-
పరిహార భారం ఎయిర్ ఇండియాదే
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ దుర్ఘటనలో ఖరీదైన బోయింగ్ డ్రీమ్లైనర్ విమానం నామరూపాల్లేకుండా ధ్వంసమైపోయింది. విమానం ఖరీదు, బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. విమానానికి బీమా సదుపాయం ఎలాగూ ఉంటుంది. బీమా సంస్థ నుంచి నష్టాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఏవియేషన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఇక బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత విమానయాన సంస్థదే. అంటే ఇక్కడ ఎయిర్ ఇండియాదే. ఈ విషయంలో స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి. 1999 నాటి మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం.. విమానం ప్రమాదానికి గురై ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగితే, ఎవరైనా క్షతగాత్రులుగా మారితే సంబంధిత విమానయాన సంస్థే ఆ నష్టాన్ని భరించాలి. విమానంలో ప్రయాణికుల వస్తువులు, సామగ్రి ధ్వంసమైనా, అవి వారికి అందడంలో ఆలస్యం జరిగినా పరిహారం ఇవ్వాల్సిందే. అహ్మదాబాద్ ప్రమాదంలో ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కో బాధిత కుటుంబానికి 1,51,880 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఎస్డీఆర్ విలువ దాదాపు రూ.120. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి రూ.1.80 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. ఎస్డీఆర్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) గతంలోనే ఖరారు చేసింది. అహ్మదాబాద్ ప్రమాదంలో 265 మంది మృతిచెందారు. మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం వీరందరికీ కలిపి ఎయిర్ ఇండియా యాజమాన్యం రూ.435 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు కాకుండా విమానంలో పనిచేసే సిబ్బందికి చట్టప్రకారం అదనపు పరిహారం ఇవ్వక తప్పదు. మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం విమాన ప్రమాదంపై దర్యాప్తు పూర్తికాక ముందే బాధిత కుటుంబాలకు 16,000 ఎస్డీఆర్లు(రూ.18 లక్షలు) అడ్వాన్స్గా చెల్లించాలి. మాంట్రియల్ తీర్మానం కింద ఇచ్చే పరిహారంతో పాటు ఒక్కో కుటుంబానికి అదనంగా రూ.కోటి చొప్పున ఇస్తామని టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. అంటే ఒక్కో కుటుంబానికి రూ.2.80 కోట్ల పరిహారం దక్కబోతోంది. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న సంగతి తెలిసిందే. బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానాన్ని దాదాపు రూ.960 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించినట్లు తెలిసింది. విమానానికి బీమా, బాధితులకు ఇచ్చే పరిహారం మొత్తంగా చూస్తే ఈ విలువ రూ.1,000 కోట్ల నుంచి రూ.1,250 కోట్ల వరకు ఉంటుంది. -
మెడికల్ కాలేజీ మృతులెందరు?
అహ్మదాబాద్: ఎయిరిండియా విమానానికి సంభవించిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యపై గురువారం అర్ధరాత్రికే స్పష్టత వచ్చింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందికి గాను ఒక్కరు మినహా అందరూ దుర్మరణం పాలయ్యారు. 241 మంది మరణించినట్టు ఎయిరిండియా అధికారికంగా ప్రకటించింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం టేకాఫైన 33 సెకన్లకే రన్వే సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ మెస్, హాస్టల్పై పడి పేలిపోవడం తెలిసిందే. ఆ సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉండటంతో అత్యంత భారీ పేలుడు సంభవించింది. దాంతో మెస్, హాస్టల్ ధ్వంసమవడమే గాక పరిసర భవనాలకూ నిప్పంటుకుని కాలిపోయాయి. కానీ అక్కడి వారిలో ఎందరు చనిపోయారన్న దానిపై మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. దీనిపై గుజరాత్ ప్రభుత్వం గానీ, కేంద్రం గానీ అధికారికంగా స్పందించలేదు. కనీసం 24 మంది మరణించినట్టు గురువారమే వార్తలొచ్చాయి. గురువారం అర్ధరాత్రికే ఆస్పత్రికి 265 మృతదేహాలు వచ్చినట్టు డీఎస్పీ కనన్ దేశాయ్ చేసిన ప్రకటన వాటికి బలం చేకూర్చింది. నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, ఒక వైద్యుడు, మరో వైద్యుడి భార్య మృతిని కాలేజీ వర్గాలు గురువారం రాత్రి ధ్రువీకరించాయి. మరో 60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయని, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని కూడా వెల్లడించింది. అంతేగాక ఇద్దరు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు ముగ్గురు బంధువుల ఆచూకీ తెలియడం లేదని కాలేజీ డీన్ డాక్టర్ మీనాక్షీ పారిఖ్ తెలిపారు. వీరి పరిస్థితి ఏమిటన్నది మాత్రం శుక్రవారం అర్ధరాత్రి దాకా తెలియరాలేదు. ప్రమాదస్థలి వద్ద భవనాల శిథిలాలు తదితరాలను తొలగించేందుకు ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నట్టు సంస్థ డీజీ హరి ఓం గాంధీ శుక్రవారం తెలిపారు. మృతులపై మాత్రం ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. దాంతో మొత్తం మృతుల సంఖ్యపై రకరకాల ఊహాగానాలు విన్పించాయి. శుక్రవారం మరో నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల మృతదేహాలు లభించాయని, మొత్తం మృతుల సంఖ్య 325కి చేరిందని వార్తలొచ్చాయి. గుజరాత్ పోలీసులు కూడా మృతుల సంఖ్య 294కు చేరినట్టు శుక్రవారం మధ్యాహ్నం చెప్పారు. కానీ, ‘240 మందికి పైగా మరణించార’ంటూ సాయంత్రానికల్లా సవరణ ప్రకటన చేశారు! మెడికల్ కాలేజీ మృతుల సంఖ్యను ప్రభుత్వం ఎందుకు గుట్టుగా ఉంచుతున్నదీ అంతుబట్టడంలేదు. -
వెయ్యి డిగ్రీల వేడిలోనూ బ్లాక్ బాక్స్ భద్రం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్ బాక్స్, డిజిటల్ వీడియో రికార్డర్(డీవీడీ) అత్యంత కీలకం కాబోతున్నాయి. ఈ రెండింటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానం పేలిపోయినప్పుడు అందులోని ఇంధనం కారణంగా ఏకంగా 1,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడింది. విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది. మృతదేహాలు మసిబొగ్గులా మారాయంటే ప్రమాద తీవ్రతను అంచనా వేయొచ్చు. భారీ ఉష్ణోగ్రతలోనూ బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉంటుందని, అందులోని డేటా చెరిగిపోదని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ బాక్స్లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్(ఎఫ్డీఆర్), మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్). ఎఫ్డీఆర్లో సాంకేతికపరమైన అంశాలు నిక్షిప్తమవుతాయి. అంటే విమానం ఎగురుతున్న ఎత్తు, వేగం, ఇంజన్ పనితీరును ఇది రికార్డు చేస్తుంది. కాక్పిట్లోని శబ్ధాలు, సంభాషణలు సీవీఆర్లో నమోదవుతాయి. టైటానియం లేదా స్టెయిన్లెస్ స్టీల్తో బ్లాక్బాక్స్ తయారు చేస్తారు. ఇది 1,100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతోపాటు అత్యధిక ఒత్తిడిని సైతం తట్టుకోగలదు. అంతేకాకుండా ఇది వాటర్ప్రూఫ్. నీటిలో 6 వేల మీటర్ల లోతున కూడా 30 రోజులపాటు భద్రంగా ఉంటుంది. నీటిలో దీని జాడ సులభంగా కనిపెట్టవచ్చు. అందులోని నుంచి సంకేతాలు వెలువడుతుంటాయి. డీవీఆర్ అనేది బ్లాక్బాక్స్ కంటే భిన్నమైనది. విమానంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఇందులో ఉంటుంది. విమానం కాక్పిట్, కేబిన్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ్లాక్ బాక్స్, డీవీఆర్ డేటాను ప్రత్యేక ల్యాబ్ల్లో ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించబోతున్నారు. ఇందుకోసం ఢిల్లీలో ఇటీవలే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ ల్యాబ్ ప్రారంభించారు. దెబ్బతిన్న రికార్డర్లను మరమ్మతు చేసి, డేటాను వెలికితీసే సదుపాయం ఇక్కడ ఉంది. -
ఒకరు మానేద్దామనుకున్నారు.. ఇంకొకరు ఇప్పుడే మొదలెట్టారు!
ముంబై: ప్రమాదానికి గురైన బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ పైలట్ సుమీత్ సభర్వాల్(56), కో పైలట్ క్లైవ్ కుందర్లది విభిన్నమైన నేపథ్యం. ఒకరు ఎంతో అనుభవశాలి కాగా, మరొకరు ఇప్పుడిప్పుడే కెరీర్ను మొదలుపెట్టారు. సభర్వాల్ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే యోచనలో ఉండగా, క్లైవ్ కుందర్ భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. ఫ్లయింగ్ అనుభవం వీరిద్దరిదీ కలిపి 9,300 గంటలు కాగా, ఇందులో సభర్వాల్ ఒక్కరికే 8,200 గంటల అనుభవముంది. పైలట్ సుమీత్ సభర్వాల్(56) ముంబైలోని పొవై ప్రాంతానికి చెందిన జల్ వాయు విహార్లో వృద్ధులైన తల్లిదండ్రులతో ఉంటున్నారు. ఎంతో అనుభవం కలిగిన సుమీత్కు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటారని పేరుంది. ‘వింగ్ కమాండర్గా రిటైరయ్యాను. ఎయిరిడింయా సిబ్బందితో కలిసి సుదీర్ఘ కాలం పనిచేశాను. కెప్టెన్ సుమీత్ ఎంతో మంచివారు. అనుభవశాలి అయిన పైలట్. ఆయన మరణం ఎయిరిండియాకు తీరని లోటు’అని సుమీత్ ఫ్యామిలీ ఫ్రెండ్ సంజీవ్ పాయ్ చెప్పారు. ‘సుమీత్ పనితీరుపై గానీ, ప్రజలతో వ్యవహరించే తీరుపైగానీ ఎన్నడూ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. ఆయన ఎంతో సౌమ్యుడు. శాంతిస్వభావి’అని పాయ్ అన్నారు. ‘సుమీత్ తండ్రి డీజీసీఎ అధికారిగా పనిచేసి, రిటైరయ్యారు. ఆయన కుటుంబంలోని మరో ఇద్దరు సైతం పైలట్లుగా ఉన్నారు. వారి స్ఫూర్తితోనే సుమీత్ పైలట్ అయ్యారు. అయితే, 82 ఏళ్ల వృద్ధుడైన తండ్రి బాగోగులను చూసుకునేందుకు ఉద్యోగం మానేయాలనుకుంటున్నట్లు కొన్ని రోజుల క్రితం సుమీత్ నాతో అన్నారు’అని పాయ్ వివరించారు.కో–పైలట్ క్లైవ్ కుందర్కు 1,100 గంటల ఫ్లయింగ్ అనుభవముంది. క్లైవ్ తల్లి ఫ్లయిట్ క్రూ సభ్యురాలు. ముంబై జుహులోని బాంబే ఫ్లయింగ్ క్లబ్లో క్లైవ్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కోర్సు పూర్తి చేశారు. ఏరోనాటికల్ ఇంజినీర్గా ఏడాదికి పైగా పనిచేశారు. కలినాలోని ఎయిరిండియా కాలనీలో క్లైవ్ పెరిగాడు. అనంతరం వీరి కుటుంబం బొరివలికి మకాం మార్చింది. కుందర్ పైలట్ కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు ఎయిరిండియాలో చేరారని పొరుగునుండే ఫ్లాయిడ్ డిసౌజా చెప్పారు. ఎంతో సరదాగా అందరినీ నవ్విస్తుండే క్లైవ్ కుందర్కు, ఆయన తండ్రి క్లిఫ్పర్డ్కు ఆటలంటే ఎంతో ఇష్టమని తెలిపారు. క్లైవ్ ఖాళీ దొరికితే చాలు క్రికెట్ ఆడేవారని చెప్పారు. విషాదం తెల్సిన వెంటనే ఆస్ట్రేలియాలో ఉంటున్న క్లైవ్ సోదరి క్లైన్, తల్లి రేఖ ఇండియాకు బయలుదేరారని ఫ్లాయిడ్ అన్నారు. క్లైవ్ కుందర్ మృతిపై నటుడు విక్రాంత్ మస్సీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. -
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ
అహ్మదాబాద్: దేశ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్వయంగా పరిశీలించారు. ఆయన ఉదయం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయి పటేల్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఘటనా స్థలానికి వచ్చారు. 20 నిమిషాల పాటు ఇక్కడే ఉన్నారు. విమానం కూలిపోవడంతో ధ్వంసమైన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెంట పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, గుజరాత్ మంత్రి హర్ష్ సంఘావీ ఉన్నారు. ప్రమాదం గురించి వారు ప్రధానమంత్రికి తెలియజేశారు. మెడికల్ కాలేజీ హాస్టల్, మెస్ ధ్వంసమైన తీరును వివరించారు. అనంతరం మోదీ సిటీ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. విమాన ప్రమాదంలో గాయాలతో బయటపడి చికిత్స పొందుతున్న విశ్వాస్ కుమార్ రమేశ్ను పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో 25 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్న సీ7 వార్డును మోదీ సందర్శించారు. అక్కడున్న డాక్టర్లతో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. విజయ్ రూపానీ కుటుంబానికి ఓదార్పు విమాన ప్రమాదంలో మృతిచెందిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబాన్ని ప్రధాని మోదీ ఓదార్చారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని గుజ్సెయిల్ కార్యాలయంలో విజయ్ రూపానీ భార్య అంజలి రూపానీతోపాటు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ విపత్కర సమయంలో గుండె నిబ్బరం కోల్పోవొద్దని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. అధికారులతో సమీక్ష ప్రధాని మోదీ గుజ్సెయిల్ ఆఫీసులో గుజరాత్ ప్రభుత్వ అధికారులతో, పౌర విమానయాన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. విమాన ప్రమా దం, తాజా పరిణామాలపై సమీక్ష నిర్వహించారు. -
పార్లమెంట్ భేటీకి ముందే బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
సాక్షి, న్యూఢిల్లీ: చాలాకాలంగా పెండింగ్లో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికను వచ్చే నెల జరుగనున్న పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే ముగించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 21న పార్లమెంట్ సమావేశాలు ఆరంభమయ్యే ముందునాటికే జాతీయ అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేసేలా ఎన్నికల ప్రక్రియను వచ్చే వారంలో ప్రారంభించాలని పార్టీ యోచిస్తోంది. ఆగస్టు 15 నుంచి బిహార్ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశాల దృష్ట్యా, కొత్త అధ్యక్షుడి నేతృత్వంలోనే ఎన్నికలను ఎదుర్కొనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక పదేపదే వాయిదా పడుతూ వస్తుంది. మే నెలలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావించినా ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దీనిని వాయిదా వేశారు. అధ్యక్ష బరిలో నిలిపే అభ్యర్థుల పేర్లపైనా పరిశీలనలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రధాన పోటీదారుల జాబితాలో కేంద్ర మంత్రులు శివరాజ్సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్, మనోహర్లాల్ ఖట్టర్, భూపేంద్ర యాదవ్, జి.కిషన్రెడ్డిలతో పాటు పార్టీ సీనియర్ నేతలు సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ తదితరులు ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లో బిహార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. అంటే సెప్టెంబర్లోగా ఎన్డీఏ కూటమి పక్షాలతో సీట్ల పంపకాలు, పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై ఓ అవగాహనకు రావాల్సి ఉంది. ఇది జరగాలంటే ఆగస్టు నుంచే బిహార్ ఎన్నికలపై ఆగస్టు నుంచే పూర్తి స్థాయి ఫోకస్ పెట్టాల్సి ఉంది. అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు జరుగనున్నాయి. పార్టీ కీలక నేతంలతా సమావేశాల్లో బిజీగా ఉండే నేపథ్యంలో, సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చే యాలని, అలా అయితేనే ఆయన సారథ్యంలో బిహార్ ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చనే భావనలో పార్టీ ఉంది. దీనికై ఈ నెల చివరి వారంలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాల్సి ఉంది. పార్టీ నియమావళి ప్రకారం జాతీయ అధ్యక్షుడి ప్రకటనకు ముందే సగానికి పైగా రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపికను పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటిì చాలా రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. వీరిని త్వరలోనే ప్రకటించే దిశగా ఇప్పటికే కీలక చర్చలు ముగిశాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరి ప్రకటన ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయితే ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ మూడేళ్ల కాలంలో యూపీ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పంజాబ్ వంటి కీలక రాష్ట్రాలతో పాటు మొత్తంగా 12 రాష్ట్రాల ఎన్నికలు ఈయన సారధ్యంలోనే జరుగుతాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు సైతం కొత్త అధ్యక్షుడి హాయంలోనే ఉండనున్నాయి. -
లండన్కు చేరాక ఫోన్ చేస్తా..
ముంబై: అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద మృతుల హృదయవిదారక విషాద గాథలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎయిరిండియా డ్రీమ్లైనర్ క్యాబిన్ క్రూలో పనిచేసే మైథిలీ పాటిల్(23) తన తండ్రి మోరేశ్వర్ పాటిల్కు గురువారం మధ్యాహ్నం చివరిసారిగా ఫోన్ చేశారు. లండన్ చేరుకున్నాక మళ్లీ చేస్తానంటూ ఆయన్ను అనునయించారు. కానీ, కొద్ది గంటల్లోనే ఘోరం జరిగిపోయింది. ఆమె తన మాట నెరవేర్చకుండానే తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయారు. డ్రీమ్లైనర్లో క్రూ సిబ్బందిలో ప్రాణాలు కోల్పోయిన 12 మందిలో మైథిలి ఒకరు. అంతేకాదు, వీరిలో ఇద్దరు పైలట్లు సహా మొత్తం 9 మంది క్రూ సిబ్బంది మహారాష్ట్రకు చెందిన వారే కావడం గమనార్హం. నవా గ్రామానికి చెందిన మైథిలి రెండేళ్ల క్రితం ఎయిరిండియాలో జాయినయ్యారు. ఈమె తండ్రి మోరేశ్వర్పాటిల్ ఓఎన్జీసీ లేబర్ కాంట్రాక్టర్గా ఉన్నారు. లండన్ చేరుకున్న వెంటనే ఫోన్ చేస్తానంటూ మైథిలి దుర్ఘటనకు కొద్దిసేపటి ముందే తండ్రికి ఫోన్ చేసి చెప్పారని ఆమె బంధువు, నవా గ్రామ మాజీ సర్పంచి జితేంద్ర మాత్రే చెప్పారు. క్యాబిన్ క్రూ మరో సభ్యుడు దీపక్ పాఠక్ థానె పక్కనే ఉన్న బద్లాపూర్ నివాసి. ఎయిరిండియాలో 11 ఏళ్లుగా పనిచేస్తున్న పాఠక్ లండన్ వెళ్లేముందుకు తల్లికి ఫోన్ చేసి మాట్లాడారని ఆయన సోదరి చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన క్రూ సభ్యుడు అపర్ణా మహదిక్(43)కి కూడా ముంబై సమీప గోరెగావ్ ప్రాంతమే. ఈమె భర్త కూడా ఎయిరిండియా క్రూ సభ్యుడిగా పనిచేస్తున్నారు. అపర్ణకు ఎన్సీపీ నేత సునీల్ తత్కారేకు బంధువు. విమానం క్రూ సభ్యుల్లో ఒకరైన ఇర్ఫాన్ సమీర్ షేక్(22) రెండేళ్ల క్రితమే ఎయిరిండియాలో జాయినయ్యారు. ఈయన ఎన్నో కలలు కన్నారని కుటుంబసభ్యులు కన్నీరమున్నీరవుతున్నారు. షేక్ కుటుంబం పుణె నగరం పింప్రి చించ్వాడీలో ఉంటోంది. క్రూలో మరో సభ్యురాలు శ్రద్ధా ధావన్ది ములుండ్లోని వైశాలి నగర్. ధావన్ మరణ వార్త తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు డీఎన్ఏ నమూనాలు ఇచ్చేందుకు అహ్మదాబాద్కు వెళ్లారు. విమాన క్యాబిన్ క్రూ సభ్యుల్లో రోష్ని రాజేంద్ర సొంఘారె డొంబివిలి ప్రాంతంలో ఉంటుండగా, సాయినీత చక్రవర్తి జుహు కొలివాడకు చెందిన వారు. ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అయిన సొంఘారేకు ఇన్స్టాలో 54 వేలకు పైగా ఫాలోయర్లున్నారు. ప్రమాదంలో చనిపోయిన పైలట్ సుమీత్ పుష్కరాజ్ సభర్వాల్(56) ముంబైలోని పొవైలో జల్ వాయు విహార్లో వృద్ధులైన తల్లిదండ్రులతో ఉంటున్నారు. విమానం కో–పైలట్ క్లైవ్ కుందర్ది కూడా ముంబైనే. శాంటాక్రుజ్ ప్రాంతంలోని కలినాలో జెరోమ్ అపార్టుమెంట్లో నివసిస్తున్నారు. భర్తతో కలిసి గడపాలని.. గుజరాత్లోని మెహ్సనాకు చెందిన అంకితా పటేల్ది మరో విషాదం. ఈమెకు గతేడాది డిసెంబర్లో పెళ్లయింది. భర్త వసంత్ లండన్లో ప్రొవిజన్ స్టోర్ యజమాని. ఈ నూతన దంపతులు కలిసి గడిపింది కేవలం 12 రోజులు మాత్రమే. వసంత్ లండన్ వెళ్లిపోవడంతో, తనూ అక్కడికి వెళ్లి భర్తతో గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. తన తల్లిదండ్రులు, సోదరుడితోపాటు వసంత్ సోదరితో కలిసి వీసా కోసం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. అంకితను లండన్ పంపించేందుకు వీరంతా గురువారం విమానాశ్రయానికి వచ్చారు. ఆమెకు గుడ్ బై చెప్పి మెహ్సనాకు బయలుదేరిన కొద్దిసేపటికే ఘోరం జరిగిపోయిందని వసంత్ సోదరి ఆశాబెన్ పటేల్ చెప్పారు. వెంటనే తిరిగి వచ్చామన్నారు. గాట్విక్ విమానాశ్రయంలో భార్యకు ఘనస్వాగతం పలకాల్సిన వసంత్..బదులుగా ఆమె అవశేషాలను తీసుకునేందుకు వస్తున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించేందుకు అధికారులు అంకిత సోదరుడి డీఎన్ఏ నమూనాలు తీసుకున్నట్లు వివరించారు. ప్రయాణాలంటే ఎంతో సరదా.. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన నీరజ్ లవానియా(50), అపర్ణ దంపతులకు ప్రయాణాలంటే ఎంతో ఇష్టం. ఈ వేసవి సెలవుల్లో లండన్ వెళ్లాలనుకున్నారు. వీరితోపాటు 18 ఏళ్ల కుమార్తె కూడా వెళ్లాల్సి ఉంది. అయితే, ఒంటరిగా ఉండే 70 ఏళ్ల నీరజ్ తల్లిని చూసుకునేందుకని ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. లండన్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానమెక్కిన లవానియా దంపతులు ప్రాణాలు కోల్పోయారు. డిగ్రీ ఫైనలియర్ చదువుకుంటున్న వీరి కూతురు తల్లిదండ్రుల అవశేషాలను గుర్తుపట్టేందుకు అహ్మదాబాద్ వెళ్లి అధికారులకు డీఎన్ఏ నమూనా ఇచ్చారు. ఆగ్రాలోని అకోలాకు చెందిన నీరజ్ 1995లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ కోసమని వడోదరకు మకాం మార్చారు. చుట్టుపక్కల వారితో ఎంతో కలుపుగోలుగా ఉండే నీరజ్ మరణ వార్త విని అకోలా వాసులు సైతం విషాదంలో మునిగిపోయారు. విమాన ప్రయాణానికి కొద్దిసేపటి ముందే 1.30 గంటల సమయంలో తనతో నీరజ్ మాట్లాడాడని సోదరుడు సతీశ్ చెప్పారు. టీవీలో వచ్చిన వార్తను చూసి షాక్కు గురయ్యానన్నారు.కుమారుడి వద్ద గడిపేందుకని..డ్రీమ్లైనర్ ప్రమాద మృతుల్లో మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా వాసి మహదేవ్ పవార్(68), ఆశా(60) దంపతులు కూడా ఉన్నారు. సంగోలా తెహశీల్లోని హటిడ్ గ్రామానికి చెందిన మహదేవ్ గుజరాత్లోని నడియాడ్లోని టెక్స్టైల్ మిల్లులో పని చేసేవారు. ఈయనకు ఇద్దరు కుమారులు. ఒకరు అహ్మదాబాద్లో, మరొకరు లండన్లో ఉంటున్నారు. లండన్లో నివసిస్తున్న కుమారుడి వద్దకని బయలుదేరిన ఈ దంపతులు విమాన ప్రమాదం బారినపడ్డారు. వీరు అహ్మదాబాద్లో 15 ఏళ్లుగా నివసిస్తున్నారని సోలాపూర్ జిల్లా అధికారి ఒకరు తెలిపారు. ఈ దంపతులు ఇటీవలే హటిడ్లో ఉంటున్న బంధువుల వద్దకు వచ్చి వెళ్లారని చెప్పారు.భర్త బర్త్డే కోసం.. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన హర్ప్రీత్ కౌర్ హొరొ(28) ఐటీ నిపుణురాలిగా బెంగళూరులో పనిచేస్తున్నారు. ఈమె భర్త రొబ్బీ హొరా లండన్లోని ఐటీ కంపెనీలో ఉద్యోగి. ఈనెల 16న రొబ్బీ పుట్టినరోజు. వాస్తవానికి హర్ప్రీత్ ఈ నెల 19న లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే, భర్త పుట్టిన రోజు వేడుక కోసమని ముందుగానే ఎయిరిండియా డ్రీమ్లైనర్లో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. లండన్ వెళ్లాక దంపతులు యూరప్ టూర్ కూడా ప్లాన్ చేసుకున్నారని బంధువులు చెప్పారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని, వీరి కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిపోయాయని బంధువులు చెప్పారు.టీస్టాల్ యజమాని 14 ఏళ్ల కుమారుడు.. డ్రీమ్లైనర్ ప్రమాదం అహ్మదాబాద్ మెఘానీనగర్ ప్రాంతం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్కు సమీపంలోని చెట్టు కింద టీకొట్టు నడుపుకునే కుటుంబంలో తీరని విషాదం నింపింది. విమానం కూలిన సమయంలో సీతా బెన్ టీ తయారు చేస్తుండగా ఆమె కుమారుడు 14 ఏళ్ల ఆకాశ్ పట్ని పక్కనే నిద్రిస్తున్నాడు. కూలిన విమాన లోహ శకలం ఒకటి వచ్చి ఆకాశ్ తలను తాకింది. ఆ వెంటనే చెలరేగిన మంటల్లో ఆకాశ్ మాడి మసయ్యాడు ఆకాశ్. కుమారుడిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నంలో తల్లి సీతా బెన్ తీవ్రంగా గాయపడి ఆస్ప త్రిలో చికిత్స పొందుతోంది.అంతా బాగుందని చెప్పి అంతలోనే.. గుజరాత్లోని ఆనంద్లో ఉండే సురేశ్ మిస్త్రీ అహ్మదాబాద్ బీజే మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వద్ద డీఎన్ఏ నమూనా ఇచ్చేందుకు క్యూలో ఉన్నారు. ఈయన కుమార్తె 21 ఏళ్ల క్రినా మిస్త్రీ విమాన ప్రమాదంలో చనిపోయింది. వర్క్ వీసా రావడంతో ఏడాది క్రితం లండన్ వెళ్లిన క్రినా ఇటీవలే ఆనంద్కు తిరిగి వచ్చింది. వైద్య చికిత్స అనంతరం డ్రీమ్లైనర్లో లండన్ తిరిగి పయనమయ్యింది. విమానం ఎక్కాక కూడా తండ్రికి ఫోన్ చేసి నిశ్చింతగా ఇంటికి వెళ్లండంటూ ధైర్యం చెప్పింది. ఇంటికి వెళ్లాక దుర్వార్త తెలిసిందని, క్రినా ఇక లేదన్న విషయాన్ని నమ్మలేకపోతున్నట్లు సురేశ్ గద్గద స్వరంతో చెప్పారు.తిరిగొచ్చాక భారీగా వేడుక చేద్దామని..గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర విషాదంలో అసువులు బాసిన వారిలో భవిక్ మహేశ్వరి(26) అనే నవ వరుడు కూడా ఉన్నారు. లండన్లో పనిచేసే భవిక్ 15 రోజులక్రితమే వడోదరకు వచ్చారు. పెళ్లి చేసుకున్నాకే తిరిగి లండన్ వెళ్లాలని కుటుంబసభ్యులు పట్టుబట్టడంతో వారి కోరిక మేరకు జూన్ 10న ఓ యువతితో చాలా సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత నవ వధువును లండన్ పంపేందుకు ఏర్పాట్లు సైతం మొదలయ్యాయి. మరోసారి వివాహ వేడుకను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. నూతన వధువు సహా కుటుంబసభ్యులంతా గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో భవిక్కు వీడ్కోలు పలికారు. వారి తిరిగి ఇళ్లకు చేరుకున్నారో లేదో ఘోరం జరిగిపోయింది. ఈ విషాదాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోందని బంధువొకరు తెలిపారు.ఏకైక కెనడియన్ నిరాలీ పటేల్..అహ్మదాబాద్ విషాద బాధితుల్లో కెనడా పౌరురాలు ఒకరుండటం తెల్సిందే. ఈమె భారత సంతతికి చెందిన నిరాలీ పటేల్(32). టొరంటోని ఎటోబికోక్లో ఉండే నిరాలీ సోషల్ ట్రిప్లో భాగంగా భారత్కు వచ్చారు. నిరాలీ మరణవార్త తెల్సిన భర్త, ఏడాది వయస్సున్న కుమార్తెతో భారత్కు వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఈమె తల్లిదండ్రులు, సోదరుడి కుటుంబం బ్రాంప్టన్లో నివస్తున్నారు. భారత్లో 2016లో దంత వైద్యంలో డ్రిగీ పొందిన నిరాలీ 2019లో కెనడా వెళ్లారు. మిస్సిస్సౌగాలో డెంటల్ క్లినిక్ నడుపుతున్నారు. నిరాలీ మృతి పట్ల కెనడా ప్రధాని మార్క్ కార్నీ, విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ సంతాపం ప్రకటించారు. అంత్యక్రియలకు బయల్దేరి అనంతలోకాలకు అహ్మదాబాద్/నాగ్పూర్: అహ్మదాబాద్ నుంచి లండన్కు అంత్యక్రియల కోసం వెళ్తున్న కుటుంబంలోని ముగ్గురు విమాన ప్రమాదంలో మరణించారు. నాగపూర్కు చెందిన 32 ఏళ్ల యశా కామ్దార్కు నాలుగేళ్ల కిందట అహ్మదాబాద్కు చెందిన వ్యక్తితో వివాహమైంది. అప్పటినుంచి ఆమె అహ్మదాబాద్లోనే నివసిస్తున్నారు. మామ కిషోర్ మోదా చాలాకాలంగా లండన్లో ఉంటున్నారు. ఆయన అంత్యక్రియల కోసం ఒకటిన్నరేళ్ల కొడుకు, 58 ఏళ్ల అత్త రక్షతో కలిసి ఆమె లండన్ బయల్దేరి ముగ్గురూ ప్రమాదానికి బలయ్యారు. దాంతో యశా కుటుంబం, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. నాగపూర్లోని ఆమె తల్లిదండ్రులు అహ్మదాబాద్ బయలుదేరారు.లండన్ నుంచి పూర్తిగా వచ్చేయాలనుకుని.. కోచి: విమాన ప్రమాదంతో మరణించిన 39 ఏళ్ల కేరళ నర్సు రంజితది మరో విషాద గాధ. కేరళ ప్రభుత్వ నర్సుగా చేసిన ఆమె సెలవు పెట్టి కొంతకాలం ఒమన్లో పని చేశాక బ్రిటన్ వెళ్లింది. లండన్లో నర్సుగా చేస్తోంది. కేరళలో కొత్తిల్లు కట్టుకుని కుటుంబానికి కొత్త జీవితం ఇవ్వాలని కలలు కంది. లండన్లో ఉద్యోగానికి రాజీనామా చేసి శాశ్వతంగా భారత్కు వచ్చేయాలనుకుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వారిని రంజిత తల్లి చూసుకుంటోంది. నాలుగు రోజుల క్రితమే కేరళ వచ్చింది. అక్కడ మళ్లీ తన ప్రభుత్వోద్యోగంలో చేరడానికి లాంఛనాలు పూర్తి చేసింది. లండన్లో ఉద్యోగానికి రాజీనామా చేసి సర్టిఫికెట్లు, సామగ్రి తెచ్చుకోవడానికి గురువారం చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లింది. లండన్కు ఎయిరిండియా విమానమెక్కి తిరిగిరాని లోకాలకు చేరింది. దాంతో పిల్లలు, తల్లి దిక్కులేనివారయ్యారు. కాగా, రంజితను కులపరంగా, లైంగికంగా వేధిస్తూ ఆన్లైన్లో అసభ్య పోస్టులు పెట్టిన కాసరగోడ్ జిల్లా వెల్లరికుందు డిప్యూటీ తహశీల్దార్ పవిత్రన్ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడని, మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. -
అమెరికాలో ఆగని రగడ
వాషింగ్టన్/అస్టిన్: అమెరికాలో వలసదారుల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. మరోవైపు ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) ఆధ్వర్యంలో అక్రమ వలసదారుల అరెస్టులు, గెంటివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని వాషింగ్టన్ డీసీలో శనివారం భారీ ఎత్తున మిలటరీ పరేడ్ జరుగనుంది. విదేశాల నుంచి అతిథులు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘నో కింగ్స్’కార్యక్రమాలు నిర్వహించాలని, నిరసనలు ఉధృతం చేయాలని వలసదారులు నిర్ణయించారు. దాదాపు 2 వేల ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టేలా వ్యూహం రూపొందించారు. ఫిలడెల్ఫియాలో భారీ ర్యాలీకి సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల శాంతియుతంగానే జరుగుతున్నప్పటికీ, మరికొన్నిచోట్ల హింసాత్మకంగా మారుతున్నాయి. లాస్ ఏంజెలెస్, స్పాకేన్ సిటీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఒత్తిళ్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని, ఇమ్మిగ్రేషన్ రైడ్స్, డిపోర్టేషన్లు యథాతథంగా కొనసాగుతాయని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తేలి్చచెప్పింది. అక్రమ వలసదారులు దేశం విడిచి వెళ్లిపోవాలని, లేకపోతే బలవంతంగా పంపించక తప్పదని స్పష్టంచేసింది. అధికారులపై రాళ్లు, టపాకాయలతో దాడులు అక్రమ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. లాస్ వెగాస్లో 94 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు అభియోగాలు మోపారు. బుధవారం రాత్రి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 800 మంది వలసదారులు అధికారులపై విరుచుకుపడ్డారు. రాళ్లు, మంచినీటి సీసాలు విసిరారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో నలుగురు అధికారులు గాయపడ్డారు. జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. మిషగాన్లో గురువారం ఆందోళనలు జరిగాయి. వందలాది మంది పార్క్ ప్లాజాలో గుమికూడారు. ట్రంప్ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోశారు. తమను బలవంతంగా బయటకు వెళ్లగొట్టాలని చూస్తే చట్టపరంగా పోరాడుతామని హెచ్చరించారు. సియాటెల్ డౌన్టౌన్లో సైతం నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తమను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై నిరసనకారులు పెప్పర్స్ప్రే చల్లారు. టపాకాయలు, రాళ్లు విసిరారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ను రద్దు చేయాలని నినదించారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని స్పాకేన్ సిటీలో 30 మందికిపైగా నిరసనకారులు అరెస్టయ్యారు. టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియో, అరిజోనా రాష్ట్రంలోని టక్సన్లో ఆందోళనలు శాంతియుతంగా జరుగుతున్నాయి. అలాస్కాలో 40 మంది వలసదారులను పోలీసులు నిర్బంధించారు. లాస్ ఏంజెలెస్లో గత వారం రోజుల్లో 470 మంది అరెస్టయ్యారు. న్యూజెర్సీలో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్ను నిరసనకారులు చుట్టుముట్టారు. ఈ కేంద్రంలో చాలామంది అక్రమ వలసదారులను అధికారులు నిర్బంధించారు. వీరిని వినిపించేందుకు నిరసనకారులు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో న్యూజెర్సీలో వెయ్యి పడకలతో డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. శనివారం ఆందోళనలు మరింత ఉధృతరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు సంకేతాలు రావడంతో పలు రాష్ట్రాల్లో ముందు జాగ్రత్తగా నేషనల్ గార్డు దళాలను మోహరిస్తున్నారు. ‘నో కింగ్స్’ర్యాలీలకు అనుమతి లేదని గవర్నర్లు చెబుతున్నారు. హింస, విధ్వంసానికి పాల్పడేవారిపై త్వరగా విచారణ చేపట్టాలని అమెరికా న్యాయ శాఖ అన్ని రాష్ట్రాల అటారీ్నలకు గురువారం సందేశం పంపించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. ట్రంప్ నిర్ణయానికి కోర్టు మద్దతు ఆందోళనలు అణచివేయడానికి లాస్ఏంజెలెస్కు 4 వేల నేషనల్ గార్డు దళాలను, 700 మంది మెరైన్ గార్డులను రంగంలోకి దించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కాలిఫోరి్నయాకు నేషనల్ గార్డు సిబ్బందిని పంపించాలన్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఫెడరల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వును తొమ్మిదో యూఎస్ సర్క్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్ నిర్ణయానికి పరోక్షంగా మద్దతు పలికింది. కోర్టు నిర్ణయంతో నేషనల్ గార్డు సిబ్బందికి అడ్డంకి తొలగిపోయింది. నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. -
ఇంజన్ వైఫల్యమే!
దేశాన్ని దిగ్భ్రాంతికి లోను చేసిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ (వీటీ–ఏఎన్బీ) 171 విమాన ప్రమాదానికి ఇంజన్ వైఫల్యమే కారణమై ఉంటుందని వైమానిక రంగ నిపుణులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పెను ప్రమాదాన్ని సూచిస్తూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు పైలట్ చేసిన మేడే కాల్లోనూ, ప్రమాద వీడియోల్లోనూ విమానం ఇంజన్ శబ్దం అసలు విన్పించమే లేదు. దాన్నిబట్టి విమానం అప్పటికే పూర్తిగా థ్రస్ట్ (ఎగిరేందుకు అవసరమైన వేగం) పూర్తిగా కోల్పోయిందని విశ్లేషిస్తున్నారు. పక్షులు ఢీకొట్టడం వంటివి ఇందుకు కారణం కావచ్చంటున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో పక్షుల బెడద ఎక్కువే. అయితే బోయింగ్లో అత్యాధునికమైన ఈ శ్రేణి విమానాల్లో రెండు అత్యంత శక్తిమంతమైన ఇంజన్లుంటాయి. ఒకటి అనుకోకుండా ఫెయిలైనా రెండో ఇంజన్ సాయంతో విమానం సునాయాసంగా ఎగరగలదు. దాన్ని బట్టి రెండు ఇంజన్లూ విఫలమై ఉంటాయని అనుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ 10 లక్షల ప్రయాణాలకు కేవలం ఒకసారి మాత్రమే అలా జరిగే ఆస్కారముంటుంది! ఇంధన కల్తీ, యాంత్రిక వైఫల్యం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. కానీ బోయింగ్ 787లో వాడేది అత్యంత శక్తిమంతమైన జనరల్ మోటార్స్ కంపెనీ తాలూకు జీఈఎన్ఎక్స్ ఇంజన్లు. అవి అత్యంత విశ్వసనీయమైనవి. ఈ నేపథ్యంలో ప్రమాద కారణం పెద్ద పజిల్గా మారింది. బ్లాక్బాక్స్ డేటాను పూర్తిగా విశ్లేషించిన మీదటే దీనిపై స్పష్టత వస్తుందని నిపుణులు అంటున్నారు. వారి విశ్లేషణ ప్రకారం ప్రమాద కారణాలు ఏమై ఉండొచ్చంటే...టేకాఫ్ సెట్టింగుల్లో లోపంవిమానం టేకాఫ్ కాగానే లాండింగ్ గేర్ మూసుకోవాలి. సురక్షితమైన ఎత్తుకు చేరేదాకా రెండు ఫ్లాప్లూ (రెక్కల వెనక భాగం) విచ్చుకుని ఉండాలి. అప్పుడే విమానానికి ఎగిరేందుకు అవసరమైన శక్తి, ఊపు లభిస్తాయి. వీటన్నింటినీ టేకాఫ్ సెట్టింగులుగా పిలుస్తారు. ఇకగురువారం మధ్యాహ్నం ప్రమాద సమయంలో అహ్మదాబాద్లో ఏకంగా 43 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో వాయుసాంద్రత తక్కువగా ఉంది. అలాంటప్పుడు లాండింగ్ గేర్, ఫ్లాప్లు అత్యంత కచ్చితత్వంతో పని చేయడం చాలా కీలకం. కానీ ఏఐ171 విమానం గేర్ తెరుచుకునే ఉండగా ఫ్లాప్లు మూసుకుపోయాయి. ఇది పెను ప్రమాదానికి దారితీసే అసాధారణ పరిస్థితి. దీనివల్ల పైకెగిరేందుకు కావాల్సిన శక్తి సమకూరక విమానం అదుపు తప్పుతుంది. పైగా అవసరమైన థ్రస్ట్ లభించకుండానే పైలట్ టేకాఫ్కు ప్రయత్నించి ఉంటాడంటున్నారు. ఇలా ఫ్లాప్లు వెంటనే ముడుచుకుపోవడం వల్లే 2008లో స్పాన్ఎయిర్ విమానం కుప్పకూలింది.సరిపోని థ్రస్ట్ బోయింగ్ ఇంజన్లు శక్తిమంతమైనవే అయినా విమానం బరువు, రన్వే పొడవు, ఉష్ణోగ్రత తదితరాల ఆధారంగా టేకాఫ్కు నిర్దిష్ట థ్రస్ట్ సెటింగ్లు అవసరమవుతాయి. 43 డిగ్రీల ఎండ ఉన్నందున ఇంజన్ సామర్థ్యం సహజంగానే కాస్త తగ్గుతుంది. అలాంటప్పుడు టేకాఫ్కు మామూలు కంటే అధిక థ్రస్ట్ తప్పనిసరి. కానీ ఏఐ171 పైలట్ రొటేషన్ స్పీడ్ను పొరపాటుగా లెక్కించి తక్కువ థ్రస్ట్ ప్రయోగించి ఉండొచ్చు. 241 మంది ప్రయాణికులు, భారీ లగేజీ, ఏకంగా 1.25 లక్షల లీటర్ల ఇంధన బరువు దీనికి తోడై విమానం సజావుగా ఎగరలేకపోయి ఉంటుంది.లాండింగ్ గేర్ వైఫల్యంప్రమాద సమయంలో ఏఐ171 విమానం లాండింగ్ గేర్ తెరుచుకునే ఉంది. ఇది డ్రాగ్కు దారితీస్తుంది. దాంతో విమానం సజావుగా ఎగరలేదు. అందుకే టేకాఫ్ అయ్యాక క్షణాల్లోనే గేర్ మూసుకోవాల్సి ఉంటుంది. కానీ తొలుత దాదాపుగా మూసుకున్న ఏఐ171 లాండింగ్ గేర్ ఆ వెంటనే బయటికొస్తూ కన్పించింది. బహుశా విమానాన్ని పైకి తీసుకెళ్లేందుకు అవసరమైన థ్రస్ట్ లభించడం లేదని అర్థమై ఎమర్జెన్సీ లాండింగ్కు వీలుగా పైలట్ ఉద్దేశపూర్వకంగానే అలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తం ఉదంతంలో ఏదో ఒక దశలో పైలట్ లోపం కచ్చితంగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి లోపాలను సునాయాసంగా అధిగమించే అత్యాధునిక సాంకేతికత 787 సొంతం. ఇక్కడే పైలట్ మానవ తప్పిదం చోటుచేసుకుని ఉంటుందంటున్నారు.విద్రోహ కోణంఉగ్రవాదులో, దేశ వ్యతిరేక శక్తులో ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చేయడం. కానీ ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న సమాచారం,సాక్ష్యాలను బట్టి ఇందుకు అవకాశాలు తక్కువే.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ రాశి వారికి అందరిలోనూ గౌరవం పెరుగుతుంది.. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి: బ.తదియ ప.2.32 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.11.41 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ఉ.7.09 నుండి 8.48 వరకు, తదుపరి రా.3.43 నుండి 5.20 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.02 నుండి 7.13 వరకు, అమృతఘడియలు: సా.4.54 నుండి 5.46 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.30. మేషం: శ్రమ ఫలిస్తుంది. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. దైవచింతన.వృషభం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు.మిథునం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు.కర్కాటకం: అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. కీలక నిర్ణయాలు.సింహం: పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖుల నుంచి శుభవార్తలు. ఆస్తి లాభం. దైవదర్శనాలు. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.కన్య: కొన్ని పనులు వాయిదా. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. దూరపు బంధువుల కలయిక. స్థిరాస్తి వివాదాలు.తుల: వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఇంటాబయటా సమస్యలు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయ దర్శనాలు.వృశ్చికం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.ధనుస్సు: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.మకరం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.కుంభం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అనుకోని సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు.మీనం: కొత్త పనులు చేపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. -
బ్యాంకింగ్ మోసాలు @ రూ.36,014 కోట్లు
సాక్షి, అమరావతి: రుణ ఖాతాలు, డిజిటల్ పేమెంట్లకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ నేరాల విలువ 2023–24తో పోల్చిచూస్తే మూడు రెట్లు పెరిగింది. ఈ మోసాల విలువ రూ.12,230 కోట్ల నుంచి రూ.36,014 కోట్లకు ఎగసింది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. ఇదే కాలంలో నేరాల సంఖ్య మాత్రం 36,060 నుంచి 23,953కు తగ్గింది. ఫ్రాడ్ క్లాసిఫికేషన్కు సంబంధించి 2023 మార్చి 27న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి, గత సంవత్సరాల్లో నివేదించిన రూ.18,674 కోట్ల విలువైన 122 కేసులను తిరిగి తాజా నేరాలుగా నమోదు చేయడం వల్ల మొత్తం నేరాల విలువ పెరిగిందని ఆర్బీఐ నివేదిక వివరించడం గమనార్హం. మొత్తం నేరాల సంఖ్యలో ప్రైవేటు బ్యాంకులకు సంబంధించినవి 60 శాతం ఉన్నాయి. కానీ విలువ పరంగా ప్రభుత్వ రంగ బ్యాంకులవి 71 శాతం కంటే ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..» నేరాల సంఖ్యలో ఎక్కువగా డిజిటల్ చెల్లింపుల (కార్డ్, ఇంటర్నెట్) కేటగిరీలో చోటుచేసుకున్నాయి. అయితే విలువ పరంగా చూస్తే లోన్ లేదా అడ్వాన్స్ ఖాతాల్లోనే ఎక్కువ నేరాలు జరిగాయి. » ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువగా కార్డ్, ఇంటర్నెట్ నేరాలు జరగ్గా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లోన్ పోర్టుఫోలియోకి సంబంధించిన నేరాలు ఎక్కువ ఉన్నాయి. » మొత్తం కేసుల్లో లోన్ సంబంధిత నేరాలు 33 శాతానికి పైగా ఉండగా, మొత్తం నేరాల విలువలో 92 శాతం వాటాను కలిగి ఉన్నాయి.» 2024–25 చివరిలో కార్డ్, ఇంటర్నెట్ నేరాల కేటగిరీలో 13,516 కేసులు నమోదయ్యాయి. ఇవి మొత్తం 23,953 నేరాల్లో 56.5 శాతం.» రూ.లక్ష, అంతకంటే ఎక్కువ ఉన్న కేసుల వివరాలనే నివేదికలో పొందుపరచడం జరిగింది. » సంస్థలు తమ నివేదికలను సవరిస్తే ఈ డేటా మారే అవకాశం కూడా ఉంది. » నివేదికలో పేర్కొన్న మొత్తాన్ని ‘కోల్పోయిన నష్టం’గా పరిగణించడం సరికాదు. రికవరీల ఆధారంగా నష్టం తగ్గవచ్చు.భద్రత కోసం కొత్త డొమెయిన్లు..డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న నేరాలపై పోరాటానికి ఒక వినూత్న ప్రయత్నంగా భారతీయ బ్యాంకుల కోసం ప్రత్యేకంగా ‘..bank.in’, నాన్–బ్యాంకుల కోసం ‘fin.in’ అనే ఇంటర్నెట్ డొమెయిన్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ చేసింది. ఈ ప్రయత్నం డిజిటల్ బ్యాంకింగ్పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది, సైబర్ మోసాలను గుర్తించడంలో అలాగే ఫిషింగ్ వంటి ప్రమాదకరమైన కార్యకలాపాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్బీటీ) ఈ డొమెయిన్లకు ప్రత్యేక రిజిస్ట్రార్గా వ్యవహరిస్తుందని, బ్యాంకుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతుందని నివేదిక తెలిపింది. -
బాబు తొలి ఏడాది మోసాల ఖరీదు రూ.81,398 కోట్లు
చెరువు గట్టున మర్రి చెట్టు కింద వేటాడే సత్తువ లేని ఓ ముసలి పులి కూర్చొని ఉండేది. చేతితో బంగారు కడియం పట్టుకుని.. అటుగా వెళ్తున్న బాటసారులను బంగారు కడియం ఇస్తా నా వద్దకు రా అంటూ పిలుస్తూ ఉండేది. ఒక రోజున చెరువు గట్టుపై నుంచి వెళ్తున్న బాటసారిని ముసలి పులి నా వద్దకు రా అంటూ పిలిచింది. బాటసారి భయపడి పారిపోతుంటే.. ‘భయపడకు.. నా చేతిలో బంగారు కడియం చూశావా.. నీలాంటి పుణ్యాత్మునికి ఈ బంగారు కడియం ఇస్తే నాకు స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుంది’ అంటూ ఆశ పెట్టింది. ‘నువ్వేమో క్రూర జంతువు.. నిన్నెలా నమ్మేది?’ అంటూ ఆ బాటసారి అనుమానం వ్యక్తం చేస్తే.. ఆ ముసలి పులి పక్కనే ఉన్న నక్క జోక్యం చేసుకుంటూ ‘పండు ముసలి పులి పరుగెత్తలేదు.. పళ్లూడిపోయాయి.. మాంసం తినడం ఎప్పుడో మానేసింది.. చెరువులో శుభ్రంగా స్నానం చేసి రా.. బంగారు కడియం తీసుకో’ అంటూ ఊరించింది.బంగారు కడియంపై ఆశపడ్డ బాటసారి.. నక్క చెప్పినట్టే చెరువులో స్నానం చేసి, మర్రి చెట్టు కింద కూర్చున్న ముసలి పులి వద్దకు వెళ్లాడు.. ముసలి పులి ఒక్కసారిగా బాటసారిపై పడి చంపేసి కడుపు నిండా తినేసింది.. మిగిలిపోయిన బాటసారి మాంసాన్ని నక్క తినేసింది. ఇదీ పంచతంత్రం నీతి కథ. ఈ కథ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది.ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 హామీలను టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చారు. ఆ హామీల అమలు పూచీపత్రం ఇదిగో అంటూ ‘బాబు ష్యూరిటీృభవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ఏటా పథకాల ద్వారా ఆ కుటుంబానికి ఒనగూరే లబ్ధిని వివరిస్తూ ఇంటింటా బాండ్లను పంపిణీ చేశారు. గత చరిత్రను చూసి చంద్రబాబును ప్రజలు నమ్మరేమో అనే భయంతో.. ఆ హామీల అమలు పూచీ నాదీ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.వైఎస్ జగన్ పథకాలను కొనసాగించడంతోపాటు రెండింతలు సంక్షేమం అధికంగా ఇస్తామంటూ చంద్రబాబు, పవన్ నమ్మబలికారు. ఆ మేరకు ఎల్లో మీడియా కూడా ఊదరగొట్టింది. ఆ హామీలతో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే తొలి ఏడాది సూపర్ సిక్స్లో ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. మిగతా హామీలకు దిక్కే లేదు. ఆ హామీలన్నీ మోసాలుగా మిగిలాయి. సూపర్ సిక్స్, ఇతర పథకాల ద్వారా తొలి ఏడాది లబ్ధిని ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈ లెక్కన చంద్రబాబు మొదటి ఏడాది మోసాల ఖరీదు రూ.81,397.83 కోట్లు.సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఓట్లేయించుకుని విజయం సాధించిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న.. అనే సామెతను అవపోసన పట్టిన సీఎం చంద్రబాబు, అధికారం చేపట్టిన వెంటనే తన నైజాన్ని చాటిచెప్పారు. సూపర్ సిక్స్ సహా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎవరైనా ప్రశ్నిస్తే.. సంపద సృష్టించే రహస్యం చెవిలో చెప్పండి.. సంపద సృష్టించాక సంక్షేమం ఇస్తా.. అంటూ ఎదురు దాడికి దిగుతూ వచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఏడాదిలోనే రూ.1,58,604 కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించారు. అయినా సరే ఒక్కటంటే ఒక్క పథకాన్ని అమలు చేయకపోవడం గమనార్హం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, దీపం, ఉచిత బస్సు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ భృతి, మత్స్యకార భరోసా, ఉచిత పంటల బీమా పథకాల కిందే రూ.81,397.83 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. తద్వారా చంద్రబాబును నమ్మి ఓటేయడమంటే చంద్రముఖిని మళ్లీ నిద్రలేపడమేనని ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అప్రమత్తం చేస్తూ నాటి సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలు అక్షర సత్యమని నిరూపితమైందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.అది మేనిఫెస్టో.. ఇది మాయఫెస్టో రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో నాలుగే నాలుగు పేజీలతో కూడిన మేనిఫెస్టోను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారు. తొలి ఏడాదే 95 శాతం హామీలు అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా తొలి ఏడాదే 3.58 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.40,627 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఐదేళ్ల పాలనలో రూ.2,73,756.17 కోట్లను డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1,84,604.32 కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాలు కలిపితే ఐదేళ్లలో పేదలకు మొత్తం రూ.4,58,360.49 కోట్ల ప్రయోజనం కలిగించారు. మేనిఫెస్టో అమలు అంటే ఇదీ అని నిరూపించారు. కానీ.. సూపర్ సిక్స్ సహా 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలి ఏడాది సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా మేనిఫెస్టోను మాయఫెస్టోగా మార్చారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామంటూ నమ్మబలికి, అంతకంటే రెండింతలు సంక్షేమం ఇస్తామని నమ్మించి ప్రజలను నట్టేట ముంచారు.మోసాలుగా మిగిలిన హామీలు » సూపర్ సిక్స్ పథకాల్లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 1.80 కోట్ల మంది. వీరికి నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. మొదటి ఏడాది ఒక్క పైసా ఇవ్వలేదు. అంటే.. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు రూ.32,400 కోట్లు ఎగ్గొట్టారు. » దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే.. రూ.4,083.48 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది ఒక సిలిండర్కు మాత్రమే రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు.» మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే నెలకు రూ.275 కోట్ల చొప్పున ఆర్టీసీకి ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఈ హామీని అమలు చేయలేదు. అంటే.. ఉచిత బస్సు రూపంలో మహిళలకు రూ.3,500 కోట్లు ఎగ్గొట్టారు. ఉచిత బస్సు సౌకర్యం అమలై ఉండింటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు మహిళలంతా అమరావతికి వెళ్లి చూసొచ్చే వారు. కడప, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల వాళ్లంతా విశాఖ నగరానికి వెళ్లొచ్చేవారు. వారి ఆశలు ఇప్పటి దాకా నెరవేర లేదు. » 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది పెన్షన్ ఇవ్వకుండా రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు.» తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మంది పిల్లలకు రూ.15 వేల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడీఐఎస్ఈ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్–యూడైస్) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు.» 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. తొలి ఏడాది నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారు.» ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు.» వైఎస్ జగన్ అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. 2023–24లో పంటలు సాగు చేసిన రైతులకు బీమా ప్రీమియం చెల్లించకుండా ఎగ్గొట్టారు. దాంతో రైతులకు బీమా పరిహారం రూ.1,385 కోట్లు రాలేదు.» మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ.. మొదటి ఏడాది మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఇవ్వకుండా రూ.265 కోట్లు ఎగ్గొట్టారు.సూపర్ సిక్స్ ఇచ్చేశా అంటూ హూంకరింపు కూటమి సర్కార్ రెండో ఏడాదిలోకి అడుగు పెట్టాక తల్లికి వందనం పథకం కింద 87,41,885 మందికి రూ.15 వేల వంతున ఇవ్వాల్సి ఉండగా 54,94,703 మందికి మాత్రమే రూ.13 వేల చొప్పున జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే 32,47,182 మందికి ఎగనామం పెట్టి తల్లికి వందనం పథకాన్ని మహా మోసంగా మార్చారు. ఈ పథకంపై మీడియాతో మాట్లాడుతూ పీృ4కు ఆడబిడ్డ నిధి, స్కిల్ డెవలప్మెంట్కు నిరుద్యోగ భృతి అనుసంధానం చేశానని.. 20న అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15న ఉచిత బస్సు పథకాలను అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. మొత్తంగా సూపర్ సిక్స్ అమలు చేసేశానని, ఇంకెవరైనా దీని గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప మరోటి కాదంటూ హూంకరించారు. 32,400 కోట్లు18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు ఏటా రూ. 18 వేల చొప్పున ఎగ్గొట్టిన ఆడబిడ్డ నిధి లబ్ధిదారులు 1.80కోట్లు3,218.48 కోట్లుదీపం2 పథకం కింద మహిళలకు టోకరాలబ్ధిదారులు 1.59 కోట్లు13,112.82 కోట్లుతల్లికి వందనం పథకం కింద మహిళలకు రూ. 15 వేల చొప్పున టోపీలబ్ధిదారులు 87,41,8851,385 కోట్లుపంటల బీమా పరిహారం చెల్లించకుండా రైతులకు కలిగించిన నష్టం లబ్ధిదారులు53 లక్షలు9,600 కోట్లు50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నెలకు రూ. 4 వేలు చొప్పున ఇవ్వని పింఛన్ సొమ్ము లబ్ధిదారులు 20 లక్షలు10,716.53 కోట్లుఅన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు రూ. 20 వేల చొప్పున అన్యాయం లబ్ధిదారులు 53,58,266265 కోట్లుమత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద రూ. 24 వేల చొప్పున తొలి ఏడాది ఎగవేసిన మొత్తం 7,200 కోట్లునిరుద్యోగ భృతి కింద యువతకు రూ. 36 వేల చొప్పున దగాలబ్ధిదారులు 20 లక్షలు3,500 కోట్లుఉచిత బస్సు కింద మహిళలకు మోసం లబ్ధిదారులు 2.7 కోట్లు -
మళ్లీ కొలువుల కళకళ!
ముంబై: ఉద్యోగ నియామకాలు మే నెలలో సానుకూలంగా నమోదయ్యాయి. ఎనిమిది నెలల వరుస క్షీణత తర్వాత మే నెలలో 8.9 శాతం నియామకాలు పెరిగినట్టు (పోస్టింగ్లు) జాబ్సైట్ ఇండీడ్ ప్రకటించింది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్లోనే అధిక నియామకాలు కొనసాగుతున్నట్టు స్పష్టం చేసింది. మరింత సంఘటిత ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ మారుతుండడం ఇందుకు మద్దతునిస్తున్నట్టు తెలిపింది. భారత్లో ఉద్యోగ నియామకాలు కరోనా ముందు సంవత్సరం (2019) కంటే 80 శాతం అధికంగా ఉన్నట్టు, ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే ఎంతో మెరుగని వెల్లడించింది. ముఖ్యంగా యూకే, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్లో ఉద్యోగ నియామకాలు ఇప్పటికీ కరోనా ముందు నాటి కంటే తక్కువగా ఉండడాన్ని తన నివేదికలో ఇండీడ్ ప్రస్తావించింది. వీటితో పోల్చి చూసినప్పుడు భారత్లో నియామకాలు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. భారత్ మార్పు దిశగా ప్రయాణిస్తుండడంతో ఇటీవలి సంవత్సరాల్లో సంఘటిత రంగంలో మరిన్ని ఉద్యోగ కల్పనలకు దారితీస్తున్నట్టు విశ్లేíÙంచింది. ఇతర ఆర్థిక వ్యవస్థలు ఈ స్థాయిలో సంఘటితం వైపు అడుగులు వేయడం లేదని తెలిపింది. ఈ విభాగాల్లో అధిక నియామకాలు.. చిన్నారుల సంరక్షణ విభాగంలో 27 శాతం, వ్యక్తిగత సంరక్షణ, గృహ ఆరోగ్యంలో 25 శాతం, విద్యా రంగంలో 24 శాతం, తయారీలో 22 శాతం చొప్పున మే నెలలో నియామకాలు పెరిగాయి. అదే సమయంలో డెంటల్ రంగలో 10.2 శాతం, వ్యవసాయం, ఫారెస్ట్రీలో 8.6 శాతం, కమ్యూనిటీ, సామాజిక సేవల్లో 6.8 శాతం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 4.2 శాతం చొప్పున నియామకాలు తగ్గాయి. మే నెలలో 1.5 శాతం ఉద్యోగ ప్రకటనల్లో కంపెనీలు జెనరేటివ్ ఏఐ అవసరాన్ని ప్రస్తావించాయి. ముఖ్యంగా డేటా అనలైటిక్స్ ఉద్యోగాల్లో 12.5 శాతం వాటికిర, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 3.6 శాతం, సైంటిఫిక్ రీసెర్చ్లో 3.1 శాతం మేర జెనరేటివ్ ఏఐ పరిజ్ఞానాన్ని అవసరాన్ని పేర్కొన్నాయి. -
అజిత్కి జోడీగా...
స్టార్ హీరో అజిత్కి జోడీగా శ్రీనిధీ శెట్టి నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. యశ్ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’తో హీరోయిన్గా పరిచయమయ్యారు శ్రీనిధీ శెట్టి. ఆ సినిమాపాన్ ఇండియా హిట్ కావడంతో ఈ బ్యూటీకి ఫుల్ క్రేజ్ నెలకొంది. ఆ తర్వాత ఆమె నటించిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’, తమిళ చిత్రం ‘కోబ్రా’ మంచి విజయాలు సాధించాయి. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది థర్డ్ కేస్’ సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు శ్రీనిధి.ఈ చిత్రంలో తనదైన నటన, యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారామె. ప్రస్తుతం తెలుగులో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా ‘తెలుసు కదా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే... అజిత్ కుమార్తో నటించే క్రేజీ చాన్స్ను శ్రీనిధి అందుకున్నట్లు టాక్. అజిత్ నటిస్తున్న 64వ సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం.అజిత్తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సినిమా తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ ‘ఏకే 64’ (వర్కింగ్ టైటిల్)కి దర్శకత్వం వహిస్తారని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ నవంబరులో ఆరంభం అవుతుందట. 2026 వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి... అజిత్కి జోడీగా శ్రీనిధి నటిస్తారా? లేదా అనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. -
ఫలితాలతోపాటే వేగంగా వార్షిక నివేదికలు
ముంబై: కంపెనీలు ఆర్థిక ఫలితాల వెల్లడికి, వార్షిక నివేదికల విడుదలకు మధ్య అంతరాన్ని తగ్గించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కోరింది. దీనివల్ల ఇన్వెస్టర్ల విశ్వాసం ఇనుమడిస్తుందని కంపెనీ సీఎఫ్వోలకు సూచించింది. ఆడిట్ కమిటీలు, ఆడిటర్లతో సీఎఫ్వోలు మరింత లోతుగా సంప్రదింపులు నిర్వహించాలని, తద్వారా మరింత సహకారంతో ఆర్థిక ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకోవాలని సెబీ హోల్టైమ్ సభ్యుడు అనంత నారాయణ్ కోరారు. సీఎఫ్వోలకు సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా విశ్వాసం నిలబెట్టడంలో సీఎఫ్వోలు పోషిస్తున్న ప్రాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ప్రస్తుతం వార్షిక ఫలితాలు, వార్షిక నివేదికల వెల్లడికి మధ్య అంతరం 70 నుంచి 140 రోజుల వరకు ఉంటోంది. ఖాతాలు, అంతర్గత నియంత్రణలు, కంపెనీ ఆడిటర్ రిపోర్ట్ గురించి మరింత లోతైన వివరాలతో కూడిన వార్షిక నివేదిక మరింత సమాచారయుక్తంగా ఉంటుంది. ఈ జాప్యాన్ని తగ్గిస్తే ఇన్వెస్టర్లకు పారదర్శకత పెరుగుతుంది’’అని అనంత నారాయణ్ పేర్కొన్నారు. -
రెండు గంటలు... ఏడు ప్రాజెక్ట్లు!
ఎనిమిది పదుల వయసులో ఎంతో చురుకుగా సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, టీవీ షోలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు అమితాబ్ బచ్చన్. వేగంగా పని చేయడం తనకు ఇష్టం అంటున్నారు ఈ బిగ్ బి. అందుకు ఉదాహరణగా ఇటీవల తాను రెండు గంటల్లో ఏడు ప్రాజెక్ట్లు (ఐదు వాణిజ్య ప్రకటనలు, రెండు ఫొటోషూట్లు) చేసిన విషయం గురించి చెప్పారు. ‘‘ఈ మధ్య నేను రెండు గంటల్లో ఏడు ప్రాజెక్ట్లు చేయడంతో నా డైరెక్టర్ ఫ్రెండ్ ఒకరు ‘ఇలా పని చేయడం సరి కాదు.ఒక్క రోజులో పూర్తి చేయాల్సిన పనిని నువ్వు రెండు గంటల్లో పూర్తి చేస్తే ఎలా? నువ్వు పని వి«ధానాన్నిపాడు చేస్తున్నావు. ఇలా చేస్తే క్లైంట్లు ఒకే రోజులో ఎక్కువ ప్రాజెక్ట్లు చేయమంటారు. అది కరెక్ట్ కాదు’ అని చమత్కారంగా అన్నాడు. ఆ మాటలు నాకు చాలా ఆనందాన్నిచ్చాయి. నాకు ఇలా స్పీడ్గా పని చేయడం ఇష్టం’’ అని పేర్కొన్నారు అమితాబ్ బచ్చన్. -
మిడిమిడి జ్ఞానమా.. అతి తెలివా!?
సాక్షి, అమరావతి : ‘ప్రజా జీవితంలో ఉండేవారు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంతైనా తెలుసుకోవాలి, లేదా అన్నీ తెలిసిన వారిని పక్కన పెట్టుకోవాలి. అదీ సాధ్యం కానప్పుడు తెలిసిన వారు చెప్పింది విని అర్థం చేసుకుని మాట్లాడాలి. వీటిలో ఏ ఒక్కటీ చేయని వ్యక్తి కీలక విద్యా శాఖ మంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టం’ అని విద్యా రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయో.. వాటిలో ఎంత మంది విద్యార్థులున్నారో తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి నవ్వుల పాలవడం లోకేశ్కు కొత్తేం కాదని ప్రజలు అంటున్నారు. శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. యూడైస్పై మాట్లాడిన తీరు చూస్తుంటే విద్యా రంగంపై ఆయనకు కనీస అవగాహన లేదని స్పష్టమైందని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. ‘యూడైస్ ప్లస్’లో అంగన్వాడీ పిల్లలను కూడా లెక్కిస్తారని చెప్పి తన అజ్ఞానాన్ని ప్రదర్శించారంటున్నారు. ‘యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్’.. సంక్షిప్తంగా యూడైస్ ప్లస్గా పేర్కొనే వెబ్సైట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది.యూడైస్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయుల డేటాను ఏటా అప్లోడ్ చేస్తారని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు. పైగా ఇందులో నమోదు చేసే వివరాలన్నీ ఆయా జిల్లా కలెక్టర్లు స్వయంగా పరిశీలించిన తర్వాతే అప్లోడ్ చేస్తారు. చిల్లరమల్లర వివరాలను ఇందులో నమోదు చేయరు. పైగా అన్ని వివరాలను ఒకటికి పదిసార్లు పరిశీలించిన తర్వాతే డేటాను నమోదు చేస్తారు. ప్రతి విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ (1–12) వరకు చదివే విద్యార్థుల వివరాలు మాత్రమే ఇందులో ఉంటాయని, అంగన్వాడీ పిల్లల వివరాలు నమోదు చేయలేదని యూడైస్ ప్లస్ నివేదికలోనే పేర్కొన్నారు. కావాలంటే రిపోర్టులోని పేజీ నంబర్ 10లో చూస్తే అవగాహన వస్తుందంటున్నారు. యూడైస్ ప్లస్ డేటా ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో వివిధ మేనేజ్మెంట్ పాఠశాలలు 61,373 ఉన్నాయి. వీటిలో 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ వివరాలు ఇదే రిపోర్టులోని 30వ పేజీలో ఉంది. ఈ కనీస వివరాలు కనుక్కోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం మంత్రిగా తగదని, అయినా లోకేశ్ సంగతి తెలిసిందే కదా అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. లోకేశ్ సెల్ఫ్ గోల్ విద్యాశాఖ మంత్రి లోకేశ్కు పరిపక్వత లేదు. నన్ను విమర్శించే స్థాయి అంతకంటే లేదు. యూడైస్ డేటాను తెలుసుకోవడానికి వంద రోజుల సమయం పట్టిందంటే ఆయనకు ఏ మాత్రం జ్ఞానం ఉందో అర్థమవుతోంది. పదో తరగతి పేపర్ల మూల్యాంకనం తప్పుల తడకగా నిర్వహించినప్పుడే విద్య శాఖ మంత్రిగా లోకేశ్ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు యూడైస్ డేటా పేరుతో ప్రతిపక్షంపై బురద చల్లాలని సెల్ఫ్గోల్ వేసుకున్నారు. యూడైస్ డేటాను కలెక్టర్లు స్వయంగా ఆమోదిస్తారు. ఏ లెక్కలు పడితే.. అవి ఇందులో చేర్చడానికి కుదరదు. ఇంగిత జ్ఞానం లేని లోకేశ్కు ఈ విషయాలు ఏమీ తెలియవు. అసలు లోకేశ్ను కాదు.. ఆయన్ను విద్య శాఖ మంత్రిని చేసిన చంద్రబాబును అనాలి. కొడుకుపై ప్రేమ ఉంటే ఇంకేమైనా చేసుకోవాలి గానీ విద్యార్థులపై బలవంతంగా రుద్దడం దురదృష్టకరం. – బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విద్యా శాఖ మాజీ మంత్రినీ బుద్ధి గడ్డి తినిందా లోకేశ్?లోకేశ్కు ఏపాటి అక్షర జ్ఞానం ఉందో దేశం మొత్తానికి తెలుసు. ఏడాది కాలంలో విద్యా శాఖను భ్రష్టు పట్టించారు. ఎక్కడైనా అంగన్వాడీ పిల్లలను యూడైస్లో నమోదు చేస్తారా? నువ్వు మంత్రివా? చదువు సంధ్యలు సరిగా అబ్బలేదు. కనీసం ప్రెస్మీట్కు వచ్చే ముందైనా నీ అధికారులను అడిగితే చెబుతారు కదా! తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.2 వేలు కోత పెడుతున్నావు? దీనిపై గతంలో నువ్వు విమర్శలు చేయలేదా? ఇప్పుడు నీ బుద్ధి గడ్డి తింటోందా? కలెక్టర్ స్వయంగా ఆమోదించిన డేటాలో తప్పులు ఉన్నాయని ఎలా అంటావు? సరే.. ఒక్కటైనా నిరూపించావా? – ఆదిమూలపు సురేశ్,రాష్ట్ర విద్యా శాఖ మాజీ మంత్రి -
జేఏఎల్ దివాలా పరిష్కార ప్రణాళికకు డెడ్లైన్ పొడిగింపు
న్యూఢిల్లీ: దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న జైప్రకాష్ అసోసియేట్స్ (జేఏఎల్) పరిష్కార ప్రణాళిక దాఖలుకు ఆఖరు తేదీని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జూన్ 24కి పొడిగించాయి. బిడ్డర్ల విజ్ఞప్తి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఆఖరు తేదీ పొడిగింపును రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదించినట్లు జేఏఎల్ తెలిపింది. వాస్తవానికి ఈ గడువు జూన్ 9తో ముగియాలి. అయితే, పలువురు బిడ్డర్లు పరిష్కార ప్రణాళికను సమరి్పంచేందుకు మరింత గడువు కావాలని కోరడంతో సీవోసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వివరించింది. సుమారు 25 కంపెనీలు జేఏఎల్ను దక్కించుకోవడంపై ఆసక్తిగా ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, వేదాంత, పతంజలి ఆయుర్వేద, జీఎంఆర్ బిజినెస్ అండ్ కన్సల్టెన్సీ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్, సిమెంట్ తయారీ, ఆతిథ్యం తదితర రంగాల్లో జేఏఎల్ కార్యకలాపాలు సాగిస్తోంది. రుణాల చెల్లింపులో డిఫాల్ట్ కావడంతో 2024 జూన్ 3న కంపెనీపై దివాలా పరిష్కార ప్రక్రియ కింద జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) విచారణ చేపట్టింది. కంపెనీకి మొత్తం రూ. 57,185 కోట్ల మేర రుణభారం ఉంది. -
అంత ఉలుకెందుకు లోకేశ్!?
సాక్షి, అమరావతి :తల్లికి వందనం పథకం అమలుతీరుపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో వైఎస్సార్సీపీని ఉద్దేశించి మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఘాటుగా బదులిచ్చింది. మంత్రి సవాల్కు ప్రతి సవాల్ కూడా చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కౌంటర్ ఇచ్చింది. వైఎస్సార్సీపీ స్పందన ఏమిటంటే..‘‘నారా లోకేశ్.. యూడైస్ నివేదిక 2023–24 ప్రకారం రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య మొత్తం 87,41,885 మంది. ఆ రిపోర్టును జతచేస్తున్నాం. కానీ మీరు అంగన్వాడీ పిల్లలను కలిపారని అంటున్నారు. మీ వ్యాఖ్యలను ఈ నివేదిక సమర్థించడంలేదు. దీనికి సమాధానం ఏంటి? పైగా ఆనాటి విద్యాశాఖ మంత్రికి బేసిక్స్ కూడా తెలియవంటూ అవమానకరంగా, హేళనచేస్తూ మాట్లాడ్డం సంస్కార హీనం’’.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సమాచారానికి సంబంధించిన పేపర్లు, వీడియో క్లిప్పింగ్స్లు జతచేసింది. నువ్వు చేసిన ప్రచారానికి మేం ఎన్ని కేసులు పెట్టాలి?‘‘మీ తప్పుల్ని ఎత్తిచూపినా, నీ అబద్ధాలను ఎండగడుతున్నా తట్టుకోలేక అధికార అహంకారంతో బెదిరించడం మీకు అలవాటైంది. అమ్మఒడి నుంచి టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ పేరు చెప్పి వైఎస్ జగన్మోహన్రెడ్డి డబ్బులు లాగేస్తున్నారని గతంలో మీరు చెప్పిన సిద్ధాంతమే లోకేశ్. అప్పుడు ఎన్నికల్లో నువ్వు చేసిన ప్రచారాన్ని ఇప్పుడు మేం చెప్తుంటే అంత ఉలుకెందుకు? అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని అనకూడని మాటలు కూడా అన్నావు. నువ్వు చేసిన ప్రచారానికి మేం ఎన్ని కేసులు పెట్టాలి? అప్పట్లో స్వయంగా నువ్వు ఏమన్నావో ఒక్కసారి విను’’.ఆ రోజుల్లో మీ వేదన అంతా ఇంతా కాదు..‘‘వైఎస్సార్సీపీ హయాంలో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ గురించి మీరు, మీకు వత్తాసు పలుకుతూ నిరంతరం అబద్ధాలు వండివార్చే మీ పార్టీ కరపత్రం ఈనాడు రాసిన ఒక కథనాన్ని ప్రస్తావిస్తూ మీరు చేసిన పోస్టు ఇది. వెయ్యి రూపాయలు ఏమయ్యాయో తెలియదంటూ పాపం ఆ రోజుల్లో మీరు పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. మరి దీనికి ఎవరిపై కేసులు పెట్టాలి? మీ పార్టీ సోషల్ మీడియాను నడిపిన మీపైనా? ఏనాడూ నిజం చెప్పని ఈనాడుపైనా? లేక ఇద్దరిపైనా? లేకపోతే ఆ పోస్టు చేసింది మా పార్టీ కాదని మళ్లీ అదే ఎల్లో మీడియాతో రాయిస్తావా? అంతటి ఘనుడివే నువ్వు’’.. అంటూ శుక్రవారం వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. -
ఏఐ చిప్ మార్కెట్ జోరు..
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో (2028 నాటికి) కృత్రిమ మేథ (ఏఐ) ప్రాసెసర్ మార్కెట్ 500 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్లు అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ (ఏఎండీ) సీఈవో ’లీసా సూ’ తెలిపారు. 2023లో 45 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ విభాగం ఏటా 60 శాతం మేర వృద్ధి చెందుతోందని వివరించారు. అడ్వాన్సింగ్ ఏఐ 2025 కాన్ఫరెన్స్లో ’ఎంఐ350 సిరీస్’ జీపీయూలు (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు), ఇతర ఉత్పత్తులను ఆవిష్కరించిన సందర్భంగా లీసా ఈ విషయాలు వివరించారు. కొత్తగా ప్రవేశపెట్టిన చిప్లు నలభై శాతం అధిక సామర్థ్యంతో పని చేస్తాయని పేర్కొన్నారు. డెవలపర్ కమ్యూనిటీ కొత్త ఉత్పత్తులను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు డెవలపర్ క్లౌడ్ యాక్సెస్ ప్రోగ్రాంను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. ’హీలియోస్ ఏఐ ర్యాక్ స్కేల్’ సొల్యూషన్ని కూడా ఏఎండీ ఆవిష్కరించింది. ఇది వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఏఐని వినియోగించే 10 అతి పెద్ద కంపెనీల్లో ఏడు సంస్థలు తమ ఏఎండీ ఇన్స్టింక్ట్ యాక్సిలరేటర్లను ఉపయోగిస్తున్నాయని, ఈ లిస్టులో భారత టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కూడా ఉందని లీసా చెప్పారు. కాన్ఫరెన్స్ సందర్భంగా ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్తో పాటు మెటా, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ తదితర దిగ్గజాల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. -
ఒకేసారి 72 వేల మంది బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేచోట ఐదేళ్లుగా పనిచేస్తున్న 72 వేల మందికి పైగా ఉద్యోగులకు స్థానచలనం తప్పదు. దాదాపు 80 వేల మంది సచివాలయాల ఉద్యోగులకు ఈ విడతలో బదిలీలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఒకేచోట ఐదేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులు బదిలీకి దరఖాస్తు చేసుకోకపోయినా వారు బదిలీకాక తప్పదు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఈ బదిలీల ప్రక్రియ జరగనున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు.. రిక్వెస్టు బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి శనివారం ఉదయం నుంచి ప్రత్యేక వెబ్పోర్టల్ అందుబాటులోకి రానున్నట్లు అధికారులు చెప్పారు. 70 శాతానికి పైగా బదిలీ.. ప్రస్తుతం 1.09 లక్షల మంది ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఈ ఏడాది 70 శాతం మందికి పైగా స్థానచలనం ఉంటుందని అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఈనెల 30లోగా ఈ బదిలీల ప్రక్రియను పూర్తిచేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు స్పష్టంచేస్తూ బదిలీ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కె. భాస్కర్ గురువారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆఫ్లైన్ విధానంలోనే బదిలీల ప్రక్రియ.. ఈసారి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్లో చేపట్టాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలను నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో చేపట్టింది. అయితే, ఇప్పుడు ఒకే విడతన దాదాపు 80 వేల మందిని ఆఫ్లైన్లో చేపట్టాలని నిర్ణయించడమంటే, భారీగా పైరవీలకు తెరలేపినట్లేనని సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట వేసే అవకాశముందని.. దీనివల్ల ఉద్యోగులు రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
పశ్చిమాసియా రణరంగం
దుబాయ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ: పశ్చిమాసియా మరోసారి రణరంగమైంది. అమెరికా ఆశీస్సులతో ఇరాన్పై ఇజ్రయెల్ భీకర వైమానిక దాడులు చేసింది. అణు కర్మాగారాలే లక్ష్యంగా విరుచుకుపడింది. గురువారం అర్ధరాత్రి మొదలుకుని శుక్రవారం రాత్రిదాకా పలు విడతల్లో దేశవ్యాప్తంగా 200కు పైగా అణు, సైనిక లక్ష్యాలపై క్షిపణులు, బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ముందస్తుగానే ఇరాన్లోకి చేరవేసి ఉంచిన డ్రోన్లు కూడా కూడా అదే సమయంలో వాటిపై దాడులకు దిగాయి. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా పూర్తిగా కుప్పకూల్చాయి. దాంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులను అడ్డుకోవడం ఇరాన్కు అసాధ్యంగా మారింది. రోజంతా విడతలవారీగా జరిగిన ఈ దాడుల్లో ఇరాన్ కనీవినీ ఎరగని నష్టాలు చవిచూసింది.ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు పదేపదే భారీ క్షిపణులు, బాంబులతో చేసిన దాడుల్లో నతాంజ్లోని ప్రధాన అణుశుధ్ధి కర్మాగారం భస్మీపటలమైంది. ఆరుగురు అణు శాస్త్రవేత్తలతో పాటు సైనిక ముఖ్యుల్లో దాదాపుగా అందరూ దాడులకు బలయ్యారు! మృతుల్లో ఇరాన్ సైన్యాధిపతి మహమ్మద్ బాఘేరి, రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామీ, బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాం చీఫ్ అమీర్ అలీ హజిజాదే, ఫెరేడౌన్ అబ్బాసీ దవానీ, మహమ్మద్ మెహదీ టెహ్రాన్చి, పలువురు వాయుసేన అత్యున్నతాధికారులతో పాటు దేశ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ తదితరులు కూడా ఉన్నారు. ఇరాన్ అంతటా కూలిన భవనాలు, శిథిలాల దిబ్బలు, వాటినుంచి వెలువడ్డ పొగ ఆకాశాన్ని కమ్ముకుంటున్న దృశ్యాలు వైరల్గా మారాయి. గురిచూసి ఇరాన్ గుండెలపై కొట్టామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.ఆర్మీ చీఫ్తో పాటు తమవారి మృతిని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ ధ్రువీకరించారు. భారీ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కాసేపటికే ఇజ్రాయెల్పై ఇరాన్ 100కు పైగా డ్రోన్లతో దాడికి దిగింది. శుక్రవారం రాత్రి క్షిపణులు కూడా ప్రయోగించింది. 1980ల్లో ఇరాక్తో యుద్ధం తర్వాత ఇరాన్పై జరిగిన అతి పెద్ద దాడి ఇదే. ప్రాంతీయ ప్రత్యర్థుల పోరు యుద్ధానికి దారితీసేలా కన్పిస్తోంది. గాజాపై ఏడాదిన్నరకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఇరాన్పైనా ఇజ్రాయెల్ కయ్యానికి కాలుదువ్వడం విశేషం. ఇరాన్కు జరిగిన భారీ నష్టాలకు లెబనాన్కు చెందిన ఉగ్ర సంస్థ హెజ్బొల్లా సంతాపం తెలిపింది. అయితే ఇరాన్కు దన్నుగా ఇజ్రాయెల్పై దాడికి దిగే దిశగా ప్రకటనేమీ చేయలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో కనీసం 70 మందికి పైగా మరణించారని, 350 మందికి పైగా గాయపడ్డారని సమాచారం.ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీఇరాన్ ప్రతి దాడుల హెచ్చరికలతో ఇజ్రాయెల్ జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించింది. పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, హోమ్ ఫ్రంట్ కమాండ్, అధికారుల సూచనలను పాటించాలని సూచించింది. దాంతో జనం నిత్యావసరాలను నిల్వ చేసి పెట్టుకునేందుకు సూపర్ మార్కెట్లకేసి పరుగులు తీశారు. అన్ని సరిహద్దుల వద్దా తమ సైనికులు సర్వ సన్నద్ధంగా ఉన్నారని మిలిటరీ చీఫ్ ఇయాల్ జమీర్ హెచ్చరించారు. తమను సవాలు చేయడానికి ప్రయత్నిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. రాడార్ కేంద్రాలతో పాటు డజన్ల కొద్దీ క్షిపణి ప్రయోగ వ్యవస్థలను కూడా నేలమట్టం చేసినట్టు తెలిపారు.టెల్ అవీవ్లోని బెన్గురియన్ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్ మూసేసింది. నెతన్యాహును తీవ్రంగా వ్యతిరేకించే విపక్ష నేత యైర్ లపిడ్తో పాటు ప్రత్యర్థి పార్టీలు, శక్తులు కూడా ఇరాన్పై దాడికి పూర్తి మద్దతు తెలపడం విశేషం. తమ మనుగడకు ఇరాన్ ప్రబల ముప్పన్న అభిప్రాయం ఇజ్రాయెలీలందరిలోనూ ఉంది. ఇది నెతన్యాహుకు అతి పెద్ద సానుకూలాంశమని చెబుతున్నారు. మరోవైపు ఇరాన్లో కూడా ఎమర్జెన్సీని మించిన పరిస్థితి కొనసాగుతోంది.అణు ముప్పును తిప్పికొట్టేందుకే: నెతన్యాహుఇరాన్పై తమ తొలి దెబ్బ అదిరిందని నెతన్యాహు ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్ మనుగడను సవాలు చేసే ఇరాన్ అణు ముప్పును రూపుమాపేందుకే తిప్పికొట్టడానికి దాడులు ప్రారంభించాం. అవి చాలా రోజులు కొనసాగుతాయి. ముప్పు తొలగేదాకా వెనకంజ వేసేది లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘ఇజ్రాయెల్ను నాశనం చేస్తామని ఇరాన్ బహిరంగ ప్రకటనలు చేస్తోంది. అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది.ఇటీవల ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంతో 9 అణుబాంబులను తయారు చేయొచ్చు. ఇరాన్ను ఇప్పుడు నిలువరించకపోతే ఇజ్రాయెల్కు పెనుప్రమాదం. నాజీ హోలోకాస్ట్ మారణకాండ నుంచి మేం పాఠాలు నేర్చుకున్నాం. మరోసారి బాధితులుగా మిగిలిలేందుకు సిద్ధంగా లేం’’ అని స్పష్టం చేశారు. ‘‘మా పోరు ఇరానీలతో కాదు. వారిని 46 ఏళ్లుగా అణచివేస్తున్న నియంతలతో. వారి బారినుంచి ఇరానీలకు విముక్తి కల్పించే రోజు ఎంతో దూరం లేదు’’ అని చెప్పారు.ఫైటర్లకు గాల్లోనే ఇంధనంఇరాన్పై దాడుల సందర్భంగా ఇజ్రాయెల్ తన వైమానిక శక్తిని పూర్తిస్థాయిలో ప్రదర్శించింది. దాని యుద్ధ విమానాలు మధ్యలో వెనక్కు వచ్చే అవసరం లేకుండా వాటికి అవసరమైన ఇంధనాన్ని రీఫ్యూ యలర్ల ద్వారా గాల్లోనే ఎప్పటి కప్పుడు అందజేస్తూ వచ్చింది. అయితే ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఇరాన్ గగనతలం లోపలికి చొచ్చు కెళ్లాయా, లేక సమీప దేశాల నుంచే క్షిపణులు ప్రయోగించాయా అన్నదానిపై స్పష్టత లేదు. తమ ప్రాంతాల మీదుగా దూసుకు పోతున్న ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను ఇరాక్ ప్రజలు ఊపిరి బిగబట్టి వీక్షించారు.ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్ఇజ్రాయెల్ దాడులకు తీవ్రమైన శిక్ష విధిస్తామని ఖమేనీ ప్రకటించారు. దాడుల అనంతరం అత్యున్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వెంటనే 100 డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడులు చేశారు. వాటిని ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. చాలా డ్రోన్లను కూల్చేసింది. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తన వైమానిక స్థావరాలను, గగన తలాన్ని మూసివేసింది. పక్క దేశం ఇరాక్ కూడా గగనతలాన్ని మూసేసింది. అన్ని విమానాశ్రయాలలో విమాన రాకపోకలను నిలిపివేసింది. దాంతో ఇరాన్, ఇరాక్ మీదుగా వెళ్లే అనేక విమానాలు దారిమళ్లించుకోవాల్సి వచ్చింది. మరికొన్ని విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. ఈ కారణంగా భారత్కు సంబంధించిన పలు విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి.దాడులు ఎక్కడెక్కడ?రాజధాని టెహ్రాన్ మొదలుకుని ఇరాన్వ్యాప్తంగా పలు నగరాలు, ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. తబ్రీజ్, కెర్మన్ షా సైనిక స్థావరాలతో పాటు అరక్, బుషెహ్ర్ అణు స్థావరాలు వీటిలో ఉన్నాయి. టెహ్రాన్లో పలు ప్రాంతాలు దాడుల్లో నేలమట్టమ య్యాయి. అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నేతృత్వం వహి స్తున్న శాస్త్రవేత్తలు, సీనియర్ అధికా రులను ఇజ్రాయెల్ లక్ష్యం చేసుకుంది. నతాంజ్ అణుశుద్ధి కర్మాగారంపై దాడులను అంతర్జాతీయ అణుఇంధన సంస్థ ధ్రువీకరించింది. రేడియేషన్ స్థాయిని గమని స్తున్నట్టు పేర్కొంది.దాడుల గురించి ముందే తెలుసు: ట్రంప్ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల గురించి తమకు ముందే తెలుసని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ప్రకటించారు. అయితే వాటిలో తమ ప్రమేయం లేదన్నారు. ఇకనైనా అణ్వాయుధ కలలను పక్కన పెట్టాలని ఇరాన్ను హెచ్చరించారు. ‘‘దౌత్యపరమైన పరిష్కారానికి ముందుకు రావాలి. కాదని ప్రతీకార దాడులకు పాల్పడితే ఎదుర్కొనేందుకు మా సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉంది. అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్ను కూడా కాపాడుతుంది. మాతో ఇరాన్ తక్షణం అణు ఒప్పందానికి రావాలి. అదొక్కటే దారి. లేదంటే మరిన్ని తీవ్ర పర్యవసానాలు తప్పవు’’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. ‘‘తదుపరి దశలో మరింత తీవ్రమైన దాడులకు ప్రణాళికలు సిద్ధమైపో యాయి.ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. కాలాతీతం కాకముందే తెలివైన నిర్ణయం తీసుకోండి. భారీ జన హననాన్ని తప్పించండి. ఇరాన్ అనే దేశమే లేకుండా పోయే పరిస్థితి రాకుండా చూసుకోండి’’ అంటూ అల్టిమేటమిచ్చారు. జాతీయ భద్రతా మండలి చీఫ్ తదితరులతో వైట్హౌస్ సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులను సమీక్షించారు. ఇరాన్పై ఇజ్రాయెల్ చర్యలు ఏకపక్షమైనవని, తమ ప్రమేయం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు.శాంతి నెలకొనాలి: మోదీపశ్చిమాసియాలో పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వెలిబుచ్చారు. అక్కడ తక్షణం శాంతి, సుస్థిరత నెలకొ నాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం ఆయనకు ఫోన్ చేశారు. ఇరాన్పై దాడులకు దారితీసిన పరిస్థితు లను వివరించారు. ఇరాన్తో పాటు పశ్చిమాసియా దేశాల్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది. ఇజ్రాయెల్, ఇరాన్ ఇరు దేశాలతోనూ భారత్కు సన్నిహిత సంబంధాలున్నాయని గుర్తు చేసింది. వాటికి అవసరమైన ఎలాంటి సాయానిౖనా సిద్ధమని పేర్కొంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి పట్ల రష్యాతో సహా ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వెలిబుచ్చాయి. -
పీహెచ్సీల్లో ఉచిత మందులు కరవు
చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థ కుప్పకూలింది. వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడంతో పాటు, ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన పీహెచ్సీల్లో (ప్రైమరీ హెల్త్ సెంటర్) మందులకు తీవ్ర కొరత నెలకొంది. వైద్యం కోసం పీహెచ్సీలకు వెళ్లిన వారిలో సగం మందికి పైగా రోగులకు ఉచిత మందులను ప్రభుత్వం అందించలేకపోతోంది. ఈ విషయం ప్రభుత్వం నిర్వహించిన తాజా ఐవీఆర్ఎస్ సర్వేలోనే వెల్లడైంది. ఉమ్మడి 13 జిల్లాల వారీగా చేపట్టిన సర్వేలో ఏకంగా 43 నుంచి 55 శాతం మంది రోగులు ఉచిత మందులు అందలేదని స్పష్టం చేశారు. అదే విధంగా పీహెచ్సీల్లో అందుతున్న వైద్య సేవలపైనా 40 శాతం వరకూ రోగులు అసంతృప్తిగా ఉన్నారు. –సాక్షి, అమరావతిసీఎం సొంత జిల్లాలో అధ్వాన్నంఏడాది పాలనలో ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చినట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే క్షేత్ర స్థాయిలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. నిబంధనల ప్రకారం పీహెచ్సీల్లో 200 రకాలకు పైగా ఉచిత మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, సగానికిపైగా మందులను ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. ఫలితంగా ఎక్కువ సంఖ్యలో రోగులు మందులను బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది.స్వయంగా సీఎం చంద్రబాబు సొంత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 48 శాతం మంది రోగులకు ఉచిత మందులు అందలేదని వెల్లడైంది. ఇక వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి అనంత జిల్లాలో ఏకంగా 55 శాతం మంది రోగులు తమకు ఉచిత మందులు అందలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తేలింది. ఇక పీహెచ్సీల్లో అందుతున్న వైద్య సేవల విషయంలో చిత్తూరు జిల్లాలో 36 శాతం, అనంతపురం జిల్లాలో 40 శాతం మంది రోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
వారాహి ఆలయ ధ్వంసంపై కేసు నమోదు
సాక్షి, టాస్క్ఫోర్స్: తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలోని శ్రీ ఆది వారాహి అమ్మవారి ఆలయం ధ్వంసంపై హిందూ సంఘాలు, రాజకీయ పార్టీల నిరసనలతో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు రామిరెడ్డి, మణిరెడ్డి, హేమాద్రితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆ ముగ్గురినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అయితే ప్రధాన నిందితుడైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిషోర్ రెడ్డిపై కేసు నమోదు చేయక పోవడం పట్ల స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి, నామమాత్రపు సెక్షన్లతో కేసు పెట్టడం వల్లే ముగ్గురి ఇలా అరెస్ట్ చేయడం.. అలా బెయిల్ మంజూరు చేసి పంపడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరిపై చర్యలు తీసుకోకపోయినా.. తీసుకున్నట్లు కనిపించాలని పై స్థాయి నుంచి ఆదేశాలు వచి్చనట్లు సమాచారం. అందువల్లే తూతూ మంత్రపు చర్యలతో పోలీసులు ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ‘నన్నెవరూ ఏమీ చేయలేరు. నాని అన్న మంత్రి లోకేశ్తో మాట్లాడాడు. వాళ్లేం చేస్తారో చేసుకోని.. మనం చేసేది చేద్దాం’ అని ఆలయం కూల్చివేతలో కీలక నిందితుడు తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండటంతో ఆలయాన్ని నేలమట్టం చేసిన ప్రాంతాన్ని శుక్రవారం ఉదయం ఎస్ఐ జగన్నాథరెడ్డి పరిశీలించారు. కూటమి నాయకుల దాడిలో శిథిలమైన విగ్రహాలు, ఉత్సవమూర్తులను పోలీసు స్టేషన్కు తరలించారు. దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణిరాజశయన ఆలయ ధ్వంసం ప్రాంతాన్ని సందర్శించి, ఆలయ ఉపచారకులు శ్రీమహారుద్ర వారాహి స్వామిని అడిగి వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.కాగా, విజయవాడకు చెందిన జై భారత్ హిందూ సంఘానికి చెందిన సభ్యులు ఘటనా స్థలి వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఘటనలో నిందితులకు వెంటనే బెయిల్ మంజూరు కావడంపై హిందూ సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్లో ఉన్నామా? చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి హిందువులపై ఎందుకు ఇంత విద్వేషమని హిందూ సంఘ ప్రతినిధి చీనేపల్లి కిరణ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్లోనే ఉన్నామా.. లేక పాకిస్తాన్లో ఉన్నామా అని అనుమానం కలుగుతోందన్నారు. ఎమ్మెల్యే నాని అనుచరుడు కిషోర్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెబుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే నాని ధ్వంసమైన ఆలయాన్ని పరిశీలించక పోవడం శోచనీయమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ ఘటనపై స్పందించక పోవడం పట్ల హిందువులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తూతూ మంత్రపు చర్యలతో సరిపెడితే హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం తప్పదని స్పష్టం చేశారు. -
ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రంగం @ రూ. 3,600 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ పరిశ్రమ 2024లో రూ. 3,600 కోట్ల స్థాయికి చేరింది. 2025లో ఇది మరో 25 శాతం వృద్ధి చెందనుంది. ది గోట్ ఏజెన్సీ, డబ్ల్యూపీపీ మీడియా, కాంటార్ కలిసి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్లో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ తీరుతెన్నులు, వినియోగదారుల ధోరణులను మార్చేందుకు .. బ్రాండ్పై విశ్వసనీయతను పెంచుకునేందుకు కంపెనీలు ఏ విధంగా తమ మార్కెటింగ్ వ్యూహాల్లో ఇన్ఫ్లుయెన్సర్లను భాగం చేసుకుంటున్నాయి లాంటి అంశాలను ఇది వివరించింది. దీని ప్రకారం ఈ పరిశ్రమలో ప్రధానంగా ఫాలోయర్ల సంఖ్యపైనే దృష్టి పెట్టే ధోరణిలో మార్పులు వస్తున్నాయి. బ్రాండ్లు ఎక్కువగా కంటెంట్ నాణ్యత, క్రియేటర్ల ఔచిత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా తయారీ రంగంలో ఇలాంటి ట్రెండ్ కనిపిస్తోంది. ఈ విభాగంలో 85 శాతం బ్రాండ్లు ఇన్ఫ్లుయెన్సర్ల ఎంపికలో కంటెంట్ నాణ్యత ప్రాథమిక ప్రాతిపదికగా ఉంటున్నట్లు వివరించాయి. దీర్ఘకాలిక భాగస్వామ్యానికి మొగ్గు.. నివేదిక ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్లతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను కుదుర్చుకునేందుకు బ్రాండ్లు మొగ్గు చూపుతున్నాయి. 72 శాతం బ్రాండ్లు ఇలాంటి భాగస్వామ్యాలను ఎంచుకున్నాయి. కంటెంట్ నియంత్రణ, బ్రాండ్ భద్రత రీత్యా 95 శాతం బ్రాండ్లు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లను ఎంచుకుంటున్నాయి. అయితే, విశిష్టమైన రంగాల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న ఇన్ఫ్లుయెన్సర్లకు ఆటోమోటివ్, కన్జూమర్ డ్యూరబుల్స్లాంటి విభాగాల్లో డిమాండ్ ఉంటోంది. సవాళ్లు ఉన్నాయి... → సానుకూలాంశాలు అనేకం ఉన్నప్పటికీ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో సవాళ్లు కూడా ఉంటున్నాయి. సరైన ఇన్ఫ్లుయెన్సర్లను దొరకపుచ్చుకోవడం ప్రధాన సవాలుగా ఉంటోంది. 83 శాతం మార్కెటర్లు, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాలు) సెక్టార్లో 95 శాతం సంస్థలు సరైన టాలెంట్ను దొరకపుచ్చుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వివరించాయి. పెట్టుబడులపై రాబడులను (ఆర్వోఐ) లెక్కించేందుకు మార్కెటర్లు ఎక్కువగా ఎంగేజ్మెంట్ రేట్ (39 శాతం), కంటెంట్ నాణ్యత (36 శాతం)కు ప్రాధాన్యత ఇస్తున్నారు. → వినియోగదారుల కోణం నుంచి చూస్తే కొనుగోలు ప్రస్థానంలో ఇన్ఫ్లుయెన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లను ప్రోడక్ట్ డిస్కవరీ కోసం (63 శాతం మంది), సమాచార సేకరణ కోసం (69 శాతం మంది) ఫాలో చేస్తున్నట్లు భారతీయ వినియోగదారులు తెలిపారు. → ఇన్ఫ్లుయెన్సర్లతో చేతులు కలపడంలో విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు 70 శాతం బ్రాండ్లు తెలిపాయి. బీఎఫ్ఎస్ఐలో ఇది 77 శాతంగా ఎఫ్ఎంసీజీలో ఇది 76 శాతంగా ఉంది. → నేటి వినియోగదారులు కేవలం ప్రోడక్టుల కొనుగోలుకే కాకుండా, స్టోరీలు, కమ్యూనిటీలు, తాము విశ్వసించే క్రియేటర్లు చెప్పే విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్తులో ఇన్ఫ్లుయెన్సర్లను వ్యూహాత్మక భాగస్వాములుగా వ్యవహరించే బ్రాండ్లే రాణిస్తాయి. నియంత్రణలు, కంటెంట్పై ఫోకస్ పెరుగుతున్న పరిస్థితుల్లో బ్రాండ్లు, క్రియేటర్లు అర్థవంతమైన, దీర్ఘకాలం నిలబడే భాగస్వామ్యాలను ఏర్పర్చుకోవడం కీలకంగా నిలుస్తుంది. -
డ్రైవర్ నిర్లక్ష్యానికి ఐదుగురు బలి
సాక్షి బెంగళూరు/కార్వేటినగరం: కర్ణాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ఏపీ వాసులు మృతిచెందారు. ఏపీఎస్ ఆర్టీసీ చిత్తూరు–2 డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు గురువారం రాత్రి తిరుపతి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. బస్సు శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరు శివారులోని హోసకోటె–కోలారు జాతీయ రహదారిపై గొట్టిపుర గేట్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ వేగంగా వెళుతూ ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. బస్సు అదుపు తప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో 18 మందిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె పంచాయతి మారేడుపల్లె గ్రామానికి విశ్వనాథరెడ్డి భార్య శారద(40), వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు గ్రామానికి చెందిన కె.కేశవులురెడ్డి(45), అతని తమ్ముడు జనార్దన్రెడ్డి కుమారుడు 45 రోజుల చిన్నారి, శ్రీరంగరాజపురం మండలంలోని కమ్మకండ్రిగ గ్రామానికి చెందిన తులసి (22), తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం తిమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన హరిబాబు, రోహిణి దంపతుల కుమార్తె ప్రణతి(4)గా గుర్తించారు. ప్రణతి తండ్రి బెంగళూరులో ఆర్మీ ఉద్యోగం చేస్తున్నాడు. క్షతగాత్రులను సిలికాన్ సిటీ, ఎంవీజే ఆస్పత్రుల్లో చేర్పిం చి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోపాటు అతి వేగంతో లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయతి్నంచడమే ఈ ప్రమాదానికి కారణమని హోసకోటె పోలీసులు తెలిపారు. బెంగళూరు రూరల్ జిల్లా ఎస్పీ సీకే బాబా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
విద్యుత్ కొనుగోలు ధరలు ఖరారు!
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్కు చెల్లించాల్సిన ధరలను డిస్కంలు ఖరారు చేశాయి. యూనిట్ సగటు ధర రూ.4.99గా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు 2023–24లో కొన్న ధరనే 2024–25కు వర్తింపజేయాలంటూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)ని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ వివరాలను కమిషన్ తన వెబ్సైట్ ద్వారా శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. డిస్కంల ప్రతిపాదన ప్రకారం.. ఇళ్లపైన సోలార్ రూఫ్టాప్ ఏర్పాటుచేసుకుని నెట్ మీటరింగ్ ద్వారా మిగులు విద్యుత్ను డిస్కంలకు అందిస్తున్న వారికి పూల్డ్కాస్ట్ ధర యూనిట్కు రూ.4.60 లభిస్తుంది. అదే విధంగా.. సెంట్రల్ గ్యాస్ స్టేషన్లు, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్లు, ఏపీ జెన్కో థర్మల్, హైడల్ వంటి ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించాల్సిన పూల్డ్కాస్ట్ ధరను కూడా డిస్కంలు ఖరారుచేసి ఏపీఈఆర్సీకి సమరి్పంచాయి. -
కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేస్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కేటీఆర్కు ఏసీబీ అధికారులు శుక్రవారం పంపిన నోటీసులో సూచించారు. ఈ కేసులో కేటీఆర్ ఏ–1గా ఉన్నారు. వాస్తవానికి మే 28నే తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్కు మే 26న ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.అయితే విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు హాజరుకావాలంటూ ఏసీబీ అధికారులు తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా–ఈ కార్ రేస్లో రూ.54.89 కోట్లు దుర్వినియోగం జరిగినట్టు ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి నిబంధనలు అతిక్రమించి విదేశీ కంపెనీకి డబ్బులు పంపారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఇప్పటికే జనవరి 9న కేటీఆర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు.కేసులో ఏ–2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్, ఏ–3గా ఉన్న హెచ్ఎండీఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్రెడ్డిని సైతం ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించారు. జనవరి 8న అర్వింద్కుమార్ను, జనవరి 9న కేటీఆర్, 10న బీఎల్ఎన్రెడ్డిని, అదే నెల 18న గ్రీన్కో ఏస్ నెక్సŠట్జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్కుమార్ను ఏసీబీ అధికారులు విచారించారు. వీరందరి స్టేట్మెంట్ల ఆధారంగా ఫార్ములా–ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులు, సీఈవోను జూమ్ మీటింగ్ ద్వారా వర్చువల్గా విచారించారు. తాజాగా కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నిస్తుండడంతో ఈ కేసు దర్యాప్తు తుది దశకు చేరినట్టుగా తెలుస్తోంది. ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్ సైతం ధ్రువీకరించారు. కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం కక్షసాధింపే: కవితఫార్ములా–ఈ రేసింగ్లో మరోసారి విచారణకు రావాలని కేటీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నోటీసులు జారీ చేసిందని ఎక్స్ వేదికగా ఆమె ఆరోపించారు. -
బంగారం భగభగ.. చమురు సలసల!
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు, పసిడి ధరలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా పసిడి మరో సరికొత్త రికార్డు దిశగా పరుగులు తీసింది. ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులతో బంగారం ధర భారీగా పెరిగింది. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో ఒక దశలో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,200 పెరిగి రూ.1,01,540 స్థాయిని తాకింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం ధర సైతం రూ.1,900 పెరిగి రూ.1,00,700 స్థాయిని నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న నమోదైన పసిడి ధర (99.9 శాతం స్వచ్ఛత) రూ.1,01,600 ఇప్పటివరకు దేశీ మార్కెట్లో ఆల్టైమ్ గరిష్ట స్థాయిగా కొనసాగుతోంది. దీని ప్రకారం సరికొత్త రికార్డుకు చేరువైనట్టు తెలుస్తోంది. అయితే అమ్మకాల ఒత్తిడితో ఢిల్లీ మార్కెట్లో పసిడి ధరలు ఆ తర్వాత కొంత దిగొచ్చాయి. మరోవైపు వెండి సైతం కిలోకి రూ.1,100 పెరగడంతో సరికొత్త జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,08,100కు చేరుకుంది. ఎంసీఎక్స్ మార్కెట్లో ఆగస్ట్ డెలివరీ కాంట్రాక్టు పసిడి ధర రూ.2,011 పెరిగి రూ.1,00,403కు చేరుకుంది. ‘‘బంగారం ధరలు రూ.లక్ష మార్క్ను దాటి కొత్త గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 3,440 డాలర్లను అధిగమించింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనం వైపు మొగ్గుచూపించారు’’అని మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురి చేసినట్టు చెప్పారు.ముడిచమురు మంటలు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ఒక దశలో 13 శాతం పెరిగి 78 డాలర్లకు చేరింది. 2022 మార్చి తర్వాత ఒకే రోజు చమురు ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. నాడు ఉక్రెయిన్పై రష్యా దాడులు చమురు ధరలకు ఆజ్యం పోశాయి. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అత్యున్నత నేత ఖమేనీ చేసిన ప్రకటన ఆందోళనలను మరింత పెంచింది. ఆ తర్వాత కొంత తగ్గి 74.32 డాలర్ల స్థాయికి బ్రెంట్ క్రూడ్ ధరలు దిగొచ్చాయి. బెంచ్మార్క్ యూఎస్ క్రూడ్ సైతం 7%కి పైగా పెరిగి 73 డాలర్లకు చేరింది. ధరలు మరింత పెరగొచ్చు.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు విస్తృతమైతే ముడి చమురు ధరలు బ్యారెల్కు 120 డాలర్లు చేరుకోవచ్చని జేపీ మోర్గాన్ హెచ్చరించింది. మోర్గాన్ స్టాన్లీ అయితే 130 డాలర్ల వరకు పెరగొచ్చని అంచనా వేసింది. చమురు ఉత్పత్తిలో ఇరాన్ ప్రపంచంలో 9వ స్థానంలో ఉంటే, మధ్యప్రాచ్యంలో సౌదీ అరేబియా తర్వాత రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉండడం గమనార్హం. పెరిగిన క్రూడ్ ధరలతో కరిగిన రూపాయి క్రూడాయిల్ ధరలు పెరగడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 59 పైసలు బలహీనపడి 86.11 వద్ద స్థిరపడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడితో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా అమెరికా కరెన్సీ డాలర్ బలపడటం కూడా మన కరెన్సీ ఒత్తిడికి లోనైంది. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో గురువారం ముగింపు(85.52)తో పోలిస్తే ఏకంగా 73 పైసల బలహీనతతో 86.25 వద్ద మొదలైంది. దేశీయ మే ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్టానికి దిగిరావడం.., ఆర్బీఐ జోక్యంతో రూపాయి కాస్త రికవరీ అయ్యింది. -
నిబంధన.. వారికోలా.. వీరికి మరోలా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరుబాట కార్యక్రమం విషయంలో మొదట్నుంచీ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగానే వ్యవహరిస్తోంది. పోలీసుల అనుమతితోనే కష్టాల్లో ఉన్న పొగాకు రైతులకు మద్దతుగా పోరుబాట ర్యాలీ జరిగింది. పోలీసుల అనుమతి లేకుండా టీడీపీ వర్గీయులు నిరసనలకు దిగారు. గొడవలు సృష్టించారు. అయినా పోలీసులు అసలు నిందితులైన టీడీపీ వర్గీయులను వదిలేశారు. కేవలం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల పైనే కేసులు పెట్టడం కుట్రపూరితేమనన్న వ్యాఖ్యలు వినిస్తున్నాయి. పోలీసులు అనుమతి లేకుండా నిరసనలు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పొదిలి పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు నిరసనలకు దిగడం ద్వారా గొడవలు సృష్టించాలన్న కుట్ర జరిగిందని తెలుస్తోంది. పోరుబాటలో టీడీపీ చేపట్టిన నిరసనలకు పోలీసుల అనుమతులు లేవని ఈనెల 12న దర్శి డీఎస్పీ స్వయంగా చెప్పారు. పోలీసుల అనుమతి లభించాకే జగన్ పోరుబాటకు ఏర్పాట్లు చేసుకున్నారు. వారు సూచించిన రూట్ ప్రకారమే ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో టీడీపీ నిరసనలకు దిగడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలకు పోలీసుల నుంచి సరైన సమాధానాలు లేవు. టీడీపీ మూకలు అనుమతి లేకుండా పెద్ద సంఖఱ్యలో వ చ్చి, విధ్వంసం సృష్టించినా పోలీసులు పట్టించుకోలేదు. ర్యాలీని భగ్నం చేయాలన్న కుట్రతోనే పచ్చమూకలు నిరసనలకు దిగినట్లు స్పష్టమవుతోంది. పచ్చమూకలకు కాపలాగా... వైఎస్ జగన్ పొదిలిలోకి ప్రవేశించక ముందే స్థానిక టీడీపీ నాయకుడు గుణిపూడి భాస్కర్ ఇంటి వద్ద కొంత మంది పచ్చమూకలు గుమిగూడారు. నవాబ్ మిట్ట దగ్గర వంద మందికి పైగానే కాపుకాశారు. ఈ రెండు చోట్ల చేతిలో నల్లకుండలు పట్టుకొని, నల్లబెలూన్లు ఎగరేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తున్న పచ్చమూకలకు పోలీసులు కాపలా కాస్తూ కనిపించారు. నిజానికి పోలీసుల అనుమతి లేకుండా నిరసనలకు దిగిన వారిని అదుపులోకి తీసుకొని అక్కడ నుంచి తరలించాల్సి ఉంది. కానీ వారి సమక్షంలోనే వైఎస్ జగన్ ర్యాలీ మీదకు రాళ్లు, చెప్పులు విసిరారు. అయినా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాళ్లు రువ్వుతున్న దుండగులను వదిలేసి ర్యాలీకి తరలి వచ్చిన రైతులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తల మీద లాఠీచార్జి చేశారు.ర్యాలీ మీద రాళ్లు రువి్వన తరువాత కొందరు పోలీసులు పచ్చమూకలతో చెట్టాపట్టాలేసుకొని తిరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అసలు ఈ గొడవలు జరుగుతాయని ముందుగానే పోలీసులకు, పచ్చమీడియాకు తెలుసని జోరుగా ప్రచారం జరుగుతోంది.వేషం మార్చి పిచ్చివేషాలేసి... జగన్ ర్యాలీలో పక్కా ప్రణాళిక ప్రకారమే టీడీపీ నేతలు గొడవలు సృష్టించినట్లు స్పష్టమవుతోంది. పోరుబాటకు జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తారని ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెలుసుకున్న అధికార పార్టీ వారు మారువేషంలో ర్యాలీలోకి ప్రవేశించినట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ కార్యకర్తలు తెల్ల ఖద్దరు దుస్తులు ధరించి ర్యాలీలోని ప్రజలతో కలిసిపోయినట్లు సమాచారం. అందుకోసం మార్కెట్ యార్డు పదవి ఇస్తామన్న హామీతో ఒక నాయకుడిని రంగంలోకి దించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి కిరాయి మూకలను రంగంలోకి దించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియోలు తీసి స్థానిక నాయకుడి ఫోన్కు పంపించినట్లు తెలుస్తోంది. ర్యాలీకి తరలి వచి్చన నిరక్షరాస్యులైన వృద్ధులు, మహిళలకు జాకెట్ ముక్కలు, నగదు, జగన్కు వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను పంపిణీ చేశారు. పోరుబాట భగ్నం చేయడానికి అధికార టీడీపీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పోలీసు కేసుల పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధించే కుట్రలకు తెరలేపారు. -
25లోగా రైతు భరోసా
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలోని రైతులకు ఈ నెల 25వ తేదీలోగా ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చేనెల చివరి వరకు రైతులకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, మిగతావి ఆగస్టు తర్వాత వస్తాయని తెలిపారు. బోనస్ ప్రకటన తర్వాత రాష్ట్రంలో సన్న ధాన్యం సాగు పెరిగిందని చెప్పారు.ఇతర దేశాల్లో డిమాండ్ ఉన్న ఆరు రకాల వరి రాష్ట్రంలో సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆయిల్పామ్ రైతులకు టన్నుకు రూ.25 వేలు తగ్గకుండా కనీస మద్దతు ధర కోసం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రానికి లేఖలు పంపించి, త్వరలోనే ప్రధానమంత్రిని కలుస్తామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని, అందులో తాను కూడా ఉన్నానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు చెపుతున్న మాటలన్నీ అబద్ధమని మంత్రి తుమ్మల అన్నారు. కేబినెట్ సబ్ కమిటీ వేయడానికి 15 రోజుల ముందుగానే మేడిగడ్డ బరాజ్ మంజూరైందని తెలిపారు. -
హంద్రీనీవా విస్తరణ పనుల్లో నాణ్యత డొల్ల
కర్నూలు సిటీ/పత్తికొండ రూరల్ : హంద్రీనీవా కాలువ విస్తరణ పనుల్లో డొల్లతనం బట్టబయలైంది. పనుల్లో నాణ్యతతో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన కాలువ లైనింగ్ దెబ్బతిని గండి పడడంతో కర్నూలు, అనంతపురం కడప, చిత్తూరు జిల్లాలోŠల్ 6.05 లక్షల ఎకరాలకు సాగు, 33 లక్షల మందికి తాగునీటిని అందించేందుకు హంద్రీనీవాను చేపట్టారు. ఈ కాలువ సర్కిల్–1 పరిధిలో 216 కి.మీ వరకు ఉంది. ఇందులో కర్నూలు జిల్లాలో 0 కి.మీ నుంచి 134 కి.మీ వరకు ప్రవహిస్తుంది.ఏటా 40 టీఎంసీల నీటిని శ్రీశైలం వెనుక జలాల నుంచి (బ్యాక్వాటర్) ఈ కాలువ ద్వారా తరలించాలనేది లక్ష్యం. అందుకు కాలువను 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు. అయితే, ఏటా నీటి ప్రవాహంతో కాలువలో పూడిక పేరుకుపోతుండటంతో ప్రవాహ సామర్థ్యం తగ్గిపోతోంది. ఈ కారణంగా 40 టీఎంసీలలో 60 శాతం నీటిని కూడా తరలించలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రధాన కాలువను విస్తరించాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. రెండు ప్యాకేజీలుగా సుమారు రూ.601 కోట్లతో అంచనాలు వేశారు. ప్యాకేజీ–1 కింద రూ.171 కోట్లు, ప్యాకేజీ–2లో రూ.430 కోట్లతో టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టారు. 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంతలో పత్తికొండ సమీపంలోని పందికొన గ్రామం 108 కి.మీ దగ్గర ప్రధాన కాలువకు గండిపడి లైనింగ్ దెబ్బతింది. దీనికి కారణం కాల్వ పక్కన ఉండే వాగులో నుంచి నీరు రావడమేనని ఇంజనీర్లు చెబుతున్నారు. కానీ, కాల్వ విస్తరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంవల్లే లైనింగ్ దెబ్బతిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.విస్తరణ పనుల్లో నాణ్యతపై అనుమానాలు..హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు ఈనెల 10లోపు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో కాంట్రాక్టర్లు హడావుడిగా పనులుచేస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే కాలువకు గండిపడి లైనింగ్ దెబ్బతినింది. నిజానికి.. అక్కడ నాణ్యమైన బంక మట్టివేసి రోలింగ్ చేశాకే లైనింగ్ చేయాలి. కానీ, నాణ్యతలేని నల్లమట్టి వాడడంవల్లే ఇటీవలి వర్షాలకు సిమెంట్ లైనింగ్ దెబ్బతినిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై హంద్రీనీవా ఎస్ఈ పాండురంగయ్యను వివరణ కోరగా.. కాలువకు ఎలాంటి ప్రమాదంలేదని, కాల్వ పక్కనున్న వంక నీరు కాల్వగట్టుపై నుంచి రావడంతోనే సిమెంట్ కాంక్రీట్ ఊడిపోయిందన్నారు. -
ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ): ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో 4.8, అన్నమయ్య జిల్లా గుండ్లపల్లిలో 4.4, విజయనగరం జిల్లా గుల్లసీతారామపురంలో 4.0, నంద్యాల జిల్లా చౌతకూరులో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా తడలో అత్యధికంగా 8.3 సెంటీమీటర్ల వర్షం పడింది. నాగలాపురంలో 7.9 సెంటీమీటర్లు, పల్నాడు జిల్లా మాచర్లలో 7.1, తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకచర్లలో 6.7, చిత్తూరు జిల్లా యాదమర్రిలో 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం శుక్రవారానికి ఉత్తర కర్ణాటక దానికి ఆనుకుని ఉన్న తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరో ద్రోణి పశ్చిమ–మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఒడిశా తీరం వరకు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
ఎడాపెడా అక్రమ అరెస్టులపై చెంపదెబ్బ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పౌరులు, మేధావులు, పాత్రికేయుల వాక్ స్వాతంత్య్ర హక్కును హరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వాక్ స్వాతంత్య్ర హక్కును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెప్పింది. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ను తప్పుపట్టింది. లైవ్ షోలో ఓ ప్యానలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై నవ్వినందుకు కొమ్మినేనిని అరెస్ట్ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘‘నవ్వడం నేరమా? దానికే అరెస్ట్ చేసేస్తారా?’’ అంటూ మండిపడింది. నవ్వడమే తప్పయితే, తాము కూడా ప్రతి రోజూ నవ్వుతూనే కేసులను విచారణ చేస్తుంటామంటూ గుర్తు చేసింది. లైవ్ షోలో ప్యానలిస్ట్ వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వారే తప్ప, ఆయన ఎలాంటి అనుచిత, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది. ఓ జర్నలిస్టుగా లైవ్ న్యూస్ షోలో పాల్గొనే కొమ్మినేని హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని, తద్వారా ఆయన వాక్ స్వాతంత్య్ర హక్కును కూడా పరిరక్షించినట్లవుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఈ నెల 8న నమోదు చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. బెయిల్ మంజూరు సందర్భంగా షరతులు విధించాలని కింది కోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.అరెస్ట్... రిమాండ్ను సవాల్ చేసిన కొమ్మినేనికొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే కేఎస్సార్ లైవ్ షోలో పాల్గొన్న మరో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి రాజధాని గురించి పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో కృష్ణంరాజు, కొమ్మినేనిపై టీడీపీకి చెందిన కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కొమ్మినేని, కృష్ణంరాజుపై ఐటీ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. తర్వాత పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయనను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో కొమ్మినేని తన అరెస్ట్, రిమాండ్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కొమ్మినేని తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, పొన్నవోలు సుధాకర్రెడ్డి, అల్లంకి రమేశ్ వాదనలు వినిపించారు. » ఈ నెల 6న కొమ్మినేని లైవ్ షో నిర్వహించారని, అందులో ప్యానలిస్ట్గా పాల్గొన్న మరో సీనియర్ జర్నలిస్ట్ అమరావతి గురించి వ్యాఖ్యలు చేశారని సిద్ధార్థ దవే ధర్మాసనానికి వివరించారు. ఈ వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన ఎవరి మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని నివేదించారు. ప్యానలిస్ట్ వ్యాఖ్యలకు.. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిని బాధ్యుడిగా చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు.మరొకరు చేసిన వ్యాఖ్యలకు యాంకర్ను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించిన జస్టిస్ మన్మోహన్... అలా అదుపులోకి తీసుకునేందుకు చట్టం అనుమతిస్తుందా? అని ప్రశ్నించారు. ఏ నిబంధన మేరకు అరెస్టు చేశారో చెప్పాలని ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూథ్రాలను ప్రశ్నించారు. చర్చలో ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేని నవ్వారని, ఈ విషయంలో ప్రేక్షక పాత్ర పోషించారని వివరించారు. ఆయన మాట్లాడేటప్పుడు అడ్డుకోకుండా నవ్వారని రోహత్గీ బదులిచ్చారు. ఈ వాదనపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. నవ్వడం నేరమా? నవ్వితే అరెస్ట్ చేస్తారా? అంటూ నిలదీసింది. ఎవరైనా నవ్వొచ్చేలా మాట్లాడితే ధర్మాసనంపై ఉన్న తాము కూడా నవ్వుతామన్న జస్టిస్ మన్మోహన్.. అంతమాత్రాన తప్పుడు కేసులు అంటగట్టేస్తారా? అని ప్రశ్నించారు. జస్టిస్ మిశ్రా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ... ప్రతి రోజూ ఇలా జరుగుతూనే ఉంటుందని అన్నారు. కొమ్మినేని చర్చలో ప్రేక్షకుడు కాదని రోహత్గీ చెప్పగా... ఆయన ఆ వ్యాఖ్యలు చేయలేదు కదా? అని జస్టిస్ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు. పిటిషనర్ స్వయంగా ఎటువంటి పరువు నష్టం కలిగించే, అవమానకర వ్యాఖ్యలు చేయలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. లైవ్ షోలో ఆయన పాత్రికేయ భాగస్వామ్యం రక్షణకు అర్హమైనదని, ఇది వాక్ స్వాతంత్య్ర హక్కును కాపాడుతుందని తెలిపింది. కొమ్మినేని అరెస్ట్ ఎంతమాత్రం సహేతుకం కాదంటూ ఆయనను బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు విధించే నిబంధనలు, షరతులకు లోబడి ఈ నెల 8న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నంబర్ 108లో కొమ్మినేనిని బెయిల్పై విడుదల చేయాలని నిర్దేశించింది. తాను నిర్వహించే షోలో కొమ్మినేని ఎలాంటి పరువు నష్టం వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని, ఇతరులను అలాంటి ప్రకటనలు చేయడానికి అనుమతించడం గానీ చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రేవంత్.. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: ‘రేవంత్రెడ్డి గారూ.. ఓటుకు నోటు కేసులో మీరు..ఫార్ములా ఈ అంశంలో నేను.. ఇద్దరమూ ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నాం. న్యాయమూర్తి సమక్షంలో మనిద్దరం లై డిటెక్టర్ పరీక్ష ఎందుకు చేయించుకోకూడదు. ఈ పరీక్షను టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తే అసలు దోషులు ఎవరో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. నాతోపాటు లై డిటెక్టర్ పరీక్షకు హాజరయ్యే దమ్ముందా’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలు చేశారు. శుక్రవారం ‘ఎక్స్’లో కేటీఆర్ స్పందించారు. ‘ప్రభుత్వం నడిపే చేవలేనప్పుడు ప్రజలతో సర్కస్ చేస్తూ వారి దృష్టిని మళ్లిస్తారు.కానీ కాంగ్రెస్ పార్టీతోపాటు దాని జోకర్ సీఎం చేసే హడావుడి మమ్ములను అడ్డుకోలేవు. సోమవారం ఉదయం 10 గంటలకు ఫార్ములా–ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ నుంచి పిలుపు వచ్చింది. చట్టానికి కట్టుబడిన పౌరుడిగా విచారణకు హాజరై ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరిస్తాను. నల్లటి బ్యాగ్ నిండా డబ్బుతో దొరికి పదేళ్లు పూర్తి చేసుకున్నదెవరో చెప్పగలరా. ఓ వైపు రాష్ట్రం దివాలా తీసిందని చెబుతున్న సీఎం రేవంత్.. పదే పదే విచారణలు, ప్రచారాలు పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఎందుకు వృథా చేస్తున్నారు’అని కేటీఆర్ ప్రశ్నించారు.విద్యా వ్యవస్థపై బాధ్యత లేదురాష్ట్రంలో విద్యా వ్యవస్థ కూడా కుంటుపడిందని కేటీఆర్ ‘ఎక్స్’లో విమర్శించారు. దీని పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదన్నారు. వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతుభరోసా అమలు విషయంలో ప్రభుత్వానికి ప్రణాళిక లేదని మండిపడ్డారు. పాఠశాలలు పునః ప్రారంభమైనా పాలకులు నిర్లక్ష్యం వీడటం లేదన్నారు. ఎమ్మెల్యే పల్లాకు పరామర్శసోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని కేటీఆర్ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకొని తిరిగి ప్రజాక్షేత్రంలో చురుగ్గా పాల్గొనాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఆస్పత్రికి వెళ్లిన వారిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, తాతా మధు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు. -
సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు
సాక్షి, అమరావతి: ‘సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ‘ఎక్స్’ వేదికగా శుక్రవారం ఆయన పోస్టు చేశారు. ‘నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధిచెప్పింది.కొమ్మినేని అరెస్టు ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు తీవ్ర భంగకరమని సుప్రీంకోర్టు చెప్పడం ముదావహం’ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘అమరావతి నిర్మాణం పేరిట రూ.వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారు.అబద్ధాలు, మోసాలతో కూడిన పాలన నుంచి మళ్లించడానికి, చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్ ద్వారా పథకం ప్రకారం విష ప్రచారం చేయించారు. వాటిని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని ‘సాక్షి’ మీడియా యూనిట్ ఆఫీసుల మీద, కార్యాలయాల మీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు. చంద్రబాబు తన తప్పు తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీకి, ‘సాక్షి’ మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా మాట్లాడడంతోనే ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్ర పన్నారని అర్థం అవుతోంది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో యాంకర్గా వ్యవహరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ ఇవాళ సుప్రీంకోర్టు ఇచి్చన ఆర్డర్ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటుకావు. సత్యమేవ జయతే’ అని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఇదొక హెచ్చరికకొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సంకెళ్లను న్యాయ వ్యవస్థ బద్దలు కొట్టింది. కొమ్మినేని అరెస్ట్ అక్రమం అని దేశం మొత్తం తెలిసింది. సాక్షి కార్యాలయాలపై తన కార్యకర్తలను, నాయకులను ఉసిగొల్పి దాడులు చేయించిన చంద్రబాబు అరాచకానికి తాజా తీర్పు ఒక హెచ్చరిక. చంద్రబాబు కుట్రపూరిత విధానాలను న్యాయస్థానం ఉత్తర్వులు ఎత్తిచూపాయి.– పూనూరు గౌతంరెడ్డి, వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడుబాబు సిగ్గుతో తలదించుకోవాలికొమ్మినేని అరెస్ట్ అక్రమమని తన తీర్పుతో కూటమి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు బుద్ధి చెప్పింది. చంద్రబాబు సర్కార్ పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలకు ఈ తీర్పు గట్టి హెచ్చరిక. ఇకనైనా చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. అక్రమ అరెస్టులను ఆపాలి. –పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీతల ఎక్కడ పెట్టుకుంటారు..కొమ్మినేని అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చంద్రబాబుకు చెంపపెట్టు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సంకెళ్లను న్యాయ వ్యవస్థ బద్దలు కొట్టింది. ఇప్పుడు చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకుంటారు. – కల్పలత, ఎమ్మెల్సీసుప్రీం తీర్పుతోనైనా బాబు కళ్లు తెరవాలికొమ్మినేనిది అక్రమ అరెస్ట్ అంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుతో అయినా చంద్రబాబు కళ్లు తెరవాలి. చంద్రబాబు మెప్పు కోసం రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్న పోలీసులు పునరాలోచన చేయాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించే వారిని కోర్టుల్లో నిలబెడతాం. – తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యేరాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బకొమ్మినేని అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురురెబ్బ. కనీస నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేయడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం. – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేక్షమాపణ చెప్పాలి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన అంశంలో మంగళగిరి కోర్టు న్యాయమూర్తి, డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, తాజాగా సుప్రీంకోర్టు జర్నలిస్టుల భావప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ వెంటనే విడుదల చేయాలని ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు. తెనాలిలో దళిత, ముస్లిం యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తప్పు పట్టడం కూడా ప్రభుత్వ నేతలను తలదించుకునేలా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ అందరూ కొమ్మినేని అరెస్టుతో ఆగకుండా సాక్షి కార్యాలయాలపై దాడులకు ప్రేరేపించినందుకు తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలాగే కొమ్మినేని, కృష్ణంరాజులపై కేసులను ఉపసంహరించుకోవాలి. – ఈదర గోపీచంద్, సామాజిక విశ్లేషకులు -
ఐ లవ్ యు డాడీ...
నాటి రోజుల్లో నాన్న అంటే సం పాదించేవాడుగా, కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించేవాడిగా మాత్రమే గుర్తింపు ఉండేది. నేటి సమాజంలో తండ్రి పాత్ర ఒక కొత్త మలుపు తీసుకుంది. కేవలం సంపాదనకే పరిమితం కాకుండా, పిల్లలతో కలిసి ఆడుతూ.. పాడుతూ.. అల్లరి చేస్తూ... వారి ఆలనా పాలనా చూసే మంచి తండ్రి. అభివృద్ధిలో, భావోద్వేగ బంధాలలో, నైతిక విలువల్లో భాగస్వామి అయ్యే లవ్లీ డాడీ!ప్రస్తుత తల్లిదండ్రుల తరం ‘సమాన భాగస్వామ్యం‘ అనే సిద్ధాంతాన్ని అంగీకరిస్తోంది. తండ్రులు ఇప్పుడు పిల్లల ఆరోగ్యం, విద్య, ఆటలు, వారితో గడిపే సమయం – అన్నిట్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. పాలు పట్టడం నుంచి బడికి తీసుకెళ్లడం వరకు ప్రతి దైనందిన పనిలోనూ తండ్రి పాత్ర కనిపిస్తుంది.భావోద్వేగాలకు ప్రాధాన్యంఈ తరానికి చెందిన తండ్రులు పిల్లలను ఆదేశించేవాళ్లుగా కాదు అన్ని విషయాలు వారితో చర్చించేవాళ్లుగా మారారు. వారి భయాలు, ఆశలు, ప్రశ్నలు, ఆనందాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బంధం పిల్లల మనోభావాలపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది.వర్క్–లైఫ్ బ్యాలెన్స్ కుటుంబానికి సమయం కేటాయించడం కోసం నేటి తండ్రులు పని సమయంలో సర్దుబాటు చేసుకుంటున్నారు. ‘క్వాలిటీ టైమ్‘ అనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. రోజూ కొంత సమయం పిల్లలతో గడపడం, స్కూల్ ఈవెంట్స్కు హాజరవడం, వారికి కథలు చెప్పడం వంటి పనులు ఈ తరం తండ్రుల ప్రత్యేకతగా చెప్పవచ్చు.టెక్నాలజీతో అనుబంధంఈ డిజిటల్ యుగంలో తండ్రులు.. పిల్లల విద్య, ఆరోగ్యం, అభివృద్ధి, ఆన్ లైన్ యాప్స్, వీడియో కాల్స్, ఈ– లర్నింగ్ టూల్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. టెక్నాలజీ సహకారంతో పిల్లల ప్రపంచానికి దగ్గరగా ఉంటున్నారు.ఆధునిక తండ్రిమోడర్న్ ఫాదర్హుడ్ అనేది ప్రేమతో, సహనంతో, బాధ్యతతో కూడినదిగా మారింది. ఒక తండ్రి మోడర్న్గా, ప్రేమగా మారినప్పుడు కుటుంబం మారుతుంది. కుటుంబం మారినప్పుడు సమాజం మారుతుంది. ఈ మార్పు ఒక మంచి భవిష్యత్తుకు వేదికగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు.ఉదాహరణగా తండ్రిఓ ఆధునిక తండ్రిగా, సింగిల్ ఫాదర్గా ఉండటం అనే అసాధ్యమైన పనిని కూడా నేటి తండ్రులు సుసాధ్యం చేస్తున్నారు. పిల్లల చదువు, భావోద్వేగాలు, వారి భవిష్యత్తునూ చూసుకోవడంపై దృష్టి పెడుతున్నారు. సెలబ్రిటీలు కూడా ఇందుకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా తండ్రి తనంలో వారు చూపే నిబద్ధతా, ప్రేమా ప్రతి తండ్రికీ ఆదర్శ్ర పాయమే.కరణ్ జోహర్ సరోగసీ ద్వారా జుహీ, యష్ అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. సింగిల్ డ్యాడ్గా ఆయన తన పిల్లలకు ఆదర్శంగా ఉండటమే కాక, తన అనుభవా లను పుస్తక రూపంలోనూ, ఇంటర్వ్యూలలోనూ పంచుకున్నారు. -
ఇక అసెంబ్లీ పదవులు!
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణ, ఐఏఎస్ల బదిలీలు, జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా అసెంబ్లీ పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సామాజిక, ప్రాంతాల వారీ సమీకరణలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ చీఫ్ విప్, విప్ల నియామకంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు ఒక జాబితా కూడా సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చీఫ్ విప్ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇచ్చే అవకాశముందని, ఒకవేళ మండలిలో అదే సామాజిక వర్గ నేతకు చీఫ్ విప్ పదవి ఉందని సీఎం భావించిన పక్షంలో బీసీ నేతకు కేటాయించే అవకాశముందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.ఇక మొన్నటివరకు విప్గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్కుమార్ను మంత్రిగా, మరో విప్ రాంచంద్రు నాయక్ను డిప్యూటీ స్పీకర్గా నియమించిన నేపథ్యంలో ఖాళీ అయిన ఆ రెండు పదవులను కూడా భర్తీ చేసే యోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో సమీకరణలను బట్టి విప్ల సంఖ్యను 4 నుంచి 5 లేదా 6కు పెంచే అవకాశాలను కూడా ఆయన పరిశీలిస్తున్నట్టు సమాచారం. చీఫ్ విప్ ఎవరికి?ప్రస్తుతం అసెంబ్లీలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్కుమార్ స్పీకర్గా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్గా ఎస్టీ వర్గాలకు చెందిన రాంచంద్రునాయక్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇద్దరు బీసీలు.. కురుమ సామాజిక వర్గం నుంచి బీర్ల అయిలయ్య, మున్నూరుకాపు వర్గం నుంచి ఆది శ్రీనివాస్లు విప్లుగా ఉన్నారు. మరో రెండు విప్ పదవులు (అడ్లూరి, రాంచంద్రు నాయక్) ఇటీవల ఖాళీ అయ్యాయి. ఇప్పటివరకు చీఫ్ విప్ను నియమించకపోవడంతో అది కూడా ఖాళీగా ఉంది. ఇలావుండగా ఇప్పటివరకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విప్ పోస్టులను రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వలేదు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ ఆ వర్గం నేతలకు చాన్స్ దక్కలేదు.ఈ నేపథ్యంలో చీఫ్ విప్ పదవిని ఆ సామాజిక వర్గానికి చెందిన పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డికి కేటాయిస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానిపక్షంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని నియమించే అవకాశాలున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరి నియామకం ద్వారా అటు సామాజిక సమీకరణలను పాటించడంతో పాటు రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యం దక్కలేదనే విమర్శకు కొంతవరకు చెక్ పెట్టినట్టు అవుతుందనే ఆలోచనలో సీఎం ఉన్నారని సమాచారం. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి కాకపోతే మాత్రం ప్రస్తుతం విప్లుగా ఉన్న ఇద్దరు బీసీ నేతల్లో ఒకరికి పదోన్నతి లభించవచ్చని, బీర్ల అయిలయ్య లేదంటే ఆది శ్రీనివాస్లను చీఫ్ విప్లుగా నియమిస్తారని, తద్వారా మంత్రి పదవుల్లో ఈ వర్గాలకు ప్రాతినిధ్యం లేదన్న వాదనకు తెరపడినట్టవుతుందని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. విప్ల భర్తీకీ సమీకరణాలుఅసెంబ్లీలో ప్రభుత్వ విప్లుగా ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై కూడా సామాజిక, ప్రాంతీయ సమీకరణలను సీఎం రేవంత్ అంచనా వేస్తున్నారు. మాదిగ సామాజిక వర్గం నుంచి వేముల వీరేశం, లక్ష్మీకాంతరావు, మాల సామాజిక వర్గం నుంచి మేడిపల్లి సత్యం శ్రీగణేష్, ఎస్టీ కోటాలో మురళీ నాయక్, వెడ్మ బొజ్జుల పేర్లను పరిశీలిస్తున్నారని, సామాజిక వర్గాలు, ఉమ్మడి జిల్లాల సమీకరణల్లో ఒక్కో వర్గానికి ఒకరిని నియమిస్తారని తెలుస్తోంది. మరోవైపు విప్గా మహిళా ఎమ్మెల్యేకు అవకాశం కల్పించే విషయాన్ని కూడా సీఎం రేవంత్ సీరియస్గా పరిశీలిస్తున్నారని, ఈ మేరకు త్వరలోనే అసెంబ్లీ పదవుల పందేరం అధికారికంగా ఉండే అవకాశముందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
కానీ.. ప్రపంచంలో ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నా చూస్తూ ఎంజాయ్ చేస్తాం అంతేగా సార్!
కానీ.. ప్రపంచంలో ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నా చూస్తూ ఎంజాయ్ చేస్తాం అంతేగా సార్! -
‘వారిద్దరిలా అభిమానాన్ని పొందలేదు’
బెల్గ్రేడ్: పురుషుల టెన్నిస్ను దాదాపు రెండు దశాబ్దాల పాటు ఫెడరర్, నాదల్, జొకోవిచ్ శాసించారు. ఫెడరర్ 20 గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలుచుకోగా, నాదల్ 22 గ్రాండ్స్లామ్ టైటిల్స్తో దానిని సవరించాడు. ఆ తర్వాత జొకొవిచ్ 24 గ్రాండ్స్లామ్ ట్రోఫీలు సాధించి అగ్ర స్థానాన నిలిచాడు. అయితే సుదీర్ఘ కెరీర్లో ఫెడరర్, నాదల్ అభిమానులకు చేరువైనంతగా జొకోవిచ్ కాలేకపోయాడు. ఆట అద్భుతమే అయినా కొన్నిసార్లు కోర్టులో తన ప్రవర్తన, మాటతీరు అతని ప్రతిష్టను కొంత తగ్గించాయి. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు స్వయంగా జొకోవిచ్ ఈ విషయాన్ని అంగీకరించాడు. ఫెడరర్, నాదల్ తరహాలో తాను టెన్నిస్ ప్రేమికుల నుంచి తగినంత అభిమానం పొందలేకపోయానని అతను వ్యాఖ్యానించాడు. ‘నాలో ఎన్నో లోపాలు ఉండవచ్చు. అది వాస్తవం. అయితే ఎప్పుడూ మనసులో చెడు ఆలోచనలు లేకుండా మంచి ఉద్దేశంతోనే నా జీవితాన్ని గడిపాను. నాకు నచ్చినట్లుగా బతికాను. కానీ ఫెడరర్, నాదల్తో పోలిస్తే చాలాసార్లు నేను ఎవరికీ అక్కర్లేని పసివాడిలా నన్ను చూశారు. ఈ కారణంగా చాలాసార్లు బాధపడ్డాను. ఎందుకు ఇలా జరుగుతోందని చాలాసార్లు నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నా ప్రవర్తన మారితే అంతా బాగుంటుందని భావించి ఆ ప్రయత్నమూ చేశాను. అయినా సఫలం కాలేకపోయాను’ అని జొకోవిచ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే నన్ను పట్టించుకోలేదు... ఫెడరర్, నాదల్తో పోలిస్తే తనకు తగినంత గౌరవం దక్కకపోవడానికి భౌగోళిక పరిస్థితులు కూడా ఒక కారణమని జొకోవిచ్ అభిప్రాయపడ్డాడు. యూరోప్లోని ప్రముఖ దేశాల నుంచి వారిద్దరు వచ్చారని, తాను వారికి సవాల్ విసరడం కొందరికి నచ్చలేదని అతను అన్నాడు. ‘నాకు గుర్తింపు రాకముందే ఫెడరర్, నాదల్ సమఉజ్జీలైన ప్రత్యర్థులుగా పోరాడుతూ వచ్చారు. పశ్చిమాన బలమైన దేశాలైన స్విట్జర్లాండ్, స్పెయిన్ల నుంచి వారు వచ్చారు. కాబట్టి నాతో పోలిస్తే సహజంగానే వారికి ఎన్నో సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరే గొప్ప ఆటగాళ్లు అనే కొందరి మనస్తత్వాన్ని నేను మార్చలేకపోయాను. పైగా నంబర్వన్ను అవుతాను అంటూ నేను చేసిన ప్రకటన చాలా మందికి నచ్చలేదు’ అని 38 ఏళ్ల జొకోవిచ్ గుర్తు చేసుకున్నాడు. వారిద్దరిపై గౌరవం ఉంది... ఫెడరర్, నాదల్లతో ఎన్నో గొప్ప మ్యాచ్లలో తలపడ్డానని, ఏనాడూ తప్పుగా మాట్లాడలేదని జొకో వ్యాఖ్యానించాడు. ‘మైదానంలో ప్రత్యర్థులైనంత మాత్రాన ఎవరినైనా ద్వేషిస్తామా. వారికి కీడు తలపెట్టాలని, ఏం చేసైనా ఓడించాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. గెలుపు కోసమే పోరాడాం. మెరుగైన ఆటగాడే గెలిచాడు. వారిద్దరిపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఒక్క చెడు మాట కూడా మాట్లాడలేదు. ఇకపై కూడా మాట్లాడను’ అని సెర్బియా స్టార్ తమ మనసులో మాట వెల్లడించాడు. ముగ్గురి ఆట భిన్నం... జొకోవిచ్ తన ఆటతో పాటు ఫెడరర్, నాదల్ ఆట గురించి కూడా విశ్లేషించాడు. ముగ్గురి ఆట భిన్నంగా ఉంటుందని అతను పోల్చాడు. ‘ఫెడరర్ చాలా ప్రతిభావంతుడు. అతని ఆట చాలా అందంగా అనిపిస్తుంది. అలవోకగా అతను కదిలి షాట్లు ఆడే తీరులో కూడా కళ కనిపిస్తుంది. నాదల్ దీనికి పూర్తిగా భిన్నం. అతని శారీరక సామర్థ్యం అసమానం. దానినే బాగా వాడుకుంటాడు. నా ఆట వీరిద్దరికి మధ్యలో ఉన్నట్లుగా ఉంటుంది. నాదల్ ప్రదర్శనతో నాకు దగ్గరి పోలికలు ఉన్నాయి. సమయం సాగుతున్నకొద్దీ మా ఆటలో మరిన్ని సొంత ప్రత్యేకతలు వచ్చి చేరాయి. ఒకరి ఆటను మరొకరు అభినందించుకుంటూ ముందుకు సాగాం. ఈ క్రమంలో మాలో పోటీతత్వం పెరిగి ఆట కూడా మరింత మెరుగైంది. వీరిద్దరితో హోరాహోరీ సమరాల్లో తలపడటం నాకు మేలు చేసింది. నా కెరీర్ ముందుకు సాగడంలో నిస్సందేహంగా వారి ప్రభావం ఉంది’ అని ఇటీవల జెనీవా ఓపెన్లో విజేతగా నిలిచి కెరీర్లో 100 సింగిల్స్ టైటిల్స్ పూర్తి చేసుకున్న జొకోవిచ్ వివరించాడు. -
ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ షురూ
బెకెన్హామ్: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ జట్టు నాలుగు రోజుల ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారం ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభం కాగా... ఆట ఆరంభానికి ముందు అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు భారత జట్టు నివాళులర్పించింది. దీనికి సంబంధించిన ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఎయిరిండియా ఏఐ–171 విమాన ప్రమాదంలో మృతిచెందిన 265 మందికి సంతాపంగా ఆటగాళ్లంతా చేతులకు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు. మరోవైపు లార్డ్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మూడో రోజు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు కూడా ఈ ప్రమాదమృతులకు ఒక నిమిషం పాటు మౌనం వహించి సంతాపం తెలిపారు. ఈ నెల 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... అంతకుముందు ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో భారత ‘ఎ’ జట్టు రెండు అనధికారిక టెస్టు మ్యాచ్లు ఆడింది. ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టు ఆటగాళ్లతో కలుపుకొని ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్కు అభిమానులు, మీడియాకు అనుమతి లేదు. -
హైదరాబాద్లో భారత్, న్యూజిలాండ్ మ్యాచ్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్లో ఒక మ్యాచ్ జరిగే అవకాశాలున్నాయి. 2026 జనవరిలో టీమిండియాతో 3 వన్డేలు, 5 టి20లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత్కు రానుంది. ఈ 8 మ్యాచ్ల కోసం జైపూర్, మొహాలీ, ఇండోర్, రాజ్కోట్, గువాహటి, హైదరాబాద్, త్రివేండ్రం, నాగ్పూర్ వేదికలను షార్ట్లిస్ట్ చేశారు. ఈ సిరీస్ల కోసం మరికొన్ని వేదికలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది టీమిండియాకు బిజీ షెడ్యూల్ ఉంది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు వెస్టిండీస్తో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుండగా... రెండో మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది. నవంబర్ 14 నుంచి దక్షిణాఫ్రికాతో కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో తొలి టెస్టు ఆడనుంది. 22 నుంచి గువాహటిలో రెండో టెస్టు జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 మధ్య సఫారీ జట్టుతో మూడు వన్డేల సిరీస్లు ఆడనుంది. ఈ మూడు మ్యాచ్లు వరుసగా రాంచీ, రాయ్పూర్, విశాఖపట్నంలలో జరగనున్నాయి. అనంతరం డిసెంబర్ 9 నుంచి 19 వరకు ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా కటక్, ముల్లాన్పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్లో మ్యాచ్లు జరుగుతాయి. రోస్టర్ విధానంలో అన్ని నగరాలకు ఆతిథ్యమిచ్చే అవకాశం ఇవ్వడంలో భాగంగా... వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్తో జరగనున్న వన్డే, టి20 సిరీస్ల కోసం హైదరాబాద్ వేదికను పరిశీలిస్తున్నారు. శనివారం జరగనున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అపెక్స్ కౌన్సిల్ భేటీ అనంతరం కివీస్తో షెడ్యూల్ ప్రకటించనున్నారు. న్యూజిలాండ్తో సిరీస్ల అనంతరం ఫిబ్రవరి–మార్చిలో భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుంది. -
భారత్ X ఆస్ట్రేలియా
లండన్: మహిళల హాకీ ప్రొ లీగ్ యూరోపియన్ అంచె పోటీల కోసం భారత జట్టు పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. లోటుపాట్లను సవరించుకొని ఆస్ట్రేలియాను ‘ఢీ’కొట్టేందుకు రెడీ అయ్యింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో 9 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న భారత మహిళల జట్టు పట్టికలో ఎగబాకేందుకు యూరోప్ అంచెను సది్వనియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మహిళల టీమ్ నేడు, రేపు వరుస మ్యాచ్ల్లో ఆసీస్తో తలపడుతుంది. ప్రస్తుత జట్టు యువ క్రీడాకారిణిలతో పాటు అనుభవజు్ఞల కలబోతతో సమతూకంగా ఉంది. యూరోప్ పర్యటనతో రాటుదేలాక సెపె్టంబర్లో జరిగే ఆసియా చాంపియన్షిప్ టైటిల్తో నేరుగా వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్కు అర్హత సాధించాలని మహిళల జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. గట్టి ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు దీటుగానే సిద్ధమయ్యామని చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ అన్నారు. ‘ప్రతి విభాగం కూడా పటిష్టమయ్యేందుకు సమష్టిగా శ్రమించాం. అయితే రెండు విభాగాల్లో మరింత దృష్టి సారించాల్సి వచ్చింది. ఫలితాన్ని తారుమారు చేసే గోల్ కీపింగ్, డ్రాగ్ ఫ్లికింగ్ విభాగాలు అంత్యంత కీలకం’ అని కోచ్ అన్నారు. ఇందులో భాగంగానే డ్రాగ్ఫ్లికర్లు దీపిక, మనీషాలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. యూరోప్ టూర్కు ముందే డ్రాగ్ ఫ్లిక్లో నిపుణుడైన నెదర్లాండ్స్ కోచ్ టూన్ సీప్మన్తో పది రోజుల పాటు ఇద్దరు శిక్షణ తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన డ్రాగ్ ఫ్లికర్లలో చాలా మంది సీప్మన్ శిష్యులే అని ఈ సందర్భంగా హరేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు. ఇలా ప్రతి విభాగంలోనూ క్రీడాకారిణిలను దీటుగా తయారు చేస్తున్నామని చెప్పారు. భారత్ అంచె పోటీల్లో ప్రపంచ నంబర్వన్ నెదర్లాండ్స్ను 2–2తో భారత్ నిలువరించేందుకు ప్రత్యేక కోచింగ్లే దోహదం చేశాయన్నారు. భువనేశ్వర్లో జరిగిన ఆ మ్యాచ్లో భారత్ షూటౌట్లో గెలిచి బోనస్ పాయింట్ సాధించింది. పెర్త్ (ఆ్రస్టేలియా)లో ‘ఎ’ జట్టుతో ఆడిన ఫ్రెండ్లీ మ్యాచ్ల అనుభవం కూడా భారత అమ్మాయిలకు కలిసివస్తుందని చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ అన్నారు. ఆసీస్ సీనియర్ జట్టు బలాబలాలేంటో తమకు తెలుసని పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలతోనే బరిలోకి దిగుతామని చెప్పారు. కంగారూ టీమ్తో వరుస మ్యాచ్లు ముగిసిన వెంటనే ఇక్కడే 17, 18 తేదీల్లో పటిష్టమైన అర్జెంటీనాను ఎదర్కొంటుంది. అనంతరం బెల్జియంకు పయనమవుతుంది. అంట్వర్ప్లో 21, 22 తేదీలో జరిగే మ్యాచ్ల్లో మేటి జట్టయిన బెల్జియంతో ఢీకొంటుంది. చివరగా బెర్లిన్లో ఈ నెల 28, 29 తేదీల్లో చైనాతో జరిగే పోటీలతో యూరోప్ అంచె ప్రొ లీగ్ ముగుస్తుంది. -
‘స్వర్ణ’ సురుచి
మ్యూనిక్: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) మూడో ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టుకు తొలి స్వర్ణ పతకం లభించింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 19 ఏళ్ల సురుచి సింగ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్లో సురుచి పోటీపడ్డ మూడు ప్రపంచకప్ టోర్నీల్లోనూ బంగారు పతకాలు గెలవడం విశేషం. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి 241.9 పాయింట్లు స్కోరు చేసి విజేతగా అవతరించింది. కామిలీ జెద్రెజెవ్స్కీ (ఫ్రాన్స్; 241.7 పాయింట్లు) రజతం నెగ్గగా... కియాన్జున్ యావో (చైనా; 221.7 పాయింట్లు) కాంస్య పతకాన్ని సంపాదించింది. ఈ ఏడాది జాతీయ సీనియర్ జట్టులోకి వచ్చిన సురుచి ఏప్రిల్లో బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన తొలి ప్రపంచకప్ టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్యం సాధించింది. ఏప్రిల్లోనే పెరూ రాజధాని లిమాలో జరిగిన రెండో ప్రపంచకప్ టోర్నీలో సురుచి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో, మిక్స్డ్ టీమ్ విభాగంలో బంగారు పతకాలు గెలిచింది. -
విజయం దిశగా దక్షిణాఫ్రికా
ఐసీసీ టోర్నీల్లో తమ రాత మార్చుకునేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమైంది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో మూడో రోజు అసాధారణ ఆటతో టైటిల్కు చేరువైంది. 282 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎక్కడా తడబడని సఫారీ టీమ్ గెలుపుపై గురి పెట్టింది. పేలవ ప్రదర్శనతో ఆసీస్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయగా... మార్క్రమ్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు కండరాల నొప్పితో బాధపడుతూ కూడా బ్యాటింగ్ కొనసాగించిన కెపె్టన్ తెంబా బవుమా అండగా నిలిచాడు. చేతిలో 8 వికెట్లతో శనివారం మరో 69 పరుగులు సాధిస్తే 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ దక్షిణాఫ్రికా ఖాతాలో చేరుతుంది. లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో విజేతగా నిలిచే దిశగా దక్షిణాఫ్రికా అడుగులు వేస్తోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో సఫారీ టీమ్ డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాపై మూడో రోజు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 282 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 56 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది. మార్క్రమ్ (159 బంతుల్లో 102 బ్యాటింగ్; 11 ఫోర్లు) శతకం బాదగా... కెప్టెన్ తెంబా బవుమా (121 బంతుల్లో 65 బ్యాటింగ్; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మూడో వికెట్కు ఇప్పటికే అభేద్యంగా 143 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 144/8తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 207 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్ (136 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. చివరి వికెట్కు 59 పరుగులు... మూడో రోజు ఆట ఆరంభంలోనే లయన్ (2)ను రబాడ అవుట్ చేయడంతో ఆసీస్ 9వ వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే స్టార్క్ పట్టుదలగా పోరాడాడు. అతనికి హాజల్వుడ్ (53 బంతుల్లో 17; 2 ఫోర్లు) అండగా నిలవడంతో ఆలౌట్ చేసేందుకు సఫారీ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కొన్ని చక్కటి షాట్లు ఆడిన స్టార్క్ 131 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆసీస్ స్కోరు కూడా 200 దాటింది. ఎట్టకేలకు మార్క్రమ్ బౌలింగ్లో హాజల్వుడ్ వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా ఊపిరి పీల్చుకుంది. స్టార్క్, హాజల్వుడ్ 22.3 ఓవర్ల పాటు ఆడి చివరి వికెట్కు 59 పరుగులు జోడించడం విశేషం. శతక భాగస్వామ్యం... తొలి ఇన్నింగ్స్కు భిన్నంగా దక్షిణాఫ్రికా ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. 10 ఓవర్లలోనే 47 పరుగులు చేసిన జట్టు రికెల్టన్ (6) కోల్పోయింది. మార్క్రమ్, ముల్డర్ (27; 5 ఫోర్లు) ఓవర్కు 4 పరుగుల రన్రేట్తో ధాటిని కొనసాగించారు. లబుషేన్ చక్కటి క్యాచ్తో ముల్డర్ వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. అయితే ఆ్రస్టేలియా ఆనందం ఇక్కడికే పరిమితమైంది. మార్క్రమ్, బవుమా కలిసి సమర్థంగా ఇన్నింగ్స్ను నడిపించారు.ఈ క్రమంలో 69 బంతుల్లోనే మార్క్రమ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తీవ్రంగా ఎండ కాయడంతో పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా మారిపోయింది. దాంతో ఆసీస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. కొద్ది సేపటికి బవుమా 83 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆట ముగియడానికి కొద్దిసేపు ముందు మార్క్రమ్ 156 బంతుల్లో సెంచరీతో సగర్వంగా నిలిచాడు. బవుమా క్యాచ్ పట్టి ఉంటే... భారీ భాగస్వామ్యానికి ముందు ఒకే ఒక్క సారి ఆసీస్కు మరింత పట్టు బిగించే అవకాశం వచ్చింది. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బవుమాకు లైఫ్ లభించింది. స్టార్క్ ఓవర్లో బవుమా ఆడిన షాట్కు బంతి మొదటి స్లిప్లోకి దూసుకెళ్ళగా క్యాచ్ అందుకోవడంలో స్మిత్ విఫలమయ్యాడు. అయితే నిజానికి అది అంత సులువైన క్యాచ్ కాదు. ఈ టెస్టులో చాలా బంతులు బ్యాట్కు తగిలాక స్లిప్ కార్డాన్కు కాస్త ముందే పడుతుండటంతో స్మిత్ సాహసం చేస్తూ సాధారణంగా నిలబడే చోటుకంటే కాస్త ముందు వచ్చి నిలబడ్డాడు. ముందు జాగ్రత్తగా హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. ఊహించినట్లుగానే బంతి చాలా వేగంగా దూసుకొచి్చంది. మరీ దగ్గర కావడం వల్ల స్పందించే సమయం కూడా లేకపోయింది. దాంతో స్మిత్ కుడి చేతి వేలికి బంతి బలంగా తగిలి కింద పడిపోయింది. నొప్పితో విలవిల్లాడిన అతను వెంటనే మైదానం వీడాడు. అనంతరం స్కానింగ్లో వేలు విరిగినట్లు తేలింది! స్కోరు వివరాలు: ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 138; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 207; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (బ్యాటింగ్) 102; రికెల్టన్ (సి) కేరీ (బి) స్టార్క్ 6; ముల్డర్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 27; బవుమా (బ్యాటింగ్) 65; ఎక్స్ట్రాలు 13; మొత్తం (56 ఓవర్లలో 2 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–9, 2–70. బౌలింగ్: స్టార్క్ 9–0–53–2, హాజల్వుడ్ 13–0–43–0, కమిన్స్ 10–0–36–0, లయన్ 18–3–51–0, వెబ్స్టర్ 4–0–11–0, హెడ్ 2–0–8–0. -
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.64% పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు శుభవార్త తెలిపింది. ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 3.64 శాతం పెంచింది. పెంచిన డీఏ 2023 జనవరి 1వ తేదీ నుంచి వర్తిస్తుందని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా శుక్రవారం జారీచేసిన జీవోలు 78, 79లో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 26.39 శాతం ఇస్తుండగా.. తాజాగా పెంపుతో 30.03 శాతానికి చేరుతుంది.తాజాగా పెంచిన డీఏను జూన్ నెల వేతనంతో జూలైలో ఇస్తారు. 2023 జనవరి 1వ తేదీ నుంచి 2025 మే 31 వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమచేస్తారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు డీఏ బకాయిలను 28 వాయిదాల్లో చెల్లిస్తారు.సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులకు 10 శాతం డీఏ బకాయిలను ప్రాన్ ఖాతాల్లో జమచేస్తారు. మిగిలిన 90 శాతం బకాయిలను 28 వాయిదాల్లో జూన్ నెల వేతనంతో నెలవారీగా చెల్లిస్తామని ఉత్తర్వుల్లో వెల్లడించారు. 1 జూలై 2023 నుంచి పెండింగ్లో ఉన్న డీఏ అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రత్యేకంగా ఆరు నెలల తర్వాత జారీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. -
నడచిన హిమాలయం... ఎగసిన ప్రజాకెరటం!
కళ్లు ఆకారాన్ని చూస్తాయి. మనస్సు ఆంతర్యాన్ని చూస్తుంది. దాని పరిధి చాలా విశాలం. మనసుతో మను షుల్ని, సమాజాన్ని చూడగలిగినవాడు, చదవగలిగినవాడు మహానాయకుడు. ఆ మహానాయకుడే మాజీ ముఖ్యమంత్రి డా‘‘ వై.ఎస్. రాజశేఖర రెడ్డి. నాకు అత్యంత సన్నిహితుడు, హితుడు, గురువు, మార్గదర్శి. అకుంఠిత దీక్ష, ప్రజల పట్ల అపారమైన ప్రేమ, మనిషి పట్ల మమ కారం, పేదరికాన్ని పారద్రోలాలన్న పట్టుదల, అణగారిన జనానికి అన్నీ సమకూర్చాలన్న కోరిక, సమసమాజ స్థాపన ఆయన లక్షణాలు, లక్ష్యాలు. శత్రువును కూడా క్షమించగలిగే సంస్కారం, పగవాడికైనా మేలు చేసే గుణం ఆయన సొంతం. హిమాలయ సమున్నతుడు కాబట్టే ప్రజలు ప్రేమగా ఆయ నను ‘రాజన్న’ అని పిలుచుకున్నారు. పాదయాత్ర:2003లో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు ఆయన చేసిన 1,648 కిలోమీటర్ల పాదయాత్ర ఓ చరిత్ర. ఆయన వెంట నేను ఉండటం నా అదృష్టం. ఎంత జీవితాన్ని చూశానో, ఎన్ని నేర్చు కున్నానో అన్నిటికీ ‘సాక్షి’ ఆ పాదయాత్ర. 2003 ఏప్రిల్ 9న చేవెళ్లలో పెద్ద బహిరంగ సభతో ప్రారంభమైంది మహాయాత్ర. ఆ సభా వేదికకు పైన నీడగా షామియానా వేశారు. విపరీతంగా వచ్చిన జనం అందరూ ఎండలోనే ఉన్నారు. అది గమనించిన వైఎస్ ‘జనం ఎండలో ఉంటే నేను నీడలోఉండాలా’ అంటూ షామియానా తీయించారు. మండుటెండలోనే సాగింది ఆయన ప్రసంగం. అనంతరం తొలి అడుగు వేశారు ప్రజా ప్రస్థానానికి! కీపాస్ కట్టిన పంచ, తలపాగాలతో రైతులా కదిలారు. ఆయనను దగ్గరగా చూడా లని, కరచాలనం చేయాలని, కష్టాలు చెప్పుకోవాలని, గ్రామాలకు గ్రామాలు కదలి వచ్చాయి. చేవెళ్ల దాటి కౌకుంట్ల, మన్నెగూడ, శివారెడ్డిపేట... ఇలా అనేక గ్రామాల గుండా సాగుతోంది పాదయాత్ర. దారి పొడుగునా కనిపిస్తున్న ప్రజల ఆవేదనకు ఆయన చలించిపోతున్నారు. రాత్రి బస చేస్తున్న గ్రామాలలో కొందరు పెద్దలు ఆయన వద్దకు వచ్చి అక్కడ ఏసీ సౌకర్యం ఉన్న ఇల్లు ఉందని ఆహ్వానించినా, సున్నితంగా కాదని జనం మధ్య పడుకునేవారు వైఎస్. సదాశివ పేటకు చేరింది యాత్ర. అక్కడ ఎందరో కుండలు చేస్తున్నారు. వారిని చూపించాను ఆయనకు. ‘కరుణా! చూడాల్సింది వారు చేస్తున్న కుండల్ని కాదు, వారిగుండెల్ని’ అంటూ వారి దగ్గరికి వెళ్లారు. అంత దగ్గరగా ఆయనను చూసి చెమ్మగిల్లిన కళ్లతో వారు వారి బాధల్ని చెప్పుకున్నారు. ‘మంచిరోజులు వస్తున్నాయి’ అంటూ వారిని ఓదార్చారు. ప్రజలలో కనిపిస్తున్న పేదరికం, అనారోగ్యం, కరవు చూసి చలించిపోయిన ఆయనలో అప్పుడే ఉచితకరెంటు, ‘ఆరోగ్యశ్రీ’ లాంటి పథకాలు రూపుదిద్దుకున్నాయి. ఎనిమిదవ రోజు సుల్తానాపూర్లో యాత్ర సాగుతోంది.ఆ గ్రామంలో నర్సారెడ్డి అనే రైతు కుటుంబాన్ని అప్పు తీర్చ మని బ్యాంకు వారు దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అప్పటికే నర్సారెడ్డి ఆత్మహత్య చేసు కున్నాడు. అయినా ఆ కుటుంబాన్ని బ్యాంకువాళ్లు వేధిస్తు న్నారు. అది విన్న వైఎస్ ముఖంలో బాధ, కోపం! వెంటనే బ్యాంకు వారిని పిలిపించి నిలదీశారు, హెచ్చరించారు.బ్యాంకువారు భయపడి వెనక్కి తగ్గారు, ఆ కుటుంబం రక్షింప బడింది.పొతంశెట్టి పల్లెలో యాత్ర సాగుతోంది. ఓ యువ జంట వైఎస్ ఎదురుగా వచ్చి కాళ్ళమీద పడింది. తాము ప్రేమి కులమని, కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని, చాలా దూరం నుంచి మిమ్మల్ని నమ్మి వచ్చామని వారు చెప్పుకొన్నారు. కొన్ని క్షణాలు ఆలోచించిన ఆయన అక్కడే అప్పుడే ఆ జంటకు వివాహం చేశారు, అక్షింతలు వేశారు. మరో నాయకుడైతే వారిని అక్కడే వదిలేసేవారు. కానీ వైఎస్ ముందుచూపుతో హైదరాబాదులోని ఓ పోలీసు ఉన్నతాధి కారికి ఫోన్ చేసి ఆ జంటకు రక్షణ కల్పించమని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సాగే దారిలో నేను, మరికొందరు మిత్రులం వైఎస్ కన్నా కాస్త ముందుగా ఆ దారిలో వెళ్లేవాళ్ళం. వైఎస్ రాక గురించీ, పాదయాత్ర గురించీ ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకునేందుకు మా ప్రయత్నం. బురుగిద్ద గ్రామం దాటి, గాంధీనగర్ చేరుకున్నాం. అప్పటికి రాత్రి ఏడు గంటలు అయి ఉంటుంది. హఠాత్తుగా వడగళ్ళ వాన, విపరీతమైన చలి! వర్షంలో తడుస్తామని ప్రక్కనే వున్న జీపు ఎక్కి కూర్చున్నా. దాదాపు అరగంట పాటు వర్షం కురిసింది. మా వెనుక దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న వైఎస్ ఆ చలిలో, వర్షంలో అలాగే తడుస్తూ వచ్చారు. అందుకే ధీరుడు, నాయకుడు అయ్యారాయన. నాయకపురం దాటి, లక్ష్మీపురం గ్రామంలో ప్రవేశించాం. అక్కడ రెండు గ్రూపులు ఉన్నాయి. ఒకే పార్టీ, ఇద్దరు నాయకులు! ఎవరి ఏర్పాట్లు వాళ్లు చేస్తున్నారు. అది గమనించిన వైఎస్సార్ ఇద్దర్నీ పిలిచి అక్కడే రాజీ చేశారు. పాదయాత్ర గోదావరి జిల్లాలలోకి ప్రవేశించింది. అక్కడ కూడా రైతు బతుకు దీనంగా ఉండటం, గ్రాసం లేక పశువు లను రైతులు సగం ధరకు అమ్ముకోవడం చూసి వైఎస్ చలించి పోయారు. సీతంపేట గ్రామంలో నాగపద్మిని అనే మహిళ వైఎస్ దగ్గరికి వచ్చింది. కుటుంబ నియంత్రణకు ఆపరేషన్ చేయించున్నాననీ, అధికారులు ఆ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నారనీ చెప్పింది. వెంటనే అధికారులను పిలిపించి అక్కడే సర్టిఫికెట్ ఇప్పించారు. ఆమె చేతిలో పదిహేను రోజుల పసికందు ఉంది. ఆ బిడ్డకు ‘రాజశేఖర్’ అని పేరు పెడతానంటే, ఆయన కాదని ‘రాజీవ్‘ అని నామకరణం చేశారు. రాజ మండ్రి సమీపం కోవూరుకు చేరుకున్నాం. జన ప్రవాహం మరింత ఎక్కువయింది. ఆయన ప్రసంగం ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు జనం చప్పట్లు ఆగలేదు. ఆ క్షణమే అర్థమ య్యింది రాష్ట్రానికి కాబోయే అధినాయకుడు ఎవరో!2003 మే 18:తెల్లారింది. కానీ నిప్పుల కొలిమిలో నిద్ర లేచినట్లు ఉంది. వైఎస్ నీరసంగా కనిపించారు. అయినా నడక సాగింది. కానీ నీరసం తెలుస్తోంది. ఓ చెట్టు క్రింద మంచం వేసి కాసేపు కూర్చోబెట్టాం. తరువాత మెల్లగా మధురపూడి గ్రామం చేరుకున్నాం. ఆయన పూర్తిగా నీరసించి పోయారు. వైద్యులు విశ్రాంతికి ఆదేశించారు. రాష్ట్రం అంతా కలకలం. ఆయన ఆరోగ్యం కోసం అన్ని మతాల వారి ప్రార్థనలు కొనసాగాయి. ఆరు రోజుల విరామం తరువాత మే 24న తిరిగి నడక ప్రారంభించారు వైఎస్. యాత్ర పత్తిపాడు గ్రామం దగ్గర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.జనప్రవాహం చెక్కు చెదరడం లేదు. జూన్ 11న జర్జంగి గ్రామం చేరుకున్నాం. అక్కడ రాళ్ళ క్వారీలలో వందలాది మంది వడ్డెరలు పని చేస్తున్నారు. వారంతా ఆయణ్ణి చూడటానికి వచ్చారు. తమ తలపాగాలను తీసి రోడ్డుమీద పరిచారు. దానిపై ఆయన్ని నడవమన్నారు. చూస్తున్న అందరి కళ్ళూ చెమరించాయి. శరీరాలు పులకరించాయి. అది కదా అభిమానం, అది కదా గౌరవం... అది కదా నిజమైన సన్మానం! జూన్ 15న ఇచ్ఛాపురం చేరుకున్నాం. ఆ సాయంత్రం బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది. పార్టీలోని అతిరథ మహారథులందరూ వేదికపైకి వచ్చారు. లక్షలాది మందిజనం. చప్పట్లకు దిక్కులు దద్దరిల్లాయి. ఆ మహా ప్రజా ప్రస్థానానికి చిహ్నంగా ఒక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. మహా పాదయాత్ర పూర్తి అయింది. ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు! చాలు జీవితానికి ఈ అనుభూతి. గుర్తు చేసుకుంటే శరీరం పులకరిస్తోంది. ఆయన జ్ఞాపకంతో కళ్లు చెమరిస్తు న్నాయి. రైతు బాంధవుడైన ఆ మహానేత అడుగులో అడుగు వేసి నడచిన నా జన్మ ధన్యం. చరిత్ర ఏనాడూ మరచిపోలేని సత్యం ఈ మహాయాత్ర!-వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్-భూమనకరుణాకర రెడ్డి -
ఇంజనీరింగ్ ఫీజుల పెంపు వాయిదా!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల పెంపును వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు కాలేజీల జమా ఖర్చుల ప్రతిపాదనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. అసలు ఇంజనీరింగ్ ఫీజులు పెంచాల్సిన అవసరం ఉందా? అని కూడా ఆయన అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. శుక్రవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.పాఠశాలల నిర్వహణ, ఇంజనీరింగ్ కాలేజీల కౌన్సెలింగ్ షెడ్యూల్, టీచర్ల సమస్యలు, ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపు, గురుకుల హాస్టళ్ల నిర్వహణ తదితర అంశాలపై చర్చ జరిగింది. ప్రధానంగా ఇంజనీరింగ్ ఫీజుల విషయమై సీఎం.. అధికారులను అనేక ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ప్రైవేటు కాలేజీలపై గతంలో వేసిన టాస్క్ఫోర్స్ నివేదికలోని అంశాలేంటి? అని నిలదీశారు.ఫ్యాకల్టీ లేకపోవడం, ఇష్టానుసారం సీట్లు పెంచుకోవడం, అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయడం వంటి అంశాలపై టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో తేలిందేంటని ప్రశ్నించారు. అయితే, అధికారులు ఇందుకు సంసిద్ధంగా లేకపోవడంతో సమాధానం చెప్పలేకపోయారు. దీంతో ముఖ్యమంత్రి వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సమీక్షకు వచ్చేటప్పుడు కనీసం అవసరమైన నివేదికలతో రావద్దా?’అంటూ ప్రశ్నించారు. ఫీజులకు, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు లింక్ పెట్టడం సరికాదు.. కాలేజీలపై పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే ఫీజుల వ్యవహారం చూద్దాం అని అన్నారు. తాళాలపై తీవ్ర ఆగ్రహం.. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు బిల్లులు విడుదల చేయలేదని యజమానులు తాళం వేయడంపై సీఎం సీరియస్గా స్పందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత జరుగుతుంటే కనీసం ప్రభుత్వం దృష్టికి ఎందుకు తేలేదని నిలదీశారు. విద్యాశాఖ అధికారులు పనిచేస్తున్నారా? లేదా? అనే అనుమానం కలుగుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్కూళ్ళు రీ ఓపెన్ అయిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరిన విద్యార్థుల సంఖ్యను అధికారులు వివరించలేకపోవడం కూడా సీఎంను ఆగ్రహానికి గురి చేసింది.బడిబాట కార్యక్రమం ఎక్కడా సజావుగా సాగడం లేదని, టీచర్లు దీన్ని సీరియస్గా తీసుకోలేదని, ఉన్నతాధికారులు కూడా పట్టించుకోలేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలాచోట్ల పుస్తకాలు, దుస్తులు అందడం లేదని విమర్శలు వస్తున్నా అధికారులు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయని, నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. దీనికి అధికారులు ఇచ్చిన వివరణపై కూడా సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రైవేటు స్కూళ్ళల్లో 25 శాతం ఉచిత సీట్లు ఇచ్చే అంశంపై కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సీఎం ప్రస్తావించారు. కొత్తగా 571 పాఠశాలలు: సీఎం ఇరవై మందికన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యా శాఖ పురపాలక శాఖతో సమన్వయం చేసుకుని హెచ్ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యాశాఖపై సీఎం శుక్రవారం నిర్వహించిన సమీక్షకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా వివిధ విభాగాల కింద ఇంటర్మీడియట్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబదీ్ధకరించి ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు.నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని.. డే స్కాలర్స్కూ ఆ పాఠశాలల్లోనే అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలని సూచించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కార్యదర్శి మాణిక్ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్మిడియట్ బోర్డు కార్యదర్శి శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నైపుణ్యం పెంచాలి విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు, నైపుణ్యం పెంచేలా విద్యా వ్యవస్థలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. మౌలికవసతుల కల్పన, టీచర్లకు శిక్షణ ఇచ్చే విషయంలో ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. -
ఇజ్రాయెల్ బాధ్యతారాహిత్యం
గాజాలో నరమేధం కొనసాగిస్తూనే పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ మరో కుంపటి రాజేసింది. ఎలాంటి కవ్వింపూ లేకుండానే శుక్రవారం ఇరాన్పై దాడులకు దిగి రాజధాని తెహ్రాన్తో సహా అనేకచోట్ల బాంబుల వర్షం కురిపించింది. 200 యుద్ధ విమానాలు ఏకబిగిన సాగించిన ఈ దాడుల్లో ఇరాన్ సైన్యంలో కీలక పాత్ర పోషిస్తున్న సైనిక దళాల చీఫ్, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్, ఇరాన్ ఎమర్జెన్సీ కమాండ్ చీఫ్ల ప్రాణాలు తీయటంతో పాటు అణు కార్యక్రమంలో చురుగ్గా ఉంటున్న ఆరుగురు శాస్త్రవేత్తలను హతమార్చింది. ఇరాన్ అణు స్థావరాలను కూడా లక్ష్యం చేసుకున్నట్టు సమాచారం. ఆ దేశంపై తమ యుద్ధం ఆగదని కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రతీకారంగా ఇరాన్ వంద డ్రోన్లతో సాగించిన దాడి పెద్దగా ఫలించిన వైనం కనబడట్లేదు. అమె రికా అధ్యక్ష ఎన్నికలప్పుడూ, అధికారం స్వీకరించాకా ట్రంప్ ఇరాన్తో అణు ఒప్పందం గురించి పదేపదే ప్రకటనలు చేశారు. కానీ ఇజ్రాయెల్ దుందుడుకు చర్య చూస్తుంటే ఆ ప్రకటనల్లోని నిజా యతీ ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే అమెరికా లోపాయకారీ అనుమతి లేకుండా ఆ దేశం ఇలాంటి దాడులకు తెగించే అవకాశం లేదు. తాజా దాడుల్ని ఖండించకపోగా ఒప్పందం కోసం వస్తున్న అవకాశాలను ఇరాన్ కాలదన్నుకుంటున్నదని, ఇదే కొనసాగితే పరిస్థితి విషమం కావొచ్చని శుక్ర వారం ఆ దేశాన్ని ట్రంప్ హెచ్చరించిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. నిజాయతీ ఉంటే అణు ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగా ఈ దాడులేమిటని ఇజ్రాయెల్ను నిలదీసి ఉండాలి. చర్చలే అణు ఒప్పందానికి సంబంధించినవైనప్పుడు ఇరాన్ అణు శాస్త్రవేత్తల్ని హత్య చేయటం నేరపూరితమని చెప్పివుండాలి. ఆ పని చేయకపోగా ఇజ్రాయెల్ దాడుల్లో తమ ప్రమేయం లేదని, కనుక పశ్చిమాసియాలోని అమెరికన్ స్థావరాలపై ప్రతీకార దాడులకు దిగొద్దని ఇరాన్ను హెచ్చరించింది. ఇరాన్తో అణు ఒప్పందం గురించి తన దూతల ద్వారా చర్చలు మొదలెట్టాక వాటిని భగ్నం చేసే చర్యకు పాల్పడవద్దని ఆ మధ్య ఇజ్రాయెల్కు ట్రంప్ సూచించారు. అయితే అమెరికా విధిస్తున్న షరతులు తమకు సమ్మతం కాదని మూడు రోజుల క్రితం ఇరాన్ ప్రకటించాక పరిస్థితి మారింది. వాస్తవానికి వచ్చే ఆదివారం అమెరికా–ఇరాన్ల మధ్య మరో దఫా చర్చలు జరగాల్సి ఉంది. తాజా దాడుల తర్వాత వాటిని నిలిపివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అణుబాంబు వైపుగా అడుగులేస్తున్నదని ఇరాన్పై ఆరోపణలు చేసేవారు ఏ కవ్వింపూ లేకుండానే ఇజ్రాయెల్ దాడులు చేయటాన్ని ఏ రకంగా సమర్థిస్తారు? ఈ దాడులకు 24 గంటల ముందు పశ్చిమాసియా దేశాల్లోని తమ సైనికాధికారుల కుటుంబాలు వెనక్కి వచ్చేయాలంటూ పిలుపునివ్వటం, ఇరాక్ నుంచి దౌత్య వేత్తల్ని కూడా వెనుదిరగమని అమెరికా చెప్పటం గమనార్హం. వాస్తవానికి గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్కు విమానాలూ, క్షిపణులూ, ఇతర ఆయుధాలు పంపిస్తూ తాజా దాడులకు అమెరికాయే పూర్వరంగాన్ని సిద్ధం చేసిందా అనే అనుమానం కలుగుతోంది.అసలే ప్రపంచం పలు సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. కరోనా మహమ్మారి కాటేయటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తీవ్రంగా దెబ్బతిని ఉన్నాయి. అయిదేళ్లు కావస్తున్నా ఏ దేశమూ పూర్తిగా కోలుకున్న దాఖలా కనబడటం లేదు. అంతక్రితమే 1991లో కువైట్పై ఇరాక్ సాగించిన యుద్ధం మొదలుకొని ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య టర్కీ, సిరియాల మధ్య తీవ్ర ఘర్షణలు సాగాయి. ఉగ్రవాదాన్ని అంతమొందించే పేరిట ఇరాక్పై అమెరికా, పాశ్చాత్య దేశాలు కొనసాగించిన యుద్ధం, లిబియాలో కల్లోలం సృష్టించి గడాఫీని అంతం చేయటం వంటి పరిణామాల నుంచి పశ్చిమాసియా ఇంకా కోలుకోలేదు. అక్కడ చాలా దేశాల్లో సాయుధ ముఠాలు పరస్పరం తలపడు తున్నాయి. ఇజ్రాయెల్–పాలస్తీనా వైరం సరేసరి.ఉక్రెయిన్తో యుద్ధానికి దిగిన రష్యా బయట కొచ్చే మార్గం తెలియక కొట్టుమిట్టాడుతోంది. దాన్నుంచి సాయం అందే దారులు మూసుకు పోవటంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మిలిటెంట్ల దాడుల తర్వాత దేశం విడిచి పరార య్యారు. ఇప్పుడక్కడ అమెరికా మద్దతుతో ఒకప్పటి అంతర్జాతీయ ఉగ్రవాది మహమ్మద్ అల్– షారా దేశాధ్యక్షుడయ్యాడు. సరిగ్గా నెలరోజుల క్రితం గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సదస్సుకెళ్లిన ట్రంప్ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇలా పశ్చిమాసియా రకరకాల క్లేశాలతో ఇప్పటికీ నెత్తురోడుతూ ఉండగా దాన్ని మరింత ఊబిలోకి నెట్టేలా తాజా పరిణామాలున్నాయి. ఇరాన్పై దాడి జరిగితే తాము మౌనంగా ఉండ బోమని ఆ మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. అదే జరిగితే ఇజ్రాయెల్ తరఫున అమెరికా నేరుగా రంగంలోకి దిగుతుంది. సారాంశంలో ఇజ్రాయెల్ దుందుడుకు చేష్టలు, అమెరికా గుడ్లప్పగించి చూడటం ఒక్క పశ్చిమాసియాను మాత్రమే కాదు... ప్రపంచాన్నే యుద్ధం అంచుల్లోకి నెడుతున్నాయి. తాను అధికారంలోకొచ్చాక ఇరాన్తో 46 ఏళ్లుగా కొనసాగుతున్న వైరానికి స్వస్తి పలుకుతానని, ప్రపంచంలో ఏ మూలనా అమెరికా సైన్యం ఉండాల్సిన అవసరం లేకుండా చేస్తానని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటలు ట్రంప్ మరిచారా? ఈ యుద్ధం కొనసాగితే తక్షణం హార్మూజ్ జలసంధి మూతబడి ప్రపంచ దేశాలకు పోయే 25 శాతం ముడిచమురు, సహజ వాయు రవాణా నిలిచిపోతుంది. పర్యవసానంగా అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలుమరింత కుంగుతాయి. ఇక అమెరికా, రష్యా, చైనాలు నేరుగా దిగితే జరిగే పరిణామాలు ఊహకందని ఉత్పాతాన్ని సృష్టిస్తాయి. అగ్రరాజ్యాలు... ముఖ్యంగా అమెరికా తమ మూర్ఖత్వాన్ని విడనాడి ఇజ్రాయెల్ను దారికి తేవాలి. లేనట్టయితే భవిష్యత్తరాలు క్షమించవు. -
గాల్లో ప్రాణాలు
దేశంలో విమానయాన నియంత్రణ సంస్థ అయిన ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (డీజీసీఏ) పాత్రపైనే ఇపుడు అనివార్యంగా ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రయా ణికుల భద్రత పట్ల ఉపేక్ష, జాగ్రత్త, ఆదుర్దా కనబరచక పోవడం డీజీసీఏ స్వభావంగా మారిపోయింది. విమాన భద్రతా ఉల్లంఘనలు 2008 నుంచి వేలాదిగా చోటుచేసు కుంటున్నా అది వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు పయనించగలిగిన బోయింగ్ 777–200, 777–300–ఇ.ఆర్. విమానాలను ఎయిర్ ఇండియా రంగంలోకి దించింది. భారత్ నుంచి అమెరికా వెళ్ళే విమానాలకు 16 గంటల వరకు సమయం పడుతుంది. దాంతో ఎయిర్ ఇండియాకు చెందిన సుదూర శ్రేణి విమానాలకు అప్పటి డీజీసీఏ నసీమ్ జైదీ కఠిన నిబంధనలను నిర్దేశించారు. కానీ, ఎయిర్ ఇండియా 787 డ్రీమ్ లైనర్ విమానాలతో భారత్ నుంచి ఆస్ట్రేలియాకి సర్వీసులు మొదలు పెట్టిన పుడు ఎగువ నిబంధనలను అప్పటి డీజీసీఏ మార్చే సింది. అది ఆకాశయాన భద్రతా ప్రమాణా లను గాలికొదిలేసింది. ఇది అటు ప్రయాణికు లతో పాటు ఇటు విమాన సిబ్బంది ప్రాణాలకు కూడా చేటు తేవడమే అవుతుంది. డ్రీమ్ లైనర్ను ఆ విధంగా ఉపయోగించడం వల్ల ప్రమాదానికి లోనయ్యే అవకాశం అనుమతించిన సాధారణ పరిమితులకు మించి 25 రెట్లు పెరిగిందని ఎయిర్ ఇండియాకూ తెలుసు. కానీ, ఆ నివేదికను ఎయిర్ ఇండియా, డీజీసీఏ రెండూ మరుగు పరిచేశాయి. ఆ రూటులో సుర క్షిత పయన నిబంధనలు ఉల్లంఘనలకు గుర వుతున్న సంగతి ప్రయాణికులకు తెలియలేదు. డిజైన్ దశలోనే లోపాలుఅలాగే, 787 డ్రీమ్లైనర్లు ఇంకా డిజైన్ దశలో ఉన్నప్పుడే,ఇంకా వాటి గగన సామర్థ్యాలను పరీక్షించకముందే ఎయిర్ ఇండియా వాటి కొనుగోలుకు ఆర్డరు పెట్టేసింది. ఎయిర్ ఇండియా సమకూర్చుకున్న బోయింగ్ 787 డ్రీమ్లైనర్ల ప్రారంభపు ఆకాశయానాల్లోనే వాటి భద్రత, ఇంజినీరింగ్కు సంబంధించి అనేక లోపాలు, సమస్యలు బయటపడ్డాయి. విమాన సిబ్బందికి విమాన భద్రతా నిబంధనలను రూపొందించడంలో డీజీసీఏకున్న అధికారాలను సవాల్ చేస్తూ, నేను బొంబాయి హైకోర్టులో 2013–14 రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేశాను. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి అప్పట్లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. నేను వేసిన రిట్ పిటి షన్లకు అటు డీజీíసీఏ గానీ, ఇటు ఎయిర్ ఇండియా గానీ 2019 వరకు జవాబులు దాఖలు చేయకపోవడం పట్ల ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మరో దిగ్భ్రాంతికరమైన సంగతి ఏమిటంటే, విమాన సిబ్బందికి విమాన సురక్షిత నిబంధనలను జారీ చేసే, లేదా రూపొందించే అధికారం డీజీసీఏకు 2016 సెప్టెంబర్లో మాత్రమే లభించింది. అదీ 1937 నాటి విమాన నిబంధనలోని 42–ఎ సెక్షనుకు సవరణ తీసుకురావడం ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఎయిర్ ఇండియా విమాన సురక్షిత నిబంధనలను తుంగలో తొక్కుతున్నా డీజీసీఏ వాటిని కప్పిపుచ్చుతూ వచ్చిందని దీనిద్వారా స్పష్టమవుతోంది. డీజీíసీఏ, ఎయిర్ ఇండియా అధికారులపై చర్య తీసుకోవాలని కోరుతూ నేను చాలా క్రిమినల్ కేసులు పెట్టాను. విమాన సురక్షిత ప్రమాణాలు ఉల్లంఘనలకు లోనవుతున్న సంగతిని ట్రయల్ కోర్టు అయినా పట్టించుకుంటుందని ఆశతో ఆ పని చేశాను. ఎందుకంటే, ఆ లోపాలు ప్రయాణికులు, విమాన సిబ్బంది... ఇద్దరి ప్రాణాలకూ ముప్పు తెచ్చేవిగా ఉన్నాయి. కనీసం ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం తర్వాతనైనా, కోర్టు మేల్కొని, విమాన సురక్షిత నిబంధనలను బాహాటంగా ఉల్లంఘించిన సంబంధిత డీజీసీఏ, ఎయిర్ ఇండియా అధికారులపై కఠిన చర్య తీసుకుంటుందని ఆశిస్తున్నాను.-వ్యాసకర్త ఎయిర్ ఇండియా మాజీ సీనియర్ అధికారి, కె.వి.జె. రావు- (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)కారణాలు ఏమిటి?అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ఏఐ 171 కూలిపోయి కొన్ని గంటలే అవుతోంది. దాదాపు 260 మందికి పైగా బలిగొన్న ఈ దుర్ఘటనకు దారితీసిన కారణాలపై ఊహాగానాలు అప్పుడే జోరందుకున్నాయి. కొన్ని సమాచార సాధనాలు దీన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తు న్నాయి. ఈ విషాదకర ఘటనపై నా అభిప్రాయాలు తెలుపవలసిందని ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ కోరింది. నేను అందుకు అంగీకరించి, ‘‘దీనిపై ఊహాగానాలకు పాల్పడటం తొందరపాటు అవుతుంది’’ అని మాత్రమే చెబుతానన్నాను. ఫలితంగా, వారు నాతో ఆ ఇంటర్వ్యూను జరపనే లేదు. ఊహాగానాలు చేసేందుకు నేను విముఖంగా ఉండటమే బహుశా అందుకు కారణం కావచ్చు.ఈ ఘోర విపత్తుకు కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని అందరిలాగా నాకూ కుతూ హలం ఉంది. కానీ ఇంత త్వరగా బాహాటంగా ఊహాగానాలు చేయడం–అందులోనూ ఆధారాలు స్వల్పంగా ఉన్న సమయంలో–ఎవరికీ ప్రయోజనకారి కాదనిపించింది. అది హానికరం కూడా! పురాతన తవ్వకాల మాదిరిగా... మొదట అగ్ని జ్వాలలను ఆర్పి, బతికున్న వారికోసం అన్వేషణ పూర్తయిన పిదపనే వైమానిక ప్రమాద దర్యాప్తులు ప్రారంభమవుతాయి. అలాంటి దుర్ఘటనలు జరిగినపుడు ప్రాణాలతో ఉన్నవారు, క్షతగాత్రుల గురించి మొదట పట్టించు కోవాలి. తర్వాత, ప్రమాద స్థలికి వెళితే సురక్షితమేనని, ఇబ్బందేమీ ఉండదని ప్రకటించాలి. అనంతరం, చనిపోయిన వారిని గుర్తించడం ఆరంభమవుతుంది. ప్రమాదంపై దర్యాప్తునకు సమాంతరంగా, బాధితులను గుర్తించే పనిని వేరే సంస్థ చూసుకుంటుంది. దర్యాప్తులో పాలుపంచుకునేది కేవలం ప్రభుత్వ అధికారులే కాదు, సదరు విమానాన్ని తయారు చేసిన సంస్థ (ప్రస్తుత సందర్భంలో బోయింగ్) దర్యాప్తునకు సహాయపడేందుకు తన ప్రతినిధులను పంపుతుంది. ప్రయాణికులు ఏయే దేశాలకు చెందినవారో ఆ యా దేశాలు కూడా కొందరిని పంపవచ్చు. ప్రమాదం సంభవించిన దేశంలోని పరిశో ధకులు, వైమానిక దుర్ఘటనలపై దర్యాప్తు చేయడంలో మరింత అనుభవం ఉన్న ఇతర దేశాలకు చెందినవారి సహాయాన్ని కూడా అర్థించవచ్చు. ఇన్వెస్టిగేటర్లు శిథిలాల నుంచి బ్లాక్ బాక్స్ (ఫ్లైట్ డాటా రికార్డర్లు, కాక్పిట్ వాయిస్ రికార్డర్)లను వెతికి పట్టుకోవడాన్ని ప్రాథమిక బాధ్యతగా భావిస్తారు (అహ్మదాబాద్లో వైద్య కళాశాల హాస్టల్ మెస్ పైకప్పు మీద బ్లాక్బాక్స్ను గుర్తించారు). విమానం గురించిన డేటా కూడా వీటిల్లోఉంటుంది. విమానం ఎలా పని చేస్తోందో, పైలెట్లు ఏం చెబుతున్నారో తెలుస్తుంది. బ్లాక్ బాక్స్లను వెలికి తీసినంత మాత్రాన విమానం కూలిన ఘట నలో దర్యాప్తు పూర్తయినట్లు కాదు. విమాన ప్రమాద దర్యాప్తు పురావస్తు తవ్వకాల లాంటిదే! ఒక పద్ధతి ప్రకారం, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి చేయాల్సిన పని అది. ఆధారాలను సేకరించి తదుపరి విశ్లేషణకు వాటిని భద్రపరచకపోతే, విలు వైన ఆధారాలను ఎప్పటికీ కోల్పోయినట్లే లెక్క. దర్యాప్తు అధికారులు సాక్షుల వాఙ్మూలాలను, ఆ ఘటనకు సంబంధించి వారు ఏవైనా వీడి యోలు తీసి ఉంటే వాటిని సేకరిస్తారు. వారి విశ్లేష ణను కంపెనీ డాక్యుమెంటేషన్, శిక్షణ, నియంత్రణ సంస్థ పేర్కొన్న నియమ నిబంధనలను పాటించడం గురించిన సమాచారంతో పోల్చి చూసుకుంటారు. విమాన ప్రమాదాలలో దాదాపు 80 శాతానికి ‘మానవ అంశాలే’ కారణం. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ పేర్కొంటున్న మానవఅంశాలు: మానవుల సామర్థ్యాలు, గుణగణాలు, పరిమితులు, వారు ఉపయోగించే విధివిధానాలు, పరికరాలు, ఎలాంటి వాతావరణంలో పనిచేస్తు న్నారు లాంటివి! ఈ దుర్ఘటనపై పూర్తి ఫోరెన్సిక్ దర్యాప్తు సమగ్ర రూపంలో చేతికందడానికి కొన్నేళ్ళు పట్టవచ్చు. ఉదాహరణకు, ఆస్ట్రేలియాలో 2023లో సీ వరల్డ్ హెలికాప్టర్ కూలిన ఘటనపై తుది నివేదిక ఈ ఏడాది ఏప్రిల్లో విడుదలైంది. ఊహాగానాలు–నిందలువిమాన ప్రమాదానికి కారణం కాగల అంశాలపై హానికరమైన ప్రజా ఊహాగానాలకు సంబంధించి సుదీర్ఘ చరిత్రేఉంది. మలేసియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంహెచ్–370 విమానం 2014 మార్చి 8న గగనతలం నుంచి అదృశ్యమైంది. ఆ ఘటనకు దాని చీఫ్ పైలట్ జహారీ అహ్మద్ షాయే బాధ్యుడంటూ ప్రచారం జరిగింది. షాతోపాటు ఆ ఘటనలో 238 మంది చనిపోయారు. ఆ ప్రచారం తనను చాలా బాధకు గురిచేస్తోందని షా సోదరి సకీనబ్ షా 2016లో సి.ఎన్.ఎన్.కు ఇచ్చినఇంటర్వ్యూలో వాపోయారు. ఆ ప్రమాదానికి తన సోదరుడిని ‘బలిపశువును’ చేస్తున్నారని ఆమె అన్నారు. ఇదమిత్థంగా కారణాలు తెలియకుండానే, ప్రమాదాలకు అలా ఎవరెవరినో బాధ్యులుగా భావించిన దృష్టాంతాలను చాలా చూపవచ్చు. ఒక రకం విమానాలను నడిపేవారికి అదే రకానికి చెందిన కొత్త మోడల్ విమానాలను ఇచ్చి (ఈ కొత్త విమానాలను నడపడంలో పైలట్లకు సిములేటర్లో తగినంత శిక్షణ ఇవ్వకుండానే) నడిపేయమనడం కూడా విమానయాన సంస్థలకు కొత్తేమీ కాదు. ఫలితంగా జరగరానిది ఏదైనా జరిగితే వచ్చే అపనిందల వల్ల పైలట్లు ఉద్యోగాలు కోల్పోతారు. ప్రతిష్ఠ దెబ్బతింటుంది. వారి కుటుంబ సభ్యులు పడే వేదన వర్ణనాతీతం.బహిరంగంగా ఊహాగానాలు చేయడం దర్యాప్తు ప్రక్రియకు ఏ విధంగానూ దోహదపడదు. మృతుల, క్షతగాత్రుల కుటుంబాలకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. సునిశితమైన అంశాలను కనుగొనడానికి వీలుగా బాహ్య ఒత్తిడులు ఏమీ లేకుండా ఇన్వెస్టిగేటర్లను వారి పనిని వారిని చేసుకోనివ్వాలి. ఈ ప్రక్రియను గౌరవించడం, నిజాయతీతో వ్యవహరించనివ్వడం ముఖ్యం. మాటలకందని విషాదాన్ని అనుభవిస్తున్న అనేక మందికి మనం అండగా నిలవాలి. -వ్యాసకర్త యూనివర్సిటీ ఆఫ్ సదరన్ క్వీన్స్ ల్యాండ్ బ్యాచిలర్ ఆఫ్ ఏవియేషన్కు ప్రోగ్రామ్ డైరెక్టర్, నటాషా హీప్(‘ది కాన్వర్సేషన్’ సౌజన్యంతో) -
జల్దీ ఇల్లు కట్టుకోండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదల కోసం ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, ఇప్పటికి పనులు మొదలైనవి 69 వేలు మాత్రమే. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండో సంవత్సరం కొనసాగుతుండటంతో మరో 4.50 లక్షల ఇళ్ల నిర్మా ణానికి కూడా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ నేప థ్యంలో ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది.అసలే పనుల ప్రారంభంలో ఆలస్యం జరుగుతుండగా, ప్రస్తుతం వానాకాలం కూడా మొదలు కావటంతో ఇళ్ల నిర్మాణం మరింత మందగించనుంది. భారీ వర్షాలు ప్రారంభమైతే అసలు పనులే చేపట్టేందుకు జనం ఆసక్తి చూపరు. వ్యవసాయ పనులు ఊపందుకుంటే పనుల్లోకి వెళ్లేందుకే మొగ్గు చూపుతారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా చూడాలని గృహనిర్మాణ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి త్వరగా పనులు ప్రారంభించాలని సూచిస్తున్నారు. పూర్తయిన ఇళ్లు రెండే..కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు కూడా ఉన్నాయి. దీంతో వీటి నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవలి నుంచే లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు జారీ చేస్తుండటంతో నెల రోజులుగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 69 వేల ఇళ్లు మాత్రమే మొదలయ్యాయి. వాటిల్లో పూర్తయినవి రెండు మాత్రమే. 15 వేల ఇళ్లకు మాత్రమే ఇప్పటివరకు ఆర్థిక సాయం పంపిణీ జరిగింది.ఇందులో 10 వేల ఇళ్లకు సంబంధించి తొలి విడత బేస్మెంట్ లెవల్ నిధులు రూ.లక్ష చొప్పున విడుదల కాగా, మూడు వేల ఇళ్లకు రెండో విడత, మరో రెండు వేల ఇళ్లకు గోడలకు సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. మొత్తంగా రూ.100 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. నిధులకు ఇబ్బంది లేదని, ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. భారీ వర్షాలు పడితే ఇసుకకూ కష్టమే..రాష్ట్రంలో వానాకాలం మొదలు కావటంతో భారీ వర్షాలు కురిస్తే ఇళ్ల నిర్మాణ పనులకు ఆటంకాలేర్పడతాయని అధికార యంత్రాంగం భయపడుతోంది. దీంతో వర్షాలు ఊపందుకోక ముందే వీలైనన్ని ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని భావిస్తోంది. ఈ ఇళ్లకు కావాల్సిన ఇసుకను వాగులు, వంకల నుంచి సేకరించి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. భారీ వర్షాలు కురిసి వాగులు నీటితో నిండిపోతే ఇసుక సేకరణ కూడా కష్టమవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈలోపే వీలైనంత మందికి ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించారు. అది జరగాలంటే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలి. ఇందుకోసం బృందాలుగా అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వెంటనే పనులు మొదలుపెట్టాలని కోరుతున్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట
హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్లను తిరిగి చెల్లిస్తోంది ఈడీ. కర్నాటక, తెలంగాణ, ఏపీ, ఒడిశాలలో అగ్రిగోల్డ్ బాదితులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారు. సుమారు 19 లక్షల మంది మోసపోయినట్లు ఈడీ గుర్తించింది. ఈ స్కామ్ లో ఇప్పటికే 33 మందిపై చార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ.. వారి ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు డిపాజిట్లు చెల్లిస్తోందిగత ఏడాది నవంంబర్లో ఈడీ ఛార్జ్షీట్ను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ. 6,380 కోట్లు వసూల్ చేసినట్లు కోర్టు గుర్తించింది. దీనిలో భాగంగా రూ. 4,141 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్లో ఉన్న ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అగ్రిగోల్డ్ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేశారు. -
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. స్టీవ్ స్మిత్కు తీవ్ర గాయం
లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా సూపర్ స్టార్ స్టీవ్ స్మిత్ గాయపడ్డాడు. మూడో రోజు ఆట సందర్భంగా స్లిప్లో ఫీల్డింగ్ చేస్తుండగా స్మిత్ చేతి వేలికి గాయమైంది. సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్.. రెండో బంతిని బావుమాకు షార్ట్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని బావుమా లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి థిక్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో స్మిత్ ఆ క్యాచ్ను అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో బంతి బలంగా స్మిత్ చిటికెన వేలికి తాకింది. దీంతో స్మిత్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు.వెంటనే ఫిజియో సాయంతో స్మిత్ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి స్దానంలో కొన్స్టాస్ సబ్స్ట్యూట్గా ఫీల్డ్లోకి వచ్చాడు. స్మిత్ గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా అప్డేట్ ఇచ్చింది. అతడి చిటికెన వేలు ఎముక పక్కకు జరిగిందని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో త్వరలో వెస్టిండీస్తో జరనున్న టెస్టు సిరీస్కు స్మిత్ దూరమయ్యే అవకాశముంది. -
కొత్త ఫోనొచ్చింది.. రూ.10 వేలకే పవర్ఫుల్ 5జీ ఫోన్
తక్కువ బడ్డెట్లో స్మార్ట్ఫోన్లు తయారు చేసే లావా మరోసారి బడ్జెట్ లో శక్తివంతమైన ఫ్లాగ్ షిప్ ఫోన్ ను లాంచ్ చేసింది. లావా స్టోర్మ్ ప్లే 5జీ (Lava Storm Play 5G) ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.10,000 కంటే తక్కువ ధరకే హై ఎండ్ స్పెసిఫికేషన్లను ప్రవేశపెట్టిన డివైజ్ ఇది. బడ్జెట్ సెగ్మెంట్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డైమెన్సిటీ 7060 చిప్సెట్, ఎల్పీపీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, 120 హెర్ట్జ్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. లావా స్టోర్మ్ ప్లే 5జీ ధరఈ లావా ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్తో ఒకే ఒక వేరియంట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధరను కేవలం రూ.9,999గా నిర్ణయించారు. రూ.9,999 ప్రారంభ ధరతో ఈ స్మార్ట్ ఫోన్ జూన్ 24 నుంచి అమెజాన్ లో తొలి సేల్ కు అందుబాటులో ఉండనుంది.ఫీచర్లు..స్పెసిఫికేషన్లులావా స్టార్మ్ ప్లే 5జీ మీడియాటెక్ కొత్త డైమెన్సిటీ 7060 5జీ ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఇది గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది.ఇందులో 6 జీబీ ఫాస్ట్ ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఇవ్వగా 6 జీబీ వర్చువల్ ర్యామ్తో మరింత విస్తరించుకోవచ్చు. అంటే మొత్తం 12 జీబీ ర్యామ్ లభిస్తుంది. ఇక స్టోరేజ్ కోసం 128 జీబి యూఎఫ్ఎస్ 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది.ఇందులో 6.75 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేను ఇచ్చారు. కెమెరా సెటప్ విషయానికొస్తే, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ సెన్సార్తో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.లావా స్టార్మ్ ప్లేలో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యుయల్ సిమ్ 5జీ సపోర్ట్, ఐపీ64 రేటింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి.అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 15తో ఎలాంటి బ్లోట్ వేర్ లేకుండా, అంటే అనవసరమైన యాప్స్, పాప్ అప్ యాప్స్ లేకుండా పనిచేస్తుంది.2 సంవత్సరాల పాటు 1 ప్రధాన ఓఎస్ అప్ డేట్, సెక్యూరిటీ అప్ డేట్ లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. -
పెళ్లి చేసుకున్న రెండు రోజులకే ఆదరా బాదరాగా..!
వడోదరా: అహ్మదాబాద్ విమాన ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చిపోయింది. పలు కుటుంబాల్లో దీనగాథను నింపేసింది. 241 కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసేసింది. ఈ ప్రమాదం అనంతరం తడిమే కొద్దీ వర్ణణాతీతమైన గాథలే కనిపిస్తున్నాయి. తాజాగా పెళ్లైన రెండు రోజులకే లండన్లో ఉద్యోగం కోసం విమానం ఎక్కిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో అది ఆ కుటుంబంలో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. వడోదరాకు చెందిన భావిక్ మహేశ్వరి(26).. రెండు రోజుల క్రితం చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి నిమిత్తం రెండు వారాల క్రితం లండన్ నుంచి భారత్కు వచ్చిన భావిక్.. జూన్ 10వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. అనంతరం లండన్లో పని చేస్తున్న భావిక్,.. జూన్ 12వ తేదీన అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కాడు. అంతే అదే అతని ఆఖరి మజిలీ అయ్యింది. తండ్రితో మాట్లాడిన మాటలే ఆఖరి మాటలు అయ్యాయి. ఈ విషయాన్ని పదే పదే తలుచుకుని తండ్రి అర్జున్ మహేశ్వరి కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘ నా తనయుడు మళ్లీ వస్తానన్నాడు.. లండన్ వెళ్లాక ఫోన్ చేస్తానన్నాడు. టేకాఫ్ టైం అవుతుంది నాన్న అన్నాడు’అని చివరిసారి మాట్లాడిన మాటలు తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తన కుమారుడు లండన్లో చదువుకని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడని, పెళ్లి నిమిత్తం వచ్చి ఇలా మృత్యువాత పడ్డాడని తండ్రి శోకతప్త హృదయంతో మాట్లాడారు. -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ జీవో విడుదల చేసింది. జనవరి1,2023 నాటి డీఏపై జీవో విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని పేర్కొంది -
మిస్టరీ థ్రిల్లర్గా హంటర్ ఛాప్టర్ -1.. గ్రాండ్ రిలీజ్
హీరో వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'హంటర్ ఛాప్టర్ 1'. ఈ చిత్రంలో నందిత శ్వేతా, తాన్య హోప్ హీరోయిన్స్గా నటించారు. ఈ సినిమాకు షరీఫ్ గౌస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎ.రాజశేఖర్, సాయి కిరణ్ బత్తుల నిర్మించారు.తాజాగా మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1 శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని అర్రోల్ కొరెల్లి అందించారు. బాలాజీ కె రాజా సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఆకట్టుకోనుంది. -
ప్లాస్టిక్ కవర్లో పసికందు.. ప్రసవం తరువాత చెట్టుకు వేలాడదీసి
సాక్షి,అల్లూరి : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డను వర రామచంద్రపురం మండలం కొక్కెరగూడెం అడవిలో వదిలేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఏ కన్నతల్లిబిడ్డో ఏమో ప్రసవం తరువాత పసికందును ప్లాస్టిక్ కవర్లో పెట్టి చెట్టుకు వేలాడ దీశారు. ప్లాస్టిక్ కవర్ చుట్టడంతో ఊపిరాడక గుండలవిసేలా ఏడుస్తున్న పసికందును స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్లాస్టిక్ కవర్లో ఉన్న పసికందును అత్యవసర చికిత్స నిమిత్తం చింతూరు ఆసుపత్రికి తరలించారు. చింతూరు పసికందుల వార్డులో మగ బిడ్డకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. -
భారత్తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టులో ఫ్లింటాఫ్ తనయుడు
భారత అండర్-19 జట్టుతో జరగనున్న వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) ప్రకటించింది. ఇంగ్లీష్ అండర్-19 జట్టుకు థామస్ రెవ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఇంగ్లండ్ దిగ్గజం ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ చోటు దక్కించుకున్నాడు.రాకీ ప్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకునేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటివరకు 5 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన రాకీ.. 15.22 సగటుతో 137 పరుగులు చేశాడు. అదేవిధంగా 8 లిస్ట్-ఎ మ్యాచ్లలో అతడి పేరిట 167 పరుగులు ఉన్నాయి. అంతేకాకుండా యూత్ టెస్టులలో ఓ సెంచరీ కూడా ఈ జూనియర్ ప్లింటాప్ సాధించాడు. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు యూత్ వన్డేల సిరీస్ జూన్ 27 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండు మల్టీ-డే మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టుకు యువ సంచలనం అయూష్ మాత్రే సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ వంటి చిచ్చరపిడుగులు ఉన్నారు.ఇంగ్లండ్ అండర్-19 టీమ్థామస్ రెవ్ (కెప్టెన్), రాల్ఫీ ఆల్బర్ట్, బెన్ డాకిన్స్, జేద్న్ డెన్లీ, రాకీ ఫ్లింటాఫ్, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, జాక్ హోమ్, జేమ్స్ ఇస్బెల్, బెన్ మేయెస్, జేమ్స్ మింటో, ఐజాక్ మొహమ్మద్, జోసెఫ్ మూర్స్, సెబ్ మోర్గాన్, అలెక్స్ వేడ్.భారత అండర్-19 జట్టుఆయుష్ మ్హత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్సిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు, హర్వాన్ష్ పంగాలియా, ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహా, ప్రణవ్ సింఘేత్ రాఘవేంద్ర, మొహమ్జేద్ ఎహమ్జెనా. -
థగ్ లైఫ్ బ్యాన్.. కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు!
కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. తొలి మూడు రోజుల్లో భారీగానే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీ ఇప్పటివరకు పెద్దగానే వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకపోవడం కూడా కలెక్షన్స్పై ప్రభావం చూపింది.అయితే థగ్లైఫ్ సినిమా నిషేధంపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కన్నడపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో థగ్ లైఫ్ను కర్ణాటకలో నిషేధిస్తున్నట్లు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. ఆ తర్వాత హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. కమల్ క్షమాపణలు చెబితే విడుదలకు అనుమతి ఇస్తామని చెప్పిన ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో థగ్ లైఫ్ కర్ణాటకలో రిలీజ్ చేయలేదు.అయితే సెన్సార్ పూర్తయిన చిత్రాన్ని అనధికారికంగా నిషేధించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా థగ్ లైఫ్పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా వేసింది. చాలా ఏళ్ల తర్వాత కమల్- మణిరత్నం కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శింబు, త్రిష కీలక పాత్రలు పోషించారు. -
‘నేహా చెప్తే వింటారు’.. పర్సనల్ ఫైనాన్స్లో ఈమెది మామూలు ఫాలోయింగ్ కాదు
నేహా నాగర్.. దేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న మహిళా పర్సనల్ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్స్టాగ్రామ్లో ఈమెకు 1.9 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆ పాపులారిటీతోనే ‘కాండేరే హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్ లిస్ట్ 2025’లో స్థానం సంపాదించింది. సంపద సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, దాతలు, సాంస్కృతిక రూపకర్తలు, యువ నాయకులు, ప్రొఫెషనల్స్, ఇన్ఫ్లుయెన్సర్ ఫౌండర్లతో సహా అన్ని కేటగిరీల్లోని మహిళలతో ఈ జాబితాను రూపొందించారు.దేశ పర్సనల్ ఫైనాన్స్ ల్యాండ్ స్కేప్లో నాగర్ ఒక మార్గదర్శక స్వరం. వైవిధ్యంతో ఆమె అందించే కంటెంట్, ఆర్థిక పాఠాలు నేహా నాగర్ను ఆన్ లైన్ లో దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్లలో ఒకరిగా చేశాయి. ఫైనాన్స్ కంటెంట్ క్రియేటర్, ఎంటర్ప్రెన్యూర్, ఏంజెల్ ఇన్వెస్టర్ అయిన నాగర్ పన్నులు, బడ్జెట్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ వంటి సంక్లిష్ట ఆర్థిక అంశాలను సులభతరం చేయడంలో ప్రసిద్ధి చెందారు.👉 30 ఏళ్ల నాటి షేర్లు.. అప్పుడు లక్ష.. ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా?వివిధ ప్లాట్ఫామ్లలో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఆమె ఆర్థిక పాఠాలను వినోదంతో మిళితం చేసి కంటెంట్ ఫాలోవర్లకు అందిస్తుంది. అందరికీ అర్థమయ్యే బాలీవుడ్, క్రికెట్ వంటి అంశాలతో ఈమె ఫైనాన్స్ కంటెంట్ మిళితమై ఉంటుంది. నైకా, క్రెడ్, ఎయిర్ టెల్ వంటి టాప్ బ్రాండ్లతో కలిసి పనిచేసిన నేహా.. ఆర్థిక స్వావలంబన సాధించడానికి అవసరమైన పరిజ్ఞానం అందించి జనానికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్న ఆకాంక్షలతో మొదలైన నాగర్ ప్రయాణం ఎంబీఏ, వెల్త్ మేనేజ్ మెంట్ కు దారితీసింది. ముఖ్యంగా మహిళలకు సహాయం చేయాలనే తపనతో, వాళ్లు డబ్బును అర్థం చేసుకోవడం, నిర్వహించుకోగలగడంలో తన వంతు సాయం అందించడానికి ఆమె చివరికి డిజిటల్ ఫైనాన్స్ పాఠాల వైపు మొగ్గు చూపారు. పిల్లల్ని కనడానికి ముందు అవసరమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఆమె చేసిన ఒక పోస్ట్ వైరల్ అయ్యి జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఆర్థిక అక్షరాస్యతకు ఆమె చేసిన కృషికి ఫోర్బ్స్, సీఎన్బీసీ, ఎన్డీటీవీ, టీఈడీఎక్స్, ఇతర ప్రముఖ వేదికలలో కూడా ఆమె స్థానం పొందారు. -
Plane Crash: ఉద్యోగులకు టాటా గ్రూప్ చైర్మన్ లేఖ
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మరోసారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జూన్ 12వ తేదీ అనేది టాటా గ్రూప్ చరిత్రలో చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. ఎయిర్ ఇండియాను 2022లో తీసుకున్న టాటా గ్రూప్.. తాజా విమాన ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతటి ప్రాణనష్టం అనేది చాలా అపారమైన నష్టంగా చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం టాటా గ్రూప్ ఉద్యోగులకు సుదీర్ఘ లేఖ రాశారాయన. ‘నిన్న(గురువారం, జూన్ 12) జరిగిన దుర్ఘటన అనేది మాటల్లో చెప్పలేనిది. ఆ దుర్ఘటనతో ఇంకా షాక్లోనే ఉన్నాం. ఒక్క ప్రాణంపోతేనే విషాదం అంటాం. మరి ఇంతమంది ప్రాణనష్టం జరిగితే ఏమనాలి. ఇది కచ్చితంగా అపారమైన ప్రాణనష్టమే. ఇది మా గ్రూప్ చరిత్రలో దుర్దినంగా మిగిలిపోతుంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అన్ని స్వదేశీ, విదేశీ బృందాలకు మేము పూర్తిగా సహకరిస్తాం. అత్యంత పారదర్శకతతో దర్యాప్తునకు సహకారం అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. తాము ఎయిర్ ఇండియాను తీసుకున్నప్పట్నుంచీ ప్రయాణికులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నామని, ఇందులో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. #AirIndiaFlightCrash | Tata Group Head Natarajan Chandrasekaran writes to his colleagues, "What occurred yesterday was inexplicable, and we are in shock and mourning. To lose a single person we know is a tragedy, but for so many deaths to occur at once is incomprehensible. This… pic.twitter.com/XboB94W6DG— ANI (@ANI) June 13, 2025 కాగా, అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన విమానం గురువారం సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ఇందులో 242 మంది ఉండగా, 241 మంది మృత్యువాత పడ్డారు. ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడై తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ ప్రయాణికుడు.. ప్రమాదం ఎలా జరిగిందో చెప్పే పరిస్థితుల్లో లేడు. -
‘మా అమ్మ ఆచూకీ తెలిస్తే చెప్పండన్న’.. కూలిన ఎయిరిండియా విమానం కింద..
గాంధీ నగర్: ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. విమాన ప్రమాద సమయంలో బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్లో తన తల్లి శార్లాబెన్ ఠాకూర్, రెండేళ్ల కుమార్తె ఆధ్య ఉన్నారు. పెను విషాదంపై సమాచారం అందుకున్న బాధితుడు తన అమ్మ, కుమార్తెతో పాటు అక్క ఆచూకీ కోసం వెతుకుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.ప్రమాదంలో చెల్లాచెదురైన ప్రయాణికుల మృత దేహాల్ని గుర్తిస్తున్న అధికారుల్ని.. తనని నవ మాసాలు కనిపెంచిన అమ్మ.. తాను కన్న కూతురు, అక్క చనిపోయారని ఓవైపు కీడు శంకిస్తున్నా ఆ బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని దిగమింగుకుంటూ బాధితుడు ..‘సార్ .. మా అమ్మ, కూతురు,అక్క ఎక్కడ ఉన్నారో.. ఏమో? వాళ్ల ఆచూకీ తెలిస్తే చెప్పండన్నా అంటూ అమాయకంగా.. బాధతో ప్రాధేయపడుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. బాధితుడి వేడుకోలుతో అధికారులు అతని తల్లి,కుమార్తె ఆచూకీ గుర్తించే పనిలో పడ్డారు.VIDEO | Ahmedabad air crash: Ravindra Thakore mourns the loss of his mother and daughter, who were working at the canteen of the medical college hostel on which the ill-fated aircraft crashed. He says, “I want the authorities to check inside the building. I want to go by myself.… pic.twitter.com/9b5FRVHJWr— Press Trust of India (@PTI_News) June 13, 2025 ఎయిరిండియా కుప్పకూలిన హాస్టల్ భవనాలు కింద వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకున్నారు. బాధితుడి తల్లి బీజే మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులకు, ప్రొఫెసర్లకు భోజనం వండేది. భోజనం, చపాతీలు, గుజరాతీ వంటలు చేయగా.. వాటిని, ఆమె కుమారుడు ప్రతీ రోజు కళాశాల క్యాంపస్లో డెలివరీ చేసేవాడు. తిరిగి బీజే మెడికల్ కాలేజీ హాస్టల్కు వచ్చేవారు. ఎప్పటిలాగే కుమార్తెను తన తల్లి దగ్గర వదిలేసి పక్కనే ఉన్న సివిల్ ఆస్పత్రిలో లంచ్ బాక్స్లు ఇచ్చేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఈ ఘోరం జరిగింది. ఈ విషాదంపై శార్లాబెన్ కుమారుడు రవీ మాట్లాడుతూ.. విమాన ప్రమాదం జరిగిన సమయంలో సివిల్ హాస్పిటల్కు టిఫిన్ బాక్సులు అందించటానికి వెళ్లాను. ఎప్పటిలాగే ప్రతి రోజు భోజనం ఇచ్చినట్లుగా జూన్ 12న నేను మధ్యాహ్నం 1 గంటకు హాస్పిటల్ సిబ్బందికి, హాస్టల్కు భోజనం అందించడానికి వెళ్లాను. తిరిగి రావడంతో ఓ విమానం మెస్లో దూసుకొచ్చిందని విన్నాను. విమానం కూలిన ప్రదేశంలో మా అమ్మ కూర్చుంది. ఆ ప్రదేశం మొత్తం పూర్తిగా కాలిపోయింది. మా అమ్మ, కుమర్తె, అక్కడ ఉన్నారని కంటతడి పెడుతూ మీడియాతో మాట్లాడారు. గంటలు గడుస్తున్నాయి. వాళ్ల ఆచూకీ లభించలేదు. అయినప్పటికీ వారి ఆచూకీ గుర్తించేందుకు మరో 72 గంటలు వేచి చూడాలని చెప్పారని వాపోయారు. This Baby Girl and her mother both are missing from mess building since plane crash Guys I know her father personally Please Contact me through Comments if found 🙏🙏🙏 Ahmedabad Gujarat pic.twitter.com/oJLEn6nr77— DTS (@Sharma17_05) June 13, 2025ప్రమాదం జరిగిన ఒక రోజు తరువాత సివిల్ హాస్పిటల్లో వైద్యులు మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యుల నుండి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు. మరోవైపు జేబీ మెడికల్ కాలేజీ బిల్డింగ్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. బాధితుడు రవి చెప్పిన ప్రాంతం అంతా మనుషుల శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. వాటిని గుర్తించేందుకు బాధితుల కుటుంబసభ్యుల డీఎన్ఏని సేకరిస్తున్నారు. బాధితుడి రవి కూడా తన వాళ్ల ఆచూకీ దొరుకుతుందేమోనని విషాదం నిండిన కళ్లతో ఎదురు చూస్తున్నాడు. -
పూర్ణ పెళ్లిరోజు.. శుభశ్రీ హల్దీ.. మెహరీన్ చిల్ మోడ్..
యూట్యూబ్లో హల్దీ సెలబ్రేషన్స్ వీడియో షేర్ చేసిన బిగ్బాస్ బ్యూటీ శుభశ్రీనో క్యాప్షన్ అంటున్న నటి కీర్తి భట్ వెకేషన్లో ప్రియా వారియర్పెళ్లిరోజు సెలబ్రేట్ చేసుకున్న పూర్ణ View this post on Instagram A post shared by PRUDHVI RAJ (@portraitsbyprudhviraj) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Nidhi Agarwal (@nidhiagarwal_) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
అతి అభిమానం ఆరోగ్యానికి చాలా హానికరం.. బండ్ల గణేశ్ పోస్ట్ వైరల్!
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఏది చేసిన వెరైటీగానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఆయన.. జీవితానికి సంబంధించిన పోస్టులు పెడుతుంటారు. తాజాగా బండ్ల గణేశ్ ట్విటర్ వేదికగా చేసిన నెట్టింట వైరల్గా మారింది. అతి ప్రేమ.. అతి అభిమానం.. అతి విశ్వాసం.. అతి నమ్మకం.. ఆరోగ్యానికి హానికరం అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది కేవలం మన లైఫ్ కోటేషన్ తరహాలోనే పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తనకు నిజ జీవితంలో ఎదురైన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నట్లుగా కనిపిస్తోంది.ఇటీవల బండ్ల గణేశ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావును కలిశారు. అనారోగ్యంతో ఉన్న ఆయనను కలిసి పరామర్శించారు. కోట శ్రీనివాసరావుతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలో కోట శ్రీనివాసరావు గుర్తు పట్టలేనంతగా మారిపోయినట్లు కనిపించారు. కాగా.. టాలీవుడ్లో పలు సినిమాల్లో నటుడిగి మెప్పించిన బండ్ల గణేశ్.. నిర్మాతగాను తనదైన ముద్రవేశారు. పలు సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు.అతి ప్రేమ అతి అభిమానం అతి విశ్వాసం అతి నమ్మకం ఆరోగ్యానికి హానికరం ………..!— BANDLA GANESH. (@ganeshbandla) June 13, 2025 -
విద్యా ప్రమాణాల పెంపే మా లక్ష్యం: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్రెడ్డి. ఈరోజు(శుక్రవారం. జూన్ 13) విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. ప్రతీ విద్యార్థికి నాణ్యమైన అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపునకు వీలుగా విద్యా వ్యవస్థను మార్పు చేయాలని సీఎం రేవంత్ సూచించారు. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్యత్లో వారు తమకు ఇష్టమైన రంలగంలో రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.తెలంగాణలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యా శాఖ పురపాలక శాఖతో సమన్వయం చేసుకొని హెచ్ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా వివిధ విభాగాల కింద ఇంటర్మీడియట్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబద్దీకరించి ప్రతి పాఠశాలలో నిర్ధిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని.. డే స్కాలర్స్కూ ఆ పాఠశాలల్లోనే అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.పిల్లలకు కుటుంబం, సమాజం ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు కుటుంబం, సమాజం పట్ల వారి బాధ్యతను తెలియజేసేలా కౌన్సెలింగ్ ఇప్పిస్తే వారు మానసికంగా దృఢంగా తయారవడంతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా రాణిస్తారని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. -
వరుస ఎదురు దెబ్బలు.. మావోయిస్టుల వ్యూహం ఏంటి?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రసుత్త పరిస్థితులు చూస్తుంటే.. దండకారణ్యంపై పట్టు సడలకుండా ఉండేందుకు మావోయిస్టులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడాదిన్నరగా మావోయిస్టులు బస్తర్ పరిధిలోకి వచ్చే దండకారణ్యం, ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా, అబూజ్మడ్ అడవుల్లో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత 409 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందగా.. లొంగిపోయిన/అరెస్టయిన వారు మరో 1,200 మందికి పైగా ఉన్నారు. పోలీసుల చేతిలో హతమైన వారిలో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు చలపతి, ప్రయాగ్మాంజీ, సుధాకర్ వంటి అగ్రనేతలు ఉన్నారు. ఇంతకు రెట్టింపు సంఖ్యలో డివిజన్ కమిటీ సభ్యులు చనిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీ మరో ఆరేడు నెలల్లో తన ఉనికిని కోల్పోతుందనే ప్రచారం జరిగింది. మరోవైపు ఈ ఏడాది మార్చి 28న శాంతి చర్చల ప్రతిపాదనను మావోయిస్టులు తెర మీదకు తెచ్చారు. బస్తర్కు తిరిగి రండి..! వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు/అరెస్టులతో కేడర్ను మావోయిస్టులు చాలా వరకు నష్టపోయారు. మరోవైపు శాంతి చర్చల ప్రతిపాదనపై కేంద్రం, ఛత్తీస్గఢ్ సర్కార్ నుంచి సానుకూల ప్రకటన రావడం లేదు. దీంతో బస్తర్ అడవుల్లో తమ పట్టు కోల్పోకుండా ఉండేందుకు మావోయిస్టులు ప్రణాళిక సిద్ధం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏఓబీ), ఎంఎంసీ (మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్), కేకేటీ (కర్ణాటక, కేరళ, తమిళనాడు) ప్రాంతాల్లో పనిచేస్తున్న అగ్రనేతలను బస్తర్కు తిరిగి రావాలని మావోయిస్టు పార్టీ కోరినట్టు తెలుస్తోంది. పార్టీ నిర్మాణం, సాయుధ పోరాటం, గెరిల్లా వార్ఫేర్లో నిపుణులైన సీనియర్ నాయకులు రంగంలోకి దిగితే సానుభూతిపరులు, పార్టీ కేడర్లో ఆత్మ విశ్వాసం పెంచొచ్చని ఆ పార్టీ అంచనా వేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.కొత్తగా ఏడుగురు ఐపీఎస్లు వానాకాలం రావడంతో బస్తర్ అడవులు చిక్కబడ్డాయి. డ్రోన్ల సాయంతో కూంబింగ్ చేయడం సైతం భద్రతా దళాలకు కష్టంగా మారే పరిస్థితి వచ్చింది. అయినా మావోయిస్టులపై నిర్బంధం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన సుక్మా, బీజాపూర్, దంతేవాడ, నారాయణపూర్లో కొత్తగా ఏడుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది. 2021 బ్యాచ్కు చెందిన ఈ యువ అధికారులకు నక్సల్స్ను తుదముట్టించే బాధ్యతలు అప్పగించింది. కొత్తగా వచ్చిన అధికారులతో ఈ నాలుగు జిల్లాల పరిధిలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో పాల్గొంటున్న ఐపీఎస్ల సంఖ్య 20కి చేరుకుంది.ఊహించని దాడి.. ఏఓబీ నుంచి కొందరు కీలక నేతలు ఇప్పటికే దండకారణ్యానికి చేరుకున్నట్టు సమాచారం. ఈ సందేహాలకు బలం చేకూర్చేలా పువర్తిలో సీఆర్పీఎఫ్ క్యాంప్నకు సమీపంలో ఒక వ్యక్తిని ఇటీవల మావోయిస్టులు హత్య చేశారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర సరిహద్దులో ఉన్న కుంట మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో భద్రాచలం–జగ్దల్పూర్ జాతీయ రహదారి నుంచి కేవలం 400 మీటర్ల సమీపంలో ఐఈడీ పేల్చి ఏఎస్పీ స్థాయి అధికారిని హతమార్చారు. తీవ్ర నిర్బంధం నడుమ వరుసగా రెండు రోజుల పాటు భద్రతా దళాల కన్నుగప్పి దాడులు నిర్వహించి ఈ ప్రాంతంపై తమకున్న పట్టు ఏంటో మావోలు తెలియజేసినట్టయ్యింది. అయితే ఈ రెండు ఘటనలపై మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.చదవండి: అడవే ఆధారం.. బతుకు భారం -
Donald Trump: నచ్చితే ఒక రకంగా.. నచ్చకపోతే ఇలా..!
డొనాల్డ్ ట్రంప్.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అన్నీ వివాదాస్పద నిర్ణయాలే. ఏది చేసినా తమ పాటే వినాలనే పంతం. ఏ అంశాన్ని తీసుకున్నా ‘వామ్మో ట్రంప్’ అనుకోవాల్సిన పరిస్థితి. అటు సుంకాలు పెంపు దగ్గర్నుంచి మొదలుకొని అక్రమ వలసలపై ఉక్కుపాదం, పలు దేశాల యుద్ధాలపై తనకు తానుగా కల్పించుకున్న మధ్యవర్తిత్వం.. ఇలా ప్రతీది ట్రంప్కు ముడిపడే ఉంది.ఇటీవల కాలంలో ట్రంప్ శాంతి మంత్రం జపిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఆపై భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని తెగ చెప్పేసుకున్నారు. ఇది దొంగ జపమా.. నిజమైన తపనా?, ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడానికి ట్రంప్ ఇలా చేస్తున్నారనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడ మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఉవ్విళూరుతున్నది ట్రంప్ నేతృత్వంలోని అమెరికా. ఎటువంటి ప్రయోజనం లేకుండా అగ్రరాజ్యం ఇలా చేస్తుందా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.మరి ఇరాన్పై కక్ష ఎందుకు?ఇక్కడ ఇరాన్పై మాత్రం ట్రంప్ పగ కనబడుతూనే ఉంది. తాజాగా ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ట్రంప్ సమర్ధిస్తున్నారు. ఇరాన్పై ఇజ్రాయిల్ ేచేసిన దాడి అద్భుతమని కొనియాడారు. అదే సమయంలో ఇంకా ఇరాన్పై దాడిని ఇజ్రాయిల్ పెంచాల్సిన అవసరం ఉందని కూడా నొక్కి చెప్పారు. మొన్నటి వరకూ రష్యా- ఉక్రెయిన్ల సుదీర్ఘ యుద్ధం, ఆపై భారత్-పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధం.. ప్రపంచానికి పెనుముప్పు అని కనువిప్పు కల్గించిన ట్రంప్.. ఇప్పుడు ఇజ్రాయిల్-ఇరాన్ల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ట్రంప్కు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఇలా వ్యవహరిస్తారనేది తాజా ప్రకటనతో తేటతెల్లమైంది. అణు ఒప్పందంపై ఇరాన్కు చాన్స్ ఇచ్చామని, కానీ దాన్ని వారు పట్టించుకోలేదన్నారు ట్రంప్. తమతో అణు ఒప్పందాన్ని చేసుకోవడానికి నిరాకరించారని, అందుకు తగిన ప్రతిఫలమే ఇజ్రాయిల్ చేసిన దాడి అంటూ ఏబీసీతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. వారు(ఇరాన్) ఇంకా మూల్యం చెల్లించుకుంటుందంటూ ఇజ్రాయిల్ చేస్తున్న దాడిని నేరుగా అభినందిస్తూ ఇరు దేశాలను మరింత రెచ్చగొట్టేలా మాట్లాడారు. తాము చెప్పిన మాట విననందుకు ఇరాన్ ఏమైపోయినా ఫర్వాలేదన్న వైఖరి ట్రంప్లో స్పష్టంగా కనబడుతోంది. ఏ దేశాన్నైనా ఏ రకంగానైనా తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనతో ట్రంప్ ఉన్నారనేది తాజా పరిణామాలతో రుజువైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. ఎమర్జెన్సీ విధింపు..ఇజ్రాయెల్-ఇరాన్ రెండూ భారత్కు మిత్రదేశాలే, కానీ.. -
BBL 2025-26: స్టీవ్ స్మిత్ జట్టులోకి బాబర్ ఆజం..
పాకిస్తాన్ సూపర్ స్టార్ బాబర్ ఆజం తొలిసారి ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్ (BBL)లో ఆడేందుకు సిద్దమయ్యాడు. బీబీఎల్ 2025-26 సీజన్ కోసం బాబర్ ఆజంతో సిడ్నీ సిక్సర్స్ ఫ్రాంచైజీ ఒప్పందం కదుర్చుకుంది. ప్రీ డ్రాఫ్ట్ ఒప్పందంలో భాగంగా సిడ్నీ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్తో కలిసి బాబర్ సిడ్నీ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశముంది. స్మిత్ గత కొన్ని సీజన్లగా సిక్సర్స్ జట్టుకే ప్రాతనిథ్యం వహిస్తున్నాడు."ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 లీగ్లలో ఒకటైన బిగ్ బాష్ లీగ్లో ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన సిడ్నీ సిక్సర్స్ ఫ్రాంచైజీకి ధన్యవాదాలు. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని సిడ్నీ సిక్సర్స్ రిలీజ్ చేసిన ప్రకటనలో ఆజం పేర్కొన్నాడు. బీబీబీఎల్ 15వ సీజన్ డ్రాఫ్ట్ జూన్ 19న జరగనుంది. కాగా బాబర్ ఆజం ఇప్పటికే పీఎస్ఎల్తో పాటు సీపీఎల్, ఎల్పీఎల్, బీపీఎల్ వంటి పలు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో ఆడాడు. అయితే పాకిస్తాన్ టీ20 సెటప్ నుంచి బాబర్ ఆజంతో పాటు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదిని పక్కన పెట్టాలని పీసీబీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బాబర్ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో ఆడేందుకు ఆసక్తిచూపుతున్నట్లు తెలుస్తోంది.చదవండి: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచ క్రికెట్లో తొలి ప్లేయర్గా -
కాశీ తర్వాత కందూరే!
కందూరు రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటే కాశీవిశ్వేశ్వరుడిని దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ కల్ప వృక్షాలు ఉండటమే ఇందుకు ప్రత్యేక కారణం. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండలం కందూరు సమీపంలోని రామలింగేశ్వరాలయం దక్షిణ కాశీగా వెలుగొందుతోంది. కాశీ తర్వాత కల్ప వృక్షాలు ఇక్కడే ఉన్నాయని పురాణం చెబుతోంది. ఈ కల్ప వృక్షాలకు ఓ ప్రత్యేకత ఉంది. వృక్షాల కింద వంటలు చేసి, అందులో కొంత ఇతరులకు దానం చేసి కల్పవృక్షాల కిందే భోజనాలు చేసి నిద్రిస్తే కోరిన కోర్కెలు, గృహబాధలు, రోగాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.కల్పవృక్షాలు ఉండటమే ప్రత్యేకత కల్పవృక్షాలు (కబంధ) కాశీ తర్వాత కందూరులోనే కొలువయ్యాయని చరిత్ర చెబుతోంది. 11వ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రలో ఉంది. ఈ ఆలయం వద్ద ఓ విశిష్టత ఉంది. ఆలయం నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 27 కల్పవృక్షాలు ఉండటమే ప్రత్యేకత. ఆకాశంలో ఉండే 27 నక్షత్రాలకు ప్రతీకగా ఆలయం పక్కనున్న కోనేరు చుట్టూ 27 కల్పవృక్షాలు ఉన్నాయి. చాలామంది ఆలయం వద్ద ఉన్న కల్పవృక్షాల వేర్లను తీసుకెళ్లి నాటినా అవి పెరగలేదు. ఆలయం వెలిసిన నాటి నుంచి ఇక్కడ 27 కల్పవృక్షాలే ఉండటం అరుదైన విశేషంగా భక్తులు భావిస్తారు. అందుకే కందూరుకు వెళ్తే కాశీకి వెళ్లినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ ప్రచారకర్తగా ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి వ్యవహరిస్తున్నారు.తంబళి వంశ మహిళతో.. కందూరు సమీపంలోని గుట్టపై పూర్వం రామలింగేశ్వర స్వామి ఆలయం ఉండేది. గుట్టపై కొలువైన రామలింగేశ్వరుడిని తంబళి వంశానికి చెందిన మహిళ రోజూ గుట్టపైకి ఎక్కి దర్శించుకునేది. కాలక్రమేణా ఆమె గర్భిణి కావడంతో రోజూ గుట్ట ఎక్కడం ఆమె వల్ల కాలేదు. ప్రతిరోజు గుట్ట ఎక్కి మిమ్మల్ని దర్శించుకోవడం నావల్ల కాదు.. మళ్లీ ఎప్పుడు దర్శించుకుంటానో ఏమోనని స్వామితో మొరపెట్టుకుంది. వెంటనే అక్కడ ప్రత్యక్షమైన రామలింగేశ్వరస్వామి నీవు రాలేకుంటే నేనే నీవెంట వస్తాను.. వెనుదిరిగి చూడకుండా గుట్ట దిగి వెళ్లు అని ఆమెతో చెప్పాడు. వెంటనే ఆ మహిళ గుట్ట దిగడం ఆరంభించింది.రథంపై రామలింగేశ్వరస్వామి గుట్ట దిగుతున్న సమయంలో రథచక్రాలు, గంటల శబ్దాలకు ఆమె భయపడి వెనుదిరిగి చూసింది. దీంతో రథచక్రాలు విరిగి ఒకటి కోనేరులో పడిపోయింది. రెండోది లింగాకృతి దాల్చి రామలింగేశ్వరుడి పీఠంగా ఏర్పడిందని ఆలయ చరిత్ర చెబుతోంది. ఆ మహిళ శిలగా రూపాంతరం చెందింది. ఆమె శిలావిగ్రహం నేటికీ గర్భగుడిలో ఉంది. ప్రస్తుతం స్వామివారికి పానవట్టం లేదు. రథచక్రమే పానవట్టంగా మారడమే ఈ క్షేత్ర మహిమ.చదవండి: అడవే ఆధారం.. బతుకు భారం -
'24 ఏళ్లుగా అక్కడే ఉన్నా.. నేను, నా స్నేహితులు షాకయ్యాం '
అహ్మదాబాద్ విమాన ప్రమాదం మాలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ స్పందించారు. అక్కడే దాదాపు 24 ఏళ్లు నివసించానని తెలిపారు. తాను నివాసమున్న ప్రదేశానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘనినగర్లో విమాన ప్రమాదం జరిగిందని అన్నారు. నా బాల్యమంతా అక్కడే గడిచిందని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. తాను నివసించిన ప్రాంతంలో ఈ విషాదం జరగడం నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ఘటన విన్న వెంటనే తాను, తన పాఠశాల స్నేహితులు షాక్లో ఉన్నామని తెలిపారు. కాగా.. కేరళలోని త్రిసూర్లో జన్మించిన ఉన్ని ముకుందన్ అహ్మదాబాద్లోని మణినగర్లో పెరిగారు.అంతకుముందు బాధితుల కుటుంబాలకు తన సంతాపాన్ని ప్రకటించారు. క్లిష్ట సమయంలో ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని ఉన్ని ముకుందన్ పోస్ట్ చేశారు. ఈ ప్రమాదంపై పలువురు సినీతారలు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. కాగా.. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. మేఘనినగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 265 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక ఉన్ని ముకుందన్ సినీ కెరీర్ విషయానికొస్తే 'సీడన్' అనే తమిళ చిత్రంతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 'మల్లూ సింగ్'లో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత 'విక్రమాదిత్యన్', 'కెఎల్ 10 పట్టు', 'స్టైల్', 'ఒరు మురై', 'వంతు పార్థయ', 'అచాయన్స్', 'మాలికప్పురం' 'మార్కో' చిత్రాలతో అభిమానులను అలరించారు. నిర్మాతహా తన తొలి చిత్రం'మెప్పడియాన్'కి జాతీయ అవార్డు అందుకున్నారు. -
లైఫ్లో ఒక్కసారైనా ఆ హీరోతో నటించాలి, బిగ్బాస్ ప్రైజ్మనీ ఏం చేశానంటే?
తెలుగు బిగ్బాస్ చరిత్రలోనే కౌశల్ మండా (Kaushal Manda) ఒక సంచలనం. ఇతడు బిగ్బాస్ రెండో సీజన్లో అడుగుపెట్టినప్పుడు అభిమానులు కౌశల్ ఆర్మీ అంటూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు, రోడ్డుపై ర్యాలీలు కూడా చేశారు. ఏదైతేనేం.. రెండో సీజన్ కప్పు కొట్టడంతో పాటు రూ.50 లక్షల ప్రైజ్మనీ గెల్చుకున్నాడు.500 సినిమాలు చేసేవాడినిషోలు, సినిమాలతో బిజీగా ఉన్న అతడు తాజాగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. కౌశల్ మాట్లాడుతూ.. 17 ఏళ్ల వయసులో రాజకుమారుడు మూవీతో సినీప్రయాణం ప్రారంభించాను. అప్పటినుంచి దాదాపు 98 సినిమాల్లో యాక్ట్ చేశాను. అందరూ కేవలం ఒకే వృత్తిపైనే ఫోకస్ పెడతారు. కానీ, నేను మల్టీ టాస్కింగ్ చేస్తాను. మోడలింగ్, ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ కొరియోగ్రఫీ.. ఇవన్నీ చేస్తూనే సినిమాల్లో నటిస్తున్నాను. ఇవేవీ లేకుంటే ఈపాటికి 500 సినిమాలు అయిపోయేవి.ఆ హీరోలతో పని చేయాలనుందిహీరో ఉదయ్కిరణ్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అతడు సుమారు 16 సినిమాలు చేసుంటే అందులో 12 చిత్రాల్లో నేనూ యాక్ట్ చేశాను. తనతో నాకు మంచి అనుబంధం ఉండేది. చిరంజీవి, కమల్ హాసన్ గారితో కలిసి పని చేయాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. జీవితంలో ఒక్కసారైనా ఆ ఛాన్స్ వస్తే బాగుండని ఎదురుచూస్తున్నాను. ఇకపోతే మా అమ్మ క్యాన్సర్తో పోరాడుతూ చనిపోయింది. అందుకే బిగ్బాస్ ద్వారా వచ్చిన ప్రైజ్మనీని క్యాన్సర్ బాధితులకే విరాళమిస్తానని ప్రకటించాను. ఆ మాట నిలబెట్టుకున్నాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: నీ ప్రేమకు దిష్టి తగలొద్దు.. ముద్దులతో ముంచెత్తిన నిహారిక -
‘తప్పుడు వివాదాన్ని సృష్టించిన వారంతా క్షమాపణలు చెప్పాలి’
తాడేపల్లి: సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్పై సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మహిళలను కించపరిచారంటూ లేని దానిని ఆపాదిస్తూ కూటమి పార్టీల నేతలు తాము చేసిన బురద రాజకీయంకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో అరాచకం సృష్టించాలనుకుంటే కుదరదనే విధంగా సుప్రీంకోర్ట్ తీర్పు ప్రజాస్వామిక స్పూర్తిని నిలబెట్టిందని అన్నారు. ఇంకా ఆమె ఎమన్నారంటే...‘ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, పత్రికాస్వేచ్ఛను పరిరక్షిస్తూ సుప్రీంకోర్ట్ కొమ్మినేని అరెస్ట్పై ఇచ్చిన ఉత్తర్వులను ప్రజలు స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. వారి సొంత రెడ్బుక్ రాజ్యాంగాలు చెల్లవు, భారత రాజ్యాంగం ప్రకారమే ఎవరైనా పాలన చేయాలని మరోసారి సుప్రీంకోర్ట్ తన తాజా ఉత్తర్వులతో చెప్పినట్లయ్యింది. ఏపీలో ఏడాది పాలనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేదు. అమరావతి పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి తెగబడ్డారు. తన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్, సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులతో ఒక అరాచకాన్ని సృష్టించారు. అటువంటి భయానక పరిస్థితుల్లో ప్రజాస్వామిక స్పూర్తిని పరిరక్షిస్తూ సుప్రీంకోర్ట్ ఈ రోజు వెలువరించిన తీర్పు చంద్రబాబు అరాచకాలకు గొడ్డలిపెట్టు. గడిచిన మూడు రోజులుగా మహిళలను అవమానించారనే వక్రీకరణలను ఆపాదిస్తూ వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతమ్మ, సాక్షి మీడియా పైనా, సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపైనా చేసిన దుష్ప్రచారం, కూటమి ప్రభుత్వ కుట్రలు సుప్రీంకోర్ట్ ఉత్తర్వులతో మొత్తం దేశమంతా తెలిసింది. ఇటువంటి దుర్మార్గానికి పాల్పడిన వారంతా వైఎస్ జగన్, వైఎస్ భారతమ్మకు క్షమాపణలు చెప్పాలి. ఈ వివాదాన్ని రెచ్చగొట్టేలా చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇప్పటికైనా సుప్రీంకోర్ట్ ఉత్తర్వులతో తన బుద్ది మార్చుకోవాలి. బాధ్యతాయుతమైన మహిళా మంత్రులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదులు ఇచ్చి, తప్పుడు కేసులు బనాయించేందుకు కుట్రపూరితంగా వ్యవహరించారు. ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడినందుకు వారు తమ పదవులకు రాజీనామా చేయాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. -
ఆఫ్-రోడ్లో దూసుకెళ్లే ‘జిమ్నీ’.. లక్ష మంది కొనేశారు..
ఆఫ్-రోడ్లో దూసుకెళ్లే మారుతి సుజుకి జిమ్నీ విక్రయాల్లోనూ దూసుకెళ్లింది. సరికొత్త మైలురాయిని దాటింది. మారుతి సుజుకి జిమ్నీ మొదటిసారిగా 2023 జూన్లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుండి ఈ ఆఫ్-రోడ్ ఎస్యూవీ 5-డోర్ల వెర్షన్ లక్ష యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. ఆటోకార్ ప్రొఫెషనల్స్ నివేదిక ప్రకారం.. రెండు సంవత్సరాలలో ఈ వాహనం మొత్తం 1,02,024 యూనిట్ల అమ్మకాలను సాధించింది.మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ మొత్తం విక్రయాల్లో దేశీయ మార్కెట్లో విక్రయించిన 26,180 యూనిట్లు (2025 ఏప్రిల్ చివరి వరకు లాంచ్ అయినవి), 75,844 ఎగుమతి యూనిట్లు (2025 ఏప్రిల్ చివరి వరకు లాంచ్ అయినవి) ఉన్నాయి. అయితే మారుతి సుజుకి జిమ్నీ అమ్మకాల సంఖ్య పరంగా దాని ప్రధాన ప్రత్యర్థులలో ఒకటైన మహీంద్రా థార్ శ్రేణి కంటే చాలా వెనుకబడి ఉంది. 2020 అక్టోబర్లో లాంచ్ అయినప్పటి నుండి 2025 ఏప్రిల్ చివరి వరకు మూడు డోర్ల థార్, థార్ రాక్స్ తో, ఎస్యూవీ శ్రేణి మొత్తం 2,59,921 యూనిట్లతో 2.5 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది.మారుతి సుజుకి జిమ్నీ మూడు డోర్ల వర్షన్ ప్రపంచ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందింది. ఈ పాపులారిటీని పునరావృతం చేయడానికి కంపెనీ ఐదు డోర్ల వెర్షన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆఫ్-రోడర్ కొనుగోలుదారులను ఆకర్షించే లక్ష్యంతో ఈ వాహనం 4×4 సిస్టమ్తో బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్తో వచ్చింది. ఈ ఎస్యూవీ భారత మార్కెట్లో రూ .12.75 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అమ్మడవుతోంది. దీనిని గురుగ్రామ్ ప్లాంట్లో తయారు చేసి జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు.మారుతి సుజుకి జిమ్నీలో సింగిల్ 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 105 బీహెచ్పీ పవర్ని, 134 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో జతచేయబడి ఉంటుంది. మాన్యువల్ వెర్షన్ లీటరుకు 16.94 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 16.39 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. -
ఎయిరిండియా పెను విషాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 విమాన ప్రమాదంతో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఎయిర్లైన్స్ డ్రీమ్లైనర్ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా బోయింగ్ విమానాల్లోని 787 విమానాల్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాల్ని పరిశీలించిన వెంటనే నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. వందల మందిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తర్వాతే డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించింది. In light of the AI-171 accident on 12.06.2025, DGCA issues directives to Air India to carry out additional maintenance actions on B787-8/9 aircraft equipped with Genx engines with immediate effect.@RamMNK @mohol_murlidhar @dgca pic.twitter.com/L8YCJ1FVVT— MoCA_GoI (@MoCA_GoI) June 13, 2025 -
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచ క్రికెట్లో తొలి ప్లేయర్గా
లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో బంతితో మ్యాజిక్ చేసిన స్టార్క్.. రెండో ఇన్నింగ్స్లో బ్యాట్తో తన జట్టును ఆదుకున్నాడు. 77 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆసీస్ను స్టార్క్ తన విరోచిత పోరాటంతో గట్టెక్కించాడు. హెడ్, స్మిత్, లబుషేన్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట.. స్టార్క్ తన విలువను మరోసారి చాటుకున్నాడు. తొమ్మిదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ స్పీడ్ స్టార్.. ప్రోటీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. 136 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో స్టార్క్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.ఓ ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తొమ్మిది లేదా అంతకంటే తక్కువ స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ ఆటగాడు కోర్ట్నీ బ్రౌన్ పేరిట ఉండేది. 2004 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్పై తొమ్మిదో స్దానంలో బ్యాటింగ్కు వచ్చిన బ్రౌన్.. 35 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో బ్రౌన్ ఆల్టైమ్ రికార్డును స్టార్క్ బ్రేక్ చేశాడు.సౌతాఫ్రికా టార్గెట్ 282..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సెకెండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి సౌతాఫ్రికా ముందు 282 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. ఆసీస్ బ్యాటర్లలో స్టార్క్తో పాటు అలెక్స్ క్యారీ(43) పరుగులతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ నాలుగు వికెట్లు పడగొట్టగా.. లుంగీ ఎంగిడీ మూడు, జానెసన్,మార్క్రమ్ తలా వికెట్ సాధించారు. -
‘ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి’
ఢిల్లీ: ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోయాయన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి. ఇందుకు అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై టీడీపీ నేతల అత్యాచారానికి పాల్పడిన ఘటనలే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశామని, అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ‘అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాము. హరికృష్ణ పై దాడికి సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. సాక్షి మీడియాను నిర్వీర్యం చేసేందుకు, ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించారు. కొమ్మినేని శ్రీనివాస్ పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టింది. విశ్లేషకుడు చెప్పిన వ్యాఖ్యలకు కొమ్మినేనికి ఆపాదించడం సరికాదు కొమ్మినేనిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది శుభపరిణామం’ అని ఎంపీ గురుమూర్తి వ్యాఖ్యానించారు.ఏపీలో మహిళలపై తీవ్రమైన అఘాయిత్యాలుఏపీలో మహిళలపై తీవ్రమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని అరకు ఎంపీ తనుజారాణి పేర్కొన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలలో చిన్న చిన్న బాలికలపై అత్యాచారాలు జరిగాయన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీ తనుజా రాణి తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలను ఏపీ పోలీసులు టార్గెట్ చేస్తున్నారని, చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు. -
KTR: ‘లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. మరి రేవంత్’
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడింట్ కేటీఆర్ ఫైరయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు..ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, బ్యాంకు ద్వారా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్ లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపాడుచట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవడంతోపాటు.. విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానని మాటిస్తున్నాను. అయితే, పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్లో ఉందిఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉన్నదా? ఓవైపు మీ దివాళాకోరు విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఓ ముఖ్యమంత్రిగా నిస్సిగ్గుగా మీ అసమర్థతను చాటుకుంటున్న ఈ తరుణంలో.. విచారణల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకుని, వెంటనే లై డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ సిద్ధం కావాలి’ అని పేర్కొన్నారు. కాగా, కేటీఆర్కు తాజాగా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో జూన్ 16న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఆ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్పై దుయ్యబట్టారు.అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు..కానీ ఈ చిల్లర చేష్టలు, పనికిరాని డ్రామాలతో ప్రతినిత్యం తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకోలేరని ఈ దద్దమ్మ…— KTR (@KTRBRS) June 13, 2025 -
అక్క డిప్రెషన్లో.. దయచేసి ప్రాణాలు తీయొద్దు.. ఏడ్చేసిన వర్ష
తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన బ్యూటీ వర్ష (Varsha). సీరియల్ నుంచి కామెడీ షోలోకి వచ్చి హైలైట్ అయింది. అయితే తనపై పదేపదే కుళ్లు జోకులు వేస్తుంటే తీసుకోలేకపోయింది. ముఖ్యంగా తనది అబ్బాయి గొంతు అని, అబ్బాయిలాగే ఉంటుందని ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేసినప్పుడు ఒంటరిగా బాధపడింది.డిప్రెషన్లో..అలాగే తన ఇంట్లో జరిగిన ఓ విషాదకర వార్తను తాజాగా పంచుకుంది. ఓ పాడ్కాస్ట్లో వర్ష మాట్లాడుతూ.. మనకు మనుషులు చాలా అవసరం. మా అక్క ఏదో పనిమీద బావగారిని బయటకు పంపించింది. సడన్గా ఓ బైక్ ఢీ కొడితే అక్కడికక్కడే చనిపోయారు. మా అక్క డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. మా బావగారి బట్టల్ని ఒక గదిలోకి తీసుకెళ్లి వాటిని పట్టుకునే నిద్రిస్తోంది. ఎవరికీ శాపం కాకూడదుఆయన శవాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు మా అక్క కొడుకు నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. పిన్ని, మాకు టిఫిన్ తెచ్చుకోవడం కూడా తెలియదు. రేపటినుంచి మేము ఎవర్ని అడగాలి? అని ఏడ్చేశాడు. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరినీ ఒకటే కోరుకుంటున్నా.. మీ నిర్లక్ష్య డ్రైవింగ్.. వేరొకరి ప్రాణాలు తీసేంత శాపంగా మారకూడదు అని చేతులెత్తి మొక్కుతూ ఏడ్చేసింది వర్ష.చదవండి: నీ ప్రేమకు దిష్టి తగలొద్దు.. ముద్దులతో ముంచెత్తిన నిహారిక -
అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్
గాంధీ నగర్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాక ఈ ఘటనలో అధికారికంగా దాదాపు 265 మంది దాక మరణించినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఏదో అద్భుతం జరిగనట్లుగా బయటపడింది రమేష్ ఒక్కడే అన్న సంగతి విధితమే. దీంతోపాటు మరో విచిత్రం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతూ.. ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ బృందం మరో అద్భుతాన్ని ప్రపంచానికి చూపించింది. ఆ ఎయిర్ ఇండియా శిథిలాల మధ్య పవిత్ర గ్రంథం భగవద్గీత ఆ అగ్ని కీలలకు కొంచెం కూడా చెక్కుచెదరకుండా కనిపించి ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా, ఈ విషాద ఘటనపై సమగ్రంగా విచారణ జరపాల్సిన బాధ్యతను ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)కు అప్పగించారు పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:(చదవండి: హాట్టాపిక్గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..) -
'క్షీణించిన బిగ్బాస్ విన్నర్ ఆరోగ్యం.. అలా జరగకూడదని కోరుకుంటున్నా'
బాలీవుడ్ నటి, బిగ్బాస్ విన్నర్ సనా మక్బుల్ ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. లివర్ సైరోసిస్ అనే వ్యాధితో సనా పోరాడుతోంది. ఇటీవల సనా హాస్పిటల్ బెడ్పై ఫోటోను పోస్ట్ చేయడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే సనా ఐదేళ్లుగా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్తో బాధపడుతోంది. గతంలోనే చికిత్స తీసుకున్నప్పటికీ ఏమాత్రం మెరుగవ్వలేదని తెలుస్తోంది.తన ఆరోగ్యంపై సనా మాట్లాడుతూ.. 'నేను కొంతకాలంగా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్తో బాధపడుతున్నా. కానీ ఇటీవల పరిస్థితులు మరింత దిగజారాయి. నా రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా లేదు. నా కాలేయంపై దాడి చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం నాకు లివర్ సిర్రోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కానీ నేను బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. ఇమ్యునోథెరపీని ప్రారంభించానని.. ప్రస్తుతం కోలుకోవడంపై దృష్టి సారించానని' ఆమె తెలిపింది.అయితే వైద్యులు కాలేయ మార్పిడి అవసరం రాకుండా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సనా తెలిపింది కొన్ని రోజులు కష్టమైన సరే కోలుకునేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించింది. ఇది అంత సులభం కాదని.. కానీ నేను అంత తేలికగా వదిలిపెట్టనని సనా మక్బుల్ అన్నారు. ప్రస్తుతం నెమ్మదిగా నడుస్తున్నానని తెలిపింది. ఈ పరిస్థితి తనను శారీరకంగా, మానసికంగా ప్రభావితం చేసిందని చెప్పింది.కాగా.. సనా మక్బుల్ బిగ్బాస్ ఓటీటీ సీజన్-3 విన్నర్గా నిలిచింది. తెలుగులో దిక్కులు చూడకు రామయ్యా, మామ ఓ చందమాల చిత్రాల్లో నటించింది. బాలీవుడ్లో పలు సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించింది. -
ఎయిరిండియా విమాన ప్రమాదం.. సీసీ కెమెరాలో భయంకర దృశ్యాలు
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా విమానం పెను ప్రమాదంలో మరో నలుగురు మెడికోలు మృతి చెందారు. రాకేష్,ఆర్యన్,మనవ్ జయ్ ప్రకాష్లు మరణించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో ఎయిరిండియా విమానం కూలడంతో బీజే మెడికల్ కాలేజీలో మరణాల సంఖ్య 28కి చేరింది. అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో మెడికల్ కాలేజీ ముందున్న సీసీ కెమెరాలో భయంకరమైన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురవారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ఎయిర్పోర్టు నుంచి మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన క్షణాల్లో అందరూ చూస్తుండగానే మేఘానీనగర్లో బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్పై కుప్పకూలింది. విమమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరే బ్రతికారు.బీజే మెడికల్ కాలేజీ హాస్టల్లో 24మంది మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం మరో నలుగురు విద్యార్ధులు మరణించారు.మరోవైపు తాజాగా ఎయిరిండియా విమానం బీజేపీ మెడికల్ కాలేజీపై కూలిన సమయంలో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దృశ్యాలు మెడికల్ కాలేజీ హాస్టల్ ముందు ఉన్న భవనం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఆ సీసీ టీవీ ఫుటేజీల్లో విమానం కూలినప్పుడు విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అణు బీభత్సం ఎలా ఉంటుందో.. విమానం కూలే సమయంలో అంతే ప్రమాద స్థాయి కనిపించింది. దట్టంగా పొగ కమ్ముకుంది. స్థానికంగా పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతమంతా బీతావాహ పరిస్థితి నెలకొంది. ఇక హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో లోపల వైద్య విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కలవర పెడుతున్నాయి. ఓ విద్యార్థి విమానం బిల్డింగ్పై పడడంతో ఎగిరిపడుతున్న విమాన శకలాలు, బిల్డింగ్ శకలాల నుంచి తనని తాను రక్షించుకునేందుకు హాస్టల్లో లోపల ఉన్న టేబుల్ కింద పరిగెత్తుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. -
ఇన్ఫోసిస్లో రూ.కోట్లు సంపాదిస్తున్నారు.. ఇదిగో కొత్త డేటా
ఐటీ పరిశ్రమలో ఉద్యోగులకు రూ.లక్షల్లో వేతనాలు ఉంటాయన్నది తెలిసిందే. అయితే కొంత మంది ఉన్నతోద్యోగులు రూ.కోట్లలో సైతం పరిహారాలు అందుకుంటారు. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్లో రూ.కోట్లు సంపాదిస్తున్నవారి సంఖ్య ఈసారి పెరిగింది. అంతక్రితం ఏడాది క్షీణత తరువాత, వార్షికంగా రూ .1 కోటి కంటే ఎక్కువ సంపాదించే ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పెరిగి 112కు చేరుకుంది.స్టాక్ ఇన్సెంటివ్స్ పర్క్విసైట్ విలువలో మార్పులు, అధిక వేరియబుల్ పే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. అదీకాకుండా 33 మంది అధిక సంపాదన కలిగిన ఉద్యోగులు ఇన్ఫోసిస్లో ఏడాది మధ్యలో చేరారు. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. వీరు ఒక్కొక్కరు సగటున నెలకు రూ .8.5 లక్షలకు పైగా జీతం పొందుతున్నారు. కంపెనీలో రూ .1 కోటి కంటే ఎక్కువ సంపాదించే వారి సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది పూర్తీగా రివర్స్ అయింది. అప్పుడు వీరి సంఖ్య అంతకు ముందు ఏడాది కంటే 17 శాతం తగ్గింది.చారిత్రాత్మకంగా 2023 ఆర్థిక సంవత్సరం అత్యధికంగా 124 మంది ఉద్యోగులను నమోదు చేయగా, 2020 ఆర్థిక సంవత్సరం గత ఆరేళ్లలో అత్యల్పంగా 74 మందిని నమోదు చేసింది. ఈ జాబితాలో భారత్ కు చెందిన ఉద్యోగులు మాత్రమే ఉన్నారని, టాప్ 10 ఎగ్జిక్యూటివ్ లను మినహాయించారని కంపెనీ స్పష్టం చేసింది. ఈ 112 మంది ఉద్యోగుల మొత్తం వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.203 కోట్లుగా ఉంది. సీఎఫ్వో జయేశ్ సంఘ్ రాజ్కా రూ.8.8 కోట్ల పరిహారంతో అగ్రస్థానంలో నిలవగా, చీఫ్ డెలివరీ ఆఫీసర్లు దినేష్ ఆర్ రూ.7.2 కోట్లు, సతీష్ హెచ్సీ రూ.6.9 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.👉 ఇదీ చదవండి: అమ్మో ఏఐతో జాబ్ ఇంటర్వ్యూ.. అన్నీ పట్టేస్తుంది!ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ అధిక సంపాదనలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది 2000 సంవత్సరానికి ముందు నుండి ఇన్ఫోసిస్లో ఉన్నారు. కొందరు 1990 నాటివారూ ఉన్నారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఇన్ఫోసిస్ మొత్తం వ్యయం 2025 ఆర్థిక సంవత్సరంలో 4% పెరిగి రూ .85,950 కోట్లకు చేరుకుంది. ఇది దాని మొత్తం ఆదాయం రూ .1.63 లక్షల కోట్లలో 53 శాతం. 2025 మార్చి నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.24 లక్షలుగా ఉంది. -
బోయింగ్ డ్రీమ్లైనర్ రహస్యాల్ని బయటపెట్టి..
అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంతో.. బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానాలను ఇక మీదట భారత విమానయాన సంస్థలకు ఉపయోగించకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు.. ప్రమాదంపై విచారణ ముగిశాక అమెరికా వైడ్బాడీ ఎయిర్లైనర్తో సమీక్ష జరిపిన తర్వాతే ఏ నిర్ణయం అనేది ప్రకటించనుందని ఆంగ్ల మీడియా కథనాల సారాంశం. అయితే.. బోయింగ్ విమానం.. అందునా డ్రీమ్లైనర్(Dreamliner) ఎంత మాత్రం సురక్షితం కాదన్న ఆ సంస్థ వేగు, మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ స్టేట్మెంట్ ఇప్పుడు తాజా ప్రమాద నేపథ్యంలో తెర మీకు వచ్చింది. బోయింగ్లో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన బార్నెట్.. ఆయన 787 డ్రీమ్లైనర్ విమానాల భద్రతా లోపాలను బయటపెట్టి సంచలన చర్చకు దారి తీశారు. అయితే ఆయన సజీవంగా లేరు. 👉జాన్ బార్నెట్(John Barnett) 2024 మార్చిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సౌత్ కరోలీనా చార్లెస్టన్లో తన ట్రక్కులో ఆయన తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. అయితే ఆయనది ఆత్మహత్య కాదని.. ఆయన్ని హత్య చేశారని ఆయన సన్నిహితులు ఇప్పటికీ వాదిస్తుంటారు. అందుకు.. ‘‘ఈ పోరాటం ఇంకా ఎంతో కాలం చేయలేను’’ అంటూ ఆయన చేతిరాతతో దొరికిన నోట్ను ప్రస్తావిస్తుంటారు.👉ఆ నోట్ ఆధారంగా.. ఆయన కుటుంబ సభ్యులు బోయింగ్పై దావా వేశారు. ఆపై కొన్నాళ్లకు కంపెనీతో సెటిల్మెంట్ చేసుకుని ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. 👉787 డ్రీమ్ లైనర్ విమానం సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణానికి ఉపయోగించే అత్యాధునిక విమానం. అయితే ఆ విమానం అందుకు పనికి రాదన్నది బార్నెట్ వాదన. 👉బోయింగ్ సంస్థలో బార్నెట్ మూడు దశాబ్దాలకు పైగా పని చేశారు. 2010 నుండి 787 డ్రీమ్లైనర్ను తయారు చేస్తున్న నార్త్ చార్లెస్టన్ ప్లాంట్లో క్వాలిటీ మేనేజర్గా విధులు నిర్వర్తించారు. అనారోగ్యంతో 2017లో పదవీ విరమణ చేశారు. సంస్థ నుంచి పదవీ విరమణ తర్వాత నుంచి మరణించేదాకా.. బోయింగ్పై ఆయన విమర్శలు గుప్పించారు.ఏం చెప్పాడంటే.. 2019లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయింగ్ సంస్థ లోపాల గురించి బార్నెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘బోయింగ్ ఫ్యాక్టరీలో సరిగా లేని లోపభూయిస్ట భాగాలను ఉద్దేశపూర్వకంగా విమానంలో అమర్చారు. ఆక్సిజన్ వ్యవస్థలోని కొన్ని తీవ్రమైన సమస్యలను కనుగొన్నాం. అత్యవసర సమయాల్లో ప్రతీ నాలుగు ఆక్సిజన్ మాస్కుల్లో ఒకటి పనిచేయదు. వాస్తవానికి.. కొత్త విమానాన్ని నిర్మించే ప్రయత్నంలో సౌత్ కరోలినాలో అసెంబ్లింగ్ ప్రక్రియ హడావిడిగా జరిగింది. ఇది భద్రతపై కంపెనీని రాజీ పడేలా చేసింది’’ అంటూ చెప్పారాయన. అలాగే.. Photo Credits: Netflix👉ఇదే కాకుండా కార్మాగారంలోని వివిధ బాగాలను ట్రాక్ చేయడంలో కార్మికులు విఫలమయ్యారని, దీని వల్ల ఫాల్ట్ ఉన్న భాగాలు కనిపించకుండా పోయాయని తెలిపారు. ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలిపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2017లో యూఎస్ రెగ్యులేటర్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) సమీక్ష, బార్నెట్ వ్యక్తం చేసిన కొన్ని ఆందోళనల్ని సమర్థించింది. 👉2022లో నెట్ఫిక్స్ ‘డౌన్ఫాల్: ది కేస్ అగెనెస్ట్ బోయింగ్’ డాక్యుమెంటరీలో జాన్ బార్నెట్ కనిపించారు. ప్రత్యేకించి 737 మ్యాక్స్ ప్రమాదాల గురించి ఆయన చర్చించారు.👉2024 మొదట్లో.. అలస్కా ఎయిర్లైన్స్ తలుపులు ఊడిపడిన ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బోయింగ్ వైఫల్యాలను ఆయన ఎత్తి చూపించారు. చివరకు.. తన మరణానికి ముందు కూడా ఆయన కంపెనీకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చాడు. 👉అయితే, బోయింగ్ సంస్థ మాత్రం బార్నెట్ ఆరోపణల్ని ఖండించింది. తమ విమానాలు అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత ప్రమాణాలతో నిర్మితమవుతున్నాయని చెప్పింది. భద్రత, నాణ్యత, సమగ్రత బోయింగ్ విలువల్లో ప్రధానమైనవని కంపెనీ నొక్కి చెప్పింది. తాజాగా.. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంతో.. బోయింగ్ డ్రీమ్లైనర్పై బార్నెట్ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. -
లగ్జరీ ఫ్లాట్లను అమ్మేసిన స్టార్ హీరో.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రస్తుతం వార్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో యంగ్ టైగర్ జూనియర్ కూడా నటించారు. ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే సినిమాల సంగతి పక్కనపెడితే హృతిక్ రోషన్ ఆయన తండ్రితో కలిసి ఖరీదైన మూడు ఫ్లాట్లను అమ్మేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని ఆంధేరి వెస్ట్లో ఉన్న మూడు రెసిడెన్షియల్ ఫ్లాట్లను దాదాపు రూ.6.75 కోట్లకు విక్రయించారు. ఈ ఆస్తులు ముంబైలోని అంధేరి శివారులోనే ఉండగా.. వాటిలో రెండు ఆయన తండ్రి రాకేశ్ రోషన్వి కాగా.. మూడో ఫ్లాట్ హృతిక్ రోషన్కు చెందినదిగా సమాచారం.మరోవైపు హృతిక్ రోషన్ క్రిష్-4 మూవీ తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను రాకేశ్ రోషన్ నిర్మించనున్నారు. ఈ సినిమాకు హృతిక్ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల పాప్ స్టార్ జాక్సన్ వాంగ్ రోషన్ దంపతులను వారి నివాసంలో కలిశారు. అతను క్రిష్ 4లో భాగం అవుతానని ఇప్పటికే ధృవీకరించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అయితే క్రిష్-4 ఇంకా సెట్స్పైకి వెళ్లాల్సి ఉంది. -
నల్లటి ఆర్మ్ బ్యాండ్లతో ఆసీస్-సౌతాఫ్రికా ఆటగాళ్లు
లార్డ్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా నల్లటి ఆర్మ్ బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. గురువారం(జూన్ 12) అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలుపుతూ బ్లాక్ బ్యాండ్స్ను ధరించారు.ఆట ఆరంభానికి ముందు ఇరు జట్లు ఆటగాళ్లు రెండు నిమిషాల పాటు మౌనం కూడా పాటించారు. మరో వైపు ఇంట్రాస్వ్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో భారత జట్టు ఆటగాళ్లు కూడా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఎక్స్లో షేర్ చేసింది.కాగా అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 265 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ విషయానికి వస్తే.. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా తడబడి నిలబడింది.టాపార్డర్ విఫలమైనప్పటికి.. అలెక్స్ క్యారీ(43), మిచెల్ స్టార్క్(44 బ్యాటింగ్) ఆసీస్ను ఆదుకున్నారు. ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 59 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కంగారులు ప్రస్తుతం 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.The sports fraternity observes a solemn moment of silence in memory of the lives lost in the tragic Ahmedabad plane crash, standing in deep solidarity with the grieving families during this difficult time. pic.twitter.com/nTXfRnyksP— Star Sports (@StarSportsIndia) June 13, 2025చదవండి: IND vs ENG: ఫ్యామిలీ ఎమర్జెన్సీ.. భారత్కు తిరిగొచ్చిన గౌతం గంభీర్ -
Plane Crash: నా భూమిని ఆ తల్లే కాపాడింది..!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎన్నో జీవితాల్లో చీకటి నింపింది. భార్యకు భర్తను, భార్యకు భర్తను, తల్లికి కూతుర్నీ, కూతురికి తండ్రిని దూరం చేసి తీరని విషాదాన్ని మోసుకొచ్చింది. 242 మందితో నిన్న(గురువారం, జూన్ 12వ తేదీ) మధ్యాహ్న సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలో ఎయిర్పోర్ట్కు అత్యంత సమీపంలో కుప్పకూలిపోయింది. ఇందులో 230 ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది విమానం సిబ్బంది ఉండగా, ఒక్క ప్రయాణికుడు మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. ఇలా బ్రతికి బయటపడింది ఒకరైతై.. ఫ్లైట్ మిస్ అయ్యి ప్రాణాలు దక్కించుకుంది ఒక మహిళ. లండన్కు వెళ్లాల్సిన గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్కు చెందిన భూమి చౌహాన్ అనే మహిళ.. అహ్మదాబాద్లో ట్రాఫిక్లో చిక్కుకుపోయి కాస్త ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకుంది. తన ఫ్లైట్ మిస్ అయ్యిపోయిపోతుందేమోనని గాబరా గాబరాగా ఎయిర్పోర్ట్ వైపు అడుగులు వేసింది. కానీ చివరకు ఆమె ఫ్లైట్ ఎక్కలేదు. బోర్డింగ్ ప్రాసెస్కు ఆమె సమయానికి రాలేకపోవడంతో ఫ్లైట్ మిస్ చేసుకుని బ్రతికిపోయింది. ‘నేను ఎయిర్పోర్ట్లో బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. అప్పుడే విమానం కూలిపోయిందనే సమాచారం దావానంలా వ్యాపించింది. అది నేను వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా 171 బోయింగ్ విమానం. ఆ వార్తతో నాకు కాళ్లు కదల్లేదు. చాలా సేపటివరకూ నేను షాక్లోనే ఉన్నా. ఆ ఫ్లైట్ మధ్యాహ్నం 1.10కి టేకాఫ్ అవుతుంది. బోర్డింగ్ ప్రోసెస్ అంతా 12.10 కల్లా కంప్లీట్ చేయాలి. #WATCH | Bhoomi Chauhan, a resident of Gujarat's Bharuch, missed yesterday's flight, AI-171, which crashed and 241 of 242 on board, including crew members, lost their lives.Bhoomi Chauhan says, "...We arrived at the check-in gate 10 minutes late, but they didn't allow me, and I… pic.twitter.com/T1AqU9SSz0— ANI (@ANI) June 13, 2025కానీ నేను 12.20కి ఎయిర్పోర్ట్కి వచ్చా. నేను చెక్ ఇన్ గెట్ దగ్గరికి వచ్చి వారిని రిక్వస్ట్ చేశా. మొత్తం ప్రొసెస్ అంతా త్వరగా కంప్లీట్ చేస్తానన్నాను..కానీ వారు నన్ను అనుమతించలేదు. దాంతో ఎయిర్పోర్ట్ నుంచి నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఎయిర్పోర్ట్ బయటకు వచ్చీ రావడంతో ఫ్లైట్ కూలిపోయింది. దాంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాను వెళ్లాల్సిన ఫ్లైట్ కూలిపోయిందనే వార్తతో ఉక్కిరిబిక్కిరి అయినట్లు ఆమ స్సష్టం చేసింది. తాను అంచుల వరకూ వెళ్లి వెనక్కి వచ్చినట్లు అనిపించిందన్నారు భూమి. తనను విమాన ప్రమాదం నుంచి తప్పించినందుకు తన ఇష్ట దైవం గణపతికి కృతజ్ఞతలు తెలియజేశారు. గణపతే తనను సేవ్ చేశాడని ఆందోళనగా మాట్లాడారు. ఇక భూమి తల్లి మాట్లాడుతూ.. ఈ విమాన ప్రమాదం నుంచి తన కూతురు తప్పించుకున్నందుకు నిజంగా ఆ దేవీ మాతకు ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువేనన్నారు. ‘ నా కూతురు తన బిడ్డను నా వద్ద వదిలి లండన్కు బయల్దేరింది. నిజంగా ఆమె ఒంటరిగా విమానం ఎక్కి ఉంటే ఆమె కూతురు అనాథ అయ్యేది. తన కూతురు సేఫ్గా ఇంటికొచ్చిందని, ఆ విమాన ప్రమాం తలుచుకుంటేనే భయంగా ఉంది. నా కూతుర్ని ఆ దేవతే కాపాడింది’ అని పేర్కొన్నారు.భూమి చౌహాన్ తండ్రి మాట్లాడుతూ.. ‘ భారీ ట్రాఫిక్తో నా కూతురు ఎయిర్పోర్ట్కు వెళ్లడం కాస్త ఆలస్యమైంది. దాంతో బోర్డింగ్ ప్రాసెస్కు అనుమతించలేదు. మేము రిక్వస్ట్ చేసినా వారు అనుమతించలేదు. ఆ నేపథ్యంలో ఎయిర్పోర్ట్కు బయటకు వచ్చేశాము. అంతే కాసేపటికే మేము అక్కడ ఉండగానే ఆ విమానం కూలిపోయిందనే వార్త తెలిసింది’ అని ఆమె తండ్రి తెలిపారు. -
AMA తొలి భారతీయ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ ముక్కామల రికార్డ్, ఎవరీ ‘బాబీ’
భారత సంతతికి చెందిన డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ (Srinivas Mukkamala) అమెరికా వైద్యసంఘం ( AMA-American Medical Association) తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 179 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఎన్నికైన భారతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ “బాబీ” ముక్కామల రికార్డు సృష్టించారు. ఇటీవలి AMA వార్షిక సమావేశంలో ఆయన180వ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ఇది అమెరికా వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అందరూ ప్రశంసిస్తున్నారు.ముక్కామల మిచిగాన్లోని ఫ్లింట్లో అనుభవజ్ఞుడైన ENT స్పెషలిస్ట్. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు 1972లో జన్మించారు. మెక్లారెన్ ఫ్లింట్ , హర్లీ మెడికల్ సెంటర్ వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయ మెడిసిన్లో పట్టభద్రుడు. ఓటోలారిన్జాలజీ రంగంలో ఆయనకు మంచి పేరు ఉంది.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!స్వయంగా కేన్సర్ సర్వైవర్గత సంవత్సరం, ముక్కామలకు మెదడులోని టెంపోరల్ లోబ్లో 8-సెంటీమీటర్ల కణితి కనిపించింది. రోగ నిర్ధారణ జరిగిన మూడు వారాల తర్వాత హై-రిస్క్ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్లో 90 శాతం కణితిని విజయవంతంగా తొలగించారు.ఆరోగ్య సంరక్షణ పట్ల అతని నిబద్ధతను బలోపేతం చేసేలా తాజా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ప్రపంచ స్థాయి చికిత్స అందినప్పటీ లక్షలాది మందికి ఇలాంటి చికిత్సలో ఆలస్యం జరుగుతోందనీ, ఆర్థిక పరిమితులు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నారని ముక్కామలకు హైలైట్ చేశారు. అలాగే చాలా మంది రోగులు తమ బీమా కవరేజీ వస్తుందా, లేదా మందులకు ఎంత ఖర్చవుతుంది, ఔషధానికి ,నిపుణుడిని చూడటానికి ఎంతకాలం వేచి ఉండాలో అనే భయాలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈ అనుభవం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్యుల హక్కులు, వనరుల కోసం పోరాడే వేదికగాఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు మార్గం వేయనుందనీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణకు, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ AMA ప్రాధాన్యతను పెంచుతుందని హామీ ఇచ్చారు. అలాగే AMA ప్రజారోగ్యంలో విస్తృతమైన సంస్కరణల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ముక్కామల అధ్యక్ష పదవిని చేపట్టడం విశేషం. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల ప్రమాదాలు, సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించిఅవగాహన పెంచడానికి అసోసియేషన్ ఇటీవల ఒక విధానాన్ని స్వీకరించింది.ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్గతంలో ఏఎంఏ ఫౌండేషన్ నుంచి ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ లీడర్షిప్ అవార్డు (Excellence in Medicine Leadership Award )ను ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 2021 వరకు ఏఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్ బాబీ తల్లిదండ్రులు 1970ల్లో ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు. -
100% VFX ఉన్న ఫస్ట్ మూవీ.. పోస్టర్ చూశారా?
తల్లాడ సాయికృష్ణ,అమ్మినేని స్వప్న చౌదరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కిషోర్ దాస్,వినోధ్ నువ్వుల, కృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం హనీ కిడ్స్. వీరి నటనకు తోడు అత్యాధునిక గ్రాఫిక్స్ టెక్నాలజీ ఈ సినిమాను అద్భుతమైన విజువల్ అనుభవంగా మార్చబోతోంది. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి 100% VFX ఆధారిత సినిమాగా దీనికి గుర్తింపు రాబోతోంది. హర్ష.ఎం దర్శకత్వంలో అత్యాధునిక టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ-సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ చివరి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయ్యింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పోస్టర్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కథానాయిక స్వప్న చౌదరి అమ్మినేని మాట్లాడుతూ ఈ జోనర్ సినిమాలు పక్కా పిల్లలకి నచ్చుతాయంది. తనకు అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపింది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. రెబల్ స్టార్ ప్రభాస్ పోస్ట్
అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. ఈ దుర్ఘటన నిజంగా దేశానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని అన్నారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ విషాదంపై ఇప్పటికే టాలీవుడ్ సినీతారలతో పాటు.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం విచారం వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ది రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారుయ ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. -
తొలిసారి బేబీ బంప్తో కనిపించిన మెగా కోడలు
మెగా కోడలు త్వరలో తల్లి కాబోతుంది. గత నెలలోనే వరుణ్ తేజ్ ఈ విషయాన్ని ప్రకటించాడు. తన భార్య లావణ్య త్రిపాఠి ప్రస్తుతం గర్భంతో ఉందని తెలియజేస్తూ పోస్ట్ పెట్టాడు. అప్పటినుంచి అటు వరుణ్ గానీ ఇటు లావణ్య గానీ మీడియా కంట పడట్లేదు. తాజాగా ఇద్దరూ కలిసి మాల్దీవుల్కు వెకేషన్ వెళ్లారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. లావణ్య బేబీ బంప్తో కనిపించింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్.. 'శక్తిమాన్')కలిసి రెండు సినిమాలు చేసిన వరుణ్-లావణ్య.. దాదాపు ఆరేడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. అలా పెద్దల్ని ఒప్పించి 2023లో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత చాలావరకు సినిమాలు తగ్గించేసిన లావణ్య.. అంతకు ముందే ఒప్పుకొన్న ఒకటి రెండు సినిమాలు, వెబ్ సిరీస్ పూర్తి చేసింది. అలా ఈ ఏడాది మే 6న తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టింది.ఇప్పుడు బేబీ బంప్తో బీచ్ ఒడ్డున భర్తతో కలిసి కనిపించింది. ప్రస్తుతం వరుణ్-లావణ్య.. మాల్దీవుల్లోనే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే మెగా కోడలు ఇప్పట్లో కొత్త సినిమాలు చేయడం కష్టమే. ఒకవేళ బిడ్డ పుట్టిన కొన్నేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్పై కనిపిస్తే కనిపించొచ్చు. లేదంటే మొత్తానికే కెరీర్ని వదిలేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరోవైపు వరుణ్.. ప్రస్తుతం మేర్లపాక గాంధీతో కలిసి ఓ హారర్ కామెడీ మూవీ చేస్తున్నాడు. ఇదివరకే కొంతమేర షూటింగ్ పూర్తయింది. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) -
నీ ప్రేమకు దిష్టి తగలొద్దు.. ముద్దులతో ముంచెత్తిన నిహారిక
అమ్మతో పంచుకోలేనవి, నాన్నతో చెప్పుకోలేనివి, సోదరుడు/సోదరితో మాట్లాడలేనివి.. ఏవైనా సరే ఈ ఒక్క వ్యక్తి దగ్గర మాత్రం నిర్మొహమాటంగా మాట్లాడేస్తారు. మొహమాటాలకు అస్సలు తావుండదు. అతడే ఫ్రెండ్.. ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. నమ్మి దోచుకునేవారికంటే నిజాయితీగా మసులుకునే ఫ్రెండ్ ఒక్కరున్నా చాలనుకునేవారు చాలామంది.ఫ్రెండ్స్ గ్యాంగ్మెగా డాటర్ నిహారిక (Niharika Konidela)కు అలా చెప్పుకునే స్నేహితులు ముగ్గురున్నారు. వారే వితికా షెరు, మహాతల్లి జాహ్నవి, అంబటి భార్గవి. ఈ నలుగురు కలిశారంటే ప్రపంచాన్నే మర్చిపోతారు. తాజాగా వితికా షెరు (Vithika Sheru).. నిహారికకు పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. తనకోసం ఏం చేయాలా? అని ఆలోచించగా ఓ మంచి ఐడియా తట్టింది. నిహారిక పాటరీ స్టూడియోను అందంగా మార్చేసింది. భార్గవితో కలిసి ఆ పాటరీ గదిలోని ఓ గోడకు రంగు వేసింది. తర్వాత అక్కడున్న వస్తువుల్ని కొన్ని తీసేయించి అందంగా సర్దింది. కొన్ని పూలమొక్కల్ని కూడా గదిలో అలంకరించింది.నిహారికకు తెలియకుండా..ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం చెప్పింది. నిహారిక, నేను ఒకే టీచర్ దగ్గర పాటరీ (మట్టి పాత్రలు తయారు చేయడం) నేర్చుకున్నాం. మేము ఫ్రెండ్స్ అయ్యాక ఈ విషయం తెలుసుకున్నాం. నేను కుమ్మరి పనిలో బేసిక్స్ మాత్రమే వచ్చు. కానీ నిహారిక, భార్గవి డిగ్రీలు చేసేశారు అని చెప్పుకొచ్చింది. ఈ మేకోవర్ అంతా నిహారికకు తెలియకుండా చేసింది. తీరా ఆ పాటరీ స్టూడియోకు వచ్చిన నిహారిక.. తన గదిని అంత అందంగా మార్చిన వితికాను ముద్దులతో ముంచెత్తింది.దిష్టి తగలొద్దువితికా చేసిన పనిని మెచ్చుకుంటూ నిహారిక సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నీకు, నీ ప్రేమకు ఏ దిష్టీ తగలకూడదు. తన ప్రేమను కాదనడం కష్టం అన్నంతగా ప్రేమిస్తుంది. నా జీవితాన్ని అందంగా మార్చినందుకు థాంక్యూ. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కాస్తంత బాధలో ఉన్నాను. కానీ, నువ్వు చేసిన పని చూశాక నాపై కురిపిస్తున్న ప్రేమకు ముగ్ధురాలినైపోయాను. నువ్వెప్పుడూ నీ చుట్టూ ఉండే జనాల్ని ఎంతో స్పెషల్గా ఫీలయ్యేలా చేస్తావ్. చెప్పలేనంత ప్రేమ కురిపిస్తావ్. దీన్ని నేను గ్రాంటెడ్గా తీసుకోను.. నా జీవితంలోకి వచ్చిన నిన్ను అనునిత్యం ప్రేమిస్తూనే ఉంటాను. ఐ లవ్యూ బేబీ.. అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు.. వితికా లాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: శూర్పణఖగా ప్రియాంక అవుట్.. రకుల్తో డీల్? -
'మిరాకిల్ సీట్ 11A'..! కూర్చోవడానికి ఇష్టపడరు ఎందుకంటే..?
విమానంలో ఎవ్వరు ఇష్టపడని 11A సీటు ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనతో ఒక్కసారిగా హాట్టాపిక్గా మారింది. యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఈ భయానక విమాన ప్రమాద ఘటనలో 241 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు ప్రాణాలతో బయటపడానికి కారణం ఎకానామీ క్లాస్లో విమాన రెక్కల ముందు వరసులో ఉండే 11A విండ్ సీటు అని, దీని వెనుకే ఎమర్జెన్సీ డోర్ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో నెట్టింట ఈ సీటు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సీటుని విమానంలో ఎవ్వరు ఇష్టపడని చెత్త సీటుగా చెబుతుంటారు. అంతలా ఇష్టపడని 11A సీటు ఆ ప్రమాద ఘటనలో ఒకేఒక్కడిగా ప్రాణాలతో బయటపడ్డ ఆ వ్యక్తి కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. మరీ ఆ సీటు స్పెషాలిటీ..? ఎందుకు చెత్తసీటుగా ప్రయాణికులు భావిస్తారు..?అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు విమానంలో 11ఏ సీటులో కూర్చొన్నాడు. ఇది అతడి పాలిట వరమై ప్రాణాలతో బయటపడ్డ మృత్యుజయుడిలా యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. మొత్తం 241 మంది ప్రాణాలు బలిగొన్న ఆ భయానక విమాన ప్రమాదం నుంచి ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డ ఏకైక భారత సంతతి బ్రిటిష్ వ్యక్తిగా రమేశ్ విశ్వాస్ కుమార్ నిలిచారు. దాంతో ఒక్కసారిగా 11ఏ కాస్తా మిరాకిల్ సీటుగా మారిపోయింది. బాధితుడు రమేష్ సైతం ఇంటర్వ్యూలో ఎలా బతికానో నాకు తెలియదని చెప్పాడు. దేవుని దయ వల్ల బయటపడ్డా..ఎందుకంటే ఆ ఘటనలో తాను కళ్లు తెరిచి చూసేటప్పటికీ.. తాను బతికే ఉన్నానని గుర్తించానని అన్నాడు. ఆ క్షణంలో గేటు విరిగిపోయి ఉండటం చూశానని, అక్కడ చిన్న గ్యాప్ ఉందని, దాని గుండా దూకానని చెప్పుకొచ్చాడు రమేష్. బోయింగ్ 787 సీటింగ్ కాన్ఫిగరేషన్ ప్రకారం, సీట్ 11A అనేది స్టాండర్డ్ ఎకానమీ ఎగ్జిట్ రో సీటు. అలాంటి సీటులు సాధారణంగా వొంపు తిరిగి ఉంటాయి, అందువల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారనేది నిపుణుల అభిప్రాయం. బహుశా అదే అతడి ప్రాణాలను కాపాడి ఉండొచ్చు. కానీ బోయింగ్ 787లో ఈ 11Aని అత్యంత చెత్త సీటుగా ప్రయాణికులు భావిస్తారట.రీజన్ ఏంటంటే..'ది విండో సీట్ 11A' అనేది కిటికీ లేని విండో సీటుగా ప్రసిద్ధి చెందినది. ఎయిర్ కండిషనింగ్ డక్ట్లు లేదా స్ట్రక్చరల్ రీన్ఫోర్స్మెంట్ల వంటి అంతర్గత భాగాల స్థానం కారణంగా, కొన్ని సీట్లు ముఖ్యంగా 9A, 10A, 11A, 12A వంటి రెక్క ముందు భాగంలో ఉన్న సీట్లకు - పూర్తిగా కిటికీలు ఉండవు. ఇలా మరో బోయింగ్ 737-900 విమానంలో కూడా ఉంటుందట. చాలామంది ప్రయాణికులు ఈ సీటు గురించి ఫిర్యాదులు చేస్తారట. ఎందుకంటే..? బయట వ్యూ కోసం ఆశించే ప్రయాణికులకు ఇవి అత్యంత నిరుత్సాహపరిచే సీటులుగా చెబుతుంటారు. కిటీకీ లేకుండానే విండో సీటుగా పిలవడంతో చాలామంది ప్రయాణికులు పలుసార్లు ఇబ్బందులు పడ్డారట. అందుకే ప్రయాణికులంతా ఈ 11A సీటంటే హడలిపోతారట. అస్సలు ఇష్టపడరట. పైగా దీన్ని విమానంలోనే అత్యంత చెత్త సీటుగా పరిగణిస్తారట. ఇప్పడు ఈ మృత్యుంజయడు రమేష్ విశ్వాస్ కుమార్ కారణంగా ఈ సీటుకి డిమాండ్ పెరిగి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారేమో అని నెట్టింట నెటిజన్లు కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతుండటం గమనార్హం. (చదవండి: Seat 11A: ఆ సీటులో ఉంటే భద్రమేనా?) -
25 మందికి ఎస్యూవీ కార్లను బహుమతిగా ఇచ్చిన స్టార్టప్ కంపెనీ
చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ తన ఉద్యోగులకు కార్లను గిఫ్టగా ఇచ్చింది. కంపెనీలు లాభాలను ఉద్యోగులను పంచి ఇచ్చింది. "నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు; అనుచరులు లేకుండా నాయకుడు లేడు" అని అజిలిసియం వ్యవస్థాపకుడు, CEO రాజ్ బాబు తెలిపారు.ఈ పరంపర కొనసాగుతుందని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దీంతో ఈ వార్త నెట్టింట సందడిగా మారింది. 25 మందికి ఎస్యూవీ కార్లు గిప్ట్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు ప్రముఖ అటానమస్ ఏజెంట్ ఏఐ భాగస్వామిగా ఉన్న అజిలిసియం సంస్థ ఒక గొప్ప ఆవిష్కరణకు చర్యలు తీసుకుంది. దీర్ఘకాలంగా తమ సంస్థలో సేవలందిస్తున్న ఉద్యోగులందరికీ హ్యుందాయ్ క్రెటా కార్లను బహుమతిగా గురువారం అందజేసింది. సంస్థ 10వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రారంభం నుంచి ప్రపంచ స్థాయికి దాని ప్రయాణాన్ని తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన 25 మంది ఉద్యోగులను గుర్తించి సత్కరించారు. విలువైన సేవలకు గుర్తింపుగా చెన్నైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని అజిలిసియం ప్రధాన కార్యాలయంలో ఈ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాజ్బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజిలిసియంలో తమ ఉద్యోగుల సేవలను ఎల్లప్పుడు గుర్తిస్తూనే ఉన్నామని చెప్పారు. సకాలంలో సేవలను అందించడంలో , దీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారికి అందించిన ఈ కార్లు బహుమతులు కావని, అవి శాశ్వత విశ్వాసం, భాగస్వామ్య ఉద్దేశం కలిసిన అద్భుత స్పూర్తిగా ఆయన వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: 41 కాదు 24 ఏళ్లే : వయసు తగ్గించుకున్న లండన్ డాక్టర్ సీక్రెట్ ఇదే! 2014లో అజిలిసియంను రాజ్ బాబు స్థాపించారు .ఇది ఏజెంట్ AI భాగస్వామిగా లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు సేవలందిస్తున్నందున బూట్స్ట్రాప్గా ఎదుగుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఇది 45శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR)తో వృద్ధి చెంది 2027 నాటికి 100 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నమోదు చేస్తుందని బాబు ధీమా వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: Beauty Tip పూల రెక్కలు, తేనె చుక్కలతో మెరిసిపోండి ఇలా! -
ఫ్యామిలీ ఎమర్జెన్సీ.. భారత్కు తిరిగొచ్చిన గౌతం గంభీర్
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ మరో వారం రోజులలో ఆరంభం కానుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. ఇప్పటికే ఇంగ్లండ్పై అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. నేటి నుంచి భారత సీనియర్ టీమ్-ఇండియా 'ఎ' జట్ల మధ్య వార్మాప్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. హెడ్కోచ్ గౌతం గంభీర్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా తిరిగి భారత్కు వచ్చేసినట్లు తెలుస్తోంది. రెవ్స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం.. గంభీర్ తల్లికి గుండెపోటు వచ్చినట్లుగా సమాచారం.ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా సదరు రిపోర్ట్ పేర్కొంది. ఈ క్రమంలోనే గంభీర్ హుటాహుటిన స్వదేశానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే గంభీర్ తిరిగి ఎప్పుడు ఇంగ్లండ్కు వెళ్తాడన్నది ఇంకా క్లారిటీ లేదు. తొలి టెస్టుకు ప్రారంభానికి ముందే జట్టుతో గంభీర్ తిరిగి కలిసే అవకాశముంది. కాగా వైట్బాల్ సిరీస్లలో కోచ్గా విజయవంతమైన గౌతీ.. టెస్టుల్లో మాత్రం ఇప్పటివరకు ఇంకా తన మార్క్ను చూపించలేకపోయాడు. అతడి నేతృత్వంలో భారత జట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో ఘోర పరాభావాలను మూటకట్టుకుంది. దీంతో ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్ గంభీర్కు చాలా కీలకం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్ ఆటగాళ్లు లేని యువ భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై ఎలా రాణిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత కొత్త టెస్టు జట్టు కెప్టెన్గా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ ఎంపికైన సంగతి తెలిసిందే.చదవండి: న్యూజిలాండ్ ఓపెనర్ మహోగ్రరూపం.. 19 సిక్సర్లతో ఊచకోత -
స్టాక్ మార్కెట్లు.. వరుస నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం పెరగడం, ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు పతనమయ్యాయి.ఇంట్రాడేలో 80,354.59 పాయింట్ల కనిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 573.6 పాయింట్లు (0.7 శాతం) క్షీణించి 81,118.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 169.6 పాయింట్లు లేదా 0.68 శాతం క్షీణించి 24,718.6 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ లు వరుసగా 0.24 శాతం, 0.43 శాతం నష్టపోయాయి.అయితే రంగాలవారీ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, ఎనర్జీ, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 26 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1 శాతానికి పైగా నష్టపోయాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ మాత్రమే లాభపడ్డాయి.ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ నేపథ్యంలో క్రూడాయిల్ ధర బ్యారెల్కు 8.57 శాతం పెరుగుదలతో 73.87 డాలర్లకు ఎగసింది. మరోవైపు మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 7.6 శాతం పెరిగి 15.08 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
ఫార్ములా-ఈ కారు రేసు.. కేటీఆర్కు మరోసారి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఏసీబీ మరోసారి నోటీసులుచ్చింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో సోమవారం(జూన్ 16)న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో ఇదివరకే ఓసారి ఆయన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.జనవరి 9వ తేదీన సుమారు ఆరున్నర గంటలపాటు కేటీఆర్ను ఏసీబీ విచారించింది. ఆపై ఈ ఏడాది మే చివరి వారం(28వ తేదీ)లో మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే అమెరికా పర్యటన నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు తెలియజేశారు. దీంతో మరోసారి ఇవాళ మూడోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 10గం. విచారణకు రావాలని ఏసీబీ తన నోటీసుల్లో స్పష్టం చేసింది.ఫార్ములా ఈ కారు రేసు కేసులో.. కిందటి ఏడాది డిసెంబర్ 29వ తేదీన ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జనవరి మొదట్లో విచారణకు హాజరయ్యే క్రమంలో అధికారులు అనుమతించకపోవడంతో వెనక్కి వచ్చేశారు. ఆ సమయంలో ఆయన రాతపూర్వక వివరణ ఇచ్చారు. తిరిగి.. 9వ తేదీ విచారణకు హాజరై ఏసీబీ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. -
మొదలు నరికినా మొలకెత్తే చేవ!
పది రోజుల కింద ‘మహారాష్ట్ర అంగన్వాడీ కర్మచారి సంఘటన్ వర్సస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’ కేసులో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గౌరి గాడ్సే, జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్ ఇచ్చిన మధ్యంతర ఆదేశానికి అనేక రకాలుగా ప్రాధాన్యం ఉంది. ఆ ఆదేశం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో పాటించవలసిన కనీస నిబంధనలను గుర్తు చేసింది. అది ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన ఉద్యో గానికి కనీసం పదకొండు సంవత్సరాలుగా నియామకాలు జరగలేదనే వాస్తవాన్ని బయట పెట్టింది. అది ఆ రాష్ట్ర ప్రభు త్వంలో ఉద్యోగులు ఇరవై సంవత్సరాలకు పైగా పదోన్నతి లేకుండా కింది స్థాయి ఉద్యోగంలో కొనసాగుతున్నారని చూపింది. అన్నిటికీ మించి, అంగన్వాడీ కర్మచారి సంఘటన్ తరఫున ఈ కేసు వాదించి గెలిచిన న్యాయవాది ఎన్నో ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొని, తన ప్రజా జీవనాన్నీ, తన న్యాయవాద వృత్తినీ ధ్వంసం చేయడానికి పాలకులు చేసిన ప్రయత్నాలను ధిక్కరించి, ప్రజా ప్రయోజన, కార్మిక సంక్షేమ కృషిలో మొక్కవోని దీక్షతో కొనసాగుతున్నారని చూపింది. మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్’(ఐసీడీఎస్)లో భాగమైన అంగన్వాడీ ముఖ్య సేవిక అనే పర్యవేక్షక ఉద్యోగ నియామకాల కోసం 2021 జూన్ 4న ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. మళ్లీ 2025 ఫిబ్రవరి 4న కూడా ఆ ఉద్యోగాలకు సంబంధించే మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటికే ఆ ఉద్యోగం కన్నా కిందిస్థాయి సేవిక (వర్కర్) ఉద్యోగంలో పది సంవత్సరాలకు పైగా, కొన్ని సందర్భాలలోనైతే ఇరవై, ఇరవై అయిదు సంవత్సరాలకు పైగా పని చేస్తున్న వారికి ఈ ముఖ్య సేవిక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అంగన్వాడి సేవికల సంఘమైన మహారాష్ట్ర అంగన్ వాడీ కర్మచారి సంఘటన్ తమకు జరిగిన ఈ అన్యాయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయదలచుకుంది. వారి తరఫున న్యాయవాది సుధా భరద్వాజ్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో వీరికి కూడా అవకాశం కల్పించేలా మార్పులు చేయాలని, ఈ మార్పులకు తగినట్టుగా గడువు తేదీలు మార్చాలని కోర్టు ఇప్పుడు మధ్యంతర ఆదేశం ఇచ్చింది. ఈ ఆదేశం మహారాష్ట్రలో ఎన్నో సంవత్స రాలుగా సేవికలుగా ఎదుగూ బొదుగూ లేకుండా పని చేస్తున్న వేలాదిమందికి ఒక ఆశాసూచిక. దేశంలో మొత్తంగా కొన సాగుతున్న కార్మిక వ్యతిరేక విధానాలలో ఈ మధ్యంతర తీర్పు ఒక చిన్న ఊరట. సుధా భరద్వాజ్ ఛత్తీస్గఢ్లో దాదాపు రెండు దశాబ్దాలు ప్రధానంగా కార్మిక వ్యవహారాల న్యాయ వాదిగా, ఆ తర్వాత ఢిల్లీలో ఒక న్యాయ శాస్త్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పని చేసిన వ్యక్తి. సుధా భరద్వాజ్ ప్రపంచ ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త కృష్ణా భరద్వాజ్ కూతురు. అమెరికాలో పుట్టి, ఆమెరికన్ పౌరురాలిగా అక్కడే పదకొండేళ్ల వయసు దాకా ఉన్నారు. ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రారంభిస్తున్నప్పుడు అక్కడి అర్థశాస్త్ర శాఖను నిర్మించమని కృష్ణా భరద్వాజ్కు పిలుపు వెళ్లగా, సుధ కూడా తల్లితో పాటుఢిల్లీ వచ్చారు. పద్దెనిమిదేళ్ల వయసు రాగానే స్వచ్ఛందంగా తన అమెరికన్ పౌరసత్వం వదులుకున్నారు. కాన్పూర్ ఐఐటీలో గణితశాస్త్రంలో ఎంఎస్ చేశారు. విద్యార్థి దశలో ఎన్ఎస్ ఎస్లో భాగంగా ఉత్తరప్రదేశ్,బిహార్, మధ్యప్రదేశ్గ్రామీణ పాంతాలకు, కార్మిక ప్రాంతాలకు వెళ్లి, కుల,వర్గ అసమాన తలను చూసి, ఆ పేద ప్రజల సేవలోనే తన జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. అప్పటి మధ్యప్రదేశ్లో గని కార్మికులను సంఘటితం చేస్తున్న శంకర్ గుహ నియోగి ఆలోచనలతో, ఆచరణతో ప్రభావితమై తన ఇరవై ఐదవ ఏట, 1986లో అక్కడ కార్మికుల మధ్య పని చేయడానికి వెళ్లారు. అనేక సంఘాల్లో పని చేయడం ప్రారంభించారు. భిలాయిలో ఎక్కువగా నిరక్షరాస్యులైన కార్మికుల మధ్య, పేదల మధ్య పని చేస్తున్నప్పుడు, అక్కడ చదువు వచ్చిన ఏకైక వ్యక్తిగా ఆమె ఆ కార్మికులకు, పేదలకు జరుగు తున్న అన్యాయాల గురించి మాట్లాడడానికి, న్యాయస్థానా లలో కేసులు వేయడానికి ఎక్కువగా న్యాయవాదులను కలవ వలసి ఉండేది. పిటిషన్లు రాయవలసి ఉండేది. అటు వంటి పనులు చేస్తుండగా, ఆ కార్మికులు ‘మీరే ఎందుకు న్యాయవాది కాకూడదు’ అని ప్రోత్సహించడంతో, 2000 నాటికి తానే న్యాయవాదిగా మారారు. భూకబ్జాలకు, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కార్మికుల హక్కులనూ, ఆదివాసుల సామూహిక అటవీ హక్కులనూ, పర్యావర ణాన్నీ పరిరక్షించడానికి ఎన్నో కేసులు వాదించారు. ‘జన హిత’ అనే న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’లో పని చేశారు. ఇలా ఛత్తీస్గఢ్లో, ముఖ్యంగా బిలాస్పూర్ హైకో ర్టులో, ఇతర న్యాయస్థానాల్లో ఆదివాసుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం ఆమె చేస్తున్న విస్తారమైన పని, ప్రభుత్వానికి కంటగింపు అయింది. ఆమె పనిని అడ్డుకోవ డానికి, వేధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి ‘అర్బన్ నక్సల్’ అనే ముద్ర కొట్టి 2018 ఆగస్ట్ 28నఆమెను అరెస్టు చేసి భీమా కోరేగాం కేసులో నిందితురాలిగా చూపారు. మూడేళ్ల జైలు జీవితం తర్వాత 2021 డిసెంబర్లో షరతులతో కూడిన బెయిల్ మీద ఆమె విడుదల య్యారు. ఆ షరతుల్లో ప్రధానమైనది, ‘ముంబయి వదిలి పోకూడదు’ అనేది. అందుకే బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈఅంగన్వాడీ సేవికల కేసులో గణనీయమైన విజయం సాధించారు.వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ -
అహ్మదాబాద్ ఘటన.. ఎయిరిండియాపై ప్రియాంక చోప్రా సిస్టర్ ఆగ్రహం!
అహ్మదాబాద్ విమానం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. మనిషి ప్రాణాలు పోవడానికి ఒక్క సెకను చాలు అనేది కళ్లముందు కనిపిస్తోంది. ఈ విషాద ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ఘటన తర్వాత పలువురు విమానం ఎక్కాలంటేనే ఆలోచించే పరిస్థితి ఎదురవుతోంది. విమాన ప్రయాణం ఇంత విషాదంగా మారడంతో భద్రతపై ప్రతి ఒక్కరిలో అనుమానాలు మొదలయ్యాయి.ఈ ప్రమాదం జరిగిన వెంటనే పలువురు టికెట్స్ రద్దు చేసుకున్నారు. అందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ మీరా చోప్రా భర్త కూడా ఉన్నారు. ఆమె భర్త ఈనెల 15న దుబాయ్కు ఎయిరిండియా విమానంలో వెళ్లాల్సి ఉంది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భద్రతపై నమ్మకం లేకపోవడంతో టికెట్ రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు మీరా చోప్రా తెలిపింది. అయితే ఎయిరిండియా తమ టికెట్ డబ్బులను వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించిందని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్లైన్స్ సిబ్బంది తీరుపై మీరా చోప్రా తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది.మీరా చోప్రా ట్వీట్లో రాస్తూ.. 'ఎయిరిండియా తీరు చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది. నా భర్త జూన్ 15న ఎయిరిండియాలో దుబాయ్కు ప్రయాణించాల్సి ఉంది. భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో మేము ప్రయాణం రద్దు చేసుకోవాలనుకున్నాం. కానీ ఎయిర్ ఇండియా వారికి ఎటువంటి సలహా రాలేదని పేర్కొంటూ టికెట్ ధర మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి నిరాకరించింది. ఎయిర్ ఇండియాను నడపడంలో మేమందరం గర్వపడ్డాం. ఎందుకంటే ప్రముఖ టాటా గ్రూప్ నడుపుతున్న మన జాతీయ విమానయాన సంస్థ. కానీ ఈ రోజు ఏమి జరిగిందో మనం చూశాం. ఇప్పుడు వారు విమానాలు ఎలా నిర్వహిస్తున్నారో తీవ్ర నిరాశపరిచింది. ఈ ఘటన వారికి సిగ్గుచేటు. ఈ ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఎయిరిండియా వీటిని అస్సలు పట్టించుకోదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే మీరా చోప్రా టికెట్ రీఫండ్ చేయమని అడగడంపై నెటిజన్లు ట్రోల్ చేశారు. టికెట్ రద్దు విధానాన్ని ముందుగా చదుకోవాలని ఆమెకు సలహాలిచ్చారు. నిబంధనల ప్రకారం మీరు విమాన సమయాన్ని మార్చినట్లయితే రద్దు చేసి డబ్బులిస్తారని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. నిబంధనలకు విరుద్ధంగా మీ సొంత కారణాలతో టికెట్ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని మరో నెటిజన్ మీరాకు కౌంటరిచ్చారు. కాగా.. గురువారం జరిగిన ఎయిరిండియా ప్రమాదంలో ఒక్కరు మినహా 241 అందరూ ప్రాణాలు కోల్పోయారు. #AirIndia insensitivity is beyond shocking..My husband is scheduled to travel to Dubai on 15th June on @airindia and we wanted to cancel the flight due to the lack of safety measures. But Air India declined to refund any amount citing no advisory has come to them. We all took…— Meerraa Chopraa (@MeerraChopra) June 12, 2025 -
‘వైఎస్సార్సీపీ లీగల్ సెల్ పనితీరు అద్భుతం’
గుంటూరు: తమ పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసుల విషయంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తోందని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశంసించారు.ఈరోజు(శుక్రవారం, జూన్ 13) గుంటూరులో జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సదస్సు నిర్వహించారు. ఇందులో అంబటి రాంబాబు, పోతిన మహేష్, మాజీ ఎంపీ మాదుగుల వేణుగోపాల్రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, సుదర్శన్రెడ్డిలతో పాటు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు పాల్గొన్నారు. వీరితో పాటు ఏడు నియోజకవర్గాల నుంచి న్యాయవాదులు భారీ స్థాయిలో తరలివచ్చారు. దీనిలోభాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు పై తప్పుడు కేసులో బనాయిస్తోంది. ఒక్కొక్కరి పైన 10 కేసులు తక్కువ పెట్టడం లేదు. పార్టీ నాయకుల్ని కార్యకర్తలని వేధించాలన్న లక్ష్యంతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం బనాయించే అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అద్భుతంగా న్యాయపోరాటం చేస్తుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, నాయకులకు లీగల్ సెల్ అండగా ఉండి మేమున్నాము అనే భరోసా కల్పిస్తోంది. గుంటూరు జిల్లా లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుంది వారికి అభినందనలు’ అని పేర్కొన్నారు.రాష్ట్రంలో హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది.. రాష్ట్రంలోని ప్రజల హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేశారు. ప్రభుత్వం పథకం ప్రకారమే అక్రమ కేసులు బనాయిస్తోంది. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధుల న్యాయపోరాటం అద్భుతం’ అని కొనియాడారు.ఇవి పథకం ప్రకారం చేసే దాడులుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక పథకం ప్రకారం.. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేస్తోంది. యాక్టివ్గా ఉన్న కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోంది. సోషల్ మీడియా వారి పైన కూడా ఒక్కొక్కరిపై 10కి తగ్గకుండా కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పారు. ప్రభుత్వమే వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతోంది. ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ వైఎస్ జగన్ ఆదేశాలతో న్యాయపోరాటం చేస్తుంది. పార్లీ నాయకుల్ని, కార్యకర్తల్ని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కాపాడుకుంటుంది. పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వారందరినీ పార్టీ కచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది’ అని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే అరాచకం మొదలుపెట్టారుకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరాచకం మొదలుపెట్టిందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు సుదర్శన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేశారు. చాలామంది కార్యకర్తలు ఊర్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడప్పుడు వాళ్లు తిరిగి ఫంక్షన్లకు వచ్చిన వాళ్లపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు. లీగల్ సెల్ .. పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటుంది.. రక్షిస్తుంది. కూటమి నేతలు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయట్లేదు అని ప్రశ్నించినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఒక్కొక్కరిపై 15 నుంచి 20 కేసులు నమోదు చేసి రాష్ట్రమంతా తిప్పారు. కష్ట కాలంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుంది’ అని ఆయన తెలిపారు. -
కొమ్మినేని అరెస్టుపై సుప్రీం తీర్పు హర్షణీయం: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి,విజయవాడ: టీవీ డిబేట్లో గెస్టు చేసిన వ్యాఖ్యలకు సదరు డిబెట్ నిర్వహిస్తున్న యాంకర్ ఎలా బాధ్యులవుతారు? అంటూ ఏపీ పోలీసుల్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని అత్యున్నత న్యాయ స్థానం ఏపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సాక్షి ఛానెల్ డిబేట్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు తుళ్లూరు పోలీసులు కొమ్మినేనిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ అరెస్టుపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొమ్మినేని వెంటనే విడుదల చేయాలంటూ తీర్పును వెలువరించింది. అయితే రాష్ట్రంలో నిరంకుశంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టి బుద్ధి చెప్పేలా సుప్రీం తీర్పు ఇవ్వడం హర్షణీయం అంటూ వైఎస్సార్సీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.గురుమూర్తి, ఎంపీఏపీలో శాంతిభద్రతలు దిగజారాయిఅనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులపై టిడిపి నేతలు అత్యాచారానికి పాల్పడ్డారుఈ అంశంపై ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారుఅత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాముహరికృష్ణ పై దాడి పై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిందిబాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నానుఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందిసాక్షి మీడియాను నిర్వీర్యం చేసేందుకు, ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించారుకొమ్మినేని శ్రీనివాస్ పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిందివిశ్లేషకుడు చెప్పిన వ్యాఖ్యలకు కొమ్మినేనికి ఆపాదించడం సరికాదువాక్ స్వాతంత్రానికి పెద్ద పీటల దేశం సుప్రీంకోర్టు కొమ్మినేని విడుదల చేయాలని ఆదేశించింది బొల్లా బ్రహ్మనాయుడు:సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేయడం ముమ్మూటికీ చంద్రబాబు సర్కార్కు చెంపపెట్టే. చంద్రబాబు ఇప్పటికైనా అక్రమ కేసులు పెట్టించడం, అరెస్టు చేయించడం వంటివి ఆపకపోతే ప్రజలే బుద్ధి చెప్పడం ఖాయం. వెన్నపూస రవీంద్రరెడ్డి:సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ రక్షణకు బలమైన సందేశంకొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్పై దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టుకొమ్మినేనిపి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం.బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ట్వీట్సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై ఈ రోజు సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురురెబ్బే.కనీస నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేయడంపై సుప్రీం కోర్టు సీరియస్ అవ్వడమే కాకుండా వెంటనే కొమ్మినేనిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం.గోరంట్ల మాధవ్: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారి అక్రమ అరెస్ట్పై సుప్రీం కోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు. ప్రభుత్వం పత్రికా స్వాతంత్య్రాన్ని హరించే అరాచకాలకు కోర్టు బుద్ధి చెప్పింది.డిబేట్ నిర్వహించినందుకు చంద్రబాబు చేయడం అక్రమమని సుప్రీం స్పష్టంగా చెప్పింది.ఈ తీర్పు ప్రజాస్వామ్య పునాదులను నిలబెట్టే గొప్ప విజయం.వంగా గీత:సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ రక్షణకు బలమైన సందేశం.కొమ్మినేని అక్రమ అరెస్ట్పై దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు.కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం.ఆరె శ్యామల:సత్యమేవ జయతేకొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టుకు, పత్రికా స్వేచ్ఛను సర్వనాశనం చేసే ప్రయత్నాలకు ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక.కనీసం ఈ తీర్పుతోనైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్టు చేయించడం ఆపాలి.పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి:కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమమని తన తీర్పుతో కూటమి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు బుద్ధి చెప్పింది.చంద్రబాబు సర్కార్ పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలకు ఈ తీర్పు గట్టి హెచ్చరిక.ఇప్పటికైనా చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి.అక్రమ అరెస్టులను ఆపాలి.వరుదు కళ్యాణికొమ్మినేని గారి అరెస్ట్పై సుప్రీం కోర్టు తీర్పు ప్రజాస్వామ్య రక్షణకు నిదర్శనం.చంద్రబాబు ప్రభుత్వం పత్రికా స్వాతంత్య్రాన్ని అణచివేసే చర్యలకు కోర్టు బ్రేక్ వేసిందిడిబేట్ నిర్వహించినందుకు కేసు పెట్టడం అన్యాయమని సుప్రీం కోర్టు ఖండించడాన్ని స్వాగతిస్తున్నా.ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి.భూమన కరుణాకరరెడ్డి: కొమ్మినేని అరెస్టుపై సుప్రీం కోర్టు అత్యద్భుతమైన తీర్పు ఇచ్చింది.కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టు సుప్రీం కోర్టు తీర్పు కూటమి ప్రభుత్వంకు చెంప పెట్టు లాంటిదిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు సుప్రీం కోర్టు తీర్పుతో బుద్ధి చెప్పిందిఏపీలో పత్రిక స్వేచ్ఛను సర్వనాశనం చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి ఈ తీర్పు చెంప పెట్టు లాంటిదికూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్ను ఏ విధంగా బలహీన పరచాలని చూస్తూనే, సాక్షి మీడియాపై దాడులు చేయించిందిడిబేట్ నిర్వహించే వారిని అరెస్ట్ చేయడం అక్రమమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పిందిఈ తీర్పు ద్వారా సుప్రీం కోర్టు ప్రజాస్వామ్యాన్ని పునాదులను నిలబెట్టిందిసాక్షి కార్యాలయాలుపై దాడి చేసిన గుండాలు, రౌడీ మూకలను వెంటనే అరెస్టు చేయాలిగుడివాడ అమర్నాథ్:సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయం సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాను.సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి, రెడ్ బుక్ రాజ్యాంగానికి చెంపపెట్టుసుప్రీం కోర్టు తీర్పుతో కొమ్మినేనిది అక్రమ అరెస్టు అని తేలింది.కొమ్మినేని అరెస్టు వ్యవహారంపై సుప్రీం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలు రాష్ట్రంలో గాడితప్పిన పాలనకు హెచ్చరిక పత్రికా స్వేచ్ఛను హరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరెస్టులు అక్రమమని సుప్రీం స్పష్టం చేయడం హర్షనీయం కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా 70 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు అరెస్టులో అత్యంత అమానవీయంగా వ్యవహరించారుఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు, కక్ష సాధింపు చర్యలు ఆపాలి సీదిరి అప్పలరాజు:సీనియర్ పాత్రికేయలు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమన్న సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టులో రాష్ట్ర ప్రభుత్వం కనీస నిబంధనలు పాటించలేదన్న విషయం సుప్రీం కోర్టు తీర్పు ద్వారా స్పష్టమైంది.రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి ఈ తీర్పు కచ్చితంగా చెంపపెట్టు.కోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం చేసింది ముమ్మూటికీ అక్రమ అరెస్టే అని తేలింది.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న సుప్రీం వ్యాఖ్యలు రాష్ట్రంలో పరిస్ధితికి అద్దం పడుతున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ అరెస్టులు ఆపాలి. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుచేయాలి -
ఎయిరిండియా ప్రమాదం.. దొరికిన బ్లాక్ బాక్స్
న్యూఢిల్లీ: అహ్మదాబాద్(గుజరాత్) ఎయిరిండియా విమాన ప్రమాద విచారణలో పురోగతి చోటు చేసుకుంది. ఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అంతకు ముందు.. బ్లాక్బాక్స్ దొరికిందంటూ ప్రచారం జరగ్గా.. అధికారులు కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్పై ఆరంజె కలర్లో ఉన్న బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఏ171 బ్లాక్ బాక్స్ బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంనతరం, బ్లాక్ బాక్స్ను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఈ బ్లాక్ బాక్స్లో సీవీఆర్, ఎఫ్డీఆర్ భాగాలుంటాయి. వీటిల్లో విమాన డేటా రికార్డింగ్, వేగం, ఎత్తు గురించి తెలుసుకునే అవకాశం ఉంది. సీవీఆర్లో రికార్డయిన చివరి రెండు గంటల పైలెట్, కోపైలెట్ల మధ్య సంభాషణ వినొచ్చు. గురువారం మధ్యాహ్నాం లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యే బృందం దర్యాప్తు జరుపుతోంది.ఇదీ చదవండి: బ్లాక్బాక్స్తో ఏం చేస్తారో తెలుసా? -
అల్లు అర్జున్.. 'శక్తిమాన్'
90స్ జనరేషన్కి సూపర్ హీరోలు అనగానే స్పైడర్ మ్యాన్, 'శక్తిమాన్' గుర్తొస్తాయి. స్పైడర్ మ్యాన్ సినిమాల సంగతి కాసేపు పక్కనబెడితే 'శక్తిమాన్' స్టోరీతో అటు సీరియల్ గానీ మూవీస్ గానీ రాలేదు. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో ఈ ప్రాజెక్ట్ తీస్తారనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఫైనల్గా అది అల్లు అర్జున్ చేతిలోకి వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?'పుష్ప 2' తర్వాత లెక్క ప్రకారం బన్నీ.. త్రివిక్రమ్తో సినిమా చేయాలి. భారీ బడ్జెట్తో మైథలాజికల్ మూవీ ఒకటి అనుకున్నారు. కానీ అది ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో తమిళ దర్శకుడు అట్లీతో.. బన్నీ కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. ఇదో హాలీవుడ్ రేంజ్ సూపర్ హీరో తరహా సినిమా అని అనౌన్స్మెంట్ వీడియోతో క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) రీసెంట్గా బన్నీ చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో త్రివిక్రమ్ చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చింది. దీంతో నెక్స్ట్ ఎవరితో చేస్తాడా అనే టైంలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది. గతంలో ఇతడు 'మిన్నల్ మురళి' అని లోకల్ సూపర్ హీరో మూవీ ఒకటి తీశాడు. ఈ క్రమంలోనే బన్నీ-బాసిల్ కలిసి 'శక్తిమాన్' చేస్తారనే రూమర్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు ఓ రెండు కలిసి.. గీతా ఆర్ట్స్తో భారీ ఎత్తున నిర్మించబోతున్నారని అంటున్నారు. త్వరలో ప్రకటన రావొచ్చని మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు వినిపిస్తున్నవన్నీ నిజమేనా? లేదంటే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని డ్యామేజ్ కంట్రోల్ ఏమైనా చేస్తున్నారా అనిపిస్తుంది. కొన్నిరోజులు ఆగితే నిజమేంటనేది క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' టీమ్ వార్నింగ్.. అలా చేస్తే కఠిన చర్యలు) -
దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ లైవ్ అప్డేట్స్..
లక్ష్యం దిశగా సౌతాఫ్రికా..282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ధీటుగా బదులిస్తోంది. 39 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా.. రెండు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(76), బావుమా(41) ఉన్నారు. ప్రోటీస్ విజయానికి ఇంకా 122 పరుగులు కావాలి.మార్క్రమ్ హాఫ్ సెంచరీసౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్లో మార్క్రమ్ హాఫ్ సెంచరీ సాధించాడు. 51 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 26 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్..వియాన్ ముల్డర్ రూపంలో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన ముల్డర్.. స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. 20 ఓవర్లకు సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(41), బావుమా(5) ఉన్నారు. సౌతాఫ్రికా విజయానికి ఇంకా 201 పరుగులు కావాలి.నిలకడగా ఆడుతున్న సౌతాఫ్రికా..282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(19), ముల్డర్(22) ఉన్నారు.సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్..ర్యాన్ రికెల్టన్ రూపంలో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన రికెల్టన్.. స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు.సౌతాఫ్రికా టార్గెట్ 282 పరుగులు..లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 207 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి సౌతాఫ్రికా ముందు 282 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. ఆసీస్ బ్యాటర్లలో టెయిలాండర్ మిచెల్ స్టార్క్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.టాపర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి స్టార్క్ మాత్రం ప్రోటీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. స్టార్క్ 58 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(43) పరుగులతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ నాలుగు వికెట్లు పడగొట్టగా.. లుంగీ ఎంగిడీ మూడు, జానెసన్,మార్క్రమ్ తలా వికెట్ సాధించారు.మిచెల్ స్టార్క్ హాఫ్ సెంచరీ.లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో మిచెల్ స్టార్క్ ఇటు బంతితోనూ, అటు బ్యాట్తోనూ రాణిస్తున్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో ఆసీస్ టాపర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి స్టార్క్ మాత్రం ప్రోటీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీ మార్క్ను స్టార్క్ అందుకున్నాడు. 53 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 64 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. క్రీజులో స్టార్క్తో పాటు హాజిల్వుడ్(17) కూడా ఉన్నాడు. సౌతాఫ్రికాకు ఆసీస్ టెయిలాండర్ బ్యాటర్ మిచెల్ స్టార్క్ కొరకరాని కొయ్యగా మారాడు. తన బ్యాటింగ్తో సఫారీలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. 37 పరుగులతో స్టార్క్ తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 51 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కంగారులు ప్రస్తుతం 249 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ఆసీస్ తొమ్మిదో వికెట్ డౌన్..ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన నాథన్ లియోన్.. రబాడ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. 43 ఓవర్లకు ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. క్రీజులో స్టార్క్(19), హాజిల్వుడ్(0) ఉన్నారు.లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ మూడో రోజు ఆట ప్రారంభమైంది. 144-8 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజును ఆటను ఆసీస్ ఆరంభించింది. క్రీజులో మిచెల్ స్టార్క్(16), నాథన్ లియోన్(2) ఉన్నారు. ఆసీస్ ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్లో 138 పరుగులకే కుప్పకూలిందితుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, హెడ్, వెబ్స్టర్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్, నాథన్ లియోన్.దక్షిణాఫ్రికా: ఐదెన్ మార్క్రమ్, ర్యాన్ రికిల్టన్, వియాన్ ముల్దర్, తెంబా బవుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, బెడింగ్టన్, కైల్ వెరీన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి. -
జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ
రిలయన్స్ జియో భారతదేశపు అతిపెద్ద టెలికాం సంస్థ. దేశంలోని మొబైల్ యూజర్లలో ఎక్కువ మంది జియోను వినియోగిస్తున్నారు. మీరు కూడా జియో యూజర్ అయి ఉండి, లాంగ్ బవ్యాలిడిటీతో తక్కువ ఖర్చులో రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ సమాచారం మీ కోసమే. 84 రోజులు అంటే దాదాపు మూడు నెలలు వ్యాలిడిటీతో మంచి ప్రయోజనాలను అందించే మూడు రీఛార్జ్ ప్లాన్లను జియో ఇటీవల ప్రవేశపెట్టింది.జియో రూ.799 ప్లాన్జియో రూ .799 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది. దీంతోపాటు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీనితో పాటు, జియో హాట్స్టార్కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్తో పొందవచ్చు.జియో రూ.859 ప్లాన్ఈ ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ ఉన్నన్నిరోజులూ అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం ఆస్వాదించవచ్చు. దీంతోపాటు రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అంతే కాకుండా జియో హాట్స్టార్కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్తో ఆనందించవచ్చు.👉 ఇదీ చదవండి: రూ.200 లోపే రీచార్జ్.. 2 నెలలుపైగా వ్యాలిడిటీజియో రూ.889 ప్లాన్జియో రూ .889 ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో పాటు జియో హాట్స్టార్కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్లో చేర్చారు. అలాగే జియో సావన్కు కూడా ఉచిత యాక్సెస్ను కూడా వినియోగదారులు పొందుతారు. -
మెర్సిడెస్ బెంజ్ కలెక్టర్స్ ఎడిషన్ @ 4.3 కోట్లు.. ప్రత్యేకత ఇదే..
లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తాజాగా ఏఎంజీ జీ63 ‘కలెక్టర్స్ ఎడిషన్’ మోడల్ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ.4.3 కోట్లు (ఆల్ ఇండియా ఎక్స్–షోరూం). ప్రస్తుత టాప్ ఎండ్ లగ్జరీ వాహన కస్టమర్ల కోసం కంపెనీ కేవలం 30 యూనిట్లే విక్రయించనుంది. బెంగళూరులోని మెర్సిడెస్ బెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియా (ఎంబీఆర్డీఐ) భాగస్వామ్యంతో భారత్లోని పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ దీన్ని రూపొందించంది. తమ అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దిన వాహనాలను కస్టమర్లు కోరుకుంటున్న నేపథ్యంలో టాప్ ఎండ్ లగ్జరీ సెగ్మెంట్లో హైపర్–పర్సనలైజేషన్ ట్రెండ్ ఎక్కువగా ఉంటోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు.ఇదీ చదవండి: అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్బాక్స్’మిడ్ గ్రీన్ మాగ్నో, రెడ్ మాగ్నో రంగుల్లో లభిస్తుంది.మొదటగా కొనుగోలు చేసే కస్టమర్లకు డ్యాష్ బోర్డ్ గ్రాబ్ హ్యాండిల్పై తమ పేరును చెక్కించుకునే వీలుంది.స్పేర్ వీల్ కవర్పై ‘వన్ ఆఫ్ థర్టీ’ ప్లేట్ ఉంటుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ను సూచిస్తుంది.బ్లాక్ నాప్పా లెదర్, ఓపెన్ పోర్ వాల్నట్ వుడ్ ట్రిమ్తో ఇంటీరియర్ ఉంటుంది. -
Beauty Tip పూల రెక్కలు, తేనె చుక్కలతో మెరిసిపోండి ఇలా!
సువాసనలు వెదజల్లే అందమైన పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ అందానికి అందంగా, సుగంధంగా గులాబీలు, మల్లె, జాజి పూలు అమ్మాయిలకు మరీ ఇష్టం. పురాతన కాలం నుంచీ మల్లి, జాజి, గులాబీ పూల రెక్కలను సౌందర్య సాధనంగా కూడా వాడేవారు. శరీరానికి మెరుపు, ముఖ తేజస్సును పెంచుకునేందుకు గులాబీ రేకులకు, కాస్త తేనె, కూసింత పసుపు,ఇతర అనేక సుగంధ ద్రవ్యాలను కలిపి వాడతారు. మరి ఇవాల్టి టిప్ ఆఫ్ ది డే లో భాగంగా గులాబీ బాలగా మన ముఖం మెరిసిపోవాలంటే ఇవిగో టిప్స్...గులాబీ రేకులు, నల్ల నువ్వులు, బార్లీ గింజలు సమ పాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని తగినన్ని రోజ్వాటర్ కలిపి, ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది. లేదంటే సింపుల్గా పది గులాబీ రేకలను మెత్తగా చేసి, అందులో రెండు చెంచాల రోజ్వాటర్, రెండు చెంచాల తేనె, మూడు చుక్కల బాదం నూనె వేసి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖంపై వలయాకారంగా రాస్తూ పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే.. చక్కటి మెరుపు వస్తుంది. అర టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్లా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్తో చర్మ రంధ్రాలు శుభ్రపడి ముఖ చర్మం కాంతివంత మవుతుంది. (Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..)ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారే చర్మతత్త్వం గలవారు మాయిశ్చరైజర్గా ఉపయోగించవచ్చు. చర్మం తాజాగా మెరుస్తూ ఉండాలంటే ఎప్పటికప్పుడు చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. ఇందుకోసం కార్న్ఫ్లేక్స్ని పొడి చేసి అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దన చేయాలి. దీంతో మృతకణాలు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది. ఇదీ చదవండి: సంజయ్ మరణానికి కారణం ఓ తేనెటీగ : వైద్యులు ఎంత శ్రమించినా..!మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నీళ్లు కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక ముఖానికి రాసి, మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఆయిల్ ప్యాక చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. నోట్ : పువ్వులు ఎంత అందమైనవి అయినా కొంతమందికి ఎలర్జీ కలిగించవచ్చు. అందుకే ఏదైనా ప్యాక్ వేసుకునే ముందు కొద్దిగా టెస్టింగ్ ప్యాక్లా వేసుకోవడం మర్చిపోవద్దు. ఏదైనా సమస్య వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
‘సుప్రీం తీర్పు’.. చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao)ను వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు అని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అత్యున్నత న్యాయ స్థానం తీర్పుపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘సుప్రీం తీర్పు చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహం.అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారు. అబద్ధాలు, మోసాలతో కూడిన పాలననుంచి మళ్లించడానికి, తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్ద్వారా పథకం ప్రకారం విషప్రచారం చేయించారు. వాటిని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్ ఆఫీసులమీద, కార్యాలయాలమీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు.చంద్రబాబు తన తప్పును తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా నిన్న మాట్లాడ్డంతోనే ఆయన రాజకీయ లబ్ధికోసం ఈ కుట్రపన్నారని అర్థం అవుతోంది. విశ్లేషకుడు వ్యాఖ్యలతో యాంకర్గా వ్యవహరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావు’అని ట్వీట్లో పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు @ncbn గారికి పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 13, 2025 -
ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’
మల్టీ టాలెంటెడ్ తేజ్ నటించిన త్రిభాషా చిత్రం ‘డ్యూడ్. ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న "డ్యూడ్" చిత్రం టీజర్ త్వరలో విడుదల చేయనున్నారు!!హీరో కమ్ డైరెక్టర్ తేజ్ మాట్లాడుతూ... "హీరోగా, డైరెక్టర్ గా 'డ్యూడ్" చిత్రం ఔట్ ఫుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. రష్ చూసుకుంటుంటేనే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఎప్పుడెప్పుడు ఆడియన్స్ తో కలిసి థియేటర్స్ లో సినిమా చూసుకుంటామా అని చాలా ఆత్రంగా ఉంది. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలో టీజర్ రిలీజ్ చేసి, అప్పటి నుంచి ప్రచార కార్యమాలు ముమ్మరం చేస్తాం" అని అన్నారు!!రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది!!ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్... ఈ చిత్రానికి 'స్క్రిప్ట్ కన్సల్టెంట్'గా కూడా వ్యవహరించడం విశేషం. శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష... ఫుట్ బాల్ అంటే పడి చచ్చే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు -
కొమ్మినేని అరెస్ట్ టు బెయిల్! ఎప్పుడేం జరిగిందంటే..
సాక్షి, అమరావతి: సుప్రీం కోర్టు తీర్పుతో విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలకు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. కొమ్మినేనిని తక్షణమే రిలీజ్ చేయాలంటూ.. ఆయన అరెస్ట్ అక్రమమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చేసింది. సాక్షి, కొమ్మినేనికి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు ఏ సంబంధం లేకపోయినా.. వాటిని ఆపాదిస్తూ ఎల్లో బ్యాచ్ ఎంతగా రెచ్చిపోయిందో తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పుడు, ఏం జరిగిందో పరిశీలిస్తే..9వ తేదీ సోమవారం..గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కొమ్మినేనిని ఈ నెల 9వ తేదీన(సోమవారం) అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి ఆ రోజు ఉదయమే చేరుకుని ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఏ అభియోగాలపై తనను అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించిన కొమ్మినేనికి సరైన సమాధానం ఇవ్వలేదు. 👉70 ఏళ్ల వయసులో.. సీనియర్ సిటిజన్, పైగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన్ను.. ఇంటి లోపల గదిలోకి వెళ్లి మందులను తెచ్చుకునేందుకు కూడా అనుమతించలేదు. బలవంతంగా వాహనం ఎక్కించి గుంటూరుకు తరలించారు. కొమ్మినేనిని సోమవారం ఉదయం 11 గంటలకు అరెస్టు చేసినట్టు ప్రకటించారు.కొమ్మినేనిపై బీఎన్ఎస్ 79, 196(1), 353(2), 299, 356(2), 61(1), 67 ఐటీ యాక్ట్, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా అక్రమ కేసు నమోదు చేసిందని వైఎస్సార్సీపీ మండిపడింది. అదే సమయంలో సాక్షి మీడియా సంస్థలపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయి.పోలీసులపై మంగళగిరి కోర్టు ఆగ్రహంఈ నెల 10న (మంగళవారం) కొమ్మినేనిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద ఏ విధంగా కేసు నమోదు చేస్తారు? అంటూ గుంటూరు జిల్లా మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఆ సెక్షన్ను ఎందుకు పెట్టారని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డిబేట్లో అసలు ఎస్సీ, ఎస్టీల గురించి చర్చే జరగనప్పుడు ఆ చట్టం కింద కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆ సెక్షన్లు కొట్టి వేస్తున్నట్లు చెబుతూ.. మెమోలు జారీ చేస్తామని పోలీసులను హెచ్చరించారు. ఆపై కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు.ఇవాళ.. పోలీసులకు సుప్రీం కోర్టు మందలింపు కొమ్మినేని అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్పై శుక్రవారం(13 జూన్) సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ‘‘గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు టీవీ యాంకర్ కొమ్మినేని ఎలా బాధ్యులవుతారు?. నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా?.. అలాగైతే కేసు విచారణ సమయంలో చాలాసార్లు మేమూ నవ్వుతాం అని వ్యాఖ్యానించింది . వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం. -
శూర్పణఖగా ప్రియాంక అవుట్.. రకుల్తో డీల్?
ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో రామాయణ్ (Ramayan Movie) ఒకటి. రణ్బీర్ కపూర్ రాముడిగా, సౌత్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇదివరకే మొదలైంది. వచ్చే ఏడాది దీపావళికి తొలి భాగాన్ని, 2027లో రెండో భాగాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.ప్రియాంక అవుట్తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. రావణుడి చెల్లెలు శూర్పణఖ పాత్ర కోసం స్టార్ హీరోయిన్లను సంప్రదించారట! మొదట ఈ అవకాశం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను వరించిందట. కానీ, తన చేతిలో ఉన్న ప్రాజెక్టులతో ఆమె ఫుల్ బిజీగా ఉందట. దీంతో రామాయణ్ చిత్రయూనిట్.. ప్రియాంకను వదిలేసి రకుల్ ప్రీత్ సింగ్ను శూర్పణఖ పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం కావడం కంటే సంతోషం ఇంకేముంటుందని రకుల్ వెంటనే రామాయణ్కు ఓకే చెప్పినట్లు భోగట్టా!రామాయణ్..ఈ క్రమంలో ఆమెకు లుక్ టెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. రామాయణ్ విషయానికి వస్తే సన్నీ డియోల్ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయిగా కనిపించనున్నారు. ఇక ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం రాజమౌళి- మహేశ్బాబు (SSMB29) సినిమాతో బిజీగా ఉంది. అటు రకుల్.. చివరగా మేరే హజ్బెండ్ కీ బీవీ మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఇండియన్ 3, దేదే ప్యార్ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.చదవండి: కూతురి బర్త్డే సెలబ్రేట్ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా? -
ప్రశ్నించినందుకు! ఈడ్చుకెళ్లి, బేడీలేసి..
అమెరికా రాజకీయాల్లో ఓ ఘటన కలకలం రేపింది. కాలిఫోర్నియా సెనేటర్, డెమొక్రటిక్ సభ్యుడు అలెక్స్ పాడిల్లా(Alex Padilla)తో భద్రతా సిబ్బంది ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బలవంతంగా లాక్కెళ్లి మరీ ఆయన్ని నేల మీద పడుకోబెట్టి.. చేతులు వెనక్కి విరిచి బేడీలు వేశారు అధికారులు. అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం లాస్ ఏంజెల్స్లో హోంల్యాండ్ సెక్యూరిటీ(DHS) సెక్రటరీ క్రిస్టి నోయెమ్ ప్రెస్మీట్ నిర్వహించారు. గత వారం రోజులుగా అక్కడ వలసదారుల నిరసనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఎంత మంది వివరాలు సేకరించారో గణాంకాలను నోయెమ్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి ‘‘నా పేరు అలెక్స్ పాడిలా. సెనేటర్ని. సెక్రటరీకి నాదో ప్రశ్న అంటూ మాట్లాడబోయారు. ఇంతలో..URGENT BREAKING: Democrat US Senator Alex Padilla was just thrown to the ground and arrested for trying to speak at a DHS Press Conference by Secretary Kristi Noem. This is Trump’s America. This is so incredibly pathetic. I am so sad for the state of this country. pic.twitter.com/yI9fKdoYoW— Brian Krassenstein (@krassenstein) June 12, 2025అక్కడున్నన సిబ్బందిని ఆయన్ని బయటకు లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు, వాళ్ల మధ్య పెనుగులాట జరిగింది. అనంతరం.. ఎఫ్బీఐ సిబ్బంది ఆయన్ని బలవంతంగా నేల మీద పడుకోబెట్టి.. చేతులు వెనక్కి విరిచి.. బేడీలు వేసి అదుపులోకి తీసున్నారు. అయితే కాసేపటికే ఆయన్ని అధికారులు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.డీహెచ్ఎస్ ఈ చర్యలను సమర్థించుకుంది. పాడిల్లాను దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిగా భావించి అధికారులు అలా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. ఆయన చర్యను పొలిటికల్ డ్రామాగా అభిర్ణించింది. అయితే కాసేపటికే ఆయన్ని విడుదల చేశామని, నోయెమ్-పాడిల్లా 15 నిమిషాలపాటు భేటీ అయ్యారని ప్రకటించింది. మరోవైపు ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో కూడా తమ సిబ్బంది చర్యను వెనకేసుకొచ్చారు. ఈ ఘటనపై అలెక్స్ పాడిల్లా స్పందించారు. ఒక సెనేటర్ విషయంలోనే ఇలా జరిగితే.. సాధారణ వర్గాల ప్రజలతో ఇంకెలా వ్యవహరిస్తారో? అని నిలదీశారాయన. వలసవాదులతో ఎలా వ్యవహరిస్తున్నారో.. ఈ దేశ పౌరులతోనూ అలాగే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారాయన. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ట్రంప్ పాలనలో ఇలాంటి దుర్మార్గాలు కూడా మొదలయ్యాయ వ్యాఖ్యానిస్తున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, కమలా హారిస్, సెనేట్లో మైనారిటీ నేత చుక్ షూమర్ తదితరులు ఈ ఘటనను ఖండించారు. ఇంకోవైపు రిపబ్లికన్ పార్టీలోనూ ఈ ఘటనపై పలువురి నుంచి ప్రతికూల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించాల్సి ఉంది. -
సిల్క్ చీరలో సమంత.. ఇది 1930ల నాటి స్టైల్!
నటి సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu) సింపుల్ డిజైనర్ వేర్లో ట్రెండీగా కనిపిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడే తన స్టైలిష్ ఫోటోలను నెటిజన్లతో షేర్ చేసుకుంటారామె. అలానే ఈసారి పచ్చి మామిడకాయ లోపలి భాగం రంగులోని చీరలో తళుక్కుమ్మంది. ఆ సంప్రదాయ చీరలో స్టైలిష్గా కనిపిస్తున్న సమంత అనుసరించిన ఫ్యాషన్ శైలి 1930ల నాటిది. అంతేకాదండోయ్ నాటి గ్లామర్ స్టైల్కి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ చీర డిజైనింగ్ చెప్పే అర్థం చూస్తే షాకవ్వుతారు. ఇక్కడ సమంత రా మ్యాంగో శాటిన్ సిల్క్ చీరలో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. వావ్..! వాటే శారీ అనేలా ఉంది ఆమె లుక్. ఈ తాజా లుక్ 1920-30ల ఛానెల్ ఆర్డ్ డెకో శైలి అట. అంటే..ఇక్కడ సమంత ధరించిన చీర ఆర్ట్ డెకో ఉద్యమం నుంచి ప్రేరణ పొందిన డిజైన్. ఈ చీరపై కనిపించే బోల్డ్ లైన్లు, రేఖాగణిత నమునాలు, నిర్మాణ నైపుణ్యానికి సంబధించిన డిజైన్లో రూపొందిస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఆర్కిటెక్చర్కి సంబంధించిన గీతలే దర్శనమిస్తాయి. దీనిలో కనిపించే క్షితిజ సమాంతర రేఖలకు ప్రేరణ ఏరోడైనమిక్ డిజైన్ అని, ఇవి నాటికల్ అంశాలను కూడా నొక్కిచెబుతాయని అంటున్నారు ష్యాషన్ నిపుణులు. అయితే ఈ గీతలు, రేఖలు అన్ని చేతితో చేసిన ఎంబ్రాయిడరీ డిజైన్ అట. సున్నితమైన బంగారు జరీతో డిజైన్ చేస్తారట. చూడటానికి సాదాసీదాగా కనిపించే ఈ శారీని రిచ్లుక్లో ఉండి, రాచరికానికి అద్ధం పట్టే విలాసవంతమైన స్టైలిష్వేర్గా అభివర్ణిస్తారు ఫ్యాషన్ ప్రియులు. ఆ చీరకు తగ్గ మేకప్, చెవిపోగులు, కాక్టెయిల్ రింగ్తో తన రూపాన్ని అద్భుతంగా కనిపించేలా చేసింది సమంత. పాత ఫ్యాషన్కి సరికొత్త రూపమిచ్చేలా కొత్త ట్రెండ్ని సెట్ చేసేలా ఉంది సమంత వింటేజ్ ఆర్ట్ డెకో లుక్. చాలా సింపుల్గా కనిపిస్తున్న ఈ శాటిన్ సిల్క్ చీర ధర వచ్చేసి సుమారు రూ. 50 వేలు పైనే పలుకుతుందట. View this post on Instagram A post shared by RAW MANGO (@raw_mango) (చదవండి: ఎవరీ లీనా నాయర్? ఏకంగా బ్రిటిష్ అత్యున్నత గౌరవం..) -
ప్రపంచ టాప్ 20 ధనవంతుల జాబితాలో అంబానీ, అదానీకి చోటు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మరోసారి బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్లో తన సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతుల జాబితా ఉన్న ఈ సూచీలో ముఖేశ్ అంబానీ 17వ స్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ 20 స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఈ ఇండెక్స్లో టాప్లో టెస్లా సీఈఓ ఎలాన్మస్క్, తర్వాతి స్థానాల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, అమెజాన్ అధినేత జెఫ్బెజోస్ నిలిచారు.బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ 500 అత్యంత ధనవంతులు జాబితాలో ఇండియా నుంచి ముఖేశ్ అంబానీ(17వ స్థానం), గౌతమ్ అదానీ(20వ స్థానం), శివ్నాడార్(41వ స్థానం), షాపూర్ మిస్త్రీ(52వ స్థానం), సావిత్రి జిందాల్(59వ స్థానం), అజిమ్ప్రేమ్జీ(69వ స్థానం), సునిల్మిట్టల్(73 స్థానం), దిలీప్ సంఘ్వీ(79వ స్థానం), లక్ష్మీ మిట్టల్(86వ స్థానం)లు 100 స్థానాల్లోపు నిలిచారు.ఇదీ చదవండి: అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్బాక్స్’ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితా.. -
భారత వాయుసేన హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. వారంలో రెండోసారి..
ఛండీగఢ్: భారత వాయుసేనకి చెందిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో, పంజాబ్లోని పఠాన్కోట్లో ఆర్మీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. పంజాబ్లోని పఠాన్కోట్ (Pathankot)లో భారత వాయుసేన అపాచీ హెలికాప్టర్-M17 అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. నంగాల్పుర్ పరిధిలోని హాలెడ్ గ్రామంలో శుక్రవారం భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ అత్యవసరంగా దిగింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడిన కారణంగానే అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. JK: Air Force #Apache helicopter #M17 makes emergency landing in Pathankot....... pic.twitter.com/dQSNmP6NYa— Devesh , वनवासी (@Devesh81403955) June 13, 2025అయితే, వారం రోజుల వ్యవధిలో భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లు ఇలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం ఇది రెండోసారి. జూన్ 6న, ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ సమీపంలోని ఒక పొలంలో ఇలాగే వాయుసేన హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఈ ఘటనలో పైలట్లు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు చెప్పుకొచ్చారు. -
బాలయ్య మీసం ఊడింది..వీడియో వైరల్
సినిమా హీరోలు చాలా మంది విగ్గు పెట్టుకోవడం తెలిసిందే. పాత్రలకు తగినట్టు తమ అభిమానులను ఆకట్టుకొనేందుకు చాలా మంది విగ్గులు పెట్టుకొని నటిస్తుంటారు. అయితే రజనీకాంత్ లాంటి కొంతమంది హీరోలు ఇలాంటి విగ్గులు కేవలం సినిమాల వరకే పరిమితం చేస్తుంటారు. నిజ జీవితంలో వయసు తగ్గట్లుగా ప్రవర్తిసూ..సాధారణ వ్యక్తులాగానే జీవితాన్ని కొనసాగిస్తారు. మరికొంతమంది అయితే సినిమాల్లోనే కాదు..బయట కుడా విగ్లోనే తిరుగుతారు. వయసు మీద పడినా..అభిమానుల ముందు కుర్రాడిలా కనిపించేందుకు ఫేక్ మీసాలు.. విగ్గులు ధరిస్తుంటారు. అవి లేకుండా బయట కాలు కూడా పెట్టరు. అలాంటి నటుల్లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఒకరు. విగ్గు, పెట్టుడు మీసాలు లేకుండా ఆయన బయట తిరగలేరు.ఈ విషయం అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయకున్నది పెట్టుడే మీసాలే అన్న విషయం బయటకు వచ్చింది. ఓ స్టేజ్పై ఆయన మాట్లాడుతుండగా.. మూతికి అతికించుకున్న ఫేక్ మీసాలు ఊడిపోయాయి. అందరి ముందే గమ్ తెప్పించుకొని మీసాలు అతికించుకొని తన ప్రసంగాన్ని కొనసాగించాడు.నందమూరి బాలకృష్ణ ఇటీవల తన 65వ పుట్టిన రోజు(జూన్ 10)ని బసవతారకం ఆస్పత్రిలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరుకున్నాడు. కత్తిని గాల్లో తిప్పుతూ కేకు కట్ చేసి అభిమానులను అలరించాడు. అనంతరం ఆయన ఫ్యాన్స్ని ఉద్దేశించి మాట్లాడాడు. తన స్పీచ్లో ఎప్పటిలాగానే తన బ్లడ్ వేరు..బ్రీడ్ వేరు అని ఊదరగొట్టాడు. అయితే బాలయ్య ఇలా మాట్లాడుతన్న సమయంలో తన పెట్టుడు మీసం కాస్త ఊడిపోయింది. దీంతో కాస్త షాకయిన బాలయ్య.. వెంటనే తేరుకొని గమ్ ఇవ్వండంటూ సిబ్బందిపై గరం గరం అయ్యాడు.గమ్ ఇవ్వగానే వెనక్కి తిరిగి మీసాలను అతికించుకొని, మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ‘ఈ వయసులో విగ్గులు, పెట్టుడు మీసాలు అవసరమా?’, ‘మనదంతా ఓపెన్ బుక్ అని ప్రతిసారి చెప్పే బాలయ్య..ఇలా బయట ఫేక్ మీసాలు పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఏముంది?’, ‘సినిమాల్లో ఎలాగో తప్పదు.. నిజ జీవితంలో అయినా సహజంగా బతుకొచ్చు కదా?’ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.Papam Bulbul Balayya 😂😂😂Chusukovali kada Mental 😜🤡 pic.twitter.com/9Dqp6BNf20— We Love Chiranjeevi (@WeLoveMegastar) June 11, 2025బాలకృష్ణ గమ్ము గమ్ము అని అడుగుతుంటే ఎందుకబ్బా స్పీచ్ మధ్యలో bubblegum లేక chewing gum అడుగుతున్నాడని మొదట అర్థం కాలేదు తర్వాత అర్థమయింది 😁😁 pic.twitter.com/etuvYFQX5I— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) June 11, 2025 -
ప్రదీప్ రంగనాథన్ బిగ్ ప్లాన్.. మరో హిట్ గ్యారెంటీనా?
కోలీవుడ్లో 'కోమాలి' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ రంగనాథన్ ఎంట్రీలోనే అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత లవ్టుడే చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై తనే దర్శకత్వం వహించి సూపర్హిట్ కొట్టారు. ఇటీవల డ్రాగన్ చిత్రంలో హీరోగా నటించి సంచలన విజయాన్ని సాధించారు. ఇలా వరుసగా హీరోగా, దర్శకుడిగా విజయాలను అందుకున్న ప్రదీప్ ప్రస్తుతం విఘ్నేశ్శివన్ దర్శకత్వంలో ఎల్ఐకే చిత్రంతో పాటు కీర్తీవాసన్ దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న డ్యూడ్ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా తాజాగా మరో సారి ఈయన మెగాఫోన్ పట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీన్ని లవ్టుడే చిత్రాన్ని నిర్మించి సూపర్హిట్ కొట్టిన ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం మాత్రమే చేస్తారా లేక కథానాయకుడిగానూ నటిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తివివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అకాశం ఉంది. -
కొమ్మినేని కేసులో జరిగింది ఇదే..: పొన్నవోలు
సాక్షి, ఢిల్లీ: ఒక్క సాకుతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును జైలుపాలు చేశారని.. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని.. ఈ కేసులో సరిగ్గా ఇదే జరిగిందని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొమ్మినేని అరెస్ట్ అక్రమమని.. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు.‘‘మూడేళ్ల లోపు శిక్ష కలిగిన సెక్షన్లకు ఎలా అరెస్టు చేస్తారు?. గెస్ట్ చేసే వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు?. నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం అక్రమం. పాలక పక్షం మెప్పుకోసం పోలీసులు ప్రయత్నాలు మానుకోవాలి. సాక్షి మీడియా గొంతు నులమాలని చూస్తున్నారు. సాక్షి ఆఫీసులపైన దాడులకు దిగుతున్నారు. పోలీసులు కనీసం కేసులు పెట్టడం లేదు. ఈ అంశాలన్నీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చాం’’ అని పొన్నవోలు తెలిపారు. -
హైదరాబాద్-తిరుపతి వందే భారత్లో సాంకేతిక లోపం.. నిలిచిపోయిన రైలు
సాక్షి, నెల్లూరు: హైదరాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో, వందే భారత్ రైలు నెల్లూరులో నిలిచిపోయింది. వందే భారత్ రైలులో సాంకేతిక సమస్య కారణంగా దాదాపు 30 నిమిషాల పాటు నిలిపిపోయింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
'రాజాసాబ్' టీమ్ వార్నింగ్.. షేర్ చేస్తే కఠిన చర్యలు
ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా టీజర్.. ఈ నెల 16న రిలీజ్ చేస్తామని కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. దీంతో అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో అనుకోనిది జరిగింది. ఎవరో టీజర్ని లీక్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మూవీ టీమ్ అలెర్ట్ అయిపోయింది. హెచ్చరిస్తూ ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) 'రాజాసాబ్ కంటెంట్ ఎవరి సోషల్ మీడియాలోనైనా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అలానే అకౌంట్ సస్పెండ్ చేస్తాం. అందరూ మాకు సహకరిస్తారని అనుకుంటున్నాం' అని మూవీ టీమ్ ట్వీట్ చేసింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు కొన్నిరోజుల క్రితమే అనౌన్స్ చేశారు.హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటించారు. సంజయ్ దత్ విలన్గా చేశాడు. తమన్ సంగీతమందించాడు. ఇప్పటికే చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో రాబోయే టీజర్తో మూవీ కంటెంట్ ఏంటనేది క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: పులిలా నడవమని లోకేశ్ చెప్పేవాడు.. కమ్ముల మాత్రం: నాగార్జున)Strict action will be taken and handles will be suspended immediately if any leaked content from #TheRajaSaab is found….We request everyone to cooperate and stand with us in protecting the experience….Let’s celebrate responsibly. Be aware. ⚠️— The RajaSaab (@rajasaabmovie) June 13, 2025 -
కూతురి బర్త్డే సెలబ్రేట్ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?
సెలబ్రిటీలు అందం విషయంలో తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కావు. పిల్లల పక్కన నిల్చుంటే వారికి అక్కలానో, అన్నలానో ఉంటున్నారు తప్ప పేరెంట్స్లా మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న బ్యూటీ కూడా అంతే! ఇంతకీ కూతురి బర్త్డేకు కేక్ కట్ చేయించి తనకు ప్రేమగా తినిపిస్తున్న ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?ఫేమస్ సాంగ్..తెలుగులో ఓ ఫేమస్ పాటతో ఓ ఊపు ఊపేసింది. ప్రేమ.. ఓ ప్రేమ.. వచ్చావా ప్రేమ.. అనుకుంటేనే ఉన్నా రామ్మా.. అంటూ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆవిడే మహిమ చౌదరి (Mahima Chaudhry). శ్రీకాంత్, జగపతిబాబు నటించిన 'మనసులో మాట' సినిమాలోనిదే ఈ పాట. ఎక్కువగా హిందీ సినిమాలే చేసిన మహిమ 2016 తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. కానీ, 8 ఏళ్ల తర్వాత ద సిగ్నేచర్ అనే హిందీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది వచ్చిన ఎమర్జెన్సీ, నడానియన్ వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. కూతురి బర్త్డే..తన కూతురు అరియానా పుట్టినరోజు సెలబ్రేషన్స్ను అభిమానులతో పంచుకుంది. హ్యాపీ బర్త్డే మై బేబీ అని క్యాప్షన్ జోడించింది. ఇక ఈ వీడియోలో తల్లి చేతుల్ని పట్టుకుని నమస్కరించింది అరియానా. ఆ తర్వాతే క్యాండిల్స్ ఊది కేక్ కట్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. మహిమ అసలు తల్లిలా కాదు, ఆమెకు అక్కలా కనిపిస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు.అందమైన కూతురుఅరియానా ఇటీవలే తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తనను చాలా మంది అయితే హాలీవుడ్ నటి సెలీనా గోమెజ్తో లేదంటే పాతకాలం నాటి అమూల్ యాడ్లో కనిపించే అమాయకపు అమ్మాయితో పోలుస్తారు. షారూఖ్ ఖాన్ పర్దేశ్ సినిమాతో కెరీర్ ఆరంభించిన మహిమా 35కు పైగా సినిమాలు చేసింది. 2022లో రొమ్ము క్యాన్సర్ బారిన పడగా.. ఆత్మస్థైర్యంతో దాన్ని జయించింది. View this post on Instagram A post shared by Mahima Chaudhry (@mahimachaudhry1) చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు -
అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్బాక్స్’
విమానయానంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందులోని పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కాక్పిట్(పైలట్లు కుర్చునే ప్రదేశం) కమ్యూనికేషన్లను విశ్లేషించడం కీలకంగా మారుతుంది. ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలించేందుకు పరిశోధకులు కాక్పిట్ వాయిస్ రికార్డర్లు (సీవీఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్ల(ఎఫ్డీఆర్)పై ఆధారపడుతుంటారు. సాధారణంగా వీటిని బ్లాక్బాక్స్ అని పిలుస్తారు. పైలట్ తీసుకునే నిర్ణయాలు, సిస్టమ్ వైఫల్యాలు, అత్యవసర ప్రతిస్పందనలను విశ్లేషించడం ద్వారా విమానయాన నిపుణులు భవిష్యత్తులో భద్రతా ప్రోటోకాల్స్ను మెరుగుపరిచేందుకు వీలవుతుందనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ఘటనలోనూ బ్లాక్బాక్స్లోని వివరాలు కీలకంగా మారనున్నాయి. అయితే ప్రమాదం జరిగినచోట ఈ బ్లాక్బాక్స్ను ఇంకా గుర్తించాల్సి ఉంది.బ్లాక్బ్లాక్స్లోని వివరాల విశ్లేషణలో కీలక దశలుబ్లాక్బాక్స్ రికవరీప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి బ్లాక్బాక్స్ను ముందుగా రికవరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సీవీఆర్, ఎఫ్డీఆర్ పరికరాలు తీవ్రమైన మంటలతోపాటు ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా రూపొందిస్తారు. ఫోరెన్సిక్ బృందాలు తమ దర్యాప్తును ప్రారంభించడానికి కీలకమైన ఆడియో, ఫ్లైట్ డేటాను దీని నుంచి సేకరిస్తాయి.ఆడియో విశ్లేషణకాక్ పిట్ ఆడియోను ట్రాన్స్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రమాదం జరిగే ముందు వరకు సాగిన కమ్యునికేషన్ను విశ్లేషిస్తారు. కీలక క్షణాలను గుర్తించడానికి నిపుణులు పైలట్ సంభాషణలు, రేడియో ట్రాన్స్లేషన్లు, అలారం, ప్రమాద నేపథ్య శబ్దాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రమాద పరిస్థితుల్లో ఒత్తిడి స్థాయులు, కమాండ్ స్పష్టత, ప్రతిస్పందన సమయాన్ని వెల్లడిస్తుంది. ఇది సిబ్బంది సదరు పరిస్థితిని ఎలా నిర్వహించారో నిర్ణయించడానికి అవసరం అవుతుంది.ఎఫ్డీఆర్ నివేదికఫ్లైట్ డేటాతో కూడిన ఆడియో సింక్రనైజింగ్ ఎఫ్డీఆర్ రిపోర్ట్లో విమానం ఎత్తు, ఎయిర్ స్పీడ్, ఇంజిన్ పనితీరు, కంట్రోల్ ఇన్పుట్స్ వంటి పారామీటర్లు ఉంటాయి. నిబంధనల ప్రకారమే పైలట్ చర్యలు తీసుకున్నారా లేదా అనే వివరాలు ఇందులో ఉంటాయి. ప్రమాద పరిస్థితి ఎంత వేగంగా పెరిగిందో అంచనా వేయడానికి ఈ సింక్రనైజేషన్ తోడ్పడుతుంది.హెచ్చరికలు గుర్తించడంహెచ్చరిక సంకేతాలను గుర్తించడంలో సిబ్బంది ఎలా ప్రతిస్పందించారో అర్థం చేసుకోవడానికి ఈ బ్లాక్బాక్స్ ఉపయోగపడుతుంది. ఇంజిన్ ఫైర్ అలారంలు, అత్యవసర వ్యవస్థ యాక్టివేషన్తో సహా అగ్ని సంబంధిత వార్నింగ్లను విశ్లేషించేందుకు ఇది సాయం చేస్తుంది.సమన్వయాన్ని అంచనా వేయడంఅత్యవసర సమయంలో సిబ్బంది సమన్వయాన్ని అంచనా వేయడానికి పైలట్ కమ్యూనికేషన్ కీలకం. కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్ పనులను సరిగ్గా నిర్వర్తించారా.. నిబంధనలను పాటించారా.. అనే వివిధ అంశాలను పరిశీలిస్తారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి గ్రౌండ్ సిబ్బంది అందించిన కమ్యూనికేషన్లను, అత్యవసర ప్రకటనలను విమాన సిబ్బంది అనుసరించారా లేదా అని గమనిస్తారు.ఇదీ చదవండి: సోనా కామ్స్టర్ ఛైర్మన్ మృతిసిస్టమ్ వైఫల్యాలను పరిశీలించడంఒకవేళ విద్యుత్ లేదా మెకానికల్ లోపం వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లయితే సిస్టమ్ వైఫల్యాలను పరిశీలించేందుకు బ్లాక్బాక్స్ ఉపయోగపడుతుంది. అందులోని ఆన్బోర్డ్ సెన్సార్లు, మెయింటెనెన్స్ రికార్డ్లు కారణాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. డిజైన్ లోపాలు లేదా పట్టించుకోని భద్రతా సమస్యలు సంఘటనకు దోహదపడ్డాయా అని పరిశోధకులు అన్వేషిస్తారు. -
ఎవరీ లీనా నాయర్? ఏకంగా బ్రిటిష్ అత్యున్నత గౌరవం..
భారత సంతతి సీఈవో లీనా నాయర్కు బ్రిటన్ అత్యున్నత గౌరవం లభించింది. ఆమె ఛానెల్ సీఈవోగా రిటైల్ అండ్ వినియోగదారుల రంగంలో అత్యున్నతమైన నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. ఆ రంగంలో ఆమె అందించిన సేవలకు, కృషికి గానూ..యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవంతో సత్కరించింది. ఈ మేరకు ఛానెల్ గ్లోబెల ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లీనా నాయర్ను ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ విలియం కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)తో సత్కరించారు. ఈ కొత్తఏడాది 2025 గౌరవ పురస్కారాల జాబితాలో ఆమె ఈ అత్యున్నత గౌరవాన్ని దక్కించుకుంది. అంతేగాదు ఛానెల్ బ్రాండ్ లీనా శక్తిమంతమైన నాయకురాలిగా ప్రపంచఖ్యాతీ సంపాదించుకుందని ప్రశంసించింది. దీర్ఘకాలిక సమగ్ర వ్యాపార ప్రభావాన్ని అందించింది. తన బ్రాండ్ హవాను కొనసాగించడం, క్లయింట్ అనుభవాన్ని మెరుగుపరచడం,నిలకడగా సాగేలా వేగవంతం చేయడం వంటి సేవలను అందించిదని ఛానెల్ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కాగా భారతీయ వ్యాపార కార్యనిర్వాహకురాలిగి లీనా నాయర్ జనవరి 2022లో ఛానెల్లో బాధ్యతలు స్వీకరించారు. ఛానెల్లో ఆమెనే తొలి భాతర సంతతి మహిళా సీఈవో. తన నాయకత్వంలో ఛానెల్ బ్రాండ్కి మంచి గుర్తింపు లభించేలా కృషి చేసింది. వినియోగదారులను ఆకర్షించేలా గణనీయమైన పురోగతిని అందుకునేలా చేసింది. ముఖ్యంగా కంపెనీ ఫౌండేషన్కు గణనీయమైన ఆర్థిక సహాయం లభించేలా చేసింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 మిలియన్లకు పైగా మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూరుతుండటం విశేషం. ఇక ఆమె ఛానెల్లో చేరడాని కంటే ముందు..యూనిలీవర్లో కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్గా, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా సేవలందించారు. చివరగా లీనా స్వస్థలం భారత్లోని మహారాష్ట్రలోని కోల్హాపూర్. ఆమె బాల్యమంతా గడిచింది. ఉన్నత విద్య కోస యూకే వచ్చి అక్కడే సెటిల్ అయ్యారామె. (చదవండి: ఆన్లైన్ ఆర్థిక అక్షరాస్యత వేదిక 'ఫిన్ఈ') -
రోహిణి, రూపా బదిలీ
బొమ్మనహళ్లి: ఐఏఎస్ అధికారిణి డి.రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారిణి డి.రూపాతో పాటు పలువురు ఉన్నతాధికారులను సర్కారు బదిలీ చేసింది. ఇందులో రోహిణి, రూపా ఇద్దరు తగవులు పడుతూ కేసులు పెట్టుకోవడం తెలిసిందే.కర్ణాటకలో పలువురు అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్మెంటు బోర్డు ఎండీగా ఉన్న రూపాను బెంగళూరు మెట్రో పాలిటన్ టాస్క్ఫోర్స్ అదనపు డిజీపీగా బదిలీ చేశారు. రోహిణిని వ్యవసాయ శాఖ, ఆహార సంస్కరణల విభాగం కార్యదర్శి స్థానం నుంచి కార్మిక శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఎస్బీ శెట్టణ్నవర్ను బెళగావి స్థానిక కమిషనర్గా, అక్రం పాషాను ఆర్టీసీ ఎండీగా నియమించారు.వీరి మధ్య వివాదం ఇలా.. ఇదిలా ఉండగా.. ఒక మహిళా ఐఏఎస్.. ఒక మహిళా ఐపీఎస్ ల మధ్య ఎప్పుడో నాలుగేళ్ల క్రితం మొదలైన వివాదం నేటికి కొనసాగుతూనే ఉంది. కన్నడ నాట ఐఏఎస్ రోహిణి, ఐపీఎస్ రూపాల మధ్య సోషల్ మీడియా వేదికగా ఆరంభమైన రచ్చ కాస్తా గాలివానలా మారింది. ప్రస్తుతం వీరి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో వీరి వ్యవహారంపై కేసు కూడా నమోదైంది.ఈ కేసు విచారణలో భాగంగా 2021 జనవరి 15వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ వీరి మధ్య సంభాషణను భద్రపరిచాల్సిందిగా మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు భారతి ఎయిర్ టెల్- రిలయన్స్ జియోలకు ఆదేశాలిచ్చింది. తన వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలు పెట్టి పరువు భంగం వాటిల్లేలా చేసిన కారణంగా రూ. కోటి నష్టపరిహారం ఇవ్వాలని ఐఏఎస్ రోహిణి పట్టుబడుతోంది. ఇదే సమయంలో తమ ఇద్దరి మధ్య వివాదానికి సంబంధించి కాల్ డేటా రికార్డు(సీడీఆర్)ను ఒక్కసారి పరిశీలించాల్సిందిగా ఐపీఎస్ రూపా మెజిస్ట్రేట్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ కేసు విచారణ బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు ముందుకు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన మెజిస్ట్రేట్ కోర్టు.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి కాల్ డేటా రికార్డును భద్రపరిచి ఉంచాల్సిందిగా ఇరు టెలికాం సర్వీసులకు ఆదేశాలిచ్చింది.ఐపీఎస్ రూపా విచారణకు హాజరుకాకుండా జాప్యం చేస్తున్న కారణంగా ఆమెను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రక్రియను నిలిపివేయాలంటూ ఐఏఎస్ రోహిణి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో తమ మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని కాల్ డేటా ఆధారంగా పరిశీలించాలని రూపా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో 2021 జనవరి 15వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ తమ మధ్య సాగిన సంభాషణను పరిశీలించాలని కోరుతూ, ఆ మేరకు టెలికాం సంస్థలకు ఆదేశాలివ్వాలని రూపా డి పేర్కొంది. దాంతో ఈ నెల ఆరంభంలో విచారణ చేపట్టిన బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు.. తాజాగా వారి మధ్య సాగిన సంభాషణ కాల్ డేటా రికార్డును పొందుపరచాల్సిందిగా సదరు టెలికాం సంస్థలకు ఆదేశాల్లో పేర్కొంది.రాజీ కుదరలేదు..!వీరి మధ్య చోటు చేసుకున్న వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి స్టేను కూడా విదించింది సుప్రీంకోర్టు. అయితే వీరి మధ్య పరస్పర అంగీకారం కుదరకపోవడంతో ఆ కేసుపై అప్పటివరకూ కొనసాగిన స్టేను గతేడాది సుప్రీంకోర్టు ఎత్తివేసింది. కాగా, సుమారు రెండేళ్ల క్రితంఐఏఎస్ రోహిణికి వ్యతిరేకంగా ఐపీఎస్ రూపా ఫేస్బుక్లో తీవ్ర విమర్శలతో పలు పోస్ట్లు చేశారు. అందులో రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్ చేసి ఆమె పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని పలు ఆరోపణలను గుప్పించారు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలా కోర్టుల వరకూ వెళ్లిన కేసు నేటికి పరిష్కారం దొరకలేదు. తన పరువుకు భంగం వాటిల్లేలా చేసినందుకు కోటి రూపాయిలు నష్ట పరిహారం ఇవ్వాల్సిందేనని ఐఏఎస్ రోహిణి పట్టుబడుతుండగా, అసలు వివాదానికి కారణం ఏమిటో ఒక్కసారి కాల్ డేటా రికార్డును పరిశీలిస్తే తెలుస్తుందని రూపా అంటున్నారు. -
పులిలా నడవమని లోకేశ్ చెప్పేవాడు.. కమ్ముల మాత్రం: నాగార్జున
నాగార్జున హీరోగా కొత్త సినిమాలు చేయక చాన్నాళ్లయింది. అలా అని ఖాళీగా ఏం లేడు. కూలీ, కుబేర చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. ఇదివరకే వీటికి సంబంధించిన లుక్స్, గ్లింప్స్ వీడియోలు రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు మూవీస్తో నాగ్ సరికొత్తగా కనిపించబోతున్నాడనే హింట్ అయితే వచ్చేసింది. త్వరలో ఈ రెండు మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ క్రమంలోనే నాగ్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. ఓ ఇంటర్వ్యూల మాట్లాడుతూ ఈ రెండు చిత్రాలు, దర్శకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'కూలీ' సినిమాలో రజినీకాంత్ హీరో. లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. కొన్నిరోజుల క్రితం చిన్న వీడియో లాంటిది రిలీజ్ చేశాడు. ఇందులో నాగార్జునని వెనక వైపు నుంచి చూపించారు. అలా కొన్ని సెకన్లపాటు కనిపించిన ఈ వీడియో స్టైలిష్గా ఉండేసరికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో నాగ్.. సైమన్ అనే ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన నాగ్.. 'లోకేశ్ ఎప్పుడు పులిలా నడవమని అనేవాడు. మిమ్మల్ని చూస్తే ప్రేక్షకులు భయపడాలి సర్ అనేవాడు' అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా)అదే టైంలో 'కుబేర' తీసిన దర్శకుడు శేఖర్ కమ్ముల మాత్రం 'మీరు హీరోలా నడుస్తున్నారు. కొంచెం తగ్గించండి' అని చెప్పేవాడు. వీళ్లిద్దరికీ అదే తేడా. కూలీ విషయానికొస్తే.. 'లోకేశ్ నన్ను చాలా అద్భుతంగా చూపించాడు. నన్ను నేను అలానే చూడాలనుకున్నాను. సినిమా చూస్తున్నంతసేపు విజిల్స్ వేస్తూనే ఉంటారు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఎన్నో సక్సెస్లు చూశాను. మూవీ కలెక్షన్స్ నాకు ముఖ్యం కాదు' అని నాగార్జున చెప్పుకొచ్చాడు.రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ 'కూలీ' మూవీ.. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. తెలుగులోనూ ఈ చిత్రానికి భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర' సినిమా.. ఈనెల 20న అంటే వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఇందులో ధనుష్, రష్మిక హీరోహీరోయిన్లు కాగా.. నాగ్ కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు మూవీస్ హిట్ అయితే గనక నాగార్జునని ఇలా మరిన్ని సినిమాల్లో డిఫరెంట్ రోల్స్లో చూడొచ్చేమో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) #Nagarjuna: Coolie Vs Kubera #Coolie: Lokesh is larger than life Filmmaker🔥. Loki says Walk in like a Tiger, people should scared with ur Look🐯👿#Kubera: Sekhar is very realistic filmmaker🫶. Director says you are waking like a Hero bring it down😀 pic.twitter.com/lVkVCkYE1r— AmuthaBharathi (@CinemaWithAB) June 13, 2025 -
సంజయ్ మరణానికి కారణం ఓ తేనెటీగ : వైద్యులు ఎంత శ్రమించినా.!
అహ్మదాబాద్లో జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్నో కంపెనీల్లో అంతులేని శోకాన్ని నింపింది. ఒక్కో కుటుంబానికి ఒక్కో విషాద గాథ. ఎన్నో ఆశలతో విమానం ఎక్కిన వందలమంది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఇలా ఉండగానే బిజినెస్ ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. సోనా కామ్స్టార్కు చెందిన ఉంజయ్ కపూర్ అకస్మాత్తుగా కన్నుమూశారు. విమాన ప్రమాదంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన కొన్ని గంటల తరువాత గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. అయితే ఆయన మరణం ఎలా జరిగిందో తెలిస్తే షాకవ్వక మానరు. మరణం ఎటువైపు ఎలా ముంచుకు వస్తుందో తెలియదు అనడానికి ఈ సంజయ్ మరణం నిదర్శనంగా నిలుస్తోంది. పోలో క్రీడలో ప్రసిద్ధుడు, వ్యాపారవేత్త బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్, 53 ఏళ్ల వయసులో గుండెపోటుతో యునైటెడ్ కింగ్డమ్లో మరణించారు. పోలో ఆడుతున్నప్పుడు, ఒక తేనెటీగ సంజయ్ నోటిలోకి దూరిపోయింది. పొరపాటున దాన్ని మింగడంతో అది గుండెపోటుకు దారితీసిందని చెబుతున్నారు. తక్షణమే వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని. నిపుణులు కూడా పరిస్థితిని పరిష్కరించలేకపోయారట.భారతదేశ ఆటోమోటివ్ రంగంలో ప్రముఖ వ్యాపారవేత్త, కపూర్ ఆటోమోటివ్ మార్గదర్శకుడు సురీందర్ కపూర్ కుమారుడు సోనా కామ్స్టార్ చైర్మన్ సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం బిజినెస్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎయిరిండియా ప్రమాదంపై తన విచారాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అంతలోనే ఆయన కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.ప్రమాదంపై ఆయన ట్వీట్ అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై కపూర్ సోషల్ మీడియా ద్వారా విచారం వ్యక్తం చేశారు. "అహ్మదాబాద్లో జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా ప్రమాదం భయంకరమైన వార్త. బాధిత కుటుంబాలందరికీ నా సానుభతి. ఈ క్లిష్ట సమయంలో ధైర్యాన్ని, శక్తిని పొందాలని కోరుకుంటున్నాను"ఎవరీ సంజయ్ కపూర్గురుగ్రామ్లో ఉన్న ప్రముఖ ప్రపంచ ఆటో విడిభాగాల తయారీదారు సోనా కామ్స్టార్ అధినేత సంజయ్ కపూర్. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ACMA) అధ్యక్షుడిగా కూడా పనిచేశారు . అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) తయారీ మండలికి సహ-అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తాను చదువుకున్న డెహ్రాడూన్లోని ది డూన్ స్కూల్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. బకింగ్హామ్ విశ్వవిద్యాలయం నుండి HRలో BBA పూర్తి చేసిన తరువాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఓనర్-ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్లో చేరారు. సంజయ్ 2003లో తన తండ్రి కంపెనీలో పగ్గాలు చేపపట్టి ప్రపంచ బ్రాండ్గా దాన్ని తీర్చిదిద్దారు. సోనా కామ్స్టార్ అనే కంపెనీకి సంజయ్ ఛైర్మన్గా ఉన్నారు. -
ఎలా బతికానో కూడా తెలియదు
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మొత్తం 265 మందికి(ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారం) మరణించారు. విమానం నుంచి ప్రాణాలతో బయటపడింది రమేష్ ఒక్కడే. ప్రస్తుతం సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రధాని మోదీ పరామర్శించి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. మరికొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ఆయన నుంచి వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. .. ‘‘నమ్మలేకపోతున్నా.. ఎలా బతికానో కూడా తెలియట్లేదు’’ అంటూ అతను చెబుతున్నాడు. విమానంలో 11ఏ సీట్లో కూర్చున్న రమేష్.. ఎమర్జెన్సీ విండో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారంటూ తొలుత పోలీసులు చెప్పారు. అతని సోదరుడు ధీరేంద్ర సోమ్బాయ్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే రమేష్ మాత్రం జరిగింది అది కాదని స్పష్టత ఇచ్చారు. అంతా క్షణాల్లో జరిగిపోయిందని, తమ విమానం నేలకూలుతుందన్న విషయం తనకు అర్థమైంది. ఆ వెంటనే విమానం కిందకు వచ్చి ముక్కలై.. పేలిపోయిందని.. ప్రమాద క్షణాలను గుర్తు చేసుకున్నారు.40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ అయిన విశ్వాష్ కుమార్ రమేష్.. ఏదో అద్భుతం జరిగినట్లే ప్రమాదం నుంచి బయటడ్డారు. ప్రమాద సమయంలో విమానం నేలను తాకి రెండు ముక్కలైంది. ఆ సమయంలో సీటు ఎగిరి కాస్త దూరం పడిపోయింది. ఈ క్రమంలోనే నాకు గాయాలయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో అసలు ఎలా బతికానో కూడా తెలియదు అని రమేష్ ప్రధాని మోదీ సహా తనను పలకరించిన వారికల్లా చెబుతున్నాడు.‘‘ప్రమాదం జరిగాక నేను బతకడం కష్టమనే అనుకున్నా. అయితే నా సీటు దగ్గర్లో విమాన ప్రధాన భాగం ఉందని కనిపించింది. అక్కడ కొంచెం సందు కనిపించింది. నా సీటు బెల్ట్ను నెమ్మదిగా తొలగించి.. పాకుంటూ బయటకు వచ్చా. నా చుట్టుపక్కల వాళ్లలో కొందరు చనిపోయి ఉన్నారు. కొందరికి ఊపిరి ఆగిపోతున్న పరిస్థితి. అది చూశాక.. ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కాలేదు. బయటకు వచ్చాక.. విమానం పేలిపోయిందని ఏదో భాషలో(గుజరాతీ) అంతా అరుస్తున్నారు. ఆ గందరగోళ వాతావరణంలోనే నడుచుకుంటూ వచ్చి ఆంబులెన్స్ ఎక్కాను’’ అని రమేష్ తెలిపారు. ప్రస్తుతం కోలుకుంటున్న రమేష్ను.. త్వరలో పోలీసులు, దర్యాప్తు కమిటీ ప్రశ్నించే అవకాశం ఉంది. -
ఆ సీటులో ఉంటే భద్రమేనా?
అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. విమానంలో 11ఏ సీటులో కూర్చున్న రమేశ్ క్షేమంగా బయటపడ్డాడు. బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానంలో ఈ సీటు ఎకానమీ క్లాస్ కేబిన్లో మొదటి వరుసలో ఉంటుంది. విమానంలో కుడి పక్కన రెక్కల కంటే రెండు వరుసల ముందు కిటికీ పక్కనే ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి ఉద్దేశించిన ఎమర్జెన్సీ డోరు వెనుకే 11ఏ సీటు ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో కూర్చోవడం రమేశ్ ప్రాణాలతో బయటపడడానికి కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. 11ఏ సీటు (Seat 11A) సురక్షితమని భావిస్తున్నారు.హాట్లైన్ నెంబర్మరోవైపు విమాన ప్రమాదంతోపాటు మృతులకు సంబంధించిన సమాచారం అందించడానికి ఎయిర్ ఇండియా సంస్థ 1800 5691 444 హాట్లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. విదేశీయుల కోసం +91 8062779200 నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.విమానం కొత్తదే! న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో గురువారం కుప్పకూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం మరీ పాతదేమీ కాదని ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఈ విమానం 2013లో సేవలు ప్రారంభించిందని వెల్లడించారు. 12 సంవత్సరాల నుంచి ఇది వాణిజ్య సేవలు అందిస్తోంది. పౌర విమానయాన రంగంలో 12 సంవత్సరాలు అంటే దాదాపు కొత్త విమానం కిందే లెక్క అని నిపుణులు తెలిపారు. ఈ విమానం వీటీ–ఏఎన్బీ పేరుతో రిజిస్టర్ అయ్యింది. ఎయిర్ ఇండియా సంస్థ వద్ద ఉన్న బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ రకానికి చెందిన 27 విమానాల్లో ఇదీ ఒకటి. ఈ రకానికి చెందిన ఒక విమానం ప్రమాదంలో పూర్తిగా ధ్వంసం కావటం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. 2020లో కాసరగోడ్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కూలిపోయిన ఘటన తర్వాత దేశంలో అతిపెద్ద విమాన ప్రమాదం కూడా ఇదే.చదవండి: నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే.. -
కొమ్మినేనికి ఊరట.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు(Kommineni Srinivasa Rao)కు భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సాక్షి చానెల్ డిబేట్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై గుంటూరు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే..కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమమంటూ దాఖలైన పిటిషన్ను ఇవాళ జస్టిస్ పీకే మిశ్రా, జస్టిన్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘టీవీ డిబేట్లో నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా?. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం?. ఆయన్ని వెంటనే విడుదల చేయండి. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలి. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుంది’’ అని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్లోని ముఖ్యాంశాలు:కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేశారు. మూడేళ్ల లోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. నోటీసు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదు. కేఎస్సార్ లైవ్ షో లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు.. యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు?. అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్ను కేఎస్ఆర్ నియంత్రించారు . వాటిని సమర్థించలేదు. తెలంగాణలో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో.. అదీ ఆంధ్రప్రదేశ్లో రిమాండ్ చేశారు. పైగా ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోలేదు. కొమ్మినేని సీనియర్ జర్నలిస్టు. ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదు.పైగా 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్. కొమ్మినేని దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున న్యాయవాదిని అనుమతించలేదు. సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం . ఈ కేసులో పోలీసులు ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21 ,22(1)ను ఉల్లంఘించారు. ప్రజాస్వామ్య నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాక్ స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్నారు. అక్రమ అరెస్టుతో ఆయన జీవించే హక్కుకు భంగం కలిగింది’’ అని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది. -
తెలుగు నిర్మాతపై కాస్టింగ్ కౌచ్ కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన నటి
ఈ ఏడాది ప్రారంభంలో ‘దంగల్’ నటి ఫాతిమా సనా షేక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దక్షిణ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డానని చెప్పింది. హైదరాబాద్కు చెందిన కొందరు ఏజెంట్లు ఛాన్స్లు ఇప్పిస్తానంటూనే 'ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారా..?' అని అడిగినట్లు తెలిపింది. ఆపై కొందరు టాలీవుడ్ నిర్మాతలు కూడా తనని పరోక్షంగా అలాంటి ప్రశ్నలే వేశారని చెప్పింది. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేగాయి. అయితే, తాజాగా మరోసారి ఫాతిమా రియాక్ట్ అయ్యారు.దక్షిణాదిలో తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు గతంలో చెప్పిన మాటలు నిజమేనని మరోసారి 'దంగల్' నటి ఫాతిమా పేర్కొంది. కానీ, తను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారని తెలిపింది. ఒక వ్యక్తి వల్ల మాత్రమే తాను ఇబ్బంది ఎదుర్కొన్నానని క్లారిటీ ఇచ్చింది. అతను ఒక ఏజెంట్ కావచ్చు లేదా చిన్న నిర్మాత కావచ్చని చెప్పింది. కానీ, దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తాను తప్పుపట్టలేదని స్పష్టత ఇచ్చింది. ఒకరి గురించి చెప్పిన మాటలను కొందరు అదేపనిగా అక్కడి పరిశ్రమ మొత్తాన్ని ఆపాదిస్తూ ప్రచారం చేయడం చాలా తప్పని పేర్కొంది. ' కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి పరిశ్రమలో ఉంది. అనేక రంగాలలో కూడా ఇలాంటి వాతావరణమే ఉంది. దారి వెంట వెళ్తున్న ఒక స్త్రీని అదేపనిగా చూస్తూ ఆమెను తప్పుగ చూసే వారు ఎందరో ఉన్నారు. వాటిని దాటుకుని నేటి మహిళ ముందుకు వెళ్తుంది.' అని ఆమె చెప్పింది.ఫాతిమా గతంలో ఏం చెప్పిందంటే..అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీతో నటి ఫాతిమాకు మంచి గుర్తింపు వచ్చింది. గీతా ఫోగట్ పాత్రలో ఆమె అదరగొట్టేసింది. 2015లో ఆమె తెలుగులో నటించిన ‘నువ్వు నేను ఒకటవుదాం’ చిత్రం విడుదలైంది. ఆ మూవీ తర్వత మరో సినిమా చేస్తున్న క్రమంలోనే ఒక నిర్మాత నుంచి కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు గతంలో ఇలా చెప్పింది. ' హైదరాబాద్లో నేను చిన్నస్థాయి నిర్మాతలను కలుసుకున్నాను. ఒక హౌటల్లో దిగాను. ఆ నిర్మాతలు కాస్టింగ్ కౌచ్ గురించి నాతో మాట్లాడారు. నీకు అవకాశం ఇవ్వాలంటే మేము చెప్పిందల్లా చేయాలని అన్నాడు. నేను కాదని చెప్పడంతో ఆ నిర్మాత నన్ను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. చాలా అసభ్యకరంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి పచ్చిగానే అడిగేశాడు. ఇంకోకరు అదే విషయాన్ని డైరెక్ట్గా చెప్పకపోయినా.. వారు చెప్పినదాని అర్థం ఏమిటో స్పష్టంగా అర్థమైంది. ఒకప్పుడు బాలీవుడ్లో మంచి పాత్రలు రావడానికి సౌత్ సినిమా మొదటి అడుగు అని తాను నమ్ముతాను. కానీ, నాకు ఇలా జరుగుతుందని అనుకోలేదు.' అని ఆమె గతంలో వెల్లడించింది. -
41 కాదు 24 ఏళ్లే : వయసు తగ్గించుకున్న లండన్ డాక్టర్ సీక్రెట్ ఇదే!
ఆధునిక కాలంలో బరువును తగ్గించుకోవడం కాదు.. వయసును తగ్గించుకోవడం ట్రెండ్గా మారింది. ఈ విషయంలో లండన్కు చెందిన 41 ఏళ్ల వైద్యుడు వార్తల్లో నిలుస్తున్నాడు. తన అసలు వయసుతో తెలిస్తే జీవసంబంధమైన వయస్సు 24 సంవత్సరాలు అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ డాక్టర్ స్టోరీ నెట్టింట సందడిగా మారింది. పదండి మరి ఆ వివరాలుతెలుసుకుందాం.మిలియనీర్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్, ప్రాజెక్ట్ బ్లూప్రింట్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తన వయసును తగ్గించుకోవడంలో విజయవంతమయ్యాడు. తాజాగా లండన్కు చెందిన Hum2n longevity క్లినిక్ వ్యవస్థాపకుడు 41 ఏళ్ల డాక్టర్ ఎనాయత్ తన క్రోనోలాజికల్ ఏజ్ కంటే బయో ఏజ్ 24 సంవత్సరాలని ప్రకటించుకున్నాడు. 18 నెలల క్రితం తీసుకున్న పరీక్షల ఆధారంగా తన వయస్సు 17 సంవత్సరాలు తగ్గిందని తెలిపాడు. ఇందుకోసం డాక్టర్ ఎనాయత్ ఏడేళ్లుగా ఔరా రింగ్, హూప్ స్ట్రాప్ వంటి పరికరాల ద్వారా క్రమం తప్పకుండా రక్తం, మూత్రం, మైక్రోబయోమ్ పరీక్షలతో పాటు తన ఆరోగ్యాన్ని నిత్యం పరిశీలించుకున్నాడు. ఫలితాల ఆధారంగా అతను సప్లిమెంట్లతో సహా ఆయుష్సును పెంచే జీవన శైలిని పాటించాడు. ప్రధాంగా బీకాంప్లెక్స్, ఫోలేట్, మెగ్నీషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల వంటి సప్లిమెంట్లు తన బయో ఏజ్ను తగ్గించాయని చెప్పడం గమనార్హం. "ఈ సప్లిమెంట్లు నా జీవసంబంధమైన వయస్సు వెనక్కి మళ్లడానికి మద్దతు ఇచ్చాయని బిజినెస్ ఇన్సైడర్తో అన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..విటమిన్ బి కాంప్లెక్స్మిథైలేషన్ జన్యు లోపం కారణంగా హోమోసిస్టీన్ స్థాయిలు పెరగడం వల్ల రక్తం గడ్డకట్టడం, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. ఇవి ఈ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణంగా, డైటీషియన్లు ఆహారం ద్వారా పోషకాలను పొందాలని, కొన్ని పోషకమైన ఆహారాలు లోపం లేదా తీసుకోలేక పోవడం వంటి సందర్భాలలో అవసరమైనప్పుడు మాత్రమే వాటిని తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. చేపలు, పౌల్ట్రీ, చిక్కుళ్ళు ,ఆకుకూరలు వంటి బి విటమిన్లు అధికంగా ఉన్న ఆహారాలు హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.అయితే బీవిటమిన్లు మెరుగైన మానసిక స్థితి, చిత్తవైకల్య నివారణకు అనుసంధానించబడి ఉండవచ్చు, కానీ ఈ ఫలితాలను నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరంఅంటున్నారు నిపుణులు."మిథైలేషన్-సంబంధిత జన్యు లోపం లేకుండా కూడా, ముఖ్యంగా అధిక ఒత్తిడి, పేలవమైన నిద్ర లేదా ఇంటెన్సివ్ శిక్షణ కాలంలో మిథైలేటెడ్ బి కాంప్లెక్స్ తీసుకోవడాన్ని నేను ఇప్పటికీ పరిశీలిస్తాను, ఎందుకంటే ఇవి బి విటమిన్ల డిమాండ్ను పెంచుతాయి" అని డాక్టర్ ఎనాయత్ అన్నారు.మెగ్నీషియండాక్టర్ ఎనాయత్ ఆహారం తీసుకోవడం ద్వారా సహజంగా తక్కువ మెగ్నీషియం స్థాయిలు ఉన్నందున మెగ్నీషియం బిస్గ్లైసినేట్ తీసుకుంటాడు. మెరుగైన శోషణ కోసం, దాని స్థాయిలను పెంచడానికి సహాయ పడేలా దీన్ని ఎంపిక చేసుకున్నాడు. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, కండరాల పనితీరుకు మెగ్నీషియం చాలా అవసరం. చిక్కుళ్ళు, ఆకుకూరల్లో ఇది లభిస్తుంది.మెగ్నీషియం తీసుకోవడం కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుందని, నిద్రను మెరుగు పరుస్తుందని, తద్వారా తాను చాలా సులభంగా నిద్రపోతానని డాక్టర్ ఎకాయత్ చెప్పారు.ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు డాక్టర్ ఎనాయత్ ప్రతిరోజూ ఒమేగా-3 సప్లిమెంట్ తీసుకుంటాడు. చేపలు, వాల్నట్లు, చియా విత్తనాలలో లభించే ఒమేగా-3లు గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. వాపును, రక్తపోటును తగ్గిస్తాయి. కొవ్వు చేపలను వారానికొకసారి తినడం హృదయ సంబంధ వ్యాధుల నుండి రక్షించడానికి నిరూపించబడినప్పటికీ, సప్లిమెంట్ రూపం ప్రయోజనాలు అంత స్పష్టంగా లేవు. అయితే, కొన్ని పరిశోధనలు ఒమేగా-3 సప్లిమెంట్లు యాంటీ-ఏజింగ్ ప్రభావాలను కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఇటీవలి అధ్యయనంలో ఒమేగా-3లు రోజూ తీసుకున్న పాల్గొనేవారు తక్కువ జీవసంబంధమైన వయస్సు తగ్గినట్టు గుర్తించారు. నోట్: ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే పోషకమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర, ఒత్తిడి నిర్వహణ బయోలాజికల్ ఏజ్ను తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ ఇలాంటి ప్రయోగాలు చేసేటపుడు నిపుణుల పర్యవేక్షణచాలా అవసరం అని గుర్తించాలి. -
అండర్ వేర్లో క్రికెట్ అడిన స్టార్ హీరో.. ట్రోల్స్పై ఫన్నీ రిప్లై!
బాలీవుడ్ స్టార్ హీరో క్రికెట్ ఆడితే.. అందరూ అతన్ని ట్రోల్ చేస్తున్నారు. అదేంటి క్రికెట్ ఆడితే తప్పేంటి? హీరోలు క్రికెట్ ఆడోద్దా ఏంటి? అంటారా? ఆ హీరో ఆటని ఎవరు తప్పుపట్టడం లేదు. ఆ ఆట ఆడేందుకు వేసుకొచ్చిన దుస్తులపైనే అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బంతి-బ్యాట్ ఆట ఆడేందుకు అండర్వేర్ ధరించి గ్రౌండ్లోకి వచ్చాడు. దానికి సంబంధించిన వీడియోని సదరు హీరోనే ఇన్స్టాలో షేర్ చేయగా.. అదికాస్త వైరల్ అయి అతన్ని ట్రోలింగ్కి గురి చేసింది. ఆ హీరో ఎవరో కాదు.. తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్న టైగర్ ష్రాఫ్. 2014లో వచ్చిన హీరోపంతి సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు టైగర్ ష్రాఫ్. ఈ సినిమా అల్లు అర్జున్ నటించిన పరుగు చిత్రానికి బాలీవుడ్ రీమేక్. ఇక ఈ సినిమా తర్వాత బాఘీ, బాఘీ2 వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరో రేంజ్కు వెళ్లిపోయాడు. తాజాగా ఈ యంగ్ హీరో, అక్షయ్ కుమార్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యలతో కలిసి క్రికెట్ ఆడాడు. అయితే ఆ సమయంలో టైగర్ కేవలం అండర్వేర్ మాత్రమే ధరించాడు. తన బాడీని ఎక్స్పోజ్ చేస్తూ క్రికెట్ ఆడాడు. ఆ వీడియోని ఇన్స్టాలో షేర్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. ఈ వీడియోలో అక్షయ్ కుమార్, గణేష్ ఆచార్యలతో కలిసి బీచ్లో క్రికెట్ ఆడుతూ కనిపించాడు. అయితే, టైగర్ ఒక్కడే అండర్వేర్లో ఆడటంతో నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేసి, ట్రోల్ చేశారు. "చెడ్డీ ప్రీమియర్ లీగ్", "ఊర్ఫీ జావేద్ మేల్ వెర్షన్" అంటూ కామెంట్స్ చేశారు. కొందరు అతని ఫిట్నెస్ను ప్రశంసించినప్పటికీ, చాలామంది అతన్ని విమర్శించారు. తాజాగా ఈ ట్రోల్స్పై టైగర్ ష్రాఫ్ స్పందిస్తూ మరో వీడియోని ఇన్స్టాలో షేర్ చేశాడు. అందులో ఈ సారి ట్రాక్ ప్యాంట్ వేసుకొని క్రికెట్ ఆడుతున్నాడు. ఈ వీడియోని షేర్ చేస్తూ.. ‘ట్రాక్ ప్యాంట్లోనూ అదే స్థితి’ అని కాస్త ఫన్నీగా రాసుకొచాడు. ఇక టైగర్ ష్రాఫ్ కెరీర్ విషయానికొస్తే.. ఈ మధ్య ఆయనకు సరైన హిట్ పడలేదు. ఆయన చివరగా నటించిన సింగం అగైన్, బడే మియాన్ చోటే మియాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ప్రస్తుతం బాఘీ4 చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) -
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, ఢిల్లీ: అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలో మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, ఎయిర్ ఇండియా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా AI-379 విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. బెదిరింపు కాల్ అనంతరం, ప్రయాణికులను విమానం నుంచి కిందకు దింపేసి.. విమానంలో తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.BIG BREAKING NEWS 🚨 Air India flight AI 379 makes emergency landing in Thailand after bomb threat. Thailand Official said "Passengers being escorted from the plane, flight AI 379, in line with emergency plans"There were 156 passengers on the flight, and the bomb threat was… pic.twitter.com/ollnR7ltxa— Times Algebra (@TimesAlgebraIND) June 13, 2025 -
ఐదు రోజుల్లో మూడు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన కెనడా స్విమ్మర్
విక్టోరియా: కెనడా స్టార్ స్విమ్మర్ సమ్మర్ మెకింటోష్ మరో ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొనే కెనడా జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్లో 18 ఏళ్ల మెకింటోష్ ఐదు రోజుల వ్యవధిలో మూడో ప్రపంచ రికార్డు తిరగరాసింది. బుధవారం జరిగిన 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ రేసులో 4 నిమిషాల 23.65 సెకన్లలో లక్ష్యాన్ని చేరి తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును (4 నిమిషాల 24.38 సెకన్లు) తిరగరాసింది.గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన మెకింటోష్... వచ్చే నెలలో సింగపూర్ వేదికగా జరగనున్న ప్రపంచ అక్వాటిక్స్ చాంపియన్షిప్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ ట్రయల్స్లో భాగంగా ఇప్పటికే మెకింటోష్ 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ, 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగాలలో రెండు ప్రపంచ రికార్డులు సృష్టించింది. ‘పోటీకి ముందే ఏదో ప్రత్యేకంగా చేస్తానని అనుకున్నా. నా కెరీర్లో ఇది అత్యుత్తమ టోర్నీ. ప్రపంచ రికార్డులు నమోదయ్యేవి బద్దలవడానికే. కొలనుకు వీడ్కోలు చెప్పేంతవరకు వాటిపై నా పేరే ఉండే విధంగా చూసుకుంటా’ అని మెకింటోష్ పేర్కొంది. -
సోనా కామ్స్టర్ ఛైర్మన్ మృతి
ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సుంజయ్ కపూర్(53) జూన్ 12, 2025న యూకేలో పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణంపట్ల పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. సోనా బీఎల్డబ్ల్యూ కామ్స్టర్ సంస్థ(ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.31,073 కోట్లు)కు ఛైర్మన్గా ఆటోమోటివ్ రంగంపై సుంజయ్ కపూర్ చెరగని ముద్ర వేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) కాంపోనెంట్స్, డ్రైవ్లైన్ సిస్టమ్స్లో కీలక సంస్థగా సోనా కామ్స్టర్ను తీర్చిదిద్దారు. ఆయన తన నాయకత్వంతో కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.గ్లోబల్గా విస్తరణసంజయ్ కపూర్ 2015లో తన తండ్రి సురీందర్ కపూర్ నుంచి కంపెనీ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత సుంజయ్ వ్యూహాత్మకంగా సోనా కామ్స్టర్ సర్వీసులను అంతర్జాతీయంగా విస్తరించారు. ట్రాక్షన్ మోటార్లు, స్టార్టర్ మోటార్లు, అధునాతన డ్రైవ్లైన్ సొల్యూషన్లలో కంపెనీ స్థానాన్ని బలోపేతం చేశారు. అతని దూరదృష్టితో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కాంపోనెంట్స్ తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. దాంతో సంస్థ ప్రపంచ ఆటోమొబైల్ ఎకోసిస్టమ్లో ఒక ముఖ్యమైన సరఫరాదారుగా మారింది.తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాలుసంజయ్ నాయకత్వంలో సోనా కామ్స్టార్ దేశ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరా గొలుసును బలోపేతం చేయడమే కాకుండా యూరప్, ఉత్తర అమెరికా, ఆసియా అంతటా ప్రధాన ఆటోమోటివ్ తయారీదారులకు కీలక భాగస్వామిగా మారింది. సుస్థిరత, సాంకేతిక పురోగతి పట్ల ఆయన నిబద్ధత తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.ఇదీ చదవండి: ప్చ్.. బంగారం తులం లకారం.. హ్యాట్రిక్!పరిశ్రమ నాయకత్వానికి సహకారంభారత ఆటో కాంపోనెంట్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) అధ్యక్షుడిగా పని చేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) మాన్యుఫాక్చరింగ్ కౌన్సిల్కు అధ్యక్షత వహించారు. సృజనాత్మకత, స్థానికీకరణ, ఎగుమతి వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించారు. తయారీదారులు, సరఫరాదారులకు ఒకే విధంగా ప్రయోజనం చేకూర్చేలా పని చేశారు. -
పైలట్ సుమీత్: నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే..
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మాటలకందని పెను విషాదాన్ని నింపింది. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా మిగిలింది. తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా పైలెట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మృతి చెందారు. కెప్టెన్ సుమీత్కు సంబంధించిన కుటుంబ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని, పైలట్ ఉద్యోగం మానేసి చూసుకుంటానని కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మాట ఇచ్చారు. కానీ ప్రమాదవశాత్తు తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే విమాన ప్రమాదంలో ఆయన మరణించారు. తండ్రికి మాట ఇచ్చిన విషయాన్ని బంధువులు తెలిపారు.లండన్కు విమాన ప్రయాణానికి ముందు కూడా సమీత్ తన తండ్రికి ఫోన్ చేశారు. "తాను లండన్ చేరుకున్న తర్వాత మీకు కాల్ చేస్తానని చెప్పాడు.. కానీ ఇంతలోనే తీవ్ర విషాదం జరిగిపోయింది. ముంబయిలోని పోవై ప్రాంతంలో సుమీత్ తండ్రి ఒంటరిగా ఉంటున్నారు. గతంలో ఆయన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యారు.కాగా, అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా 787–8 డ్రీమ్లైనర్ విమానాన్ని నడిపిన పైలట్లకు సర్వీస్లో సుదీర్ఘ అనుభవం ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తెలిపింది. ఈ విమానాన్ని ప్రధాన పైలట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందర్ నడిపారు. ప్రయాణీకుల విమానాలు నడపడంలో సుమీత్కు ఏకంగా 8,200 గంటల అనుభవం ఉంది. కో పైలట్ క్లైవ్కు 1,100 గంటల అనుభవం ఉంది. ఇద్దరికి కలిసి 9,300 గంటలపాటు వినిమానం నడిపిన అనుభవం ఉందని డిజిసిఎ వెల్లడించింది. -
ఇజ్రాయెల్-ఇరాన్ రెండూ భారత్కు మిత్రదేశాలే, కానీ..
ఇరాన్ నుంచి అణు ముప్పు పొంచి ఉందని చెబుతూ ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’(Operation Rising Lion) పేరిట సైనిక చర్యకు దిగింది. ప్రతిగా.. ఇరాన్ డ్రోన్లతో ఇజ్రాయెల్ మీద దాడికి దిగింది. అయితే తాజా పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారత దేశం స్పందించింది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే.. ఇరు పక్షాలను ఉద్దేశించి విజ్ఞప్తి చేసింది.‘‘ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దాడులు ఎంతో ఆందోళనకరం. భారత్ ఇరు దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉంది. రెండు మాకు మంచి మిత్రదేశాలే. సాధ్యమైన మద్దతు అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అందుకే దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం. అంతేగానీ, ఉద్రిక్తతలను పెంచే చర్యలను ఏమాత్రం ప్రోత్సహించకూడదు’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.అంతకు ముందు.. ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు 200 యుద్ద విమానాలతో టెహ్రాన్ దాకా ఇజ్రాయెల్ బలగాలు దూసుకెళ్లాయి. ఇరాన్ అణు.. క్షిపణి స్థావరాలను నాశనం చేయడంతో పాటు ఆ దేశ మిలిటరీ చీఫ్, కొందరు అగ్ర సైంటిస్టులను హతమార్చాయి. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లోని భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అడ్వైజరీలో పేర్కొంది. -
ఆన్లైన్ ఆర్థిక అక్షరాస్యత వేదిక 'ఫిన్ఈ'
ఆర్థిక అక్షరాస్యత కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, ఈ తరానికి ఇదొక తప్పనిసరి అవసరమని ఫిన్ఈ వ్యవస్థాపకురాలు బ్లెసిడా బెన్నీ అన్నారు. విద్యార్థులు మొదలు, వర్కింగ్ ఫ్రొఫెషనల్స్ వరకూ ఆర్థిక విద్య (ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్)ను చేరువ చేయడానికి ఫిన్ఈ ఆధ్వర్యంలో ఆన్లైన్ ఆర్థిక అక్షరాస్యత వేదిక ఫిన్వర్సిటీని ప్రారంభించామన్నారు. నగరంలోని మెర్క్యూర్ హోటల్ వేదికగా గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ విప్లవాత్మక ఫిన్వర్సిటీని ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవానికి మాజీ ఐఏఎస్ అధికారి జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేటి ప్రపంచంలో ఆర్థిక అక్షరాస్యత ప్రధానమైన అంశమని, మనం మరింత విజ్ఞానం, సాధికారత కలిగిన జనాభా కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆర్థిక అవగాహనను ప్రోత్సహించడం ముఖ్యమని తెలిపారు. ఆర్థిక స్వాతంత్య్రం అందరికీ అందుబాటులో ఉండే భవిష్యత్తును నిర్మించడమే ఈ వర్సిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం బ్లెసిడా బెన్నీ తన అభిప్రాయాలు పంచుకుంటూ.. యువతతో పాటు నిపుణులలో ఆర్థిక అక్షరాస్యతలో గణనీయమైన అంతరం ఉందని, ఈ క్లిష్టమైన అంతరాన్ని తగ్గించే ప్రణాళికలు తమ లక్ష్యమని అన్నారు. ఫిన్వర్సిటీతో రానున్న రెండేళ్లలో 20 లక్షల మందిని మార్చుతూ.. ప్రపంచ ఆర్థిక నైపుణ్యాలతో సాధికారత కల్పించే దిశగా ముందుకు సాగుతున్నామని వివరించారు. మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్వి బద్రీనాథ్, ఫిన్ఈ డైరెక్టర్ నులకజోడు మధు వినయ్, నటులు శ్రీ తేజ్, అభిలాష్ శంకర, ప్రఖ్యాత గాయకుడు లక్ష నాయుడు, జబర్దస్త్ ఆర్టిస్టులు తదితర సెలబ్రిటీలు పాల్గొన్నారు. (చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..) -
ప్చ్.. బంగారం తులం లకారం.. హ్యాట్రిక్!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు భారీగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.92,950 (22 క్యారెట్స్), రూ.1,01,400 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.1,950, రూ.2,120 పెరిగింది.చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1,950, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,120 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.92,950 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.1,01,400 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1,950 పెరిగి రూ.93,100కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2,120 పెరిగి రూ.1,01,550 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే శుక్రవారం వెండి ధర(Silver Prices)ల్లో మార్పులు వచ్చాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.1,100 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,20,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో చాలామంది చూసేవి థ్రిల్లర్స్. అందుకు తగ్గట్లే ఇతర భాషల్లో అలరించిన కొన్ని మూవీస్ని డబ్బింగ్ చేసి తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ తమిళ చిత్రాన్ని దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులోకి తీసుకొచ్చారు. సడన్ సర్ప్రైజ్ అన్నట్లు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్)2022లో తమిళంలో రిలీజై ఆకట్టుకున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'యుగి'. కథిర్, నరైన్, జోజూ జార్జ్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని ఇప్పుడు 'కార్తీక: మిస్సింగ్ కేస్' పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆహా ఓటీటీలోకి శుక్రవారం(జూన్ 13) నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్తీక అనే అమ్మాయి మిస్సింగ్ కేసుని ఛేదించే క్రమంలో ఓ డిటెక్టివ్ బృందానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు ఆ అమ్మాయి దొరికిందా లేదా అనేదే మిగతా స్టోరీ.ఇకపోతే ఇదే వీకెండ్లో ఈ సినిమాతో పాటు మరో 22 సినిమాలు-వెబ్ సిరీసులు ఓటీటీల్లోకి వచ్చేయడం విశేషం. వీటిలో శుభం, కేసరి 2, ఏస్, ఎలెవన్, జింఖానా, బ్లైండ్ స్పాట్, సిన్, డియర్ ఉమ, డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్ చిత్రాలతో పాటు రానా నాయుడు 2 సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీసే. ఈసారి థియేటర్లలో కొత్త సినిమాలేం రిలీజ్ కాలేదు కాబట్టి ఓటీటీ మూవీస్పై తెలుగు ప్రేక్షకులు లుక్కేయడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ను సీక్రెట్గా ఫాలో అవుతున్నా: అల్లు అరవింద్) -
వా.. నర ప్రేమ!
విశ్వాసం గురించి చెప్పాల్సి వస్తే కుక్కనో, మరేయితర జంతువునో ప్రస్తావన తీసుకొస్తాం. ఎందుకంటే.. పట్టెడన్నం పెడితే మూగ జీవాలు చూపించే ప్రేమ అలాంటిది మరి!. తాజాగా ములుగు జిల్లాలో జరిగిన ఓ ఘటన.. పలువురిని కంటతడి పెట్టిస్తోంది. వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామానికి చెందిన వెంకటరమణ అనే మహిళ.. తన ఇంటి పక్కనే ఉన్న దుర్గమ్మ గుడి వద్ద రోజూ సేవ చేస్తూ ఉండేది. ఆమె కొడుకు బొల్లె వీర్రాజు తల్లికి సాయంగా ప్రసాదం తీసుకెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ వానరం వీర్రాజు దృష్టిని ఆకర్షించింది. అలా క్రమం తప్పకుండా ఆ వానరానికి ప్రసాదం పెట్టడంతో వాళ్లు మంచి స్నేహితులయ్యారు. అయితే అంతలోనే.. విధి వక్రీకరించింది. అనారోగ్యంతో వీర్రాజు మొన్నీమధ్యే కన్నుమూశాడు. రోజూ తనకు తిండి పెట్టి అపురూపంగా చూసుకునే వీర్రాజు రాకపోవడంతో.. ఆ వానరమే కదిలి వచ్చింది. ఇంట్లో విగత జీవిగా చాపలో ఉన్న వీర్రాజు చుట్టూ తిరిగింది. పాపం.. అతన్ని శాశ్వత నిద్ర నుంచి లేపేందుకు తన వంతు ప్రయత్నం చేసింది. అవేవీ జరగకపోవడంతో చివరకు తన స్నేహితుడి చెంత కాసేపు విశ్రమించింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. వీర్రాజు అంతిమ యాత్రలోనూ కాసేపు ఆ వానరం కనిపించింది. గుడి దగ్గరకు రాగానే వీర్రాజు పార్థివదేహం మీద పడి విలపించినంత పని చేసింది. కొద్ది దూరం అంతిమ యాత్రలో జనాలతో కలిసి వచ్చి.. ఆపై వెనక్కి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడున్న వాళ్లను కంటతడి పెట్టించాయి. ఆ వా‘నర’ ప్రేమను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. -
తెలంగాణ బోనం.. సాంస్కృతిక ప్రయాణం..
ఆషాఢమాసంలో బోనాల జాతర ఉత్సవాలకు నగరం సిద్ధమవుతోంది. పాతబస్తీలో ఈసారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించడానికి భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఇప్పటికే సర్వసభ్య సమావేశం నిర్వహించింది. పాతబస్తీలో బోనాల సమర్పణ అనంతరం నిర్వహించే సామూహిక ఘటాల ఊరేగింపులో ప్రధాన పాత్ర వహించే శకటాలు, కళాకారుల విన్యాసాల కోసం సంబంధిత ఉత్సవాల నిర్వాహకులు పెద్ద ఎత్తున కళాకారులకు ఇప్పటికే బుకింగ్స్ ఇస్తున్నారు.(చదవండి: ఆదివాసీ కోయిల.. ! ఇంజనీర్ గ్రాడ్యుయేట్ కాస్తా.. ర్యాప్ సింగర్గా..)కళాకారుల నృత్య ప్రదర్శనలు.. ఈసారి ఉత్సవాల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు హైలెట్గా నిలువనున్నాయి. కళాకారులు ప్రదర్శించే హావభావాలను చూసే ప్రతి ఒక్కరూ భక్తిపారవశ్యంతో తన్మయత్వం పొందుతారు. ఘట స్థాపన ఊరేగింపు, పోతురాజుల నృత్యాలు, అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు తదితర కార్యక్రమాల్లో వివిధ రకాల అలంకరణల్లో, రూపాల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో అలరిస్తాయి. పాతబస్తీకి ప్రత్యేకం..నిజాం కాలం నుంచి ఇక్కడి అమ్మవారి దేవాలయాల్లో పూజలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన బోనాన్ని సమర్పించడం ఆనవాయితీ. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే విధంగా నగరంలో ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. తెలంగాణ జిల్లాల్లోనే అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు పాతబస్తీ ప్రత్యేకతను చాటుతాయి.ఇతర రాష్ట్రాల కళాకారులకు ఉపాధిగా.. రాష్ట్రంలో జరిగే బోనాల ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, తమిళనాడుకు చెందిన కళాకారులు ఎక్కువగా పాల్గొంటారు. నగరంలో బోనాల జాతర ఉత్సవాల్లో కళాకారులు, వినూత్న తరహా సెట్టింగ్స్ కోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తారు. ఈసారి కళాకారులకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. దీంతో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. పాతబస్తీలోని ప్రముఖ దేవాలయాల నిర్వాహకులు కళాకారుల కోసం పోటీ పడుతున్నారు. దీంతో కొన్ని వందల కుటుంబాల కళాకారులకు ఈ బోనాల జాతర ఉత్సవాలు యేటా ఉపాధి కల్పిస్తున్నాయి. ఆకట్టుకునే రూపాలు, నృత్యాలు.. బోనాల జాతర ఉరేగింపులో కేరళ పులికళి, భేరీ నృత్యం, గరిగెలు, బేతాళ నృత్యం, ఒగ్గోళ్ల నృత్యం, బోనాలు, కాళికాదేవీ, లక్ష్మీదేవీ, వేంకటేశ్వర స్వామి, పొట్టి పోతరాజులు, సింహరథం, డప్పులోళ్లు, హనుమంతునిలో రాముడు, తయ్యం, దేవ నృత్యం, ఉరుములు, కొమ్ముకొయ్య, జడ కోలాటం, యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి శకటం.. అందులో ఏర్పాటు చేసే మూర్తులు, విజయవాడ కనకదర్గమ్మ దేవాలయ రథం.. అందులో కొలువుదీరే అమ్మవారి వేషధారణలోని కళాకారుల హావభావాలు.. ఇలా ఒకటేంటి పలు రకాల శకటాలు, కళాకారుల నత్యాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. (చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..) -
పికిల్స్.. పీక్స్.. టన్నుల కొద్దీ : భారీ డిమాండ్
మామిడి సీజన్ ముగుస్తుండగానే మరోవైపు.. పచ్చడి మామిడి సీజన్ హడావుడి మొదలవుతోంది. తెలుగుతనానికి ప్రతీకలైన ఆవకాయ, మాగాయ వంటి పచ్చళ్ల తయారీ ఇంటింటా ఊపందుకోగా.. నగరం నుంచి విదేశాలకు ఎగుమతి కోసం పచ్చళ్ల తయారీ మొదలైంది. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు తయారీదారులు సిద్ధమవుతున్నారు. దీనికి తోడు ఏటా జూన్లోభారీగా ఎగుమతయ్యే నేపథ్యంలో ఆ హడావుడి, సందడి కనిపిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలు జూన్ నెల వస్తుందంటే నోరూరించే పచ్చళ్ల కోసం లొట్టలేసుకుంటూ ఎదురు చూస్తుంటారు. ఈ సీజన్లో వారి పచ్చళ్ల ప్రియత్వాన్ని తీర్చడంలో నగరమే కీలకంగా మారుతోంది. ఉద్యోగం, ఇతరత్రా వ్యాపకాల రీత్యా నగరం నుంచి వెళ్లి విదేశాల్లో నివసిస్తున్న తమ బంధువుల కోసం ఈ మామిడికాయ పచ్చళ్లను సిటిజనులు పంపిస్తుంటారు. ప్రస్తుతం హోమ్మేడ్ ఆర్గానిక్ పచ్చళ్ళకు ఎక్కువ ఆదరణ ఉంది. అలాగే ఆర్గానిక్ వెరైటీలకు కూడా డిమాండ్ భారీగా ఉందని సరఫరాదారులు చెబుతున్నారు. చదవండి: Hanuman Chalisa: మోస్ట్ వ్యూడ్ వీడియో! 460 కోట్లుఎందరో తయారీ ‘దారులు’.. నగరానికి చెందిన పికిల్ కార్ట్, తెలుగు పికిల్స్, అమ్మ చేతి వంట వంటి కొన్ని ప్రత్యేక డెలివరీ స్టార్టప్స్, సంస్థలు ఆన్ లైన్ ఆర్డర్ల ద్వారా విదేశాలకు నేరుగా డెలివరీ చేస్తూన్నాయి. ఇక మియాపూర్లోని పికిల్స్ బై శ్రీదేవి, కూకట్పల్లిలోని మై గ్రాండ్ మా పికిల్స్, ఇసీఐఎల్ అనంత్ నగర్లోని పికిల్స్ బై రేణుక, గచ్చిబౌలిలోని అమ్మచేతి వంట, మాదాపూర్లోని తెలుగు హోమ్ ఫుడ్స్ ఇలా అనేక సంస్థల పచ్చళ్లు విదేశాల ఎగుమతులకు పేరొందాయి. అలాగే పచ్చడి తయారు చేయడం కంటే, దాన్ని విదేశాలకు పంపించడానికే ఎక్కువ ఖర్చు అవుతోందని తయారీదారులు అంటున్నారు. ఒక కేజీ ఆవకాయ పచ్చడి తయారీ ఖర్చు అన్ని దినుసులకూ కలిపి రూ.125 నుంచి రూ.150 వరకూ అవుతుందని అంచనా. అదే కేజీ ఆవకాయను అమెరికాకు పంపించేందుకు అన్ని రకాల పన్నులూ కలిపి రూ.900 వరకూ అవుతుంది. చదవండి: Anjana Sri రెండు సార్లు దురదృష్టం.. కానీ ఆ మాటే ధైర్యం చెప్పింది!టన్నుల కొద్దీ సరఫరా.. నగరంలో తయారయ్యే ఆవకాయ, మాగాయ, ముక్కాళి తదితర సంప్రదాయ హోమ్మేడ్ పచ్చళ్లకు విదేశీ మార్కెట్లలో భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రతి సంవత్సరం వేసవి ముగింపు దశలో, జూన్ నెల నుంచే పచ్చళ్ల సరఫరా గణనీయంగా పెరుగుతుంది. నగరం నుంచి కనీసం 1500–2000 టన్నుల వరకూ వివిధ రకాల పచ్చళ్ళను అనేక దేశాలకు తరలిస్తారని అంచనా. ఇందులో 70% భాగాన్ని ఆవకాయ ఆక్రమిస్తుంది. ప్రధానంగా రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) ఈ పచ్చళ్ల భారీ సరఫరాకు కేంద్రబింధువుగా నిలుస్తోంది. మరోవైపు వీటిని పెద్ద ఎగుమతిదారులు సముద్ర మార్గం ద్వారా కూడా ముంబై పోర్టు లేదా చెన్నై పోర్ట్ ద్వారా కూడా కన్సైన్మెంట్లు పంపిస్తున్నారు. ఎక్కడెక్కడికి.. ఎక్కువగా.. నగరం నుంచి అమెరికాలోని న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్ వంటి రాష్ట్రాలకు, కెనడాలోని టొరంటో, వాంకూవర్, యునైటెడ్ కింగ్డమ్లోని లండన్, బర్మింగ్హామ్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, మిడిల్ ఈస్ట్లో దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియాలకు అత్యధిక పరిమాణంలో ఈ పచ్చళ్లు సరఫరా అవుతాయి. అక్కడి ఇండియన్ స్టోర్లలో ఇవి రిటైల్ ఫార్మాట్లో పికిల్స్ విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. అమెరికాలోని పటేల్ బ్రదర్స్, అప్నా బజార్ తదితర స్టోర్లలో హైదరాబాద్ పచ్చళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఆవకాయ బిర్యానీకి ఆదరణ.. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉన్న రెస్టారెంట్స్లో ఆవకాయ బిర్యానీ హల్ చల్ చేస్తోంది. దీని కోసం కూడా పచ్చళ్ల తయారీ దారులు ఆవకాయను పెద్ద యెత్తున తరలిస్తున్నారు. ‘ఈ సీజన్లో వందల కిలోల పరిమాణంలో ఆవకాయను పంపిస్తాం. అక్కడ ఉన్న మన బావార్చి రెస్టారెంట్ సహా పలు స్టాల్స్కి వీటిని సరఫరా చేస్తాం’ అంటూ చెప్పారు మల్కాజ్గిరిలో ఆవకాయ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న రాజశేఖర్ అనే వ్యాపారి. -
‘ట్రాఫిక్’కు పోలీసు బకాయి రూ.68 లక్షలు!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగర పోలీసు విభాగానికి చెందిన వాహనాలు సైతం ఎడాపెడా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. వీటిని ట్రాఫిక్ విభాగం అధికారులు గుర్తించి జారీ చేసిన ఈ–చలాన్ల బకాయిలు భారీగానే ఉన్నాయి. ఈ జరిమానాల చెల్లింపు విషయంలో మాత్రం ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. రహదారి నిబంధనలపై అవగాహనకు కృషి చేస్తున్న నగరవాసి లోకేంద్ర సింగ్ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలను వెలుగులోకి తెచ్చారు.పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ–చలాన్లలో ఇప్పటికీ 17,391 పెండింగ్లో ఉన్నాయి. వీటి జరిమానా మొత్తం రూ.68 లక్షలని లెక్క తేలింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 210 బీ ప్రకారం ఆ చట్టాన్ని అమలు చేసే ఏ అధికారికి సంబంధించిన వాహనమైనా ఉల్లంఘనకు పాల్పడితే... సాధారణ జరిమానాకు రెట్టింపు విధించే అవకాశం ఉంది. ఆ కోణంలో లెక్కిస్తే జరిమానా మొత్తం రూ.1.36 కోట్లుగా పరిగణించవచ్చు. నగరంలోని రహదారులపై ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలను పోలీసు విభాగం ఈ–చలాన్ల రూపంలోనే జరిమానా విధిస్తోంది. చౌరస్తాలతోపాటు ఇతర కీలక ప్రాంతాల్లో ఉన్న కెమెరాలు, క్షేత్ర స్థాయిలో ఉండే పోలీసులు ఆ ఉల్లంఘనలను ఫొటోలు తీస్తారు. ఆటోమేటెడ్ కెమెరాలు గుర్తించి.. సాధారణంగా క్షేత్ర స్థాయి సిబ్బంది తమ విభాగానికి చెందిన వాహనాలు చేసే ఉల్లంఘనలపట్ల చూసీచూడనట్లుగా వ్యవహరిస్తారు. అవి కంట పడినప్పటికీ ఫోటోలు తీయరు. అయితే ఓవర్ స్పీడింగ్ వంటి ఉల్లంఘనల్ని ఆటోమేటెడ్ కెమెరాలు గుర్తించి ఫొటోలు తీస్తాయి. దీంతో పోలీసు వాహనాలపైనా ఈ–చలాన్లు జారీ అవుతున్నాయి. ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సర్వర్కు ఆర్టీఏ డేటాబేస్ అనుసంధానించి ఉంటుంది. దీని ఆధారంగా ఆయా వాహన చోదకుల రిజిస్టర్డ్ చిరునామాలకు ఈ–చలాన్లు, రిజిస్టర్డ్ మెబైల్ నెంబర్లకు ఎస్సెమ్మెస్లు వెళ్తాయి.అయితే పోలీసు విభాగానికి సంబంధించిన వాహనాలు అన్నీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) పేరుతోనే రిజిస్టరై ఉంటాయి. దీంతో ఈ ఈ–చలాన్లు కూడా ఆ పేరుతోనే జారీ అవుతాయి. ఆ వాహనం ఎవరు వినియోగిస్తున్నారో వారి చిరుమానాలు రికార్డుల్లో ఉండవు. ఈ కారణంగానూ పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ–చలాన్లలో అత్యధికం పెండింగ్లో ఉండిపోతున్నట్లు తెలుస్తోంది. పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ ఈ–చలాన్లను అన్ని రకాలైన ఉల్లంఘనలకు సంబంధించి ఉన్నాయని తెలుస్తోంది.ఓవర్ స్పీడ్పైనే ఎక్కువ..ఓవర్ స్పీడింగ్, రాంగ్ పార్కింగ్ తదితర ఉల్లంఘనలపై జారీ అయినవి ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వాహనాలపై గరిష్టంగా 15 చలాన్లు పెండింగ్లో ఉండగా... వీటిలో కొన్ని 2017 నాటివి కావడం గమనార్హం. అత్యంత ప్రముఖుల వాహనాలకు పైలెటింగ్, ఎస్కార్ట్ చేస్తున్న, ఆయా కాన్వాయ్లను అనుసరిస్తున్న పోలీసు వాహనాలు పరిమితికి మించిన వేగంతోనే ప్రయాణించాల్సి వస్తుంది. ఈ కారణంగానూ కొన్నింటిపై ఈ–చలాన్లు జారీ అవుతున్నాయి. కాగా, గత ఏడాది ట్రాఫిక్ విభాగం అధికారులు మొత్తం 56.3 లక్షలు ఈ–చలాన్లు జారీ చేశారు. వీటిలో 46.6 లక్షలు చలాన్లకు సంబంధించిన జరిమానాను వాహన చోదకులు చెల్లించారు. -
చరిత్ర సృష్టించిన నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు
అంతర్జాతీయ వన్డేల్లో క్రికెట్ పసికూన నెదర్లాండ్స్ సంచనలం సృష్టించింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ లీగ్-2 2023-27లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ నిర్దేశించిన 370 పరుగుల లక్ష్యాన్ని డచ్ టీమ్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. తద్వారా అంతర్జాతీయ వన్డేల్లో మూడో భారీ లక్ష్య ఛేదనను నమోదు చేసింది. వన్డేల్లో టాప్-2 లక్ష్య ఛేదన రికార్డులు సౌతాఫ్రికా పేరిట నమోదై ఉన్నాయి.🚨 HISTORY BY NETHERLANDS 🚨- Netherlands chase down 370 runs against Scotland in the final over, third highest chase in ODI History with Max ODowd scoring 158*(130) with 12 fours & 4 Sixes 🤯 pic.twitter.com/dJkWRcyBlr— Johns. (@CricCrazyJohns) June 13, 2025వన్డే చరిత్రలో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్లు..2006లో జోహన్నెస్బర్గ్లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 438/9 (లక్ష్యం 435)2016లో డర్బన్లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 372/6 (లక్ష్యం 372)2025లో డండీలో స్కాట్లాండ్పై నెదర్లాండ్స్ 374/6 (లక్ష్యం 370)మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. ఓపెనర్ జార్జ్ మున్సే అతి భారీ శతకంతో (191) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 369 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్లో మాథ్యూ క్రాస్ (59) అర్ద సెంచరీతో రాణించగా.. చార్లీ టియర్ 23, బ్రాండన్ మెక్ముల్లెన్ 21, లియామ్ నేలర్ 14, ఫిన్లే మెక్క్రీత్ 9, మైఖేల్ లీస్క్ 28 (నాటౌట్), మార్క్ వ్యాట్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. మ్యాక్స్ ఓడౌడ్ (158) అజేయ శతకంతో విరుచుకుపడటంతో 49.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్లో తేజ నియమానూరు (51), నోవా క్రోయిస్ (50) అర్ద సెంచరీలతో రాణించగా.. మైఖేల్ లెవిట్ 44, స్కాట్ ఎడ్వర్డ్స్ 32 పరుగులతో పర్వాలేదనిపించారు.గతంలో తృటిలో మిస్ అయ్యింది..! నెదర్లాండ్స్ టీమ్ 2023లోనే ఈ రికార్డును తృటిలో మిస్ అయ్యింది. నాడు విండీస్ నిర్దేశించిన 375 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్ సమం చేసింది. ఫలితంగా ఆ మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో నెదర్లాండ్స్ గెలిచినా అది విజయవంతమైన రెండో అత్యధిక లక్ష్య ఛేదనగా పరిగణించబడలేదు.వన్డేల్లో నెదర్లాండ్స్ బ్యాటర్ ద్వారా అత్యధిక వ్యక్తిగత స్కోరు..158* - మాక్స్ ఓ'డౌడ్ వర్సెస్ స్కాట్లాండ్, డండీ, 2025137* - వెస్లీ బరేసి vs కెన్యా, లింకన్, 2014134* - క్లాస్-జాన్ వాన్ నూర్ట్విజ్క్ vs నమీబియా, బ్లూమ్ఫోంటెయిన్, 2003123 - బాస్ డి లీడే vs స్కాట్లాండ్, బులవాయో, 2023 -
పీఎల్ఐ స్కీములతో పెట్టుబడులకు దన్ను..
ఎలక్ట్రిక్, ఇతరత్రా ప్రత్యామ్నాయ ఇంధనాలతో పని చేసే హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ (హెచ్ఈఎంఎం) తయారీ కోసం ప్రత్యేకంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) ప్రవేశపెడితే మరిన్ని కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలవుతుందని ఓ నివేదిక తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా ఇలాంటి వాహనాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటంతో భారీ పెట్టుబడులు అవసరమయ్యే ఈ విభాగంపై తయారీ సంస్థలు, సరఫరాదారులు పెద్ద స్థాయిలో ఇన్వెస్ట్ చేయకపోవచ్చని పేర్కొంది.ఇదీ చదవండి: ఆన్లైన్ మోసాలకు ఎయిర్టెల్ చెక్‘పీఎల్ఐ స్కీమును ప్రకటిస్తే కొత్త పెట్టుబడులు వస్తాయి. తయారీ, ఇంజినీరింగ్, ఆర్అండ్డీ విభాగాల్లో ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఎలక్ట్రిక్, ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే హెచ్ఈఎంఎంలను దేశీయంగా ఉత్పత్తి చేసుకునే సామర్థ్యాలు పెరుగుతాయి‘ అని భారతీయ ఖనిజ పరిశ్రమ సమాఖ్య (ఎఫ్ఐఎంఐ) రూపొందించిన నివేదిక తెలిపింది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్తో కలిసి ఎఫ్ఐఎంఐ దీన్ని రూపొందించింది. మైనింగ్ కార్యకలాపాల్లో కీలకమైన హెచ్ఈఎంఎంలు.. కర్బన ఉద్గారాలకు కారకంగా ఉంటున్నందున పర్యావరణహితమైన మెషినరీపై ఆసక్తి ఏర్పడుతోంది. -
విశాఖలో దారుణం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హతమార్చి.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యను డంబుల్తో కొట్టి చంపేశాడు.. భార్యను హతమార్చిన అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంచర పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే కారణమమని పోలీసులు అంటున్నారు.తమ్ముడి చేతిలో అన్న హతంమరో ఘటనలో తమ్ముడి చేతిలో అన్న హతమయ్యాడు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాలా జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లిలో జరిగింది. కుటుంబ కలహాలతో తాగిన మైకంలో అన్న కూన నర్సయ్యను కట్టెతో తలపై తమ్ముడు కూన రాములు విచక్షణారహితంగా కొట్టి చంపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మోస్ట్ వ్యూడ్ వీడియో.. 460 కోట్లు
స్థానిక కళాకారులతో కలిసి పాటల కచేరి నిర్వహించినా, అంతర్జాతీయ వేదికలపై ఆడిపాడినా హరిహరన్ (Hariharan) గళానికి ఉన్న ప్రత్యేకత వేరు. తాజా విషయానికి వస్తే...ఈ ప్రముఖ గాయకుడు పాడిన ‘హనుమాన్ చాలీసా’ (Hanuman Chalisa) యూట్యూబ్లో( Youtube) ‘మోస్ట్ వ్యూడ్ వీడియో’గా నిలిచింది. 4.6 బిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది. ‘ఊహించని స్పందన ఇది. ఎక్కడకు వెళ్లినా హనుమాన్ చాలీసా గురించే మాట్లాడుతున్నారు’ అంటున్నాడు హరిహరన్.జీమ్యూజిక్కు రెడ్ డైమండ్ ప్లే బటన్మన దేశంలోని టాప్ మ్యూజిక్ లేబుల్స్లో ‘జీ మ్యూజిక్ కంపెనీ’ ఒకటి. తాజా విషయానికి వస్తే... యూట్యూబ్లో 100 మిలియన్ సబ్స్క్రైబర్లతో ‘వావ్’ అనిపించింది. యూట్యూబ్ వారి ప్రతిష్ఠాత్మకమైన ‘రెడ్ డైమండ్ ప్లే బటన్’ను సాధించింది. ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ అందుకున్న ప్రపంచంలోని రెండో మ్యూజిక్ లేబుల్... జీ మ్యూజిక్. దశాబ్దం క్రితం ప్రారంభమైన ‘జీ మ్యూజిక్’ ఇండియన్ మ్యూజిక్ మార్కెట్లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది.మోస్ట్ వ్యూడ్ వీడియో.ఇవీ చదవండి: Anjana Sri రెండు సార్లు దురదృష్టం.. కానీ ఆ మాటే ధైర్యం చెప్పింది!Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్లైనర్పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటీ రిలీజ్ కాలేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఏకంగా 22 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. వీటిలో తొమ్మిది వరకు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. వీటిలో ఏస్, ఎలెవన్, శుభం, జింఖానా తదితర చిత్రాలతో పాటు రానా నాయుడు 2 సిరీస్ ఉండటం విశేషం. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?(ఇదీ చదవండి: ‘దేవికా అండ్ డానీ’ రివ్యూ : ఆత్మలతో మాట్లాడే టీచరమ్మ!)ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (జూన్ 13)అమెజాన్ ప్రైమ్బ్లైండ్ స్పాట్ - తెలుగు సినిమాఏస్ - తెలుగు డబ్బింగ్ మూవీఎలెవన్ - తెలుగు సినిమాఇన్ ట్రాన్సిట్ - హిందీ సిరీస్అమెరికన్ థండర్ - ఇంగ్లీష్ సినిమాద ట్రైటర్స్ - హిందీ రియాలిటీ షోడీప్ కవర్ - ఇంగ్లీష్ సినిమానెట్ఫ్లిక్స్కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్రానా నాయుడు 2 - తెలుగు సిరీస్ఫ్యూబర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ఫ్లాట్ గర్ల్స్ - థాయ్ మూవీగ్రేస్ అనాటమీ సీజన్ 21 - ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 14)హాట్స్టార్కేసరి ఛాప్టర్ 2 - హిందీ సినిమాశుభం - తెలుగు మూవీఅండర్ డాగ్స్ - ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 15)సోనీ లివ్అలప్పుళా జింఖానా - తెలుగు డబ్బింగ్ మూవీఆహాసిన్ - తెలుగు సినిమాసన్ నెక్స్ట్డియర్ ఉమ - తెలుగు మూవీజీ5డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్ - తెలుగు డబ్బింగ్ సినిమాఆపిల్ ప్లస్ టీవీఎకో వ్యాలీ - ఇంగ్లీష్ మూవీనాట్ ఏ బాక్స్ - ఇంగ్లీష్ సిరీస్మనోరమ మ్యాక్స్సూపర్ గర్ల్స్ - మలయాళ సిరీస్(ఇదీ చదవండి: లైఫ్ అంతా అల్లు అర్జున్కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు) -
ఈ నకిలీ డాక్టర్కు అసలు ‘హృదయం’ లేద్సార్!
ఈ నకిలీ డాక్టర్కు అసలు ‘హృదయం’ లేద్సార్! -
రెండు సార్లు దురదృష్టం.. కానీ ఆ మాటే ధైర్యం చెప్పింది!
వరల్డ్ చిన్నతనంలోనే అంజనశ్రీ (Anjana Sri) ప్రమాదవశాత్తు కాలు కోల్పోయింది. కూచిపూడి నాట్యం అంటే ఈ చిన్నారికి ఎంతో ఇష్టం.ఇక నాట్యానికి దూరం కావాల్సిందేనా? ‘లేదు’ అన్నది ఆ చిన్నారిలోని ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. కూచిపూడి నాట్యంలో అంజనశ్రీ రాణిస్తోంది.జాతీయస్థాయిలో ప్రదర్శనలు ఇస్తూ అందరి మన్ననలు పొందుతోంది.... జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన బొమ్మకంటి నాగరాజు, గౌతమి దంపతుల కుమార్తె అంజనశ్రీ నాలుగు సంవత్సరాల వయస్సులో రోడ్డు ప్రమాదంలో ఎడమకాలు పూర్తిగా కోల్పోయింది. నాట్యప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదని సుధాచంద్రన్ నిరూపించింది. ఆమె ఎదుర్కొన్న కష్టాలు, వాటిని అధిగమించిన తీరును అంజనశ్రీకి కథలుగా చెప్పేవాళ్లు తల్లిదండ్రులు. అంతేకాదు, కూచిపూడి నాట్యకారుడు మచ్చ దేవదాసు వద్ద శిక్షణ ఇప్పించారు. దురదృష్టవశాత్తు రెండోసారి రోడ్డు ప్రమాదం జరిగింది. కుడికాలుకు తీవ్రగాయాలు కావడంతో ఆపరేషన్ చేసి రాడ్ వేశారు. అయినప్పటికీ కృంగిపోకుండా కూచిపూడిలో శిక్షణను కొనసాగించింది.ఇప్పటి వరకు జాతీయస్థాయిలో యాభైకి పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చింది అంజనశ్రీది పేద కుటుంబం. నాన్న బొమ్మకంటి నాగరాజు చిన్నపాటి పాల వ్యాపారం చేస్తున్నాడు. తల్లి గౌతమి గృహిణి. ‘మా అమ్మాయి కూచిపూడి నాట్యంలో పెద్ద పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం’ అంటున్నారు అంజనశ్రీ తల్లిదండ్రులు.చదవండి: Akhil-Zainab Reception డైమండ్ నగలతో, గార్జియస్గా అఖిల్ అర్థాంగిఆ మాటే ధైర్యం చెప్పిందినాకు కూచిపూడి అంటే చాలా ఇష్టం. యాక్సిడెంట్లో కాలుపోవడంతో ఇక ఎప్పుడూ డ్యాన్స్ చేయలేను అని బాధపడేదాన్ని. నా తల్లిదండ్రులు మాత్రం ‘నువ్వు ఎప్పటిలాగే మళ్లీ డ్యాన్స్ చేస్తావు’ అని ధైర్యం చెప్పారు. వారి ఆశీర్వాదబలంతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. ‘పట్టుదల ఉంటే కానిది లేదు’ అనే మాటను స్కూలు పాఠాల్లో విన్నాను. ఆ మాట నాకు ధైర్యం చెప్పినట్లు అనిపించేది. – అంజనశ్రీ– కందుకూరి శశిధర్, సాక్షి, జగిత్యాలచదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్లైనర్పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! -
పువ్వుల డిజైనర్వేర్లో స్టైలిష్గా కనిపిద్దాం ఇలా..!
పువ్వులకు మగువలకు విడదీయరాని బంధం ఉంటుంది. పువ్వులను తమ భుజాల మీదుగా మణికట్టు వరకు అలంకరించుకుని అందంగా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. వెస్ట్రన్ గౌన్లలో విరివిగా కనిపించే ఈ స్టైలు ఇప్పుడు ఎల్లలు దాటి మన సంప్రదాయ డిజైనర్ వేర్లోనూ కనువిందు చేస్తోంది. ఫ్యాబ్రిక్తో పువ్వులు వచ్చేలా కుట్టడం ఈ స్టైల్ ప్రత్యేకత. ఇక పువ్వులు చేతుల్లో కాదు, చేతులకు అందంగా అలంకరించుకోవచ్చు.పింక్, పీచ్ కలర్ బ్లౌజ్ అయితే ఫెమినైన్ లుక్, రెడ్ కలర్ అయితే స్టేట్మెంట్ అటైర్గా, తెలుపు, గోధుమరంగు అయితే వేదికలపైన పల్లకీ లుక్తో కనిపిస్తారు. ఏ స్టైల్లో కనిపించాలనుకుంటే ఆ డ్రెస్సింగ్కి సరిగ్గా నప్పే ఈ గులాబీల గుచ్చాలు ప్రత్యేకంగా కనిపించడమే కాదు, ఫొటోలలోనూ విలాసంగా ఉంటుందనే ఆలోచన కూడా దీనికి క్రేజ్ పెంచుతోంది. నిన్నటి వరకు పిల్లల డ్రెస్సింగ్లో కనిపించే ఈ స్టైల్ పెద్దవారి చీరకట్టుకూ అందాన్ని తీసుకువచ్చింది. రిసెప్షన్, సంగీత్.. వంటి వేడుకలలో గ్రాండ్గా వెలుగుతోంది.స్లీవ్స్ డిజైన్ బోల్డ్గా ఉంటే, నెక్ సింపుల్గా ఎలాంటి ఆభరణాలు లేకుండా ఉంటే బాగుంటుంది. పెద్ద పెద్ద ఆభరణాలు కాకుండా సన్నని చైన్లు వాడచ్చు.గులాబీ పువ్వు ఆకృతి వచ్చేలా బ్లౌజ్ స్లీవ్స్ డిజైన్ చేయడం ఈ స్టైల్ స్పెషల్. ఈ పువ్వులు లేయర్లుగా మంచి ఫ్లేర్ వచ్చేలా డిజైన్ చేస్తారు. వీటిని ఎక్కువగా నెట్, ఆర్గాంజా, షిఫాన్ వంటి ఫ్యాబ్రిక్స్తో తయారు చేస్తారు.ఇండో వెస్టర్న్ డ్రెస్సుల్లో, ఫ్యూజన్ గౌన్లు, క్రాప్ టాప్ + స్కర్ట్ లుక్, పెప్లం టాప్స్, షరారా, పలాజో సెట్లలో విరివిగా కనిపిస్తున్నాయి.సంప్రదాయ డ్రెస్సులకు రెండు వైపులా ఫ్యాబ్రిక్ గులాబీల కుచ్చు ఉంటే, వెస్ట్రన్ స్టైల్స్లో బ్లౌజ్ లేదా గౌన్కు, సింగిల్ షోల్డర్ ఫ్రాక్కి ఒకవైపు గులాబీ గుచ్చం కనువిందు చేస్తుంది.శారీ లేదా లెహంగా కూడా సింగిల్ షోల్డర్ రోజ్ బొకేని డిజైన్ చేయించుకోవచ్చు.శారీ బ్లౌజ్ ట్రెండ్లలో గులాబీ స్లీవ్స్ అందంగా అమరిపోతున్నాయి.రోజ్ స్లీవ్స్ ఎంచుకున్నప్పుడు జుట్టును పోనీటైల్ లేదా బన్ స్టైల్ వేసుకుంటే డ్రెస్సింగ్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది.హై నెక్ టాప్ అయితే డ్యూయల్ రోజ్ స్లీవ్స్ బాగుంటాయి. (చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..) -
కర్ణాటకలో APSRTC బస్సుకి ప్రమాదం.. చిత్తూరువాసుల మృతి
బెంగళూరు: కర్ణాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు, ఓ లారీ ఢీ కొట్టడంతో నలుగురు స్పాట్లోనే మరణించారు. 16 మందికి గాయాలు కాగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చిత్తూరు వాసులుగా తెలుస్తోంది.తిరుపతి నుంచి ఏపీ 03 జెడ్ 0190 నెంబర్ బస్సు బెంగళూరుకు వెళ్తోంది. కోలారు జిల్లా హోసాకోట్లోని పుట్టిపురా గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలుకేశవరెడ్డి(44)తులసి(21)ప్రణతి(5)ఏడాదిన్నర వయసున్న చిన్నారి -
ఆపరేషన్ రైజింగ్ లయన్.. రేడియేషన్ రిలీజ్ అయ్యిందా?
ఆపరేషన్ రైజింగ్ లయన్.. అప్డేట్స్అణు ధార్మికత విడుదలైందా?ఇరాన్ న్యూక్లియర్ సెంటర్లపై ఇజ్రాయెల్ దాడులుకీలక స్థావరాలను నాశనం చేసినట్లు ప్రకటించుకున్న ఇజ్రాయెల్అందులో నతాంజ్, ఇస్ఫహాన్, బుషెహర్ కేంద్రాలు కూడాదీంతో రేడియేషన్ విడుదలైందంటూ ప్రచారంఖండించిన యూఎన్ విభాగం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీఎలాంటి అణు ధార్మికత విడుదల కాలేదని ఐఏఈఏ స్పష్టీకరణఅణు కేంద్రాలకు పెద్దగా నష్టమూ వాటిల్లలేదని ప్రకటన ఒక్క విమానం తిరగట్లేదు!!ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో గంభీరంగా గగనతలంఇజ్రాయెల్, ఇరాన్తో పాటు జోర్డాన్ మీదుగా సంచరించని విమానం విమానాలు తిరకపోవడాన్ని ధృవీకరించిన ఫ్లైట్రాడర్24As has been the case during previous hostilities between Iran and Israel, Jordan has also closed its airspace to flights. NOTAM read JORDAN AIRSPACE CLSD DUE TO OPS REASONS pic.twitter.com/JIWDUVhJjk— Flightradar24 (@flightradar24) June 13, 2025 ఇరాన్ ఎయిర్ డిఫెన్స్పై దాడి పూర్తి!ఇరాన్ వైమానిక దళంపై దాడి పూర్తైందని ప్రకటించిన ఇజ్రాయెల్ఇరాన్ పంపిన డ్రోన్లను నేలకూల్చినట్లు ప్రకటించిన ఐడీఎఫ్ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన ఇజ్రాయెల్ముగ్గురు సైనికాధికారులు, పలువురు సైంటిస్టులు దుర్మరణంప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ఇరు దేశాల ఉద్రిక్తతలపై భారత్ ఆందోళనరెండు మిత్రదేశాలేనని స్పష్టీకరణఅయితే ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలని కోరిన భారత్దౌత్య మార్గాన చర్చల ద్వారా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచనఅంతకు ముందు.. ఇరాన్లోని భారతీయులకు భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్వంద డ్రోన్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడిన ఇరాన్ సైన్యండ్రోన్ దాడుల్ని తిప్పికొడుతున్న ఇజ్రాయెల్ఇరాన్ అణు ముప్పు తొలగించేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన ఇజ్రాయెల్ఇరాన్ మిలిటరీ చీఫ్, ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ జనరల్, మరికొందరు అగ్ర అణు సైంటిస్టుల దుర్మరణం ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇరాన్ సుప్రీం ఖమేనీగంటల వ్యవధిలోనే ఇరాన్ కౌంటర్ ఎటాక్స్ఇజ్రాయెల్-ఇరాన్ పరస్పర దాడులతో అట్టుడుకున్న పశ్చిమాసియాఆపరేషన్ రైజింగ్ లయన్పై నెతన్యాహు కీలక ప్రకటన ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్ దాడులుమళ్లీ రగులుతున్న పశ్చిమాసియాఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కీలక ప్రకటన ఇరాన్ ముప్పును తిప్పి కొట్టేందుకే ఈ సైనిక చర్యఇరాన్ అణు కార్యక్రమానికి గుండె కాయ లాంటి ప్రాంతాన్ని ధ్వంసం చేశాంనంతాజ్లోని అణు శుద్ధి కేంద్రాన్ని పూర్తిగా నాశనం చేశాంటెహ్రాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాంకు కారణమైన కేంద్రాలను ధ్వంసం చేశాంఅగ్ర అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాంఇటీవలె అధిక మొత్తంలో శుద్ధి చేసిన యురేనియంను తయారు చేసిన ఇరాన్ఆ యురేనియంతో 9 అణు బాంబులు తయారు చేసే కెపాసిటీఇరాన్ను ఇప్పుడు ఆపకపోతే పెను ముప్పు తప్పదుముప్పును పూర్తిగా తొలగించేంత వరకు ఆపరేషన్ కొనసాగుతుందన్న నెతన్యాహు 1980 తర్వాత..ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులుఇప్పటికే 30-40 యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ సైన్యంఅణు కేంద్రాలతో పాటు మిస్సైల్స్ స్థావరాలపైనా కొనసాగుతున్న దాడులు1980 ఇరాన్-ఇరాక్ యుద్ధం తర్వాత ఇరాన్ అణుస్థావరాలపై దాడి జరగడం ఇదేఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ జనరల్ హోసెయిన్ సలామీ మృతిదాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ బాఘేరి, మరికొందరు అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్లు సమాచారం #BREAKING Iran armed forces chief of staff Mohammad Bagheri killed in Israel attack, reports state TV pic.twitter.com/nlGlzZmLqT— AFP News Agency (@AFP) June 13, 2025ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటాం: అయతొల్లా ఖమేనీ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు దాడుల్లో మృతి చెందిన ఇరాన్ మిలిటరీ చీఫ్, పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ అధిపతిఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీకఠిన శిక్ష తప్పదని ఇజ్రాయెల్ను హెచ్చరించిన ఖమేనీ With this crime, the Zionist regime has prepared for itself a bitter, painful fate, which it will definitely see.— Khamenei.ir (@khamenei_ir) June 13, 2025 ఇరాన్ గగన తలం నుంచి విమానాల మళ్లింపుఇరాన్పై ఇజ్రాయెల్ సైన్యం దాడులుదాడుల నేపథ్యంలో పలు విమానాల దారి మళ్లింపుఎయిరిండియాకు చెందిన 16 విమానాలను దారి మళ్లించినట్లు సమాచారం. దాడులకు ముందు ట్రంప్ పోస్టు వైరల్ఇరాన్పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించి అణు స్థావరాలపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్దీనికి కొన్ని గంటల ముందు ట్రూత్ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ఇరాన్ న్యూక్లియర్ సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించిన ట్రంప్ఇరాన్ గొప్ప దేశమే కావొచ్చు.. కానీ అణ్వాయుధాలు కలిగి ఉండాలనే ఆశను వదులుకోవాలని వ్యాఖ్యఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభంఇరాన్పై సైనిక చర్య ప్రారంభించిన ఇజ్రాయెల్ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలుపెట్టినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుఇరాన్ అణు ముప్పును తొలగించేందుకేనని స్పష్టీకరణఇజ్రాయెల్ సైనిక చర్యతో తమకు సంబంధం లేదని ప్రకటించిన అమెరికా -
ఇంజనీర్ గ్రాడ్యుయేట్ కాస్తా.. ర్యాప్ సింగర్గా ప్రభంజనం..
ఆకులందు అణిగిమణిగి ఉండే అడవి పాటను భళ్లుమనే దీపాల నగర వేదికల మీదకు తెచ్చింది మాహి. మహరాష్ట్ర ఆదివాసీ తెగకు చెందిన ఈ యువ గాయని తన రాప్ సింగింగ్ని పేరు కోసమో కీర్తి కోసమో కాక అడవి కోసం, పర్యావరణం కోసం ఆయుధంగా మార్చింది. మాహి చెప్పేది ఒకటే – దేశంలో ఎవరు ఎక్కడ ఉండాలో కొందరు నిర్ణయించారు. ఎక్కడకు చేరాలో మనం నిశ్చయించుకుంటే చాలు అని. మాఝీ నిర్ణయం ప్రకారం ఆమె పాట సరిహద్దులు దాటుతోంది.‘నేను మీకు వినోదం అందించడానికి రాలేదు. నా జాతికి ప్రాతినిధ్యం వహించడానికి వచ్చాను’ అంటుంది మాహి. 27 ఏళ్ల ఈ ర్యాప్ సింగర్ ఆదివాసీల జీవితాన్నే పాటగా మార్చి లైవ్ షోస్ చేస్తూ ఆదరణ పొందుతోంది. ఎడతెగని వచనాన్ని పాటలా పాడే ‘ర్యాప్’ లో మన దేశం నుంచి మురికివాడల పిల్లలు కూడా షైన్ అయ్యి పేరు సంపాదించారు. ఇప్పుడు అడవి నుంచి వచ్చిన మాహి వంతు. ‘మా ఆదివాసీల గురించి నేను పాడకపోతే ఇంకెవరు పాడతారు’ అంటుంది మాహి.గిరిజన కోయిలమాహి పూర్తి పేరు మధుర యశ్వంత్ ఘనె. అయితే ర్యాపర్గా మాహి.జి పేరుతో గుర్తింపు పొందింది. ఈమె సొంత ఊరు మహరాష్ట్రలోని వరంగుషి. వీళ్లంది మహదేవ్ కోలి అనే గిరిజన తెగ. తండ్రి బస్ కండెక్టర్గా పని చేస్తుంటే తల్లి గృహిణి. ‘మా తెగలో ఎవరూ బడికి వెళ్లరు. వెళ్లినా మధ్యలోనే మానేస్తారు. అందుకే మా అమ్మా నాన్నా నా చదువు కోసం ముంబై వలస వచ్చారు’ అంటుంది మాహి. ముంబైలో తమ్ముడితో కలిసి ఇంజనీరింగ్లో చేరిన మాహి అక్కడే స్టూడెంట్స్ పాడే ర్యాప్ సాంగ్స్ను మొదటిసారి వింది. అయితే ఆమెకు పాడటం రాదు, బాణీ కట్టడం అంతకన్నా రాదు. కాని అప్పుడప్పుడు కవిత్వం రాసేది. కాని కోవిడ్ వచ్చాక ఆమెలోకి గాయని బయటకు వచ్చింది.అడవి పాట ఇచ్చిందికోవిడ్ వచ్చినప్పుడు ముంబై మూగబోయింది. ఆ సమయంలో నగరం మంచిది కాదని మాహి కుటుంబం అడవిలోని సొంత పల్లెకు వెళ్లి ఉండిపోయింది. ‘అక్కడకు వెళ్లాక మా వాళ్ల జీవితం నాకు కొత్తగా అర్థమైంది. వారు కోవిడ్ కాలంలో కూడా హాయిగా జీవిస్తున్నారు. వారు ప్రకృతి ఒడిలో ఉన్నారు. ఆశ లేదు. పరుగు లేదు. ఎవరికీ హాని చేయరు. అడవిని కాపాడి మేలు చేస్తారు. కాని వీరి గురించి ఎవరూ మాట్లాడరే. అడవుల్లో గిరిజనులు ఉన్న ఊసే ఎవరికీ ఉండదే అనిపించింది. అలా మొదటి పాట తన్నుకొని వచ్చింది. ఆ పాటే ‘జంగిల్ చా రాజా’. 2019లో ఈ పాట బయటకు రాగానే నాకు గుర్తింపు వచ్చింది’ అంటుంది మాహి.హక్కుల కోసం పాటమాహి తన పాటలో సామాజిక స్పృహ ఉండాలని కోరుకోవడం ఆమెకు గౌరవాన్ని తెచ్చింది. జేఎన్యూ స్టూడెంట్స్ ప్రత్యేకంగా ఆహ్వానించి మాహి షో నిర్వహించడంతో మాహి పాటల్లోని రాజకీయ స్పృహ మరింతగా పదును తేలింది. ఇక మాహి పాటలు వరుసెత్తాయి. రైతుల సమస్యలు, కుల వివక్ష, క్వీర్ కమ్యూనిటీ హక్కులు, గ్రామీణ జీవనం, స్త్రీల సంఘర్షణ ఆమె సాట వస్తువులయ్యాయి. ‘కనిపించే వాటిని చూస్తూ కూడా అంధుడిగా మారకు’... ‘ఎవరి చెమటతో నీ ఇల్లు పూర్తవుతుందో వారు ఏ ఠికానా లేకుండా తిరగడాన్ని చూడు’... ‘బేటీ బచావు కబ్ తక్... ఎందుకు ఆడపిల్లను కాపాడాలి... కాపాడాల్సిన అవసరమే లేని సమాజాన్ని నిర్మించలేమా’... ఇలా ఉంటాయి ఆమె పాటల్లోని లైన్లు.మాహి ఇంకా చాలా పేరునూ గుర్తింపునూ పొంనుంది. ఎందుకంటే ఆమె పాటలో అర్థం, ఆగ్రహం ఉన్నాయి. అవి పాటను సజీవం చేస్తాయి. (చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..) -
రామ్మోహనా.. రీల్స్ చేయడానికి వెళ్లావా..?
సాక్షి, తాడేపల్లి: నిన్న(గురువారం) భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. అయితే, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా పోస్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిన్న ఫ్లైట్ క్రాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన వీడియోను రామ్మోహన్ నాయుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. వీడియోకు బ్యాక్ గ్రౌండ్ ఆడియో కలిపి పోస్టు చేయడంపై ట్రోల్ అవుతోంది. ఘటన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారా? రీల్స్ చేయడానికా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.This is Aviation minister RamMohan Naidu.Instead of taking the responsibility for #planecrash he's literally uploading reels.There is music in the video, there are multiple cuts & video effects.This reel-fever of Modi cabinet is disgusting.pic.twitter.com/vUDcYfBhps— Tarun Gautam (@TARUNspeakss) June 12, 2025 -
విషాదం.. పోలో ఆడుతూ హీరోయిన్ మాజీ భర్త హఠాన్మరణం!
బాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి కరిష్మా కపూర్(Karisma Kapoor) మాజీ భర్త సంజయ్ కపూర్(53) గుండెపోటుతో మృతి చెందాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంలో .. ఇంగ్లాండ్లో సంజయ్ పోలో అడుతుండగా నోట్లోకి అకస్మాత్తుగా ఒక తేనెటీగ దూరిందట. దీనివల్ల తీవ్రమైన అలెర్జీ రియాక్షన్ వచ్చి, ఆయనకు ఊపిరాడలేదు. ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీసిందని సమాచారం. వెంటనే ఆటను నిలిపివేసి, ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.సంజయ్ కపూర్ ఇండియాలో ప్రముఖ వ్వ్యాపారవేత్తలలో ఒకరు. 2003లో కరిష్మాని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేధాలు వచ్చాయి. దీంతో ఇద్దరు 2014లో విడాకులకు దరఖాస్తు చేయగా.. 2016లో విడాకులు మంజూరు అయ్యాయి. ఆ తర్వాత మోడల్, నటి ప్రియా సచ్దేవ్ను సంజయ్ పెళ్లాడారు. కరిష్మా మాత్రం ఒంటరిగానే ఉంటోంది. -
న్యూజిలాండ్ ఓపెనర్ మహోగ్రరూపం.. 19 సిక్సర్లతో ఊచకోత
న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ మహోగ్రరూపం దాల్చాడు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 ఎడిషన్ తొలి మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ లీగ్లో శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్కు ప్రాతనిథ్యం వహిస్తున్న అలెన్.. వాషింగ్టన్ ఫ్రీడంతో ఇవాళ (జూన్ 13) జరిగిన మ్యాచ్లో ఏకంగా 19 సిక్సర్లు బాదాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్లో ఇవే అత్యధిక సిక్సర్లు. గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 2017 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఓ మ్యాచ్లో 18 సిక్సర్లు బాదాడు.ఈ మ్యాచ్లో 51 బంతులు ఎదుర్కొన్న అలెన్ 19 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 151 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో అలెన్ సెంచరీని కేవలం 34 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఎంఎల్సీ చరిత్రలో ఇదే వేగవంతమైన సెంచరీ. గతంలో ఈ రికార్డు పూరన్ పేరిట ఉండేది. పూరన్ 2023 ఎడిషన్లో 40 బంతుల్లో శతక్కొట్టాడు. నేటి మ్యాచ్లో అలెన్ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎంఎల్సీ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్. గతంలో కూడా ఈ రికార్డు యూనికార్న్స్ (215/5) పేరిటే ఉంది.నేటి మ్యాచ్లో యూనికార్న్స్ ఇన్నింగ్స్లో సంజయ్ కృష్ణమూర్తి 20 బంతుల్లో 36, హసన్ ఖాన్ 18 బంతుల్లో 38 (నాటౌట్), టిమ్ సీఫర్ట్ 10 బంతుల్లో 18, జేక్ ఫ్రేజర్ 9 బంతుల్లో 6, కూపర్ కన్నోలీ 7 బంతుల్లో 5, కోరె ఆండర్సన్ 6 బంతుల్లో 3 (నాటౌట్) పరుగులు చేశారు. వాషింగ్టన్ బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ 2, నేత్రావల్కర్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్ గట్టిగానే ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ.. వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్లు కోల్పోతుంది. తొలి 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 79 పరుగులు చేసిన ఆ జట్టు.. ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగుతుంది. 10 ఓవర్ల తర్వాత వాషింగ్టన్ స్కోర్ 118/8గా ఉంది. బెన్ సియర్స్ (1), ఇయాన్ హోలాండ్ (1) క్రీజ్లో ఉన్నారు. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు మిచెల్ ఓవెన్ (20 బంతుల్లో 39), రచిన్ రవీంద్ర (17 బంతుల్లో 42), వన్ డౌన్ ఆటగాడు జాక్ ఎడ్వర్డ్స్ (7 బంతుల్లో 21) ఆకాశమే హద్దుగా చెలరేగారు. అయితే ఆతర్వాత వచ్చిన మ్యాక్స్వెల్ (5), గ్లెన్ ఫిలప్స్ (0), ఆండ్రియస్ గౌస్ (2), ఒబస్ పియనార్ (2), ముక్తార్ అహ్మద్ (1) దారుణంగా విఫలమయ్యారు. యూనికార్న్స్ బౌలర్లలో రౌక్స్, హసన్ ఖాన్, హరీస్ రౌఫ్ తలో 2 వికెట్లు తీయగా.. లియామ్ ప్లంకెట్ ఓ వికెట్ పడగొట్టాడు. ఓ టీ20 ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-4 బ్యాటర్లు..ఫిన్ అలెన్-19 (న్యూజిలాండ్)క్రిస్ గేల్-18 (వెస్టిండీస్)సాహిల్ చౌహాన్-18 (సైప్రస్)క్రిస్ గేల్-18 (వెస్టిండీస్) -
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు లాభపడి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 132 ప్లాయింట్లు పెరిగి 82,639 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.21 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.91 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.34 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.38 శాతం లాభపడింది. నాస్డాక్ 0.24 శాతం పుంజుకుంది.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో భారత స్టాక్ సూచీలు నిన్నటి సెషన్లో ఒకశాతం నష్టపోయాయి. ఇరాన్పై ఇజ్రాయిల్ దాడికి సన్నాహాలు చేస్తోందన్న వార్తలతో క్రూడాయిల్ ధరలు పెరుగుదల, అధిక వాల్యుయేషన్ల ఆందోళనలు, వారాంతపు ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు అంశాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. సూచీల ఒక శాతం పతనంతో రూ.5.98 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.449 లక్షల కోట్లు (5.26 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచ్చింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..
కూచిపూడి కళాకారిణి శ్రవ్యమానస. అత్యంత సామాన్య కుటుంబంలో పుట్టిన శ్రవ్య తనకు తానుగా ఎక్కిన నిచ్చెన మెట్లే అన్నీ. తొమ్మిదేళ్ల వయసులో గజ్జె కట్టి... నేడు ‘మిస్ వరల్డ్ 2025’ కార్యక్రమాల్లో నాట్య ప్రదర్శనలిచ్చిన ఘనతను తన ఖాతాలో జమ చేసుకున్నారు. కళాకారుల బిడ్డ! శ్రవ్య అమ్మానాన్నలిద్దరూ కళాకారులే. సామాన్య కుటుంబం కావడంతో ఉద్యోగం మీదనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. శ్రవ్య జీవితంలో నాట్యం, చదువు రెండూ సమతూకంగానే పెరిగాయి. ఎంటెక్ పూర్తి కాగానే హైదరాబాద్ మెట్రో రైల్లో ఉద్యోగం వచ్చింది. కానీ కళ కోసం ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. దేశవిదేశాల్లో ఆమె ప్రదర్శనలు పద్దెనిమిది వందలు దాటాయి. ఆమె అకాడెమీలో శిక్షణ తీసుకున్న విద్యార్థుల సంఖ్య మూడు వేలు దాటింది. అధ్యయనమే గెలిపిస్తోంది! ‘నాట్యసాధనలో నిత్యం మేధోమధనం జరుగుతూ ఉండాలి. గురువులు నేర్పించిన జ్ఞానంతో సరిపుచ్చుకుంటే అక్కడే ఆగిపోతాం’ అంటారు శ్రవ్య. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో బుద్ధవనంలో ప్రదర్శన బుద్ధుడి ఇతివృత్తంగా ఉండాలన్నారు నిర్వహకులు. వారం రోజుల్లో బౌద్ధాన్ని అధ్యయనం చేసి, కాస్ట్యూమ్స్ లేత రంగులతో నిరాడంబరంగా డిజైన్ చేసి, బృందం మొత్తానికి కుట్టించడం వరకు ఎందులోనూ రాజీ పడలేదామె. అలాగే చౌమొహల్లా ప్యాలెస్ ప్రదర్శనకు సితార్ వంటి నిజాం సంగీత శైలితో సెమీ క్లాసికల్ రూపొందించి ప్రదర్శించారు. పోచంపల్లిలో తెలుగు జానపదం కోలాటం, శిల్పారామంలో బృందావనం, బంజారా, రాసలీలలు ప్రదర్శించి చూపారు. ఆర్ద్రతే కళ క్యాన్సర్ పేషెంట్కి విగ్ తయారు చేయడానికి సహజమైన కేశాలు అవసరమని తెలిసి గుండు చేయించుకుని తన కేశాలనిచ్చారు శ్రవ్య. కళాకారులను బతికించేది మనసు లోతుల్లోంచి ఉబికి వచ్చే ఎమోషనే. ఈ సున్నితత్వాన్ని తనలో పదిలపరుచుకుంటున్నారామె. అబుదాబిలో శ్రీనివాస కల్యాణం ప్రదర్శనకు స్టాండింగ్ ఒవేషన్ రావడం మధురానుభూతి, యాసిడ్ సర్వైవర్ మనోగతాన్ని ఆవిష్కరించడం నర్తకిగా ఆమె సామాజిక బాధ్యత. కళాకారులు సామాజిక సమస్యల మీద స్పందించడంతోపాటు సాంకేతికంగా కూడా ఎప్పటికప్పుడు తమను తాము అప్డేట్ చేసుకోవాలి. చెయ్యి పట్టుకుని నడిపించే గాడ్ఫాదర్లు లేని శ్రవ్య మానస... డిజిటల్ వేదికగా ప్రపంచానికి సుపరిచితం కావడం వల్లనే మిస్ వరల్డ్ 2025 కార్యక్రమాల్లో నాట్య ప్రదర్శన అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ‘వ్యక్తిగా పరిపూర్ణత సాధించిన బ్యూటీ ప్రాజంట్స్ నుంచి చాలా నేర్చుకున్నాను’... అన్నప్పుడు ఆమెలో శిఖరాన్ని అధిరోహించిన సంతోషం వ్యక్తమైంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
విమాన ప్రమాద సమయంలో జరిగింది ఇదేనా?
ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానం గేర్ రాడ్ మూసుకోలేదు. దానికి తోడు రెక్కల వెనక భాగం (ఫ్లాప్) ముడుచుపోయి ఉంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అసాధారణ పరిస్థితిపై వైమానిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత తక్కువ ఎత్తులో ఉన్న ప్పుడు ముఖ్యంగా టేకాఫ్ సమయంలో ఈ పరిస్థితి విమానానికి ప్రాణాంతక మేనని చెబుతున్నారు.సాధారణంగా విమానం టేకాపైన వెంటనే, అంటే 600 అడుగుల ఎత్తుకు చేరడానికి ముందే గేర్ రాడ్ విధిగా మూసుకోవాలి. ఇక విమానం చెప్పుకోదగ్గ ఎత్తుకు ఎగిరేదాకా ఫ్లాప్స్ రెండూ విచ్చుకునే ఉండాలి. విమానం పైకి వెళ్తున్న కొద్దీ అవి క్రమంగా లోనికి ముడుచుకుంటాయి. కానీ, ఎయిరిండియా విమానం టేకాఫ్ కాగాన్ లాండింగ్ గేర్ తొలుత కొంతమేరకు ముడుచుకున్నా వెంటనే తిరిగి బయటికి వచ్చింది. "బహుగా విమానానికి కావాల్సిన వేగం (థ్రస్ట్) లోపించడమో, పవర్ ఫెయిల్యూర్ చోటుచేసుకోవడమో జరిగి ఉండాలి. అది గమనించి పైలట్ ముందు జాగ్రత్తగా లాండింగ్ గేర్ను తెరిచి ఉంటారు. దాంతో పాటే కిందకు పడిపోతున్న విమానాన్ని వెంటనే పైకి లేపేపేందుకు కావాల్సిన థ్రస్ట్ కోసం ఫ్లాప్ను ఒక్కసారిగా మూసేందుకు ప్రయత్నించి ఉంటాడు" అని వైమానిక నిపుణులు అభిప్రాయపడ్డారు."కానీ 800 అడుగుల ఎత్తులో ఇది చాలా రిస్క్. ఇలాంటప్పుడు విమానం అటూ ఇటూ ఉగిపోతుంది. ఎయిరిండియా విమానం మాత్రం ఇలాంటి పరిస్థితుల్లోనూ కూలేదాకా సజావుగానే ప్రయాణించింది. అందుకు పైలట్ సామర్థ్యమే కారణం కావచ్చు. దీంతో పాటు రైట్ రడ్డర్ సమస్య తలెత్తిన సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇది లెఫ్ట్ ఇంజన్ ఫెయిల్యూర్కు సంకేతం, ఇవన్నీ కలగలిసి విమానాన్ని ఢీకొనడానికి ముందే సకాలంలో పైకి లేపడంలో పైలట్ విఫలమై ఉంటారు" అని వారు విశ్లేషించారు. అంతేగాక పక్షులు ఇంజన్ను ఢీకొనడం కూడా ప్రమాదానికి కారణం కావచ్చుంటున్నారు. "ఎయిర్పోర్ట్ను ఆనుకుని ఆవాస ప్రాంతాలున్నాయి. కనుక అక్కడ చాలా పక్షులుంటాయి. అనేక పక్షులు ఢీకొని రెండు ఇంజన్లూ శక్తిని కోల్పోయి ఉంటాయి. అందువల్లే టేకాఫ్ అనంతరం విమానం నిర్దిష్ట అందుకోలేకపోయి ఉంటాయి" అని వారన్నారు. -
ఇరాన్ ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియాకు తప్పిన ముప్పు.. విమానాల దారి మళ్లింపు
ఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ముంబై నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. మూడు గంటల ప్రయాణం తర్వాత వెనక్కి వచ్చింది. దీంతో, ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 5:39 గంటలకు ముంబై నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. మూడు గంటల ప్రయాణం తర్వాత రాడార్లో సిగ్నల్స్ సమస్య తలెత్తింది. దీంతో, సదరు విమానం తిరిగి వెనక్కి వచ్చేసింది. ఫ్లైట్ రాడార్ 24 ద్వారా ఈ విషయం నిర్ధరణ అయ్యింది. రాడార్ సిగ్నల్స్ సమస్య కారణంగానే విమానం వెనక్కి మళ్లినట్లు సమాచారం.Air India flight bound for London returns to Mumbai after 3 hours in air, says Flightradar24 pic.twitter.com/YcaxXG0lh2— NDTV (@ndtv) June 13, 2025ఇక, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్.. తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో, పలు దేశాలకు చెందిన విమాన సర్వీసులపై ఈ ప్రభావం పడింది. అనేక విమాన సర్వీసులకు దారి మళ్లిస్తున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన విమానాలను కూడా దారి మళ్లిస్తున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఎయిర్ ఇండియా స్పందిస్తూ..‘ ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ప్రయాణీకులకు వసతి కల్పించడంతో సహా అన్ని వసతులు కల్పలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.విమాన సర్వీసుల వివరాలు:AI130 - లండన్ హీత్రో-ముంబై - వియన్నాకు మళ్లించబడిందిAI102 - న్యూయార్క్-ఢిల్లీ - షార్జాకు మళ్లించబడిందిAI116 - న్యూయార్క్-ముంబై - జెడ్డాకు మళ్లించబడిందిAI2018 - లండన్ హీత్రో-ఢిల్లీ - ముంబైకి మళ్లించబడిందిAI129 - ముంబై-లండన్ హీత్రో - ముంబైకి తిరిగి వెళ్ళడంAI119 - ముంబై-న్యూయార్క్ - ముంబైకి తిరిగి వెళ్ళడంAI103 - ఢిల్లీ-వాషింగ్టన్ - ఢిల్లీకి తిరిగి వెళ్ళడంAI106 - న్యూవార్క్-ఢిల్లీ - ఢిల్లీకి తిరిగి వెళ్ళడంAI188 - వాంకోవర్-ఢిల్లీ - జెడ్డాకు మళ్లించడంAI101 - ఢిల్లీ-న్యూయార్క్ - ఫ్రాంక్ఫర్ట్/మిలన్కు మళ్లించడంAI126 - చికాగో-ఢిల్లీ - జెడ్డాకు మళ్లించడంAI132 - లండన్ హీత్రో-బెంగళూరు - షార్జాకు మళ్లించబడిందిAI2016 - లండన్ హీత్రో-ఢిల్లీ - వియన్నాకు మళ్లించబడిందిAI104 - వాషింగ్టన్-ఢిల్లీ - వియన్నాకు మళ్లించబడిందిAI190 - టొరంటో-ఢిల్లీ - ఫ్రాంక్ఫర్ట్కు మళ్లించబడిందిAI189 - ఢిల్లీ-టొరంటో - ఢిల్లీకి తిరిగి రాక. #TravelAdvisoryDue to the emerging situation in Iran, the subsequent closure of its airspace and in view of the safety of our passengers, the following Air India flights are either being diverted or returning to their origin:AI130 – London Heathrow-Mumbai – Diverted to Vienna…— Air India (@airindia) June 13, 2025 -
ఓటీటీలో 'కేసరి చాప్టర్ 2' స్ట్రీమింగ్
‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter 2) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జలియన్ వాలాబాగ్ విషాదం నేపథ్యంలో అక్షయ్ కుమార్(Akshay Kumar) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 18న బాలీవుడ్లో విడుదలైంది. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనే ట్యాగ్లైన్ను చేర్చారు. మాధవన్, అనన్యపాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మించారు. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. చరిత్ర గురించి తెలుసుకోవాలనే కోరిక ఉన్న వారికి ఈ మూవీ మంచి అవకాశం అని చెప్పవచ్చు. జియో హాట్స్టార్ (JioHotstar) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు వర్షన్ మరో వారంలోపు విడుదల కావచ్చు.కథేంటంటే..స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఏప్రిల్ 13, 1919లో పంజాబ్లోని అమృత్సర్కు సమీపంలో ఉన్న జలియన్వాలా బాగ్లో సమావేశం అయిన భారతీయులపై అప్పటి పంజాబ్ జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతాడు. తనకున్న అధికార బలంతో ఈ మారణకాండ గురించి స్థానిక వార్తా పత్రికల్లో రాకుండా చేస్తాడు. ఈ ఘటనపై అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఓ కమిషన్ ఏర్పాటు చేస్తుంది.అందులో బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్(అక్షయ్ కుమార్) కూడా ఉంటాడు. తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని శంకరన్పై ఒత్తిడి తెస్తారు. కానీ జలియన్వాలా బాగ్ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని శంకరన్కు అర్థమవ్వడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్(అనన్య పాండే)తో జనరల్ డయ్యర్పై కోర్ట్లో కేసు వేయిస్తాడు. బాధితుల తరపున ఆయన వాధిస్తాడు.డయ్యర్ తరపున వాధించేందుకు ఇండో బ్రిటన్ న్యాయవాది నెవిల్లే మెక్కిన్లే (ఆర్.మాధవన్) రంగంలోకి దిగుతాడు. ఎలాంటి సాక్ష్యాలే లేని ఈ కేసును శంకరన్ ఎలా డీల్ చేశాడు? డయ్యర్ చేసిన కుట్రను ప్రపంచానికి తెలియజేసేక్రమంలో శంకరన్కు ఎదురైన సమస్యలు ఏంటి? యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్ ఆయనకు ఎలాంటి సహాయం చేసింది? చివరకు డయ్యర్ చేసిన తప్పులను సాక్ష్యాలతో సహా ఎలా బయటపెట్టాడు? అనేదే మిగతా కథ. -
ఆ వెడ్డింగ్ గౌనుకి ఒకటిన్నర మిలియన్ల వ్యూస్..!
ఐదంటే ఐదు డాలర్లు పెట్టి ఎప్పుడో అరవై ఏళ్ల క్రితం నాటి వెడ్డింగ్ గౌన్ కొనుక్కుందామె, అది తొడుక్కుని చూద్దామని టిక్టాక్లో అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేసింది. అయితే అది ఆమెకు సరి΄ోలేదు. దాంతో తనకన్నా కొద్దిగా తక్కువ పర్సనాలిటీ ఉన్న తన చెల్లెలికి ఆ గౌన్ ఇచ్చింది. అది ఆమెకు అతికినట్లు సరి΄ోయింది. త్వరలో జరగనున్న తన వెడ్డిండ్కి ఆ గౌన్ని డ్రై క్లీనింగ్ చేయించి దానినే ధరించాలని డిసైడ్ చేసుకుంది. ఇక్కడ అది కాదు విశేషం. వీరిద్దరి వీడియోస్కి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. షష్టిపూర్తి కూడా జరుపుకున్న నాటి ఆ గౌను అంత నాజూగ్గా ఉండటం, అది కారుచౌకగా కొనుక్కుని దానికి చిన్న చిన్న రిపేర్లు చేయించి తన వెడ్డింగ్ రోజున అదే గౌన్ను ధరించాలనుకోవడం చాలా బాగుందంటూ అందరూ ఆ అక్కచెల్లెళ్లని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఓహియోలోని కొలంబస్కు చెందిన మ్యాడీ స్ట్రేయర్ అనే ఆమె వింటేజ్ వెడ్డింగ్ డ్రెస్లు దొరికే ఎస్టేట్ సేల్లో పాతకాలం నాటి ఈ వెడ్డింగ్ గౌన్ చూసి ముచ్చటపడింది. వెంటనే ఐదు డాలర్లు చెల్లించి దానిని కొనుక్కుంది. తనకు సరిపోకపోవడంతో చెల్లెలికి దానిని ప్రెజెంట్ చేసింది. అయితే ఆమె కూడా ఆ గౌనును చూసి మురిసిపోయి త్వరలో జరగబోయే తన పెళ్లికి బోలెడంత ఖరీదు చేసి అప్పటికే వెడ్డింగ్ గౌన్ను కొనుక్కున్నప్పటికీ దానిని పక్కనపెట్టి మరీ అక్క ఇచ్చిన ఈ గౌన్ తొడుక్కోవడానికి డిసైడైంది. వీరిద్దరి వీడియోలకూ ఒకటిన్నర మిలియన్లకి పైగా వ్యూస్, లక్షా ఇరవై ఆరువేల లైకులూ వచ్చాయి. Woman Buys 1963 Wedding Dress for $5 at Estate Sale—but There's a Twist - Newsweek https://t.co/s9Cgy4hgkE— Manuco (@manuco22) June 7, 2025 (చదవండి: Different Dowry Case: కట్నంగా బైక్, నగదుతోపాటు కిడ్నీ కూడా ఇవ్వాల్సిందే..) -
‘దేవికా అండ్ డానీ’ రివ్యూ : ఆత్మలతో మాట్లాడే టీచరమ్మ!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో వెబ్ సిరీస్ ‘దేవికా అండ్ డానీ’ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.సినిమాలైనా... వెబ్ సిరీస్లైనా... వాటిలో వచ్చే కథలు కొన్ని వాస్తవ రూపాలైతే మరికొన్ని కథలు దర్శకుని కాల్పనిక కళాకృతులు. రెండిటిలోను ప్రేక్షకుల నమ్మకం అనేది కీలకం. అది వాస్తవమైనా, కల్పన అయినా చూసే ప్రేక్షకుడికి నచ్చితే నెత్తిన పెట్టుకుంటాడు. అటువంటి కోవకి చెందినదే ‘దేవికా అండ్ డానీ’ వెబ్ సిరీస్. జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. దీపక్ రాజ్ అందించిన ఈ సిరీస్ కథకు బి. కిరణ్ దర్శకత్వం వహించారు. ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. సబ్జెక్ట్ సీరియస్ అయినా చక్కటి హాస్యంతో చాలా జాగ్రత్తగా స్క్రీన్ప్లే రాసుకున్నారు దర్శకుడు. ‘పెళ్ళి చూపులు’ ఫేం రీతూ వర్మ ఈ సిరీస్లో ప్రధాన కథానాయిక. ఓ రకంగా కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంటుంది. దేవిక పాత్రలో రీతూ జీవించారనే చెప్పాలి. ఇక కథ విషయానికొస్తే... దేవిక ఆ ఊరి స్కూల్లో సంగీతం నేర్పించే టీచర్గా పని చేస్తుంటుంది. దేవిక తాత పెద్ద ఉపాసకుడు. ఆయనకు ఆత్మలతో మాట్లాడే అద్భుతమైన శక్తి ఉంటుంది. అదే శక్తి మనవరాలు దేవికకు కూడా ఉందన్న విషయం కథ మధ్యలో తెలుస్తుంది. దేవికకు ఓ పెళ్ళి సంబంధం ఖాయమవుతుంది. దేవిక స్కూల్కి వెళ్ళే సమయంలో ఓ రోజు డానీ అనే వ్యక్తి పరిచయమవుతాడు. డానీని దేవిక ఇష్టపడుతుంది. కానీ దేవిక దగ్గరకు డానీ ఓ సమస్యతో వస్తాడు. ఆ సమస్య వల్ల దేవిక చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుని ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటుంది. పుట్టి బుద్ధి ఎరిగిన నాటి నుండి ఇల్లు, స్కూలుకి పరిధిలోని 20 కిలోమీటర్లలోనే ప్రయాణిస్తున్న ఓ పెళ్ళి నిశ్చయమైన అమ్మాయి దారిలో కనబడ్డ అబ్బాయితో ప్రేమలో పడి ఆ అబ్బాయికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణించి తన ప్రాణాలను పణంగా పెడుతుంది. మరి... డానీ సమస్యను దేవిక తీర్చగలిగిందా? తనకు నిశ్చితార్థమైన అబ్బాయినే పెళ్ళి చేసుకుందా? అన్న విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం ‘దేవికా అండ్ డానీ’ వెబ్ సిరీస్ చూసేయండి. సిరీస్ మొత్తం మంచి ట్విస్టులతో, చక్కటి హ్యూమర్తో ఎక్కడా బోర్ కొట్టదు. ఇంకెందుకు ఆలస్యం... చూసేయండి మరి.– హరికృష్ణ ఇంటూరు -
అల్లు అర్జున్ అంటే అంతే.. కొత్త దర్శకుడికి బిగ్ ఛాన్స్
పుష్ప(Pushpa) తరువాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాల గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పాన్ ఇండియా రేంజ్లో ఆదరణ ఉండటంతో ప్రస్తుతం కథల ఎంపిక విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తో ఒక సినిమాను పట్టాలెక్కించాడు. త్రివిక్రమ్(Trivikram) సినిమాను దాదాపు పక్కన పెట్టేసినట్లే అని చెప్పవచ్చు. అయితే, ఇప్పటికే బన్నీ లిస్ట్లో ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఆయనతో ఒక ప్రాజెక్ట్ తప్పకుండా చేస్తారని టాక్ ఉంది. ఇంతలో ఎవరూ ఊహించలేని ఒక దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అట్లీ సినిమా తర్వాత తన దర్శకత్వంలోనే బన్నీ సినిమా అంటూ పెద్ద ఎత్తున్న వైరల్ అవుతుంది.అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరూ ఊహించలేని దర్శకుడితో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కథ కూడా బన్నీ ఓకే చేశారట. మలయాళ హిట్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్(Basil Joseph)తో బన్నీ సినిమా దాదాపు ఖరారు అయిపోయిందట. మలయాళంలో డైరెక్టర్గానే కాకుండా నటుడిగా కూడా ఆయన సంచలన విజయాలను అందుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మిన్నల్ మురళీ' (2021) చిత్రానికి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, దర్శకుడిగా ఆయన మూడు చిత్రాలకే పనిచేశారు. స్టోరీ రచయితగా పలు సినిమాలకు పనిచేశారు. జయ జయ జయ జయహే, సూక్ష్మ దర్శిని, పోన్ మాన్ వంటి సినిమాలతో ఆయన తెలుగు వారికి నటుడిగా బాగా దగ్గరయ్యాడు. కేవలం మూడు సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన బాసిల్ జోసెఫ్తో బన్నీ సినిమా చేస్తున్నట్లు వార్తలు రావడంతో నెట్టింట భారీగా వైరల్ అవుతుంది.ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాస్ ఒక సినిమా గురించి మాట్లాడారు. మరో నాలుగు నెలలో గీతా ఆర్ట్స్ నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్ను ప్రకటిస్తామన్నారు. అదే సమయంలో త్రివిక్రమ్ మూవీ కాదని కూడా తెలిపాడు. ఎవరూ ఊహించలేని కాంబినేషన్ అని ఆయన అన్నాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. మలయాళంలో అల్లు అర్జున్కు భారీ ఇమేజ్ ఉంది. దీంతో ఆయన మీద అభిమానంతో దాదాపు నాలుగేళ్లు కష్టపడి ఒక కథను బాసిల్ రెడీ చేశారట. త్వరలో అధికారికంగా ప్రకటన ఉంటుందని సమాచారం. -
ఆన్లైన్ మోసాలకు ఎయిర్టెల్ చెక్
ఆన్లైన్ మోసాల కట్టడి చేసే దిశగా తమ ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టంను దేశవ్యాప్తంగా మరింతగా అందుబాటులోకి తెస్తున్నట్లు టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలో దీన్ని ప్రవేశపెట్టిన 25 రోజుల వ్యవధిలోనే 1,80,000 పైచిలుకు హానికారక లింకులను బ్లాక్ చేసినట్లు పేర్కొంది.ఈ వ్యవస్థతో 54 లక్షల మందికి ప్రయోజనం చేకూరినట్లు వివరించింది. ఎయిర్టెల్ మొబైల్, బ్రాడ్బ్యాండ్ కస్టమర్లందరికీ ఇది ఆటోమేటిక్గా ఎనేబుల్ చేసినట్లు భారతి ఎయిర్టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఈవో అజయ్ అనంతపద్మనాభన్ చెప్పారు. ఎస్ఎంఎస్లు, వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఈ–మెయిల్స్ మొదలైన వాటిల్లో వచ్చే లింకులను ఈ అధునాతన వ్యవస్థ ఫిల్టర్ చేస్తుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఈపీఎఫ్ క్లెయిమ్లకు వేగంగా ఆమోదంస్కాములను నివారించేందుకు తమ విభాగం నిరంతరం కృషి చేస్తోందని, ఎయిర్టెల్ కూడా సమర్ధవంతమైన ఫ్రాడ్ డిటెక్షన్ సొల్యూషన్ ప్రవేశపెట్టడం ప్రయోజనకరమైన విషయమని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ, డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. -
నిధులు సమీకరణకు ప్రభుత్వ సంస్థ రెడీ
అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు(క్విప్) ద్వారా పునరుత్పాదక ఇంధన అభివృద్ధి పీఎస్యూ.. ఇరెడా రూ. 2,000 కోట్లు సమీకరించింది. ఈ నెల 5–10 మధ్య చేపట్టిన క్విప్నకు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి ప్రోత్సాహకర స్పందన లభించినట్లు కంపెనీ పేర్కొంది. బీమా రంగ సంస్థలు, వాణిజ్య బ్యాంకులు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తదితర అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్) ఆసక్తి చూపినట్లు వెల్లడించింది. ఇష్యూ ప్రాథమిక పరిమాణం రూ. 1,500 కోట్లుకాగా.. 1.3 రెట్లు అధికంగా రూ. 2,006 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు తెలియజేసింది. అర్హతగల కొనుగోలుదారులకు ఈక్విటీ షేర్ల కేటాయింపును చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. దీంతో షేరుకి రూ. 165.14 ధరలో 12.15 కోట్ల ఈక్విటీ షేర్లు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. రూ. 10 ముఖ విలువగల వీటిని రూ. 155.14 ప్రీమియంతో కేటాయిస్తున్నట్లు వివరించింది. ఫ్లోర్ ధర రూ. 173.83తో పోలిస్తే 5 శాతం డిస్కౌంట్లో రూ. 165.14 చొప్పున షేర్లను జారీ చేస్తున్నట్లు తెలియజేసింది. ఇదీ చదవండి: ఈపీఎఫ్ క్లెయిమ్లకు వేగంగా ఆమోదంక్విప్ నిధుల సమీకరణతో కంపెనీ టైర్–1 మూలధనంసహా కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) మరింత పటిష్టమైనట్లు పేర్కొంది. దేశీయంగా పునరుత్పాదక ఇంధన రంగ విస్తరణకు నిధులు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. 2023 నవంబర్లో ఐపీవో చేపట్టిన కంపెనీ తక్కువ సమయంలోనే క్విప్ను విజయవంతంగా నిర్వహించినట్లు ఇరెడా చైర్మన్, ఎండీ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. -
ఇరాన్కు భారీ షాక్.. ఆర్మీ చీఫ్, అణు శాస్త్రవేత్తలు మృతి!
జెరూసలెం: పశ్చిమాసియాలో మరో యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. తమ వ్యతిరేక శక్తులకు సహకారం అందిస్తుందనే కోపంతో ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్పై ఒక్కసారిగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ క్రమంలో ఇరాన్ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది.ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ఇరాన్పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఇక, ఇజ్రాయెల్ దాడుల్లో.. ఇరాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భీకర దాడుల్లో ఇరాన్ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. ఐఆర్జీసీ హెడ్క్వార్టర్స్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఈ దళం అధిపతి మేజర్ జనరల్ హొస్సేన్ సలామీ మరణించినట్టు సమాచారం. ఈ మేరకు పలు కథనాలు పేర్కొన్నాయి. ఈయనతో పాటు రెవల్యూషనరీ గార్డ్లోని ఇతర టాప్ అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. BREAKING:Iran confirms that Israel has killed:– Hossein Salami (the IRGC’s Commander-in-Chief)– Gholam-Ali Rashid (the Armed Forces Strategic Commander)– Dr. Tehranchi (The project supervisor in the Amad Plan to develop nuclear weapons and project supervisor for… pic.twitter.com/y7FoHHJ7Ga— Visegrád 24 (@visegrad24) June 13, 2025ఇరాన్పై కొద్ది రోజుల్లోనే దాడులు చేస్తామని ఇజ్రాయెల్ వెల్లడించిన విషయం తెలిసిందే. అమెరికా సాయం లేకుండానే ఈ దాడులు జరగనున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా దాడులు చేస్తామని ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నజీర్జాదే తెలిపారు. దీంతోపాటు ఇజ్రాయెల్పై వందల బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తామని స్పష్టంచేశారు.🚨 JUST IN: The Israeli military has KlLLED Iran’s Military Chief of Staff in a targeted strike, per FoxNetanyahu says Iran has enriched enough Uranium for nine atomic bombs. pic.twitter.com/VSU5t87iGZ— Nick Sortor (@nicksortor) June 13, 2025 అమెరికా అప్రమత్తంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా నుంచి తమ సైనిక, ఇతర సిబ్బందిని తగ్గించుకోవాలని నిర్ణయించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని సిబ్బందిని తగ్గించాలని సూచించారు. బహ్రెయిన్, కువైట్లలోనూ అత్యవసరం కాని సిబ్బందిని తగ్గించాలని ఆదేశించారు. వారంతా ఆయా దేశాలను వీడేందుకు సాయం చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్లోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందికీ హెచ్చరికలు జారీ అయ్యాయి. -
‘ఇజ్రాయెల్ దాడులు’.. ఇరాన్లోని భారతీయులకు అడ్వైజరీ
ఢిల్లీ: ఇరాన్పై ఇజ్రాయెల్ భయానక దాడులు చేస్తోంది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ విడుదల చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులకు కీలక సూచనలు చేసింది. ట్విట్టర్ వేదికగా.. ‘ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులంతా అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు చెప్పే భద్రతా ప్రమాణాలను పాటించండి. ఎప్పటికప్పుడు ఎంబసీల సోషల్ మీడియా ఖాతాలను అనుసరించి తాజా సమాచారం తెలుసుకోండి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత శిబిరాలకు చేరుకొనేందుకు సిద్ధంగా ఉండండి’ అడ్వైజరీలో పేర్కొంది.The Embassy of India in Iran posts an advisory for Indian nationals living in Iran."In view of the current situation in Iran, all Indian nationals & persons of Indian origin in Iran are requested to remain vigilant, avoid all unnecessary movements, follow the Embassy’s Social… pic.twitter.com/nxgvL0AtDZ— ANI (@ANI) June 13, 2025మరోవైపు.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ విమాన రాకపోకలపై పడింది. ఇరాన్, ఇరాక్ గగనతలంలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పొరుగు దేశాలకు, ప్రాంతాలకు వెళ్లే విమానాల రాకపోకలపై ప్రభావం చూపిస్తోంది. ఈ మేరకు సంబంధిత ఎయిర్ లైన్స్ను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్పోర్టు అధికారులు సూచించారు. -
WTC Final 2025: కమిన్స్ ట్రిపుల్ సెంచరీ
లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ రసవత్తరంగా సాగుతుంది. తొలి రెండు రోజుల్లోనే ఇరు జట్లకు చెందిన 28 వికెట్లు కూలడంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు మారింది. ప్రస్తుతానికి ఆసీస్ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తున్నా, నిలబెట్టుకుంటుందన్న గ్యారెంటీ లేదు.రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. మిచెల్ స్టార్క్ (16), నాథన్ లియోన్ (1) క్రీజ్లో ఉన్నారు. 43/4 వద్ద రెండో రోజు తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన సౌతాఫ్రికా మరో 95 పరుగులు మాత్రమే జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది. బెడింగ్హమ్ 45, బవుమా 36 పరుగులు చేసి సౌతాఫ్రికాను మూడంకెల స్కోర్ దాటించారు. వీరు కాక సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో వెర్రిన్ (13), రికెల్టన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మార్క్రమ్ (0), ముల్దర్ (6), స్టబ్స్ (2),జన్సెన్ (0), మహారాజ్ (7), రబాడ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.కమిన్స్ 6 వికెట్లతో చెలరేగిపోయి ప్రొటీస్ పతనాన్ని శాశించాడు. సౌతాఫ్రికాను స్వల్ప స్కోర్కు కట్టడి చేయడంలో స్టార్క్ (2/41), హాజిల్వుడ్ (1/27) కూడా తలో చేయి వేశారు. 74 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కూడా సఫారీ బౌలర్ల ధాటికి వణికింది. ఆ జట్టును అలెక్స్ క్యారీ (43) అదుకున్నాడు. స్టార్క్ ఆసీస్ను 300 పరుగుల టార్గెట్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో క్యారీ, స్టార్క్ కాకుండా లబూషేన్ (22), స్టీవ్ స్మిత్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఉస్మాన్ ఖ్వాజా 6, గ్రీన్ 0, హెడ్ 9, వెబ్స్టర్ 9, కమిన్స్ 6 పరుగులకు ఔటయ్యారు. సఫారీ బౌలర్లలో రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టి ఆసీస్కు చుక్కలు చూపించారు. జన్సెన్, ముల్దర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకే ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకోవడంతో ఆసీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.మిగతా ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ క్యారీ (23), లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. గ్రీన్ (4), కమిన్స్ (1), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ లియోన్ డకౌట్లయ్యారు.కమిన్స్ ట్రిపుల్ సెంచరీతొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసి సౌతాఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టిన ఆసీస్ సారధి కమిన్స్.. ఈ ప్రదర్శన అనంతరం పలు రికార్డులు సాధించాడు. ఈ ప్రదర్శనతో కమిన్స్ టెస్ట్ల్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ మైలురాయిని తాకిని 40వ బౌలర్గా.. ఎనిమిదో ఆసీస్ బౌలర్గా.. ఓవరాల్గా 30వ పేసర్గా.. ఆరో ఆసీస్ పేసర్గా పలు ఘనతలు సాధించాడు.ఈ ప్రదర్శనతో కమిన్స్ సాధించిన మరిన్ని రికార్డులు ఇవే..అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టోర్నమెంట్ ఫైనల్లో ఐదు వికెట్లు తీసిన తొలి కెప్టెన్గా కమ్మిన్స్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏ కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో కమ్మిన్స్ 78 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(77) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో బుమ్రాను కమ్మిన్స్ అధిగమించాడు.లార్డ్స్ మైదానంలో ఒక టెస్టు ఇన్నింగ్స్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్గా కమ్మిన్స్ (28 పరుగులకు 6 వికెట్లు) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బాబ్ విల్లీస్ పేరిట ఉండేది. 1982లో భారత్పై 101 పరుగులిచ్చి విల్లీస్ 6 వికెట్లు పడగొట్టాడు. తాజా ప్రదర్శతో విల్లీస్ ఆల్టైమ్ రికార్డును కమ్మిన్స్ బ్రేక్ చేశాడు. -
ఈపీఎఫ్ క్లెయిమ్లకు వేగంగా ఆమోదం
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) క్లెయిమ్ల పరిష్కారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత వేగాన్ని సంతరించుకుంది. క్లెయిమ్ దరఖాస్తుల్లో 50 శాతాన్ని (ప్రధానంగా ఉపసంహరణ) మూడు రోజుల్లోనే పరిష్కరించినట్టు ఓ అధికారి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇలా మూడు రోజుల్లోనే పరిష్కరించిన క్లెయిమ్లు 39 శాతంగా ఉన్నట్టు చెప్పారు.2025 ఏప్రిల్ నుంచి జూన్ 5 మధ్య 68.96 లక్షల క్లెయిమ్లకు మూడు రోజుల్లో పరిష్కారం లభించింది. ప్రస్తుతం రూ.లక్ష వరకు క్లెయిమ్లకు ఆటోమేటెడ్ పరిష్కారం అమల్లో ఉండగా, ఈపీఎఫ్వో త్వరలోనే రూ.5 లక్షల వరకు క్లెయిమ్లకు ఈ పరిమితిని పెంచనుంది. దీంతో మరిన్ని క్లెయిమ్లకు వేగంగా పరిష్కారం లభించనుందని ఆ అధికారి తెలిపారు. ఈ పరిమితి పెంపునకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం అవసరం లేదన్నారు. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఇందుకు అనుమతించొచ్చని చెప్పారు.ఇదీ చదవండి: అమెరికా బడ్జెట్ లోటుకు 5 నిమిషాల్లో పరిష్కారం ఇదే..!అనారోగ్యం, విద్య, ఇంటి నిర్మాణం/కొనుగోలు, వివాహ అవసరాలకు సంబంధించిన క్లెయిమ్లు రూ.లక్ష వరకు ఉండి, దరఖాస్తుదారులకు అర్హతలు ఉంటే వాటికి మూడు రోజుల్లోనే క్లెయిమ్ మొత్తం మంజూరవుతున్నట్టు తెలిపారు. ముఖ్యంగా 2012కు ముందు చేరిన సభ్యుల క్లెయిమ్ల ధ్రువీకరణకు సమయం తీసుకుంటున్నట్టు తెలిపారు. పెన్షన్, గ్రూప్ ఇన్సూరెన్స్, ఈపీఎఫ్ ఉపసంహరణలు అన్నింటినీ 72 గంటల్లోనే పరిష్కరించాలన్నది ఈపీఎఫ్వో లక్ష్యమని.. ఈ దిశగా ఈపీఎఫ్వో కృషి చేస్తున్నట్టు చెప్పారు. -
8k వర్షన్లో ఎన్టీఆర్- జాన్వీ కపూర్ వీడియో సాంగ్
దేవరలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) రొమాంటిక్ స్టెప్పులతో ‘చుట్టమల్లే’ అంటూ యువతను బాగా చుట్టేసుకుంది. ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘దేవర’లో ఈ పాటకు ఫ్యాన్స్ ఎక్కువే అని చెప్పవచ్చు. తాజాగా 'చుట్టమల్లే' పాటను 8k వర్షన్లో ఉన్న వీడియోను విడుదల చేశారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల నుంచి పలు సాంగ్స్ 8k వర్షన్లో విడుదలయ్యాయి. దసరా, స్త్రీ2, గేమ్ఛేంజర్, రైడ్2 వంటి చిత్రాలతో పాటు కొన్ని పాత సినిమాల నుంచి కూడా సరికొత్తగా 8k వర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.ప్రస్తుతం 4K వీడియోలోనే ఎక్కువ పాటలు ఉంటున్నాయి. అయితే, ఇప్పుడు 8k వర్షన్లో విడుదల చేస్తున్నారు. దీంతో 4K వీడియో కంటే ఎక్కువ రిజల్యూషన్తో నాణ్యత ఉంటుంది. 8k వీడియో చూడటం వల్ల మీరు మరింత స్పష్టమైన. పదునైన విజువల్స్ను అనుభవించవచ్చు. 8k వీడియోలను పెద్ద స్క్రీన్లలో లేదా డిస్ప్లేలలో చూడటం ద్వారా వాటిని మరింత బాగా ఆస్వాదించవచ్చు. 4k రిజల్యూషన్ 3840 x 2160 పిక్సెల్స్ (pixels) అయితే, 8k రిజల్యూషన్ 7680 x 4320 పిక్సెల్స్గా ఉంటుంది. -
ట్యాపింగ్ కేసు.. వ్యూహం మార్చిన సిట్
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం అమెరికాలో తలదాచుకున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు తిరిగి రావడం, ఆయన విచారణ పర్వం కొనసాగుతుండటంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. విచారణ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్తుండటంతో తమ వ్యూహం మార్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయి, బెయిల్పై బయటకు వచ్చిన నిందితులను మరోసారి ప్రశ్నించాలని నిర్ణయించారు.ఎస్ఐడీలోని ఎస్ఓటీకి నేతృత్వం వహించిన డి.ప్రణీత్రావు ఈ కేసులో అరెస్టు అయిన తొలి నిందితుడు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న ఈయన్ను బుధవారం ప్రభాకర్రావుతో కలిపి విచారించారు. తాజాగా శుక్రవారం సైతం విచారణ హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ప్రభాకర్రావు శనివారం మరోసారి సిట్ ఎదుట విచారణకు వస్తుండటంతో ఒక రోజు ముందు ప్రణీత్ను ప్రశ్నించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు మూలం ఎస్ఐబీ కార్యాలయంలోని హార్డ్డిస్క్లు ధ్వంసం చేయడం. ఎస్ఐబీ అదనపు ఎస్పీగా పని చేస్తున్న డి.రమేష్ ఫిర్యాదు ఆధారంగా కుట్ర, నమ్మక ద్రోహం, నేరపూరిత చర్యలు, ప్రజా ఆస్తుల విధ్వంసం తదితర సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో చాన్నాళ్ల తర్వాత టెలిగ్రాఫిక్ యాక్ట్ చేర్చారు. నల్లగొండ జిల్లాలో పని చేస్తూ, ఇన్స్పెక్టర్ హోదాలో 2018లో ఎస్ఐబీలోకి ప్రవేశించిన దుగ్యాల ప్రణీత్ రావుకు 2023లో డీఎస్పీగా యాక్సిలేటరీ పదోన్నతి లభించింది. ఈయన ఎస్ఐబీలో ఉన్న మిగిలిన అధికారుల మాదిరిగా కాకుండా విధులు నిర్వర్తించారు.ఎస్ఐబీ కార్యాలయంలో తన కోసం ప్రత్యేకంగా రెండు గదులను ఏర్పాటు చేసుకున్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తీసుకు 17 అత్యాధునిక కంప్యూటర్లతో పని చేశారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల పేరుతో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ప్రణీత్ తన అధికారాన్ని దురి్వనియోగం చేస్తూ నిఘాకు సంబంధించిన అనేక వివరాలను తన వ్యక్తిగత డ్రైవ్ల్లో భద్రపరుచుకున్నారని, 2023 డిసెంబర్ 4 రాత్రి ఎస్ఐబీ కార్యాలయంలోకి వచ్చిన ప్రణీత్ రావు అక్కడి సీసీ కెమెరాలు పని చేయకుండా ఆపేసి కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని డిలీట్ చేయడంతో పాటు ఎస్ఐబీకి చెందిన 42 హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.రెండు టీబీల డేటాను డిలీట్ చేయడంతో పాటు దాదాపు 1600 పేజీల కాల్ డేటాను కూడా ప్రణీత్ రావు తగులబెట్టినట్లు, కొన్ని హార్డ్ డిస్క్ల్ని ధ్వంసం చేయడంతో పాటు మరికొన్ని తీసుకుపోయి వాటి స్థానంలో కొత్తవి పెట్టినట్లు తేల్చారు. ప్రణీత్ రావు ఎస్ఐబీలో పని చేసినప్పుడు 30 మంది సిబ్బందితో ప్రత్యేక బృందం ఉంది.అప్పట్లో ఎస్ఐడీ చీఫ్గా ప్రభాకర్రావు ఉండటంతో ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందని సిట్ అనుమానిస్తోంది. ఈ ఆరోపణల్లో అత్యధికం ప్రభాకర్రావు ఖండిస్తుండటంతో సిట్ అప్రమత్తమైంది. శుక్రవారం ప్రణీత్రావు నుంచి సేకరించే వివరాల ఆధారంగా శనివారం ప్రభాకర్రావుకు సంధించాలి్నన ప్రశ్నావళిని సిద్ధం చేయనున్నారని తెలిసింది. ప్రణీత్ తర్వాత భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావులకూ నోటీసులు జారీ చేసి ప్రశి్నంచేందుకు సిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
ఇజ్రాయెల్ మరో యుద్ధం.. ఇరాన్పై వైమానిక దాడులు..
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ రాజధాని ట్రెహాన్ టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్కు చెందిన అణు కర్మాగారం, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. మరోవైపు.. ఇజ్రాయెల్లో అత్యవసర పరిస్థితి విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఇరాన్పై యుద్ధం విషయంలో అమెరికా మాటను వినేందుకూ ఇజ్రాయెల్ సిద్ధంగా లేకపోవడం గమనార్హం. మరోవైపు దీనిని తిప్పికొట్టేందుకు ఇరాన్ అదే స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటోంది. వందల బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఎటు దారితీస్తుందోనన్న భయాందోళనలు ప్రపంచమంతటా వ్యక్తమవుతున్నాయి. Iran had no idea we were coming. They were completely blind. The Israeli strike caught ALL the Iranian commanders in bed. Not a single warning signal was activated. pic.twitter.com/oLLyt1JhDs— Cheryl E 🇮🇱🎗️ (@CherylWroteIt) June 13, 2025ఇజ్రాయెల్ దాడులపై నెతన్యాహు ప్రకటన..ఇరాన్పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించామని నెతన్యాహు ప్రకటనఇరాన్ అణ్వాయుధీకరణ కార్యక్రమం, అణు కేంద్రాలను టార్గెట్ చేసినట్టు చెప్పుకొచ్చారు.ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభమైంది.ఎన్ని రోజులైన ఆపరేషన్ కొనసాగుతుంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ అధిపతి మృతి!Benjamin Netanyahu full statement on Iran's attack:"We struck at the heart of Iran's nuclear enrichment program, Iran's nuclear weaponization program, Iran's main enrichment facilities, leading nuclear scientists, and ballistic missile programs."pic.twitter.com/EBGMLi23Aj— Vivid.🇮🇱 (@VividProwess) June 13, 2025ఇరాన్ (Iran)పై ఇజ్రాయెల్ ముందస్తు వైమానిక దాడులు చేసింది. టెహ్రాన్లోని ఓ ప్రాంతంలో శుక్రవారం భారీగా పేలుడు శబ్ధాలు వినిపించాయి. ఈ మేరకు ఇరాన్లోని ఓ వార్తా సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇరాన్కు చెందిన అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. డజన్ల కొద్దీ దాడులు జరిగాయని సమాచారం. వీటి తర్వాత టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని విమానాలను నిలిపివేసింది.మరోవైపు.. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కు భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఇరాన్ ఆర్మీ చీఫ్ సహా సైనికులను టార్గెట్ చేసి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసినట్టు సమాచారం. 🚨 JUST IN: The Israeli military has KlLLED Iran’s Military Chief of Staff in a targeted strike, per FoxNetanyahu says Iran has enriched enough Uranium for nine atomic bombs. pic.twitter.com/VSU5t87iGZ— Nick Sortor (@nicksortor) June 13, 2025ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ.. మరోవైపు ఇజ్రాయెల్లో ప్రత్యేక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ దేశంలో దాడులు జరగవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇరాన్ లో తాము దాడులు నిర్వహించామని.. దీని కారణంగా ఇజ్రాయెల్లో కూడా క్షిపణి లేదా డ్రోన్ దాడులు జరగవచ్చని ఆయన అన్నారు. ఇక ఇరాన్పై దాడులు చేయడంలో ఇజ్రాయెల్ ఏకపక్షంగా వ్యవహరించిందని, ఈ ఆపరేషన్లో అమెరికా ప్రమేయం లేదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టం చేసారు. ఈ ప్రాంతంలోని అమెరికన్ దళాలను రక్షించడం తమ పరిపాలన యొక్క అగ్ర ప్రాధాన్యత అని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తాము చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇరాన్ అమెరికా ప్రయోజనాలను లేదా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోకూడదని మార్క్ అన్నారు. Iran is the enemy but this is not our fightThey chant "death to America" all the time but two things can be true at once. This is not our fight If you're screaming for Trump to send our troops to die in an Israel-Iran war, grab a gun and go fight it yourself! Drag your own… pic.twitter.com/ZnCkqZHu2q— Terrence K. Williams (@w_terrence) June 13, 2025 అమెరికా స్పందన..ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులతో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. టెహ్రాన్ దాడికి రావొద్దని, తమ దేశానికి చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. అమెరికా బలగాలను కాపాడుకోవడమే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.Here we go. Israel has just struck Tehran, Iran.The United States should NOT get involved in this!No more wars!pic.twitter.com/ngTAn1AEKs— Steve 🇺🇸 (@SteveLovesAmmo) June 13, 2025 -
వరంగల్లో దారుణం.. భర్త గొంతు కోసిన భార్య
సాక్షి, వరగల్: వరంగల్ నగరంలో దారుణ ఘటన జరిగింది. భర్త గొంతును భార్య కోసేసింది. దుబాయ్ వెళ్లి సంపాదించాలని భర్తపై ఒత్తిడి చేసింది. దుబాయ్ వెళ్లనందుకు భర్తపై హత్యాయత్నం చేసింది. భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఎంజీఎంలో మృత్యువుతో రెహమాన్ పోరాడుతున్నాడు. గత కొద్దిరోజులుగా రహమాన్ను భార్య కుటుంసభ్యులు వేధిస్తుండగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
శ్రేయస్ అయ్యర్కు మరో చేదు అనుభవం
కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఒకే నెలలో వరుసగా రెండు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. జూన్ 3న అతని సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైంది. పది రోజులు తిరక్కుండానే జూన్ 12న అతని కెప్టెన్సీలోని మరో జట్టు ఫైనల్లో ఓటమిని ఎదుర్కొంది.నిన్న జరిగిన ముంబై టీ20 లీగ్ ఫైనల్లో శ్రేయస్ నేతృత్వం వహించిన సోబో ముంబై ఫాల్కన్స్.. ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రేయస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ప్రత్యర్ధి టీమ్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఈ మ్యాచ్లో శ్రేయస్ ఆటగాడిగానూ విఫలమయ్యాడు. 17 బంతులు ఆడి బౌండరీలు, సిక్సర్లు లేకుండా 12 పరుగులు మాత్రమే చేశాడు. అతని జట్టులో మయూరేశ్ తండేల్ (50) అజేయ అర్ద సెంచరీతో రాణించగా.. హర్ష్ గర్వ్ (28 బంతుల్లో 45 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంగ్క్రిష్ రఘువంశీ 7, ఇషాన్ ముల్చందని 20, అమోఘ్ భత్కల్ 16 పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో వైభవ్ మాలీ 2, ఆదిత్య ధుమాల్, మ్యాక్స్వెల్ స్వామినాథన్ తలో వికెట్ పడగొట్టారు.రాయల్స్ ఇన్నింగ్స్లో చిన్మయ్ రాజేశ్ సుతార్ (53) అర్ద సెంచరీతో రాణించగా.. అవైస్ ఖాన్ నౌషద్ 38, సాహిల్ భగవంతా జాదవ్ 22, సిద్దేశ్ లాడ్ 15, సచిన్ యాదవ్ 19, రోహన్ రాజే 8 (నాటౌట్) పరుగులు చేశారు. శ్రేయస్ జట్టు బౌలర్లలో కార్తీక్ మిశ్రా, యశ్ దిచోల్కర్ తలో రెండు వికెట్లు తీశారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా చిన్మయ్ రాజేశ్ సుతార్ ఎంపిక కాగా.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును సాయిరాజ్ పాటిల్ గెలుచుకున్నాడు. కెప్టెన్గా శ్రేయస్ రికార్డుఐపీఎల్ 2024లో కేకేఆర్ను విజేతగా నిలిపాడు2024లో ముంబైకి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడుఐపీఎల్ 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఫైనల్స్కు చేర్చాడు (రన్నరప్)ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్స్కు చేర్చాడు (రన్నరప్)ముంబై టీ20 లీగ్ 2025లో సోబో ముంబై ఫాల్కన్స్ను ఫైనల్స్కు చేర్చాడు (రన్నరప్) -
ఓటీటీలో సడెన్ సర్ప్రైజ్.. 'విజయ్ సేతుపతి' కొత్త సినిమా స్ట్రీమింగ్
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన కొత్త సినిమా 'ఏస్' (Ace) ఓటీటీలోకి వచ్చేసింది. మే 23న విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు వారాల్లోనే స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటించింది. రొమాంటిక్ క్రైమ్ కామెడీగా ఆకట్టుకున్న ఈ మూవీని ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు, తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రంలో దివ్యా పిళ్లై, యోగిబాబు, అవినాశ్, పృథ్వీరాజ్, కీలక పాత్రలలో నటించారు. రీసెంట్గా మహారాజా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ సేతుపతి తర్వాత ఏస్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ వీకెండ్లో ఓటీటీలో మీరూ ఈ చిత్రాన్ని చూసేయండి.'ఏస్' (Ace) చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ చిత్రాన్ని జూన్ 13న అందుబాటులోకి తీసుకొచ్చారు. తమిళ్తో పాటు తెలుగు వర్షన్ను ఒకేసారి విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.కథబోల్ట్ కన్నన్ (విజయ్ సేతుపతి) జైలు నుంచి విడుదలై తన నేర గతాన్ని వదిలించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మలేసియాకు వస్తాడు. అక్కడ జ్ఞానందం (యోగిబాబు) ఆశ్రయం కల్పిస్తాడు. మలేషియాలో కల్పన (దివ్యా పిళ్లై) హోటల్ నడుపుతూ ఉంటుంది. ఆమె వద్దకు పనిలో చేరుతాడు బోల్డ్ కన్నన్.. ఈ క్రమంలో, తన పెంపుడు తండ్రి రాజా దొరై (బబ్లూ) నుండి ఇంటిని విడిపించుకోవడానికి డబ్బు కూడబెడుతున్న రుక్మిణి (రుక్మిణి వసంత్)తో కన్నన్ ప్రేమలో పడతాడు. అయితే, కల్పన తన హోటల్ కోసం తీసుకున్న లోన్ చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇలా తన ప్రేయసితో పాటు యజమాని కూడా డబ్బుల కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీంతో తన స్నేహితుడు జ్ఞానందంతో కలిసి మలేసియాలో అక్రమ వ్యాపారాలు నడిపే ధర్మ (అవినాష్) వద్దకు డబ్బుల కోసం వెళ్తారు. అయితే, వడ్డీ కట్టడంలో ఆలస్యమైతే ప్రాణాలు తీసే ధర్మ ఉచ్చులో వారు చిక్కుకుంటారు. ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బోల్ట్ కన్నన్ ఎలా బయటపడతాడు..? నగరంలో జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీతో కన్నన్కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్నో సమస్యలను దాటుకుని తాను ప్రేమించిన రుక్మిణిని కన్నన్ పెళ్లి చేసుకుంటాడా..? అసలు బోల్ట్ కన్నన్ గతం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. -
విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్పై ఫేక్ ప్రచారం..
Ahmedabad Incident Updates..బ్లాక్ బాక్స్ రికవరీ నివేదికలు ఊహాగానాలు మాత్రమే: ఎయిర్ ఇండియాఅహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్పై ఫేక్ ప్రచారంబ్లాక్ బాక్స్ దొరికిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం.తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఎయిర్ ఇండియా.బ్లాక్ బాక్స్పై ఎంత దొరకలేదని స్పష్టం చేసిన ఎయిర్ ఇండియా.Till now, the black box is not recovered from the plane.The black box is located in the tail section of the aircraft.The tail of the aircraft is stuck into the building.To access the blackbox safely, the tail needs to be removed from the building.But the work regarding… pic.twitter.com/c9B62v10Ce— Kapil (@kapsology) June 13, 2025మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లుడీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.ప్రమాదంలో మృతదేహాలన్ని కూడా మాంసపు ముద్దల్లా మారిపోయాయి.తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలను నిర్వహించి వారిని గుర్తించనున్నారు.డీఎన్ఏ కోసం శాంపిళ్ల సేకరణవిమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ కోసం అధికారులు శాంపిళ్లను సేకరించారు.డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతుదేహాలను గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగించనున్నారు. విమాన ప్రమాదంపై మోదీ స్పందన..విమాన ఘటన తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా. ఇంత మంది ప్రాణాలు కోల్పోయిన బాధను మాటల్లో చెప్పలేను.ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అహ్మదాబాద్ విమానాశ్రయంలో మోదీ సమీక్షఅహ్మదాబాద్ విమానాశ్రయంలో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని సమీక్షసమీక్షలో అధికారులు, సహా మంత్రులు పాల్గొన్నట్టు సమాచారం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్న మోదీ.ఆసుపత్రిలో క్షతగాత్రులను ప్రధాని మోదీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిన అడిగి తెలుసుకున్నారు. #WATCH | PM Modi meets and enquires about the health condition of those injured in the Air India plane crash in Ahmedabad pic.twitter.com/QCFrmdSEXx— ANI (@ANI) June 13, 2025 #WATCH | PM Modi visits Ahmedabad Civil Hospital to meet those injured in AI-171 plane crash pic.twitter.com/ebUFXSTT8o— ANI (@ANI) June 13, 2025ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ.. #WATCH | The wreckage of the AI-171 plane hangs from BJ Medical College's building, which it crashed into soon after take-off from Ahmedabad airport yesterdayPM Modi visited the plane crash site today to assess the ground situation.(video source: DD) pic.twitter.com/ScTDNv5nYz— ANI (@ANI) June 13, 2025ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ.. ప్రధాని మోదీ విమాన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మృతుల కుటుంబాలను మోదీ పరామర్శ. ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్తో మాట్లాడిన మోదీ. విమాన ప్రమాదంతో తీవ్ర విషాదం#WATCH | PM Modi visits the site of AI-171 flight crash in Ahmedabad The crash claimed the lives of 241 people, including 12 crew members onboard. pic.twitter.com/gCvP229Vcs— ANI (@ANI) June 13, 2025 ఘటనా స్థలికి ఫోరెన్సిక్ బృందం.. విమాన ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిన్ నిపుణుల బృందం#WATCH | A forensic team arrives at the #AirIndiaPlaneCrash site, in Ahmedabad. pic.twitter.com/d49Bnxdjgl— ANI (@ANI) June 13, 2025ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరగాలి..AI-171 విమాన ప్రమాదంపై బాధిత కుటుంబ సభ్యుడి ఆవేదన..అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ వద్ద ఓ వ్యక్తి ఆగ్రహం..ఈ సంఘటన ఎలా జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు జరగాలి.మా ప్రాణాలకు విలువ లేదా?కఠిన చర్య తీసుకోవడం ఎయిర్ ఇండియా బాధ్యత.#WATCH | On the AI-171 plane crash, a local at Ahmedabad Civil Hospital says, "There should be a thorough investigation into how this incident happened. Does life have no value?? It is Air India's responsibility to take action." pic.twitter.com/MPbmkHdelr— ANI (@ANI) June 13, 2025అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీప్రధాని మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానం ప్రమాదానికి గురైన స్థలాన్ని పరిశీలించనున్నారు. PM Narendra Modi will be visiting Gujarat's Ahmedabad today.#AhmedabadPlaneCrash pic.twitter.com/4fN7dla4va— ANI (@ANI) June 13, 2025ప్రమాద ఘటనా స్థలానికి ఎయిరిండియా సీఈవోఅహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన చోటుకి ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంపుబెల్ విల్సన్ చేరుకున్నారు.ఘటనా స్థలాన్ని పరిశీలించారు.మరోవైపు.. ఘటన స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.#WATCH | Air India MD & CEO Campbell Wilson arrives at AI-171 plane crash site in Ahmedabad241 passengers lost their lives in the plane crash yesterday pic.twitter.com/Jw1GOnduUI— ANI (@ANI) June 13, 2025విమాన ప్రమాదం.. ఈవెంట్లు రద్దుఅహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదంఈ ఘటనపై ప్రముఖులు దిగ్భ్రాంతిపలు సినిమా ఈవెంట్లు రద్దుగుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది.#WATCH | Visuals from AI-171 crash site in Ahmedabad, GujaratAir India has confirmed the loss of 241 lives of the 242 passengers on board the aircraft, which crashed soon after takeoff yesterday pic.twitter.com/1alznlNj40— ANI (@ANI) June 13, 2025కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘానీనగర్లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది. -
పది నిమిషాల ఆలస్యం.. నేను ప్రాణాలతో ఉన్నా: భూమి చౌహాన్
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాద సమయంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే పది నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను నిలబెట్టింది. విమాన ప్రమాదం నుంచి తనను దేవుడే రక్షించాడని ఆమె చెప్పుకొచ్చింది.వివరాల ప్రకారం.. భూమి చౌహాన్ అనే యువతి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి ఎయిరిండియా (Air India) ఫ్లైట్ AI171 బుక్ చేసుకున్నారు. విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఆమె ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. దీంతో ఆమెకు పదినిమిషాల ఆలస్యం అయింది. అప్పటికే ఆ ఫ్లైట్ టేకాఫ్ అయి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. దీంతో, ఈ ప్రమాదంపై భూమి చౌహన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా..‘ట్రాఫిక్ కారణంగా నేను విమానం మిస్ అయ్యాను. ఇదే సమయంలో నేను వెళ్లాల్సిన విమానం కుప్పకూలిందనే విషయం తెలిసిన వెంటనే షాక్కు గురయ్యా. ఆ ఘటన గురించి తలుచుకుంటే నా శరీరం వణుకుతోంది. ఈ ప్రమాద ఘటనపై మాట్లాడలేకపోతున్నా. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ దేవుడికి ధన్యవాదాలు. గణపతి బప్పానే నన్ను కాపాడాడు. పది నిమిషాలు ఆలస్యం కావడం వల్ల నేను విమానం ఎక్కలేకపోయాను. విమాన ప్రమాద విషయాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.#WATCH | Bhoomi Chauhan, a resident of Gujarat's Bharuch, missed yesterday's flight, AI-171, which crashed and 241 of 242 on board, including crew members, lost their lives.Bhoomi Chauhan says, "...We arrived at the check-in gate 10 minutes late, but they didn't allow me, and I… pic.twitter.com/T1AqU9SSz0— ANI (@ANI) June 13, 2025ఇక, పది నిమిషాల ఆలస్యంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం చేరుకున్న చౌహాన్.. మధ్యాహ్నం 1.30 గంటకు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చింది. 1.38 నిమిషాలకు టేకాఫ్ అయిన విమానం క్షణాల్లోనే ఎయిర్పోర్ట్ పరిసరాల్లోని నివాసప్రాంతంలో కుప్పకూలింది. లండన్లో భర్తతో కలిసి ఉంటున్న భూమి చౌహాన్ రెండేళ్ల అనంతరం వెకేషన్ కోసం ఇండియా వచ్చింది.ఇదిలా ఉండగా.. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. విమానం మెడికోలు ఉంటున్న భవనంపై పడడంతో అందులో ఉంటున్న 24 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. -
విమాన ప్రమాదం.. 'కుబేర' ఈవెంట్ వాయిదా
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం వల్ల 'కుబేర' టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో నేడు (జూన్ 13)న జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దేశం మొత్తం దుఃఖంలో ఉండగా తామా కుబేర వేడుకను చేయలేమని వారు తెలిపారు. అభిమానులు దీనిని గ్రహిస్తారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ధనుష్- నాగార్జున-రష్మిక కలిసి నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో ఈ నెల 20న విడుదల కానుంది. శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కుప్పకూలింది. మొత్తం 265 మంది మృతి చెందారు. అందులోని 229 మంది ప్రయాణికులు ఉండగా 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం వైద్యకళాశాల మీద పడటంతో 24 మంది విద్యార్థులు మరణించిన వారిలో ఉన్నారు. ఈ ఘటనతో దేశం మొత్తం తీవ్రమైన దుఃఖంలో ఉంది. దీంతో కుబేర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఈ ఆదివారం ఈ వేడుక జరగవచ్చని సమాచారం. -
సూక్ష్మ రుణాలు 25 శాతం డౌన్
న్యూఢిల్లీ: సూక్ష్మ రుణ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో పంపిణీ చేసిన రుణాల మొత్తం రూ.1,12,459 కోట్లుగా ఉంది. మొత్తం 2.2 కోట్ల ఖాతాదారులకు ఈ మొత్తం రుణాల రూపంలో అందింది. 2023–24లో ఈ రంగం పంపిణీ చేసిన రుణాల మొత్తంతో పోల్చితే 25 శాతం తగ్గినట్టు సూక్ష్మ రుణ సంస్థల నెట్వర్క్ (ఎంఫిన్) తెలిపింది. 2023–24తో పోల్చితే 2024–25లో ఒక్కో ఖాతావారీ సగటు రుణ పంపిణీ 12.3 శాతం అధికంగా రూ.50,131గా ఉంది. ఎన్బీఎఫ్సీ–ఎఎంఫ్ఐ రంగం గత ఆర్థిక సంవత్సరంలో రూ.57,307 కోట్లను రుణాల రూపంలో సమకూర్చుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 36 శాతం ఎక్కువ. ఎన్బీఎఫ్సీ–ఎఎంఫ్ఐ సమీకరించిన రుణ నిధుల్లో 78.4 శాతం బ్యాంకుల నుంచి లభించింది. 11.9 శాతం నాన్ బ్యాంకుల నుంచి, 5.1 శాతం ఈసీబీల రూపంలో వచి్చంది. 2025 మార్చితో ముగిసిన చివరి మూడు నెలల కాలంలో ఎంఎఫ్ఐ నిర్వహణ ఆస్తులు (రుణాలు) 2024 మార్చి త్రైమాసికంతో పోల్చి చూస్తే 11.9 శాతం తగ్గి రూ.1,47,279 కోట్లుగా ఉన్నాయి. ప్రాంతాల వారీగా ఎంఎఫ్ఐ పోర్ట్ఫోలియోని గమనిస్తే.. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల వాటా 33 శాతంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలు 28 శాతం, ఉత్తరాది 17 శాతం, పశ్చిమ భారత్ వాటా 14 శాతం చొప్పున ఉంది. -
భారత ఫార్మా సంస్థలు ఉత్పత్తులను కాపీ కొట్టవు
బెర్న్: భారత ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు స్విప్ కంపెనీల ఉత్పత్తులను కాపీ కొడతాయన్న ఆరోపణలను కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. ఇది ఎంతో కాలంగా నెలకొన్న అపోహ అని స్పష్టం చేశారు. మేధో సంపత్తి హక్కులను (ఐపీఆర్) భారత్ గౌరవిస్తుందే కానీ.. ఇతరుల నుంచి టెక్నాలజీని ఎప్పుడూ చోరీ చేయదన్నారు. తమ ట్రేడ్మార్క్లు లేదా పేటెంటెడ్ లేదా కాపీ రైట్ టెక్నాలజీని భారత కంపెనీలు చట్టవిరుద్ధంగా కాపీ చేశాయన్న దానికి స్విప్ కంపెనీలు ఒక్క నిదర్శనం కూడా చూపించలేకపోయినట్టు చెప్పారు. ఈ విషయంలో ఒక్క కంపెనీ కూడా ఏ ఒక్క ఘటనను తమ దృష్టికి తీసుకురాలేదన్నారు. పేటెంట్లలో స్వల్ప మార్పులను భారత్ అనుమతించబోదన్నారు. దురదృష్టవశాత్తూ కొన్ని కంపెనీలు కొన్ని సవరణలతో అదనపు మేథో హక్కును సొంపాదిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత పేటెంట్ చట్టంలోని సెక్షన్ 3(డీ) కింద అప్పటికే ఉన్న పెటెంటెడ్ ఔషధాల కంటే మరింత ప్రభావవంతమైనవని నిరూపితమైనే కొత్త వాటికి అనుమతులకు అవకాశం కల్పిస్తుండడం గమనార్హం. ఈ నిబంధనలను సవరించాలని కొన్ని బహుళజాతి కంపెనీలు లోగడ కోరినప్పటికీ భారత్ తోసిపుచి్చంది. ఐపీఆర్ ప్రక్రియలను భారత్ మరింత మెరుగుపరుస్తోందని, దీంతో నిబంధనల అమలు భారం తగ్గి, వేగంగా అనుమతులు లభిస్తాయని మంత్రి చెప్పారు. -
దిగ్విజయాల నుంచి దిగంతాలకు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సాధారణ ప్రయాణికులతోపాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ సైతం ప్రాణాలు కోల్పోయిన వార్త తెలిసి గుజరాత్ ప్రజలు హుతాశులయ్యారు. పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేసి ప్రజారంజకంగా పాలించిన విజయ్ రూపానీ లేరన్న వార్త గుజరాత్ వాసులను కలిచివేసింది. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్పై మక్కువ ప్రస్తుతం మయన్మార్గా పిలుచుకుంటున్న నాటి బర్మాలోని యాంగూర్ నగరంలో 1956 ఆగస్ట్ రెండో తేదీన విజయ్ కుమార్ రూపానీ జన్మించారు. నాటి బర్మాలో రాజకీయ అస్థిరత కారణంగా రూపానీ తల్లిదండ్రులు మాయబెన్, రామ్నిక్లాల్ రూపానీలు 1960లో గుజరాత్కు వలసవచ్చింది. చిన్నప్పటి నుంచే హిందూత్వంపై మక్కువతో టీనేజీలో ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ ‘శాఖ’లో చేరారు. ఇందులోభాగంగా తొలుత ఏబీవీపీలో విద్యార్థి కార్యకర్తగా చేరారు. 1971లో జనసంఘ్లో చేరారు. భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం నాటి నుంచి పార్టీకు పూర్తిగా అంకితమయ్యారు. 1976లో ఎమర్జెన్సీ కాలంలో భుజ్, భావనగర్ జైళ్లలో 11 నెలలపాటు కారాగార శిక్ష అనుభవించారు. 1978 నుంచి 1981 వరకు ఆర్ఎస్ఎస్ ప్రచారక్గానూ పనిచేశారు. 1987లో రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పోరేటర్గా గెలిచారు. 1996 నుంచి 1997 దాకా రాజ్కోట్ మేయర్గా సేవలందించారు. 1998లో బీజేపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కేశూభాయ్పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మేనిఫెస్టో కమిటీకి ఛైర్మన్గా ఉన్నారు. 2006లో గుజరాత్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్కు ఛైర్మన్గా సేవలందించారు. 2006 నుంచి 2012 ఏడాదిదాకా గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. బీజేపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు పనిచేసిన రికార్డ్ ఈయన సొంతం. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో రాష్ట్ర మున్సిపల్ ఫైనాన్స్ బోర్డ్కు రూపానీ ఛైర్మన్ సేవలందించారు. 2014లో విజుభాయ్ వాలా రాజ్కోట్ పశి్చమ శాసనసభ నియోజకవర్గానికి రాజీనామాచేయడంతో అక్కడ ఉపఎన్నిక చేపట్టారు. బీజేపీ మద్దతుతో ఆనాడు రూపానీ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2014 నవంబర్లో నాటి మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ తొలిసారిగా కేబినెట్ను విస్తరించినప్పుడు మొట్టమొదటిసారిగా రూపానీని మంత్రిపదవి వరించింది. రవాణా, నీటి పారుదల, ఉపాధి కారి్మక శాఖల మంత్రిగా పనిచేశారు. 2016 ఫిబ్రవరిలో గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా రూపానీ ఎన్నికయ్యారు. 2021లో భారత్లో అత్యంత ప్రభావశీలురైన తొలి 100 మంది వ్యక్తుల జాబితాలో రూపానీ స్థానం సంపాదించుకున్నారు.ముఖ్యమంత్రిగా.. 2017లో గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అప్పటిదాకా సీఎంగా కొనసాగిన ఆనందిబెన్ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో పార్టీకోసం దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న రూపానీకి సీఎం పదవి కట్టబెట్టాలని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. రాజ్కోట్ వెస్ట్లో కాంగ్రెస్ నేత ఇంద్రాణిరాజ్యగురును మట్టికరిపించి ఎమ్మెల్యేగా గెలిచిన రూపానీని పార్టీ శాసనసభాపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది. ప్రజల సమస్యలను వీలైనంత ఎక్కువగా పరిష్కరించేందుకు కృషిచేసి సమర్థవంతమైన సీఎంగా పేరుతెచ్చుకున్నారు.లక్కీనంబర్ 1206 నాడే...1206. ఇది తన లక్కీ నంబర్ అని విజయ్ రూపానీ బాగా నమ్ముతారు. అందుకే తొలినాళ్లలో వాడిన మోటార్సైకిళ్ల నుంచి ఆయన కార్ల దాకా అన్నింటికీ ఇదే నంబర్ ఉంటుంది. చివరికి విమాన ప్రమాదంలో రూపానీ దుర్మరణం పాలైన తేదీ కూడా 12.06 (జూన్ 12) కావడం విధి వైచిత్రేనంటూ ఆయన అభిమానులు వాపోతున్నారు. -
దంపతులపై బరితెగించిన బాస్
సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి పాలనలో నాయకులు, పోలీసులే కాదు.. పాలకపక్ష నేతల అడుగులకు మడుగులొత్తే కొందరు అధికారులు సైతం పేట్రేగిపోతున్నారు. చేతిలో అధికారం, పెద్దల ఆశీర్వాదం ఉందన్న ధీమాతో కిందిస్థాయి వారిని ఇష్టారాజ్యంగా వేధిస్తున్నారు. పశుసంవర్థక శాఖలో ఓ ఉన్నతాధికారి ఓ అడుగు ముందుకేసి దంపతులపై చెయ్యెత్తి కొట్టేందుకు బరితెగించారు. బదిలీల్లో తాము దరఖాస్తు చేసుకోకపోయినా బదిలీ అయిందని.. పైగా పోస్టింగ్ ఇవ్వలేదని అడగడమే వారు చేసిన నేరం. ఆ వివరాలు..స్పౌజ్ గ్రౌండ్లో పశు వైద్యులు డాక్టర్ సురేష్ విశాఖ జిల్లా పరవాడ మండలం వాడచీపురపల్లిలోనూ, డాక్టర్ పద్మలీల గాజువాక డిస్పెన్సరీల్లో మూడేళ్లుగా పనిచేస్తున్నారు. తాజా బదిలీల్లో వారు దరఖాస్తు చేసుకోకపోయినప్పటికీ పద్మలీలను బదిలీచేశారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. తమ గోడు చెప్పుకునేందుకు విజయవాడ వచ్చిన ఈ దంపతులపై పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి. దామోదరనాయుడు చేయిచేసుకున్నంత పనిచేశారు. ‘నిబంధనల మేరకే బదిలీలు చేశాం.. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే వెళ్లి ప్రభుత్వానికి చెప్పుకోండి.. మీరు కోరుకున్న చోట పోస్టింగ్లు ఇవ్వడం కుదరదు’.. అంటూ గుడ్లురుముతూ ఆగ్రహంతో ఊగిపోయారు. చెయ్యెత్తి కొట్టేందుకు వారి మీదకు దూసుకెళ్లారు.‘కొట్టాలనుకుంటే కొట్టండి.. మీకు దండం పెట్టి అడుగుతున్నా.. అప్లై చేయకుండా ఎలా బదిలీ చేస్తారు? కనీసం ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో కూడా చెప్పకపోతే ఎలా?’.. అంటూ డాక్టర్ సురేష్ దంపతులు వాపోయారు. ‘ముందు మీరిక్కడ నుంచి వెళ్లిపోండి. పోస్టింగ్ ఆర్డర్స్ పంపిస్తాం’.. అంటూ బలవంతంగా వారిని అక్కడ నుంచి పంపించేసిన కొద్దిసేపటికే వారిద్దరికీ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. వాడచీపురపల్లి నుంచి ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడకు సురేష్ను.. ఆయన ఖాళీచేసిన వాడచీపురపల్లికి ఆయన భార్య పద్మలీలను పంపించారు. ఈ ఘటన ఒక్కటే కాదు.. పశుసంవర్థక శాఖలో జరిగిన తాజా బదిలీల్లో ఉన్నతాధికారుల లీలలు కోకొల్లలు. జీఓ–23 ప్రకారం.. ఐదేళ్లు నిండిన వారిని విధిగా బదిలీ చేయాలి.దరఖాస్తు చేస్తేనే రెండేళ్లు దాటిన వారిని బదిలీ చేయాలి. కానీ, ఆచరణకు వచ్చేసరికి ఈ నిబంధనలకు తిలోదకాలిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి పార్టీ నేతల సిపార్సు లేఖలు ఉంటే చాలు అడ్డగోలుగా బదిలీలు చేసేశారు. ముడుపులు ముట్టజెప్పిన వారికైతే కోరుకున్న చోట పోస్టింగ్లు ఇచ్చారు. సిఫార్సులున్నాయనే సాకుతో 5–7 ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారి జోలికిపోని ఉన్నతాధికారులు, పనిచేసేచోట ఆరునెలల సర్వీస్ కూడా పూర్తికాని వారిని పైరవీలతో బదిలీలు చేశారు. ఓ సామాజికవర్గానికి చెందిన వారికైతే కోరుకున్న చోట కోరుకున్న పోస్టింగ్లు ఇచ్చారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాధాన్యత గల కీలక విభాగాల్లో తమకు అనుకూలంగా ఉన్న వారికి పోస్టింగ్లు ఇచ్చుకున్నారని డైరెక్టర్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ప్రశ్నిస్తే దాడికి యత్నిస్తారా?బదిలీల్లో నిబంధనలు పాటించలేదు. దరఖాస్తు చేయకపోయినా, ఐదేళ్లు నిండకపోయినా అడ్డగోలుగా బదిలీలు చేశారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే నానా దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించడం, బెదిరించడం, దాడికి సైతం యత్నించడం చేస్తున్నారు. డాక్టర్ సురేష్ దంపతులపట్ల పశుసంవర్థక శాఖ డైరెక్టర్ దామోదరనాయుడు ప్రవర్తించిన తీరే ఇందుకు నిదర్శనం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. – డాక్టర్ సీహెచ్ కృష్ణారావు, చైర్మన్, ఏపీ పశుసంవర్థక శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ -
ఘోర విషాదాలు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం దేశ ప్రజలను ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఇది కూడా ఒకటని చెబుతున్నారు. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. వందలాది మంది ప్రయాణికులు గమ్యస్థానం చేరకుండానే కన్నుమూశారు. చాలావరకు సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతోపాటు మానవ తప్పిదాలు సైతం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. → 2020 ఆగస్టు 7: కేరళలోని కోజికోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రన్వేపై ఎయిర్ ఇండియా 1344 విమానం ల్యాండవుతున్న సమయంలో అదుపు తప్పింది. పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. విమానం రెండు ముక్కలు కావడంతో అందులో ఉన్న 190 మంది ప్రయాణికుల్లో 21 మంది మృతిచెందారు. భారీ వర్షం, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పైలట్లు సైతం ఉన్నారు. → 2010 మే 22: కర్ణాటకలోని మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 737–800 విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. విమానంలో వెంటనే మంటలు చెలరేగడంలో 158 మంది మరణించారు. ఇది టేబుల్టాప్ రన్వే కావడంతో విమానాన్ని ల్యాండింగ్ చేయడంలో పైలట్ తడబడినట్లు గుర్తించారు. → 2000 జూలై 17: బిహార్ రాజధాని పాటా్నలో అలయెన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 జనావాసాలపై కుప్పకూలింది. 60 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 55 మంది విమాన ప్రయాణికులు కాగా, ఐదుగురు ఇళ్లల్లోని నివాసితులు. → 1996 నవంబర్ 12: సౌదీ అరేబియా విమానం 763, కజకిస్తాన్ ఎయిర్లైన్స విమానం 1907 హరియాణాలోని చార్కీ దాద్రీ గగనతలంలో పరస్పరం ఢీకొని కుప్పకూలాయి. ఏకంగా 349 మంది మరణించారు. సమాచార మారి్పడిలో లోపం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. → 1990 ఫిబ్రవరి 14: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 605 బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్పోర్టులో ల్యాండయ్యే ముందు అదుపుతప్పింది. రన్వే పక్కన భూమిని ఢీకొని పక్కనే ఉన్న గోల్ఫ్ కోర్సులోకి దూసుకెళ్లింది. విమానంలో 146 మంది ఉండగా, వీరిలో 92 మంది మృతిచెందారు. → 1988 అక్టోబర్ 19: గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 113 ల్యాండింగ్ సమయంలో రన్వే పక్కన చెట్లను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగడంతో 135 మంది ప్రయాణికులకు గాను 133 మంది విగత జీవులయ్యారు. పొగమంచు అధికంగా ఉండడం వల్ల రన్వే కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. → 1978 జనవరి 1: ముంబై నుంచి దుబాయ్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855 అరేబియా సముద్రంలో కూలిపోయింది. విమానంలోని మొత్తం 213 మంది ప్రయాణికులు మరణించారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన జరిగింది. → 1973 మే 31: ఢిల్లీ పాలమ్ ఎయిర్ఫోర్టులో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 440 ల్యాండింగ్ కంటే ముందు హైటెన్షన్ విద్యుత్ వైర్లను ఢీకొట్టింది. దాంతో అందులో మంటలు వ్యాపించడంతో 65 మందికిగాను 48 మంది ప్రయాణికులు బలయ్యారు. ప్రతికూల వాతావరణం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
వైపరీత్యం..పెరుగుతోంది ప్రాణ నష్టం
దేశంలో వైపరీత్యాలు ఏటికేటికీ పెరుగుతున్నాయి. ఇవి ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమవుతున్నాయి. భూకంపాలు, వరదలు, అకాల వర్షాలు, కొండ చరియలు విరిగిపడడం, సుడిగాలులు..ఇలా జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పులి మీద పుట్రలా ప్రజా జీవనాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇందుకు తాజాగా భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే నిదర్శనం. సాక్షి, న్యూఢిల్లీః దేశంలో గత ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా మానవ మరణాల సంఖ్య గణనీయంగా ఉందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా విడుదల చేసిన ఎనీ్వస్టాట్స్ ఇండియా–2025 (పర్యావరణ గణాంకాలు) నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వరదలు, పిడుగుపాట్లు, వడగాడ్పులు, భారీ వర్షాలు వంటి వైపరీత్యాలతో 2024–25 ఏడాదిలో దేశంలో ఏకంగా 3,080 మంది మరణించినట్లు తెలిపింది. 2013–14 ఏడాదిలో సంభవించిన మానవ మరణాల తర్వాత అత్యధిక మరణాలు గత ఏడాదే సంభవించినట్లు పేర్కొంది. నివేదికలో అంశాలివీ.. ⇒ గడిచిన 25ఏళ్లలో అంటే 2001–02 నుంచి చూస్తే అత్యధిక మరణాలు 2007–08లో 3,764, 2008–09లో 3,405, 2013–14లో 5,677 నమోదు కాగా, ఆ తర్వాత గత ఏడాదే అత్యధికంగా 3,080 మరణాలున్నాయి. ⇒ పశు మరణాల సంఖ్య మాత్రం గత ఏడాది గణనీయంగా తగ్గింది. అత్యధికంగా 2006–07లో 4,55,619 మరణించగా, 2023–24లో 1,19,683 గతేడాది 61,966 చనిపోయాయి. ⇒ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇళ్లు ›కూలడం వంటి నష్టాలు 2007–08లో ఏకంగా 35.27లక్షలుండగా, 2023–24లో 1.40లక్షలు, 2024–25లో మాత్రం 3.64లక్షలుగా ఉంది. ⇒ 2007–08లో 85.13లక్షల హెక్టార్లలో పంట నష్టం జరగ్గా, 2023–24లో 13.39లక్షల హెక్టార్లు, 2024–25లో 14.24 లక్షల హెక్టార్లుగా ఉంది. -
పక్షి ఢీకొట్టిందా?
గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన బోయింగ్ 787–7 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాద దుర్ఘటనలో.. ఇంకా కారణాలు నిర్ధారణ కానప్పటికీ పక్షి ఢీకొట్టడం వల్లే ఇది జరిగిందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. భారత్లో 2015లో ఇలాంటి పెద్ద ప్రమాదం జరిగింది. కత్రా నుండి వైష్ణోదేవి ఆలయానికి వెళుతున్న హెలికాప్టర్.. రాబందు ఢీకొనటంతో పల్టీలు కొట్టి, మంటలు చెలరేగి పైలట్తో సహా ఏడుగురు చనిపోయారు. రన్వేపై లేదా గాల్లో పక్షులు ఢీకొనడం వల్ల గతంలో మనదేశంలో అనేక విమాన ప్రమాద దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత ప్రమాదం జరిగిన అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో.. 2022తో పోలిస్తే 2023లో దాదాపు రెట్టింపునకు పైగా ఇలాంటి ప్రమాదాలు జరగడం గమనార్హం. 2022లో కేవలం 39 ప్రమాద ఘటనలే జరిగితే ఆ తరవాతి ఏడాది ఈ సంఖ్య 81కి పెరిగింది. ఢిల్లీ రన్వేపై 700సార్లు! పక్షులు ఢీకొన్న సంఘటనలు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యధికంగా జరిగాయి. 2018–2023 మధ్య ఆ రన్వేలపై 700 కేసులు నమోదయ్యాయి. 2023 డిసెంబరు 18న రాజ్యసభలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం.. భారతదేశంలో అ త్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు వన్యప్రాణు లు, ప్రధానంగా పక్షుల బెడదతో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని తెలుస్తోంది. గత ఏడాది ఎమిరేట్స్ విమానం ముంబైలో ఫ్లెమింగోల గుంపును ఢీకొట్టడంతో 39 పక్షులు చనిపోయాయి. పక్షులు తగిలితే ఎందుకు కూలిపోతాయి? నిజానికి పక్షుల తగిలినంత మాత్రానే విమానాలు కూలిపోవు. కొన్ని సందర్భాలలో ఇంజిన్ లేదా ఇతర భాగాలకు నష్టం వాటిల్లుతుంది. విమానాలు చాలా వేగంగా టేకాఫ్ అవుతాయి. పక్షులు, ముఖ్యంగా పెద్ద పక్షులు; ఇంజిన్ లేదా విండ్షిల్డ్లోకి ప్రవేశించే పక్షి సమూహాలు ఢీకొనడం వల్ల మాత్రం పెద్ద ముప్పే వాటిల్లవచ్చు. టేకాఫ్ దశలో ఇంజిన్ చాలా వేగంతో తిరుగుతున్నప్పుడు, విమానం తక్కువ ఎత్తులో ఉండగానే పక్షి ఢీకొన్నప్పుడు ఇంజిన్ ఫ్యాన్ బ్లేడ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో ఇంజిన్ విఫలమై ప్రమాదం సంభవించవచ్చు. పక్షి ఢీకొట్టగానే పైలట్ దృష్టి చెదిరి ప్రమాదాలు జరుగుతుంటాయి. అన్ని పక్షులూ ముప్పుకాదు 1966–1989 మధ్య కాలంలో తీవ్రమైన విమాన నష్టానికి కారణమైన పక్షుల జాబితాలో రాబందులు ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేవి. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో వాటి వల్ల ముప్పు తగ్గింది. నేడు ప్రధానంగా బ్లాక్ కైట్స్ (డేగ జాతి), గబ్బిలాలు, ల్యాప్విగ్ పక్షులు ప్రమాదం కలిగించే జాబితాలోకి చేరాయి. 2020 జూన్లో ‘డిఫెన్స్ లైఫ్’సైన్స్ జర్నల్ లో ‘భారతదేశంలో విమానాలకు వన్యప్రాణుల తాకిడి’అనే శీర్షికతో ప్రచురితమైన అధ్యయన పత్రం ప్రకారం.. ఈ మూడు జాతుల పక్షులే ఇప్పుడు ప్రధానంగా రన్వేపై విమాన ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. 2012–2018 మధ్య భారతదేశంలో 3,665 వన్యప్రాణుల తాకిళ్లు సంభవించినట్లు ఈ పత్రం పేర్కొంది. వీటిల్లో 385 ఘటనలు విమాన నష్టానికి కారణం అయ్యాయి. 2005–2018 మధ్య మూడు సైనిక విమానాలు కూలిపోవటానికి బ్లాక్ కైట్స్ పక్షులే కారణం. -
రాజస్థాన్ ప్రథమం..సిక్కిం అథమం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా చెట్ల సంఖ్య పెరుగుదలలో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. 2019–20లో చదరపు కిలోమీటరుకు 10363 చెట్లుండగా, 2021–22 నాటికి ఆ సంఖ్య 10841కు చేరింది. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నిలిచాయని జాతీయ పర్యావరణం–2025 తెలిపింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఈ నివేదికను వెల్లడించింది.దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2019–20తో పోల్చితే 2021–22 నాటికి 93 చెట్లు పెరిగినట్లు వివరించింది. అసోం, బీహార్, గోవా, గుజరాత్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2019–20తో పోల్చితే 2021–22లో చెట్ల సంఖ్య తగ్గిపోయినట్లు గణాంకాలు వెల్లడించాయి. తెలంగాణ 11వస్థానం సాధించింది. కాగా చెట్ల సంఖ్య పెరుగుదలలో సిక్కిం చివరిస్థానంలో నిలిచింది. 2019–20లో చదరపు కిలోమీటరుకు 51 చెట్లుండగా , 2021–22 నాటికి వాటి సంఖ్య 48కు తగ్గిందని నివేదిక వెల్లడించింది. -
మట్టి నిండిన భోజనం!
అహ్మదాబాద్: సరిగ్గా మధ్యాహ్న భోజన సమయం కావటంతో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్లో హడావిడి మొదలైంది. ఆకలిమీద ఉన్న రెసిడెంట్ వైద్యులు నచ్చిన ఆహారం వడ్డించుకొని డైనింగ్ టేబుల్స్పై కూర్చొని ముచ్చట్లు చెప్పుకొంటూ.. ఇష్టంగా తింటున్నారు. అంతలోనే ఒక్కసారిగా భారీ శబ్దం.. బీటలువారి కూలిపోతున్న భవనం గోడలు.. ఆ వెంటనే దూసుకొచ్చిన రాకాసి అగ్నికీలలు.. కన్నుమూసి తెరిచేంతలో అంతా బూడిదమయం.అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రదేశంలో దృశ్యాలు ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో చెప్పకనే చెప్పాయి. దుమ్ముతో నిండిపోయిన డైనింగ్ టేబుల్స్.. వాటిపై నిండుగా భోజనంతో పొందికగా ఉన్న ఆహారం పేట్లు.. పక్కనే మంచినీటి గ్లాసులు.. మసిబారిపోయిన క్యాంటీన్.. కొన్నిచోట్ల చిందరవందరగా పడిపోయిన సామగ్రి ఆ ఘోర ప్రమాదానికి సాక్ష్యంగా నిలిచాయి. ఆ హాస్టల్ భవనంలో రెసిడెంట్ వైద్యులు నివాసం ఉంటారు. నేరుగా భవనంపైనే కూలిన విమానం.. సాంకేతిక లోపంతో విమానం కిందికి దూసుకొచ్చి నేరుగా హాస్టల్ భవనంలోని నాలుగో అంతస్తులోకి దూసుకెళ్లింది. దీంతో భవనం ఒకవైపు పూర్తిగా ధ్వంసమైంది. భవనానికి భారీ రంధ్రం ఏర్పడింది. భారీగా మంటలు చెలరేగటంతో భవనం గోడలు మొత్తం నల్లగా మారిపోయాయి. ఆ భవనం చుట్టూ ఉన్న చెట్లు నిలువునా కాలిపోయిన నల్లని మొద్దులు మాత్రమే మిగిలాయి. విమాన ఫ్యూజ్లేజ్లు (ప్రధాన బాడీలోని కొన్ని భాగాలు) భవనం గోడల్లోనే ఇరుక్కుపోయాయి. విమానం టైర్లు తల్లకిందులై భవనంలో వేలాడుతూ కనిపించాయి. విమానం తాకిన వేగానికి ఎంతో బలమైన భవనం పిల్లర్లు కూడా నుజ్జునుజ్జు అయ్యాయి. ఆరంతస్తుల భవనం బయటి గోడలు మొత్తం ధ్వంసమైపోయి బిల్డింగ్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. -
విమానంలో విద్యుత్
నడవడమే రాని మానవుడు నేడు పక్షిలా గాలిలో ఎగిరిపోయే సాధనాలను కనుగొని ఎక్కడికి అంటే అక్కడికి నిమిషాలు, గంటల్లోనే ప్రయాణిస్తున్నాడు. దేశ విదేశాల్లో విమానంలో చక్కర్లు కొడుతున్నాడు. ఆ విమానం నడవాలంటే మాత్రం ఇంధనంతో పాటు విద్యుత్ కూడా చాలా అవసరం. కానీ, అవే ఒక్కోసారి వందల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాయి. అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం కూడా అలాంటిదే.ఈ దుర్ఘటనకు విమానంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా విఫలమవడం కారణం కావొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు విమానంలో విద్యుత్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది..? ఎందుకు విఫలం అవుతుంది..? దానివల్ల జరిగిన ప్రమాదాలేంటి? అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.సాక్షి, అమరావతి: విమానంలో ప్రధానంగా నాలుగు రకాల విద్యుత్ వ్యవస్థలు పనిచేస్తుంటాయి. వాటినే ప్రధాన, అత్యవసర, ద్వితీయ, సహాయక విద్యుత్ వ్యవస్థలుగా పిలుస్తుంటారు. వీటితో పాటు ఓవర్లోడ్, షార్ట్ సర్క్యూట్ వంటి ఆకస్మిక ప్రమాదాల నుంచి రక్షించేందుకు సర్క్యూట్ బ్రేకర్లను అమర్చుతారు. అత్యవసర సమయంలో వాడుకునేందుకు వీలుగా విద్యుత్ను బ్యాటరీల్లో నిల్వ చేస్తారు. నావిగేషన్, కమ్యూనికేషన్, నియంత్రణ, క్యాబిన్, కాక్పిట్ లైటింగ్, ఎయిర్ కండిషనింగ్, టీవీ, ఫ్యాన్లు వంటి కీలక పనులకు ఈ విద్యుత్ వ్యవస్థ ఉపయోగపడుతుంది.ఇది ఏమాత్రం విఫలమైనా విమానం కుప్పకూలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. విమానంలో జనరేటర్లు లేదా ఆల్టర్నేటర్లు అనేవి ఉంటాయి. ఇవి ఇంజిన్తో నడుస్తూ విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ప్రధాన ఇంజన్లు పని చేయనప్పుడు సహాయక విద్యుత్ యూనిట్ ఆదుకుంటుంది. రామ్ ఎయిర్ టర్బైన్ అనేది కొన్ని సందర్భాల్లో విద్యుత్ వనరుగా పనికొస్తుంది. ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫయర్ యూనిట్లు కొన్ని వ్యవస్థల కోసం విద్యుత్ను అందిస్తుంటాయి. బ్యాటరీలు బ్యాకప్ పవర్ సోర్స్లుగా పనిచేస్తాయి. కాకపోతే ఈ వ్యవస్థ అన్ని విమానాల్లోనూ ఒకేలా ఉండదు. సింగిల్ ఇంజిన్ జనరల్ ఏవియేషన్ ఎయిర్క్రాఫ్ట్, ఆధునిక, బహుళ ఇంజిన్ కమర్షియల్ జెట్ ఎయిర్క్రాఫ్ట్ మధ్య విద్యుత్ వ్యవస్థ సామర్థ్యం, నిర్మాణంలో చాలా తేడా ఉంటుంది. ముందే శిక్షణ ఇస్తారు.. విద్యుత్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా తగిన సూచనలను, శిక్షణను ముందే పైలట్లకు తెలియజేస్తారు. విద్యుత్ వ్యవస్థ వైఫల్యాన్ని సూచించడానికి ఒక అమ్మీటర్, లోడ్ మీటర్ లేదా హెచ్చరిక లైట్ ఉంటాయి. బలమైన రక్షణ వ్యవస్థ, పర్యవేక్షణ, వైఫల్య హెచ్చరిక నిబంధనలు విద్యుత్ వ్యవస్థలో ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు తగిన సూచనలను పైలట్లకు అందజేస్తుంటాయి. స్టాండ్బై ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్స్, ఎయిర్క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ఫ్లోర్ పాత్ ఇల్యూమినేషన్ వంటి భాగాలు వాటికి సొంత బ్యాకప్ విద్యుత్ ఉంటుంది. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా విఫలమైనా కూడా ఇవి పనిచేస్తాయి. విమానంలో సర్క్యూట్ బ్రేకర్ విఫలమైనప్పుడు ఒకసారి మాత్రమే రీసెట్ చేయాలి. రెండోసారి చేయకూడదు. విద్యుత్ జనరేటర్లు, వైర్ల నుంచి పొగలు, మంటలు వస్తే విద్యుత్ ఐసోలేషన్ విధానాన్ని అనుసరించాలి. విమానాన్ని త్వరగా ల్యాండ్ చేయాలి. ఏమాత్రం ఆలస్యమైనా భారీ నష్టం సంభవిస్తుంది.విద్యుత్ వ్యవస్థ విఫలంతో విమాన ప్రమాదాలు, దుర్ఘటనల్లో కొన్ని⇒ ఎండీ11 అనే స్విస్ ఎయిర్ విమానంలో విద్యుత్ అగ్నిప్రమాదం వల్ల కెనడా సమీపంలో 1998 సెపె్టంబర్ 2న అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. ⇒ 2010 ఆగస్టు 24న ఉత్తర సూడాన్లో ఖార్టూమ్ నుంచి బీరుట్ బయల్దేరిన ఏ321 ఎయిర్బస్లో జనరేటర్లు దెబ్బతిని విద్యుత్ వ్యవస్థ పనిచేయడం మానేసింది. 49 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ⇒ 2009 మార్చి 15న లండన్ హీత్రూ నుంచి ఎడిన్బర్గ్కు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ఏ319 విమానంలో విద్యుత్ వైఫల్యం ఏర్పడి పైలట్లకు డిస్ప్లే కనిపించలేదు. పొగలు కూడా వచ్చాయి. దీంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ⇒ 2008 సెపె్టంబరు 22న అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన బి752 సియాటిల్ నుంచి న్యూయార్క్ వెళ్తుండగా విద్యుత్ సమస్య ఎదుర్కొంది. చికాగోలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్ గేర్ దెబ్బతిన్నది. 192 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. -
Air India flight crash: ఆశలు బుగ్గిపాలు
ఉద్యోగరీత్యా వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఎలాగైనా తన కుటుంబాన్ని తన వద్దకు చేర్చుకుని హాయిగా జీవిద్దామని భావించిన ఓ భారతీయుని కల కలగానే మిగిలిపోయింది. అతని కుటుంబం మొత్తం మంటల్లో కాలిపోయింది. విమాన ప్రమాద ఘటనలో ఈ హృదయవిదారక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతీక్ జోషి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత ఆరేళ్లుగా లండన్లో పనిచేస్తున్నారు. అతని భార్య డాక్టర్ కౌమీ వ్యాస్ రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీళ్లకు ఎనిమిదేళ్ల కూతురు మిరాయా, ఐదేళ్ల కవల కుమారులు నకుల్, ప్రద్యుత్ ఉన్నారు. కుటుంబం మొత్తాన్నీ లండన్కు శాశ్వతంగా తీసుకురావాలన్న ప్రతీక్ ప్రయత్నాలు ఇటీవల సఫలమయ్యాయి. దీంతో కేవలం రెండ్రోజుల క్రితమే భార్య కోమీ తన డాక్టర్ ఉద్యోగానికి రాజీనామాచేసింది. కొద్దిరోజుల క్రితం ప్రతీక్ భారత్కు వచ్చి కుటుంబంతో సహా లండన్కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. బ్యాగులనీ ప్యాక్ చేసుకుని ఇరు కుటుంబాలకు టాటా బైబైలు చెప్పి అందమైన భవిష్యత్తుపై కలలలో ఎయిర్పోర్ట్కు బయల్దేరారు. లండన్కు వెళ్లే విమానం ఎక్కగానే తమ తమ సీట్లలో కూర్చొని ఒక అందమైన సెల్ఫీతీసుకున్నారు. భార్యాభర్త పక్క సీట్టలో, కవల సోదరులు, సోదరి మరో సీట్లో కూర్చుని నవ్వుతూ దిగిన ఫొటోను బంధువులకు వెంటనే పంపేశారు. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నామనుకున్నారుగానీ సమిధలౌతామని అస్సలు ఊహించి ఉండరు. ప్రమాదంలో ఎగసిన అగ్నికీలలో కుటుంబం మొత్తం కాలిబూడిదైంది. రెప్పపాటులో రంగుల ప్రపంచం మసిబారిపోయి నుసిగా మారింది. జీవితం క్షణభంగురం. నువ్వు నిర్మించిన, నువ్వు కలలుగన్న, నువ్వు ప్రేమించినదంతా ఒక సెకన్లో సమాధిగా మారిపోయింది. అందుకే ఇప్పుడే జీవించు, ఇప్పుడే ప్రేమించు. రేపు అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. జీవితం అస్థిరం. అది ముగిసేలోపే వీలైనంత ప్రేమను పెంచుదాం. పంచుదాం.. -
పది ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులు
సాక్షి, హైదరాబాద్: కేబినెట్లోకి ముగ్గురు కొత్త మంత్రులను తీసుకోవడంతో జిల్లా ఇన్చార్జి మంత్రుల విషయంలో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇన్చార్జి మంత్రులుగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి (కరీంనగర్), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (ఖమ్మం), కొండా సురేఖ (మెదక్)లను ఆ బాధ్యతల నుంచి తప్పించింది.అలాగే ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రిగా ఉన్న సీతక్కను అక్కడ నుంచి మార్చి.. నిజామాబాద్ జిల్లా ఇన్చార్జిగా నియమించగా, అక్కడి ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్కు మార్చింది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురికి జిల్లా ఇన్చార్జిలుగా బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు మార్పులు జరిగిన జిల్లాలతోపాటు మొత్తం పది ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నవీన్ మిత్తల్ బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ను ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఆయనతో పాటు హైదరాబాద్, మల్కాజిగిరి సహా పలు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు స్థాన చలనం కలిగించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుత కార్యదర్శి బుద్దప్రకాశ్ను ఆ పోస్టు నుంచి తప్పించింది. కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు కొందరి బదిలీకి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే మిత్తల్ను దీర్ఘకాలం పాటు రెవెన్యూ శాఖలో కొనసాగించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఆయన్ను బదిలీ చేసింది.గత ప్రభుత్వంలో కూడా కీలకంగా వ్యవహరించిన ఆయనపై..అధికారంలోకి రాకముందు విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ .. అధికారంలోకి వచి్చన తర్వాత కూడా అక్కడే కొనసాగించడం చర్చనీయాంశమయ్యింది. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ కూడా బదిలీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయన మొత్తం మూడుసార్లు బదిలీ కావడం గమనార్హం.ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని ఆశించిన డాక్టర్ శశాంక్ గోయల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా నియమితులయ్యారు. ఈ స్థానంలో ఉన్న గౌరవ్ ఉప్పల్ను కేంద్ర ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శిగా సర్కారు నియమించింది. మొత్తం 36 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రసుత్తం పరిశ్రమల శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్న గుర్రం మల్సూర్ను ముఖ్యమంత్రి ముఖ్య పౌరసంబంధాల అధికారిగా నియమించారు.బదిలీలు ఇలా.. 1. డాక్టర్ శశాంక్ గోయల్; ప్రస్తుతం: స్పెషల్ సీఎస్, తెలంగాణ భవన్ (ఢిల్లీ); బదిలీ: స్పెషల్ సీఎస్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్.2. నవీన్ మిత్తల్; ప్రస్తుతం: ముఖ్య కార్యదర్శి రెవెన్యూ శాఖ, సీసీఎల్ఏ ; బదిలీ: ముఖ్య కార్యదర్శి, ఇంధన శాఖ3. ఎన్. శ్రీధర్; ప్రస్తుతం: ముఖ్య కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధి శాఖ; బదిలీ: ముఖ్య కార్యదర్శి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,ఆర్డబ్ల్యూఎస్, అదనంగా ముఖ్య కార్యదర్శి మైన్స్, జియాలజీ.4. డాక్టర్ జ్యోతి బుద్దప్రకాశ్; ప్రస్తుతం: కార్యదర్శి స్టాంప్స్, రిజి్రస్టేషన్స్, గృహనిర్మాణ శాఖ; బదిలీ: కార్యదర్శి ఎస్సీ అభివృద్ధి, అదనంగా ప్రణాళిక శాఖ, టీజీఆర్ఏసీ డీజీ.5. లోకేశ్కుమార్; ప్రస్తుతం: అదనపు సీఈవో; బదిలీ: పూర్తి అదనపు బాధ్యతలు కార్యదర్శి, రెవెన్యూ, సీసీఎల్ఏ.6.గౌరవ్ ఉప్పల్; ప్రస్తుతం: రెసిడెంట్ కమిషనర్ తెలంగాణ భవన్ ఢిల్లీ; బదిలీ: కార్యదర్శి సమన్వయం కేంద్ర ప్రాజెక్టులు, ప్రాయోజిత కార్యక్రమాలు.7. భారతీ లక్పతి నాయక్ ; ప్రస్తుతం: కార్యదర్శి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్; బదిలీ: కార్యదర్శి, సమాచార కమిషన్.8. హరిచందన దాసరి; ప్రస్తుతం: కార్యదర్శి, రోడ్లు, భవనాలు; బదిలీ: కలెక్టర్, హైదరాబాద్.9. కిల్లు శివకుమార్నాయుడు; ప్రస్తుతం: అదనపు కమిషనర్ జీహెచ్ఎంసీ; బదిలీ: కమిషనర్, ఆర్ అండ్ ఆర్, భూ సేకరణ ఐ క్యాడ్.10. రాజీవ్గాంధీ హన్మంతు; ప్రస్తుతం: కలెక్టర్, నిజామాబాద్; బదిలీ: ప్రత్యేక కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్, కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అదనపు బాధ్యతలు.11. వినయ్ కృష్ణారెడ్డి; ప్రస్తుతం: కమిషనర్ ఆర్,ఆర్ అండ్ ఎల్ ఏ, ఐ క్యాడ్; బదిలీ: కలెక్టర్, నిజామాబాద్.12. జి.శ్రీజన ; ప్రస్తుతం: డైరెక్టర్, పీఆర్ అండ్ ఆర్డీ; బదిలీ: డైరెక్టర్ మహిళా శిశు సంక్షేమం(అదనపు బాధ్యతలు).13. శివశంకర్ లాహోటి; ప్రస్తుతం: వెయిటింగ్ ఫర్ పోస్టింగ్; బదిలీ: సంయుక్త కార్యదర్శి, వ్యవసాయం, సహకార శాఖ, సంయుక్త కార్యదర్శి డిజాస్టర్ మేనేజ్మెంట్ (అదనపు బాధ్యతలు)14. చిట్టెం లక్ష్మి; ప్రస్తుతం: వెయిటింగ్ ఫర్ పోస్టింగ్; బదిలీ: సంయుక్త కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ.15. కె.హైమావతి; ప్రస్తుతం: పీడీ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ; బదిలీ: కలెక్టర్, సిద్దిపేట.16. వాసం వెంకటేశ్వర్లు; ప్రస్తుతం: డైరెక్టర్ యువజన సరీ్వసులు; బదిలీ:డైరెక్టర్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డైరెక్టర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, కుటుంబ సంక్షేమం.17. వీపీ గౌతమ్ ; ప్రస్తుతం: ప్రత్యేక కార్యదర్శి, గృహ నిర్మాణం; బదిలీ: కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ (అదనపు బాధ్యతలు)18. గౌతం పొట్రూ; ప్రస్తుతం: కలెక్టర్, మల్కాజిగిరి–మేడ్చల్; బదిలీ: డైరెక్టర్ సింగరేణి పర్సనెల్ అండ్ అడ్మిని్రస్టేషన్.19.కె. నిఖిల; ప్రస్తుతం: సీఈవో, టీజీఐఆర్డీ; బదిలీ: డైరెక్టర్, మత్స్యశాఖ, సీఈవో (టీజీఐఆర్డీ అదనపు బాధ్యతలు)20.వల్లూరి క్రాంతి; ప్రస్తుతం: కలెక్టర్, సంగారెడ్డి; బదిలీ: మేనేజింగ్ డైరెక్టర్ , పర్యాటకాభివృద్ధి సంస్థ21.ఉదయ్కుమార్; బదిలీ: సీఈవో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ప్రత్యేక కార్యదర్శి, పీఈ శాఖ22. ప్రియాంక ఆలా ; ప్రస్తుతం: డైరెక్టర్, మత్స్య శాఖ; బదిలీ: కార్యదర్శి, తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్.23. పి. ప్రావీణ్య; ప్రస్తుతం: కలెక్టర్, హనుమకొండ; బదిలీ: కలెక్టర్, సంగారెడ్డి.24. నిర్మలా కాంతివెస్లీ ; బదిలీ: కార్యదర్శి, సీఈవో, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, వీసీ అండ్ ఎండీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్.25. మిక్కిలినేని మనుచౌదరి; బదిలీ: కలెక్టర్, మేడ్చల్–మల్కాజిగిరి.26. ముజమ్మిల్ ఖాన్; ప్రస్తుతం: కలెక్టర్, ఖమ్మం; బదిలీ: డైరెక్టర్ సివిల్ సప్లయ్స్, సీఆర్వో హైదరాబాద్ (అదనపు బాధ్యతలు).27. స్నేహ శబరీ‹Ù ; ప్రస్తుతం: అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ; బదిలీ: కలెక్టర్, హనుమకొండ 28. అనుదీప్ దురిశెట్టి; ప్రస్తుతం: కలెక్టర్, హైదరాబాద్; బదిలీ: కలెక్టర్, ఖమ్మం29. నవీన్ నికోలస్; ప్రస్తుతం: కార్యదర్శి, టీజీపీఎస్సీ; బదిలీ: డైరెక్టర్, పాఠశాల విద్య, (ఎస్ ఎస్ఏ పీడీగా అదనపు బాధ్యతలు).30. చెక్క ప్రియాంక ; ప్రస్తుతం: ఉప కార్యదర్శి, ఎంఏ అండ్ యూడీ; బదిలీ: స్పెషల్ కమిషనర్, ఐ అండ్ పీఆర్.31. చాహత్ బాజ్పేయి; ప్రస్తుతం: కమిషనర్, కరీంనగర్ కార్పొరేషన్; బదిలీ: కమిషనర్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్.32. అశ్విని తానాజీ వకాడే; బదిలీ: అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) కరీంనగర్33. ప్రఫుల్ దేశాయ్; బదిలీ: కమిషనర్, కరీంనగర్ కార్పొరేషన్.34. షఫీయుల్లా; ప్రస్తుతం: ప్రత్యేక కమిషనర్, గ్రామీణాభివృద్ధి; బదిలీ: కార్యదర్శి, మైనారిటీ సంక్షేమం, కార్యదర్శి, మైనారిటీ స్కూల్స్ (అదనపు బాధ్యతలు)35. వీఎస్ఎన్వీ ప్రసాద్ (ఐఎఫ్ఎస్); బదిలీ: డైరెక్టర్, హెచ్ఎండీ 36. నిఖిల్ చక్రవర్తి; ప్రస్తుతం: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, టీజీఐఐసీ; బదిలీ: డైరెక్టర్, పరిశ్రమల శాఖ, -
చేనేత.. దేశ వారసత్వ సంపద
సాక్షి, యాదాద్రి, భూదాన్ పోచంపల్లి: చేనేత అంటే వస్త్రం కాదని, అది దేశ వారసత్వ సంపద అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు అద్భుతమైన కళాత్మక వృత్తికి చిహ్నమని అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిని తన సతీమణితో కలిసి గవర్నర్ సందర్శించారు. చేనేత గృహాలను సందర్శించి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకొన్నారు. టూరిజం పార్కులోని మ్యూజియంలో ఇక్కత్ వ్రస్తాల తయారీ విధానాలను స్వయంగా పరిశీలించి ఇక్కత్ డిజైన్లు, చేనేత కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం చేనేత కార్మికులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో వారి అభిప్రాయాలను తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తాను గతంలో త్రిపుర హ్యాండ్లూమ్ ఆఫీస్లో పనిచేస్తున్న కాలంలోనే పోచంపల్లి ఇక్కత్ పేరు బాగా వినబడేదని, దాంతో ఎలాగైనా పోచంపల్లిని సందర్శించి ఇక్కత్ కళను తెలుసుకోవాలనే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఐఐటీ, ఎన్ఐటీ సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చి చేనేతలో నూతన డిజైన్ల అభివృద్ధి, ఉపాధి తదితర అంశాలపై అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు.సాక్షి, యాదాద్రి, భూదాన్ పోచంపల్లి: చేనేత అంటే వస్త్రం కాదని, అది దేశ వారసత్వ సంపద అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు అద్భుతమైన కళాత్మక వృత్తికి చిహ్నమని అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిని తన సతీమణితో కలిసి గవర్నర్ సందర్శించారు. చేనేత గృహాలను సందర్శించి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకొన్నారు. టూరిజం పార్కులోని మ్యూజియంలో ఇక్కత్ వ్రస్తాల తయారీ విధానాలను స్వయంగా పరిశీలించి ఇక్కత్ డిజైన్లు, చేనేత కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం చేనేత కార్మికులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో వారి అభిప్రాయాలను తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తాను గతంలో త్రిపుర హ్యాండ్లూమ్ ఆఫీస్లో పనిచేస్తున్న కాలంలోనే పోచంపల్లి ఇక్కత్ పేరు బాగా వినబడేదని, దాంతో ఎలాగైనా పోచంపల్లిని సందర్శించి ఇక్కత్ కళను తెలుసుకోవాలనే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఐఐటీ, ఎన్ఐటీ సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చి చేనేతలో నూతన డిజైన్ల అభివృద్ధి, ఉపాధి తదితర అంశాలపై అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు.అందుబాటులోకి వచి్చన ఆధునిక టెక్నాలజీతో నకిలీ ఇక్కత్ వ్రస్తాల నిరోధానికి కృషి చేస్తామని అన్నారు. పోచంపల్లికి మిస్వరల్డ్ బృందం సందర్శనతో ఇక్కడ 30 శాతం వ్రస్తాల కొనుగోళ్లు పెరిగాయని చెప్పడం గొప్పవిషయమని అన్నారు. ఈ ప్రాంతంలోని చేనేత కళాకారులు అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు పొందడం అభినందనీయమన్నారు. అనంతరం చేనేత కార్మికులకు బీమా చెక్కులతో పాటు త్రిఫ్ట్ ఫండ్ చెక్కులను అందజేశారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. గవర్నర్ స్థాయి లాంటి వ్యక్తులు పోచంపల్లి ఉత్పత్తులను పరిశీలించేందుకు రావడం రెండవసారి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూ ఆదుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్, పలువురు చేనేత కళాకారులు పాల్గొన్నారు.అందుబాటులోకి వచి్చన ఆధునిక టెక్నాలజీతో నకిలీ ఇక్కత్ వ్రస్తాల నిరోధానికి కృషి చేస్తామని అన్నారు. పోచంపల్లికి మిస్వరల్డ్ బృందం సందర్శనతో ఇక్కడ 30 శాతం వ్రస్తాల కొనుగోళ్లు పెరిగాయని చెప్పడం గొప్పవిషయమని అన్నారు. ఈ ప్రాంతంలోని చేనేత కళాకారులు అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు పొందడం అభినందనీయమన్నారు. అనంతరం చేనేత కార్మికులకు బీమా చెక్కులతో పాటు త్రిఫ్ట్ ఫండ్ చెక్కులను అందజేశారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. గవర్నర్ స్థాయి లాంటి వ్యక్తులు పోచంపల్లి ఉత్పత్తులను పరిశీలించేందుకు రావడం రెండవసారి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూ ఆదుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్, పలువురు చేనేత కళాకారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కర్కశత్వంపై అక్షర గర్జన
విజయవాడ స్పోర్ట్స్/జి.కొండూరు: ‘సాక్షి’ కార్యాలయాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దురుద్దేశంతో చేస్తున్న దాడులను ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు, కార్మిక సంఘాలు, న్యాయవాదులు, వామపక్ష నాయకులు, సీనియర్ జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. నాణేనికి మరోవైపు ఉన్న ప్రపంచాన్ని చూపిస్తూ ప్రజల సమస్యల్ని వెలుగులోకి తీసుకొస్తున్న సాక్షిపై దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. పత్రిక కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని నినదించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను రెడ్బుక్ ప్రమాదంలో పడేసిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.సాక్షి కార్యాలయాలపై టీడీపీ నాయకులు చేస్తున్న దాడులకు నిరసనగా విజయవాడ గాం«దీనగర్లోని ధర్నా చౌక్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఇచి్చన పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి జర్నలిస్టు, జర్నలిస్టు సంఘాల నాయకులు తరలివచ్చి ధరాలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా కొనసాగింది.టీడీపీ గూండాల చర్యలకు నిరసనగా ఫ్లకార్డులను ప్రదర్శించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడండి, రెడ్బుక్ పాలనను అంతం చేయండి, పత్రికా కార్యాలయాలపై దాడులు సిగ్గు.. సిగ్గు.. అనే నినాదాలతో ఆ ప్రాంగణాన్ని హోరెత్తించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఒగ్గు గవాస్కర్, సాక్షి ప్రతినిధులు బీవీ రాఘవరెడ్డి, విశ్వనా«థ్రెడ్డి, ఎన్.సతీ‹Ù, ఓబుల్రెడ్డి వెంకట్రామిరెడ్డి, చందు శివాంజనేయులు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర పాల్గొన్నారు.సాక్షిపై కక్షసాధింపు చర్యలను ఖండిస్తున్నాం మీడియా సంస్థలు తప్పులు, పొరపాట్లు చేశాయని భావిస్తే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో ఎంతమాత్రం సమంజసం కాదు. ఇది కేవలం కక్షసాధింపు చర్యే. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ను ఈ ప్రభుత్వం దురి్వనియోగం చేస్తోంది. సాక్షిపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ఖండిస్తున్నాం. – కె.పోలారి, ఇఫ్టూ నేతనా సర్విసులో ఇలాంటివి చూడలేదు నా సర్విసులో మీడియా సంస్థలు, జర్నలిస్టులపై ఇటువంటి దాడులు చూడలేదు. మీడియా సంస్థలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూడటం ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. – వెంకటేశ్వరరెడ్డి, రిటైర్డ్ పోలీసు అధికారి నిరంకుశ చర్య మంచిది కాదు ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులను, దమన కాండలను జర్నలిస్టు సంఘాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకోవడం దుర్మార్గం. జర్నలిస్టులు, మీడియా సంస్థలపై ప్రభుత్వం నిరంకుశ వైఖరి ప్రదర్శించడంమంచి చర్య కాదు. – సీహెచ్.రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి, చిన్న, మధ్య తరగతి పత్రికల సంఘం (సామ్నా) -
హృదయం ముక్కలైంది: ప్రధాని మోదీ
మాస్కో/లండన్/వాషింగ్టన్/పారిస్/బ్రస్సెల్స్: మాన ప్రమాద వార్త తెలియగానే తన హృదయం ముక్కలైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఖాతాలో ఒక సంతాప పోస్ట్ పెట్టారు. ‘‘ అహ్మదాబాద్లో పెను విషాదం నన్ను ఎంతగానో కలచివేసింది. మాటలు రావడం లేదు. మాటలకందని మహా విషాదమిది. నా హృదయం ముక్కలైంది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలన్నీ మృతుల కుటుంబాల గురించే. సహాయక చర్యల్లో నిగమ్నమైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నా’’ అని మోదీ అన్నారు. ‘‘ హృదయ విదారక దుర్ఘటన ఇది. ఇంతటి విషాద సమయంలో బాధిత కుటుంబాలకు యావత్భారతావని అండగా నిలుస్తోంది’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తంచేశారు. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు పార్టీల అధినేతలు, అగ్రనేతలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తూ సంతాప సందేశాలు వెలువర్చారు.ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేసిన ప్రపంచాధినేతలుఅంతులేని విషాదాన్ని మిగిల్చిన గుజరాత్ విమాన ప్రమాద ఘటనపై ప్రపంచదేశాలు నిర్వరపోయాయి. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తంచేస్తూ ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మొదలు మలేసియా ప్రధాని అన్వర్ఇబ్రహీం దాకా పలువురు ప్రపంచ దేశాల అధినేతలు, పాలకులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తూ సంతాప సందేశాలు పంపించారు. ‘‘ ఎంతో మంది బ్రిటిష్ జాతీయులతో లండన్కు బయల్దేరిన విమానం కూలిన దుర్ఘటన దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ ఘటన వివరాలను ఎప్పటికప్పుడు తెల్సుకుంటున్నా. తాజా పరిస్థితిపై ఆరాతీస్తున్నా. భాదితుల కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని బ్రిటన్ ప్రధాన మంత్రి కెయిర్ స్మార్మర్ వ్యాఖ్యానించారు. బ్రిటన్ రాజు ఛార్లెస్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లెయిన్ తదితరులు తమ సంతాపాన్ని ప్రకటించారు. -
డీజీపీ బాధితుల పక్షమా?.. దాడి చేసినవారి పక్షమా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర డీజీపీ బాధితుల పక్షాన ఉంటారో, దాడులు చేసిన చేసిన వారి పక్షాన ఉంటారో తేల్చుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు అరుణ్కుమార్, వరుదు కళ్యాణి, ఇతర నేతలు స్పష్టంచేశారు. ఏపీలో అరాచక పరిస్థితులపై డీజీపీకి ఫిర్యాదు చేయటానికి వస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సాక్షి కార్యాలయాలపై దాడులు, పొదిలిలో రైతులపై అక్రమ కేసులు, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం, మాజీ సీఎం వైఎస్ జగన్ కార్యక్రమాలకు భద్రత కల్పించకపోవడం, మహిళలపై అఘాయిత్యాలు తదితర అంశాలపై వారు గురువారం అదనపు డీజీ మధుసూదనరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.అనంతరం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అదనపు డీజీకి చాలా అంశాలపై ఫిర్యాదు చేశాం. దర్శిలో మా వారిపై టీడీపీ గూండాలు దాడి చేస్తే, మా వారిపైనే 15 అక్రమ కేసులు పెట్టారు. బాధితులకు కాకుండా టీడీపీ గూండాలకే పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్ పర్యటనలకి ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించడంలేదు. జగన్ కాన్వాయ్పై రాళ్ల దాడి చేసిన వారికి పోలీసులు అండగా నిలబడ్డారు.పొదిలి, గుంటూరు, రామగిరి, తెనాలి ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటనలో ప్రజలు భారీగా వచ్చినా, తగిన భద్రత కల్పించలేదు. ఇందులో లోకేశ్, టీడీపీ పాత్రపై విచారణ చేయాలి. జగన్ పర్యటనను అడ్డుకొనేందుకు వచ్చిన 40 మంది టీడీపీ మహిళా కార్యకర్తలకు మాత్రం 200 మంది పోలీసులను రక్షణగా పెట్టారు. మహిళలను ముందర పెట్టి విధ్వంసాలు సృష్టించి, జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలని టీడీపీ కుట్ర చేస్తోంది.ఇవే విషయాలను అడిషనల్ డీజీకి వివరించాం. వైఎస్సార్సీపీ వారిపై కొందరు పోలీసులు చేస్తున్న దాడులపైనా చర్యలు తీసుకోవాలని కోరాం’ అని చెప్పారు. వైఎస్ జగన్ పర్యటనలకు భద్రత విషయంలో ఎవరు ఆదేశిస్తే ఇంత ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారో పోలీసు అధికారులే చెప్పాలని అరుణ్ కుమార్ అన్నారు. అడిషనల్ డీజీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, నాయకులు మలసాని మనోహర్ రెడ్డి, ఏఎన్ఎన్ మూర్తి తదితరులు ఉన్నారు. -
ప్రయాణికులపాలిట పీడకల... డ్రీమ్లైనర్
విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం కలలు రెక్కలు కట్టుకుని విమానం ఎక్కే వందలాది మంది ప్రయాణికులు తాజాగా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ పేరు చెప్పగానే హడలిపోతున్నారు. ఇది మార్గమధ్యంలో కూలిపోయి తమ కలలను కల్లలుచేస్తుందన్న ప్యాసింజర్ల భయాందోళల నడుమ ఈ మోడల్ విమానంపై సర్వత్రా చర్చ నెలకొంది. అమెరికా విమానతయారీరంగ దిగ్గజం బోయింగ్ 2011లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ఈ విమానం ఇప్పుడు అత్యంత అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. దీంతో ఈ మోడల్ విమానం గత విజయాలు, విశేషాలతోపాటు వివాదాలపర్వాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. వేర్వేరు చోట్ల తయారుచేసి మరోచోట విడిభాగాలను పటిష్టమైన ప్రామాణాలను పాటించకుండానే బిగిస్తున్నారని, డిజైన్ లోపాలున్నాయని ఈ మోడల్పై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్ పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి గమనిద్దాం. విలాసానికి మారుపేరు.. ఎప్పుడొచ్చింది? 2011లో విశ్వవిపణిలోకి తొలిసారిగా అడుగుపెట్టినప్పుడు బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానంలోని సదుపాయాలు, సామర్థ్యాన్ని చూసిన వాళ్లంతా ఔరా అనేశారు. ఎక్కువ మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతోపాటు సుదూరాలకు ఇది అవలీలగా వెళ్లగలదు. కొనుగోలుచేసిన, నిర్వహణ సంస్థకు అనువుగా 242 నుంచి గరిష్టంగా 290 వరకు ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. సామర్థ్యం ఎంత? ఏకధాటిగా ఎక్కడా ఆగకుండా ఏకంగా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీంతో సుదూర నగరాల మధ్య సంధానకర్తగా ఇది మంచి పేరు తెచ్చుకుంది. అత్యంత పటిష్టమైన, అత్యంత తేలికైన మూలకాలతో విమాన నిర్మాణ విడిభాగాలను తయారుచేశారు. దీంతో మిగతా పోటీ సంస్థల మోడళ్లతో పోలిస్తే దీని బరువు తక్కువగా ఉంటుంది. మైలేజీపరంగా తక్కువ ఇంధనంతో పనిచేస్తుంది. టెక్నాలజీ ఎలాంటిది? కొత్తతరం డిజైన్, అధునాతన ఫ్లై–బై–వైర్ కంట్రోలర్లతో పనిచేస్తుంది. ప్రతి ఆదేశాన్ని పైలట్ ఇవ్వాల్సిన పనిలేకుండా గాల్లో కదిలే దిశ, ఒంపుకు అనుగుణంగా ఆటోమేటిక్గా కంప్యూటరే ఆదేశాలు ఇచ్చే వ్యవస్థ ఇందులో ఉంది. అత్యాధునిక ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లు దీనిలో ఉన్నాయి. సింథటిక్ విజన్ సిస్టమ్(ఎస్వీఎస్) సాయంతో కింద ఉన్న భూభాగాన్ని త్రిమితీయ(3డీ) ఫొటోలు తీసి ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో రన్వేపై పక్షులు, ఎయిర్పోర్ట్ వస్తువులు ఏమైనా ఉన్నాయోలేదో వెంటనే అలర్ట్చేస్తుంది. మంచుదుప్పటి కప్పుకున్నా, భీకర వర్షం పడుతున్నా రన్వే పరిసరాలను స్పష్టంగా చూపిస్తుంది. ఇంకెన్ని ఫీచర్లు ఉన్నాయి? ప్రయాణికుల సీటింగ్ క్యాబిన్, కాక్పిట్, కార్గో సెక్షన్లు అన్నింటిపైనా సమీకృత పర్యవేక్షణ ఉండేలా ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ ఏవియానిక్స్(ఐఎంఏ) విధానంతో విమానం పనిచేస్తుంది. ఆక్సిజన్ పీడనం, ఇంధన లీకేజీలు, హఠాత్తుగా ప్రయాణ ఎత్తు తగ్గడం, పిడుగులతో కుదుపులకు లోనవడం వంటి సందర్బాల్లో వెనువెంటనే ఆటోమేషన్లో తనంతట తానుగా సర్దుబాటు చేసుకునే వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. మరి లోపాలేంటి? తొలిరోజుల్లో నవతరం విమానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన 787–8 డ్రీమ్లైనర్ నెమ్మదిగా విమర్శల సుడిగుండంలో పడింది. 2013లో ఈ మోడల్ విమానాల్లో లిథియం అయాన్ బ్యాటరీలు పేలిపోయాయి. దీంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్(ఎఫ్ఏఏ) వీటి రాకపోకలను స్తంభింపజేసింది. విమానం మధ్యలోని ప్రధాన విడిభాగాన్ని ఇతర భాగాలను అనుసంధానించేటప్పుడు సరైన ప్రమాణాలను పాటించట్లేరని 2019లో తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి. బిగింపుల మధ్య అతుకులు సరిగా పూడ్చట్లేరని, ఇందుకు కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కూడా తోడైందని వెల్లడైంది. దీంతో తరలింపు కోసం వాడిన బోల్ట్లు ఆ తర్వాత సైతం జాయింట్ల వద్ద అలాగే ఉండిపోయి మొత్తం వ్యవస్థకే సమస్యాత్మకంగా మారుతున్నాయి. సమీక్ష జరిపాకే ఎయిర్లైన్స్లకు కొత్త విమానాలను డెలివరీ చేయాలని ఎఫ్ఏఏ ఆదేశించడంత 2021 జనవరి నుంచి 2022 ఆగస్ట్దాకా 787 సిరీస్ల డెలివరీ ఆగిపోయింది.లోపాలను ఎత్తిచూపిన సీనియర్ ఉద్యోగులు ఏళ్ల తరబడి బోయింగ్ సంస్థలో పనిచేసిన సీనియర్ ఇంజినీర్లు ఈ మోడల్ విమానాల్లో లోపాలు ఉన్నట్లు పలుమార్లు బహిరంగంగా చెప్పారు. బోయింగ్ సంస్థలో ఇంజనీర్గా 17 ఏళ్లపాటు పనిచేసిన మాజీ ఉద్యోగి సామ్ సలేహ్పౌర్ 2024లో ఎఫ్ఏఏకు ఫిర్యాదు కూడా చేశారు. ‘‘విడిభాగాల ఉత్పత్తి దశలో బోయింగ్ అడ్డదారులు తొక్కుతోంది. విడిభాగాల బిగింపు సమయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలను పాటించట్లేదు. హడావిడిగా తుది ఆమోద ముద్ర వేసేలా ఇంజనీరింగ్ సిబ్బందిపై ఒత్తిడి చేస్తోంది. సరైన బిగింపు లేకపోవడం వల్ల విమానం పాతబడేకొద్దీ లోపం అనేది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అసెంబ్లీ యూనిట్లలో సిబ్బంది అడవిలో టార్జాన్ మాదిరిగా ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా మారుతూ పనిని సవ్యంగా చేయట్లేరని సంస్థకు ఎన్నోసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. 2020 ఏడాది నుంచి మూడుసార్లు సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తే నన్ను ‘నోరు మూస్కో’అన్నారు. ఇన్ని లోపాలతో తయారైన ఈ లోహ విహంగాలు టిక్ టిక్ శబ్దం చేసే టైంబాంబులే. రక్షణ, భద్రతా సంస్కృతికి బోయింగ్ తిలోదకాలిస్తోంది’’అని సలేహ్పౌర్ ఆరోపించారు.సమస్యలు ఎత్తిచూపి శాశ్వత నిద్రలోకి.. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్గా 32 ఏళ్లు బోయింగ్లో పనిచేసిన జాన్ బార్నెట్ సైతం పలు లోపాలను ఎత్తిచూపారు. ‘‘అత్యధిక పని ఒత్తిడి కారణంగా సిబ్బంది.. తయారీ లోపాలున్నాసరే ఆయా భాగాలను బిగించేస్తున్నారు. ఆక్సీజన్ వ్యవస్థల్లో ఇలాంటి లోపాలను గుర్తించా. ప్రతి నాలుగింట ఒక ఎమర్జెన్సీ బ్రీతింగ్ మాస్్కలో లోపం ఉంది. వాడేటప్పుడు ఇవి విఫలమవడం ఖాయం’’అని అన్నాడు. ఈ లోపాలను బయటపెట్టినందుకు ఈయనపై కేసు నమోదైంది. తర్వాత ఈయన ఆత్మహత్యచేసుకున్నారు. విమానాల్లో లోపాల ను క్వాలిటీ ఆడిటర్ జాషువా డీన్ సైతం బయటపెట్టారు. తర్వాత ఆయన సైతం అనారోగ్య సమస్యలతో చనిపోయారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 30లోగా వీరి విధుల హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియను పూర్తిచేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు స్పష్టంచేస్తూ బదిలీ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి కె. భాస్కర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మార్గదర్శకాల ప్రకారం మే 31 నాటికి ఒకే గ్రామ, వార్డు సచివాలయంలో ఐదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీచేయాలి. ఐదేళ్లు పూర్తికాని ఉద్యోగులను కూడా వారి అభ్యర్థన మేరకు బదిలీ చెయ్యొచ్చు. అలాగే..⇒ ఉద్యోగులను వారి సొంత మండలానికి బదిలీ చేయకూడదు. n దృష్టిలోపం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. మానసిక వికలాంగ పిల్లలు ఉన్న ఉద్యోగులను సంబంధిత వైద్య సౌకర్యాలు అందుబాటులో చోటుకు లేదా వారు కోరుకునే ప్రాంతానికి బదిలీచేయాలి. ⇒ గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులకు, 40 శాతం వైకల్యంగల ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. ⇒ క్యాన్సర్, ఓపెన్హార్ట్ ఆపరేషన్, న్యూరో సర్జరీ, కిడ్ని ట్రాన్స్ప్లాంటేషన్ వంటి వ్యాధులతో బాధపడే ఉద్యోగులను లేదా ఆ ఉద్యోగులపై ఆధారపడిన భార్య లేదా పిల్లలుంటే అటువంటి వారిని ఆయా వైద్య సౌకర్యాలున్న ప్రాంతాలకు బదిలీచేయాలి. ⇒ కారుణ్య ప్రాతిపదికన నియమించిన వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. ⇒ దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు బదిలీ నుంచి మినహాయింపు పొందవచ్చు. ఒకవేళ బదిలీ కోసం అభ్యర్థిస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ కేటగిరిలో స్పష్టమైన ఖాళీ లభ్యత ఆధారంగా కోరుకున్న చోటుకు బదిలీచేయాలి. ⇒ భార్యాభర్తలు ఉద్యోగులైతే ఇద్దరినీ ఒకే స్టేషన్కు లేదా దగ్గరగా ఉన్న స్టేషన్లకు బదిలీచేయాలి. ⇒ గిరిజన, మారుమూల, వెనుకబడిన ప్రాంతాల్లో ఖాళీల భర్తీకి కలెక్టర్లు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులు నిర్ధేశిత గడువులోగా విధుల్లో చేరాలి. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ⇒ ఇక నిధులు చెల్లింపు పెండింగ్ ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేయకూడదు. ⇒ ఉద్యోగుల బదిలీలను ఈ మార్గదర్శకాల మేరకు అత్యంత పారదర్శకంగా ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలకు అవకాశంలేకుండా గడువులోగా పూర్తిచేయాలి.సొంత మండల పరిధిలోనే బదిలీలు చేయాలి..గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో కోరుకున్న వారిని మినహాయించి మిగిలిన వారినందరినీ సొంత మండలాల పరిధిలోనే బదిలీలు కల్పించాలని గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎం.డి. జానీపాషా, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు ప్రభుత్వాన్ని కోరారు.ఇతర మండలాలకు వారిని బదిలీ చేయాలనే నిబంధనతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు.