Anakapalle
-
అత్యున్నత త్యాగానికి సెల్యూట్
సింథియా: తోటి మనిషి ప్రాణాన్ని కాపాడటం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన తూర్పు నావికాదళ పెట్టీ ఆఫీసర్, దివంగత దీపక్ కుమార్ వీరోచిత త్యాగానికి భారతావని అత్యున్నత పురస్కారంతో నివాళులర్పించింది. మానవత్వంతో ఆయన చూపిన అసాధారణ ధైర్యసాహసాలకు గుర్తింపుగా భారత రాష్ట్రపతి ప్రకటించిన ‘సర్వోత్తమ జీవన్ రక్షా పతకాన్ని’ ఏప్రిల్ 1న ముంబైలో జరిగిన నావికా దళ పురస్కార వేడుకలో ప్రదానం చేశారు. భారత నావికాదళ అధిపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును దీపక్ కుమార్ సతీమణి రౌషానీ కుమారి కన్నీటి పర్యంతమవుతూ అందుకున్నారు. ఆ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ దీపక్ కుమార్ చేసిన త్యాగాన్ని తలచుకుని నిశ్శబ్దంగా నివాళులర్పించారు. ఏం జరిగిందంటే? 2024, సెప్టెంబర్ 14న అనకాపల్లి జిల్లా దేవరాపల్లి సమీపంలో గల సరియా జలపాతం వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృతికి ఒక వ్యక్తి కొట్టుకుపోతుండగా, ఏమాత్రం ఆలోచించకుండా దీపక్ కుమార్ నీటిలోకి దూకారు. ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే, వరద ఉధృతి అత్యంత బలంగా ఉండటంతో ఇద్దరూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వీరమరణం పొందారు. దీపక్కుమార్ చేసిన ఈ మహోన్నత త్యాగం భారత నావికాదళం అత్యున్నత సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఆయన అకుంఠిత ధైర్యానికి భారత నావికాదళం వందనం చేస్తూ, ఈ అవార్డు ద్వారా దేశం ఆయన వీరోచిత గాథను శాశ్వతంగా స్మరించుకుంటుందని తెలిపారు. -
సకలజీవులపై ప్రేమ, కరుణ కలిగి ఉండాలి
బయ్యవరం వద్ద పాదయాత్ర ముగించి ధ్యానం చేస్తూ విశ్రమిస్తున్న దిగంబర జైన ముని ఆచార్య ప్రముఖ్ సాగర్ జి మహారాజ్ కశింకోట: సకల జీవుల పట్ల ప్రేమ, గౌరవం,కరుణ కలిగి ఉండాలని దిగంబరజైన ముని ఆచార్య ప్రముఖ్ సాగర్జి మహారాజ్ ఉద్బోధించారు. మండలంలోని బయ్యవరం గ్రామానికి దిగంబర జైన మునులైన సాగర్జి మహారాజ్ సహా ప్రభాకర్ సాగర్ చేపట్టిన మంగళ అహింస పాద యాత్ర శనివారం సాయంత్రం చేరింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సకల జీవుల పట్ల ప్రేమ, గౌరవం,కరుణ కలిగి ఉండాలనే సందేశాన్ని బోధించడానికి దేశ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నామన్నారు. గత ఏడాది నవంబర్ 30న కోల్కత్తా నుంచి చేపట్టిన పాద యాత్ర కర్నాటకలోని బెంగళూరుకు వచ్చే జులై వరకు సాగనుందన్నారు. ప్రతి రోజు సుమారు 25 కిలో మీటర్లు యాత్ర చేస్తున్నట్టు చెప్పారు. -
వైఎస్సార్సీపీ హయాంలోనే గ్రామాభివృద్ధి
చోడవరం: వైఎస్సార్సీపీ హయాంలోనే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పంచాయతీ సర్పంచ్ల పదవీ ముగిసిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని 91 మంది సర్పంచ్లను శనివారం ఘనంగా సత్కరించారు. చోడవరంలో జరిగిన సన్మాన సభలో చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల నుంచి వివిధ గ్రామాల సర్పంచ్లు, మండల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నెరవేర్చారన్నారు. పంచాయతీలను బలోపేతం చేస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చారన్నారు. అన్ని శాఖల సచివాలయ ఉద్యోగులు సర్పంచ్ల పర్యవేక్షణలో పనిచేసే మహోన్నత విధానాన్ని తెచ్చారన్నారు. సచివాలయ వ్యవస్థలో వలంటీర్లను తెచ్చి సంక్షేమ పథకాలన్నీ నేరుగా ప్రజల ఇంటి వద్దకే అందించేలా చేశారని కొనియాడారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా ప్రతీ పని వలంటీర్ల ద్వారా సచివాలయంలోనే జరిగేలా ఒక కొత్త వ్యవస్థను తెచ్చి దేశ చరిత్రలో రికార్డు సృష్టించిన ఘనత జగన్మోహన్రెడ్డిదే అన్నారు. ప్రతీ పంచాయతీలో రూ. 2.5 కోట్లతో పంచాయతీ భవనాలు, సచివాలయం, కమ్యూనిటీ ఆస్పత్రి, రైతు భరోసా కేంద్రం కట్టించి, ఆయా కార్యాయాల్లోనే పూర్తి స్థాయిలో ప్రజలు సేవలు అందించారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ఐదేళ్లపాటు గ్రామ స్థాయిలో ప్రజలకు ఎంతో సేవలు అందించిన సర్పంచ్లకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంటు పరిశీలకురాలు శోభా హైమావతి, చోడవరం నియోజకవర్గ పరిశీలకుడు గండి రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, సంయుక్త కార్యదర్శి దొండ రాంబాబు, జెడ్పీటీసీ పోతల శ్రీనివాసరావు, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, ఎంపీపీలు గాడి కాసు, పైల రాజు, యర్రంశెట్టి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు బైన ఈశ్వరరావు, దొండా నారాయణమూర్తి, శరగడం నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
స్పీకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
నర్సీపట్నం: జాతరలో దళితుడిని కొట్టిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని విదసం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. పండగలో డప్పు కొట్టడానికి వచ్చిన దళితుడిని స్పీకర్ చెంప పగల గొట్టడాన్ని నిరసిస్తూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం నర్సీపట్నం అబిద్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల మంది సమక్షంలో దళితుడిని బహిరంగంగా కొట్టడం స్పీకర్ అహంకారానికి నిదర్శనమన్నారు. పండగలో ప్రజలంతా సంతోషంతో ఉంటే, దళితులను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగడం అమానుషమన్నారు. తప్పును సరిదిద్దుకోకుండా బాధితుడిని బెదిరించి రాజకీయ ప్రకటన ఇప్పించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. తమకు రాజకీయాలు అనవసరమని, తప్పు ఎవరు చేసినా చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. నేతల నాగేశ్వరరావు మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడుకు దళితులను అవమానించటం పరిపాటిగా మారిందన్నారు. పదవి ఉంటే నేల మీద నిలబడు అన్నారు. మట్ల అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విదసం నాయకులు లావణ్య, గోడి వెంకటేశ్వరరావు, అల్లంపల్లి ఈశ్వరరావు, ఈరెల్లి సుదీర్కుమార్, చెక్క రాంబాబు, తాతబాబు తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ దళితుడిని కొట్టడం అమానుషం: కె.వి.పి.ఎస్ నర్సీపట్నం: అమ్మవారి జాతరలో డప్పు కొట్టడానికి వచ్చిన దళితుడిని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొట్టడం అమానుషమని కె.వి.పి.ఎస్. నాయకులు పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ ఈ విధంగా దాడి చేయటం దారుణమన్నారు. స్పీకర్ వంటి వ్యక్తుల వల్లే దళితులపై దాడులు నానాటికీ పెరుగుపోతున్నాయన్నారు. తక్షణమే స్పీకర్ అయ్యన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
మునగపాక ఎంపీపీగా కృష్ణవేణి ఎన్నిక
మునగపాక: స్థానిక మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఉమ్మలాడ ఎంపీటీసీ మొల్లేటి కృష్ణవేణి ఎన్నికయ్యారు. ఇటీవల ఎంపీపీ మళ్ల జయలక్ష్మి, వైస్ ఎంపీపీలు బోజా లక్ష్మితో పాటు చిందాడ దేవీలపై వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు అవిశ్వాసం ప్రకటించడంతో అప్పటి ఆర్డీవో ఆయీషా సమక్షంలో అవిశ్వాసం నెగ్గిన విషయం తెలిసిందే. దీంతో నూతన ఎంపీపీ ఎన్నికను శనివారం తన కార్యాలయంలో ఎంపీడీవో ఉషారాణి నిర్వహించారు. ఎంపీపీగా ఉమ్మలాడ ఎంపీటీసీ మొల్లేటి కృష్ణవేణి పేరును మునగపాక ఎంపీటీసీ–2 సూరిశెట్టి రమణ ప్రతిపాదించగా ఇతర వైఎస్సార్సీపీ సభ్యులు బలపరిచారు. సమావేశానికి మొత్తం 13 మంది సభ్యులు హాజరుకాగా వారిలో 11 మంది కృష్ణవేణికి అనుకూలం, మరో ఇద్దరు సభ్యులు వ్యతిరేకం ప్రకటించినట్టు ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపరింటెండెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీపీగా ఎంపికై న కృష్ణవేణి నారాయణరావు దంపతులను ఇతర ఎంపీటీసీలంతా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామి సత్యనారాయణ,ఎంపీటీసీలు సూరిశెట్టి రమణ,బోడకుర్తి గణేష్, మద్దాల వీరునాయుడు,కాండ్రేగుల కిరణ్కుమార్,మళ్ల కాశీ సురేష్, ఇల్లా శిరీషా, కాండ్రేగుల వెంకటలక్ష్మి, బొడ్డేడ హైమావతి, కర్రి సంజీవి,శరగడం అప్పలనరసమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆగిఉన్న లారీనీ ఢీకొన్న వ్యాన్
ప్రమాదవివరాలు తెలుసుకుంటున్న ఎస్ఐ సన్నిబాబు, (ఇన్సెట్) రామ్మూర్తి మృతదేహం నక్కపల్లి: జాతీయరహదారిపై వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంంలో ఒక వ్యక్తి మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ సన్నిబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం గింజేరి గ్రామానికి చెందిన సుమారు 10 మంది వ్యాన్లో ఒంగోలు వెళ్లారు.అక్కడ ఫంక్షన్ చూసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ నక్కపల్లి సమీపంలో వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డుపక్కన పార్క్చేసిన ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొంది. ఈఘటనలో వ్యాన్లో డ్రైవర్ పక్కన కూర్చొన్న రాజాన రామ్మూర్తి(60) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు.వ్యాన్లో ఉన్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలోవిజయనగరం జిల్లా ఎస్.కోట మండలం కొట్టాంకు చెందిన దండుపాటి శాంతి, ఇదే మండలం చామలపల్లిగ్రామానికి చెందిన జుత్తాడ దేవి,కొత్తవలస మండలం ముమ్మలోడుపాలెంకు చెందిన మంతిన దుర్గమ్మ, చామలపల్లి గ్రామానికి చెందిన రాపర్తి రామలక్ష్మి,గింజేరి గ్రామానికి చెందిన నానిపల్లి లక్ష్మి ఉన్నారు. వీరికి నక్కపల్లి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి విశాఖ కేజీహెచ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
తిరుమల పవిత్రతను కాపాడాలి
● టీటీడీ చైర్మన్ను పదవి నుంచి తొలగించాలంటూ వైఎస్సార్సీపీ నాయకుల నిరసన ● వెంకన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు ● భారీగా హాజరైన పార్టీ శ్రేణులు అసాంఘిక, అనైతిక చర్యలకు పాల్పడి తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బ తీసిన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఆయనను ఆ పదవి నుంచి తొలగించి, తిరుమల పవిత్రను కాపాడాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడును చైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ నినాదాలు చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన టీటీడీ చైర్మన్ బిఆర్.నాయుడును విధుల నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి దేమునిగుమ్మం వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎంపీ బి.వి.సత్యవతి, మాడుగుల వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్సీపీ శ్రీకాకుళం, మన్యం జిల్లాల రీజనల్కోఆర్డినేటర్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్ సీపీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అనురాధ, చోడవరం వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీమంత్రి, వైఎస్సార్సీపీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, చోడవరం నియోజకవర్గం సమన్వయకర్త గుడివాడ అమర్నాఽథ్,ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాలజోగులు, వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ, యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో సమన్వయకర్త కరణం ధర్మశ్రీ తదితరులు, నర్సీపట్నంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్సీపీ నర్సీపట్నం సమన్వయ కర్త ఉమాశంకర్ గణేష్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. – సాక్షి నెటవర్క్ రాంబిల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొడుతున్న వైఎస్సార్సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వకర్త కరణం ధర్మశ్రీ, పార్టీ నాయకులు బీఆర్ నాయుడిని తొలగించాలంటూ ప్లకార్డులతో ఉపమాకలో నిరసన వ్యక్తం చేస్తున్న పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు పార్టీ నాయకులతో కలిసి ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే, నర్సీపట్నం సమన్వయకర్త ఉమాశంకర్ గణేష్ -
లాడ్జీలో కర్ణాటక వ్యక్తికి తీవ్ర గాయాలు
నర్సీపట్నం: పట్టణంలోని లాడ్జీలో కర్ణాటక వ్యక్తి తీవ్ర గాయాల పాల య్యాడు. అతడితోపాటు వచ్చిన వారు బి.ఎన్.సాగర్ పేరు మీద లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. రెండు రోజులుగా నలుగురు కలిసి ఉంటున్నారు. శనివారం రాత్రి రూమ్లో బీరు సీసాలు పడి ఉన్నాయి. వారిలో ఒకరిపై దాడి జరిగింది. దాడికి గురైన వ్యక్తి అపసార్మక స్థితిలో పడి ఉన్నాడు. లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుడితో దిగిన బి.ఎన్.సాగర్, మరో ఇద్దరు రూమ్ నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని పోలీసులు సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. -
ఎన్టీఆర్ ఆస్పత్రికి నిర్లక్ష్య సుస్తీ..!
సాక్షి, అనకాపల్లి: జిల్లా కేంద్రం అనకాపల్లిలో గల ఎన్టీఆర్ ఆస్పత్రిలో సకాలంలో సక్రమంగా వైద్య సేవలు అందకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం, సకాలంలో వైద్యం అందకపోవడంతో ఈ ఆస్పత్రిలోని ఎన్ఎన్సీయూ వార్డులో చికిత్స పొందుతున్న మూడు రోజుల పసికందు ప్రాణాలు శుక్రవారం గాలిలో కలిసిపోయాయి. సకాలంలో వైద్య సేవలందని ఘటనలు తరచూ జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. గతంలో కూడా చాలాసార్లు విద్యుత్ సమస్యలతో ఆస్పత్రిలో అవుట్ పేషెంట్లు ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఆస్పత్రికి అనకాపల్లి, చోడవర ం, మాడుగుల, పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి నియోజకవర్గాల నుంచి వైద్యం కోసం రో గులు వస్తుంటారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆస్పత్రిలో సేవలు నానాటికీ తీసి కట్టుగా మారాయి. వైద్యులు లేరని సూపరింటెండెంట్ ప్రభుత్వానికి లేఖ రాసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇష్టారాజ్యం... అడిగేవారే లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యమైంది. చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. ఆస్పత్రిలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతుండడంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. గత వారం రోజులుగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నా అధికారులు పట్టించుకోలేదు. జనరేటర్ సదుపాయం ఉన్నా..10 నిమిషాల పాటే పనిచేస్తుంది. మందుల కొరత, పారామెడికల్ సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన స్కానింగ్ యంత్రం నిర్వహణ ఖర్చులకు కూడా చంద్రబాబు సర్కార్ నిధులు కేటాయించలేదు. ఓపీ ఫుల్... వైద్యం నిల్ జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రోజువారీ సగటున 500 నుంచి 600 వరకూ ఓపీ నమోదు అవుతోంది. వారికి తగ్గట్టుగా ఆస్పత్రిలో సదుపాయాలను మెరుగుపరచలేదు. వైద్యపరికరాలు, మందులు, వీల్చైర్లు, ఇతర మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉంది. వైద్యుల కొరత కారణంగా రోగులు గంటల తరబడి పడిగాపులు కాయవలసివస్తోంది. ఓపీలో చూపించుకుని వైద్యుడి సలహామేరకు వార్డులో చేరితే ఏమాత్రం ఎమర్జెన్సీఅయినా తక్షణమే కేజీహెచ్కి వెళ్లిపోవాలని రిఫర్ చేస్తున్నారు. గైనిక్ రోగులకు చిన్నపాటి ఎమర్జెన్సీ ఉన్నా కేజీహెచ్కు పంపుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. నాడు చేసిన అభివృద్ధే... వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ‘నాడు–నేడు’లో భాగంగా ఎన్టీఆర్ ఆస్పత్రి ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పనకు రూ.1.5 కోట్లు మంజూరయ్యాయి. గత ప్రభుత్వంలో సీఎస్ఆర్ నిధులతో రూ.1.85 కోట్లతో సిటీస్కాన్ యంత్రం కొనుగోలు చేశారు.ఆ తరువాత ఆస్పత్రిలో జరిగిన అభివృద్ధి పనులు దాదాపు శూన్యమని చెప్పొచ్చు. సిబ్బంది ఏరీ ? నడవలేని స్థితిలో ఉన్న రోగులను తీసుకెళ్లేందుకు వీల్చైర్లున్నా వాటిని తోసేందుకు తగిన సిబ్బంది లేరు. దీంతో రోగి బంధువులే వార్డు బాయ్లుగా మారాల్సివస్తోంది. వైద్యులు, స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది కొరత, తగిన మందులు, సౌకర్యాలు, వసతులులేక రోగులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఏసీ సౌకర్యం లేకపోవడంతో స్కానింగ్, ఎక్స్రే యంత్రాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఆల్ట్రా స్కానింగ్ రూంలో ఒక్కరే రేడియాలజిస్టు అందుబాటులో ఉన్నారు. నెలవారీ చెకప్లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను సైతం మూడు గంటలకు పైగా స్కానింగ్ సెంటర్ల వద్ద పడిగాపులుకాయాల్సి వస్తోంది. 42 మంది వైద్యులకు గాను 32 మాత్రమే అందుబాటులో ఉన్నారు. జనరల్ మెడిసిన్ విభాగంలో ముగ్గురికి గాను ఇద్దరు మాత్రమే ఉన్నారు. పీడియాట్రిక్ వైద్యులు ఒక్కరూ కూడా లేరు. ఎన్ఎన్సీయూ వార్డులో చిన్న పిల్లల వైద్యులు ఇద్దరు ఉండాలి, ప్రస్తుతం రెండు పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు అనస్థీషియా వైద్యులకు గాను ఒకరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. కంటి వైద్య నిపుణులు ఇద్దరికిగాను, ఒక్కరే ఉన్నారు. సైకియాట్రిస్ట్ వైద్యులు లేరు.స్టాఫ్ నర్సులు, పారామెడికల్ స్టాఫ్ 510 మంది ఉండాలి. వీరు రెండు షిఫ్ట్లలో విధులు నిర్వహించా లి. కానీ ప్రస్తుతం 215 మంది మాత్రమే పనిచేస్తు న్నారు. కాంట్రాక్ట్, రెగ్యులర్ స్టాఫ్ నర్సులు 56 మంది పనిచేస్తున్నారు. ఆస్పత్రిలో సర్జికల్ గ్లౌజులు, కాటన్, ఐవి క్యానల్, స్కానింగ్ జల్, కొన్ని రకాల సర్జికల్ పరికరాలు,ఫాంటాప్ ఇంజక్షన్ల కొరత ఎక్కువగా ఉంది.జిల్లా కేంద్రం అనకాపల్లిలో గల ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోగుల సేవకు దూరమవుతోంది. ఇక్కడ సమస్యలు తిష్టవేశాయి. నిరుపేదలు వైద్య కోసం నానా అవస్థలు పడుతున్నారు. సకాలంలో వైద్యం అందకపోవడం..వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. తరచూ ఏదో ఒక వివాదంతో ఈ ఆస్పత్రి వార్తల్లో నిలుస్తోంది. -
స్పీకర్ తక్షణమే రాజీనామా చేయాలి
నర్సీపట్నం: నియోజకవర్గ కేంద్రం నర్సీపట్నంలో జరిగిన మరిడమ్మ పండగలో డప్పు కళాకారుడైన దళితుడిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాడి చేయడం దుర్మార్గమని, తక్షణమే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. దళితుడుపై దాడిని నిరసిస్తూ పార్టీ నాయకులతో కలిసి ఆయన స్థానిక అబిద్సెంటర్ లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి శనివారం క్షీరాభిషేకం చేసి, స్పీకర్ క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ పోలీసుల సమక్షంలో కొట్టడం మరీ దుర్మార్గమన్నారు. స్పీకర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టలేదని ఆయన పోలీసులను ప్రశ్నించారు. కాలు తొక్కడం వల్లే స్పీకర్ కొట్టారని బాధితుడితో బలవంతంగా వీడియో రిలీజ్ చేయించారన్నారు. కాలు తొక్కితే కొట్టేస్తారా అని గణేష్ ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ చట్టాలను గౌర వించాల్సిన స్పీకర్ ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, సహాయ కార్యదర్శి పెట్ల అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివ, ఎంపీపీ సుర్ల రాజేశ్వరి,జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు,మాజీ మున్సిపల్ వైస్చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, మాకవరపాలెం ఎంపీపీ రుత్తల సర్వం, మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు ఈరెల్లి సుదీర్కుమార్, పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత, గొలుగొండ ఎంపీపీ గజ్జలపు మణికుమారి, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ రోజా, 17వ వార్డు ఇన్చార్జి అల్లంపల్లి లావణ్య, పార్టీ టౌన్ యూత్ అధ్యక్షులు అల్లంపల్లి ఈశ్వరరావు, మట్ల చంటి, పట్టణ మహిళా అధ్యక్షురాలు కణితి అన్నపూర్ణ, ముస్లిం కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ షేక్ ఉన్నీషాబేగం, మాజీ కౌన్సిలర్లు జగదీశ్వరి, కర్రి చైతన్య, సుర్ల నాయుడు, తమరాన శ్రీను, కొణతాల వరలక్ష్మి పాల్గొన్నారు. -
ఏఎన్ఎం ఆత్మహత్యాయత్నంపై విచారణ
దేవరాపల్లి: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గరిశింగి సచివాలయంలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న జి.రాజ్యలక్ష్మి పాడేరులో శుక్రవారం ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి (డీఐవో) చంద్రశేఖర్దేవ్ స్థానిక పీహెచ్సీలో శనివారం విచారణ జరిపారు. పీహెచ్సీ వైద్యాధికార్లు ఈ.పూజ్యమేఘన, డి.వనజల నుంచి ఆయన వివరాలను సేకరించారు. స్థానిక పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజ్ వేధింపులకు గురి చేయడంతోనే తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. హెల్త్ సూపర్వైజర్ వేధింపులపై ఇటీవల స్థానిక ఎంపీడీవోకు సైతం ఏఎన్ఎం రాజ్యలక్ష్మి ఫిర్యాదు చేసినట్లు స్థానిక పీహెచ్సీ వైద్యులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు సూపర్వైజర్ను అదే రోజు మరో సబ్సెంటర్కు తాత్కాలింగా మార్పు చేశామని స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి పూజ్యమేఘన తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజ్ను సైతం ప్రశ్నించారు. ఆత్మహత్యకు యత్నించిన రాజ్యలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని పాడేరు వైద్యులు, బంధువులను అడిగి తెలుసుకుంటున్నామని డీఐవో చంద్రశేఖర్దేవ్ తెలిపారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన అనంతరం పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. కాగా ఎనిమిది నెలలు క్రితం ఆమె బదిలీపై దేవరాపల్లి పీహెచ్సీకి వచ్చారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి
అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యుల కొరత, విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో మూడురోజుల శిశువు మృతి చెందిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆరోపించారు. ఆస్పత్రిలో ఈనెల 3వ తేదీ రాత్రి వైద్యుల కొరత, విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా కశింకోటలోని గవరపేట వీధికి చెందిన వేగి శ్రీనివాసరావు, తులసి దంపతుల మూ డు రోజుల శిశువు మృతిచెందిన విషయం తెలిసిందే. శిశువు మృతికి కారణాలు బహిర్గతం చేయాలని, మరణానికి కారణమైన వైద్యుడిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో శనివారం వైఎస్సార్సీపీ నాయకులు, శిశువు కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ నిరుపేద రోగులు చికిత్స పొందే ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన సదుపాయాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు.శిశువు మృతి ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నామని, ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం తదితర కారణాలతోనే శిశువు మృతిచెందిందని చెప్పా రు. మృతికి గల కారణాలు సూపరింటెండెంట్కు తెలిసినప్పటికీ నోరు మెదపడం లేదన్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆస్పత్రి వైద్యులు లేరని, ఎస్ఎన్సీయూ వార్డు లో శిశువును పరీక్షించేందుకు వైద్యులు లేరని సూపరింటెండెంట్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అనారోగ్యానికి గురైన శిశువును ఉదయం 9.30 గంటలకు చిన్నపిల్లల వైద్యుడికి చూపించగా ఏమీ పరవాలేదని చెప్పారని, మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో చికిత్స చేయడానికి వైద్యుడు లేకపోవడం వల్లే మరణించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో జరిగిన అన్నివిషయాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. మాజీ ఎంపీ బి.వి. సత్యవతి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆస్పత్రి వైద్యులు ఓ మాతృమూర్తికి తీవ్ర అన్యాయం చేశారన్నారు.సరైన పద్ధతిలో బిడ్డకు పాలు ఇవ్వకపోవడం వల్లే ఊపిరితిత్తుల్లోకి చేరి మరణించినట్టు చిన్నపిల్లల వైద్యులు చెప్పడం దారుణమన్నారు. డీసీహెచ్ఎస్, సూపరింటెండెంట్ న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్రాజా, ఆస్పత్రి మాజీ డైరెక్టర్ మూనూరు శ్రీను, వైఎస్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు దండా జ్ఞానదీప్, 80,81,84 వార్డుల ఇన్చార్జ్లు కె.ఎం.నాయుడు, బి.శివ, కె.రాఘవ, మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు మర్రిపల్లి శోభ, ఎంపీపీ గొర్లి సూరిబాబు, పార్టీ సీనియర్ నాయకులు కొణతాల మురళీకృష్ణ, బుదిరెడ్డి దేముడుబాబు, కలగలక్ష్మిగున్నయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా పోలీస్ వార్షిక క్రీడా సంబరాలు
పరుగు పోటీలో పాల్గొన్న పోలీస్ అధికారులు ఆరిలోవ(విశాఖ తూర్పు): అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని విశాలాక్షినగర్ ఆర్మ్డ్ రిర్వ్డ్ పోలీస్ మైదానంలో శనివారం పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి క్రీడా పోటీలు పోలీస్ విభాగంలో ఐపీఎస్ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు ఒకే వేదికపైకి తీసుకువస్తుందని తెలిపారు. తోటి సిబ్బందితో పరిచయాలు పెంచుకొని సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడతాయన్నారు. ఆయా పోటీల్లో అనకాపల్లి, పరవాడ, నర్సీపట్నం, సబ్ డివిజన్లతోపాటు ఆర్మ్డ్ రిజర్వ్డ్ విభాగానికి చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చూపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై అట్రాసిటీ కేసు పెట్టాలి
ఆరిలోవ: దళిత డప్పు కళాకారుడు నాగులాపల్లి రాందాస్పై దాడి చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి జిల్లా ఎస్సీ విభాగం పరిశీలకుడు అల్లంపల్లి రాజుబాబు డిమాండ్ చేశారు. పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలన్నారు. మద్దిలపాలెంలో పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు, హత్యలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. నిన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో మరిడిమాండ జాతరలో దళిత డప్పుకళాకారుడి చెంపపై కొట్టారు..మొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆకివీడులో దళిత పేటలో శ్రీరామనవమి వేడుకలో 300 మంది కిరాయి రౌడీలతో దళితలపై దాడులు చేయించి, వీరిలో 57 మంది దళిత యువకులపై హత్యాయత్న కేసులను బనాయించారన్నారు. ఇద్దరూ గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి దళితలపై దాడులకు పాల్పడడం హేయమన్నారు. ఇటీవల దళితుడైన మంద సాల్మాన్ హత్య చేశారని, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు, దళిత మహిళపై సదరు ఎమ్మెల్యే అనుచరుడు నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డాడని వాపోయారు. ప్రభుత్వం తీరు మారకుంటే వచ్చే ఎన్నికల్లో దళితులంతా తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. -
ఆశ్రమ భూమి కబ్జాకు టీడీపీ నేతలు యత్నం!
అనకాపల్లి: జిల్లాలోని ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెంలో టిడిపి నేతల దౌర్జన్యం చేశారు. ఆశ్రమానికి చెందిన 3.48 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు యత్నించారు. ఈ భూ వివాదం కోర్టులో ఉండగా భూమిలోకి దౌర్జన్యంగా వెళ్లారు టీడీపీ నేతలు ఎరకయ్య సతీష్, వారి అనుచరులు. ఈ భూ కబ్జాను స్థానిక మహిళలు అడ్డుకునే యత్నం చేశారు. అయితే మహిళలు అని చూడకుండా టీడీపీ నేతలు బూతులతో రెచ్చిపోయారు. దీనిపై ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదు. అదే సమయంలో టీడీపీ నేతలకు వత్తాసు పలికారు పోలీసులు. -
గడ్డివాము, పశువుల పాకలు దగ్ధం
మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది నాతవరం: గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మండలంలోని ఎం.బి.పట్నంలో గడ్డివాము, పశువుల పాకలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన వి.రాజుబాబు తన పొలంలో పశువుల మకాం వద్ద గడ్డి వాము, పాకలు వేసుకున్నాడు. శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం ఎస్ఐ అప్పలస్వామి, సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. గడ్డి వాము, పశువుల పాకలు దగ్ధమవడంతో రూ. 50 వేలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. -
సింహగిరిపై ‘దొంగల’ వేట
సింహాచలం: ‘మీరు స్వామి వారి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం’ అంటూ అర్చకులు గద్దిస్తుంటే, భక్తులు బిత్తరపోయారు. నిష్కల్మషమైన భక్తితో కొండెక్కిన తమను ‘దొంగలు’ అనడమేమిటి? పైగా చేతులకు తాళ్లు కట్టి బంధించడమేమిటి? అని ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. కానీ, అదంతా ’దొంగ–పోలీస్’ ఆటలా సాగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టమని తెలిసి చివరకు ఆనంద డోలికల్లో మునిగిపోయారు. అసలేం జరిగింది? : సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివార్షికకల్యాణోత్సవా ల్లో భాగంగా శుక్రవారం ఉదయం ‘వినోదోత్సవం’ కనువిందుగా జరిగింది. గురువారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో (వేట ఉత్సవం) స్వామివారి ఉంగరం పోయిందని, అది భక్తులే తీశారని అర్చకు లు సరదాగా నిలదీసే ఘట్టమే ఈ ఉత్సవ విశేషం. బంధీలుగా వీఐపీలు.. సామాన్యులు రాజగోపురం వద్ద స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి ఏడు పరదాల చాటున వేంజేసి ఉండగా.. ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు స్వామివారి దూతగా మారి.. చేతిలో కర్ర, తాడు పట్టుకుని భక్తులను బంధించి తీసుకువచ్చారు. గాజువాకకు చెందిన వ్యాపారవేత్త సాగర్, ఇంజనీరింగ్ విద్యార్ధి ప్రణతి, విశాఖకు చెందిన ఫిజియోథెరపిస్టు రేష్మి, విజయనగరానికి చెందిన ఆమె సోదరి భార్గవి, ఒడిశాలోని జాజ్పూర్కి చెందిన ప్రభుత్వ వైద్య విద్యార్థులు, శ్రీహరిపురానికి చెందిన భరత్, హేమ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కుమారుడు సిద్ధార్థ, కోడలు నిత్య, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జర్నలిస్టుల సంఘం జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, పలువురు నూతన దంపతులతోపాటు దేవస్థానం ఈవో జె.వెంకటరావు దంపతులను కూడా వదలకుండా తాళ్లతో బంధించి స్థానాచార్యుల ముందు ప్రవేశపెట్టారు. సీసీ కెమెరా సాక్ష్యం ఉంది.. ఇచ్చేయండి! స్థానాచార్యులు రాజగోపాల్ భక్తులను ప్రశ్నించిన తీరు అత్యంత సహజంగా సాగింది. ‘మీరు దొంగతనం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయి’ అని ఆయన గర్జించడంతో భక్తులు హడలిపోయారు. భక్తుల చేతికి ఉన్న ఉంగరాలు చూపిస్తూ.. ‘ఇదే స్వామివారి ఉంగరం’ అని అర్చకులు నిలదీయడంతో చాలామంది భక్తులు ఆవేశంతో, మరికొందరు బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ట్విస్ట్ ఏమిటంటే: అందరినీ బంధించిన ప్రధానార్చకుడిని, అందరినీ ప్రశ్నించిన స్థానాచార్యుడిని, ఏఈవోలను కూడా చివర్లో తాళ్లతో బంధించడం ఈ ఉత్సవంలో హైలైట్గా నిలిచింది. పరదా వెనుక దొరికిన ‘నిజమైన’ దొంగ భక్తుల విచారణ ముగిసిన తర్వాత, స్వామివారి పల్లకీకి ఉన్న ఏడు పరదాలను ఒక్కొక్కటిగా తొలగించారు. ఆశ్చర్యంగా ఆఖరి పరదా చాటునే స్వామివారి ఉంగరం లభ్యమైంది. అంటే దొంగ మరెవరో కాదు.. ఆ స్వామివారే అని తేలడంతో భక్తులంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. తమను దొంగలుగా పట్టుకోవడం కూడా ఆ నృసింహుడి లీలగా భావించి భక్తులు పులకించిపోయారు. -
కలెక్షన్ల కలకలం
హెడ్ నర్సుల పోస్టింగ్ల్లోసీఎంవోకు ఫిర్యాదు 13న కమిటీ విచారణ మహారాణిపేట: వైద్య ఆరోగ్యశాఖలో ఇటీవల జరిగిన హెడ్ నర్సుల పదోన్నతులు, పోస్టింగ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రాధారాణి ఆధ్వర్యంలో ఇటీవల హెడ్ నర్సులకు పదోన్నతులు కల్పించి, పలు ఆస్పత్రుల్లో పోస్టింగ్లు జారీ చేశారు. అయితే ఈ పదోన్నతులు, పోస్టింగ్ల వెనుక లక్షలాది రూపాయల అవినీతి జరిగిందని విశాఖ సిటిజెన్ ఫోరం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బీవీకే బాబ్జీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పదోన్నతులు పొందిన పలువురు నర్సుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఆయన తన లేఖలో ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిన ఈ ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు, దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా కలెక్టర్ను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ ఆ ఫిర్యాదును కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణికి పంపించారు. అయితే హెడ్ నర్సుల పదోన్నతుల వ్యవహారం తన పరిధిలోకి రాకపోవడంతో.. సూపరింటెండెంట్ ఆ లేఖను తిరిగి వైద్య ఆరోగ్యశాఖ రీజినల్ డైరెక్టర్కు బదిలీ చేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు.. వైద్య ఆరోగ్యశాఖ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ (మేల్) ప్రిన్సిపాల్ డాక్టర్ మీనాక్షిని విచారణ అధికారిగా నియమించారు. ఈ నెల 13న ఈ వ్యవహారంపై డాక్టర్ మీనాక్షి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఆ ముగ్గురే కీలకం.. ముఖ్యమంత్రికి అందిన ఫిర్యాదులో ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం నాయకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. నర్సుల సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగాభవాని, కార్యదర్శి వరలక్ష్మి, ఈసీ సభ్యురాలు గౌరి.. పదోన్నతి పొందిన మొత్తం 30 మంది నర్సుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సదరు 30 మంది నర్సులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ముగ్గురు నాయకురాళ్లను కూడా విచారణ అధికారి ప్రత్యేకంగా ప్రశ్నించనున్నారు. అంతేకాకుండా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తమ రోజువారీ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని కూడా ఫిర్యాదులో ఆరోపించారు. వీరికి కేటాయించిన వార్డుల్లో డ్యూటీలు చేయకుండా, నిత్యం క్లాక్ రూమ్లోనే ఉంటూ అక్కడి నుంచే సెటిల్మెంట్లు చేస్తున్నారని విమర్శించారు. నర్సింగ్ సూపరింటెండెంట్ అండదండలతోనే.. మిగతా నర్సులందరికీ ఎప్పటికప్పుడు డ్యూటీలు మారుస్తున్నప్పటికీ, వీరు మాత్రం ఏళ్ల తరబడి ఒకే వార్డులో తిష్టవేశారని ఫిర్యాదులో ఆక్షేపించారు. నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి అండదండలతోనే వీరు ఇలా రెచ్చిపోతున్నారని, ఎవరికై నా తమకు అనుకూలమైన డ్యూటీలు లేదా మంచి పోస్టింగ్లు కావాలంటే వీరిని కలిసి అడిగినంత ఇచ్చుకుంటే.. పద్మావతిని మేనేజ్ చేసి డ్యూటీలు వేయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంగాభవాని, వరలక్ష్మి స్పందిస్తూ.. తమకు సంబంధిత అధికారుల నుంచి ఇంకా ఎలాంటి నోటీసులు రాలేదని, విచారణ అధికారి కోరితే అన్ని వివరాలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
పలు రైళ్లు దారి మళ్లింపు
తాటిచెట్లపాలెం: ఈస్ట్రన్ రైల్వే పరిధిలో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను ఏప్రిల్ నుంచి జూన్ 30వ తేదీ వరకు దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్కుమార్ తెలిపారు. ● ఏప్రిల్ 6, 13, 20, 27, మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో తాంబరం–సిల్ఘాట్ టౌన్(15629) నాగోన్ ఎక్స్ప్రెస్, తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 3,10,17,24, మే 1,8,15,22,29 జూన్ 5,12,19,26వ తేదీల్లో సిల్ఘాట్ టౌన్–తాంబరం(15630) నాగోన్ ఎక్స్ప్రెస్లు మళ్లించబడిన మార్గంలో వయా అసన్సోల్, అండల్, సయింథియా మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ● ఈ నెల 2,9,16,23,30 మే 7,14,21,28, జూన్ 4,11,18,25వ తేదీల్లో తాంబరం–న్యూ టిన్సుకియా (15929) ఎక్స్ప్రెస్, తిరుగు ప్రయాణంలో ఈ నెల 6,13,20,27 మే 4,11,18,25 జూన్ 1,8,15,22,29వ తేదీల్లో న్యూ టిన్సుకియా–తాంబరం(15930)ఎక్స్ప్రెస్లు మళ్లించబడిన మార్గంలో వయా అసన్సోల్, అండల్, సయింథియా మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ● ఈ నెల 8,15,22,29 మే 6,13,20,27 జూన్ 3,10,17,24వ తేదీలల్లో డాక్టర్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–న్యూ జల్పయ్గురి (22611) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, తిరుగు ప్రయాణంలో ఈ నెల10,17,24 మే 1,8,15,22,29 జూన్ 5,12,19,26వ తేదీల్లో న్యూ జల్పయ్గురి–డాక్టర్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ (22612) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు మళ్లించబడిన మార్గంలో వయా అసన్సోల్, అండల్, సయింథియా మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ● ఈ నెల 4,11,18,25 మే 2,9,16,23,30 జూన్ 6,13,20,27వ తేదీల్లో ఎస్ఎంవీటి బెంగళూరు–కామాఖ్య (12551)ఎక్స్ప్రెస్, తిరుగు ప్రయాణంలో ఈ నెల 8,15,22,29 మే 6,13,20,27 జూన్ 3,10,17,24వ తేదీల్లో కామాఖ్య– ఎస్ఎంవీటీ బెంగళూరు (12552) ఎక్స్ప్రెస్లు మళ్లించబడిన మార్గంలో వయా అసన్సోల్, అండల్, సయింథియా మీదుగా రాకపోకలు సాగిస్తాయి. -
విశాఖ వేదికగా నౌకాదళ గర్జన
ఐఎన్ఎస్ తారాగిరి, అరిధామన్లను జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి తారాగిరి వార్షిప్ని జాతికి అంకితం చేస్తున్న రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ మహారాణిపేట(విశాఖ): విశాఖలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా భారత నౌకాదళానికి చెందిన కీలక ప్రాజెక్టులు ముందుకు సాగాయి. ప్రాజెక్ట్–17ఏలో భాగమైన అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ తారాగిరిని జాతికి అంకితం చేశారు. 75 శాతం పైగా స్వదేశీ సాంకేతికతతో నిర్మితమైన ఈ నౌక దేశ సముద్ర భద్రతను బలోపేతం చేయడంలో కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో అత్యంత రహస్యంగా విశాఖ షిప్బిల్డింగ్ సెంటర్లో అణు శక్తితో నడిచే జలాంతర్గామి అరిధామన్ను కూడా నౌకాదళానికి సమర్పించారు. అరిహంత్ శ్రేణిలో మూడో ఈ సబ్మైరెన్ సుమారు 7,000 టన్నుల సామర్థ్యంతో, 80 శాతం స్వదేశీ సాంకేతికతతో నిర్మితమై, కే–4 క్షిపణులను మోసుకెళ్లగలదు. దీని ద్వారా భారతదేశం తన ‘న్యూక్లియర్ ట్రయాడ్’ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. పర్యటనలో భాగంగా ఐఎన్ఎస్ డేగా వద్ద కేంద్ర మంత్రికి కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్, సీపీ శంఖబ్రత బాగ్చి, కోస్ట్గార్డ్, నేవీ అధికారులు స్వాగతం పలికారు. -
మంత్రి పదవి కోసం ఉత్తరాంధ్రకు వెన్నుపోటు
సాక్షి, అనకాపల్లి: మంత్రి పదవి కోసం... చంద్రబాబు, లోకేష్ మొప్పు పొందాలని విశాఖకు వెన్నుపోటు పొడుస్తావా అంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉమ్మడి పశ్చిమ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఓట్లతో గద్దెనెక్కానన్న విశ్వాసం కూడా లేకుండా విశాఖను రాజధానిగా ప్రకటించిన మాజీ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గంటా అనుచిత వ్యాఖ్య లు చేయడం సిగ్గుచేటన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు మూడు రాజధానులకు స్వాగతమని, నేడు అమరావతికే జై కొడతావా అంటూ మండిపడ్డారు. విశాఖ ప్రాంతానికి చెందిన వాడివి కాకపోయి నా తమ ప్రాంత ప్రజలు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా గెలిపించి రాజకీయ భిక్ష పెడితే.. అదే ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరా వతి పేరిట చంద్రబాబు అవినీతికి పార్లమెంట్లో చట్టం చేస్తున్నట్లుగా ఉందంటూ ఎద్దేవ చేశారు. ముంపు ప్రాంతమైన అమరావతి రాజధానికే రూ.2 లక్షల కోట్లు ఖర్చుచేస్తే.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాత్రికి రాత్రే అమరావతికి పారిపోయి వచ్చారు.. పదేళ్ల పాటు ఉమ్మడి ఏపీ ఆదాయంతో రాజధాని ఏర్పాటు చేయాలనే నిబంధనను మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థం కోసం ఆ నాడు తాత్కాలిక భవనాల పేరిట హడావుడి చేశారన్నారు. నాడు, నేడు వైఎస్సార్సీపీ స్టాండ్ ఒక్కటేనని, అమరావతి రాజధానితో పాటు అభివృద్ధి వికేంద్రీకరణే తమ సిద్ధాంతమన్నారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అమరావతి పేరిట జరుగుతున్న అవినీతికి మాత్రమే వైఎస్సార్సీపీ వ్యతిరేకమన్నారు. తమ ప్రభుత్వంలో కూడా అమరావతితో పాటు విశాఖ, కర్నూల్ మూడు రాజధానుల ఏర్పాటు చేయాలనుకున్నామని చెప్పారు. విశాఖ రాజధాని కాకుంటే మావిగన్ పేరిట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలతో కలిసి రాజధాని చేస్తే తక్కువ ఖర్చుతో రాజధానిని నిర్మించుకుందామని తమ నాయకుడు ప్రతిపాదన తీసుకొచ్చారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ.2 లక్షల కోట్లు అమరావతి రాజధానికే ఖర్చు చేస్తే.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల అభివృద్ధి నిలిచిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలనా కేంద్రీకృతంతో ప్రాంతాల మధ్య విభేదాలు రాకుండా మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని స్పష్టం చేశారు. మంత్రి పదవిపై వ్యామోహంతో.. లోకేష్ మొప్పు కోసం టీడీపీ ఎమ్మెల్యే గంటా చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని విశాఖ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ అమర్నాథ్ డిమాండ్ చేశారు. లేకుంటే ఉత్తరాంధ్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారంటూ హెచ్చరించారు. -
పట్టుదలకు ప్రతిరూపం లలిత శ్రీ.. ప్రతిభకు నిదర్శనం బిందు
పెదగంట్యాడ: గాజువాక ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళా న్యాయవాదులు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించారు. పట్టుదల ఉంటే ఏ వయసులోనైనా విజయం సాధించవచ్చని ధర్మాల లలిత శ్రీ నిరూపించగా, యువ న్యాయవాది కొట్టాన బిందు తొలి అడుగుల్లోనే అత్యున్నత శిఖరాన్ని అధిరోహించారు. వివాహమైన 15 ఏళ్ల తర్వాత జడ్జిగా లలిత శ్రీ ధర్మాల లలిత శ్రీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. వివాహమైన 15 ఏళ్ల తర్వాత ఆమె ఉన్నత చదువులపై దృష్టి సారించారు. ముందుగా పీజీ పూర్తి చేసి, ఆపై ఎల్ఎల్బీ పట్టా పొందారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమయ్యారు. కేవలం రెండో ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై తన కలని సాకారం చేసుకున్నారు. తొలి అడుగులోనే విజయం సాధించిన బిందు : జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సీనియర్ న్యాయవాది ఎం. శాంతి కుమార్తె కొట్టాన బిందు కూడా జడ్జిగా ఎంపికయ్యారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఈమె, సీనియర్ న్యాయవాది వెన్నెల ఈశ్వరరావు వద్ద జూనియర్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వృత్తిలో రాణిస్తూనే జూనియర్ సివిల్ జడ్జిగా విజయం సాధించారు. గాజువాక బార్ అసోసియేషన్ నుంచి ఒకేసారి ఇద్దరు మహిళలు న్యాయమూర్తులుగా ఎంపిక కావడంపై బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు యశోధర వేదమణి హర్షం వ్యక్తం చేశారు. కొట్టాన బిందు ధర్మాల లలితాశ్రీ జూనియర్ సివిల్ జడ్జిలుగా ఇద్దరు మహిళలు -
బస్సుపై దాడి
విషయం తెలిసిన వెంటనే పోతురెడ్డిపాలెం, పురుషోత్తపురం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ ట్రావెల్ బస్సుపై కర్రలు,రాళ్లతో దాడులు చేశారు.బస్సు అద్దాలు పగులగొట్టి బీభత్సం సృష్టించారు.దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సమీప పొలాల్లోకి పరుగులు తీశారు.అనంతరం నెమ్మదిగా తెల్లవారుజామున హైవే చేరుకుని,ఆటోల్లో అడ్డురోడ్డుకు వెళ్లారు.అక్కడి నుంచి వేర్వేరు బస్సుల్లో గమ్యస్థానాలకు పయనమయ్యారు. -
మృత్యువులోనూ వీడని స్నేహ బంధం
యలమంచిలి మండలం పోతురెఢ్డిపాలెం హైవే కూడలి వద్ద దుర్ఘటన యలమంచిలి రూరల్: నిశిరాత్రి..పోతురెడ్డిపాలెం హైవే రక్తసిక్తమైంది.అమ్మవారి జాతరను తిలకించి బైక్పై వెళ్తున్న ముగ్గురు స్నేహితులను మృత్యువు పొట్టనపెట్టుకుంది.కలిసి,మెలిసి పెయింటర్లుగా పనిచేస్తున్న ముగ్గురు యువకులు తమ జీవితం రంగులమయం కావాలని ఎన్నో కలలుకన్నారు.ఏ ఒక్కరికి పెయింటింగ్ పని దొరికినా ముగ్గురు కలిసి చేసుకునేవారు.తమలో ఒకరిని ఇంటి వద్ద బైక్పై డ్రాప్ చేసేందుకు వెళ్లిన ఆ ముగ్గురిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. వీరు ప్రయాణిస్తున్న బైక్ను ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మరణంలోనూ మేము ఒకరినొదిలి మరొకరం ఉండలేమంటూ ఆ ముగ్గురూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘోర దుర్ఘటన మూడు నిరుపేద కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.యలమంచిలి రూరల్ పోలీసులు,బాధిత కుటుంబ సభ్యులు,స్థానికులు తెలిపిన వివరాలు ఇవి... యలమంచిలి మండలం పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు.పురుషోత్తపురంలో గురువారం రాత్రి జరిగిన గొల్లమారెమ్మతల్లి పండగను తిలకించిన ముగ్గురు స్నేహితులు బైక్పై పక్కనున్న పోతురెడ్డిపాలెం గ్రామానికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. హైవే కూడలి వద్ద విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ ఎలక్ట్రిక్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నాని(24),ఏటికొప్పాకకు చెందిన ఇల్లపు గోవింద్(25),పోతురెడ్డిపాలెం గ్రామానికి చెందిన బంగారు దుర్గాప్రసాద్(16) పెయింటర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గొల్లమారెమ్మతల్లి పండగకు ఈ ముగ్గురూ వెళ్లారు. పండగలో ఆనందంగా గడిపిన అనంతరం దుర్గాప్రసాద్ను పోతురెడ్డిపాలెంలో దింపిరావడం కోసం బైక్పై బంగారు నాని,గోవింద్,దుర్గాప్రసాద్ అర్ధరాత్రి సమయంలో బయల్దేరారు.వీరు బయల్దేరిన ఐదు నిమిషాలకే ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు యలమంచిలి ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందాడు. లిప్తపాటులో...మృత్యుకాటు పండగలో ఆనందంగా గడిపిన అనంతరం దుర్గాప్రసాద్ను పోతురెడ్డిపాలెంలో డ్రాప్ చేసి రావడానికి ముగ్గురు యువకులు ఒకే బైకుపై పురుషోత్తపురం నుంచి బయలుదేరారు. పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద సర్వీసు రోడ్డులోకి వెళ్లడానికి హైవేను దాటుతున్న సమయంలో అవతల రహదారిపై వస్తున్న లారీని గమనించిన యువకులు దానికంటే ముందుగానే పోతురెడ్డిపాలెం గ్రామానికి వెళ్లే సర్వీసు రోడ్డులోకి వెళ్లేందుకు బైక్ను ముందుకు నడిపారు సరిగ్గా అదే సమయంలో లారీకి ఎడమ వైపు నుంచి ట్రావెల్ బస్సు అతివేగంగా రావడంతో బైక్ వెనుక భాగాన్ని ఢీకొంది.వెంటనే ఇద్దరు యువకులు ఎగిరి బస్సు ముందున్న అద్దాలకు ఢీకొని, రోడ్డుపై పడిపోయారు.ముగ్గురు యువకుల తల భాగాలపై తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందారు. పెళ్లయిన నాలుగు నెలలకే.. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఏటికొప్పాకకు చెందిన ఇల్లపు గోవింద్కు నాలుగు నెలల కిందటే వివాహమైనట్టు కుటుంబసభ్యులు తెలిపారు.ప్రమాద విషయం తెలియగానే గోవింద్ భార్య దుర్గ,తల్లిదండ్రులు అప్పారావు,భవానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.గోవిందు పురుషోత్తపురంలో అత్తవారింటికి పండగ నిమిత్తం వచ్చి విగతజీవిగా మారాడు.బంగారు నానికి భార్య కుమారి మూడేళ్లలోపు వయసున్న కుమార్తె,కుమారుడు ఉన్నారు. నాని మృతదేహాన్ని చూసి కుమారి గుండెలవిసేలా రోదించింది. తండ్రి మరణించిన విషయం కూడా తెలియని పిల్లలు అమాయకంగా దిక్కులు చూస్తుంటే అక్కడున్నవారు కంటతడి పెట్టారు.ఇటీవల ఉగాది పండగకు నాని కొనుగోలు చేసిన డ్యూక్ బైకే ప్రాణాలు తీసిందంటూ విలపించారు. మరొక మృతుడు బంగారు దుర్గాప్రసాద్ 7వ తరగతి వరకు చదువుకుని పెయింటింగ్ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు.మృతి చెందిన కుమారుడిని చూసి అతని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.ఏం పాపం చేశామని ఈ రంపపు కోత అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. -
గిరిజన యువతి ఆత్మహత్య
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతోనే దేవరాపల్లి: ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి, పెళ్లికి నిరాకరించడంతోనే తీవ్ర మనస్తాపం చెందిన గిరిజన యువతి దూసరి లక్ష్మి (22) ఆత్మహత్య చేసుకుంది. దేవరాపల్లిలో గత నెల 30న అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ శివారు కొరపర్తికి చెందిన గిరిజన యువతి లక్ష్మి ఆత్మహత్య చేసుకున్న సంగతి విధితమే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం సీఐ కె.కృష్ణ, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణతో కలిసి అనకాపల్లి ఇన్చార్జి డీఎస్పీ ఈ.శ్రీనివాసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతగిరి మండలం కొరపర్తి గ్రామానికి చెందిన దూసరి లక్ష్మి దేవరాపల్లిలోని ఓ ప్రైవేటు క్లినిక్లో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. దేవరాపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కొల్లి లోకేష్ (24)కు ఐదేళ్ల క్రితం లక్ష్మితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. అయితే ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, నిందితుడు లోకేష్ మీది తక్కువ కులం అని, పెళ్లి చేసుకోవడం కుదరదని నిరాకరించాడు. ప్రియుడు నమ్మించి మోసగించడాన్ని తట్టుకోలేని లక్ష్మి తీవ్ర మనస్తాపంతో గత నెల 30న తాను నివాసం ఉంటున్న ఇంటిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి దూసరి పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే గిరిజన యువతిని వంచించి ఆత్మహత్యకు కారకుడైన లోకేష్ను రైవాడ జలాశయం సమీపంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు లోకేష్పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ, ఆత్మహత్యకు ప్రేరేపించడం, పెళ్లి చేసుకుంటానని మోసగించడానికి సబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఇన్చార్జి డీఎస్పీ చెప్పారు . నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్టు ఆయన తెలిపారు. -
వీసీసీఐ ఆధ్వర్యంలో స్పీకర్ మీట్
ఏయూక్యాంపస్: విశాఖపట్నం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(వీసీసీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం బీచ్ రోడ్డులోని ఒక హోటల్లో స్పీకర్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. గూగుల్ ఇండియా కస్టమర్ ఎంగేజ్మెంట్ విభాగాధిపతి మైత్రేయి గణపతి కీలకోపన్యాసం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కస్టమర్ ఎంగేజ్మెంట్ను బలోపేతం చేయడం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఏఐ టెక్నాలజీ పాత్రను వివరించారు. అభివృద్ధి చెందుతున్న డిజిట్ ప్రపంచంలో ఎంసెస్ఎంఈలు, పరిశ్రమల వాటాదారులకు ఎంతో ఉపయుక్తంగా ఈ ప్రసంగం నిలచింది. వీసీసీఐ అధ్యక్షుడు ఎం.సుదర్శన్ స్వామి ప్రారంభోపన్యాసం అందించారు. మ్యాపిల్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శివ్కుమార్ మాట్లాడుతూ సాంకేతికత స్వీకరించడం, ఆవిష్కరణలు, భవిష్యత్కు సిద్ధమైన వ్యాపార వ్యూహాలను వివరించారు. డబ్ల్యూఎన్ఎస్ ఉపాధ్యక్షుడు ఆర్.ఎల్.నారాయణ మోడరేటర్గా నిర్వహించిన రెండో సెషన్లో కృష్ణ మోహన్, నీరజ్ సార్ధా, కీర్తన ఆనంద్, రాజేష్ పూసర్ల, పవన్ తదితరులు వ్యాపార విస్తరణ వ్యవస్థలకు సంబంధించిన విభిన్న అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ చర్చలో పాల్గొన్నారు. వీసీసీఐ కార్యదర్శి పి.రాజేష్ వందన సమర్పణ చేశారు. -
సంక్షోభంలోనూ సడలని ఉక్కు సంకల్పం
● పడిలేచిన కెరటంలా.. విశాఖ సిటీ : సవాళ్లు ఎదురైనప్పుడే అసలైన సత్తా బయటపడుతుంది. విశాఖ స్టీల్ప్లాంట్ విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. ఒకవైపు ప్రైవేటీకరణ నీడలు, మరోవైపు నిధుల కొరత, ఇంకోవైపు ఉద్యోగులపై వీఆర్ఎస్ ఒత్తిళ్లు.. ఇన్ని ప్రతికూలతల మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్ ’పడిలేచిన కెరటం’లా విస్మయకర రీతిలో పుంజుకుంది. నష్టాల సాకుతో పరిశ్రమను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్న వేళ, తన సామర్థ్యాన్ని గణాంకాలతో సహా నిరూపించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి నుంచి విక్రయాల వరకు ఉహకందని వృద్ధిని నమోదు చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఆదాయం, ఉత్పత్తి గణాంకాలు సరికొత్త మైలురాళ్లను అధిగమించాయి. కష్టాలు చుట్టుముట్టినా.. గత కొన్నేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నిధుల కొరత వల్ల ముడిసరుకు సేకరణ భారంగా మారింది. దీనికి తోడు ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఉద్యోగుల్లో మానసిక ఆందోళన కలిగించింది. నష్టాల పేరుతో ప్లాంట్ సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరిగినా, అక్కడి కార్మికులు మాత్రం తమ సంకల్పాన్ని వదలలేదు. తక్కువ వనరులతోనే ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తూ సత్తా చాటుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుని అమ్మకాల్లో దూసుకుపోయారు. ఉత్పత్తిలో అజేయమైన వృద్ధి విశాఖ స్టీల్ ప్లాంట్ మునుపెన్నడూ లేని విధంగా ఉత్పత్తిలో గణనీయమైన వృద్దిని నమోదు చేసింది. ఒకవైపు వనరుల లేమితో సతమవుతున్నప్పటికీ.. 52 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది హాట్ మెటల్ ఉత్పత్తి 3.91 మిలియన్ టన్నుల నుంచి 5.95 మిలియన్ టన్నులకు పెరిగింది. అలాగే లిక్విడ్ స్టీల్ ఉత్పత్తిలో కూడా భారీ పురోగతి కనిపిస్తోంది. గత ఏడాది 3.75 మిలియన్ టన్నుల ఉత్పత్తి కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అది 5.69 మిలియన్ టన్నులకు చేరుకుంది. క్రూడ్ స్టీల్ ఉత్పత్తి కూడా 51 శాతం వృద్ధిని నమోదు చేయడం ప్లాంట్ పనితీరుకు నిదర్శనం. ఆదాయ ప్రవాహం.. పెరిగిన అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ టర్నోవర్ రూ.22,311 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది రూ.18,288 కోట్లుగా ఉంది. అంటే కేవలం ఏడాది కాలంలోనే ఆదాయం 22 శాతం మేర పెరగడం విశేషం. కేవలం ఆదాయం మాత్రమే కాకుండా, అమ్మకాల పరిమాణంలో కూడా 27 శాతం వృద్ధి కనిపించింది. గత ఏడాది 3.49 మిలియన్ టన్నుల అమ్మకాలు జరగ్గా.. ఈసారి అది 4.42 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇది సంస్థ మార్కెట్ విస్తరణను స్పష్టం చేస్తోంది. ప్రైవేటీకరణ వాదనకు ఇదే సమాధానం విశాఖ స్టీల్ తన ఉత్పత్తుల నాణ్యతను పెంచడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దేశీయంగా మౌలిక సదుపాయాల కల్పన పెరగడం వల్ల ఉక్కుకు డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని విశాఖ స్టీల్ అందిపుచ్చుకుని సరఫరాను వేగవంతం చేసింది. దీనివల్ల సంస్థ లాభదాయకత కూడా మెరుగుపడింది. ఈ రికార్డు వెనుక ప్లాంట్ వ్యూహాత్మక నిర్వహణ కీలక పాత్ర పోషించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలను సాధించాలని ఆర్ఐఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత రికార్డులు స్టీల్ప్లాంట్ ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పాయి. నష్టాల పేరుతో ప్రైవేటీకరణ నిర్ణయం తప్పని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ప్లాంట్కు సొంత గనులు కేటాయిస్తే.. ఇది దేశంలోనే అత్యంత లాభదాయకమైన సంస్థగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ నమోదు చేసిన వృద్ధి వివరాలు విభాగం గత ఏడాది ప్రస్తుత ఏడాది వృద్ధి శాతం వార్షిక టర్నోవర్ రూ.18,288 కోట్లు రూ.22,311 కోట్లు 22 శాతం హాట్మెటల్ ఉత్పత్తి 3.91 మి.ట 5.95 మి.ట 52 శాతం లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి 3.75 మి.ట 5.69 మి.ట 51.7 శాతం అమ్మకాల పరిమాణం 3.49 మి.ట 4.42 మి.ట 27 శాతం విశాఖ ఉక్కు రికార్డుల మోత ఉత్పత్తిలో 52 శాతం వృద్ధి అమ్మకాల్లో 27 శాతం పెరుగుదల వార్షిక టర్నోవర్ రూ.22,311 కోట్లు వార్షిక వృద్ధి 22 శాతం -
కాపర్ వైరు దొంగ అరెస్టు
అచ్యుతాపురం రూరల్: సెజ్ పరిసర ప్రాంతాల్లో కాపర్ వైరు చోరీ చేసిన ఓ వ్యక్తిని అచ్యుతాపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి, మార్చి నెలల్లో సెజ్ పరిధిలో ఉన్న మెగా ఇంజినీరింగ్ కంపెనీలో రూ.1.50 లక్షల విలువైన వైరును గాజువాకలోని కణితి రోడ్డుకు చెందిన గడ్డిపాటి తిలక్ కుమార్ చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వైరును విక్రయించగా వచ్చిన నగదుతో ఓ కారు కొనుగోలు చేసినట్టు వారు చెప్పారు. ఆ కారులో దర్జాగా వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్టు వారు తెలిపారు. ఇతనిపై ఇప్పటికే గాజువాక, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం పరిధిలో పలు పోలీసు స్టేషన్లలో చోరీ కేసులు నమోదైనట్టు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. -
మౌనిక హత్య కేసుపై జ్యూడిషియల్ విచారణ జరపాలి
కంచరపాలెం: గాజువాకలో గత నెల 29న దారుణ హత్యకు గురైన దళిత మహిళ పోలిపల్లి మౌనిక ఘటనపై ఉన్నత స్థాయి జ్యూడిషియల్ విచారణ జరపాలని పలు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీ–1లో మహిళా, దళిత సంఘాలు, స్థానిక కాలనీ యూత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ.. మౌనికను అత్యంత కర్కశంగా హతమార్చిన నేవీ ఉద్యోగి రవీంద్ర పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని మండిపడ్డారు. నిందితుడికి నేర చరిత్ర లేదని, మృతదేహాన్ని ఏం చేయాలో పాలుపోక లొంగిపోయాడని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకవైపు నిందితుడు కిటికీలోంచి వెళ్లి తలుపు తీశాడని చెబుతూనే, మరోవైపు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇవ్వడం వెనుక అసలు నిజాన్ని దాచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మృతురాలు దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడమే ఈ నిర్లక్ష్యానికి కారణమని నేతలు ధ్వజమెత్తారు. పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, వాస్తవాలు వెలుగులోకి రావాలంటే తక్షణమే జ్యూడిషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు అనురాధ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రతినిధి బేగం, సీఎమ్మెస్ నేత లలిత, చింతాడ సూర్యం, న్యాయవాదులు గిరిధర్, పద్మ, దళిత సంఘాల నాయకులు కొత్తపల్లి వెంకటరమణ, పీవోడబ్ల్యూ ప్రతినిధులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మహిళ, దళిత ప్రజాసంఘాల నేతల డిమాండ్ -
చంద్రబాబు పాలనలోరైతుల పరిస్థితి దుర్భరం
●రైతు సంఘాల నాయకులు వెంకన్న , దొరసమావేశంలో మాట్లాడుతున్న వెంకన్న, దొర దేవరాపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాతల పరిస్థితి దుర్భరంగా మారిందని, వారు పండించిన పంటలకు కనీస మార్కెట్ సౌకర్యం కల్పించడం లేదని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో వ్యవసాయ సంఘం ముఖ్య నాయకులతో శుక్రవారం నిర్వహించిన సమాశంలో వారు మాట్లాడారు. ఈ ఏడాది గిరిజన రైతులు పండించిన జీడి పంటకు మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. జీడి పంటకు పూత దశలో టీదోమ తెగులు సోకి పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. జీడి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మూతపడటంతో చెరకు పండించిన రైతులు ఆ భూముల్లో ఇతర పంటలు సాగు చేసేవారని, మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో ఇప్పుడు ఖాళీగా విడిచి పెట్టేస్తున్నారని చెప్పారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వారి సమస్యలను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలు, వ్యవసాయ కార్మికులు, గిరిజనుల సమస్యలపై ఈ నెల 19న దేవరాపల్లిలో జిల్లా సదస్సు నిర్వహించనున్నట్టు వెంకన్న, దొర తెలిపారు. ఈ సదస్సుకు జిల్లా వ్యాప్తంగా కూలీలు, గిరిజన రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె. ఈశ్వరరావు, సీహెచ్. చినదేముడు, డి. శంకర్, ఎం.ఎర్రునాయుడు, జె.ఈశ్వరరావు, పోతురాజు, దేముడు తదితర్లు పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
యలమంచిలి రూరల్: అనకాపల్లి జిల్లా లో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. యలమంచిలి మండలం పోతురెడ్డిపాలెం కూడలి వద్ద జాతీయ రహదారిపై బైక్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నాని (24), ఏటికొప్పాకకు చెందిన ఇల్లపు గోవిందు (25), పోతిరెడ్డిపాలేనికి చెందిన బంగారు దుర్గాప్రసాద్ (16) మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. పురుషోత్తపురంలో గురువారం రాత్రి గొల్లమారెమ్మ తల్లి పండగ జరిగింది. స్నేహితులైన ఇల్లపు గోవింద్, బంగారు నాని, బంగారు దుర్గాప్రసాద్ పండగకు వెళ్లారు. అనంతరం దుర్గాప్రసాద్ను పోతురెడ్డిపాలెంలో డ్రాప్ చేసి రావడానికి ముగ్గురూ కలిసి ఒకే బైకుపై పురుషోత్తపురం నుంచి బయలుదేరారు. పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద సర్వీసు రోడ్డులోకి వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా వీరు ప్రయాణిస్తున్న బైక్ను విజయవాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. రోడ్డు దాటే క్రమంలో లారీని గమనించిన యువకులు బస్సును గమనించలేదు. కేవలం రెండు సెకన్లలో రోడ్డు దాటతారనగా.. బస్సు బైకు వెనుక భాగాన్ని ఢీకొంది. బంగారు నాని ఇటీవల ఉగాది పండగకు కొత్త ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. అమ్మవారి పండగలో ఆనందంగా గడిపి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురి కావడం, ముగ్గురు యువకులూ ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రమాద విషయం తెలిసిన గ్రామస్తులు ప్రమాద స్థలంలో బస్సు అద్దాలను కర్రలు, రాళ్లతో ధ్వంసం చేశారు. దీంతో బస్సులో ప్రయాణికులు భయాందోళనతో సమీపంలో పొలాల్లోకి పరుగులు తీశారు. యలమంచిలి సీఐ ధనుంజయరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు యువకుల మృతితో పురుషోత్తపురం, పోతురెడ్డిపాలెం గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. -
దళితుడిపై అయ్యన్న దాడి
సాక్షి, అనకాపల్లి/మునగపాక: డప్పు కొడుతున్న దళితుడిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నాలుగు రోజుల క్రితం జరిగిన మరిడిమాంబ అమ్మవారి జాతరలో 60 ఏళ్లు పైబడి ఉన్న దళిత డప్పు కళాకారుడుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నర్సీపట్నానికి చెందిన దళిత డప్పు కళాకారుడు నాగులపల్లి రామదాసు తోటి కళాకారులతో కలిసి పండగలో డప్పు కొడుతుండగా..ఒక్కసారిగా అయ్యన్న ఆగ్రహంతో ఊగిపోయారు. వృద్ధుడు అని కూడా చూడకుండా రామదాసుపై చేయి చేసుకున్నారు. చెంప చెళ్లుమనిపించడమే కాకుండా పరుష పదజాలంతో తీవ్రంగా దూషించారు. ఆ సమయంలో సీఐ గఫూర్తో పాటు ఎస్ఐలు అక్కడే ఉన్నా ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం. ఇదిలా ఉండగా తన కాలు తొక్కినందుకే అయ్యన్న కొట్టాడని బాధితుడితో బలవంతంగా చెప్పించడం కొసమెరుపు.స్పీకర్ అయ్యన్నను అరెస్టు చేయాలి: కేవీపీఎస్ డిమాండ్సాక్షి, అమరావతి: దళిత డప్పు కళాకారుడిపై దాడి చేసిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) అధ్యక్షుడు ఓ.నల్లప్ప, ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి శుక్రవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మరిడితల్లి పండగలో డప్పు కొడుతుండగా దళితుడైన నాగులాపల్లి రామదాసును పోలీసుల సమక్షంలోనే అయ్యన్నపాత్రుడు చెంపదెబ్బ కొట్టడం దారుణమన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ స్థాయి వ్యక్తి విచక్షణ కోల్పోతే ఎలా? అని ప్రశ్నించారు. ఈ చర్యకు పాల్పడిన స్పీకర్పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. విధి నిర్వహణలో ఉండి కూడా నివారించని పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నల్లప్ప, మాల్యాద్రి డిమాండ్ చేశారు. అయ్యన్న క్షమాపణ చెప్పాలి నర్సీపట్నంలో జరిగిన మరిడిమాంబ జాతరలో దళిత వృద్ధ డప్పు కళాకారుడిని అయ్యన్న చెంప దెబ్బ కొట్టారు. తక్షణమే ఆ దళిత డప్పు కళాకారుడికి అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పాలి. కూటమి పార్టీల నాయకులకు దళితులంటే చిన్నచూపు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలి. – డాక్టర్ బూసి వెంకటరావు, విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ దాడి అమానుషండప్పు కళాకారుడిపై అయ్యన్నపాత్రుడు దాడి చేయడం అమానుషం. సమాజంలో దళితులను గౌరవించాల్సింది పోయి అగౌరవపరచడం అయ్యన్నకు తగదు. కళాకారులను ప్రోత్సహించాల్సింది పోయి దాడి చేయడం సరైన సంప్రదాయం కాదు. తక్షణమే అయ్యన్నపాత్రుడు దళితులకు క్షమాపణ చెప్పాలి.– యల్లబిల్లి కొండబాబు, డప్పు కళాకారుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడుఅయ్యన్న దిష్టిబొమ్మ దహనంకోవెలకుంట్ల: దళితుడిపై అయ్యన్నపాత్రుడు దాడి చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం రాత్రి నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో దళిత సంఘాల నేతలు నిరసన తెలిపారు. అయ్యన్నపాత్రుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దండు మధుబాబు, గ్రేటర్ రాయలసీమ మాలమహానాడు అధ్యక్షుడు కోగిల ప్రసాద్ మాట్లాడుతూ..దళితులపై అహంకారపూరిత వైఖరి ప్రదర్శిస్తూ దాడి చేయడం హేయమన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోట దళితులపై దాడులు, దౌర్యన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దళితుడిపై దాడి చేసిన అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయ్యన్నపాత్రుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. -
రాయితీపై కొరమీను చేపల పెంపకం
కొరమీను చేప పిల్లలు విడుదలకు భూమి పూజ చేస్తున్న ప్రజాప్రతినిధులు అధికారులు నాతవరం : చేపల పెంపకానికి ప్రభుత్వం రాయితీపై యూనిట్లు మంజూరు చేస్తుందని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం మూడు కొరమీను చేప పిల్లలు పెంపకం యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వెలుగు పథకంలో కొరమీను చేపల పెంపకం కోసం రాయితీపై మూడు యూనిట్లు మంజూరు చేశామన్నారు. యూనిట్కు రూ.4 లక్షల 41వేలు కాగా అందులో రూ.లక్షా 35వేలు సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ యూనిట్ ఏర్పాటు చేసుకునే లబ్ధిదారుకు వ్యవసాయ భూమి, విద్యుత్, బోరు సదుపాయం ఉండాలన్నారు. యూనిట్ ఏర్పాటు చేసేందుకు బ్యాంకు ద్వారా రుణం ఇస్తామన్నారు. కొరమీను ఏడాదికి మూడు విడతలుగా పంట వస్తుందన్నారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం కనకరాజు, జిల్లా మహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలు కోరుబిల్లి మణి, నాతవరం, గన్నవరం పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జిలు అపిరెడ్డి మాణిక్యం, సింగంపల్లి సన్యాసిదేముడు తదితరులు పాల్గొన్నారు. -
సోలార్ ప్లాంట్ పేరుతో భూసేకరణ ఆపాలి
తుమ్మపాల: సోలార్ పవర్ ప్లాంట్ పేరుతో భూసేకరణ ఆపాలంటూ చీడికాడ మండలం జి.కొత్తపల్లి, అడవుల అగ్రహారం, బైలపూడి, చిన్నగోగాడ గ్రామాల ప్రజలు కలెక్టరేట్ గేటు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి ఆర్ దేముడు నాయుడు మాట్లాడుతూ జి. కొత్తపల్లిలో సర్వే నంబరు 166,167లో 40 ఎకరాలు, అడవుల అగ్రహారంలో సర్వే నంబరు 63లో 55 ఎకరాలు, బైలపూడిలో సర్వే నంబరు 122లో 60 ఎకరాలు, చిన్న గోగాడలో సర్వే నంబరు2లో 70 ఎకరాలు మొత్తం 225 ఎకరాలకు సాగు నిమిత్తం 65 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం డీ పట్టా ఇచ్చిందన్నారు. 320 మంది పేద రైతు కుటుంబాలు తాతలు, తండ్రుల నాటి నుంచి సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ ఈపీడీసీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 57.97 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ని నిర్మించనున్నట్లు ప్రకటించిందన్నారు. జీడి, మామిడి, పామాయిల్, నువ్వులు, వేరుశనగ వంటి పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద రైతులు నుంచి భూములు తీసుకుంటే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతుల భూములు లాక్కోవద్దని, సోలార్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఏ అగ్రహారం సర్పంచ్ సలారి గంగశేషు, మాజీ ఎంపీపీ కొల్లి అప్పలనాయుడు, గంటా మాచిరాజు, కన్నబాబు నాగరాజు, చలుగు శ్రీనువాస్, రైతులు పాల్గొన్నారు. -
అధినేతతో ఆత్మీయ కలయిక
నర్సీపట్నం : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మర్యాద పూర్వకంగా కలిసారు. నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు గణేష్ తెలిపారు. తుమ్మపాల: జడ్పీ వైస్ చైర్పర్సన్ భీశెట్టి సత్యవతి, ఆమె కుమారుడు వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకుడు భీశెట్టి జగన్ తాడేపల్లిలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు. దుశ్శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై ఆయనతో చర్చించినట్లు తెలిపారు. జిల్లాలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. -
భూసేకరణ జరపకుండా సాగునీటి కాల్వల తవ్వకాలు
మునగపాక : రైతుల నుంచి ఎటువంటి భూమి సేకరించకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువలను ఎలా తవ్వేస్తారంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ధ్వజమెత్తారు. రైతులకు ప్రత్యామ్నాయం చూపించి సాగునీటి కాలువ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతవరకు పనులు జరగకుండా చూడాలని తహసీల్దార్ సత్యనారాయణను కోరారు. వివరాలివి. పూడిమడక రోడ్డు విస్తరణలో భాగంగా మునగపాక మండలం గంగాదేవిపేట నుంచి మున గపాక జంక్షన్ వరకు వచ్చే మార్గంలో ఇరువైపులా సాగునీటి కాలువలు ఉండేవి. రహదారి విస్తరణలో ప్రస్తుతం ఉన్న కాలువల ద్వారా వేలాది ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందుతూ వచ్చేది. అయితే విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువలో రిటైనింగ్ వాల్ నిర్మించే క్రమంలో పొక్లెయిన్ ద్వారా పనులు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న స్థానిక రైతులు సమస్యను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన గురువారం సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించారు. రైతులకు జరుగుతున్న అన్యాయం గుర్తించి సమస్యను తహసీల్దార్ సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువలను తవ్వేసే కార్యక్రమం ఎలా చేపడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి విస్తరణకు తాము సమ్మతమేనని అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంటలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఆలోచన లేకుండా రైతులకు నష్టం వాటిల్లేలా పనులు చేపట్టడం సరికాదన్నారు. దీంతో స్పందించిన తహసీల్దార్ సత్యనారాయణ సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామి సత్యనారాయణ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, రైతు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఆడారి మహేష్, దాడి శివ, సీపీఎం నేత ఎస్.బ్రహ్మాజీ, రైతులు పాల్గొన్నారు. -
నాణ్యత డొల్ల
పాయకరావుపేట: పట్టణంలో రూ.5.20 కోట్లతో విస్తరిస్తున్న మెయిన్ రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపిస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా, ఉప సర్పంచ్ జగతా భవానీశ్రీనివాస్, పట్టణ శాఖ అధ్యక్షుడు ధనిశెట్టి మహేష్ విమర్శించారు. పట్టణంలో దగ్గుపల్లి సాయిబాబా కార్యాలయంలో గురువారం వారు మాట్లాడుతూ వీఎంఆర్డీఏ నిధులతో చేపట్టిన విస్తరణ పనుల్లో అధికారుల పర్యవేక్షణ లేదన్నారు. కరెంటు లేకుండానే రాత్రిపూట పనులు చేపడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మిగిలిన మూడేళ్ల పాటు మనుగడ ఉండేలా రోడ్డు నిర్మిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆ తర్వాత ఎలా పోయినా పర్వాలేదన్నట్లు కాంట్రాక్టర్లు, కూటమి నాయకుల వ్యవహారశైలి ఉందన్నారు. పూర్తిగా కూటమి నాయకుల కనుసన్నల్లోనే పనులు జరగడం వల్ల నాణ్యత లోపించిందన్నారు. ఎస్టిమేషన్లో పేర్కొన్న విధంగా మెటీరియల్ను సముపాళ్లలో వినియోగించడం లేదన్నారు. 20 ఎంఎం, 40 ఎంఎం, క్రషర్ చిప్స్ బూడిద వేయాల్సి ఉండగా, బూడిద మాత్రమే వేస్తున్నారన్నారు. సరిగ్గా రోలింగ్ చేయడం లేదన్నారు. రోడ్డు విస్తరణ చేసేందుకు హోం మంత్రి నిర్ణయించినప్పుడు పాయకరావుపేట పట్టణాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని స్వాగతించామన్నారు. రోడ్డుపై చిరువ్యాపారులకు న్యాయం చేయలేదన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇంతవరకు చూపలేదన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి ఆపేశారన్నారు. కోర్డు వివాదం కారణంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విస్తరణను పక్కన పెట్టి కొత్త రోడ్డు నిర్మించామన్నారు. అదే సమయంలో రోడ్డుకు ఇరువైపులా వేసిన బెర్మ్లను ఇప్పుడు తొలగిస్తున్నారన్నారు. తవ్వకాల్లో వచ్చిన గ్రావెల్ను అనధికార లేఅవుట్లకు తరలిస్తున్నారన్నారు. హోం మంత్రి ఈ రెండు విషయాలపై దృష్టి సారించాలన్నారు. నాసిరకం పనులపై విచారణ జరిపించాలని, బెర్మ్ తవ్వకాల్లో వచ్చిన గ్రావెల్ను తరలిస్తున్న అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాసిరకం పనులపై క్వాలిటీ కంట్రోలు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో వార్డు సభ్యులు కొప్పిశెట్టి మోహన్, పిరాది రాజు, తుమ్మలపల్లి సతీష్, బీసీ సెల్ అధ్యక్షుడు కేశనకుర్తి సత్తిబాబు, కోనేటి పద్మారావు, పోసిన వీరబాబు, కె. రంగ తదితరులు పాల్గొన్నారు. -
8న ‘అనకాపల్లి’ సినిమా రిలీజ్
అనకాపల్లి: అనకాపల్లి సినిమాను ఈనెల 8న దేశవ్యాప్తంగా విడుదల చేయడం జరుగుతుందని సినీదర్శకుడు నక్కిన త్రినాథ్ అన్నారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘అనకాపల్లి’ సినిమాను అనకాపల్లి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం జరిగిందన్నారు. అనకాపల్లిపై ఉన్న అభిమానంతో సినిమాను తీయడం జరిగిందని, ఇక్కడ ప్రజలు ఎక్కువగా సినిమాన్ని ఆదరించడమే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని పదర్శించి, అనకాపల్లి పేరును చాటడం జరుగుతుందన్నారు. విక్రమ్ సహదేవ్ హీరోగా సంధ్య వశిష్ట హీరోయిన్గా తారక్ కొండప్ప విలన్గా నటించడం జరిగిందన్నారు. అంతకుముందు సంధ్య వశిష్ట, తారక్ కొండప్పలు సినిమా షూటింగ్లో వారి అనుభవాలను వివరించారు. కార్యక్రమంలో భవ్యశ్రీ డెవలపర్ అధినేత, గవరపాలెం కనకదుర్గమ్మవారి ఆలయ శాశ్వత చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్, ఆలయ వ్యవస్థాపకుడు పి.వి.రమణ, సహనిర్మాత కుమార్రాజా, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల మురళీకృష్ణ పాల్గొన్నారు. -
బడ్జెట్ నిధులు సక్రమంగా వినియోగించండి
తుమ్మపాల : రాష్ట్ర బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రతినిధులు, అధికారులు కార్యక్రమాలను రూపొందించుకోవాలని, కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఏపీ ఫైనాన్స్ శాఖ సెక్రటరీ డి.రోనాల్డ్ రోస్, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, ఎమ్మెల్యేలతో కలిసి 2026–27 బడ్జెట్ – ఔట్ రీచ్ అవగాహన సదస్సు నిర్వహించారు. అభివృద్ధి ప్రాజెక్టులు, సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, చేసిన బడ్జెట్ కేటాయింపులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు, అధికారులకు సూచించారు. హోంశాఖ మంత్రి అనిత మాట్లాడుతూ ప్రతి అధికారి జిల్లా అభివృద్ధిపై జవాబుదారీగా ఉండాలని, వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం వల్ల నిధులు వృథా కాకూడదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, సుందరపు విజయ్ కుమార్, బండారు సత్యనారాయణమూర్తి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు పాల్గొన్నారు. తలసరి ఆదాయంలో జిల్లాకు 13 స్థానం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 99శాతం జీతాలు, వడ్డీలు, పెన్షన్లకే సరిపోతోందని జిల్ల ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆస్తులు, అప్పుల కేటాయింపులో ఆదాయం తెలంగాణకు, అప్పులు ఏపీకి కేటాయింపు జరిగిందని, అయినప్పటికీ అన్ని సమస్యలు ఎదురొడ్డి ముందుకు నడుస్తున్నామన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.87 లక్షల కోట్లు ఉంటే, ఏపీ తలసరి ఆదాయం రూ.2.60 లక్షల కోట్లు మాత్రమే అన్నారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా తలసరి ఆదాయంలో అనకాపల్లి జిల్లా 13వ స్థానంలో ఉందన్నారు. -
ఐఐఎం విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు
గంభీరంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రాంగణంతగరపువలస: ఆనందపురం మండలం గంభీరం గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–విశాఖపట్నం(ఐఐఎంవీ)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. యునైటెడ్ కింగ్డమ్ కేంద్రంగా పనిచేసే బిజినెస్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నుంచి ఐదేళ్ల కాలానికి గాను ఐఐఎంవీ అక్రిడిటేషన్ను దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార విద్యలో నాణ్యత, సామాజిక ప్రభావాన్ని గుర్తించే ఈ అక్రిడిటేషన్ను పొందిన దేశంలోని అతికొద్ది సంస్థల్లో ఐఐఎంవీ ఒకటిగా నిలవడం విశేషం. ఈ సందర్భంగా ఐఐఎంవీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ గుర్తింపు అంతర్జాతీయ ప్రమాణాల పట్ల తమకున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, బాధ్యతాయుతమైన నిర్వహణ, నిరంతర అభివృద్ధి అనేవి తమ సంస్థ మూల విలువలని, ఈ అక్రిడిటేషన్ వాటిని మరింత ప్రతిబింబిస్తోందన్నారు. ఈ గుర్తింపుతో గ్లోబల్ స్థాయిలో ఐఐఎంవీ ప్రతిష్ట మరింత పెరుగుతుందని, తద్వారా విదేశీ భాగస్వామ్యాలు, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, అంతర్జాతీయ పరిశోధనలకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
యువకుడిని రక్షించిన మైరెన్ పోలీసులు
నీటమునిగిన శ్రీనివాస్తో మైరెన్ పోలీసులు ఎస్.రాయవరం : రేవుపోలవరం తీరంలో సముద్రంలో మునిగిపోతున్న యువకుడిని గస్తీ నిర్వహిస్తున్న పెంటకోట మైరెన్ పోలీసులు కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ సంఘటన మేరకు మైరెన్ ఏఎస్ఐ ఎం.కృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాకవరపాలెం మండలం జి.కోడూరు గ్రామానికి చెందిన చవ్వాకుల శ్రీనివాస్ గురువారం 10వ తరగతి చివరి రోజు పరీక్ష రాసి స్నేహితులతో కలిసి సుమారు 10 మంది రేవు పోలవరం తీరానికి వచ్చారు. వీరిలో నలుగురు స్నేహితులు స్నానం కోసం సముద్రంలోనికి దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పెద్ద అలరావడంతో శ్రీనివాస్ మునిగిపోయాడు. అది గమనించిన మైరెన్ పోలీసులు హెచ్ఎస్ పి.అప్పలరాజు, శ్రీను, కానిస్టేబుల్ చినబాబు కలసి సముద్రంలోనికి దిగి శ్రీనివాస్ను ఒడ్డుకు చేర్చారు. స్వల్ప అస్వస్థతతో తీరంలో నుంచి బయటపడిన శ్రీనివాస్ను చూసి స్నేహితులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీనివాస్ ఆరోగ్యం నిలకడగా ఉండడంతో స్వగ్రామానికి పంపారు. -
కుంచవానిపాలెంలో వ్యక్తి అనుమానాస్పద మృతి
మునగపాక : మండలంలోని కుంచవానిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్టు ఎస్ఐ పి.ప్రసాదరావు తెలిపారు.ఇందుకు సంబందించిన వివరాలను ఆయన గురువారం విలేకరులకు తెలిపారు. కుంచవానిపాలెం గ్రామానికి చెందిన పుచ్చ పారిపల్లి (38) ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగానే బుధవారం పనులు ముగించుకొని ఇంటికి చేరుకొని రాత్రి నిద్రపోయాడు. తెల్లవారు లేచి చూసేసరికి పారిపల్లి మృతి చెంది ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా గుర్తించి కేసు నమోదు చేశారు. పారిపల్లి మృతదేహాన్ని అనకాపల్లి వందపడకల ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. -
ప్పం ట్టాల్సిందే..!
తట్టెడు మట్టికీ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : తట్టెడు మట్టికీ తలవంచాల్సిందే.. పిక్కెడు రాయికీ పిండుకోవాల్సిందే.. ఉమ్మడి విశాఖ జిల్లాలో ’రాయల్టీ’ పేరిట ఏఎంఆర్ సంస్థ సాగిస్తున్న అక్రమ వసూళ్లు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. సొంత పొలంలో మట్టి తీసినా, సొంత ఇంటికి రాయి తెచ్చినా.. ఎక్కడ చిన్న ఇసుక కుప్ప కనిపించినా.. ప్రైవేటు సంస్థ ప్రతినిధులు స్కానర్లు పట్టుకుని వాలిపోతున్నారు. లోడును బట్టి వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. మైనింగ్ శాఖ అండతో గ్రామగ్రామాన చెక్పోస్టులు పెట్టి సాగిస్తున్న ఈ ’దోపిడీ’ పర్వంపై జనాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. చెక్పోస్టులు.. ఫ్లైయింగ్ స్క్వాడ్ల దందా వాస్తవానికి గతంలో రాయల్టీ వసూలు బాధ్యతను మైనింగ్ శాఖే నిర్వహించేది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బాధ్యతను జిల్లాల వారీగా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. ఇందుకోసం మైనింగ్ శాఖ టెండర్లను ఆహ్వానించగా.. విశాఖ జిల్లాలో ఈ టెండర్ను ఏఎంఆర్ సంస్థ దక్కించుకుంది. టెండర్ పొందినప్పటి నుంచి సంస్థ ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వాహనాలతో ఫ్లైయింగ్ స్క్వాడ్ పేరుతో గ్రామాల్లో తిరుగుతోంది. ఎక్కడైనా చిన్న ట్రాక్టర్లో మట్టి కనిపించినా, ఎర్రపిక్క కనిపించినా రాయల్టీ చెల్లించాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తోంది. తమ సొంత పొలంలో నుంచి మట్టిని తీసుకెళుతున్నా ఎందుకు డబ్బులు ఇవ్వాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక వసూలు చేసే మొత్తాన్ని స్కానర్ ద్వారా సేకరిస్తున్నప్పటికీ, ఆ వివరాలను మైనింగ్ శాఖకు క్రమం తప్పకుండా సమర్పిస్తున్నారా లేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదనే విమర్శలు ఉన్నాయి. వసూలైన డబ్బులు కంపెనీ ఖాతాలోకే వెళుతున్నాయా, లేక సొంత ఖాతాలకు మళ్లుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, వసూలు చేస్తున్న రాయల్టీకి సరైన బిల్లులు ఇస్తున్నారా అనే అంశాన్ని కూడా మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద మైనింగ్ శాఖ మౌనంతో ఏఎంఆర్ సంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయల్టీ వసూలు పేరుతో రుబాబు..! రాయల్టీ వసూలు బాధ్యతను దక్కించుకున్న ఏఎంఆర్ సంస్థ ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేసుకుంది. చెక్పోస్టుల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. అక్కడ పనిచేసే సిబ్బంది క్వారీల నుంచి వచ్చే వాహనాల లోడ్ను గమనిస్తూ, అదనపు లోడు ఉంటే అదనపు రాయల్టీని ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ‘ఫ్లైయింగ్ స్క్వాడ్’ పేరుతో జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ, ఎక్కడైనా ఇంటి అవసరాల కోసం మట్టిని తరలిస్తున్నా రాయల్టీ చెల్లించాల్సిందేనంటూ వాలిపోతున్నారు. ఇంటి నిర్మాణం కోసం కొద్దిపాటి పిక్క తీసుకున్నా వందల్లో రాయల్టీ చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రైతులు తమ సొంత పొలంలో నుంచి మట్టిని తవ్వుకుని ఇంటి నిర్మాణం కోసం తరలిస్తున్నా అక్కడికక్కడే సిబ్బంది చేరుతున్నారు. రాయల్టీ కట్టాల్సిందేనంటూ చెబుతూ, ఎంత మొత్తం చెల్లించాలనే విషయాన్ని స్కానర్ ద్వారా చూపించి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ‘మాకు సంబంధం లేదు’ అంటూ తప్పుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయల్టీ పేరుతో ఏఎంఆర్ రుబాబు ఇంటి నిర్మాణం కోసం పిక్కకు రొక్కం లెక్క ఉమ్మడి జిల్లాలో ఇష్టారాజ్యంగా చెక్పోస్టుల ఏర్పాటు ఫ్లైయింగ్ స్క్వాడ్లతో గ్రామాల్లో వేట ట్రాక్టర్ కనిపిస్తే స్కానర్ ఓపెన్ రూ.వందల నుంచి రూ.వేల వరకూ వసూళ్లు సొంత పొలం మట్టికీ రాయల్టీ తప్పదా..? మైనింగ్ శాఖ మౌనంతో విమర్శలకు తావు -
తేగాడ కేజీబీవీలో కేంద్ర బృందం
తేగాడలోని కస్తూర్భాగాంధీ విద్యాలయంలో పరిశీలిస్తున్న కేంద్ర అధ్యయన బృందం కశింకోట : మండలంలోని తేగాడ వద్ద ఉన్న కస్తూర్భాగాంధీ విద్యాలయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రొనాల్డ్ రోజ్ బృందం గురువారం సందర్శించింది. ఈ సందర్భంగా వ్యర్థాలను అరికట్టడానికి ప్రయోగాత్మకంగా జిల్లాలోని వసతి గృహాలు, కస్తూర్భాగాంధీ విద్యా సంస్థలతోపాటు ఇక్కడ కూడా ఏర్పాటు చేసిన కంపోస్టు ఎరువు తయారీ, వర్షం నీరు, వాడుక నీరు నివారణ కోసం నిర్మించిన ఇంకుడు గొయ్యి, కూరగాయలు పండించేందుకు ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్లను బృందం పరిశీలించింది. వాటి నిర్వహణ తీరును అధ్యయనం చేసి సంతృప్తి వ్యక్తం చేసింది. విద్యార్థులతో ఈ కార్యక్రమం అమలుపై ఉన్న అవగాహన గురించి బృందం చర్చించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించింది. ఈ సందర్భంగా రోనాల్డ్ రోజ్ కస్తూర్భా విద్యా సంస్థ ఆవరణలో మొక్కలు నాటారు. బృందంలో ఏపీ ప్రిన్సిపల్ కార్యదర్శి రొనాల్డ్ రోజ్ , డీఈవో అప్పారావునాయుడు, ఎంఈవోలు సురేష్కుమార్, రమణశ్రీ, ఎంపీడీవో సిహెచ్.చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. -
కోర్టు స్టే ఇచ్చినా బేఖాతరు
నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువులో సృష్టి క్షేత్రం పేరుతో చేస్తున్న అక్రమ నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. కోర్టు అదేశాలను అమలు చేయాల్సిన అధికార యంత్రాగం కనీసం పట్టించుకోలేదు. స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడి ఆధ్వర్యంలో చేపట్టిన సృష్టి క్షేత్రం అక్రమ నిర్మాణాలను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హైకోర్టును ఆశ్రయించారు. పెద్ద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. ఈ పిల్పై ప్రతివాదులుగా ఉన్న జలవనరులు, కలెక్టర్తో పాటు స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చి 24 గంటలు గడుస్తున్నా ఇరిగేషన్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చెరువు మధ్యలో వేస్తున్న రోడ్డు నిర్మాణానికి వినియోగిస్తున్న మిషనరీ ఇంకా అక్కడే ఉంది. ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు వెనకాడుతున్న ఇరిగేషన్ అధికారుల వైఖరిని కోర్టు దృష్టికి తీసుకువెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే సిద్ధమవుతున్నట్టు తెలిసింది. -
గడ్డివాము దగ్ధం
నాతవరం : మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్సీపీ నేత గుడివాడ వెంకటరమణకు చెందిన గడ్డివాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిబూడిదైంది. నాతవరం గ్రామ సమీపంలో రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 336లో సుమారుగా మూడు ఎకరాలు 60 సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో వ్యవసాయం సాగు చేసుకుంటూ పశువులు పాకలు వేసుకుని పాడి పరిశ్రమ నడుపుతున్నారు. గేదెలు, ఆవులు కలిపి 15పైగా పశువులు ఉన్నాయి. పాడి పరిశ్రమ నడుపుతున్న వెంకటరమణ పశువులకు ఏడాది కాలం పాటు మేతకు అవసరమైన ఇటీవల ఆరు ట్రాక్టర్లు ఎండిగడ్డి కొనుగోలు చేసి తన పశువుల మకాం వద్ద నిల్వ చేసుకున్నాడు. ఎప్పటి మాదిరిగా బుధవారం సాయంత్రం వరకూ పశువుల సంరక్షణ చూసి ఇంటికి వచ్చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో గడ్డి వాము తగలబడడం చూసి స్థానికులు సమాచారం అందించారు. వెంకటరమణ వెంటనే పశువుల మకాం వద్దకు వెళ్లి చూసేసరికి పెద్ద మంటలతో గడ్డివాములు కాలిపోతుంది. నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసిందన్నారు. సమీపంలో ఉన్న పశువులు పాకలు, పశువులకు ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఇటీవల పాడి పశువుల మేత కోసం సుమారుగా లక్ష రూపాయలతో కొనుగోలు చేసి నిల్వ చేసుకున్న గడ్డివాము పూర్తిగా కాలిపోయిందని బాధితుడు వెంకటమణ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటరమణ నాతవరం గ్రామంలో వైఎస్సార్సీపీలో కీలకంగా పని చేస్తుంటాడు. వెంకటరమణ గడ్డివామును ఎవరో కావాలనే తగులబెట్టి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనపై బాధితుడు వెంకటరమణ గురువారం తహసీల్దార్ చందనరేఖకు ఫిర్యాదు చేశారు. -
అయ్యన్నపాత్రుడి సృష్టి క్షేత్రంపై స్టే
సాక్షి, అమరావతి/నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని పెద చెరువును ఆక్రమించి ‘సృష్టి క్షేత్రం’ పేరుతో చేస్తున్న నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. పెద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నిర్దేశించింది. అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడి ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెద చెరువు కట్ట బలోపేతం, సుందరీకరణ పనులు నిర్వహించవచ్చని హైకోర్టు తెలిపింది. అయితే సుందరీకరణ పనులు చేపట్టే ముందు అందుకు సంబంధించిన కార్యాచరణను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్లతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న అయ్యన్న పాత్రుడికి సైతం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. చెరువు ఆక్రమణ దారుణం: పొన్నవోలు వాదనలుస్పీకర్గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న పెద చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం దారుణమని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఉమా శంకర గణేష్ హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘పెద చెరువు కింద 345.25 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అయితే అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడి నేతృత్వంలోని ఈ చెరువు మధ్యలో నిర్మాణాలు చేపడుతున్నారు. చెరువును కొంత మేర పూడ్చి ఇక్కడ భారీ శివపార్వతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. శివ పార్వతుల విగ్రహాల ఏర్పాటునకు పిటిషనర్ వ్యతిరేకం కాదు. చెరువు సమీపంలో ఉన్న చారిత్రక దేవస్థానంలో విగ్రహాలను ఏర్పాటు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. పంటలకు ప్రాణాధారంగా ఉన్న చెరువును పూడ్చేసి విగ్రహాలను ఏర్పాటు చేయడంపైనే అభ్యంతరం. గతంలో ఇదే చెరువు సమీపంలో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేస్తుంటే అధికారులకు లేఖ రాసి మరీ అడ్డుకున్న అయ్యన్నపాత్రుడు, ఇప్పుడు తానే తన కుమారుడితో కలిసి చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేస్తుండటం దారుణం. ఈ నేపథ్యంలో అయ్యన్న నేతృత్వంలో జరుగుతున్న చెరువు ఆక్రమణను అడ్డుకోవాలి’ అని అభ్యర్థించారు. నీటి వనరులను పరిరక్షించాలని సుప్రీంకోర్టుతో సహా పలు హైకోర్టులు చాలా తీర్పులు వెలువరించాయని తెలియజేశారు. ప్రభుత్వ వాదనలు తప్పని ఆధారాలతో నిరూపణఅనంతరం ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ, చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. కేవలం చెరువు కట్టల బలోపేతం, పూడికతీత, సుందరీకరణ పనులను మాత్రమే చేపడుతున్నామన్నారు. ఎలాంటి స్టే ఇవ్వొద్దని కోరారు. ఈ సమయంలో సుధాకర్రెడ్డి స్పందిస్తూ, చెరువు మధ్యలో నిర్మిస్తున్న నిర్మాణాలకు సంబంధించి అయ్యన్నపాత్రుడు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్న భూమి పూజ ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం, పెద చెరువులో చేస్తున్న నిర్మాణాలపై స్టే విధించింది. రైతుల హర్షం: ఉమా శంకర గణేష్ స్పీకర్ తలపెట్టిన అక్రమ నిర్మాణాలపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో మమ్మల్ని çకలిశారు. దీంతో వారికి అండగా నిలిచాం. హైకోర్టు తాజా ఆదేశాలతో రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. -
పింఛన్లు పంపిణీ చేసిన హోం మంత్రి
నక్కపల్లి: మండలంలో అప్పలపాయకరావుపేట, నక్కపల్లి గ్రామాల్లో బుధవారం హోం మంత్రి వంగలపూడి అనిత సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ నేతన్నలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. దీనివల్ల కరెంటు బిల్లుల భారం నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. చేనేత కార్మికురాలితో కలిసి నక్కపల్లిలో మగ్గం నేశారు. వారి నుంచి చీర కొనుగోలు చేశారు. అనంతరం నక్కపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏపీఐఐసీ పునరావాస కాలనీలో నిర్వాసితుల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కొప్పిశెట్టి వెంకటేష్, పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జ్ కొప్పిశెట్టి బుజ్జి, ఎంపీడీవో చైతన్య, నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నాయకులపై కేసు కొట్టివేత
చోడవరం : వైఎస్సార్సీపీ నాయకులకు కోర్టులో ఊరట లభించింది. ఆ పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసును చోడవరం కోర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. 12 మంది వైఎస్సార్సీపీ నాయకులపై పెట్టిన కేసు నిరాధారమైనదంటూ నిర్దోషులుగా పేర్కొంటూ వారిపై పెట్టిన కేసును కోర్టు కొట్టేసింది. వివరాల్లోకి వెళితే... 2018లో వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్పోర్టులో ఒక యువకుడు కోడి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళన చెందిన చోడవరం వైఎస్సార్సీపీ నాయకులు తమ అధినేతపై జరిగిన హత్యాయత్నానికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ శాంతియుతంగా చోడవరం పట్టణంలో నిరసన తెలిపారు. ఈ నిరసనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి స్థానిక వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, చోడవరం జెడ్పీటీసీ మారిశెట్టి విజయశ్రీకాంత్, చోడవరం ఉపసర్పంచ్ పుల్లేటి వెంకట్రావు,బిసీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పల్లా నర్సింగరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంపలి ఆనంద్, జిల్లా ప్రతినిధి జ్యోతుల రమేష్, సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పందిరి శ్రీనివాసరావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఓరుగంటి నెహ్రూ, జిల్లా ప్రతినిధి వడ్డాది నర్సింహమూర్తి, మండల బీసీసెల్ అధ్యక్షుడు సూరిశెట్టి నాగదుర్గగోవింద, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శరగడం నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షురాలు అల్లాడ భవానీతో సహా 12 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి 9సంవత్సరాలు పాటు వాయిదాలకు కోర్టుకు తిరిగిన ఆ పార్టీ నాయకులకు కోర్టులో ఎట్టకేలకు ఊరట లభించింది. వైఎస్సార్సీపీ నాయకుల తరపున ఆ పార్టీ లీగల్ అడ్వయిజర్ కాండ్రేగుల డేవిడ్ కోర్టులో వాదనలు వినిపించారు. అప్పటి తహసీల్దార్, ఇద్దరు ఎస్ఐలు, పలువురు కానిస్టేబుళ్లు ఈ విచారణలో కోర్టుకు హాజరయ్యారు. చోడవరం జుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి స్వర్ణ ఈ కేసును విచారణ చేసి తుది తీర్పు చెప్పారు. నిందితులపై మోపబడిన ఆరోపణలు రుజువు కాకపోవడంతో వారిని నిర్దోషులుగా పరిగణిస్తూ న్యాయమూర్తి కేసును కొట్టివేశారని నిందితుల తరపు న్యాయవాది కాండ్రేగుల డేవిడ్ చెప్పారు. ఈ సందర్భంగా వారంతా డెవిడ్కు కృతజ్ఞతలు తెలిపారు. తమపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినప్పటికీ న్యాయమే గెలిచిందని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. -
వాల్తేరులో సరికొత్త మైలు రాళ్లు
సాక్షి, విశాఖపట్నం : భారతీయ రైల్వేలో వాల్తేరు విభాగం మునుపెన్నడూ లేని విధంగా చరిత్రాత్మక విజయాలను నమోదు చేస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతోందని డీఆర్ఎం లలిత్ బోహ్రా తెలిపారు. వాల్తేరు డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో వాల్తేరు ప్రగతి వివరాలను వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన ఈ విభాగం, దేశవ్యాప్తంగా అత్యధిక ఆదాయం గడించిన విభాగాల్లో ఐదో స్థానాన్ని కై వసం చేసుకుని తన ప్రత్యేకతను చాటుకుందని తెలిపారు. ప్రధానంగా సరుకు రవాణాలో 85.1 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా, మునుపటి ఏడాదితో పోలిస్తే 17.25 శాతం వృద్ధిని నమోదు చేసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించామన్నారు. వాల్తేరు డీఆర్ఎం ఇంకా ఏం చెప్పారంటే.. ఆర్థిక రికార్డులు.. కార్యకలాపాల జోరు వాల్తేరు విభాగం ఈ ఏడాది మొత్తం రూ.11,598 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది గతేడాదితో పోలిస్తే 17 శాతం అధికం. ముఖ్యంగా సరుకు రవాణా, రవాణా నిర్వహణలో 150 మిలియన్ టన్నుల మైలురాయిని దాటి అగ్రగామిగా నిలిచింది. ప్రయాణికుల రాకపోకలు కూడా గణనీయంగా పెరిగాయి. సుమారు 3.34 కోట్ల మంది ప్రయాణికులు వాల్తేరు రైల్వే సేవలను వినియోగించుకోగా, గత 21 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల విభాగం ద్వారా రూ.881.37 కోట్ల ఆదాయం సమకూరింది. క్యాటరింగ్, పార్కింగ్, ప్రకటనలు, టికెట్ తనిఖీల ద్వారా కూడా భారీగా ఆదాయం ఆర్జించాం. శరవేగంగా స్టేషన్ల నవీకరణ పనులు వాల్తేరు డివిజన్ పరిధిలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 15 రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు ఎంపిక చేశాం. విశాఖపట్నం ప్రాంతంలో రైలు ఫ్లైఓవర్లు, అదనపు లైన్ల నిర్మాణం, స్టేషన్ల నవీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం విశాఖపట్నం స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్, విశాఖలో 220, విజయనగరంలో 24 డిజిటల్ స్క్రీన్లు, అత్యాధునిక వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశాం. పండగలు, సెలవుల రద్దీని తట్టుకునేందుకు 300కు పైగా ప్రత్యేక రైళ్లు, 400 అదనపు కోచ్లను నడిపాం. విశాఖపట్నం నుంచి తిరుపతి, చర్లపల్లి వెళ్లే ప్రత్యేక రైళ్లను క్రమబద్ధీకరించారు. అరకు, కొరాపుట్ కాఫీ బ్రాండ్లను ప్రోత్సహించడానికి ఆయా స్టేషన్లలో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్లాటినం రేటింగ్ కలిగిన హరిత రైల్వే స్టేషన్గా విశాఖపట్నం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదు వాల్తేరు విభాగం సాంకేతికత వినియోగంలోనూ ముందుంది. భద్రత, నిఘా కోసం విశాఖ స్టేషన్లో ‘ఆర్క్ అర్జున్’ అనే కృత్రిమ మేధస్సుతో పనిచేసే రోబోను ప్రవేశపెట్టాం. ఇది నేరస్తులను గుర్తించడంలో, ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భద్రతా పరంగా అప్రమత్తంగా వ్యవహరించిన సిబ్బందికి ప్రత్యేక అవార్డులు అందజేయడమే కాకుండా, సిబ్బంది నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. మౌలిక వసతుల విస్తరణ రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు మౌలిక సదుపాయాల విస్తరణపై విభాగం దృష్టి సారించాం. ఈ ఏడాది జనవరి నాటికి 380 కిలోమీటర్లకు పైగా డబుల్ లైన్ పనులను పూర్తి చేసి ప్రారంభించడం ఒక పెద్ద విజయం. దీనివల్ల రైళ్ల రాకపోకల్లో జాప్యం తగ్గడమే కాకుండా, సరుకు రవాణా సామర్థ్యం కూడా పెరుగుతుంది. పార్లమెంట్లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించినట్లుగా.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ త్వరలో రాబోతుందని డీఆర్ఎం స్పష్టం చేశారు. -
హోంగార్డు కుటుంబానికి రూ.4.24 లక్షల సాయం
హోంగార్డు వెంకటరావు భార్య నీలిమకు చెక్కు అందజేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: పోలీస్ శాఖలో హోంగార్డులు ఒక భాగమేనని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు డి.వి.వెంకటరావు భార్య నీలిమకు రూ.4,24,120 చెక్కును బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ఆర్.ఐ.ఎన్.ఎల్ స్టీల్ ప్లాంట్లో డిప్యూటేషన్పై విధులు నిర్వర్తిస్తూ, అనారోగ్యంతో మరణించిన వెంకటరావు కుటుంబానికి అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మిగిలిన హోంగార్డులు ఒక రోజు గౌరవ వేతనాన్ని అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎ.ఓ సి.హెచ్.తిలక్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ దేవరాజు, జూనియర్ అసిస్టెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా మరిడమ్మ జాతర
నర్సీపట్నం: మూడేళ్లకోసారి నిర్వహించే పట్టణ ప్రజల ఇలవేల్పు మరిడమ్మ జాతర కనులపండువగా జరిగింది. రెల్లివీధి నుండి అమ్మను గరగలు నృత్యం, వివిధ కాగితపు పువ్వుల అలంకరణతో తీసుకువచ్చారు. ఊరేగింపులో వివిధ రకాల కళాకారులు, వేషదారుణలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తీన్మార్ డప్పులు, అమ్మవారి శక్తి అవతారాలతో కళాకారులు, వివిధ రకాల డప్పు వాద్యకారులు ఊరేగింపులో పాల్గొన్నారు. దారిపొడవునా ప్రజలు ఊరేగింపును తిలకించడానికి బారులు తీరారు. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ ఊరేగింపు సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ను మళ్లించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు ఊరేగింపులో పాల్గొన్నారు. -
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
గోవాడ ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు చోడవరం: కార్మికులను నష్టం కలిగించే లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో గోవాడ సుగర్ఫ్యాక్టరీ గేటు వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా సీఐటీయు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు ఇవ్వడంతో దీనిలో భాగంగా గోవాడ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ధర్నా చేశారు. లేబర్ కోడ్స్ను రద్దు చేసి గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను నష్టం కలిగించే చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందని, వెంటనే వీటిని రద్దు చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు, గోవాడ సుగర్స్ కార్మిక సంఘం నాయకులు శరగడం రామునాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల గోవాడ సుగర్ ప్యాక్టరీలో కార్మికులు, రైతులకు తీరని నష్టం కలిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణంలో రైతులు, కార్మికులకు రావలసిన బకాయిలను చెలించాలని వారు డిమాండ్చేశారు. ఈ ఆందోళనలో నాయకులు ఎస్.వి నాయుడు, రాయి సూరిబాబు, రామకుమార్ పాల్గొన్నారు. -
అంతిమయాత్రకు కష్టాలెన్నో...
బుచ్చెయ్యపేట: మేజర్ పంచాయతీ వడ్డాదిలో శ్మశానానికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేక పలువురు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో కొత్తూరు రెల్లివీధికి చెందిన కొత్తపల్లి రాజు అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. వీరి శ్మశానం మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న పెద్దేరు కస్పా కాలువ అవతల ఉంది. కాలువపై నుండి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేక కుటుంబ సభ్యులు రాజు మృతదేహంతో కాలువలోకి దిగి అవస్థలు పడ్డారు. మోకాళ్ల లోతు నీటిలో నుంచి దిగి శ్మశానానికి చేరుకుని దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఎవరైనా మృతి చెందితే ఈ రోజుతో ఆయనకు కష్టాలు పోయాయి సంతోషంతో దహన సంస్కారాలు చేయాలంటారు. కానీ శ్మశానంకు వెళ్లే రహదారి సౌకర్యం లేక అంతిమయాత్రకు నానా కష్టాలు తప్పడం లేదని పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో అవసరం లేకపోయినా పంట పొలాలకు లే అవుట్లకు ప్రభుత్వ నిధులతో రోడ్లు వేస్తున్న అధికారులు అవసరం ఉన్న చోట మాత్రం రోడ్డు సదుపాయం కల్పించడం లేదని, నాయకులు ఎక్కడ చెబితే అక్కడే రోడ్లు వేస్తున్నారు తప్ప ప్రజాప్రయోజనాలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. -
కార్మికులకు సంక్షేమ పథకాల పునరుద్ధరణ
మాట్లాడుతున్న సహాయ కార్మికాధికారి సూర్యనారాయణ చోడవరం: కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని కార్మిక శాఖ సహాయ కార్మికాధికారి పి. సూర్యనారాయణ అన్నా రు. బుధవారం చోడవరంలో సబ్బవరం, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ, బుచ్చెయ్య పేట, రావికమతం, మాడుగుల మండలాలకు చెందిన కార్మిక సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. గత నెల నుంచి సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరించామ న్నారు. కార్మికుల కుమార్తెల వివాహానికి రూ.40 వేలు, ప్రసూతి ఖర్చులకు రూ. 20వేలు, సహజ మరణానికి రూ.60వేలు, దహన ఖర్చులకు రూ. 20వేలు ఇచ్చే పథకాలు పునరుద్ధరించామన్నారు. -
పటిష్ట చర్యలు
ప్రభుత్వ భూముల పరిరక్షణకు● సీఎంఓ కార్యాలయం, పీజీఆర్ఎస్ దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ ● రెవెన్యూ అధికారుల సమీక్షలో కలెక్టర్ విజయకృష్ణన్తుమ్మపాల: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ ఽశౌర్యమాన్ పటేల్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న భూముల తాలూక తాజా పరిస్థితులను తెలుపుతూ నివేదికలు సమర్పించాలని, సంక్షిష్ట పరిస్థితులకు సంబంధించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టాదార్ పాస్పుస్తకాలు పంపిణీ, రీ సర్వే, వెబ్ ల్యాండింగ్ పోర్టింగ్, తదితర అంశాలపై నిర్వహించాల్సిన విధి విధానాల గురించి ప్రస్తావించారు. మ్యుటేషన్ల ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జీవో నెం. 30 ప్రకారం అందరికీ ఇల్లు కార్యక్రమంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సీఎంవో కార్యాలయం నుంచి, పీజీఆర్ఎస్లో వచ్చిన దరఖాస్తులపై అధికారులు స్వయంగా పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. 22(ఏ) పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కోర్టు కేసుల విషయంలో అధికారుల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చౌక ధరల దుకాణాలు, పెట్రోలు బంకులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. చౌక ధరల దుకాణాలకు మహిళలు పిల్లలు వచ్చినట్లయితే ముందుగా వారికి సరుకులు పంపిణీ చేయాలని, మంచి నీరు ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదని, గ్యాస్ ఏజెన్సీలలో ముందస్తు బుకింగ్స్ లేకుండా చూడాలని, గ్యాస్ సిలిండర్లను డోర్ డెలివరీ ద్వారా మాత్రమే అందజేయాలని, గ్యాస్ గోడౌన్ వద్ద ఎటువంటి డెలివరీలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గనులు క్వారీలపై అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. ఫైర్ క్రాకర్ యూనిట్లకు సంబంధించిన తనిఖీ నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణ రావు, ఆర్డీవోలు వి.వి. రమణ, షేక్ ఆయేషా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
కోసం వలన చేత
గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026విద్యా కుసుమాల నిలయం, దేశానికే గర్వకారణమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం నేడు ప్రైవేటు శక్తుల చేతిలో పతనం.. రాష్ట్రపతి ప్రారంభించిన రక్షణ కేంద్రానికి గ్రహణం.. ఆదాయం ఇచ్చే అక్షయ పాత్రను.. అప్పనంగా చిత్తుకాగితం చేసిన వైనం.. ’చేతికొచ్చిన బంగారాన్ని చెరువులో పారేసినట్టు’.. సొంత ప్రతిష్టను బలిపీఠం ఎక్కిస్తున్న పాలకులు.. ప్రశ్న ఒకటే.. ఏయూ భవితవ్యం.. ప్రైవేటు శక్తుల బతుకుదెరువా? ● ఏయూ డిఫెన్స్ స్టడీస్ సెంటర్కు మంగళం ● ప్రైవేటు వర్సిటికీ లబ్ధి చేకూర్చడమే పాలకవర్గం లక్ష్యం? ● ఏకపక్ష నిర్ణయాలతో అభాసుపాలుఇదీ ఏయూలో పాలన ప్రైవేటు హితం కోసం.. వర్సిటీకి రిక్తంసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ గడ్డపై విద్యా వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం.. నేడు ప్రైవేటు శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ‘గీతం వలన.. గీతం కోసం.. గీతం చేత..’ అన్న చందంగా సాగుతున్న ప్రస్తుత పాలన, వర్సిటీ గౌరవాన్ని గంగలో కలిపేస్తోంది. సాక్షాత్తూ భారత రాష్ట్రపతి ప్రారంభించిన రక్షణ అధ్యయన కేంద్రానికే మంగళం పాడి, రూ.15 కోట్ల ఆదాయాన్ని ఇచ్చే అక్షయపాత్రను చిత్తుకాగితంలా పారేసిన వైనంపై మేధావుల నుంచి ఆగ్రహం పెల్లుబుకుతోంది. అగ్నివీరులకు మార్గదర్శిగా, దేశ రక్షణ దళాలకు విద్యా గనిగా పేరుగాంచిన ఏయూని కుప్పకూల్చి.. ఆ శిథిలాల మీద ప్రైవేటు సామ్రాజ్యానికి రెడ్ కార్పెట్ వేస్తున్న పాలకుల తీరుపై నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్రపతి ప్రారంభించిన కేంద్రానికి గ్రహణం ఏయూ రక్షణ అధ్యయన కేంద్రాన్ని 2018లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సెంటర్ అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు, అధికారులు తమ విధుల్లో ఉంటూనే.. ఉన్నత చదువులు అభ్యసించడానికి, రిటైర్మెంట్ తర్వాత మెరుగైన ఉపాధి పొందేందుకు ఈ కేంద్రం వారధిలా నిలిచింది. భారత వైమానిక, నౌకా, భూసేనలతో పాటు ఐఎన్ఎస్ సంస్థలు, కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ ఫేర్ వంటి అత్యున్నత రక్షణ విభాగాలతో ఏయూ బలమైన ఒప్పందాలు చేసుకుంది. దీనివల్ల వేలాది మంది రక్షణ సిబ్బంది పీహెచ్డీలు, డిగ్రీలు పూర్తి చేసి వర్సిటీ ప్రతిష్టను పెంచడమే కాకుండా, వర్సిటీ ఖజానాకు సుమారు రూ.15 కోట్ల ఆదాయాన్ని కూడా సమకూర్చారు. అగ్నివీర్లకు మార్గదర్శి.. నేడు అగమ్యగోచరం దేశంలో అగ్నివీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపికై న మొదటి విశ్వవిద్యాలయంగా ఏయూ రికార్డు సృష్టించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 7 వేల మందికి పైగా సైనికులు ఇక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యాక్ గుర్తింపులో ఈ కేంద్రం ప్రదర్శించిన ‘బెస్ట్ ప్రాక్టీసెస్’కు 400 కి 400 మార్కులు రావడం విశేషం. ఇంతటి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న కేంద్రాన్ని, 2023లో సెనేట్ ఆమోదంతో పూర్తిస్థాయి స్కూల్గా మార్చాలని నిర్ణయించారు. అయితే, కొత్త పాలన వచ్చిన తర్వాత పరిస్థితి తలకిందులైంది. ఏయే కారణాలతో ఈ కేంద్రాన్ని మూసివేశారో అర్థం కాక విద్యార్థులు, నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిణామాల వల్లే సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ నిరంజన్ తన పదవికి రాజీనామా చేయగా, సమన్వయకర్తగా ఉన్న ఉజ్వల్ వంటి నిపుణులు వర్సిటీని వీడాల్సి వచ్చింది. -
నూకాంబిక సన్నిధిలో చాగంటి
అనకాపల్లి: గవరపాలెం నూకాంబిక అమ్మవారిని బుధవారం ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అంతకుముందు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణని ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కవిమిషనర్ యాళ్ల శ్రీధర్లు పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చాగంటి కోటేశ్వరరావును శాలువాతో సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానంలో నూకాంబిక అమ్మవారి నెల పండగ జాతరలో భాగంగా కోటేశ్వరరావు ప్రవచనం చేశారు. -
సెజ్ హామీ.. నెరవేరదేమీ?
నాతవరం: స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గాంధీనగరం సమీపంలో ఎస్ఈజెడ్ (సెజ్) ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబరులో నర్సీపట్నం తుని మధ్య అర్అండ్బీ రోడ్డు పనులకు భూమి పూజ చేసేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్ విచ్చేశారు. కార్యక్రమం అనంతం ఏర్పాటు చేసిన సభలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ గాంధీనగరం ప్రాంతంలో ఎస్ఈజెడ్ ఏర్పాటు చేస్తానన్నారు, నర్సీపట్నం, తుని మధ్య అర్అండ్బీ రోడ్డును అనుకుని గాంధీనగరం ప్రాంతంలో 100 ఎకరాలు తక్కువ లేకుండా భూమి సేకరిస్తే సీఎం చంద్రబాబుతో మాట్లాడి సెజ్ ఏర్పాటు చేస్తానని కలెక్టర్ సమక్షంలో హామీ ఇచ్చారు. ఇక్కడ ఎస్ఈజెడ్ ఏర్పాటు చేసిన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులు పండించే వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడకు తరలిస్తామన్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయ సెజ్ ఏర్పాటు చేయడం వల్ల అనకాపల్లి జిల్లాలో మైదాన ప్రాంత రైతులతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో గిరిజనులు పండించే అన్ని రకాల ఉత్పత్తులకు గిరాకీ ఉండే విధంగా చేసుకోవచ్చునన్నారు. మైదాన ప్రాంత రైతులకు తోడు గిరిజన ప్రాంత రైతుల ఉత్పత్తులను సెజ్లో నిల్వ చేసి, ఇతర మార్కెట్లకు తరలిస్తే అధిక ఆదాయం వస్తుందని ఊరించారు. మన ప్రాంతంలో రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు ఇతర రాష్ట్రాలలో గిరాకీ ఉందన్నారు. అక్కడ మార్కెట్లో ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా ఆయా ఉత్పత్తులు తయారు చేసేందుకు సెజ్ ఎంతో ఉపయోడపడుతుందన్నారు. గాంధీనగరం ప్రాంతంలోనే ఎస్ఈజెడ్ ఏర్పాటు చేయడం వల్ల ఉత్పత్తులను తుని రైల్వే స్టేషన్కు, జాతీయ రహదారికి, విశాఖపట్నం ఎయిర్పోర్డుకు తరలించేందుకు రవాణాతో పాటు రోడ్డు మార్గం బాగుంటుందన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభలో ఇచ్చిన హామీ మేరకు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు ఎన్.దినేష్కుమార్, విజయ్కృష్ణన్ 2025 ఫిబ్రవరి 17న గాంధీనగరం ప్రాంతంలో భూములను స్వయంగా పరిశీలించారు. ఇక్కడ సెజ్ ఏర్పాటుకు 100 ఎకరాలకు పైగా భూమి కావాలి. అందులో ప్రభుత్వ భూమి ఎంత ఉంది, జిరాయితీ భూమి ఎంత, డీఫారం భూమి ఎంత? అనే విషయమై క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఇక్కడ సెజ్ ఏర్పాటుకు అవసరమైన భూమి సేకరణ చేయాలని ఇద్దరు కల్టెక్టర్లు నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణను ఆదేశించారు, గాంధీనగరం సమీపంలో అధికంగా పెడిమికొండలో అటవీశాఖకు చెందిన భూములు ఉన్నాయి. అటవీశాఖ భూములు తీసుకుంటే దానికి బదులుగా ఇదే మండలంలో సరుగుడు సుందరకోట ప్రాంతంలో వేలాది ఎకరాలు గ్యాప్ ఏరియా భూములు ఉన్నాయి. వాటిలో కొంత భూమి అటవీశాఖకు ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక్కడ సెజ్ ఏర్పాటు చేయడం వల్ల మైదాన, ఏజెన్సీ ప్రాంత వ్యవసాయ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పీకర్ స్వయంగా ప్రకటించారు. ఇలా ప్రజలకు ఆశ చూపించి 15 నెలలు గడుస్తున్నా సెజ్ ఏర్పాటుపై అడుగు ముందుకు పడలేదు. -
పంచాయతీల్లో అధికారుల పాలన
సాక్షి, అనకాపల్లి: పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన రానుంది. గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ఈ నెల 2వ తేదీ గురువారంతో ముగుస్తుంది. ఈ మేరకు ఎన్నికలు జరిగే వరకు పంచాయతీలు ప్రత్యేక అధికారులను పాలనలోకి వెళతాయి. ఈ మేరకు ఆయా అధికారులతో జాబితాను తయారీ చేసింది. ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల ఎడ్యుకేషన్, మండల అగ్రికల్చర్ అధికారులు, సీడీపీఓ అధికారులు ఇతర మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. ఒక్కో అధికారికి రెండు నుంచి మూడు, నాలుగు వరకూ పంచాయతీల బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయా పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. గజిటెడ్ హోదా కలిగిన అధికారులను గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు మండల అభివృద్ధి అధికారులు మండలాల్లో పనిచేస్తున్న గజిటెడ్ హోదా కలిగిన, మండల అధికారులతో జిల్లాలో 216 మంది అధికారులతో జాబితాలను తయారు చేశారు. ఈ మేరకు వివరాలను సిద్ధం చేశారు. జిల్లా పంచాయతీ అధికారి సందీప్ ప్రత్యేక అధికారుల జాబితాను సిద్ధం చేసి, ఆమోదం కోసం కలెక్టర్కు పంపించారు. ఈ జాబితా ఆమోదం పొందినట్లు సమాచారం. అధికారికంగా ఈ నెల 3వ తేదీన విడుదల చేయనున్నారు. పంచాయతీల పాలకవర్గాలకు ఎన్నికలు జరిగే వరకు, లేదా ఆరు నెలలపాటు ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది. 646 పంచాయతీలకు ప్రత్యేకాధికారులు జిల్లాలో 24 మండలాల పరిధిలో మొత్తం 646 గ్రామ పంచాయతీలున్నాయి. 2021 ఫిబ్రవరి రెండు, మూడు వారాల్లో (అప్పట్లో ఉమ్మడి జిల్లా) నాలుగు దశల్లో పంచాయతీల పాలకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు ఏప్రిల్ రెండో తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల రెండో తేదీతో ఐదేళ్ల పదవీ కాలం పూర్తవుతుంది. పంచాయతీల పునర్విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకా కుటుంబ సర్వే, బీసీ జనాభాగణన, ఇతర కారణాల వల్ల ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణను కొద్ది నెలలపాటు వాయిదా వేస్తున్నట్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 646 పంచాయతీలకు గానూ 216 మంది అధికారులను నియమిస్తూ జాబితా సిద్ధం చేశారు. సర్పంచ్లపై కూటమి కక్ష సాధింపు ఇప్పటివరకు గ్రామ అవసరాల కోసం సర్పంచులు స్వేచ్ఛగా చెక్కులు జారీ చేసే అవకాశం ఉండేది. అయితే నిధుల దుర్వినియోగం జరుగుతుందనే అనుమానంతో ప్రభుత్వం ఈ అధికారాలను పరిమితం చేసింది. ఇకపై సర్పంచులు జారీ చేసే ప్రతి చెక్కును డీఎల్డీఓ ఆమోదించడం తప్పనిసరి. పంచాయతీ కార్యదర్శులు నేరుగా చెక్కులను ప్రాసెస్ చేయకుండా డీఎల్డీవోల అనుమతి పొందిన తర్వాతే నిధులు విడుదయ్యేలా నిబంధనలు మార్చారు. జిల్లాలో అత్యధిక గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు సర్పంచ్లు ఉండడంతో వారిని ఇబ్బంది పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నేటితో ముగియనున్న సర్పంచ్ల పదవీ కాలం ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు పూర్తి మండల స్థాయి అధికారులకూ బాధ్యతలు ఎన్నికలు జరిగే వరకూ అధికారుల పాలనే జిల్లాలో మొత్తం 646 పంచాయతీల్లో 216 అధికారులు ఇప్పటికే మున్సిపాలిటీల్లో ప్రత్యేక పాలన ఎన్నికలకు వెళ్లే యోచనలో లేని ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల జాబితా సిద్ధం పంచాయతీ సర్పంచ్ల గడువు ఈ నెల 2తో ముగియనుంది. మూడో తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన ఉంటుంది. ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల జాబితా ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించాం. శుక్రవారం ఉదయం జాబితా ప్రకటిస్తాం. 24 మండలాల్లో ఉన్న ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, మండల ఎడ్యుకేషన్, మండల అగ్రికల్చర్ అధికారులు, సీడీపీఓ అధికారులను నియమించడం జరిగింది. – సందీప్, జిల్లా పంచాయతీ అధికారి, అనకాపల్లి జిల్లా -
గిరిజన యువతి మృతిపై పోలీసుల విచారణ
దేవరాపల్లి : మండల కేంద్రంలో సోమవారం రాత్రి అనంతగిరి మండలం కొరపర్తికి చెందిన గిరిజన యువతి దూసరి లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. అనకాపల్లి ఇన్చార్జి డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, కె.కోటపాడు సీఐ కె.కృష్ణ, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ ఘటనా స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. యువతి ఉరి వేసుకున్న గదిలో క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. దేవరాపల్లికి చెందిన యువకుడు కొల్లి లోకేష్ ప్రేమ పేరుతో వంచించి మోసం చేయడాన్ని తట్టుకోలేక తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి పెంటయ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతురాలి కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మంళవారం స్థానిక పోలీస్స్టేషన్కు అధిక సంఖ్యలో తరలివచ్చి లక్ష్మి మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ కులానికి చెందిన యువతి కావడంతోనే సదరు యువకుడు పెళ్లికి నిరాకరించాడని, దీనిని తట్టుకోలేక తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తూ తల్లిదండ్రులను ఇద్దరు తమ్ముళ్లు, చెల్లిని పోషిస్తున్న లక్ష్మి మృతితో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న మాట్లాడుతూ గిరిజన యువతి మృతిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ రక్షణ చట్టం కింద పరిహారం, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్ట పరిహారం, రెండు ఎకరాల భూమి, కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కె.కోటపాడు సీహెచ్సీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. -
15 కిలోల గంజాయి పట్టివేత
గంజాయిని పట్టుకున్న సెక్యూరిటీ వింగ్ (ఆర్ఐ) టీం పెందుర్తి: ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరానికి తరలిస్తున్న గంజాయిని పెందుర్తి రైల్వే స్టేషన్ వద్ద సెక్యూరిటీ వింగ్(ఆర్ఐ) టీం పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు పెందుర్తి ప్రాంతంలో ఆర్ఐ బృందం తనిఖీలు నిర్వహించింది. నార్కోటిక్ డాగ్ సహాయంతో రైల్వే స్టేషన్ వద్ద 4 ప్యాకెట్లలో 15 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయితో పాటు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మేడపై నుంచి పడి యువకుడు మృతి
అచ్యుతాపురం రూరల్ : ప్రమాదవశాత్తూ మేడపై నుంచి పడి అలబాని రామకృష్ణ (22) అనే యువకుడు మృతి చెందిన సంఘటన అచ్యుతాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లారస్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ అచ్యుతాపురం వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న మనోహర్ హాస్టల్లో మూడో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో మూడో అంతస్తుపై నుంచి పడిపోవడం చుట్టుపక్కల వారు కొద్ది సేపటికి గమనించి 108 ఆంబులెన్స్ ద్వారా అచ్యుతాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 3 గంటల సమయంలో రామకృష్ణ మృతి చెందాడు. ఘటనపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ చంద్రశేఖర్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
కందిపప్పు కలేనా.. రాగులు గతమేనా?
మహారాణిపేట: పేదల ఆహార భద్రతకు అండగా ఉండాల్సిన రేషన్ దుకాణాలు ఇప్పుడు అరకొర సరఫరాలతోనే సరిపెట్టుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలలు దాటినా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పూర్తి స్థాయిలో నిత్యావసరాలు అందకపోవడం కార్డుదారుల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఎన్నికల ముందు రేషన్ ద్వారా విభిన్న నిత్యావసరాలు అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం బియ్యం, పంచదారకే పరిమితమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే కందిపప్పు, రాగులు పంపిణీ చేస్తూ ‘మూన్నాళ్ల ముచ్చట’గా మార్చేసిందనే ఆవేదన వ్యక్తమవుతోంది. పిండితో సరిపెడుతున్న సర్కార్ బియ్యం, పంచదార తప్ప మరేమీ ఇవ్వకుండానే కాలం గడిపేస్తున్న చంద్రబాబు సర్కార్, తాజాగా పట్టణ ప్రాంతాల్లో రూ. 20లకే గోధుమ పిండి ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటోంది. అయితే, గ్రామీణ ప్రజలకు ఈ సౌకర్యం లేకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోషకాహారం పేరిట చేస్తున్న ఈ హడావుడి, క్షేత్రస్థాయిలో కేవలం కొందరికి మాత్రమే అందుతోంది. జిల్లాలో పరిస్థితి ఇలా... డీఎస్ఓ పరిధిలో మధురవాడ, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి ప్రాంతాలు ఉండగా, జిల్లాలో 5.12 లక్షల తెలుపు కార్డులు, 600కు పైగా చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అయినప్పటికీ సరఫరా లోపాలు సరిచేయడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ఆశలు... ఇంకా నిరీక్షణలోనే.. గడప గడపకు రేషన్ అని చెప్పిన పాలకులు, ఇప్పుడు రేషన్ షాపుల్లో సరుకులకే కత్తెర వేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరల నేపథ్యంలో, రేషన్ దుకాణాలపై ఆధారపడే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కందిపప్పు, రాగులు వంటి అవసరమైన వస్తువులు అందకపోవడంతో పేదల భోజనంలో పోషకాహారం తగ్గిపోతోంది. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి కందిపప్పు, వంటనూనె వంటి నిత్యావసరాలను పునరుద్ధరించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.రాగులు మున్నాళ్ల ముచ్చటే.. రాగులు మూడు కిలోలు ఇస్తామని చెప్పి చివరకు ఒక కిలోకే పరిమితం చేయడం కార్డుదారుల్లో అసంతృప్తిని పెంచింది. అంతేకాకుండా రాగులు ఇచ్చినప్పుడు బియ్యం కోటాలో కోత విధించడం మరో సమస్యగా మారింది. అది కూడా జనవరి నెల వరకే ఇచ్చారు. ఈనెల రాగులకు ఇండెంట్ పెట్టలేదు. అంటే ఈ నెల ఒక్క కిలో పంపిణీ చేసే అవకాశం లేదు.రేషన్ దుకాణాల్లో నిత్యావసరాల కోసం ఎదురు చూసే కార్డుదారులకు నిరాశే మిగులుతోంది. ఎన్నికల హామీల్లో చెప్పిన కందిపప్పు, రాగులు ఇప్పుడు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోగా, నెలల తరబడి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో అమాంతం పెరిగిన ధరల మధ్య రేషన్పై ఆధారపడే పేదలు కందిపప్పు, రాగుల కోసం కళ్లప్పగించి ఎదురుచూస్తుండటం పరిస్థితి తీవ్రతను చూపుతోంది. కందిపప్పు కోసం కళ్లప్పగింత గత ప్రభుత్వ హయాంలో ప్రతి కార్డుదారుడికి నెలకు ఒక కిలో కందిపప్పు అందించేవారు. ప్రస్తుతం అది గతస్మృతిగా మారింది. ఏప్రిల్లో కూడా కందిపప్పు పంపిణీ చేసే సూచనలు కనిపించడం లేదు. ఇందుకు సంబంధించి ఇండెంట్ కూడా పెట్టకపోవడం గమనార్హం. మార్కెట్లో కందిపప్పు ధరలు రూ.150 నుంచి రూ.180 వరకు పెరగడంతో, సాధారణ ప్రజలకు కొనుగోలు భారంగా మారింది. దీంతో రేషన్ ద్వారా తక్కువ ధరకు లభించే కందిపప్పుపైనే అనేక కుటుంబాలు ఆధారపడుతున్నాయి. -
నిందితుడు రవీంద్రను ఉరితీయాలి
మహారాణిపేట: ‘నా బిడ్డను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు’అంటూ మౌనిక తండ్రి పొలిపల్లి వేణుగోపాల్ కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద తన కుమార్తె మృతదేహాన్ని చూసి ఆయన బోరున విలపించారు. తన కుమార్తెను హత్య చేసిన చింతాడ రవీంద్రను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హత్య జరిగిన సమయంలో మౌనిక ఒంటిపై ఉన్న సుమారు రెండు తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయని వేణుగోపాల్ తెలిపారు. ఈ కేసుపై ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించి, తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు. -
● ఈపీడీసీఎల్లో వినూత్న కార్యక్రమం ● డయల్ యువర్ సీఎండీకి వినతుల వెల్లువ ● ఫోన్ కాల్స్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్న అధికారులు
సాక్షి, విశాఖపట్నం: ఒక ఫోన్ నంబర్.. 8 వారాలు.. 11 జిల్లాలు.. 11 సర్కిళ్లు.. 345 ఫిర్యాదులు.. వచ్చిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. మొత్తంగా వినూత్నంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రారంభించిన ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి స్పందన వస్తోంది. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి స్వయంగా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం ఫిర్యాదులు తీసుకొని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత విభాగాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 345 ఫిర్యాదులు.. 35 పెండింగ్ ఇప్పటివరకు 8 వారాల పాటు డయల్యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు 345 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 310 ఫిర్యాదులను ఈపీడీసీఎల్ అధికారులు పరిష్కరించారు. ఫోన్లో ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ఆ గ్రామానికి రావడంతో ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెరుగుతూ వస్తోంది. ఎక్కువగా లోవోల్టేజీ సమస్యపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటివరకు 76 వరకూ లోవోల్టేజీ ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యప్రకాష్ పర్యవేక్షిస్తూ.. పరిష్కరిస్తున్నారు. 76 ఫిర్యాదుల్లో 62 పరిష్కరించారు. లోవోల్టేజీని అధిగమించేందుకు... 43 ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు మార్చారు. లోవోల్టేజ్ ఉన్న ప్రాంతంలో 7.5 కి.మీ మేర పాత కండక్టర్లు మార్చడం విశేషం. మిస్డ్ కాల్స్పైనా దృష్టి పెడుతున్నాం.. ఈ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకూ ఫిర్యాదులు తీసుకుంటున్నాం. ఒక ఫిర్యాదు తీసుకున్న సమయంలో ఏవైనా మిస్డ్ కాల్స్ ఉంటే.. 11.30 గంటల తర్వాత ఆ నంబర్లకు ఫోన్ చేసి.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. ప్రతి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించాం. విద్యుత్ అంతరాయాలు, వోల్టేజ్ సమస్యలు, కొత్త సర్వీస్ కనెక్షన్ జాప్యం, విద్యుత్ పునరుద్ధరణ, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి వంటి అంశాలను నేరుగా నా దృష్టికి తీసుకురావొచ్చు. –పృథ్వీతేజ్ ఇమ్మడి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ -
ఇంటి బడ్జెట్ తలకిందులు గల్ఫ్ యుద్ధం సాకుతో నిత్యావసర ధరల మంట పెరిగిన వంటనూనె, పప్పుదినుసుల ధరలు జిల్లాలో కొనసాగుతున్న గ్యాస్ ఇబ్బందులు రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలోనూ పెంచుతున్న ధరలు పాఠశాలలు, హాస్టళ్లలో భోజన వంటకు ఇక్కట్లు
అనకాపల్లి: రాగల ఐదురోజులలో ఆకాశం మేఘావృతమై పొడిగా ఉంటుందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం శాస్త్రవేత్త వి.గౌరీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అర్హులకు ఓటు హక్కు కల్పించండి విశాఖ లీగల్ : విశాఖ న్యాయవాదుల సంఘం నూతన ఎన్నికలకు సంబంధించి చాలా మంది న్యాయవాదులు ఓటు హక్కును కోల్పోయారు. సరైన సమాచారం లేని కారణంగా పలువురు న్యాయవాదులు తాము చెల్లించవలసిన సభ్యత్వ రుసుము చెల్లించలేదు. ఈనెల 23లోపు సభ్యత్వ రుసుం చెల్లించాలని న్యాయవాద సంఘం గడువు విధించింది. ఈ లోపు న్యాయవాదులు క్రీడా సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించడంతో పలువురు న్యాయవాదులు తమ సభ్యత్వం చెల్లించలేకపోయారు. మార్చి 23వ తేదీ లోపు సభ్యత్వ రుసుం చెల్లించలేని వారికి ఓటు హక్కు లేదని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి సీనియర్ న్యాయవాది పాక సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయవాదులందరికీ ఓటు హక్కు కల్పించడం కనీస ధర్మమని పేర్కొన్నారు. సభ్యత్వ రుసుము గడువు ఈనెల 6వ తేదీ వరకు పెంచాలని కోరారు. ఈ విషయంలో ఎన్నికల అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వాలని.. అవసరమైతే సర్వసభ్య సమావేశం నిర్వహించాలని సూచించారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వతి నాయుడు మాట్లాడుతూ అర్హులైన అందరి న్యాయవాదులకు ఓటు హక్కు కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షి, అనకాపల్లి : పశ్చిమాసియాలో నెల రోజులుగా జరుగుతున్న యుద్ధం పేద, సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడి యుద్ధ మేఘాలు మన వంటింట్లో సెగలు పుట్టిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో, ఇక్కడ అన్ని రకాల వస్తువుల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక వైపు నిత్యవసర ధరలు పెరగడం..మరో వైపు గ్యాస్ ట్రబుల్తో జిల్లా ప్రజలు బాధపడుతున్నారు. వంట నూనె నుంచి పప్పుదినుసుల వరకూ అన్నింటిపై ఆ ప్రభావం పడింది. వంటనూనె రేట్లు పెరగడంతో వినియోగదారులు, రెస్టారెంట్లు, హోటల్స్లో, పాస్ట్ఫుడ్ సెంటర్లలో రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు పాఠశాలలు, హాస్టళ్లలో భోజన వంటకు గ్యాస్ ట్రబుల్తో ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఒక్కసారిగా పెరిగిన ధరలను చూసి షాక్కు గురవుతున్నారు. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే, మన దగ్గర ధరలు పెరగడమేమిటని ప్రశ్న ఉత్పన్నమైనా పెరిగిన రేట్లతో జేబులకు చిల్లులు పడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ఇటు ప్రభుత్వ పన్నుల పోటు, పెరుగుతున్న నిత్యావసర ధరలు.. మధ్యలో వ్యాపారుల మాయాజాలం.. వెరసి సామాన్యుడి జేబు ఖాళీ అవుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రేట్లు పెరగడం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ధరల పెరుగుదల గృహిణుల బడ్జెట్ను తలకిందులు చేస్తోంది. గ్యాస్ రేట్లు పెరగడం కొరత ఏర్పడడంతో వాటికి ప్రత్యామ్నాయమైన కట్టెలు, బొగ్గులు రేట్లు కూడా గ్రామాల్లో పెరిగాయి. ధరల మంటకు కారణాలు ఇవే.. గల్ఫ్, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి అయ్యే నిత్యవసర వస్తువులు, వంట నూనె, గ్యాస్ సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతింది. దీంతో దిగుమతులు తగ్గి మార్కెట్లో అనుకోని విధంగా ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలపై ఇటీవల విధించిన 12 శాతం ట్యాక్స్ ధరలు భగ్గుమనడానికి మరో కారణమైంది. పండగల సీజన్ కావడంతో మార్కెట్లో వంట నూనెలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. కృత్రిమ కొరతతో సామాన్యుల నిలువుదోపిడీ అంతర్జాతీయ కారణాలను సాకుగా చూపి స్థానిక వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మార్కెట్లో డిమాండ్ పెరగడాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు, పాత స్టాక్ను గోదాముల్లో బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన పాత స్టాక్ను సైతం పెరిగిన కొత్త ధరలకే విక్రయిస్తూ వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇదే అదనుగా రిటైర్ వ్యాపారులు కిరాణా వస్తువులను కూడా పెంచారు. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాలు, విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ కొరవడడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో రోజుకు గృహ, వాణిజ్య అవసరాల నిమిత్తం పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ 10 వేల కేజీల నూనె వినియోగం జరుగుతున్నట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 50 శాతం పామాయిల్, 40 శాతం సన్ఫ్లవర్ ఆయిల్, 10 శాతం ఇతర నూనెలు వాడుతున్నారు. అయితే పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ రేట్లు రూ.6 నుంచి రూ.10 పెరిగాయి.పామాయిల్లో రూ.90 –115 నుంచి రూ.120–140 వరకూ పెరిగింది.సన్ఫ్లవర్ ఆయిల్ రూ. 140–160 నుంచి రూ.166–178 వరకూ పెరిగింది. ●జిల్లాలో 300 వరకూ ఆయిల్ మిల్లులు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచి, పాయకరావుపేట, చోడవరం, సబ్బవరం, ఎస్.రాయవరంలో ఎక్కువగా ఉన్నాయి. వీటిలో వేరుశనగ, నువ్వుల నూనెలు తయారవుతాయి. ఇవి మిల్లుల ద్వారా 3 వేల కేజీలకు పైగా వినియోగం అవుతున్నాయి. జిల్లాలో పెరిగిన ధరల వివరాలు ఇలా...వంటింటికి ధరల సెగ -
పరుగు పోటీల్లో కండక్టర్ సత్తా
పద్మనాభం: గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 30, 31 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో అనంతవరం గ్రామానికి చెందిన కొండిమాని రాంబాబు అద్భుత ప్రతిభ కనబరిచారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఈ క్రీడల్లో రెండు బంగారు పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. విశాఖ జిల్లా తరపున 35, 45 సంవత్సరాల పురుషుల విభాగాల్లో రాంబాబు పాల్గొన్నారు. 100 మీటర్ల పరుగు పందెం, 4x100 మీటర్ల రిలే పరుగు పందెంలో బంగారు పతకాలను సాధించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పతకాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కండక్టర్గా విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల పట్ల ఆయన చూపుతున్న ఆసక్తిని పలువురు అభినందించారు. -
లక్ష్యానికి మించి పన్నులు వసూలు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో ఆస్తి, ఖాళీ జాగా పన్నుల వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని మించి నమోదయ్యాయి. నగరంలో 6 లక్షలకు పైగా ఆస్తి/ఖాళీ జాగా అసెస్మెంట్లు ఉండగా, 2025–26 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం రాత్రి 9 గంటల సమయానికి రూ.620.08 కోట్లు ఆస్తి పన్ను వసూలైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం వడ్డీ రాయితీ కారణంగా ప్రజలు, సంస్థలు భారీగా పన్నులు చెల్లించడంతో వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రూ.510.15 కోట్లు వసూలవగా, ఈసారి రూ.109.93 కోట్లు అధికంగా వచ్చింది. అదనపు కమిషనర్ (రెవెన్యూ), డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ), జోనల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేసిన కృషి ఫలితంగానే ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయని కమిషనర్ తెలిపారు. రాత్రి 12 గంటల వరకు అన్ని సౌకర్య కేంద్రాలు పనిచేస్తుండటంతో వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడిన ప్రజలకు జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఉపాధ్యాయినుల సమస్యలపై యూటీఎఫ్ వినతి
అనకాపల్లి : మహిళా ఉపాధ్యాయులకు ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక స్టాఫ్ రూమ్స్, మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ, ఏప్రిల్ 1న స్థానిక నెహ్రూచౌక్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహర దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వత్సవాయి శ్రీలక్ష్మి, గొంది చిన్నబ్బాయ్ అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన కె.ఎన్.ఆర్.పేటలో యూనియన్ ఆధ్వర్యంలో డీఈఓకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు పుస్తకాలు తీసుకురావడం, ప్రశ్నపత్రాలు తీసుకు రావడం లాంటి పనుల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు తదితర సమస్యల నుంచి రక్షణార్ధం జిల్లా స్థాయిలో ఒక ప్రొటెక్షన్ సెల్ను ఏర్పాటు చేయాలన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి జిల్లా స్థాయిలో స్ట్రెస్ మేనేజ్మెంట్ కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలన్నారు. తల్లిదండ్రులను అత్తమామాలను చూసుకోవడానికి పది రోజులు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని, మహిళా ఉద్యోగులకు ఉచిత న్యాయ సలహా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. -
ఆంగ్లభాష ప్రాముఖ్యత పెరుగుతోంది
అనకాపల్లి : ఆంగ్లభాష ప్రాముఖ్యత నేటి ఆధనిక ప్రపంచంలో ప్రచండ వేగంతో దూసుకుపోతుందని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన కె.ఎన్.ఆర్.పేటలో ఏపీ ఎంఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఆంగ్ల అధ్యాపకుడు విల్లూరి ఉమామహేశ్వరరావు రచించిన ‘ట్రాన్స్మ్యుటేషన్ ఆఫ్ హిస్టరీ లిటరేచర్’ పుస్తకాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుస్తక సాహిత్యం ద్వారా ఆంగ్ల భాషాభివృద్ధి చేసుకోవాలనుకునే వారికీ, ఆంగ్లభాష వ్యక్తీకరణని అభివృద్ధి చేసుకోదలచుకునే వ్యక్తులకు క్లుప్తంగా ఆంగ్లభాషపై మంచి పట్టు సంపాదించుకుని తనదైన శైలిలో ఆంగ్లంలో భావప్రకటన చేయదలచుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. స్కూళ్లు, కళాశాలల విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పుస్తక రచయిత డాక్టర్ విల్లూరి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో భారతీయుల స్థితిగతులు, వారి జీవన ప్రమాణాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు తదితర విషయాలను, వివిధ రకాల రచయితల రచనా పటిమను పరిగణనలోనికి తీసుకుంటూ రాసిన పుస్తకం ఆద్యంతం ఆసక్తిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు అప్పారావు, కిషోర్, సాయిరామ్. పలాసరావు(పోస్టల్ డెవలప్మెంట్ ఆఫీసర్), కాళిదాస్, టి.లక్ష్మీనాయుడు పాల్గొన్నారు. -
సురక్షిత విశాఖే లక్ష్యంగా పనిచేద్దాం
అల్లిపురం: నగరంలో ప్రజల భద్రతను మెరుగుపరచడం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు భాగస్వాములు కావాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి కోరారు. పోలీస్ కమిషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో నగరానికి చెందిన సుమారు 35 మంది ఇన్ఫ్లూయెన్సర్లతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ, సోషల్ మీడియా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే సమాజంలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుత్సాహంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ధైర్యం నింపడం, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, చిట్ఫండ్ మోసాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించడం, హెల్మెట్ ధారణ ఆవశ్యకత, రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడం, పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన స్పీడ్ లేజర్ గన్స్ పనితీరుపై సమాచారం అందించడం తదితర అంశాలపై వీడియోలు, సందేశాల రూపంలో విస్తృత ప్రచారం కల్పించాలని సీపీ కోరారు. అనంతరం ఇన్ఫ్లూయెన్సర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్ఫ్లూయెన్సర్లకు సీపీ శంఖబ్రత బాగ్చి పిలుపు -
రూ.3 కోట్ల ప్రభుత్వ భూమికి స్కెచ్?
మధురవాడ: ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అక్రమార్కులు తెగబడుతున్నారు. మధురవాడ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన భూమిని కొట్టేయడానికి నియోజకవర్గ ముఖ్యనేత పేరును వాడుకుంటూ దర్జాగా పనులు సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కబ్జాదారులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతోనే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. రూ.3 కోట్లు విలువ చేసే భూమి విశాఖ రూరల్ మండలం, మధురవాడ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 388 పరిసరాల్లో ఈ దందా సాగుతోంది. మధురవాడ హైవే నుంచి ఐటీ సెజ్కు వెళ్లే మార్గంలో, వికలాంగుల కాలనీ వద్ద అదానీ డేటా సెంటర్ రోడ్డును ఆనుకుని ఉన్న సుమారు 500 గజాల ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడ గజం ధర బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.60 వేల వరకు పలుకుతోంది. అంటే సుమారు రూ.3 కోట్ల విలువైన ఈ భూమిని హస్తగతం చేసుకునేందుకు పక్కా పథకం రచించారు. గతంలో అక్రమంగా నిర్మించిన షెడ్లకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలోని తుప్పలను తొలగించి, కొండ భూమిని చదును చేసే పనులు మొదలుపెట్టారు. ఇంత దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమణకు తెరలేపడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణ పనుల్లో జీవీఎంసీ వాహనం ఈ కబ్జా పర్వంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూ ఆక్రమణను అడ్డుకునేందుకు వచ్చిన గ్రేడ్–2 వీఆర్వో, అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేయించారు. భూమిని చదును చేస్తున్న పొక్లెయిన్ను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించేందుకు ప్రయత్నించగా.. అది జీవీఎంసీ శానిటేషన్ విభాగానికి చెందిన వాహనమని తేలడంతో విస్తుపోయారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖ నేత నుంచి ‘సదరు వ్యక్తులు మనవారే.. వదిలేయండి’అంటూ హుకుం జారీ కావడంతో అధికారి వెనక్కి తగ్గినట్లు సమాచారం. ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ఏకంగా ప్రభుత్వ వాహనాన్నే వాడటం చూస్తుంటే, ఈ వ్యవహారం ఎంతటి స్థాయి వ్యక్తుల కనుసన్నల్లో జరుగుతుందో అర్థమవుతోంది. అసలు సూత్రధారులు ఎవరు? అసలు అక్రమార్కుల పనులకు జీవీఎంసీ వాహనాన్ని పంపిన అధికారులు ఎవరు? ఈ కబ్జా వెనుక జీవీఎంసీలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా.. లేక ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
రెండు బైక్ల ఢీ... ఇద్దరు యువకుల మృతి
డుంబ్రిగుడ : మండలంలోని గోరాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎస్ఐ ఎల్.సురేష్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అరకులోయ మండలం మాదల పంచాయతీ తోటవలస గ్రామానికి చెందిన కిల్లో జోషప్(23) అనే గిరిజన యువకుడు బంధువుల ఇంటి నుంచి స్వగ్రామానికి బయలుదేరగా, హుకుంపేట మండల గడుగుపల్లి గ్రామానికి చెందిన మువ్వల శ్రీను(28) అనే యువకుడు తన స్నేహితుడితో చటువాలో జరుగుతున్న పండగను చూసేందుకు బయలుదేరారన్నారు. గోరాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో కిలోమీటరు దూరంలో రాత్రి వేళ రెండు బైకులు బలంగా ఢీ కొన్నాయని చెప్పారు. సంఘటన స్థలంలోనే శ్రీను మృతి చెందగా, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జోషప్ అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యంలో యండపల్లివలసలో మృతి చెందారని ఎస్ఐ తెలిపారు. వారితో పాటు మరొకరు గాయాలతో ఉండగా ఆసుపత్రిలో చేర్పించారని తెలిపారు. మృతదేహాలను అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించి మృతుల కుటుంబ సభ్యులకు మంగళవారం అప్పగించడం జరిగిందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతి చెందిన మువ్వల శ్రీను, (ఫైల్) -
దేవస్థానం సొసైటీ ఎన్నికల్లో హరి ప్యానెల్ గెలుపు
సింహాచలం: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు ప్రహ్లాదపురంలోని సొసైటీ కల్యాణమండపంలో మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 206 ఓట్లకు 168 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి నిరంజన్ పట్నాయక్ తెలిపారు. 9 మంది సభ్యులకు గాను పోటీలో 14 మంది(రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుతం విధుల్లో నిలిచిన ఉద్యోగులు) నిలిచారు. వీరిలో డి.వి.ఎస్.రామరాజు(హరి) ప్యానెల్ విజయం సాధించింది. డి.వి.ఎస్.రామరాజు, గొడవర్తి శ్రీనివాసాచార్యులు, సుంకర సన్యాసిరావు(తాతాజీ), టీపీఎన్ మూర్తి, వై.అప్పారావు, ముగ్గు వరహాలరావు, లంక సూరిబాబు, కోరాడ శ్రీనివాస సాయి, గెడ్డపు సన్యాసి విజయం సాధించారు. బుధవారం అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోనున్నారు. -
స్టీల్ప్లాంట్ తల్లీ.. ఇక సెలవు
● ఓ కార్మికుడి వీడ్కోలు స్టీల్ప్లాంట్ మెయిన్ గేటు వద్ద నమస్కారం చేస్తున్న అప్పలరాజు ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారం రుణం తీర్చుకోలేనిదని స్టీల్ప్లాంట్ కార్మికుడు గొందేశి అప్పలరాజు అన్నారు. స్టీల్ప్లాంట్ రోల్షాప్ అండ్ రిపేర్ షాప్ విభాగానికి చెందిన జనరల్ ఫోర్మెన్ అప్పలరాజు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా మంగళవారం పదవీ విరమణ చేశారు. విభాగంలో సహోద్యోగుల మధ్య జరిగిన కార్యక్రమాల అనంతరం ఆయన ఇంటికి బయల్దేరారు. స్టీల్ప్లాంట్ నుంచి బయటకు వచ్చిన అప్పలరాజు ఉద్వేగానికి లోనయ్యారు. స్టీల్ప్లాంట్ మెయిన్ గేటుకు నమస్కారం చేసి కన్నీటి పర్యంతమయ్యారు. 35 ఏళ్ల తన సేవలను పూర్తి చేసుకుని వెళ్లడం బాధగా ఉందన్నారు. తన కన్న తల్లి తర్వాత తల్లి లాంటి స్టీల్ప్లాంట్ తనకు మంచి జీవితం, కుటుంబాన్ని ఇచ్చిందన్నారు. స్టీల్ప్లాంట్ రుణం తీరుకోలేనిదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. సహోద్యోగులు ఆయనను ఓదార్చి ఇంటికి పంపించారు. -
ఐదు నెలలుగా విద్యుత్ మీటర్ కోసం...
సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుని చీకట్లోనే నివాసముంటున్నామని, నూతన విద్యుత్ మీటర్కు ఫీజు కట్టి ఐదు నెలలు అవుతున్నా విద్యుత్ శాఖ సిబ్బంది మీటర్ వేసి విద్యుత్ సౌకర్యం కల్పించడం లేదని, తక్షణమే తమకు విద్యుత్ సౌకర్యం కల్పించాలంటూ మాడుగుల మండలం చింతలూరు గ్రామానికి చెందిన భార్యభర్తలు గుడేపు దుర్గాలు, లక్ష్మి పీజీఆర్ఎస్లో వినతి అందించారు. రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగించే తాము చీకట్లోనే నివాసముండాల్సి వస్తుందని, చుట్టుపక్కల అందరికీ అందించిన విద్యుత్ సౌకర్యం తమకు కూడా అందించి న్యాయం చేయాలని ఆమెను కోరారు. –గుడేపు లక్ష్మి -
అర్జీల్లో భూ సమస్యలే అధికం
తుమ్మపాల :సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఅర్ఎస్కు 167, రెవిన్యూ క్లినిక్లో 181 మొత్తం 348 అర్జీలు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక ఉప కలెక్టర్లు మనోరమ, రామ మాణి, మెప్మా పీడీ కె.సరోజిని, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మైనింగ్ అధికారులపై ఫిర్యాదు చింతలూరులో గ్రాంట్ ఆర్డర్ లేకుండా 3 వేల క్యూబిక్ మీటర్ల అక్రమ మైనింగ్పై విచారణ కోరుతూ నర్సీపట్నం మైనింగ్ అధికారులకు చేసిన ఫిర్యాదుపై ముందు తేదీలతో తప్పుడు నివేదికలు ఇచ్చి, ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను ఉద్దేశపూర్వకంగా నిరాకరించడం, గ్రామస్తులను మోసం చేసి సంతకాలు సేకరించడంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాడుగుల మండలం చింతలూరుకు చెందిన మెలిపాక మణికంఠ కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 379–1లో అక్రమాలపై చేసిన ఆరు ఫిర్యాదులను నీరు గార్చడానికి మైనింగ్ అధికారులు, క్వారీ నిర్వాహకులు కలిసి నేరపూరిత చర్యలకు పాల్పడారని వారిపై చర్యలు తీసుకోవాలని, మైనింగ్ అధికారుల ప్రమేయం లేకుండా స్వతంత్ర టాస్క్ఫోర్స్ కమిటీతో పునర్విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
కౌమార దశలో గర్భధారణతో దుష్ప్రభావాలు
తుమ్మపాల : కౌమార దశలో గర్భం దాల్చడం వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘కౌమార దశలో గర్భధారణ – కారణాలు, దుష్ప్రభావాలు అవగాహన‘ గోడ పత్రికలను ఆమెతో పాటు జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించడం, అనుమానాస్పద సంఘటనలపై తక్షణమే అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి సూర్యలక్ష్మి, డీఎంహెచ్వో హైమావతి, సిబ్బంది పాల్గొన్నారు. జీరో పావర్టీ పీ4 తొలి వార్షికోత్సవాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తిరుపతి పద్మావతీ మహిళా యూనివర్సిటీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్లో నిర్వహించారు. -
‘క్రేజీ’ స్కూళ్లు
యలమంచిలి రూరల్ : జిల్లా కేంద్రం అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, అచ్యుతాపురం, అడ్డురోడ్డు సహా జిల్లాలో దాదాపుగా అన్ని మండల కేంద్రాలు, పెద్ద పంచాయతీల్లో ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్ల దందా మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల స్థాయిలోనే ఐఐటీ, నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ల పేరుతో విద్యార్థులపై మితిమీరిన ఒత్తిడి పెంచుతున్నారు. తల్లిదండ్రులపై అదనపు ఫీజుల భారం మోపుతున్నారు. కార్పొరేట్ స్థాయి వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలు అంటూ రంగురంగుల బ్రోచర్లు చూపిస్తూ సామాన్య తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి యాజమాన్యాలు. తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు తమ కళ్ల ముందే నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నా మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్కు సలామ్ కార్పొరేట్ శక్తులు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. జిల్లాలో కార్పొరేట్, కొన్ని బడా ప్రైవేటు యాజమాన్యాలు అనుమతుల్లేకపోయినా ధనదాహంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నా అటువైపు అధికారులు కన్నెత్తయినా చూడడానికి సాహసించడం లేదు. నిబంధనల ప్రకారం ఎల్కేజీ, కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు అనుమతులు ఇవ్వరు. కానీ ప్రైవేటు పాఠశాలల్లో ఈ తరగతుల నిర్వహణ నిరాటంకంగా కొనసాగిపోతోంది. విద్యాశాఖ అధికారుల తీరుతో యాజమాన్యాలు ఆడిందే ఆట..పాడిందే పాట అన్న చందంగా వాటి నిర్వహణ సాగుతోంది. సమాచారం నిల్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కిండర్ గార్డెన్ స్కూళ్ల వివరాలు నమోదైన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. కార్యాలయ అధికారులు తమకు తగిన సమాచారం లేదంటున్నారు. మరోవైపు కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో నిబంధనలు బేఖాతరు చేస్తూ అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నా నేటికీ ఒక్క స్కూల్పై కూడా చర్యలు చేపట్టలేదంటేనే కార్పొరేట్ యాజమాన్యాలతో వారికి ఉన్న బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో అనుమతులు లేకుండానే ప్రైమరీ, ఉన్నత పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అనుమతుల్లేకుండా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణ పుట్టగొడుగుల్లా కిండర్ గార్డెన్ స్కూళ్లు విద్యాసంవత్సరం ముగియకుండానే అడ్మిషన్లు ప్రారంభం తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ యాజమాన్యాలు తనిఖీలు మరిచిన విద్యాశాఖ అధికారులు -
కోర్టు ఆదేశాలు ధిక్కరణ
చెరువు గర్భంలో మరలా పనులు చేస్తున్న దృశ్యం గొలుగొండ: మండలంలోని సీహెచ్ నాగాపురం చెరువు గర్భంలో శ్మశాన వాటిక పనులు చేయకూడదని కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు ధిక్కరించారు. మళ్లీ పనులు చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో శ్మశాన వాటిక ఉంది. ఆ స్థలాన్ని వదిలేసి కూటమి నేతలు రైతులకు ఉపయోగపడే చెరువు గర్భంలో శ్మశాన వాటిక పనులు చేస్తున్నారు. ప్రస్తుతం చెరువు గర్భంలో ఏర్పాటు చేస్తున్న శ్మశాన వాటిక పాఠశాలకు ఆనుకుని ఉండటం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతారని ప్రజలు ఆర్నెల్ల క్రితం వ్యతిరేకించారు. దీంతోపాటు రైతులు ఇబ్బందులు పడే అవకాశముందని గ్రామస్తులు, పంచాయతీ పాలకులు కోర్టును ఆశ్రయించారు. దాంతో చెరువు గర్భంలో పనులు నిలుపుదల చేయాలని నాలుగు నెలలు క్రితం కోర్టు ఎంపీడీవో, పీఆర్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అధికారులు పనులు నిలుపుదల చేశారు. మళ్లీ రెండు రోజుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా పనులు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు. కోర్టు ఆదేశాలు ధిక్కరించి పనులు చేస్తున్న అధికారులుపై జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
ఇసుక తవ్వకాలు చేస్తే క్రిమినల్ కేసులు
మాకవరపాలెం: అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని తహసీల్దార్ ముజీబ్ స్పష్టం చేశారు. సాక్షిలో సోమవారం తవ్వుకో.. అమ్ముకో శీర్షికన వచ్చిన కథనంతో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. దీనిపై స్పందించిన తహసీల్దార్ మాట్లాడుతూ జంగాపల్లి సర్పానదిని ఆనుకుని నిర్వహిస్తున్న తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ఈ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టడం, ఇసుకను తరలించడం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. అలాగే జీ.కోడూరు, జంగాలపల్లి గ్రామ రెవెన్యూ అధికారులను ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చామన్నారు. ఇకపై ఆ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేస్తే ఆ రెండు గ్రామాల వీఆర్వోలపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2న వాటర్ స్పోర్ట్స్ పోటీలు అనకాపల్లి : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలు ఏప్రిల్ 2న ముత్యాలమ్మపాలెం బీచ్లో సబ్ జూనియర్–15 జూనియర్–18 బాలబాలికలకు నిర్వహించడం జరుగుతుందని సంస్థ జిల్లా అధికారి పూజారి శైలజ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఏప్రిల్ 10, 11 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి సైకిలింగ్ పోటీలలో ఎంపికైన బాలబాలికలు ఏప్రిల్ 4, 5 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ల్లడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్లు 933277778, 8125416870లను సంప్రదించాలన్నారు. -
రాయి పిక్కలు ఏరుకున్నా టాక్స్ కట్టాల్సిందేనా..?
రావికమతం : గ్రావెల్, రాయి ఏదైనా తెచ్చుకోవాలంటే మైనింగ్ సిబ్బందికి డబ్బులు కట్టాల్సిందే.. లేదంటే కుదరదంటున్నారు మైనింగ్ సిబ్బంది. మండలంలో గర్నికంలో ఇంటి నిర్మాణానికి రాయి పిక్కలను తీసుకొస్తుండగా ఏఎంఆర్ సంస్థ మైనింగ్ సిబ్బంది అడ్డుకోవడంపై మహిళలు తిరగబడ్టారు. కొండ ప్రాంతంలో రాయి పిక్కలు ఏరుకొని తీసుకొస్తుండగా టాక్స్ కట్టమనడం ఎంత వరకు సమంజసం.. అంటూ మైనింగ్ కంపెనీ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ విషయమై సోమవారం గర్నికం గ్రామస్తులు, సర్పంచ్ భర్త నూకరాజు ిమైనింగ్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెంధిన కొందరు మహిళలు పక్కా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. గచ్చులు చేయడానికి రాయి పిక్క అవసరం కావడంతో సమీపంలో గల మెట్ట ప్రాంతంలో చిన్న రాయి పిక్కలను పోగుచేసుకొని వాటిని ట్రాక్టర్లో వేసి తీసుకెళుతుండగా ఏఎంఆర్ మైనింగ్ సంస్థ సిబ్బంది టాక్స్ కట్టాలని అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఇస్తుంటే , రాయి పిక్కలకు ట్యాక్స్ కట్టడం ఏంటని ప్రశ్నించారు. దీంతో సర్పంచ్ భర్త నూకరాజు తదితరులు అక్కడికి చేరుకొని మైనింగ్ సంస్థను తప్పు బట్టారు. రాయి పిక్కలకు కూడా ట్యాక్స్ కట్టాలని ఉందా , ఉంటే అందుకు సంబంధించిన జీవో చూపించాలని నిలదీశారు. ప్రతి దానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తే సామాన్యులు ఎలా బతకాలి... అని కూటమి ప్రభుత్వం సంపద సృష్టించడం అంటే ఇదేనా? అంటూ మహిళలు వాపోయారు. -
లీజు విధానం... ఆలయ భూముల ఆక్రమణలకు ఊతం
జిల్లాలో హిందు దేవాలయాల భూముల ఆక్రమణలపై విచారణ చేపట్టి భూములను రక్షించడంతో పాటు శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునఃనిర్మాణం చేయాలని బీజేపీ జనతా వారధి కోకన్వీనర్ జిల్లా ఉపాధ్యక్షుడు దొగ్గా ఈశ్వరప్రసాద్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ప్రైవేటు భూములు దేవాలయ భూముల జాబితాలో కలిసిపోయాయనే నెపంతో వందల ఎకరాల దేవాలయ భూములను ఆక్రమించేస్తున్నారని, దీంతో పాటు 33 ఏళ్ల పాటు దేవాలయ భూముల లీజు విధానం సరైంది కాదని అధికారులు పునఃపరిశీలన చేయాలన్నారు. జీవో నెం.139ను పూర్తిగా రద్దు చేయాలని, ఆక్రమణను రెగ్యులరైజ్ చేయడం నిలిపివేయాలని, దేవాలయాల ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికే ఖర్చుచేసేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. దింతో పాటు ఏళ్ల తరబడి సంచార జాతులగా నివాసముంటున్న కుటుంబాలను గుర్తించి వారికి కులధ్రువీకరణ పత్రాలు అందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని మరో వినతి పత్రం అందించారు. –దొగ్గా ఈశ్వరప్రసాద్ -
అధికారుల అండతో అక్రమ రిజిస్ట్రేషన్లు
రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా కొనుగోలు చేసిన భూమిని తన పేరున కాకుండా రెవెన్యూ అధికారులు రీసర్వేలో ఇతరుల పేరున ఆన్లైన్ చేయడంతో తన భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, తక్షణమే రిజిస్ట్రేషను జరగకుండా నిలిపివేసి తన పేరున ఆన్లైన్ చేయాలంటు కశింకోట మండలం అచ్చెర్ల గ్రామానికి చెందిన కర్రి రాజేశ్వరి రెవెన్యూ క్లినిక్లో ఫిర్యాదు చేశారు. దస్తావేజు నెం.2199/2023 దిన ఉన్నప్పటికీ 2024లో జరిగిన రీసర్వేలో ఇతరుల పేరున వీఆర్వో ఆన్లైన్ చేయడం దారుణమని, తక్షణమే విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. –కర్రి రాజేశ్వరి -
సరదా కోసం వెళ్తే.. ప్రాణం పోయింది
ఆనందపురం: గంభీరం రిజర్వాయర్లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామానికి చెందిన మలిరెడ్డి నితిన్ (20), తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్డీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. మధురవాడలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటున్న నితిన్.. మధ్యాహ్నం హాస్టల్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా తన స్నేహితులతో కలిసి ఆటోలో రిజర్వాయర్ సందర్శనకు వెళ్లాడు. స్నేహితులు ఈతకు దిగగా, నితిన్ ఒడ్డున ఉన్న సిమెంట్ గోడపై కూర్చున్నాడు. ఈ క్రమంలో అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అపస్మారక స్థితిలో నితిన్ను బయటకు తీసి, 108కు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని నితిన్ను పరీక్షించి.. అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు, ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్న మలిరెడ్డి దీక్షిత్ ఫిర్యాదు మేరకు ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేతికి అందొచ్చిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి. ఎస్ఐ పి.శివ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రౌడీలతో భూ ఆక్రమణకు యత్నం
పూర్వం నుంచి తమ ఆక్రమణలో ఉన్న పీడబ్ల్యూడీ భూమిలో పెంచుకున్న జీడిమామిడి, పనస చెట్లను దౌర్జన్యంగా నరికివేసి తన భూమిలోకి అక్రమంగా చొరబడి ఆక్రమించేందుకు ప్రయత్నించిన విషయమై తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని, దీంతో ఆక్రమణదారులు రౌడీలతో తమపై దాడులకు దిగుతున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించడంతో పాటు నా భూమిని రక్షించాలంటూ అనకాపల్లి మండలం దిబ్బపాలెం గ్రామానికి చెందిన భార్యభర్తలు కాండ్రేగుల సత్యవతి, సూర్యారావు ఫిర్యాదు చేశారు. చెట్ల నరికివేతపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశించాలని పీజీఆర్ఎస్లో కలెక్టర్ను కోరారు. – కాండ్రేగుల సూర్యారావు -
చదువుకొనగ రా రమ్మని..!
విద్యా సంవత్సరం ముగియకముందే జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండానే వచ్చే విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించడం, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తూ తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నాయి. కిండర్గార్డెన్ స్కూళ్లు.. వేల కొద్దీ ఫీజులు ఫిర్యాదులొస్తే చర్యలు జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఎల్కేజీ, యూకేజీ వంటి తరగతులు నిర్వహిస్తున్నట్టు గానీ, కిండర్ గార్డెన్ స్కూళ్ల నిర్వహణపై గానీ ఫిర్యాదులొస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రైవేటు పాఠశాలలు సక్రమంగా నిర్వహించేందుకు తరచూ తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. –గిడ్డి అప్పారావు నాయుడు, డీఈవో జిల్లాలో 122 మంది ప్రైవేటు స్కూళ్లు ఉండగా వాటిలో సుమారుగా 58 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో చాలా పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక జిల్లాలో 150కి పైగా కిండర్ గార్డెన్ స్కూళ్లు ఎటువంటి అనుమతులు లేకుండానే నడుస్తున్నాయి. ఈ స్కూళ్లు విధిగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. కానీ ఈ పాఠశాలల్లో వేలకొద్దీ ఫీజులు గుంజుతున్నారు. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా ‘ఫిర్యాదు వస్తేనే స్పందిస్తాం...’ అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రైవేటు, కార్పొరేటు యాజమాన్యాల ప్రలోభాలకు తలొగ్గుతున్న అధికారులు వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. అధిక ఫీజులు, పుస్తకాల పేరిట దోపిడీ జరుగుతున్నా మిన్నకుండిపోతున్నారు. అర్హత లేని టీచర్లతో తక్కువ వేతనాలకు బోధన చేయిస్తూ ఏటా రూ.కోట్లలో లాభాలు ఆర్జిస్తున్నారు. మునగపాకలో ఇటీవల ఓ ప్రైవేటు విద్యాసంస్థ అనుమతుల్లేకుండా ముందస్తు ప్రవేశాలు చేపడుతుండడంపై ఏఐఎస్ఎఫ్ నేతలు ఆందోళన నిర్వహించారు. చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇస్తున్నా ప్రయోజనం ఉండడం లేదు. -
ఉరేసుకుని గిరిజన యువతి ఆత్మహత్య
దేవరాపల్లి: గిరిజన యువతి దూసరి లక్ష్మి(22) సోమవారం రాత్రి దేవరాపల్లిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ శివారు కొరపర్తి గ్రామానికి చెందిన పెంటయ్య, జమ్ములమ్మ దంపతుల ఇద్దరు కుమార్తెలు దేవరాపల్లిలో ఐదేళ్లగా నివసిస్తున్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి స్థానిక ప్రైవేటు మెడికల్ ల్యాబ్లోను, చిన్న కుమార్తె భవాని సెల్ దుకాణంలోను పని చేస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తన అక్క ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోతున్నట్లు వేరొక వ్యక్తి ఫోన్ ద్వారా తెలుసుకున్న చెల్లెలు భవాని వెంటనే తాము అద్దెకుంటున్న గదికి పరుగులు తీసింది. అప్పటికే అక్క చున్నీతో ఉరేసుకొని విగతజీవిగా ఉండటాన్ని చూసి బోరున విలపించింది. ఈమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని మృతురాలి చెల్లెలు భవాని చెప్పినట్లు తెలిసింది. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతిరాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని కె.కోటపాడు సీహెచ్సీకి తరలిస్తున్నట్లు తెలిపారు. గిరిజన యువతి ఆత్మహత్యతో దేవరాపల్లిలోపాటు కొరపర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఎస్పీ కార్యాలయంలో 64 ఫిర్యాదులు
ఆర్జీదారుల సమస్యలను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 64 ఆర్జీలు వచ్చాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు ఎస్పీ తుహిన్ సిన్హాకు వివరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల వేదికలో వచ్చి అర్జీలు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు–31, కుటుంబ కలహాలు–2, మోసపూరిత వ్యవహారాలు–5, ఇతర విభాగాలకు చెందినవి–26 వచ్చినట్టు తెలిపారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు. డ్వామా పీడీ పూర్ణిమాదేవి బదిలీ తుమ్మపాల : జిల్లా నీటి యాజమాన్య సంస్థ డ్వామా పీడీ ఆర్.పూర్ణిమాదేవిని బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా నుంచి పార్వతీపురం మన్యం జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారిగా ఆమెకు బదిలీ అయ్యింది. ఎండీఎంను ప్రైవేటుపరం చేయొద్దని ధర్నా రోలుగుంట: మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు సోమవారం స్థానిక ఎంఈవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకురాలు కె.ప్రసన్న మాట్లాడుతూ స్మార్ట్ కిచిన్ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రయివేటుపరం చేస్తోందన్నారు. ఈ పథకం కింద జిల్లాలో నాలుగు వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ఈ పథకాన్ని కొనసాగిస్తూ నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకుడు ఈరెల్లి చిరంజీవి, ఎండీఎం మండల నాయకులు అమ్మాజి, రమ, వరహాలమ్మ, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని యువకుడి మృతి
ప్రమాద స్థలంలో లోకేష్ మృతదేహం మాకవరపాలెం: మండలంలోని తామరం వేంకటేశ్వర ఆలయ సమీపంలో శనివారం అర్ధరాత్రి లారీ ఢీకొని యువకుడి దుర్మరణం చెందాడు. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన చింతాడ లోకేష్(25) కశింకోట మండలం సుందరయ్యపేటలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తన మోటార్ సైకిల్పై మాకవరపాలెం వైపు వస్తున్నాడు. అదే సమయంలో నర్సీపట్నం నుంచి తాళ్లపాలెం వైపు ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో లోకేష్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై లోకేష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ దామోదర్నాయుడు ఆదివారం తెలిపారు. లారీని పట్టుకున్నామన్నారు. -
బెట్టింగ్ల ఉచ్చులో పడొద్దు
అనకాపల్లి: అత్యాశకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ తుహిన్ సిన్హా అదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ నిర్వాహకులపై ఆన్లైన్ బుకీలపై ప్రత్యేక పోలీస్ బృందాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. బెట్టింగ్ నిర్వహించినా, ప్రోత్సహిహించినా, పాల్గొన్నా ఏపీ జూద చట్టం ప్రకారం అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ యాప్ల ఉచ్చులో పడవద్దన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. -
ఇమ్మానుయేలు సంస్థ హాస్టల్లో అగ్నిప్రమాదం
● ప్రమాద సమయంలో లేని విద్యార్థులు ● తప్పిన పెనుప్రమాదం మాకవరపాలెం: హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని కొండల అగ్రహారంలో ఇమ్మానుయేలు సంస్థ నిర్వహిస్తున్న హాస్టల్లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉమ్మడి జిల్లాకు చెందిన 80 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరంతా నిత్యం ఉదయం తామరంలో సంస్థకు చెందిన ఎడ్యుకేషన్ క్యాంపస్లోని స్కూల్కు బస్సుపై వెళ్లి తిరిగి సాయంత్రం హాస్టల్కు చేరుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మూడు అంతస్థులు కలిగిన హాస్టల్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో స్థానికులు గమనించిన వెంటనే స్పందించి మంటలు చెలరేగిన గదుల్లో ఎవరూ లేకపోవడంతో రెండో అంతస్థులో ఉన్న పది మంది విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ప్రతి ఆదివారం ఈ విద్యార్థులంతా హాస్టల్కు సమీపంలో సంస్థకు చెందిన చర్చికు వెళతారు. ఆదివారం కూడా సుమారు 70 మంది వరకు చర్చికి వెళ్లడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇదే అగ్నిప్రమాదం రాత్రి వేళలో జరిగితే ఎందరో విద్యార్థులు మృత్యువాత పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరిగి నా గాయపడేవారన్నారు. ఈ సంఘటనలో హాస్టల్లో ఉన్న ఒక బైక్తోపాటు విద్యార్థుల పుస్తకాలు, బట్టలు ఉంచిన పెట్టెలు కాలిపోయాయి. విద్యార్థులంతా క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా రు. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. హాస్టల్ను పరిశీలించిన ఎంఈవో హాస్టల్ను ఎంఈవో మూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా మంటలు చెలరేగిన హాస్టల్ భవనం, కాలిపోయిన విద్యార్థులు పెట్టెలను పరిశీలించారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల సంఖ్యను తెలుసుకున్నారు. నివేదికను డీఈవోకు అందజేశామని, విద్యార్థులను ఇక్కడి నుంచి తామరంలో ఇమ్మానుయేలు సంస్థకు చెందిన మరో హాస్టల్కు తరలించామని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. -
మరణంలోనూ వీడని స్నేహం
ఉమ్మలాడ శారదానదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి మునగపాక: వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. చివరకు శారదానదిలో స్నానానికి వెళ్లి ఒకేసారి మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని ఉమ్మలాడలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం ఇక్కడ శారదానదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరూ మునిగిపోయి మృతి చెందారు. ఎస్ఐ పి.ప్రసాదరావు తెలిపిన వివరాలు ప్రకారం.. అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ పరిధి ముత్రాసు కాలనీకి చెందిన చింతా రోహిణ్కుమార్ (26), తాడి హర్షవర్దన్ (24) అనకాపల్లిలోని వేర్వేరు చోట్ల పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఇరువురు కలిసి సమీపంలోని ఉమ్మలాడ శారదానదిలో స్నానానికి వెళ్లారు. స్నానానికి వెళ్లిన ఇద్దరూ నదిలో ఒక్కసారిగా మునిగిపోయారు. గమనించిన స్థానికులు మునగపాక పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి అనకాపల్లి రెండొందల ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా అందివస్తారనుకున్న కొడుకులు నదిలో మునిగిపోయి ఇలా విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. -
ఇదేం ‘పచ్చ’పాతం
● దేవరాపల్లి పార్కులో శిలాఫలకాల ఏర్పాటులో ప్రొటోకాల్కు తూట్లు ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మాణ పనులకు శ్రీకారం ● శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించిన అప్పటి డిప్యూటీ సీఎం బూడి ● తాజాగా పార్కు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన అధికారులు ● శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని మూలన పడేసిన వైనం దేవరాపల్లి: మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పార్కులో శంకుస్థాపన శిలాఫలకాన్ని ఏర్పాటు చేయకుండా మూలన పడేయడం వివాదస్పదమైంది. తాజాగా పార్కు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన వీఎంఆర్డీఏ అధికారులు శంకుస్థాపన శిలాఫకం ఏర్పాటులో పక్షపాత వైఖరిని ప్రదర్శించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో... స్థానిక పోలీస్స్టేషన్కు ఎదురుగా శిథిలావస్థకు చేరుకుని దశాబ్దాలుగా అధ్వానంగా ఉన్న ఇరిగేషన్ క్వార్టర్స్ను తొలగించి ఆహ్లాదకర పార్కు, యోగా భవనం, వాకింగ్ ట్రాక్ నిర్మించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సంకల్పించారు. అప్పట్లోనే వీఎంఆర్డీఏ నుంచి రూ. 75 లక్షలు మంజూరు చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. సగం పనులను సైతం అప్పట్లోనే పూర్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేసింది. ఈ నెల 13న పార్క్ను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్తో కలిసి ప్రారంభించారు. పైలాన్ నిర్మించి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన అధికారులు, పార్కు నిర్మాణ సమయంలో వేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని యోగా భవనంలో మూలన విడిచిపెట్టడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికారులు కూటమి నేతల మెప్పు కోసమే ఇలా వ్యవహరించారని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రారంభోత్సవ శిలాఫలకంలో పేర్లు రాయించడంలోను వీఎంఆర్డీఏ అధికారులు ప్రొటోకాల్కు తూట్లు పొడిచారు. ఎంపీపీ, జెడ్పీటీసీ పేర్లు లేకుండా చేసి ప్రొటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ప్రొటోకాల్ పాటించకుండా పక్షపాతంగా వ్యవహరించిన వీఎంఆర్డీఏ అధికారుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
మంచినీటి కోసం గిరిజనుల అవస్థలు
దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు మదనగురువులో గిరిజనులు మంచినీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. తాగునీటి సదుపాయం లేకపోవడంతో గ్రామానికి దూరంగా ఉన్న గెడ్డలో ఊట నీరే తమకు శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కలెక్టర్ స్పందించి తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం చేతులు జోడించి వేడుకున్నారు. వీరికి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న, మండల కార్యదర్శి బి.టి. దొర మద్దతు పలికారు. అటవీ ప్రాంతంలో జీవిస్తున్న గిరిజనులను అడవి జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని సీపీఎం నాయకులు విమర్శించారు. గిరిజనులను ఉద్ధరించేందుకు అడవి బాట పట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఇక్కడ కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గెడ్డలో కలుషిత నీరు తాగడం వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ తదితర విష జ్వరాల బారినపడుతున్నారని వాపోయారు. ప్రభుత్వ పాలకులు యుద్ధప్రాతిపదికన స్పందించి మంచినీటి సదుపాయం కల్పించాలని, లేకుంటే వచ్చే నెల 2న కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని బాధిత గిరిజనులు హెచ్చరించారు. కార్యక్రమంలో పాంగి కన్నయ్య, పాంగి రామన్న, మామిడి చిన్నయ్య, పాంగి పెద భీమన్న, పాంగి చిన బీరాజు, పాంగి సన్యాసమ్మ, పి. దేముడమ్మ, సూకురి లక్ష్మి, మామిడి సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలి నిరసన -
కమ్యూనిటీ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు
ఎంవీపీకాలనీ: నగరంలోని కమ్యూనిటీ ప్రాంతాల అభివృద్ధికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఆదివారం ఎంవీపీకాలనీలోని అప్పుఘర్, వాసవానిపాలెం సాగర తీర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్లూమ్బర్గ్ ఫిలాంత్రోపీస్ 2025–2026 మేయర్స్ చాలెంజ్కు ప్రపంచవ్యాప్తంగా ఎంపికై న 24 నగరాల్లో విశాఖ ఒకటిగా నిలవడం గర్వకారణమన్నారు. ఈ విజయం ఫలితంగా నగరంలో ‘వి–పుల్’(విశాఖ–ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్) కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున కమ్యూనిటీ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. పర్యటనలో భాగంగా శివగణేష్నగర్, వాసవానిపాలెంలోని మత్స్యకారులతో మాట్లాడి, ఆయా ప్రాంతాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, కాలువల మరమ్మతులతో పాటు గ్రీన్ బెల్ట్లను అభివృద్ధి చేయాలని మత్స్యకార గ్రామాల పెద్దలు కమిషనర్కు విన్నవించారు. ‘వి–పుల్’ద్వారా ప్రజా భాగస్వామ్యంతో ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ సిద్ధంగా ఉందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. జెడ్సీ శివప్రసాద్, వైద్యాధికారి ప్రసాదరావు, పలువురు వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ -
దళితుల భూ సమస్యల పరిష్కారానికి కృషి
రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు సీతారాం నర్సీపట్నం: అన్యాక్రాంతమైన దళితుల భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం పేర్కొన్నారు. గొలుగొండ మండలం జోగంపేట గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించి దళితల భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాండవ నిర్వాసితులమైన తమకు కోటవురట్ల మండలం పందూరు గ్రామంలో అసైన్డ్ భూములు ప్రభుత్వం ఇచ్చిందని బాధిత దళిత రైతులు కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకువెళ్లారు. ఏ సంబంధం లేని పెత్తందారులు తమ భూముల్లో ఫలసాయాన్ని అనుభవిస్తున్నారని వాపోయారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వివరించారు. దీనికి సీతారాం స్పందిస్తూ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం బాలుర గురుకుల కళాశాల, పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కె.మరిడియ్య, గురుకుల పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చిట్ల చతపతిరావు, తహసీల్దార్ కె.నూకరాజు, ఎంపీడీవో శ్రీనువాసరావు, ఎస్సై రామారావు, రుషికేశ్వరరావు, ఏఎస్డబ్ల్యూవో బాబూరావు, డీహెచ్పీఎస్ నాయకులు డీసీహెచ్ రాజు, డీవీఎంఎస్ సభ్యులు సహదేవుడు, ఈరెల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
మరికొంతకాలం ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరో మూణ్నెల్ల పాటు పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్కుమా ర్ ఒక ప్రకటనలో తెలిపారు. ● విశాఖపట్నం –షాలిమర్ (08508) స్పెషల్ రైలు ప్రతి మంగళవారం విశాఖపట్నంలో ఉదయం 11.20 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్ల వారు 3 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. ఈ రైలును జూన్ 30 వరకు పొడిగించారు. షాలిమర్–విశాఖపట్నం (08507) స్పెషల్ ప్రతీ బుధవారం షాలిమర్లో తెల్లవారుజాము 5గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 8.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలును జూలై 1వ తేదీ వరకు పొడిగించారు. ● సంబల్పూర్– ఈరోడ్ (08311) వీక్లీ స్పెషల్ ప్రతి బుధవారం సంబల్పూర్లో ఉదయం 11.35 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 9.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ్నుంచి 9.32 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 10.50 గంటలకు ఈరోడ్ వెళ్తుంది. ఈ రైలును మే 27వ తేదీ వరకు పొడిగించారు. ఈరోడ్–సంబల్పూర్ (08312) వీక్లీ స్పెషల్ను మే 29వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ఈరోడ్లో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.35గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.08 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ్నుంచి 1.10 గంటలకు బయల్దేరి శనివారం రాత్రి 11.15 గంటలకు సంబల్పూర్ వెళ్తుంది. ● భువనేశ్వర్–యశ్వంత్పూర్(02811) వీక్లీ ఏసీ స్పెషల్ను జూన్ 27వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి శనివారం భువనేశ్వర్లో రాత్రి 7.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 1.53 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 1.55 గంటలకు బయల్దేరి సోమవారం తెల్లవారుజాము 12.15 గంటలకు యశ్వంత్పూర్ వెళ్తుంది. యశ్వంత్పూర్–భువనేశ్వర్ (02812) వీక్లీ ఏసీ స్పెషల్ను జూన్ 29వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి సోమవారం తెల్లవారుజాము 4.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10.53 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 10.55గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6గంటలకు భువనేశ్వర్ వెళ్తుంది. ● యశ్వంత్పూర్–కతిహార్(06571) వీక్లీ ఏసీ స్పెషల్ను జూలై 14వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి మంగళవారం యశ్వంత్పూర్లో ఉదయం 7 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజాము 5 గంటలకు విజయనగరం చేరుకుంఉటంది. అక్కడి నుంచి 5.10 గంటలకు బయల్దేరి గురువారం తెల్లవారుజాము 4.30గంటలకు కతిహార్ వెళ్తుంది. కతిహార్–యశ్వంత్పూర్ (06572) వీక్లీ ఏసీ స్పెషల్ను జూలై 17వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి శుక్రవారం తెల్లవారుజాము 5.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజాము 3.40 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.50 గంటలకు బయల్దేరి మరుసటిరోజుఉదయం 4గంటలకు భువనేశ్వర్ వెళ్తుంది. ● ఎస్ఎంవీ బెంగళూరు–మాల్డా టౌన్(06565) స్పెషల్ రైలును జూలై 12వతేదీ వరకు పొడిగించారు. ఎస్ఎంవీ బెంగళూరులో ఈ రైలు ప్రతి ఆదివారం రాత్రి 11.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 6.13 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 6.15గంటలకు బయల్దేరి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు మాల్డా టౌన్ వెళ్తుంది. మాల్డా టౌన్– ఎస్ఎంవీ బెంగళూరు(06566) స్పెషల్ను జూలై 15వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు బుధవారాల్లో సాయంత్రం 4గంటలకు మాల్డా టౌన్లో బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3.33గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.35గంటలకు బయల్దేరి మరుసటిరోజు శుక్రవారం మధ్యా హ్నం 12.45 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరు వెళ్తుంది. -
నేత్రపర్వంగా ఎదురు సన్నాహం
నక్కపల్లిలో ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం నక్కపల్లి: ప్రాచీన శైవక్షేత్రం ఉపమాకలో భువనేశ్వరి సమేత లక్ష్మణేశ్వరాలయంలో వార్షిక కల్యాణోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శైవాగమన సంప్రదాయం ప్రకారం కల్యాణోత్సవాలు జరిపేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా రాత్రి స్వామివారిని సప్పర వాహనంలోను, పార్వతీ దేవిని పల్లకిలో అలంకరించి కోలాట ప్రదర్శనలతో నక్కపల్లిలో మైలవరభట్ల జోగారావు ఇంటి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి ఆది దంపతుల పెళ్లి చూపులు, పెళ్లిమాటల కార్యక్రమాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. అనంతరం మంచిరాజు సూర్యనారాయణ మూర్తి (సహరాపంతులు), శింగంశెట్టి నాని కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఎదుర్కోలు ఉత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెండ్లిమాట తంతు అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను ఉపమాక ఆలయానికి ఊరేగింపుగా తరలించారు. అర్ధరాత్రి స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు వెలవలపల్లి మహేష్, పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి కొప్పిశెట్టి బుజ్జి వేదపండితులు పసర కొండ పండు, బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు డీవిరామారావు, శ్రీపాద ప్రణవ్రామ్ పాల్గొన్నారు. -
ఉరేసుకుని వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్: మండలంలోని మర్రిబంద కాలనీకి చెందిన మామిడి వెంకటేష్(34) ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. వివరాలివి. మృతుడికి బాగా మద్యం సేవించే అలవాటు ఉండడం వల్ల భార్యతో తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం బంధువులతో కలిసి తలుపులమ్మలోవ దర్శనానికి వెళ్లడానికి అందరూ తయారు కాగా అంతకుముందే ఉదయం వెంకటేష్ మద్యం సేవించడంతో మళ్లీ భార్యభర్తలకు చిన్న గొడవ జరిగింది. దీంతో వెంకటేష్ తలుపులమ్మలోవకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండిపోయాడు. సాయంత్రం కుటుంబసభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి పడకగదిలో చీరతో వెంకటేష్ ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. భార్య ఉమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
కార్యకర్తలే మన బలం
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026గెడ్డలో ఊట నీటిని సేకరిస్తున్న మదనగరువు గిరిజనులుఅనకాపల్లి : కార్యకర్తలే మన పార్టీకు అత్యంత బలమని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. ఆదివారం కశింకోట మండలం తేగాడ గ్రామంలో గల ఎస్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యుడు గొల్లబాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హాజరయ్యారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం సమావేశం ప్రారంభించారు. పార్టీ సంస్థాగత కమిటీలు జిల్లాలో పూర్తయ్యాయని, జిల్లాలో సుమారుగా 57వేల మందిని పార్టీ వివిధ కమిటీల్లో నియమించడం జరిగిందని రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు చెప్పారు. పబ్లిసిటీపై ఉన్న వ్యామోహం..పథకాల అమలుపై లేదు.. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వానికి పబ్లిసిటీ వ్యామోహం తప్ప సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదని అన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండానే సూపర్ హిట్ పబ్లిసిటీ చేయించుకుంటున్న చంద్రబాబును చూసి ప్రజలు నవ్విపోతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాలో రూ. 4,600 కోట్లతో చేపట్టిన మూలపేట పోర్టు పనులు నాడే సుమారుగా 60 శాతం పూర్తి అయినా ఈ రెండేళ్ల పాలనలో పనులు నిలుపుదల చేశారన్నారు. మా ప్రభుత్వంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అమరావతితో పాటు విశాఖ, కర్నూలు అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడితే అసెంబ్లీ సమావేశాల్లో కూటమి నాయకులు అమరావతి అభివృద్ధి కోసం మాట్లాడలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ రాజధానిగా 10 సంవత్సరాలు ఉండగా, ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుఅడ్డంగా దొరికిపోవడంతో అక్కడ నుంచి పారిపోయి అమరావతికి రావడం జరిగిందన్నారు. విశాఖలో రూ.5 వేల కోట్ల ప్రభుత్వ భూమిని స్వాహా చేశారన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపుతో వైఎస్సార్సీపీకే మేలు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డీనేటర్ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 263 అసెంబ్లీ స్థానాలను పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, దీనివల్ల వైఎస్సార్సీపీకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. నక్కపల్లి కేంద్రంగా ప్రైవేట్ స్టీల్ప్లాంట్ను వైఎస్సార్సీపీ హయాంలో తీసుకొస్తే ఒక జూమ్కాల్ తో తానే తెచ్చినట్టు చంద్రబాబు చెప్పుకుంటున్నాడంటూ మండిపడ్డారు. అనకాపల్లి పట్టణంలో రూ.100 కోట్ల విలువైన కన్యకాపరమేశ్వరి దేవస్థానం భూమి కూటమి నాయకులు భూమిని స్వాహా చేయాలని చూడడంతో దానిపై వైఎస్సార్సీపీ పోరాడిందన్నారు. రాజ్యసభ సభ్యుడు గొల్లబాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీగా పాలన సాగుతుందన్నారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా పాలన చేస్తున్నారన్నారు. కేంద్రంలో మహిళలకు చట్టసభలో 30 శాతమా లేదా 33 శాతమా అనేదానిపై చర్చ జరుగుతుందన్నారు. బొడ్డేడకు ఘఽన సన్మానం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తరువాత తొలిసారిగా జిల్లా స్థాయి సమావేశం నిర్వహించిన సందర్భంగా బొడ్డేడ ప్రసాద్ను ఘనంగా సన్మానించారు. సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, మలసాల భరత్కుమార్, అదీప్రాజ్, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, సూర్యనారాయణరాజు, శరగడం చిన అప్పలనాయుడు, సీఈసీ సభ్యులు బి.వి.సత్యవతి, రమణమూర్తిరాజు, కోలా గురువులు, నియోజకవర్గ పరిశీలకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, గండి రవికుమార్, పైలా శ్రీనివాసరావు, సతీష్వర్మ, దంతులూరి దిలీప్కుమార్, ఏడువాక సత్యారావు, వీసం రామకృష్ణ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, ఉత్తరాంధ్ర జిల్లాల జేసీఎస్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్రెడ్డి, పార్టీ జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.సమస్యలపై పోరాటం చేయాలి : కన్నబాబు విశాఖ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ మీ పరిధిలో స్థానిక ప్రజా సమస్యలు, కూటమి వైఫల్యాలపై పోరాటం చేయాలని సూచించారు. వచ్చే నెలలో సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుందని, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు భయపడుతుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందరం సిద్ధంగా ఉండాలన్నారు. ఇటీవల మాకవరపాలెం మెడికల్ కళాశాల పరిశీలనకు వై.ఎస్ జగన్మోహన్రెడ్డి వస్తే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, పోలీసులు అడ్డుకున్నా ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమిలో కుమ్ములాటలు ఉన్నాయని, వై.ఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి భయపడి కలిసి ఉన్నట్టు నటిస్తున్నారన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతమే లక్ష్యం సంస్థాగత నిర్మాణ కమిటీల ఎంపిక దాదాపుగా పూర్తి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా సన్నద్ధంగా ఉండాలి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు -
కల్యాణ వైభోగమే..
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. శ్రీమహా విష్ణువు అవతారమైన శ్రీవరాహ లక్ష్మీనసింహస్వామిని పెళ్లికుమారుడిగా, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పెళ్లికుమార్తెలుగా అలంకరించి నిర్వహించిన ఈ వేడుకను చూసి భక్తులు పులకించిపోయారు. నృసింహ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కొట్నాల ఉత్సవంతో ప్రారంభం పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచే కల్యాణోత్సవ ఘట్టాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద అర్చకులు, ముత్తయిదువలు పసుపుకొమ్ములను దంచి కొట్నాల ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం చేపట్టారు. ముక్కోటి దేవతలను కల్యాణోత్సవానికి ఆహ్వానిస్తూ ధ్వజస్తంభంపై గరుడాళ్వార్ చిత్రపటాన్ని అర్చకులు ఎగురవేశారు. రసవత్తరంగా ఎదురు సన్నాహోత్సవం కల్యాణ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఎదురు సన్నాహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారు వర్ణపు పల్లకీలో, అమ్మవార్లను ముత్యాల పల్లకీలో వేంచేపు చేశారు. సింహగిరి మాడ వీధుల్లో పల్లకీలను ఊరేగిస్తూ, పశ్చిమ మాడ వీధిలోని జోడు భద్రాల వద్ద ఎదురెదురుగా ఉంచారు. స్వా మి, అమ్మవార్ల వైభవాన్ని చాటిచెబుతూ సాగిన ఈ కార్యక్రమం రసవత్తరంగా సాగింది. అర్చకులు పూలదండలతో నృత్యాలు చేస్తూ ఉత్సవాన్ని రక్తి కట్టించారు. పుల్లెల సత్యనారాయణ శర్మ, ముష్టి పవన్ కుమార్ శర్మ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. హోరెత్తిన రథోత్సవం సింహగిరి మాడ వీధుల్లో నిర్వహించిన రథోత్సవం కనులవిందుగా సాగింది. ఉత్సవమూర్తులను రథంపై అధిష్టింపజేశారు. జాలరి పెద్ద కదిరి లక్ష్మణరావు రథ సారథిగా వ్యవహరించగా, విశాఖ నలుమూ లల నుంచి అమ్మవారి బంధువులుగా వచ్చిన జాలర్లు రథాన్ని లాగే బాధ్యతను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తు లు రథం తాళ్లను లాగుతూ స్వామి వారిని సేవించుకున్నారు. కనులపండువగా కల్యాణోత్సవం ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో రాత్రి 10.30 గంటలకు స్వామి వార్షిక కల్యాణోత్సవం ప్రారంభమైంది. రథోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లను కల్యాణ ప్రాంగణంలోకి తీసుకొచ్చి, కల్యాణ వేదికపై వేంచేపు చేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్పం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ వేడుకలను దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యుల పర్యవేక్షణలో అర్చక బృందం నిర్వహించారు. ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాతలు రాంభట్ల నృసింహశర్మ, శేషాచారి వ్యాఖ్యానం అందించారు. దేవస్థానం ఈవో జె. వెంకటరావు ఏర్పాట్లను పర్యవేక్షించగా, గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. నయనానందకరంగా అప్పన్న వార్షిక కల్యాణోత్సవం విశేషంగా ఎదురు సన్నాహోత్సవం పరవశించిన భక్తజనం ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లిన సింహగిరితిరువీధిలో రథోత్సవం -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మరో ఇద్దరికి గాయాలు అనకాపల్లి : అనకాపల్లి–సబ్బవరం హైవేపై రేబాక జంక్షన్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన మైనింగ్ లారీ ఢీకొనడంతో పాటు బొలెరో డ్రైవర్ నాగరాజు(33)ను కొంత దూరం పాటు ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలో నిల్చొని ఉన్న మరో ముగ్గురు యువకులను కూడా లారీ ఢీకొంది. వీరిలో ఒకరు స్వల్పంగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు, బాధితుల కుటుంబ సభ్యులు రోడ్డుపై టెంటు వేసి ఆందోళన చేశారు. మైనింగ్ లారీల దూకుడుకు అడ్డుకట్టవేయాలని డిమాండ్ చేశారు. భరోసా ఇచ్చేంతవరకు మృతదేహాన్ని తీసేది లేదంటూ పట్టుబట్టారు. మృతుడు నాగరాజు సబ్బవరం మండలం నారపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంలో అనకాపల్లి మండలం కాపుశెట్టివానిపాలెం గ్రామానికి చెందిన కరణం శేషాద్రి, కరణం తేజ, కరణం బాలాజీలు గాయపడ్డారు. అనకాపల్లి రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. -
ప్రజా సమస్యలపై సానుకూల దృక్పథం
హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఉమ్మడి విశాఖ జిల్లాల కలెక్టర్లు ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, విజయ కృష్ణన్, దినేష్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో పలు సమస్యలను సభ్యులు ఏకరవు పెట్టారు. వేసవి రీత్యా ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేయాలని, వైద్య సేవలను మరింత విస్తరించాలని, తగినంతమంది వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, విద్యుత్ కోత సమస్యలు లేకుండా చూడాలని జెడ్పీటీసీ సభ్యులు ఈర్లె అనురాధ, సామి సత్యనారాయణ,పైలా సన్యాసిరావు, దూలీ నాగరాజు కోరారు. ఈ సందర్భంగా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైరపర్సన్, కె.కోటపాడు జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ మాట్లాడుతూ గుల్లేపల్లి వద్ద కల్వర్టు నిర్మించి, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని, కింతలి–జాలంపల్లి రోడ్ల పరిస్థితిని అధ్యయనం చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రోడ్లలో ఏర్పడిన గుంతలను పూడ్చాలని డిమాండ్ చేశారు. ● ఎక్కడా ఉచిత విద్యుత్ అమలు కావడం లేదని అనకాపల్లి ఎంపీపీ సూరిబాబు అన్నారు. ఉచిత విద్యుత్ అంటూ బిల్లులు ఇస్తున్నారని,సెల్లో బిల్లులను సభలో చూపించారు. అనకాపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఉచిత విద్యుత్ అమలు కావడం లేదని,అలాగే ఉచిత విద్యుత్ సరఫరా 9 గంటలు ఇవ్వడం లేదని అన్నారు.కానీ ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు సర్కారు గొప్పగా చెప్పుకుంటోందని విమర్శించారు ● ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత పాటించాలని, సోషల్ ఆడిట్ను పక్కాగా నిర్వహించాలని సభ్యులు కర్రి సత్యం,ఈర్లె అనురాధ కోరారు. ఉపాధి హామీ పథకంలో పనులు సక్రమంగా చేపట్టాలని మాడుగుల ఎంపీపీ రాజారామ్ కోరారు. సభ్యులు లేవనెత్తిన అంశాలను సీరియస్గా తీసుకుని వీలైనంత త్వరగా నాణ్యమైన రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ అధికారులను ఆదేశించారు. గిరిజనుల నుంచి విద్యుత్ బిల్లుల వసూళ్లు ఆపాలి గిరిజనులకు ఉచిత విద్యుత్ సౌకర్యం ఉన్నప్పటికీ బిల్లులు ఇవ్వటం సరికాదని, ఆ ప్రక్రియను సరిదిద్దాలని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. రోలుగుంట మండలం అర్ల పంచాయతీ పరిధిలోని కొత్తలోసింగి, లోసింగి, పెదగరువు, పీత్రిగెడ్డ, నీళ్లబంద గ్రామాల్లో గిరిజనులకు విద్యుత్ బిల్లులు ఇచ్చారంటూ ఆమె ప్రస్తావించారు. పునఃపరిశీలన చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు. Iవ పేజీ తరువాయి -
భూ సమస్యలపై వినతుల వెల్లువ
నర్సీపట్నం: ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో దళితుల భూసమస్యలపై అర్జీలు వెల్లువెత్తాయి. తాండవ నిర్వాసితులకు కోటవురట్ల మండలం పందూరు గ్రామంలో ఇచ్చిన భూములను అగ్రవర్ణాల వారు అక్రమించారని గొలుగొండ మండలం జోగంపేట గ్రామానికి చెందిన దళితులు కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకువెళ్లారు.మా భూములను మాకు అప్పగించాలని వారు కోరారు. 1.78 సెంట్ల భూమిని వేరే కులం వారు అక్రమించి భూమిలోకి రానివ్వటం లేదని, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని గొలుగొండ మండలం కశిమి గ్రామానికి చెందిన వేమగిరి సింహాచలం అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఎకరా 81 సెంట్లు భూమి వివరాలను రికార్డుల్లో తొలగించి అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి పేరు నమోదు చేశారని ఆమె మొరపెట్టుకుంది. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డీహెచ్పీఎస్ జిల్లా నాయకులు డొక్కా రాజుబాబు కమిషన్ సభ్యులు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యలను పరిష్కరించి, నివేదిక ఇవ్వాలని సభ్యులు ఆర్డీవో వి.వి.రమణకు సూచించారు. దళితుల భూములకు రక్షణ కల్పించడమే కమిషన్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య, దళిత నాయకులు చిట్ల చలపతిరావు, సహాదేవుడు తదితరులు పాల్గొన్నారు. -
మూలపేట పోర్టు పనులు సత్వరం పూర్తి చేయాలి
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిహ్నమైన మూలపేట పోర్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం శ్రీకాకుళం జిల్లా నౌపడలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ. 4,361.91 కోట్లతో ప్రారంభించిన ఈ పోర్టు పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ఈ సభకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని కోరారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు మద్దిలపాలెం పార్టీ కార్యాలయం నుంచి నాయకులు బయలుదేరతారని ఆయన వెల్లడించారు. -
అప్పన్న కల్యాణం చూతము రారండోయ్
సింహాచలం: చైత్ర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని సింహగిరిపై వేంచేసిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరగనుంది. దేవస్థానం ఈవో జె. వెంకటరావు ఆధ్వర్యంలో అధికారులు, వైదిక వర్గాలు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద జరిగే కొట్నాల ఉత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు ధ్వజారోహణం, 6.30 గంటలకు ఉత్సవమూర్తులతో ఎదురు సన్నాహోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8.30 గంటలకు మాడ వీధుల్లో రథోత్సవం, రాత్రి 10.30 గంటలకు ఉత్తర రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన సుందరమైన వేదికపై స్వామివారి వార్షిక కల్యాణాన్ని జరిపిస్తారు. ఈ వేడుకకు సుమారు 15 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు, వారందరికీ అన్నప్రసాదం, పంపిణీకి తలంబ్రాలు, లడ్డూ ప్యాకెట్లను సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం కొండపైన, దిగువన ఎల్ఈడీ స్క్రీన్లు, చలువ పందిళ్లు, తాగునీరు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో 15 షటిల్ సర్వీసులతో పాటు నగరం నలుమూలలకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. భద్రత కోసం 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్యాణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అప్పన్న మూలవిరాట్ దర్శనాలు లభిస్తాయి, తిరిగి రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. శనివారం ఉదయం రథ కదలికలను అధికారులు శాస్త్రోక్తంగా పరిశీలించి రథోత్సవానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సింహగిరిపై కల్యాణం ప్రాంగణంలో, మాడ వీధిలో, సింహగిరి బస్టాండ్, అన్నప్రసాద భవనం వద్ద, కొండదిగువ బస్టాండ్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. ఫైర్ సేఫ్టీ సిలిండర్లు, అగ్నిమాపక శకటం అందుబాటులో ఉంచారు. దేవస్థానంలో రెగ్యులర్ సీసీ కెమెరాలతో పాటు కల్యాణోత్సవం ప్రాంగణం తదితర ప్రాంతాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. -
గ్యాస్ బండ దొరకడం గగనమే..
● ఖాళీ సిలిండర్లతో తప్పని పడిగాపులు ● డీలర్లు బ్లాక్లో అమ్ముకుంటున్నారని వినియోగదారుల ఆరోపణ నర్సీపట్నం: వంటగ్యాస్ దొరక్క వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా సర్వర్ బిజీ వస్తోంది. గతంలో గ్యాస్ బుక్ చేస్తే 2 నుంచి 3 రోజుల్లో సిలిండరు డెలివరీ అయ్యేది. ప్రస్తుతం 20 రోజులు అవుతున్నా డెలివరీ ఇవ్వడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. ప్రధానంగా హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుతో వినియోగదారులు ఖాళీ బండలు పట్టుకుని గ్యాస్ కోసం రోడ్డు ఎక్కుతున్నారు. శనివారం రెండు లారీలతో సిలిండర్లు వచ్చినా కొందరికే గ్యాస్ లభించింది. చాలా మంది ఖాళీ సిలిండర్లతో సీబీఎం కాపౌండ్ మెయిన్రోడ్డుపై బారులు తీరారు. గ్యాస్ దొరక్క నిరాశతో వెనుదిరిగారు. గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తున్న బాయ్లు ఒక్కో సిలిండర్ను రూ.2 వేలుకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, ఇదంతా ఏజెన్సీ నిర్వాహకుల కనుసన్నల్లోనే జరుగుతుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఏజెన్సీ నిర్వాహకులు తప్పుడు లెక్కలతో అధికారులను సైతం బురిడీ కొట్టిస్తున్నారని చెబున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బుచ్చెయ్యపేట: గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో గ్యాస్ బుక్ చేసుకున్న రెండు మూడు రోజుల్లోనే సిలిండర్ ఇంటికి వచ్చేది. ప్రస్తుతం బుక్ చేసిన 40 రోజుల వరకు గ్యాస్ అందని పరిస్థితి ఏర్పడింది. సింగిల్ సిలిండర్ ఉన్న వారు ఎప్పుడు గ్యాస్ అయిపోతుందో, ఎప్పుడు బుక్ చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. శనివారం వడ్డాదిలో వందలాది మంది గ్యాస్ కోసం మండుటెండలో గంటల తరబడి వేచి ఉండవలసి వచ్చింది. ఈ నెల 19 వరకు బుక్ చేసుకున్న వారికి మాత్రమే గ్యాస్ ఇవ్వగా 20వ తేదీ తరువాత బుక్ చేసుకున్న వారికి గ్యాస్ ఇవ్వకపోవడంతో పలువురు వెనుదిరిగారు. -
అట్టహాసంగా ప్రారంభమైన ఇనార్బిట్మాల్
తాటిచెట్లపాలెం: సాలగ్రామపురంలో దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మాల్గా పేరుగాంచిన ‘ఇనార్బిట్ మాల్’ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇనార్బిట్ మాల్ సీఈవో రజనీష్ మహాజన్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రోహిత్ గోప్లాని, ప్రాజెక్ట్స్ అండ్ డిజైన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యూసఫ్ సయ్యద్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ హిమాంశు ధడుధాలు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులైన క్రీడాకారులు షేక్ కౌసర్ సాహిల్, యాళ్ల సత్తిబాబు, గాలిదేవర శివగంగ దుర్గా, అడ్డగుదురు ప్రణయ్ల చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం విశేషం. మాల్ ప్రారంభం సందర్భంగా మొదటి 500 మందికి ‘గోల్డెన్ టికెట్’ గిఫ్ట్లు ప్రకటించడంతో ఉదయం నుంచే నగరవాసులు భారీగా తరలివచ్చారు. జనం ఒక్కసారిగా లోపలికి రావడంతో స్వల్ప తోపులాట జరగగా, ఫోర్త్ టౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలు అవుట్లెట్లు ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, నగరంలోని అతిపెద్ద మాల్ను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా బారులు తీరారు. -
రామతీర్థానికి అప్పన్న దేవస్థానం పట్టువస్త్రాల సమర్పణ
సింహాచలం: శ్రీరామనవమిని పురస్కరించుకుని విజయనగరం జిల్లా రామతీర్థంలో శుక్రవారం జరిగిన సీతారాముల కల్యాణోత్సవానికి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను వైదిక, అధికారులు తీసుకెళ్లారు. రామతీర్థంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సింహాచలం దేవస్థానం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు గత 11 ఏళ్ల నుంచి అందిస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా అక్కడికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవస్థానం ఈవో జె.వెంకటరావు, అర్చకులు, అధికారులు తీసుకెళ్లారు. -
నేడు ‘ఎర్త్ అవర్’
రాత్రి 8.30కు విద్యుత్ దీపాలు ఆఫ్ చేయండి డాబాగార్డెన్స్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఎర్త్ అవర్–2026’ కార్యక్రమంలో నగర ప్రజలందరూ భాగస్వాములు కావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు గంట పాటు అనవసరమైన విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆపివేయాలని ఆయన కోరారు. 2007లో ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్–ఇండియా’ ప్రారంభించిన ఈ ఉద్యమం, ప్రస్తుతం 190కి పైగా దేశాల్లో విస్తరించి అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా మారిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది ఎర్త్ అవర్ ఉద్యమం 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషమని కమిషనర్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై అవగాహన, విద్యుత్ ఆదా, జీవ వైవిధ్య పరిరక్షణే లక్ష్యంగా సాగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, గృహ సముదాయాల నివాసితులు స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. నివాసిత సంక్షేమ సంఘాలు, యువత, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కదిలి మన భూమిని, భవిష్యత్ తరాలను కాపాడడంలో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. -
జీవీఎంసీ కమిషనర్తో బళ్లారి మేయర్ భేటీ
జీవీఎంసీ అభివృద్ధిని బళ్లారి ప్రతినిధులకువివరిస్తున్న కమిషనర్ కేతన్గార్గ్ డాబాగార్డెన్స్: అధ్యయన యాత్రలో భాగంగా బళ్లారి మేయర్ పి.గాదెప్ప, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జె.ఎస్. ఆంజనేయులు శుక్రవారం కమిషనర్ కేతన్ గార్గ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగర సుందరీకరణ, అభివృద్ధి కార్యక్రమాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. విశాఖలో అమలవుతున్న ‘ఆపరేషన్ లంగ్స్’, 24 గంటల నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి ద్వారా ఆదాయం..వంటి అంశాలను కమిషనర్ వారికి వివరించారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి ఐవీఆర్ఎస్, టోల్ఫ్రీ నంబర్ల పనితీరును తెలియజేశారు. జీవీఎంసీ కార్యాచరణ ఇతర నగరాలకు ఆదర్శంగా ఉందని మేయర్ గాదెప్ప కొనియాడారు. త్వరలోనే బళ్లారి నుంచి ఒక ప్రత్యేక సాంకేతిక బృందాన్ని అధ్యయనం కోసం విశాఖకు పంపిస్తామని, వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బళ్లారి టౌన్ ప్లానింగ్ అధికారి తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. -
సీతారామం
లోకాభిరామం... నేత్ర పర్వంగా సీతారాముల కల్యాణం గ్రామగ్రామాన రామనామం ప్రతిధ్వనించింది...మామిడాకుల తోరణాలు మెరిసిమురిసిపోయాయి.. మందిరాలు, వీధులు కల్యాణ మండపాలుగా మారిపోయాయి... సిగ్గుమొగ్గలైన సీతమ్మ... చిరు మందహాసంతో రామయ్య ఆసీనులయ్యేవేళ ఆయా ప్రాంతాలన్నీ పరమ ధామాల్లా శోభిల్లాయి.. శ్రీరాముడు సీతారాముడిగా మారుతున్న వేళ.. సకల సుగుణాల కలబోత సీతమ్మ.. రామయ్య చెంతన చేరిన వేళ... మంగళవాయిద్యాలు కల్యాణరాగం ఆలపించాయి... వేద మంత్రాలు మిన్నంటాయి.. జై శ్రీరామ్.. జైజై సీతారామ్ అన్న జయజయ ధ్వానాల మధ్య సీతారాముల కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న రామాలయంలో స్వామివారి కల్యాణాన్ని అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, శేషాచార్యులు ఘనంగా నిర్వహించారు. మరో భద్రాద్రిగా పేరుగాంచిన మునగపాక మండలం అరబుపాలెంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కె.కోటపాడు మండలం చిరికిపాలెంలో పిండివంటలతో సీతమ్మకు సారె సమర్పించారు. చోడవరం, నర్సీపట్నం తదితర మండలాల్లో సీతారామ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కనులారా తిలకించిన భక్తులు పరవశించిపోయారు. – సాక్షి, న్యూస్ నెట్వర్క్ సింహగిరిపై రాములోరి వేడుకఘనంగా కల్యాణోత్సవం సింహాచలం : సింహగిరిపై ఉన్న పురాతన రామాలయంలో శుక్రవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ కల్యాణ వేడుకను కనులారా తిలకించి భక్తిపారవశ్యంలో మునిగితేలారు. సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో విష్వక్సేనపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను దేవస్థానం స్థానాచార్యులు టీపీ రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు గిరి, కుమార్, అప్పాజి తదితరులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు కల్యాణ అక్షింతలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఏఈవోలు ఏర్పాట్లు పర్యవేక్షించారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్న ముస్లింలు పెదబోదిగల్లంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం నక్కపల్లి: మతసామరస్యానికి ప్రతీకగా పెదబోదిగల్లం నిలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో సీతారామ కల్యాణోత్సవంలో హిందువులతో పాటు ముస్లింలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. 80శాతం మంది ముస్లింలు నివసించే ఈగ్రామంలో రామమందిర నిర్మాణానికి వారు కూడా విరాళాలిచ్చారు. అంతేకాకుండా శ్రీరామనవమి వేడుకలను కూడా ప్రతిఏటా ఘనంగా నిర్వహించేందుకు సహకరించడంతోపాటు సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారు.శుక్రవారం కల్యాణోత్సవంలో హిందూ, ముస్లింలు భారీ ఎత్తున పాల్గొనడంతో రామాలయం కిటకిటలాడింది. ఈ గ్రామంలో రంజాన్ ఉపవాస దీక్షలను హిందువులు కూడా చేస్తారు. హలీంను హిందువులు తృప్తిగా ఆరగిస్తే.. వడపప్పు, బెల్లంపానకాన్ని రుచి చూడటానికి ముస్లింలు ఆరాటపడతారు.ప్రతిహిందువుల పండగలోను ముస్లింలు పాల్గొంటారు. ఇక్కడ శ్రీరామనవమివేడుకలేకాదు, దేవీనవరాత్రులను కూడా ఘనంగా నిర్వహిస్తారు. హిందువులు ఉరుసుల్లో మొక్కుబడులు చెల్లించుకుంటే, ముస్లింలు తూర్పుగోదావరి జిల్లాలో తలుపులమ్మతల్లిని దర్శించుకుని ముడుపులు సమర్పిస్తారు. -
సందడిగా ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
నాతవరం: పండగలు సందర్భంగా విద్యార్థులకు ఆటలు పోటీలు నిర్వహించేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని ఎస్ఐ వై.తారకేశ్వరరావు కోరారు. శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం నాతవరంలో అండర్ –14 విభాగంలో బాలబాలికలకు ఉమ్మడి జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. బాలికల విభాగంలో గోపాలపట్నం హైస్కూల్ విద్యార్థినులు మొదటి స్థానంలో నిలిచారు. నాతవరం హైస్కూల్, శాంతినికేతన్ స్కూల్ విద్యార్థినులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. బాలుర విభాగంలో గోపాలపట్నం హైస్కూల్ విద్యార్థులు విజేతగా నిలిచారు. చోడవరం హైస్కూల్ ద్వితీయ, గొలుగొండ మండలం కృష్ణదేవిపేట స్కూల్ విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి బహుమతులతోపాటు షీల్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నాతవరం పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి అపిరెడ్డి మాణిక్యం, నాతవరం ఉప సర్పంచ్, వైఎస్సార్సీపీ జిల్లా కమిటి సభ్యుడు కరక అప్పలరాజు, మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, నేతల విజయకుమార్, వైఎస్సార్సీపీ మేధావుల సంఘం మండల శాఖ అధ్యక్షుడు పైల పోతురాజు పాల్గొన్నారు. -
గ్యాస్ సరఫరా చేయాలని గిరిజనుల నిరసన
గ్యాస్ సరఫరా కోసం ఖాళీ కంచాలతో నిరసన తెలుపుతున్న గిరిజనులు రావికమతం: మండలంలో చీమలపాడు పంచాయతీ పరిధి గిరిజన గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయాలని కోరుతూ శుక్రవారం కల్యాణపులోవలో ఖాళీ సిలిండర్లతో ఖాళీ కంచాలు పట్టుకుని గిరిజనులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు మాట్లాడుతూ కొన్ని రోజులు నుంచి గిరిజన గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయలేకపోవడంతో గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఆన్లైన్లో బుక్ చేసుకొని రావికమతం వస్తేనే గ్యాస్ ఇస్తామని ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ వారు చెబుతున్నారని తెలిపారు. గ్యాస్ బుక్ చేసుకుందామంటే ఏజెన్సీ గ్రామాల్లో తరుచూ సిగ్నల్ సమస్య వస్తుందన్నారు. దిగువ గ్రామాలకు వచ్చి ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసుకుని రావికమతం ఏజెన్సీ వద్దకు వెళ్తే నాలుగు రోజులు తర్వాత ఇస్తామని చెప్పుతున్నారని వాపోయారు. గ్యాస్ ఏజెన్సీ వారు గిరిజన గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. -
చెక్పోస్ట్ కార్మికుని మృతికి నష్టపరిహారం చెల్లించాలి
అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వం మండలంలో మైనింగ్ను ఏఎంఆర్ సంస్థలకు అప్పగించి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మైనింగ్ చెక్పోస్టులు వద్ద కార్మికులు 24 గంటలూ విధుల్లో ఉండడంతో అనారోగ్యానికి గురై మృత్యవాత పడుతున్నట్లు వాపోయారు. కార్మికుల చట్టాలను ఏఎంఆర్ సంస్థ నీరుగారుస్తుందన్నారు. మండలంలో మామిడిపాలెం ఏఎంఆర్ మైనింగ్ చెక్ పోస్ట్లో మొబైల్ స్క్వాడ్ విధుల్లో ఉండి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన తాడేపల్లి గూడెంకు చెందిన ముప్పిడి రామిరెడ్డి కుటుంబానికి సదరు సంస్థ రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే ప్రమాదంలో క్షతగాత్రుడైన కూండం గ్రామానికి చెందిన జగదీష్కు పూర్తి వైద్యం అందించాలని కోరారు. మైనింగ్ చెక్ పోస్ట్లో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర అభద్రతాభావంలో ఉన్నారని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందన్నారు. ప్రాణాలకు తెగించి రేయంబవళ్లు మైనింగ్ ప్రాంతాలను చెక్ చేయడంతోపాటు నిత్యం ప్రమాదాలు గురవుతున్న వారికి ఎటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదన్నారు. కనీస వేతనాలు అమలు కావడం లేదని, పనిగంటలు అదనంగా చేయించుకోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు వాపోయారు. లేబర్ అధికారులు చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, ఉపాధ్యక్షుడు గంటా శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో.. ఎటో?
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఇప్పుడు ఆ ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. గత ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రణాళికలను పక్కనపెట్టి, కేవలం తన మార్కు కనిపించాలన్న తాపత్రయంతో చంద్రబాబు ప్రవేశపెట్టిన ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిత్వ శాఖలు గట్టి షాక్ ఇచ్చాయి. కొత్తగా పంపిన డీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపడంతో విశాఖ వాసుల మెట్రో కల మళ్లీ మొదటికి వచ్చింది. వాస్తవానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖ అభివృద్ధిని కాంక్షిస్తూ 76 కిలోమీటర్ల మేర 4 కారిడార్లతో లైట్ మెట్రో ప్రాజెక్టుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. రూ. 14,309 కోట్ల అంచనా వ్యయంతో, పీపీపీ విధానంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2023 డిసెంబర్ 29న ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, విదేశీ డిజైన్లు, డబుల్ డెక్కర్ కారిడార్లంటూ ‘విజనరీ’ పేరుతో కొత్త డీపీఆర్ను రూపొందించారు. కేవలం 8 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ కారిడార్ కోసం పూర్తిస్థాయిలో ఉన్న పాత డీపీఆర్ను మార్చేయడం ఇప్పుడు విమర్శలకు దారితీసింది. ఈ కొత్త ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం ‘డబుల్ డెక్కర్ వస్తే ఇక మెట్రోతో పనేముంది?’ అని ప్రశ్నిస్తూ డీపీఆర్ను తిరస్కరించింది. ‘ఇదేం డీపీఆర్ బాబూ?’ అంటూ కేంద్రం అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సాంకేతిక అడ్డంకులు – కేంద్రం తిరస్కరణ కేంద్ర మంత్రిత్వ శాఖల విశ్లేషణ ప్రకారం.. డబుల్ డెక్కర్ కారిడార్ వల్ల నిర్మాణ సమయం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సాంద్రత, భూసేకరణ సమస్యలు ఈ కొత్త ప్రతిపాదనతో మరింత జటిలమవుతాయి. ఈ నేపథ్యంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్కు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ డబుల్ డెక్కర్ ప్రతిపాదనను తొలగించి, పాత పద్ధతిలోనే సాధ్యమయ్యే రీతిలో మరోసారి కొత్త డీపీఆర్ తయారు చేయాలని తేల్చి చెప్పింది. దీనివల్ల నెలల తరబడి కష్టపడి చేసిన కసరత్తు అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ముగింపు..మళ్లీ మొదటికే కథ! మొత్తానికి విశాఖ మెట్రో కథ ఇప్పుడు ‘మళ్లీ మొదటికి’ అన్నట్లు తయారైంది. కేంద్రం ఆదేశాల మేరకు కొత్త డీపీఆర్ తయారు చేయాలంటే మళ్లీ కొన్ని నెలల సమయం పడుతుంది. అప్పటివరకు నిధుల కేటాయింపు, టెండర్ల ప్రక్రియ ఆగిపోవాల్సిందే. ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారినప్పుడల్లా ఇలా ప్రాజెక్టు నివేదికలు మారిపోతే, సామాన్యుడికి మెట్రో ప్రయాణం ఎప్పటికీ ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. డబుల్ డెక్కర్తోనే అసలు సమస్య విశాఖ మెట్రో కోసం గత ప్రభుత్వం సిద్ధం చేసిన లైట్ మెట్రో డీపీఆర్ బాగుందని కేంద్రం చెప్పినా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టుబట్టి పంపిన ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదనలు ఇప్పుడు ప్రాజెక్టును గందరగోళంలోకి నెట్టాయి. 12 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిశీలనకు వెళ్లిన ఈ కొత్త డీపీఆర్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా డబుల్ డెక్కర్ కారిడార్ ఉంటే మెట్రోకు రావాల్సిన ట్రాఫిక్ తగ్గిపోతుందని, ఇది ప్రాజెక్టు మనుగడకే ముప్పని కేంద్రం స్పష్టం చేసింది. ‘అసలు ఈ డీపీఆర్ మెట్రో అభివృద్ధి కోసమేనా?’ అని పలు శాఖలు సందేహాలు లేవనెత్తడంతో, ఆశలు చిగురించిన వైజాగ్ మెట్రో కథ మళ్లీ మొదటికి చేరింది. మరోసారి డీపీఆర్లో మార్పులకు..! విశాఖ మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కకుండా ప్రభుత్వ ‘విజనరీ’ నిర్ణయాలు అడ్డుపడుతున్నాయి. గత ప్రభుత్వం పంపిన డీపీఆర్నే కొనసాగించి ఉంటే ఇప్పటికే పనులు ప్రారంభమయ్యేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం పట్టుబట్టి చేర్చిన 8 కి.మీ. డబుల్ డెక్కర్ కారిడార్పై కేంద్ర మంత్రిత్వ శాఖలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీనివల్ల మెట్రోకు రావాల్సిన ట్రాఫిక్ దెబ్బతింటుందని కేంద్రం తేల్చిచెప్పింది. అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం కనీసం 5 కిలోమీటర్ల మేరకై నా డబుల్ డెక్కర్ ఉంచాలని పట్టుబడుతోంది. దీనిపై గత 20 రోజులుగా కేంద్ర ప్రతినిధులతో కలిసి అధికారులు మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు. ఫలితంగా మూడోసారి డీపీఆర్లో మార్పులు తప్పనిసరయ్యాయి. ఈ జాప్యం వల్ల వైజాగ్ మెట్రో ప్రాజెక్టు మరోసారి అటకెక్కినట్లయింది. ‘బాబు’ విజనరీని ఛీకొట్టిన కేంద్రం డబుల్ డెక్కర్తో ‘డబుల్’ భారం విశాఖ మెట్రో ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు ఆర్థికంగా, సాంకేతికంగా పెను సవాలుగా మారాయి. గత ప్రభుత్వం 76 కి.మీ మేర రూపొందించిన డీపీఆర్ కంటే.. ప్రస్తుత ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదన వల్ల నిర్మాణ వ్యయం కిలోమీటరుకు 30 నుంచి 40 శాతం అదనంగా పెరిగింది. ఈ భారీ బడ్జెట్ను భరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సైతం నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎన్ఏడీ జంక్షన్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న ఫ్లైఓవర్ల మధ్య మళ్లీ డబుల్ డెక్కర్ నిర్మించడం అత్యంత క్లిష్టమని పేర్కొంది. పైపులైన్లు, విద్యుత్ లైన్ల మార్పిడి వల్ల కాలయాపన జరగడమే కాకుండా, మలుపుల వద్ద మెట్రో వేగం తగ్గి ప్రయాణ సమయం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ మొండి పట్టుదల వల్ల వైజాగ్ మెట్రో పట్టాలెక్కడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. -
నిద్రలో నిఘా.. ముప్పులో భద్రత
మహారాణిపేట: కోట్లాది రూపాయల మత్స్య వ్యాపారానికి నిలయం, వేలాది కుటుంబాలకు జీవనాధారమైన విశాఖ ఫిషింగ్ హార్బర్లో భద్రత డొల్లగా మారింది. ప్రతిష్టాత్మకమైన ఈ హార్బర్లో నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. దీంతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతోంది. పోర్ట్ అథారిటీ పర్యవేక్షణ లోపం మత్స్యకారుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. అలంకారప్రాయంగా 60 కెమెరాలు హార్బర్లో నేరాల నియంత్రణ కోసం విశాఖ పోర్టు సుమారు 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అయితే వీటిలో మెజారిటీ కెమెరాలు మరమ్మత్తులకు గురికావడం, మరికొన్నింటికి నెట్వర్క్ కనెక్షన్లు లేకపోవడంతో నిఘా వ్యవస్థ పూర్తిగా పడకేసింది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న తరుణంలో, కీలకమైన హార్బర్లో కెమెరాలు పనిచేయకపో వడంపై మత్స్యకార వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్ నిఘా లేకపోవడంతో హార్బర్ ప్రాంతం మందుబాబులకు, గంజాయి బ్యాచ్లకు ఆవాసంగా మారింది. రాత్రి సమయాల్లో బోట్లపైనే మద్యం సేవిస్తూ ఘర్షణలకు దిగడం నిత్యకృత్యమైంది. అంతేకాకుండా, బోట్లలోని విలువైన సామాగ్రి, వేట కోసం నిల్వ ఉంచుకున్న డీజిల్ దొంగతనానికి గురవుతున్నాయి. సీసీ ఫుటేజీ అందుబాటులో లేకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. నిషేధ కాలం వేళ.. పెరగనున్న భయం ఫిషింగ్ హార్బర్లో కోట్లాది రూపాయల మత్స్య వ్యాపారం జరుగుతున్నా, భద్రత విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల హార్బర్ అసాంఘిక శక్తులకు, దొంగతనాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో బోట్లపై మద్యం సేవించడం, సామగ్రిని దోచుకోవడం వంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. వచ్చే నెల 15 నుంచి వేట నిషేధ కాలం ప్రారంభం కానుంది. ఆ సమయంలో హార్బర్ నిర్మానుషంగా మారుతుంది కాబట్టి బోట్లకు రక్షణ కల్పించడం యజమానులకు పెద్ద సవాలుగా పరిణమించనుంది. ఇప్పటికై నా విశాఖ పోర్ట్ అథారిటీ స్పందించి వెంటనే సీసీ కెమెరాలను మరమ్మతు చేయాలి. అలాగే వేట లేని సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి. – వాసుపల్లి జానకీరామ్, అధ్యక్షుడు, ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ (ఇండియా), ఫిషింగ్ హార్బర్లో అలంకారంగా ఉన్న సీసీ కెమెరాలు -
ఈవీఎం గొడౌన్ వద్ద అప్రమత్తంగా ఉండాలి
తుమ్మపాల: ఈవీఎం గొడౌన్ వద్ద సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జేసీ శౌర్యమాన్ పటేల్ ఆదేశించారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గొడౌన్ను గురువారం జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. తాళాలు తీయించి గొడౌన్ లోపల కూడా తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ప్రమాణాలపై అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. తనిఖీ క్రమంలో లాగ్బుక్లో సంతకం చేశారు. భద్రతా ప్రమాణాలు, లాగ్బుక్ నిర్వహణ ఇతర అంశాలపై నాయకులతో మాట్లాడారు. భద్రపరిచిన ఈవీఎంల స్థితిగతులను ఎన్నికల విభాగం అధికారులు జేసీకి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆయిషా, కలెక్టరేట్ ఏవో విజయ్కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.శ్రీనివాసరావు, వి.రమేష్, మీసాల సుబ్బన్న, కె.హరినాథ్బాబు, స్థానిక రెవెన్యూ, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బూత్ లెవల్ ఏజెంట్ల వివరాలు పంపండి ●గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు ఏజెంట్ను నియమించి వివరాలను అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు కోరారు. ఈవీఎం గొడౌన్ తనిఖీ అనంతరం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల జాబితా నవీకరణ ప్రక్రియపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు విషయంలో బూత్ లెవల్ అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఓటర్ల జాబితా తయారీలో సహకరించాలని కోరారు. -
విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన
పాడేరు : జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించడంతో పాటు మౌలిక వసతులను కల్పించాలని ఐటీడీఎ పీవో, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం ఏటీడబ్ల్యూవోలు, హెచ్ఎలు, ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల పనితీరుపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తల్లిదండ్రుల నుంచి అందిన ప్రతికూల ఫీడ్ బ్యాక్కు గల కారణాలను నిశితంగా పరిశీలిస్తామన్నారు. పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్కు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. హెచ్ఎంలు జవాబుదారితనంలో విధులు నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అభ్యసన వాతావరణం కల్పించాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో టీడబ్ల్యూ డీడీ పరిమళ, ఏటీడబ్ల్యూఓలు, హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
రెండో రోజు భారత్ గ్యాస్ గోదాం వద్ద వినియోగదారుల పాట్లు
గ్యాస్ గోదాం వద్ద ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు మాడుగుల రూరల్ : భారత్ గ్యాస్ కోసం మాడుగుల సీతారామ గ్యాస్ ఏజెన్సీ వద్ద గురువారం కూడా గ్యాస్ వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో క్యూ కట్టారు. ఈ నెల 20వ తేదీకి ముందు గ్యాస్ బుక్ చేసుకున్న వారికి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. రెండు లారీల ద్వారా గ్యాస్ సిలిండర్లు రావడంతో గురువారం సుమారు 400 మందికి సిలిండర్లు పంపిణీ చేశారు. గురువారం కూడా గోదాం వద్ద తహసీల్దారు రమాదేవి, ఎస్ఐ నారాయణరావు గ్యాస్ సిలిండర్ల పంపిణీని పర్యవేక్షించారు. -
చందనోత్సవం ఏర్పాట్ల పరిశీలన
ఏర్పాట్ల ప్రణాళికను పరిశీలిస్తున్న కలెక్టర్, సీపీ సింహాచలం: ఏప్రిల్ 20న జరిగే శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేందిరప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశించారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవం ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఉచిత దర్శనం, రూ.300, రూ.1000, రూ.1500 మార్గాలను పరిశీలించి భక్తులకు తెలిసేవిధంగా సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు. ఉచిత దర్శనంలో వచ్చే భక్తులకు రెండు మార్గాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో తెలిపారు. క్యూలైన్లలో మంచినీరు, వాష్రూమ్స్, ఎమెర్జన్సీ ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఉత్తర రాజగోపురం నుంచి అన్నదానం భవనానికి వెళ్లే మార్గాలను సీపీ పరిశీలించి భద్రతా పరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కొండపై బస్ కాంప్లెక్స్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు రద్దీని క్రమబద్ధీకరించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింహగింపై పార్కింగ్ ఏరియా తక్కువగా ఉండటంతో ప్రైవేటు వాహనాలను నియంత్రించాలని సూచించారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, దేవస్థానం ఈవో జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
బొలేరో– స్కూటీ ఢీకొని ఇద్దరు మృతి
రావికమతం : స్థానిక బీఎన్రోడ్డులో గురువారం ఎదురెదురుగా వస్తున్న బొలేరో, స్కూటీ వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మైనర్ యువకులు మృతి చెందారు. మరో మైనర్ గాయపడ్డాడు. ఈ దుర్ఘటనపై ఎస్ఐ రఘువర్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రావికమతం గ్రామానికి చేఽందిన డి.ఉదయ్కుమార్ (16), సిహెచ్.కోటేశ్వరరావు(17), ఐ.బాజ్జి(17) అనే ముగ్గురు గురువారం ఏపీ 39ఎఫ్డబ్ల్యు 4047 నంబర్ గల స్కూటీపై కొత్తకోట వైపు వెళుతుండగా అదే సమయంలో గర్నికం గ్రామానికి చెందిన నల్లపురెడ్డి శ్రీను బొలేరో(ఏపీ39టీఎల్ 3332) వాహనంపై పాడేరు వెళుతుండగా ఎదురెదురుగా వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఉదయ్కుమార్ (పండు), కోటేశ్వరరావుల తల నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. గాయపడిన ముగ్గురినీ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఉదయ్కుమార్, కోటేశ్వరరావులకు తలపై బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమించగా నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయ్కుమార్ (పండు) మరణించగా, కోటేశ్వరరావును మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం విమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించి కోటేశ్వరరావు మృతి చెందాడు. మరో యువకుడు బాజ్జి గాయాలతో చికిత్స పొందుతున్నాడు. బొలేరో వాహనం డ్రైవర్ శ్రీనును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రఘువర్మ తెలిపారు. ఇద్దరు మైనర్ యువకులు మృతి చెఽందడంతో రావికమతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రోడ్డెక్కిన కాఫీ రైతులు
● కాఫీని జీసీసీ కొనుగోలు చేయాలని డిమాండ్ ● లేకుంటే ఐటీడీఏను ముట్టడిస్తామని హెచ్చరిక చింతపల్లి: సీజన్కు ముందు దళారులను నమ్మవద్దని, గిట్టుబాటు ధర ఇచ్చి మేమే కొంటామని చెప్పిన జీసీసీ.. ఇప్పుడు తీరా సమయం వచ్చాక ముఖం చాటేయడం ఏంటి? అంటూ కాఫీ రైతులు, గిరిజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ గురువారం చింతపల్లిలో భారీ ఆందోళన చేపట్టారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో తొలుత చింతపల్లిలోని జీసీసీ డీఎం కార్యాలయం ఎదుట రైతులు నిరసన తెలిపారు. అనంతరం రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాఫీ గింజల కొనుగోలుపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేసిన అధికారులు, ఇప్పుడు అకస్మాత్తుగా కొనుగోళ్లు నిలిపివేయడం గిరిజన రైతులకు తీరని అన్యాయమని ధ్వజమెత్తారు.వెంటనే ఐటీడీఏ, జీసీసీ ఉన్నతాధికారులు స్పందించి కొనుగోళ్లు ప్రారంభించకపోతే, రైతులందరితో కలిసి పాడేరు ఐటీడీఏను ముట్టడిస్తామని హెచ్చరించారు. అవసరమైతే రోడ్లపైనే వంటా–వార్పూ చేపట్టి నిరసన తెలియజేస్తామన్నారు.తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను జీసీసీ డీఎం, తహసీల్దార్ శంకర్రావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు చిరంజీవి పడాల్, సీపీఎం నాయకులు పాంగి ధనుంజయ్, ఎంపీటీసీ సత్తిబాబు, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
వసుధైక కుటుంబానికి నిదర్శనం ఏయూ
మద్దిలపాలెం: ఐక్యత, వైవిధ్యమే మన బలం అని, వసుధైక కుటుంబానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నిదర్శనంగా నిలుస్తోందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీచ్రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్ వేదికగా గురువారం నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక విభావరిని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏయూకు ఉన్న ప్రతిష్టకు నిదర్శనంగానే విదేశీ విద్యార్థులంతా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని కొనియాడారు. యువతరం శాంతి, సుస్థిరతకు పాటుపడాలని సూచించారు. ఏయూ అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో విద్యనందిస్తోందని ప్రశంసించారు. విభిన్న దేశాల సంస్కృతులను పంచుకుంటూ సామరస్య జీవనం సాగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. వర్సిటీ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఇది ఒకటని తెలిపారు. కొద్ది రోజుల కిందట నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్కు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పాల్ డగ్లస్ మాట్లాడుతూ.. ఏయూలో ప్రస్తుతం 57 దేశాలకు చెందిన 1,150 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు ఆచార్య ఎన్.ఎం.యుగంధర్, ఆచార్య విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విదేశీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. ప్రత్యేక వస్త్రధారణలతో, ఆకట్టుకునే ఆహార్యంతో తమ దేశ సంస్కృతీ సంప్రదాయాలను, నృత్య రీతులను పరిచయం చేస్తూ వారు నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. -
గ్యాస్ కొరత లేకుండా నిత్యం పర్యవేక్షణ
మాడుగుల రూరల్: గ్యాస్ కొరత లేకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నామని మాడుగుల నియోజకవర్గ పౌర సరఫరాల ఉప తహసీల్దారు(సీఎస్డీటీ) కె.రవిబాబు అన్నారు. మాడుగులలోని సీతారామ భారత్ గ్యాస్ గోదామును ఆయన గురువారం సాయంత్రం తనిఖీ చేశారు. ప్రస్తుతం గోదాంలో 342 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, ఈ వారంలో ఆయిల్ కంపెనీల నుంచి వరుసగా మూడు రోజుల పాటు గ్యాస్ సిలిండర్లు రాకపోవడం వల్ల బ్యాక్లాగ్ ఎక్కువైపోయిందని సీఎస్డీటీ తెలిపారు. దీని వల్ల ఒకేసారి గోదాం వద్ద రద్దీ ఏర్పడిందని, గురువారం 500 మంది గ్యాస్ వినియోగదారులకు సిలిండర్లు అందించామన్నారు. రాబోయే రెండు రోజుల్లో గ్యాస్ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంనది ఆయన స్పష్టం చేశారు. ఘాట్రోడ్డు జంక్షన్లో హోటళ్ల తనిఖీ అనంతరం ఘాట్రోడ్డు జంక్షన్లోని పలు హోటళ్లను సీఎస్డీటీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోదమాంబ ఫ్యామిలీ రెస్టారెంట్లో డొమిస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. రెండు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. దేవరాపల్లిలో కూడా హోటళ్లను తనిఖీ చేసి, రెండు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్టు రవిబాబు తెలిపారు. -
వైఎస్సార్ హయాంలోనే పారిశ్రామికాభివృద్ధికి బీజం
నక్కపల్లి: మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే పాయకరావుపేట నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి బీజం పడిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిశీలకుడు వీసం రామకృష్ణ తెలిపారు. గురువారం ఆయన నక్కపల్లిలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఘనత ముమ్మాటికీ వైఎస్సార్సీపీదేనన్నారు. దీనిపై తాము తప్పుడు ప్రచారం చేస్తున్నామని కొంతమంది టీడీపీ నాయకులు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. పాయకరావుపేట నియోజవకర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేదన్నారు. 30 ఏళ్లపాటు 1983 నుంచి 2009 వరకు, మళ్లీ 2014 – 19 వరకు టీడీపీ ఎమ్మెల్యేలే ఇక్కడ ప్రాతినిధ్యం వహించారన్నారు. ఈ కాలంలో నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. చివరికి విద్యార్థుల ఉన్నత విద్య కోసం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఆనాటి టీడీపీ ఎమ్మెల్యేలు పనిచేశారన్నారు. ఈ ప్రాంత రైతులకు రావాల్సిన తాండవ జలాలను సైతం విడుదల చేయించలేకపోయారని విమర్శించారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్రెడ్డి దృష్టికి ఈ ప్రాంత కరువు సమస్యలు తీసుకెళ్లడంతో ఆయన స్పందించి నక్కపల్లిలో హెటెరో డ్రగ్స్, పాయకరావుపేటలో దక్కన్ కంపెనీలను ఏర్పాటు చేయించారన్నారు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ బహిరంగ వేదికపై చెప్పారన్నారు. విశాఖ – చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్, పరవాడలో ఫార్మాసిటీ, అచ్యుతాపురంలో సెజ్లు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డిదేనన్నారు. నియోజకవర్గానికి 35 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించారన్నారు. నక్కపల్లి మండలంలో ఎస్ఈజెడ్ ఏర్పాటు ప్రతిపాదనలను తీసుకొస్తే భూములు కోసం వచ్చే వారిని చెట్లకు కట్టి కొట్టాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారన్నారు. జగన్ హయాంలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత.. దావోస్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఈవో ఆదిత్య మిట్టల్ను కోరగా, నక్కపల్లి మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూములను మిట్టల్ ప్రతినిధుల బృందం పరిశీలించి వెళ్లిందని వీసం తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆయన చూపించారు. జూమ్ కాల్లో స్టీల్ ప్లాంట్ తెచ్చేశానని లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జూమ్ సమావేశంలోనే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలరా? అని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ భూమి పూజా కార్యక్రమంలో నిర్వాసితులను కనీసం గౌరవించే ప్రయత్నం చేయలేదన్నారు. రైతుల త్యాగం వల్లే ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారన్నారు. వీసీఐసీఆర్లో నక్కపల్లిని క్లస్టర్గా చేసిన ఘతన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిదేనన్నారు. నక్కపల్లి మండలంలో సేకరించిన భూముల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1100 కోట్లు కేటాయించారన్నారు. నక్కపల్లి ఆస్పత్రిని 50 పడకల స్థాయికి పెంచారన్నారు. ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ సమన్వయకర్త కంబాల జోగులుపై విమర్శలు చేస్తున్నారని, ప్రస్తుత ఎమ్మెల్యే, హోం మంత్రి కూడా స్థానికేతరాలన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెప్తామన్నారు. కంబాల జోగులను విమర్శించే అర్హత టీడీపీ చోటా నాయకులకు లేదన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, ఎంపీటీసీ గొర్ల గోవిందరాజు, సర్పంచ్ తళ్ల భార్గవ్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఎల్లేటి సత్యనారాయణ, స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు యలమంచిలి చందు, మాజీ ఎంపీటీసీ పిక్కి తాతీలు, వార్డు సభ్యులు పిక్కి అప్పలరాజు, నాయకులు వంకా కృష్ణ, దమ్ము రమణ, ఎస్ చిన్నా తదితరులు పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయరూ..
రావికమతం: మండలంలో చీమలపాడు పంచాయతీ జెడ్.జోగుంపేట కేంద్రంగా ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని గురువారం గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేతులు జోడించి నిరసన తెలిపారు. చీమలపాడు పంచాయితీ పరిదిలో గల జెడ్.జోగుంపేటలో ఎంపీపీ స్కూల్ ఉంది. జెడ్.జోగుంపేట గ్రామం చుట్టు కరగెడ్డ, గంగంపేట, రొచ్చుపణుకు,పెద గరువు, రాయపాడు, నేరెడు బంద, బంగారు బందలు, అజేయపురం తదితర గ్రామాల గిరిజన విద్యార్థులు జెడ్.జోగుంపేటలో చదువుకుంటున్నారు. రోలుగుంట, రావికమతం మండలాల పరిధిలో 70 గ్రామాల గిరిజన విద్యార్థులకు జెడ్.జోగుంపేట కేంద్రంగా గిరిజన పాఠశాల ఏర్పాటు చేయాలని చోడవరం నియోజవర్గంలో ఒక్క గిరిజన ఆశ్రమ పాఠశాల కూడా లేదని, ఆశ్రమ పాఠశాల ఉంటే గిరిజన విద్యార్థులకు మేలు జరుగుతుందని, జిల్లా కలెక్టర్ స్పందించి జెడ్.జోగుంపేటలో ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాంగి చంద్రయ్య,పాంగి చంపావతి,వంతల ఐలమ్మ పాల్గొన్నారు. -
కోడిపందాలు ఆడుతున్న 9 మంది అరెస్టు
పట్టుబడ్డ వ్యక్తులు, నగదు, కోళ్లు, సెల్ఫోన్లు పాయకరావుపేట : మండలంలో గల ఈదటం గ్రామ శివారులో 9 మంది వ్యక్తులు కోడి పందాలు ఆడుతున్నట్టు సీఐ జి.అప్పన్నకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ పురుషోత్తం, సిబ్బంది దాడి జరిపి పట్టుకున్నారు. వారి వద్ద రూ.3230 నగదు, 3 బతికిన కోళ్లు, 3 చనిపోయిన కోళ్లు, 9 సెల్ఫోన్లు, 5 మోటారు సైకిళ్లు సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కోడి పందాలు, రబ్బరు గుండాట, పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
వేతన సవరణ అమలు చేయకపోతే మరో ఉద్యమం
మెయిన్రోడ్డు డీసీసీబీ వద్ద ధర్నా చేస్తున్న జిల్లా సహకార ఉద్యోగులు అనకాపల్లి : జిల్లా సహకార బ్యాంక్ల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వేతన సవరణలను తక్షణమే అమలు చేయాలని బ్యాంక్ ఉద్యోగుల సంఘం మేనేజర్ రజని, అసిస్టెంట్ మేనేజర్ రత్నం అన్నారు. స్థానిక మెయిన్రోడ్డు జిల్లా సహకార బ్యాంక్ వద్ద ఉద్యోగులు గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల వేతన సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. ఉద్యోగులు నిరంతరం సేవలు అందిస్తున్నప్పటికీ తగిన వేతన సవరణ జరగలేదన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వేతన సవరణ అమలు చేయాలని వారు కోరారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో దశలవారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఫీల్డ్ ఆఫీసర్ శ్రీను, స్టాఫ్ అసిస్టెంట్లు సాయికృష్ణ, వాగ్దేవి, హేమ, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పునరావాసం కల్పించనిదే ఖాళీ చేయం
అచ్యుతాపురం రూరల్ : పునరావాసం కల్పించకుండా గ్రామం నుంచి ఖాళీ చేసేది లేదంటూ దుప్పితూరు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గురువారం దుప్పితూరు గ్రామస్తులు అఖిలపక్ష నాయకుల మద్దతుతో బ్రాండిక్స్ ఆవరణలో గ్రామానికి చెందిన చిట్టి పైడితల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆందోళన చేశారు. ఏపీఐఐసీ అధికారులు దుప్పితూరు గ్రామం మధ్యలో ప్రహరీ చుట్టూ ఉన్న నిర్వాసిత ప్రజలను ఖాళీ చేయాలని భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. గ్రామ దేవతలు, శివాలయం, శ్మశాన వాటిక, దేవదాయ భూములు, దుప్పితూరు గ్రామ ప్రజలకు పునరావాసం, ఆర్అండ్ఆర్ ప్యాకేజ్, గ్రామ కంఠంలో ఉన్న నిర్మాణాలకు నష్టపరిహారం చెల్లించి గ్రామాన్ని తరలించకుండా ఏపీఐఐసీ అధికారులు గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగుతున్నారన్నారు. గ్రామం చుట్టూ ప్రహరీ కట్టడం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఆవేదన చెందారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దుప్పితూరు గ్రామస్తుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో దుప్పితూరు సర్పంచ్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు, ఇతర పార్టీ నాయకులు, దేశంశెట్టి వెంకటరమణ, దేశంశెట్టి పైడియ్యనాయుడు, గ్రామ పెద్దలు దేశంశెట్టి తాతియ్యలు, దేశంశెట్టి ఈశ్వర్రావు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు శెట్టి నాగేశ్వర్రావు, శెట్టి కాసుబాబు, ప్రగడరాజు, దేశంశెట్టి కాసుబాబు, ప్రగడ ఈశ్వర్రావు, ప్రగడ కొండలరావు, మాడెం సూరి అప్పారావు పాల్గొన్నారు. -
మద్యం షాపులపై ఎకై ్సజ్ అధికారుల శీతకన్ను !
మునగపాక : వడ్డించేవాడు మనోడైతే బంతిలో అఖరిలో కూర్చొన్నా అన్నీ అందుతాయన్న సామెత అందరికీ తెలిసిందే. అలాంటి సంఘటన మునగపాకలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో పలువురు వ్యాపారులు లాటరీ ద్వారా షాపులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. మునగపాక మండలంలో ఐదు షాపులు ఉన్నాయి. వాటిలో మునగపాకలో రెండు, నాగవరం, తోటాడ, చూచుకొండ ప్రాంతాల్లో చెరొకటి షాపులు ఉన్నాయి. అయితే ఆయా షాపులకు సంబంధించిన మద్యం అనకాపల్లి గొడౌన్ను నుంచి సరఫరా అవుతుంది. ఏ దుకాణానికి ఎంతమేర మద్యం సరఫరా చేయాలన్నా ఎకై ్సజ్ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో షాపు నిర్వాహకులు తమకు కావాల్సిన పలు రకాల మద్యం సీసాలను కొనుగోలు చేస్తుంటారు. ఆయా బాటిళ్లపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ను ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేస్తే సంబంధిత షాపు పేరు అలాగే వెండర్ నేమ్, బాటిల్ ఎప్పుడు తయారైంది.. అలాగే గొడౌన్ పేరు వంటి వివరాలు తెలుస్తాయి. అయితే మునగపాక మెయిన్రోడ్డులోని వైన్ షాపులో చీప్ లిక్కర్పై ఉన్న క్యూఆర్ కోడ్ను తనకు అందిన సమాచారం మేర స్థానిక సాక్షి విలేకరి స్కాన్ చేస్తే ఇతర ప్రాంతానికి చెందిన వెండర్ పేరు అనగా ఎంఎల్ఎం వైన్స్ పేరు వస్తుంది. దీనిని బట్టి చూస్తే ఇతర ప్రాంతాలకు చెందిన మద్యం ఇక్కడ యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయన్నది తెటతెల్లం అవుతుంది. గురువారం రాత్రి మునగపాక మెయిన్రోడ్డులోని ఇరువైపులా ఉన్న వైన్షాపులను ఎకై ్సజ్ అధికారులు తనిఖీ నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఎకై ్సజ్ సీఐ నాయుడును ఫోన్లో వివరణ కోరేందుకు యత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ విషయమై ఉన్నతాధికారులు తగు విచారణ చేపట్టి అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
దుకాణాల్లో సబ్సిడీ గ్యాస్ వినియోగం
దేవరాపల్లి టిఫిన్ సెంటర్ల తనిఖీ చేస్తున్న సీఎస్డీటీ ఎ.రవిబాబు దేవరాపల్లి : దుకాణాల్లో సబ్సిడీ గ్యాస్ వినియోగించిన ఇద్దరు వ్యక్తులపై సివిల్ సప్లయి అధికారులు 6ఏ కేసులు నమోదు చేశారు. గ్యాస్ కొరత నేపథ్యంలో సివిల్ సప్లయి అధికారులు మండలంలో పలు హోటళ్లు, దాబా, టిఫిన్, టీ దుకాణాలపై గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కమర్షియల్ గ్యాస్కు బదులుగా డొమెస్టిక్( గృహ అవసరాల గ్యాస్) గ్యాస్ను వాడుతున్నట్టు గుర్తించారు. దేవరాపల్లిలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో టిఫిన్ సెంటర్ నిర్వాహకుడిపైన, కాశీపురంలో దాబా యజమానిపైన 6ఏ కేసులు నమోదు చేసి, రెండు సిలిండర్లను సీజ్ చేసినట్టు సివిల్ సప్లయి డిప్యూటీ తహసీల్దార్ ఎ. రవిబాబు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నామని, గృహ అవసరాల గ్యాస్ను వాణిజ్య సముదాయాలలో వినియోగిస్తే క్రిమినల్ కేసులు సైతం పెట్టేందుకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. మాడుగుల నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామని, కె.కోటపాడు మండలంలో నిర్వహించిన దాడుల్లో నలుగురిపై కేసులు నమోదు చేసి, 13 సిలిండర్లను సీజ్ చేశామని ఆయన తెలిపారు. ఆయన వెంట వీఆర్వో బి. నాగేశ్వరరావు తదితర రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
పేదల ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలి
తుమ్మపాల : ప్రజల ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ కోరారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (బ్యాంకర్ల సమావేశం) జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదప్రజల ఆర్థిక అభ్యున్నతి కోసం చేస్తున్న పథకాలకు అనుగుణంగా ఔత్సాహికులకు రుణ సదుపాయం కల్పించాలన్నారు. విద్యా రుణాలు, ఎంఎస్ఎంఈలకు పీఎం సూర్య ఘర్ పథకాలకు, వ్యవసాయ రుణాలు, ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కింద విరివిగా రుణాలు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. రుణాలు అందించడంలో అన్ని బ్యాంకులు లక్ష్యాలు సాధించాలన్నారు. సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయాలని అన్నారు. అధికారులు, ఎస్హెచ్జి మహిళలు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి రుణాల మంజూరులో సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా విద్యా రుణాల పట్ల విద్యార్థులలో అవగాహన కలిగించి ప్రోత్సహించాలన్నారు. పీఎం సూర్యఘర్ రుణాలను పెంచాలని, తద్వారా సోలార్ విద్యుత్ వినియోగం పట్ల ప్రజలలో అవగాహన కలిగించాలన్నారు. వ్యవసాయ రుణాల మంజూరు, రెన్యువల్ సమయాల్లో రీ సర్వే వల్ల ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే రెవెన్యూ అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. అంతకుముందు నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ వార్షిక ప్రణాళిక పుస్తకాన్ని (2026–27) ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యనారాయణ రావు, లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ శచీదేవి, పలు బ్యాంకుల మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
చింతలూరు కొండలను కొల్లాగొడుతున్నారు..
మైనింగ్ పర్మిట్లు లేకుండానే...! వాస్తవానికి ఏదైనా క్వారీ మైనింగ్ జరపాలంటే పర్మిట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత మేర మైనింగ్ చేస్తున్నది? ఎంత మొత్తం గ్రానైట్ను తరలిస్తున్నారనే విషయాన్ని పేర్కొంటూ రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అధికార తెలుగుదేశం పార్టీ నేత పేరుతో ఎటువంటి మైనింగ్ పర్మిట్లు లేకుండానే సుమారు రూ. 10 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్లను తరలించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బ్లాస్టింగులు చేపడుతూ గ్రామ ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ క్వారీ ఉన్న ప్రాంతానికి డీఆర్డీవో కూడా కూతవేటు దూరంలోనే ఉంది. రక్షణరంగ సంస్థకు సమీపంలో చేపడుతున్న ఈ బ్లాస్టింగులతో ఇబ్బందులు తప్పవనే ఆందోళన కూడా నెలకొంది. అర్ధరాత్రి సమయాల్లో వాహనాల సామర్థ్యానికి మించి మరీ అధిక లోడుతో భారీ గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారు. అయినప్పటికీ అటు పోలీసు, ఇటు రెవెన్యూ, మైనింగ్, రవాణా శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. భారీ లోడ్లతో ఈ విధంగా మొత్తం రూ. 10 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్లను అక్రమంగా తరలించినట్టు మైనింగ్ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మైనింగ్ విజిలెన్స్ అధికారుల తనిఖీలో ఇక్కడ అక్రమంగా మైనింగ్ జరుగుతున్నట్టు తేలినప్పటికీ స్థానిక మైనింగ్ అధికారులు మాత్రం ఇక్కడంతా ఏమీ జరగలేదని నివేదికలు పంపిస్తుండడం గమనార్హం. నర్సీపట్నంలోని మైనింగ్ అధికారి వ్యవహారశైలిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అర్ధరాత్రి సమయంలో అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చింతలూరు నుంచి అక్రమంగా రాత్రి సమయాల్లో గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చి మరీ వ్యవహారం నడుపుతున్న సదరు టీడీపీ నేత ఆడిందే ఆట...పాడిందే పాటగా వ్యవహారం నడిపిస్తున్నారు. గతంలో ఐటీ కంపెనీ పెట్టి... ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.100 కోట్ల మేర వసూలు చేసి అరెస్టయిన చరిత్ర కలిగిన సదరు నేత చంద్రబాబు, లోకేష్లతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు డీపీగా పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నట్టు విమర్శలున్నాయి. ఇప్పటివరకు అక్రమంగా భారీ గ్రానైట్ బ్లాక్లను అడ్డంగా తరలిస్తూ రూ.10 కోట్ల మేర ఆర్జించినట్టు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ జరుపుతున్నారని, పర్మిట్లు లేకుండానే గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారంటూ దీనిపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు తమ తనిఖీల ద్వారా తేల్చారు. అయితే స్థానిక మైనింగ్ అధికారులు మాత్రం అంతా సవ్యంగానే ఉందంటూ అధికార టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు నివేదికలు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కూటమిలోని బీజేపీ నేతలు కూడా ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేస్తుండడం గమనార్హం. కూటమి ప్రభుత్వం రాకతో జిల్లాలో అక్రమాల ఘనులు చెలరేగిపోతున్నారు. అధికారపార్టీ నేతలు ఆడింది ఆటగా.. పాడింది పాటగా అధికారులు తాళం వేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. గతంలో ఐటీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను రూ.100 కోట్ల మేర మోసం చేసిన కేసులో అరెస్టయిన టీడీపీ నేత అజయ్ కొల్లా తాజాగా అనకాపల్లి జిల్లాలో మైనింగ్ డాన్గా అవతారమెత్తాడు. గ్రానైట్ బ్లాక్ల అక్రమ రవాణాతో రూ.కోట్లు కొల్లగొడుతున్నాడు. స్థానిక మైనింగ్ అధికారులు కొమ్ము కాస్తున్నారు. రూ. 100 కోట్ల మేర నిరుద్యోగులకు టోపీ అనకాపల్లి జిల్లాలో మైనింగ్ డాన్గా వ్యవహరిస్తూ అక్రమ మైనింగ్ చేపడుతున్న సదరు టీడీపీ నేత గుంటూరు నుంచి వచ్చి మరీ ఇక్కడ దౌర్జన్యం చెలాయిస్తున్నారు. ఇతరులకు చెందిన క్వారీని ఆక్రమించి మరీ అక్రమ మైనింగ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. విజ్డమ్ జాబ్స్ పేరుతో నిరుద్యోగుల నుంచి రూ. 100 కోట్ల మేర వసూలు చేసిన వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 14 మందిని అరెస్టు చేయగా, ఇందులో సీఈవోగా ఉన్న అజయ్ కొల్లా కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ నిరుద్యోగుల నుంచి రూ.100 కోట్ల మేరకు ఈ ముఠా వసూలు చేసింది. ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ నిరుద్యోగుల జాబితాను ఇతర కంపెనీలకు విక్రయిస్తుందని కూడా విచారణలో తేలింది. అంతేకాకుండా విజ్డమ్ జాబ్స్ పేరుతో స్థాపించిన కంపెనీలోని ఉద్యోగులతోనే నిరుద్యోగులకు ఫోన్ చేయించి మీకు ఫలానా కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటూ కూడా మోసం చేసి ఆయా అభ్యర్థుల నుంచి ఇంత మొత్తం చెల్లించాలంటూ వసూళ్లకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఎంత మందిని ఉద్యోగాల పేరుతో మోసం చేసి డబ్బులు వసూలు చేస్తే, అటువంటి ఉద్యోగులకు పర్సంటేజీల రూపంలో చెల్లించే ఏర్పాటు కూడా అజయ్ కొల్లా చేయడం గమనార్హం. -
విగ్రహ ధ్వంసం కారకులపై చర్యలేవీ...
అనకాపల్లి టౌన్ : మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను, అందుకు ప్రోత్సహించిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు డిమాండ్ చేశారు. గురువారం అనకాపల్లిలో తగరంపూడి గ్రామంలో ఇటీవల ధ్వంసం చేసిన గురునాథరావు విగ్రహం వద్ద ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, సమన్వయకర్తలతో కలిసి ముత్యాలనాయుడు నిరసన తెలియజేశారు. నిరసనలో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ ఆగడాలు నశించాలి..గురునాథరావు విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని నినదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు మీడియాతో మట్లాడుతూ ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, ఇప్పుడు మాజీ మంత్రి గురునాథరావు విగ్రహం ధ్వంసం వంటి చర్యలకు కూటమి నేతలు పాల్పడడం బాధాకరం అన్నారు. సంఘటన జరిగి ఇన్ని రోజులైనా ఇప్పటివరకూ నిందితులను అరెస్ట్ చేయకపోవడం అన్యాయమన్నారు. కులాలకు, పార్టీలతీతంగా నాలుగు దశాబ్దాల రాజకీయ నేపఽథ్యం ఉన్న నాయకుడు..అందరికీ అభిమానపాత్రుడైన దివంగత గురునాథరావు విగ్రహం ధ్వంసం వెనుక ఉన్న వారిని ఇక్కడి స్థానిక కూటమి నాయకులు కాపాడడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షుడు రామచంద్రరావు ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. హడావుడిగా కొందరు వ్యక్తులకు నోటీసులు ఇచ్చి ఊరుకోవడం అన్యాయమన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారిని, వారిని ప్రోత్సహించిన వారిని అరెస్ట్ చేయకపోతే భవిష్యత్ ఉద్యమ కార్యచరణను ప్రటిస్తామంటూ హెచ్చరించారు. అనకాపల్లి అసెంబ్లీ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ మాట్లాడుతూ సంఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసేవరకు తమ పోరాటం ఆగదన్నారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ విగ్రహాల ధ్వంసం చేసిన నిందితులను స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్లు ప్రోత్సహించడం తగదన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కూటమి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్రాఉ. గ్రామస్తుల సాక్షిగా ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జనసేన నాయకుడు భరత్బాబును ఇంత వరకు విచారణ చేయలేదంటే కూటమి నేతల కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారని అర్ధమవుతోందన్నారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, చింతలపూడి వెంకట్రామయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల సన్యాసిపాత్రుడు, పైలా శ్రీనివాసరావు, దంతులూరి దిలీప్ కుమార్, ఎంపీపీలు గొర్లి సూరిబాబు, కలగ లక్ష్మి గున్నయ్య నాయడు, పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీ రామరాజు, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పార్టీ నాయకులు బొడ్డేడ శివ, కె.ఎం.నాయడు, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కాండ్రేగుల హైమావతి, ఉపాధ్యక్షురాలు మర్రిపల్లి శోభ పాల్గొన్నారు. -
స్నాతకోత్సవం.. ప్రతిభకు పట్టం
వైభవంగా ఏయూ 91, 92వ కాన్వొకేషన్లు విద్య అనేది కొత్త ప్రయాణానికి ఆరంభం: గవర్నర్ అబ్దుల్ నజీర్మద్దిలపాలెం: కళ్లలో భవిష్యత్తుపై కోటి ఆశలు.. చేతుల్లో ఎంతో శ్రమించి సాధించిన విద్యా పట్టాలు.. వెరసి ఆ విద్యార్థుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. నిరంతర శ్రమకు దక్కిన పతకాలు, పీహెచ్డీ డిగ్రీలను సగర్వంగా చేతబూని.. తమ విజయానికి బాటలు వేసిన కుటుంబ సభ్యులతో కలిసి కెమెరాలకు చిరునవ్వులు చిందిస్తూ వారు మురిసిపోయారు. శతాబ్ది ఉత్సవాలతో వందేళ్ల వైభవాన్ని చాటుకుంటున్న ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బుధవారం ఎటు చూసినా ఈ పండగ వాతావరణమే కనిపించింది. బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా.. విద్యార్థుల ఉత్సాహం, కోలాహలం నడుమ 91, 92వ సంయుక్త స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, ఏయూ చాన్సలర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. వందేళ్ల వైభవానికి, నిరుపమాన ప్రగతికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రత్యేక నిదర్శనమని ఆయన కొనియాడారు. శతాబ్దకాలంగా ఏయూ విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో సాధించిన ప్రగతి దేశానికే గర్వకారణమన్నారు. సర్ సి.ఆర్.రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సి.వి.రామన్, సి.ఆర్.రావు వంటి మహనీయుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. డిగ్రీ సాధన అనేది విద్యా జీవితానికి ముగింపు కాదని, అదొక కొత్త ప్రయాణానికి ఆరంభమని విద్యార్థులకు సూచించారు. క్యాంపస్లో రాజకీయాలకు దూరంగా ఉండి, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సగ్గుర్తి, పతంజలి శాస్త్రిలకు డాక్టరేట్లు ప్రదానం వేడుకల్లో భాగంగా ఏయూ పూర్వ విద్యార్థి, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ డాక్టర్ పూర్ణచంద్రరావు సగ్గుర్తికి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తల్లావజ్జల పతంజలి శాస్త్రికి గవర్నర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. జియో, సివిల్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ప్రొఫెసర్ పి.జగదీశ్వరరావు, ప్రొఫెసర్ సి.ఎన్.వి.సత్యనారాయణ రెడ్డిలకు బెస్ట్ రీసెర్చ్ అవార్డులు అందజేశారు. వివిధ విభాగాల నుంచి మొత్తం 17 మంది రీసెర్చ్ మెడల్స్ అందుకోగా.. 13 మంది రీసెర్చ్ ప్రైజ్లు, ఏడుగురు ఎం.ఫిల్ డిగ్రీలు, 441 మంది పీహెచ్డీ పట్టాలు తీసుకున్నారు. అలాగే 174 మందికి యూజీ పీజీ మెడల్స్, 437 మందికి యూజీ పీజీ ప్రైజులు ప్రదానం చేశారు. విశాఖతో.. ఏయూతో ఆత్మీయ అనుబంధం గౌరవ డాక్టరేట్ స్వీకరించిన అనంతరం బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ డాక్టర్ పూర్ణ చంద్రరావు సగ్గుర్తి ప్రసంగించారు. తన స్వస్థలమైన విశాఖపట్నంలో ఈ గౌరవం అందుకోవడం గర్వంగా ఉందన్నారు. తన కుటుంబంలో ఎనిమిది మంది ఏయూ నుంచే పట్టభద్రులయ్యారని గుర్తుచేసుకున్నారు. తన మావయ్య ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు 1984–87 మధ్య విశ్వవిద్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వేగంగా ఎదుగుతోందని, రాబోయే రోజుల్లో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల్లో భారత్ 7.5 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామి సంస్థగా నిలుస్తోందని, ఆస్తుల పరంగా అమెరికాలో రెండో స్థానంలో ఉండటంతో పాటు మార్కెట్ విలువ పరంగా కూడా ప్రముఖ స్థానాన్ని సంపాదించిందన్నారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనలో ముందంజ ఆంధ్ర విశ్వవిద్యాలయం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీ) సాధనలో గర్వించదగ్గ స్థాయికి చేరుకోవాలని ఏయూ ఉపకులపతి జి.పి.రాజశేఖర్ ఆకాంక్షించారు. రెండో శతాబ్దంలోకి అడుగుపెడుతున్న ఏయూ.. విజ్ఞానం, ఆవిష్కరణలతో పాటు సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వం, చాన్సలర్, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, ఏయూ పూర్వ వీసీలు, ఇతర యూనివర్సిటీల వీసీలు, ఏయూ రెక్టార్, రిజిస్ట్రార్, ఆచార్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి
దేవరాపల్లి: ఆరోగ్యకరమైన పంటల సాగుకు రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజ్కుమార్, శాస్త్రవేత్త డాక్టర్ సత్తిబాబు సూచించారు. మండలంలోని మారేపల్లిలో ఆత్మ పథకం సౌజన్యంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై స్థానిక వ్యవసాయ అధికారి ఎల్.వై.కాంతమ్మ ఆధ్వర్యంలో రైతులకు రెండో రోజు బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిందె దశలో ఉన్న నువ్వు పంటలో అధిక దిగుబడులు సాధించేందుకు 13.0.45 మల్టీ–కె, 19.19.19 పిచికారి చేయాలని సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడాలని తెలిపారు. రైతులకు జీవామృతం తయారీ విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తర్ణ అధికారి ఎస్. కిరణ్కుమార్ తదితర వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
మర్యాదపూర్వక కలయిక
దేవరాపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, అనకాపల్లి సమన్వయ కర్త మలసాల భరత్కుమార్ బుధవారం వేర్వేరుగా మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్గా నియమించినందుకు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు ముత్యాలనాయుడు చెప్పారు. -
యలమంచిలిలో భారీ చోరీ
యలమంచిలి రూరల్ : పట్టణ ఠాణా పరిధి కట్టుపాలెం చెరకు కాటా సమీపంలో కొత్తపాలెం వెళ్లే రహదారి పక్కనున్న ఓ ఇంట్లో బుధవారం భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 9 తులాల బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి వస్తువులు కాజేశారు.ఇక్కడ నివాసముంటున్న రైతు బొడ్డేటి సతీష్ ఇంట్లో బుధవారం మధ్యాహ్నం బీరువాలో భధ్రపరిచిన సుమారు 9 తులాల బరువున్న 4 బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. బాధితుడు, ఘటనా స్థలంలో స్థానికుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం రైతు సురేష్ పొలం పని చేసుకోవడానికి వెళ్లారు.అతని భార్య యలమంచిలి పట్టణంలో ఒక ప్రైవేటు పాఠశాలలో పిల్లల చదువుకు సంబంధించి వాకబు చేయడానికి వెళ్లారు. ఇంటికి తాళాలు వేసి పక్కనే ఒక ప్రదేశంలో దాచి వెళ్లారు.ఇంట్లో ఎవరూ లేరని ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు తీసుకుని ఇంట్లోకి వెళ్లి బీరువాలో దాచిన బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన భార్య బీరువా తెరిచి ఉండడం చూసి పరిశీలించగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు తెలిసింది. దీంతో బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తామెవరూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల మధ్యలో చోరీ జరగడాన్ని బట్టి తెలిసిన వారి పనే అయి ఉంటుందని బాధిత కుటుంబీకులు అనుమానిస్తున్నారు. సీఐ ధనుంజయరావు, పట్టణ ఎస్ఐ కె.సావిత్రి, ఏఎస్ఐ చెల్లారావు, అనకాపల్లి నుంచి క్లూస్ టీం బృందం చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. బాధిత కుటుంబీకుల నుంచి చోరీకి సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. చోరీ సమాచారాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించలేదు. ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం సభ్యులు -
స్మార్ట్ కిచెన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
నర్సీపట్నం:రపభుత్వం తక్షణమే స్మార్ట్ కిచెన్ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎంఈవో కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శంకరరావు మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా మధ్యాహ్న భోజన కార్మికులు.. పిల్లలకు వండి పెడుతున్నారు. కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు స్మార్ట్ కిచెన్ పేరుతో ఒకే చోట నుంచి స్కూళ్లకు క్యారేజీలు పంపాలని నిర్ణయించాయన్నారు. ఈ స్మార్ట్ కిచెన్ల వల్ల వేలాదిమంది వంట కార్మికులు ఉపాధి కోల్పోతాయరని చెప్పారు. కార్మికులందరూ ఐక్యంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పి కొట్టాలన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం సెంట్రల్ కిచెన్ పేరుతో అక్షయపాత్ర, ఇస్కాన్, నవ ప్రయాస వంటి సంస్థలకు కట్టబెడితే నాడు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడించినట్టు గుర్తు చేశారు. కేసులు పెట్టి జైలుకు పంపినా ఐక్యంగా పోరాడాం దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం ప్రతి మండలంలో రెండు స్మార్ట్ కిచెన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే మెనూ చార్జీలు చాలకపోయినా పిల్లలకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన భోజనాన్ని కార్మికులు అందిస్తున్నారన్నారు. సమయానికి బిల్లులు రాకపోయినా అప్పులు చేసి భోజనం అందిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భోజన పథకాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని కంకణం కట్టుకున్నాయన్నారు. ఒక్కో స్మార్ట్ కిచెన్కు ప్రభుత్వమే స్థలం ఇచ్చి, రూ.55 లక్షలతో నిర్మిస్తుందన్నారు. మనకు మాత్రం వంట షెడ్లు, పాత్రలకు నిధులు ఖర్చు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్డే మీల్ కార్మిక సంఘం నాయకులు ఒ.నూకరాజు, సత్యవతి, ప్రసన్న, ఇ.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
విగ్రహ ధ్వంసం కేసు నీరుగార్చేలా పోలీసుల తీరు
అనకాపల్లి: మండలంలోని తగరంపూడిలో ఈనెల 20వ తేదీ రాత్రి మాజీ మంత్రి, దివంగత గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని అదే గ్రామానికి చెందిన జనసేన నాయకులు ధ్వంసం చేశారని, వారిని అరెస్టు చేయకుండా కేసును నీరుగాచ్చే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. స్థానిక నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ కార్యాలయంలో ఆపార్టీ పట్టణ, మండల అధ్యక్షులు మందపాటి జానకీరామరాజు, పెద్దిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురునాథరావు పార్టీలకు అతీతంగా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించారని, ఆయన మరణానంతరం తగరంపూడి గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా 2019లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రోత్సహించిన గ్రామ జనసేన ప్రధాన నాయకుడు భరత్బాబును తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 26 జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు, గురునాథరావు అభిమానులు విగ్రహాన్ని సందర్శించనున్నట్టు చెప్పారు. తగరంపూడి సర్పంచ్ యాదగిరి అప్పారావు ఈనెల 21న విగ్రహం వద్ద విలేకరులతో సమావేశం నిర్వహించి 15 రోజుల క్రితం గ్రామ జనసేన నాయకులు విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేసినట్టు చెప్పారని తెలిపారని, అదే సర్పంచ్ ఈనెల 24న విగ్రహాన్ని జనసేన నాయకులు తొలగించమని చెప్పలేదని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సర్పంచ్ మాటమార్చే విధంగా కూటమి నేతలు ఒత్తిడి చేశారని ఆరోపించారు. 2004లో ఏఎంఎఎల్ కళాశాలలో దేశనాయకుల విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తులపై పార్టీలకు అతీతంగా అప్పటి వర్తకసంఘం నాయకులు కేసులు నమోదు చేయించారని చెప్పారు. గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులపై కూడా పార్టీలకు ఆతీతంగా కేసు నమోదు చేయించి, అరెస్టు చేయాలని కోరారు. ఈ కేసు విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యహరించాలన్నారు. దోషులను అరెస్టు చేసేవరకూ పోరాటాలు చేస్తామన్నారు. గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసే వ్యక్తులను అరెస్టు చేయకపోతే వచ్చే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కచ్చితంగా అరెస్టు చేస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్ మాట్లాడుతూ విగ్రహాలను ధ్వంసం చేసిన కూటమి నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పార్టీ మండల అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్ మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన అసలైన నిందితులను అరెస్టు చేయకుండా, తూతూ మంత్రంగా చిన్ననాయకులను అరెస్టు చేసే విధంగా పోలీసులు చర్యలు చేపట్టడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పార్టీ సీనియర్ నాయకుడు మళ్ల బుల్లిబాబు, 81వ వార్డు ఇన్చార్జి బొడ్డేడశివ, పట్టణ, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కాండ్రేగులు హైమావతి, పద్మకుమారి, కశింకోట ఎంపీపీ కలగ లక్ష్మి గున్నయ్యనాయుడు, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు మర్రిపల్లి శోభ, పార్టీ నాయకులు బుద్దిరెడ్డి దేముడుబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
శారదా నదిలో వృద్ధుడు గల్లంతు
ప్రమాద స్థలంలో గాలింపు చర్యలు చేపడుతున్న సీఐ అల్లు స్వామినాయుడు కశింకోట: మండలంలోని తేగాడ గ్రామం వద్ద శారదా నదిలో బుధవారం ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. తేగాడకు చెందిన గొంతిన లోవరాజు (60) కూలి పని కోసం గ్రామ సమీపంలోని నదిని నడిచి దాటడానికి అవతలకు వెళ్తుతుండగా మునిగిపోయి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందడంతో సీఐ అల్లు స్వామినాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా వృద్ధుడ ఆచూకీ దొరకలేదు. లోవరాజుకు భార్య సూర్యకాంతం, వివాహమైన కుమారుడు,కుమార్తె ఉన్నారు. -
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
అనకాపల్లి: క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు శారీరక దారుఢ్యం చేకూరుతుందని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి పూజారి శైలజ అన్నారు. మండలంలో ఏఎంఎఎల్ కళాశాల క్రీడామైదానంలో సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుందన్నారు. అనంతరం 100, 400, 800, 1500 మీటర్ల రన్నింగ్, లాంగ్జంప్, హైజంప్, త్రోబాల్, డిస్క్త్రో తదితర పోటీలను నిర్వహించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 30,31 గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. -
సమష్టి కృషితోనే గంజాయి, డ్రగ్స్ నియంత్రణ
తుమ్మపాల : డ్రగ్స్, గంజాయి సమస్యను అరికట్టడంలో అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాదకద్రవ్యాలు, గంజాయి నియంత్రణ, నార్కో కో– ఆర్డినేషన్ సెంటర్ అవగాహన కార్యక్రమాలకు సంబంధించి జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ఎస్పీ తుహిన్ సిన్హాలతో కలిసి ఆమె జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో గల ఎన్టీఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో డీ–అడిక్షన్ సెంటర్ పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అక్రమంగా టొబాకో ఉత్పత్తులు సరఫరా చేస్తున్న వారిపై టాక్స్, ఫుడ్ సేఫ్టీ, పోలీస్, ఈగల్ ఇతర శాఖలు కలిసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్కి సంబంధించిన సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. కమిటీలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు. విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేసి, విద్యార్థులకు అవగాహన కల్పించాలని, పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని, గంజాయి వినియోగం, విక్రయాలపై వెంటనే సమాచారం అందించాలని అన్నారు. రైల్వేస్టేషన్, రైళ్లలో, బస్టాండ్లలో నిరంతరం గస్తీ నిర్వహించాలని పోలీస్, ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో క్రమం తప్పక నషా ముక్త్ భారత్ కార్యక్రమాలను చేపట్టాలని, ప్రతి హాస్టల్లో డ్రగ్స్ గంజాయిపై అవగహన కల్పించాలని, పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆన్లైన్ ద్వారా అక్రమంగా ఎన్ఆర్ఎక్స్ మెడిసిన్స్ ఆర్డర్ చేసి విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ జిల్లాలో పోలీస్, ఎకై ్సజ్ శాఖలు సమన్వయంతో తనిఖీలు చేపట్టి రోజువారీగా కేసులు నమోదు చేస్తున్నాయని తెలిపారు. నర్సీపట్నం మండలం డౌనూరు, వి.మాడుగుల మండలం తాడిపర్తి, చిడికాడ మండలం కోనాం, డౌనూరు, కేడీపేట మండలం భీమవరం, దేవరపల్లి మండలం శ్రీరాంపురం ప్రాంతాల్లో శాశ్వత చెక్పోస్టులు ఏర్పాటు చేసి, జిల్లా వ్యాప్తంగా 38 వాహన తనిఖీ పాయింట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 158 కేసులు నమోదై, 492 మందిని అరెస్ట్ చేసి, 9,726 కిలోల గంజాయి, 145 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎక్త్సెజ్ అధికారి వి.సుధీర్, డీఆర్వో వై.సత్యనారాయణరావు, జిల్లా రవాణా, ప్రజా రవాణా, వ్యవసాయ, విద్యా, అటవీ, వెనుకబడిన, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీఓ షేక్ అయిషా, డీఎస్పీ ఎం.శ్రావణి, రైల్వే, జీఆర్పి, ఈగల్ శాఖల పోలీసులు పాల్గొన్నారు. -
సర్కారు గ్యాస్ కబుర్లు... జనం తిప్పలు
ఏజెన్సీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న జనం మాడుగులలో ఖాళీ సిలిండర్లతో గ్యాస్ గోదాం వద్ద క్యూ బుక్ చేసినా రోజుల తరబడి వేచి ఉండాల్సిందే.. మారుమూల గ్రామాల ప్రజలకు మరిన్ని తిప్పలు మాడుగుల రూరల్ : వినియోగదారులకు గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. మాడుగుల హైస్కూలు సమీపంలో గల సీతారామ భారత్ గ్యాస్ గోదాం వద్ద బుధవారం వందలాది మంది వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీ ఎదుట క్యూ కట్టారు. ఒకవైపు గ్యాస్ కొరత లేదని బుక్ చేసుకున్న వారికి గ్యాస్ అందజేస్తామని ప్రభుత్వం చెబుతుండగా, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గ్యాస్ దొరుకుతుందా లేదా అన్న ఆదుర్దాతో మహిళలు, యువకులు గంటల తరబడి క్యూలో నిల్చుని నానా అవస్దలు పడ్డారు. ఈ నెల 20 వ తేదీలోపు గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదార్లకే గ్యాస్ బండలు పంపిణీ చేస్తామని స్థానిక గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వారికి తేల్చి చెప్పారు. కానీ భవిష్యత్తులో గ్యాస్ దొరకదనే ఆందోళన ప్రజల్లో నెలకొనడంతో అందరూ ఒక్కసారిగా గ్యాస్ ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సుమారు 500 మంది వినియోగదారులు బుధవారం ఒక్కరోజే ఉదయం నుంచి ఖాళీ సిలిండర్లతో రోడ్డు మీద క్యూ కట్టారు. ఒకేసారి వినియోగదారులు వందలాది మంది భారత్ గ్యాస్ గోదాం వద్దకు రావడంతో ఎటువంటి గొడవలు జరగకుండా ఎస్ఐ జి.నారాయణరావు, సిబ్బంది వచ్చి వారిని క్యూలో పెట్టారు. 300 గ్యాస్ సిలిండర్లు బుధవారం పంపిణీ చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. 20 వ తేదీ తర్వాత గ్యాస్ బుక్ చేసుకున్న వారికి టోకెన్లు అందజేసి, గ్యాస్ వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారు. మండలంలో మారుమూల గ్రామాల ప్రజలకు మరిన్ని తిప్పలు తప్పడం లేదు. వారంతా ఖాలీ సిలిండర్లను ఆటోలు, బైక్లు మీద తీసుకుని వచ్చి గంటల తరబడి వేచి ఉన్నా గ్యాస్ దొరక్క పోవడంతో ఉసూరుమని ఇంటిముఖం పట్టారు. ఐదు రోజులుగా గ్యాస్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నామని క్యూలోని మహిళలు, వృద్ధులు తమ కష్టాలు ఏకరువు పెట్టారు.రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులతో పాటు, కనీసం గ్యాస్ కూడా అందించలేని స్దితిలో ఉందని పలువురు మహిళలు మండిపడ్డారు. గ్యాస్ కష్టాలు తీర్చాలి... రాష్టంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వచ్చాక నిత్యావసర ధరలు పెంచారు. దీనికి తోడు ప్రజలకు అతి ముఖ్యమైన గ్యాస్ కూడా సకాలంలో అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత పరిస్థితిలో గ్యాస్ వినియోగదారులు అందరికీ గ్యాస్ సిలిండర్లు అందేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ గ్యాస్ అందించాలి. –శోలం రమేశ్, వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు, శంకరం గ్రామ సర్పంచ్, మాడుగుల మండలం -
ఆ భూములే జీవనాధారం
నాకు ఎకరం డి–పట్టా భూమి ఉంది. ఇది తాతల నుంచి సంక్రమించిన భూమి. యూకలిప్టస్ తోట వేశాను. ఈ భూమే నా కుటుంబానికి జీవనాధారం. ఇప్పుడు ఆ భూమి తీసేసుకుంటే ఎలా బతకాలి. మా నుంచి భూమి తీసుకుంటే మాకు ఆత్మహత్యే గతి. – గుంపాన పెద్ద సత్యారావు, అడవి అగ్రహారం భూములిచ్చేది లేదు.. మేం నలుగురు అన్నదమ్ములం. మాకు మొత్తం 3 ఎకరాల భూమి ఉంది. తాతల నుంచి వచ్చిన భూమి ఇది. అపరాలు పండిస్తాం. ఇప్పుడు సోలార్ ప్రాజెక్టు అంటూ లాక్కొనేందుకు యత్నిస్తే ఎలా బతకాలి. మా కుటుంబంతో పాటు మా సోదరుల కుటుంబం కూడా రోడ్డున పడతాయి. సాగు చేస్తున్న భూములు ఇచ్చేది లేదు. –గొల్లవిల్లి రమేష్ నాయుడు, నిర్వాసిత రైతు. -
ఖాళీ బండల మోత
నర్సీపట్టం : పట్టణంలో ఇంటింటికీ గ్యాస్ రాకపోవడంతో ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. గంటల కొద్ది వేచి ఉంటున్నారు. సిలిండర్ల లోడు వచ్చాక సమాచారం ఇస్తామని చెబుతూ ఏజెన్సీల నిర్వాహకులు వారిని తిప్పి పంపుతున్నారు. సిలిండర్లు డెలివరీ చేసినట్టు మెసెజ్ వచ్చిందని, గ్యాస్ మాత్రం డెలివరీ చేయలేదని వినియోగదారులు అంటున్నారు. గ్యాస్ సమస్యల పరిష్కారానికి ఉదయం 8 నుంచి రాత్రి గంటల వరకు అందుబాటులో ఉండాల్సిన టోల్ ఫ్రీ నంబర్లు పని చేయడం లేదని చెబుతున్నారు. గ్యాస్ కొరత ప్రభావం శుభకార్యాలపైనా పడింది. బయట మార్కెట్లో బ్లాక్లో రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు ఉందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. -
వడ్డాదిలో రోడ్డెక్కిన విభేదాలు
వడ్డాదిలో రోడ్డు వేయకుండా నేలపై బైఠాయించిన బత్తుల వర్గీయులు వడ్డాదిలో గొడవ పడుతున్న ఇరువర్గాలను చెదరగొడుతున్న పోలీసులు బుచ్చెయ్యపేట : మేజర్ పంచాయతీ వడ్డాది టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వడ్డాదిలో సిమెంట్ రోడ్ల ఏర్పాటులో ఎమ్మెల్యే రాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు వర్గీయుల మధ్య తార స్థాయికి వర్గ విభేదాలు చేరాయి. రోడ్డు వేయాలని ఎమ్మెల్యే రాజు వర్గీయులు, మాకు సమాచారం లేకుండా రోడ్లు ఎలా వేస్తారు అంటూ తాతయ్యబాబు వర్గీయులు భీష్మించి తోపులాటకు దిగారు. వడ్డాదిలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.55 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ నెల 22న ఎమ్మెల్యే రాజు రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తన సొంత గ్రామంలోనే తనకు చెప్పకుండా సిమ్మెంట్ రోడ్ల శంకుస్ధాపన కార్యక్రమం చేయడంపై తాతయ్యబాబుతో పాటు అతని వర్గీయులు ఆగ్రహం చెందారు. బుధవారం సిమెంట్ రోడ్డు వేయడానికి కూలీలు రాగా తాతయ్యబాబు వర్గీయులు దొండా నరేష్, రమేష్, కన్నబాబు, శంకర్, గురుమూర్తి, సయ్యపురెడ్డి మాధవరావు, ముత్యాల సూరిబాబు అడ్డుకున్నారు. రోడ్డు వేసి తీరుతామని ఎమ్మెల్యే వర్గీయులు దొండా సన్యాసిరావు, దొండా గిరిబాబు, శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి, కుబిరెడ్డి వెంకటరావు, వీర్ల సురేష్, అదట్రా రమేష్, ఈఽశ్వరరావు, సింగంపల్లి రమేష్ తదితరులు అడ్డు తగిలారు. దీంతో ఇరువర్గాల మధ్యన తీవ్ర వాగ్వాదం జరిగి కొట్లాటకు దిగబోయారు. దీంతో బుచ్చెయ్యపేట ఎస్ఐ శ్రీనివాసరావు తమ సిబ్బందితో వచ్చి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీడీపీ అధికారంలో లేనపుడు నాలుగేళ్లు పార్టీ గురించి పట్టించుకోని ఎమ్మెల్యే రాజు ఈ రోజు వడ్డాదిలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నాడని తాతయ్యబాబు వర్గీయులు ఆగ్రహం చెందగా, నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుంటే పనులు అడ్డుకోవడమేంటని ఎమ్మెల్యే రాజు వర్గీయులు ఎదురు తిరిగారు. మోదకొండమ్మ ఆలయ చైర్మన్ దొండా గిరిబాబు స్వయంగా ఇసుక మోసి రోడ్డు వేయండని కోరగా, హౌసింగ్ బోర్డు చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చే వరకు రోడ్డు వేయొద్దని గ్రామ టౌన్ టీడీపీ అధ్యక్షుడు దొండా నరేష్ ఎదురు తిరిగారు. సుమారు 15 మంది పోలీసులతో గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు పనులు చేపట్టకుండానే కూలీలు వెళ్లిపోవడంతో ఇరువర్గాల వారు వెనుదిరిగారు. రాత్రికి గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.


