Anakapalle
-
పచ్చని చెట్లూ పచ్చనేతల పాలు
బుచ్చెయ్యపేట: మండలంలో గల పెదమదీన గ్రామంలో విలువైన అకేషియా చెట్లను ఆర్ధరాత్రి నరికి తరలించారు. గ్రామానికి ఆనుకుని విశాలంగా కొండ ప్రాంతం ఉంది. అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిలో సుమారు 150 ఎకరాల్లో ఏపుగా అకేషియా చెట్లు పెరిగి ఉన్నాయి. సోమవారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు ట్రాక్టర్లు లోడు వరకు నరికి పట్టుకుపోయారు. ఇదే చెట్ల విషయంలో గతంలో గ్రామంలో కూటమి నేతలు గొడవలు పడ్డారు. ఈ ఏడాది జనవరిలో కూటమికి చెందిన సర్పంచ్ భర్త కె.వి.ఆర్ నాయుడు కొండ ప్రాంతంలో ఉన్న చెట్లను నరికి గ్రామ అభివృద్ధి పనులకు వినియోగిస్తామని పంచాయితీ తీర్మానం చేయించారు. అప్పట్లో సర్పంచ్ భర్త ప్రభుత్వ భూమిలో చెట్లు నరికిస్తుండగా ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ వియ్యపు అప్పారావు వర్గీయులు అడ్డుకున్నారు. వేలం వేయకుండా ప్రభుత్వ భూమిలో ఉన్న చెట్లు నరకొద్దని తెలపగా దీనిపై ఇరు వర్గాలు వారు గొడవ పడ్డారు. జనవరి 20వ తేదీన గ్రామ రామాలయం వద్ద కూటమి నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కారాలు విసురుకుంటూ కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా పలువురు గాయపడ్డారు. డీఎస్పీ, సీఐ, పలు పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలకు చెందిన వారిపై కేసులు నమోదు చేశారు. వారం రోజుల పాటు గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు. ఈ గొడవల కారణంగా మనస్థాపానికి గురైన సర్పంచ్ భర్త కె.వి.ఆర్ నాయుడు అకాలంగా మృతి చెందారు. మరలా ఇదే భూమిలో చెట్లు నరికి వేయడంపై గ్రామంలో చర్చనీయాంశమైంది. అర్ధరాత్రి పూట ప్రభుత్వ భూమిలో అకేషియా చెట్లు తరలించడంతో గ్రామంలో మరలా గొడవలు జరిగే అవకాశం ఉందని ఆందోళన నెలకొంది. గ్రామంలో ప్రభుత్వ భూమిలో విలువైన అకేషియా చెట్లు నరికివేత కూటమి నేతల పనేనని మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జోగా కొండబాబు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కె.అచ్చింనాయుడు ఆరోపిస్తున్నారు. చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
బుచ్చెయ్యపేట: మండలంలో గల పీపీ ఆగ్రహారం శివారు గొర్లెపాలెం గ్రామానికి చెందిన యువకుడు వెలుగుల ప్రసాద్(24) బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం సాయంత్రం గ్రామం నుంచి వెళ్లి పోయి అనకాపల్లి ఏఎంఏఎల్ కాలేజీ వద్ద ట్రైన్ క్రింద పడి మృతి చెందాడు. ఇతని మృతికి గల కారణాలు తెలియడం లేదు. గ్రామానికి చెందిన వెలుగుల సత్తిబాబు, మాణిక్యంలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవశాయం చేసుకుని జీవిస్తున్న సత్తిబాబు తన కుమార్తెకు వివాహం చేయగా కుమారుడు ప్రసాద్కు వివాహం చేయడానికి చూస్తున్నారు. ఇంటర్ చదివిన ప్రసాద్ ప్రస్తుతం లంకెలపాలెం వద్ద ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. తమ కుమారుడు ఆత్మహత్యకు కారణమేమిటో తల్లిదండ్రులకు అంతుచిక్కడం లేదు. అందివచ్చిన కుమారుడు అకాల మృతితో ప్రసాద్ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. ప్రసాద్ మృతదేహానికి బుధవారం శవ పంచనామా నిర్వహిస్తారని గ్రామస్తులు తెలిపారు. -
వీఆర్ఎస్ ఇచ్చి ఉంటే ఇలా జరిగేదా?
స్టీల్ప్లాంట్ పరిస్థితి దృష్ట్యా గతేడాది నా తండ్రి వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారులు తిరస్కరించారు. 1991 నుంచి స్టీల్ప్లాంట్ సెంట్రల్ మెకానిక్ మెయింట్నెన్స్లో పనిచేసిన నా తండ్రిని, ఏడాది కిందటే ఆ విభాగం నుంచి ఎస్ఎమ్ఎస్–2కి బదిలీ చేశారు. ఎటువంటి శిక్షణ ఇవ్వకుండా, కనీస భద్రతా ప్రమాణాలు లేనిచోటుకి పంపించారు. కుటుంబానికి దికై ్కన తండ్రిని కోల్పోయిన తాము ఇప్పుడు ఏమైపోవాలి. అమ్మ సూర్యకుమారి గృహిణి. చెల్లి దీపిక ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. వారిని సముదాయించడం నా వల్ల కావడం లేదు. – హనీష్, మృతుడు కృష్ణ కుమారుడు -
ఉపాధి పనులు చేస్తూ కూలీ మృతి
కశింకోట: పేరంటాలపాలెం గ్రామానికి చెందిన వృద్ధ ఉపాధి కూలీ మంగళవారం మృతి చెందారు. మండపాక సత్యారావు (67) ఉపాధి కార్యక్రమంలో పంచాయతీ పరిధిలో కూలీకి వెళ్లి ట్రెంచ్ తవ్వకం పని చేస్తుండగా ఉదయం 7.30 గంటల సమయంలో నీరసంగా ఉందని కిందికి పడిపోవడంతో స్థానికులు, ఉపాధి సిబ్బంది సహాయంతో అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించడంతో తిరిగి పేరంటాలపాలెం తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఏపీవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. భార్య రమణమ్మ, పెళ్లయిన ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. -
‘ఉక్కు’ మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి
మహారాణిపేట(విశాఖ): విశాఖ స్టీల్ప్లాంట్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు వెంటనే కోటి రూపాయల పరిహారం అందించాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర డిమాండ్ చేశారు. విశాఖలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు రూ.10 లక్షల పరిహారం అందించాలని కోరారు. స్టీల్ప్లాంట్లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు తీరని లోటు అన్నారు. మృతుల కుటుంబాల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించాలని కోరారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే ఉచిత వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. -
వైభవంగా పరదేశిమాంబ జాతరలు
దేవరాపల్లి: మండలంలోని ముషిడిపల్లి, గరిశింగిలో పరదేశి మాంబ అమ్మవారి పెద్ద పండగలను మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముషిడిపల్లిలో సుమారు 30 ఏళ్ల తర్వాత, గరిశింగిలో 18 సంవత్సరాల తర్వాత భారీ స్థాయిలో నిర్వహించడంతో అధిక సంఖ్యలో బంధు మిత్రులు, భక్తులు హాజరయ్యారు. దీంతో గ్రామాలు సందడిగా మారాయి. తెల్లవార జాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసాయి. అమ్మవారి ప్రతిరూపంగా చెక్కతో తీర్చిదిద్దిన బండి ప్రభ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం నిర్వహించిన దేవతామూర్తుల వేషధారణలు, బిందెల డ్యాన్స్, మహిళల కోలాట ప్రదర్శనలు, రాత్రికి నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం బూడి పూజలు గరిశింగి, ముషిడిపల్లిలో పరదేశి అమ్మవారిని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు దర్శించుకుని పూజలు చేశారు. ఆయా గ్రామాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు తీర్థ, ప్రసాదాలను అందజేశారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి వెంట జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, డాక్టర్ వరదపురెడ్డి సింహాచలం నాయుడు, వైఎస్సార్సీపీ మాడుగుల బీసీ సెల్ అధ్యక్షుడు ఆదిరెడ్డి త్రినాఽథస్వామి, సీనియర్ నాయకులు చింతల సత్య వెంకటరమణ, వరదపురెడ్డి లలితానాయుడు, గూడెపు రాము, గూడెపు మోహన్, గూడెపు అప్పారావు, ముషిడిపల్లిలో లెక్కల తాతబాబు, బొడ్డు నారాయణమూర్తి, బొడ్డు పెద అప్పారావు తదితరులున్నారు. దేవరాపల్లిలో... మండల కేంద్రం దేవరాపల్లి రెల్లి వీధిలో పోలమాంబ అమ్మవారి పండగ మంగళవారం ఘనంగా జరిగింది. స్థానికులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు వరదపురెడ్డి చంద్రరావు, గంగవంశం సంతోష్, వరదపురెడ్డి అప్పలనాయుడు, కొరుప్రోలు శ్రీను, పాచిల వెంకటరావు తదితర్లు పాల్గొన్నారు. శంభువానిపాలెంలో పరదేశమ్మ అమ్మవారి ఒడ్డు పండగ మంగళవారం ఘనంగా జరిగింది. వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, రాత్రి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.ముషిడిపల్లిలో 30 ఏళ్లు, గరిశింగిలో 18 ఏళ్ల తర్వాత భారీ ఎత్తున నిర్వహణ -
ప్రభుత్వ పాఠశాలల్లో యజ్ఞంలా మొక్కల పెంపకం
దేవరాపల్లి: పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో యజ్ఞంలా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు డ్వామా పీడీ సీహెచ్. నిర్మలాదేవి తెలిపారు. బేతపూడి కేజీబీవీ, తెనుగుపూడి బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటేందుకు తవ్విన గోతులను పరిశీలించి, ఉపాధి హామీ సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నెట్ జీరో హెల్తీ క్యాంప్ కార్యక్రమంలో భాగంగా జూన్ 20 లోపు మొక్కల నాటే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. 4,500 పెద్ద చెట్లు, 5780 మధ్యస్త చెట్లు, 35,250 పొదల మొక్కలు, 30,500 ఔషధ మొక్కలు పాఠశాలల ఆవరణలో నాటనున్నట్టు ఆమె చెప్పారు. ఒక్కో పాఠశాలలో రూ. 4.99 లక్షల వ్యయంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. మొక్కల సంరక్షణకు తొలి ఏడాది రూ. 4 లక్షలు, రెండు, మూడో ఏడాదిలో నీటి తడుపులు, నిర్వహణ కోసం రూ. 23వేలు చొప్పున నిధులు కేటాయిస్తామన్నారు. జలధార కార్యక్రమం ద్వారా జిల్లాలో 617 చెరువుల పరిధిలో 1,614 అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. వీటి కోసం రూ. 66.62 కోట్లు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీవో వై.రుక్మిణీదేవి, ప్లాంటేషన్ సూపర్వైజర్ కె.శ్రీను, ఈసీ వెంకటేష్, ఎంపీడీవో కార్యాలయం పరిపాలన అధికారి లక్ష్మీనారాయణ, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొ న్నారు. -
జిల్లాలో 808 సెల్ఫోన్ల రికవరీ
రికవరీ సొత్తు విలువ రూ.1.65 కోట్లు అనకాపల్లి: ప్రతి వ్యక్తికి నిత్యజీవితంలో మొబైల్ అనేది కేవలం ఒక వస్తువు కాదని, వారి జీవితకాల జ్ఞాపకాలు, వ్యక్తిగత సమాచారం అందులోనే ఉంటుందని, సెల్ఫోన్లు పోయినట్లు వస్తున్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి, 12వ విడతలో 808 సెల్ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి రికవరీ చేసిన ఫోన్లను వాటి యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన ఫోన్లు సుమారుగా రూ.1.65కోట్లు విలువ చేసే 808 పోన్లు రికవరీ చేయడం జరిగిందన్నారు. జిల్లా చరిత్రలో పెద్ద మొత్తంలో మొదటి సారిగా పెద్ద సంఖ్యలో ఫోన్లు రికవరీ చేయడం జరిగిందన్నారు. ఈనెల 1వ తేదీ వరకూ 8,500 చోరీకి గురైనట్టు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. 11 విడత వరకూ 4,086 మొబైల్ ఫోన్ల విలువ రూ.8.42 కోట్లు ఉంటుందన్నారు. ఈ ఏడాది 1543 సెల్ఫోన్లు మిస్సింగ్ అయినట్టు ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ చెప్పారు. జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్: 9346912007కు ‘ఏజీ‘ అని టైప్ చేసి పంపితే వచ్చే లింక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
గుమ్మం దాటిన అడుగు.. తిరిగి రాలేదు
ఒకే దశాబ్దంలో మూడు విషాదాలు విశాఖను ఒకే దశాబ్దంలో మూడు పెద్ద విషాదాలు వెంటాడాయి. ఎల్జీ పాలిమర్స్, హెచ్పీసీఎల్, ఇప్పుడు స్టీల్ప్లాంట్. ప్రతిసారీ ఒకే డ్రామా పునరావృతమవుతుంది. ప్రమాదం జరుగుతుంది, విచారణ కమిటీలు వేస్తారు, నివేదికలు వస్తాయి, కేసులు పెడతారు. కొన్ని నెలల తర్వాత అంతా మర్చిపోతారు. కానీ సర్వం కోల్పోయిన ఆ కుటుంబాలు ఎలా మర్చిపోతాయి? మూడేళ్లుగా పోరాడుతూనే నడిపిన ప్లాంట్ విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పటి నుంచి కార్మికులు దాదాపు మూడేళ్లుగా పోరాడుతున్నారు. వేతన కోతలు, వీఆర్ఎస్ పేరుతో సిబ్బంది తగ్గింపు, ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నా..‘కన్నతల్లిలాంటి’ ఈ ప్లాంట్ను గుండెల్లో పెట్టుకుని నడిపించారు. అదే ప్లాంట్లో ఇప్పుడు అడుగుపెట్టాలంటే భయంగా ఉందని కార్మికులే చెప్తున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం తర్వాత మంగళవారం ప్లాంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆవేదన గాలిలో తేలింది. అతడికి ఆ రోజు మామూలే అనిపించింది. టిఫిన్ తిన్నాడు. చొక్కా వేసుకున్నాడు. చేతిలో లంచ్బాక్స్ పట్టుకున్నాడు. గుమ్మం దాటుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు..భార్య అక్కడే నిలబడి సాగనంపింది. అది తన చివరి చూపు అవుతుందని అతనికి తెలియదు. లోపలున్న ఆమెకూ తెలియదు. ఆ సాయంత్రం తిరిగి రాని ఆ చూపు, ఇప్పుడు ఆ ఇంటిలో శాశ్వత నిశ్శబ్దమైపోయింది. విశాఖ స్టీల్ప్లాంట్లో మెల్టింగ్ షాప్ అంటే సాధారణ పని స్థలం కాదు. అది 1,600 డిగ్రీల సెల్సియస్ వేడి రాజ్యం. రాయి కరిగి నీరయ్యే వేడి. ఉక్కు లావాలా ప్రవహించే వేడి. ఆ నిప్పుల కొలిమి పైన వేలాడుతున్న లాడెల్ క్రేన్ సోమవారం సాయంత్రం ఒక్కసారిగా తెగిపడింది. కరిగిన ఉక్కు వెల్లువలా ముంచెత్తింది. మిగతా కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తారు. కానీ ఆ ఎనిమిది మంది మాత్రం తప్పించుకోలేకపోయారు. వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా ముద్దలైపోయాయి. ఆ రాత్రి, ఆ ఎనిమిది ఇళ్లలో దీపాలు వెలిగాయి..కానీ వెలుతురు రాలేదు. గుమ్మం వైపే చూస్తూ నిద్రపోయిన పిల్లలు ఒక ఇంట్లో పిల్లలు అమ్మను అడిగారు..‘నాన్న ఎప్పుడొస్తారు?’ ‘రాత్రికి వస్తారు’ అని ఆమె చెప్పింది. గుమ్మం వైపు చూస్తూ చూస్తూ వాళ్లు నిద్రపోయారు. తెల్లవారింది. నాన్న రాలేదు. ఆ పిల్లలకు ఇంకా అర్థం కాలేదు..నాన్న ఇక ఎప్పటికీ రారని. మరో ఇంట్లో ముసలి తల్లి కొడుకు కోసం అన్నం వడ్డించి కూర్చుంది. అన్నం చల్లారిపోయింది. ఆమె ఆశలూ ఆవిరైపోయాయి. వీళ్లేం సరిహద్దుల్లో తుపాకులు పట్టలేదు. ప్రాణాంతక వ్యాధితో పోరాడలేదు. కేవలం పొట్టకూటి కోసం పనికి వెళ్లారు. కానీ వారు నమ్ముకున్న పని స్థలం వారికి రక్షణ ఇవ్వలేకపోయింది. అరిగిపోయిన క్రేన్లు. కాలం చెల్లిన సాంకేతికత. లాభాల కోసం ప్రాణాలను పణంగా పెట్టే నిర్ణయాలు. ఎందుకంటే ప్లాంట్ ఆపితే ప్రొడక్షన్ ఆగుతుంది, లాభాలు తగ్గుతాయి, పై అధికారులు ప్రశ్నిస్తారు. ఆ కార్పొరేట్ భయాల మధ్య ఎనిమిది మంది నిరపరాధుల ప్రాణాలు బూడిదయ్యాయి. –సాక్షి, విశాఖపట్నంఅంకెలుగా మిగిలిపోకూడదు రేపు వీరి పేర్లు పేపర్లలో వస్తాయి. టీవీల్లో చర్చలు జరుగుతాయి. రెండు రోజుల తర్వాత ప్రభుత్వ రికార్డుల్లో కేవలం అంకెలుగా మిగిలిపోతారు. న్యాయం అంటే కొన్ని లక్షల పరిహారం విసిరేయడం కాదు. వ్యవస్థ మారాలి. పరిశ్రమల్లో లాభాల కంటే కార్మికుల ప్రాణాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. పని కోసం ఇల్లు దాటిన ప్రతి మనిషి, క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవడం వారి హక్కు. ఆ హక్కును కాపాడడం వ్యవస్థ బాధ్యత. రేపు మరో తల్లి కన్నీరు కార్చకుండా ఉండటమే.. వీరికి ఇచ్చే నిజమైన నివాళి. -
చంద్రబాబు పాలన అవినీతిమయం
వైఎస్సార్సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అచ్యుతాపురం రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండేళ్లలో సాగించిన పాలన అవినీతిమంగా మారిందని వైఎస్సార్సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ అచ్యుతాపురం మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకరరావు ఆధ్వర్యంలో మంగళవారం అచ్యుతాపురం లేపాక్షి కల్యాణ మండపంలో నాలుగు మండలాల ముఖ్యనాయకులు కార్యకర్తలతో ‘రెండేళ్ల కూటమి పాలన కుతంత్రాల చర్చా వేదిక’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ పరిశీలకుడు కోలా గురువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు ఆగ్రహిస్తున్నారని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.450 కోట్ల వ్యయంతో పూడిమడకలో జెట్టీ నిర్మాణానికి శ్రీకారం చుడితే చంద్రబాబు ప్రభుత్వం దానిని నిలుపుదల చేయడం అన్యాయమన్నారు. బ్లూ జెట్ ఫార్మా వంటి రసాయన పరిశ్రమల కారణంగా మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పరిశ్రమల్లో మత్స్యకారులకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలేదని చెప్పారు. అరాచకాలకు అంతే లేదు.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ పరిశీలకుడు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ పాలనలో అరాచకాలకు అంతేలేకుండా పోయిందన్నారు. ఎక్కడా లేని విధంగా మునగపాక మండలంలో గ్రావెల్ దోపిడీ జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో రైతులు ఎరువుల సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతులను పిలుపునిచ్చారు. మెగా డీఎస్సీ దగా డీఎస్సీగా మారిందన్నారు. అచ్యుతాపురంలో ఫ్లై–ఓవర్ నిర్మాణం కారణంగా ఎంతో మందికి అన్యాయం జరిగిం దని, వ్యాపారాలు కోల్పోయే దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్రమంతటా రాక్షస పాలన, దగాకోరు పాలన కొనసాగుతోందని చెప్పారు. ఈ నెల 12వతేదీ ఉదయం 8.30 గంటలకు ధర్మశ్రీ స్వగ్రామమైన రాంబిల్లి మండలం మామిడివాడ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్ మెంబర్ బోదెపు గోవింద్, జిల్లా అధికార ప్రతినిధి భీముని వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ రాంబిల్లి మండల అధ్యక్షుడు కిషోర్ రాజు, మునగపాక మండల అధ్యక్షుడు ఆడారి అచ్చియ్యనాయుడు, జెడ్పీటీసీ సోము సత్యనారాయణ, అచ్యుతాపురం వైస్ ఎంపీపీ వాసుపల్లి పద్మ శ్రీనివాస్, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు సియ్యాద్రి బుజ్జి, రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ చోడపల్లి దేముడు, వైఎస్సార్టీయూసీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చోడిపల్లి అప్పారావు, సీనియర్ నాయకులు కూండ్రపు విమలా నాయుడు, గంగిరెడ్డి రాము, లాలం వాణివాసు, గొర్లి ప్రసన్న కుమార్, గొర్లి నూకరాజు, కారుకుండి శ్రీను, పంచదార్ల పైడిరాజు, రాజాన నాయుడుబాబు, యాండ్ర పైడిరాజు, శెట్టి నాగేశ్వరరావు, లాలం శ్రీను, మాడెం సూరి అప్పారావు, పిన్నమరాజు రవీంద్రరాజు, శనివాడ జువ్వలనాయు డు, దొడ్డి కృష్ణ, పీలా నర్సింగరావు, తోట వెంకటేష్, పంచదార్ల రవి, తట్టా రాజు, బండారు రమణ, పుర్రె సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాద తీవ్రతకు శిథిల సాక్ష్యాలుగా..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్ ఎస్ఎంఎస్–2 విభాగంలో సంభవించిన ఘోర ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్న అంతర్గత దృశ్యమిది. లాడిల్ పేలి అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ద్రవరూప ఉక్కు ఒక్కసారిగా ఉప్పొంగి పడటంతో ప్లాంట్ లోపలి క్యాబిన్ల అద్దాలు, ఇనుప రేకులు పూర్తిగా ఛిన్నాభిన్నమయ్యాయి. పేలుడు ధాటికి భారీ కేబుళ్లు సైతం కాలిపోయి వేలాడుతుండగా, పరిసరాల్లోని యంత్రాలు, ఫ్యాన్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న యాజమాన్య ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, హెల్మెట్లు ధరించిన రక్షణ సిబ్బంది ధ్వంసమైన యంత్రాలను, కాలిపోయిన భాగాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్లాంట్ అంతటా దట్టమైన బూడిద, కాలిపోయిన అవశేషాలు పేరుకుపోయి భీతావహ వాతావరణాన్ని తలపిస్తోంది. -
విచారణకు అధికారుల గైర్హాజరుపై ఆగ్రహం
రోలుగుంట: వీఆర్పీ అక్రమాలపై చేపట్టిన విచారణకు అధికారులు గైర్హాజరవడంతో ఫిర్యాదు దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కొమరవోలులో వీఆర్పీ కృష్ణ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఉపాధి హామీ కూలీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 4, 6 తేదీల్లో అధికారులు విచారణ జరిపారు. మళ్లీ మంగళవారం నిర్వహించిన విచారణకు ఎంపీడీవో వి.ఎస్.నాగేశ్వరరావు, ఏపీడీ చిన్నారావు హాజరు కాలేదు. ఏపీవో మాత్రమే హాజరుకావడంతో ఫిర్యాదుదారులు బి.వి.జె,పాత్రుడు, బండారు వరహాలుదొర, వంటాకుల సత్తిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచరాణాధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తురున్నారని వారు ఆరోపించారు. ఉన్నతాఽఽఽధికారులు వస్తేనే తాము సహకరిస్తామని వారు ఏపీవోతో తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఏపీవో, ఫిర్యాదుదారుల మధ్య వాగ్వాదం జరిగింది. విచారణ నిర్వహించకుండానే ఏపీవో వెనుదిరిగారు. దీనిపై ఎంపీడీవో నాగేశ్వరరావుని సాక్షి సంప్రదించగా తాను డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటన డ్యూటీలో పాల్గొనాల్సి వచ్చిందని, ఏపీడీ చిన్నారావు తమశాఖ పీడీ నిర్మాలాదేవి ఆదేశాల మేరకు గొలుగొండ మండలంలో విధులు నిర్వాహించాల్సి వచ్చిందని వివరించారు. -
నక్కపల్లి, ఉపమాకల్లోదాహం కేకలు
నెలరోజులుగా నిలిచిపోయిన నీటి సరఫరా ● ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద ఆందోళన నక్కపల్లి: మండలంలో పలు గ్రామాల్లో దాదాపు నెలరోజుల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు అల్లాడుతున్నారు. వేసవి ఎండలు, ఆపై ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి గోరు చుట్టుపై రోకటిపోటులా తాగునీటి ఎద్దడి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఇబ్బందులను గుర్తించిన వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ డిమాండ్ చేశారు. నక్కపల్లిలో నెలరోజుల నుంచి రక్షిత మంచినీటి పథకాల ద్వారా తాగునీటి సరఫరా జరగడం లేదు.హెటెరో రసాయన పరిశ్రమ వారు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ దగ్గర నుంచి ఐదు రూపాయలకు డబ్బా నీళ్లు కొనుక్కుని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే ఈ ఆర్వో ప్లాంట్ కూడా వారం రోజుల నుంచి మూలకు చేరింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. తాగునీటి కోసం కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాల్లోకి వెళ్లి వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఉపమాకలో కుళాయిల మూగనోము ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాకలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ కుళాయిల ద్వారా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలంతా ఆలయం వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన కుళాయిల వద్దకు వచ్చి నీటిని పట్టుకుంటున్నారు. ఉపమాక శివారు మన బాన వానిపాలెం గ్రామస్తులకు ఇదే ఇబ్బంది ఉంది. వీరు కిలోమీటరు దూరంలో ఉన్న జాతీయరహదారి వద్దకు వచ్చి అక్కడ ఉన్న వ్యవసాయ బావుల్లో నీటిని తాగడం, ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవాల్సిన పరిస్దితి నెలకొంది. గొట్టివాడ వద్ద వరాహనదిలో ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టు సక్రమంగా పని చేయడం లేదు. అక్కడ నుంచి నక్కపల్లి పరిసర ప్రాంత గ్రామాలకు పైపుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల కిత్రం ఏర్పాటు చేసిన ఈ పైపులైను పూర్తిగా చెడిపోయింది. తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నప్పటికీ వారం పదిరోజుల మించి పనిచేయడం లేదు. -
స్కేటింగ్ క్రీడాకారిణికి అభినందన
నర్సీపట్నం: ఇటీవల తైవాన్లో జరిగిన అంతర్జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీల్లో నర్సీపట్నానికి చెందిన పి.చైత్రదీపిక అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు కైవసం చేసుకుంది. క్రీడాకారిణి మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రు డుని మర్యాదపూర్వకంగా కలిసింది. ఆమెను స్పీక ర్ అభినందించారు. తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ కాంపిటిషన్స్లో చైత్రదీపిక భారతదేశం తరపున ప్రాతి నిధ్యం వహించింది. యూత్ కేటగిరి ఇన్లైఫ్ ఈవెంట్లో రజత పతకం, సోలో డ్యాన్స్ ఈవెంట్లో కాంస్య పతకం, క్యాడెట్ కేటగిరి షో గ్రూప్ ఈవెంట్లో రజత పతకాలు సాధించింది. -
ఆదివాసీల ఫిర్యాదుపై తహసీల్దార్ విచారణ
రావికమతం: ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హైదరాబాద్కు చెందిన చుండూరు ఉషారాణి,భర్త నాగేశ్వరరావు బెదిరిస్తున్నారని, అధికారుల ద్వారా స్వాధీనం చేసుకోడానికి యత్నిస్తున్నారని, ఈ విషయంపై కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని చీమలపాడు పంచాయతీ జెడ్.జోగుంపేట గ్రామానికి చెందిన ఆదివాసీలు చేసిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ అంబేడ్కర్ మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ సర్వే నంబరు 66–2లో 78 ఎకరాల జిరాయితీ భూమిలో పది ఎకారాలను తాను కొనుగోలు చేశానని చెప్పారు. అనంతరం తహసీల్దార్కు డాక్యుమెంట్లు చూపించారు. మీ దగ్గర ఏమైనా డ్యాకుమెంట్లు ఉంటే చూపించాలని ఆదివాసీలను తహసీల్దార్ అడగగా తాము చాలా సంవత్సరాల నుంచి సాగులో ఉన్నామని ఈ భూమి తమకే చెందుతుందని ఆదివాసీలు తెలిపారు. దీనిపై నివేదికను జిల్లా అధికారుల అందజేస్తానని తహసీల్దార్ చెప్పారు.ఎటువంటి గొడవలు జరగకుండా కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రావికమతం, రోలుగుంట, బుచ్చెయ్యపేట పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నేడు విశాఖకు మాజీ సీఎం వైఎస్ జగన్
స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం విశాఖకు రానున్నారు. విశాఖ స్టీల్ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్ర గాయాలతో నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో పాటు, ప్రస్తుతం సెవెన్హిల్స్, కిమ్స్ ఐకాన్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్ జగన్ స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే.. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11:20కి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాంనగర్లో గల సెవెన్హిల్స్ ఆసుపత్రికి 11:40కి చేరుకుని, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తిరిగి మధ్యాహ్నం 1:10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1:50కి షీలానగర్లో ఉన్న కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 2:20 గంటలకు ఆసుపత్రి నుంచి బయలుదేరి 2:30కి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని తిరిగి గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రయాణమవుతారు. -
అతనితో శారీరక సంబంధం పెట్టుకో.. బాలికకు వీఆర్వో ఒత్తిడి..!
అనకాపల్లి జిల్లా: మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలికను ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోమని బలవంతం చేసిన మహిళా వీఆర్వోపై కేసు నమోదు చేసినట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం. ఉపేంద్ర తెలిపారు. వివరాలివి. ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక హాస్టల్ ఉండి చదువుకుంటోంది. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన ఆ బాలికకు సమీపంలో ఉన్న మహిళా వీఆర్వో బొల్లం పార్వతి ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోమని చెప్పింది. అందుకు బాలిక నిరాకరించడంతో మహిళా వీఆర్వో, ఆమె అక్క సింగారపు అప్పలనర్సలు చెడు ప్రచారం చేయసాగారు. బాలికకు వేరొక వ్యక్తితో శారీరక సంబంధం ఉన్నట్టు వదంతులు సృష్టించి ప్రచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది తెలిసిన బాలిక మనస్థాపం చెందడంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఈ నెల 6వ తేదీన యలమంచిలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదు. దీంతో సోమవారం జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో వీఆర్వోపై కలెక్టరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఓటరు జాబితాల నిర్వహణలో బీఎల్ఏలదే కీలక పాత్ర
అనకాపల్లి టౌన్: ఓటరు జాబితాల నిర్వహణలో బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) పాత్ర అత్యంత కీలకమని వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ అన్నారు. పట్టణంలోని న్యూకాలనీ రోటరీ కల్యాణ మండపంలో నియోజకవర్గ పరిధిలోని 251 మంది బీఎల్ఏలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై ప్రత్యేక శిక్షణ కార్య క్రమం నిర్వహించారు. సమన్వయకర్త భరత్కుమా ర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి (కోఆర్డినేషన్) హర్షవర్ధన్రెడ్డి పాల్గొని ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, సవరణ దరఖాస్తుల సమర్పణ విధివిధానాలపై అవగాహన కల్పించారు. నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా బీఎల్ఏ లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పార్టీ నియమించిన ఏజెంట్లు ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేపట్టాలని, పార్టీకి పడే ఏ ఒక్క ఓటూ జాబితా నుంచి తొలగిపోకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో 23 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితాపై సమగ్ర రివిజన్ జరుగుతోందని, ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం ఆమోదించిన ఏవైనా రెండు గుర్తింపు కార్డులు (డాక్యుమెంట్లు) తప్పనిసరిగా ఉండేలా ఓటర్లను నేరుగా కలిసి చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. 100 రోజుల పాటు సాగే ఈ ప్రక్రియలో అధికారులు ఓటర్ల తొలగింపు, సవరణలను పారదర్శకంగా నిర్వహిస్తున్నారో లేదో నిరంతరం గమనించాలన్నారు. ముఖ్యంగా ద్వంద్వ ఓట్ల (డబుల్ ఓట్లు) నమోదుపై తగిన ఆధారాలు సేకరించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎక్కడైనా అర్హులైన వారి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నట్లు గమనిస్తే, వెంటనే ఆ ఓటరు పూర్తి వివరాలను పార్టీ లీగల్ టీమ్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇప్పుడు తయారయ్యే ఓటర్ల జాబితాయే భవిష్యత్తులో వైఎస్సార్సీపీ విజయానికి కీలకం కానుందని, కాబట్టి ప్రతి ఏజెంట్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువులు కూడా సరఫరా చేయలేకపోతోందని జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ విమర్శించారు. దొడ్డిదారిలో ఒక్కో డీఎస్సీ పోస్టును రూ.లక్షలకు అమ్ముకుంటూ అర్హులకు అన్యాయం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా సూపర్ సిక్స్లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రైతులు, జర్నలిస్టులు, మహిళలపై దాడులు, అత్యాచారాలకు సంబంధించిన ఫొటోలను తెరపై ప్రదర్శిస్తూ చంద్రబాబు నిరంకుశ పాలనను సమన్వయకర్త భరత్ కుమార్ ఎండగట్టారు. యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1500 సాయం, అమ్మఒడి, కొత్త పింఛన్లు వంటి ఏ ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. నియోజకవర్గ పరిశీలకులు సతీష్ వర్మ మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ఓట్లను అడ్డదారిలో తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టాలన్నారు. నర్సీపట్నం నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరై నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి మాట్లా డుతూ ప్రతి ఓటూ కీలకమైందని, బూత్ లెవెల్ ఏజెంట్లు ఇళ్లకు వెళ్లినప్పుడు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి ఓటు నమోదుకు అవసరమైన వివరాలను సేకరించాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబా బు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షు డు జాజుల రమేష్, వివిధ వార్డుల ఇంచార్జ్ లు కె.ఎమ్. నాయుడు, బొడ్డేడ శివ, కోరుకొండ రాఘవ, అల్లు త్రినాథ్, బుద్ధ భాస్కర్ రావు, మళ్ల బుల్లిబాబు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
8 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు
కశింకోట: ఒడిశా నుంచి రాజస్థాన్కు మోటారు బైక్పై గంజాయి తరలిస్తున్న ఇద్దర్ని కశింకోట వద్ద సోమ వారం అరెస్టు చేసినట్టు సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. స్థానిక పీఏసీఎస్ సమీపంలో జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడినట్టు తెలిపారు. రాజస్థాన్లోని బిల్వారా జిల్లా రతన్పురా గ్రామానికి చెందిన డ్రైవర్ ఈశ్వర్ గుజ్జర్ (27), అదే జిల్లాకు చెందిన కూలీ మహమ్మద్ సల్మాన్ (30)లను అరెస్టు చేశామన్నారు. రాజస్థాన్ నుంచి అనకాపల్లి వచ్చి పూడిమడక మార్గంలోని వంతెన వద్ద బైక్ను దొంగిలించి ఒడిశా వెళ్లి గంజాయి కొనుగోలు చేసి తరలిస్తుండగా ఎస్ఐలు లక్ష్మణరావు, సతీష్, ఏఎస్ఐ మణికుమారి, సిబ్బంది పట్టుకున్నార న్నారు. దొంగిలించిన బైక్తో పాటు గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా పోలీసులను అభినందించారు. -
గోవాడ రైతుల సమస్యలపై పోరాటానికి సిద్ధం
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ చెరకు రైతుల తరపున త్వరలో వైఎస్సార్సీపీ పోరాటం చేయడానికి సిద్ధమవుతుందని ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల ముందు గోవాడ ఫ్యాక్టరీని ఆదుకుంటామని చెప్పి తర్వాత ఏకంగా దాన్ని మూసేసిన చంద్రబాబు ప్రభుత్వం మోసాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన సమయం వచ్చిందన్నారు. సూపర్ సిక్స్ మోసాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వెన్నుపోటుకు రెండేళ్లు దశల వారీగా నిరసన కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా రెండేళ్లలో రాష్ట్రంలోను, జిల్లాలోనూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాలు, దౌర్జన్యాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ చోడవరంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను అమర్నాథ్, ముత్యాలనాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చోడవరం, మాడుగుల నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులతో చోడవరం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏకై క అతిపెద్ద గోవాడ సుగర్ ఫ్యాక్టరీ 2024 సీజన్ వరకూ ఎంతో చక్కగా క్రషింగ్ చేస్తూ రైతులకు సకాలంలో బకాయిలు ఇచ్చిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూసేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 వేల మంది సభ్య రైతులు, 2 లక్షల మంది ప్రత్యక్ష, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న రైతు, కార్మికుల కుటుంబాలు రోడ్డున పడేలా చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఫ్యాక్టరీని ఆధునికీకరించి టన్నుకు రూ. 4 వేలు గిట్టుబాటు ధర ఇస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక పాత బకాయిలు ఇవ్వకపోగా, రెండేళ్లుగా ఫ్యాక్టరీ మహాజన సభలు సైతం నిర్వహించ లేదని ధ్వజమెత్తారు. రైతుల తరపున పోరాటం చేసి, చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాన్ని అందరికీ తెలియజేయడంతోపాటు ఫ్యాక్టరీని తెరిపించి, పాత బకాయిలు చెల్లించేలా వైఎస్సార్సీపీ ఉద్యమానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో అర్హత ఉన్న ఓట్లు తొలగించకుండా గ్రామాల్లోకి వస్తున్న సర్వే అధికారులతో కలిసి బూత్ ప్రతినిధులు పనిచే యాలని సూచించారు. ఈ నెల 12వ తేదీన చోడవరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని అమర్నాథ్ కోరారు. కార్యక్రమంలో మహిళా విభాగం జోన్ –1 అధ్యక్షురాలు ఈర్లె అనురాధ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, సంయుక్త కార్యదర్శి దొండా రాంబాబు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి పల్లా నర్సింగరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొళ్లిమళ్ల అచ్చెంనాయుడు, సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు, రైతు విభాగం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, బూరె బాబూరావు, కర్రి సత్యం, పలు మండలాల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీలు, అనుబంధ కమిటీల ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
తరగని సమస్యలు
సాగు భూములు ఖాళీ చేయాలని బెదిరింపులు తుమ్మపాల: అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజా సమస్యలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఒకే సమస్యపై పదే పదే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా శాశ్వత పరిష్కారం కావడం లేదు. ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్కు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వారం సైతం 281 అర్జీలు నమోదు కావడం గమనార్హం. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మందిరంలో కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి, డీఆర్వో వై.సత్యనారాయణరావు అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఏడీ సర్వే, ఇరిగేషన్, బీసీ వెల్ఫేర్, ఏపీఎస్ఆర్టీసీ, డ్వామా, తాగునీరు తదితర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పెండింగ్ అర్జీలు అధికంగా ఉన్న శాఖల అధికారులకు ప్రత్యేక సూచనలు జారీ చేస్తూ, సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వారం మొత్తం – 281 వినతులు రాగా, వాటిలో రెవెన్యూ క్లినిక్ –143, పీజీఆర్ఎస్ –138 నమోదయ్యాన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాశీపురంలో ఏళ్ల తరబడి తీరని మురుగు వ్యధ ఏళ్ల తరబడి తీరని వ్యధగా ఉన్న మురుగు కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ దేవరాపల్లి మండలం కాశీపురం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. స్వచ్ఛభారత్ పేరుతో పంచాయతీకి నిధులు మంజూరవుతున్నా పాత పోస్టాఫీసు సమీపంలో దుర్గంధంగా తయారైన కాలువను కనీసం పట్టించుకోవడం లేదని, అనేకసార్లు అర్జీలు చేసినా బుట్టదాఖలు చేస్తున్నారని, దాదాపు వంద నివాసాల మురుగునీరు దిగువకు పోకుండా నిలిచిపోతుందని, దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడంతో వర్షాలు పడినప్పుడు ఇళ్లలోకి చేరుతుందని, పాలకులు, అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. తాగునీరు లేక అర్జీదారుల విలవిల కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో అర్జీదారుల దాహం తీరేందుకు చుక్కనీరు కూడా దొరకలేదు. రెండు వారాల క్రితం కలెక్టరేట్ బయట ఆర్భాటంగా ప్రారంభించిన మజ్జిగ చలివేంద్రం చుట్టుపు చూపుగానే పెట్టి మూసేశారు. మజ్జిగ లేదు కదా.. కనీసం మంచినీరు కూడా లేకపోవడంతో అర్జీదారులు మండుటెండలో దాహంతో ఇబ్బందులు పడ్డారు. అర్జీలు రాసేందుకు సరైన సౌకర్యాలు లేక అనేక మమంది ఎండలోనే నిల్చోని తమ సమస్యలపై అర్జీలు రాసుకున్నారు. పలువురు వృద్ధులు గంటల తరబడి కలెక్టరేట్ బయటే అధికారుల రాక కోసం నిరీక్షించారు. అధికారులు మాత్రం చుట్టపు చూపుగానే వచ్చి అర్జీలు తీసుకుని వెళ్లిపోవడంతో వారంతా అసహనం వ్యక్తం చేశారు. రావికమతం: ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తూ ఆధారపడి జీవనం సాగిస్తున్న భూములను ఖాళీ చేసి వెళ్లిపోవాలని కొంతమంది రాజకీయ పలుకుబడితో బెదిరిస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని చీమలపాడు పంచాయతీ జెడ్.జోగుంపేట గ్రామానికి చెందిన ఆదివాసీలు కోరుతున్నారు. దీనిపై సోమవారం కలెక్టర్, ఎస్పీలకు వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు. కళ్యాణపులోవ జలాశయం ఎగువన జెడ్.జోగుంపేటలో పదెకరాల భూములను తరతరాలుగా తాము సాగు చేస్తున్నామన్నారు. వాటిని హైదరాబాద్కు చెందిన చుండూరు ఉషారాణి, ఆమె భర్త నాగేఽశ్వరరావు 2025 నుంచి ఖాళీ చేయాలని వివిధ రూపాల్లో ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. వారి నుంచి తమకు రక్షణ కల్పంచి న్యాయం చేయాలని ఆదివాసీలు చీడిపల్లి దేముడమ్మ, రెచుకట్ల లోవమ్మ కోరారు. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె. జనార్దన్ మాట్లాడుతూ ఆదివాసీల భూములను పెత్తందారులు రాజకీయ పలుకుబడితో ఖాళీ చేయాలని బెదిరించడం దారుణమని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. పింఛన్ అడిగితే కేసు నమోదు చేశారు? ‘పింఛన్ సొమ్ము ఇవ్వలేదని గ్రామ సచివాలయంలో అడిగినందుకు నా కుమారుడిపై కేసు నమోదు చేసి వేధిస్తున్నారని, దళిత వృద్ధురాలిలైన నన్ను, నా కుమారుడ్ని తీవ్ర దుర్భాషలాడిన సచివాలయ ఉద్యోగిపైనా కేసు నమోదు చేసి మాకు న్యాయం చేయాలి’ అంటూ పాయకరావుపేటకు చెందిన మారెళ్ల అప్పలనర్స కలెక్టరేట్ బయట ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నెల 1న మా ఇంటి వద్ద పింఛన్ నగదు ఇవ్వలేదు. 2న సచివాలయానికి వెళ్లి అడిగినందుకు ఆగలేరా అంటూ మాపై దురుసుగా ప్రవర్తించారని, పింఛన్ ఇవ్వకపోవడంతో మందులు కొనుక్కోలేకపోయానని, రోజువారి మాత్రలు లేక ఇబ్బంది పడుతున్నానంటూ ఆవేదన వెళ్లబుచ్చింది. నా కుమారుడు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని పోలీసులు సచివాలయ ఉద్యోగి తప్పుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేయడం దారుణమంది. న్యాయం కోసం కలెక్టర్ను కలిసేందుకు వస్తే లోపలికి పంపించడం లేదని వాపోయింది. దివ్యాంగులు, వృద్ధులు కలెక్టర్ను కలిసే అవకాశం లేదని, కింద అధికారులు వస్తారని బయటే ఉంచేశారని ఆవేదన వ్యక్తం చేసింది. -
ప్రమాదంపై సమగ్ర విచారణ జరగాలి
గాజువాక : స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణ నిర్వహించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఉక్కు ప్రమాద మృతులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండేళ్లుగా వీఆర్ఎస్, రిటైర్మెంట్వాళ్లతో కలుపుకొని సుమారు 9,500 మంది కార్మికులను తొలగించారన్నారు. ఉన్న కార్మికులపై విపరీతమైన ఒత్తిడి పెంచారని, ఉత్పత్తి ఆధారితంగా జీతాలు చెల్లిస్తామని షరతు పెట్టారని అన్నారు. దీనివల్ల కార్మికులపై అదనపు భారం పడిందన్నారు. మొన్నటివరకు పది మంది చేయాల్సిన పనిని ఇప్పుడు ముగ్గురు చేస్తున్నారన్నారు. కార్మికులపై అంత భారం పడినప్పుడు వారికి కల్పించాల్సిన భద్రతా ప్రమాణాలపై యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. భద్రతా ప్రమాణాలు తీసుకోకపోవడమే కాక, సీనియర్ ఉద్యోగులను బలవంతంగా వీఆర్ఎస్ పెట్టించేసి, ఉన్నవాళ్లపై ఒత్తిడి పెంచారన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు యాజమాన్యం ఆ బాధ్యత కూడా తీసుకోకుండా ఈరోజు ఇంతమంది కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణమైందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు కనీసం కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇవ్వడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఉపమాక ఆలయ చోరీ కేసులో నిందితులు అరెస్టు
నక్కపల్లి/అనకాపల్లి: ఉపమాక వేంకటేశ్వర స్వా మి ఆలయంలో ఈనెల 3వ తేదీన జరిగిన చోరీకి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తుహిన్సిన్హా విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఆలయంలో భారీ చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈనెల 3వ తేదీ రాత్రి ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి ఉపమాక ఆలయ ప్రాంగణంలోకి వెనుక ప్రాంతం నుంచి ప్రవేశించారన్నారు. ఆస్థాన మండపంలో ఉన్న హుండీని, ఆండాళ్లమ్మవారి సన్నిధిలో ఉన్న హుండీని కట్టర్తో కట్చేసి వాటిలో భక్తులు స్వామివారికి కానుకల రూపంలో సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలతోపాటు, నగదును అపహరించారన్నారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి క్లూస్ టీములను రంగంలోకి దించి విచారణ ప్రారంభించామన్నారు. నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల సీఐల నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసామన్నారు. సీసీ ఫుటేజీ లద్వారా విచారణ వేగవంతం చేసామన్నారు. దీనిలో భాగంగా ఈనెల 7వ తేదీన ఉద్దండపురం బస్టాప్లో ఇద్దరు అనుమానిత వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో ఈ చోరీ చేసింది తామేనని అంగీకరించారన్నారు. నక్కపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన కశిరెడ్డి శ్రీహరి, గంట్యాడ చిన్నలను అరెస్టు చేసామన్నారు. వీరి నుంచి రూ.2.38,078 నగదు, సమారు రూ. 8 లక్షల విలువైన బంగారు కానుకలు (56 గ్రాములు) సుమారు రూ.7.20 లక్షలు విలువైన 2.600 గ్రాముల వెండి ఆభరణాలు స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీటి మొత్తం విలువ రూ.17.68 లక్షలుంటుందని ఎస్పీ చెప్పారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. నగదు ఆభరణాలతోపాటు, నేరానికి ఉపయోగించిన సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీ జరిగిన ఐదురోజుల వ్యవదిలోనే కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేయడంతో పాటు నూరుశాతం చోరీ సొత్తును స్వాధీనం చేసుకోగలిగామన్నారు. ఈ కేసు చేధించడంలో నర్సీపట్నం డీఎప్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు మురళి, రామకృష్ణ, అప్పలనాయుడలతోపాటు, ఎస్ఐలు సన్ని బాబు, సాహెబా అంజుమ్, మహ్మద్ ఆలీ షరీఫ్ ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి వారి కి నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లాలో అన్ని ప్రధాన దేవాలయాల వద్ద భద్రతా చర్యల్ని కట్టుదిట్టం చేయాలని, రాత్రి గస్తీ నిర్వహించాలని ఆదేశించినట్టు ఎస్పీ తెలిపారు. -
స్టీల్ప్లాంట్ దుర్ఘటనతో ఎనిమిది కుటుంబాల్లో తీరని విషాదం
సాక్షి, విశాఖపట్నం/ఉక్కునగరం/అక్కిరెడ్డిపాలెం: ఉద యం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు భార్యతో ‘సాయంత్రం త్వరగా వచ్చేస్తా’ అన్నారో కార్మికుడు.. ‘నాన్న వచ్చేటప్పుడు స్వీట్లు తీసుకురావా’ అని అడిగిన కూతురి తల నిమిరి ముద్దాడి వెళ్లారో తండ్రి.. ‘జాగ్రత్త నాయనా’ అని వెన్నుతట్టిన ముసలి తల్లికి ధైర్యం చెప్పి డ్యూటీకి బయలుదేరాడో కొడుకు.. రక్తాన్ని చెమటగా మార్చి, దేశ ప్రగతికి ఇనుప కవచాన్ని నిర్మించేందుకు ఆ చేతులు విశాఖ ఉక్కు కర్మాగారంలోకి అడుగుపెట్టాయి. కానీ, కాలం ఇంత క్రూరంగా మారుతుందని.. తాము నమ్ముకున్న కర్మాగారమే తమకు అగ్నిసమాధి అవుతుందని ఆ కార్మికులు ఊహించలేకపోయారు. ఒక్కటంటే ఒక్క క్షణం.. కేవలం ఆ ఒక్క క్షణంలో సంభవించిన అగ్నిప్రళయం ఎనిమిది మంది కార్మికులను మాంసపు ముద్దలుగా మార్చేసింది. కళ్లెదుటే ప్రాణాలు కరిగిపోతుంటే, కాపాడుకోలేక మిగిలిన శోకం.. ఉక్కునగరాన్ని కన్నీటి సముద్రంగా మార్చింది. 1600 డిగ్రీల అగ్నిప్రళయం సోమవారం సాయంత్రం 4,15 గంటల సమయం.. ‘బీ’ షిఫ్ట్ విధులు సాఫీగా సాగిపోతున్నాయి. స్టీల్ మెల్ట్ షాప్ (ఎస్ఎంఎస్–1) విభాగంలో, నేలమట్టానికి దాదాపు 9 మీటర్ల ఎత్తున ఉన్న సీసీడీ సెక్షన్ అంతా కార్మికులు, అధికారుల అలికిడితో సందడిగా ఉంది. బ్లాస్ట్ఫర్నేస్లో ఎర్రగా కాగిన హాట్మెటల్ను భారీ లేడిల్లో ఎస్ఎంఎస్కు తరలించి, ద్రవపు ఉక్కుగా మార్చే కీలక ప్రక్రియ జరుగుతోంది. ఉత్పత్తి లక్ష్యాలను అందుకునే క్రమంలో సీసీడీ మిషన్–2 పై లేడల్ను ప్లేస్ చేసి, రొటేట్ చేయడం ప్రారంభించారు. అంతా సజావుగానే ఉందనుకున్న మరుక్షణమే.. ఊహకందని కాలసర్పంలా ఆ ఘోర విస్పోటనం సంభవించింది. ద్రవరూపంలో ఉన్న ఆ నిప్పుల నరకం షాప్ ఫ్లోర్పై సునామీలా దూసుకురావడంతో, చుట్టుపక్కల ఉన్న భారీ యంత్రాలు సైతం మంటల్లో చిక్కుకున్నాయి. క్షణాల వ్యవధిలో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. కనీసం కళ్లు తెరిచి చూడడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి ఎటు పరుగెత్తాలో కూడా తెలియని ఓ నరకప్రాయ వాతావరణం అక్కడ ఏర్పడింది. ఊహకే అందని నరకయాతన! 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరిగే నీరు తగిలితేనే చర్మం ఊడిపోతుంది. అలాంటిది 1600 డిగ్రీల సెల్సియస్ అంటే పటిష్టమైన ఇనుము, రాళ్లు సైతం నీరులా కరిగిపోతాయి. ఈ అగ్ని ద్రవం మనిషి శరీరంపై పడితే.. కనీసం రక్తం కారడానికి, లేదా చర్మం కాలడానికి కూడా సమయం ఉండదు. క్షణాల వ్యవధిలో మాంసము, ఎముకలు సైతం బూడిదగా మారిపోతాయి. ఆ వేడి నుంచి వెలువడే శ్వాస గొంతులోకి వెళ్తే ఊపిరితిత్తులు క్షణంలో మాడిపోతాయి. ప్రమాద స్థలంలో కార్మికులు అనుభవించిన ఆ క్షణ కాల నరకయాతన వర్ణనాతీతం, హృదయవిదారకం. కళ్లెదుటే కరిగిపోయిన మనుషులు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్లు, సహచర కార్మికులకు అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి కన్నీరు ఆగలేదు. నిలువెత్తు మనుషులు క్షణాల వ్యవధిలో బొగ్గు ముద్దలుగా మారిపోయారు. కనీసం వారు ధరించిన దుస్తులు గానీ, ముఖాలు గానీ ఆనవాళ్లు లేకుండా పోయిన స్థితి వర్ణనాతీతం. మరోవైపు శరీరమంతా కాలిన గాయాలతో, ప్రాణ రక్షణ కోసం క్షతగాత్రులు చేసిన ఆర్తనాదాలు ఉక్కునగర వాతావరణాన్ని శోకసంద్రంగా మార్చాయి. వారిని వెంటనే ప్లాంట్ జనరల్ ఆసుపత్రికి, నగరంలోని కిమ్స్, సెవెన్ హిల్స్ ఆసుపత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు ప్లాంట్ మెయిన్ గేట్ వద్దకు, ఆసుపత్రుల వద్దకు పరుగున చేరుకున్నారు. తమ వారు బతికే ఉన్నారో లేదో తెలియక, లోపలికి వెళ్లనివ్వక వారు ఆసుపత్రి కారిడార్లలో గుండెలు పగిలేలా ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని ద్రవింపజేసింది. బతుకులు.. బుగ్గయ్యాయి ఈ ఘోర ప్రమాద బాధితుల్లో మేనేజర్ స్థాయి అధికారి గోల్డ్ కుమార్ నుంచి.. రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారీ కాంట్రాక్ట్ కార్మికుల వరకు ఉన్నారు. నక్క వెంకటరమణ, త్రినాథ్, అప్పలరాజు వంటి కాంట్రాక్ట్ కార్మికుల ఇళ్లల్లో ఈ ప్రమాదం కోలుకోలేని చీకట్లను నింపింది. అరకొర జీతాలు, కనీస భద్రత లేని వాతావరణం.. అయినా సరే, కేవలం కుటుంబ పోషణ కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధుల్లో చేరిన ఆ పేద బతుకులు.. కరిగిన ఉక్కు సముద్రంలో కలిసిపోయాయి. కన్నీరుమున్నీరు ‘నువ్వే పోతే మాకు దిక్కెవరు నాన్నా?‘ అని పిల్లలు, ‘పొద్దునే కదా కళ్లముందు తిరిగావు.. ఇంతలోనే శవమయ్యావా?‘ అంటూ మృతుల భార్యలు ఆసుపత్రి నేలపై పొర్లి ఏడుస్తుంటే.. అక్కడ ఉన్న పోలీసుల కళ్లు సైతం చెమర్చాయి. ఇప్పుడు ఆ అభాగ్య కుటుంబాలను ఆదుకునే నాథుడెవరు? తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారి పిల్లల భవిష్యత్తు ఏంటి? అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. మార్చురీ వద్ద ఉద్రిక్తత పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్కు తరలించాలని అధికారులు ప్రయత్నించగా, క్షతగాత్రుల కుటుంబీకులు, తోటి కార్మికులు అడ్డుకున్నారు. ‘మా వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమేంటో చెప్పాలి.. మాకు ఏం న్యాయం చేస్తారో తేల్చాలి’ అంటూ మార్చురీ ముందే బైఠాయించారు. యాజమాన్యం నిర్లక్ష్యమేనా? ఈ ఘోర దుర్ఘటనపై ఉక్కు కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్లాంట్లో భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కీలకమైన విభాగాల్లో కాలానుగుణంగా యంత్రాల ఫిట్నెస్ పరీక్షించకపోవడం వల్లే లాడిల్ పేలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించి, మృతుల కుటుంబాలకు భారీ పరిహారంతో పాటు ఇంట్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అమ్మని బాగా చూసుకోరాకంటతడి పెట్టిస్తున్న క్షతగాత్రుడి వీడియో వర్మా.. తమ్ముడి మీద ఎప్పుడూ చిరాకు పడకే.. తమ్ముడిని బాగా చదివించురా...నువ్వు కూడా బాగా చదువుకోమ్మా... అమ్మని బాగా చూసుకోండి...ఉంటాను డాడీ...అంటూ స్టీల్ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పైడిరాజు వీడియో అందర్నీ కన్నీటి సంద్రంలో ముంచేస్తోంది. ఒంటినిండా గాయాలతో చికిత్స పొందుతున్న ఆ బాధితుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో పిల్లలకు జాగ్రత్తలు చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. నవ్వుతూ వెళ్లిన నాన్న నల్లటి ముద్దయ్యాడు నాన్న ఎప్పుడు వస్తారు? అని అడుగుతున్న చిన్నారులు సాయంత్రానికి మార్చురీల వద్ద గుండెలవిసేలా రోదనలు కేంద్ర మంత్రి కుమారస్వామి ప్లాంట్ సందర్శనకంట్రోల్ రూమ్ ఏర్పాటుమహారాణిపేట: విశాఖ స్టీల్ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై పూర్తి సమాచారం ప్రజలకు, సంబంధిత సంస్థలకు అందుబాటులో ఉండేలా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు, క్షతగాత్రుల సమాచారం కోసం 0891–2590100, 0891–2590101, 0891–2590102 నంబర్లను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేందుకు గుర్తించిన ఆస్పత్రులకు ప్రత్యేక ఇన్చార్జీలను నియమించినట్లు కూడా వెల్లడించారు. మెడికవర్ హాస్పిటల్ (ఇసుకతోట)– ప్రత్యేక ఉప కలెక్టర్ : 91000 64971, ఎంజీఎం–సెవెన్ హిల్స్ (రాంనగర్)– ఆర్డీవో సంగీత్ మాధుర్ : 98499 03852, కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ , షీలానగర్, గోపాలపట్నం తహసీల్దార్ : 9100064976, స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్, ఉక్కునగరం, గాజువాక తహసీల్దార్ త్రినాథ్: 98499 03843 యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే..డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని సిఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్, అధ్యక్షుడు కేఎం శ్రీనివాస్ ఒక ప్రకటనలో ఆరోపించారు. కాలం చెల్లిన యంత్రాలు వాడడం, నాసిరకం ముడిసరుకు, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే లాడిల్ పేలి 8 మంది కార్మికులు ప్రా ణాలు కోల్పోయారని మండిపడ్డారు. ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రల్లో భాగంగానే భద్రతను గాలికొదిలేసి, అనుభవం లేని కాంట్రాక్ట్ కార్మికులతో పనులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ దుర్ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
సోలార్ ప్లాంట్కు భూములిచ్చేది లేదు
చీడికాడ: సోలార్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో నాలుగు గ్రామాల రైతుల నుంచి బలవంతపు భూ సేకరణను ఆపాలని వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న,రైతు సంఘం మండల కార్యదర్శి ఆర్.దేముడునాయుడు డిమాండ్ చేశారు. సోమవారం బాధిత గ్రామాలైన బైలపూడి, చినగోగాడ, జి.కొత్తపల్లి, అడవిఅగ్రహారం గ్రామాల రైతులు నిర్వహించిన జి.కొత్తపల్లి నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర మండుటెండలో జరిగిన పాదయాత్రలో వారు రైతులకు మద్దతుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు మద్దతుగా పాల్గొన్న వీరు మాట్లాడుతూ 4 గ్రామాల పరిధిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు పేరిట 262 ఎకరాల భూమిని భూ సేకరణ చేస్తున్నట్టు గతంలో సంబంధిత రైతులకు నోటీసులు ఇవ్వడంతో తమ భూములను ప్లాంట్ ఏర్పాటుకు ఇవ్వబోమని ఇప్పటికే నోటీసులకు సమాధానం చెప్పినా తహసీల్దారు పోలీసుల సహకారంతో అయినా భూములను బలవంతంగా సేకరిస్తామని బెదిరిస్తున్నారన్నారు. నాలుగు గ్రామాల్లో కలసి 262 ఎకరాల భూముల సేకరణ పేరిట రైతులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 40 ఏళ్ల క్రితమే సాగుదారులకు హక్కు పత్రాలు మంజూరు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీఈపీడీసీఎల్ ద్వారా ద్వారా 57.97 మెగావాట్ల సోలర్ ప్లాంట్ నిర్మించనున్నట్టు ప్రకటించిందన్నారు. ఈ భూముల్లో ఉన్న వందలాది మంది రైతు కుటుంబాలు పాయాయిల్, నువ్వులు, వేరుశనగ పంటలు సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ యంత్రాంగం రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. -
వెన్నుపోటు చంద్రబాబుకు కొత్తకాదు
నర్సీపట్నం: వెన్నుపొటు పొడవడం సీఎం చంద్రబాబుకు కొత్తకాదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం, ఓటర్ల జాబితాపై బీఎల్ఏలకు శిక్షణ కార్యక్రమం, పార్టీ విస్త ృతస్థాయి సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్రెడ్డి బీఎల్ఏలు విధులు, బాధ్యతులు గురించి అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి అమర్నాథ్ మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ఆశయాలను నుండి పుట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. వైశ్రాయి హోటల్ నుండి పుట్టింది టీడీపీ అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం బలంగా ఉండడం వల్లనే స్పీకర్ తనయుడు సిహెచ్.విజయ్కు రాజ్యసభ సీటు వచ్చిందన్నారు. కోర్టు తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న పనులను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే గణేష్, ఆయన అనుచరులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఈ అక్రమ కేసులకు భవిష్యత్తులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఓట్లు కోల్పోవడం వల్ల పక్క రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిబెంగాల్లో అధికారం కోల్పోవడంతో పాటు సీఎం అభ్యర్థులు ఓడిపోయారన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని మన పార్టీ సానుభూతిపరుల ఓటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు.ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు పెడితే జిల్లా గెలిచే మొదటి సీటు నర్సీపట్నమే అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాజ్యాంగం అమలైతే..ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. మెడికల్ కాలేజీను ప్రవేటుపరం చేద్దామని కూటమి ప్రభుత్వం పూనుకుంటే మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి హెచ్చరికతో ఎవరు ముందుకు రాలేదన్నారు. మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ లైటరైట్ గిప్టుగా స్పీకర్ తనయుడు విజయ్కు చంద్రబాబు రాజ్యసభ సీటు ఇచ్చారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవగా ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ తప్పుడు కేసులు పెట్టి గణేష్ను స్పీకర్ కుటుంబం ఇబ్బందులకు గురి చేసిందన్నారు. పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, మాజీ ఎంపీ డాక్టర్ బి.సత్యవతి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. స్పీకర్ మూల్యం చెల్లించక తప్పదు: గణేష్అక్రమ కేసులు పెట్టి తనను, తన అనుచరులను ఇబ్బంది పెట్టిన స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోకపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి వైదొలుగుతానని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆవేదన చెందారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్పీకర్ నియోజకవర్గ ప్రజలకు రూ.760 కోట్లు బాకీ ఉన్నారని, ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బు, అధికారం ఉందని విర్రవీగితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 2029లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మీకంటే ఆలోచన శక్తిని భగవంతుడు నాకు ఇస్తాడు. మీరుచేస్తున్న అరాచకాలకు వంతపాడుతున్న మీ పార్టీ నాయకులు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల అధ్యక్షుడు సుర్ల చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు ఏకా శివ, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు వాసు, వెంకటరత్నం, నాగేశ్వరరావు, పాణిశాంతరామ్, ఎంపీపీలు మణికుమారి, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు పాల్గొన్నారు.ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వం మాజీ మంత్రి గుడివాడ అమర్నాఽథ్ -
నిన్నటివరకు సెలవులో.. నేడు మృత్యు ఒడికి..
గాజువాక : వారం రోజుల సెలవు తరువాత విధులకు వచ్చిన ఆ ఉద్యోగి మృత్యు ఒడికి చేరడంతో ఓ కుటుంబం గుండెలవిసేలా రోదిస్తోంది. అగనంపూడి దరి శనివాడకు చెందిన భాను కుమార్కు 2018లో ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల క్రితం వివాహమైంది. మూడు నెలల క్రితం ఒక కుమారుడు పుట్టాడు. ఈ నేపథ్యంలో భానుకుమార్ వారం రోజులపాటు పెటర్నిటీ సెలవు తీసుకున్నాడు. ఆదివారం వరకు సెలవులో ఉన్న అతడు సోమవారం మధ్యాహ్నం బీ షిఫ్ట్కు వచ్చాడు. డ్యూటీకి వచ్చిన రెండున్నర గంటల వ్యవధిలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వాస్తవంగా అతడు సీ షిఫ్ట్కు రావాల్సి ఉంది. కొలీగ్ ఒకరు కోరడంతో తన డ్యూటీని బీ షిఫ్ట్కు మార్చుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతడి మృతి వార్తతో కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. -
వెంకన్న హుండీలను దోచేసింది టీడీపీ వాళ్లే?
అనకాపల్లి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం, టీటీడీ అనుబంధ దేవాలయం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 3వ తేదీ రాత్రి హుండీలను కొల్లగొట్టి భక్తులు సమర్పించిన కానుకలను చోరీచేసిన ఇద్దరు దొంగలు దొరికారు. ఈ దుర్మార్గానికి పాల్పడింది హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనితకు అత్యంత సన్నిహితులైన టీడీపీ నాయకుల కుటుంబసభ్యులని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో కోట్లాదిమంది భక్తులు తమ ఇలవేల్పుగా కొలిచే ఉపమాక వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన కానుకలను దోచుకుంది టీడీపీ కార్యకర్తలేనన్న ప్రచారం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి ఉత్సవమూర్తులున్న గర్భాలయం ఎదురుగాగల ఆస్థాన మండపంలో ఒక హుండీ, ఆండాళ్లమ్మ సన్నిధిలో మరో హుండీని కట్టర్లతో ధ్వంసంచేసి లక్షలాది రూపాయలు దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. నిందితులు స్పష్టంగా కనిపిస్తున్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు వివిధ గ్రూపుల్లో షేర్ చేసి, గ్రామాల్లో యువకులకు చూపించి ఆరా తీశారు. ఈ దురాగతానికి పాల్పడింది నక్కపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన ఇద్దరు యువకులని తేలడంతో వారిద్దరిని పోలీసులు శనివారం రాత్రి అన్నవరంలోని ఒక రిసార్ట్స్లో అదుపులోకి తీసుకుని కొంత నగదును స్వా«దీనం చేసుకున్నారు. తరువాత వారిని రేబాక తీసుకెళ్లారు. నిందితుల్లో ఒకరి ఇంటి సమీపంలోని తుప్పల్లో దాచిన నగదుమూటను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు మొత్తం రూ.2.30 లక్షలకుపైగా స్వా«దీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితుల్లో ఒకరు హోంమంత్రి వంగలపూడి అనితకు అత్యంత సన్నిహితుడు, నియోజకవర్గ ఐటీడీపీలో కీలక నాయకుడికి సోదరుడని, మరో నిందితుడు గ్రామంలో పార్టీ సీనియర్ నాయకుడి కుమారుడని ప్రచారం జరుగుతోంది. ఆరేళ్లలో 56 గ్రాముల బంగారమేనా?! ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు సమయంలో నగదును లెక్కించిన తరువాత బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులను మూటగట్టి మళ్లీ హుండీలోనే ఉంచుతారు. ఆరేళ్లుగా వచ్చిన బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులను కట్టిన మూటను దొంగలు ఎత్తుకెళ్లి ఆలయం వెనుక తోటలో పడేశారు. దీన్లో కేవలం 56 గ్రాముల బంగారు, 2.5 కిలోల వెండి ఆభరణాలు మాత్రమే ఉండటం అనుమానాలు కలిగిస్తోంది. ఆరేళ్లుగా భక్తులు సమర్పించిన బంగారం ఈ కొద్దిమొత్తమేనా అనే చర్చసాగుతోంది. ఈ వ్యవహారంలో టీటీడీ అధికారుల పాత్రను కూడా భక్తులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో బంగారానికి సంబంధించిన వ్యవహారాలు కూడా బయటపడే అవకాశం ఉంది. రెక్కీ..ఆపై చోరీ సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలిస్తే ఈ నెల ఒకటోతేదీ మధ్యాహ్నం నిందితులు యూనికార్న్ మోటారు సైకిల్పై ఆలయానికి వచ్చి ఆస్థాన మండపంలో ఉన్న హుండీ వద్ద నుంచి స్వామిని దర్శించుకుని, పరిసరాలను పరిశీలించారు. పాయకరావుపేటలో ఐరన్ కట్టర్ను కొనుగోలు చేసిన నిందితులు ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి రెండుగంటల సమయంలో ఆలయం వెనుక వైపున్న కొండపైనుంచి మామిడి చెట్టు మీదుగా ఆలయంలోకి ప్రవేశించారు. రెండు హుండీలను ఎలక్ట్రిక్ కట్టర్లతో కట్చేసి వాటిలో ఉన్న నగదు, బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. మార్చి నెల నుంచి ఆ రోజువరకు హుండీల్లో ఉన్న నగదుతోపాటు, ఆరేళ్లనుంచి భక్తులు స్వామికి కానుకలుగా సమరి్పంచిన బంగారు, వెండి ఆభరణాల మూటను కూడా వీరు ఎత్తుకెళ్లారు. అయితే ఈ ఆభరణాల మూటను ఆలయం వెనుక తోటలో పడేశారు. ఈ మూటలో 56 గ్రాముల బంగారు, 2.5 కిలోల వెండి ఆభరణాలున్నట్లు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగినరోజు రాత్రి ఆలయానికి సమీపంలో మనబానవానిపాలెంలో జాతీయ రహదారిపై దుర్గాదేవి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భారీగా బాణసంచా కాల్చారు. ఈ బాణసంచా మోతల్లోనే హుండీలను కట్చేసినట్లు భావిస్తున్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నక్కపల్లి సీఐ జె.మురళి, ఎస్ఐ సన్నిబాబు కీలకపాత్ర పోషించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు సోమవారం విలేకరులకు తెలిపే అవకాశం ఉంది. గతంలో రేబాక గూడుపుమ్మ ఆలయం, రమణయ్యపేట, ముకుందరాజుపేట, కాగిత, ఒడ్డిమెట్ట తదితర గ్రామాల్లోని ఆలయాల్లో జరిగిన చోరీల్లో కూడా ఈ నిందితుల ప్రమేయం ఉండవచ్చని ఆయా గ్రామాల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లాలో జల్జీవన్ మిషన్ నిధులు నిల్ ● నిరుపయోగంగా పైపులు
● జిల్లాలో మోగుతున్న ప్రమాద ఘంటికలు ● తాగునీటి బావుల్లో, చెరువుల్లో అడుగంటిన నీటి వనరులు ● ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు.. ● జిల్లాలో రూ..885.23 కోట్లతో 2,691 పనులకు గాను 986 పనులు పూర్తి ● గత ప్రభుత్వంలో ఆమోదం పొందిన 885 పనుల రద్దు..143 పనులు పెండింగ్ ● జిల్లాలో 16,059 చేతిపంపులు, 2.64 లక్షల కుళాయి కనెక్షన్లు సాక్షి, అనకాపల్లి: వేసవి ఆరంభం నుంచే ప్రారంభమైన నీటిఎద్దడి సమస్యలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నా యి. ఎండల తీవ్రతకు నదులు, చెరువులు, బావు లు, బోర్లు పూర్తిగా అడుగంటాయి. గ్రామాల్లో నిలిచిపోయిన జల్జీవన్ మిషన్ పనులు పూర్తి చేయడానికి నిధుల్లేవంటూ అధికారులు చెబుతు న్నారు. మరో వైపు కేంద్ర జలవనరుల శాఖ ఈ మిషన్ను 2028 వరకూ పొడిగించినట్టు ప్రకటించింది. ముఖ్యంగా నాతవరం, గొలుగొండ, రోలుగుంట, రావికమతం, మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ మండలాల పరిధిలోని శివారు గిరిజన గ్రామాల్లో దాహార్తి కేకలు మిన్నంటుతున్నాయి. గుక్కెడు నీటి కోసం గిరిజన మహిళలు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర మండుటెండలో నడవాల్సి వస్తోంది. జల్ జీవన్ మిషన్ గడువును కేంద్రం 2028 వరకు పొడిగించినా, నిధులు లేవంటూ ఇక్కడ కుళాయిల ఏర్పాటును అధికారులు గాలికొదిలేశారు. గత్యంతరం లేక బురద నీటినే వడపోసుకుని తాగుతున్నామని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. నాతవరం మండలం పెద జగ్గంపేటలో గ్రామంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. వేసవి కాలం ముదురుతున్నా అధికారులు కనీసం ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో గ్రామస్తులు నీటి కోసం అల్లాడిపోతున్నారు. చేతిబోర్లు సైతం మరమ్మతులకు గురయ్యాయి. ఈ విషయమై గ్రామస్తులు పలుమార్లు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. యుద్ధప్రాతిపదికన స్పందించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని, గ్రామంలోని చేతి బోర్లకు మరమ్మతులు చేయించాలని వేడుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరైన పనులే రద్దు జల్జీవన్ మిషన్ ప్రాజెక్టు పనులకు కూటమి ప్రభుత్వంలో గ్రహణం పట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభు త్వ హయాంలో మంజూరు చేసిన పనులను రద్దుచేసి, తిరిగి టీడీపీ నేతలు, అధికార పార్టీల ఎమ్మెల్యే లు సిఫారసు చేసిన వాటికే మళ్లీ కొత్త అనుమతులిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 4 ,18,167 ఇళ్లుండగా..2024 మార్చి నెలాఖరి నాటికి 2,63,352 ఇళ్లకు వైఎస్సార్సీపీ హయాంలో కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 188 ఇళ్లకునెక్షన్లు ఇచ్చారు. వాటికి తోడు ఇంకా ఇవ్వాల్సిన 1,54,627 కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు సరికదా మంజూరైన వాటినే రద్దు చేశారు. అదేవిధంగా 16,057 చేతి పంపులను కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలో రూ.885.23 కోట్ల అంచనా విలువతో 2,691 పనులను మంజూరు చేశారు. వీటిలో 243.48 కోట్లతో 1023 పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. గత ప్రభుత్వంలో ఆమోదం పొందిన 885 పనులను రద్దు,143 పనులు పెండింగ్లో ఉన్నాయి. -
అమ్మవారికి బంగారం ముక్కు పుడక
దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లి ప్రజల ఆరాధ్య దైవం సన్యాసమ్మ అమ్మవారికి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయ దంపతులు కాలిపు అప్పారావు, మణి పావు తులం బంగారంతో తయారీ చేయించిన ముక్కు పుడకను బహుకరించారు. దానిని ఆలయ ధర్మకర్త వరదపురెడ్డి సన్యాసిరావు (లలితానాయుడు)కు అందజేశారు. అప్పారావు,మణి దంపతులను ఆలయ ధర్మకర్త అభినందించి, అమ్మవారి తీర్థ, ప్రసాదాలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరదపురెడ్డి సింహాచలం నాయుడు, వేచలపు అప్పలనాయుడు, కె.వి.రమణ, గుండు రాంబాబు, వరదపురెడ్డి చంద్రరావు, గొర్లి తాతారావు, చొక్కాకుల రమణ, గంగవంశం సంతోష్, కొరుప్రోలు శ్రీను తదితర్లు పాల్గొన్నారు. -
ఈదురు గాలుల బీభత్సం
నర్సీపట్నం/కోటవురట్ల: నర్సీపట్నం, కోటవురట్ల మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు సూర్యుడు నిప్పులు చెరిగాడు. తీవ్ర వడగాడ్పులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచోసుకుని ఈదురుగాలులు వీచాయి. నర్సీపట్నంలో పెద్ద ఎత్తున వడగళ్ల వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు, హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మెయిన్ రోడ్డు అబిద్ సెంటర్లోని సెంట్రల్ లైటింగ్ విద్యుత్ స్తంభం నేల కొరిగింది. మున్సిపల్ స్టేడియంలోని చెట్లు విరిగి పడడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. నర్సీపట్నం మెయిన్ రోడ్డు, అబిద్ సెంటర్, మున్సిపల్ స్టేడియం ప్రాంతాలు జలమయమై చెరువులను తలపించాయి. భారీవర్షం,ఈదురుగాలులతో రాత్రి 9:30 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పట్టణంలో అంధకారం అలుముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కోటవురట్ల మండలం యండపల్లి శివారులో పలు వృక్షాలు మెయిన్రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డాయి. నర్సీపట్నం – రేవుపోలవరం రహదారిలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు సుమారు గంట పాటు ఇబ్బంది పడ్డారు. సమాచారం తెలుసుకున్న కోటవురట్ల ఎస్ఐ విజయ్ కుమార్ అక్కడకు చేరుకుని రహదారి పై అడ్డంగా పడివున్న చెట్లను పొక్లెయిన్తో తొలగింపజేసి, ట్రాఫిక్ క్లియర్ చేయడంతో వాహనదారులు ఊపిరి పిల్చుకున్నారు. -
వెంకన్న హుండీలనుదోచేసింది టీడీపీ వాళ్లే?
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం, టీటీడీ అనుబంధ దేవాలయం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 3వ తేదీ రాత్రి హుండీలను కొల్లగొట్టి భక్తులు సమర్పించిన కానుకలను చోరీచేసిన ఇద్దరు దొంగలు దొరికారు. ఈ దుర్మార్గానికి పాల్పడింది హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనితకు అత్యంత సన్నిహితులైన టీడీపీ నాయకుల కుటుంబసభ్యులని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో కోట్లాదిమంది భక్తులు తమ ఇలవేల్పుగా కొలిచే ఉపమాక వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన కానుకలను దోచుకుంది టీడీపీ కార్యకర్తలేనన్న ప్రచారం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి ఉత్సవమూర్తులున్న గర్భాలయం ఎదురుగాగల ఆస్థాన మండపంలో ఒక హుండీ, ఆండాళ్లమ్మ సన్నిధిలో మరో హుండీని కట్టర్లతో ధ్వంసంచేసి లక్షలాది రూపాయలు దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. నిందితులు స్పష్టంగా కనిపిస్తున్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు వివిధ గ్రూపుల్లో షేర్ చేసి, గ్రామాల్లో యువకులకు చూపించి ఆరా తీశారు. ఈ దురాగతానికి పాల్పడింది నక్కపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన ఇద్దరు యువకులని తేలడంతో వారిద్దరిని పోలీసులు శనివారం రాత్రి అన్నవరంలోని ఒక రిసార్ట్స్లో అదుపులోకి తీసుకుని కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. తరువాత వారిని రేబాక తీసుకెళ్లారు. నిందితుల్లో ఒకరి ఇంటి సమీపంలోని తుప్పల్లో దాచిన నగదుమూటను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మొత్తం రూ.2.30 లక్షలకుపైగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితుల్లో ఒకరు హోంమంత్రి వంగలపూడి అనితకు అత్యంత సన్నిహితుడు, నియోజకవర్గ ఐటీడీపీలో కీలక నాయకుడికి సోదరుడని, మరో నిందితుడు గ్రామంలో పార్టీ సీనియర్ నాయకుడి కుమారుడని ప్రచారం జరుగుతోంది. ఆరేళ్లలో 56 గ్రాముల బంగారమేనా?! ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు సమయంలో నగదును లెక్కించిన తరువాత బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులను మూటగట్టి మళ్లీ హుండీలోనే ఉంచుతారు. ఆరేళ్లుగా వచ్చిన బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులను కట్టిన మూటను దొంగలు ఎత్తుకెళ్లి ఆలయం వెనుక తోటలో పడేశారు. దీన్లో కేవలం 56 గ్రాముల బంగారు, 2.5 కిలోల వెండి ఆభరణాలు మాత్రమే ఉండటం అనుమానాలు కలిగిస్తోంది. ఆరేళ్లుగా భక్తులు సమర్పించిన బంగారం ఈ కొద్దిమొత్తమేనా అనే చర్చసాగుతోంది. ఈ వ్యవహారంలో టీటీడీ అధికారుల పాత్రను కూడా భక్తులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో బంగారానికి సంబంధించిన వ్యవహారాలు కూడా బయటపడే అవకాశం ఉంది. రెక్కీ..ఆపై చోరీ సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలిస్తే ఈ నెల ఒకటోతేదీ మధ్యాహ్నం నిందితులు యూనికార్న్ మోటారు సైకిల్పై ఆలయానికి వచ్చి ఆస్థాన మండపంలో ఉన్న హుండీ వద్ద నుంచి స్వామిని దర్శించుకుని, పరిసరాలను పరిశీలించారు. పాయకరావుపేటలో ఐరన్ కట్టర్ను కొనుగోలు చేసిన నిందితులు ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి రెండుగంటల సమయంలో ఆలయం వెనుక వైపున్న కొండపైనుంచి మామిడి చెట్టు మీదుగా ఆలయంలోకి ప్రవేశించారు. రెండు హుండీలను ఎలక్ట్రిక్ కట్టర్లతో కట్చేసి వాటిలో ఉన్న నగదు, బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. మార్చి నెల నుంచి ఆ రోజువరకు హుండీల్లో ఉన్న నగదుతోపాటు, ఆరేళ్లనుంచి భక్తులు స్వామికి కానుకలుగా సమర్పించిన బంగారు, వెండి ఆభరణాల మూటను కూడా వీరు ఎత్తుకెళ్లారు. అయితే ఈ ఆభరణాల మూటను ఆలయం వెనుక తోటలో పడేశారు. ఈ మూటలో 56 గ్రాముల బంగారు, 2.5 కిలోల వెండి ఆభరణాలున్నట్లు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగినరోజు రాత్రి ఆలయానికి సమీపంలో మనబానవానిపాలెంలో జాతీయ రహదారిపై దుర్గాదేవి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భారీగా బాణసంచా కాల్చారు. ఈ బాణసంచా మోతల్లోనే హుండీలను కట్చేసినట్లు భావిస్తున్నారు. నిందితుల్ని పట్టుకోవడంలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నక్కపల్లి సీఐ జె.మురళి, ఎస్ఐ సన్నిబాబు కీలకపాత్ర పోషించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు సోమవారం విలేకరులకు తెలిపే అవకాశం ఉంది. గతంలో రేబాక గూడుపుమ్మ ఆలయం, రమణయ్యపేట, ముకుందరాజుపేట, కాగిత, ఒడ్డిమెట్ట తదితర గ్రామాల్లోని ఆలయాల్లో జరిగిన చోరీల్లో కూడా ఈ నిందితుల ప్రమేయం ఉండవచ్చని ఆయా గ్రామాల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
వేటసాగేదెలా?
భరోసా ఎగ్గొట్టారు.. సబ్సిడీ ఆపేశారు.. మహారాణిపేట: వేట నిషేధ కాలం ముగిసి, ఈ నెల 15 నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వారి బతుకులను సంకటంలోకి నెట్టింది. వేట ప్రారంభానికి వారం రోజుల సమయం కూడా లేని ఈ సంధి కాలంలో, బోట్లను నడపడానికి అత్యంత కీలకమైన రాయితీ డీజిల్ ఆయిల్ను ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడం తీర ప్రాంతంలో తీవ్ర ఆందోళన రేపుతోంది. అప్పులు తెచ్చి బోట్లను మరమ్మతులు చేయించుకున్న యజమానులు ఇప్పుడు సబ్సిడీ ఆయిల్ రాక, వేటకు వెళ్లలేక అగమ్యగోచర స్థితిలో పడ్డారు. ప్రస్తుతం డీజిల్ ధర లీటరుకు రూ.104.10 పైసలకు చేరినా, ప్రభుత్వం మాత్రం పాత తొమ్మిది రూపాయల సబ్సిడీనే కొనసాగించడం మత్స్యకారుల నడ్డి విరుస్తోంది. పెరుగుతున్న ధరల దృష్ట్యా డీజిల్ సబ్సిడీని లీటరుకు రూ.25కు పెంచాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఒక ఏడాదికి సంబంధించిన ‘మత్స్యకార భరోసా’ నిధులను ఎగ్గొట్టడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఇంకా ఎంతోమంది అర్హులకు ఈ సాయాన్ని అందకుండా నిలిపివేసింది. ప్రభుత్వ ఆర్థిక సాయం అందక, డీజిల్ కొరతతో ఇప్పటికే నష్టాలతో కునారిల్లుతున్న మత్స్య పరిశ్రమను కూటమి సర్కార్ మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోందని మత్స్యకార వర్గాలు మండిపడుతున్నాయి. అమ్మవారికి పూజలతో వేటకు శ్రీకారం ఈ నేపథ్యంలో ఈనెల 9వ తేదీ మంగళవారం విశాఖ ఫిషింగ్ హార్బర్లో శ్రీశ్రీశ్రీ గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంప్రదాయంగా గంగమ్మ తల్లి ఆశీస్సులతోనే వేట ప్రారంభించే మత్స్యకారులు, జాతర అనంతరం అధికారికంగా సముద్రంలోకి వెళ్లనున్నారు. మత్స్యకారుల ఆందోళన అయితే ప్రస్తుతం సబ్సిడీ డీజిల్ సరఫరాపై స్పష్టత లేకపోవడంతో వేట ప్రారంభానికి ముందు మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో సబ్సిడీ అందకపోతే నిర్వహణ వ్యయం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం మత్స్య పరిశ్రమ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని పేర్కొంటూ చమురు సంస్థలు ఇటీవల కాలంలో పలు మార్లు డీజిల్ ధరలను పెంచాయి. గతంలో లీటరు డీజిల్ ధర రూ.96.22 ఉండగా, ప్రస్తుతం అది రూ.104.10కు చేరుకుంది. ఈ పెరుగుదల మత్స్యకారుల నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా పెంచింది. భారంగా మారిన డీజిల్ ధరలు 32 కి.మీ. మేర తీరప్రాంతం విశాఖ జిల్లా పరిధిలో 32 కిలోమీటర్ల తీరప్రాంతం, 32 మత్స్యకార గ్రామాలు, 15 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 667 మరపడవలు, 3,094 మోటారు పడవలు, 611 సంప్రదాయ ఇంజిన్ లేని తెప్పలు ఉన్నాయి. వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఇంకా అందని ఆయిల్ సబ్సిడీ మరో వారం రోజుల్లో వేట ప్రారంభం కానున్నప్పటికీ, మత్స్యకారులకు అందాల్సిన డీజిల్ ఆయిల్ సబ్సిడీ ఇంకా విడుదల కాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డుల ద్వారా ప్రతి నెల ఒక్కో బోటుకు 3 వేల లీటర్ల చొప్పున సబ్సిడీ డీజిల్ అందించేవారు. దీంతో బోటు యజమానులకు నెలకు రూ.27 వేల వరకు ఆదా అయ్యేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. డీజిల్ సబ్సిడీ పెంచాలి చంద్రబాబు ప్రభుత్వం లీటరు డీజిల్పై రూ.9 సబ్సిడీ అందిస్తోంది. అయితే గతంలో డీజిల్ ధర లీటరుకు రూ.70 ఉన్న సమయంలో కూడా ఇదే స్థాయిలో సబ్సిడీ అందించేవారని మత్స్యకారులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ధరలు రూ.100 దాటినా సబ్సిడీ మొత్తంలో ఎలాంటి పెంపు లేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సబ్సిడీని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మత్స్య పరిశ్రమపై నిర్లక్ష్యం వీడాలి రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. డీజిల్ ధరలు భరించలేని స్థాయిలో పెరిగిపోవడంతో మత్స్యకారులు, బోటు యజమానులు ఎలా బతకాలో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పటికై నా సర్కార్ నిర్లక్ష్యం వీడి, లీటర్ డీజిల్పై రూ.25 సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఆప్కాఫ్ చార్జీలను తక్షణమే రద్దు చేయాలి. మత్స్యకారులను వలసల బాట పట్టించే విధానాలను ఆపాలి. ఈ సమస్యలపై హార్బర్లలోని సాంప్రదాయ మత్స్యకారులు, సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి మత్స్య పరిశ్రమను కాపాడాలి. –జానకిరామ్ వాసుపల్లి, ప్రెసిడెంట్, మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ -
గుర్తు తెలియని మహిళ మృతి
మర్రిపాలెం: కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఓ గుర్తుతెలియని మహిళ (సుమారు 45 ఏళ్లు) మృతి చెందింది. జ్ఞానాపురం సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ సమీపంలోని ఫుట్పాత్పై ఆమె మృతదేహం ఉన్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. ఆమె అక్కడ భిక్షాటన చేస్తూ జీవించే మహిళగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హరిత వృద్ధిలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోంది
తగరపువలస: హరిత వృద్ధితో భారత్ అగ్రగామిగా ఎదుగుతోందని మాజీ హై కమిషనర్ బైసాబ్ చరణ్ ప్రధాన్ పేర్కొన్నారు. గంభీరంలోని ఐఐఎంవీ ప్రాంగణంలో ‘ఇంటర్ డిసిప్లీనరీ డెసిషన్ సైన్సెస్ అండ్ అనలిటిక్స్ ల్యాబ్’ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘గ్రీన్ ఎకానమీ’ అంతర్జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన చరణ్ ప్రధాన్ మాట్లాడుతూ అంతర్జాతీయ కూటముల ద్వారా ప్రపంచ వాతావరణ పరిపాలనలో భారత్ నాయకత్వ స్థానానికి చేరుకుంటోందని స్పష్టం చేశారు. అనంతరం ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ పృథ్వితేజ్ ఇమ్మడి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు ప్రొఫెసర్ రవి సమన్వయకర్తగా వ్యవహరించగా కోపెన్హాగన్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ అబిద్ హుస్సేన్, సదరు ల్యాబ్ విభాగాధిపతి శివశంకర్ పటేల్, జమ్ము కాశ్మీర్ లక్ష్మీపత్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ సి.విజయశేఖర్, ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మోనికా సింఘానియా, జీ2వో సోలార్ సీటీఓ వివేక్ వర్థన్, డీన్ కావేరీ కృష్ణన్, మారిశెట్టి విజయభాస్కర్, పీఆర్ శర్మ, అమిత్ శంకర్, నెక్కంటి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
అనకాపల్లి: పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక మెయిన్రోడ్డు జీవీఎంసీ కార్యాలయం వద్ద ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్తో నిరసన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని సాకుగా చూపి చమురు ధరలను విపరీతంగా పెంచడం దుర్మార్గమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్పై రూ.8 పెంచడంతో పా టు కమర్షియల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర ను భారీగా పెంచి ప్రజల నడ్డివిరిచారన్నారు. పొదుపు చర్యలు చేపట్టండి, విదేశీ ప్రయాణాలు మానేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టు వినియోగించండి అని చెబుతున్న ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులు విదేశీ పర్యటనలో చార్టెడ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు వాడుతున్నారన్నారు. బయటికి మాత్రం సైకిల్ తొక్కుతూ ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, ఆర్.శంకరరావు, గంటా శ్రీరామ్, గనిశెట్టి సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఆర్.రాము, వి.వి.శ్రీనివాసరావు, జి.దేముడు నాయుడు, ఎం.రాజేష్, కాళ్ల తెల్లయ్యబాబు, కె.సుభాషిణి, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆబోతు రమణకు ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం
దేవరాపల్లి: హెల్ప్ పుల్ హ్యాండ్స్ సామాజిక వారధి స్వచ్ఛందసేవా సంస్థ వ్యవస్థాపకుడు, రైవాడ గ్రామానికి చెందిన ఆబోతు రమణ విజయవాడలో ఆదివారం ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. మాదకద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిర్వహించిన ‘దండి మార్చ్ 2.0’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కోఆర్డినేటర్స్కు అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని విజయవాడలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ సేవా రంగంలో విశిష్ట సేవలను అందిస్తున్న ఆబోతు రమణకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఘనంగా సత్కరించి పురస్కారాలను అందజేశారు. సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న రమణను పలువురు ప్రశంసించారు. రమణ అవార్డులను అందుకోవడం పట్ల హెల్ప్ పుల్ హ్యాండ్స్ సామాజిక వారధి స్వచ్చంధ సేవా సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. -
కార్మికులకు వివాహం నుంచి ప్రసూతి వరకు ఆర్థిక సాయం నిర్మాణ కార్మికులకు అండగా సంక్షేమ బోర్డు
సీతంపేట: భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పలు పథకాలను అమలు చేస్తోంది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచే ఈ నూతన సంక్షేమ పథకాల అమలు ప్రక్రియ ప్రారంభమైంది. బోర్డులో నమోదైన 18 నుంచి 60 ఏళ్ల వయస్సు గల అర్హులైన కార్మికులు ఈ లబ్ధిని పొందవచ్చు. వివాహ కానుక, ప్రసూతి సాయం కింద రూ. 20,000 చొప్పున, సహజ మరణ ఉపశమనంగా రూ. 60,000, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ. 20,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. వీటితో పాటు కార్మికులకు ఉచిత భోజనం, స్టైపెండ్తో కూడిన 15 రోజుల వృత్తి నైపుణ్య శిక్షణను కూడా ఇస్తున్నారు. ఆయా పథకాలకు అర్హులైన కార్మికులు తమ ఆధార్, లేబర్ కార్డ్, బ్యాంకు వివరాలతో సమీప కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు. 1. వివాహ కానుక : రూ. 20,000 మహిళా కార్మికురాలి వివాహానికి, కార్మికుడు/కార్మికురాలి ఇద్దరి కుమార్తెల వివాహానికి ఆర్థిక సహాయం. కార్మికుడిగా రిజిష్టర్ అయిన ఏడాది తరువాత ఈ పథకం వర్తిస్తుంది. దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలు భవన నిర్మాణ కార్మికుని / కార్మికురాలు, పెళ్లి కుమార్తె ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, వివాహా ధ్రువీకరణ పత్రం (ఏపీ సేవ పోర్టర్లో పొందినది తప్పని సరిగా ఉండాలి), బ్యాంక్ పాస్ పుస్తకం మొదటి పేజి జిరాక్స్, భవన నిర్మాణ కార్మికుని గుర్తింపు కార్డు , అప్డేట్ రెన్యూవల్ రశీదులు జిరాక్సులు జతపర్చాలి. 2.ప్రసూతి సహాయం : రూ. 20,000 కార్మికుని భార్య , వారి కుమార్తెలకు, మహిళా కార్మికులకు ప్రసూతి ఆర్థిక సహాయం, కార్మికుడు రిజిష్టర్ అయిన ఏడాది తరువాత ఈ పథకం వర్తిస్తుంది. దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలు భవన నిర్మాణ కార్మికుని, ప్రసూతి సహాయం పొందే మహిళ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, కాన్పు సర్టిఫికెట్, జనన ధ్రవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ పుస్తకం మొదటి పేజి జిరాక్స్, భవన నిర్మాణ కార్మికుని గుర్తింపు కార్డు, అప్డేట్ రెన్యూవల్ రశీదుల జిరాక్సు జతపర్చాలి. 3. సహజ మరణ ఉపశమన పథకం: రూ. 60,000 సహజ మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలు మృతి చెందిన వ్యక్తి..నామిని, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, భవన నిర్మాణ కార్మికుని గుర్తింపు కార్డు, ఆప్డేట్ రెన్యూవల్ రశీదులు జిరాక్సు, ఏపీ సేవా పోర్టర్ ద్వారా జారి చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, నామిని బ్యాంక్ పాస్ పుస్తకం మొదటి పేజి జిరాక్స్, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్, రేషన్ కార్డు జిరాక్స్ జతచేయాలి. 4. అంత్యక్రియలకు వ్యయ సహాయ పథకం / మట్టి ఖర్చులకు సహాయం: రూ. 20,000 మరణించిన కార్మికుల అంతిమ సంస్కారాలకు ఆర్థిక సహాయం దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలు మరణించిన వ్యక్తికి సంబంధించిన నామిని ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, భవన నిర్మాణ కార్మికుని గుర్తింపు కార్డు, అప్డేట్ రెన్యూవల్ రశీదులు జిరాక్స్, ఏపీ సేవా పోర్టర్ ద్వారా జారి చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, నామిని బ్యాంక్, పాన్ పుస్తకం మొదటి పేజి జిరాక్స్, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్, రేషన్ కార్డు జిరాక్స్, ఎఫ్వీఆర్, పంచనామా జిరాక్స్ కాపీ (ప్రమాద మరణానికి వర్తిస్తుంది), మెడికల్ సర్టిఫికెట్ (ప్రమాద మరణానికి వర్తిస్తుంది) జతపర్చాల్సి ఉంటుంది. 5. కార్మికులకు వృత్తి నైపుణ్య శిక్షణ రిజిస్టర్ అయిన భవన నిర్మాణ కార్మికులకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు 15 రోజులు శిక్షణ, ఉచిత భోజన సౌకర్యాలతో పాటు రోజుకు రూ. 300 చొప్పున భృతి చెల్లింపు భవన నిర్మాణ కార్మికుడిగా నమోదు చేసుకునేందుకు కావలసిన పత్రాలు కార్మికుడు/ కార్మికురాలు వయస్సు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వారు నమోదుకు అర్హులు. అప్లికేషన్ ఫారం, స్వీయ ధ్రువీకరణ పత్రం, 2 పాస్ పోర్టు సైజు కలర్ ఫొటోలు, కార్మికుని ఆధార్ కార్డు జిరాక్స్,. నామిని, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్, కార్మికుని బ్యాంక్ అకౌంట్ మొదటి పేజి జిరాక్స్, రూ. 110లు చెల్లించిన యూనియన్ బ్యాంక్ చలానా అవసరం. -
ఘా నిద్దరోయె!
ర్లక్ష్యం మితిమీరె..రెగ్యులర్ సిబ్బందిపై చర్యలేవీ?నక్కపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ లో ఉన్న ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంభద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తవ్వేకొద్దీ లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. వారం రోజుల క్రితం ఆలయంలో చోరీ జరిగి, రూ.4లక్షల పైగా కానుకలు దుండగులు ఎత్తుకుపోవడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీటీడీ అధికారుల నిర్ణక్ష్యం వల్లే ఈ చోరీ జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చోరీకి బాధ్యులను చేస్తూ ఇద్దరు కాంట్రాక్ట్సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తొలగించి టీటీడీ అధికారులు చేతులు దులుపేసుకున్నారని భక్తులు మండి పడుతున్నారు. ఏడాదిగా పనిచేయని పలు సీసీ కెమెరాలు ఆలయంలో చాలా చోట్ల సీసీ కెమెరాలు ఏడాదిగా పనిచేయడం లేదు. మొత్తం 25 కెమెరాలకు గాను ఏడు కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఆలయం వెలుపల ప్రాంతాల్లో ఉన్న కెమెరాలు పనిచేయకపోవడం వల్లే దుండగులు సులువుగా ఆలయంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. సీసీకెమెరాల నిర్వహణను టీటీడీ విజిలెన్స్ విభాగం, స్థానిక టెంపుల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షించాలి. ఇక్కడ కెమెరాలను తిరుమలలో ఉన్న సెంట్రల్ విజిలెన్స్ విభాగానికి అనుసంధానం చేసినట్లు తెలుస్తోంది. ఉపమాక ఆలయంలోనే కాకుండా తిరుమలనుంచి కూడా ఇక్కడ ఏం జరుగుతుందో పరిశీలించే అవకాశం ఉంది. రాత్రి సమయంలో ఆలయంలోకి ఎవరైనా ప్రవేశిస్తున్నారా అనేది తిరుమల నుంచి కూడా గమనించవచ్చు. మరి అక్కడ విజిలెన్స్ సిబ్బంది గత మంగళవారం రాత్రి ఏంచేశారు, ఇక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డుల మాదిరిగానే వారు కూడా నిద్రపోయారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిఏటా మార్చిలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలు ఘనంగా జరుగుతాయి. సుమారు రెండు లక్షల మందిపైనే భక్తులు భక్తులు దర్శనానికి వస్తారు. గతంలో టీటీడీ జేఈవో స్థాయి అధికారి కల్యాణోత్సవాలకు నెలరోజుల ముందుగానే వచ్చి ఏర్పాట్లు పరిశీలించేవారు. చంద్రబాబు ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయి అధికారి రాలేదు. ఈ ఏడాది కల్యాణోత్సవాల సమయానికే ఆలయంలో సీసీ కెమెరాలు పూర్తిగా పనిచేయడం లేదు. పరకామణి లెక్కింపు మూడుసార్లు వాయిదా ? కల్యాణోత్సవాల సందర్భంగా హోంమంత్రి వంగల పూడి అనిత రెండు పర్యాయాలు ఆలయంలో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. విశాఖ సబ్ట్రెజరీలో భద్రపరచిన స్వామివారికి చెందిన వేలకోట్ల విలువైన బంగారు ఆభరణాలను వజ్రవైఢూర్యాలను ఐదు రోజుల పాటు అలంకరించనున్న నేపథ్యంలో బందోబస్తు పటిష్టంగా ఉండాలని సూచించారు. సీసీకెమెరాలు పనిచేయడం లేదన్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న మంత్రి తక్షణమే రిపేరు చేయించాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలను అధికారులు బేఖాతరు చేశారు.సీసీకెమెరాలు పనిచేయకపోవడం వల్లే గతంలో పరకామణి లెక్కింపును మూడు సార్లు వాయిదా వేసినట్లు సమాచారం. రుషికొండ ఆలయ ఈవో సూచనల మేరకు ఆలయ ప్రధానార్చకుడు తన సొంత సొమ్ముతో పరకామణి నిర్వహించే ప్రాంతాల్లో ఉన్న కెమెరాలను రిపేరు చేయించినట్లు తెలిసింది. కల్యాణోత్సవాల సందర్భంగా గత్యంతరం లేకే స్థానిక పోలీసులు తాత్కాలికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి నిఘాలో ఉత్సవాలను నిర్వహించారు.అయినా టీటీడీ అధికారుల్లో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. కొండ దిగువన ఆస్థాన మండపంలోను, ఆండాళ్లమ్మవారి సన్నిధిలో హుండీలను పగుల గొట్టిన దుండగులు, కొండపై మూలమూర్తి ఉన్న గర్భాలయ తలుపులను పెకిలించే ప్రయత్నం చేశారు. గర్భాలయంలో ఉన్న హుండీని కొల్లగొట్టే ప్రయత్నంలో భాగంగా తలుపులకు ఏర్పాటు చేసిన ఇత్తడి రేకులను ఊడతీశారు. తలుపులు పటిష్టంగా ఉండడంతో వదిలేశారు. చోరీ జరిగి ఐదురోజులు గడుస్తున్నా దుండగులు పెకలించిన తలుపులను టీటీడీ అధికారులు ఇప్పటి వరకు రిపేరు చేయించకపోవడం పట్ల భక్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.ఉపమాక ఆలయంలో తవ్వేకొద్దీ బయటపడుతున్న లోపాలుఉపమాక వేంకటేశ్వర స్వామిఆలయం హోంమంత్రి ఆదేశాలు బేఖాతరుపోలీసుల కెమెరాలతోనే కల్యాణోత్సవాలుకాంట్రాక్ట్ ఉద్యోగులే బలిపశువులు ఉపమాక ఆలయంలో జరిగిన చోరీకి సంబంధించి స్థానికులైన కాంట్రాక్టు సెక్యూరిటీ సిబ్బందిని బలిపశువులను చేశారు. వారిని ఉద్యోగం నుంచి తొలగించారు. పూర్తిస్థాయి బాధ్యత వహించాల్సిన స్థానిక ఇన్స్పెక్టర్, విజిలెన్స్ విభాగ అధికారిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈచోరీ ఘటనలో రెగ్యులర్ ఉద్యోగులను టీటీడీ వెనుకేసుకు వస్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా టీటీడీ వారు ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, స్వామివారి కానుకలు, ఆభరణాలకు రక్షణ కల్పించాలని,భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
ఏయూలో అర్ధంతరంగా ముగిసిన విచారణ
విశాఖ విద్య : ఏయూలో ఎస్సీ, ఎస్టీ నాన్ టీచింగ్ బ్యాక్లాగ్ పోస్టుల నియామకాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శనివారం ప్రారంభమైన విచారణకు బ్రేక్ పడింది. ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్లో విచారణాధికారి, రిటైర్డ్ జడ్జి బమ్మిడి శ్రీనివాసరావు విచారణను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రధాన ఫిర్యాదుదారు, విదసం నేత బూసి వెంకటరావుతో ప్రమాణం చేయించిన అనంతరం ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని భావించారు. ఈ సందర్భంగా బూసి వెంకటరావు విచారణాధికారి వద్ద తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. బ్యాక్లాగ్ పోస్టుల నియామకాల అవకతవకలపై విచారణాధికారిగా ఒక సిట్టింగ్ జడ్జిని నియమించాలని తాము ఇప్పటికే కలెక్టర్ను కోరామని తెలిపారు. అలా కాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏయూ ఉన్నతాధికారులే స్వయంగా విచారణాధికారిని నియమించుకోవడం సహజ న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధమన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విచారణాధికారికి అందజేసినట్లు వెంకటరావు వెల్లడించారు. ఈ నియామక అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే అర్హులకు పూర్తి న్యాయం జరుగుతుందని విదసం నేత వెంకటరావు పేర్కొన్నారు. ప్రస్తుత విచారణ అధికారిపై తమకు గౌరవం ఉందని, అయితే ఆయనను నియమించిన తీరుపైనే తమకు నమ్మకం లేదన్నారు. పోస్టుల భర్తీలో అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏయూ వీసీ, రిజిస్ట్రార్లే విచారణాధికారిని నియమిస్తే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, రాత్రికి రాత్రే 28 పోస్టులకు నియామకపు ఉత్తర్వులు ఇచ్చారంటే ఇందులో ఎంత పెద్ద ఎత్తున మోసం జరిగిందో అర్థమవుతోందన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని, ఈ వ్యవహారంపై రాష్ట్ర గవర్నర్, కలెక్టర్కు కూడా వినతిపత్రాలు అందజేస్తామని బూసి వెంకటరావు తెలిపారు. విచారణాధికారి నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఫిర్యాదుదారు బ్యాక్ లాగ్ పోస్టుల నియామకాల వ్యవహారం సిట్టింగ్ జడ్జితో విచారణకు దళిత సంఘాల డిమాండ్ -
రక్షిత మంచినీటి పథకం పరిశీలన
సంపతిపురం వద్ద సమగ్ర రక్షిత నీటి పథకాన్ని పరిశీలిస్తున్న జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, బృందం కశింకోట: సమగ్ర భారీ రక్షిత మంచినీటి పథకాన్ని శనివారం జెడ్పీ సీఈవో నారాయణమూర్తి పరిశీలించారు. కశింకోటకు సమీపంలో సంపతిపురం వద్ద అధికారుల బృందంతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం ఏలేరు కాలువ నీటిని నిల్వ ఉంచే జలాశయాన్ని పరిశీలించారు. వేసవి సందర్భంగా తాగునీటికి ఇబ్బంది కలగకుండా సమర్థంగా పథకాన్ని నిర్వహించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి సందీప్, ఎంపీడీవో సీహెచ్. చంద్రశేఖర్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాస్, ఏవో ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై 79 కిలోల గంజాయి పట్టివేత
సబ్బవరం: మండలంలోని అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిపై ఉన్న మర్రిపాలెం టోల్ప్లాజా వద్ద గంజాయి తరలిస్తున్న ముఠాను సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 79 కిలోల గంజాయితో పాటు రెండు వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. వివరాలను పరవాడ డీఎస్పీ బి. మోహనరావు, సబ్బవరం సీఐ జి. రామచంద్రరావుతో కలిసి శనివారం సాయంత్రం సబ్బవరం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్. సుదర్శన్, అబీబీ ఖాన్, హుస్సేన్ ఖాన్.. విశాఖ చేరుకుని, అప్పటికే విశాఖ చేరుకున్న మధ్యప్రదేశ్కు చెందిన లఖన్ బేరాగి, కమల్ ప్రజాపత్లతో కలిసి ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లా కుల్బాని ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కులాన్, కలియా అనే వ్యక్తుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి, రెండు వాహనాల్లో మధ్యప్రదేశ్లోని భోపాల్కు తరలించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో సబ్బవరం పోలీసులకు అందిన సమాచారంతో సీఐ జి. రామచంద్రరావు ఆధ్వర్యంలో పోలీసులు మర్రిపాలెం టోల్ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిందితులను అదుపులోకి తీసుకుని, నాలుగు గోనె సంచుల్లో ఉన్న 79 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి రవాణాకు ఉపయోగించిన ఒక టెంపో, ఒక కారును సీజ్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.3.95 లక్షలు కాగా, వాహనాలతో కలిపి మొత్తం ఆస్తుల విలువ రూ.7.75 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ సింహాచలం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఐదుగురు అరెస్టు -
వర్క్షాప్లు, లోకోషెడ్లతో స్వయం సమృద్ధి
రైళ్ల నిర్వహణలో ఎలాంటి లోటు లేకుండా జోన్కు 17 కీలక వర్క్షాప్లు, లోకోషెడ్లు, కోచింగ్ డిపోలు దక్కనున్నాయి. ● వాల్తేరు, విజయవాడ, గుంతకల్లులోని 3 ఎలక్ట్రిక్ లోకో షెడ్లు ● వాల్తేరు, గుత్తి, గుంతకల్లు, విజయవాడలోని 4 డీజిల్ లోకోషెడ్లు ● తిరుపతిలోని కోచ్ వర్క్షాప్, వడ్లపూడి,రాయనపాడులోని వ్యాగన్ వర్క్షాప్లు ● వాల్తేరు, విజయవాడ, గుత్తి, కాకినాడ పోర్టులోని 4 మేజర్ ఫ్రైట్ ఎగ్జామినేషన్ యార్డులు ● వాల్తేరు, తిరుపతి, విజయవాడ, కాకినాడ పోర్టు, నర్సాపూర్, మచిలీపట్నం, గుంటూరులోని 7 కోచింగ్ డిపోలు ● ట్రాక్ మెషీన్ వర్క్షాప్ కింద రాయనపాడులోని సెంట్రల్ పీవోహెచ్ వర్క్షాప్, జోనల్ ట్రాక్ మెషీన్ డిపో ● రాజమండ్రిలోని మెమూ కార్షెడ్ కూడా జోన్ పరిధిలోకే రానుంది. ● విజయవాడలోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ రన్నింగ్ స్టాఫ్(ఈటీటీసీ), గుంతకల్లులోని డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్(డీటీటీసీ) జోన్కు రానుంది. -
విశాఖ రైల్వే జోన్కుపవర్ బూస్ట్
4 పోర్టులు, కీలక వర్క్షాప్లు, లోకోషెడ్లతో ఆదాయార్జనకు ఊతం ఏటా రూ.20 వేల కోట్ల వరకు రాబడికి అవకాశం రైళ్ల నిర్వహణ, మరమ్మతులకు స్వయం సమృద్ధి దిశగా అడుగులు జోనల్ హాస్పిటల్, టౌన్షిప్తో మౌలిక సదుపాయాల విస్తరణ సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కీలక శక్తిగా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది. సరుకు రవాణాకు జీవనాడిగా నిలిచే నాలుగు ప్రధాన పోర్టులు, రైళ్ల నిర్వహణకు వెన్నెముకలైన లోకోషెడ్లు–వర్క్షాప్లు, వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు జోన్ పరిధిలోకి రానుండటంతో విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న ఈ జోన్ ఆర్థికంగా, పరిపాలనా పరంగా మరింత బలోపేతం కానుంది. వార్షికంగా రూ.17,500 కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లతో పాటు విశాఖ డివిజన్లోని కీలక ఆస్తులు, సదుపాయాలు జోన్లో విలీనం కానున్నాయి. రైళ్ల నిర్వహణ, మరమ్మతులు, సరుకు రవాణా, సాంకేతిక శిక్షణ తదితర అంశాల్లో ఇతర జోన్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వయం సమృద్ధి సాధించేలా దక్షిణ కోస్తా రైల్వే జోన్ రూపుదిద్దుకుంటోంది. జోన్కు 4 పోర్టుల బలం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆదాయానికి ప్రధాన ఆధారంగా నిలిచే 4 కీలక ఓడరేవులు పూర్తిగా ఈ జోన్ పరిపాలనా నియంత్రణలోకి రానున్నాయి. విశాఖపట్నం, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ద్వా రా భారీ స్థాయిలో సరుకు రవాణా జరుగుతోంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం జోన్కు ఆర్థిక బలాన్ని చేకూర్చనుంది. గూడ్స్ రైళ్ల తనిఖీలు, నిర్వహణ కోసం వాల్తేరు, విజయవాడ, గుత్తి, కాకినాడ పోర్టుల వద్ద ఉన్న నాలుగు మేజర్ ఫ్రైట్ ఎగ్జామినేషన్ యార్డులు కూడా జోన్ పరిధిలోకి రానున్నాయి. ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం విశాఖలో ఉన్న శాటిలైట్ డిపో ఫర్ ట్రాక్ మెషీన్స్ విశాఖ డివిజన్ పరిధిలోనే ఉంటుంది. రాయగడకు బదిలీ చేసినవి మినహాయిస్తే మిగిలిన 3 ఆపరేటింగ్ సెక్షన్ కంట్రోల్స్, ఒక టీపీసీ సెక్షన్ బోర్డు, ఇంజనీరింగ్, సీ అండ్ డబ్ల్యూ, సెక్యూరిటీ కంట్రోల్ విభాగాలు కూడా విశాఖ డివిజన్లోనే ఉంటాయి. ఇలా.. దక్షిణ కోస్తా రైల్వే జోన్ తన సామ్రాజ్యాన్ని ఒక్కొక్కటిగా విస్తరింపజేసుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. పోర్టుల ద్వారా సరుకు రవాణా, నిర్వహణా కేంద్రాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాల ద్వారా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు ఏటా రూ.17,550 కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేకే లైన్ కూడా జోన్లో విలీనం చేసి ఉంటే ఈ ఆదాయం రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల స్థాయికి చేరుకునేదని చెబుతున్నారు. -
ఏపీఎల్ రన్ రణరంగం
విశాఖ స్పోర్ట్స్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఐదో సీజన్కు తెరలేవనుంది. కప్ను కై వసం చేసుకునేందుకు ఏడు జట్లు సిద్ధమవగా..మంగళవారం రాత్రి వైఎస్సార్ స్టేడియం ఫ్లడ్లైట్ల వెలుతురులో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈసారి తొలిసారిగా ఏపీఎల్ మ్యాచ్లను మూడు వేదికల్లో నిర్వహించేందుకు నిర్వాహక కమిటీ ఏర్పాట్లు చేసింది. మూడు వేదికల్లో మ్యాచ్లు లీగ్ దశలో మొదటి ఫేజ్ మ్యాచ్లు విశాఖ వేదికగా ఈ నెల 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక్కడ మొత్తం 11 మ్యాచ్లు నిర్వహిస్తారు. ఆ తర్వాత తొలిసారిగా కడప స్టేడియంలో 9 మ్యాచ్లు, మంగళగిరి స్టేడియంలో 8 మ్యాచ్లు జరగనున్నాయి. మంగళగిరి వేదికగా నాకౌట్ పోటీలు నిర్వహించి, జూన్ 30న ఈ సీజన్కు ముగింపు పలకనున్నారు. రెండో టైటిల్ ఎవరిదో? ఏపీఎల్లో ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లలోనూ ప్రతిసారీ కొత్త జట్టు విజేత నిలిచింది. కోస్టల్ రైడర్స్ మాత్రమే రెండుసార్లు ఫైనల్కు చేరి, 2022లో విజేతగా నిలిచింది. 2023లో రాయలసీమ కింగ్స్, 2024లో వైజాగ్ వారియర్స్ చాంపియన్లగా నిలవగా.. ప్రస్తుతం తుంగభద్ర వారియర్స్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది. గత సీజన్లో వైజాగ్ వారియర్స్ను విజేతగా నిలిపిన స్థానిక స్టార్ క్రికెటర్ కేఎస్ భరత్ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడమే కాకుండా, ఈ సీజన్ ఏపీఎల్కు దూరం కావడం గమనార్హం. రూ.16.25 లక్షలతో శశికాంత్ టాప్ గత సీజన్లలో అశ్విన్ హెబ్బర్, హనుమ విహారి, నితీష్ కుమార్ రెడ్డి, అవినాష్లు అత్యధిక ధరకు అమ్ముడుపోగా.. ప్రస్తుత సీజన్లో స్థానిక ఆటగాడు కేవీ శశికాంత్ను రూ.16.25 లక్షల భారీ మొత్తానికి డిఫెండింగ్ చాంపియన్ తుంగభద్ర వారియర్స్ దక్కించుకుంది. గత సీజన్లలో గిరినాథ్, హేమంత్, అశ్విన్, హనుమ విహారి ‘మోస్ట్ వేల్యుబుల్ ప్లేయర్స్’గా నిలిచారు. గత సీజన్ రికార్డులు గత సీజన్లో అభినవ్ 269 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హనుమ విహారి, అశ్విన్ హెబ్బర్, మహీప్ కుమార్, రషీద్ (ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నందున అందుబాటులో లేడు) తర్వాత స్థానాల్లో నిలిచారు. సిక్సర్ల విషయానికొస్తే అశ్విన్ అత్యధికంగా 25 సిక్సర్లు, రోహిత్ 20 సిక్సర్లు బాదా రు. బౌలింగ్లో సత్యనారాయణ, శశికాంత్లు చెరో 14 వికెట్లతో రాణించారు. ఈసారి వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్, ఉత్తరాంధ్ర లయన్స్, బెజవాడ టైగర్స్ వంటి 7 ఫ్రాంచైజీల మధ్య జరగబోయే ఈ పో రులో ఎవరు అత్యధిక పరుగులు, వికెట్లు సాధిస్తారో చూడాలి. -
నిందితుల ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి
సీసీఫుటేజీలను చూపించి ఆరాతీస్తున్న సీఐ మురళి నక్కపల్లి: గత మంగళవారం అర్ధరాత్రి ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ కి పాల్పడిన నిందితుల ఆచూ కీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నక్కపల్లి సీఐ జె.మురళి కోరారు. కొన్ని సీసీ కెమెరాల్లో నమోదైన నిందితుల ఫొటోలు, వారు చోరీచేస్తున్న విజువల్స్ను విడుదల చేశారు. నిందితుల ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. వీటిని అందరూ వాట్సాప్ గ్రూపుల్లో షేర్చేయాలని, నిందితులు ఆచూకీ తెలిసినా, వారేనని అనుమానం వచ్చిన వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.శనివారం మరోసారి ఆలయప్రాంగణాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల్లో పలువురికి సీసీ ఫుటేజీలను చూపించి నిందితులను గుర్తుపట్టగలరా అని ఆరా తీశారు. అన్నిగ్రామాల్లోను ఈ వీడియోపుటేజీలను చూపించి నిందితులను గుర్తుపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని సీఐ తెలిపారు. -
రోబోటిక్ సర్జరీతో మెరుగైన క్యాన్సర్ వైద్యం
ఎన్టీపీసీ సింహాద్రి హెడ్ అయస్కాంత్ జెనా అగనంపూడి(విశాఖ): అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి, పరిశోధనా సంస్థ 12వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ హెడ్ అయస్కాంత జెనా మాట్లాడుతూ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీపీసీ సహకరిస్తుందని తెలిపారు. ఆస్పత్రితో రోబోటిక్ సర్జరీ యూనిట్, 3 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రి డైరెక్టర్ డా. ఉమేష్ మహంతశెట్టి మాట్లాడుతూ 12 ఏళ్లలో క్యాన్సర్ సంరక్షణలో సంస్థ విశేష పురోగతి సాధించిందన్నారు. ఆధునిక వైద్య సాంకేతికత, డయాగ్నస్టిక్ సదుపాయాలతో సమగ్ర చికిత్స అందిస్తున్నామని తెలిపారు. చికిత్సతో పాటు పునరావాసం, మానసిక మద్దతు కూడా సమగ్ర క్యాన్సర్ సంరక్షణలో భాగమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘ప్రేరణ’ పేరుతో క్యాన్సర్ బాధితులు, రోగం నుంచి కోలుకున్న వారు, వైద్యులు, సహాయకులతో ఒక ప్రత్యేక గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది రోగుల్లో మానసిక ధైర్యం పెంపొందించేందుకు నెలవారీ సమావేశాలు నిర్వహిస్తుందని వివరించారు. అలాగే నాల్గవ వార్షిక క్యాన్సర్ కాంగ్రెస్ కూడా నిర్వహించారు. ఇందులో అంతర్జాతీయ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ శైలేష్ వి శ్రీఖండో, వైస్ అడ్మిరల్ ఆర్తి సారిన్ పాల్గొని ఆధునిక క్యాన్సర్ చికిత్స విధానాలు, రోబోటిక్ సర్జరీ, రేడియోథెరపీ వంటి అంశాలపై చర్చించారు. ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి సుమారు 150 మంది వైద్య నిపుణులు, పీజీ విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లు హాజరయ్యారు. -
యలమంచిలి యువకుడికి ‘గిన్నిస్ బుక్’లో స్థానం
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ అందుకుంటున్న జగదీష్ పాల్ యలమంచిలి రూరల్:యలమంచిలి కాకివాని వీధికి చెందిన కె.జగదీష్ పాల్ ఎలక్ట్రానిక్ కీ బోర్డు వాయించడంలో ప్రతిభ చూపడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం లభించింది. గత ఫిబ్ర వరిలో హైదరాబాద్లో జరిగిన నాన్ స్టాప్ కీ బోర్డ్ ప్లే పోటీల్లో జగదీష్ పాల్ ప్రతిభ చూపి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందాడు. ఈ పోటీల్లో 22 దేశాలకు చెందిన సుమారు 2,000 మంది పాల్గొన్నారు. పోటీల్లో భాగంగా దక్షిణ భారతదేశ శాసీ్త్రయ సంగీత సరళి స్వరాలతో పాటు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ఎలక్ట్రానిక్ కీ బోర్డును గంట సేపు వాయించాడు.ఈ మేరకు జగదీష్ పాల్కు శనివారం పెందుర్తి ఐపీసీ చర్చిలో ధ్రువీకరణ పత్రం, మెడల్ అందజేసి అభినందించారు. జగదీష్ పాల్ తండ్రి పీటర్ పట్టణంలో కాకివాని వీధిలో జేసీపీఎఫ్ చర్చి నిర్వహిస్తున్నారు. -
వీఆర్పీపై సమగ్ర విచారణ జరపాలి
రోలుగుంట : కొమరవోలు అవలో జరుగుతున్న ఉపాధి పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని కూలీలు పది రోజుల క్రితం కలెక్టర్ విజయకృష్ణన్కు, పీడీకి, ఎంపీడీవోకు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవోకు ఫిర్యాదు చేశారు. దీనిలో పనుల కెళుతున్న ఉపాధి కూలీ నుంచి వారానికి రూ.100 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. డబ్బులిచ్చిన వారికి వారానికి ఆరు రోజుల మస్తరు, ప్రభుత్వ ఇస్తున్న కూలీ వేతనం పూర్తిగా మంజూరు చేస్తున్నారని, లేకుంటే మూడు రోజులు, నాలుగు రోజులు మస్తర్లు వేస్తున్నారన్నారు. ఈ ఫిర్యాదుపై కలెక్టర్ ఆదేశించిన విచారణ మేరకు ఈ నెల 4న ఎంపీడీవో వి.ఎస్ నాగేశ్వరరావు, ఏపీవో ఈశ్వరరావు, ఏపీడీ పని ప్రదేశానికి వెళ్లి విచారణ జరిపారు. అయితే విచారణ తీరుపై బాధిత ఉపాధి కూలీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం మళ్లీ అధికారులు పని ప్రదేశానికి ఆలస్యంగా వచ్చి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కొందరు తమ వద్ద వారానికి రూ.100 ఇవ్వాలని, డబ్బులు ఇవ్వకపోతే గ్రూపు మారిపోవాలని వీఆర్పీ మొయ్యా కృష్ణ బెదిరిస్తున్నారని అధికారులకు తెలిపారు. మేట్లు వీఆర్పీకి ఇవ్వడానికి అని చెప్పి వారానికి రూ.100 ఇవ్వాలని తీసుకున్నారని మరికొందరు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కూలీలు పని ప్రదేశం నుంచి వెళ్లిపోవడంతో విచారణ అర్ధంతరంగా నిలిచిపోయింది. దీనిపై ఫిర్యాదుదారులు అఽఽఽధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వీఆర్పీపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, తమకు శ్రమకు తగ్గ వేతనాలు అందించాలని కోరారు. దీనిపై ఎంపీడీవోని సాక్షి సంప్రదించగా విచారణ వేగవంతం చేసి, నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని, మేట్లు, కూలీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.కొమరవోలులో ఉపాధి కూలీల డిమాండ్ -
యరకన్నపాలెంలో డోజ్కో ప్రతినిధుల పర్యటన
మ్యాపును పరిశీలిస్తున్న రష్యా దేశస్తులు మాకవరపాలెం: మండలంలోని యరకన్నపాలెంలో డోజ్కో కంపెనీ ప్రతినిధులైన రష్యా దేశస్తులు పర్యటించారు. రాచపల్లి రెవెన్యూ పరిధిలోని 737 సర్వే నంబర్లో ఇటీవల ప్రభుత్వం 406 ఎకరాల భూమిని సేకరించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో 150 ఎకరాలను భారీ వాహనాల విడి భాగాల తయారు చేసే డోజ్కో కంపెనీకి కేటాయించారు. ఈ నేపథ్యంలో శనివారం కంపెనీకి చెందిన రష్యా ప్రతినిధులు యరకన్నపాలెం ప్రాంతంలో పర్యటించి భూములను, మ్యాపును పరిశీలించారు. రవాణాకు సంబంధించి రోడ్డు మార్గం, తదితర వివరాలను తెలుసుకుని వెళ్లారు. -
పోయిన బంగారం ఎంత?
ఆలయంలో మంగళవారం రాత్రి చోరీ చేసిన అనంతరం బంగారం వెండి,ఆభరణాలను దుండగులు ఆలయం వెనుక తోటలో వదిలే యగా పోలీసు జాగిలాలు గుర్తించాయి. ఈ మూటలో 56 గ్రాముల బంగారం, 2.70కిలోల వెండి ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే దాదాపు ఆరేళ్లనుంచి భక్తులు ఇచ్చిన కానుకలను లెక్కించి హుండీల్లోనే వేసేస్తున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఏడాదికి నాలుగు పర్యాయాల చొప్పున 24 సార్లు పరాకామణి( హుండీల ఆదాయం లెక్కింపు) నిర్వహించారు.ఇలా లెక్కించినపుడు నగదు ఎంత వచ్చింది, వెండి, బంగారం ఎంత వచ్చింది అనే వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించడం లేదు. చోరీ జరిగింది కాబట్టీ నగదు మాట ఎలా ఉన్నా వెండి, బంగారం వివరాలు కచ్చితంగా తెలియజేయాలి. కానీ దొరికిన బంగారం గురించి మాత్రమే చెబుతున్నారు. అసలు కానుకల రూపంలో ఎంత బంగారం వచ్చిందనే దానికి లెక్కలున్నాయా? లేవా?... ఉంటే ఎంత ఉండాలి, దొంగలు వదిలేయడంతో దొరికిన బంగారానికి, రిజిస్టర్లో నమోదు చేసిన బంగారానికి సరిపోయిందా లేదాఅనే వివరాలు వెల్లడించకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కానుకల రూపంలో వచ్చిన బంగారం భారీగానే ఉంటుందని, ఈవిషయాన్ని బయటపెడితే ఇబ్బంది ఎదురవుతుందనే బయటకుచెప్పడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రికవరీ విషయంలో ఉన్నతాధికారులనుంచి ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుందన్న కారణంగానే వాస్తవంగా ఎంత బంగారం ఉండాలనే దానిపై పోలీసులు కూడా విచారణ చేపట్టడం లేదని భక్తులు అంటున్నారు. చోరీజరిగి నాలుగు రోజులు గడుస్తున్నా టీటీడీ నుంచి ఒక్క అధికారి కూడా ఉపమాక వచ్చి విచారణ చేపట్టకపోవడం విశేషం. -
ఈదురు గాలులు, భారీ వర్షం
నాతవరం: మండలంలో శనివారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు మధ్యాహ్నం వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందారు. అంతలోనే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాతవరం మెయిన్ రోడ్డుపై వర్షం నీరు ప్రవహించడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. పీహెచ్సీ ప్రాంతంలో తాండవ కాలువపై నిర్మించిన వంతెనపై నీరు నిలిచిపోవడంతో వాహచోదకులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. రబీలో వేసిన నువ్వు పంటకు, ఖరీఫ్లో వేయబోయే పంటలకు ఈవర్షం ఉపయోగపడుతుందని రైతులు తెలిపారు.నాతవరం తాండవ వంతెనపై ప్రవహిస్తున్న నీరునాతవరంలో రోడ్లు జలమయం -
ఎరువుల సరఫరాలో అక్రమాలకు పాల్పడితే చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి యలమంచిలి రూరల్: ఎరువుల సరఫరాలో అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి ఎం.ఆశాదేవి హెచ్చరించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో ఎరువుల డీలర్లు,రైతుసేవా కేంద్రాల సిబ్బంది,వ్యవసాయాధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇకపై ఎరువుల సరఫరాను ఏపీఏఐఎంఎస్ ద్వారానే చేపట్టాలన్నారు.ఈ–పోర్టల్లో రైతు ఆధార్ నంబర్,గత ఖరీ్ఫ్ సీజన్లో సాగు చేసిన పంటల విస్తీర్ణం ఆధారంగా ఎరువులను సరఫరా చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కచ్చితమైన నియమ నిబంధనలు రూపొందించిందని వాటిని తప్పనిసరిగా పాటించాలన్నారు. రబీ సీజన్లో సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసిన రామారాయుడుపాలెంకు చెందిన అభ్యుదయ రైతులు బెజవాడ చిరంజీవి,గొర్లి బాబూరావు,మళ్ల బాబూరావులకు గుడ్ అగ్రిక ల్చరల్ ప్రాక్టీసెస్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి,పాయకరావుపేట ఏడీఏలు సుమంత,ప్రసాద్,మండల వ్యవసాయాధికారులు పొలిమేర మోహన్రావు,శంకర్,గోవింద్,పలువురు ఎరువుల డీలర్లు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళను వేధించిన రౌడీ షీటర్కు రిమాండ్
అచ్యుతాపురం రూరల్: సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు పెట్టి మహిళను కించపరిచిన రౌడీ షీటర్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టు సీఐ చంద్రశేఖరరావు శనివారం తెలిపారు. పూడిమడక గ్రామానికి చెందిన ఎరిపల్లి కాసులు (కిరణ్) అదే గ్రామానికి చెందిన మహిళను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు పెట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, యలమంచిలి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం రిమాండ్ విధించడంతో కేంద్ర కారాగారానికి తరలించినట్టు సీఐ చెప్పారు. కిరణ్పై గతంలో రాంబిల్లి, కశింకోట, అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లలో 10 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. అచ్యుతాపురం పోలీసుస్టేషన్లో కిరణ్పై రౌడీ షీట్ నమోదైంది. అనంతరం అచ్యుతాపురం సీఐ చంద్రశేఖరరావు పూడిమడక సచివాలయంలో గ్రామస్తులతో మాట్లాడుతూ మహిళలను, ఇతర వ్యక్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
వడదెబ్బతో వైఎస్సార్సీపీ నాయకుడు ప్రసాదరావు మృతి
చీడికాడ: వడదెబ్బతో చీడికాడకు చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు పరువాడ ప్రసాదరావు(68)శనివారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తన పింఛను దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రసాదరావు సచివాలయానికి పలుమార్లు తిరగడంతో వడదెబ్బ గురైనట్టు చెప్పారు.సాయంత్రం సచివాలయం నుంచి వచ్చి అస్వస్థతకు గురై పడిపోవడంతో సపర్యలు చేశామని చెప్పారు.శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఛాతీలో నొప్పివస్తోందని చెప్పడంతో గ్రామంలోని పీహెచ్సీకి తరలించామన్నారు.అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భార్య నిర్మల తెలిపారు.ప్రసాదరావు భౌతికకాయాన్ని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం,పార్వతీపురం మన్యం జిల్లాల రిజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు సందర్శించి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఆయన వెంట ఎంపీపీ కురచా జయమ్మనారాయణరావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు, వైస్ ఎంపీపీ ధర్మిశెట్టి కొండబాబు, సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు,చీడికాడ గ్రామశాఖ అధ్యక్షుడు పరువాడ మహేష్ తదితరులున్నారు. వీరితోపాటు పలు రాజకీయపార్టీలకు చెందిన నాయకులు నివాళులర్పించారు. -
ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్
నర్సీపట్నం: ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ముఠాను నాతవరం పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు బైక్ల చోరీల వివరాలను శనివారం వెల్లడించారు. నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు, సిబ్బంది వెదురుపల్లి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. అదే సమయంలో బైక్పై వస్తున్న ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులను సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించగా వారు పారిపోయేందుకు యత్నించారు. వారిని వెంబడించి పట్టుకుని విచారించగా నాతవరం పరిసర ప్రాంతాల్లో పలు ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసినట్టు అంగీకరించారన్నారు. నిందితులు మాతిరెడ్డి మనోజ్, కిల్లంపల్లి సుబ్రహ్మణ్యం కిరణ్, వంతల కొండలబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేసిన వాహనాలను ఒడిశా ఏజెన్సీ సరిహద్దు ప్రాంతాల్లో విక్రయించి వచ్చిన డబ్బులతో తమ వ్యక్తిగత అవసరాలు, విలాసవంతమైన జీవనానికి అలవాటు పడినట్లు డీఎస్పీ వివరించారు. కొనుగోలు చేసి మైదాన ప్రాంతాలకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.నాలుగు బైక్లు స్వాధీనం -
సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ఆత్మహత్య
మాడుగుల రూరల్: స్థానిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, టీడీపీ మాడుగల పట్టణ మాజీ అధ్యక్షుడు శ్రీనాధు మధు(52) గురువారం అర్ధరాత్రి మాడుగులలో తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పిప్పలమోడి వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్ట ఆయన బంధువులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ జి. నారాయణరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ చెప్పారు. మధు మృతి పట్ల స్థానిక వ్యాపారులు, రాజకీయనాయకులు, ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. మధుకు భార్య, కుమారై, కుమారుడు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కశింకోట: మండలంలోని ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం... అనకాపల్లి నుంచి తాళ్లపాలెం వైపు వెళుతున్న బైక్ను ఉగ్గినపాలెం వద్ద వెనుకగా వ్యాన్ వచ్చి ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న తాళ్లపాలెం శివారు బంగారయ్యపేటకు చెందిన అందపు నాగదుర్గ (18) తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ నుజ్జు అయింది. విషయం తెలుసుకున్న మిత్రుడు సింగంపల్లి శేఖర్ సంఘటనా స్థలానికి చేరుకొని నాగదుర్గను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.వైద్యులు పరీక్షించి మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు నిర్థారించారు. తల్లి లోవలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్ఐ బి.సతీష్ దర్యాప్తు చేపట్టారని సీఐ తెలిపారు..ప్రమాదానికి కారణమైన వ్యాన్, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. -
యువకుడిని కాపాడిన లైఫ్గార్డులు
యువకుడిని కాపాడిన పోలీసులు, లైఫ్గార్డులుమహారాణిపేట: కెరటాల ఉధృతికి సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని పోలీసులు, స్విమ్మర్లు కాపాడారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం రాజపురం గ్రామానికి చెందిన ఎం.మణికంఠ మిలటరీ పరీక్షలు రాయడానికి ఇటీవల విశాఖకు వచ్చాడు. శుక్రవారం గోకుల్ పార్క్ వద్ద తీరంలో స్నానం చేస్తుండగా, ఒక్కసారిగా వచ్చిన అలల ఉధృతికి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. గమనించిన కానిస్టేబుల్ భాస్కరరావు, లైఫ్గార్డులు రవివర్మ, కళ్యాణ్ వెంటనే అప్రమత్తమై మణికంఠను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి, అతని తమ్ముడు వరుణ్కు అప్పగించినట్లు మైరెన్ ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. -
అడవుల పెంపకంలో సీడ్ బాల్స్ కీలకం
ముంచంగిపుట్టు: సులభమైన పద్ధతిలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి సీడ్ బాల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ముంచంగిపుట్టు ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎం.మురళీకృష్ణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో గిరిజన రైతులకు, ప్లాంటేషన్ మేసీ్త్రలకు సీడ్ బాల్స్ తయారీపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవు పేడ, కట్టె పొయ్యి బూడిద, సేంద్రియ ఎర్రమట్టి, జీవామృత ద్రావణాలను ఉపయోగించి రైతుల చేత స్వయంగా సీడ్ బాల్స్ను తయారు చేయించారు. ఈ సందర్భంగా రేంజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. సీడ్ బాల్స్ పద్ధతి ద్వారా స్థానిక అటవీ విత్తనాలను నాటడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ముఖ్యంగా జాఫ్రా, నల్లమద్ది, తెల్లమద్ది, చింత, అడ్డ, నేరేడు వంటి వృక్ష జాతుల విత్తనాలను సీడ్ బాల్స్గా మార్చి భూముల్లో వేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఈ పద్ధతి వల్ల విత్తనాలను పక్షులు, కీటకాల బారి నుంచి రక్షించవచ్చన్నారు. ఎటువంటి ప్రత్యేక సంరక్షణ, నీటి సదుపాయం లేకపోయినా.. వర్షం పడగానే ఇవి మొలకెత్తి ఏపుగా వృక్షాలుగా పెరుగుతాయన్నారు. అందువల్ల గిరిజన రైతులంతా ఈ సాంకేతికతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు. అనంతరం పనసపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థినులతో కలిసి ఫారెస్ట్ అధికారులు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి సీహెచ్.నారాయణపడాల్, ఫారెస్ట్ బీట్ అధికారులు వెంకటరాజు, శ్రీను, స్థానిక గిరిజన నాయకులు, రైతులు, ప్లాంటేషన్ మేస్త్రిలు పాల్గొన్నారు. ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణ -
టిడ్కో గృహాల్లో కార్డన్ సెర్చ్
● ప్రతి ఇంటిని జల్లెడ పట్టిన పోలీసులు ● 7 బైక్లు స్వాధీనంఅనకాపల్లి: మండలంలోని బీఆర్టీ కాలనీ ప్రాంత పరిధిలో టిడ్కో గృహాల్లో 71 మంది పోలీసు సిబ్బందితో శుక్రవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. అనకాపల్లి టౌన్, ట్రాఫిక్, రూరల్ సర్కిల్, కశింకోట పోలీస్ స్టేషన్లకు చెందిన 12 మంది అధికారులు, 71 మంది సిబ్బందితో ప్రతి గృహాన్ని తనిఖీ చేశారు.సరైన పత్రాలు లేని ఏడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఎం.శ్రావణి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును, కుటుంబ వ్యవస్థలను నాశం చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం స్థానికులతో ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ చేయించారు.డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మాణాకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు జి.ప్రేమ్కుమార్, అశోక్కుమార్, అల్లు స్వామినాయుడు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్టీసీ కాంప్లెక్స్లో చేతివాటం
● రద్దీనే ఆసరాగా దొంగతనాలు ● మహిళలు, వృద్ధులే ప్రధాన లక్ష్యం ● పెరుగుతున్న నగదు, సెల్ఫోన్ చోరీలు ● గస్తీ పెంచాలని ప్రయాణికుల విజ్ఞప్తి అనకాపల్లి టౌన్: పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మహిళలు, వృద్ధులే లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లను తస్కరిస్తున్నారు. సాధారణ ప్రయాణికుల వలే కలిసిపోయి బస్సు ఎక్కి, దిగే సందర్భంలో ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకించి ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో దొంగలు తమ చేతికి పని చెబుతున్నారు. కాంప్లెక్స్ పరిసరాలలో పోలీసులు కనిపించకపోవడంతో వీరి పని సులువవుతోంది. రూరల్ జిల్లాకు ప్రధాన కేంద్రమైన అనకాపల్లికి ఎక్కువగా చోడవరం, మాడుగుల, బుచ్చెయ్యపేట, నర్సీపట్నం, యలమంచిలి, మునగపాక తదితర మండలాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో ఎక్కువగా పల్లె జనం కావడంతో దొంగలు వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తమ పనిని సులువుగా కానిచ్చేస్తున్నారు. ఇక్కడ కాంప్లెక్స్లో సీసీ కెమెరాలు తగినన్ని లేకపోవడంతో దొంగలు తెలివిగా వస్తువులను అపహరించి తప్పించుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. ● ఈ నెల 3న చోడవరం మండలం జుత్తాడ గ్రామానికి చెందిన ఒక ప్రయాణికురాలు అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో తన తల్లి దగ్గరకు వెళ్లడానికి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్లో రాంబిల్లి బస్సు ఎక్కింది. స్థానిక బైపాస్ దగ్గరకు రాగానే తన బ్యాగ్లో నగదు చూడగా, అందులో రూ.80 వేలు మాయమయ్యాయి. ● జనవరిలో ఇదే ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సు ఎక్కుతున్న వృద్ధురాలి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు తులం బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ● గతేడాది డిసెంబర్లో ఇదే ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికురాలి మెడలో నుంచి నాలుగు తులాల బంగారు వస్తువులను కాజేశారు. పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలి కాంప్లెక్స్లో సివిల్ దుస్తులలో పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలి. కాంప్లెక్స్కు ఎక్కువగా వివిధ గ్రామాల నుంచి ప్రయాణికులు వస్తుంటారు. వారికి అమాయక మాటలు చెప్పి దొంగలు తమ పని కానిచేస్తున్నారు. సీసీ కెమెరాలు ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి. – మద్దాల భాను, అనకాపల్లి సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కాంప్లెక్స్లో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన ఆరు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆర్టీసీ శాఖ ఆధ్వర్యంలో మరో ఐదు ఏర్పాటు చేయడానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఇన్గేట్, యలమంచిలి, చోడవరం బస్సులు ఎక్కే దగ్గర కూడా తగినన్ని కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ప్రయాణికులు అపరిచిత వ్యక్తులతో మాట్లాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – వి. ప్రవీణ, జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ చోరులకు అడ్డాగా మారింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీనే ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సులు ఎక్కి దిగే సమయాల్లో సులువుగా తమ పని కానిచ్చేస్తున్నారు. ఇక్కడ పోలీసుల గస్తీ లేకపోవడం, పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల చోరులు తప్పించుకుంటున్నారు. -
పెద్దేరులోకి దూసుకుపోయిన 108 అంబులెన్స్
బుచ్చెయ్యపేట: మండలంలోని వడ్డాది మేజర్ పంచాయతీలో 108 అంబులెన్స్కు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి వడ్డాది నుంచి బుచ్చెయ్యపేట వైపు వెళ్తున్న ఈ వాహనం పెద్దేరు నదిపై డైవర్షన్ రోడ్డులో డౌన్ నుంచి అప్ ఎక్కేటప్పుడు ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి డౌన్లోకి జారుకుంది. ఈ క్రమంలో డ్రైవర్ బ్రేక్ వేసినా పట్టకపోవడంతో దిగువ పెద్దేరు నదిలోకి దూసుకుపోయింది. అంబులెన్స్ సగ భాగం డైవర్షన్ రోడ్డుపైన, సగ భాగం పెద్దేరు నదిలో గాల్లో వేలాడుతూ ఉండిపోయింది. ఆ సమయంలో అంబులెన్స్లో రోగులెవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంబులెన్స్ వెనుక వాహనాలు, పాదచారులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అత్యవసర పరిస్థితిలో రోగులను ఆస్పత్రికి తరలించే 108 అంబులెన్స్కు బ్రేక్లు పట్టకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కండీషన్ లేని 108 వాహనాల వల్ల ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వాపోతున్నారు. తప్పిన ప్రమాదం -
విద్యుత్షాక్తో పాడి గేదెలు మృతి
నాతవరం: విద్యుత్ వైర్లు తెగిపడడంతో షాక్కు గురై రెండు పాడిగేదెలు మృతిచెందాయి. మండలంలో రాజుపేట అగ్రహం గ్రామానికి చెందిన రెడ్డి నాయుడు శుక్రవారం ఉదయం తన మకాం నుంచి పశువులను మేతకు పొలంలోకి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో విద్యుత్ వైర్లు ఆకస్మాత్తుగా తెగి ముందుగా వెళ్తున్న రెండు పాడి గేదెలపై పడడంతో షాక్కు గురై అవి అక్కడికక్కడే మృతిచెందాయి. కొంత దూరంలో నడుస్తున్న రైతు రెడ్డి నాయుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈచుట్టు పక్కల వారు గమనించి సంఘటన స్థలానికి చేరుకుని రైతు నాయుడుకు ధైర్యం చెప్పడంతో పాటు నాతవరం విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని నేలపై పడి ఉన్న విద్యుత్ వైర్లను తొలగించారు.అందిన సమాచారం మేరకు పశువైద్యాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృతిచెందిన రెండు గేదెలను పరిశీలించారు. వీటి విలువ రూ.2లక్షలుంటుందని అంచనా. -
భూ, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ● ‘చంద్రబాబు మోసాలకు రెండేళ్లు’ కార్యక్రమానికి విశేష స్పందన ● మునగపాకలో భారీ ర్యాలీ, మెయిన్రోడ్డుపై బైఠాయింపు కలెక్టర్ విజయ కృష్ణన్ చోడవరం: పీజీఆర్ఎస్లో వచ్చిన అన్ని అర్జీలను నెలరోజుల్లోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ విజయ్కృష్ణన్ అన్నారు. చోడవరం నియోజవర్గానికి సంబంధించిన చోడవరంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ లో భూ, ఇతర రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం పలు వురు అర్జీలు అందజేశారు. కలెక్టర్ స్వయంగా వినతులు స్వీకరించారు. గత వారం వందలాది దరఖాస్తులు రావడంతో వాటి పరిష్కారం ఏమేరకు జరిగాయి, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నా రు. పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించా లని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులంతా సమష్టిగా పనిచేసి రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందు కు కృషిచేయాలన్నారు. భూ పరిపాలన కమిషనర్ (సీసీఎల్ఎ) నిబంధనలకు లోబడి భూ సమస్యలు పరిష్కరించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శార్యమన్ పటేల్, డీఆర్వో సత్యనారాయణ, ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవోలు షేక్ ఆయీషా, వి.వి.రమణ, చోడవరం తహసీల్దార్ రామారావు, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల తహసీల్దారులు పాల్గొన్నారు. చంద్రబాబుకు గుణపాఠం తప్పదున్యాయపోరాటం చేస్తాం ఉపమాక వెంకన్న ఆలయంపై టీటీడీ చిన్నచూపు చూస్తోంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేవిధంగా వ్యవహరిస్తోంది. తమ ఇష్టదైవానికి సెంటిమెంట్తో భక్తులు సమర్పించిన కానుకలకు రక్షణ కల్పించడంలో విఫలమవు తోంది. సరైన రక్షణ కల్పించకుండా ఆలయా న్ని నిర్లక్ష్యంగా వదిలేస్తోంది. టీటీడీ నుంచి క్షేత్రస్థాయి పరిశీలన సరిగ్గా ఉండడంలేదు.అధికారులు సిబ్బంది ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. టీటీడీ వైఖరిపై న్యాయపోరాటం చేస్తాం. – దేవవరపు వెంకటరమణ భక్తుడు, నక్కపల్లి -
పచ్చ గద్దల గ్రావెల్ దోపిడీపై జనాగ్రహం
● ఆందోళనకారులకు మద్దతు పలికిన వైఎస్సార్ సీపీ నేతలు రాంబిల్లి(అచ్యుతాపురం): పంచదార్ల కొండపై యథేచ్ఛగా సాగుతున్న గ్రావెల్ తవ్వకాలపై వెంకటాపురం గ్రామస్తులు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంబిల్లి మండలంలోని వెంకటాపురం,పంచదార్ల గ్రామాల పరిధిలో చేపడుతున్న గ్రావెల్ తవ్వకాలతో ఏర్పడిన గోతులను ఫణిగిరి, పంచదార్ల కొండల సంరక్షణ సంస్థ సభ్యులు,వైఎస్సార్ సీపీ నియోజక వర్గ సమన్వకర్త కరణం ధర్మశ్రీ నేతృత్వంలోని పలువురు నేతలు పరిశీలించారు.రెండెకరాల్లో క్వారీ నిర్వహణకు అనుమతి ఉందని చూపిస్తూ రోజుకి వందలాది వాహనాల్లో గ్రావెల్ను తరలించుకుపోతున్నారని స్థానికులు మండిపడ్డారు.ఎంపీ రమే ష్ను ఇక్కడికి రావాలని, నిర్వాహకులను రప్పించాలని పలువురు నినాదాలు చేశారు.నంబర్ ప్లేట్ లేని వాహనాలను ఎలా అనుమతిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత లు ప్రశ్నించారు.ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాల వల్ల పంచదార్ల,హరిపురం,వెంకటాపురం గ్రామాల ప్రజల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని అక్కడి వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొంత సేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.కార్యక్రమంలో రాంబిల్లి జెడ్పీటీసీ ధూళి నాగరాజు,శ్రీనుబాబు,కిశోర్రాజు,చేపల గోవింద్, వైఎస్సార్ సీపీ అచ్యుతాపురం మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు పాల్గొన్నారు. న్యాయ పోరాటం చేస్తాం పంచదార్ల కొండను కాపాడేందుకు న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ యలమంచిలి నియోజక వర్గ సమన్వకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. క్వారీ నిర్వహిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.రాయలసీమకు చెందిన సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా క్వారీని అప్పగించారని ఆయన ఆరోపించారు.ఎంపీ రమేష్,ఎమ్మెల్యే సుందరపుల పేర్లు చెప్పి ఇక్కడకు వచ్చిన వారిని బెదిరిస్తున్నారని తెలిపారు. ఫణిగిరి,పంచదార్ల, వెంకటాపురం, భోగాపురం కొండల్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఎటువంటి తీర్మానం చేయకపోయినా పంచాయతీ ఆమోదించినట్లు చెప్పడం దారుణమన్నారు.తహసీల్దార్ వద్ద స్పష్టమైన సమాచారం లేదని ఆయన చెప్పారు. నంబర్ ప్లేట్లు లేని లారీలను ఇక్కడ వినియోగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని తెలిపారు. పుణ్య పంచధారలు కలిగిన ధారపాలెంకు నష్టం కలిగించేలా ఇక్కడ గ్రావెల్ తవ్వకాలు జరపడం శోచనీయమని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం రాయలసీమ వారికి ఉత్తరాంధ్ర కొండల్ని అడ్డగోలుగా ధారాదత్తం చేస్తోందని విమర్శించారు.ఈ ప్రాంత ప్రజల అనుమతి లేకుండా,ఇక్కడి పంచాయతీలకు సీనరైజ్ చెల్లించకుండా చేపడుతున్న దోపిడీపై పోరాటం చేస్తామని వెల్లడించారు.చంద్రబాబు,పవన్ కళ్యాణ్ల ప్రభుత్వాన్ని కాలగర్భంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. -
ఊపిరితిత్తుల క్యాన్సర్కు కేజీహెచ్లో క్లినికల్ ట్రయల్స్
● రూ.68 లక్షల విలువైన వైద్యం ఉచితంగా ● ఏడాది పాటు ఇమ్యూనోథెరపీ, పరీక్షలు ● ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా డాక్టర్ శిల్పా మహారాణిపేట: ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న పేద రోగులకు కేజీహెచ్ ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ఊపిరితిత్తుల క్యాన్సర్పై జాతీయ స్థాయిలో జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు కేజీహెచ్ ఎంపికై ంది. ఈ ట్రయల్స్కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా కేజీహెచ్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ కె.శిల్పా వ్యవహరించనున్నారు. రూ.68 లక్షల విలువైన వైద్యం.. ఉచితంగా! ఈ క్లినికల్ ట్రయల్స్ ద్వారా రోగులకు ఎంతో మేలు చేకూరనుందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. 18 నుంచి 65 ఏళ్ల లోపు వయస్సు ఉండి, ఏ దశ (స్టేజ్)లోనైనా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన రోగులకు ఈ ట్రయల్స్ ద్వారా ఏడాది పాటు పూర్తిగా ఉచితంగా వైద్యం అందిస్తారని వెల్లడించారు. సాధారణంగా ఇచ్చే కీమోథెరపితో పాటు, ఎంతో ఖరీదైన ‘ఇమ్యునోథెరపీ’ని కూడా క్లినికల్ ట్రయల్ ద్వారా ఏడాది పాటు ఉచితంగా అందజేయనున్నట్లు వివరించారు. ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్కు ఇంతటి అత్యాధునిక వైద్యం ఉచితంగా లభించడం ఇదే ప్రథమమన్నారు. ఒక్కో సైకిల్కు సుమారు రూ.4 లక్షల విలువ చేసే ఇమ్యునోథెరపీ మందును.. ప్రతి మూడు వారాలకు ఒకసారి చొప్పున, ఏడాదికి మొత్తం 17 సార్లు పూర్తిగా ఉచితంగా ఇస్తామని స్పష్టం చేశారు. బాధితులు సద్వినియోగం చేసుకోవాలి క్యాన్సర్ రోగులకు ఆర్థిక భారం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కేజీహెచ్లో ఉచితంగా అందిస్తున్నామని మెడికల్ ఆంకాలజీ హెచ్వోడీ డాక్టర్ కె.శిల్పా తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులు, వారి కుటుంబ సభ్యులు అధైర్యపడకుండా కేజీహెచ్ ఆంకాలజీ విభాగాన్ని సంప్రదించి, ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు
అనకాపల్లి: జిల్లాలో పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంట్నుట్టు అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ సంపర్క్(ఫోన్ ఇన్ పోలీస్ సిబ్బంది) కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్ల్లో విధులు నిర్వహిస్తున్న 11 మంది హోంగార్డులు, కానిస్టేబుళ్లు, హెచ్సీలు వారి వ్యక్తిగత, కుటుంబ, వృత్తిపరమైన సమస్యలను ఫోన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారి సమస్యలను ప్రతీ శుక్రవారం సెల్ నంబర్. 93469 12011 ద్వారా ఉదయం 11 నుంచి 12 గంటల వరకు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం ఏవో సీహెచ్.తిలక్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ దేవ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
చోడవరం కోర్టుల ఆవరణంలో మొక్కలు నాటుతున్న 9వ అదనపు జిల్లా జడ్జి హరినారాయణ, అడిషనల్ మెజిస్ట్రేట్ సూర్యకళ చోడవరం: పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని 9వ అదనపు జిల్లా జడ్జి హరినారాయణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరం కోర్టుల ఆవరణంలో జన విజ్ఞాన వేదిక, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ మెజిస్ట్రేట్ సూర్యకళ, ఏపీపీ చీపురుపల్లి సూర్యనారాయణ, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలిచీడికాడ: ప్రతి ఒక్కరు కనీసం ఒక మొక్కనైనా నాటి, పరిక్షించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండలంలోని జి.కొత్తపల్లి కేజీబీవీలో శుక్రవారం ఆమె మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. కేజీబీవీ ఆవరణలో 50 సెంట్ల స్థలంలో సుమారు 3,200 మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టినట్టు జిరామ్జీ పథకం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిషోర్ లింకన్ తదితరులు పాల్గొన్నారు. -
మెనూ ప్రకారం రుచికరమైన భోజనం
దేవరాపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని మధ్యాహ్న భోజన పథకం జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్, పాయకరావుపేట ఎంఈవో గాంధీ నిర్వాహకులకు సూచించారు. మండలంలోని 53 ప్రభుత్వ పాఠశాలల్లోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఎంఈవో–2 వి. ఉషారాణి ఆధ్వర్యంలో శుక్రవారం ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాణ్యత లోపించకుండా మెనూ ప్రకారం సకాలంలో రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు. భోజనం తయారీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కుక్, హెల్పర్లకు వివరించారు. అనంతరం వంటలను తయారీ చేయించి రుచి చూశారు. కార్యక్రమంలో సీఆర్పీలు రమణ తదితర స్థానిక ఎంఈవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
డేటా సెంటర్లతో పర్యావరణానికి ముప్పు
తాటిచెట్లపాలెం: గూగుల్ డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు పొంచివుందని ఢిల్లీ సైన్స్ ఫోరం ఫౌండర్, ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ జాతీయ నాయకులు డి.రఘునందన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు వీటిని వ్యతిరేకిస్తుంటే, మన దేశంలో ప్రభుత్వాలే ఆహ్వానించడం ప్రమాదకరమన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం దొండపర్తిలోని ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ సెమినార్ హాల్లో ‘డేటా సెంటర్లు –విశాఖ పర్యావరణంపై ప్రభావం’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య వక్తగా విచ్చేసిన రఘునందన్ మాట్లాడుతూ.. అమెరికా, ఐరోపా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజల వ్యతిరేకత వల్లే ఇవి ఏర్పాటు కాలేదన్నారు. వీటి వల్ల భారీగా నీరు, విద్యుత్ వినియోగంతో పాటు రేడియేషన్ సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. అలాగే మన డేటాపై విదేశీ నియంత్రణ ఉండి, పారదర్శకత ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం వాస్తవాలను మభ్యపెడుతూ 1 గిగాకు బదులు మూడు ప్రాంతాల్లో సుమారు 2.5 గిగా డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. విశాఖలోని సింహాచలం, ఆనందపురం వంటి నివాస ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవన్నారు. వీటిపై విద్యార్థులు, మేధావులు, ప్రజాసంఘాల సహకారంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి జి.మురళీధర్, రాష్ట్ర కార్యదర్శి జి.గిరిధర్, హెల్త్ సబ్ కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్ డాక్టర్ ఎం.రమేష్కుమార్, ఎన్.చంద్రశేఖర్, మానవ హక్కుల వేదిక అధ్యక్షులు వీఎస్ కృష్ణ, ప్రతినిధులు త్రినాథరావు, కామేశ్వర్రావు, జీవీ రమణ, పెద్ద సంఖ్యలో పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. -
విశాఖ–ఇచ్ఛాపురం సెక్షన్లో జీఎం తనిఖీలు
విశాఖ–ఇచ్ఛాపురం సెక్షన్లో తనిఖీలు నిర్వహిస్తున్న సౌత్ కోస్ట్రైల్వే జిఎం సందీప్మాధుర్ తాటిచెట్లపాలెం: సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ గురువారం విశాఖ– ఇచ్ఛాపురం సెక్షన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలను ఆయన పరిశీలించారు. అమృత్ భారత్ పథకం కింద ఎంపికై న సింహాచలం రైల్వే స్టేషన్తో పాటు కొత్తవలస, శ్రీకాకుళం రోడ్, నౌపడ, పలాస స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన ఆయన.. నిర్దేశిత సమయానికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇచ్ఛాపురం– విశాఖ మధ్య విండో ట్రైలింగ్ ఇన్స్పెక్షన్ ద్వారా రైల్వే ట్రాక్స్, సిగ్నలింగ్ వ్యవస్థ, బ్రిడ్జిలను పరిశీలించి, ప్రజా సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ పర్యటనలో ప్రిన్సిపాల్ చీఫ్ ఇంజనీర్ బి.ఎస్.కె. రాజ్కుమార్, పీసీఎస్టీఈ ఓబీ సురేష్కుమార్, పీసీవోఎం వినీత్కుమార్, సీఏవో అంకుష్ గుప్తా, డీఆర్ఎం లలిత్ బోహ్రా తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ‘గ్రీన్ ఎకానమీ’పై సదస్సు
ఐఐఎం విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం : వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఈ నెల 6, 7 తేదీల్లో ఐఐఎం విశాఖపట్నం ప్రాంగణంలో ఐడియల్ ల్యాబ్ ఆధ్వర్యంలో ‘ఇంటర్నేషనల్ కాంక్లేవ్ ఆన్ గ్రీన్ ఎకానమీ(ఐసీజీఈ)–2026 సదస్సు జరగనుంది. ‘ఆర్థిక, విధానపరమైన, సాంకేతిక మార్గాలు’ అనే అంశాలపై జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, విధానకర్తలు, పరిశ్రమల ప్రముఖులు, పరిశోధకులు హాజరుకానున్నారు. సియెర్రా లియోన్కి చెందిన భారత హై కమిషనర్ బైస్నాబ్ చరణ్ ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సు ప్రారంభించనున్నారు. వాతావరణ సంరక్షణ కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యాయబద్ధమైన గ్రీన్ ట్రాన్సిషన్ కోసం పబ్లిక్ పాలసీ, ఏఐ ఆధారిత సుస్థిర వ్యవస్థలు వంటి అంశాలపై ఈ సదస్సులో ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరగనున్నాయి. టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్సిటీ, కోపెన్హాగన్ బిజినెస్ స్కూల్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ సదస్సు.. పర్యావరణ, సాంకేతిక మార్పుల కాలంలో పటిష్టమైన ఆర్థిక వ్యవస్థల నిర్మాణానికి, విధానపరమైన చర్చలకు కీలక వేదికగా నిలవనుందని ఐఐఎంవీ డైరెక్టర్ ప్రొ.చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
సిటీ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సమగ్ర సమీక్ష
డాబాగార్డెన్స్: సిటీ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధే ధ్యేయంగా నగర పరిధిలోని పలు ప్రాజెక్టులపై జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో జరిగిన ఈ సమావేశంలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి అభిజిత్రేతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా కమిషనర్ కేతన్గార్గ్ జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద చేపట్టిన ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రతిపాదిత ప్రాజెక్ట్ల వివరాలను వారికి వివరించారు. విశాఖ ఎకనామిక్ రీజన్ అభివృద్ధిలో భాగంగా నగర భౌగోళిక పరిస్థితులు, అవసరాలపై వరల్డ్బ్యాంక్ ప్రతినిధుల బృందానికి పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కమిషనర్ సమగ్రంగా వివరించారు. నగరంలో నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ, రోడ్ల విస్తరణ, మొబిలిటీ కారిడార్స్, రోడ్డు కనెక్టివిటీ పెంపుదల, హౌసింగ్, మురికివాడల అభివృద్ధి తదితర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టుల రూపకల్పనపై ఈ ప్రజంటేషన్లో చర్చించారు. ఈ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాల అధ్యయనంలో భాగంగా శుక్రవారం వరల్డ్ బ్యాంకు ప్రతినిధుల బృందం నగరంలోని పలు ప్రాంతాలలో క్షేత్రస్థాయి పర్యటన చేసి పరిశీలించనుందని కమిషనర్ తెలిపారు. సమీక్షా సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, ప్రధాన ఇంజినీరు పీవీవీ సత్యనారాయణరాజు, పర్యవేక్షక ఇంజినీరు ఏడుకొండలు, అడ్వైజర్ కేవీఎన్ రవి, స్మార్ట్సిటీ కార్పొరేషన్ మేనేజర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
చాలు నీ డాబు!
వెన్నుపోటు బాబూ...వెన్నుపోటుకు రెండేళ్లు.. చంద్రబాబు గద్దెనెక్కి రెండేళ్లయినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లాలో అన్ని మండలాల్లో పార్టీ శ్రేణులు గర్జనలు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను వంచించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అనకాపల్లి జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు, ర్యాలీలు, మానవహారాలతో వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపట్టారు. ‘సీఎం డౌన్ డౌన్.. లోకేష్ డౌన్ డౌన్‘ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు హామీలు ‘గోవిందా.. గోవిందా..’ అంటూ వెన్నుపోటు పోస్టర్లను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రతులను చెత్తబుట్టల్లో, డంపర్ బిన్లలో వేస్తూ, తగలబెడుతూ తమ నిరసనను వినూత్నంగా చాటారు. కశింకోటలో చంద్రబాబు హామీల కాగితాలు చించి నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజక వర్గ సమన్వయ కర్త మలసాల భరత్కుమార్, వైఎస్సార్సీపీ శ్రేణులు రావికమతం మండలం కొత్తకోటలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అమర్నాఽథ్ దేవరాపల్లిలో భారీ స్థాయిలో హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్తున్న మాజీ డిప్యూటీ బూడి ముత్యాలనాయుడు రాష్ట్రంలో నయ వంచన పాలన టీడీపీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ ప్రతులను తగలబెట్టి నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ శ్రేణులు దద్దరిల్లిన మండల కేంద్రాలు.. ప్రజా నిరసనలతో హోరెత్తిన జిల్లా దేవరాపల్లిలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు రావికమతం మండలం కొత్తకోటలో పాల్గొన్న మాజీ మంత్రి అమర్నాథ్ అనకాపల్లి, కశింకోట, రాంబిల్లి మండలాల్లో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ సాక్షి, అనకాపల్లి : జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ రహదారులపై రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించి నిరసన తెలియజేశారు. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను బుట్టదాఖలు చేసిందని, నిరుద్యోగులను, మహిళలను, రైతులను దారుణంగా వంచించిందని ఈ సందర్భంగా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లిలో జరిగిన ఆందోళనలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం కొత్తకోటలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిన ద్రోహాన్ని ఎండగట్టారు. అనకాపల్లి పట్టణం, కశింకోట, రాంబిల్లి మండలాల్లో జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొని ప్రతులను దహనం చేశారు. యలమంచిలిలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేతృత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి కూడా పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ మండలాల్లో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’కు నిరసన ర్యాలీ నిర్వహించారు. దేవరాపల్లిలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో భారీగా నిరసన ర్యాలీ జరిగింది. నాలుగు రోడ్ల కూడలిలోని డా. బీఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్లో నిరసన చేపట్టి, మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు. అలాగే కె. కోటపాడు మండలంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ పాల్గొన్నారు. చోడవరం నియోజకవర్గంలో చోడవరం, రావికమతం, రోలుగుంట, బుచ్చెయ్యపేట మండలాల్లో నిరసన కార్యాక్రమాలు జరిగాయి. రావికమతం మండలంలో కొత్తకోటలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లపై నిరసన ర్యాలీ నిర్వహించారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం కొత్తకోట కూడలిలో వైఎస్సార్పార్టీ శ్రేణులతో కలిసి భారీ మానవహారం నిర్వహించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ప్లకార్డులతో నిరసన చేస్తూ టీడీపీ మ్యానిఫెస్టో కరపత్రాలను పార్టీ శ్రేణులతో కలిసి చింపి చెత్త బుట్టలలో వేశారు. అదేవిధంగా చోడవరం మండలంలో కొత్తూరు జంక్షన్ వద్ద రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు పాల్గొన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి టౌన్, కశింకోట మండలాల్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ రెండు మండలాల్లో జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, సమన్వయకర్త మలసాల భరత్కుమార్ పాల్గొని నిరసన తెలియజేశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లో నిరసన ర్యాలీ జరిగింది. నక్కపల్లిలో, ఎస్.రాయవరం మండలం, అడ్డురోడ్డు జంక్షన్లో ఆ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు. పాయకరావు పేట మండలంలో రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, నక్కపల్లిలో రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, కోటవురట్లలో మాజీ ఎమ్మెల్సీ, కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు సూర్యనారాయణరాజు, రాష్ట్ర కార్యదర్శి దత్తుడు సీతబాబు, మండల పార్టీ అధ్యక్షుడు పైలా రమేష్ పాల్గొన్నారు. నర్సీపట్నంలో నర్సీపట్నం టౌన్, నాతవరం, గోలుగొండ, మాకవరపాలెం మండలాల్లో నిరసన కార్యక్రమం జరిగింది. నర్సీపట్నం టౌన్లో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు. యలమంచిలిలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి, రాష్ట్ర కార్యదర్శి బోదెపు గోవింద్ పాల్గొన్నారు. రాంబిల్లి మండలంలో జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. -
భవన నిర్మాణాలు, ఎల్ఆర్ఎస్ మంజూరుపై ప్రత్యేక శ్రద్ధ
డాబాగార్డెన్స్ : నగర పరిధిలో భవన నిర్మాణ అనుమతులు, ఎల్ఆర్ఎస్, టీడీఆర్ల మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా.. నిర్ణీత గడువులోపు ప్రక్రియ పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పట్టణ ప్రణాళికా అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావుతో పాటు ఇతర టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలు భవన నిర్మాణ అనుమతుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సమర్పిస్తున్నప్పటికీ వాటి పరిష్కారంలో అనవసర జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్ పథకం కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన, మంజూరు ప్రక్రియలో కూడా నిర్లక్ష్యం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏపీ డీపీఎంఎస్ పోర్టల్లో నమోదైన భవన నిర్మాణ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, రెండు రోజుల కంటే ఎక్కువ ఆలస్యం చేయకుండా సంబంధిత ఉన్నతాధికారులకు పంపాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల విషయంలోనూ క్షేత్రస్థాయి పరిశీలన త్వరితగతిన పూర్తి చేసి, జాప్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ అనుమతుల నమోదు ప్రక్రియలోనూ లోపాలు, ఆలస్యాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో సిటీ ప్లానర్ ధనుంజయరెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్లు మధుసూధనరావు, రామ్మోహన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు తిరుపతిరావు, రామలింగేశ్వరరెడ్డి, ఝాన్సీ, లక్ష్మీ షబ్నం, శాస్త్రి, రామకృష్ణ, టీపీవోలు, టీపీబీవోలు, సర్వేయర్లు పాల్గొన్నారు. -
ఇసుకలో కాసుల వేట
శారదానది నుంచి ఇసుక తరలిస్తున్న ఎడ్లబళ్లు, (ఇన్సెట్) ముద్దుర్తి సంగమేశ్వర ఆలయం వద్ద శారదానది లోంచి ఇసుక తరలించేందుకు ఉపయోగించే బెల్లంపెనాలు, ఇసుక లారీలకు లోడు చేస్తున్న దృశ్యం చోడవరం : నదుల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు ఆగడం లేదు. నచ్చినంత తవ్వుకో...అమ్ముకో..అడిగేదెవరు అన్నంతగా ఇసుక మాఫియా రెచ్చిపోవడానికి కారణం అధికార పార్టీ నేత అండదండలేనన్నది అందరికీ తెలిసిన విషయమే. జిల్లాలో మేజర్ శారద, మైనర్ శారద, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు, సర్పా, తాండవ నదులు ప్రధానంగా ఉన్నాయి. జిల్లాలో ఎక్కడా అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో కొన్ని చోట్ల అక్రమంగా ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి మరీ రవాణా చేస్తున్నారు. చోడవరం మండలంలో ముద్దుర్తి, గవరవరం, గజపతినగరం, గౌరీపట్నం, లక్ష్మీపురం కల్లాలు, బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట రీచ్లలో వందలాది క్యుబిక్ మీటర్ల ఇసుకను రోజూ అక్రమంగా తరలిస్తున్నారు. ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద మేజర్ శారదనదిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడే గతంతో అధికారులు దాడులు చేసి ఇసుక తరలిస్తున్న బెల్లం పెనాలను స్వాధీనం కూడా చేసుకున్నారు. అయినా ఈ రేవు వద్ద తవ్వకాలు అగలేదు. ఆలయానికి ఆనుకుని ఉన్న రేవులో పూర్తిగా ఇసుక తవ్వేసి లోతు చేశారు. జిల్లాలో పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న ఈ ఆలయం, స్నానాల రేవు ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ఇసుక తవ్వకాల వల్ల ఈ పవిత్ర స్నానఘట్టం కూడా నది నీటిలో తెలియని భారీ గోతులుగా ఏర్పడి ప్రమాదకరంగా మారింది. బెల్లం పెనాల్లో ఇసుక తరలింపు అన్ని చోట్ల నదుల్లో పొక్లెయిన్లు, ఇతరత్రా సాధనాలతో ఇసుక తవ్వేసి ఒడ్డుకు చేరుస్తుంటే ముద్దుర్తి వద్ద మాత్రం బెల్లం తయారు చేసే పెద్దపెద్ద పెనాల్లో ఇసుకను ఒడ్డుకు చేర్చుతున్నారు. ఆలయం ఒడ్డు నుంచి నది అవతల ఒడ్డు, మధ్యలో ఉన్న ఇసుక మేట్లను తవ్వి పెనంలో వేసి ఈదుతూ ఇవతల ఒడ్డుకు తెచ్చి గుట్టలుగా పోస్తున్నారు. ఇక్కడ నుంచి లారీలు, ఎడ్ల బళ్లపై ఇతర ప్రాంతాలకు తరలించి రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. పట్టించుకోని యంత్రాంగం ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసులు పంచాయతీ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గ్రామ స్థాయిలో రెవిన్యూ, పంచాయతీ కార్యదర్శుల పాత్ర కూడా ఇందులో ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగంగానే రోజూ పెద్దసంఖ్యలో లారీలతో ఇసుక తరలిస్తున్నా వీఆర్ఓలు పట్టించుకోకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అక్రమ రవాణాకు అనుమతులు! ఎస్.రాయవరం : మండలంలో అనుమతులు ఉన్నాయని చెబుతూ చెరువు మట్టి, కొండ గ్రావెల్ దందా దర్జాగా కొనసాగిస్తున్నారు. మండలంలో అనుమతులు లేకుండా పెదగుమ్ములూరు, సర్వసిద్ది , పెదఉప్పలం, అనుమతులు ఉన్నాయని ఎస్.రాయవరం, పేటసూదిపురం, జేవీపాలెం, లింగరాజుపాలెం గ్రామాల్లో చెరువుల నుంచి మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. రైతు పొలాలు అవసరం కోసం అనుమతులు ఇచ్చే మట్టిని ఇటుక పరిశ్రమలకు, ప్రైవేటు వెంచర్లకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమంగా మట్టిని తరలించుకుపోతున్నారు. నాలుగు రోజులుగా ఈ చెరువుల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు చేస్తున్నా అధికారులు కిమ్మనడం లేదు. నాయకులు వత్తిళ్లు కారణంగా ఇరిగేషన్ అధికారులు నిబంధనలు పాటించకుండా అనుమతులు ఇచ్చేస్తున్నారు. మండలంలో ఏఈ, మరో ముగ్గురు సిబ్బంది ఉండా 6 చెరువులకు అనుమతులు ఇచ్చారు. అనుమతులు ఉన్న చెరువుల్లో సూపర్వైజింగ్ చేసే సిబ్బంది లేకపోవడంతో తవ్వకందారులు ఇష్టం వచ్చినట్టు మట్టి తవ్వకాలు చేసి నచ్చినవారి విక్రయించుకుంటూ దందా చేస్తున్నారు. అదే క్రమంలో గ్రావెల్ కూడా పెదగుమ్ములూరులో మేడకొండ, దార్లపూడి చెల్లాపురం లో పోలవరం కాలువ నుంచి, కాపుల వాతాడ కొండనుంచ నిత్యం అవసరం ఉన్న వారు తరలించుకుపోతున్నారు.ఈ సమయంలో గుర్రాజుపేట, రేవుపోలవరం, గుడివాడ, చినఉప్పలం గ్రామాల నుంచి సముద్ర ఇసుకను దోచుకుపోతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే అనుమతుల రద్దు నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకున్నవారు మట్టి తవ్వకాలు చేయకపోతే అనుమతులు రద్దు చేస్తాం. చెప్పిన కొలతలు ప్రకారం అనుమతులు తీసుకున్న రైతు పొలాల్లోకే మట్టి తరలించాలి. రాత్రులు మట్టి తవ్వడానికి నిబంధనలు అతిక్రమించినట్టు మా దృష్టికి వస్తే అనుమతులు రద్దుతో పాటు చర్యలు కూడా తీసుకుంటాం. – ఎస్ కె .అమీనాబాను, ఏఈ, ఇరిగేషన్, ఎస్.రాయవరం మండలం చర్యలు తీసుకుంటాం ఇసుక తవ్వకాలకు ఎక్కడా అనుమతి ఇవ్వలేదు. అక్రమ తవ్వకాలు, రవాణా చేసే వారిపై చర్యలు తీసుకుంటాం. నదుల్లోను, ప్రైవేటు భూముల్లో సైతం ఇసుక తవ్వకాలు చేయరాదు. అక్రమ ఇసుక రీచ్లపై చర్యలు తీసుకుంటాం. –రామారావు, తహసీల్ధార్, చోడవరం -
ఉపమాక ఆలయ సిబ్బందిపై వేటు
వేటు పడిన సిబ్బంది నక్కపల్లి : ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి జరిగిన చోరీకి సంబంధించి ఇద్దరు టీటీడీ సెక్యూరిటీ గార్డులపై వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సెక్యూరిటీ గార్డులు చంద్రరావు, లక్ష్మీనారాయణలను విధుల నుంచి తొలగిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసిందని గ్రూపు దేవాలయాల సూపరింటెండెంట్ వెంకటరమణ విలేకరులకు తెలిపారు. మంగళవారం రాత్రి ఆలయంలో ఇద్దరు దుండగులు ప్రవేశించి హుండీలను పగుల గొట్టి లక్షలాది రూపాయలు అపహరించిన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు ఉద్యోగులు ఒకరు ఆలయ బయట, మరొకరు సీసీ కెమెరాల రూములో పడుకున్నారు. వీరి నిర్లక్ష్యం వల్లే చోరీ జరిగిందని గుర్తించిన టీటీడీ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్పవర్ కార్పొరేషన్ సంస్థ తరపున పనిచేస్తున్న ఇద్దరిని తొలగించినట్టు ఆయన చెప్పారు. -
రేపు గవర్నర్ రాక
మహారాణిపేట: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 6న విశాఖ వస్తున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం 12.05 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా నోవాటెల్ హోటల్కు వెళ్తారు. అక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం ఎన్ఆర్ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(సంగివలస)లో 6వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7.20 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి విజయవాడ వెళ్తారు. -
50 గ్యాస్ సిలిండర్ల కోసం వాగ్వాదం
గ్యాస్ సిలిండర్లు కోసం గుమికూడిన వినియోగదారులు మాడుగుల రూరల్: మండలంలో భారత్ గ్యాస్ వినియోగదారులు మూడు మాసాలుగా గ్యాస్ కష్టాలతో సతమతమవుతున్నారు. మాడుగులలో వెంకట సీతారామ గ్యాస్ ఏజెన్సీ లైసెన్సుదారుడు పుట్టా వెంకట మురళీకృష్ణ ఏడాది క్రితం మృతి చెందారు. ఈయన రెండో కుమారుడు ప్రసన్నరాజు ఈ ఏజెన్సీని కొన్ని నెలల వరకు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీని రద్దు చేసి స్థానిక గోదాం గ్యాస్ వినియోగదారులను జిల్లాలో మాకవరపాలెం, దేవరాపల్లి, అల్లూరు జిల్లాలో పాడేరు గ్యాస్ ఏజెన్సీలకు సర్దుబాటు చేశారు. అప్పటి నుంచి వినియోగదారులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వినియోగదారులు ఏ ఏజెన్సీ పరిధిలోకి వస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాజాగా మాకవరపాలెం నుంచి భారత్ గ్యాస్ ఏజెన్సీ వాహనంతో గురువారం 50 గ్యాస్ సిలిండర్లను ఒమ్మలి చెరకు కాటా వద్దకు తెచ్చారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి 150 మంది ఖాళీ సిలిండర్లతో వచ్చి గంటల కొద్దీ నిరీక్షించారు. ఈ క్రమంలో ఏజెన్సీ సిబ్బందితో వినియోగదారులు వాగ్వాదానికి దిగారు. 50 మందికి ఓ.టి.పి ప్రకారం సిలిండర్లు అందజేసి, మిగిలిన వారికి రెండు రోజుల్లో ఇస్తామని సర్ది చెప్పారు. దాంతో నిరాశతో ఇంటిముఖం పట్టారు. హెచ్పీ గ్యాస్ సక్రమంగా అందిస్తున్నారని, భారత్ గ్యాస్ సిలిండర్లు అందటం లేదని వాపోయారు. -
నిర్ణీత సమయానికే బయోమెట్రిక్ హాజరు
కె.కోటపాడు: నిర్ణీత సమయానికల్లా ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేయాలని అనకాపల్లి జిల్లా స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు అధికారి బి.వి.సత్యనారాయణ తెలిపారు. కె.కోటపాడు గ్రామ సచివాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో సమావేశమై మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది కార్యాలయ పని నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా మూమెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. వివిధ సేవల పట్ల ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటుందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం అమలు చేయనున్న దృష్ట్యా ఇప్పటికే వెల్ఫేర్ అసిస్టెంట్లకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వివరాలను శుక్రవారంలోగా నమోదు చేయాలని తెలిపారు. 0–6 ఏళ్ల వయస్సు విద్యార్థుల ఆధార్ వివరాలను యాప్లో నమోదు చేయడంతోపాటు అక్షరాంధ్ర రెండో విడత కార్యక్రమం వెలుగు సిబ్బందితో సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలన్నారు. గ్రామంలో ఇంకా మిగలిన సిటిజన్ ఈకేవైసీని పూర్తి చేయడంతోపాటు వాట్సాప్ గవర్నన్స్–మన మిత్ర యాప్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ యాప్ ద్వారా 540పైగా సేవలను పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్.జి.ఎస్.డబ్ల్యూ మండల అధికారి సౌజన్య, కె.కోటపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి టి.శ్రీను సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
వణికించిన గాలివాన
నర్సీపట్నం: మున్సిపాలిటీ పరిధిలో గురువారం సాయంత్రం 4.30 గంటల వరకు భానుడి ఉగ్రరూపం చూపించగా, ఆ తర్వాత 5 గంటలకు ఉన్నపళంగా వరుణుడు గాలివాన రూపంలో విరుచుకుపడ్డాడు. పెదబొడ్డేపల్లి రామాలయం ఆవరణలో భారీ వృక్షం నేల కూలింది. పెదబొడ్డేపల్లి, సుబ్బరాయుడుపాలెం వద్ద చెట్లు కూలగా, నాలుగు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. విశాఖ వెళ్లే మెయిన్రోడ్డుపై చెట్లు పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మెరుపులు, ఉరుములకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ గపూర్, ఎస్సై రమేష్, సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మెయిన్ రోడ్డుపై పడిన చెట్లను జేసీబీ సహాయంతో తొలగింపజేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. విద్యుత్ సిబ్బంది సత్వరమే సరఫరా పునరుద్ధణకు చర్యలు చేపట్టారు. వర్షం కంటే బలమైన గాలులు వీయడంతో చెట్లు నేల కూలాయి. -
రోడ్డు విస్తరణలో నిబంధనలకు పాతర
మాకవరపాలెం: రోడ్డు విస్తరణ పనుల్లో నిబంధనలు పాటించడం లేదు. పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు. మండలంలోని రాచపల్లి జంక్షన్ నుంచి కోటవురట్ల మండలం చౌడువాడ వరకు ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణంతోపాటు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 12 అడుగులు వెడల్పుతో ఉన్న ఈ రోడ్డును రెండు వైపులా 3 అడుగుల చొప్పున విస్తరించి 18 అడుగులకు పెంచనున్నారు. ఈ నేపథ్యంలో మొదటగా చౌడువాడ సమీపం నుంచి రోడ్డుకు ఒకవైపు చేపట్టిన మూడడుగులు విస్తరణ పనులు గురువారం నాటికి జి.కోడూరు గ్రామం వరకు చేరుకున్నాయి. కిందన రెండు అడుగలే... ప్రస్తుతం మూడడుగుల విస్తరణలో భాగంగా మట్టిని తొలగించి మెటల్ వేసుకుంటూ వస్తున్నారు. ఈ మూడడుగుల వెడల్పుతో మీద నుంచి కింద వరకు మట్టిని తొలగించాలి. కానీ కిందకు వెళ్లే సరికి రెండు అడుగులే ఉంటుంది. ఇక లోతు అడుగున్నర మేర మట్టిని తొలగిస్తున్నారు. మూడడుగుల వెడల్పున తీయాల్సిన మట్టిని కిందకు వెళ్లేసరికి రెండడుగులే తీయడంపై స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ రోడ్డు పనులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇష్టానుసారంగా చేసుకుపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఇప్పటివరకు ఆర్అండ్బీ ఏఈగా పనిచేసిన నారాయణరెడ్డిని సంప్రదించగా తాను డీఈ పదోన్నతిపై బదిలీ అయినట్టు తెలిపారు. మూడడుగులు కచ్చితంగా మట్టిని తొలగించాల్సిందేనన్నారు. తన స్థానంలో నర్సీపట్నం ఏఈ నాయుడుకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్టు
నర్సీపట్నం: కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను గురువారం నర్సీపట్నం రూరల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ అందించిన వివరాలు.. డీఎస్పీ శ్రీనివాసరావుకు వచ్చిన సమాచారం మేరకు రూరల్ ఎస్సై రాజారావు, సిబ్బంది గబ్బాడ సమీపంలో మాటు వేశారు. చింతపల్లి వైపు నుంచి వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా, 26 కిలోల గంజాయి లభ్యమైంది. పాత నేరస్తుడైన విశాఖ నగరంలోని అల్లిపురానికి చెందిన బోధ శ్రీను(40), గంజాయి రవాణాకు సహకరించిన చింతపల్లి మండలం బలపం పంచాయతీకి చెందిన బిరుబోజు రమణమూర్తి(29), తిమురు గణేష్ కుమార్(26)లను అరెస్టు చేశారు. గంజాయి రవాణాకు ప్రేరేపించిన మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. ముగ్గురు నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఒడిశాలోని చిత్రకొండ వద్ద కొనుగోలు చేసి విశాఖపట్నం తరలిస్తున్నట్టు సీఐ తెలిపారు. నిందితుడు శ్రీను గంజాయి పొట్లాలు కట్టి ఒక్కొక్కటి రూ.200కు అల్లిపురం, ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో విక్రయిస్తాడని తెలిపారు. మత్తు చాకెట్లు కూడా విక్రయిస్తాడన్నారు. ఇతనిపై విశాఖపట్నంలో నాలుగు కేసులు ఉన్నాయన్నా రు. పట్టుబడిన గంజాయి, స్వాధీనం చేసుకున్న కారు విలువ రూ.23 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. -
దుండగుల కోసం ఆరు ప్రత్యేక బృందాలు
నక్కపల్లి : ఉపమాక ఆలయంలో చోరీ చేసిన దుండగులను పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక బృందాలను నియమించినట్టు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన ఉపమాక వెంకన్న ఆలయాన్ని సందర్శించి మరోసారి సీసీ కెమెరాలు పరిశీలించారు. ముసుగు ధరించిన ఇద్దరు దొంగలు వెనుక నుంచి ఏ విధంగా ప్రవేశించారనే దానిపై మరోసారి ఆరా తీశారు. దర్యాప్తు కోసం ఆరు ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందన్నారు. బుధవారం వేకువ జామున వరకు దొంగతనం జరిగిన ఆలయ పరిసరాలను రికార్డయిన దృశ్యాలను సీసీ పుటేజీల్లో పరిశీలిస్తున్నామన్నారు. ఆలయ పరిసరాల్లో ఏ సెల్ టవర్ నుంచి మొబైల్ఫోన్లు వాడారు, కొత్త నెంబర్లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఉపమాక ఆలయం, నక్కపల్లి హైవే జంక్షన్ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. నిందితులు ఆలయం వెనుక బంగారం వెండి ఆభరణాల మూటను ఎందుకు వదిలేశారు? దొంగతనానికి ఏమార్గంలో వచ్చారు, ఏదైనా వాహనం ఉపయోగించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు. ఆయన వెంట సీఐలు మురళి, రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
కేంద్ర మంత్రి రాజీవ్రంజన్ సింగ్కు స్వాగతం
కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు స్వాగతం పలుకుతున్న విశాఖపట్నం కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మహారాణిపేట: సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై శుక్ర, శనివారాల్లో నోవాటెల్ హోటల్లో నిర్వహించనున్న జాతీయ వర్క్షాప్లో పాల్గొనేందుకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్) గురువారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా నోవాటెల్ హోటల్ వద్ద కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయస్వాగతం పలికారు. -
చిట్టియ్యపాలెంలో యువకుడికి పాముకాటు
బుచ్చెయ్యపేట : మండలంలో గల చిట్టియ్యపాలెం గ్రామంలో ఓ యువకుడు పాము కాటుకు గురయ్యాడు. గురువారం ఉదయం గ్రామానికి చెందిన ముచ్చకర్ల గణేష్ గ్రామంలో జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న తన ఇంటికి వెళ్లాడు. ఇంట్లో పని చేస్తుండగా గణేష్ను పాము కాటు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న తురకలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉదయం 7 గంటల సమయంలో వైద్యాధికార్లు లేకపోవడంతో గణేష్ను అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గణేష్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇటీవల 15 రోజుల కిందట చినమదీనకు చెందిన 30 ఏళ్ల యువకుడు నాగరాజును పాము కాటు వేయగా ఆయన్ని ప్రైవేటు వైద్యుని దగ్గరకు తీసుకెళ్లగా సకాలంలో వైద్య సేవలు అందక మృతి చెందాడు. -
మత్స్యకారుల పొట్టకొట్టి ‘సమ్మిట్’లా?
మహారాణిపేట: రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో విశాఖలో ‘నేషనల్ ఫిషరీస్, ఆక్వా–మైరెన్ సమ్మిట్’ నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ వాసుపల్లి తెలిపారు. గురువారం విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంక్షోభం రాష్ట్రంలోని అన్ని హార్బర్లలోని మత్స్యకారుల ఉమ్మడి సమస్య అని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు ఆక్వా రైతులు సీడ్ కొరత, ఫీడ్ ధరలు, దళారీ వ్యవస్థతో నష్టపోతుంటే, మరోవైపు మైరెన్ రంగం పూర్తిగా కుదేలైందన్నారు. 15 ఏళ్ల క్రితం నాటి రొయ్యలు, చేపల ధరలే ఇప్పటికీ ఉన్నాయని, కానీ డీజిల్, కార్మిక వ్యయాలు, నిర్వహణ ఖర్చులు అనేక రెట్లు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. లీటర్ డీజిల్ ధర రూ.104 దాటినా ప్రభుత్వం ఇచ్చే రూ.9 సబ్సిడీని పెంచకపోవడం మత్స్యకారుల నడ్డి విరుస్తోందన్నారు. మత్స్యకార భరోసా పథకంలో అర్హులైన వేలాది మంది సంప్రదాయ, మెకనైజ్డ్ బోట్ మత్స్యకారులను ఉద్దేశ్యపూర్వకంగా తొలగించారని ఆరోపించారు. గతంలో మత్స్యకారుల సమస్యలపై అనేక సభల్లో గళమెత్తిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఇప్పుడు డీజిల్ సబ్సిడీ, భరోసా కోతలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని జానకీరామ్ ప్రశ్నించారు. రాష్ట్ర మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
దేవరాపల్లి : అప్పులబాధతో దేవరాపల్లికి చెందిన యువ రైతు పోతల సత్తిబాబు (26) ఆత్మహత్యకు పాల్పడ్డారని ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేవరాపల్లి రాయాలయం వీధికి చెందిన సత్తిబాబు వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వ్యవసాయం చేసేందుకు అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక ఈ నెల 2న మంగళవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో కొల్లివానిపాలెంలోని తన కల్లంలోకి వెళ్లి గడ్డి ముందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తన భార్య మణికి చెప్పాడు. వెంటనే ఆమె తమ బంధువులను తీసుకొని కల్లంలోకి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న తన భర్తను దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స చేయించి అనంతరం కె.కోటపాడు కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విశాఖ కేజిహెచ్కు తరలించారు. కేజిహెచ్లో చికిత్స పొందుతూ తన భర్త సత్తిబాబు గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మరణించినట్టు మృతుడి భార్య మణి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు. సత్తిబాబుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
స్నేహంలో మేటి..ర్యాంకుల్లో పోటీ
కోటవురట్ల: ముగ్గురు స్నేహితురాళ్లు చదువులోనూ తగ్గేదేలే అంటున్నారు. స్నేహమేరా జీవితం అంటూనే పోటీ పరీక్షల్లోనూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఒకరిపై ఒకరు పోటీ పడుతూ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థినులు ఏపీ పీజీసెట్, ఏపీ ఈడీసెట్లలో మంచి ర్యాంకులు సాధించి తమ స్నేహబంధానికి గొప్పగా నిర్వచనం చెప్పారు. ఇంటర్లో మంచి స్నేహితురాళ్లుగా పేరొందిన ముత్తుర్తి అక్షయ, పెదపల్లి మరియమ్మ, అరసాడ సరిత చదువులోనూ ప్రతిభ చాటేవారు. జూనియర్ కళాశాలను వీడినా స్నేహాన్ని వదులుకోలేక ముగ్గురూ ఒకే కళాశాలలో డిగ్రీలో చేరారు. పోటీ పరీక్షలకు ముగ్గురు పోటీపడి చదివి మంచి ర్యాంకులు సాధించారు. అక్షయ ఏపీ పీజీసెట్లో 13వ ర్యాంకు, ఏపీ ఈడీసెట్లో 712వ ర్యాంకు సాధించింది. మరియమ్మ ఏపీ పీజీసెట్లో 15వ ర్యాంకు, ఏపీ ఈడీసెట్లో 193వ ర్యాంకు, సరిత ఏపీ పీజీసెట్లో 122వ ర్యాంకు, ఏపీ ఈడీసెట్లో 1,755వ ర్యాంకు సాధించారు. దాంతో అధ్యాపకులు, సహచరులు, తల్లిదండ్రులు వారికి అభినందనలు తెలిపారు. -
అక్రమార్కులకు ఉపాధి
బుచ్చెయ్యపేట : బుచ్చెయ్యపేటలో జాతీయ ఉపాధి హామీ పథకంలో దొంగ మస్తర్లతో లక్షలాది రూపాయలు పక్కదారి పడుతున్నాయి. ఉపాధి పనుల్లో దొంగ మస్తర్లకు తావు లేకుండా పని చేసే ప్రదేశంలోనే కూలీలకు ఫేషియల్తో హాజరు తీసుకొచ్చినా బినామీ మస్తర్లు నమోదు చేసి నిధులు పక్కదారి పట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇన్ని అక్రమాలు వెలుగు చూస్తున్నా అధికారులకు పట్టడం లేదు. బుచ్చెయ్యపేట శివారు గ్రామాలు నేతవానిపాలెం, ఐయితంపూడికి వీఆర్పీ కొళ్లి కశింనాయుడు ఒక్కడే పనిచేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ఐయితంపూడి, నేతవానిపాలెం, బుచ్చెయ్యపేటలో ఉన్న పాత మేట్లను తొలగించి కొత్తగా కూటమి నేతలను మేట్లుగా చేర్చారు. ఉపాధి కూలీల హాజరు నమోదును కొతమంది మేట్లకు యాప్లో నమోదు చేసేలా వీలు కల్పించారు. దీంతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన వీఆర్పీ కొళ్లి కశింనాయుడును తొలగించడానికి కూటమి నేతలు స్కెచ్ వేశారు. పనికి రాని కొంతమందిని ఉపాధి పనులకు వచ్చినట్టు నమోదు చేసి ఉపాధి డబ్బులు పక్కదారి పట్టించారు. ఇదంతా వీఆర్పీ చేసినట్టు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. బుధవారం గ్రామ సచివాలయం వద్ద ఎంపీడీవో శివ ప్రసాద్ నారాయణ విచారణ చేపట్టారు. బుచ్చెయ్యపేటలో సుమారు 50 గ్రూపులు ఉండగా రోజుకు వెయ్యి మందికి పైగా కూలీలు పనులకు హాజరవుతున్నారు. గ్రామానికి చెందిన శనివాడ నాగలక్ష్మి మేట్గా ఉంది. ఈమె హైదరాబాద్లో ఉండగా ఆయన భర్త శ్రీనివాసరావు మేట్గా పని చేస్తూ భార్య పేరున కూడా మస్తరు నమోదు చేస్తున్నారు. మేడశెట్టి నవీన్ కాకినాడలో కోచింగ్ తీసుకుంటుండగా, నాగమణి విశాఖలో చదువుతుండగా బినామీ మస్తర్లు వేస్తున్నారు. శనివాడ శ్రీకాంత్ అనే యువకుడికి మే 2వ తేదీన వివాహం జరగ్గా అదే రోజు అతను ఉపాధి పనులకు హాజరైనట్లు మస్తరు వేశారు. కొల్లి మాధవితో పాటు అయితరెడ్డి రామకృష్ణ అతని భార్య వెంకటలక్ష్మి ముగ్గురు అచ్చుతాపురం బ్రాండిక్స్ కంపెనీలో పనికి వెళ్తుండగా వీరు ప్రతి రోజూ ఉపాధి పనులకు వస్తున్నట్లు, సీరా అర్జున ప్రైవేటు కంపెనీలో చేయగా ఉపాధి పనికి వస్తున్నట్లు మస్తర్లు వేశారు. తాటికొండ గాటీలమ్మ, గొలుగొండ హేమంత్, గాడి చిన్నమ్మలు, మంగమ్మ, అయితరెడ్డి పైడితల్లమ్మ, దుర్గాభవాని, శ్రీనివాస్ తదితరులు ఏ రోజూ ఉపాధి పనులకు వెళ్లకపోయినా పనులకు వెళ్తున్నట్లు దొంగ మస్తర్లు వేస్తున్నారు. దొంగ మస్తర్లపై విచారణకు వచ్చిన కూలీలు రెండు వర్గాలుగా విడిపోయి తోపులాటలకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఎంపీడీవో ఫిర్యాదుతో బుచ్చెయ్యపేట ఎస్ఐ మనోజ్ కుమార్ తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి విచారణ కొనసాగించారు. టీడీపీకి చెందిన డొంకిన రామారావు వీఆర్పీ భార్య సత్యవతిపై దాడి చేశాడు. దీంతో గ్రామస్తులు పలువురు వీఆర్పీ తప్పు చేయలేదని ఇటీవల కొత్తగా నియమించిన కొంతమంది మేట్లే తప్పుడుగా హాజరు నమోదు చేస్తున్నారని విచారణకు వచ్చిన అధికారులకు తెలిపారు. విచారణలో ఉండగా తనపై చేయి చేసుకున్న వ్యక్తిపై వీఆర్పీ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
గబ్బాడలో కార్డన్ సెర్చ్
నర్సీపట్నం: ఎస్పీ తుహిన్సిన్హా ఆదేశాల మేరకు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, గంజాయి నిర్మూలనకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో నర్సీపట్నం మండలం, గబ్బాడ గ్రామంలో రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్ఐలు రాజారావు, దామోదర్నాయుడు, తారకేశ్వరరావు, రామారావు, రిషికేశ్వరరావు, 70 మంది పోలీసు సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని 21 బైక్లు, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తాగుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు చేపట్టారు. గ్రామస్తులను ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి రవాణా చేసినా, విక్రయించినా, సహకరించినా వారిపై కఠినమైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే టోల్ ప్రీ నెంబర్ 1972, 112, 100 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అందించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. -
టీటీడీ నిర్లక్ష్యం
ఉపమాక వెంకన్నపైనక్కపల్లి : ఉత్తరాంధ్ర తిరుపతిగా ప్రసిద్ది గాంచిన ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంపై తిరుమల తిరుపతి దేవస్దానం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో సీసీ కెమెరాలు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ గార్డుల భద్రత ఉన్న ఆలయంలో మంగళవారం ఆర్ధరాత్రి చోరీ జరగడం గమనార్హం. రాత్రి ఒంటి గంట సమయంలో ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు ఆలయం వెనుక ఉన్న కొండపై నుంచి ఆలయ ప్రాంగణంలో ఉన్న మామిడి చెట్లు ద్వారా ఆలయంలోకి కట్టర్లతో ప్రవేశించి రెండు హుండీలను కొల్లగొట్టారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన లక్షలాది రూపాయల నగదును, బంగారు వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. చోరీ సొమ్ము రూ.4లక్షల పైనే... దేవస్థానం అధికారులు చోరీకి గురైన సొమ్ము రూ.1.50 లక్షల వరకు ఉండొచ్చని చెబుతున్నప్పటికీ దుండగులు ఎత్తుకుపోయింది సుమారు రూ.4 లక్షలు పైనే ఉంటుందన్న అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. హుండీలో మూటకట్టి ఉంచిన సుమారు రూ.20లక్షలు విలువ చేసే 56 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కిలోల 70 గ్రాముల వెండి ఆభరణాలను కొండ వెనుక తోటలో వదిలేశారు. పట్టుకుపోయే సమయంలో మూట జారిపడిపోయిందా, లేక దొరికిపోతాం ఆనే భయంతో వదిలేశారా అనేది తెలియడం లేదు. దర్యాప్తులో భాగంగా పోలీసు జాగిలాలు ఈ మూటను ఆలయం వెనుక ఉన్న కొండ ప్రాంతంలో గుర్తించాయి. దేవదాయశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయాన్ని 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్దానం వారికి అప్పగించింది. ఆలయానికి ఏటా సుమారు రూ.40 లక్షల ఆదాయం లభిస్తుంది. ఆభరణాల భద్రతలో టీటీడీ నిర్లక్ష్యం ఆలయంలో ఐదు హుండీలు ఉన్నాయి. కొండపైన రెండు, కొండ దిగువన మూడు ఉన్నాయి. ప్రతి మూడు నెలలకొకమారు హుండీలను తెరిచి వాటిలో ఉన్న నగదు, బంగారు, వెండి ఆభరణాలను లెక్కించి భద్రపరచాల్సి ఉంటుంది. టీటీడీ ఆదీనంలోకి వచ్చిన తర్వాత స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను టీటీడీ వారు నగదును మాత్రమే తీసుకెళ్లి ఆభరణాలను ఇక్కడే వదిలేస్తున్నారు. ఇలా ఐదారేళ్లనుంచి వచ్చిన ఆభరణాలను మూటగట్టి ఇక్కడ హుండీల్లోనే ఉంచడం జరుగుతోంది. ఆభరణాలను టీటీడీకి చెందిన ఇన్వెంటర్ వచ్చి తనిఖీ చేసి నిర్దారించిన తర్వాత తిరుపతిలో ఉన్న మింట్లో భద్రపరుస్తారు. కానీ టీటీడీకి చెందిన ఇన్వెంటర్ ఐదారేళ్ల నుంచి రాకపోవడంతో కానుకల రూపంలో వచ్చిన ఆభరణాలను స్థానిక సిబ్బంది లెక్కించి మూటగట్టి హుండీల్లో వేసేస్తున్నారు. చోరీ జరిగిన రాత్రి టీటీడీ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు గార్డులు ఒకరు సీసీ కెమెరాలు ఉన్న గదిలోను మరొకరు ఆలయం బయట పడుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి గంటకు ఆలయ పరిసరాలను పరిశీలించి పొజిషిన్ పీస్ఫుల్ అంటూ తిరుమలలో ఉన్న విజిలెన్స్ విభాగానికి వాట్సాప్ మెసేజ్ పంపాల్సి ఉంటుంది. అయితే మంగళవారం రాత్రి చోరీ జరిగితే ఇక్కడ బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బంది తెల్లవారు జామున నాలుగు గంటలకు పొజిషిన్ పీసుఫుల్ అంటూ విజిలెన్స్ విభాగానికి మెసెజ్ పంపించడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బుధవారం ఉదయం ఆలయంలోకి వెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది హుండీలు తెరచి ఉండడాన్ని గుర్తించి ఆలయ అధికారులకు, అర్చకులకు సమాచారం ఇచ్చారు. మూడు షిప్టుల్లో సుమారు ఆరుగురు సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. ఆలయ ఇన్స్పెక్టర్ వైఖరిపై విమర్శలు ఇక్కడ ఆలయ ఇన్స్పెక్టర్గా వ్యవహరిస్తున్న కూర్మేశ్వరరావు వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదారేళ్లుగా కానుకల రూపంలో వచ్చిన ఆభరణాలను ఏ హుండీలో ఽభద్రపరిచారన్నది ఆయన స్పష్టంగా చెప్పలేకపోవడం విశేషం. ఆస్థాన మండపంలో ఉన్న హుండీలోనా లేక ఉత్సవమూర్తులున్న గర్భాలయంలో ఉన్న హుండీలో వేశారా? అనేది చెప్పలేకపోతున్నారు. ఆస్దాన మండపంలో చోరీ జరిగిన హుండీలోనే వేసినట్లు గుర్తని చెప్పడం గమనార్హం. విధి నిర్వహణలో ఇన్స్పెక్టర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
కన్నకొడుకు అంత్యక్రియలకు నిందితుడికి అనుమతి
అనకాపల్లి : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కొడుకు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేక చొరవతో గంజాయి కేసులో నిందితుడైన వ్యక్తిని ఒక రోజు పెరోల్పై జైలు నుంచి విడుదల చేశారు. వి.మాడుగుల మండలం జంపెన గ్రామానికి చెందిన పెచ్చేటి రాజు(అలియాస్ మహాలక్ష్మీనాయుడు) గంజాయి రవాణా కేసులో నిందితుడు. ఈ ఏడాది జనవరి 12వ తేదీ నుంచి విశాఖ సెంట్రల్ జైలులో ఉంటున్నాడు. రాజు పెద్ద కుమారుడు పెచ్చేటి సాయి కిరణ్ (17) గత నెల 31వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఎస్పీకి లిఖితపూర్వకంగా సమాచారాన్ని తెలియజేయడంతో మానవతా దృక్పథంతో ఒకరోజు తాత్కాలిక బెయిల్ (పెరోల్) మంజూరు చేయించారు. ఈనెల 3వ తేదీన జరిగిన కుమారుడు అంత్యక్రియలకు రాజు హాజరయ్యాడు. మూడేళ్ల క్రితమే రాజు చిన్న కుమారుడు జితేంద్ర అనారోగ్యంతో మరణించగా, ఇప్పుడు పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భర్త జైలులో ఉండి, ఇద్దరు కొడుకులు దూరమవడంతో రాజు భార్య లక్ష్మి శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసుల తక్షణ స్పందన కన్నకొడుకు చివరి చూపుకై నా తండ్రిని తీసుకురావాలని కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు వి.మాడుగుల ఎస్ఐ నారాయణ రావు, కె.కోటపాడు సీఐ కృష్ణను కోరగా ఈ విషయాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా , అదనపు ఎస్పీ ఎల్.మోహన రావుకు వారు నివేదించారు. పరిస్థితి తీవ్రతను, కుటుంబంలోని విషాదాన్ని గమనించిన ఎస్పీ మానవత్వంతో స్పందించి, హుటాహుటిన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఎస్పీ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ఈ నెల 2న అత్యవసరంగా జీవో జారీ చేస్తూ, నిందితుడు పెచ్చేటి రాజును కారాగారం నుంచి ఒక రోజు తాత్కాలిక విడుదల చేసింది.దీంతో తగిన పోలీస్ భద్రత నడుమ రాజు జంపెన గ్రామానికి చేరుకుని, తన కుమారుడు సాయి కిరణ్కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మానవతా దృక్పథంతో స్పందించి, కన్నకొడుకును ఆఖరిసారి చూసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు పోలీస్శాఖకు రాజు, మృతుడి తల్లి లక్ష్మి, గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంత్యక్రియలు అనంతరం రాజును సాయంత్రం పోలీస్లు విశాఖ సెంట్రల్ జైల్కు తరలించారు. -
ఏడాదికి రూ.100 కోట్లకు పైగానే దోపిడీ..!
ఎటువంటి పంచాయతీ తీర్మానాలు, అనుమతులు లేకుండా సాగుతున్న ఈ దోపిడీ ద్వారా కూటమి నేతలు ఏడాదికి ఏకంగా రూ.100 కోట్ల మేర అక్రమార్జనకు తెరలేపారు. ఈ వ్యవహారంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులు రివర్స్ కేసులు పెడుతుండటంతో అక్రమార్కులకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలూ సాగుతున్న ఈ మైనింగ్ ద్వారా ప్రతిరోజూ 150 నుంచి 200 లోడ్ల మేర గ్రావెల్ తరలిపోతోంది. నంబర్ ప్లేట్లు లేని టిప్పర్లలో నిబంధనలకు విరుద్ధంగా 60 నుంచి 70 టన్నుల ఓవర్ లోడ్తో ఈ రవాణా సాగుతోంది. మార్కెట్లో ఒక్కో ట్రిప్పు గ్రావెల్ను రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. అంటే రోజుకు రూ.22.50 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి సగటున రూ.82 కోట్ల నుంచి రూ.109 కోట్ల మేర అక్రమ మైనింగ్ దోపిడీ జరుగుతోంది. మైనింగ్, రెవెన్యూ అధికారులు కళ్లుండీ కబోదుల్లా వ్యవహరిస్తుండటంతో స్థానిక యాదవ సామాజిక వర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఆవులు, మేకలు, గొర్రెలను మేపుకునేందుకు కొండపైకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, ప్రశ్నిస్తే తమపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. -
పచ్చగద్దలు!
పంచదార్ల కొండపైరాత్రింబవళ్లు యథేచ్ఛగా సాగుతున్న తవ్వకాలు నంబరు ప్లేట్లు లేని టిప్పర్లలో గ్రావెల్ తరలింపు ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలోనే అక్రమ మైనింగ్ అంటూ ఆరోపణలు కన్నెత్తి చూడని రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఫిర్యాదు చేస్తే కేసులు పెడతామంటూ పోలీసుల బెదిరింపులు గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే పనుల కానిచ్చేస్తున్న వైనం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కనీసం గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే పంచదార్ల కొండపై జోరుగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో పారిశ్రామిక పార్కు అభివృద్ధి కోసమంటూ అధికారులు ఈ మైనింగ్ అనుమతులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ ఎలా చేపడతారంటూ స్థానిక గ్రామస్తులు ప్రశ్నిస్తుంటే.. రాంబిల్లి పోలీసులు వారిపై తిరగబడి కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అండదండలతోనే తాము మైనింగ్ చేపడుతున్నామని, ఎవరైనా అడ్డు వస్తే లారీలతో తొక్కించేస్తామని మైనింగ్ నిర్వాహకులు బెదిరిస్తున్నట్లు స్వయంగా కూటమికి చెందిన స్థానిక నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు పంచదార్లలోని ప్రాచీన శైవక్షేత్రంతో పాటు, పురావస్తు శాఖ పరిధిలోని బౌద్ధారామాలకు కూడా ఈ అక్రమ మైనింగ్ వల్ల తీవ్ర ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా కొండ దిగువన ఉన్న చారిత్రక రిజర్వాయర్ సైతం ఎండిపోయే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఎన్నికలకు ముందు ‘పంచదార్ల కొండపై మైనింగ్ జరగనివ్వం’ అని హామీ ఇచ్చిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు దీనిపై ఏం సమాధానం చెప్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యేను నిలదీస్తే.. ‘తనకేమీ తెలియదు’ అంటూ దాటవేస్తున్నారని వారు వాపోతున్నారు. సీఎం రమేష్ పేరు చెప్పుకుంటూ ప్రాచీన బౌద్ధారామాలకు, శైవక్షేత్రానికి నష్టం కలిగిస్తున్న ఈ అక్రమ మైనింగ్ను వెంటనే నిలిపివేయాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. శైవ క్షేత్రానికి ముప్పు..! పంచదార్ల వద్ద పూర్వం స్వయంభూ లింగం ఉండేదని, కాలక్రమేణా అది మరుగున పడిపోవడంతో నారద మహర్షి సూచన మేరకు యమధర్మరాజు తన కుష్టు వ్యాధి నివారణ కోసం ఇక్కడ మరో లింగాన్ని ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది. అందుకే ఈ ఆలయానికి ‘ధర్మలింగేశ్వరాలయం’ అనే పేరు వచ్చింది. ఇక్కడి కోనేట్లోని లింగాల నుంచి నిరంతరం ప్రవహించే నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది నేటికీ ఒక రహస్యమే. ఈ పుణ్యతీర్థాన్ని సేవిస్తే అనారోగ్యాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి మొదటిసారిగా ఇక్కడే పాదాలు మోపారని కూడా ప్రతీతి. ఇక్కడి మండపంలో చప్పట్లు కొడితే ఆ శబ్దం తిరిగి ప్రతిధ్వనించడం మరో ప్రత్యేకత. ఇన్ని విశిష్టతలు ఉన్నందున, దీనిని పురాతన రక్షిత కట్టడంగా గుర్తిస్తూ పురావస్తు శాఖ ఇక్కడ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సాగుతున్న ఈ భారీ అక్రమ మైనింగ్ వల్ల ఈ శైవక్షేత్రం ఉనికికే ముప్పు వాటిల్లుతోంది. దీనికి తోడు ఈ కొండకు ఆనుకుని ఉన్న ఫణిగిరి కొండపై గల బౌద్ధారామాలు కూడా మైనింగ్ దెబ్బకు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని చరిత్రకారులు ఆందోళన చెందుతున్నారు. చారిత్రక జలధారకూ గండం..! కొండ నుంచి సహజసిద్ధంగా ప్రవహించే నీటితో కొండ కింద దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఒక రిజర్వాయర్ ఏర్పడింది. బ్రిటిష్ కాలం నాటి ఈ రిజర్వాయర్ను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేశారు. 2023లో ’ఏషియన్ పెయింట్స్’ సీఎస్సార్ నిధులతో అప్పటి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆధ్వర్యంలో ఈ రిజర్వాయర్ను ఆధునీకరించి, ఎక్కువ నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నారు. గతంలో వెంకటాపురం రెవెన్యూ పరిధిలో ఉపాధి హామీ నిధులతో కొండ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు జరిగేవి. కానీ, ప్రస్తుత అక్రమ మైనింగ్ కారణంగా ఈ సహజ జలధారలు పూడిపోయి, రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి తోడు, కొండపై మైనింగ్ సాగుతుండటంతో ఉపాధి హామీ పనులు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ మైనింగ్ను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఫొటోలో ఉన్నది పంచదార్ల కొండ. అటు వెంకటాపురం నుంచి ఇటు పంచదార్ల వరకూ విస్తీరించి ఉన్న ఈ కొండ బహుశా రాష్ట్రంలోనే అతిపెద్ద కొండగా గుర్తింపు పొందింది. పచ్చదనంతో కళకళలాడే పంచదార్ల కొండపై పచ్చగద్దలు వాలి అడ్డంగా తొలిచేస్తున్నాయి. -
ఉపమాక వెంకన్న ఆలయంలో భారీ చోరీ
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం భారీ చోరీ జరిగింది. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న ఈ ఆలయం టీటీడీకి అనుబంధంగా ఉంది. ఆలయంలో సీసీ కెమెరాలు, టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణ ఉన్న సమయంలోనే అర్ధరాత్రి దుండగులు ఆలయంలోకి ప్రవేశించి రెండు హుండీలను పగులగొట్టి నగదు, బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకుపోయారు. 600 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని 2015లో టీటీడీ పరిధిలోకి తీసుకున్నారు. ఇంత ప్రసిద్ధి గాంచిన ఆలయంలోకి మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు ఆలయం వెనుక నుంచి ప్రవేశించి ఉత్సవమూర్తులకు ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలో హుండీని, ఆండాళ్లమ్మ అమ్మవారి సన్నిధిలో ఉన్న హుండీని కట్టర్లతో పెకిలించారు. ఆస్థాన మండపంలో ఉన్న హుండీలో స్వామివారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకుపోయారు. అపహరణకు గురైన సొమ్ము సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని ఆలయ ఇన్స్పెక్టర్ కూర్మేశ్వరరావు చెబుతుండగా, సుమారు రూ.4లక్షలు పైనే ఉంటుందని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ ఉన్నా కూడా చోరీ ..! ఈ ఏడాది మార్చి 5వ తేదీన హుండీల కానుకలను లెక్కించారు. ఏటా స్వామివారికి కానుకల రూపంలో సుమారు రూ.40 లక్షల మేర ఆదాయం లభిస్తుంది. స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలను లెక్కించి తెల్లవస్త్రంలో మూటకట్టి ఆస్థాన మండపంలోని హుండీలో ఉంచినట్టు దేవస్థానం వారు చెబుతున్నారు. అయితే పోలీస్ జాగిలాలు ఆలయం వెనుక కొండ ప్రాంతంలో ఆ ఆభరణాల మూటను గుర్తించాయి. పోలీసులు, దేవస్థానం అధికారుల సçమక్షంలో తూకం వేయగా 56 గ్రాముల బంగారం, 2.70 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. దుండగులు మిషన్తో గర్భగుడి తలుపులు కత్తిరించడానికి యత్నించి రాకపోవడంతో వదిలేశారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, నక్కపల్లి, అడ్డురోడ్డు సీఐలు జె.మురళి, ఎల్.రామకృష్ణ, ఎస్ఐ సన్నిబాబు క్లూస్ టీములను రప్పించి, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. -
సీఎం రమేష్కు షాకిచ్చిన జనసేన నేత
సాక్షి, అనకాపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనలో కూటమి నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కూటమి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలే.. పాలకుల అరాచకాలను బయటపెడుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అక్రమ మైనింగ్పై జనసేన నేత వంశీ వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలో అక్రమ మైనింగ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని వంశీ డిమాండ్ చేశారు.వివరాల మేరకు.. అనకాపల్లి జిల్లాలోని రాంబల్లిలో ఎంపీ సీఎం రమేష్ అక్రమ మైనింగ్పై జనసేన నేత వంశీ వీడియో విడుదల చేశారు. మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అర్ధరాత్రి వీడియో విడుదల చేశారు. ఈ సందర్బంగా వంశీ మాట్లాడుతూ..‘అక్రమ మైనింగ్ను అడ్డుకుంటే లారీలతో తొక్కి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఎంపీ సీఎం రమేష్ పేరు చెప్పి తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ మైనింగ్ దగ్గరకు వచ్చిన నన్ను చంపాలనుకుంటున్నారు అని ఆరోపించారు.అలాగే, అక్రమ మైనింగ్ జరగలేదని పైకి చెబుతున్నారు. కానీ, కూటమి ప్రభుత్వ హయాంలోనే పంచదార్ల కొండపై మైనింగ్ జరుగుతుంది. నెంబర్ ప్లేట్లు లేని లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారు. అక్రమ మైనింగ్ పాల్పడే వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలి’ అని డిమాండ్ చేశారు. -
తాగునీటి కోసం మా గోడు పట్టదా..?
బుచ్చెయ్యపేట : మేజర్ పంచాయతీ వడ్డాదిలో తాగునీటి కోసం మహిళలు సచివాలయం ముట్టడించారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ సచివాలయంలో బైఠాయించి తాగునీరు అందించి ఆదుకోండి అంటూ నిరసన చేపట్టారు. ఎండాకాలం గుక్కెడు నీళ్లు అందక తీవ్ర అవస్థలు పడుతున్నాం...అధికారులూ మా గోడు పట్టించుకోండి..నీళ్లు ఇచ్చి ఆదుకోండి అంటూ నినాదాలు చేశారు. ముఖ్యంగా 9వ వార్డులో 6 నెలలుగా మంచినీళ్లు సక్రమంగా రావడం లేదు. పలువురు అనధికారికంగా మోటార్లు బిగించి ట్యాంకులకు ఎక్కించి నీటిని మళ్లిస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని, కుళాయి నుంచి బిందెడు నీళ్లు కూడా రావడం లేదని గ్రామానికి చెందిన సుంకరి లక్ష్మి, వెలుగుల రత్తమ్మ, వీర్ల శ్యామ్రాజ్, గండ్రెడ్డి లక్ష్మి, దూళ్ల పార్వతమ్మ, అరిశంకల లక్ష్మి, అదట్రా లక్ష్మి, బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు శిరిగిరిశెట్టి దొరపిల్ల తదితరులు పంచాయతీ ఈవో రామలింగేశ్వరరావును నిలదీశారు. గ్రామీణ నీటి సరఫరా అధికారులైతే ఏ నాడు మా గ్రామంలో పర్యటించరని ప్రజలకు సురక్షతమైన తాగునీరు అందుతుందా లేదా ప్రజలకు నీరు అందుతుందా లేదా, మంచినీటిని క్లోరినేషన్ చేశారా లేదా అన్నది పరిశీలించరని జిల్లా బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు చిన వెంకయ్యదొర ఆరోపించారు. గతంలో పని చేసిన అధికారులతో పాటు ప్రస్తుతం పని చేస్తున్న అధికారుల తీరు బాగోకపోవడంతోనే సచివాయం ముట్టడించాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. తక్షణం అధికారులు తాగునీటి సమస్య పరిష్కరించకపోతే ఖాళీ బిందెలతో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
అంగరంగ వైభవంగా మోదకొండమ్మ పండగ
మాడుగుల : మాడుగుల మోదకొండమ్మ పండగ మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని పూలు నగలతో ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారు 4 గంటల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రతి రూపమైన ఘటాలు శిరస్సున పెట్టుకుని ఆలయానికి కాలి నడకన వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడానికి కిలోమీటర్ల మేర బారులు తీరారు. మాడుగుల రాజవంశీకురాలు మాయాంక కుమారి దేవ్ వారి ఇంటి ఇలవేల్పుగా భావించే దేవత మోదకొండమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజుతో పాటు ఇతర కమిటీ సభ్యులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ ఎంపీపీ రామధర్మజ, కమిటీ సభ్యులు దేవరాపల్లి శ్రీనివాసరావు, దంగేటి సూర్యారావు, భీమరశెట్టి పైడినాయుడు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకున్నారు. పండగ సందర్భంగా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, సత్యహరిశ్చంద్ర నాటకం ఆకట్టుకున్నాయి. బొమ్మల కొలువులు, రంగుల రాట్నాలు చిన్నారులను ఆకట్టుకున్నాయి. అమ్మవారి ఘటాల ఊరేగింపు అమ్మవారి ప్రతిరూపమైన ఘటాలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, ఇతర కమిటీ సభ్యులు శిరస్సున పెట్టుకుని సంబరంలో అడుగుల వేశారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై ప్రతిష్టించి తీన్మార్, సన్నాయి వాయిద్యాలు, మహిళల కోలాటాలు, శక్తి వేషాలు, బళ్లవేషాలు నడుమ సంబరంగా ఊరేగించారు. ఈ సందర్భంగా మోదమాంబ లక్ష్మీ వర్తక సంఘం భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. మోదకొండమ్మ సేవక బృందం సభ్యులు ప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేశారు. గట్టి పోలీసు బందోబస్తు జాతర సందర్భంగా ఎస్ఐ జి నారాయణరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. 250 మంది సిబ్బందితో అమ్మవారిని సులువుగా దర్శించుకునే విధంగా వాతావరణం కల్పించారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. సంబరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అమ్మవారి దర్శనానికిబారులు తీరిన భక్తులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు అమ్మవారిని దర్శించుకున్నమాడుగుల రాజ వంశీకురాలు మయాంక కుమారిదేవ్ -
పెద్దకొండపై అక్రమాల రంగులు!
● 150 ఎకరాల ప్రభుత్వ భూమిపై గద్దల్లావాలిన అధికార పార్టీ నేతలు ● సరిహద్దుల కోసం రంగు రంగుల రాళ్లు..బినామీల పేర్లతో నకిలీ రికార్డులు ● రెవెన్యూ అధికారులకూ భారీగా వాటాలు.. ● కొండను పంచుకున్న కూటమి నేతలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామ పరిధిలోని పెద్దకొండపై జరుగుతున్న అక్రమ వ్యవహారాలకు రంగురంగుల రాళ్లే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వన్యప్రాణులు సంచరించే ఈ కొండను కూటమి నేతలు ముక్కలుగా పంచుకుని, తమకు కేటాయించుకున్న భూభాగాలకు రంగు రాళ్లతో సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూమిగా ఉన్న ప్రాంతంలో ప్రైవేటు సర్వేలు నిర్వహించి, సొంత మ్యాపుల ఆధారంగా హద్దులు నిర్ణయించుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అంతేకాదు, సర్వే నిర్వహణ కోసం అడవిలో చెట్లను నరికి, కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేకంగా దారులు కూడా ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ స్థాయిలో కార్యకలాపాలు సాగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రూ.450 కోట్ల భూ దోపిడీ.. అధికారులకూ వాటాలు భీమిలి నియోజకవర్గం, ఆనందపురం మండల పరిధిలోని శొంఠ్యాం గ్రామ సర్వే నంబర్లు 346, 347 లలో సుమారు 469.9 ఎకరాల ప్రభుత్వ భూమి విస్తరించి ఉంది. స్థానికంగా దీనిని ‘పెద్దకొండ’గా పిలుస్తారు. అదానీ డేటా సెంటర్ ప్రతిపాదిత ప్రాంతానికి ఎదురుగా ఉండటంతో పాటు, కొండ దిగువన ఇప్పటికే వీఎంఆర్డీఏ భూసమీకరణ చేపట్టి రైతులకు ప్లాట్లు పంపిణీ చేయడంతో ఈ ప్రాంతానికి భారీగా విలువ పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఎకరం భూమి విలువ కనీసం రూ.3 కోట్ల పైమాటే. మొత్తం 469.9 ఎకరాల్లోని అత్యంత విలువైన 150 ఎకరాల భూమిని కాజేసేందుకు కూటమి నేతలు స్కెచ్ వేశారు. ఈ భారీ స్కామ్ సాఫీగా సాగడం కోసం ఒక రెవెన్యూ ఉన్నతాధికారికి 16 ఎకరాలు, ఒక ప్రైవేటు సర్వేయర్కు 5 ఎకరాలు, ఇతర రెవెన్యూ సిబ్బందికి తలా 5 ఎకరాల చొప్పున బినామీ పేర్లతో రికార్డులు సృష్టిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా ఒక కార్పొరేషన్ చైర్మన్, ఇద్దరు ఎమ్మెల్యే పీఏల ఆధ్వర్యంలోనే నడుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘రంగు’ల ఆట.. ప్రైవేటు వేట! సాధారణ ప్రజలు, రైతులు కూడా వెళ్లడానికి సాహసించని ఈ కొండపై కూటమి నేతలు డ్రోన్ల సహాయంతో ప్రైవేట్ సర్వే పూర్తి చేశారు. ఏ నేతకు ఏ రంగు రాయి నుంచి ఏ రంగు రాయి వరకు భూమి ఉందో నిర్ధారించుకుంటూ రంగుల రాళ్లతో సరిహద్దులు గీసుకున్నారు. అక్రమాలకు సాక్ష్యాలుగా నిలుస్తున్న ఈ రంగు రాళ్లు కొండపై స్పష్టంగా కనిపిస్తున్నా.. తమకు వాటాలు అందడంతో రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. బినామీల పేర్లతో నకిలీ ‘డీ–పట్టా’లు సృష్టించి, తామే కొన్నేళ్లుగా సాగు చేస్తున్నట్లు రికార్డులు మార్చేసే ప్రక్రియ వేగంగా సాగుతోంది. బినామీల ఖాతాల్లోకి భారీగా జమ..! రైతుల నుంచి కారుచౌకగా భూములు లాక్కునేందుకు ఒప్పందాల పేరిట పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతోంది. కార్పొరేషన్ చైర్మన్ బినామీగా ఉన్న స్థానిక నేత ఎస్బీఐ ఖాతాలోకి గత 3, 4 నెలల్లోనే రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు జమ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మార్కెట్లో కోట్లు పలికే రైతుల డీ–పట్టా భూములను ఎకరా కేవలం రూ.18 లక్షలకే కొనుగోలు చేసేలా బెదిరించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇందుకు అడ్వాన్స్గా ఎకరాకు రూ.2 లక్షల చొప్పున రైతులకు ఇస్తున్నారు. బినామీలుగా వ్యవహరిస్తున్న జనసేన, టీడీపీకి చెందిన నేతల గత ఐదారు నెలల బ్యాంక్ ఖాతాలను నిష్పాక్షికంగా పరిశీలిస్తే ఈ మెగా భూదోపిడీ గుట్టు రట్టవుతుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల మౌనంపై ప్రశ్నలు ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు సర్వేలు, డ్రోన్ మ్యాపింగ్, చెట్ల నరికివేత, హద్దుల గుర్తింపు, నడక దారుల ఏర్పాటు వంటి చర్యలు బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, గత కొద్ది నెలలుగా సంబంధిత వ్యక్తుల బ్యాంకు లావాదేవీలు, భూ రికార్డులు, సర్వే వివరాలను పరిశీలిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక రైతుల నోట్లో మట్టి! కూటమి నేతల భూదాహం అంతటితో ఆగలేదు. కొండపై ప్రభుత్వ భూమిని మింగేస్తూనే.. కొండ కింద దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేద రైతుల భూములపై పడ్డారు. వాస్తవంగా రైతుల సాగులో ఉన్న 50 ఎకరాల విస్తీర్ణాన్ని రికార్డుల్లో తగ్గించి, ఆ భూమిని కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో జనసేనకు చెందిన ఒక ‘మూర్తీ’భవించిన నేతతో పాటు, కార్పొరేషన్ చైర్మన్కు బినామీగా ఉన్న ఒక టీడీపీ నేత కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్రమాల్లో ‘రాంబాబు’గా పేరొందిన వ్యక్తికి, ఈ బినామీల ‘రమణీ’య పాత్ర వెన్నుదన్నుగా నిలుస్తోంది. -
దగా పాలనకు రెండేళ్లు!
బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026ఎంఎస్ఎంఈ పార్కుకు మరో 100 ఎకరాలు ? మాకవరపాలెం: మండలంలోని రాచపల్లి రెవెన్యూలో మరో 100 ఎరకరాల భూ సేకరణకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెవెన్యూలోని 737 సర్వే నంబర్లో ఇప్పటికే ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు 406 ఎకరాల భూమిని సేకరించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ఆనుకుని ఉన్న మరో 100 ఎకరాల వరకు భూమిని సేకరించనున్నట్టు సమాచారం. దీనిలో భాగంగా గత మూడు రోజులుగా స్థానిక రెవెన్యూ సిబ్బంది సర్వే చేపట్టారు. గతంలో రైతులు సాగులోని ఆక్రమణ భూములు మాత్రమే తీసుకుని ఎకరానికి రూ.9 లక్షల చొప్పున పరిహారం అందించారు. ప్రస్తుతం వెంకయ్యపాలెం, చినరాచపల్లి ప్రాంతంలో ఉన్న జిరాయితీ భూములను మాత్రమే మంగళవారం సర్వే చేస్తున్నారు. దీంతో సుమారు 100 ఎకరాల వరకు జిరాయితీ భూమిని సేకరిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇదే విషయమై రాచపల్లి వీఆర్వో సాంబశివరావును సంప్రదించగా ఉన్నతాధికారుల ఆదేశాలతో జిరాయితీ భూములు మాత్రమే సర్వే చేస్తున్నట్టు చెప్పారు.అనకాపల్లి : కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజల నడ్డి విరిచారని, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైనట్టు పశ్చిమగోదావరి జిల్లా రిజనల్ కో ఆర్డినేటర్, చోడవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. పథకాలపై బాబు డాబు... సార్వత్రిక ఎన్నికల హామీల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో రెండేళ్ల పాలనలో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు రూ.1500, నిరుద్యోగ భృతి రూ.3వేలు, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్మెంట్, వృద్ధులకు ప్రభుత్వ ఫించన్, 50 సంవత్సరాల బీసీలకు ప్రభుత్వ పింఛన్లు, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు గురించి ప్రజలు అడుగుతుంటే పూర్తిస్థాయిలో అమలు చేయడం జరిగిందని, సూపర్సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోవడంతో ప్రజలు నవ్వుతున్నారని పేర్కొన్నారు. కూటమి మోసాలపై నిరసనలు కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన మోసాలను ప్రజలకు వివరించేందుకే ఈ నెల 4 నుంచి 12 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు స్థానిక ప్రజల సహకారంతో చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను దొడ్డిదారిన అమ్మకుని, మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చిన ఘనత విద్యాశాఖ మంత్రి లోకేష్కే దక్కిందన్నారు. దరఖాస్తు పెట్టుకుంటే చాలు అర్హతతో సంబంధం లేకుండా రూ.15 లక్షలు చెల్లిస్తే పేకాటలో ప్రావీణ్యం ఉంటే చాలు స్సోర్ట్స్ కోటాల్లో ఉద్యోగాలు కూటమి ప్రభుత్వంలో వస్తాయన్నారు. హోంమంత్రి అనిత కూటమి పాలనలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అందరూ హోంమంత్రికి దరఖాస్తులు చేసుకుని ఉద్యోగాలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామన్నారు. నిరుద్యోగ యువతకు పార్టీ అండగా నిలబడుతుందన్నారు. వైఎస్సార్సీపీ పాలనకు..నేటి పాలనకు ఉన్న తేడాలను ప్రజలు గమనించారని, అవకాశం రాగానే కూటమికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా పెంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ రీజనల్ కో ఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల సమన్వయకర్తలు మలసాల భరత్కుమార్, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, నియోజకవర్గ పరిశీలకులు సతీష్వర్మ, గండి రవి, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, అనకాపల్లి, కశింకోట మండలపార్టీ అధ్యక్షులు పెదిశెట్టి గోవింద, మలసాల కిషోర్, కశింకోట జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్రాజు, 80,81,82,83, 84 కెఎం.నాయుడు, బొడ్డేడ శివ, కోరుకొండ రాఘవ, అల్లు త్రినాథ్, బుద్ద భాస్కరరావు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ‘సూపర్సిక్స్’ అమలులో కూటమి ఫెయిల్ మోసపూరిత హామీలతోజనం నడ్డి విరిచారు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు పోస్టర్ ఆవిష్కరించినవైఎస్సార్సీపీ నేతలు -
రేషన్ బియ్యం బొక్కేసారు..!
● డిపోలో 500 కేజీల బియ్యం మాయం ● గవరపాలెంలో విజిలెన్స్ తనిఖీలు, కేసు నమోదు అనకాపల్లి : స్థానిక గవరపాలెం సంతబైల వద్ద రేషన్ డిపో నెంబర్ 29 బాదంపూడి సాయి వర్ధన్ డిపోపై మంగళవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ రమణయ్య తన బృందంతో డిపోలో తనిఖీలు చేపట్టారు. రికార్డుల ప్రకారం ఉండాల్సిన నిల్వల కంటే 500 కేజీల బియ్యం తక్కువగా ఉండడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో స్థానిక సీఎస్డీటీ లీలా శేషు కుమారి ఆధ్వర్యంలో డిపోపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఎస్డీటీ లీలా శేషు కుమారి మాట్లాడుతూ ‘గవరపాలెంలోని రేషన్ డిపోలపై వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా దాడులు నిర్వహిస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే డిపోలపై కేసులు నమోదు చేస్తున్నామని, ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు విజిలెన్స్ శాఖ తనిఖీలను ముమ్మరం చేసిందని సీఎస్డీటీ చెప్పారు. -
రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక
ఎంపికై న క్రీడాకారులతో అసోసియేషన్ సభ్యులు అచ్యుతాపురం రూరల్ : అండర్–18 రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు అనకాపల్లి జిల్లా క్రీడాకారుల ఎంపిక అచ్యుతాపురం భోగాపురం క్రీడా ప్రాంగణంలో సోమవారం జరిగింది. జిల్లా నలుమూలల వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి క్రీడాకారులు పాల్గొనగా స్టాండ్బైతో కలిపి 24 మందిని ఎంపిక చేసినట్టు నేషనల్ కోచ్ వెంకట్ తెలిపారు. జూన్ 6, 7 తేదీల్లో పల్నాడు జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఎంపికై న క్రీడాకారులను అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కూండ్రపు వెంకునాయుడు, అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎన్.వి జగదీష్, వైస్ ప్రెసిడెంట్ రెడ్డి చిరంజీవి, అసోసియేషన్ సభ్యులు ధర్మిరెడ్డి వెంకట్, డాక్టర్ సుధీర్, కూండ్రపు రమేష్, శివాజీ, శ్రీను, శంకర్, రెహమాన్ అభినందనలు తెలిపారు. -
గోదావరిలో మునిగి
బావ, బావమరిది మృతిమృతులు నూకరాజు, శ్రీనివాస్ బుచ్చెయ్యపేట: కొత్తగా పెళ్లయిన వరుడు తన బావతో కలిసి సరదాగా గోదావరి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోయి చనిపోయిన ఘటన రాజమహేంద్రవరంలో సోమవారం సాయంత్రం జరిగింది. వీరిద్దరు మృతి ఘటన బుచ్చెయ్యపేట మండలం తైపురంలో తీవ్ర విషాదం నింపింది. వివరాలివి... బుచ్చెయ్యపేట మండలం తైపురం గ్రామానికి చెందిన వియ్యపు పెదరాజు, సత్యవతిల కుమారుడు నూకరాజు(26)కు గత నెల 12వ తేదీన కశింకోట మండలం జొమ్మనపాలేనికి చెందిన ఓ యువతితో వివాహమైంది. వివాహమైన తర్వాత రాజమహేంద్రవరంలో ఉంటున్న తన అక్కాబావ వద్దకు నూకరాజు తన భార్యతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం అక్కడ గోదావరిలో స్నానానికి వెళ్లిన బావ, బావమరిది శ్రీనివాస్, నూకరాజు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందారు. పెళ్లయి 20 రోజులకే పచ్చని తోరణాలతో కళకళలాడుతున్న ఇంట్లో ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఇరు కుటుంబ సభ్యులు బోరున విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. మంగళవారం రాజమహేంద్రవరంలో నూకరాజు, శ్రీనివాస్ల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి తైపురం తీసుకువస్తామని బంధువులు తెలిపారు. -
నేడు మాడుగుల మోదమాంబ జాతర
మాడుగుల: ఉత్తరాంధ్ర ప్రధాన ఇలవేల్పు, మాడుగుల మోదమాంబ అమ్మవారి జాతర మంగళవారం ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండడంతో ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. ఆలయం వద్ద బారికేడ్లు, క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఆలయం వద్ద నుంచి పలు ప్రధాన ప్రదేశాల్లో దాతల సహకారంతో ఉచితంగా మజ్జిగ, తాగునీరు, ప్రసాదం పంపిణీ చేపట్టనున్నారు. భారీ బందోబస్తు జాతరకు బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఎస్ఐ జి. నారాయణరావు తెలిపారు. ఎస్పీ తుహిన్సిన్హా ఆదేశాలతో అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, పర్యవేక్షణలో కె.కోటపాడు సీఐ కృష్ట ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు, 14 మంది ఎస్ఐలు, ముగ్గురు సీఐలతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ బందోబస్తులో ఉంటా రన్నారు. ట్రాఫిక్ ఏర్పాట్లు జాతర సందర్భంగా విశాఖ, అనకాపల్లి, చోడవరం, నుంచి వచ్చే అన్ని ప్రెవేటు, ఆర్టీసీ బస్సులు వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిలుపుదల చేయనున్నట్టు ఎస్ఐ తెలిపారు. ఎం.కోడూరు మీదుగా వచ్చే వాహనాలను మోదకొండమ్మ ఆలయం వెనుక భాగంలో, సాగరం మీదుగా వచ్చే వాహనాలను మోదమాంబ కాలనీ వద్ద, ఖండివరం, బోయపాడు, నుంచి వాహనాలను తహసీల్దారు కార్యాలయం వద్ద నిలుపుదల చేయనున్నట్టు తెలిపారు. పలు చోట్ల జరిగే వినోద కార్యక్రమాలు వద్ద ఆదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతర విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. -
ఎస్పీ కార్యాలయంలో...
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 52 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. భూ తగాదాలు, మోసపూరిత హామీలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇతర సమస్యలపై అర్జీలు వచ్చాయన్నారు. చట్టపరిధిలో అర్జీలను పరిష్కరించే విధంగా దిగువ స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎల్.మోహన్రావు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మెగా మోసం
దగా బాబు.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన గళం నెహ్రూచౌక్ జంక్షన్లో మానవహారం, కలెక్టరేట్ ముట్టడి 5 కిలోమీటర్ల మేర భారీ కార్లు, బైక్ ర్యాలీ పోలీసుల ఆంక్షల నడుమ కలెక్టరేట్ వద్ద ధర్నా భారీగా తరలివచ్చిన యువత, వైఎస్సార్సీపీ శ్రేణులు.. నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చిత్రంలో జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంరెడ్డి అదీప్రాజ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, పెట్ల ఉమాశంకర్ గణేష్, సమన్వయకర్త మలసాల భరత్కుమార్, మాజీ ఎంపీ సత్యవతి బాబు తొలి సంతకమే ‘మెగా అక్రమం’ : మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సాక్షి, అనకాపల్లి : కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ’మెగా డీఎస్సీ’ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే ’మెగా మోసం’గా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రాగానే చేసిన తొలి సంతకంలోనే భారీ అక్రమాలు, దగా దాగున్నాయని మండిపడింది. ఈ దగా డీఎస్సీకి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం నిరుద్యోగ యువత, పార్టీ శ్రేణులు సమరభేరి మోగించాయి. నెహ్రూచౌక్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన నిరసన ప్రదర్శనలు, ముట్టడి కార్యక్రమాలతో అనకాపల్లి అట్టుడికింది. ఈ నిరసన ప్రదర్శనలో జిల్లా నలుమూలల నుంచి నిరుద్యోగ యువత, టెట్, డీఎస్సీ అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొని నిరసనను విజయవంతం చేశారు. మిన్నంటిన నినాదాలు దగా డీఎస్సీపై నిరుద్యోగుల్లో వ్యక్తమవుతున్న తీవ్ర అసంతృప్తికి మద్దతుగా వైఎస్సార్సీపీ యువజన విభాగం పిలుపునిచ్చిన ఈ నిరసన కార్యక్రమం హిట్ అయింది. నెహ్రూచౌక్ జంక్షన్ వద్ద ఉదయాన్నే వందల మంది యువకులు, అభ్యర్థులు, పార్టీ నాయకులు తరలివచ్చారు. అక్కడ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని భారీ మానవహారంగా ఏర్పడి, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నినదించారు. అనంతరం అక్కడ నుంచి కలెక్టరేట్ వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర భారీ సంఖ్యలో కార్లు, బైక్లతో ర్యాలీ నిర్వహించారు. వందలాది వాహనాలతో సాగిన ఈ ర్యాలీతో రహదారులన్నీ వైఎస్సార్సీపీ జెండాలు, నిరసన ప్లకార్డులతో నిండిపోయాయి. ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. డీఎస్సీ అక్రమాపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట సమన్వయకర్తలు అన్నపరెడ్డి అదీప్రాజు, కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు మాట్లాడుతూ పరీక్షల సమయంలో విశాఖలో విద్యుత్ నిలిపివేసి మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారని, పేపర్ లీకేజీలు జరిగాయని ధ్వజమెత్తారు. గతంలో వై.ఎస్.జగన్మోహనన్రెడ్డి 2 లక్షల మందికి పారదర్శకంగా సచివాలయ ఉద్యోగాలిస్తే, చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిందని విమర్శించారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, నియోజకవర్గ అధ్యక్షుడు జాజుల రమేష్ మాట్లాడుతూ శాంతియుత ర్యాలీలను పోలీసులు అణచివేయడం దుర్మార్గమన్నారు. అనంతరం నేతలు కలెక్టరేట్కు చేరుకుని డీఆర్వో సత్యనారాయణరావుకు వినతిపత్రం అందజేశారు. నిరసనలో మాజీ ఎంపీ బి.వి సత్యవతి, రాష్ట్ర కార్యదర్శులు గండి రవికుమార్, డి.దిలీప్కుమార్, ఏడువాక సత్యారావు, పైలా శ్రీనివాసరావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శులు మలసాల కుమార్రాజా, పాలిశెట్టి సురేష్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, అనకాపల్లి, కశింకోట మండలపార్టీ అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, వివిధ నియోజకవర్గ యువజన విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరు ఆగదు : వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ ఈ డీఎస్సీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. అప్పటివరకు ఈ ప్రక్రియను నిలిపివేసి, అర్హులైన నిరుద్యోగులందరికీ న్యాయం జరిగేలా కొత్తగా పారదర్శకంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుంది. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఈ ఉద్యమం ఆగేది లేదు. ‘ఎన్నికల ముందు కోట్లాది మంది యువతకు ఉద్యోగాలిస్తామని నమ్మించి, అధికారంలోకి వచ్చాక తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీలోనే భారీ అక్రమాలకు తెరలేపారు. వేల పోస్టుల భర్తీ అంటూ ప్రగల్భాలు పలికి, తీరా చూస్తే నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్యను కుదించి, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. ఈ నోటిఫికేషనన్ ప్రక్రియ, పోస్టుల కేటాయింపులో తీవ్రమైన అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి‘ అని ఆరోపించారు.మాడుగుల నియోజకవర్గానికి చెందిన అదిరెడ్డి వెంకటరావురెడ్డి డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కాల్లెటర్ పొందినా, తీరా వెళ్లాక అధికారులు ఉద్యోగం లేదనడం ప్రభుత్వ దగాకు నిదర్శనమన్నారు. అర్హులకు కాకుండా స్పోర్ట్స్ కోటా పేరిట, జీవో నెం. 272 తెచ్చి కూటమి అనుకూలురకు ఉద్యోగాలు కట్టబెట్టారని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఒక్కో పోస్టును రూ.15 లక్షలకు అమ్ముకున్నారని, మెరిట్ లిస్టును ఎందుకు దాచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఢిల్లీ నుంచి శృంగవరం పంచాయతీకి ఆహ్వానం
నాతవరం: గుడ్ గవర్నెర్స్ విభాగంలో జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డుకు ఎంపికై న నాతవరం మండలంలో శృంగవరం పంచాయతీకి ఆహ్వానం అందింది. ఈ నెల 3వ తేదీన ఢిల్లీలో కార్యక్రమానికి హాజరు కావాలని జిల్లా పంచాయతీ అధికారి సందీప్తోపాటు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. ఈ మేరకు మంగళవారం ఉదయం వారిద్దరు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ పంచాయతీ తరపున జాతీయ అవార్డుతో కోటి రూపాయలు అందుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలోనే శృంగవరం పంచాయతీకి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని డీపీవో తెలిపారు. -
జాతరకు వెళ్లి వస్తూ విషాదాంతం
మాడుగుల రూరల్ : మండలంలో జంపెన గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆదివారం అర్ధరాత్రి బైక్ మీద వస్తూ చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో సంఘటన స్థలంలో మృతి చెందారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ఎస్ఐ జి.నారాయణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. జంపెన గ్రామానికి చెందిన దాసరి వరుణ్ (18), పెచ్చేట్టి సాయి కిరణ్ (17), ఆదివారం గాదిరాయిలో జరిగిన మోదమాంబ జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా, అర్ధరాత్రి 12 గంటల సమయంలో గాదిరాయి నుంచి జంపెన మార్గమధ్యంలో వీరనారాయణం టి.జంక్షన్ వద్ద బైక్ ఆదుపు తప్పి, పక్కనే వున్న తాటిచెట్టును బలంగా ఢీకొట్టారు. దీంతో ఇరువురు యువకులకు తలకు బలమైన గాయాలు తగిలి, తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మృతదేహాలను చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల మృతితో జంపెనలో విషాదచాయలు అలముకున్నాయి. మృతులు ఇద్దరూ బంధువులు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వరుణ్కు తండ్రి ఐదేళ్ల క్రితం మరణించగా, తల్లి, సోదరుడు ఉన్నారు. సాయికిరణ్కు తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి ఉన్నారు. ప్రమాదంలో మృతి చెందిన దాసరి వరుణ్, సాయి కిరణ్ -
జేఈఈ అడ్వాన్స్లో మెరుపులు
నర్సీపట్నం : జేఈఈ మెయిన్స్లో నర్సీపట్నం కారుణ్య కళాశాలకు చెందిన విద్యార్థి కాకినాడ దివాకర్ అఖిల భారతస్థాయిలో 3895వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తల్లిదండ్రులు చంటిబాబు, పావని రోజు కూలీ పనులు చేసుకుంటారు. విద్యార్థి కారుణ్యలో హైస్కూల్, ఇంటర్మీడియేట్ విద్య పూర్తి చేశాడు. కళాశాలలో ప్రత్యేక తర్ఫీదుతోనే ఈ విజయం సాధించానని, ఐఐటీలో సీటు రావడమే తన అదృష్టమని, ఎక్కడ సీటు వచ్చినా మెకానికల్ ఇంజినీర్ చేయడమే తన లక్ష్యమని విద్యార్థి దివాకర్ తెలిపాడు. రోలుగుంట : కుసుర్లపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి మేడపు రెడ్డి శ్యామ్ కుమార్ జేఈఈ ఆడ్వాన్స్డ్లో తన సత్తా చాటాడు. జేఈఈ అడ్వాన్స్డ్లో ఆల్ ఇండియాలో 11.265 ఓబీసీ ఎన్సిఎల్ ర్యాంకు 2,782 సాధించాడు. రైతు కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి 560 మార్కులతో స్కూల్ టాపర్గా నిలిచాడు. ఇంటర్లో 980 మార్కులు సాధించి, ఈ ఏడాది జేఈఈ మెయిన్స్లో 99.59 పర్సేంటేజి సాధించాడు. జేఈఈ అడ్వాన్స్డ్లో కూడా తన సత్తా చాటి గ్రామానికి, తాను చదువుకున్న పూర్వ పాఠశాలకు గుర్తింపు తీసుకురావడంపై కుసుర్లపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం శెట్టి మోహన్రావు, ఉపాధ్యాయులు శ్యామ్కుమార్ని అభినందించారు. పాయకరావుపేట : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాల విద్యార్థి జె.మోనిష్కుమార్ ఓబీసీ కేటగిరిలో 167వ ర్యాంకు, జనరల్ కేటగిరిలో 974వ ర్యాంకు సాధించాడు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యాసంస్థల అధినేత నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్, ప్రిన్సిపాల్ భానుమూర్తి, ఉపాధ్యాయులు అభినందించారు. ఎం.శ్యామ్ కుమార్ కాకినాడ దివాకర్ జె.మోనిష్కుమార్ -
ఏపీ పీజీసెట్లో మాడుగుల విద్యార్థిని ఘనత
మాడుగుల రూరల్ : ఏపీ పీజీసెట్ 2026 ఫలితాల్లో మాడుగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. కళాశాల బీఏ విద్యార్థిని చొక్కా ఏసుకుమారి రాజనీతి శాస్త్ర విభాగంలో(పోలిటికల్ సైన్సు)లో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. వీరితో పాటు కళాశాలకు చెందిన బీఎస్సీ విద్యార్థిని నంబారు మౌనిక జువాలజీ విభాగంలో 155వ ర్యాంకు, చరిత్ర విభాగంలో మాదల మాధవి 228 ర్యాంకు, ఘట్టం తులసీ 265 ర్యాంకు, బీఎస్సీ విద్యార్థిని వంతల కొండమ్మ ఫిజికల్ సైన్సు విభాగంలో 252 ర్యాంకు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ పి.జయ తెలిపారు. ఏపీ ఎడ్సెట్లో ర్యాంకుల పంట ఏపీఎడ్సెట్ 2026 ఫలితాల్లో కూడా కళాశాల విద్యార్థులు సత్తా చాటారన్నారు. కళాశాల బీఎస్సీ విద్యార్థినులు బయోలాజికల్ సైన్సు విభాగంలో నంబారు మౌనిక 721 ర్యాంకు, మాటూరి దుర్గాభవానీ 2041 ర్యాంకు, మధుమతి 3155 ర్యాంకు, కొర్రా కృష్ణవేణి 4482 ర్యాంకు, గెద్దన్నపల్లి అపర్ణ 2813 ర్యాంకు, సోషల్ స్టడీస్ విభాగంలో జె. విజయలక్ష్మి 3890 ర్యాంకు సాధించారన్నారు. కేంద్రీయ విద్యాలయాల ప్రవేశ పరీక్షలో ఏసుకుమారి పోలిటికల్ సైన్సు విభాగంలో 175 మార్కులు, బీఎస్సీ విద్యార్థిని పి.మల్లేశ్వరి ఇంగ్లిష్లో 91 మార్కులు సాధించారని తెలిపారు. -
నిర్ణీత గడువులోగా పరిష్కారం
అనకాపల్లి టౌన్: పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ విజయ్కృష్ణన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె డీఆర్వో వై. సత్యనారాయణరావు, డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మిలతో కలిసి అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, తాగునీరు తదితర శాఖల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందేలా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు తిరస్కరించాల్సి వస్తే, సరైన కారణాలను తెలియ జేస్తూ ఫిర్యాదుదారుకు లిఖిత పూర్వక సమాచారం ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ధర్నా... రైతులకు, కౌలు రైతులకు ఖరీఫ్ సీజన్లో రూ.2 లక్షల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నాయకులు, రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు విత్తనాలు, క్రిమిసంహారక మందులు 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సీపీఐ జల్లా కార్యదర్శి రాజాన దొరబాబు, ఏఐఎస్ఎఎఫ్ జిల్లా కార్యదర్శి గొల్లు ఫణీంద్ర, వై.ఎన్. భద్రం, వియ్యపు రాజు పాల్గొన్నారు. -
అంబరాన్నంటిన సత్తెమ్మతల్లి పండగ
సింహాచలం: అడవివరం గ్రామ పొలిమేర దేవత సత్తెమ్మ(మరిడమ్మ) పండగ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. దుష్ట శక్తులు గ్రామంలోకి రాకుండా గ్రామ పొలిమేరలో కాపలా కాచే దేవతగా విరాజిల్లుతున్న సత్తెమ్మకు రెండేళ్లకోసారి నిర్వహించే ఈ పండగను ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించారు. తన అక్కచెల్లెళ్ల వద్దకు పొలిమేర నుంచి గ్రామంలోకి విచ్చేసిన సత్తెమ్మని మళ్లీ పొలిమేరకు సాగనంపే కార్యక్రమాన్ని గ్రామస్తులు సందడిగా నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు, మహిళలతో అడవివరం నుంచి శ్రీనివాసనగర్ సమీపంలో ఉన్న సత్తెమ్మ ఆలయం వరకు ఉన్న రెండు కిలోమీటర్ల ప్రధాన రహదారి భక్తజన జాతరగా మారింది. మిట్ట మధ్యాహ్నం మండుటెండను సైతం లెక్క చేయకుండా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అడవివరంలోని గాంధీనగర్లో ఉన్న పైడితల్లి అమ్మవారి సతకంపట్టు వద్దకు గ్రామస్తులు, మహిళలు పసుపు కుంకుమలు, చీరలు, అమృత కలశాలతో చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అమ్మవారి చెక్కబొమ్మను పూజారి వంశీయులు శిరస్సుపై పెట్టుకుని బయలుదేరారు. దుష్ట శక్తులు అమ్మవారిని వెనక్కు నెట్టకుండా కర్రలు, ఈటెలతో వలయాన్ని ఏర్పాటు చేస్తూ గ్రామస్తులు, పసుపు, కుంకుమలు, చీరలను శిరస్సుపై పెట్టుకుని మహిళలు అమ్మవారిని అనుసరించారు. దారిపొడవునా గ్రామస్తులు తమ ఇళ్ల ముందు పసుపు నీళ్లతో సత్తెమ్మ చెక్కబొమ్మకు అభిషేకాలు చేశారు. పాత గోశాల సమీపంలో ఉన్న పొలిమేర వద్దకు రాగానే సత్తెమ్మను మూడు సార్లు ప్రదక్షిణ చేయించారు. అమ్మవారి వెనుకే భక్తులు, మహిళలు ప్రదక్షిణ చేశారు. అక్కడి నుంచి అమ్మవారిని తీసుకెళ్లి గ్రామ పొలిమేరలో ఉన్న ఆలయంలో అధిష్టింపజేశారు. అమ్మవారి పూజారి వంశీయుడు లండ వెంకటరమణ, ఆలయ గౌరవాధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షుడు పి.వెంకటరావు ఏర్పాట్లు చేశారు. కర్రి అప్పలస్వామి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి దారిపొడవునా భక్తులకు మంచినీరు, కూల్ డ్రింక్స్ అందజేశారు. -
పర్యాటక ప్రాంతాలు కిటకిట
రుషికొండ బీచ్లో పర్యాటకుల తాకిడి కొమ్మాది: ఉదయం నుండి సాయంత్రం వరకు భానుడి ప్రతాపానికి నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. ఉక్కపోతతలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.దీంతో నగరవాసులందరూ సాయంత్రం అయ్యే సరికి సాగరతీరాన్ని ఆశ్రయించారు. పర్యాటక ప్రాంతాల్లో సందడి కనిపించింది. రుషికొండ బీచ్కు పెద్ద ఎత్తున పర్యాటకులు చేరుకున్నారు. బీచ్లో స్నానాలు చేస్తూ ఉపశమనం పొందారు. సమీపంలో ఉన్న చిల్డ్రన్స్ పార్కులో చిన్నారులు ఆటపాటలతో గడిపారు. అదే విధంగా గుడ్లవానిపాలెం బీచ్, సాగర్నగర్ బీచ్, తొట్లకొండ బీచ్, రామానాయుడు ఫిల్మిం స్టూడియో, ఎర్రమట్టి దిబ్బలు, భీమిలి బీచ్, మంగమారిపేట బీచ్ ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. చిన్నారులు, పెద్దలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. -
నేడు రైల్వే జోన్ సాకారం
నాడు వైఎస్సార్సీపీ పోరాటం.. సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్ష విశాఖ రైల్వే జోన్.. అది కేవలం ఒక కార్యాలయం కాదు. ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. రాష్ట్ర విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రకు విభజన చట్టం కల్పించిన ఒకే ఒక్క ఊరట రైల్వే జోన్. కానీ, చంద్రబాబు ప్రభుత్వ ప్యాకేజీ దాసోహం.. స్వార్థ రాజకీయాల మధ్య ఆ ఆశల దీపం కొడిగట్టిపోయిన వేళ.. పట్టువదలని విక్రమార్కుడిలా వైఎస్సార్సీపీ చేసిన రాజీలేని పోరాటమే ఇన్నాళ్లకు ఆ కలను సాకారం చేసింది. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ఏ స్వలాభం కోసం ఢిల్లీ పెద్దల ముందు సాగిలపడితే.. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ మాత్రం ప్రజల పక్షాన నిలబడి అలుపెరగని ఉద్యమం చేసింది. లాఠీ దెబ్బలు తిన్నా, అక్రమ కేసులు బనాయించినా వెనక్కి తగ్గకుండా కేంద్రం మెడలు వంచి ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ను సాధించిన ఆ పోరాట ప్రస్థానం ఉత్తరాంధ్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీ గర్జన అధికారంలో ఉన్న టీడీపీ.. జోన్ ఊసెత్తకపోయినా.. వైఎస్సార్సీపీ మాత్రం ప్రతిపక్ష హోదాలో ప్రజల గొంతుకగా మారింది. అప్పటి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జోన్ సాధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఊరు, వాడల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగా 2016 మార్చిలో విశాఖలోని డీఆర్ఎం కార్యాలయాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు దిగ్బంధించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేలా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వినతిపత్రాలు సమర్పించాయి. అయినా పాలకుల్లో చలనం లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. ఆమరణ దీక్షలు.. నిరసన ప్రదర్శనలు! జోన్ ఆవశ్యకతను ఢిల్లీకి వినిపించేలా 2016 ఏప్రిల్ 14న అప్పటి వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రజల నుంచి ఈ దీక్షకు అనూహ్య స్పందన లభించినా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం మాత్రం దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసి.. అక్రమ కేసులు బనాయించింది. ఇటీవలే ఆ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అక్కడితో ఆగకుండా.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎప్పుడు కుదిరితే అప్పుడు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. 2018 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో విశాఖ జోన్కు మొండిచేయి చూపడంతో వైఎస్సార్సీపీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బడ్జెట్ ప్రసంగం ముగిసిన కొద్ది గంటల్లోనే విశాఖ వీధుల్లోకి వచ్చిన పార్టీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీలు, సభలు నిర్వహించి కేంద్రం తీరును ఎండగట్టాయి. ‘రైల్ రోకో’తో ఉద్యమం తీవ్రస్థాయికి.! ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టం 2018 ఏప్రిల్ 11 నాటి ‘రైల్ రోకో’. కేంద్రం హామీని తుంగలో తొక్కడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఏకంగా విశాఖ రైల్వేస్టేషన్లోకి చొచ్చుకెళ్లి రైళ్ల రాకపోకలను స్తంభింపజేశారు. ట్రాక్ల మీద బైఠాయించి నిరసన తెలిపారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ శ్రేణుల పోరాటాల్ని అణిచివేసేందుకు పోలీసులను ప్రయోగించింది. లాఠీ చార్జీలు చేయించింది. ఆందోళనకారులపై అక్రమ కేసులు బనాయించింది. అయినప్పటికీ వైఎస్సార్సీపీ నేతలు వెనక్కి తగ్గలేదు. జోన్ సాధించే వరకు విశ్రమించబోమని మరింత గట్టిగా నినదించారు. ఈ రైల్ రోకో ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోరాటానికి తలొగ్గిన కేంద్రం..! రైల్వే జోన్ పోరాటాన్ని చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో అణిచివేస్తున్నా.. కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నా.. వైఎస్సార్సీపీ, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు ఏకతాటిపైకి వచ్చి చేసిన ఈ నిరంతర పోరాటం ఎట్టకేలకు ఫలించింది. విశాఖ వీధుల్లో రగిలిన ఈ ఉద్యమ సెగ ఢిల్లీకి చేరింది. ఎట్టకేలకు వైఎస్సార్సీపీ చేసిన ప్రజా పోరాటానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం.. 2019 ఎన్నికల ముందు విశాఖ కేంద్రంగా ‘సౌత్ కోస్ట్ రైల్వే జోన్’ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పోరాటం చేయాల్సిన అధికార టీడీపీ రాజీపడినా.. స్వప్రయోజనాల కోసం మౌనం వహించినా.. ‘పవర్’లో లేకపోయినా.. అలుపెరగని పోరాటం చేస్తే.. దశాబ్దాల కలను కూడా ఎలా సాధించవచ్చో వైఎస్సార్సీపీ నిరూపించింది. ఈ రోజు విశాఖ రైల్వే జోన్ సాకారమైందంటే.. అది ప్రస్తుత పాలకుల వల్ల కాదు.. వైఎస్సార్సీపీ, వామపక్ష నాయకులు, కార్యకర్తలకు రోడ్ల మీద పడ్డ లాఠీ దెబ్బలు, ఎదుర్కొన్న కేసుల ఫలితమే అని దక్షిణ కోస్తా రైల్వే జోన్ చరిత్ర ఎప్పటికీ చెబుతూనే ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. -
మట్టిని అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు స్వాధీనం
కశింకోటలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లు కశింకోట: మట్టిని అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని మైన్స్ శాఖకు అప్పగించినట్లు సీఐ అల్లు స్వామి నాయుడు ఆదివారం తెలిపారు. కశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గుర్తించామని చెప్పారు.వాటిని స్వాధీనం చేసుకుని మైన్స్ శాఖ అధికారులకు అప్పగించామన్నారు. ఆ శాఖ అధికారులు ట్రాక్టర్కు రూ.8 వేల చొప్పున జరిమానా విధించారని సీఐ తెలిపారు. -
హోంగార్డుపై దాడి కేసులో నలుగురికి రిమాండ్
పరవాడ: లంకెలపాలెం మరిడిమాంబ ఆలయం వద్ద మే 29న రాత్రి గస్తీ విధుల్లో ఉన్న హోంగార్డుపై దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. రిమాండ్కు తరలించిన నిందితుల్లో రాజ్సింగ్(కాకినాడ), అనిల్సింగ్(పీఎం పాలెం), సిరసపల్లికి చెందిన రాజ్కుమార్సింగ్, జితేంద్రసింగ్లు ఉన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాడి ఘటన వివరాలను సీఐ వెల్లడించారు. ఆ రోజు రాత్రి 11.45 గంటల సమయంలో పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న కె.వెంకటరావు, కానిస్టేబుల్ జి.భాస్కరరావు ఇరువురూ కలిసి లంకెలపాలెం మరిడిమాంబ ఆలయం వద్ద పాన్షాపుల వద్ద రాత్రి గస్తీలో ఉన్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు ఇన్నోవా కారులో వచ్చి అక్కడ ఆగారు. రోడ్డుపై ఆపిన కారు ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తుందన్న ఉద్దేశంతో విధి నిర్వహణలో భాగంగా హోంగార్డు వెంకటరావు కారు ఫోటో తీసి వారిని అక్కడి నుంచి వెళ్లాలని కోరారు. నిందితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజ్సింగ్ తన కారులో ఉన్న కత్తితో హోంగార్డు వెంకటరావుపై దాడి చేసి తల, చేయిపై నరికాడు. ఈ దాడిలో హోంగార్డు తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. అగనంపూడి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. హోంగార్డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన నలుగురిని మే 30న లంకెలపాలెం ఐవోసీ పెట్రోల్ బంకు వద్ద అరెస్టు చేసి అనకాపల్లి న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారని సీఐ తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
మోదకొండమ్మ పండగకు భారీ ఏర్పాట్లు
మాడుగుల: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ తల్లి పండగను జూన్ 2న ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి రంగులు అద్ది ముస్తాబుచేయడంతో పాటు భారీ విద్యుత్ దీపాలు, సెట్టింగ్లతో ఆలయం నుంచి శతకం పట్టు వరకూ కళకళలాడుతోంది. సతకం పట్టు వద్ద తాటాకుల శాలతో పాటు చలువ పందిళ్లు వేశారు. పండగ సందర్భంగా అమ్మవారిని సుమారు లక్ష మంది భక్తులు దర్శించుకుంటారని భావిస్తున్నారు. భక్తుల కోసం క్యూలైన్లు, తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు ఆలయకమిటీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. పండగను వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. పండగ సందర్భంగా మోదకొండమ్మ విగ్రహాన్ని వెండి, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలు, విచిత్ర నేలవేషాలు ప్రదర్శించనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. 250 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు. ఉత్సవం జరిగే ప్రాంతంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.భక్తుల వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఘాట్రోడ్ నుంచి వచ్చే వాహనాలకు టీటీడీ కల్యాణమండపం వద్ద, ఎం. కోడూరు నుంచి వచ్చే వాహనాలకు అమ్మవారి ఆలయం వెనుక, చీడికాడ నుంచి వచ్చే వాహనాలకు తహసీల్దార్ కార్యాలయం వెనుక, సారగరం నుంచి వచ్చే వాహనాలకు మోదమాంబ కాలనీ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, ఎస్ఐ జి.నారా యణరావు మాట్లాడుతూ పండగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అందరూ సహకరించాలని కోరారు. -
ఒక్క హామీనీ నెరవేర్చని చంద్రబాబు
● వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయండి ● మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కె.కోటపాడు: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు సక్రమంగా అమలు చేయలేదని, హామీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా జూన్ 4 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు పిలుపునిచ్చారు. కె.కోటపాడులో పార్టీ నాయకులతో ఆదివారం ఆయన మాట్లాడారు. చంద్రబాబు తప్పుడు హామీలకు మోసపోయి అన్ని వర్గాల ప్రజలు ఇప్పడు చింతిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు చేసిన వంచనను నిరసిస్తూ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 4న మాడుగుల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. 8,9 తేదీల్లో మాడుగులలో క్లోజ్డ్ మీటింగ్లు, 12న చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా నియోజకవర్గ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించడంతో పాటు నిరసన తెలపనున్నట్లు ఆయన చెప్పారు. 12న జరిగే కార్యక్రమానికి నాలుగు మండలాల్లో గల పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, ఎంపీపీ, పార్టీ మండల అధ్యక్షుడు రెడ్డి జగన్మోహన్, గొర్రుపోటు వెంకటరావు, ఏటుకూరి రాజేష్, రొంగలి సూర్యనారాయణ, వేచలపు దొరబాబు తదితరులు పాల్గొన్నారు. -
కాల్స్కు తింటున్నాయి..
● అడ్మిషన్ల కోసం ఫోన్కాల్స్తో దాడి ● ఉదయం మొదలు అర్ధరాత్రి వరకూ మోతమోగిస్తున్న కాలేజీల సిబ్బంది ● బెంబేలెత్తుతున్న పేరెంట్స్.. విచారణకు డిమాండ్పదోతరగతి, ఇంటర్ ఫలితాలు ప్రకటించింది మొదలు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. ఫోన్లు చేస్తూ మోతమోగిస్తున్నాయి. చిరునామాలు సంపాదించి విద్యార్థుల తల్లిదండ్రుల చుట్టూ.. కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకులు తిరుగుతూ ఆలోచించుకోనివ్వకుండా వేధిస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.కాలేజీలుఅనకాపల్లి టౌన్: ‘మీ అబ్బాయి/అమ్మాయి టెన్త్, ఇంటర్ పాసయ్యారు కదా మా కాలేజీలో చేర్చండి మా దగ్గర సీటు రిజర్వ్ చేసుకోండి..ఇప్పుడు సీటు రిజర్వ్ చేసుకుంటే ఫీజులో 20 నుంచి 50 శాతం వరకూ రాయితీ ఇస్తాం’ అంటూ విరామం లేకుండా ఫోన్కాల్స్, మెసేజ్లు చేస్తున్నారు. ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నా, డ్రైవింగ్లో ఉన్నా నిరంతరం కాల్స్ వస్తుండడంతో తల్లిదండ్రులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పదో తరగతి ఫలితాలు విడుదలైన మరుక్షణం నుంచే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులపై ఫోన్ల కాల్స్తో దాడికి దిగారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వస్తున్న ఫోన్కాల్స్, మెసేజ్లతో తల్లిదండ్రులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఒక్కో విద్యార్థి తల్లిదండ్రులకు రోజుకు కనీసం 20 నుంచి 30 కాల్స్ వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. తమ పిల్లల జాయినింగ్ కోసం తల్లిదండ్రులు ఎక్కడా కనీసం దరఖాస్తు చేయకపోయినా, విచారించకపోయినా నేరుగా వారి నంబర్లకే ఫోన్లు వస్తున్నాయి. కొన్ని చోట్ల విద్యార్థి ఇంటి నంబర్తో సహా పూర్తి అడ్రస్ కూడా ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండే తల్లిదండ్రులు ఫోన్ ఎత్తడానికే భయపడుతున్నారు. ఒక వేళ కట్ చేస్తే, పదే పదే రింగ్ చేస్తూ విసుగు తెప్పిస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా తమ వ్యక్తిగత వివరాలు ప్రైవేట్ శక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ వనరుగా విద్యార్థుల డేటా జిల్లాలో కొన్ని విద్యా సంస్థలు విద్యార్థుల డేటాను ఆదాయవనరుగా మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులను చేర్చుకునేటప్పుడు ఆయా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు, చిరునామా, ఫోన్ నంబర్లు, ఏ పనిచేస్తున్నారు తదితర వివరాలు తీసుకుంటాయి. టెన్త్, ఇంటర్ పరీక్షలు ముగియడమే తరువాయి విద్యార్థుల సమాచారాన్ని అంగట్లో సరుకుగా మార్చి, కొందరు అడ్మిషన్ల దందాకు సహకరిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల పేర్లు, చిరునామా, ఫోన్ నంబర్లు ప్రైవేట్ కాలేజీల చేతుల్లోకి వెళుతుండడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ డేటాబేస్ నుంచే లీకేజీ? విద్యార్థులు కేవలం ప్రభుత్వ అధికారిక సైట్లలో, పాలిటెక్నిక్ పరీక్ష అప్లికేషన్లలో లేదా తాము చదివిన స్కూళ్లలో మాత్రమే ఫోన్ నంబర్లు నమోదు చేస్తారు. అనకాపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయం, ఇంటర్మీడియెట్ విద్యాశాఖ ప్రాంతీయ కార్యాలలయం, లేకపోతే విద్యార్థులు చదివే పాఠశాలలు, కళాశాల నుంచి వెళ్లే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ఏటా అడ్మిషన్ల సీజన్లో ప్రభుత్వ విద్యాశాఖ ఆఫీసుల్లోని కీలక సమాచారాన్ని భారీ మొత్తాలకు కొనుగోలు చేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా డేటా లీకేజీ అవుతోందని విమర్శలు వస్తున్నాయి. ఫలితాలు వచ్చిన వెంటనే ప్రైవేట్ సంస్థల సిబ్బంది విద్యార్థుల ఇళ్లకు ఎలా చేరుకోగలుగుతున్నాయో అధికారులకు తెలియదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచే లీక్ అవుతుందా లేక సంబంధిత పాఠశాలల నుంచి వెళ్తుందా అనే కోణంలో తక్షణమే ఉన్నతాధికారులు, సైబర్ క్రైమ్ విభాగం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. -
కళ్ల ముందే కబ్జా
తగరపువలస: భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీ పరిధిలోని చిన్నిపేట సర్వే నంబర్ 67లో ఉన్న సుమారు 18 సెంట్ల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.కోటి విలువైన ఈ స్థలాన్ని మూడు రోజులుగా జేసీబీతో చదును చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు వీఆర్వో దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని, పైగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో ఇదే ప్రభుత్వ భూమిలో దళిత కుటుంబాలు నివాసాల కోసం పాకలు వేసుకునేందుకు ప్రయత్నించగా స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైందని గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు. అనంతరం అక్కడ సాయిబాబా ఆలయం, సామాజిక భవనాలు నిర్మించారని, ఆలయ పూజారి పేరుతో నిర్మించిన ఇంటిని ప్రస్తుతం ఇతరులకు అద్దెకు ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మిగిలిన భూమిని వాటాలుగా పంచుకునేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఇదే ప్రాంతంలో రజక సామాజిక వర్గానికి చెందిన ఓ పేద మహిళ ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నప్పటికీ, ఆమెకు 60 గజాల స్థలం కేటాయించడంలో మాత్రం అధికారులు ముందుకు రావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై వీఆర్వో రిజ్వాన్ను వివరణ కోరగా.. ఫెన్సింగ్ విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. వీఆర్ఏను పంపించి స్థలాన్ని పరిశీలించి, నివేదికను భీమిలి తహసీల్దార్కు అందజేస్తానని చెప్పారు. వీఆర్వోకు తెలియదట..! -
పండగకు వస్తానని.. తిరిగిరాని లోకాలకు
● ఎండాడ వద్ద రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి ● మృతుడు దేవరాపల్లి మండలం పెదనందిపల్లి వాసి దేవరాపల్లి/కొమ్మాది: పండగకు ఆదివారం వస్తానని చెప్పి...భార్య, పిల్లల్ని చీడికాడ మండలం మంచాలలోని ఆమె పుట్టింటికి శనివారం పంపించాడు. గంటల వ్యవధిలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆదివారం తెల్లవార జామున భర్త మరణ వార్తను ఫోన్ ద్వారా తెలుసుకున్న భార్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. దేవరాపల్లి మండలం పెదనందిపల్లి శివారు సత్యనారాయణపురం కాలనీకి చెందిన పెనుగంటి నరసింహమూర్తి (34) ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నాడు.విశాఖలోని ఎండాడ సమీపంలోని ఓ వ్యక్తికి సంబంధించిన ఫర్నిచర్ను ఆటోలో ఎక్కించుకుని శనివారం రాత్రి బయలుదేరాడు. అదే సమయంలో కాశీ వెళ్తున్న కొందర్ని అదే ఆటోలో ఎక్కించుకుని రైల్వే స్టేషన్లో దించాడు. అక్కడి నుంచి ఆదివారం వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో ఎండాడ వెళ్తుండగా ఎండాడ జంక్షన్ వద్ద సిరిగుడినగర్ వెళ్లేందుకు ఆటో యూటర్న్ తీసుకుంటుండగా.. పీఎంపాలెం వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిన నరసింహమూర్తి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి భార్య మహేశ్వరి, కుమార్తె గుణశ్రీ, కుమారుడు ఉదయ్కిరణ్ ఉన్నారు. నర్సింహమూర్తి మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. పండగకు వస్తానని మమ్మల్ని పంపించి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయవంటూ భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. పిల్లలను ఎలా పోషించాలంటూ ఆమె రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. స్వగ్రామంలో ఆదివారం కుటంబ సభ్యులు, బంధువుల ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిపారు. -
ఫోన్ కాల్స్తో ఇబ్బందులు
తమ ఫోన్ నంబర్లు ప్రెవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఎలా వేళ్లాయో అర్థం కావడం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు వస్తున్న ఫోన్ కాల్స్ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. అలాగే తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా అడ్మిషన్లు పేరిట ఫోన్ కాల్స్ రాకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలి. – జామి సీతారామయ్య, అనకాపల్లి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల పర్సనల్ డేటా ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల చేతుల్లోకి ఎలా చేరుతుందో విద్యాశాఖ సమాధానం చెప్పాలి. ఫీజు రాయితీల పేరిట తల్లిదండ్రులను పదే పదే ఫోన్స్ కాల్స్తో ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. – జి. ఫణీంద్ర కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి -
ముగిసిన జిల్లా ఔత్సాహిక క్రికెటర్ల శిక్షణ
మాట్లాడుతున్న జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు విశాఖ స్పోర్ట్స్ : జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి క్రికెట్ శిక్షణా శిబిరాలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమం వైఎస్సార్ స్టేడియంలో నిర్వహించారు. జిల్లాలోని వైఎస్సార్ స్టేడియం, స్టీల్ప్లాంట్ స్టేడియం, జింక్ గ్రౌండ్, ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వేదికలుగా శిబిరాలు నిర్వహించారు. అండర్–10 నుంచి అండర్–16 వరకు బాలురతో పాటు 50 మంది బాలికలు శిక్షణ పొందారు. శిబిరాల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకునేలా కోచ్లు శిక్షణ అందించారు. ముగింపు సందర్భంగా శిక్షణార్థుల మధ్య పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన అండర్–14, అండర్–16 క్రీడాకారులను ‘ప్రాబబుల్స్’గా ఎంపిక చేసి, భవిష్యత్తులో జిల్లా జట్ల ఎంపికలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు జి.ఎస్. వర్మ, కార్యదర్శి పార్థసారథి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త జోన్ శకం..
డెక్లోని తాత్కాలిక కార్యాలయంలో జోన్ కార్యకలాపాలకు శ్రీకారం నిరాడంబరంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉదయం 9 గంటల నుంచి లాంఛనంగా మొదలు నేడే ప్రారంభం!హాజరుకానున్న మూడు జోన్ల మేనేజర్లు, డీఆర్ఎంలు రైళ్ల రాకపోకలతో కార్యకలాపాలు ప్రారంభించనున్న అధికారులు క్రమంగా నిర్వహణ, ఆస్తుల విభజన అంశాలు కొలిక్కి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేసిన రైల్వే బోర్డు అధికారులు సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దశాబ్దాల పోరాటాలు, కోట్లాది మంది ఆశల నడుమ సాధించుకున్న ‘కొత్త రైల్వే జోన్’ శకం సోమవారం లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. రైల్వే బోర్డు ఉన్నతాధికారుల మార్గనిర్దేశంతో.. నేటి నుంచి వీఎంఆర్డీ డెక్ భవనంలోని తాత్కాలిక కార్యాలయం వేదికగా జోనల్ కార్యకలాపాలకు ఉన్నతాధికారులు శ్రీకారం చుడుతున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సోమవారం ఉదయం 9 గంటలకు నిరాడంబరంగా ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుండగా.. రైల్వే ముఖచిత్రంలో విశాఖ కేంద్రంగా సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. రైళ్ల రాకపోకలతో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. డిపార్ట్మెంట్ల వారీగా సంబరాలు చేసుకునేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలకు శ్రీకారం దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు డెక్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయం నుంచి సోమవారం నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా జరిగే ఈ కార్యక్రమానికి జోన్కు చెందిన జనరల్ మేనేజర్లు, డీఆర్ఎంలు హాజరుకానున్నారు. ఢిల్లీలోని రైల్వే బోర్డు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. రైళ్ల రాకపోకల పర్యవేక్షణతో పాటు పాలనాపరమైన కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. జోన్ అధికారులు వాల్తేరు డివిజన్ అధికారులతో, వివిధ విభాగాల అధిపతులతో సమీక్షలు నిర్వహించి శాఖల వారీ బాధ్యతలు, ఫైళ్ల బదిలీ ప్రక్రియ, మౌలిక వసతుల కల్పనపై కార్యాచరణ రూపొందించనున్నారు. అలాగే ఉద్యోగుల బదిలీలు, ఆప్షన్ల ప్రక్రియలో ఉన్న సమస్యలపై రైల్వే కార్మిక సంఘాలతో కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ నెలాఖరుకల్లా ఉద్యోగుల సర్దుబాటు పూర్తి : కొత్త జోన్ ఏర్పాటులో అత్యంత కీలకమైన మానవ వనరుల కేటాయింపు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈ జోన్లో పనిచేసేందుకు ఇప్పటికే వివిధ విభాగాల నుంచి సుమారు 3,500 మందికి పైగా సిబ్బంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరిలో ఇప్పటి వరకూ 800 మందికి పైగా ఉద్యోగుల నియామక సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. మిగిలిన సిబ్బంది బదిలీలు, సర్దుబాటు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేలా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు బోర్డు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. డిపార్ట్మెంట్ల వారీగా సంబరాలు కల సాకారం అవుతున్న నేపథ్యంలో రైల్వే ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ క్షణం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతుండటంతో, డిపార్ట్మెంట్ల వారీగా ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ నిర్వహించుకునేందుకు సిబ్బంది భారీ ఎత్తున సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒక పక్క విధులు నిర్వర్తిస్తూనే, తమ కలల జోన్ ఆవిర్భావాన్ని కేక్ కటింగ్ చేసి.. స్వీట్స్ పంచుకుంటూ పండుగలా చేసుకునేందుకు సిద్ధమయ్యారు.కొలిక్కి వస్తున్న ఆస్తుల విభజన వైజాగ్ జోన్ పరిధిలో నిర్వహణ, భౌగోళిక సరిహద్దులు, ఆస్తుల విభజన ప్రక్రియలు క్రమంగా ఓ కొలిక్కి వస్తున్నాయి. పరిపాలనాపరమైన చిక్కులు తలెత్తకుండా స్పష్టమైన కార్యాచరణతో పాత జోన్ల నుంచి ఫైళ్ల బదిలీ, ఆస్తుల పంపిణీకి సంబంధించిన సాంకేతిక అంశాలను ఉన్నతాధికారులు సామరస్యంగా పరిష్కరిస్తున్నారు. రానున్న రోజుల్లో విశాఖ కేంద్రంగా మౌలిక సదుపాయాల కల్పన, శాశ్వత భవన నిర్మాణం తదితర భారీ ప్రాజెక్టులకు ఈ పరిణామం మార్గం సుగమం చేయనుంది. రేపటి నుంచి పూర్తిస్థాయి సమన్వయం దక్షిణ కోస్తా జోన్ పాలనా యంత్రాంగం ఇకపై రోజువారీ విధుల్లో వేగం పెంచనుంది. 2వ తేదీ నుంచి వివిధ విభాగాల అధిపతులు (హెచ్వోడీలు) తమ తమ విభాగాల కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. ఈ క్రమంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటి వరకూ ఈస్ట్కోస్ట్రైల్వే జోన్ పరిధిలో జరిగిన పాలనా వ్యవహారాలను, వైజాగ్ జోన్ విధానాలకు అనుగుణంగా మార్చే ప్రక్రియపై రేపు స్థానిక వాల్తేరు డివిజన్ అధికారులతో కీలక సమన్వయ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. రైళ్ల నిర్వహణ, గూడ్స్ రవాణా ఆదాయం మళ్లింపు వంటి సాంకేతిక అంశాలపై ప్రాథమిక చర్చలు జరగనున్నాయి. ఇంకా సిద్ధం కాని జోన్ గైడ్ లైన్స్ దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించి జనరల్ గైడ్ లైన్స్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. నూతన మార్గదర్శకాలు ఖరారయ్యే వరకు, ప్రస్తుతం ఆయా డివిజన్లలో అమలవుతున్న పాత గైడ్ లైన్స్ కొనసాగించాలని ఆదివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా, విశాఖపట్నం డివిజన్కు సంబంధించి తూర్పు కోస్తా రైల్వే నిబంధనలను యథాతథంగా అమలు చేయనున్నారు. అదేవిధంగా గుంతకల్లు, విజయవాడ, గుంటూరు డివిజన్లలో దక్షిణ మధ్య రైల్వే నిబంధనలు కొనసాగుతాయి. సిబ్బంది సమస్యలు, బదిలీలు, పదోన్నతులు, ఇతర పరిపాలనా సంబంధిత వ్యవహారాలన్నీ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత విధానంలోనే జరుగుతాయని అధికారులు వివరించారు. కొత్త జోన్ మార్గదర్శకాలు వచ్చే వరకు ఏ నియమాలు పాటించాలనే దానిపై ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుత విధానాలనే అనుసరిస్తారని జోన్ ఓబీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెదిరెడ్ల రాజశేఖర్ సూచించారు. -
ఏపీపీటీఏ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్గా శ్రీనివాస్
కశింకోట: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఏపీపీటీఏ) రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్గా కశింకోటకు చెందిన కొత్తపల్లి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల పదవీ కాలానికి గాను సంఘం ఎన్నికలు విజయవాడలో జరిగాయి. తనను నియమించిన కమిటీకి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మరింత శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. జిల్లా సంఘంలో పలు పదవులు నిర్వహిస్తూ ఉపాధ్యాయుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్కు తాజా గా ఉన్నత పదవి లభించడం పట్ల ఏపీపీటీఏ అనకాపల్లి జిల్లా శాఖ అధ్యక్షుడు బోయిన చిన్నారావు, ప్రధాన కార్యదర్శి చల్లా నాగేశ్వరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
రోడ్డు బాగు చేయాలని యువకుల నిరసన
పెదమదీనలో ప్ల కార్డులతో నిరసనకు దిగిన యువకులు బుచ్చెయ్యపేట: రోడ్డను బాగుచేయాలని డిమాండ్ చేస్తూ ఐదు గ్రామాల యువకులు శనివారం రాత్రి నిరసనకు దిగారు. గున్నెంపూడి,పెదమదీన,చినమదీన,కొండపాలెం,పిల్లవానిపాలెం గ్రామాల యువకులు పెదమదీనలో సమావేశమయ్యారు. అనంతరం రోడ్డును బాగు చేసి రవాణా సదుపాయం కల్పించాలని ప్లకార్డులతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రోడ్డు పనులు ప్రారంభించారని, మూడేళ్లు అవుతున్న నేటికీ పూర్తి చేయలేదన్నారు. రోడ్డు గోతులతో నిండిపోవడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా గర్భిణులు,రోగులు ఆస్పత్రికి వెళ్లడానికి నరకయాతన పడుతున్నారన్నారు. తక్షణం పెదమదీన,గున్నెంపూడి రోడ్డును బాగు చేయాలని ఐదు గ్రామాల ప్రజలు,యువకులు సోమవారం ఛలో కలెక్టరేట్కు వెళ్లాలని నిర్ణయించారు. సుమారు వెయ్యి మందితో ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. తల్లికి తనయ తల కొరివి కశింకోట: ఓ కుమార్తె కన్నతల్లి రుణం తీర్చుకుంది. తన తల్లికి తల కొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన కశింకోటలో శనివారం చోటు చేసుకుంది. స్థానిక గవరపేట మేదర వీధి ప్రాంతానికి చెందిన ఆళ్ల నూకరత్నం అనారోగ్యంతో శనివారం మృతి చెందింది. భర్త చాలా కాలం క్రితం కాలం చేశారు. ఆమె ఏకై క కుమార్తె వెంకటలక్ష్మి (బేబీ) తన తల్లికి బంధు మిత్రులతోపాటు వెళ్లి స్థానిక సాధు మఠంలోని శ్మశానంలో తల కొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. -
ఆలయాల్లో చోరీ చేస్తున్న దొంగ అరెస్టు
పాయకరావుపేట: ఆలయాల్లో చోరీలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన స్థానిక పోలీసు స్టేషన్లో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పాయకరావుపేట పట్టణంలోని కడిమి వారి వీధికి చెందిన గుద్దాటి రాజు అలియాస్ చిన్న అనే వ్యక్తి చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్టు చెప్పారు. పట్టణంలోని దుర్గానగర్ కాలనీలో గల దుర్గాలమ్మ గుడిలో 2 తులాల బంగారం, రూ.50 వేల నగదు, అరట్లకోట గ్రామ పరిధిలో ఓరుగుంటాలమ్మ, కనకదుర్గమ్మ ఆలయాల్లో రూ.5 వేల నగదు, పట్టణంలోని బృందావనంలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రూ.1.75 లక్షల విలువ కలిగిన బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు తెలిపారు. నిందితుడు రాజుపై తుని, నర్సీపట్నం, అనకాపల్లి, అచ్యుతాపురం పోలీసు స్టేషన్ల్లో కేసులు నమోదైనట్టు చెప్పారు. రాజుపై ఇప్పటివరకు 21 కేసులు నమోదైనట్టు తెలిపారు. నిందితుని వద్ద నుంచి 2.56 తులాల బంగారం, రూ.2,520 నగదు రికవరీ చేశామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు చెప్పారు. ఎంతో కృషి చేసి కేసును చేధించిన సీఐ ఎస్.శంకరరావు, ఎస్ఐ పురుషోత్తం, హెచ్సీ వెంకట కిరణ్ను, కానిస్టేబుల్ సతీష్, నారాయణరావు, చించయ్య, మదీనాలను జిల్లా పోలీసు అధికారులు అభినందినట్టు డీఏస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. -
పరిమళించిన మానవత్వం
మాకవరపాలెం: మానవత్వం పరిమళించింది. సామాజిక మాధ్యమంలో వచ్చిన చిన్న వీడియో సందేశం మానవతా మూర్తుల హృదయాలను కదలించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవచ్ఛమైన ఆటో డ్రైవరుకు ఆపన్నహస్తం అందించేలా చేసింది. రెండు వారాల్లోనే రూ.18.40 లక్షల సాయమందించి అతని కన్నీటి చెమ్మను తుడిచింది. మండలంలోని రాచపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పట్నాల శ్రీను ప్రమాదంలో గాయపడి రెండేళ్లుగా మంచానికి పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శెట్టిపాలెం గ్రామానికి చెందిన లాలం ఏసుబాబు స్థాపించిన సాయానికి 10 రూపాయలు సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీను కుటుంబం దీనస్థితిపై సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేశారు. భార్య, ముగ్గురు పిల్లలతో ఇబ్బందులు పడుతుండడంపై స్పందించిన దాతలు విరివిగా విరాళాలుగా అందించేందుకు ముందుకు వచ్చారు. ఇలా రెండు వారాల్లో విరాళాలుగా వచ్చిన రూ.18 లక్షల 40 వేలను శనివారం సంస్థ సభ్యులు శ్రీను కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు ఏసుబాబు మాట్లాడుతూ 2019 నుంచి ఇప్పటివరకు ఏడుగురు బాధితులకు రూ.కోటి ఆర్థిక సాయంగా అందించామన్నారు. ఏడాదికి ఒక కుటుంబానికి సాయం చేయడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తుందన్నారు. తమను నమ్మి ఆర్థిక సాయం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో హోమియోపతి వైద్యుడు శశిధర్, స్థానిక ఎలక్ట్రికల్ ఏఈ బాలకృష్ణ, మనం ట్రస్టు చైర్మన్ రమేష్, అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాల అధ్యాపకుడు హరిబాబు, 30 మంది సంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
విశ్రాంత జీవితం ప్రశాంతంగా సాగాలి
పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బందిని సత్కరించిన ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: విశ్రాంత జీవితం కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, ప్రశాంతంగా సాగాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఆకాంక్షించారు. వివిధ పోలీస్ స్టేషన్లో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందిన అనకాపల్లి టౌన్ ఏఎస్ఐ బి.రామ్కుమార్, పరవాడ ఏఎస్ఐ వి.త్రినాథ్రావు, ఏఆర్ హెచ్సీ ఎల్.గోవిందరావులను శనివారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఆయన శాలువాలతో సత్కరించారు. ఉమ్మడి జి ల్లాలో వీరు అందించిన సేవలు శాఖకు గర్వకారణమన్నారు. ఏఎస్పీ ఎల్.మోహనరావు పాల్గొన్నారు. -
అనకాపల్లి జిల్లా రిజిస్ట్రార్గా రత్నకుమార్
అనకాపల్లి: జిల్లా నూతన రిజిస్ట్రార్గా పి.రత్నకుమార్ నియమితులయ్యారు. ఈయన విశాఖ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆడిట్ విభాగంలో విధులు నిర్వహిస్తూ పదోన్నతపై అనకాపల్లి జిల్లా రిజిస్ట్రార్గా వచ్చారు. శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. విశాఖ జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావు... ఇప్పటివరకు ఇక్కడ ఇన్చార్జి రిజిస్ట్రార్గా విధులు నిర్వహించారు. ఆయన నుంచి రత్నకుమార్ బాధ్యతలను స్వీకరించారు. జిల్లా రిజిస్ట్రార్ల సంఘం నాయకులు, సీనియర్ అధికారులు బంగారు వెంకటేశ్వరరావు, అప్పారావు, గీతాలక్ష్మి, బేగం, శ్రీనివాసరావు, శ్రీకాంత్ పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. -
సుగర్స్ రైతులకు బకాయిల చెల్లింపులో ప్రభుత్వం విఫలం
కె.కోటపాడు: గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ఆదుకుంటామని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి నాయకులు విస్మరించారని చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేచలపు కాసుబాబు అన్నారు. కె.కోటపాడులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు చెందిన 24 వేల మంది సభ్య రైతులు, సుమారు రెండు వేల మంది కార్మికులు గోవాడ సుగర్ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. గోవాడ సుగర్స్ రైతులకు సుమారు రూ.30 కోట్ల బకాయిల చెల్లింపులో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల ఆవేదనను రెండు నియోజకవర్గాల శాసన సభ్యులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈ ఏడాది గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మహాజన సభను కూడా నిర్వహించకపోవడంతో శోచనీయమన్నారు. ఫ్యాక్టరీ తెరిపించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చెరకు సీజన్ ప్రారంభమవుతున్న దృష్ట్యా ప్యాక్టరీ ద్వారా రైతులకు విత్తనాలను అందించాలని కాసుబాబు కోరారు. -
ఓట్లు తొలగించేందుకు కుట్ర
నక్కపల్లి: స్పెషల్ ఇంటెన్సివ్ రిజిజన్(సర్)పేరుతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓట్లను తొలగించేందుకు అధికార పక్షపార్టీలు తెరతీశాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని శాసన మండలి సభ్యురాలు వరుదు కల్యాణి అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గ స్థాయి బీఎల్ఏల శిక్షణ కార్యక్రమం శనివారం నక్కపల్లి సుబ్బరామిరెడ్డి కల్యాణ మండపంలో జరిగింది. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కంబాల జోగులు ఽఅధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ ఇటీవల లక్షల్లో ఓట్లు తొలగించడం వల్ల పలు రాష్ట్రాల్లో పార్టీలు అధికారాన్ని కోల్పోయాయన్నారు. పదేళ్లనుంచి వరుసగా ఓటుహక్కు వినియోగించుకున్నవారి ఓట్లు కూడా ఈ రివిజన్పేరుతో తొలగించారని చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రతిపక్ష పార్టీ ఓట్లను భారీగా తొలగిస్తున్నారన్నారు. ఈ స్పెషల్రివిజన్పేరుతో ఎన్నికల సంఘం, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ చాలా సీరియస్గా తీసుకుందని చెప్పారు. గతంలో పార్టీ తరఫున ప్రతి పోలింగ్ బూత్కు ఒక కన్వీనర్ను నియమించామని, తాజాగా వారికి సహాయకులుగా ప్రతి బూత్కు మరో బూత్ ఏజెంట్ను నియమించినట్టు చెప్పారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్ల తొలగింపు లక్ష్యంగా అధికార పార్టీ నాయకులు ప్రణాళిక రూపొందించారన్నారు. అందువల్ల ప్రతి బీఎల్ఏ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఓటర్ల రివిజన్సమయంలో అధికారులు అడిగిన డిక్లరేషన్ ఫారాలను కచ్చితంగా అందజేయాలన్నారు. వైఎస్సార్సీపీ ముఖ్యనాయకులు, మండల, పార్టీ జిల్లా సీనియర్ నాయకుల సహాయం తీసుకోవాలన్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. తాత్కాలికంగా వలస వెళ్లిన వారి ఓట్లను కూడా తొలగిస్తున్నారన్నారు. ఉపాధి కోసం నెల,రెండునెలలు ఇతర ప్రాంతాలకు వెళ్లినవారి ఓట్లు ప్రధాన గ్రామం నుంచి కొత్తగా ఏర్పాటయిన జగనన్న కాలనీలకు వెళ్లిన వారి ఓట్లు కూడా తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఎస్ఐఆర్పై పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇప్పటికే పలు సలహాలు సూచనలు చేశారని చెప్పారు. అన్యాయంగా ఓట్లుతొలగిస్తే అటువంటి వారి పేర్లతోకూడిన జాబితాలు కలెక్టర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేయాలన్నారు. కంబాలజోగులు,డి.వి.సూర్యనారాయణరాజు తదితరులు మాట్లాడుతూ ఈ ఓటర్ల రివిజన్ను తేలిగ్గా తీసుకోవద్దని చెప్పారు. వైఎస్సార్సీపీ మద్దతు దారుల ఓట్లు రద్దచేస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనే సత్తాలేక ఇటువంటి వాటి ద్వారా అధికారానికి దూరం చేయాలనే కుట్రజరుగుతోందన్నారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్రకార్యదర్శులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, నియోజకవర్గ పరిశీలకులు దంతులూరి దిలిప్కుమార్, పార్టీ నాలుగు మండలాల అధ్యక్షులు గొర్ల గోవిందరావు, మధు వర్మ, గెడ్డమూరి శ్రీనివాసరావు,పైలా రమేష్,పార్టీ జిల్లాప్రధాన కార్యదర్శి శీరం నర్సింహమూర్తి, ఎంపీపీలు ఏనుగుపల్లిరత్నం, జెడ్పీటీసీలు గోసలకాసులమ్మ, లంక సూరిబాబు, సిద్దాబత్తుల ఉమాదేవి,వైస్ఎంపీపీ వెలగ ఈశ్వరరావు, బూత్కమిటీల రాష్ట్రకార్యదర్శి గొర్ల బాబూరావు,వైఎస్సార్సీసీ ఐటీ వింగ్ ప్రతినిధి కొమ్ము శ్రీనివాసరావు, సీనియర్నాయకులు లొడగల చంద్రరావు, జగతా శ్రీను,పొడగట్ట పాపారావు, చోడిపల్లి అప్పన్న,పోశిన నరేష్,విద్యార్థి విబాగం అధ్యక్షుడుయలమంచిలి చందు, ప్రచార విబాగం అధ్యక్షుడు కొప్పిశెట్టి హరి, రైతువిభాగం కార్యదర్శి సూరాకాసుల గోవిందు,వాణిజ్యవిబాగం అధ్యక్షుడు వైసత్తిబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కే వెంకటరావు దనిశెట్టిబాబి తదితరులు పాల్గొన్నారు, మాట్లాడుతున్న సమన్వయకర్త కంబాల జోగులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి -
రీ సర్వే పేరిట డబ్బులు వసూలు దారుణం
దేవరాపల్లి: భూముల రీ సర్వే పేరిట రైతుల నుంచి డబ్బులు వసూలు చేయడం దారుణమని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ విమర్శించారు. దేవరాపల్లిలో శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. పారదర్శకంగా చేపట్టాల్సిన భూముల రీ సర్వేకు కొందరు అధికారులు, అధికారుల పేరు చెప్పి కొందరు నాయకులు ఎకరానికి రూ. 2వేలు నుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నట్లు పలువురు రైతులు తమ దృష్టికి వచ్చారన్నారు. రీసర్వేను క్షేత్ర స్థాయిలో పారదర్శకంగా చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రీ సర్వే చేపట్టే తేదీ, సమయాన్ని భూ యజమానులు, రైతులకు లిఖిత పూర్వకంగా తెలియజేయాల్సి ఉండగా వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం అందించడంతో స్మార్ట్ ఫోన్లు లేని రైతులకు సమాచారం అందడం లేదని తెలిపారు. సమాచారం తెలియక రైతులు హాజరు కాకపోవడంతో సిబ్బంది తూతూ మంత్రంగా రీ సర్వే నిర్వహిస్తున్నారని, దీంతో రైతులకు ప్రయోజనం కంటే కొత్త చిక్కులు వస్తున్నాయన్నారు.కొందరు రెవెన్యూ సిబ్బంది అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా సర్వే చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పారు. రీ సర్వే పేరుతో దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. రీ సర్వేలో జరుగుతున్న అవకతవకలపై పక్కా ఆధారాలతో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు తగు న్యాయం జరిగేలా కృషి చేస్తానని రమణ తెలిపారు. -
మంగళం !
మహిళా మార్టులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం, కార్పొరేట్ మాల్స్కు దీటుగా ఏర్పాటైన వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్లపై కూటమి ప్రభుత్వం శీతకన్నేసింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఐదు మార్ట్లలో ప్రస్తుతం నాలుగు పూర్తిగా మూతపడ్డాయి. పెట్టుబడి పెట్టిన డ్వాక్రా సభ్యులు లబోదిబోమంటున్నారు. సాక్షి, అనకాపల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు మరింత చేయూతనిస్తూ వారు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాలో వెలుగు శాఖ ఆధ్వర్యంలో వైఎస్సార్ మహిళామార్టులను ఏర్పాటు చేసింది. తద్వారా మహిళలు వ్యాపారాభివృద్ధి చేసుకొని ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోన్ రెడ్డి లక్ష్యం. పెద్ద పెద్ద మాల్స్ని తలదన్నేలా ఏర్పాటు చేసి, తక్కువ ధరకే నిత్యావసర సరుకులు విక్రయించారు. ఈ మార్ట్లలో వివిధ రకాల నిత్యావసర సరుకులను తక్కువ ధరకు పొదుపు మహిళలు కొనుగోలు చేసుకుంటూ సద్వినియోగం చేసుకోవడంతో ఒకవెలుగు వెలిగాయి. ఈ మార్ట్ల్లో సభ్యత్వం పొందిన పొదుపు గ్రూపు సభ్యులకు డోర్ డెలివరీ సదుపాయం కూడా కల్పించారు. జిల్లాలో మాకవరపాలెం, మాడుగుల, చోడవరం, సబ్బవరం, అనకాపల్లి, అడ్డురోడ్డులో కార్పొరేట్ తరహాలో ఒక్కో మార్టును సుమారు రూ.40లక్షలతో ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మహిళా మార్టులపై శీతకన్నేసింది. నిత్యావసర సరుకులపై ఇస్తున్న సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేశారు.దీనికి తోడుగా ఓపెన్ మార్కెట్లో ధరలు విపరీతంగా పెరగడం, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో మార్ట్లు నష్టాల బాట పట్టాయి. ప్రభుత్వ నిధులు సకాలంలో విడుదల కాకపోవడం, అమ్మకాలు పడిపోవడంతో భవనాల అద్దెలు, కరెంట్ బిల్లుల నిర్వహణ భారంగా మారింది. మార్ట్లలో పనిచేసే సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందకపోవడంతో వారు విధులకు దూరమయ్యారు. దీంతో మాకవరపాలెం మినహా మిగిలిన నాలుగు మార్టులు మూతపడ్డాయి. పెట్టుబడి సొమ్ము మాటేమిటి ! పెట్టుబడి నిమిత్తం డ్వాక్రా సభ్యుల నుంచి ఒక్కో మార్టుకు సుమారు రూ. 40 లక్షల చొప్పున వసూలు చేశారు. మార్ట్లు మూతపడటంతో ఆ పెట్టుబడి డబ్బులు తిరిగి ఎప్పుడు వస్తాయో తెలియక మహిళలు ఆందోళన చెందుతున్నారు. నాడు నెలకు కనీసం రూ. 250 సరుకులు కొనేలా ఉన్న నిబంధనలను, ప్రోత్సాహకాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. నేడు : సబ్బవరంలో మూతపడిన మహిళా మార్టు -
గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
అనకాపల్లి: కారులో రెండు బ్యాగుల్లో 56.40 కిలోల గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు రూరల్ సీఐ జి.అశోక్కుమార్ శనివారం తెలిపారు. మండలంలో బవులవాడలో ఎస్ఐ ఎ.విభూషణరావు వాహనాలు తనిఖీ చేసినట్టు చెప్పారు. ఆ సమయంలో ఒడిశా రాష్ట్రం నుంచి మహారాష్ట్రకి వెళుతున్న కారును తనిఖీ చేయగా గంజాయి బయటపడినట్టు తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన రాజు అంత్రు, మహారాష్ట్ర రాష్ట్రం థానే జిల్లాకు చెందిన రూపేష్ రాజు చిక్నేలను అరెస్టు చేసినట్టు చెప్పారు. వారి వద్ద నుంచి గంజాయి, నాలుగు సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.28.20 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. -
ఏపీ పీజీసెట్లో శ్రీ ప్రకాష్ విద్యార్థుల ప్రతిభ
పాయకరావుపేట: శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ అయిన స్పేసెస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏపీ పీజీసెట్ – 2026లో మంచి ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ డాక్టరు ఎ.రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయి కెమిస్ట్రీ విభాగంలో ఇ.వాసు 8వ ర్యాంకు, ఎన్.నాగేశ్వరి 45వ ర్యాంకు, పి.మైథిలీ 99వ ర్యాంకు, లైఫ్ సైన్స్ విభాగంలో కె.స్నేహ 48వ ర్యాంకు, ఫిజిక్స్ విభాగంలో వై.దీప్తి 69వ ర్యాంకు, జువాలజీ విభాగంలో వై.పావని 84వ ర్యాంకు, ఎస్.లోకేశ్వరి 98వ ర్యాంకు సాధించారన్నారు. స్వయం ఉపాధి స్వావలంబన లక్ష్యాలతో సాగే తమ కళాశాలలో డిగ్రీతోపాటుగా వివిధ పోటీ పరీక్షలకు ఇస్తున్న శిక్షణతో ఈ ర్యాంకులు సాధించారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె. నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. -
మైచర్లపాలెంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
చోడవరం: అంబేడ్కర్ ఆశయ సాధనకు అంతా కృషి చేయాలని అంబేడ్కర్ మిషన్ ఇండియా(ఏఐఎం) వ్యవస్థాపక అధ్యక్షుడు, ఐపీఎస్ సునీల్కుమార్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మండలంలోని మైచర్లపాలెంలో నూతనంగా నిర్మించిన అంబేడ్కర్ విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు అంబేడ్కర్ యూత్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సునీల్కుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలన్న ఆశయంతో అంబేడ్కర్ ఎంతో పనిచేశారన్నారు. మంచి క్రమశిక్షణతో యువత ముందడుగు వేస్తూ ఉన్నత ఆశయాలతో అభివృద్ధి చెందుతూ దేశ సేవలో తరించాలని కోరారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గాడి కాసు, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రతినిధి మూర్తా శ్రీనివాసరావు, మైచర్లపాలెం అంబేడ్కర్ యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
దేవరాపల్లిలో చోరీ
దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లి గుమ్మడివీధిలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన జాగరపు పైడితల్లి ఇంటిలో ట్రంక్ పెట్టెలో భద్రపరిచిన 5 తులాలకు పైబడి బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీకి గురయ్యాయి. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ శనివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పైడితల్లి ఈ నెల 24న వాడపల్లి వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లి మరుసటి రోజు ఇంటికి వచ్చాక తన వద్ద ఉన్న డబ్బును ఇంటిమేడపై గదిలోని పెట్టెలో భద్రపరిచేందుకు వెళ్లాడు. అప్పటికే పెట్టె తెరిచి ఉండటంతో ఆందోళనకు గురైన బాధితుడు అందులో భద్రపరిచిన బంగారు అభరణాలు, డబ్బు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ క్లూస్ టీమ్లను, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుడు పైడితల్లి పిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బై బై వాల్తేరు
ఇక అంతా గతమే.. ఘన చరిత్రే.. ● 133 ఏళ్ల వాల్తేరు డివిజన్ అద్భుత ప్రస్థానానికి అధికారిక ముగింపు ● విశాఖపట్నం, రాయగడలుగా విడిపోయిన ’బంగారు బాతు’ ● నేటి అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం డివిజన్ యుగారంభం ● కొత్త విశాఖపట్నం డివిజన్ తొలి డీఆర్ఎంగా లలిత్ బోహ్రా వాల్తేరు డీఆర్ఎం కార్యాలయంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్గా పేరు మార్పుసాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ‘వాల్తేరు’ పేరు ఇక చరిత్ర పుటల్లోకి చేరబోతోంది. భారతీయ రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మక డివిజన్లలో ఒకటిగా గుర్తింపు పొందిన వాల్తేరు డివిజన్ ప్రస్థానం నేటి అర్థరాత్రితో ముగియనుంది. జూన్ 1 నుంచి ‘వాల్తేరు’ అనే పేరు అధికారికంగా రైల్వే మ్యాప్ నుంచి కనుమరుగై, దాని స్థానంలో కొత్తగా విశాఖపట్నం డివిజన్ ఆవిర్భవించనుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాల్తేరు డివిజన్ను విశాఖపట్నం, రాయగడ డివిజన్లుగా విభజించింది. మే 31 అర్ధరాత్రి నుంచి ఈ మార్పు అమల్లోకి రానుండగా, ప్రస్తుత వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోహ్రా నూతన విశాఖపట్నం డివిజన్కు తొలి డివిజనల్ రైల్వే మేనేజర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. 1893 నుంచి మొదలైన మహోజ్వల చరిత్ర వాల్తేరు డివిజన్ చరిత్ర మూలాలు 19వ శతాబ్దం చివరలో నిక్షిప్తమై ఉన్నాయి. మద్రాసు నుంచి కలకత్తాను కలిపే ‘తూర్పు తీర రైల్వే’ నిర్మాణంలో భాగంగా 1893లో వాల్తేరుకు తొలిసారిగా రైలు మార్గం ఏర్పడింది. అనంతరం 1896లో బెంగాల్–నాగ్పూర్ రైల్వే ఆధీనంలోకి వెళ్లిన ఈ ప్రాంతం.. ఆ తర్వాత కాలక్రమేణా వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖపట్నం పోర్టు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో సరుకు రవాణాకు వాల్తేరు ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెంది దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించింది. భారతీయ రైల్వేకు ‘బంగారు బాతు’ రైల్వే ఆదాయ వనరుల్లో వాల్తేరు డివిజన్ ఒక బంగారు బాతు లాంటిది. తూర్పు కోస్తా రైల్వే జోన్లోనే అత్యధిక ప్యాసింజర్, సరుకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన రికార్డు ఈ డివిజన్ సొంతం. ముఖ్యంగా ఇనుప ఖనిజం, బొగ్గు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాలో వాల్తేరు ఎన్నో రికార్డులను సృష్టించింది. ఛత్తీస్గ్లోని బైలడిల్లా గనుల నుంచి విశాఖ పోర్టుకు ఇనుప ఖనిజాన్ని చేరవేసే కొత్తవలస–కిరండూల్ (కేకే లైన్) మార్గం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి సజీవ సాక్ష్యం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన, క్లిష్టమైన మార్గాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ రూట్లో 56 సొరంగాలు, 87 భారీ వంతెనలు, 1236 చిన్న వంతెనలు ఉన్నాయి. ప్రకృతి అందాలు.. అవార్డుల పంట కేవలం సరుకు రవాణాకే పరిమితం కాకుండా, పర్యాటక రంగంలోనూ వాల్తేరు తనదైన ముద్ర వేసింది. బొర్రా గుహలు, అరకు లోయ వంటి ప్రకృతి సిద్ధమైన అద్భుత ప్రాంతాల మీదుగా సాగే రైలు ప్రయాణం పర్యాటకులకు మరుపురాని అనుభూతిని అందిస్తోంది. విశాలమైన అద్దాల పెట్టెలు కలిగిన ’విస్టాడోమ్’ రైలును ప్రవేశపెట్టి పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ఈ డివిజన్ దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. పర్యావరణ హితమైన రైల్వే నిర్వహణలో, స్వచ్ఛతలో అనేక జాతీయ పురస్కారాలను సైతం సొంతం చేసుకుంది. అయితే, విభజన కారణంగా ఈ ప్రకృతి రమణీయ మార్గంలో ఎక్కువ భాగం కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్లోకి వెళ్లిపోతోంది. గుండెల్లో పదిలంగా.. ‘వాల్తేరు’ జ్ఞాపకం వాల్తేర్ డివిజన్ గడిచిన దశాబ్ద కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ దేశంలోనే అత్యధిక ఆదాయం తీసుకొచ్చిన డివిజన్గా నిలిచింది. కలల జోన్ ఏర్పాటులో భాగంగా.. ఈ చారిత్రక డివిజన్ రూపాంతరం చెందడం ఒక విధంగా బాధాకరమే. స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు విశాఖలోనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, లోకల్ రిక్రూట్మెంట్ సెల్తో పాటు అన్ని రకాల నైపుణ్య శిక్షణా కేంద్రాలను తక్షణమే విశాఖ డివిజన్ పరిధిలోనే ఏర్పాటు చేయాలి. దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్గా వాల్తేరు జ్ఞాపకం స్థానికుల గుండెల్లో ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. –పెదిరెడ్ల రాజశేఖర్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు -
బూత్ లెవెల్ ఏజెంట్లు సైనికుల్లా పనిచేయాలి
మాడుగుల: బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకమైనదని, క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పని చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాల నాయుడు తెలిపారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా సవరణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైఎస్సార్సీపీ మాడుగుల నియోజకవర్గ బూత్లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తలు, నాయకులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని చోడవరంలో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ఓటర్లను తొలగించకుండా గ్రామాల్లోకి వస్తున్న సర్వే అధికారులతో కలిసి బూత్ ఏజెంట్లు పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఏజెంట్లు, పార్టీ నాయకులు అంకితభావంతో పనిచేయాలన్నారు. ఫారం, 6, 7, 8, గురించి అవగాహన కల్పించారు. దొంగ ఓటర్లను ఎలా గుర్తించాలి, అర్హత ఉన్న ఓటర్లను తొలగించకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలి తదితర అంశాల గురించి లేజర్స్క్రీన్పై స్వయంగా బూడి ముత్యాలనాయుడు అవగాహన కల్పించారు. అర్హత ఉన్న ఓటర్లను తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అనంతరం బూత్ ఏజెంట్లు అడిగిన ప్రశ్నలకు బూడి ముత్యాలనాయుడు సమాధానాలు చెప్పారు. వచ్చే నెల 4 వ తేదీ నుంచి వైఎస్సార్ సీపీ చేపట్టబోయే ఉద్యమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొనడంతో విజయవంతమైంది. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్ వన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుడు పైలా శ్రీనువాసరావు, మాడుగుల మాజీ ఎంపీపీ వేమవరపు రామధర్మజ, దేవరాపల్లి జెడ్పీటీసీ, ఎంపీపీలు కర్రి సత్యం, చింతల బుల్లి లక్ష్మితో పాటు నియోజకరవ్గంలో గల బూత్ లెవెల్ ఏజెంట్లు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
వస్త్ర పరిశ్రమలో ఎక్కువ మందికి ఉపాధి
అచ్యుతాపురం రూరల్: దేశంలో వ్యవసాయ రంగం మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో ఉన్న వస్త్ర పరిశ్రమలో ఎక్కువ మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. మండలంలోని సెజ్లో గల బ్రాండిక్స్ పరిశ్రమను శనివారం ఆయన సందర్శించారు. పరిశ్రమలో కార్మికుల పనితీరు, యాజమాన్యం కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. బ్రాండిక్స్ తరహాలో మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం సాధారణ దుస్తులతో పాటు ఏరోస్పేస్, డ్రోన్లు, రక్షణ, వైద్య, వ్యవసాయ రంగాల్లో టెక్నికల్ టెక్స్టైల్ వినియోగం విపరీతంగా పెరుగుతోందన్నారు. ఇటువంటి విభాగాల్లో రాష్ట్రానికి అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ్ కృష్ణన్, జౌళిశాఖ రాష్ట్ర కమిషనర్ రేఖా రాణి, బ్రాండిక్స్ ఇండియా పార్ట్నర్ దొరస్వామి, పరిశ్రమ సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యం
అనకాపల్లి: జిల్లాలో మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వారిపై జరుగుతున్న నేరాల్లో నిందితులకు త్వరితగతిన జైలు శిక్షలు పడేలా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆపరేషన్ ఆపరేషన్ దండాయన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్త, మహిళా, శిశు భద్రత విభాగం ఐజీ రాజకుమారి పర్యవేక్షణలో ఏపీ పోలీస్ శాఖ స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేయడానికి ప్రతిష్టాత్మక ‘ఆపరేషన్ దండాయన’ ను ప్రారంభించినట్టు తెలిపారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విధానం అవలంభించనున్నట్టు పేర్కొన్నారు. 60 రోజుల్లో చార్జిషీట్ వేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు శిక్షలు పడేవిధంగా చర్యలు చేపడతామని తెలిపారు. పునరావృత నేరస్తులు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు బాధిత మహిళలకు కౌన్సెలింగ్, ఉచిత న్యాయ సహాయం అందించనున్నట్టు పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రజల భాగస్వామ్యంతో సైబర్ వాచ్ కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటు సామాజిక కార్యకర్తలతో కలిసి పరివర్తన సదస్సులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ఇటీవల కోర్టులు ఇచ్చిన తీర్పులను పాఠశాలలు, కళాశాలల్లో ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 28 కేసుల్లో నిందితులకు కోర్టు ద్వారా శిక్షలు పడేవిధంగా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. -
ధాన్యం.. దైన్యం
ఆరుగాలం శ్రమించి పండించిన పంట చి‘వరి’ దశకు చేరినా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరగక అన్నదాత కష్టాల పాలవుతున్నాడు. పంటను అమ్ముకునేందుకు అవస్థలకు గురవుతున్నాడు. కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. మరో వైపు వాతావరణంలో మార్పులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వర్షానికి ధాన్యం తడిసి పోవడంతో మద్దతు ధర ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మాడుగుల: ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా రబీలో ఏడువేల ఎకరాల్లో వరి సాగు చేశారు. సరాసరిన ఎకరాకు రెండు టన్నుల వరకూ దిగుబడి లభించింది. ఈ లెక్కన 14 వేల టన్నుల వరకు పండింది. జిల్లాలో మొట్టమొదటి సారిగా రబీలో ధాన్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేవలం మూడు మండలాల్లో ఆరు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. జిల్లాలో సుమారు 14వేల టన్నుల ధాన్యం దిగుబడి రాగా, కేవలం 500 టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 50 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయడం లేదు. ఈ లక్ష్యంలో ఇప్పటి వరకు 350 టన్నులు మాత్రమే కొనుగోలులో చేశారు. సకాలంలో కొనుగోలు చేయకపోడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొనుగోలులో షరతులు జిల్లాలో రాంబిల్లి, మాడుగుల, బుచ్చెయ్యపేట మండలాల్లో రబీ ధాన్యం కొనుగోలుకు ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలులో కేంద్రాల నిర్వాహకులు పెడుతున్న షరతులతో అన్నదాతలు అవస్థలకు గురవుతున్నారు. సకాలంలో ట్రక్ షీట్లు ఇవ్వకపోవడంతో పొలాల్లో ఉన్న, ట్రాక్టర్లలో లోడుచేసిన ధాన్యం ఎండకు ఎండి, వర్షాలకు తడిసి పోవడంతో రంగుమారుతోంది. శాంపిల్ ధాన్యం పాయింట్స్ 22 బదులు 27 పెట్టి, నూక శాతం ఎక్కువ చూపించి,100 కిలోలకు 10 నుంచి 12 కిలోలు తగ్గిస్తున్నారు. వాటి డబ్బులు చెల్లిస్తేనే ధాన్యం తీసుకుంటామని ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలు గ్రామాల రైతులు వాపోతున్నారు. మిల్లుల వద్దకు ధాన్యాన్ని తీసుకెళ్లి మూడు రోజులు గడుస్తున్నా ట్రక్ షీట్లు ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు.ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. దళారులదే రాజ్యం ధాన్యాన్ని సకాలంలో ప్రభుత్వం తీసుకోకపోవడంతో భద్రపరచలేక, కూలీలకు డబ్బులు చెల్లించలేక రైతులు దళారులను ఆశ్రయించవలసి వస్తోంది. ప్రభుత్వంటన్నుకు రూ.23,890 ధర చెల్లిస్తుండగా, దళారులు రూ.17 వేల నుంచి రూ. 18 వేలు మాత్రమే ఇస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో నూర్చిన ధాన్యాన్ని భద్రపరుచుకోలేక దళారులు అడిగిన ధరకే అమ్ముకోవలసి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బుచ్చెయ్యపేట మండలంలో మిల్లువద్ద మూడు రోజులుగా ట్రాక్టర్పై ఉండిపోయిన ధాన్యంమిల్లు చుట్టూ తిరుగుతున్నా.. మూడు రోజులుగా మిల్లు చుట్టూ తిరుగుతున్నాను. మిల్లుకు తీసుకువెళ్లిన ధాన్యం ట్రాక్టరు మీద మూడు రోజులు నుంచి ఎండిపోతోంది. సకాలంలో తీసుకోకపోవడంతో వర్షాల కారణంగా నూర్పు చేసిన ధాన్యం పొలాల్లో తడిసిపోతోంది. నాకు ట్రక్ షీట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. టన్నుకు 60నుంచి 70 కిలోలు తరుగుతీస్తున్నారు. నూక శాతం అధికంగా చూపించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఎంతో కష్టపడి మిల్లువద్దకు ధాన్యం తీసుకు వెళ్తే లిమిట్ అయిపోతుందని సాకులు చూపించి ఇబ్బందులు పెడుతున్నారు. అధికారులు స్పందించి మిల్లుకు తీసుకెళ్లిన ధాన్యాన్ని వెంటనే తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. – నాగేశ్వర రెడ్డి, కౌలు రైతు, సత్యవరం500 టన్నులు టార్గెట్ జిల్లాలో 500 టన్ను ల రబీ ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ 350 టన్నులు సేకరించాం. మిగిలిన 150 టన్నులు ధాన్యం త్వరితగతిన తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మేలు రకం 100 కిలోలు రూ. 2,389, కామన్ రకం రూ.2,369 మద్దతు ధర చెల్లిస్తున్నాం. –పి.జయంతి, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ అనకాపల్లి విక్రయానికి ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు జిల్లాలో కేవలం ఆరు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఈ ఏడాది కొనుగోలు లక్ష్యం 500 మెట్రిక్ టన్నులు ఇష్టానురీతిన తరుగు డబ్బులు వసూలు దోచుకుంటున్న ప్రైవేటువ్యాపారులు -
నిరసనాగ్రహం
దగా డీఎస్సీపైసీబీఐ, విశ్రాంత హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న చంద్రబాబు, లోకేష్ ఒక్కో ఉద్యోగాన్ని రూ. 15 లక్షలకు అమ్ముకున్నారు జూన్ 1న కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మహా ధర్నా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన అనకాపల్లి: మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీకి తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం యుద్ధం ప్రకటించింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైఖరిని నిరసిస్తూ.. అనకాపల్లిలో శుక్రవారం భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ మెగా డీఎస్సీని అవినీతిమయమైన దగా డీఎస్సీగా చంద్రబాబు ప్రభుత్వం మార్చేసిందని తీవ్రంగా ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతీ యువకుల జీవితాలతో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు చెలగాటం ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. విద్యార్థుల ప్రతిభను పక్కనబెట్టి, ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 లక్షలకు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. డీఎస్సీలో మెగా స్కామ్ జరిగిందని, విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానిక రింగ్ రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి భీమునిగుమ్మం కూడలి వరకు పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ..మెగా డీఎస్సీలో జరిగిన భారీ అక్రమాలపై రాష్ట్ర గవర్నర్ స్పందించి సీబీఐ, హైకోర్టు న్యాయమూర్తితో తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్చేశారు. పరీక్షల్లో అర్హత సాధించిన నిరుద్యోగులను పక్కనబెట్టి మంత్రి లోకేష్కు భారీగా ముడుపులు చెల్లించిన వారికే ఉద్యోగాలు కట్టబెడుతున్నారు. ఈ అన్యాయంపై రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 మంది నిరుద్యోగులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకుంటున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు, నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి లేకుండా, రూపాయి ఖర్చు కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెండు లక్షల మందికి పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చామని, నిరుద్యోగులకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా జూన్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్కుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల పొట్టకొడుతోందని, డీఎస్సీ పేపర్ లీకేజీ నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కష్టపడి చదివిన అభ్యర్థులను కాదని, రూ. 15 లక్షలకు ఉద్యోగాలను అమ్ముకున్న ఏ ప్రభుత్వమూ చరిత్రలో నిలబడలేదన్నారు. నగదు కొట్టు.. జాబ్ పట్టు అనేలా విద్యాశాఖ మంత్రి గ్రూపుల్లో హల్చల్ చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, 80,81,84 వార్డు ఇన్చార్జులు కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, కోరుకొండ రాఘవ, యలమంచిలి, నర్సీపట్నం, చోడవరం, పెందుర్తి నియోజకవర్గాల విద్యార్థుల విభాగం అధ్యక్షులు యలమంచిలి చందు, కిల్లాడ శ్రీనివాసరావు, బాలు యాదవ్, పోతల జగదీష్, పార్టీ సీనియర్ నాయకులు బుదిరెడ్డి దేముడుబాబు, కిట్టు, పెదిశెట్టి గోవింద్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం
అచ్యుతాపురం రూరల్: మండలం కేంద్రం అచ్యుతాపురంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో మూడు నెలల క్రితం పూడ్చిన ఓ వ్యక్తి మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడు తల్లి ఫిర్యాదుతో ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేసి, నమూనాలు సేకరించడం ఈ ప్రాంతంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే అచ్యుతాపురంలోని ఇందిరమ్మకాలనీ సమీపంలో షేక్ ఖాన్ (30) తనకుటుంబంతో నివాసం ఉంటూ మటన్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఫిబ్రవరి 27వ తేదీ శనివారం తన నివాసంలో మృతి చెందాడు. ఆ రోజు రాత్రి ఇంట్లో ఖాన్ భార్య, పిల్లలు, ఆయన తల్లి ఉన్నారు. తెల్లవారుజామున షేక్ ఖాన్ నిద్ర లేవకపోవడంతో పరిశీలించిన కుటుంబ సభ్యులు గుండెపోటుతో మరణించాడని భావించి, ముస్లిం సంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అయితే, ఖాన్ మరణంపై అప్పట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మూడు నెలల తర్వాత తల్లి ఫిర్యాదు తన కుమారుడు మరణించిన నాటి నుంచి తల్లి సైదా బీబీకి అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండే తన కొడుకుది సహజ మరణం కాదని, అది ముమ్మాటికీ హత్యేనని ఆమె బలంగా నమ్మింది. అప్పుడు ఆమె చెప్పినా ఆమె మాటలను ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు. ఆమెలో అనుమానాలు నివృత్తికాకపోవడంతో అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లో గత వారం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. మరణానికి గల అసలు కారణాలను శాసీ్త్రయంగా నిర్ధారించేందుకు పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఖననం చేసిన మృతదేహాన్ని శుక్రవారం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి చెందిన ప్రత్యేక పోస్టుమార్టం వైద్య బృందం, రెవెన్యూ అధికారుల సమక్షంలో బయటకు తీసి, క్షుణ్ణంగా పరిశీలించి, పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మరణానికి గల కారణాలను విశ్లేషించేందుకు అవసరమైన కీలక నమూనాలను (శాంపిల్స్) వైద్య బృందం సేకరించింది. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత మృతదేహాన్ని యథావిధిగా మళ్లీ అదే స్థలంలో పూడ్చిపెట్టారు. వైద్య బృందం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ మూడు నెలల కాలంలో మృతుడి కుటుంబంలో లేదా వెలుపల జరిగిన పరిణామాలు, అలాగే షేక్ ఖాన్కు ఎవరితోనైనా గొడవలున్నాయా ? శత్రువులు ఉన్నారా ? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. హత్యగా అనుమానిస్తున్న తల్లి నమూనాలు సేకరించిన పోలీసులు -
‘సర్’పై అప్రమత్తం
చోడవరం: ఓటర్ల జాబితా సవరణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్(ఎస్ఐఆర్)పై వైఎస్సార్ సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్, చోడవరం సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా సవరణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైఎస్సార్సీపీ పోలింగ్ బూత్ కమిటీలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని చోడవరం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఫారం–6,7తోపాటు ఇతర అంశాలను, జాబితాలో దొంగ ఓటర్లను ఎలా గుర్తించాలి, అర్హత ఉన్నప్పటికీ ఓటర్లను ఉద్దేశపూర్వకంగా ఎలా తొలగిస్తారు అనే విషయాలను లేజర్స్క్రీన్పై స్వయంగా అమర్నాఽథ్ బూత్ కమిటీలకు అవగాహన కల్పించారు. అర్హత ఉన్న ఓటర్లను తొలగించకుండా గ్రామాల్లోకి వస్తున్న సర్వే అధికారులతో కలిసి బూత్ ప్రతినిధులు పనిచేయాలని సూచించారు. ప్రతీ బూత్ ప్రతినిధి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయిలో పరిష్కారం కాని విషయాలను గుర్తిస్తే మండలస్థాయి, జిల్లా స్థాయి అధికారులకు పార్టీ కమిటీ ప్రతినిధులు ఫిర్యాదుచేసి సమస్య పరిష్కారానికి కృషిచేస్తాయాలన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై బూత్ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అమర్నాథ్ సమాధానాలు చెప్పి, వారి సందేహాలను నివృత్తి చేశారు. ఏమరుపాటుగా ఉండొద్దు మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ప్రతీ బూత్ ప్రతినిధి స్థానికంగా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను కలుపుకొని నిజమైన ఓటర్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది రాబోయే అన్ని ఎన్నికలపై ప్రభావం చూపుతుందని, ఈ విషయాన్ని అంతా గుర్తించి అంకితభావంతో పనిచేయాలని ముత్యాలనాయుడు సూచించారు. ఉద్యమాన్ని విజయవంతం చేయాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వచ్చే నెల 4వ తేదీ నుంచి వైఎస్సార్సీపీ చేట్టనున్న ఉద్యమాన్ని అన్ని మండల, నియోజకవర్గాస్థాయిల్లో విజయవంతంగా నిర్వహించాలన్నారు. గతంలో ఎప్పుడూలేని విధంగా ఈ బూత్ కమిటీ శిక్షణ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతో పార్టీకి మరింత ఊపు వచ్చింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటు పరిశీలకురాలు శోభా హైమావతి, నియోజకవర్గం పరిశీలకుడు గండి రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, సంయుక్త కార్యదర్శి దొండా రాంబాబు, రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి పల్లా నర్సింగరావు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొళ్లిమళ్ల అచ్చెంనాయుడు, రాష్ట్ర యూత్ విభాగం సంయుక్త కార్యదర్శి గూనూరు రామచంద్రనాయుడు, యూత్ జిల్లా అద్యక్షుడు పుల్లేటి వెంకటేష్, రైతు విభాగం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, చోడవరం, బుచ్చెయ్యపేట, రా వికమతం, రోలుగుంట మండలాల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీలు, అనుబంధ కమిటీల రాష్ట్ర, జిల్లా కమిటీల ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.మాజీ మంత్రి అమర్నాథ్ -
ఆర్టీసీ ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలతో ధర్నా
డిపో గేటు వద్ద ఎర్రబ్యాడ్జీలు ధరించి ధర్నా చేస్తున్న అసోసియేషన్ ఉద్యోగులు అనకాపల్లి: ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ) జోన్ పరిధిలో ఉద్యోగులపై ఉన్నత స్థాయి అధికారుల వేధింపులు, అక్రమ పనిష్మెంట్లు విధించడం అన్యాయమని ఏపీ పీటీడీ నేషనల్ మజ్ధూర్ యూనిటీ అసోసియేషన్ డిపో కార్యదర్శి ఏఎన్.రావు తెలిపారు. అసోసియేషన్ జోనల్ కమిటీ పిలుపు మేరకు స్థానిక డిపో గేటు వద్ద మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఎర్రబ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిగువ స్థాయి శాఖ ఉద్యోగులపై ఉన్నత స్థాయి అధికారుల పనిఒత్తిడి, చిన్నచిన్న సమస్యలపై అక్రమ వేధింపులకు గురిచేయడం, విధులు నుంచి తొలగించడం వంటి చర్యలు అన్యాయమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్.శంకరరావు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి తవ్వకాలు అడ్డగింత
ఎస్.రాయవరం: మండలంలోని కొరుప్రోలు చెరువులో గెడ్డపాలెం సమీపంలో అనుమతులు అతిక్రమించి మట్టి తవ్వకాలు చేస్తున్నారని ఉపాధి కూలీలు శుక్రవారం నిరసన తెలిపారు. ఇక్కడ మట్టి తవ్వకానికి వచ్చిన జేసీబీని అడ్డుకుని, ట్రాక్టర్లను వెనక్కి పంపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ పొలాలు కప్పుకుంటామని అనుమతులు తీసుకుని ఇరిగేషన్ అధికారుల కొలతలు, మార్కింగ్ పక్కన పెట్టి నచ్చిన చోట మట్టి తవ్వకాలు చేసి చెరువు గర్భాన్ని పాడు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పొలాలు కప్పుకోవడంతోపాటు, ఇతర వ్యాపారులకు మట్టి విక్రయిస్తున్నారని తెలిపారు. ఉపాధి కూలీలతోపాటు గ్రామస్తులు అక్కుపు జోగారావు, బద్రి నాగేశ్వరరావు, కేశవరెడ్డి కన్నయ్య, తిన్నబోతున్న అప్పారావు, నూకరాజు, కర్రి అప్పారావు, దేవ అప్పారావు, కాకర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


