breaking news
Anakapalle
-
వైభవంగా గిరి ప్రదక్షిణలు
మునగపాక, దేవరాపల్లి మండలాల్లోని మూడు గ్రా మాల్లో మంగళవారం వైభవంగా గిరిప్రదక్షిణలు నిర్వ హించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మునగపాక: మండలంలోని వాడ్రాపల్లి, తోటాడ గ్రామాల్లో మంగళవారం గిరి ప్రదక్షిణలు వైభవంగా నిర్వహించారు. తోటాడలోని ఆదినారాయణ స్వామి రాజయోగాశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వ హించిన గిరి ప్రదక్షిణలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓంకార పీఠం నుంచి ప్రారంభమైన ఊరేగింపు త్రిమూర్తుల ఆలయం, మరిడిమాంబ ఆలయం, పాటిపల్లి కాలనీ, వరాహలక్ష్మీనరసింహ స్వామి ఆలయం మీదుగా నారాయుడుపాలెం నుంచి తిరిగి ఓంకార పీఠం వరకు సాగింది. ● వాడ్రాపల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్ని వీధుల గుండా ప్రదక్షిణ సాగింది. పలు గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేంకటేశ్వర స్వామి పల్లకీ మోస్తూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఊరేగింపు లో పాల్గొన్నార. భక్తులకు డ్రింక్స్, బిస్కట్లు, మునగపాకకు చెందిన వాకర్స్ సభ్యులు అందజేశారు. మారేపల్లిలో..దేవరాపల్లి: మండలంలోని మారేపల్లి పాండవుల మెట్టపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 4 గంటలకు తొలి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజల అనంతరం సుమారు 7 కిలోమీటర్ల మేర గిరిప్రదక్షిను భక్తులు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, పూజలు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణకు తరలివచ్చారు. మారేపల్లి, తెనుగుపూడి, వెంకటరాజుపురం, వాకపల్లి జంక్షన్ మీదుగా గిరి ప్రదక్షిణ కొనసాగింది. మారేపల్లి గోవిందనామస్మరణతో మార్మోగింది. భక్తులకు దారిపొడువునా పలువురు ప్రసాదాలు, తాగునీరు, శీతల పానీయాలను అందజేశారు. వైద్య శిబిరాలు నిర్వహించారు. -
పదేళ్లుగా పరారీలో ఉన్న నిందితుడు అరెస్టు
కశింకోట: ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి, నగదు స్వాహా చేసి, మోసగించిన కేసులో పదేళ్లకు పైగా పరారీలో ఉన్న నిందితుడిని మంగళవారం కోర్టు ఆదేశాల మేరకు అరెస్టు చేసినట్లు సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్–2 ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి 2013లో పలువురి నుంచి మండలంలోని తాళ్లపాలెం గ్రామానికి చెందిన బోదెపు ప్రకాశ్ రూ.32.71 లక్షలు వసూలు చేశాడు. దీనిలో రూ.12 లక్షలు నగదు రూపంలోను, మిగిలిన రూ.20.71 లక్షలు నిందితుడి బ్యాంకు ఖాతాకు జమ చేసినట్లు సాక్షులు తెలిపారని చెప్పారు. ఈ విషయమై తెరపల్లి పరదేశి, ఇతర బాధితులు ఫిర్యాదు మేరకు 2015లో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. న్యాయ స్థానం నాన్ బెయిల్బుల్ వారెంట్ ఇచ్చిన మేరకు అరెస్టు చేశామన్నారు. కోర్టులో హాజరు పరిచి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు. -
దారులన్నీ దిగ్బంధం
సింహాచలం: స్వామి దర్శనం కోసం భక్తి పారవశ్యంతో తరలివచ్చిన లక్షలాది మంది భక్తులకు ఈసారి గిరి ప్రదక్షిణకు ముందే కష్టాలు ఎదురయ్యాయి. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి తొలిపావంచాకు చేరుకునేందుకు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ఆంక్షలు భక్తులకు చుక్కలు చూపించాయి. దారులన్నీ మూసివేయడంతో భక్తులు వాహనాలను దూర ప్రాంతాల్లోనే నిలిపి, కాలినడకన తొలిపావంచాకు చేరుకోవాల్సి వచ్చింది. 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు సిద్ధమైన భక్తులు.. ముందుగా మరో నాలుగైదు కిలోమీటర్ల ప్రయాణాన్ని నడకతోనే ప్రారంభించాల్సి వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి తొలిపావంచాకు వెళ్లే ప్రధాన మార్గాలన్నింటినీ నియంత్రించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెందుర్తి వైపు నుంచి వచ్చే వాహనాలను కృష్ణరాయపురం వద్ద, గోపాలపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలను వేపగుంట వద్దే నిలిపివేశారు. హనుమంతవాక మార్గంలో వచ్చే వాహనాలను ముడసర్లోవ వద్ద ఆపేశారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ వాహనాలను విడిచి నడక సాగించారు. వేపగుంట నుంచి పాత గోశాల వరకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు సరిపోకపోవడంతో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మరో 5 కిలోమీటర్ల నడక గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు అసలు ప్రదక్షిణ కంటే ముందే నడక పరీక్ష ఎదురైంది. గోపాలపట్నం, వేపగుంట, ఎన్ఏడీ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు భక్తులు తొలిపావంచాకు చేరుకునేందుకు ఐదు కిలోమీటర్ల వరకు నడవాల్సి వచ్చింది. హనుమంతవాక మార్గంలో వచ్చిన వారు ముడసర్లోవ నుంచి సుమారు ఆరు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు. పాత అడవివరం మార్గంలో బురద బాట పాత అడవివరం జంక్షన్ నుంచి తొలిపావంచాకు మళ్లించిన ప్రత్యామ్నాయ మార్గం భక్తులకు మరో సమస్యగా మారింది. హనుమంతవాక, శొంఠ్యాం మార్గాల నుంచి వచ్చే భక్తులను బీఆర్టీఎస్ రోడ్డులోకి అనుమతించకుండా గాంధీనగర్ మీదుగా మళ్లించారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఈ మార్గం మొత్తం బురదమయమైంది. వేలాది మంది భక్తులు ఒకేసారి రావడంతో మార్గం ఇరుకుగా మారి, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జారే బురదలో అడుగులు వేస్తూ భక్తులు తొలిపావంచాకు చేరుకున్నారు. వేపగుంటలో ట్రాఫిక్ పద్మవ్యూహం మరోవైపు పెందుర్తి–వేపగుంట మార్గంలో ట్రాఫిక్ నిర్వహణ పూర్తిగా అదుపు తప్పింది. గిరి ప్రదక్షిణ కోసం వచ్చిన వాహనాలు, సాధారణ రాకపోకల వాహనాలు ఒకేసారి చేరడంతో వరలక్ష్మీనగర్ వద్ద ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపించింది. ఉదయం నుంచి సాధారణంగా ఉన్న రద్దీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పెరిగింది. అనకాపల్లి, దేవరాపల్లి, సబ్బవరం, కె.కోటపాడు, పాడేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ఆర్టీసీ బస్సులతో రహదారులు కిక్కిరిశాయి. పార్కింగ్ ప్రాంతాల వద్ద నియంత్రణ లేకపోవడంతో వాహనాలు ఇష్టారాజ్యంగా నిలిచిపోయాయి. దీంతో గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులు కూడా కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయారు. సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ట్రాఫిక్ సమస్య కొనసాగింది. ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్లు పెందుర్తి నుంచి నగరంలోని ఆస్పత్రులకు వెళ్లే మార్గాలు కూడా ట్రాఫిక్తో నిండిపోయాయి. అత్యవసర చికిత్స కోసం రోగులను తరలిస్తున్న పలు అంబులెన్స్లు ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. పోలీసులు, స్థానికులు చొరవ తీసుకుని వాటిని బయటకు పంపించాల్సి వచ్చింది. -
విద్యుత్ వైరు తాకి రైతు మృతి
మునగపాక(యలమంచిలి రూరల్): యలమంచిలి మండలం ములకలాపల్లిలో విద్యుత్ ప్రమాదంలో రైతు అప్పలనాయుడు(62) మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములకలాపల్లికి చెందిన దుబాసి అప్పలనాయుడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగానే మంగళవారం ఉదయం పొలం పనులు చేసేందుకు వెళ్తుండగా, గాలీవర్షానికి విద్యుత్ వైరు తెగి కింద పడిపోయింది. పొరపాటున అప్పలనాయుడు వైరును తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన అప్పలనాయుడు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతుడి కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అతివేగానికి నిండు ప్రాణం బలి
● ఎదురెదురుగా ఢీకొన్న రెండు మినీ వ్యాన్లు ● ఒకరికి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు ● కాకరపాడు వద్ద ఘటన అతివేగం మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది. కాకరపాడు–రాజవొమ్మంగి సరిహద్దులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మినీ వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో డ్రైవర్తో పాటు 14 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. రెండు మినీ వ్యాన్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొయ్యూరు: అతివేగం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఒకరి ప్రాణాన్ని బలితీసుకోగా, మరో వ్యక్తిని దివ్యాంగుడిగా మార్చింది. అలాగే 14 ఏళ్ల బాలుడి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. కాకరపాడు–రాజవొమ్మంగి సరిహద్దు ప్రాంతంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొంగసింగికి చెందిన మినీ వ్యాన్ డ్రైవర్ కె. దొరబాబు (31) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్ విజయ్ కుడి చేయి విరగగా, మృతుడి పక్కనే ప్రయాణిస్తున్న 14 ఏళ్ల వై. తేజ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మంప ఎస్ఐ సీదరి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కొంగసింగి గ్రామానికి చెందిన దొరబాబు పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం లోడును వాహనంలో జడ్డంగి తీసుకెళ్లాడు. తిరిగి కొంగసింగి వస్తున్నాడు. అదే సమయంలో మండలంలో ఎం.మాకవరానికి చెందిన విజయ్ ఎరువుల లోడును వాహనంలో రాజవొమ్మంగి తీసుకువెళ్తున్నాడు. అయితే కాకరపాడు దాటిన తర్వాత దొరబాబు వాహన వేగాన్ని నియంత్రించలేకపోయాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో దొరబాబు డ్రైవింగ్ చేస్తున్న వ్యాన్ నుజ్జు నుజ్జు అయింది. తీవ్ర గాయాలపాలైన దొరబాబు సంఘటన స్థలంలో మృతి చెందాడు. వాహనంలో అతని పక్కన ఉన్న తేజ తలకు గాయమైంది. మరోవైపు దొరబాబు ఢీ కొట్టిన వ్యాన్ పల్టీలుకొట్టింది.సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన విజయ్, తేజలను రాజేంద్రపాలెం ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న ఎస్ఐ శ్రీనివాస్ గాయపడిన వారిని పరామర్శించి ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. -
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
పాయకరావుపేట: మండలంలో పెంటకోట గ్రామానికి చెందిన గేదెల మనోజ్ కుమార్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. తిరుపతి వెరిటాస్ సైనిక్ స్కూల్లో మనోజ్ కుమార్ చదువుతున్నాడు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో జరిగిన అండర్ – 19 బాయ్స్ కబడ్డీ పోటీల్లో స్టేట్ ఫైనల్ విన్నర్గా వెరిటాస్ సైనిక్ స్కూల్ విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని విద్యార్థి మనోజ్కుమార్ తండ్రి చిన అప్పలరాజు తెలిపారు. -
ఏయూ విద్యార్థినులకురూ.12 లక్షల ప్యాకేజీ ఉద్యోగాలు
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళా ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (2022–26 బ్యాచ్) విభాగానికి చెందిన విద్యార్థినులు అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారు. రోషినిషా బేగం, ఆర్.నవ్య ప్రముఖ సంస్థ ‘స్నైడర్ ఎలక్ట్రిక్’ క్యాంపస్ నియామకాల్లో రూ.12 లక్షల వార్షిక వేతనంతో ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ సంస్థల్లో ఏయూ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమన్నారు. రోషినిషా బేగం స్నైడర్ ఎలక్ట్రిక్తో పాటు వేదాంత సంస్థలోనూ ఉద్యోగానికి ఎంపికవగా, ఆర్.నవ్య ఎల్ అండ్ టీ సంస్థలోనూ అవకాశాన్ని దక్కించుకుంది. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఆర్.పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
అనకాపల్లి: జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విల్లూరి రాజేష్, ప్రధాన కార్యదర్శిగా అమ్ములోజు శ్రీను, కోశాధికారిగా ఆడారి నాయుడు ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక గవరపాలెం కామాక్షమ్మ దేవాలయం మేడపైన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడిగా కోరిబిల్లి సోమినాయుడు, ముఖ్య సలహాదారులుగా ఎం.ఎన్.ఎస్.అప్పారావు, బి.బాలాజీ బద్రీనాథ్, జిల్లా లీగల్ అడ్వైజర్గా వేలం చంద్రశేఖర్, కార్యదర్శిగా ఆళ్ల ప్రవీణ్కుమార్, వర్కింగ్ అధ్యక్షుడిగా ఏఎంఎస్ శివకుమార్, మీడియో ఇన్చార్జిగా యల్లపు వెంకట రమణాజీ, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా చింతా లక్ష్మణరావు, బుద్ధ జగన్, పిన్నపోతుల సంతోష్, ఉపాధ్యక్షులుగా భీశెట్టి తిరుమల, అందే కుమార్, బుద్ధ అప్పలనాయుడు, ఆళ్ల సతీష్ కుమార్, యల్లపు సత్యనారాయణ, వేపాడ సత్తిబాబు, సహాయ కార్యదర్శులుగా వేగి అజయ్కుమార్, కరణం కృష్ణ, గొర్లి స్వామి, లోవరాజు, శ్రావణ్కుమార్, శ్రీను, లక్ష్మణరావు సంతోష్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా అసోసియేషన్ వ్యవస్థాపకుడు కె.గురునాథరావు, రాష్ట్ర కార్యదర్శి టి.రాము, ఉపాధ్యక్షులు ఎం.ఎన్.ఎన్ అప్పారావు, వై.శ్రీనివాసరావు వ్యవహరించారు. నూతన కమిటీ రెండేళ్లు ఉంటుందని కె.గురునాథరావు చెప్పారు. -
శ్మశాన స్థలం ఆక్రమించిన టీడీపీ నాయకుడు
నక్కపల్లి: అమలాపురం పరిధిలో శ్మశాన స్థలాన్ని టీడీపీ నాయకుడు ఆక్రమించి, స్టీల్ప్లాంట్ రోడ్డుకోసం లీజుకు ఇచ్చాడని, ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ, రైతువిభాగం కార్యదర్శి సూరాకాసుల గోవిందుల ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆక్రమిత స్థలం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ గ్రామస్తులు మరణిస్తే దహన సంస్కారాల కోసం కేటాయించిన స్థలాన్ని టీడీపీకి చెందిన బాబ్జీ అనే వ్యక్తి ఆక్రమించడంతోపాటు, స్టీల్ప్లాంట్ వాహనాలు రాకపోకల కోసం లీజుకు ఇచ్చాడన్నారు. స్టీల్ప్లాంట్ అధికారులు ఈ స్థలంలోంచి రోడ్డు నిర్మించారని చెప్పారు.దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోందన్నారు. ఈవిషయాన్ని తహసీల్దార్ చిన్నికృష్ణకు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆక్రమిత స్థలం వద్దకు వచ్చి పరిశీలించారు. తక్షణమే రోడ్డును తొలగించి యథావిధిగా ఈ స్థలాన్ని శ్మశానవాటికగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. లేకపోతే ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు స్టీల్ప్లాంట్యాజమాన్యంతో మాట్లాడతానని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో స్థానిక నాయకుడు తళ్ల భార్గవ్, గ్రామస్తులు పాల్గొన్నారు.చర్యలు తీసుకోవాలని ఆక్రమిత స్థలం వద్ద ఆందోళన -
స్వయం భూ విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న శ్రీకాకుళం జిల్లా జడ్జి భారతి
చోడవరం: స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరస్వామివారిని శ్రీకాకుళం జిల్లా జడ్జి ఎన్.ప్రసన్న భారతి మంగళవారం దర్శించుకున్నారు. చోడవరానికి చెందిన ఈమె ఇటీవల శ్రీకాకుళం జిల్లా కోర్టులో జడ్డిగా నియమితులయ్యారు. విఘ్నేశ్వరస్వామివారిని దర్శించుకోడానికి ఇక్కడకు వచ్చిన ఆమెకు చోడవరం బార్ అసోసియేషన్ న్యాయవాదులు, ఫోరం ఫర్ బెటర్ చోడవరం ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. ‘గ్రేట్ వర్డ్స్ ఆఫ్ వరల్డ్ రెనౌండ్ ఇంటెలెక్చువల్స్’ పుస్తకాన్ని ఆర్క్ సంస్థ ప్రతినిధి ప్రసాద్ ఆవిష్కరించి, న్యాయమూర్తి ప్రసన్నభారతికి అందజేశారు. అనంతరం స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు కొండమంచిలి చలపతిరావు ఆధ్వర్యంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చీపురపల్లి సూర్యనారాయణ, శ్రీనివాస్, రాజు, ఫోరం ఫర్ బెటర్ చోడవరం ప్రతినిధులు అప్పారావు, బి.వి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
దగా డీఎస్సీపై సమరభేరి
అనకాపల్లి: రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ చేయాలని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లా విద్యార్థి, యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, బొడ్డేపల్లి హేమంత్కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రామచంద్ర థియేటర్ జంక్షన్ నుంచి నెహ్రూచౌక్ మీదుగా పెరుగుబజార్ జంక్షన్ వరకూ భారీ పాదయాత్ర (ర్యాలీ) నిర్వహించారు. తొలుత స్థానిక రామచంద్ర థియేటర్ జంక్షన్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అదీప్రాజుతో కలిసి అమర్నాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ నీట్ పరీక్షల పేపరు లీక్ విషయంలో కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఉద్యమాలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించిందన్నారు. రాష్ట్రంలో డీఎస్సీలో అక్రమాలను (పరీక్షలు, విద్యార్థుల సర్టిఫికెట్లు వెరిఫికేషన్, క్రీడా కోటలో ఉద్యోగాలు) దృష్టిలో పెట్టుకుని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం, నిరుద్యోగులతో రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో విద్యా శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ రెండేళ్లలో అక్రమాలు, అవినీతితో కూటమి పాలన సాగుతుందని విమర్శించారు. డీఎస్సీలో అనేక అక్రమాలు జరిగినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అన్యాయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు పోరాటాలు చేయకముందే విద్యా శాఖ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని హితవు పలికారు. ఉత్తరాంధ్ర యువజన విభాగం వర్కింగ్ అధ్యక్షుడు, పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది, పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో తెలుగు, ఇంగ్లిష్ బోధన అమలు చేశారన్నారు. కూటమి పాలనలో విద్యను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం అన్యాయమన్నారు. పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్య, వైద్యాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తోందన్నారు. పార్టీ విద్యార్థి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పుల్లేటి వెంకటేష్, బొడ్డేపల్లి హేమంత్కుమార్ మాట్లాడుతూ మెగా డీఎస్పీ దగా డీఎస్పీగా మారిందని ఎద్దేవా చేశారు. ‘రూ.15 నుంచి రూ.20 లక్షలు చెల్లించు...జాబ్ పట్టు’ అనే నినాదంతో డీఎస్పీ నియామకాలు జరిగాయన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు, నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోన్ –1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్రాజా, ఎంపీపీ గొర్లి సూరిబాబు, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జోసెఫ్, కశింకోట జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్రాజు, వివిధ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు పెద్దిశెట్టి శేఖర్, ఆకుల సాయి ప్రసాద్, నరేష్ పోచిన, సియాద్రి బుజ్జి, తమరణ శ్రీనివాస్, గుద్దేటి శ్రీనివాస్, వివిధ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, సీనియర్ నాయకులు బుదిరెడ్డి దేముడుబాబు, మళ్ల బుల్లిబాబు, ఉగ్గిన అప్పారావు, కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, అల్లు త్రినాథ్, బుద్ధ భాస్కరరావు, పెద్దిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, కార్యకర్తలు పాల్గొన్నారు. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. డీఎస్సీ అక్రమాలకునైతిక బాధ్యత వహించాలి లేకుంటే విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తాం నిరుద్యోగుల భవిష్యత్తుతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ధ్వజం కదం తొక్కిన నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీ శ్రేణులు జిల్లా విద్యార్థి, యువజ విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ -
ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాలుతుమ్మపాల: అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో ప్రజల తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు రవాణా సదుపాయాలు, భోజనం, వైద్య సహాయం, ఇతర ఏర్పాట్లను సక్రమంగా చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బస్సుల కేటాయింపు, సమయపాలన, ప్రతి బస్సు లో 60 మంది చొప్పున ప్రయాణించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. బోర్డింగ్ సమయానికి బస్సులను కేటాయించిన బోర్డింగ్ పాయింట్లకు చేరుకునే విధంగా అధికారులు చూడాలన్నారు. వైద్య సిబ్బంది ప్రతి బస్సులో ప్రథమ చికిత్స కిట్తోపాటు ఒక ఏఎన్ఎం, ఆశా కార్యకర్త అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రయాణికులకు తాగునీరు, పులిహోర, బిస్కెట్లు, అరటి పండ్లు పంపిణీ చేయాలని, మధ్యాహ్న భోజనంగా వెజ్ బిర్యానీ, మజ్జిగను అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ స్థలం వద్ద అందజేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. మండల పరిషత్ కార్యాలయాల్లో ముగ్గురు సభ్యులతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బస్సుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రతి బస్సుకు ఇన్చార్జి, మెడికల్ ఇన్చార్జిని నియమించి సమన్వయం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ శౌర్యమాన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారా యణరావు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
దివ్యాంగ విద్యార్థికి న్యాయం చేస్తాం
గొలుగొండ: దివ్యాంగ విద్యార్థికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వి. శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. చోద్యం జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న నందిక అభిషేక్కు పూర్తి అంగవైకల్యం ఉన్నా సదరం క్యాంప్లో 14 శాతం సర్టిఫికెట్ మంజూరు చేయడంతో ఆ విద్యార్థి ఆవేదనపై సాక్షిలో ‘కలెక్టర్గారు మీరైనా స్పందించండి’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, రెవెన్యూ అధికారులు గ్రామంలో విచారణ జరిపి చోద్యం జిల్లా పరిషత్ హైస్కూల్కు వెళ్లి విద్యార్థి స్థితిగతులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వి.శ్రీనివాసరావు సాక్షితో మాట్లాడు తూ జిల్లా రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు విద్యార్థి అభిషేక్ స్థితిగతులపై రెవెన్యూ సిబ్బంది విచారణ చేసి జిల్లా అధికారులకు నివేదించడం జరుగుతుందన్నారు. ఆ విద్యార్థి ఆరోగ్యం, ఇతర పరిస్థితులపై విచారణ చేశామని తెలిపారు. విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు మంగళవారం పాఠశాలలో ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులను విచారణ చేశామన్నారు. ముందుగా విద్యార్థికి హైస్కూల్కు ఎవరి సాయం లేకుండా వచ్చే విధంగా చిన్న వాహనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పూర్తి నివేదిక ఆధారంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో రాజుబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. -
గిరి హారం
హరినామమే32 కి.మీ సింహ‘గిరి ప్రదక్షిణ’తో పులకించిన భక్తజనంఈసారి యంగ్ జోష్.. పెద్ద ఎత్తున పాల్గొన్న యువత చిరుజల్లుల చల్లదనంలో.. మైమరిపించిన గిరిప్రదక్షిణం సింహాచలం: ఆషాఢ చతుర్దశి సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి కొలువుదీరిన సింహగిరి చుట్టూ మంగళవారం జరిగిన గిరి ప్రదక్షిణ భక్తి పారవశ్యానికి ప్రతీకగా నిలిచింది. లక్షలాది మంది భక్తులు హరినామస్మరణల మధ్య 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తి చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అప్పుడప్పుడు కురిసిన చిరుజల్లులు, చల్లని వాతావరణం భక్తుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఉదయం ఐదు గంటల నుంచే కొండదిగువ తొలిపావంచా వద్దకు చేరుకున్న భక్తులు కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనంతో సింహగిరి పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఈ ఏడాది యువత పెద్ద సంఖ్యలో పాల్గొనగా, తొలిసారిగా గిరి ప్రదక్షిణ చేసిన భక్తుల సంఖ్య కూడా గణనీయంగా కనిపించింది. గిరిప్రదక్షిణ మార్గం ఇదే.. అడవివరం, పైనాపిల్ కాలనీ, ముడసర్లోవ, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, వెంకోజీపాలెం, సీతమ్మధార, మాధవధార, మురళీనగర్, ప్రహ్లాదపురం మీదుగా సాగిన గిరి ప్రదక్షిణ మార్గమంతా హరినామ ఘోషలతో మారుమోగింది. భక్తుల అడుగులతో గిరివలయం పుణ్యక్షేత్రంగా పరివర్తన చెందగా, ప్రతి కూడలి భజనలు, గోవింద నామస్మరణలు, సేవా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక కాంతిని వెదజల్లింది. వైభవంగా పుష్పరథ యాత్ర గిరి ప్రదక్షిణను పురస్కరించుకుని కొండదిగువ తొలిపావంచా వద్ద మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారి పుష్పరథ యాత్ర వైభవంగా ప్రారంభమైంది. దేవస్థానం స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి కరి సీతారామాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి రథోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆ క్షణంలో లక్షలాది మంది భక్తులు ‘గోవింద... గోవింద’, ‘జై నృసింహా’ నినాదాలతో మారుమోగించగా, పుష్పాలతో అలంకరించిన రథం భక్తుల మధ్య మహోత్సవ వాతావరణంలో ముందుకు సాగింది. ఆకట్టుకున్న సాంస్కృతిక కళారూపాలు రథోత్సవంలో దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పులివేషాలు, తప్పెటగుళ్లు, కోలాటాలు, గ్రామీణ సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంగళవాయిద్యాల రవళి, కళాకారుల అడుగుల నడుమ రథయాత్ర కంటికి విందుగా సాగింది. అడుగడుగునా సేవాస్ఫూర్తి వైద్య, తాగునీటి సదుపాయాలు: కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. 32 కిలోమీటర్ల మేర 28 ప్రాంతాల్లో విశ్రాంతి స్టాల్స్, వైద్య సేవా శిబిరాలను నిర్వహించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆధ్వర్యంలో తాగునీటి సరఫరా, 600 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. భద్రతా చర్యలు: నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ పర్యవేక్షణలో 5 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. అన్నదాన సేవలు: దారిపొడవునా వివిధ స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఆహార పదార్థాలు, లఘుపానీయాలు, స్నాక్స్, పండ్లు, బిస్కెట్లు, చెరకు రసం ఉచితంగా పంపిణీ చేసి ఆధ్యాత్మిక ఉదారతను చాటుకున్నాయి. చోరుల చేతివాటం పెందుర్తి: గిరి ప్రదక్షిణ వేళ చోరులు చేతివాటం ప్రదర్శించారు. సింహచలం తొలి పావంచ మొదలుకొని అడవివరం, ఆరిలోవ, హనుమంతవాక, నగరంలో పలు చోట్ల మహిళల మెడల్లో నుంచి బంగారు ఆభరణాలతో పాటు సెల్ఫోన్లు, నగదు దొంగిలించినట్లు ఆయా ప్రాంతాల్లోని పోలీసులకు బాధితులు ఫిర్యాదులు చేశారు. తొలిపావంచా వద్ద మహిళ మెడలో బంగారు గొలుసు చోరీకి గురైంది. దీనిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. -
సిటీ జామ్
మధ్యాహ్నం 2 గంటలకు వైభవంగా పుష్పరథ యాత్రదారులన్నీ దిగ్బంధంఉదయం 5 గంటలకే కొబ్బరికాయలతో ఆధ్యాత్మిక శ్రీకారం మద్దిలపాలెం జంక్షన్లో ట్రాఫిక్ జామ్ సాక్షి, విశాఖపట్నం: భక్తి పారవశ్యంతో మారుమోగాల్సిన విశాఖ మహానగరం.. మంగళవారం ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిల్లాడింది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలిరాగా.. ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక లోపం, పోలీసు యంత్రాంగం సమన్వయ వైఫల్యం, ట్రాఫిక్ నిర్వహణలో నిర్లక్ష్యం కలిసి నగరాన్ని దాదాపు ఆరు గంటలపాటు స్తంభింపజేశాయి. గిరి ప్రదక్షిణ మార్గాలే కాదు.. నగరంలోని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసి, రాకపోకలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. భక్తులు ప్రదక్షిణ ప్రారంభించేందుకే అవస్థలు పడగా.. వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షించాల్సి వచ్చింది. సాధారణంగా 15 నిమిషాల్లో పూర్తయ్యే ప్రయాణాలకు నాలుగైదు గంటలు పట్టిన పరిస్థితి నెలకొంది. అడుగడుగునా ట్రాఫిక్ సంకెళ్లు సత్యం జంక్షన్, మద్దిలపాలెం, ఇసుకతోట, మెడికవర్ జంక్షన్, హనుమంతవాక, గురుద్వార, సీతమ్మధార, మర్రిపాలెం, వేపగుంట, సింహాచలం, మారికవలస... నగరంలోని ప్రధాన మార్గాలన్నీ కిలోమీటర్ల మేర వాహనాలతో నిండిపోయాయి. అంగుళం కూడా కదలని ట్రాఫిక్లో చంటిపిల్లలు, మహిళలు, వృద్ధులు గంటల తరబడి వాహనాల్లోనే ఉండిపోయారు. అత్యవసర వైద్యసేవలకు వెళ్తున్న అంబులెన్స్లు సైతం సైరన్లు మోగించుకుంటూ ట్రాఫిక్లోనే నిలిచిపోవడం యంత్రాంగం వైఫల్యాన్ని బహిర్గతం చేసింది. భక్తికి ముందే ట్రాఫిక్ పరీక్ష స్వామివారి నామస్మరణతో గిరి ప్రదక్షిణ ప్రారంభించాల్సిన భక్తులకు.. ముందుగా ట్రాఫిక్ పరీక్ష ఎదురైంది. తొలిపావంచాకు చేరుకోవడానికే గంటల సమయం పట్టింది. పలు చోట్ల నడిచేందుకు కూడా దారి లేక భక్తులు వాహనాల మధ్య ఇరుక్కుపోయారు. వెంకోజీపాలెం సమీపంలో తీవ్ర రద్దీ కారణంగా 20 మందికిపైగా భక్తులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. స్పష్టత లేని ఆంక్షలు ట్రాఫిక్ మళ్లింపులు చేసినా.. వాటిపై ముందస్తు సమాచారం లేకపోవడం గందరగోళాన్ని మరింత పెంచింది. మధురవాడ వైపు వెళ్లే వాహనాలను గంటల తరబడి నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలపై స్పష్టత లేక చాలామంది రోడ్లపైనే నిరీక్షించాల్సి వచ్చింది. కీలక జంక్షన్ల వద్ద తగిన సంఖ్యలో ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. గత అనుభవాలు విస్మరణ గతంలో గిరి ప్రదక్షిణ సందర్భంగా సమస్యాత్మక జంక్షన్ల వద్ద రోప్ పార్టీల ద్వారా భక్తులు, వాహనాలను విడతలవారీగా పంపిస్తూ ట్రాఫిక్ను నియంత్రించేవారు. ఈసారి అలాంటి కార్యాచరణ ఎక్కడా కనిపించలేదు. నెల రోజులుగా జరిగిన సమీక్షలు, సమావేశాలు, ఆదేశాలు.. కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో సమగ్ర కార్యాచరణ లేకపోవడంతో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. వీఐపీ బందోబస్తు.. నగరానికి భారమైందా? గిరి ప్రదక్షిణ వంటి లక్షలాది మంది భక్తులు పాల్గొనే కార్యక్రమం జరుగుతున్న రోజే భోగాపురం ఎయిర్పోర్టు కార్యక్రమం నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన సిబ్బందిలో గణనీయమైన భాగం వీఐపీ బందోబస్తుకు మళ్లించడంతో నగర ట్రాఫిక్ నిర్వహణ దెబ్బతిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై అధికారుల నుంచి అధికారిక వివరణ వెలువడలేదు. -
పారా ట్రయాత్లాన్ పోటీల్లో సత్తా చాటిన రావికమతం విద్యార్థులు
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న రావికమతం దివ్యాంగ విద్యార్థులు రావికమతం : రావికమతం మండలానికి చెందిన ముగ్గురు దివ్యాంగ విద్యార్థులు జాతీయ స్థాయి పారా ట్రయాత్లాన్ పోటీలకు ఎంపికై నట్టు ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మి నాయుడు తెలిపారు. పారా స్పోర్ట్స్ అసోసియోషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్వర్యంలో విశాఖ బీచ్లోని పాండు రంగాపురం వద్ద గల ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆదివారం జరిగిన రాష్ట్ర స్దాయి పారా ట్రయాత్లాన్ పోటీల్లో సిమ్మింగ్, రన్నింగ్ , సైక్లింగ్ విభాగాల్లో రావికమతం మండలానికి చెందిన గట్టా బాబురావు, సలాది మురళీ, కొట్యాడ రాము పసిడి, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించి ప్రతిభ చాటారు. అంతకు ముందు ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష, పీఎంశ్రీ , పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా హీల్ పారాడ్రైస్ స్కూల్, తోటపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి దివ్యాంగుల పారా స్పోర్ట్స్లో ఈ ముగ్గురు విద్యార్థులు బంగారం, సిల్వర్, బ్రాంజి మెడల్స్ సాధించారు. రాష్ట్ర స్థాయి పారా ట్రయాత్లాన్(స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లిన్) క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన ఈ ముగ్గురు విద్యార్థులను జాతీయ స్థాయి పారా ట్రయాత్లాన్ పోటీలకు సెలక్టర్లు ఎంపిక చేశారు. జాతీయ స్థాయి పారా ట్రయాత్లాన్ క్రీడా పోటీలు ఆగస్టు 15న మహారాష్ట్రలోని పూణేలో జరుగుతాయని, ఆ పోటీలకు ఈ ముగ్గురు విద్యార్థులు హాజరవుతారని మహాలక్ష్మి నాయుడు తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న దివ్యాంగ విద్యార్థులను ఎంఈవో లింగమూర్తి, బ్రహ్మాజీ అభినందించారు. -
స్థానికేతరులతో మీటింగ్ పెట్టుకున్నారు..
మేము నలుగురు అన్నదమ్ములం. మా అన్నయ్యకు ఎకరం, నాతో పాటు మిగతా ముగ్గురికి 65 సెంట్లు భూమి చొప్పున ఉంది. జిరాయితీ భూమిలో వరి పంట ఉంది. కొండపై ఉన్న అరెకరంలో పోడు వ్యవసాయం చేస్తాను. మైనింగ్ అనుమతిలిచ్చిన కొండకు ఆనుకుని 30 అడుగుల దూరంలోనే నా భూమి ఉంది. బయట నుంచి కొందరినీ తీసుకొచ్చి మీటింగ్లా పెట్టుకుని .. దాన్నే ప్రజాభిప్రాయ సేకరణ అంటూ అనుమతి ఇచ్చుకున్నారు. స్థానిక గ్రామస్తులను గానీ, సమీప రైతులకు గానీ సమాచారం ఇవ్వలేదు. దీనిపై మాకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మార్వోకు, మైనింగ్ ఏడీకి ఫిర్యాదు చేశాం. – సింగపల్లి రమేష్, రైతు, పి.కొత్తపల్లి గ్రామం -
కేజీబీవీల్లో త్వరలో ఖాళీల భర్తీ
నాతవరం : జిల్లాలో కస్తూర్బా పాఠశాలలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని సర్వశిక్షా అభియాన్ సమగ్ర అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటరు కె. శ్రీరాములు అన్నారు. ఆయన సోమవారం సాయంత్రం మర్రిపాలెంలో కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు నాణ్యతను పరిశీలించారు. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 20 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయని, ఆయా పాఠశాలల్లో 5,600 పైగా విద్యార్థులు చదువుతున్నారన్నారు. కస్తూర్బా పాఠశాలలో జిల్లా వ్యాప్తంగా 18 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. కోతుల ఇబ్బందులు నివారణలో భాగంగా జిల్లాలోనే మొట్ట మొదటిగా నాతవరం మండలం మర్రిపాలెం కేజీబీవీకి కలెక్టరు చొరవతో రూ.3 లక్షలతో సోలార్ కంచె ఏర్పాటు చేశామన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని కస్తూర్బా పాఠశాలల్లో సోలార్ కంచె ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లాలో అన్ని కేజీబీవీలకు సోలార్ లైట్లు సోలార్ ఫ్యాన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే చాలా స్కూళ్లలో విద్యార్థినుల కోసం వేడి నీళ్లు మరగబెట్టడానికి సోలార్ ప్లాంట్లు పెట్టామన్నారు. కలెక్టర్ అనుమతించిన అధికారులు మాత్రమే కేజీబీవీలోకి ప్రవేశించాలని, కేజీబీవీలో తయారు చేసిన వంటకాలు తప్ప బయట నుంచి ఎలాంటి ఆహారం లోపలకు తీసుకురాకూడదని, దానికి పూర్తి బాధ్యత ఆయా ప్రిన్సిపాళ్లదేనని స్పష్టం చేశారు. విద్యార్థినులకు నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు, ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరి ఉంటుందని తెలిపారు. రక్తహీనత గల విద్యార్థినులను గుర్తించి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లాలో ఎక్కడైనా కేజీబీవీల్లో మరుగుదొడ్లు ఇతర సామాగ్రి శిథిలమైతే యుద్ధ ప్రతిపాదికన బాగు చేసేందుకు నిధులు ఉన్నాయన్నారు. కేజీబీవీలో వసతి సమస్యలేకుండా అదనపు భవనాలు నిర్మించామని తెలిపారు. నాతవరం మండలంలో రూ.2.10 కోట్లతో అదనపు భవన నిర్మాణం పూర్తి చేశామని, త్వరలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసామన్నారు. జిల్లాలో 91 పాఠశాలలకు రూ.9 కోట్లు మంజూరయ్యాయని వాటిని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. గతంలో మంజూరైన భవన నిర్మాణ పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో నాతవరం ఎంఈవో కామిరెడ్డి వరహాలబాబు సమగ్ర విభాగం జేఈ రమణజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జగన్నాథుడి హుండీ ఆదాయం రూ.18 లక్షలు
హుండీ ఆదాయం లెక్కిస్తున్న ఆలయ అర్చకులు అనకాపల్లి : గవరపాలెం అగ్గిమర్రిచెట్టు వద్ద సుభద్రా బలభద్ర సమేత జగన్నాథ్ స్వామివారి రథయాత్ర మహోత్సవాలు గురింపు కార్యక్రమంలో భాగంగా స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం జరిగింది. రథయాత్ర పురస్కరించుకుని స్వామివారి హుండీ ఆదాయం రూ.18,44,366 వచ్చిందని ఆలయ ఈవో కె.చంద్రతేజ చెప్పారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.3,07,999 అధికంగా ఆదాయం భక్తుల ద్వారా వచ్చిందన్నారు. నగదును దేవదాయ ధర్మదాయ శాఖ ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దాడి బుజ్జి, మరో ఆలయ ఈవో మురళి, అర్చకులు పాల్గొన్నారు. -
శిలాఫలకాలు ధ్వంసం
గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన శిలా ఫలకాలు నక్కపల్లి: ఇటీవల బోయపాడులో జెట్టీనిర్మాణానికి సంబంధించి మంత్రులు శంకుస్థాపన చేసిన శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్ధనరెడ్డి బోయపాడులో జెట్టీకి శంకుస్థాపన చేశారు. రెండు శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. వీటిని ఎవరో ధ్వంసం చేశారు. సోమవారం శిలాఫలకాలు ధ్వంసం అయిన విషయాన్ని స్థానిక మత్స్యకారులు గుర్తించారు. రెండురోజుల క్రితమే వీటిని ధ్వంసం చేసినట్టు భావిస్తున్నారు. ఈ విషయమై టీడీపీకి చెందిన మత్స్యకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కలెక్టర్ గారు మీరైనా స్పందించండి
గొలుగొండ : అంగవైకల్యం ఉన్నా సదరం క్యాంప్లో అన్యాయం జరిగిందని ఓ దివ్యాంగ విద్యార్ధి ఆవేదన.. నడవలేని, లేవలేని దుస్థితిలో ఉన్నా సదరం క్యాంప్లో 14 శాతం వైకల్యం నమోదు.. కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థుల సాయంతో తప్ప పాఠశాలకు వెళ్లలేని దుస్థితి. కనీసం సదరం క్యాంప్లో న్యాయం జరుగుతుందని ఆశపడినా ప్రయోజనం శూన్యం. మండలంలో చోద్యం జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న నందిక అభిషేక్ దయనీయ పరిస్థితి ఇది. పూర్తి అంగవైకల్యం ఉన్నా క్యాంప్లో 14శాతం ఇవ్వడంపై ఈ పేద విద్యార్థితోపాటు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇదీ సమస్య నందిక అభిషేక్కు కాళ్లు, వెన్నుముక, నడుము పనిచేయడం లేదు. రెండేళ్ల క్రితం వరకు కొంతమేర బాగున్నా, వయస్సు పెరిగే కొలది అవయవాల్లో మార్పులు లేకపోవడం వల్ల ఎదుగుదల లేదని వైద్యులు తెలిపారు. తోటి విద్యార్ధులు, తల్లిదండ్రుల సాయంతో.. అభిషేక్ ప్రతిరోజు హైస్కూల్కు రావాలంటే నరకమే. ఇదే గ్రామానికి చెందిన నందిక రమణ దంపతులకు ఒక్కగాను ఒక్క కుమారుడు అభిషేక్ ఆరోగ్య పరిస్థితి చూసి ప్రతీరోజు తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తండ్రి రమణ పరిస్థితి కూడా అంతంతమాత్రమే. పేదరికం కావడం తల్లి కూలికి వెళితే తప్ప పూట గడవడం కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో సదరం క్యాంప్ ద్వారా అయినా సర్టిఫికెట్టు మంజూరైతే కనీసం పింఛను డబ్బులతోనైనా పోషించుకోవడం జరుగుతుందని ఆశ పడితే నిరాశే మిగిలింది. మే 26న సదరం స్లాట్లో పరీక్షలకు వెళితే పూర్తి అంగవైకల్యం ఉన్నా 14శాతం మంజూరు చేశారని ఆవేదన చెందుతున్నారు. మరలా స్లాట్ ఓపెన్ కావాలంటే ఏడాది వేచి ఉండాల్సిందే. ఇటువంటి సమయంలో జిల్లా విద్యాశాఖ, జిల్లా కలెక్టర్ దృష్టి సారించి న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దాతలైనా సాయం చేయండి చోద్యం గ్రామం నుంచి హైస్కూల్కు కిలోమీటర్ దూరం ఉంది. తండ్రికి అనారోగ్య పరిస్థితి, తల్లి కూలికి వెళితే తప్ప పూట గడవదు. ఇటువంటి తరుణంలో అభిషేక్కు దాతలు సాయం చేయాలని పలువురు కోరతున్నారు. బ్యాటరీ రిక్షా, లేక ఏ ఇతర వాహనం అయినా దాతలు సమకూరిస్తే ఈ విద్యార్థి స్కూల్కి ఎవరి సాయం లేకుండా వెళ్లి విద్య నభ్యసించడానికి వీలవుతుందని పలువురు కోరుతున్నారు. తోటి విద్యార్థి సాయంతో స్కూల్కు వస్తున్న అభిషేక్ సదరం క్యాంప్లో 14 శాతంగా ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ -
నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ అనుమతులు
నాకు, మా అన్నయ్య, పెదనాన్నకు ఐదెకరాలు జిరాయితీ భూమి ఉంది. వర్షాలు పడితే వరి లేకుండా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. మా భూమికి 500 మీటర్ల దూరంలో మైనింగ్కు అనుమతిలిచ్చారు. కనీసం మా అభిప్రాయం తీసుకోలేదు. ఇక్కడ మైనింగ్ జరిగితే మా పొలంలో పంట నాశనం అయిపోతుంది. గ్రామానికి 500 మీటర్ల దూరంలోనే మైనింగ్ అనుమతిస్తే మా గ్రామ ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడతారు. దీనిపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాం. – కామిరెడ్డి వెంకట కృష్ణ, రైతు, పి.కొత్తపల్లి గ్రామం -
వినతి తీసుకోవడానికే భయపడుతున్న అధికారులు
నాకు అరెకరం ఉంది. మా చిన్నాన్నకు అరెకరం ఉంది. మేము కొబ్బరి పంట, కూరగాయలు, అపరాలు పంట పండిస్తాం. దీనిపైనే మా కుటుంబం జీవిస్తోంది. ఇలాంటి వ్యవసాయం చేసుకునే చోట, గ్రామానికి 500 మీటర్ల సమీపంలో మైనింగ్కు ఎలా అనుమతిస్తారు. దీనిపై అవసరమైతే రైతులంతా ఉద్యమిస్తాం. అనుమతులను రద్దు చేయాలంటూ విన్నవించుకోవడానికి వెళ్తే మా విన్నపాలను తీసుకోవడానికే మైనింగ్ ఏడీ, స్థానిక రెవెన్యూ అధికారి భయపడిపోతున్నారు. దీని వెనుక ఎవరున్నారో తెలియాలని డిమాడ్ చేస్తున్నాం. – రావి నాగేంద్ర, రైతు, పి.కొత్తపల్లి గ్రామం -
డీఎస్సీ అక్రమాలపై నేడు యువత, విద్యార్థి ర్యాలీ
మునగపాక : డీఎస్సీ అక్రమాలతో పాటు నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా మంగళవారం అనకాపల్లిలో నిర్వహించే యువత, విద్యార్థి ర్యాలీని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కోరారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకోవడంతో ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే యువకులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఉండేదన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలో నీట్ పేపర్ లీకేజీ, అలాగే రాష్ట్రంలో డీఎస్సీలో జరిగిన అక్రమాలను చాటిచెప్పేందుకు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అనకాపల్లిలో యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారన్నారు. అనకాపల్లి రామచంద్ర థియేటర్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ నాలుగు రోడ్ల జంక్షన్ మీదుగా పెరుగుబజారు సెంటర్ వరకు కొనసాగుతుందన్నారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ర్యాలీని విజయవంతం చేయాలి.. అనకాపల్లిలో మంగళవారం నిర్వహించే విద్యార్థి, యువత ర్యాలీని ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఆడారి అచ్చియ్యనాయుడు కోరారు. మండలంలోని పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు. -
మరో కొండకు టెండర్
చంద్రబాబు ప్రభుత్వంలో జిల్లాలో మైనింగ్ మాఫియా విచ్చలవిడిగా పెట్రేగిపోతోంది. రెండున్నరేళ్ల పాలనలో కేజీఎఫ్ తరహాలో కొండలను పిండిచేసి సొమ్ము చేసుకుంది. చివరికి దైవ క్షేత్రాలను కూడా వదలకుండా అక్రమంగా మైనింగ్కు పాల్పడింది. ఇప్పుడు పేద రైతులు పోడు వ్యవసాయం చేసుకునే కొండ ప్రాంతాలపై కన్నేసింది. స్వయంగా హోంమంత్రి ఇలాకాలోనే స్థానిక కూటమి నేతల అండదండలతో పోడు కొండపై నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్కు అధికారులు అనుమతులిచ్చినట్టు స్పష్టమవుతోంది. కోటవురట్ల మండలంలో పిప్పళ్ల కొత్తపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్కు అనుమతిచ్చిన కొండసాక్షి, అనకాపల్లి : జిల్లాలో చట్టబద్ధమైన అనుమతులున్న క్వారీల కంటే అక్రమ మైనింగ్ క్వారీల సంఖ్యే ఎక్కువగా ఉంది. కూటమి ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో, మైనింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేస్తున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం పిప్పళ్ల కొత్తపల్లి (పి.కొత్తపల్లి) గ్రామంలోని సర్వే నంబర్ 190లో ఉన్న 285 ఎకరాల విస్తీర్ణంగల కొండ ప్రాంతంలో మైనింగ్కు అనుమతి ఇవ్వడంపై స్థానిక రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న కొండపై మైనింగ్కు ఎలా అనుమతిస్తారని మండిపడుతున్నారు. ఈ కొండను కొల్లగొట్టేందుకు కొందరు రాజకీయ నాయకులు, కూటమి నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. ఈ కొండపై దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న పి.కొత్తపల్లి రైతులకు గతంలోనే ప్రభుత్వం ‘డి–ఫారం’ పట్టాలు మంజూరు చేసింది. అయితే, అక్కడ ఉన్న మెటల్, విలువైన రాళ్లను తోడేసి రూ. కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు స్వార్థపరులు ఈ కుట్రకు తెరలేపారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు కోటవురట్ల మండలం పి.కొత్తపల్లి సర్వే నంబరు 190లో కొండపై మైనింగ్ తవ్వకాలకు దళారులు, కూటమి నాయకులు ఏకమయ్యారు. దీనికిగాను పాయకరావుపేటకు చెందిన ‘మణికంఠ గొంతిరెడ్డి స్టోన్్ క్రషర్’కు నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ కట్టబెట్టారు. ఈ లైసెన్స్ మంజూరుకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం అనివార్యం. బయటి వ్యక్తులను తీసుకొచ్చి సమావేశం పేరుతో పోలీసు బలగాల మధ్య బెదిరింపులకు దిగుతూ ప్రజాభిప్రాయ సేకరణ ముగించారు. మైనింగ్ శాఖ ఇచ్చిన అనుమతి ఉత్తర్వుల్లో ఒకటి 18 హెక్టార్లు, మరొకటి 6 హెక్టార్లుగా ఉంది. ఒకటి గొంతిరెడ్డి స్టోన్ క్రషర్ పేరు మీద ఉండగా.. మరొకటి 2015లో పాయకరావుపేటకు చెందిన కూండ్రపు కృష్ణ పేరు మీద ఉన్నట్టు సమాచారం. అయితే కొత్తగా వచ్చిన జీవోలో కూండ్రపు కృష్ణ పేరు లేకపోవడం గమనార్హం. గతంలోనే అనుమతులిచ్చామని అధికారులు చెప్తున్నప్పటికీ, అక్కడ ఇప్పటివరకు ఎలాంటి తవ్వకాలు జరగలేదు. పదేళ్ల క్రితం ఇచ్చిన అనుమతులు ఇప్పటివరకు ఎందుకు బయటపడలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కల్పితమని మండిపడుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే.. సదరు కొండ గ్రామానికి 500 మీటర్ల దూరంలోనే ఉంటే, అధికారిక ఉత్తర్వుల్లో మాత్రం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చూపి అక్రమాలకు పాల్పడ్డారు. సర్వే నంబరు 190లో 285 ఎకరాల్లో 65 ఎకరాలకుపైగా స్థానిక రైతుల డి–పట్టాలు ఉన్నప్పటికీ, వారి అభిప్రాయం తీసుకోకుండా మైనింగ్ లైసెన్స్ ఇవ్వడంపై మండిపడుతున్నారు. ‘శ్రీ మణికంఠ గొంతిరెడ్డి రోడ్డు అండ్ బిల్డింగ్ స్టోన్ క్రషర్’ సంస్థకు లైసెన్స్ కట్టబెట్టే ప్రక్రియలో మైనింగ్, రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు భారీగా ముడుపులు తీసుకున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక మంత్రి అండదండలతోనే ఈ దందా నడుస్తోందని రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పర్యావరణం, ఆరోగ్యంపై కోలుకోలేని దెబ్బ ఇక్కడ మైనింగ్, క్రషింగ్ ప్రారంభిస్తే వచ్చే దుమ్ము, ధూళితో గ్రామం మొత్తం తీవ్ర రోగాల బారిన పడే ప్రమాదం ఉందని పి.కొత్తపల్లి గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తక్షణమే మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఈ క్రషర్కు అనుమతులు రద్దు చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం స్థానిక రెవెన్యూ అధికారి, మైనింగ్ ఏడీకి కూడా అక్రమ మైనింగ్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలంటూ విన్నవించుకున్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. స్థానిక గ్రామస్తులు, రైతుల ఆవేదనను కూడా వినడానికి అధికారులు గంటల తరబడి వేచి ఉండాలని నిబంధనలు పెట్టారంటే.. స్థానిక ప్రజాప్రతినిధులకు ఎంత భయపడుతున్నారో స్పష్టమవుతోందని వాపోయారు. పోడు వ్యవసాయం చేస్తున్న కొండపై మైనింగ్కు కుట్ర! దశాబ్దాలుగా ఇదే కొండ రైతులకు జీవనాధారం కోటవురట్ల మండలం పి.కొత్తపల్లిలో సర్వే నంబరు 190లో 285 ఎకరాల కొండ నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ లైసెన్స్ గ్రామానికి 500 మీ. దూరంలో ఉంటే.. జీవోలో 12 కి.మీ దూరంలో ఉన్నట్లు వెల్లడి రైతులకు, గ్రామస్తులకు తెలియకుండానే ప్రజాభిప్రాయ సేకరణ పాయకరావుపేటకు చెందిన మణికంఠ గొంతిరెడ్డి స్టోన్ క్రషర్’కు అనుమతి మంత్రి అండదండలతోనే నిర్వాకం పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు, రైతులు -
పచ్చని పొలాల మీదుగా రోడ్డా?
● సర్వేను అడ్డుకున్న రైతులుపెద్దపల్లి వద్ద సర్వేను అడ్డుకున్న రైతులు మునగపాక (యలమంచిలి రూరల్) : తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారంటూ యలమంచిలి పరిధిలోని పెదపల్లి రైతులు అధికారులను అడ్డుకున్నారు. పెదపల్లి వ్యవసాయ భూముల మీదుగా రహదారి నిర్మించే క్రమంలో ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చేపడుతున్న చర్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సర్వే పనులను అడ్డగించారు. భూములు ఎందుకు తీసుకుంటున్నారు? అలాగే మాకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సర్వే ఎలా నిర్వహిస్తారంటూ పలువురు రైతులు అధికారులపై మండిపడ్డారు. పచ్చని పొలాల మీదుగా రహదారి ఏర్పాటు చేస్తే తమ బతుకులు ఎలా అంటూ రైతులు నిలదీశారు. అలాగే రైతులకు ఎంత మేర పరిహారం ఇస్తారో చెప్పకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని రైతులు తప్పుపట్టారు. గ్రామంలో గ్రామసభ నిర్వహించి తీర్మానం చేసిన తరువాతే భూ సర్వే చేయాలని రైతులు డిమాండ్ చేశారు. -
హైవేపై దోపిడీ
● కారు అద్దం పగులగొట్టి మహిళ మెడలోని బంగారం అపహరణ నక్కపల్లి: జాతీయ రహదారిపై వేంపాడు టోల్ప్లాజా సమీపంలో కారులో కూర్చున్న ఒక మహిళ మెడలోంచి గుర్తుతెలియని వ్యక్తి 3 తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యాడు. సీఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం... మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన పి.రమేష్ బాబు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు కారులో వెళ్తున్నారు. డ్రైవర్కు నిద్రరావడంతో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో టోల్ప్లాజా దాటిన తర్వాత జాస్ హోటల్ సమీపంలో కారును రోడ్డుపక్కన నిలిపి విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఒక దుండగుడు కారు సైడు అద్దాన్ని రాయితో పగులగొట్టి, రమేష్ భార్య కల్యాణి మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగా రు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్టీమ్, డాగ్స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సీఐ తెలిపారు. -
రోలుగుంట మహిళకు కోవిడ్ పాజిటివ్
రోలుగుంట: మండల కేంద్రం రోలుగుంటకు చెందిన 58 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం... రోలుగుంటలో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళ ఈ నెల 24వ తేదీన విశాఖపట్నంలో కుమార్తె ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత జ్వరం, దగ్గు రావడంతో ఆమెను కేజీహెచ్కు తీసుకెళ్లారు. కరోనా లక్షణాలు ఉండడంతో అక్కడే పరీక్షలు చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు విశాఖ డిప్యూటీ డీఎంహెచ్వో చంద్రశేఖర్ తెలిపారని స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి శ్రావణి ఆది వారం చెప్పారు. స్వల్ప లక్షణాలుండడంతో ఆమెకు మందులిచ్చి హోమ్ ఐసోలేషన్లో ఉంచాలని ఇంటికి పంపించారు. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, విశాఖలోనే వైద్య సేవలందిస్తున్నారని వైద్యాధికారి చెప్పారు. కేజీహెచ్లో నిర్వహించినపరీక్షల్లో నిర్ధారణ హోమ్ ఐసోలేషన్కు రిఫర్ చేసినఅధికారులు -
అధికారిక వేడుకగా ప్రగడ కోటయ్య జయంతి
అచ్యుతాపురం రూరల్ : చేనేత ఉద్యమ స్ఫూర్తిదాత, పద్మశాలి సమాజ ప్రముఖుడు స్వర్గీయ ప్రగడ కోటయ్య జయంతిని ప్రతి ఏడాది జూలై 26 రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో పట్ల చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అచ్యుతాపురం మండల కాంప్లెక్స్ పరిధిలోని శ్రీ భద్రావతి చేనేత కార్మికులు దుప్పితూరు సంఘం సభ్యులు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాడెం సూరి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూరి అప్పారావు మాట్లాడుతూ చేనేత జాతి అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన ప్రగడ కోటయ్యకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గుర్తింపు ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.25వేల చేనేత భరోసా, ఉచిత విద్యుత్, ఆప్కో బకాయిల చెల్లింపు వంటి హామీలను వెంటనే అమలు చేసి నేతన్నలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వానపల్లి వెంకటరమణ, అముదూరి అప్పలరాజు, వానపల్లి ముకుంద ఈశ్వర్రావు, కాకి శ్రీనివాసరావు, సూరిశెట్టి సూరి వెంకటరమణ, వానపల్లి సన్యాసిరావు, శేశెట్టి రమణ, శీరం సత్తిబాబు చేనేత కార్మికులు పాల్గొన్నారు. -
భూములిస్తే... దారిద్య్రమే మిగిలింది!
పొలాలకెళ్లాలంటే రాంగ్ రూటే గతి కాగిత,వేంపాడు, అమలాపురం రైతుల ఆవేదన రోడ్డుమధ్యలో ఆర్అండ్బీ నిర్మించిన డివైడర్ నక్కపల్లి: స్టీల్ప్లాంట్ బల్క్ డ్రగ్పార్క్ కోసం రోడ్డు నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులకు ‘దారి’ద్య్రం దాపురించింది. అధికారుల నిర్వాకం వల్ల తమ పొలాలకు వెళ్లేందుకు భవిష్యత్తులో నానా ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నుంచి భూములు సేకరించి, తమ పొలాలకు వెళ్లే వీలులేకుండా అధికారులు చేస్తున్నారంటూ కాగిత, వేంపాడు, అమలాపురం తదితర గ్రామాలకు చెందిన 500 మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కాగిత నుంచి బోయపాడు వరకు స్టీల్ప్లాంట్ అవసరాల కోసం 80 అడుగుల డబుల్ రోడ్డును నిర్మిస్తున్నారు. దీనికి సుమారు 60 ఎకరాలు అవసరమైంది. కొంత ప్రభుత్వ భూమి ఉండగా, మిలిగిన దానిని రైతుల నుంచి సేకరించారు. కాగిత నుంచి ఈ రోడ్డు నిర్మాణపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో ఈ భూముల మీదుగా తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేసుకుని రైతులు తమ పొలాల్లోకి, జగనన్న కాలనీకి రాకపోకలు సాగించేవారు. పాడి పశువులు, గొర్రెలు, మేకలు మేపుకొనేందుకు చుట్టుపక్కల పొలాల్లోకి పచ్చికబయళ్లలోకి తోలుకెళ్లేవారు. 50 శాతానికి పైగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రోడ్డుమధ్యలో డివైడర్ నిర్మిస్తున్నారు. కాగిత నుంచి యథావిధిగా రాకపోకలు సాగించేందుకు ప్రతి 100 మీటర్లకు ఒక యూటర్న్ ఇవ్వకుండా డివైడర్ నిర్మించడం వల్ల కాగిత చుట్టు పక్కల పొలాలు కలిగిన వేంపాడు, నెల్లిపూడి,అమలాపురం రైతులకు ఇబ్బంది ఏర్పడింది. ఇలా రోడ్డు మధ్యలో గ్యాప్ (యూటర్న్) తీసుకునే వెసులు బాటు కల్పించకపోవడం వల్ల రైతులు, పాడి పశువులను తీసుకుని వెళ్లేవారు రాంగ్ రూట్లో రెండు కిలోమీటర్లకుపైగా వెళ్లి తమ గమ్యాలకు చేరుకోవాల్సి వస్తోంది. 100 మీటర్లకు కాకపోయినా 200 మీటర్లకు అయినా యూటర్న్ తీసుకునేందుకు వీలుగా రోడ్డు మధ్యలో ఖాళీ విడిచిపెట్టాలని రైతులు కోరుతున్నారు. దీనికి అధికారులు ససేమిరా అంటున్నారు. నిబంధనల ప్రకారమే రోడ్డు, డివైడర్లు ఏర్పాటు చేస్తామని, రాంగ్ రూట్లో రాకపోకలు సాగించాల్సిందేనని చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణం పూర్తయి భారీ వాహనాలు రాకపోకలు ప్రారంభమయితే రాంగ్రూట్లో రావడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా పెద్దగా స్పందన లేదని వాపోతున్నారు. తమకు అనుకూలంగా, గతంలో ఉన్న మాదిరిగా ఎక్కడికక్కడ అటు ఇటు రాకపోకలు సాగించేందుకు వీలుగా యూటర్న్ ఏర్పాటు చేయకపోతే రోడ్డుపనులు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. -
రైలు ఢీకొని వృద్ధుడు మృతి
అనకాపల్లి: స్థానిక శారదానది బ్రిడ్జి వద్ద తిరుమల ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని సుమారు 60 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు గల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్టు దువ్వాడ పోలీస్ స్టేషన్ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి ఆదివారం చెప్పారు. కశింకోట నుంచి అనకాపల్లి వచ్చే డౌన్ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న మృతదేహాన్ని గమనించి, అటుగా వెళుతున్న వ్యక్తులు సమాచారం ఇచ్చారని తెలిపారు. తెలుపు రంగు ఫుల్హ్యాండ్స్ చొక్కా, కాఫీ రంగు షార్ట్ ధరించి ఉన్నాడని, ఎడమ ముంజేతిపై లక్ష్మి అనే పచ్చబొట్టు ఉందని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. వివరాలకు సెల్ నంబర్ 7382058996ను సంప్రదించవచ్చని ఎస్ఐ చెప్పారు. -
యూటర్న్ పాయింట్లు ఏర్పాటు చేయాలి
రోడ్డు మధ్యలో గ్యాప్ లేకుండా డివైడర్లు ఏర్పాటు చేయడం వల్ల రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. రెండు కిలోమీటర్లు వెళ్లి యూటర్న్ తీసుకుని రావాలంటే కష్టం. రైతులు కోరిన విధంగా ప్రతి 200 మీటర్లకు ఒక యూటర్న్ పాయింట్ ఏర్పాటుచేయాలి. రైతుల రాకపోకలకు అవకాశం కల్పించాలి. దీనిపై ఆర్అండ్బీ అఽధికారులకు వినతి పత్రం ఇచ్చాం. – దేవవరపు శివ,రైతు కాగిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం కాగిత సమీపం నుంచి స్టీల్ప్లాంట్ అవసరాల కోసం నిర్మిస్తున్న రోడ్డులో ప్రతి 200 మీటర్లకు ఒకచోట పొలాల్లోకి రాకపోకల కోసం యూటర్న్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం రోడ్డు నిర్మాణం, డివైడర్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. రైతుల వినతిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారినుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. – లలిత, ఈఈ ఆర్అండ్బి -
కేజీబీవీ ఘటనలో ఐదుగురికి షోకాజ్ నోటీసులు
కోటవురట్ల: కేజీబీవీలో 30 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈమేరకు సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీరాములు ఐదుగురికి ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రత్యేకాధికారి సరితాదేవికి, శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న నలుగురు సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏపీసీ శ్రీరాములు మాట్లాడుతూ జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, ప్రాథమిక విచారణలో భాగంగా ఐదుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
పారా ట్రయాథ్లాన్లో రావికమతం విద్యార్థులకు పతకాలు
రావికమతం: విశాఖపట్నం బీచ్రోడ్డులోని పాండురంగాపురం వద్ద ఉన్న ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ పారా ట్రయాథ్లాన్ (స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్) చాంపియన్ షిప్–2026 పోటీల్లో పీటీఎస్–3 విభాగంలో రావికమతం మండలానికి చెందిన ముగ్గురు దివ్యాంగ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ స్టేట్ లెవల్ పోటీల్లో మేడివాడకు చెందిన గంటా బాబూరావు ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం, చినపాచిల గ్రామానికి చెందిన సలాది మురళి ద్వితీయ స్థానంలో నిలిచి రజతం, మేడివాడ గ్రామానికి చెందిన కొట్యాడ రాము తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు. వీరికి అసోసియేషన్ ప్రెసిడెంట్ సీతల్ దేవి మెడల్స్, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. పతకాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మి నాయుడు, మండల విద్యాశాఖాధికారులు లింగమూర్తి, బ్రహ్మాజీ, మేడివాడ ప్రధానోపాధ్యాయుడు వంకాయల రామారావు అభినందించారు. -
అంబులెన్స్ ఏర్పాటుకు ఆస్పత్రి సిబ్బంది ససేమిరా
రోలుగుంట : ఆస్పత్రి నుంచి మృతదేహం తరలించడానికి అంబులెన్సు ఏర్పాటుకు నిరాకరించిన అధికారుల తీరు అమానుషం అని, వారి తీరులో మార్పు రావాలని సీపీఎం నాయకుడు కె.గోవింద అన్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అర్ల పంచాయతీ శివారు పీత్రుగెడ్డ గ్రామానికి చెందిన పీవీటీజీ కొందు గిరిజన జాతికి చెందిన కొర్ర సుబ్బారావు (56)ను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందాడు. మృతదేహన్ని ఇంటికి తరలించేందుకు తమకు ఆర్థిక స్థోమత లేదని అంబులెన్సు ఏర్పాటు చేయాలని ఆస్పత్రి సిబ్బందిని మృతుడి కుటుంబీకులు కోరారు. అయితే ఏజెన్సీ ప్రాంతాలకి మాత్రమే ఐటీడీఏ అంబులెన్సు అందుబాటులో ఉంటుందని, కొండ దిగువ గ్రామాలకు ఈ సేవలు వర్తించవని ఆస్పత్రి సిబ్బంది తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లగా, ఐటీడీఏ అంబులెన్సును వినియోగించుకోవాలని తెలిపారు. దీంతో మృతుడు కుమారుడైన కొర్రా కొండబాబు సీపీఎం జిల్లా కార్యదర్శి కె.గోవిందకు తెలియజేసి ఆయనతో కలిసి ఆర్డీవోకి సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ ఉదయం 8 గంటలకు చనిపోయిన మృతదేహాన్ని తరలించడానికి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ అంబులెన్సు అందుబాటులోకి రాలేదు. పాడేరు ఐటీడీఏ పీవో దృష్టికి సమస్య తీసుకెళ్లగా చివరకు పీవో జోక్యంతో అంబులెన్సు ఏర్పాటైన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఆ తరువాత మృతదేహాన్ని పీత్రుగెడ్డ తరలించగా గ్రామానికి ఆరకిలోమీటరు దూరంలో అంబులెన్సు వెళ్లే పరిస్థితి లేక అక్కడ నుంచి పాడైపె భుజాన వేసుకొని అష్టకష్టాలతో మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. సమస్య పరిష్కారానికి చొరవ చూసి సహకరించిన పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి మృతుడి కుటుంబీకులు, సీపీఎం నాయకుడు గోవింద ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మృతదేహంతో గంటల తరబడి గిరిజనుల నిరీక్షణ ఆస్పత్రి వర్గాల అమానుష వైఖరిపై ఆవేదన ఐటీడీఏ పీవో చొరవతో అంబులెన్స్ సమకూర్చిన వైనం -
అన్ని వర్గాలను దగా చేసిన కూటమి ప్రభుత్వం
మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం: అమలుకు సాధ్యం కాని హామీలతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారిని దగా చేసిందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. వైఎస్సార్సీపీ నర్సీపట్నం రూరల్ మండల అధ్యక్షుడు శానపతి వెంకటరత్నం ఆధ్వర్యంలో దుగ్గాడ గ్రామంలో ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం నెరవేర్చారన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి మోసపోయారని చెప్పారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి, రైతు భరోసా ఎంత మందికి ఇచ్చామో సచివాలయాల్లో డేటా ఉండేదని చెప్పారు. ప్రస్తుతం ఎంత మందికి ఇస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అమ్మ ఒడికి సంబంధించి రూ.14 వేలు తల్లి ఖాతాకు, స్కూల్ నిర్వహణకు రూ. వెయ్యి స్కూల్ ఖాతాలో వేస్తే టీడీపీ నాయకులు రాద్ధాంతం చేశారన్నారు. ప్రస్తుతం తల్లికి వందనం పేరుతో రూ.13 వేలు ఇస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా నిరుద్యోగులకు మొండిచేయి చూపారన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానన్న హామీని సైతం చంద్రబాబు అటకెక్కించారన్నారు. నియోజకవర్గంలో 7 వేల ఓట్లు తొలగించారని చెప్పారు. ఈ తొలగించిన ఓట్లపై బీఎల్ఏలు దృష్టి సారించాలన్నారు. ఈ నెల 31న ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేస్తారని చెప్పారు. తొలగించిన వాటిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు ఉంటే తిరిగి చేర్పించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అంశాలపై ఈ నెల 28న జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలన్నారు. అంతా బాగానే చేస్తున్నామన్న భ్రమలో టీడీపీ నాయకులు ఉన్నారు. రాబోయే రోజుల్లో కూటమి నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ అనుబంధ కమిటీల సభ్యులకు త్వరలోనే ఐడెంటిటీ కార్డులు జారీ చేస్తామని చెప్పారు.అనంతరం గణేష్ను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, పార్టీ మాకవరపాలెం, నాతవరం, గొలుగొండ మండల అధ్యక్షులు చిటికెల రమణ, నాగేశ్వరరావు, ఫాణిశాంతరామ్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుర్ల సత్యనారాయణ, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు గొంప కన్నయ్యనాయుడు, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు తమరాన శ్రీను, విద్యార్థి విభాగం నాయకులు కిల్లాడ శ్రీనివాసరావు, ఎంపీటీసీ బోళెం వెంకటేష్, మండల బూత్ ఇన్ఛార్జీ తాతాజీ, నియోజకవర్గ బూత్ కమిటీల అధ్యక్షులు సుర్ల శేఖర్, జిల్లా ప్రచారక కమిటీ నాయకులు పిల్ల శ్రీను, పట్టణ యూత్ అధ్యక్షుడు అల్లంపల్లి ఈశ్వరరావు, పార్టీ నాయకులు నిద్ర శ్రీనివాసరావు, నల్లబెల్లి శ్రీను, గుడివాడ లోవరాజు, పెట్ల పెద అప్పలనాయుడు, నియోజకవర్గ ఎస్సీసెల్ నాయకులు చవల నాగేశ్వరరావు, యూత్ నాయకులు దన్నిన నానాజీ, మాజీ సర్పంచ్ పెట్ల అప్పలనాయుడు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి రోయింగ్ పోటీలు
చింతలపూడి(జంగారెడ్డిగూడెం): ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాలువ వాటర్ స్పోర్ట్స్ సెంటర్లో రాష్ట్రస్థాయి రోయింగ్ చాంపియన్షిష్– 2026 పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఎస్ఆర్ఏఏపీ, శాప్, డీఎస్ఏ ఏలూరు సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. శాప్ డైరెక్టర్ జగదీశ్వరి, శాప్ డీఎస్డీవో అజీజ్ సిరాజ్, ఎస్ఆర్ఏఏపీ అధ్యక్షుడు తరుణ్ కాకాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలురు, బాలికలకు సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో సింగిల్, డబుల్ స్కల్స్ అంశాలపై ఎంపిక పోటీలు నిర్వహించారు. ప్రధాన కోచ్ కృష్ణమూర్తి, టెక్నికల్ అఫీషియల్ విజయ్ రోవర్ పర్యవేక్షించారు. జిల్లాల ప్రతినిధులు ఉదర్ల జోషి(ఏలూరు), ఎన్.పవన్ (ఎన్టీఆర్), ఎం.తులసిరామ్ (అనకాపల్లి), పరిగి వేణుగోపాలరావు (సత్యసాయి), పి.శ్రీనివాస్ (శ్రీకాకుళం), వెంకటేష్ (పశ్చిమగోదావరి), ఎన్.దేవుడు (తూర్పుగోదావరి), సర్పంచ్ సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షుడు చంటి పాల్గొన్నారు. విజేతలు వీరే.. సబ్ జూనియర్ బాలికల విభాగం: ఎం.లక్ష్మి (ఏలూరు) స్వర్ణం, జె.హైడి రోసిలిన్ (పశ్చిమగోదావరి) రజతం, ఎం.జాగృతి (నెల్లూరు) కాంస్యం. సబ్ జూనియర్ బాలుర విభాగం: ఎం.కుశాల్ (నెల్లూరు) స్వర్ణం, ఎన్.జస్వంత్ (ఏలూరు) రజతం, బి.నిర్మలా నాయక్ (పశ్చిమగోదావరి) కాంస్యం. జూనియర్ మహిళల విభాగం: కె.ప్రేమకుమారి (ఏలూరు) స్వర్ణం, జె.వాసవి (అనకాపల్లి) రజతం, ఎస్.యమున (ఎన్టీఆర్ జిల్లా) కాంస్యం. జూనియర్ బాలుర విభాగం: జి.మాధవ్ (ఎన్టీఆర్ జిల్లా) స్వర్ణం, బి.లిఖిత్ నాయక్ (శ్రీకాకుళం) రజతం, ఐ.జగదీష్ (ఎన్టీఆర్ జిల్లా) కాంస్యం. సీనియర్ పురుషుల విభాగం: జి.సాయిరామ్(ఎన్టీ ఆర్ జిల్లా) స్వర్ణం, బి.సంతోష్ (ఏలూరు) రజతం, ఎన్.దేవరాజ్ (అనకాపల్లి) కాంస్య పతకాలు సాధించారు. -
పని చేయని మంత్రులు తప్పుకోవడమే మంచిది
అనకాపల్లి : దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయని మంత్రులు రాజీనామా చేస్తే బాగుంటుందని, నీట్ పరీక్షల్లో పేపర్ లీక్పై చర్యలు తీసుకోవడంతో విఫలమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయించడం ప్రధాని మోదీ దృఢ నాయకత్వానికి నిదర్శమని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. స్థానిక రింగ్రోడ్డు తమ క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో పోలీసులు దమనకాండ సృష్టించారని, నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా నష్టపోయిన విద్యార్థులపై లాఠీఛార్జి చేయడం అన్యాయమన్నారు. మంత్రులు తమ శాఖల్లో ఆక్రమాలపై, సమస్యలపైన నిష్క్రియా విధానాన్ని అనుసరించడం రాజద్రోహం అవుతుందన్నారు. 2022 నీట్ పేపరు లీక్ వల్ల 8 మంది, 2026లో మరోసారి లీక్ వల్ల 21 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడితే, ప్రశ్నపత్రాలను ఉత్తర దేశం వారికి అమ్ముకునే మాఫియాపై ఏమి చర్యలు తీసుకుంటున్నారో అర్థం కావడంలేదన్నారు. నీట్ పేపర్ లీకేజీల్లో బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాలనలో బడ్జెట్ లీక్ అయినందుకు నాతో సహా 31 మంత్రుల చేత రాజీనామా చేయించడం జరిగిందన్నారు. పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిబ్బందిపై నేటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మాఫియాకు శిక్షలు విధించేలా చట్ట సవరణలు చేయడానికి ప్రధాని నిర్ణయించారని, నిందితులకు 10 సంవత్సరాలు జైలుశిక్ష, రూ.10 కోట్ల జరిమానా, కింది కోర్టు 3 నెలలు, హైకోర్టు 3 నెలలు దాటకుండా తీర్పులు ఇచ్చేలా పార్లమెంట్లో సవరణకు తీసుకోవడం మంచి పరిణామమన్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు -
గిరి ప్రదక్షిణ
‘కమాండ్ కంట్రోల్’ పరిశీలనగిరి ప్రదక్షిణ నేపథ్యంలో సింహాచలం కొండదిగువ తొలిపావంచా సమీపంలోని పుష్కరిణి సత్రంలో ఏర్పాటు చేసిన ప్రధాన కమాండ్ కంట్రోల్ రూమ్ను కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షిస్తామని కలెక్టర్ తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గంలో మొత్తం ఏడు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశామని, అన్ని శాఖల అధికారులు అక్కడ 24 గంటలూ విధుల్లో ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, పోలీసు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ మార్గం తొలి పావంచా నుంచి మొదలయ్యే గిరి ప్రదక్షిణ.. అడవివరం జంక్షన్, పైనాపిల్ కాలనీ, సెంట్రల్ జైల్, ముడసర్లోవ, చినగదిలి, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, హనుమంతవాక జంక్షన్, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్డు, వెంకోజీపాలెం, ఇసుకతోట, హెచ్బీ కాలనీ, సీతమ్మధార, అల్లూరి సీతారామరాజు విగ్రహం, బాలయ్యశాస్త్రి లేఅవుట్, పోర్టు స్టేడియం, డీఎల్బీ క్వార్టర్స్, మాధవధార, ఆర్అండ్బీ కార్యాలయం, ఎన్ఎస్టీఎల్, లక్ష్మీనగర్, కుమారి కల్యాణమండపం, ప్రహ్లాదపురం, శ్రీనివాసనగర్ మీదుగా తిరిగి సింహాచలం చేరుకుంటుంది. దర్శన సమయాలు జూలై 28: గిరిప్రదక్షిణ పూర్తి చేసి రాత్రికి చేరుకునే భక్తులకు రాత్రి 9.30 గంటల వరకు దర్శనం. జూలై 29: ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరవధిక దర్శనం. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు, అనంతరం రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు దర్శనం కల్పిస్తారు. 28న సుమారు 50 వేల మంది, 29న 80 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. -
శిష్టకరణాల అభ్యున్నతికి కృషి
అనకాపల్లి: శిష్టకరణాల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర శిష్టకరణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కు మహంతి రాజా చెప్పారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారి వివేకానంద ఫంక్షన్న హాల్లో ఆదివారం జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇటీవల మరణించిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రి మహంతి వెంకటరావు తదితరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేకమంది సంఘ సభ్యులకు సీఎం సహాయనిధి నుంచి వైద్య సహాయం, నగదు సహాయాన్ని అందజేసినట్లు చెప్పారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి మానాపురం సీహెచ్ఎస్ గౌరీశంకరరావు మాట్లాడుతూ శిష్టకరణాలు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. మహిళా కన్వీనర్ సంజుక్త పట్నాయక్ మాట్లాడుతూ శిష్టకరణ మహిళలు అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కోశాధికారి బెహరా రాధాకుమారి ఆర్థిక నివేదికను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు డబ్బీరు సత్యప్రసాద్, ఎస్వీఎన్ పట్నాయక్, సభ్యులు శేఖరమంత్రి శ్రీనివాస్, పట్నాయకుని రామచంద్రరావు, సోమశేఖర్, పొట్నూరు రవి, బలివాడ బాలభాస్కరరావు, వీణం శ్రీనివాస్, రఘుపాత్రుని భీమారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శిష్టకరణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కు మహంతిరాజా -
టీడీఆర్ బాండ్లు వద్దు
● హైకోర్టు ఆదేశాల మేరకు బాధితులకు న్యాయం చేయాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలని, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కోరారు. ఆదివారం స్థానిక పీఏసీఎస్ కార్యాలయం ఆవరణలో రహదారి విస్తరణ బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూడిమడక రోడ్డు విస్తరణ అందరికీ సమ్మతమేనన్నారు. గతంలో నిర్వహించిన గ్రామసభల్లో నిర్ణయించిన మేరకు పరిహారాన్ని నేరుగా అకౌంట్లో జమ చేయాలన్నారు. అంతేగానీ టీడీఆర్ బాండ్లు ఇస్తామంటూ చెప్పడం సరికాదన్నారు. బాధితుల్లో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు రహదారి విస్తరణకు సహకరించడం లేదంటూ తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేసేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే రహదారి విస్తరణకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. అప్పుడు నిర్ణయించిన పరిహారాన్ని కాకుండా ప్రస్తుతం భూమి విలువలను గుర్తించి, అందుకు అనుగుణంగా పరిహారం పెంచాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగేంతవరకు ప్రతి ఒక్కరూ రాజీలేని పోరాటం చేయాలన్నారు. డాక్టర్ చదరం శివాజీ, ఆడారి అచ్చియ్య నాయుడు, తనకాల జగ్గారావు, మళ్ల సూరప్పారావు, భీముని వెంకటేశ్వరరావు, బొడ్డేడ సోమ సుందరరావు తదితరులు పాల్గొన్నారు. -
రెండు పాఠశాలల్లో పాచిపోయిన ఆహారం.. 71 మంది బాలికలకు అస్వస్థత
చింతూరు/కోటవురట్ల: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో నిదర్శనమిది. గతంలో పలు కేజీబీవీల్లో, ఆశ్రమ గిరిజన పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైనా, వాటి నిర్వహణలో లోపాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా శుక్రవారం జరిగిన పేరెంట్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా మధ్యాహ్నం వండిన పప్పు, కూరలనే రాత్రికి కూడా పిల్లలకు పెట్టడంతో పాచిపోయిన ఆ ఆహారం తిని రెండు పాఠశాలల్లో 71 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.పోలవరం జిల్లా వీఆర్ పురం మండలం సోములగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 41 మంది, అనకాపల్లి జిల్లా కోటవురట్ల కేజీబీవీలో 30 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోములగూడెంలో పాచిపోయిన పప్పు సోములగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ – టీచర్స్ సమావేశం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వండిన పప్పు మిగిలిపోవడంతో విద్యార్థినులకు రాత్రి కూడా దానినే వడ్డించినట్లు తెలిసింది. మధ్యాహ్నం మిగిలిన పప్పుతో పాటు బంగాళదుంప కూర తిన్నామని, అర్ధరాత్రి నుంచి కడుపు నొప్పి ప్రారంభం కావడంతో మాత్రలు వేసుకున్నామని విద్యార్థినులు చెప్పారు.శనివారం ఉదయం నుంచి వాంతులు, విరేచనాలు అధికం కావడంతో చింతూరు సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు. చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నొఖ్వాల్ బాధిత విద్యార్థినులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థుల కోరిక మేరకు మధ్యాహ్నం మిగిలిన పప్పును రాత్రి కూడా పెట్టారని ఆయన చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నొఖ్వాల్ చెప్పారు. కోటవురట్లలో పాడైపోయిన కూరలు కోటవురట్ల కేజీబీవీలో శుక్రవారం జరిగిన పేరెంట్–టీచర్స్ మీటింగ్కు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఇక్కడ శుక్రవారం మధ్యాహ్నం వంకాయ, బంగాళాదుంప కూరలను పెట్టారు. మిగిలిపోయిన కూరలను రాత్రికి కూడా విద్యార్థినులకు పెట్టారు. శనివారం ఉదయం కిచిడీ తిన్న కొద్ది సేపటికే 30 మంది విద్యార్థినులు విరేచనాలు, వాంతులతో విలవిల్లాడిపోయారు. వీరిలో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.కె.వెంకటాపురం పీహెచ్సీ వైద్యాధికారి కేజీబీవీకి చేరుకుని చికిత్స అందించారు. తీవ్ర అస్వస్థతకు గురైన బొట్టా సత్యవతి, గాలి జయలక్షి్మ, గుడివాడ విజయలక్ష్మి, గెడ్డం పూజిత, గజ్జి జాహ్నవిలను కోటవురట్ల సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మిగతా 25 మందికి కేజీబీవీలోనే పీహెచ్సీ వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు కేజీబీవీకి పరుగు పరుగున వచ్చారు. పాచిపోయిన ఆహారం వల్లే పిల్లలు అస్వస్థతకు గురైనట్టు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల్లో కొన్ని..⇒ 2026 ఫిబ్రవరి 7 : పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 103 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉడకని ఇడ్లీలు, చాలా రోజులుగా నిల్వ ఉన్న శనగ పిండితో చేసిన బొంబాయి చట్నీ తినడం వల్ల ఆస్పత్రిపాలయ్యారు. ⇒ 2026 ఏప్రిల్ 1 : అన్నమయ్య జిల్లా పుంగనూరులోని మున్సిపల్ పాఠశాలలో బల్లి పడిన భోజనం తిని ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ⇒ 2026 ఏప్రిల్ 21 : అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆహారం వికటించి 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ⇒ 2026 జూలై 8 : కడపలోని ప్రభుత్వ డెంటల్ కాలేజీ లేడీస్ హాస్టల్లో 30 మంది విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. దోశలు, చట్నీ తిన్న వారు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు. -
చూసిన కనులదే భాగ్యం.. ఈడేరిన మనోరథం
అనకాపల్లి టౌన్: జై జగన్నాథ నినాదంతో అనకాపల్లి పట్టణం మార్మోగింది. ఇంద్రద్యుమ్న హాల్ నుంచి జగన్నాథ స్వామి ఆలయం వరకు మారు రథయాత్ర శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. మహిళా భక్తులు కోలాట నృత్యంతో అలరించారు. వందల సంఖ్యలో పాల్గొన్న భక్తులు జగన్నాథ, జగన్నాథ.. జగన్నాథ పాహిమాం... జగన్నాథ, జగన్నాథ.. జగన్నాథ రక్షమాం అంటూ తన్మయత్వంతో రథం వెంట సాగారు. ముందుగా ఉదయం కల్కి అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుభద్ర, బలభద్ర, జగన్నాథ స్వాములకు ప్రత్యేక అలంకరణ చేసి రథంపై ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు, నాయకులు, భక్తులు రథం లాగి మారు రథయాత్ర ప్రారంభించారు. ఈ రథయాత్ర ఇంద్రద్యుమ్న హాల్ నుంచి మళ్లవీధి, గాంధీబొమ్మ జంక్షన్, పెరుగుబజార్, చిన నాలుగు రోడ్ల జంక్షన్, మెయిన్ రోడ్డు మీదుగా వేల్పులవీధి, పెద నాలుగురోడ్ల జంక్షన్, శారదా బ్రిడ్జి వరకు వెళ్లి, తిరిగి పెద నాలుగు రోడ్ల జంక్షన్ మీదుగా వన్వే ట్రాఫిక్ డౌన్ మీదుగా గవరపాలెం, అగ్గిమర్రిచెట్టు వద్ద ఉన్న జగన్నాథస్వామి ఆలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొని నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పట్టణ సీఐ జి. ప్రేమ్ కుమార్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మునగపాక: మండలంలోని మునగపాక, నాగులాపల్లి గ్రామాల్లో జగన్నాథుని పండగను శనివారం ఘనంగా నిర్వహించారు. జగన్నాథ ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున తిరుగు రథాయాత్రను భక్తి శ్రద్ధలతో జరిపారు. జై గంటలు కొడుతూ గోనలు, అరటి గెలలతో ఊరేగింపుగా బావుల వద్దకు వెళ్లి, ఇంటిళ్లపాదీ స్నానమాచరించి గోనల్లో నీరు నింపి తలపై పెట్టుకుని ఇళ్లకు చేరుకున్నారు. అనంతరం ప్రసాదం తయారు చేసి సమీపంలోని బంధువులకు పంచి పెట్టారు. మునగపాకలోని జగన్నాథ స్వామిని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ దర్శించుకుని పూజలు చేశారు. ఘనంగా జగన్నాథుని మారు రథయాత్ర -
ఊపిరి కాజేసి
మందులు నమిలేసిమహారాణిపేట: ‘కంచే చేను మేస్తే.. కాపెవరు?’ అన్న చందంగా మారింది కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్)లో పరిస్థితి. రోగులకు ప్రాణం పోయాల్సిన ప్రాణవాయువునే పైసల పంటగా.. ఉచితంగా అందాల్సిన మందులనే ఆదాయ మార్గంగా మార్చుకున్న అక్రమార్కులు.. నిబంధనలను తుంగలో తొక్కి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ఆక్సిజన్ సరఫరా కాకుండానే ట్యాంకర్లు వచ్చినట్లు రికార్డులు సృష్టించడం.. సంబంధిత అధికారుల ధ్రువీకరణ లేకుండానే బిల్లులు క్లియర్ చేయడం.. మందుల కొనుగోళ్లలోనూ అక్రమాలకు పాల్పడటం వంటి ఆరోపణలు కేజీహెచ్లో అవినీతి వేర్లు ఎంత లోతుగా విస్తరించాయో చెబుతున్నాయి. కేవలం ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల కాలంలోనే ఏకంగా రూ. 1.40 కోట్ల మేర బోగస్ ఆక్సిజన్ బిల్లులు మంజూరు కావడం ఈ మహాదోపిడీ తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రాణవాయువుపై పైసల వేట ప్రాణం నిలబెట్టే ఆక్సిజన్ కూడా కొందరికి కాసుల యంత్రంగా మారిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆస్పత్రికి ట్యాంకర్లు వచ్చినట్లు రికార్డులు సృష్టించడం, సరఫరా జరిగినట్లు చూపించడం, నిబంధనల ప్రకారం తనిఖీలు లేకుండానే బిల్లులు ఆమోదించడం ద్వారా కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. కేవలం ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లోనే రూ.1.40 కోట్ల విలువైన ఆక్సిజన్ బిల్లులు అనుమానాస్పదంగా క్లియర్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘చేతికి చిక్కిందే చేప’ అన్నట్టుగా దొరికిన అవకాశాన్ని దోపిడీకి వేదికగా మార్చుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారి సెలవు చూసి.. దోపిడీ బాట పట్టి నిబంధనల ప్రకారం సీఎస్ఆర్ఎంవో ధృవీకరణ లేకుండా ఒక్క బిల్లు కూడా చెల్లించరాదు. అయితే అక్రమంగా వచ్చిన బిల్లులపై సంతకం చేయడానికి సంబంధిత అధికారి నిరాకరించారని సమాచారం. అంతే.. ‘తలుపు మూసినా కిటికీ చూసినట్లు’, ఆయన సెలవులోకి వెళ్లగానే ఇన్చార్జితో సంతకాలు చేయించి కోట్ల రూపాయల బిల్లులను వరుసగా క్లియర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం వెనుక కొందరు ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు ఉన్నట్లు ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. రూ.15 లక్షలు వెచ్చిస్తే చాలు కానీ.. కేజీహెచ్లో మొత్తం ఆరు ఆక్సిజన్ ప్లాంట్లు ఉండగా నాలుగు ప్లాంట్లు మరమ్మతులకు గురయ్యాయి. నిపుణుల అంచనా ప్రకారం సుమారు రూ.15 లక్షలు వెచ్చిస్తే వాటిని మళ్లీ వినియోగంలోకి తీసుకురావచ్చని చెబుతున్నారు. అయితే మరమ్మతులు చేపట్టకుండా బయటి నుంచి ఆక్సిజన్ను భారీగా కొనుగోలు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘ఇంట్లో నెయ్యి ఉండగా పొరుగింటి వెన్న కోసం పరుగెత్తడం’ వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయన్నది ఇప్పుడు విచారణకు ప్రధాన అంశంగా మారింది. మందుల్లోనూ అదే మంత్రం! ఆక్సిజన్తో కథ ముగియలేదు. రోగులకు ఉచితంగా అందాల్సిన మందుల కొనుగోళ్లలోనూ భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతలేని మందులను అధిక ధరలకు కొనుగోలు చేయడం, కొందరు సరఫరాదారులకే వరుసగా కాంట్రాక్టులు అప్పగించడం, అత్యవసర మందుల కొరత సృష్టించడం ద్వారా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు కేజీహెచ్లో 614 రకాల మందులు అందుబాటులో ఉండగా ప్రస్తుతం అవి 379 రకాలకే పరిమితమయ్యాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. బీపీ, ఇన్సులిన్, ఫిట్స్, క్యాన్సర్, థైరాయిడ్, యాంటీబయాటిక్స్, హిమోగ్లోబిన్ పెంచే మందులు సహా అనేక కీలక ఔషధాలు అందుబాటులో లేక రోగులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితులు ఆదాయ వనరుగా.. ఆస్పత్రిలో మందులు లేక బయట కొనుగోలు చేసినా.. అత్యవసరంగా ఇచ్చిన మందుల బిల్లుల చెల్లింపుల్లోనూ గందరగోళం నెలకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితులను కూడా కొందరు ఆదాయ వనరుగా మార్చుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘పేదవాడి కన్నీరు కొందరికి కాసుల వర్షంగా మారిందా?’ అన్న ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతోంది. కేజీహెచ్లో ఆక్సిజన్ పేరుతో కోట్ల రూపాయలు పక్కదారి సీఎస్ఆర్ఎంవో సంతకం లేకుండానే బిల్లుల క్లియరెన్స్ మందుల కొనుగోళ్లలో అక్రమాలు.. రోగులకు తీవ్ర ఔషధాల కొరత అంతర్గత కమిటీపై అనుమానాలు.. స్వతంత్ర విచారణకు డిమాండ్ -
ఎంపీఈవోలకు ఆర్థిక సాయం
అనకాపల్లి: స్థానిక నెహ్రూచౌక్ వద్ద జిల్లా వ్యవసాయశాఖలో విధులు నిర్వహిస్తున్న ఎంపీఈవోలకు ఏఈవోలు, ప్రజాసంఘాల నాయకులు శనివారం సంఘీభావం తెలియజేశారు. కనీస వేతనాలు అందించాలంటూ పెన్డౌన్ కార్యక్రమం చేస్తున్న వారికి విశాఖ ఉమ్మడి జిల్లాల ఏఈవోలు తమ వంతు సహాయంగా రూ.11వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎంపీఈవోలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయశాఖలో విధులు నిర్వహిస్తున్న ఎంపీఈవోలు, ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ పర్మినెంట్ ఉద్యోగులుగా చేస్తామని ఇచ్చిన హామీ రెండేళ్ల అవుతున్న నేటికీ అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమావేనవేతం ఇవ్వాలని, 12 సంవత్సరాలు ఉద్యోగికి నెలకు రూ.12వేలు ఇవ్వడం అన్యాయమన్నారు. బకాయిపడిన నాలుగు మాసాల జీతాలు తక్షణమే ప్రభుత్వం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో విశాఖ ఉమ్మడి వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం కార్యదర్శి కెబి.సూర్యనారాయణ, కోశాధికారి కోసూరు సత్యనారాయణ, పబ్లిసిటీ కార్యదర్శి ఎం.ఎన్.మూర్తి, గౌరవాధ్యక్షుడు జి.చిన్నదేముడు, ప్రజాసంఘాల నాయకులు వై ఎన్.భద్రం, వివి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో కారు డ్రైవర్ ఆత్మహత్య
ఆనందపురం: తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లను తాళలేక కారు డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన మండల పరిధిలోని శొంఠ్యాం జగనన్న కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కాలనీకి చెందిన కోరుకొండ హేమంత్ కుమార్ (27) కారు డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 9.45 గంటల సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన హేమంత్, స్నానం చేసి తన గదిలోకి వెళ్లాడు. ఎంతసేపటికీ భోజనానికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి అప్పలకొండ గది తలుపులు తెరిచి చూడగా, హేమంత్ సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని కిందకు దించారు. శరీరం వెచ్చగా ఉండటంతో ప్రాణాలతోనే ఉన్నాడనే ఆశతో తక్షణమే ‘108’ అత్యవసర అంబులెన్స్కు సమాచారం అందించారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది హేమంత్ను పరీక్షించి, అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గత కొంతకాలంగా ఎదురవుతున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల హేమంత్ తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడని, ఆ మనస్తాపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. మృతుడి తల్లి అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం శనివారం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్రకు మహర్దశ
వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ బీచ్రోడ్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని, పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఆకర్షితమై స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ అన్నారు. శనివారం వీఎంఆర్డీఏ కార్యాలయంలో మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్, సీఈ వినయ్కుమార్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానుందని తెలిపారు. విమానాశ్రయానికి అనుసంధానంగా 15 ప్రధాన రహదారుల్లో ప్రాధాన్యమున్న ఏడు రహదారుల అభివృద్ధి పనులు వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, ఆర్అండ్బీ శాఖల ఆధ్వర్యంలో వేగంగా జరుగుతున్నాయని, రూ.170 కోట్లతో 26 కి.మీ. మేర రహదారుల విస్తరణ చేపట్టి ఎక్కువ భాగం పూర్తి చేసినట్లు చెప్పారు. సంస్థ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ విమానాశ్రయానికి కోస్టల్ కారిడార్, గూగుల్ మ్యాప్స్, సైన్బోర్డులు, ఆర్టీసీ ఈవీ బస్సులు, ప్రయాణికుల కోసం లాంజ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
నిలకడగా కేజీబీవీ విద్యార్థినుల ఆరోగ్యం
● ఆర్డీవో, డీఎంహెచ్వో ● పాఠశాలను సందర్శించిన అధికారులు కోటవురట్ల: స్థానిక కేజీబీవీలో అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, డీఎంహెచ్వో డాక్టరు అచ్యుతకుమారి తెలిపారు. 30 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని హుటాహుటిన వారు కేజీబీవీకి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థి నుల ఆరోగ్య పరిస్థితి, అస్వస్థతకు గురికావడానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, విద్యార్థి నులందరూ క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ప్రాణాపా యం లేదని చెప్పారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఐదు గురిని నిరంతరం పర్యవేక్షిస్తూ మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. మిగిలిన 25 మంది విద్యార్థినులకు కేజీబీవీలోనే చికిత్స అందించినట్టు చెప్పారు. విద్యార్థినులు తీసుకున్న ఆహారం, నీటి నమూనాలను పరీక్ష నిమిత్తం పంపినట్టు తెలిపారు. శుక్రవారం మెగా పీటీఎం జరిగిందని, ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థినుల తల్లిదండ్రు లు ఆహార పదార్థాలు తెచ్చి ఉంటారని, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయిస్తున్నామని తెలిపారు. జెడ్పీటీసీ సభ్యురాలు సిద్ధాబత్తుల ఉమాదేవి అక్కడకు చేరుకుని విద్యార్థినుల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కై లాసపట్నంలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో చిన్నారులు మృతి చెందిన దుర్ఘటనను గుర్తు చేశారు. అధికారులు విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, మెరుగైన చికిత్స అందించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ పరామర్శ కలుషిత ఆహారం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినులను మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ పరిశీలకుడు డి.వి.సూర్యనారాయణరాజు పరామర్శించారు. ఆయన స్థానిక సీహెచ్సీకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. వారి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం కేజీబీవీకి వెళ్లి మిగతా విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఎస్ఎస్ఏ ఏపీసీ శ్రీరాము లు, ఎస్వో సరితాదేవిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
రోగులకు మెరుగైనవైద్య సేవలు కల్పించాలి
అనకాపల్లి: బడుగు, బలహీన వర్గాల రోగుల కు ప్రభుత్వ ఆస్పత్రిల్లో వైద్యసేవలు కోసం సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఆస్పత్రికి వస్తారని, ఆటువంటి రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించాలని కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. స్థానిక ఆస్పత్రి ఆవరణలో శనివారం అభివృద్ధి కమిటీ సమావే శం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు కావలసిన మౌలిక సదుపాయాలు, సకాలంలో వైద్యసేవలు అందించడం వల్ల వైద్యులతోపాటు, ఆస్పత్రి సిబ్బందికి మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నట్టయితే తమ దృష్టికి తీసుకుని రావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ ఎస్.శ్రీనివాసరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి, వైద్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి
మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ డిమాండ్ దేవరాపల్లి/నర్సీపట్నం: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దానికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ శనివారం వేర్వేరుగా డిమాండ్ చేశారు. కేంద్రంలో నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంపై విద్యార్థుల పోరాటానికి తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారని, అదే రీతిలో రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలన్నారు. కనీసం క్వాలిఫై కాకుండానే స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు టీచర్ పోస్టులను కట్టబెట్టిన విషయాన్ని సాక్ష్యాధారాలతో మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బయటపెట్టారని గుర్తుచేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డీఎస్సీలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని, కూటమి ప్రభుత్వ అసమర్థత వల్ల ఎందరో అభ్యర్థులు ఉద్యోగాలకు దూరమయ్యారని మండిపడ్డారు. బాధిత అభ్యర్థులు ప్రత్యక్షంగా మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని, అక్రమాలను బట్టబయలు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం అత్యంత దారుణమన్నారు. ఎన్డీఏలో భాగస్వామి అయిన కూటమి ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థుల ఆక్రందనలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. -
ఎల్నినోతో 50 శాతం తగ్గిన వర్షపాతం
అనకాపల్లి: జిల్లాలో ఎల్నినో ప్రభావంతో పంటలకు తీవ్రనష్టం జరుగుతుందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్చార్జి ఏడీఆర్ ఎ.అప్పలస్వామి తెలిపారు. స్థానిక ఆర్ఏఆర్ఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన టి అండ్ వి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం నైరుతి రుతుపవనాలపై తీవ్రంగా కనిపిస్తోందని చెప్పారు. దీంతో జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం కంటే సుమారు 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. జూలై నెలలో 77 శాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైందని, జిల్లాలో 17 మండలాల్లో దీని ప్రభావం అధికంగా ఉందన్నారు. జిల్లాలో సాధారణ వరి సాగు విస్తీర్ణం 56 వేల హెక్టార్లు కాగా, ఇప్పటికి కేవలం 169 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశార న్నారు. మొత్తం పంటల విస్తీర్ణం 69 వేల హెక్టార్లు కాగా, కేవలం 3,756 హెక్టార్ల సాగు చేపట్టారని తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి సీహెచ్.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఆశించిన వర్షాలు కురిస్తేనే జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త డి.ఉమామహేశ్వరరావు, విశాఖ జిల్లా వ్యవసాయ అధికారి ప్రతినిధి బి.విజయప్రసాద్, వివిధ మండల వ్యవసాయశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు
మహారాణిపేట: ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా, కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు పటిష్ఠంగా ఉండేలా చూడాలని సూచించారు. గిరి ప్రదక్షిణ అనంతరం కొండపై దర్శనాలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని, నమూనా ఆలయాల వద్ద కూడా భక్తులు కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అప్పుఘర్, జోడుగుళ్లపాలెం వద్ద సముద్ర స్నానాలకు వచ్చే భక్తుల భద్రత కోసం 90 మంది గజ ఈతగాళ్లను, మార్గంలో 31 వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ ట్రాఫిక్ మళ్లింపులపై ముందస్తు ప్రచారం చేయాలని, నాలుగు ప్రవేశ మార్గాల్లో తాత్కాలిక బస్టాండ్లు, దిశా సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గోపాలపట్నం, చినగదిలి, సీతమ్మధార, పెందుర్తి మండలాల పరిధిలోని 221 పాఠశాలలు, కళాశాలలకు గిరి ప్రదక్షిణ సందర్భంగా సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. సమీక్షలో ఎమ్మెల్యేలు పి. గణబాబు, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పి. విష్ణుకుమార్రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ విద్యాధరి, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, దేవస్థానం ఈవో వెంకటరావు, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్ తదితరులు పాల్గొన్నారు. హోంమంత్రి అనిత -
దస్తావేజు లేఖర్లకు న్యాయం చేయాలి
అనకాపల్లి: ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు పీపీపీ పద్దతిలో ప్రేవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు చర్యలు చేపట్టడం అన్యాయమని, బ్రిటిష్ కాలం నుంచి రిజిస్ట్రేషన్ శాఖలో విధులు నిర్వహిస్తున్న దస్తావేజు లేఖరులకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. మండలంలో జాతీయ రహదారిలోని ఏఎంఎఎల్ కాలేజీ జంక్షన్ వద్ద దీక్షలు చేస్తున్న దస్తావేజు లేఖరులకు శనివారం ఆయన సంఘీ భావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉనారని పేర్కొన్నారు. జీవో నంబర్ 396ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి మలసాల కుమార్ రాజా, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, ,80, 81వార్డు ఇన్ఛార్జ్లు కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు పెతకంశెట్టి జోసఫ్, పార్టీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, ఎంపీటీసీ శ్రీను, మాజీ సర్పంచ్ వరహాలు పాల్గొన్నారు. -
అంతర్గత కమిటీనిజాలు బయటపెట్టేనా
ఈ నిధుల మాయాజాలంపై సీఎంవో, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్లడంతో అంతర్గత విచారణ కమిటీ వేశారు. ఈ కమిటీపై ఆస్పత్రి వర్గాల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న శాఖలోని అధికారులే విచారణ చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయా? గతంలో ఇలాంటి అనేక కమిటీలు నివేదికలకే పరిమితమై, చర్యలు మాత్రం శూన్యంగా మిగిలిపోయాయన్న విమర్శలు ఉన్నాయి. కంటితుడుపు అంతర్గత కమిటీలను పక్కనపెట్టి జాయింట్ కలెక్టర్ లేదా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లేదా స్వతంత్ర ఉన్నతస్థాయి దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కాగా కమిటీ శనివారం కేజీహెచ్లో విచారణ చేపట్టింది. ఆవరణలోని ఆక్సిజన్ ప్లాంట్లను పరిశీలించింది. -
1,500 ఎకరాలకు సాగునీటి భద్రత
అనకాపల్లి: సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని డీఎంఎఫ్టీ, ఇరిగేషన్ శాఖ, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రూ.10 కోట్ల వ్యయంతో డీసిల్టింగ్, కాలువల అభివృద్ధి పనులు చేపట్ట డం జరిగిందని కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మె ల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. మండలంలో శారదా నదిపై తుమ్మపాల వద్ద ఎల్లయ్య గ్రోయిన్ మరమ్మతు పనులు డీఎంఎఫ్టీ నిధులతో రూ.1.19 కోట్ల వ్యయంతో పూర్తి చేయడంతో, సుమారుగా 1500 ఎకరాలకు సాగునీటి కాలువ పూజను శనివారం ఆమె ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరి ఉత్తరాంధ్రలో లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశాలు మెరుగుపడతాయన్నారు. డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, మూతపడిన షుగర్ ఫ్యాక్టరీల స్థానంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. -
అప్పన్నకు వైభవంగా తొలి ఏకాదశి ఆర్జిత సేవలు
సింహాచలం: తొలి ఏకాదశి సందర్భంగా వరాహ లక్ష్మీనృసింహస్వామికి శనివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు సహస్ర నామార్చనని విశేషంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ బేడా మండపంలో వేదికపై అధిష్టింపజేసి, 1001 నామాలతో సహస్రనామార్చన చేశారు. ●శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ బేడా మంపడంలో స్వామివారి ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణం కమనీయంగా సాగింది. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు. ●వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడ సేవ కూడా ఘనంగా జరిగింది. ఆలయ బేడా మండపంలో వెండి గరుడ వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉంచి అష్టోత్తరశత నామావళి పూజ చేశారు. పరవాడ: తొలి ఏకాదశి సందర్భంగారావాడ దరి జల్లెలపాలెంలో కొలువుదీరిన మరిడిమాంబ ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకటాద్రిపై ఏకాదశి ప్రత్యేక పూజలు పెందుర్తి: తొలి ఏకాదశి సందర్భంగా స్థానిక వెంకటాద్రిపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు మహర్తి రామానుజాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, అష్టోత్తర పూజలు చేశారు. భక్తులు తులాభారం సమర్పించారు. దాదాపు 10 వేల మంది భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. స్వామిని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు, వెస్ట్ జోన్ ఏసీపీ పెడాడ ప్రదీప్తి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్(ఎస్ఈసీ) కోడిగుడ్ల దేవిసాంబ దర్శించుకున్నారు. పెందుర్తి సాధుమఠం వద్ద ఉన్న రమా సత్యనారాయణస్వామి ఆలయంలో ప్రధానార్చకుడు మురళీకృష్ణశర్మ, రాజ ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. -
ప్రధాని పర్యటన సందర్భంగా డిజిటల్ డిస్ప్లే బోర్డు ఏర్పాటు
విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ● జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి మంగవేణి అనకాపల్లి: విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్న సందర్భంగా ఆయన పర్యటన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను జిల్లా ప్రజలు వీక్షించేందుకు వీలుగా స్థానిక నెహ్రూ చౌక్లో డిజిటల్ ఎల్ఈడీ డిస్ప్లే బోర్డును ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం తెలిపారు. ఈ బోర్డులో ప్రధాని పర్యటన సమయం, ప్రారంభోత్సవ కార్యక్రమ వివరాలు, ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన సమాచారం నిరంతరం ప్రదర్శించనున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని తెలుసుకుని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని వీక్షించాలని ఆమె సూచించారు.నాతవరం: చదువుతో పాటు విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి జి.మంగవేణి సూచించారు. మర్రిపాలెం కేజీబీవీని శనివారం ఆమె ఎంపీడీవో శ్రీనివాస్తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. మెనూ చార్టును, కిచెన్లోకి వెళ్లి కూరగాయలు, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం స్కూల్ ప్రాంగణమంతా కలియతిరిగారు. విద్యార్థినులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ. 2.12 కోట్లతో నూతనంగా నిర్మించిన అదనపు భవనాన్ని ప్రారంభిస్తే వసతి సమస్య పరిష్కారమవుతుందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీవో దాసరి కొండాజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
హామీల అమలులో కూటమి విఫలం
● 28న వాగ్దానాల అమలు కోరుతూ ర్యాలీ ● భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ మునగపాక: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేరోజులు ఆసన్నమయ్యాయన్నారు. విద్యార్థులు, యువకులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28వ తేదీన అనకాపల్లిలో నిర్వహించనున్న విద్యార్థి, యువత ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డీఎస్సీ స్కాంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలను కూటమి ప్రభుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని చెప్పారు. ఏటా నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యల కారణంగా విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును కోల్పోతున్నారని చెప్పారు. నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాల కారణంగా విద్యార్థులు నష్టపోవాల్సి వచ్చిందని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెరిగిపోయాయన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా అనకాపల్లిలో విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్రాజా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ర్యాలీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంగా చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హేమంత్కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్తో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల విద్యార్థి, యువజన విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు
నక్కపల్లి: ఆషాఢ శుద్ధ ఏకాదశి(తొలి ఏకాదశి) పూజలను శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వేకువజామున మూడు గంటలకు గరుడాద్రిపై స్వామి వారి మూల విరాట్కు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. సాయంత్రం గరుడాద్రి చుట్టూ శ్రీనివాస్ భక్త సమాజం వారితో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అర్చకులు వరప్రసాద్ ఆచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారిని తహసీల్దార్ చిన్ని కృష్ణ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ తదితరులు దర్శించుకున్నారు. సీఐ మురళి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కోలాటం నిర్వహించారు. ఉపమాకకు పోటెత్తిన భక్తులు -
రెవెన్యూ సిబ్బందిపై దాడి
పెందుర్తి: చినముషిడివాడలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన శనివారం ఉద్రిక్తతకు దారితీసింది. పెందుర్తి తహసీల్దార్ ఐ.వెంకటఅప్పారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్ తెలిపిన వివరాల ప్రకారం.. చినముషిడివాడ సర్వే నంబర్ 185లోని ప్రభుత్వ గయాళి భూమిలో ఓ మహిళ అక్రమ నిర్మాణం చేపట్టినట్లు సమాచారం అందడంతో ఆయన రెవెన్యూ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. పరిశీలన అనంతరం అది ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణమని నిర్ధారించి తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు తొలగింపు ప్రక్రియను అడ్డుకొని రెవెన్యూ సిబ్బందిపై దాడికి దిగారు. అదే సమయంలో తహసీల్దార్ ఉన్న వాహనం వైపు కూడా దూసుకెళ్లి భయాందోళనకు గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పంగా చంద్రశేఖర్, దివాకర్, గొడ్డు అప్పలనాయుడు, సాయి, బోగేష్, కక్కల సంతోష్, నారాయణపురం అరుణపై తహసీల్దార్ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
చోడవరం: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసంచేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలులో పెడతారా అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, చోడవరం సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. జగన్ 2.0 యాప్ వాల్పోస్టర్ను చోడవరం పార్టీ కార్యాలయంలో ఆయన శుక్ర వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ అరాచకాలను యాప్లో నమోదు చేయవచ్చని చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. కూటమి నాయకులు ఎక్కడికక్కడ కొండలు, భూములు, ఇసుక, మట్టి దోపిడీ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని, అటువంటి బెదిరింపులకు వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు భయపడరని చెప్పారు. ప్రతి ఒక్కరూ జగన్ 2.0 యాప్ను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొండారాంబాబు, ఎంపీపీ గాడి కాసు, జిల్లా యూత్, రైతు విభాగాల అధ్యక్షులు పుల్లేటి వెంకటేష్, నాగులాపల్లి రాంబాబు, మండల అధ్యక్షుడు శరగడం చిమ్మినాయుడు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గూనూరు రామచంద్రనాయుడు, సోషల్మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పందిరి శ్రీనివాసరావు, చోడవరం పట్టణశాఖ అధ్యక్షుడు దేవరపల్లి సత్య, చోడవరం వైస్ ప్రెసిడెంట్ పుల్లేటి వెంకట్రావు, బొగ్గు శ్యామల, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శులు దొడ్డి వెంకట్రావు, ఓరుగంటి నెహ్రూ, ఎస్సీసెల్ రాష్ట్రసంయుక్త కార్యదర్శి వేచలపు ప్రకాష్, బొగ్గు శ్యామల తదితరులు పాల్గొన్నారు. గుడివాడ అమర్నాథ్ -
విద్యార్థులపై దాడులు అమానుషం
అనకాపల్లి: కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో విద్యార్థులపై దాడులు జరపడం అమానుషమని, ఈ దమనకాండను దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారని అనకాపల్లి బార్ అసోసియేషన్ కార్యదర్శి శివాచారి అన్నారు. దాడులకు వ్యతిరేకంగా స్థానిక కోర్టు భవనాల సముదాయం వద్ద శుక్రవారం న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్, కేంద్ర ప్రభుత్వ తప్పిదాల కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు నష్టపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పూర్వ కార్యదర్శి ఆడారి స్వామి, పూర్వ అధ్యక్షుడు బుద్ధ త్రినాథ్, శేఖరమంత్రుల సాయి వెంకట లక్ష్మణ్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
నేడు మారు రథయాత్ర
అనకాపల్లి టౌన్: జగన్నాథ స్వామి మారు రథయాత్ర మహోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించనున్నారు. దేవదాయశాఖాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక గూడ్స్రోడ్డు ఇంద్రద్యుమ్న హాల్ నుంచి ఉదయం 9 గంటలకు మారు రథయాత్ర ప్రారంభమవుతుందని ఆలయ ఈవో కె.చంద్రతేజ తెలిపారు. మళ్ళవీధి, గాంధీబొమ్మ జంక్షన్, పెరుగుబజార్, చిననాలుగురోడ్ల జంక్షన్, మెయిన్ రోడ్డు మీదుగా వేల్పులవీధి, పెద నాలుగురోడ్ల జంక్షన్ శారదాబ్రిడ్జి వరకు వెళ్లి తిరిగి పెద నాలుగు రోడ్ల జంక్షన్, వన్వేట్రాఫిక్ డౌన్ మీదుగా రథం గవరపాలెం అగ్గిమర్రిచెట్టు వద్ద ఉన్న జగన్నాథస్వామి ఆలయానికి చేరుకుంటుంది. ఈసందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. -
1.08 లక్షల ఓట్లకు కత్తెర?
ముగిసిన ‘సర్’ ప్రక్రియ 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల సాక్షి, అనకాపల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. జాబితాలో దాదాపు 1,08,606 ఓట్లు తొలగించినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇది ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమమే అయినప్పటికీ, అమలవుతున్న తీరుపై రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు అనేక సందేహాలు వ్యక్తం చేశాయి. జిల్లాలో ప్రస్తుతం 13,02,389 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. వీరందరికీ ఎన్యుమరేషన్ ఫారం–2లను పంపిణీ చేయగా, 11,93,783 ఫారాలను డిజిటలైజ్ చేశారు. అంటే 91.66 శాతం ప్రక్రియ పూర్తయింది. కాగా శుక్రవారంతో ఫారాల సమర్పణ ముగిసింది. 31వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఆగస్టు ఒకటో తేదీ తర్వాత అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు యాడెడ్, షిఫ్టెడ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కువ ఆందోళన షిఫ్టెడ్ ఓట్లపైనే.. తొలగించిన ఒక లక్షా 8 వేల 606 ఓట్లలో అత్యధికంగా మరణించిన వారు 48,455 మంది ఉండగా, 32,609 షిఫ్టెడ్ ఓట్లు ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా పాయకరావుపేట నియోజకవర్గంలో 21,608 ఓట్లు, చోడవరం నియోజకవర్గంలో 19,467, అత్యల్పంగా నర్సీపట్నం నియోజకవర్గంలో 16,709 ఓట్లు తొలగించబడ్డాయి. తొలగించిన వాటిలో షిఫ్టెడ్ ఓట్లు ఎక్కువగా పాయకరావుపేట నియోజకవర్గంలో 6,946 ఉండగా, తర్వాత స్థానంలో చోడవరం నియోజకవర్గంలో 6,564, యలమంచిలి నియోజకవర్గంలో 6,243 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా డబుల్ ఎంట్రీ.. అనకాపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 3,692 ఓట్లు, తర్వాత యలమంచిలిలో 2,780 ఓట్లు ఉన్నాయి. సర్ ప్రక్రియలో శాశ్వత నివాసాన్ని నిర్ధారించే సమయంలో వీరిలో చాలా మంది పేర్లు తొలగించారని తెలుస్తోంది. మ్యాపింగ్పై ఆరోపణలు సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు నిర్వహించిన మ్యాపింగ్పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల తొందరపాటు, మరికొన్ని ప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హులైన ఓటర్ల వివరాలు సరిగా నమోదు కాలేదని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఒకే నియోజకవర్గంలో బూత్ మారిన కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయిన వారు, వివాహం తర్వాత చిరునామా మారిన మహిళలు, ఉద్యోగరీత్యా బదిలీ అయిన వారు, అద్దె ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాల వివరాలు మ్యాపింగ్లో సరిగా నమోదు కాలేదన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అధికార యంత్రాంగం.. అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ఎన్నికల అధికారులు అధికారికంగా స్పందించలేదు. అసెంబ్లీ మొత్తం ఓటర్లు డిస్ట్రిబ్యూటెడ్ డిజిటలైజేషన్ శాతం చోడవరం 2,19,895 2,19,895 2,00,428 91.14 మాడుగుల 1,90,545 190,545 1,76,516 92.63 అనకాపల్లి 2,15,615 215,615 1,96,945 91.34 యలమంచిలి 2,08,851 2,08,851 1,90,728 91.32 పాయకరావుపేట 2,53,393 2,53,393 2,31,785 91.47 నర్సీపట్నం 2,14,090 2,14,090 1,97,381 92.19 మొత్తం 13,02,389 13,02,389 11,93,783 91.66జిల్లాలో అసెంబ్లీ వారీగా డిజిటలైజేషన్ -
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
బీచ్రోడ్డు(విశాఖ): రెల్వేప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా ఆదేశించారు. విశాఖపట్నం–హజ్రత్ నిజాముద్దీన్ స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ (12803) రైలులో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, పరిశుభ్రత, క్యాటరింగ్, కోచ్ నిర్వహణను సమీక్షించడానికి క్షుణ్ణంగా పరిశీలించారు. మెకానికల్, కమర్షియల్, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులతో కలిసి ఆయన ప్రయాణికులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వారి నుంచి స్వీకరించిన సూచనల ఆధారంగా డివిజన్ పరిధిలో ప్రయాణికుల సౌకర్యాలను మరింత మెరుగుపరచడానికి తక్షణమే చర్యలు చేపట్టాల ని అధికారులను డీఆర్ఎం ఆదేశించారు. -
నేడు తొలి ఏకాదశి పూజలు
నక్కపల్లి: ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) పర్వదినం సందర్భంగా మండలంలోని ఉపమాక గ్రామంలో గరుడాద్రిపై వేంచేసియున్న కల్కి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజ లు నిర్వహించనున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఆలయ గాలిగోపురం వద్ద విశాలమైన ప్రాంగణంలోనూ, ఆలయంలోనూ క్యూలైన్లు, స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు అందజేయడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. తెల్లవారుజామున 3:30 గంటలకు కల్కి వేంకటేశ్వర స్వామివారి మూలవిరాట్కు విశేష అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటల వరకు భక్తులందరికీ దర్శనం కల్పిస్తారు. కొండ దిగువన గల ఆలయ క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామివారి ఆలయంలోనూ నిత్య పూజలు, కై ంకర్యాలు నిర్వహించిన తర్వాత రాత్రి 8 గంటల వరకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం స్థానిక శ్రీనివాస భక్త సమాజం ఆధ్వర్యంలో భక్తుల గోవింద నామస్మరణ మధ్య గిరిప్రదక్షిణ జరుగుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు చెప్పారు. ఉపమాక ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు -
27న ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కార్మికుల చలో విజయవాడ
అనకాపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ప్రజారవాణా శాఖ (ఆర్టీసీ)లో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు కోన లక్ష్మణ్ తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపో గేటు వద్ద శుక్రవారం ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీలో అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులు ఇప్పటికీ తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సక్రమంగా అమలు కావడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నాయుడు, విశ్వేశ్వరరావు, వెంకట్, భగవాన్, హర్షవర్ధన్, పృథ్వీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
కలెక్టర్ విజయ కృష్ణన్ రావికమతం: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి సమాజ శ్రేయస్సుకు పాటు పడాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. మరుపాక మోడల్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన పేరెంట్, టీచర్ మీటింగ్లో విజయ్ కృష్ణన్, స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల మానసిక స్థితిని తల్లిదండ్రులు గమనించి, వారితో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. ఈ సందర్భంగా కొందరు తల్లిదండ్రులు మాట్లాడుతూ నర్సీపట్నం నుంచి నేరుగా మరుపాక మోడల్ స్కూల్ వరకు బస్సులు నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు, మండల ప్రత్యేక అధికారి విజయప్రసాద్, తహసీల్దార్ అంబేడ్కర్, ఎంపీడీవో మహేష్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండనాయుడు, కొత్తకోట సీఐ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
దస్తావేజు లేఖర్ల వంటావార్పు
నక్కపల్లి : రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 396ను రద్దు చేయాలని కోరుతూ దస్తావేజు లేఖర్లు నిరసన కొనసాగిస్తున్నారు. గురువారం నక్కపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద వంటా వార్పుతో నిరసన చేపట్టారు. వైఎస్సార్సీపీ ఈ ఆందోళనకు సంఘీభావం తెలిపింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ మాట్లాడుతూ ఈ విధానం వల్ల ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కొరవడుతుందన్నారు. లావాదేవీలు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం తగదన్నారు. రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆధారపడ్డ వేలాది మంది లేఖర్లు జీవనోపాధి కోల్పోతారన్నారు. వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండలశాఖ అధ్యక్షుడు గొర్ల గోవిందు, మాజీ అధ్యక్షుడు పొడగట్ల పాపారావు, మాజీ సర్పంచ్లు తళ్ల భార్గవ్, సాదిరెడ్డి శ్రీను, దస్తావేజు లేఖర్ల సంఘ నాయకులు దాతారం మురళీకృష్ణ, రమణ బాబు, కుమార్ పాల్గొన్నారు. -
అక్రమ వసూళ్లకు లైసెన్స్
నర్సీపట్నం: జిల్లాలోని అనుమతి ఉన్న మైనింగ్ లీజుల దగ్గర సీనరేజ్ వసూలు చేసే బాధ్యత తీసుకున్న కాంట్రాక్టర్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం అనుమతి ఉన్న ప్రాంతాల నుంచి తవ్వకాలు జరిగే వాటికే పర్మిట్లు, రసీదులు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వ భూములు, చెరువుల్లో అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారు. నర్సీపట్నం పరిధి బయపురెడ్డిపాలెం, పెదబొడ్డేపల్లి అమలాపురం, గొలుగొండ, నాతవరం మండలాల్లో కొన్ని రోజులుగా మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. లేఅవుట్లు, స్థలాల చదునుకు చెరువుల్లో పెద్ద ఎత్తున అనధికారికంగా మట్టి తరలింపు జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయకట్టు రైతులు పొలాలకు మట్టి తీసుకువెళ్లాలన్నా కప్పం కట్టాల్సిందేనని ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. తవ్వకాలకు అనుమతులతో పని లేదు.. మాకు డబ్బు కట్టాల్సిందేనని సంస్థ సిబ్బంది సూచిస్తున్నారు. చీడిగుమ్మలలో సొంత అవసరాలకు మట్టి తీసుకు వెళ్తుంటే అడ్డుకోవడంతో సంస్థ సిబ్బంది, స్థానికులకు నడుమ ఇటీవల వివాదం చోటు చేసుకుంది. బయపురెడ్డిపాలెం చెరువులో మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు (ఫైల్)జిచేతి రాతలే పర్మిట్లు.. వసూళ్ల బాధ్యతను తీసుకున్న సంస్థ జిల్లాలో ఖనిజ సంపదను తమకేదో రాసిచ్చినట్టు చిన్న కాగితం ముక్కపై రబ్బర్ స్టాంప్ వేసి, దానిపై పెన్నుతో వాహనం నంబరు, తేదీ, సమయం, వసూలు చేసిన డబ్బులు, చెక్ పాయింట్ పేరు రాసి డ్రైవర్ల చేతిలో పెడుతున్నారు. అడ్డదారుల్లో వసూళ్లు... జిల్లాలో మైనింగ్ దోపిడీ విపరీతంగా పెరిగింది. సీనరేజ్ వసూళ్ల బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో వారు వీలైనంత వరకు వసూళ్లు చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. జిల్లాలో సుమారు 90 వరకు మైనింగ్ లీజులు ఉన్నాయి. ఏడాదికి గతంలో రూ.14 కోట్లపైనే ఆదాయం ఉంటుంది. దీన్ని వసూలు చేసే బాధ్యతను గతేడాది అక్టోబర్లో ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించింది. ఈ సంస్థ ఏడాదికి రూ.18 కోట్లు ప్రభుత్వానికి చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. అప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి వసూళ్లు చేస్తున్నారు. -
మైనింగ్ ఏడీ కార్యాలయం వద్ద నిరసన
నర్సీపట్నం: రైతాంగానికి నష్టం కలిగించే మైనింగ్ లీజులను రద్దు చేయాలని వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన కోటవురట్ల మండలం, పిప్పళ్ల కొత్తపల్లి రైతులకు నిరాస ఎదురవడంతో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలియజేసారు. గ్రామానికి 500 మీటర్ల దూరంలో ఉన్న కొండ సర్వే నెంబరు 190లో విస్తీర్ణం 285 ఎకరాలు కలిగి ఉంది. చాలా మంది పేదలకు డి–ఫారం పట్టా ఇచ్చారు. పొడి వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారని ఆ గ్రామానికి చెందిన కామిరెడ్డి స్వామినాయుడు, సింగంపల్లి రమేష్; రొంగల వెంకట రమణ, పైల వీరాస్వామి పేర్కొన్నారు. వినతిపత్రం తీసుకునేందుకు మైనింగ్ అధికారులు నిరాకరించడం దారుణం అన్నారు. కార్యాలయం బోర్డు వద్ద బైఠాయించి నిరసన తెలియజేసామని పేర్కొన్నారు. కొంత మంది దళారులు, రాజకీయ నాయకులు కుమ్మకై ్క కొండను వ్యాపారంగా మార్చుకొని అక్కడ ఉన్న మెటల్ రాయిని తవ్వి రూ.కోట్లు కొల్లగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే మైనింగ్ను నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
వరుణదేవా.. కరుణించవా..
మాడుగుల రూరల్/గొలుగొండ: ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్లో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఒక వైపు వరినారు పోసి ఎండిపోకుండా అష్టకష్టాలు పడి నీరు తడుపుతూ కాపాడుకుంటున్నారు. మరోవైపు వర్షాలు కురిస్తే విత్తనాలు వేద్దామని మరికొందరు రైతులు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వానలు కురవాలని పలు గ్రామాల్లో స్థానికుంతా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గురువారం మాడుగుల మండలం కె.జె.పురం మునసీబు కళ్లాలు వద్ద వేపచెట్టు కింద బోగుండమ్మ అమ్మవారికి పసుపు కుంకుమతో పూజలు చేశా రు. అనంతరం వంటలు వండుకుని సహపంక్తి భోజనాలు చేశారు. అదేవిధంగా గొలుగొండ మండలం చీడిగుమ్మలలో మహిళలు కిలోమీటరు మేర ఉన్న గ్రామ పొలిమేర వరకు జలాభిషేకం చేస్తూ వర్షాలు కురవాలని మొక్కుకున్నారు. గ్రామంలో అమ్మవారి ఆలయాలతోపాటు స్థానిక శివాలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో రైతులు, మహిళలు ప్రత్యేక పూజలు -
పరారైన గంజాయి నిందితుల పట్టివేత
రావికమతం: గంజాయి అక్రమ రవాణా కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకోని వారిని గురువారం చోడవరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు పంపినట్టు కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రావికమతం ఎస్ఐ రఘువర్మ తెలిపారు. వారు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 15 తేదీన రావికమతం మండలం గుడివాడ కూడలి వద్ద రావికమతం ఎస్ఐ రఘువర్మ సిబ్బంది కలిసి తనిఖీలు చేస్తుండగా ఒడిశా నుంచి తమిళనాడుకు రెండు కార్లలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను పట్టుకుని, 220 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిలో మరో ఇద్దరు పారిపోయారు. ముగ్గురు నిందితులు, రెండు కార్లను, 220 కేజీల గంజాయిని ఈ నెల 15 తేదీన స్వాధీన పర్చుకొని వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు పల్నాడు జిల్లా ఇరుకుపాలేనికి చెందిన మోపర్తి యశ్వంత్, సత్తెనపల్లి నివాసి షేక్ కరీముల్లాలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకొని చోడవరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు పంపినట్టు తెలిపారు. -
ప్రజలకు రామ నామం..పంచదార్లకు శఠగోపం.!
సాక్షి, అనకాపల్లి: ఒకవైపు పవిత్ర పుణ్యక్షేత్రమైన పంచదార్ల కొండలను పిండి చేస్తూ రూ.వందల కోట్ల అక్రమార్జనకు తెగబడటం..మరోవైపు ప్రజల ఆధ్యాత్మిక బలహీనతను ఆసరాగా చేసుకుని ‘ఉచిత ఆయోధ్య, కాశీ యాత్రలు’ పేరిట ప్రజల దృష్టిని మళ్లించడం..ఇదీ కూటమికి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తీరు. భక్తి పేరుతో ప్రజలను మభ్యపెడుతూ, పవిత్ర దైవక్షేత్రాల కొండలను తన బినామీలతో కొల్లగొడుతున్న వైనం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పంచదార్ల కొండపై స్థానిక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పీఏ విజయ్కుమార్ నాయుడు, లక్ష్మీ మినరల్స్ పేరిట, స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ అనుచరుడు వై. శ్రీనివాస్ పేర్లతో అక్రమ తవ్వకాలకు తెరలేపారు. వీటికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఉద్యమం తలపెట్టింది. దీనికి ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది. తమ పాలనపై ప్రజావ్యతిరేకత తలెత్తడంతో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలి‘ట్రిక్స్’ ఉపయోగిస్తోంది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఇదే సమయంలో 19వ తేదీ నుంచి అయోధ్య యాత్రకు రైలు వెళుతున్నట్టు కూటమి నేతలు ప్రకటించారు. తిరుగు ప్రయాణంలో 23వ తేదీన అనకాపల్లి చేరుకుంది. మళ్లీ మూడు నాలుగు ట్రిప్లు యాత్రకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దోపిడీ నుంచి దృష్టి మళ్లించేందుకే... జిల్లాలో ఆధ్యాత్మిక కొండల్లో అక్రమ మైనింగ్ను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. ఇటీవల రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు, ఈ నెల 21న ‘ఛలో పంచదార్ల’ కార్యక్రమాలు చేపట్టింది. వైఎస్సార్సీపీ చేపట్టిన పోరాటానికి భయపడిన అధికార యంత్రాంగం తాత్కాలికంగా తవ్వకాలను నిలిపివేసింది. అయితే, ఈ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కూటమి నాయకులు కుట్ర పన్నారు. వైఎస్సార్సీపీ దీక్షలు చేపట్టిన రోజే అనకాపల్లి జిల్లాకు చెందిన 1,,600 మందిని ప్రత్యేక రైలులో కాశీ, అయోధ్య ఉచిత యాత్రకు తీసుకెళ్లారు. గురువారంతో ఈ యాత్ర ముగిసి రైలు తిరిగి అనకాపల్లికి చేరుకుంది. కొండలను కొల్లగొట్టి ఆర్జించిన అక్రమ సొమ్ముతోనే ఈ యాత్రలు చేయిస్తున్నారని, భక్తి పేరుతో జిల్లా ప్రజలను నిద్రపుచ్చే యత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. తాజాగా పంచదార్ల, వెంకటాపురం, హరిపురం, రాంబిల్లి పరిసర గ్రామాల నుంచి మరో 1,600 మందిని యాత్రకు తీసుకెళ్లేందుకు ఎంపీ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. శివాగ్రహం తప్పదు! ఉమా ధర్మలింగేశ్వరస్వామి, మాధవస్వామి ఆలయాలు, లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలు ఉన్న ఫణిగిరి కొండ గుండెల్లోంచి ఉద్భవించి భక్తులకు పుణ్యతీర్థాన్ని అందించే ఆ ఐదు పవిత్ర ధారలు ఇప్పుడు కన్నీరు పెడుతున్నాయి. అభివద్ధి ముసుగులో ఎంపీ కనుసన్నల్లో పవిత్ర జలాలను దారి మళ్లించి, పవిత్రతను దెబ్బతీసిన వారికి శివాగ్రహం తప్పదని సమీప గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. అక్రమ మైనింగ్తో చేసిన పాపాలు కాశీ, అయోధ్య యాత్రతో పోవని, పంచదార్ల క్షేత్ర పవిత్రతను కాపాడుకునే వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధర్మపోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి పారా క్రీడల్లో విద్యార్థి ప్రతిభ
సబ్బవరం: రాష్ట్ర స్థాయిలో ఈ నెల 21 నుంచి 23 వరకూ విజయవాడలో నిర్వహించిన పారా స్పోర్ట్స్ మీట్లో మండలంలోని తవ్వవానిపాలెం జెడ్పీ హైస్కూల్కు చెందిన 9వ తరగతి విద్యార్థి సీరంరెడ్డి పూర్ణతేజ నాలుగు పతకాలు సాధించాడు. రిలే రన్నింగ్, లాంగ్ జంప్ విభాగాల్లో స్వర్ణ పతకాలు, 400 మీటర్ల పరుగులో రజతం, 100 మీటర్ల పరుగులో కాంస్య పతకం అందుకున్నాడు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచడంతో అక్టోబర్లో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా పూర్ణతేజను ఎంఈవోలు లక్ష్మణరావు, రవీంద్రబాబు, పాఠశాల హెచ్ఎం ఏవీఎన్ రత్నం, గ్రామ పెద్దలు బోకం స్వామినాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
సమర్థంగా ‘నెట్ జీరో హెల్తీ క్యాంపస్’ అమలు
తుమ్మపాల: పాఠశాలలు, కళాశాలల్లో పరిశుభ్రత, పచ్చదనం, వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణ, నీటి సంరక్షణ, విద్యుత్ ఆదా, ప్లాస్టిక్ రహిత వాతావరణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ‘నెట్ జీరో హెల్తీ క్యాంపస్‘ కార్యక్రమంపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి విద్యాసంస్థలో నెట్ జీరో హెల్తీ క్యాంపస్ లక్ష్యాలను సమర్ధంగా అమలు చేసి, విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలన్నారు. శుక్రవారం నిర్వహించనున్న మెగా పేరెంట్–టీచర్ సమావేశాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు సమావేశానికి ముందుగానే తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించి, నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కా ర్యక్రమంలో నాటిన మొక్కల సంరక్షణ సరిగా జరుగుతోందా అనే అంశాలను పరిశీలించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో పొదలు, కలుపు మొక్కలు పెరగకుండా, విష జంతువులు సంచరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే నెల 14 లోగా నీటిపారుదల పనులు పూర్తవ్వాలి తుమ్మపాల: నీటిపారుదల కాలువల నిర్మాణం, పూడికతీత పనులను ఆగస్టు 14 లోగా పూర్తి చేయడంతో పాటు సిమెంట్ లైనింగ్, కాలువల మరమ్మతులు, వాగుల మళ్లింపు వంటి ప్రతి పనికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమయ్యారు. ఎర్త్వర్క్, కాలువ తవ్వకం పనులు ప్రతిపాదించిన రూ.30.93 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనుల్లో మెజారిటీ పనులు పూర్తయినందున, మిగిలిన ఎంబ్యాంక్మెంట్, క్లియరెన్స్ పనులను ఆగస్టు 10వ తేదీ నాటికి ముగించాలన్నారు. స్ట్రక్చర్ల పనులను వచ్చే గురువారం నాటికి పూర్తి చేసి నివేదించాలని జిల్లా పరిధిలోని 31 కిలోమీటర్ల వైఎల్ఎంసీ కాలువ పరిధిలో పూడికతీత, సిల్ట్ తొలగింపు పనులను వేగవంతం చేయాలన్నారు. తాండవ ప్రాజెక్ట్లో 3.65 టీఎంసీల నీటి నిల్వ ఉందని, సుమారు 32వేల ఎకరాల ఆయకట్టుకు నెల రోజుల్లో నీటి విడుదల చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రైవాడ రిజర్వాయర్లో ప్రస్తుతం 1.16 టీఎంసీల నీరు నిల్వ ఉందని, 15వేల ఎకరాల సాగునీటితో పాటు, జీవీఎంసీ తాగునీటి అవసరాలకు (రోజుకు 50 క్యూసెక్కులు) పంపిణీ జరిగేలా అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్ట్ కింద సాగునీరు అందుతున్నందున నీటి పన్ను అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ఎస్.రాయవరం మండలంలో 89 మైనర్ ఇరిగేషన్ పనులు పూర్తికావడం, నర్సీపట్నం, కోటవురట్ల, దేవరాపల్లి, కోటపాడు మండలాల్లో పనులు మందగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని మండలాల్లోని పెండింగ్ కాలువ మరమ్మతులు, ఎత్తిపోతల పథకాల పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గడువులోగా గ్రామీణాభివృద్ధి పనులు తుమ్మపాల: పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రెయిన్ నిర్మాణం వంటి పనుల పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. యలమంచిలి నియోజకవర్గంలో పనుల పురోగతి మందగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 13 నుంచి 14 నెలలు గడిచినా పనులు పూర్తికాకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పెండింగ్లో ఉన్న పనులు, ఆక్రమణలు లేదా స్థల వివాదాల కారణంగా నిలిచి పోయిన పనులను ఐదు నుంచి పది రోజుల్లోగా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. నిర్మా ణ వ్యయం లేదా కాంట్రాక్టర్ల సమస్యలతో ఆలస్యమవుతున్న బీటీ రోడ్లను అవసరమైన చోట సీసీ రోడ్లుగా మార్చి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్ బిల్లుల సమస్య లను కూడా వెంటనే పరిష్కరించి, పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
గిరి ప్రదక్షిణకు విస్తృత ఏర్పాట్లు
మహారాణిపేట: ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన తుది సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ట్రాఫిక్, భద్రత, తాగునీరు, వైద్యం, పారిశుధ్యం, విద్యుత్, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గిరి ప్రదక్షిణ మార్గాన్ని 7 జోన్లు, 28 సెక్షన్లుగా విభజించి ప్రతి సెక్షన్కు పోలీసు, జీవీఎంసీ అధికారులను ఇన్చార్జిలుగా నియమించారు. 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆరు షిఫ్టుల్లో అధికారులు విధులు నిర్వహించనున్నారు. మార్గంలో ఏడు కంట్రోల్ రూమ్లు, 28 సహాయక కేంద్రాలు, 31 వైద్య శిబిరాలు, 595 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నారు. భక్తుల రద్దీని కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పర్యవేక్షించడంతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు అందుబాటులో ఉంచనున్నారు. గిరి ప్రదక్షిణ రోజుల్లో బీఆర్టీఎస్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదని, ప్రత్యామ్నాయ మార్గాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అలాగే మద్యం దుకాణాలను మూసివేయాలని, భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ నెల 28 ఉదయం నుంచి 29 మధ్యాహ్నం వరకు సింహాచలం వైపు భారీ వాహనాలపై ఆంక్షలు అమలు చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, దేవస్థానం ఈవో జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
వారంలోగా రూ.5 కోట్లు చెల్లించండి
జీవీఎంసీకి మాడుగుల ఎమ్మెల్యే బండారు అల్టిమేటం లేకపోతే రైవాడ నుంచి చుక్కనీరైనా ఇవ్వబోమని బెదిరింపులు ఖరీఫ్ సాగుకు 250 క్యూసెక్కుల నీరు విడుదలదేవరాపల్లి: రైవాడ జలాశయానికి వారం, పది రోజుల్లోగా రూ.5 కోట్లు చెల్లించకుంటే జీవీఎంసీకి నీటి సరఫరాను నిలుపుదల చేస్తామని టీడీపీకి చెందిన మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జీవీఎంసీ అధికారులను ఉద్దేశించి బెదిరింపులకు దిగారు. రైవాడ జలాశయం నుంచి ఖరీఫ్ పంటల సాగుకు ఎమ్మెల్యే బండారు గురువారం నీటిని విడుదల చేశారు. ముందుగా రైవాడ అతిథి గృహం వద్ద వినాయక, జలాశయం వద్ద ఎరకాలమ్మ తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఎడమ కాలువ స్లూయిస్ గేటు వద్ద జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తారువ సమీపంలోని కలిగొట్ల బ్రాంచ్ కెనాల్ వద్ద రూ. 27 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక విలేకరులతో మాట్లాడారు. రైవాడ నుంచి నీటి సరఫరా చేస్తున్నందుకు జీవీఎంసీ రూ.169 కోట్ల మేర బకాయి చెల్లించాల్సి ఉందని, రైవాడ జలాశయం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని పలుమార్లు జీవీఎంసీ అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో సైతం ఈ సమస్యను ప్రస్తావించానన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన హామీ మేరకు రూ. 5 కోట్లు వారం, పది రోజుల్లో విడుదల చేయాలని, లేకుంటే ఎమ్మెల్యే హోదాలో తానే రైతులతో కలిసి జీవీఎంసీకి చుక్క నీరు వెళ్లకుండా గేట్లు మూసేసి అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైవాడ ప్రాజెక్టు చైర్మన్ పోతల పాత్రునాయుడు, ఇరిగేషన్ డీఈలు జి.సత్యంనాయుడు, వేణుగోపాలనాయుడు పాల్గొన్నారు. -
ఎమ్మెస్కో పుస్తకాల వితరణ
తుమ్మపాల: పాఠకులకు నాణ్యమైన విజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో విజయవాడకు చెందిన ఎమ్మెస్కో బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి ఉచితంగా వివిధ నూతన పుస్తకాలను అందించినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వి.సతీష్కుమార్తో కలిసి పుస్తకాలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెస్కో సంస్థ అందించిన పుస్తకాలు విద్యార్థులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు, పాఠకులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ పుస్తకాలను జిల్లాలోని అన్ని శాఖా గ్రంథాలయాలకు బట్వాడా చేసి, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రంథాలయాల వినియోగాన్ని ప్రజలు మరింతగా పెంచుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. -
ప్రభుత్వ ఆధీనంలోనే ఎలక్ట్రికల్ బస్సులు నడపాలి
డిపో వద్ద ఏఐటీయూసీ ధర్నాఅనకాపల్లి: కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ)లో కేంద్ర సాయంతో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టి ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దుర్మార్గమని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు వై.ఎన్.భద్రం అన్నారు. స్థానిక డిపో గేటు వద్ద ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వ ఆధీనంలో నడపాలని గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి ప్రాణత్యాగాలు చూసి సాధించుకున్న ఆర్టీసీని వైఎస్సార్సీపీ పాలనలో విలీనం చేయడం జరిగిందన్నారు. నేటి పాలనలో ఆర్టీసీని మరోసారి ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. ఇప్పటికే రూ.30 కోట్ల విలువైన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి పట్టణాలలో ఆర్టీసీ ఆిస్తిని పినాకిల్ అనే ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేయడం అన్యాయమని, 70 సంవత్సరాలుగా లక్షలాది మంది పేద మధ్యతరగతి ప్రజల ప్రయాణ అవసరాలకు ఉపయోగపడుతున్న ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టడం మానుకోవాలన్నారు. సూపర్ 6లో భాగంగా శ్రీ శక్తి ద్వారా 60 లక్షల మందికి ఉచితంగా సేవలందిస్తున్న ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వమే ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసి, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ తోనే బస్సులను నడిపించాలని, ఆర్టీసీలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, కారుణ్య నియామకాలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ స్థలాలను కారు చౌకగా ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం నిలుపుదల చేయాలని లేని పక్షంలో ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు డి.ఎన్.మూర్తి, బి.వి.రామకృష్ణ, తాకాసి వెంకటేశ్వరరావు, శ్రీరామదాసు అబ్బులు, కోరుమిల్లి శంకరరావు, కర్ణం మాణిక్యాలరావు, వేపాడ శ్రీను, కె.ఎం రావు, సురేష్, బి.ఎస్ రావు, మత్తుర్తి సూరిబాబు పాల్గొన్నారు. -
మున్సిపల్ ఖాతాల నిర్వహణ పరిశీలన
మునగపాక(యలమంచిలి రూరల్): యలమంచిలి మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం అకౌంటింగ్ స్టాండర్ట్స్ అడ్వైజరీ బోర్డు ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ జయరాజ నాయక్ బృందం సందర్శించింది. అకౌంటింగ్ విధానం, డిజిటల్ ఫైనాన్స్ నిర్వహణ, ఖాతాల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. అకౌంటింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని పలు సూచనలు చేసింది. పరిపాలనా పరమైన సేవలు మరింత విస్తృతం చేయాలని, ప్రతిఒక్కరికీ జవాబుదారుగా ఉండాలని ఆర్థిక లావాదేవీలు సక్రమంగా నిర్వహించాలని పేర్కొంది. కార్యక్రమంలో బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
చెక్ బౌన్స్ కేసులో ఎస్బీఐ మాజీ ఉద్యోగి అరెస్ట్
కంచరపాలెం: చెక్ బౌన్స్ కేసులో నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఎస్బీఐ మాజీ ఉద్యోగి గల్లా రాజశేఖర్ను కంచరపాలెం పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ 2వ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్లో ఉన్న సీసీ నం.21/2021 కేసుకు సంబంధించి కోర్టు జారీ చేసిన ఎన్బీడబ్ల్యూ మేరకు ఆయనను అరెస్టు చేసి తదుపరి చర్యల నిమిత్తం విజయవాడకు తరలించారు. ఫిర్యాదుదారు ముత్యాల సురేష్ ఆరోపణల ప్రకారం, గల్లా రాజశేఖర్ తన ఇంటర్మీడియట్ సహపాఠి అయిన ఎన్ఆర్ఐ ముత్యాల సురేష్ను విశాఖలో పెట్టుబడులు పెట్టాలని నమ్మించి సుమారు రూ.కోటి తీసుకున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా మోసం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అంతేకాక తనపై తప్పుడు కేసులు నమోదు చేయించే ప్రయత్నం కూడా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న సమయంలో నిధుల అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో గల్లా రాజశేఖర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుని ఎస్బీఐ సేవల నుంచి తొలగించినట్లు సమాచారం. ఆయనపై మరిన్ని ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయని ఫిర్యాదుదారు తెలిపారు. -
హుండీ దొంగల అరెస్టు
చోడవరం: దేవాలయాల్లో హుండీ చోరీలకు పాల్పడిన ముగ్గురు దొంగలను పట్టుకొని చోడవరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈనెల 18వ తేదీన చోడవరం శివారు ద్వారకానగర్లో శ్రీ ఆంజనేయస్వామి, శ్రీరాముని ఆలయాల్లో హుండీలు చోరీ జరిగిన విషయం తెలిసిందే. సీసీ పుటేజీల ఆధారంగా దొంగలను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ కేసులు చోడవరం వెంకయ్యగారిపేటకు చెందిన జెడిపల్లి భూపతి (23), తమిళనాడు రాష్ట్రం నమక్కల్ జిలాలలకు చెందిన వర కార్తిక్ (21), విజయనగరం జిల్లా పాతబొబ్బిలి గ్రామానికి చెందిన నెల్లి లోకేష్ (19)ను అరెస్టు చేసినట్టు చోడవరం సీఐ అప్పలరాజు చెప్పారు. ఈ నిందితులను చోడవరం ఎస్ఐలు నాగకార్తీక్, జోగారావు, సిబ్బంది సహకారంతో పట్టుకోవడం జరిగిందన్నారు. నిందితులను చోడవరం కోర్టుకు హాజరపర్చగా వీరికి రిమాండ్ విధించారని తెలిపారు. -
స్కేటింగ్ క్రీడాకారులకు స్పీకర్ అభినందనలు
నర్సీపట్నం: ఇటీవల కాకినాడలో నిర్వహించిన 13వ ర్యాంకింగ్ ఓపెన్ నేషనల్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో రోలర్ స్కేటింగ్ అసోసియేషన్కు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్ధులను క్యాంపు కార్యాలయంలో స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు గురువారం అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో 7వ తరగతి విద్యార్ధి వి.సూర్యవంశి రింక్ 1000 మీటర్ల విభాగంలో స్వర్ణపతకం సాధించడంతో పాటు రింక్ 200 మీటర్లు, రోడ్ 500 మీటర్లు విభాగాల్లో రజత పతకాలు కై వసం చేసుకున్నాడు. నీట్ విద్యార్ధి జాన్సన్ పుట్టపల్లి రోడ్ 500 మీటర్లు, రింక్ 500ఫ్లస్ డీ విభాగాల్లో రజత పతకాలు, రింక్ 1000 మీటర్ల విభాగంలో కాంస్యపతకం సాధించాడు. 4వ తరగతి విద్యార్ధిని గొల్లు మాన్విత రింక్ 500ఫ్లస్ డీలో రజతం, రోడ్ 1ల్యాబ్, రింక్ 1000 మీటర్లలో క్యాంస్య పతకాలు సాధించింది. 5వ తరగతి విద్యార్ధిని వేచలపు జాహ్నవి రింక్ 800 మీటర్లలో రజతం, రోడ్ 500 మీటర్లు, రింక్ఫ్లప్డీ విభాగాల్లో కాంస్యపతకాలు సాధించగా, 6వ తరగతి విద్యార్ధిని కన్నూరి అనీష్ రింక్ 1000 మీటర్ల విభాగంలో రజత పతకాన్ని కై వసం చేసుకున్నాడు. పతకాలు సాధించేందుకు తర్ఫీదు ఇచ్చిన కోచ్ మణికంఠ కళ్యాణ్, విజేతలను స్పీకర్ అభినందించారు. -
రాష్ట్ర స్థాయి పారా క్రీడా పోటీల్లో పతకాల పంట
10 పతకాలు సాధించిన రావికమతం దివ్యాంగ విద్యార్థులు రావికమతం: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో హీల్ పారడైస్ స్కూల్ వేదికగా ఈ 20 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పారా క్రీడా పోటీల్లో రావికమతం మండలానికి చెందిన నలుగురు దివ్యాంగ విద్యార్థులు 10 మెడల్స్ సాధించారు. ఈ పోటీల్లో మేడివాడ హైస్కూల్కు చెందిన జి. బాబూరావు టి –47 కేటగిరీ రిలే 400 ఈవెంట్లో గోల్డ్ మెడల్, లాంగ్ జంప్లో బ్రాంజ్ మొడల్ సాధించాడు. గర్నికం కేజీబీవీకి చెందిన ఎన్ హేమదర్గ ఎఫ్ 41 కేటగిరి డిస్క్ త్రోలో గోల్డ్ మెడల్, జూవెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించింది. కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన కె రాము టి. 47 కేటగిరిలో రిలే 400 మీటర్ల రన్నింగ్లో గోల్డ్ మెడల్, షాట్ ఫుట్లో సిల్వర్ మెడల్ సాధించారు. చినపాచిల గ్రామానికి చెందిన సలాది మురళీ టి. 47 కేటగిరిలో లాంగ్ జంప్లో గోల్డ్ మెడల్, జువెలిన్ త్రోలో గోల్డ్ మెడల్, రిలే 400 ఈవెంట్లో గోల్డ్ మెడల్, 100 మీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ సాధించారు. వీరిని సమగ్ర శిక్ష ఏఎస్ పీడీ కె. రవీంద్రనాథ్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ భరణి అభినందించి బహుమతులు అందజేశారు. శిక్షణ అందించిన ప్రత్యేక ఉపాధ్యాయుడు బొడ్డు మహాలక్ష్మీనాయుడు, జగన్నాథనాయుడులను ఎంఈవోలు లింగమూర్తి, బ్రహ్మాజీ అభినందించారు. -
26 నుంచి చాంపియన్షిప్ కప్ ఎంపిక పోటీలు
నర్సీపట్నం: అమరావతి చాంపియన్షిప్ కప్ పోటీలకు బాక్సింగ్ క్రీడాకారులు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో సాధన చేస్తున్నారు. అమరావతి చాంపియన్షిప్ కప్ –2026 నియోజకవర్గ స్థాయి ఎంపిక పోటీలు ఇక్కడ స్టేడియంలో ఈ నెల 26 నుంచి జరుగుతాయని శాప్ కోచ్ కె.అబ్బు గురువారం తెలిపారు. ఈ నెల 26న చెస్ క్రీడాకారులను ఎంపిక చేస్తామన్నారు. 30న పరవాడ సంస్కృతి గ్లోబల్ స్కూల్లో ఆర్చరీ, ఇదే రోజున నర్సీపట్నంలో బాక్సింగ్, యోగా, బ్యాడ్మింటన్, వేములపూడి హైస్కూలు, కాలేజీ గ్రౌండ్లో అథ్లెటిక్స్, కబడ్డీ క్రీడాకారులను ఎంపిక చేస్తామన్నారు. ఈ నెల 31న వేములపూడి హైస్కూలులో ఖోఖో, నక్కపల్లి జెడ్పీహెచ్ స్కూల్లో హాకీ, ఆగస్టు 1న ఎన్టీఆర్ స్టేడియంలో వాలీబాల్, ఆగస్టు 2న అనకాపల్లి ఎస్ఆర్డీలో వెయిట్ లిఫ్టింగ్, 3న అనకాపల్లి ఏఎంఏఎల్ కాలేజీలో బాస్కెట్ బాల్ ఎంపికలు నిర్వహిస్తామని తెలిపారు. -
వచ్చే నెలాఖరులోగా బాలికల వసతి గృహం పూర్తి
దేవరాపల్లి: స్థానిక బాలికల వసతి గృహ పనులను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని సమగ్ర శిక్ష ఈఈ డి.వి. నరసింహారావు స్థానిక ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ. 1.94 కోట్లతో నిర్మిస్తున్న బాలికల వసతి గృహ భవనాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో టైప్–4 బాలికల వసతి గృహ భవనం గొలుగొండలో పునాది దశలో ఉందన్నారు. దేవరాపల్లిలోని భవనాన్ని త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో కేజీబీవీల్లో అదనపు వసతుల కోసం రూ. 23.28 కోట్లతో 12 భవనాల నిర్మాణం చేపట్టగా, అందులో 11 భవనాలు పూర్తయ్యాయన్నారు. వీటిలో దేవరాపల్లి, కె.కోటపాడు, అచ్యుతాపురం ప్రారంభించగా, నర్సీపట్నం, చోడవరం నియోజకవర్గాల్లో మూడు చొప్పున భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. అచ్యుతాపురం భవనం ఇంకా టెండర్ దశలో ఉందని స్పష్టం చేశారు. సమగ్ర శిక్ష డీఈ కె.గణేష్, స్థానిక ఏఈ పి. సంతోష్ తదితర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఈఈ నరసింహారావు ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశం -
రహదారి మూసివేతకు కాంట్రాక్టర్ల యత్నం
పోలవరం కాలువ పనులు అడ్డుకున్న సీతంపాలెం గ్రామస్తులు నక్కపల్లి: సీతంపాలెం నుంచి వెదుళ్లపాలెం వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న రహదారిని మూసివేసేందుకు పోలవరరం కాలువ కాంట్రాక్టర్లు ప్రయత్నించడాన్ని సీతంపాలెం గ్రామస్తులు అడ్డుకున్నారు. రోడ్డు తొలగించేందుకు సిద్ధపడడంతో ఎంపీటీసీ, వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, తాజా మాజీ సర్పంచ్ గొర్ల నాగ అప్పలరాజు, మాజీ ఎంపీటీసీ గొనగాల రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ప్రతిఘటించారు. సీతంపాలెం నుంచి వెదుళ్లపాలెం మీదుగా జాతీయ రహదారికి చేరుకునేందుకు ఎప్పటి నుంచో ఈ రోడ్డును ఉపయోగించుకుంటున్నామన్నారు. పోలవరం కాలువ కోసం దశాబ్దాల కిత్రం అతి తక్కువ ధరలకు భూములు ఇవ్వడం జరిగిందన్నారు. పోలవరం పనులకు తాము వ్యతిరేకం కాదన్నారు. సీతంపాలెం వెదుళ్లపాలెం వద్ద కాలువ కోసం మధ్యలో ఉన్న రోడ్డును తవ్వేస్తామని ఇంజినీరింగ్ అధికారులు హరిప్రసాద్, ఏఈ సతీష్లు సిద్ధపడడంతో గ్రామస్తులు అడ్డుకుని వారితో వాగ్వాదానికి దిగారు. సీతంపాలెం నుంచి రేబాక, తిరుపతిపాలెం, రేవళ్లు, వెదుళ్లపాలెం, సీహెచ్బి అగ్రహారం, నక్కపల్లి తదితర గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు ఈ రోడ్డును ఉపయోగిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, వంతెన నిర్మించకుండా ప్రస్తుతం ఉన్న రోడ్డును తొలగిస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వివరించారు. బోదిగల్లం మీదుగా రాకపోకలు సాగించాలని అధికారులు సూచించారు. బోదిగల్లం మీదుగా రాకపోకలు సాగించాలంటే పది కిలోమీటర్లు అదనంగా వెళ్లాల్సి ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. కాలువ కోసం తవ్వకాలు చేపడితే ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మించి అప్పుడు తవ్వకాలు జరపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేసిన తర్వాతే ప్రస్తుతం ఉన్న మట్టి రోడ్డు తవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ప్రసాదుల సింహాద్రి, ఈగల గూడుపు రాజు, బొట్టాకాసులు, గొనగాల బాబ్జి,తదితరులు ఉన్నారు. గ్రామస్తులు వినతిపత్రం ఇస్తే ఉన్నతాధికారులకు పంపిస్తామని అధికారులు తెలిపారు. -
చోరీ సొత్తు స్వాధీనం
ఎస్.రాయవరం: వెంకటాపురం గ్రామంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు అడ్డురోడ్డు సీఐ ఎల్.రామకృష్ణ గురువారం తెలిపారు. ఈ నెల19 తేదీ రాత్రి వెంకటాపురంలో వాడపర్తి జోగయ్య ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు బద్దలుకొట్టి అరతులం బంగారం, రెండు జతల సిల్వర్ పట్టీలు, సుమారు రూ.6 వేలు నగదు అపహరించినట్టు బుధవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అదే గ్రామానికి చెందిన కొప్పిశెట్టి వెంకటేష్ మద్యానికి బానిస అయ్యి చోరీకి పాల్పడినట్టు వెల్లడైందన్నారు. దీంతో నిందితుడి వద్ద చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని అతడిని రిమాండ్కు తరలించినట్టు సీఐ చెప్పారు. -
‘పంచదార్ల’ను కాపాడండి.. కేంద్రానికి వైఎస్సార్సీపీ విజ్ఞప్తి
ఢిల్లీ: అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండల్లో మైనింగ్ను వెంటనే అరికట్టి, అక్కడి వారసత్వ సంపదను కాపాడాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు వైఎస్సార్సీపీ ఎంపీ ఎం.గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కేంద్ర మంత్రికి ఒక వినతి పత్రం సమర్పించిన ఆయన, చారిత్రక బౌద్ధ పురావస్తు ప్రాంతం, శ్రీ ధర్మలింగేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న మైనింగ్ కార్యకలాపాలను తక్షణమే నిలిపి వేయించాలని, ఆ మొత్తం పంచదార్ల కొండ ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని కోరారు.ధనదిబ్బలు బౌద్ధ పురావస్తు స్థలం శాతవాహన కాలానికి చెందిన అత్యంత ప్రాచీన వారసత్వ కట్టడం అని, అది భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) రక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందిందని ఎంపీ గురుమూర్తి గుర్తు చేశారు. అలాగే పంచదార్లలోని శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయం తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆలయమని తెలిపారు. ఈ రెండు చారిత్రక వారసత్వ కట్టడాల సమీపంలో మైనింగ్, బ్లాస్టింగ్ కార్యకలాపాలు కొనసాగడం వల్ల పురావస్తు సంపదకు, సహజ వాతావరణానికి, శాశ్వత జలధారలకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.ఏఎస్ఐ రక్షిత ధనదిబ్బలు బౌద్ధ క్షేత్రానికి సుమారు 90 మీటర్లు, 190 మీటర్లు, 200 మీటర్ల దూరంలో మైనింగ్ జరుగుతోందని, ఉపగ్రహ చిత్రాలతో పాటు, క్షేత్రస్థాయి పరిశీలనల్లో కూడా ఆ విషయం తెలిందని, ఇంకా మైనింగ్ కొనసాగితే, అది పురావస్తు సంరక్షణ చట్టాల ఉల్లంఘన అవుతుందని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో పురావస్తు శాఖతో తక్షణ క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించాలని, మైనింగ్ ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని, నిపుణులతో కూడిన సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు మైనింగ్, బ్లాస్టింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని ఎంపీ గురుమూర్తి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పంచదార్ల మొత్తం ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని కోరారు. -
757 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు
కె.కోటపాడు: ఆర్లి ప్రాంతంలో 757 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత అన్నారు. ఆర్లి, చింతపాలెం, ఎరకన్నపాలెం గ్రామాలకు చెందిన రైతులతో బుధవారం ఆర్లి గ్రామంలో గ్రామసభను జరిపారు. ఈ గ్రామసభలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత, అనకాపల్లి ఆర్డీవో ఆయిషా, తహసీల్ధార్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతు ఆర్లి రెవెన్యూలో 757 ఎకరాల భూమిలో జిరాయితీ, డి–పట్టాలతో కూడిన భూములు ఉన్నట్లు ఆమె తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబందించి భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.20 లక్షల నగదుతో పాటు 150 గజాల అభివృద్ధి చేసిన స్థలం ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ఆర్డీవో ఆయిషా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఫార్మా వంటి కంపెనీలు రావని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన పుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు వంటివి రానున్నట్లు ఆమె తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుపై ప్రజలు తెలిపిన వివరాలను ఆమె నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో వీఆర్వో శేషు, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
జగన్ 2.0 యాప్తో కూటమి అరాచకాలను బయటపెడదాం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అనకాపల్లి: జగన్ 2.0 సూపర్ యాప్తో కూటమి ప్రభుత్వ అరాచకాలను బయటపెడదామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక రింగ్రోడ్డులోని నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ కార్యాలయంలో బుధవారం ఆయన యాప్ను ఆవిష్కరించారు. అనంతరం ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్సీపీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ జగన్ 2.0 సూపర్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, గ్రామీణ స్థాయి నుంచి కూటమి ప్రభుత్వ అరాచకాలను యాప్లో నమోదు చేస్తే, అది మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి దృష్టికి వెళ్తుందని చెప్పారు. యాప్లో పార్టీకి సంబంధించిన సమస్యలు, కూటమి అక్రమాలు నమోదు చేయాలని సూచించారు. చలో పంచదార్ల కార్యక్రమానికి విశాఖ ఉమ్మడి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు తరలివెళ్లడంతో ప్రభుత్వం దిగివచ్చి, ఫణిగిరి కొండ ప్రాంతాన్ని ’నో మైనింగ్ జోన్’గా పేర్కొంటూ డీఆర్సీ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు చెప్పారు. నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ మాట్లాడుతూ... కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలను పార్టీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తుంటే ప్రభుత్వం వీడియోలను డిలీట్ చేసి, అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదులు, కూటమి అరాచకాలను యాప్లో నమోదు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్నంతా అమరావతి పేరుతో దోచుకుంటోందని ఆరోపించారు. మాజీ ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ... రాష్ట్రంలో సోషల్ మీడియాను అణిచివేసేందుకు ప్రభుత్వం అనేక కుట్రలు పన్నుతోందని చెప్పారు. ప్రజలు వైఎస్సార్సీపీ పాలన కోసం ఎదురుచూస్తున్నారన్నారు. జగన్ 2.0 సూపర్ యాప్ ద్వారా ఇప్పటికే 15 లక్షల మంది తమ సమస్యలను నమోదు చేశారని తెలిపారు. నియోజకవర్గ పరిశీలకుడు పి.సతీష్ వర్మ మాట్లాడుతూ... ఈ యాప్ వల్ల ప్రజలకు, కార్యకర్తలకు మేలు జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వానికి త్వరలో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు మాట్లాడుతూ... వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో బొజ్జన్నకొండను పురావస్తుశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తే, కూటమి పాలనలో బొజ్జన్నకొండ వైపు వెళ్లే రహదారి శిథిలావస్థకు చేరిందన్నారు. రైల్వేశాఖ తమ ఆస్తులను కాపాడుకునేందుకు విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి వద్ద రహదారికి ఇరువైపులా పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిందని, దీనివల్ల ప్రతిరోజూ 10 నుంచి 15 మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, పార్టీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ఉగ్గిన అప్పారావు, 80, 81, 84 వార్డుల ఇన్చార్జ్లు కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, కోరుకొండ రాఘవ, అనకాపల్లి, కశింకోట మండలాల అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల మురళీకృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కరక సోమునాయుడు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు మర్రిపల్లి శోభ, అనకాపల్లి, కశింకోట మహిళా మండల అధ్యక్షురాళ్లు పద్మకుమారి, తగరంపూడి నూకరత్నం తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా సముద్రపు ఇసుక తరలింపు
కొమ్మాది: బీచ్ రోడ్డు సాగర్నగర్ తీరం వద్ద యథేచ్ఛగా సముద్రపు ఇసుకను తరలించేస్తున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా బీచ్ ఇసుక తరలించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం 10 మంది మహిళలు ఇసుకను మూటలు కట్టి తరలించేందుకు సిద్ధమయ్యారు. దీంతో అక్కడ భారీ గోతులు ఏర్పడ్డాయి. దీన్ని గమనించిన స్థానికుల అడ్డుకున్నారు. ఇప్పటికే బీచ్ ముందుకు వచ్చేస్తోందని, కెరటాల తీవ్రతను అడ్డుకునే ఇసుక దిబ్బలు తవ్వి, తరలించుకుపోవడం ఏంటని ప్రశ్నించారు. అటవీశాఖ అధికారులు జూలో ఉన్న జంతువుల కోసం వీటిని తీసుకుని రమ్మన్నారని సదరు వ్యక్తులు చెప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ ఉచిత ఇసుక నిబంధనల మేరకు నదులు, గెడ్డల్లో అధికారుల అనుమతితో ఇసుక తరలించవచ్చని, ఇలా బీచ్లో ఇసుక తీసుకుపోవడం ఏంటని ఆక్షేపిస్తున్నారు. ఇది పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోండి
సబ్బవరం: ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాల నుంచి రక్షణ పొందేందుకు రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై) కింద తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని అనకాపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఎం.ఆశాదేవి సూచించారు. మండలంలోని అసకపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’కార్యక్రమంలో ఆమె రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున వరి రైతులు ఎకరాకు రూ.84 ప్రీమియం చెల్లించి బీమా చేయించుకోవాలన్నారు. పంట నష్టపోతే ఎకరాకు రూ.42 వేల వరకు పరిహారం పొందే అవకాశం ఉంటుందన్నారు. మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని చెప్పారు. తక్కువ వ్యవధిలో కోతకు వచ్చే వరి రకాలను ఎంపిక చేసుకోవాలన్నారు. విత్తన శుద్ధి, నారుమడి యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు కె.ధనలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి పోతల సత్యనారాయణ, ఏఈవో బాలరాజు, వీఏఏ అలేఖ్య, ఎంపీటీసీ అప్పారావు, మాజీ సర్పంచ్ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎం.ఆశాదేవి -
ఏం చేశారు..?
50 రోజుల్లో అధికారులున్నా.. నిర్ణయాలు లేవు జీఎం, సీపీటీఎం వంటి ఉన్నతాధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ, జోన్ పరిధిలోనే పరిష్కరించగల స్థానిక సమస్యలపై కూడా ఎవరూ చొరవ చూపడం లేదు. విశాఖ డివిజన్ డీఆర్ఎం సైతం కొత్త సర్వీసులపై స్పందించకపోవడం గమనార్హం. పెద్ద పెద్ద ప్రాజెక్టుల పురోగతికి సమయం పట్టినా, రైల్వే బోర్డు వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉన్న పనులను కూడా మూలన పడేశారు. ప్రయాణికులకు ఉపయోగపడే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకున్నా ప్రజల్లో ‘జోన్ వచ్చింది’ అనే సంతృప్తి ఉండేది. పక్క జోన్లు లాభపడుతుంటే, ఇక్కడి అధికారులు మాత్రం కేవలం ఏసీ గదుల సమీక్షలకే పరిమితమవుతున్నారు. ఇప్పటికై నా జోన్ ఉన్నతాధికారులు నిద్రమత్తు వదిలి స్పందించాలి. 100 రోజుల నాటికై నా దారి మళ్లిన రైళ్లను తిరిగి విశాఖకు రప్పించి, ఇక్కడి నుంచే కొత్త సర్వీసులను ప్రారంభించి, జోన్ ఉనికిని కాపాడాలని ఉత్తరాంధ్ర ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్న చందంగా తయారైంది దక్షిణ కోస్తా రైల్వే జోన్ తీరు. దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకున్న కలల జోన్ ప్రారంభమై 50 రోజులు పూర్తవుతున్నా, సామాన్య ప్రయాణికుడికి కనిపించిన మార్పు శూన్యం. కార్యాలయం విశాఖలో ఉన్నా.. రైళ్లు మాత్రం ఇప్పటికీ ఇతర జోన్ల ఆధీనంలోనే నడుస్తున్నాయి. జోన్ ఏర్పడితే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. అధికారులు మాత్రం ఏసీ గదుల్లో సమీక్షలకే పరిమితమై, క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్ణయాలూ తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జోన్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు విశాఖ కేంద్రంగా ఒక్క కొత్త రైలు సర్వీసు కూడా ప్రారంభం కాలేదు. దారి మళ్లించిన రైళ్లు తిరిగి రాలేదు. స్పెషల్ రైళ్ల విషయంలోనూ విశాఖకు ప్రాధాన్యం దక్కలేదు. దీంతో ‘జోన్ వచ్చింది.. కానీ ప్రయోజనం ఎక్కడ?’ అనే ప్రశ్న ప్రయాణికుల నుంచి వినిపిస్తోంది. రూట్ మనది.. రైళ్లు వారివి! దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి ఆంధ్రప్రదేశ్లోని అత్యంత కీలక రైల్వే మార్గాలను కలిగి ఉంది. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లే అనేక రైళ్లు ఈ జోన్ పరిధిలోనే ప్రయాణిస్తున్నాయి. అయినప్పటికీ కొత్త రైలు సర్వీసులను ప్రారంభించేది మాత్రం ఇతర జోన్లే కావడం గమనార్హం. ఇటీవల కొల్లాం, తిరుచానూరు, తిరువణ్ణామలై, అస్సాం తదితర ప్రాంతాలకు నడిపిన స్పెషల్ రైళ్లలో దాదాపు 70 శాతం మార్గం దక్షిణ కోస్తా జోన్ పరిధిలోనే ఉన్నప్పటికీ, వాటిని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రారంభించింది. అదే విధంగా చర్లపల్లి–కొల్లాం స్పెషల్ రైలు గుంటూరు మీదుగా ఈ జోన్లోనే ప్రయాణిస్తున్నా, దానిని విశాఖ నుంచి నడపాలన్న ఆలోచన కూడా అధికారులు చేయలేదు. జోన్ ఏర్పడినా కీలక సర్వీసులు విశాఖకు రాకుండా దారి మళ్లడం, కొన్ని రైళ్లు దువ్వాడ వరకే పరిమితం కావడం ప్రయాణికులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఇతర జోన్లకు పాత్లు కేటాయించే బదులు, విశాఖ నుంచే కొత్త సర్వీసులు ప్రారంభించే అవకాశాలను పూర్తిగా విస్మరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హాల్టులు.. అదనపు లైన్లపై నిశ్శబ్దం జోన్ ఏర్పడిన తర్వాతైనా అదనపు రైల్వే లైన్లు, దారి మళ్లిన రైళ్ల పునరుద్ధరణ, పెండింగ్లో ఉన్న హాల్టులపై నిర్ణయాలు వస్తాయని ప్రజలు ఆశించారు. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. దువ్వాడ, పెందుర్తి స్టేషన్లలో అదనపు హాల్టులు కల్పించాలన్న డిమాండ్ ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. ఈరోడ్–సంబల్పూర్ వంటి రైళ్లు దువ్వాడలో కేవలం సిబ్బంది మార్పిడికే ఆగుతున్నాయి. సిబ్బంది వైజాగ్ జోన్కు చెందిన వారే అయినప్పటికీ, ఆ రైళ్లు మాత్రం ఇతర జోన్ల ఆధీనంలోనే కొనసాగుతున్నాయి. బెంగళూరు దిశగా రైళ్ల సంఖ్య, ఫ్రీక్వెన్సీ పెంచాలన్న విజ్ఞప్తులూ పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. -
ఆచార్యా.. ఇది మీకు తగునా..!
విశాఖ విద్య: ఏయూలో కీలక స్థానంలో ఉన్న ఓ అధికారిపై తీవ్ర స్థాయి అవినీతి, నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు విశ్వవిద్యాలయ సర్వీస్ రూల్స్ పక్కనబెట్టి, స్వలాభం కోసం సమాంతర వ్యవస్థను నడిపించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏయూలో ఉన్నత స్థానంలో ఉంటూ.. వ్యక్తిగత జీఎస్టీఐఎన్తో ఏయూ డెవలప్మెంట్ కౌన్సిల్(ఏయూడీసీ) ఆదాయానికి గండికొట్టడంతోపాటు, ఓ ప్రైవేట్ పాఠశాలకు చైర్మన్గా వ్యవహరించడం వర్సిటీలో హాట్ టాపిక్గా మారింది. ప్రైవేట్ స్కూల్ అధినేతగా రిజిస్ట్రార్! రాజమహేంద్రవరంలో ఓక్వుడ్ స్కూల్(సీబీఎస్ఈ)ను ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య రాంబాబు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూల్ అధికారిక వెబ్సైట్, సీబీఎస్ఈ బోర్డు పత్రాల ప్రకారం ఆచార్య రాంబాబు ఈ స్కూల్ సొసైటీ అధ్యక్షుడిగా, పాఠశాల చైర్మన్గా కొనసాగుతున్నారు. సదరు పాఠశాల డైరెక్టర్లుగా ఆయన కుటుంబ సభ్యులే వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇంకా విచిత్రమేంటంటే.. ఇదే పాఠశాలకు సంబంధించిన స్ట్రక్చర్ సౌండ్నెస్ సర్టిఫికెట్ను ఏయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన మరొక ప్రొఫెసర్ జారీ చేయడం గమనార్హం. వ్యక్తిగత జీఎస్టీఐఎన్తో ఏయూ ఆదాయానికి గండి వర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు సాయిల్ టెస్టింగ్, రహదారుల నిర్మాణం, బిల్డింగ్ స్ట్రక్చర్ స్టెబిలిటీ అండ్ సౌండ్నెస్ వంటి క్వాలిటీ తనిఖీలు చేస్తుంటారు. ఈ ప్రక్రియ అంతా ఏయూడీసీ ద్వారా జరగాలి. ఇందుకు వసూలు చేసే ఫీజులో 30 శాతం నిధులు కౌన్సిల్కి వెళ్తాయి. మిగిలిన 70 శాతం సదరు ప్రొఫెసర్లకు అందుతాయి. ఈ లావాదేవీలన్నీ ఏయూడీసీ అధికారిక జీఎస్టీఐఎన్తో జరగాలి. ప్రొఫెసర్ రాంబాబు సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్గా ఉన్నప్పటి నుంచి ఈ నిబంధనలకు తూట్లు పొడిచారన్న ఆరోపణలున్నాయి. తన పేరిట వ్యక్తిగత జీఎస్టీఐఎన్ తీసుకుని, ప్రైవేట్ సివిల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సేవలతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. పదేళ్లకు పైగా ఈ వ్యక్తిగత జీఎస్టీఐఎన్తో కన్సల్టెన్సీ కార్యకలాపాలు నిర్వహించినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో, నాలుగేళ్ల క్రితం ఆయన ఆ లైసెన్స్ను రద్దు చేసుకున్నట్లు సమాచారం. సమాచారం ఇచ్చేందుకు ఏయూ విముఖత ప్రొఫెసర్ రాంబాబు వ్యక్తిగత జీఎస్టీఐఎన్, ప్రైవేట్ కన్సల్టెన్సీ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని కోరినా ఏయూ యంత్రాంగం స్పందించడం లేదని ఆర్టీఐ కార్యకర్త జల్లి రాజశేఖర్ తెలిపారు. దీనిపై గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. యూనివర్సిటీ పేరు వాడుకుని ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా ప్రయోజనం చేకూర్చడం, వర్సిటీ ఆదాయానికి గండి కొట్టడంపై విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, జారీ చేసిన స్ట్రక్చర్ సౌండ్నెస్ సర్టిఫికెట్లపై లోతైన దర్యాప్తు జరగాలని కోరుతున్నారు. రిజిస్ట్రార్ స్థానంలో ఆయనే ఉంటే విచారణ సజావుగా సాగదని, ఆయన్ని తప్పించి, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ కమిటీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలపై రిజిస్ట్రార్ ఆచార్య రాంబాబును వివరణ కోసం ‘సాక్షి’పలు దఫాలుగా ప్రయత్నించినా ఆయన స్పందించలేదు. -
స్థాయి దిగజారి విమర్శలొద్దు
జిల్లా సమస్యలపై మౌనం అనకాపల్లి: ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి పాలనలో అప్పటి ఎమ్మెల్యే (ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే) కొణతాల రామకృష్ణకు మూడు మంత్రి పదవులు ఇచ్చి ఉత్తరాంధ్ర జిల్లాకే పెద్ద దిక్కుగా చేసిన ఘనత మర్చిపోయి రాజశేఖర్రెడ్డి కుమారుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని గొడ్డలిపార్టీ అని సంభోదించడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. స్థానిక రింగ్రోడ్డు పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రెండు రోజుల క్రితం కశింకోట మండలం ఉగ్గినపాలెం గ్రామంలో జరిగిన ఒక సమావేశంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తన స్థాయిని దిగజారి మాట్లాడడంతో నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అనకాపల్లి నియోజకవర్గ సమస్యలపై మాట్లాడ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మనవడు గురించి సంభోదిస్తూ మాట్లాడడం చూస్తే మంత్రి పదవికోసం పాకులాడుతున్నట్టు తెలుస్తుందన్నారు. హెరిటేజ్ లాభాలు రానున్న రోజుల్లో బాగా పెరుగుతాయని ఎమ్మెల్యే మాట్లాడడం చూస్తుంటే త్వరలో హెరిటేజ్ అమ్మకాలు తనే (కొణతాల రామకృష్ణ) చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు. దివంగత రాజశేఖర్రెడ్డి మరణానానంతరం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొణతాల రామకృష్ణకు ఎంతో గౌరవం ఇచ్చారని, అనకాపల్లిలో నేటి వరకూ ఎమ్మెల్యేలుగా పనిచేసిన దాడి వీరభద్రరావు, గుడివాడ అమర్నాథ్, గంటా శ్రీనివాసరావు తమస్థాయికి తగ్గట్టుగా మాట్లాడేవారని అన్నారు. కొణతాల రామకృష్ణకు సీటు ఇప్పించిన జనసేన అధినేత పవన్కల్యాణ్ గురించి మాట్లాడకూడా టీడీపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి ఎక్కువగా పొగడ్తలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ సమావేశంలో సూపర్సిక్స్ పథకాలు కోసం, నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కోసం మాట్లాడితే బాగుటుందన్నారు. కాంగ్రెస్పార్టీలో ఉత్తరాంధ్ర జిల్లాలో ద్రోణంరాజు సత్యనారాయణ వంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కొణతాల రామకృష్ణను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి గెలిపించుకుని, మూడు మంత్రి పదవులు ఇచ్చిన రోజును ఒక్కసారి రామకృష్ణ గుర్తుచేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో సుమారుగా రూ.50 కోట్ల ప్రభుత్వ స్థలాన్ని కాజేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, మండలంలో అన్ని గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్పై ఎమ్మెల్యే దృష్టి పెడితే బాగుంటుందన్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగజారడం రామకృష్ణకు తగదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కెరీర్ గైడెన్స్, ఉపాధి, కొత్త కోర్సులపై చర్చ
విశాఖ విద్య: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) బుధవారం ఆంధ్ర యూనివర్సిటీలో పర్యటించి విశ్వవిద్యాలయ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆడిట్ నివేదికలపై సమీక్ష నిర్వహించింది. కమిటీ చైర్మన్ పులపర్తి ఆంజనేయులు అధ్యక్షతన ఏయూ ఐఐఎం భవనంలో జరిగిన సమావేశంలో యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్, జాబ్మేళాల నిర్వహణ, విద్యార్థులకు ఉపాధి అవకాశాల కల్పన, ఆధునిక కోర్సుల ప్రవేశపెట్టడం, సిలబస్, బోధనా విధానాలు, పోటీ పరీక్షలకు శిక్షణ, వెబ్సైట్ నిర్వహణ, యువతకు ఉపాధి సమాచారం చేరవేత తదితర అంశాలతో పాటు ఆడిట్ పారాలపై కమిటీ సమగ్రంగా సమీక్షించింది. గత పర్యటనలో ఖాతాల నిర్వహణపై పలు ప్రశ్నలు లేవనెత్తిన కమిటీ, ఈసారి కూడా ఆర్థిక లావాదేవీలు, వ్యయాలకు సంబంధించిన వివరాలను పరిశీలించింది. ఏయూ వైస్ చాన్సలర్ జి.పీ. రాజశేఖర్ విశ్వవిద్యాలయ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, అకౌంట్స్ నిర్వహణపై పూర్తి నివేదికను కమిటీకి సమర్పించారు. ఆడిట్ నివేదికలను పరిశీలించి అవసరమైన సూచనలు చేస్తామని పీఏసీ చైర్మన్ తెలిపారు. సమావేశంలో పీఏసీ సభ్యులు రామ్ రాజగోపాల్, పి. విష్ణుకుమార్ రాజు, అరిమిల్లి రాధాకృష్ణ, కోళ్ల లలిత కుమారి, బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఏయూలో ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమీక్ష -
‘మధ్యాహ్న భోజనం’ నాణ్యతగా ఉండాలి
అనకాపల్లి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు. స్ధానిక కలెక్టర్ కార్యాలయంలో పీఎం పోషణ్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం స్టీరింగ్, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గవర్నమెంట్ పాఠశాలలకు, జూనియర్ కాలేజీలకు సరఫరా చేస్తున్న రైస్లో పురుగులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏడో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థినులకు సరిపడా శానిటరీ నాప్కిన్లను సకాలంలో అందజేయాలన్నారు. భోజన పథకంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు తగిన ఆరోగ్య పరీక్షలు సకాలంలో చేసి, రక్తహీనత కలిగిన విద్యార్థుల డేటాను యాప్లో పొందుపరచాలన్నారు. ఈ నెల 24న జరగబోయే మెగా పేరెంట్ మీటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. -
పోలీసులకు జోన్ గుబులు
సాక్షి, అనకాపల్లి: ’రాష్ట్రపతి ఉత్తర్వులు–2025’ ప్రకారం పోలీస్శాఖలో కొత్త జిల్లాలకు స్థానిక క్యాడర్ల కేటాయింపులో హెడ్ కానిస్టేబుల్స్కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇటీవలే పదోన్నతి పొంది ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుళ్లకు పోలీస్ శాఖ స్థానిక కేడర్ కేటాయింపుల ప్రక్రియ తీవ్ర వేదనను మిగులుస్తోంది. రెండేళ్ల కిందటే హెడ్ కానిస్టేబుళ్లగా పదోన్నతి పొందినా వారు జూనియర్లుగానే కొనసాగుతున్నారు. ఇటీవల రెండేళ్లుగా సీనియర్ పీసీలు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లేకపోవడంతో రెండేళ్లుగా పనిచేసినా జూనియర్లుగానే పరిగణించబడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇలా రెండేళ్ల పాటు హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేసి, ప్రస్తుతం కొత్త జిల్లాలకు స్థానిక కేడర్ కేటాయింపు ప్రక్రియలో జూనియర్లను ఏజెన్సీకు పంపించే అవకాశం ఉంది. ఇలా ఈ అన్యాయమైన కేటాయింపుల కారణంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెం దిన సుమారు 130 మందికి పైగా హెడ్ కానిస్టేబుళ్లు తమ సొంత జిల్లాలకు, కుటుంబాలకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి నెలకొంది. రెండేళ్లు సర్వీస్ ఉన్నా జూనియర్లే.. గతంలో రెండేళ్ల క్రితం హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొంది ట్రైనింగ్ పూర్తి చేసుకుని, కోర్టు స్టే కారణంగా నిలిచిపోయిన సీనియర్ పీసీలుగానే ఉండిపోయిన వారు మైదాన ప్రాంతంలోనే కొనసాగనున్నారు. ఇదే బ్యాచ్లో 130 మంది వరకూ హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొంది వెళ్లిన వారు మాత్రం జూనియర్లుగా ఉండిపోయారు. హెడ్ కానిస్టేబుళ్లలో కొత్తగా రెండేళ్లుగా కోర్టు స్టే కారణంగా రాకపోవడంతో రెండేళ్ల సర్వీసు ఉన్నా జూనియర్లుగానే ఉండిపోయారు. దీంతో కొత్త జిల్లాలకు స్థానిక కేడర్ కేటాయింపు ప్రక్రియలో ఏజెన్సీకే పరిమితం కానున్నారు. ఉమ్మడి జిల్లాలో విశాఖ, అనకాపల్లి జిల్లాలు రెండూ జోన్–1లోనూ, అల్లూరి జిల్లా జోన్–2లో ఉండడంతో వీరు అల్లూరి జిల్లాకు వెళితే, వారు ఎస్ఐలుగా పదోన్నతి పొందే వరకూ శాశ్వతంగా ఏజెన్సీలోనే ఉండిపోనున్నారు. కాగా వీరిలో అనకాపల్లి, విశాఖ జిల్లాలకు చెందిన వారూ కూడా శాశ్వతంగా వారి సొంత జిల్లాలకు దూరం కానున్నారు. ఉమ్మడి జిల్లాలో 1000 మంది హెచ్సీలు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 1000 మందికి పైగా హెడ్ కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఇటీవలే (రెండేళ్ల క్రితం) కానిస్టేబుళ్ల నుంచి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన వారు 130 మంది వరకూ ఉన్నారు. అయితే, నూతన జిల్లాల ప్రకారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాను స్థానిక కేడర్ కేటాయించాల్సి ఉంది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అనకాపల్లి, విశాఖ జోన్–1లోకి, అల్లూరి జిల్లా జోన్–2లోకి విభజించారు. అయితే రివర్స్ సర్వీస్ ప్రకారం కేటాయింపులు జరుగుతున్నాయి. రెండేళ్ల పాటు సీనియారిటీ ఉన్నా వారు జూనియర్లు గానే పరగణిస్తున్నారు. దీంతో వీరు ఏజెన్సీకే పరిమితం కానున్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన వారు ఏజెన్సీకి కేటాయింపు జరగడం కారణంగా జోన్లు మారిపోతున్నాయ. శాశ్వతంగా సొంత ప్రాంతాలకు దూరంగా కానున్నారు. జోన్–2లో అల్లూరి జిల్లా, రంపచోడవరం, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం జిల్లాలున్నాయి. వారికి ఏఎస్ఐగా పదోన్నతి వచ్చినా జోన్–2కే పరిమితం కానున్నారు. వారికి వెసులుబాటు కల్పించకపోతే దీని వల్ల వారి కుటుంబాలు, పిల్లల చదువులు, వృద్ధులైన తల్లిదండ్రుల వైద్య సదుపాయాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జిల్లాకు స్థానిక కేడర్ కేటాయింపుస్పీకర్, డీఐజీకి వినతి కొత్త జిల్లాలకు స్థానిక కేడర్ కేటాయింపు ప్రక్రియలో నష్టపోతున్న హెడ్ కానిస్టేబుళ్లు తమ సమస్యలపై పోరాడేందుకు సిద్ధమయ్యారు. తమకు అన్యాయం జరుగుతుందని, న్యాయం చేయాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డీఐజీ గోపినాథ్ జెట్టీకి విన్నవించుకున్నారు. రెండేళ్ల పాటు చేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకుని స్థానిక కేడర్ కేటాయింపులు జరపాలని కోరారు. డీఎల్పీ కమిటీ పరిశీలనలోనూ తమకు న్యాయం జరగకపోతే, ఈ కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి ’రిట్ పిటిషన్’ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. కమిటీలో ఉన్నది వీరే.. ఉద్యోగులను పాత, కొత్త జిల్లాల మధ్య పారదర్శకంగా కేటాయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ చైర్మన్గా ఉంటారు. కో–చైర్మన్లుగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అల్లూరి జిల్లా కలెక్టర్ టి.నిశాంతి వ్యవహరిస్తారు. కన్వీనర్గా డీఐజీ గోపినాథ్ జెట్టీ, కొత్త జిల్లా అధికారి కో–కన్వీనర్గా జిల్లా ఎస్పీలు తుహిన్ సిన్హా, అమిత్ బర్దర్ ఉంటారు. ఆగస్టు 5వ తేదీ నాటికి ప్రక్రియ పూర్తవ్వాలనేది ప్రభుత్వ నిబంధన.ఏకపక్ష వైఖరితో నష్టంసాధారణంగా స్థానిక కేడర్ లేదా స్థాన చలనం ప్రక్రియలో సర్వీసు, సీనియారిటీ, హెచ్ఆర్ఏ ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త జిల్లాలకు స్థానిక కేడర్ కేటాయింపు ప్రక్రియలో లోపాలు, అధికారుల ఏకపక్ష వైఖరితో ఉమ్మడి జిల్లాలోని మొత్తం హెడ్ కానిస్టేబుళ్లలో దాదాపు 130 మంది హెడ్ కానిస్టేబుళ్లు తీవ్రంగా నష్టపోతున్నారు. -
కలకలం రేపిన సగం కాలిన మృతదేహం
గోపాలపట్నం(విశాఖ): కొత్తపాలెంలోని పులగానిపాలెం పాత ఊరు సమీపంలో రైల్వే ట్రాక్ దాటాక నిర్మానుష్య ప్రాంతంలో సగం కాలిన మృతదేహం ఘటన బుధవారం కలకలం రేపింది. గుర్తుతెలియని, సుమారు 35–40 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మృతదేహం సగం కాలి, చెట్టు కింద పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి వీఆర్వో సుబ్బారావుకు సమాచారం ఇవ్వగా, ఆయన పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐలు మారయ్య, రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహం వద్ద కాలిపోయిన మొబైల్, కళ్లజోడు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వేలిముద్రలను కూడా సేకరించారు. అనంతరం సీఐ సన్యాసినాయుడు మాట్లాడుతూ మృతుడు ట్రాక్ ప్యాంటు, రౌండ్ నెక్ టీషర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహం పరిస్థితిని బట్టి ఘటన మంగళవారం రాత్రి జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని, వేరే చోట హత్య చేసి, ఆధారాలు చెరిపివేసేందుకు ఇక్కడ కాల్చి ఉండొచ్చన్న అనుమానంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మృతుడి గుర్తింపుతో పాటు ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు మొబైల్ ఫోన్ ఆధారాలు, పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీఆర్వో సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. మద్యం, గంజాయి కార్యకలాపాలకు అడ్డా ఘటన జరిగిన పులగానిపాలెం పాత ఊరు–రైల్వే కల్వర్టు పరిసర ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో అక్కడ తరచూ మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతానికి రావాలంటే స్థానికులు కూడా భయపడే పరిస్థితి ఉందన్నారు. పోలీసుల నిఘాను మరింత పెంచాలని కోరుతున్నారు. కొత్తపాలెంలో సంచలనంగా మారిన ఘటన -
ఎంఏఎఫ్ జాతీయ న్యాయ సలహాదారుగా వరప్రసాద్
అచ్యుతాపురం రూరల్: మానవ అధికార ఫారం (ఎమ్ఏఎఫ్) జాతీయ న్యాయ సలహాదారుగా అడ్వకేట్ కేవీవీ వరప్రసాద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ఆయనకు బుధవారం నియామక ఉత్తర్వులు, గుర్తింపు కార్డును అందజేసారు. బాధితులకు న్యాయపరమైన సహాయం అందించి, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని వరప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఏఎఫ్ రాష్ట్ర చైర్మన్ తంగప్పన్ కుమార్, అరకు మహిళా అధ్యక్షురాలు కె.సంతోషి, రాష్ట్ర కార్యాలయ ఇన్చార్జి డి.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వెలుగు సంఘాల బలోపేతమే లక్ష్యం
రెండు రోజుల బీడీపీ శిక్షణ విజయవంతంసబ్బవరం: స్థానిక వెలుగు మండల సమాఖ్య ఆధ్వర్యంలో బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్(బీడీపీ)పై నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది. మండలానికి చెందిన ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్లు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు శిక్షణ అందించారు. జిల్లా మేనేజర్ పి.వెంకటరమణ మాట్లాడుతూ వెలుగు మహిళా స్వయం సహాయక సంఘాలు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘాలు, గ్రామ సమాఖ్యలు వ్యాపారాభివృద్ధి ప్రణాళికలు రూపొందించి ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. నక్కపల్లి ఏపీఎం శ్రీనివాసరావు బీడీపీ రూపకల్పన, అమలు విధానంపై శిక్షణ ఇచ్చారు. అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి, గొలుగొండ, చోడవరం, సబ్బవరం, యలమంచిలి క్లస్టర్ల ప్రతినిధులు శిక్షణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు దాసరి సునీతతో పాటు సిబ్బంది, సీసీలు, అకౌంటెంట్లు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
సింహగిరిపై ఘనంగా స్వాతి హోమం
సింహాచలం: స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం శ్రీ నృసింహ హోమం విశేషంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి ఆలయ కల్యాణమండపంలో అర్చకులు హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదికపై చక్రపెరుమాళ్లని వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం జరిపారు. పూజలో పాల్గొన్న భక్తులకు కంకణధారణ చేసి హోమగుండం వద్ద వేంజేపచేశారు. మండపారాధన, అగ్నిప్రతిష్ట, హోమం, పూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. హోమంలో ఉంచిన ప్రధాన కలశంను అర్చకుడు శిరస్సుపై పెట్టుకుని తిరువీధిగా ఆలయంలోకి వెళ్లి స్వామివారి మూలవిరాట్కి సమర్పించారు. అనంతరం ఆ పవిత్ర జలాలను భక్తులపై జల్లారు. ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
విద్యార్థులపై లాఠీచార్జ్ అన్యాయం
చోడవరం: ఈ నెల 20న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ’చలో పార్లమెంట్’ కార్యక్రమంలో శాంతియుతంగా నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ను ప్రయోగించడం అన్యాయమని పీడీఎస్వో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.భాస్కర్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా చోడవరంలో విద్యార్థులతో కలిసి పీడీఎస్వో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చోడవరం కళాశాల జంక్షన్ నుంచి బస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్షలో అవకతవకలు, అవినీతి, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించిన విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడడాన్ని ఖండిస్తున్నట్లు భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసాహితి జిల్లా నాయకులు గౌరీశంకర్, సీ్త్ర విముక్తి సంఘటన జిల్లా కన్వీనర్ లక్ష్మీకుమారి పాల్గొన్నారు. -
కూటమి అనకొండల భరతం పడతాం
సాక్షి, అనకాపల్లి : హిందూ దేవాలయాలున్న కొండలపై అక్రమ గ్రావెల్ మైనింగ్ను వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అడ్డుకుని తీరుతామని, కూటమి అనకొండల భరతం పడతామని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. విశాఖలోని సింహాచలం, అనకాపల్లిలోని పంచదార్ల కొండలను పిండిచేస్తూ అక్రమ సంపదను ఆర్జిస్తున్నారని చంద్రబాబు కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులపై మండిపడ్డారు. కూటమి పార్టీల నేతల మైనింగ్ దోపిడీకి నిరసనగా వైఎస్సార్సీపీ మంగళవారం చేపట్టిన ‘చలో పంచదార్ల’ ధర్మ పోరాట యాత్రకు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. వందలాది కార్లు, వేలాది బైకులతో అనకాపల్లి రింగ్ రోడ్డు పార్టీ కార్యాలయం నుంచి పూడిమడక జంక్షన్, మునగపాక, అచ్యుతాపురం మీదుగా రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామం వరకు 20 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది. అక్కడ అక్రమంగా తవ్విన గ్రావెల్ గుంతలను శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్, కేకే రాజు, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ మంత్రి బాలరాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, పార్టీ నేతలు పెట్ల ఉమాశంకర్ గణేశ్, కంబాల జోగులు, మలసాల భరత్కుమార్, మొల్లి అప్పారావు, అన్నంరెడ్డి అ«దీప్రాజ్, అనకాపల్లి పరిశీలకులు శోభా హైమావతితో పాటు పలువురు ముఖ్య నేతలు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి, మాజీ ఎమ్మెల్యే కె.భ్యాగలక్ష్మి, ఉత్తరాంధ్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, నియోజకవర్గ పరిశీలకులు కోలా గురువులు, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, సతీష్వర్మ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మీడియాతో మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలికూటమి ప్రభుత్వ అక్రమ గ్రావెల్ తవ్వకాలను యావత్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికే ’చలో పంచదార్ల’ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారు. కూటమి నేతలు దశాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర శివుని దేవాలయాన్నే దోచుకుంటున్నారు. దేవాలయ సంరక్షణ, సనాతన ధర్మం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్న జనసేన ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి కుట్రలు జరుగుతున్నాయని మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వం కాదా.. ఇది చేతగాని ప్రభుత్వమా? ధర్మలింగేశ్వర స్వామి మూడో కన్ను తెరిస్తే ఈ కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది. రేపటికల్లా మైనింగ్కు సంబంధించిన ఒక్క వస్తువు కూడా అక్కడ ఉండటానికి వీల్లేదు. తక్షణమే పంచదార్లను ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలి. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలి. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా తవ్వుకుంటూ పోతుంటే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. కేజీఎఫ్ తరహాలో కొండను 125 అడుగుల లోతు తవ్వేయడం దారుణం. ప్రశ్నించే వారిపై పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగుతారా? పవిత్రమైన పంచదార్ల కొండను బీజేపీ ఎంపీ సీఎం రమేష్, జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ ఇద్దరూ తొలి చేస్తున్నారు. ఈ మొద్దు ప్రభుత్వంలో చలనం రాకపోతే తానే స్వయంగా వస్తానని వైఎస్ జగన్ చెప్పారు. గతంలో రుషికొండపై ప్రభుత్వ భవనం కడితే దుష్ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇప్పుడు పంచదార్ల దైవక్షేత్రం కొండలను పిండి చేస్తుంటే ఏం చేస్తున్నారు? సనాతన ధర్మం ఏమైంది? సీఎం రమేష్ అంటే కరపె్టడ్ మేన్. ఉమా ధర్మలింగేశ్వరస్వామితో పెట్టుకుంటే మాడి మసైపోతారు. -
బ్లాక్స్టోన్ పరిశ్రమ కోసం భూముల పరిశీలన
మాకవరపాలెం: బ్లాక్స్టోన్ పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీ ప్రతినిధులు భూములను పరిశీలించారు. మండలంలోని పెద్దిపాలెం, పైడిపాల, బూరుగుపాలెం, తూటిపాల రెవెన్యూ గ్రామాల పరిధిలో పరిశ్రమల స్థాపనకు 4,259 ఎకరాల ల్యాండ్ బ్యాంకును రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. అలాగే రాచపల్లి రెవెన్యూలోని 737 సర్వే నంబర్లోనూ ప్రభుత్వం 406 ఎకరాలను సేకరించింది. ఈ నేపథ్యంలో మంగళవారం తూటిపాల, యరకన్నపాలెం ప్రాంతాల్లో జేసీ శౌర్యమాన్పటేల్, బ్లాక్స్టోన్ కంపెనీ ప్రతినిధులు పర్యటించారు. ఈ కంపెనీకి సుమారు 500 ఎకరాల భూమి అవసరంగా చెబుతున్నారు. దీంతో ముందుగా తూటిపాల రెవెన్యూలో బ్లాక్ స్టోన్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో కలసి భూములను, వాటికి సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. అనంతరం రాచపల్లి రెవెన్యూలోని 737 సర్వే నంబర్లో సేకరించిన 406 ఎకరాల్లో ఇప్పటికే 150 ఎకరాలను డోజ్కో కంపెనీకి కేటాయించారు. మిగిలి ఉన్న భూమిని కూడా జేసీ పరిశీలించారు. జేసీ వెంట ఆర్డీవో రమణ, తహసీల్దార్ నూకరాజు, ఏసిఐఐసీ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కాగా మే నెలలోనూ ఇదే కంపెనీ ప్రతినిధులు ఈ భూములను పరిశీలించారు. -
ధర్మాగ్రహం
కూటమి దోపిడీపైఎంపీ రమేష్, ఎమ్మెల్యే విజయకుమార్ మైనింగ్ అక్రమాలపై నిరసన● పెద్దఎత్తున హాజరైన ప్రజలు, వైఎస్సార్సీపీ అభిమానులు ● వందలాది కార్లు, వేలాది బైకులతో 20 కి.మీ మేర యాత్ర ● అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు ● చారిత్రక, ఆధ్యాత్మిక సంపద పరిరక్షణకు పోరాటం ఆగదంటూ హెచ్చరిక ● హాజరైన శాసనమండలి విపక్ష నేత బొత్స, రీజినల్ కోఆర్డినేటర్లు కన్నబాబు, అమర్నాథ్ , పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్, కేకే రాజుదిగ్విజయంగా వైఎస్సార్సీపీ ‘చలో పంచదార్ల’మునగపాక నుంచి ‘చలో పంచదార్ల’కుసాక్షి, అనకాపల్లి: కూటమి ప్రజాప్రతినిధుల అక్రమ మైనింగ్ దోపిడీపై వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. పవిత్రమైన పంచదార్ల చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ చేపట్టిన ‘చలో పంచదార్ల’ ధర్మపోరాట యాత్ర దిగ్విజయంగా సాగింది. స్థానిక కూటమి ఎంపీ సీఎం రమేష్, స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్లు చేస్తున్న అక్రమ మైనింగ్ను అడ్డుకునేందుకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు ప్రవాహంలా తరలివచ్చారు. అనకాపల్లి టౌన్ రింగురోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ధర్మపోరాట యాత్ర పూడిమడక జంక్షన్, మునగపాక, అచ్యుతాపురం మీదుగా రాంబిల్లి మండలంలోని వెంకటాపురం జంక్షన్, పంచదార్ల కొండ వరకూ సుమారుగా 25 కిలోమీటర్ల మేర సాగింది. యలమంచిలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేతృత్వంలో వందలాది కార్లు, వేలాది మోటార్ బైక్లతో వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు కూటమి నేతల అక్రమాలను నిరసిస్తూ నినాదాలతో ర్యాలీగా సాగారు. ఈ ధర్మపోరాట యాత్ర ఏకంగా 3 గంటల సమయం పట్టిందంటే ప్రజా స్పందన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దారి పొడవునా ప్రజలు వైఎస్సార్సీపీ నాయకులకు ఘనస్వాగతం పలికారు. అక్రమ మైనింగ్ ప్రదేశాన్ని పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు పంచదార్ల చేరుకున్న అనంతరం వైఎస్సార్సీపీ అగ్రనేతలు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కొల్లగొడుతున్న అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజినల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ మంత్రి బాలరాజు, సమన్వయకర్తలు కంబాల జోగులు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అధీప్రాజ్, వాసుపల్లి గణేష్కుమార్, మలసాల భరత్కుమార్, మొల్లి అప్పారావు, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి, నియోజకవర్గం పరిశీలకులు కోలా గురువులు, వీసం రామకృష్ణ, చింతకాయల సన్యాసిపాత్రుడు సతీష్వర్మ, ఏడువాక సత్యారావు, పైలా శ్రీనివాసరావు, గండి రవి, బాణాల శ్రీనివాసరావు, పలువురు ముఖ్య నాయకులు పరిశీలించారు. వెంకటాపురం జంక్షన్ వద్ద సభకు హాజరైన జనసందోహంరేపటి నుంచి మైనింగ్ ఆపేయాల్సిందే –బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వ అక్రమాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం దోచుకోవడం, దాచుకోవడం, అక్రమ సంపాదనపైనే కూటమి ప్రజాప్రతినిధులు దృష్టిసారిస్తున్నారు. విశాఖలో సింహాచలం, అనకాపల్లిలో పంచదార్ల కొండను పిండిచేస్తూ అక్రమ సంపద ఆర్జిస్తున్నారు. దశాబ్దాల కాలం నాటి పవిత్ర శివుని దేవాలయాన్నే దోచుకుంటున్నారు. దేవాలయ సంరక్షణ, సనాతన ధర్మం అంటున్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ప్రెస్మీట్ పెట్టి ఏదో కుట్రలు జరిగిపోతున్నాయంటూ మాట్లాడుతున్నాడు. మీదే ప్రభుత్వం కదా! మీది చేతగాని ప్రభుత్వమా చెప్పండి? కుట్రలు జరిగితే బయటకు తీయండి. శివుడితో రాజకీయాలొద్దు... ధర్మలింగేశ్వర స్వామి మూడో కన్ను తెరిస్తే కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది. శివుడికి ఎదురొడ్డి ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే వెళ్తున్నారు... తస్మాత్ జాగ్రత్త! రేపటికల్లా అక్కడ మైనింగ్ చేసే యంత్రాలు, ఏ ఒక్క వ్యక్తీ ఉండకూడదు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ను కోరుతున్నాను... ఇక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలి. ’నో మైనింగ్ జోన్’గా ప్రకటించకపోతే మళ్లీ ఇక్కడికి రావాల్సి వస్తుంది. ప్రజా పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం– కురసాల కన్నబాబు కూటమి ప్రజాప్రతినిధులు చేస్తున్న మైనింగ్ దోపిడీపై వైఎస్సార్సీపీ చేస్తున్న ధర్మపోరాటానికి వేలాదిమంది ప్రజలు, కేడర్ వచ్చి విజయవంతం చేశారు. కూటమి ప్రజాప్రతినిధులు తమ చేతుల్లో అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా తవ్వుకుంటూ పోతామంటే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా పవిత్రమైన పంచదార్ల కొండను బీజేపీ ఎంపీ సీఎం రమేష్, జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ ఇద్దరూ పంచుకుని తొలిచేస్తున్నారు. ‘మొన్న చేపట్టిన రిలే నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చినప్పుడు పంచదార్ల అక్రమ మైనింగ్ విషయాన్ని మా నాయకుడు వై.ఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. పవిత్రమైన ఫణిగిరి కొండను అపవిత్రం చేస్తున్న వారు ఎంతటివారైనా వైఎస్సార్సీపీ పోరాడాలని, ప్రజా పక్షాన నిలవాలని ఆయన ఆదేశించారు. అప్పటికీ ఈ మొద్దు ప్రభుత్వంలో చలనం లేకపోతే తానే స్వయంగా వస్తానని జగన్ చెప్పారు. మా ప్రభుత్వంలో విశాఖలోని రుషికొండపై ప్రభుత్వ భవనం కడితే, రుషులు ధ్యానం చేసే కొండ అంటూ ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్కళ్యాణ్ తమ అనుకూల మీడియాలో తప్పుడు ప్రచారాన్ని ఊదరగొట్టారు. మరి ప్రస్తుతం విశాఖలోని సింహాచలం, అనకాపల్లిలోని పంచదార్ల దైవక్షేత్రాల కొండలనే పిండి చేస్తుంటే సనాతన ధర్మం ఏమైపోయింది? వెంటనే పంచదార్లను ’నో మైనింగ్ జోన్’ గా ప్రకటించాలి. డబుల్ ఇంజిన్ దోపిడీ – బొడ్డేడ ప్రసాద్ అడ్డుకుంటే బెదిరింపులు – కరణం ధర్మశ్రీ పవిత్ర పుణ్యక్షేత్రమైన శివుడు ఉన్న కొండ అని తెలిసి కూడా అక్రమంగా తవ్వేస్తున్నారు. దీనిపై స్థానిక రెవెన్యూ, మైనింగ్, దేవదాయ, ఆర్కియాలజీ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోతోంది. అక్రమ గ్రావెల్ లారీలను పంచదార్ల కొండను ఆనుకుని ఉన్న గ్రామస్తులు అడ్డుకుంటే లారీలతో తొక్కించి చంపేస్తామని బెదిరిస్తున్నారు. పంచదార్ల దైవక్షేత్రం పాండవులు సంచరించిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది, శేషాద్రి కొండ కన్నా పవిత్రమైంది. ఈ కొండపై మైనింగ్ జరగకుండా ’నో మైనింగ్ జోన్’ సాధించే వరకు పోరాడుతాం. సీఎం రమేష్ కరెప్టెడ్ మ్యాన్ – గుడివాడ అమర్నాథ్ పన్నెండు దశాబ్దాల క్రితం నుంచి ఈ ఫణిగిరి కొండపై పవిత్ర పంచధారల పేరిట ధారలు వస్తే, అక్రమ గ్రావెల్ తవ్వకాలతో ఆ ధార కాస్తా ఫణిగిరి కింద కన్నీరుగా మారింది. స్థానిక ప్రజలు వందలాది గ్రావెల్ టిప్పర్ లారీలను అడ్డుకుంటే వారిపై కేసులు పెడుతున్నారు. ఫణిగిరి కొండ పరిధిని తక్షణమే ’నో మైనింగ్ జోన్్’గా ప్రకటించాలి. కూటమి నేతలు ఇక్కడ గుడిని, గుడిలో లింగాన్ని మింగేస్తున్నారు. ‘సీఎం రమేష్ అంటే కరెప్టెడ్ మ్యాన్. నువ్వు ఉమా ధర్మలింగేశ్వర స్వామితో పెట్టుకుంటున్నావు, మాడి మసైపోతావు జాగ్రత్త! సీఎం రమేష్ దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం, హరహర మహాదేవుడి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలే ఆయనకు రాజకీయ పతనాన్ని చూపిస్తారు. కొండలు పిండి చేస్తున్నారు –కేకే రాజు బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే, ఇక్కడ ’డబుల్ ఇంజిన్ దోపిడీ’ జరుగుతోంది. సామాన్య రైతు ఒక తట్ట మట్టి తవ్వితే పోలీసులు కేసు పెడుతున్నారు.. అలాంటిది పవిత్రమైన పంచదార్ల కొండనే తవ్వేస్తుంటే ఒక్క కేసు ఎందుకు పెట్టలేదో? గత నెల రోజులుగా ఈ ప్రాంతంలో కూటమి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ పంచదార్ల కొండను తొలిచేసి గ్రావెల్ను తరలిస్తున్నారు. ఈ ప్రాంతానికి వచ్చి సనాతన ధర్మం వంటి పెద్ద పెద్ద మాటలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కూటమి నేతలు చేస్తున్న పాపాలు కనపడడం లేదా? కూటమి ప్రభుత్వంలో కొండలను పిండేస్తున్నారు.. భూ దోపిడీకి పాల్పడుతున్నారు. అనకాపల్లిలో సహజ వనరులను దోచుకోవడానికే రాయలసీమ నుంచి ఇక్కడకు ప్రజాసేవ పేరుతో సీఎం రమేష్ వచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూటమి నేతలు దోచుకుంటున్నారు. ఈ ప్రాంత సంస్కృతిని మంటగలుపుతున్నారు. పంచదార్ల కొండ పరిధిలో 31 కి.మీ నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ వెంటనే జీవో ఇవ్వాలి.. -
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక
కె.కోటపాడు : ఈ నెల 18న విశాఖపట్నంలో రైల్వే అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ మీట్లో ఎ.కోడూరు హైస్కూల్కు చెందిన విద్యార్థినులు పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభను చూపారు. అథ్లెటిక్స్లో భాగంగా పెంటాధలిన్ పోటీల్లో లెక్కల ఉమ గోల్డ్మెడల్ను సాధించింది. కొమ్మనాపల్లి కుసుమ ట్రయాథ్లాన్లో గోల్డ్మెడల్, యెల్లంకి జ్యోత్స్న ప్రియాంక ట్రయాథ్లన్లో సిల్వర్, మునస రోహిని ట్రయాథ్లన్లో సిల్వర్, కిల్లి ప్రమోదిని లాంగ్ జంప్, హైజంప్ పోటీల్లో సిల్వర్, కె.శ్యామ్ ట్రయాథ్లన్లో మూడో స్థానంలో నిలిచాడు. వీరికి నిర్వాహకులు పతకాలతో పాటు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. -
● హోంమంత్రి అనిత తక్షణం రాజీనామా చేయాలి ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ
రెడ్బుక్ రాజ్యంలో రాక్షస పాలనఅనకాపల్లి: కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మహిళలపై దాడులు పెరిగిపోయాయని, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గంలోనే మహిళపై అఘాయిత్యం జరిగినప్పటికీ పట్టించుకోకపోవడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి అన్నారు. స్థానిక రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లా మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడేడ్డ ప్రసాద్ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్, భీమునిగుమ్మం అంబేడ్కర్ విగ్రహం వరకూ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండున్నర ఏళ్లుగా రాష్ట్రంలో మహిళలపై అనేక దాడులు జరుగుతున్నా మహిళా కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో మహిళపై చెప్పలేని ఘోరం జరిగిందని, నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేదని రాష్ట్ర హోంమంత్రి అనిత తక్షణమే రాజీనామా చేయాలన్నారు. మహిళలు స్కూల్ నుంచి గుడి వరకూ వెళ్లాలంటే భయపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాల మంత్రి నారా లోకేష్ మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారన్నారు. మాజీ ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. పార్లమెంట్లో మహిళా రిజ్వరేషన్ బిల్లు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటే, మన రాష్ట్రంలో మహిళలపై దాడులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనను గాలికి వదిలేసి అధికార దాహంతో ఊగిపోతున్నారన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా వర్కింగ్ జోన్–1 అధ్యక్షురాలు ఈర్లె అనురాధ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండున్నర ఏళ్ల అరాచక పాలనపై ప్రజలు విరక్తి చెందారన్నారు. సరైన సమయంలో ఓటు ద్వారానే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మహిళలపై దాడులు చేసిన వ్యక్తులపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంపీ మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, జిల్లా ఉపాధ్యక్షురాలు మర్రిపల్లి శోభ, సీరం నదియా, మహిళా నాయకులు పద్మకుమారి, పద్మ, సుందరిలత, హైమావతి, శ్రావణి, సీతారత్నం, నూకరత్నం, విజయ లక్ష్మీ, లక్ష్మి పాల్గొన్నారు. -
‘పంచదార్లను నో మైనింగ్ జోన్గా ప్రకటించే వరకూ ఉద్యమిస్తాం’
పంచదార్ల: అనకాపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పంచదార్లలో తవ్వకాలు దారుణమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి దేవుడంటే భయం లేదని, తవ్వకాలు ఆపకపోతే ఇది ప్రజా ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు కన్నబాబు. పంచదార్లలో మైనింగ్ అక్రమాలపై మీడియాతో మాట్లాడిన కురసాల కన్నబాబు.. సంపద సృష్టి అంటే విధ్వంసమా అని ప్రశ్నించారు. ‘మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది. చంపేస్తామని బెదిరిస్తే బెదిరేది లేదు. ఎక్కడైతే అవినీతి ఉంటుందో అక్కడ వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుంది. పంచదార్లను చూస్తుంటే కేజీఎఫ్ గుర్తుకు వస్తుంది. సింగరేణి గనుల్లా తవ్వేశారు. ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నారు. పంచదార్లలో మైనింగ్ చేసే వారిపై కేసులు పెడుతున్నారా? లేదా?, కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలను భయపెట్టి బతుకుతున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పేవాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. పంచదార్లను నో మైనింగ్ జోన్గా జీవో ఇచ్చేవరకూ ఉద్యమిస్తాం. పంచదార్ల కొండపై అమరలింగేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారు. శివుడు మూడో కన్ను తెరిస్తే కూటమి భస్మం అవుతుంది. పంచదార్ల కొండపై తట్ట మట్టి తీయండి.. పరిణామాలు ఎలా ఉంటాయో చూస్తారు. ఇంతటితో వదలం.. లక్షలాది మందిని పంచదార్లకు తీసుకొస్తాం’ అని హెచ్చరించారు. -
టీడీపీ నేతల అక్రమ మైనింగ్పై వైఎస్సార్సీపీ పోరాటం
సాక్షి, అనకాపల్లి జిల్లా: కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్ అరాచకంపై వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలోని పంచదార్ల గ్రామంలో ఉన్న ఫణిగిరి కొండపై కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్ను వ్యతిరేకిస్తూ ఇవాళ (మంగళవారం) చలో పంచదార్ల’ పేరిట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. వేలాది బైకులు, వందలాది కార్లతో వైఎస్సార్సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. పంచదార్ల కొండలను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారుయలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమబాటలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.పంచదార్ల కొండల కోసం ధర్మ పోరాటం: బొత్సఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పంచదార్ల కొండల కోసం ధర్మ పోరాటం చేస్తున్నామన్నారు. పంచదార్ల కొండలను దోపిడీ చేస్తున్నారు. ప్రజా ఉద్యమంలా మారకుండా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలి. అక్రమ మైనింగ్ ఆపకపోతే మళ్ళీ ఇక్కడికి వస్తాం. వాస్తవాలు ప్రజలకు తెలియాలని మీడియాను మొత్తం తీసుకువచ్చాంఅక్రమ మైనింగ్కు పాల్పడేది చిన్న వ్యక్తులు కాదు. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు కలిపి దోచుకుంటున్నారు. రోజు సనాతన ధర్మం అంటారు, ఎక్కడ ఉంది మీ సనాతన ధర్మం. మీకు కళ్లు ఉంటే కూటమి పెద్దలు వచ్చి అక్రమ మైనింగ్ చూడండి. పంచదార్ల కొండ కోసం మేము పోరాటం చేస్తుంటే కుట్ర దాగి ఉందని మాట్లాడతారా?. ఏమి కుట్ర దాగి ఉందో కూటమి నేతలు చెప్పాలి. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో తెలియదు. పాపం కూటమి నేతలకు తగులుతుంది. రేపు ఉదయం మైనింగ్ వాహనాలు పంచదార్ల కొండపై ఉండకూడదు. ఉంటే నడిరోడ్డుపై ధర్నా చేస్తాం’’ అని బొత్స హెచ్చరించారు. -
గర్భస్థ శిశువు మృతిపై విచారణ
మాడుగుల రూరల్: కె.జె.పురం పీహెచ్సీలో ఈ నెల 18వ తేదీన కూర్మానాథపురం గ్రామానికి చెందిన ఏలుసూరి నారాయణమ్మ రెండో కాన్పులో గర్భంలోనే మగ శిశువు మృతి చెందింది. ఈ సంఘటనపై జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, నోడల్ అధికారి కె. చంద్రశేఖర్దేవ్ సోమవారం విచారణ నిర్వహించారు. ఆ రోజు ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనకాపల్లి నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందింది. దీంతో గర్భస్థ శిశువుతోపాటు తల్లి మృతి చెందడంతో స్థానిక పీహెచ్సీలో వైద్యాధికారులు ఎల్.వి.ఎస్.ఎస్. ప్రసాదుపాత్రుడు, బి. ఈశ్వర్ సందీప్, ఇతర సిబ్బందిని విచారించారు. బిడ్డ మృతితో బాలింతరాలు డిప్రెషన్కు లోనైందని స్టాఫ్నర్స్ మానస వివరించారు. అనంతరం గ్రామానికి వెళ్లి మృతురాలు కుటుంబ సభ్యులను విచారించారు. ఈ సందర్భంగా డీఐవో మాట్లాడుతూ సమగ్రంగా విచారణ చేపట్టి, నివేదికను కలెక్టర్కు అందజేస్తామన్నారు. తాటిపర్తి సచివాలయ ఏఎన్ఎం, ఎంహెల్హెచ్పీ శ్రావణి, కూర్మానాథపురం ఆశ కార్యకర్త, పీహెచ్ఎన్ ఇందిరను విచారించారు. ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా తగు జాగ్రత్తలు వహించాలని ఆయన ఆదేశించారు. అనంతరం పీహెచ్సీలో ఆపరేషన్ థియేటర్, మందులిచ్చే గదిని, ల్యాబ్ను, వార్డును పరిశీలించారు. -
ఎంపీఈవోల సమస్యలు పరిష్కరించాలి
అనకాపల్లి: వ్యవసాయశాఖలో ఎంపీఈవోలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ ఎంపీఈవోల యూనియన్ జిల్లా నాయకులు శ్రీను, సంతోష్, రాజా, ప్రశాంతిలు అన్నారు. స్థానిక గాంధీనగరం జిల్లా వ్యవసాయ కార్యాలయం వద్ద సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వ్యవసాయశాఖలో సుమారుగా 12 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న పర్మనెంట్ చేయకపోవడం అన్యాయమని, సమాన పనికి సమాన వేతనం కింద రూ.35వేలు అమలు చేయాలని, శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని, నాన్ శాంక్షన్ పోస్టుల నుంచి శాంక్షన్ పోస్టులకు కన్వర్ట్ చేయాలని, హెల్త్ కార్డులు సదుపాయం కల్పించాలని, ప్రమాద భీమా కల్పించాలని, విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా సదుపాయం కల్పించాలని, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేయాలని తదితర డిమాండ్లతో ధర్నా చేపట్టారు. వివిధ రూపాల్లో ఈనెల 25వకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో పోలీసు పాలన
సీపీఐ జాతీయ సమితి సభ్యుడు జె.వి.సత్యనారాయణమూర్తిఅనకాపల్లి: అమరావతిలో విపరీతమైన దోపిడీ జరుగుతుందని, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పోలీసులకు విచక్షణారహితంగా అధికారాలు ఇవ్వడంతో రాష్ట్రంలో పోలీసు పాలన కొనసాగుతోందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు జె.వి.సత్యనారాయణమూర్తి విమర్శించారు. స్థానిక న్యూకాలనీ రోటరీ హాల్లో సోమవారం పార్టీ నాయకులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలపై చంద్రబాబు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. సాయి తేజ మృతి కేసే దీనికి ఉదాహరణ అన్నారు. రామ మందిరం నిర్మిస్తే దేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉంటారని చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ భక్తులిచ్చిన కోట్లాది రూపాయల విరాళాలు దోచుకుని హిందువుల మనోభావాలు దెబ్బతీసిందన్నారు. ఒకప్పుడు పవిత్రమైన తిరుపతి లడ్డూను పాచిపోయిన లడ్డూ ఇచ్చిన ప్రధాని మోదీ అని చెప్పిన పవన్ కళ్యాణ్ తనకు తాను గొప్ప సనాతని అని ప్రకటించుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం అన్నారు. ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు, పాదయాత్ర జరుగుతున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో కూడా ర్యాలీలు పాదయాత్రలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్శులు దొరబాబు, అప్పలరాజు, కార్యవర్గ సభ్యులు వెంకటరమణ,గురు బాబు, ఫణీంద్ర, డిసిహెచ్.క్రాంతి, రాధాకృష్ణ, మండల కార్యదర్శులు వియ్యపు రాజు, తాకాసి వెంకటేశ్వర్లు, గొర్ల దేముడు బాబు తదితరులు పాల్గొన్నారు. -
కశింకోట ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్లో ప్రవేశాలు
కశింకోట: కశింకోటలోని ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాలలో వినియోగదారుల కోటా కింద ప్రవేశానికి సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలలో అన్ని సీట్లు భర్తీ అయ్యాయి . సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో కొన్ని సీట్లు మాత్రం భర్తీ కాలేదు. మొత్తం120 సీట్లకుగాను 102 సీట్లు భర్తీ చేసినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. ఉమా శంకర్ తెలియ చేశారు. ఈ కౌన్సెలింగ్కు స్పెషల్ ఆఫీసర్గా అనకాపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఐ.వి.ఎస్.ఎస్ శ్రీనివాసరావు, తనిఖీ అధికారులుగా లెక్చరర్లు సురేష్, రంగారాజ్ హాజరయ్యారు. కౌన్సెలింగ్లో అసోసియేట్ ప్రిన్సిపాల్ కె.శివ, విభాగాధిపతులు గణేష్, రమణ కుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్ కె.శివరాం, సిబ్బంది పాల్గొన్నారు. -
దివ్యాంగులకు ప్రవేశం లేదా...
కలెక్టర్, జాయింట్ కలెక్టర్ను నేరుగా కలిసి తమ సమస్య వివరించేందుకు వచ్చిన కొందరు దివ్యాంగులను కలెక్టరేట్ బయటే ఉంచి వారితో వచ్చిన సహాయకులను మాత్రమే లోపలకు పంపించి అర్జీ తీసుకుంటున్నారని, దివ్యాంగులమైన తమను కలెక్టర్ను కలిసేందుకు అనుమతించలేదని చెబుతున్నారు. ఆటోలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా కలెక్టరేట్ బయటే వీల్చైర్లలో ఉండిపోవాల్సి వస్తుందని, గంటల పాటు వేచి ఉన్న తరువాత సంబంధిత శాఖ అధికారులు వచ్చి సమస్య అడిగి తెలుసుకుని సరే అంటున్నారని, కలెక్టర్ను ప్రత్యక్షంగా కలిసే అవకాశం లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. -
హోంమంత్రి అనుచరుడి జులుంపై ఫిర్యాదు
ఎస్.రాయవరం: అధికార బలంతో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త , మాజీ సర్పంచ్ అయిన వజ్రపు శంకర్రావు దౌర్జన్యంగా తన సొంతభూమిలో పశువుల షెడ్డుని కూలదోసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు వజ్రపు లక్ష్మి సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై రాష్ట్ర మహిళా కమిషన్కు, సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. శంకర్రావు హోంమంత్రి ముఖ్య అనుచరుడు కావడంతో అధికారులు ఆయన దౌర్జన్యాలను నిలువరింపచేయకపోగా , ఇచ్చిన ఫిర్యాదుపై కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారని బాధితురాలు వాపో యారు. పాడి పశువులను పెంచుకుంటూ కూలి చేసుకుని బతికే తమను ఇబ్బందులు పెట్టడం ఏమిటని ఆవేదన చెందారు. కొనుక్కున్న భూమిలో రూ.4 లక్షల వెచ్చించి షెడ్డు నిర్మాణం చేసుకుంటే కూలదోసి తమని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. జిల్లా అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయలాని పేర్కొన్నారు. -
నీళ్లనుకుని కెమికల్ తాగి వ్యక్తి మృతి
ఎస్.రాయవరం: వాటర్ బాటిల్ అనుకుని కెమికల్ వాటర్ తాగిన వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని దార్లపూడిలో జరిగింది. ఎస్.రాయవరం ఏఎస్ఐ వెంకటేశ్వర్లు సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు జిల్లా కై కలూరి గ్రామానికి చెందిన పిల్లనగ్రోవి సతీష్ (48) రెండు రోజుల క్రితం సోలార్ ప్లేట్లు ఏర్పాటుకు సిబ్బందితో కలసి దార్లపూడి వచ్చాడు. ఆ గ్రామంలోని ఓ ఇంట్లో సోలార్ పనులు చేపడుతున్నారు. ఆ క్రమంలో సతీష్ ఆదివారం రాత్రి ఆ ఇంట్లో టేబుల్ కింద బాటిల్లో ఉన్న కెమికల్ను నీళ్లు అనుకుని తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అయితే అప్పటికే సతీష్ మృతి చెందాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ తెలిపారు. -
సాగు హక్కుల కోసం రోడ్డెక్కిన రైతులు
కె.కోటపాడు: మూడు తరాలుగా సాగు చేస్తున్న భూములపై ఎటువంటి హక్కులు దఖలు పడకపోవడంతో పాచిలవానిపాలెం, చౌడువాడ, గరుగుబిల్లి గ్రామాల రైతులు రోడ్డెక్కారు. రైత్వారీ పట్టాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చౌడువాడ నుంచి కె.కోటపాడు వరకూ 8 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రను తొలుత వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దాట్ల శివాజీరాజు, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ ఇక్కడ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. 200 మందికిపైగా రైతులు పాల్గొని ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్రగా కె.కోటపాడు చేరుకున్నారు. అక్కడ మూడు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దారు కార్యాలయం వద్దకు చేరుకుని సాగు భూములకు హక్కులు కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దారు నాగరాజుకు వినతిపత్రం అందించారు. పరిశీలించి న్యాయం చర్యలు తీసుకోనున్నట్లు తహసీల్దారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ మాట్లాడుతూ 1989లో విశాఖపట్నం ఆర్డీవో ఈ భూములు రైత్వారీ ఇనాంగా ధ్రువీకరించి ఉత్తర్వులు ఇచ్చారన్నారు. సాగుదారులకు భూహక్కులను కల్పించాలని అందులో పొందుపర్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించుకుంటున్నా సమస్యకు పరిష్కారం కాలేదని వాపోయారు. ఇప్పటికై నా మూడు గ్రామాల్లో 354 ఎకరాలు సాగు చేసుకుంటున్న 500 మంది రైతుల పేరున హక్కులను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహన్రావు, కె.గౌరీశంకర్, లక్ష్మీకుమారి, న్యాయవాది పిళ్లా హరశ్రీనివాస్, నందారపు భాస్కరరావు, ఎంపీటీసీ ఏటుకూరి రాజేష్, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు ఆకుల సాయిప్రసాద్, వార్డు మాజీ మెంబర్ చల్లా సురేష్, పాల సంఘం అధ్యక్షుడు కోమార వెంకటరమణ, పాల సంఘం మాజీ అధ్యక్షుడు కోమార ఎర్రునాయుడు, ధనిమిశెట్టి అప్పారావు, గండి సత్యనారాయణ, సిరపరపు రమణారావు, పాచిల శ్రీనివాసరావు, వంటాకు గోవిందరావు, బొడ్డు దేముడుబాబు, జాగరపు కన్నంనాయుడు, సిరపరపు అప్పలనాయుడు, పోతల రమణారావు, తనకాల అప్పలకోటి, కోమార సోమునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఇష్టపడి చదివితే ప్రతి ఒక్కరూ ‘షైనింగ్ స్టార్స్’
జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్రఅనకాపల్లి టౌన్: ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి కాకుండా.. ఇష్టపడి చదవాలని, ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడానికే షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్ధానికంగా ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్, పదో తరగతి 2026 సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పేరిట ప్రతిభా అవార్డులు, ప్రోత్సాహక నగదు బహూకరణ ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. జిల్లాలోని ఇంటర్లో 34 మందికి, పదో తరగతిలో 154 మంది మెత్తం 188 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి, ఒక్కో విద్యార్థికి 20 వేల రూపాయల నగదు, ప్రశంసాపత్రం ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్, ఆర్డీవో అయేషా, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, డీఈవో అప్పారావు నాయుడు, డీఐఈవో వినోద్ బాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. -
పోరుబాట
మైనింగ్ మాఫియాపై● నేడు ‘చలో పంచదార్ల’ ఉద్యమం ● ఉదయం 9 గంటలకు అనకాపల్లి రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీ : ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్● హాజరుకానున్న బొత్స, కురసాల కన్నబాబు, అమర్నాథ్, ముత్యాలనాయుడు తదితరులుసాక్షి, అనకాపల్లి: కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్ అరాచకంపై వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా, పురాతన దివ్యక్షేత్రంగా భావించే శ్రీ ఉమా ధర్మలింగేశ్వరస్వామి వారి ఆలయం వెలసిన పంచదార్ల కొండను స్థానిక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పీఏ విజయ్కుమార్ నాయుడు పేరుతో, లక్ష్మీ మినరల్స్ పేరుతో స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ అనుచరుడు వై.శ్రీనివాస్ పేరుతో తవ్వేస్తున్నారు. ఏడాదికి రూ.100 కోట్ల అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. చోళుల కాలంనాటి, మహాభారతంలో పాండవుల నివాసం ఉన్న చరిత్ర ఉన్న యలమంచిలి నియోజకవర్గం, రాంబిల్లి మండలంలోని పంచదార్ల గ్రామంలో ఉన్న ఫణిగిరి కొండపై కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్ను వ్యతిరేకిస్తూ మంగళవారం ‘చలో పంచదార్ల’ పేరిట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమబాటలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, ఎంపీలు గొల్ల బాబూరావు, తనూజరాణి, విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, బొడ్డేడ ప్రసాద్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంబా రవిబాబు, ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరాజు, రేగం మత్స్యలింగం పాల్గొననున్నారు. వీరితో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య నేతలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. కూటమి నేతల మైనింగ్ అక్రమాలపై వైఎస్సార్సీపీ ధర్మ పోరాటం -
సర్వర్ మొరాయింపు...అర్జీదారులకు తిప్పలు
తుమ్మపాల: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు భారీ సంఖ్యలో జిల్లాలోని అర్జీదారులు తరలివచ్చారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో సత్యనారాయణరావు అర్జీదారుల సమస్యలను తెలుసుకుని అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు అందించారు. కాగా పీజీఆర్ఎస్ వెబ్సైట్ సాంకేతిక సమస్యతో సర్వర్ అంతరాయంతో అర్జీదారులు గంటల పాటు క్యూలైన్లలోనే కంప్యూటర్ల ముందు నిలిచిపోయారు. సౌకర్యాల లేమి, దివ్యాంగులకు ఎదురైన ఇబ్బందులతో పలువురు అర్జీదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కలెక్టరేట్ వద్దే ఉండి పోవాల్సి వస్తుందని, అయినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని, దీంతో పదేపదే అర్జీలు చేస్తున్నామని అర్జీదారులు చెబుతున్నారు. ఫిర్యాదుల పురోగతిపై స్పష్టమైన సమాచారం అందడం లేదని, పొంతన లేని సమాధానాలతో ఎండార్స్మెంట్ ఇవ్వడమే పరిష్కారంగా అర్జీలను ముగించేస్తున్నారని వాపోతున్నారు. ఆరుబయటే అర్జీలు రాత... అర్జీదారుల సంఖ్యకు తగిన కూర్చునే ఏర్పాట్లు లేకపోవడంతో చాలామంది చెట్ల నీడలో, విగ్రహాల దిమ్మలపై కూర్చుని అర్జీలు రాసుకున్నారు. కొందరు నిల్చునే తమ దరఖాస్తులను సిద్ధం చేసుకున్నారు. తాగునీరు, విశ్రాంతి, వృద్ధులు–దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్లు వంటి సౌకర్యాలు మరింత మెరుగుపరచాలని కోరుతున్నారు. 90శాతం వైకల్యం ఉన్నా అందని పూర్తి స్థాయి పింఛను ఓ దివ్యాంగుడి గోడు నడుము విరిగిపోయి పూర్తిగా నడవలేని స్థితిలో ఉంటూ 90 శాతం వికలాంగుడిగా సదరం ధ్రువీకరణ ఉన్నప్పటికి పూర్తి స్థాయి రూ.15 వేలు పింఛను అందడం లేదని, కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలంటూ రాంబిల్లి మండలం దిమిలి గ్రామానికి చెందిన మామిడి అప్పారావు భార్య సహాయంతో ఆటో కట్టించుకుని కలెక్టరేట్కు వచ్చానన్నాడు. అతన్ని కలెక్టరేట్ బయటే ఉంచి అర్జీని వేరొకరితో లోపలికి పంపించారని, రెండు గంటలుగా వేచి ఉన్నా ఎవరూ రాలేదని, కలెక్టర్ను కలిసే అవకాశం ఇస్తే తనను చూసి కనికరించైనా పింఛను మంజూరు చేస్తారేమోనని వచ్చానని, తీరా ఇక్కడ లోపలికి అనుమతించలేదని వాపోయాడు. ఎన్టీఆర్ ఆసుపత్రి డాక్టర్ వచ్చి సమస్య తెలుసుకున్నారని, అనవసరంగా వచ్చానని నిరాశ వ్యక్తం చేశారు. -
గిడ్డంగుల్లో పనిలేదు... బతికేదెలా..
● కలెక్టర్కు హమాలీల వినతి యలమంచిలిలో గల పౌరసరఫరాల గిడ్డంగి పరిమితిని తగ్గించేలా పలు డిపోలకు అందించాల్సిన సరుకులను మరో గిడ్డంగికి అప్పగించడంతో తమకు పనితగ్గి నెలవారీ వేతనం కూడా తగ్గిపోయిందని, గిడ్డంగి నుంచి తొలగించి డిపోలను పునరుద్ధరించి తమకు న్యాయం చేయాలంటూ హమాలీలు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి హమాలీలుగా పనిచేస్తున్న తమకు జీవనాధారంగా ఉన్న గిడ్డంగిలో పని తగ్గిపోయి ఆర్థికంగా చితికిపోతున్నామంటూ ఆవేదన చెందారు. తమ సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందించారు. -
సాగు భూములు రక్షించాలని డిమాండ్
నర్సీపట్నం: భూ మాఫియా నుంచి ఆదివాసీల సాగు భూములను రక్షించి, మైనింగ్ మాఫియా నుంచి కల్యాణపులోవ రిజర్వాయర్ని కాపాడాలని సీపీఐఎంఎల్ లిబరేషన్ నాయకుడు కె.జనార్దన్ డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద గిరిజనులతో కలిసి ఆయన నిరసన తెలియజేశారు. కార్యాలయం ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ మాఫియా పెద్దపెద్ద యంత్రాలు, జేసీబీలతో రిజర్వాయర్ను కప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీంతో రిజర్వాయర్ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ, ఫారెస్టు అధికారుల అండతో మరింత రెచ్చిపోతున్నారన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఆదివాసుల సాగుభూములను కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. -
కష్టాల్లో ఆగాకర రైతులు
గొలుగొండ: కష్టాల్లో ఆగాకర రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. జిల్లాలో ఎక్కవగా గొలుగొండ మండలంలో ఈ ఆగాకర సాగు జరుగుతుంది. అనుకూలమైన నేలలు ఉండడంతో ఎకరం రూ.లక్ష వర కు పెట్టుబడులు పెట్టి సాగు చేపడితే తీరా కాపు దశ లో వర్షం వెనుకంజ వేసింది. మండలంలో ఈ సాగు అన్ని ప్రాంతాల్లో 1500 ఎకరాల్లో సాగు జరుగుతుందంటే ఈ ప్రాంతంలో అనుకూలమైన నేలలు ఉండడమే కారణం. మండుటెండలో ఏప్రిల్ నుంచి పా దులు పెంచుకుంటూ వేలాది రూపాయలు పెట్టు బడులు పెడితే కాపు దశలో చినుకులు లేక 25 శాతం మాత్రమే కాయలు రావడంతో రైతులు లబోదిబో అంటున్నారు. 1500 ఎకరాల్లో సాగు గొలుగొండ మండలంలో వరి సాగు తరువాత ఈ సీజన్లో ఆగారక సాగు ఎక్కవగా జరుగుతుంది. కొత్త ఎల్లవరం, రాజుపేట, కరక, జిల్లెడిపూడి, గొలుగొండ, జోగుంపేట, పప్పుశెట్టిపాలెం, అమ్మపేట, చీడిగుమ్మల, ఎర్రవరం తదితర ప్రతీ గ్రామంలో వందలాది ఎకరాలు కనుచూపు మేర ఆ పంట వేస్తారు. సరిగ్గా ఏప్రిల్ నెలలో ఈ పంటకు పాదులు ఏర్పాటు చేసి ప్రతిరోజు నీరు పోసి పాదులు పెంచడం జరుగుతుంది. జులై మొదటివారం నుంచి పంట దిగుబడి వస్తుంది. జులై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఈ సాగు విస్తారంగా జరగడంతో రైతులకు లాభాలు వచ్చేవి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా కాపు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎకరానికి రూ. లక్ష వరకు పెట్టబడి ఆగారక సాగుకు అధికంగా పెట్టుబడులు అవుతుంటాయి. మండు వేసవిలో పాదులు పెంపకం, పాదులు పెరుగుతున్న సమయంలో పందిళ్లు వేయడం, ఆడ, మగ పాదులు వేరు చేయడం, ఎరువులు, పురుగు మందులకు అధికంగా పెట్టుబడులు అవుతుంటాయి. రైతులు మొదటి రెండు దఫా కాపులోనే ఈపెట్టుబడులు వచ్చేవి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా పాదులు ఎదుగుదల దశలో వానల్లేక దిగుబడి దెబ్బతీసింది. దీని వల్ల కాపు 25శాతం మాత్రమే వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాలు సకాలంలో కురిస్తే రూ. 3 లక్షల దాటి ఆదాయం వచ్చేదని చెబుతున్నారు. అనుకూలమైన నేలలు ఆగారక సాగుకు ఎర్ర నేలలు ఉండాలి. నీరు ఎక్కువగా ఉండకుండా, ఆరుతడిగా ఉన్న నేలల్లో మంచి పెరుగుదల వస్తుంది. ఈ రకం నేలలు ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉంది. ఎకరం రూ.25వేల వరకు శిస్తులకు భూములు సాగు చేయడం జరుగుతుంది. ఇటువంటి మంచి నేలలు మండలంలో పై గ్రామాల్లో ఉండడం వల్ల ఈ సాగు ప్రతి ఏటా పెరుగుతుంది. ప్రస్తుతం తీవ్ర వర్షభావ పరిస్థితుల కారణంగా నష్టాలు చూడాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. ఎండిపోతున్న పాదులు ఈ సీజన్లో మంచి వర్షాలు కురవడం వల్ల పాదులు విస్తారంగా పెరిగి కాయలు అధికంగా వచ్చేవి. మండుటెండలో ట్యాంకర్లతో నీరుపోసి పాదులు పెంచినా పాదులు పెరిగే సమయంలో వర్షం లేక పాదులు ఎండిపోతున్నాయి. ప్రస్తుతం కాయలకు ధర ఉన్నా దిగుబడులు లేక తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. –గోవింద్, రాజుపేట, రైతు ధరలు బాగున్నా, దిగుబడులు లేక ప్రస్తుతం రైతుల వద్ద పండిన ఆగారక కిలో రూ.150 నుండి 160 వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ ధరలు టన్ను కాయలకు రూ. లక్షా 50వేల వరకు ఆదాయం వస్తున్నా కాపు లేకపోవడంతో రైతలకు నష్టాలే వచ్చే అవకాశం ఎక్కవగా ఉంది. ఎకరానికి రూ. 50వేల వరకు నష్టం వస్తుందని రైతులు అంటున్నారు. నిలిచిన ఎగుమతులు ఆగారక సాగు మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన కేంద్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు అయిన ఒడిశా, పశ్చిమబంగా, తమిళనాడు, బెంగళూరు, తెలంగాణ ప్రాంతాలకు ప్రతి ఏటా ఎగుమతులు ఉండేవి. వ్యాపారులు రైతులకు అడ్వాన్సులు ముందుగా ఇచ్చి వ్యాపారం చేసే వారు. కానీ ఈ ఏడాది కాయలు దిగుబడి లేక ఇతర ప్రాంతాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఉన్న కాస్త కాయలు ఇక్కడికే అమ్మకాలు జరుగుతున్నాయి. -
సాగు చేస్తున్నా...హక్కులు లేవు
భూమిని సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నాం. ఇంట్లో ఆర్థికపరమైన అవసరాలు వచ్చే సమయాల్లో ఈ భూమిని అమ్ముకోవడానికి వీలుకావడం లేదు. భూమి రికార్డులు తమ పేరును లేకపోవడంతో ఎవ్వరూ కొనుగోలు చేయడం లేదు. మా పేరున భూ హక్కులను కల్పించాలని కోరుతున్నా పరిష్కారం లభించడం లేదు. –గండి సత్యనారాయణ, రైతు, పాచిలవానిపాలెం సత్రం భూములుగా నమోదు చేశారు గతంలో మూడు గ్రామాల్లో జిరాయితీ భూములకు రెవెన్యూ అధికారులు పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. ఈ భూములకు సంబంధించి 2015లో ఎండోమెంట్ అధికారులు రైతులకు ఎటువంటి నోటీస్లు ఇవ్వకుండా సత్రం భూములుగా నమోదు చేశారు. దీనిపై పలుమార్లు అధికారులను కలిసి ఫిర్యాదులు చేసినా నేటికీ పరిష్కారం లేదు. ప్రకృతి విపత్తులు సమయంలో ప్రభు త్వం నుంచి నష్టపరిహారం అందడం లేదు. పెట్టుబడులకు అప్పులు చేసి వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. –కోమార వెంకటరమణ, రైతు, చౌడువాడ -
రాష్ట్ర స్థాయి పారా క్రీడా పోటీలకు ఎంపిక
రావికమతం: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష , పారా స్పోర్ట్స్’ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో హీల్ పారడైస్ స్కూల్ వేదికలో ఈ 20 నుంచి 23 వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి పారా క్రీడా పోటీలకు రావికమతం నుంచి నలుగురు దివ్వాంగ విద్యార్థులు ఎంపికై నట్టు దివ్యాంగులకు శిక్షణ అందిస్తున్న మేడివాడ ప్రత్యేక ఉపాధ్యాయులు బొడ్డు మహాలక్ష్మినాయుడు తెలిపారు. ఫిబ్రవరిలో అనకాపల్లి జిల్లాలో జిల్లా స్థాయి పారా క్రీడా పోటీలకు మండలం నుంచి 14 మంది దివ్యాంగ విద్యార్థులను పంపించగా వారిలో నలుగురు విద్యార్థులు జి.బాబూరావు (మేడివాడ హైస్కూల్), ఎన్.హేమదర్గ (కేజీబీవీ గర్నికం), కె.రాము (ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్తకోట) ఎస్. మురళి (చినపాచిల గ్రామం) జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరించి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎపికైనట్టు ప్రత్యేక ఉపాధ్యాయుడు బొడ్డు మహాలక్ష్మి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థులను, శిక్షణ అందించిన ఉపాధ్యాయులను పలువురు ఆభినందించారు. -
‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాల్సిందే!
అనకాపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర ఏళ్లలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్లు కొండలను పిండి చేసేస్తున్నారని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి, మైనింగ్ మంత్రికి అనేక పర్యాయాలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపట్టినట్టు వైస్సార్సీపీ యలమంచిలి సమన్వయకర్త, కరణం ధర్మశ్రీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. పంచదార్లను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలన్నారు. స్థానిక రింగ్రోడ్డు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, రీజనల్ కో ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, బూడి ముత్యాలనాయుడు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్రతో కలిసి ఈనెల 21న అనకాపల్లి రింగ్ రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మునగపాక, అచ్చుతాపురం మీదుగా పంచదార్ల ఫణిగిరి కొండ వద్దకు ర్యాలీ నిర్వహించం జరుగుతుందన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో లేటరేట్ ఖనిజ సంపద, చోడవరం నియోజకవర్గంలో గ్రానైట్ క్వారీలు, శారదానది పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక, పోలవరం ఎడమకాలువ గట్టుపై గ్రావెల్ తవ్వకాలతో కూటమి నాయకులు యథేచ్ఛగా దోచుకుంటున్నారని ఆరోపించారు. పంచదార్ల కొండను 150 అడుగుల్లో తవ్వకాలు చేశారని, కడప జిల్లాకు చెందిన ఎర్రగుట్లు గ్రామానికి చెందిన సీఎం రమేష్ డ్రైవర్ అయిన విజయకుమార్ పేరు మీద కొండను దోచేస్తున్నారన్నారు. ఫణిగిరి కొండ పక్కనే ఉన్న మరో ఐదున్నర ఎకరాల కొండను లక్ష్మీనరసింహ మినరల్స్(వై.శ్రీనివాసరావు పేరుమీద) స్థానిక ఎమ్మెల్యే విజయకుమార్ బినామీ పేరుతో దోచేస్తున్నారన్నారు. ఫణిగిరి కొండను 150 అడుగులు తవ్వేయడం వల్ల జల ధారలు రావడం లేదని పురావస్తుశాఖ వారు కలెక్టర్కు తెలియజేయడం జరిగిందన్నారు. సనాతన ధర్మం అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అనేక పర్యాయాలు చెబుతుంటే, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కూటమి ఎంపీ ఎక్కడ పాటిస్తున్నారో చెప్పాలన్నారు. హిందూ దేవాలయాలను పరిరక్షిస్తా మని చెప్పిన బీజేపీ పంచదార్ల కొండను ఎందుకు కాపాడడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, కశింకోట జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్రాజు, 80,81 వార్డు ఇన్ఛార్జ్లు కెఎం.నాయుడ, బొడ్డేడ శివ, కశింకోట మండలపార్టీ అధ్యక్షుడు మలసాల కిషోర్, నాయకులు కలగలక్ష్మీ గున్నయ్యనాయుడు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ యలమంచిలి సమన్వయకర్త కరణం ధర్మశ్రీ -
సేవ్ పంచదార్ల టీ–షర్ట్ ఆవిష్కరణ
అచ్యుతాపురం రూరల్: రాంబిల్లి మండల గజిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చేపల శ్రీహారిక ఫణిగిరిపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ శాశ్వతంగా నిలిపివేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ నాయకత్వంలో చేపడుతున్న ధర్మ పోరాటంలో యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుతూ సేవ్ పంచదార్ల అనే టీ–షర్ట్ ఆవిష్కరించింది. పంచదార్లను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న ధర్మపోరాటంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. -
పంచదార్లలో మైనింగ్పై కమిటీ
తుమ్మపాల: రాంబిల్లి మండలం పంచదార్లలో జరుగుతున్న మైనింగ్పై ఒక కమిటీ వేసి ఆ ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’ గా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లాలో మంజూరు చేసిన రోడ్లను రాబోయే పదిహేను రోజుల్లో ప్రారంభించాలని, అలా చేయని కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని మంత్రి అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన ఆధ్వర్యంలో డీఆర్సీ సమావేశం జరిగింది. ఇరిగేషన్, తాగు నీరు, రోడ్లు భవనాలు, జల్జీవన్ మిషన్, పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాలువ పనులు, ఏపీఐఐసీ, పంచాయతీ రాజ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వ్యవసాయ శాఖ, మున్సిపాల్ శాఖల పై సమీక్ష జరిగింది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో పాటు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన అభివృద్ధి, నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసి, వినియోగంలోకి తీసురావాలన్నారు. జిల్లాను వ్యవసాయ రంగం తోపాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి బాటలో నిలిపేవిధంగా నియోజకవర్గ స్థాయిలో పారిశ్రామిక ఔత్సాహిక పారిశ్రమికవేత్తలతో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పలు శాఖలకు సంబంధించిన పెండింగ్ సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన అభివృద్ధి, నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసేబాధ్యత అధికారులపై ఉందన్నారు. వివిధ శాఖల పరిధిలో ఇంకా పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణ రావు, సీపీవో జి.రామారావు,అనకాపల్లి ఆర్డీఓ షేక్ అయేషా, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు. -
ఉత్తరాంధ్రకు గేట్వేగా భోగాపురం విమానాశ్రయం
మహారాణిపేట: వచ్చే నెల 1న ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్వేగా నిలవనుందని విశాఖ కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన సమీక్షలో విమానాశ్రయం ప్రారంభాన్ని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని, పర్యాటకం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. 28 రహదారులతో అనుసంధానం విశాఖ నుంచి విమానాశ్రయానికి 28 ప్రధాన రహదారులు (238 కి.మీ) అందుబాటులో ఉన్నాయని, అన్ని మార్గాల్లో సైనేజీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బ్రౌన్ఫీల్డ్, గ్రీన్ఫీల్డ్ రోడ్లను డిసెంబరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏడు ప్రాధాన్య రోడ్లలో నాలుగు పూర్తయ్యాయని, అడవివరం–శాంఠ్యాం రోడ్డుకు అటవీ అనుమతులు లభించాయని, జుత్తాడ రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. 20 ప్రత్యేక బస్సులు.. 9 లాంజ్లు విమానాశ్రయానికి 20 ప్రత్యేక బస్సులను కేటాయించగా, ఇప్పటికే 9 అందుబాటులోకి వచ్చాయ ని తెలిపారు. గాజువాక, బీచ్ రోడ్ మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు నడపడంతో పాటు నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం లాంజ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల 1 ప్రారంభానికి కనెక్టివిటీ,రవాణా ఏర్పాట్లు వేగవంతం -
గూగుల్ ‘డేటా’.. విశాఖకు ‘గండం’
మహారాణిపేట: తర్లువాడలో ప్రతిపాదిత డేటా సెంటర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పర్యావరణ, పౌర స్వేచ్ఛా సంఘాలు, ఏఐ రెగ్యులేషన్ కూటమి, గ్రీన్ విశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్కే బీచ్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి, స్థానిక రైతుల జీవనోపాధికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును అమలు చేసే ముందు పర్యావరణ ప్రభావ అంచనా , సామాజిక ప్రభావ అంచనా నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోతున్న తర్లువాడ దళిత రైతులకు తగిన నష్టపరిహారం, ప్రత్యామ్నాయ భూమి కల్పించాలని కోరారు. ప్రాజెక్టు విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఉపాధ్యాయుల సమస్యలపై ఏపీటీఎఫ్ సమావేశం
అనకాపల్లి : విద్యాశాఖలో ఉపాధ్యాయుల విభజన జరగవలసి ఉందని, అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్ 1గా మార్చాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల అన్నారు. స్థానిక ఉప్పలపాటి చంద్రశేఖరరావు కల్యాణ మండపంలో ఆదివారం ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై.శ్రీనివాస్ ఆధ్యక్షతన ఉమ్మడి విశాఖ జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 ఉపాధ్యాయుల విభజనపై ఆమె వివరించారు. ఉమ్మడి విశాఖలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1/70 చట్టం అమలులో ఉన్న కారణంగా గిరిజనేతర ఉపాధ్యాయులు విభజనలో అల్లూరి జిల్లాకు అలాట్ అయితే వారు అనకాపల్లి, విశాఖ జిల్లాలో రాబోయే ఖాళీల్లోకి తిరిగి వచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కె.వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయుల విభజన ప్రక్రియను వివరించి, అక్కడ ఏర్పడిన ఇబ్బందులను వాటిపై సంఘాల ప్రాతినిధ్యాలను వివరించారు. తెలంగాణ ఉద్యోగుల విభజనలో జరిగిన లోపాలు ఏపీ ఉద్యోగుల విభజనలో పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు. అనంతరం స్థానిక సమస్యలపై రాష్ట్ర అధ్యక్షురాలు మంజులకు వినతిపత్రం అందజేస్తున్న ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమరాన త్రినాథ్, రాష్ట్ర పూర్వ కార్యదర్శి బి.వెంకటపతిరాజు, అనకాపల్లి, విశాఖ జిల్లాల నాయకులు కె.కె.ఎల్.ఎన్.ధర్మారావు, ఎస్.దుర్గాప్రసాద్, సీహెచ్.కరుణాకరరావు, టి.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
ఘాట్రోడ్డులో వ్యాన్బోల్తా
పాడేరు/మాడుగుల: పాడేరు–చోడవరం ప్రధాన రహదారి ఘాట్ మార్గంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం గుర్రాలపాలెం ప్రాంతానికి చెందిన కొంతమంది భక్తులు ఆదివారం పాడేరు ఘాట్రోడ్డులో అమ్మవారి పాదాల వద్ద మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం భోజనాలు ముగించుకుని సాయంత్రం వ్యాన్లో తిరిగి గ్రామానికి బయలుదేరారు. వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో ఇప్పమాను జంక్షన్ వద్ద బోల్తా పడింది. ప్రమాదంలో రోలుగుంట మండలం గుర్రాలపాలెం గ్రామానికి చెందిన చలపతి(50) అక్కడికక్కడే మృతి చెందాడు. పాడేరు ఎస్ఐ పాపినాయుడు సంఘటన స్థలాన్ని సందర్శించి, క్షతగాత్రులను మాడుగుల సీహెచ్సీకి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మండల కేంద్రం బుచ్చెయ్యపేటకు చెందిన సూరిశెట్టి అప్పారావు (60), మరణించాడని, మరో 14 మంది క్షతగాత్రులను అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించామని వైద్యుడు రాజుకుమార్ తెలిపారు. పాడేరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మృతి, 14 మందికి తీవ్ర గాయాలు -
నాగులాపల్లిలో కప్పాకప్పా నీలాలు..
మునగపాక : కొద్ది రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంట పొలాల సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేస్తున్నాయి. జూలై 20వ తేదీకి చేరుకుంటున్నా ఎండల తీవ్రత తగ్గడం లేదు.దీంతో అటు ప్రజలు,ఇటు రైతులు ఆవేదనకు గురవుతున్నారు. దీంతో నాగులాపల్లికి చెందిన గౌరీ పుత్రులు వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఆదివారం కప్పాకప్పా నీలాలకు శ్రీకారం చుట్టారు. గౌరీ పుత్రులైన పొలమరశెట్టి నూకాలయ్య, శరగడం సత్యనారాయణ,దొడ్డి ఆదిబాబు,పొలమరశెట్టి జగన్,సురేష్,మళ్ల అప్పలనాయుడు, సంతోష్తో పాటు పలువురు రైతులు గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.కప్పలను పట్టుకొని కర్రకు కట్టి ఊరేగింపు చేపట్టారు. కప్పాకప్పా నీలాలు అంటూ నినదించారు. వరుణ దేముడు కరుణ చూపించాలంటూ రైతులు అలాగే ప్రజలు కూడా వేడుకుంటున్నారు. -
సా...గుతూ..!
రెండేళ్లుగాముకుందరాజుపేట వద్ద నత్త నడకన జరుగుతున్న పోలవరం కాలువపై వంతెనల నిర్మాణంనక్కపల్లి: జిల్లాలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణపు పనులు నత్తనడకన జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినప్పటికీ పనుల్లో మాత్రం జాప్యం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నుంచి పోలవరం కాలువ అనేది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ. 1994లో ఈ ప్రాంత రైతులు రేబాక పర్యటనకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని, ఈ ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తీర్చాలని కోరారు. అయితే పోలవరం తప్ప మరేమైనా అడగండి..పోలవరం ఊసెత్తకండి అని వారికి చంద్రబాబు ఖరాఖండిగా చెప్పేసారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహానేత ఇదే రైతులు 2003లో పాదయాత్ర చేసిన సందర్బంలో దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ఈ ప్రాంత పర్యటనకు వచ్చినపుడు కలసి ఈప్రాంతమంతా వర్షాధారమని, సరైన సాగునీటి సదుపాయం లేక వేలాది ఎకరాలు సాగుకు నోచుకోవడం లేదని పోలవరం ప్రాజెక్టు నిర్మించి కాలువలు తవ్వితే ఈప్రాంత మంతా సస్యశ్యామలమవుతుందని వివరించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖ జిల్లాకు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 50 కిలోమీటర్ల కాలువ నిర్మాణం ఇచ్చిన మాట ప్రకారం 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టుకు శంకుస్దాపన చేయడంతో పాటు పాయకరావుపేట నుంచి తాళ్లపాలెం వరకు, 6,7,8 ప్యాకేజీల కింద ఎడమ ప్రధాన కాలువ నిర్మాణపు పనులు ప్రారంబించారు. సుమారు 50 కిలోమీటర్లు దూరం కాలువ నిర్మాణం కోసం భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపు వంటి కార్యక్రమాలు పూర్తి చేశారు. కాలువ నిర్మాణాన్ని పాయకరావుపేట నియోజకవర్గంలో పీఎల్పురం, సీతారామపురం, నక్కపల్లి మండలంలో దేవవరం, గొడిచర్ల, డొంకాడ, గుల్లిపాడు, ముకుందరాజుపేట, రమణయ్యపేట, చినదొడ్డిగల్లు, సీతంపాలెం, పెదబోదిగల్లం, ఎస్రాయవరం మండలం రామయ్యపట్నం, పెట్టుగోళ్లపల్లి, యలమంచలి మండలం కొత్తూరు, యలమంచలి, కొత్తలి మీదుగా తాళ్లపాలెం వరకు దాదాపు 40 శాతం పనులు పూర్తి చేశారు. వై.ఎస్ మరణానంతరం అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదు. తర్వాత రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం సైతం ఈ కాలువ పనులు నిర్లక్ష్యం చేశాయి. 2019 వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలువ నిర్మాణ పనులు కొనసాగించడం, ఇరువైపులా రాతి కట్టు, అక్కడక్కడ వంతెనల నిర్మాణ పనులు చేపట్టింది. కూటమి ప్రభుత్వంలో నత్తనడక.. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టును తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని పదేపదే ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ పనులు మాత్రం నత్తనడకన జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు వెళ్లే వర్షపునీరు, కొండ గెడ్డల ద్వారా దిగువ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్యాసేజీ పనులు, అలాగే అక్కడక్కడ బ్రిడ్జిలు, వంతెనల నిర్మాణపు పనులు నత్తనడకన జరుగుతున్నాయి. రూ.333 కోట్ల వ్యయంతో మండలంలో ముకుందరాజుపేట, రమణయ్యపేట, దార్లపూడి, పెద బోదిగల్లం, దొడ్డిగల్లు, ఎస్.రాయవరం మండలం దార్లపూడి, ప్రాంతాల్లో జరుగుతున్న వంతెనలు, సూపర్ పాసేజెస్ పనులు చేపట్టారు. ఆరో ప్యాకేజీలో 16 వంతెనలు, 14 సూపర్పాసేజ్లు నిర్మాణంలో ఉన్నాయి. ముంచెత్తుతున్న వర్షపు నీరు వర్షాలు పడిన సందర్భంలో వరదనీరు దిగువ ప్రాంతాల్లో ఉన్న పొలాలు, గ్రామాలను, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తకుండా ఈ పనులు చేపట్టాల్సి ఉంది. ఏడాది క్రితం ప్రారంభమైన పనులు చురుగ్గా జరగడం లేదు. వర్షాలు పడిన సమయంలో వరద నీరు దిగువ ప్రాంతాలను ముంచెత్తుతోందని రైతులు వాపోతున్నారు. అలాగే కాలువకు అవతల ఉన్న పొలాలు, భూములకు వెళ్లేందుకు వంతెనలు నిర్మించాలని బోదిగల్లం, చినదొడ్డిగల్లు, సీతంపాలెం, పెట్టుగోళ్లపల్లి, రమణయ్యపేట తదితర గ్రామాల పరిధిలో వీటిని నిర్మించకపోవడం వల్ల రైతులు తమ పొలాల్లోకి వెళ్లేందుకు సరైన రోడ్డులేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగువ ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లోకి వర్షపునీరు యధావిధిగా చేరేందుకు సూపర్పాసేజ్లు నిర్మించలేదు. డొంకాడ, ముకుందరాజుపేట, గుల్లిపాడు సీతారాంపురం, చినదొడ్డిగల్లు ప్రాంతాల్లో కాలువ నిర్మాణపు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ కాలువను పూర్తిగా కొనసాగించకుండా మధ్యమధ్యలో వదిలేయడం వల్ల కాలువ ఎప్పటికి పూర్తవుతుందోనన్న సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలో నిర్మించిన కాలువలకు లైనింగ్ చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిపోతోంది. పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే వంతెనలు, సూపర్ పాసేజ్లు పూర్తిచేసి అసంపూర్తిగా ఉన్న కాలువల నిర్మాణం పూర్తి చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు. నత్తనడకన పోలవరం కాలువ పనులు రూ.333 కోట్లతో వంతెనలు, సూపర్ పాసేజ్లు ఏడాదిగా అరకొరగా పనులు వర్షాలు వస్తే ముంచెత్తుతున్న వరద నీరు కాలువపై వంతెనలు లేక ఇబ్బంది పడుతున్న రైతులు పనుల్లో జాప్యంతోఅనేక ఇబ్బందులు పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. వంతెనలు, సూపర్పాసేజ్ పనులు తొందరగా పూర్తి చేయకపోవడం వల్ల రైతుల రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో వరదనీరు సూపర్పాసేజ్లు లేకపోవడం వల్ల దిగువ ప్రాంతాలను ముంచెత్తుతోంది. పనుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల నాణ్యత కూడా లోపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయింది. చినదొడ్డిగల్లు వద్ద కాలువ తవ్వేశారు. వంతెన లేకపోవడం వల్ల పొలాల్లోకి వెళ్లే రైతులు ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా దూరం వెళ్లి చేరుకోవాల్సి వస్తోంది. – గొర్లగోవిందు, రైతు, సీతంపాలెం -
వైభవంగా ఘాట్రోడ్డులో ఘటాలు పండగ
మాడుగుల : మాడుగుల మండలం ఘాట్రోడ్ జంక్షన్లో వెలసిన మోదకొండమ్మ పాదాలు ఘటాలు పండగ ఆదివారం వర్తక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంక్షన్లో గల వర్తక సంఘం సభ్యులు అమ్మవారి ప్రతి రూపమైన 101 ఘటాలతో డప్పులు వాయిద్యాలతో జంక్షన్ నాలుగు కూడలిలో సుమారు మూడు కిలోమీటర్ల మేర మండుటెండలో అడుగులో అడుగులు వేసి అమ్మవారి ఆలయానికి చేరుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకటరాజారామ్, మాజీ ఏఎంసీ చైర్మన్ శేనాపతి కొండలరావు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరిని ఆలయ కమిటీ దుశ్శాలువా కప్పి ఘనంగా సత్కరించింది. భక్తులకు ఉచితంగా ప్రసాదాలు, మజ్జిగ అందజేశారు.101 ఘటాలతో బారులు తీరిన భక్తులు -
పవర్ లిఫ్టింగ్ పోటీల్లోశ్రీనివాస్ ప్రతిభ
అనకాపల్లి: మహారాష్ట్రలోని జౌరంగబాద్ జిల్లాలో ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకూ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ జాతీయస్థాయి క్రీడాపోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో స్థానిక వేల్పులవీధి ఎస్కెపి పవర్ సిటీజిమ్కు చెందిన మొగ్గా శ్రీనివాస్( అండర్ 59) విభాగంలో ఏపీ నుంచి ప్రాతినిద్యం వహించి, స్క్వాట్లో 155 కిలోల బరువును ఎత్తి జాతీయ స్థాయి రికార్డు నమోదు చేసి బంగారు పతకాన్ని సాధించారు. అనకాపల్లి పట్టణంలో గాంధీనగరంలో మొగ్గా శ్రీనివాస్ వృత్తి రిత్యా వాహనాలకు టైర్లు, పంచర్లు వేసుకుని జీవనం సాగిస్తున్నాడు. క్రీడలపై ఆసక్తి పెంచుకోవడంతో పవర్లిఫ్టింగ్ పోటీల్లో జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని సాధించి, మన రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చినట్లు జిల్లా పవర్లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ్రపు నీలా, ప్రధాన కార్యదర్శి బద్రీనాథ్, కోశాధికారి వి.అజయ్, జిమ్ నిర్వహకులు పూర్ణ అభినందించారు. ఈనెల 23న మహారాష్ట్ర నుంచి శ్రీనివాస్ అనకాపల్లికి రానున్నారని, అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించడం జరుగుతుందన్నారు. -
‘చలో పంచదార్ల’కు తరలిరండి
మునగపాక : పంచదార్ల పుణ్యక్షేత్రాన్ని ప్రతీ ఒక్క భక్తుడు కాపాడుకోవాలని కోరుతూ ఈ నెల 21వ తేదీన నిర్వహించే చలో పంచదార్ల కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని వైఎస్సార్సీపీ జిల్లా ఽఅధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆడారి అచ్చియ్యనాయుడు అధ్యక్షతన మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన రాంబిల్లి మండలం పంచదార్ల కొండను పిండేస్తూ కూటమి నేతలు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేయడం వల్ల పవిత్రమైన ధార బురదమయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలందించాల్సిన పాలకులు కొండలను పిండేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారన్నారు. ఈ సమస్యపై కొంతకాలంగా నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పలు రూపాల్లో పోరాటం చేస్తున్నారన్నారు. కొండ ప్రాంతంలో అక్రమ మైనింగ్ కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. అక్రమార్జనే ధ్యేయంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తన అనుచరుల ద్వారా కొండను తవ్వేస్తూ పంచదార్ల ఆలయానికి అపవాదు తీసుకువస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో 21వ తేదీన వైఎస్సార్సీపీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంలో భాగంగా ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ పెద్దలు హాజరయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పంచదార్లలోని శివునికి పూజలు నిర్వహించి అనంతరం మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలిస్తారన్నారు. ఇందుకోసం మునగపాక మండలం నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు, మాజీ ఎంపీపీ దాసరి అప్పారావు,మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు,ఎంపీపీ మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు, పార్టీ నేతలు షేక్ ఇస్మాయిల్, నరాలశెట్టి సూర్యనారాయణ,పెంటకోట హరేరామ, బొద్దపు శ్రీరామమూర్తి,పెంటకోట అప్పలనాయుడు,టెక్కలి కొండలరావు,దిమ్మల అప్పారావు,భీశెట్టి గంగప్పలనాయుడు,బొడ్డేడ బుజ్జి, శ్రీపతి రామకృష్ణ,చదరం నాయుడు,చదరం అప్పలనాయుడు, పొలమరశెట్టి జగదీష్, రాపేటి పరమేష్, వెంకటప్పారావు తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ -
తపాలాశాఖ జీడీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అనకాపల్లి: దేశవ్యాప్తంగా తుపాలశాఖలో విధులు నిర్వహిస్తున్న జీడీఎస్ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ కార్యాలయం విజయవాడ వద్ద ఈనెల 14న భారీ ఎత్తున ధర్నా, ర్యాలీ నిర్వహించడం జరిగిందని, అక్కడ విషయాలను జిల్లాస్థాయి సమావేశంలో వివరించడం జరుగుతుందని అనకాపల్లి తపాలశాఖ డివిజన్ కార్యదర్శి డిఎస్ఆర్.ప్రసాద్ అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో తపాలశాఖ జీడీఎస్ ఉద్యోగులు, ది అనకాపల్లి పోస్టల్ ఎంప్లాయిస్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిడెట్ నంబర్.బి–1952 జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీడీఎస్లకు పూర్తిస్థాయి సామాజిక భద్రత, పెన్షన్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని, 8వ కేంద్ర వేతన సంఘం పరిధిలో జీడీఎస్లను చేర్చి న్యాయమైన వేతన ప్రయోజనాలు అందించాల్సి అవసరం ఉందన్నారు. పెరగుతున్న పనిభారం, లక్ష్యాల(టార్గెట్ల) పేరుతో జరుగుతున్న ఒత్తిడి, వేధింపులను నిలిపివేయాలన్నారు. వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేసి, ఉద్యోగులపై అదనపు భారం తగ్గించాల్సి బాధ్యత ఉన్నతస్థాయి అధికారులపై ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలను ఏకపక్ష నిర్ణయాలతో కాకుండా, యూనియన్లతో చర్చించి పరిష్కరించాలని ఆయన కోరారు. కమలేష్ చంద్ర కమిటీ నివేదికను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆర్.వి,నాగరాజు, డీజీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
బెట్టింగ్ దందా..
అల్లిపురం: క్రికెట్ బెట్టింగ్ బరిలోకి రాజకీయ పలుకుబడి ఉన్న యువనేతలు కూడా దిగుతున్నారా? రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడినంటూ ప్రచారం చేసుకుంటున్న టీడీపీ తెలుగు యువత నాయకుడు, జీవీఎంసీ 51వ వార్డు అధ్యక్షుడు పేడాడ మణికంఠ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసులో అరెస్టు కావడం రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. సీతన్న గార్డెన్స్ కేంద్రంగా బెట్టింగ్? ఇండియా–ఇంగ్లాండ్ టీ20 సిరీస్ సందర్భంగా నగరంలో లక్షల్లో బెట్టింగ్ జోరందుకుందన్న పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు మాధవధారలోని సీతన్న గార్డెన్స్ అపార్ట్మెంట్పై సంయుక్తంగా దాడి చేశారు. ఈ దందా నిర్వహిస్తున్న మణికంఠతో పాటు ఆయన అనుచరుడు సికిలిపల్లి శాంతి స్వరూప్ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, బ్యాంకు పత్రాలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. లోకేష్ సాన్నిహిత్యమే పెట్టుబడిగా.. మణికంఠ రాజకీయంగా ఎదగడానికి, తన పలుకుబడిని ప్రదర్శించడానికి మంత్రి నారా లోకేష్తో ఉన్న సాన్నిహిత్యాన్నే ప్రచారాస్త్రంగా వాడుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బెట్టింగ్ వ్యవహారంతో మంత్రికి ఎలాంటి సంబంధం ఉందా లేదా?అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. రాజకీయ పరిచయాలను అడ్డుపెట్టుకుని సాగించిన ఈ అక్రమ దందాపై పోలీసుల దర్యాప్తు కీలకంగా మారింది. పోలీసుల గోప్యత.. మిగిలినవారేరి? ఈ దాడి సమయంలో పలువురిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, చివరకు ఇద్దరిపైనే కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. మిగిలిన వారిని ఎందుకు విడిచిపెట్టారు? కేసు వివరాలను పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టాస్క్ఫోర్స్ వర్గాలకు, సైబర్ క్రైమ్ పోలీసులకు మధ్య నిందితుల సంఖ్యపై భిన్న సమాచారం రావడం కూడా అనుమానాలను బలపరుస్తోంది. ఫోన్లలో మరో దందా గుట్టు? స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను విశ్లేషిస్తున్న పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు దొరికినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్లతో పాటు, ఆన్లైన్ ద్వారా యువతులను ట్రాప్ చేసి వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఈ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు బెట్టింగ్ బాస్ ఎవరు? ఆర్థిక లావాదేవీలు ఎవరి ఖాతాల నుంచి జరిగాయనేది తేలాల్సి ఉంది. రాజకీయ పలుకుబడి ఉన్నా చట్టం ముందు అందరూ సమానమేనని పోలీసులు నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లోకేష్ సన్నిహితుడినంటూ పరిచయం -
అప్పన్న నామస్మరణతో వైభవంగా ఊంజల్సేవ
పెద్ద ఎత్తున పాల్గొన్న ఒడిశా భక్తులుసింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారికి ఆదివారం సాయంత్రం ఊంజల్సేవ వైభవంగా నిర్వహించారు. ఒడిశాకు చెందిన లక్ష్మీకాంత్ నాయక్దాస్ ఈ సేవను స్వామివారికి అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఒడిశాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఊంజల్సేవలో పాల్గొని అప్పన్న నామస్మరణలో మునిగితేలారు. ఆలయ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఊంజల్పై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా వేంచేపు చేశారు. ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ద్వాదశి ఆరాధనలు నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో స్వామివారికి అర్చన చేసి ఊంజల్సేవ నిర్వహించారు. ఒడిశా భక్తులు, అర్చకులు కీర్తనలు ఆలపిస్తుండగా లక్ష్మీకాంత్ నాయక్దాస్ స్వామివారి ఉయ్యాలను ఊపారు. అనంతరం భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు టి.పీ. రాజగోపాల్, ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, ఇతర అర్చకులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు కూడా హాజరయ్యారు. -
ఫణిగిరిపై అక్రమ మైనింగ్ నిలిపివేయాలి
అచ్యుతాపురం రూరల్ : పంచదార్ల ఫణిగిరిపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలు వెంటనే పూర్తి స్థాయిలో నిలిపివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం వద్ద సీపీఎం బృందం పర్యటించి అనంతరం అక్రమ క్వారీ జరిగిన ప్రదేశంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రావెల్ తవ్వకాల వల్ల పంచదార్ల సహజ నీటి వనరులు, పర్యావరణం, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మైనింగ్, సంబంధిత శాఖల అధికారులు విచారణ జరిపి అక్రమ తవ్వకాలపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తవ్వకాలను శాశ్వతంగా నిలిపివేయకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి దేముడు నాయుడు, రైతు సంఘం నాయకులు కర్రి అప్పారావు, సీఐటీయూ అచ్యుతాపురం మండల కార్యదర్శి కూండ్రపు సోమునాయుడు అధిక సంఖ్యలో సీపీఎం, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీ
చోడవరం : ఇటీవల కాలంలో దేవాలయాల్లో హుండీల చోరీలు యథేచ్ఛగా జరుగుతున్నారు. ఇప్పటికే మండలంలో పలు గ్రామాల్లో దేవాలయాల్లో జరిగిన హుండీ చోరీలు మరువక ముందే తాజాగా చోడవరం పట్టణంలో ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీ జరిగింది. చోడవరం–లక్ష్మీపురం రోడ్డులో పట్టణ శివారు ద్వారకానగర్ వద్ద ఉన్న అభయాంజనేయస్వామి ఆలయంలో హుండీ శనివారం అర్ధరాత్రి చోరీకి గురైంది. ఆలయంలో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా ఆలయంలో హుండీ చోరీ జరిగినట్టు ఆలయ కమిటీ గుర్తించి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలో నమోదైన వివరాలు ప్రకారం ఒక దొంగ ఆలయం ప్రధాన ఇనుప గేటు తాళాన్ని పగలు గొట్టి ఆలయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న హుండీ తాళాన్ని పగలు గొట్టాడు. అందులో భక్తులు కానుక రూపంలో వేసిన డబ్బులన్నింటినీ తన జేబులో వేసుకొని హుండీ మొత్తం లూటీ చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఉదయం లేచి సీసీ పుటేజీలను పరిశీలించిన ఆలయ కమిటీ ప్రతినిధులు వెంటనే చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 20వేలకు పైబడి నగదు చోరీకి గురై ఉంటుందని అంచనావేస్తున్నారు. ఇదిలావుండగా ఇటువంటి చిల్లర దొంగల ఆగడాలు ఇటీవల చోడవరం పరిసరాల్లో చాలా ఎక్కువయ్యాయి. వాస్తవానికి ఈ రూట్లో రాత్రి పూట పోలీసు గస్తీ కూడా ఉంటుంది. అయినప్పటికీ దర్జాగా చోరీ చేయడం గమనార్హం. ఇప్పటికై నా పోలీసు గస్తీని మరింత ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.సీసీ కెమెరాలో చిక్కిన చోరీ దృశ్యాలు -
వోఎస్సీలో ఉద్యోగాల దరఖాస్తుకు 31 చివరి తేదీ
ఎంవీపీకాలనీ: భీమిలిలోని ఒన్ స్టాఫ్ సెంటర్ (వోఎస్సీ)లో వివిధ పోస్టుల భర్తీకి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా సెంటర్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ వంటి మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా ఎంవీపీ కాలనీ సెక్టార్–9లోని సంక్షేమ భవన్ కార్యాలయంలో అందజేయాలని అధికారులు కోరారు. విశాఖలో మరో కరోనా కేసు నమోదు మహారాణిపేట: నగరంలో తాజాగా మరో కరోనా కేసు వెలుగుచూసింది. దీంతో జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య రెండుకు చేరింది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఓ 28 ఏళ్ల యువకుడు పెందుర్తి ప్రాంతంలో కూలి పనులు చేస్తూ నివాసం ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా మలేరియా జ్వరంతో బాధపడుతున్న అతడికి ఎంతకీ తగ్గకపోవడంతో కేజీహెచ్లో చేర్పించారు. అక్కడ వైద్యులు శాంపిల్స్ సేకరించి వైరాలజీ ల్యాబ్లో పరీక్షించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం ఆ యువకుడిని కేజీహెచ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. చంద్రశేఖర్ నాయుడు పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలోని అఫీషియల్ కాలనీకి చెందిన 33 ఏళ్ల యువకుడు కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. -
అప్పన్న సన్నిధిలో ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ దంపతులు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదాయపు పన్ను శాఖ(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బట్టిని (ఐఆర్ఎస్), హైదరాబాద్ ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ సునీత బిల్లా(ఐఆర్ఎస్) దంపతులు ఆదివారం ఉదయం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు స్వామికి అష్టోత్తర పూజ జరిపి, వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, శేషవస్త్రంలను ఏఈవో తిరుమలేశ్వరరావు అందజేశారు. -
అమరావతికి తరలించండి
విశాఖలో డేటా సెంటర్ల పేరుతో కొండలను తవ్వేస్తూ, చుట్టుపక్కల అడవులను నరికివేయడం తీవ్ర ఆందోళనకరం. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల కంబాలకొండ ఎకో ఫారెస్ట్, వన్యప్రాణి అభయారణ్యాల ఉనికికే ప్రమాదం వాటిల్లుతోంది. దీని ప్రభావంతో ముడసర్లోవ జలాశయం, స్థానిక నీటి వనరులు తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. పర్యావరణానికి ఇంతటి ముప్పు తెచ్చే ఈ డేటా సెంటర్ను అమరావతికి మార్చడం ఎంతో ఉత్తమం. –దీక్ష ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలి మనుషులు, పర్యావరణం మధ్య ఉన్న బంధం విడదీయరానిది. ఈ సమతుల్యత దెబ్బతింటే దాని ప్రభావం ప్రజల జీవనంపై తీవ్రంగా పడుతుంది. ప్రకృతి పరిరక్షణ విషయంలో ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలి. విశాఖపట్నం పర్యావరణం, సహజ వారసత్వాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. –రాజా రామ్మోహన్ రాయ్, గ్రీన్ విశాఖ -
రూ.కోట్లతో కట్టి.. ముళ్లపొదల్లో వదిలేశారు!
రూ.కోట్లతో కట్టి.. ముళ్లపొదల్లోవదిలేశారు! బాలికల కోసం నిర్మించిన వసతి గృహంమురళీనగర్ (విశాఖ): రాష్ట్రంలోనే అత్యుత్తమ ప్రభుత్వ పాలిటెక్నిక్లలో ఒకటిగా పేరొందిన కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, వసతి సౌకర్యాల విషయంలో మాత్రం విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. 1956లో స్థాపితమైన ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ దాదాపు 70 ఏళ్ల చరిత్రను పూర్తి చేసుకుని 71వ వసంతంలోకి అడుగుపెట్టింది. సాంకేతిక విద్యలో ఉత్తమ పాలిటెక్నిక్ అవార్డును సొంతం చేసుకున్న ఈ కళాశాలలో, కోట్లాది రూపాయలతో నిర్మించిన బాలికల హాస్టల్ భవనం ఎనిమిదేళ్లుగా తాళం వేసి ఉండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రూ.కోట్ల భవనం.. ప్రయోజనం శూన్యం కాలేజీలో ప్రస్తుతం వివిధ ఇంజినీరింగ్ విభాగాలు, ఫార్మసీ కోర్సులతో కలిపి సుమారు 1,800 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో దాదాపు 300 మంది విద్యార్థినులు ఉన్నారు. బాలుర కోసం రెండు హాస్టళ్లు ఉన్నప్పటికీ, బాలికలకు మాత్రం ఇప్పటికీ శాశ్వత వసతి సదుపాయం లేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా సుమారు ఎనిమిదేళ్ల క్రితం రూ.10 కోట్ల వ్యయంతో ఆధునిక హాస్టల్ భవనాన్ని నిర్మించారు. 150 మందికి పైగా విద్యార్థినులు నివసించే సామర్థ్యం ఉన్న ఈ భవనాన్ని హాస్టల్గా ప్రారంభించకుండా కొంతకాలం మెకానికల్ విభాగం తరగతి గదులుగా ఉపయోగించారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో తరగతులను నిలిపివేసినా, హాస్టల్ను మాత్రం ఇప్పటికీ అందుబాటులోకి తీసుకురాలేదు. ప్రస్తుతం ఆ భవనం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి నిరుపయోగంగా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనం ఇలా వృథా కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ విద్యార్థినులకు ఇబ్బందులు గతంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమీపంలోని ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్ (గైస్) హాస్టల్లో పాలిటెక్నిక్ విద్యార్థినులకు తాత్కాలికంగా వసతి కల్పించారు. ఆ కాలేజీకి ఉన్న డిమాండ్ కారణంగా ఈ ఏడాది మొదటి సంవత్సరం పాలిటెక్నిక్ విద్యార్థినులకు అక్కడ అవకాశం దక్కలేదు. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాల వంటి దూర ప్రాంతాల నుంచి మెరిట్ సాధించి వచ్చే గ్రామీణ విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయట అద్దె గదులు తీసుకుని చదివించే ఆర్థిక స్థోమత లేక చాలామంది సీటు వచ్చినా చేరలేకపోతున్నారు. మరికొందరు డిప్లమా చదువును పూర్తిగా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాశ్వత ప్రిన్సిపాల్ లేకపోవడమేప్రధాన సమస్య కాలేజీకి చాలా కాలంగా శాశ్వత ప్రిన్సిపాల్ లేకపోవడం కూడా సమస్యను మరింత సంక్లిష్టం చేసింది. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్స్ తరచూ మారుతుండటంతో కీలక పరిపాలనా నిర్ణయాలు ముందుకు సాగడం లేదు. ఇటీవల స్థానిక ప్రజాప్రతినిధులు కాలేజీని సందర్శించి హాస్టల్ను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించినప్పటికీ, ఆ వెంటనే ప్రిన్సిపాల్ బదిలీ కావడంతో వ్యవహారం మళ్లీ మొదటికి చేరింది. ప్రస్తుతం మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయి, రెండో విడత ప్రవేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ● కంచరపాలెం పాలిటెక్నిక్లో విద్యార్థినులకు వసతి కరువు ● రూ.10 కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనం ఎనిమిదేళ్లుగా నిరుపయోగం ● గ్రామీణ విద్యార్థులు బయట అద్దెలు భరించలేక ఇబ్బందులు ● పట్టించుకోని సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఇకనైనా మేల్కొంటారా? ఏళ్లుగా మూతపడి ఉన్న హాస్టల్ భవనాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలంటే ముందుగా పరిసరాలను శుభ్రం చేసి, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక వసతులను పునరుద్ధరించాలి. విద్యార్థినుల భద్రత కోసం ప్రహరీ గోడ ఎత్తు పెంచడంతో పాటు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి. ముఖ్యంగా కాలేజీకి శాశ్వత ప్రిన్సిపాల్ను నియమించి హాస్టల్ నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనం అడవిగా మారిపోగా, మరోవైపు విద్యార్థినులు అద్దె గదుల కోసం అల్లాడాల్సి రావడం సాంకేతిక విద్యాశాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి హాస్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చి గ్రామీణ విద్యార్థినుల ఉన్నత విద్యకు అండగా నిలవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రూ.10 కోట్ల భవనానికి తాళం.. విద్యార్థినులకు అద్దె గది ’శిక్ష’! -
ఘన వ్యర్థాలప్రాసెసింగ్ ప్లాంట్ ప్రారంభం
నర్సీపట్నం: పురపాలక సంఘంలో స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 నిధుల కింద మంజూరైన రూ.305 లక్షల వ్యయంతో నిర్మించిన తడి, పొడి వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ను కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలంతా తడి,పొడి చెత్తను వేర్వేరుగా పారిశుధ్య కార్మికులకు అందించి, పట్టణ పరిశుభ్రతకు సహకరించాలన్నారు. డంపింగ్ యార్డు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు సీహెచ్.పద్మావతి, సీహెచ్.రాజేష్, మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఆర్డీవో వి.వి.రమణ, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, తహసీల్దార్ రామారావు తదితరులు పాల్గొన్నారు.


