breaking news
Anakapalle
-
15 తేదీలోగా శతశాతంఇంటి పన్నులు వసూలు చేయాలి
కశింకోట పంచాయతీ కార్యాలయంలో ఇంటి పన్నుల వసూలుపై సమీక్షిస్తున్న సీఈవో నారాయణమూర్తి కశింకోట : ఇంటి పన్నుల వసూలును ఈ నెల 15లోగా శతశాతం పూర్తి చేయాలని జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి ఆదేశించారు. స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. పన్నుల వసూలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా రూ.82 లక్షల మేర పన్నుల బకాయిలు వసూలు కావలసి ఉందని గుర్తించారు. వీటిని సత్వరమే వసూలు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. అలాగే వెదురుపర్తి, నూతలగుంటపాలెం, ఉగ్గినపాలెం పంచాయతీల్లో పన్నుల వసూలు వెనుకబడి ఉందని, వాటిని కూడా పూర్తిగా వసూలు చేయడానికి కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుధ్యం పని తీరును పరిశీలించారు. డిప్యూటీ ఎంపీడీవో తోటారావు, సచివాలయ, పంచాయతీ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించండి
దేవరాపల్లి : రేషన్ డీలర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఆదాయ మార్గాలను చూపించ కుండా ప్రభుత్వం రేషన్ డీలర్లతో వెట్టి చాకిరి చేయించుకుంటుందని మండిపడ్డారు. డీలర్ల కమీషన్తో పనిలేకుండా గౌరవ వేతనం చెల్లించాలని గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. పౌర సరఫరాల శాఖలో ప్రక్షాళన పేరుతో డీలర్ల ఆదాయ మార్గాలను నియంత్రించి రేషన్ డీలర్లను దొంగలుగా చూపిస్తున్నారని విమర్శించారు. దశాబ్దాలుగా రేషన్ షాపులను నమ్ముకొని బతుకుతున్న డీలర్ల ఆర్థిక పరిస్థితుల కోసం పట్టించుకోక పోవడం అన్యాయమన్నారు. డీలర్లషిప్లను వదులుకోలేక, అప్పులు చేసి దుర్భర జీవితాలు గడుపుతున్నారన్నారు. గతంలో బియ్యం, కిరోసిన్, పంచదార, పప్పు ఇతర సరుకులు పంపిణీ చేసే వారని, ప్రస్తుతం బియ్యం, పంచదార తప్ప ఇతర సరుకులు పంపిణీ చేయడం లేదన్నారు. దీంతో పౌరసరఫరాల శాఖ నుంచి కమీషన్ ద్వారా డీలర్లకు వచ్చే ఆదాయానికి గండిపడిందన్నారు. రాష్ట్రంలోని సుమారు 30 వేలకు పైబడి ఉన్న డీలర్లకు కనీస ఆదాయ మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. -
మా భూముల్లో సర్వే జరపకండి
చీడికాడ : మా భూములను సోలార్ ప్రాజెక్టుకు అప్పగించేది లేదని ముందుగానే గ్రామసభల్లో చెప్పినా మరలా ఎందుకు మా భూముల్లో సర్వే నిర్వహించేందుకు వచ్చారంటూ మండలంలోని బైలపూడి, ఎ.అగ్రహారం రైతులు రెవెన్యూ అధికారులను బుధవారం నిలదీశారు. వివరాలలోకి వెళితే మండలంలోని బైలపూడి, ఎ.అగ్రహారం పరిసరాల్లో గల 120 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు భూములు సేకరణకు ఇటీవల రెండు గ్రామాల్లో తహసీల్దార్ కిషోర్ లింకన్ గ్రామసభలు నిర్వహించారు. పూర్వకాలం నుంచి తమ సాగులో ఉన్న ఢీ–పారం భూములపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని తమ భూముల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు అంగీకరించమంటూ రెండు గ్రామాల రైతులు తేల్చిచెప్పారు. దీనిపై సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో రెండు గ్రామాల రైతులు తహసీల్దార్ కిషోర్ లింకన్కు సోలార్ ప్రాజెక్టుకు తమ భూములు ఇవ్వబోమని వినతి పత్రాలు అందించారు. అయితే దానికి ఎటువంటి సమాధానం చెప్పకుండా బుధవారం మండల సర్వేయర్ సురేష్, సచివాలయం సర్వేయర్తో పాటు వీఆర్వో సత్యనారాయణ ఇతర రెవిన్యూ సిబ్బంది బైలపూడి, ఎ.అగ్రహారం భూముల్లో సర్వే జరిపేందుకు వచ్చారు. దీంతో రెండు గ్రామాలకు చెందిన రైతులు వచ్చి అధికారులను అడ్డుకున్నారు. సోలార్ ప్రాజెక్టు మా భూముల్లోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఏవైనా ఉత్తర్వులుంటే చూపించాలంటూ అసలు ప్రాజెక్టు మంజూరైందా ? అంటూ రైతులు నిలదీశారు. దీనికి మండల సర్వేయర్, వీఆర్వో మాట్లాడుతూ ఈ భూములను చూసి సర్వే జరపమని ఇచ్చిన తహసీల్దార్ ఆదేశాల మేరకే వచ్చామని చెప్పారు. అయితే మా భూముల్లో సర్వేలు జరపవద్దని రైతులు తేల్చి చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు. -
కార్పొరేట్లకు దోచిపెట్టడమే అభివృద్ధా?
అనకాపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ సంపదను, వనరులను కార్పొరేట్ల పరం చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజశర్మ, అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో బుధవారం బొప్పే ఉమామహేశ్వరరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సంపదను కొల్లగొట్టి కార్పొరేట్లకు కట్టపెట్టేందుకు కేంద్రం, మరింత జోరుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాయన్నారు. దీనికి వ్యతిరేకంగా మేధావులు, అభివృద్ధి కాముకులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజల నుంచి ప్రతిఘటన వ్యక్తం కావడం గమనార్హం అన్నారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న పరిణామాలను అర్ధం చేసుకుని ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రభుత్వాలు వైఖరిని నిలువరించే చర్యలు జరగాలన్నారు. అభివృద్ధి అంటే స్థానిక ప్రజలకు జీవన ప్రమాణాలు పెరిగేలా మంచి ఉపాధి, విద్య, వైద్య అవకాశాలు కల్పించడం అన్నారు. దురదృష్టవశాత్తూ ఉత్తరాంధ్రలో నేడు ప్రభుత్వాలు చేస్తున్న నిర్ణయాలు అభివృద్ధికి భిన్నంగా ఉన్నాయన్నారు. పరిశ్రమలు, వివిధ ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టడం, గిరిజన ప్రాంతాలతో పాటు విశాఖ నగర నడిబొడ్డున అత్యంత విలువైన 13.74 ఎకరాల ప్రభుత్వ భూమిని లులు మాల్కు కేటాయించడం చూస్తేనే ప్రభుత్వ అభివృద్ధి నమూనా ఎలాంటిదో అర్థమవుతుందన్నారు. 1/70 పీసా వంటి గిరిజన చట్టాలను ధిక్కరిస్తూ పాడేరు, పార్వతీపురం జిల్లాల్లో హైడ్రో పవర్ టూరిజం ప్రాజెక్టులకు భూములు లాక్కోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బాౖక్సైట్ తవ్వకాలకు చాపకింద నీరులా పావులు కదుపుతున్నారని, నక్కపల్లిలో బల్క్ డ్రగ్, మిట్టల్ స్టీల్, విజయనగరం జిల్లాలోఐటీ పార్కు, విశాఖలో గూగుల్ డేటా, టీసీఎస్, శ్రీకాకుళంలో కార్గో ఎయిర్పోర్ట్ వంటి సంస్థలకు 99 పైసలకే భూమిని ధారాదత్తం చేయడం ఏమి అభివృద్ధి అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ 50 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించి ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోను, మెట్రో రైల్, గిరిజన యూనివర్శిటీ నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలన్నారు. విద్యాసంస్థల్లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని నియమించి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం కల్పించాలని, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో కిడ్నీ వ్యాధి కారణాలను తెలుసుకునే సమగ్ర పరిశోధన చేయాలన్నారు. మాకవరపాలెం మెడికల్ కళాశాలను ప్రభుత్వం తక్షణమే నిర్మించాలన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు, జేవీబీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు త్రిమూర్తులురెడ్డి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు, ఎల్ఐసీ విశ్రాంత ఉద్యోగులు రంగబాబు, జె.రమేష్, విశ్రాంతి అధ్యపకుడు ఇమ్మిడిశెట్టి చక్రపాణి, న్యాయవాది గంటా సురేష్ పాల్గొన్నారు. -
హస్త కళాకారులనుప్రోత్సహించడమే ధ్యేయం
మాట్లాడుతున్న తమ్మిరెడ్డి శివశంకరరావు అనకాపల్లి: ప్రధాని విశ్వకర్మ ఎగ్జిబిషన్ కమ్ ట్రేడ్ ఫెయిర్ – 2026ను ఈనెల 6 వరకూ అనకాపల్లి గాంధీనగరం ఎస్ఆర్ శంకరన్ హాల్లో నిర్వహించడం జరుగుతుందని ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు అన్నారు. స్థానిక ఎస్ఆర్.శంకరన్ హాల్లో బుధవారం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పీఎం విశ్వకర్మ పథకం కింద నమోదు చేసుకున్న కళాకారుల ఉత్పత్తులు, నైపుణ్యాలను ప్రోత్సహించడం, మార్కెటింగ్, వ్యాపార అభివృద్ధి అవకాశాలను అందించడం లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. విస్తృత శ్రేణి సంప్రదాయ హస్తకళలు, చేతివృత్తుల ఉత్పత్తులను ప్రదర్శిస్తారని, చేతివృత్తులవారు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు జిల్లాలో వివిధ ప్రాంతాల నంంచి కళాకారులు రావడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో విశాఖ ఎంఎస్ఎంఈ డీఎఫ్వో జాయింట్ డైరెక్టర్ ఆర్.సెంథిల్కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ పి.కె.పి.ప్రసాద్, కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్.విజయానందరెడ్డి, జిల్లా లీడ్బ్యాంక్ మేనేజర్ కె.సత్యనారాయణ, జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి గోవిందరావు, బీజే పీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అభిమాన నీరాజనం
మన్యం మురిసింది.. సాగరం పులకించింది. జనతరంగం ఎగసింది.. సంక్షేమ ప్రదాతకు ఆత్మీయ స్వాగతం పలికింది.. అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది.. ‘సీఎం.. సీఎం.. జై జగన్’ నినాదాలతో హోరెత్తించింది. అడుగడుగునా పూలవర్షాలు, జనహారతులు, అభిమానుల కేరింతల మధ్య వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లాల పర్యటన జనప్రభంజనాన్ని తలపించింది. అరకు, విశాఖ నగరంలో వెల్లువలా తరలివచ్చిన జనకెరటం అభిమాన నేతను చూసి మురిసిపోయింది. వివాహ వేడుకలే జనవేదికలుగా మారి.. జననేతకు నీరాజనాలు అర్పించిన దృశ్యాలు ఉమ్మడి విశాఖ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. మురిసిన మన్యం.. పులకించిన సాగరం ఘనస్వాగతం పలికిన పార్టీ నేతలు అరకులోయ, విశాఖలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు గొల్ల బాబూరావు, గుమ్మా తనూజరాణి, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, మత్స్సరాస విశ్వేశ్వరరాజు, బొడ్డేడ ప్రసాద్, మజ్జి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, కంబాల జోగులు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్రాజ్, కె.భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గు ణ, తైనాల విజయ్కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, శోభా హైమావతి, సమన్వయకర్త లు మొల్లి అప్పారావు, దేవన్రెడ్డి, మలసాల భరత్ కుమార్, మాజీ ఎంపీలు భీశెట్టి సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, ముఖ్య నేతలు కోలా గురువులు, చింతకాయల సన్యాసి పాత్రుడు, చిక్కాల రామారావు, ఏడువాక సత్యరావు, బాణాల శ్రీనివాసరావు కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు. జననేత జగన్ రాకతో హోరెత్తిన ఉమ్మడి విశాఖవిశాఖలో జగనన్నకు తిలకం దిద్దుతున్న మహిళలుసాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ పర్యటనకు విచ్చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి బుధవారం పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. జననేత రాకతో విశాఖపట్నం, అల్లూరి జిల్లాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. మాజీ సీఎం వస్తున్నారని తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు ఉదయం 10 గంటలకే విశాఖ విమానాశ్రయానికి చేరుకుని ఎదురుచూశారు. అరకు పర్యటన ముగించుకుని తిరిగి వచ్చే వరకు అక్కడే వేచిచూశారు. అరకులోయలో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి వచ్చిన జగన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు విమానాశ్రయం నుంచి మర్రిపాలెం వరకు రోడ్లపై నిలబడ్డారు. ఆయనను చూడగానే ‘జై జగన్’ నినాదాలతో ఆ ప్రాంతం అంతా మార్మోగింది. ఓ దశలో అభిమానులు బారికేడ్లు దాటి దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నియంత్రించారు. విమానాశ్రయం నుంచి కాన్వాయ్గా బయలుదేరిన జగన్కు మర్రిపాలెంలోని రాణాప్రతాప్నగర్ వరకు రోడ్డుదారిన ఇరువైపులా నిలబడి అభిమానులు పూలవర్షం కురిపించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆత్మీయ స్వాగతం పలికారు. రాణాప్రతాప్నగర్లోని వైఎస్సార్సీపీ విశాఖ దక్షిణ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ నివాసానికి చేరుకున్న సందర్భంగా అక్కడ కూడా పెద్దఎత్తున జనసమ్మర్ధం కనిపించింది. -
నేత్రపర్వంగా రథోత్సవం
నక్కపల్లి : ఉపమాక వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మధ్యా హ్నం ఆలయం మూసివేసిన అనంతరం రాత్రి ఏడుగంటలకు ఆలయం తెరచి, ఆలయశుద్ధి, సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం స్వామివారి డోలోత్సవంలో భాగంగా అద్దపు సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భాలయ ప్రవేశ ఘట్టాన్ని లక్ష్మీసంవాదం, చోరసంవాదం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను సుదర్శన పెరుమాళ్లను రథంలో ఉంచి మాడవీధుల్లో తిరువీధి సేవలు నిర్వహించారు. రథోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. తెల్లవారు ఉపమాకలో తిరునాళ్లు జరిగాయి. తదుపరి మూడురోజుల పాటు పుష్పయాగోత్సవాలు (పవళింపుసేవలు)జరుగుతాయి. ఈ సందర్భంగా కొండపైన, దిగువన నిత్య ఆరాధనలు బాల భోగ నివేదనలు, నిత్యహోమాలు, ఆలయంలో బలిహరణలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగించారు. రాత్రికి స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వివిధ రకాల పండ్లు నివేదన చేశారు. జోలపాటలతో స్వామివారి పుష్పయాగోత్సవం(పవళింపు)సేవ మొదటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. -
జిల్లా జేఏసీ వైస్ చైర్మన్గా గొంది చినబ్బాయ్
గొంది చినబ్బాయ్ను సత్కరిస్తున్న జేఏసీ నాయకులు అనకాపల్లి: ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) వైస్ చైర్మన్గా గొంది చినబ్బాయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక నర్సింగరావుపేటలో ఏపీటీఎఫ్ భవనంలో సోమవారం రాత్రి జరిగిన ఎన్నికల్లో చినబ్బాయ్లను కమిటీ సభ్యులు పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు రొంగలి అక్కునాయుడు, జిల్లా కార్యదర్శి గుత్తుల సూర్య ప్రకాష్, సీనియర్ నాయకులు రవికుమార్, నూతన్ కుమార్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
నేడు విద్యాసోపానం
నాటి సంకల్పం అనకాపల్లి కేంద్రీయ విద్యాలయంలో ఏప్రిల్ నుంచి అడ్మిషన్లుకేంద్రంతో పోరాడి తెచ్చిన నాటి వైఎస్సార్సీపీ ఎంపీ సత్యవతి కేంద్రీయ సంస్థ నుంచి 5 సార్లు సందర్శన, తనిఖీ సుందరయ్యపేటలో 10 ఎకరాల స్థలం కేటాయింపు 1 నుంచి 5వ తరగతి వరకూ అడ్మిషన్లు ప్రారంభం వైఎస్సార్సీపీ హయాంలో రూ.28.73 కోట్ల నిధులు కేటాయింపు కూటమి ప్రభుత్వంలో 20 నెలల పాటు జాప్యం రూ.10.5 కోట్లతో స్కూల్ భవనం, రూ.5.79 కోట్ల మౌలిక వసతులు రూ.1.95 కోట్లతో వాల్ నిర్మాణం, రూ.4.77 కోట్లతో ఆటస్థలం -
పడవ బోల్తా పడి మత్స్యకారుడి మృతి
అచ్యుత్యాపురం రూరల్: మండలంలోని పూడిమడక తీరంలో కొండపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు చోడిపల్లి దేముడు (41) మంగళవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 4.30 గంటలకు పూడిమడకకు చెందిన ఒరుపుల మసేను ఐఎన్డీ–ఏపీ–వీ3–ఎంఓ–2010 బోటుపై నలుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. తీరానికి 20 మీటర్ల దూరంలో అలల తాకిడికి చోడిపల్లి దేముడు పడిపోయాడు. వెంటనే తోటి మత్స్యకారులు సముద్రంలో నుంచి బయటకు తీసినప్పటికే మృతి చెందాడు. మృతుడు భార్య రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దేముడు ఇక లేడన్న చేదు నిజం జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో తీరంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
8 నెలలకే డిప్యుటేషన్
మాకవరపాలెం: స్థానిక తహసీల్దార్ వెంకటరమణ డిప్యుటేషన్ చర్చనీయాంశమైంది. మండలంలో కొందరు టీడీపీ నేతలకు అనుకూలంగా లేకనే ఆయన్ను సాగనంపినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది జూన్ 23న మాకవరపాలెం తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. కేవలం ఎనిమిది నెలలకే ఆయనకు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయ ఏవోగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. అక్కడ ఏవోగా పనిచేస్తున్న ముసీబ్ను ఇక్కడ తహసీల్దార్గా నియమించారు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేసిన తహసీల్దార్.. తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వెంకటరమణ తనదైన శైలిలో విధులు నిర్వహించారు. తామరం రెవెన్యూలో టీడీపీ నేతలు ఆక్రమించేందుకు ప్రయత్నించిన 20 ఎకరాల గెడ్డ పోరంబోకు భూమిని స్వాధీనం చేసుకున్నారు. రామన్నపాలెం శివారు చినరాపల్లి వద్ద టీడీపీకి చెందిన వారు ఊటగెడ్డ రిజర్వాయర్ భూమిలో చేపట్టిన ఆక్రమణలనూ అడ్డుకున్నారు. అంతేకాకుండా ఇటీవల తూటిపాల వద్ద సర్పానదిని ఆనుకున్న భూమిలో ఇసుక తరలింపునకు ఏర్పాట్లు చేసే క్రమంలో జేసీబీని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. తామరంలో ప్రభుత్వ భూమికి పాసుపుస్తకాలు చేసేందుకు ఓ బ్రోకర్ ఆశచూపిన రూ.20 లక్షలను సైతం తిరస్కరించారు. ఏళ్ల తరబడి రాచపల్లి రెవెన్యూలో ఏపీఐఐసీ పేరున ఉన్న రైతుల భూముల మార్పునకు ఆయన కృషి చేశారు. ల్యాండ్ బ్యాంకు సిద్ధం చేయడంలోనూ .. మాకవరపాలెం మండలాన్ని పరిశ్రమల హబ్గా చేయాలనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలతో తొలుత రాచపల్లి రెవెన్యూలోని సర్వే నంబరు 737లో 406 ఎకరాల రైతుల భూమిని సర్వే చేసి కంపెనీలకు అప్పగించేందుకు సిద్ధం చేశారు. పరిశ్రమల స్థాపనకు అనువుగా పైడిపాల, బూరుగుపాలెం, పాపయ్యపాలెం ప్రాంతాల పరిధిలోని మరో 4,400 ఎకరాల ల్యాండ్ బ్యాంకును సిద్ధం చేయడంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. భూ ఆక్రమణలు చేసే వారు ఏ పార్టీవారైనా కేసులు పెట్టాలన్న స్పీకర్ ఆదేశాలనూ ఆయన ముక్కుసూటిగా అమలు చేశారు. అయితే ఆర్డీవో కార్యాలయంలో పాలనా పరమైన ఇబ్బందులను అధిగమించేందుకు తహసీల్దార్ వెంకటరమణకు డిప్యుటేషన్పై ఏవోగా నియమించినట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కానీ కొందరు టీడీపీ నేతలకు అనుకూలంగా లేకపోవడంతోనే ఆయన డిప్యుటేషన్ జరిగిందని తీవ్రంగా చర్చ సాగుతోంది. ఏది ఏమైనా 8 నెలల్లోనే ఆయనను ఇక్కడ నుంచి డిప్యుటేషన్పై పంపడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. -
గిరిజనుడి దారుణ హత్య
ముంచంగిపుట్టు: వివాహేతర సంబంధం ఓ గిరిజనుడి ప్రాణాలను బలిగొంది. మండల కేంద్రం ముంచంగిపుట్టులో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గొంతుకోయడంతో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. దీనికి సంబంధించి జి.మాడుగుల సీఐ బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి: అసలేం జరిగింది? పెదబయలు మండలం, అడుగులపుట్టు పంచాయతీ, కొత్తపుట్టు గ్రామానికి చెందిన కాసులమ్మకు, గూడెంకొత్తవీధి మండలం ఆర్వీనగర్కు చెందిన కిముడు అరుణ్తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు గత ఆరేళ్లుగా పెదబయలు మండల కేంద్రంలో నివాసం ఉంటున్నారు. అరుణ్ జీపు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, ఏడాది క్రితం పెదబయలు మండలం అరడకోట పంచాయతీకి చెందిన కూర్తాడి నాగేశ్వరరావు (27)తో కాసులమ్మకు పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయమై అరుణ్కు, కాసులమ్మకు మధ్య తరచూ గొడవలు జరిగేవి. నాగేశ్వరరావును అరుణ్ పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా, కాసులమ్మ భర్తతో గొడవపడి నాగేశ్వరరావు వద్దే ఉంటోంది. పథకం ప్రకారమే.. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త అరుణ్, తన భార్య అన్నయ్య అయిన వంతాల నాగేశ్వరరావుతో కలిసి ఈ సమస్యపై చర్చించాడు. సోమవారం రాత్రి ముంచంగిపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ కొండపడ హోళీ జాతరకు వీరిద్దరూ వచ్చారు. ఆ సమయంలో కాసులమ్మ, నాగేశ్వరరావుతో కలిసి ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ముంచంగిపుట్టు రామాలయం సమీపంలోని వారి ఇంటికి వెళ్లిన అరుణ్, వంతాల నాగేశ్వరరావు.. తలుపు తీయమని కోరారు. తలుపు తీయగానే లోపల ఉన్న కూర్తాడి నాగేశ్వరరావుపై కత్తితో దాడి చేసి, పీక కోసి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసుల చర్యలు కాసులమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి నాగేశ్వరరావు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించే లోపే అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక సీహెచ్సీకి తరలించారు. జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్య చేసి పరారీలో ఉన్న అరుణ్, వంతాల నాగేశ్వరరావులను 12 గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్టు చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని సీఐ తెలిపారు. వివాహేతర సంబంధమే కారణం వెల్లడించిన సీఐ శ్రీనివాసరావు ముంచంగిపుట్టులో ఘటన ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు -
నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి ఇళ్లలో వివాహ వేడుకలకు హాజరు సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ వేడుకకు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్కు హాజరవుతారు. ఈ మేరకు పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పర్యటన వివరాలిలా.. ●ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ●ఉదయం 10.50 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ●ఉదయం 11.40 గంటలకు విశాఖ నుంచి హెలికాప్టర్లో అరకు వ్యాలీ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తంగులగూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయం వద్దకు వెళ్తారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ రిసెప్షన్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ●మధ్యాహ్నం 1.10 గంటలకు అరకు నుంచి హెలికాప్టర్లో తిరిగి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ●మధ్యాహ్నం 1.30 గంటలకు రోడ్డు మార్గాన మర్రిపాలెం రాణా ప్రతాప్నగర్కు చేరుకుంటారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ చిన్న కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై ఆశీస్సులు అందజేస్తారు. ●మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్పోర్టు నుంచి విమానంలో బయలుదేరుతారు. -
గంజాయి స్మగ్లర్ల అనుమానిత స్థావరాల తనిఖీ
చోడవరం : కొన్ని చోట్ల స్థావరాలు ఏర్పాటు చేసుకొని స్మగ్లర్లు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారన్న అనుమానంతో చోడవరం పట్టణంలో పలు లాడ్జిలు, నిర్మానుష్య ప్రదేశాల్లో పాడుబడిన ఇళ్లను పోలీసులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తెచ్చి చోడవరం పట్టణంలో పలు లాడ్జిలు, శివారు ప్రదేశాల్లో పాతబడిన ఇళ్లు, నిర్మానుష్య ఖాళీ ప్రదేశాల్లో దాచి ఉంచి అక్కడ నుంచి అనువైన సమయంలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే అనుమానంతో ఎస్ఐ జోగారావు తన సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో ఎటువంటి గంజాయి గాని, అనుమానితులుగా గాని వీరికి దొరకలేదు. దీనితో నిఘా మరింత పెంచుతామని ఎస్ఐ తెలిపారు. -
ఖాజీపాలెం గ్రామ దేవాలయాల్లో చోరీ
అచ్యుతాపురం రూరల్: మండలంలోని ఖాజీపాలెం గ్రామంలో అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో మూడు దేవాలయాలతోపాటు ఒక వ్యక్తి ఆటో చోరీకి గురయ్యాయి. సర్పంచ్ పీలా నర్సింగరావు కథనం మేరకు.. గ్రామంలో అర్ధరాత్రి దాటిన తర్వాత మోదమాంబ, దుర్గాలమ్మ, ఆంజనేయ స్వామి ఆలయాల హుండీల్లో నగదు రూ.30 వేలు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దాంతో పాటు అదే గ్రామానికి చెందిన బుదిరెడ్డి శ్రీను ఆటో కూడా ఎత్తుకుపోయారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గ్రామ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ అధికారులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. చోరీకి గురైన ఆటోను మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అనకాపల్లి హైవే పక్కన సబ్బవరం వెళ్లే మార్గంలో శంకరం దగ్గర పురుషోత్తపురానికి చెందిన వ్యక్తి గుర్తించినట్లు సర్పంచ్ తెలిపారు. -
టమాటా రైతు కన్నీరు
దేవరాపల్లి : దేవరాపల్లి హోల్సేల్ కాయగూరల మార్కెట్లో మంగళవారం టమాటా ధరలు ఘోరంగా పతనమయ్యాయి. 30 కేజీల క్రేటు టమాటా కేవలం రూ. 30 నుంచి రూ. 50 మాత్రమే ధర పలకడంతో గత్యంతరం లేని స్థితిలో కొందరు రైతులు వ్యాపారులకు విక్రయించారు. మరికొందరు కనీసం రవాణా ఛార్జీలు సైతం రావడం లేదని మనస్థాపంతో కష్టపడి పండించిన టమాటాలను రోడ్డుపై పారపోసి నిరసన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి కుటుంబమంతా ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో చివరకు తమకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాయగూర మార్కెట్ ఉండడంతో విస్తారంగా టమాటాను సాగు చేశామని, దిగుబడి సైతం ఆశాజనంగా ఉండడంతో ఎంతో ఆశపడ్డామన్నారు. తీరా పంట చేతికి అందే సమయంలో కేజీ టమాటాకు మరీ దారుణంగా రూపాయి, రూపాయిన్నర ధర పలకడంతో తాము ఎలా బతకాలని పలువురు రైతులు వాపోయారు. -
ఏపీ జేఏసీ కో చైర్మన్గా గోపీనాథ్
గోపీనాథ్కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలుపుతున్న పీఆర్టీయూ శాఖ ఉపాధ్యాయులు నర్సీపట్నం: ఏపీ జేఏసీ కో చైర్మన్గా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ నాయకులు ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏ బకాయిలు, ఐఆర్, పీఆర్సీ ప్రకటన ప్రభుత్వం వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ఇతర సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామన్నారు. పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎ.వరహాలనాయుడు, జి.వి.రమేష్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కె.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
నేత్రపర్వం... వెంకన్న చక్రతీర్థం
నక్కపల్లి: వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా ఉపమాక వెంకన్న చక్రవారి స్నానం మంగళవారం ఘనంగా జరిగింది. పౌర్ణమినాడు వేంకటేశ్వరస్వామి అత్తవారింటికి (సముద్రుడి) వెళ్లే సన్నివేశాన్ని చక్రవారి స్నానంగా పిలుస్తారు. కల్యాణం అనంతరం పౌర్ణమి నాడు ఉదయం ఆలయంలో నిత్య పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవ మూర్తులను ఎదురుగా ఉంచి రోలు రోకలికి పూజలు నిర్వహించారు. చూర్ణోత్సవంలో భాగంగా చూర్ణాన్ని భక్తులపై జల్లారు. కల్యాణం అనంతరం స్వామివారిని భక్తులకు అద్దంలో చూపించి దర్శనం కల్పించారు. ఏటా పౌర్ణమినాడు రాత్రిపూట జరిగే ఈ కార్యక్రమం చంద్ర గ్రహణం వల్ల మధ్యాహ్నంలోపు పూర్తి చేసి ఆలయాన్ని మూసి వేశామని ప్రధానార్చకుడు వరప్రసాదాచార్యులు తెలిపారు. రాజయ్యపేట సముద్ర తీరంలో చక్రతీర్థం.. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరస్వామిని రాజాధిరాజ వాహనంపై ఉంచి రాజయ్యపేట సముద్ర తీరానికి తీసుకెళ్లి స్నానమాచరింపజేశారు. అనంతరం నూతన వస్త్రాలను అలంకరించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు సముద్రంలో స్నానం చేసేందుకు పోటీపడ్డారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి పలువురు తోడపెద్దులు, అమ్మవారి ఘటాలు (గరగలు)ను తీసుకువచ్చి సముద్ర స్నానమాచరింపచేశారు. చంద్ర గ్రహణం కావడంతో మధ్యాహ్నం ఆలయాన్ని మూసి వేశారు. సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో అద్దాల మండపంలో స్వామివారికి డోలోత్సవం(అద్దపు సేవ) నిర్వహించారు. స్వామివారి గర్భాలయ ప్రవేశాన్ని శ్రీదేవీ,భూదేవీ అడ్డుకోవడం, తానెవరో వివరించి గర్భాలయ ప్రవేశ సన్నివేశాన్ని అర్చక స్వాములు కళ్లకు కట్టినట్లు వివరించారు. అర్చక స్వాములు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, నరశింహాచార్యులు, శ్రీనివాసాచార్యులు, గోపాలా చార్యులు, సాయిఆచార్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సీఐ మురళి, ఎస్ఐ సన్నిబాబుల ఆధ్వర్యలో చక్రవారీ తీర్థం వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు. -
అక్రమంగా బాణసంచా నిల్వ చేస్తే కేసులు
రావికమతం: అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేసినా, పేలుడు పదార్థాలు నిల్వ చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి హెచ్చరించారు. కాకినాడలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుళ్ల ఘటన నేపథ్యంలో రావికమతం పోలీస్ స్టేషన్ పరిధి కొమిరలో భూమి ఎంటర్ప్రైజస్ మ్యాగజైన్ను మంగళవారం ఆమె కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రావికమతం ఎస్ఐ రఘువర్మలతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులు, పరిసరాలు, సేఫ్టీ ఏర్పాట్లను పరిశీలించారు. మ్యాగజైన్కు 2030 వరకు పీఈఎస్వో లైసెన్స్ ఉన్నట్లు గుర్తించారు. ప్రజలకు, జీవాలకు ఎటువంటి ఇబ్బందులు లేవని నిర్ధారించారు. లైసెన్స్ హోల్డర్ను హ్యాండ్లింగ్ నిల్వ సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని హెచ్చరించారు. -
రూ.7 లక్షలతో క్యాంటీన్, గార్డు రూం ఏర్పాటుకు నిధులు కేటాయింపు
డిజైన్ పూర్తి చేసి ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా పూర్తి తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయ తరగతులు నిర్వహించే జీవీఎంసీ ఉడ్పేట స్కూల్సాక్షి, అనకాపల్లి : నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు.. నేడు జిల్లాలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తుకు సోపానంగా మారాయి. పదేళ్లుగా జిల్లా వాసులను ఊరించే కేంద్రీయ విద్యాలయానికి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్రంగా అనకాపల్లి ఏర్పడిన తరువాత నుంచి విద్య వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం..నాడే కేంద్రయ విద్యాలయం ఏర్పాటుకు పది ఎకరాల స్థలం కేటాయించడమే కాకుండా డిజైన్ పూర్తి చేసి ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా సుగమం చేసింది. 2025 విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లును ప్రారంభించాలనే ముందుచూపుతో నాటి అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాకు కేంద్రీయ విద్యాలయం తీసుకురావడానికి నాడు అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి కృషితో సఫలీకృతం అయిందని చెప్పుకోవచ్చు. వచ్చే నెలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ అడ్మిషన్లు కూడా ప్రారంభం కావడం ఆమె కృషికి నిదర్శనం. దీనికోసం అనకాపల్లి పట్టణంలోని ఉడ్పేట జీవీఎంసీ పాఠశాలలో తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ పర్యవేక్షణ బాధ్యతను విశాఖలో ఉన్న కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్కు అప్పగించారు. కూటమి ప్రభుత్వంలో 20 నెలల పాటు జాప్యం జరగడం కారణంగానే అడ్మిషన్లు ప్రక్రియ ఆలస్యమైంది. లేదంటే గతేడాదిలోనే అడ్మిషన్లు ప్రారంభం కావాల్సి ఉంది. వైఎస్సార్సీపీ హయాంలోనే స్థలం కేటాయింపు.. అనకాపల్లి జిల్లా ఏర్పడక ముందు నుంచే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాధన ఉన్నప్పటికీ నాడు టీడీపీ ప్రభుత్వంలో (2014–19) అడుగులు పడలేదు. కేవలం స్థలం పరిశీలనతోనే ముగిసింది. దాన్ని ప్రభుత్వం నుంచి అధికారికంగా జీవో గానీ..నిధులు కేటాయింపు గానీ రాలేదు. తరువాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి ప్రోత్సాహంతో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అన్ని విధాల సుగమం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేంద్రీయ విద్యాలయానికి అనకాపల్లి టౌన్లో సుందరయ్యపేట పంచాయితీ శివారులో అచ్చియ్యపేటలో సర్వే నెంబర్ 511–2లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జీవో కూడా ఇచ్చారు. వెనువెంటనే పది ఎకరాల ప్రభుత్వ భూమిని కేంద్రీయ విద్యాలయం (కేవీ) ఏర్పాటు కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (సికింద్రాబాద్)కు అప్పగించారు. ఎంపీ నిధులతో పది ఎకరాలను చదును చేయించడం కూడా జరిగింది. డిజైన్ పూర్తి చేసి ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా పూర్తి చేశారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటకు రూ.28.73 కోట్ల నిధులు కేంద్రీయ సంఘటన నుంచి కేటాయింపులు జరిగాయి. దీనికోసం అనకాపల్లి పట్టణంలోని ఉడ్పేట జీవిఎంసీ పాఠశాలలో తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆలస్యం కారణంగా 20 నెలల పాటు జాప్యం జరిగింది. లేదంటే గతేడాదే అడ్మిషన్లు ప్రారంభం కావాల్సి ఉంది. రూ.28.73 కోట్లతో కేవీ విద్యాలయం.. తాత్కలిక భవనంలో తరగతులు ప్రారంభమైన తరువాత నుంచి భవనాల నిర్మాణం చేపడతారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు రూ.28.73 కోట్ల నిధులు కేటాయించారు. వీటిలో రూ.10.5 కోట్లతో స్కూల్ భవనం, రూ.5.79 కోట్ల మౌలిక వసతులు, రూ.1.95 కోట్లతో వాల్ నిర్మాణం, రూ.4.77 కోట్లతో ఆటస్థలం, రూ.7 లక్షలతో క్యాంటీన్, గార్డు రూం ఏర్పాటుకు నిధులు కేటాయింపులు జరిగాయి. కేవీతో ఈ ప్రాంత విద్యార్థులకు మంచి భవిష్యత్తు కేంద్రీయ విద్యాలయం తీసుకు రావాలనే కృతనిశ్చయంతోనే పనిచేశాను. వచ్చే నెల నుంచి అడ్మిషన్లు ప్రారంభం అయితే ఈ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తు బావుంటుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్కు పది ఎకరాల స్థలం కేటాయిస్తూ జీవో వచ్చింది. అంతేకాకుండా నా ఎంపీ నిధులతో ఆ భూమిని చదును చేయించడమే కాకుండా..తాత్కాలికంగా ఉడ్పేట్లోఉన్న జీవీఎంసీ భవనాన్ని కూడా ఇవ్వాలని నిర్ణయించాం. 90 శాతం ప్రాసెస్ అంతా వైఎస్సార్సీపీ ప్రభ్వుత్వంలోనే జరిగింది. ఏ ప్రభుత్వం ఉన్నా..ఈ ప్రాంత విద్యార్థులకు మంచి జరగాలన్నదే వైఎస్సార్సీపీ ఉద్దేశ్యం. – డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, మాజీ ఎంపీ, అనకాపల్లి. -
గణేష్కు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కితాబు
● పార్టీ కమిటీల డిజిటలైజేషన్లో నర్సీపట్నం టాప్ నర్సీపట్నం: వైఎస్సార్సీపీ కమిటీల నియామకంలో రాష్ట్రంలోనే నర్సీపట్నం నియోజకవర్గం ముందంజలో ఉండటంతో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ను మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మెచ్చుకున్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ వివిధ విభాగాల కమిటీలను నియమించడంతోపాటు డిజిటలైజేషన్ చేసిన ప్రక్రియను పార్టీ అధినేతకు గణేష్ వివరించారు. కమిటీల నియామకంలో ముందంజలో ఉండటంతో.. ఇదే స్ఫూర్తితో పని చేయాలని అధినేత సూచించినట్లు గణేష్ తెలిపారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీ అధ్యక్షుడు ఏకా శివ, నాలుగు మండలాల అధ్యక్షులు శానాపతి వెంకటరత్నం, గొలుగొండ పాణిశాంతరావు, లగుడు నాగేశ్వరరావు పార్టీ అధినేతను కలిసిన వారులో ఉన్నారు. -
ఇరాన్పై దాడులు ఆపాలని డిమాండ్
అనకాపల్లి టౌన్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులను తక్షణమే ఆపేయాలని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం జిల్లా సమితి (ఇస్కప్) డిమాండ్ చేసింది. స్థానిక శ్రామిక సదనంలో జరిగిన సమావేశంలో ప్రపంచ శాంతిని కోరుతూ యుద్ధంలో కన్నుమూసిన మానవాళికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇస్కప్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎ. మాధవరావు మాట్లాడుతూ అమెరికా అనుసరించే సామ్రాజవాద, దురాక్రమణ చర్యల్లో భాగంగానే ప్రపంచంలో శాంతి లేకుండా పోతుందన్నారు. కేవలం ఆయిల్ నిక్షేపాల కోసమే కుంటిసాకులతో ఈ దాడులకు తెగబడ్డాయన్నారు. ఒక దేశంపై మరొక దేశం దాడి చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు. కార్యక్రమంలో ఇస్కప్ జిల్లా నేతలు విల్లూరి పైడారావు, దాడి శివరాం, మళ్ల చక్రవర్తి, బొడ్డేడ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. -
వేడుకగా నాగవల్లి వసంతోత్సవం
బుచ్చెయ్యపేట: ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి నాగవల్లి వసంతోత్సవం వేడుకగా జరిగింది. స్వామివారి 153వ కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు నాగవల్లి వసంతోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అఖిలాండ బ్రహ్మండకోటి గోవింద నామశరణ ఘోషతో వడ్డాది వీధులన్నీ భక్తిభావంతో పులకించాయి. చంద్ర గ్రహణం కారణంగా శ్రీదేవి, భూదేవి, వేంకటేశ్వరస్వామికి తిరువీధి వసంతోత్సవం ఆలయ పరిసర ప్రాంతాల్లోనే నిర్వహించారు. గజ, గరుడ వాహనాలపై ఉంచి నిర్వహించే తిరువీధి వసంతోత్సవం, గ్రామ ఊరేగింపును అధికారులు రద్దు చేశారు. ఆలయ పరిసర ప్రాంతంలోనే భక్తులు స్వామివారిపై వసంతోత్సవం జల్లుతూ గోవింద నామస్మరణతో తరించారు. సన్నాయి, మేళతాళాలతో డప్పులు, వాయిద్యాల నడుమ స్వామివారి తిరువీధోత్సవం మంగళవారం గిరిజాంబ కొండ ప్రాంతంలోనే జరిగింది. చంద్ర గ్రహణం కారణంగా నాగవల్లి వసంతోత్సవం ఊరేగింపు సమయాన్ని కుదించారు. వడ్డాది శారదా నదిలో వేంకటేశ్వర స్వామికి చక్రస్నానం చేయాల్సివుండగా గ్రహణం కారణంగా ఆలయం దిగువన మంచి నీటిట్యాంకు వద్ద స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఉంచి ధర్మకర్త శ్రీరామ్, ఈవో శర్మ సమక్షంలో వేదపండితులు శాస్త్రోక్తంగా చక్రస్నానం చేయించారు. స్వామి వారితో పాటు పలువురు భక్తులు స్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను గిరిజాంబ కొండపై ఉంచారు. గ్రహణంతో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేశారు. బుధవారం తెల్లవారు నాలుగు గంటలకు ఆలయంలో సంప్రోక్షణ పూజలు చేసిన తర్వాత భక్తులకు పునః దర్శనాలు కల్పిస్తామని ఈవో శర్మ, అర్చకులు సాధువులు, శ్రీకాంతచార్యులు తెలిపారు. -
సీబీఐ విచారణ చేయాలి
కలెక్టర్ అక్రమాలపై అనకాపల్లి: దేవదాయ శాఖ అధికారుల ప్రమోయం లేకుండా అనకాపల్లి జిల్లా నడిబొడ్డున ఉన్న వంద కోట్ల విలువైన కన్యకాపరమేశ్వరి ఆలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ నిర్ణయంపై సీబీఐ విచారణ చేయాలంటూ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. మంగళవారం అనకాపల్లి టౌన్లో కన్యకాపరమేశ్వరి దేవస్థానం భూములను వైఎస్సార్ సీపీ నేతలు పరిశీలించారు. అంతకు ముందు స్థానిక రింగ్రోడ్డులో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి దేవస్థానం భూముల వరకూ నిర్వహించిన ర్యాలీలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి పార్లమెంట్, నియోజకవర్గ సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్, మలసాల భరత్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, చింతలపూడి వెంకట్రామయ్య, మాజీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ 111 ఏళ్ల క్రితం (1915లో) దూరి కామమ్మ అనే మహిళ బ్రాహ్మణ సత్రం కోసం 2.49 ఎకరాల భూమిని దానమిచ్చిన భూమి దేవదాయ శాఖది కాదని, ప్రైవేటు వ్యక్తులదని కలెక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చారని మండిపడ్డారు. దేవదాయ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే అధికారం కలెక్టర్కు లేదని, కేవలం ఎండోమెంట్ కమిషనర్ అనుమతితోనే ఏదైనా జరగాలని గుర్తు చేశారు. కానీ ఆగమేఘాలమీద కూటమి ప్రభుత్వం రాగానే కేవలం రెండు వారాల్లోనే తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు చేరడం వెనుక భారీ కుంభకోణం ఉందని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఒకవైపు హిందుత్వం గురించి, మతం, ఆలయాల గురించి కూటమి ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతూనే మరోవైపు భారీ ఎత్తున దేవుడి భూములు కై ంకర్యం అవుతున్నాయన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ గా వచ్చి దాదాపు 20 నెలలు పూర్తవుతున్నాయి... జిల్లా అభివృద్ధిపై మీ మార్కు ఎక్కడా కనబడలేదంటూ మండిపడ్డారు. పేదల సమస్యల మీద స్పందించడానికి టైం లేని ఈ జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వని ఈ కలెక్టర్ నాలుగు గోడల మధ్య ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డాన్ని వైఎస్సార్సీపీ చూస్తూ ఉపేక్షించదన్నారు. ఆమె చేసిన ప్రతి రెవెన్యూ నిర్ణయం మీద సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలా జరగని పక్షంలో న్యాయపోరాటం తధ్యమని హెచ్చరించారు. అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ మాట్లాడుతూ రూ.కోట్లాది విలువ చేసే కన్యకా పరమేశ్వరి దేవస్థానం భూమిని కాపాడవలసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ 1915లో బ్రాహ్మణులకు సత్రంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన భూమి యాజమాని డి.కామమ్మ ఆత్మకు శాంతి లేకుండా కూటమి ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కాసుల కళకళ అంటూ రెవెన్యూ అధికారులు చెవులు కొరుక్కుంటున్నారన్నారు. ఒక రాజకీయ నాయకుడి ప్రోత్సాహంతోనే దేవస్థానం భూమిని కాజేయాలని ప్రణాళికలు వేసినట్టు తెలుస్తోందన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్, నియోజకవర్గ సమన్యయకర్తలు బొడ్డేడ ప్రసాద్, కంబాల జోగులు, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, మాజీ ఎంపీ సత్యవతి, రాష్ట్ర కార్యదర్శి దిలీప్కుమార్, పట్టణ పార్టీ, మండలపార్టీ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, పెదిశెట్టి గోవింద్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్,, కశింకోట మండలపార్టీ అధ్యక్షుడు మలసాల కిషోర్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్రాజా, జిల్లా సీనియర్ నాయకుడు మళ్ల బుల్లిబాబు, కశింకోట ఎంపీపీ కలగ లక్ష్మిగున్నయ్యనాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు, 80,81, వార్డు ఇన్ఛార్జ్లు కె.ఎం.నాయుడు, బోడ్డేడ శివ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచన సుజాత, వివిధ అనుబంధ విభాగం నాయకులు పాల్గొన్నారు. -
అమ్మో దొంగనోట్లు!
బుచ్చెయ్యపేట : వడ్డాది వేంకటేశ్వరస్వామి కల్యాణ మహాత్సవాల్లో దొంగనోట్లు కలకలం రేపింది. కల్యాణ మహోత్సవాలు సందర్భంగా పలువురు వ్యాపారులకు దొంగనోట్లు అంటకట్టారు. వడ్డాదికి చెందిన సంగడి అప్పారావు ఐస్ క్రీంలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి వచ్చిన డబ్బుల్లో ఒకటి రూ, 200 దొంగనోటు రావడంతో ఆందోళన చెందాడు. ఇతనిలాగే కొంత మంది వ్యాపారులకు దొంగనోట్లు రాగా భయపడి వచ్చిన నోట్లును చింపి పారేశారు. గతంలో వడ్డాది సంతలో రూ, 500, 1,000, 2,000 దొంగ నోట్లు ఎక్కువగా చలామణి చేసేవారు. మరలా ఇపుడు దొంగనోట్లు చలామణి అవడంతో పలువురు వ్యాపారులు హడలిపోతున్నారు. -
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడుగా బొడ్డేడ ప్రసాద్
సాక్షి, అనకాపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బొడ్డేడ ప్రసాద్ను నియమించారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. బొడ్డేడ ప్రసాద్ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. తరువాత 2023 ఆగస్టు నెలలో రెండో సారి(అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా) పనిచేశారు. మూడోసారి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆయనకు అవకాశం కల్పించారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గవర కార్పొరేషన్ చైర్మన్గా, అరకు పార్లమెంట్ పరిశీలకులుగా, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా పనిచేశారు. ఈ సందర్భంగా బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ తనను నమ్మి జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన మాజీ సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా స్థాయి టెన్నిస్, బ్యాడ్మింటన్ మాస్టర్ పోటీలు అనకాపల్లి : రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి టెన్నిస్ (మాస్టర్స్– 40 సంవత్సరాలు) పురుషులు, మహిళలు సింగిల్స్, డబుల్స్ పోటీలు బాడ్మింటన్ మాస్టర్ 35 సంవత్సరాల పురుషులు, మహిళలకు ఈనెల 8న ఉదయం 8 గంటలకు జిల్లాలో పరవాడ మండలం కేవీకేలో ఎంపిక పోటీలు జరుగుతాయని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి పూజారి శైలజ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 22, 23 తేదీల్లో విజయనగరంలో రాష్ట్రస్థాయి టెన్నిస్ పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికైన వారికి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 14, 15 తేదీల్లో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ మాస్టర్ పోటీలు జరుగుతాయన్నారు. అర్హులైన క్రీడాకారులు ఆధార్ జెరాక్స్, పాస్పోర్టు సైజ్ ఫొటో అందజేయాలని, క్రీడాకారులు ముందుగా https://sports.ap. gov.inలో నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. -
కూటమి నేతల అండతో భూకబ్జాలు పెరిగిపోయాయి: వైఎస్సార్సీపీ
సాక్షి, అనకాపల్లి: కూటమి నేతల అండతో భూకబ్జాలు పెరిగిపోయాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. అనకాపల్లిలో ఆలయ భూమి కబ్జాను నిరసిస్తూ వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటూ భూములు కబ్జా చేస్తున్నారంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కన్యకా పరమేశ్వరి దేవాలయానికి 100 కోట్లకు పైగా విలువ చేసే భూములను దానంగా ఇచ్చారు. వందేళ్ల క్రితం రెండు ఎకరాల 49 సెంట్లు భూములను ఇచ్చారు. ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ కోసం అందులో ఎకరా 38 సెంట్లు తీసుకున్నారు. కన్యకా పరమేశ్వరి దేవాలయానికి ఎకరా 11 సెంట్లు స్థలం మిగిలి ఉంది. ఈ భూమి 100 కోట్లకు పైగా విలువ చేస్తుంది. దేవాదాయ శాఖ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే అధికారం అధికారులకు లేదు. అధికారులు దేవాదాయ భూమిని ప్రైవేటు భూములు అని నివేదిక ఎలా ఇచ్చారు?’’ అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు.‘‘రూ.100 కోట్లు భూమి ఇప్పటికే కౌలుదారుల పేరు మీద ఉంది. దేవాలయాలు గురించి మాట్లాడే సనాతన నేతలు ఏమి చేస్తున్నారు. 100 కోట్ల భూమిపై సీబీఐ విచారణ జరపాలి. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో దొంగల ముఠా ఏర్పడింది. దేవాదాయ ప్రభుత్వ భూములను ఈ ముఠా దోచుకుంటుంది’’ అంటూ అమర్నాథ్ మండిపడ్డారు.పూర్తి స్థాయిలో దర్యాపు చేయాలి: ముత్యాల నాయుడుఎకరా 11 సెంట్లు భూమి నీ కన్యకా పరమేశ్వరి దేవాలయానికి దానం ఇచ్చారు. దేవాలయ భూములను క్రయ విక్రయాలకు అనుమతి లేదు. దేవాదాయ శాఖ భూమిని అధికారులు జిరాయితీ భూమిగా మార్చారు. 100 కోట్ల భూ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాపు చేయాలి. దీని వెనుక ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు మీద చర్యలు తీసుకోవాలి.భూములను దోచుకుంటున్నారు: మలసాల భరత్అధికారులు బ్రోకర్లతో కుమ్మకై దేవాదాయ భూములను దోచుకుంటున్నారు. రూ.100 కోట్లు విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. 22సీలో ఉన్న భూములను 22ఏ లోకి కలెక్టర్ ఎలా మారుస్తారు? ఈ కుంభకోణాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. రూ. 100 కోట్లు భూ వ్యవహారంపై కలెక్టర్ ఆర్డీవో వివరణ ఇవ్వాలిభూములను కబ్జా చేయాలని చూస్తే ఊరుకునేది లేదు: కరణం ధర్మశ్రీసర్వే 1539 లో ఉన్న దేవాదాయ భూమి కాజేయాల్ని చూస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ భూమిని కాజేయాలని ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 100 కోట్ల భూమిని కాపాడాం. మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో ఈ భూమి కొట్టేయడానికి ప్రయతిస్తున్నాడు. దేవాదాయ భూములను కబ్జా చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. -
ప్రతి అర్జీకి గడువులోగా పరిష్కారం
తుమ్మపాల: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు వచ్చే సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీదారుల సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతోపాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్, మండల, గ్రామ స్థాయిలలో నిర్వహించే పీజీఆర్ఎస్కు సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా అర్జీలు రీఓపెన్ కాకుండా నివారించవచ్చని తెలిపారు. ప్రతి శాఖ అధికారి అర్జీల పరిష్కార పరిస్థితిని రోజూ పర్యవేక్షణ చేయాలని, గడువు లోపల చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ వారం పీజీఆర్ఎస్లో–128, రెవెన్యూ క్లినిక్లో–173, మొత్తం 301 అర్జీలు నమోదయ్యాయి. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు మనోరమ, రమామణి, సీపీవో జి.రామారావు, పలు శాఖల పీడీలు కె సరోజిని, శచీదేవి, సూర్యలక్ష్మి, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రైతుల డిమాండ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు తక్షణమే నష్టపరిహారం మంజూరు చేయాలని, లేనిచో నిషేధిత జాబితా నుంచి తొలగించి క్రయవిక్రయాలకు అనుమతించాలంటూ అనకాపల్లి మండలం తుమ్మపాల, సత్యనారాయణపురం, మూలపేట గ్రామాల రైతులు కలెక్టరేట్ గేటు వద్ద నిరసన చేపట్టారు. అనంతరం పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ప్రాజెక్టులో భాగంగా ఐదేళ్ల క్రితం గెజిట్ విడుదల చేసి రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చారని వాపోయారు. అప్పటి నుంచి ఎటువంటి క్రయవిక్రయాలు చేసుకోలేక కుటుంబ అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి 2013 భూ పరిహార చట్టం కింద మార్కెట్ విలువకు నాలుగు రెట్లు పరిహారం ఇవ్వాలని, ఐదేళ్లుగా సాగు చేయకుండా నిలిపివేయడంతో ఉపాధి కోల్పోయామని, ఈ కాలానికి పరిహారం కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రైతు నాయకులు పీలా మురళీ, సిహెచ్.పార్థసారథి, పి.వి.గంగునాయుడు, కోటేశ్వరరావు, ఆదినారాయణ, రైతులు పాల్గొన్నారు. అధికార పార్టీ నేతల భూ ఆక్రమణపై దళితుల నిరసన ఏళ్ల తరబడి సాగులో ఉన్న గ్రామకంఠం భూమిని అధికార పార్టీ నాయకులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పాయకరావుపేట మండలం మంగవరం గ్రామానికి చెందిన దళితులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. సర్వే నంబరు 127లో 8.40 ఎకరాల గ్రామకంఠం భూమిని తామంతా సాగు చేసుకుంటు జీవిస్తున్నామని, పట్టాలు, పాసుపుస్తకాలు మంజూరు చేయాలంటూ ఏళ్ల తరబడి అధికారులకు అర్జీలు చేస్తున్నా న్యాయం చేలేదని వాపోయారు. ఇప్పుడు అధికార పార్టీ నేతలు భూమిని ఇతరుల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేసి ఆక్రమించేందుకు చూస్తున్నారన్నారు. తాము అడ్డుకుంటే బైండోవర్ చేసి భూమిలోకి రాకుండా చేస్తున్నారని, న్యాయం చేయాలంటు డిమాండ్ చేశారు. భూమిని సాగుచేస్తున్న తమకు హక్కు పట్టాలు మంజూరు చేయడంతోపాటు అధికార పార్టీ నాయకుల నుంచి రక్షణ కల్పించాలని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తీవ్ర నష్టాలు
దేవరాపల్లి: ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించకపోవడంతో ఏటా జీడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర ఆవేదన వ్యక్తం చేశారు. జీడి పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండలంలోని చింతలపూడి సచివాలయం వద్ద గిరిజన రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. అనంతరం సచివాలయ అధికారులకు డిమాండ్ల కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకన్న, దొర మాట్లాడుతూ వరి, చెరకు, పత్తి, పామాయిల్ మాదిరిగా జీడి పంటకు మద్దతు ధర ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. జీడికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేజీకి రూ. 200 చొప్పున మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్థిరంగా ధర లేక పోవడంతో దళారుల చేతుల్లో మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి సైతం రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ధ్వజమెత్తారు. జీడి పంట విస్తరణకు ప్రత్యేక దృష్టి సారించి ఇతర దేశాల నుంచి జీడి దిగుమతులను నిలుపుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎం. ఎర్రునాయుడు, జె. ఈశ్వరరావు, దాయిరి ఈశ్వరరావు, గమ్మెల శ్రీను, చిన్నారావు, సావు రాము, పోయిరి రాము, ఇరట ఈశ్వరరావు, పాంగి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజన పథకానికి నిండుకున్న బియ్యం
కశింకోట: స్థానిక జెడ్పీ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి బియ్యం నిండుకున్నాయి. దీంతో పక్కన అప్పుగా తెచ్చి భోజనం వండి వడ్డించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా 1వ తేదీకి మండలంలోని ఉగ్గినపాలెం వద్ద పౌర సరఫరాల శాఖ గిడ్డంగి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య మేరకు బియ్యాన్ని నేరుగా సరఫరా చేస్తున్నారు. ఈ నెల ఇప్పటి వరకు రాలేదు. గత నెలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో మధ్యాహ్న భోజన పథకానికి బియ్యం లేక పక్కనున్న సమగ్ర బాలికల వసతి గృహం నుంచి అప్పుగా తెచ్చి వండి పెట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 600 మంది బాలికలు పాఠశాలలో చదువుతున్నారు. వీరికి సంఖ్య ఆధారంగా బియ్యం సరఫరా చేస్తుండటంతో అవి నెలాఖరుకు అయిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీని దృష్ట్యా అధికారులు సకాలంలో బియ్యం పాఠశాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మంగళవారానికి బియ్యాన్ని సరఫరా చేస్తామని గిడ్డంగి అధికారులను సంప్రదించగా తెలిపారని హెచ్ఎం ఎంఎస్ స్వర్ణకుమారి, ఇన్చార్జి హెచ్ఎం శశికళ తెలిపారు. -
వడ్డాది వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక అలంకరణ
బుచ్చెయ్యపేట : ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. వడ్డాది వెంకన్న ఉత్సవాలపై భక్తుల విమర్శలు కల్యాణ వేడుకల ఏర్పాట్లలో వైఫల్యాలపై సోమవారం సాక్షి కథనానికి అధికారులు స్పందించారు. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి వేంకటేశ్వరస్వామి 153వ కల్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా సాధారణ అలంకరణతోనే స్వామివారి దర్శనాలు కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై దేవస్ధానం అధికారులు సోమవారం శ్రీదేవి,భూదేవి,స్వామి వారి విగ్రహాలను పుష్ఫాలతో ప్రత్యేకంగా అలంకరించారు. గిరిజాంబ కొండపైన ఉన్న స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి దర్శనాలు కల్పించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. కల్యాణ వేడుకల్లో భాగంగా ప్రత్యేకమైన స్వామి వారి నాగవల్లి వసంతోత్సవం, తిరువీధి ఉత్సవం,చక్రస్నానం మంగళవారం జరగనుంది. ఆలయ ధర్మకర్త దొండా కన్నబాబు, ఈవో శర్మ, దేవాదాయశాఖ సిబ్బంది నాగవల్లి వసంతోత్సవం ఏర్పాట్లపై ఆలయంలో చర్చించారు. చంద్రగ్రహణం తగలక ముందే స్వామి వారి నాగవల్లి వసంతోత్సవం పూర్తి చేయాలని నిర్ణయించారు. -
సోలార్ ప్రాజెక్టుకు భూములిచ్చేది లేదు
● బైలపూడి, ఎ.అగ్రహారం గ్రామాల రైతులు తహసీల్దార్కు వినతి పత్రం అందించి మాట్లాడుతున్న రైతులు చీడికాడ: పూర్వం నుంచి సాగులో ఉన్న భూములను సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుకు ఇవ్వబోమని మండలంలోని బైలపూడి, ఎ. అగ్రహారం చిన్న, సన్నకారు రైతులు స్పష్టం చేశారు. సోమవారం పీజీఆర్ఎస్లో తహసీల్దార్ కిషోర్ లింకన్కు వినతి పత్రం అందించారు. బైలపూడికి చెందిన జి.రమేష్, అగ్రహారానికి చెందిన సలాది గంగశేషులుతోపాటు 50 మంది రైతులు మాట్లాడుతూ తమ సాగులో ఉన్న భూములకు ప్రభుత్వం డీ పట్టాలు అందించిందన్నారు. ఆ భూముల్లో వేరుశనగ, అపరాలు, కందులు, పామాయిల్ పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆ భూములను సోలార్ ప్లాంట్కు అందిస్తే జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. ప్లాంట్ వల్ల విడుదలయ్యే రేడియేషన్తో తమ గ్రామాల్లో ప్రజలు, చిన్నపిల్లలకు, పశువులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తమ భూములను ఇచ్చేది లేదన్నారు. -
ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు
అర్జీదారు సమస్య తెలుసుకుంటున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 40 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా పలువురు నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారం భూతగాదాలు–30, కుటుంబ కలహాలు–2, ఇతర విభాగాలకు చెందినవి–8 అర్జీలు వచ్చాయన్నారు. అర్జీదారులు సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని కిందస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు పాల్గొన్నారు. -
రైవాడ కాలువలో ప్రమాదవశాత్తూ పడి వ్యక్తి మృతి
కె.కోటపాడు : మండలంలో పాతవలస గ్రామానికి చెందిన తవినేని దేముడుబాబు(40) ఆదివారం రాత్రి కె.సంతపాలెం వద్ద రైవాడ కాలువలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందాడు. దేముడుబాబు భార్య బంగారమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఫిర్యాదు మేరకు కె.కోటపాడు ఎస్ఐ ఆర్.ధనుంజయ్ తెలిపిన వివరాలివి. పాతవలస గ్రామానికి చెందిన తవినేని దేముడుబాబుతో పాటు ఆయన మేనల్లుడు కిల్లి వెంకటరావు కె.సంతపాలెం రైవాడ కాలువకు సమీపంలో కాల కృత్యాలను తీర్చుకునేందుకు ఆదివారం వెళ్లారు. కాలువకు కొంత దూరంలో మేనల్లుడు వెంకటరావు ఉండిపోగా, కాలకృత్యాలకని వెళ్లిన దేముడుబాబు సమయం గడుస్తున్నా రాకపోవడంతో వెంకటరావు అతని ఆచూకీ కోసం వెతికాడు. కాలువ వెంబడి వెతగ్గా కొంత దూరంలో కాలువలో దేముడుబాబును గుర్తించి బయటకు తీశాడు. అప్పటికే దేముడుబాబు మృతిచెంది ఉన్నాడు. మృతుడికి భార్య, కుమారుడితో పాటు అనారోగ్యంతో ఉన్న తల్లి ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న దేముడుబాబు మృతితో కుటుంబ సభ్యులతో రోధన స్థానికులను కంటతడి పెట్టించింది. దేముడుబాబు మృతదేహానికి పోస్టుమార్టం పనులను పూర్తి చేసి సోమవారం కుటుంబ సభ్యులకు అందించారు. -
చింత పండుకు గిరాకీ
మాడుగుల వారపు సంతలో ఎదురు చూస్తున్న గిరి రైతులు మాడుగుల: స్థానిక వారపు సంతలో చింత పండుకు గిరాకీ పెరిగింది. పాడేరు, చింతపల్లి, దేవాపురం గిరి ప్రాంతాల నుంచి శివరాత్రికి ముమ్మురంగా చింత పండు వచ్చేది. ఈ ఏడాది శివరాత్రి దాటిపోయినా సరే అరకొరగా కొత్త చింతపండు రావడంతో డిమాండ్ పెరిగిపోయింది. 40 కిలోల కావిడి చింతపండు రూ. 4 వేల నుంచి రూ.4,500 వరకు ధర పలికింది. గత ఏడాది ఇదే కావిడి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ధర ఉండేది. ప్రస్తుతం చింతపండు ఆలస్యంగా రావడంతో ధరలు పెరిగిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. -
త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
రావికమతం: సచివాలయ ఉద్యోగికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మండలంలో గర్నికం గ్రామానికి చెఽందిన సచివాలయ ఉద్యోగి మౌనిక బుచ్చెయ్యపేట మండలం పెదపూడి సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం విధులకు స్కూటీపై వెళ్తుండగా, రావికమతం –గుడ్డిప ఆర్ఈసీ రోడ్డులో గుడివాడ జంక్షన్ వద్ద బస్సు చక్రాల కిందకు దూసుకుపోయింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించేందుకు బస్సు ఆగి ఉండటంతో స్కూటీతో సహా బస్సు చక్రాల కిందకు దూసుకెళ్లినా ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఆటోకు, బస్సుకు మధ్య స్కూటీ ఇరుక్కుని నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో ఆమె చెయ్యి విరిగింది. వెంటనే అనకాపల్లిలో ఆస్పత్రికి తరలించారు. ఏఎస్ఐ రమణ ఘటనా స్థలాన్ని పరిశీలీంచారు. -
జగనన్న కాలనీ స్థలం దురాక్రమణ
యలమంచిలి రూరల్ : కూటమి ప్రభుత్వంలో భూ అక్రమాలకు అధికార టీడీపీ నాయకులే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. ఓటు బ్యాంకు పెంచుకోవడమే లక్ష్యంగా అడ్డగోలు వ్యవహారాలకు అండగా నిలబడుతున్నారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధి కొక్కిరాపల్లి రెల్లి కాలనీ సమీపంలో పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పక్కన జగనన్న కాలనీకి కేటాయించిన స్థలం దురాక్రమణ వ్యవహారమే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. వివరాలివి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొక్కిరాపల్లి రెవెన్యూ సర్వే నెంబర్లు 458/1,458/2,461/1,498/1లో సుమారు 14 ఎకరాల్లో జగనన్న లేఅవుట్ ఏర్పాటు చేశారు. యలమంచిలి పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఇక్కడ నివాస గృహాల నిర్మాణం కోసం ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ లేఅవుట్లో సుమారు 15 సెంట్ల స్థలాన్ని కొక్కిరాపల్లికి చెందిన ఒక కుటుంబం ఆక్రమించుకుంది. ఆక్రమిత స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా కాంక్రీట్ ఫ్లోరింగ్తో భారీ షెడ్ నిర్మించుకున్నారు. షెడ్లో సీమ పందుల పెంపకాన్ని చేపట్టారు. పందుల పెంపకం కోసం షెడ్కు ఎదురుగా సెప్టిక్ ట్యాంక్ సైతం నిర్మించారు. దీంతో ఈ ప్రాంతంలో విపరీతమైన దుర్గంధం వస్తోంది. భవిష్యత్తులో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటే ఇక్కట్లు తప్పవు. ఆక్రమణకు టీడీపీ కౌన్సిలర్ అండ జగనన్న కాలనీలో స్థలం ఆక్రమించుకుని భారీ షెడ్ నిర్మించిన అడ్డగోలు వ్యవహారానికి కొక్కిరాపల్లి వార్డు టీడీపీ కౌన్సిలర్ అండగా ఉన్నారన్న ఆరోపణలున్నాయి. టీడీపీ నేత ప్రోత్సాహంతోనే ప్రభుత్వ స్థలంలో దర్జాగా షెడ్ నిర్మించుకున్నామని ఆక్రమణదారులు సైతం బహిరంగంగానే చెబుతున్నారు. షెడ్ నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చయిందని, మాకేమీ ఇబ్బంది లేదని ఆక్రమణదారులు ధీమా చూపుతున్నారు. ఇదంతా తమ కళ్ల ముందే జరుగుతున్నా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీఆర్వో, సచివాలయ సిబ్బంది, ఇతర యంత్రాంగం ఆక్రమణకు ప్రోత్సాహం అందించడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీ నాయకుడే అండగా ఉండడంతో ప్రస్తుతం నిర్మించిన భారీ షెడ్ పక్కనే మరొకటి కట్టడానికి వీలుగా ఇసుక, మెటల్ సిద్ధం చేశారు. ఆక్రమిత స్థలం చుట్టూ కంచె వేసుకోవడానికి సైతం చూస్తున్నారు. భవిష్యత్తులో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఇక్కడ నివసించే వారికి విపరీతమైన కంపు, దోమలు, ఈగల బెడద తీవ్రం కానుందన్న అభిప్రాయాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇలాంటి ఆక్రమణను చూస్తూ ఊరుకుంటే మరికొంత మంది దురాక్రమణకు తెగబడే అవకాశం ఉందని, తమకు కేటాయించిన స్థలాలు ఆక్రమణకు గురికాకుండా అధికారులు చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
ఉన్నత విద్యకు భాష అడ్డంకి కాదు...
సదస్సులో మాట్లాడుతున్న సత్యనారాయణ మాకవరపాలెం : తెలుగు మీడియంలోనూ ఉన్నత విద్యను అభ్యసించవచ్చని ఉత్తరప్రదేశ్ మాజీ డీఐజీ, కోటవురట్ల మండలం పాములవాకకు చెందిన కిల్లాడ సత్యనారాయణ అన్నారు. మాకవరపాలెం, బూరుగుపాలెం ఉన్నత పాఠశాలల్లో సోమవారం విద్యార్థులకు ఉన్నత విద్యపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవాలన్నారు. మాతృభాషను గౌరవిస్తూ ఇతర భాషలను నేర్చుకోవాలన్నారు. తెలుగులో చదివినా ఐఏఎస్, ఐపీఎస్లు కావొచ్చన్నారు. పదో తరగతిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను వారు అభ్యసించే ఏ చదువులకై నా తానే నిధులు సమకూరుస్తానన్నారు. ఇప్పటి నుంచే భవిష్యత్లో ఏం చేయాలో నిర్ణయించుకోవాలని విద్యార్థులకు సూచించారు. క్యోతీరావుపూలే ఆల్ ఇండియా ఓబీసీ చైర్మన్ పోతల ప్రసాద్, మండల ఏపీటీఎఫ్ అధ్యక్షుడు ఎన్.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ మాకవరపాలెం మండలం నుంచే స్వచ్ఛంద కార్యక్రమాలు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్న సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని ఉపాధ్యాయుడు దుర్మరణం
ప్రమాదస్థలాన్ని పరిశీలిస్తున్న యలమంచిలి రూరల్ ఎస్ఐ ఉపేంద్ర యలమంచిలి రూరల్: రేగుపాలెంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు కన్నం కృష్ణారావు(58) దుర్మరణం చెందారు. మండలంలోని జంపపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ పట్టణంలోని సిగ్నేచర్ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో పులపర్తిలో పొలంలో వ్యవసాయ పనులు చూసుకుని తిరిగి ఇంటికి తన ద్విచక్రవాహనంపై వస్తుండగా, తుని నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న ఏపీ31బీజీ8398 నంబరు లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. అతడి శరీరంపై నుంచి లారీ చక్రాలు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శరీరభాగాలు నుజ్జయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాన్ని నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతుడి సోదరుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. ఎంఈవో సూర్యప్రకాష్, ఉపాధ్యాయ సంఘాల నేతలు, సహచర ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు. -
పారా బ్యాడ్మింటన్ విజేతలకు కలెక్టర్ అభినందన
గూనూరు ఆదిలక్ష్మిని అభినందించిన కలెక్టర్ విజయకృష్ణన్ తదితరులు రావికమతం : విజయనగరంలో ఇటీవలే జరిగిన రాష్ట్ర స్థాయి 7వ పారా బ్యాడ్మింటన్ చాంపియన్ పోటీల్లో రావికమతం మండలానికి చెందిన దివ్యాంగ విద్యార్థులు గూనూరు ఆదిలక్ష్మి , రాజాన మానస, నమ్మి హేమ దుర్గ విజయ కేతనం ఎగురవేసి జాతీయ స్థాయి పారా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్–2026 పోటీలకు ఎంపికైన సంగతి తెలిసిందే. వారిని అనకాపల్లిలో సోమవారం కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు, సమగ్ర శిక్ష సహిత విద్య సమన్వయ అధికారి బి.రామకృష్ణనాయుడు అభినందించి ఘనంగా శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. జాతీయ స్థాయి పారా బ్మాడ్మింటన్ పోటీల్లో ఘన విజయం సాధించి అనకాపల్లి జిల్లాకు మంచి పేరు తీసురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయుడు బొడ్డు మహాలక్ష్మి నాయుడు, జగన్నాథనాయుడు, దేవుడునాయుడు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
తుమ్మపాల : జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించి, ఎంపీడీవోతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారం రోజులుగా వివిధ మండలాల్లో 10 నుండి 20 ఇండికేటర్ల (సూచికల) ఆధారంగా పనులను సమీక్షించడం జరిగిందని, ఎంపీడీవోలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. వచ్చే సమీక్ష సమయానికి జిల్లా ర్యాంకింగ్లో గణనీయమైన మార్పు ఉండాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలన్నారు. ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ’అక్షర ఆంధ్ర’ కార్యక్రమం కింద 97 శాతం అటెండెన్స్ నమోదు కావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. వచ్చే వారం నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నిమిత్తం జిల్లాలో ఏర్పాటు చేసిన 108 పరీక్ష కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. స్టీల్ ప్రాజెక్ట్ భూమి పూజకు ఏర్పాట్లు నక్కపల్లి మండలంలోఆర్సెలర్మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్రాజెక్ట్ సంస్థ స్థాపిస్తున్న భారీ ఉక్కు ప్రాజెక్ట్కు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని, ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం 2,200 ఎకరాల భూమిని కేటాయించినట్టు అధికారులు తెలిపారు. భూమి పూజ ఏర్పాట్లపై చర్చించేందుకు ప్రాజెక్ట్ ప్రతినిధులు కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ను కలిశారు. సీఈవో దిలీప్ ఓమెన్ ప్రాజెక్ట్ పనులు వేగంగా కొనసాగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ప్రాజెక్ట్ చీఫ్ కేఎల్ చౌదరి, హెచ్ఆర్ డైరెక్టర్ అశితోష్ తెలియాంగ్, అడ్మిన్ హెడ్ కెప్టెన్ దీపక్ పట్నాయక్, హెచ్ఆర్ అడ్మిన్ డి.ఎస్.వర్మ పాల్గొన్నారు. -
రియల్
తీరంలోవేటపర్యావరణ కంటే.. ప్రాఫిట్ ముఖ్యం వీటిని పరిశీలిస్తే ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కంటే ప్రాఫిట్కే పెద్దపీట వేస్తోందని స్పష్టమవుతోంది. ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటే.. నగరంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. తీరంలో ఇసుక దిబ్బలు, ఖాళీ ప్రదేశాలు సహజ సిద్ధమైన బఫర్ జోన్లుగా పనిచేసి ఉప్పెనలు, తుపాన్ల తీవ్రతను తగ్గిస్తాయి. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో వాణిజ్య విస్తరణకు తెరతీస్తే.. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలకు విశాఖను బలి చేయడమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం విశాఖ విధ్వంసాన్ని మాత్రమే కోరుకుంటోంది తప్ప.. అభివృద్ధిని కాదంటూ పర్యావరణవేత్తలు, కూటమి పార్టీల ప్రతినిధులే సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘమైన తీరప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వం పగబట్టింది. అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు అభివృద్ధి పేరుతో తీరాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతోంది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) నిబంధనలను సడలించడం, జోన్లు మార్చడం వంటి చర్యలతో తీరప్రాంత సమతుల్యతను దెబ్బతీస్తోంది. పర్యాటక ముసుగులో న్యాయస్థానాల హెచ్చరికల్ని కూడా బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. కావాల్సిన వారికి ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అడ్డదారులు తొక్కుతోంది. గతంలో పర్యావరణవేత్తలు, ప్రజలు పోరాడి కాపాడుకున్న తీరప్రాంతాలను ఇప్పుడు కమర్షియల్ హబ్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నగరంలోని సాగరతీర ప్రాంతాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వం ఎంతటి మొండివైఖరితో ఉందో అర్థమవుతోంది. తన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్ల కోసం పర్యావరణ అనుమతులను సైతం వేగవంతం చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యంతరాలను పక్కనపెట్టి అడ్జస్ట్మెంట్లతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. భీమిలి తీరంలో సీఆర్జెడ్ మాయాజాలం విశాఖ–భీమిలి తీరప్రాంతంలో సీఆర్జెడ్ జోన్ల మార్పిడి (రీక్లాసిఫికేషన్)పై చంద్రబాబు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం.. సీఆర్జెడ్–3 కేటగిరీలో ఉన్న ప్రాంతాలు తక్కువ నిర్మాణాలు కలిగి, ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. సముద్రమట్టం నుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. ఇక్కడి ఇసుకదిబ్బలు, చిత్తడినేలలు వంటివి అలల తాకిడిని, తుపాన్లను అడ్డుకునే సహజ రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. సీఆర్జెడ్–2 కేటగిరీలో సముద్రతీరానికి అత్యంత సమీపంలో భారీ కాంక్రీట్ కట్టడాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకోవచ్చు. విశాఖ–భీమిలి బీచ్ వెంబడి సీఆర్జెడ్–3 పరిధిలో 500 ఎకరాలకుపైగా భూములున్నాయి. వీటిలో భారీ కాంక్రీట్ నిర్మాణాలకు వీలులేదు. ఇప్పుడు ఈ భూముల్ని సీఆర్జెడ్–2 పరిధిలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ భూముల్లో మెజారిటీ వాటా ప్రభుత్వ నేతలదే కావడంతో.. మార్పిడి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విశాఖని గ్లోబల్ సిటీగా మారుస్తామనే సాకుతో తీరప్రాంత మాస్టర్ప్లాన్పై సమీక్షలు మొదలుపెట్టారు. 2024 అక్టోబర్–డిసెంబర్ మధ్య మాస్టర్ప్లాన్ సవరణల పేరుతో అంతర్గత కసరత్తు జరిగింది. ఆ సమయంలోనే సీఆర్జెడ్–3లోని భూముల్ని సీఆర్జెడ్–2 కిందకు చేర్చి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా మార్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపించి మార్పులు చేసెయ్యాలని ప్రభుత్వం ఆరాటపడిపోతోంది. పర్యావరణ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి అన్న మంత్రి దుర్గేష్ నిబంధనల్ని పాటిస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు అభివృద్ధికి అవే అడ్డంకి అనటం ఆందోళన కలిగిస్తోంది. పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభలో మాట్లాడుతూ పర్యావరణ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి అంటూ వ్యాఖ్యానించారు. ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కూడా అసెంబ్లీలో నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధి కోసం కాకుండా.. బీచ్రోడ్డుని సీఆర్జెడ్–2లోకి తీసుకురావాలని కోరారు. ఇక్కడ సీఆర్జెడ్ నిబంధనల కారణంగా 9 మీటర్లపైన నిర్మాణాలు చేపట్టలేకపోతున్నామనీ.. వీటిని సడలించాలంటూ మాట్లాడటంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కేవలం విశాఖ విధ్వంసాన్ని మాత్రమే కోరుకుంటోంది తప్ప.. అభివృద్ధిని కాదంటూ పర్యావరణ వేత్తలు, కూటమి పార్టీ ప్రతినిధులే సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. సీఆర్జెడ్ నిబంధనల మాయాజాలం విశాఖ సాగర రక్షణ కవచానికి తూట్లుఆత్మహత్యా సదృశ్యమే.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ముప్పు పొంచి ఉన్న తరుణంలో ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఓవైపు గ్రేట్ గ్రీన్వాల్ వంటి కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు పర్యాటకశాఖ దానికి విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయం. కేవలం రూ.4,098 కోట్ల పెట్టుబడులు, 2,800 హోటల్ గదులు వంటి తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం, శాశ్వత పర్యావరణ రక్షణ కవచాలైన సీఆర్జెడ్–3 నిబంధనలను సడలించి తీరాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చాలని చూడటం ఆత్మహత్యా సదృశ్యమే. ఇప్పటికే జీవీఎంసీ, ఏపీపీసీబీ పర్యవేక్షణ లోపంతో సముద్రజలాలు కలుషితమవుతున్నాయి. ఇప్పుడు అదనపు కట్టడాలకు అనుమతినిస్తే విశాఖ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అభివృద్ధి అంటే ప్రకృతిని ధ్వంసం చేయడంకాదు, భావితరాలకు సురక్షితమైన తీరాన్ని అందించడమే. ప్రభుత్వం సీఆర్జెడ్ పునర్వర్గీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. – బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన ప్రతినిధి, పర్యావరణవేత్త తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది విశాఖపట్నం తీరప్రాంతంలో సీఆర్జెడ్–3 నిబంధనలను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండటం గర్హనీయం. కేవలం పర్యాటక అభివృద్ధి, వాణిజ్య విస్తరణ పేరుతో చేస్తున్న ఈ మార్పువల్ల సాగరతీరంలోని ఇసుక దిబ్బలు, చిత్తడి నేలలు వంటి సహజ రక్షణ కవచాలు ధ్వంసమైపోతాయి. భవిష్యత్తులో తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది. ప్రభుత్వం తాత్కాలిక లాభాల కోసం మత్స్యకారుల జీవనోపాధిని పణంగా పెడుతోంది. ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న విశాఖకు ఇది మరో పెద్దదెబ్బ. చట్టబద్ధమైన పర్యావరణ రక్షణలను అడ్డంకులుగా చూడటం బాధ్యతారాహిత్యం. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాల్సిందే. – వై.రాజేష్, వీఎస్ కృష్ణ, మానవహక్కుల ఫోరం ప్రతినిధులు -
దళితుల భూముల జోలికి వస్తే తడాఖా చూపిస్తాం
సాక్షి, అనకాపల్లి : దళితుల ఓట్లతో గద్దెనెక్కి అదే దళితుల భూములను బెదిరించి లాక్కొంటామంటే మా తడాఖా చూపిస్తామంటూ మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్రావు హెచ్చరించారు. పంచదార్ల గ్రామంలో దళితుల భూముల్లోకి పొలిటికల్ బ్రోకర్లు, అధికారులు ఎవరైనా వచ్చి బెదిరిస్తే రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలన్నీ ఏకమై కూటమి ప్రభుత్వానికి, అధికారులకు తగిన బుద్ధి చెబుతామన్నారు. సోమవారం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్లలో దీక్ష చేపడుతున్న దళితులకు మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్రావు మద్దతు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీరుపై నిరసనగా నెల రోజులుగా చేపడుతున్న దీక్షా శిబిరం వద్దకు వెళ్లి వారికి ధైర్యాన్ని నింపారు. వారి పోరాటాన్ని మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జిల్లా మెజిస్ట్రేట్గా ఉన్న కలెక్టర్ నుంచి తహసీల్దార్ వరకూ అందరూ దళితుల భూములను లాక్కోవడంలో పాపం పంచుకున్నారని, వీరిని వెనకుండి నడిపించేది స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్, కూటమి నేతలు అని అన్నారు. పంచదార్ల గ్రామంలో ఉన్న ఈ దళితులు సాగు చేసుకునే భూములను లాక్కొనేందుకు వారికి తెలియకుండానే నకిలీ నోటీసులు పంపించి వారి భూములను కొట్టేసేందుకు కూటమి ప్రజాప్రతినిధులతో కలిసి కుట్రకు తెరలేపారన్నారు. పంచదార్లలో దళితులకు న్యాయం చేయడానికి వైఎస్సార్సీపీ లీగల్ సెల్తో చర్చించి న్యాయ సహాయం అందజేస్తామన్నారు. 50 ఏళ్ల క్రితం పేద దళితలకు ఇచ్చిన భూములను కూటమి ప్రభుత్వం లాక్కోవాలని చూస్తే పార్టీలకతీతంగా ప్రజాసంఘాలు, దళిత సంఘాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎసీ సెల్ అధ్యక్షుడు పాలిసెట్టి సురేష్రాజ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి దండు జ్ఞానదీప్, మాల మహానాడు రాష్ట్ర నాయకుడు సింహాద్రి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు సుజాత, శిరీష శ్రీనుబాబు, జెడ్పీటీసీ ధూళి నాగరాజు, దివ్యాంగుల విభాగ యలమంచిలి నియోజకవర్గ అధ్యక్షుడు రేబాక రాము, ఉప్పులూరి నాయుడు, కిశోర్ రాజు, బుడబండి అప్పారావు, గూటాల నాగ అప్పలరాజు,ఽ ధారపాటి అబ్దం, బుడబండి రమేష్, చరపల్లి లోవరాజు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నేత ఐడీ బాబు, సురేష్ పాల్గొన్నారు. -
సీబీఐ విచారణ చేపట్టాలి
దేవదాయ భూముల్లో అక్రమాలపై అనకాపల్లి : స్థానిక రింగ్రోడ్డు ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ పక్కన ఉన్న విశాఖ కన్యకాపరమేశ్వరి దేవస్థానం భూమిని ఎండోమెంట్ కమిషనర్కు తెలియకుండా ఎకరా 11 సెంట్లు సుమారుగా రూ.100 కోట్ల విలువైన భూముల రికార్డులను తారుమారు చేయడంపై సీబీఐ విచారణకు చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ జిల్లా పార్లమెంట్, నియోజకవర్గ సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్, మలసాల భరత్కుమార్ అన్నారు. స్థానిక రింగ్రోడ్డు పార్టీ పట్టణ అధ్యక్షుడు జానకీరామరాజు ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కన్యకాపరమేశ్వరి అమ్మ వారి దేవస్థానం భూమి సర్వే నంబర్ 1539/5లో సుమారుగా 111 ఏళ్ల క్రితం డి.కామమ్మ అనే మహిళ బ్రాహ్మణులకు సత్రంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరిగిందన్నారు. అప్పట్లో ఈ భూమిని ఎండోమెంట్లో 22సీగా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 22 ఏలోకి గత ఏడాది సెప్టెంబర్లో మార్పు చేసిందన్నారు. దేవస్థానం భూములను ఇతర వ్యక్తుల పేర్లు మార్చే సమయంలో రాష్ట్ర దేవస్థానం కమిషనర్ ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలని, అటువంటి నిబంధనలను పాటించకుండా కూటమి నేతలకు భూమిని కట్టబెట్టడం అన్యాయమన్నారు. 111 సంవత్సరాల క్రితం దేవదాయశాఖ అధికారులు కాండ్రేగుల సూరిఅప్పారావుకు కౌలుకు ఇవ్వడం జరిగిందని సూరిఅప్పారావు మృతిచెందిన తరువాత భార్య కాండ్రేగుల చిన్నతల్లికి కౌలుకు ఇవ్వడం జరిగిందన్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వం ఈ భూమిని కాజేసేందుకు చర్యలు చేపట్టగా దేవదాయశాఖ అధికారులు, ప్రజలు ఉద్యమాలతో అడ్డుకున్నారని, మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి ఈ భూమిపై కన్నువేసిందన్నారు. ఈ విషయంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ఆధ్వర్యంలో పార్టీశ్రేణులు ఈనెల 3న కన్యకాపరమేశ్వరి దేవస్థానం భూ మి పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూమిపై చర్చ జరుగుతుంటే దేవస్థానం, రెవెన్యూ అధికారులు ఆ భూమిలో నేటికీ బోర్డును ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. కన్యకాపరమేశ్వరి దేవస్థానం భూమిని కూటమి నాయకుల్లో కొంతమందికి అప్పగించే విధంగా అధికారులు చర్యలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. 1915లో కామమ్మ విశాఖ కన్యకాపరమేశ్వరి దేవస్థానం బ్రాహ్మణులకు సత్రంగా వాడుకోవాలని అప్పు డు 2.16 ఎకరాలు భూమిని అప్పగించడం జరిగిందని, ఎన్టీఆర్ బెల్లం మార్కెట్కు కొంత మేరకు భూమిని తీసుకున్నారని, మిగిలిన ఎకరా 11 సెంట్లు దేవస్థానం ఆధీనంలో ఉందన్నారు. కౌలు చేసిన వ్యక్తులు ఎలా భూ యజమానులు అవుతారని రికార్డులు తారుమారు చేశారో కూటమి నేతలు, ప్రభుత్వ అధికారులే చెప్పాలన్నారు. ప్రభుత్వ భూములు 22(ఎ,బి,సి,డి) విభాగంలో ఉంటాయని 22సీ పూర్తిగా దేవదాయశాఖకు చెందిందని, కన్యకాపరమేశ్వరి దేవస్థానం భూమి 22సీ నుంచి 22ఏకు ఎలా మార్పు చేశారో లిఖిత పూర్వకంగా ప్రజలకు తెలియజేయాలన్నారు. భూమిని అడ్డుగోలుగా కలెక్టర్ సహకారంతో దోచుకోవాలని కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. రెవెన్యూ పరంగా భూములు మార్పులు చేయాలంటే వీఆర్వో, ఆర్ఐ, డీటీ, తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ సంతకాల తరువాత కలెక్టర్ సంతకం చేస్తారని, కన్యకాపరమేశ్వరి దేవస్థానం భూమి విషయమై ఇలా జరగలేదన్నారు. ఇక్కడే డి.కామమ్మకు చెందిన మరో రూ. 50 కోట్లు విలువచేసే భూమి ఉందని, ఈ విషయాన్ని త్వరలో వెలుగులోనికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దిలీప్కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, మండల పార్టీ అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, పార్టీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, 80,81 వార్డు ఇన్ఛార్జ్లు కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, పార్టీ నాయకులు కొణతాల మురళీకృష్ణ, కలగలక్ష్మి గున్యయ్యనాయుడు, ఎం.శ్రీనివాసరావు, డానీ, పద్మకుమారి, మర్రిపల్లి శోభ, లక్ష్మి పాల్గొన్నారు. -
నేడు ఉపమాక ఆలయం తాత్కాలిక మూసివేత
● చంద్రగ్రహణం కారణంగా ఉదయం స్వామివారి చక్రవారీస్నానం ● సంప్రోక్షణ అనంతరం రాత్రికి డోలోత్సవంఉపమాక వెంకన్న ఆలయం, మోదకొండమ్మ నక్కపల్లి : కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రధానార్చకులు వరప్రసాదాచార్యులు తెలిపారు. సాయంత్రం ఏడుగంటల దాటిన తర్వాత సంప్రోక్షణ అనంతరం వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మిగిలిన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ముందుగా స్వామివారికి తిరువీధి సేవ లు, అనంతరం స్వామివారి చక్రవారీ స్నానం నిర్వహించడం జరుగుతుందన్నారు. రాత్రి డోలోత్సవం నిర్వహిస్తారు. నేడు మోదకొండమ్మ ఆలయం మూసివేత మాడుగుల: మోదకొండమ్మ ఆలయం ఈ నెల 3 వ తేదీన చంద్ర గ్రహణం సందర్భంగా ఉద యం 9 గంటల నుంచి బుధవారం తెల్లవారు వర కు మూసి వేయడం జరుగుతుందని, సంప్రోక్షణ అనంతరం 10 గంటలకు దర్శనాలు ప్రారంబిస్తామని ఆలయ చైర్మన్ అప్పలరాజు తెలిపారు. -
6,7 తేదీల్లో బాలోత్సవం
అనకాపల్లి : పిల్లల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని డీఎస్పీ ఎం.శ్రావణి అన్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సోమవారం అనకాపల్లి బాలోత్సవం–2026 కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారిగా బాలోత్సవం–2026 కార్యక్రమాలను స్థానిక న్యూకాలనీ రోటరీ ప్రాంగణంలో ఈనెల 6, 7 తేదీల్లో చేపట్టడం అభినందనీయమన్నారు. జిల్లా వ్యాప్తంగా 100కు పైగా పాఠశాల విద్యార్థులు పాల్గొంటారని, 35 రకాల అకడమిక్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమాజ భాగస్వామ్యంలో భాగంగా రామాబాలల సంఘం, రోటరీ క్లబ్ లాంటి 20 సంస్థలు భాగస్వాములుగా అనకాపల్లి బాలోత్సవం నిర్వహించడం శుభ పరిణామని అన్నారు. ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ కార్యక్రమాలను రెండు రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి 2026 బాలోత్సవం ప్రోగ్రామ్ చైర్మన్, సిద్దార్ధ సోషల్ సర్వీస్– కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్లా నాగభూషణం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొప్పే ఉమామహేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు కడిమిశెట్టి త్రిమూర్తులు పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్కు శాపం
ఈపీడీసీఎల్ నిర్లక్ష్యం... ఆర్ఈసీఎస్ అనుబంధ కళాశాలపై శీతకన్ను ● రూ.కోట్ల ఆదాయం తీసుకుంటూ నిర్వహణ గాలికి.. ● అఫిలియేషన్ ఫీజు చెల్లించకపోవడంతో ఆందోళన ● కళాశాల అనుమతిని విద్యాశాఖ రద్దు చేసే అవకాశాలు ● రోడ్డున పడనున్న 600 మంది విద్యార్థులు, 50 మంది ఉద్యోగులు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులుసాక్షి, అనకాపల్లి: ఈపీడీసీఎల్లో గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ(ఆర్ఈసీఎస్)ను విలీనం చేసిన తరువాత దానికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాల పరిస్థితి దయనీయంగా మారింది. దానిని పూర్తిగా గాలికి వదిలేశారు. ఆర్ఈఎస్కు గల వందల కోట్ల ఆస్తులు, భారీగా వస్తున్న ఆదాయాన్ని లాక్కొని అనాథగా వదిలేయడంతో ఉద్యోగులు, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈపీడీసీఎల్ అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల పాలిటెక్నిక్ కాలేజీ మనుగడే ప్రమాదంలో పడింది. జిల్లాలో ఐదు మండలాల పరిధిలో గల గ్రామాల్లో గృహ, వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార అవసరాల నిమిత్తం 50 ఏళ్ల క్రితం ఆర్ఈసీఎస్ విద్యుత్ సరఫరా కార్యకలాపాలను ప్రారంభించింది. 2021 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆర్ఈసీఎస్ సంస్థ కార్యకలాపాలను ఈపీడీసీఎల్కు అప్పగిస్తూ ఏపీఈఆర్సీ ఆదేశించింది. నాటి నుంచి ఆర్ఈసీఎస్ కార్యకలాపాలను, సంస్థ ఆస్తులను, కార్యాలయాలను, విద్యుత్ పంపిణీ వ్యవస్థను, ఆదాయాన్ని ఈపీడీసీఎల్ హస్తగతం చేసుకుంది. విలీన ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగకపోయినా..సంస్థ కార్యకలాపాల వరకే అప్పగించినా..సంస్థ ఆదాయం మొత్తం ఈపీడీసీఎల్ ఖాతాలోనే జమవుతోంది. అయితే సంస్థ ఆస్తులు, అప్పుల సెటిల్మెంట్ జరిగే వరకు అనుబంధ పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణ బాధ్యతను ఆర్ఈసీఎస్ ఆదాయంతోనే చేపట్టాలని స్పష్టంగా పేర్కొంది. ఉద్యోగులను, కార్యాలయాలను వాడుకుంటూ వ్యాపారం చేస్తున్న ఏపీఈపీడీసీఎల్ సంస్థ కళాశాల పూర్తి బాధ్యతను మాత్రం గాలికి వదిలేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిచిన ఈ కళాశాల పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో దయనీయంగా మారింది. పాలిటెక్నిక్ కళాశాలలో సిబ్బందికి ఏడాదిగా జీతాలు ఇవ్వకుండా, కళాశాల నిర్వహణ బాధ్యత తీసుకోకుండా ఏపీఈపీడీసీఎల్ కాలయాపన చేస్తూ వచ్చింది. ‘సాక్షి’ లో పలుమార్లు కథనాలు రావడంతో కళాశాల సిబ్బందికి, టీచర్లకు గత ఏడాది అక్టోబర్ నెల నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. కానీ కళాశాల నిర్వహణను గాలికొదిలేశారు. కళాశాల నిర్వహణకు అనుమతి కోసం, అఫిలియేషన్ కోసం విద్యాశాఖకు చెల్లించాల్సిన ఫీజులు కూడా చెల్లించలేదు. టెలిఫోన్, ఇంటర్నెట్, స్టేషనరీ, టాయిలెట్ నిర్వహణ వంటి ఖర్చులకు కూడా నగదు చెల్లించకుండా ఈపీడీసీఎల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి ఫీజులు చెల్లించకపోతే పాలిటెక్నిక్ కళాశాలకు అనుమతి, అఫిలియేషన్లను రద్దు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే 600 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. 50 మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్, అధికారులు పలుమార్లు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇంటర్నెట్ రుసుం, స్టేషనరీకి నగదు చెల్లించకపోవడం వల్ల రోజువారీ కార్యక్రమాల నిర్వహణ కష్టతరంగా మారిందని, నిధులు లేక టాయిలెట్లను శుభ్రం చేయకపోవడం వల్ల తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోందని విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నా..ఈపీడీసీఎల్ అధికారుల్లో స్పందన కనిపించలేదు. చివరికి పాలిటెక్నిక్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించడం లేదు సరికదా, చెల్లిస్తున్న అరకొర జీతాలకు కూడా నిబంధనలకు విరుద్ధంగా గరిష్ట పరిమితి విధించి తగ్గిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు ఉద్యోగులకు జీతాన్ని తగ్గించారు. తమ జీతాన్ని పునరుద్ధరించాలని పలుమార్లు వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. కశికోటలోని ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాల బైలాకు విరుద్ధంగా... విద్యుత్ వినియోగదారుల పిల్లలకు సాంకేతిక విద్యను అందించేందుకు 2008 సెప్టెంబర్ నెల లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించి కశింకోటలో రాజీవ్గాంధీ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు. కళాశాలకు సంస్థ ప్రధాన కార్యాలయంలో ఐదుఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాకుండా కళాశాల నిర్వహణ బాధ్యత, ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు, భవనాల నిర్మాణం, ప్రయోగ పరికరాల కొనుగోలు ఇతర నిర్వహణ ఖర్చులకు నగదును ఆర్ఈసీఎస్ నిధుల నుంచి చెల్లించేలా తీర్మానం చేశారు. 2009లో రాజీవ్ గాంధీ ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. అంతేకాకుండా వినియోగదారుల పిల్లలకే సగం సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఆర్ఈసీఎస్ యాజమాన్యం కల్పించిన మౌలిక సదుపాయాలతో 120 మంది విద్యార్థులతో కళాశాల ప్రారంభమైంది. ఇక్కడ చదివిన విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించి వివిధ హోదాల్లో స్థిరపడ్డారు. ఈ పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణ వ్యయం, విద్యార్థుల ఫీజులు, సిబ్బంది జీతభత్యాలు సంస్థ ఆదాయం నుంచే చెల్లించాలని బైలాలో పేర్కొన్నారు. అయితే దాని కి విరుద్ధంగా ఈపీడీసీఎల్ అధికారులు వ్యవహ రిస్తున్నారు. 2021 నుంచి 2025 మే మధ్యకాలంలో విద్యుత్ వినిమయ బిల్లుల బకాయిల చెల్లింపులు రూ.574.32 కోట్ల ఆదాయం రాగా .. సిబ్బంది జీతాలు,రికరింగ్, నాన్రికరింగ్ ఖర్చుల కోసం రూ.171.35కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 402.96 కోట్ల నగదును ఈపీఆర్సీ బ్యాంకు ఖాతాలో జమచేయాల్సి ఉంది. కానీ ఏపీఈపీడీసీఎల్ వారి ఖాతాలలో జమచేసుకున్నారు. పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణలో ఆటంకాలపై ఈపీడీసీఎల్ అధికారులకు చాలా సార్లు వినతిపత్రాలు అందజేసినట్టు చెప్పారు. ప్రభుత్వానికి అఫిలియేషన్ ఫీజు చెల్లించకపోతే రద్దయ్యే ప్రమాదం ఉంది. -
నష్ట పరిహారం ఇవ్వడం లేదు...
సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేయించుకున్న ప్రతి వ్యక్తికి ప్రభుత్వం నుంచి సహాయం అందజేయాలి. లేబర్ కార్డు తీసుకునే సమయంలో ప్రభుత్వం రూ.60 కట్టించుకుని రశీదు ఇస్తుంది. ప్రమాదాలు జరిగినప్పుడు పట్టించుకోవడం లేదు. భవన నిర్మాణ రంగంలో ఎక్కువగా మహిళలే పనులు చేస్తారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. సంక్షేమ బోర్డుకు నిధులిచ్చి కార్మికులను ప్రభుత్వాలే ఆదుకోవాలి. –మారేడుపూడి సత్యనారాయణ, మేస్త్రి, మూలపేట గ్రామం -
డార్క్ కామెడీతో ‘సంప్రదాయని సుద్దిని సుద్దపూసని’
డాబాగార్డెన్స్ (విశాఖ): శివాజీ, లయ జంటగా నటించిన నూతన చిత్రం ‘సంప్రదాయని సుద్దిని సుద్దపూసని’ ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఆదివారం నగరంలో జరిగిన ప్రెస్ మీట్లో చిత్ర విశేషాలను యూనిట్ పంచుకుంది. ఈ సందర్భంగా హీరో శివాజీ మాట్లాడుతూ.. ‘ఇది అద్భుతమైన డార్క్ కామెడీ చిత్రం. మా హిట్ పెయిర్ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుంది. సినిమా ఆఖరి 45 నిమిషాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. రోహన్ అద్భుతంగా నటించాడు. కుటుంబం కోసం సినిమాలు చేస్తూనే, ప్రజల కోసం పోరాడుతాను. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి. మహిళల వస్త్రధారణపై గతంలో నేను చేసిన వ్యాఖ్యలు కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.’అని తెలిపారు. హీరోయిన్ లయ మాట్లాడుతూ.. ‘మా తాతగారి ఊరు విశాఖ కావడంతో ఇక్కడితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఇందులో నా పాత్ర పేరు ఉత్తర. భర్తపై చూపించే అతిప్రేమ తెచ్చిపెట్టే చిక్కుల చుట్టూ ఈ కథ వినోదాత్మకంగా సాగుతుంది. అన్ని వర్గాల వారు ఎంజాయ్ చేసే చిత్రమిది.’అని తెలిపారు. -
సింహగిరిపై పెళ్లి సందడి
సింహాచలం : సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి వార్షిక కల్యాణోత్సవానికి నాందిగా జరిగే ‘డోలోత్సవం’ మంగళవారం అత్యంత వైభవంగా జరగనుంది. ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారు పెళ్లి కుమారుడిగా ముస్తాబై, కొండ దిగువన ఉన్న తన సోదరి అడవివరం పైడితల్లి అమ్మవారిని పిల్లను అడిగే ఈ వేడుకను స్థానికులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ ఏడాది చంద్రగ్రహణం కారణంగా ఉత్సవ సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు దేవస్థానం ఈవో జె. వెంకటరావు తెలిపారు. గ్రహణం వేళ.. తెల్లవారుజామునే వేడుకలు సాధారణంగా పగలు జరిగే ఈ ఉత్సవం, చంద్రగ్రహణం కారణంగా మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభం కానుంది. స్వామివారి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను పల్లకిలో ఉంచి మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు తీసుకొస్తారు. తొలుత పైడితల్లి అమ్మవారి ఆలయానికి చేరుకుని, అక్కడి నుంచి పుష్కరిణి సత్రం వద్ద ఉన్న ఉద్యానవన మండపానికి స్వామిని వేంచేపు చేస్తారు. అక్కడ వసంతోత్సవం, చూర్ణోత్సవం, డోలోత్సవ వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి అడవివరం గ్రామంలో తిరువీధి ఉత్సవం జరుగుతుంది. ఉదయం 8 గంటలకల్లా స్వామివారు తిరిగి కొండపైకి చేరుకున్నాక ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. తరతరాల సంప్రదాయం ఈ డోలోత్సవం వెనుక ఒక మనోహరమైన గాథ ఉంది. సింహగిరి నాథుడికి సోదరి సమానురాలైన పైడితల్లి అమ్మవారి కుమార్తెనే స్వామి పెళ్లి చేసుకున్నారని భక్తుల విశ్వాసం. ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరిగే కల్యాణానికి ముందు, ఫాల్గుణ పౌర్ణమి నాడు స్వామివారు స్వయంగా దిగి వచ్చి పిల్లను అడగడం ఇక్కడి సంప్రదాయం. తొలుత అమ్మవారు నిరాకరించడం, ఆపై స్వామివారి వైభవాన్ని చూసి అంగీకరించడం వంటి ఘట్టాలను స్మరిస్తూ భక్తులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ వసంతోత్సవం జరుపుకుంటారు. ఈ వేడుక అనంతరం ఉగాది నాడు పెళ్లిరాట వేయడంతో కల్యాణ పనులు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఈ డోలోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తారని భావిస్తున్న అధికారులు, ఉద్యానవన మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
ఆస్పత్రి పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశం
నర్సీపట్నం: ఏరియా ఆసుపత్రి అభివృద్ధి పనులపై తక్షణమే విజిలెన్స్ విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. ఏరియా ఆసుపత్రిని ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాబార్డ్ కింద మంజూరైన రూ.40 లక్షలతో జరుగుతున్న మరమ్మతులు, రంగుల పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించడంతో సంబంధిత కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్ అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. పనుల్లో ఎటువంటి అవకతవకలు జరిగినా అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ హెచ్చరించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణను బ్లాక్ లిస్టులో పెట్టాలని సంబంధిత అధికారులను స్పీకర్ ఆదేశించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధాశారదకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట కౌన్సిలర్ సిహెచ్.పద్మావతి ఉన్నారు. -
ఆదుకునే చిత్తశుద్ధి ఏదీ...
జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి అనకాపల్లి పట్టణానికి భవన నిర్మాణ కార్మికులు వస్తారు. ఎండ, వాన లెక్క చేయకుండా పనులు నిమిత్తం రాకపోకలు సాగిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులకు పనిచేసే ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతాయి. కార్మికులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మృత్యువాత పడగా మరికొందరు క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, ప్రభుత్వమే కొంత నిధిని ఇవ్వాలి. –అప్పలనాయుడు, ఊడేరు గ్రామం, అనకాపల్లి మండలం -
తీరంలో ఫ్లాష్మాబ్
ఏయూక్యాంపస్ (విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు విశాఖ సాగర తీరాన సందడి చేశారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఏయూ ఇనుస్ట్రుమెంటేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘స్పైక్స్–26’ సాంకేతిక మరియు మేధో ఉత్సవాల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం బీచ్రోడ్డులోని వైఎంసిఏ వద్ద విద్యార్థులు ఫ్లాష్మాబ్ నిర్వహించారు. ప్రముఖ సినీ గీతాలకు విద్యార్థులు ఉత్సాహంగా నృత్యం చేస్తూ పర్యాటకులను, స్థానికులను విశేషంగా అలరించారు. ఈ ప్రదర్శన ద్వారా రాబోయే జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవంపై అవగాహన కల్పించారు. -
చందనోత్సవం ఏర్పాట్లలో జాప్యం వద్దు
సింహాచలం: సింహగిరిపై ఏప్రిల్ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. ఆదివారం ఆయన ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సింహగిరిపై సాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం క్యూలు, మంచినీటి వసతి, బారికేడ్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ నెల చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటీవలే జరిగిన సమావేశంలో కాంట్రాక్టర్లు ఇచ్చిన హామీ మేరకు పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో ఈఈలు రామకృష్ణ, రాంబాబు, డీఈ హరి, ఏఈ రవిరాజు పాల్గొన్నారు. -
విశాఖ డెయిరీ అవినీతిపైనివేదికను బహిర్గతం చేయాలి
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న డిమాండ్ దేవరాపల్లి: విశాఖ డెయిరీ అవినీతి, అక్రమాలపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 2024 నవంబర్లో జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో వేసిన సభా కమిటీ నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సభా కమిటీ వేసి ఏడాదిన్నర దాటిన డెయిరీ యాజమాన్యం ఒత్తిళ్లకు తలొగ్గి దర్యాప్తు నివేదిక బయటపెట్టలేదని విమర్శించారు. సభా కమిటీకే చట్టబద్ధత లేనప్పుడు ఎవరి మెప్పు కోసం కమిటీ వేశారని ప్రశ్నించారు. విశాఖ డెయిరీ యాజమాన్యం పాడి రైతులతో పాటు ఉద్యోగులను, కార్మికులను కష్టార్జితాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. స్పీకర్ అయ్యన్న వేసిన సభా కమిటీ దర్యాప్తునకు అతీగతీ లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సభా కమిటీ నివేదికను బహిర్గతం చేసి, డెయిరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యూటీ చెల్లించాలి
నర్సీపట్నం: ఆర్టీసీలో రిటైర్ అవుతున్న ఉద్యోగులకు గ్రాట్యూటీ, లీవుల డబ్బులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. నర్సీపట్నం డిపోలో పని చేస్తూ రిటైర్ అయిన ఈయూ సీనియర్ నాయకుడు జోనల్ జాయింట్ సెక్రటరీ వై.రాము పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. రాము దంపతులను యూనియన్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్పొరేషన్గా ఉన్నప్పుడు రిటైర్ అయిన రోజే గ్రాట్యూటీ, లీవుల డబ్బులతో పాటు అన్ని సెటిల్మెంట్లు చేసేవారన్నారు. 2024 డిసెంబర్ వరకు రిటైరైన వారిలో 2024 ఏప్రిల్ వరకు మాత్రమే చెల్లించారన్నారు. తరువాత చెల్లింపులు లేవన్నారు. రిటైర్ అవుతున్న ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ధీరజ్. ఈయు ఉద్యోగులు పాల్గొన్నారు. -
విలేజ్ సర్వేయర్ల అసోసియేషన్ జిల్లా కార్యవర్గం
అనకాపల్లి టౌన్: ఏపీ విలేజ్ సర్వేయర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఆర్.ఎస్.అప్పారావు ఎన్నికయ్యారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఐ.శ్రీను, కార్యదర్శిగా సి.హెచ్. ఉమామహేష్, సహాయ కార్యదర్శిగా పి.రవి ప్రసాద్, కోశాధికారిగా ఎస్.మోహన్, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా బి.సంతోష్ కుమార్, మహిళా కార్యదర్శిగా జి.బాల, న్యాయ, క్రమశిక్షణ కార్యదర్శిగా ఇ.దిలీప్ కుమార్, కమ్యూన్కేషన్,ఐటీ కార్యదర్శిగా పి.శ్రీనివాస్, సంక్షేమ కార్యదర్శిగా కె.సంతోష్, సలహాదారుడిగా కె.మురళీ ఎన్నికయ్యారు. -
టీసీఎల్ విజేత టాలీవుడ్ సెలబ్రిటీ ఎలెవన్
విశాఖస్పోర్ట్స్: నగరంలో నిర్వహించిన తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్(టీసీఎల్) ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో టాలీవుడ్ సెలబ్రిటీ ఎలెవన్ ఘనవిజయం సాధించి ట్రోఫీని కై వసం చేసుకుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ క్రీడా సంబరాల్లో అటు వెండితెర తారలు, ఇటు బుల్లితెర సెలబ్రిటీలు జట్లుగా విడిపోయి తలపడ్డారు. తరుణ్, శ్రీకాంత్ వంటి అగ్ర నటులు అభిమానులను ఆహ్వానించడం, ప్రవేశం ఉచితం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. ఉత్కంఠగా ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగిన టైటిల్ పోరులో టాస్ గెలిచిన ఎన్ఎం స్పేసెస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు దినేష్ (52), పవన్ (52) అర్ధ సెంచరీలతో రాణించి, రెండో వికెట్కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టాలీవుడ్ బౌలర్లలో వినయ్, తమన్, సాంబా, దేవా తలో వికెట్ తీశారు. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టాలీవుడ్ సెలబ్రిటీ ఎలెవన్ ఓపెనర్లు సుధీర్ బాబు (35), నిఖిల్ (21) ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. మధ్యలో అశ్విన్ (44) బౌండరీలతో విరుచుకుపడగా, ఓంకార్ (23) సింగిల్స్తో స్కోరు బోర్డును పరిగెత్తించాడు. చివరి 4 ఓవర్లలో 40 పరుగులు చేయాల్సిన దశలో సాంబా (30), వినయ్ (6) నిలకడగా ఆడి మరో 4 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రత్యర్థి బౌలర్లలో శరత్, కల్కి రెండేసి వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. తొలుత జరిగిన మ్యాచ్లో పోలీస్ వారియర్స్ 18 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేయగా, ఎన్ఎం స్పేసెస్ జట్టు 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భరత్ (58), కిరీటి (48) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగారు. 10 ఓవర్ల పాటు జరిగిన మరో మ్యాచ్లో టీవీ కింగ్స్ 3 వికెట్లకు 140 పరుగులు చేసింది. అభిషేక్ (74) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీవీ టైగర్స్ 8 వికెట్ల నష్టానికి 98 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. బౌలింగ్లో నరేష్ 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. విజేతలకు నిర్వాహకులు ట్రోఫీని అందజేశారు. తారల సందడితో వైఎస్సార్ స్టేడియం కోలాహలంగా మారింది. -
ఉపమాకలో ఘనంగా సదస్యం
స్వామివారిపై పాట ఆవిష్కరణ నక్కపల్లి: వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో సదస్యం(పండిత సభ) ఘనంగా జరిగింది.ముందుగా స్వామివారికి నిత్యారాధనలు, బాలభోగనివేదన, రాజభోగనివేదన కార్యక్రమం నిర్వహించారు. సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి తిరువీధి సేవలునిర్వహించారు.అనంతరం వేదపండితులను ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను పుణ్యకోటివాహనంలో ఉంచి తిరువీధి సేవలు జరిపారు. ఆలయంలో డోలు ఆర్టిస్ట్ సింహాచలం స్వరకల్పనలో ప్రముఖ వేదపండితురాలు డాక్టర్ వేదాల గాయత్రీదేవి రచించిన రావోయి ఉపమాక దేవాపర అనే పాటను ఆవిష్కరించారు. ఈ పాటకు ప్రముఖ ఆర్కెస్ట్రా నిర్వాహకులు ఉప్పలపు గురుమూర్తి కుమారులు శ్రీనివాస్, శివ తమ వాయిద్యసహకారం అందించారు. రచయిత్రి డాక్టర్ గాయత్రీదేవిని పీఏసీఎస్ చైర్మన్కొప్పిశెట్టి బుజ్జి,దేవస్థానం ఇన్స్పెక్టర్ కూర్మేశ్వరరావు తదితరులు సత్కరించారు. ఈకార్యక్రమంలో తాలూకా బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు డి.వి.రామారావు, శ్రీపాద ప్రణవ్రామ్, గోపాలాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
జీడి రైతుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి
దేవరాపల్లి: జీడి రైతుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, మద్దతు ధర కల్పించాలని నాన్ షెడ్యూల్ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర డిమాండ్ చేశారు. చింతలపూడి పంచాయతీ శివారు సమ్మెదలో జీడి రైతులతో కలిసి ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అసెంబ్లీలో చర్చించి, కేజీ జీడి పిక్కలకు రూ. 200 చొప్పున మద్దతు ధర ప్రకటించాలని కోరారు. జీడి పంటలను రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నినదించారు. జీడి పిక్కలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోడంతో దళారీ వ్యాపారుల బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల నుంచి జీడిపిక్కల దిగుమతులను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. జీడి పంటకు మార్కెట్ సౌకర్యం కల్పించి, నిలకడగా మద్దతు ధర ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. జీడి పంటను ఈ క్రాప్లో నమోదు చేసి, జీడి రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని కోరారు. జీడికి మద్దతు ధర కల్పించకుంటే జీడి రైతులతో కలిసి సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని దొర స్పష్టం చేశారు. కార్యక్రమంలో కొరతం పైడితల్లి, గతుం రాము, దొమ్మంగి చంద్రమౌళి, దొమ్మంగి చిన మూలనాయుడు, చికుముకల పూలయ్యనాయుడు పాల్గొన్నారు. -
వడ్డాది వెంకన్న ఉత్సవాలపై భక్తులు విమర్శలు
బుచ్చెయ్యపేట: ప్రసిద్ధి చెందిన వడ్డాది వెంకటేశ్వరస్వామి కల్యాణ మహాత్సవాలపై భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. 150 ఏళ్లపైగా చరిత్ర గల వడ్డాది వేంకటేశ్వరస్వామి ఉత్సవాలు సక్రమంగా నిర్వహించకపోవడంపై పలు గ్రామాల భక్తులు మండిపడుతున్నారు. ప్రతి ఏటా ఐదు రోజుల పాటు కమనీయంగా నిర్వహించే స్వామి కల్యాణ వేడుకలను కనులార చూద్దామని రాష్టం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈసారి జరుగుతున్న 153 కల్యాణ మహోత్సవాల్లో సరైన సదుపాయాలు కల్పించకపోవడంపై అధికారులు,పాలకుల తీరుపై మండిపడుతున్నారు. కల్యాణ వేడుకలు నిర్వహణపై పాలకులు, అధికారులు పెద్దగా ప్రచారాలు చేయలేదు. దీంతో ఈసారి ఉత్సవాలకు భక్తుల రద్దీ బాగా తగ్గిపోయింది. దేవున్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న భక్తులకు దేవస్ధానం తరపున ఎటువంటి ప్రసాదాలు అందించడం లేదు. కల్యాణ మహోత్సవాల రోజుల్లో కూడా శ్రీదేవి,భూదేవి,వేంకటేశ్వరస్వామి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరణ చేయకపోగా, సాధారణ అలంకరణతోనే భక్తులకు చూపించడంపై పలువురు మండిపడుతున్నారు. వేడుక రోజుల్లో కూడా లాకర్లో స్వామి వారి ఆభరణాలు ఉన్న తీసుకొచ్చి అలంకరణ చేయకపోవడంపై భక్తులు మండి పడుతున్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయం దిగువన సుమారు కోటి రూపాయలతో కల్యాణ మండపం కడతామని చెప్పినా నిర్మాణానికి పునాది లేదు. చిన్నచిన్న గ్రామాల్లో కల్యాణ మండపాలు కట్టినా మేజర్ పంచాయతీ వడ్డాదిలో కల్యాణ మండపం కట్టకపోవడంపై ఎమ్మెల్యే, ఎంపీ,గ్రామంలో ఉన్న కూటమి నేతల తీరుపై భక్తులు, ప్రజలు విమర్శిస్తున్నారు. ఆలయం పక్కనే కాపు సంఘం మండపాన్ని సగం నిర్మించి అసంపూర్తిగా వదిలేయడంపైనా మండి పడుతున్నారు. గతంలో వేంకటేశ్వరస్వామి కల్యాణం జరిగే ఐదు రోజులు వడ్డాది రోడ్లు జనంతో రద్దీతో తీవ్ర ట్రాఫిక్తో ఉండేవి. కానీ నేడు ఉత్సవాల్లో సందడే కరువైంది. గతంలో కల్యాణం జరిగే ఐదు రోజులు భక్తులకు వినోదం కలిగేలా ఆలయం దిగువన, వడ్డాది నాలుగు రోడ్ల జంక్షన్లో వేరువేరుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. కానీ నేడు తెరపై సినిమాలు వేసే స్థాయికి దిగిపోయారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబుకు ఆరోగ్యం బాగుండకపోవడంతో ఉత్సవాలు ఏర్పాటుకు ఆలయ పాలక మండలి సభ్యులను నియమిస్తామని మూడేళ్లుగా చెబుతున్నా నేటికీ ఎమ్మెల్యే రాజు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆలయ కీర్తి చరిత్ర పెరిగేలా అధికారులు, పాలకులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పలు గ్రామాల భక్తులు కోరుతున్నారు. -
క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం
వైభవంగా ఏఆర్వోఐ గోల్డెన్ జూబ్లీ బీచ్ వాక్ ఏయూక్యాంపస్ (విశాఖ): అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా విశాఖ బీచ్రోడ్డులో క్యాన్సర్ అవగాహన వాక్ నిర్వహించారు. ‘50 ఏళ్లుగా స్వస్థత – క్యాన్సర్ రహిత రేపటి దిశగా’ అనే నినాదంతో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ఈ ర్యాలీ సాగింది. సుమారు 100 మంది రేడియేషన్ ఆంకాలజిస్టులు, మెడికల్ ఫిజిసిస్టులు, రేడియేషన్ టెక్నాలజిస్టులు ఇందులో పాల్గొని, రేడియేషన్ థెరపీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ బి.రవి శంకర్ మాట్లాడుతూ.. క్యాన్సర్ను సకాలంలో గుర్తించడంపై అవగాహన పెంచడం తమ ఉద్దేశమని తెలిపారు. ఏఆర్వోఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సేనాపతి మాట్లాడుతూ.. దేశంలో ఆంకాలజీ ప్రమాణాలను మెరుగుపరచడంలో సంస్థ అందిస్తున్న 50 ఏళ్ల సేవలను గుర్తుచేసుకున్నారు. చికిత్సలో కీలక పాత్ర పోషించే మెడికల్ ఫిజిసిస్టులు, రేడియేషన్ టెక్నాలజిస్టుల సేవలను ప్రజలకు పరిచయం చేయడం ఈ వాక్ ప్రత్యేకత అని ఆయన వివరించారు. రోగులకు మరింత సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్స అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.సుజాత, కార్యదర్శి డాక్టర్ పీబీ ఆనంద రావు, సదస్సు కార్యదర్శి డాక్టర్ వి.దివ్య సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
శరణం.. అమ్మ దివ్య చరణం
ఘనంగా మోదమ్మ పాదాలు తీర్థంఅమ్మా నీ పాద సన్నిధే భక్తుల పెన్నిధి..అది తెలిసిన వారి జన్మ ధన్యం అంటూ మోదమ్మ పాదాలను దర్శించుకుని జనం పరవశించిపోయారు.. కాపాడు తల్లీ అని వేడుకుని మొక్కులు చెల్లించుకున్నారు.. మాడుగుల మండలం ఘాట్రోడ్డు జంక్షన్లో మోదమ్మ పాదాలు తీర్థం వైభవంగా జరిగింది. భక్తులు పోటెత్తడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. మాడుగుల: మండలంలోని ఘాట్రోడ్డు జంక్షన్లో ఉత్తరాంధ్ర ఇలవేల్పు మోదకొండమ్మ పాదాలు తీర్థం ఆదివారం వర్తక సంఘం, ఉత్సవ కమిటీ, ఆటో యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ప్రత్యేకంగా నిర్వహించిన కుంకుమ పూజల్లో పాల్గొని, అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళల కోలాటాలు, నేలవేషాలు, తోడుపెద్దు ఉత్సవాలు, అమ్మవారి ప్రతిరూపమైన ఘటాల ఊరేగింపు తదితర కార్యక్రమాలతో ఉత్సవం కనుల పండువగా సాగింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణ సంచాకాల్చారు. ఉత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సలహా సంఘం సభ్యుడు బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిలను వేర్వేరుగా ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఘన చరిత్ర ఉన్న చల్లని, మహిమ గల తల్లి మోదకొండమ్మ అని తెలిపారు. ఆకట్టుకున్న గుర్రాల పరుగు పోటీ ఉత్సవం సందర్భంగా నిర్వహించిన గుర్రాల పరుగు పోటీ ఉత్సాహంగా సాగింది. ఈ పోటీల్లో 16 గుర్రాలు పాల్గొన్నాయి. పోటీలను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు కోట్ని సత్యనారాయణ, పుట్టా బలరామ్, పెచ్చేటి కొండలరావు, పెచ్చేటి నానాజీ, యన్నంశెట్టి వెంకటరమణ, కోట్ని శ్రీనివాసరావు, కరణం లింగరాజు, వై.సంతోష్ కుమార్, అద్దేపల్లి సత్యారావుతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, ఎంపీపీ తాళ్ళపురెడ్డి వెంకటరాజారామ్, దేవరాపల్లి జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్సీపీ దేవరాపల్లి మండల అధ్యక్షుడు బూరే బాబూరావు, శేనాపతి గంగాధర్, శ్రీనాదు జగ్గారావు, మోదునాయుడు, దాసరి రాజు, కరణం రాము తదితరులు పాల్గొన్నారు. -
నిధులిస్తే ఒట్టు!
పేరుకే సంక్షేమ బోర్డు... భవన నిర్మాణ కార్మికులపై కూటమి నిర్లక్ష్యం ● కార్మికులు దాచుకున్న నగదు ఎక్కడో..? ● సమస్యలపై స్పందించని ప్రభుత్వం అనకాపల్లి: సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని బోర్డును ఏర్పాటు చేశారు. నేటికీ ఒక్కరూపాయి కూడా బోర్డుకు ఇవ్వలేదు. మరి సంక్షేమ బోర్డు ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న సంక్షేమ బోర్డులో నిధులు ఏమయ్యాయోనని ప్రశ్నిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల భద్రత, సంక్షేమం కోసం 1996లో అప్పటి ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశారు. మొదట్లో ఈ పథకం భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే ఉద్దేశించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో అనేక మంది కులవృత్తుల వారిని ప్రభుత్వాలు చోటు కల్పించాయి. ఉపాధి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, చిన్నపాటి దుకాణాల్లో మెకానిక్లు, మరికొంత మంది వృత్తిదారులను సభ్యత్వం చేయిస్తున్నారు. బోర్డును ఏర్పాటు చేసి, నిధులు లేకుండా చేయడంతో కార్మికులకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సభ్యత్వం నమోదు చేతివృత్తులదారులు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు రెండు ఫొటోలు, ఆధార్ కార్డు జెరాక్స్, రేషన్ కార్డు, బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ జెరాక్స్ కాపీలతో పాటు కార్మికుడిపై ఆధారపడి జీవించే వారి ఆధార్ కార్డు జెరాక్స్లు కార్మికశాఖ అధికారులకు అందజేయాలని, కార్మికశాఖ అధికారులు ఆన్లైన్ల్లో లబ్ధిదారులని పూర్తి వివరాలను నమోదు చేస్తారు. కార్మికశాఖ నుంచి ఒకసారి తీసుకున్న కార్డు 5 సంవత్సరాల వరకూ పనిచేస్తుంది. ప్రతి కార్మికుని నుంచి ఐదు సంవత్సరాల సభ్యత్వం కోసం రూ.60 బ్యాంక్లో ప్రభుత్వానికి చెల్లిస్తారు. గతంలో లేబరు కార్డు ఉన్న వ్యక్తులు మరలా రెన్యూవల్ చేసుకోవాలి. రూ.100 కోట్ల హామీ అమలేదీ... 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సంక్షేమ బోర్డుకు మంగళం పాడారు. కార్మికుల పోరాటాల కారణంగా కొత్తగా గత ఏడాది సంక్షేమ బోర్డును పునరుద్ధరించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తి అవుతున్నా ఒక్క రూపాయి కూడా సంక్షేమ బోర్డు నుంచి లేబర్కార్డు తీసుకున్న కార్మికులకు చెల్లించలేదు. కార్మికులకు ప్రమాదాలు, మృత్యువాత పడినప్పుడు, ప్రమాదంలో అంగవైకల్యం ఏర్పడినా ఆర్థిక సాయం ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంక్షేమ బోర్డుకు రూ.100 కోట్లు ఇస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలు చేయలేదు. బోర్డుకు చైర్మన్ను నియమించారు. కార్మిక సంఘాలతో పూర్తిస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయలేదు. -
బాణసంచా కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు
తుమ్మపాల/అనకాపల్లి టౌన్: జిల్లాలోని పలు బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో ఆదివారం పోలీసు, రెవెన్యూ, ఫైర్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. అనకాపల్లి మండలంలో కొప్పాక, రాజుపాలెం తదితర ప్రాంతాల్లో బాణసంచా కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ ఆనందకుమార్, ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు, రూరల్ సీఐ జి.అశోక్ కుమార్, ఎస్ఐ రవికుమార్ పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: ఎస్పీ బాణసంచా తయారీలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుళ్లు జరిగిన దృష్ట్యా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో ఆదివారం తనిఖీలు చేసినట్టు తెలిపారు. షెడ్లలో పరిమితికి మించి పేలుడు పదార్థాలు నిల్వ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, మిక్సింగ్, ఫిల్లింగ్, ప్యాకింగ్ ఎండబెట్టే విభాగాలు నిబంధనల ప్రకారం నిర్ణీత దూరంలో ఉన్నాయో లేదో పరిశీలించామని చెప్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఎర్తింగ్ తదితర సౌక ర్యాలు ఉన్నాయోలేదో పరిశీలించినట్టు తెలిపారు. శిక్షణ పొందిన వ్యక్తులే పని చేస్తున్నారా, బాలకా ర్మికులు ఉన్నారా తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. అగ్నిమాపక పరికరాల లభ్యత, ఎగ్జిట్ పాయింట్లు, పొగతాగడంపై నిషేధం వంటి భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశామన్నారు. జిల్లాలో ఎక్కడైనా అనధికారికంగా బాణసంచా తయారు చేసినా, నిల్వ ఉంచినా తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు ఎస్పీ చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో ఎవరైనా అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అన్ని పోలీసు స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు, ఫైర్, రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహించినట్టు ఎస్పీ తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
సబ్బవరం: ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన వసతులు, నాణ్యమైన బోధన అందుతుందని అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు. మండంలోని గొటివాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో గ్రామంలో ఆదివారం నిర్వహించిన అడ్మిషన్ డ్రైవ్ గ్రామస్తుల సహకారంతో ఉత్సాహంగా సాగింది. కార్యక్రమానికి హాజరైన డీఈవో..తల్లిదండ్రుల్ని ఒప్పంచి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి, వారి విద్యా భవిష్యత్కు శుభారంభం కల్పించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలున్న ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పీవీ ఆనంద్, పాఠశాల కమిటీ చైర్మన్ గొర్లి నూకరాజు, అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి, పూర్వ విద్యార్థి దినకర్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త జోన్.. బదిలీ టెన్షన్
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్న తరుణంలో.. ఉద్యోగుల విభజన ప్రక్రియ సెగలా మారుతోంది. దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ల నుంచి ఉద్యోగుల బదిలీలను విశాఖ రైల్వే జోన్కు ప్రారంభించినా.. సీనియారిటీ కోల్పోతామనే ఆందోళన కొత్త చిచ్చు రేపుతోంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్కు 259 అకౌంట్ పోస్టులు, 699 ఇతర విభాగాల పోస్టులను హెచ్ఆర్ఎంఎస్ ద్వారా బదిలీ చేసే ప్రక్రియను పూర్తి చేశారు. అయితే.. బదిలీ అవుతున్న పోస్టుల్లో పని చేస్తున్న సిబ్బంది, తమ సీనియారిటీతో పాటు సర్వీసుకు బ్రేక్ వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. గతేడాది డిసెంబర్లో రైల్వే బోర్డు నాన్–గెజిటెడ్ ఉద్యోగుల కోసం ఒక సర్క్యులర్ జారీ చేసింది. కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా జోన్తో పాటు రాయగడ డివిజన్లో పనిచేసేందుకు ఎవరికి ఎక్కడ ఆసక్తి ఉందో ఆప్షన్లు ఎంచుకోవాలని సూచించింది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉన్న విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు.. విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్లో చేరబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ను రెండుగా విభజించి.. కొంత భాగాన్ని విశాఖపట్నం డివిజన్గా, మిగిలిన భాగాన్ని రాయగడ డివిజన్లో చేర్చారు. కొత్త జోన్ హెడ్క్వార్టర్స్లో పోస్టింగులతో పాటు రాయగడ డివిజన్లో పనిచేసేందుకు ఆప్షన్లు ఎంచుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశారు. విశాఖ జోన్, రాయగడ డివిజన్ కోసం వివిధ డివిజన్లు, ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లలో విధులు నిర్వర్తిస్తున్న నాన్–గెజిటెడ్ ఉద్యోగులను కేడర్ వారీగా విభజించి కేటాయింపులు జరిపారు. డివిజన్ల హద్దుల మార్పే అసలు సమస్యా? కొత్త జోన్ ఏర్పాటుతో పలు రైల్వే సెక్షన్లు ఒక డివిజన్ నుంచి మరో డివిజన్కు మారబోతున్నాయి. గుంతకల్లు డివిజన్ పరిధిలోని 108 కి.మీ. పొడవున్న రాయచూర్–వాడి సెక్షన్ ఇకపై సికింద్రాబాద్ డివిజన్ కిందకు రానుంది. గుంటూరు డివిజన్ పరిధిలోని 142 కి.మీ. ఉన్న విష్ణుపురం–జానపాడు సెక్షన్ కూడా సికింద్రాబాద్ డివిజన్కు బదిలీ కానుంది. సికింద్రాబాద్ డివిజన్లోని 46 కి.మీ. ఉన్న కొండపల్లి–మోటుమర్రి సెక్షన్ ఇప్పుడు విజయవాడ డివిజన్ పరిధిలోకి వెళ్లనుంది. ఈ మార్పుల వల్ల దాదాపు 2,000 మంది సిబ్బంది ప్రభావితం కానున్నారు. వీరికి నచ్చిన రైల్వే జోన్ను ఎంచుకునే అవకాశం కల్పించాలని అధికారులు ఇప్పటికే ప్రతిపాదించినా.. సరిహద్దుల మార్పులతో తమ సీనియారిటీకి ఇబ్బందులొస్తాయన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. రివర్స్ ఆప్షన్ కోసం ఉద్యోగుల పట్టు సూపర్వైజరీ కేడర్కు చెందిన ఎస్ఎస్ఈ, పీ.వే, టీఆర్డీ వంటి హోదాల్లో ఉన్న సుమారు 2,512 మంది సిబ్బంది భవిష్యత్తుపై ప్రస్తుతం స్పష్టత కరువైంది. ప్రధాన కార్యాలయం నియంత్రణలో ఉండే ఈ కేడర్ల ఉద్యోగులు, కొత్త జోన్కు వెళ్తే తమ సీనియారిటీ దెబ్బతింటుందని భయపడుతున్నారు. అలాగే నిర్మాణ విభాగంలో పని చేస్తున్న వారి పేర్లను ఎన్వోసీ జాబితాలో చేర్చకపోవడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బదిలీ అవుతున్న పోస్టుల్లో పని చేస్తున్న సిబ్బంది తమ సీనియారిటీ, సర్వీసు ప్రయోజనాల దృష్ట్యా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జోన్ ప్రధాన కార్యాలయం పరిధిలో పని చేస్తున్న దాదాపు 279 మంది సిబ్బంది, తమను తిరిగి దక్షిణ మధ్య రైల్వే జోన్లోనే కొనసాగించాలని ‘రివర్స్ ఆప్షన్’కోరుతున్నారు. వీరంతా ప్రస్తుతం కొత్త జోన్ పరిధిలోని డివిజన్ల కింద ఉన్నట్లు చూపిస్తున్నప్పటికీ, పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం పాత జోన్లోనే ఉండేలా అవకాశం కల్పించాలని కార్మిక సంఘాలు రైల్వే బోర్డును డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించి, ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులు సైతం రైల్వే బోర్డుకు లేఖలు రాశారు. ఈ సమస్యలను పరిష్కరించి, ఉద్యోగులకు స్పష్టమైన హామీ వస్తే తప్ప.. సిబ్బంది విభజన ప్రక్రియ ముందుకు వెళ్లే అవకాశం లేదని జోనల్ వర్గాలు చెబుతున్నాయి. -
‘బ్లూజెట్ ఫార్మాతో మత్స్యకారులకు నష్టం’
అచ్యుతాపురం రూరల్: తీవ్రమైన కాలుష్యాన్ని వెదజల్లే బ్లూ జెట్ ఫార్మా పరిశ్రమ వల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతారని, పరిశ్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని పూడిమడక గ్రామ అఖిలపక్ష నాయకులు కోరారు. శనివారం జరిగిన పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావును అఖిలపక్షనాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. రాంబిల్లి మండలం సీతపాలెంలో ఏర్పాటు చేస్తున్న బ్లూ జెట్ ఫార్మా కారణంగా మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇప్పటికే అచ్యుతాపురం, రాంబిల్లి మండాలాల్లో గల 480 ఫార్మా పరిశ్రమలు వ్యర్థ రసాయనాలను పూడిమడక వద్ద సముద్రంలో విడుదల చేస్తుండడం వల్ల చేపలు మృతిచెంది, మత్స్యకారుల జీవనోపాధి కోల్పోతున్నారని వారు తెలిపారు. పూడిమడకలో 20 వేల మంది నివసిస్తున్నారని, వారి ప్రాణాలను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మత్స్యకార నాయకులు చోడిపల్లి అప్పారావు, వాసుపల్లి శ్రీనివాసరావు, ఉమ్మిడి జగన్, చేపల తాతయ్యలు, మేరుగు అప్పలనాయుడు తదితరులున్నారు. -
మెడికల్, ఫార్మా మాఫియా దోపిడీని అరికట్టాలి
తుమ్మపాల: మెడికల్, ఫార్మా మాఫియా దోపిడీని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని సీపీఐ జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావుకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు మాట్లాడుతూ మెడికల్ మాఫియా నాసిరకం మందులను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను నిలువ దోపిడీ చేస్తోందన్నారు. అద్దె సర్టిఫికెట్లతో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాపులపై తనిఖీలు నిర్వహించి, చర్యలు తీసుకోవడంలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్, ఫార్మా మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే వరకు సీసీఐ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోందని చెప్పారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఏటా రూ.300 కోట్లకు పైగా స్టైఫండ్ ఎగవేస్తున్నారని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పీపీపీ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.వి.రమణ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సన్యాసిరావు, జి.ఫణీంద్ర కుమార్, రాధాకష్ణ, మండల కార్యదర్శి వియ్యపురాజు, సీపీఐ నాయకుడు ఈశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రజాప్రతినిధులంటే గౌరవం లేదా...
నాతవరం: నిబంధనలు ఉల్లఘించి ప్రోటోకాల్ పాటించకుండా రాజకీయ పార్టీల మధ్య వివాదాలు సృష్టిస్తున్న ఎంపీడీవో శ్రీనివాస్ తీరుపై ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సభ్యులు సర్పంచులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలో శనివారం ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి , వైస్ ఎంపీపీ పైల సునీల్, జెడ్పీటీసీ సభ్యులు కాపారపు అప్పలనర్స ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీకి చెందిన 16 మంది ఎంపీటీసీ సభ్యులు, 26 మంది పంచాయతీ సర్పంచులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీడీవో వ్యవహారశైలి కారణంగా నాతవరం ిపీహెచ్సీ ప్రాంగణంలో ఆట స్థలం వివాదం చోటు చేసుకుందన్నారు. ఎంపీపీ జెడ్పీటీసీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా సర్పంచ్ తీర్మానం లేకుండా ఏకపక్ష నిర్ణయంతో రూ.4 లక్షల నిధులతో ఆట స్ధలం పనులు ప్రారంభించి మధ్యలో నిలిచిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. లింగంపేటలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం విషయంలో కూడా ఎంపీడీవో శ్రీనివాస్ సర్పంచులకు తెలియకుండా ఏక పక్ష నిర్ణయంతో భూమి పూజ చేసి గ్రామంలో వివాదానికి కారణమయ్యారన్నారు. మండల వ్యాప్తంగా ఏ పంచాయతీలోనైనా ప్రభుత్వ నిధులతో చేసే అభివృద్ధి పనులకు సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పదవులు లేని కూటమి నేతలతో పనులకు భూమి పూజ వంటి పనులు ఎంపీడీవో స్వయంగా చేయించడం జరుగుతుందన్నారు. మండలంలో 31 గ్రామ పంచాయతీలకు 26 గ్రామ పంచాయతీ సర్పంచులు వైఎస్సార్సీపీకి మద్దతుదారులే ఉన్నారన్నారు. కానీ పదవులు లేని కూటమి నేతలతో ఎంపీడీవో అభివృద్ధి పనులకు భూమి పూజలు చేయించి తమను అగౌరవ పరిచే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారుగా రూ. 22 లక్షలు మార్చి 10లోపు ఖర్చు చేయాలని కలెక్టరు ఆదేశించారన్నారు. ఆయా నిధులతో పనులు చేసేందుకు గతంలో ఎంపీపీ లక్ష్మణమూర్తి స్వయంగా ప్రతిపాదనలు పంపించగా ఆ ఫైల్పై ఎంపీడీవో సంతకం చేయకుండా జాప్యం చేస్తున్నారన్నారు. ఎంపీడీవో తీరుపై కలెక్టరుకు ఫిర్యాదు చేస్తామన్నారు. అప్పటికీ మార్పు రాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు లగుడు నాగేఽశ్వరరావు అద్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించి తీర్మానించామని, మాజీ గణేష్తో మండల నాయకులు చర్చించి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గన్నవరం పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు గొర్లె వరహాలబాబు, వైస్ ఎంపీపీ పైల సునీల్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కరక అప్పలరాజు, మంకు సాంబమూర్తి, వేమల సూరిబాబు, అడిగర్ల నాయుడు, కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్లు శిరుసుపల్లి నర్సింగరావు, పైల పోతురాజు, సర్పంచుల సంఘం మండల శాఖ అధ్యక్షుడు మిరపల వెంకటరమణ, పార్టీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు ఇనపసప్పల పుష్ప, ఎంపీటీసీ సంఘం నాయకుడు తమరాన సత్యనారాయణ, మండల యూత్ అధ్యక్షుడు బండారు నాయుడు, సర్పంచులు గొలగాని రాణి, గుడపర్తి అచ్చియ్యనాయుడు, లగుడు నాగేశ్వరరావు, ఇట్టంశెట్టి శ్రీను, పాతాళ అప్పారావు, పార్టీ పెన్షనర్లు మండల శాఖ అధ్యక్షుడు సబ్బవరపు వెంకునాయుడు పాల్గొన్నారు. -
శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
విద్యార్థుల పఠన సామర్ధ్యాన్ని పరిశీలిస్తున్న జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారిత అధికారిమంగవేణి నర్సీపట్నం: ఇంటర్మీడియేట్లో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్ధులు కష్టపడి చదవాలని జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి జి.మంగవేణి విద్యార్ధులకు సూచించారు. నర్సీపట్నంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహం–2ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టడీ అవర్స్ను పరిశీలించారు. పరీక్షలు ఎలా రాస్తున్నారని విద్యార్ధులను ఆరా తీసారు. కష్టపడి చదివి శతశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్ధులకు సూచించారు. విద్యార్ధులకు తయారు చేసిన భోజనాన్ని పరిశీలించారు. విద్యార్ధులతో కలిసి భోజనం చేశారు. -
జీడి పిక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి..
ఆందోళన చేస్తున్న జీడి రైతులు కోటవురట్ల: జీడి పిక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ డిమాండ్ చేశారు. యండపల్లిలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జీడి రైతులు శనివారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సత్యనారాయణ మాట్లాడుతూ గత నాలుగేళ్లు పంట సరిగ్గా లేక, సరైన గిట్టుబాటు ధర లేక ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. అసెంబ్లీలో చర్చించి జీడి పిక్కలకు కిలోకు రూ.200 మద్దతు ధర ఇచ్చి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. జీడి పిక్కల వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి పప్పును భారీ ధరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మార్కెట్లో 80 కిలోల జీడిపిక్కల బస్తాకు రూ.8000 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే జీడి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రోలుగుంట: జీడి పిక్కల సమస్యపై అసెంబ్లీలో చర్చించాలంటూ శనివారం సాయంత్రం రత్నంపేట గ్రామంలో ఫారెస్ట్ భూమి సాగు రైతులు ఆందోళన చేశారు. కిలో జీడిపిక్కలకి రూ.200 ధర నిర్ణయించాలని డిమాండు చేశారు. జీడి పిక్కలు 80 కిలోల బస్తాకి రూ.18 వేలు మద్దతు ధర ఇవ్వాలన్నారు. జీడిపిక్కల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. జీడిపంటల సాగు విస్తీర్ణంపై గతంలో ఇచ్చిన రాయితీలు పునరుద్ధరించాలన్నారు. జీడిపిక్కలు, పండ్లు ప్రాసె సింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. తమ సమస్య పరిస్కారంపై స్పందించకుంటే తహసీల్దార్ కార్యాలయం వద్ద వంటా –వార్పు కార్యక్రమం చేపడతామని గెమ్మిలి చందర్రావు, చిన్నబ్బాయి, జీడిమామిడి గిరిజన సంఘం నాయకులు తెలిపారు. -
వీధి కుక్కల దాడిలో మూడు లేగదూడలు మృతి
చోడవరం:చోడవరం పట్టణ శివారు ద్వారకానగర్లో శనివారం వీధి కుక్కలు దాడి చేయడంతో పాడి రైతులు జోగా శ్రీను, జోగా తలుపులకు చెందిన మూడు లేగదూడలు మృతి చెందాయి. నెలరోజుల కిందట కూడా ఇదే తరహాలో కుక్కలు దాడిచేసి ఒక గేదెపెయ్యిని చంపాయి. ఇటీవల చోడవరం పట్టణంతోపాటు అన్ని గ్రామాల్లోనూ వీధికుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవి గుంపులుగుంపులుగా వీధుల్లో తిరుగుతూ స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మృతిచెందిన లేగదూడలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సీతారామస్వామి పరిశీలించారు. వీధికుక్కలను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పంచాయతీ ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పెట్రోల్ బంకుల్లో జోరుగా ఆయిల్ కల్తీ
చోడవరం : అసలే ఆకాశాన్నంటిన ధర...ఆపై ఆయిల్ కల్తీ. నిఘా అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పెట్రోల్ బంకుల్లో కల్తీ యథేచ్ఛగా జరుగుతోంది. ఇంధనం కల్తీ కారణంగా రూ.వేలు, లక్షలు పెట్టి కొనుగోలుచేసిన వాహనాలు మెకానిక్ షెడ్లకు చేరుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఆమాంతంగా ఆకాశాన్నంటడంతో వాహనాలపై హాయిగా తిరగడమే అందరికీ భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయిల్ కల్తీ కూడా జరగుతుండడంతో మరమ్మతులకు గురైన వాహనాలకు పెట్టుబడులు పెట్టలేక వాహనచోదకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారు 100కు పైగా పెట్రోల్, డీజిల్ బంకులు ఉన్నాయి. చోడవరం పరిసరాల్లోనే 15 బంకులు ఉన్నాయి. వీటిలో ఆయిల్ కల్తీ ఎక్కువగా జరుగుతుంది. పెట్రోల్, డీజిల్లో ఇథనాల్, ఇతర క్రూడాయిల్ కల్తీకి పాల్పడుతున్నారు. ఆయిల్ కల్తీతోపాటు కొన్ని బంకుల్లో భూమిలో ఉంచిన స్టోరేజ్ ఆయిల్ ట్యాంకర్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల వర్షపునీరు పెట్రోల్, డీజిల్ ట్యాంకుల్లో చేరి ఆయిల్లో కలిసిపోతుండగా ఆ కల్తీ ఆయిల్నే వాహనాలకు వేస్తున్నారు. ఇటీవల పెట్రోల్ బంకుల్లో ఈ తరహా కల్తీతో అనేక వాహనాలు మరమ్మతులతో మూలకు చేరాయి. చోడవరం, వెంకన్నపాలెం, వడ్డాది, రావికమతం, మాడుగుల, అనకాపల్లి, సబ్బవరం, యలమంచిలి, తాళ్లపాలెం, నర్సీపట్నం, పెందుర్తి ప్రాంతాల్లో బంకుల్లో ఆయిల్ కల్తీ జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. బంకులను ఎప్పటికప్పుడు పరిశీలించి, తనిఖీలు చేయాల్సిన విజిలెన్స్, రెవిన్యూ,కొలతలు–తూనికలు, పౌరసరఫరాల శాఖాధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవల కాలంలో ఈ శాఖల తనిఖీలు మొక్కుబడిగానే ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు లేకపోవడం వల్ల పెట్రోల్ బంకుల యజమానులు ఇష్టారాజ్యంగా ఆయిల్ కల్తీలకు, కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ ఆయిల్ వల్ల వాహనాల ఇంజిన్ స్ట్రక్ అయిపోయి మరమ్మతులతో వస్తున్నాయి. ఆయిల్ సాంద్రత (డెన్సిటీ)లో తేడాలు ఉండడం వల్ల కల్తీ ఆయిల్తో ఇంజన్లు దెబ్బతింటున్నాయి. కొలతల్లో భారీ మోసాలు చేస్తున్నారు. ముందుగా ఆయిల్ పంపింగ్ చేసే మిషన్ల వద్ద పాయింట్ల రీడింగ్లో ఎడ్జిస్టింగ్ చేస్తున్నారు. అసలే లీటర్ పెట్రోల్ ధర రూ.108.41 ఉండగా డీజిల్ ధర రూ. 98 ఉంది. ఇంత ఎక్కువగా ధరలు పెరిగిపోయిన పరిస్థితుల్లో రీడింగ్లో మోసాలు, ఆయిల్లో కల్తీలతో రూ.వేలకువేలు పోసి కొన్న వాహనాలు అర్ధంతరంగా మూలకు చేరడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతుంది. తక్షణం పెట్రోల్ బంకుల్లో ఆయిల్ కల్తీ, కొలతల్లో మోసాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని, కల్తీని అరికట్టాలని వాహదారులు కోరుతున్నారు. -
చూసిన కనులదే భాగ్యం
నక్కపల్లి: కల్యాణకాంతులతో ఉపమాక దేదీప్యమా నంగా దర్శనమిచ్చింది. కోనేటిరాయుడి వార్షిక తిరుకల్యాణం శుక్రవారం అర్ధరాత్రి అంగరంగవైభవంగా జరిగింది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరస్వామి కల్యాణఘట్టాన్ని తిలకించేందుకు భక్తకోటి తెల్లవార్లు మేల్కోనిఉంది. ప్రతిఏటా ఫాల్గుణశుద్ధ ఏకాదశినాడు జరిగే వెంకన్న వార్షిక కల్యాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఉపమాకకు చెందిన అర్చక స్వాములు వేదపండితులు,గొట్టుముక్కల వరప్రసాద్, సంకర్షణ పల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు ఈ కల్యాణ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. కల్యాణానికి ముందుగా వేంకటేశ్వరస్వామిని, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఎదురెదురుగా ఉంచి, పెళ్లి మాటల తంతును నిర్వహించారు. ఈ సన్నివేశంలో స్వామివారి గొప్పతనాన్ని, గుణగణాలను,సౌశీల్యాన్ని, అమ్మవార్ల గుణగణాలను, ఔన్నత్యాన్ని ప్రముఖ తెలుగుపండితురాలు డాక్టర్గొట్టుముక్కల గాయత్రీ దేవి భక్తుల కళ్లకు కట్టినట్టు వివరించారు. కట్నకానుకలను, పెళ్లిమాటల కార్యక్రమాన్ని భక్తుల హర్షద్వానాల మధ్య నిర్వహించారు.అనంతరం ఉభయ నాంచారులతోకూడిన స్వామివారిని పెద్ద రథంపై ఉంచి రథోత్సవం నిర్వహించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. రథోత్సవం పూర్తయిన తర్వాత కల్యాణతంతు ప్రారంభమైంది. రాజగోపురం పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్ద కల్యాణమహోత్సవం నిర్వహించారు. తిరుపతినుంచి ప్రత్యేకంగా వచ్చిన అర్చక స్వాములు వేదాలను పఠించారు. స్వామివారికి టీటీడీ తరఫున అధికారులు పట్టవస్త్రాలు సమర్పించారు. జిల్లానలుమూలలతోపా టు, ఇతర జిల్లాలనుంచి వచ్చిన వేలాది మంది భక్తులు తెల్లవార్లు కల్యాణాన్ని వీక్షించారు. కల్యా ణోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నక్కపల్లి,పాయకరావుపేట, అడ్డురోడ్డు సీఐలు మురళి,రామకృష్ణ అప్పన్న ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు.తెల్లవార్లు జాతర జరిగింది. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన తోడపెద్దులతో సంబరం నిర్వహించారు.కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు శుక్రవారం ఉదయం ఉపమాక చేరుకున్న భక్తులు అర్ధరాత్రి కల్యాణం అనంతరం శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకుని తిరుగుప్రయాణమయ్యారు. -
ఆ
జాతీయ స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలకు ముగ్గురు ఎంపిక రావికమతం: విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి 7వ పారా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల్లో రావికమతం మండలానికి చెందిన విద్యార్థినులు గూనురు ఆదిలక్ష్మి, రాజాన మానస,నమ్మి హేమ దుర్గ విజయ కేతనం ఎగురవేసి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్, మేడివాడ హైస్కూల్ ప్రత్యేక ఉపాధ్యాయుడు బొడ్డు మహాలక్ష్మి నాయుడు శనివారం తెలిపారు. వచ్చేనెల 6వ తేదీ నుంచి హైదరాబాద్లో జరగనున్న నేషనల్ లెవల్ బ్యాడ్మింటన్ పోటీల్లో వీరు పాల్గొంటారని ఆయన చెప్పారు. చేతులు జోడించి అడుగుతున్నాం...చదువుల గుడి పూర్తి చేయండి -
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
విద్యార్థులకు సూచనలు ఇస్తున్న డీఈవో అప్పారావు నాయుడు పాయకరావుపేట: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని డీఈవో జి.అప్పారావు నాయుడు తెలిపారు. మండలంలో మంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలన్నారు. టెన్త్ పరీక్షలు మార్చి 16న ప్రారంభమవుతాయని, ఇంకో 15 రోజులు మాత్రమే సమయం ఉందని తెలిపారు. ఈ 15 రోజులు ఎంతో కీలకమని, ప్రణాళిక ప్రకారం చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రమేష్బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఏపీఐఐసీ భూముల్లో మట్టి, గ్రావెల్ తవ్వకాలు
మాకవరపాలెం: ఏపీఐఐసీ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్నాయి. మండలంలోని రాచపల్లి రెవెన్యూ పరిధిలో ఏపీఐఐసీకి చెందిన 290 ఎకరాల భూమి ఉంది. అయితే రామన్నపాలెం శివారు వెంకయ్యపాలెం వద్ద ఈ భూముల్లో వారం రోజులుగా రాత్రివేళల్లో మట్టి, గ్రామవెల్ను పొక్లెయిన్లతో తవ్వి తరలించుకుపోతున్నారు. అయినా సంబంధిత అధికారులు ఈ తవ్వకాలను అడ్డుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ నుంచి తరలిస్తున్న మట్టి, గ్రావెల్ను సమీప గ్రామాల్లోని భూములు, వివిధ నిర్మాణాలు చేపట్టే స్థలాలను కప్పివేసేందుకు తరలిస్తున్నారు. రాత్రి వేళల్లో అయితే ఎవరూ పట్టించుకోరనే ఉద్ధేశ్యంతో మట్టి మాఫియా ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. మట్టి, గ్రావెల్ తవ్వకాలతో ఈ ప్రాంతంలో భారీ ఎత్తున ఏర్పడిన గోతుల్లో రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి నీరు చేరి ప్రమాదకరంగా మారాయి. ఇటుగా గడ్డి మేసేందుకు వచ్చే పశువులు ఏమాత్రం ఇందులో పడినా మృత్యువాత పడతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతం నుంచి గ్రావెల్ తరలిస్తున్న వారిపై కేసులు పెట్టారు. ప్రస్తుతం ఎవరూ పట్టించుకోకపోవడంతో దర్జాగా తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రభుత్వానికి చెందిన ఈ ఏపీఐఐసీ భూముల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకోవడంతో పాటు మట్టిని తరలించేవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘మైనింగ్ మాఫియాతో టీడీపీ, జనసేన కుమ్మక్కు’
నర్సీపట్నం: మైనింగ్ మాఫియాతో టీడీపీ, జనసేన నేతలు కుమ్మకై ఆదివాసీ భూములను కబళిస్తున్నారని సీపీఐఎంఎల్ లిబరేషన్ పొలిట్బ్యూరో సభ్యుడు వి.శంకర్ మండిపడ్డారు. స్థానిక ఎన్జీవో హోమ్లో శనివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనింగ్ మాఫియా రెచ్చిపోతూ గిరిజనుల భూములను కాజేస్తోందని తెలిపారు. ఆదివాసీ గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. 5వ షెడ్యూల్లో చేర్చకపోవడం వల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అటవీ హక్కుల చట్ట సవరణకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.చట్టర్జీపురం ఆదివాసీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్రకమిటీ సభ్యుడు డి.హరినాఽథ్ మాట్లాడుతూ మైనింగ్ మాఫీయాను కట్టడి చేసేందుకు ఆదివాసీలు ఉద్యమించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి బుగతాబంగార్రాజు మాట్లాడుతూ ఈ సమస్యలపై మార్చి 30న ‘చలో నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం’ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా 21 మందితో జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా కార్యదర్శిగా కోసూరిరాజు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రకమిటీ సభ్యులు ఉదయ్కిరణ్, కె.జనార్దన్, కేదారి సత్య, కడాలి రాజేశ్వరి, బాలరాజు, పవన్కుమార్, చంటి, రాజు తదితరులు పాల్గొన్నారు. -
నందం.. త్మీయత.. వేదన
ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణం.. వార్డు ప్రజలతో పెనవేసుకున్న అనుబంధం.. నగర అభివృద్ధిలో పంచుకున్న భాగస్వామ్యం.. ఇవన్నీ ఒకెత్తయితే, మరో పక్షం రోజుల్లో పదవి నుంచి దిగిపోతున్నామన్న భావన వారి మనసులను బరువెక్కించింది. ఇంకొన్ని పనులు మిగిలిపోయాయే.. ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేకపోయామే అన్న ఆవేదన వారి మాటల్లో కనిపించింది. గౌరవప్రదంగా వీడ్కోలు పలికేలా కనీసం ఆరంభ దశలో ఉన్న పనులైనా పూర్తి చేయండంటూ అధికారులను వారంతా అభ్యర్థించారు. ఆనందం, ఉద్వేగం, నిరాశ.. ఇలా కలగలిపిన భావోద్వేగాల మధ్య జీవీఎంసీ ప్రస్తుత పాలకవర్గ చిట్టచివరి సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. – డాబాగార్డెన్స్ (విశాఖ)చివరి సమావేశం కావడంతో కౌన్సిల్ హాల్లో క్రమశిక్షణ కంటే ఆత్మీయ పలకరింపులకే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశానికి మేయర్ పీలా శ్రీనివాసరావు కాస్త ఆలస్యంగా రావడంతో 11.30 గంటలకు సభ మొదలైంది. ఈలోపు సభ్యులంతా పిచ్చాపాటి కబుర్లు, సెల్ఫీలతో సందడి చేశారు. సభకు హాజరైన ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సైతం సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ ఫొటోలు దిగారు. సుదీర్ఘంగా జీరో అవర్.. సమావేశం ప్రారంభమైన వెంటనే మేయర్ జీరో అవర్ను ప్రకటించారు. సభ్యులకు తమ వార్డుల సమస్యలు చెప్పుకునేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో ఉదయం 11.30కి మొదలైన జీరో అవర్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన అజెండా చర్చ రాత్రి 8 గంటల వరకు సాగింది. ఈ సమావేశంలో మొత్తం 37 అజెండా అంశాలతో పాటు మరో 30 టేబుల్ అంశాలకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. ఆటలొద్దు.. టూర్కే వెళ్దాం చివరి కౌన్సిల్లో మహిళా కార్పొరేటర్లు పార్టీలకతీతంగా ఏకమయ్యారు. ఐదేళ్లుగా సభలో ప్రజాసమస్యలపై గొంతెత్తిన వీరంతా ఆఖరి రోజున చిరునవ్వులు చిందిస్తూ ఆప్యాయతలు పంచుకున్నారు. ముగింపు సందర్భంగా మూడు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహిద్దామన్న మేయర్ ప్రతిపాదనను వారు తిరస్కరించారు. తమకు ఆటలు వద్దని, అందరినీ టూర్కు తీసుకెళ్లాలని పట్టుబడుతూ మేయర్ పోడియంను చుట్టుముట్టారు. జీరో అవర్ జరుగుతున్నా.. వినకుండా కమిషనర్ కేతన్గార్గ్కు వినతిపత్రం అందజేశారు. ఉన్నత చదువులు చదివిన అధికారుల ముందు, పెద్దల ముందు కూర్చుని మాట్లాడే స్థాయికి తాము చేరడానికి తమ భర్తల 0సహకారం మరువలేనిదని బీజేపీ కార్పొరేటర్ గంకల కవిత గుర్తు చేయగా.. మిగిలిన మహిళా సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు పలుకుతూ తమ భర్తలకు, ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
నేడు ఘాట్రోడ్లో మోదకొండమ్మ పాదాలు తీర్థం
ఘాట్రోడ్ జంక్షన్లో వెలసిన మోదకొండమ్మ పాదాలు మాడుగుల: ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఘాట్రోడ్ జంక్షన్లో వెలసిన మోదకొండమ్మ పాదాలు తీర్థాన్ని వర్తక సంఘం,ఉత్సవ కమిటీ, ఆటో యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయానికి రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు. తీర్థం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహించనున్నట్టు ఉత్సవ కమిటీ తెలిపింది. అధిక సంఖ్యలో భక్తులు ఉత్సవంలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకోవాలని కమిటీ కోరింది. ఆది సోమ -
విశాఖ రైల్వే గుండెకోత
● ఆ రెండింటినీ రాయగడకే అప్పగించేసిన రైల్వే బోర్డు ● కాపాడుకోవడంలో చంద్రబాబు సర్కారు విఫలం ● తుది హద్దులు ఖరారు చేసిన కేంద్రం ● విశాఖ డివిజన్ పరిధి 401.68 కిలోమీటర్లు ● రాయగడ డివిజన్ పరిధి 704.75 కిలోమీటర్లుగా నిర్థారించిన బోర్డు సాక్షి, విశాఖపట్నం: అనుకున్నదంతా అయిపోయింది.. చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం ముందు మరోసారి మోకరిల్లి.. విశాఖ రైల్వే డివిజన్ ఆదాయ వనరులను రైల్వే బోర్డుకు తాకట్టు పెట్టేసింది. దశాబ్దాల కలగా ఉన్న విశాఖ రైల్వే డివిజన్ నెరవేరే రోజులు సమీపిస్తున్నాయన్న ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. శతాబ్దాల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ విచ్ఛిన్నమైపోయింది. విశాఖ డివిజన్కు రావాల్సిన ఆదాయాన్నంతా ఒడిశా తీసుకెళ్లిపోతోంది. అరకు, కేకేలైన్ మొత్తాన్ని రాయగడ డివిజన్ పరిధిలో విలీనం చేసేస్తూ రైల్వే బోర్డు తాజాగా తుది ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పర్యాటక ప్రాంతమంతా రాయగడకే.. కొత్తగా ప్రతిపాదించిన విశాఖపట్నం డివిజన్, రాయగడ డివిజన్ల మధ్య కిలోమీటర్ల వారీగా విభజనను అధికారులు ఖరారు చేశారు. అయితే.. ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి అత్యంత కీలకమైన అరకు ప్రాంతం విశాఖ డివిజన్ పరిధి నుంచి రాయగడ పరిధిలోకి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత విభజన లెక్కల ప్రకారం.. సరకు రవాణా పరంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే కేకే (కొత్తవలస–కిరండూల్) లైన్ మొత్తం.. రాయగడ డివిజన్ పరిధిలోకి వెళ్లిపోయింది. కేకే లైన్లో కొత్తవలస యార్డు మినహాయించి.. పర్యాటక ప్రాంతాలైన బొర్రాగుహలు, అరకు, కిరండూల్ వరకు ఉన్న సుదీర్ఘ మార్గం అంతా రాయగడ డివిజన్ కిందికే వెళ్లింది. దీనివల్ల విశాఖపట్నం తన ఆదాయ వనరులలో ప్రధానమైన పర్యాటక, కార్గో రైల్వే మార్గాన్ని కోల్పోయింది. చంద్రబాబు కూటమి ఎంపీల వైఫల్యం వల్లే విశాఖ డివిజన్ నష్టపోయింది. విశాఖ డివిజన్ ప్రయోజనాల కోసం ఏనాడూ టీడీపీ, జనసేన ఎంపీలు లోక్సభలో గళమెత్తిన పాపాన పోలేదు. కేకేలైన్ చేజారింది.. అరకు వెళ్లిపోయింది..కొత్త జోన్కు వాల్తేరే కీలకం.. కానీ.! తూర్పు కోస్తా రైల్వే జోన్కు 1106.435 కిమీ విస్తీర్ణం, 2859.376 కి.మీ. ట్రాక్లైన్తో ఉన్న వాల్తేరు డివిజన్ బంగారు బాతుగుడ్డు లాంటిది. ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిపెద్ద డివిజన్ వాల్తేరు. ఏటా దాదాపు 3 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ. 17 వేల కోట్లు కాగా, ఇందులో రూ.10 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. దేశంలోనే సుమారు 300 డీజిల్ ఇంజన్లతో అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజిన్లతో భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ ఇది. ఇందులో సింహభాగం ఆదాయం ఐరన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. వాల్తేరు డివిజన్ పరిధిలో ఏటా సరకు రవాణా ద్వారా వచ్చే ఆదాయమంతా.. ఇప్పుడు రాయగడ డివిజన్కు సొంతమవుతుంది. దీనివల్ల కొత్తగా ఏర్పడే విశాఖ డివిజన్ ఆదాయం రూ.3 వేల కోట్లు కూడా దాటే అవకాశం లేదు. -
రిటైర్డ్ హోంగార్డుకు రూ. 4.06 లక్షల ఆర్థిక సాయం
పదవీ విరమణ పొందిన హోంగార్డుకు ఆర్థిక సాయం అందజేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: విశేష సేవలందించి పదవీ విరమణ చేసిన హోంగార్డు రాజారావుకు తోటి సిబ్బంది రూ.4.06 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో కమ్యూనికేషన్ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన రాజరావుకు శనివారం ఎస్పీ తుహిన్ సిన్హా ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ పరిపాలన అధికారి సీహెచ్.తిలక్ బాబు, జూనియర్ అసిస్టెంట్ రమేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనంగా వెంకన్న కల్యాణం
● భారీగా తరలివచ్చిన భక్తులు ● గోవింద నామస్మరణతో మార్మోగిన గిరిజాంబ కొండ బుచ్చెయ్యపేట: అశేష భక్తుల గోవింద నామస్మరణ, మంగళవాయిద్యాల నడుమ ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి 153వ కల్యాణ మహాత్సవాలు శుక్రవారం రాత్రి అంగరంగవైభవంగా జరిగాయి. గురువారం రాత్రి అంకురార్పణ,ధ్వజారోహణ చేసి దొంగపెండ్లి నిర్వహించారు. శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు కుటుంబ సభ్యులకు తొలిదర్శనం కల్పించారు. కల్యాణోత్సవాల సందర్భంగా గోవింద నామ స్మరణతో వడ్డాది గిరిజాంబ కొండ మార్మోగింది. తెల్లవారు జాము మూడు గంటల నుంచి రాష్టం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు వేంకటేశ్వరస్వామి తొలి దర్శనం కోసం ఆలయం వద్ద బారులు తీరారు. మెట్ల మార్గం,కొండ ముందు,వెనక ఉన్న సిమ్మెంట్ రోడ్డు మార్గం నుంచి భక్తులు తరలివెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. రాత్రి గిరిజాంబ కొండపై ఆలయ మండపంలో స్వామి వారి కల్యాణంను వేడుకగా నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని దగ్గర నుంచి చూసిన భక్తులు పులకించిపోయారు. తిరువీధి ఉత్సవంలో స్వామి వారి పల్లకి మోయడానికి పలువురు పోటీపడ్డారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి,కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, బుచ్చెయ్యపేట, రావికమతం,కొత్తకోట,రోలుగుంట ఎస్ఐలు పలు శాఖల అధికార్లు స్వామివారిని దర్శించుకోగా దేవస్ధానం ఈవో శర్మ దగ్గరుండి పూజా కార్యక్రమాలు చేయించి ప్రసాదాలు అందించారు. ఆలయ ధర్మకర్త దొండా కన్నబాబు ఆరోగ్యం సహకరించకపోవడంతో అతని అన్న కుమారుడు శ్రీరామ్తో వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని నిర్వహించారు. -
నైతిక విలువలు పెంపొందేలా విద్యాభ్యాసం
మురళీనగర్(విశాఖ ఉత్తర): విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించుకునేలా విద్యాభ్యాసం జరగాలని అనకాపల్లి జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కె.ఇందిరాభారతి అన్నారు. విశాఖలోని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఫార్మసీ విద్యార్థుల ఫ్రెషర్స్ డే, వీడ్కోలు సమావేశం ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫార్మసీ విభాగం వైద్య రంగంలో కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. వెంకటరమణ మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకునే విధంగా ప్రయోగాత్మక అధ్యయనంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, ఫార్మసీ కాలేజీ పూర్వ విద్యార్థి ఇందిరాభారతిని ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఫార్మసీ విభాగాధిపతి జె.గోవిందరావు, జనరల్ సెక్షన్ హెడ్ డాక్టర్ పీఎం బాషా, ఎలక్ట్రికల్ విభాగం హెడ్ డాక్టర్ ఎం.నారాయణ, విద్యార్థి సలహాదారు ఎస్.వి.రమణ పాల్గొన్నారు. -
బాడీబిల్డింగ్లో కానిస్టేబుల్ సత్తా.. ఎస్పీ అభినందన
ఆరిలోవ(విశాఖ తూర్పు): బాడీబిల్డింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన కానిస్టేబుల్ జి.శ్రీనివాసరావును అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు. ఇటీవల విశాఖ సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో జరిగిన తొమ్మిదో మిస్టర్ ఆంధ్ర బాడీబిల్డింగ్ చాంపియన్షిప్–2026లో మాస్టర్స్ కేటగిరీలో అనకాపల్లి జిల్లాకు చెందిన కానిస్టేబుల్ జి.శ్రీనివాసరావు రజత పతకం సాధించారు. 2009 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం కై లాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్డ్ విభాగంలో పనిచేస్తూ జిల్లా పోలీస్ జిమ్ ట్రైనర్గా అధికారులు, సిబ్బందికి తర్ఫీదు ఇస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కై లాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీనివాసరావును ఎస్పీ సిన్హా సత్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ శ్రీనివాసరావు ఇంతవరకు 25 సార్లు మిస్టర్ ఆంధ్రగా నిలిచినట్లు తెలిపారు. 2013లో మిస్టర్ సౌత్ ఇండియా గోల్డ్ మెడల్ సాధించారన్నారు. వృత్తిపరమైన బాధ్యతలు నిర్వహస్తూ క్రీడలపై అంకితభావం కనబరచడం అభినందనీయమన్నారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, ఎస్బీ డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, మన్మధరావు, రమణమూర్తి, సంజీవిరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏయూలో అరాచక శక్తులను అరికట్టండి
కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ప్రజా సంఘాల, వామపక్ష పార్టీల నాయకులుమహారాణిపేట: ఆంధ్రా యూనివర్సిటీలో మత వైషమ్యాలు సృష్టించి, విద్యార్థులపై దాడులకు పాల్పడిన ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ శక్తులను తక్షణమే అరెస్టు చేయాలని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించి, ఏయూలోని విద్యార్థి, కార్మిక, దళిత సంఘాల జెండాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ధర్నాను ఉద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. రెహ్మన్, సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు, ప్రజాపోరు కార్యదర్శి మహిత మాట్లాడారు. విద్యపై ఏకాగ్రత వహించాల్సిన విశ్వవిద్యాలయంలో మత విద్వేషాలు రగిల్చి, విద్యార్థినిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులతో నీచమైన ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఏయూ ఎప్పుడూ మత సామరస్యానికి, విద్యా వికాసానికి నిలయమని, అటువంటి చోట అరాచకాలు సృష్టించడం దారుణమని ధ్వజమెత్తారు. అధికార గర్వంతో చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్న దుండగులపై పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని వారు ప్రశ్నించారు. రాజ్యాంగం, చట్టాలు వీరికి వర్తించవా? చంద్రబాబు ప్రభుత్వం వీరికి మినహాయింపు ఇచ్చిందా? అని నిలదీశారు. నిందితులను అరెస్టు చేయకపోతే ప్రభుత్వం అరాచకాలను ప్రోత్సహిస్తుందనే భావన ప్రజల్లో కలుగుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని, ఏయూలో ప్రశాంత వాతావరణాన్ని పునరుద్ధరించాలని నేతలు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో సీపీఎం నాయకులు బి.గంగారావు, ఆర్.కె.ఎస్.వి.కుమార్, పి.మణి, వి.కృష్ణారావు, పి.పైడిరాజు, బి.రమణి, క్షేత్రపాల్, వనజ, చంద్రశేఖర్; సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) నాయకులు నిర్మల, వెంకటలక్ష్మి తదితరులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
పాముకాటుతో బాలుడి మృతిపై సమగ్ర విచారణ
కశింకోట : ఇటీవల పాము కాటుతో మృతి చెందిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని తాళ్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పాము కాటుకు గురైన బాలుడు కిరణ్ను తీసుకురాగా సిబ్బంది వైద్యం అందించకపోవడం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ మోసయ్యపేటకు చెందిన తాతయ్య కొర్ని నాయుడు, అమ్మమ్మ గోవిందమ్మ ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయమై పీహెచ్సీని శుక్రవారం సందర్శించి విచారణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీహెచ్సీలో అత్యవసరమైన సేవలందించడానికి పాము, కుక్క కాటు వాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒకవేళ వాక్సిన్ కొరత ఉంటే సబ్బవరం స్టాల్ నుంచి అందిస్తారన్నారు. అత్యవసరమైన వాక్సిన్ ప్రతి పీహెచ్సీల్లో అందుబాటులో ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు కూడా పీహెచ్సీలో 24 గంటలు సేవలందిస్తున్నామన్నారు. అలాగే జాతీయ రహదారికి దగ్గరలో ఉన్న ఈ పీహెచ్సీలో కూడా సేవలందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిబ్బంది కొరత కూడా లేకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రోగుల పట్ల సిబ్బంది సంయమనంగా వ్యవహరించాలని, అసభ్యకరంగా, దురుసుగా మాట్లాడితే సహించబోమన్నారు. ఎవరైనా ఈ విషయమై ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మరోసారి కలసి కిరణ్ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు. -
కమనీయం కన్యావరుణ సంవాదం
● మంత్రముగ్దులను చేసిన ఎదురు సన్నాహ మహోత్సవం ● నేత్ర పర్వంగా వెంకన్న ధ్వజారోహణం ● ఘనంగా రథోత్సవంనక్కపల్లి: ఉపమాక వెంకన్న కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన కన్యావరుణసంవాదం (ఎదురు సన్నాహ మహోత్సవం) వేలాది మంది భక్తులను మంత్ర ముగ్ధులను చేసింది.ఉపమాక సింహాద్రాచార్యులు ఇంటివద్ద జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠనాథుని తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా తెల్లవారు జామున 2 గంటలకు గరుడాద్రిపై షడ్భుజాలతో అశ్వారూఢుడై వెలసిన మూలవిరాట్కు పంచామృతాలతో అభిషేకం, తొలిపూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. తదుపరి స్వర్ణాభరణాలతో అలంకరించిన శ్రీదేవి,భూదేవి సమేత వేంకటేశ్వర స్వామిని పెద్దపల్లకిలో ఉపమాక మాడవీధుల్లో తిరువీధిసేవ నిర్వహించారు.స్వామివారి కల్యాణానికి భక్తులతోపాటు అష్టదిక్పాలకులను ఆహ్వానించారు. భక్తులు కానుకలు మొక్కుబడులు సమర్పించుకున్నారు. తిరువీధి సేవ అనంతరం ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్, అర్చక స్వాములు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు వేదమంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. ధ్వజపటాన్ని ఎగురు వేస్తూ అష్టదిక్పాలకులు, దేవతలను స్వామివారి కల్యాణానికి ఆహ్వానించారు. ధ్వజారోహణతో కల్యాణోత్సవాలు లాంఛనంగా ప్రారంభమైనట్టు అర్చక స్వాములు తెలిపారు.ి అనంతరం బేరీ పూజ, ద్రవిడ వేద ప్రభంద పారాయణం నిర్వహించారు. బాలభోగ, రాజభోగనివేదనలు, తీర్థగోష్టి, ప్రసాద నివేదన, వినియోగం వంటి కార్యాక్రమాలు జరిగాయి. క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామిని,విశాఖ నుంచి తెచ్చిన ఆభరణాలను స్వామివారి ఉత్సవమూర్తులకు అలంకరించి ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న అద్దాల మండపంలో ఉంచి భక్తులకు దర్శనం కల్పించారు. నేత్రపర్వంగా ఎదురు సన్నాహమహోత్సవం కల్యాణోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి ఎదురుసన్నాహమహోత్సవం జరిగింది. దీనినే కన్యావాద సంవాదం( పెళ్లిమాటల తంతుగాపేర్కొంటారు). వేంకటేశ్వరస్వామిని గరుడ వాహనంపైన, ఉభయదేవేరులను సప్పరం వాహనంపై ఉంచి చిన్నవీధి, పెద్దవీధులలో ఊరేగించారు. ఉపమాక సింహాద్రాచార్యులు ఇంటివద్ద స్వామివారిని, ఉభయనాంచారులను ఎదురెదురుగా ఉంచి పెళ్లిమాటలు, కట్నకానుకల కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్రాంత తెలుగు పండిట్, అభినవ మొల్ల డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి స్వామివారి, అమ్మవార్ల గుణగణాలను, కీర్తిప్రతిష్టలను వివరించిన సన్నివేశం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సన్నివేశాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఉపమాక వీధులు కిక్కిరిసిపోయాయి. కల్యాణం వరకు ఉండలేని భక్తుల ఈ పెళ్లిమాటలతంతును వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎదురుసన్నాహ మహోత్సవం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన వెంకటేశ్వరస్వామిరిని రథంపై ఉంచి తిరువీధుల్లో రథోత్సవం నిర్వహించారు. -
ఎస్పీ సంపర్క్కు 10 మంది పోలీసులు వినతి
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో హోంగార్డు నుంచి కానిస్టేబుల్ వరకూ శుక్రవారం ఎస్పీ సంపర్క్ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది సెల్ నంబర్.9346912011 నంబరకు 10 మంది పోలీస్ సిబ్బంది ఉదయం 11 నుంచి 12 గంటల వరకూ అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావుకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ 10 మంది పోలీసులు వారి వ్యక్తిగత, కుటుంబ, వృత్తిపరమైన సమస్యలు తెలియజేయడం జరిగిందన్నారు. సిబ్బంది సర్వీస్ పరమైన పోస్టింగ్స్, బదిలీలు, సెలవులు విషయంలో మాట్లాడడం జరిగిందన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు 10 మంది పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం ఏవో తిలక్బాబు, సూపరింటెండెంట్లు గిరి, బీమాబాయి, ప్రేయర్ సన్, ఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు. -
మార్చి 2న పంచదార్లకు జూపూడి రాక
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పంచదార్లకు మాజీ ఎంఎల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రానున్నారు. పంచదార్లకు చెందిన దళితుల డీ పట్టా భూముల్ని రెవెన్యూ అఽధికారులు రికార్డు పరంగా స్వాధీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో బాధిత దళిత రైతు కుటుంబాలకు చెందిన వారు 26 రోజుల నుంచి ధర్నా నిర్వహిస్తున్నారు. ఎటువంటి పరిహారం ఇవ్వకుండా, దళిత రైతు కుటుంబాలకు చెందిన వారి సమ్మతి లేకుండా భూముల్ని స్వాధీనం చేసుకోవడంలో కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ దళిత రైతులు ఆగ్రహంతో ఉన్నారు. వీరి నిరసనను రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం, కూటమి నేతలు కనీసం సంఘీభావం ప్రకటించకపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు, దళిత సంఘాలు నిరసనకు అండగా నిలిచాయి. పంచదార్ల రైతులకు మరింత మద్దతు ప్రకటించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మాజీ ఎంఎల్సీ జూపూడి ప్రభాకర్ విచ్చేయనున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఐడీ బాబు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
అనకాపల్లి: జీవీఎంసీ విలీనగ్రామైన కొప్పాక బ్రిడ్జి సమీపంలో సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం గుర్తించినట్లు పట్టణ సీఐ జి.ప్రేమ్ కుమార్ తెలిపారు. కొప్పాక గ్రామ ఇన్చార్జ్ వీఆర్వో యాదల అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. సుమారు 5 నుంచి 7 రోజుల క్రితం మృతిచెంది ఉంటాడని, మృతుడు శరీరంపై ఎటువంటి గాయాలు లేవని, శరీరంబాగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉందని తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఖనం చేసినట్టు సీఐ చెప్పారు. -
జీడి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
దేవరాపల్లి: జీడి పంటకు మద్దతు ధర కల్పించి, రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నాన్ షెడ్యూల్ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర డిమాండ్ చేశారు. మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు బోడిగరువులో స్థానిక జీడి రైతులతో కలిసి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీడి పిక్కలకు మద్దతు ధర లేక రైతులు పడుతున్న కష్ట, నష్టాలను అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. కిలో రూ. 200 చొప్పున మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతర దేశాల నుంచి జీడిపిక్కల దిగుమతులను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించక పోవడంతో దళారీ వ్యాపారుల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడి పంటకు మద్దతు ధరతో పాటు మార్కెట్ సౌకర్యం కల్పించి, జీడి రైతుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలన్నారు. జీడికి మద్దతు ధర కల్పించకుంటే జీడి రైతులతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని దొర తెలిపారు. ఈ కార్యక్రమంలో పోయిరి రాము, దేవుడు, పోయిరి దారప్ప, కొనుసు రవీంద్ర, సీవేరి అప్పారావు తదితర గిరిజన జీడి రైతులు పాల్గొన్నారు. -
పాత కక్షలతో యువకుడి హత్య
మాడుగుల రూరల్: పాత కక్షలతో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని గాదిరాయి జంక్షన్ వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ జి. నారాయణరావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో జంపెన గ్రామానికి చెందిన పెచ్చేటి ఉపేంద్ర(27) గురువారం రాత్రి జంపెన నుంచి కింతలి వెళ్తుండగా, మార్గ మధ్యలో గాదిరాయి విద్యుత్ ఉపకేంద్రం వద్ద మూడు రోడ్ల కూడలిలో గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో తలపై తీవ్రంగా కొట్టారు. దీంతో ఉపేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికుల సమాచారం మేరకు మాడుగుల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి పంచనామా జరిపి, పోస్టుమారానికి అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని శుక్రవారం మధ్యాహ్నం అనకాపల్లి డీస్పీ ఎం.శ్రావణి, కె.కోటపాడు సీఐ కె.కృష్ణతో పాటు క్లూస్ టీమ్ సభ్యులు సందర్శించారు. మృతుడికి వివాహం కాలేదు. తల్లిదండ్రులున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ జి.నారాయణరావు మాట్లాడుతూ పాతకక్షల కారణంగా ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
రోజులేనా..!
మళ్లీ పాతడాబాగార్డెన్స్: జీవీంఎసీ ప్రస్తుత పాలకవర్గ ప్రస్థానం ముగింపు దశకు చేరుకుంది. 2021లో మొదలైన ఈ ఐదేళ్ల ప్రయాణంలో శనివారం నిర్వహించనున్న సర్వసభ్య సమావేశం అత్యంత కీలకం కానుంది. ప్రస్తుత మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఈ చిట్టచివరి సమావేశం జరగనుంది. ఈ భేటీలో నగరాభివృద్ధికి సంబంధించి 37 ప్రధాన అజెండా అంశాలపై చర్చించి సభ్యులు ఆమోదం తెలపనున్నారు. ముఖ్యంగా వీధి దీపాల నిర్వహణ, వివిధ సర్వీసు అంశాలు మరియు పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు ఈ సమావేశంలో మోక్షం లభించనుంది. నలుగురు మేయర్లు... ఎన్నో రాజకీయ మలుపులు ఈ ఐదేళ్ల కాల పరిమితిలో విశాఖ నగర పాలన ఎన్నో రాజకీయ పరిణామాలకు వేదికై ంది. 2021 ఏప్రిల్ నుంచి సుమారు నాలుగేళ్ల పాటు వైఎస్సార్ సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్ హోదాలో కౌన్సిల్ సమావేశాలను నడిపించారు. ఆమె హయాంలో జియ్యాని శ్రీధర్, కట్టుమూరి సతీష్ డిప్యూటీ మేయర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రాజకీయ సమీకరణల మార్పుతో గతేడాది ఏప్రిల్ 28న పీలా శ్రీనివాసరావు మేయర్గా, దళ్లి గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్గా పగ్గాలు చేపట్టారు. కట్టుమూరి సతీష్ మాత్రం ఐదేళ్ల పాటు డిప్యూటీ మేయర్గా తన పదవిలో కొనసాగడం గమనార్హం. వచ్చే నెల 18తో ఈ పాలకవర్గ గడువు అధికారికంగా ముగియనుంది. పంచాయతీల విలీనం.. ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత ప్రస్తుత పరిస్థితుల్లో జీవీఎంసీకి తక్షణమే ఎన్నికలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 64 పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఈ విలీన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైతే, వార్డుల పునర్విభజన, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా, మార్చి 7వ తేదీ తర్వాత కౌన్సిల్ సమావేశాలకు అవకాశం లేకపోవడంతో, నగరం మరోసారి సుదీర్ఘ కాలం పాటు అధికారుల చేతుల్లోనే ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మేయర్ల చారిత్రక నేపథ్యం విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఎందరో ప్రముఖులు మేయర్లుగా సేవలు అందించారు. 1981లో బీజేపీకి చెందిన ఎన్.ఎస్.ఎన్ రెడ్డి తొలి మేయర్గా బాధ్యతలు చేపట్టగా, ఆ తర్వాత డి.వి. సుబ్బారావు (టీడీపీ), సబ్బం హరి (కాంగ్రెస్) వంటి నేతలు పనిచేశారు. విశాఖకు తొలి మహిళా మేయర్గా రాజాన రమణి ఐదేళ్ల పాటు రికార్డు సృష్టించారు. గ్రేటర్ విశాఖగా ఆవిర్భవించిన తర్వాత పులుసు జనార్థన్ మేయర్గా సేవలందించగా, సుదీర్ఘ విరామం తర్వాత 2021లో గొలగాని హరి వెంకటకుమారి మేయర్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పీలా శ్రీనివాసరావు ఈ ఐదేళ్ల కాలక్రమానికి ముగింపు పలకబోతున్నారు. ఎన్నికల సందిగ్ధంలో గ్రేటర్ విశాఖ జీవీఎంసీ ‘చివరి’ అంకం: ఐదేళ్ల ప్రస్థానానికి నేడే ముగింపు పలకనున్న కౌన్సిల్ 37 అంశాలతో అజెండా మేయర్ కాలానికి మోగిన ముగింపు గంటమళ్లీ అధికారుల పాలన దిశగా? విశాఖలో ఉత్కంఠ ప్రస్తుత పాలకవర్గ గడువు ముగియడానికి మరో పక్షం రోజులు మాత్రమే సమయం ఉండటంతో, నగరం మళ్లీ అధికారుల పాలనలోకి వెళ్తుందా అనే చర్చ జోరందుకుంది. గత చరిత్రను పరిశీలిస్తే..2012 నుంచి 2021 వరకు సుమారు ఎనిమిదేళ్ల పాటు ఎన్నికలు జరగక అధికారులే పాలన సాగించారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో సుదీర్ఘ కాలం పాటు ప్రత్యేకాధికారుల పరిపాలన కొనసాగింది. 2021లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడంతో మళ్లీ ప్రజాప్రతినిధుల పాలన అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండటం, పాలకవర్గ గడువు ముగిసిపోతుండటంతో మళ్లీ పాత రోజులు పునరావృతమవుతాయేమోనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
రచ్చకెక్కిన కూటమి విభేదాలు
అచ్యుతాపురం రూరల్ : కూటమిలో కుమ్ములాటలు తార స్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం నునపర్తి గ్రామంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పాటు పలువురు నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నునపర్తి పంచాయతీలో శుక్రవారం పలు అంశాలపై చర్చించేందుకు పంచాయతీ కార్యదర్శి మధు స్థానిక సచివాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల రెండున్నర సెంట్ల గ్రామ కంఠం భూమిపై టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య వివాదం జరిగింది. గ్రామ కంఠం అంశంపై హైకోర్టులో కేసు నడుస్తుండడంతో గ్రామ సభ అజెండాలో ఎలా పెడతారని, వెంటనే ఈ అంశాన్ని తొలగించాలని స్థానిక టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.దానికి పంచాయతీ కార్యదర్శి స్పష్టత ఇవ్వకుండా గ్రామ సభ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆయన తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహించి, నిరసన వ్యక్తం చేశారు. కార్యదర్శి ఈ విషయాన్ని సర్పంచ్ చుక్కా అనూరాధ(బీజేపీ) తెలియజేయడంతో ఆమె సమావేశం ప్రదేశానికి వచ్చారు. ఆమెను కూడా టీడీపీ నాయకులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అయితే బీజేపీకి చెందిన బీసీ మహిళా సర్పంచ్ చుక్కా అనూరాధ, కార్యదర్శి మధును టీడీపీ నేతలు నిర్బంధించారని బీజేపీ నాయకులు ఆరోపించారు. తాము గ్రామ కంఠం గురించి ప్రశ్నించామే తప్ప ఎవరీ నిర్బంధించలేదని టీడీపీ నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ నాయకులు వంటావార్పు చేశారు. ఈ వివాదం అర్ధరాత్రి వరకూ కొనసాగింది ఇంతజరగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు, ఎంపీడీవో చూసీచూడనట్టు వ్యవహరించారు. -
తూటిపాలలో ఇసుక తవ్వకాల అడ్డగింత
స్వాధీనం చేసుకున్న జేసీబీతో తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది మాకవరపాలెం: ఇసుక అక్రమ తవ్వకాలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని తూటిపాల శివారులో సర్పానదిని ఆనుకున్న భూముల్లో ఇసుక తవ్వకాలకు స్థానికులు గురువారం జేసీబీతో ఏర్పాట్లు చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే తహసీల్దార్ వెంకటరమణ తమ సిబ్బందితో తవ్వకాల ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఇసుక తరలింపునకు రోడ్డు వేయడంతోపాటు మడుల్లో ఇసుకపై ఉన్న మట్టిని తొలగించే పనులు చేస్తున్న జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారుల రాకతో జేసీబీ డ్రైవర్ పరారయ్యాడు. జేసీబీని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వీఆర్ఏలను అక్కడే ఉంచామని తహసీల్దార్ తెలిపారు. ఆర్ఐ చక్రపాణి, వీఆర్వోలు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో జిల్లా క్రీడాకారులప్రతిభ
కశింకోట : రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలో జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు వేర్వేరు విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయమని కన్నూరుపాలేనికి చెందిన ప్రగతి చెస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు డి.ఎస్ గాయత్రిదేవి, చెస్ సీనియర్ నేషనల్ ఆర్బిటర్ డి.వి.సుధీర్కుమార్ అన్నారు. ఇటీవల తిరుపతిలో స్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( ఎస్ఎఎపి) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు జరగ్గా తమ అసోిసియేషన్ ప్రోత్సాహంతో వెళ్లిన జిల్లాలోని ఎస్.రాయవరానికి చెందిన శ్రావ్యశ్రీ (15 ఏళ్లలోపు విభాగం)లో ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇదే గ్రామానికి చెందిన భీమరశెట్టి సహస్ర (13 ఏళ్ల లోపు విభాగం), అనకాపల్లికి చెందిన వెంకటేశ్వరరావు (17 ఏళ్ల లోపు విభాగం) తృతీయ స్థానం సాధించారన్నారు. వీరిలో ఫిడే రేటింగ్ సాధించిన శ్రావ్యశ్రీ త్వరలో నాగాలాండ్లో జరగనున్న జాతీయ టీం ఛాంపియన్షిప్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. -
ఆదర్శ పాఠశాలలు పిలుస్తున్నాయి
నర్సీపట్నం: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశానికి గాను ఏపీ మోడల్ స్కూల్స్ విద్యా సంస్థ వారు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు, ఎయిడెడ్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఆరు నుంచి 12వ తరగతి వరకు మంచి విద్యను అభ్యసించవచ్చు. క్రమశిక్షణతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటూ చదువుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకే ఆదర్శ పాఠశాలలకు ఏటా పోటీ పెరుగుతోంది. జిల్లాలో నర్సీపట్నం, కశింకోట, రావికమతం, మునగపాక, చీడికాడ మండలాల్లో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఒక్కోచోట వంద సీట్ల భర్తీకి గాను ఏటా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సీటు పొందేందుకు ఏటా వందల మంది విద్యార్థులు పోటీ పడతారు. అందులో అత్యధిక మార్కులు సాధించే వారికే సీటు లభ్యం అవుతుంది. అందుకే ఇప్పటి నుంచే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు దృష్టి పెడితే సీటు సాధించడం సులభమవుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అధునాతన సౌకర్యాలు.. పట్టణానికి దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలు, విశాలమైన గదులు, కంప్యూటర్ ల్యాబ్తో పాటు భౌతిక, జీవశాస్త్రం ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. ఆవరణలో విశాలమైన క్రీడా మైదానం ఉంది. ఏటా విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొని బహుమతులు సాధిస్తున్నారు. యోగాలో విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నారు. ఆదర్శ పాఠశాలల్లో సీటు సాధిస్తే ఉచిత విద్యతోపాటు వసతి, దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు అన్ని ప్రభుత్వం నుంచే అందిస్తారు. మార్చి 31 వరకు గడువు.. ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశానికి గాను ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు www.cre.ap.gov.in, www.apmr.apcfrr.i n అనే వెబ్సైట్ల ద్వారా సమర్పించాలి. ఏప్రిల్ 12 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. -
ఆలయాల ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళిక
నాతవరం: దేవాలయాలకు ఆదాయ వనరులు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని యలమంచిలి దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టరు డి. ఉమాదేవి తెలిపారు. నాతవరంలో గంగాదేవి నూకాలమ్మ దేవస్థానానికి చెందిన 13 ఎకరాల వ్యవసాయ భూములకు కౌలు వేలం పాట గురువారం స్థానిక రామాలయం వద్ద నిర్వహించారు. వేలంలో 11 మంది పాల్గొని రూ.5 వేల చొప్పున డిపాజిట్ చేశారు. గతేడాది ఈ భూములకు రూ.70 వేలు వేలం పాడగా, ఈ ఏడాది రూ.1. 48 లక్షలకు గ్రామానికి చెందిన గవిరెడ్డి అప్పల సత్యనారాయణ దక్కించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రూ. 25 లక్షలలోపు ఆదాయం ఉన్న ఆలయాలను సీ కేటగిరీలోకి ప్రభుత్వం మార్చిందన్నారు. తమ పరిధిలో ధూప, దీప నైవేద్యం కోసం 70 ఆలయాలకు ప్రతి నెలా రూ.10 వేల చొప్పున తమ శాఖ ద్వారా చెల్లిస్తుందన్నారు. మెట్ట భూములు ఆరేళ్ల వరకు కౌలుకు ఇస్తున్నామన్నారు. నర్సీపట్నం మండలంలో 70 ఎకరాలు సోలార్ ప్లాంటుకు ఇచ్చామన్నారు. సాగుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని, దీనివల్ల ఆదాయం రాకుండా భూములనీ నిరుపయోగంగా ఉన్నాయన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని కౌలు వేలం పాట పెంచామని, కమిషనర్ నుంచి ప్రత్యేకంగా అనుమతులు పొందాలన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రజల్లో భక్తిభావం పెరిగిందన్నారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం డివిజన్కు చెందిన దేవాదాయ ధర్మదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి ఈ.సాంబశివరావు, సూపర్వైజరు రామకృష్ణ, నాతవరం గంగాదేవి నూకాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు ధనాజీ, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ సమస్యలపై ఏపీటీఎఫ్ ధర్నా
చోడవరంలో ధర్నా చేస్తున్న ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులు చోడవరం: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేశారు. చోడవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మెయిన్రోడ్డు పక్కన ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి చోడవరం తాలూకా పరిధిలో ఉన్న చోడవరం, బుచ్చెయ్యపేట, చీడికాడ, మాడుగుల, రావికమతం, కె.కోటపాడు మండలాలకు చెందిన ఏపీటీఎఫ్ సంఘం ఉపాధ్యాయులంతా ఈ ధర్నాలో పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, 12వ పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, పీఆర్సీ కమిషన్ను నియమించే వరకూ 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, ఐఆర్ ప్రకటించాలని, రావలసిన అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని, ఈహెచ్ఎస్ పరిమితిని రూ. 25లక్షలకు పెంచాలని, బోధనేతర పనులు చెప్పే విధానాలను రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని వారు డిమాండ్ చేశారు. 2009 కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకూ ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేదని ఏపీటీఎఫ్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమరాన త్రినాఽథరావు అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు మోసూరి మహాలక్ష్మినాయుడు, జిల్లా కార్యదర్శి ఎ. ప్రసాదరావు, రాష్ట్ర కౌన్సిల్ విజయలక్ష్మి, శ్యాంకుమార్, మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆర్. చిరంజీవి, కె. మల్లేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు గొల్లు శ్రీనువాసరావు పాల్గొన్నారు. -
అక్రమ గ్రావెల్ క్వారీపై విచారణ
అందలాపల్లి కొండపై విచారణ చేస్తున్న మైన్స్ అధికారులు అచ్యుతాపురం రూరల్: మండలంలోని కొండకర్ల పంచాయతీ అందలాపల్లి గ్రామ సర్వే నంబరు 136/2లో అనధికార గ్రావెల్ క్వారీని గురువారం మైన్స్ అధికారులు తనిఖీ చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదు మేరకు అచ్యుతాపురం – అనకాపల్లి రోడ్డుకు అవసరమైన గ్రావెల్ తరలించేందుకు బీవీఎస్ఆర్ సంస్థ ఇక్కడ క్వారీని లీజుకు తీసుకుంది. ఇదే అవకాశం చేసుకుని సదరు సంస్థకు కేటాయించిన 4.2 హెక్టార్లకు మించి ఇష్టానుసారంగా మైనింగ్ చేస్తోంది. అక్రమంగా వివిధ నిర్మాణ సముదాయాలకు అమ్మకాలు చేస్తోంది. దీనికితోడు రాత్రిళ్లు భీకర శబ్దాలతో కొండను పేల్చడంతో గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఈ వ్యవహారంపై కొండకర్ల పంచాయతీకి చెందిన గ్రామ పెద్ద కోట్ని అప్పల శివ నూకరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైన్స్ అధికారులు విచారణ చేపట్టి నివేదిక తీసుకున్నారు. -
సౌత్ కోస్ట్ రైల్వే పీఎఫ్ఏగా హరిప్రసాద్
తాటిచెట్లపాలెం: సౌత్ కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్(పీఎఫ్ఏ)గా డాక్టర్ పూడి హరిప్రసాద్ నియమితులయ్యారు. మార్చి 1న ఆయన ఈ బాధ్యతలను అధికారికంగా స్వీకరించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఆయన 1993వ బ్యాచ్కు చెందిన ఇండియన్ రైల్వేస్ అకౌంట్స్ సర్వీసెస్ సీనియర్ అధికారి. శ్రీకాకుళం జిల్లా కవిటి గ్రామానికి చెందిన డాక్టర్ హరిప్రసాద్కు ఉన్నత విద్యా నేపథ్యం ఉంది. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల నుంచి బీటెక్ (సివిల్) పూర్తి చేసిన ఆయన.. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ (మార్కెటింగ్), ఎల్ఎల్బీ, ఎంబీఏ(ఫైనాన్స్) పట్టాలు పొందారు. ఆ తర్వాత పవర్ సెక్టార్ రిఫార్మ్స్ అంశంపై పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రజా పరిపాలన, ఆర్థిక నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జాతీయ ప్రాజెక్టుల రూపకల్పన వంటి కీలక రంగాల్లో ఆయనకు దాదాపు మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో వాల్తేరు డివిజన్లో సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్గా కూడా డాక్టర్ హరిప్రసాద్ సేవలందించారు. ఇప్పుడు మళ్లీ అదే విశాఖపట్నం కేంద్రంగా ఉన్న సౌత్ కోస్ట్ రైల్వేలో కీలక పదవి చేపట్టనుండటం పట్ల రైల్వే అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పతకాలు
అనకాపల్లి టౌన్/రావికమతం : విజయనగరంలో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి 7వ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో అనకాపల్లి జిల్లా రావికమతం మండలానికి చెందిన దివ్యాంగ విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. అనకాపల్లి జిల్లాకు చెందిన దివ్యాంగ విద్యార్థులు సింగిల్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ వీల్ చైర్, డ్వార్ఫిజం పారా బ్యాడ్మింటన్ కేటగిరిలలో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచారు. రావికమతం మండలం, తోటకూరపాలెం గ్రామానికి చెందిన గూనురు ఆదిలక్ష్మి (వీల్ చైర్ కేటగిరిలో) 2 గోల్డ్ మెడల్స్, మరుపాక గ్రామం రౌతు తనుష్ ఒక గోల్డ్ మెడల్, టి. అర్జాపురం గ్రామానికి చెందిన రాజాన మానస (షార్ట్ స్టేచర్ కేటగిరిలో) ఒక గోల్డ్ మెడల్, ఒక రజత పతకం, ఎల్.ఎన్.పురం గ్రామానికి చెందిన నిమ్మి హేమ దుర్గ (షార్ట్ స్టేచర్ కేటగిరిలో) గోల్డ్ మెడల్, కొత్తకోట గ్రామానికి చెందిన వెల్లంకి (లోకేష్ షార్ట్ స్టేచర్ కేటగిరిలో) 2 కాంస్య పతకాలు సాధించారు. ఈ విద్యార్థులను సమగ్ర శిక్ష సహిత విద్య సమన్వయకర్త బి.రామకృష్ణ నాయుడు అభినందించారు. -
చిటికెలో...లోపాలు తేటతెల్లం
జిల్లాలో రోజుకి 8.98 లక్షల లీటర్ల పాల ఉత్పత్తిడెయిరీలకు వెళ్లే పాలు 6.73 లక్షల లీటర్లుగ్రామంలోనే విక్రయించే పాలు 2.25 లక్షల లీటర్లు అనకాపల్లి టౌన్ : ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రించే వరకూ చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు పాలను విరివిగా వాడుతుంటారు. అలాంటి పాలలోనూ కల్తీ జరిగి ఇటీవల రాజమండ్రిలో కల్తీ పాలు తాగి నలుగురు మరణించగా..పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లనివన్నీ పాలు కావనేలా..స్వచ్ఛమైన పాలల్లో కూడా కల్తీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కిచెన్లోనే కల్తీ పాలను గుర్తించవచ్చంటూ పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. ఏవి స్వచ్ఛమైన పాలు..ఏవి కల్తీ పాలు అనేది చిన్నపాటి చిట్కాలతో గుర్తించవచ్చు. ఒకనాడు నగరాల్లో, పట్టణాల్లో కల్తీ జరిగేవి..కానీ ప్రస్తుత పరిఽస్థితుల్లో గ్రామ స్థాయిలోనే కల్తీ ముఠాలు ఎక్కువవుతున్నాయి. పాడి రైతు రోజంతా కష్టపడి పాడి పశువులను మేత వేసి..స్వచ్ఛమైన పాలను డెయిరీలకు అతి తక్కువ ధరకే పోస్తున్నారు. కానీ అలాంటి స్వచ్ఛమైన పాలనే కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ ముఠాలు ఎక్కువైపోతున్నాయి.పాలు చిక్కగా ఉండేందుకు మొక్కజొన్న పిండి, వెన్న శాతం ఎక్కువగా ఉండేందుకు వంట నూనెలు, నురగ కోసం డిజర్జెంట్, యూరియా వంటివి కలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని కల్తీముఠాలు సింథటిక్ పాలు తయారు చేస్తున్నాయి కూడా.స్వచ్ఛత తెలిసేదెలా..రోజూ మనం మార్కెట్ నుంచి కొనుగొలు చేసుకునే పాలు స్వచ్ఛమైనవా..? లేదంటే ఏదైనా కల్తీ జరిగిందా..? అనేది ఇంట్లోనే కొద్ది పాటి చిట్కాలు, జాగ్రత్తలతోనే గుర్తించవచ్చు.●స్వచ్ఛమైన పాలు స్వల్ప తీపి వాసన కలిగి ఉంటుంది. క్రీమ్ రుచిని కలిగి ఉంటాయి. అలా కాకుండా పాలు చేదుగా లేదా వింతైన రసాయన వాసన కలిగి ఉంటే అవి కల్తీ పాలుగా గుర్తించవచ్చు.●పాలను బాగా మరిగించినప్పుడు అవి పసుపు రంగులోకి మారితే..అందులో సర్ఫ్, సబ్బు లేదా నూనే పదార్థాలు కలిపారని భావించాలి. అదే స్వచ్ఛమైన పాలను మరిగిస్తే రంగు మారదు.●కొద్దిగా పాలు తీసుకొని అందులో ఒకటి లేదా రెండు అయోడన్ ద్రావణం చుక్కలు వేసిన వెంటనే పాలు నీలి రంగులోకి మారితే ..అందులో పిండి లేదా స్టార్చ్ కలిపారని గుర్తించాలి. అలా కాకుండా పాలు సాధారణ తెలుపు రంగులోనే ఉంటే కల్తీ జరగలేదని అర్థం●పాలల్లో నీరు అధికంగా కలిపితే..దాన్ని గుర్తించే చిట్కా..ఒక పలకను ఏటవాలుగా ఉంచి దానిపై పాల చుక్కలను జార విడవాలి. పాలు నెమ్మదిగా తెల్లని గీత లాగ కిందకు జారితే స్వచ్ఛ మైనవిగా గుర్తించవచ్చు. అలా కాకుంకా చాలా వేగంగా జారితే మాత్రం పాలలో నీరు కలిసినట్టుగా గుర్తించాలి.●స్వచ్ఛమైన పాలు కాచి చల్లాచ్చిన తర్వాత పైన మీగడ చిక్కగా అంటే మందంగా కడుతుంది. కానీ కల్తీ పాలు అయితే వేడి చేసినప్పుడు సరైన మీగడ రాదనే విషయాన్ని కూడా గమనించాలి.●అలాగే పాలను సీసాలో వేసి బాగా కుదిపితే అధికంగా నురగ వస్తే కల్తీ జరిగినట్టు గుర్తించాలి. అలాగే 5 మిల్లీ లీటర్ల పాలలో 2 స్పూన్ల ఉప్పు కలపాలి. ఈ మిశ్రమం నీలి రంగులోకి మారితే..పాలలో గంజి పౌడర్ కలిపినట్లు గుర్తించాలి.●ఇక అన్నిటికంటే ముఖ్యంగా నీటిలో యూరియాను వినియోగించి కల్తీ పాలను తయారు చేస్తున్నారు. ఈ కల్తీని యూరియా స్ట్రిప్ ద్వారా గుర్తించవచ్చు. ఈ స్ట్రిప్స్ మందుల షాపులో లభ్యమవుతాయి. వాటిని ఉపయోగించి కల్తీ పాలలో యూరియా కలిసిందా లేదా అనేది స్వయంగా మనమే గుర్తించవచ్చు.తనిఖీలు ముమ్మరం చేశాంపాలు కల్తీని నిరోధించడానికి తనిఖీలు ముమ్మరం చేశాం. కల్తీపాలు గుర్తిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదులు చేయండి. ఇప్పటికే కల్తీ పాలను గుర్తించడానికి ఆధునిక పద్ధతులు పాటిస్తున్నాం. గ్రామస్థాయి నుంచి పట్టణాల్లో కూడా కల్తీ పాలు గుర్తించడంపై అవగాహన కల్పిస్తున్నాం. సాధారణ గృహ పరీక్షల నుంచి అధునాతన ప్రయోగశాల స్పెక్టోస్కోపీ వరకూ అన్ని పద్ధ్దతుల ద్వారా కల్తీకి చెక్ పెడుతున్నాం. –డాక్టర్ బి.రామ్మోహన్ రావు, జిల్లా పశువర్ధక శాఖ అధికారి,అనకాపల్లి జిల్లా -
వెంకన్న కల్యాణం చూతమురారండి...
నక్కపల్లి: కోనేటిరాయుడి కల్యాణానికి వేళయింది. ఉపమాక గరుడాద్రి పర్వతంపై ఏకశిలపై షఢ్బుజాలతో అశ్వారూఢుడై వెలసిన వెలసిన వేంకటేశుని వార్షిక దివ్యకల్యాణ మహోత్సం శుక్రవారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైకుంఠనాధుని కల్యాణం తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తకోటి ఉపమాక తరలివస్తోంది. కల్యాణోత్సవాలను పురస్కరించుకుని ఆలయం విద్యుద్దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతోంది. ఘనంగా అంకురార్పణ కల్యాణోత్సవాలకు సంబంధించి గురువారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. స్వామివారి కల్యాణమండపంలో ఉభయదేవేరులను ఉంచి సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి పుట్టమన్ను తెచ్చేందుకు తీసుకెళ్లారు. దీన్నే అంకురార్పణ అంటారు. విశేష పూజలు, గరుడ ప్రాణప్రతిష్ట హోమాలు, నీరాజన మంత్ర పుష్ఫం వంటి కార్యక్రమాలు నిర్వహించి గరుడప్పాలు నివేదన చేశారు. స్వామివారి పెళ్లి కావడిని ఉపమాక మాఢవీదుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి పసుపుకుంకుమలు, పసుపుకొమ్ములు, కొబ్బరిబొండాలు కానుకలుగా సమర్పించుకున్నారు. పెళ్లి కావిడ ఊరేగింపులో అర్చక స్వాములు కృష్ణమాచార్యులు, గోపాలాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు, సాయి ఆచార్యులు, దేవస్దానం సిబ్బంది పాల్గొన్నారు. నేడే స్వామివారి కల్యాణం స్వామివారి కల్యాణం శుక్రవారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. అదేరోజు సాయంత్రం కన్యావాద సంవాదం (ఉపమాక సింహద్రాచార్యులు ఇంటి వద్ద స్వామివారి అమ్మవార్ల పెండ్లిమాటలు, గుణగణాలను వివరించే తంతును నిర్వహిస్తారు) తరిగొండ వేంగమాంబ సాహితీ పీఠం వ్యవస్థాపకురాలు డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించి కన్నుల పండువగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం రథోత్సవం జరుతుంది. అనంతరం కల్యాణ వేడుకలు జరుగుతాయి. మార్చి1న పండిత సభ, 2న తోటోత్సవం, స్వామివారికి గజవాహనంపై తిరువీధిసేవ, 3న పౌర్ణమినాడు రాజయ్యపేట సముద్రతీరంలో స్వామివారికి చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రికి డోలోత్సవం, అద్దపుసేవ జరుగుతుంది. 3వ తేదీ పౌర్ణమినాడు చంద్ర గ్రహణం కావడంతో ఉదయాన్నే స్వామివారిని రాజయ్యపేట సముద్రతీరానికి చక్రవారీ స్నానం కోసం తీసుకెళ్లి మధ్యాహ్నంలోపు ఈ కార్యక్రమాలన్నీ పూర్తిచేసి ఆలయం మూసివేయడం జరుగుతుందని ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. తిరిగి 4న సంప్రోక్షణ నిర్వహించి ఆలయాన్ని తెరవడం జరుగుతుందన్నారు. 4 నుంచి 6వ తేదీ వరకు స్వామివారి పుష్పయాగోత్సవాలు జరుగుతాయన్నారు. స్వర్ణాలంకరణ భూషితుడైన స్వామివారిని చూసేందుకు భక్తులు తరలిరానున్నారు. 8లోవడ్డాది వెంకన్న కల్యాణోత్సవాలకు వేళాయె.. -
8న గురుకులం ప్రవేశ పరీక్ష
దేవరాపల్లి: డాక్టరు బీఆర్. అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో 2026–2027 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీ సీట్లు భర్తీ కోసం ప్రవేశ పరీక్షను మార్చి 8న నిర్వహిస్తున్నట్లు తెనుగుపూడి గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ ఎస్.విక్టర్పాల్ తెలిపారు. మార్చి 2న జరగాల్సిన ఈ ప్రవేశ పరీక్ష తేదీని మార్పు చేస్తూ ఉమ్మడి విశాఖ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త జి. గ్రేస్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. మార్చి 8న 6, 7 తరగతులకు ఉదయం 10 నుంచి 11:30 గంటలకు వరకు, 8, 9, 10 తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 3:30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. మరిన్ని వివరాలకు హెల్ప్లైన్ 0891–2799641 సంప్రదించాలని కోరారు. -
షార్ట్ సర్క్యూట్తో స్కూటీ దగ్ధం
నర్సీపట్నం: ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్గేట్ ప్రాంతంలో గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో స్కూటీ దగ్ధమైంది. పట్టణంలోని అయ్యన్నకాలనీకి చెందిన జి.నానాజీ తన స్కూటీపై కాంప్లెక్స్కు వస్తున్నాడు. ఇక్కడ ఇన్గేట్ నుంచి వస్తుండగా స్కూటీ నుంచి మంటలు వ్యాపించాయి. అతడు భయంతో దాన్ని పార్కు చేసి పరుగులు తీశాడు. ప్రయాణికులు, స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఫైర్ ఆఫీసర్ అప్పలస్వామి, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
అసెంబ్లీని సందర్శించిన రిషివ్యాలీ విద్యార్థులు
అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్ధులు, ఉపాధ్యాయులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం : ఏపీ అసెంబ్లీ విజ్ఞాన యాత్రలో భాగంగా నర్సీపట్నం రిషీ వ్యాలీ స్కూల్కు చెందిన 120 మంది గురువారం అసెంబ్లీని సందర్శించారు. విద్యార్థులతో స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు ముచ్చటించారు. చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే దిశగా అసెంబ్లీ విజ్ఞాన యాత్ర కొనసాగుతుందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, మాతృభాషను మరువొద్దు అని స్పీకర్ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్శనలో స్కూల్ నిర్వాహకులు అక్కంరెడ్డి కార్తీకేయ, కౌశిక్ పాల్గొన్నారు. -
సహకార ఉద్యోగుల సమ్మె విరమణ
మాడుగుల : ఈ నెల 16 వ తేదీ నుంచి తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మెను ఈ నెల 25 వ తేదీతో ముగించామని, అనకాపల్లి జిల్లా పీఎసీఎస్ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు బొడ్డేడ లక్ష్మణరావు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర జేఎసీ జరిపిన చర్చల్లో లక్ష రూపాయలు నుంచి రూ.4 లక్షలకు గ్రాట్యూటీ పెంచామని, టర్మ్ ఇన్సూరెన్స్ రూ. 5 లక్షలు పెంచామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించామన్నారు. తమకు సమ్మెకాలంలో అన్నివిధాలా సహాయ సహకారాలు అందించిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఆయన వెంట సహకార సంఘ ఉద్యోగులు పాల్గొన్నారు. -
శరీర సౌష్టవ పోటీల్లో అనకాపల్లి క్రీడాకారుల ఘనత
మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో బహుమతులు సాధించిన క్రీడాకారులు సంతోష్, ప్రసాద్తో జిమ్ సభ్యులు అనకాపల్లి : క్రీడాకోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చని అవినాష్ జిమ్ నిర్వహకులు ఐ.ఆర్.గంగాధర్ అన్నారు. ఈనెల 22, 23 తేదీల్లో కాకినాడ, విశాఖపట్నం నగరాలలో జరిగిన ‘మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్‘ పోటీలలో అవినాష్ పవర్ జిమ్ సభ్యుడు పినపోతుల సంతోష్ ప్రథమ(కాకినాడలో) స్థానం, పి.ప్రసాద్ ద్వితీయ(విశాఖలో) స్థానం సాధించారు. గురువారం జిమ్ ఆవరణలో గంగాధర్ శాలువాలతో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన వాతావరణంలో యువత తన జీవిత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. యువత సామాజిక కార్యక్రమంలో కూడా పాల్గొంటూ సమాజంలో బాధ్యత గల పౌరులుగా మెలగాలన్నారు. కార్యక్రమంలో జిమ్ మేనేజర్ గొర్లె స్వామి గౌడ్, సభ్యులు అవినాష్, బుద్ధ గణేష్, బుచ్చిరాజు, నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి గోపి, కర్రి చిన్న ,రాజు ,శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు. -
వడ్డాది వెంకన్న కల్యాణోత్సవాలకు వేళాయె..
బుచ్చెయ్యపేట: ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి 153వ కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి గిరిజాంబ కొండ ముస్తాబైంది. శుక్రవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు జరిగే స్వామివారి కల్యాణ వేడుకలు తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. వీరి సౌకర్యార్థం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 150 మందికిపైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలో దిగువ క్యూలైన్లు, మంచినీటి సదుపాయం, వైద్య సేవలు, తదితర ఏర్పాట్లు చేశారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలకు, మెట్లు మార్గం, కళావేదిక తదితర ప్రాంతాల్లో రంగులు వేసి మిరుమిట్లు గొలుపే భారీ విద్యుత్ లైటింగ్ సెట్టింగ్లను కిలోమీటర్లు పొడవున ఏర్పాటు చేశారు. శ్రీదేవి, భూదేవితో వేంకటేశ్వరస్వామి కల్యాణానికి మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. ధ్వజ స్తంభం వద్ద, ఆలయంలోను, ఉత్సవ విగ్రహాల వద్ద భక్తులు తొక్కుసలాటలు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కల్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు, నాయకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలి రోజు రాత్రి 9 గంటలకు స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవం జరగనుంది.ఆలయ చరిత్ర..42 ఏళ్ల క్రితం వడ్డాదికి నారాయణభజీ అనే స్వామి భిక్షాటనకు వచ్చి వడ్డాది పుణ్యక్షేత్రంగా భాసిల్లుతుందని చెప్పి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల్లోనే విజయరామరాజుపేటలో కాళ్ల పాకల వద్ద రైతులు నేలబావి తవ్వుతుండగా శ్రీదేవి, భూదేవి, వేంకటేశ్వరస్వామి విగ్రహాలు బయటపడ్డాయి. అప్పటి గ్రామ పెద్ద దొండా భగవంతులయ్య ఆధ్వర్యంలో గిరిజాంబ కొండపై ఏర్పాటు చేసి ఆలయం నిర్మించారు. నిత్య ధూప, దీప నైవేద్యాలకు 58 ఎకరాల భూమిని ఆయన దానం చేశారు. అప్పటి నుంచి వారి కుటుంబ సభ్యులు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు.కల్యాణ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలుస్వామివారి కల్యాణ మహోత్సవాలు జరిగే ఐదు రోజులు వడ్డాది కొండ దిగువ దేవస్థానం వారు, వడ్డాది నాల్గు రోడ్ల జంక్షన్లో వర్తక సంఘం ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.వడ్డాది ఇలా చేరుకోవాలి..స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రతి అరగంటకు నర్సీపట్నం, చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ల నుంచి బస్సు సదుపాయం కలదు. విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు నుంచి వడ్డాదికి ఆర్టీసీ బస్సు సదుపాయం ఉంది. మెట్ల మార్గంతోపాటు కొండపైకి వాహనాల ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు. -
నగరవనం సందర్శించిన సీసీఎఫ్
నర్సీపట్నం : ఆరిలోవ అటవీ ప్రాంతంలో నిర్మితమవుతున్న నగరవనాన్ని సీసీఎఫ్ బి.ఎం.దివాన్ మైదీన్, డీఎఫ్వో ఎం.శామ్యూల్తో కలిసి గురువారం సందర్శించారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు అటవీశాఖ వారు సుమారు రూ.1.60 కోట్లతో నగర వనంను తయారు చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న నగరవనం పనులను సీసీఎఫ్ పరిశీలించారు. నిర్దేశించిన సమయానికి పనులు పూర్తయ్యేలా చూడాలని రేంజర్ రాజేష్ను ఆదేశించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా నగరవనం తయారు చేయాలని సూచించారు. వనంలో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ట్రైనీ డీఎఫ్వో చిదానంద, ఎఫ్ఎస్వో రామాంజులు, బీట్ సిబ్బంది ఉన్నారు. -
దళిత ఐపీఎస్లపై వేధింపులు ఆపాలి
కోటవురట్ల : అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.2 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును తక్షణమే అరెస్టు చేయాలని విస్తృత దళిత సంఘాల(విదసం) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో విదసం ఐక్య వేదిక అనకాపల్లి జిల్లా సమితి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రజలిచ్చిన అధికారాన్ని, డిప్యూటీ స్పీకర్ పదవిని దుర్వినియోగం చేస్తూ ఐపీఎస్ అధికారి సునీల్నాయక్ను అరెస్టు చేయడం కోసం, మరో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్కుమార్ సస్పెన్షన్ కోసం ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రఘురామకృష్ణరాజే ఒక ఆర్థిక నేరస్తుడుగా బెయిల్పై బయట ఉన్నాడని, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.1796 కోట్లు రుణాన్ని ఎగ్గొట్టి సీబీఐ కేసులో నిందితుడుగా ఉన్నాడన్నారు. ఇండ్ పవర్ కార్పోరేషన్ కోసం ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రూ.970 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.826 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టినందుకు 2022లో రఘురామకృష్ణరాజుపై సీబీఐ చార్జిషీట్ వేసిందన్నారు. 2024 అక్టోబరులో ఇతని ఆస్తులు వేలానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆదేశించిందని తెలిపారు. ఇంతటి ఆర్థిక నేరస్తుడు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి అధికారాన్ని అడ్డంపెట్టుకుని తాను అరెస్టు నుంచి తప్పించుకోవడమే కాకుండా వ్యక్తిగత కక్ష సాధింపుతో దళిత ఐపీఎస్ అధికారులను అరెస్టు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ముమ్మాటికి అధికార దుర్వినియోగమేనని విమర్శించారు. బీహార్ కేడర్ ఐజీ స్థాయి అధికారి సునీల్నాయక్ను, రాష్ట్ర డీజీ సునీల్కుమార్ను లక్ష్యంగా పెట్టుకుని వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని జైళ్లో పెట్టించాలని కుట్రలకు పాల్పడడం ప్రజా ప్రాతినిధ్య చట్టాలకు వ్యతిరేకం అన్నారు. చిన్న చిన్న ఆరోపణలకే ముఖ్యమంత్రులను సైతం జైళ్లకు పంపించిన ఈడీ, సీబీఐ అధికారులు రూ.2 వేల కోట్ల ప్రజల సొమ్మును కాజేసిన రఘురామకృష్ణరాజును ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కూటమి సర్కారు దళిత ఐపీఎస్ను లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపుతూ వేధిస్తోందని మండిపడ్డారు. మట్ల అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వడ్లమూరి ఫ్రాన్సిస్, ఎం.చిట్టియ్య, నడింపల్లి నూకరాజు, మైలపల్లి త్రిమూర్తులు, మద్దెల కృష్ణప్రసాద్, గంట్యాడ చిరంజీవి, బూకా ఏసుదాసు, ఎస్.వీరబాబు పాల్గొన్నారు. -
అంగన్వాడీల రిలే నిరహార దీక్ష
నర్సీపట్నం: అంగన్వాడీల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు ఎం.దుర్గామణి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం మహాత్మాగాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. గ్రాట్యూటీ అమలుకు నిబంధనలు రూపొందించాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలన్నారు. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. మే నెల అంతా వేసవి సెలవుల జీవో వెంటనే ఇవ్వాలన్నారు. లబ్ధిదారులకు బియ్యం, ఆయిల్, కందిపప్పు క్వాంటీటి పెంచాలన్నారు. మెనూ చార్జీలు పెంచి, గ్యాస్ ఉచితంగా సరఫరా చేయాలన్నారు. ప్రీ స్కూళ్లను బలోపేతం చేయాలన్నారు. ప్రీ స్కూల్ పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం వర్తింపజేయాలన్నారు. ప్రాజెక్టు అధ్యక్షురాలు ఆర్.రమణమ్మ, కార్యదర్శులు డి.మహాలక్ష్మి, సీనియర్ నాయకులు వి.సామ్రాజ్యం, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, భాగ్య, ఆశాజ్యోతి, శోభ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు పాల్గొన్నారు. -
అతివేగం... మృత్యుపాశం
సబ్బవరం: సబ్బవరం–ఆరిపాక రోడ్డులో గాలిభీమవరం సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం రాయపుర అగ్రహారాన్ని శోకసంద్రంలో ముంచేసింది. తీర్థమహోత్సవాలకు ఆనందంగా బయలుదేరిన ముగ్గురు యువకుల ప్రయాణం క్షణాల్లోనే విషాదయాత్రగా మారింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందడంతో అతని కుటుంబం బోరున విలపిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. రాయపుర అగ్రహారానికి చెందిన సింగంపల్లి సాయి(23), పల్ల కనకరాజు, నంబారు సందీప్ ద్విచక్రవాహనంపై సబ్బవరం వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ నడుపుతున్న సింగంపల్లి సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న పల్ల కనకరాజు, నంబారు సందీప్ తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న సీఐ జి.రామచంద్రరావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా, క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. కనకరాజు తలకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఢీకొన్న తీవ్రతకు రెండు వాహనాలు దూరంగా ఎగిరిపడ్డాయి. ద్విచక్రవాహనం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఆటో సైతం తీవ్రంగా దెబ్బతిని రోడ్డు పక్కన ఒరిగిపోయింది. మితిమీరిన వేగమే కారణమా? మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుల వేగం, నిర్లక్ష్యం మూడు కుటుంబాల జీవితాలను తారుమారు చేశాయని గ్రామస్తులు వాపోతున్నారు. సాయి తండ్రి గోవిందరావు కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటినుంచి కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న సాయి.. ఇలా ఆకస్మిక మరణం చెందడంతో ఆ కుటుంబం కన్నీటిపర్యంతమైంది. కొడుకు మరణవార్త విన్న తల్లి ఆర్తనాదాలు గ్రామస్తులు కదిలించాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు యువకులు త్వరగా కోలుకోవాలని గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు. మృతుడి సోదరుడు సింగంపల్లి నరేంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర బుధవారం సాయంత్రం ఆరిపాక జంక్షన్ నుంచి గ్రామంలోని శ్మశానవాటిక వరకూ నిర్వహించిన సాయి అంతిమయాత్రలో వందలాదిగా యువకులు, స్నేహితులు, గ్రామస్తులు పాల్గొని అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్ తదితరులు అంతిమయాత్రలో పాల్గొని సాయి మృతదేహానికి నివాళులర్పించారు. -
కొత్త రకం విత్తనాలతో అధిక దిగుబడులు
దేవరాపల్లి: అపరాల సాగులో కొత్త రకం విత్తనాలను నాటడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చునని కె.వి.కె. ప్రధాన శాస్త్రవేత్త ఎస్. రాజ్కుమార్ సూచించారు. మండలంలోని ఎం. అలమండలో జాతీయ ఆహార భద్రతా మిషన్ స్కీమ్లో భాగంగా పప్పు ధాన్యాలు పంటలపై రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని ఏవో ఎల్.వై. కాంతమ్మ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. పప్పు ధాన్యాలు దిగుబడి, విస్తీర్ణం పెంచుకునే విధానంపై రైతులకు సమగ్రంగా వివరించారు. కొత్త రకం విత్తనాలు వినియోగించి, సకాలంలో కలుపు మందులు వాడటం ద్వారా ఆశాజనకంగా దిగుబడులు సాధించి మంచి ఆదాయం పొందవచ్చునని సూచించారు. 19–19–19 రకం లేదా, 13–0–45 రకం ఎరువును ఎకరానికి కేజీ చొప్పున 25 నుంచి 35 రోజులకు ఒకసారి, 60 రోజులకు మరోసారి వేయడం ద్వారా ఎకరాకు దాదాపుగా అదనంగా క్వింటా దిగుబడి సాధించవచ్చునని అవగాహన కల్పించారు. ప్రస్తుతం సాగులో ఉన్న మినప పంటను తీసేసి మరలా మినుము లేదా మొక్కజొన్న వేసుకోవచ్చునని సూచించారు. ఉద్యానశాఖ అధికారి సత్తిబాబు మాట్లాడుతూ కాయగూరల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సలహాలు, సూచనలు చేశారు. విస్తరణాధికారి కిషోర్ మాట్లాడుతూ మినీ కిట్స్, కొత్త వంగడాలపై రైతులకు వివరించారు. మండల వ్యవసాయ విస్తరణాధికారి ఎస్.కిరణ్కుమార్, రైవాడ ప్రాజెక్టు చైర్మన్ పోతల పాత్రునాయుడు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు బాలు పాల్గొన్నారు. కె.వి.కె ప్రధాన శాస్త్రవేత్త రాజ్కుమార్ -
9 నుంచి రిలే నిరాహార దీక్షలు
అనకాపల్లి: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ మహిళా వసతి గృహాలను ఏర్పాటు చేయాలని వచ్చే నెల 9 నుంచి 14వ తేదీ వరకూ విద్యార్థులతో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి.ఫణింద్రకుమార్ తెలిపారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో దీక్షల గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మహిళా హాస్టళ్ల ఏర్పాటుపై పలుమార్లు జిల్లా అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధికి విన్నవించుకున్నా ఎటువంటి స్పందన లేదన్నారు. జిల్లా కేంద్రంలో ఒకే బీసీ మహిళ వసతి గృహం ఉందని, అందులో 200 మంది విద్యార్థినులు అరకొర వసతుల మధ్య ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు. దాంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు విద్యకు దూరమవుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు జగదీష్, సింహాద్రి, మణికంఠ, రూపవతి, లిఖిత, తేజ, సుశీల, మధు తదితరులు పాల్గొన్నారు. -
నోటమాట లేదు!
● పతనమైన టమాటా ధర ● కిలో రూ.4కే వ్యాపారుల కొనుగోలు ● కంటితడి పెడుతున్న రైతులు గొలుగొండ: మార్కెట్లో టమాటా ధర పతనంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంట పండిస్తే, కిలో రూ.4కే వ్యాపారులు కొనుగోలు చేయడంతో గగ్గోలు పెడుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధర లేక దిగాలుగా ఉన్న రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాడిపండు పడినట్టుగా తయారైంది. మూడు రోజుల నుంచి కురుస్తున్న తేలికపాటి వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ వర్షంతో పంట పాడవుతుందని వాపోతున్నారు. 600 ఎకరాల్లో సాగు నర్సీపట్నం డివిజన్ పరిధిలో గొలుగొండ మండలంలోనే ఏటా టమాటా పంట విస్తారంగా సాగవుతోంది. తాండవ జలాశయం పరిసర ప్రాంతాలైన గొలుగొండ, సాలికమల్లవరం, వెంకటాపురం, కొత్తమల్లంపేట, అమ్మపేట పరిసర ప్రాంతాలతోపాటు వ్యవసాయ మోటార్లు ఉన్న ఏటిగైరంపేట, రిట్టవానిపాలెం, పాకలపాడు, చీడి గుమ్మల గ్రామాల్లో సుమారుగా 600 ఎకరాలకుపైగా పండిస్తున్నారు. గతే డాది డిసెంబరులో వేసిన పంట ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో కాపునకు వస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెలలో కిలో రూ.4కే ధర పలకడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఎకరాకు రూ.30 వేల వరకు నష్టమే.. ఏటా జనవరిలో పంట కాపునకు వచ్చినప్పుడు కాస్త ధరలు తక్కువగా ఉంటాయి. గత ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వీటి ధరలు అధికంగా ఉండేవి. ఇవే ధరలు ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉంటాయని భావించి అదనంగా సాగు చేశారు. అయితే ఈ నెల రెండో వారం నుంచి ధరలు పతనం కావడంతో ఎకరాకు రూ.30 వేల వరకు నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యం లేక... గొలుగొండ మండలంలో టమాటా పంట నాణ్యమైనది కావడంతో ఇతర ప్రాంతాల వ్యాపారులు వచ్చి పొలం వద్దే కొనుగొలు చేసి వాహనాలపై తరలించుకుపోతుంటారు. ఈ ఏడాది విశాఖ, తుని, రాజమండ్రి, అనకాపల్లి, విజయవాడ నుంచి వ్యాపారులు ఇక్కడికి రావడం లేదు. పై ప్రాంతాల్లో రైతులు టమాటా సాగు చేయడంతో వీటికి డిమాండ్ లేకుండా పోయింది. దీంతో ఇక్కడ పండిన పంటను నర్సీపట్నం, కృష్ణదేవిపేట మార్కెట్కు తరలించి అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల చిరు వ్యాపారులు తక్కువ ధరకు అమ్మకాలు చేయాల్సి వస్తోంది. ఒక్కొక్కసారి తీసుకెళ్లిన కాయలు అమ్మకంగాక అక్కడ దాచి మరుసటిరోజు విక్రయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక ట్రే (25 కిలోలు) రూ. 80 నుంచి రూ. 100 వరకు అమ్మకం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అకాల వర్షంతో మరింత నష్టం మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం రైతులకు మరింతగా నష్టాన్ని మిగులుస్తోంది. తేలికపాటి వర్షం పడటంతో కాయలు పాడై కుళ్లిపోతున్నాయి. ఇలా 20 నుంచి 30 శాతం కాయలు మూడు రోజుల్లోనే పాడయ్యాయి. రోజూ సాయంత్రం అరగంట పాటు తేలికపాటి వర్షం కురుస్తుందని వాపోతున్నారు. కనీసం మార్చి మొదటి వారంలోనైనా ధరలు ఉండాలని రైతులు ఆశిస్తున్నారు. మార్కెట్లో కొనుగోలు లేక నిరీక్షణ నేను ఎకరా వరకు టమాటా సాగు చేశాను. ప్రస్తుతం కాపు విస్తారంగా ఉంది. కోసిన కాయకులు కృష్ణదేవిపేట మార్కెట్కు తరలిస్తే గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. కాయలంతా ఒకేసారి రావడంతో కొనేవారు కరువయ్యారు. తక్కువ ధరకు అమ్మలేక, వాటిని మరలా ఇంటికి తీసుకురాలేక నరకయాతన పడుతున్నాం. – పరవాడ కవి, రైతు, లింగంపేట, గొలుగొండ మండలం తీవ్రంగా నష్టపోతున్నాం ఫిబ్రవరిలో మంచి ధరలు ఉంటాయని ఉద్దేశంతో సాగు చేశాం. ఎన్నడూ లేని విధంగా ఈ నెలలోనే ధరలు పతనం కావడంతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. మార్కెట్లో కిలో రూ.4కే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. – ఎస్. సూకరాజు, రైతు, గొలుగొండ -
జీడి పంటకు మద్దతు ధర ప్రకటించాలి
గిరిజన రైతుల ఆందోళన రావికమతం: జీడి పంటకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ మండలంలోని చీమలపాడు పంచాయతీలో ఏిపీ ఆదివాసీ గిరిజన సంఘం, ఐదో షెడ్యూల్ సాధన కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గిరిజన రైతులు బుధవారం కల్యాణపులోవలో ఆందోళన చేపట్టారు. జీడి పిక్కలకు ప్రభుత్వం మద్దతు ధర కేజీ రూ.200 ఇవ్వాలని, రైతు సేవా కేంద్రాల ద్వారా జీడి పిక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, సాగు రాయితీలు పునరుద్ధరించాలని, జీడితోటలో అంతర కృషి పరికరాలు ఉచితంగా అందించాలని కోరారు. జీడి పరిశోధన కేంద్రాలు ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసి నాణ్యమైన మొక్కలు సరఫరా చేయాలన్నారు. బ్యాంక్ రుణాలు అందించాలని, జీడి పంటకు వాతావరణ బీమా అమలు చేయాలని, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఎం కార్యవర్గ సభ్యులు కే గోవిందరావు, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గెమ్మిల వాసు తదితరులు పాల్గొన్నారు. -
పునరావాస కాలనీలో పనులు వేగవంతం చేయాలి
నక్కపల్లి: నిర్వాసితుల కోసం ఏపీఐఐసీ ఏర్పాటు చేస్తున్న పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం ఆమె జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్తో కలసి పెదబోదిగల్లంలో జరుగుతున్న పునరావాస కాలనీ పనులను పరిశీలించారు. నిర్వాసితులంతా కాలనీకి తరలి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పిస్తే లబ్ధిదారులంతా కాలనీకి వస్తారన్నారు. ప్రారంభించిన ఇళ్లకు అవసరమైన సామగ్రి అంతా సిద్ధం చేయాలన్నారు. తాగునీరు, వాడుకనీరు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు డ్రైనేజీల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. స్టీల్ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్ కోసం సేకరించిన నిర్వాసిత ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించి ఖాళీ చేయించాలని సూచించారు. మూలపర్ర, పాటిమీద గ్రామాల నిర్వాసితుల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆమె వెంట ఆర్డీవో వి.వి.రమణ, ఏపీఐఐసీ జెడ్ఎం నర్సింగరావు, తహసీల్దార్ శ్రీను, తదితరులు ఉన్నారు. -
రెవెన్యూ క్లినిక్ అర్జీలపై క్షేత్ర స్థాయిలో విచారణ
తుమ్మపాల: రెవెన్యూ క్లినిక్లో వచ్చిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ, సర్వే, భూమి రికార్డులు, పౌర సరఫరాల శాఖలపై మండల, డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సేవల్లో సమయ పాలన, పారదర్శకత అవసరమన్నారు. సంబంధిత అధికారులు రోజూ క్షేతస్థాయిలో మానిటరింగ్ చేసి, రెవెన్యూ సేవల్లో ఆలస్యం లేకుండా ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా చూడాలన్నారు. జిల్లాలో వివాదరహిత భూ రికార్డులు, బాధ్యతాయుత రెవెన్యూ పరిపాలన కోసం అధికారులు మరింత చురుకుగా పని చేయాలని సూచించారు. ఆన్లైన్ సేవలు, భూమ్యాపింగ్, రికార్డులు అప్డేషన్, మ్యుటేషన్ దరఖాస్తులు వంటి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. లోపాలు ఉన్న చోట వెంటనే సరిదిద్దాలని, నిర్ణీత సమయంలో నివేదికలు సమర్పించాలన్నారు. మండల స్థాయిలో తరచూ పర్యటించి విచారణ చేయాలన్నారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విచారణ చేయాలన్నారు. నీటి తీరువా వసూలు కోసం మండల, గ్రామ స్థాయిల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు కె.మనోరమ, ఎస్.సుబ్బలక్ష్మి, ఆర్డీవోలు షేక్ ఆయిషా, వి.వి.రమణ, ఏడీ సర్వే గోపాలరాజా, జిల్లా పౌర సరఫరాల అధికారి, పౌర సరఫరాల సంస్థ డీఎంలు కె.ఎన్.మూర్తి, కె.జయంతి, అన్ని మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు, కలెక్టరేట్ కో ఆర్డినేషన్, భూ వ్యవహారాల పర్యవేక్షకులు పాల్గొన్నారు.అధికారులకు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశం -
వెంకన్న కల్యాణోత్సవాలకునేడే అంకురార్పణ
● ఉదయం పెండ్లి కావిడి ఊరేగింపు ● రేపు రాత్రి కల్యాణం ● ఘనంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ నక్కపల్లి: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. శుక్రవారం రాత్రి ఉపమాకలో గరుడాద్రి పర్వతంపై కల్కి అవతారంలో షడ్భుజాలతో స్వయం వ్యక్తమై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణం ఘనంగా జరగనుంది. గురువారం నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కల్యాణోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. గురువారం ఉదయం స్వామివారి పెండ్లి కావిడెను ఉపమాక మాడ వీధుల్లో ఊరేగిస్తారు. సాయంత్రం ఆలయంలో విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్వరుణ, కంకణధారణ, అంతరాలయ పూజ, నీరాజన మంత్రపుష్పాలు సమర్పిస్తారు. తదుపరి సాయంత్రం అంకురార్పణ చేస్తారు. దీంతో స్వామివారి కల్యాణ ఉత్సవాలు ప్రారంభమైనట్లేనని ప్రధానార్చకుడు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. – శుక్రవారం ఉదయం ఉభయ దేవేరులను పెద్ద పల్లకిలో అధిష్టింపజేసి ఆలయంలోను, గ్రామంలోను అష్టదిక్పాలకు అవాహనం చేసిన తర్వాత ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు రాత్రి వేంకటేశ్వరస్వామిని ఇత్తడి గరుడ వాహనంపైన, ఉభయ దేవేరులను శేష వాహనంపైన ఉంచి ఉపమాక సింహాద్రాచార్యులు ఇంటి వద్ద కన్యావాద సంవాదం(ఎదురు సన్నాహ మహోత్సవం) నిర్వహిస్తారు. ప్రముఖ వేద పండితురాలు డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఎదురు సన్నాహ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం రథోత్సవం, అదే రోజు అర్ధరాత్రి కల్యాణం జరగనుంది. ప్రత్యేక ఏర్పాట్లు : వేసవి కాలం సమీపించడం, ఎండ వేడిమి ప్రారంభం కావడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వెంకన్న కల్యాణం తిలకించడాన్ని ఉత్తరాంధ్రలో భక్తులు సెంటిమెంట్గా భావిస్తారు. స్వామివారిని ఉదయం దర్శించుకుని, రాత్రి కల్యాణం తిలకించి తిరుగు పయనమవ్వడం అనాధిగా వస్తోంది. ఆలయ రాజగోపురం ఎదురుగా భారీ స్థాయిలో జర్మన్ టెంట్లు, షెడ్లు వేశారు. మెట్ల మార్గం వద్ద రెయిలింగ్ ఏర్పాటు చేశారు. పుష్కరిణిలో స్నానమాచరించే భక్తులు ప్రమాదానికి గురికాకుండా రక్షణ ఏర్పాట్లు చేశారు. గర్భాలయం, బేడా మండపాల చుట్టు పెంటార్లు వేశారు. ధ్వజస్తంభం, రాజగోపురం ఎదురుగా అఖిలాండం నుంచి ప్రత్యేక ఇనుప గ్రిల్స్తో క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉపమాక పెద్ద చెరువు, మనబాన వానిపాలెం సెంటర్లలో ఏర్పాటు చేసిన స్వాగత ధ్వారాలు ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్ కాంతులతో ఆలయ ప్రాంగణం కాంతులీనుతుంది. ఈ ఏడాది కల్యాణోత్సవాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్ష మంది భక్తులు తరలివస్తారని పోలీసు శాఖ అంచనా వేసింది. 300 మందితో పోలీసు బందోబస్తు : జిల్లా ఎస్పీ తుహిన్సిన్హా ఆదేశాల మేరకు కల్యాణోత్సవాలకు సుమారు 300 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీఐ మురళి తెలిపారు. సీఐలు, ఎస్ఐలతో పాటు,స్పెషల్ బ్రాంచి పోలీసులు, హెచ్సీలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, మఫ్టీలో సిబ్బంది భద్రత కోసం పని చేస్తారన్నారు. తిరువీధి సేవలు, తిరునాళ్లు జరిగే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, డ్రోన్ కెమెరాల సాయంతో భద్రత పర్యవేక్షిస్తామన్నారు. మనబానవానిపాలెం, నక్కపల్లిలో పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించామన్నారు. ఉపమాక వెళ్లే అన్ని మార్గాల్లోను చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 27వ తేదీ ఉదయం నుంచి మద్యాహ్నం వరకు మాత్రమే ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతిస్తామని సీఐ చెప్పారు. -
పాల ఉత్పత్తుల సేకరణపై అప్రమత్తం
అనకాపల్లి టౌన్: జిల్లాలో వివిధ డెయిరీల్లో సేకరిస్తున్న పాల ఉత్పత్తులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి రామ్మోహన్ సూచించారు. స్థానిక జిల్లా పశు సంవర్థక శాఖ కార్యాలయంలో మహిళా డెయిరీ సహకార సంఘం చీఫ్ ప్రమోటర్స్, కార్యదర్శులకు పాల ఉత్పత్తులు, కల్తీ, కో–ఆపరేటివ్ చట్టాలు, పరిశుభ్రమైన పాల ఉత్పత్తులపై బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్టోమీటర్ ద్వారా పాలలో కలిసే నీటి శాతం గుర్తించవచ్చన్నారు. ఎఫ్టీఐఆర్ స్పెక్ట్రోస్కోపీ పరికరం ద్వారా పాలలో ఉండే బహుళ కల్తీ పదార్థాలను గుర్తించేందుకు వీలు ఉంటుందన్నారు. బయోస్పెన్సర్లు ఉపయోగించడం ద్వారా యూరియా లేదా సమానమైన లవణాలు వంటి పదార్థాలను గుర్తించవచ్చన్నారు. సంఘాల సభ్యులు తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ శ్రీనివాస్, అమూల్ మేనేజర్ శ్రీకాంత్ పటేట్, ప్రశాంత్, ఏపీడీడీసీఎఫ్ జిల్లా మేనేజర్ రాకేష్, తదితరులు పాల్గొన్నారు. -
బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన
ఉపమాకలో జరగనున్న వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా బుధవారం పరిశీలించారు. డీఎస్పీ, సీఐలతో కలసి ఆయన ఉపమాకలో పర్యటించారు. స్వామివారి కల్యాణానికి లక్షలాది మంది తరలిరానున్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విలువైన స్వర్ణాభరణాలను అలంకరించి స్వామివారి రథోత్సవం, తిరువీధి సేవలు, ఎదురు సన్నాహా మహోత్సం నిర్వహించనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని సూచించారు. వచ్చేనెల 3న రాజయ్యపేట సముద్ర తీరంలో స్వామివారి చక్ర స్నానం సమయంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. డ్రోన్, సీసీ కెమెరాలు, మఫ్టీలో పోలీసు సిబ్బందితో నిరంతరం నిఘా పెట్టాలన్నారు. ఆశ్లీల నృత్యాల ప్రదర్శనకు తావులేదని, సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలకే అనుమతి ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ దేవ ప్రసాద్, ఎస్పీ డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ బాల సూర్యారావు, సీఐ మురళి, ఎస్ఐ సన్నిబాబు, తదితరులు పాల్గొన్నారు. -
గంజాయిపై విశాఖ రేంజ్ పోలీసుల ఉక్కుపాదం
సాక్షి, అనకాపల్లి: గంజాయిపై విశాఖ రేంజ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్సిన్హా, అల్లూరి ఎస్పీ అమిత్ బర్దర్ నేతృత్వంలో బుధవారం పరవాడలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ వద్ద భారీ స్థాయిలో గంజాయి ధ్వంసం చేశారు. విశాఖ రేంజ్ పరిధిలో అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో 783 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 52,336.614 కిలోల గంజాయి, 142.187 మీటర్ల హసిష్ ఆయిల్ను దహనం చేశారు. వీటిలో అనకాపల్లి జిల్లాలో 332 కేసులకు సంబంధించి 17,068.24 కిలోల గంజాయి, 10.03 లీటర్ల హషీష్ ఆయిల్ను, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 451 కేసులకు సంబంధించి 35,268.374 కిలోల గంజాయి, 132.157 లీటర్ల హషీష్ ఆయిల్ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ మీడియాతో మాట్లాడుతూ 2024 జూన్ నుంచి 2026 జనవరి నెలాఖరి వరకూ గత 20 నెలల్లో పోలీసులు చేసిన దాడుల్లో 976 కేసుల్లో 2,405 మందిని గంజాయి స్మగ్లర్లు, అక్రమ రవాణా చేసిన వారిని అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి 55,346.292 కిలోల గంజాయి, 56.275 కిలోల హషీష్ ఆయిల్ను, 685 వాహనాలను సీజ్ చేశామన్నారు. 24 అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలను గుర్తించి, 129 మంది సభ్యులపై నిరంతర నిఘా ఉంచినట్టు చెప్పారు. అంతేకాకుండా రూ. 9.19 కోట్ల ఆస్తుల జప్తు చేశామన్నారు. ఇప్పటి వరకు 14 మంది ప్రధాన నిందితులకు సంబంధించి రూ. 9,19,17,290 విలువైన ఆస్తులను గుర్తించి, ఫ్రీజ్ చేస్తూ కన్ఫర్మేషన్ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలవాటు పడ్డ నేరస్తులపై 92 ప్రతిపాదనలు సిద్ధం చేయగా, 34 డిటెన్షన్ ఆర్డర్లు అమలైనట్టు చెప్పారు. 1599 మందిపై హిస్టరీ షీట్లు తెరిచామన్నారు. నేరస్తుల డేటా ట్రాకింగ్ కోసం ఖాజ్, నిడాన్, నాట్గ్రిడ్ వంటి యాప్లను, 33 అత్యాధునిక డ్రోన్ల ద్వారా 129 హాట్స్పాట్లపై 1360 సార్లు నిఘా పెట్టి, నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు డీఐజీ వివరించారు. 6 డీ–అడిక్షన్ కేంద్రాల ద్వారా 401 మంది బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చి, 244 మందిని కేంద్రాలకు తరలించి చికిత్స అందించామన్నారు. గంజాయి సాగు చేసే గిరిజనులకు 29,840 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా 1.59 కోట్ల మొక్కలు పంపిణీ చేశామన్నారు. గంజాయి సమాచారం కోసం 1972, 1933 నంబర్లలో సంప్రదించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు జి.ఆర్.ఆర్.మోహన్, వి.విష్ణుస్వరూప్, ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, బి.మోహనరావు, పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎస్.బాలసూర్యారావు, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పరవాడలో కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ వద్ద గంజాయి ధ్వంసం అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 783 కేసుల్లో 52,336 కిలోల పట్టివేత డీఐజీ గోపీనాథ్జెట్టి, ఎస్పీల ఆధ్వర్యంలో దహనం -
స్కూల్ బస్సుకు ప్రమాదం
మాడుగుల రూరల్ : చోడవరం చలపతి పాఠశాలకు చెందిన బస్సు బుధవారం సాయంత్రం మాడుగుల మండలం ఎం.కోటపాడు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, రోడ్డు వెడల్పుగా ఉండడంతో పాటు ఎటువంటి ట్రాఫిక్ లేకపోయినా రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలపై ఎక్కించడంతో బస్సు కాలువలోకి దూసుకుపోయిందని విద్యార్థులతో పాటు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్ఐ నారాయణరావును వివరణ కోరగా.. డ్రైవర్ మామిడి చిన్న మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
వచ్చే నెలలో స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన
నక్కపల్లి: వచ్చే నెలలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన జరగనుంది. ఈ భూమి పూజకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. చందనాడ, డీఎల్పురం, వేంపాడు, అమలాపురం పరిసర ప్రాంతాల్లో 2,200 ఎకరాల్లో ఆర్సిలర్ మిట్టల్ యాజమాన్యం రూ.67వేల కోట్ల వ్యయంతో 10.5 వేల లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో స్టీల్ప్లాంట్ను ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. బుధవారం కలెక్టర్ విజయ కృష్ణన్ కాగిత, చందనాడ ప్రాంతాల్లో పర్యటించారు. కాగిత వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంగణాన్ని, ప్రధాని సభ వద్దకు చేరుకునే ప్రాంతాలను తనిఖీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ శౌర్యమాన్పటేల్, అడ్డురోడ్డు ఆర్డీవో వి.వి.రమణ, రెవెన్యూ ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు. డీఐజీ, ఎస్పీ పర్యటన ప్రధాని పర్యటన ఏర్పాట్లను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్జెట్ట్టి, జిల్లా ఎస్పీ తుహిన్సిన్హా బుధవారం పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలీప్యాడ్, వాహనాల పార్కింగ్ తదితర ప్రాంతాలను తనిఖీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని డీఐజీ స్థానిక పోలీసు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ జి.ఆర్.మోహన్, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, పీఐలు మురళి, అప్పన్న, ఎస్ఐ సన్నిబాబు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎసరు!
దేవుని భూమికిసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఒకవైపు అధికార పార్టీ నేతలు ప్రైవేటు భూమిని కూడా వివాదాలు రేపి తమ సొంతం చేసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తుండగా.. మరోవైపు దేవదాయ శాఖ భూములపైనే కన్నేయడం కలకలం రేపుతోంది. దేవదాయ శాఖకు చెందిన భూమిని ’ఇనాం’ భూమిగా చూపుతూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్ట ప్రకారం దేవదాయ కమిషనర్ పరిధిలోని అంశాల్లో కలెక్టర్ జోక్యం చేసుకోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. రికార్డుల్లో స్పష్టంగా దేవదాయ భూమి అని ఉన్నా, నిషేధిత జాబితా (22–ఏ)లో ఉన్న స్థలానికి కొత్త రికార్డులు ఎలా సృష్టించారో తేలాల్సి ఉంది. ఈ భూ దందా వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు అధికారుల పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కమిషనర్ను కాదని కలెక్టర్ పేరుతో..? సాధారణంగా దేవదాయశాఖకు చెందిన భూముల జాబితాను దేవదాయశాఖ కమిషనర్ అధికారికంగా ప్రకటిస్తారు. ఆయా జిల్లాల వారీగా ఆ జాబితాను కలెక్టర్లకు పంపించి, సంబంధిత సర్వే నంబర్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చుతారు. తద్వారా ఆ భూములపై ఎలాంటి క్రయవిక్రయాలు జరగకుండా రక్షణ కల్పిస్తారు. అయితే అనకాపల్లిలోని సర్వే నంబరు 1539/5లో ఉన్న 2.49 ఎకరాల భూమి విషయంలో ఈ విధానానికి భిన్నంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రికార్డుల ప్రకారం ఇది దేవదాయ శాఖ భూమి. అందుకే 22ఏ–1(సి) నిషేధిత జాబితాలో చేర్చారు. ఒకవేళ భూమి దేవదాయశాఖకు చెందదని తేలితే, ఆ సర్వే నంబరును 22ఏ జాబితా నుంచి తొలగించే అధికారం కేవలం దేవదాయశాఖ కమిషనర్కే ఉంటుంది. జిల్లా కలెక్టర్కు ఆ అధికారం లేదు. అయినప్పటికీ, ఈ భూమిని ఇనాం భూమిగా పేర్కొంటూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో కమిషనర్ అధికారాలను ఎప్పుడు, ఎలా కలెక్టరుకు బదలాయించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వారసత్వ హక్కు పేరుతో చక్రం వాస్తవానికి అనకాపల్లిలోని సర్వే నెంబరు 1539/5లో 2.49 ఎకరాల భూమిని కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి దూరి కామమ్మ అనే మహిళ 2005లో దత్తత ఇచ్చారు. ఇందులో 1.38 ఎకరాలను ఎన్టీఆర్ మార్కెట్ కోసం తీసుకున్నారు. మిగిలిన 1.11 ఎకరాల భూమి దేవదాయశాఖ ఆధీనంలో ఉంది. అయితే రికార్డుల్లో మాత్రం మొత్తం భూమి దేవదాయశాఖకు చెందినదిగానే ఉంది. 2016 నుంచి కూడా దేవదాయశాఖకు చెందిన భూమిగానే రికార్డుల్లో ఉంది. అంటే ఎన్టీఆర్ మార్కెట్ కోసం తీసుకున్న భూమికీ అధికార బదిలీ ప్రక్రియ జరగలేదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం భూమి 22ఏ–1(సి) నిషేధిత జాబితాలోనే ఉంది. అయితే, ఈ భూమి తనకు వారసత్వంగా వచ్చిందని పేర్కొంటూ కాండ్రేగుల చినతల్లి అనే మహిళ దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా కలెక్టర్ ఈ సర్వే నెంబరులోని భూమి ఇనాం భూమిగా పేర్కొంటూ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అధికారపార్టీకి చెందిన నేతల ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమ భూమిని కాపాడాలంటూ ఇప్పుడు కన్యాకాపరమేశ్వరి దేవస్థాన సభ్యులు వేడుకుంటున్నారు. ‘‘దేవుడి దానంపై దోపిడీ చేస్తే దైవశాపం తప్పదు’’ అనే సామెత గుర్తుకొచ్చేలా అనకాపల్లిలో దేవదాయశాఖ భూమిపై జరుగుతున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. రికార్డుల్లో స్పష్టంగా 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న దేవాలయ భూమిని ఇనాం భూమిగా మలిచే ప్రయత్నం, దేవదాయ శాఖ కమిషనర్ అధికారాలను పక్కనబెట్టి కలెక్టర్ స్థాయిలో ఉత్తర్వులు వెలువడటం వెనుక కనిపించని శక్తులు పనిచేశాయా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. వ్యవస్థను మేనేజ్ చేసి, రికార్డులను సృష్టించి, సాక్షాత్తూ దేవుడి ఆస్తులకే ఎసరు పెడుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు పెను సంచలనం రేపుతోంది. నిజానిజాలు దేవుడికెరుక? దేవదాయశాఖ భూమి అని రికార్డుల్లో ఉన్న స్థలాన్ని ఇనాం భూమిగా ఎలా పేర్కొన్నారు? కమిషనర్ అధికారాలను పక్కనబెట్టి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడానికి కారణమెంటీ? ఇందులో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. నిషేధిత జాబితా భూములపై అధికార పార్టీ నేతల కన్ను కమిషనర్ను కాదని.. కలెక్టర్ ద్వారా పావులు కదిపిన వైనం సొంత భూమిని కాపాడుకోలేక బాధితులుగా మారిన దేవదాయ అధికారులుఅధికారులే బాధితులుగా పీజీఆర్ఎస్కు.. సాధారణంగా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్కు ఫిర్యాదు చేస్తారు. కానీ, అనకాపల్లి జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సాక్షాత్తూ దేవదాయ శాఖ అధికారులే బాధితులుగా మారి.. తమ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తున్నారంటూ రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. సర్వే నంబరు 1539/5లోని భూమి దేవాదాయశాఖకు చెందినదని, అక్కడ తమ ఆధీనాన్ని సూచిస్తూ బోర్డు కూడా ఏర్పాటు చేసినట్లు వారు ఆధారాలు చూపుతున్నారు. అయినప్పటికీ రికార్డుల మార్పుల ద్వారా కలెక్టరును తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తున్నారు. -
‘గోవ’ పండగ... ఆనందం నిండుగా...
కె.కోటపాడు : ఆర్లి గ్రామంలో గంగాదేవి(గోవ) పండగను మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఐదేళ్లకు ఒక మారు గ్రామస్ధులు అమ్మవారి పండగను నిర్వహించడం ఆచారంగా వస్తుంది. పండగ పర్వదినం కావడంతో గంగాదేవి ఆమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్మాణం చేపట్టిన పందిరికి మొక్కులలో భాగంగా కొబ్బరి, అరటి, ద్రాక్ష పండ్లతో పాటు, నగదు, చీరలను వేలాడదీశారు. మధ్యాహ్నం పందిరికి వేలాడదీసిన వస్తువులను భక్తులు పొందేందుకు దోపిడీ కార్యక్రమం నిర్వహించగా భక్తులంతా ఉత్సాహంగా పోటీపడ్డారు. భక్తులకు లభించే వస్తువు అమ్మవారి ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు. పండగ సందర్భంగా బంధువులు, స్నేహితుల రాకతో గ్రామమంతా సందడిగా మారింది. ఈ సందర్భంగా తప్పెటగుళ్ల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. -
సచివాలయ ఉద్యోగి అని నమ్మించి బంగారం చోరీ
నిందితుడి అరెస్టుఅనకాపల్లి : సచివాలయ ఉద్యోగిగా చెప్పుకుని జిల్లాలో పలు చోట్ల చోరీకి పాల్పడిన కోనసీమ జిల్లా, రాజోలు మండలం, శివకోడపాలెం గ్రామానికి చెందిన ఎల్లమెల్లి వెంకటరమణ, అలియాస్ కిషోర్, అలియాస్ అర్జునరావును అరెస్టు చేసినట్టు డీఎస్పీ ఎం.శ్రావణి అన్నారు. పట్టణ పోలీస్స్టేషన్ ఆవరణలో మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుడు వెంకటరమణ గత ఏడాది డిసెంబర్లో అనకాపల్లి పట్టణం కర్ణాలువీధి దగ్గర సచివాలయం ఉద్యోగిని అని చెప్పి ఒక గృహాన్ని అద్దెకు కావాలని చెబుతూ పింఛన్ ఇప్పిస్తానని, ఫొటో, ఫింగర్ ప్రింట్ తీసుకోవాలని నమ్మబలికి మెడలో బంగారం తాడు ఉంటే పింఛను రాదని, ఆ బంగారాన్ని తీసివ్వమని చెప్పి ఓ మహిళను మోసగించాడని తెలిపారు. అలాగే గత ఏడాది నవంబర్లో ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు గ్రామంలో కూడా ఇదే విధంగా తనను తాను సచివాలయ ఉద్యోగిగా చెబుతూ ప్రభుత్వం నుంచి కొత్త పథకం కింద కొంత నగదు వచ్చిందని, ఆ డబ్బులు ఇవ్వాలంటే ఆధార్కార్డు, ఫొటో కావాలని, మెడలో బంగారు వస్తువులు తీయించి కాజేశాడని డీఎస్పీ చెప్పారు. నిందితుడు వద్ద నుంచి చోరీ సొత్తు 33.21 గ్రాములు బంగారం తాడు, రెండు బంగారం సూత్రాలు 22.85 గ్రాములు, ఒక బంగారం నల్లపూసలు 31.70 గ్రాములు మొత్తం బంగారం సుమారుగా 87.70 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా 14 రోజులు రిమాండ్ విధించడం జరిగిందన్నారు. నిందితుడిపై రాష్ట్రంలో పలు పోలీస్స్టేషన్లలో పాత కేసులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రేమ్కుమార్, ఎస్ఐలు అల్లు స్వామినాయుడు, కె.సంతోష్కుమార్ పాల్గొన్నారు. -
స్పీకర్ ఇలాకాలో రెడ్బుక్ రాజ్యాంగం
నాతవరం : అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇలాకాలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అధికారులు అమలు చేస్తున్నారని లింగంపేట సర్పంచ్ లోకవరపు రాము అన్నారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రామంలో సర్వే నంబరు 46లో 15సెంట్ల విస్తీర్ణంలో లోకవరపు అప్పలనాయుడు కుటుంబ సభ్యులు పూర్వం నుంచి నివాసం ఉంటున్నారని, ఉమ్మడి కుటుంబీకులు ఆ స్థలాన్ని వాటాలు వేసుకుని కొందరు శ్లాబు ఇళ్లు నిర్మించుకోగా, మరికొందరు ఆ స్థలంలో షెడ్లు వేసుకుని ఉంటున్నారన్నారు. వీరంతా వైఎస్సార్సీపీకి చెందిన వారు కావడంతో ఈ స్థలం గ్రామ కంఠం అంటూ కూటమి పెద్దలు కుట్ర చేశారన్నారు. ఈ స్థలంలో పంచాయతీ భవనం నిర్మిస్తామంటూ స్థానిక కూటమి నేతలు ప్రతిపాదనలు చేశారని, అధికారుల అండతో సర్పంచ్నునైన తనకు తెలియకుండా ఆ స్థలంలో పంచాయతీ నూతన భవనం నిర్మాణం చేసేందుకు రెండు నెలల క్రితం భూమి పూజ చేశారని తెలిపారు. పూర్వం నుంచి నివాసం ఉంటున్న వారి స్థలంలో భవనం నిర్మాణం చేయొద్దని, తనకు తెలియకుండా భూమి పూజ ఎలా చేస్తారని అధికారులను అడిగామన్నారు. కానీ అధికారులు సరైన సమాధానం ఇవ్వకుండా కూటమి నేతలకు వత్తాసు పలకడంతో ఈ స్థలంలో నివాసం ఉంటున్న లోకవరపు అప్పలనాయుడు, మనోజ్కుమార్ హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చిందన్నారు. స్టే ఉండగా ఆ స్థలంలో ఎంపీడీవో శ్రీనివాస్ పోలీసు బందోబస్తుతో పనులు చేసేందుకు గత నెలలో సిద్ధమయ్యారని చెప్పారు. తాను బాధితులతో కలిసి ఆ స్థలంలో పనులు చేయకుండా నిలుపుదల చేశానన్నారు. దీనిపై కక్ష పెట్టుకున్న అధికారులు, కూటమి నేతలు కుమ్మకై ్క పంచాయతీ కార్యదర్శి బాబితో లోకవరపు వరహాలబాబు, యర్రాపాత్రుడు నూకరాజు, మంగ నారాయణమూర్తి తదితర వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయించారని తెలిపారు. పోలీసులు క్షేత్ర స్థాయిలో జరిగిన విషయాలు పరిశీలించకుండా సోమవారం రాత్రి బాధితులనే నాతవరం తీసుకెళ్లిపోయారన్నారు. తప్పుడు కేసులు పెట్టి స్టేషన్కు తరలించి, ఆ స్థలంలో పోలీసులు బందోబస్తుతో మంగళవారం పనులు చేసేందుకు ఎంపీడీవో శ్రీనివాస్ తహసీల్దార్ ఓ.చందనరేఖ వచ్చారన్నారు. ఈ స్థలంలో ఎలాంటి పనులు చేయరాదని కోర్టులో స్టే ఉందని అధికారులతో వాదించామన్నారు. గ్రామసభ ఆమోదం లేకుండా, సర్పంచ్కు తెలియకుండా ఏకపక్ష నిర్ణయంతో పంచాయతీ భవనం నిర్మాణం చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై తప్పుడు కేసులు పెట్టి, భయపెట్టి కూటమి నేతలు అధికారుల అండతో ఇష్టానుసారం చేసేందుకు కుట్ర చేశారని సర్పంచ్ రాము ఆరోపించారు. టీడీపీ నేతల ఒత్తిడితో అక్రమ అరెస్ట్లు నర్సీపట్నం: టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకు వైఎస్సార్సీపీ సానుభూతిపరులను అక్రమ అరెస్ట్లు చేస్తున్నారని నాతవరం మండలం, లింగంపేట సర్పంచ్ లోకవరపు రాము ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఇచ్చిన స్థలం విషయంలో పోలీసులు వ్యవహారించిన తీరుపై ఆర్డీవో కార్యాలయంలో సర్పంచ్, బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అనంతరం సర్పంచ్, బాధిత కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. తాత,తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన 15 సెంట్ల భూమిని లోకవరపు వరహాలబాబు, రాజుబాబు అనుభవిస్తున్నారన్నారు. ఈ భూమిపై గ్రామ టీడీపీ నాయకుడు డి.అప్పలనాయుడు కన్నేశాడరన్నారు. ఆ భూమి గ్రామకంఠం పరిధిలో ఉందని రూ.2 లక్షలు ఇవ్వాలని అప్పలనాయుడు అనుభవదారులను డిమాండ్ చేశాడని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆస్థలంలో పంచాయతీ భవనం కడతామని టీడీపీ నాయకుడు అధికారుల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చారన్నారు.ఆ స్థలంలో భవనం కట్టేందుకు చేసిన తీర్మానంపై తన సంతకాలను సైతం పోర్జరీ చేశారని ఆరోపించారు. ఈ నెల 23వ తేదీ రాత్రి భోజనం చేస్తున్న మా కుటుంబ సభ్యులైన లోకవరపు నూకరాజు, లోకవరపు మంగ, లోకవరపు కొండబాబు, లోకవరపు నారాయణమూర్తి, పైల సీతారామనాగ జమీలు, లోకవరపు వరహాలబాబును పోలీసులు తీసుకెళ్లారని, ఎందుకు తీసుకువెళ్తున్నారని ఎస్ఐ తారకేశ్వరరావును ప్రశ్నించినప్పటికీ సమాధానం లేదన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి అక్రమ అరెస్టులు చేశారన్నారు. స్థల విషయమై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి
కోటవురట్ల: ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.ఆశాదేవి సూచించారు. మండలంలో ఆమె మంగళవారం పర్యటించి, రామచంద్రపురం శివారు శ్రీపతిరాజు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఉద్యానవన, వ్యవసాయ అనుబంధ పంటల సాగు పరిస్థితులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో చీడపీడలను నివారించడంతో పాటు, అధిక దిగుబడితో ఆరోగ్యకరమైన పంటను పొందవచ్చన్నారు. అనంతరం తంగేడులోని విత్తనశుద్ధి ఫ్యాక్టరీని సందర్శించారు. నాణ్యత పరీక్షల తర్వాత మాత్రమే రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి లచ్చన్న, ఏవో సరోజిని, సిబ్బంది, ఫ్యాక్టరీ యజమాని కొరుప్రోలు శివకుమార్ పాల్గొన్నారు. -
భూ వివాదంలో ఆరుగురి అరెస్టు
నర్సీపట్నం : గ్రామకంఠం భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించిన విషయమై పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ తెలిపారు. నర్సీపట్నం రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరా వెల్లడించారు. నాతవరం మండలం, లింగంపేట పంచాయతీ పరిధి సర్వే నెంబర్ 46లో పంచాయతీకి చెందిన ఖాళీ గ్రామకంఠం భూమిని తప్పుడు పత్రాలని సృష్టించి రిజిస్టేషన్ చేయించినట్లు జాయింట్ ఇన్స్పెక్షన్లో రుజువైందన్నారు. ఈ భూ వివాదానికి సంబంధించి ఎల్.నూకరాజు, ఎల్.మంగ, ఎల్.కొండబాబు, ఎల్.నారాయణమూర్తి, పి.సీతారామ నాగజమీలు,ఎల్.వరహాలబాబును అరెస్ట్ చేశామని సీఐ, ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ భూమిని కాజేసేందుకు తప్పుడు పత్రాలు సృష్టించినందునే చర్యలు తీసుకున్నామని నాతవరం తహసీల్దార్ చందనరేఖ పేర్కొన్నారు. -
సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గం
అనకాపల్లి: ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా జి.రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక నర్సింగరావుపేట అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా వి.కృష్ణ మోహన్, ఆర్థిక కార్యదర్శిగా రాజాన సన్యాసినాయుడు, సహ అధ్యక్షుడిగా వేదూరి శ్రీనివాసరావు,అదనపు ప్రధాన కార్యదర్శిగా కనిశెట్టి ఉమ, మహిళా అధ్యక్షురాలిగా మల్ల ఉమామహేశ్వరి, మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎం.సూర్యకుమారి, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎం.ఉమామహేశ్వరరావు, ఎస్.సంతోష్ కుమా ర్, ఆర్.రామ్చరణ్తో పాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా సి.గణేష్, ఎం. ఈశ్వరరావు, అబ్రహం సునంద వ్యవహరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ మార్చి ఒకటో తేదీన సీపీఎస్ విధానం రద్దుకోరుతూ విశాఖలో జరగబోయే సాగర ఘోష కార్యక్రమాన్ని విజయవంతం చేయాడానికి కృషి చేస్తామన్నారు. -
రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపిక
కశింకోట : రాష్ట్ర స్థాయి సైక్లింగ్ రేస్ పోటీలకు స్థానిక డీపీఎన్ జెడ్పీ హైస్కూలు 9వ తరగతి విద్యార్థి పీతల కిషోర్ ఎంపికయ్యాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆప్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సైక్లింగ్ రేస్ పోటీలు మంగళవారం అనకాపల్లిలో నిర్వహించారు. ఈ పోటీలో కిషోర్ రాష్ట్ర స్థాయి పోటీకి ఎంపికై నట్టు హెచ్ఎం ఎన్.జె.వి ప్రసాద్ తెలిపారు. ఈ నెల 28, మార్చి 1వ తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొననున్నట్లు చెప్పారు. కిషోర్ ఎంపిక పట్ల ఆయనతోపాటు పీడీలు వి.ప్రభాకరరావు, పి. కమల, విద్యా కమిటీ ప్రతినిధుల నక్కా నాగమణి, దుర్గ అప్పారావు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. -
జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో ఇందు ప్రతిభ
అచ్యుతాపురం రూరల్ : జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో ఎంజేపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని బి.ఇందు ఉత్తమ ప్రతిభ కనబర్చిందని పాఠశాల ఫిజకల్ డైరెక్టర్ ధర్మిరెడ్డి రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తమిళనాడులో గల జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం జరిగిన జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున కాంస్య పతకం సాధించడంలో ఇందు ఉత్తమ ప్రతిభ కనబర్చిందన్నారు. క్రీడాకారిణి ఇందుకి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.రాజా రత్నకుమార్, సర్పంచ్ కరెడ్ల బుల్లెమ్మ, మాజీ సర్పంచ్ కరెడ్ల సూర్యప్రకాశ్, స్కూల్ కమిటీ చైర్మన్ యు.ఉష, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. -
ఉత్సాహంగా సైక్లింగ్సెలక్షన్స్ పోటీలు
అనకాపల్లి టౌన్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాలకు మేరకు మంగళవారం నిర్వహించిన శాప్ లీగ్ సైక్లింగ్ సెలక్షన్స్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. అండర్–18 విభాగంలో పట్టణంలో సుంకరమెట్ట జంక్షన్ నుంచి దేవీపురం వరకు జరిగిన పోటీల్లో 45 మంది బాలురు, 10 మంది బాలికలు పాల్గొన్నారు. వ్యక్తిగత, మాస్టర్ విభాగంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలైన వారు ఈ నెల 28 నుంచి మార్చి నెల 1వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పూజారి శైలజ తెలిపారు. -
3న అప్పన్న డోలోత్సవం
సింహాచలం: ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించు కుని మార్చి 3న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి డోలోత్సవాన్ని కొండ దిగువన ఉన్న పుష్కరిణి సత్రం ప్రాంగణంలోని ఉద్యానవన మండపంలో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానం ఈవో జె.వెంకటరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు చంద్రగ్రహణం సంభవిస్తున్న నేపథ్యంలో వైదిక కార్యక్రమాలు, ఉత్సవ నిర్వహణ సమయాల్లో మార్పు లు చేసినట్లు పేర్కొన్నారు. 3న తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవ, 3.30 గంటలకు బాలభోగం, ఆరాధన పూర్తిచేసి.. అనంతరం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, చూర్ణోత్సవం నిర్వహిస్తారు. తెల్లవారుజామున 4 గంట లకు స్వామివారి ఉత్సవమూర్తులను మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు తీసుకొస్తారు. అక్కడ ఉద్యానవన మండపంలో డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు. అనంతరం ఉద యం 6 గంటల నుంచి గ్రామ తిరువీధి నిర్వహించి, తిరిగి స్వామివారిని కొండపైకి తీసుకెళ్తారు. భక్తులందరూ ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఈవో కోరారు. -
పోలీసులు నూతన దృక్పథంతో ముందుకు సాగాలి
ఆరిలోవ: మారుతున్న సాంకేతిక పరిస్థితులు, సోషల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని నూతన దృక్పథంతో పోలీసులు ముందుకు సాగాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. కై లాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ మైదానంలో 15 రోజులుగా జరుగుతున్న అనకాపల్లి జిల్లా ఏఆర్ బలగాల వార్షిక డీ–మొబలైజేషన్ ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఏఆర్ పోలీసులు ఆయనకు సాదర స్వాగత పలికారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ అనధికారిక సమావేశాలు, అనుమతి లేని ర్యాలీలు నియంత్రించేటప్పుడు అప్రమత్తంగా మెలగాలన్నారు. చట్టపరమైన నిబంధనల మేరకు శాంతియుతంగా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇక్కడ శిక్షణలో నేర్చుకున్న ఆయుధాల వినియోగం, బాంబ్ స్క్వాడ్ , మాబ్ కంట్రోల్ నైపుణ్యాలు విధి నిర్వహణలో వెన్నుముఖంలా నిలుస్తాయని చెప్పారు. విధి నిర్వహణలో ఉండి కుటుంబ బాధ్యతలను విస్మరించకూడదన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, ఎస్బీ డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, మన్మథరావు, ఆర్ఎస్ఐ ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
● 1.20 లక్షల మంది వస్తారని అంచనా ● విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్ సింహాచలం : ఏప్రిల్ 30న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేందిరప్రసాద్ తెలిపారు. చందనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై మంగళవారం ఆయన సింహగిరిపై దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది చందనోత్సవానికి 1.20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసినట్టు తెలిపారు. సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంతృప్తికర దర్శనం కల్పించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. బారికేడింగ్తో సహా అన్ని సివిల్, నిర్మాణ పనులు మార్చి 31లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. క్యూలైన్లలో సాధ్యమైనంత వరకు శాశ్వత షెల్టర్లు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. తాత్కాలిక షెల్టర్ ఏదైనా ఏర్పాటుచేస్తే ముందుగా ఆర్అండ్బీ లేదా వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ల ద్వారా సర్టిఫై చేయిస్తామన్నారు. సాధారణ భక్తులకు ఉదయం 3గంటల నుంచి రాత్రి 11గంటల వరకు దర్శనం కల్పించే ప్రణాళిక చేశామన్నారు. వీఐపీలు, వీవీఐపీలకు ఉదయం 3 నుంచి 5 గంటల వరకు మాత్రమే ప్రత్యేక టైమ్ స్లాట్లు ఉంటాయని తెలిపారు. రూ. 300, రూ. 1000, రూ. 1500 టికెట్ల దర్శనాల క్యూలు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రారంభమవుతాయన్నారు. వారం ముందే టికెట్ల జారీ ప్రక్రియని పూర్తిచేస్తామన్నారు. టిక్కెట్లపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామన్నారు. బస్సుల నిర్వహణ, పికల్–డ్రాప్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాలపై స్పష్టమైన ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ ప్రాంగణంలోకి సెల్ఫోన్లు అనుమతి ఉండదని, పోలీసులు, సేవావలంటీర్లతో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. అనంతరం కలెక్టర్ స్వామివారిని దర్శించుకున్నారు. -
4న చలో విజయవాడ
అనకాపల్లి : సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలు, మేకలు పెంపకందారుల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి, అధికారం చేపట్టి 20 మాసాలు కావస్తున్నా పట్టించుకోలేదని ఏపీ గొర్రెలు మేకలు పెంపకం దారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంటా శ్రీరామ్ అన్నారు. ఈ మేరకు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మార్చి 4న విజయవాడలో రాష్ట్ర ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పెంపకందారుకు 50 శాతం సబ్సిడీతో రూ.ఐదు లక్షలు రుణం ఇచ్చే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని, పశువైద్యశాలలు, ఆర్బీకేలలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని, ఉచిత బీమా ద్వారా పశు నష్టపరిహారం రూ.10వేలు ఇవ్వాలని, సంవత్సరానికి నాలుగుసార్లు నట్టల నివారణ మందులు, అన్ని రకాల టీకాలు ఉచితంగా అందజేయాలని ఆయన కోరారు. సహకార సంఘాలకు ఎన్సీడీసీ ఇచ్చిన రూ. 88 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేసి, 90శాతం సబ్సిడీతో ఉపాధి హామీ నిధులతో షెడ్లు నిర్మించి, మందలను నిలుపుకోవడానికి వలలు పంపిణీ చేయాలని అన్నారు. 50 సంవత్సరాలు నిండిన పెంపకందారునికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ పింఛన్ అందజేయాలన్నారు. పశు వైద్యకేంద్రాల్లో నెలకు పదివేల రూపాయల విలువైన నాణ్యమైన మందులు ఉంచాలని, పెంపకం దారుల రక్షణ కోసం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా సామాజిక రక్షణ చట్టం తేవాలని, పెంపకం దారులకు ఎక్స్గ్రేషియా పథకాన్ని పునరుద్ధరించి ప్రమాదంలో మరణిస్తే రూ.20 లక్షలు, సాధారణ మరణాలకు రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి గోకాడ దేముడు నాయుడు సభ్యులు మనబాల రాజేష్, గొర్లె రమణ తదితరులు పాల్గొన్నారు. -
పౌష్టికాహారం పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
దేవరాపల్లి : అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సరఫరా చేసే పౌష్టికాహార పంపిణీలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. సూర్యలక్ష్మి అన్నారు. మండలంలోని శంభువానిపాలెం, వాలాబు, రైవాడ అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రీ స్కూల్ పనితీరు, పిల్లల హాజరు పట్టికను, పలు రిజిష్టర్లను పరిశీలించారు. ప్రీ స్కూల్ పిల్లలతో మాట్లాడి విద్యా బోధనపై ఆరాతీశారు. పోషణ్ ట్రాకర్, బాల సంజీవని యాప్ అప్డేషన్ను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహార, ఇతర సేవలను చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలకు ఆమె వివరించారు. ఈ సందర్భంగా పీడీ సూర్యలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో కచ్చితంగా సమయ పాలన పాటించి, పారదర్శకంగా వ్యవహరించాలని అంగన్వాడీ కార్యకర్తలకు ఆదేశించారు. అనంతరం వాలాబు గ్రామంలో స్థానిక ప్రజలతో సమావేశమై బాల్య వివాహాలతో కలిగే అనర్దాలను వివరించి, వారితో ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాలను నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కె.కోటపాడు ప్రాజెక్ట్ ఐసీడీఎస్ సీడీపీవో పి.లలితకుమారి, సూపర్వైజర్లు రాములమ్మ, ఆదిలక్ష్మి, వాలాబు సర్పంచ్ పోడెల వెంకటలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
బహిరంగ మల విసర్జనను అరికట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ విజయకృష్ణన్ అనకాపల్లి : జిల్లాలోని గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి పారుదల, గ్రామ/వార్డు సచివాలయ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పారిశుధ్యం మెరుగుకు 24 మండలాల్లో ప్రతి మండలానికి 5 గ్రామాలు చొప్పున ఎంపిక చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ప్రధానంగా రావికమతం, రాంబిల్లి, బుచ్చెయ్యపేట మండలాల పరిధిలో పనిచేస్తున్న ఎంపీడీఓలు, ఉప ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక సూచనలు జారీ చేయడం జరిగిందన్నారు. గ్రామాలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా ఉంచడం, ప్రతి ఇంటిలో మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావడం, గ్రామంలోని అన్ని వీధి దీపాలు వెలిగేలా చూడడం, మురుగు కాలువలను శుభ్రపరచడం, తడి చెత్తను చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు తరలించి నాడేప్ పిట్స్లో వేయడం, ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేయడం వంటి చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. గ్రామస్తులకు బహిరంగ మలవిసర్జన చేయవద్దని అవగాహన కల్పించాలని, పొడి చెత్త (ప్లాస్టిక్, పేపర్లు, పుస్తకాలు, ఇనుము, అల్యూమినియం తదితరాలు) స్వచ్ఛ రథం వాహనాలకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి సందీప్, జిల్లా గ్రామీణ నీటి పారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ అనిల్ కుమార్, జీఎస్డబ్ల్యూఎస్ సమన్వయ అధికారి మంజుల వాణి, ఎంపీడీఓలు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర సాధనకు కలసిరండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 విధానం అమలుకు సంపూర్ణ సహకారం అందించి స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వాములు కావాలని కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసి పేదరికం లేని సమాజాన్ని స్థాపిద్దామని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర 2047, ప్రణాళికలపై మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర– 2047 విజన్లో భాగంగా పీ–4 విధానం అమలవుతుందని, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో సీపీవో రామారావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీపీవో సందీప్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శచిదేవి పాల్గొన్నారు. -
చూడ‘చెక్కిన’ తాజ్ అందం
● లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు పెన్సిల్ ముల్లుపై చెక్కిన తాజ్మహల్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఇచ్చిన ప్రశంసాపత్రంతో వెంకటేష్ నక్కపల్లి : మండలంలో చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గట్టెం వెంకటేష్ పెన్సిల్ముల్లుపై తాజ్ మహల్ చెక్కాడు. సుమారు ఆరు గంటల పాటు శ్రమించి 4 మిల్లీమీటర్ల వెడల్పు, 4 మిల్లీమీటర్ల ఎత్తుతో పెన్సిల్ ముల్లుపై తాజ్మహల్ను రూపొందించాడు. అతని ప్రతిభకు గుర్తింపుగా లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించింది. వెంకటేష్ గతంలోనూ ఇలా ఎన్నో సూక్ష్మకళాఖండాలను రూపొందించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం విశేషం. -
ఉపమాక చేరిన వెంకన్న ఆభరణాలు
విశాఖ నుంచి తెచ్చిన స్వామివారి ఆభరణాలు నక్కపల్లి : ఉపమాక వేంకటేశ్వర స్వామివారికి చెందిన ఆభరణాలు మంగళవారం ఆలయానికి తీసుకు వచ్చారు. స్వామివారికి కోట్లాది రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటిలో పచ్చల హారం, కెంపులు, మరకత మాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, రత్నాలు పొదిగిన హారం ఉన్నాయి. వీటిని భద్రతా కారణాల రీత్యా విశాఖలోని సబ్ట్రెజరీలో భద్రపరిచారు. ప్రతిఏటా వీటిని స్వామివారి కల్యాణోత్సవాల సందర్భంగా పటిష్ట్ట బందోబస్తు మధ్య తీసుకువచ్చి స్వామివారికి అలంకరిస్తారు. దేవస్థానం సూపరింటెండెంట్ కూర్మేశ్వరరావు, సీఐ మురళి, ఎస్ఐ సన్నిబాబు ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్లతో కూడిన బృందం పటిష్ట బందోబస్తు మధ్య ఆభరణాలు తీసుకు వచ్చారు. స్వామివారికి అలంకరించి భక్తుల దర్శనం కోసం ఐదురోజుల పాటు స్వామివారి ఆభరణాలను ఇక్కడే ఉంచుతారు. ఆభరణాలు ఆలయానికి తీసుకు వచ్చిన నేపథ్యంలో సివిల్ పోలీసులతో పాటు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బలగాలు ఆభరణాలు భద్రపరచిన ప్రాంతంలో పహరా కాస్తున్నాయి. విశాఖ నుంచి తీసుకు వచ్చిన ఆభరణాలను బేడా మండపం చుట్టూ ప్రదక్షణలు నిర్వహించి లాకర్లో భద్రపరిచారు. -
విత్తనం ద్వారా అరటిసాగు
దేవరాపల్లి : మండలంలోని తామరబ్బ పంచాయతీ శివారు పల్లపు కోడాబులో సనపల జగదీష్, ఇందుకూరి విష్ణుప్రియ దంపతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. విశాఖపట్నంకు చెందిన జగదీష్ ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంట్ సైన్స్, విష్ణుప్రియ ఎన్విరాన్మెంట్ సైన్స్లో డాక్టరేట్ సైతం పూర్తి చేశారు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో దంపతులిద్దరూ ఆకుకూరలు, కాయగూరలతో పాటు దేశీయ పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వీరు సాగు చేస్తున్న పంటలను విశాఖపట్నం నుంచి వచ్చిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, మ్యాంగో మేన్ అప్పాజీ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం, ఇంజినీర్ అల్లు గోపి, గోశాల ప్రతినిధి అచ్యుతరావు తదితరులతో కూడిన బృందం మంగళవారం సందర్శించారు. మొలకలతో కాకుండా విత్తనం ద్వారా పెంచిన అరటి చెట్టును, వాటికి కాసిన భారీ అరటి గెలలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రసాయనాలను వినియోగించకుండా కాయగూరలు, ఆకు కూరలు, పండ్ల తోటలు తదితర సుమారు 150 రకాల పంటలు పండించి, మంచి దిగుబడులు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. -
దురంతో ఎక్స్ప్రెస్ కోచ్ల్లో మార్పులు
తాటిచెట్లపాలెం : విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య నడుస్తున్న దురంతో ఎక్స్ప్రెస్ కోచ్ల్లో పలు మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్–విశాఖపట్నం (22204) దురంతో ఎక్స్ప్రెస్ ఏప్రిల్ 22వ తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం–సికింద్రాబాద్ (22203)దురంతో ఎక్స్ప్రెస్ ఏప్రిల్ 23వ తేదీ వరకు 1–ఫస్ట్ ఏసీ, 4–సెకండ్ ఏసీ, 12–థర్డ్ ఏసీ, 3–స్లీపర్ క్లాస్, 2–జనరల్ సెకండ్ క్లాస్ /లగేజి /దివ్యాంగ్ కోచ్లతో నడుస్తుంది. ఏప్రిల్ 25 నుంచి శాశ్వతంగా.. సికింద్రాబాద్–విశాఖపట్నం (22204) దురంతో ఎక్స్ప్రెస్ ఏప్రిల్ 25వ తేదీ నుంచి, తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం–సికింద్రాబాద్ (22203) దురంతో ఎక్స్ప్రెస్ ఏప్రిల్ 26వ తేదీ నుంచి 1–ఫస్ట్ ఏసీ, 4–సెకండ్ ఏసీ, 14–థర్ ఏసీ, 2–సెకండ్ క్లాస్ కం లగేజి/ దివ్యాంగ కోచ్లతో శాశ్వత ప్రాతిపదికన నడుస్తుంది. -
మూగ నివేదన!
వైద్యమందక... పశువులకు సేవలు అందిస్తున్న గోపాలమిత్ర నాతవరం : పేదవాడి ట్రాక్టరు పాడి పశువు అన్నది పూర్వపు సామెత. రైతులకు అంత ప్రాధాన్యం కలిగిన పశువుకు ఎలాంటి రోగం వచ్చిన వైద్యసేవలు అందించే నాధులు కరువయ్యారు. జిల్లాలో 24 మండలాల పరిధిలో మొత్తం 67 వెటర్నరీ అసిస్టెంటు సర్జన్లు పోస్టులకు 9 తొమ్మిది మందిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి నియమించక ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలో వెటర్నరీ అసిస్టెంట్ల పోస్టులు 48 మందికి 24 మంది నియమించలేదు. వీరంతా క్షేత్ర స్థాయిలో పశువైద్యశాలలో రైతులకు అందుబాటు ఉండాలి కానీ పూర్తి స్థాయి సిబ్బంది లేక జిల్లాలో చాలా పశువైద్యశాలలు తెరుచుకోక ఎప్పుడు చూసినా మూసి ఉంటున్నాయి. జిల్లాలో కుసర్లపూడి ఎం.కోడూరు కె.జె.పురం, బూరుగుపాలెం, వడ్డాది, నాతవరం, కొరుప్రోలు, ఏటికొప్పాక ప్రాంతాల్లో గల పశువైద్యకేంద్రాల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు రెండేళ్లుగా ఖాళీగానే ఉండడంతో ఈ ప్రాంత పాడి రైతు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు నియామకాలు లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి సిబ్బందిని కూడా ప్రభుత్వం నియమించక పశువులకు ఎలాంటి వైద్య సేవలు అందాలన్నా గోపాలమిత్ర లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీటితో పాటు వెటర్నరీ లైవ్స్టాక్ అఫీసర్లు, లైవ్స్టాక్ అసిస్టెంట్ పోస్టులు సైతం ఖాళీగానే ఉన్నాయి. అదే విధంగా జిల్లాలో మొత్తం 446 ఆర్ఎస్కేలు పరిధిలో 198 వెటర్నరీ క్లస్టర్లు ఉన్నాయి. వాటిలో సుమారుగా 82 వరకు పోస్టులు ఖాళీగా ఉండడంతో క్షేత్ర స్థాయిలో పశువులకు వైద్య సేవలు పొందడం కష్టంగా మారింది. రైతులకు జీవనాధారంగా వ్యవసాయం తర్వాత పాడి పశువులు మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకంపై ఆధారపడుతున్నారు. వాటికి ఎలాంటి ఆనారోగ్య సమస్య వచ్చినా పశువైద్యాధికారులు సేవలు అందించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి పూర్తిస్థాయిలో పశువైద్యాధికారులు, సిబ్బంది లేక పాడి రైతులు అనేక బాధలు పడుతున్నారు. చాలా గ్రామాల్లో పశువులకు సకాలంలో వైద్య సేవలు అందక వేలాది రూపాయలు విలువ చేసే పశువులు మరణించిన సందర్భాలు ఉన్నాయి. గతంలో పాడిరైతులకు పశువైద్యశాలల ద్వారా పశుగ్రాసం, విత్తనాలు రాయితీపై సరఫరా చేసేవారు. పశువులకు, లేగదూడలకు వ్యాధులు రాకుండా ముందస్తుగా వ్యాక్సిన్లు వేసేవారని, ఇటీవల కాలంలో వాటికి దూరమయ్యామని రైతులు అంటున్నారు. వైద్య సిబ్బంది కొరత... నాతవరం మండలంలో నాతవరం, గునుపూడి, శృంగవవరం ప్రాంతాల్లో పశువైద్యశాలలు ఉన్నాయి. గునుపూడి, నాతవరం పశువైద్యాశాలల్లో వైద్యులతో పాటు క్షేత్ర స్థాయి సిబ్బంది లేకపోవడంతో ఎప్పుడు చూసినా అవి మూతబడి ఉంటున్నాయి. శృంగవరం పశువైద్యశాలలో వైద్యులు ఉన్నా ఎప్పుడూ రైతులకు అందుబాటులో ఉండరని రైతులు ఆరోపిస్తున్నారు. వైద్యాధికారులతో పాటు దిగువ స్థాయి సిబ్బంది కూడా లేకపోవడంతో ఈ ప్రాంత రైతులంతా గోపాలమిత్రలపై ఆధారపడుతున్నారు. ఈ ప్రాంతంలో అధిక శాతం రైతులు పాడిపై అధారపడుతున్నారు. నాతవరం, గునుపూడి పశువైద్యశాలలో వైద్యులను నియమించాలని గత నెలలో మండల ప్రత్యేకాధికారి మంగవేణికి మాజీ ఎంపీపీ పారుపల్లి కొండబాబు, రైతులు స్వయంగా ఫిర్యాదు చేశారు. ఈ సమస్య స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తెస్తూ మండల సమావేశంలో చర్చించినా కనీస ప్రయోజనం కలగలేదని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై పాయకరాపుపేట పశుసంవర్ధకశాఖ ఏడీ వెంకట సురేష్ను వివరణ కోరగా ప్రభుత్వం కొత్తగా వైద్యాధికారులు, సిబ్బంది నియామకాలు చేయలేదన్నారు. అందువల్ల సిబ్బంది కొరత వెంటాడుతుందని, సచివాలయాల్లో ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నామన్నారు. పశువైద్యాధికారులు లేక అందని వైద్యసేవలు అనేక చోట్ల మూసి ఉంటున్న పశువైద్యశాలలు క్షేత్రస్థాయి సిబ్బంది లేక గోపాలమిత్రలపై భారం -
ఆల్బెండజోల్ మాత్రలతో రక్తహీనత నివారణ
గొండుపాలెం హైస్కూల్లో ఆల్బెండజోల్ మాత్రలు వేసుకున్న విద్యార్థులతో జిల్లా లెపర్సీ అండ్ టీబీ వైద్యాధికారి స్వప్న కె.కోటపాడు: ఆల్బెండజోల్ మాత్రలతో నులిపురుగులను నివారించి, తద్వారా రక్తహీనత సమస్యను అధిగమించవచ్చని జిల్లా లెపర్సీ, టీబీ వైద్యాధికారిణి కె.స్వప్న తెలిపారు. మండలంలో చౌడువాడ పీహెచ్సీని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యాధికారులు మాదంనాయుడు, రామ్ నరేష్లతో మాట్లాడి పీహెచ్సీ పరిధిలో ఎంత మంది కుష్టు, టీబీ లక్షణాలతో వైద్యం పొందుతున్నారు, ఈ నెల 17న జరిగిన డీవార్మింగ్ డే కార్యక్రమంలో పీహెచ్సీ పరిధిలోఎంత మందికి ఆల్బెండజోల్ మాత్రలను అందించారో తెలుసుకున్నారు. అనంతరం గొండుపాలెం హైస్కూల్లో 143 మందికి నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడాదికి రెండుసార్లు ఈ ఆల్బెండజోల్ మాత్రలను వేసుకోవడం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈవో జె.సన్యాసిరావు, పీహెచ్ఎన్ కనకవేణి, టీబీ సూపర్వైజర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


