breaking news
Anakapalle
-
రైవాడలో ఫ్లెక్సీల చించివేతపై ఇరువర్గాల కొట్లాట
దేవరాపల్లి : మండలంలోని రైవాడలో ప్లెక్సీల చించివేత విషయంలో తలెత్తిన వివాదం టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం వీరిలో కొందరిని మెరుగైన వైద్యం కోసం కె.కోటపాడు ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 28న గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా టీడీపీ నాయకులు ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వాటిని చించివేశారని ఆరోపణలతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన చల్లా తాతయ్యలు, వైఎస్సార్సీపీకి చెందిన చల్లా నాయుడు వర్గీయుల వివాదం రేగింది. నాలుగు రోజుల క్రితం చెలరేగిన వివాదం సద్దుమణగక పోవడంతో ఇరువర్గాలను సోమవారం సాయంత్రం స్థానిక ఏఎస్ఐ ప్రసాద్ స్టేషన్కు పిలిపించి మాట్లాడి పంపించారు. వీరంతా గ్రామానికి వెళ్లిన తర్వాత ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ కొట్లాటలో తాతయ్యలు అన్నయ్య చల్లా వెంకటరమణ తలపై తీవ్ర గాయం కాగా, కుమారుడు సాయి, భార్య నారాయణమ్మ తదితరులకు గాయాలయ్యాయి. ఇదే ఘర్షణలో వైఎస్సార్సీపీకి చెందిన ఆబోతు రాముకు సైతం తలపై తీవ్ర గాయం కాగా, అతని తల్లి నూకాలు, వదిన కాసులమ్మ, స్వామి తదితరులు గాయపడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై ఇరువర్గాలు స్థానిక పోలీస్స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. గ్రామంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ఐ వి. సత్యన్నారాయణ తెలిపారు. -
గుప్పుగుప్పున...గంజాయ్
ఉమ్మడి జిల్లాలో గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది జులై వరకు.. పట్టుబడ్డ గంజాయి 29,898 కిలోలు నమోదైన కేసులు 413 అరెస్టయిన వారు 1245 మంది పెదగొలుగొండపేట వద్ద తొలగించిన పోలీసు చెక్పోస్టు వద్ద నిరుపయోగంగా స్టాప్ గేట్. (ఇన్సెట్) చెక్పోస్టు వద్ద ఐరన్ షెడ్డు తొలగించడంతో తుప్పల్లో దర్శనమిస్తున్న మరుగుదొడ్డు బేసిన్సాక్షి, అనకాపల్లి : ఏజెన్సీ టు నేషనల్ హైవే...వయా అనకాపల్లి జిల్లా...గంజాయి గుప్పుమంటోంది. అల్లూరి జిల్లాలో కొయ్యూరు, పాడేరు, చింతపల్లి, జీకే వీధి, జి.మాడుగుల మండలాల పరిధిలో సాగు చేసే గంజాయిను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, నాతవరం, గొలుగొండ, రోలుగుంట మండలాల మీదుగానే విశాఖకు, ఇతర నగరాలకు గుట్టుగా రవాణా చేస్తున్నారు. ఏజెన్సీలో ఈ ప్రాంతల నుంచి గంజాయిని నర్సీపట్నం మీదుగా రవాణా చేస్తే ఆ మార్గంలో చెక్పోస్టులు ఉండడంతో గంజయి స్మగ్లర్లు ఆ దారి కాకుండా నాతవరం మండలంలో పెద గొలుగొండ పేట మీదుగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇది గుర్తించి చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. ఆ తరువాత గంజాయి ఈ మార్గం ద్వారా రవాణా అవ్వడం తగ్గింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత అక్కడ చెక్ పోస్టు తీసేయడంతో ఆ మార్గాన గంజాయి అక్రమ రవాణా సాగుతుంది. ఈ మార్గాన అనుకుని ఉన్న గ్రామాల్లో ఉన్న యువతే టార్గెట్గా గంజాయి స్మగ్లర్లు గంజాయి అక్రమ రవాణా చేయిస్తున్నట్టు సమాచారం. కొంత మంది ఆకతాయిలతో స్నేహం చేసి గంజాయికి అలవాటు పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఏజెన్సీలో ఏఓబీ ప్రాంతంలో కూడా ప్రస్తుతం గంజాయి సాగు పెరిగింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డ్రోన్ల సాయంతో 7,515 ఎకరాల్లో గంజాయి సాగు గుర్తించి ధ్వంసం చేశారు. కూటమి ప్రభుత్వంలో గంజాయి సాగు మళ్లీ విచ్చలవిడిగా జరుగుతుంది. పెదగొలుగొండ పేట చెక్పోస్టు కీలకం.. నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గంజాయి నిర్మూలించేందుకు ప్రత్యేకంగా పోలీసు చెక్పోస్టు ఏర్పాటు చేస్తే ..నేటి కూటమి ప్రభుత్వం చెక్పోస్ట్నే ఎత్తేసింది. నాతవరం మండలంలో ఏటు అవతల గ్రామాలకు వెళ్లే మార్గంలో పెద గొలుగొండపేట గ్రామ సమీపంలో పోలీసులు ప్రత్యేకంగా చెక్పోస్టు ఏర్పాటు చేశారు. అప్పటి నర్సీపట్నం ఏఎస్పీగా పని చేసిన ఆర్.రిషాంత్రెడ్డి అధ్వర్యంలో రూ.3 లక్షలు వ్యయంతో పోలీసు చెక్పోస్టు ఏర్పాటు చేసి గంజాయి ఆక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఈ చెక్పోస్టు వద్ద ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని నియమించి 24 గంటలు గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెంచారు. అదేవిధంగా పోలీసులు రాత్రింబవళ్లు ఉండేందుకు ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఈ రోడ్డులో ప్రయాణించే వారి కదలికలను నర్సీపట్నం ఏఎస్పీతో పాటు జిల్లా ఎస్పీ నేరుగా పర్యవేక్షించే చర్యలు చేపట్టారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ చెక్పోస్టు ఎత్తేశారు. ఎత్తేసిన మరుక్షణం నుంచే అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల చింతపల్లి, కోయ్యూరు, గూడెంకోత్తవీధి మండలాల నుంచి ఈ ప్రాంతం మీదుగా గంజాయి అక్రమ రవాణా తిరిగి ఊపందుకుంది. హైవేకు షార్ట్ కట్ రూట్.. ఏజెన్సీలో కొయ్యూరు, జీకే వీధి, చింతపల్లి ప్రాంతాల నుంచి గంజాయి ఎటువంటి చెక్పోస్టులు లేకుండా అత్యంత తక్కువ దూరంతో కాకినాడ జిల్లా తునిలో ఉన్న హైవేకు చేరుకోవచ్చు. పెదగొలుగొండ పేట మీదుగా తుని–నర్సీపట్నం బైపాస్ రోడ్డులో కోటనందూరు మీదుగా తుని హైవేకు చేరుకుంటారు. తుని రైల్వే స్టేషన్ నుంచి ఇతర మార్గాలకు అక్రమ రవాణా, లేదంటే జాతీయ రహదారి మీదుగా విశాఖపట్నానికి రవాణా జరుగుతుంది. మూడు జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉన్న నాతవరం మండలం మీదుగానే గంజాయి అక్రమ రవాణాకు రాజమార్గంలా స్మగ్లర్లు ఉపయోగించుకుంటున్నారు. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలను అనుసంధానిస్తూ ఉన్న నాతవరం మండలంలో పోలీసులు చెక్పోస్టులు పెంచి నిఘా పెంచితే అక్రమ గంజాయి రవాణాను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని స్థానిక ప్రజలు సైతం సూచిస్తున్నారు. గతంలో ఇక్కడ పోలీసు చెక్పోస్టు ఏర్పాటు చేయడంతో గంజాయి రవాణా చేసే స్మగ్గర్లకు చెక్ పడింది. గతంలో పోలీసు చెక్పోస్టు ఉండే ప్రదేశంలో ప్రస్తుతం చెక్పోస్టు ఎత్తివేసి, అక్కడ ఏర్పాటు చేసిన ఐరన్ షెడ్డు మెటీరియల్ తరలించేశారంటూ స్థానిక ప్రజలు సైతం ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. పరవాడలో రూ.1.06 కోట్ల విలువైన 213.36 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు (ఫైల్) జూన్ 5న అనకాపల్లి టౌన్ పరిధిలోని బీఆర్టీ కాలనీలో మెగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు (ఫైల్) జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా గడచిన ఏడాదిలో 413 కేసులు ఉమ్మడి జిల్లాలో గత ఏడాదిలో 29,898 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 413 కేసులు నమోదు చేసి 1245 మందిని అరెస్ట్ చేశారు. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 64,823 కిలోల గంజాయి ధ్వంసం చేయగా, అనకాపల్లి జిల్లాలో 459 కేసుల్లో 34,818 కిలోల గంజాయి, 39.04 కిలోల హషీష్ ఆయిల్ను, అలాగే అల్లూరి జిల్లాలో 255 కేసుల్లో 30,005 కిలోల గంజాయి, 35.35 కిలోల హాషీష్ ఆయిల్ను ధ్వంసం చేశారు. ఈగల్ విభాగం 5 స్టాటిక్, 38 డైనమిక్ చెక్పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్డన్ సెర్చ్... ర్యాపిడ్ కిట్లతో టెస్ట్ –నాతవరం మండలంలో చమ్మచింత, కురువాడ గ్రామాల్లో ఆదివారం పోలీసులు ’ఆపరేషన్ వజ్ర ప్రహార్’ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్డన్ సెర్చ్ చేపట్టారు. గంజాయి పెడ్లర్లను గుర్తించేందుకు గంజాయి ర్యాపిడ్ కిట్లతో 15 మందికి పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తికి 18 ఏళ్లు యువకుడుగా గుర్తించారు. పదో తరగతి వరకూ చదువుకున్నాడు. అమ్మ చనిపోవడంతో చదువు నిలిపివేశాడు. ఆకతాయిలతో స్నేహం..గంజాయి సేవించడం..దానికి అలవాటు పడడం జరిగింది. గతంలో కొన్ని నెలల క్రితం కురువాడ, చమ్మచింత గ్రామాల్లో గంజాయి అక్రమ రవాణా చేసే గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రెండు గ్రామాల్లో యువత గంజాయి మత్తు ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ నెల 30న ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో 1 సీఐ, 8 ఎస్ఐలు, 56 మంది పోలీస్ సిబ్బందితో కార్డన్ సెర్చ్ చేపట్టారు. ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. 300 ఇళ్లు, 600 మందిని తనిఖీ చేసి, రికార్డులు లేని 35 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. -
మున్సిపల్ అధికారులూ స్పందించండి..!
నర్సీపట్నం : మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ మున్సిపాలిటీ బ్యాంక్ కాలనీకి చెందిన ఎస్.సూర్యనారాయణరాజు ఆర్డీవో కార్యాలయం ఎదుట అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తన ఇంటికి అనుకొని ఉన్న ఖాళీ స్థలంలో మురుగు నీరు నిలిచిపోవటం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నాం తెలిపారు. దుర్వాసన, దోమలు, బోరు నీరు కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్లినా స్పందన లేదని, ఫిర్యాదు చేసిన తననే అధికారులు హెచ్చరిస్తున్నారని ఆవేదన చెందారు. సమస్య పరిష్కరించే వరకు దీక్ష విరమించే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. -
సీఎం గారూ ఈ సమస్యలు తీర్చండి..
నక్కపల్లి : పాయకరావుపేట పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నియోజకవర్గ సీపీఎం నాయకుల లేఖ విడుదల చేసారు. నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ఈ లేఖలో కోరుతున్నట్లు సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.అప్పలరాజు తెలిపారు. తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాల భూములు ఏపీఐఐసీకి విక్రయించే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, వెంటనే షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి కార్మికులకు, రైతులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని, తాండవ, వరాహ నదులకు ఇరువైపులా పటిష్టమైన గట్లు నిర్మించాలని ఆ లేఖలో కోరారు. అలాగే నక్కపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన భవనాలు నిర్మించాలని, ఎస్.రాయవరం, కొరుప్రోలులలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, విద్యాబోధనకు అవసరమైన లెక్చరర్లను నియమించాలని కోరారు. నక్కపల్లి ఆస్పత్రిని 100 పడకల స్థాయికి అప్గ్రేడ్ చేయాలని, ట్రామాకేర్సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరారు. ఎస్.రాయవరం మండలంలో ఏన్ఈవోబీ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, బోయపాడు వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటరు వెంటనే నిర్మించాలని, విదేశాల్లో వ్యతిరేకించిన బల్క్డ్రగ్ పార్క్ కోసం అదనపు భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే స్టీల్ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రెండో జాబితా, వివాహితులైన ఆడపిల్లలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని, ఉద్దండపురం వద్ద వాటర్గ్రిడ్ను తక్షణమే పూర్తిచేసి నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాలని, ధర్మవరం నుంచి ఎస్.రాయవరం వెళ్లు రోడ్డు విస్తరణ చేయాలని, నక్కపల్లిలో ఎస్సీ బాలుర వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని, కోటవురట్ల మండలంలో అణుకు, తడపర్తి, కొత్తూరు, గిరిజన గ్రామాలకు తారురోడ్డు ఏర్పాటు చేయాలని, అడ్డురోడ్డులో ఆర్టీసీ కాంప్లెక్స్, సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని సీఎంను లేఖ ద్వారా కోరుతున్నట్టు అప్పలరాజు వెల్లడించారు. -
స్టీల్ప్లాంట్ సీఎండీకి అదనపు బాధ్యతలు
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ సీఎండీ ఎం.ఎన్.వి.ఎస్. ప్రభాకర్కు స్టీల్ప్లాంట్ అనుబంధ సంస్థలైన ఈస్ట్రన్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ (ఈఐఎల్), బిస్రా స్టోన్ లైమ్ కంపెనీ లిమిటెడ్ (బీఎస్ఎల్సీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) ఎ.కె.బాగ్చీ సోమవారం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సీఎండీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఉప కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఈనెల ఒకటి నుంచి ఏడాది పాటు లేదా తదుపరి నియామకం జరిగే వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. -
అక్రమ గ్రావెల్ తరలింపుపై సమగ్ర విచారణ జరపాలి
సాక్షి, అనకాపల్లి : పంచదార్ల కొండపై మైనింగ్ ఆగిందా..? లేక రీహాబిలిటేషన్ పేరుతో అక్రమ తవ్వకాలకు కొత్త దారి తెరిచారా? అని వైఎస్సార్సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ నిలదీశారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఆధ్యాత్మిక, పర్యావరణ, భూగర్భ జలాల ప్రాధాన్యం కలిగిన పంచదార్ల కొండ ప్రజల ఆస్తి. అలాంటి పంచదార్ల కొండ పరిధిలో ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటిస్తూ ఇచ్చిన ప్రభుత్వం జీవోకే విలువ లేకపోతే ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ప్రతిపక్షాల నిరసనలకు తలవంచి చంద్రబాబు ప్రభుత్వమే పంచదార్లను ’నో మైనింగ్ జోన్న్’గా ప్రకటిస్తూ జీవో జారీ చేసిందని, అయితే ఉత్తర్వులు వెలువడిన తర్వాత కూడా కొండపై తవ్వకాలు ఎందుకు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రీహాబిలిటేషన్ లెవిలింగ్ పేరిట చేస్తున్న తవ్వకాలను తక్షణమే నిలిపివేసి, టెండర్ల ప్రక్రియ నుంచి గ్రావెల్ తరలింపు వరకు జరిగిన వ్యవహారంపై పారదర్శక విచారణ జరిపి నిజాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. రీహాబిలిటేషన్ పేరుతో మళ్లీ కొండను తవ్వడానికి అనుమతులు ఎలా ఇచ్చారో ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. చూపిస్తున్న వర్క్ ఆర్డర్ మైనింగ్కా లేక రీహాబిలిటేషన్న్కా అనేది స్పష్టత ఇవ్వాలన్నారు. రీహాబిలిటేషన్ పేరుతో ఇప్పటివరకు ఎంత పరిమాణంలో గ్రావెల్ తీశారు? ఎంత బయటకు తరలించారు? అందులో రీహాబిలిటేషన్న్కు వాడింది ఎంత? అనే అంశాలపై అధికారులతో కొలతలు వేయించి సమగ్ర విచారణ జరపాలని కోరారు. -
రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక
సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై న విద్యార్థులు పాయకరావుపేట : గత నెల 30న మాకవరపాలెంలో జరిగిన సాఫ్ట్బాల్ ఎంపికల ప్రక్రియలో శ్రీ ప్రకాష్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సబ్ జూనియర్స్ అండర్ – 14 బాలుర విభాగంలో బి.సార్ధక్ , డి.నంద కిషోర్ బాలికల విభాగంలో వి.గీతా ప్రవస్తి, కె.రాఘ వర్షిణి అనకాపల్లి తరపున సెప్టెంబరు 12 నుండి 14 వరకు విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాష్ట్ర స్ధాయి పోటీలకు ఎంపికై నట్టు శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ ప్రధానోపాధ్యాయుడు డి.వి.శ్రీనివాస్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులను విద్యాసంస్థల అధినేత సిహెచ్.వి.కె నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.ఎస్ మూర్తి, కోచ్ విజయ్ అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
రావికమతం : గాజువాక సమీపంలో చినగంట్యాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రావికమతం గ్రామానికి చెందిన వృద్ధురాలు కంచిపాటి బంగారమ్మ (62) మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం మనుమరాలు, భర్తతో కలిసి స్కూటీపై ముగ్గురు వెళ్తుండగా అయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో బంగారమ్మ మృతి చెందగా, మిగిలిన ఇద్దరూ గాయపడినట్టు ఆమె బంధువులు తెలిపారు. రావికమతం గ్రామానికి బంగారమ్మ గాజువాకలో ఉంటున్న మనవరాలు ఇంటికి ఆదివారం వెళ్లింది. సోమవారం ఇంటికి వస్తానని చెప్పడంతో ఆమె రాకకోసం కుమార్తె బంధువులు ఎదురు చూస్తున్నారు. బంగారమ్మ రావికమతంలో చాలా కాలం నుంచి కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంది. గాజువాక నుంచి రావికమతం రావడానికి మనవరాలు, భర్తతో స్కూటీపై వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదవార్త తెలిసి స్వగ్రామంలో కుమార్తె, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. -
తాత్కాలిక పనులతో మమ అనిపించారు...
కశింకోట: మండలంలోని తాళ్లపాలెం సంత వద్ద పోలవరం ఎడమ కాలువ అనుసంధాన పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. అయినప్పటికి నీటికి అవరోధం లేకుండా అందించడానికి అనువుగా పూర్తి చేశామని అధికారులంటున్నారు. పోలవరం కాలువను ప్రస్తుతం విశాఖకు తాగునీటిని సరఫరా చేస్తున్న ఏలేరు కాలువతో ఇక్కడ అనుసంధానం చేశారు. తాత్కాలిక పనులు మాత్రమే నిర్వహించి పనులు అయిపోయినట్లు మమ అనిపించారు. ఇంకా పలు మిగిలిన పనులు నిర్వహించాల్సి ఉంది. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టకపోవడం వల్ల పోలవరం నీరు విడుదల చేస్తే ప్రవాహానికి అడ్డంకులు కలిగి ఇబ్బందులు ఏర్పడతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. తాళ్లపాలెం సంత వద్దకు పోలవరం నీరు రావడానికి ఆలస్యం కానుందని సమాచారం. ప్రభుత్వం వచ్చే సెప్టెంబర్ 2న పోలవరం కాలువ ద్వారా సాగు, తాగునీరు, పరిశ్రమలకు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి హయాంలో జల యజ్ఞంలో చేపట్టిన పోలవరం కాలువ నిర్మాణ పనులు జరగ్గా అక్కడక్కడ మిగిలి ఉన్న పనులను రెండు నెలల క్రితం యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. 7వ ప్యాకేజిలో భాగంగా దార్లపూడి నుంచి తాళ్లపాలెం సంత వరకు పనులు నిర్వహించారు. దీనిలో భాగంగా తాళ్లపాలెం సంత వద్ద విశాఖకు తాగునీరు అందిస్తున్న ఏలేరు కాలువకు గతంలో మిగిలిపోయిన అసంపూర్తి పనులు తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టి పోలవరం కాలువను అనుసంధానించారు. అనుసంధాన ప్రాంతంలో ఏలేరు కాలువ నీరు వెళ్లడానికి ప్రస్తుతం అవరోధం లేకుండా అడ్డుకట్ట వేశారు. పోలవరం కాలువ నుంచి నీరు విడుదల చేయగానే దాన్ని తొలగించి పోలవరం కాలువ నీరు ఇక్కడ ఏలేరు కాలువలో అనుసంధానికి మార్గం సుగమం చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ చేపట్టిన పనులలో భాగంగా అను సంధాన ప్రాంతం వరకు కాలువ తవ్వి సుమారు కిలో మీటరు పొడవున ఎడమ రక్షణ గట్టును కొత్తగా ఏర్పాటు చేసి ఇప్పటికే ఉన్న కుడి గట్టును పట్టిష్టం చేశారు. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన కాలువ అంతర్ భాగంలో సిమెంట్ కాంక్రీట్తో వేయాల్సిన లైనింగ్ పనులు చేపట్టలేదు. దీనివల్ల నీటి ప్రవాహ సమయంలో కాలువలో మట్టి పూడుకుపోవడం, బురద నీరు ప్రవహించడం, ప్రస్తుత ఏలేరు కాలువలోకి ఆ బురద, మట్టి కొట్టుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంకులు కలిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. అయితే రెండు నెలల పాటు నీటి ప్రవాహం తర్వాత నిలిపి వేసి లైనింగ్ పనులు, శాశ్వత పనులు నిర్వహిస్తారని పోలవరం కాలువ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా నీరు ప్రవాహానికి అనువుగా తాత్కాలిక ప్రాతిపదికన కాలువను ఏర్పాటు చేశామంటున్నారు. కాలువ నుంచి నీటిని విడుదల చేస్తే మండలంలోని రైతులకు మొదటి దశగా సుమారు 5 వేల ఎకరాల వరకు పంట భూములకు సాగు నీటి సదుపాయం మెరుగు కానుంది. అయితే ప్రభుత్వం సెప్టెంబర్ 2వ తేదీన దార్లపూడి వద్ద పోలవరం నీటిని విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అయితే తాళ్లపాలెం వరకు నీరు రావడానికి దాదాపు రెండు రోజులు ఆలస్యం కావచ్చునని అధికారులు అంటున్నారు. అలాగే తాత్కాలిక ప్రాతిపదికనే నర్సీపట్నం వైపు మార్గంలో పోలవరం కాలువపై కాజ్వే రోడ్డు నిర్మించారు. దీని స్థానంలో నూతన ఫ్లై ఓవర్ వంతెన నిర్మించాల్సి ఉందని, దీన్ని కూడా తర్వాత చేపడడతామని అధికారులంటున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టిన పనుల వల్ల అవరోధం కలగకుండా శాశ్వత ప్రాతిపదికన పనులను నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు. -
రేపు పాయకరావుపేటకు సీఎం చంద్రబాబు
పోలవరం ఎడమ కాలువ జలహారతి ప్రదేశాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్, ఏస్పీ పాయకరావుపేట : సీఎం చంద్రబాబు ఈనెల 2న పాయకరావుపేటకు రానున్నారు. పోలవరం ఎడమ కాలువ వద్ద గోదావరి జలాలకు జలహారతి సమర్పించనున్నారు. అనంతరం పీఎల్ పురంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం చంద్రబాబు ఈనెల 2న బుధవారం ఉండవల్లిలో గల తన నివాసం నుంచి బయలుదేరి మధ్యా హ్నం 2.30 గంటలకు పాయకరావుపేట పి.ఎల్ పురానికి చేరుకుంటారు. అక్కడ నుంచి పోలవరం లెప్ట్ మెయిన్ కెనాల్ వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 3.30 నుంచి 5.20 గంటల వరకూ పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో ఉండవల్లికు వెళ్లనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం ఏర్పాట్లు పరిశీలించారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ముగ్గురు అదనపు ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు , 36 మంది సీఐలు, 90 మంది ఎస్ఐ లు, 150 మంది ఏఎస్ఐలు, 427 మంది కానిస్టేబుళ్లు, 150 మంది మహిళా కానిస్టేబుళ్లు, 249 మంది హోం గార్డులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు తీర్చండి
తుమ్మపాల : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా ఏపీ జేఏసీ అమరావతి నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఆగస్టు 28న విజయవాడలో జరిగిన రాష్ట్ర సదస్సు నిర్ణయం మేరకు ఈ ఉద్యమ కార్యాచరణ లేఖను అందజేసినట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా శాఖ చైర్మన్ ఎస్.ఎస్.వి.ఎస్ నాయుడు మాట్లాడుతూ ఇప్పటికే 37 నెలలు ఆలస్యమైన 12వ పీఆర్సీ కమిషన్న్ను వెంటనే నియమించాలని, తాత్కాలిక భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 5 డీఏలను విడుదల చేయడంతో పాటు పెన్షనర్లకు తగ్గించిన 3 శాతం క్వాంటమ్ ఆఫ్ పెన్షనన్ను పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగుల 26 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని, గత 8 ఏళ్ల బకాయిలను పే–స్లిప్పుల్లో నమోదు చేయాలన్నారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుపై కొందరు చేస్తున్న వ్యక్తిగత, రాజకీయ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం స్పందించి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి అనకాపల్లి జిల్లా జనరల్ సెక్రెటరీ డి.లోవరాజు, రెవెన్యూ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీరామ్ మూర్తి, ఏపీ పీటీడీ జిల్లా అధ్యక్షులు డీఎన్ మూర్తి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. శంకర రావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి డి. దొరబాబు, ఏపీవీఆర్ఓఎస్ అసోషియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, జిల్లా ఏపీవీఆర్ఓ అధ్యక్షులు ఏ. శశి, ఏపీ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి శేఖర్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నుంచి ఎం.ఎన్.ఎన్ సూరి శివ, ఏపీ ఫిజికల్ చాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, ఏపీ జేఏసీ అమరావతి సంఘాలు, డివిజన్ స్థాయి అధ్యక్షులు, కార్యదర్శులు, ఇతర ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
డేటా సెంటర్కు భూ సర్వే పూర్తి
మాకవరపాలెం : డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూముల సర్వే పూర్తయిందని తహసీల్దార్ కాకర నూకరాజు తెలిపారు. మండలంలోని తూటిపాల రెవెన్యూలో రెన్యూ గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే 433.03 ఎకరాల్లో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. భూముల విస్తీర్ణం, రైతుల వివరాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా సోమవారం తహసీల్దార్ మాట్లాడుతూ తూటిపాల రెవెన్యూ పరిధిలోని అడిగర్లపాలెం, పోతలూరు, మామిడిపాలెం, తూటిపాల ప్రాంతాల్లో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబందిన భూముల సర్వే పూర్తి చేశామన్నారు. సరిహద్దులు కూడా నిర్ణయించామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ డేటా సెంటర్కు భూ సేకరణపై త్వరలో రైతులతో సమావేశాలు నిర్వహించి, పరిహారం, ఇతర ప్యాకేజీల వివరాలపై చర్చించనున్నట్టు చెప్పారు. -
సంచార జాతుల సంక్షేమానికి కృషి
అనకాపల్లి: దేశంలో సంచార జాతులను మోదీ ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం ద్వారా రుణాలను అందజేయడం జరుగుతుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రొంగలి గోపిశ్రీనివాస్, శ్రీనివాసరావు అన్నారు. స్థానిక రావుగోపాలరావు కళాక్షేత్రంలో సంచార జాతుల విముక్తి దివస్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సంచార జాతులను 1952 ఆగస్టు 31న భారత దేశం గుర్తించడం జరిగిందన్నారు. సంచార జాతులకు ఒక ప్రదేశం ఉండదని, భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్నట్టు ఆయన చెప్పారు. 1871లో బ్రిటిష్ ప్రభుత్వం వారు సంచార జాతులవారిని జైల్లో పెట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాల పాలనలో సంచార జాతులను పట్టించుకోలేదన్నారు. సంచార జాతకు ప్రత్యేక సంక్షేమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి పాలనలో సంచార జాతులను గుర్తించి వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. స్వశక్తితో అభివృద్ధి చేందుకు బీజేపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిల్లా రమాకుమారి, చొక్కాకుల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
కొత్తకోట వైద్యాధికారి –2 గైర్హాజరుపై విచారణ
రావికమతం: కొత్తకోట పీహెచ్సీ వైద్యాధికారి –2 ఉదయ్కుమార్పై పలు ఫిర్యాదులు రావడంతో జిల్లా ఇమ్యూనిజేషన్ అధికారి చంద్రశేఖర్ దేవ్ సోమవారం విచారణ చేపట్టారు. ఇక్కడ పీహెచ్సీలో పని చేస్తున్న ఉదయ్కుమార్ తరుచూ విధులకు గైర్హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పీహెచ్సీని సందర్శించి సిబ్బందిని తీరా తీశారు. వైద్య సేవలు, సిబ్బంది పనితీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యాధికారి –2పై నివేదిక డీఎంహెచ్వోకు అందజేస్తామని, ప్రఽస్తుతం రెండో వైద్యాధికారిగా రవితేజ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం ఎంపీటీసీ పూడి దేవా, నాయకులు కోట గోవిందరావు, కోట సత్యనారాయణ, వెల్లంకి ఈశ్వరరావు పలు సమస్యలుపై వినతి పత్రం అందజేశారు. పీహెచ్సీలో రాత్రిళ్లు డాక్టర్ ఉండాలని, 108 అందుబాటులో ఉండాలని, ఆస్పత్రికి మెయిన్ గేటు ఏర్పాటు చేయాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా టీబీ, హెచ్ఐవీ అధికారి కె. స్వప్న, వైద్యులు మోహిని సురేఖ, రవితేజ, సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
చోడవరం: గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు పదేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ. లక్ష చొప్పున జరిమానా విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించిందని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తెలిపారు. వివరాల్లోకి వెళితే... 2016లో దేవరాపల్లి శివారులో గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా అప్పటి ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇనస్పెక్టర్ సిహెచ్.వి.ప్రసాద్ తన సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా అటుగా వెళుతున్న టాటా ఇండికా కారులో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. కారును తనిఖీ చేయగా అందులో 144కేజీల గంజాయిని పట్టుకున్నారు. కారుతో పాటు గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ కేసు చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.హరినారాయణ వాదనలు విని, నిందితులు దేవరాపల్లికి చెందిన అతవ అచ్యుతరావు, తమిళనాడుకు చెందిన ఒచ్చు విజయ్కుమార్ పై నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేశారు. ఒక్కొక్కరికి 10యేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ. లక్ష జరిమానా చెల్లించాలని, జరిమానా చెల్లించలేని పక్షంలో మరో ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి హరినారాయణ తీర్పు చెప్పినట్టు సుధీర్ తెలిపారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీపురపల్లి సూర్యనారాయణ అన్ని వివరాలు కోర్టుకు అందించడంతో నేరం రుజువైందని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నేరస్తునికి శిక్ష పడేలా అన్ని సాక్షాధారాలు సేకరించిన వారందర్నీ ఆయన అభినందించారు. -
పాడుతా తీయగా విజేతలకు బహుమతులు
అనకాపల్లి: స్థానిక గవరపాలెం సంతోషిమాత అమ్మవారి ఆలయం వద్ద పాడుతూ తీయగా పాటల పోటీలు ఆదివారం రాత్రి ముగిసాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా 50మంది సింగర్స్ వచ్చి పాటలు పాడారు. న్యాయనిర్ణేతలుగా సంగీత దర్శకుడు ఇంద్రగంటి లక్ష్మీశ్రీనివాస్, ప్రముఖ అధ్యాత్మిక విద్యావేత్త, ప్రవచన కర్త, నంది అవార్డు గ్రహీత అల్లాడ బాలసౌజన్యకుమారి వ్యవహరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పాటలు మానసిక ఉత్సాహానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి ప్రియగీతకు (అనకాపల్లి)రూ.5వేలు, ద్వితీయ బహుమతి నిత్యప్రియ(కశింకోట)రూ.3వేలు, తృతీయ బహుమతి డి.జగదీశ్వరి(నాగులాపల్లి)రూ.2వేలు, కన్సొలేషన్ బహుమతులుగా ఐదుగురికి రూ.వేయి చొప్పన నగదు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో ఎంబీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి
తుమ్మపాల : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించి సామాజిక న్యాయం కల్పించాలని జిల్లా యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంకే మారేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, 139 కులాలకు చెందిన బీసీ రిజర్వేషన్లు కేవలం 10 శాతం ఉన్నత బీసీ కులాలకు చెందిన వారే రాజకీయ లబ్ధి పొందుతున్నారని అన్నారు. న్యాయవాది ఐఆర్ గంగాధర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. జిల్లాప్రధాన కార్యదర్శి గుత్తుర్తి అప్పారావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఎంబీసీలకు రాజకీయ ప్రాధాన్యం లేక పోవడం వల్ల ధనిక వర్గాలకు చెందిన రాజకీయ నాయకులు బానిసలుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ రిజర్వేషన్లు కొందరికే కాదని అందరికీ చెందాలని రాంబిల్లి మండల యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు రంగాల నాగరాజు అన్నారు. సీపీఐ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి జనార్ధన్ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం ఎంబీసీలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి తమ పార్టీ మద్దతిస్తుందని అన్నారు. ఐలాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ఎస్.అజయ్కుమార్ మాట్లాడుతూ ఎంబీసీల సామాజిక న్యాయ పోరాటం న్యాయబద్ధమైనదని అన్నారు. ఎంబీసీల న్యాయమైన రాజకీయ డిమాండ్ ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చి, ఎస్సీలకు అందించే అన్ని సంక్షేమ పథకాలు, సౌకర్యాలు అందించాలని కోరుతూ కలెక్టరేట్లో డీఆర్వో సత్యనారాయణరావుకు జిల్లా నాయకులు వినతిపత్రం అందించారు. కులవృత్తి చేసుకుంటూ నేటికీ గ్రామాల్లో ఒకటి రెండు కుటుంబాలుగా ఉన్న తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని, తమకు కూడా ఎస్సీ హోదా కల్పించడం ద్వారా ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలు పొందగలమన్నారు. ప్రభుత్వం స్పందించి రజకులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సాధన కమిటీ కోకన్వీనర్ చల్లపల్లి రామ కోటేశ్వరరావు, అడ్డూర్ శంకర్, పొట్నూరు తిరుపతయ్య, సూదికొండ రమణ హనుమంతరావు, రజక సంఘ నాయకులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ ఆస్పత్రిలో ఓపీ లైన్లు కిటకిట
అనకాపల్లి టౌన్ : అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ విభాగానికి వస్తున్న రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. దీంతో భారీ క్యూలైన్లు ఏర్పడుతున్నాయి. ఇక్కడకు ప్రతిరోజూ సుమారు 650 నుంచి 700 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఓపీ మధ్యాహ్నం 12 గంటల వరకు రద్దీ కొనసాగుతుంది. దీంతో క్యూలైన్లు బారులు తీరుతున్నాయి. పెరిగిన రద్దీకి తగ్గట్టుగా ఓపి కౌంటర్లు లేకపోవడంతో పేషంట్లతో వచ్చిన వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సోమవారం 11.30 గంటల సమయంలో ఓపి కౌంటర్ల వద్ద తోపులాట, కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ సిబ్బంది సర్ది చెప్పడంతో గొడవ సద్దు మనిగింది. జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రిగా ఉండడంతో చుట్టపక్కల గ్రామాల నుంచి, స్ధానికులు అధిక సంఖ్యలో ప్రజలు వైద్యం కోసం వస్తున్నారు.అయితే పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ఓపీ కౌంటర్లను పెంచాల్సిన అవసరం ఉంది. -
మద్యం మత్తు.. కారు బీభత్సం
చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): మద్యం మత్తులో కారుతో అతివేగంగా వస్తూ బీభత్సం సృష్టించి ఒక కారు, నాలుగు ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. చింతపల్లి సమీపంలోని అంతర్ల ‘టీ టైం’ పాయింట్ వద్ద జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు గూడెంకొత్తవీధి మండలంలోని ధారాలమ్మ తల్లిని దర్శించుకుని కారులో తిరిగి వస్తున్నారు. వారు పూటుగా మద్యం సేవించి, కారును విపరీతమైన వేగంతో నడుపుతూ చింతపల్లి సమీపంలోని అంతర్ల శ్మశానవాటిక వద్ద ఉన్న ‘టీ టైం’ బోర్డు పోల్ను ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా అక్కడ నిలిపి ఉంచిన వాహనాలపైకి కారు దూసుకెళ్లి బలంగా ఢీకొట్టడంతో నామగిరి వరప్రసాద్, చప్పట్ల వాసు, సాగిన నాగార్జున, వంతల వెంకటరావు, పప్పు సత్తిబాబులకు చెందిన ద్విచక్ర వాహనాలతో పాటు మరో కారు నుజ్జునుజ్జయ్యాయి. అదే సమయంలో పక్కనే ఉన్న వాటర్ సర్వీసింగ్ సెంటర్ నుంచి తన వాహనంతో బయటకు వస్తున్న ఉగ్గిన రమేష్ను కూడా కారు ఢీకొట్టడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో పలువురు ఉన్నప్పటికీ ఎవరికీ గాయాలు కానందున స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన సమయంలో కారును పాయకరావుపేట మండలానికి చెందిన పడాల సాయి సమరన్న దొర నడుపుతుండగా, కారులో మామిడి రాజేష్, డీఏ కిరణ్తో పాటు మొత్తం నలుగురు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, మద్యం మత్తులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
అవినీతి నాయకుడు!
కార్మికుల సొమ్ము నొక్కేస్తున్న యూనియన్ లీడర్ 30 మంది ఫ్యామిలీ పెన్షన్ లబ్ధిదారుల నుంచి భారీగా వసూళ్లు స్టీల్ప్లాంట్ కల్యాణ మండపాల కాంట్రాక్టుల్లోనూ అక్రమాలు నెలరోజుల్లో పదవీ విరమణ చేస్తున్న అక్రమాల నాయకుడు ప్లాంట్ చరిత్రలో తొలిసారిగా నిలిచిపోయిన ఫైనల్ సెటిల్మెంట్ సీవీసీ, సీబీఐ కి ఫిర్యాదు చేసిన కార్మిక సంఘాలు విచారణ నుంచి తప్పించాలంటూ టీడీపీ నేతల చుట్టూ ప్రదక్షిణలు సాక్షి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్లో ఓ కీలక యూనియన్ నేత సాగించిన అవినీతి బాగోతం తీవ్ర కలకలం రేపుతోంది! కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిన నాయకుడే.. ఏకంగా కార్మికుల సొమ్ముల్ని దోచుకుంటూ రూ.కోట్లు గడించారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడం ప్లాంట్లో సంచలనంగా మారింది. అమాయక లబ్ధిదారుల ఫ్యామిలీ పెన్షన్లు మొదలుకుని కల్యాణ మండపాల కాంట్రాక్టులు, ఆన్–డ్యూటీ కేసుల ఆమోదం వరకు ప్రతి దాంట్లోనూ తన మాయాజాలం ప్రదర్శిస్తూ అందినకాడికి దోచుకున్న ఈ ‘అక్రమాల నాయకుడి’పై తోటి కార్మిక సంఘాలు సీవీసీ, సీబీఐలకు ఫిర్యాదు చేయడంతో ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది. మరికొద్ది రోజుల్లో పదవీ విరమణకు సిద్ధమవుతున్న తరుణంలో.. ప్లాంట్ చరిత్రలోనే తొలిసారిగా యాజమాన్యం ఆయన ఫైనల్ సెటిల్మెంట్ని నిలిపివేయడం హాట్టాపిక్గా మారింది. తన మెడకు చుట్టుకుంటున్న అవినీతి ఫిర్యాదులు, విచారణల నుంచి తనను ఎలాగైనా రక్షించాలంటూ సదరు నాయకుడు ఇప్పుడు అధికార టీడీపీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం అటు రాజకీయంగానూ, ఇటు కార్మిక వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైజాగ్ స్టీల్ప్లాంట్లో గుర్తింపు పొందిన ఓ కార్మిక సంఘం అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి. తన పదవిని అడ్డం పెట్టుకుని 2019 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.8 కోట్ల నగదు, రెండు కిలోల బంగారాన్ని అక్రమంగా సంపాదించారంటూ..యూనియన్కి చెందిన ఓ కీలక నేత కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ, సీబీఐ, చీఫ్ విజిలెన్స్ అధికారులకు ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆన్ డ్యూటీ కేసుల ఆమోదంలోనూ హస్తలాఘవం నిబంధనలకు విరుద్ధంగా 2020–2025 మధ్య కాలంలో ప్లాంట్ వెలుపల జరిగిన ప్రమాదాలను సైతం విధి నిర్వహణలో జరిగినవిగా (ఐవోడీ) చూపిస్తూ ప్రయోజనాలు పొందేలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ప్రతి కేసులో సుమారు రూ.80–90 లక్షల ప్రయోజనం చేకూరగా, సంబంధిత కుటుంబాల నుంచి మధ్యవర్తుల ద్వారా రూ.25–30 లక్షలు అక్రమంగా వసూలు చేసినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఇక.. యాజమాన్యం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించిన సమయంలో.. దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు ఎక్కడ కోల్పోతామోనన్న భయంతో ఉన్న కొంతమంది ఉద్యోగుల నుంచి ఈ అవినీతి కార్మిక సంఘ నాయకుడు భారీగా వసూళ్లకు పాల్పడ్డారని సమాచారం. పథకం ఆమోదం పొందేలా చేస్తానని వారికి నమ్మకబలికి ఏకంగా రూ.కోటిన్నర స్వాహా చేసినట్లు తెలుస్తోంది. అయితే.. తన లావాదేవీలన్నీ కుటుంబ సభ్యుల అకౌంట్ల ద్వారా చేస్తుండటంతో.. ఆ ఆధారాల్ని కూడా సీబీఐ, సీవీసీకి అప్పగించినట్లు సమాచారం. ప్లాంట్ చరిత్రలో తొలిసారిగా.. సదరు కార్మిక సంఘ నాయకుడు త్వరలోనే పదవీ విరమణ చేస్తున్న సమయంలో కొందరు యూనియన్ నాయకులు వరుస ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. సీబీఐ, సీవీసీ, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు అక్రమాలపై పక్కా ఆధారాలతో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఒక్కసారిగా అందరి దృష్టి అతని అవినీతిపై పడింది. గతంలో అనేక మంది కార్మిక నాయకులపై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈసారి ఆ ఆరోపణల్లో పక్కా ఆధారాలు ఉండటంతో సదరు కార్మిక సంఘ నేతకు సంబంధించిన ఫైనల్ సెటిల్మెంట్ని యాజమాన్యం నిలిపివేసింది. వైజాగ్ స్టీల్ప్లాంట్ చరిత్రలో మొదటిసారిగా ఓ ఉద్యోగైన కార్మిక సంఘ నాయకుడి ఫైనల్ సెటిల్మెంట్ని నిలిపివేసిన పరిస్థితి ఏర్పడింది. ఉన్నత స్థాయి విచారణ ముగిసే వరకు ఈ నిర్ణయం అమలులో ఉండే అవకాశం ఉందని స్టీల్ప్లాంట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. తనపై వచ్చిన అక్రమాల మరక చెరిపేయాలంటూ స్థానిక టీడీపీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. ఫైనల్ సెటిల్మెంట్ సజావుగా జరిగేలా చూడాలంటూ రూ.కోట్లు ఆఫర్ చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తుండటం కొసమెరుపు. కాదేదీ నేత మేతకు అనర్హం కరోనా మహమ్మారి సమయంలో ప్లాంట్లో సుమారు 125 మంది ఉద్యోగులు మరణించగా, వారి కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కింద రావాల్సిన ప్రయోజనాలను సదరు నాయకుడు సొమ్ము చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పలుకుబడితోనే పెన్షన్ వస్తుందని నమ్మించి ఒక్కో కుటుంబం నుంచి రూ.5 లక్షల చొప్పున దాదాపు 30 కుటుంబాల నుంచి రూ.కోటిన్నర వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక.. యూనియన్ పరిధిలో ఉండే కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్స్లో జరిగే కార్యక్రమాలకు సంబంధించి పూల, విద్యుత్ అలంకరణ కాంట్రాక్టర్ల నుంచి అనధికారికంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా జరిగే సుమారు 200 ఫంక్షన్ల ద్వారా రూ.50–60 లక్షల వరకు అక్రమంగా ఆర్జించారని, గత రెండున్నరేళ్లలో సదరు నాయకుడి అక్రమ వసూళ్ల మొత్తం సుమారు రూ.2.5 కోట్లకు చేరుకుందని సమాచారం. -
చమ్మచింత, కురువాడల్లో కార్డన్ సెర్చ్
నాతవరం: మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతోందని, డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ అన్నారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా మండలంలోని చమ్మచింత, కురువాడ గ్రామాల్లో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ రెండు గ్రామాల్లో 300 ఇళ్లలో తనిఖీలు చేశారు. రికార్డులు లేని 35 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్షాపు నుంచి 25 మద్యం క్వార్టర్ బాటిళ్లు సాధీ నం చేశారు. గంజాయి ర్యాపిడ్ కిట్స్తో 15 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరు గంజాయి సేవించినట్టుగా పాజిటివ్గా వచ్చింది. ఈ సందర్భంగా సీఐ రేవతమ్మ మాట్లాడుతూ ఎస్పీ తుహిన్సిన్హా పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించామన్నారు. గంజాయి రవాణా, సాగు చేస్తున్న, పాత నేర చరిత్ర కలిగిన వ్యక్తుల నివాసాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గతంలో గంజాయి కేసుల్లో నిందితులతో పాటు అనుమానాస్పదంగా తిరిగే వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్లు 1972, 100, 112కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావుతో పాటు గొలుగొండ, కృష్ణదేవిపేట, నర్సీపట్నం రూరల్, టౌన్, మాకవరపాలెం మండలాల ఎస్ఐలు, 58 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల పోరు ఉధృతం
నక్కపల్లి: ప్రజలతోపాటు, వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యసిబ్బందికి కూడా కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. ‘ఏరు దాటే వరకూ ఓడ మల్లన్న.. తరువాత బోడి మల్లన్న‘ అన్న చందంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రెండేళ్ల నుంచి కాలయాపన చేస్తుండడంతో పాటు, అరకొరగా చెల్లిస్తున్న వేతనాలు కూడా రెండు నెలల నుంచి ఇవ్వకపోవడంతో కాంట్రాక్ట్ వైద్యసిబ్బంది, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ డిమాండ్ల సాధనకు పోరు ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో వైద్య విధాన పరిషత్తోపాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జీజీహెచ్ వంటి ఆస్పత్రుల్లో సుమారు 360 మంది స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులుగా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మంది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు రెగ్యులర్ చేయలేదు సరికదా, రెండు నెలల నుంచి జీతాలు కూడా చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయని వాపోతున్నారు. 8వ తేదీ నుంచి విధుల బహిష్కరణ సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఆందోళన ఉధృతం చేసేందుకు కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులు నిర్ణయించారు. ఆన్లైన్ సర్వీసులు (రోజువారీ నివేదికలు, పేషెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వంటి విధులు) బహిష్కరించనున్నారు. సెప్టెంబరు 7న కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయనున్నారు. 8వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో విధులు బహిష్కరించనున్నట్టు ప్రకటించారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధికారులకు అందజేసినట్టు కాంట్రాక్ట్ వైద్యసిబ్బంది సంఘం నాయకులు తెలిపారు. నిరసన వ్యక్తం చేస్తున్నా... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తమ డిమాండ్లు నెరవేర్చాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాలుగు రోజుల నుంచి కాంట్రాక్ట్ వైద్యసిబ్బంది ఆందోళన చేస్తున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించారు. వీరి డిమాండ్లు... వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేయాలి. రెగ్యులరైజేషన్ పూర్తయ్యే వరకు 100శాతం గ్రాస్ వేతనం చెల్లించాలి. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ సదుపాయం కల్పించాలి. అనారోగ్యానికి గురైన ఉద్యోగులకు పూర్తి జీతంతో కూడిన సెలవులు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. సంవత్సరాల తరబడి కుటుంబాలకు దూరంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు బదిలీ సదుపాయం కల్పించాలి. దశలవారీగా ఆందోళన సమస్యల పరిష్కారం కోసం జూన్ 17న విజయవాడలో ధర్నా చేశాం. 45 రోజుల కార్యాచరణ ప్రకటించాం. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. దీంతో తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకు పూర్తిస్థాయిలో నిరసన తెలిపేందుకు సిద్ధపడుతున్నాం. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి దశలవారీగా ఆందోళన ఉధృతం చేస్తాం. –రాజబాబు, వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ కన్వీనర్ వెట్టిచాకిరీ చేయిస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఎన్నికల ముందు పాదయాత్రలో లోకేష్ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా కాలయాపన చేస్తున్నారు. రెగ్యులర్ అయ్యేలోపు రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. మాతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. రెగ్యులర్ చేసే వరకు గ్రాస్ శాలరీ నూరు శాతం చెల్లించాలి. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే అన్ని సదుపాయాలు కల్పించాలి. – జయలక్ష్మి, జిల్లా జేఏసీ అధ్యక్షురాలు -
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులకు అభినందన
నాతవరం: మండలానికి చెందిన నలుగురు విద్యార్థులు సాఫ్ట్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు అన్నారు.నాతవరం స్కూల్లో ఆదివారం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ఎన్ఆర్ఐ సతీష్, స్థానిక గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు అభినందించారు, ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నాతవరం హైస్కూల్లో చదువుతున్న అఖిల, గ్రేస్ బాలికల విభాగం నుంచి, జస్వంత్, సింహాద్రి బాలుర విభాగం నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. ఎన్ఆర్ఐ సతీష్ మాట్లాడుతూ విద్యాతోపాటు చదువు ముఖ్యమన్నారు. -
రాకాసి అలల నుంచి సేఫ్గా..!
కొమ్మాది(విశాఖ): రుషికొండ సముద్రపు అలల అందాలను చూస్తూ సరదాగా గడపాలని వచ్చిన ఆ పర్యాటకులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఒక్కసారిగా విరుచుకుపడిన రాకాసి అలలు వారిని సముద్ర గర్భంలోకి లాక్కెళ్లాయి. మృత్యువు అంచున కొట్టుమిట్టాడుతున్న ఆ ఏడుగురిని లైఫ్గార్డులు ప్రాణాలకు తెగించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఛత్తీస్గఢ్తో పాటు విజయనగరం జిల్లా సాలూరు ప్రాంతాలకు చెందిన ఏడుగురు పర్యాటకులు ఆదివారం సాయంత్రం రుషికొండ బీచ్కు విహారయాత్ర కోసం వచ్చారు. సరదాగా స్నానాలు చేసేందుకు వారంతా సముద్రంలోకి దిగారు. అలల ఉధృతికి అయితే ఆ సమయంలో అలల ఉధృతి తీవ్రంగా ఉండటంతో ఛత్తీస్గఢ్కు చెందిన రాజేంద్ర సత్య, మనోజ్, కిశోర్ కుమార్, తరుణ్ వర్మ, సాలూరుకు చెందిన టి.మురళి, జి.శ్రీరామ్కుమార్, ఆర్.తేజేశ్వరరావులు అదుపుతప్పి సముద్రంలోకి కొట్టుకుపోయారు. సహాయం కోసం వారు ఆర్తనాదాలు చేయడంతో గమనించిన తీర ప్రాంత లైఫ్గార్డులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సముద్రంలోకి దూకారు. తీవ్రంగా శ్రమించి ఏడుగురినీ ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మైరెన్ పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి సురక్షితంగా ఇళ్లకు పంపించారు. సమయస్ఫూర్తితో స్పందించి ఏడుగురి ప్రాణాలు కాపాడిన లైఫ్గార్డుల సాహసాన్ని మైరెన్ సీఐ ఎం.అప్పారావు, ఏఎస్ఐ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. -
అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలి
దేవరాపల్లి: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ సాగు పూర్తిగా దెబ్బతిన్నందున అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సిద్ధం చేసిన వరి నారుమడులు పూర్తిగా ఎండిపోయాయన్నారు. ఇకపై వర్షాలు కురిసినా అదును దాటిపోయినందున ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. అన్నదాతలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారన్నారు. క్షేత్ర స్థాయిలో పంట నష్టాలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. కొత్తగా సాగుకు పెట్టుబడులు కోసం బ్యాంక్ల నుంచి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని, రైతులతో పాటు రైతు కూలీలకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు.సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న డిమాండ్ -
దమ్ముంటే డీఎస్సీపై సీబీఐ విచారణకు ఆదేశించాలి
బీచ్రోడ్డు(విశాఖ): రాష్ట్రంలో డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా ఓ బూటకమని, నిరుద్యోగ యువతను ప్రభుత్వం నట్టేట ముంచుతోందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ఆరోపించారు. ‘మ్యాప్స్’ (మెగా డీఎస్సీ ఆత్మగౌరవ పోరాట సమితి) ఆధ్వ ర్యంలో ఆదివారం నిర్వహించిన సభ మంత్రి నారా లోకేష్ సొంత ప్రచారం కోసం ఏర్పాటు చేసిన కపట నాటకమని విమర్శించారు. ఈ ప్రచార సభ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల ఎంపిక పారదర్శకంగా జరిగితే నారాయణ, శ్రీచైతన్య, బెహరా వంటి ప్రైవేట్ విద్యా సంస్థల బస్సుల్లో జనాలను తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. దీని వెనుక స్థానిక డీఈవోలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డీఎస్సీతోపాటు స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలు, అవకతవకల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే విశాఖలో ఇలాంటి సభలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సీబీఐ విచారణను తప్పించుకునేందుకే ఈకార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. దమ్ముంటే తక్షణ మే సీబీఐ విచారణకు ఆదేశించి నారా లోకేష్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, లేనిపక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
జీతాలు చెల్లించే వరకూ రిలే దీక్షలు
కశింకోట: ఆర్ఈసీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న కశింకోటలో పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక సిబ్బంది సెలవు రోజు ఆదివారం కూడా రిలే దీక్షలు నిర్వహించారు. గత నెల నుంచి తమకు నిలిపి వేసిన జీతాలు తక్షణమే ఏపీఈపీడీసీఎల్ అధికారులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షలు నాల్గో రోజుకి చేరాయి. ఈ సందర్భంగా తమ జీతాలు చెల్లించి, తమకు ఇవ్వాల్సిన సౌకర్యాలు అమలు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని, మరింత తీవ్రతరం చేస్తామని పాలిటెక్నిక్ అధ్యాపక సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు శరగడం హేమంత్ కార్యదర్శి బి. నగేష్ ఈ సందర్భంగా హెచ్చరించారు. అసోసియేట్ ప్రిన్సిపాల్ కె. శివ, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు 36 మంది ఎంపిక
మాకవరపాలెం: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు 36 మంది ఎంపికై నట్టు అసోసియేషన్ చైర్మన్ సతీష్, కార్యదర్శి నూకరాజు తెలిపారు. స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ మండలాల నుంచి సబ్ జూనియర్ విభాగంలో 150 మంది బాలబాలికలు పాల్గొన్నారు. 18 మంది బాలురు, 18 మంది బాలికలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారంతా వచ్చే నెల 11 నుంచి 13 వరకు విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని ఆర్గనైజింగ్ కార్యదర్శి డి.రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో 15 మంది పీఈటీలు పాల్గొన్నారు.నేటి పీజీఆర్ఎస్ రద్దు : ఎస్పీ అనకాపల్లి: జిల్లా పోలీసు కార్యాలయంలో సో మవారం జరగాల్సిన పీజీఆర్ఎస్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాయకరావుపేట మండలంలో నిర్వహించే జలహారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నందున బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని, అందువల్ల పీజీఆర్ఎస్ రద్దు చేశామని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు గమనించి, పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. ఉద్యోగం రాక యువకుడి ఆత్మహత్య అనకాపల్లి: ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మళ్లవీధికి చెందిన సరిసా జయసూర్య (25) బీటెక్ పూర్తిచేశాడు. ఇంటి వద్దే ఉంటూ సంవత్సరం కాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. పలు ఉద్యోగాల కోసం పరీక్షలు రాశాడు. అయినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురై ఈ నెల 29వ తేదీ రాత్రి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సరిసా వెంకట రామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ ఎస్.కె. జిలానీ తెలిపారు. -
చికిత్స పొందుతూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
తగరపువలస: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి ఆదివారం మృతి చెందాడు. భీమిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన కంఠమణి తరుణ్కుమార్ (19) సంగివలసలోని అనిట్స్ కళాశాలలో రెండో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నాడు. గత శనివారం పార్ట్టైమ్ ఉద్యోగం ముగించుకుని బైక్పై తగరపువలస వైపు బయలుదేరగా.. రాత్రి 9 గంటల సమయంలో తాళ్లవలస సర్వీస్ రోడ్డులో ఎదురుగా కారులో వస్తున్న సంగివలస ఎన్ఆర్ఐ ఆస్పత్రి వైద్యుడు వెంకటేష్ కారు ఢీకొట్టింది. దీంతో తరుణ్కుమార్ తలకు, ఎడమ కాలు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. స్పృహ కోల్పోయిన అతడిని స్నేహితులు సంగివలస ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 6 గంటలకు మరణించాడు. మృతుడి తల్లి సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గురువుకు అ‘పూర్వ’ సత్కారం
కోటవురట్ల: విద్యా బుద్ధులు నేర్పి, క్రమశిక్షణను అలవరిచి తమ ఉన్నతికి కారణమైన గురువును పూర్వ విద్యార్థులు అపూర్వ రీతిలో సత్కరించి తమ గురుభక్తిని, ఆత్మీయతను చాటుకున్నారు. రాట్నాలపాలెంలో 1988లో ఎంపీపీ స్కూల్ ప్రారంభం కాగా, ఆ పాఠశాలకు పత్రి ప్రసాదరావు అదే సంవత్సరంలో ఉపాధ్యాయుడిగా చేరారు. అప్పటి నుంచి 2001 వరకు అదే పాఠశాలలో ప్రాథమిక విద్యను అందించారు. ఆ సమయంలో అక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడి ఉన్నత జీవితాలను అనుభవిస్తున్నారు. తమ ఉన్నతికి కారణమైన ప్రసాదరావు మాస్టారును మేళతాళాలతో పాఠశాలలోకి సాదరంగా తీసుకెళ్లి ఘనంగా సత్కరించారు. గురువు పాదాలకు ప్రణమిల్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. శిష్యుల ప్రేమానురాగాలకు భావోద్వేగానికి గురైన ప్రసాదరావు ఆనందభాష్పాలతో దీవించారు. ఈ అపూర్వ ఘటన గురు శిష్యుల బంధానికి తార్కాణంగా నేటి తరం విద్యార్థులకు మార్గదర్శంగా నిలిచింది. -
ధరలు తగ్గించాలని మహిళల ధర్నా
అనకాపల్లి: నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, పెంచిన ధరలను తగ్గించి బడుగు, బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బుగిడి నూకఅప్పారావు డిమాండ్ చేశారు. స్థానిక గవరపాలెం పార్కుసెంటర్ వద్ద నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మహిళలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు నెలల్లో 25 కిలోల బియ్యం ధర రూ.1,370 నుంచి ప్రస్తుతం రూ.1,770 పెరగడం దారుణమన్నారు. వంట నూనెలు, పప్పులు, అపరాలు, ఇతర కిరాణా సరుకుల ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో నిత్యావసరాల ధరలను తగ్గిస్తామని చెప్పిన కూటమి నాయకులు అధికారం చేపట్టిన తరువాత ధరలు విపరీతంగా పెరిగినా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. నిత్యావసర ధరలను తగ్గించే వరకూ పోరాటాలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళలు కాండ్రేగుల సన్నమ్మడు, బొడ్డేడ లక్ష్మి, భాగ్యలక్ష్మి, మాధవి, బి.సింహాచలం, కె.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఓటీ సర్వీసులను రెస్టాఫ్గా మార్చాలని డిమాండ్
అనకాపల్లి: నర్సీపట్నం, అనకాపల్లి డిపోల్లో అన్ని ఓటీ సర్వీసులను రెస్టాఫ్గా మార్చి ప్రయాణికులకు బస్సు సౌకర్యం మెరుగుపరచాలని నేషనల్ మజ్ధూర్ యూనిటీ అసోసియేషన్ రీజనల్ కార్యదర్శి పి.సుధాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక డిపో వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ సర్క్యులర్ 1/2019కు విరుద్ధంగా విధుల నుంచి తొలగించిన డ్రైవర్ ఇ.రమణను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, నర్సీపట్నం–విశాఖ నైట్ సర్వీసులకు డ్యూటీ అవర్స్ తగ్గించాలని, స్టాఫ్ రెస్ట్రూమ్ సౌకర్యం మెరుగుపరచాలన్నారు. అర్హులైన మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్లు ఇవ్వాలని, ఉద్యోగులకు లీవు పొజీషన్ మెరుగుపరచాలని, గ్యారేజీలో కార్మికులకు నాణ్యమైన టూల్స్, సరిపడా స్పేర్పార్ట్స్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి.శంకరరావు, రీజనల్ అధ్యక్షుడు రాజు, తదితరులు పాల్గొన్నారు. -
‘అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలి’
ఎస్.రాయవరం: వచ్చే నెల 2న జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చందబాబునాయుడు అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలని ఏపీ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మండలంలోని రామయ్యపట్నంలో రైతు సంఘం నాయకులు పర్యటించి పొలాలను పరిశీలించారు. ఖరీఫ్లో నారుమడులు సైతం వర్షాభావం కారణంగా ఎండిపోయాయని వాపోయారు. ఈ ఏడాది రైతులు సాగు చేసే పరిస్థితి లేదన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేష్, రైతు సంఘ నాయకులు ఆర్. అప్పలకొండ, శివ, గోవిందు, దొరబాబు, ఆర్.నాగు తదితరులు పాల్గొన్నారు. -
కళ్లలో కసి.. మనసులో మమత
కొమ్మాది: కళ్లలో కసి.. మాటల్లో గాంభీర్యం.. తెరపై కనిపిస్తే ప్రత్యర్థులకు భయం పుట్టించే విలన్ పాత్రలు. కానీ నిజ జీవితంలో మాత్రం సున్నితమైన మనసున్న కళాకారుడు. తన నటనతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో ప్రతినాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాఖవాసి సీనియర్ నటుడు సత్యప్రకాశ్. విశాఖ తిమ్మాపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ‘సాక్షి’తో తన సినీ ప్రయాణం, విశాఖతో అనుబంధం, కుమారుడి సినీ భవిష్యత్పై తన కలలను పంచుకున్నారు. అక్కయ్యపాలెం నుంచి వెండితెర వరకు.. అక్కయ్యపాలెంలో పుట్టిన సత్యప్రకాశ్కు చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. సినీ రంగంలో అడుగులు వేస్తున్న సమయంలో దర్శకుడు రవిరాజా పినిశెట్టి అవకాశం ఇచ్చారని, తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా మరువలేనిదని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘పోలీస్ స్టోరీ’తో మొదలైన విలన్ ప్రయాణం విలన్గా తన సినీ ప్రస్థానం ‘పోలీస్ స్టోరీ’ చిత్రంతో ప్రారంభమైందని సత్యప్రకాశ్ తెలిపారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా సాగిన ఆయన ప్రయాణంలో ఇప్పటివరకు 700కు పైగా సినిమాల్లో నటించారు. ‘సరిపోదా శనివారం’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాల్లోనూ కనిపించిన ఆయన.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’, ‘ఫౌజి’, నాని నటిస్తున్న ‘ప్యారడైజ్’ సినిమాలతో పాటు మరో 14 చిత్రాల్లో నటిస్తున్నారు. అవార్డుల కంటే చిరు ఇచ్చిన కారు ప్రత్యేకం సుదీర్ఘ సినీ జీవితంలో ఎన్నో అవార్డులు, సన్మానాలు అందుకున్నప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవి తనకు ఇచ్చిన బహుమతిని మాత్రం ఎప్పటికీ మరిచిపోలేనని సత్యప్రకాశ్ చెప్పారు. ‘బిగ్బాస్ సినిమా సమయంలో చిరంజీవి నాకు ఇచ్చిన కారు నా జీవితంలో ప్రత్యేక జ్ఞాపకం’ అని ఆయన భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. వైజాగ్.. నా అదృష్టం విశాఖవాసిగా పుట్టడం నా అదృష్టం. ఇక్కడి ప్రజలు సినిమాలను మాత్రమే కాదు.. కళాకారులను కూడా తమ కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తారు. ప్రకృతి అందాలతో విశాఖ ఓ అద్భుతమైన సినిమా వేదిక అని సత్యప్రకాశ్ అన్నారు. తక్కువ ఖర్చుతో అత్యద్భుతమైన విజువల్స్ అందించగల సామర్థ్యం విశాఖకు ఉందని, మరిన్ని చిత్రాల షూటింగ్లు ఇక్కడ జరగాలని ఆకాంక్షించారు. విలన్గా పేరు.. తండ్రిగా మాత్రం హీరో కావాలి తాను ఎన్నో చిత్రాల్లో ప్రతినాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తన కుమారుడు నటరాజ్ను హీరోగా చూడాలన్నదే తన కోరిక అని సత్యప్రకాశ్ తెలిపారు. ఇప్పటికే కన్నడంలో ‘మనసు మల్లిగె’, ‘ఉగ్రావతార’, తెలుగులో ‘ఉల్లాలా ఉల్లాలా’, ‘అమ్మదీవెన’ వంటి చిత్రాల్లో నటరాజ్ హీరోగా నటించారు. సెప్టెంబర్ 4న ‘ధర్మస్థల నియోజకవర్గం’ నటరాజ్ హీరోగా నటించిన ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రం సెప్టెంబర్ 4న విడుదల కానుందని సత్యప్రకాశ్ తెలిపారు. ఈ చిత్రంలో సాయికుమార్, సుమన్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారని, ఇది తన కుమారుడి కెరీర్లో కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు నటరాజ్కు అందాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. -
కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అనకాపల్లి: వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్పర్సన్ జయలక్ష్మి డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి కాంట్రాక్టు ఉద్యోగులు ఆదివారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతర ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్నర్సలు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
విదేశీ కల.. కేటుగాళ్ల ఎర!
విశాఖ విద్య: చేతిలో డిగ్రీ ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న తపనా ఉంది. అదే వారి బలహీనతగా మారుతోంది. భవిష్యత్తుపై వారికున్న ఆశ కొందరి కేటుగాళ్లకు ఆసరాగా మారుతోంది. విదేశీ ఉద్యోగాలు, వర్క్ వీసాల ముసుగులో మోసగాళ్లు యువతకు వల విసురుతున్నారు. రూ.లక్షలు కాజేస్తూ.. వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. ఆగ్నేయాసియా దేశాల్లో బానిస బతుకులు మొదలుకొని.. ద్వారకానగర్ కేంద్రంగా సాగుతున్న ‘ఫ్లైయింగ్ బోర్డర్స్’ తరహా హైటెక్ మోసాల దాకా విశాఖలో విదేశీ ఉద్యోగ రాకెట్ కోరలు చాస్తోంది. లక్షల్లో జీతాలు, విలాసవంతమైన జీవితం దక్కుతుందని నమ్మి యువత కేటుగాళ్ల వలలో పడుతోంది. కష్టపడి కూడబెట్టిన సొమ్మంతా సమర్పించుకున్న తర్వాత లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్లు, కొన్ని సందర్భాల్లో అధికారుల ఉదాసీనత వల్ల బాధితులకు న్యాయం జరగడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా సైబర్ స్లేవరీ రాకెట్ గతంలో విశాఖ కేంద్రంగా నడిచిన ఆగ్నేయాసియా సైబర్ స్లేవరీ రాకెట్ తీవ్ర సంచలనం సృష్టించింది. విశాఖ యువతను సింగపూర్, థాయిలాండ్, మలేషియా వంటి దేశాల్లో డేటా ఎంట్రీ, రిసెప్షనిస్ట్, హోటల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక కంబోడియా, థాయిలాండ్, మయన్మార్లలోని రహస్య ప్రాంతాలకు తరలించి పాస్పోర్టులు లాక్కున్నారు. వారిని బానిసలుగా మార్చి భారతీయులపైనే బిట్కాయిన్, ఫెడెక్స్, స్టాక్ మార్కెట్ సైబర్ మోసాలు చేయాలని చిత్రహింసలకు గురిచేశారు. విశాఖ పోలీసుల ప్రత్యేక చొరవ, హెల్ప్లైన్ ద్వారా గత ఏడాది కాలంలో సుమారు 87 మందికి పైగా బాధితులను రక్షించి స్వదేశానికి తీసుకొచ్చారు. నకిలీ ఆఫర్ లెటర్లతో ఐటీ మోసాలు కొందరు కేటుగాళ్లు నకిలీ కన్సల్టెన్సీలు ఏర్పాటు చేసి, ప్రముఖ ఐటీ కంపెనీల పేరిట నకిలీ ఆఫర్ లెటర్లను సృష్టించి మోసగిస్తున్నారు. విదేశీ ప్రాజెక్టుల్లో ఉద్యోగాల పేరుతో రిజిస్ట్రేషన్, ట్రైనింగ్ ఫీజుల కింద రూ.లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నారు. గతంలో ‘వునాతి టెక్నాలజీస్’ అనే సంస్థపై విశాఖ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ‘ఫ్లై బై నైట్’ అనే సంస్థ సైతం ఇదే తరహా మోసాలకు పాల్పడి నిరుద్యోగులను నిండా ముంచింది. ‘ఫ్లైయింగ్ బోర్డర్స్’ ఘరానా మోసం ఇటీవలే ద్వారకానగర్లో ‘ఫ్లైయింగ్ బోర్డర్స్’ కన్సల్టెన్సీ నిరుద్యోగులను భారీగా ముంచేసింది. గతేడాది మార్చిలో ప్రారంభమైన ఈ సంస్థకు ముసునూరి సౌజన్య మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఏడాది కాలంలోనే విదేశీ ఉద్యోగాలు, వర్క్ వీసాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా నగదు వసూలు చేశారు. బాధితులకు వీసాలు రాకపోగా, ఇచ్చిన డబ్బు తిరిగి రాక రోడ్డున పడ్డారు. హైదరాబాద్లోనూ ఈ సంస్థపై పలు ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయి. నిందితురాలు సౌజన్యను అరెస్ట్ చేసే క్రమంలో ఎన్టీఆర్ జిల్లా పెనమలూరులోని ఆమె నివాసంలో పలు కీలక డాక్యుమెంట్లు, ఒప్పంద పత్రాలు, బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేసు దర్యాప్తు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై బాధితులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ‘జరిగిందేదో జరిగింది.. సెటిల్మెంట్ చేసుకోండి’ అంటూ మధ్యవర్తులు రంగంలోకి దిగి బాధితులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ద్వారకానగర్లో పుట్టగొడుగుల్లా కన్సల్టెన్సీలు విశాఖ ద్వారకానగర్లోని రెండో, మూడో లైన్లలో కన్సల్టెన్సీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. యూకే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ లాంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని.. ఇంగ్లిష్ రాకపోయినా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న నకిలీ కన్సల్టెన్సీలపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కాలువలో కాంక్రీట్ వాల్ నిర్మించొద్దు
ఎస్.రాయవరం: ఉప్పరాపల్లి పైడితల్లమ్మ కాలువలో దిగువ రైతులకు సాగునీరు వెళ్లకుండా చేపట్టిన కాంక్రీట్ వాల్ నిర్మాణాన్ని ఆయకట్టు రైతులు ఆదివా రం అడ్డుకున్నారు. 3,600 ఎకరాలకు సాగునీరందించే కాలువలో పూర్తి స్థాయిలో పూడికతీత పనులు చేపట్టకపోగా, ఇప్పుడు టీడీపీ మండలాధ్యక్షుడు ప్రోద్బలంతో ఇరిగేషన్ అధికారులు కాంక్రీట్ వాల్ నిర్మించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరి ప్రయోజనాల కోసం వందలాది మంది రైతుల భూములకు సాగునీరు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఏఈ భాను స్పందిస్తూ కాలువలో కాంక్రీట్ వాల్ వేయడం వల్ల ఏ ఒక్కరికీ ఇబ్బందులు ఉండవని, రైతులు అడ్డుకుంటే పనులు ఆపేస్తామన్నారు. ఇరిగేషన్ మెయింటెనెన్స్ గ్రాంట్ రూ. 9 లక్షలతో పనులు చేపడుతున్నామన్నారు. -
సత్యసాయి సేవా సంస్థల సేవలు విస్తృతం
అనకాపల్లి: సత్యసాయి సేవా సంస్థల సేవలు మరింత విస్తృతం చేయాలని ఆ సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.లక్ష్మణరావు పిలుపునిచ్చారు. స్థానిక గవరపాలెం గౌరీగ్రంథాలయం ఆవరణలో జిల్లా సత్య సేవా సంస్థల జిల్లా కన్వీనర్లతో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్యసాయి 101వ జయంతి సందర్భంగా ఈ ఏడాది భారీగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సమితి పరిధిలో మొక్కలను నాటాలన్నారు. నారాయణ సేవ, మెడికల్ క్యాంపులు, దుప్పట్లు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది నవంబర్ 23వ తేదీన సాయిబాబా శత జయంతి నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి అప్పలనాయుడు, ప్రతినిధులు కామరాజు, మూర్తి, గౌరీ, విద్యా, బీవీపీ మహేశ్వరి, భారతి తదితరులు పాల్గొన్నారు. -
‘పంచదార్ల’ను వదలని మైనింగ్ మాఫియా
సాక్షి, అనకాపల్లి: పవిత్ర పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్ ఆగడం లేదు. ప్రభుత్వం జీవో జారీ చేసి 48 గంటలు కూడా గడవక ముందే అక్రమార్కులు మళ్లీ భారీ యంత్రాలతో తవ్వకాలు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలోని శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రమైన పంచదార్ల కొండపై రెండు నెలలుగా కూటమి నేతలు అక్రమ తవ్వకాలకు పాల్పడడం.. దీనిపై గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడం తెలిసిందే. ఈ దందాపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇవ్వడం.. వైఎస్సార్సీపీ ఢిల్లీ దాకా ఉద్యమించడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఈ నెల 27న పంచదార్ల కొండను ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటిస్తూ జీవో 226 జారీ చేసింది.అయితే, ప్రభుత్వం ఇచ్చిన జీవోను సైతం అక్రమార్కులు లెక్కచేయడం లేదు. జీవో వచ్చిన రెండు రోజుల్లోనే, స్థానిక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బంధువు మైనింగ్ చేస్తున్న ప్రాంతానికి పక్కనే శనివారం మళ్లీ అక్రమ తవ్వకాలు మొదలుపెట్టినట్లు స్థానిక ప్రజలు వెల్లడించారు. ఈ విషయం అధికారులకు తెలిసినా, ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి ముసుగులో, పారిశ్రామిక పార్కు పేరుతో మైనింగ్ శాఖ కనీస అనుమతులు కూడా లేకుండా రెండు నెలలుగా రాత్రి, పగలు తేడా లేకుండా 3 నుంచి 4 లక్షల క్యూబిక్ మీటర్ల మేర గ్రావెల్ను తవ్వేశారు. ప్రశ్నించిన వారిని లారీలతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ తతంగంపై సాక్షి, వైఎస్సార్సీపీ పోరాటంతో ప్రభుత్వం దిగొచ్చి జీవో జారీ చేసినా, స్థానిక మాఫియా దానిని ఏ మాత్రం ఖాతరు చేయక పోవడం గమనార్హం. దీనిపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్, పోలీసు శాఖ అధికారులు తక్షణం స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
పాయకరావుపేటను కరువు నియోజకవర్గంగా ప్రకటించాలి
నక్కపల్లి: పాయకరావుపేట నియోజకవర్గంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నాలుగు మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీవ్రంగా నష్టపోతున్న రైతులను తక్షణమే ఆదుకోవడంతోపాటు వారి రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. నక్కపల్లిలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంట ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ఎడమ కాలువ పనులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అప్పట్లోనే 50 శాతం కాలువ పనులు పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో మరో 25 శాతం పనులు జరిగాయన్నారు. పోలవరం ఎడమ కాలువకు వైఎస్సార్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పశువులకు అవసరమైన పశుగ్రాసాన్ని ఉచితంగా లేదా సబ్సిడీపై ప్రభుత్వం అందించాలని కోరారు. పాయకరావుపేట నియోజకవర్గ రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు అయినంపూడి మాణిరాజు, గొర్ల గోవిందరావు, వెలగ ఈశ్వరరావు, సూరకాసుల గోవిందు, తల్లా భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ -
మద్యం మత్తులో కారుతో ఢీ
● కౌలు రైతు మృతి,మరో ముగ్గురికి గాయాలు ● రేవుపోలవరం రోడ్డులో ఘటన ఎస్.రాయవరం: మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తి వెనుక నుంచి సైకిల్, స్కూటీని ఢీకొట్టడంతో కౌలు రైతు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన రేవుపోలవరం రోడ్డులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ రమేష్, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని గుర్రాజుపేట సమీపంలో రేవుపోలవరం రోడ్డులో సైకిల్పై వస్తున్న కౌలు రైతు పెంకి మన్నియ్య(65)ను, స్కూటీపై వస్తున్న మరో ముగ్గురిని రేవుపోలవరం నుంచి అడ్డురో డ్డు వైపు వస్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దాంతో మన్నియ్య అక్కడికక్కడే మృతి చెందగా, స్కూటీపై వస్తు న్న ముగ్గురికి గాయాలయ్యా యి. మృతుడు మన్నియ్యది నక్కపల్లి మండలం పెదతీనార్ల గ్రా మంగా పోలీసు లు గుర్తించారు. గుడివాడలో కొబ్బరి తోట కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పొలం పనులు చూసుకుని రాత్రి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమా దానికి గురయ్యా డు. గుడివాడ శివారు లక్ష్మీపతిరాజుపేట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్కూటీపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదానికి కారణమైన వారు కారు వదిలి పరారయ్యినట్టు ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
అమరావతి చాంపియన్షిప్ పోటీల్లో నర్సీపట్నంక్రీడాకారులకు పతకాలు
నర్సీపట్నం: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ఇండోర్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన అమరావతి చాంపియన్షిప్ క్రీడా పోటీల్లో నర్సీపట్నం క్రీడాకారులు పలు పతకాలు సాధించారు. బాక్సింగ్లో చక్రాంతి రోహిణి, సకిరెడ్డి హరిణి, బొంతు మౌనిక, లగుడు సమంత గోల్డ్ మెడల్స్ సాధించారు. యర్రా తేజస్విని, కోడూరు కుసుమ సిల్వర్ మెడల్స్ పొందారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. నర్సీపట్నం క్రీడాకారులను స్పీకర్ ప్రత్యేకంగా అభినందించారని శాప్ కోచ్ అబ్బు తెలిపారు. -
మెడ్కో మాయాజాలానికి చెక్!
మహారాణిపేట(విశాఖ): కేజీహెచ్ అధికారుల ఏకపక్ష నిర్ణయానికి ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ గట్టి బ్రేక్ వేసింది. నిబంధనలను పక్కనపెట్టి న్యూరోసర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ కొండపల్లి శివరామకృష్ణను ఎన్టీఆర్ వైద్యసేవ మెడికల్ కోఆర్డినేటర్ (మెడ్కో)గా నియమిస్తూ కేజీహెచ్ యాజమాన్యం పంపిన ప్రతిపాదనకు ట్రస్ట్ ఆమోదం తెలపలేదు. ఆయనకు మెడ్కో లాగిన్ ఇచ్చే ప్రక్రియను నిలిపివేసింది. దీంతో కేజీహెచ్ అధికారుల ‘మెడ్కో మాయాజాలం’ బట్టబయలైందన్న విమర్శలు ఆస్పత్రి వర్గాల్లో వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ఈ వ్యవహారంపై ‘కేజీహెచ్లో మెడ్కో మాయాజాలం’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. అత్యంత రద్దీగా ఉండే న్యూరోసర్జరీ విభాగానికి చెందిన వైద్యుడికి కీలక పరిపాలనా బాధ్యతలు అప్పగించడంపై అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ నుంచే ఆ ప్రతిపాదనకు బ్రేక్ పడటంతో కేజీహెచ్ అధికారుల నిర్ణయం ప్రశ్నార్థకంగా మారింది. లాగిన్కు ‘నో’ కేజీహెచ్ నుంచి పంపిన వివరాల ఆధారంగా ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ పోర్టల్లో నమోదైన తాజా అభ్యంతరం ప్రకారం.. డాక్టర్ శివరామకృష్ణ ఇప్పటికే విజయనగరంలోని తిరుమల మెడికవర్ ఆస్పత్రిలోని ఓ యూనిట్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ మెడ్కోగా ఆయన అభ్యర్థనను ఆమోదించాలంటే ముందుగా అక్కడి కన్సల్టెంట్ హోదా నుంచి ఇన్యాక్టివేట్ కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కారణంతోనే మెడ్కో లాగిన్కు ఆమోదం లభించలేదు. అంటే కేజీహెచ్ అధికారులు ఒక వైపు ఉత్తర్వులు జారీ చేసి, మరోవైపు ఆ నియామకానికి అవసరమైన అర్హతలు, నిబంధనలను పరిశీలించకుండానే ముందుకు వెళ్లారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘వద్దు’ అన్నా.. మెడ్కో బాధ్యతలు స్వీకరించలేనని సంబంధిత వైద్యుడు ముందుగానే అభ్యంతరం తెలిపినప్పటికీ, ఆయనపై బలవంతంగా బాధ్యతలు మోపారన్న ఆరోపణలు గతంలోనే వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఒక వైపు వైద్యుడి విముఖత.. మరోవైపు ఆయనకు కేటాయించిన మెడ్కో బాధ్యతలకు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ నుంచి ఆమోదం రాకపోవడం అధికారుల అత్యుత్సాహాన్ని బహిర్గతం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ జోక్యం చేసుకోవాలి? ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సమగ్రంగా దృష్టి సారించాలని ఆస్పత్రి వర్గాలు కోరుతున్నాయి. కేజీహెచ్ అధికారులు మెడ్కోగా ఎవరిని, ఏ నిబంధనల ప్రకారం ఎంపిక చేశారు? డీఎంఈ మార్గదర్శకాలను పరిశీలించారా? ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ నిబంధనలను ముందుగానే తనిఖీ చేశారా? అన్న అంశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అహంకారానికి ఎదురుదెబ్బ? కేజీహెచ్ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ మాత్రం వాటిని యథాతథంగా అంగీకరించలేదు. అవసరమైన అర్హతలు, ప్రస్తుత అనుబంధాలపై అభ్యంతరం వ్యక్తం చేసి లాగిన్ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో ‘ఆస్పత్రిలో అధికారుల ఆదేశమే అంతిమమని భావిస్తే కుదరదని ట్రస్ట్ తాజా నిర్ణయం తేల్చిచెప్పింది’ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా కేజీహెచ్ యాజమాన్యం ఆత్మపరిశీలన చేసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఆర్ఎంవో స్థాయి అధికారులకు మెడ్కో బాధ్యతలు అప్పగిస్తారా? లేక తిరిగి అదే వివాదాస్పద నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డీఎంఈ మార్గదర్శకాలు పట్టవా? ఎన్టీఆర్ వైద్యసేవ వంటి పరిపాలనా బాధ్యతలను సీఎస్ఆర్ఎంవో, డీసీఎస్ఆర్ఎంవో, ఆర్ఎంవో వంటి అధికారులకు అప్పగించాలని డీఎంఈ గతంలో మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. క్లినికల్ స్పెషాలిటీ వైద్యులను వీలైనంత వరకు పరిపాలనా బాధ్యతల నుంచి దూరంగా ఉంచి, రోగుల చికిత్సకు వినియోగించాలన్నదే వాటి ఉద్దేశం. అయితే కేజీహెచ్లో పరిపాలనా వైద్యాధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ న్యూరోసర్జన్ను ఎంపిక చేయడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే నియామకానికి ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ లాగిన్ ఇవ్వకపోవడంతో.. ‘నిబంధనలు పట్టించుకోకుండా చేసిన నియామకానికి చివరికి ఇదే గతి పట్టింది’ అన్న చర్చ సాగుతోంది. -
సినిమా రాజధానిగా విశాఖ
కొమ్మాది: భవిష్యత్తులో విశాఖ సినిమా రాజధానిగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ చైర్మన్ భరత్ భూషణ్, ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తెలిపారు. తిమ్మాపురంలోని వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో శనివారం నిర్వహించిన ‘సినీ సెలిబ్రిటీ గాలా ఫిల్మ్ అవార్డ్స్– 2026’కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా మాట్లాడారు. విశాఖ ఇప్పటికే గూగుల్, ఐటీ రంగాల్లో ముందంజలో ఉందని, త్వరలోనే సిని మా రంగంలో కూడా కీలక కేంద్రంగా మారుతుందన్నారు. సినిమా షూటింగ్స్కు అనుకూలంగా మౌలిక సదుపాయాలు ఏర్పా టు చేయడంతో పా టు డబ్బింగ్ స్టూడియోలు, ఎడిటింగ్ సౌకర్యాలు వంటి అవసరమైన అన్ని వనరులను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. త్వరలోనే ప్రతిష్టాత్మక నంది అవార్డులను కూడా విశాఖలో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టాలెంట్ వేవ్ స్టూడియోస్ లోగోను ఆవిష్కరించారు. నటీనటులు హెబ్బా పటేల్, శ్రీ సత్య ప్రకా శ్, కాశీ విశ్వనాథ్, షణ్ముక్, సేతురామ్ పాల్గొన్నారు. -
కష్టాల సాగు
రైతు విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు భయంతోనే వ్యవసాయం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణ పరిస్థితులు, విపత్తుల కారణంగా గత రెండేళ్లలో వేసిన పంట ఏదో రూపంలో నాశనమై రైతు నష్టపోయాడు. ‘అన్నదాత సుఖీభవ’ పేరిట తొలి ఏడాది ఎగవేత, రెండో ఏడాది అరకొర సాయం అందించడం, ఉచిత పంట బీమా లేకపోవడంతో రైతులు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాదైనా పూర్తిస్థాయిలో వ్యవసాయం చేద్దామని సిద్ధపడగా ఎల్నినో ప్రభావంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ఆగస్టు పూర్తయినా జిల్లాలో 20 శాతం నాట్లు కూడా పడలేదు. ఖరీఫ్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 1.80 లక్షల ఎకరాలు కాగా, గత ఏడాది 1.32 లక్షల ఎకరాల్లోపంట వేశారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో సాగు ఉంటుందని అంచనా వేశారు. కానీ ప్రస్తుతం 20 శాతం కూడా వరినాట్లు వేయలేదు. ఎల్నినో ఎఫెక్ట్ సాక్షి, అనకాపల్లి: ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఖరీఫ్ సాగుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. జిల్లాలో తీవ్ర వర్షాభావంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జులై, ఆగస్టు నెలల్లో దాదాపు 69 శాతం వర్షపాతం లోటు నమోదైంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతాయని భావిస్తున్నారు. ఈ నెలల్లో కూడా 35 నుంచి 40 శాతం వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో వరి సాగుకు సవాళ్లు తప్పేలా లేవు. ఈ ఏడాది ఖరీఫ్ మొదలైన తరువాత సరైన వర్షాలు లేకపోవడం, నదుల్లో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ముందస్తు చర్యలేవి ? ఆగస్టులో వర్షాలు కురుస్తాయన్న ఉద్దేశంతో జులైలో వరి నారుమళ్లు పోసిన రైతులు, నారును బతికించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి మడులను తడుపుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై ముందస్తుగా అవగాహన కల్పించకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎల్నినో ప్రభావం అధికంగా ఉన్నా ఇప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు. ట్యాంకర్ల నీటితో నారు తడుపుతున్న రైతులు జిల్లాలో తాండవ, రైవాడ, పెద్దేరు, కోనాం, కల్యాణపులోవ రిజర్వాయర్లలో నీటిమట్టం బాగా తగ్గిపోయింది. తాండవ, శారదానది, వరహా నది, సర్పా నదుల గ్రోయిన్లు, ఆనకట్టలు, ఇతర నీటి వనరుల కింద దాదాపు 1.32 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలన్నది లక్ష్యం కాగా, ఇంతవరకు కనీసం వంద ఎకరాల్లో కూడా నాట్లు పడలేదు. నదుల్లో కనీస స్థాయిలో కూడా నీటి ప్రవాహం లేకపోవడంతో ఆనకట్టల నుంచి కాలువల్లోకి నీరు పారడం లేదు. తాండవ, రైవాడ రిజర్వాయర్ల ఆయకట్టు పరిధిలో మందకొడిగా నాట్లు సాగుతున్నాయి. ఇప్పటివరకు 10 నుంచి 20 శాతం నాట్లు జరిగాయి. మిగిలిన చోట్ల వర్షాలు ముఖం చాటేయడంతో మడుల్లో వరినారు ఎండిపోతోంది. బోర్లు, బావులున్న రైతులు మినహా మిగిలిన వారెవరూ ఇంతవరకు వరినాట్లు వేయలేదు. విత్తనాలు మొలిచిన తరువాత నారు పెరగడానికి సరిపడా వర్షాలు పడకపోవడంతో రైతులు వ్యవసాయ బోర్ల నుంచి ట్యాంకర్లతో నీటిని తీసుకువచ్చి తడుపుకోవాల్సి వస్తోంది. ఈ విధంగా వారానికి ఒకసారి నీటి తడి ఇవ్వాల్సి వస్తోందని, ఒక్కో విడత నీటి రవాణా కోసం రూ.1,000 చెల్లిస్తున్నామని, మొత్తం మీద వరినారు నాటే దశకు పెరిగే వరకు రూ.4,000 ఖర్చువుతుందని రైతులు వాపోతున్నారు. తీవ్ర కరువు ఛాయలు జిల్లాలో అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలతో పాటు పరవాడ, సబ్బవరం మండలాల్లో కరువు ఛాయలు ఎక్కువగా ఉన్నాయి. తాండవ రిజర్వాయర్ పరిధిలో నాతవరం, గొలుగొండ, నర్సీపట్నం రూరల్ పరిధిలో 10 శాతం మాత్రమే వరినాట్లు వేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మండలంలో సర్పా, వరహా నదులపై నిర్మించిన ఆనకట్టల ద్వారా బూరుగుపాలెం, తాడపాల, పైడిపాల, లచ్చన్నపాలెం, మాకవరపాలెం, తామరం, జంగాపల్లి, నారాయణరాజుపేట, గిడితూరు గ్రామాలకు నీరు సరఫరా కాలేదు. ● శారదా నది కింద అనకాపల్లి, కశింకోట, మునగపాక మండలాల్లో ఏడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా జూలై నెల మధ్య నుంచి శారదా నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది ఆగస్టు వచ్చినా నీరు లేకపోవడంతో 10 శాతం కూడా వరినాట్లు జరగలేదు. అనకాపల్లి, కశింకోట, మునగపాక, యలమంచిలి, పరవాడ, సబ్బవరం మండలాల్లో గత నెలలో వరి నారుమడులు పోశారు. సరైన వర్షాలు లేకపోవడంతో చాలాచోట్ల నారు ఎండిపోయింది. వర్షాభావంతో ఎండిపోతున్న నారు బతికించుకోవడానికి ట్యాంకర్లతో నీరు ఒక్కో ట్యాంక్ నీటికి రూ.1,000 ఖర్చు అడుగంటుతున్న రిజర్వాయర్లు నారు అందివచ్చినా నాట్లు వేయలేని పరిస్థితి జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 1.80 లక్షల ఎకరాలు ఇప్పటివరకు 20 శాతం కూడా జరగని వరి నాట్లు ఎండిపోతున్న నారుమడులు తీవ్ర వర్షాభావ పరిస్థితులు వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరినాట్లు కోసం వేసిన నారుమడులు సైతం ఎండిపోతున్నాయి. మా ప్రాంతంలో ఏటా ముందుగా నాట్లు వేసేవాళ్లం. అలాంటిది ఈ ఏడాది నారుమడులు రక్షించుకోలేకపోతున్నాం. ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేసి వారి ఇబ్బందులుపై దృష్టి సారించాలని కోరుతున్నాం. – నూకినాయుడు, రైతు, లింగంపేట, గొలుగొండ మండలం చుక్క చినుకు లేదు జూన్ నెలాఖరులో కురిసిన వర్షాలకు రెండు ఎకరాల్లో వరినాట్లకు రెండు కట్టలు ధాన్యం ఆకుపోత వేశాను. ఆగస్టు నెల వచ్చినా చుక్క చినుకు లేదు. మధ్యలో డీజిల్ ఇంజిన్తో ఆకుమడికి రెండు నీటి తడులు అందించినా ప్రయోజనం లేకపోయింది. వేసిన వరి ఆకు అంతా ఎండిపోయింది. దుక్కులకు, విత్తనాలకు, ఎరువులకు ఇతర పెట్టుబడులకు ఆరు వేల వరకు ఖర్చు పెట్టిన ఫలితం దక్కలేదు. వచ్చే ఏడాది తిండి గింజలతో పాటు పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. – బండి రాజారావు, లోపూడి రైతు, బుచ్చెయ్యపేట‘కల్యాణపులోవ’ నీరు విడుదల చేసినా రాలేదు నీరు లేక వరినారు ఎండిపోతోంది. ఆర్థిక భారమైనప్పటికీ చెరువుల్లోంచి నీటిని మోటారు ద్వారా తోడి రెండు సార్లు తడిపాము. కానీ ప్రయోజనం లేకపోయింది. మా భూములున్న ప్రాంతంలో బోర్లు లేవు. చెరువులో కూడా నీరు లేదు. మా గ్రామానికి కల్యాణపులోవ జలాశయం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. జలాశయం నుంచి నీరు విడుదల చేసి 15 రోజులవుతోంది. ఇంతవరకూ మా పొలాలకు చేరలేదు. గతంలో జలాశయం నుంచి నీరు విడుదల చేశాక రెండు, మూడు రోజుల్లో మా పొలాలకు చేరేది. – గట్రెడ్డి రాజారావు, రైతు, దొండపూడి, రావికమతం మండలం -
అమ్మానాన్నకు ఏం చెప్పాలిరా?
గండేపల్లి/మాడుగుల రూరల్: స్నేహితులను మించిన అన్నదమ్ముల అనుబంధం వారిది. అప్పటివరకు కలిసే ఉన్న వారి బంధంపై విధికి కన్ను కుట్టిందేమో.. ప్రమాద రూపంలో వెంటాడి విడదీసింది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదంలో కళ్లముందే తమ్ముడు మృతిచెందడంతో అన్న పడిన వేదన వర్ణనాతీతం. ఇరవై రెండేళ్లు కలిసే ఉన్నాం కదరా.. నన్నొంటరిని చేసి వెళ్లిపోయావా తమ్ముడు.. అంటూ తోడబుట్టిన తమ్ముడి కోసం అన్న పడుతున్న వేదన చూపరులను కన్నీళ్లు పెట్టించింది. ఈ ప్రమాదంలో మణికట్టు తెగిపడి తానూ తీవ్ర గాయాలపాలైనప్పటికీ.. ఆ నొప్పిని భరిస్తూనే.. ‘నీకోసం అడిగితే.. అమ్మ నాన్నకు ఏం సమాధానం చెప్పాలిరా..’ అంటూ ఆ అన్న భోరున విలపించిన తీరు చూసి అంబులెన్స్ సిబ్బంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కాకినాడ జిల్లా గండేపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం అవురువాడ పంచాయతీ శివారు కాగిత గ్రామానికి చెందిన రబ్బా రమణ కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. రమణకు ఒక కుమార్తె, రబ్బా నవీన్, రబ్బా ప్రసాద్ (22) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. అన్నదమ్ములు ఇద్దరూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో కొలువైన వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బైక్పై గత ఆరు వారాలుగా ప్రతి శనివారం వచ్చి వెళుతున్నారు. ఏడో వారమైన ఈ శనివారం కూడా వాడపల్లికి వచ్చిన వీరు దర్శనానంతరం స్వగ్రామానికి బయలుదేరారు. సాయంత్రానికి మండలంలోని మురారి గ్రామంలో గల బ్యాంక్ ఆఫ్ బరోడా సమీపంలోకి వచ్చేసరికి ఇసుక లోడుతో ముందు వెళుతున్న టిప్పర్ లారీని తప్పించే ప్రయత్నంలో బైక్ హ్యాండిల్ లారీకి తగిలి అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడిపోయారు. ఈ ఘటనలో ప్రసాద్ నడుము భాగం పైనుంచి లారీ దూసుకుపోవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. నవీన్ కుడి చెయ్యి లారీ చక్రాల కింద చిక్కుకుని మణికట్టు వరకు తెగిపడింది. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్లో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జీజీహెచ్కు తరలించారు. ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జెడ్ రాగంపేట సీహెచ్సీకి తరలించారు. ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న రోడ్డు సేఫ్టీ పోలీస్, హైవే సేఫ్టీ సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ యూవీ శివనాగబాబు తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే మండల వైఎస్సార్సీపీ యూత్ అధ్యక్షుడు తంటపురెడ్డి బన్నీ, కాగిత గ్రామస్తులు సంఘటనా స్థలానికి వెళ్లారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లి దండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నన్నొంటరిని చేశావా తమ్ముడూ? 22 ఏళ్లు కలిసే ఉన్నాం కదరా! తీవ్రంగా గాయపడినా.. కళ్లముందే తమ్ముడి మృతిని తట్టుకోలేక అన్న ఆక్రోశం బైక్ అదుపుతప్పిన ఘటనలోతమ్ముడు మృతి మణికట్టు వరకు తెగిపడినఅన్న కుడి చెయ్యి దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ఘటన -
తాళపత్ర గ్రంథాల ఆవిష్కరణ
నర్సీపట్నం: దాతలు ఇచ్చిన తాళపత్ర గ్రంథాలను జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజా శనివారం ఆవిష్కరించారు. దాతలు సమకూర్చిన గ్రంథాలను పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ అధికారి కుమార్ రాజా అవార్డు పొందారు. ఈ సందర్భంగా నర్సీపట్నం శాఖాగ్రంథాలయంలో ఆయనను గ్రంథాలయ అధికారి పి.దమయంతి తదితరులు ఘనంగా సత్కరించారు. అనంతరం కుమార్ రాజా మాట్లాడుతూ గ్రంథాలయ అధికారి అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. తాళపత్ర గ్రంథాలను ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. రాజుబాబు, సూర్యనారాయణ, వరలక్ష్మి, వరహామణి, అప్పలనాయుడు, చంద్రకళ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
అనకాపల్లి టౌన్: హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ను ప్రతి విద్యార్థీ ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని డీఈవో జి.నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక బాలికోన్నత పాఠశాలలో స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్లెన్సీ అవార్డులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26లో రాష్ట్ర స్థాయిలో జరిగిన వివిధ క్రీడల్లో జిల్లా నుంచి పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ అవార్డులు అందజేసినట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.రుధిరా రాణి, వ్యాయామ ఉపాధ్యాయులు డి.వి.ఎస్.కె. నాయుడు పాల్గొన్నారు. -
వినూత్న ప్రాజెక్టుతో ఆకట్టుకున్న నాగజ్యోతి
రోలుగుంట: విద్యార్థుల అభ్యసనాన్ని మరింత సులభతరం, ఆసక్తికరం ఫలప్రదం చేసేందుకు ఆంగ్ల టీచర్ పీవీఎం నాగజ్యోతి రూపొందించిన ప్రాజెక్టు ప్రశంసలు అందుకుంది. ప్రభుత్వ సి.ఎస్.ఇ(కమిషనర్ ఆఫ్ స్కూలు ఎడ్యుకేషన్) తమీమ్ అన్సారీ ఆమె అధ్యయనాన్ని అభినందించారు. ఈ సందర్భంగా టుర్కూ యూనివర్సిటీ వైస్ రెక్టార్ మాయ పితోలా ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ డెవలప్మెంటు సర్టిఫికెటు ప్రదానం చేశారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల టీచర్గా పనిచేస్తున్న నాగజ్యోతి ఏపీ పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఫిన్లాండు విద్యా అధ్యయనం పర్యటనకు వెళ్లిన విషయం విదితమే. అక్కడ వర్సిటీలో గత నెల 17 నుంచి పది రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ఈ నెల 27వ తేదీతో విజయవంతంగా పూర్తి చేసుకుంది.ఫిన్లాండ్లో విద్యా వ్యవస్థపై సమగ్ర అధ్యయనం -
మాకవరపాలెం హైస్కూల్కు ఉత్తమ క్రీడా పాఠశాల అవార్డు
మాకవరపాలెం: స్థానిక ఉన్నత పాఠశాలకు ఉత్తమ క్రీడా పాఠశాల అవార్డు లభించింది. ఏటా క్రీడా దినోత్సవం రోజున జిల్లాలో ఐదు పాఠశాలలను ఉత్తమ క్రీడా పాఠశాలలుగా ఎంపిక చేస్తున్నారు. ఈ ఏడాది మాకవరపాలెం హైసూల్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడి విద్యార్థులు క్రీడల్లో రాణిస్తుండడంతో అవార్డుకు ఎంపిక చేశారు. క్రీడా దినోత్సవం సందర్భంగా శనివారం అనకాపల్లిలో డీఈవో నాగేశ్వరరావు చేతుల మీదుగా పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు, పీఈటీ రవి అవార్డు అందుకున్నారు. వీరితోపాటు విద్యార్థులను డీఈవో అభినందించారు. -
ఘనంగా ఓనం
● ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ● అబ్బురపరిచిన పులి వేషధారణలు దేవరాపల్లి: ఓనం వేడుకలను స్థానిక కై రళీ ఇంగ్లిష్మీడియం హైస్కూల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరస్పాండెంట్ ఎం.కె.దినేష్, ప్రిన్సిపాల్ లిస్సీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో స్థానిక విద్యార్థులు, కేరళ మహిళా ఉపాధ్యాయులు కేరళ సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో సందడి చేశారు. విద్యార్థులు చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. విద్యాలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థుల మహాబలి రాజు, పులి వేషధారణలు, పులికలి టైగర్స్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
మోకాళ్లపై నిలుచుని నిరసన
మాడుగుల: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక సీహెచ్సీలో శనివారం పారా మెడికల్ సిబ్బంది మోకాళ్లపై నిలుచుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, విధి నిర్వహణలో మృతి చెందిన వారికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, మరణించిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పారా మెడికల్ సిబ్బంది కుమారి, వరలక్ష్మి, లోవరాజు, తాతాజీ, కాంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
చలో ఢిల్లీనివిజయవంతం చేయాలి
దేవరాపల్లి: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వేచలపు కాసుబాబు, సీపీఐ మండల కార్యదర్శి వేమల కన్నబాబు, సీపీఐ జిల్లా సమితి సభ్యుడు గరికిన రాజు, మండల సహాయ కార్యదర్శి రాయి సింహాద్రి అప్పడు కోరారు. దేవరాపల్లిలో శనివారం ‘చలో ఢిల్లీ’ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుపరిపాలన అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక నిత్యావసరాలతో సహా అన్ని ధరలు విపరీతంగా పెంచి పేదలపై పెనుభారం మోపుతున్నారన్నారు. తక్షణమే పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్య రంగాలను మెరుగుపర్చి, పంటలకు కనీస మద్దతు కల్పించేలా చట్టబద్ధత తీసుకురావాలని కోరారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, మహిళా రిజర్వేషన్లు అమలు చేసి, కార్మికుల హక్కులను పరిరక్షించాలన్న డిమాండ్ల సాధన కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వా రు చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్ర జలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
తల్లి ఆనందం కోసం.. మరో తల్లి కడుపులో చిచ్చు!
పాప కిడ్నాప్ కేసులో తల్లీకూతుళ్లు, ఆటోడ్రైవర్ అరెస్ట్ అల్లిపురం(విశాఖ): తన తల్లి ఆనందం కోసం మరో తల్లి కడుపుకోతకు కారణమైన యువతితో పాటు ఆమె తల్లి, స్నేహితుడిని టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రైల్వే స్టేషన్ బస్టాప్ వద్ద నుంచి నాలుగేళ్ల చిన్నారి సయ్యద్ శివపార్వతిని అపహరించిన కేసును ఛేదించిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శనివారం టూటౌన్ పోలీస్స్టేషన్లో ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి, టూటౌన్ సీఐ బండారు అప్పలనాయుడుతో కలిసి కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 23న విజయవాడకు చెందిన సయ్యద్ అబ్దుల్ అఫీజ్ గని, ఆయన భార్య సయ్యద్ శేషమ్మ విశాఖ వ్యాలీ సమీపంలోని శిశు సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న తమ 11 ఏళ్ల కుమారుడు సయ్యద్ మారయ్యను చూసేందుకు విశాఖపట్నం వచ్చారు. కుమారుడిని చూసిన అనంతరం దంపతులు తమ నాలుగేళ్ల కుమార్తె సయ్యద్ శివపార్వతితో కలిసి రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆటోస్టాండ్ సమీపంలోని ఫుట్పాత్పై నిద్రించారు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఓ యువతి తన స్నేహితుడితో కలిసి అక్కడికి వచ్చి, తల్లి పక్కనే నిద్రిస్తున్న చిన్నారి శివపార్వతిని అపహరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలంలోని ఓ మహి ళ వద్ద ఉన్నట్లు గుర్తించి సురక్షితంగా రక్షించారు. అనంతరం ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లి ఆశ.. కూతురి తప్పుడు దారి! చిన్నారి అపహరణ కేసులో ఎస్.రాయవరం మండలం పాపకాయలవీధికి చెందిన అన్నమదేవర వరలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో చిన్నారిని అపహరించింది తన కుమార్తె అన్నమదేవర ప్రతిభారావు, ఆమె స్నేహితుడు విజయనగరం జిల్లా గరివిడి గ్రామానికి చెందిన కొంచాడ ఉపేంద్ర అని వెల్లడయింది. వరలక్ష్మికి మొదటి భర్త ద్వారా ప్రతిభారావు జన్మించింది. అనంతరం అతడు మరణించాడు. అనంతరం రెండో వివాహం చేసుకోగా ఆమెకు సంతానం కలగలేదు. దీంతో ఎక్కడైనా చిన్నారిని తీసుకురావాలని తన కుమార్తె ప్రతిభారావుకు రూ.30 వేలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. స్కూటీపై వచ్చి.. పాపను ఎత్తుకెళ్లి.. తల్లి కోరికను నెరవేర్చేందుకు ఇదే అవకాశంగా భావించిన ప్రతిభారావు తన స్నేహితుడు ఉపేంద్రతో కలిసి గురువారం రాత్రి రైల్వేస్టేషన్ సమీపానికి స్కూటీపై వచ్చింది. ఫుట్పాత్పై తల్లి పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల శివపార్వతిని అపహరించి ఎస్.రాయవరం తీసుకెళ్లి తన తల్లికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. వరలక్ష్మి ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రతిభారావు, ఉపేంద్రలను తుని రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు. ముగ్గురు నిందితులకు ఇప్పటివరకు ఎటువంటి నేర చరిత్ర లేదని ఆయన పేర్కొన్నారు. -
అడుగంటిన ఆశలు
మాడుగుల: నియోజకవర్గంలో రోజురోజుకు జలాశయాల్లో నీటిమట్టం తగ్గుతుండడంతో ఖరీఫ్ సాగుపై అన్నదాతల ఆశలు అడుగంటుతున్నాయి. జిల్లాలో మొత్తం 10 జలాశయాలుండగా, మాడుగుల నియోజకవర్గంలోనే అధికంగా ఏడు జలాశయాలున్నాయి. వీటి పరిధిలో ఏటా సుమారు 58,844 ఎకరాల్లో రెండు పంటలు పండేవి. అయితే ఈ ఏడాది వాటి పరిస్థితి దయనీయంగా మారింది. అత్యంత అధిక జలవనరులు గల పెద్దేరు, రైవాడ, కోనాం జలాశయాలతో పాటు చిన్న జలాశయాలైన పాలగెడ్డ, తారకరామ, గొరిగెడ్డ, ఉరక గెడ్డ జలాశయాలు అడుగంటడంతో అన్నదాతలు బోరుమంటున్నారు. రిజర్వాయర్లు అడుగంటడంతో భూగర్భజలాలు తగ్గిపోయి వ్యవసాయ మోటార్లు కూడా మొరాయిస్తున్నాయి. ఇకపై వర్షాలు అనుకూలించకపోతే తాగడానికి కూడా నీరు లేకుండా పోయే పరిస్థితులు దాపురిస్తాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నియోజవర్గంలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 58,844 ఎకరాలు కాగా, ఈ ఏడాది జలాశయాలు, బోర్లు కింద కేవలం 10 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. మొరాయిస్తున్న బోర్లు ఏటా ఆగస్టు నెలలో జలాశయాలు నిండుకుండల్లా తొణికిసలాడేవి. కానీ ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో నియోజకవర్గంలో ఏడు జలాశయాలతో పాటు చెరువులు ఎండిపోతుండడంతో వ్యవసాయ బోర్లు కూడా మొరాయిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నారు మడులు ఎండిపోయాయి. వర్షాలు కురవకపోవడంతో అధికశాతం మంది రైతులు నారుమడులు వేయలేదు. ప్రత్యామ్నాయంగా గంటి చేలు, వెద ద్వారా వేసిన వరి పంటలు కూడా ఎండిపోతున్నాయి. మాడుగుల నియోజకవర్గాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులును ఆదుకోవాలని, ఆయకట్టు రైతులు మొరపెట్టుకుంటున్నారు.రైవాడ : ఆయకట్టు 15,344 ఎకరాలు, మండలం : దేవరాపల్లి నాట్లువేసిన ఎకరాలు : 15 వందలు(నాట్లు కొనసాగుతున్నాయి) మాడుగుల నియోజకవర్గంలోని జలాశయాల్లోపరిస్థితి నీటి మట్టం(మీటర్లలో) జలాశయం గరిష్ట ప్రస్తుతం ఆయకట్టు పెద్దేరు 137 128. 70 19,000 రైవాడ 114 103.50 15,344 కోనాం 121.25 92.00 14,500వర్షపాతం (మిల్లీమీటర్లలో) నెల సగటు కురిసింది లోటుశాతం జూన్ 123.2 97.5 20.9 జులై 175.9 45.4 74.2 ఆగస్టు 176.5 48.5 128 గొరిగెడ్డ, ఉరక గెడ్డ ఆయకట్టు : 3000 ఎకరాలు మండలం : మాడుగుల నాట్లు వేసిన ఎకరాలు : 150 పాలగెడ్డ : ఆయకట్టు 2000 ఎకరాలు మండలాలు: మాడుగుల, చీడికాడ నాట్లు వేసిన ఎకరాలు : పడలేదు జలాశయాల్లో తగ్గిన నీటి మట్టం ప్రశ్నార్థకంగా ఖరీఫ్ సాగు దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు మాడుగుల నియోజకవర్గంలో 58,444 వేల ఎకరాలకు సాగునీటి సమస్య కేవలం 10 వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగు ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు జలాశయాలు నిర్మించిన నాటి నుంచి ఇలాంటి పరిస్థితులు లేవు. పెద్దేరు జలాశయం అడుగంటడంతో 1200 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పడ్డాయి. వర్షాలు కురిస్తేనే కాస్తోకూస్తో పండే అవకాశం ఉంటుంది. చినుకులు తప్ప వర్షాలు కురవడంలేదు. వర్షాలు కురుస్తాయి, జలాశయాలు నిండుతాయని ఎదురుచూస్తున్నాం.ఈ ఏడాది పంటలపై ఆశలు వదులుకోవలసిన పరిస్థితి దాపురించింది. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – చల్లా బుజ్జి, రైతు సత్యవరం తారకరామ : ఆయకట్టు 250 ఎకరాలు మండలం : మాడుగుల నాట్లువేసిన ఎకరాలు 120 ఆగస్టులోనూ లోటే ఆగస్టు నెల పూర్తవుతన్నా జిల్లాలో సరైన వర్షాలు లేవు. ఖరీఫ్ సాగుకు కీలకమైన జూన్, జులైతో పాటు, ఆగస్టులోనూ లోటు వర్షపాతమే నమోదైంది. ఇప్పటి వరకు జిల్లాలో సగటు వర్షపాతం 475.6 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా, 284.1 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. వర్షాలు లేక, జలాశయాల్లో నీరు అడుగంటి పోవడంతో వరినారుమడులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బోర్లు మొరాయిస్తున్నాయి జలాశయాల్లో నీరు అడుగంటడంతో పాటు వర్షా లు అనుకూలించక పోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్లు మొరాయిస్తున్నాయి. బోర్లు కింద వేసిన నాట్లు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది.ప్రత్యామ్నాయ పంటలూ ఎండిపోతున్నాయి. ప్రభుత్వం స్పందించి మాడుగుల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి. – పర్రే రామునాయుడు, రైతు. గాదిరాయి -
తెనుగుపూడి గురుకుల ఇంటర్ విద్యార్థి అదృశ్యం
దేవరాపల్లి: మండలంలోని తెనుగుపూడి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల విద్యాలయానికి చెందిన ఇంటర్ ఫస్టియ ర్ విద్యార్థి కదిరి ప్రవీణ్ అదృశ్యమైనట్టు తండ్రి లోవరాజు, విద్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ వివరాల ప్ర కారం.. కశింకోట మండలం తేగాడ గ్రామానికి చెందిన ప్రవీణ్ ఈ నెల 24వ తేదీ రాత్రి 7.15 గంటలకు విద్యాలయం నుంచి అదృశ్యమైనట్లు హౌస్ టీచర్ లెక్కల అర్జునరావు విద్యార్థి తండ్రికి ఫోన్లో తెలియజేశారు. అదేరోజు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ప్రవీణ్ తన తండ్రికి వేరే వ్యక్తి ఫోన్ నుంచి చేసి రాత్రి స్నేహితుడి ఇంట్లో ఉంటానని, మరుసటి రోజు ఇంటికి లేదా హాస్టల్కు తిరిగి వస్తానని తెలిపినట్లు ఫిర్యా దులో పేర్కొన్నారు. సదరు విద్యార్థి ఇటు హాస్టల్కు అటు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పాఠశా ల సిబ్బంది పరిసర ప్రాంతాల్లో గాలించిన ఆచూకీ లభించలేదు. అనకాపల్లి రైల్వేస్టేషన్ నుంచి విజ యవాడ వైపు వెళ్లే రైలులో ప్రయాణించినట్లు సమాచారం లభించింది. విద్యార్థి ఆచూకీ ఎవరికై నా లభిస్తే సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు. -
అసంపూర్తిగా వదిలేసిన రోడ్డుకు గిరిజనుల శ్రమదానం
రావికమతం: చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు పల్లెపండుగ–అడవితల్లి బాట పేరిట ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు పనులకు గిరిజనులే శ్రమదానం చేసి బాగు చేసుకున్నారు. చీమలపాడు పంచాయతీ శివారు కొండ శిఖర గ్రామం నేరేడు బంద పీవీటీజీ కొండ గిరిజనులు జెడ్.జోగుంపేట నుంచి మూడు కిలోమీటర్ల మేర శుక్రవారం రోడ్డు అభివృద్ధి చేశారు. జోగుంపేట నుంచి నేరేడుబంద వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.2.50 కోట్ల నిధులతో పల్లెపండుగ–అడవితల్లి బాట కార్యక్రమం పేరిట 2024 డిసెంబరులో చోడవరం ఎమ్మెల్యే ప్రారంభించారు. కొంత మేరకు రోడ్డు పనులు ప్రారంభించి మధ్యలో వదిలేశారు. అనంతరం వేసిన మట్టి కొట్టుకుపోయి గోతులమయంగా మారింది. దీంతో ఈ మార్గంలో వెళ్లాలంటే గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో నేరేడు బంద గిరిజన యువకులు, మహిళలు తమ గ్రామానికి బైక్ వెళ్లడానికి వీలుగా శ్రమదానం చేసి మూడు కిలోమీటర్లు వరకు గోతులను పూడ్చి రోడ్డు చదును వేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు కే గోవిందరావు మాట్లాడుతూ ప్రభుత్వం తవ్వి వదిలేసిన రోడ్డు పనులు పూర్తి చేయాలని, లేకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద వినూత్నంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. -
ఏసీబీ వలలో సబ్ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్
● రిటైర్మెంట్ బిల్లులు క్లియర్ చేసేందుకు రూ.40 వేలు డిమాండ్ ● లంచం తీసుకుంటుండగారెడ్హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు నర్సీపట్నం: పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేందుకు విశ్రాంత తహసీల్దార్ వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా నర్సీపట్నం సబ్ ట్రెజరీ కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ విజయభాస్కర్ను అవినీతి నిరోధకశాఖ వలపన్ని పట్టుకుంది. ఏసీబీ అడిషనల్ ఎస్పీ ఎస్.ఆర్.హర్షిత తెలిపిన వివరాల మేరకు... రిటైర్మెంట్ బిల్లులు, ఆర్జిత సెలవుల బిల్లులను సంబంధిత అధికారి పనిచేసిన కార్యాలయం నుంచి సబ్ ట్రెజరీకి పంపించారు. ఆ బిల్లులు మంజూరు చేసేందుకు సబ్ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ ఎన్.విజయ్భాస్కర్ రిటైర్డ్ మండల లెవెల్ అధికారిని రూ.40 వేలు లంచం ఇవ్వాలని, లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో బిల్లులు మంజూరు చేయడం జరగదని చెప్పాడు. లంచం ఇవ్వలేదని బిల్లు రిజెక్ట్ చేశాడు. దీంతో రిటైర్డ్ ప్రభుత్వ అధికారి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. తమ సూచన మేరకు రూ.30 వేలు లంచం ఇస్తుండగా విజయ్భాస్కర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్టు చెప్పారు. నర్సీపట్నం కొత్తవీధిలో నివాసం ఉంటున్న విజయ్భాస్కర్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న విజయ్భాస్కర్ను రిమాండ్ నిమిత్తం శనివారం విశాఖ ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 11 ఏసీబీ కేసులు నమోదు చేశామని, లంచం ఎవరు డిమాండ్ చేసినా నిర్భయంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని అడిషనల్ ఎస్పీ హర్షిత చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీలు బి.వి.ఎస్.ఎస్.రమణమూర్తి, ఎ.పృథ్వీరాజ్, సీఐలు లక్ష్మణరావు, శ్రీనివాస్, సుప్రియ, వెంకటరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించాలి
● మామూళ్ల మత్తులో రెవెన్యూ అధికారులు ● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న ఆగ్రహం దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి, సమ్మెద గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దేవరాపల్లిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ, గిరిజనుల భూములను పట్టణ ప్రాంతానికి చెందిన పెత్తందారులు దర్జాగా కబ్జా చేస్తున్నారని విమర్శించారు. రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుల నుంచి వచ్చే ముడుపులకు ఆశపడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎటువంటి అనుమతులు, హక్కు పత్రాలు లేకుండానే 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ, బంజరు భూములను, డీ–పట్టా భూములను ఆక్రమించి సాగు చేస్తున్నారని ఆరోపించారు. వాలా బు, గరిశింగి పంచాయతీల పరిధిలో సైతం విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను చెరబడుతున్నారని విమర్శించారు. దళిత, గిరిజనులకు ప్రభుత్వం కేటాయించిన బంజరు భూములు అన్యాక్రాంతమవుతున్నా చోద్యం చూడటం దారుణమన్నారు. ఆక్రమించిన అసైన్డ్ భూములకు రెవెన్యూ అధికారులు ఫారం–3 ఇచ్చి బోర్లు వేయిస్తున్నారన్నారు. ఈ ఆక్రమణలపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫిర్యాదుదారునికి తప్పుడు ఎండార్స్మెంట్ ఇచ్చి సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఎక్కడా చూడలేదన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను రక్షించాలని, లేకుంటే తామే ఎర్ర జెండాలు పాతి ఆ భూములను పేదలకు పంపిణీ చేస్తామని హెచ్చరించారు. -
బెధరగొడుతున్నాయ్
సాక్షి, అనకాపల్లి: జిల్లాలో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. నింగిని తాకిన నిత్యవసర ధరలు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. నెల రోజుల వ్యవధిలో పరిశీలిస్తే అన్ని ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆరు నెలల క్రితం పశ్చిమాసియా యుద్ధ నెపంతో వంట నూనెలు, వంట గ్యాస్ తదితర ధరలను అమాంతంగా పెంచినప్రభుత్వాలు.. ఇప్పుడు ఎందుకు అమాంతంగా నిత్యవసర ధరలు పెంచేశారంటూ పేద, మధ్యతరగతి ప్రజలు మండిపడుతున్నారు. పండగొచ్చినా.. పబ్బమొచ్చినా.. సామాన్యుడు దిగులుపడుతున్నాడు. మార్కెట్లో అడుగు పెడితే చాలు.. ధరాఘాతంతో బెదిరిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొందరు దళారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నా.. చంద్రబాబు సర్కారు పర్యవేక్షణ కరవైంది. ధరల నియంత్రణలో కూటమి సర్కారు పూర్తిగా విఫలమైందంటూ ప్రజలు మండిపడుతున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న దళారులు కొద్ది రోజుల క్రితం ధరలతో పోల్చి చూస్తే ఇప్పుడు అధిక శాతం నిత్యావసర సరకుల ధరలు అమాంతం పెరిగిపోయి, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారాయి. పంచదార, బెల్లం, ఉల్లి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు అల్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై 12 శాతం టాక్స్ను విధించడంతో ఒక్కసారిగా ధరలు భగ్గుమన్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఇష్టానుసారంగా పెంచారు. కొంత మంది వ్యాపారులు పలు రకాలైన వస్తువులను బ్లాక్ చేసి ప్రజలను దోచుకుంటున్నార న్న ఆరోపణలు వస్తున్నాయి. పంట సాగు తగ్గడం, వర్షాభావ పరిస్థితులు, నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణ లేకపోవడం, ఎల్ నినో ప్రభావం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. రైస్ మిల్లర్లు, వ్యాపారులు బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు అక్రమంగా నిల్వ చేయడం కూడా ధరల పెరుగుదలకు కారణాలు అవుతున్నాయి. ఏదీ పర్యవేక్షణ? ధరల నియంత్రణ కోసం జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు పరిశీలిస్తే.. అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలపై అధికార యంత్రాంగం ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. కనీస సమీక్షలు కూడా నిర్వహించలేదు. నిర్దేశించిన ధరల కన్నా అదనపు ధరలకు విక్రయించే వారిపై చర్యల్లేవు సరి కదా.. ప్రభుత్వం నుంచి ప్రకటనలు కూడా కానరాలేదు. జిల్లాలో ధరల స్థిరీకరణపై పర్యవేక్షణ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించవలసి ఉంటుంది. ఏడాది కాలంలో ఒక్కసారి కూడా సమావేశం జరిగిన సందర్భాల్లేవనే చెప్పుకోవచ్చు. బయట మార్కెట్లో ఎంఆర్పీకి విక్రయిస్తున్న వారి సంఖ్య చేతి వేళ్లపై లెక్కపెట్టుకోచ్చు. సామాన్య, మధ్య తరగతి వినియోగదారులను నిలువునా దోచుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నా పట్టించుకొనే నాథుడే కరవయ్యాడు. ఎక్కడా పర్యవేక్షణ లేదు, తనిఖీలు లేవు, దాడులు లేవు. పండగలను దృష్టిలో పెట్టుకుని పలు రకాల నిత్యావసర వస్తువులను బ్లాక్ చేస్తున్నారు. బియ్యం, పప్పులు, వంట నూనెలు, బెల్లం, పంచదార అక్రమంగా నిల్వ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి అనధికార నిల్వలు చేసి ఒక విధంగా చెప్పాలంటే దళారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎవరికి నచ్చిన ధరలకు వారు విక్రయిస్తున్నారు. వినియోగదారులు లబోదిబోమన్నా పట్టించుకునే వారు లేక జనాలు అల్లాడుతున్నారు. చేదెక్కుతున్న తీపి ధరలు శ్రావణ శుక్రవారం పూజల సందర్భంగా మార్కెట్లో పంచదార, బెల్లం ధరలను పోటాపోటీగా పెంచేశారు. పంచదార, బెల్లంతో పిండివంటలు ఎక్కువగా చేస్తుంటారు. దీంతో ఈ రెంటి ధరల పెరుగుదలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ప్రస్తుతం రకాన్ని బట్టి పంచదార ధర కిలో రూ.40–45 నుంచి రూ.70–72 వరకు పెరిగింది. 30 రోజుల క్రితం ఉన్న ధరలతో నేటి ధరలను పోల్చితే వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. బెల్లం ధర కిలో రూ.90 పైనే పలుకుతోంది. గతంలో రూ.50 ఉండేది, ఇప్పుడు రకాన్ని బట్టి రూ.70 నుంచి రూ.90కి విక్రయిస్తున్నారు. ఒక్కసారిగా రూ.16 నుంచి రూ.36 వరకు పెరిగింది. కంటినీరు తెప్పిస్తున్న ఉల్లి, వెల్లుల్లి నెల రోజులుగా ఉల్లిపాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. కిలో రూ.35 ఉండే ధర ఇప్పుడు రూ.70కి చేరుకుంది. రకాన్ని బట్టి రూ.50 నుంచి రూ.70 వరకూ విక్రయిస్తున్నారు. వెల్లుల్లి ధర కూడా కిలోపై రూ.50 పెరిగింది. ‘క్రూర’ గాయలు జిల్లాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. పచ్చిమిర్చి నుంచి టమాటా వరకూ అన్నింటి రేట్లు పెరిగాయి. ఉల్లి, వెల్లుల్లి రేట్లు చూస్తే కన్నీళ్లొస్తున్నాయి. పచ్చిమిర్చి, బీన్స్, చిక్కుడు, ఆగాకరకాయ, బంగాళదుంప, అల్లం రేట్లు భారీగా పెరిగాయి. రైతుబజారుకు రూ.1,000 పట్టుకొని వెళ్తే.. సంచి నిండుగా కూరగాయలు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక బయట మార్కెట్కు వెళ్తే సరేసరి.. సంచిలో సగం కాదు కదా.. అడుగు భాగానికి కూడా రావడం లేదు. నిత్యావసర వస్తువులు పాత ధరలు ప్రస్తుత ధరలు (కిలో రూ.లలో) పంచదార 40 – 45 70 – 72 బెల్లం 45 – 50 75 – 90 సన్ఫ్లవర్ నూనె 172 180 గోల్డ్ డ్రాప్ 170 180 పామాయిల్ 120 126 శనగపప్పు 75 90 ధనియాలు 180 350 కందిపప్పు 120 130 మినపప్పు 120 135 కూరగాయలు టమాటా 20 – 30 40 – 50 ఉల్లి 25 – 35 50 – 70 వెల్లుల్లి 110 160 పచ్చిమిర్చి 40 – 50 90 – 120 బీన్స్ / చిక్కుడు 40 – 50 80 – 120 బంగాళాదుంప 20 – 25 30 – 40 అల్లం 80 – 100 180 – 220 బియ్యం (25 కిలోలు) రూ. 1,000 – 1,050 రూ. 1,600 – 1,700 (లలిత) ఇతర రకాల బియ్యం రూ. 1,200– 1,650 వంటింటి నుంచి శుభకార్యక్రమానికి అవసరమయ్యే అన్ని వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయలు, బియ్యం, చక్కెర, బెల్లం, నూనెలు ఇలా ప్రతి వస్తువు ధర పెరిగిపోవడంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. నెలవారీ ఇంటి బడ్జెట్ తలకిందులైందని సామాన్య, మధ్యతరగతి వినియోగదారులు వాపోతున్నారు. -
మొక్కలకు రాఖీ.. పర్యావరణానికి రక్ష
మాకవరపాలెం: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండగ జరుపుకొంటారు. అయితే మండలంలోని తూటిపాల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు వినూత్నంగా శుక్రవారం విద్యార్థులతో మొక్కలకు రాఖీలు కట్టించారు. వృక్షాలను సంరక్షిస్తే అవి మనకు రక్షణగా నిలుస్తాయని హెచ్ఎం భీమారావు, ఉపాధ్యాయుడు రాము చెప్పారు. విద్యార్థులకు చిన్నవయసు నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంలో భాగంగా మొక్కలకు రాఖీలు కట్టించామని తెలిపారు. అనకాపల్లి: జీవీఎంసీ విలీన గ్రామమైన ఎరుకువానిపాలెం ఎంపీయూసీ స్కూల్ ఆవరణలో చెట్లకు శుక్రవారం విద్యార్థులు రాఖీలు కట్టారు. చెట్లను సోదరులుగా భావించి రక్షించాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. అనంతరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొణతాల ఫణిభూషన్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం కె.పి.బి.శ్రీధర్, ఉపాధ్యాయులు జయశ్రీరాణి, సుజాత, ఉమ, కృష్ణారావు, మూర్తి, ఎస్ఎంసీ చైర్మన్ అరిగా శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు మార్జిన్ ధ్వంసం.. అధికారులు మౌనం
● నక్కపల్లికి నీరు తరలింపునకు నాతవరంలో రోడ్డు ధ్వంసం ● స్పీకర్, కలెక్టర్ భూమిపూజ చేసినచోటే వంగిన సిమెంట్ రోడ్డు నాతవరం: కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్డు, తాగునీటి పైపులైనును కళ్ల ముందే పొక్లెయిన్తో ధ్వంసం చేస్తున్నా ఏమీ చేయలేని పరిస్ధితి నెలకొంది. మండలంలో నర్సీపట్నం – తుని మధ్య ఆర్అండ్బీ రోడ్డు, శృంగవరం నుంచి కాకినాడ జిల్లా సరిహద్దు వరకు తారురోడ్డు నిర్మాణంతోపాటు మధ్య వెదుళ్లుగెడ్డపై వంతెన నిర్మించేందుకు గత ప్రభుత్వం రూ. 14 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అప్పటి టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ తీవ్ర జాప్యం చేయడంతో ఎన్నికలు వచ్చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా రోడ్డు విస్తరణ పనులు చేసేందుకు 2024 నవంబరులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్ స్వయంగా భూమిపూజ చేశారు. శృంగవరం నుంచి జిల్లా సరిహద్దు వరకు తారురోడ్డు నిర్మించారు. రోడ్డు మధ్యలో వెదుళ్లుగెడ్డపై వంతెన ఇంకా నిర్మించలేదు. మన్యపురట్ల జంక్షన్ హెచ్పీసీఎల్ పాయింటు వద్ద అర్అండ్బీ రోడ్డు 300 మీటర్లు పల్లంగా ఉండడంతో అక్కడ తారురోడ్డుకు బదులు పటిష్టంగా ఉండేందుకు సిమెంట్ రోడ్డు నిర్మించారు. కుంగిపోయిన రోడ్డు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నక్కపల్లి మండలంలో పలు పరిశ్రమలకు నీరు అవసరం నిమిత్తం ఏలేరు కాలువలో నీటిని తరలించేందుకు పైపులైను పనులు చేపట్టారు. నాతవరం మండలం ఎ.శరభవరం వద్ద ఏలేరు కాలువలో నీటిని పైపుల ద్వారా తరలించేందుకు ఆర్అండ్బీ రోడ్డు మార్జిన్ అనుకుని పొక్లెయిన్తో కాలువ తీస్తున్నారు. నాతవరం మండలం కాకినాడ జిల్లా కోటనందూరు తుని మండలాల మీదుగా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలానికి పైపులైను 60 కిలోమీటర్లు మేర కాలువ తీస్తున్నారు. ఆయా పనులు ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రూ.350 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు చేస్తున్నారు. ఇటీవల కొత్తగా వేసిన తారురోడ్డు, సిమెంట్ రోడ్డు మార్జిన్ లోతుగా తవ్వేయడంతో రోడ్డు బీటలు వేసి దెబ్బతింది. హెచ్పీసీఎల్ పాయింట్ వద్ద కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డు అడుగుభాగంలో పైపుల ఏర్పాటుకు లోతుగా తవ్వేయడంతో రోడ్డు కుంగిపోయింది. మిగతా ప్రాంతంలో తారురోడ్డు మార్జిన్లో లోతుగా తవ్వేసి పైపులు వేశాక మొక్కుబడిగా మట్టివేసి కప్పేయడంతో వర్షాలు వచ్చినపుడల్లా వాహనాలు కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ఫైలట్ ప్రాజక్టు ద్వారా 18 గ్రామాలకు తాగునీరు అందించేందుకు గతంలో తాండవ నదిలో సంపు నిర్మించి పైపులైను ద్వారా ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అప్పట్లో పైపులైను కోసం తారురోడ్డు మార్జిన్లో కాలువలు తీసి పైపులు వేశారు. ఆ పైపులు ఉన్న ప్రదేశం నుంచి నక్కపల్లి మండలానికి ఏలేరు కాలువలో నీటిని తరలించేందుకు పెద్ద కాలువలు తీస్తున్నారు. కాలువ తీసేటప్పుడు తాగునీటి పైపులైను ధ్వంసం కావడంతో ప్రజలకు తాగునీటి సరఫరాకు తరుచూ అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల ప్రజలకు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల మధ్య నీటి కోసం వివాదం జరుగుతుంది. కళ్లముందే సిమెంట్ రోడ్డు కుంగిపోయినా, తారురోడ్డు శిథిలమైనా తాగునీటి పైపులైను ధ్వంసం చేసినా పెద్ద ప్రాజెక్టు పనులు కావడంతో సంబంధిత శాఖ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. స్పీకర్ ఆదేశాలు బేఖాతర్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈనెల 11న నాతవరం నుంచి తాండవ మధ్య కొత్తగా నిర్మించిన తారురోడ్డు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ రోజు ఆయన మాట్లాడుతూ తారురోడ్డుపై దమ్ము ట్రాక్టర్లు తిరిగినా, రోడ్డును పాడు చేసినా వెంటనే కేసులు పెట్టాలని పోలీసులు, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. తమ పార్టీకి చెందిన దమ్ము ట్రాక్టర్లు రోడ్డుపై తిరిగినా కేసు పెట్టాలన్నారు. చమ్మచింత వద్ద పొలాలకు సాగునీరు కోసం తాండవ రోడ్డు మార్జిన్ను దొరబాబు తవ్వడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇపుడు నర్సీపట్నం – తుని మధ్య ఆర్అండ్బీ రోడ్డు మార్జిన్ తవ్వేయడంతో రోడ్డు కుంగిపోయి బీటలు వేస్తున్నా అధికారులు పట్టనట్టు ఉండిపోయారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఆర్అండ్బీ జేఈ నాయుడుబాబును సంప్రదించగా శిథిలమైన రోడ్డు మరలా వారితోనే బాగు చేయించుతామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈ జయరాం మాట్లాడుతూ పైపులైను ఇష్టం వచ్చినట్టు తవ్వేయడంతో తరుచూ తాగునీటికి అంతరాయం ఏర్పడుతుందన్నారు. తమ సిబ్బంది వాటిని బాగుచేయడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. -
పర్యాటక ప్రాంతంగా ఏటికొప్పాక అభివృద్ధి
యలమంచిలి రూరల్: లక్కబొమ్మల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన మండలంలోని ఏటికొప్పాక గ్రామాన్ని పర్యాటకంగా అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ అన్నారు. ఏటికొప్పాక గ్రామానికి సమీపంలో రూ.3 కోట్ల రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ నిధులతో నిర్మించనున్న హస్తకళ ఇతివృత్త ఉద్యానవనం (హ్యాండీక్రాఫ్ట్స్ థీమ్డ్ పార్కు) నిర్మాణానికి ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం భూమిపూజ చేశారు. ఏటికొప్పాక సమీపంలో సుమారు 10 ఎకరాల్లో ఈ పార్కు నిర్మాణానికి పర్యాటకశాఖ ప్రణాళిక రూపొందించింది. పార్కు నమూనాతో ముద్రించిన ఫ్లెక్సీని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్న ఏటికొప్పాక హస్తకళాకారులు, లక్కబొమ్మలకు మరింత ప్రాచుర్యం కల్పించి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. లక్కబొమ్మల తయారీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటకశాఖ డైరెక్టర్ రవి పట్టాన్శెట్టి, కలెక్టర్ విజయకృష్ణన్, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, పలువురు అధికారులు పాల్గొన్నారు.హ్యాండీక్రాఫ్ట్స్ థీమ్డ్ పార్కుకు భూమిపూజ -
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి
యలమంచిలి రూరల్: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యలమంచిలిలో శుక్రవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తెలంగాణ, రాజస్తాన్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు అమలు చేస్తున్నాయని, మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించిన చట్టం చేయాలని వారంతా కోరారు. స్థానిక న్యాయస్థానాల ప్రాంగణం ఎదుట నిర్వహించిన ఈ నిరసనలో పాల్గొన్న న్యాయవాదులు మాట్లాడుతూ తమ డిమాండ్ సాధన కోసం వచ్చే సోమవారం కూడా విధులు బహిష్కరించనున్నట్టు తెలిపారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేయాలని నినాదాలు చేశారు. స్థానిక న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కొన్ని సివిల్ కేసులకు సంబంధించి పోలీసు,రెవెన్యూ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఆసరాగా చేసుకుని పాల్పడుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు తీర్మానించారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదుల ద్వారా సమాంతర కేసులు నడుపుతున్నారని పోలీసు,రెవెన్యూ అధికారులపై న్యాయవాదులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇకపై అలాంటి అక్రమాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.యలమంచిలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడు పి.వి. రమణ,కూనిశెట్టి శ్రీను,నగిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సావిత్రీ బాయి పూలే విగ్రహావిష్కరణ
కె.కోటపాడు: మహిళల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా సావిత్రీ బాయిపూలే, జ్యోతిరావ్ పూలేలు విశ్వసించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి జి.జి.ఎస్.నాగేశ్వరరావు అన్నారు. పాతవలస జెడ్పీ హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయురాలు సుజాతతో పాటు ఆమె భర్త నాగేశ్వరరావులు సావిత్రీబాయి పూలే విగ్రహాన్ని వారి సొంత నగదుతో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే అని విద్యార్థులకు తెలిపారు. భారతీయ సంఘ సంస్కర్తగాను, ఉపాధ్యాయినిగా, రచయిత్రిగా ఆమె సేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంఈవోలు కె.సత్యనారాయణ, డి.వి.డి.ప్రసాద్, హెచ్ఎం.నాగేశ్వరరావు, ఉపాధ్యాయుడు ఈశ్వరరావు పాల్గొన్నారు. -
తలవంచిన అనకొండలు
సాక్షి, అనకాపల్లి: కొండలు మింగే ఘనులకు చెక్ పడింది. పవిత్ర పంచదార్ల (ఫణిగిరి) పర్వతం కేవలం ఒక కొండ కాదు.. వేల ఏళ్లుగా భక్తుల దాహాన్ని తీరుస్తూ, ఆధ్యాత్మిక ప్రశాంతతను పంచుతున్న శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామివారి దివ్య క్షేత్రం. పంచదార్ల కొండ గుండెల్లోంచి ఉద్భవించి, భక్తులపై పుణ్యజలాలను చిలకరించే ఆ ఐదు పవిత్ర జీవధారలను కాపాడుకోవడానికి జరిగిన ధర్మపోరాటం చివరకు విజయం సాధించింది. అభివృద్ధి ముసుగులో కూటమి నేతలు జరిపిన అక్రమ తవ్వకాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమానికి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. పంచదార్ల కొండను అధికారికంగా ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటిస్తూ గురువారం ప్రభుత్వం జీవో 226ను జారీ చేసింది. ఈ ప్రకటనపై స్థానిక ప్రజలు, వైఎస్సార్సీపీ కేడర్, నాయకత్వం చేసిన ప్రజా పోరాట ఫలితమే ఈ నో మైనింగ్ జోన్ ప్రకటన అంటూ వైఎస్సార్సీపీ నేతలు వెల్లడించారు. వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్.జగన్న్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యలమంచిలి సమన్వయకర్త, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ నేతృత్వంలో ఉమ్మడి జిల్లా నాయకులు నెల రోజుల పాటు తీవ్ర ఉద్యమం చేపట్టారు. ఉమ్మడి జిల్లా వైఎస్సార్సీపీ నేతలంతా చేపట్టిన ఉద్యమ ఫలితంగా పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్గా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జూలై నెల 1వ తేదీ నుంచి పలు మార్లు ఎమ్మార్వో నుంచి జిల్లా మైనింగ్ శాఖ అధికారి వరకూ పలు వినతులు అందజేశారు. జూలై 18 నుంచి రెండు రోజుల పాటు రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు. పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు. జూలై 21న ‘చలో పంచదార్ల’ పేరిట అనకాపల్లిలో గల వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి పంచదార్ల వరకూ భారీ బైక్, కార్ల ర్యాలీ చేట్టారు. పంచదార్ల కొండ పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ యలమంచిలి సమన్వయకర్త కరణం ధర్మశ్రీ నేతృత్వంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ తదితర నేతలంతా హాజరై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. నో మైనింగ్ జోన్గా పంచదార్ల కొండ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం పంచదార్ల కొండపై ఇష్టారాజ్యంగా అక్రమ తవ్వకాలు వరుస కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’ పత్రిక పవిత్ర పంచదార్లని కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ నేతల పోరుబాట సాక్షి కథనాలతో ఇరకాటంలో పడిన కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు ‘నో మైనింగ్ జోన్’గా గుర్తిస్తూ జీవో జారీ ఉద్యమానికి భారీగా ప్రజా మద్దతు ఈ ఉద్యమానికి ప్రజల నుంచి భారీగా మద్దతు రావడంతో కూటమి ప్రభుత్వం తన తప్పులకు తలవంచక తప్పలేదు. అంతటితో ఆగలేదు. ఢిల్లీలో వైఎస్సార్సీపీ ఎంపీలంతా వెళ్లి కేంద్ర మంత్రికి వినతి అందజేశారు. నెల రోజుల పాటు వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమానికి కూటమి ప్రభుత్వం తలొగ్గి పంచదార్ల కొండను నో మైనింగ్జోన్ ప్రకటించింది. వైఎస్సార్సీపీ యలమంచిలి సమన్వయకర్త కరణం ధర్మశ్రీ నేతృత్వంలో చేసిన పోరాటానికి, వైఎస్సార్సీపీ కేడర్ అలుపెరగని పోరాటానికి ప్రభుత్వం తలవంచక తప్పలేదు. రాజ్యసభ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ ఎంపీలతో పాటు కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, బొడ్డేడ ప్రసాద్ ఢిల్లీలో కేంద్ర మంత్రి దృష్టికి పంచదార్ల సమస్యలను తీసుకెళ్లారు. ఎట్టకేలకు గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో.226 ద్వారా పంచదార్ల తీర్థయాత్ర కొండలను ‘నోమైనింగ్ జోన్గా’ అధికారికంగా ప్రకటించింది. పంచదార్ల గ్రామంలోని సర్వే నం.1లో 2.153 హెక్టార్ల విస్తీర్ణంలో చేపడుతున్న దాసమ్నాని విజయ్కుమార్ నాయుడు క్వారీ లీజును రద్దు చేసి, పంచదార్ల కొండ పరిధి నో మైనింగ్ జోన్గా ప్రకటించారు. కూటమి ప్రజాప్రతినిధుల అధర్మ పనులకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమం ఫలితమే పంచదార్ల కొండ పరిధిని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించడం. పంచదార్లను పచ్చ గెద్దలు దోచుకు తింటుంటే..సాక్షాత్ ఆ పరమశివుడే తనను మా అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రూపంలో ఉద్యమం వైపు నడిపించారు. పంచదార్లను ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించే వరకూ అలుపెరగని పోరాటం చేశాను. ఈ పోరాటం ఇంతటితో ఆగేది లేదు. గతంలో జరిగిన అక్రమ మైనింగ్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అందులో ప్రమేయం ఉన్న అధికారులు, పెద్దస్థాయి అధికారులను వదిలేసి చిరు స్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. అక్రమ మైనింగ్కు పాల్పడిన వారిపై మైనింగ్ శాఖ వేసిన పెనాల్టీ రూ.4 లక్షల్లో ఒక్క పైసా కూడా వారు చెల్లించలేదు. ఉద్యమం రోజు కూడా మైనింగ్ తవ్వకాలకు అనుమతి పొందిన మరో క్వారీపై సర్వేయర్ లేరంటూ సర్వే జరగలేదంటూ లక్షీ మినరల్స్ పేరిట చేసిన అక్రమ తవ్వకాలపై కూడా పెనాల్టీ విధించాలి. ఇదే రాంబిల్లి మండలంలో రాముకొండపై కూడా అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. వారిపై కూడా మైనింగ్శాఖ చర్యలు తీసుకోవాలి. లేదంటే కూటమి అధర్మ పనులపై నిరంతర పోరాటం చేయక తప్పదు. –కరణం ధర్మశ్రీ, యలమంచిలి సమన్వయకర్తసాక్షి కథనాలకు తలొగ్గిన ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో పంచదార్ల కొండను కూటమి నేతలు అక్రమ గ్రావెల్ తవ్వకాలకు పాల్పడ్డారు. కనీసం మైనింగ్శాఖ అనుమతులు కూడా లేకుండానే రాత్రి, పగలు తేడా లేకుండా 3–4 లక్షల క్యూబిక్ మీటర్ల మేర అక్రమ తవ్వకాలు చేపట్టారు. అయితే, దీనిపై స్థానికంగా గ్రామస్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఇచ్చినా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో పారిశ్రామిక పార్కు పేరుతో గ్రావెల్ తరలింపు కోసం మైనింగ్ అనుమతులు మంజూరు చేశారు. పవిత్రమైన పంచదార్ల కొండపై నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ ఎలా చేపడతారంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తే..ఎవరైనా అడ్డుగా వస్తే లారీలతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో కూటమి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల అండదండలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన పంచదార్ల కొండపై ఇష్టారాజ్యంగా అక్రమ తవ్వకాల అంశాన్ని వరుస కథనాలతో ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. సాక్షి కథనాలతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. -
రేవ్ పార్టీ.. దర్యాప్తు డర్టీ..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నం శివార్లలోని ‘హ్యాపీ నేచర్ రిసార్ట్స్’లో జరిగిన రేవ్ పార్టీలో కత్తిపోట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీ నేతల మధ్య జరిగిన ఈ వివాదాన్ని కప్పిపుచ్చేందుకు సాక్షాత్తూ పోలీసులే తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఘటనా స్థలంలో కళ్లెదుటే ఆధారాలు కనిపిస్తున్నా.. వాటిని స్వాధీనం చేసుకోవడంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించడం పోలీసుల తీరుపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తూ.. కేసును నీరుగార్చి, అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలను రక్షించేందుకు కింది స్థాయి సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. పోలీసుల వైఫల్యం? తెల్లవారుజామున సుమారు 4:18 గంటల ప్రాంతంలోనే పార్టీలో ఘర్షణ జరిగి, గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి వెళ్లినప్పటికీ.. పోలీసుల దర్యాప్తు మధ్యాహ్నం 3 గంటల వరకు ముందుకు సాగలేదు. కనీసం క్రైమ్ సీన్ను స్వాధీనం చేసుకోవడంలోనూ పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో సుమారు 40కి పైగా ఖాళీ, సగం తాగిన మద్యం సీసాలు పడి ఉన్నా వాటిని వెంటనే స్వాధీనం చేసుకోలేదు. ఈ జాప్యాన్ని ఆసరాగా చేసు కున్న కొందరు నేతలు ఆధారాలన్నింటినీ అక్కడి నుంచి మాయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసు నమోదు కాకముందే ఘటనా స్థలంలో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు పరోక్షంగా అవకాశం కల్పించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కేవలం 6 బాటిళ్లు మాత్రమే దొరికినట్టు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు రిసార్ట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. బయటకు రాని సీసీటీవీ ఫుటేజీ! ఈ రేవ్ పార్టీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో, ఆ కోణాన్ని దాచిపెట్టేందుకు సీసీటీవీ ఫుటేజీల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా హత్యాయత్నం జరిగిన సమయానికి సంబంధించిన ఫుటేజీని మాత్రమే పోలీసులు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం పార్టీకి సంబంధించిన పూర్తి ఫుటేజీని సేకరించి ఉంటే అందులో పాల్గొన్న వారి వివరాలు, అసలు విషయాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానికంగా చర్చ నడుస్తోంది. కానీ అలా పూర్తిస్థాయి ఫుటేజీ తీసుకోకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లభ్యమైన ప్రాథమిక దృశ్యాల్లో.. దాడికి పాల్పడిన వ్యక్తి ఒంటిపై దుస్తులు లేకుండా ఉన్నాడని, అలాగే పెద్ద సంఖ్యలో యువతులు కూడా అక్కడ కనిపించారని సమాచారం. అసలు అక్కడికి కత్తి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అన్న అంశాలపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీకి ఎవరెవరు వచ్చారు? లోపల ఏం జరిగింది? అన్న కీలక విషయాలు నమోదైన సీసీ కెమెరాల ఫుటేజీని తక్షణమే సీజ్ చేయకుండా కాలయాపన చేశారనే విమర్శలు ఉన్నాయి. సాధారణంగా చిన్న చోరీల వ్యవహారాల్లోనూ హడావుడి చేసే పోలీసులు.. ఇంత పెద్ద ఘటన జరిగినా కనీసం మీడియాకు పూర్తి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.ఆ విదేశీ మద్యం తెచ్చిందెవరు? ఈ రేవ్ పార్టీలో స్థానిక మద్యంతో పాటు విదేశీ మద్యం కూడా భారీగా పారినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో మద్యం బాటిళ్లు ఉన్నట్లు ఆధారాలు కనిపిస్తున్నా, పోలీసులు మాత్రం తక్కువ బాటిళ్లు ఉన్నట్లు చెబుతున్నారు. అసలు ఈ విదేశీ మద్యం అక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అన్న కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేయడం లేదని సమాచారం. ఒక విద్యార్థి విభాగం (టీఎన్ఎస్ఎఫ్) నాయకుడే ఈ విదేశీ మద్యాన్ని సరఫరా చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా.. ఆ దిశగా పూర్తిస్థాయి విచారణ చేపట్టకపోవడం పోలీసుల పక్షపాత వైఖరికి అద్దం పడుతోంది. -
ఏయూ భూతర్పణం!
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన రూ.వేల కోట్ల విలువైన ఆస్తులు క్రమంగా కరిగిపోతున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. వర్సిటీ భవిష్యత్ అవసరాలు, విద్యార్థుల ప్రయోజనాల కోసం పూర్వీకులు ఇచ్చిన విలువైన భూములను ప్రజా ప్రయోజనాల సాకుతో పలు సంస్థలకు బదలాయింపులు జరిగిపోతున్నాయి. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం మరోసారి ‘భూ’తర్పణం చేసేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటి వరకు ఇచ్చిన భూములకే సరైన పరిహారం రాకపోగా.. మళ్లీ భూములను కట్టబెట్టడంపై ఉద్యోగ వర్గాలు తప్పుబడుతున్నాయి. ఏయూ భూములు చేజారిపోతుండటంపై విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ఉద్యోగ సంఘాలు, పూర్వ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో వరుస కేటాయింపులు ● 1991లో త్రీటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని 2 ఎకరాల ఏయూ భూమిని రైతుబజార్ కోసం, మరో ఎకరాన్ని జీవీఎంసీ వినియోగానికి కేటాయించారు. ఆ భూమిలో టెన్నిస్ గ్రౌండ్ ఏర్పాటు చేసినప్పటికీ విశ్వవిద్యాలయానికి ఎటువంటి పరిహారం అందలేదు. ● 1999లో మధురవాడలో అందుబాటులో ఉన్న సుమారు 85 ఎకరాల్లో 81 ఎకరాలను పేదల గృహ నిర్మాణ కార్యకలాపాల కోసం జీవీఎంసీకి అప్పగించారు. ఈ భూమికి కూడా విశ్వవిద్యాలయానికి ఎలాంటి పరిహారం చెల్లించలేదు. ● 2001లో హనుమంతవాక జంక్షన్ వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సుమారు 9 ఎకరాల్లో 4 ఎకరాలను జాతీయ రహదారి సంస్థకు ఇచ్చారు. ఈ భూమికి కూడా ఏయూకు పరిహారం శూన్యం. ● 2018లో సుమారు 1.5 ఎకరాల విలువైన బీచ్ ప్రాంత భూమిని వాణిజ్య కార్యకలాపాల కోసం వుడాకు కేటాయించారు. ఇప్పటివరకు దీనివల్ల విశ్వవిద్యాలయానికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం అందలేదని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. మరో కేటాయింపునకు రంగం సిద్ధం ఇప్పటికే విలువైన భూములు కోల్పోయిన ఏయూకు మరోసారి భూ నష్టం జరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. యోగా సెంటర్ భూమిని ఆయుష్ ఆసుపత్రికి, సిరిపురం సమీపంలోని భూమిని, హనుమంతవాక జంక్షన్ వద్ద మరో ఎకరం భూమిని జీవీఎంసీకి అప్పగించేందుకు ఏయూ వైస్చాన్సలర్ ఆచార్య జి.పి.రాజశేఖర్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలు అమలైతే విశ్వవిద్యాలయానికి మరింత విలువైన భూమి దూరమయ్యే అవకాశం ఉందని ఏయూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలకు కేటాయిస్తున్నప్పటికీ.. అందుకు తగిన విధంగా ఏయూకు పరిహారం అందకపోవడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రూ.7 కోట్ల మున్సిపల్ పన్ను వివాదం ఒకవైపు విలువైన భూములను జీవీఎంసీ ఉచితంగా తీసుకుంటుంటే, మరోవైపు అదే జీవీఎంసీకి ఏయూ నిధుల నుంచి ఏకంగా రూ.7 కోట్ల ఆస్తి పన్ను చెల్లించడం వివాదాస్పదంగా మారింది. గతంలో పన్ను మినహాయింపు కోసం గవర్నర్కు లేఖలు రాసి ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రక్రియ కొలిక్కి రాకముందే హడావుడిగా రూ.7 కోట్లు చెల్లించడాన్ని అప్పటి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధనుంజయరావు తీవ్రంగా వ్యతిరేకించారని, వర్సిటీ ప్రయోజనాలకు గండికొట్టే నిర్ణయాలను వ్యతిరేకించినందుకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పరిరక్షించకపోతే భవిష్యత్తు శూన్యం వర్సిటీ భూములు ఎవరి సొంత ఆస్తి కాదని, భవిష్యత్ తరాల విద్యార్థుల కోసమేనని అధ్యాపకులు స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు ప్రైవేటు వర్సిటీలకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తూ భూములు కేటాయిస్తుంటే, ప్రఖ్యాత ప్రభుత్వ విశ్వవిద్యాలయమైన ఏయూ ఆస్తులను ఇష్టారాజ్యంగా పప్పుబెల్లాల్లా పంచడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రస్తుత బదలాయింపు ప్రతిపాదనలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
నోటిఫికేషన్ లేకుండా భూసేకరణా..?
కె.కోటపాడు: ఎంఎస్ఎంఈ పార్కు పేరిట నిబంధనలను పాటించకుండా రైతుల భూములను బలవంతంగా అధికారులు లాక్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నారని సీపీఎం నాయకుడు గండి నాయినిబాబు అన్నారు. గొండుపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు కోసం గుర్తించిన భూముల రైతులతో కలిసి గురువారం వీరు నిరసన కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా నాయినిబాబు మాట్లాడుతూ భూసేకరణకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ను ఇవ్వకుండా రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడానికి అధికారులు ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు. రైతుల నుంచి తీసుకుంటున్న భూముల్లో జిరాయితీ పట్టా ఎకరానికి రూ.20 లక్షలు, పట్టాలేని భూములు ఎకరానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్టు రైతులకు స్థానిక టీడీపీ నాయకులు చెబుతున్నారని నాయినిబాబు ఆరోపించారు. రైతులు భూములు ఇవ్వబోమని చెప్పినా రెవెన్యూ అధికారులు నోటీసులు పంపుతున్నారని అన్నారు. ఈ నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఈర్లె నాయుడుబాబు, రొంగలి ముత్యాలనాయుడు, రైతులు సీముసిరి రాము, ఆర్.గోవింద, నాగమణి, రాము పాల్గొన్నారు. గొండుపాలెంలో రైతులతో కలిసి సీపీఎం నిరసన -
వడ్డాది వెంకన్న ఆలయ ట్రస్ట్బోర్డు ప్రమాణ స్వీకారం
బుచ్చెయ్యపేట: వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల రాష్ట్ర దేవదాయశాఖ వేంకటేశ్వరస్వామి ఆలయానికి 20 ఏళ్ల తరవాత కమిటీ సభ్యులను నియమించింది. కొత్తగా నియమితులైన సభ్యులతో గురువారం దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ వసంతకుమార్ ట్రస్ట్ బోర్డు సభ్యులతో ప్రమాణం చేయించారు. వేంకటేశ్వరస్వామి సన్నిధిలోనే ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబుతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఎన్నికై న సయ్యపురెడ్డి సత్యనారాయణ మూర్తి,(నవీన్), ఎస్.లక్ష్మీనారాయణ, పి.రాధ, ఎస్. మహాలక్ష్మి, అప్పలనరస, కె.లక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈవో శర్మ, నాయకులు దొండా గిరిబాబు, శ్రీరామూర్తి, రమేష్, పేరమ్మ, వాసు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోవాడ సుగర్స్ నిర్వీర్యం
దేవరాపల్లి: కూటమి ప్రభుత్వ హయాంలోనే గోవాడ సుగర్ ఫ్యాక్టరీని పూర్తిగా నిర్వీర్యం చేసి మూతపడే స్థాయికి తీసుకువచ్చారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. వెంకన్న విమర్శించారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని చెరకు రైతులు, కార్మికుల బకాయి రూ. 38 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. చెరకు రైతు, కార్మికుల బకాయిలను తక్షణమే చెల్లించి సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోన్ని ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం మూడు నియోజకవర్గాల రైతులు, ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండున్నర లక్షల మంది గోవాడ సుగర్ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో అత్యధికంగా ఉన్న రైతులు, కూలీలు ఉన్నారని వీరికి తీవ్ర ద్రోహం చేసిందన్నారు. రైతులు పూర్తిగా చెరకు పంట పండించే కోల్పోయే విధంగా చేసిందన్నారు. ఒక వైపు ఫ్యాక్టరీ మూసివేయగా మరో వైపు ఈ ఏడాది వర్షాలు కురవక పోవడంతో రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన రైతులకు నేటికీ బిల్లులు చెల్లించక పోవడంతో అప్పులు ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ ప్రాంత రైతాంగం చెరకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతాంగాన్ని ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. బకాయిల కోసం రైతులు, కార్మికులు సంక్రాంతి పూట 23 రోజులు ఆఖిల పక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తే చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు స్పందించి బకాయి చెల్లింపునకు స్పష్టమైన హామీ ఇచ్చి దీక్ష విరమింప చేశారన్నారు. అనంతరం ఇద్దరు ఎమ్మెల్యేలు ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందని, సంక్షోభంలో ఉన్న రైతులు, కూలీలను ఆదుకొని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
జిల్లా కోర్టును సందర్శించిన విదేశీ ప్రతినిధులు
విశాఖ లీగల్: కెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా జపాన్, బెల్జియం, అమెరికా దేశాలకు చెందిన అంతర్జాతీయ ఇంటర్న్స్ భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, జీవన విధానంపై అవగాహన పొందేందుకు భారత్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు జిల్లా కోర్టుతో పాటు న్యాయవాదుల చాంబర్లను సందర్శించారు. ఈ సందర్భంగా భారత న్యాయ వ్యవస్థ, కోర్టుల పనితీరు, న్యాయ ప్రక్రియలు, న్యాయవాదుల విధుల గురించి వివరాలు తెలుసుకున్నారు. భారతీయ న్యాయ వ్యవస్థ ఆచరణాత్మక విధానాన్ని, కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం లభించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని వారు తెలిపారు.సాంస్కృతిక మార్పిడి ద్వారా విదేశీ యువతకు భారతీయ సంప్రదాయాలు, న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో పరస్పర అవగాహన, స్నేహ సంబంధాలను బలోపేతం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నీ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గాలి రామిరెడ్డి, సీనియర్ మెంబర్ యు. శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈ. సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికులు తగ్గినా.. ఆదాయం ఘనం
సాక్షి, విశాఖపట్నం: ప్రయాణికుల రాకపోకలతో.. నిత్యం కిటకిటలాడే ప్లాట్ఫారాలతో విశాఖపట్నం రైల్వే డివిజన్ ఎప్పుడూ ముందువరసలో ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితుల్లో ఆశ్చర్యకరమైన మార్పు కనిపించింది. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పడిపోయినప్పటికీ, రైల్వే శాఖకు అత్యంత కీలకమైన ‘సగటు ఆదాయం’ విషయంలో మాత్రం డివిజన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తక్కువ మంది ప్రయాణించినా, రైల్వే ఖజానాకు మాత్రం డివిజన్ నుంచి భారీగానే ఆదాయం సమకూరడం గమనార్హం. ఈసారి మూడో స్థానమే.. ఈ ఏడాది జూలై 2026కు సంబంధించిన తాజా అధికారిక గణాంకాలను పరిశీలిస్తే.. విశాఖపట్నం రైల్వే డివిజన్ మొత్తం 2.67 మిలియన్ల (26.7 లక్షల) మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఇందులో రిజర్వేషన్ ద్వారా 0.87 మిలియన్లు, అన్రిజర్వ్డ్ ద్వారా 1.80 మిలియన్ల మంది ప్రయాణించారు. ఇదే సమయంలో పొరుగున ఉన్న విజయవాడ డివిజన్ ఏకంగా 6.55 మిలియన్ల ప్రయాణికులతో అగ్రస్థానంలో నిలవగా, గుంతకల్లు డివిజన్ కూడా 3.59 మిలియన్లతో విశాఖను మూడో స్థానానికి నెట్టేసి రెండో స్థానానికి ఎగబాకింది. కేవలం 1.60 మిలియన్లతో గుంటూరు డివిజన్ మాత్రమే విశాఖ కంటే వెనుకబడింది. జూన్తో పోలిస్తే విశాఖ డివిజన్లో ప్రయాణికుల రాకపోకలు 3 శాతం తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. సగటు ఆదాయంలో మాత్రం సూపర్ ప్రయాణికుల రద్దీలో విజయవాడ, గుంతకల్లు డివిజన్ల కంటే వెనుకబడిన ప్పటికీ.. ఒక్కో ప్రయాణికుడి ద్వారా వచ్చే సగటు ఆదాయాన్ని విశ్లేషిస్తే విశాఖ రైల్వే డివిజన్దే పైచేయి కావడం విశేషం. జూలై నెలలో విశాఖ డివిజన్ మొత్తం రూ.76.83 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో రిజర్వ్డ్ ప్రయాణికుల ద్వారా రూ.61.94 కోట్లు, అన్రిజర్వ్డ్ ప్రయాణికుల ద్వారా రూ.14.89 కోట్లు ఖజానాకు వచ్చి చేరాయి. అంటే సగటున లెక్కగడితే విశాఖ డివిజన్లో ఒక్కో ప్రయాణికుడు రూ.287 చొప్పున రైల్వేకు చెల్లించారు. అదే విజయవాడలో అత్యధికంగా రూ.135.83 కోట్ల ఆదాయం వచ్చినప్పటికీ, అక్కడి సగటు ఆదాయం రూ.207 మాత్రమే. గుంతకల్లు డివిజన్లో సగటు ఆదాయం సుమారు రూ.270 కాగా, గుంటూరు డివిజన్లో అది కేవలం రూ.137గా నమోదైంది. ఎందుకు దూరమవుతున్నారు? గతంలో వాల్తేరు డివిజన్గా ఉన్న ప్రాంతాన్ని రెండుగా విభజించి.. ఒకటి విశాఖ డివిజన్గా, మరొకటి రాయగడ డివిజన్గా ఏర్పాటు చేశారు. ఇదే విశాఖలో ప్రయాణికుల రాకపోకలు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీంతో పాటు సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులు రైళ్లకు దూరమవ్వడం కూడా మరో కారణమని చెబుతున్నారు. వేసవి సెలవులు ముగియడం ఒక కారణమైతే.. సాధారణ రైళ్లలో జనరల్, స్లీపర్ కోచ్ల సంఖ్యను తగ్గించి ఏసీ కోచ్లను పెంచడం మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతో తక్కువ ధరలో ప్రయాణించే అన్రిజర్వ్డ్ ప్రయాణికుల సంఖ్య కేవలం 1.80 మిలియన్లకే పరిమితమైంది. ప్రీమియం రైళ్ల హవా మరోవైపు సగటు ఆదాయం పెరగడానికి వందేభారత్ వంటి ప్రీమియం రైళ్ల రాక ప్రధాన కారణం. ఈ తరహా రైళ్లలో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆక్యుపెన్సీ రేటు అత్యధికంగా ఉంటోంది. అందుకే తక్కువ మంది ప్రయాణించినా ఆదాయం గణనీయంగా వస్తోంది. విశాఖ రైల్వేస్టేషన్లో శరవేగంగా జరుగుతున్న భారీ పునరాభివృద్ధి పనుల కారణంగా ప్లాట్ఫారాలు, పార్కింగ్ ప్రాంతాల్లో కొంత అసౌకర్యం నెలకొంది. ఇది కూడా స్థానిక ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడానికి కారణమవుతోంది. ప్రస్తు తం నెలకొన్న ఈ స్తబ్దత తాత్కాలికమేనని రైల్వే అధికారులు భావిస్తున్నారు. రిజర్వ్డ్ కేటగిరీ ద్వారా రూ.61.94 కోట్ల అత్యధిక ఆదాయం రావడం.. సుదూర ప్రయాణాలకు ప్రజలు విశాఖ డివిజన్పైనే ఆధారపడుతున్నారనడానికి నిదర్శనం. రానున్న దసరా, దీపావళి పండుగల సీజన్ నాటికి విశాఖ స్టేషన్లో కొన్ని మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో ఆదాయం రికార్డు స్థాయిలో నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి...
అనకాపల్లి: విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన విశాలాంద్ర విలేకరి పి.గోవిందుపై ఈనెల 19న జరిగిన హత్యాయత్యాన్ని ఖండిస్తూ, నిందితుడు గుడివాడ కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు భీమరశెట్టి వెంకటేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబులు అన్నారు. స్థానిక నెహ్రూచౌక్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్, సీపీఐ ఆధ్వర్యంలో ఽగురువారం ధర్నా చేసి, మండలంలో కొత్తూరు పంచాయతీ పరిదిలో ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో షేక్ ఆయిషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ అక్రమాలపై వార్తలను ప్రచురించినందుకే జర్నలిస్టు గోవిందుపై దాడి చేయడం అన్నాయమన్నారు. దాడికి సంబంధించిన వీడియో, ఫొటో ఆధారాలు ఉన్నప్పటికీ నిందితుడు గుడివాడ కృష్ణపై అక్కడ పోలీసులు నేటి వరకూ చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు అజయ్, బి.కొండలరావు, సీహెచ్.శశికుమార్, కాండ్రేగుల మోహన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఈసీఎస్ ముట్టడి
కశింకోట: కశింకోటలోని ఆర్ఈసీఎస్ (అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకారం సంఘం) ఆధ్వర్యంలో నడుస్తున్న పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక సిబ్బంది తమకు సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మళ్లీ గురువారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి మద్దతుగా కళాశాల విద్యార్థులు కూడా నిలిచి ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. కళాశాలలో పనిచేస్తున్న 46 మంది అధ్యాపక సిబ్బందికి గత జులై నెల జీతం చెల్లించకుండా నిలిపివేయడం, నిబంధనల ప్రకారం అమలు చేయాల్సిన ఇతర సదుపాయాలను కల్పించపోవడంతో ఈనెల10న అధ్యాపక, సిబ్బంది రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీంతో ఏపీఈపీడీసీఎల్ ఉన్నతాధికారులు స్పందించి ఈ నెల 20లోగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే హామీ మేరకు ఎటువంటి చర్యలు చపట్టకపోవడం, జీతాలు ఇవ్వబోమని, కళాశాల నిర్వహణ బాధ్యత తమకు లేదని ఈపీడీసీఎల్ అధికారులు తెగేసి చెబుతుండడంతో అధ్యాపక సిబ్బంది మళ్లీ ఆందోళన బాట పట్టారు. గురువారం ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేశారు. ప్రిన్సిపాల్ బి.ఉమాశంకర్, అసోసియేట్ ప్రిన్సిపాల్ శివ, అధ్యాపక సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు శరగడం హేమంత్, కార్యదర్శి భీమిశెట్టి నగేష్ తదితరులు మాట్లాడుతూ ఆర్ఈసీఎస్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలను 2009లో ఏర్పాటు చేశారన్నారు. అధ్యాపక సిబ్బంది జీతాలను, ఇతర ఖర్చులను 2021 వరకు సంస్థ భరించిందన్నారు. అయితే 2021లో ఏపీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాల మేరకు ఆర్ఈసీఎస్ ఆపరేషన్స్ను ఏపీఈపీడీసీఎల్ స్వాధీనం చేసుకోవడంతో సమస్య మొదలైంది. ఈపీడీసీఎల్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఈసీఎస్ కార్యకలాపాలతో పాటు రూ.110 కోట్ల నిల్వలు, ఆస్తులను, విద్యుత్ సరఫరా ద్వారా వచ్చే కోట్లాది రూపాయల ఆదాయాన్ని కూడా సొంతం చేసుకుందని, కానీ ఆర్ఈసీఎస్ నిధులతో నడిచే పాలిటెక్నిక్ కళాశాల బాధ్యతను మాత్రం తీసుకోవడం లేదన్నారు. కళాశాల నిర్వహణ బాధ్యత వహించడానికి, తమకు జీతాలు చెల్లించడానికి ససేమిరా అంటుండడంతో ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు కల్పించుకొని విద్యార్థుల భవిష్యత్, అధ్యాపక సిబ్బంది ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమస్య పరిష్కరించాలన్నారు. అధ్యాపకులకు మద్దతుగా విద్యార్థుల ఆందోళన అధ్యాపకులు, సిబ్బంది ఆందోళనకు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బాసటగా నిలిచారు. విద్యార్థులు ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించి కళాశాల అధ్యాపక సిబ్బంది జీతపు బకాయిల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య వల్ల తమకు పాఠాలు సవ్యంగా సాగక ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను సత్వరమే పరిష్కరించి తమ భవిష్యత్కు పూర్తి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఈసీఎస్ ఎండీ, ఏపీఈపీడీసీఎల్ సూపరింటిండెంటింగ్ ఇంజినీర్ జి.ప్రసాద్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో విద్యార్థులు వెనుదిరిగారు. -
సిద్ధమవుతున్న గణనాథులు
బుచ్చెయ్యపేట: హిందూ సంప్రదాయం ప్రకారం తొలి పూజ చేసేది వినాయకుడికే.. హిందువులు ఏ కార్యం తలపెట్టినా విఘ్నాలు తొలగించే గణనాథుడినే వేడుకుంటారు. ఇందుకోసం గణపతి విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. రంగురంగుల అలంకరణలతో వివిధ రూపాల్లో ఆకర్షణీయంగా వీటిని శిల్పికళాకారులు తీర్చిదిద్దుతున్నారు. అడుగు నుంచి 15 అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తున్నారు. వచ్చే నెల 14వ తేదీన వినాయక చవితి సందర్భంగా ఉత్సవ కమిటీలు సైతం గ్రామాల్లో అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి. పలు రూపాల్లో విగ్రహాలు మేజర్ పంచాయతీ వడ్డాది, బుచ్చెయ్యపేట, సీతయ్యపేట, విజయరామరాజుపేట, రాజాం తదితర గ్రామాల్లో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీటి తయారీతో స్థానికంగా పలువురి కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. విజయ వినాయక, లంబోదర వినాయక, బుద్ధి వినాయక, పంచముఖ వినాయక, పార్వతీపరమేశ్వర్ల సన్నిధి వినాయక, ఊయలలో ఊగుతున్న వినాయక, శ్వేత నాగు బంధ వినాయక, గోవుపై ఊరేగుతున్న వినాయక వంటి పలు ఆకారాల్లో తయారు చేస్తున్నారు. మట్టితోపాటు కొబ్బరి పీచు, అట్టలు, ఇతర ముడి సరుకులతో వినాయక విగ్రహాలు తయారవుతున్నాయి. ఒక్కో విగ్రహాన్ని పరిమాణం బట్టి రూ. 100 నుంచి రూ.25 వేల వరకు అమ్మకాలకు సిద్ధం చేస్తున్నారు. వినాయ విగ్రహాలు తయారీతో శిల్పి కళాకారుల కుటుంబాలతోపాటు మరో 15 మంది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. వినాయక చవితి నుంచి దసరా ఉత్సవాల వరకు వీరికి చేతినిండా పని దొరుకుతుంది. రంగులతో ఆకట్టుకుంటున్నపంచముఖ వినాయక విగ్రహంఆకట్టుకుంటున్న విజయ వినాయక విగ్రహంతయారవుతున్న కాల సర్ప వినాయక విగ్రహంవినాయక విగ్రహాల తయారీ 15 అడుగుల ఎత్తు వరకు సిద్ధం వివిధ ఆకృతుల్లో ముస్తాబు చేతినిండా పని విగ్రహాల తయారీపై ఆధార పడి జీవిస్తున్నాం. మా కుటుంబాలతోపాటు మరో 15 మంది కుటుంబీకులకు ఉపా ధి కల్పిస్తున్నాం. ఈ ఏడాది విగ్రహాల తయారీకి ముడిసరుకు ధరలు పెరిగాయి. 15 అడుగుల విగ్రహాలు వరకు తయారు చేశాం. పలు గ్రామాల నుంచి వస్తున్న ఆర్డర్లు మేరకు పలు ఆకారాల్లో వినాయక విగ్రహాలను తయారు చేసి అమ్మకాలకు అందుబాటులో ఉంచాం. –కె లోవరాజు, విగ్రహాల తయారుదారుడు, వడ్డాది -
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పతకాలు
నర్సీపట్నం: తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ నెల 24 నుండి 27 వరకు జరిగిన అమరావతి ఛాంపియన్షిప్ కప్ బాక్సింగ్ పోటీల్లో నర్సీపట్నం నింజాస్ అకాడమికి చెందిన తొమ్మిది మంది బాలికలు మెడల్స్ సాధించారని శాప్ కోచ్ కె.అబ్బు తెలిపారు. 66 కేజీల విభాగంలో సకిరెడ్డి హరిణి, 60 కేజీల విభాగంలో లగుడు సమంత, 75 కేజీలలో బొంతు మౌనిక, 80 కేజీల విభాగాల్లో రోహిణి స్వర్ణ పతకాలు సాధించారు. 57 కేజీలు కుసుమ కుమారి, 80 కేజీల విభాగాల్లో యర్రా తేజస్విని రజత పతకాలు సాధించారు. 54 కేజీల్లో ఎస్.రిషిత, 57 కేజీల్లో జి.సాయి, 65 కేజీల విభాగాల్లో బి.యజ్ఞ కాంస్య పతకాలు సాధించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బాక్సింగ్ పోటీల్లో 460 మంది బాలికలు పాల్గొన్నారు. ఈ నెల 29న తిరుపతిలో నేషనల్ స్పోర్ట్స్ డే ప్రోగ్రాంలో స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నగదు పురస్కారాలు అందిస్తారని శాప్ కోచ్ అబ్బు తెలిపారు. ఈ టీమ్కు కోచ్లుగా అన్నపూర్ణ, జాహ్నవి వ్యవహరించారు. -
సమ్మెదలో ప్రభుత్వ భూముల దురాక్రమణ
దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి పంచాయతీ సమ్మెద రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ప్రభుత్వ భూముల్లో పాగా వేసి దర్జాగా అక్రమిస్తున్నారు. సుమారు 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ, బంజరు భూములను ఎటువంటి అనుమతుల పత్రాలు లేకుండానే సాగు చేస్తున్నారు. కొందరు బయట వ్యక్తులు సిండికేట్గా ఏర్పడి దౌర్జన్యంగా దురాక్రమణకు తెగబడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు చోద్యం చూడడంపై పలు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రెవెన్యూ అధికారులకు భారీ మొత్తంలో మామూళ్లు ముట్టడంతోనే అటుగా కన్నెత్తి చూడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమణలపై బాధిత రైతులు కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.ఇదిలా ఉండగా సమ్మెద రెవెన్యూ పరిధిలో బంజరు భూములకు 2005లో అప్పటి ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు పట్టాలు మంజూరు చేసింది. వీరిలో కొందరు సాగు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారుల అండదండలతో ఈ ప్రాంతానికి సంబంధం లేని బయట వ్యక్తులు ఆక్రమించి దర్జాగా సాగు చేస్తున్నారు. భూ హక్కుదారులకు రక్షణ కల్పించాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమణదారులకు కొమ్ము కాస్తూ మాట్లాడుతున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆక్రమణలపై రెవెన్యూ, పోలీస్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పరిష్కరించకుండా ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నారని, ప్రస్తుతం చేపడుతున్న రీసర్వేలో ఆక్రమణదారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి అక్రమణదారుల నుంచి తమ భూములకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. -
డిపో ఎదుట ఉద్యోగుల నిరసన
అనకాపల్లి: ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ)లో 1/2019 సర్క్యులర్కి విరుద్ధంగా ఇచ్చిన పనిష్మెంట్లను తక్షణమే రద్దు చేసి, ఈ.రమణ డ్రైవర్ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ప్రజారవాణాశాఖ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో అధ్యక్షుడు కె.ఎన్.రమేష్ అన్నారు. అసోసియేషన్ రీజనల్ కమిటీ తీర్మానం మేరకు ఈనెల 26, 27 తేదీల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు బుధవారం నిరసన తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ఓటీ సర్వీసులకు రన్నింగ్ టైం సరిపోని కారణంగా పెంచాలని, ఓఎంఎస్ వన్ మ్యాన్ సర్వీసులకు కండక్టర్ని ఇవ్వాలని, ఉద్యోగులకు లీవ్ పొజిషన్ అమలు చేయాలని, ఉద్యోగులకు రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, యూనియన్ పక్షపాత వైఖరితో అమలు చేసిన ఓడీలను రద్దు చేసి, సీనియార్టీ ప్రకారం ఓడీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ
కశింకోట: జిల్లాలో ముస్లింలు ఈద్ మిలాద్ ఉన్ నబీ (మహమ్మద్ ప్రవక్త) జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. మసీదుల్లో ప్రార్థనలు, ఖురాన్ పఠనం చేశారు. కశింకోట మండలం బయ్యవరంలోని హజరత్ ఆన్సర్ మద్దిని బెలియా దుర్గా నుంచి బయ్యవరం గ్రామం, జాతీయ రహదారి మీదుగా కశింకోట ప్రధాన రహదారి నుంచి జామియా, నూరి మసీదుల వరకూ ర్యాలీ నిర్వహించారు. శాంతి, సౌభాగ్యం, సుఖ సంతోషాలతో అందరూ మెలగాలని, ప్రేమ, దయ, కరుణ కలిగి ఆనందంగా సోదర భావంతో ఉండాలని ముస్లిం పెద్దలు ఆకాంక్షించారు. జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ బాబర్, మసీద్ కమిటీల ప్రతినిధులు నసీం అక్తర్, అబ్దుల్ కలాం, అబ్దుల్ మస్జీద్, ఎంఎ రబ్బానీ, సలీం, నాయమ్, మాక్సువల్, మౌలానా జాఫ్ఫార్, సయ్యద్తాజ్ పాల్గొన్నారు. -
సరుగుడు...నష్టాలకు విరుగుడు
చోడవరం: ఈ ఏడాది సరుగుడు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో మెట్ట ప్రాంతాలకే పరిమితమైన సరుగుడు సాగు ఇప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లోను, పల్లపు ప్రాంతాల్లోనూ అధికంగా సాగు చేస్తున్నారు. వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోవడంతో ఈ ఏడాది వరి, చెరకు సాగు తగ్గింది. వీటి స్థానంలో తక్కువ ఖర్చుతో సాగయ్యే సరుగుడు వేసేందుకు రైతులు ఎక్కువగా మొగ్గు చేపుతున్నారు. దీనితో సరుగుడు నారుకు విపరీతమైన గిరాకీ పెరిగింది. చోడవరం నియోజకవర్గంలో ప్రధాన పంటలు వరి, చెరకు. ఈ రెండు పంటలు సాధారణ విస్తీర్ణం ఏటా 21వేల 500 ఎకరాల్లో వరి, 30వేల ఎకరాల్లో చెరకు సాగు జరుగుతుంది. సరుగుడు సాగు 6వేల ఎకరాల్లో జరిగేది. అయితే ఈ ఏడాది సరుగుడు సాగు ఏకంగా 10వేల ఎకరాలకు పైబడి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. సకాలంలో వర్షాలు పడకపోవడం, మరో పక్క వరి నారు ముడుగులు ఆశించిన స్థాయిలో నీరు, నారు లేకపోవడంతో ఆదిలోనే వరి సాగుకి నారు సమస్య ఉత్పన్నమైంది. అంతేకాకుండా సబ్సిడీపై అందాల్సిన డీఏపీ ఎరువును ప్రభుత్వం అనుకున్నంతగా అందించలేకపోయింది. వీటికితోడు దమ్ములు, ఉడుపులకు యంత్రాలు, ట్రాక్టర్లు, కూలీలకు అయ్యే ఖర్చు నాట్లు సమయంలోనే ఎకరాకి రూ.15 నుంచి 20 వేలకు ఖర్చవుతుండడంతో పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు. ఈ రెండు పంటలకు ఈ ఏడాది పెట్టుబడులు భారీగా పెరిగాయి. మరో పక్క గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రెండేళ్లుగా క్రషింగ్ చేయకుండా మూసివేయడంతో ప్రత్యామ్నాయ పంటలపై రైతులు ఆసక్తి చూపారు. ఈ పరిస్థితుల్లో పెద్దగా ఖర్చులేకుండా ఒకసారి ఉడిస్తే 4,5 యేళ్లు ఎటువంటి పెట్టుబడి లేకుండా ఒకేసారి మొత్తంలో డబ్బులు వచ్చే వాణిజ్య పంట అయిన సరుగుడుపై ఈ ఏడాది రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. జోరుగా సరుగుడు నారు వేసే పనిలో నిమగ్నమయ్యారు. సరుగుడు సాగు చేసేవారు సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో నారు కొరత ఏర్పడింది. ఒక్కో మొక్క 80 పైసలు నుంచి రూపాయి ఉండగా ఇప్పుడు డిమాండ్ను బట్టి రూపాయి 20 పైసలకు అమ్ముతున్నారు. అయినా నారుకోసం దూర ప్రాంతాలకు వెళ్లి మరీ తెచ్చి రైతులు సాగు చేస్తున్నారు. అయితే ఆహార పంటలైన వరి, చెరకు సాగు తగ్గడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. -
మంచాల మోడల్ స్కూల్ బస్సు పునరుద్ధరించాలి
చీడికాడ: మండలంలోని మంచాల మోడల్ స్కూల్కు విద్యార్థులను తరలించే బస్సును పునరుద్ధరించాలని సీఐటీయు మండల కార్యదర్శి ఆర్.దేముడునాయుడు కోరారు. బుధవారం ఆయన విద్యార్థులు కోనాంలో చేపట్టిన నిరసనకు మద్దతు పలికారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా గల మంచాల మోడల్ స్కూల్కు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు గల విద్యార్థులు చీడికాడ మండలంలోని వరాహపురం, చినగోగాడ, జి.కొత్తపల్లి, చీడికాడతో పాటు కోనాం, చినకోనాం, శిరిజాం, ఖండివరం, అప్పలరాజుపురం, బి.సింగవరం, జైతవరం విద్యార్థులు ఉదయం, సాయంత్రం ఈ బస్సులోనే స్కూళ్లకు వెళుతుంటారన్నారు. ఈ ఏడాది వేసవి సెలవుల వరకు నడిచిన బస్సు సెలవుల అనంతరం నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ పాఠశాలను ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికే నిరుపేద విద్యార్థులకు ఉపకరించే బస్సును నిలిపివేశారని ఆరోపించారు. ఈ బస్సును పునరుద్ధరించాలని ఇప్పటికే పాఠశాల పీఎంసీ, తల్లిదండ్రుల సంతకాలతో ఎమ్మెల్యే బండారు దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇప్పటికై నా అధికారులు, ఎమ్మెల్యే స్పందించి వెంటనే బడి బస్సును పునరుద్ధరించాలని కోరారు. -
108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
చీడికాడ: నెలలు నిండిన గర్భిణి ప్రసవ నొప్పులతో 108 వాహనంలో మార్గమధ్యంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన మండలంలోని అర్జునగిరిలో బుధవారం చోటు చేసుకుంది. 108 పైలట్ లెక్కల ముత్యాలనాయుడు అందించిన వివరాలిలా ఉన్నాయి. అర్జునగిరికి చెందిన వై.రాణికి బుధవారం ఉదయం 6.35 గంటలకు పురుటి నొప్పులు ప్రారంభమైనట్టు తమకు సమాచారం అందడంతో చీడికాడ నుంచి అర్జునగిరి 6.55 గంటలకు చేరుకునిన్నామని, గర్భిణిని 108 వాహనంలో సమీపంలో గల పెదగోగాడ పీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ కావడంతో తమ వాహనంలో గల ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్)లెక్కల వరలక్ష్మి సూచనల మేరకు వాహనాన్ని పక్కకు తీసామన్నారు. ఈఎంటీ, ఆశాకార్యకర్త పి.మంగ సహకారంతో పురుడు పోసారన్నారు. రాణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే రాణికి ఇది రెండవ కాన్పు అని, మొదటి కాన్పు సిజేరియన్ కాగా రెండో కాన్పు నార్మల్ డెలివరి అయిందని అన్నారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా పెదగోగాడ పీహెచ్సీలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. -
పెళ్లికి వెళ్తూ అనంత లోకాలకు..
ఆనందపురం/డెంకాడ: సింహాచలంలో జరిగే స్నేహితుడి పెళ్లి వేడుకలో పాల్గొనాలని ఉదయాన్నే సంతోషంగా బయలుదేరారు. పెళ్లి సందడి చూసి, ఆనందంగా తిరిగి రావాలని అనుకున్నారు. కానీ కొన్ని క్షణాల్లోనే ఆ ప్రయాణం విషాదంగా మారింది. కారు లారీని ఢీకొనడంతో సంతోషంగా సాగాల్సిన ప్రయాణం ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం బొడ్డవలస గ్రామానికి చెందిన కోన రవికిశోర్ (37) సీఆర్పీఎఫ్ జవాన్. బంధువులతో కలిసి సింహాచలంలో జరిగే స్నేహితుడు శంకర్ వివాహ వేడుకకు కారులో బయలుదేరారు. గురువారం ఉదయం ఆనందపురం నుంచి పెందుర్తి వైపు వెళ్తుండగా గంభీరం పంచాయతీ పరిధిలోని దుక్కవానిపాలెం టోల్గేట్ సమీపంలో కారు అదుపుతప్పింది. డివైడర్పైకి ఎక్కిన కారు, అవతలి వైపు నుంచి వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవింగ్ చేస్తున్న రవికిశోర్కు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. క్షణం ముందు వరకు కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి వేడుకకు బయలుదేరిన ఆయన.. అదే ప్రయాణంలో విగతజీవిగా మారడం అందరినీ కలచివేసింది. కారులో ఉన్న రౌతు వరాలమ్మ, కోన వరాలమ్మ, రౌతు దుర్గ, కురుముంజి వరలక్ష్మి, బంటుపల్లి లక్ష్మి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రవికిశోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. పెళ్లి ఇంటికి చేరాల్సిన వేళ విషాద వార్త చేరడంతో ఇరు కుటుంబాల్లో కన్నీటి పర్యంతమైంది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి కళ్లెదుటే... జమ్ముకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న కోన కిశోర్ బుధవారం సింహాచలంలో జరిగే స్నేహితుడి పెళ్లికోసం స్వగ్రామమైన బొడ్డవలసకు మంగళవారం వచ్చాడు. బొడ్డవలసకు చెందిన శంకర్ పెళ్లికోసం పేరంటాళ్లను తీసుకుని బుధవారం కారులో బయలుదేరి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. కారులో తల్లి కోన వరహాలు కూడా ఉంది. తల్లి కళ్లెదుటే కొడుకు ప్రాణాలు విడవడంతో కన్నీటిపర్యంతమైంది. వరహాలకు కూడా స్పల్పగాయాలయ్యాయి. భార్య, ఇద్దరు ఆడ పిల్లలు మృతుడికి భార్య భాగ్యశ్రీ, కుమార్తెలు రిషితశ్రీ (3వ తరగతి), గాత్వికశ్రీ (ఎల్కేజీ)లు ఉన్నారు. తల్లిదండ్రులు కోన చిదంబరం, వరహాలకు ఇద్దరు కుమార్తెలు, రవికిశోర్ ఒక్కడే కుమారుడు. కుటుంబానికి మృతుడి జీతమే ఆధారం. ప్రమాదంలో ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది. రవికిశోర్ మృతదేహానికి పోలీస్ లాంచనాలతో బొడ్డవలసలో అంత్యక్రియలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ జవాన్ కోన రవికిశోర్(ఫైల్) మృతుడుకోన రవికిశోర్ -
ఖాళీ బిందెల గోడు వినండి...
రోలుగుంట: ఫ్లోరైడు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో రోలుగుంట ఎస్సీ కాలనీలో ఖాళీ బిందెలతో మహిళలు బుధవారం ధర్నా చేశారు. ఈ ధర్నాకు సారధ్యం వహించిన సీపీఎం నాయకుడు కె.గోవింద మాట్లాడుతూ మండలంలోని కె.నాయుడుపాలెం, నిండుగొండ, ఎన్.కొత్తూరు తదితర ఫ్లోరైడు గ్రామాల్లో తాగునీరందక జనం ఎన్నో ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తెలిపిన వివరాలివి. ఆయా గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి 2004లో రూ.3.50 కోట్లతో భారీ ప్రాజెక్టు నిర్మించారు. రోలుగుంటలో లక్ష లీటర్ల సామర్ధ్యం గల ట్యాంకు నిర్మించి జానకీరాంపురంలో ఏటిలో నీటిని శుద్ధి చేసి బాధిత గ్రామాలకు సరఫరా చేసేవారు. ఏటిలో ఇసుక మాఫియా కారణంగా నీటిమట్టం అడుగంటి పోయి తాగునీరందని పరిస్థితి ఏర్పడింది. జల్జీవన్ మిషన్ పథకం ద్వారా 2020–21లో రూ.6 కోట్లు మంజూరు చేశారు. పనులు జరగాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చి వాటిని రద్దు చేసింది. అయితే అధికారులు ఆ నిధులతో పనులు జరపాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామంటున్నారు. జల్జీవన్ మిషన్ పథకం కింద 50 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరందిస్తామని కోతలు కోసిన కూటమి నాయకులు చుక్కనీరు అందించకపోవడం బాధాకరమని తెలిపారు. తాము భూములు అడగడం లేదు, రుణాలు అడగడం లేదు.. తాగునీరవ్వండి మహాప్రభో అంటూ ఈ ధర్నాలో మహిళలు తమ గోడు వినిపించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున మహిళలతో పాటు సీపీఎం నాయకులు కె.గోవింద, వి.నూకరత్నం, వి.శ్రీదేవి పాల్గొన్నారు. -
జిల్లా దస్తావేజు లేఖర్ల నూతన కార్యవర్గం
అనకాపల్లి/చోడవరం: జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షునిగా వడ్డాది రమేష్(చోడవరం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో కొత్తూరు పంచాయతీ శారదానగర్ శ్రీనివాస ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో జిల్లా గౌరవాధ్యక్షునిగా సున్నం చిదంబరస్వామి(నర్సీపట్నం), ప్రధాన కార్యదర్శి బొగ్గారపు వెంకట గున్నాజీరావు(అనకాపల్లి), ఉపాధ్యక్షులుగా డి.ఎస్.వి.జె.ఎన్.మురళీకృష్ణ (నక్కపల్లి), సహాయ కార్యదర్శిగా రనరం సన్యాసినాయుడు(నర్సీపట్నం), కోశాధికారిగా ఆర్లే ఉమామహేశ్వరరావు(యలమంచిలి), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శేఖర్మంత్రి శ్రీనివాసరావు (సబ్బవరం) కార్యవర్గ సభ్యులుగా కోట్ని గణేష్, సూదికొండ మాణిక్యాలరావు, ఒమ్మిడిపాటి వరప్రసాద్, జూరెడ్డి శ్రీరామూర్తి, బొబ్బిలి సన్యాసినాయుడుతో పాటు మరో తొమ్మిది మంది ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి గాదె రవికుమార్, రాష్ట్ర కోశాధికారి అవ్వారు సత్యనారాయణ వ్యవహరించారు. ఈ సందర్బంగా వడ్డాది రమేష్ మాట్లాడుతూ పై కమిటీ రెండు సంవత్సరాలు ఉంటుందన్నారు. జిల్లాలో దస్తావేజుల లేఖరులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేస్తామన్నారు. -
చెరకు రైతుల కంట నీళ్లొస్తున్నాయి..
దేశంలో షుగర్ ఫ్యాక్టరీలు పెరుగుతుంటే ఏపీలో మూతపడుతున్నాయి. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో ఉన్న అన్ని సహకార షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. గతంలో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా చెరకు సాగు కాస్త.. ప్రస్తుతం 3 లక్షలకు పడిపోయింది. ఒక్క అనకాపల్లి జిల్లాలోనే ఒక లక్షా 30 వేల ఎకరాల్లో పండించే చెరకు సాగు ప్రస్తుతం 5 వేల ఎకరాలకే పరిమితమైంది. గోవాడ మూతతో 25 వేల మంది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీల ఆస్తులన్నీంటినీ ఏపీఐఐసీ పేరిట తన పార్టీ ప్రతినిధులకు, బినామీలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. రైతుల కంట నీళ్లొస్తున్నాయి. –కర్రి అప్పారావు, చెరకు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
చదువుల గూడు చెదిరింది
మధురవాడ: రాత్రి 10 గంటలు.. చుట్టూ చిమ్మచీకటి. గురుకుల వసతి గృహంలో రేపటి పాఠాల గురించి కలలు కంటూ నిద్రిస్తున్న గిరిజన బిడ్డలకు ఒక్కసారిగా బూట్ల చప్పుళ్లు, అధికారుల గద్దింపులు వినిపించాయి. ‘తెల్లారేసరికి స్కూల్ ఖాళీ చేయాలి.. బ్యాగులు సర్దుకోండి’ అంటూ హుకుం జారీ చేశారు. నిద్రమత్తులోనే పుస్తకాలు, బట్టలు బ్యాగుల్లో సర్దుకున్న విద్యార్థులు.. ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమన్నారు. ‘సారూ.. మమ్మల్ని ఇక్కడే చదువుకోనివ్వండి’ అంటూ కొందరు చేతులు జోడించి వేడుకున్నా ఫలితం లేకపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కొండకోనల్లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ‘మీ పిల్లలను తరలిస్తున్నాం.. వెంటనే రండి’ అని సమాచారం ఇచ్చారు. వారు విశాఖ చేరుకునేలోపే 480 మంది విద్యార్థులను పోలీసుల పహారా మధ్య బస్సుల్లో ఎక్కించి సబ్బవరం, శ్రీకృష్ణాపురం, దేవరాపల్లి, పార్వతీపురం ప్రాంతాలకు తరలించారు. దీంతో మారికవలస–తిమ్మాపురం రోడ్డులోని గురుకుల ప్రాంగణం విద్యార్థుల ఆర్తనాదాలు, తల్లిదండ్రుల రోదనతో దద్దరిల్లింది. చదువు కోసం దూరం నుంచి వచ్చిన బిడ్డలు అరకు, పాడేరు, కొయ్యూరు, చింతపల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాల కొండకోనల నుంచి వచ్చిన 480 మంది గిరిజన విద్యార్థులు మారికవలస గురుకులంలో చదువుకుంటున్నారు. మెరుగైన విద్య అందుతుందన్న ఆశతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చేర్పించారు. అయితే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) ఏర్పాటు కోసం ఈ పాఠశాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ పిల్లల చదువులపై అనిశ్చితి నెలకొంది. విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత కొద్దిరోజులుగా తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు, వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. పాఠశాలను ఇక్కడే కొనసాగించాలని, సీవోఈకి ప్రత్యామ్నాయ భవనం చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన పేరెంట్స్ సమావేశంలోనూ ఇదే విషయాన్ని తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారి అభ్యంతరాలను పక్కనపెట్టి మంగళవారం అర్ధరాత్రి అధికారులు, పోలీసులు పాఠశాలకు చేరుకోవడం తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి ‘ఆపరేషన్’ రాత్రివేళ పాఠశాలకు చేరుకున్న అధికారులు, పోలీసులు గేట్లు మూసివేసి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశారు. బ్యాగులు సర్దుకోవాలని హుకుం జారీ చేశారు. నిద్రపోతున్న బిడ్డలను లేపి.. పుస్తకాలు, బట్టలు సర్దించి.. తెల్లారేలోగా పాఠశాలను ఖాళీ చేయించారు. ఒంటిగంట దాటిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లోని తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పిల్లలను తరలిస్తున్నట్టు చెప్పారు. అప్పటికే రాత్రి కావడంతో దూర ప్రాంతాల నుంచి బయలుదేరడం తల్లిదండ్రులకు సాధ్యం కాలేదు. కొందరు అర్ధరాత్రే వాహనాల కోసం పరుగులు తీశారు. మరికొందరు ‘మా పిల్లల్ని మాకు చూపించండి.. మేమే వచ్చి తీసుకెళ్తాం’ అంటూ అధికారులను వేడుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అంతలోనే ప్రత్యేక బస్సులు సిద్ధమయ్యాయి. పోలీసుల పహారా మధ్య విద్యార్థులను బస్సుల్లోకి ఎక్కించి సబ్బవరం, శ్రీకృష్ణాపురం, దేవరాపల్లి, పార్వతీపురం తదితర ప్రాంతాలకు తరలించారు. బిడ్డల కన్నీళ్లు.. తల్లిదండ్రుల ఆర్తనాదాలు.. పోలీసుల పహారా.. అధికారుల హడావుడి.. వెరసి ఆ రాత్రి మారికవలస గురుకుల ప్రాంగణం ఓ విషాద దృశ్యాన్ని తలపించింది. తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచి పెద్దచేసి మంచి చదువు అందించాలన్న ఆశతో కొండకోనల నుంచి వందల కిలోమీటర్ల దూరం పంపిన పిల్లలను అర్ధరాత్రి హడావుడిగా తరలించడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీవోఈ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజన, ప్రజాసంఘాలు, వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా అధికారుల తీరుపై మండిపడ్డాయి. ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సునీల్కుమార్ రాజా, సోషల్ వెల్ఫేర్ డీడీ రామకృష్ణ, డీఎస్టీడబ్ల్యూవో సురేష్ల పర్యవేక్షణలో తరలింపు జరిగినట్లు సమాచారం. -
విశాఖలో ‘నవ్య’ శకం!
సాక్షి, విశాఖపట్నం: బుక్ చేసిన గ్యాస్ సిలిండర్ ఎప్పుడొస్తుందో అని ఎదురుచూస్తున్నారా.? సిలిండర్ మోసుకురావాలంటే అలిసిపోతున్నారా.? ఇకపై మీకు సమస్య లేదు. ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్లు సిలిండర్ ఆర్డర్ పెట్టేసుకుంటే.. నిమిషాల వ్యవధిలో మీ ఇంట్లో వాలిపోతుంది. ఒక చోటు నుంచి మరో చోటికి సులువుగా, శ్రమ లేకుండా తీసుకెళ్లేలా మీ చేతిలో ఒదిగిపోతుంది. అదే.. హిందూస్థాన్ పెట్రోలియం(హెచ్పీ) తీసుకొచ్చిన ‘నవ్య’మైన సిలిండర్. ఇప్పటికే బెంగళూరు, విజయవాడల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సిలిండర్ను తాజాగా విశాఖ మార్కెట్లోకి కూడా ప్రవేశపెట్టారు. శివాజీపాలెంలోని రఘురాం గ్యాస్ ఏజెన్సీ వద్ద బుధవారం హెచ్పీ కంపెనీ ప్రతినిధులు 10 కిలోల కాంపోజిట్ సిలిండర్ ‘హెచ్పీ నవ్య’ను లాంఛనంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఏమిటీ ‘నవ్య’ ప్రత్యేకతలు.? నవ్య సిలిండర్ పాలిమర్తో తయారు చేశారు. బరువు తక్కువ, భద్రత ఎక్కువ అన్న సూత్రంతో రూపొందిన ఈ సిలిండర్ ఈ జనరేషన్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అని హెచ్పీసీఎల్ వర్గాలు చెబుతున్నాయి. సాంప్రదాయ ఇనుప సిలిండర్లతో పోలిస్తే ఈ కొత్త కాంపోజిట్ సిలిండర్ అత్యంత తేలికగా ఉండటమే కాకుండా అనేక ఆధునిక వసతులను కలిగి ఉందంటున్నారు. గ్యాస్ ఎంత ఉందో చూసుకోవచ్చు! గ్యాస్ ఉందా లేదా అనే టెన్షన్ని కూడా ఈ కొత్త సిలిండర్ లేకుండా చేస్తుంది. పాలిమర్ సిలిండర్లో మధ్యలో ఫైబర్గ్లాస్ సాంకేతికతను ఏర్పాటు చేశారు. అందుకే ఇది పాక్షికంగా పారదర్శకంగా ఉంటుంది. లోపల గ్యాస్ ఎంత ఉందనేది ఎప్పటికప్పుడు మనం చూసుకునే వెసులుబాటు ఉన్న ఒక స్మార్ట్ కాంపోజిట్ సిలిండర్ ఇది. దీంతో రీఫిల్ బుకింగ్ సమయాన్ని ముందుగానే అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్గ్లాస్ మెటీరియల్తో రూపుదిద్దుకోవడం వల్ల తుప్పు పట్టే సమస్య ఉండదు. ప్రమాదాల బారిన పడకుండా అత్యున్నత భద్రతా ప్రమాణాలతో, పేలుడు సంభవించని రీతిలో దీనిని రూపొందించారు. 10 కేజీల సిలిండర్ ఇది 10 కిలోల సిలిండర్. అపార్టుమెంట్లు, చిన్న కుటుంబాలు, ఉద్యోగులు, విద్యార్థులతో పాటుగా అదనపు గ్యాస్ కనెక్షన్ కావాలనుకునేవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సిలిండర్ ధర ప్రాంతాన్ని అనుసరించి, మొదటిసారి కనెక్షన్ తీసుకున్నప్పుడు రూ.4,900 నుంచి రూ.5,002 వరకూ ఉంటుందని హెచ్పీ అధికారులు చెబుతున్నారు. తొలిసారి కొనుగోలు చేసినప్పుడు మాత్రం గుర్తింపు కార్డు, డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఉంటుంది. తర్వాత ఇక సులువే. దీని రీఫిల్ ధర రూ.1,600 నుంచి రూ.1,700 వరకూ ఉంటుంది. విశాఖ మార్కెట్లోకి ‘హెచ్పీ నవ్య’ మద్దిలపాలెం: హెచ్పీసీఎల్ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అభిషేక్ త్రివేది, ఎల్పీజీ చీఫ్ జనరల్ మేనేజర్ దేబేష్ పురోహిత్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మహేందర్ సింగ్ చేతుల మీదుగా ‘హెచ్పీ నవ్య’ను శివాజీపాలెంలో గల రఘురాం గ్యాస్ ఏజెన్నీ వద్ద బుధవారం మార్కెట్లోకి లాంఛనంగా ప్రవేశపెట్టారు. అనంతరం సేల్స్ ఆఫీసర్ ప్రతాప్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎన్డీ సేల్స్) ఆశీష్ సింఘాల్ మాట్లాడుతూ వినియోగదారులకు మరింత భద్రతతో పాటు సులభమైన వినియోగాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ఆధునిక సిలిండర్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీజీఎం(ఎల్పీజీ సేల్స్) ఆర్.ఉమాపతి, చీఫ్ మేనేజర్ (కమర్షియల్) బి.వి.వి.రాజు తదితరులు పాల్గొన్నారు. -
నూకాంబిక సన్నిధిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని బుధవారం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్, చైర్మన్ పీలా నాగశ్రీనులు మంత్రి దంపతులను శాలువాలతో సత్కరించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటిసారిగా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
రెండు చోరీ కేసుల్లో నలుగురి అరెస్ట్
పెందుర్తి: సబ్బవరం–షీలానగర్ రోడ్డు పనులకు వినియోగించే ఐరన్, కేబుల్ వైర్లను దొంగిలించిన నలుగురు వ్యక్తులను పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.4.5 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి క్రైం పోలీస్ స్టేషన్లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయా వివరాలను క్రైం ఏసీపీ ఎ.వెంకటరావు వెల్లడించారు. సబ్బవరం–షీలానగర్ రోడ్డు పనుల నిమిత్తం పెందుర్తి మండలం నందవరపువానిపాలెం సమీపంలో ఐవోసీఎల్ సంస్థ ఐరన్, కేబుల్ వైర్లను నిల్వచేసింది. ఈ నెల 8న సైట్ ఇన్చార్జి తోట సునీల్రాజ్ సామగ్రి సరిచూడగా అందులో దాదాపు రూ.3 లక్షల విలువైన ఐరన్, కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. ● గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి అనుసంధానంగా నిర్మిస్తున్న సబ్బవరం–షీలానగర్ రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం జేపీ కన్స్ట్రక్షన్స్ సంస్థ నరవ వద్ద సెంటరింగ్ ప్లేట్లు, యూ జాకీలు, బేస్ జాకీలు భద్రపరిచింది. గత నెల 10న సైట్ సెక్యూరిటీ సూపర్వైజర్ వంకా శివశంకర్ సామగ్రి పరిశీలించగా రూ.1.50 విలువైన సామాగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆయా చోరీల విషయంలో ఫిర్యాదులు అందుకున్న పెందుర్తి క్రైం విభాగం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని కొబ్బరితోట(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కుప్పిలి)కి చెందిన అలపాన రెడ్డి(29), పూర్ణామార్కెట్ కల్లు పాకల(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా లోపెంట)కు చెందిన నాయన అసిరిబాబు(30), పూర్ణామార్కెట్ ప్రసాద్ గార్డెన్స్(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వెంకయ్యపేట)కు చెందిన దల్లి గోవింద్(29), 104 ఏరియాకు చెందిన పరపటి సంతోష్కుమార్(31) ఆయా చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను బుధవారం నగరంలో మాటు వేసి పట్టుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. వారిని నుంచి చోరీ సొత్తును రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ఆయా కేసుల్లో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ క్రైం సీఐ బి.తిరుమలరావు, పెందుర్తి క్రైం ఎస్ఐ డి.సూరిబాబు, ఏఎస్ఐ కె.శ్రీనివాసరావు, హెచ్సీ వి.పేరయ్యనాయుడు, పీసీలు బి.దేముడునాయుడు, ఎల్.తాతారావులను ఉన్నతాధికారులు అభినందించారు. -
‘పిల్లలు చేసిన తప్పేంటి?’: ఎమ్మెల్సీ రవిబాబు
విద్యార్థుల తరలింపు విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు పాఠశాలకు చేరుకుని పిల్లలతో మాట్లాడారు. అనంతరం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ పిల్లలను భయభ్రాంతులకు గురిచేసి తరలించడం అమానుషమన్నారు. ‘ఆ పసిబిడ్డలు చేసిన తప్పేంటి? వారి చదువులు, భవిష్యత్తుతో ఇలా ఆడుకోవడం సరికాదు’ అని మండిపడ్డారు. సీవోఈ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు అద్దె భవనంలో దాన్ని నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న మారికవలస గురుకులాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. -
సీఎం రమేష్ అక్రమ మైనింగ్
ఆ క్వారీకి లీజుల్లేవు.. పర్యావరణ అనుమతులు అంతకంటే లేవు. ప్రభుత్వ రికార్డుల్లో మూతపడినట్లు కనిపిస్తుంది.. కానీ వాస్తవానికి అక్కడ నిత్యం వందలాది లారీలు ఖనిజాన్ని తరలించేస్తున్నాయి. కళ్లెదుటే దోపిడీ జరుగుతున్నా అధికారులు కిమ్మనడంలేదు...ఎందుకంటే దాని వెనకున్నది ఎంపీ సీఎం రమేష్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, ‘వెంగమాంబ’ క్రషర్స్ అధినేత శ్రీనివాస్ చౌదరిలతో కూడిన మైనింగ్ మాఫియా. అనకాపల్లి జిల్లాలో ఎంపీ సీఎం రమేష్ సాగిస్తున్న దోపిడీకి అంతు లేకుండా పోతోంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ రూ.వందల కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఈ అక్రమ మైనింగ్ వివరాలివీ.సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : అనకాపల్లి మండలం సీతానగరం గ్రామ పరిధిలోని సర్వే నంబరు 251, 190, 303లో ‘వెంగమాంబ క్రషర్స్’ పేరుతోనూ అక్రమ మైనింగ్ సాగిస్తున్నారు. వాస్తవానికి సర్వే నం. 251లో జీఎస్ఎన్ శ్రీనివాస్ పేరిట ఉన్న 4 హెక్టార్లు, 1 హెక్టారు లీజుల గడువు వరుసగా మే 2023, ఫిబ్రవరి 2022 నాటికే ముగిసిపోయాయి. అలాగే సర్వే నం.193, 303లలో సుమారు 3 హెక్టార్లలో వీవీఆర్ స్టోన్ క్రషర్స్ (వెంగమాంబ శ్రీనివాస్ చౌదరి) పేరిట ఉన్న లీజులకు సైతం ఎలాంటి అనుమతులు లేవు. గతంలో వచ్చిన అక్రమ మైనింగ్ ఫిర్యాదులతో ఈ క్వారీలు మూతపడ్డాయి. మైనింగ్ శాఖ అధికారిక రికార్డుల ప్రకారం ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదు. కానీ, నిబంధనలకు పాతరేసి ప్రతిరోజూ ఇక్కడ తవ్వకాలు జరిపి ఇష్టారాజ్యంగా ఖనిజాన్ని తరలించేస్తున్నారు. పథకం ప్రకారం చేతులు కలిపి... తన అక్రమ వ్యాపారాలకు రక్షణ కవచం ఏర్పాటు చేసుకునేందుకు వెంగమాంబ శ్రీనివాస్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీలో చేరి, అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన సీఎం రమేతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఎంపీకి అత్యంత సన్నిహితుడిగా మారారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉందన్న ధీమాతో ఆయన మరింతగా రెచ్చిపోతున్నారు. వెంగమాంబకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పీలా గోవింద్ కూడా సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం స్వయంగా పీలా మాట్లాడిన ఆడియో మెసేజ్ కలకలం రేపింది. అనుమతిలేని చోట అడ్డగోలు తవ్వకాలు పాత జరిమానాలకు సంబంధించి ఒక్క పైసా కూడా చెల్లించకపోగా, మైనింగ్ శాఖ డిమాండ్æ నోటీసులు ఇచ్చినా, కోర్టుల్లో కేసులు నడుస్తున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎంపీ సీఎం రమేష్ అండతో.. పర్యావరణ, మైనింగ్ అనుమతులు లేకుండానే రూ.వందల కోట్ల విలువైన ఖనిజాన్ని యథేచ్ఛగా దోచేస్తున్నారు. అనుమతి లేని చోట అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. పట్టపగలే అక్రమ మైనింగ్ నడుస్తూ రోడ్డు మెటల్, బోల్డర్లు రవాణా అవుతున్నా..ఎంపీ జోక్యం ఉండడంతో అటు మైనింగ్ శాఖ అధికారులతో పాటు రవాణా, రెవెన్యూ యంత్రాంగం కూడా అడ్డుకునే సాహసం చేయలేకపోతోంది. కళ్లెదుటే కోట్లాది రూపాయల ప్రభుత్వ సంపద దోపిడీకి గురవుతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తుండడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.విజిలెన్స్ అధికారికి లంచం ఆఫర్!వెంగమాంబ స్టోన్ క్రషర్స్ అక్రమాల చరిత్ర ఈనాటిది కాదు. 2020లో మైన్స్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ క్వారీల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. అనుమతులకు మించి ఏకంగా 5,68,923 క్యూబిక్ మీటర్ల ఖనిజాన్ని అక్రమంగా దోచేశారని నిర్ధారించారు. ఈ అడ్డగోలు తవ్వకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేసి, రూ. 33 కోట్ల మేర భారీ జరిమానా విధించారు. అయితే ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం విజిలెన్స్ మైనింగ్ అధికారికి వెంగమాంబ యజమాని ఏకంగా రూ. 3 కోట్ల మేర లంచం ఇవ్వజూపారంటూ ఆరోపణలు రావడం.. కలకలం రేపింది. వందలాది లారీల్లో ఖనిజం తరలిపోతోందని స్థానికులు మొత్తుకున్నా లెక్కచేయకుండా మైనింగ్ డాన్కి సహకరించారన్న ఆరోపణలతో అప్పట్లో ముగ్గురు అధికారులపై బదిలీ వేటు కూడా పడింది.రూ.15 వేల జీతగాడు.. మైనింగ్ ఓనర్.! పంచదార్లలో మైనింగ్ లీజు తీసుకున్న విజయకుమార్ నాయుడు సీఎం రమేష్కు సమీప బంధువు, వరుసకు అల్లుడు. యర్రగొండ్లకు చెందిన విజయ్కుమార్ గతంలో సీఎం రమేష్ అన్న సురేష్ నాయుడు దగ్గర రూ.15 వేల జీతంతో పీఏగా పనిచేశారు. తర్వాత సీఎం రమేష్ పీఏగా మారారు. అనకాపల్లి రాజకీయ వ్యవహారాల్లో పీఏ విజయ్కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేవలం రూ.15 వేల జీతగాడైన విజయ్కుమార్.. తక్కువ కాలంలోనే మైనింగ్ ఓనర్గా ఎలా అయ్యారనేదే ప్రశ్నార్థకంగా మారింది. తన కంపెనీ మైనింగ్ పేరుతో రిత్విక్ ప్రాజెక్టులకు గ్రావెల్ సరఫరా చేస్తున్నట్లు చూపిస్తూ రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. Godavari Pushkaralu: పది కోట్ల మంది భక్తులు వస్తారు -
స్లాస్ సర్వేలో పారదర్శకత పాటించాలి
కశింకోట : స్లాస్ (ఎస్ఎల్ఎఎస్) సర్వేను కేవలం ఒక పరీక్షగానే కాకుండా విద్యార్థుల వాస్తవ అభ్యసన స్థాయిని తెలుసుకునే ముఖ్య విద్యా సాధనంగా చూడాలని జిల్లా విద్యా శాఖ అధికారి జి.జి.ఈ నాగేశ్వరరావు సూచించారు. కశింకోటలోని డీపీఎన్ జెడ్పీ హైస్కూల్లో జోన్ స్థాయిలో 7 మండలాలకు చెందిన ఎంపిక చేసిన 139 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్కు మంగళవారం స్లాస్ సర్వే (రాష్ట్ర స్థాయి అభ్యాసన సాధన సర్వే)పై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు తమ తరగతి స్థాయికి అనుగుణంగా సాధించాల్సిన అభ్యాసన ఫలితాలను ఎంతవరకు సాధించారో తెలుసుకోవడం, వారి సామర్థ్యం, అభ్యాసన లోపాలను గుర్తించడం సర్వే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. సర్వే ద్వారా లభించే సమాచారాన్ని విశ్లేషించి విద్యార్థులకు అవసరమైన అబ్యాసన మెరుగుదల కార్యక్రమాలను రూపొందించేందుకు, బోధనా పద్దతులను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఉపయోగించుకోవచ్చునన్నారు. ఫీల్డ్ ఇన్విజిలేటర్లు సర్వే సమయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, విద్యార్థులకు ఎలాంటి సమాధానాలను సూచించరాదని, మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఒ వి. సురేష్, డిసీసీబీ కార్యదర్శి నూకరాజు, డైట్ లెక్చరర్ సిహెచ్. శ్రీధర్, ఎ.వి. రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. వేతన బకాయిల కోసం డీఈవోకు వినతి జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు తమకు రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది చెందుతున్నామని, వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఈఒ జిజిఈ నాగేశ్వరరావును కోరారు. కశింకోటలోని డీపీఎన్ జెడ్పీ హైస్కూలుకు వచ్చిన సందర్భంగా మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సమగ్ర శిక్ష ఉద్యోగులు, సీఆర్పీలు కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. జూన్, జులై నెలలకు సంబంధించి వేతనాలు చెల్లించలేదన్నారు. వేతనాలు సకాలంలో జమ అయ్యేలా చూడాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ నాయకులు అచ్యుతకృష్ణ, శంకర్, రమణ, నూకేష్, లక్ష్మణ్, సత్యబాబు, లక్ష్మినారాయణ, రామలక్ష్మి పాల్గొన్నారు. -
డివైడర్ని ఢీకొని యువకుడి దుర్మరణం
ఎస్.రాయవరం : కోనవానిపాలెం జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై బైకు డివైడర్ను ఢీకొన్న ఘటనలో యువకుడు దుర్మణం చెందినట్టు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. వివరాలివి. నక్కపల్లి మండలం సీహెచ్ఎల్ పురం గ్రామానికి చెందిన కోడి వెంకి (21) సోమవారం రాత్రి కొరుప్రోలు నుంచి ఇంటికి వెళుతుండగా ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలు తగిలి ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని భద్రపరిచి, మంగళవారం పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తెలిపారు. -
రీజనల్ గేమ్స్లో మెరిసిన విద్యార్థిని
కోటవురట్ల : గ్రామీణ క్రీడాకారులు అద్భుత ప్రతిభతో అబ్బురపరుస్తూ ఔరా అనిపిస్తున్నారు. మండలంలోని కె.బి.అగ్రహారం గ్రామానికి చెందిన లాలం లెహ్యాశ్రీ అండర్ 14 విభాగంలో బహుముఖ ప్రజ్ఞతో పతకాల పంట పండించింది. విభిన్న క్రీడలను ఎంచుకుని తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్సీఈ) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రీజనల్ గేమ్స్, స్పోర్ట్స్లో 9 పతకాలను సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. రాజమండ్రిలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న లాలం లెహ్యాశ్రీ స్కేటింగ్, అథ్లెటిక్స్లో రాణిస్తోంది. రీజనల్ గేమ్స్లో రోలర్ స్కేటింగ్లో 2 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు, అథ్లెటిక్స్లో 3 రజత పతకాలు, 2 కాంస్య పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. దీంతో అక్టోబర్ 7 నుంచి 9 వరకు ముంబై, ఠాణే, మహారాష్ట్ర జరిగే జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్, అక్టోబర్ 13 నుంచి 15 వరకు హైదరాబాద్లో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా లెహ్యాశ్రీ మాట్లాడుతూ భవిష్యత్లో భారత ఒలింపిక్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి మన దేశానికి స్వర్ణ పతకం అందించమే జీవిత లక్ష్యంగా పేర్కొంది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వం తన విజయాలకు కారణంగా తెలిపింది. జాతీయ స్థాయి పోటీలలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కీర్తిని తీసుకొచ్చేలా స్వర్ణ పతకాలను సాధించాలని కె.బి.అగ్రహారం గ్రామస్తులు, మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. -
ఒకే పేరుతో బ్యాంకులో ఇద్దరికి ఖాతాలు
మునగపాక : ఖాతాదారుని పేరు ఒక్కటే..గాని వ్యక్తులు వేర్వేరు. ఇరువురు ఖాతాదారులు ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలో భాగంగా జరిగిన తప్పును తెలుసుకొని సర్దుకుపోయారు. అయితే సంబంధం లేని వ్యక్తి బ్యాంక్ వద్ద హల్చల్ చేయడం చర్చనీయాంశమైంది. మునగపాక గ్రామంలో శెట్టిబలిజ కాలనీకి చెందిన పోలారపు జ్యోతి 28–03–2015న నాగులాపల్లి యూనియన్ బ్యాంక్లో ఖాతా తెరిచారు. అదే ప్రాంతానికి చెందిన పోలారపు జ్యోతి పేరిట 2016లో అదేబ్యాంక్లో మరో ఖాతా తెరిచారు. అయితే వెనుక అకౌంట్ తెరిచిన జ్యోతికి 28–03–2015న ఖాతా ప్రారంభించినట్టు పుస్తకం అందజేశారు. ఇరువురిలో ఒక జ్యోతి స్థానికంగా పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు. సంబంధిత బ్యాంకుకు ఆమె జీతం క్రమం తప్పకుండా క్రెడిట్ అవుతూ వస్తుంది. రెండవసారి అకౌంట్ ప్రారంభించిన జ్యోతి బ్యాంక్ ఖాతాలో రెండేళ్లుగా తల్లికి వందనం పేరిట ఇద్దరు పిల్లలకు రూ.52వేలతో పాటు మరో 5వేల నగదు వెరసి రూ.57వేల నగదు ఖాతాలో ఉంది. అయితే రెండు రోజుల క్రితం జ్యోతి తన ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసినట్టు మెసేజ్ రావడంతో కంగుతిన్న ఆమె స్థానిక బ్రాంచి అధికారులను ఆశ్రయించింది. దీంతో బ్యాంక్ మేనేజర్ కలుగజేసుకొని విషయాన్ని పరిశీలించి గతంలో బ్యాంక్ అధికారుల చిన్నపాటి తప్పిదం కారణంగా పొరపాటు జరిగిందని వారికి నచ్చచెప్పారు. ఈ సమయంలో మునగపాకకు చెందిన ఒక వ్యక్తి తనకు సంబంధం లేకున్నా బ్యాంక్ వద్ద హల్చల్ చేసి బ్యాంక్ అఽధికారులను ఇబ్బందులకు గురిచేసేలా ప్రవర్తించడంతో అసహనం వ్యక్తమైంది. ఇరువురు ఖాతాదారులు జరిగిన తప్పును గుర్తించి సర్దుకుపోతుంటే సంబంధం లేని వ్యక్తి హల్చల్ చేయడం ఎంతవరకు సమంజసమని బ్యాంక్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న బ్యాంక్ అధికారులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. -
పోలవరం ఎడమ కాలువ పరిశీలించిన మంత్రి అనిత
పోలవరం కాలువను పరిశీలిస్తున్న మంత్రి అనిత, కలెక్టర్ విజయ్ కృష్ణన్ పాయకరావుపేట : పోలవరం ఎడమ కాలువను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం పరిశీలించారు. స్థానిక పి.ఎల్.పురం, సీతారాంపురం గ్రామాల పరిధిలో గల కాలువను జలహారతి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. మంత్రి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్ కాలువను పరిశీలించి, తగు ఏర్పాట్లకు అధికారులను ఆదేశించారు. వచ్చే నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాలువను ప్రారంభోత్సవం చేయనున్నట్టు తెలిసింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పోలవరం కాలువ ఇంజినీరింగ్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. -
చిన్నారులకు ఆటపాటలతో బోధన
నర్సీపట్నం: ఆటపాటల ద్వారా చిన్నారులకు విద్య నేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.జి.ఎస్.నాగేశ్వరరావు అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. పట్టణంలోని జెడ్పీ హైస్కూల్(తురకబడి)లో జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను అంగన్వాడీ కేంద్రాల్లో సక్రమంగా అమలు చేయాలన్నారు. ఇంగ్లిష్పై ప్రత్యేక దృష్టి సారించి, చిన్నారులను ఆ దిశగా తీర్చిదిద్దాలన్నారు. పిల్లలకు సులభంగా అర్థం కావాలంటే ఆటపాటల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సీడీపీవో జి.వి.రమణి, ఏఎంవో కెజియా, ఎంఈవో సిహెచ్.తలుపులు, రిసోర్స్పర్సన్లు కె.ఆర్.పి.ఎం.నాగేశ్వరరావు, బి.ఎస్.ఆర్.గోవింద్, కె.గణేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు కె.రామలక్ష్మి, పి.అప్పలనర్స పాల్గొన్నారు. -
సమ్మె బాటలో కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది
నక్కపల్లి : తమను రెగ్యులర్ చేయాలంటూ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పలువురు కాంట్రాక్టర్ వైద్య సిబ్బంది మంగళవారం ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మెబాట పడతామని నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని దశల వారీగా ఉద్యమబాట పడతామని వారు హెచ్చరించారు. మంగళవారం నక్కపల్లి ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పోలీసులకు వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర సంఘం సూచనల మేరకు తమ న్యాయపరమైన కోర్కెలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను రెగ్యులర్ చేయాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకుండా తమతో వెట్టిచాకిరీ చేయిస్తోందన్నారు. త్వరలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని అవసరమైతే విధులకు రాకుండా నిరసన కొనసాగిస్తామన్నారు. ఉద్యోగులకు 100 శశాతం గ్రాస్ వేతనం ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఈపీఎస్ సదుపాయం కల్పించాలని, హెల్త్కార్డు మంజూరు చేయాలని, రిక్వెస్ట్ బదిలీలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి టౌన్ : కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ జయలక్ష్మి డిమాండ్ చేశారు. స్ధానిక ఎన్టీఆర్ ఆసుపత్రి ఆవరణలో ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ చేసే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని, ఉద్యోగుల రిక్వెస్టెడ్ ట్రాన్స్ఫర్లను మంజూరు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు అందించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కన్వీనర్ రాజాబాబు, కార్యదర్శి జయరత్నం తదితరులు పాల్గొన్నారు. -
రైతులంతా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి
పులపర్తిలో రైతులకు సూచనలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి యలమంచిలి రూరల్ : రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.ఆశాదేవి సూచించారు. యలమంచిలి మండలం పులపర్తిలో మంగళవారం పొలం పిలుస్తోంది.. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె వరి సాగు చేస్తున్న పంట పొలాలను పరిశీలించి రైతులకు సాగులో సూచనలు ఇచ్చారు. ఎల్నినో ప్రభావంతో 50 శాతం వర్షపాతం లోటు ఉండని, నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వరి సాగు చేస్తున్నారన్నారు. మిగిలిన రైతులు ప్రత్యామ్నాయ పంటలైన జనుము, రాగులు, జొన్నలు, గంటెలు సాగు చేపట్టాలని సూచించారు. వరి నాట్లు పూర్తి చేసిన రైతులంతా ఫసల్ బీమా యోజన కింద బీమా చేయించుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. యలమంచిలి వ్యవసాయాధికారి పొలిమేర మోహన్రావు, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు. -
శెట్టిపాలెంలో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్
ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం చేసే స్థలాన్ని పరిశీలిస్తున్న జీఎం దేవరాజు మాకవరపాలెం : మండలంలోని శెట్టిపాలెంలో వచ్చే నెల 4న కాఫీ ప్రాసెసింగ్ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నట్టు జీసీసీ జీఎం దేవరాజు తెలిపారు. శెట్టిపాలెం గ్రామ సమీపంలో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి భూమిని సేకరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ భూమిని ఆయన పరిశీలించి, శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 4న ఈ కాఫీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. రూ.10 కోట్లతో 12 ఎకరాల్లో ఈ యూనిట్ను నిర్మిస్తున్నామన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జీసీసీ అధికారి విశ్వనాథం, శెట్టిపాలెం మాజీ సర్పంచ్ అల్లు రామునాయుడు పాల్గొన్నారు. -
రూ.1.83 కోట్ల లిక్విడ్ గంజాయి పట్టివేత
నర్సీపట్నం : ఆటోలో తరలిస్తున్న రూ.1.83 కోట్ల విలువైన లిక్విడ్ గంజాయిని గొలుగొండ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. గంజాయి తరలిస్తూ పట్టుబడిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. మీడియాతో డీఎస్పీ మాట్లాడుతూ ఒడిశా నుంచి అల్లూరి జిల్లా మీదుగా మైదాన ప్రాంతానికి గంజాయి తరలిస్తున్నట్టు ఈగల్ ఇంటెలిజెన్స్ వారు జిల్లా ఎస్పీ తుహిన్సిన్హాకు వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బంది అప్రమత్తయ్యారని తెలిపారు. రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్ఐలు రామారావు, రుషికేశ్వరరావు, రాజారావు సిబ్బందితో గొలుగొండ మండలం, చిన్నయ్యపాలెం శివారు ప్రాంతంలో నిఘా పెట్టారన్నారు. అటుగా వస్తున్న ఆటో, రెండు బైకులు ఆపి తనిఖీ చేశారు. ఆటోలో 14.7 కేజీల హషీస్ ఆయిల్(లిక్విడ్) గంజాయిని గుర్తించారు. పట్టుబడిన నిందితుల్లో గొలుగొండ మండలం, కొమిర పంచాయతీకి చెందిన రెడ్డి నర్సింహమూర్తిపై 7 కేసులు, 3 దొంగతనం కేసులు ఉన్నాయి. విశాఖపట్నం అగనంపూడికి చెందిన అంకిరెడ్డి నానాజీ(37)పై 8 గంజాయి కేసులు ఉన్నాయి. అల్లూరి జిల్లా, చింతపల్లి మండలం, బలపం గ్రామానికి చెందిన కొర్రా వెంకటరావు(38)పై 3 గంజాయి కేసులు ఉన్నాయి. విశాఖపట్నం, అక్కయ్యపాలేనికి (స్వస్థలం రోలుగుంట మండలం, బి.బి.పట్నం) చెందిన బాకురి లోవ లక్ష్మిపై 3 గంజాయి కేసులు ఉన్నాయి. అలాగే మరో నిందితుడు మల్కన్గిరి జిల్లా, చిత్రకొండ బ్లాక్, రోళ్లగెడ్డ గ్రామానికి చెందిన కొర్రా సాయి(22). వీరందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఆటోడ్రైవర్ పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితుల వద్ద నుంచి ఆటో, రెండు బైక్లు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లిక్విడ్ గంజాయి చైన్నె తరలిస్టున్నట్టు తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. -
జీవీఎంసీకి మళ్లీ విలీన గండం!
● ఎన్నికలు ఎగ్గొట్టేందుకే కూటమి సర్కారు కొత్త నాటకం? ● 79 గ్రామ పంచాయతీల విలీనం పేరిట గ్రామసభల హడావుడి ● గతంలో ఎన్నికలు ఆపేసినట్లే.. మళ్లీ పాత ఫార్ములా అమలు? అప్పుడూ బాబే.. ఇప్పుడూ బాబే..డాబాగార్డెన్స్: మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలను దీర్ఘకాలం పాటు వాయిదా వేసేందుకు కూటమి ప్రభుత్వం ’విలీన ప్రక్రియ’ పేరుతో రాజకీయ కుట్రకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. 2014–19లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాగే విలీన ప్రక్రియను తెరపైకి తెచ్చి, ఆపై న్యాయపరమైన వివాదాలు సృష్టించి ఏకంగా 2021 వరకు జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకున్నారని విపక్షాలు గుర్తుచేస్తున్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నడుస్తుండగానే, అదే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉంటూ అశాసీ్త్రయ పద్ధతిలో 79 గ్రామ పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసేందుకు ప్రయత్నించడం చూస్తుంటే, ఎన్నికలు జరపకూడదనే కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రికి రాత్రే గ్రామసభల డ్రామా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ప్రజాస్వామ్య నియమ నిబంధనలను పూర్తిస్థాయిలో తుంగలో తొక్కి కూటమి ప్రభుత్వం రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకుంటోంది. నాలుగు గ్రామీణ మండలాల్లోని 79 గ్రామ పంచాయతీల విలీనం కోసం హడావుడిగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. కార్పొరేట్ శక్తుల ఆర్థిక ప్రయోజనాలు కాపాడేందుకు, కూటమి పార్టీల స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకే ఈ రకమైన దారుణమైన చర్యకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిధులు, విధులు, అధికారాల వికేంద్రీకరణ ద్వారా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న 73, 74 రాజ్యాంగ సవరణల ఆశయాలకు ఈ చర్య కోలుకోలేని దెబ్బ. ఆలోచించే సమయం ఎక్కడ? జీవీఎంసీలో విలీనం కావాలో వద్దో తేల్చుకునే కనీస స్వేచ్ఛను కూడా ప్రజలకు ఇవ్వడం లేదు. లాభనష్టాలపై చర్చించేందుకు తగిన సమయం ఇవ్వకుండా, ఆఘమేఘాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం వెనుక ఆంతర్యమేమిటో అందరికీ అర్థమవుతూనే ఉంది. ముందస్తుగా గడువు ఇచ్చి, ప్రజాభిప్రాయ సేకరణ తేదీలను వెల్లడించాలి. విలీనం వల్ల కలిగే పరిణామాలు, లాభాలు, నష్టాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్థానిక నాయకుల అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ, కూటమి ప్రజాప్రతినిధులు తమ అనుయాయులతో ముందస్తుగా విలీన లేఖలు రాయించి, గ్రామసభలలో తూతూమంత్రంగా ఆమోదం పొందేందుకు డ్రామా ఆడుతున్నారని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత విలీన ప్రాంతాల పరిస్థితి ఏంటి? గతంలో జీవీఎంసీలో విలీనం చేసిన గాజువాక, భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలతో పాటు 32 గ్రామ పంచాయతీల పరిస్థితి ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉంది. విలీనమైన ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోగా, ప్రజలపై విపరీతమైన పన్నుల భారం పడింది. తాగేందుకు కనీస తాగునీరు అందించలేని దుస్థితి నెలకొంది. పారిశుధ్య కార్మికులను కూడా పూర్తి స్థాయిలో నియమించలేకపోయారు. ’పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం’ పేరుతో ప్రజల ఉమ్మడి ఆస్తులను, మౌలిక సదుపాయాలను ప్రైవేట్ శక్తులకు కట్టబెడుతున్నారు. గ్రామీణ స్వరూపానికి ముప్పు కూటమి ప్రభుత్వం జీవీఎంసీలో విలీనం చేయాలని చూస్తున్న పద్మనాభం, భీమిలి, ఆనందపురం, పెందుర్తి మండలాల్లోని 79 గ్రామ పంచాయతీలు నగరానికి అత్యంత సుదూరంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు. ఈ విలీనం వల్ల గ్రామీణ ప్రజలు తీవ్రంగా నష్టపోనున్నారు. విలీనం పూర్తయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పూర్తిగా రద్దవుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజలపై పట్టణ స్థాయి ఆస్తి, చెత్త, నీటి పన్నుల భారం మోపబడుతుంది. స్థానిక పాలన ప్రజలకు దూరమై, వికాసానికి బదులు వినాశనం దాపురిస్తుంది. పన్నులు నగర స్థాయిలో.. సేవలు? గ్రామ పంచాయతీ నుంచి జీవీఎంసీలోకి వస్తే ఆస్తి పన్ను, నీటి చార్జీలు, ఇతర పౌరసేవల రుసుములు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన ఉంది. పన్నులు పెరిగితే అందుకు తగ్గట్టుగా రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి సేవలు అందుతాయా? అన్నది ప్రశ్న. ఇప్పటికే విలీనమైన ప్రాంతాల్లో మౌలిక వసతుల పరిస్థితిపై సమీక్ష చేయకుండా కొత్తగా మరో 79 గ్రామ పంచయాతీలను కలపడం వల్ల జీవీఎంసీపై మరింత భారం పడుతుందన్న విమర్శలూ ఉన్నాయి. -
సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్
మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సన్యాసినాయుడువిశాఖ–లీగల్: సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు కోరారు. జిల్లా కోర్టులోని డీఎల్ఎస్ఏ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై మంగళవా రం నిర్వహించిన చట్టపరమైన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ లోక్ అదాలత్లో వీలైనంత ఎక్కువ సంఖ్యలో పెండింగ్, రాజీపడ్డ దగ్గ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు, ఇన్సూరెన్స్(బీమా)కంపెనీల ప్రతినిధు లు, స్టాండింగ్ కౌన్సిల్స్(న్యాయవాదులు) పాల్గొన్నారు. -
పాముకాటు.. నాటు వైద్యంతో చేటు
బుచ్చెయ్యపేట : మండలంలో గల చిన అప్పనపాలెం గ్రామంలో పాము కాటుకు గురైన యువకుడు నాటు వైద్యాన్ని ఆశ్రయించి బలైపోయాడు. గ్రామానికి చెందిన పైల దేవి ప్రసాద్ (19) సోమవారం సాయంత్రం తన పశువులను మేతకు పొలంలోకి తోలుకెళ్లాడు. పొలంలో పశువులను మేపుతుండగా కాలికి చుట్టుకుని పాము కాటు వేసింది. వెంటనే దేవి ప్రసాద్ పామును చేతితో పట్టుకుని దూరంగా విసిరేసి, పాము కాటు వేసిందని కేకలు వేయడంతో దగ్గరలోనే పశువులను మేపుతున్న వారు వచ్చి పామును చంపేశారు. కాటు వేసిన పామును రక్త పొడ విష సర్పంగా గుర్తించారు. వెంటనే దేవి ప్రసాద్ను ఆసుపత్రికి వైద్య సేవలకు తరలిస్తుండగా ఇదే గ్రామానికి చెందిన నాటు వైద్యుడు తాను మందు వేస్తానని వారిని నమ్మ బలికాడు. అతడి మాటలు నమ్మిన కుటుంబ సభ్యులు దేవి ప్రసాద్కు పసర మందులు వేయించారు. రాత్రి గడిచేకొద్ది పాము విషం దేవి ప్రసాద్ శరీరం అంతా వ్యాపించి పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు తెల్లవారుజాము ఐదున్నర గంటల ప్రాంతంలో ఆటోలో బుచ్చెయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి దేవి ప్రసాద్ను తీసుకెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించాలని సూచించగా, అక్కడికి తీసుకెళ్లడంతోనే దేవీప్రసాద్ మృతిచెందాడు. దీంతో సకాలంలో దేవి ప్రసాద్ను ఆసుపత్రికి తరలించి ఉంటే బతికేవాడని కుటుంబ సభ్యులు భోరున విలపించారు. దేవీప్రసాద్ తండ్రి అప్పలనాయుడు ఏడాది కిందట అనారోగ్యంతో మృతి చెందగా తల్లి సన్యాసమ్మ కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులు, కుమార్తెను పోషించుకుంటుంది. చిన్న వాడైన దేవి ప్రసాద్ ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేశాడు. తల్లికి పొలం పనుల్లో చేదోడుగా ఉంటున్నాడు. పశువులను మేపుతూ పాడి ద్వారా జీవనోపాధి పొందుతున్నాడు. సోమవారం ఉదయం తనకు స్కాలర్షిప్ పడిందో లేదోనని తెలుసుకోవడానికి తల్లి సన్యాసమ్మను తీసుకుని వడ్డాది బ్యాంక్కు వెళ్లి వచ్చాడు. అమ్మను ఇంటి వద్ద దించేశాడు. సాయంత్రం అమ్మా నేను పశువులను మేతకు తీసుకెళ్తానని చెప్పి పొలంలోకి వెళ్లిపోయాడు. పశువులను తోలుకెళ్లిన కొడుకు పాము కాటుకు గురై మృతి చెందడంతో ఆమె భోరున విలపిస్తుంది. భర్త అనారోగ్యంతో మృతి చెందాడు.. ఇప్పుడు అందివచ్చిన చెట్టంత కొడుకు పాము కాటుతో మృతి చెందాడు.. నేను ఏం పాపం చేశాం దేవుడా ! అంటూ దేవి ప్రసాద్ తల్లితో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. దేవీ ప్రసాద్ మృతదేహానికి అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. సాయంత్రం చిన అప్పనపాలెంలో అంత్యక్రియలు నిర్వహించారు. పాము కరిస్తే సరైన వైద్య సేవలు అందించకుండా నాటు వైద్యం చేయించడమే ఆ యువకుడిని బలితీసుకుందని మృతుడి బంధువులు, స్నేహితులు వాపోయారు. ఇటీవల చిన మదీనకు చెందిన 35 ఏళ్ల యువకుడికి పాము కాటు వేయగా నాటు వైద్యం చేయించగా అతను మృతి చెందాడు. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ ఇలాంటివి జరుగుతున్నా అక్కడున్న అధికారులు, స్వచ్ఛంద సంస్ధలు, యువత, నాయకులు, అభ్యుదయ వాదులు ఇలాంటి వాటిని రూపుమాపడానికి సరైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
గ్రావెల్ తవ్వకాలపై విచారణకు సిద్ధమా?
నక్కపల్లి : మండలంలో పోలవరం కాలువ మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలపై బహిరంగ విచారణకు సిద్ధంగా ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ కూటమి నాయకులకు సవాల్ విసిరారు. మంగళవారం నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ పోలవరం కాలువ మట్టిని కూటమి పార్టీలకు చెందిన నాయకులే తవ్వి తరలించుకుపోతున్నారన్నారు. ఇది బహిరంగ వ్యవహారమే అయినప్పటికీ తమ ప్రమేయం లేదంటూ కొంతమంది నాయకులు భుజాలు తడుముకోవడం సిగ్గుచేటన్నారు. రమణయ్యపేట, ముకుందరాజుపేట, తాండవ చక్కెర కర్మాగారం పరిసర ప్రాంతాల నుంచి నిత్యం లక్షలాది క్యూబిక్మీటర్ల పోలవరం కాలువ మట్టిని అక్రమంగా తవ్వేసి అనధికార లేఅవుట్లకు అమ్మేసుకుంటున్నారన్నారు. గుల్లిపాడు రైల్వేప్లాట్ఫారం ఎత్తు చేయడానికి ముకుందరాజుపేట నుంచి పోలవరం కాలువ మట్టి తరలించారన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు చెరువుల్లో మట్టిని గంపగుత్తగా అమ్మేస్తున్నారన్నారు. పోలవరం మట్టి తవ్వకాలపై టీడీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. వాటర్ట్యాంకు కూలిపోవడం సిగ్గుచేటు బోదిగల్లం పునరావాసకాలనీలో నిర్మాణంలో ఉన్న వాటర్ట్యాంకు కూలిపోవడం సిగ్గుచేటని, కాంట్రాక్టర్ ఎవరో కూడా తెలియని దుస్థితిలో టీడీపీ నాయకులు ఉండడం దారుణమన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్లే ట్యాంకు నిర్మాణ దశలో కూలిపోయి ఇద్దరు గాయాలపాలయ్యారన్నారు. సుమారు 20 మంది ప్రాణాలతో బయటపడ్డారన్నారు. వాటర్ట్యాంకు కూలిపోయిన ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గొర్ల గోవిందు, తళ్ల భార్గవ్, అల్లాడ కొండ పాల్గొన్నారు. -
కళాకారులను ప్రోత్సహించాలి
తుమ్మపాల : సాంస్కృతిక రంగానికి, కళాకారులకు సరైన ప్రోత్సాహం లేనందువల్ల కళా రంగం దుర్భరమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుందని, కళాకారుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి సంక్షేమ పథకాలు అందించాలని ప్రజానాట్యమండలి కళా సంస్థ జిల్లా సమితి ఆధ్వర్యంలో కళాకారులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో జానపద గ్రామీణ పౌరాణిక పద్మ నాటక రంగాలు కళారూపాలు ఉన్నాయని, వాటికి ప్రభుత్వం నుంచి సరైన ఆదరణ, ప్రోత్సాహం కరువైందని జిల్లా నాయకులు ఎన్.అప్పారావు, వై.ఎన్. భద్రం అన్నారు. ఆయా కళా రంగాలలో నెపుణ్యం కలిగిన కళాకారులకు గుర్తింపు లేకుండా పోయిందని, గతంలో కళాకారులకు ప్రత్యేకమైన పెన్షన్ విధానం ఉండేదని, కళాకారులకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదన్నారు. సమాజాన్ని చైతన్యవంతుల్ని చేస్తూ వినోదాన్ని విజ్ఞానాన్ని పంచే కళాకారుల పరిస్థితి దుర్భరంగా తయారైందన్నారు. కళారంగాన్ని కళారూపాలను, కళాకారులను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సాంస్కృతిక శాఖకు ప్రతి ఏటా ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయింపుతో పాటు అర్హత కలిగి, 50 సంవత్సరాలు నిండిన ప్రతి పేద కళాకారునికి పదివేల రూపాయలు పెన్షన్, ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, నెలలో కనీసం 15 రోజుల పాటు కళాకారులకు వేతనంతో కూడిన కళా ప్రదర్శనలకు అవకాశాలు కల్పించాలన్నారు. నంది నాటకోత్సవాల్లో గ్రామీణ జానపద కళారూపాల విభాగాలను పోటీల్లో చేర్చాలని, ప్రతి ఏటా తప్పనిసరిగా నంది నాటకోత్సవాలు నిర్వహించి ప్రోత్సహించాలన్నారు. ప్రతి పేద కళాకారుడికి మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించాలన్నారు. ప్రభుత్వం ఏటా అందించే కళారత్న, ఉగాది పురస్కారాల ఎంపికలో పారదర్శకత నిజాయితీ ప్రదర్శించాలని అన్నారు. కళాకారులకు బస్సు, రైలులో ఉచితంగా ప్రయాణించడానికి సౌకర్యం కల్పించాలని కోరారు. -
జేపీ అగ్రహారం సభలో ఉద్రిక్తత
రోలుగుంట: జేపీ అగ్రహారం గ్రామానికి చెందిన భూముల రీ సర్వే నిర్వహణ కోసం గతంలో వాయిదా పడిన గ్రామ సభను సోమవారం మరలా స్థానిక రైతులతో ఆర్డీవో స్థానిక రామమందిరంలో నిర్వహించారు. ప్రభుత్వం రైతుల సౌలభ్యం కోసం భూ రీసర్వే కార్యక్రమం చేపట్టిందని, వైషమ్యాలకు పోకుండా సర్వేకు సహకరించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామానికి చెందిన ఈనాం భూముల రీసర్వే వివరాలను రైతులకు చదివి వినిపించారు. 1969లో ఈ భూములపై రీసర్వే జరిగి, మరలా ఇప్పుడే ఈ సర్వే జరుగుతుందన్నారు. ఈ భూముల అమ్మకాలు, కొనుగోలుదారుల పరిస్థితి, స్థానిక నాయకుల ప్రమేయంతోనే సాగుదారులకు పాస్బుక్లు మంజూరు, పంపిణీ విషయాలపై ఆర్డీవో వివరిస్తుండగా సభలో పాల్గొన్న సాగుదారులు ఎవరికి పాస్బుక్లు ఇచ్చారో తమకు తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద కూడా తాతల నాటి భూసాగుకు సంబంధించిన రికార్డులున్నాయని వాటిని కూడా పరిశీలించి సాగులో ఉన్న తమ అర్హతలను పరిగణనలోకి తీసుకొని పాస్బుక్లు మంజూరు చేయాలని రైతుల తరపున బుచ్చిరాజు, శంకర్రావు, ఆర్.టి.నాయుడు తదితరులు ఆర్డీవోకు విన్నవించారు. అయితే సరైన సమాధానం లేకపోవడంతో రైతులందరూ ఒక్కసారిగా లేచి అధికారులను నిలదీయడంతో సభలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు కలుగజేసుకొని రైతులను సముదాయించాలని చూసినా, వారు ఆగ్రహంతో గ్రామసభను బహిష్కరించి వెళ్లిపోయారు. దీంతో సభ చాలించి ఆర్డీవో వి.వి.రమణ తహసీల్దార్ నాగమ్మ అక్కడ నుంచి వెనుదిరిగారు. రైతులను తమ వద్ద ఉన్న రికార్డులతో మంగళవారం తన కార్యాలయానికి రావాలని ఆర్డీవో సూచించారని బుచ్చిరాజు, శంకర్రావు విలేకరులకు తెలిపారు. సాగులో ఉన్న తమ భూములను ఖాళీ చేసేది లేదని, చావోరేవో తేల్చుకుంటామని విలేకరుల వద్ద స్పష్టం చేశారు. -
శ్లాబ్కూలిన ఘటనపై విచారణ
నక్కపల్లి: స్టీల్ప్లాంట్ పునరావాస కాలనీలో నిర్మాణంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం శ్లాబ్కూలిన ఘటనపై అడ్డురోడ్డు ఆర్డీవో రామలక్ష్మి సోమవారం పరిశీలించారు. బోదిగల్లం వద్ద నిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న పునరావాస కాలనీలో ఆదివారం రక్షిత మంచినీటి పథకం శ్లాబ్ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. దీనిపై ఆర్డీవో ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. కాంట్రాక్టర్ నిర ్లక్ష్యం, పనులు జరిగిన సమయంలో అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా ఆనేదానిపై విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని ఆర్డీవో తెలిపారు. విచారణకు హోంమంత్రి ఆదేశం శ్లాబ్ కూలిన ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత విచారణకు ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలపై విచారణ జరిపించాలని మంత్రి ఆదేశించినట్టు టీడీపీ ఇన్చార్జి వెంకటేష్ తెలిపారు. నాణ్యత లోపించినా, భద్రతాలోపం ఉన్నా అధికారుల పర్యవేక్షణ లేకపోయినా ఉపేక్షించేది లేదని మంత్రి పేర్కొన్నారన్నారు. తక్షణం సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారన్నారు. కాంట్రాక్టర్పై కేసు నమోదు బోదిగల్లం వద్ద స్టీల్ప్లాంట్ నిర్వాసిత పునరావాసకాలనీలో రక్షిత మంచినీటి పథకం స్లాబ్కూలి ఇద్దరు కూలీలు గాయపడిన ఘటనకు సంబంధించి పనులు చేపట్టిన కాంట్రాక్టర్పై కేసు నమోదు చేసినట్లు సీఐ జె.మురళి తెలిపారు. ఈ ఘటనలో షేక్ అభి, ఆదిశంకర్ సత్యనారాయణ గాయపడిన విషయం తెలిసిందే. పనులు జరిగే చోట సరైన భద్రతా ప్రమాణాలు పాటించనందుకు కాంట్రాక్టర్పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. -
బ్రిక్స్ సదస్సులో కోటవురట్ల యువకుడు
కోటవురట్ల: విశాఖలో ఈ నెల 22, 23 తేదీలలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కోటవురట్ల మండలం సుంకపూరుకు చెందిన పోలిరెడ్డి శ్యామ్కుమార్ పాల్గొన్నారు. బ్రిక్స్ సదస్సులో 11 సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు, క్రీడా మంత్రులు పాల్గొనగా వారితో కలిసి ప్రసంగించే అవకాశం దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని శ్యామ్కుమార్ తెలిపారు. ఈ సదస్సు ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునే అరుదైన అవకాశం దక్కిందన్నారు. యువజన వ్యవహారాలు, క్రీడలు, అంతర్జాతీయ సహకారం, సంప్రదాయ దేశీయ క్రీడలు, క్రీడా సాంకేతికత, తయారీ రంగాలు, యువతకు లభిస్తున్న ప్రోత్సాహం తదితర అంశాలపై అవగాహన కలిగిందన్నారు. -
వినతులు...
అటుఇటుతుమ్మపాల: పీజీఆర్ఎస్ అర్జీలపై అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2 లలో నిర్వహించిన పీజీఅర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయిలలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖ అధికారి వారి శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కార పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షణ చేసి, గడువులోపల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో దళిత కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించి, కుల వివక్షకు అడ్డుకట్ట వేయాలని, కుల వివక్ష వ్యతిరేక పోరాటం సంఘం, ఏపి వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన దళితులు, సంఘాల నాయకులు కలెక్టరేట్ గేటు వరకు పాడె మోసి నిరసన తెలిపారు. కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా 71 గ్రామాలో్ల్ ప్రత్యక్షంగా సర్వేలు చేశామని, కనీస మౌలిక వసతులు కూడా సక్రమంగా అందడం లేదన్నారు. మంచినీటి సౌకర్యం లేకపోవడం, కుళాయి కనెక్షన్లు ఉన్నప్పటికీ నీరు రాకపోవడం, రోడ్లు అధ్వానంగా ఉండడం, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దళిత కాలనీల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉందన్నారు. జిల్లాలో అనేక గ్రామాల్లో దళితులకు శ్మశాన వాటికలకు స్థలాలు లేకపోవడం, ఉన్న స్మశాన స్థలాలు కబ్జాలకు గురికావడం, సామాజిక భవనాలు లేకపోవడం వంటి సమస్యలు కొనసాగున్నాయన్నారు. దళితులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకపోవడంతో వారి భూ హక్కులు ప్రశ్నార్థకంగా మారాయని, ముఖ్యంగా ఎస్.రాయవరం మండలం సైతారుపేటలో దళితులకు క్షవరం చేయడానికి నిరాకరించడం వంటి కుల వివక్ష ఘటనలు ఇప్పటికీ చోటు చేసుకోవడం ఆందోళనకరమని, దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పాయకరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రభుత్వ స్థలంలో సుమారు 40 ఏళ్లుగా ఇళ్లు, గుడిసెలు, పాకలు వేసుకుని నివసిస్తున్న పేద కుటుంబాలను ఎటువంటి ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా పొక్లెయిన్లతో తొలగించేందుకు అధి కారులు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. దళితుల సమస్యలపై పాడె మోసి నిరసన చేస్తున్న దళితులుకలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం అర్జీలు స్వీకరించిన కలెక్టర్, జేసీ, డీఆర్వో పలు సమస్యలపై కలెక్టరేట్ ఎదుట నిరసనలు దళిత కాలనీలపై ఇంత నిర్లక్ష్యమా... -
కందుల టికెట్లకు చెల్లుచీటి!
డాబాగార్డెన్స్: పవిత్రమైన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సనాతన ధర్మ సూత్రాలను, దేవదాయ శాఖ నిబంధనలను తుంగలో తొక్కుతూ ట్రస్ట్బోర్డు చైర్మన్ కందుల నాగరాజు సాగిస్తున్న దందాకు బ్రేక్ పడింది. ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు పాలకమండలి సభ్యులకు, అధికారులకు, అర్చకులకు తీవ్ర మనస్తాపం కలిగిస్తున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ ఆయన సాగిస్తున్న వ్యవహారశైలిపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనుమతుల్లేకుండానే టికెట్ల ముద్రణ: మార్గశిర మాసోత్సవాల సందర్భంగా డిసెంబరు 27న నిర్వహించతలపెట్టిన ‘మార్గశిర సహస్ర కలశాభిషేకం’ పేరిట చైర్మన్ సొంత నిర్ణయాలు తీసుకోవడం వివాదాస్పదమైంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి ముందస్తు ఆమోదం పొందకుండానే ఆయన సొంతంగా రూ.200 విలువైన టికెట్లను, కరపత్రాలను ముద్రించి విక్రయాలకు తెరలేపడం దుమారం రేపింది. ఈ వ్యవహారంపై ‘కందుల దందా’ పేరిట ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి దేవదాయ శాఖ డి ప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) సుజాత స్పందించారు. ఆ టికెట్లు చెల్లవు: ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు జరగనున్న మార్గశిర ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రలో భక్తులు పాల్గొనేందుకు రూ.200 టికెట్ నిర్ణయించాలని పాలకమండలి సమావేశంలో చైర్మన్ కోరారని ఈవో తెలిపారు. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా చైర్మన్ సొంతంగా ప్రచురించిన కరపత్రాలు, మాన్యువల్ టికెట్లు ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని, అటువంటి టికెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లవని ఆమె తేల్చిచెప్పారు. దేవస్థానం తరఫున అధికారికంగా టికెట్ల ధర ఖరారు చేస్తూ ఎలాంటి కరపత్రాలనూ ముద్రించలేదని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని దేవదాయ శాఖ కమిషనర్తో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. -
అత్యవసర సేవలూ బంద్
మహారాణిపేట: కేజీహెచ్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. స్టైఫండ్ పెంచాలంటూ 15 రోజులుగా ఆందోళన బాట పట్టిన జూనియర్ వైద్యులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సోమవారం నుంచి సమ్మె తీవ్రతరం చేశారు. ఓపీ, వార్డు సేవలకే పరిమితం కాకుండా చివరికి ‘అత్యవసర సేవల’ను కూడా బహిష్కరించి రోడ్డుపైకి రావడంతో కేజీహెచ్లో వైద్య వ్యవస్థ పూర్తిగా ఇబ్బందుల్లో పడింది. వైద్యుల స్థానంలో నర్సులు.. జూనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రిలోని అత్యవసర విభాగాలు దిక్కులేనివిగా మారాయి. దిక్కుతోచని స్థితిలో ప్రాణాపాయంలో ఉన్న రోగులను కాపాడుకునేందుకు నర్సులే డాక్టర్ల అవతారమెత్తాల్సి వచ్చింది. అత్యవసర విభాగంలో నర్సే స్వయంగా స్టెతస్కోప్ పట్టుకుని రోగులను పరీక్షించాల్సిన దారుణ పరిస్థితి దాపురించింది. నిపుణులైన వైద్యులు లేక, ప్రాథమిక వైద్యం కూడా అందక ఓపీ విభాగాల్లో తీవ్రమైన వ్యాధులతో వచ్చిన రోగులు గంటల తరబడి పడిగాపులు కాస్తూ విలవిలలాడారు. రోడ్డుపై బైఠాయింపు.. ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా సోమవారం జూనియర్ డాక్టర్లు కేజీహెచ్ ఆవరణను హోరెత్తించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ప్రదర్శన ఆంధ్రా మెడికల్ కాలేజ్, క్యాజువాలిటీ మీదుగా తిరిగి సూపరింటెండెంట్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం రాజేంద్రప్రసాద్ వార్డు నుంచి భావనగర్ వార్డు వరకు ప్రధాన రహదారిపై వైద్యులు బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం వైద్యులు అక్కడ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆందోళనలో ఏపీ జూనియర్ డాక్టర్లు అసోసియేషన్ ఆంధ్ర మెడికల్ కాలేజీ అధ్యక్షుడు దినకర్ సాయి శ్రీనివాస్, ఆంధ్రా మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె.రవీందర్, ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ (ఏపీజేయూడీఏ) విశాఖ యూనియన్ నాయకుడు డాక్టర్ శిరాజ్ తదితరులు పాల్గొన్నారు. చికిత్స కోసం కేజీహెచ్కు.. ప్రైవేటు ఆస్పత్రికి తరలింపు ద్విచక్రవాహనం నుంచి జారిపడి కాలికి తీవ్ర గాయమైన పంజాబ్ హోటల్ ప్రాంతానికి చెందిన ఆర్.రామారావు(74)ను కుటుంబ సభ్యులు కేజీహెచ్కు తీసుకువచ్చారు. జూనియర్ వైద్యుల సమ్మెతో చికిత్స అందకపోవడంతో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్యులు తెలిపారని రామారావు పేర్కొన్నారు. -
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి సెల్ఫ్ సపోర్టింగ్ విధానంలో ఎంబీఏ, ఎంసీఏ పూర్తికాల కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఎ.నాయుడు తెలిపారు. డీసీఎంఎస్లో ఎంబీఏ మార్కెటింగ్ మేనేజ్మెంట్కు 40, ఫైనాన్స్ మేనేజ్మెంట్కు 40, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కు 40 సీట్లు, ఏయూఎస్ఐబీలో 120 సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంబీఏ కోర్సులకు వార్షిక ఫీజును రూ.1.50 లక్షలుగా నిర్ణయించారు. ఎంసీఏ కోర్సులో 90 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ కోర్సుకు వార్షిక ఫీజు రూ.1.25 లక్షలుగా నిర్ణయించారు. ఏపీ ఐసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మిగిలిన సీట్లను అర్హత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబర్ 15 సాయంత్రం 5 గంటల్లోగా డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయానికి పోస్టు ద్వారా లేదా స్వయంగా అందజేయాలి. సెప్టెంబర్ 17న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
ఎస్పీ కార్యాలయంలో 56 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 56 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలు పరిష్కారానికి వారం రోజుల్లో చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు, ఆస్తి సంబంధిత సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, వేధింపులు, మోసపూరిత వ్యవహారాలు, ఆర్థిక నేరాలు, ఇతర ప్రభుత్వ విభాగాలకు చెందిన అర్జీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సాధిక్ఖాన్పై పోలీసులకు బీజేపీ నేతల ఫిర్యాదు
రావికమతం: రాజమండ్రి దగ్గర గోదావరిలో దూకి ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన సాధిక్ ఖాన్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని సోమవారం రావికమతం పోలీసులకు మండల భారతీయ జనతా పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఏఈ నూకరాజు కుటుంబంతో సంబంధాలు ఏర్పరచుకొని స్నేహంగా ఉంటూ సభ్యుల వ్యక్తిగత ఫొటోలు,వీడియోలు తీసి , వారిని మత మార్పిడిపై ఒత్తిడి తెచ్చి, బెదిరింపు చర్యలకు పాల్పడి వారిని మానసిక క్షోభకు గురి చేసి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన సాధిక్ఖాన్ను అరెస్టు చేయాలని ఫిర్యాదులో కోరారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి అదేశాల మేరకు సాధిక్ఖాన్పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గల్లా రాజేశ్వరరావు, మండల బీజేపీ అధ్యక్షుడు గుటాల చిన్న, ప్రధాన కార్యదర్శి దంట్ల సత్యనారాయణ తెలిపారు. -
తండ్రి మృతిపై కుమారుడి ఫిర్యాదు
కె.కోటపాడు: తామర వ్యాధి చికిత్సకు ఎ.కోడూరు గ్రామానికి వచ్చిన వ్యక్తి వైద్యం పొందుతూ మృతిచెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎ.కోడూరు ఎస్ఐ సంతోష్కుమార్ తెలిపిన వివరాలివి. మండలంలో ఆనందపురం గ్రామానికి చెందిన దుంగల ఈశ్వరరావు(55) తామర వ్యాధికి చికిత్స పొందేందుకు ఎ.కోడూరులో గల ఆర్ఎంపీ వైద్యుడు త్రినాథ్ వద్దకు సోమవారం వచ్చాడు. ఆర్ఎంపీ వైద్యుడు త్రినాథ్ ఈశ్వరరావును పరిశీలించి ఇంజక్షన్ చేశాడని, అయితే కొద్ది సేపటికి ఈశ్వరరావు మృతిచెందాడని తెలిపారు. వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ వల్లే తన తండ్రి ఈశ్వరరావు మృతిచెందినట్టు కుమారుడు అక్కునాయుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించామన్నారు. -
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ సక్రమంగా అమలు చేయాలి
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పథకం ప్రకారం దళితులు, గిరిజన జనాభా ప్రతిపాధికన నిధులు కేటాయించి అభివృద్ధి పథకాలు అమలు చేయాలంటూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద దళిత నాయకులు నిరసన చేశారు. ఎస్సీలకు 16.4, ఎస్టీలకు 5.3 శాతం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని, ప్రతి నెలా నోడల్ ఏజెన్సీ సమావేశం ద్వారా పథకాన్ని సక్రమంగా ఆమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పథకం నిధులను ఇతర పథకాలకు కేటాయించకుండా శ్వేత పత్రం విడుదల చేయాలంటూ పలు డిమాండ్లపై వినతిపత్రాన్ని పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్కు అందించారు. -
బైక్ ప్రమాదంలో బీహార్ యువకుడి మృతి
కోటవురట్ల: అతివేగం ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. మండలంలోని యండపల్లిలో అన్నవరం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బీహార్కు చెందిన మహ్మద్ సెహవాజ్, మహ్మద్ అనాష్, మహ్మద్ సాజిద్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం చింతపల్లి వచ్చారు. సోమవారం ఉదయం రేవు పోలవరం బీచ్కు ముగ్గురూ బైక్పై వెళుతుండగా అన్నవరం జంక్షన్ వద్ద మలుపులో రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ బెంచీని వేగంగా ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో బైక్ నడుపుతున్న మహ్మద్ సెహవాజ్(22) తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న మహ్మద్ అనాష్, మహ్మద్ సాజిద్లకు గాయాలు కావడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విశ్రాంత డీఎఫ్వో మృతికి సంతాపం
నర్సీపట్నం: జిల్లా సోషల్ ఫారెస్ట్ అధికారిగా పని చేస్తూ ఇటీవల పదవీ విరమణ పొందిన లక్ష్మణ్ సోమవారం గుండెపోటుతో విశాఖలో తన స్వగ్రామంలో మృతి చెందారు. నర్సీపట్నం ఏరియాలో వివిధ హోదాల్లో ఆయన పని చేసి అందరికీ సుపరిచితులయ్యారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. స్వస్థలం విజయనగరం జిల్లా అయినప్పటికీ, కుమార్తె చదువు నిమిత్తం విశాఖలో ఉంటున్నారు. నర్సీపట్నం డీఎఫ్వోగా, రేంజర్గా సేవలు అందించారు. చింతపల్లి డీఎఫ్వో, సబ్ డీఎఫ్వోగా పని చేశారు. నూతన జిల్లాలు ఏర్పాటు అయిన తరువాత జిల్లా సోషల్ ఫారెస్ట్ అధికారిగా సేవలు అందించి గత ఏడాది జూన్లో పదవీ విరమణ పొందారు. నర్సీపట్నం, చింతపల్లి డివిజన్ల్లో పని చేసిన సిబ్బంది ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. -
ఎన్టీఆర్ ఆస్పత్రిలో నల్లబ్యాడ్జీలతో నిరసన
అనకాపల్లి: ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్ల తరబడి అంకితభావంతో రోగులకు సేవలు అందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులర్ చేయాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ సిబ్బంది పట్టణశాఖ అధ్యక్షురాలు రాజేశ్వరి అన్నారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో సోమవారం కాంట్రాక్టు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ నిరసన చేయడం జరుగుతుందని, వేతనాలు పెంపుపై తక్షణం చర్యలు చేపట్టాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని తదితర డిమాండ్లతో నిరసన తెలియజేశారు. -
ఆత్మహత్యకు పాల్పడ్డ ఏఈ కుటుంబానికి న్యాయం చేయాలి...
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు అన్నారు. ఇటీవల వార్తల్లో ప్రచారమవుతున్న ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని, ఆత్మహత్యపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్పై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయడం, నిందితుడితో పాటు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సాదిక్ ఖాన్పై వచ్చిన మోసం, బెదిరింపులు, ఆర్థిక దోపిడీ, వ్యక్తిగత ఫొటోలు, వీడియోల దుర్వినియోగం, బలవంతపు మతమార్పిడి ఆరోపణలు, కుటుంబ సభ్యులకు హాని చేస్తామని బెదిరించిన ఆరోపణలు అంశాలను చట్టపరంగా పరిశీలించి, నేరం రుజువైతే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. -
జాతీయస్థాయి రెజ్లింగ్లో కేజీబీవీ విద్యార్థినికి పతకం
మాకవరపాలెం: జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీల్లో కేజీబీవీ విద్యార్థిని కాంస్య పతకం సాధించింది. స్థానిక కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కోసూరు జ్యోత్స్న ఈ నెల 21 నుంచి 23 వరకు హరిద్వార్లో గ్రాప్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొంది. ఈ పోటీల్లో ప్రతిభ చూపి కాంస్య పతకం సాధించింది. రాష్ట్రస్థాయిలో సైతం ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించిందని పాఠశాల ఎస్వో త్రివేణి సోమవారం తెలిపారు. ఈ విద్యార్థినిని ఎస్వోతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. -
‘పబ్లిక్’ సర్వీస్
తుమ్మపాల: పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారులకు సోమవారం ఉచిత భోజన ఏర్పాట్లను కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్ పటేల్ పరిశీలించి అర్జీదారులకు స్వయంగా భోజనం వడ్డించారు. రెండు నెలలుగా ప్రతి సోమవారం ఉచిత భోజన కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కలెక్టరేట్ అధికారుల ఆదేశాలతో నిర్వాహకులు గత వారం అర్జీదారులు నుంచి ఒక్కో ప్లేట్ భోజనానికి రూ.5 చొప్పున వసూలు చేసిన విషయం విమర్శలకు దారి తీసింది. దీనిపై స్పందించిన కలెక్టర్ అర్జీదారులకు స్వయంగా భోజనం వడ్డించి అధికారుల తీరుపై పరోక్షంగా చురకలు అంటించారు. అన్నా క్యాంటీన్ ద్వారా అందించే ఈ పథకంలో కూడా నగదు వసూలు చేయడంపై సంబంధిత సిబ్బందిని ఆమె హెచ్చరించినట్టు తెలిసింది. కార్యక్రమంలో డీఆర్వో వై.సత్యనారాయణరావు, సూపరింటెండెంట్ విజయకుమార్ పాల్గొన్నారు. -
‘అంతర్జాతీయ డ్రాగన్ బోట్’ పోటీలకు కానిస్టేబుల్ ఎంపిక
తుమ్మపాల: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ డ్రాగన్ బోట్ చాంపియన్ షిప్ పోటీలకు అనకాపల్లి మండలం రొంగలివానిపాలెంకు చెందిన కానిస్టేబుల్ సూరినాయుడు ఎంపికయ్యారు. చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనున్న 2026 ఐసీఎఫ్ డ్రాగన్ బోట్ ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో భారత జట్టు తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మేరకు భారత కయాకింగ్ అండ్ కానోయింగ్ అసోసియేషన్ నుంచి ఏపీ డీజీపీ కార్యాలయానికి లేఖ అందినట్టు సూరినాయుడు తెలిపారు. సెప్టెంబర్ 28న భారత బృందం చైనాకు బయలుదేరి, అక్టోబర్ 4న తిరిగి వస్తుంది. సూరినాయుడు ప్రస్తుతం డీఐజీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సూరినాయుడు అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై పోలీసు అధికారులు, సహచరులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. -
కందుల దందా
డాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి దేవస్థానం వివాదాలకు నిలయంగా మారుతోంది. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో సనాతన ధర్మ సూత్రాలను, దేవదాయ శాఖ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ కందుల నాగరాజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర కలకలం రేపుతోంది. ‘ఆలయం నాదే... నే చెప్పిందే వేదం’ అనే ధోరణితో ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు అటు పాలకమండలి సభ్యులకు, ఇటు ఆలయ అధికారులకు, చివరకు అర్చక సిబ్బందికి సైతం తీవ్ర మనస్తాపం కలిగిస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఆయన సాగిస్తున్న వ్యవహార శైలిపై భక్తజనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పేరుమీద.. తాజాగా మార్గశిర మాస ఉత్సవాల వేళ చైర్మన్ నాగరాజు తీసుకున్న నిర్ణయం ఆలయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. డిసెంబర్ 27న నిర్వహించ తలపెట్టిన మార్గశిర సహస్ర కలశాభిషేకం (మార్గశిర రథయాత్ర) పేరిట దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ గానీ, ప్రభుత్వం గానీ ఎటువంటి ఆమోదం తెలపకుండానే ఆయన సొంతంగా రూ.200 విలువైన టికెట్లను, కరపత్రాలను ముద్రించి విక్రయాలకు శ్రీకారం చుట్టడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మహిళలకు ప్రత్యేక డ్రెస్ కోడ్ నిర్ణయించడమే కాకుండా, ఈ అనధికారిక కరపత్రాలపై దక్షిణ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాత పేర్లను ముద్రించడం గమనార్హం. ఎమ్మెల్యే చేతుల మీదుగానే యాత్ర ప్రారంభమవుతుందంటూ భక్తులను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆది నుంచి వివాదస్పదమే.. చైర్మన్ కందుల నాగరాజు ఏకపక్ష నిర్ణయాల పరంపర ఈనాటిది కాదు. గత జూన్ నెలలోనే ఆలయ పవిత్రతను భంగపరుస్తూ, కాళ్లకు పాదరక్షలతో దేవుని ప్రాంగణంలోకి ప్రవేశించి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఘటన మరవకముందే ఈ కొత్త వివాదం ముసిరింది. ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాతతో పాటు ఇతర సిబ్బందితో కనీస సమన్వయం లేకుండా, ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఆలయ పరిపాలన దారి తప్పింది. ప్రజాప్రతినిధి, ప్రభుత్వ అధికారులు సైతం మౌనం వహించడంతో ఛైర్మన్ వైఖరి మరింత శ్రుతిమించుతోందని పాలకమండలి సభ్యులే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ సాగిస్తున్న ఈ అనధికారిక టికెట్ల విక్రయాలను, ఆర్థిక లావాదేవీలను వెంటనే నిలిపివేసి, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు సత్వరమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే.. చట్ట ప్రకారం ట్రస్ట్బోర్డు సమావేశంలో ఏదేని నిర్ణయం తీసుకున్నప్పటికీ, దానికి సంబంధించిన ప్రతిపాదనలను కార్యాలయం ద్వారా దేవదాయ శాఖ కమిషనర్కు పంపి, ప్రభుత్వ పూర్వానుమతి పొందాకే ఎలాంటి రుసుములు లేదా టికెట్లను అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు ఈ నిర్ణయానికి సంబంధించిన ఎలాంటి దస్త్రాలు తమ కార్యాలయానికి రాలేదని ఆలయ సిబ్బందే స్పష్టం చేస్తుండటం చైర్మన్ అక్రమ విధానాలకు అద్దం పడుతోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్థిక లావాదేవీలకు తెరదీయడం చట్టవిరుద్ధమని తెలిసినా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చైర్మన్ ఇలా వ్యవహరించడం శోచనీయం. గర్వంతో విర్ర వీగకూడదు ఆలయ వ్యవహారాల్లో ఏకపక్ష ధోరణి, అనధికారిక నిర్ణయాలు సరికావు. ట్రస్ట్ బోర్డు బాధ్యతల్లో ఉన్నవారు దేవదాయ శాఖ నిబంధనలకు లోబడి భక్తులకు సేవకులుగా మాత్రమే పనిచేయాలి తప్ప, ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనే గర్వంతో విర్రవీగకూడదు. దేవదాయ శాఖ డీసీ హోదా కలిగిన అధికారి అధికారికంగా అనుమతించి విడుదల చేయాల్సిన సేవా టికెట్లను, ప్రభుత్వ ఆమోదం లేకుండా చైర్మన్ సొంతంగా ముద్రించి విక్రయించడం స్పష్టమైన చట్ట ఉల్లంఘన. అమ్మవారి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ, అనధికారిక రుసుములతో భక్తులను దేవునికి దూరం చేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి. ప్రభుత్వం మరియు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. –విజయశంకర్ ఫణీంద్ర, కో–కన్వీనర్, బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ -
పర్యాటక ప్రాంతాల్లో ‘బ్రిక్స్’ ప్రతినిదులుసందడి
కొమ్మాది: బ్రిక్స్ దేశాల క్రీడామంత్రుల సమావేశం నేపథ్యంలో పలువురు బ్రిక్స్ ప్రతినిధులు తొట్లకొండను ఆదివారం సందర్శించారు. దీని చారిత్రక పాధాన్యతతో పాటు బౌద్ధమతంలో ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టతను గైడ్ ద్వారా తెలుసుకున్నారు. నీటి తొట్టెలు, చైత్యాలు, ఆరామాలు, స్థూపాలు, మహాస్థూపం, పాకశాల, ధ్యాన కేంద్రాలను సందర్శించి, వాటి గురించి తెలుసుకున్నారు. అక్కడి నుంచి తొట్లకొండపై ఉన్న సీ వ్యూ పాయింట్ సందర్శించారు. రుషికొండ వద్ద... బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన రుషికొండ బీచ్ను బ్రిక్స్ దేశాల ప్రతినిధులు సందర్శించి అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులు సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. వారితో కలసి థింసా, ఇతర నృత్యాల్లో పాల్గొని, ప్రతినిధులు సందడి చేశారు. -
కావడి కదంబం.. భక్తి రస ప్రవాహం
నగరంలోని మార్వాడీల సంప్రదాయ సిద్ధంగా ఆదివారం కావడి యాత్ర నిర్వహించారు. తమ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, విశ్వశాంతి నెలకొనాలని కోరుతూ వీరు ప్రతి ఏడాది శ్రావణమాసంలో ఈ కావడి యాత్రను చేపడతారు. ఈసారి యాత్ర రోజు ఏకాదశి కావడంతో ఆదివారం కావడి యాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా వీరు మొదట మాధవదార శివాలయంలో శివుడిని దర్శించుకున్న అనంతరం కావిళ్లతో బయలుదేరారు. మురళీనగర్, ఊర్వశి కూడలి మీదుగా జాతీయ రహదారిపై సుమారు రెండువేల కుటుంబాలు భారీ సంఖ్యలో ఊరేగింపుగా బీచ్రోడ్డులోని జగన్నాథస్వామి ఆలయం వరకు కావడి యాత్రను కొనసాగించినట్టు మార్వాడీ యువమంచ్ అధ్యక్షుడు విష్ణు రాటేరియా తెలిపారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కావడి యాత్రతో నగరం భక్తి రస ప్రవాహంగా మారింది. – మురళీనగర్ -
కేజీహెచ్లో మెడ్కో మాయాజాలం
మహారాణిపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం నిర్వహణలో నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? కేజీహెచ్లో చోటుచేసుకున్న తాజా పరిణామం ఈ ప్రశ్నను మరోసారి తెరపైకి తెచ్చింది. క్లినికల్ స్పెషాలిటీ విభాగాలకు చెందిన వైద్యులను ఎన్టీఆర్ వైద్యసేవ ఇన్చార్జి మెడికల్ కోఆర్డినేటర్ (మెడ్కో)గా నియమించవద్దని వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) గతంలోనే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ న్యూరోసర్జరీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. శివరామకృష్ణకు మెడ్కో బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదంగా మారింది. ఉత్తర్వుల నేపథ్యం కేజీహెచ్కు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఏ. రాజేష్ను ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్కు డిప్యుటేషన్పై పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ట్రస్ట్ మెడ్కు పూర్తి బాధ్యతలను డాక్టర్ కె. శివరామకృష్ణకు అప్పగించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అత్యంత రద్దీగా ఉండే న్యూరోసర్జరీ విభాగంలో పనిచేసే వైద్యుడికి ఈ అదనపు పరిపాలనా బాధ్యత అప్పగించడంపై ఆస్పత్రి వర్గాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డీఎంఈ ఆదేశాలు బేఖాతరు ఎన్టీఆర్ వైద్యసేవ/ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణ బాధ్యతలను సీఎస్ఆర్ఎంవో, డీసీఎస్ఆర్ఎంవో, ఆర్ఎంవో వంటి పరిపాలనా వైద్యాధికారులకే అప్పగించాలని, క్లినికల్ స్పెషాలిటీ వైద్యులను వీలైనంత వరకూ ఈ బాధ్యతల నుంచి మినహాయించి వారి సేవలను పూర్తిగా రోగుల చికిత్సకే వినియోగించాలని డీఎంఈ గతంలోనే స్పష్టం చేసినట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. క్లినికల్ వైద్యులు ఇన్చార్జిలుగా ఉంటే పథకం అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు తలెత్తుతాయని, పరిపాలనా వ్యవహారాలతో ప్రత్యక్ష సంబంధమున్న సీఎస్ఆర్ఎంవో, డీసీఎస్ఆర్ఎంవో, ఆర్ఎంవోలే ఈ బాధ్యతలకు సరైనవారని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నట్టు సమాచారం. అయితే వీటిని పక్కనపెట్టి న్యూరోసర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్కు బాధ్యతలు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. వద్దన్నా వినకుండా అప్పగింత మెడ్కో బాధ్యతలు స్వీకరించలేనని సంబంధిత వైద్యుడు చెప్పినప్పటికీ బలవంతంగా అప్పగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం శస్త్రచికిత్సలు, రోగుల పరీక్షలతో బిజీగా ఉండే న్యూరోసర్జరీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వైద్యుడిపై ఇంత విస్తృత పరిపాలనా భారం మోపడం రోగుల సేవలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. డీఎంఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్నతాధికారుల ఉద్దేశమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డైట్ క్యాంటీన్లోనూ అదే తీరు కేజీహెచ్లో డైట్ క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను కూడా ఆర్ఎంవో స్థాయి అధికారులకు కాకుండా పీడియాట్రిక్స్ విభాగ అధిపతి డాక్టర్ చక్రవర్తికి అప్పగించినట్టు ఆస్పత్రి వర్గాలు ఆరోపిస్తున్నాయి. క్లినికల్ బాధ్యతలు నిర్వర్తించే స్పెషలిటీ వైద్యులపై పరిపాలనా భారం మోపడం వైద్య సేవలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఆర్ఎంవో వ్యవస్థ ఉన్నా వినియోగించని వైనం కేజీహెచ్లో సీఎస్ఆర్ఎంవో డాక్టర్ యు. శ్రీహరి, డీసీఎస్ఆర్ఎంవో డాక్టర్ కుమార్, ఆర్ఎంవో డాక్టర్ బంగారయ్య వంటి పరిపాలనా వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పటికీ, కీలక బాధ్యతల నుంచి వారిని పక్కనపెట్టడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. బాధ్యతలు నిర్వహించే అధికారులను పక్కనపెట్టి, ఉన్నతాధికారులు చెప్పినట్లు సంతకాలు పెట్టే రబ్బర్ స్టాంపుల కోసమేనా నిబంధనలను సైతం విస్మరిస్తున్నారు? అన్న ప్రశ్నలు ఆస్పత్రి వర్గాల్లో తీవ్రంగా వినిపిస్తున్నాయి. కలెక్టర్ జోక్యం చేసుకోవాలి డీఎంఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని ఆస్పత్రి వర్గాలు కోరుతున్నాయి. ఎన్టీఆర్ వైద్యసేవ నిర్వహణలో నిబంధనలు పాటిస్తున్నారా? క్లినికల్ స్పెషాలిటీ వైద్యుడికి మెడ్కో బాధ్యతలు అప్పగించడం సమంజసమేనా? అందుబాటులో ఉన్న ఆర్ఎంవో వ్యవస్థను ఎందుకు వినియోగించలేదు? అన్న ప్రశ్నలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.నిబంధనలు కేవలం సాధారణ ఉద్యోగులకే వర్తిస్తాయా, ఉన్నతాధికారులకు వర్తించవా అన్న ప్రశ్నకు కేజీహెచ్ యాజమాన్యం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
కూలిన వాటర్ ట్యాంక్
తప్పిన పెను ప్రమాదం నక్కపల్లి: స్టీల్ప్లాంట్, బల్క్డ్రగ్ పార్క్ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఆదివారం కూలిపోయింది. ట్యాంకు అడుగు భాగంలో పనిచేస్తున్న ఇద్దరు మేసీ్త్రలు తీవ్రంగా గాయపడగా, ట్యాంక్ పైభాగంలో పనిచేస్తున్న సుమారు 20 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. బోదిగల్లం వద్ద నిర్వాసితుల కోసం పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 800 మందికి ఇళ్లస్థలాలు కేటాయించి ఆర్ అండ్ ఆర్ప్యాకేజీ చెల్లించడంతో వీరంతా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. వీరికి ప్రభుత్వమే రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. దీనిలో భాగంగా రెండు లక్షల కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన పెద్ద రక్షిత మంచినీటి పథకం నిర్మిస్తున్నారు. ఆదివారం ట్యాంకు కోసం శ్లాబ్ వేసేపనులు ప్రారంభించారు. ఈ పనులు జరుగుతుండగా డెక్కింగ్ కోసం వేసిన కర్రలు ఊడిపోవడంతో శ్లాబ్ కాంక్రీట్ ఒక్కసారిగా కింద కు పడిపోయింది. కింద భాగంలో పనిచేస్తున్న పాయకరావుపేట రాజుగారి బీడుకు చెందిన షేక్ అబీ, జగ్గంపేట పోలీస్స్టేషన్ సమీపంలో నివసిస్తున్న ఆదిశంకర సత్యనారాయణ అనే తాపీమేసీ్త్రలు తీవ్రంగా గాయపడ్డారు. కాంక్రీట్ కింద చిక్కుకున్న వారిని అతికష్టంపై బయటకు తీసి నక్కపల్లి ఆస్పత్రికి తరలించారు. ట్యాంక్ పైభాగంలో సుమారు 20 మంది పనిచేస్తున్నారు. కూలిపోతున్న సమయంలో శ్లాబ్ మధ్యభాగంలో లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. పెద్ద శబ్దంతో శ్లాబ్ కూలిపోవడంతో చుట్టుపక్కల వారు భయంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పనులు నాసిరకంగా జరగడం, పర్యవేక్షణ లేకపోవడంతోనే వాటర్ట్యాంక్ నిర్మాణ దశలోనే కూలిపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ, సీపీఎం నాయకుడు ఎం.అప్పలరాజు, వైస్ ఎంపీపీ వీసం నానాజీ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వీసం రామకృష్ణ మాట్లాడుతూ నాసిరకం మెటీరియల్ ఉపయోగించడం వల్లే శ్లాబ్ వేసిన రోజునే కూలిపోయిందన్నారు. ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని, క్షతగాత్రులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
ముగ్గులతో నిరసన
నేటి నుంచి జూడాల ఆందోళన తీవ్రతరంమహారాణిపేట: స్టైపెండ్ పెంపు కోసం గత 14 రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల (జూడాలు) పట్ల ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం నుంచి తమ నిరసనలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అత్యవసర సేవలను సైతం బహిష్కరించిన వైద్యులు, ఆదివారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట రంగురంగుల ముగ్గులు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. జనవరి నుంచి స్టైపెండ్ పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం 3 శాతమే ఇస్తామనడం సరికాదని, ఇతర రాష్ట్రాలతో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు తీరేవరకు పోరాటం కొనసాగుతుందని ఏపీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ శిరాజ్, దినకర్ సాయి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం నాటి రిలే నిరాహార దీక్షల్లో డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ జాహ్నవి, డాక్టర్ సుభాష్, డాక్టర్ విజేత తదితరులు పాల్గొన్నారు. -
పొల్యూషన్కు సొల్యూషన్ ‘సైక్లింగ్’
ఏయూ క్యాంపస్: కాలుష్యానికి సైక్లింగ్ పరిష్కారంగా నిలుస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. బ్రిక్స్ ఫ్రెండ్షిప్ వేడుకల్లో భాగంగా సండేస్ ఆన్ సైకిల్ పేరిట బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని ఆదివారం ఉదయం బీచ్రోడ్డులో సైక్లింగ్ చేశారు. సైక్లింగ్ అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. సైక్లింగ్ ‘ఫిట్ ఇండియా’ఉద్యమంలో భాగమన్నారు. భారత ప్రధాని ‘సండేస్ ఆన్ సైకిల్’కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఆదివారం దేశవ్యాప్తంగా దాదాపు 1,800 నగరాల్లో ఈ కార్యక్రమం నిర్వహించగా, 50 లక్షల మంది యువత పాల్గొన్నారని పేర్కొన్నారు. సైక్లింగ్ అద్భుతమైన వ్యాయామమని, దీనివల్ల శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. ప్రతి ఆదివారం ప్రజలు సైక్లింగ్లో పాల్గొనాలని సూచించారు. తద్వారా కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. బీచ్రోడ్డులోని నోవాటెల్ హోటల్ నుంచి సీ హారియర్ వరకు బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బ్రిక్స్ ప్రతినిధులు, శాప్ ఎండీ భరణి, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్డీవో దిలీప్ చక్రవర్తి, క్రీడా అధికారి జూన్ గ్యాలియట్, యూడీసీ పీడీ సత్యవేణి, కేంద్ర ప్రభుత్వ అధికారులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటం
అనకాపల్లి టౌన్: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటం చేస్తామని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్పర్సన్ ఎస్.జయ తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 24 నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కానున్నట్టు చెప్పారు. పెన్డౌన్, కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 6 తర్వాత సమ్మెకు సిద్ధమవుతామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవులు, పీఎఫ్, హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని, రిక్వెస్ట్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి. శ్రీనివాసరావు, జేఏసీ కన్వీనర్ ఐ. రాజాబాబు పాల్గొన్నారు. -
ఆంధ్రకేసరికి ఘన నివాళి
అనకాపల్లి టౌన్: ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతిని స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సబ్ డివిజన్ ఇన్చార్జి డీఎస్పీ జి.ఆర్.ఆర్. మోహన్ మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమ సమయంలో బ్రిటిష్ వారిని ఎదుర్కొని నిలబడ్డారని కొనియాడారు. నిజాయతీ, సత్యనిష్ఠ, నైతిక విలువలతో కూడిన ప్రకాశం పంతులు జీవితం నేటి యువతకు, ప్రజా ప్రతినిధులకు, ఉద్యోగులకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. -
అడుగంటిన రావణాపల్లి జలాశయం
గొలుగొండ: రావణాపల్లి రిజర్వాయర్ అడుగంటడంతో నర్సీపట్నం, గొలుగొండ మండలాల్లో దారు ణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు రెండో వారంలో వరి నాట్లు పడి పచ్చగా కళకళలాడాల్సిన పొలా లు జీవం కోల్పోయి బీడువారి ఉన్నాయి. రావణాపల్లి నీటి నిల్వ సామర్థ్యం 139 ఎంసీఎఫ్టీలకు గాను, ప్రస్తుతం 49 ఎంసీఎఫ్టీలు మాత్రమే ఉంది. గొలు గొండ, నర్సీపట్నం మండలాల్లోని 2,600 ఎకరాల భూములకు ఈ జలాశయం ప్రధాన ఆధారం. ప్రతి ఏటా జులై నెలలో సాగు నీరు విడుదల చేసేవారు. ఈ ఏడాది ఆగస్టు పూర్తి కావస్తున్నా నీటి నిల్వలు లేకపోవడంతో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. 15 సంవత్సరాల తరువాత... రావణాపల్లి జలాశయం ఎప్పుడూ నిండు కుండలా ఉండేది. జలాశయం గొలుగొండ మండలంలో ఉన్నప్పటికీ అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం తురవాడ గెడ్డ నుంచి జలాశయంలోకి నీరు వచ్చేది. తురవాడ గెడ్డ నిత్యం నీటితో కళకళలాడేది. ఏజెన్సీ ప్రాంతంలో ఏ మాత్రం వర్షం కురిసినా తురవాడ గెడ్డ పొంగి ప్రవహించి, జలాశయంలోకి నీరు చేరుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో కూడా వర్షాలు కురవకపోవడంతో జలాశయం అడుగంటింది. 15 సంవత్సరాల తరువాత ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మత్స్యకారులకు నష్టం రావణాపల్లి జలాశయంలో చేపల పెంపకం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి ఏటా జనవరి నుంచి జులై వరకు ఈ జలాశయంలో మత్స్యకారులు భారీగా చేపలు వేటాడి జీవనోపాధి పొందుతారు. ఈ ఏడాది జలాశయంలో నీరు లేకపోవడంతో ఇటు రైతులకు, ఇటు వందలాది మంది మత్స్యకారులకు ఇబ్బందులు గురవుతున్నారు. -
భూ సేకరణపై వాస్తవాలు వెల్లడించాలి
మాకవరపాలెం: భూ సేకరణపై అధికారులు వాస్తవాలను వెల్లడించాలని మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ డిమాండ్ చేశారు. పరిశ్రమల స్థాపనకు మండలంలోని పైడిపాల, పెద్దిపాలెం, బూరుగుపాలెం, తూటిపాల రెవెన్యూల పరిధిలో 4,259 ఎకరాల ల్యాండ్ బ్యాంకును సిద్ధం చేయడంలో భాగంగా 25 రోజులుగా రెవెన్యూ అధికారులు భూముల సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఎందుకు చేస్తున్నారనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదంటూ ఆదివారం పాపయ్యపాలెం అడవిరాజులబాబు ఆలయం వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యే పరిశ్రమల వివరాలను ప్రజలకు తెలియజేయాలని, సర్వే పూర్తయిన వెంటనే రైతులకు విస్తీర్ణం తెలపాలని అన్నారు. పరిశ్రమలకు భూములు సేకరిస్తే జిరాయితీ భూములకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ధరకు మూడు రెట్లు, డీ పట్టా భూములకు రెండు రెట్లు, పదేళ్లుగా సాగులో ఉన్న రైతులకు కూడా డీ పట్టాకు ఇచ్చినట్టుగా నష్ట పరిహారం అందజేయాలన్నారు. ఈ భూముల్లో ఉన్న చెట్లకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బూరుగుపాలెం ఎంపీటీసీ సభ్యుడు రుత్తల యర్రాపాత్రుడు మాట్లాడుతూ రైతులంతా కలసికట్టుగా ఉంటేనే సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉందని చెప్పారు. శాంతియుతంగా ఉద్యమాలు చేయాలన్నారు. చామంతిపురం మాజీ సర్పంచ్ బొడ్డు గోవిందరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావడాన్ని అందరూ స్వాగతిస్తున్నామని, అయితే ఆరోగ్యానికి హాని కలిగించే పరిశ్రమల ఏర్పాటును, రైతులకు నష్టం కలిగించే చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తామన్నారు. కార్యక్రమంలో బూరుగుపాలెం, పైడిపాల, ముషిడిపాలెం, మామిడిపాలెం, కె. తూటిపాల మాజీ సర్పంచ్లు వొబ్బలరెడ్డి రమణ, రుత్తల శ్రీను, బుడ్డా రమణ, రుత్తల నాయుడు, గవిరెడ్డి ప్రసాదరావు, వైఎస్సార్సీపీ మండల యూత్ అధ్యక్షుడు రాజు, నాయకులు భీమిరెడ్డి గోవింద, యర్రా లోవ, సత్తిబాబు పాల్గొన్నారు. నాలుగు రెవెన్యూల పరిధిలోజరుగుతున్న భూముల సర్వే భవిష్యత్ కార్యాచరణకు సమావేశమైన రైతులు నష్టపరిహారం, ఇతర ప్యాకేజీలపై స్పష్టతకు డిమాండ్ -
మందుపాతర!
ప్రభుత్వాస్పత్రుల్లో..మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పేద రోగుల ప్రాణాలకు భరోసా కరువైంది. ఒకవైపు జూనియర్ వైద్యుల సమ్మెతో సర్కారు వైద్యం పడకేసింది. మరోవైపు ప్రాణాధార మందుల కొరత పేద రోగులను నిలువునా దహిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజల పెద్ద దిక్కు అయిన కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్) మొదలుకొని నగరంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత తీవ్ర స్థాయికి చేరింది. రోగుల ఆర్తనాదాలు వినపడుతున్నా పాలకుల్లో మాత్రం చలనం లేకుండా పోయింది. మందుల కోటాలో కోత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేద రోగులకు అన్ని రకాల మందులు పుష్కలంగా అందుబాటులో ఉండేవి. దాదాపు 613 రకాల ఔషధాలను నిరంతరం అందుబాటులో ఉంచి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెల రోజులకు సరిపడా మందులను ఒకేసారి ఉచితంగా అందజేసేవారు. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ప్రస్తుతం కేవలం 318 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులోనూ అత్యవసర ఔషధాలు దాదాపు నిండుకున్నాయి. నెల రోజుల కోటాను కాస్తా వారం రోజులకు కుదించేశారు. ఆ కొద్దిపాటి మందుల కోసమే గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రాణాధార మందుల కొరత బీపీ, షుగర్, గుండెజబ్బులు, క్యాన్సర్, ఫిట్స్, మూర్ఛ వ్యాధి నివారణ మాత్రలతో పాటు ఇన్సులిన్, యాంటీబయాటిక్స్, బ్లీడింగ్ నివారణ, రక్తహీనత నివారణ మందుల నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ఆక్సిజన్ పైపులు, వెంటిలేటర్ కిట్లు, ఆపరేషన్లకు వాడే సర్జికల్ దారాలు, గర్భాశయ ఇన్ఫెక్షన్ నివారణ మందులు సైతం దొరకడం లేదు. క్యాన్సర్ బాధితులకు అవసరమైన ఖరీదైన మందులు వస్తే 2–3 రోజుల్లోనే అయిపోతున్నాయి. మళ్లీ ఎప్పుడు వస్తాయో తెలియక ప్రాణాంతక వ్యాధులతో బాధపడే రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. 100 గ్లౌజులకు ఉన్నవి 10 మాత్రమే! ఆస్పత్రుల్లో ప్రాథమిక వైద్య పరికరాల కొరత మరింత దారుణంగా మారింది. కేజీహెచ్లో రోజుకు కనీసం 100 సెట్ల గ్లౌజులు అవసరం కాగా, పది సెట్లకు మించి లభించడం లేదు. ఒక్కోసారి గ్లౌజులు లేకుండానే ఆపరేషన్లు చేయాల్సిన ప్రమాదకర పరిస్థితులు దాపురిస్తున్నాయని వైద్యులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాయాలకు డ్రెస్సింగ్ చేయడానికి అవసరమైన సూదులు, కిట్లు, ఆయింట్మెంట్లు లేకపోవడంతో రోగుల కుటుంబ సభ్యులే బయట మెడికల్ స్టోర్స్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. కౌంటర్లు కిటకిట.. రోగుల విలవిల! కేజీహెచ్తో పాటు ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక వైద్యశాల, ఈఎన్టీ, రాణి చంద్రమతి దేవి, టీబీ, ఐడీ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రోజూ 3 వేల మందికి పైగా ఓపీ, ఐపీ రోగులు మందుల కౌంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. మందుల కోసం నిలబడితే ‘స్టాక్ లేదు.. విజయవాడకు ఇండెంట్ పెట్టాం.. బయట కొనుక్కోండి’ అంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ వైద్యం పూర్తిగా పడకేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందక.. మందులు లేక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. నిండుకున్న మందుల స్టాక్ 613 రకాలకు అందుబాటులో ఉన్నవి 318 మాత్రమే.. బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ మందుల కొరత నెల రోజుల కోటా వారం రోజులకు కుదింపు -
తాండవలో నిలిచిన చేప పిల్లల ఉత్పత్తి
మత్స్యకారుల జీవన వనరు తాండవ చేప పిల్లల కేంద్రం మూలకుచేరింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఏకై క చేపల విత్తన ఉత్పత్తి కేంద్రానికి గ్రహణం పట్టింది. కూటమి ప్రభుత్వ అలసత్వంతో రెండేళ్లుగా పెంపకానికి గండిపడింది. ఫలితంగా మత్స్యకారులు ఉపాధికి దూరమై అవస్థలకు గురవుతున్నారు. పలువురు వలసబాట పట్టారు. నాతవరం: మండలంలోని తాండవ చేప పిల్లల విత్తన ఉత్పత్తి కేంద్రం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉనికి కోల్పోయే స్థితికి చేరింది. ప్రతి ఏటా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జూన్ నుంచి ఆగస్టు మధ్య ఈ కేంద్రంలో సుమారు 1.50 కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేసేవారు. ఇక్కడ పెద్ద చేపలకు కృత్రిమ గర్భోత్పత్తి (ఇంజెక్షన్ల) ద్వారా వివిధ రకాల చేప పిల్లలను ఉత్పత్తి చేసి, మొదట తాండవ రిజర్వాయర్లో విడుదల చేసేవారు. అనంతరం జిల్లాలోని రైవాడ, కోనాం, పెద్దేరు, కల్యాణపులోవ తదితర రిజర్వాయర్లకు సరఫరా చేసేవారు. వాటితో పాటు రిజిస్టర్ అయిన మత్స్యకార సహకార సంఘాలకు రాయితీపై సరఫరా చేసేవారు. మిగిలిన వాటిని నర్సీపట్నంలోని మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలోని నీటి కుండీల్లో పెంచి ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేవారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న కేంద్రాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. సిబ్బంది కొరతనో లేక నిధుల లేమియో తెలియదు కానీ, రెండేళ్ల నుంచి ఇక్కడ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. శిథిలావస్థలో భవనాలు.. పట్టించుకోని సిబ్బంది ఉత్పత్తి నిలిచిపోవడంతో రూ.లక్షల విలువైన యంత్రాలు, సామగ్రి నిరుపయోగంగా మారి పాడవుతున్నాయి. నీటి సరఫరా కోసం వేసిన బోరు బావి చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచాయి. కార్యాలయం తలుపులు, కిటికీలకు చెదలు పట్టి ఊడిపోతున్నాయి. పర్యవేక్షణ పూర్తిగా కరవైంది. సిబ్బంది చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారు. ఉత్పత్తి కేంద్రాన్ని తక్షణమే పునరుద్ధరించాలి తాండవ చేప పిల్లల విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని కాపాడవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై ఉంది. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు కేటాయించి, ఉత్పత్తిని ప్రారంభించాలి. లేనిపక్షంలో మత్స్యకారుల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. –బాలేపల్లి వెంకటరమణ,సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుమత్స్యకారుల వలసలు చేప పిల్లల ఉత్పత్తి నిలిచిపోవడంతో తాండవ రిజర్వాయర్లో చేపల వేట సక్రమంగా సాగడం లేదు. ఈ రిజర్వాయర్పై ఆధారపడి నాతవరం, గొలుగొండ, కొయ్యూరు మండలాలకు చెందిన జాలరిపేట, అమ్మపేట, జోగుంపేట, పొగచెట్లపాలెం, సారిక, మల్లవరం, ఆడాకుల, చోద్యం తదితర గ్రామాలకు చెందిన 600 నుంచి 700 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గతంలో 5 నుంచి 25 కిలోల బరువుండే పెద్ద చేపలు పడేవని, ఇప్పుడు చిన్న చేపలు కూడా దొరకడంలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేట సాగక ఉపాధి కరవవడంతో జాలరిపేటకు చెందిన పలువురు మత్స్యకారులు నాగార్జున సాగర్ వంటి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. సమస్యలపై విన్నవించుకుందామంటే ఉత్పత్తి కేంద్రంలో అధికారులెవరూ అందుబాటులో ఉండటం లేదు. కొనుగోలు చేసి తెచ్చే దుస్థితి నాతవరంలోని తాండవ ప్రాజెక్టు దిగువన 1986లో ఈ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ సరైన వాతావరణంతో పాటు నీటి సదుపాయం సమృద్ధిగా ఉండడంతో ప్రతి ఏటా నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి ఉత్పత్తి సాధించేవారు. అయితే గత ఏడాది ఇక్కడ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇతర జిల్లాల నుంచి చేప పిల్లలను కొనుగోలు చేసి తీసుకురావాల్సి వచ్చింది. అలా తెచ్చిన పిల్లలనే కలెక్టర్ విజయకృష్ణన్ రిజర్వాయర్లో విడుదల చేశారు. స్థానికంగా కోట్లాది పిల్లలను ఉత్పత్తి చేసి జిల్లా అంతటికీ సరఫరా చేసిన కేంద్రం, నేడు బయట నుంచి కొనుగోలు చేసే స్థితికి దిగజారడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘అభివృద్ధి మాది... డప్పు కూటమి ప్రభుత్వానిది’
అనకాపల్లి: సీఎం చంద్రబాబు మాడుగుల పర్యటన వలన ఎలాంటి ప్రయోజనం లేదని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ నేత బూడి ముత్యాల నాయుడు విమర్శించారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. అభివృధ్ధి తాము చేస్తే.. డప్పు మాత్రం కూటమి ప్రభుత్వం కొట్టుకుంటుందని మండిపడ్డారు. నమ్మినవారిని నట్టేట ముంచడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, వెన్నుపోటు పొడవడమే ఆయన రాజకీయమన్నారు. ‘డిఎస్సీ అవకతవకలపై సీబిఐ విచారణ జరిపించాలి. సిబిఐ విచారణ అంటే కూటమి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు. కూటమి పాలనలో గ్రామాలలో మద్యం ఏరులై పారుతుంది. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం దుకాణాలను పరిమితం చేశాం. ఇప్పుడు గ్రామాలలో బెల్ట్ షాపులు పెరిగాయి.వైఎస్సార్సీపీ గత పథకాలను కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటుంది.రైతులపై టీడీపీ మొసలి కన్నీరు కురుస్తుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సివిల్ సర్వీసుకు న్యాయ పరిజ్ఞానం తోడ్పాటు
సబ్బవరం: ‘యూపీఎస్సీ, సివిల్ సర్వీసు పరీక్షల్లో న్యాయ విద్యార్థులు రాణించగలరు. ఇందుకు న్యాయ పరిజ్ఞానం తోడ్పడుతుంది. అదేవిధంగా చట్టాలను సమర్థంగా అమలు చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణకు సైతం న్యాయ పరిజ్ఞానం దోహదపడుతుంది.’ అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ లీసా గిల్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని శనివారం సీజే జస్టిస్ లీసా గిల్ సందర్శించారు. యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన విద్యార్థినుల వసతి గృహం, రెండు సమావేశ మందిరాలను ఆమె ప్రారంభించారు. అనంతరం విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో తరగతుల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్ లీసా గిల్ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించే దిశగా కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రతి రంగంలో మహిళలకు కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ, అవి వారి ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలను పరిమితం చేయకూడదని చెప్పారు. మహిళలు భవిష్యత్లో మార్గదర్శకులుగా నిలిచేలా లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు.న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం బాగా పెరుగుతోందిన్యాయవాద వృత్తిలో మహిళల పాత్రపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సీజే జస్టిస్ లీసా గిల్ సమాధానమిస్తూ... న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. పంజాబ్–హరియాణ హైకోర్టులో ప్రస్తుతం సుమారు 70 శాతం మంది, పలు రాష్ట్రాల హైకోర్టుల్లో దాదాపు 65 శాతం మంది మహిళా న్యాయవాదులు ఉన్నారని తెలిపారు. న్యాయరంగంలో పరిస్థితులు మారుతున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. మొదటి తరం మహిళా న్యాయవాదులు వృత్తిలోకి ప్రవేశించినప్పుడు అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ.. అంకితభావం, పట్టుదలతో వాటిని అధిగమించారని చెప్పారు. న్యాయ విద్యార్థులు అత్యుత్తమ సివిల్ సర్వెంట్లుగా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం విశ్వవిద్యాలయ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సీజే జస్టిస్ లీసా గిల్ను యూనివర్సిటీ వీసీ ఆచార్య సూర్యప్రకాశరావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య, మాజీ న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు, భోపాల్ నేషనల్ అకాడమీ మాజీ డైరెక్టర్ మోహన్ గోపాల్, యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ విశ్వచంద్రనాథ్ మదాసు, అకడమిక్ డైరెక్టర్ సోమా భట్టాచార్య, అధ్యాపకులు పాల్గొన్నారు. -
అప్పన్నను దర్శించుకున్న మిథాలీరాజ్
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళా క్రికెట్ కన్సల్టెంట్ మిథాలీరాజ్ దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు అష్టోత్తరంపూజ నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రంలను ఈవో జల్లేపల్లి వెంకటరావు అందజేశారు. మిథాలీరాజ్తో పాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గేమ్ డెవలప్మెంట్ జనరల్ మేనేజర్ ఎమ్.ఎస్.కుమార్, మహిళల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎన్.గీత, విశాఖ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఆర్.గౌరీశంకర్, ఏసీఏ సీనియర్ ఉమెన్ టీమ్ హెడ్ కోచ్ షర్భానీ డెబ్నాఽథ్ స్వామిని దర్శించుకున్నారు. -
సీఎంకు సమస్యలు చెప్పుకోనివ్వరా?
సీపీఐ, ఏపీ చెరకు రైతు సంఘాల ఆగ్రహంచోడవరం: రైతు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన తమను అడ్డుకోవడం హేయమైన చర్య అని సీపీఐ జిల్లా సంయుక్త కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేచలపు వెంకటరమణ(కాసుబాబు) ఆగ్రహం వ్యక్తం చేశా రు. కె. కోటపాడు మండలం ఏ కోడూరులో శనివారం సీఎం చంద్రబాబునాయుడు బహిరంగ సభలో గోవాడ చర్కెర కర్మాగారం చెరకు రైతుల బకాయిలు, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో వ్యవసాయ దయనీయ పరిస్థితులపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం గోవాడ సుగర్ ఫ్యాక్టరీని పూర్తిగా మూసివేసి చెరకు రైతులను, కార్మికులను రోడ్డున పడేసిందని వాపోయారు. వీరి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి సభ వద్దకు వెళ్లనీయకుండా పోలీసులతో అడ్డుకుని ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారని ధ్వజమెత్తారు. అభ్యసన సామర్థ్యాలు పెంపొందేలా బోధన సబ్బవరం: విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధన సాగించాలని డీఈవొ జి.జి.ఎస్.నాగేశ్వరరావు సూచించారు. సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాన్ని ఆయన సందర్శించి మ్యాథ్స్, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంచేందుకు అవసరమైన అంశాలపై సమావేశాల్లో చర్చించి, పరస్పరం బోధనా పద్ధతులను మెరుగుపరుచుకోవాలన్నారు. -
ఘాటెక్కిన ఉల్లి
● రోజురోజుకు పెరుగుతున్న ఉల్లిపాయ ధరలు ● అయోమయంలో వినియోగదారులు అనకాపల్లి టౌన్: ఉల్లిపాయ కోయకుండానే కంటతడి తెప్పిస్తుంది. ఇది లేనిదే ఏ కూరలు వండడం దాదాపు సాధ్యం కాదు. సాంబార్, పప్పు, వేపుళ్లు, గ్రేవీ కూరీలు, చట్నీలు ఇలా ప్రతీ వంటకంలో ఉల్లి ఉండాల్సిందే. వంటకాలలో ఉల్లిదే అగ్రస్థానం. అటువంటి ఉల్లిపాయ ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో సామాన్యులు బెంబేలెత్తున్నారు. గత వారం క్రితం కిలో రూ.34 ఉన్న ఉల్లిపాయ ధర నేడు రూ.50లకు పలుకుతుంది. నిన్నటి వరకు కిలోల లెక్కన కొనుగోలు చేసిన వినియోగదారులు ప్రస్తుతం ధరలు చూసి అరకిలో, పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. ఈ ధరలు అల్పాదాయ వర్గాల కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కాయగూరల ధరలతో బెంబేలెత్తుతున్న సామాన్యులు ఒక్కసారిగా పెరిగిపోతున్న ఉల్లిపాయ ధరతో మరింత సతమతమవుతున్నా పలువురు చెబుతున్నారు. సాగుపై ఎల్నినో ప్రభావం మహారాష్ట్రలోని నాసిక్, సోలాపూర్ వంటి ప్రధాన ప్రాంతాల నుంచి మార్కెట్కు ఉల్లి రాక తగ్గిపోయింది. అలాగే ఎనినో ప్రభావంతో ఉల్లి సాగు ఆలస్యమవడం, కోల్డ్ స్టోరేజ్లలో ఉన్న నిల్వలు మాత్రమే మార్కెట్కు తెస్తుండడంతో ఉల్లి ధర భారిగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు ఉల్లిపాయ ధరల నియంత్రణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమండ్ చేస్తున్నారు. మార్కెట్ను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని అందుకే రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయని పలువురు చెబుతున్నారు. తక్షణమే రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందుబాటు ధరల్లో ఉల్లిపాయలు, కాయగూరల విక్రయాలు చేపట్టాలని కోరుతున్నారు. -
సినీ దర్శకుడు పూరీ సందడి
నర్సీపట్నం: సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ రాకతో శనివారం సోదరుడు, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇంట్లో సందడి వాతా వరణం నెలకొంది. ఇక్కడ తల్లి సత్యవతి అలియాస్ అమ్మాజీని ఆలింగనం చేసుకుని సంతోషంలో మునిగి తేలారు. సోదరుడు ఉమాశంకర్ గణేష్, మరదలు కళావతి, కుటుంబ సభ్యు లు పూరీని చూసి ఆనందంతో పరవశించిపోయారు. కుటుంబ సభ్యులు అందరితో ఆయన ముచ్చటించారు. పూరీ రాకను తెలుసుకున్న అభిమానులు అధిక సంఖ్యలో గణేష్ ఇంటికి చేరుకున్నారు. అభిమానులందరితో ఆయన సెల్ఫీలు దిగారు. తన చిన్ననాటి స్నేహితులను చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ ఆనందంగా గడిపారు.చౌడువాడలో మెగా జాబ్మేళా రేపు అనకాపల్లి: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కె.కోటపాడు మండలం చౌడువాడ ప్రభుత్వ హైస్కూల్లో సోమవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సంస్థ అధికారి పి. రోహిణి తెలిపారు. ఈ మేళాలో 16 బహుళ జాతీయ సంస్థలు పాల్గొని నిరుద్యోగ యువతీ, యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చన్నా రు. మరిన్ని వివరాలకు 79811 02224 ఫోన్ నంబర్లో సంప్రదించాలని తెలిపారు. -
సీఎం పర్యటనలో విషాదం
● అస్వస్థతతో కాంట్రాక్ట్ స్వీపర్ వీరబాబు మృతి ● గోప్యంగా ఉంచిన అధికారులు, పోలీసులు సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో విషాద ఘటన చోటుచేసుకుంది. కె.కోటపాడు మండలం ఎ.కోడూరు గ్రామంలో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ స్వీపర్ దడాల వీరబాబు(45) అకస్మాత్తుగా మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సీఎం పర్యటన నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే జిల్లాలోని పలు సచివాలయాల్లో పనిచేస్తున్న స్వీపర్లను ఎ.కోడూరుకు విధుల నిమిత్తం తీసుకెళ్లారు. వీరబాబు కూడా ఈ నెల 20న అక్కడికి చేరుకుని పరిశుభ్రత పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన ఆయన శనివారం ఉదయం నుంచే తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్లు సహచరులు తెలిపారు. వెంటనే అతన్ని కె.కోటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సభ ముగిసిన అనంతరం ప్రాంగణాన్ని శుభ్రం చేసేందుకు వీరబాబు రాకపోవడంతో సహచరులు ఫోన్ చేయగా, ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. పాయకరావుపేట సచివాలయంలో కాంట్రాక్ట్ స్వీపర్గా పనిచేస్తున్న వీరబాబే కుటుంబానికి ఆధారం. ఆయనకు భార్యతో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై అధికారులు, పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
వరుణ దేవా.. కరుణించవా.!
● వెన్నలపాలెం మహిళల ఆలయప్రదక్షిణలు, పూజలు ● సాయంత్రం చిరుజల్లులు పడడంతో సర్వత్రా హర్షం నాతవరం: వరుణ దేవుడు కరుణ కోసం మర్రిపాలెం పంచాయతీ శివారు వెన్నలపాలెం గ్రామంలోని మహిళలు శనివారం ఆలయ ప్రదక్షిణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మహిళలు నిర్వహించిన ఈ పూజలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముందుగా తాండవ జంక్షన్లోని వినాయకుడి ఆలయాన్ని బిందెలతో నీళ్లు తీసుకువెళ్లి శుద్ధి చేశారు. అనంతరం గ్రామంలోని సీతారాముల ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, జీడితోటల్లో ఉన్న తలుపులమ్మ తల్లి ఆలయాన్ని కూడా నీటితో శుభ్రపరిచి, ఆలయాల చుట్టూ నీటి బిందెలతో ప్రదక్షిణలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా ఇంటి వద్ద నుంచి తీసుకువచ్చిన నీటితో శుభ్రం చేసి, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘ఎండ తీవ్రత తగ్గించి సకాలంలో వర్షాలు కురిపించాలి’అంటూ మహిళలు దేవుడిని ప్రార్థించారు. అనంతరం గ్రామ వీధుల్లో బిందెల్లో నీళ్లు తీసుకుని ఊరేగింపుగా తిరుగుతూ ఒకరిపై ఒకరు నీళ్లు పోసుకుంటూ సందడి చేశారు. ఆశ్చర్యకరంగా మధ్యాహ్నం తరువాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతూ సాయంత్రానికి చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ పూజల ఫలితంగా వర్షం కురిసిందని విశ్వాసం వ్యక్తం చేశారు. పూర్వకాలంలో వర్షాలు ఆలస్యమైనప్పుడు ఇదే విధంగా ఆలయాలను శుభ్రపరిచి, పూజలు నిర్వహించే సంప్రదాయం ఉందని గ్రామ పెద్దలు తెలిపారు. -
సీఎం గారూ.. మాకు ఒరిగిందేమిటి?
ధర్మకోనేరు సుందరీకరణ పనులను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబుసాక్షి, అనకాపల్లి/కె.కోటపాడు: అధికారం చేపట్టి రెండున్నరేళ్ల తరువాత కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో శనివారం జరిగిన సీఎం చంద్రబాబు పర్యటనతో స్థానిక ప్రజలకు, జిల్లా వాసులకు ఒరిగేందేమి లేదు. స్థానిక సమస్యల పరిష్కారంపై ఎటువంటి ప్రకటన లేదు. అభివృద్ధి పనులకు నిధులపై హామీ లేదు. ‘సీఎం గారూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లు ఎప్పుడు నెరవేరుస్తారు? మా రోడ్లు ఎప్పుడు బాగుపడతాయి? మా సమస్యలకు పరిష్కారం ఎప్పుడొస్తుంది?’అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులే బాధ్యులు : ప్రజల సమస్యలకు పరిష్కారం, అభివృద్ధి పనులపై స్పష్టమైన హామీ ఇవ్వడం కంటే ప్రభుత్వ శాఖల పనితీరుపై విమర్శలు చేయడానికే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ డిపార్ట్మెంట్ల పనితీరు సరిగా లేదంటూ అధికారులపై రుబాబు ప్రదర్శించారు. ప్రభుత్వమే తగిన నిధులు విడుదల చేయకపోతే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ఎలా అమలు చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిధుల కొరత, ప్రభుత్వ వైఫల్యాలను పక్కనపెట్టి అధికారుల పనితీరుపై నెపం మోపే ప్రయత్నం చేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. సూపర్ సిక్స్లో అరకొరగా అమలు చేసిన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, సీ్త్ర శక్తి పథకంలో లోపాలను అధికారులపై నెట్టే యత్నం చేశారు. అంతేకాకుండా వివిధ విభాగాల వారీగా జిల్లా అధికారుల పనితీరును బహిరంగ సభలో సీఎం ప్రశ్నించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, మైనింగ్ శాఖ, పురపాలక శాఖ అధికారుల పురోగతి బాలేదంటూ రుబాబు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను అధికారులపై రుద్దేందుకే ఈ సభ నిర్వహించినట్టుగా ఉందని జనం గుసగుసలాడుకోవడం కనిపించింది. రోడ్లు బాలేవంటూ నిరసన : సీఎం సభలో ప్రజల నుంచే అసంతృప్తి వ్యక్తమైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నుంచి రోడ్లు అద్దంలా మెరిసిపోతున్నాయంటూ చంద్రబాబు చెబుతూ.. అర్అండ్బీ, పంచాయతీ రాజ్ ఎస్ఈను పిలవగా.. రోడ్లు బాగోలేదంటూ పలువురు ప్రజలు చేతులూపుతూ నిరసన తెలిపారు. దీంతో రోడ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తే మీరు సరిగ్గా ఎందుకు వేయలేదంటూ ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ ఇంజినీర్లపై సీఎం రుసరుసలాడారు. ఒక వైపు ప్రజలు సమస్యలను గుర్తు చేస్తుంటే.. మరోవైపు చంద్రబాబు ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే సభలో నుంచి పలువురు వెళ్లిపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. గంట ఆలస్యంగా పర్యటన : సీఎం చంద్రబాబు పర్యటన గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఎ.కోడూరు చేరుకోవాల్సి ఉంది. పలు గ్రామాల నుంచి డ్వాక్రా మహిళలను ఎ.కోడూరుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఒక వైపు చిరుజల్లులు పడుతున్నా.. బయటకు వెళ్లకుండా వారిని సభలోనే బలవంతంగా నిలిపివేశారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభమైన కొద్ది సేపటికే మహిళలు, ప్రజలు వెనుదిరగడం ప్రారంభించారు. సీఎం ప్రసంగం పూర్తయినంత వరకూ ఉండాలని టీడీపీ నాయకులు కోరుతున్నా ఎవరూ వినిపించుకోకపోవడం విశేషం.ఎన్నికల హామీల ఊసెత్తకుండా ముగిసినచంద్రబాబు ఎ.కోడూరు పర్యటన ప్రభుత్వ వైఫల్యాలను అధికారులపై నెట్టే యత్నం సభలోనే రోడ్లు బాలేవంటూ చేతులూపి ప్రజల నిరసన ప్రసంగం మధ్యలోనే వెనుదిరిగిన జనాలుసీఎం చంద్రబాబు పర్యటన జిల్లా వాసులకు మళ్లీ నిరాశే మిగిల్చింది. కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’కార్యక్రమంలో ఎప్పటిలాగే చంద్రబాబు డాబూ..డూబూ అంటూ సాగింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లు కావస్తుండడంతో ఎన్నికలకు ముందు కె.కోటపాడు వేదికగా ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా సీఎం ఏమైనా ప్రకటన చేస్తారని, స్థానిక సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇస్తారని ఆశించిన ప్రజలకు భంగపాటే ఎదురైంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను అధికారులపై నెట్టే యత్నం చేయడంతో అంతా విస్తుపోయారు. -
పరదేశమ్మ విగ్రహానికి ప్రత్యామ్నాయం చూపాలి
అచ్యుతాపురం రూరల్: చోడపల్లి పంచాయితీ పరిధి లో గ్రామదేవత పరదేశమ్మ తల్లి విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాన్ని శనివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణలో భాగంగా విగ్రహాన్ని ప్రత్యామ్నాయ ప్రదేశానికి తరలించకుండా తొలగించేందుకు చర్యలు చేపట్టడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహానికి ముందుగా తగిన స్థలం కేటా యించి, కొత్తగా ప్రతిష్టాపన పూర్తి చేసిన అనంత రం ప్రస్తుత విగ్రహాన్ని తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అధికారులు చర్యలు చేపట్టాలని కోరా రు. ఈ ఆందోళనకు సీఐటీయూ మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాకి శంకర్, కాకి అవతారం, పోలవరపు పారునాయుడు, దమ్ము చండి, గెంజి రామకృష్ణ, పెంకి నరసింగరావు, గోవిందు, లోవరాజు, తదితరులు పాల్గొన్నారు.విగ్రహం తొలగింపును అడ్డుకున్న గ్రామస్తులు -
లాంఛనమేనా..?
ప్రైవేటీకరణ సీఐఎస్ఎఫ్ ఉపసంహరణతో విశాఖ ఉక్కులో కలవరం●జింక్ పరిశ్రమలోనూ తొలుత భద్రతా బలగాల తొలగింపు.. ఆ తర్వాతే మూత ●కూటమి వచ్చాక ప్లాంట్పై వరుసగా ప్రతికూల నిర్ణయాలు ●ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్న హామీలు ఏమయ్యాయంటున్న ఉద్యోగ సంఘాలు ●సెయిల్లో విలీనం చేయడమే పరిష్కారమని డిమాండ్ సాక్షి, విశాఖపట్నం/ఉక్కునగరం: ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ స్టీల్ప్లాంట్కు భద్రతా కవచంగా ఉన్న సీఐఎస్ఎఫ్ కూడా ఇక ఉండదా..? వేల ఎకరాల్లో విస్తరించి.. వేల కోట్ల విలువైన ఆస్తులు, అత్యంత కీలకమైన ఉత్పత్తి విభాగాలున్న ప్లాంట్ నుంచి కేంద్ర బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకోవడం దేనికి సంకేతం..? ‘ప్రైవేటీకరణ చేయం’ అని చెబుతున్న కేంద్రం.. ఒక్కో అడుగు వేస్తూ చివరకు ప్లాంట్ భద్రతనూ తొలగిస్తోందా..? సీఐఎస్ఎఫ్ ఉపసంహరణే ప్రైవేటీకరణకు ముందడుగుగా మారుతోందా..? తాజా పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. స్టీల్ప్లాంట్లోని సీఐఎస్ఎఫ్ యూనిట్ను పూర్తిగా ఖాళీ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. నవంబర్ 17 నాటికి మొత్తం బలగాలను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్లాంట్లో సుమారు 350 మంది సెక్యూరిటీ, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరందరినీ ఉపసంహరించనున్నారు. 2024 వరకు దాదాపు 1,500 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఉండగా.. రెండేళ్లుగా దశలవారీగా సంఖ్యను కుదిస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు మిగిలిన బలగాలనూ పూర్తిగా తొలగించేందుకు నిర్ణయించడం ఉద్యోగ, కార్మిక వర్గాల్లో ఆందోళనకు దారితీసింది. కూటమి వచ్చాక.. ఒక్కో అడుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్లాంట్ పరిస్థితులు మరింత దిగజారాయని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో విశాఖ ఉక్కును కాపాడతామని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చాక కేంద్రం నిర్ణయాలపై గట్టిగా నిలదీయడం లేదని విమర్శిస్తున్నాయి. ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని కేంద్రాన్ని ఒత్తిడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని ప్రైవేటు స్టీల్ పరిశ్రమకు గనుల కేటాయింపు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసిందని ఆరోపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ తీర్మానం చేయడం ద్వారా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకున్నామని.. అప్పట్లో కేంద్ర ఉక్కు మంత్రి సైతం ఈ విషయాన్ని ప్రకటించారని ఉద్యోగ సంఘాలు గుర్తుచేస్తున్నాయి. ముడిసరుకు కొరత.. ఉద్యోగుల కుదింపు 2024 సెప్టెంబర్లో వర్కింగ్ క్యాపిటల్, ముడిసరుకు కొరత తీవ్రరూపం దాల్చింది. కోకింగ్ కోల్ అందక బ్లాస్ట్ ఫర్నేస్–3 మూతపడటంతో ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 25 శాతానికి పడిపోయి నష్టాలు మరింత పెరిగాయి. 2024 అక్టోబర్ నుంచి 2025 జనవరి వరకు ఉత్పత్తి తగ్గిందన్న కారణంతో కార్మికులకు వేతనాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఉద్యోగుల సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా వీఆర్ఎస్ అమలు చేశారు. సుమారు 12,300 మంది ఉన్న శాశ్వత ఉద్యోగులను 2026 డిసెంబర్ నాటికి 8 వేలకు తగ్గించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. మరోవైపు వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడంతో మిగిలిన సిబ్బందిపై పనిభారం పెరిగిందని సంఘాలు చెబుతున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు 2025 జనవరిలో కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించినా.. అందులో ఎక్కువ మొత్తం పాత బకాయిలు, రుణాల చెల్లింపులకే వెళ్లిందని.. ప్లాంట్ అభివృద్ధికి పెద్దగా ఉపయోగపడలేదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. కీలక విభాగాలు ప్రైవేటు బాటలో.. 2025 ఆగస్టులో ప్లాంట్లోని 44 కీలక విభాగాలను ప్రైవేటుపరం చేసేందుకు ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం టెండర్లు పిలిచింది. రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, కోక్ ఒవెన్, సింటర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నేస్ వంటి కీలక విభాగాలు ఇందులో ఉండటంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అదే ఏడాది ఉద్యోగులపై సీఎం చంద్రబాబు చేసిన ‘వైట్ ఎలిఫెంట్స్’ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. పని చేయని ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వాలన్న ఆయన వ్యాఖ్యలను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. భద్రతా కవచానికీ కోత నిర్వహణ వ్యయాన్ని తగ్గించే చర్యలతో ప్లాంట్లో భద్రతా ప్రమాణాలు దెబ్బతిన్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. 2025 డిసెంబర్లో ఫ్యాక్టరీల శాఖ తనిఖీల్లో 645 భద్రతా లోపాలను గుర్తించి నోటీసులు ఇచ్చిందని చెబుతున్నాయి. 2026 జనవరిలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తగ్గింపు ప్రక్రియ మొదలైంది. సెక్యూరిటీ, ఫైర్ విభాగాల నుంచి సుమారు 400 మందిని తగ్గించి.. వారి స్థానంలో ఏపీ స్పెషల్ ఫోర్స్ సిబ్బందిని నియమించారు. తాజాగా మిగిలిన సీఐఎస్ఎఫ్ సిబ్బందినీ పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే సమయంలో అనుభవజ్ఞులైన కాంట్రాక్టు సిబ్బందిని తొలగించి కొత్త సిబ్బందితో కీలక విభాగాల్లో పనులు చేయించారని సంఘాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026 జూన్ 8న ఎస్ఎంఎస్–2 విభాగంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందడం భద్రతా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. రూ.8,097 కోట్ల సాయం ఎక్కడ? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్లాంట్కు అదనంగా రూ.8,097 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ 2026 మేలో సిఫార్సు చేసినా.. ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై తగిన ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని విమర్శిస్తున్నాయి. ఇక 2026 జూలైలో రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన స్టీల్ కొనుగోళ్లలో విశాఖ ఉక్కుకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రైవేటు సంస్థ నుంచి కొనుగోలుకు సీఆర్డీఏ అనుమతులు ఇచ్చిందని ఆరోపిస్తున్నాయి. ఆ ఆర్డర్ను స్టీల్ప్లాంట్కు ఇచ్చి ఉంటే కొంత ఆర్థిక ఊరట లభించేదని పేర్కొంటున్నాయి.జింక్ పరిశ్రమలోనూ ఇదే దారి విశాఖలోని హిందూస్థాన్ జింక్ పరిశ్రమ పరిణామాలను ఉద్యోగ సంఘాలు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాయి. తొలుత ముడిసరుకు రవాణా భారం పెరగడం.. నష్టాలు రావడం.. ఆ తర్వాత సీఐఎస్ఎఫ్ భద్రతను ఉపసంహరించడం.. అనంతరం ప్రైవేటీకరణ.. చివరకు ముడిసరుకు వ్యయం భారంగా మారడంతో 2012లో పరిశ్రమ శాశ్వతంగా మూతపడిందని చెబుతున్నాయి. ఇప్పుడు విశాఖ ఉక్కులోనూ ముడిసరుకు కొరత, ఆర్థిక సంక్షోభం, ఉద్యోగుల సంఖ్య కుదింపు, కీలక విభాగాల ప్రైవేటీకరణ, భద్రతా బలగాల ఉపసంహరణ వంటి పరిణామాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జింక్ పరిశ్రమ బాటలోనే స్టీల్ప్లాంట్నూ నడిపిస్తున్నారా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.


