రూ.100 కోట్లు విలువ చేసే దేవదాయ భూమిని ప్రైవేటు వ్యక్తులకు
అప్పగించడం దారుణం
అనకాపల్లిలో కన్యకాపరమేశ్వరి
దేవస్థానం భూములపై కూటమి నేతల కన్ను
హిందూ ధర్మం అంటే దేవుడి
భూములను దోచుకోవడమేనా?
ఆ భూముల పరిరక్షణకు
న్యాయపోరాటం చేయడానికి సిద్ధం
ఆలయ స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రులు గుడివాడ, బూడి ముత్యాలనాయుడు
కలెక్టర్ అక్రమాలపై
అనకాపల్లి: దేవదాయ శాఖ అధికారుల ప్రమోయం లేకుండా అనకాపల్లి జిల్లా నడిబొడ్డున ఉన్న వంద కోట్ల విలువైన కన్యకాపరమేశ్వరి ఆలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ నిర్ణయంపై సీబీఐ విచారణ చేయాలంటూ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. మంగళవారం అనకాపల్లి టౌన్లో కన్యకాపరమేశ్వరి దేవస్థానం భూములను వైఎస్సార్ సీపీ నేతలు పరిశీలించారు. అంతకు ముందు స్థానిక రింగ్రోడ్డులో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి దేవస్థానం భూముల వరకూ నిర్వహించిన ర్యాలీలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి పార్లమెంట్, నియోజకవర్గ సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్, మలసాల భరత్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, చింతలపూడి వెంకట్రామయ్య, మాజీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ 111 ఏళ్ల క్రితం (1915లో) దూరి కామమ్మ అనే మహిళ బ్రాహ్మణ సత్రం కోసం 2.49 ఎకరాల భూమిని దానమిచ్చిన భూమి దేవదాయ శాఖది కాదని, ప్రైవేటు వ్యక్తులదని కలెక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చారని మండిపడ్డారు. దేవదాయ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే అధికారం కలెక్టర్కు లేదని, కేవలం ఎండోమెంట్ కమిషనర్ అనుమతితోనే ఏదైనా జరగాలని గుర్తు చేశారు. కానీ ఆగమేఘాలమీద కూటమి ప్రభుత్వం రాగానే కేవలం రెండు వారాల్లోనే తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు చేరడం వెనుక భారీ కుంభకోణం ఉందని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఒకవైపు హిందుత్వం గురించి, మతం, ఆలయాల గురించి కూటమి ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతూనే మరోవైపు భారీ ఎత్తున దేవుడి భూములు కై ంకర్యం అవుతున్నాయన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ గా వచ్చి దాదాపు 20 నెలలు పూర్తవుతున్నాయి... జిల్లా అభివృద్ధిపై మీ మార్కు ఎక్కడా కనబడలేదంటూ మండిపడ్డారు. పేదల సమస్యల మీద స్పందించడానికి టైం లేని ఈ జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వని ఈ కలెక్టర్ నాలుగు గోడల మధ్య ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డాన్ని వైఎస్సార్సీపీ చూస్తూ ఉపేక్షించదన్నారు. ఆమె చేసిన ప్రతి రెవెన్యూ నిర్ణయం మీద సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలా జరగని పక్షంలో న్యాయపోరాటం తధ్యమని హెచ్చరించారు.
అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ మాట్లాడుతూ రూ.కోట్లాది విలువ చేసే కన్యకా పరమేశ్వరి దేవస్థానం భూమిని కాపాడవలసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ 1915లో బ్రాహ్మణులకు సత్రంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన భూమి యాజమాని డి.కామమ్మ ఆత్మకు శాంతి లేకుండా కూటమి ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కాసుల కళకళ అంటూ రెవెన్యూ అధికారులు చెవులు కొరుక్కుంటున్నారన్నారు. ఒక రాజకీయ నాయకుడి ప్రోత్సాహంతోనే దేవస్థానం భూమిని కాజేయాలని ప్రణాళికలు వేసినట్టు తెలుస్తోందన్నారు.
కార్యక్రమంలో పార్లమెంట్, నియోజకవర్గ సమన్యయకర్తలు బొడ్డేడ ప్రసాద్, కంబాల జోగులు, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, మాజీ ఎంపీ సత్యవతి, రాష్ట్ర కార్యదర్శి దిలీప్కుమార్, పట్టణ పార్టీ, మండలపార్టీ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, పెదిశెట్టి గోవింద్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్,, కశింకోట మండలపార్టీ అధ్యక్షుడు మలసాల కిషోర్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్రాజా, జిల్లా సీనియర్ నాయకుడు మళ్ల బుల్లిబాబు, కశింకోట ఎంపీపీ కలగ లక్ష్మిగున్నయ్యనాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు, 80,81, వార్డు ఇన్ఛార్జ్లు కె.ఎం.నాయుడు, బోడ్డేడ శివ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచన సుజాత, వివిధ అనుబంధ విభాగం నాయకులు పాల్గొన్నారు.


