Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock market updates on December 3rd 20251
Stock Market Updates: నష్టాల్లో కదులుతున్న సూచీలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 90.35 పాయింట్లు తగ్గి 25,941.85 కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 241.18 పాయింట్లు నష్టపోయి 84,897.09 వద్ద ట్రేడవుతోంది.హెచ్‌యూఎల్, టైటాన్, టాటా మోటార్స్ పీవీ, ఎన్టీపీసీ, బీఈఎల్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, కోటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకీ, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, ఐటీసీ నేతృత్వంలోని 30 సెన్సెక్స్ స్టాక్స్ ఈ రోజు నష్టాల్లో ఉన్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎటర్నల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, టెక్ ఎం, అదానీ పోర్ట్స్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాయి.రంగాలవారీగా నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.02 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.08 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా సూచీలు వరుసగా 0.7 శాతం, 0.3 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Nirmala Sitharaman calls for coordinated global effort2
క్రిప్టో తరహా ఆర్థిక ఉత్పత్తులతో సవాళ్లు

ఆర్థిక వ్యవస్థలు డిజటల్‌గా మారుతుండడం, క్రిప్టో, స్టెబుల్‌ కాయిన్లు తరహా కొత్త ఆర్థిక ఉత్పత్తులు పుట్టుకొస్తుండడంతో.. వీటి కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.లబ్ధిదారుల వివరాలు, పన్నుల సమాచారాన్ని సకాలంలో పంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఇందుకోసం కృత్రిమ మేథ (ఏఐ) వంటి సాధనాలను వినియోగించుకోవాలని, దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. ఇందుకు వీలుగా అంతర్జాతీయ ఫోరమ్‌ కోసం మంత్రి సీతారామన్‌ పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రమాణాలను మరింత బలోపేతం చేయడంతోపాటు పంచుకున్న సమాచారం ఆధారంగా ఫలితాలు సాధించేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు.ఢిల్లీలో మంగళవారం 18వ గ్లోబల్‌ ఫోరమ్‌ ప్లీనరీ సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి సీతారామన్‌ మాట్లాడారు. ఏ ఒక్క దేశం తనంతట తాను ఈ సవాళ్లను పరిష్కరించలేదన్నారు. సహకారం, విశ్వాసం, సకాలంలో సరైన సమాచారం పంచుకోవడం అవసమరన్నారు. స్పష్టమైన నిబంధనల మేరకు నడుచుకుంటే పన్నుల్లో పారదర్శకత, కచ్చితత్వం ఉంటుందన్నారు.గడిచిన దశాబ్ద కాలంలో దేశంలో స్వచ్చంద నిబంధనల అమలు మెరుగుపడినట్టు మంత్రి చెప్పారు. సకాలంలో సమాచారాన్ని గుర్తించేందుకు ఏఐ తరహా టెక్నాలజీలు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆవిష్కరణలు అన్నవి జవాబుదారీగా ఉండాలంటూ.. ఇవి వ్యవస్థలకు బలాన్ని, విశ్వసనీయతను తెచ్చిపెట్టే విధంగా ఉండాలన్నారు. రహస్య సమాచారం.. డేటా గోప్యతకు సంబంధించి బలమైన వ్యవస్థల దిశగా దేశాలు కలసి పనిచేయాలని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అరవింద్‌ శ్రీవాస్తవ పిలుపునిచ్చాన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పంచుకునే సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించు కోవాలన్నారు.

IndiGo Faces Rs 117 Crore Penalty on Input Tax Credit3
ఇండిగో సంస్థకు భారీ జరిమానా

విమానయాన సంస్థ ఇండిగోకు జీఎ‍స్టీ అధికారులు భారీ జరిమానా విధించారు. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌కు సంబంధించి కేరళలోని సీజీఎస్టీ కొచ్చి కమిషనరేట్లోని సెంట్రల్ టాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ రూ .117.52 కోట్ల జరిమానా విధించారని, దీన్ని సవాలు చేస్తామని ఇండిగో తెలిపింది.ఇండిగో రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. జరిమానా 2018-19 నుంచి 2021-22 మధ్య కాలానికి సంబంధించి కంపెనీ పొందిన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి)ను డిపార్ట్మెంట్ తిరస్కరించింది. దీంతో జరిమానాతో సహా డిమాండ్ ఆర్డర్ జారీ చేసింది. ‘అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు తప్పుగా ఉన్నాయని కంపెనీ నమ్ముతోంది. అలాగే బాహ్య పన్ను సలహాదారుల సహాయంతో కేసుపై బలం తమ వైపే ఉంటుందని కంపెనీ విశ్వసిస్తోంది’ అని ఇండిగో ఫైలింగ్‌లో పేర్కొంది.పన్ను అధికారులు ఇచ్చిన జరిమానా నోటీసును తగిన అధికారుల ముందు సవాలు చేస్తామని తెలిపిన ఇండిగో యాజమాన్యం.. దీని వల్ల తమ ఆర్థిక పరిస్థితులు, నిర్వహణ లేదా ఇతర కార్యకలాపాలపై పెద్ద ప్రభావమేమీ ఉండదని వివరించింది.ఏమిటీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌?ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అనేది వ్యాపార సంస్థలు ఇన్‌పుట్లపై చెల్లించిన పన్నులకు క్రెడిట్ క్లెయిమ్ చేయడం ద్వారా పన్ను బాధ్యతను తగ్గించుకునేందుకు అనుమతించే జీఎస్టీ కింద ఒక యంత్రాంగం. ఈ అర్హతను ఆయా వ్యాపార సంస్థలు పొందాయా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలిస్తారు. ఒకే వేళ వ్యత్యాసాలు గుర్తిస్తే ఆ ట్యాక్స్‌ క్రెడిట్‌ను జరిమానాతో సహా తిరిగి వసూలు చేస్తారు.

Reliance completes merger of Star Tv with Jiostar4
రిలయన్స్‌లో కీలక విలీనం పూర్తి

జియోస్టార్‌తో అనుబంధ సంస్థ స్టార్‌ టెలివిజన్‌ ప్రొడక్షన్స్‌ లిమిటెడ్‌(ఎస్‌టీపీఎల్‌) విలీనాన్ని పూర్తిచేసినట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా వెల్లడించింది. స్టార్‌ బ్రాండ్‌తోపాటు.. గ్రూప్‌ కంపెనీలకు లైసెన్సులను ఎస్‌టీపీఎల్‌ కలిగి ఉంది. స్టార్‌ ఇండియాతో ఎస్‌టీపీఎల్‌ విలీనం(ప్రస్తుతం జియోస్టార్‌ ఇండియా)పై 2024 నవంబర్‌ 14న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.జియోస్టార్‌ సైతం రిలయన్స్‌కు అనుబంధ కంపెనీకాగా.. 2025 నవంబర్‌ 30 నుంచి జియోస్టార్‌లో ఎస్‌టీపీఎల్‌ విలీనం అమల్లోకి వచ్చినట్లు తెలియజేసింది. నిజానికి రిలయన్స్‌ మీడియా బిజినెస్, గ్లోబల్‌ మీడియా దిగ్గజం వాల్ట్‌ డిస్నీ దేశీ బిజినెస్‌ మధ్య భాగస్వామ్య కంపెనీగా 2024 నవంబర్‌లో జియోస్టార్‌ అవతరించింది. వెరసి సంయుక్త సంస్థ విలువ 8.5 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.దీంతో దేశీయంగా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజ ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తున్న కంపెనీ జూలై–సెపె్టంబర్‌ త్రైమాసికంలో రూ. 7,232 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 1,322 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ జియోసినిమా, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ కలయికతో జియో హాట్‌స్టార్‌ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.

IPO alert SEBI green signal for 4 companies5
ఐపీవోకు 4 కంపెనీలు రెడీ.. రూ. 10,000 కోట్లకు సై!

తాజాగా సెకండరీ మార్కెట్లు కొత్త గరిష్టాల రికార్డ్‌ను సాధించగా.. ప్రైమరీ మార్కెట్లు సైతం ఈ కేలండర్‌ ఏడాది(2025) సరికొత్త రికార్డులవైపు పరుగెడుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది 96 కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు సమకూర్చుకోవడం ద్వారా స్టాక్‌ ఎక్ఛ్సేంజీలలో లిస్టయ్యాయి. గత మూడు నెలల్లోనే 40 కంపెనీలకుపైగా ఐపీవోకు రావడం విశేషం! ఇంతక్రితం 2024లో 94 కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు సమీకరించి రికార్డ్‌ నెలకొల్పాయి. కాగా.. తాజాగా మరో 4 కంపెనీలు నిధుల సమీకరణకు సిద్ధపడనున్నాయి. వివరాలు చూద్దాం..ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిది. దీంతో రూ. 10,000 కోట్ల సమీకరణ ద్వారా దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు వీలు చిక్కింది.ఈ బాటలో మరో మూడు కంపెనీల ముసాయిదా ప్రాస్పెక్టస్‌లకు సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. జాబితాలో పవరికా లిమిటెడ్, టెక్నోక్రాఫ్ట్‌ వెంచర్స్, అన్ను ప్రాజెక్ట్స్‌ చేరాయి. పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు అనుమతించమంటూ ఈ కంపెనీలు సెబీకి 2025 జూలై– సెప్టెంబర్‌ మధ్య కాలంలో ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. తాజాగా అనుమతులు పొందాయి. ఈ నెలలోనే ఆఫర్‌ ప్రస్తుతం కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ ఈ నెలలోనే పబ్లిక్‌ ఇష్యూకి రానున్నట్లు తెలుస్తోంది. తద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం సంస్థలో ఐసీఐసీఐ బ్యాంక్‌ వాటా 51 శాతంకాగా.. ప్రుడెన్షియల్‌ కార్పొరేషన్‌ 49 శాతం వాటా కలిగి ఉంది.ఇష్యూలో భాగంగా 1.76 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్‌ సంస్థ ప్రుడెన్షియల్‌ కార్పొరేషన్‌ హోల్డింగ్స్‌(యూకే) ఆఫర్‌ చేయనుంది. దీంతో ఐపీవో నిధులు ప్రుడెన్షియల్‌ కార్పొరేషన్‌(ప్రమోటర్‌)కు చేరనున్నాయి. దేశీయంగా ఇప్పటికే నాలుగు అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాయి. లిస్టెడ్‌ ఏఎంసీలు.. హెచ్‌డీఎఫ్‌సీ, యూటీఐ, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్, శ్రీరామ్, నిప్పన్‌ లైఫ్‌ జాబితాలో ఐదో కంపెనీగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ చేరనుంది.పవర్‌ సొల్యూషన్స్‌.. పవర్‌ సొల్యూషన్స్‌ సమకూర్చే పవరికా లిమిటెడ్‌ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 700 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,400 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 525 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు మరికొన్ని నిధులు కేటాయించనుంది.వృథా నీటి సొల్యూషన్లు వ్యర్థ జలాల ట్రీట్‌మెంట్‌ సొల్యూషన్లు అందించే టెక్నోక్రాఫ్ట్‌ వెంచర్స్‌ ఐపీవోకు వస్తోంది. దీనిలో భాగంగా 95.05 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 23.76 లక్షల షేర్లను ప్రమోటర్‌ సంస్థ కార్తకేయ కన్‌స్ట్రక్షన్స్‌ విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 138 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూషన్‌లో ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూషన్‌లో సేవలందిస్తున్న అన్ను ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా ఐపీవో చేపట్టనుంది. 2003లో అన్ను ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్ట్‌(ఇండియా) ప్రయివేట్‌ లిమిటెడ్‌గా ఏర్పాటైన కంపెనీ తదుపరి అన్ను ప్రాజెక్ట్స్‌గా అవతరించింది. మౌలిక రంగ సంబంధ డిజైన్, డెవలప్‌మెంట్, అభివృద్ధి, నిర్వహణ తదితర సరీ్వసులు సమకూర్చుతోంది.వేక్‌ఫిట్‌ @ రూ. 185–195 హోమ్, ఫర్నిషింగ్స్‌ కంపెనీ వేక్‌ఫిట్‌ ఇన్నోవేషన్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 185–195 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 8న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 377 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 912 కోట్ల విలువైన 4.67 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లతోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,289 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూ 10న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఈ నెల 5న షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఇష్యూ తదుపరి ప్రమోటర్ల వాటా 43.7 శాతం నుంచి 37 శాతానికి దిగిరానున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రామలింగెగౌడ వెల్లడించారు. ఈ నెల 15కల్లా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. కంపెనీ విలువ రూ. 6,400 కోట్లుగా నమోదయ్యే వీలుంది.నిధుల వినియోగమిలా ఈక్విటీ జారీ నిధులలో రూ. 31 కోట్లు కొత్తగా 117 కోకో రెగ్యులర్‌ స్టోర్ల ఏర్పాటుకు, రూ. 15 కోట్లు మెషీనరీ తదితర కొనుగోళ్లకు, రూ. 161 కోట్లు లీజ్, సబ్‌లీజ్‌ అద్దెలుసహా ప్రస్తుత స్టోర్ల లైసెన్స్‌ ఫీజు చెల్లింపులకు వినియోగించనున్నట్లు వేక్‌ఫిట్‌ పేర్కొంది. మరో రూ. 108 కోట్లు మార్కెటింగ్, ప్రకటనలకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. ప్రస్తుతం 130 స్టోర్లను నిర్వహిస్తున్న కంపెనీ వార్షికంగా 25–45 స్టోర్లను జత చేసుకునే ప్రణాళికలు అమలు చేయనుంది.2016లో ఏర్పాటైన కంపెనీ హోమ్, ఫర్నిషింగ్‌ మార్కెట్లో దేశీయంగా వేగవంత వృద్ధిని సాధిస్తోంది. 2024 మార్చి31కల్లా రూ. 1,000 కోట్లుపైగా ఆదాయం అందుకుంది. 2025 సెప్టెంబర్‌30కల్లా 6 నెలల్లో రూ. 724 కోట్ల టర్నోవర్, రూ. 35 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ సొంత చానళ్లు, కోకో స్టోర్లతోపాటు.. ఇతర ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లు, మల్టీబ్రాండ్‌ ఔట్‌లెట్ల ద్వారా విభిన్న ఫర్నీచర్, ఫర్నిషింగ్స్‌ ప్రొడక్టులను విక్రయిస్తోంది. బెంగళూరు(కర్ణాటక), హోసూర్‌(తమిళనాడు), సోనిపట్‌(హర్యానా)లలో రెండేసి చొప్పున తయారీ యూనిట్లను కలిగి ఉంది.

Wipro acquires Harman digital transformation solutions unit for 375 million6
విప్రో చేతికి హర్మన్‌ డిజిటల్‌

న్యూఢిల్లీ: ఐటీ సర్విసుల దేశీ దిగ్గజం విప్రో తాజాగా హర్మన్‌కు చెందిన డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సొల్యూషన్స్‌(డీటీఎస్‌) బిజినెస్‌ కొనుగోలుని పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఇందుకు రూ. 3,270 కోట్లు వెచ్చించింది. 2025 ఆగస్ట్‌ 21న డీటీఎస్‌ను సొంతం చేసుకోనున్నట్లు విప్రో ప్రకటించింది. డీల్‌ను విజయవంతంగా ముగించడంతో తమ ఇంజినీరింగ్‌ గ్లోబల్‌ బిజినెస్‌లో విభాగంగా డీటీఎస్‌ పనిచేయనున్నట్లు విప్రో తెలియజేసింది.డీటీఎస్‌ కొనుగోలు ద్వారా అడ్వాన్స్‌ ఏఐ సామర్థ్యాలు, ఇంజినీరింగ్‌ ఇన్నోవేషన్, ఆర్‌అండ్‌డీ నైపుణ్యాల పెంపుపై కంపెనీ కట్టుబాటులో మరో మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది. డీటీఎస్‌లో 100 % వాటా కొనుగోలుకి విప్రో.. దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్‌కు చెందిన హర్మన్‌తో ఆగస్ట్‌లో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement