Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock market updates on 22nd April 2026 - IT shares fall1
నష్టాల్లో స్టాక్ మార్కెట్‌.. ఐటీ షేర్లు విలవిల

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. మంగళవారం అమెరికా, ఇరాన్ మధ్య కుదురుతుందనుకున్న ఒప్పందం విఫలం కావడంతో భౌగోళిక రాజకీయ పరిస్థితులపై మదుపర్లలో ఆందోళన చెలరేగింది. దీంతో భారతీయ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ పడిపోయాయి.ఈరోజు ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 150 పాయింట్లు పడిపోయి 24,426 వద్ద, సెన్సెక్స్‌(Sensex) 591 పాయింట్లు క్షీణించి 78,681 వద్ద ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్ లో హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ట్రెంట్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ఉన్నాయి.విస్తృత మార్కెట్లు మిశ్రమ గమనికతో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.20 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.30 శాతం నష్టపోయాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ అత్యంత క్షీణించింది. నిఫ్టీ హెల్త్‌కేర్, నిఫ్టీ ఫార్మా కూడా తక్కువ పనితీరు కనబరిచాయి. ఇదిలా ఉండగా, నిఫ్టీ కన్స్ట్రక్షన్ డ్యూరబుల్, నిఫ్టీ మెటల్ మెరుగైన పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Crude oil prices fall amid hopes for US-Iran peace talks2
అమెరికా–ఇరాన్‌ డీల్‌పై ఆశలతో...

ముంబై: అమెరికా–ఇరాన్‌ల మధ్య శాంతి చర్చల పురోగతిపై ఆశలతో పాటు క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 95 డాలర్ల కిందకి దిగిరావడంతో మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఒక శాతం లాభపడింది. సెన్సెక్స్‌ 753 పాయింట్లు పెరిగి 79,273 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 212 పాయింట్లు బలపడి 24,577 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.క్యాపిటల్‌ గూడ్స్‌ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్‌ ఆద్యంతం స్థిరమైన లాభాలతో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 847 పాయింట్లు పెరిగి 79,367 వద్ద, నిఫ్టీ 237 పాయింట్లు ఎగసి 24,602 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. సూచీలు ఒక శాతానికి పైగా ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ.3 లక్షల కోట్లు పెరిగి రూ.469 లక్షల కోట్లకు చేరింది. ⇒ ఆసియాలో దక్షిణ కొరియా (2.65%), తైవాన్‌ (1.72%), జపాన్‌(1%), హాంగ్‌కాంగ్‌(0.48%), సింగపూర్‌ (0.22%), చైనా (0.07%) లాభపడ్డాయి. యూరప్‌లో ఫ్రాన్స్‌ (–0.40%), బ్రిటన్‌ (–0.50%) మార్కెట్లు నష్టపోగా, అయితే జర్మన్‌ (0.10%) పెరిగింది. అమెరికా స్టాక్‌ సూచీలు స్వల్పలాభాలతో ట్రేడవుతున్నాయి. ⇒ రంగాల వారీగా బీఎస్‌ఈ ఇండెక్సుల్లో ఎఫ్‌ఎంసీజీ (2.23%), రియల్టీ (2.17%), ప్రైవేటు బ్యాంకులు (1.71%), ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (1.32%), టెలికమ్యూనికేషన్‌ (1.14%), పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ (1%) పెరిగాయి. మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు వరుసగా 0.79%, 0.29 శాతం లాభపడ్డాయి. ⇒ మార్చి త్రైమాసిక నికర లాభం 19% వృద్ధితో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 8% పెరిగి రూ.979 వద్ద స్థిరపడింది. 28 పైసలు క్షీణించిన రూపాయి డాలర్‌ మారకంలో రూపాయి విలువ 28 పైసలు బలహీనపడి 93.44 వద్ద ముగిసింది. పశ్చి మాసియా శాంతి చర్చలపై అనిశ్చితి, క్రూడ్‌ ధరల్లో ఒడిదుడుకులు వంటివి రూపాయిపై ఒత్తిడి పెంచాయి. నాన్‌–డెలివరబుల్‌ ఫార్వర్డ్‌(ఎన్‌డీఎఫ్‌) మార్కెట్లలో స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌పై ఆర్‌బీఐ నియంత్రణలను సడలింపు నిర్ణయమూ దేశీయ కరెన్సీపై ప్రభావం చూపిందని నిపుణులు తెలిపారు.

Nestle India Q4 earnings: Net profit rises 27 Percentage to Rs 1111 crore3
నెస్లే ఇండియా లాభం సన్‌రైజ్‌

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా గతేడాది(2025–26) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 27 శాతం జంప్‌చేసి రూ. 1,111 కోట్లకు చేరింది. ఇందుకు దేశీ ఆదాయం పుంజుకోవడం సహకరించింది. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో రూ. 873 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇతర ఆదాయంతో కలసి మొత్తం ఆదాయం సైతం 23 శాతం ఎగసి రూ. 6,766 కోట్లను అధిగమించింది.రికార్డ్‌ డేట్‌ జూలై 10...వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది. ఇందుకు జూలై 10 రికార్డ్‌ డేట్‌గా ప్రకటించింది. నెస్కఫే సన్‌రైజ్, మ్యాగీ నూడుల్స్, కిట్‌కాట్‌ తదితర ప్రొడక్టుల దేశీ విక్రయాలు 23 శాతంపైగా బలపడి రూ. 6,445 కోట్లను తాకాయి. ఇవి కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. మొత్తం వ్యయాలు 21 శాతం పెరిగి రూ. 5,217 కోట్లను దాటాయి. ప్రకటనల వ్యయాలు 50 శాతం పెరిగినప్పటికీ దేశీ అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ మనీష్‌ తివారీ పేర్కొన్నారు.దీంతో నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు పటిష్టస్థాయిలో 26 శాతందాటి నమోదైనట్లు వెల్లడించారు. ఎగుమతుల ఆదాయం మరింత అధికంగా 31 శాతం జంప్‌చేసి రూ. 249 కోట్లకు చేరింది. కాగా.. పూర్తి ఏడాదికి నెస్లే ఇండియా నికర లాభం 9 శాతం మెరుగుపడి రూ. 3,499 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 14 శాతంపైగా బలపడి రూ. 23,195 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు 7% జంప్‌చేసి రూ. 1,379 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1,395 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది.

HCLTech Q4 Results: Profit climbs 4 Percentage to Rs 4488 crore4
హెచ్‌సీఎల్‌ టెక్‌ ఓకే

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 4 శాతం వృద్ధితో రూ. 4,488 కోట్లను తాకింది. ఇందుకు ఏఐ ఆధారిత సర్వీసులు పుంజుకోవడం దోహదపడింది. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో రూ. 4,307 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 33,981 కోట్లకు చేరింది.అంతక్రితం క్యూ4లో రూ. 30,246 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. త్రైమాసికవారీగా నికర లాభం 10 శాతం మెరుగుపడగా, ఆదాయం నామమాత్ర వృద్ధిని అందుకుంది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 24 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. ఇందుకు మే 4 రికార్డ్‌ డేట్‌గా ప్రకటించింది. 1–4 శాతం వృద్ధి అత్యంత అనిశ్చిత డిమాండ్‌ వాతావరణంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27)లో ఆదాయం 1–4 శాతం మధ్య వృద్ధి చూపగలదని హెచ్‌సీఎల్‌ టెక్‌ తాజా అంచనాలు(గైడెన్స్‌) ప్రకటించింది. టారిఫ్‌ల ప్రభావం, విచక్షణాధారిత వ్యయాలు తగ్గడంతోపాటు ఇద్దరు క్లయింట్ల నుంచి కాంట్రాక్టులలో సమస్యలు వంటి అంశాలు ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది. పూర్తి ఏడాదికి డీలా మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హెచ్‌సీఎల్‌ టెక్‌ నికర లాభం 4% నీరసించి రూ. 16,642 కోట్లను తాకింది. 2024–25లో రూ. 17,390 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం పుంజుకుని రూ. 1,30,144 కోట్లకు చేరింది. గతేడాది అనిశ్చిత పరిస్థితులు డిమాండ్‌పై ప్రభావం చూపినట్లు కంపెనీ సీఈవో, ఎండీ సి.విజయకుమార్‌ వెల్లడించారు.కొన్ని బిజినెస్‌ విభాగాలు నెమ్మదించడంతో పనితీరులో అంచనాలను అందుకోలేకపోయామని తెలియజేశారు. ఇందుకు క్లయింట్ల విచక్షణాధారిత వ్యయాలు తగ్గడం, నిర్ణయాలలో ఆలస్యం కారణమైనట్లు పేర్కొన్నారు. క్యూ4లో అడ్వాన్స్‌డ్‌ ఏఐ ఆదాయం 15.5 కోట్ల డాలర్లను తాకినట్లు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం (2026–27)లో ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా వి లువను సృష్టించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. మార్కెట్లు ముగిశాక ఫలితాలు ప్రకటించింది. కంపెనీ షేరు 1% లాభంతో రూ.1,442 వద్ద ముగిసింది.ఇతర విశేషాలు...⇒ ఏఐ ప్రభావంతో 10 కోట్ల డాలర్ల విలువైన డీల్‌ను 8 కోట్ల డాలర్లకే కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఏఐతో ఆదాయం పుంజుకోనున్నట్లు భావిస్తోంది. ⇒ క్యూ4లో 193.6 కోట్ల డాలర్ల విలువైన కొత్త డీల్స్‌ కుదుర్చుకుంది. పూర్తి ఏడాదికి 932.3 కోట్ల డాలర్లకు మొత్తం కాంట్రాక్టుల విలువ చేరింది. ⇒ నికరంగా 802 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,27,181ను తాకింది. క్యూ4లో 1,712 మంది ఫ్రెషర్స్‌కు చోటిచ్చింది. దీంతో ఈ సంఖ్య గతేడాదికి 11,744కు చేరింది. ⇒ పశ్చిమాసియా ప్రభావం తక్కువేనని ఆదాయంలో ఈ ప్రాంత వాటా 1 శాతమేనని కంపెనీ వెల్లడించింది.

How Rich Is Tim Cook Inside His Apple Salary Bonuses and Net Worth5
యాపిల్‌ సీఈఓ.. టిమ్ కుక్ సంపద ఎంతో తెలుసా?

ప్రపంచ టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలిచిన యాపిల్ కంపెనీ ఇటీవల ఒక కీలక ప్రకటన చేసింది. 2026 సెప్టెంబర్‌లో ప్రస్తుత సీఈఓ 'టిమ్ కుక్' తన పదవి నుంచి వైదొలగి.. బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.టిమ్ కుక్ 1998లో యాపిల్‌లో చేరి.. కంపెనీ సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఎదిగారు. స్టీవ్ జాబ్స్ ఆరోగ్య కారణాల వల్ల తప్పుకున్న తర్వాత, 2011లో ఆయన కంపెనీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి యాపిల్ సంస్థను ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థలలో ఒకటిగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు.టిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ విలువ సుమారు 4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అలాగే ఐఫోన్ తయారీకి అవసరమైన ఉత్పత్తి కేంద్రాలను చైనాలో విస్తరించడం ద్వారా గ్లోబల్ సరఫరా వ్యవస్థను బలపరిచారు. ఫాక్స్‌కాన్ వంటి కంపెనీలతో భాగస్వామ్యం యాపిల్ విజయానికి ప్రధాన కారణమైంది.టిమ్ కుక్ సంపద - ఆదాయంటిమ్ కుక్ సంపద సుమారు 2.9 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.27 వేలకోట్లు) ఉంటుందని అంచనా. కాగా ఈయన వద్ద యాపిల్ కంపెనీ షేర్లు 3 మిలియన్లకు పైగా ఉన్నాయి.ప్రారంభంలో సీఈఓగా టిమ్ కుక్ జీతం 9,00,000 డాలర్లుగా ఉండేది. తర్వాత ఇది 3 మిలియన్ డాలర్ల బేస్ సాలరీగా స్థిరపడింది. అయితే ఆయన మొత్తం ఆదాయం స్టాక్ అవార్డులు, బోనస్‌ల ద్వారా భారీగా పెరిగింది. 2022లో ఆయన మొత్తం ఆదాయం సుమారు 99.4 మిలియన్ డాలర్లకు చేరింది. 2023లో షేర్‌హోల్డర్ల అభిప్రాయాలను గౌరవిస్తూ తన వేతనాన్ని స్వచ్ఛందంగా తగ్గించుకున్నారు. కానీ కంపెనీ పనితీరు, స్టాక్ పెరుగుదల కారణంగా 2024లో మళ్లీ ఆయన ఆదాయం సుమారు 74.6 మిలియన్ డాలర్లకు పెరిగింది.ఆపిల్ వృద్ధిలో టిమ్ కుక్ పాత్రటిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ కంపెనీ ఆదాయం 108 బిలియన్ డాలర్ల నుంచి 416 బిలియన్ డాలర్లకు పెరిగింది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఆధిపత్యం సాధించింది. ఐఫోన్, మ్యాక్‌బుక్, ఐప్యాడ్ వంటి ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందాయి. దీన్నిబట్టి చూస్తే కుక్ సారథ్యంలో కంపెనీ ఎంతగా ఎదిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఇదీ చదవండి: '2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': రాబర్ట్ కియోసాకి

Only These Six Assets Will Survive 2026 Says Robert Kiyosaki6
'2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': కియోసాకి

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చాలా సంవత్సరాలుగా ఆర్ధిక పరమైన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు 2026లో సురక్షితమైన ఆస్తుల గురించి వివరించారు.కియోసాకి ప్రకారం.. అమెరికా డాలర్ వంటి ప్రభుత్వ డబ్బు “నిజమైన సంపద కాదు”, ఎందుకంటే ప్రభుత్వం అవసరమైతే ఎక్కువ డబ్బు ముద్రించగలదు. ఇలా డబ్బు ముద్రించడం వల్ల దాని విలువ తగ్గిపోతుందని ఆయన అంటున్నారు. అందుకే ఆయన దీనిని “ఫేక్ మనీ” అని అంటారు.ప్రస్తుతం అమెరికా జాతీయ రుణం చాలా ఎక్కువగా ఉందని, రోజుకి బిలియన్ల డాలర్ల రుణం పెరుగుతుందని.. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రమాదంలో పడవచ్చని కియోసాకి అభిప్రాయం.కియోసాకి చెప్పిన సురక్షితమైన ఆస్తులుబంగారం (Gold)వెండి (Silver)చమురు (Oil)ఆహారం (Food)బిట్‌కాయిన్ (Bitcoin)ఈథీరియం (Ethereum)కియోసాకి అభిప్రాయం ప్రకారం.. పరిమితంగా ఉండే వనరులు విలువైనవి. ఎందుకంటే వాటిని అంత సులభంగా తయారు చేయలేము. కాబట్టి వీటి విలువ క్రమంగా పెరుగుతుందని విశ్వసిస్తారు.బంగారం, వెండిబంగారం ధర ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరిగింది. ప్రపంచంలో ఆర్ధిక అనిశ్చితి పెరిగినప్పుడు వీటి విలువ పెరుగుతుంది. కాబట్టి దీనిపై పెట్టె పెట్టుబడులు ప్రజలను ధనవంతులను చేస్తుంది. లేదా కష్టకాలంలో ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుంచి విముక్తి కల్పిస్తుంది.క్రిప్టో కరెన్సీకియోసాకి బిట్‌కాయిన్, ఈథీరియంను భవిష్యత్తు డిజిటల్ ఆస్తులుగా చూస్తున్నారు. ఇవి కూడా ప్రభుత్వ నియంత్రణలో లేవు కాబట్టి సంప్రదాయ డబ్బుకు ప్రత్యామ్నాయంగా ఉంటాయని ఆయన భావిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇందులో పెట్టుబడి పెట్టడం అంటే కొంత రిస్క్ కూడా ఎదుర్కోవాలి ఉంటుంది.చమురు, ఆహారంచమురు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మౌలిక అవసరం. యుద్ధాలు లేదా సరఫరా సమస్యలు దెబ్బతింటే ధరలు పెరుగుతాయి. అదే విధంగా ఆహార ధరలు కూడా ఇంధన ధరలపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఇవి కూడా 'అవసరమైన ఆస్తులు' అని కియోసాకి అభిప్రాయం.కియోసాకి చెప్పిన ఈ మాటలతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు విమర్శించారు. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి అంచనా నిజం కాలేదు కాబట్టి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఆర్ధిక నిపుణులు ఒకే రకమైన పెట్టుబడులపై పూర్తిగా ఆధారపడకూడదని సూచిస్తారు.ఇదీ చదవండి: ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు!

Advertisement
Advertisement
Advertisement