ప్రధాన వార్తలు
ఐసీఐసీఐ బ్యాంక్కి ప్రొవిజనింగ్ దన్ను
ముంబై: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశీయంగా రెండో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 9.28 శాతం వృద్ధి చెంది రూ. 14,755 కోట్లకు చేరింది. మొండిబాకీలు మొదలైన వాటికి కేటాయింపులు ఏకంగా 90 శాతం తగ్గడం ఇందుకు దోహదపడింది. శనివారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం గతేడాది క్యూ4లో రూ. 891 కోట్లుగా ఉన్న ప్రొవిజనింగ్ ఈ మార్చ్ క్వార్టర్లో రూ. 96.16 కోట్లకు తగ్గింది. డిసెంబర్ క్వార్టర్లో ఇది రూ. 2,556 కోట్లుగా ఉంది. సమీక్షాకాలంలో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 8.4 శాతం వృద్ధితో రూ. 22,979 కోట్లకు చేరింది. అసెట్స్ 15 శాతం వృద్ధి చెందడం, నికర వడ్డీ మార్జిన్ స్వల్పంగా 4.32 శాతానికి పెరగడం ఇందుకు ఉపయోగపడింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న క్రమంలో ఆరోగ్యకరమైన ఫలితాలు సాధించగలిగినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా తెలిపారు. ఎకానమీ మెరుగుపడే కొద్దీ మరింతగా రుణాలిచ్చేందుకు తమ దగ్గర తగినన్ని నిధులు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భవిష్యత్ అంచనాలను వెల్లడించడం కష్టమని బాత్రా చెప్పారు. తమ రిస్కు సామర్థ్యాల పరిధికి లోబడి వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. క్యూ4లో అసెట్ క్వాలిటీ, రికవరీలు మెరుగుపడటం వల్ల ప్రొవిజనింగ్ తగ్గిందని, అత్యవసర పరిస్థితుల కోసం కేటాయించిన రూ. 13,100 కోట్ల నిధి అలాగే ఉందని ఆయన పేర్కొన్నారు. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకు ఒక్కో షేరుకి రూ. 12 చొప్పున తుది డివిడెండు ప్రకటించింది. ఫలితాల్లో కీలకాంశాలు.. → క్యూ4లో వడ్డీయేతర ఆదాయం (ట్రెజరీ కాకుండా) 5.6 శాతం పెరిగి రూ. 7,415 కోట్లకు చేరింది. రూపాయిపై అతి స్పెక్యులేషన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ ఇటీవల తీసుకున్న చర్యలతో ట్రెజరీ విభాగానికి సంబంధించి రూ. 106 కోట్ల నష్టం వచ్చింది. → నిర్వహణ వ్యయాలు 12 శాతం పెరిగి రూ. 12,089 కోట్లకు చేరాయి. → అసెట్ క్వాలిటీ విషయానికొస్తే స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి డిసెంబర్లో 1.53 శాతంగా, గతేడాది మార్చి క్వార్టర్లో 1.67 శాతంగా ఉండగా ప్రస్తుతం 1.40 శాతానికి తగ్గింది. స్థూల స్లిప్పేజీలు రూ. 4,242 కోట్లుగా ఉన్నాయి. → బిజినెస్ బ్యాంకింగ్ దన్నుతో రుణ వృద్ధి 24 శాతం మేర నమోదైంది. గ్రామీణ రుణాల పోర్ట్ఫోలియో 25 శాతం మేర పెరగగ్గా, రిటైల్ వాటా 41 శాతానికి నెమ్మదించింది. దేశీయంగా కార్పొరేట్ రుణాలు 9 శాతం పెరిగినప్పటికీ, పోర్ట్ఫోలియోలో వీటి వాటా 20 శాతానికి పరిమితమైంది. రాబోయే రోజుల్లో ఇది కొంత పెరిగే అవకాశం ఉంది. → మార్చి 31 నాటికి బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ 17.18 శాతంగా ఉంది. → స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ. 13,702 కోట్లకు చేరింది. క్రితం క్యూ4లో నమోదైన రూ. 12,630 కోట్లతో పోలిస్తే 8.5 శాతం పెరిగింది. → 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం 6.2 శాతం వృద్ధి చెంది రూ. 50,147 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 47,227 కోట్లు.
స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు డౌన్
న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్ఫోన్ మార్కెట్ ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) మందగించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, క్యూ1లో స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు (కంపెనీ నుంచి డీలర్లకు రవాణా) గత ఏడాదితో పోలిస్తే 3 శాతం తగ్గాయి. గత 6 ఏళ్లలో బలహీనమైన పనితీరు ఇది. పెరిగిన తయారీ ఖర్చులు, ముఖ్యంగా మెమొరీ చిప్ల ధరలు పెరిగిపోవడం తెలిసిందే. దీంతో వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గడం (ముఖ్యంగా రూ.15,000 లోపు ఫోన్లకు).. మొత్తం మార్కెట్ పనితీరును ప్రభావితం చేసినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు డబుల్ డిజిట్ స్థాయిలో తగ్గొచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ పేర్కొన్నారు. ‘‘2026 పూర్తి సంవత్సరానికి స్మార్ట్ఫోన్ మార్కెట్ సుమారు 10 శాతం తగ్గొచ్చని అంచనా. ‘‘విడిభాగాల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా మెమొరీ ధరలు గత 9 నెలల్లో 4 రెట్లు పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులు ఫోన్లను వెంటనే మార్చకుండా, ఉన్న వాటినే ఎక్కువ కాలం వినియోగిస్తున్నారు’’అని పాఠక్ వివరించారు. పశ్చిమాసియలో సంక్షోభంతో జీవన వ్యయాలు పెరిగాయని, ఈ పరిస్థితుల్లో ప్రజలు స్మార్ట్ఫోన్ల వంటి వాటి కంటే ముఖ్యమైన అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది. కనుక ఈ మార్కెట్ నెమ్మదిగా కోలుకోవచ్చని అభిప్రాయపడింది. వివో నంబర్ 1 → దేశీ మార్కెట్లో 21 శాతం వాటాతో వివో మొదటి స్థానంలో నిలిచింది. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో పోర్ట్ఫోలియో విస్తరణ ద్వారా తన ఆధిపత్యాన్ని కాపాడుకుంది. → శామ్సంగ్ రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా ఎ–సిరీస్ మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. → ఒప్పో 14 శాతం వాటాతో మూడో స్థానంలో నిలిచింది. మార్చి త్రైమాసికంలో 8 శాతం వృద్ధిని (2025 క్యూ1తో పోల్చితే) సాధించింది. → షావోమీ నాలుగో స్థానంలో ఉంది. రూ.10,000–20,000 ధరల శ్రేణిలో రడబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసింది. → ఆన్లైన్ మార్కెట్లో రూ.10,000–20,000 ధరల విభాగంలో రియల్మీ బలమైన బ్రాండ్గా నిలిచింది. → నథింగ్ 47 శాతం వృద్ధిని నమోదు చేసింది. → ప్రీమియం ఫోన్ల సెగ్మెంట్లో (రూ.45,000కు పైన) గూగుల్ 39 శాతం వృద్ధిని సాధించింది. → అందుబాటు ధరల ఫోన్ల విభాగంలో (రూ.30,000–45,000) ప్రముఖ బ్రాండ్గా వన్ప్లస్ ముందంజలో ఉంది. నార్డ్ సిరీస్కు మంచి స్పందన లభిస్తోంది.
721 టన్నుల బంగారం దిగుమతి
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కొత్త రికార్డులకు చేరాయి. 71.98 బిలియన్ డాలర్ల (రూ.6,69,414 కోట్లు) విలువైన బంగారం దిగుమతి అయింది. 2024–25 సంవత్సరంలో 58 బిలియన్ డాలర్ల దిగుమతులతో పోల్చి చూస్తే 24 శాతం పెరిగాయి. పరిమాణం పరంగా చూస్తే తగ్గుదల కనిపిస్తోంది. 2024–25లో 759.09 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 4.76 తక్కువగా 721.03 టన్నులకు పరిమితమయ్యాయి. బంగారం ధర గణనీయంగా పెరగడంతో, విలువ అధికంగా ఉన్నప్పటికీ పరిమాణం తగ్గినట్టు వాణిజ్య శాఖ గణాంకాల ఆధారంగా స్పష్టమవుతోంది. 2023–24లో 45.54 బిలియన్ డాలర్లు, 2022–23లో 35 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు నమోదయ్యాయి. చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద పసిడి వినియోగ మార్కెట్గా ఉండడం గమనార్హం. ప్రధానంగా ఆభరణాల నుంచే ఎక్కువ డిమాండ్ ఉంటోంది. → వెండి దిగుమతుల విలువ సైతం గత ఆర్థిక సంవత్సరంలో 150 % పెరిగి 12 బిలియన్ డాలర్లుగా ఉంది. పరిమాణం పరంగానూ 42 % పెరిగి 7,335 టన్నుల మేర ఉంది. → బంగారం కిలో ధర 2024–25లో 76,617 డాలర్లుగా ఉంటే, 2025–26లో 99,825 డాలర్లకు చేరడం దిగుమతుల విలువ పెరిగేందుకు దారితీసింది. → అత్యధికంగా స్విట్జర్లాండ్ నుంచి 40 శాతం మేర బంగారం దిగుమతి కాగా, యూఏఈ నుంచి 16%, దక్షిణాఫ్రికా నుంచి 10% చొప్పున వచ్చింది. దేశ మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా 5 శాతంగా ఉంటుంది. → స్విట్జర్లాండ్ నుంచి బంగారం దిగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 11.36 శాతం పెరిగి 24.27 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ. 20,351 కోట్లు
ముంబై: దేశీ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 20,351 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం క్యూ4లో నమోదైన రూ. 18,835 కోట్లతో పోలిస్తే ఇది 8 శాతం అధికం. సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం రూ. 1,16,920 కోట్లుగా నిల్చింది. క్రితం క్యూ4లో ఇది రూ. 1,20,269 కోట్లు. వడ్డీ ఆదాయం రూ. 86,779 కోట్ల నుంచి రూ. 87,182.50 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుపై రూ. 13 చొప్పున తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది. గతేడాది ఆగస్టు 11న ప్రకటించిన రూ. 2.50 మధ్యంతర డివిడెండుతో కలిపి మొత్తం రూ. 15.5 మేర డివిడెండు ఇచ్చినట్లవుతుందని సంస్థ తెలిపింది. క్యూ1లో చిన్న రుణగ్రహీతలపై పశ్చిమాసియా ప్రభావం.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల చిన్న, మధ్య తరహా రుణగ్రహీతలపై ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభావం పడొచ్చని బ్యాంక్ సీఈవో, ఎండీ శశి జగదీశన్ తెలిపారు. యుద్ధం ముగిశాక పరిస్థితి చక్కబడటానికి రెండు నెలలు పట్టొచ్చని వివరించారు. అయితే, అసెట్ క్వాలిటీపరంగా ప్రతికూల పరిస్థితులేమీ లేవని చెప్పారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ శాఖ బాండ్ల మిస్–సెల్లింగ్ వ్యవహారం నేపథ్యంలో నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అతాను చక్రవర్తి అకస్మాత్తుగా రాజీనామాపై వ్యాఖ్యానించేందుకు జగదీశన్ నిరాకరించారు. మిస్–సెల్లింగ్ వ్యవహారంపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే, విచారణ నివేదిక ఎప్పట్లోగా రావొచ్చనేది కూడా చెప్పడానికి నిరాకరించారు. దర్యాప్తులో భాగంగా భారీ స్థాయిలో డేటాను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చక్రవర్తి రాజీనామా అనంతరం బ్యాంకు పట్ల సానుకూలంగా వ్యవహరించడంపై ప్రభుత్వం, క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాత్కాలికంగా చైర్పర్సన్గా ఉన్న కేకి మిస్త్రీ పూర్తి కాలం కొనసాగాలని తాము కోరుకుంటున్నట్లు కోరుకుంటున్నామని, అయితే నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ (ఎన్ఆర్సీ) ముందు ఈ ప్రతిపాదన ఉంచడానికి ముందుగా నిర్దిష్ట ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించారు. జగదీశన్ పదవీకాలం ఈ ఏడాదితో ముగియనున్న నేపథ్యంలో ఆయన పునర్నియామకం విషయాన్ని ఎన్ఆర్సీ పరిశీలిస్తుందని, ఇందుకు నిర్దిష్ట కాలవ్యవధిని చెప్పలేమని డిప్యుటీ ఎండీ కైజాద్ భరూచా తెలిపారు. ఇతర విశేషాలు.. → పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం (కన్సాలిడేటెడ్) రూ. 4,95,463 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 4,70,916 కోట్లు. → స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ4లో నికర లాభం రూ. 19,221 కోట్లకు చేరింది. క్రితం క్యూ4లో ఇది రూ. 17,616 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 89,488 కోట్ల నుంచి రూ. 89,809 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ. 62,951 కోట్ల నుంచి రూ. 62,006 కోట్లకు తగ్గాయి. → వడ్డీ ఆదాయం రూ. 77,460 కోట్ల నుంచి రూ. 76,610 కోట్లకు నెమ్మదించింది. → స్థూల మొండిబాకీల నిష్పత్తి 2025 మార్చి క్వార్టర్లో 1.33 శాతంగా, డిసెంబర్ క్వార్టర్లో 1.24 శాతంగా ఉండగా ప్రస్తుతం 1.15 శాతానికి తగ్గింది. నికర మొండిబాకీల నిష్పత్తి 0.38 శాతంగా ఉంది. క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి 19.7 శాతంగా ఉంది. → 2026 మార్చి 31 నాటికి 9,689 శాఖలు, 21,172 ఏటీఎంలు ఉన్నాయి. 2025 మార్చి 31న 9,455 శాఖలు, 21,139 ఏటీఎంలు ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య 2,14,521 నుంచి 2,11,178కి తగ్గింది.
రైలు టికెట్ రహస్యం తెలుసా?
భారతీయ రైల్వే.. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి రైళ్లపై ఆధారపడుతుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా గమనించారా? మనం బుక్ చేసుకునే ప్రతి రిజర్వేషన్ టికెట్పైనా 10 అంకెల పీఎన్ఆర్ (PNR) సంఖ్య ఉంటుంది. అసలు ఈ నంబర్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అది కేవలం ఒక సంఖ్యేనా లేక అందులో ఏవైనా వివరాలు దాగి ఉన్నాయా?ఏమిటీ పీఎన్ఆర్?పీఎన్ఆర్ అంటే 'ప్యాసింజర్ నేమ్ రికార్డ్'. ఇది రైల్వే డేటాబేస్లో ప్రయాణికుడికి కేటాయించే ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య. సీటు కన్ఫర్మ్ అయిందా లేదా? ఏ కోచ్లో బెర్త్ కేటాయించారు? ప్రయాణ తేదీ, రైలు వివరాలు వంటి కీలక సమాచారమంతా ఈ 10 అంకెల వెనుక నిక్షిప్తమై ఉంటుంది.పది అంకెలే ఎందుకంటే..లక్షల కొద్దీ బుకింగ్స్ జరిగే మన దేశంలో, తక్కువ అంకెలు ఉంటే నంబర్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఎక్కువ అంకెలు ఉంటే గుర్తుంచుకోవడం కష్టం. అందుకే, నిర్వహణకు సులభంగా ఉంటూనే, బిలియన్ల కొద్దీ ప్రత్యేకమైన కాంబినేషన్లను సృష్టించేందుకు 10 అంకెల ఫార్మాట్ను రైల్వే ఎంచుకుంది.ఈ 10 అంకెలు యాదృచ్ఛికంగా ఇచ్చేవి కావు. ఇందులో ప్రతి అంకెకు ఒక అర్థం ఉంది.మొదటి అంకె: ఇది టికెట్ ఏ రైల్వే జోన్ లేదా ఏ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ద్వారా బుక్ అయిందో సూచిస్తుంది. ఉదాహరణకు 2 లేదా 3 తో మొదలైతే అది సికింద్రాబాద్ (SCR) వంటి జోన్లకు సంబంధించినదిగా గుర్తించవచ్చు.మొదటి 3 అంకెలు: ఇవి రిజర్వేషన్ జరిగిన జోనల్ క్లస్టర్ను తెలియజేస్తాయి.చివరి 7 అంకెలు: ఇవి సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే యూనిక్ నంబర్లు. ఇవి ఒకే ప్రయాణంలో ఇద్దరు వ్యక్తులకు ఒకే నంబర్ రాకుండా అడ్డుకుంటాయి.పీఎస్ఆర్ వ్యవస్థ ఎందుకు కీలకం?కోట్లాది మంది డేటాను గందరగోళం లేకుండా నిర్వహించడానికి పీఎన్ఆర్ వ్యవస్థ వెన్నెముకలా పనిచేస్తుంది. దీని ద్వారా వెయిటింగ్ లిస్ట్ (WL) లేదా RAC లో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఒకే సీటు ఇద్దరికి కేటాయించకుండా ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది.అత్యవసర సమయాల్లో ప్రయాణికుల పూర్తి వివరాలను రైల్వే అధికారులు త్వరగా సేకరించేందుకు ఇది తోడ్పడుతుంది.మనం సాధారణంగా చూసే ఆ 10 అంకెల కోడ్ వెనుక ఇంతటి భారీ సాంకేతిక వ్యవస్థ దాగి ఉంది. భారత్ వంటి భారీ జనాభా ఉన్న దేశంలో రైలు ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడంలో పీఎన్ఆర్ నంబర్ పోషిస్తున్న పాత్ర అమోఘం. ఈ సారి మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఈ వివరాలన్నీ మీ పీఎన్ఆర్లో గమనించండి.
డీఏ పెంపు.. కేంద్ర ఉద్యోగులకు ఇక మరింత జీతం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నిరీక్షణకు తెరపడింది. ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (DA)ను 2 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా పెంపుతో డీఏ ప్రస్తుతం ఉన్న 58 శాతం నుండి 60 శాతానికి చేరుకుంది.గత అక్టోబర్లో ప్రభుత్వం డీఏను 55% నుండి 58 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం జూలై 1, 2025 నుండి అమలులోకి వచ్చింది. ఇప్పుడు ప్రకటించిన అదనపు 2 శాతం పెంపుతో కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.జీతం ఎంత పెరుగుతుందంటే?ఈ పెంపు వల్ల నెలవారీ వేతనంలో మార్పులను ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిస్తే.. ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం (Basic Pay) రూ.50,000 అనుకుందాం. పాత రేటు (58%) ప్రకారం డీఏ రూ.29,000. కొత్త రేటు (60%) ప్రకారం డీఏ రూ.30,000. అంటే, ప్రతి నెలా నేరుగా రూ.1,000 అదనంగా లభిస్తుంది. దీనితో పాటు జనవరి నుండి రావాల్సిన బకాయిలు (Arrears) కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి.8వ వేతన సంఘానికి డిమాండ్లుఒకవైపు డీఏ పెరుగుతున్నప్పటికీ, ఉద్యోగ సంఘాలు 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుపై ఒత్తిడి పెంచుతున్నాయి. నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ 3.83 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను డిమాండ్ చేస్తోంది. ఇదే గనుక అమలైతే కనీస వేతనం రూ.18,000 నుండి ఏకంగా రూ.69,000కు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత డీఏ పెంపు వల్ల సుమారు 1.19 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.
కార్పొరేట్
ఐసీఐసీఐ బ్యాంక్కి ప్రొవిజనింగ్ దన్ను
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ. 20,351 కోట్లు
రైలు టికెట్ రహస్యం తెలుసా?
రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
మూడు నెలల్లో 73 వేల ఉద్యోగాలు ఉఫ్!
జియో ఫైనాన్షియల్ లాభం డౌన్
డిజిటల్ యాడ్స్ డబుల్
మహిళలకు ‘లీడర్షిప్’.. ఆదిత్య బిర్లా కొత్త ప్రోగ్రామ్
ఆసియాకు కొత్త కుబేరుడు.. ముఖేష్ అంబానీ నెం.2
ఇరాన్ వార్ : బడ్జెట్ ఎయిర్లైన్స్ దివాలా
కాకమీదున్న పసిడి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో క...
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగ...
ఎన్ఎస్ఈలో రికార్డు స్థాయిలో తగ్గిన యాక్టివ్ ఇన్వెస్టర్లు
స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు, అంతర్జాతీయ భౌగోళి...
భారీగా వంట నూనెల దిగుమతులు
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతులు మార్చిలో భారీగా పె...
రష్యన్ ఆయిల్.. రయ్ రయ్..
పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల క్రూడ్ రేట్లు పెరగకుం...
భారత్ వృద్ధి వేగవంతం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న...
ఏప్రిల్ 20 నుంచి యూఎస్ టారిఫ్ రీఫండ్లు!
అమెరికా దిగుమతిదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే!
సాంకేతిక ప్రపంచంలో ఏఐ విప్లవం రోజురోజుకూ పెరుగుతోంది. నిత్యం ఇంటర్నెట్లో చదివే సమాచారంలో సగానికి పైగా కంటెంట్ మనుషులు రాసింది కాదు. ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ 2026 వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.50 ప్లస్ వరకు..కేవలం మూడేళ్ల కాలంలో అంతర్జాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నివేదిక ప్రకారం, 2025 ప్రారంభం నుంచి ఇంటర్నెట్లో కొత్తగా పుట్టుకొస్తున్న కంటెంట్లో 51.72 శాతం వాటా ఏఐ సొంతం చేసుకోగా మానవ మేధస్సుతో సృష్టించిన కంటెంట్ 48.28 శాతానికి పరిమితమైంది.నవంబర్ 2022: చాట్జీపీటీ రాకతో ఏఐ కంటెంట్ ప్రస్థానం దాదాపు సున్నా వద్ద మొదలైంది.2023-24: అధునాతన టూల్స్ అందుబాటులోకి రావడంతో గ్రాఫ్ వేగంగా పెరిగింది.2025-26: మొదటిసారిగా మానవ కంటెంట్ను ఏఐ అధిగమించింది.ఎందుకీ పరుగు?కంపెనీలు, క్రియేటర్లు, చిన్న వ్యాపార సంస్థలు ఏఐ వైపు మొగ్గు చూపడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఒక రచయిత గంటల తరబడి శ్రమించి రాసే వ్యాసాన్ని ఏఐ సెకన్ల వ్యవధిలో సిద్ధం చేస్తోంది. వెబ్సైట్లకు అవసరమైన భారీ సమాచారాన్ని క్షణాల్లో అందిస్తుంది. పెద్ద సంఖ్యలో కంటెంట్ రైటర్లను నియమించుకోవడం కంటే ఏఐ టూల్స్ వాడటం సంస్థలకు ఆర్థికంగా లాభదాయకంగా మారింది. ముఖ్యంగా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లు, ఎస్ఈఓ పేజీలు, సాధారణ ఈమెయిల్స్ వంటి వాటికి ఇప్పుడు ఏఐకే ప్రాధాన్యత ఇస్తున్నారు.విస్తరిస్తున్న ఏఐ సామ్రాజ్యంకేవలం బ్లాగులకే పరిమితం కాకుండా ఏఐ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ విస్తరించింది. మార్కెటింగ్ కాపీలు, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ల నుంచి ఫేస్బుక్ యాడ్స్ వరకు, కస్టమర్ సపోర్ట్ విభాగంలో రోబోటిక్ మెసేజ్లతోపాటు సహజంగా అనిపించే ఏఐ సమాధానాలు.. ఇలా చాలా వాటికి ఏఐ టూల్స్ వాడుతున్నారు.మానవ మేధస్సు పాత్ర ముగిసినట్లేనా?ఏఐ ఆధిపత్యం పెరిగినప్పటికీ మానవ పర్యవేక్షణ ఇంకా కీలకంగానే ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో వస్తున్న కంటెంట్లో ఎక్కువ భాగం ఒక మిశ్రమ ప్రక్రియ (హైబ్రిడ్ ప్రాసెస్). ఏఐ ఒక డ్రాఫ్ట్ సిద్ధం చేస్తే మనుషులు దాన్ని ఎడిట్ చేయడం, వాస్తవాలను తనిఖీ చేయడం, భాషాలోపాలు సరిదిద్దడం వంటి పనులు చేస్తున్నారు. కంటెంట్లో సృజనాత్మకత, భావోద్వేగాల కోసం మనిషి అవసరం ఇంకా ఉందని సాంకేతిక నిపుణుల విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!
మాక్ యూజర్ల కోసం పెర్ప్లెక్సిటీ ‘పర్సనల్ కంప్యూటర్’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ‘పెర్ప్లెక్సిటీ’ టెక్ ప్రపంచంలో మరో సంచలనానికి తెరలేపింది. మాక్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ‘పర్సనల్ కంప్యూటర్’ అనే సరికొత్త సాఫ్ట్వేర్ను కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. ఇది కంప్యూటర్లోని ఫైళ్లు, అప్లికేషన్లతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే ఒక ఏఐ ఏజెంట్ అని కంపెనీ తెలిపింది.మల్టీ-మోడల్ ఆర్కెస్ట్రేషన్ఫిబ్రవరిలో కంపెనీ పరిచయం చేసిన ‘పెర్ప్లెక్సిటీ కంప్యూటర్’ అధునాతన ఆర్కెస్ట్రేషన్ ఫీచర్లను ఇప్పుడు నేరుగా యూజర్ల పర్సనల్ కంప్యూటర్లలో తీసుకువచ్చారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కంప్యూటర్లోని లోకల్ ఫైల్స్, ఇన్స్టాల్ చేసిన యాప్లు, వెబ్ కంటెంట్ను ఒకే చోట అనుసంధానిస్తుంది. సంక్లిష్టమైన పనులను పూర్తి చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఏకకాలంలో మల్టీ ఏఐ ఏజెంట్లను రంగంలోకి దించుతుంది.మాక్ మినీతో నిరంతర సేవలుఈ సాఫ్ట్వేర్ అత్యంత ఆకర్షణీయమైన అంశం దాని ‘రిమోట్ యాక్సెస్’ సామర్థ్యం. ఒకవేళ మీరు మాక్ మినీలో ఈ సాఫ్ట్వేర్ను రన్ చేస్తుంటే అది 24/7 అందుబాటులో ఉంటుంది. మీరు ఇంటి బయట ఉన్నప్పుడు కూడా మీ స్మార్ట్ఫోన్ ద్వారా వాయిస్ కమాండ్స్ ఇచ్చి మీ కంప్యూటర్లోని పనులను పూర్తి చేయవచ్చు లేదా పర్యవేక్షించవచ్చు.పర్సనల్ కంప్యూటర్ చేసే పనులు ఇవే..ఈ ఏఐ అసిస్టెంట్ కేవలం సమాధానాలు చెప్పడమే కాకుండా క్రియేటివ్ పనులను కూడా చక్కబెడుతుంది.మీ 'టూ-డూ లిస్ట్' సమీక్షించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తుంది. యాపిల్ నోట్స్ లేదా మెసేజెస్ వంటి యాప్లను తెరిచి మీకు కావాల్సిన సమాచారాన్ని పంపడం లేదా నోట్స్ సిద్ధం చేయడం వంటివి చేస్తుంది. అస్తవ్యస్తంగా ఉన్న ఫోల్డర్లను క్రమబద్ధీకరించడం, ఫైళ్లకు అర్థవంతమైన పేర్లు పెట్టడం వంటి పనులను క్షణాల్లో పూర్తి చేస్తుంది.మొబైల్ నుంచే వాయిస్ ద్వారా పనులను పూర్తి చేసే వెసులుబాటు ఉంది.భద్రతే ప్రాధాన్యంవినియోగదారుల డేటా భద్రత విషయంలో పెర్ప్లెక్సిటీ కఠినమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ‘పర్సనల్ కంప్యూటర్ అప్లికేషన్ అత్యంత సురక్షితమైన ‘శాండ్బాక్స్’ వాతావరణంలో పనిచేస్తుంది. ఇది చేసే ప్రతి చర్యను యూజర్లు పర్యవేక్షించవచ్చు. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే మార్పులు చేసే సదుపాయం కూడా ఉంది’ అని కంపెనీ స్పష్టం చేసింది.ప్రస్తుతానికి ఈ ‘పర్సనల్ కంప్యూటర్’ ఫీచర్ పెర్ప్లెక్సిటీ ప్రో చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వెయిట్లిస్ట్లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ త్వరలోనే సాధారణ వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!
‘టెక్ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు..
టీసీఎస్ (TCS) నాసిక్ బీపీవోలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడులపై ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగా మరో ఐటీ సంస్థ టెక్ మహీంద్రాపైనా ఇదే రకమైన మతపరమైన పక్షపాత ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముంబై గోరేగావ్ ఐటీ పార్క్లో ఈ సంస్థకు చెందిన బీపీపీ కార్యాలయంలో మతపరమైన పక్షపాతం, వివక్షపూరిత నియామక పద్ధతులు కొనసాగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.బాంబే హైకోర్టు న్యాయవాది అశుతోష్ దూబే తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక ఉద్యోగి పంపిన సందేశాన్ని షేర్ చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. సదరు కార్యాలయంలోని హెచ్ఆర్ విభాగం ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వారినే ఎక్కువగా నియమిస్తోందని, కార్యాలయ నిబంధనలు కూడా పక్షపాతంగా ఉన్నాయని ఆ సందేశంలో ఆరోపించారు.ముఖ్యంగా రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు క్యాంటీన్లో ఇఫ్తార్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించారని, ఆ సమయంలో ప్యాంట్రీ ఏరియాలోకి ఇతరులు పాదరక్షలతో రావద్దంటూ ఏర్పాటు నోటీసులకు సంబంధించిన ఫోటోలనూ దూబే షేర్ చేశారు. దీనివల్ల తాము "మినీ పాకిస్తాన్లో" పని చేస్తున్నట్లు అనిపిస్తోందని, అక్కడ పనిచేయడం అసౌకర్యంగా ఉందంటూ ఒక ఉద్యోగి వాపోయినట్లుగా దూబే పేర్కొన్నారు. అలాగే, నియామకాల్లో పారదర్శకత లేదని, కార్పొరేట్ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది అశుతోష్ దూబే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన టెక్ మహీంద్రా యాజమాన్యంఈ ఆరోపణలపై టెక్ మహీంద్రా యాజమాన్యం వెంటనే స్పందించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలు, ఫోటోలు పూర్తిగా "నిరాధారమైనవి" అని కొట్టిపారేసింది. తాము నిర్వహించిన అంతర్గత సమీక్షలో అటువంటి వివక్షపూరిత సంఘటనలు ఏవీ జరగలేదని తేలిందని సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. ముఖ్యంగా వైరల్ అవుతున్న 'ఫుట్వేర్ ఫ్రీ జోన్' నోటీసు అసలు తమ కార్యాలయానికే చెందినది కాదని, నియామక ప్రక్రియలో కూడా ఎలాంటి అవకతవకలు లేవని కంపెనీ వెల్లడించింది.తమ సంస్థ సర్వమత సమానత్వాన్ని పాటిస్తుందని, సమ్మిళిత, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రాధాన్యతని టెక్ మహీంద్రా పేర్కొంది. మతం, కులం లేదా ఇతర ప్రాతిపదికన ఎలాంటి వివక్షను సహించబోమని, ప్రతి ఉద్యోగిని నిష్పాక్షికంగా చూస్తామని కంపెనీ స్పష్టం చేసింది. కార్పొరేట్ విలువలను కాపాడటంలో తాము ఎప్పుడూ ముందుంటామని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా కోరింది.ఇదీ చదవండి: కంపెనీల్లో ఇదేం నీతి? దెబ్బకు హెచ్ఆర్ సైలెంట్!
‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట!
సాంకేతిక ప్రపంచంలో పారదర్శకత, భద్రత గురించి గొప్పలు చెప్పుకునే యాపిల్, గూగుల్ సంస్థల అసలు రంగు బయటపడిందని కొందరు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అశ్లీలతను, ఏకాభిప్రాయం లేని లైంగిక కంటెంట్ను ప్రోత్సహించబోమని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఈ టెక్ దిగ్గజాలు వాస్తవానికి ‘న్యూడిఫై’(లైంగిక పరమైన) యాప్ల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నాయని ‘టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్ట్’ (టీటీపీ) తాజా నివేదికలో బయటపెట్టింది.కోట్లలో డౌన్లోడ్లు.. వందల కోట్లలో ఆదాయం!టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం, యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లలో కృత్రిమ మేధ సాయంతో సాధారణ వ్యక్తుల, సెలబ్రిటీల ఫొటోల నుంచి దుస్తులను తొలగించి నగ్నంగా మార్చే అన్డ్రెస్ లేదా న్యూడిఫై యాప్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ తరహా యాప్లు ఇప్పటివరకు సుమారు 483 మిలియన్ల సార్లు డౌన్లోడ్ అయ్యాయి. యాప్ మ్యాజిక్ గణాంకాల ప్రకారం, వీటి ద్వారా ఈ కంపెనీలు 122 మిలియన్ డారల్లు (సుమారు రూ.1,000 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించాయి. యాపిల్ స్టోర్లో 18, గూగుల్ ప్లే స్టోర్లో 20 ఇలాంటి యాప్లను పరిశోధకులు గుర్తించారు.సెర్చ్ చేస్తే చాలు.. ప్రకటనలే స్వాగతం!వినియోగదారులు యాప్ స్టోర్ల్లో న్యూడిఫై వంటి పదాల కోసం వెతికినప్పుడు ఈ యాప్లు కనిపించడమే కాకుండా కంపెనీలు స్వయంగా వాటికి సంబంధించిన ప్రకటనలను కూడా ప్రదర్శిస్తుండటం గమనార్హం. అంతేకాకుండా ఆటోకంప్లీట్ ఫీచర్ ద్వారా వినియోగదారులను నేరుగా ఇటువంటి అశ్లీల యాప్ల వైపు మళ్లిస్తున్నాయని నివేదిక తీవ్రంగా విమర్శించింది. ‘ఈ కంపెనీలు కేవలం యాప్లను ఆమోదించడమే కాదు, వాటి ద్వారా లాభం పొందుతూ వినియోగదారులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి’ అని టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేటీ పాల్ అన్నారు.నిబంధనలు ఏం చెబుతున్నాయి?యాపిల్ మార్గదర్శకాలు బహిరంగ లైంగిక లేదా అశ్లీల కంటెంట్ను స్పష్టంగా నిషేధిస్తున్నాయి. గూగుల్ సైతం వ్యక్తులను దిగజార్చే ‘ప్రాంక్’ పేరుతో బట్టలు విప్పినట్లు చూపే యాప్లను అనుమతించబోమని చెబుతోంది. అయితే, ఫొటో ఎడిటింగ్ యాప్లుగా ముసుగు వేసుకుని వచ్చే ఇటువంటి సాఫ్ట్వేర్లను గుర్తించడంలో ఈ కంపెనీలు విఫలమవుతున్నాయి.అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడినగ్నత్వ యాప్ల వల్ల మహిళలు, చిన్నారుల భద్రత ప్రమాదంలో పడుతోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ‘టేక్ ఇట్ డౌన్’ చట్టంపై సంతకం చేశారు. ఇది ఏకాభిప్రాయం లేని లైంగిక చిత్రాలను ప్రచురించడాన్ని నేరంగా పరిగణిస్తుంది. అశ్లీల చిత్రాలను తొలగించని టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లను విచారించేలా యూకే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది.దిద్దుబాటా? కంటితుడుపు చర్యలా?బ్లూమ్బెర్గ్, టీటీపీ నివేదికల అనంతరం, యాపిల్ సుమారు 15 యాప్లను తొలగించినట్లు తెలిపింది. గూగుల్ కూడా పలు యాప్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. అయితే, ఒకసారి తొలగించిన యాప్లు కొన్ని నెలలకే మళ్లీ కొత్త పేర్లతో ప్రత్యక్షమవుతున్నాయని, టెక్ దిగ్గజాల పర్యవేక్షణ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం లాభాల కోసం నైతికతను పక్కన పెడుతున్న ఇలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: కాకమీదున్న పసిడి ధరలు
పర్సనల్ ఫైనాన్స్
బ్యాంక్ ఖాతాపై కన్నేసే సైబర్ కిరాతకులు
మీ ఈమెయిల్ బాక్స్లో ఒక నోటిఫికేషన్... ‘మీ పేరుతో కొత్త బ్యాంక్ ఖాతా ప్రారంభమైంది’ అని ఉందా? లేదా మీ బ్యాంక్ స్టేట్మెంట్ను పరిశీలిస్తే మీకు తెలియని లావాదేవీలు కనిపిస్తున్నాయా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సామాన్యుల కష్టార్జితాన్ని దోచుకోవడానికి సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్టీసీ) నివేదిక ప్రకారం, వినియోగదారులు సైబర్ మోసాల వల్ల 2024లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.5 బిలియన్ డాలర్లు (రూ.1 లక్ష కోట్లకు పైగా) డబ్బు కోల్పోయారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 25 శాతం ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ప్రధాన బ్యాంకింగ్ మోసాలు, వాటి నుంచి తప్పించుకునే మార్గాలపై ప్రత్యేక కథనం.నేరగాళ్లు అనుసరిస్తున్న ఏడు వినూత్న పద్ధతులు1. నకిలీ బ్యాంక్ వెబ్సైట్లుఅచ్చం మీ బ్యాంక్ వెబ్సైట్లాగే కనిపించే నకిలీ సైట్లను స్కామర్లు సృష్టిస్తారు. అధిక వడ్డీ ఆశ చూపి లేదా మీ ఖాతా బ్లాక్ అయ్యిందని భయపెట్టి మిమ్మల్ని లాగిన్ అయ్యేలా చేస్తారు. మీరు అక్కడ ఇచ్చే యూజర్ ఐడీ, పాస్వర్డ్ నేరుగా నేరగాళ్ల చేతికి వెళ్తాయి.జాగ్రత్త: వెబ్సైట్ అడ్రస్లో ‘https://’ ఉందో లేదో చూడండి. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను మాత్రమే వాడండి.2. ప్రమాదకరమైన యాప్లు, ఎక్స్టెన్షన్లుఉపయోగకరంగా కనిపించే కొన్ని థర్డ్ పార్టీ యాప్లు మీ ఫోన్లోని డేటాను దొంగిలిస్తాయి. ఇవి మీ కీబోర్డ్ ఎంట్రీలను (కీస్ట్రోక్స్) ట్రాక్ చేసి మీ బ్యాంక్ వివరాలను స్కామర్లకు తెలియజేస్తాయి.జాగ్రత్త: ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి అధికారిక బ్యాంకింగ్ యాప్లను మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. యాంటీ-వైరస్ సాఫ్ట్వేర్ను వాడండి.3. ఫోన్ కాల్స్, మెసేజ్లు‘మీ కేవైసీ అప్ డేట్ చేయకపోతే అకౌంట్ ఆగిపోతుంది’ అంటూ వచ్చే ఫోన్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్లతో జాగ్రత్త. బ్యాంక్ ప్రతినిధులమని నమ్మిస్తూ మీ ఓటీపీ లేదా పిన్ నంబర్ అడుగుతారు.జాగ్రత్త: బ్యాంకులు ఎప్పుడూ ఫోన్లో వ్యక్తిగత సమాచారం అడగవు. అనుమానం వస్తే వెంటనే కాల్ కట్ చేసి నేరుగా మీ బ్రాంచ్ను సంప్రదించండి.4. ఓవర్ పేమెంట్ స్కామ్మీరు ఏదైనా వస్తువు అమ్మకానికి పెట్టినప్పుడు కొనుగోలుదారు పొరపాటున ఎక్కువ మొత్తానికి చెక్ ఇచ్చానని చెప్పి మిగిలిన మొత్తాన్ని తిరిగి పంపమని కోరతాడు. మీరు డబ్బు పంపిన తర్వాత ఆ చెక్ బౌన్స్ అవుతుంది.జాగ్రత్త: గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే చెక్కులు క్లియర్ అయ్యే వరకు వేచి ఉండండి. అనుమానాస్పద లావాదేవీలను ప్రోత్సహించకండి.5. ఎంప్లాయిమెంట్ మోసాలువర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల పేరుతో నేరగాళ్లు మిమ్మల్ని సంప్రదిస్తారు. జీతం పంపడానికి లేదా క్లయింట్లకు డబ్బు బదిలీ చేయడానికి మీ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాను వాడమంటారు. ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని మనీ లాండరింగ్ కేసుల్లో ఇరికించే ప్రమాదం ఉంది.జాగ్రత్త: పేరున్న సంస్థలు ఎప్పుడూ ఉద్యోగి వ్యక్తిగత ఖాతాలను వ్యాపార లావాదేవీలకు వాడవు. అధికారిక వెబైసైట్ల్లో కంపెనీ క్రెడెన్షియల్స్ చెక్ చేయండి.6. అనధికార ఖాతాలుమీ ఆధార్ లేదా పాన్ వివరాలను దొంగిలించి మీ పేరుతో ఇతర బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తారు. వీటి ద్వారా అక్రమ లావాదేవీలు జరిపి మీ క్రెడిట్ స్కోర్ను దెబ్బతీస్తారు.జాగ్రత్త: మీ క్రెడిట్ రిపోర్ట్ను తరచుగా తనిఖీ చేయండి. మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్ఏ) తప్పనిసరిగా ఆన్ చేసుకోండి.మోసపోయారా? వెంటనే ఇలా చేయండి!వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్కు ఫోన్ చేసి ఖాతాను లేదా కార్డును బ్లాక్ చేయించండి.సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేసేందుకు భారతదేశంలో 1930కు కాల్ చేయండి లేదా ‘cybercrime.gov.in’లో ఫిర్యాదు చేయండి.భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి.ఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట!
పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!
భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పవిత్ర దినాన పసిడిని కొనుగోలు చేయడం అదృష్టాన్ని, శాశ్వత సంపదను తెస్తుందని కోట్లాది మంది నమ్ముతారు. అయితే, ఈ సంప్రదాయం వెనుక బలమైన ఆర్థిక ప్రయోజనం కూడా దాగి ఉందని గత తొమ్మిదేళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం సెంటిమెంట్తోనే కాకుండా, లాభదాయకమైన పెట్టుబడి వ్యూహంగా కూడా బంగారం తన సత్తాను చాటుతోంది. ముఖ్యంగా గత తొమ్మిదేళ్ల కాలంలో పసిడి సుమారు రూ. 29,000 నుండి రూ. 1,54,000 స్థాయికి చేరుకుని, పెట్టుబడిదారులకు ఏకంగా 435 శాతం భారీ రాబడిని అందించింది.12 ఏళ్లలో అక్షయ తృతీయ రాబడులు ఇలా..గత 12 ఏళ్ల అక్షయ తృతీయ బంగారం రాబడులను పరిశీలిస్తే, 2015లో 11 శాతం, 2017లో 3 శాతం తగ్గుదలతో కొంత నిరాశపరిచినప్పటికీ, ఆ తర్వాత నుండి పసిడి ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా 2020లో 47 శాతం భారీ రాబడిని అందించిన బంగారం, ఈ ఏడాది (2026) ఏకంగా 60 శాతం వృద్ధిని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2023లో 18 శాతం, 2024లో 22 శాతం, 2025లో 31 శాతంగా ఉన్న రాబడులు, ప్రతి ఏడాది రెట్టింపు ఉత్సాహంతో పెరుగుతూ పసిడిపై పెట్టుబడి అత్యంత లాభదాయకమని మరోసారి నిరూపించాయి.ఏడాదిలో 60 శాతం పెరుగుదలగత ఏడాది కాలంలో బంగారం చూపిన జోరు ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. 2025 అక్షయ తృతీయ (ఏప్రిల్ 30) నాటి ధరలతో పోలిస్తే, ప్రస్తుతం పసిడి ధరలు 60 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గోల్డ్ మార్కెట్కు గతేడాది అండగా నిలిచాయి. పెట్టుబడిదారులకు వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ఘనమైన లాభాలను అందిస్తూ, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం తన పట్టును నిలుపుకుంది. ధంతేరాస్తో పాటు అక్షయ తృతీయ భారతీయులకు అతిపెద్ద కొనుగోలు పండుగగా కొనసాగుతోంది.2026 సంవత్సరం బంగారం కొనుగోలుదారులకు కొంత గందరగోళంగా ప్రారంభమైనప్పటికీ, బులియన్ మార్కెట్ భవిష్యత్తు మాత్రం ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఇటీవల యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మార్చి గరిష్టాల నుండి ధరలు 10 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై జాప్యం వంటి కారణాలు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. అయినప్పటికీ, ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 15 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ధరల్లో వచ్చిన ఈ తాత్కాలిక తగ్గుదల (పుల్ బ్యాక్) కొనుగోలుదారులకు ఒక మంచి అవకాశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మళ్లీ వచ్చే పండుగకి రూ.1.80 లక్షలు!మున్ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఎదురయ్యే ఆటంకాలు పసిడి ధరలో పదునైన పెరుగుదలకు దారితీస్తాయని, ఏడాది కాలంలోనే తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.1,80,000 మార్కును తాకవచ్చని నిర్మల్ బాంగ్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ కునాల్ షా విశ్లేషించారు. అదేవిధంగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర 5,500 డాలర్ల స్థాయికి చేరవచ్చని, తద్వారా దేశీయంగా ధరలు రూ.1,70,000 నుండి రూ. 1,85,000 మధ్య ఉండొచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ నిపుణులు భావిస్తున్నారు.
అలర్ట్: రేపటి నుంచి ఈ బ్యాంక్ అకౌంట్లు క్లోజ్!
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపయోగంగా ఉన్న లక్షలాది ఖాతాలను రేపటి (ఏప్రిల్ 16) నుండి శాశ్వతంగా మూసివేయాలని బ్యాంక్ యాజమాన్యం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇతర ప్రభుత్వ బ్యాంకుల బాటలోనే పీఎన్బీ కూడా ఈ కఠిన చర్యలకు ఉపక్రమించడం బ్యాంకింగ్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.ఎవరి ఖాతాలు మూతపడతాయి?మీడియా నివేదికల ప్రకారం.. ఈ కింది కేటగిరీల కిందకు వచ్చే ఖాతాలను బ్యాంక్ మూసివేయనుంది.మూడేళ్లుగా లావాదేవీలు లేనివి: గత మూడేళ్లుగా కనీసం ఒక్కసారి కూడా వాడని ఖాతాలు.జీరో బ్యాలెన్స్: ఖాతాలో జీరో బ్యాలెన్సు ఉండి, చాలా కాలంగా ఇన్యాక్టివ్గా ఉన్న ఖాతాలు.కేవైసీ అప్డేట్ లేనివి: గడువులోపు e-KYC (ఈ-కేవైసీ) పూర్తి చేయని ఖాతాలపై బ్యాంక్ వేటు వేసే అవకాశం ఉంది.ఎందుకీ కఠిన నిర్ణయం?బ్యాంకులో వేల సంఖ్యలో నిరుపయోగంగా పడి ఉన్న ఖాతాల వల్ల మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని బ్యాంక్ భావిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా, అలాగే బ్యాంక్ డేటాను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో క్రమానుగతంగా ఇటువంటి చర్యలు చేపడుతుంటారు.ఖాతాను కాపాడుకోవాలంటే..మీ ఖాతా క్లోజ్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ కింది పనులు పూర్తి చేయండి:మీ సమీపంలోని పీఎన్బీ బ్రాంచ్కు వెళ్లి వెంటనే ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.మీ అకౌంట్లో కొంత మొత్తాన్ని జమ చేయండి.కనీసం ఒక చిన్న లావాదేవీ (డ్రా చేయడం లేదా జమ చేయడం) చేయడం ద్వారా అకౌంట్ యాక్టివ్గా ఉందని నిర్ధారించుకోండి.తీసుకెళ్లాల్సిన పత్రాలుఈ పనుల నిమిత్తం బ్యాంకుకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, విద్యుత్ లేదా నీటి బిల్లు (అడ్రస్ ప్రూఫ్ కోసం), బ్యాంక్ పాస్బుక్ ఒరిజినల్ పత్రాలతో పాటు వాటి ఫోటోకాపీలను (జిరాక్స్) వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి.ఇదీ చదవండి: పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు
ఆరోగ్య బీమా.. ఆదుకునే కవచమా? చక్రవ్యూహమా?
ఆరోగ్య బీమా అనేది ఆపద సమయంలో ఆదుకునే ఒక రక్షా కవచం. కానీ, అవసరానికి ఆ కవచం పనిచేయకపోతే పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం దేశంలో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రి ఖర్చుల కోసం క్లెయిమ్ చేస్తే.. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదో ఒక కారణంతో తిరస్కరించడం లేదా సగం డబ్బులే ఇవ్వడం వంటివి సాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారిక గణాంకాలు, నిపుణుల విశ్లేషణతో రూపొందించిన ప్రత్యేక కథనం మీ కోసం..క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది?వైద్య ఖర్చులు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సామాన్యుడికి ఆరోగ్య బీమా కొండంత అండ. అయితే, క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో పాలసీదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో ‘బీమా భరోసా’ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులు, 2025 ఆర్థిక సంవత్సరం మొత్తం ఫిర్యాదుల సంఖ్యను మించిపోయాయి. ఫిబ్రవరి 2026 నాటికి ఈ పోర్టల్లో సుమారు 73,729 ఫిర్యాదులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో దాదాపు 69% ఫిర్యాదులు కేవలం క్లెయిమ్ తిరస్కరణ లేదా జాప్యానికి సంబంధించినవే కావడం గమనార్హం.క్లెయిమ్ తిరస్కరణకు ప్రధాన కారణాలుబీమా సంస్థలు క్లెయిమ్లను తిరస్కరించడానికి నిబంధనలతోపాటు పాలసీదారుల అవగాహన లోపం కూడా ఒక కారణం. క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.ముందస్తు వ్యాధులను చెప్పకపోవడం..పాలసీ తీసుకునేటప్పుడు బీపీ, షుగర్ వంటి పాత జబ్బుల గురించి దాచడం అతిపెద్ద తప్పు. 36 నెలల నిరీక్షణ కాలం (మారటోరియం పీరియడ్) ముగియకముందే ఇలాంటివి బయటపడితే కంపెనీలు క్లెయిమ్ను నేరుగా తిరస్కరిస్తాయి.వెయిటింగ్ పీరియడ్కొత్తగా పాలసీ తీసుకున్న వెంటనే అన్ని వ్యాధులకు కవరేజీ ఉండదు. సాధారణంగా మొదటి 30 రోజులు (ప్రమాదాలు మినహా) నిర్దిష్ట వ్యాధులకు (హెర్నియా, క్యాటరాక్ట్.. వంటివి) 2-4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈలోపు క్లెయిమ్ చేస్తే అది రిజెక్ట్ అవుతుంది.వైద్య అవసరం లేకుండానే ఆసుపత్రిలో చేరికకేవలం డయాగ్నోస్టిక్ పరీక్షల కోసం లేదా ఇంట్లోనే చికిత్స పొందే అవకాశం ఉన్న జబ్బులకు ఆసుపత్రిలో చేరితే క్లెయిమ్ రాదు. కనీసం 24 గంటల ఆసుపత్రి చేరిక తప్పనిసరి (డే కేర్ చికిత్సలు మినహా).కాస్మెటిక్ సర్జరీలు, దంత చికిత్సలు, విటమిన్ సప్లిమెంట్స్ వంటివి చాలా పాలసీల్లో కవర్ కావు. మీరు పాలసీ తీసుకునే ముందే వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.ఆసుపత్రిలో చేరిన 24-48 గంటల్లోపు బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. రీయింబర్స్మెంట్ విషయంలో డిశ్చార్జ్ అయిన 15-30 రోజుల్లోపు పత్రాలు సమర్పించకపోతే సమస్యలు ఎదురవుతాయి.పాలసీ కొనే ముందు చెక్ చేయాల్సినవి..పాలసీ డాక్యుమెంట్ అనేది కేవలం కాగితాల కట్ట కాదు, అది ఒక చట్టపరమైన ఒప్పందం. కొనే ముందు కీలక అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి.గది అద్దెపై పరిమితి ఉందో లేదో చూడండి. గది అద్దె పరిమితి మించితే, మొత్తం బిల్లులో కంపెనీ కోత విధిస్తుంది.బిల్లులో కొంత శాతం మీరే చెల్లించాలనే నిబంధన(కో-పేమెంట్) ఉంటే ప్రీమియం తగ్గుతుంది కానీ, క్లెయిమ్ సమయంలో మీ జేబుకు చిల్లు పడుతుంది.మీ ఇంటికి దగ్గరలో ఉన్న ప్రముఖ ఆసుపత్రులు ఆ బీమా నెట్వర్క్లో ఉన్నాయో లేదో సరిచూసుకోండి.ఒకే ఏడాదిలో ఒకటికంటే ఎక్కువసార్లు అనారోగ్యం పాలైతే బీమా మొత్తం (సమ్ అస్యూర్డ్) తిరిగి రీఛార్జ్ అయ్యే సౌకర్యం ఉందో లేదో చూడండి.ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పే మాటల కంటే పాలసీలోని ‘కీ ఫీచర్స్ డాక్యుమెంట్’ చదవడం ఉత్తమం. ఏదైనా ఫిర్యాదు ఉంటే మొదట బీమా సంస్థకు, అక్కడ పరిష్కారం లభించకపోతే ఐఆర్డీఏఐ ‘బీమా భరోసా’ పోర్టల్ లేదా ఇన్సూరెన్స్ అంబడ్స్మన్ను ఆశ్రయించవచ్చు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు


