Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TCS Nashik Case Shocking Allegations of Harassment and Abuse Surface1
TCS నాసిక్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు!

ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ శాఖకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక మాజీ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణల ప్రకారం.. అక్కడ కొంతమంది టీమ్ లీడర్లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళా ఉద్యోగులపై మానసికంగా, లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.మహిళలను టీమ్ లీడర్ల డెస్క్ దగ్గరకు పిలిచే సమయంలో అసభ్యకరమైన, అవమానకరమైన భాషను ఉపయోగించేవారని చెప్పారు. ఒక ప్రొఫెషనల్ కార్యాలయంలో ఊహించలేని విధంగా అసభ్య ప్రవర్తన కొనసాగిందని ఆమె వెల్లడించారు. ముఖ్యంగా తౌసిఫ్ అత్తర్ అనే వ్యక్తి హిందూ సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని, పండుగల సమయంలో చీరలు లేదా బొట్టులు ధరించిన మహిళలను అవమానించేవాడని ఆరోపించారు.ఒక సహోద్యోగి కృష్ణ రుద్రాక్ష మాలను ధరించేవాడని, తరువాత మత మార్పిడి చేసుకున్నాడని కూడా ఆమె పేర్కొన్నారు. నిదా ఖాన్ అనే ఉద్యోగి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె హెచ్‌ఆర్ కాకపోయినా, ఇతర విభాగాలకు మారేందుకు ప్రయత్నించడం అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు.ఆఫీసులో భద్రత పేరుతో ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లు, బ్యాగులు, లంచ్ బాక్సులు బయట ఉంచాల్సి వచ్చేదని, దీని వల్ల లోపల జరిగే కార్యకలాపాలు రికార్డు కాకుండా ఉండేవని తెలిపారు. డానిష్, రాజా వంటి ఉద్యోగులు వీకెండ్లలో హోటళ్లు బుక్ చేసి మహిళలను ఒత్తిడి చేసి తీసుకెళ్లేవారని కూడా ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనల వల్ల కార్యాలయ వాతావరణం పూర్తిగా విషపూరితంగా మారిందని, ఉద్యోగం వదిలిన తర్వాత మాత్రమే తాను సురక్షితంగా ఉన్నానని ఆ మహిళ తెలిపారు. ఇంత పెద్ద సంస్థలో ఉన్న ఉన్నతాధికారులకు ఈ వ్యవహారాలు తెలియకపోవడం ఆశ్చర్యకరమని ఆమె ప్రశ్నించారు.ఈ కేసు ఒక్క వ్యక్తి ఆరోపణలతో మాత్రమే కాకుండా.. మొత్తం ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 2022 నుంచి మార్చి 2026 వరకు జరిగిన మానసిక, లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయబడింది.ఇప్పటివరకు ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశారు. వారిలో తౌసిఫ్ అత్తర్, డానిష్ షేఖ్, రాజా మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేఖ్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీ, నిదా ఖాన్ ఉన్నారు. ఇంకా ఒక మహిళా ఉద్యోగి అదృశ్యంగా ఉండటం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తోంది. కాగా అరెస్టు అయిన వారిని సంస్థ సస్పెండ్ చేసింది.

Gold on Akshaya Tritiya Unstoppable Rise 9 years of strong returns2
పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!

భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పవిత్ర దినాన పసిడిని కొనుగోలు చేయడం అదృష్టాన్ని, శాశ్వత సంపదను తెస్తుందని కోట్లాది మంది నమ్ముతారు. అయితే, ఈ సంప్రదాయం వెనుక బలమైన ఆర్థిక ప్రయోజనం కూడా దాగి ఉందని గత తొమ్మిదేళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం సెంటిమెంట్‌తోనే కాకుండా, లాభదాయకమైన పెట్టుబడి వ్యూహంగా కూడా బంగారం తన సత్తాను చాటుతోంది. ముఖ్యంగా గత తొమ్మిదేళ్ల కాలంలో పసిడి సుమారు రూ. 29,000 నుండి రూ. 1,54,000 స్థాయికి చేరుకుని, పెట్టుబడిదారులకు ఏకంగా 435 శాతం భారీ రాబడిని అందించింది.12 ఏళ్లలో అక్షయ తృతీయ రాబడులు ఇలా..గత 12 ఏళ్ల అక్షయ తృతీయ బంగారం రాబడులను పరిశీలిస్తే, 2015లో 11 శాతం, 2017లో 3 శాతం తగ్గుదలతో కొంత నిరాశపరిచినప్పటికీ, ఆ తర్వాత నుండి పసిడి ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా 2020లో 47 శాతం భారీ రాబడిని అందించిన బంగారం, ఈ ఏడాది (2026) ఏకంగా 60 శాతం వృద్ధిని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2023లో 18 శాతం, 2024లో 22 శాతం, 2025లో 31 శాతంగా ఉన్న రాబడులు, ప్రతి ఏడాది రెట్టింపు ఉత్సాహంతో పెరుగుతూ పసిడిపై పెట్టుబడి అత్యంత లాభదాయకమని మరోసారి నిరూపించాయి.ఏడాదిలో 60 శాతం పెరుగుదలగత ఏడాది కాలంలో బంగారం చూపిన జోరు ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. 2025 అక్షయ తృతీయ (ఏప్రిల్ 30) నాటి ధరలతో పోలిస్తే, ప్రస్తుతం పసిడి ధరలు 60 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గోల్డ్ మార్కెట్‌కు గతేడాది అండగా నిలిచాయి. పెట్టుబడిదారులకు వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ఘనమైన లాభాలను అందిస్తూ, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం తన పట్టును నిలుపుకుంది. ధంతేరాస్‌తో పాటు అక్షయ తృతీయ భారతీయులకు అతిపెద్ద కొనుగోలు పండుగగా కొనసాగుతోంది.2026 సంవత్సరం బంగారం కొనుగోలుదారులకు కొంత గందరగోళంగా ప్రారంభమైనప్పటికీ, బులియన్ మార్కెట్ భవిష్యత్తు మాత్రం ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఇటీవల యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మార్చి గరిష్టాల నుండి ధరలు 10 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై జాప్యం వంటి కారణాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. అయినప్పటికీ, ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 15 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ధరల్లో వచ్చిన ఈ తాత్కాలిక తగ్గుదల (పుల్ బ్యాక్) కొనుగోలుదారులకు ఒక మంచి అవకాశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మళ్లీ వచ్చే పండుగకి రూ.1.80 లక్షలు!మున్ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఎదురయ్యే ఆటంకాలు పసిడి ధరలో పదునైన పెరుగుదలకు దారితీస్తాయని, ఏడాది కాలంలోనే తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.1,80,000 మార్కును తాకవచ్చని నిర్మల్ బాంగ్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ కునాల్ షా విశ్లేషించారు. అదేవిధంగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర 5,500 డాలర్ల స్థాయికి చేరవచ్చని, తద్వారా దేశీయంగా ధరలు రూ.1,70,000 నుండి రూ. 1,85,000 మధ్య ఉండొచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ నిపుణులు భావిస్తున్నారు.

Wipro unveils Rs 15000 crore buyback via tender route3
విప్రో భారీ ఆఫర్: రూ.15,000 కోట్లతో షేర్ల బైబ్యాక్

ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో తన వాటాదారులకు తీపి కబురు అందించింది. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (Q4FY26) ఫలితాల సందర్భంగా ఏకంగా రూ. 15,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది.బైబ్యాక్ ముఖ్యాంశాలువిప్రో బైబ్యాక్ చేసే షేర్ల మొత్తం విలువ రూ. 15,000 కోట్లు. బైబ్యాక్ ధర ఒక్కో షేరుకు రూ. 250. ప్రస్తుత మార్కెట్ ధర రూ. 210.15 తో పోలిస్తే ఇది 19 శాతం అధికం. మొత్తం 60 కోట్ల షేర్లను (మొత్తం ఈక్విటీలో 5.7 శాతం) కంపెనీ వెనక్కి తీసుకోనుంది. 'టెండర్ ఆఫర్' మార్గంలో దామాషా పద్ధతిలో ఈ బైబ్యాక్ ప్రక్రియ జరగనుంది. రికార్డు తేదీ నాటికి షేర్లు కలిగిన వారు, ఏడీఆర్ (ADR) హోల్డర్లు ఇందులో పాల్గొనవచ్చు.క్యూ4 ఫలితాలుమార్చి 2026తో ముగిసిన త్రైమాసికంలో విప్రో ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నికర లాభం గత ఏడాది ఇదే కాలంలో రూ. 3,569.6 కోట్లుగా ఉండగా, ఇప్పుడు 1.89 శాతం తగ్గి రూ. 3,501.8 కోట్లుగా నమోదైంది. మరోవైపు కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 7.6 శాతం వృద్ధితో రూ. 24,236.3 కోట్లకు చేరింది. 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 13,197.4 కోట్ల నికర లాభాన్ని, రూ. 92,624 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.ఏఐ దిశగా అడుగులుఫలితాల సందర్భంగా విప్రో సీఈఓ, ఎండీ శ్రీని పల్లియా మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వస్తున్న మార్పులు క్లయింట్ల ప్రాధాన్యతలను మారుస్తున్నాయని తెలిపారు. ‘మేము 'ఏఐ-ఫస్ట్' వ్యూహంతో ముందుకు వెళ్తున్నాం. మా ఏఐ నేటివ్ బిజినెస్ యూనిట్ ద్వారా 'సర్వీసెస్-యాజ్-ఎ-సాఫ్ట్వేర్' మోడల్‌కు పెద్దపీట వేస్తున్నాం. ఓలం గ్రూప్‌తో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం మా భవిష్యత్తు పెట్టుబడులకు నిదర్శనం’ అని ఆయన పేర్కొన్నారు.గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి విప్రో షేరు ధర స్వల్పంగా పెరిగి రూ. 210.20 వద్ద స్థిరపడింది.

Surge in Russian Oil Indias Imports Triple to 5 3 Billion in March4
రష్యన్‌ ఆయిల్‌.. రయ్‌ రయ్‌..

పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల క్రూడ్‌ రేట్లు పెరగకుండా రష్యన్‌ ఆయిల్‌పై ఆంక్షలను అమెరికా నెలరోజుల పాటు సడలించడంతో, ఆ దేశం నుంచి ముడి చమురు దిగుమతులు మళ్లీ జోరందుకున్నాయి. మార్చిలో భారత్‌ కొనుగోళ్లు మూడు రెట్లు పెరిగి 5.3 బిలియన్‌ డాలర్లకు చేరాయి.యూరప్‌కి చెందిన సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ, క్లీన్‌ ఎయిర్‌ (క్రియా) నివేదిక ప్రకారం ఫిబ్రవరిలో రష్యా నుంచి దిగుమతులను తగ్గించుకున్న భారత్, ఆ తర్వాతి నెలలో మళ్లీ గణనీయంగా కొనుగోళ్లు చేసింది. మొత్తం 5.8 బిలియన్‌ యూరోల విలువ చేసే రష్యన్‌ హైడ్రోకార్బన్స్‌ని దిగుమతి చేసుకోగా ఇందులో క్రూడాయిల్‌ వాటా 91 శాతం (సుమారు 5.3 బిలయన్‌ యూరోలు)గా నమోదైంది.ఇది 2025 మార్చిలో నమోదైన దానితో పోలిస్తే 72 శాతం అధికం. ఇక రష్యా నుంచి దిగుమతి చేసుకున్న మిగతా వాటిలో బొగ్గు (337 మిలియన్‌ యూరోలు), ఇతరత్రా ఆయిల్‌ ఉత్పత్తులు (178.5 మిలియన్‌ యూరోలు) ఉన్నాయి. మార్చిలో భారత్‌ క్రూడాయిల్‌ దిగుమతులు మొత్తం మీద 4 శాతం తగ్గినప్పటికీ రష్యా నుంచి కొనుగోళ్లు మాత్రం రెట్టింపయ్యాయి.ఫిబ్రవరిలో 1.4 బిలియన్‌ డాలర్ల మేర ముడిచమురు దిగుమతి అయింది. ఆంక్షల కారణంగా 2025 నవంబర్‌లో రష్యన్‌ దిగుమతులు నిలిపివేసిన ప్రభుత్వ రంగ మంగళూరు, వైజాగ్‌ రిఫైనరీలు 2026 మార్చి నుంచి తిరిగి కొనుగోళ్లు మొదలుపెట్టాయి.

Tech Mahindra responds to viral claims about Goregaon office Mini Pakistan row5
‘టెక్‌ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు..

టీసీఎస్‌ (TCS) నాసిక్‌ బీపీవోలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడులపై ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగా మరో ఐటీ సంస్థ టెక్‌ మహీంద్రాపైనా ఇదే రకమైన మతపరమైన పక్షపాత ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముంబై గోరేగావ్‌ ఐటీ పార్క్‌లో ఈ సంస్థకు చెందిన బీపీపీ కార్యాలయంలో మతపరమైన పక్షపాతం, వివక్షపూరిత నియామక పద్ధతులు కొనసాగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.బాంబే హైకోర్టు న్యాయవాది అశుతోష్ దూబే తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక ఉద్యోగి పంపిన సందేశాన్ని షేర్ చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. సదరు కార్యాలయంలోని హెచ్‌ఆర్ విభాగం ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వారినే ఎక్కువగా నియమిస్తోందని, కార్యాలయ నిబంధనలు కూడా పక్షపాతంగా ఉన్నాయని ఆ సందేశంలో ఆరోపించారు.ముఖ్యంగా రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు క్యాంటీన్‌లో ఇఫ్తార్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించారని, ఆ సమయంలో ప్యాంట్రీ ఏరియాలోకి ఇతరులు పాదరక్షలతో రావద్దంటూ ఏర్పాటు నోటీసులకు సంబంధించిన ఫోటోలనూ దూబే షేర్‌ చేశారు. దీనివల్ల తాము "మినీ పాకిస్తాన్‌లో" పని చేస్తున్నట్లు అనిపిస్తోందని, అక్కడ పనిచేయడం అసౌకర్యంగా ఉందంటూ ఒక ఉద్యోగి వాపోయినట్లుగా దూబే పేర్కొన్నారు. అలాగే, నియామకాల్లో పారదర్శకత లేదని, కార్పొరేట్ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది అశుతోష్ దూబే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన టెక్‌ మహీంద్రా యాజమాన్యంఈ ఆరోపణలపై టెక్ మహీంద్రా యాజమాన్యం వెంటనే స్పందించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలు, ఫోటోలు పూర్తిగా "నిరాధారమైనవి" అని కొట్టిపారేసింది. తాము నిర్వహించిన అంతర్గత సమీక్షలో అటువంటి వివక్షపూరిత సంఘటనలు ఏవీ జరగలేదని తేలిందని సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. ముఖ్యంగా వైరల్ అవుతున్న 'ఫుట్‌వేర్ ఫ్రీ జోన్' నోటీసు అసలు తమ కార్యాలయానికే చెందినది కాదని, నియామక ప్రక్రియలో కూడా ఎలాంటి అవకతవకలు లేవని కంపెనీ వెల్లడించింది.తమ సంస్థ సర్వమత సమానత్వాన్ని పాటిస్తుందని, సమ్మిళిత, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రాధాన్యతని టెక్ మహీంద్రా పేర్కొంది. మతం, కులం లేదా ఇతర ప్రాతిపదికన ఎలాంటి వివక్షను సహించబోమని, ప్రతి ఉద్యోగిని నిష్పాక్షికంగా చూస్తామని కంపెనీ స్పష్టం చేసింది. కార్పొరేట్ విలువలను కాపాడటంలో తాము ఎప్పుడూ ముందుంటామని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా కోరింది.ఇదీ చదవండి: కంపెనీల్లో ఇదేం నీతి? దెబ్బకు హెచ్‌ఆర్‌ సైలెంట్‌!

Tennis Star Carlos Alcaraz Appointed as Infosys Global Brand Ambassador6
ఇన్ఫోసిస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా అల్కరాజ్‌

న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఏడు సార్లు గ్రాండ్‌ శ్లామ్‌ చాంపియన్‌గా నిల్చిన టెన్నిస్‌ దిగ్గజం కార్లోస్‌ అల్కరాజ్‌ని తాజాగా తమ గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. దీనితో పాటు ఏఐ ఆధారిత మ్యాచ్‌ అనలిటిక్స్, మ్యాచ్‌ల కోసం సన్నద్ధం కావడానికి వ్యక్తిగత స్థాయిలో పనితీరును మదింపు చేసేందుకు ఉపయోగపడే అప్లికేషన్‌ని ఆయన తో కలిసి తమ ఏఐ సాంకేతికత టొపాజ్‌ సహా యంతో అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది.అలాగే సామాజిక ప్రయోజనాల కోసం టె క్నాలజీని ఉపయోగించుకునే దిశగా ఇన్ఫోసిస్, అల్కరాజ్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. ఏఐ ద్వారా టెన్నిస్‌ స్థాయిని మరింతగా పెంచాలన్న తమ లక్ష్య సాధన దిశగా ఆయనతో భాగస్వామ్యం కీలకమని ఇన్ఫీ తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement