Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India commercial fleet may reach 2250 by 2035: Airbus1
కమర్షియల్‌ విమానాలు మూడు రెట్లు వృద్ధి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మూడో అతి పెద్ద ఏవియేషన్‌ మార్కెట్‌గా భారత్‌ వృద్ధి చెందే క్రమంలో దేశీయంగా 100 సీట్ల పైగా సామర్థ్యం ఉండే కమర్షియల్‌ విమానాల సంఖ్య వచ్చే దశాబ్ద కాలంలో మూడు రెట్లు పెరుగుతుందని విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్‌ అంచనా వేస్తోంది. దీని ప్రకారం ప్రస్తుతం 850గా ఉన్న సంఖ్య 2035 నాటికి 2,250కి పెరగనుంది. దేశీయంగా ఏవియేషన్‌ మార్కెట్‌ వృద్ధి చెందుతుండటం, అంతర్జాతీయ రూట్లలో కూడా కార్యకలాపాలను విస్తరించడంపై దేశీ విమానయాన సంస్థలు గణనీయంగా దృష్టి పెడుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి.వింగ్స్‌ ఇండియా 2026 సందర్భంగా గురువారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎయిర్‌బస్‌ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్‌ జర్జెన్‌ వెస్టర్‌మెయర్‌ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం భారత ఎయిర్‌లైన్స్‌ నుంచి 1,250 విమానాలకు ఆర్డర్ల బ్యాక్‌లాగ్‌ ఉందని వివరించారు. ఏటా సగటున 120–150 వరకు విమానాలను అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.వచ్చే పదేళ్లలో భారత్‌లో ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ వృద్ధి వార్షికంగా 8.9 శాతంగా ఉండొచ్చని, విమానాశ్రయాల సంఖ్య మరో 50 మేర పెరగవచ్చని భావిస్తున్నట్లు వెస్టర్‌మెయర్‌ తెలిపారు. కమర్షియల్‌ విమానాల సంఖ్య పెరగడంతో పాటు వార్షికంగా సరుకు రవాణా సామర్థ్యం పెరిగేందుకు కూడా అవకాశం ఉందని ఆయన చెప్పారు. భారతీయ విమానయాన సంస్థలు సుమారు 1,700 విమానాలకు ఆర్డర్లివ్వగా, ఎయిర్‌బస్‌ దగ్గర 72% బ్యాక్‌లాగ్‌ ఉందని వెస్టర్‌మెయర్‌ తెలిపారు. 35 వేల మంది పైలట్లు కావాలి.. విమానాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో 2035 నాటికి 35,000 మంది పైగా పైలట్లు అవసరమవుతారని, అలాగే సాంకేతిక సిబ్బంది సంఖ్య కూడా మూడు రెట్లు పెరిగి 34,000 స్థాయిలో కావాల్సి ఉంటుందని వెస్టర్‌మెయర్‌ చెప్పారు. ప్రస్తుతం పైలట్ల సంఖ్య 12,000గా, సాంకేతిక సిబ్బంది సంఖ్య సుమారు 11,000గా ఉన్నట్లు ఆయన తెలిపారు. విమానాల సంఖ్య మూడు రెట్లు పెరిగే క్రమంలో భారత్‌ వేగంగా మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాలింగ్‌ కార్యకలాపాలకి హబ్‌గా ఎదుగుతుందని వెస్టర్‌మెయర్‌ చెప్పారు.ఎయిర్‌ఫ్రేమ్‌లు, ఇంజిన్లు, విడిభాగాల మార్కెట్‌ 2035 నాటికి మూడు రెట్లు పెరిగి 9.5 బిలియన్‌ డాలర్లకు చేరగలదని పేర్కొన్నారు. ఇక ఫ్లయిట్, గ్రౌండ్, సాంకేతిక కార్యకలాపాల డిజిటలైజేషన్‌తో పాటు సైబర్‌ సెక్యూరిటీ మొదలైన వాటిపై భారతీయ ఎయిర్‌లైన్స్‌ 1 బిలియన్‌ డాలర్ల వరకు వెచ్చించే అవకాశం ఉందన్నారు.భారత్‌లో తొలిసారిగా రూపొందించి, అసెంబుల్‌ చేసిన ఎయిర్‌బస్‌ సీ–295 ట్విన్‌ ఇంజిన్‌ మీడియం మిలటరీ రవాణా విమానాన్ని 2026 మూడో త్రైమాసికంలో డెలివర్‌ చేయనున్నట్లు వెస్టర్‌మెయర్‌ వివరించారు. ఎయిర్‌బస్‌ హెచ్‌125 హెలికాప్టర్ల కోసం ఫైనల్‌ అసెంబ్లీ లైన్స్‌ ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి డెలివరీలు ప్రారంభం కాగలవని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌ నుంచి 1.5 బిలియన్‌ డాలర్ల మేర కొనుగోళ్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

Air India orders 30 more Boeing 737 Max planes2
30 బోయింగ్‌ విమానాలకు ఎయిరిండియా ఆర్డరు..

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇంధనం ఆదా చేసే 737 మ్యాక్స్‌ రకానికి చెందిన మరో 30 బోయింగ్‌ విమానాల కోసం ఎయిరిండియా ఆర్డరిచ్చింది. దీనితో బోయింగ్‌కి మొత్తం కలిపి దాదాపు 200 విమానాలకు ఆర్డరిచ్చినట్లవుతుంది. మరోవైపు, ఏ321 రకానికి చెందిన 200 విమానాల కోసం ఎయిర్‌బస్‌కి ఇచ్చిన ఆర్డర్‌లో ఎయిరిండియా స్వల్ప మార్పులు చేసింది.ఇందులో 15 ఎయిర్‌క్రాఫ్ట్‌లను అధునాతన ఎ 321ఎక్స్‌ఎల్‌ఆర్‌ (ఎక్స్‌ట్రా లాంగ్‌ రేంజ్‌) వేరియంట్‌కి మార్చుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇవి 2029–2030 మధ్యలో డెలివర్‌ అ య్యే అవకాశం ఉందని వివరించింది. ఇంధనం ఆదా చేసే ఎ321 ఎక్స్‌ఎల్‌ఆర్‌ విమానా లకు దాదాపు 8,700 కి.మీ. రేంజి ఉంటుంది.

Economic Survey 2025-263
సవాళ్లున్నా ముందుకే   

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధితో ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ప్రస్థానం కొనసాగుతుందని ఆర్థిక సర్వే విశ్వాసం వ్యక్తం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026–27) జీడీపీ 6.8–7.2 శాతం మధ్య వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 7.4 శాతం కంటే తగ్గించడం గమనార్హం. జీడీపీలో ద్రవ్యలోటు 2025–26లో 4.8 శాతం అంచనా కాగా, 2026–27లో 4.4 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో తీసుకొచ్చిన విధానపరమైన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మధ్య కాల వృద్ధిని 7 శాతానికి చేర్చుతాయి.కనుక ప్రపంచ అనిశ్చితుల మధ్య స్థిరమైన వృద్ధికి అవకాశం ఉంది. కావాల్సింది అప్రమత్తతే కానీ, నిరాశావాదం కాదు’’అని ఆర్థిక సర్వే పేర్కొంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య రక్షణాత్మక పెట్టుబడుల ధోరణితో బంగారం, వెండి ధరల మంటలు ఇప్పుడప్పుడే చల్లారకపోవచ్చని అభిప్రాయపడింది. 739 పేజీలతో కూడిన 2025–26 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంటుకు సమర్పించారు. సందర్భానుసారం వేదాలు, ఇతిహాసాల్లోని సూక్తులను సైతం ప్రస్తావించడం విశేషం. ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌ బృందం దీన్ని రూపొందించింది. ఏటా బడ్జెట్‌కు ముందు ఆవిష్కరించే ఆర్థిక సర్వే నివేదిక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు రానున్న రానున్న సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉంటుందన్నది తెలియజేస్తుంది.‘స్వదేశీ’ మంత్రం.. అంతర్జాతీయంగా వాణిజ్యం, ఇతర సమస్యల నుంచి గట్టెక్కేందుకు ‘స్వదేశీ’ మంత్రాన్ని ఆర్థిక సర్వే సూచించింది. ‘‘అన్నిరకాల దిగుమతులకు ప్రత్యామ్నాయం అన్నది ఆచరణ సాధ్యం కాబోదు. అలాగే, ఆమోదనీయం కూడా కాదు. అభివృద్ధి చెందిన దేశాలు ఎగుమతులపై నియంత్రణలు విధిస్తూ, టెక్నాలజీ బదిలీకి నిరాకరిస్తున్న తరుణంలో స్వదేశీ అన్నది తప్పనిసరే కాదు అవసరం కూడా’’అని ఆర్థిక సర్వే పేర్కొంది. ఐరోపాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ తయారీ రంగ పోటీతత్వాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడం, ఎగుమతుల పరంగా ఉన్న అవరోధాలను తొలగించడంపై దృష్టి సారించాలి. సర్వేలోని అంశాలు.. ⇒ 2026–27లో జీడీపీ వృద్ధి రేటు 6.8–7.2 శాతంగా ఉంటుంది. మధ్య కాలానికి జీడీపీ వృద్ధి 7 శాతంగా కొనసాగొచ్చు. ⇒ 2026–27లో ద్రవ్యలోటు 4.4 శాతానికి దిగొస్తుంది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువే ఉండొచ్చు. అయినప్పటికీ ఆర్‌బీఐ లకి్ష్యత స్థాయి 4 శాతం పరిధిలోనే ఉంటుంది. ⇒ అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలు ఈ ఏడాదిలో ముగుస్తాయి. దీంతో విదేశీ వాణిజ్యం పరంగా అనిశ్చితులు తగ్గుతాయి. ⇒ కృత్రిమ మేధ (ఏఐ)పై ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ట్రిలియన్‌ డాలర్లు కుమ్మరిస్తున్న నేపథ్యంలో.. ఈ పెట్టుబడులు ఆశించిన ప్రతిఫలం ఇవ్వకపోతే అది ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అధిక విలువలు కలిగిన అసెట్స్‌లో దిద్దుబాటు చోటుచేసుకోవచ్చు. ⇒ రూపాయి విలువ పటిష్టమైన దేశ ఆర్థిక మూలాలను ప్రతిఫలించడం లేదు. అమెరికా టారిఫ్‌లతో రూపాయి విలువ 5 శాతం పతనమైంది. అయినప్పటికీ కరెన్సీ విలువ క్షీణించడం వల్ల మన ఉత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్‌ల ప్రభావాన్ని కొంత వరకు తగ్గిస్తోంది. ⇒ దేశ వృద్ధిలో సేవల ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వస్తు ఎగుమతులపై టారిఫ్‌ల అనిశ్చితుల ప్రభావాన్ని ఇవి భర్తీ చేస్తున్నాయి. ⇒ ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలో ఉంది. కంపెనీలు, గృహాల పద్దులు ఆరోగ్యంగా ఉన్నాయి. వినియోగం కూడా బలంగా ఉంది. ⇒ తదుపరి జీఎస్‌టీ సంస్కరణల్లో భాగంగా ఇ–వే బిల్లు వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించాలి. ⇒ ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి రూ.8.1 లక్షల కోట్ల చెల్లింపుల్లో జాప్యం ఈ రంగం వృద్ధికి అవరోధంగా మారింది. నగదు ప్రవాహాల ఆధారితంగా రుణ సాయం అందించడం వంటి వినూత్నమైన చర్యలు అవసరం. ⇒ ఎరువుల తయారీలోకి వినియోగించే ముడి పదార్థాలు, ఫార్మా ముడిసరుకులు (ఇంగ్రేడియెంట్స్‌), మ్యాగ్నెట్, బ్యాటరీ సెల్స్, నూనెలు, టెలికం ఎక్విప్‌మెంట్, వైద్య పరికరాల పరంగా స్వావలంబనను పెంచేందుకు బహుళ అంచల విధానం అవసరం. ⇒ ప్రస్తుతం ఏదైనా కంపెనీలో ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంటే దాన్ని ప్రభుత్వ సంస్థగా పేర్కొంటుండగా, దీన్ని 26 శాతానికి తగ్గించాలి. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో 51 శాతం కంటే తక్కువకు తగ్గించుకోవచ్చు. పూర్తిగా వైదొలగొచ్చు. ⇒ పీఎల్‌ఐ పథకం కింద రూ.13,759 కోట్ల ప్రోత్సాహకాలతో దేశంలో మొబైల్‌ ఫోన్ల తయారీ 2025 సెప్టెంబర్‌ నాటికి రూ.9.34 లక్షల కోట్లకు చేరింది. ఎగుమతులు రూ.5.12 లక్షల కోట్లుగా ఉన్నాయి. ⇒ డిజిటల్‌ వ్యసనానికి చెక్‌ పెట్టేందుకు సోషల్‌ మీడియా యాప్‌ల వినియోగంలో వయసుల వారీ పరిమితులు తీసుకురావాలి. కరోనా సమయంలో మొదలైన ఆన్‌లైన్‌ బోధన టూల్స్‌పై ఆధారపడడాన్ని తగ్గించే చర్యలు అవసరం. పిల్లలకు బేసిక్‌ ఫోన్లు లేదా కంటెంట్‌ పరంగా ఫిల్టర్లతో విద్యా సంబంధిత సమాచారంతో కూడిన ట్యాబ్‌లను అనుమతించొచ్చు. ⇒ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య మీడియాలో అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌పై ప్రచారాన్ని నిషేధించాలి. చంటి పిల్లలకు సంబంధించి పాలు, పానీయాల మార్కెటింగ్‌పై పరిమితులు విధించాలి. ⇒ దేశంలో స్థూలకాయం పెరిగిపోతుండడం ప్రధాన ప్రజారోగ్య సవాలుగా మారింది. కనుక సరైన పోషకాహారం తీసుకోవడంపై దృష్టి సారించాలి. 2019–21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మహిళల్లో 24 శాతం, పురుషుల్లో 23 శాతం అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ⇒ ఐటీ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఉండొచ్చు. కొన్ని రకాల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుంది. దీనిపై దృష్టి సారించేందుకు ఏఐ ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలి.వికసిత్‌ భారత్‌కు మార్గసూచీభారతదేశ సంస్కరణల ప్రస్థానాన్ని ఆర్థిక సర్వే విశదీకరించింది.అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన వాతావరణం మధ్య స్థిరమైన పురోగతిని ప్రతిబింబించింది. బలమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, స్థిరమైన వృద్ధితోపాటు దేశ నిర్మాణంలో ఆవిష్కరణలు, పారిశ్రామిక పాత్రను హైలైట్‌ చేస్తోంది. తయారీని బలోపేతం చేయడానికి, ఉత్పాదకతను పెంచడానికి, వికసిత్‌ భారత్‌ లక్ష్యం దిశగా మన ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి ఈ సర్వే కార్యాచరణను కూడా వివరించింది’’ – ప్రధాని నరేంద్ర మోదీపటిష్ట స్థితిలో భారత్‌ దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు ఇంతకుముందెన్నడూ లేనంత బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ సవాళ్లను విజయవంతంగా అధిగమించడం ద్వారా భారత్‌ను అధిక వృద్ధి పథంలో నిలిపాం. జీడీపీ వృద్ధి సామర్థ్యాన్ని 7 శాతానికి చేర్చాం. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభం మధ్య భారత్‌ అంతర్జాతీయ ఆశాకిరణంగా నిలిచింది’’ – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎగుమతులు, వ్యవసాయంలో లోపాలు.. పార్లమెంటు ముందుంచిన ఆర్థిక సర్వే 2025–26 దేశ ఎగుమతి విధానాలు.. ముఖ్యంగా వ్యవసాయ రంగం విషయంలో లోపాలను ఎత్తి చూపించింది. విలువ పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద వ్యవసాయ దేశంగా ఉన్న భారత్‌ నుంచి.. వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, ఆహారం, పానీయాల ఉత్పత్తుల ఎగుమతులు వచ్చే నాలుగేళ్ల కాలంలో 100 బిలియన్‌ డాలర్లకు (రూ.9.2 లక్షల కోట్లు) చేరుకుంటాయని అంచనా వేసింది.2024–25లో ఇవి 51.1 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అయితే విధానాల్లో తరచూ చేసే మార్పులతో సరఫరా వ్యవస్థలు దెబ్బతినొచ్చని, అనిశ్చితికి కారణమై.. విదేశీ కొనుగోలుదారులు ప్రత్యామ్నాయాలను ఆశ్రయించేందుకు దారితీయొచ్చంటూ హెచ్చరించింది. ఒక్కసారి ఎగుమతుల మార్కెట్లను కోల్పోతే తిరిగి పొందడం కష్టమవుతుందని పేర్కొంది.

Gold Sharp Rise Looks Like a Bubble Warns Economist William Lee4
బంగారం కొనొద్దు.. విలియం లీ హెచ్చరిక!

2025 జనవరిలో రూ. 78వేలు వద్ద ఉన్న బంగారం ధర 2026 జనవరికి రూ. 1.78లక్షలు క్రాస్ చేసింది. ఏడాది కాలంలో లక్ష రూపాయలు పెరిగిందన్నమాట. గోల్డ్ రేటు రోజు రోజుకి పెరుగుతున్న తీరు చూసి పసిడి ప్రియులలో కూడా ఒకింత భయం మొదలైంది. ఇది వరకు ఎప్పుడూ లేనంతగా.. పెరిగిపోతుండడంతో రాబోయే రోజుల్లో గోల్డ్ కొనడానికి సాధ్యమవుతుందా అని ఆలోచిస్తున్నారు.బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీన్ని చూసి చాలామంది గోల్డ్ కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. రేట్ల పెరుగుదల విషయంలో ప్రజలు గాబరాపడాల్సిన అవసరం లేదు. పెరిగిన ధరలకు కారణం.. ప్రపంచ రాజకీయ, సామాజిక పరిస్థితులే అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' పేర్కొన్నారు.పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉంది. అంటే గోల్డ్ రేటు ఏ సమయంలో అయినా భారీగా తగ్గిపోతుందని అన్నారు. కాబట్టి ధరలు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో బంగారం దొరకదేమో అని ఎగబడి బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.కొన్ని సంస్థలు ఇచ్చే రిపోర్ట్స్ కూడా ప్రజలను భయపెడుతున్నాయి. ఇదంతా ఒక ట్రాప్ అని విలియం లీ పేర్కొన్నారు. కొన్ని పెద్ద సంస్థలు, ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని ఎక్కువ ధరకు విక్రయించుకోవడానికి ఇలా చేస్తుంటారని ఆయన అన్నారు. ఎప్పుడైతే ఒక వస్తువుకు డిమాండ్ పెరుగుతుందో.. దాని ధర కచ్చితంగా పెరుగుతుంది. కానీ బంగారం విషయంలో మాత్రం లండన్, న్యూయార్క్ వంటి దేశాల్లోని కొన్ని పెద్ద బ్యాంకులు ఫిక్స్ చేస్తాయని ఆరోపించారు.ఇదీ చదవండి: ఊహకందని రేటు.. రికార్డు స్థాయికి చేరిన వెండి!1980లో బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరిగాయి. ఈ సమయంలో కూడా చాలామంది ప్రజలు గోల్డ్ కొనడానికి ఎగబడ్డారు. కొన్ని రోజుల తరువాత గోల్డ్ రేటు 57 శాతం పడిపోయింది. 2011లో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు (2026) కూడా ఇదే రిపీట్ అవుతుందని ఆయన అన్నారు. కాబట్టి రేటు పెరిగిందని కొనేయకండి. కొన్ని రోజులు వేచి చూడండి. తప్పకుండా.. బంగారం ధర తగ్గుతుందని చెప్పారు.

Realme P4 Power 5G Launched with 10001 mAh Battery in India5
రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌: 10,001 mAh బ్యాటరీతో..

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులతో చాలామందికి ఎదురయ్యేది ఛార్జింగ్ సమస్యే. దీనికి చెక్ పెట్టడానికి రియల్‌మీ (Realme) లేటెస్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇది ఏకంగా 10,001 mAh బ్యాటరీతో వస్తుంది. దీని ధర ఎంత?, డెలివరీలు ఎప్పుడు అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.రియల్‌మీ లాంచ్ చేసిన ఎక్కువ బ్యాటరీ పవర్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ పేరు 'పీ4 పవర్ 5జీ'. ఇది 6.78 అంగుళాల 4డి కర్వ్⁺ అమోలెడ్ డిస్‌ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ & 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో 12 జిబి వరకు ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్‌తో లభించే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫిబ్రవరి 5 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.ట్రాన్స్‌ఆరెంజ్, ట్రాన్స్‌సిల్వర్, ట్రాన్స్‌బ్లూ ఎంపికలలో లభించే రియల్‌మీ పీ4 పవర్ 5జీ మొబైల్.. 8 జీబీ/ 128 జీబీ ధర రూ. 25,999 నుంచి ప్రారంభమవుతుంది. 8 జీబీ / 256 జీబీ ధర రూ. 27,999 &12 జీబీ / 256 జీబీ ధర రూ. 30,999. ఇది పెద్ద బ్యాటరీ కలిగి ఉన్నప్పటికీ.. 219 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Airtel Provides 36 Crore Indians With Free Access to Adobe Express Premium6
రూ.4000 విలువైన ప్రీమియం.. ఏడాదిపాటు ఉచితం!

భారతదేశంలోకి ప్రముఖ టెలికాం కంపెనీ 'ఎయిర్‌టెల్'.. ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా.. తన 36 కోట్ల వినియోగదారులకు ప్రముఖ డిజైన్ ప్లాట్‌ఫామ్ అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం (Adobe Express Premium)ను ఉచితంగా అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ ఈ కథనంలో తెలుసుకుందాం.అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం అనేది కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే కాకుండా.. బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. సుమారు రూ.4,000 విలువైన ఈ ప్రీమియం ప్యాకేజీని ఎయిర్‌టెల్ యూజర్లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.. ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు.అడోబ్ ఎక్స్‌ప్రెస్ అనేది.. అడోబ్ రూపొందించిన ఒక సులభమైన, వేగవంతమైన క్రియేట్ ఎనీథింగ్ యాప్. డిజైన్ అనుభవం లేకపోయినా, ఎవరికైనా ప్రొఫెషనల్ స్థాయి పోస్టర్లు, సోషల్ మీడియా కంటెంట్, వీడియోలు, ఆహ్వాన పత్రికలు, మార్కెటింగ్ మెటీరియల్ రూపొందించడానికి ఇది సహాయపడుతుంది. ఇందులో ఉన్న AI ఆధారిత ఫీచర్లు పనిని మరింత వేగంగా, ఆకర్షణీయంగా చేస్తాయి. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ట్లో లాగిన్ అయి ఈ సర్వీస్ యాక్టివేట్ చేసుకోవచ్చు.అడోబ్ ఎక్స్‌ప్రెస్ కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే కాకుండా.. హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల వినియోగదారులు తమ మాతృభాషలోనే డిజైన్ చేయగలుగుతారు. పండుగ శుభాకాంక్షలు, పెళ్లి ఆహ్వానాలు, వాట్సాప్ స్టేటస్‌లు, స్థానిక దుకాణాల ప్రమోషన్‌లు అన్నీ సులభంగా రూపొందించవచ్చు.ఇదీ చదవండి: పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనాఅడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ద్వారా.. కంటెంట్ క్రియేటర్లు & ఇన్‌ఫ్లూయెన్సర్లు.. రీల్స్, యూట్యూబ్ థంబ్‌నెయిల్స్, వైరల్ కంటెంట్ సులభంగా తయారు చేయవచ్చు. సాధారణ వినియోగదారులు పండుగ శుభాకాంక్షలు, వ్యక్తిగత ఆహ్వానాలు పంపుకోవచ్చు. విద్యార్థులు ప్రాజెక్టులు, ప్రెజెంటేషన్లు, పోర్ట్‌ఫోలియోలు రూపొందించవచ్చు. చిన్న వ్యాపారులు లోగోలు, పోస్టర్లు, సోషల్ మీడియా ప్రకటనలు నిమిషాల్లో రూపొందించవచ్చు.You x Us x @adobeexpress - collab of the year!Casually unlocking the quick & easy design app worth ₹4000 for all of you.#EveryoneCanDesign #MadeWithAdobeExpress #AirtelXAdobe pic.twitter.com/JmCHG4tvgE— airtel India (@airtelindia) January 29, 2026

Advertisement
Advertisement
Advertisement