Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Airtel Outpaces Jio in New User Growth for the Third Consecutive Month1
జియోకు షాక్‌.. ఎయిర్‌టెల్‌కే ఎక్కువ యూజర్లు!

భారతీ ఎయిర్‌టెల్‌ కొత్త చందాదారులను ఆకర్షించడంలో వరుసగా మూడో నెలలోనూ ముందుంది. ఫిబ్రవరిలో 48.5 లక్షల కొత్త చందాదారులను తన నెట్‌వర్క్‌లో భాగం చేసుకుంది. వైర్‌లైన్‌ కూడా కులుపుకుంటే ఎయిర్‌టెల్‌ మొత్తం మీద 50.88 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. జియో నికరంగా 17.41 లక్షల చందాదారులను (మొబైల్‌ విభాగంలో 16.24 లక్షలు) ఆకర్షించింది.మొత్తం మీద ఫిబ్రవరి చివరికి మొబైల్, ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ కనెక్షన్ల సంఖ్య 127.33 కోట్లకు పెరిగింది. వొడాఫోన్‌ ఐడియా ఇటీవలి కాలంలోనే మొదటిసారి 21,927 మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ 1.01 లక్షల కస్టమర్లను కోల్పోయింది. జియో నికర చందాదారులు 51.96 కోట్లకు పెరిగారు. 36.4 కోట్ల చందాదారులతో ఎయిర్‌టెల్‌ రెండో స్థానంలో ఉంటే, 12.93 కోట్ల కస్టమర్లతో వొడాఫోన్‌ ఐడియా, 2.8 కోట్ల కస్టమర్లతో బీఎస్‌ఎన్‌ఎల్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గ్లోబల్‌గా రెండో స్థానంలో ఎయిర్‌టెల్‌ అంతర్జాతీయంగా 65 కోట్ల మంది సబ్ర్‌స్కయిబర్స్‌తో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికం ఆపరేటరుగా భారతి ఎయిర్‌టెల్‌ నిల్చింది. మార్చి 31 నాటికి అందుబాటులో ఉన్న జీఎస్‌ఎంఏ ఇంటెలిజెన్స్‌ గణాంకాలను ఉటంకిస్తూ కంపెనీ ఈ విషయాలు తెలిపింది. ఎయిర్‌టెల్‌కి భారత్‌లో 36.8 కోట్ల మంది, ఆఫ్రికాలోని 14 దేశాల్లో 17.9 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వినూత్న ఆవిష్కరణలు, విశ్వసనీయత ప్రాతిపదికన కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడంపై దృష్టి పెట్టనున్నట్లు భారతి ఎయిర్‌టెల్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ గోపాల్‌ విఠల్‌ తెలిపారు.

Unemployed Techie Walks Into 7 Offices With Resumes Shares Experience2
ఉద్యోగం కోసం ఆఫీసుకు పోతే..: టెకీకి ఎదురైన అనుభవం!

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న.. ఈ కాలంలో టెక్నాలజీ రంగంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం.. ఒక పెద్ద సమస్యగా మారింది. కంపెనీలు ఎక్కువగా ఏఐ టూల్స్, ఆటోమేషన్ వంటివాటిపై మొగ్గు చూపుతున్న కారణంగా.. చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం పొందడం చాలా కష్టంగా మారింది.ఈ నేపథ్యంలో ఒక నిరుద్యోగ టెకీ.. పాతకాలపు విధానాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. అతని స్నేహితుడు నేరుగా కంపెనీలకు వెళ్లి ఉద్యోగం సెర్చ్ చేయమని సూచించడంతో.. దాన్నే ఫాలో అయ్యాడు. తాను ఉంటున్న నగరంలోనే ఏడు కంపెనీలను సందర్శించారు.మొదట రెండు పెద్ద కంపెనీలకు వెళ్లి ఉద్యోగం కోసం అడిగినప్పుడు, అక్కడి సిబ్బంది అతన్ని ఆశ్చర్యంగా చూసి, ఆన్‌లైన్‌లో అప్లై చేయమని చెప్పారు. అంతే కాకుండా అసలు వారు పేపర్ రెజ్యూమ్ తీసుకోలేదు. ఇంకో రెండు చిన్న కంపెనీలకు వెళ్లినప్పుడు, ఒక కంపెనీ ఆ జాబ్ పోస్ట్ చాలా కాలం క్రితం పెట్టారని, అది తప్పుగా మళ్లీ కనిపించిందని చెప్పారు. మరొక కంపెనీ అతని రెజ్యూమ్ తీసుకున్నప్పటికీ, ఆన్‌లైన్‌లో అప్లై చేయమని సూచించిందని అతడు పేర్కొన్నాడు.మిగిలిన మూడు కంపెనీల పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. రెండు కంపెనీలు అసలు అక్కడ లేవు. ఆఫీసులు ఖాళీగా ఉన్నాయి. చివరికి ఒక చోటకి అతను వెళ్లినప్పుడు, అది ఒక పెద్ద గది మాత్రమే ఉండి, అందులో ఇద్దరు వ్యక్తులు ల్యాప్‌టాప్‌లతో పని చేస్తూ కనిపించారు. వాళ్లను కంపెనీ గురించి అడిగితే.. వారు అయోమయంగా చూసి అతన్ని వెళ్లమని చెప్పినట్లు వెల్లడించాడు.ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!ఉద్యోగం సెర్చ్ చేస్తున్న క్రమంలో అతనికి ఎదురైన అనుభవాన్ని.. అతని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో ఆ పోస్ట్ చాలా వైరల్ అయింది. ఈ కాలంలో నేరుగా వెళ్లి ఉద్యోగం కోసం అడగడం ఉండదని.. ప్రస్తుతం ఎక్కువ కంపెనీలు ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ పద్ధతులను అనుసరిస్తున్నాయని చాలామంది చెప్పారు. కొందరు మాత్రం అరుదుగా ఈ విధానం పనిచేసే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడ్డారు.

Will EPF interest rate be increased to 10pc Government clarifies3
EPF వడ్డీ రేటు పెంపు? ప్రభుత్వ ప్రకటన ఇదీ..

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వడ్డీ రేటును 10 శాతానికి పెంచుతారనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ వైఖరిని వివరించారు.కార్మిక సంఘాల నుంచి డిమాండ్ లేదుఈపీఎఫ్ వడ్డీ రేటును 10 శాతానికి పెంచాలని కార్మిక సంఘాలు ఏవైనా డిమాండ్ చేశాయా? అన్న ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. అటువంటి విజ్ఞప్తులేవీ ప్రభుత్వం వద్దకు రాలేదని స్పష్టం చేశారు. వడ్డీ రేటు పెంపుపై యూనియన్ల నుంచి ఎటువంటి అధికారిక ప్రతిపాదనలు లేవని ఆమె పేర్కొన్నారు.10 శాతం రేటు సాధ్యమేనా?వడ్డీ రేటును 10 శాతానికి పెంచే అంశంపై ఈపీఎఫ్ఓ (EPFO) ఏదైనా ఆర్థిక లేదా యాక్చురియల్ విశ్లేషణ నిర్వహించిందా అన్న అంశాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. ఈపీఎఫ్ వడ్డీ రేటును నిర్ణయించే అధికారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT)కు ఉంటుందని, వారి సిఫార్సుల మేరకే నిర్ణయాలు జరుగుతాయని తెలిపారు.వడ్డీ రేటును ఎలా నిర్ణయిస్తారంటే..ఈపీఎఫ్ వడ్డీ రేట్ల లెక్కింపు వెనుక ఉన్న ప్రాతిపదికను ప్రభుత్వం ఈ సందర్భంగా వివరించింది. ఈపీఎఫ్ నిధిని వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టగా వచ్చే వాస్తవ ఆదాయం ఆధారంగానే వడ్డీ రేటును నిర్ణయిస్తారు.ఇది కేవలం పెట్టుబడి రాబడిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఇతర ఆర్థిక వేరియబుల్స్‌తో దీనిని పోల్చడం సాధ్యం కాదు. ఈపీఎఫ్ పథకం-1952లోని పారాగ్రాఫ్ 60(4) ప్రకారం.. వడ్డీ ఖాతాలో నిధుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది.

Bangladesh Tightens Energy Use as Middle East Tensions Global Oil Supply4
ఇంధన పొదుపునకు బంగ్లాదేశ్ కఠిన నిర్ణయాలు

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ అప్రమత్తమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, చమురు సరఫరా గొలుసులో అనిశ్చితి ఏర్పడటంతో తన దేశీయ ఇంధన అవసరాలను అదుపులో ఉంచుకోవడానికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను క్యాబినెట్ సమావేశంలో ఆమోదించింది.కొత్త పని గంటలుపెరుగుతున్న ఇంధన ధరలు, చమురు సరఫరా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలను తక్షణమే అమలులోకి తెచ్చింది.ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. గతంలో అక్కడి ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేసేవి.మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.పారిశ్రామిక రంగంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని, ముఖ్యంగా డెకరేటివ్‌ లైటింగ్(వేడుకల్లో ఉపయోగించే విద్యుత్‌)పై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.విద్యా రంగంలో మార్పులుపాఠశాలల పని వేళలపై విద్యాశాఖ త్వరలో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అందులో.. పాఠశాల సమయాలను సర్దుబాటు చేయడం, అవసరమైతే ఆన్‌లైన్ తరగతులకు ప్రాధాన్యత ఇవ్వడం, కాలుష్యం, ఇంధన వినియోగం తగ్గించేందుకు పాఠశాలల కోసం ఎలక్ట్రిక్ బస్సుల దిగుమతులకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలను పరిశీలించనున్నట్లు అంచనా.ఇదీ చదవండి: వంతెనలు.. అభివృద్ధికి వారధులు

War Push Aviation Costs Higher ATF Price Surge Forces Airlines Fuel Surcharges5
విమాన ప్రయాణికులకు ఇంధన సెగ.. కేంద్రం జోక్యం!

సామాన్యుడి విమాన ప్రయాణంపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల ఏవియేషన్ రంగానికి సవాలుగా మారుతోంది. దాంతో ఇటీవల విమానయాన సంస్థలు ఇంధన సర్‌ఛార్జీలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్‌) ధరల పెరుగుదల, దాని పర్యవసానాలపై విమానయాన సంస్థలతో చర్చలు జరిపేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది.విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం వాటా కేవలం ఇంధనానిదే. అందుకే ఏటీఎఫ్ ధరల్లో స్వల్ప మార్పు వచ్చినా అది టికెట్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇటీవల సవరణల తర్వాత ధరల వ్యత్యాసం ఇలా ఉంది.విభాగంపాత ధర (కిలోలీటరుకు)ప్రస్తుత ధర (కిలోలీటరుకు)ఇంటర్నేషనల్‌/చార్టర్డ్రూ. 96,638.14రూ. 2,07,341.22 (దాదాపు రెట్టింపు)దేశీయ కార్యకలాపాలు-రూ. 1,04,927.18 ప్రభుత్వం విమానయాన రంగానికి వెసులుబాటు కల్పిస్తూ 25 శాతం వరకు పెంపునకు అనుమతించినప్పటికీ దేశీయ ప్రయాణీకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రభావాన్ని 8.5 శాతానికి పరిమితం చేయాలని భావించింది.ఇండిగో దూకుడు..ప్రభుత్వ అధికారిక ఆదేశాలు రాకముందే దేశీయ దిగ్గజం ఇండిగో ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చేలా ఇంధన సర్‌ఛార్జీలను సవరించింది. అయితే, గతంలో ఉన్న రూ.425 ఫ్లాట్ ఛార్జీని తొలగించింది. ప్రయాణించే దూరాన్ని బట్టి రూ.275 నుంచి రూ.950 వరకు దేశీయ మార్గాల్లో సర్‌ఛార్జీని నిర్ణయించింది. దీనివల్ల తక్కువ దూరం ప్రయాణించే వారికి కొంత ఉపశమనం లభించనుంది. అంతర్జాతీయ రూట్లలో ముఖ్యంగా యూరప్ వంటి సుదూర ప్రాంతాలకు ఇంధన సర్‌ఛార్జీ ఏకంగా రూ.10,000 వరకు పెరగడం గమనార్హం.ప్రభుత్వ జోక్యంధరల పెరుగుదలపై విమానయాన సంస్థల నుంచి కేంద్రం వివరణ కోరుతోంది. ‘ధరల పట్ల సున్నితంగా ఉండే భారతీయ మార్కెట్‌లో ఇంధన ధరల భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపడం సరైనది కాదు’ అని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కేంద్రం ఇంకా ఎటువంటి అధికారిక నియంత్రణ ఆదేశాలు జారీ చేయలేదు. కానీ, త్వరలో జరగబోయే చర్చల ద్వారా అదనపు సర్‌ఛార్జీలను ఉపసంహరించుకోవాలని లేదా కనీసం పునసమీక్షించాలని సంస్థలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: వంతెనలు.. అభివృద్ధికి వారధులు

India Faces Alarming Medical Inflation Insurance Gap Threatens6
తీవ్ర అనారోగ్యాలకు ఆర్థిక ముప్పు!

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణపై చర్చ జరుగుతున్న వేళ ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో వైద్య ద్రవ్యోల్బణం సుమారు 11.5% కి చేరుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం కావడంతో సామాన్యుడి ఆర్థిక భద్రతకు సవాలుగా మారింది. ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్యాల (క్రిటికల్‌ ఇల్‌నెస్‌) చికిత్సకు అయ్యే ఖర్చుకు, ప్రజల వద్ద ఉన్న బీమా రక్షణకు మధ్య వ్యత్యాసం పెరుగుతోందని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ‘ఏయాన్’ హెచ్చరించింది.కారణం ఏమిటి?సాధారణంగా ఆరోగ్య బీమా అంటే కేవలం ఆసుపత్రి ఖర్చులు మాత్రమేనని చాలామంది భావిస్తారు. కానీ, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు లేదా అవయవ మార్పిడి వంటి తీవ్ర సమస్యలు తలెత్తినప్పుడు అసలు సవాళ్లు మొదలవుతాయి. ఏయాన్ ఇండియా హెల్త్ అండ్ వెల్త్ సొల్యూషన్స్ హెడ్ యాష్లే డిసిల్వా తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఈ వైద్య ఖర్చుల వ్యత్యాసం కేవలం హాస్పిటలైజేషన్ ఖర్చులకే పరిమితం కాదు. దీర్ఘకాలిక చికిత్స వల్ల ఉద్యోగానికి లేదా వృత్తికి ఆటంకం కలగవచ్చు. మందులు, డయాగ్నోస్టిక్స్, రికవరీ సమయంలో అయ్యే ఇతర ఖర్చులు అదనపు భారం. ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ వంటి ఆధునిక వైద్య పద్ధతులు ప్రాణాలను కాపాడుతున్నప్పటికీ వాటి ఖరీదు సామాన్యుడికి భారంగా మారుతోంది’ అన్నారు.వేతనాలు తక్కువ.. వైద్య ఖర్చులు ఎక్కువ!ఏయాన్ గ్లోబల్ మెడికల్ ట్రెండ్ రేట్స్ నివేదిక ప్రకారం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వైద్య ఖర్చుల పెరుగుదల వేతనాల పెరుగుదల కంటే వేగంగా ఉంది. 2026 వరకు ఈ రెండంకెల ద్రవ్యోల్బణం(11.5 శాతం) ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. భారతదేశంలో సగటున ఒక ఉద్యోగికి తన సంస్థ ద్వారా లభించే బీమా కవరేజీ రూ.3 లక్షలు నుంచి రూ.5 లక్షల మధ్యే ఉంటోంది. అయితే, ఒక తీవ్రమైన వ్యాధికి చికిత్స పొందాలంటే ఈ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదు.గ్లోబల్ మార్కెట్‌తో పోలిస్తే..చైనా, మలేషియా, థాయిలాండ్ వంటి పొరుగు దేశాలతో పోలిస్తే భారతదేశంలో బీమా రక్షణ పొందినవారి సంఖ్య తక్కువగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సామాజిక భద్రతా వ్యవస్థలు బలంగా ఉండగా, భారత్‌లో ప్రజలు తమ జేబుల నుంచే అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.నిపుణుల సూచనలుపెరుగుతున్న ఈ ఆర్థిక అగాధాన్ని పూడ్చడానికి కేవలం ప్రాథమిక ఆరోగ్య బీమా సరిపోదని బీమా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు. అందులో.. సాధారణ పాలసీతో పాటు తీవ్రమైన వ్యాధులకు ప్రత్యేక కవరేజీ ఇచ్చే రైడర్లను తీసుకోవడం, కంపెనీ ఇచ్చే బీమాకు అదనంగా ఉద్యోగులే కొంత ప్రీమియం చెల్లించి కవరేజీని పెంచుకోవడం, నివారణా చర్యలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ ద్వారా వ్యాధులు రాకుండా చూసుకోవడం వంటివి ఉన్నాయి.ప్రస్తుతం మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ అది ఆర్థికంగా సామాన్యుడిని కుంగదీయకూడదంటే.. బీమా రక్షణ ప్రణాళికలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శారీరక ఆరోగ్యంతో పాటు ఆర్థిక ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలని ఏయాన్ నివేదిక స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: వంతెనలు.. అభివృద్ధికి వారధులు

Advertisement
Advertisement
Advertisement