ప్రధాన వార్తలు
స్టాక్ మార్కెట్ సెలవులు.. ట్రేడింగ్ బంద్
భారత స్టాక్ మార్కెట్లకు (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ) మార్చి నెలలో వారాంతాలతోపాటు మూడు ప్రధాన సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు హోలీ, శ్రీరామ నవమి, మహావీర్ జయంతి పండుగలకు సంబంధించినవి. మార్చి 3 (మంగళవారం) హోలీ సెలవు, మార్చి 26 (గురువారం) శ్రీరామ నవమి సెలవు, మార్చి 31 (మంగళవారం) మహావీర్ జయంతి సెలవుగా ప్రకటించారు. ఈ రోజుల్లో ఈక్విటీ, డెరివేటివ్స్, కరెన్సీ సెగ్మెంట్లలో ట్రేడింగ్ పూర్తిగా అందుబాటులో ఉండదు.ట్రేడింగ్ ఏయే రోజుల్లో..మార్చి నెలలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు, శని, ఆదివారాలు,పైన పేర్కొన్న సెలవులు మినహా అందుబాటులో ఉంటుంది. మార్చిలో మొత్తం 31 రోజులు ఉండగా, మార్చి 1, 8, 15, 22, 29 తేదీల్లో ఆదివారాలు, మార్చి 7, 14, 21, 28 తారీఖుల్లో శనివారాలు వస్తాయి. వీటితోపాటు పండుగల సెలవులు పోగా మిగిలిన 19 రోజులు ట్రేడింగ్కు అందుబాటులో ఉంటాయి. ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ షెడ్యూల్ను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలుమార్కెట్ రీసెర్చ్: ఏదైనా స్టాక్ లేదా సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు పూర్తి అధ్యయనం చేయండి. కంపెనీ ఫండమెంటల్స్, మార్కెట్ ట్రెండ్స్, ఆర్థిక సూచికలను పరిశీలించండి.రిస్క్ మేనేజ్మెంట్: మొత్తం మూలధనాన్ని ఒకే స్టాక్లో పెట్టకుండా, డైవర్సిఫికేషన్ చేయండి. స్టాప్-లాస్ ఆర్డర్లు ఉపయోగించి నష్టాలను నియంత్రించండి.ఎమోషనల్ డెసిషన్స్ వద్దు: మార్కెట్ హెచ్చుతగ్గులకు భావోద్వేగాలతో స్పందించకుండా, లాంగ్-టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేయండి. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ (FOMO) లాంటి భావనలను నివారించండి.ట్యాక్స్, రెగ్యులేటరీ అవగాహన: షార్ట్-టర్మ్, లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రూల్స్ తెలుసుకోండి. సెబీ రెగ్యులేషన్లకు అనుగుణంగా ట్రేడ్ చేయండి.సెలవుల సమయంలో ప్లానింగ్: సెలవుల ముందు లేదా తర్వాత మార్కెట్ వాల్యూమ్ తక్కువగా ఉండవచ్చు, దీంతో వోలటాలిటీ పెరగవచ్చు. అందువల్ల ముందుగానే పొజిషన్లను అడ్జస్ట్ చేయండి.ఈ సెలవులు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్లు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఎన్ఎస్ఈ, బీఎస్ఈ వెబ్సైట్లను చెక్ చేయాలి.
ఏఐప్లస్ స్మార్ట్ఫోన్ నుంచి నోవాపాడ్స్
న్యూఢిల్లీ: ఏఐప్లస్ స్మార్ట్ఫోన్ సంస్థ తాజాగా ఏఐఓటీ విభాగంలోకి కార్యకలాపాలు విస్తరించింది. నోవాపాడ్స్, నోవావాచ్ని ప్రవేశపెట్టింది. ఇవి ఫిబ్రవరి 27 నుంచి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటాయి. నోవాపాడ్స్ ధర రూ. 699 నుంచి, నోవా వాచ్ ధర రూ. 2,499 నుంచి ప్రారంభమవుతుంది.అలాగే కొత్త తరం స్మార్ట్ఫోన్లయిన పల్స్ 2, నోవా 2 సిరీస్ని కూడా కంపెనీ ప్రకటించింది. మార్చ్ 2న పల్స్ 2ని, ఆ తర్వాత నోవా 2 సిరీస్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. పల్స్ 2లో 50 ఎంపీ ఏఐ డ్యుయల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 తదితర ఫీచర్లు ఉంటాయని పేర్కొంది.
ద్రవ్యలోటు రూ.9.8 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జనవరి చివరికి (10 నెలల్లో) రూ.9.8 లక్షల కోట్లకు చేరుకుంది. పూర్తి ఆర్థిక సంవత్సం బడ్జెట్ అంచనాలో ఇది 63 శాతానికి సమానం. క్రితం ఆర్థిక సంవత్సరం జనవరి చివరికి ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 74.5 శాతంగా ఉండడం గమనార్హం. 2025–26 సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతం (రూ.15.58 లక్షల కోట్లు)గా ఉంటుందన్నది బడ్జెట్ అంచనా. ఈ వివరాలను కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ప్రకటించింది. జనవరి చివరికి ప్రభుత్వానికి రూ.27.08 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో రూ.20.94 లక్షల కోట్లు పన్ను ఆదాయం కాగా, పన్నేతర రూపంలో రూ.5.57 లక్షల కోట్లు, రుణేతర మార్గాల్లో రూ.57,129 కోట్ల ఆదాయం సమకూరింది.
బడ్జెట్లో మెరిసే ఇంటీరియర్..
మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇల్లు ఒక భావోద్వేగం. అయితే, మారుతున్న కాలంతో పాటు నిర్మాణ ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం ఇల్లు కట్టడమే కాకుండా, నివసించడానికి యోగ్యంగా మార్చే ఇంటీరియర్ డెకరేషన్ కోసం అదనంగా లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సరైన ప్రణాళిక, మెటీరియల్ ఎంపికలో మెలకువలు పాటిస్తే.. తక్కువ బడ్జెట్లోనే మీ ఇంటిని ఒక ప్యాలెస్లా మార్చుకోవచ్చని ఇంటీరియర్ డిజైనింగ్ నిపుణులు సూచిస్తున్నారు.ఇంటీరియర్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..హాల్ (లివింగ్ రూమ్)ఇంట్లోకి అడుగుపెట్టగానే కనిపించేది హాల్. ఇక్కడ ఖర్చు తగ్గించి లుక్ పెంచడానికి మల్టీ ఫంక్షనల్ ఫర్నిచర్ ఉత్తమ మార్గం. గోడలకు ఖరీదైన టెక్స్చర్ పెయింట్లకు బదులుగా ఒక గోడకు మాత్రమే యాక్సెంట్ కలర్ లేదా తక్కువ ధరలో దొరికే పీవీసీ ఫ్లూటెడ్ ప్యానెల్స్ వాడవచ్చు. లైటింగ్కు సంబంధించి ఫాల్స్ సీలింగ్ కోసం భారీగా ఖర్చు చేసే బదులు కోవ్ లైటింగ్ లేదా స్టైలిష్ ఎల్ఈడీ స్ట్రిప్స్తో మంచి లుక్ తీసుకురావచ్చు.వంటగదివంటగదిలో మాడ్యులర్ కిచెన్ పేరుతో భారీగా ఖర్చు అవుతుంది. ఖరీదైన ప్లైవుడ్కు బదులుగా డబ్ల్యూపీసీ (Wood Polymer Composite) బోర్డులను వాడటం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా చెదలు పట్టకుండా ఉంటుంది. స్టోరేజ్ కోసం పైన ఉండే క్యాబినెట్లకు తలుపులు పెట్టకుండా ఓపెన్ షెల్వింగ్ పద్ధతిని పాటిస్తే మెటీరియల్ ఖర్చు తగ్గుతుంది. ఇది వంటగది విశాలంగా కనిపించేలా చేస్తుంది.బెడ్రూమ్అల్యూమినియం సెక్షన్లతో కూడిన వార్డ్రోబ్స్ లేదా స్లైడింగ్ డోర్ కబోర్డులు స్థలాన్ని ఆదా చేస్తాయి. లామినేట్ షీట్ల ఎంపికలో లేటెస్ట్ మ్యాట్ ఫినిష్ ఎంచుకుంటే తక్కువ ధరలో లగ్జరీ లుక్ వస్తుంది. స్టోరేజ్ సౌకర్యం ఉన్న బెడ్స్ ఎంచుకోవడం వల్ల అదనపు అల్మారాల అవసరం ఉండదు.వాష్రూమ్, క్యారిడార్బాత్రూమ్ గోడల మొత్తానికి టైల్స్ వేయకుండా కేవలం 7 అడుగుల ఎత్తు వరకు వేసి పైన పెయింట్ వేయడం ద్వారా 20 శాతం వరకు ఖర్చు తగ్గించవచ్చు. బ్రాండెడ్ ఫిట్టింగ్స్లో ఎంట్రీ లెవల్ సిరీస్లను ఎంచుకోండి. ఇవి క్వాలిటీతో పాటు వారంటీని ఇస్తాయి. క్యారిడార్లో రేయిలింగ్ కోసం అద్దాలను అమర్చడం వల్ల ఇరుకైన క్యారిడార్లు కూడా విశాలంగా కనిపిస్తాయి.బడ్జెట్ పెరగకుండా ఉండాలంటే..ఇంటి నిర్మాణం మొదలుపెట్టే ముందే ఇంటీరియర్ ప్లాన్ సిద్ధం చేసుకోండి. వైరింగ్, ప్లంబింగ్ పాయింట్లు ముందుగానే నిర్ణయించుకుంటే తర్వాత చేసే మార్పుల వల్ల అయ్యే వృధా ఖర్చును నివారించవచ్చు.ఇదీ చదవండి: సిటీలో సామాన్యుడు ఇల్లు కొనాలంటే..
తొలి 9 నెలల్లో ఎఫ్డీఐలు జూమ్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి 9 నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) 18 శాతం ఎగశాయి. వెరసి ఏప్రిల్–డిసెంబర్లో 47.87 బిలియన్ డాలర్లకు చేరాయి. వీటిలో యూఎస్ నుంచి పెట్టుబడులు రెట్టింపై 7.8 బిలియన్ డాలర్లను తాకాయి. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024–25 ఇదే కాలంలో ఇవి 40.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో ఎఫ్డీఐలు 17 శాతం పుంజుకుని12.69 బిలియన్ డాలర్లకు చేరాయి. కాగా.. తొలి 9 నెలల్లో ఈక్విటీ పెట్టుబడులు, ఇతర మూలధనం, రిటర్నులను తిరిగి ఇన్వెస్ట్చేయడం తదితరాలు 17 శాతంపైగా బలపడి 73.31 బిలియన్ డాలర్లను తాకాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి 62.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో యూఎస్ నుంచి పెట్టుబడులు రెట్టింపై 7.8 బిలియన్ డాలర్లను తాకాయి. గతేడాది 9 నెలల్లో ఇవి 3.73 బిలియన్ డాలర్లు మాత్రమే. సింగపూర్ 17.65 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో అగ్రస్థానంలో నిలవగా.. తదుపరి ర్యాంకులలో యూఎస్(4.83 బి.డా), మారిషస్(4.83 బి.డా), జపాన్(3.2 బి.డా), యూఏఈ(2.45 బి.డా), నెదర్లాండ్స్(2.29 బి.డా), కేమన్ ఐలాండ్స్(1.97 బి.డా), సైప్రస్(1.4 బి.డా) నిలిచాయి.
తగ్గనున్న ఎయిర్లైన్స్ నష్టాలు
ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం దేశీ విమానయాన సంస్థల నష్టాలు గణనీయంగా తగ్గొచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 17,000–18,000 కోట్ల స్థాయిలో నష్టాలు ఉండొచ్చని, ఇవి 2026–27లో రూ. 11,000–12,000 కోట్లకు పరిమితం కావొచ్చని పేర్కొంది. సమీప భవిష్యత్తులో సవాళ్లు ఉన్నప్పటికీ నిర్వహణ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతుండటం, విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంలాంటి సానుకూల అంశాల కారణంగా ఏవియేషన్ పరిశ్రమకు స్థిరమైన అవుట్లుక్ కొనసాగిస్తున్నట్లు ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది. 2026–27లో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 6–8 శాతం పెరిగి 17.5–17.9 కోట్లకు చేరొచ్చని తెలిపింది. ఇటీవలే ఈ ఆర్థిక సంవత్సరం ప్రయాణికుల రద్దీ అంచనాలను 4–6 శాతం స్థాయి నుంచి 0–3 శాతానికి ఇక్రా సవరించింది. ‘‘భారత ఏవియేషన్ పరిశ్రమ 2024–25లో రూ. 5,500 కోట్లు, 2025–26లో అంతకన్నా అధికంగా రూ. 17,000–18,000 కోట్లకు నష్టాలు పెరగనున్నాయి. అయితే, పెరిగే విమాన ప్రయాణికుల సంఖ్య దన్నుతో 2026–27లో ఇవి రూ. 11,000–12,000 కోట్లకు తగ్గొచ్చు. అలాగే 2025–2026లో ఫ్లయిట్ల రద్దు కారణంగా దెబ్బతిన్న కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థాయికి రాగలవు’’ అని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కింజల్ షా తెలిపారు. నివేదిక ప్రకారం.. → సీమాంతర ఉద్రిక్తతలు, విమాన దుర్ఘటన, డిసెంబర్లో ఇండిగో కార్యకలాపాల్లో అంతరాయాలు తదితర అంశాల కారణంగా వార్షిక ప్రాతిపదికన 2025–26 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో పరిశ్రమ రాబడులు క్షీణించాయి. కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రతికూల ప్రభావం, ఫ్లయిట్ల రద్దు.. జాప్యాలవల్ల నిర్వహణ వ్యయాలు పెరగడంలాంటి సవాళ్ల మధ్య కూడా కంపెనీలు రాబడి స్థాయిని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయడంతో ఆదాయం తీవ్ర స్థాయిలో క్షీణించలేదు. → తాత్కాలిక అంతరాయాలు నెమ్మదించే కొద్దీ సమీప భవిష్యత్తులో రాబడులు మెరుగుపడొచ్చు. అయితే, విమాన ఇంధనం ధరలు, డాలరు–రూపాయి మారకం రేటును నిశితంగా గమనించాల్సి ఉంటుంది. → 2025 క్యాలెండర్ సంవత్సరంలో కొత్తగా విమానాల సంఖ్య 4 శాతం పెరగడంతో 2025 డిసెంబర్ 31 నాటికి మొత్తం విమానాల సంఖ్య 865కి చేరింది. వివిధ విమానయాన సంస్థలు భారీ ఎయిర్క్రాఫ్ట్ల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. 2026 జనవరి 31 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం మొత్తం 1,700 పైచిలుకు విమానాలకు ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ వచ్చే 10 ఏళ్లలో అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఇందులో ఎక్కువ శాతం విమానాలు పాతబడిన వాటి స్థానాన్ని భర్తీ చేసేవిగానే ఉండనున్నాయి. → వివిధ కారణాల రీత్య పలు విమానాలను పక్కన పెట్టాల్సి రావడమనేది గత కొన్నేళ్లుగా పరిశ్రమకు సమస్యాత్మకంగా మారింది. ఇంజిన్ల వైఫల్యం, సరఫరా వ్యవస్థపరమై సవాళ్లతో 2023 సెపె్టంబర్ నాటికి పక్కన పెట్టిన విమానాల సంఖ్య పరిశ్రమలోని మొత్తం విమానాల్లో 20–22 శాతంగా నమోదైంది. ఇది 2026 ఫిబ్రవరి నాటికి 13–15 శాతానికి (సుమారు 117 ఎయిర్క్రాఫ్ట్లు) దిగి వచి్చంది. ఇలా పక్కన పెట్టిన ఎయిర్క్రాఫ్ట్ల సంఖ్య తగ్గుతూ, కొత్త విమానాలు అందుబాటులోకి వచ్చే కొద్దీ పెరిగే విమాన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సరఫరా కూడా మరింత మెరుగుపడనుంది.
కార్పొరేట్
ట్రావెల్కి హోలీ జోష్
ట్రూజాన్ సోలార్ టార్గెట్ రూ.650 కోట్లు!
టీసీఎస్ కోడ్విటా ఛాంపియన్ 2026 విజేతలు
యస్ బ్యాంక్ ఫారెక్స్ కార్డులతో రూ.2.5 కోట్ల ఫ్రాడ్
ఐపీఓ రివర్స్ గేర్!
ఘనంగా జాతీయ ఆరోగ్య మేళా 2026 ప్రారంభం
‘లక్ష్మి’ వినియోగదారుడికి లెక్సస్ కారు గిఫ్ట్
ఏసీ ధరలు అప్! కారణం ఇదే..
ఐఆర్ఎఫ్సీ వాటా ఆఫర్.. స్పందించని ఇన్వెస్టర్స్
కోల్ ఇండియా రేర్ ఎర్త్ మైనింగ్
విచిత్రంగా బంగారం ధరలు..
దేశంలో పుత్తడి ధరలు (Today Gold Rate) ఎప్పటికప్పడు...
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో...
ఏఐ టెక్నాలజీ మార్కెట్లకు మంచిదే
టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో పర్యవ...
ట్రేడింగ్కు కనీస అర్హత ఉండాలి
డెరివేటివ్స్(ఎఫ్అండ్వో)లో పాలుపంచుకునే ఇన్వెస్ట...
విమాన ప్రయాణికులకు ఊరట
విమాన ప్రయాణికుల కోరికను నెరవేరుస్తూ డైరెక్టరేట్ జ...
ఆర్బీఐ కీలక ప్రకటన.. కొత్త రూల్!
భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం వేగంగా పెరు...
అతిపెద్ద ఆర్థిక మార్పు ఎదుర్కొంటున్నాం: కియోసాకి
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఫెడరల్ రిజర్వ్ విధానాలు...
సెమీకండక్టర్లకు దశాబ్దాలపాటు మద్దతు
సంపన్న దేశాల తరహాలోనే వచ్చే 20–25 ఏళ్ల పాటు సెమీకం...
ఆటోమొబైల్
టెక్నాలజీ
శాంసంగ్ గెలాక్సీ ఎస్26 సిరీస్: ధరలు ఇలా
దక్షిణ కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తమ ఫ్లాగ్షిప్ గెలాక్సీ ఎస్26 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో ఎస్26, ఎస్26ప్లస్, ఎస్ 26 అల్ట్రా అని మూడు వేరియంట్స్ ఉంటాయి. శాంసంగ్ పోర్టల్ ప్రకారం వేరియంట్ని బట్టి ధర రూ. 87,999 నుంచి రూ. 1,89,999 (అల్ట్రా) వరకు ఉంటుంది. ప్రీఆర్డర్ చేసే వారికి రూ. 20,000 వరకు విలువ చేసే ప్రయోజనాలు లభిస్తాయి.ఈ సిరీస్లోని అల్ట్రా వేరియంట్లో పరిశ్రమలోనే తొలిసారిగా ప్రైవసీ డిస్ప్లే ఫీచర్ ఉంది. స్క్రీన్ మీద ఉన్న కంటెంట్ పక్క వారికి కనిపించకుండా కేవలం యూజరుకు మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్ని మార్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఇతరులతో ఉన్నప్పుడు ప్రైవసీని కాపాడుకునేందుకు సహాయకరంగా ఉంటుంది. శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, అరగంటలోనే 75 శాతం చార్జ్ అయ్యేలా సూపర్ ఫాస్ట్ చార్జింగ్ 3.0, 50 ఎంపీ, అల్ట్రా వైడ్ కెమెరా, 200 ఎంపీ వైడ్ కెమెరా, 256 జీబీ నుంచి 1 టీబీ వరకు స్టోరేజ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీనికి ముందు సిరీస్ తరహాలోనే ఈ ఫోన్లను కూడా భారత్లోని నోయిడా ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు శాంసంగ్ తెలిపింది. దక్షిణ కొరియా వెలుపల, బెంగళూరులోని తమ ఆర్అండ్డీ సెంటర్ వీటిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు వివరించింది. ఈ సిరీస్తో దేశీయంగా యాపిల్ నుంచి పోటీ నెలకొన్న 800 డాలర్ల ఎగువ ధర పలికే సూపర్ ప్రీమియం స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో శాంసంగ్ తన స్థానాన్ని పటిష్టం చేసుకునే అవకాశం లభించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
సైబర్ భద్రతలో రాజీ లేదు
దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. మెసేజింగ్ యాప్లకు సంబంధించి ప్రతిపాదించిన ‘సిమ్ బైండింగ్’ నిబంధనల్లో ఎటువంటి సడలింపు ఉండబోదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ముఖ్యంగా వెబ్ ఆధారిత మెసేజింగ్ ప్లాట్ఫామ్లకు విధించిన 6 గంటల ఆటోమేటిక్ లాగ్-అవుట్ నిబంధనను సడలించబోమని తేల్చి చెప్పారు.ఏమిటీ సిమ్ బైండింగ్? వినియోగదారులపై ప్రభావం?టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్-2024 ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్.. మెసేజింగ్ యాప్లు ఇకపై వినియోగదారుడి ఫోన్లోని యాక్టివ్ సిమ్ కార్డుతో నిరంతరం అనుసంధానమై ఉండాలి. ఒకవేళ ఫోన్ నుంచి ఒరిజినల్ సిమ్ కార్డును తొలగించినా లేదా అది డీయాక్టివేట్ అయినా ఆ పరికరంలో మెసేజింగ్ సేవలు తక్షణమే నిలిచిపోతాయి. ల్యాప్టాప్ లేదా పీసీల్లో వాడే వెబ్ వెర్షన్లు ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా లాగ్-అవుట్ అవుతాయి. వినియోగదారులు క్యూఆర్ కోడ్ ద్వారా మళ్లీ ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.ఈ నిబంధనలను పాటించడానికి ఇచ్చిన 90 రోజుల గడువు ఫిబ్రవరి 28, 2026తో ముగియనుంది. దీన్ని పొడిగించే ఆలోచన లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) స్పష్టం చేసింది. ‘జాతీయ భద్రతే మాకు ముఖ్యం. మోసాలను నివారించడానికి సిమ్ బైండింగ్ తప్పనిసరి. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు’ అని సింధియా పేర్కొన్నారు.ఏజీఆర్, స్పెక్ట్రమ్ వేలంటెలికాం ఆపరేటర్లు కోరుతున్న సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్) ఉపశమనంపై మంత్రి స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. వొడాఫోన్ ఐడియా తరహాలో ఏజీఆర్ ఉపశమనం కోరే ఏ సంస్థ అయినా న్యాయపరమైన మార్గాలనే అనుసరించాలని సూచించారు. మరోవైపు, తదుపరి స్పెక్ట్రమ్ వేలం కోసం ట్రాయ్ సిఫార్సులను సమర్పించిందన్నారు. వీటిని పరిశీలించి త్వరలోనే వేలం కాలక్రమాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు.శాటిలైట్ ఇంటర్నెట్: స్టార్లింక్కు షరతులుభారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఎలాన్ మాస్క్ నేతృత్వంలోని స్టార్లింక్ ఇంకా అవసరమైన భద్రతా డెమోలను పూర్తి చేయలేదని మంత్రి తెలిపారు. భారత సరిహద్దుల వెలుపల ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే సామర్థ్యం, నెట్వర్క్పై పూర్తి స్థాయి భద్రతా నియంత్రణ వంటి అంశాల్లో స్పష్టత వచ్చిన తర్వాతే స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగుతాయని వివరించారు.ఇదీ చదవండి: విమాన ప్రయాణికులకు ఊరట
ఏఐతో మరిన్ని అవకాశాలు
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) రాకతో ఉద్యోగాలు పోతాయనే భయపడనక్కర్లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. దీనితో ఉద్యోగ విధుల స్వభావం మాత్రమే మారుతుందని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. దేశీయంగా ఉద్యోగాలపై ఏఐ ప్రతికూల ప్రభావం గురించి తనకెలాంటి ’ఆందోళన’ లేదని ఆయన చెప్పారు. 2000లో వై2కే సమస్య తలెత్తినప్పుడు భారత్కి ఎలాగైతే మంచి అవకాశాలు లభించాయో, అదే విధంగా ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీతో కంపెనీలకు మరిన్ని వ్యాపార అవకాశాలు లభించగలవని మంత్రి తెలిపారు. 60 లక్షల ఉద్యోగాలు, 315 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమపై ఏఐ ప్రభావం గురించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరింత మెరుగ్గా మారడానికి ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. టెక్నాలజీని వినియోగించే కొద్దీ మానవ నైపుణ్యాలు, ప్రతిభావంతుల అవసరం మరింతగా పెరుగుతుందని, తద్వారా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. ఏఐతో లాభాలు, ఎగుమతులు పెరుగుతాయని, 23 లక్షలకు పైగా సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మ్యాథ్స్ గ్రాడ్యుయేట్స్ వీటిని అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఇటీవల కుదుర్చుకున్న తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోవలోనే ప్రపంచంతో భారత్ మరింతగా అనుసంధానమయ్యేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు.
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కొత్త వార్నింగ్!
యువత వారానికి 70 గంటలు పని చేయాలన్న వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి (N.R. Narayana Murthy) మరోసారి దేశ యువతకు కీలక సందేశం ఇచ్చారు. ఈసారి ఆయన దృష్టి కృత్రిమ మేధస్సు (AI)పై ఉంది. వైట్-కాలర్ ఉద్యోగాలను ఏఐ, యంత్రాలు భర్తీ చేస్తాయనే భయాలు పెరుగుతున్న వేళ, యువత ఆందోళన చెందకుండా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.“ఏఐ శత్రువు కాదు… అవకాశాల ద్వారం”జనరేటివ్ ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతపై చర్చలు ముదురుతున్నాయి. అయితే ఈ భయాలను తప్పుబట్టిన మూర్తి, ఏఐ ఆటోమేటిక్గా అందరికీ సమాన అవకాశాలు కల్పించదని స్పష్టం చేశారు.“జనరేటివ్ ఏఐని ఉత్పాదకత కోసం నేను స్వయంగా ఉపయోగించిన అనుభవం చెబుతోంది. దీన్ని తెలివిగా వినియోగించినవారికి మెరుగైన నాణ్యత, అధిక ఉత్పాదకత లభిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.యువత ఏఐని ప్రమాదంగా కాకుండా, సమర్థంగా వినియోగించాల్సిన సాధనంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, కృషి, నిరంతర అభ్యాసంతో ఏఐ నైపుణ్యాలను మిళితం చేస్తే భవిష్యత్తులో విజయం సాధ్యమని మూర్తి అన్నారు.ఉద్యోగాలపై ఏఐ ప్రభావం… తీవ్రమౌతున్న చర్చఇటీవల అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ (Anthropic) సంస్థ పలు అధునాతన ఏఐ సాధనాలను విడుదల చేయడంతో ఏఐ ఆధారిత ఉద్యోగ నష్టాలపై చర్చ మళ్లీ జోరందుకుంది. ముఖ్యంగా ఈ కంపెనీ అభివృద్ధి చేసిన క్లాడ్ (Claude) ప్లాట్ఫామ్ ఆఫీస్ పనులను స్వయంచాలకంగా నిర్వహించే సామర్థ్యంతో ముందుకు వచ్చింది.లీగల్ సర్వీసులు, ఫైనాన్స్, మానవ వనరులు, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి రంగాల్లో పత్రాల విశ్లేషణ, డేటా ప్రాసెసింగ్, వర్క్ఫ్లో మేనేజ్మెంట్ వంటి పనులను ఈ సాధనాలు సులభతరం చేస్తున్నాయి. సాధారణంగా పెద్ద మొత్తంలో సిబ్బంది అవసరమయ్యే క్లిష్ట ప్రక్రియలను కూడా ఇవి సమర్థంగా నిర్వహించగలవని నిపుణులు చెబుతున్నారు.“భయపడకండి… సిద్ధం అవ్వండి”ఏఐ వల్ల ఉద్యోగాలు మార్పు చెందవచ్చు కానీ పూర్తిగా అంతరించిపోవని మూర్తి అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని, దానిపై ప్రావీణ్యం సాధించినవారికే భవిష్యత్తు అనుకూలంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సారాంశంగా “ఏఐపై పట్టు సాధించండి.. లేదంటే అవకాశాలు కోల్పోతారు” అంటూ యువతకు నారాయణ మూర్తి హితవు పలికారు.
పర్సనల్ ఫైనాన్స్
రూ.7 కోట్ల ఫ్రాడ్లో ఇరుక్కున్న ఇంజినీరింగ్ విద్యార్థి
స్నేహితుడికి సాయం చేద్దామని బ్యాంక్ ఖాతా వివరాలు పంచుకున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి.. ఏకంగా రూ.7 కోట్ల సైబర్ మోసం కేసులో చిక్కుకున్నాడు. ఈ ఘటన బ్యాంకు ఖాతాల విషయంలో యువతకు పెద్ద హెచ్చరికగా మారింది. బ్యాంక్ ఖాతా వివరాలను నిర్లక్ష్యంగా పంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన స్పష్టం చేస్తోందిబెంగళూరులోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థికి ఆయుష్ అనే వ్యక్తితో దాదాపు ఏడాది కాలంగా స్నేహం ఉంది. 2025 నవంబర్లో ఆయుష్ బ్యాలెన్స్ లేకపోవడంతో తన బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని, తాత్కాలికంగా విద్యార్థి ఖాతాను ఉపయోగించుకుంటానని అభ్యర్థించాడు.స్నేహితుడిని పూర్తిగా నమ్మిన విద్యార్థి.. తన కర్ణాటక గ్రామీణ బ్యాంక్ (Karnataka Gramin Bank) ఖాతాకు లింక్ అయిన ఏటీఎం కార్డ్తో పాటు ఎయిర్టెల్ సిమ్ కార్డు, నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్లతో సహా అన్ని యాక్సెస్ వివరాలను పంచుకున్నాడు. ఈ వివరాలను పోస్ట్ ద్వారా పంపగా.. అందుకున్నట్లు ఆయుష్ వాట్సాప్లో ధ్రువీకరించాడు కూడా.అయితే, కొన్ని నెలల తర్వాత షాకింగ్ నిజం బయటపడింది! బ్యాంకు అధికారులు సదరు విద్యార్థిని సంప్రదించి.. అతడి ఖాతా ద్వారా భారీ అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని తెలిపింది. దాదాపు రూ.7 కోట్లు ఈ ఖాతా ద్వారా బదిలీ అయినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల్లోనే ఈ మొత్తం లాండరింగ్ జరిగినట్లు సమాచారం.తన ఖాతా సైబర్ నేరస్థుల 'మ్యూల్ అకౌంట్'గా దుర్వినియోగం అయినట్లు తెలిసిన విద్యార్థి వెంటనే ఖాతాను బ్లాక్ చేయించాడు. అనంతరం నార్త్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆయుష్తో పాటు ఇతరులపై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది ఓ హెచ్చరికే!స్నేహితులు అయినా.. బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్లు, ఓటీపీలు ఎవరితోనూ షేర్ చేయవద్దు. అత్యంత నమ్మకమైన వ్యక్తుల నుంచే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. బ్యాంక్ లేదా పోలీసులు అడిగినా.. ఫోన్లో ఇలాంటి వివరాలు ఇవ్వవద్దు. జాగ్రత్తలు తీసుకోండి.. సైబర్ మోసాల నుంచి దూరంగా ఉండండి!బ్యాంక్ అకౌంట్ దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలుఏటీఎం పిన్, సీవీవీ, ఓటీపీలు, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, ఖాతా వివరాలు స్నేహితులు/బంధువులు అయినా ఎవరికీ ఇవ్వవద్దు. బ్యాంకులు కూడా ఎప్పుడూ ఇలాంటివి ఫోన్ ద్వారా అడగవు."తాత్కాలికంగా ఖాతా ఉపయోగించుకోవాలి", "ఈజీ మనీ", "కమిషన్ ఇస్తాం", "జాబ్ ఫ్రమ్ హోమ్" అని ఎవరైనా అడిగితే నిరాకరించండి. ఇవి మనీ మ్యూల్ స్కామ్లే!స్ట్రాంగ్ పాస్వర్డ్ (అప్పర్+లోయర్+నంబర్+స్పెషల్) పెట్టుకోండి. దీన్ని రెగ్యులర్గా మారుస్తూ ఉండండి. ట్రాన్సాక్షన్ అలర్ట్స్ (SMS/ఈమెయిల్) ఆన్ చేసుకోండి. దీని వల్ల అనుమానాస్పద లావాదేవీలు వెంటనే తెలుస్తాయి.అన్నోన్ SMS/వాట్సాప్ లింకులు క్లిక్ చేయవద్దు. బ్యాంకు యాప్/వెబ్సైట్ నేరుగా టైప్ చేసి వెళ్లండి. పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ చేయవద్దు.ఖాతా స్టేట్మెంట్ తరచూ చెక్ చేయండి. అనుమానాస్పద ట్రాన్సాక్షన్ కనిపిస్తే వెంటనే బ్యాంకుకు, 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్లైన్) లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి.
మ్యూచువల్ ఫండ్స్.. ‘న్యూ ఆఫర్స్’..
ఎల్ఐసీ ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్: సంప్రదాయ ఐటీ సర్వీసుల పరిధికి మించి విస్తరిస్తున్న టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల అవకాశాలను అందించే దిశగా ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా టెక్నాలజీ ఫండ్ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 6తో ముగుస్తుంది. సెమీకండక్టర్ ఆధారిత కంపెనీలు, డేటా సెంటర్ ఆపరేటర్లు, డిజిటల్ కామర్స్ ప్లాట్ఫాంలు, ఇంటర్నెట్ బిజినెస్లు, వర్ధమాన టెక్నాలజీ సంస్థలు సహా సాంకేతికతతో ముడిపడి ఉన్న వివిధ రంగాల సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి బీఎస్ఈ టెక్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ రూపంలోనైతే వ్యవధిని బట్టి రూ.100 నుంచి కట్టొచ్చు. కరణ్ దోషి, జైప్రకాశ్ తోషి్నవాల్ దీనికి ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ‘బరోడా బీఎన్పీ’ ఈఎస్జీ స్ట్రాటజీ ఫండ్ పర్యావరణహితంగా వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో బరోడా బీఎన్పీ పారిబా మ్యుచువల్ ఫండ్ తాజాగా ఈఎస్జీ బెస్ట్–ఇన్–క్లాస్ స్ట్రాటెజీ ఫండ్ని ఆవిష్కరించింది. దీనికి నిఫ్టీ100 ఈఎస్జీ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. సెబీలో నమోదు చేసుకున్న రేటింగ్ కంపెనీలు ఇచ్చే ఈఎస్జీ రేటింగ్స్, అలాగే, కంపెనీ అంతర్గతంగా నిర్వహించే ఫండమెంటల్ రీసెర్చ్, అనాలిసిస్ ఆధారంగా ఎంపిక చేసిన సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. కనీసం రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టే విధంగా ఈ ఫండ్ ఉంటుంది. గడిచిన పదేళ్లలో ఏడేళ్ల పాటు నిఫ్టీ 100 టీఆర్ఐకి మించి నిఫ్టీ 100 ఈఎస్జీ టీఆర్ఐ మెరుగైన పనితీరు కనపర్చిందని సంస్థ సీఈవో సంజయ్ గ్రోవర్ తెలిపారు. బజాజ్ లైఫ్ బీఎస్ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ జీవిత బీమా సంస్థ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా బీఎస్ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 15 వరకు ఈ న్యూ ఫండ్ ఆఫర్లో (ఎన్ఎఫ్వో) ఇన్వెస్ట్ చేయొచ్చు. స్థిరంగా ఆదాయాలు ఆర్జిస్తూ, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న దేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. కంపెనీకి చెందిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలైన (యులిప్స్) బజాజ్ లైఫ్ స్మార్ట్ వెల్త్ గోల్, బజాజ్ లైఫ్ సుప్రీం, బజాజ్ లైఫ్ గెయిన్లతో దీన్ని తీసుకోవచ్చు. ఇటు జీవిత బీమా కవరేజీని పొందుతూనే అటు దీర్ఘకాలంలో సంపదను కూడా పంచుకునేలా ఇది రెండిందాల ప్రయోజనాలు అందిస్తుందని కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు.వెల్త్ కంపెనీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఈక్విటీ, డెట్ సాధనాల్లో క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని పెంచుకునే అవకాశం కల్పించేలా ది వెల్త్ కంపెనీ మ్యుచువల్ ఫండ్ ..తాజాగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ని ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 10న ముగుస్తుంది. మార్కెట్ పరిస్థితులు, వేల్యుయేషన్లు, రిస్క్ ఇండికేటర్లను బట్టి ఈక్విటీ, డెట్ సాధనాల మధ్య పెట్టుబడులను సర్దుబాటు చేస్తూ మెరుగైన రాబడులు అందించడంపై ఇది దృష్టి పెడుతుంది. కనీసం 65 శాతం నిధులను ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సాధనాల్లోనూ, 35 శాతం భాగాన్ని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి క్రిసిల్ హైబ్రిడ్ 50+50 మోడరేట్ ఇండెక్స్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది.
ప్రభుత్వ సొమ్ములు ప్రైవేటు బ్యాంకుల్లో ఎందుకు?
భారత బ్యాంకింగ్ రంగంలో మరోసారి భారీ మోసం కలకలం రేపింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇది కేవలం ఈ ఒక్క బ్యాంకుకే పరిమితమా.. లేక అన్ని ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లపై భద్రతా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయా!! ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా ప్రైవేటు బ్యాంకుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి విభాగాలు డిపాజిట్లు ఎందుకు చేస్తున్నాయి? ఎంత మొత్తం ఉంది? ఈ ప్రత్యేక కథనంలో వివరంగా చూద్దాం.మోసం బయట పడిందిలా..ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లోని తమ ఖాతాలు మూసివేయాలని హర్యానా ప్రభుత్వ విభాగం ఒకటి కోరగా, బ్యాంకు రికార్డుల్లోని బ్యాలెన్స్లు వాస్తవ ఖాతాలతో సరిపోలలేదు. దీంతో బ్యాంకు అంతర్గత ఆడిట్లో రూ.590 కోట్ల మోసం బయటపడింది. బ్యాంకు ఉద్యోగులు, బయటి వ్యక్తులు కలిసి ఈ అవకతవకలకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. ఫలితంగా బ్యాంకు షేర్లు 20% పడిపోయి, మార్కెట్ విలువలో రూ.14,438 కోట్ల నష్టం జరిగింది.బ్యాంకు సీఈవో వి వైద్యనాథన్ మాట్లాడుతూ, "ఇది ఒక్క బ్రాంచ్కు పరిమితమైన విషయం. బ్యాంకు మొత్తం కార్యకలాపాలు సాధారణంగా సాగుతున్నాయి" అని చెప్పారు. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసి, ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభించారు. "ఇది సిస్టమిక్ సమస్య కాదు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం" అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అయితే, ఈ ఘటన ప్రైవేటు బ్యాంకుల్లో ప్రభుత్వ డిపాజిట్ల భద్రతపై చర్చను రేకెత్తించింది.ప్రైవేటు బ్యాంకుల్లో ప్రభుత్వ డిపాజిట్లు ఎంత?దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి విభాగాలు ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తం గురించి ఖచ్చితమైన లెక్కలు బహిరంగంగా అందుబాటులో లేవు. అయితే, ఆర్బీఐ, ఎస్బీఐ రీసెర్చ్ నివేదికల ప్రకారం.. మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్లో డిపాజిట్లు 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.241.5 లక్షల కోట్లు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు బ్యాంకుల వాటా సుమారు 37% (రూ.89 లక్షల కోట్లు) కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 55 శాతం.ప్రభుత్వ డిపాజిట్లు ప్రైవేటు బ్యాంకుల్లో ఎంతో చెప్పాలంటే, ఐడీఎఫ్సీ మోసం కేసులోనే హర్యానా ప్రభుత్వ ఖాతాల్లో రూ.590 కోట్లు ఉన్నాయంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర విభాగాలు కలిపి ఈ మొత్తం వేల కోట్లలో ఉండవచ్చు. ఇండియాస్టాట్ డేటా ప్రకారం.. ప్రైవేటు బ్యాంకుల మొత్తం డిపాజిట్లు 2024-25లో వివిధ రకాలుగా (కరెంట్, సేవింగ్స్, ఫిక్స్డ్) విభజించబడ్డాయి, కానీ ప్రభుత్వ స్పెసిఫిక్ డేటా లేదు. ఆర్బీఐ అంచనాల ప్రకారం.. 2025-26లో డిపాజిట్ గ్రోత్ 11-12%. ఇందులో ప్రభుత్వ డిపాజిట్లు కూడా పెరుగుతున్నాయి.ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా ప్రైవేటులో ఎందుకు?ప్రభుత్వ రంగ బ్యాంకులు సార్వభౌమ గ్యారెంటీతో భద్రత కల్పిస్తున్నప్పుడు, ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. ముందుగా, ప్రైవేటు బ్యాంకులు మెరుగైన వడ్డీ రేట్లు, టెక్నాలజీ ఆధారిత సేవలు అందిస్తాయి. గత 10 ఏళ్లలో ప్రైవేటు బ్యాంకులు డిపాజిట్ మార్కెట్లో పీఎస్యూబీల వాటాను తగ్గించాయి. డిపాజిట్లు డిజిటల్ పేమెంట్లు, మ్యూచువల్ ఫండ్ల వైపు మళ్లుతున్నా, ప్రైవేటు బ్యాంకులు మెరుగైన కస్టమర్ రిలేషన్షిప్లతో డిపాజిట్లు సమీకరిస్తున్నాయి.రెండవది డైవర్సిఫికేషన్: ప్రభుత్వాలు రిస్క్ తగ్గించడానికి డిపాజిట్లను వివిధ బ్యాంకుల్లో విభజిస్తాయి. పీఎస్యూబీలు ఫిస్కల్ డెఫిసిట్, ఎన్పీఏలతో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ప్రైవేటు బ్యాంకులు మెరుగైన ఎఫిషియన్సీ, డిజిటల్ సర్వీసెస్తో ఆకర్షిస్తాయి.మూడవది, రెగ్యులేటరీ సపోర్ట్: ఆర్బీఐ లిక్విడిటీ మేనేజ్మెంట్, సీఆర్ఆర్ తగ్గింపులతో డిపాజిట్ గ్రోత్ను ప్రోత్సహిస్తోంది. అయితే, పీఎస్యూబీలు ప్రైవేటు బ్యాంకులతో పోటీ పడుతూ, డిపాజిట్ గ్రోత్లో ముందున్నాయి. గత 6 నెలల్లో పీఎస్యూబీల మార్కెట్ క్యాప్ రూ.5.75 లక్షల కోట్లు పెరిగింది.ఐడీఎఫ్సీ మోసం ప్రభుత్వ డిపాజిట్ల భద్రతపై హెచ్చరికలా మారింది. ప్రభుత్వాలు డిపాజిట్లు చేసేటప్పుడు బ్యాంకు ఆంతరిక నియంత్రణలు, ఆడిట్ సిస్టమ్లను పరిశీలించాలి. ఆర్బీఐ మరిన్ని రెగ్యులేషన్లు తీసుకురావాలి. ప్రభుత్వ సొమ్ములంటే ప్రజల సొమ్ములే. వీటి భద్రత అత్యవసరం.
నగదు వ్యవహారాలు వద్దే వద్దు ..!
నగదు వ్యవహారాలు ఇప్పటికీ చాలామంది చేస్తూనే ఉన్నారు. వ్యవస్థలో నగదు చెలామణి ఈ జనవరిలో రూ. 40 లక్షల కోట్లకు చేరిందని ప్రాథమిక అంచనా. ఇది వార్షికంగా 11.1% చొప్పున పెరుగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ పెరుగుదల ఒక చరిత్రను సృష్టిస్తోంది. మరోవైపు డిజిటల్ వ్యవస్థ వృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా యూపీఐ వాడే వారి సంఖ్య 400 మిలియన్లు. దానిని మరో 600 మిలియన్లకు పెంచి ‘ఒక బిలియన్’కి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం.ఫోన్పే, గూగుల్ పే, పేటీఎంలు ‘స్కాన్అండ్పే’ ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. భవిష్యత్తు ‘డిజిటల్ ప్రపంచమే’. అయినా మనిషి మారడం లేదు. నగదు వదలట్లేదు. రాజకీయ ఎన్నికల్లో నగదు పంపిణీ గురించి వింటాం. సినిమా ఇండస్ట్రీలో అది పరిపాటి. రియల్ ఎస్టేట్లో అలవాటు. లంచావతరాలకు దురలవాటు. ఎందుకో ఈ పొరపాటు చేసిన తర్వాత, దొరికిపోయిన తర్వాత గ్రహపాటు అని సరిపెట్టుకోవడం సాధారణమైంది. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటూ సక్రమమైన మార్గంలోనే సంపాదిస్తూ చౌక రోజుల్లో ఇళ్లు, ఫ్లాటు కొన్నారు. కాలం కలిసొచ్చింది. వాటిని అమ్మినప్పుడు భారీ లాభాలు వచ్చాయి.అయితే మార్కెట్ ధరని మించిన ప్రతిఫలాన్ని నగదులో తీసుకున్నారు. సక్రమమైన(వైట్) వ్యవహారాన్ని ఆదాయపన్ను వారికి డిక్లేర్ చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఇంట్లో కొండచిలువగా నగదు నిలువ ఉంది. ఏం చేయాలి? ఇదొక పెద్ద ప్రశ్న..! ఇంతటితో ఆగిపోయిందా? లేదు. జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు స్నేహితుడికి వైద్యం నిమిత్తం రూ.6 లక్షలు నగుదు రూపంలో ఇచ్చింది. ఆ స్నేహితుడు తన భార్య ఆనారోగ్యం కోసం ఖర్చు పెట్టినా భార్య చనిపోయింది. తరువాత ఇన్సూరెన్సు డబ్బు బ్యాంకు ద్వారా వచ్చాయి. ‘చేతిలో నగదు లేదు. తను తిరిగి చెల్లించాల్సిన రూ.6 లక్షల మొత్తం చెక్కు ద్వారా ఇస్తాను’ అంటున్నాడు. ఇప్పుడు ఆ జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు ఆ మొత్తాన్ని ఎలా చూపించాలన్నది ప్రశ్న.మంచికి పోతే చెడు ఎదురురొచ్చింది..? తండ్రి బతికున్నప్పుడు జాగాలో సగం రాయించుకున్నాడు పెద్ద కొడుకు. పెద్దలు ఇద్దరూ కాలం చేశారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మిగిలిన సగం జాగా పెద్దవాడికే అమ్మేశారు. కానీ పెద్దవాడు వ్యాపారంలో బాగా సంపాదించడం వలన తన దగ్గర ఉన్న నగదు కుటుంబ సభ్యులకిచ్చి వ్యవహారం నడిపించాడు. డబ్బు మీద వ్యామోహం వలన అందరూ నగదు వైపే మొగ్గు చూపించారు. ఒక్కొక్కరి చేతిలో పదేసి లక్షల మూట చేరింది. అటు పెద్దకొడుకు తన ‘బ్లాక్మనీ’ని వదిలించుకొని మిగతా అందరికి నగదు పంచి ఇచ్చాడు.నగదు నాగుపాములా తయారైంది.! అన్నదమ్ములు ఐక్యంగా ఉన్న కుటుంబంలో అన్న పురోహితుడు, తమ్ముడు క్యాటరింగ్ చేసేవారు. ఇద్దరికి దశ తిరిగింది. బాగా డబ్బులు నగదు రూపంలో వచ్చాయి. భార్యామణుల సలహామేరకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. కాలక్రమేణా పెద్ద మొత్తాలుగా మారాయి. టీడీయస్.. ఇన్కమ్టాక్స్.. పన్ను ఎగవేత ఉద్దేశంతో ఇన్కమ్ రిటర్నులు వేయడం లేదు. ఇప్పుడేం చేయాలనేది ఎడతెగని ప్రశ్న..?తను ఒక చిన్న ఇంట్లో ఉంటూ తన పది ప్లాట్లు కేవలం నగదుకే అద్దెకిచ్చి, అద్దె వసూలు చేస్తూ జీవితం కులాసాగా గడుపుతున్నాడు గోవిందం. పొరపాటున ఒక కిరాయిదారునికి ఇచ్చిన రశీదు కొంప ముంచింది. ఒకటి నగదు రశీదు. రెండవది పన్ను ఎగవేత. వీటి విషయం ఏమిటంటే.. నగదు వ్యవహారాలను చేయకండి. అసలు ప్రోత్సహించకండి. నల్లధనం (బ్లాక్ మనీ) వైపు వెళ్లొద్దు. నగదులో అప్పు ఇవ్వడం తప్పు. పుచ్చుకోవడం మరీ తప్పు. ఆ మొత్తాన్ని తిరిగి బ్యాంకు ద్వారా చెల్లిస్తే అది ఆదాయంగా మారి పన్నుకి గురి అవుతుంది. నగదు తీసుకోవడం తప్పని చెప్పాం కదా..! పోనీ దానిని అకౌంటు చేస్తే కనీసం మీ నిజాయితీ తెలుస్తుంది. గణనీయంగా పెరిగిన నగదు వ్యవహారాలను కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా కనుక్కొవచ్చు. డిపార్ట్మెంట్ వారి వద్ద ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ విభాగాలున్నాయి. మీరు సంపాదించిన ‘ధనం’ మీ దగ్గర ఉన్నా, వారి దగ్గర ‘ఇంధనం’ లాంటి సమాచారం ఉంది. ఈ రెండింటిని అనుసంధానం చేసే అవకాశం ఇవ్వకండి. సౌకర్యం కోసం నగదుని ఆశ్రయించకండి. అన్ని విధాల బ్యాంకు దారి సక్రమమైన రహదారి.


