Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Own House vs Renting Which better EMI vs SIP Wealth creation 20261
సొంతిల్లా... అద్దె ఇల్లా?

సొంతిల్లా... అద్దె ఇల్లా? ఏది బెటర్‌? ఈ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పినా కరెక్టే. కాకపోతే... అది చెప్పిన వారి దృష్టి కోణంలో మాత్రమే. ఒకరు ఇదే కరెక్ట్‌... అని చెప్పినంత మాత్రాన అందరికీ అదే కరెక్ట్‌ అనిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇల్లు అవసరాలు... అనేది ఆలోచించే కోణం... సామాజిక– ఆర్థిక స్థాయి... మానసిక తృప్తిపై ఆధారపడి ఉంటుంది. అందుకని ఒకరికి సొంతిల్లు కరెక్టనిపించవచ్చు. మరొకరికి అదే ఈఎంఐలో సగం పెట్టి అదే ఇంట్లో అద్దెకు ఉండొచ్చు కదా? మిగిలిన ఈఎంఐ మొత్తంతో దీర్ఘకాలంలో సంపద సృష్టించవచ్చు కదా? అని అనిపించవచ్చు. రెండూ కరెక్టే. అందుకే ఎవరి పరిస్థితులు, అవసరాలను బట్టి వారు నిర్ణయించుకోవాల్సిందే. మరి ఆ అవసరాలు, పరిస్థితులను గుర్తించేదెలా? ఇదే ఈ వారం ‘వెల్త్‌ స్టోరీ’.. – సాక్షి, వెల్త్‌ డెస్క్‌ఇంటిని కొనటమనేది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు. ఒక గుర్తింపు కోసం, భద్రత కోసం భావోద్వేగాలతో ముడిపడి తీసుకునే నిర్ణయమది. ‘ఆ రమణను చూశావా? ఎంత అందమైన ఇల్లు కట్టుకున్నాడో! చాలా ఖర్చు పెట్టాడట, గట్టిగానే సంపాదించి ఉంటాడు’... అనే గుర్తింపు చాలా మందికి కిక్కునిస్తుంది. జీవితంలో తాము సాధించిన ఘనతల్లో సొంతింటిని ఒకటిగా చూస్తుంటారు. సరైన ప్రాంతంలో ఇల్లు సమకూర్చుకుంటే, సొంతింటి కల సాకారానికితోడు కాలక్రమంలో దాని విలువ కూడా గణనీయంగా పెరుగుతుందన్నది ఒక ఆలోచన. నెలవారీ ఆదాయం నుంచి కొంత అద్దెకు కేటాయించి, మిగిలిన నిధిని సంపద సృష్టి కోసం పెట్టుబడిగా మార్చుకోవచ్చన్నదీ నిజమే. ప్రాపర్టీ కంటే ఈక్విటీలు అధిక రాబడులు ఇచ్చినట్టు చరిత్ర చెబుతోంది. పూర్వపు రోజులతో పోలిస్తే ఇపుడు చిన్న పట్టణాల నుంచి నగరాల వరకు చాలా చోట్ల ఇళ్ల స్థలాలు కొనలేనంత ఖరీదైపోయాయి. సామాన్య, మధ్య తరగతి వాసులకు అందనంత ఎత్తుకు వాటి ధరలు చేరాయి. పైగా ఇంటిపై అద్దె రూపంలో వచ్చే రాబడి ఈఎంఐతో పోలిస్తే చాలా తక్కువ. ఇలా ఎన్నో అంశాలను చూడాల్సి ఉంటుంది.సొంతింటికి వెళితే.. 🔹 భాగ్యనగరంలో ఫ్లాట్‌ కొనాలంటే కనీసం రూ.కోటి పైనే పెట్టాలి. 🔹 రుణంతో ముందుకు వెళ్లేట్టు అయితే 20 శాతం డౌన్‌ పేమెంట్‌ (రూ.20 లక్షలు)ను కొనుగోలుదారుడు రెడీ చేసుకోవాలి. 🔹 స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలు 6 శాతం కోసం మరో రూ. 6 లక్షలు. మొత్తంగా రూ.26 లక్షలు కావాలి. 🔹 మిగిలిన రూ.80 లక్షలను బ్యాంక్‌ రుణంగా ఇస్తుంది. 20 ఏళ్ల కాలానికి 8 శాతం రేటు ప్రకారం చూస్తే నెలవారీ ఈఎంఐ రూ.66,915. 🔹 20 ఏళ్లలో రూ.80 లక్షల రుణానికి చెల్లించుకోవాల్సిన మొత్తం రూ.1.61 కోట్లు. ఆరంభంలో రూ.26 లక్షలు కలిపితే రూ.1.87 కోట్లు అవుతుంది. 🔹 ఇంటికి మరమ్మతులు, ప్రాపర్టీ ట్యాక్స్‌ తదితర ఖర్చులు అదనం. 🔹 రూ.కోటి ఇంటి కోసం దాదాపు రెట్టింపు చెల్లించాల్సి వస్తుంది. కిరాయి ఇంటికి వెళితే..? 🔹 నగరాల్లో నివాస గృహాలపై రెంటల్‌ ఈల్డ్స్‌ 2–3 శాతం మించడం లేదు. 🔹 రూ.కోటి ఇంటిపై 2.5 శాతం రాబడి ప్రకారం ఏడాదికి అద్దె రూ.2.5 లక్షలు. 🔹 ఏటా 5 శాతం పెరుగుతూ (పెరిగే ధరలకు అనుగుణంగా) వెళితే 20 ఏళ్లలో రూ.82.7 లక్షలను అద్దె రూపంలో చెల్లించాల్సి వస్తుంది. 🔹 సొంతంగా ఇల్లు సమకూర్చుకుంటే అయ్యే రూ.1.87 కోట్లలో సగానికంటే తక్కువే. 🔹 మరి మిగిలిన సగానికే ఇల్లు సొంతం అవుతోంది కదా? అని వాదించొచ్చు. ఇందులో నిజం కొంతే. కాంపౌండింగ్‌ మ్యాజిక్‌ 🔹 ఇంటిని రుణంపై తీసుకుంటే నెలవారీ రూ.66,915 ఈఎంఐ చెల్లించాలి. 🔹 అదే అద్దెకు తీసుకుంటే రూ.20,883 కిరాయి చెల్లిస్తే సరిపోతుంది. 🔹 అంటే రూ.46,082 మిగిలినట్టు. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా ఈ మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే? 🔹 12 శాతం వార్షిక రాబడి ప్రకారం చూసినా (ఇంతకంటే ఎక్కువే రావచ్చు) 20 ఏళ్లలో రూ.5.98 కోట్ల సంపద సృష్టి సాధ్యం. 🔹 మరి కొనుగోలు చేసిన ఇంటి విలువ కూడా 20 ఏళ్లలో రూ.6 కోట్లకు చేరుకుంటుందా? కచ్చితంగా చెప్పలేం. నిజానికి ఈక్విటీల్లోనే అధిక రాబడులున్నాయి మరి. 🔹 కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కేసుల్లో ప్రాపర్టీ విలువ కూడా ఇదే స్థాయిలో పెరిగిన నిదర్శనాలూ ఉన్నాయి.అటా.. ఇటా..? 🔹 సంపదను సృష్టించుకోవాలన్నది లక్ష్యం అయితే అద్దె ఇంటికి వెళ్లి, సిప్‌ వేసుకోవడం బెటర్‌. మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేసి కోరుకున్నంత సమకూర్చుకోవచ్చు. 🔹 ఒకవేళ అద్దెకు ఉండి, మిగిలే ఆదాయాన్ని సిప్‌ చేసేంత క్రమశిక్షణ లేని వారికి ఇంటి కొనుగోలే సరైన నిర్ణయం. 🔹 తరచూ ప్రాంతాలు మారుతుంటే లేదా పనిచేసే చోటుకు సమీపంలో ఉండాలనుకునుంటే రెంటెడ్‌ హోమ్‌ అనుకూలం. 🔹 ఇంటికి ఈఎంఐ పెద్ద మొత్తంలోనే ఉంటుంది. పిల్లల ఉన్నత విద్య, వివాహాలు, తమ విశ్రాంత జీవన అవసరాల కోసం కూడా పెట్టుబడి మిగులు ఉండేలా చూసుకోవాలి. సొంతిల్లు ఎప్పుడు? కొన్ని సందర్భాల్లో ఇంటిపై పెట్టుబడి సిరులు కురిపిస్తుందనడంలో సందేహం లేదు. 🔹 ధరలు ఏటా 10 శాతం మించి పెరిగే చోట ఇంటిపై పెట్టుబడి కాసులు కురిపిస్తుంది. 🔹 గృహ రుణాలు కనిష్ట స్థాయిలకు చేరిన సందర్భంలోనూ ఇంటికి ఈఎంఐ రూపంలో చెల్లింపులు తగ్గుగాయి. 🔹 దీర్ఘకాలం పాటు స్థిర నివాసం కోరుకుంటే ముందడుగు వేయొచ్చు. 🔹 గృహ రుణం చెల్లింపులపై పన్ను మినహాయింపు ప్రయోజనాలను (పాత పన్ను విధానంలో రూ.2 లక్షల వరకు వడ్డీపై) పూర్తి స్థాయిలో వినియోగించుకున్నా ఆ మేరకు దీర్ఘకాలంలో చాలా ఆదా అవుతుంది. 🔹 ఎక్కువ మంది ఇంటి కొనుగోలుకే ఎందుకు మొగ్గు చూపుతారంటే? సొంతిల్లు కలిగి ఉండాలన్న అభిలాషే అని చెప్పొచ్చు. తమకు నచ్చిన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవచ్చు. ఉన్నట్టుండి ఖాళీ చేయనక్కర్లేదు. ఏటా అద్దె పెంచనక్కర్లేదు. సామాజిక గుర్తింపు ఇలా ఎన్నో భావోద్వేగ అంశాలు ఆ దిశగా నడిపిస్తుంటాయి. 🔹 సొంతిల్లును సంపద సృష్టి కంటే నివాస యోగ్య సాధనంగానే చూడాలి. భావోద్వేగాల కంటే ఆర్థిక భద్రతకే ప్రాధాన్యం ఎక్కువ. నోట్‌: ఏటా కనీసం 10 శాతానికి పైన పెరుగుతూ వెళితేనే సొంతిల్లు మెరుగైన నిర్ణయమని స్పష్టమవుతోంది.

3 Upcoming IPOs This Week Waterways Leisure Advit Jewels CSM Technologies ipo details2
ఈ వారం 3 ఐపీఓలు

మార్కెట్లో మళ్లీ సానుకూల పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పబ్లిక్‌ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ వారంలో మూడు ఐపీఓలు ఇన్వెస్టర్ల తలుపు తుడుతున్నాయి. లగ్జరీ క్రూ యిజ్‌ సర్వీసులను అందిస్తున్న కార్డీలియా క్రూ యిజెస్‌ పేరెంట్‌ కంపెనీ వాటర్‌వేస్‌ లీజర్‌ టూరిజమ్‌ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో రూ. 585 కోట్లు సమీకరించనుంది. ఇక జైపూర్‌కు చెందిన ఆభరణాల తయారీ సంస్థ అద్విత్‌ జ్యువెల్స్, ఐటీ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ సీఎస్‌ఎం టెక్నాలజీస్‌ కూడా జాబితాలో ఉన్నాయి.వాటర్‌వేస్‌ లీజర్‌ టూరిజం ఎప్పుడు: జూన్‌ 23న ప్రారంభం.. 25న ముగింపు షేరు ధరల శ్రేణి: రూ.769–808 సమీకరణ మొత్తం: రూ.585 కోట్లుఅద్విత్‌ జ్యువెల్స్‌ ఎప్పుడు: జూన్‌ 23న ప్రారంభం.. 25న ముగింపు షేరు ధరల శ్రేణి: రూ.130–138 సమీకరణ మొత్తం: రూ.165 కోట్లుసీఎస్‌ఎం టెక్నాలజీస్‌ ఎప్పుడు: జూన్‌ 24న ప్రారంభం.. 29న ముగింపు షేరు ధరల శ్రేణి: రూ.107–113 సమీకరణ మొత్తం: రూ.146 కోట్లు

Peace talks and crude oil prices to set the direction in this week3
శాంతి చర్చలు.. క్రూడ్‌ ధరలే దిక్సూచి!

పశ్చిమాసియాలో శాంతి పవనాలు... క్రూడ్‌ మంటలు చల్లారడంతో స్టాక్‌ మార్కెట్లలో మళ్లీ కాస్త జోష్‌ కనిపిస్తోంది. అయితే, అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి చర్చల్లో పురోగతితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రూపాయి కదలికలు, రుతుపవనాల విస్తరణపైనా ఇన్వెస్టర్లు ఫోకస్‌ చేయనున్నారు. మరోపక్క, మొహర్రం సందర్భంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్లకు సెలవు ప్రకటించడంతో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం కానుంది. పశ్చిమాసియాలో ఒకపక్క ఉద్రిక్తతలు కుదుటపడుతున్న తరుణంలో తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు మళ్లీ అనిశ్చితికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లోని అమెరికా–ఇరాన్‌ మధ్య స్విట్జర్లాండ్‌లో ఆదివారం తొలి విడత శాంతి చర్చలు మొదలయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ దీనికి హాజరు కాగా, ఇరాన్‌ ప్రతినిధుల బృందానికి పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బఘేర్‌ ఘాలిబాఫ్‌ నేతృత్వం వహించారు. ఈ కీలక చర్చల్లో ఎలాంటి పురోగతి ఉంటుందనేది ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశీయంగా స్టాక్‌ మార్కెట్లకు కీలకంగా నిలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘ఈ వారం ఇన్వెస్టర్ల ఫోకస్‌ అంతా యూఎస్‌–ఇరాన్‌ శాంతి చర్చలపైనే ఉంటుంది. మరోపక్క క్రూడ్‌ ఆయిల్‌ ధరల కదలికలను కూడా నిశితంగా గమనిస్తారు. చమురు ధరల సెగ తగ్గడం రానున్న రోజుల్లో మన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుంది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు గనుక తలెత్తితే క్రూడ్‌ మంటతో మార్కెట్లతో పాటు ఎకానమీకి కూడా షాక్‌ తగులుతుంది’ అని ఎన్రిచ్‌ మనీ సీఈఓ పోన్ముడి ఆర్‌ అభిప్రాయపడ్డారు. వరుణుడు కరుణిస్తాడా... ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఈ ఏడాది వర్షాలకు గండి పడుతుందన్న అంచనాలు బలడుతున్నాయి. జూన్‌ నెల దాదాపు చివరికి చేరుకుంటున్నప్పటికీ ఇంకా రుతుపవనాలు విస్తరించకపోవడం.. నైరుతి రుతుపవన సీజన్‌లో ఇప్పటిదాకా 41 శాతం లోటు వర్షపాతం ఉండన్న వాతావరణ శాఖ (ఐఎండీ) గణంకాలతో మార్కెట్ల ఫోకస్‌ వరుణుడి వైపు మళ్లింది. వర్షాలు సరిగ్గా పడకపోతే గ్రామీణ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. స్టాక్‌ మార్కెట్లకు ఇది చాలా ప్రతికూలాంశంగా మారుతుందనేది విశ్లేషకుల మాట. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో రుతుపవనాల విస్తరణపై ఇన్వెస్టర్లు దృష్టి కేంద్రీకరిస్తారని వారు అంటున్నారు.గతవారమిలా...పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణగడం, క్రూడ్‌ చల్లారడం, రూపాయి కోలుకోవడంతో గతవారం దేశీ మార్కెట్లు భారీగా బౌన్స్‌ అయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,274 పాయింట్లు (1.65%) పుంజుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 390 పాయింట్లు (1.65%) ఎగబాకి 24,000 పాయింట్ల పైన స్థిరపడింది.సాంకేతికంగా చూస్తే...గతవారం బుల్లిష్‌ ధోరణి ఈ వారం కూడా కొనసాగితే.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీకి 24,080–24,120 పాయింట్ల వద్ద తొలి నిరోధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 24,200 పాయింట్ల పైన నిలదొక్కుకుంటే.. తదుపరి 24,400 వరకూ ఎగబాకే అవకాశం ఉంటుంది. ఇక సూచీ గనుక వెనకడుగు వేస్తే.. 23,900 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. దాన్ని కోల్పోతే 23,800 వద్ద రెండో మద్దతు దొరుకుతుంది. దీని దిగువున 23,700 స్థాయిని మళ్లీ పరీక్షించే అవకాశం ఉంటుంది.రూపాయిపై ఫోకస్‌..పశ్చిమాసియా యుద్ధం.. క్రూడ్‌ సెగతో బక్కచిక్కిన రూపాయి.. ఆర్‌బీఐ, ప్రభుత్వ చర్యలతో గత రెండు వారాల్లో భారీగా కోలుకుంది. మే నెలాఖర్లో డాలరుతో రూపాయి మారకం విలువ 96.96 ఆల్‌టైమ్‌ కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. చమురు ధరలు శాంతించడం (బ్రెంట్‌ క్రూడ్‌ 80 డాలర్ల దిగువకు చేరింది) డాలర్ల ప్రవాహానికి చేపట్టిన చర్యల ప్రభావంతో తాజాగా 94.20 స్థాయికి పుంజుకుంది. అయితే, అమెరికా–ఇరాన్‌ శాంతి చర్చల ఆధారంగా క్రూడ్‌ ధరల్లో చోటు చేసుకునే హెచ్చుతగ్గులు రానున్న రోజుల్లో రూపాయి విలువపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘మార్కెట్లు క్రమంగా రెండు ప్రధాన అడ్డంకులను అధిగమిస్తున్నాయి. టారిఫ్‌ అనిశ్చితితో పాటు పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు సద్దుమణిగేలా కనబడుతున్నాయి. కొంత కాలంగా జరుగుతున్న స్థిరీకరణ తర్వాత ఈ సానుకూలతలు మార్కెట్‌ రికవరీకి దన్నుగా నిలుస్తాయి. అయితే, వాటి ఫలితాలపైనే మార్కెట్‌ గమనం ఆధారపడి ఉంటుంది’ అని జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ వ్యాఖ్యానించారు.– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Utility Vehicles and GST Cuts to Boost Passenger Vehicle Market ICRA Report4
జీఎస్‌టీ ఎఫెక్ట్.. పెరుగనున్న కార్ల అమ్మకాలు!

స్థిరంగా కొనసాగుతున్న డిమాండ్, జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో పెరిగిన కొనుగోలు సామర్థ్యం, యుటిలిటీ వాహనాలకు లభిస్తున్న ఆదరణ తదితర కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) విక్రయాలు 4–6 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ‘ఇక్రా’ తన నివేదికలో తెలిపింది.గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్‌ వాహనాల టోకు అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 27 శాతం వృద్ధితో 4.4 లక్షల యూనిట్లకు చేరాయి. అదే సమయంలో వినియోగదారుల నుంచి లభించిన భారీ డిమాండ్, కొత్త మోడళ్ల విడుదల, సుదీర్ఘ వివాహాల సీజన్‌ కారణంగా రిటైల్‌ విక్రయాలు 33 శాతం పెరిగాయి. అయితే, పెరుగుతున్న ఇంధన, కమొడిటీ ధరలతో పాటు బలహీనమైన రుతుపవనాలపై ఆందోళనలు రాబోయే కాలంలో నిశితంగా గమనించాల్సిన కీలక అంశాలుగా ఉన్నాయని ఇక్రా పేర్కొంది.యుటిలిటీ వాహనాల ఆధిపత్యం ‘‘ప్యాసింజర్‌ వాహనాల విభాగంలో యుటిలిటీ వాహనాల ఆధిపత్యం కొనసాగుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో జరిగిన మొత్తం ప్యాసింజర్‌ వాహనాల విక్రయాల్లో ఇవి దాదాపు 68 శాతం వాటాను దక్కించుకున్నాయి. అలాగే, గత ఏడాది సెపె్టంబర్‌లో జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో మినీ, కాంపాక్ట్‌ కార్ల విభాగాల్లోనూ డిమాండ్‌ పుంజుకుంది’’ అని ఇక్రా నివేదిక స్పష్టం చేసింది.పెరిగిన ఎగుమతులు.. ఈవీల జోరుదేశీయ వాహన తయారీ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో తమ సరఫరాను ముమ్మరం చేయడంతో, ఈ ఏడాది మే నెలలో ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 13 శాతం వృద్ధిని సాధించాయి. ఇదే సమయంలో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వినియోగం కూడా పుంజుకుంది. 2027 ఆర్థిక సంవత్సర ఆరంభంలో ప్యాసింజర్‌ వాహనాల విభాగంలో ఈవీల వాటా దాదాపు 6 శాతానికి చేరినట్లు ఇక్రా నివేదిక వెల్లడించింది.

Aprilia Tuono 457 Special Edition Launched At Rs 3 99 Lakh5
ఎప్రిలియా కొత్త బైక్: ధర ఎంతంటే?

ఎప్రిలియా ఇండియా.. టుయోనో 457 స్పెషల్ ఎడిషన్‌ను దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. దీని ధర రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కోసం ఎంపిక చేసిన షోరూమ్‌లలో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.కొత్త ఎప్రిలియా టుయోనో 457 స్పెషల్ ఎడిషన్‌ 2006 ట్యూనో 1000R నుంచి తీసుకున్న రెండు కొత్త లివరీలను పొందింది. అంతేకాకుండా.. ఈ మోటార్‌సైకిల్‌లో కొన్ని ఎర్గోనామిక్ మార్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది.స్పెషల్ ఎడిషన్ టుయోనో 457, కొత్త గ్రాఫిక్స్ డిజైన్, లోగోలతో పాటు, మాంబా బ్లాక్ అండ్ పూమా గ్రే అనే రెండు కొత్త రంగులలో లభిస్తుంది. కొత్త స్మోక్డ్ ఫినిష్ ఏరోడైనమిక్ ఫ్లైస్క్రీన్, నిటారుగా ఉండే రైడింగ్ పొజిషన్ కోసం ఎత్తుగా అమర్చిన హ్యాండిల్‌బార్లు ఉన్నాయి. సుదూర ప్రయాణాలలో మరింత సౌకర్యం కోసం ఈ స్పెషల్ ఎడిషన్ సీటులో మార్పులు చేశారని, అలాగే భారతీయ రోడ్లపై మెరుగ్గా పనిచేసేలా సస్పెన్షన్‌ను కూడా మెరుగుపరిచినట్లు ఎప్రిలియా చెబుతోంది.ఇంజిన్ విషయానికి వస్తే.. ఎప్రిలియా పవర్‌ప్లాంట్‌లో ఎటువంటి మార్పు చేయలేదు. కాబట్టి టుయోనో 457 బైక్ 46.9 bhp పవర్, 43.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 457 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌తో కొనసాగుతోంది.

Indian Railways New Rules to Come into Effect from July 1 20266
ప్రయాణికులకు అలర్ట్.. అమల్లోకి రైల్వే కొత్త రూల్స్!

టికెట్ లేకుండా లేదా చెల్లుబాటు కాని టికెట్‌తో ప్రయాణించే ప్రయాణికులపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఇండియన్ రైల్వే సిద్ధమైంది. జన్ విశ్వాస్ చట్టం ప్రకారం కొత్త రూల్స్ జులై 1నుంచి అమల్లోకి రానున్నట్లు భారతీయ రైల్వే వెల్లడించింది.కొత్త నిబంధనల ప్రకారం, టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఇకపై కనీస జరిమానా రూ.250 నుంచి రూ.500కు పెంచారు. అంటే, ఎవరైనా సరైన టికెట్ లేకుండా ప్రయాణిస్తే వారికి టికెట్ ఛార్జీతో పాటు అదనంగా కనీసం రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన తప్పుడు టికెట్‌తో ప్రయాణించేవారికి కూడా వర్తిస్తుంది.అంతేకాకుండా.. టికెట్‌లో పేర్కొన్న కోచ్ లేదా క్లాస్ కాకుండా ఇతర కోచ్‌లో ప్రయాణిస్తే కూడా జరిమానా విధించడం జరుగుతుంది. ఉదాహరణకు, జనరల్ టికెట్‌తో స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లో ప్రయాణించడం, లేదా అనుమతించిన దూరం (దిగాల్సిన స్టేషన్) కంటే ఎక్కువ ప్రయాణించడం వంటి వాటిపై కూడా అదనపు చార్జీలు విధిస్తారు.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇతరుల టికెట్‌ను ఉపయోగించి ప్రయాణించడం కూడా నేరంగా పరిగణించడం జరుగుతుంది. ఇలా ప్రయాణిస్తే.. టికెట్ రద్దు చేయడమే కాకుండా, రూ.500 జరిమానా కూడా విధిస్తారు. ఒకవేళ ప్రయాణికుడు ఈ జరిమానాలు చెల్లించడానికి నిరాకరిస్తే, రైల్వే అధికారులు కోర్టులో కేసు వేయవచ్చు. అప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం బకాయిలు వసూలు చేయడం జరుగుతుంది.ఇదీ చదవండి: అమెరికా వీసా నిబంధనల్లో మార్పు.. కొత్త విధానం ఇలా!ప్రయాణికుల్లో అవగాహన పెంచాలని లక్ష్యంతో ఈ కొత్త నిబంధనలను రైల్వే శాఖ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ రైల్వే, మధ్య రైల్వే వంటి విభాగాలు సోషల్ మీడియా, ఇతర ప్రకటనల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. సరైన టికెట్‌తో మాత్రమే ప్రయాణించాలని, రైల్వే నియమాలను తప్పకుండా పాటించాలని సూచిస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement