Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Air India Ticket Prices To Rise As Airline Revises Fuel Surcharge1
ఎయిరిండియా ప్రయాణికులకు ఏటీఎఫ్‌ సెగ

ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) రేట్లు భారీగా ఎగిసిన నేపథ్యంలో ఎయిరిండియా గ్రూప్‌ తమ ఫ్లయిట్స్‌పై ఇంధన సర్‌చార్జీని విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది దేశీ ఫ్లయిట్స్‌పై రూ. 299 నుంచి రూ. 899 వరకు, విదేశీ రూట్లలో 24 డాలర్ల నుంచి 280 డాలర్ల వరకు (కొన్ని రూట్లు మినహాయించి) ఉంటుంది. ఏప్రిల్‌ 8 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ఎయిరిండియా గ్రూప్‌ పేర్కొంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలకు కూడా ఇవి వర్తిస్తాయి.బంగ్లాదేశ్, జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా తదితర రూట్లకు సంబంధించి నియంత్రణ సంస్థ నుంచి వచ్చే అనుమతులను బట్టి నిర్ణయాలు ప్రకటించనున్నట్లు సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 27తో ముగిసిన వారాంతంలో బ్యారెల్‌కి 27.83 డాలర్లుగా ఉన్న ఏటీఎఫ్‌ మార్చి 27న ముగిసిన వారాంతానికి 81.44 డాలర్లకు ఎగిసినట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో సర్‌చార్జీలను విధించినప్పటికీ ఏటీఎఫ్‌ వ్యయాలు పూర్తిగా రికవర్‌ కావని, ఇప్పటికీ సింహభాగం భారాన్ని సంస్థే భరిస్తోందని ఎయిరిండియా పేర్కొంది. ఎయిర్‌లైన్స్‌ నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్‌ వాటా 40–45 శాతం వరకు ఉంటుంది. మరో విమానయాన సంస్థ ఇండిగో ఇప్పటికే ఇంధన సర్‌చార్జీలను సవరించిన సంగతి తెలిసిందే.సీఈవో విల్సన్‌ రాజీనామాఎయిరిండియా సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ రాజీనామా చేశారు. దీనితో ఆయన స్థానంలో కొత్త వారి నియామకం కోసం కంపెనీ ప్రత్యేక కమిటీని నియమించింది. న్యూజిలాండ్‌కి చెందిన విల్సన్‌ గతంలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కి పని చేశారు. 2022లో ఎయిరిండియా పగ్గాలు చేపట్టిన విల్సన్‌ గత నాలుగేళ్లుగా సీఈవో, ఎండీగా పని చేస్తున్నారు. ‘2026లో తప్పుకోవాలనే యోచనలో ఉన్నట్లు 2024లోనే ఎయిరిండియా చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌కి విల్సన్‌ తెలిపారు. అధికార బదలాయింపు ప్రక్రియ సజావుగా సాగేట్లుగా అప్పటి నుంచే కసరత్తు జరుగుతోంది‘ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.వారసుడు ఎంపికయ్యేంత వరకు విల్సన్‌ ప్రస్తుత హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొంది. ‘కోవిడ్‌ అనంతరం పలు సవాళ్లు ఎదురైనప్పటికీ కంపెనీ వాటిని అధిగమించి, పురోగమించడంలో విల్సన్‌ కీలకపాత్ర పోషించారు‘ అని చంద్రశేఖరన్‌ కితాబిచ్చారు. ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ల డెలివరీలు, సరఫరా వ్యవస్థలో సవాళ్లు, రెండు యుద్ధాలు, ఎయిర్‌స్పేస్‌ మూసివేత, ఇంధన ధరల పెంపు, అన్నింటికన్నా ముఖ్యంగా ఒక పెను విషాదం (అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటన)లాంటి అసాధారణ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మీరు సాధించిన విజయాలు ఎంతో గర్వకారణం.కొత్త విమానాల డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో నేను కంపెనీ పగ్గాలను మరొకరికి అప్పగించేందుకు ఇదే సరైన సమయం‘ అని ఉద్యోగులకి ఇచ్చిన సందేశంలో విల్సన్‌ పేర్కొన్నారు. 2022లో ఎయిరిండియాను ప్రభుత్వం నుంచి టాటాలు కొనుగోలు చేసిన అనంతరం నాలుగు ఎయిర్‌లైన్స్‌ని విజయవంతంగా విలీనం చేయడం తదితర అంశాల్లో విల్సన్‌ కీలక పాత్ర పోషించారు. అయితే, 250 మంది ప్రయాణికులు మరణించిన ఎయిరిండియా విమాన దుర్ఘటన, ఇతరత్రా సందర్భాల్లో భద్రతా ప్రమాణాల లోపాలు తదితర అంశాలపై విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.

Digital commerce in India will grow to Rs 250 billion by 20302
ఈ–కామర్స్ @ 250 బిలియన్‌ డాలర్లు!

న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్‌ మార్కెట్‌ 2030 నాటికి దాదాపు మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుత 90 బిలియన్‌ డాలర్ల స్థాయి నుంచి 250 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. జెన్‌ జెడ్‌ షాపర్స్, క్విక్‌ కామర్స్‌ వేగంగా విస్తరిస్తుండటంలాంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. గూగుల్, డెలాయిట్‌ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దశాబ్దం ఆఖరు నాటికి భారత డిజిటల్‌ ఎకానమీలోకి 15 కోట్ల మంది కొత్త షాపర్స్‌ ప్రవేశించనున్నారు. మొత్తం ఆన్‌లైన్‌ వ్యయాల్లో 22 కోట్ల పైగా ఉన్న జెన్‌ జెడ్‌ వినియోగదారుల వాటా 45%కి చేరనుంది.దేశీయంగా ప్రజల షాపింగ్‌ చేసే తీరుతెన్నులు మారుతున్న నేపథ్యంలో ఈ–కామర్స్‌ కీలక దశలో ఉందని గూగుల్‌ ఇండియా ఎండీ (కనెక్టెడ్‌ కన్జూమర్‌ కామర్స్‌) రోమా దత్త చౌబే తెలిపారు. ఏఐ, ఇతరత్రా సాంకేతికతలతో వినియోగదారులు కొత్త కొనుగోలు ధోరణులను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆల్గోరిథమ్‌ శకం వైపు మార్కెట్‌ మళ్లుతోందని డెలాయిట్‌ దక్షిణాసియా పార్ట్‌నర్‌ ఆనంద్‌ రామనాథన్‌ పేర్కొన్నారు. డిజిటల్‌ జనులైన జెన్‌ జెడ్‌ వినియోగదారులు ఈ మార్పులకు కారణమవుతున్నారని వివరించారు. వినియోగదారులు తమ అవసరాన్ని వివరిస్తే, ఏఐ దాన్ని విశ్లేషించుకుని, సత్వరమే సొల్యూషన్స్‌ కూడా అందించే జనరేటివ్‌ కామర్స్‌ వేగవంతంగా అమల్లోకి వచ్చేందుకు ఇది దోహదపడుతోందన్నారు. మరిన్ని కీలకాంశాలు.. ⇒ ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ఉంటున్న క్విక్‌ కామర్స్‌ మార్కెట్‌ రాబోయే రోజుల్లో 50 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చు. ఈ విభాగంలో కొనుగోలుదారుల సంఖ్య రెట్టింపై 7 కోట్లకు చేరనుంది. ఈ మార్కెట్లో ద్వితీయ శ్రేణి నగరాలు, అంతకన్నా చిన్న పట్టణాల వినియోగదారుల వాటా 30 శాతం స్థాయిలో ఉండనుంది. ⇒ 2030 నాటికి మొత్తం క్విక్‌ కామర్స్‌ వ్యయాల్లో సౌందర్య సాధనాలు, ఫ్యాషన్, ఎల్రక్టానిక్స్‌లాంటి ఆహారయేతర కేటగిరీల వాటా 45 శాతానికి చేరుతుంది. తద్వారా ఆయా విభాగాల్లో స్పెషలిస్టులకు 10 బిలియన్‌ డాలర్ల వ్యాపారావకాశాలు లభిస్తాయి. ⇒ క్రియేటర్‌ ఎకానమీ కూడా కీలకంగా మారనుంది. కంటెంట్‌ క్రియేటర్లు 2030 నాటికి మొత్తం రిటైల్‌ వ్యయాల్లో 30 శాతం భాగాన్ని ప్రభావితం చేస్తారు. ప్రతి 10 ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో ఒకటి నేరుగా క్రియేటర్‌ స్టోర్‌ఫ్రంట్‌ ద్వారా జరుగుతుంది. లైవ్‌ కామర్స్‌ 8 బిలియన్‌ డాలర్ల స్థాయికి పెరుగుతుంది. ⇒ పరిశ్రమ వృద్ధిలో కృత్రిమ మేధ ముఖ్య పాత్ర పోషించనుంది. హైపర్‌ పర్సనలైజేషన్, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చడం ద్వారా రిటైల్‌ లాభదాయకత 30–35% మేర పెరిగేందుకు దోహదపడనుంది.

Government plans Rs 2. 5 lakh cr credit guarantee scheme for businesses affected by West Asia crisis3
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. దెబ్బతిన్న రంగాలకు కేంద్రం దన్ను!

న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో దేశీయంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈలు) కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలవనుంది. రూ.2.5 లక్షల కోట్లతో క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ (రుణ హామీ పథకం)ను తీసుకొచ్చే యోచనతో ఉంది. ఈ పథకం కింద రుణాలు తీసుకున్న సంస్థలు ఇరాన్‌–ఇజ్రాయెల్‌/అమెరికా యుద్ధ ప్రభావం కారణంగా చెల్లింపుల్లో విఫలమైతే 90 శాతం మేర (రూ.100 కోట్ల వరకు) ప్రభుత్వం రుణదాతలకు (బ్యాంక్‌లు) చెల్లిస్తుంది.ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ క్రెడిట్‌ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్‌సీజీటీసీ) ఈ మేరకు హామీని బ్యాంక్‌లకు ఇవ్వనుంది. కరోనా సమయంలోనూ ప్రభుత్వం ఇదే తరహా పథకాన్ని (అత్యవసర రుణ హామీ పథకం/ఈసీఎల్‌జీఎస్‌) ప్రకటించడం తెలిసిందే. నాడు ఈ పథకం ఎంతో విజయవంతమైందని, ఎన్నో సంస్థలు నిలదొక్కుకుని, తర్వాత చెల్లింపులు చేసేందుకు వీలు ఏర్పడినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈసీఎల్‌జీఎస్‌ను నాడు అన్ని రంగాలకు అమలు చేశారు. నూరు శాతం హామీని ఈ పథకం కింద ప్రభుత్వం అందించింది. దీనికింద అప్పటికే రుణాలు తీసుకున్న సంస్థలకు, అదనపు రుణ సదుపాయాలను బ్యాంక్‌లు ఆఫర్‌ చేశాయి.రుణ రేట్లపై పరిమితులతోపాటు ముందస్తు చెల్లింపుల చార్జీలు, ప్రాసెసింగ్‌ చార్జీల్లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత క్రూడ్‌ ధరలు భగ్గుమనడం తెలిసిందే. ఈ ప్రభావం వినియోగదారులపై పడకుండా ఉండేందుకు పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గించడం తెలిసిందే. ఫార్మా, టెక్స్‌టైల్స్‌ తదితర రంగాల్లో వినియోగించే కీలక ముడిపదార్థాలైన పెట్రోకెమికల్స్‌పైనా దిగుమతి సుంకాలను మినహాయించడం గమనార్హం.

Private banks outpace PSBs in Q4 deposit growth4
డిపాజిట్ల వేటలో ప్రైవేటు బ్యాంకులు టాప్‌

ముంబై: డిపాజిట్ల వేటలో ప్రభుత్వరంగ బ్యాంకులతో ప్రైవేటు బ్యాంక్‌లు గట్టి పోడీ పడుతున్నాయి. జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రైవేటు బ్యాంకులు అధిక డిపాజిట్లను సమీకరించడం ఇందుకు నిదర్శనం. 2025–26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రైవేటు బ్యాంకులు డిపాజిట్లలో 12–17 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కానీ, ఇదే కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి 2–14 శాతానికి పరిమితమైనట్టు డేటా స్పష్టం చేస్తోంది. సాధారణంగా బ్యాంకులకు కరెంట్‌ అకౌంట్‌ అండ్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ (కాసా) డిపాజిట్లు చాలా చౌక రేట్లకే లభిస్తుంటాయి. ఇతర ఆర్థిక సాధనాల్లో ఇంతకుమించి మెరుగైన రాబడులతో కాసా డిపాజిట్లు క్రమంగా తగ్గిపోతుండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో బ్యాంక్‌లు సర్టిఫికెట్స్‌ ఆఫ్‌ డిపాజిట్‌ (సీడీ)ల జారీ ద్వారా నిధులను సమకూర్చుకుంటున్నాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో అధిక వృద్ధి.. ప్రైవేటు బ్యాంకుల్లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ డిపాజిట్లలో మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. డిపాజిట్లు 17.2 శాతం పెరిగి రూ.2.84 లక్షల కోట్లకు చేరాయి. ఆ తర్వాత కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ డిపాజిట్లు 14.7 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డిపాజిట్లు 14.4 శాతం చొప్పున పెరిగాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అత్యధికంగా 14.33 శాతం వృద్ధిని నమోదు చేయగా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 14 శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ ఇండియా 13.37 శాతం చొప్పున డిపాజిట్లను పెంచుకున్నాయి. మార్చి త్రైమాసికం ముగిసిన తర్వాత కొన్ని బ్యాంక్‌లు విడుదల చేసిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఈ వ్యత్యాసం కనిపించింది. దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ ఎస్‌బీఐ ఇంకా ఈ వివరాలు విడుదల చేయలేదు. రుణాల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల పైచేయి మార్చి త్రైమాసికంలో రుణాల పరంగా ప్రభుత్వరంగ బ్యాంకులు మెరుగైన పనితీరు చూపించాయి. రుణాల్లో 12–22 శాతం వరకు వృద్ధిని సాధించాయి. అదే ప్రైవేటు రంగ బ్యాంకుల్లో రుణ వృద్ధి 12–20 శాతంగానే ఉంది. అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర రుణాల్లో 22 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో సంస్థ లోన్‌బుక్‌ రూ.2.92 లక్షల కోట్లకు చేరింది. యూకో బ్యాంక్‌ లోన్‌బుక్‌ 20 శాతం పెరిగి రూ.2.34 లక్షల కోట్లకు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లోన్‌బుక్‌ సైతం 18.90 శాతం పెరిగి రూ.3.45 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. ఇక మార్చి త్రైమాసికంలో ప్రైవేటు బ్యాంకుల నిర్వహణ లాభం (కేటాయింపులకు ముందు) 9.1 శాతం, నికర లాభం 11.9 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా.

Mahindra and Swaraj hike tractor prices amid rising input costs5
మహీంద్రా ట్రాక్టర్ల రేట్ల పెంపు

ముంబై: ముడివస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా వివిధ ట్రాక్టర్ల రేట్లను పెంచుతున్నట్లు మహీంద్రా ట్రాక్టర్స్‌ వెల్లడించింది. ప్రాంతాలు, మోడల్స్‌వారీగా పెంపు ఉంటుందని, ఏప్రిల్‌ 8 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది.మరోవైపు, మహీంద్రా గ్రూప్‌లోనే భాగమైన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 21 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని వివరించింది.

25 firms join pre-bid meet for Rs 7, 280 crore rare earth magnet scheme6
రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్ల తయారీకి కంపెనీల క్యూ

న్యూఢిల్లీ: రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్ల తయారీ పట్ల పదుల సంఖ్యలో కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, ఎన్‌ఎల్‌సీ ఇండియా, వేదాంత, హిందుస్థాన్‌ జింక్‌ సహా 25 కంపెనీలు ప్రభుత్వం నిర్వహించిన బిడ్‌ ముందస్తు సమావేశంలో (ప్రీ బిడ్‌) పాల్గొన్నాయి. మంగళవారం (7న) ఈ సమావేశం జరిగింది. దేశీయంగా సింటర్డ్‌ రేర్‌ ఎర్త్‌ పర్మనెంట్‌ మ్యాగ్నెట్ల తయారీని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో రూ.7,280 కోట్ల ప్రోత్సాహకాలతో భారీ పరిశ్రమల శాఖ ఒక పథకాన్ని తీసుకురావడం గమనార్హం.6,000 మెట్రిక్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి (ఎంటీపీఏ) సామర్థ్యంతో తయారీ కేంద్రాల ఏర్పాటుకు బిడ్లను ఆహ్వనిస్తూ మార్చి 20న ప్రకటన జారీ చేసింది. గరిష్టంగా ఐదు సంస్థలను బిడ్డింగ్‌ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ప్రతీ సంస్థ 1,200 ఎంటీపీఏ సామర్థ్యంతో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అన్నీ కలిసి ఉత్పత్తి సామర్థ్యం 6,000ఎంటీపీఏగా ఉంటుంది. బిడ్డింగ్‌ తేదీ మే 28 కాగా, సాంకేతిక బిడ్లను మే 29న తెరవనున్నారు.‘‘ఆశావహ బిడ్డర్లకు స్కీమ్‌ వివరాలు, ముఖ్యమైన నిబంధనలు, బిబ్డింగ్‌ ప్రక్రియల గురించి వివరణాత్మక ప్రదర్శన ఇచ్చాం. బిడ్డర్లు లేవనెత్తిన సందేహాలను పరిష్కరించాం. ఈ నెల 22 వరకు తమ సందేహాలను ఈ–మెయిల్‌ ద్వారా తెలియజేయొచ్చని సూచించాం’’అని భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. బిడ్డింగ్‌ ప్రక్రియ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, రెన్యువబుల్‌ ఎనర్జీ, ఎల్రక్టానిక్స్, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్ల అవసరం ఎంతో ఉంటుంది.

Advertisement
Advertisement
Advertisement