Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Adani Overtakes Bill Gates as Net Worth Crosses 100 Billion Dollars1
బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టిన అదానీ

అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా స్టాక్ మార్కెట్‌లో అస్థిరత ఉన్నప్పటికీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంపద మాత్రం గణనీయంగా పెరిగింది. గురువారం ఆయన నికర సంపద పెరగడంతో.. 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో తిరిగి ప్రవేశించడమే కాకుండా, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కూడా అధిగమించారు.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ నికర సంపద ఒక్క రోజులోనే 7.16 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ పెరుగుదలతో, ఆయన మొత్తం సంపద 106 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 17వ స్థానానికి ఎగబాకారు. అంటే 2026లో, గౌతమ్ అదానీ నికర సంపద 21.4 బిలియన్ డాలర్లు పెరిగింది.నికర సంపద పెరగడంతో అదానీ బిల్‌గేట్స్ (104 బిలియన్ డాలర్స్)ను అధిగమించారు. కాగా.. 90.2 బిలియన్ డాలర్ల నికర సంపదతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఈ జాబితాలో 20వ స్థానంలో ఉన్నారు.

Vodafone Idea CEO Says Ongoing Minor Tariff Corrections2
యూజర్లకు షాక్.. వొడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం!

భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ను సుమారు 4-5 శాతం పెంచినట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో అడుగులు వేస్తూ.. యూజర్లకు షాకిచ్చింది. మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించింది.వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ.. అన్ని ప్లాన్‌లకూ ఒకేసారి ధరలను పెంచే ప్రణాళిక ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసింది. అయితే ఎంత పెంచనుంది?, యూజర్లు రీఛార్జ్ చేసుకోవడానికి అదనంగా ఎంత వెచ్చించాల్సి ఉంటుందనే విషయాలను సంస్థ వెల్లడించలేదు.ప్రస్తుతం చిన్నపాటి సవరణలు మాత్రమే ఉంటాయి. భారీ పెంపు ఉండదు. మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ మార్పులు చేస్తున్నట్లు వొడాఫోన్ ఐడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిజిత్ కిషోర్ పేర్కొన్నారు. ఒక ముఖ్యమైన వాటాదారుగా ప్రభుత్వం కంపెనీపై విశ్వాసం ఉంచిందని, కంపెనీ పనితీరును మెరుగుపరచడంపై దృష్టి సారిస్తోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.ఇదీ చదవండి: దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా!

Top 5 Automatic Cars Under Rs 10 Lakh In India3
రూ.10 లక్షలుంటే.. ఓ కారు మీ సొంతం!

ఇండియన్ మార్కెట్లో ఆటోమాటిక్ కార్లకు ఇప్పుడు కూడా మంచి డిమాండ్ ఉంది. అయితే వీటికోసం ఎక్కువ డబ్బు కేటాయించాలేమో అనుకుంటే పొరపాటే? ఎందుకంటే దేశీయ విఫణిలో రూ.10 లక్షల (ఎక్స్ షోరూమ్) కంటే తక్కువ ధరకు లభించే కార్లు ఉన్నాయి. ఈ కథనంలో ఆ కార్ల గురించి తెలుసుకుందాం.కియా సోనెట్రూ. 10 లక్షల లోపు సెగ్మెంట్‌లోని అత్యంత ప్రీమియం కాంపాక్ట్ SUVలలో ఒకటి కియా సోనెట్. దీని ప్రారంభ ధర రూ.9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఆకట్టుకునే డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందింది. ఇందులోని 83 పీఎస్ పవర్, 115 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 120 పీఎస్ పవర్, 172 ఎన్ఎమ్ టార్క్ అందించే 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 116 పీఎస్ పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజిన్స్ అన్నీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్స్ పొందుతాయి.ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. ఇది 385-లీటర్ల బూట్ స్పేస్‌ను కూడా అందిస్తుంది.స్కోడా కైలాక్స్కోడా కైలాక్ ప్రారంభం: రూ. 9.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది మంచి పనితీరును అందించడంతో.. దీనిని ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇది 1-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 115 PS పవర్ 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సెగ్మెంట్‌లో స్కోడా పూర్తిగా పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌లపై దృష్టి సారించినందున, డీజిల్ ఇంజన్ అందుబాటులో లేదు. ఇందులోని 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ గొప్ప డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.టాటా పంచ్టాటా పంచ్ ప్రారంభం: రూ. 7.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఇటీవల ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 5 స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 88 PS, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పంచ్‌లో డీజిల్ ఇంజన్ అందుబాటులో లేదు.మారుతి సుజుకి డిజైర్రూ. 7.62 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే మారుతి సుజుకి డిజైర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 90 PS పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో వైర్‌లెస్ కనెక్టివిటీతో కూడిన 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, చుట్టూ LED లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ ఎయిర్-కాన్, క్రూయిజ్ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.రెనాల్ట్ ట్రైబర్రెనాల్ట్ ట్రైబర్ ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 8.38 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 72 PS, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపిక లభిస్తుంది. ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ క్లస్టర్, కీలెస్‌ ఎంట్రీ, 625 లీటర్ల బూట్ స్పేస్ మొదలైనవి ఉన్నాయి.

Mumbai Leela Bungalow in Juhu Sells for Rs 221 Crore4
దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా!

ముంబైలోని జుహు తారా రోడ్డులో.. సముద్రానికి ఎదురుగా ఉన్న లీలా బంగ్లా రూ. 221 కోట్లకు అమ్ముడైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ బంగ్లా ఆర్ట్ డెకో నిర్మాణం, గ్రేడ్ IIB వారసత్వ హోదాను కలిగి ఉంది. దీనిని అమ్మకానికి పెట్టిన తరువాత చాలామంది డెవలపర్లు, వ్యాపారవేత్తలను ఆకట్టుకుంది.నానావతి మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో సంబంధం ఉన్న కుటుంబానికి చెందిన గౌతమ్ నానావతికి చెందిన లీలా బంగ్లాను నోటండాస్ జ్యువెలర్స్ గ్రూప్‌లో భాగమైన నోటండాస్ రియల్టీ రూ.221 కోట్లకు కొనుగోలు చేసింది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత బుధవారం ఈ లావాదేవీ అధికారికంగా ఖరారైందని సమాచారం.నోటండాస్ రియల్టీ సంస్థకు చెందిన మహేష్ జగ్వాని, హర్ష్ జగ్వాని అనే తండ్రి-కొడుకు ఈ డీల్‌ను పూర్తి చేశారు. వీరు నోటండాస్ జ్యువెలర్స్ కూడా నిర్వహిస్తున్నారు. దీనిని 1983లో కిషిన్ జగ్వానీ స్థాపించారు. ఇది బాంద్రాలోని వాటర్‌ఫీల్డ్ రోడ్ నుంచి తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.చదరపు అడుగుకు రూ. 2,60,5921,355 చదరపు మీటర్ల స్థలంలో ఉన్న లీలా బంగ్లా నిర్మాణ విస్తీర్ణం సుమారు 8,480 చదరపు అడుగులు. అదనంగా 2,500 చదరపు అడుగుల టెర్రస్.. 5,000 చదరపు అడుగుల తోట కూడా ఉన్నాయి. చదరపు అడుగుకు రూ. 2,60,592 ధర చెల్లించినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఈ బంగ్లాలో 1950ల కాలానికి చెందిన బర్మా టేకు చెక్కతో తయారైన తలుపుల ఫ్రేములు, మెట్ల నిర్మాణం, అలంకరణలు ఉన్నాయి. ఈ భవనం ఆర్ట్ డెకో శైలిని ప్రతిబింబిస్తూ పురాతన సౌందర్యాన్ని కాపాడుకుంటోంది. సముద్రం వైపు ఉండే ఇలాంటి పెద్ద స్థలాలు జూహు ప్రాంతంలో చాలా అరుదుగా లభిస్తాయి. అందుకే ఈ ఆస్తికి వ్యాపారవేత్తలు, డెవలపర్లు ఎంతో ఆసక్తి చూపారు.కేవలం మరమ్మతులు మాత్రమే..అయితే.. గ్రేడ్ IIB హెరిటేజ్ హోదా ఉండటం వల్ల ఈ భవనాన్ని పూర్తిగా కూల్చి కొత్తగా నిర్మించలేరు. కేవలం మరమ్మతులు, విస్తరణలు మాత్రమే చేయవచ్చు. అవి కూడా అసలు నిర్మాణ శైలిని కాపాడే విధంగా ఉండాలి. ఈ పరిమితులు ఉన్నప్పటికీ, ఈ ఆస్తి ప్రాముఖ్యత తగ్గలేదు.ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా ఈ లావాదేవీని నిర్వహించిందని నివేదిక పేర్కొంది, అయితే ఈ విషయంపై సంప్రదించినప్పుడు ఆ సంస్థ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ఈ బంగ్లాను మొదట 2022లో రూ. 210-220 కోట్ల అంచనా ధరతో మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో ధరను రూ. 250 కోట్లకు పెంచారు. చివరికి రూ.221 కోట్లకు అమ్ముడైంది.ఇదీ చదవండి: అంబానీ ఇంట్లో చెఫ్.. రోజుకు 4000 రోటీలు!

Gold Prices Slide: Key Factors Behind the Recent Slump in India5
ఇందుకేనా బంగారం ధరలు తగ్గుతున్నది..?

గత వారం రోజులుగా పసిడి ప్రియులకు ఊరటనిస్తూ బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు దేశీయ మార్కెట్లో మారుతున్న సమీకరణాలు పసిడి ధరను కిందకు దింపుతున్నాయి. గత వారం రోజులుగా దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర గణనీయంగా తగ్గుతూ వస్తోంది. అక్షయ తృతీయ వంటి పర్వదినాల వేళ కూడా డిమాండ్ ఊహించిన స్థాయిలో లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావడం వంటి అంశాలు పసిడి వెలుగులను తగ్గించాయి.దేశంలో ముఖ్యంగా హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 24 మధ్య కాలంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్ 19వ తేదీన 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ. 1,42,800 గా ఉండగా, ఏప్రిల్ 24 నాటికి అది రూ. 1,40,200 కి చేరి, మొత్తం రూ. 2,600 మేర తగ్గింది. అదేవిధంగా, 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే, ఏప్రిల్ 19న రూ. 1,55,780 గా ఉన్న ధర, ఏప్రిల్ 24 నాటికి రూ. 1,52,950కి పడిపోయింది, అంటే తులంపై సుమారు రూ. 2,830 మేర ధర తగ్గింది. గత ఐదు రోజులుగా వరుసగా ధరలు క్షీణించడంతో కొనుగోలుదారులకు భారీ ఉపశమనం లభించింది.ధరలు తగ్గడానికి దారితీసిన 4 కీలక అంశాలుబలపడుతున్న అమెరికన్ డాలర్అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ పెరగడం బంగారం ధరపై నేరుగా ప్రభావం చూపుతోంది. డాలర్ ఇండెక్స్ బలపడినప్పుడల్లా పెట్టుబడిదారులు పసిడి కంటే డాలర్ వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వస్తున్నాయి.ముడిచమురు సెగ.. వడ్డీ రేట్ల భయంప్రస్తుతం అంతర్జాతీయంగా (ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద) నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటాయి. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీన్ని అరికట్టడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇప్పుడప్పుడే తగ్గించకపోవచ్చనే సంకేతాలు వెలువడటంతో, బంగారంపై పెట్టుబడులు తగ్గాయి.లాభాల స్వీకరణఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలకు (తులం దాదాపు రూ.1,50,000 పైచిలుకు) చేరాయి. ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు పెద్ద ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మి లాభాలను గడించడం (Profit Booking) మొదలుపెట్టారు. మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరగడం కూడా ధరల తగ్గుదలకు ఒక కారణం.దేశీయ మార్కెట్లో తగ్గిన డిమాండ్భారత్‌లో బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పటికీ, పాత బంగారాన్ని ఇచ్చి కొత్తది తీసుకోవడం లేదా తక్కువ పరిమాణంలో కొనుగోలు చేయడం వల్ల రిటైల్ మార్కెట్లో సందడి తగ్గింది.ప్రస్తుతం మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఒక కొలిక్కి వచ్చి, డాలర్ విలువ స్థిరపడితే తప్ప ధరల్లో స్పష్టత రాదు. అయితే, ధరలు తగ్గుతున్న ఈ సమయం దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి అవకాశమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముందుముందు ధరలు మరింత తగ్గుతాయా లేదా మళ్లీ పుంజుకుంటాయా అన్నది అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పసిడి ప్రేమికులు మాత్రం ఈ ధరల తగ్గింపును ఆస్వాదిస్తూ కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.

Union Bank of India Reports 10pc Jump in Q4 Net Profit Dividend of Rs5 Declared6
పెరిగిన యూనియన్‌ బ్యాంక్‌ లాభం.. రూ.5 డివిడెండ్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 10 శాతం ఎగసి రూ. 5,504 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు తగ్గడానికితోడు ఆస్తుల(రుణాలు) నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించింది. స్టాండెలోన్‌ నికర లాభం సైతం 7 శాతం పుంజుకుని రూ. 5,316 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు బ్యాంక్‌ వెల్లడించింది. ట్రెజరీ వీక్‌ తాజా క్యూ4లో యూనియన్‌ బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 1 శాతం క్షీణించి రూ. 9,406 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ మార్జిన్లు 2.87 శాతం నుంచి 2.64 శాతానికి నీరసించడం ప్రభావం చూపింది. ట్రెజరీ ఆదాయం మందగించడంతో 3 శాతం తక్కువగా రూ. 5,412 కోట్ల వడ్డీయేతర ఆదాయం అందుకుంది. ఈ కాలంలో రుణ నాణ్యత మెరుగుపడటంతో స్లిప్పేజీలు, రుణ వ్యయాలు తగ్గినట్లు బ్యాంక్‌ వెల్లడించింది.దీంతో ప్రొవిజన్లు 3 శాతం తగ్గి రూ. 2,640 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో ఇవి రూ. 2,715 కోట్లుగా నమోదయ్యాయి. అంతేకాకుండా స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.6 శాతం నుంచి 2.82 శాతానికి దిగివచ్చాయి. తాజా స్లిప్పేజీలు రూ. 2,483 కోట్ల నుంచి రూ. 2,023 కోట్లకు వెనకడుగు వేశాయి. ప్రధానంగా ఎంఎస్‌ఎంఈల నుంచి రూ. 895 కోట్లు నమోదయ్యాయి.

Advertisement
Advertisement
Advertisement