Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Main risk of AI is erosion of human judgment: RBI Governor1
తప్పుల్ని టెక్నాలజీకి ఆపాదించొద్దు

ముంబై: బ్యాంకింగ్‌ కార్యకలాపాల కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) మోడళ్లను రూపొందించేటప్పుడు, నిర్ణయాలపై అర్థవంతమైన మానవ పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలని బ్యాంకర్లకు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సూచించారు. తప్పుడు నిర్ణయాలకు టెక్నాలజీ టూల్స్‌ను నిందించడం ఆర్‌బీఐకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ జరిగిన వార్షిక ‘ఫిబాక్‌’ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కస్టమర్లకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు మానవ విచక్షణను ఏఐతో భర్తీ చేస్తే సరిపోదని, నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడే విధంగా ఏఐని సరైన రీతిలో వినియోగించుకోవాలని బ్యాంకులను కోరారు.ఏఐని అదుపులో పెట్టాల్సిన ఒక రిసు్కలా కాకుండా, బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సిన సామర్థ్యంగానే ఆర్‌బీఐ పరిగణిస్తోందని మల్హోత్రా చెప్పారు. కాబట్టి బ్యాంకులు ప్రేక్షక పాత్రకు పరిమితం కాకుండా, ఈ టూల్స్‌ను అందిపుచ్చుకోవాలని సూచించారు. ‘ఒక బ్యాంకు తీసుకునే నిర్ణయానికి అంతిమ బాధ్యత దానిదే కావాలి తప్ప విక్రేతదో లేదంటే ఆల్గారిథమ్‌దో కాకూడదు. ఏఐ మోడల్‌ నిర్ణయం తీసుకుందని మనం చెప్పలేం. వినియోగదారుడికైనా, అదేవిధంగా బ్యాంకుకైనా అది ఎప్పటికీ ఆమోదయోగ్యమైన సమాధానం కాదు’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొన్నారు. కస్టమర్‌ సర్వీసులతో సహా వివిధ బ్యాంకింగ్‌ కార్యకలాపాల కోసం ఈ మధ్య పలు భారతీయ బ్యాంకులు ఏఐ టూల్స్‌ను భారీగా వాడుకోవడం, ఏఐ వల్ల కొంత కాలానికి వివిధ రంగాల్లో ఉద్యోగ కోతలు తప్పవన్న ఆందోళనల నేపథ్యంలో మల్హోత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ రిసు్కలు పొంచి ఉన్నాయ్‌... సైబర్‌ సెక్యూరిటీ రిసు్కలతో సహా ఏఐ వల్ల బ్యాంకింగ్‌ రంగానికి తలెత్తే ముప్పుల పట్ల బ్యాంకులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పారు. ఇటీవల ఒక ఏఐ మోడల్‌ స్వయంగా సిస్టమ్‌పై దాడి చేసిన సంఘటనను ఆయన ఉదహరించారు. ఏఐ మోడళ్లు పక్షపాత ధోరణితో వ్యవహరించే రిస్కులు కూడా ఉంటాయన్నారు. ముఖ్యంగా నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలు, హోదాలు, అదేవిధంగా కొన్ని వర్గాల పట్ల ఇష్టం, అయిష్టం చూపించే ధోరణులు ఉండొచ్చని ఆయన హెచ్చరించారు. డేటా గోప్యత అనేది కేవలం చట్టపరమైన నిబంధనలను పాటించడానికే పరిమితం కాకుండా చూసుకోవాలన్నారు. బ్యాంకుల్లో వాస్తవంగా ఎలాంటి ఏఐ మోడళ్లు పనిచేస్తున్నాయనేది ఆర్‌బీఐకి తెలియాలని, కాబట్టి ఆయా మోడల్స్‌కు సంబంధించిన పూర్తి జాబితాను నిర్వహించాలని కూడా బ్యాంకులకు మల్హోత్రా సూచించారు.

PM E-DRIVE scheme to run till Mar 31 2028: electric two wheeler incentive capped at Rs 50002
ఈ–టూవీలర్లకు ‘పీఎం’ స్కీము పొడిగింపు

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ’పీఎం ఈ–డ్రైవ్‌’ స్కీము గడువును 2028 మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది. అయితే, దీనిపై ఇచ్చే సబ్సిడీని రూ. 5,000 నుంచి (కిలోవాట్‌హవర్‌కి – కేడబ్ల్యూహెచ్‌) సగానికి రూ. 2,500కి తగ్గించింది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం 2025 ఏప్రిల్‌ 1 నుంచి 2028 మార్చి 31 వరకు రిజిస్టర్‌ అయ్యే ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు ప్రతి కేడబ్ల్యూహెచ్‌ సామర్థ్యానికి రూ. 2,500 మేర సబ్సిడీ పొందవచ్చు. ఒక్కో వాహనంపై సబ్సిడీ గరిష్టంగా రూ. 5,000 ఉంటుంది.గతంలో, అంటే, 2024–25 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ ప్రతి కేడబ్ల్యూహెచ్‌కి రూ. 5,000గాను, గరిష్ట పరిమితి రూ. 10,000గాను ఉంది. తాజా ప్రోత్సాహకాన్ని పొందాలంటే ఈ–టూవీలర్‌ ఎక్స్‌–ఫ్యాక్టరీ రేటు గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలుగా ఉంటుంది. ఈ స్కీము తాజా విడత కోసం కేంద్రం రూ. 2,767 కోట్లు కేటాయించింది. 2024 ఏప్రిల్‌ 1 నుంచి 2028 మార్చి 31 వరకు అమలయ్యే పీఎం ఈ–డ్రైవ్‌ పథకానికి మొత్తం రూ. 11,900 కోట్లు వెచ్చిస్తోంది.

Gold prices surge by Rs 1200 at Rs 157200 per 10 grams3
పసిడి తగ్గేదేలే..

న్యూఢిల్లీ: ఆయిల్‌ రేట్లు అంతర్జాతీయంగా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నప్పటికీ బులియన్‌పై పెట్టుబడులకు సంబంధించి ట్రేడర్ల నుంచి గణనీయంగా డిమాండ్‌ నెలకొనడంతో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. వరుసగా ఆరో సెషన్‌లోనూ ర్యాలీ కొనసాగించి, మంగళవారం ఏకంగా రెండు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ. 1,57,200కి చేరింది. గత 6 ట్రేడింగ్‌ సెషన్లలో బంగారం రేటు రూ. 9,800 (సుమారు 6.65%) పెరిగింది. మరోవైపు, వెండి కూడా అదే ధోరణిలో కేజీకి ఇంకో రూ. 2,000 పెరిగి రూ. 2,42,000కి చేరింది. ఇది కూడా దాదాపు 2 నెలల గరిష్ట స్థాయి.

Audi Next Three Years Plan4
ఆడి కొత్త ప్లాన్.. వచ్చే మూడేళ్లలో..

వచ్చే మూడేళ్లలో తమ మార్కెట్‌ వాటాను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు వాహనాల దిగ్గజం ఆడి ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ తెలిపారు. ప్రస్తుతం సంస్థకు 8 శాతం మార్కెట్‌ వాటా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, రాబోయే పండుగల సీజన్‌లో సరికొత్త ఆడి క్యూ3తో మొదలుపెట్టి 2027 నాటికి మొత్తం మూడు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.2027లో నెక్ట్స్‌ జనరేషన్‌ ఆడి ఏ5, ఫ్లాగ్‌షిప్‌ ఆడి క్యూ9ని అందుబాటులోకి తేనున్నట్లు ధిల్లాన్‌ పేర్కొన్నారు. ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లపై ప్రధానంగా దృష్టి పెడుతూ వచ్చే ఏడాది ఆఖరు నాటికి రిటైల్‌ నెట్‌వర్క్‌ని 25 శాతం పైగా విస్తరించనున్నట్లు వివరించారు. షోరూమ్‌ల సంఖ్యను 40కి పెంచుకోనున్నట్లు వివరించారు. ప్రస్తుత డీలర్‌íÙప్‌లను తమ ప్రోగ్రెసివ్‌ షోరూమ్‌ కాన్సెప్టునకు కూడా అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు చెప్పారు.

IPO Market Gets a Boost SEBI Clears 9 Companies5
ఐపీఓ మార్కెట్‌లో జోష్.. 9 కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్!

గతేడాది(2025) డిసెంబర్‌.. ఈ ఏడాది(2026) ఏప్రిల్‌ మధ్య దరఖాస్తు చేసిన 9 కంపెనీల ప్రాస్పెక్టస్‌లను సెబీ తాజాగా అనుమతించింది. జాబితాలో రీడిఫ్‌.కామ్‌ ఇండియాసహా ప్లేసింపుల్‌ గేమ్స్, గరుడా ఏరోస్పేస్‌ తదితరాలున్నాయి. ఇప్పటికే వారాంతాన(7న) రెండు కంపెనీల(లీప్‌ ఇండియా, టెక్నోక్రాఫ్ట్‌ వెంచర్స్‌) పబ్లిక్‌ ఇష్యూలు ప్రారంభంకాగా.. స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ ఎన్‌క్యూబ్‌ ఎథికల్స్‌ రూ. 3,000 కోట్ల సమీకరణకు వీలుగా సెబీకి దరఖాస్తు చేసింది. తాజాగా లిస్టింగ్‌కు అనుమతి పొందిన జాబితాలో జాక్సన్‌ గ్రీన్, అడ్రాయిట్‌ ఇండస్ట్రీస్, ఎక్స్‌ప్రెషన్‌ 360 సర్వీసెస్ ఇండియా, ఎస్‌ఎన్‌వీఏ ట్రావెల్‌టెక్, నైనీ పేపర్స్‌తోపాటు.. రైల్వే రంగ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఈపీసీ సర్వీసుల కంపెనీ లక్స్‌యో సైతం చేరింది.గోప్యతా విధానంలో జాక్సన్‌ గ్రీన్‌ లిమిటెడ్, రీడిఫ్‌.కామ్‌ ఇండియా, ఎస్‌ఎన్‌వీఏ ట్రావెల్‌టెక్, గరుడా ఏరోస్పేస్‌ గోప్యతా మార్గంలో సెబీకి దరఖాస్తు చేయడం ద్వారా అనుమతి పొందాయి. కాగా.. పూర్తి క్యాజువల్‌ మొబైల్‌ గేమ్స్‌ కంపెనీ ప్లేసింపుల్‌ గేమ్స్‌ ఐపీవో ద్వారా రూ. 3,150 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. కంపెనీలో 97 శాతం వాటా కలిగిన ప్రమోటర్‌ సంస్థ ఎంటీజీక్స్‌ గేమింగ్‌ హోల్డింగ్‌ ఏబీ ఈక్విటీ షేర్లను ఆఫర్‌ చేయనుంది. 2024–25లో కంపెనీ రూ. 2,260 కోట్ల ఆదాయం సాధించింది.ఇక గరుడా ఏరోస్పేస్‌ ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. డ్రోన్ల తయారీ ఈ చెన్నై స్టార్టప్‌ వ్యవసాయం, రక్షణ రంగాలతోపాటు ఎంటర్‌ప్రైజ్‌ సరీ్వలెన్స్‌ సంబంధ యూఏవీలను రూపొందిస్తోంది.ఇన్ఫీబీమ్‌ నుంచి..ఎవెన్యూస్‌ఏఐ లిమిటెడ్‌(గతంలో ఇన్ఫీబీమ్‌ ఎవెన్యూస్‌) అనుబంధ కంపెనీ రీడిఫ్‌.కామ్‌ ఇండియా సీసీఎవెన్యూ పేరుతో డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఎంటర్‌ప్రైజ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫామ్‌ బిల్డ్‌ఏబజార్‌ను సైతం ఏర్పాటు చేసింది. ఇంజినీరింగ్, తయారీ రంగ కంపెనీ అడ్రాయిట్‌ ఇండస్ట్రీస్‌ ఐపీవోలో భాగంగా 98.97 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 13.5 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మెషీనరీ, పరికరాలు, రవాణా మౌలిక సదుపాయాలు తదితరాల కొనుగోలు(పెట్టుబడి వ్యయాలు)కు వెచ్చించనుంది. అనుబంధ సంస్థ అడ్రాయిట్‌ డ్రైవ్‌షాఫ్టŠస్‌లో పెట్టుబడి, రుణ చెల్లింపులకు సైతం నిధులు వినియోగించనుంది. ప్రధానంగా ఆటోమోటివ్, ఇండ్రస్టియల్‌ రంగ పరికరాలు తయారు చేస్తోంది.టెక్నాలజీ, పేపర్‌..కోల్‌కతా మీడియా, ప్రకటనల కంపెనీ ఎక్స్‌ప్రెషన్‌ 360 సర్వీసెస్ ఇండియా పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా 1.5 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్‌ ఆఫర్‌ చేయనున్నారు. దీంతో ఇష్యూ నిధులు కంపెనీకికాకుండా ప్రమోటర్‌కు చేరనున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ కంపెనీ లక్స్‌యో ఐపీవోకింద రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. టెక్నాలజీ ఆధారిత ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రావోమింట్‌ను నిర్వహిస్తున్న ఎస్‌ఎన్‌వీఏ ట్రావెల్‌టెక్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది.కంపెనీ ప్రధానంగా వెబ్‌సైట్, మొబైల్‌ అప్లికేషన్ల ద్వారా విమానాలు, హోటళ్లు, అద్దె కార్లు, ప్రయాణ బీమా తదితర ట్రావెల్‌ బుకింగ్‌ సర్వీసులు సమకూర్చుతోంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌కు సమీకృత పేపర్‌ తయారీ కంపెనీ నైనీ పేపర్స్‌కు సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. కంపెనీ రైటింగ్, ప్రింటింగ్, ఇండ్రస్టియల్, ప్యాకేజింగ్‌ సంబంధ పేపర్‌ను తయారు చేస్తోంది. ఉత్తరాఖండ్‌లోని కాశిపూర్‌లో తయారీ ప్లాంటును కలిగి ఉంది. సెబీ నుంచి తాజాగా అనుమతి పొందిన కంపెనీలన్నీ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానున్నాయి.

Government Approves Introduction of One Billion Polymer Banknotes of Rs 10 and Rs 206
కరెన్సీ నోట్లలో కీలక మార్పు!

కరెన్సీ నోట్ల విషయంలో కేంద్రం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పేపర్ నోట్లకు బదులుగా పాలిమర్‌(ప్లాస్టిక్)తో తయారు చేసిన నోట్లను ప్రయోగాత్మకంగా తీసుకురావడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది.ముందు రూ.10, రూ.20 నోట్లపై ఈ ప్రయోగం చేయనున్నారు. ఒక్కో డినామినేషన్‌కు 100 కోట్ల నోట్లను తయారు చేసి, ప్రజల మధ్య చలామణిలోకి తీసుకువచ్చి ఎలా పనిచేస్తాయో పరిశీలించనున్నారు. ఇది విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని పాలిమర్ కరెన్సీ నోట్లు వచ్చే అవకాశం ఉంటుంది.కొత్త పాలిమర్ నోట్లు వస్తున్నాయని.. పాత పేపర్ నోట్లు వెంటనే రద్దు అవుతాయని ప్రజలు భయపడాల్సిన అవకాశం లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం ఉన్న పేపర్ నోట్లతో పాటు కొత్త పాలిమర్ నోట్లు కూడా చలామణిలో ఉంటాయి. ముందుగా ఈ నోట్లు రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతున్నాయి, ఎంతకాలం మనగలుగుతున్నాయి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి వంటి విషయాలను రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తుంది.ట్రయల్స్ సక్సెస్ అయితే.. తర్వాత వీటిని రెగ్యులర్‌గా చలామణిలోకి తీసుకురావాలని ఆర్‌బీఐ ఆలోచిస్తోంది. పాలిమర్ నోట్లు.. కాగితం నోట్ల కంటే కొంత భిన్నంగా ఉంటాయి. ఇవి పలుచని ప్లాస్టిక్ లాంటి పదార్థంతో తయారవుతాయి. అందువల్ల నీటికి, తేమకు, దుమ్ముకు తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.పేపర్ నోట్లతో పోలిస్తే ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. నకిలీ నోట్లను తయారు చేయడం కూడా కొంత కష్టంగా ఉండేలా భద్రతా ఫీచర్లు ఏర్పాటు చేయవచ్చు. ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల్లో ఇప్పటికే కొన్ని పాలిమర్ నోట్లు వాడుతున్నారు. భారత్‌లో కూడా గతంలో పరిమిత స్థాయిలో వీటిని పరీక్షించారు.కొత్త నోట్లు ఎప్పటి నుంచి మన చేతుల్లోకి వస్తాయనేది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. పాలిమర్ నోట్ల తయారీకి సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదటి దశలోనే ఉందని ప్రభుత్వం తెలిపింది. నోట్ల తయారీకి అవసరమైన మెటీరియల్, ప్రింటింగ్ ఏర్పాట్లు, ట్రయల్స్ ఎక్కడ నిర్వహించాలి వంటి విషయాలపై ఇంకా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.ఇదీ చదవండి: హైదరాబాద్​లో ట్రంప్ టవర్స్!

Advertisement
Advertisement
Advertisement