ప్రధాన వార్తలు
పెట్రోలే కాదు.. తాగే నీటిపైనా యుద్ధం ఎఫెక్ట్!
రష్యా-ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కేవలం ఇంధన ధరలనే కాదు, సామాన్యుడు తాగే నీటిని కూడా ఖరీదైనవిగా మారుస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి గుండా రవాణాకు అంతరాయం కలగడంతో ముడి చమురు ధరలు బ్యారెల్కు 119 డాలర్లకు చేరడం భారత్లో బాటిల్ వాటర్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది.ప్యాకేజింగ్ భారంనీటి ధర పెరగడానికి కారణం నీరు కాదు, ఆ నీటిని నింపే ప్లాస్టిక్ బాటిల్. ప్లాస్టిక్ తయారీకి వాడే PET (పాలిథిలిన్ టెరెఫ్తాలేట్) రెసిన్ గుళికలు ముడి చమురు నుండి తయారవుతాయి. చమురు ధరలు పెరగడంతో, ఈ ముడిపదార్థాల ధరలు గత పక్షం రోజుల్లోనే భారీగా పెరిగాయి.ధరల పెంపుమార్కెట్ లీడర్ బిస్లేరి ఇప్పటికే వాటర్ బాటిళ్ల ధరలను 11 శాతం పెంచింది. 12 లీటర్ బాటిళ్ల బాక్స్ ధర ఏకంగా రూ. 24 పెరిగింది. ప్యాకేజింగ్ ఖర్చులు 70 శాతం పెరగడంతో లీటర్ బాటిల్ ధర రూ. 20కి చేరుకుందని బిస్లేరి సీఈఓ ఏంజెలో జార్జ్ తెలిపారు. PET ప్రిఫార్మ్స్ ధర కిలోకు రూ. 115 నుండి రూ. 180కి పెరగడమే కాకుండా, సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడిందని మహారాష్ట్ర బాటిల్డ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది.పరిశ్రమలపై 'చైన్ రియాక్షన్'కెమ్కో ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ వైభవ్ సరోగి అభిప్రాయం ప్రకారం, ఈ ప్యాకేజింగ్ సెగ కేవలం తాగునీటికే పరిమితం కాదు. PET ప్యాకేజింగ్ను ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్ డ్రింక్స్, ఫుడ్ డెలివరీ, ఫార్మాస్యూటికల్స్, కాస్మెటిక్స్ రంగాలు కూడా ప్రభావితం కానున్నాయి.సామాన్యుడిపై నీటి భారంభారతదేశంలో స్వచ్ఛమైన నీటి లభ్యత ఇప్పటికే సవాలుగా మారింది. దేశంలో దాదాపు 70 శాతం భూగర్భ జలాలు కలుషితమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణాల్లో 15 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 6 శాతం గృహాలు తమ ప్రాథమిక దాహం తీర్చుకోవడానికి బాటిల్ వాటర్ పైనే ఆధారపడుతున్నాయి.కర్మాగారాల మూసివేతపెరిగిన ఖర్చులను భరించలేక మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దాదాపు 20 శాతం తయారీ ప్లాంట్లు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేశాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో బాటిల్ వాటర్ ధరలు మరింత భారమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒరాకిల్ బాస్కు షాక్.. రూ.16 లక్షల కోట్లు లాస్!
టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లారీ ఎల్లిసన్ సంపద ఊహించని రీతిలో ఆవిరైపోయింది. గడిచిన ఆరు నెలల కాలంలోనే ఆయన నికర విలువ ఏకంగా 193 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16.10 లక్షల కోట్లు) మేర క్షీణించింది. ఒరాకిల్ షేర్లు మార్కెట్లో భారీగా పతనమవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.కుబేరుల జాబితాలో వెనక్కి..బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ 22, 2025 నాటికి ఎల్లిసన్ నికర విలువ 388 బిలియన్ డాలర్లుగా ఉండేది. అప్పట్లో ఆయన ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఏప్రిల్ 3, 2026 నాటికి అది 195 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల ర్యాంకింగ్స్లో ఆయన రెండో స్థానం నుండి ఆరో స్థానానికి పడిపోయారు.షేర్ల పతనమే కొంపముంచింది..ఒరాకిల్ సంస్థలో ఎల్లిసన్కు దాదాపు 41% వాటా ఉంది. కంపెనీ షేర్ల విలువ తగ్గితే ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ కూడా నేరుగా ప్రభావితమవుతుంది. సెప్టెంబర్ 2025లో 345.72 డాలర్ల వద్ద ఉన్న ఒరాకిల్ షేర్ ధర, ఏప్రిల్ 2, 2026 నాటికి 146.38 డాలర్లకి పడిపోయింది. అంటే దాదాపు 58% మేర పతనం నమోదైంది.భారీగా ఉద్యోగుల తొలగింపు ఒకవైపు సంపద క్షీణిస్తుండగా, మరోవైపు ఒరాకిల్ సంస్థ ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా భారీగా ఉద్యోగ కోతలకు పాల్పడింది. మార్చి 31న ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000 నుండి 30,000 మంది ఉద్యోగులను (మొత్తం సిబ్బందిలో 18%) తొలగించినట్లు సమాచారం.భారత్పై తీవ్ర ప్రభావంమీడియా నివేదికల ప్రకారం, ఈ తొలగింపుల ప్రభావం భారత్పై తీవ్రంగా ఉంది. దేశంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 12,000 మంది ఉద్యోగులను కంపెనీ సాగనంపినట్లు తెలుస్తోంది."ప్రస్తుత వ్యాపార అవసరాలు, సంస్థాగత మార్పులను దృష్టిలో ఉంచుకుని మీ పాత్రను తొలగించాలని నిర్ణయించాం," అంటూ తెల్లవారుజామునే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.వ్యాపార ఒత్తిళ్లు, మార్కెట్ అస్థిరత నేపథ్యంలో ఒరాకిల్ తీసుకున్న ఈ నిర్ణయాలు అటు ఇన్వెస్టర్లను, ఇటు ఐటీ నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక: తొలి ఆరు నెలల్లో..
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి (2026–27 ఏప్రిల్-సెప్టెంబర్) రూ.8 లక్షల కోట్ల రుణాలను మార్కెట్ నుంచి సమీకరించే ప్రణాళికతో ఉంది. ఆదాయం లోటును పూడ్చుకునేందుకు డేటెడ్ సెక్యూరిటీల జారీ ద్వారా ఈ మేరకు నిధులను సమకూర్చుకోనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.17.20 లక్షల కోట్లను మార్కెట్ నుంచి నిధుల రూపంలో సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది.బడ్జెట్ సమర్పణ అనంతరం, ప్రభుత్వ సెక్యూరిటీల (జీసెక్) మార్పిడి ప్రక్రియలు నిర్వహించడంతో స్థూల మార్కెట్ రుణాలు రూ. 16.09 లక్షల కోట్లకు తగ్గాయని తెలిపింది. ‘‘రూ.16.09 లక్షల కోట్లకు గాను రూ.8.20 లక్షల కోట్లను (మొత్తం లక్ష్యంలో 51%) మొదటి ఆరు నెలల్లో డేటెడ్ సెక్యూరిటీల ద్వారా సమీకరించనున్నాం.ఇందులో రూ.15,000 కోట్లు సావరీన్ గ్రీన్ బాండ్ల జారీ కూడా ఉంటుంది. 2026–27లో వాస్తవ ద్రవ్యలోటు రూ.16.9 లక్షల కోట్లుగా ఉంటుంది. ఈ లోటును భర్తీ చేసుకునేందుకు డేటెడ్ సెక్యూరిటీల జారీ ద్వారా మార్కెట్ నుంచి నికర రుణ సమీకరణ రూ.11.7 లక్షల కోట్లుగా ఉంటుంది. మిగిలిన మొత్తం చిన్న మొత్తాల పొదుపు నిధులు, ఇతర వనరుల రూపంలో సమకూర్చుకోనున్నాం’’ అని ఆర్థిక శాఖ తెలిపింది.
ఇక మేడిన్ ఇండియా సీసీ కెమెరాలదే రాజ్యం!
న్యూఢిల్లీ: దిగుమతి చేసుకున్న, సర్టిఫై చేయని యూనిట్లపై నిషేధంతో సీసీటీవీ కంపెనీలు ఏప్రిల్ 1 నుంచి దేశీయంగా తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించాయి. హిక్విజన్, టీపీ–లింక్లాంటి చైనీస్ సీసీటీవీ కంపెనీలపై దీనితో ప్రభావం పడిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.స్టాండర్డైజేషన్ టెస్టింగ్, క్వాలిటీ సర్టిఫికేషన్ (ఎస్టీక్యూసీ) నిబంధనల అమలుతో సర్వైలెన్స్ పరిశ్రమ స్వరూపం మారినట్లు సీపీ ప్లస్ బ్రాండ్ సీసీటీవీలను తయారు చేసే ఆదిత్య ఇన్ఫోటెక్ వెల్లడించింది. ఎస్టీక్యూసీ లేని సీసీటీవీ యూనిట్ల విక్రయాన్ని 2025 ఏప్రిల్ 9 నుంచి కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ నిషేధించింది. అయితే అప్పటికే దిగుమతి చేసుకున్న ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఈ ఏడాది మార్చి 31 వరకు వీలు కల్పించింది. దీనితో పలు సంస్థలు దేశీయంగా ఉత్పత్తిపై మరింత దృష్టి సారించాయి.
పెరిగిన మహీంద్రా కార్ల ధరలు
దేశీయ వాహన తయారీ దిగ్గజం.. మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్యూవీ, కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ వెల్లడించింది. ధరలు గరిష్టంగా 2.5 శాతం వరకు పెరగనుండగా, అన్ని వాహనాలపై సగటున 1.6 శాతం పెరుగుదల ఉంటుంది.పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులు, మొత్తం వ్యయాల మొదలైన కారణాల వల్లనే ధరల పెంపు జరిగిందని కార్ల తయారీ సంస్థ పేర్కొంది. దీంతో XUV 3ఎక్స్ఓ ఈవీ, ఎక్స్ఈవీ 9ఎస్, బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెరగనున్నాయి. కొత్త ధరలో త్వరలోనే వెల్లడవుతాయి. థార్, స్కార్పియో ఎన్, ఎక్స్యూవీ 7ఎక్స్ఓ వంటి జనాదరణ పొందిన మోడళ్ల ధరలు 2.5% వరకు పెరగనున్నాయి.మహీంద్రా XUV7XO ధరల సవరణ మొదటి 40,000 బుకింగ్ల డెలివరీ తర్వాత జరుగుతుంది. ధరల పెరుగుదల జరిగినప్పటికీ.. కారు ఫీచర్లు లేదా మెకానికల్ స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు ఉండవు.
బంగారం 'గిఫ్ట్' వచ్చిందా.. ఈ రూల్స్ తెలుసా?
ప్రస్తుతం పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ప్రతి ఇంటా బంగారంపైనే చర్చ జరుగుతోంది. 2026 మార్చిలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.69 లక్షల ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకి, ప్రస్తుతం స్వల్ప హెచ్చుతగ్గులతో రూ.1.50 లక్షల సమీపంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా బంగారం బహుమతులు ఇచ్చే వారు, తీసుకునే వారు తాజా పన్ను నిబంధనలు తెలుసుకోవడం చాలా అవసరం.బంగారం ధరలు భారీగా పెరగడంతో, బహుమతిగా ఇచ్చే నగలు లేదా కాయిన్ల విలువ కూడా పెరిగింది. దీనివల్ల పన్ను పరిమితులు త్వరగా దాటే అవకాశం ఉంది.ఇలా వస్తే పన్ను లేదు..బంధువుల నుంచి: భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి ఎంత విలువైన బంగారం అందుకున్నా నయా పైసా పన్ను చెల్లించక్కర్లేదు.వివాహ కానుకలు: వివాహ సమయంలో స్నేహితులు లేదా ఇతరుల నుంచి వచ్చే గోల్డ్ గిఫ్ట్లకు పూర్తి మినహాయింపు ఉంటుంది. ధర ఎంత ఉన్నా పన్ను ఉండదు.వారసత్వ సంపద: తల్లిదండ్రుల నుంచి లేదా వీలునామా ద్వారా వచ్చే బంగారానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.ఇలా అయితే పన్ను కట్టాల్సిందే..స్నేహితులు / ఇతరుల నుంచి: బంధువులు కాని వారు ఇచ్చే బంగారం విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మించితే, ఆ మొత్తం విలువపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి. ప్రస్తుతం బంగారం ధర రూ.1.5 లక్షలు దాటిన నేపథ్యంలో, చిన్న ఉంగరం బహుమతిగా ఇచ్చినా ఈ పరిమితి దాటే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.బంగారం అమ్మితే పన్ను ఎంత? బడ్జెట్ 2026 నిబంధనల ప్రకారం బంగారం అమ్మకంపై పన్ను (Capital Gains Tax) గణనలో స్పష్టత వచ్చింది. దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG): మీరు బంగారాన్ని 24 నెలల (2 ఏళ్లు)కంటే ఎక్కువ కాలం ఉంచుకుని అమ్మితే, వచ్చే లాభంపై 12.5% పన్ను పడుతుంది. ఇందులో 'ఇండెక్సేషన్' (ద్రవ్యోల్బణ సర్దుబాటు) ప్రయోజనం ఉండదు.స్వల్పకాలిక మూలధన లాభం (STCG): కొన్న 24 నెలల లోపే అమ్మితే, ఆ లాభాన్ని మీ వార్షిక ఆదాయానికి కలిపి, మీ ట్యాక్స్ స్లాబ్ (Slab Rate) ప్రకారం పన్ను విధిస్తారు.సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB): మీరు నేరుగా ఆర్బీఐ నుంచి కొన్న బాండ్లను (Sovereign Gold Bonds) మెచ్యూరిటీ (8 ఏళ్లు) వరకు ఉంచుకుంటే లాభంపై పన్ను ఉండదు. కానీ, సెకండరీ మార్కెట్లో కొన్న వారికి ఈ మినహాయింపు వర్తించదు.కొనుగోలుపై జీఎస్టీ అదనంబంగారం ధరలతో పాటు పన్నుల (GST) భారం కూడా ఉంటుంది. గోల్డ్ వాల్యూపై 3 శాతం, మేకింగ్ చార్జీలపై 5% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్పై కూడా 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.నిపుణుల సూచన: బంగారం ధరలు భారీగా ఉన్నందున, పెద్ద మొత్తంలో బంగారం బహుమతిగా వచ్చినప్పుడు భవిష్యత్తులో ఐటీ నోటీసుల ఇబ్బంది లేకుండా 'గిఫ్ట్ డీడ్' (Gift Deed) రాసి ఉంచుకోవడం ఉత్తమం.ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, బంగారం ధరలు 2026 చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి పెట్టుబడి లేదా బహుమతుల విషయంలో పన్ను అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోండి.ఇదీ చదవండి: బంగారం, వెండి పెట్టుబడులకు కొత్త నిబంధనలు
కార్పొరేట్
పెట్రోలే కాదు.. తాగే నీటిపైనా యుద్ధం ఎఫెక్ట్!
ఇక మేడిన్ ఇండియా సీసీ కెమెరాలదే రాజ్యం!
సెయిల్ చైర్మన్ రాజీనామా
ఉద్యోగం కోసం ఆఫీసుకు పోతే..: టెకీకి ఎదురైన అనుభవం!
విమాన ప్రయాణికులకు ఇంధన సెగ.. కేంద్రం జోక్యం!
తీవ్ర అనారోగ్యాలకు ఆర్థిక ముప్పు!
మందుబాబులకు ‘పెగ్గు’ మరింత ఖరీదు!
బ్యాంకుల మార్జిన్లు డీలా
భారతి ఎయిర్టెల్ రికార్డ్.. 65 కోట్ల యూజర్స్!
ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!
గుడ్ న్యూస్.. బంగారం రేటు తగ్గిందోచ్!!
దేశంలో పసిడి ధరలు దిగివచ్చాయి. కొనుగోలుదారులకు ఊర...
మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ...
గంటల్లోనే రెచ్చిపోయిన బంగారం రేట్లు
దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉద...
స్టాక్ మార్కెట్లు ముగిశాయిలా..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగ...
స్పెక్యులేటర్లపై ఆర్బీఐ ఉక్కుపాదం
విదేశీ మార్కెట్లో రూపాయి పతనాన్ని అరికట్టేందుకు భ...
అమల్లోకి కొత్త ఐటీ చట్టం
ఆదాయపన్ను చట్టం, 2025 బుధవారం నుంచి అమల్లోకి వచి్చ...
సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు
ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (సెజ్)ని యూనిట్లకు ఏడాది...
రూ.2 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు మార్చిలో మరింత బలపడ్డ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
జియో హిట్ ప్లాన్: అన్లిమిటెడ్ బెనిఫిట్స్!
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ డేటా, అపరిమిత కాలింగ్ కోరుకునే వారి కోసం జియోలో ఓ పాపులర్ హిట్ ప్లాన్ అందుబాటులో ఉంది. అదే రూ. 349 ప్లాన్.ప్లాన్ వివరాలుజియో అందిస్తున్న ఈ రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. అంటే ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే దాదాపు నెల రోజుల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా మొబైల్ సేవలను ఆస్వాదించవచ్చు.డేటా ధమాకాఈ ప్లాన్ ప్రధాన ఆకర్షణ దీని డేటా ప్రయోజనాలే. ప్రతిరోజూ 2 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. 28 రోజుల కాలపరిమితిలో వినియోగదారులకు మొత్తం 56 GB డేటా అందుబాటులో ఉంటుంది. రోజువారీ పరిమితి ముగిసిన తర్వాత కూడా తక్కువ వేగంతో ఇంటర్నెట్ వాడుకునే సౌలభ్యం ఉంటుంది.అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్డేటాతో పాటు, ఈ ప్లాన్ ద్వారా దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు కూడా లభిస్తాయి. లోకల్, ఎస్టీడీ కాలింగ్స్ కోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆకాశం ఎందుకో ఎరుపెక్కింది!
ఆఫ్రికాలోని గ్రీకు ద్వీపమైన క్రీట్లో బుధవారం ప్రకృతి ఒక వింత దృశ్యాన్ని ఆవిష్కరించింది. తెల్లవారుజాము ఆకాశం అకస్మాత్తుగా గాఢమైన ఎరుపు, నారింజ రంగుల్లోకి మారిపోయింది. చూస్తుంటే భూమి మీద ఉన్నామా లేక ఇతర గ్రహంపై ఉన్నామా అన్నంతగాలా వాతావరణం మారిపోవడంతో స్థానిక నివాసితులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్గా మారాయి.ఏమిటీ వింత? ఎందుకు ఇలా జరిగింది?శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, ఇది ఎటువంటి అతీత శక్తి వల్ల కలిగింది కాదు. కేవలం వాతావరణ మార్పుల వల్ల సంభవించిన సహజ పరిణామం. దీనికి ప్రధాన కారణం సహారా ఎడారి నుంచి వీచిన భారీ ధూళి తుఫాను. ఉత్తర ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి వీచిన బలమైన గాలులు, టన్నుల కొద్దీ సన్నని ఇసుక, ధూళి కణాలను మధ్యధరా సముద్రం మీదుగా ఉత్తర దిశగా మోసుకొచ్చాయి. ఈ ధూళి మేఘాల మార్గంలో దక్షిణ ఏజియన్ సముద్ర తీరంలో క్రీట్ ద్వీపం ఉండటంతో ఇక్కడ ప్రభావం అత్యధికంగా కనిపించింది.ఆకాశం ఎరుపు రంగులోకి ఎందుకు మారుతుంది?‘వాతావరణంలో ధూళి కణాలు దట్టంగా ఉన్నప్పుడు అవి సూర్యరశ్మిని విడగొడుతాయి(స్కాట్టరింగ్). తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన నీలం రంగు కణాలు చెల్లాచెదురైపోగా ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన ఎరుపు, నారింజ రంగులు మాత్రమే మన కంటికి చేరుతాయి. దీనినే ‘రెడ్ స్కై ఫినామినా’ అంటారు’ అని శాస్త్రవేత్తలు చెప్పారు.పర్యావరణానికి వరప్రసాదం.. కానీ..ఈ ధూళి తుఫాను చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ దీని వల్ల పర్యావరణానికి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఈ ఎడారి ధూళిలో ఇనుము, కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి నేలపై చేరినప్పుడు మట్టిని, సముద్రంలో పడినప్పుడు సముద్రపు నాచును సారవంతం చేస్తాయి. అయితే, గాలి నాణ్యత (ఏక్యూఐ) భారీగా పడిపోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు
ఏఐ అప్స్కిల్లింగ్పై ఫోకస్
ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ భారత మార్కెట్లో తన కార్యకలాపాలను మరింత సుస్థిరం చేసుకునే దిశగా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 50,000 మంది నిపుణులను నియమించుకోవాలని నిర్ణయించింది. ఉద్యోగాల కల్పనతోపాటు అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతలో ఉద్యోగులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గిస్తున్న తరుణంలో డెలాయిట్ తీసుకున్న ఈ నిర్ణయం భారత టెక్ రంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.నైపుణ్యాల పెంపే లక్ష్యం!ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో డెలాయిట్ దక్షిణాసియా సీఓఓ నితిన్ కిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంస్థ హెడ్కౌంట్ను తగ్గించడంపై కాకుండా, సామర్థ్యాలను బలోపేతం చేయడంపైనే దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ‘ఏఐ సాధనాల ద్వారా అత్యంత క్లిష్టమైన, అధిక విలువ కలిగిన పనులను నిర్వహించడానికి మా ఉద్యోగులను సిద్ధం చేస్తున్నాం. కేవలం పని వేగాన్ని పెంచడమే కాకుండా ఉద్యోగులు అధునాతన బాధ్యతలు చేపట్టేలా అప్స్కిల్లింగ్పై దృష్టి సారించాం’ అని తెలిపారు.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే 30,000 మందికి పైగా ఉద్యోగులకు ఏఐలో శిక్షణ పూర్తి చేశారు. సంస్థ తన మొత్తం ఆదాయంలో 9% సామర్థ్యం పెంపు, శిక్షణ, ఆవిష్కరణ కార్యక్రమాల కోసం కేటాయిస్తోంది. డెలాయిట్ అంతర్జాతీయ శ్రామిక శక్తిలో దాదాపు మూడింట ఒక వంతు భారత్లోనే ఉండటం విశేషం.భారతీయ సంస్థల్లో సవాళ్లుఏఐ పట్ల ఆసక్తి పెరుగుతున్నప్పటికీ భారతీయ సంస్థల్లో (ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, పెద్ద కార్పొరేట్ గ్రూపుల్లో) కొన్ని ప్రాథమిక ఆందోళనలు ఉన్నాయని డెలాయిట్ గుర్తించింది. సున్నితమైన సమాచారం నియంత్రిత వాతావరణంలో భద్రంగా ఉంటుందా లేదా అన్నది ప్రధాన ప్రశ్న. ఏఐ మోడళ్ల ధరల నిర్ణయం ఎక్కువగా వినియోగం ఆధారంగా ఉంటుంది. దీనివల్ల బడ్జెట్పై భారం పడవచ్చని కంపెనీలు భయపడుతున్నాయి.భద్రత ముఖ్యంఆవిష్కరణలు ఎంత ముఖ్యమో భద్రత కూడా అంతే ముఖ్యమని నితిన్ కిని నొక్కి చెప్పారు. ‘భారతదేశం ఏఐ అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే బలమైన భద్రతా వ్యవస్థలను నిర్మించడం అనివార్యం’ అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ సాంకేతికతలపై పట్టు సాధించే క్రమంలో డెలాయిట్ భారత్లో క్వాంటం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి కొత్త కార్యక్రమాలను కూడా ప్రారంభించనుంది. తద్వారా అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలకు భారతదేశాన్ని గ్లోబల్ సెంటర్గా మార్చాలని సంస్థ భావిస్తోంది.ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు
ప్రయోగాల నుంచి ప్రయోజనాల దిశగా..
కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు కేవలం ప్రయోగశాలలకో, మొబైల్ యాప్లకో పరిమితమైన సాంకేతికత కాదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు తమ రోజువారీ కార్యకలాపాల్లో ఏఐని అంతర్భాగం చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ‘మోడల్ సామర్థ్యం’ కంటే ఇప్పుడు దాని ‘నిర్వహణా సామర్థ్యం’ పైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంటర్ప్రైజ్ ఏఐ మనుగడకు నియంత్రణ, సమన్వయం కీలకంగా మారుతున్నాయిని ప్రముఖ సంస్థ గార్ట్నర్ అంచనా వేసింది.2027 నాటికి 40 శాతం ప్రాజెక్టులు రద్దు?గార్ట్నర్ అంచనా ప్రకారం, 2027 చివరి నాటికి సుమారు 40 శాతం ఏజెంటిక్ ఏఐ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇందుకు కారణం.. అంచనాలకు మించి నిర్వహణ ఖర్చులు పెరగడం, వ్యాపార పరంగా స్పష్టమైన విలువ జోడింపు కనిపించకపోవడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలాఉండగా, కేవలం ఏఐ మోడల్స్ను కొనుగోలు చేయడం వల్ల లాభం లేదని, పని విధానాన్ని పునర్నిర్మించడం, పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారానే ఫలితాలు వస్తాయని మెకిన్సే పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.అడ్డంకిగా అవాస్తవ సమాచారంఏఐ వ్యవస్థలు ఇచ్చే సమాచారం ఎంతవరకు నమ్మదగినది? అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద కంపెనీలను వేధిస్తోంది. కేపీఎంజీ 2025 నివేదిక ప్రకారం.. 54 శాతం మంది ప్రతినిధులు డేటాలో ఉన్న అశాస్త్రీయతను ప్రధాన రిస్క్గా భావిస్తున్నారు. 45 శాతం మంది ఏఐ సృష్టించే తప్పుడు సమాచారం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వల్ల పైలట్ ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలోకి రావడానికి జాప్యం జరుగుతోంది. ఇక్కడే గవర్నెన్స్(నియంత్రణ) ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. ఏఐ తీసుకునే నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ నిర్ణయం వెనుక ఉన్న లాజిక్ ఏమిటి? అనే అంశాలపై స్పష్టత లేకపోతే సంస్థలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.సమీకృత పరిష్కారంప్రముఖ టెక్ నిపుణుడు, ఎవాల్యుయేట్ఐక్యూ సహ వ్యవస్థాపకుడు సంజయ్ కొప్పికర్ అభిప్రాయం ప్రకారం.. ఎంటర్ప్రైజ్ ఏఐలో గవర్నెన్స్, సమన్వయం అనేవి విడివిడి అంశాలు కావు. ఇవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు. ‘ఏఐని కేవలం అమలు చేయడం ముఖ్యం కాదు, దానిని నియంత్రించగలగడం, వివరించగలగడం, నమ్మదగినదిగా మార్చడం తక్షణ అవసరం’ అని చెప్పారు.భారీ పెట్టుబడులు - రాబడిపై ఆందోళనలుటెక్ దిగ్గజాలు జనరేటివ్ ఏఐ మౌలిక సదుపాయాల కోసం బిలియన్ల డాలర్లు కుమ్మరిస్తున్నాయి. నిత్యం కొత్త వెర్షన్లు, కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తుండటంతో పాత టెక్నాలజీ త్వరగా కాలం చెల్లిపోతోంది. దీంతో పెట్టుబడిని ఎలా వెనక్కి తీసుకోవాలనే దానిపై కంపెనీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.దాంతో కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ ఖర్చులను తగ్గించుకోవడానికి చిన్న, ప్రత్యేకమైన మోడల్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఏఐ ఇచ్చే అవుట్పుట్ నమ్మదగ్గదిగా ఉంటేనే క్లయింట్లు డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ట్రస్ట్ను ఒక ఫీచర్గా కంపెనీలు అమ్ముతున్నాయి. పూర్తిగా ఏఐపై ఆధారపడకుండా మానవ పర్యవేక్షణ ఉండేలా హైబ్రిడ్ వర్క్ ఫ్లోలను డిజైన్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: దక్షిణాదిలో ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!
పర్సనల్ ఫైనాన్స్
రికార్డ్: ఒక్క నెలలో రూ. 29.53 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పండుగలు, ఆర్థిక సంవత్సరం ముగింపు తదితర అంశాల నేపథ్యంలో ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) ద్వారా లావాదేవీలు మార్చిలో రికార్డు స్థాయికి ఎగిశాయి. ఏకంగా రూ. 29.53 లక్షల కోట్ల విలువ చేసే 2,264 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.గతేడాది మార్చిలో నమోదైన రూ. 24.77 లక్షల కోట్లతో పోలిస్తే విలువపరంగా 19 శాతం పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 26.84 లక్షల కోట్ల విలువ చేసే 2,039 కోట్ల లావాదేవీలు రికార్డయ్యాయి. డిజిటల్ చెల్లింపులు ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారాయనడానికి ఇది నిదర్శనమని పేనియర్బై ఎండీ ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా 85 శాతంగా ఉంది. అంతర్జాతీయంగా యూఏఈ, సింగపూర్ తదితర ఏడు దేశాల్లో ఇది అందుబాటులో ఉంది.
హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?
వీకెండ్ వచ్చిందంటే చాలు కుటుంబంతోనో, స్నేహితులతోనో కలిసి రెస్టారెంట్కు వెళ్లడం ఇప్పుడు సర్వసాధారణం. భోజనం ముగించి బిల్లు చేతికి రాగానే అన్నీ సరి చూసుకుంటాం. కానీ అందులో ‘సర్వీస్ ఛార్జీ’ పేరుతో అదనంగా 5 నుంచి 10 శాతం వరకు బిల్లులో వసూలు చేస్తుండడం గమనించే ఉంటారు. ఇది తప్పనిసరి అని హోటల్ సిబ్బంది వాదించవచ్చు, లేదా మీ అనుమతి అడగకుండానే బిల్లులో వేసేయవచ్చు. అసలు ఈ సర్వీస్ ఛార్జీని కస్టమర్లు కచ్చితంగా చెల్లించాలా? చట్టం ఏం చెబుతోంది? వంటి అంశాలను చూద్దాం.సర్వీస్ ఛార్జీ ‘ట్యాక్స్’ కాదు!చాలామంది వినియోగదారులు సర్వీస్ టాక్స్ (సేవా పన్ను)కు, ‘సర్వీస్ ఛార్జీ’కి మధ్య ఉన్న తేడా తెలియక అయోమయానికి గురవుతుంటారు. జీఎస్టీ అనేది ప్రభుత్వం విధించే చట్టబద్ధమైన పన్ను. ఇది ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా చెల్లించాలి. సర్వీస్ ఛార్జీ అనేది రెస్టారెంట్ యాజమాన్యం తమ సిబ్బంది సేవలకు గుర్తింపుగా (టిప్కు బదులుగా) విధించే రుసుము. ఇది ప్రభుత్వానికి వెళ్లే పన్ను కాదు. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) మార్గదర్శకాల ప్రకారం, సర్వీస్ ఛార్జీ అనేది పూర్తిగా ఆప్షనల్. కస్టమర్ అనుమతి లేకుండా దీన్ని బిల్లులో చేర్చడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘనే అవుతుంది.రెస్టారెంట్లు ఏం చేయవచ్చు.. ఏం చేయకూడదు?కొన్ని రెస్టారెంట్లు తమ మెనూ కార్డులో ‘మేము సర్వీస్ ఛార్జీ విధిస్తాం’ అని రాసి ఉండవచ్చు. అయితే, కేవలం మెనూ కార్డులో రాసి ఉన్నంత మాత్రాన దాన్ని తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదు. సర్వీస్ ఛార్జీ చెల్లించలేదని కస్టమర్ను వేధించడం, సర్వీస్ నిరాకరించడం లేదా రెస్టారెంట్లోకి రాకుండా అడ్డుకోవడం చట్టవిరుద్ధం. వారి సర్వీసు నచ్చకపోతే లేదా మీకు ఇష్టం లేకపోతే సదరు ఛార్జీని తొలగించమని అడిగే పూర్తి హక్కు కస్టమర్లకు ఉంది.సాధారణంగా వినియోగదారులు ఏం చేస్తారు?రద్దీగా ఉన్న సమయంలో గొడవ ఎందుకని చాలామంది మౌనంగా చెల్లిస్తుంటారు. కొందరు ఇది ప్రభుత్వ పన్నుగా భావిస్తారు. ఛార్జీని తొలగించమని అడిగితే తక్కువగా చూస్తారేమోనన్న ఇంకొందరు సంకోచిస్తారు. బిల్లులో చివరలో దీన్ని కలపడం వల్ల అది మొత్తంలో భాగమని చెల్లిస్తుంటారు.అసలు ఏం చేయాలి?బిల్లు జనరేట్ కాకముందే సర్వీస్ ఛార్జీని మినహాయించి బిల్లు ఇవ్వమని కోరండి. సిబ్బందితో వాదించకుండా ఇది చెల్లించడం ఆప్షనల్ అని ప్రశాంతంగా హోటల్ యాజమాన్యానికి వివరించండి. ఒకవేళ హోటల్ యాజమాన్యం మొండిగా వ్యవహరించి బలవంతంగా వసూలు చేస్తే ఆ బిల్లును సాక్ష్యంగా ఉంచుకుని నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్(1915)కు ఫిర్యాదు చేయవచ్చు.ఎలాంటి సమయాల్లో చెల్లించవచ్చు?మీకు అందించిన సర్వీసులు అద్భుతంగా ఉందని మీరు భావిస్తే ఆ సిబ్బందిని ప్రోత్సహించడానికి సర్వీస్ ఛార్జీ రూపంలో లేదా నేరుగా టిప్ రూపంలో నగదును స్వచ్ఛందంగా ఇవ్వవచ్చు. ఇది పూర్తిగా మీ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: పాకిస్థాన్కు వీసా నిలిపివేసిన ఖతార్
బంగారం, వెండి పెట్టుబడులకు కొత్త నిబంధనలు
దేశంలో బంగారం, వెండిపై పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్ 1 నుండి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. సెబీ (SEBI) తీసుకున్న కొత్త నిర్ణయాలు, పన్ను విధానాల్లో మార్పులు మీ లాభాలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఆ మార్పులేంటో ఓసారి పరిశీలిద్దాం.అంతర్జాతీయ ధరలకు స్వస్తి! ఇప్పటి వరకు గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ల (ETF) ధరలను అంతర్జాతీయ ప్రమాణాల (LBMA) ఆధారంగా నిర్ణయించేవారు. కానీ ఏప్రిల్ 1 నుండి సెబీ (SEBI) కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ఇకపై వీటి ధరలు భారతీయ ఎక్స్ఛేంజీల 'దేశీయ స్పాట్ ధర' (Domestic Spot Price) ఆధారంగానే నిర్ణయిస్తారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు, కరెన్సీ మార్పిడి రేట్ల ప్రభావం మన పెట్టుబడులపై తక్కువగా ఉంటుంది. పెట్టుబడిదారులు భారత మార్కెట్ వాస్తవ ధరకే లావాదేవీలు జరపవచ్చు.గోల్డ్ బాండ్స్పై పన్ను పోటుఫిజికల్ గోల్డ్ కంటే సురక్షితమైనదిగా భావించే సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB)విషయంలో ప్రభుత్వం పన్ను నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పటి వరకు సావరిన్ గోల్డ్ బాండ్లపై పన్ను మినహాయింపులు ఉండటంతో వీటిని ఉత్తమ పెట్టుబడిగా భావించేవారు. అయితే, కొత్త నిబంధనల ప్రకారం వీటిపై కూడా 'మూలధన లాభాల పన్ను' వర్తిస్తుంది.అయితే బాండ్లను జారీ చేసిన సమయంలో నేరుగా కొనుగోలు చేసి, మెచ్యూరిటీ వరకు ఉంచుకునే వారికి పన్ను మినహాయింపు కొనసాగుతుంది. అదే సెకండరీ మార్కెట్ (స్టాక్ మార్కెట్) ద్వారా బాండ్లను కొనుగోలు చేసిన వారు మాత్రం ఇకపై స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక మూలధన లాభాల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.డిజిటల్ గోల్డ్పై ప్రభుత్వ నిఘాడిజిటల్ గోల్డ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టే ప్రయోజనాలను పూర్తిగా పన్ను వలయం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే డిజిటల్ పెట్టుబడులపై కూడా పారదర్శకమైన పన్ను విధానాన్ని తీసుకురావడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
ఏటీఎం రూల్స్.. ఇక మారిపోయాయ్..
దేశంలోని ప్రముఖ బ్యాంకుల ఏటీఎం వినియోగదారులకు అలర్ట్.. ఈ ఏప్రిల్ 1 నుంచి దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఏటీఎం/సీఆర్ఎం నగదు ఉపసంహరణ నిబంధనల్లో కీలక మార్పులు చేశాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ (HDFC), బంధన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కస్టమర్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (UPI) ద్వారా చేసే ఏటీఎం విత్ డ్రాయల్స్ను కూడా నెలవారీ ఉచిత లావాదేవీల కోటాలో చేర్చింది.నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకుంటే ప్రతి లావాదేవీకి రూ. 23 + పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.కార్డు లేకుండా నగదు పొందే సౌలభ్యం ఉన్నప్పటికీ, ఇకపై లావాదేవీల సంఖ్యపై కస్టమర్లు నిఘా ఉంచక తప్పదు.పంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డ్ వేరియంట్లను బట్టి రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, భద్రతను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.రూపే ఎన్సీఎంసీ ప్లాటినం (డొమెస్టిక్ & ఇంటర్నేషనల్), ఉమెన్ పవర్ ప్లాటినం, పీఎన్బీ పలాష్, రూపే బిజినెస్ ప్లాటినం, మాస్టర్ కార్డ్ ప్లాటినం, వీసా గోల్డ్ కార్డులకు నగదు విత్డ్రా పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 50,000కు తగ్గించింది.ఇక రూపే సెలెక్ట్, పీఎన్బీ రూపే నియో/ఎక్సెల్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డులకు క్యాష్ విత్డ్రా లిమిట్ రూ. 1.5 లక్షల నుంచి రూ. 75,000కు తగ్గిందిఅయితే పీఓఎస్ (POS), ఈ-కామర్స్ లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు. కస్టమర్లు తమ లిమిట్ను పీఎన్బీవన్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు.బంధన్ బ్యాంక్బంధన్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఏటీఎం వినియోగ నియమాలను మార్చింది. సొంత బ్యాంకు అంటే బంధన్ బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత ఫైనాన్షియల్ లావాదేవీలే ఉంటాయి. ఆర్థికేతర లావాదేవీలు (బ్యాలెన్స్ చెక్ వంటివి) మాత్రం అపరిమితం.ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే మెట్రో నగరాల్లో నెలకు కేవలం 3 ఉచిత లావాదేవీలు (ఫైనాన్షియల్ + నాన్ ఫైనాన్షియల్ కలిపి), నాన్-మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది.ఉచిత పరిమితి మించితే ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.23, ఒక్కో నాన్ ఫైనాన్షియల్ లావాదేవీకి రూ.10 అదనంగా చార్జీలు ఉంటాయి. ఇక తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల లావాదేవీలు విఫలమైతే రూ.25 పెనాల్టీ విధిస్తారు.ఇది చదవలేదా? 👉 బ్యాంకులు దేశవ్యాప్తంగా తెరిచేది ఒక్క రోజే!


