ప్రధాన వార్తలు
దివాలా తీసిన జేఏఎల్ కొనుగోలు.. అదానీకే ‘జై’!
న్యూఢిల్లీ: దివాలా తీసిన తమ సంస్థ జేఏఎల్ కొనుగోలుకి సంబంధించి అదానీ గ్రూప్ వైపై జేపీ గ్రూప్ వ్యవస్థాపకుడు జైప్రకాశ్ గౌర్ మొగ్గు చూపారు. గౌతమ్ అదానీ సారథ్యంలో గ్రూప్ పురోగమించగలదని విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. రుణదాతల కమిటీ (సీవోసీ), దివాలా పరిష్కార నిపుణుడు పారదర్శకంగా బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహించినట్లు గౌర్ పేర్కొన్నారు.ఇందులో పాల్గొన్నందుకు అదానీ గ్రూప్, వేదాంత గ్రూప్నకు ధన్యవాదాలు తెలిపారు. అదానీ గ్రూప్ను సీవోసీ ఎంపిక చేయడాన్ని తాను గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. బిడ్డింగ్లో తాము గెల్చినట్లు రాతపూర్వకంగా ధృవీకరించిన తర్వాత, దానికి భిన్నంగా అదానీ గ్రూప్ను విజేతగా ప్రకటించారంటూ పోటీ సంస్థ వేదాంత చీఫ్ అనిల్ అగర్వాల్ ఆరోపించిన నేపథ్యంలో గౌర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.రూ. 57,185 కోట్ల రుణాలు బాకీ పడటంతో 2024 జూన్లో జేఏఎల్పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. రూ. 14,535 కోట్ల అదానీ గ్రూప్ బిడ్కు గతేడాది నవంబర్లో సీవోసీ ఆమోదించగా, మార్చి 17న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (అలహాబాద్ బెంచ్) కూడా ఆమోదముద్ర వేసింది. అయితే, రూ. 17,926 కోట్లకు బిడ్ చేసిన వేదాంత, దీన్ని సవాలు చేస్తూ అపీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. ప్రస్తుతం దీనిపై ఎన్సీఎల్ఏటీ విచారణ చేపట్టినప్పటికీ, ఎన్సీఎల్టీ నిర్ణయంపై మధ్యంతర స్టే విధించడానికి నిరాకరించింది.
పసిడి, ఫారెక్స్ నిల్వలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: ఇటీవల తగ్గముఖం పట్టిన భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు మళ్లీ పుంజుకున్నాయి. ఏప్రిల్ 3తో ముగిసిన వారంలో 9.063 బిలియన్ డాలర్లు పెరిగి 697.121 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు (మార్చి 27) వారంలో ఇవి 10.288 బిలియన్ డాలర్లు క్షీణించి 688.058 బిలియన్ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక గరిష్టం 728.494 డాలర్లుగా నమోదయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత కొన్ని వారాలు పాటు తగ్గుతూ వచ్చాయి. రూపాయి మారకపు విలువపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని డాలర్లు విక్రయించడమే కాక.. కొన్ని విధానపరమైన జాగ్రత్తలనూ తీసుకుంటోంది.ఏప్రిల్ 3తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.784 బిలియన్ డాలర్లు పెరిగి, 552.856 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల విలువ 7.221 బిలియన్ డాలర్లు పెరిగి 120.742 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
మన ఆయిల్, గ్యాస్.. ఎంత ఖర్చయినా తెచ్చుకుందాం
న్యూఢిల్లీ: సంప్రదాయ ఇంధన సరఫరాల కోసం పశ్చిమాసియా దేశాలపై అధికంగా ఆధారపడడంపై అప్రమత్తత అవసరమని ఓఎన్జీసీ చైర్మన్, సీఈవో అరుణ్ కుమార్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ తన చమురు దిగుమతుల్లో సగం మేర, గ్యాస్ అవసరాల్లో 30 శాతం, ఎల్పీజీ అవసరాల్లో 85–90 శాతాన్ని మధ్యప్రాచ్య దేశాల నుంచి సమకూర్చుకుంటున్నట్టు చెప్పారు.పశ్చిమాసియాలో సంఘర్షణల కారణంగా దశాబ్దాలలో ఎన్నడూ లేనంతటి ఇంధన సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న తరుణంలో అరుణ్ కుమార్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రాధాన్యం నెలకొంది. పశ్చిమాసియా మనకు సమీపంలో ఉండడంతో అక్కడి వనరులను సులభంగా పొందొచ్చనుకోవడాన్ని కొంత సందేహంగానే చూడాలన్నారు. ఇంధన భద్రతపై పీఎన్జీఆర్బీ నిర్వహించిన సదస్సులో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రపంచ క్రమం మారుతోందని, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఇంధన భద్రతపై దీర్ఘకాలం నుంచి ఉన్న అంచనాలు మారిపోతున్నాయంటూ హెచ్చరించారు. కనుక దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవడం ఎంతో కీలకమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ ఆయిల్, గ్యాస్ ఉన్నా.. ఎంత ఖర్చు అయినా దాన్ని వెలుగులోకి తెచ్చుకోవాలంటూ.. సంక్షోభంలో మనకు ఎవరూ సాయం చేయరన్నారు. అలాగే, దేశంలో ఇంధన నిల్వల సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో ఒకే రోజు 108 ఈ-విటారా కార్లు డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా 2031 నాటికి మరో 4 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనుంది. అప్పటికి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహన (బీఈవీ) విభాగంలో అగ్రస్థానానికి చేరాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు. హైదరాబాద్లో ఒకే రోజున 108 ఈ–విటారా వాహనాలను డెలివరీ చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.కమోడిటీల ధరలు పెరిగిన నేపథ్యంలో తమ కార్ల రేట్లను పెంచే యోచనలో ఉన్నట్లు వివరించారు. అయితే, పెంపు పరిమాణం ఎంత, ఎప్పుడు ఉంటుందనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. 44 దేశాలకు 25,000 పైచిలుకు ఈ–విటారా వాహనాలను ఎగుమతి చేసినట్లు ఆయన తెలిపారు. ఎగుమతులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలను ఇంకా మదింపు చేయాల్సి ఉందన్నారు. దేశీయంగా హైదరాబాద్లో అత్యధికంగా 14.5 శాతం స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఉంటోందని ఆయన చెప్పారు.తెలంగాణవ్యాప్తంగా 256 చార్జింగ్ పాయింట్లు ఉన్నాయని, హైదరాబాద్లో ప్రతి 5 కి.మీ.కి ఒకటి చొప్పున 119 ఉన్నాయని వివరించారు. కస్టమర్లలో ముందుగా రేంజిపరమైన ఆందోళన తొలగించేలా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాకే విద్యుత్ వాహనాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతోనే ఎలక్ట్రిక్ కార్ ఆవిష్కరణలో కొంత జాప్యం జరిగినట్లు పార్థో బెనర్జీ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,000కు పైగా ఎక్స్క్లూజివ్ చార్జింగ్ పాయింట్లు ఉండగా 2030 నాటికి లక్షకు పైగా పబ్లిక్ చార్జింగ్ పాయింట్ల నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నామన్నారు.
‘ఆమె’ తీసుకున్న లోన్లు రూ.76 లక్షల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళా శక్తి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అధికారిక రుణ వ్యవస్థలో వారి భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు చిన్నపాటి అవసరాల కోసం రుణాలు తీసుకోవడానికే పరిమితమైన వనితలు .. ఇప్పుడు వ్యాపార విస్తరణకు భారీ స్థాయిలో రుణాలు తీసుకుంటున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా మహిళల రుణ పోర్ట్ఫోలియో అక్షరాలా రూ.76 లక్షల కోట్లకు చేరిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. వ్యవస్థలోని మొత్తం రుణాల్లో మహిళల వాటా ఏకంగా 26 శాతానికి ఎగబాకింది.నీతి ఆయోగ్ సీఈఓ నిధి చిబ్బర్ న్యూఢిల్లీలో విడుదల చేసిన ‘ఫ్రమ్ బారోవర్స్ టు బిల్డర్స్: ఉమెన్ అండ్ ఇండియాస్ ఎవాల్వింగ్ క్రెడిట్ మార్కెట్‘ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ (డబ్ల్యూఈపీ), ట్రాన్స్యూనియన్ సిబిల్, మైక్రోసేవ్ కన్సల్టింగ్ (ఎంఎస్సీ) సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. 2017 నుంచి చూస్తే మహిళలకు ఇచి్చన రుణాల పరిమాణం 4.8 రెట్లు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. కేవలం రుణాలు పొందడం మాత్రమే కాకుండా, అధికారిక రుణ వ్యవస్థలో వారి భాగస్వామ్యం గుణాత్మకంగా మారుతోందని వెల్లడించింది.పరుగులు పెడుతున్న వృద్ధి .. 2017 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ మధ్య కాలంలో క్రియాశీలక మహిళా రుణగ్రహీతల సంఖ్య 9 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదు చేసింది. మహిళల్లో రుణ విస్తృతి 19 శాతం నుంచి 36 శాతానికి ఎగబాకింది. ప్రస్తుతం రుణ మార్కెట్లో 16 కోట్ల మంది యాక్టివ్ మహిళా రుణగ్రహీతలు ఉన్నారు. 2017లో రూ.16 లక్షల కోట్లుగా ఉన్న వీరి బకాయిలు, 2025 నాటికి రూ.76 లక్షల కోట్లకు చేరాయి. దేశంలో రుణ అర్హత కలిగిన 45 కోట్ల మంది మహిళలు ఉండగా, భవిష్యత్తులో ఈ మార్కెట్ మరింతగా విస్తరించే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.మైక్రోఫైనాన్స్ నుంచి అప్గ్రేడ్ .. చిన్నపాటి మైక్రోఫైనాన్స్ రుణాలతో మొదలుపెట్టిన మహిళలు ఆ తర్వాత మంచి క్రెడిట్ హిస్టరీ సాధించి క్రమంగా రిటైల్, కమర్షియల్ రుణాల వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న మైక్రోఫైనాన్స్ రుణగ్రహీతల్లో 19 శాతం మంది రిటైల్ లేదా కమర్షియల్ లోన్స్ కలిగి ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. ఈ ’కస్టమర్ గ్రాడ్యుయేషన్’లోనూ దక్షిణాది రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. అత్యధికంగా తమిళనాడులో 27 శాతం మంది మహిళలు పెద్ద రుణాల వైపు అప్గ్రేడ్ అవ్వగా, కర్ణాటకలో ఈ రేటు 20 శాతంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ఉన్న బలమైన క్రెడిట్ వ్యవస్థకు ఇది నిదర్శనమని నివేదిక స్పష్టం చేసింది.డిజిటల్ అండతో సత్వర రుణాలు: కేరళ కేస్ స్టడీ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), అధికారిక రుణ వ్యవస్థల కలయికతో ఆర్థిక భాగస్వామ్యం సులభతరమైందని నీతి ఆయోగ్ సీఈఓ నిధి చిబ్బర్ పేర్కొన్నారు. గుర్తింపు, చెల్లింపులు, అండర్రైటింగ్, లోన్ సరీ్వసింగ్ వంటి అంశాల్లో డిజిటలైజేషన్ పెరగడం వల్ల మహిళలకు రుణాలు త్వరగా మంజూరవుతున్నాయి. ప్రధాన వినియోగ విభాగాల్లో అదే రోజు రుణం మంజూరు (సేమ్–డే అప్రూవల్స్) ఏకంగా 45 శాతానికి చేరింది. గ్రామీణ మహిళా వ్యాపారుల డిజిటల్ ప్రయాణంపై అధ్యయనం చేసిన బృందం.. కేరళలో పలు ఆసక్తికర విషయాలు గుర్తించింది.కేరళలోని గ్రామీణ మహిళా వ్యాపారుల్లో 38 శాతం మంది మహిళలు.. ’సమయాభావం’ తమ వ్యాపార వృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందని వెల్లడించారు. ఇంటి బాధ్యతలు, వ్యాపారం రెండింటినీ చూసుకోవాల్సి రావడం వల్ల డిజిటల్ టూల్స్ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోతున్నామని వారు తెలిపారు. అయినా సరే కొందరు గ్రామీణ వ్యాపారులు వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, పింటెరెస్ట్ వంటి డిజిటల్ టూల్స్ ఉపయోగించి మార్కెటింగ్ చేసుకుంటున్న తీరును నివేదిక కేస్ స్టడీలుగా ప్రచురించింది. భవిష్యత్తులో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా తమ వ్యాపారాలను మరింత వృద్ధి చేసుకోవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.మహిళలు అధికారిక ఫైనాన్షియల్ సిస్టమ్స్ వైపు మళ్లడం, వివిధ రుణ విభాగాల్లో చురుకుగా పాల్గొనడం భారత్ ఆర్థిక ముఖచిత్రంలో ఒక అర్థవంతమైన మార్పని డబ్ల్యూఈపీ మిషన్ డైరెక్టర్ అన్నా రాయ్ తెలిపారు. దాదాపు 16 కోట్ల మంది యాక్టివ్ మహిళా రుణగ్రహీతల డేటాతో పాటు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 161 మంది మహిళా నానో–ఎంటర్ప్రెన్యూర్ల ప్రైమరీ రీసెర్చ్ ఆధారంగా ఈ నివేదికను సమగ్రంగా రూపొందించారు. వ్యాపార రుణాల్లో దక్షిణాది హవా .. వ్యాపార అవసరాల కోసం రుణాలు తీసుకునే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2022–2025 మధ్య కాలంలో మొత్తం కమర్షియల్ క్రెడిట్ వృద్ధి రేటు 17 శాతంగా ఉండగా, మహిళా వ్యాపారుల రుణాల వృద్ధి రేటు ఏకంగా 31 శాతంగా నమోదైంది. 2017 నుంచి చూస్తే వ్యాపార రుణాల బకాయిల పరిమాణం 7.5 రెట్లు పెరిగింది. ఈ విభాగంలో దక్షిణాది రాష్ట్రాలు బలమైన ముద్ర వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ రుణాలు తీసుకున్న మహిళల్లో ఒక్క తమిళనాడు రాష్ట్రం నుంచే 15 శాతం మంది ఉండగా, కర్ణాటక వాటా 9 శాతంగా ఉంది. అయితే వృద్ధి రేటు పరంగా చూస్తే ఉత్తరాది రాష్ట్రాలైన బిహార్ (59%), ఉత్తరప్రదేశ్ (42%) వేగంగా దూసుకెళ్తున్నాయని నివేదిక తెలిపింది.
క్విక్–కామర్స్లో భారత్ హవా!
న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్లైన్ రిటైల్ మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. 2025లో ఈ మాధ్యమం ద్వారా అమ్ముడైన ఉత్పత్తుల స్థూల విలువ (జీఎంవీ) దాదాపు 65–66 బిలియన్ డాలర్లుగా ఉంటుందని బెయిన్ అండ్ కంపెనీ, ఫ్లిప్కార్ట్ నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. విలువపరంగా 19–21 శాతం వృద్ధి నమోదైందని రిపోర్టు పేర్కొంది. ఈ క్రమంలో క్విక్–కామర్స్ విభాగానికి సంబంధించి ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా ఎదిగినట్లు వివరించింది. ఈ–కామర్స్ జీఎంవీలో దాదాపు 16–17 శాతం ఈ క్విక్ కామర్స్ ద్వారానే వచి్చనట్లు తెలిపింది. ఇది చైనా సహా చాలా మార్కెట్లలో నమోదైన దానికంటే అధికమని వివరించింది. ఆన్లైన్ షాపింగ్, అందుకోసం చేసే వ్యయం పెరుగుతుండటంతో ఏటా 20 శాతం వృద్ధితో 2030 నాటికి భారత ఈ–రిటైల్ మార్కెట్ 170–180 బిలియన్ డాలర్లకు చేరవచ్చని నివేదిక అంచనా వేసింది. రిపోర్టులోని మరిన్ని విశేషాలు.. → స్థూల ఆర్థిక పరిస్థితులు, వినియోగదారుల సెంటిమెంటు మెరుగుపడుతుండటంతో గతేడాది పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందింది. జీఎస్టీ కోతలు, ఆదాయ పన్నుపరమైన ఊరట, నెమ్మదిస్తున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల తగ్గింపు తదితర సానుకూలాంశాలతో ప్రైవేట్ వినియోగం పెరిగింది. 2022–24 మధ్య 8 శాతంగా ఉన్న ప్రైవేట్ వినియోగం 2025లో 10.5 శాతానికి చేరింది. 2026 తొలి త్రైమాసికంలోనూ ఇదే ఊపు కొనసాగడంతో 23–25 శాతం వృద్ధి చెందింది. → గత రెండేళ్లుగా క్విక్ కామర్స్ విభాగం రెట్టింపయ్యింది. 2025లో ఈ సెగ్మెంట్ జీఎంవీ 10–11 బిలియన్ డాలర్లకు చేరింది. రాబోయే రోజుల్లో 2030 నాటికి ఇది 65–70 బిలియన్ డాలర్లకు చేరనుంది. అదనంగా నమోదయ్యే ఈ–రిటైల్ జీఎంవీలో దీని వాటా 45–50 శాతానికి చేరొచ్చు. అప్పటికి మొత్తం ఆన్లైన్ షాపింగ్లో సంప్రదాయ ఈ–రిటైల్ విభాగం వాటా 60–65 శాతంగా ఉండవచ్చు. → అంతర్జాతీయంగా వినియోగానికి భారత్ కీలక చోదకంగా నిలుస్తోంది. వచ్చే అయిదేళ్లలో వినియోగంపై అదనంగా వెచి్చంచే ప్రతి 8 డాలర్లలో భారత్ వాటా 1 డాలరుగా ఉండనుంది. → గతేడాది ఈ–రిటైల్ మార్కెట్ భారీగా వృద్ధి చెందినా, ఆఫ్లైన్ మాధ్యమాన్ని ప్రాధాన్యతను కొట్టిపారేసేందుకు వీలు లేదు. మెజారిటీ వినియోగదారులకు చేరువయ్యేందుకు ఇప్పటికీ ఇది కీలకంగా ఉంటోంది. దీని దన్నుతోనే 2030 నాటికి మొత్తం రిటైల్ పరిశ్రమ 1.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోనుంది. → గడిచిన అయిదేళ్లలో భారత్లో ఆన్లైన్ షాపింగ్ మార్కెట్ రెట్టింపయ్యింది. షాపింగ్ చేసే వారి సంఖ్య 2025లో రెట్టింపయ్యి 29–30 కోట్లకు చేరింది. విక్రేతల వ్యవస్థ విస్తరించడం (గత అయిదేళ్లలో మూడు రెట్లు), భౌగోళికంగా మరిన్ని ప్రాంతాల్లోకి సేవలు అందుబాటులోకి రావడం ఇందుకు దోహదపడుతోంది. → జెన్ జెడ్ తరం కీలకంగా మారింది. ఈ–రిటైల్ షాపర్స్లో వీరి వాటా 40–45 శాతంగా ఉంటోంది. 2025లో అదనంగా వచ్చి ఈ–రిటైల్ ఆర్డర్లలో 50 శాతం ఈ వర్గం నుంచే వచ్చింది. లైఫ్స్టయిల్, బ్యూటీ, ఎల్రక్టానిక్స్ తదితర కేటగిరీలవ్యాప్తంగా ఈ విభాగం కస్టమర్ల షాపింగ్ ప్రాధాన్యతలు చాలా ప్రత్యేకంగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, వీడియోలు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం, సత్వర రుణ సదుపాయం వినియోగించుకోవడం ఎక్కువగా ఉంటోంది. → ఇంటర్నెట్ యూజర్లలో షాపింగ్ చేసే వారి సంఖ్య 25–30 శాతంగానే ఉన్నప్పటికీ (మెట్రోలు/ప్రథమ శ్రేణి నగరాల్లో ఇది 45–50 శాతంగా ఉంది), గతేడాది అదనంగా నమోదైన ఆన్లైన్ ఆర్డర్లలో ద్వితీయ శ్రేణి నగరాల వాటా దాదాపు 50 శాతంగా ఉంది. → పరిశ్రమ గణనీయంగా ఎదుగుతున్నప్పటికీ భారత్లో ఇప్పటికీ ఈ–రిటైల్ విస్తరణ చాలా తక్కువగానే జీడీపీలో 1.6 శాతం మాత్రమే ఉంది. అదే చైనాలో 13–14 శాతంగా, ఇండొనేషియాలో 4–4.5 శాతంగా ఉంది. ఇంటర్నెట్ యూజర్లలో 30 శాతం మంది మాత్రమే ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. చైనాలో ఇది 92 శాతంగా, అమెరికాలో 74 శాతంగా ఉంది. ఇవన్నీ భారత్లో ఈ రంగం మరింత వృద్ధి చెందడానికి గల అవకాశాలను సూచిస్తున్నాయి. → వచ్చే అయిదేళ్లలో ఈ–రిటైల్ మార్కెట్ తదుపరి వృద్ధి దశలోకి అడుగుపెట్టనుంది. క్యూ–కామర్స్ ఇందుకు దన్నుగా నిలవనుంది. నిత్యావసరాలు, అలాగే డిస్క్రెషనరీ ఉత్పత్తులకు సంబంధించి సౌకర్యవంతమైన మాధ్యమంగా క్యూ–కామర్స్ నిలుస్తోంది. ప్రస్తుతం 200 పైగా నగరాల్లో 7,000 పైగా మైక్రో–ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ పని చేస్తున్నాయి. భారీ స్థాయిలో కార్యకలాపాల నిర్వహణ వల్ల లాభదాయకత మెరుగుపడింది. అయితే, టాప్ మెట్రోలు, ప్రథమ శ్రేణి నగరాల పరిధిని దాటి ఇతర ప్రాంతాల్లో దీని వినియోగం ఎలా ఉంటుందనే దానిపై ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు.
కార్పొరేట్
దివాలా తీసిన జేఏఎల్ కొనుగోలు.. అదానీకే ‘జై’!
మన ఆయిల్, గ్యాస్.. ఎంత ఖర్చయినా తెచ్చుకుందాం
క్విక్–కామర్స్లో భారత్ హవా!
''ఒరాకిల్ ఉద్యోగం పోయింది.. మేకలు పెంచాలనుకుంటున్నా''
తొలగించిన కంపెనీ.. మళ్లీ పిలిచింది: చివరికి అవమానమే!
IRCTC కొత్త రూల్.. ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు!
ఓపెన్ ఏఐ నిపుణులను తన్నుకుపోయిన మెటా!
ఎయిరిండియా ఉద్యోగులకు ఛైర్మన్ హెచ్చరిక
స్విగ్గీకి నందన్ రెడ్డి గుడ్బై.. తప్పుకొంటున్న కోఫౌండర్
ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీ ఒలెక్ట్రా కొత్త బ్రాండ్ ఐడెంటిటీ
450 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ...
పసిడి, వెండి రివర్స్గేర్
న్యూఢిల్లీ: అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధానికి రెండు వ...
ఉద్యోగం - ఆర్థిక స్వేచ్ఛ: కియోసాకి సూచన
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ...
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్ట...
40 శాతం రాయితీపై రష్యా ఎల్ఎన్జీ?
ప్రపంచ ఇంధన మార్కెట్లో పెను మార్పులు సంభవిస్తున్న...
యుద్ధ విరమణతో భారత్కు దక్కేదేమిటి?
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తాత్కాలి...
సహజ వాయువు కోటా 95 శాతానికి పెంపు
దేశీయ వ్యవసాయ రంగానికి వెన్నుముకగా నిలిచే ఎరువుల ప...
ఎంట్రప్రెన్యూర్లకు ముద్రా రుణాల దన్ను
ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ముద్రా రుణాలు ఆర్థికంగా స...
ఆటోమొబైల్
టెక్నాలజీ
రఫేల్ డీల్.. ‘స్వదేశీ’ అస్త్రాలకు పెద్దపీట!
భారత వాయుసేన(ఐఏఎఫ్)లో సుమారు రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో కొనుగోలు చేయనున్న 114 రఫేల్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ (ఎంఆర్ఎఫ్ఏ) ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిబంధనను చేర్చబోతోంది. ఈ యుద్ధ విమానాల్లో భారతీయ క్షిపణులు, ఆయుధ వ్యవస్థలను ఏకీకృతం చేసేందుకు వీలుగా ‘ఇంటర్ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్’ (ఐసీడీ)ను ఒప్పందంలో అంతర్భాగం చేయాలని భారత్ నిర్ణయించుకుంది.ఏమిటీ ఐసీడీ? దీని ప్రాముఖ్యత ఏంటి?సాధారణంగా ఏ దేశమైనా ఇతర దేశాల నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేసినప్పుడు ఆ విమానాల తయారీ సంస్థలు తమ సొంత క్షిపణులను మాత్రమే వాడుకునేలా సాఫ్ట్వేర్ కట్టడి చేస్తాయి. అయితే, రాబోయే 114 రాఫెల్ విమానాల విషయంలో భారత్ భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. తుది ఒప్పందంలో ఐసీడీలో మార్పులు చేయడంతో భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన అత్యాధునిక క్షిపణులు రఫేల్ వ్యవస్థతో అనుసంధానం కావడానికి మార్గం సుగమం అవుతుంది.దీనివల్ల భవిష్యత్తులో మనం ఫ్రాన్స్ నుంచి ఖరీదైన క్షిపణులను కొనాల్సిన అవసరం లేకుండా దేశీయ టెక్నాలజీతో గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణులను, ఇతర స్వదేశీ బాంబులను ఈ విమానాల ద్వారా ప్రయోగించవచ్చు.మేక్ ఇన్ ఇండియాకు ఊతంఫిబ్రవరి 12న డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఈ భారీ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. వచ్చే నెలలో డసో ఏవియేషన్ సంస్థకు ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ (ఆర్ఎఫ్పీ) జారీ కానుంది. మొత్తం 114 విమానాలలో 18 విమానాలు నేరుగా ఫ్రాన్స్ నుంచి సిద్ధంగా వస్తాయి. మిగిలిన 96 విమానాలు 25 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో భారత్లోనే తయారవుతాయి. ఇది దేశీయ రక్షణ రంగ తయారీలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.సోర్స్ కోడ్ వివాదంపై స్పష్టతసోర్స్ కోడ్ బదిలీ విషయంలో వస్తున్న అపోహలను రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కొట్టిపారేశారు. ఏవియానిక్స్, రాడార్, ఫ్లైట్ కంట్రోల్ వంటి కీలక విధులను నియంత్రించే సోర్స్ కోడ్ను పంచుకోకపోవడం అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక ప్రామాణిక పద్ధతి. భారత్కు అత్యంత సన్నిహిత దేశాలైన రష్యా (Su-30 MKI విషయంలో), అమెరికా కూడా తమ సోర్స్ కోడ్లను ఎవరికీ పంచుకోవు. అయినప్పటికీ, ఐసీడీ ద్వారా సాఫ్ట్వేర్ అనుసంధానత లభిస్తుంది కాబట్టి, సోర్స్ కోడ్ లేకపోయినా మన ఆయుధాలను వాడుకోవడానికి ఎటువంటి ఆటంకం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: 40 శాతం రాయితీపై రష్యా ఎల్ఎన్జీ?
టీసీఎస్ బోణీ బాగుంది! ఇక ఏప్రిల్ 1 నుంచే వేతనాల పెంపు
ఐటీ పరిశ్రమలో ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఆకర్షణీయమైన ఫలితాలతో క్యూ4 సీజన్కి బోణీ కొట్టింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 12.22 శాతం వృద్ధితో రూ. 13,718 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికం (క్యూ3)లో ఇది రూ. 10,657 కోట్లుగా ఉండగా, అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ4లో రూ. 12,224 కోట్లుగా నమోదైంది.ఆదాయం రూ. 64,479 కోట్ల నుంచి సుమారు 10 శాతం వృద్ధితో రూ. 70,698 కోట్లకు ఎగిసింది. 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను టీసీఎస్ లాభం 1.35 శాతం వృద్ధితో రూ. 48,553 కోట్ల నుంచి రూ. 49,210 కోట్లకు చేరింది. ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 2.67 లక్షల కోట్లుగా నమోదైంది. ఒక్కో షేరుకు రూ. 31 చొప్పున తుది డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. దీనితో పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 39,571 కోట్ల మేర డివిడెండ్ ఇచ్చినట్లవుతుంది.ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు..క్యూ4లో నిర్వహణ మార్జిన్ 24.2 శాతం నుంచి 25.3 శాతానికి పెరిగింది. వార్షికంగా 2.3 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండేలా క్యూ4లో ఏఐ ఆదాయాలు నమోదయ్యాయి. నాలుగో త్రైమాసికంలో 12 బిలియన్ డాలర్ల విలువ చేసే కొత్త డీల్స్ కుదిరాయి.కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఏఐ నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చే ధోరణిని గతేడాది తరహాలోనే కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ కంపెనీ కొనసాగించనుంది.ఉద్యోగులు పెరిగారు.. వరుసగా రెండు త్రైమాసికాల పాటు క్షీణించిన ఉద్యోగుల సంఖ్య క్యూ4లో మళ్లీ పెరిగింది. నికరంగా 2,356 మంది చేరడంతో మార్చి ఆఖరు నాటికి మొత్తం సంఖ్య 5,84,519కి చేరింది. ఉద్యోగాల కోత చేపట్టడం వల్ల 2026 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 23,460 మేర తగ్గింది.వేతనాల పెంపు ఏప్రిల్ 1 నుంచే..ఏప్రిల్ 1 నుంచి తిరిగి వేతనాల పెంపును అమలు చేసే విధానానికి మళ్లినట్లు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సుదీప్ కున్నుమల్ తెలిపారు. గతేడాది ఇంక్రిమెంటు లభించని సీనియర్ సిబ్బంది ఈసారి అందుకోనున్నారు. టాప్ పర్ఫార్మర్లకు రెండంకెల స్థాయిలో పెంపు ఉంటుంది.టెక్నాలజీపై పెట్టుబడులకు ఆసక్తిసీక్వెన్షియల్గా వరుసగా మూడో క్వార్టర్లో వృద్ధిని సాధించాం. స్థూల ఆర్థిక పరిస్థితుల రీత్యా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ, టెక్నాలజీపై కస్టమర్లు పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మాకు ఇది సానుకూలాంశంగా ఉంటుంది. – కె. కృతివాసన్, టీసీఎస్ సీఈవో, ఎండీ
ఐటీ కంపెనీలు ‘వార్న్’ నోటీసులు.. ఇచ్చాయంటే..
అంతర్జాతీయ ఐటీ రంగంలో మళ్లీ కుదుపు మొదలైంది. ముఖ్యంగా అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ ఐటీ దిగ్గజ సంస్థలు ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నాయి. కృత్రిమ మేధ (AI) వినియోగం పెరగడం, క్లయింట్ల నుంచి వ్యయ నియంత్రణ ఒత్తిడి ఎక్కువవ్వడంతో ఆన్సైట్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.ఏమిటీ ‘వార్న్’ నోటీసులు?అమెరికా చట్టాల ప్రకారం.. 100 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీలు, ఒకేసారి 50 మందికి పైగా సిబ్బందిని తొలగించాలన్నా లేదా కార్యాలయాన్ని మూసివేయాలన్నా 60 రోజుల ముందే సమాచారం ఇవ్వాలి. దీనినే 'వర్కర్ అడ్జస్ట్మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్' (WARN) అంటారు. తాజాగా భారతీయ కంపెనీలు వివిధ రాష్ట్రాల్లో దాఖలు చేస్తున్న ఈ నోటీసులు ఐటీ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.2026లో పెరిగిన కోతలు: గణాంకాలను పరిశీలిస్తే, 2025 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2026 తొలి మూడు నెలల్లోనే అత్యధికంగా ఉద్యోగాల తొలగింపులు జరిగినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.పెద్ద ఒప్పందాల ప్రభావం: గతంలో కుదుర్చుకున్న 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన భారీ ఒప్పందాల పునర్నిర్మాణం (Restructuring) వల్ల ఎక్కువ మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు.ముందు వరుసలో దిగ్గజాలు: జనవరి-మార్చి మధ్య కాలంలో ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందూజా గ్లోబల్ సర్వీసెస్ వంటి సంస్థలు ఫ్లోరిడా, టెక్సాస్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో వార్న్ నోటీసులు ఇచ్చాయి.గత ఏడాది పరిస్థితి: 2024లో జెన్పాక్ట్, హెచ్సీఎల్, టీసీఎస్ వంటి సంస్థలు కేవలం నాలుగు నోటీసులు మాత్రమే ఇవ్వగా, 2025లో జెన్పాక్ట్ విస్కాన్సిన్లో నోటీసులు జారీ చేసింది. కానీ, ప్రస్తుత ఏడాదిలో ఈ ధోరణి వేగవంతమైంది.ఏఐ, క్లయింట్ల ఒత్తిడిసాంకేతికత మారుతున్న కొద్దీ కంపెనీలు పాత పద్ధతులకు స్వస్తి పలుకుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్వీకరణ పెరగడంతో, క్లయింట్లు తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేయాలని ఐటీ సంస్థలపై ఒత్తిడి తెస్తున్నారు. దీనివల్ల ఆన్సైట్లో ఉన్న ఉద్యోగులను తగ్గించుకోవడం లేదా రీస్ట్రక్చరింగ్ చేయడం కంపెనీలకు తప్పనిసరి అవుతోంది.తొలగింపులే కాకపోవచ్చుఅన్ని వార్న్ నోటీసులు నేరుగా ఉద్యోగ తొలగింపులే కాకపోవచ్చు. ఉదాహరణకు, ఫిబ్రవరిలో ఇన్ఫోసిస్ BPM విభాగం 248 మంది ఉద్యోగుల కోసం నోటీసు ఇచ్చింది. అయితే వీరు ఇన్ఫోసిస్ క్లయింట్ అయిన 'వాన్గార్డ్' సంస్థకు తిరిగి వెళ్తున్నట్లు వెల్లడైంది.మరోవైపు, టెక్ దిగ్గజం ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిని తొలగించగా, అందులో భారత్కు చెందిన 10,000 మంది ఉండటం గమనార్హం. తెల్లవారుజామున ఈమెయిల్స్ ద్వారా ఉద్యోగులకు సమాచారం పంపుతూ కంపెనీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఏఐ స్కిల్స్పై స్కాలర్షిప్ టెస్ట్
తెలంగాణకు చెందిన స్టార్టప్ 'కాగ్నిటివ్స్కోర్.ఏఐ' విద్యను మార్కుల ఆధారిత మూల్యాంకనం నుండి మేధోశక్తి వైపు మళ్లించే లక్ష్యంతో 'కాగ్నిచాంప్ ఇండియా స్కాలర్షిప్ — తెలంగాణ ఎడిషన్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కీర్తి కుమార్ జైన్, విక్రమ్ సింగ్ నేగి స్థాపించిన ఈ కార్యక్రమం, ఏఐ-ఆధారిత ప్రపంచంలో అవసరమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలను గుర్తించి, పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.3 నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ స్కాలర్షిప్లో, 20 నిమిషాల ఆన్లైన్, గేమిఫైడ్, అడాప్టివ్ అసెస్మెంట్ ఉంటుంది. ఇది మే 2 లేదా 3, 2026న జరగనుంది. దీనికి రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 26న ముగుస్తాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇందులో పాల్గొనడం ఉచితం కాగా, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు రూ.499 చెల్లించి నమోదు చేసుకోవచ్చు.సాంప్రదాయ పరీక్షలకు భిన్నంగా, కాగ్నిచాంప్ మేధోశక్తి, ఉన్నత స్థాయి ఆలోచనా సామర్థ్యం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, ఇంకా సృజనాత్మకత, సమస్య పరిష్కారం వంటి 21వ శతాబ్దపు కీలక నైపుణ్యాలను మూల్యాంకనం చేస్తుంది. దీని ద్వారా విద్యార్థులు గుర్తింపు, 12వ తరగతి వరకు 100% ట్యూషన్ ఫీజు మద్దతుతో కూడిన స్కాలర్షిప్లు, వారి బలాబలాలపై వ్యక్తిగత అంతర్దృష్టుల వంటి అవకాశాలను పొందుతారు.ఈ కార్యక్రమం, జాతీయ విద్యా విధాన చట్రానికి అనుగుణంగా, విద్యార్థుల అభ్యసనం, అభివృద్ధిపై పాఠశాలలకు, తల్లిదండ్రులకు ఆచరణాత్మకమైన అంతర్దృష్టులను కూడా అందిస్తుంది. ఈ ప్రారంభంతో, భారతదేశంలో భవిష్యత్తుకు సిద్ధమైన, జ్ఞానాత్మక ఆధారిత విద్యలో అగ్రగామిగా నిలవాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుంది.
పర్సనల్ ఫైనాన్స్
విదేశీ చెల్లింపులపై కస్టమర్లకు వెంటనే సమాచారం
ముంబై: విదేశాల నుంచి భారత్లోని ఖాతాలకు వచ్చే సీమాంతర చెల్లింపులపై (జమలు) ఖాతాదారులకు వెంటనే సమాచారం (నోటిఫికేషన్) ఇవ్వాలని బ్యాంక్లకు ఆర్బీఐ ఆదేశించింది. ఇందుకు వీలుగా తమ ప్రక్రియలను క్రమబద్దీకరించుకోవాలని సూచించింది. ఖాతాలో జమ అయిన వెంటనే కస్టమర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది.ఫారెక్స్ మార్కెట్ పనిచేయని వేళ్లలో వచ్చే చెల్లింపుల విషయాన్ని మరుసటి రోజు తెలియజేయాలని కోరింది. బ్యాంకులు తమ విదేశీ ఖాతాల లావాదేవీలను గరిష్టంగా ఒక గంటలోపే పరిశీలించి సరిచూడాలని ఆదేశించింది. ఫారీన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ పనివేళ్లలో వచ్చే చెల్లింపులను మాత్రం అదే రోజు జమ చేయాలని పేర్కొంది. ఇందుకు వీలుగా వ్యవస్థలను సరిచేసుకోవాలని సూచించింది.2025 అక్టోబర్ 29న జారీ చేసిన ముసాయిదా నిబంధనలపై భాగస్వాముల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ నిబంధనలను ఆర్బీఐ జారీ చేసింది. ఇవి ఆరు నెలల తర్వాత నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం సీమాంతర చెల్లింపులకు సంబంధించి సమాచారం అందించిన వెంటనే, ఆ మొత్తాన్ని తక్షణమే సంబంధిత లబ్దిదారు ఖాతాలో జమ చేయనప్పటికీ, కస్టమర్లకు వెంటనే ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.
పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు
సంపాదించే ప్రతి వ్యక్తి తన భవిష్యత్తు కోసమో, తన కుటుంబం భవిష్యత్తు కోసమో ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. అయితే రిస్క్తో కూడిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు అందరూ చేయలేరు. అలాంటి వారి కోసం రిస్క్ లేకుండా మెరుగైన రాబడినిచ్చే అనేక పొదుపు పథకాలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. ఆయా స్కీములు ఏంటి.. వాటికి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. తెలుసుకుందాం..2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. సురక్షితమైన పెట్టుబడితో పాటు ఆకర్షణీయమైన రాబడులు ఇచ్చే ప్రధాన పథకాల వివరాలు ఇలా ఉన్నాయి..సుకన్య సమృద్ధి యోజన: ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకం ప్రస్తుతం అత్యధిక వడ్డీని అందిస్తోంది. దీర్ఘకాలిక అవసరాలకు ఇది ఉత్తమ ఎంపిక. దీనికి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: వృద్ధులకు సామాజిక భద్రత కల్పిస్తూ, సుకన్య సమద్ధితో సమానంగా అత్యధిక 8.2% వడ్డీని అందిస్తోంది.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పథకం. దీనిపై ప్రస్తుతం 7.1% వడ్డీ లభిస్తోంది.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకం స్థిరమైన, సురక్షితమైన రాబడులకు గ్యారెంటీ ఇస్తుంది. దీనిపై అందిస్తున్న వడ్డీ 7.7 శాతం.కిసాన్ వికాస్ పత్ర (KVP): తమ పెట్టుబడిని నిర్ణీత కాలంలో రెట్టింపు చేసుకోవాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ప్రస్తుత రేటు ప్రకారం 115 నెలల్లో నగదు రెట్టింపు అవుతుంది. దీని వడ్డీ రేటు 7.5%.మంత్లీ ఇన్కమ్మ్ స్కీమ్ (MIS): ఒకేసారి పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం అనువైనది. దీనికి 7.4% వడ్డీ లభిస్తుంది.టైమ్ డిపాజిట్లు & రికరింగ్ డిపాజిట్లుబ్యాంకు ఎఫ్డీలతో పోలిస్తే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు గట్టి పోటీనిస్తున్నాయి. కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..కాలపరిమితివడ్డీ రేటు (%)ఏడాది టైమ్ డిపాజిట్6.9రెండేళ్ల టైమ్ డిపాజిట్7.0మూడేళ్ల టైమ్ డిపాజిట్7.1ఐదేళ్ల టైమ్ డిపాజిట్7.55 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ (RD)6.7సాధారణ సేవింగ్స్ డిపాజిట్లపై యథావిధిగా 4 శాతం వడ్డీ కొనసాగుతోంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకాలు సామాన్యులకు పెట్టుబడి సాధనాలుగా నిలుస్తున్నాయి.
స్మాల్ సేవింగ్స్ వడ్డీ రేట్లు ఇలా..
చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లు వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ యథాతథంగా కొనసాగనున్నాయి. 2026–27 సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వివిధ స్కీమ్లపై ఎంత వడ్డీ వస్తుందో చూద్దాం..➤ సుకన్య సమృద్ధి యోజన: 8.2 శాతం➤ పీపీఎఫ్: 7.1 శాతం➤ సేవింగ్స్ డిపాజిట్ రేటు: 4 శాతం➤ కిసాన్ వికాస్ పత్ర: 7.5 శాతం➤ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: 7.7 శాతం➤ మంత్లీ ఇన్కమ్ స్కీమ్: 7.4 శాతం➤ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: 8.2 శాతం➤ ఏడాది టైమ్ డిపాజిట్: 6.9 శాతం➤ రెండేళ్ల టైమ్ డిపాజిట్: 7 శాతం➤ మూడేళ్ల టైమ్ డిపాజిట్: 7.1 శాతం➤ ఐదేళ్ల టైమ్ డిపాజిట్: 7.5 శాతం➤ ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ): 6.70 శాతం
పెళ్లి ఆగిపోయినా.. ఖర్చు మిగిలిపోదు!
భారతదేశంలో వివాహం అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, అదొక భారీ వేడుక. లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసే ఈ వేడుకలు, ఏదైనా అనుకోని కారణంతో ఆగిపోతే ఆ కుటుంబాలు ఆర్థికంగా కోలుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచేందుకు ఇప్పుడు 'వెడ్డింగ్ ఇన్సూరెన్స్' (Wedding Insurance)అందుబాటులోకి వచ్చింది.ఏమేమి కవర్ అవుతాయి?సాధారణంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రధానంగా నాలుగు అంశాల్లో రక్షణ కల్పిస్తాయి..క్యాన్సిలేషన్ లేదా వాయిదా: ప్రకృతి వైపరీత్యాలు (భారీ వర్షాలు, వరదలు), ఆకస్మిక అగ్నిప్రమాదాలు లేదా వధూవరుల కుటుంబాల్లో ఎవరైనా మరణించడం వంటి కారణాలతో పెళ్లి ఆగిపోతే, ఇప్పటికే చెల్లించిన అడ్వాన్స్లను బీమా కంపెనీ చెల్లిస్తుంది.ఆస్తి నష్టం: ఫంక్షన్ హాల్లో అగ్నిప్రమాదం జరిగి ఆస్తికి నష్టం వాటిల్లినా లేదా దొంగతనం జరిగినా బీమా వర్తిస్తుంది.వ్యక్తిగత ప్రమాదాలు: వేడుక సమయంలో వధూవరులకు లేదా పాలసీలో పేర్కొన్న కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగితే వైద్య ఖర్చులు భరిస్తుంది.పబ్లిక్ లయబిలిటీ: పెళ్లికి వచ్చిన అతిథులకు ఏదైనా ప్రమాదం జరిగినా లేదా మూడవ పక్షానికి నష్టం జరిగితే ఈ పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.వధూవరుల్లో ఒకరు తప్పుకుంటే బీమా వస్తుందా?ఇది చాలా మందికి ఉండే సందేహం. ఒకవేళ వధూవరుల్లో ఎవరో ఒకరు పెళ్లి వద్దని వెళ్ళిపోతే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? దీనికి సమాధానం 'లేదు'. వధూవరుల మధ్య గొడవలు రావడం, ఒకరు మరొకరిని ఇష్టం లేక వదిలేయడం (Cold Feet) వంటి కారణాలకు బీమా కంపెనీలు పరిహారం ఇవ్వవు. అలాగే యుద్ధం, ఉగ్రవాద దాడులు లేదా వధూవరుల నిర్లక్ష్యం వల్ల జరిగే నష్టాలకు కూడా బీమా వర్తించదు.ప్రీమియం ఎంత ఉంటుంది?వివాహ బడ్జెట్ను బట్టి ఈ పాలసీ ప్రీమియం నిర్ణయిస్తారు. సాధారణంగా పెళ్లి మొత్తం ఖర్చులో 0.7 శాతం నుంచి 2 శాతం వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే, రూ. 20 లక్షల బడ్జెట్తో పెళ్లి చేసుకుంటున్న వారు దాదాపు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల మధ్య ప్రీమియం చెల్లించి సురక్షితం కావచ్చు.బీమా అందించే సంస్థలుభారతదేశంలో ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ ఎర్గో (HDFC ERGO), ఐసీఐసీఐ లాంబార్డ్ (ICICI Lombard), బజాజ్ అలియంజ్ (Bajaj Allianz), ఫ్యూచర్ జనరాలి (Future Generali) వంటి సంస్థలు ఈ వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. పెళ్లి కార్డు ప్రింటింగ్ నుంచి క్యాటరింగ్, వెన్యూ బుకింగ్ వరకు అన్నిటికీ రసీదులు (Invoices) ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ సులభతరం అవుతుంది.లక్షల రూపాయల ఖర్చుతో కూడిన శుభకార్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు, స్వల్ప ప్రీమియంతో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఆర్థిక భద్రతతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారంపై తీపి కబురు.. రెండు రోజులే గ్యాప్..


