Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

EPF Interest Rate 8 25 Percent How Much Will Rs 1 Lakh Earn in a Year1
PF ఖాతాలో రూ.లక్ష ఉంటే.. ఎంత వడ్డీ వస్తుందంటే?

2025-26 సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును మునుపటి మాదిరిగానే 8.25 శాతం వద్దనే ఉంచారు. ఈపీఎఫ్ఓ తన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తరువాత.. వడ్డీ రేటు చందాదారుల ఖాతాల్లోకి జమ అవుతుంది.వడ్డీ రేటు 8.25 శాతం వద్ద ఉన్నప్పుడు.. పీఎఫ్ ఖాతాలో ఒక ఒక లక్ష రూపాయలు ఉంటే ఎంత మొత్తం ఎంత వడ్డీ వస్తుందనే విషయాన్ని గమనిస్తే.. 2026 మార్చి 31 నాటికి ఖాతాలో రూ. 1 లక్ష ఉంటే రూ. 8250 (8.25 శాతం) వడ్డీ వస్తుంది. అంటే మొత్తం రూ. 1,08,250 అవుతుంది. ఆ తరువాత ఏడాది కూడా ఇదే వడ్డీ ఉంటే.. ఆ మొత్తంపై కూడా వడ్డీ పెరుగుతుంది.ఒకవేళా రూ. 5 లక్షలు పీఎఫ్ ఖాతాలో ఉంటే.. వడ్డీ రూ.41250 జమ అవుతుంది. ఖాతాలో రూ. 10 లక్షలు ఉంటే రూ. 82500 వడ్డీ వస్తుందన్నమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఖాతాలో ఉన్న డబ్బుకు మాత్రమే వడ్డీ వస్తుంది. అంటే ఏడాది మధ్యలో అకౌంట్ నుంచి మీరు విత్‌డ్రా చేసుకుంటే.. మిగిలిన మొత్తానికి వడ్డీ జమ అవుతుంది.పీఎఫ్ వడ్డీ రేటు గతంలో..నిజానికి 2024లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), చందాదారులకు 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతం వడ్డీని అందించింది. ఆ తరువాత వడ్డీ రేటును తగ్గించి 2016-17లో 8.65 శాతం & 2017-18లో 8.55 శాతం అందించింది. 2020-21లో 8.5 శాతం వద్ద ఉన్న వడ్డీ రేటును 2021-22 సంవత్సరానికి 8.10 శాతంగా నిర్ణయించారు. 2022-23లో 8.15 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2023-24కి స్వల్పంగా 8.25 శాతానికి పెంచింది. ఇప్పుడు కూడా అదే వడ్డీ రేటు కొనసాగుతోంది.ఇదీ చదవండి: మరో ఫ్లాట్‌ అమ్మేసిన ప్రీతిజింటా.. ఈసారి ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Dubai Real Estate on Edge Amid Rising Geopolitical Tensions2
రికార్డుల రియల్‌ ఎస్టేట్‌.. ఇప్పుడంతా టెన్షన్‌!

స్థిరాస్తి రంగం లావాదేవీలలో అత్యంత ప్రధానమైంది సెంటిమెంట్‌. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఎవరైనా సరే.. వారి భావోద్వేగాలపై ప్రభావం పడిందంటే చాలు తుది నిర్ణయానికి పునరాలోచనలో పడతారు. ఏ దేశ స్థిరాస్తి రంగంలోనైనా ఇదే పరిస్థితి. ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలలో యుద్ధం నేపథ్యంలో ప్రధానంగా దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం అనిశ్చితిలో పడింది. గతేడాది దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 2.70 లక్షలకు పైగా స్థిరాస్తి లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 917 బిలియన్‌ ఏఈడీ. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ.2,30,872 కోట్లు. దుబాయ్‌ రియల్టీ చరిత్రలో ఇదే అత్యధిక లావాదేవీలు కావడం గమనార్హం. – సాక్షి, సిటీబ్యూరో అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు ఇరాన్‌పై మొదలు పెట్టిన యుద్ధం క్రమంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌(యూఏఈ) దేశాలకు విస్తరించింది. దీంతో స్థిరాస్తి పెట్టుబడిదారులు ప్రపంచంలోని అత్యంత డైనమిక్‌ ప్రాపర్టీ మార్కెట్లలో ఒకటైన దుబాయ్‌లో ప్రాంతీయ అస్థిరత దెబ్బతింటుందా అనే సందిగ్ధంలో పడిపోయారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను తాత్కాలికంగా ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.2008 ఆర్థిక సంకోభం, కరోనా మహమ్మారి కాలంలో దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ షాక్‌కు గురైంది. కాకపోతే విధానపరమైన సంస్కరణలతో ఆయా విపత్కర పరిస్థితుల నుంచి వేగవంతంగా కోలుకుంది. అయితే ఈసారి దుబాయ్‌ కూడా ఎదురుదాడికి దిగడంతో పశ్చిమాసియా దేశాల్లో సురక్షిత ఆర్థిక కేంద్రమైన ఎమిరేట్స్‌లో భౌతిక నష్టం పరిమితమే అయినప్పటికీ.. ప్రపంచ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం తప్పక ఉంటుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.భారతీయుల పెట్టుబడులు ఎందుకంటే? 150 దేశాల పెట్టుబడిదారులు యూఏఈ ప్రాపర్టీ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. యూఏఈ జనాభాలో దాదాపు 88–89 శాతం మంది ప్రవాసులు ఉంటారు. దీంతో సహజంగానే ఇక్కడ ప్రాపర్టీ మార్కెట్‌లో వీరిదే హవా.. భౌగోళిక సామీప్యత, డాలర్‌ కంటే దిర్హమ్‌ స్థిరత్వం, ఎక్కువ విలువ, అద్దె రాబడులు అధికంగా ఉండటం వంటి కారణంగా భారతీయులు దుబాయ్‌లో పెట్టుబడులకు మొగ్గు చూపిస్తుంటారు. భారత సంతతికి చెందిన డెవలపర్ల వాటా నిర్మాణ దశలోని ప్రాజెక్ట్‌లలో 8–10 శాతం వరకు ఉంటుంది.మన ఇన్వెస్ట్‌మెంట్‌ విలువ రూ.2,30,872 కోట్లు.. ప్రపంచదేశాలతో పోలిస్తే అత్యధిక అద్దె రాబడి వచ్చేది దుబాయ్‌లోనే.. ఇక్కడ అద్దె వార్షిక ఆదాయం 6–9 శాతం మధ్య ఉంటుంది. భారత్‌ అతిపెద్ద విదేశీ పెట్టుబడుల దేశం దుబాయ్‌. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఇండియన్స్‌ ఆస్తి కొనుగోళ్ల వాటా 20–22 శాతంగా ఉందని అనరాక్‌ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. 2021 నుంచి దుబాయ్‌లో గృహాల ధరలు సుమారు 60–75 శాతం మేర పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దుబాయ్‌లో దాదాపు 2 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. వీటి విలువ 538 బిలియన్‌ ఏఈడీ(ఇండియన్‌ కరెన్సీలో రూ.1,34,945 కోట్లు).ఆర్థిక సంకోభం, కోవిడ్‌ సమయంలో.. దుబాయ్‌ ప్రాపర్టీ మార్కెట్‌ గతంలోనూ చేదు అనుభవాలను చవిచూసింది. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దుబాయ్‌లో ప్రాపర్టీల ధరలు 50–60 శాతం మేర క్షీణించాయి. దీని నుంచి కోలుకునేందుకు 6–7 ఏళ్ల కాలం పట్టింది. చమురు ధరల పతనం, అధిక సరఫరా కారణంగా 2014, 2019లలో ఇక్కడ ధరలు దాదాపు 25–30 శాతం మేర తగ్గాయి. ఇక, ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్‌ మహమ్మారి కాలంలో ప్రాపర్టీ మార్కెట్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. అద్దెలపై ప్రభావం.. సాధారణంగా దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రవాసులపై అధికంగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాపర్టీ ఇన్వెస్టర్లు తాత్కాలికంగా వేచి చూసే ధోరణి అవలంబిస్తారు. ఇలాంటి సెంటిమెంట్‌ ప్రభావం తొలుత నిర్మాణ ప్రారంభ దశలో కొనుగోళ్ల, ఊహాజనిత పెట్టుబడులపై చూపిస్తాయి. ఎందుకంటే ఈ విభాగాలు మార్కెట్‌ సెంటిమెంట్, విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటాయి. అలాగే యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల పర్యాటక పరిశ్రమ దెబ్బతింటుంది. దీంతో పర్యాటక ప్రాంతాల్లోని అద్దెలు, ఆతిథ్య ప్రాపర్టీలు, రిటైల్‌ ఆస్తులపై తాత్కాలిక ప్రభావం ఉంటుంది.

US Vows No Repeat of China Trade Mistakes with India Nears trade deal Final Stage3
‘చైనాతో చేసిన పొరపాటు భారత్‌తో చేయం’

రెండు దశాబ్దాల క్రితం చైనా విషయంలో చేసిన వాణిజ్యపరమైన తప్పులను భారత్ విషయంలో పునరావృతం చేయబోమని అమెరికా స్పష్టం చేసింది. భారత్‌తో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకున్న తరుణంలో అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ‘రైసినా డైలాగ్ 2026’ వేదికగా ఆయన ఇరు దేశాల ఆర్థిక సంబంధాలపై ప్రసంగం చేశారు.చైనా అనుభవాలే గుణపాఠం‘20 ఏళ్ల క్రితం చైనాకు మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి ఆ దేశాన్నే మాకు పోటీగా మార్చిన పొరపాటును భారత్ విషయంలో చేయం’ అని లాండౌ కుండబద్ధలు కొట్టారు. అమెరికా ప్రభుత్వం తన ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, అందుకే భారత్‌తో కుదుర్చుకోబోయే ఏ ఒప్పందమైనా పరస్పర ప్రయోజనం ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేశారు. తానేమీ ఇక్కడ సామాజిక సేవ చేయడానికి రాలేదని, అమెరికా ప్రయోజనాలే తమకు పరమావధి అని వ్యాఖ్యానించారు.ఊగిసలాటలో వాణిజ్య ఒప్పందం?భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ముగింపు దశలో ఉందని లాండౌ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ ఇటీవలి పరిణామాలు ఒప్పందాన్ని మరింత జాప్యం చేసే దిశగా ఉన్నాయి. ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన రెసిప్రోకల్ టారిఫ్‌లు చెల్లవని తీర్పునిచ్చింది. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్త దిగుమతులపై 10% నుంచి 15% వరకు అదనపు సర్‌ఛార్జీని విధించింది. గతంలో భారతీయ వస్తువులపై ఉన్న 25% సుంకాన్ని ఒప్పందం ద్వారా 18%కి తగ్గిస్తామని అమెరికా ఆశ చూపేది. కానీ ప్రస్తుతం అందరికీ వర్తించే సుంకం 10%కి తగ్గడంతో అమెరికా ఆఫర్‌కు ఉన్న ప్రాధాన్యత తగ్గింది.

New Dimensions of Trust in Indian Banking4
‘భారతీయ బ్యాంకింగ్‌పై నమ్మకం’లో కొత్త కోణాలు

చిరకాలంగా బ్యాంకింగ్ రంగంలో నమ్మకమనేది కీలకాంశంగా ఉంటోంది. అయితే ఆ నమ్మకం కలిగే ప్రక్రియ ఇప్పుడు మారుతోంది. నేటి కస్టమర్ల దగ్గర మరింత సమాచారం ఉంటోంది. వారు మరింతగా కనెక్ట్ అయి ఉంటున్నారు. తమకు అందుబాటులో ఉన్న ఆప్షన్ల గురించి కూడా అవగాహన పెరిగింది. కాబట్టి, ఇప్పుడు వారు బ్యాంకుల నుంచి కేవలం ఆర్థిక తోడ్పాటును మాత్రమే కాకుండా, విశ్వసనీయత, జవాబుదారీతనం, నిలకడైన నిరంతర సేవలను కూడా ఆశిస్తున్నారు.ఆర్థిక రంగ సంస్కరణల తర్వాతి కాలంలో బ్యాంకింగ్ రంగం ప్రధానంగా బ్యాంకింగ్ సేవలను ఎక్కువ మందికి చేరవేయడంపై దృష్టి పెట్టింది. మరింత మంది ప్రజలను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమనేది ఆర్థిక, సామాజిక పరంగా ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఈ దిశగా గణనీయమైన పురోగతి కూడా సాధించబడింది. ఇప్పుడు బ్యాంకింగ్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో, కస్టమర్లు మరో ముఖ్య అంశాన్ని కోరుకుంటున్నారు. అదేమిటంటే, మారుతున్న పరిస్థితుల్లో కూడా తమ బ్యాంక్ ఆధారపడే విధంగానే ఉంటుందని, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందనే ఓ నమ్మకాన్ని వారు కోరుకుంటున్నారు.విశ్వాసానికి మారుతున్న పునాదులుకొన్ని సంవత్సరాల క్రితం వరకు బ్యాంకులపై విశ్వాసం ప్రధానంగా భౌతిక ఉనికితో అనుసంధానమై ఉండేది. దగ్గరలో ఉన్న బ్రాంచ్, చిరపరిచితమైన సిబ్బంది, స్థిరమైన ప్రక్రియలు కస్టమర్లకు భరోసా కలిగించేవి. స్థిరత్వమే విశ్వాసానికి ఆధారంగా ఉండేది.టెక్నాలజీ అభివృద్ధితో బ్యాంకింగ్ రంగం మారిన తర్వాత సౌలభ్యమనేది కూడా కస్టమర్ల ప్రాధాన్యతల్లో కీలకంగా మారింది. వేగవంతమైన లావాదేవీలు, సులభమైన ప్రక్రియలు రోజువారీ బ్యాంకింగ్‌ను సులభతరం చేశాయి. అయితే కాలక్రమేణా ఇవి ప్రత్యేతలుగా కాకుండా సర్వసాధారణంగా ఆశించే సేవలుగా మారిపోయాయి.ఇప్పుడు కస్టమర్లు బ్యాంకింగ్ సేవలనేవి ఎప్పుడు కావాలంటే అప్పుడు సాధారణంగా అందుబాటులోనే ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి దృష్టి ఇప్పుడు విశ్వసనీయ వ్యవస్థలవైపు మళ్లింది. బ్యాంకింగ్ సిస్టమ్‌లు సజావుగా పనిచేయాలి. కస్టమర్ సమాచారం భద్రంగా ఉండాలి. సంస్థలు కార్యకలాపాల్లో క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటున్నారు.దీనితో భద్రత అనే భావన పరిధి కూడా పెరిగింది. బ్యాంక్ ఆర్థికంగా పటిష్టంగా ఉండటం ముఖ్యమే. అదే సమయంలో మోసాల నివారణ, వ్యక్తిగత డేటా రక్షణ, సమస్యలు తలెత్తినప్పుడు వేగంగా స్పందించడంలాంటి బ్యాంకింగ్ సామర్థ్యాలపై కూడా కస్టమర్లు దృష్టి పెడుతున్నారు.రుణ లభ్యత పెరగడం కూడా కస్టమర్ల అంచనాలను ప్రభావితం చేసింది. రుణాల మంజూరులో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం, వడ్డీ మరియు ఛార్జీల్లో పారదర్శకత ఉండటం, రిస్క్‌ను సమగ్రంగా అంచనా వేయడం వంటి అంశాల విషయంలో బ్యాంకుల నుంచి కస్టమర్లు భరోసాను కోరుకుంటున్నారు. బ్యాంకులు వ్యాపార వృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టడం కాకుండా తాము సేవలందించే కస్టమర్ల దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి కూడా మద్దతుగా నిలిచేలా ఉండాలని ఈ అంశాలు సూచిస్తాయి.ఇలాంటి పరిస్థితుల్లో విశ్వసనీయత, వివేచన, స్థిరత్వాన్ని బట్టి నమ్మకం నిలిచి ఉంటుంది.డిజిటల్ పురోగతి - కస్టమర్ అవగాహనభారత్‌లో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి రోజువారీ బ్యాంకింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే చెల్లింపులు పూర్తి చేయవచ్చు. ఎక్కడో దూరంగా ఉండి కూడా ఖాతాలు తెరవొచ్చు. రుణాలపై నిర్ణయాలు కూడా గతంతో పోలిస్తే చాలా వేగంగా తెలియజేయవచ్చు. ఇలాంటి పురోగతి వల్ల వ్యక్తులు, వ్యాపారాలకు ఆర్థిక అంశాల నిర్వహణ మరింత సులభమైంది.అయితే ఈ అభివృద్ధితో పాటు కస్టమర్లలో సైబర్ భద్రత అంశాలపై కూడా అప్రమత్తత పెరుగుతోంది. మోసాలు, డేటా లీక్ ఘటనలు భద్రత చర్యల ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాయి. కేవలం సౌలభ్యం మాత్రమే కస్టమర్లకు భరోసా కలిగించడం లేదు. భద్రత, సన్నద్ధత కూడా అంతే ముఖ్యమైనదిగా ఉంటోంది.ఇప్పుడు బ్యాంకులు డిజిటల్ సేవలు అందించగలవా లేదా అనే విషయం గురించి కస్టమర్లు ప్రశ్నించడం లేదు. బ్యాంకులు రిస్క్‌లను ఎంత సమర్ధవంతంగా ముందుగానే గుర్తిస్తున్నాయి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తున్నాయి అనే అంశాలను గమనిస్తున్నారు. అసాధారణ లావాదేవీలపై తక్షణ అలర్ట్‌లు, అవసరమైన సమయంలో సత్వర సహాయం, ఖాతాలను భద్రంగా ఉంచే స్పష్టమైన విధానాలు కస్టమర్ల విశ్వాసాన్ని నిలబెట్టడంలో కీలకంగా మారుతున్నాయి.దీర్ఘకాలిక నమ్మకాన్ని పెంపొందించుకునే సంస్థలు టెక్నాలజీతో పాటు బాధ్యత కూడా పెరుగుతుందని గుర్తిస్తున్నాయి. అందువల్ల డిజిటల్ సామర్థ్యాల విస్తరణతో పాటు పర్యవేక్షణ వ్యవస్థలు, భద్రతా చర్యలు, స్పందనా విధానాలను పటిష్టం చేసుకోవడంపై కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ యుగంలో నమ్మకమనేది అప్రమత్తత, పారదర్శకత, జవాబుదారీతనంపై ఆధారపడి ఉంటుంది.ముందున్న దారిగత దశాబ్దకాలంలో భారత బ్యాంకింగ్ రంగం స్థిరంగా విస్తరించింది. బ్యాంకింగ్ సేవల లభ్యత విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు నిర్ణయాల నాణ్యతపై దృష్టి పెరుగుతోంది. ముఖ్యంగా కీలక సమయాల్లో బ్యాంకులు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నాయనేది కస్టమర్లు నిశితంగా గమనిస్తున్నారు.కొన్ని సందర్భాల్లో బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ అంటే కొంత నిగ్రహం పాటించడం కూడా అవుతుంది. ఉదాహరణకు రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే రుణాన్ని నిరాకరించడం, భారీ లావాదేవీల ముందు అదనపు ధృవీకరణ చేపట్టడం, లేదా నిర్దిష్ట ఆర్థిక ఉత్పత్తి అనేది కస్టమర్ పరిస్థితులకు ఎందుకు అనుకూలం కాదనే విషయాన్ని స్పష్టంగా వివరించడంలాంటి చర్యలు అవసరం కావచ్చు. ఇలాంటి నిర్ణయాలు తాత్కాలికంగా వ్యాపార విస్తరణ వేగాన్ని నెమ్మదింపచేసినా, అవి సంస్థల బాధ్యతాయుతమైన వైఖరికి నిదర్శనంగా నిలుస్తాయి. దీర్ఘకాలంలో కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొనేందుకు తోడ్పడతాయి. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్యాంకు సమతుల్యతతో, స్థిరంగా వ్యవహరిస్తుందనే నమ్మకాన్ని పెంచుతుంది.మొత్తంగా చూస్తే విశ్వాసమనేది మాటలతో కాదు, రోజువారీ తీసుకునే చర్యలతోనే ఏర్పడుతుంది. న్యాయబద్ధంగా ఉంటూ, క్రమశిక్షణ, బాధ్యతతో వ్యవహరించే బ్యాంకులు మాత్రమే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలవు. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కూడా అవి తోడ్పడతాయి.- హితేంద్ర నాథ్ ఝా, హెడ్ - రిటైల్ లయబిలిటీస్, టీఏఎస్‌సీ & టీపీపీ, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

Gold Stranded in Dubai Sold at Discount5
బంగారంపై భారీ డిస్కౌంట్‌.. అమ్మేసుకుంటున్న వ్యాపారులు

మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో దుబాయ్‌లో బంగారాన్ని భారీ తగ్గింపుతో అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన రవాణా తీవ్రంగా ప్రభావితమవడంతో, కీలకమైన బులియన్ ట్రేడింగ్ హబ్ అయిన దుబాయ్ నుంచి బంగారం సరఫరా దెబ్బతింది.విమానాలపై ఆంక్షలు, పెరిగిన షిప్పింగ్, బీమా ఖర్చుల నేపథ్యంలో చాలా మంది కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లను ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. వెంటనే డెలివరీకి హామీ లేకపోవడంతో అదనపు ఖర్చులు చెల్లించడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో నిల్వ, నిధుల ఖర్చులను భరించాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు వ్యాపారులు లండన్ గ్లోబల్ బెంచ్‌మార్క్ ధరతో పోలిస్తే ఔన్స్‌కు సుమారు 30 డాలర్ల వరకు తగ్గింపుతో బంగారాన్ని అందిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.ఈ వారం మధ్య నుంచి కొంతమేర బంగారం విమానాల్లో లోడ్ చేసి దుబాయ్ నుంచి పంపించినప్పటికీ, శుక్రవారం నాటికి చాలా సరుకు రవాణా ఆలస్యమైందని ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ ముఖ్యంగా దుబాయ్.. ఆసియా దేశాలకు బంగారం శుద్ధి చేసి ఎగుమతి చేసే ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే స్విట్జర్లాండ్‌, యూకే, కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం కూడా దుబాయ్ ద్వారా రవాణా అవుతుంది. అయితే టెహ్రాన్‌కు, అమెరికా-ఇజ్రాయెల్‌కు మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గగనతలం పాక్షికంగా మూతపడింది.ఇది చదివారా? 👉 స్తంభించిన దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌!సాధారణంగా బంగారాన్ని ప్రయాణికుల విమానాల కార్గో విభాగాల్లో తరలిస్తారు. ప్రస్తుతం యూఏఈ నుంచి విమానాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి వస్తోంది. అయితే భూసరిహద్దులు దాటేటప్పుడు భద్రతా సమస్యలు ఉండటంతో సౌదీ అరేబియా లేదా ఒమాన్ విమానాశ్రయాలకు భూభాగం మీదుగా అధిక విలువ గల సరుకులను తరలించడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు.

Retail Boom Fuels Hyderabad Real Estate Growth6
రిటైల్‌ ఫేమ్‌.. రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌!

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ ల్యాండ్‌స్కేప్‌ దాని సాంప్రదాయ కేంద్రాలకు మించి విస్తరిస్తోంది. కార్యాలయ స్థలాలు, నివాస, డేటా సెంటర్లు, పారిశ్రామిక లైఫ్‌ సైన్సెస్‌తో సహా వివిధ రంగాలు వృద్ధి కేంద్రాలుగా ఉద్భవిస్తున్నాయి. ఓ వైపు పశ్చిమ, మధ్య హైదరాబాద్‌లో బిజినెస్‌ హాట్‌స్పాట్‌లు నానాటికీ పెరుగుతున్నాయి. మరోవైపు రాబోయే 3–5 సంవత్సరాలలో తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందనున్నాయని, ఇవి గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్టాక్‌లో 12–15 శాతం, వార్షిక ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌లో 5–10 శాతం వాటా అందుకుంటాయని కొలియర్స్‌ నివేదిక పేర్కొంది. స్టార్టప్స్‌లోనూ టాప్‌.. హైదరాబాద్‌ వర్ధమాన వ్యవస్థాపకులకు కూడా కీలకమైన నగరంగా మారింది. 2014లో కేవలం 200 స్టార్టప్‌లు మాత్రమే నగరంలో ఉండగా, ఆ సంఖ్య 7,500కు పెరిగింది. ఈ పెరుగుదల నగరంలో వ్యాపార స్థలాలకు డిమాండ్‌ను అనూహ్యంగా పెంచేస్తోంది. అమెరికాకు చెందిన స్టార్టప్‌ పరిశోధన సంస్థ స్టార్టప్‌ జీనోమ్‌ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఆసియాలోనే స్టార్టప్‌లకు ఉత్తమ నగరాల్లో హైదరాబాద్‌ 19వ స్థానంలో నిలవడం గమనార్హం. లీజింగ్‌.. కింగ్‌.. రిటైల్, ఫ్యాషన్‌ వృద్ధికి దేశంలోని అగ్ర నగరాల్లో హైదరాబాద్‌ ఒకటిగా మారుతోంది. కుష్మాన్‌– వేక్‌ఫీల్డ్‌ తాజా రిటైల్‌ మార్కెట్‌ బీట్‌ రిపోర్ట్‌ ప్రకారం, 2025 మొదటి త్రైమాసికంలో 0.8 మిలియన్‌ చదరపు అడుగుల స్థలం రిటైల్‌ లీజింగ్‌ను సిటీ నమోదు చేసింది. 2024తో పోలిస్తే ఇది 106 శాతం పెరుగుదల కావడం విశేషం. మొత్తం జాతీయ రిటైల్‌ లీజింగ్‌లో 34 శాతంతో నగరాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది. దీనిలో ఎక్కువ భాగం జీవనశైలి ఉత్పత్తుల షాపింగ్‌కు సంబంధించినవి, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్, కొత్తపేట, కొంపల్లి వంటి కీలకమైన ప్రాంతాలలో కొలువుదీరుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement