Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Apple confirmed iPhones under active attack from spyware developers1
ఐఫోన్ యూజర్లకు యాపిల్ అత్యవసర హెచ్చరిక

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ వినియోగదారులకు ఒక అరుదైన, ముఖ్యమైన భద్రతా హెచ్చరికను జారీ చేసింది. కొంతమంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని అధునాతనమైన ‘స్పైవేర్’ దాడులు జరుగుతున్నట్లు కంపెనీ గుర్తించింది. ఈ దాడులు ఎంత శక్తివంతమైనవంటే, సాధారణ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల ద్వారా కూడా వీటిని పూర్తిగా నిరోధించడం యాపిల్‌కు సవాలుగా మారింది.ఏమిటీ దాడులు?ఇవి సాధారణంగా మనం చూసే వైరస్‌లు లేదా ఫిషింగ్ లింక్‌ల వంటివి కావు. ఇవి ‘జీరో-క్లిక్’ సాంకేతికతను ఉపయోగిస్తాయి. అంటే, వినియోగదారు ఎటువంటి లింక్‌ను క్లిక్ చేయకపోయినా, ఏ అటాచ్‌మెంట్‌ను ఓపెన్ చేయకపోయినా.. కేవలం ఒక మెసేజ్ రావడం ద్వారా లేదా బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ ద్వారా ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.సాధారణంగా ఇవి జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, కార్యకర్తలు, ఉన్నత స్థాయి అధికారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతుంటాయి. ఈ దాడులకు సంబంధించిన విషయాలు యాపిల్ సంస్థకు కూడా తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే వీటిని ప్యాచ్ చేసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోవచ్చు.ఐఓఎస్‌ 26 అప్‌డేట్ ఎందుకు ముఖ్యం?ప్రస్తుతం యాపిల్ తన అత్యంత సురక్షితమైన ఐఓఎస్‌ 26 వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఇది ఐఫోన్ 11, ఆపై మోడళ్లలో మాత్రమే అనుకూలంగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. కీలకమైన సెక్యూరిటీ ప్యాచ్‌లు కేవలం ఐఓఎస్‌ 26లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. పాత వెర్షన్లకు (ఉదాహరణకు ఐఓఎస్‌ 18) యాపిల్ ఇకపై ప్యాచ్‌లను అందించదని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: పండుగ షాపింగ్‌.. భారీ డిస్కౌంట్లు కావాలా?ఇప్పుడేం చేయాలి?మీ డేటా, వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉండాలంటే వెంటనే కొన్ని చర్యలు తీసుకోవాలి. మీ ఫోన్ ఐఫోన్ 11 లేదా ఆపై మోడల్ అయితే వెంటనే Settings > General > Software Update లోకి వెళ్లి iOS 26కు అప్‌డేట్ చేయండి.కనీసం రోజుకు ఒక్కసారైనా ఫోన్‌ను రీబూట్ చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న అనుమానాస్పద ప్రక్రియలు ఆగిపోయే అవకాశం ఉంది.మీరు ఒకవేళ కీలక వ్యక్తి అయి, మిమ్మల్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భావిస్తే ఫోన్‌లోని ‘లాక్‌డౌన్ మోడ్’ను ఆన్ చేయండి. ఇది వెబ్ బ్రౌజింగ్, మెసేజ్ అటాచ్‌మెంట్స్ వంటి కొన్ని ఫీచర్లను పరిమితం చేస్తుంది. హ్యాకర్లకు మీ ఫోన్ పట్టుబడకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది.సైబర్ దాడులు నిరంతరం మారుతుంటాయి. కాబట్టి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవడమే ఐఫోన్ వినియోగదారులకు ఉన్న అత్యుత్తమ రక్షణ అని గమనించాలి.

smart online shopping guide in festive season2
పండుగ షాపింగ్‌.. భారీ డిస్కౌంట్లు కావాలా?

పండుగ సీజన్ వచ్చిందంటే చాలు.. ఇటు వీధులన్నీ రంగురంగుల వెలుగులతో, అటు ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు భారీ డిస్కౌంట్లతో కళకళలాడుతుంటాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. వంటి ఈ-కామర్స్‌ సైట్లు ప్రత్యేక ఈవెంట్లతో ఆఫర్లు ప్రకటిస్తాయి. దాంతో వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తాయి. అయితే, ఈ ఆఫర్ల వెల్లువలో పడి అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా, తెలివిగా ఎలా షాపింగ్ చేయాలో వివరించే చిట్కాలు చూద్దాం.ముందస్తు ప్రణాళికసేల్ ప్రారంభం కావడానికి ముందే మీకు కావాల్సిన వస్తువులను ‘విష్‌లిస్ట్’లో చేర్చుకోవడం ఉత్తమం. దీనివల్ల ధర తగ్గినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే, ఎంత వరకు ఖర్చు చేయాలనే దానిపై ఒక బడ్జెట్ వేసుకోవడం వల్ల అనవసరమైన కొనుగోళ్లను నివారించవచ్చు.ధరల పరిశీలనఒక సైట్‌లో తక్కువ ధర కనిపిస్తోందని వెంటనే కొనేయకండి. వేర్వేరు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల్లో ధరలను పోల్చి చూడండి. ఇందుకోసం ఆన్‌లైన్‌లో కొన్ని టూల్స్ లేదా వెబ్‌సైట్‌లను ఉపయోగించి, గత కొన్ని నెలల్లో ఆ వస్తువు అత్యల్ప ధర ఎంత ఉందో తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ‘భారీ డిస్కౌంట్’ అని చూపించేవి నిజానికి సాధారణ ధరలకంటే తక్కువ ఏమీ ఉండకపోవచ్చు.బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్పండుగ సేల్స్ సమయంలో ఈ-కామర్స్ సంస్థలు నిర్దిష్ట బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులపై 10% నుంచి 15% వరకు తగ్గింపును ఇస్తుంటాయి. మీ దగ్గర ఆ బ్యాంక్ కార్డు లేకపోతే, స్నేహితులు లేదా బంధువుల కార్డులను ఉపయోగించి డబ్బు ఆదా చేయవచ్చు. కొన్ని వెబ్‌సైట్లు లేదా యాప్స్ ద్వారా షాపింగ్ చేయడం వల్ల అదనంగా కొంత మొత్తం క్యాష్‌బ్యాక్‌ ద్వారా వాలెట్‌లోకి వస్తుంది.నో-కాస్ట్ ఈఎంఐఖరీదైన వస్తువులు (ల్యాప్‌టాప్స్, ఫ్రిజ్‌లు, ఫోన్లు) కొనేటప్పుడు ‘నో-కాస్ట్ ఈఎంఐ’ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల వడ్డీ భారం లేకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. అయితే, దీనిపై ఉండే ప్రాసెసింగ్ ఫీజును గమనించడం మర్చిపోవద్దు.ఎక్స్ఛేంజ్ ఆఫర్లుమీ పాత వస్తువులను మార్పిడి చేయడం ద్వారా కొత్త వస్తువు ధరను గణనీయంగా తగ్గించుకోవచ్చు. పండుగ సమయాల్లో ఎక్స్ఛేంజ్ వాల్యూపై అదనపు బోనస్ కూడా లభిస్తుంది. వస్తువును ఇచ్చే ముందు అది పని చేసే స్థితిలో ఉందో లేదో సరిచూసుకోండి.సైబర్ భద్రత అత్యంత ముఖ్యంషాపింగ్ హడావిడిలో సైబర్ మోసాల బారిన పడే అవకాశం ఉంది. కేవలం అధికారిక వెబ్‌సైట్లు లేదా యాప్స్ ద్వారానే షాపింగ్ చేయండి. వాట్సాప్ లేదా ఎస్‌ఎమ్‌ఎస్‌ల్లో వచ్చే ‘భారీ బహుమతులు’, ‘లింక్‌లపై క్లిక్ చేయండి’ వంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. చెల్లింపులు చేసేటప్పుడు సురక్షితమైన గేట్‌వేలను మాత్రమే వాడండి.ఇదీ చదవండి: బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత

Uniper AM Green sign agreement for 5 lakh tons per year of renewable ammonia3
ఏటా 5 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎగుమతి

భారత పునరుత్పాదక ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఏఎం గ్రీన్, జర్మనీకి చెందిన ఇంధన దిగ్గజం యూనిపర్ (Uniper)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ నుంచి ఏటా 5 లక్షల టన్నుల వరకు పునరుత్పాదక అమ్మోనియాను యూనిపర్ సంస్థ కొనుగోలు చేయనుంది. ఈమేరకు యూనిపర్ సీఈఓ మైఖేల్ లూయిస్, ఏఎం గ్రీన్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ కుమార్ చలమలశెట్టి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.ఒప్పందంలోని అంశాలు..ఏడాదికి గరిష్టంగా 5,00,000 టన్నుల గ్రీన్ అమ్మోనియాను యూనిపర్ కొనుగోలు చేయనుంది. ఒక భారతీయ సంస్థ ఇటువంటి భారీ స్థాయి అంతర్జాతీయ ఎగుమతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 1 ఎంటీపీఏ (ఏటా మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం) ప్లాంట్ నుంచి 2028 నాటికి మొదటి విడత ఎగుమతి ప్రారంభం కానుంది. ఈ అమ్మోనియా యూరోపియన్ RFNBO (Renewable Fuel of Non-Biological Origin) సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.ఈ సందర్భంగా ఏఎం గ్రీన్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ చలమలశెట్టి మాట్లాడుతూ.. ‘గ్లోబల్‌గా ఎనర్జీ పరంగా వస్తున్న మార్పులో భారత్ పాత్రకు ఈ భాగస్వామ్యం ఒక మైలురాయిగా నిలుస్తుంది. మా ప్రత్యేకమైన క్లీన్ ఎలక్ట్రిసిటీ సొల్యూషన్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ గ్రీన్ అమ్మోనియా.. కెమికల్స్, అల్యూమినియం వంటి కర్బన ఉద్గారాలు ఎక్కువగా ఉత్పత్తయ్యే పరిశ్రమలు తమ ఉద్గారాలను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు. యూనిపర్ సీఈఓ మైఖేల్ లూయిస్ స్పందిస్తూ.. ‘భారత్, యూరప్ మధ్య మొట్టమొదటి భారీ స్థాయి సరఫరా కేరిడార్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు గర్వంగా ఉంది. గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ద్వారా ఎరువులు, రిఫైనింగ్ వంటి రంగాలకు ఎంతో మేలు జరుగుతుంది’ అని తెలిపారు. ఏఎం గ్రీన్ కో-ఫౌండర్ మహేష్ కొల్లి మాట్లాడుతూ, తమ పెట్టుబడిదారులు (Gentari, GIC, ADIA) సహకారంతో ప్రపంచ స్థాయి నాణ్యతతో సరైన ధరలో గ్రీన్ అమ్మోనియాను అందించే పర్యావరణ వ్యవస్థను నిర్మించామని తెలిపారు.ఇదీ చదవండి: బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత

Why major banks arguing RTI Act harm their commercial interests?4
బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత

బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంపై సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పత్రాలు చర్చనీయాంశం అయ్యాయి. మొండి బకాయిలు, ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, తనిఖీ నివేదికలు(Inspection Reports) వంటి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని సవాలు చేస్తూ దేశంలోని ప్రధాన బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంకులు కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)ను ఆశ్రయించాయి.అసలు వివాదం ఏమిటి?సమాచార హక్కు చట్టం (RTI) కింద ధీరజ్ మిశ్రా, వాతిరాజ్, గిరీష్ మిట్టల్, రాధా రామన్ తివారీ వంటి సామాజిక కార్యకర్తలు ఆర్‌బీఐ వద్ద కొన్ని కీలక పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా..టాప్ 100 ఎన్‌పీఏల వివరాలు.బ్యాంక్ ఆఫ్ బరోడాకు విధించిన రూ.4.34 కోట్ల జరిమానాకు సంబంధించిన తనిఖీ నివేదికలు.యెస్ బ్యాంక్ ఉద్దేశపూర్వక ఎగవేతదారులు.ఎస్‌బీఐ, ఆర్‌బీఎల్ బ్యాంకులపై ఆర్‌బీఐ జరిపిన పర్యవేక్షణ మూల్యాంకన నివేదికలు.ఆర్‌బీఐ వర్సెస్ బ్యాంకులుఆర్టీఐ నిబంధనల ప్రకారం ఈ సమాచారాన్ని వెల్లడించవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భావించింది. సుప్రీంకోర్టు గతంలో జయంతిలాల్ ఎన్. మిస్త్రీ కేసులో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఆర్‌బీఐకి బ్యాంకులతో ఎటువంటి విశ్వసనీయ సంబంధం (Fiduciary Relationship) లేదని, కాబట్టి సమాచారాన్ని దాచాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, బ్యాంకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సమాచారం వెల్లడిస్తే తమ వాణిజ్య ప్రయోజనాలకు, మార్కెట్ పోటీతత్వానికి హాని కలుగుతుందని, ఇది తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని బ్యాంకులు వాదిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయంతిలాల్ మిస్త్రీ తీర్పును పునపరిశీలించాలని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.సీఐసీ కీలక నిర్ణయంఈ వ్యవహారాలను విచారించిన సమాచార కమిషనర్ ఖుష్వంత్ సింగ్ సేథీ వీటి సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సంక్లిష్టమైన అంశాలను గతంలో డబుల్ బెంచ్ విచారించినందున ఈ కేసులన్నింటినీ సీఐసీ నేతృత్వంలోని లార్జర్‌ బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. ఇది తుది నిర్ణయం తీసుకునే వరకు ఆయా సమాచారాలను దరఖాస్తుదారులకు వెల్లడించకూడదని మధ్యంతర ఉత్తర్వుల ద్వారా నిలిపివేశారు.డిపాజిటర్ల హక్కులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల జవాబుదారీతనం విషయంలో ఈ తీర్పు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ లార్జర్‌ బెంచ్‌ సమాచార వెల్లడికి మొగ్గు చూపితే బ్యాంకింగ్ రంగంలోని లోపాలు, ఎగవేతదారుల వివరాలు బహిర్గతం అవుతాయి. లేదంటే బ్యాంకుల గోప్యతకు చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది.ఇదీ చదవండి: రూ.2.7 కోట్ల జీతం.. ఉద్యోగం వదిలేసిన 22 ఏళ్ల యువకుడు..

why 22 year old techie resigned 2 7 cr job left full details5
రూ.2.7 కోట్ల జీతం.. జాబ్‌ వదిలేసిన 22 ఏళ్ల యువకుడు.. ఎందుకంటే..

ప్రస్తుతం ఉన్న జాబ్‌ మార్కెట్‌లో రూ.కోట్లలో జీతం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, ఆ భారీ జీతం వెనుక ఉన్న పని ఒత్తిడి వ్యక్తి ప్రాథమిక స్వేచ్ఛను, సంతోషాన్ని హరిస్తే? సరిగ్గా ఇదే ఆలోచనతో, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న క్లూలీ (Kluly) అనే ఏఐ స్టార్టప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO) డేనియల్ మిన్ తన పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏడాదికి ఏకంగా 3 లక్షల డాలర్లు (సుమారు రూ.2.7 కోట్లు) వేతనం ఉన్న కొలువును వదులుకుని ఆయన కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు.చిన్న వయస్సులోనే..ప్రఖ్యాత వార్టన్ స్కూల్ నుంచి మార్కెటింగ్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసిన డేనియల్ మిన్ మే 2025లో తన 21వ ఏటనే క్లూలీలో చేరారు. మిన్ తన ప్రతిభతో తక్కువ కాలంలోనే కీలక బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆ విజయం వెనుక ఉన్న శ్రమ క్రమంగా అతని మానసిక స్థితిపై ప్రభావం చూపడం మొదలైందని తాను చెప్పారు.రాజీనామా అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ మిన్ తన మనసులో మాటను పంచుకున్నారు. ‘కెరీర్ ప్రారంభంలో రోజుకు 12 గంటలు కష్టపడటం సహజమని నేను భావించాను. కానీ, కాలక్రమేణా ఆ ‘గ్రైండ్’(నిరంతర పని) నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నా స్నేహితులతో కలిసి డిన్నర్ చేయడం లేదా నా సోదరుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం వంటి చిన్న చిన్న సంతోషాలను కూడా నేను కోల్పోయాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించిన పని, క్రమేణా భారంగా మారిందని, పని కాకుండా అసలు వేరే జీవితమే లేకుండా పోయిందని వెల్లడించారు.సీఈఓ ముందే..కంపెనీ సీఈఓ రాయ్ లీ తన పనితీరును గమనించి రాజీనామా గురించి అడిగినప్పుడు డేనియల్ మిన్ తన భావోద్వేగాలను దాచుకోలేకపోయారు. తన రాజీనామా నిర్ణయాన్ని చెబుతూ ఆయన సీఈఓ ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, రాయ్ లీ ఎంతో సానుభూతితో స్పందించారని, ఉద్యోగం కంటే వ్యక్తిగత సంతోషమే ముఖ్యమని తనను ప్రోత్సహించారని మిన్ తెలిపారు. ‘తమ ఉద్యోగుల శ్రేయస్సును కోరుకునే ఇలాంటి బాస్ దొరకడం అదృష్టం’ అన్నారు.సోషల్ మీడియా స్పందనడబ్బు కంటే మానసిక ప్రశాంతత ముఖ్యం అని భావించి డేనియల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘గ్రైండ్ కల్చర్ పేరుతో యువతను శ్రమదోపిడీకి గురిచేయడం సరికాదు’ అని కొందరు కామెంట్‌ చేశారు. ‘మీ నిజాయితీకి హ్యాట్సాఫ్’ అంటూ కొందరు కామెంట్లతో మద్దతు తెలుపుతున్నారు. మొత్తానికి, కెరీర్ ప్రారంభంలోనే భారీ ప్యాకేజీని వదులుకుని డేనియల్ మిన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై మరోసారి చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: ముగిసిన ‘వైట్ కాలర్’ స్వర్ణయుగం

Why Salaried Jobs Are Declining know the details6
ముగిసిన ‘వైట్ కాలర్’ స్వర్ణయుగం

దశాబ్దాలుగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఉద్యోగార్థులకు ఐటీ, ఫైనాన్స్, బీపీఓ రంగాల్లోని వైట్ కాలర్ కొలువులే ఆర్థిక భరోసాకు ఆధారాలుగా నిలుస్తున్నాయి. కానీ, ఆ స్వర్ణయుగం ఇప్పుడు ముగిసిందని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, మార్సెల్లస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు సౌరభ్ ముఖర్జీ హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ఏటా 11 శాతం వృద్ధిని నమోదు చేసిన వైట్ కాలర్ ఉద్యోగాల మార్కెట్, ఇప్పుడు కేవలం 1 శాతం వృద్ధికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ పోడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో ఆయన భారతదేశ ఉద్యోగ భవిష్యత్తుపై విశ్లేషణ చేశారు.ఆవిరవుతున్న ఆశలు‘మారుతున్న సాంకేతిక పరిస్థితుల కారణంగా జీతం పొందే యుగం ముగిసింది. దశాబ్దాలుగా పట్టణ మధ్యతరగతి ప్రజలు తమ ఆర్థిక ఎదుగుదలకు స్థిరమైన కార్యాలయ ఉద్యోగాలుగా భావించే విభాగాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. టెక్ కంపెనీల్లో లే-ఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు), ఆటోమేషన్, కృత్రిమ మేధ (AI) విప్లవం కలిసి పాతకాలపు కొలువుల తీరును మార్చేస్తున్నాయి’ అన్నారు.‘ఐటీ రంగంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఏటా వేల సంఖ్యలో నియామకాలు చేపట్టేవి. కానీ ఇప్పుడు ఏఐ ద్వారా ఉత్పాదకత పెంచుకుంటూ, కొత్త నియామకాలను భారీగా తగ్గిస్తున్నాయి. ఎంట్రీ లెవల్ కోడింగ్, కస్టమర్ సపోర్ట్, అడ్మినిస్ట్రేటివ్ పనులు ఇప్పుడు సాఫ్ట్‌వేర్లే చేస్తున్నాయి. కేవలం టెక్ రంగమే కాదు.. ఫైనాన్స్, లీగల్, లాజిస్టిక్స్, మీడియా రంగాల్లో కూడా 2031 నాటికి ప్రస్తుతమున్న 25 శాతం ఉద్యోగాలు అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది’ అని చెప్పారు.విద్యార్థులకు వేక్-అప్ కాల్ప్రస్తుత విద్యా విధానం, పాత కెరియర్‌ సూత్రాలను అంటిపెట్టుకున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ముఖర్జీ హెచ్చరించారు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వేచి ఉండటం ఇప్పుడు ఒక జూదం లాంటిదని అభిప్రాయపడ్డారు. ‘మీరు ఆటోమేట్ చేయలేని నైపుణ్యాలను నేర్చుకోకపోతే, రోజురోజుకు తగ్గిపోతున్న ఈ జాబ్‌ మార్కెట్‌లో నిరుద్యోగులుగా మిగిలిపోతారు’ అని సౌరభ్ ముఖర్జీ తెలిపారు.ఇప్పుడు ఏం చేయాలి?మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు ఏం చేయాలో ముఖర్జీ కొన్ని సూచనలు చేశారు.1. మానవ నైపుణ్యాలకు ప్రాధాన్యం: మెషీన్లు చేయలేని పనులైన సృజనాత్మకత, సమస్య పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన వంటి వాటిపై దృష్టి పెట్టాలి.2. అడాప్టబిలిటీ: ఏఐ, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతికతలను నేర్చుకోవడంతో పాటు వాటిని నిరంతరం అప్‌డేట్ చేసుకోవాలి.3. ఇతర నైపుణ్యాలు: కేవలం రెజ్యూమ్ ఉంటే సరిపోదు. ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, రియల్‌టైమ్‌ అనుభవం చాలా అవసరం.4. నెట్‌వర్కింగ్: పరిశ్రమ నిపుణులతో కనెక్ట్ అవ్వడం ద్వారా మారుతున్న మార్కెట్ ట్రెండ్స్‌ను ముందే పసిగట్టాలి.ఇదీ చదవండి: మీ డబ్బు - మీ నిర్ణయం..

Advertisement
Advertisement
Advertisement