Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CITES CoP20 in Samarkand formally endorsed Vantara initiative1
ఐరాస సంస్థ ‘సైట్స్‌’ మెచ్చిన వంతారా

జంతు సంరక్షణలో ఇండియాలోని రిలయన్స్‌ ఆధ్వర్యంలో ఉన్న వంతారా వండి సంస్థలు చూపుతున్న నిబద్ధతను ఐరాస సంస్థ సైట్స్ (CITES) ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) పరిధిలో పనిచేస్తున్న ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వంతారా కాంప్లెక్స్‌లోని గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), రాధా కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ (RKTEWT) వంటి కేంద్రాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనిచేస్తున్నాయని పేర్కొంది.ఈ నివేదికను రూపొందించడానికి సైట్స్ బృందం భారత్‌లో విస్తృత పరిశీలన జరిపి 79వ సైట్స్ స్టాండింగ్ కమిటీ సమావేశం కోసం సమగ్ర రిపోర్ట్ సిద్ధం చేసింది. ఈ సమావేశం ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 5 వరకు జరుగుతోంది. సైట్స్ తన నివేదికలో వంతారా సౌకర్యాలను విశేషంగా ప్రశంసిస్తూ అక్కడి పశువైద్య సేవలు, వసతులు ప్రపంచ స్థాయి నాణ్యత కలిగినవని పేర్కొంది. "ఈ కేంద్రాలు జంతువులను సురక్షితంగా సంరక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు" అని తెలిపింది.వంతారా అభివృద్ధి చేసిన అధునాతన వైద్య పద్ధతులు, జంతు చికిత్సా విధానాలు అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా ఉన్నాయని సైట్స్ తెలిపింది. ఈ విజయాలను శాస్త్రీయ సమాజంతో పంచుకోవాలని కూడా ప్రోత్సహించింది. ఈ కేంద్రాలు పూర్తిగా చట్టపరమైన, నైతిక ప్రమాణాలతోనే పనిచేస్తున్నాయని సైట్స్ మిషన్ కీలకంగా ప్రస్తావించిన అంశం. భారత్‌కు అక్రమంగా జంతువులను దిగుమతి చేశారనే ఆధారాలు ఏవీ లేవని నివేదిక స్పష్టం చేసింది. జంతువుల విక్రయం లేదా వాటి సంతానోత్పత్తితో సంబంధం ఉన్న వాణిజ్య కార్యకలాపాలు లేవని తెలిపింది. వాణిజ్య ప్రయోజనాల కోసం దిగుమతులు జరగలేదని స్పష్టంగా పేర్కొంది. వీటి ప్రధాన ఉద్దేశ్యం సంరక్షణ, జాతి పునరుద్ధరణ మాత్రమేనని, భవిష్యత్తులో అడవుల్లో తిరిగి వదిలేలా వీటిని అభివృద్ధి చేస్తున్నామని సంస్థ నిర్వాహకులు వివరించారు.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్‌.. వివరాలివే..

Meta reportedly advanced talks to buy Google Tensor AI chips2
ఎన్వీడియాకు గూగుల్‌ గట్టి దెబ్బ

మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్ తన ఏఐ డేటా సెంటర్లలో గూగుల్ టెన్సర్ ఏఐ చిప్‌లను వాడేందుకు బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ మెటా ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం ఏఐ కంప్యూటింగ్ రంగంలో టాప్‌లో ఉన్న ఎన్వీడియాకు గట్టి దెబ్బ తగలబోతుందని కొందరు అంచనా వేస్తున్నారు.2027లో ఏఐ డేటా సెంటర్లలో గూగుల్‌ టీపీయూలుపరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం మెటా తన ఏఐ డేటా సెంటర్లలో 2027 నాటికి గూగుల్‌ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లను(TPU) ఉపయోగించేందుకు చర్చలు జరుపుతోంది. దాంతోపాటు వచ్చే ఏడాది గూగుల్ క్లౌడ్ నుంచి కూడా ఈ చిప్‌లను మెటా అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. గూగుల్ ఇప్పటికే ఆంత్రోపిక్ పీబీసీకి 1 మిలియన్ టెన్సర్ చిప్‌లను సరఫరా చేస్తోంది.గూగుల్‌ టెన్సర్‌ఏఐ పనుల కోసం దాదాపు 10 సంవత్సరాల క్రితం టెన్సర్ చిప్‌ను గూగుల్ అభివృద్ధి చేసింది. ఎన్వీడియా చిప్‌లపై అతిగా ఆధారపడటంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఏఎండీ వంటి ప్రత్యర్థులు ఉన్నప్పటికీ గూగుల్‌ టెన్సర్ చిప్స్ ఊపందుకుంటున్నాయి.ఎన్వీడియా చిప్స్ఎన్వీడియా బ్లాక్‌వెల్ వంటి చిప్‌లు ప్రాథమికంగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌లు (GPU). ఇవి గత దశాబ్దంలో వీడియో గేమ్‌లకు కీలకంగా ఉండేవి. లార్జ్‌ డేటాను నిర్వహించగల సామర్థ్యం కారణంగా ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఇవి చాలా అనుకూలంగా మారాయి.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్‌.. వివరాలివే..

Key Reasons Behind the Delay Income tax Refunds CBDT Chairman comments3
ట్యాక్స్‌ రీఫండ్‌.. ఆలస్యానికి కారణం ఇదే..

ఆదాయపు పన్ను (ఐటీ) రీఫండ్‌ల జారీలో జరుగుతున్న జాప్యంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. పన్ను చెల్లింపుదారులు క్లెయిమ్ చేసిన తప్పుడు తగ్గింపులు (Incorrect Deductions) లేదా అధిక విలువ గల క్లెయిమ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నందున రీఫండ్‌ల ఆలస్యం జరుగుతోందని స్పష్టం చేశారు.ఈ ఏడాది ఐటీఆర్ (ITR) దాఖలు గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్ల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సీబీడీటీ ఛైర్మన్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)లో పన్ను చెల్లింపుదారుల లాంజ్‌ను ప్రారంభించిన అనంతరం అగర్వాల్ విలేకరులతో మాట్లాడారు.‘తక్కువ విలువ కలిగిన రీఫండ్లను ఇప్పటికే విడుదల చేస్తున్నాం. మిగిలిన రీఫండ్‌లను ఈ నెలలో లేదా డిసెంబర్ నాటికి విడుదల చేస్తాం. పన్ను శాఖ కొన్ని తప్పుడు తగ్గింపులు, అధిక విలువ గల రీఫండ్‌ క్లెయిమ్‌లను గుర్తించింది. వాటిని ధ్రువీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్లెయిమ్‌లను సిస్టమ్ ద్వారా రెడ్-ఫ్లాగ్ చేశాం. పన్ను చెల్లింపుదారులు క్లెయిమ్ చేసిన తప్పుడు తగ్గింపులపై విశ్లేషణ నిర్వహిస్తున్నాం. ఇది రీఫండ్‌ల జారీలో జాప్యానికి కారణం అవుతుంది’ అని అగర్వాల్ పేర్కొన్నారు.మరోవైపు, ఏదైనా తగ్గింపులను మర్చిపోయిన పన్ను చెల్లింపుదారులు సవరించిన రిటర్న్ (Revised Return) దాఖలు చేయాలని కోరుతూ వారికి లేఖలు రాసినట్లు కూడా ఆయన వెల్లడించారు. టీడీఎస్ (మూలం వద్ద పన్ను తగ్గింపు) రేట్లు హేతుబద్ధీకరించబడటం వల్ల రీఫండ్ క్లెయిమ్‌ల్లో కూడా తేడాలుంటాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 మధ్య రీఫండ్‌లు రూ.2.42 లక్షల కోట్లకు చేరుకున్నాయి.వ్యాజ్యాల తగ్గింపుపై దృష్టిప్రత్యక్ష పన్ను కేసులకు సంబంధించిన వ్యాజ్యాలను తగ్గించడానికి డిపార్ట్‌మెంట్, బోర్డు తీవ్రంగా కృషి చేస్తున్నాయని అగర్వాల్ తెలిపారు. అప్పీలేట్ అధికారులు ఓవర్ టైమ్ పని చేస్తున్నారని చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 40 శాతానికి పైగా అప్పీళ్లు పరిష్కరించినట్లు తెలిపారు.ఇదీ చదవండి: అమెరికాపై తగ్గని మోజు!

US Hit Record in International Students And India Is Behind the Surge4
అమెరికాపై తగ్గని మోజు!

అమెరికాలో ఏటా రికార్డు స్థాయిలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ పెరుగుదలకు ప్రధానంగా భారతదేశం నుంచి వెళ్లే విద్యార్థులు అధికమవుతుండడం కారణంగా నిలిచింది. తాజాగా ఓపెన్ డోర్స్ 2025 నివేదికలోని వివరాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. యూఎస్‌లో దాదాపు ముగ్గురు అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారతీయులే ఉండడం గమనార్హం. 2024-25 విద్యా సంవత్సరంలో భారతీయ విద్యార్థుల నమోదు 3,63,019కు చేరుకుంది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 9.5 శాతం పెరుగుదలను సూచిస్తుంది.యూఎస్‌ వెళ్లే భారతీయ విద్యార్థులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు. ప్రాడిజీ ఫైనాన్స్ డేటా ప్రకారం ఇండోర్, భువనేశ్వర్, పంజాబ్, సూరత్, కోయంబత్తూర్, మైసూరు, నాగ్‌పుర్‌.. వంటి టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి యూఎస్‌ వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఈ విద్యార్థులు తరచుగా ఉపాధ్యాయులు, చిన్న వ్యాపార యజమానులు, మిడ్ కెరియర్‌ నిపుణుల కుటుంబాల నుంచి ఎక్కువగా ఉన్నారు.STEM కోర్సులు2024-25లో యూఎస్ మొత్తంగా 11,77,766 అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 4.5 శాతం ఎక్కువ. యూఎస్‌లోని ప్రతి 10 మంది భారతీయ విద్యార్థుల్లో దాదాపు 7 మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సుల్లో చేరుతున్నారు.43.4% మంది భారతీయ విద్యార్థులు గణితం, కంప్యూటర్ సైన్స్ లో చేరారు.22.8% మంది ఇంజినీరింగ్ కోర్సులను ఎంచుకున్నారు.ఓపీటీ..అమెరికా అందిస్తున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)కు ఆదరణ పెరుగుతోంది. యూఎస్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లు దేశీయ శ్రామిక శక్తిలోకి ప్రవేశించడానికి ఓపీటీ ఎంతో తోడ్పడుతుంది. భారతీయ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ముఖ్యంగా STEMలో H-1B వీసాలు లేదా ఇతర వర్గాలకు మారడానికి ముందు వృత్తిపరమైన అనుభవాన్ని పొందడానికి ఓపీటీని ఉపయోగించుకుంటున్నారు.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్‌.. వివరాలివే..

gold overdraft facility flexible line of credit know more details5
బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్‌.. వివరాలివే..

కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అనేక మందికి బంగారం కేవలం ఆభరణంగా కాకుండా అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి సాధనంగా మారింది. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం తమ బంగారాన్ని అమ్మివేయడం లేదా తాకట్టు పెట్టడం సర్వసాధారణం. అయితే అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బంగారాన్ని సాధారణ పద్ధతిలో తాకట్టు పెట్టకుండా, అమ్ముకోకుండానే దాన్ని ఉపయోగించుకునే అద్భుతమైన మార్గం ఉంటే? అవును, అదే బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ (Overdraft on Gold Jewellery) సదుపాయం. పెరుగుతున్న బంగారం ధరల నేపథ్యంలో అనేక ప్రముఖ బ్యాంకులు తమ వినియోగదారులకు ఈ ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తూ వారి ఆర్థిక అవసరాలకు భరోసా కల్పిస్తున్నాయి.గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే?బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం అనేది ఒక రకమైన సురక్షితమైన రుణం (Secured Loan). ఇది వ్యక్తిగత రుణం లాంటిది కాకుండా, ఒక క్రెడిట్ లైన్‌లాగా పనిచేస్తుంది. సాధారణంగా గోల్డ్ లోన్‌లో ఒకేసారి మొత్తం డబ్బు తీసుకుని దానిపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయంలో మీ బంగారు ఆభరణాల విలువను బట్టి బ్యాంక్ నిర్దిష్ట పరిమితి(Limit)తో రుణాన్ని మంజూరు చేస్తుంది. వినియోగదారుడు ఈ పరిమితి నుంచి అతనికి అవసరమైన మేరకు ఎప్పుడైనా, ఎంతైనా డబ్బును డ్రా చేసుకునే సౌలభ్యం ఉంటుంది.మీరు డ్రా చేసుకున్న అసలు మొత్తంపై (Utilised Amount) మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మంజూరైన మొత్తం పరిమితిపై కాదు. ఈ సౌకర్యం సాధారణంగా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు చెల్లుబాటు అవుతుంది. మీ సౌలభ్యాన్ని బట్టి క్రమానుగతంగా రుణం తిరిగి చెల్లించవచ్చు.వినియోగదారులకు ఉపయోగాలుబంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ద్వారా వినియోగదారులకు కీలక ప్రయోజనాలు ఉన్నాయి. యూజర్లు డ్రా చేసుకున్న మొత్తానికే వడ్డీ లెక్కిస్తారు. ఉదాహరణకు, మీకు రూ.5 లక్షల పరిమితి మంజూరైతే అందులో రూ.2 లక్షలు మాత్రమే వాడుకుంటే ఆ రూ.2 లక్షలపై మాత్రమే వడ్డీ చెల్లించాలి.ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలో నిధులు జమ చేయడం ద్వారా తీసుకున్న రుణాన్ని ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా పాక్షికంగా లేదా పూర్తిగా తిరిగి చెల్లించవచ్చు. నెలవారీ ఈఎంఐ (EMI) లాంటి కఠిన నిబంధనలు ఉండవు.వ్యాపార అవసరాలు, వైద్య ఖర్చులు లేదా ఇతర అత్యవసరాల కోసం తక్షణమే నిధులు పొందవచ్చు.గోల్డ్ లోన్ లేదా గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్‌లకు వ్యక్తిగత రుణాల కంటే వడ్డీ రేట్లు సాధారణంగా తక్కువగా ఉంటాయి.బంగారు ఆభరణాలు సురక్షితంగా బ్యాంకు వాల్ట్‌లో ఉంటాయి. వాటిని అమ్ముకోవాల్సిన అవసరం లేదు.బంగారం విలువను ఎలా లెక్కిస్తారు..బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందడానికి వినియోగదారులు సాధారణంగా కొన్ని అర్హతలు కలిగి ఉండి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా 18 క్యారెట్ల (Carat) నుంచి 24 క్యారెట్ల మధ్య స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణాలపై బ్యాంకులు ఓడీ ఇస్తాయి. వినియోగదారుడికి కావలసిన పరిమితిని బట్టి తగినంత బరువున్న బంగారాన్ని సమర్పించాల్సి ఉంటుంది.బ్యాంక్ నియమించిన వాల్యుయేటర్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను, బరువును నిర్ధారించి వాటి ప్రస్తుత మార్కెట్ విలువను లెక్కిస్తారు. ఈ విలువలో 70% నుంచి 75% వరకు ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిని మంజూరు చేస్తారు.ఛార్జీలుబంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ (OD) సౌకర్యాన్ని వినియోగించుకునేటప్పుడు వినియోగదారులు చెల్లించాల్సిన ప్రధాన ఛార్జీల్లో వడ్డీ రేటు ముఖ్యమైనది. ఓడీ పరిమితి నుంచి తీసుకున్న అసలు మొత్తానికి మాత్రమే లెక్కిస్తారు. ఈ వడ్డీ సాధారణంగా రోజువారీగా లెక్కిస్తారు. బ్యాంకును అనుసరించి సంవత్సరానికి 8% నుంచి 15% మధ్య మారుతూ ఉంటుంది.కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇది బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి, అకౌంట్‌ను సెటప్ చేయడానికి వసూలు చేసే ఏకమొత్తం ఛార్జీ. ఈ ఫీజు సాధారణంగా మంజూరైన మొత్తం ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిలో 0.5% నుంచి 1.5% వరకు ఉంటుంది.వాల్యుయేషన్ ఛార్జీలు.. బ్యాంక్ నియమించిన వాల్యుయేటర్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను, బరువును తనిఖీ చేసి దాని ప్రస్తుత మార్కెట్ విలువను నిర్ణయిస్తారు. ఈ సర్వీసు కోసం వసూలు చేసే ఫీజునే వాల్యుయేషన్ ఛార్జీలు అంటారు. అలాగే రుణ ఒప్పందాలను చట్టబద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు స్టాంప్ డ్యూటీ ఛార్జీని వినియోగదారులే భరించాల్సి ఉంటుంది.ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని అందిస్తున్న బ్యాంకులు1. ఫెడరల్ బ్యాంక్: డిజి గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ పథకం2. సీఎస్‌బీ బ్యాంక్: ఓవర్ డ్రాఫ్ట్ గోల్డ్ లోన్ స్కీమ్3. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB): టీఎంబీ గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India): బంగారు ఆభరణాలపై ఎస్ఓడీ (Secured Overdraft on Gold Ornaments - SOD).ఇదీ చదవండి: ఇండియాలో ‘గూగుల్ మీట్’ డౌన్

Japan dual mode vehicle switches from bus to rail in about 15 seconds automobile6
రైలు పట్టాలపై సవారీ చేసే బస్సు

సాధారణంగా మనం ఊహించని పనులను చేసే కొన్ని వాహనాలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి ఒక వినూత్న వాహనాన్ని జపాన్‌లో ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ మోడ్ వెహికల్ (DMV)గా రికార్డు సృష్టించింది. ఇది బస్సు మాదిరిగా సాధారణ రోడ్లపై, రైలులాగా రైల్వే ట్రాక్‌పై పరుగులు పెడుతుంది.చిన్న బస్సు రూపంలో కనిపించే ఈ డ్యూయల్ మోడ్ వాహనం దాని డిజైన్, ప్రత్యేకతలతో వాహనదారులను ఆకర్షిస్తోంది. దీనికి ప్రత్యేకమైన పేరు లేనప్పటికీ దీని పనితీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వాహనం జపాన్‌లోని షికోకు ద్వీపంలోని కొచ్చిని టోకుషిమా మధ్య నడుస్తోంది. ఈ డ్యూయల్ మోడ్ వాహనాన్ని ఆసా కోస్ట్ రైల్వే అనే ఒక ప్రైవేట్ పబ్లిక్ రైల్వే సంస్థ నిర్వహిస్తోంది.15 సెకన్లలో మోడ్ ఛేంజ్‌..ఈ వాహనం రోడ్డు మోడ్ (బస్సు) నుంచి రైలు మోడ్‌కు లేదా రైలు మోడ్‌ నుంచి రోడ్డు మోడ్‌కు చాలా త్వరగా మారగలదు. మోడ్‌ల మధ్య సెటప్‌ను మార్చుకోవడానికి డీఎంవీకి కేవలం 15 సెకన్లు మాత్రమే పడుతుంది.ఈ వాహనం 21 మందిని మోసుకెళ్లగలదు.రోడ్డుపై వేగం గంటకు 100 కిలోమీటర్ల వరకు చేరుకోగలదు.రైలు పట్టాలపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. View this post on Instagram A post shared by Japan Journeys: Culture, Cuisine, and Adventure 🎌 (@vibeinjapan)ఈ డీఎంవీ జపాన్‌లో అవాకైనాన్, కైఫు, షిషికుయి, కన్నోరా, ఉమినోకి టోయో టౌన్, మిచినోకి షిషికుయి ఒన్సెన్‌ను కలుపుతూ నడుస్తుంది. ఈ మార్గంలో ప్రయాణించే దూరాన్ని బట్టి ఛార్జీలు 200 యెన్ల నుంచి 800 యెన్ల వరకు (సుమారు రూ.100 నుంచి రూ.450) ఉంటాయి.ఇదీ చదవండి: ఇండియాలో ‘గూగుల్ మీట్’ డౌన్

Advertisement
Advertisement
Advertisement