Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

SEBI Approves IPOs for Five Companies1
5 కంపెనీలు లిస్టింగ్‌కు రెడీ

ఈ కేలండర్‌ ఏడాది(2025) సరికొత్త రికార్డు నెలకొల్పే బాటలో ప్రైమరీ మార్కెట్లు పలు లిస్టింగ్‌లతో కదం తొక్కుతున్నాయి. ఇప్పటికే సెంచరీ మార్క్‌కు చేరువైన ఐపీవోలు రూ. 1.6 లక్షల కోట్లకుపైగా సమీకరించాయి. ఈ బాటలో తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరో 5 కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచి్చంది. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు తాజాగా సెబీ నుంచి 5 కంపెనీలకు అనుమతి లభించింది. జాబితాలో లీప్‌ ఇండియా, ఎల్‌డొరాడో అగ్రిటెక్, మోల్బియో డయాగ్నోస్టిక్స్, టెక్నోక్రాఫ్ట్‌ వెంచర్స్, ఫుడ్‌లింక్‌ ఎఫ్‌అండ్‌బీ హోల్డింగ్స్‌(ఇండియా) చేరాయి. నిధుల సమీకరణకు వీలుగా ఈ కంపెనీలన్నీ జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. అయితే మరోపక్క ఐనాక్స్‌ క్లీన్‌ ఎనర్జీ, స్కై అల్లాయ్స్‌ అండ్‌ పవర్‌ వెనకడుగు వేశాయి. ఈ నెల మొదట్లో సెబీ నుంచి ఐపీవో పత్రాలను వాపస్‌ తీసుకున్నాయి. వీటిలో ఐనాక్స్‌ క్లీన్‌ ఎనర్జీ తాత్కాలికంగానే ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రీఐపీవో రౌండ్‌లో భాగంగా కంపెనీ ఇటీవల రూ. 5,000 కోట్లు సమకూర్చుకున్న నేపథ్యంలో ఫైనాన్షియల్స్‌పై సవరించిన ముసాయిదా పత్రాలను తిరిగి దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రూ. 2,400 కోట్లపై కన్ను పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా సప్లైచైన్‌ అసెట్‌ పూలింగ్‌ కంపెనీ లీప్‌ ఇండియా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. దీంతో లిస్టింగ్‌ ద్వారా రూ. 2,400 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 300 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వెచి్చంచనుంది. రూ. 1,000 కోట్లకు రెడీ శ్రీకార్‌ సీడ్స్‌ బ్రాండ్‌ కంపెనీ ఎల్‌డొరాడో అగ్రిటెక్‌ ఐపీవోలో భాగంగా రూ. 340 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 660 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. విత్తనాలుసహా.. సస్యరక్షణ సొల్యూషన్స్‌ సమకూర్చే తెలంగాణ కంపెనీ ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 245 కోట్లు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. పీఈ సంస్థల వాటాలు పీఈ సంస్థలు టెమాసెక్, మోతీలాల్‌ ఓస్వాల్‌కు పెట్టుబడులున్న మోల్బియో డయాగ్నోస్టిక్స్‌ ఐపీవోలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 1.25 కోట్ల షేర్లను కంపెనీ ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 99 కోట్లు కొత్త ఆర్‌అండ్‌డీ యూనిట్‌(ఎక్సలెన్స్‌ సెంటర్, ఆఫీస్‌ స్పేస్‌) ఏర్పాటుకు వెచి్చంచనుంది. కేంద్రీకృత కిచెన్ల ఏర్పాటు కేటరింగ్, ఫుడ్‌ రిటైల్‌ చైన్‌ కంపెనీ ఫుడ్‌లింక్‌ ఎఫ్‌అండ్‌బీ హోల్డింగ్స్‌(ఇండియా) ఐపీవోలో భాగంగా రూ. 160 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.19 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను కొత్త కేంద్రీకృత కిచెన్ల ఏర్పాటుతోపాటు, మెటీరియల్‌ అనుబంధ సంస్థ ఫుడ్‌లింక్‌ గ్లోబల్‌ రెస్టారెంట్స్‌ అండ్‌ కేటరింగ్‌ సర్వీసెస్‌ కొత్తగా నెలకొల్పనున్న క్యాజువల్‌ డైనింగ్‌ రెస్టారెంట్లకు వినియోగించనుంది. ఇండియా బిస్ట్రో, ఆర్ట్‌ ఆఫ్‌ దమ్, చైనా బిస్ట్రో తదితర బ్రాండ్లతో 30 క్యాజువల్‌ రెస్టారెంట్లు, క్లౌడ్‌ కిచెన్లను నిర్వహిస్తోంది. తాజా ఈక్విటీ, ఓఎఫ్‌ఎస్‌ ఐపీవోలో భాగంగా వేస్ట్‌వాటర్‌ ట్రీట్‌మెంట్‌ సొల్యూషన్లు అందించే టెక్నోక్రాఫ్ట్‌ వెంచర్స్‌ 95.05 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 23.76 లక్షల షేర్లను కంపెనీ ప్రమోటర్‌ సంస్థ కార్తికేయ కన్‌స్ట్రక్షన్స్‌ ఆఫర్‌ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 138 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. రెండు కంపెనీల దరఖాస్తు జాబితాలో స్టీమ్‌హౌస్‌ ఇండియా సిటియస్‌ ట్రాన్స్‌నెట్‌ ఇన్వెస్ట్‌ ట్రస్ట్‌ రవాణా సంబంధ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు చేపట్టే సిటియస్‌ ట్రాన్స్‌నెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌(ఇన్విట్‌) పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. దీనిలో భాగంగా యూనిట్ల జారీ ద్వారా రూ. 1,340 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇష్యూ నిధుల్లో రూ. 1,235 కోట్లు ఎస్‌ఆర్‌పీఎల్‌లో సెక్యూరిటీల కొనుగోలు, టీఈఎల్, జేఎస్‌ఈఎల్, ధోలా, డిబంగ్‌ తదితర ఎస్‌పీవీ ప్రాజెక్టులలో పెట్టుబడులు చేపట్టనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. దాదాపు 3,407 కిలోమీటర్ల పోర్ట్‌ఫోలియో(ఆస్తులు)ను కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 1,987 కోట్ల ఆదాయం, రూ. 418 కోట్ల నికర నష్టం ప్రకటించింది. రూ. 425 కోట్లకు సై ఇండ్రస్టియల్‌ స్టీమ్, గ్యాస్‌ సరఫరా చేసే స్టీమ్‌హౌస్‌ ఇండియా ఐపీవోకు వీలుగా సెబీకి అప్‌డేటెడ్‌ ప్రాస్పెక్టస్‌ను జత చేసింది. జూలైలో గోప్యతా విధానంలో దరఖాస్తు చేయడంతో తాజాగా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 345 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 80 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌ ఆఫర్‌ చేయనున్నారు. తద్వారా 425 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, అంకలేశ్వర్, పనోలీ యూనిట్ల విస్తరణకు, దహేజ్‌లో కొత్త స్టీమ్‌ జనరేషన్‌ యూనిట్‌ ఏర్పాటుకు వినియోగించనుంది. 2024–25లో రూ. 395 కోట్ల ఆదాయం, రూ. 31 కోట్ల నికర లాభం ఆర్జించింది.

New Kia Seltos Unveiled in India2
కియా నుంచి కొత్త సెల్టోస్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆటోమొబైల్‌ దిగ్గజం కియా ఇండియా తాజాగా సరికొత్త సెల్టోస్‌ వెర్షన్‌ని ప్రవేశపెట్టింది. భద్రత, టెక్నాలజీ, డిజైన్‌కి ప్రాధాన్యమిస్తూ మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ విభాగంలో మరింత విశాలమైనదిగా దీన్ని తీర్చిదిద్దినట్లు బుధవారమిక్కడ నిర్వహించిన గ్లోబల్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ ఎండీ గ్వాంగు లీ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా కొత్త సెల్టోస్‌ను రూపొందించినట్లు చెప్పారు. వినూత్న స్టైలింగ్, ప్రీమియం ఇంటీరియర్స్, ఏడీఏఎస్‌ లెవెల్‌ 2, బోస్‌ 8–స్పీకర్‌ ఆడియో, 30 అంగుళాల పనోరమిక్‌ డిస్‌ప్లే ప్యానెల్‌ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నట్లు చీఫ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ సున్‌హాక్‌ పార్క్, సీనియర్‌ వీపీ అతుల్‌ సూద్‌ వివరించారు. దీనికి దేశవ్యాప్తంగా బుకింగ్స్‌ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రాథమికంగా రూ. 25,000 కట్టి బుక్‌ చేసుకోవచ్చు. తుది ధరను జనవరి 2న ప్రకటిస్తామని, డెలివరీలు ఆ నెల మధ్య నుంచి ప్రారంభమవుతాయని పార్క్‌ తెలిపారు. దేశీయంగా 5,80,000 పైచిలుకు సెల్టోస్‌ వాహనాలను కియా విక్రయించింది.

Microsoft to Intel, the bold bet on India technology ecosystem3
టెక్‌ దిగ్గజాల పెట్టుబడులజోరు.. 

సాంకేతిక ఆవిష్కరణలకు భారత్‌ మెగా హబ్‌గా మారే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌ నుంచి ఇంటెల్‌ వరకు పలు అగ్రగామి సంస్థలు వరుస కడుతున్నాయి. దేశీయంగా డేటా సెంటర్లు, ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల 17.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల వ్యవధిలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఆసియాలో మైక్రోసాఫ్ట్‌ ఇంత భారీగా ఇన్వెస్ట్‌ చేయడం ఇదే ప్రథమం. భారత్‌ సాంకేతిక సామర్థ్యాలపై కంపెనీకి గల నమ్మకానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చిప్‌ దిగ్గజం ఇంటెల్‌ కూడా భారత్‌ సెమీకండక్టర్ల లక్ష్యాల సాధనకు మద్దతుగా నిల్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్‌తో జట్టు కట్టింది. కంపెనీ సీఈవో లిప్‌–బు టాన్‌ ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. అటు మరో అగ్రగామి సంస్థ అమెజాన్‌ సైతం భారత్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. ఏఐ, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై 35 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఇక్కడ అదనంగా పది లక్షలకుపైగా ఉద్యోగావకాశాలను కల్పించాలనే ప్రణాళికల్లో ఉంది. భారత్‌ నుంచి 80 బిలియన్‌ డాలర్ల ఈ–కామర్స్‌ ఎగుమతులను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక సెర్చ్‌ దిగ్గజం గూగుల్‌ .. వైజాగ్‌లో డేటా సెంటర్‌పై 15 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేస్తోంది. ఓపెన్‌ఏఐ కూడా భారత్‌లో డేటా హబ్‌ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. రియల్టీకి కూడా ఊతం.. దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను నిర్మించడంపై పెద్ద సంస్థలు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కూడా ఊతం లభించనుంది. డేటా సెంటర్ల రాకతో నిర్మాణ, రిటైల్, నిర్వహణ విభాగాల్లో పెద్ద సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలకు ఊతం లభించనుంది. వైజాగ్‌లో గూగుల్‌ ఏఐ, డేటా సెంటర్‌ హబ్‌తో 1,00,000 పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అధ్యయనం ప్రకారం డేటా సెంటర్లతో వచ్చే ఒక్క ప్రత్యక్ష ఉద్యోగంతో ఆరు రెట్లు పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. ఏఐ డేటా సెంటర్‌ బూమ్‌తో ఇంజినీర్లు, ఐటీ నిపుణులు, నిర్మాణ రంగ వర్కర్లు, రిటైల్‌ తదితర పరి శ్రమలలో మరింత ఉద్యోగ కల్పన జరగనుంది. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Yuvraj Singh cofounded FINO Tequila launches in India4
భారతదేశంలో ‘ఫినో’ టెకిలా ఆవిష్కరణ

క్రికెట్ మైదానంలో తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ‘సిక్సర్ కింగ్’ యువరాజ్ సింగ్ ఇప్పుడు వ్యాపార ప్రపంచంలో దూసుకుపోతున్నారు. తన అల్ట్రా-ప్రీమియం టెకిలా బ్రాండ్ ‘ఫినో(Fino)’ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేయడం ద్వారా స్పిరిట్‌ విభాగంలోకి ప్రవేశించారు. ఈ లగ్జరీ స్పిరిట్ ఇప్పటికే అభిమానులు, విలాసవంతమైన పానీయాల ప్రియులను ఆకర్షించినట్లు కంపెనీ తెలిపింది.యువరాజ్ సింగ్ భారతీయ-అమెరికన్ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో ఈ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఫినో నాలుగు అల్ట్రా-ప్రీమియం టెకిలా వేరియంట్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్రతి బాటిల్ ధర రూ.10,000 కంటే ఎక్కువ ఉండడం గమనార్హం. భారతదేశంలో సగటు నెలవారీ జీతం రూ.25,000 నుంచి రూ.32,000 మధ్య ఉన్నందున చాలా మంది వినియోగదారులు కేవలం ఒక బాటిల్ టెకిలా కోసం దాదాపు ఒక నెల ఆదాయాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఈ అత్యధిక ధర ఈ బ్రాండ్‌ను కేవలం లగ్జరీ స్పిరిట్స్ మార్కెట్‌కే పరిమితం చేసింది. ఫినో స్పిరిట్‌లను 100% బ్లూ వెబర్ అగావే నుంచి రూపొందిస్తున్నట్లు కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ

IndiGo announced all 65000 employees mobilised to restore operations5
65,000 మంది ఉద్యోగుల సహకారం!

దేశీయ విమానయాన రంగంలో ఇటీవల తలెత్తిన భారీ అంతరాయాల నేపథ్యంలో ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి కృషి చేసినట్లు తెలిపింది. ఈ ప్రయత్నంలో రోజువారీ కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం 65,000 మంది ఉద్యోగులు కీలకమైన సహకారాన్ని అందించారని ఇండిగో పేర్కొంది.డిసెంబర్ 2న ప్రారంభమైన సామూహిక విమాన రద్దులు, ఆలస్యం కారణంగా ప్రయాణికులకు కలిగిన తీవ్ర అసౌకర్యాన్ని పరిష్కరించడానికి ఇండిగో యాజమాన్యం ప్రయత్నించింది. ఈ సంక్షోభ సమయంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌, తన బృందం పరిస్థితులను సద్దుమణిగించేందుకు చర్యలు తీసుకున్నారు. నిన్న విమాన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించినట్లు చెప్పారు. ఈ ​క్రమంలో ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. ఇండిగో బోర్డు మొత్తం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.ప్రభుత్వ జోక్యం: డీజీసీఏ చర్యలుఈ అసాధారణ అంతరాయాలపై కేంద్ర విమానయాన శాఖ స్పందించింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలని ఇండిగో సీనియర్ నాయకత్వానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాక, ఇండిగో విమాన కార్యకలాపాలను స్థిరీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇండిగో ఫ్లైట్ షెడ్యూల్‌లో 10% తగ్గించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీనికి అనుగుణంగా, విమానయాన సంస్థ తన నెట్‌వర్క్‌లోని అన్ని గమ్యస్థానాలకు సేవలను కొనసాగిస్తూనే స్థిరీకరణ కోసం షెడ్యూల్‌లో కోతలు పెట్టింది.ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ

Gautam Adani met Satya Nadella demoed AI applications6
భారత్ ఏఐ భవిష్యత్తుకు 360 డిగ్రీల భాగస్వామ్యం

మైక్రోసాఫ్ట్ భారతదేశంలో 17.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.47 లక్షల కోట్లు) పెట్టుబడిని ప్రకటించిన తరువాత అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను గౌతమ్ అదానీ తన ఎక్స్‌ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్‌ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది.ఈ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఏఐ యుగంలో ఫిజికల్‌, డిజిటల్ అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ‘సత్య నాదెళ్లను కలవడం, సాంకేతికత భవిష్యత్తుపై ఆయన అమూల్యమైన భావాలను పొందడం ఎప్పుడూ ఆనందకరం. ఏఐ యుగంలో ఫిజికల్‌, డిజిటల్ ప్రపంచాలు కలుస్తున్నందున మైక్రోసాఫ్ట్‌తో మా 360 డిగ్రీల భాగస్వామ్యాన్ని మరింత లోతుగా తీసుకెళ్తున్నందుకు సంతోషిస్తున్నాం’ అని అదానీ పేర్కొన్నారు. నాదెళ్ల స్వయంగా నిర్మిస్తున్న ఏఐ యాప్‌ల డెమోను చూడటం పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు.భారత్ గ్లోబల్ టెక్ లీడర్‌గా..అదానీ గ్రూప్ ఎనర్జీ, పోర్ట్‌లు వంటి భౌతిక మౌలిక సదుపాయాల సామర్థ్యాలు మైక్రోసాఫ్ట్ ఏఐ, క్లౌడ్ నైపుణ్యాలతో జతకట్టడం భారతదేశం సాంకేతిక లక్ష్యాలకు కీలకమౌతుంది. అదానీ-నాదెళ్ల భాగస్వామ్యం మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల వృద్ధికి (అదానీకనెక్స్ జాయింట్ వెంచర్ ద్వారా ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణలో సహకారం ఉంది) మరింత ఊతమిస్తుంది. భారత్‌లో గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజాలు కూడా భారీగా పెట్టుబడులు ప్రకటించిన నేపథ్యంలో దేశ డేటా సెంటర్ మార్కెట్ వేగంగా విస్తరించనుంది. ఈ పరిణామం మేక్ ఇన్ ఇండియా, వికసిత్‌ భారత్ 2047 లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తుంది.Always a pleasure to meet @satyanadella and gain his valuable insights into the future of technology. We are excited to continue building a 360° partnership as the physical and digital worlds converge in the age of AI. Getting a demo from him of the AI apps he is personally… pic.twitter.com/T70YTbjTbT— Gautam Adani (@gautam_adani) December 10, 2025ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ

Advertisement
Advertisement
Advertisement