Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Quick commerce thrives in metros but faces hurdles in smaller cities Redseer1
మెట్రోల్లోనే క్విక్‌ కామర్స్‌ జోరు..

క్విక్‌కామర్స్‌ రంగం శరవేగంగా వృద్ధి సాధిస్తున్నప్పటికీ.. మెట్రోలకు వెలుపల పట్టణాల్లో లాభదాయకమైన విస్తరణ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని మార్కెట్‌ పరిశోధనా సంస్థ రెడ్‌సీర్‌ తెలిపింది. క్విక్‌కామర్స్‌ సంస్థల స్థూల వస్తు విక్రయ విలువ (జీఎంవీ)లో నాన్‌ మెట్రోలు 20 శాతం వాటానే భర్తీ చేస్తున్నట్టు పేర్కొంది. తక్కువ డిమాండ్, డిజిటల్‌ పరిణతి తక్కువగా ఉండడం, స్థానిక షాపింగ్‌ అలవాట్లను రెడ్‌సీర్‌ నివేదిక ప్రస్తావించింది.2025 మొదటి ఐదు నెలల్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు క్విక్‌ కామర్స్‌ సంస్థల ఆదాయం 150 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. డార్క్‌ స్టోర్లను పెద్ద ఎత్తున ప్రారంభించడం, వివిధ విభాగాల్లోకి దూకుడుగా ఎంట్రీ ఇవ్వడం, తీవ్రమైన పోటీ ఈ వృద్ధికి నేపథ్యాలుగా వివరించింది. టాప్‌–10–15 పట్టణాల వెలుపల ఒక్కో డార్క్‌స్టోర్‌కు వచ్చే రోజువారీ ఆర్డర్ల తగ్గుదల వేగంగా ఉందని వెల్లడించింది. 1,000 దిగువకు ఆర్డర్లు తగ్గాయని.. టాప్‌15కు తదుపరి టాప్‌ 20 పట్టణాల్లో డార్క్‌ స్టోర్‌ వారీ ఆర్డర్లు 700 దిగువకు తగ్గినట్టు తెలిపింది.ఇది డిమాండ్‌ బలహీనతను తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఆన్‌లైన్‌ సంస్థల పట్ల నమ్మకం తక్కువగా ఉండడం, డిజిటల్‌ టెక్నాలజీల పట్ల అవగాహన తక్కువగా ఉండడం ఆర్డర్లు పరిమితంగా ఉండడానికి కారణంగా పేర్కొంది. జనాభా కూడా తక్కువగా ఉండడాన్ని గుర్తు చేసింది. క్విక్‌కామర్స్‌ సంస్థలు ఆఫర్‌ చేసే వస్తు శ్రేణి స్థానికుల అభిరుచులకు అనుగుణంగా ఉండకపోవడాన్ని పేర్కొంది.దీనికితోడు ఈ ప్రాంతాల్లో స్థానిక రిటైల్‌ స్టోర్లకు, ప్రజలకు మధ్య ఉండే బలమైన సంబంధాలను ప్రస్తావించింది. దీంతో మెట్రోలతో పోల్చితే నాన్‌ మెట్రోల్లో ఒక్కో డార్క్‌స్టోర్‌ లాభం–నష్టాల్లేని స్థితి రావడానికి రెట్టింపు సమయం తీసుకుంటున్నట్టు వెల్లడించింది.

SEBI bans Jane Street over Rs 4843 crore unlawful earnings2
‘జేన్‌ స్ట్రీట్‌’ స్కామ్‌!

న్యూఢిల్లీ: దేశీ స్టాక్‌ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడినందుకు గాను అమెరికన్‌ సంస్థ జేన్‌ స్ట్రీట్‌ (జేఎస్‌) గ్రూప్‌పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు ట్రేడింగ్‌ చేయకుండా గ్రూప్‌ సంస్థలపై నిషేధం విధించింది. అక్రమంగా ఆర్జించిన రూ. 4,843 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. స్టాక్‌ సూచీలను ప్రభావితం చేసి, జేఎస్‌ గ్రూప్‌ భారీగా లబ్ధి పొందిందనే ఆరోపణలపై చేపట్టిన విచారణలో భాగంగా సెబీ ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జేన్‌ స్ట్రీట్‌ (జేఎస్‌) గ్రూప్‌లో భాగమైన జేఎస్‌ఐ ఇన్వెస్ట్‌మెంట్స్, జేఎస్‌ఐ2 ఇన్వెస్ట్‌మెంట్స్, జేన్‌ స్ట్రీట్‌ సింగపూర్, జేన్‌ స్ట్రీట్‌ ఏషియా ట్రేడింగ్‌ సంస్థలకు ఇవి వర్తిస్తాయి. 2023 జనవరి–2025 మే మధ్య కాలంలో 21 ఎక్స్‌పైరీ తేదీల్లో సూచీలను ప్రభావితం చేసే విధంగా క్యాష్, ఫ్యూచర్స్‌ మార్కెట్లో గ్రూప్‌ పెద్ద ఎత్తున ట్రేడింగ్‌ చేసినట్లు, తద్వారా ఆప్షన్స్‌ మార్కెట్లో పొజిషన్లతో భారీగా లాభాలు ఆర్జించినట్లు సెబీ విచారణలో తేలింది. జేన్‌ స్ట్రీట్, దాని అనుబంధ సంస్థలు భారతీయ ఆప్షన్స్‌ మార్కెట్లో అనధికారిక ట్రేడింగ్‌ వ్యూహాలు అమలు చేస్తున్నాయంటూ 2024 ఏప్రిల్‌లో మీడియాలో వార్తలు రావడం ఈ కేసుకు బీజం వేశాయి. ఎక్స్‌పైరీ రోజు దగ్గరపడే సమయంలో, ఇండెక్స్‌ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా, జేఎస్‌ గ్రూప్‌ సందేహాస్పద ట్రేడింగ్‌ లావాదేవీలు నిర్వహిస్తోందని సెబీ గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఇలాంటివి చేయబోమంటూ ఎన్‌ఎస్‌ఈకి హామీ ఇచ్చినప్పటికీ గ్రూప్‌ సంస్థలు తమ తీరును మార్చుకోలేదని ఉత్తర్వుల్లో సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘2025లో ఎన్‌ఎస్‌ఈ జారీ చేసిన అడ్వైజరీని కూడా పట్టించుకోకుండా, లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తూ జేఎస్‌ గ్రూప్‌ వ్యవహరించిన తీరు చూస్తే, మిగతా ఎఫ్‌పీఐలు, మార్కెట్‌ వర్గాల్లాగా, అది నమ్మతగినది కాదని అర్థం అవుతోంది. గతంలోలాగే లావాదేవీలు కొనసాగించేందుకు జేఎస్‌ గ్రూప్‌ను అనుమతిస్తే ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు కచ్చితంగా భంగం వాటిల్లుతుందని ప్రాథమిక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి’’ అని సెబీ వ్యాఖ్యానించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ జేఎస్‌ గ్రూప్‌ అక్రమంగా ఆర్జించిన రూ. 4,843.57 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఉత్తర్వులకు సంబంధించినవి అయితే తప్ప, తమ అనుమతి లేకుండా, జేఎస్‌ గ్రూప్‌ సంస్థల ఖాతాల్లో ఎలాంటి డెబిట్‌ లావాదేవీలను జరగనివ్వరాదంటూ బ్యాంకులకు సెబీ ఆదేశాలు ఇచ్చింది. ఇతరత్రా సూచీల్లోనూ జేఎస్‌ గ్రూప్‌ ట్రేడింగ్‌ లావా దేవీలపై సెబీ విచారణ చేపడుతోంది. సెబీ ఉత్తర్వుల ప్రకారం ఇండెక్స్, స్టాక్‌ ఆప్షన్లలో ట్రేడింగ్‌ ద్వారా జేఎస్‌ గ్రూప్‌ రూ.44,358 కోట్లు ఆర్జించింది. స్టాక్‌ ఫ్యూచర్స్‌లో రూ.7,208 కోట్లు, ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌లో రూ. 191 కోట్లు, క్యాష్‌ సెగ్మెంట్లో రూ. 288 కోట్లు నష్టపోయింది. దీంతో 2023 జనవరి–2025 మార్చి మధ్య మొత్తం మీద రూ.36,671 కోట్లు అక్రమంగా ఆర్జించింది. ఏం చేసింది.. ఎలా చేసింది..స్టాక్‌ మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువగా ఉండే నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఆప్షన్స్‌ సెగ్మెంట్స్‌లో ట్రేడింగ్‌ ద్వారా సూచీలను ప్రభావితం చేసి, దాన్నుంచి లాభాలు పొందిందని జేఎస్‌ గ్రూప్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం అది రెండు కీలక వ్యూహాలు అమలు చేసిందని సెబీ విచారణలో వెల్లడైంది. దీని ప్రకారం, బ్యాంక్‌ నిఫ్టీ స్టాక్స్, ఫ్యూచర్లలో ’జేఎస్‌ గ్రూప్‌’ ఉదయం పెద్దయెత్తున కొనుగోళ్లు చేసి, సాయంత్రం భారీగా అమ్మేసేది. అలాగే ఎక్స్‌పైరీ రోజున ఆఖరు రెండు గంటల్లో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా ఏదో ఒకదాన్ని భారీగా కొనడమో లేదా అమ్మడమో చేసేది. ఉదాహరణకు.. జేఎస్‌ గ్రూప్‌ ఉదయాన్నే కొన్ని ఎంపిక చేసుకున్న బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ షేర్లను భారీగా కొనేసేది. అదే సమయంలో ఇండెక్స్‌ ఆప్షన్స్‌ను షార్ట్‌ (అమ్మేయడం) చేసేది. ట్రేడింగ్‌ ముగిసే సమయం దగ్గరపడే కొద్దీ షేర్లను ఒక్కసారిగా అమ్మేసేది. దీంతో షేరు ధర పడిపోయేది. ఫలితంగా షేర్లపరంగా నష్టాలు వచ్చినప్పటికీ, సమాంతరంగా తీసుకున్న ఇండెక్స్‌ షార్ట్‌ ఆప్షన్లలో భారీగా లాభాలు వచ్చేవి. దీనివల్ల, ఉదయం రూ. 10 దగ్గర ఉన్న ఆప్షన్‌.. సాయంత్రానికి ఎకాయెకిన రూ.300–రూ. 400 అయిపోతుంది. లేదా అటుది ఇటవుతుంది. ఇలా ఎక్స్‌పైరీ రోజుల్లో ఇలా అసా ధారణ తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడటంతో సాధారణ ట్రేడర్లు భారీగా నష్టపోతారు. వాల్యూమ్స్‌పై ప్రభావం.. జేన్‌ స్ట్రీట్‌పై సెబీ చర్యలను మార్కెట్‌ వర్గాలు స్వాగతించాయి. దీనితో చిన్న ట్రేడర్లకు కాస్త ఊరట లభించగలదన్నాయి. కాకపోతే ఆప్షన్స్‌ వాల్యూమ్స్‌పైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌లో జేన్‌ స్ట్రీట్‌ లాంటి ట్రేడింగ్‌ సంస్థల వాటా దాదాపు 50 శాతం వరకు ఉంటుందని జిరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్‌ కామత్‌ తెలిపారు. ఇలాంటి సంస్థలు వెనక్కి వెళ్లిపోతే దాదాపు రిటైల్‌ కార్యకలాపాలపైనా ప్రభావం పడొచ్చని వివరించారు. ఫలితంగా బిడ్‌–ఆస్క్‌ స్ప్రెడ్‌ (కొనుగోలు, అమ్మకం బిడ్ల మధ్య వ్యత్యాసం), తీవ్ర ఒడిదుడుకులు, అనిశ్చితి పెరిగిపోవచ్చన్నారు. ఇది ఇటు ఎక్సే్చంజీలకు, అటు బ్రోకర్లకు మంచి వార్త కాకపోవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి పెద్ద సంస్థలపై మన మార్కెట్‌ ఎంతగా ఆధారపడిందనేది దీనితో తెలిసిపోతుందని కామత్‌ తెలిపారు. స్టాక్స్‌ కుదేలు.. జేఎస్‌ గ్రూప్‌పై సెబీ చర్యలతో ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలతో, విదేశీ సంస్థల ట్రేడింగ్‌ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ప్లాట్‌ఫాంలు, సంస్థల షేర్లు శుక్రవారం గణనీయంగా క్షీణించాయి. బీఎస్‌ఈలో నువామా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ షేరు 11.26%, స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ ఏంజెల్‌ వన్‌ షేరు 6%, బీఎస్‌ఈ షేరు 6.42%, సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ (ఇండియా) 2.3% క్షీణించాయి. జేఎస్‌ గ్రూప్‌పై సెబీ చర్యలతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతిందని లెమన్‌ మార్కెట్స్‌ డెస్క్‌ అనలిస్ట్‌ గౌరవ్‌ గర్గ్‌ తెలిపారు.ఏమిటీ జేన్‌ స్ట్రీట్‌.. ఆర్థిక సేవల రంగానికి సంబంధించిన జేన్‌ స్ట్రీట్‌ గ్రూప్‌ 2000లో ట్రేడింగ్‌ సంస్థగా అమెరికాలో కార్యకలాపాలు ప్రారంభించింది. అమెరికాతో పాటు యూరప్, ఆసియాలోని 45 దేశాల్లో, 5 కార్యా లయాల్లో 2,600 మంది సిబ్బంది ఉన్నారు. 2020 డిసెంబర్‌లో ఇది భారత్‌లో కార్యకలాపాలు ఆరంభించింది.

LIC Launches 2 New Insurance Plans Nav Jeevan Shree and Nav Jeevan Shree Single Premium3
ఎల్‌ఐసీ కొత్త పాలసీలు..

ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తాజాగా నవ జీవన్ శ్రీ, నవ జీవన్ శ్రీ - సింగిల్ ప్రీమియం పేరుతో రెండు కొత్త సేవింగ్‌ పాలసీలను ప్రారంభించింది. ఇవి నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, లైఫ్ కవరేజ్ కలిగిన వ్యక్తిగత సేవింగ్ ప్లాన్లు. బీమా రక్షణతో పాటు పెట్టుబడికి భద్రత, వడ్డీ రాబడి కోరుకునేవారికి ఇవి అనువుగా ఉంటాయి. ఈ పాలసీలు 2025 జూలై 4 నుంచి 2026 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఎల్‌ఐసీ తెలిపింది. నవ జీవన్ శ్రీ - రెగ్యులర్ ప్రీమియం (ప్లాన్ నెం.912) ఇది ఒకేసారి కాకుండా విడతల వారీగా ప్రీమియం చెల్లించే వారికి అనువైన ప్లాన్. కనీస సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు, గరిష్ఠ పరిమితి లేదు. వయస్సు పరిమితి 30 రోజుల నుంచి 75 ఏళ్ల వరకు. మెచ్యూరిటీ నాటికి కనిష్ట వయసు 18 సంవత్సరాలు కాగా గరిష్ట వయసు 75 ఏళ్లు. 6, 8, 10 లేదా 12 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధులను ఎంచుకోవచ్చు. పాలసీ టర్మ్ కనీసం 10 సంవత్సరాలు. 15, 16, 20 ఏళ్ల వ్యవధిని కూడా ఎంచుకోవచ్చు. గ్యారెంటీడ్ అడిషన్లు: 10-13 ఏళ్ల పాలసీకి - 8.50 శాతం, 14-17 సంవత్సరాలకు 9 శాతం, 18-20 ఏళ్ల కాలానికి 9.50 శాతం చొప్పున గ్యారెంటీడ్ అడిషన్లు లభిస్తాయి.డెత్ బెనిఫిట్‌: ఆప్షన్ 1 కింద - కనీస సమ్ అష్యూర్డ్‌తోపాటు వార్షిక ప్రీమియానికి 7 రెట్లు, ఆప్షన్ 2 కింద - వార్షిక ప్రీమియానికి 10 రెట్లు + బేసిక్ సమ్ అష్యూర్డ్ చెల్లిస్తారు.దీనికి కూడా యాక్సిడెంట్ డెత్ & డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ప్రీమియం వెయివర్ బెనిఫిట్ రైడర్ వంటి వాటిని జోడించుకునే వెసులుబాటు ఉంది. మెచ్యూరిటీ తర్వాత లేదా రిస్క్‌ జరిగినప్పుడు చెల్లింపు: మొత్తం డబ్బును ఒకేసారి లేదా నెలవారీ/త్రైమాసిక/అర్ధవార్షిక/వార్షిక ప్రాతిపదికన పొందవచ్చు. ప్రీమియం చెల్లింపును కూడా ఇదే విధంగా ఎంపిక చేసుకోవచ్చు.నెలకు రూ.10 వేలతో రూ.26 లక్షలుఒక వ్యక్తి రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకుంటే.. ఆప్షన్ 2 కింద 10 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఎంచుకుంటే వార్షిక ప్రీమియం రూ.1,10,900 కట్టాలి. అదే నెలవారీ అయితే రూ.10,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పదేళ్లకూ చెల్లించే మొత్తం సొమ్ము: రూ.11,09,000 అవుతుంది. పాలసీ వ్యవధి 20 సంవత్సరాలు పూర్తయ్యాక రూ.16,58,786 గ్యారెంటీడ్ అడిషన్ రూపంలో లభిస్తాయి. మొత్తం కలుపుకొంటే మెచ్యూరిటీ తర్వాత రూ.26,58,786 లభిస్తుంది.నవ జీవన్‌ శ్రీ- సింగిల్‌ ప్రీమియం (ప్లాన్‌ నం.911) ఈ పాలసీ ఒకేసారి ఏకమొత్తం పెట్టుబడి పెట్టదలచుకున్న వారికి అనువుగా ఉంటుంది. ఈ పాలసీని 30 రోజుల నుండి 60 ఏళ్ల వయస్సు వరకూ ఎవరైనా తీసుకోవచ్చు. అయితే ఆప్షన్ 2 కింద మాత్రం గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు మాత్రమే. మెచ్యూరిటీ సమయానికి కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠంగా 75 ఏళ్లు (ఆప్షన్ 2లో 60) ఉండాలి. పాలసీ వ్యవధి కనీసం 5 సంవత్సరాలు, గరిష్ఠంగా 20 సంవత్సరాలు. కనీస హామీ మొత్తం (Sum Assured) రూ.1 లక్ష. గరిష్ఠ పరిమితి లేదు. డెత్ బెనిఫిట్‌: ఆప్షన్ 1 కింద - సింగిల్ ప్రీమియానికి 1.25 లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. ఆప్షన్ 2 కింద - సింగిల్ ప్రీమియానికి 10 రెట్లు రిస్క్ కవరేజీ లభిస్తుంది.గ్యారెంటీడ్ అడిషన్: ప్రతి వెయ్యి రూపాయల బేసిక్ సమ్ అష్యూర్డ్‌పై రూ.85 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ లభిస్తుంది. యాక్సిడెంట్ డెత్ & డిజేబిలిటీ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ వంటి అదనపు రైడర్లను కూడా జోడించుకోవచ్చు.రిస్క్ లేదా మెచ్యూరిటీ సమయంలో చెల్లింపు: మొత్తాన్ని ఒకేసారి లేదా నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షిక పద్ధతిలో పొందే అవకాశముంది. రూ.5 లక్షలకు రూ.7.12 లక్షలు18 ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల వ్యవధికి రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకుంటే.. సింగిల్ ప్రీమియం రూ.5,39,325 చెల్లించాలి. దీనికి ప్రతి ఏడాది గ్యారెంటీడ్ అడిషన్‌గా రూ.42,500 వస్తుంది.(మొత్తం రూ.2,12,500). ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో మొత్తంగా రూ.7,12,500 లభిస్తుంది. ఒకవేళ చివరి సంవత్సరంలో రిస్క్ జరిగితే గరిష్టంగా రూ.9.17 లక్షలు ఎల్‌ఐసీ నుంచి లభిస్తాయి.

Garuda Aerospace secures govt contracts for AI powered drone solutions4
ఏఐ డ్రోన్లకు భారీగా ఆర్డర్లు

ఏఐ ఆధారిత డ్రోన్‌ సొల్యూషన్స్‌ కోసం గుజరాత్, తమిళనాడు, ఝార్ఖండ్‌ రాష్ట్రాల ప్రభుత్వ విభాగాల నుంచి పలు కాంట్రాక్టులు లభించినట్లు డ్రోన్‌ టెక్నాలజీ సంస్థ గరుడా ఏరోస్పేస్‌ తెలిపింది. ఒరిస్సా మైనింగ్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం ప్రకారం వార్షిక సర్వేల నిర్వహణ, గనుల మూసివేత ప్రణాళికల కోసం డిజిటల్‌ డేటాబేస్‌లను, సర్వే మ్యాప్‌లు మొదలైన వాటిని తయారు చేయాల్సి ఉంటుంది.అలాగే గుజరాత్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, తమిళనాడుకు చెందిన జియాలజీ, మేనింగ్‌ డిపార్ట్‌మెంట్, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ టెండర్లను కూడా గరుడ ఏరోస్పేస్‌ దక్కించుకుంది. అటు ఝార్ఖండ్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ నుంచి కూడా కాంట్రాక్టు లభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు అగ్నీశ్వర్‌ జయప్రకాష్‌ చెప్పారు.తమ డ్రోన్‌ యాజ్‌ ఏ సర్వీస్‌(డాస్‌) మోడల్‌ వినియోగం పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని, తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ఈ కాంట్రాక్టులు తోడ్పడతాయని వివరించారు.

Ferrari zips around Bengaluru for a year without tax made to pay Rs 1 4 cr after RTO steps in5
రూ.7.5 కోట్ల కారు.. బడా బిజినెస్‌మ్యాన్‌ కక్కుర్తి..

రోడ్‌ ట్యాక్స్‌ చెల్లించకుండా బెంగళూరు వీధుల్లో తిరుగుతున్న ఫెరారీ లగ్జరీ సూపర్ కారును ప్రాంతీయ రవాణా కార్యాలయ అధికారులు పట్టుకున్నారు. ట్యాక్స్‌ కడతావా.. సీజ్‌ చేయమంటావా అని అధికారులు పట్టుబట్టడంతో కారు యజమాని రూ.1.42 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.రూ.7.5 కోట్ల విలువైన బ్రైట్‌ రెడ్‌ ఫెరారీ ఎస్ఎఫ్ 90 స్ట్రాడేల్ కారు కొన్ని నెలలుగా బెంగళూరు వీధుల్లో షికారు చేస్తోంది. ఈ లగ్జరీ కారు మహారాష్ట్రలో రిజిస్టర్ అయిందని, అలాంటి వాహనాలపై అక్కడ లైఫ్‌టైమ్‌ ట్యాక్స్‌ రూ.20 లక్షలు ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. ‘మహారాష్ట్రలో ఇలాంటి కార్లపై పన్ను రూ.20 లక్షలు కాగా, కర్ణాటకలో ఇది దాదాపు రూ.1.5 కోట్లు. ఈ వాహనం రెండేళ్ల క్రితం మహారాష్ట్రలో రిజిస్టర్ అయింది’ అని రవాణా అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది.జయనగర్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో) అధికారులు నగరంలో తరచూ కనిపిస్తున్న ఫెరారీ కారుపై నిఘా పెట్టి పట్టుకున్నారు. డాక్యుమెంట్లు ఇంట్లో ఉన్నాయని డ్రైవర్ తొలుత చెప్పాడు. కారు రిజిస్ట్రేషన్‌ను పరిశీలించిన అధికారులు కర్ణాటక పన్ను చెల్లించకుండా 18 నెలలకు పైగా బెంగళూరులో ఈ వాహనం తిరుగుతున్నట్లు గుర్తించారు. ఏం చేయాలని అధికారులు తమ ఉన్నతాధికారులను సంప్రదించగా బకాయిలు చెల్లించకపోతే వాహనాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో ఫెరారీ కారు యజమాని అదే రోజు పన్నులు, జరిమానాల రూపంలో రూ.1.4 కోట్లు చెల్లించాడు.కాగా ఈ ఖరీదైన ఫెరారీ కారు యజమాని ఓ బడా వ్యాపారవేత్త. దేశంలోని 55 నగరాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్త తక్కువ పన్ను రేటు కారణంగా మహారాష్ట్రలో తన ఫెరారీ కారును రిజిస్టర్ చేయించుకుని బెంగళూరులో తిప్పుతున్నన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, కర్ణాటక నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రంలో ఏడాదికి పైగా బయటి రాష్ట్రాల వాహనాలను ఉపయోగించే వారు ఇక్కడ లైఫ్‌టైమ్‌ రోడ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది.పన్ను ఎగవేతకు పాల్పడిన లగ్జరీ కార్ల యజమానులపై బెంగళూరు ఆర్టీవో అధికారులు చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గత మార్చిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో కర్ణాటక వెలుపల రిజిస్టర్ అయిన హై ఎండ్ వాహనాల నుంచి రూ.40 కోట్ల బకాయిలు వసూలు చేశారు.

SBI credit card New rule from July 15 higher minimum due in next bill Youth Finance6
SBI క్రెడిట్‌ కార్డు కొత్త రూల్‌.. జూలై 15 నుంచి..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్స్ (SBI Card) నిబంధనల్లో కొత్త మార్పులు చేస్తోంది. కనీస మొత్తం బకాయిలు (మినిమమ్‌ అమౌంట్‌ డ్యూ- ఎంఏడీ) లెక్కింపు పద్ధతిని సవరించింది. క్రెడిట్ కార్డు హోల్డర్ డిఫాల్ట్ అవ్వకుండా క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్‌ గడువు తేదీ నాటికి తిరిగి చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని ఎంఏడీ అంటారు. ఎంఏడీ లెక్కింపులో చేసిన ఈ సర్దుబాటుతో మినిమమ్‌ డ్యూ కట్టేద్దాంలే.. అనుకునే పెద్దమొత్తంలో బకాయిలున్న కొంతమంది క్రెడిట్ కార్డు హోల్డర్లు ఇక కాస్తంత ఎక్కువ మినిమమ్‌ డ్యూ చెల్లించాల్సి రావచ్చు.ఎందుకంటే కొత్త ఎంఏడీ ఫార్ములా ప్రతి నెలా ఫైనాన్స్ ఛార్జీలు ఫీజులను పూర్తిగా చెల్లించేలా చేస్తుంది. వాటిని పూర్తిగా చెల్లించకుండా లేదా ఏదో కొంత మొత్తం చెల్లించి తర్వాత పొడిగించుకుందామంటే కుదరదు. పెరిగిన ఎంఏడీ చెల్లింపు కొంతమందికి ప్రత్యేకించి రివాల్వింగ్ క్రెడిట్ కార్డ్ రుణం ఉన్నవారికి భారంగా అనిపించినప్పటికీ అది మంచిదే. క్రెడిట్ కార్డ్ రుణాన్ని రివాల్వింగ్ చేయడం అంటే సరళంగా చెప్పాలంటే క్రెడిట్‌ కార్డు బకాయిని పాక్షికంగా లేదా పూర్తిగా చెల్లించేసి కొత్త కొనుగోళ్ల కోసం మిగిలిన క్రెడిట్ పరిమితిని ఉపయోగించడం అన్నమాట.ఏం మారిందంటే.. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుల కొత్త మినిమమ్‌ డ్యూ (MAD) ఫార్ములా, పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్‌ను ఎస్‌బీఐ కార్డ్‌ తమ వెబ్‌సైట్‌లో వివరించింది. జూలై 15 నుంచి కొత్త ఎంఏడీ లెక్కింపులో 100% జీఎస్టీ, 100% ఈఎమ్ఐ మొత్తం, 100% ఫీజులు / ఛార్జీలు, 100% ఫైనాన్స్ ఛార్జీలు, ఏదైనా ఓవర్ లిమిట్ మొత్తం, మిగిలిన బ్యాలెన్స్ బకాయిలలో 2% ఉంటాయి. ఇంతకుముందు ఈఎంఐ, ఛార్జీల్లో కొంత భాగాన్ని మాత్రమే చేర్చేవారు. వినియోగదారులు కాస్త మొత్తాన్ని చెల్లించి, మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి వీలుండేది.ఇక పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ విషయానికి వస్తే.. కార్డుదారుడి బకాయిపై అందుకున్న చెల్లింపులను 100% జీఎస్టీ, 100% ఈఎంఐ మొత్తం, 100% ఫీజు / ఛార్జీలు, 100% ఫైనాన్స్ ఛార్జీలు, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, రిటైల్ ఖర్చులు, క్యాష్ అడ్వాన్స్‌తో సర్దుబాటు చేయాలని పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ పేర్కొంది. ఈ సవరించిన క్రమం వడ్డీ,పెనాల్టీ పడే భాగాలను మొదట క్లియర్ చేసేలా చేస్తుంది. దీంతో దీర్ఘకాలికంగా కార్డుదారులకు వడ్డీ పెరుగుదలను తగ్గిస్తుంది.యువతా.. క్రెడిట్ కార్డు భారం పెంచుకోవద్దుఆర్థిక స్థిరత్వానికి స్మార్ట్ క్రెడిట్ కార్డ్ మేనేజ్ మెంట్ అనేది కీలకం. ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్ కు ఇది చాలా ముఖ్యమైనది. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపులు సజావుగా జరగడానికి, రుణ భారం పెరగకుండా చూసుకునేందుకు నిపుణులు సూచించే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియజేస్తున్నాం.పూర్తి మొత్తం, సకాలంలో చెల్లించండి - ఎల్లప్పుడూ కనీస మొత్తానికి బదులుగా మీ మొత్తం బిల్లును చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది వడ్డీ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ఆరోగ్యంగా ఉంచుతుంది.ఆటో-పే & అలర్ట్ లను పెట్టుకోండి - చెల్లింపులను ఆటోమేట్ చేయండి లేదా రిమైండర్ లను పెట్టుకోండి. తద్వారా మీరు గడువు తేదీలను ఎన్నడూ కోల్పోరు. ఆలస్య రుసుము, పెనాల్టీ వడ్డీ రేట్లు త్వరగా పెరుగుతాయని గమనించండి.మితిమీరిన వాడకం వద్దు - క్రెడిట్ కార్డులు మీ బడ్జెట్ కు అనుబంధంగా ఉండాలి. దానిని మీరి పోకూడదు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్వహించడానికి మీ క్రెడిట్ లిమిట్‌లో 30% కంటే తక్కువగా ఖర్చు చేయండి.వడ్డీ రేట్లను అర్థం చేసుకోండి - ఒకవేళ బకాయిలు ఉన్నట్లయితే, అధిక వడ్డీ రేట్లను గుర్తుంచుకోండి. అప్పు తీర్చడం వల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది.రివార్డ్ లు, ఆఫర్ లను సద్వినియోగం చేసుకోండి - క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ లు, రివార్డ్ పాయింట్లను తెలివిగా ఉపయోగించండి. అవి మీ ఖర్చు అలవాట్లు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి.స్టేట్ మెంట్ లను క్రమం తప్పకుండా చెక్ చేయండి - అనధికార ఛార్జీలు లేదా లోపాలను ముందుగానే పట్టుకోవడం కోసం లావాదేవీలను ఎప్పటిక​ప్పుడు పర్యవేక్షించండి.కార్డుల సంఖ్యను తగ్గించుకోండి - ఎక్కువ కార్డులను వాడటం చూడ్డానికి బాగానే ఉంటుంది. కానీ అతిగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కార్డులుంటే తగ్గించుకోవడం మంచిది.

Advertisement
Advertisement
Advertisement