breaking news
Tirupati
-
Tirumala: శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం క్యూకాంప్లెక్స్లోని 7 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 76,903 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,612 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.64 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
తిరుపతి రూరల్: ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా తిరుపతిలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాలులో శనివారం ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్న్స్ ఎగ్జిబిషన్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సీఎండీ శివశంకర్ శనివారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సంస్థ పరిధిలోని తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్లో 50కి పైగా నమూనాలను ఏర్పాటు చేశారు. ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా సంస్థ పరిధిలో నిర్వహించిన క్విజ్, వక్తృత్వపు పోటీలు, సైనన్స్ ఎగ్జిబిషన్లో స్టాళ్ల ఏర్పాటు తదితర పోటీల్లో విజేతలకు ఈనెల 21వ తేదీన రాష్ట్ర ఇంధన శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా బహుమతులు అందించనున్నారు. కార్యక్రమంలో ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు కె. గురవయ్య, పి. అయూబ్ఖాన్, చీఫ్ జనరల్ మేనేజర్లు కె.ఆదిశేషయ్య, జె.రమణాదేవి, పీహెచ్. జానకిరామ్, ఎం.ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. -
నేటితో ముగియనున్న స్పోర్ట్స్మీట్
ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో ఈనెల 14వ తేదీ నుంచి జరుగుతున్న 58వ ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్ ఆదివారంతో ముగియనుంది. ఇక్కడ చెస్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరుగుతున్నాయి. దేశంలోని వివిధ ఐఐటీల నుంచి విద్యార్థులు ఈ పోటీల్లో తలపడుతున్నారు. చెస్: చెస్ ఈవెంట్లో ఆరు గ్రిప్పింగ్ రౌండ్ల తర్వాత, ఐఐటీ బాంబే ప్రస్తుతం 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 15.5 పాయింట్లతో ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్పూర్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 14పాయింట్లతో ఐఐటీ పాట్నా, ఐఐటీ వారణాసి కూడా పోటీలో ఉన్నాయి. ఆదివారం జరగనున్న చివరి రౌండ్తో విజేత ఎవరన్నది తేలనుంది. టెన్నిస్ (మహిళలు) టెన్నిస్ మహిళల విభాగంలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్ ఫైనల్స్కు చేరుకున్నాయి. ఐఐటీ పాట్నా మూడో స్థానంలో నిలిచింది. టెన్నిస్ (పురుషులు) పురుషుల టెన్నిస్ పోటీ సెమీఫైనల్ దశకు చేరుకుంది, ఇందులో ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే జట్లు సె మీఫైనల్కు చేరాయి. కాగా ఆదివారం ముగింపు ఉత్సవాలు, షీల్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్ డీన్ ప్రొఫెసర్ అశ్విన్ మహాలింగం ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. -
సాంకేతికతకు అధిక ప్రాధాన్యం
నాయుడుపేట టౌన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ విద్యార్థుల్లో సాంకేతికతను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. నాయుడుపేట జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానికి ప్రదర్శనను అట్టహాసంగా ప్రారంభించినట్లు తెలిపారు. సూళ్లూరుపేట ఎమ్మె ల్యే నెలవల విజయశ్రీ ముఖ్యఅతిథిగా హాజరై, ప్రదర్శనను ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ నాయుడుపేటలో జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించేందుకు జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించిన ఎంఈఓలతో పాటు పలువురు ప్రత్యేక అధికారులు ఎంతో సహకరించారన్నారు. ఈ ప్రదర్శనలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 126 గ్రూపుల విద్యార్థులు, వ్యక్తిగత విభాగం నుంచి 65 మంది విద్యార్థులు, టీచర్ల ప్రోత్సాహంతో జరిగిన 34 సైన్స్ నమూనాలను ప్రదర్శించారన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కె భానుప్రసాద్, గూడూరు డిప్యూటీ డీఈఓ దువ్వూరు సనత్కుమార్, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం మంజుల, ఎంఈఓలు మాధవీలత, బాణాల మునిరత్నం, తదితరులు పాల్గొన్నారు. గెలుపొందిన పాఠశాలల వివరాలివీ.. విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో వ్యక్తిగత విభాగంలో జిల్లా స్థాయిలో చెన్నూరు ఉన్నత పాఠశాలకు చెందిన కే సురేష్రెడ్డి, పాకాల మండలం ఓబులవారిపల్లి పాఠశాలకు చెందిన కే రాజశేఖర్ విజేతలుగా నిలిచారు. టీచర్స్ విభాగంలో శ్రీకాళహస్తి మండలం మాచువోలు ఉన్నత పాఠశాలకు చెందిన డాక్టర్ ఎన్ సుబ్రమణ్యశర్మ, చిల్లకూరు గురుకుల పాఠశాలకు చెందిన వైవీ సురేష్బాబులు జిల్లా స్థాయిలో గెలుపొందారు. గ్రూపు విభాగంలో జిల్లాలోని 14 ఉన్నత పాఠశాలలు ప్రతిభ కనపరిచి విజేతలుగా నిలిచినట్లు డీఈఓ వెల్లడించారు. -
రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు ఓసీ పల్లి హైస్కూల్ విద్యార్థి
పాకాల:జిల్లా స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఓసీ పల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థి ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్ఎం సి.కుమార్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ వడమాలపేట జెడ్పీ హైస్కూల్(బాలుర) పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ఓసీపల్లి జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థి కె.రాజశేఖర్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయు లు విద్యార్థి రాజశేఖర్కి అభినందనలు తెలిపారు. -
12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: రేణిగుంట – రైల్వేకోడూరు రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో రవాణా చేస్తున్న 12 ఎర్రచందనం దుంగలను గుర్తించి, స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కారు, పైలట్గా ఉపయోగిస్తున్న బైక్ను సీజ్ చేశారు. ఆర్ఐ సాయి గిరిధర్కు చెందిన ఆర్ఎస్ఐ లింగాధర్ టీమ్ ఎప్బీఓ పి.చెంగలరాయుడుతో కలసి శనివారం తెల్లవారుజాము నుంచి రైల్వే కోడూరు రోడ్డులోని ఆంజనేయపురం ఫారెస్ట్ చెక్ పోస్టు వద్దకు చేరుకుని వాహన తనిఖీలు చేపట్టారు. సుమారు 5 గంటల ప్రాంతంలో ఒక బైక్లో ఒక వ్యక్తి వచ్చి, పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అతన్ని పట్టుకోగా, వెనకే వస్తున్న కారు తప్పించుకునేందుకు ప్రయత్నించింది. దీంతో కారును చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, డ్రైవర్ కారును తప్పించబోయి అక్కడే ఆగి ఉన్న లారీని ఢీ కొన్నాడు. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. కొందరు వ్యక్తులు దిగి పారిపోతుండగా టాస్క్ఫోర్సు పోలీసులు వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారులోని ఎర్రచందనం దుంగలు, వాహనాలుసహా ముగ్గురు స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్కు తరలించారు. పట్టుబడిన వారిలో ఒకరు రేణిగుంటకు చెందిన వ్యక్తి కాగా, మరో ఇద్దరు తమిళనాడు సేలం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. -
దర్జాగా విద్యుత్ చౌర్యం
సాక్షి టాస్క్ ఫోర్సు: ఓ భవన నిర్మాణ పనుల్లో కళ్ల ఎదుటే నేరుగా విద్యుత్ స్తంభం నుంచి వైరు లాగి భవన నిర్మాణ పనుల్లో భాగంగా వెల్డింగ్, నీటి మోటర్, తదితర పరికరాలకు విద్యుత్ వినియోగించుకుంటున్నా విద్యుత్ శాఖాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వివరాలలోకి వెళితే.. గూడూరు జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఏర్పాటైన కాశీ లేఅవుట్లో ప్రభుత్వ పెద్దలు ఓ భవన నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకు త్రీఫేజ్ విద్యుత్ కనెక్షన్ తీసుకుని మీటరు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అందులో నుంచి విద్యుత్ను భవన నిర్మాణ పనులకు వినియోగించుకుంటే అధికంగా బిల్లులు చెల్లించాల్సి వస్తుందని భావించిన భవన యజమాని తన భవన నిర్మాణానికి సమీపంలోనే ఉన్న విద్యుత్ స్తంభానికి నేరుగా విద్యుత్ వైర్ను వేసి విద్యుత్ చౌర్యం పాల్పడుతున్నారు. అయితే అధికారులు అటు వైపు కన్నెతి కూడా చూడక పోవడం విశేషం. భవన నిర్మాణ పనుల్లో జరుగుతున్న విద్యుత్ చౌర్యాన్ని ఆ శాఖ డీఈఈ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా టౌన్ ఏఈని పంపి పరిశీలిస్తామని తెలిపారు. -
శ్రీకాళహస్తిలో ముందస్తుగా జగన్ జన్మదిన వేడుకలు
శ్రీకాళహస్తి : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ముందస్తు జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తిలో వైభవంగా ని ర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మ ధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభి మానులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి వేడుకలను విజయవంతం చేశారు. పట్టణమంతా వైఎస్సార్ సీపీ జెండాలు, నినాదాలతో ఉత్సాహభరితంగా మారింది. శ్రీకాళహస్తి వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు నిర్వహించిన భారీ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేతలు గజమాల వేశారు. అనంతరం జగనన్నకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. కార్యకర్తలు, అభిమానులకు అన్నదానం చేశారు. వాహనచోదకుల భద్రత కోసం జగనన్న జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నేతలకు హెల్మెట్లు పంపిణీ చేశారు.అలాగే సంప్రదాయ కళలను ప్రోత్సహించడమే లక్ష్యంగా డప్పు కళాకారులకు డప్పులు అందజేశారు. -
మా ఇంటి దీపం వెలిగించాడు!
శాంతిపురం: ‘‘నాకున్న 1.5 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుని భార్య జయంతి, కొడుకు పృథ్విఆదిత్యతో ఉన్నంతలో సంతోషంగా జీవించేవాడిని. మూడేళ్ల క్రితం నా కొడుకు ఆనారోగ్యానికి గురయ్యాడు. నెల రోజుల పాటు మేము ఆస్పత్రుల చుట్టూ తిరిగితే ఊపిరి తిత్తులు తీవ్రమైన ఇన్పెక్షన్కు గురైనట్టు తేల్చారు. అప్పట్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం గురించి తెలిసినా, నా బిడ్డ ఎదుర్కొంటున్న జబ్బుకు చికిత్సలు చేసే ఆస్పత్రులు స్థానికంగా లేక ఇబ్బంది పడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో వైద్యం కోసం చేసిన ఖర్చులు తమ శక్తికి మించి అయిన వారి సాయం తీసుకున్నా అదీ సరిపోలేదు. నానాటికీ అనారోగ్యం ముదురుతూ శ్వాస తీసుకోవడానికి అల్లాడుతున్న నా చంటి బిడ్డను చూస్తూ ఉండలేక సతమతమయ్యారు. చివరకు బెంగళూరులోని రెయిన్బో అస్పత్రికి తీసుకువెళితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించారు. రూ.10 లక్షలకు పైగా విలువైన చికిత్సలను ఉచితంగా అందించడంతో పృథ్విఆదిత్య గండం నుంచి గట్టెక్కాడు. ఇప్పుడు మూడేళ్ల వయసున్న బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అప్పట్లో తమ కష్టాన్ని, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి అందిన సాయాన్ని తలుచుకుని ధర్మేంద్ర దంపతులు చేతులు జోడించి నాటి సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. మా లాంటి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంటి మంచి మనసున్న పాలకులే కావాలి. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు.’’ – ధర్మేంద్ర, ఆరిముత్తనపల్లి, శాంతిపురం మండలం -
నేడు పల్స్ పోలియో
తిరుపతి తుడా: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఎంపిక చే సిన పలు కేంద్రాల్లోనూ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్టు డీఎంహెచ్ఓ డా క్టర్ బాలకృష్ణ నాయక్ తెలిపారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఆయన ర్యాలీని ప్రారంభించారు. జిల్లాలో 26 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 58 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో లక్ష్యం సాధన మేరకు 5 ఏళ్లలోపు పిల్లలు 2,59,843 మంది కాగా, వీరందరికీ పోలియో చుక్కలు అందించడానికి 1,868 పోలియా బూత్లను ఏర్పాటు చేశామన్నారు. 84 మొబైల్ బూత్లను, 59 ట్రాన్సిస్టర్ బూత్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. మహిళా వర్సిటీలో ‘ఇన్స్పైరింగ్ మైండ్స్’పై సదస్సు తిరుపతి రూరల్: శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని గణాంక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం ‘ఇన్స్పైరింగ్ మైండ్స్’పై సదస్సు నిర్వహించారు. స్కూల్ ఆఫ్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ టి.సుధ, స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్, పీఎం ఉషా, కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సి.వాణి, గణాంక శాస్త్ర విభాగం ఇన్చార్జి హెచ్ఓడీ డాక్టర్ ఎం.శివపార్వతి సదస్సులో పాలు పంచుకున్నారు. దక్షిణాఫ్రికాలోని యూనివర్సిటీ ఆఫ్ జూలు ల్యాండ్ నుంచి వచ్చిన ప్రొఫెసర్ శ్యామల కృష్ణనాయర్, డాక్టర్ అనిల్ కుమార్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఆ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో మొదటగా మద్రాస్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఎం.ఆర్. సింధుమోల్ ‘స్టాటిస్టిక్స్ మైండ్‘ అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం, ప్రొఫెసర్ శ్యామల కృష్ణనాయర్ పరిశ్రమల్లో మల్టీస్కేల్ ప్రాసెస్ మానిటరింగ్, సింగులర్ స్పెక్ట్రమ్ డీకంపోజిషన్ వంటి అధునాతన పద్ధతులపై అవగాహన కల్పించారు. 23, 24 తేదీల్లో మార్కెటింగ్పై అవగాహన తిరుపతి అర్బన్: ఎంఎస్ఎంఈ యజమాన్యానికి ఈ నెల 23, 24 తేదీల్లో కలెక్టరేట్ సమీపంలోని లెమన్ట్రీ హోటల్లో వ్యాపార విస్తరణపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నారని సమాచారశాఖ అధికారులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్కు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన వ్యాపారులు హజరుకావడానికి ఈ నెల 22వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అదనపు సమాచారం కోసం 9885429054, 9989094777 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,729 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,162 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.31 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. -
ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విప్లవం
తిరుపతి సిటీ:‘‘మాది తిరుపతి. నగరంలోని వైఎస్సార్ మార్గ్లోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ పాఠశాలల్లో మేము పదో తరగతి చదువుతున్నాం. నగరంలోని మా పాఠశాలను జగనన్న సీఎం అయిన తర్వాత నాడు–నేడు నిధులతో మూడు అంతస్తుల భవనం నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల గదులు, ప్రతి క్లాస్ రూమ్లో డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిపుణులైన ఉపాధ్యాయులతో ప్రాక్టికల్గా డిజిటల్ స్రీన్పై పాఠాలను బోధిస్తున్నారు. స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టీవ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా బోధిస్తుంటే ప్రతి అంశాన్ని నేరుగా చూస్తూ, సులువుగా అర్థం చేసుకుంటున్నాం. గతంలో పాఠశాలలో వాష్ రూమ్లు ఉండేవి కాదు. ఆరు బయటకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తు తం బాలబాలికలకు ఆధునాతనమైన బాత్ రూమ్లు, తరగతి గదుల్లో ఆకట్టుకునేలా డెస్క్లు ఏర్పాటు చేశారు. గతంలో జగనన్న గోరు ముద్ద ద్వారా 16 రకాల పదార్థాలతో ప్రత్యేక మెనూను రూపొందించి నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా అందించారు. గతంలో తెలుగు మీడియం మాత్రమే ఉండేది. జగన్ సార్ సీఎం అయిన తర్వాతనే మా స్కూల్లో పూర్తి స్థాయి ఇంగ్లీషు మీడియంగా మారింది. అమ్మఒడి ఏటా క్రమం తప్పకుండా మా అమ్మ ఖాతాలో జమచేయడంతో మా చదువుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగేది. జగనన్న విద్యా కానుక ఎంతో నాణ్యతతో అందించారు. అప్పటి బూట్లు, బ్యాగులు ఇప్పటికీ మేము వాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి మళ్లీ రావాలని కోరుకుంటున్నాం. జగన్ మామయ్య మీకు జన్మదిన శుభాకాంక్షలు.’’ – వెంకటేష్, జగదీష్, పదో తరగతి విద్యార్థులు, డాక్టర్ ఎస్ఆర్కే మున్సిపల్ స్కూల్, తిరుపతి -
మా ఊరు రూపు మార్చిన మహర్షి జగన్
తిరుపతి రూరల్: ‘‘మా ఊరు ఏర్పడినప్పటి నుంచి ఇంత అభివృద్ధి ఎప్పుడూ చూడలేదు. ఇలా మా ఊరు మారుతుందని కలలో కూడా ఊహించలేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా ఊరిలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి నగరానికి వెళ్లాల్సి వచ్చేది. కనీసం పిల్లలకు అవసరమైన చిన్న సర్టిఫికెట్ కావాలన్నా సరే పదిసార్లు టౌన్కు వెళ్లే వాళ్లం. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే మా గ్రామంలోనే అన్నీ ఉన్నాయి. ఎలాంటి సమస్య వచ్చినా సరే పరిష్కారం చేయడానికి గ్రామ సచివాలయంలో ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నారు. గతంలో ఆరోగ్యం బాగలేకుంటే ఒక నర్సు వచ్చి రెండు మందు బిళ్లలు ఇచ్చి వెళ్లేది. ఇప్పడు అత్యవసర వైద్యం అందించడానికి విలేజ్ క్లినిక్ మా ఊర్లోకే వచ్చింది. అనుకోని మహమ్మారి రోగాలు వస్తే తప్ప సాధారణ జబ్బులు అన్నింటికీ ఇక్కడే వైద్యం అందుతోంది. వ్యవసాయం చేయడానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, సలహాలన్నీ కూడా ఊరులోనే అందుతున్నాయి. గత ప్రభుత్వంలో జగనన్న ఆ ఊరుకి గ్రామ సచివాలయం, రైతు భరోసాకేంద్రం, మహిళాభవనం, విలేజ్ హెల్త్ క్లినిక్లను అందుబాటులోకి తెచ్చారు. గ్రామంలోని పాడుబడిన భవనంలో నడిచిన ప్రాథమిక పాఠశాల రూపు రేఖలు మార్చి కార్పొరేట్ తరహాలో భవనాలు నిర్మించి, సకల మౌలిక వసతులు కల్పించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు మినహా ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా కనిపించని ఆ ఊరులో నేడు 15 మంది ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే విద్య నుంచి విత్తనాల వరకు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంత చేయగలిగిన శక్తి, సామర్థ్యం ఒక్క జగనన్నకు మాత్రమే ఉంది.. మా ఊరు మారడమే కాదు.. మా బతుకులు కూడా మారాయి.. జగనన్నే మా నమ్మకం. మహర్షిలా మా ఊరును మార్చిన జగనన్నకు మా ఊరి ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. – విజయసింహారెడ్డి, గ్రామపెద్ద, తనపల్లి, తిరుపతి రూరల్ మండలం -
టీటీడీ ఆస్తులకు రక్షణేది?: భూమన
సాక్షి, తిరుపతి: టీటీడీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. టీటీడీ పవిత్ర స్థలాన్ని 7 స్టార్ హోటళ్లకు ఇవ్వడం సరికాదన్నారు. దేవుడి ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.. ప్రజా సంఘాలు, హిందుత్వ సంఘాలు ఆందోళనలుచేపట్టాలని భూమన పిలుపునిచ్చారు.‘‘ఎర్ర చందనం చెట్లకు కొత్తగా నెంబర్లు వేస్తున్నారు. ఒక్కో చెట్టుకు రెండు నంబర్లు వేస్తూ మోసం చేస్తున్నారు. ఎర్ర చందనం దుంగుల్ని కాపాడతానన్న పవన్ ఎక్కడ?. ఏపీ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలి’’ అని భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. -
బిడ్డ శవాన్ని మంత్రగాళ్లు ఎత్తుకెళతారని..
తిరుపతి: అనారోగ్యంతో వారం రోజుల కిందట ఓ బాలుడు(6) మృతి చెందగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలను పూర్తి చేశారు. అయితే తన బిడ్డ మృతదేహాన్ని మంత్రగాళ్లు ఎక్కడా తీసుకెళ్లిపోతారోనని, ఆ తండ్రి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళితే.. చంద్రగిరి మండలంలోని కందులవారిపల్లికి చెందిన ఓ బాలుడు అనారోగ్యంతో వారం కిందట మృతి చెందాడు. అనంతరం బాలుడి శవానికి గ్రామ పొలిమేరలోని శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.అయితే బాలుడు తమకు మొదటి సంతానం కావడంతో క్షుద్రపూజల కోసం మంత్రగాళ్లు మృతదేహాన్ని తీసుకెళతారని తండ్రికి అనుమానం వచ్చి కొద్దిరోజుల పాటు రోజుకు రూ.1500 చొప్పున డబ్బు ఇచ్చి నిఘా పెట్టాడు. ఆపై ఆర్థిక భారం అధికం కావడంతో తానే కాపలాగా ఉంటూ వచ్చాడు. చివరకు సమాధి వద్ద సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిత్యం సెల్ఫోన్ ద్వారా తన కుమారుడి సమాధిని పర్యవేక్షిస్తున్నాడు. తన బిడ్డపై ఉన్న మమకారంతో తండ్రి చూపిస్తున్న ప్రేమకు గ్రామస్తులు సైతం కంట తడిపెట్టారు. -
వైఎస్ జగన్ దృష్టికి కళత్తూరు సమస్యలు
వరదయ్యపాళెం: కేవీబీపురం మండలంలో ఇటీవల రాయలచెరువు తెగి ముంపునకు గురైన కళత్తూరు గ్రామ సమస్యలను తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తితో కలసి సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ముంపు సమయంలో జరిగిన నష్ట పరిస్థితులను తెలిపారు. అలాగే గ్రామంలోని ప్రతి ఇంటా జరిగిన నష్టం, పంట నష్టం, కోతకు గురైన పొలాలను గురించి వివరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు వివరాల గురించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. అలాగే వరద బాధితుల పక్షాన వైఎస్సార్సీపీ గట్టిగా నిలబడాలని, తప్పకుండా న్యాయం చేసే వరకు వారి పక్షాన పోరాడాలని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తిని, సమన్వయకర్త రాజేష్కు సూచించినట్లు సమాచారం. నిధులు వృథా చేస్తే చర్యలు తిరుపతి అర్బన్: నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేసి, వృథా చేసే పంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా పంచాయితీ అధికారి(డీపీఓ) సుశీలాదేవి స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్లోని తమ చాంబర్ నుంచి మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులు 2025–26కు సంబంధించి మొదటి విడతలో రూ. 32,24,48,796 మంజూరు చేశారన్నారు. అయితే జిల్లాలో 774 పంచాయతీలు ఉన్నప్పటికీ ఎన్నికలు జరిగిన 744 పంచాయతీలకు మాత్రమే నిధులు విడుదల చేశారని వెల్లడించారు. ఈ నిధులను తాగునీటి అవసరాలు, చేతిపంపులు, నీటి ట్యాంకులు, మోటార్ల నిర్వహణకు, పారిశుద్ధ్యానికి వినియోగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నేటితో ముగియనున్నపది పరీక్షల ఫీజు గడువు తిరుపతి సిటీ: జిల్లాలో ఇప్పటి వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించని విద్యార్థులు రూ.500ల అపరాధ రుసుముతో శనివారంలోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిందని, ఇదే చివరి అవకాశమని వెల్లడించారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులను సంప్రదించి తక్షణం ఫీజు చెల్లించాలని సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నేడు, రేపు సైన్స్ ఎగ్జిబిషన్ తిరుపతి రూరల్ : ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా శని, ఆదివారాల్లో తిరుపతిలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు ఏపీ ఎస్పీ డీసీఎల్ చైర్మన్ – మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. తిరుపతి పాత తిరుచానూరు రోడ్డు లోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఎగ్జిబిషన్ను ఏ ర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదు వుతున్న విద్యార్థులకు స్టాల్స్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. స్టాల్స్ విజేతలతోపాటు సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో నిర్వహించిన క్విజ్, వక్తృత్వ పోటీల్లో విజేతలకు ఈ నెల 21న రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవం నిర్వహించారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుంచి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జియ్యంగార్లు గోష్ఠిగానం చేస్తారు. తిరుమల పెద్దజీయర్స్వామి, తిరుమల చిన్న జీయర్స్వామి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం పాల్గొన్నారు. -
ఎర్రచందనం దుంగల పరిశీలన
కలువాయి(సైదాపురం): ప్రభుత్వ అనుమతితో నరికి, విక్రయించేందుకు ఓ ప్రైవేట్ సంస్థలో ఉంచిన ఎర్రచందనం దుంగలను జిల్లా అటవీశాఖాధికారులు, ఫారెస్ట్ రేంజ్ అధికారి మాల్యాద్రి శుక్రవారం పరిశీలించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి మాట్లాడుతూ మొత్తం ఐదు ఎర్రచందనం చెట్లు నరకగా వచ్చిన నాలుగు టన్నుల బరువున్న 39 దుంగలు, నాలుగు వేర్లు 970 కిలోలు ఉన్నట్లు తెలిపారు. వీటి కొలతలు, బరువు పరిశీలించిన అనంతరం సంబంధిత వారికి పర్మిట్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు స్క్వాడ్ రేంజర్ రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతకు రాయితీ దూరం
ప్రభుత్వం రైతులకు ఏదైనా మేలు చేస్తుందంటే అది రాయితీ విత్తనాల పంపిణీ మాత్రమే. ఈ క్రమంలో తిరుపతి జిల్లాలోని కర్షకులకు ఏటా రబీలో ప్రభుత్వం సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేసేది. ఈ ఏడాది ధరలు అధికంగా ఉన్నాయని, బాబు సర్కారు రాయితీ విత్తన పంపిణీ ప్రక్రియను ఆపివేసింది. దీంతో సన్న, చిన్నకారు రైతులు విత్తన కాయలకు అధిక ధరలు వెచ్చించలేక ఆ పంటకు దూరం అయ్యారు. తిరుపతి అర్బన్: వేరుశనగ పంటకు తిరుపతి జిల్లా పెట్టిన పేరు. దూర ప్రాంతాల నుంచి సైతం వేరుశనగ కాయలు కావాలంటే తిరుపతి జిల్లాకు వచ్చి కొనుగోలు చేసేవారు. ఈ క్రమంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న దశాబద్దాలుగా ఏటా రబీ సీజన్లో 55 నుంచి 60 శాతం రాయితీతో రైతులకు విత్తనాలు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఇచ్చేవారు. అయితే ఈ రబీ సీజన్లో విత్తనాలు రేట్లు అధికంగా ఉన్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం రాయితీ విత్తనాలు ఇవ్వాలేమని వ్యవసాయాధికారులకు సందేశం చేరవేసినట్లు తెలుస్తోంది. వేరుశనగ పంట దూరం... జిల్లాలో ప్రధానంగా వరి, వేరుశనగ, మామిడి, చెరుకు అధికంగా సాగు చేస్తున్నారు. అయితే గతంలో చంద్రబాబు పాలనలోనే చెరుకు బకాయిలు ఇవ్వకుండా కొందరు ఫ్యాక్టరీలు యజమానులు రైతులను ఇబ్బందులు పెట్టడంతో జిల్లాలో చెరుకు సాగు పూర్తిగా కనుమరుగైంది. మరోవైపు బాబు పాలనలోనే ఈ ఏడాది మామిడి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గిట్టుబాటు ధర చెల్లించకపోవడంతో మామిడి పంట సాగు సైతం తరిగిపోతోంది. తాజాగా ఆయన పాలనలోనే రాయితీతో రైతులకు ఇవ్వాల్సిన వేరుశనగ విత్తనాలు ఎగనామం పెట్టడంతో ఈ పంట సైతం జిల్లాలో దూరం అవుతుంది. రాయితీ విత్తనాల పంపిణీ ఆపి వేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మిగిలిన పంట కేవలం వరి మాత్రమే. అయితే యూరియా ఇబ్బందులతో ఆ పంట సైతం చంద్రబాబు పాలనలో దూరమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రైతులు చర్చించుకుంటున్నారు. గత ఏడాది రాయితీ వేరుశనగ కాయలను టీడీపీ నేతలు పెద్ద మొత్తంలో తీసుకుని జిల్లాలో తిరిగి డబ్బులు చెల్లించలేదు. దీంతోనే ఈ సీజన్లో ఆపివేశారని కొందరు, ధరలు పెరుగుదలతోనే రాయితీ ఇవ్వలేక ఆపివేసినట్టు మరి కొందరు చర్చించుకుంటున్నారు.అనంతపురం కదిరి ప్రాంతంలో టాగ్ 24 రకం, కే6, జేఎల్ 26 రకాల వేరుశనగ కాయల బస్తా(50కిలోలు) రూ.5500 నుంచి రూ.6 వేలకు ప్రైవేటు వ్యాపారులు విక్రయిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీ 55 నుంచి 60 శాతంతో ఇచ్చి ఉంటే బస్తా రూ.2300 నుంచి రూ.2500కు వచ్చేది. చంద్రబాబు సర్కార్ వేరుశనగ పంపిణీ ఎగనామం పెట్టడంతో ఈ పంట జిల్లాలో సాగుకు దూరమైంది.కాగా వేరుశనగ రాయితీ విత్తనాలు ఇవ్వకుండా ప్రభుత్వం గత నెల నవంబర్ 15 నుంచి ఈ నెల 15 వరకు వేరుశనగ పంట సాగు చేసిన రైతులు ఎకరం పంటకు బీమా ప్రీమియం రూ.450 చెల్లించాలని తెలపడం విడ్డూరంగా ఉంది. -
ఇద్దరు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
4 కిలోల గంజాయి స్వాధీనం రేణిగుంట: అరకు ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి తిరుపతి పరిసర ప్రాంతాల్లో విక్రయించే ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఈ వివరాలను వెల్లడించారు. పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు రేణిగుంట సంత వద్ద అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు తనిఖీ చేశారు. వారి వద్ద నల్ల కవర్లో నాలుగు కిలోల గంజాయి ఉండగా గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తిరుమల బాలాజీ నగర్కు చెందిన మేలపాటి యశ్వంత్, తిరుపతి బీటీఆర్ కాలనీకి చెందిన మల్లెల సూర్యగా గుర్తించామని డీఎస్పీ అన్నారు. అరకు ప్రాంతానికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తి వద్ద నుంచి తీసుకువచ్చి, తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వారు విచారణలో తెలిపారన్నారు. నిందితులను అరెస్టు చేసి, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. సమావేశంలో రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి, ఎస్ఐ నాగరాజు పాల్గొన్నారు. -
ఇండియన్ బ్యాంక్ నుంచి టీటీడీకి విరాళం
తిరుమల: టీటీడీకి ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణేశ్కుమార్ రూ. 37,97,508 విరాళం అందజేసినట్లు తెలిపారు. ఈ నెల 19వ తేదీన అదనపు ఈఓ వెంకయ్య చౌదరిని కలసి విరాళం డీడీని అందజేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. అలిపిరి చెక్పోస్టు వద్ద ఏర్పాటు చేయనున్న సెక్యూరిటీ లగేజీ స్కానర్ కోసం విరాళం అందజేసినట్లు తెలిపారు. టీటీడీకి రూ.20 లక్షలు విరాళం హైదరాబాద్ కు చెందిన హిమశ్రియ దంతు అనే భక్తురాలు టీటీడీ స్విమ్స్ ట్రస్టుకు శుక్రవారం రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. అలాగే ఫ్లాష్లైన్ ఈఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు వారి ప్రతినిధి కుప్పాల నీలేష్ కుమార్ తిరుమలలో అదనపు ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. -
ప్రభుత్వ భూములు.. ప్రైవేటు ఆసాములు
అడిగేవారు.. అడ్డుకునే వారులేరని..ప్రభుత్వ, అటవీ భూములను ఆక్రమించేశారు. ఆపై వాటికి ఫెన్సింగ్ వేసుకుని, నకిలీ పత్రాలు సృష్టించి, తమ సొంతం చేసుకున్నారు. అడ్డొచ్చిన గ్రామస్తులపై దౌర్జన్యం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు సైతం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించడంతో సర్కారు స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. రామచంద్రాపురం: మండలంలోని రాయలచెరువు పరిసరాల్లో ప్రభుత్వ భూములపై రాబందులు పడి అందినకాడికి ఆక్రమించేసుకుంటున్నారు. అడ్డొచ్చిన గ్రామస్తులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ రాక్షసుల్లా వ్యవహరిస్తుండం మండలంలో చర్చనీయాంశమైంది. రామచంద్రాపురం మండలానికి చెందిన మండల మాజీ నాయకుడొకరు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారంటూ రెండు రోజుల క్రితం గ్రామస్తులతో కలిసి కూటమి నేతలు ఆందోళనకు దిగారు. అటవీ భూమి ఆక్రమిత స్థలంలో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్, హద్దు రాళ్లను పడగొట్టారు. రాయలచెరువు లెక్కల దాఖలాలో సర్వే నంబర్లు 410/1, 410/6, 409/1 పరిధిలో నాలుగు ఎకరాలకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి, ఏకంగా 30 ఎకరాల అటవీ భూమిని చదును చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నకిలీ పట్టాలను గుర్తించిన అధికారులు మండలంలోని ప్రభుత్వ భూములను నకిలీ పత్రాలతో కబ్జా చేయడంపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు విచారణ చేపట్టారు. పట్టాలను పరిశీలించిన అధికారులు ఇవి పూర్తిగా బోగస్ పట్టాలని నిర్ధారించి, పనులను అడ్డుకున్నారు. ప్ర స్తుతం కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో రాబందుల్లా ప్రభుత్వ భూములపై వాలిపోయారు. మంత్రి అనుమతి ఉందంటూ బెదిరింపు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్న ఆ పార్టీ నేత తమకు మంత్రి అండదండలు ఉన్నాయంటూ అధికారులు, ప్రజలను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆక్రమణకు అండగా 70 మందికి పైగా మద్దతుదారులు ఉన్నారని, ఆక్రమణదారుడు వాగ్వాదం చేశారు. ఈ క్రమంలో కూటమి నాయకులు, గ్రామస్తులు కలిసి పనులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. -
భార్య హత్య కేసులో భర్తకు 20 ఏళ్లు జైలు
సూళ్లూరుపేట: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.2 వేలు జరిమానా విఽధిస్తూ నెల్లూరు ఏడీజే కోర్టు న్యాయమూర్తి ఎం సోమశేఖర్ శుక్రవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. సూళ్లూరుపేట మండలంలోని మన్నేముత్తేరి పంచాయతీ జంగాలగుంటలో 2017 ఫిబ్రవరి 28న రాత్రి పులి మునస్వామి పూటుగా మద్యం సేవించి, భార్య ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను నెల్లూరు నారాయణ ఆ స్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ మార్చి 4న మృతి చెందింది. ఈ కేసును అప్పటి సీఐ విజయకృష్ణ విచారించి, నిందితు డిని అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్లు జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు దగ్ధం చిల్లకూరు: గూడూరు పట్టణంలోని తిలక్నగర్లోని సుజాతమ్మకు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధం అయ్యింది. స్థానికుల కథనం మేరకు.. గూడూరు తిలక్ నగర్లో సు జాతమ్మ నివాసం ఉంది. ఈ క్రమంలో శుక్రవా రం ఉదయం ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి, మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్టోని వారంతా బయటకు పరుగులు తీసి, మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినా మంటలు అదుపుకాకపోవడంతో స్థానికులు అగ్నిమాక శాఖ సిబ్బందికి సమాచారం అందజేశారు. అగ్నిమాపకశాఖ వచ్చి మంటలను అదుపు చేసే సరికే ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుజాతమ్మ కుటుంబం కట్టుబట్టలతో మిగిలారు. జిల్లాస్థాయి విద్యవైజ్ఞానిక ప్రదర్శన నేడు నాయుడుపేట టౌన్: పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి జరగనున్న జిల్లాస్థాయి విద్యవైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆ ప్రదర్శన నిర్వహణ జిల్లాధికారి కే భానుప్రసాద్ తెలిపారు. ఈ ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, డీఈఓ కేవీఎన్ కుమార్తో కలిసి ప్రారంభిస్తారన్నారు. ఏర్పాట్లను జిల్లాధికారి, డిప్యూటీ డీఈఓ దువ్వూరు సనత్ కుమార్ పరిశీలించారు. రేపు జాబ్ మేళా తిరుపతి సిటీ: తిరుపతి నగరంలోని శ్రీనివాసపురంలో వున్న హెచ్కేఎస్ జాబ్ సర్వీసెస్ సెంటర్లో ఆదివారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధినేత కేశవప్రసాద్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పలు ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, పీజీ చదివిన అభ్యర్థులు హాజరుకావచ్చని తెలిపారు. వివరాలకు 8978133574, 8522031850 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నారావారిపల్లి శివారులో చిరుత సంచారం చంద్రగిరి: మండలంలోని నారావారిపల్లి శివారులో శుక్రవారం చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామంలోని టీటీడీ కల్యాణ మండపం వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలోని బండరాయిపై చిరుత పులి కదలికలను స్థానికులు గుర్తించారు. మరికొంత మంది చిరుత పులి వెళుతున్న దృశ్యాలను తమ సెల్ఫోన్లలో బంధించారు. గతంలో ఎన్నడూ చిరుత సంచారం జరిగిన దాఖలాలు లేవని, అయితే నారావారిపల్లి గ్రామానికి సమీపంలో చిరుత పులి సంచరించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మహిళ దుర్మరణం మండ్య(కర్ణాటక): కారు గోడను ఢీకొని మహిళ మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఈఘటన మండ్య నగర సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతికి చెందిన దివ్య (26) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. తన కుటుంబంతో కలిసి శుక్రవారం బెంగళూరు నుంచి మైసూరుకు కారులో వెళుతుండగా మండ్య నగర శివార్లలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన గోడను ఢీకొంది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో దివ్య మృతి చెందగా గాయపడిన దినేష్, తేజు, ప్రియాంక, డ్రైవర్ సిద్ధిక్ను మిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తరువాత, వారిని మైసూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి సంఘటన స్థలాన్ని సందర్శించారు. మండ్య రూరల్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పట్టా భూమిగా మార్చి.. ఏమార్చి!
● దర్జాగా కబ్జా ఏర్పేడు: ‘అది ప్రభుత్వ భూమి... అయితే దాన్ని ఆక్రమించుకున్న ఓ వ్యక్తి రెవెన్యూ అధికారుల అండదండలతో సెటిల్మెంట్ భూమిగా వేరొక సర్వే నంబర్తో మార్చుకుని దర్జాగా అనుభవిస్తున్నాడు. ఏర్పేడు–వెంకటగిరి మార్గం చింతలపాళెం రెవెన్యూ పరిధిలో రోడ్డు పక్కన సర్వే నంబర్ 46–14లో 39 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఈ భూమిని కాజేసిన వ్యక్తి కొన్నేళ్ల కిందట దీనిని స్వానుభవం సెటిల్మెంట్ పట్టా భూమిగా మార్చారు. రెవెన్యూ అధికారులు ఏకంగా సర్వే నంబర్ను 46–20 పేరుతో కొత్త నంబర్ సృష్టించి 73 ఖాతా నంబర్తో ఆన్లైన్లో సొంత భూమిగా నమోదు చేశారు. రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించి సాగుచేసుకుంటున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏర్పేడు తహసీల్దార్ ఎం.భార్గవిని వివరణ కోరగా విచారించి, ప్రభుత్వ భూమి అని తేలితే తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
పాకాల: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసుల కథనం మేరకు.. పదిపుట్లబైలు పంచాయతీ పెరుమాళ్లగుడిపల్లి గ్రామంలోని నీటి ట్యాంకు కింద ఉన్న చిన్న గది నుంచి శుక్రవారం కుళ్లిన వాసన వస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ మృతదేహం కుళ్లిపోయి, కనిపించింది. మృతుడు వచ్చిన ద్విచక్ర వాహనం మండలంలోని పదిపుట్లబైలు సమీపంలో పంటపొలాల్లో పడి ఉండడాన్ని చూసిన స్థానికులు ఈ నెల 16వ తేదీన పాకాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ద్విచక్ర వాహనం నంబర్ ఆధారంగా స్కూటరిస్ట్ అడ్రస్ను తెలుసుకుని పీలేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెల్డింగ్ షాపు యజమాని, మృతుని తల్లి ఇరువురు స్కూటర్ వద్ద దొరికిన ఆధార్కార్డుతో మృతుడు చిత్తూరు జిల్లా, బంగారుపాళెం మండలం, జి.కురూపపల్లికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు డి.చిట్టిబాబుగా (24)గా గుర్తించారు. మృతుడు పీలేరులోని ఓ వెల్డింగ్ షాపులో హెల్పర్గా పని చేసేవాడు. ఈ నెల 15వ తేదీ రాత్రి వెల్డింగ్ షాపు ఓనరు ద్విచక్ర వాహనంలో పీలేరు నుంచి స్వగ్రామానికి బయలు దేరాడు. మృతుడు ఫూటుగా మద్యం తాగి స్కూటర్పై పడిపోవడంతో దెబ్బలు తగిలి 50 అడుగుల దూరంలో ఉన్న ట్యాంకు గదిలోకి వెళ్లి ఉండవచ్చని, అక్కడే అతను మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగమంజుల తెలిపారు. -
● కొరవడిన పర్యవేక్షణ ● ప్రాజెక్ట్కు పొంచిఉన్న ముప్పు ● అడవిని తలపిస్తున్న కట్ట
రాపూరు/సైదాపురం: మండలంలో తెలుగుగంగ పథకంలో భాగంగా నిర్మించిన కండలేరు జలాశయంపై పర్యవేక్షణ లోపించడంతో శిథిలావస్థకు చేరుతోంది. కనీసం మరమ్మతులు చేపట్టకపోవడడంతో ప్రాజెక్ట్కు మనుగడకు ముప్పువాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. జలాశయం హెడ్ రెగ్యులేటర్ల షట్టర్లు పాడైపోవడంతో హుటాహుటిన నిపుణుల కమిటీ పర్యవేక్షించింది. అయినా ప్రయోజనం కనిపించడం లేదు. జలాశయంలో నీటిమట్టం పూర్తిగా తగ్గితేనే మరమ్మతు చేసేందుకు వీలుంటుందని నిపుణుల కమిటీ నిగ్గు తేల్చింది. దీంతో నిండుకుండలా ఉన్న కండలేరు జలాశయంపైనే సాగు చేసే అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. శాశ్వత మరమ్మతులు చేపట్టకపోతే జలాశయం మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. కాలువలకు నీరు విడుదల కండలేరు జలాశయం నుంచి సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు నియోజక వర్గాల్లోని చెరువులకు ఏటా కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తారు. ఇందుకోసం కండలేరులో 60 టీఎంసీలు నీరు నిల్వ చేస్తారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,160 క్యూసెక్కులు, పిన్నేరు కాలువకు 20 క్యూసెక్కులు, హైలెవల్ కాలువకు 100, లోలెవల్ కాలువకు 50 క్యూసెక్కులు, మొదటి బ్రాంచ్ కెనాల్కు 75 క్యూసెక్కులు వంతున నీరు విడుదల చేస్తున్నారు. దీంతో కండలేరు నుంచి చెరువులకు సాగునీరు వస్తుంది. ప్రస్తుతం కండలేరు జలాశయంలో పుష్కలంగా నీరు ఉండడంతో రబీ సీజన్పైనే అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. అవసరం ఇలా.. కండలేరు జలాశయం పరిధిలోని నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం రబీ సీజన్లో సాగునీటి అవసరాలకు విడతల వారీగా నీటిని విడుదల చేస్తున్నారు. మట్టికట్టపై అడవిని తలపిస్తున్న కర్ర తుమ్మ కండలేరు జలాశయం మట్టికట్టపై రెండేళ్లుగా చెట్లును తొలగించకపోవడంతో అడవిలా తయారైంది. ఇటీవల కురిసిన మెంథా, దిత్వా తుపాన్లతో కురిసిన భారీ వర్షాలకు జలాశయంలోకి పూర్తిగా నీరు చేరడంతో అధికారులు నానా ఇబ్బందులు పడ్డారు. గతంలో ఏటా మట్టికట్టపై ఉన్న కర్ర తుమ్మ చెట్లను తొలగించి, కట్టను బాగు చేస్తుండేవారు. అయితే రెండేళ్ల నుంచి అలాంటి జాడ లేకపోవడంతో కట్టకు కూడా పెను ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్లూయిజ్ వద్ద కూడా కంప పెరిగిపోవడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల కమిటీ పరిశీలన కండలేరు జలాశయాన్ని గత రెండేళ్ల క్రితం నిపుణుల కమిటీ పరిశీలించింది. కండలేరు జలాశయం నిర్మాణం చేపట్టి సుమారు 30 ఏళ్లు పూర్తి కావస్తుందని, మట్టికట్టను వెడల్పు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కానీ ఇప్పటికీ ఆ నివేదిక కార్యరూపం దాల్చలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా కండలేరు జలాశయాన్ని డిసెంబర్ 17వ తేదీన నిపుణుల కమిటీ పరిశీలించింది. లీకేజీ సమస్య, గేట్లు ఎత్తే సమయంలో గేట్లు పైకి లేవడంలేదని అక్కడి సిబ్బంది కమిటీ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం జలాశయంలో 60 టీఎంసీల నీరు ఉండడంతో లీకేజీ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడం కష్టమని తెలిపారు. నీరు తగ్గిన తరువాత వచ్చి మరోసారి పరిశీలించి లీకేజీ సమస్య పరిశీలించగలని నిపుణుల బృందం తేల్చి చెప్పింది. దేశ చరిత్రలోనే ఖ్యాతి.. కండలేరు జలాశయం దేశంలో ఎక్కడ లేని విధంగా 10.758 కి.మీ. పొడవున మట్టికట్టను నిర్మించారు. ఇంత పెద్ద మట్టికట్ట ఆసియా ఖండంలో మరొకటి లేకపోవడం విశేషం. జలాశయంలో భాగంగా కండలేరు అతిథిగృహం, కండలేరు హెడ్రెగ్యులేటర్, పవర్స్లూయిస్, అప్రోచ్ చానల్స్ నిర్మించారు. 1983లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, ఎంజీఆర్ శంకుస్థాపన చేశారు.ఈ జలాశయంలో 68 టీఎంసీల నీరు నిల్వ ఉంచి చైన్నె, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగునీరు అందిచేందుకు ఈప్రాజెక్టు నిర్మించారు. 10.758 కిలోమీటర్ల పొడవు, 49 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల వెడల్పుతో మట్టికట్ట నిర్మించారు. 1984లో ప్రారంభమైన ఈ పనులు 1996 వరకు కొనసాగాయి, 22 గ్రామాలు జలాశయంలో ముంపునకు గురయ్యాయి, 2021 లో 61.03 టీఎంసీల నీరు నిల్వ చేశారు. దెబ్బతిన్న హెడ్ రెగ్యులేటర్ గేట్లు కండలేరు జలాశయం హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న గేట్లు పలుసార్లు మరమ్మతులు చేశారు. కానీ హెడ్ రెగ్యులేటర్ వద్ద కొన్నేళ్లుగా లీకేజీ సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలో పలుసార్లు నిపుణుల కమిటీ పరిశీలించింది. అయినా లీకేజీని అరికట్టలేకపోయింది. అలాగే సకాలంలో గేట్లు ఎత్తడంతో సిబ్బంది కొంతమేర కష్టపడుతుంటారు. జలాశయం నుంచి నీరు విడుదల చేసే సమయంలో గేట్లు పైకి ఎత్తడం కష్టంగా మారుతుంది. ప్రైజర్ ద్వారా గేట్లు ఎత్తుతుంటారు. కండలేరు జలాశయంలోని హెడ్ రెగ్యులేటర్కు 2014–15 సంవత్సరంలో రూ.కోటి నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో రోప్, బేరింగ్ తదితర పరికరాల మరమ్మతుకు వినియోగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 2024–25 సంవత్సరంలో కండలేరు గేట్లకు రూ.67 లక్షలు నిధులు మంజూరు చేయడంతో గేట్లు మరమ్మతులు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రవాహవేగంతోనే జలాశయం 391 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉన్నప్పటికీ దీని పరిధిలో వచ్చే వర్షపు నీరు 3 టీఎంసీలు మాత్రమే. మిగిలిన నీరు కృష్ణా, పెన్నా నదుల నుంచి జలాశయానికి తరలిస్తారు. కండలేరు జలాశయం హెడ్రెగ్యులేటర్ నుంచి 178 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూండి (చైన్నె) జలాశయానికి ప్రతి సంవత్సరం 12 టీఎంసీల తాగునీరు విడుదల చేయాల్సి ఉంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు సాగునీరు, ఈ జిల్లాల ప్రజలకు తాగునీరు అందిస్తారు. నీరు తగ్గిన తరువాత మరమ్మతులు చేస్తాం కండలేరు జలాశయం హెడ్రెగ్యులేటర్ వద్ద గేట్లు గత 30 ఏళ్ల కిందట నిర్మించారు. ప్రతిసారి నీళ్లు వదిలే సమయంలో గేట్లు ఎత్తుతూ దించుతూ ఉండడంతో కొంతమేర దెబ్బతిని ఉండవచ్చు. అలాగే కాంక్రీట్ వాల్ కూడా దెబ్బతిని ఉంటుందని నిపుణుల కమిటీ సూచించింది. నీళ్లు తగ్గిన తరువాత నిపుణుల కమిటీ, ఉన్నతాధికారుల సూచన మేరకు మరమ్మతులు చేపడతాం. –అనిల్కుమార్, ఏఈ, తెలుగుగంగ -
ఎర్రచందనం కేసులో నలుగురికి ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్ ఎర్రచందనం చెట్లను నరికి తరలిస్తున్న కేసులో నలుగురికి ఒక్కొక్కరికి ఐదేళ్లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ అధికారి హరినాథ్, కోర్టు కానిస్టేబుల్ నరసింహులు కథనం మేరకు.. 2017 ఆగస్టు ఏడో తేదీ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో భాకరాపేట స్టేషన్ పోలీసులకు అందిన సమాచారంతో వారు చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట, దేవరకొండ రోడ్డు, విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పరిగెత్తడానికి ప్రయత్నించారు. పోలీసులు కలికిరి మండలం, గుట్ట పాళెం సమీపంలోని అచ్చర్ల గొల్లపల్లికి చెందిన ఎన్.రెడ్డెప్ప, పి నాగరాజ అలియాస్ గోవింద్, ఎర్రావారిపాళెం మండలం, బుగ్గలవారిపల్లి హరిజనవాడకు చెందిన ముడిమి చెంగయ్య, అదే మండలం, గొల్లపల్లికి చెందిన బి.వెంకటాద్రి అలియాస్ చిన్నను అదుపులోకి తీసుకున్నారు. వారు ఉన్న సమీపంలోని పొదల్లో దాచిన 44 కిలోల నాలుగు ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నలుగురిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నలుగురికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ అమర్ నారాయణ వాదించారు. మరో కేసులో ఇద్దరికీ మూడేళ్లు.. ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న కేసులో ఇద్దరికీ మూడేళ్లు చొప్పున జైలుశిక్ష , ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ జడ్జి శ్రీకాంత్ శుక్రవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. 2009 ఆగస్టు ఒకటో తేదీ కడప ఫ్లయింగ్ స్క్వాడ్ ఫారెస్ట్ సిబ్బంది బద్వేలు రేంజ్ పరిధిలోని సోమిరెడ్డిపల్లి వ్యవసాయ భూముల్లో తనిఖీలు చేసి 201 కిలోల బరువున్న ఎనిమిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా, బి మఠం మండలం, లింగాల దిన్నిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన కత్తి గురుమూర్తి, అదే మండలం, సోమశెట్టిపల్లికి చెందిన డేరింగ్ ల సుబ్రహ్మణ్యంను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
తిరుమలలో మరో అపచారం..
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వరుస అపచారాలు చోటుచేసుకుంటున్నాయి. టీటీడీ విజిలెన్స్ వైఫల్యాలు బయటపడుతున్న నేపథ్యంలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తిరుమలలో మరో అపచారం జరిగింది. ఓ గదిలో భక్తుడి వద్ద కోడి గుడ్లను పట్టుకున్నారు. ఈ ఘటన కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. తిరుమలలో వరుస అపచారాలు, విజిలెన్స్ వైఫల్యాలు భక్తులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. గత నెలలో అలిపిరి మెట్లమార్గంలో నాన్ వెజ్ తింటూ ఉద్యోగాలు పట్టుబడిన సంగతి తెలిసిందే. అలాగే, గతంలో శ్రీవారి ఆలయం ముందున్న బస్టాండులో భక్తులు ఎగ్ బిర్యానీ తింటూ దర్శనమిచ్చారు. అలిపిరిలో మద్యం, నాన్వెజ్ కలకలం సృష్టించింది. అంతేకాకుండా తిరుమలలో మద్యం మత్తులో యువకులు హల్చల్ చేసిన వీడియోలు బయటకువచ్చాయి. ఇక, తాజాగా తిరుమలలో కోడి గుడ్లను టీటీడీ సిబ్బంది గుర్తించారు. కౌస్తుభంలోని 538 గదిలో భక్తుడి వద్ద గుడ్లు చూసిన సిబ్బంది వారిని పట్టుకున్నారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,729 మంది స్వామివారిని దర్శించుకున్నారు.22,162 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.47 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 5 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో ఏం జరిగినా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని.. ఏ ఘటన జరిగినా టీటీడీ బోర్డుదే బాధ్యత అంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. కానుకల లెక్కింపులో పారదర్శకత ఉండాలన్న ధర్మాసనం.. టెక్నాలజీని వినియోగించుకోవాలని హైకోర్టు సూచించింది.టీటీడీ పరకామణి చోరీ కేసు పిటిషన్పై హైకోర్టు ఇవాళ(డిసెంబర్ 19, శుక్రవారం) విచారణ చేపట్టింది. పరకామణి లెక్కింపు వ్యవహారంలో గత విచారణలో సలహాలు ఇవ్వమన్న దానిపై ఏమైనా సలహాలు ఇస్తారా అంటూ టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ను న్యాయస్థానం ప్రశ్నించింది. కానుకల లెక్కింపు,పర్యవేక్షణ, రికార్డుల సేకరణ కోసం AI టెక్నాలజీ, కంప్యూటర్స్ వినియోగించాలని పేర్కొంది. చివరి పైసా వరకు లెక్క సరిగ్గా ఉండాలని.. చోరీలు, మోసాలు జరగకుండా చూడాలని హైకోర్టు చెప్పింది.టీటీడీ బోర్డ్ వెంటనే వీటిపై చర్యలు చేపట్టాలని.. ఒక ముసాయిదా రూపొందించాలని పేర్కొంది. రెండు వారాల్లోగా దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. టీటీడీ బోర్డు 8 వారాల్లోగా ప్లాన్ B పై నివేదిక సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. -
మోహిత్ రెడ్డిని అభినందించిన అధినేత
– చంద్రగిరిలో లక్షా 16 వేల సంతకాల సేకరణపై ప్రశంసలు తిరుపతి రూరల్ : చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభినందించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం చంద్రగిరిలో చరిత్ర సృష్టించిందని, సీఎం చంద్రబాబు పుట్టి, పెరిగిన నియోజక వర్గంలోనే లక్షా 16 వేల మంది సంతకం పెట్టినట్టు తెలుసుకున్న ఆయన శభాష్ అంటూ ప్రశంసించారు. గురువారం తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలసిన చెవిరెడ్డి మోహిత్రెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. ఆ తరువాత చెవిరెడ్డి ఆరోగ్యం గురించి ఆరా తీసిన జగన్ ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయం, ధర్మం గెలుస్తుందని చెవిరెడ్డి కుటుంబానికి అండగా నిలబడతానన్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : శ్రీకాళహస్తి మండలం ఆదవరం అటవీ పరిధిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఒక స్మగ్లరును టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. తీర్ధాలపాల కోన వద్ద కొంత మంది వ్యక్తులు గుమికూడి కనిపించగా వారిని పోలీసులు చుట్టుముట్టే ప్రయత్నం చేయగా పారిపోతున్న క్రమంలో ఒకరిని పట్టుకున్నారు. పట్టుబడిన స్మగ్లరు కర్ణాటకకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆ పరిసరాల్లోని ఆరు ఎర్రచందనం దుంగలు, ఉపయోగించిన ద్విచక్ర వాహనం సహా తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. సిద్ధార్థ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఐడియాథాన్–2025 నారాయణవనం : తిరుపతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్టిఐహెచ్) సహకారంతో సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ఐడియాథాన్ –2025ను నిర్వహించారు. 90 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు పాల్గొని, తమ వినూత్న ఆలోచనలు, స్టార్టప్ ఐడియాలు, సాంకేతిక పరిష్కారాలను ప్రదర్శించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రతినిధులు సిల్వియా, వినోద్ కుమార్, వీరేంద్ర సాయి, శ్రీనివాస్ విద్యార్థుల ఆలోచనలను పరిశీలించి సూచనలు అందించారు. ప్రాజెక్టులు, ఆలోచనలపై మార్గదర్శకాలను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు, హెచ్వోడీలు, కంప్యూటర్ సైన్ విద్యార్థులు పాల్గొన్నారు. బైక్ ఢీకొని వ్యక్తి మృతి నాయుడుపేట టౌన్ : మండలంలోని చలివేంద్రం గ్రామ సమీపంలో బైక్ ఢీకొని గాయపడిన కల్లుగీత కార్మికుడు కన్నడి వెంకటయ్య(65) మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. చలివేంద్రం గ్రామానికి చెందిన వెంకటయ్య గురువారం సాయంత్రం గ్రామ సమీపంలో రోడ్డు పక్కగా నడిచి వెళుతున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. ఈ క్రమంలో మార్గమధ్యలో వెంకటయ్య మృతి చెందాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీకి తరలించారు. సీఐ బాబి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
తడ : కార్మికులను తరలిస్తున్న ప్రైవేటు బస్సు జాతీయ రహదారిపై మూడు బైకులను ఢీకొట్టిన ఘటనలో నలుగురు ద్విచక్ర వాహనదారులు గాయపడ్డారు. గురువారం కాదలూరు గ్రామం వద్ద జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బూదూరు నుంచి మాంబట్టు సెజ్లోని పరిశ్రమకు కార్మికులను తీసుకొస్తున్న బసు ప్రమాద స్థలం వద్ద ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ముందు ఆగి ఉన్న మూడు బైక్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో దొరవారిసత్రం మండలానికి చెందిన రమేష్, యమున, సంపూర్ణతో పాటు మరో మహిళ గాయపడ్డారు. వీరంతా కూడా అపాచీ పరిశ్రమలో పని చేస్తూ విధులకు హాజరయ్యేందుకు బైక్లపై వెళుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం క్షతగాత్రులు సూళ్లూరుపేటలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బస్సు బోల్తా కొట్టే ప్రమాదం నుంచి తృటిలో తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది కార్మికులు ఉన్నారు. -
వైఎస్సార్సీపీ కీలక సమావేశంలో జిల్లా నేతలు
తాడేపల్లెలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమాశంలో పాల్గొన్న జిల్లా నేతలు భూమన కరుణాకర రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, భూమన అభినయ్ రెడ్డి. – విజయవాడ నారాయణవనంలో నేత కార్మికులు నేసిన పార్టీ శాలువా గురించి వివరిస్తున్న ఎంపీ గురుమూర్తి, నూకతోటి రాజేష్ అధినేతను సన్మానిస్తున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి -
19 నుంచి అధ్యాపకులకు శిక్షణ
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల విధానం ఈ ఏడాది నుంచి మారింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ప్రభుత్వ కళాశాలలోని విద్యార్థులకు, అధ్యాపకులకు పూర్తి స్థాయిలో ఇప్పటికే అవగాహన కల్పించారు. ఫిబ్రవరి నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అన్ని కళాశాలల్లో ప్రతి సబ్జెక్టులో సిలబస్ పూర్తి చేశాం. రివిజన్ చేస్తున్నాం. నూతన పరీక్షల విధానంపై తుది విడతగా మరో మారు అధ్యాపకులకు ఈనెల 19వ తేదీన తిరుపతి చైతన్య కళాశాల వేదికగా శిక్షణ ఇవ్వనున్నాం. పరీక్షల విధానంపై ఎటువంటి తికమక లేదు. –రాజశేఖర్రెడ్డి, ఆర్ఐఓ, తిరుపతి -
‘బాబు నీ బుద్ధి మారదా?’
కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న వామపక్షనేతలు తిరుపతి అర్బన్ : సీఎం చంద్రబాబు బుద్ధిలో ఏ మాత్రం మార్పు రాలేదని.. ఆయనది ఎప్పుడూ కార్పొరేట్ ఆలోచనేనని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి మండిపడ్డారు. సీపీఐతోపాటు ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ వద్ద గురువారం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడంపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ గేటు నుంచి లోనికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పి. మురళి మాట్లాడుతూ.. 17 మెడికల్ కళాశాలలు గత ప్రభుత్వం తీసుకొస్తే...చంద్రబాబు వాటిని ప్రైవేటీకరణ చేయడం సిగ్గు చేటుగా ఉందని మండిపడ్డారు.55 శాతం సీట్లు.. ఒక్కో సీటు కోటికి అమ్ముకోవడం... 45శాతం సీట్లు కన్వీనర్ కోటలో ఇవ్వడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీ ఉచ్చులో చిక్కుకున్న చంద్రబాబు ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ 100 శాతం సీట్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు అందిస్తామని చెప్పి.. ప్రస్తుతం మాట తప్పినందుకు తక్షణమే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
మరో మైలురాయిని అధిగమించిన శ్రీసిటీ
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : శ్రీసిటీలోని క్రయోజెనిక్ ట్యాంకుల తయారీ అగ్రగామి సంస్థ యూఎస్ఏ చార్ట్ ఇండస్ట్రీస్కు చెందిన వీఆర్వీ ఆసియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ, అత్యాధునిక క్రయోజెనిక్ సాంకేతికతతో తయారైన భారీ లిక్విడ్ నైట్రోజన్ స్టోరేజ్ ట్యాంక్ను ఈజిప్ట్లోని ప్రముఖ సంస్థ ఎయిర్ లిక్విడ్కు ఎగుమతి చేయడం ద్వారా మరో ప్రధాన మైలురాయిని అధిగమించింది. 531 కిలో లీటర్ల సామర్థ్యం, 168 టన్నుల బరువు, సుమారు 39 మీటర్ల పొడవు, 5.45 మీటర్ల వ్యాసం కలిగిన ఈ ట్యాంక్ క్రయోజెనిక్ ఇంజినీరింగ్లో అత్యున్నత ప్రమాణాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ భారీ నిర్మాణాన్ని చైన్నె పోర్ట్కు తరలించేందుకు ప్రత్యేక మల్టీ–యాక్సిల్ లాజిస్టిక్స్ను వినియోగించారు. ఈ ఎగుమతిని ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి గొప్ప విజయంగా అభివర్ణించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ప్రపంచ స్థాయి క్రయోజెనిక్ ఇంజినీరింగ్లో వీఆర్వీ ప్రతిభను ఇది మరింత బలపరుస్తుందని అన్నారు. -
విషమ పరీక్ష
డిసెంబర్ వచ్చినా సగం సిలబస్ కూడా పూర్తి కాక.. మార్చినెట్టా గట్టేక్కేది అంటూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు నూతన పరీక్షల విధానం వీరిని మరిన్ని కష్టాల్లోకి నెడుతోంది. కొత్త విధానంపై అవగాహన లేకపోవడంతో పరీక్షల భయం వెంటాడుతోంది. తిరుపతి సిటీ: ఇంటర్మీడియట్ విద్యామండలి వ్యవహార శైలితో ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొకోక తప్పడం లేదు. నూతన జాతీయ విద్యావిధానం పేరుతో ఇంటర్మీడియల్లో మొదటి సంవత్సరం సిలబస్ను పూర్తిగా మార్చేశారు. నూతన సిలబస్తో పరీక్షా విధానంలోనూ పెనుమార్పులు తీసుకొచ్చారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం అడ్మిషన్లు అక్టోబర్ వరకు కొనసాగాయి. దీంతో మూడు నెలల వ్యవధిలో నూతన సిలబస్పై పట్టు సాధించడం అసాధ్యమని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. పరీక్షల విధానం, నూతన సిలబస్పై జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు 80శాతం మంది విద్యార్థులు అవగాహన లేకపోవడం గమనార్హం. ఫిబ్రవరిలో పరీక్షలు.. పూర్తి కానీ సిలబస్! ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు జరగనున్నాయి. కానీ జిల్లాలోని సుమారు 60 శాతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నూతన సిలబస్ ఇప్పటివరకు అధ్యాపకులు పూర్తి చేయకపోవడం గమనార్హం. మరో 40 రోజుల పనిదినాలు మాత్రమే పరీక్షలకు గడువు ఉన్నా అధికారులు చెల్లించకపోవడం ఆశ్చర్యమేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రధానంగా జేఈఈ, నీట్, ఎమ్సెట్ వంటి ప్రధాన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. నూతన పరీక్షా విధానం ఇలా.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు అన్ని గ్రూపులకు సంబంధించి సబ్జెక్టుల సంఖ్యను ఆరు నుంచి ఐదుకు తగ్గించారు. ఇందులో ఇంగ్లీషును తప్పనిసరి చేసి, సెకండ్ లాంగ్వేజ్ను ఐచ్ఛికం చేశారు. అలాగే సిలబస్ మార్పుతో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ ఏ, బీ పేపర్లును రద్దు చేశారు. కేవలం ఒకే మ్యాథ్స్ పేపరు మాత్రమే ఉంటుంది. బైపీసీలో బోటనీ, జువాలజీ సెబ్జెక్టులను కలిపి బయాలజీ పేరుతో ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. ప్రధానంగా 100 మార్కులు ఉన్న సబ్జెక్టుల్లో 35 మార్కులు ఉత్తీర్ణతగాను, 85 మార్కులు రాత పరీక్ష ఉండే సైన్స్ సబ్జెక్టుల్లో 29 మార్కులు పాస్ మార్కులుగా నిర్ణయించారు. సైన్స్ సబ్జెక్ట్ల ప్రాక్టికల్స్కు సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కలిపి 30 మార్కులుగా నిర్ణయించారు. అంటే ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్కు 15 మార్కులు, సెకండ్ ఇయర్లో 15 మార్కులు ఉండనున్నాయి. అలాగే ఈ ఏడాది ప్రశ్నపత్రాల్లో అర్థ, ఒకటి, రెండు, నాలుగు, ఐదు, ఎనిమిది, 16 మార్కుల ప్రశ్నలు సందించనున్నారు.నూతన సిలబస్తో.. సరికొత్త పరీక్షల విధానంజిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 30,275 మంది హాజరు కానున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో మ్యాథ్మెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్ సబ్జెక్టుల్లో నూతన సిలబస్తో సమూల మార్పులు చేశారు. కొత్త సిలబస్పై అటు అధ్యాపకులకు అవగాహన లేకపోవడంతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జిల్లాలో ఈ ఏడాది గత ఏడాది కంటే ఫలితాలు మెరుగు పడే అవకాశం లేదని సాక్షాత్తు ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కాగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం యథావిధిగా పాత సిలబస్, పాత పరీక్షా విధానంలో పరీక్షలు జరగనున్నాయి. -
వక్తృత్వ పోటీ విజేత తిరుపతి
తిరుపతి రూరల్ :ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో కడప జిల్లా విద్యార్థులు, వక్తృత్వ పోటీల్లో తిరుపతి విద్యార్థి విజేతలుగా నిలిచారని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి వెల్లడించారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని తిరుపతి,చిత్తూరు, నెల్లూ రు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఇంధన పరిరక్షణ అంశంపై జిల్లా స్థాయిల్లో క్విజ్, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. జిల్లాల పరిధిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆయా జిల్లా కార్యాలయాల ద్వారా ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ నుంచి బుధవారం సాయంత్రం ఫైనల్ రౌండ్ పోటీలను నిర్వహించారు. వక్తృత్వపు పోటీల్లో .. ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వక్తృత్వపు పోటీల్లో తిరుపతి జిల్లా గూడూరులోని సీఎస్ఎం ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జె. అద్రిజారావు మొదటి స్థానంలో నిలువగా, చిత్తూరు జిల్లా పైపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కే. మనీషా ద్వితీయ స్థానం, అనంతపురం జిల్లాలోని లక్ష్మి సినర్జీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న టి. యశస్విని తృతీయ స్థానంలో నిలిచారు. సంస్థ డైరెక్టర్ (టెక్నికల్ – హెచ్ఆర్ డి) కె. గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు కె. ఆది శేషయ్య, పి.హెచ్. జానకిరామ్, జనరల్ మేనేజర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈనెల 20, 21న రాష్ట్ర విద్యుత్తు శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతులు మీదుగా విజేతలకు బహుమతులు అందించనున్నట్టు సీఎండీ తెలిపారు. -
లారీ డ్రైవర్ కుమార్తెకు ఐఈఎస్
తిరుపతి సిటీ: తిరుపతి సింగాలకుంటకు చెందిన లారీ డ్రైవర్ కృష్ణమూర్తి కుమార్తె దాసరి ఇందుమతి అరుదైన లక్ష్యాన్ని సాధించారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్లో దేశంలోనే అత్యుత్తమ పరీక్షగా పేరుగాంచిన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)లో 75వ ర్యాంక్ సాధించి రికార్డు సృష్టించారు. తొలి ప్రయత్నంలోనే ఆమె ఈస్థాయికి చేరుకోవడంపై జిల్లా వ్యాప్తంగా ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాన్న లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారని ఆయన కష్టాలను గమనించి ఎలాగైనా ఐఈఎస్ సాఽధించాలని పట్టుదలతో పరీక్షకు సన్నద్ధం అయ్యానని తెలిపారు. 21న తిరుమలలో పల్స్ పోలియో తిరుమల:తిరుమలలో 21వ తేదీ పల్స్ పోలియో సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, జీఎన్సీ టోల్ గేట్, సీఆర్ఓ, పీఏసీ 1, 2, కొత్త బస్టాండ్, హెల్త్ ఆఫీస్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1,2 ఏటీసీ, ఎంబీసీ–34, వరాహస్వామి విశ్రాంతి గృహం 1, రాంభగీచా రెస్ట్ హౌస్ 1, కల్యాణకట్ట, మేదరమిట్ట, పాప వినాశనం, సుపథం, బాలాజీ నగర్ వినాయక ఆలయం, బాలాజీ నగర్ బాలబడి, ఎస్వీ హై స్కూల్, తిరుమల ఆలయం లోపల , వెలుపల, ఉద్యోగుల డిస్పెన్సరీల వద్ద కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేయనున్నారు. నేడు ఇంటర్ పరీక్షలపై అవగాహన తిరుపతి సిటీ : నూతన సిలబస్, సరికొత్త పరీక్షా విధానంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల నిర్వహణపై ప్రిన్సిపాళ్లకు, అధ్యాపకులకు అవగాహన కల్పించనున్నట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం తిరుచానూరులో శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, పరీక్షా సెంటర్ల ఇంచార్జిలు హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో కడప ఆర్జేడి సురేష్బాబు, ఇంటర్మీడియట్ విద్యామండలి నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ చాణిక్యుడు పాల్గొంటారని తెలియజేశారు. మెగా జాబ్ మేళాకు స్పందన తిరుపతి తుడా : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధ్వర్యంలో జిల్లాలోని పట్టణ ప్రాంతంలోని తిరుపతి కార్పొరేషన్, గూడూరు, పుత్తూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి , సూళ్లురుపేట , వెంకటగిరి మున్సిపాలిటీల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జాల ఎఫ్రాయిమ్ తెలిపారు. గరువారం తిరుపతి తుడా కార్యాలయంలో జరిగిన జాబ్ మేళాలో మహిళా సంఘాల, సభ్యుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ మేళా నిర్వహించామన్నారు. ఇందులో సుమారు 454 మంది హాజరు కాగా అందులో 117 మందికి ఉద్యోగాలు పొందారన్నారు. కార్యక్రమంలో తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారి లోకనాథం, మెప్మా అధికారులు పాల్గొన్నారు. శాస్త్రాలపై పట్టు సాధించాలి తిరుపతి సిటీ : విద్యార్థి దశ నుంచే శాస్త్ర సంరక్షణ, శాస్త్రలపై పట్టు సాధించాలని స్వర్ణవల్లీ మహాసంస్థానం పీఠాధిపతులు శ్రీగంగాధరేంద్ర సరస్వతీ మహాస్వామి, శ్రీమదానంద బోధేంద్ర సరస్వతీ స్వాములు సూచించారు. గురువారం జాతీయ సంస్కృత వర్సిటీలో పరమాచార్య గురుకుల కేంద్రం, పలు వాక్యార్థ సభలలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు శాస్త్రాల పఠనంతో విశేష జ్ఞానం సొంతమవుతుందన్నారు. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. శాస్త్ర విషయాలు, సంస్కృతిని సంరక్షించేందుకు కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పరమాచార్య గురుకుల కేంద్ర డైరెక్టర్, అద్వైత వేదాంత విభాగ ఆచార్యులు గణపతి భట్, డీన్ రజనీకాంత్ శుక్ల, ఐక్యూఏసీ డైరెక్టర్ సతీష్, గోవింద వాక్యార్థ సభ కో ఆర్డినేటర్లు శ్రీహరి దాయగుడే, మనోజ్ షిండే, కులపతి వాక్యార్థసభ కోఆర్డినేటర్లు శంకర నారాయణ, భరత భూషణ్ త్ , పలు విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఐఐటీలో ఉత్కంఠగా పోటీలు
ఏర్పేడు : ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ఈనెల 14వ తేదీ నుంచి జరుగుతున్న 58వ ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్ క్రీడా పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. చెస్, టెన్నీస్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. చెస్ 4వ రౌండ్ ఫలితాలివే చెస్ పోటీలలో నాల్గవ రౌండ్ ముగిసే సరికి ఖరగ్పూర్ ఐఐటీ విద్యార్థులు 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తర్వాతి స్థానాలలో 11 పాయింట్లతో బాంబే ఐఐటీ, 10 పాయింట్లతో ఇండోర్, కాన్పూర్ ఐఐటీలు, 9.5 పాయింట్లతో వారణాసి, మద్రాస్, గౌహతి ఐఐటీలు, 9 పాయింట్లతో పాట్నా ఐఐటీ, 8.5 పాయింట్లతో హైదరాబాద్, బిలాయ్, భువనేశ్వర్ ఐఐటీలు కొనసాగుతున్నాయి. టెన్నీస్ మహిళలు, పురుషుల విభాగాలలో క్వార్టర్ ఫైనల్స్ పోటీలు జరుగుతున్నాయి. -
పేదల స్థలాలను దోచేస్తారా ?
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 13లో 1.09 ఎకరాల మఠం భూమిని ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గురువారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా చేశారు. బాధిత కుటుంబాలకు సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. సీపీఎం మండల కన్వీనర్ వేణు మాట్లాడుతూ.. గాంధీపురానికి చెందిన 32 రజక కుటుంబాల వారు ఇంటి నిర్మాణాల కోసం కొనుగోలు చేస్తే ఆ భూములు దోచేసి ప్రహరీ నిర్మాణం చేస్తున్నారన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి పేదల జాగాల్లో పాగా వేసేందుకు ప్రయత్నించే రామసుబ్బారెడ్డితో పాటు అతనికి అండగా నిలబడ్డ వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మఠం భూముల్లో 144 సెక్షన్ అమలు చేయాలి భూ ఆక్రమణ దారుల ఆగడాలతో మఠం భూమిలో అల్లర్లు చెలరేగుతున్నాయని, గంజాయి మత్తులో యువత భయబ్రాంతులకు గురిచేస్తున్నందున అక్కడ 144 సెక్షన్ అమలు చేసి ఆక్రమణలను అడ్డుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. మఠం భూములను పరిరక్షించడంతో పాటు ఆ మఠం భూమి తమదేనని అమాయకులను మోసం చేసి డబ్బులకు విక్రయించిన వ్యక్తులపై కేసు పెట్టాలని, లేని పక్షంలో జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ రామ్మోహన్ను కలిసి వినతి పత్రం అందించి బాధితులకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు వేణు, సుబ్రమణ్యంలతో పాటు 32 బాధిత కుటుంబాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. కేసు నమోదు చేయాలి మఠం భూములను అడ్డంగా అమ్మేస్తున్న భూ ఆక్రమణ దారుడు రామసుబ్బారెడ్డిపై భూ ఆక్రమణ నిరోదక చట్టం కింద కేసు నమోదు చేయాలి. స్థానికులపై దాడులకు తెగబడుతున్న కడప జిల్లా వాసులను అక్కడి నుంచి తరిమివేయాలి. డబ్బులు పెట్టి స్థలం కొనుగోలు చేసిన బాధితులు అందరికీ న్యాయం చేయాలి. – మహేష్, రజకసంఘం నాయకుడు, గాంధీపురం -
తుపాను దెబ్బతీసింది
ఈ చిత్రంలో ఉన్న రైతు చిల్లకూరు వేమయ్య, తనకు ఉన్న మూడెకరాలలో ఒక ఎకరం నిమ్మ సాగు చేపట్టాడు. సీజన్లో నిమ్మ కాయలు కోసి విక్రయించుకుంటే ఇంటి ఖర్చులు పోను రెండెకరాల్లో వరి, ఇతర ఉద్యాన పంటలు సాగుకు అవసరమైన ఖర్చులకు సరిపోయేవి. అయితే ఈ ఏడాది జనవరి నుంచి నిమ్మ కాయలు బాగా కాస్తున్నప్పటికీ ధరలు అంతంత మాత్రంగానే ఉండడంతో సాగుకు అవసరమైన మందులు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు తుపాను సమయంలో నిమ్మ పూత రాలి పోవడంతో వేసవిలో కాయలు దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. -
తహసీల్దార్, వీఆర్వోల సస్పెన్షన్
తిరుపతి అర్బన్ : పీజీఆర్ఎస్(ప్రజా సమస్యల పరిష్కార వేదిక) పిటీషన్లకు సంబంధించి తప్పుదోవ పట్టించారనే నేపథ్యంలో ఓజిలి తహసీల్దార్ పద్మావతిని, వీర్లగుణపాడు వీఆర్వో డిల్లెయ్యను సస్పెన్షన్ చేశారు. వివరాల్లోకి వెళితే ఓజిలి మండలంలోని వీర్లగుణపాడులోని సర్వే నంబర్ 74లో ధనంజయ, వెంకటరమణయ్య అనే రైతులు తమ భూములను అన్లైన్లో నమోదు చేయాలని పీజీఆర్ఎస్లో అధికారులకు పిటీషన్ ఇచ్చారు. అయితే ఆ భూములకు సంబంధించి వాస్తవాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టకుండా పిటీషన్ను తిరస్కరించకుండా తహసీల్దార్ ఎండార్స్మెంట్ చేయడంతో సమస్య నెలకొంది. దీంతో అధికారులు ఈ అంశంపై సీరియస్ అయ్యారు. ఈ అంశానికి తోడుగా వీర్లగుణపాడు వీఆర్వో డిల్లయ్య సదరు సర్వే నంబర్లో అక్రమంగా నమోదైందని, బోగస్ అంటూ జనవరిలో ఓ నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత జూన్లో ఆ భూమి వారి స్వాధీనంలో ఉందని మరో నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత అక్టోబర్లో ఎంట్రీలు అక్రమంగా ఉన్నాయని, పిటీషనర్ల స్వాఽధీనంలో కాకుండా భూమి ఖాళీగా ఉందంటూ మరో నివేదిక ఇచ్చారు. ఇలా మూడు సార్లు ఇచ్చిన నివేదికల్లో ఒకదానితో ఒకటి పొంతన లేకుండా చూపించారు. ఈ అంశాన్ని గుర్తించిన సీసీఎల్ఏ కమిషనర్ జయలక్ష్మి విచారణకు ఆదేశించారు.ఈ క్రమంలో ఓజిలి తహసీల్దార్ పద్మావతిని సస్పెన్షన్ విధించినట్లు ఆమె బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అనుమతులు లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లరాదని స్పష్టం చేశారు. మరోవైపు వీఆర్వో డిల్ల్య్యెను కలెక్టర్ సస్పెన్షన్ చేశారు. మొత్తంగా అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చిందంటూ అంతా చర్చించుకుంటున్నారు. -
24న ఎల్వీఎం3–ఎం6 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 24న ఉదయం 8.54 గంటలకు ఎల్వీఎం3–ఎం6 రాకెట్ ప్రయోగాన్ని జరిపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్కు చెందిన ఏటీఎస్ సంస్థ శాస్త్రవేత్తలు రూపొందించిన 6,500 కిలోల బ్లూబర్డ్–6 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు.రెండో అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ అనుసంధానం పనులను పూర్తి చేసి ప్రయోగ వేదిక మీదకు తరలించారు. ముందుగా ఈ నెల 15న, ఆ తరువాత 21న ప్రయోగం జరపాలని భావించగా సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 24న ముహూర్తం కుదరడంతో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయోగాన్ని వీక్షించాలనుకునే వారు గురువారం నుంచి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఇస్రో ఓ ప్రకటన విడుదల చేసింది. షార్ కేంద్రం నుంచి ఇది 104వ ప్రయోగం కాగా ఉపగ్రహ ప్రయోగాల్లో వందవది కావడం గమనార్హం. -
తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థాన నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది. శ్రీవారి ఆలయం ముందు ఓ రాజకీయ పోస్టర్ కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు అతి చర్యలకు దిగారు. అన్నాడీఎంకే కార్యకర్తలు ఆలయ పరిసరాల్లో జయలలిత, పళని స్వామి చిత్రాలతో కూడిన పోస్టర్ను పెట్టి రీల్స్ తీశారు. పోస్టర్లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మాజీ సీఎం పళని స్వామి చిత్రాలు ఉండటం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఆలయ పరిసరాల్లో రాజకీయ చిహ్నాలు, ప్రసంగాలు, ప్రచారం నిషేధం ఉన్నప్పటికీ, కార్యకర్తలు అత్యుత్సాహంతో ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనను పట్టించుకోని టీటీడీ భద్రతా అధికారులు విమర్శలకు గురవుతున్నారు. ఆలయ పరిసరాల్లో భద్రతా చర్యలు కఠినంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై టీటీడీ అధికారులు స్పందించారు. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. -
కండలేరు జలాశయాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ!
రాపూరు: మండలంలోని కండలేరు జలాశయాన్ని బుధవారం నిపుణుల కమిటీ బృందం పరిశీలించింది. కండలేరు జలాశయంలోని ప్రస్తుత మున్న నీటి నిల్వలు, నీటి విడుదల గురించి ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలాశయంలో 60 టీఎంసీ నీరు నిల్వ ఉండడంతో ఎటువంటి సమస్యలు తలెత్తే పరిస్థితి ఉందన్న అంశంపై ఇంజినీరింగ్ బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జలాశయంలోని హైలెవల్, లోలెవల్ స్లూయీస్ను, హెడ్రెగ్యులేటర్ను బృందం పరిశీలించింది. హెడ్రెగ్యులేటర్ వద్ద ఉన్న గేట్లు చాలా కాలంగా ప్రజర్ ఇస్తేనే గేట్లు పైకి లేస్తున్నట్లు సిబ్బంది తెలిపినట్లు నిపుణుల కమిటీ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం గేట్లు పరిస్థితిని పరిశీలించామని, నీరు ఎక్కువగా వస్తుండడంతో గేట్లు పరిస్థితి తెలియడంలేదని, నీరు తగ్గిన తరువాత మరోసారి పరిశీలించి గేట్లు ఎందుకు స్ట్రక్ అవుతున్నాయన్న విషయం తెలుసుకుంటామని అప్పుడు గేట్లు మార్చాలా? లేదా ఏదైనా మరమ్మతులు చేపట్టాలా, లేదా కొత్త గేట్లు పెట్టాలని చెప్పగలమన్నారు. ఈ నిపుణుల కమిటీ బృందంలో తిరుపతి క్యాలిటీ కంట్రోల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శారద, నెల్లూరు తెలుగుగంగ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీరు సుబ్రమణేశ్వరావు, ఈఈ గజేంద్రరెడ్డి, డీఈ నాగేంద్రబాబు, ఏఈ అనిల్ ఉన్నారు. -
రాష్ట్ర గవర్నర్ కు సాదర వీడ్కోలు
రేణిగుంట: తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన ముగించుకుని బుధవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు పయనమైన గవర్నర్ అబ్దుల్ నజీర్కి రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సాదర వీడ్కోలు పలికారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ రవికుమార్, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా గాలి శ్రీనివాసులు తిరుపతి లీగల్: తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా న్యాయ వాది గాలి శ్రీనివాసులును నియమిస్తూ ప్రభుత్వం బు ధవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు న్యాయవా ది గాలి శ్రీనివాసులు తెలిపారు. ఆయన మూడేళ్లు ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. ఆయన తిరుపతిలో 25 ఏళ్ల పైగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ గా విధులు నిర్వహిస్తున్నారు. సీనియర్ న్యాయవాది దొరైరాజ్ వద్ద ఆయన జూనియర్ న్యాయవాదిగా విధులు ప్రా రంభించాడు. ఆయన నియామకంపై రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు జి.సుదర్శన్ రావు, న్యాయవాదు లు దేశిరెడ్డి భాస్కర్ రెడ్డి, దేవరాజులు, తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య రాపూరు: మల్లమ్మగుంట సమీపంలోని కొండేరువాగు వద్ద బుధవారం మృతదే హం ఉన్నట్లు స్థానికులు పో లీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ వెంకటేశ్వరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. ఏఎస్ఐ కథనం మేరకు.. గూడూరు మండలం తిరుపతిగారిపల్లి గ్రామానికి చెందిన సుందరయ్య(79) ఈనెల 14వ తేదీ ఇంటి సమస్యలతో ఇల్లు వదిలి వెళ్లాడు. మల్లమ్మగుంట వద్ద ఉన్న వాగు సమీపంలో మృతి చెందాడు. మృతదేహం పక్కన పురుగుల మందు ఉండడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్న ట్లు తెలిపారు. మృతిని ఫొటోను చూసి, వారి బంధువులు ఇక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ మే రకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
రెండు నెలులగా తిరుగుతున్నా..
వాకాడు: నాకు చెవులు రెండు పూర్తిగా వినిపించవు. దీంతో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సదరం క్యాంపునకు దరఖాస్తు చేసుకున్నాను. అక్కడ స్లాట్ బుక్ చేసుకున్న అనంతరం ఇచ్చే రశీదు కోసం గత రెండు నెలలుగా సచివాలయం చుట్టు తిరుగుతూనే ఉన్నాను. అయినా ఏ ఆస్పత్రిలో వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలనే విషయం తెలియడం లేదు. సచివాలయం సిబ్బందిని అడిగితే మాకు ఏమి తెలియదు అని చెబుతున్నారు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. – ఉమ్మడి రమణమ్మ, గొల్లపాళెం, వాకాడు మండలం -
ఐఐటీలో ఉత్కంఠగా స్పోర్ట్స్మీట్
ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో జరుగుతున్న 58వ ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్లో నాలుగో రోజు బుధ వారం వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఉత్కంఠగా సాగా యి. ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్గా ఐఐటీ రూర్కీ నిలిచింది. దీంతో వెయిట్లిఫ్టింగ్ పోటీలు ముగిశాయి. కాగా చెస్, టెన్నిస్ పోటీలు కొనసాగుతున్నాయి. వెయిట్ లిఫ్టింగ్ పోటీల చాంపియన్గా ఐఐటీ రూర్కి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు 60 కిలోల విభాగంలో మౌన్సోలిన్ నౌలక్ 189 పాయింట్లతో మొదటిస్థానంలో నిలవగా, మొత్తం ఐదుగురు ఐఐటీ రూర్కీ క్రీడాకారులు ప్రతిభ చూపారు. అలాగే 65 కిలోల విభా గంలో ఆరుగురు, 71 కిలోల విభాగంలో ఐదుగురు, 79 కిలోల విభాగంలో ఒక్కరు, 79 ప్లస్ కిలోల విభాగంలో ఐదుగురు మొత్తం 22 మంది ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్షిప్ను సొంతం చేసుకున్నారు. అలాగే ఐఐటీ రోపర్ 9 మందితో రెండోస్థానం, ఐఐటీ కాన్పూర్ 8మందితో మూడో స్థానంలో నిలిచాయి. వారణాసి, బాంబే ఐఐటీల నుంచి ఐదుగురు చొప్పున, గౌహతి, ఖరగ్పూర్ ఐఐటీల నుంచి ఇద్దరు చొప్పున, మద్రాస్, గాంధీనగర్ ఐఐటీలు ఒక్కరు చొప్పున వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభను చూపారు. అలాగే 65కిలోల విభాగంలో ఐఐటీ రూర్కీ విద్యార్థి అభిషేక్కుమార్, 79 కిలోల విభాగంలో ఐఐటీ కాన్పూర్ విద్యార్థి దృవ్శెట్టి, 71 కిలోల విభాగంలో ఐఐటీ రూర్కీ విద్యార్థి దాస్ అ నుప్కుమార్, 60 కిలోల విభాగంలో ఐఐటీ రూర్కీ విద్యార్థి మౌన్సోలిన్ నౌలక్ మొదటిస్థానాల్లో నిలిచారు. చెస్లో ఐఐటీ ఖరగ్పూర్ మొదటి స్థానం చెస్ పోటీల్లో ఐఐటీ ఖరగ్పూర్ అద్భుతంగా ఆడి, 9.5 పాయింట్లతో టేబుల్లో మొదటి స్థానంలో నిలి చింది. ఐఐటీ కాన్పూర్ 9 పాయింట్లతో, ఐఐటీ బాంబే, వారణాసి 8 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో చే రువలోనే నువ్వానేనా? అంటూ పోటీ పడుతున్నా యి. 7.5 పాయింట్లతో మద్రాస్, ఇండోర్, గౌహతి కూడా పోటీలో ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ ఐఐటీ మ ద్రాస్, 2వ జనరేషన్ ఐఐటీ హైదరాబాద్లో కూడా ఈ స్పోర్ట్స్ మీట్ జరుగుతోంది. ఈనెల 21వ తేదీతో ఈ టోర్నీ ముగియనుంది. -
సైట్ ఓపెన్ కావడం లేదట
చిట్టమూరు:నాకు పదేళ్లుగా వినికిడి లోపం ఉంది. ఎదుటివారి మాటలు పూర్తిగా వినిపించవు. దీంతో కూలి పనులకు వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో సదరన్ క్యాంపునకు వెళ్లి వైద్యుల వద్ద చూపించుకున్నాను. అయితే సర్టిఫికెట్ రాకపోవడంతో పింఛన్ రాలేదు. ఇటీవల జరిగిన సదరన్ క్యాంప్లో చూపించుకునేందుకు గ్రామ సచివాలయానికి స్లాట్ బుక్ చేసుకునేందుకు వెళ్లాను. అయితే ఎప్పుడు వెళ్లినా సదరన్ క్యాంప్ సైట్ ఓపెన్ కావడంలేదు. – మారుబోయిన మస్తాన్, ఆరూరు, చిట్టమూరు మండలం -
అత్యుత్తమ ఆస్పత్రిగా స్విమ్స్ అభివృద్ధి
తిరుపతి తుడా: దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రిగా స్విమ్స్ను అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బీఆర్ నాయుడు పేర్కొన్నారు. బుధవారం స్విమ్స్ ఆస్పత్రిలో సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు గదులను ఆయన అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.10.65 కోట్లతో 37 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో మూడు అంతస్తులలో సెంట్రల్ మెడికల్ గోడౌన్ ప్రారంభించామని, ఇందులో మెడికల్ స్టోర్లు, జనరల్ స్టోర్లు, కోల్డ్ స్టోరేజ్, ఆపరేషన్ థియేటర్ స్టోర్లు, కార్యాలయాలు, సమావేశ మందిరం ఉన్నాయని తెలిపారు. అలాగే రూ.4.40 కోట్ల వ్యయంతో 300 మంది రోగుల సహాయకులు వేచివుండేందుకు వీలుగా విశ్రాంతి భవంలోని 2, 3వ అదనపు అంతస్తులను ప్రారంభించినట్టు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో రోగుల సహాయకులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతోపాటు మరుగుదొడ్లు, లిఫ్టులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్, టీటీడీ బోర్డు సభ్యులు, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జి జగదీష్ పాల్గొన్నారు క్రెడిట్ చోర్ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పరిధిలోని ఆస్పత్రులను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించింది. స్విమ్స్ లో రూ.10.65 కోట్లతో సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగి సహాయకుల విశ్రాంతి భవనం రూ. 4.40 కోట్లతో పనులను ప్రారంభించింది. 90 శాతం పనులు పూర్తి చేసుకున్నాయి. ఏడాదిన్నర కాలంలో 10 శాతం పనులు పూర్తి చేసి రంగులు వేసి, తామే అభివృద్ధి చేశామనేలా కలరింగ్ ఇస్తూ ఈ భవనాలను ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులను తమ ప్రభు త్వం చేసిందంటూ క్రెడిట్ చోర్కి పాల్పడ్డారు. -
పీజీ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గత ఏడాది డిసెంబర్లో జరిగిన పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాలను అధికారులు ఎట్టకేలకు బుధవారం విడుదల చేశారు. రెగ్యులర్ పీజీ కోర్సులకు సంబంధించి ఎంఏ రూరల్ డెవలప్మెంట్, ఎకనా మిక్స్, హిందీ, టూరిజం, తెలుగు, ఎమ్మెస్సీ ఆ క్వాకల్చర్, బయోటెక్నాలజీ, ఎంకామ్తో పాటు ఎల్ఎల్ఎమ్ నాలుగో సెమిస్టర్ ఫలితాలను సైతం విడుదల చేసినట్లు డీన్ ఆచార్య సురేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల కోసం విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. 20న ఎస్వీయూలో జాబ్మేళా తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయీమెంట్ కార్యాలయంలో ఈనెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీని వాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, బీటెక్, పలు ఫార్మసీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశంలోనే పేరొందిన ఎమ్ఎన్సీ కంపెనీల ప్రతినిధులు సుమారు 300 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వ హించనున్నారని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు శనివారం 10 గంటలకు వర్సిటీలోని ఎంప్లాయీమెంట్ కార్యాలయానికి తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో చేరుకోవాలన్నారు. మలేషియాలో ఉద్యోగావకాశాలు తిరుపతి సిటీ: మలేషియాలో ఉన్నతవిద్యతోపాటు ఉద్యోగ అవకాశాలున్నాయని ఆ దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ చి యాంగ్ కౌన్యున్ పేర్కొన్నారు. కొన్ని రోజులు గా ఎస్వీ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో ల్యాబ్ మెటీరియల్పై జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన బుధవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ చియాంగ్ కౌన్యున్ పరిశీలించారు. మెటీరియల్ సైన్స్పై ప్రామాణి కత కలిగిన పరిశోధనలు సాగాలని ఆకాంక్షించారు. పరిశోధనలకు కేంద్రంగా ఉండే గొప్ప ప్రయోగశాలల్లో పరికరాల పనితీరు మెరుగుపరచుకోవడం అవసరమని చెప్పారు. ఎస్వీ యూనివర్సిటీతో తాము అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ట్టు వెల్లడించారు. అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. తాను చీఫ్ ఎడిటర్గా ఉన్న మెటీరియల్ సైన్స్ ఇన్ సెమీ కండక్టర్ ప్రపోజల్స్ జర్నల్కు యూనివర్సిటీ నుంచి పరిశోధకులు శాస్త్రవేత్తలు పరిశోధన వ్యా సాలు పంపాలని కోరారు. అనంతరం ప్రొఫె సర్ చియాంగ్ కౌన్యున్ను శిక్షణ కార్యక్రమం కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ దేవప్రసాదరాజు శా లువ, పుష్పగుచ్చం, జ్ఞాపికతో సత్కరించారు. శ్రీవారి సేవలో ఉడిపి మఠం పీఠాధిపతి తిరుమల: తిరుమలలోని శ్రీవారి బుధవారం ఉడిపిలోని సోడే వాదిరాజ మఠం పీఠాధిపతి విశ్వ వల్లభతీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. తిరుమల బేడీ ఆంజనేయ స్వామి వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, పోటు పేస్కార్ మునిరత్నం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. -
ఏడాదిన్నరగా తిరుగుతున్నా
చంద్రగిరి: నేను చంద్రగిరి కొత్తపేటలో నివాసం ఉంటున్నాను. వృద్ధాప్యంతోపాటు గతంలో జరిగిన ప్రమాదంలో నడుము వెన్నుపూసతోపాటు ఎడమకాలు విరిగిపోయింది. దీంతో అప్పట్లో రాడ్లు పెట్టి శస్త్రచికిత్స చేశాడు. ఏడాదిన్నర క్రితం రాడ్లు విరిగిపోవడంతో పరిస్థితి తీవ్రతరం అయ్యింది. ప్రస్తుతం నడవలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చే వికలాంగుడి సర్టిఫికెట్ కోసం ఏడాదిన్నరగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. అయినా నాకు సరిఫికెట్ రాలేదు. – రాఘవరెడ్డి, కొత్తపేట, చంద్రగిరి -
వేడుకగా గొబ్బిదేవత పుర ఉత్సవం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం వేడుకగా గొబ్బిదేవత పుర ఉత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయ అలంకార మండపంలో గొబ్బిదేవతకు పలు అభిషేకాలు చేసి, విశేషంగా అలంకరించారు. అనంతరం పుర ఉత్సవం నిర్వహించారు. స్కిల్ ఇండియా స్టేట్ పోటీల్లో ఎస్పీడబ్ల్యూ విద్యార్థుల ప్రతిభ తిరుపతి సిటీ: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్పీడబ్ల్యూ కళాశాలలో ఈనెల 15వ తేదీ నుంచి రెండు రోజుల పాటు నిర్వహించిన స్కిల్ ఇండియా కాంపిటేషన్ పోటీల్లో పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 85 మంది విద్యార్థులు పోటీ పడగా ఇందిలో 9 మంది విద్యార్థులు జిల్లా స్థాయిలో రాణించారు. విజయవాడ కేంద్రంగా ఈనెల 19వ తేదీన జరగనున్న స్టేట్ లెవల్ కాంపిటేషన్లో వీరు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బుధవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి నారాయణమ్మ స్టేట్ లెవల్ కాంపిటేషన్కు ఎంపికై న 9 మంది విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించి, జాతీయ స్థాయిలో సైతం రాణించాలని ఆ కాంక్షించారు. స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ దీప పాల్గొన్నారు. నైలెట్తో కలసి నూతన కోర్సులు తిరుపతి సిటీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ)తో కలిసి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలల్లో విద్యార్థులకు ఉపాధి లక్ష్యంగా నూతన కోర్సులు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ వేణుగోపాల్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎస్వీ ఆ ర్ట్స్ కళాశాల్లో విద్యార్థుల కోసం నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యవృద్ధి కోర్సులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైలెట్ అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణను విద్యార్థులు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రతి సంవత్సరం పరిశ్రమ ల అవసరాలకు అనుగుణమైన నూతన కోర్సు లను ప్రవేశపెట్టేందుకు ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నైలెట్తో త్వరలో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రధానంగా ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో ప్రాక్టికల్ శిక్షణకు ప్రాఽ దాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగాధిపతి మల్లికార్జున రావు, ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి రత్నరావు, అధ్యాపకులు చక్రవర్తి పాల్గొన్నారు. మహిళా హాస్టళ్లలో సెల్ ఫోన్ల చోరీ తిరుపతి క్రైం : నగరంలోని మహిళా హాస్టళ్లలో సెల్ఫోన్లు చోరీకి పాల్పడిన సంఘటన బుధ వారం వెలుగులోకి వచ్చింది. ఈస్ట్ పోలీసులు కథనం మేరకు.. భవానీనగర్ సమీపంలోని ఫ్రెండ్స్, మహిత్ ఉమెన్స్ హాస్టల్లోకి బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని ము సుగు దొంగ చొరబడి ఆరు సెల్ ఫోన్లను చోరీ చేశాడు. దీనిపై మహిళా హాస్టళ్లలోని విద్యా ర్థులు ఈస్ట్ పోలీసులు సంప్రదించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముంపు బాధితులకు ఫ్యాన్ల వితరణ వరదయ్యపాళెం: కేవీబీపురం మండలంలో రాయలచెరువు వరద ప్రవాహానికి ముంపునకు గురైన గ్రామాల్లో వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నిధులతో ముంపు బాధితులకు ఫ్యాన్ల వితరణ కార్యక్రమం కొనసాగుతోంది. మొదటగా కళత్తూరు పంచాయతీలో 500 కుటుంబాలకు ఫ్యాన్ల వితరణ చేశారు. అయితే ముంపు బాధిత గ్రామాలు పాతపాళెం, దళితవాడ, అరుంధతివాడలో కూడా నీటి ప్ర వాహం సంభవించి నష్టం వాటిల్లడంతో ఆ రెండు గ్రామాలకు చెందిన 75 కుటుంబాలకు బుధవారం నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ సూచనల మేరకు ఫ్యాన్లను వితరణగా అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గవర్ల కృష్ణయ్య, స్థానిక సర్పంచ్ సుకన్య, నేతలు హరిబాబు, ప్రవీణ్కుమార్, శివప్రసాద్ వర్మ, వెంకటరమణ, మోహన్రాజు, జయరాం, వెంకటేష్ పాల్గొన్నారు. -
ముత్తుకూరు నుంచి గూడూరుకు
చిల్లకూరు:నేను వృత్తి రీత్యా మత్స్యకారుడిని. సముద్రంపైకి పడవలో వెళ్లి చేపల వేట ద్వారా జీవనం చేస్తుండేవాడిని. నాలుగేళ్ల కిందట ప్రమా దం జరగడంతో కుడికా లు, కుడి చేయి సరిగా పని చేయకుండా మాట కూడ పూర్తిగా మాట్లాడలేని స్థితికి చేరుకున్నాను. గత ప్రభుత్వంలో నాకు ది వ్యాంగుల పింఛన్ ఇస్తుండగా ప్రస్తుతం చంద్రన్న సర్కార్ సదరన్ సర్టిఫి కెట్ ఇస్తేనే పింఛన్ అని చెప్పింది. దీంతో ముత్తకూరులోని సచివాలయంలో స్లాట్ బుక్ చేసుకుంటూ దగ్గరలో ఉండే నెల్లూర్లులోని సర్వ జన ఆస్ప త్రికి కాకుండా గూడూరు ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని ధ్రువపత్రం తీసుకు రావాలని చెప్పడంతో అష్ట కష్టాలు పడ్డాడు. – వి పోలయ్య, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా -
దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తే ఉద్యమం
తిరుపతి కల్చరల్: సర్వేల పేరుతో పా టు కుంటి సాకులు చూపి, దివ్యాంగుల పింఛన్లు తొలిగిస్తే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టడం తథ్యమని దివ్యాంగుల సేవా సంఘం జేఏసీ రాష్ట్ర నేత కొణతం చంద్రశేఖర్, దివ్యాంగుల సేవా సమితి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు మురళీ గౌడ్ స్పష్టం చేశారు. దివ్యాంగుల సేవా సమితి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం గిరిజన భవన్లో దివ్యాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రశేఖర్ గౌడ్, మురళీతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ వినోద్, సీపీఎం నేత నాగరాజు, రాస్ సంస్థ అధికారి యువరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చేసినప్పుడే నిజమైన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం అని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తూ నోటీసులు అందజేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ల తొలగింపుపై రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల సంఘాలు పెద్ద ఎత్తున రోడ్లపై నిరసనలు చేయడంతో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలిపారు. పింఛన్ల జోలికొస్తే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ సేవా సంఘం నిర్వాహకులు ఆశాజ్యోతి, దివ్యాంగుల పేద ప్రజల సేవా సంస్థ, హరిత చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు సోమశేఖర్, శివకుమారి, హరినాథరెడ్డి, వసంత్కుమార్, రాజేష్, మాధవన్ పాల్గొన్నారు. -
ప్రైవేటీకరణపై విద్యార్థి రణం
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ కలాలు గళాలుగా మార్చి విద్యార్థిలోకం రణం మొదలు పెట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో విద్యార్థులు తమదైన పాత్ర పోషించి, సంతకాలతో తమ గళం వినిపించారు. జిల్లాలోని విద్యార్థులు లక్షలాది మంది తమ సంతకం చేసి, నిరసన తెలిపారు. తిరుపతి సిటీ: జిల్లా యువత, విద్యార్థులు చంద్రబాబు సర్కార్ వ్యవహార శైలిపై గళమెత్తారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో లక్షలాది మంది యువత పాల్గొన్నారు. సామాన్య ప్రజలతో పాటు, విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేసి చంద్రబాబు సర్కార్కు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులే సుమారు 4 లక్షల మంది సంతకాలు చేశారంటే చంద్రబాబు సర్కార్పై యువత ఎంత ఆగ్రహంగా ఉందో తెటతెల్లమవుతోంది. విద్యారంగాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు సర్కార్ వైద్యవిద్యను గ్రామీణ, పట్టణ పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మార్చేందుకు కుట్ర పన్నుతోందని విద్యార్థి లోకం ఆవేదన వ్యక్తం చేస్తోంది.వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తిరుగుబాటు జిల్లాలో సంతకాల వివరాలు నియోజకవర్గం మొత్తం సంతకాల సేకరణ విద్యార్థులు చేసిన సంతకాలు తిరుపతి 60, 432 24,221 చంద్రగిరి 1, 16,017 61,327 శ్రీకాళహస్తి 75,776 21,658 వెంకటగిరి 72,487 19,423 సూళ్లూరుపేట 69,544 17,557 గూడూరు 70,551- 18,674 సత్యవేడు 51,508 16,700 -
అధ్యాపక పోస్టులు తక్షణం భర్తీ చేయాలి
తిరుపతి సిటీ: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను తక్షణం భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వలరాజు డిమాండ్ చేశారు. బుధవారం ఎస్వీయూ పరిపాలనా భవనం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కామన్ ఎంట్రెనన్స్ పీజీ సెట్ విధానాన్ని రద్దు చేయాలని, యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలన్నారు. ఎస్వీయూ యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించకపోవతే యూనివర్సిటీ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యూనివర్సిటీ నాయకులు చిన్న, నగర అధ్యక్ష ,కార్యదర్శులు హరికృష్ణ, వినయ్ జిల్లా సహాయ కార్యదర్శి మోహన్, నాయకులు వెంకటేష్, అశోక్, నాని, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. -
మాకు కడుపు కోత మిగిల్చారు
నాయుడుపేటటౌన్: పట్టణంలోని మూకాంబికా వీధిలో నివాసం ఉన్న దివ్యాంగుడు తుమ్మూరు శ్రీనివాసులు. అతని భార్యపేరు విజయ. 2017 కంటే ముందు బ్రెయిన్ స్ట్రోక్తో శ్రీనివాసుల పరిస్థితి విషమంగా మారి రెండు కాళ్లు, చేతులు పని చేయక మంచానికి పరిమితమయ్యారు. వంద శాతం వైకల్యం ఉన్న శ్రీనివాసులుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రూ.15 వేలు పింఛన్ వచ్చేది. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం మంచానికే పరిమితమై రెండు కాళ్లు, చేతులు పనిచేయని శ్రీనివాసులుకు 40 శాతం కంటే తక్కువగా ఉందని నోటీసు జారీ చేసి పింఛన్ను రద్దు చేశారు. తిరుపతి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో సదరన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని నోటీసులు ఇచ్చారు. దీంతో నడవలేనిస్థితిలో ఉన్న ఆయన్ని కుటుంబసభ్యులు నానా ఇబ్బందులు పడి తిరుపతి వైద్యశాలకు తీసుకెళ్లారు. అయినా సదరన్ సర్టిఫికెట్ అందలేదు. పింఛన్ రద్దు చేసి మాకు కడుపు కోత మిగిల్చారని ఆవేదన చెందుతున్నారు. -
లైంగిక వేధింపుల పరిష్కారంపై అవగాహన
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో విద్యార్థినులు, మహిళా ఉద్యోగులకు లైంగిక వేధింపులు, పరిష్కారం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం వర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి పాల్గొని మాట్లాడుతూ వర్సిటీలో మహిళా ఉద్యోగులు, విద్యార్థినుల భద్రత కోసం కృషి చేస్తున్నామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. తిరుపతి ఉమెన్ ఇనిషియేటివ్ పర్సన్ మీరా రాఘవేంద్ర, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు, డీన్ రజనీకాంత్ శుక్లా, ఐసీసీ సభ్యురాలు డాక్టర్ శ్వేత, ఉమెన్ సెల్ చైర్పర్సన్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ, డాక్టర్ జి నాగలక్ష్మి పాల్గొన్నారు. సీనియర్ సిటిజెన్ని బెదిరించిన సైబర్ నేరగాళ్లు తిరుపతి క్రైం:నగరంలో నివాసం ఉంటున్న ఓ సీనియర్ సిటిజెన్ను సైబర్ నేరగాళ్లు బెదిరించిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్వీ యూని వర్సిటీ పోలీసుల కథనం మేరకు.. నగరంలో నివాసం ఉంటున్న 66 సంవత్సరాల వృద్ధుడికి సీబీఐ అధికారులంటూ గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. మీరు మహిళతో అనుచిత వ్యాఖ్యలు చేశారని, మీపై బెంగళూరులో కేసు నమోదైందని తెలిపాడు. అనంతరం వీడియో కాల్ చేసి, ఇంట్లో ఎవరికీ తెలపొద్దని గదిలో కెళ్లి మాట్లాడాలని సూచించాడు. ఆ వృద్ధుడిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. అతని అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నింటిని తెలుసుకున్నారు. వెంటనే ఆ వృద్ధుడు ఆర్టీజీఎస్ ద్వారా రూ.40 లక్షలను వీరికి పంపించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఆర్టీజీఎస్ పంపించేందుకు ఇస్కాన్ బ్రాంచ్లోని ఎస్బీఐ సిబ్బందిని సంప్రదించాడు. వారు ఎందుకు పంపించాలని ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని తెలిపారు. ఇదంతా సైబర్ మోసగాళ్ల పనేనని, దీనిపై మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు సంప్రదించాలన్నారు. బ్యాంకు సిబ్బంది అప్రమత్తతతో సైబర్ మోసం తప్పింది. బ్యాంకు సిబ్బందిని ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు స్టేషన్ కు పిలిపించి వారిని ఘనంగా సత్కరించారు. -
ఇది పరకామణి చోరీ కంటే పెద్ద దోపిడి.. చంద్రబాబుపై భూమన ఆగ్రహం
సాక్షి, తిరుపతి: తిరుమల పవిత్రతను కాపాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలం అవుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏకంగా దేవుడి భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారాయన. బుధవారం తన నివాసంలో భూమన మీడియాతో మాట్లాడారు.. .. టీటీడీకి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు. దేవస్థానం భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. అలిపిరిలో సమీపంలో అత్యంత విలువైన భూముల్ని ఇచ్చేస్తున్నారు. ఎకరా రూ.26 కోట్ల రూ.52 లక్షల ఖరీదైన భూముల్ని కట్టబెట్టారు. రూ.460 కోట్ల విలువైన భూమిని ఒబెరాయ్కి ఇచ్చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.3 వేల కోట్ల విలువైన భూమి ఇది. 13వ తేదీన జీవోకూడా కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 13న జీవో.. 5న రిజిస్ట్రేషన్ చేశారు. మరి ఇంకా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ సైట్లో ఎందుకు కనిపించడం లేదు?. ఎవరికి మేలు చేయడానికి రూ. 2 కోట్లు బిల్డింగ్ ఫీజుకు సర్దుబాటు చేశారు, రూ. 26 కోట్ల స్టాంప్ డ్యూటీ మాఫీ చేసేశారు. ఆ భూముల్లో భారీగా చందనపు చెట్ల ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కాకముందే చెట్లు కొట్టడం ప్రారంభించారు. ఒక బ్రాహ్మణుడు స్వామివారికి ఇచ్చిన భూమిని బాబు పందేర వేస్తున్నారు. తిరుమల పవిత్రతతను కాపాడడంలో చంద్రబాబు విఫలం అయ్యారు. వంద గదుల హోటల్కు భారీ ఎత్తున భూములు కట్టబెడుతున్నారు. ప్రభుత్వం దగ్గరి భూములు ఇవ్వకుండా(రెవెన్యూ ల్యాండ్).. టీటీడీ భూములు ఎలా ఇస్తారు?. గతంలోనూ హోటల్పేరు మార్చి తతంగం అంతా నడిపించింది చంద్రబాబే. దేవుడిని దోపిడీ చేసి ఒబెరాయ్కు ఇప్పుడు భూములు అప్పజెప్తునారు. దేవుడి ఇనాం భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెడతారు?. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారు. వెంకటేశ్వరస్వామికి చంద్రబాబు చేస్తోంది అన్యాయం కాదా?..’’ అని భూమన మండిపడ్డారు. వంద రూమ్ల ఒబెరాయ్ హోటల్తో 1,500 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రజలకు చెప్తోంది. అదెలా సాధ్యం. ఇది పరకామణి దొంగతనం కంటే అతి పెద్ద దోపిడి. దీని వల్ల టీటీడీకి వచ్చిన లాభం ఏమిటి?. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనాడు తీసుకు వచ్చిన ఏడు కొండలు పరిధిలోనే ఈ భూములు ఉన్నాయి. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఈ భూమి ఉంది. అలిపిరి వద్ద అనుమతులు లేకుండా అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి?.. స్వామీజీలు ఇప్పటికైనా మౌనం వీడాలి. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై పోరాటం చేయాలి. ప్రత్యేక అగ్రిమెంట్ వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి తప్పిదాలు చేశారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి’’ అని భూమన డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: తిరుమలలో మహాపచారం.. మద్యం, బిర్యానీ ప్యాకెట్లు లభ్యం! -
టీటీడీ నిర్లక్ష్యం.. భూదేవి కాంప్లెక్స్లో మందు, బిర్యానీ!
సాక్షి, తిరుపతి: ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల ఆరాధన, గోవింద నామస్మరణతో నిండిపోవాల్సిన ప్రదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యంతో అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం బాటిళ్లు, మాంసపు ప్యాకెట్లు కనిపించడం భక్తులను తీవ్రంగా కలచివేస్తోంది.మద్యం, మాంసం నిషేధం ఉన్న ప్రదేశంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘గోవింద నామస్మరణ ఉండాల్సిన ప్రదేశంలో మద్యం, మాంసం ఎలా?” అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమల పవిత్రతకు విరుద్ధంగా పదే పదే అపచారాలు జరుగుతున్నాయి. టీటీడీ విజిలెన్స్ నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.భూదేవి కాంప్లెక్స్లో మద్యం, మాంసం ప్రవేశం పూర్తిగా నిషేధం. అయినప్పటికీ, నిత్యం మద్యం బాటిళ్లు దర్శనమివ్వడం భద్రతా లోపాలను బహిర్గతం చేస్తోంది. టీటీడీ వెంటనే చర్యలు తీసుకుని, తిరుమల పవిత్రతను కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా తిరుపతి భూదేవి కాంప్లెక్స్లో మద్యం, మాంసం దర్శనమివ్వడం భక్తులలో ఆగ్రహం రేపుతూ, టీటీడీ విజిలెన్స్పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. -
గవర్నర్కు సాదర స్వాగతం
రేణిగుంట: తిరుపతి జిల్లా రెండు రోజుల ప ర్యటనలో భాగంగా మంగళవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి విమానాశ్రయంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో తిరుపతికి పయనమయ్యారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సోమ వారం అర్ధరాత్రి వరకు 70,251 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,862 మంది భక్తు లు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ. 4.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వా మివారిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. 18న మెగా జాబ్మేళా తిరుపతి తుడా: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధ్వర్యంలో తిరుపతిలోని కచపి ఆడిటోరియం వేదికగా ఈనెల 18వ తేదీన మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు మెప్మా డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి, గూడూరు, పుత్తూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీల పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుమారు 18 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలకు హా జరవుతారని, వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారని తెలిపారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీజీతో పాటు పలు పార్మసీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు. జనవరి 10, 11తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ తిరుపతి అర్బన్: కొత్త ఏడాది జనవరి 10, 11తేదీల్లో సూళ్లూరుపేట పరిధిలోని పులికాట్ సరస్సుతోపాటు సమీప ప్రాంతాల వద్ద ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, జూ క్యూరేటర్ సెల్వం, ప ర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ రమణ ప్రసాద్తో కలిసి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఫ్లె మింగో ఫెస్టివల్కు ఏర్పాట్లు ప్రారంభించాలని ఆదేశించారు. పులికాట్–నేలపట్టు, బీవీ పాళెం, అటకానితిప్ప, ఇరక్కంఐలాండ్, ఉబ్బలమడుగు, పెరియపాళెం తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చే యడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అలాగే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా ప్రచారం చేయాలన్నారు. వీటికి సంబంధించి పోస్టర్, లోగో, పబ్లిసిటీ, బ్యానర్లు, డిజిటల్ బోర్డు ద్వారా ప్రచారం చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని తెలిపారు. జిల్లా పర్యాటక, సాంస్కృతిక అధికారి ఎం.జనార్దన్రెడ్డి, ఏపీ టీడీసీ ఈఈ సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
ప్రైవేట్ కొలువు వదిలి.. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు
రామచంద్రాపురం: ఇంజినీరింగ్ విద్యను అభ్యసించి పదేళ్ల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన యువకుడు హరికృష్ణ రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ వ్యవసాయ రంగంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని వెంకట్రామాపురం సమీపంలో మూడు ఎకరాల లీజు భూమిలో 20 రకాల ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. ప్రకృతి సాగుపై పూర్తిగా అవగాహన లేకపోయినా, రైతుల సూచనలు, శిక్షణతో ముందుకెళ్లి విజయాన్ని సాధించిన హరికృష్ణ, తిరుపతిలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేకంగా దుకాణాలు కూడా ప్రారంభించారు. కలుషితం లేని ఆహా రానికి ప్రజల్లో పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని నాణ్యత, స్వచ్ఛతతో పండించిన పంటల్లో లాభాలను ఆర్జిస్తున్నారు. మంగళవారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యక్రమంగా రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ లో భాగంగా తిరుపతి జిల్లా డీపీఎం షణ్ముగం నేతృత్వంలో 150 మంది ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు హరికృష్ణ క్షేత్రాన్ని సందర్శించారు. ప్రకృతి వ్యవసా య అధికారి డీపీఎం షణ్ముగం మాట్లాడుతూ రూ.లక్షల్లో జీతం తీసుకునే ఉద్యోగాన్ని వదిలి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్న హరికృష్ణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పీ భానుమూర్తి, మధు, నీలమ్మ, శ్రీదేవి, బాబాసాహెబ్, అయ్యప్ప నాయుడు పాల్గొన్నారు. -
ఆపి ఉన్న కారులో మంటలు
నాయుడుపేటటౌన్: ఆగి ఉన్న కారులో ఒకసారిగా మంటలు చెలరేగి కారు దగ్ధమైన సంఘటన మండలంలోని నరసారెడ్డికండ్రిగ రహ దారి వద్ద మంగళవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. మండలంలోని అరవపెరిమిడి గ్రామానికి చెందిన పాలెల హరిబాబు తన కారులో సొంతపని నిమిత్తం నరసారెడ్డి కండ్రిగ రహదారి వద్దకు వచ్చారు. కారు రోడ్డు పక్కగా ఆపి, వెళ్లాడు. కొద్ది సేపటికే కారులో మంటలు వస్తుండాన్ని స్థానికులు గుర్తించారు. హరిబాబు కూడ అక్కడ చేరుకుని అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వారు సంఘటనా స్థలానికి చేరు కుని కారు లోంచి వస్తున్న మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు చాల వరకు దగ్ధమైంది. కారు బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా గుర్తించారు. ఘాట్ రోడ్డులో వ్యక్తి ఆత్మహత్య తిరుమల: భార్యతో గొడవపడి మనస్తాపానికి గురై ఘాట్ రోడ్డులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. కర్ణాటకకు చెందిన సుమన్(39) కొంతకాలంగా తిరుపతిలోని గాజుల వీధిలో నివాసం ఉంటున్నాడు. ఇతను సెలూన్ లో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఇతడు దీపిక అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంతకాలంగా భార్య దీపికతో గొడవలు పడుతున్నట్లు తిరుపతిలోని వారి ఇంటి యజమాని భువనేశ్వరి సమాచారం మేరకు తెలిసిందని పోలీసులు తెలిపారు. అయితే మృతుడు ఫోన్ పరిశీలించగా ఈ నెల 10వ తేదీన ఆఖరి ఫోన్ వెళ్లినట్లుగా గుర్తించామన్నారు. అయితే ఆ రోజే మృతుడి తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులోని తొమ్మిదో మలుపు వద్ద అటవీ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనను మంగళవారం 9 మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరగా వాహనాన్ని పక్కకు పెడుతున్న సమయంలో ఆటో మెకానిక్ మనోహర్ రెడ్డి గుర్తించారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసినట్లు తెలిపారు. పోక్సో కేసులో రాపిడో డ్రైవర్ అరెస్టు తిరుపతి క్రైమ్: నగరంలో ఈనెల 3వ తేదీన బాలికపై జరిగిన అత్యాచారం కేసులో రాపిడో ఆటో డ్రైవర్ను మంగళవారం అరెస్టు చేసినట్లు అలిపిరి సీఐ రామకిషోర్ తెలిపారు. ఈ నెల మూడో తేదీన నగరంలోని ఓ హాస్టల్లో చదువుతున్న బాలిక మరో హాస్టల్లో మారేందుకు, సామాన్లు తీసుకుని వెళ్లేందుకు రాపిడోను బుక్ చేసుకుంది. ఆ బాలికను భయపెట్టి, బెదిరించి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా సత్యసాయి జిల్లాకు చెందిన సాయి కుమార్గా గుర్తించి అరెస్టు చేశామని సీఐ తెలిపారు. ఎస్వీయూ హెల్త్సెంటర్కు ఈసీజీ యంత్రం వితరణ తిరుపతి సిటీ: ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్ టాటా నర్సింగరావు వర్సిటీలోని ఆరోగ్య కేంద్రానికి తన వ్యక్తిగత నిధులతో ఈసీజీ యంత్రాన్ని బహుకరించారు. ఈ మేరకు తన చాంబర్లో మంగళవారం రూ. 27వేలు విలువ గల పోర్టబుల్ ఈసీజీ యంత్రాన్ని ల్యాబ్ టెక్నీషియన్ ముత్తువేలుకు అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు, సిబ్బంది, క్యాంపస్ నివాసితులకు సకాలంలో పరీక్షలు చేయడానికి యూనివర్సిటీ హెల్త్ సెంటర్ సౌకర్యాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తనవంతు సహాయ సహకారం అందించామన్నారు. మద్యం దుకాణంలో చోరీ తిరుపతి క్రైమ్: నగరంలోని ఓ మద్యం దుకాణంలో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి సీఐ రామకిషోర్ కథనం మేరకు.. కరకంబాడి రోడ్డులోని ఎస్వీఎస్ వైన్షాప్లో గుర్తుతెలియని దుండగులు ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి అనంతరం వైన్షాప్ గోడ పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. దుకాణంలో ఉన్న కౌంటర్లో 2.45 లక్షలు దోచుకెళ్లినట్లుగా షాపు సిబ్బంది మని ప్రసాద్ తెలిపారన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు
చంద్రగిరి: శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని చంద్రగిరి సీఐ సురేష్ కుమార్ హెచ్చరించారు. మండలంలోని తొండవాడలో సోమవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనాలను దగ్ధం చేసిన ఘటనలో నిందుతుడిని మంగళవారం అదుపులోకి తీసుకుని, మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పిచ్చినాయుడుపల్లి దళితవాడకు చెందిన రేణిగుంట గౌతం(పెప్సీ) అనే యువకుడు ఆదివారం రాత్రి తొండవాడలోని సంధ్య, ఆమె భర్త మహేంద్రరెడ్డిపై మద్యం మత్తులో కత్తితో దాడికి యత్నించారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు యువకుడిని మందలించి పంపించినట్లు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున సంధ్య ఇంటి ఆవరణలో ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గౌతంను విచారించగా, ద్విచక్ర వాహనాలను తగలబెట్టినట్లు అంగీకరించారని చెప్పారు. గౌతంపై ఇప్పటికే చంద్రగిరి, తిరుపతి రూరల్, గూడూరు పోలీసు స్టేషన్లలో చోరీలు, గొడవలకు సబంధించి కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిచినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అరుణాచలం, సిబ్బంది నాగమణి, మణి, వినాయక, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
కోటి సంతకాల సేకరణ సూపర్ సక్సెస్
తిరుపతి మంగళం : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం విజయవంతంగా జరిగిందని మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. మంగళవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో నిర్వహించిన ర్యాలీలు విజయవంతం అయ్యాయన్నారు. ప్రభుత్వ సూపర్ సిక్స్ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిందని, రాష్ట్రంలో 2.5 కోట్ల మంది ఓటర్లు ఉంటే 1.30 కోట్ల మంది సంతకాలు చేయడం సామాన్యమైన విషయం కాదని, దీన్ని చూస్తే ఈ ప్రభుత్వంపై ఎంత ప్రజావ్యతిరేకత ఉందో అర్థమవుతుందని తెలిపారు. ఈ సంతకాల కార్యక్రమంలో వైఎస్సార్ సీపీతోపాటు బీజేపీ, జనసేన, టీడీపీకి చెందినవారు కూడా సంతకాలు చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ పాలనలో ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీలో రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించడంతోపాటు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉచితంగా వైద్య విద్యను చదువుకోవడానికి అవకాశం ఉంటుందని, ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నడపాలని, పేద బిడ్డల మెడికల్ చదువులపై ఉక్కుపాదం మోపాలని చూస్తే.. అప్పుడు కోటి కాస్తా పదికోట్ల సంతకాలవుతాయని తేల్చి చెప్పారు. -
ఐఐటీలో హోరాహోరీగా క్రీడా పోటీలు
ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో జరుగుతున్న 58వ ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్లో మూడో రోజు మంగళవారం చెస్, టెన్నిస్, వెయిట్లిఫ్టింగ్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ క్రీడా సంబరం డిసెంబర్ 14 నుంచి 21వ తేదీ వరకు కొనసాగనుంది. క్రీడల పోటీలలో నువ్వా..నేనా..? చెస్ పోటీలో ఐఐటీ కాన్పూర్ అద్భుతంగా ఆడి, 8 పాయింట్లతో టేబుల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఐఐటీ ఖరగ్పూర్ 7.5 పాయింట్లతో కాన్పూర్కు దగ్గరగా ఉంది. ఐఐటీ బీహెచ్యూ వారణాసి, ఐఐటీ హైదరాబాద్ చెరో 6 పాయింట్లతో మూడో స్థానంలో సమానంగా ఉన్నాయి. టెన్సిస్లోనూ వివిధ జట్లు నాక్అవుట్కు చేరుకోవటానికి తీవ్రంగా పోటీ పడుతున్నాయి. కాగా వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో రూర్కీ , కాన్పూర్, బీహెచ్యూ వారణాసి జట్లు లీగ్ మ్యాచ్ల్లో సత్తా చాటి ముందంజలో ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ ఐఐటీ మద్రాస్, 2వ జనరేషన్ ఐఐటీ హైదరాబాద్లో కూడా ఈ స్పోర్ట్స్ మీట్ జరుగుతోంది. ఈనెల 21వ తేదీతో ఈ టోర్నీ ముగియనుంది. -
కోట ఎంపీపీ అంజమ్మ మృతి
కోట: స్థానిక ఎంపీపీ, వైఎస్సార్సీపీ నాయకురాలు దాసరి అంజమ్మ(60) మంగళవారం మృతి చెందారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈమె పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడవలూరు ధనుంజయరెడ్డికి ముఖ్య అనుచరులుగా గుర్తింపు పొందారు. ఊనుగుంటపాళెం ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన ఆమె అనంతరం కోట ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఊనుగుంటపాళెంలో ఆమె మృతదేహానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడవలూరు ధనుంజయరెడ్డి, సీఈసీ సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్రెడ్డి, మండల కన్వీనర్ పలగాటి సంపత్కుమార్ రెడ్డి, తహసీల్దార్ జయజయరావు, ఎంపీడీఓ దిలీప్కుమార్లు నివాళులర్పించారు. జనసందోహం మధ్య ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. -
వంద శాతం పల్స్పోలియా
తిరుపతి అర్బన్: జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు పల్స్ పోలియా 100 శాతం చేపట్టాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. కలెక్టరేట్లో ఆయన మంగళవారం అధికారులతో సమీక్షించారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పల్స్ పోలియో కార్యక్రమం వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా పరిశ్రమల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని హైరిస్క్ జనాభాను గుర్తించి, ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని 26 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 58 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 1868 పోలియో బూత్లు, 84 మొబైల్ బూత్లు, 59 ట్రాన్సిట్ బూత్లు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనందమూర్తి, డీఎల్ఏసీటీఓ డాక్టర్ శైలజ, ఎస్వీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శాంతకుమారి పాల్గొన్నారు. -
ఆపి ఉన్న కారులో మంటలు
ఆపి ఉన్న కారులో ఒకసారిగా మంటలు చెలరేగిన సంఘటన నాయుడుపేట మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.బర్డ్ ప్రాంగణంలో బెంచీలపై ఎదురుచూస్తున్న రోగుల సహాయకులు చలికి వణికి పోతున్న రోగులు తిరుపతిలో 17 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయా యి. చలిగాలులు, మంచు తుపాన్లా మారింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్ర రూపం దాల్చింది. చలికి గజగజ లాడిస్తోంది. బర్డ్ ఆస్పత్రిలో ఓపీకి వచ్చే రోగులు చలి బారిన పడుతున్నారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో చెట్ల కింద మంచుకు వణికి పోతున్నారు. రోగులతోపాటు ఒకరిద్దరు సహాయకులు పరిస్థి తి ఇలానే ఉంది. ముందు రోజు రాత్రి నుంచే ఆస్పత్రి వద్ద మంచు ముంగిట్లో రోగులు, వారి సహాయకులు పడిగాపులు కాస్తున్నారు. -
వైభవంగా గొబ్బెమ్మ ఉత్సవం
శ్రీకాళహస్తి: ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం మనోన్మణి(గొబ్బెమ్మ)కు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేషంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారిని చప్పరాలపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జాతీయ యోగా పోటీల్లో బీవీబీ విద్యార్థి ప్రతిభ తిరుపతి సిటీ: మహారాష్ట్ర వేదికగా ఈనెల 30వ తేదీన జరగనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్స్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీలకు భారతీయ విద్యాభవన్ విద్యార్థి టి సుయశ్వంత్ ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థి జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని డైరెక్టర్ సత్యనారాయణ, ప్రిన్సిపల్ పద్మజ కొనియాడారు. రాస్ కృషి విజ్ఞాన కేంరద్రం సందర్శన రేణిగుంట: మండలంలోని కరకంబాడి పంచాయతీలో ఉన్న రాస్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంగళవారం హైదరాబాద్కు చెందిన ఐసీఏఆర్–అటారీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జేవీ ప్రసాద్ సందర్శించారు. ముందుగా ఆయన కేవీకే శాస్త్రవేత్తలతో సమావేశమై దత్తత గ్రామాల్లో రాస్ చేపట్టిన వివిధ కార్యక్రమాల ప్రగతి, 2025–2026 సంవత్సరానికి నిర్దేశించిన కార్యక్రమాల ప్రణాళిక అమలు గురించి చర్చించారు. కేవీకే శాస్త్రవేత్తల పనితీరు, కార్యక్రమాల ప్రగతిని ప్రశంసించారు. రైతులకు సాగు ఖర్చు తగ్గించి ఆదాయం పెంచే సాంకేతికతలో భాగంగా సమగ్ర సస్యరక్షణ, జీవన ఎరువుల వినియోగం, పురుగుమందుల పిచికారీలో డ్రోన్ల వినియోగం, ప్రకృతి వ్యవసాయ విధానం, ప్రకృతి వ్యవసాయంలో వాడే కషాయాలు, ఘన, ద్రవ జీవామతం వంటి ముడి పదార్థాల తయారీపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త డా.ఎస్.శ్రీనివాసులు, కె.వి.కె శాస్త్రవేత్తలు సుధాకర్, దివ్య, రాము కుమార్, అనూష, దివ్య సుధ, సిబ్బంది పాల్గొన్నారు. -
సీకాం కళాశాలకు అరుదైన గౌరవం
తిరుపతి సిటీ: ఢిల్లీ వేదికగా విజయ్ వివస్ సందర్భంగా వెటరన్స్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రైడ్ ఆఫ్ నేషన్–2025 కార్యక్రమంలో తిరుపతి సీకాం డిగ్రీ కళాశాలకు హానర్స్ ఆఫ్ పార్టిఫికేషన్ కళాశాల అవార్డు దక్కింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర మంత్రి సంజయ్సేథ్, అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్లాల్, వెటరన్స్ ఇండియా వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ బీకే మిశ్రా చేతుల మీదుగా సీకాం కళాశాలల డైరెక్టర్ టీ.ప్రణీత్ స్వరూప్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీకాం కళాశాల నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా సేవలందిస్తోందన్నారు. దీంతో ఇప్పటికే కళాశాల ప్రత్యేక హోదా సాధించిందన్నారు. దేశభక్తి, సేవారంగాలల్లో సైతం కళాశాల ముందంజలో ఉందని చెప్పారు. -
పోరాటం ఉధృతం చేస్తాం
తిరుపతి అర్బన్: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు చిరంజీవి రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు కోటిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వేమాలయ్య తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సహకార సంఘాల ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క సమస్యకు పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 6వ తేదీన సొసైటీల వద్ద, 8వ తేదీన బ్రాంచ్ కార్యాలయాల వద్ద, 16న కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేపట్టామని స్పష్టం చేశారు. అలాగే ఈ నెల 22న చిత్తూరు డీసీసీబీ వద్ద ధర్నా చేస్తామని, ఈ నెల 29న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. -
రూ.కోట్లు వృథా..అంతా వ్యధ
తొట్టంబేడు: కార్యాలయాల భవనాలు అసంపూర్తిగా ఉండడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ప్రజలవద్దకే పాలన తెచ్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేశారు. ఇందులో భాగంగానే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లను ఆయా పంచాయతీల పరిధిలోనే ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. ఎన్నికల నాటికి ఇందులో చాలా వరకు భవనాలు పూర్తి కాగా.. ఆ తర్వాత కొన్ని చివరి దశలో ఉన్నాయి. వాటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన బాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇలాంటిదే తొట్టంబేడు మండలంలో చోటు చేసుకుంది. రూ.కోటి వ్యయంతో మేజర్ పంచాయతీలైన తంగేళ్లపాళెం, సాంబయ్యపాళెం పంచాయతీల పరిధిలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేశారు. దాదాపు భవనాలు పూర్తయ్యాయి. రూ.15 లక్షలు వెచ్చిస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అవస్థలే..అవస్థలు తొట్టంబేడు పంచాయతీ తంగేళ్లపాళెంలో 2,500 మంది, సాంబయ్యపాళెం పంచాయతీలో 1800 మంది వరకు జనాభా ఉన్నారు. వీరిలో చాలా మంది రైతులే. వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరు ఎరువులు, విత్తనాలతోపాటు ఆరోగ్య అవసరాల నిమిత్తం సుమారు పది కిలోమీటర్ల దూరంలోని శ్రీకాళహస్తికి వెళ్లాల్సి వస్తోంది. వీరి అవసరార్థం గత ప్రభుత్వంలో రూ.కోటి వెచ్చించి రైతు భరోసా, విలేజ్ హెల్త్క్లినిక్, సచివాలయం ఏర్పాటు చేశారు. ఇవి దాదాపు పూర్తికావచ్చాయి. ఫ్లోరింగ్ వేస్తే సరిపోతుంది. వీటికి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. కానీ వీటిని అందుబాటులోకి తెస్తే గత ప్రభుత్వానికి ఎక్కడ మంచిపేరు వస్తుందేమోనని కూటమి నేతలు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అత్యవసరమైనా.. ఎరువులు అవసరమైనా శ్రీకాళహస్తికి పోవాల్సి వస్తుంది. ఈ భవనాలు అందుబాటులో ఉంటే తమకు ఏ దిగులూ ఉండదని స్థానికులు చెబుతున్నారు. -
ఎర్రచందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం చెట్లను నరకడానికి ప్రయత్నించిన కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి మంగళవారం తీర్పు చెప్పినట్టు ఫారెస్ట్ సిబ్బంది తెలిపారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ ఫారెస్ట్ సిబ్బంది 2017 సంవత్సరంలో శేషాచలం, నాగపట్ల బీట్, టీఎన్ పాళెం సెక్షన్ అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లాకు చెందిన విజయ్ కుమార్, మణి అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా అటవీ ప్రాంతంలో ఉండడాన్ని గుర్తించారు. ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికి శిక్ష విధించారు. -
బాబు చెప్పేవన్నీ అబద్ధాలే
పెళ్లకూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని, ఒక్కమాట కూడా నిజం ఉండదని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రూ.21లక్షల వేల కోట్లు పెట్టుబడులు తెచ్చామంటూ బహిరంగ వేదికల్లో భీకరాలు పలకడం అమానుషమన్నారు. తెచ్చిన పెట్టుబడులను ఎక్కడ పెట్టారు, ఏమి చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసం ఉందన్నారు. పచ్చరోత పత్రికల్లో లేని జీడీపీని చూపించి రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి కేంద్రం నుంచి వచ్చే రూ.10 వేల కోట్ల నిధులు రాకుండా చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రోజుకు రూ.475 కోట్లు చొప్పున 18 నెలల్లో రూ.2.66 లక్షల కోట్లు అప్పు తెచ్చిన హీనచరిత్ర చంద్రబాబుదన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో మంజూరైన 17మెడికల్ కాలేజ్లను పూర్తి చేస్తే జగన్మోహన్రెడ్డిని పేరు వస్తుందనే నెపంతో పీపీపీ విధానం అంటూ రూ.100కు బినామీలకు దోచి పెడుతున్నాడని మండిపడ్డారు. మెడికల్ కాలేజ్లను అమ్మి ముడుపులను కరకట్టకు పంపడమేనా? అని ఎద్దెవా చేశారు. ఆయన వెంట నాయకులు వెంకటాచలం, శంకరయ్య, బత్తెయ్య, సునీల్ ఉన్నారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి వక్తృత్వ పోటీలు
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృ వర్సిటీలో రెండు రోజులగా జరిగిన రాష్ట్రస్థాయి సంస్కృత వక్తృత్వ, సాహిత్య పోటీలు మంగళవారంతో ముగిశాయి. వాగ్వర్థిని పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సంస్కృత పోటీల్లో భాగంగా 36 విభాగాల్లో పోటీలను నిర్వహించామన్నారు. ఇందులో పలు ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీన్ కొంపెల్ల రామసూర్యనారాయణ, డీన్ రజినీకాంత్ శుక్లా, వాగ్వర్థిని కోఆర్డినేటర్లు డాక్టర్ భరత్ భూషణ్ రథ్, డాక్టర్ ప్రదీప్ కుమార్ భాగ్, కో–ఆర్డినేటర్ డాక్టర్ ఉదయన హెగ్డే పాల్గొన్నారు. -
ఎట్టకేలకు మోక్షం
తిరుమల: వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ ఆస్పత్రి ఆధునికీకరణకు ఎట్టకేలకు టీటీడీ కదిలింది. ఈ ఆస్పత్రిలో గత ఏడాది ఎన్నికలనాటికే 75 శాతం పనులు పూర్తయి, వినియోగానికి సిద్ధమైంది. గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం రావడంతో మిగిలిన వసతుల కల్పన పనులు నిలిపివేశారు. ఇది పూర్తయితే వైఎస్ జగన్కు పేరు వస్తుందన్న అక్కసుతో పనులకు అడ్డుకట్ట వేశారు. అయితే ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో ఎట్టకేలకు ఈ ఆస్పత్రిలో ఆధునిక సౌకర్యాల కల్పనకు పాలక మండలి రూ.48 కోట్లు మంజూరు చేసింది. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో వి. వీరబ్రహ్మం పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో టీటీడీ గోశాల నిర్మాణానికి కేటాయించిన 400 ఎకరాల భూమిలో 100 ఎకరాలను ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు అవసరమైన దివ్య వృక్షాలు పెంచేందుకు వినియోగించాలని ఈ సమావేశంలో టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో అంచెలంచెలుగా గోశాలకు మంగళం పాడినట్లేనని భావిస్తున్నారు. మరికొన్ని ముఖ్య నిర్ణయాలు.. » టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైన సాఫ్ట్వేర్లు, సిబ్బంది తదితర సౌకర్యాల కల్పనకు ఆమోదం. » ముంబైలోని బాంద్రాలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం »దాతల కాటేజీల నిర్వహణ, నిర్మాణాలపై నూతన విధానం తేవాలని నిర్ణయం అర్చకులు, పోటు వర్కర్ల వేతనాల పెంపు టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్న 62 మంది అర్చక, పరిచారక, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం. ఆమేరకు.. అర్చకులకు రూ.25,000 నుంచి రూ.45,000కు, పరిచారకులకు రూ.23,140 నుంచి రూ.30,000కు, పోటు వర్కర్లకు రూ.24,279 నుంచి రూ.30,000కు ప్రసాదం డి్రస్టిబ్యూటర్లకు రూ.23,640 నుంచి రూ.30,000 కు పెంపు -
శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు సమయం
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 19 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 81,345 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,150 మంది భక్తులు త లనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4 కోట్లు సమర్పించారు. టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారు స్వామి వారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. -
శ్రీవారి దర్శనానికి ‘మార్చి’ కోటా షెడ్యూల్ విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం డిసెంబర్ 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందినవారు డిసెంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు, శ్రీవారి వసంతోత్సవాల టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది.ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల (ఎస్ఈడీ) కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 14 వరకు దేశ వ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. -
అర్జీలపై శ్రద్ధ చూపండి
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో ప్రజలు ఇచ్చే అర్జీల పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 363 అర్జీలు వచ్చాయి. అందులో ప్రధానంగా రెవెన్యూ సమస్యలపై 225 అర్జీలను అందుకున్నారు. కలెక్టర్తోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మాండ్, సుధారాణి అర్జీలను స్వీకరించారు. కలెక్టర్కు అర్జీలు ఇవ్వడానికి పోటీపడిన అర్జీదాలులు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారులు సోమవారం తమ అర్జీలను కలెక్టర్కు ఇవ్వడానికి పోటీ పడ్డారు. అధికారులు అర్జీలను స్వీకరిస్తున్నారని, లోనికి వెళ్లాలని సూచించినా 70 శాతం మంది అర్జీదారులు తమ అర్జీలను కలెక్టర్కు మాత్రమే ఇస్తామంటూ క్యూలోనే ఉండిపోయారు. మా బిడ్డలకు సాయం చేయండి తన భర్త, తన కుమారుడు షణ్ముగం మృతి చెందారు. కోడలు మంజుల కిడ్నీ సమస్యతో మంచానికే పరిమితం అయ్యిందని ముగ్గురు పిల్లల బాగోగులను తాను చూసుకుంటున్నానని భాస్కరమ్మ అనే మహిళ కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. సాయం చేసి ఆదుకోవాలని కోరింది. ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది. ఒంటరి మహిళను..పింఛన్ ఇవ్వండి తన భర్త తనకు దూరంగా ఉండిపోయారని నాయుడుపేట మండలంలోని దురదవాడ గ్రామానికి చెందిన బి. మాధవి వాపోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు కుటుంబ పోషణ భారంగా మారుతుందని, పింఛన్ ఇప్పించాలని కలెక్టర్ను కోరింది. దారి సమస్య పరిష్కరించండి దారి సమస్య పరిష్కరించాలని తిరుపతి రూరల్ మండలం అంబేడ్కర్ నగర్కి చెందిన పలువురు ఎస్సీలు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దామినేడు లెక్కదాఖలో దారి ఉండేదన్నారు. అయితే రత్నం అనే వ్యక్తి దారిలేదంటూ అభ్యంతరం చెబుతున్నారని వాపోయారు. మద్యం షాపు మాకొద్దు మద్యం షాపు మా కొద్దు..దాంతో తలనొప్పులు తప్పడం లేదంటూ పుత్తూరు పట్టణంలోని రామానాయుడు కాలనీకి చెందిన పలువురు మహిళలు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు.సీఆర్పీల సమస్యలు పట్టించుకోరా? సమగ్రశిక్షలో 14ఏళ్లుగా పనిచేస్తున్న సీఆర్పీల సమస్యలను పట్టించుకోవాలని వారు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. -
ఐఐటీలో రసవత్తరంగా క్రీడా పోటీలు
ఏర్పేడు: తిరుపతి ఐఐటీ ఇండోర్ స్టేడియంలో క్రీడా పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. 58వ ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్లో రెండో రోజు టెన్నిస్ లీగ్ మ్యాచ్లు, చదరంగం మ్యాచ్లు హోరాహోరీగా జరిగాయి. డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ విద్యార్థులతో కలసి చదరంగం ఆడి పోటీలను ప్రారంభించారు. ముందంజలో కాన్పూర్ ఐఐటీ విద్యార్థులు చదరంగం లీగ్ పోటీలో మొదటి రౌండ్ తర్వాత ఐఐటీ కాన్పూర్ 4 పాయింట్లతో ముందంజలో నిలిచింది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ గౌహతి 3.5 పాయింట్లతో దగ్గరగా ఉన్నాయి. వెయిట్లిఫ్టింగ్ అధికారిక ఫలితాలు రెండో రోజున సోమవారం 60 కిలోల (గ్రూప్ ఏ, గ్రూప్ బీ), 65 కిలోల (గ్రూప్ ఏ) విభాగాల్లో వెయిట్లిఫ్టింగ్ ఈవెంట్లు జరిగాయి. సోమవారం విజేతలను ప్రకటించారు. ఈ పోటీలు ఈనెల 21వ వరకు జరగనున్నాయి. -
రాష్ట్రపతి పర్యటనపై సమీక్ష
రేణిగుంట: భారత రాష్ట్రపతి ద్రౌపదిము ర్ము, ఈ నెల 17న, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 16, 17 తేదీల్లో తి రుపతి జిల్లా పర్యటన సందర్భంగా సో మవారం రేణిగుంట విమానాశ్రయంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయు డు, అధికారులతో సమన్వయ సమావే శం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ఈ నెల 17వ తేదీన తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాలోని స్వర్ణ దేవాలయం దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వేలూరు వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. అనంత రం తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారన్నారు. ఇంటెలిజెన్స్ అధికారి నాగబాబు, అడిషనల్ ఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాస రావు, నాగభూషణ రావు, వెంకటరాముడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి, విమానాశ్రయ డైరెక్టర్ భూమినాథన్, సీఐఎస్ఎఫ్ అధికారి అనురాగ్ యాదవ్, ఐబీ అధికారి శిరీష, డీఎస్పీలు రామకష్ణాచారి, చంద్రశేఖర్, భక్తవత్సలం, రామకృష్ణ, చిరంజీవి, ప్రసాద్, రాంబాబు, అంకారావు, వెంకటనారాయణ, డీఎఫ్ఓ రమణయ్య పాల్గొన్నారు. -
నేటి నుంచి మళ్లీ ఆధార్ ప్రత్యేక శిబిరాలు
తిరుపతి అర్బన్: విద్యార్థుల కోసం పాఠశాలల్లో మళ్లీ ఆధార్ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని గ్రామ,వార్డు సచివాలయాల జిల్లా అధికారి జీవీ నారాయణరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 86,141 మంది పిల్లలు ఆధార్లో బయోమెట్రిక్లను నవీకరించాల్సి ఉందన్నారు. అయితే గత నెల నవంబర్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఆధార్ ప్రత్యేక శిబిరాల్లో కేవలం 11,796 మందికి మాత్రమే బయోమెట్రిక్ నవీకరణ పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. దీంతో ఈ నెల 16 నుంచి 20 వరకు, అలాగే ఈ నెల 22 నుంచి 24 వరకు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధితోనే ఆర్థిక స్వావలంబన తిరుపతి రూరల్: నైపుణ్యాభివృద్ధితోనే మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించగలరని శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీ ఉమ అన్నారు. విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్రం తరఫున మూడు నెలల టైలరింగ్, అప్పేరల్ డిజైనింగ్ శిక్షణ కార్యక్రమంతో పాటు హోమ్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేకరీ యూనిట్ను సోమవారం ఆమె ప్రారంభించారు. భాషాప్రయుక్త రాష్ట్రానికి ఆద్యులు అమరజీవి తిరుపతి అర్బన్: భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటుకు అమరజీవి పొట్టిశ్రీరాములు ఆద్యులని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం అమరజీవి వర్ధంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్లో జరుపుకున్నారు. డీఆర్వో నరసింహులు, డీఆర్డీఏ పీడీ శోభన్బాబు, ల్యాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్కుమార్, డీఐపీఆర్ఓ గురుస్వామిశెట్టి పాల్గొన్నారు. నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం జరుగనుంది. స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన బోర్డు సభ్యులు హాజరై, దాదాపు 60 అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఈనెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరుగనున్న వైకుంఠ ద్వార దర్శనాలను ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లపై చర్చించనున్నారు. అలాగే 100 ఎకరాల్లో దివ్యవృక్షాల ప్రాజెక్టుకు బోర్డు ఆమోదం తెలుపనుంది. అలాగే వసతిగృహాల నిర్మాణ పథకంలో దాతలకు అందిస్తున్న ప్రివిలైజేషన్లో నూతన పాలసీని తీసుకురాను న్నారు. రాష్ట్రంలో ఐదువేల ఆలయాలను శ్రీవాణి ట్రస్టు ద్వారా నిర్మించడానికి సంబంధించి సమగ్రమైన విధివిధానాలను రూపొందించడంతోపాటు నిధులను మంజూరు చేసే అవకాశం ఉంది. తిరుపతి రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2024–2025 వి ద్యాసంవత్సరానికి సంబంధించిన ఏపీ ఆర్ సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలు మొత్తం 65 సబ్జెక్టు లకు నిర్వహించగా, 5,164 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,859 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కె. మధుమూర్తి తెలిపారు. ఏపీ ఆర్సెట్ ఫలితాలను ఆయన ఆన్లైన్లో అధికారికంగా విడుదల చేశారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ వి.ఉమ వర్చువల్గా హాజరయ్యారు. ఈ పరీక్షా ఫలితాల్లో సబ్జె క్టుల వారీగా పరిశీలిస్తే ఫార్మసీ విభాగంలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కాగా, తరువాత స్థా నాల్లో మేనేజ్ మెంట్, కంప్యూటర్ సైన్స్ విభాగాలు నిలిచాయి. పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించిన మౌఖిక పరీక్ష వివరాలను త్వరలోనే ఉన్నత విద్యా మండలి అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామని ఏపీ ఆర్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.ఉష, కో– కన్వీనర్ ప్రొఫెసర్ జాన్ సుష్మ తెలిపారు. కాగా అభ్యర్థులు పరీక్షా ఫలితాలను ఏపీఆర్సెట్ వెబ్సైట్లో చూడవచ్చని ఆయన తెలిపారు. -
వైఎస్సార్ సీపీలోకి టీడీపీ యువ నేత
శ్రీకాళహస్తి: పట్టణంలోని 29వ వార్డుకు చెందిన టీడీపీ యువ నాయకుడు మణికంఠ సోమవారం వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన అధికారికంగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మణికంఠకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిబద్ధతతో ప్రజల కోసం పనిచేసే నాయకులకు వైఎస్సార్ సీపీలో ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. మణికంఠ నిబద్ధతగల యువ నాయకుడని, అతని సేవలను పార్టీ సమర్థవంతంగా వినియోగించుకుంటుందని తెలిపారు. మణికంఠ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో 29వ వార్డులో వైఎస్సార్ సీపీ బలోపేతానికి తన శాయిశక్తులా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకుడు గిరిధర్ రెడ్డి, ఆర్కాడు ముత్తు, శంకర్ పాల్గొన్నారు. -
హెల్మెట్ బాధ్యత కాదు భద్రత
తిరుపతి క్రైం: హెల్మెట్ అనేది బాధ్యత కాదు అది భద్రత అని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని జి ల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి టౌన్క్లబ్ వరకు హెల్మెట్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో సుమారు 700 మంది పో లీసులు పాల్గొని, ప్రజలకు అవగాహన కల్పించా రు. అనంతరం ట్రాఫిక్ పోలీసులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అంతకుముందు కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో భద్రతా చైతన్యాన్ని మరింతగా పెంచడమే ప్రధాన లక్ష్యంగా పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతుందన్నారు. ఇటీవల ద్విచక్ర వాహనాల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణనష్టం నివారణకు హెల్మెట్ వినియోగం అత్యంత కీలకమని అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, బీట్ సిబ్బంది నేరుగా రంగంలోకి దిగారన్నారు. జిల్లాలో అమలులో ఉన్న నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన ప్రకారం హెల్మెట్ లేకుండా వచ్చేవారికి పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వకూడదని ఆదేశించారు. అలాగే నో హెల్మెట్ నో రైడ్ కార్యక్రమం ద్వారా చిన్న దూరానికై నా హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదని, వాహనం నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని బలంగా ప్రచారం చేస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వ్యక్తితోపాటు, వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగి హెల్మెట్ను ధరించాలని సూచించారు. జరిమానాల విధించడం మా లక్ష్యం కాదు పోలీసుల లక్ష్యం జరిమానాలు విధించడం కాదని, రోడ్డు ప్రమాదాలను నివారించడమే ప్రధాన ఉద్దేశమని కలెక్టర్, ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియా రీల్స్, వీడియోల కోసం నిర్లక్ష్యంగా బైక్ నడపకుండా యువత తమ జీవిత విలువను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహర్ ఆచారి, నాగభూషణం, శ్రీనివాసులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
రైళ్లలో చోరీలు.. దొంగ అరెస్టు
– రూ.9 లక్షల విలువచేసే సొత్తు స్వాధీనం రేణిగుంట: స్థానిక రైల్వే పరిధిలో కొంత కాలంగా ప్లాట్ఫామ్లపై, కదులుతున్న రైళ్లలో చోరీలు చేస్తున్న వ్యక్తిని సోమవారం అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ 9.10 లక్షల విలువ చేసే 91 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు జీఆర్పీ సీఐ యతీంద్ర తెలిపారు. రేణిగుంట రైల్వేస్టేషన్లోని జీఆర్పీ పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ యతీంద్ర ఈ వివరాలు వెల్లడించారు. వరుస చోరీల నేపథ్యంలో తిరుపతి డీఎస్ఆర్పీఎస్ఆర్ హర్షిత ఆదేశాల మేరకు ఆర్పీ ఎస్ఐ మధుసూదన్రావు, ధర్మేంద్ర రాజు సిబ్బందితో కలిసి రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. చోరీలకు పాల్పడుతున్నది చైన్నెలోని ఎర్నావూర్కు చెందిన నీలా లోకేష్ కుమార్ (36)గా గుర్తించి పుత్తూరు రైల్వే స్టేషన్ టూవీలర్ పార్కింగ్లో అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుంచి రూ 9.10 లక్షల విలువ చేసే 91 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. -
మార్కెట్ లోకి ‘స్మైల్ ఎకో‘ ఉత్పత్తులు
శ్రీసిటీ (వరదయ్యపాళెం): శ్రీసిటీలోని స్మైల్ ఎకో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తమ ఉత్పత్తులను మొట్టమొదటగా సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున పరుచూరి సమక్షంలో శ్రీసిటీ డైరెక్టర్ (సీఎస్సార్) నిరీషా సన్నారెడ్డి లాంఛనంగా కంపెనీ ఆవరణలో ఉత్పత్తుల వాహనాన్ని ప్రారంభించారు. వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులు (శానిటరీ న్యాప్కిన్స్) తయారు చేసే ఈ కంపెనీ ఈ ఏడాది 5న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు, పద్మశ్రీ డాక్టర్ టి.హనుమాన్ చౌదరి చేతుల మీదుగా ప్రారంభమైంది. శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుని తొలుత సుమారు రూ.10 లక్షల విలువచేసే తొలి ఉత్పత్తులను విజయవాడకు పంపింది. స్మైల్ ఎకో ఉత్పత్తులు మార్కెట్కు విడుదలపై కంపెనీ ఎండీ, సిబ్బందికి నిరీషా సన్నారెడ్డి అభినందనలు తెలిపారు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
రేణిగుంట: వేగంగా వచ్చిన మెట్రో బస్సు ముందు వెళుతున్న కారును ఢీకొనడంతో కారు పక్కనే పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్ర మాదం తప్పింది. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళు తున్న ఆర్టీసీ మెట్రో బస్సు రేణిగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ముందు వెళుతున్న కారును వేగంగా ఢీకొట్టడంతో ముందున్న ద్విచక్ర వాహన మెకానిక్ షాపు వద్ద పార్కింగ్ చేసిన ఆరు ద్విచక్ర వాహనాల పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ మనుషులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. సంఘటన స్థలానికి అర్బన్ పోలీసులు చేరుకుని ప్రమాదానికి కారణమైన బస్సును స్టేషన్కి తరలించి, విచారిస్తున్నారు. -
పరికరాలపై అవగాహన పెంచుకోవాలి
తిరుపతి సిటీ: పరిశోధనలకు కేంద్రమైన ప్రయోగశాలల్లో పరికరాల నిర్వహణపై పరిశోధకులు తగిన అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ విజయభాస్కర్రావు కోరారు. ఎస్వీ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో ల్యాబ్ మెటీరియల్పై వారం రోజులు జరిగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను సోమవారం వర్సిటీలోని సెనెట్ హాల్లో ప్రారంభించారు. ఈ కార్యాక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ గొప్ప పరిశోధన కేంద్రాలు, యూనివర్సిటీల్లో ఎంతో విలువైన ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయన్నారు. ముంబై వెస్ట్రన్ రీజినల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పరికరంపై అవగాహన ఉన్నప్పుడే పరిశోధకులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎస్వీయూ రెక్టార్ ప్రొఫెసర్ సీహెచ్ అప్పారావు , ఫిజిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ దేవప్రసాదరాజు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ దేవప్రసాదరాజు, ప్రొఫెసర్ హేమ, ప్రిన్సిపల్ పద్మావతి పాల్గొన్నారు. మా బతుకులు ఇంతేనా? వాకాడు: కొన్నేళ్లుగా తమిళనాడుకు చెందిన జాలర్లు స్పీడు బోట్లతో సముద్రంపై హద్దులు దాటి తమ పరిధిలోకి చొచ్చుకొనివచ్చి అక్రమంగా వేట చేసి, తమకేమీ మిగల్చకుండా విలువైన మత్స్యసంపదను దోచుకుపోతున్నారని జిల్లా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సోమవారం జిల్లాలోని సముద్రతీరంలో ఉన్న చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలంలోని సముద్రంలో దాదాపు 52 స్పీడు బోట్లు ఒక్కసారిగా పరిధి దాటి వందల టన్నుల మత్స్యసంపదను దోచుకుపోయారు. దీన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై రాళ్ల దాడికి దిగడంతో తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నారు. పొరుగు రాష్ట్రాల స్పీడు బోట్లు దందాను ఎవరు ఆపలేకున్నారని, మా బతుకులు ఇంతేనా అని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
● కోట మండల వాసిగా గుర్తింపు
వ్యక్తి ఆత్మహత్య చిల్లకూరు: గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఓ వ్యక్తి మృతి చెందిన్నట్లు స్థానికులు గుర్తించి, సోమవారం పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో గూడూరు రూరల్ ఎస్ఐ తిరుపతయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్ఐ కథనం మేరకు.. కోట మండలం నెల్లూరుపల్లికి చెందిన దాసి సుబ్బయ్య(40) అనే వ్యక్తి వరికోత మిషన్లు తీసుకువచ్చి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. వేకువ జామున ఈ ప్రాంతానికి బైక్పై వచ్చి ఉరి వేసుకుని మృతి చెందాడు. ఆయన సెల్ఫోన్ ఆదారంగా వివరాలు తెలుసుకుని, వారికి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి, మృతదేహాన్ని పోస్టు మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తిరుమలను వణికిస్తున్న చలి తిరుమల:చలి తీవ్రతకు శాలువలు,స్వెట్టర్లు ధరించి వెళుతున్న భక్తులు ఆధ్యాత్మి క పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఎన్నడు లేని విధంగా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో భక్తుల తిరుమలలో బెడ్ షీట్లు, స్వెట్టర్లు కప్పుకుని వెళుతున్నారు. రూములు దొ రకని భక్తులు వెయిటింగ్ హాల్లో టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్లలో ఉండిపోతున్నా రు. రెండు మూడు రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. ఇప్పటికే తిరుమలలో కనిష్టంగా 20 డిగ్రీల వరకు ఉంటుంది. -
గంజాయి మత్తులో యువకుడు వీరంగం
చంద్రగిరి: మండలంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న దంపతులపై ఆదివారం సాయంత్రం గంజాయి మత్తులో ఓ యువకుడు కత్తితో దాడికి యత్నించి, వీరంగం చేశాడు. బాఽధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడు సోమవారం తెల్లవారుజామున వారి రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టాడు. ఈ ఘటన మండలంలోని తొండవాడలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. తొండవాడలో మహేంద్రరెడ్డి, సంధ్య దంపతులు కిరాణా దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. ఆదివారం సాయంత్రం పిచ్చినాయుడుపల్లికి చెందిన గౌతమ్ కుమార్ (పెప్సీ) అనే యువకుడు మత్తులో కిరాణా దుకాణం నడుపుతున్న సంధ్య, ఆమె భర్త మహేంద్రరెడ్డిపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ క్రమంలో సంధ్య చంద్రగిరి పోలీసు స్టేషన్ చేరుకుని జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మత్తులో ఉన్న గౌతమ్ కుమార్(పెప్సీ)ని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తీసుకొచ్చి మందలించి పంపివేశారు. దీనిపై కక్షకట్టిన గౌతమ్ కుమార్ సోమవారం వేకువజామున మహేంద్రరెడ్డి ఇంటి ఆవరణలో ఉంచిన రెండు ద్విచక్రవాహనాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీనిపై బాధితులు మరో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర మీడియా ఫ్యానలిస్టుకు నోటీసు
తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ రాష్ట్ర మీడియా ఫ్యానలిస్టు పసుపులేటి సురేష్పై తిరుపతి నగరంలోని జనసేన నాయకులు పెట్టిన అక్రమ కేసులకు సోమవారం ఈస్ట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పసుపులేటి సురేష్ విచారణ నిమిత్తం ఈస్ట్ పోలీస్స్టేషన్లో సీఐ శ్రీనివాసులు వద్ద హాజరయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తూ రెడ్బుక్ పాలన సాగిస్తూనే ఉన్నారని పసుపులేటి సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు శ్రీకాళహస్తి:మున్సిపల్ కమిషనర్ పి.భవాని ప్రసా ద్, టౌన్ ప్లానింగ్ అధికారి శారదపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. సిరి అనే యువతి నిర్వహిస్తున్న షాపుపై కోర్టు స్టే ఉన్నప్పటికీ కూల్చివేశారన్న ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. సీసీఎస్ఆర్ 51814/2025 నంబర్తో కేసు నమోదు కాగా, త్వరలో హైకోర్టులో విచారణకు రానుంది. -
కానిస్టేబుల్ పోలీసుశాఖకు వెన్నెముక
– జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతి క్రైం: కానిస్టేబుల్ అనేది పోలీస్ శాఖకు వెన్నెముక లాంటిదని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికై శిక్షణకు హాజరైన 138 మంది అభ్యర్థులతో సోమవారం ఎస్పీ పోలీసు పెరేడ్ గ్రౌండ్లో సమావేశమయ్యారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి, శారీరక పరీక్షలు, రాత పరీక్షలు తదితర అన్ని దశలను దాటు కుని ఈ స్థాయికి వచ్చారని అభినందించారు. ఇది సులభంగా లభించిన అవకాశం కాదని, మీ అంకిత భావం, క్రమశిక్షణ, పట్టుదలతోనే ఈ విజయం లభించిందని పేర్కొన్నారు. అనంతరం విజయవాడకు వెళ్లే అభ్యర్థుల బస్సులను జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. -
మఠం భూమిలోకి బయటి వ్యక్తులు రాకూడదు!
తిరుపతి రూరల్: మండలంలోని గాంధీపురం పంచాయతీ అవిలాల సర్వే నంబర్ 13లోని మఠం భూమిలో ఆక్రమణలు కొనసాగుతున్నందున గొడవలు జరుగుతున్నాయని సాక్షి దినపత్రికలో సోమవారం ‘కబ్జాల రాజ్యం!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన పోలీసులు మఠం భూమిలోకి బయటి వ్యక్తులు ఎవరు రాకూడదని హుకుం జారీ చేశారు. అలాగే స్థానికులు కూడా అకారణంగా ఎవరితో గోడవలు పడకూడదని, ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసులకు తెలపాలని సూచించారు. అలాగే మఠం భూముల్లో అక్రమ నిర్మాణాల విషయంగా గత రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణలో కారకులైన 30 మందిపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినట్టు సమాచారం. -
‘రెడ్బుక్’ పాలన తప్ప.. ప్రజా పాలన ఏదీ?: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ పాలన తప్ప.. ప్రజా పాలన చేయడం లేదంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సేకరించిన సంతకాల సేకరణ కరపత్రాలను ఇవాళ భారీ ర్యాలీగా విజయవాడ తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. ప్రజల నుంచి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై నిరసనలు స్వచ్చందంగా మద్దతు తెలిపారని ఆర్కే రోజా అన్నారు.వైఎస్ జగన్.. 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు. వైఎస్ జగన్ పేరు చెరిపేయాలని చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుంది. విద్యార్థుల జీవితాలను కూటమి సర్కార్ నాశనం చేస్తుంది. కూటమి పాలనలో వారు చేసిన సర్వేలోనే అందరు మంత్రులకు రెడ్ మార్క్ వచ్చింది. విద్యావ్యవస్థను నారా లోకేష్ నాశనం చేస్తే.. వ్యవసాయాన్ని అచ్చెన్నాయుడు నాశనం చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను చంద్రబాబు విచ్ఛిన్నం చేశారు. -
కబ్జాల రాజ్యం!
ఖాళీ భూమి కనిపిస్తే చాలు.. పచ్చమూక రెచ్చిపోతోంది. ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడుతోంది. అధికారుల అండతో యథేచ్ఛగా ఆక్రమణల పర్వం కొనసాగిస్తోంది. అందులో భాగంగా హథీరామ్జీ మఠానికి చెందిన రూ.6కోట్ల విలువైన స్థలంపై కన్నేసింది. నకిలీ పత్రాలను సృష్టించి కబళించేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో ముందుగా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టింది. అడ్డుకునేందుకు యత్నించిన స్థానికులపై ఖాకీల సాయంతో దౌర్జన్యానికి తెగబడింది. సాక్షి, టాస్క్ఫోర్స్ : తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ పరిధిలోని అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 13లో ఉన్న ఎకరా మఠం భూమిపై టీడీపీ నేతలు కన్నేశారు. ఆ భూమిని 2014లోనే వైఎస్సార్ కడపజిల్లా రైల్వేకోడూరుకు చెందిన రామసుబ్బారెడ్డి పేరిట రిజిస్టర్ జరిగినట్టు ఓ డాక్యుమెంట్ను తీసుకువచ్చారు. ఆ భూమిని ఎంతో కాలంగా కాపాడుకుంటూ వచ్చిన తమను నిర్ధాక్షిణ్యంగా తరిమేశారని స్థానిక రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు ఈ భూమిని కబ్జా చేయాలని చాలా మంది ప్రయత్నించినా అడ్డుకున్నామని, అయితే టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారని మండిపడుతున్నారు. కాపాడాల్సిన పోలీసులు సైతం అక్రమార్కులకే వంత పాడారని వాపోతున్నారు. రిజిస్ట్రేషన్ ఎలా..? మఠం భూమిని ఎవరు రిజిస్ట్రేషన్ చేశారో అంతుపట్టడం లేదని స్థానికులు వెల్లడిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మఠం భూములను రిజిస్ట్రేషన్ చేయరని స్పష్టం చేస్తున్నారు. నిజంగా ఆ రిజిస్ట్రేషన్ సక్రమమే అయితే ఇంత కాలంగా ఆ భూమిలోకి ఎందుకు ప్రవేశించలేదో చెప్పాలని నిలదీస్తున్నారు. నిజానికి రామసుబ్బా రెడ్డి పేరిట వున్న రిజిస్టర్ డాక్యుమెంట్లో రాసిన భూమికి హద్దులు కూడా లేవని చెబుతున్నారు., సర్వే నంబరు 13లోని 105 ఎకరాల విస్తీర్ణంలో ఆ భూమి ఎక్కడుందో కూడా తెలియదన్నారు. ప్రభుత్వం కనికరిస్తే ఈ భూమిలో చిన్నపాటి గూడు కట్టుకుందామని ఆశిస్తే.. టీడీపీ నేతలు కబ్జా చేసేశారని ఆవేదన చెందుతున్నారు. కన్నెత్తి చూడని అధికారులు తిరుపతి శివారులో బాలాజీ డెయిరీకి వెనుక జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ భూమి విలువ సుమారు రూ.6కోట్లు ఉంటుంది. ఇంతటి విలువైన భూమిని అడ్డగోలుగా ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మిస్తున్నా రెవెన్యూ అధికారులే కాకుండా, మఠం అధికారులు కూడా కన్నెత్తి చూడడం లేదని ఆరోపిస్తున్నారు. పేదలు జానెడు జాగాలో గుడిసె వేసుకుంటే వెంటనే వచ్చి నేలమట్టం చేసే మఠం అధికారులు రూ.కోట్లు విలువైన భూమికి ప్రహరీ కడుతుంటే ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు.కళ్ల ముందే భూములు అన్యాక్రాంతం అవుతున్నా అడ్డుచెప్పడం లేదని మండిపడుతున్నారు. భయపెడతున్న ఖాకీలు మఠం భూమిని ఆక్రమిస్తున్న టీడీపీ నేతలకు పోలీసులే వెన్నుదన్నుగా నిలబడ్డారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అడ్డుకునేందుకు వెళితే కేసులు పెడతామని భయాందోళనకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఈ విషయంలో కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని పేదలకు న్యాయమ చేయాలని కోరుతున్నారు. స్థానిక ముఖ్య ప్రజాప్రతినిది అండతోనే ఆక్రమణదారులు అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఐదు నెలల క్రితమే.. మఠం భూమి ఆక్రమణకు ఐదు నెలల క్రితమే రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. చంద్రగిరి మండలానికి చెందిన టీడీపీ నేత ఆగస్టు 4వ తేదీన ఆ భూమిలో చదును పనులు చేపట్టారు. ఆ సమయంలో పెద్దసంఖ్యలో చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటి ఘటనను అన్ని పత్రికలు ప్రచురించాయి. దీంతో పోలీసులు, మఠం అధికారులు సైతం వచ్చి ఆ భూమిలో ఎవరూ ప్రవేశించకూడదని హెచ్చరించారు. తర్వాత ఆక్రమణకు యత్నించిన టీడీపీ నేత అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో టీడీపీకి చెందిన మరికొందరు నేతలు రంగంలోకి దిగారు. చంద్రగిరి నియోజకవర్గ ముఖ్యనేత అండదండతో కబ్జాకు శ్రీకారం చుట్టినట్టు స్థానికులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఒకప్పుడు భూమి చదును పనులను అడ్డుకున్న పోలీసులు, మఠం అధికారులు, ఇప్పుడు ప్రహరీ గోడ నిర్మాణానికి కాపు కాస్తున్నారని వివరిస్తున్నారు. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడిస్తున్నారు. -
అదరగొట్టిన అరగొండ ఆణిముత్యం
తవణంపల్లె : చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంఅరగొండకు చెందిన పల్లవి, శ్రీధర్ కుమార్తె సహస్ర టీనేజీ విభాగం మిస్ ఆంధ్ర అందాల పోటీల్లో రన్నరప్గా నిలిచింది. ఆమె తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా బెంగళూరులో స్థిరపడ్డారు. సహస్ర బెంగళూరులోని ఓర్కిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. సహస్రకు చిన్న నాటి నుంచి అందాల పోటీల్లో పాల్గొనడం, క్రికెట్తో పాటు డాన్స్పై మక్కువ. స్కూల్ యాజమాన్యం సైతం అందాలు షోలు నిర్వహించి సహస్రకు ప్రోత్సాహం అందించింది. ఈ క్రమంలోనే ఆమె గత ఏడాది సెప్టెంబర్ 24వ తేదీ నుంచి బెంగళూరులోని కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ స్కూల్లో క్రికెట్లోనూ కోచింగ్ తీసుకుంటోంది. డాన్స్లోనూ రాణిస్తోంది. సహస్ర అభిరుచికి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహం తోడవడంతో నేడు మిస్ ఆంధ్ర పోటీల్లో ద్వితీయ స్థానం సాధించింది. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చింది. క్రికెట్లోనూ చక్కటి కోచింగ్ తీసుకొని జాతీయ స్థాయిలో రాణి స్తుందని తల్లిదండ్రులు ఆకాక్షించారు. ఓర్కిడ్జ్ ఇంజర్నేషనల్ స్కూల్లో నాణ్యమైన విద్యతో పాటు అందాల పోటీలు నిర్వహించి ప్రోత్సహించడం వల్లే తమ కుమార్తె సత్తా చాటిందని వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అరగొండ పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మిస్ ఆంధ్ర రన్నరప్గా సహస్ర -
సాంకేతిక సౌధంలో క్రీడా సంబరం
ఏర్పేడు : భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (ఐఐటీ) 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ ఆధ్వరంయలో భారత ఒలింపిక్ వెయిట్లిప్టింగ్ క్రీడాకారుడు సతీష్ శివలింగం పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. తిరుపతి ఐఐటీలో వెయిట్ లిఫ్టింగ్(పురుషులు), టెన్నిస్(పురుషులు, మహిళలు), చెస్(మిక్స్డ్) పోటీలు ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ముందుగా క్రీడా జ్యోతిని వెలిగించి, స్పోర్ట్స్మీట్ మస్కట్ ‘తేజస్’ను ఆవిష్కరించారు. దేశంలోని వివిధ ఐఐటీల నుంచి వచ్చిన క్రీడాకారులు గ్రౌండ్లో మార్చ్ఫాస్ట్ చేపట్టారు. ముఖ్య అతిథి సతీష్ శివలింగం మాట్లాడుతూ తాను వేలూరు సమీపంలోని ఓ పల్లెటూరులో జన్మించానని, 15ఏళ్ల వయసులో తండ్రి సూచన మేరకు వెయిట్లిఫ్టింగ్ను ఎంచుకున్నానని తెలిపారు. అప్పట్లో వెయిట్లిఫ్టింగ్కు పనికిరానని వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారన్నారు. అప్పుడే తాను ప్రపంచస్థాయిలో వెయిట్లిఫ్టింగ్ విభాగంలో రాణించాలని లక్ష్యం పెట్టుకుని కఠోర శ్రమతో అంచెలంచెలుగా ఎదిగి కామన్వెల్త్ గేమ్స్లో రాణించి బంగారు మెడల్ను అందుకున్నానని వివరించారు. 2016 రియో ఒలింపిక్స్లో మన దేశం తరఫున ఆడానన్నారు. 2036 ఒలింపిక్ గేమ్స్ మన దేశంలో జరిగే అవకాశాలున్నాయని, ఇప్పటి వరకు ఒలింపిక్ క్రీడల్లో మన క్రీడాకారులు కేవలం రెండు బంగారు పతకాలను సాధించి అట్టడుగు స్థానంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 2018 నుంచి ఖేలో ఇండియా పేరుతో ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ ప్రతిభ ఉన్న క్రీడాకారులకు గుర్తింపునిస్తోందని వెల్లడించారు. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీతోపాటు హైదరాబద్, మద్రాస్ ఐఐటీలలో జరుగుతున్న ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్ను కేవలం క్రీడా పోటీలుగా తాను భావించడం లేదని తెలిపారు. ఐఐటీల స్నేహం, అనుబంధాల సమ్మేళనానికి ఈ స్పోర్ట్స్ మీట్ తార్కాణంగా నిలుస్తుందని వివరించారు. . క్రీడల్లో రాణించాలంటే పట్టుదలతోపాటు క్రమశిక్షణ అవసరమన్నారు. వివిధ ఐఐటీల నుంచి వచ్చిన విద్యార్థులందరూ క్రీడాస్ఫూర్తిని పాటించి ప్రతిభను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు ప్రారంభ వేడుకల్లో భాగంగా తిరుపతికి చెందిన సైనిక్ స్కూల్ విద్యార్థుల ప్రదర్శన వీక్షకులను కట్టిపడేసింది. అలాగే కర్రసాము, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
భాషపై పట్టు.. ప్రతిభకు పట్టం
తిరుపతి సిటీ: భాషపై పట్టు సాఽధించి ప్రతిభకు పట్టం కట్టడమే లక్ష్యంగా సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో చేపట్టిన సాక్షి స్పెల్బీకి విశేష స్పందన లభిస్తోంది. అందులో భాగంగా ఆదివారం తిరుపతి జీవకోనలోని విశ్వం విద్యాసంస్థల్లో నిర్వహించిన స్పెల్బీ సెమీఫైనల్ పరీక్షకు విద్యార్థులు పోటెత్తారు. ఈ పరీక్షలకు ప్రధాన స్పాన్సర్గా డ్యూక్స్ వ్యాఫి, అసోసియేట్ స్పాన్సర్గా రాజమండ్రికి చెందిన ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరించాయి. క్వార్టర్ ఫైనల్లో ప్రతిభ చూపి సెమీస్కు చేరిన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. నాలుగు కేటగిరీల్లో నిర్వహించిన సెమీస్కు సుమారు 500 మంది విద్యార్థులు హాజరై తమ సత్తా చాటారు. ఉదయం 10.15కి పరీక్ష ప్రారంభమైన మధ్యాహ్నం 12గంటలకు ముగిసింది. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సాక్షి సిబ్బంది పకడ్బందీ ఏర్పాటుల చేశారు. పిల్లలు రాణించేలా ప్రోత్సాహం ఆంగ్లంలో పిల్లల రాణించేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి మీడియా గ్రూప్ స్పెల్బీ పరీక్షలు నిర్వహిస్తోంది. లక్షలాది మంది విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు సహకరిస్తోంది. దీంతో పదాల ఉచ్ఛారణ, కొత్త పదాలను తెలుసుకోవడం, స్పెల్లింగుపై పట్టు సాధించి పోటీ పరీక్షలకు సైతం ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సంతోషంగా ఉంది సాక్షి స్పెల్బీలో ఇప్పటి వరకు జరిగిన రెండు రౌండ్లలో ఉత్తీర్ణత సాధించి సెమీస్కు చేరడం సంతోషంగా ఉంది. స్పెల్ బీ పరీక్షలో నూతన పదాల స్పెల్లింగ్స్తో పాటు పదాల ఉచ్ఛారణ ఎలా చేయాలనే విషయాన్ని తెలుసుకున్నాం. తోటి విద్యార్థులతో పోటీ పడి పరీక్షలు రాయడంతో మాలోని ప్రతిభ, సామర్థ్యం తెలుస్తోంది. – గీతిక, జశ్విత, 5వ తరగతి, విశ్వం స్కూల్, తిరుపతిఫైనల్కు చేరుకోవడమే లక్ష్యం సాక్షి స్పెల్బీ సెమీస్కు మా అమ్మాయి ఎంపికై ంది. ఫైనల్కు చేరుకోవడమే లక్ష్యంగా సన్నద్ధమవుతోంది. సాక్షి స్పెల్ బీతో ఆంగ్ల భాషపై భయం అనేది పోయింది. స్పెల్ బీ కోసం సాక్షి అందించిన మెటీరియల్లో సరికొత్త పదాలను విద్యార్థులు నేర్చుకుంటున్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రొత్సహిస్తున్న సాక్షికి ధన్యవాదాలు. – రాఘవేంద్రనాయుడు, స్వప్న, విద్యార్థిని సాయి రుషిత తల్లిదండ్రులు, నాగార్జున స్కూల్, వైఎస్సార్ కడప జిల్లా ఆంగ్లంపై పట్టు సాధిస్తున్నాం స్పెల్బీ పరీక్షలకు హాజరై ఇప్పటే రెండు రౌండ్లలో ప్రతిభ చూపి సెమీఫైనల్కు చేరుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. దీంతో ఆంగ్లంపై పట్టు సాధిస్తున్నామనిపిస్తోంది. నూతన పదాలు, వాటి అర్థాలు, స్పెలింగ్లు తెలుసుకుంటున్నాం. దీంతో ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న మా అకడమిక్ విద్యకు సైతం ఎంతో ఉపయోగపడుతోంది. – ఆరాధ్య, ప్రణవీ, సిల్వర్ ఓక్స్ స్కూల్, నెల్లూరు పోటీ ప్రపంచంలో ఉపయోగం విద్యార్థులు సాక్షి స్పెల్ బీ పరీక్షలకు హా జరుకావడంతో పోటీ ప్రపంచంలో దీటు గా నిలబడేందుకు ఉపయోగపడుతుంది. మా విద్యార్థి సెమీస్కు చేరడం అభినందనీయం.స్పెల్బీ మెటీరియల్ సైతం అంతర్జాతీయ స్థాయిలో ఉండడంతో విద్యార్థులు నూతన పదాలపై పట్టు సాధిస్తారు. ఇలాంటి పోటీ పరీక్షలను నిర్వహించి విద్యార్థులను ప్రొత్సహిస్తున్న సాక్షి మీడియాకు ధన్యవాదాలు. – విద్యార్థి పునీత్తో టీచర్ ప్రమీల, క్యాండర్ నేషనల్ పబ్లిక్ స్కూల్, తిరుపతి థ్రిల్లింగ్గా ఉంది సాక్షి స్పెల్బీలో పాల్గొనడంతో ఇంగ్లిషు భాషలో మా సత్తా ఎంటో తెలుస్తోంది. క్వార్టర్ ఫైనల్లో ఉత్తీర్ణులై సెమీస్కు చేరాం. పరీక్ష బాగా రాశాం. ఎన్నో కొత్త పదాలకు స్పెల్లింగ్ రాయడం థ్రిల్లింగా ఉంది. మా ఆలోచనకు పదును పెట్టి పదాలకు స్పెల్లింగ్స్ రాస్తున్నాం. దీంతో మేము చదివే ఇంగ్లిషు సబ్జెక్ట్ సులువుగా అనిపిస్తోంది. – తమన్ కృష్ణ, హర్మన్ కృష్ణ, ఎడిఫై స్కూల్, తిరుపతి పిల్లలలో ఆసక్తి పెరుగుతోంది సాక్షి స్పెల్బీపై పిల్లల లో ఆసక్తి పెరుగుతోంది. మా అమ్మాయి ఒకటో తరగతి చదువుతోంది. స్పెల్ బీ పరీక్ష ను సునాయాసంగా రాయడం సంతోషంగా ఉంది. సెమీఫైనల్ వరకు రావడం, పరీక్షలో ఉచ్చరిస్తున్న పదాలను అర్థం చేసుకుని స్పెల్లింగ్లు రాస్తుంటే ఎంతో ఆశ్చర్యానికి గురయ్యా. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న సాక్షికి రుణపడి ఉంటాం. – రమ్య,విద్యార్థిని సాయిరుషిత తల్లి, క్యాంఫోర్డ్ స్కూల్, తిరుపతి ఎంతో ఆసక్తిగా జరిగింది సాక్షి స్పెల్ బీలో ఇప్పటి వరకు జరిగిన రెండు రౌండ్లు ఒక ఎత్తు. కానీ, ఆదివారం జరిగిన సెమీఫైనల్ ఎంతో ఆసక్తిగా జరి గింది. నూతన పదాలను నేర్చుకున్నాం. వాటికి స్పెల్లింగ్లు కొత్తగా ఉన్నాయి. బాగా రాశాం. ఫైనల్కు చేరుకుంటామనే నమ్మకం ఉంది. విద్యార్థులను సాక్షి మీడియా ఎంతగానో ప్రొత్సహిస్తోంది. – హర్షిత, మోనిక, 7,8వ తరగతి విద్యార్థులు, ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్, నెల్లూరు పరీక్ష బాగా రాశాం సాక్షి స్పెల్బీ సెమీఫైనల్ పరీక్ష బాగా రాశాం. చాలా ఈజీగా అనిపించింది. స్పెల్బీ మెటీరియల్ పోటీ పరీక్షలతో పాటు మా అకడమిక్ విద్యకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి పరీక్షలు మరిన్ని సాక్షి మీడియా నిర్వహించాలి. మేము మరిన్ని పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నాం. – హుమేమ, మహి, 4వ తరగతి విద్యార్థులు, విద్యోదయ అపెక్స్ స్కూల్, నెల్లూరు భయం పోయింది గతంలో ఇంగ్లిషు భాష అంటే కాస్త జంకేవాళ్లం. సాక్షి స్పెల్బీ పోటీ పరీక్షలకు హజరుకావడంతో ఆ భయం పోయింది. ఆంగ్లభాష అంటే ఇంతేనా అని మాపై మాకు నమ్మకం కలిగింది. భాషపై పట్టుతో పాటు స్పెల్లింగ్, పదాల ఉచ్ఛారణ తెలుసుకున్నాం. సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు. – చరణి, సాత్విక్, 6వతరగతి విద్యార్థులు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, వైఎస్సార్ కడప జిల్లా -
ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నరసింహయ్య
తిరుపతి కల్చరల్ : నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తిరుపతికి చెందిన శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నరసింహయ్య నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ చైర్మన్ ఐ.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా జి.సాయికృష్ణ, ఉపాధ్యక్షుడిగా తిరునగరు శశికళ, ప్రధాన కార్యదర్శిగా ఎల్.గంగాధర్ను ఎంపిక చేసిట్లు పేర్కొన్నారు. సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం కమిటీ ప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. అనంతరం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నరసింహయ్య మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయం చేకూరేలా పనిచేస్తామని తెలిపారు. -
ప్రతిష్టాత్మక పరీక్ష
సాక్షి నిర్వహిస్తున్న స్పెల్ బీ విద్యార్థులలోని సృజనాత్మక శక్తిని వెలికితీసే ప్రతిష్టాత్మక పరీక్షగా చెప్పవచ్చు. ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు విద్యార్థులకు ఇది మంచి అవకాశం. పోటీ ప్రపంచంలో దీటుగా నిల బ డాలంటే ఆంగ్లంపై పట్టు అవసరం. ఆ దిశగా సాక్షి మీడియా విద్యార్థులను ప్రొత్సహించడం అభినందనీయం. సెమీఫైనల్కు విశ్వం విద్యాసంస్థ వేదిక కావడం గర్వంగా ఉంది. – ఎన్.విశ్వచందన్రెడ్డి, అకడమిక్ డైరెక్టర్, విశ్వం విద్యాసంస్థలు, తిరుపతి కొత్త పదాలు నేర్చుకుంటున్నాడు సాక్షి స్పెల్బీ పరీక్షకు హాజరుకావడంతో మా అబ్బాయి ఆంగ్ల భాషపై పట్టు సాధించి కొత్త పదాలు నేర్చుకుంటున్నాడు. పదాల ఉచ్ఛారణపై పట్టు వస్తోంది. తప్పులు లేకుండా స్పెలింగ్ లు రాసేందుకు ఈ పరీక్షలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. రెండు రౌండ్లలో అర్హత సాధించి మూడో రౌండ్ స్పెల్ బీ సెమీస్కు మా అబ్బాయి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. సాక్షికి ధన్యవాదాలు. – అనిత, రెండవ తరగతి విద్యార్థి హరిన్ తల్లి, రెయిన్బో స్కూల్, నెల్లూరు -
‘కంట్రోల్’ తప్పిన ప్రయాణం!
తిరుపతి సెంట్రల్ బస్టాండ్లో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ప్రధానంగా సెలవు రోజుల్లో రద్దీ అధికంగా ఉన్నప్పటికీ క్రమబద్ధీకరించాల్సిన కంట్రోలర్లు పట్టించుకోకపోవడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం అన్ని ప్లాట్ఫామ్లు జనంతో కిక్కిరిశాయి. ఒక వైపు సరిపడా బస్సులు లేకపోవడం.. మరోవైపు గంటల నిరీక్షణ తర్వాత సర్వీసులు వస్తుండడంతో ప్రయాణికుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. వచ్చిన బస్సులో ఎక్కేందుకు నానా అగచాట్లు వస్తున్నాయి. అయినప్పటికీ ఆర్టీసీ కంట్రోలర్లు.. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. – తిరుపతి అర్బన్ -
నాటు కోళ్లకు చికిత్స
బుచ్చినాయుడుకండ్రిగ : మండలంలోని గాజులపెళ్లూరులో నాటు కోళ్లకు జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ నారాయణస్వామి చికిత్స చేశారు. అంతు చిక్కని వైరస్తో నాటు కోళ్లు మృతి అనే శీర్షికతో సాక్షి పత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి ఏడీఏ మునిరాజా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ నారాయణస్వామి గాజులపెళ్లూరుకు వెళ్లి కోళ్లకు వైద్యం చేశారు. పెంపకందారులకు పలు సూచనలు ఇచ్చారు. అడవిలోకి చొరబడిన ఇద్దరి అరెస్ట్ తిరుపతి అన్నమయ్యసర్కిల్ : అన్నమయ్య జిల్లా కోడూరు మండలం మొగిలి పెంట అటవీప్రాంతంలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. వివరాలు.. రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానంద, ఏఆర్ఎస్ఐ బాల చెన్నయ్య బృందం స్థానిక ఎఫ్వీఓ కె.విజయ కృష్ణతో కలసి కూంబింగ్ నిర్వహిస్తుండగా తిమ్మయ్యగుంట వద్ద కొందరు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను గమనించి పారిపోయేందుకు యత్నించారు. టాస్క్ఫోర్స్ సిబ్బంది వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గొడ్డళ్లు, రంపాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారిది తమిళనాడు జమునామత్తూరు జిల్లాగా గుర్తించారు. నిందితులను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసుస్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆకతాయిలపై కేసు నాగలాపురం: పిచ్చాటూరు మండలంలోని శేషంబేడు గ్రామంలో ఉన్న సీఎస్ఐ చర్చి ఆవరణలో శనివారం ముగ్గురు ఆకతాయిలు మద్యం సేవించి, స్థానిక ప్రజలను, చర్చికి వచ్చి వెల్లే భక్తులపై అల్లర్లు సృష్టించారు. ఈ మేరకు వారి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాఘవేంద్ర తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ మండలంలోని శేషంబేడు సీఎస్ఐ చర్చి వద్ద ముగ్గురు ఆకతాయిలు అల్లర్లు చేస్తున్నారని సమాచారం అందిందన్నారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల పై ఆకతాయిలు మద్యం మత్తులో హెడ్ కానిస్టేబల్ చంద్రబాబు, కానిస్టేబల్ కవి అరసరసన్ పట్ల దురుసుగా ప్రవర్తించి, దుర్భాషలాడి బెదిరింపులకు గురిచేశారన్నారు. ఈ ఘటనపై శేషంబేడు గ్రామానికి చెందిన విజయ్, ఈసాక్, స్టాలిన్ను అరెస్టు చేశామని తెలిపారు. స్వర్ణముఖిలో ఇసుక దందా చంద్రగిరి: చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీ నేతలు స్వర్ణముఖి నదిలో ఇసుక దందాకు పాల్పడుతున్నారు. మండలంలోని బీమానది, స్వర్ణముఖినది, కల్యాణి నదులతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నరసింగాపురం సమీపంలోని స్వర్ణముఖినదిలో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రంగంపేటకు చెందిన ఓ టీడీపీ నేత జేసీబీ సాయంతో ఇసుక తరలించారు. భారీగా గోతులు ఏర్పడడంతో పాటు గుట్టలుగుట్టలుగా ఇసుక మేటలను నిల్వ చేసి, ఆపై ట్రాక్టర్లకు లోడ్డు చేసి తరలించారు. రాత్రి, పగలు తేడాలేకుండా సాగుతున్న ఈ దందాపై రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికై నా స్పందించి ఇసుక నిల్వలపై నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. -
మన సంస్కృతి మహోన్నతం
తిరుపతి సిటీ : ప్రపంచ దేశాలతో పోలిస్తే మన భారతీయ సంస్కృతి మహోన్నతమైనదని ఎన్ఎస్యూ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం ఈ మేరకు వర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన మన సంస్కృతి అవార్డుల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలుగు, హిందీ ప్రతిభ పరీక్షల్లో విజేతలైన విద్యార్థులు ప్రతిభా పురస్కారాలు అందుకోవడం అదృష్టమన్నారు. విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ప్రాచీన భారతీయ విజ్ఞాన సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉయ్ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తహసున్నీసా బేగం మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ సమయపాలన తప్పనిసరిగా పాటించాలన్నారు. డిజిటల్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలిపారు. ప్రొఫెసర్ మాధవరావు, ఆర్కేఎస్ గ్రూప్ అధినేత బి.రూప్ కుమార్ రెడ్డి, మన సంస్కృతి సంస్థ డైరెక్టర్ డాక్టర్ షేక్ మస్తాన్, వే ఫౌండేషన్ అధినేత పైడి అంకయ్య, సమన్వయకర్తలు మహమూద్ అలీ పాల్గొన్నారు. -
పరిహారం మొక్కుబడిగా ఇస్తే నష్టపోతాం
పంట నష్టపరిహారం మొక్కుబడిగా ఇస్తే భారీగా నష్టపోతామని రైతులు చెబుతున్నారు. ఎకరానికి 30 బస్తాల లెక్కన నష్ట పరిహారం ఇస్తే తీసుకుంటామని, లేదంటే ఆత్మహత్యలకైనా సిద్ధమేనని అన్నదాతలు అంటున్నారు. ఇప్పటివరకు అయిన ఖర్చులు నష్టపరిహారంగా ఇస్తామంటే ఈ ఏడాది ఫలితం నష్టపోయినట్టే కదా! అని చెబుతున్నారు. విత్తనాలు విక్రయించిన పూజిత అగ్రో సర్వీస్ సెంటర్ యజమాని నంద్యాలలో రూ.650 బస్తా తీసుకొచ్చి రైతులకు రూ.1300 పైగా విక్రయించారు. 20 రోజులకే వెన్ను వచ్చేసిందని రైతులు గగ్గోలు పెడుతున్న విషయాన్ని అన్నపూర్ణ సీడ్ కంపెనీ నుంచి పరిహారంగా రెండు లోడ్లు విత్తనాలను కూడా తీసుకొచ్చారని రైతులు చెబుతున్నారు. ఎకరానికి 30 బస్తాల వంతున ఈ ఏడాది గిట్టుబాటు ధర ప్రకారం నష్టపరిహారం అన్నపూర్ణ సీడ్ కంపెనీ, పూజిత ఆగ్రో సెంటర్ వారినుంచి తీసి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. -
నేటి నుంచి ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్
ఐఐటీ విద్యార్థులకు క్రీడా పోటీలు ఏర్పేడు: భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ(ఐఐటీ) 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభం కానున్నట్లు తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ వెల్లడించారు. 8 రోజులపాటు తిరుపతి ఐఐటీ వేదికగా జరగనున్న ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ఐఐటీల నుంచి విద్యార్థులు ఇప్పటికే తిరుపతి ఐఐటీకి చేరుకుని, ప్రాక్టీస్ మొదలు పెట్టారు. తిరుపతి ఐఐటీతోపాటు మద్రాస్, హైదరాబాద్ ఐఐటీల్లోనూ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఏర్పేడు సమీపంలో ఉన్న తిరుపతి ఐఐటీ ఇండోర్, అవుట్డోర్ క్రీడా ప్రాంగణం వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఇందుకోసం ఐఐటీలో ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ భారతీయ రెజ్లర్ సతీష్ శివలింగం హాజరుకానున్నారు. దేశంలోని 23 ఐఐటీల నుంచి 5వేల మందికి పైగా విద్యార్థులు ఈ క్రీడాపోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలు ఈనెల 21వ తేదీతో ముగియనున్నాయి. తిరుపతి ఐఐటీ వేదికగా చెస్(మిక్స్డ్), టెన్నిస(పురుషులు, మహిళలు), వెయిట్ లిప్టింగ్(పురుషులు) పోటీలు జరగనున్నాయి. -
నేను మీ శిరోధైర్యాన్ని..!
●తిరుపతి మంగళం : నాకే బాధేస్తోంది.. ఇలా నా గురించి, నా అవసరం గురించి మీతో చెప్పక తప్పడం లేదు. జిల్లాలో నన్ను విస్మరిస్తున్న తీరుపై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించడంతోపాటు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మార్పు రాకపోవడంతో తట్టుకోలేక మీ ముందుకు వచ్చి నా గోడు వినిపిస్తున్నా. ఇంతకూ నేనెవరనేగా మీ అనుమానం. మీ ప్రయాణంలో మీ తలకు రక్షణగా ఉండే హెల్మెట్ను. రహదారి ప్రమాదంలో అయినవాళ్లను కోల్పోయిన వారి కుటుంబాలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇదంతా ఎందుకంటే ఇటీవల నన్ను ధరించని వారు జిల్లాలో అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికై నా మీరు మారండి.. నా మాట వినండి. నన్ను తలకెక్కించుకోండి. తలకు పెట్టుకుంటే ప్రాణం దక్కించుకున్నట్లే.. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు నన్ను తప్పనిసరిగా ధరించాలి. ఊడి కింద పడకుండా బెల్టు పెట్టుకోవాలి. ఐఎస్ఐ మార్కును పరిశీలించి వినియోగించండి. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగితే తలకు దెబ్బ తగలకుండా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. శరీరం మొత్తంలో తలే కీలకం. దానికి దెబ్బ తగలకుండా నేను కాపాడుతా. నన్ను ధరిస్తే జుట్టు ఊడిపోతుందనేది కేవలం అపోహనే. ఈ విషయం ఇప్పటికే వైద్యపరంగా రుజువైంది. హెల్మెట్ ధరించకుండా వెళితే పెట్రోల్ కూడా పట్టవద్దని పెట్రోల్ బంకుల యజమానులకు కూడా అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వాహనచోదకుల్లారా తలకు హెల్మెట్ లేకుండా ప్రయాణించగలరేమో.. కానీ బైక్లో పెట్రోల్ లేకుండా ప్రయాణించలేరు కదా. -
టెట్ మూడో రోజూ ప్రశాంతం
తిరుపతి సిటీ: జిల్లాలో మూడో రోజు టెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలు, చైన్నెలోని మూడు పరీక్ష కేంద్రాలో ఉదయం మొదటి సెషన్కు 1,784 మంది హాజరుకావాల్సి ఉండగా, 1,666మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్లో 1,655 మంది హాజరు కావాల్సి ఉండగా 1,450 మంది హాజరైనట్లు తెలిపారు. దుబాయ్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి అర్బన్: దుబాయ్లో జనరల్ హెల్పర్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి లోకనాథం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓఎంసీఏపీ, వరల్డ్ పీపుల్ సొల్యూషన్స్ సంస్థల సహకారంతో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్హత పదో తరగతి, వయస్సు 21–37 వరకు ఉండాలని పేర్కొన్నారు. రిక్రూట్మెంట్ ఫీజు రూ.30 వేలతోపాటు జీఎస్టీ ఉంటుందని తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఉందని చెప్పారు. అదనపు సమాచారం కోసం 91609 12 690, 99888 53335, 871265 5686, 879011 8349నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ప్రశాంతంగా నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష తిరుపతి సిటీ: జిల్లాలో 10 పరీక్ష కేంద్రాల్లో శనివారం జరిగిన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష–2026 ప్రశాంతంగా జరిగిందని డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు 2,060 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 1,212 మంది విద్యార్థులు హాజరయ్యారని, 848 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో జరిగిన పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. పరీక్ష నిర్వహణకు సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్ జట్టులో తిరుపతి జిల్లా క్రీడాకారిణికి స్థానం తిరుపతి ఎడ్యుకేషన్ : గోల్ షాట్బాల్ భారత జట్టులో తిరుపతి జిల్లా నెరబైలుకు చెందిన క్రీడాకారిణి రెడ్డిచర్ల దేవీప్రియ చోటు సాధించారు. గత నెల 15వ తేదీన పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించిన గోల్ షాట్బాల్ భారత జట్టు ఎంపిక పోటీల్లో సీ్త్రల విభాగంలో ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు నేపాల్ దేశం ఖాట్మాండులో నిర్వహించనున్న దక్షిణాసియా అంతర్జాతీయ చాంపియన్షిప్ పోటీల్లో భారత జట్టులో ఈమె ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5 నుంచి 13వ తేదీ వరకు మహారాష్ట్ర, పుణెలో నిర్వహిస్తున్న భారత జట్టు ప్రాక్టీస్ క్యాంపులో శిక్షణ పొందుతున్నారు. ఓ ప్రైవేటు కళాశాలలో ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న ఆమె 2010 నుంచి ఇప్పటివరకు హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, షూటింగ్బాల్ తదితర క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించారు. తొలిసారిగా భారత జట్టులో స్థానం సాధించిన ఆమెను గోల్ షాట్బాల్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.మురళి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. -
చాలా ఉత్సాహంగా ఉంది
తిరుపతి ఐఐటీ వేదికగా జరగనున్న 58 ఐఐటీ ఇంటర్ స్పోర్ట్స్ మీట్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో నేను పోటీ పడుతున్నాను. తిరుమల వెంకన్న పాదాల చెంత ఇంత పెద్ద ఈవెంట్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. – జ్ఞానిప్రకాష్, బీటెక్ సీఎస్ఈ, విద్యార్థి, ఐఐటీ జోధ్పూర్, రాజస్థాన్ క్రీడల్లోనూ సత్తా చాటుతాం ఐఐటీ విద్యార్థులంటే కేవలం పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను సమాజానికి పరిచ యం చేయటమే కాకుండా క్రీడల్లోనూ మేము ఎవరికీ తీసిపోము. ఇక్కడ ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు బాగున్నాయి.దేశంలోని అన్ని ఐఐటీల నుంచి జట్లు పోటీలో పాల్గొనడం ఛాలెంజింగ్గా అనిపిస్తోంది. – పర్వేష్ జక్కర్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు, ఐఐటీ, జోధ్పూర్, రాజస్థాన్ సర్వసంస్కృతుల సమ్మేళనం మేము దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఐఐటీల్లో చదువుతు న్న భావి ఇంజినీర్లు. తిరుపతి ఐఐటీ వేదికగా జరగనున్న ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్ ఈవెంట్లో పాల్గొనేందుకు వచ్చాం. మేము ప్రాక్టీ స్ ప్రారంభించాం. చదువులతోపాటు క్రీడల్లోనూ రాణించి ఐఐటీల నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే ప్రతిభ మాలో ఉంది. – అమన్ కుమార్ గౌతమ్, ఐఐటీ, రూర్కీ, ఉత్తరాఖాండ్, ● -
అనురాగం పంచి..
కన్నీటిపర్యంతమవుతున్న కుటుంబసభ్యులు కృష్ణకుమారి మృతదేహం వద్ద రోదిస్తున్న కుమార్తె హేమమాధురి, బంధుమిత్రులు చిత్తూరురూరల్ (కాణిపాకం): ‘ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఇద్దరే ఉన్నాం. ఇప్పుడు ఒక్కదాన్నే ఉండాలా..? యాత్రకు పోబుద్ధి లేదన్నావే. అందరొచ్చారు..లేవ య్యా’ అంటూ మృతుడు నాగేశ్వరరావు భార్య అముల్ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. శుక్రవారం వేకువజామున చింతూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిత్తూరు నగరానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అందులో నాగేశ్వరరావు(68), శ్రీకళాదేవి(64), శ్యామ ల(67) ఉన్నారు. అలాగే తవణంపల్లి మండలం, నారసింహనపల్లెకు చెందిన దొరబాబు(37)కూడా మృతి చెందారు. ఈ మృతదేహాలు శనివారం మధ్యాహ్నం ఆయా ప్రాంతాలకు చేరాయి. ఒంటరిదాన్ని చేశావయ్యా! చిత్తూరు నగరం, గిరింపేటలోని మరాఠి వీధికి చెందిన నాగేశ్వరరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన మృతదేహం చింతూరు నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు ఇంటికి చేరింది. దీంతో మరాఠి వీధి లో విషాదచాయాలు అలముకున్నాయి. ఆయన ఇంటి వద్ద బంధువులు, కుటుంబీకుల ఆర్తనాదాలు మి న్నంటాయి. భర్త మృతదేహం వద్ద భార్య అముల్భాయ్ గుండెలు బాదుకుంటూ రోదించడం అందరినీ క లచివేసింది. ఇన్నాళ్లు ఇద్దరున్నాం.. ఇప్పుడు ఒంటరిదాన్ని చేశావంటూ ఆమె రోదించిన తీరు గుండెలు బరువెక్కేలా చేసింది. అనంతరం 4.30 గంటలకు అంత్యక్రియలు పూర్తిచేశారు. కొలిచి..గుండెలవిసి! మరాఠివీధిలోని నాగేశ్వరరావు, అముల్భాయ్ ఆ ధ్యాత్మిక దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి సకలదేవలను పూజించేవారు. నిత్యం పూజలు చేస్తూ గడిపేవారు. దేవుడంటే అపారమైన భక్తి. ఎక్కడ పూజలు జరిగినా ముందు వరుసలో నిలిచేవాళ్లు. ఆ చింతన అయ్యప్పస్వామి భక్త భజన మండలిలో వీళ్లకు సభ్యులుగా అవకాశం కల్పించారు. దుర్గానగర్ కాలనీలో జరిగే అయ్యప్పస్వామి భజన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవారని ఆ వీధిలోని వారు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిత్తూరు ఆస్పత్రిలో శ్రీకళాదేవి మృతదేహం చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శ్రీకళాదేవి మృతదేహాన్ని భద్రపరిచారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. కొడుకు భసవంత్రెడ్డి శనివారం యూఎస్ఏ నుంచి స్వదేశం రానున్నారు. ఆదివారం వేకువజామున రెండు గంటలకు చిత్తూరుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంత్యక్రియలు చేయనున్నట్టు ఆమె బంధువులు పేర్కొన్నారు. శ్యామలకు తుది వీడ్కోలు చిత్తూరు కార్పొరేషన్: చింతూరు రోడ్డు ప్రమాదంలో మరణించిన చిత్తూరుకు చెందిన ట్రాన్స్కో విశ్రాంత ఉద్యోగి శ్యామల(67)కు శనివారం తుది వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం అక్కడి నుంచి స్థానిక కొంగారెడ్డిపల్లెలో ఆమె తమ్ముడు విశ్రాంత ఎస్ఐ సదాశివంరెడ్డి నివాసం వద్దకు పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. శ్యామల కుమారుడు ప్రసాద్, ఆయ న భార్య సరిత, కూతురు నీలిమ, మనవరాళ్లు యుక్త, ముక్త, దీక్షిత ఆమెను చూసి వెక్కివెక్కి ఏడ్చేశారు. టూరుకు వెళ్లకపోయినా బాగుండేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెతో ఉన్న అనుభవాలను నెమరువేసుకొని కుంగిపోయారు. పర్యాటకం అంటే ఇష్టపడే శ్యామల గత నెలలో నీలమ్మ, దీక్షితతో కలిసి సింగపూర్కు వెళ్లినట్లు సీనియర్ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్ గుర్తుచేసుకున్నారు. శ్యామల అన్నలు రామ్కుమార్రెడ్డి, సదాశివంరెడ్డి, వదినలు పుష్పలత, సంపూర్ణమ్మ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని బాధపడ్డారు. కృష్ణకుమారి (ఫైల్) కొడుకులు.. కూతుళ్లు.. బంధువులు.. భార్యలు.. స్నేహితులతో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అనురాగాల పొదరింట్లో పెనవేసుకున్న బంధాల మధ్య జీవితాన్ని నెట్టుకొచ్చారు. ఎన్నో జ్ఞాపకాలు పంచారు. కష్టసుఖాలకోర్చి బిడ్డలను పెంచి పెద్ద చేశారు. వారి బాగోగులు కళ్ల చూడకనే తీపి గురుతులను వదలి పరలోకాలకు వెళ్లిపోయారు. భర్తలేని లోటుతో కొందరు, తల్లీదండ్రిని కోల్పోయిన బాధతో పిల్లలు.. జీవిత చరమాంకంలో కుటుంబానికి బాసటగా నిలిచే పెద్దవాళ్లు.. ఇలా జిల్లాకు చెందిన ఎనిమిది మంది శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు–మారేడుమిల్లి ఘాట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యుఒడికి చేరారు. వారి మృతదేహాలు శనివారం జిల్లాకు చేరాయి. వారిని చూసి బంధువులు, కుటుంబీకులు, స్నేహితులు గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఇందులో కొందరికి అంత్యక్రియలు నిర్వహించగా.. మరికొందరికి నేడు దహన క్రియలు పూర్తి చేయనున్నారు. అమ్మా..నాన్నా వెళ్లిపోయారా? పలమనేరు: చింతూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సునంద, శివశంకర్రెడ్డి మృతదేహాలు పలమనేరుకు చేరాయి. ఆ మేరకు వీరి అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నట్టు కుటుంబీకులు తెలిపారు. తల్లిదండ్రుల మృతదేహాలను చూసి ఒక్కగానొక్క కుమారుడైన వెంకటసాయి గుండెలవిసేలా రోదించాడు. ‘ఇక తనకు దిక్కెవరంటూ’ ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు శివశంకర్రెడ్డి తల్లి ఇంద్రాణమ్మ బాధ వర్ణణాతీతంగా మారింది. ఆదివారం ఆ భార్యభర్తలకు ఒకేచోట అంత్యక్రియలు జరగేలా కుటుంబీకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెనుమూరు(కార్వేటినగరం): మండలంలోని బలిజపల్లి గ్రామానికి చెందిన హరినాథరెడ్డి భార్య కృష్ణకుమారి మృత దేహం శనివారం స్వ గ్రామానికి చేరింది. మృతురాలికి భర్తతోపాటు ఒక్కగానొక్క కుమార్తె హేమమాధురి ఉన్నారు. ‘నాకు త్వరలో మంచి భవిష్యత్ను అందించాలని, ఆలయాలను దర్శించుకుని పుణ్యం సంపాదించాలని బయలుదేరిన మూడో రోజే ఆయుష్యు తీరిపోయిందా తల్లి.. ఇక అమ్మా అని ఎవరిని పిలిచేది.. ఇంత త్వరగా అమ్మ అన్న పిలుపునకు దూరమవుతానని అనుకోలేదమ్మా..’ అంటూ కుమార్తె హేమమాధురి రోదించడంతో ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. జీవనాధారం కో సం బెంగళూరులో స్థిరపడినప్పటికీ నిత్యం కు టుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఫోన్ ద్వారా సరదాగ మాట్లాకునేవారు. కృష్ణకుమారి మారేడు మిల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యు ఒడికి చేరింది. అమ్మాయిని ఒక అయ్య చేతిలోకి పెట్టకుండానే.. ‘ఒక్కగానొక్క కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచి ఉన్నత చదువులు చదివించావు. ఆమెను ఒక అయ్య చేతిలో పెట్టకుండా మృత్యుఒడిలోకి జారుకున్నావా...?. నేను ఏం చేయగలను.. నీవు లేకుండా బిడ్డను ఎలా సాకగలను’ అంటూ కృష్ణకుమారి భర్త హరినాథరెడ్డి రోదించడం అందరి కంట కన్నీళ్లు తెప్పించింది. సంతోషంగా ఉన్న కుటుంబంలో దేవుడు ఇంత విషాదాన్ని నింపుతాడా .. నీ చేతుల మీదుగా నేను వెళ్లాలనుకున్నా.. కానీ నా చేతుల మీదుగా నిన్ను సాగనంపుతానని కల్లో కూడా ఊహించ లేదు కృష్ణకుమారి’ అంటూ గుండెలవిసేల రోదించడం అందర్నీ కలచి వేసింది. అనంతరం కృష్ణవేణి అంత్యక్రియలు పూర్తి చేశారు. -
అమ్మగారు మళ్లీ తనిఖీలు!
ఆమె ప్రజాప్రతినిధి కాదు.. నామినేటెడ్ పదవి కలిగిన వారు కూడా కాదు. శాసనసభ్యుడి తల్లి. అయితే తరచూ ఆకస్మిక తనిఖీలు చేసి అధికారులకు హడలెత్తిస్తుంటారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తల్లి బొజ్జల బృందమ్మ కొన్ని నెలల క్రితం శ్రీకాళహస్తి ఆలయంలో, స్థానిక ఆస్పత్రుల్లో, హాస్టళ్లతో తనిఖీలు చేశారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పట్లో జనం శ్రీకాళహస్తి షాడో ఎమ్మెల్యే అంటూ విమర్శించారు. ఆ తర్వాత కొద్ది రోజులు పర్యటనలు చేయలేదు. తాజాగా శనివారం విమానాశ్రయ సమీపంలోని గిరిజన గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. వసతి సదుపాయాలు, భోజన నాణ్యత, తరగతుల నిర్వహణ తీరు, విద్యార్థుల హాజరు పట్టికలు, విద్యా ప్రమాణాలు, పరిశుభ్రత అంశాలను ఆమె స్వయంగా పరిశీలించారు. నిర్వహణపై అధికారులను ప్రశ్నించారు. సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. – రేణిగుంట -
తిరుమలలో నాకాబందీ
తిరుమల : వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమలలో శనివారం వేకువజాము నుంచి నాకా బందీ నిర్వహించారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్, రెవెన్యూ ఫారెస్ట్, బాంబు స్క్వాడ్, టీటీడీ ఫైర్ సిబ్బంది, క్రైమ్, ట్రాఫిక్ తదితర విభాగాల 82 మంది సిబ్బంది బృందాలుగా ఏర్పడి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలాజీ నగర్లోని సుమారు 1,043 ఇళ్లను తనిఖీ చేశారు. నివాసితుల గుర్తింపు కార్డులు, వాహన రికార్డులు పరిశీలించడంతోపాటు అనుమానిత వ్యక్తుల వేలు ముద్రలను సేకరించారు. ఓనర్లు, టెన్డెంట్లు వివరాలను సేకరించామన్నారు. సరైన రికార్డు లేని 13 ద్విచక్ర వాహనాలు, ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న 12 మంది వ్యక్తులను గుర్తించారు. అలాగే 15 గృహాల్లో నివాసేతర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. మరో నాలుగు గృహాల్లో లైసెనన్స్ లేకుండా వ్యాపారాల నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఒక ఇంట్లో అనధికారికంగా కుక్కను పెంచుకున్నట్లు గుర్తించి, స్థానిక ఫారెస్ట్ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. గుండెపోటుతో ఏపీఎస్పీ జవాను మృతి సూళ్లూరుపేట రూరల్: మండలంలోని ఆబాక గ్రామంలో నివాసమున్న ఏపీఎస్పీ జవాను దెయ్యాల జనార్దన్ (45) గుండెపోటుతో ఇంటి వద్ద శనివారం మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. దెయ్యాల జనార్దన్ వెంకటగిరి తొమ్మిదో బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకుని శనివారం ఇంటికి వచ్చాడు. హఠాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఏపీఎస్పీ డీఎస్పీ విజయానంద్ నేతృత్వంలో పోలీసులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జనార్దన్ మృతితో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. జనార్దన్కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అంత్యక్రియల్లో ఏపీఎస్పీ ఎస్లు మురళీకృష్ణ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అంతు చిక్కని వైరస్తో నాటుకోళ్లు మృతి బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలో అంతు చిక్కని వైరస్ సోకడంతో వేల నాటుకోళ్లు మృత్యువాత పడుతున్నాయి. నెల రోజుల్లో మండలంలోని పలు గ్రామాల్లో వేల నాటు కోళ్లు మృతి చెందుతుండడంతో పెంపకం దార్లు లబోదిబోమంటున్నారు. దీంతో గ్రామాల్లో నాటుకోళ్లు జాడ లేకుండా పోతుంది. గాజులపెళ్లూరులో సుమారు 300కు పైగా నాటుకోళ్లు మృతి చెందాయి. ముఖ్యంగా రూ.వేలు పలికే పందెం కోళ్లు సైతం మృతి చెందడంతో భారీగా నష్టపోతున్నా రు. కోళ్లను కాపాడుకుంనేందుకు పెంపకం దార్లు నానా అవస్థలు పడుతున్నారు. వ్యాధి సోకిన కోళ్లు గంటల వ్యవధిలోనే కుప్పకూలి మృతి చెందుతున్నారు. అయినా పశు వైద్యాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. -
మీ ప్రాణాలకు రక్షణ
ద్విచక్రవాహనాలు నడిపే ప్రతిఒక్కరు హెల్మెట్ ధరించండి. అది మీ ప్రాణాలకు రక్షగా ఉంటుంది. తలజుట్టు ఊడిపోతుందన్న ఫ్యాషన్కు పోయి తలకు హెల్మెట్ ధరించడం గిల్టీగా ఫీలువుతున్నారు. దాంతో అనేక మంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ వినియోగంపై రవాణా, పోలీసుశాఖ అధికారులు వాహనచోదకులకు అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వాహనచోదకుల్లో చలనం రాకపోవడం భాదాకరం. ఇప్పటికై నా వాహనదారులు హెల్మెట్ను ధరించి ప్రాణాలను కాపాడుకోండి. – కొర్రపాటి మురళీమోహన్, తిరుపతి జిల్లా రవాణాశాఖాధికారి -
పొగమంచుపై ముందస్తు చర్యలు
రేణిగుంట: స్థానిక విమానాశ్రయ పరిసరాల్లో ప్రస్తుతం పొగమంచు అధికంగా ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం విమానాశ్రయంలో ఫాగ్ ప్రిపేర్నెస్, డ్రైరన్ను నిర్వహించారు. ఐఎండీ, ఎయిర్లైన్స్, ఏఏసీ అధికారులు పాల్గొని, ఆలస్య విమానాల ప్రయాణికుల కో సం ప్రత్యేకంగా వేచి ఉండడానికి, రి ఫ్రెష్మెంట్ సదుపాయాలు సిద్ధం చేశారు. ప్రయాణికులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్ భూమి నాథన్ తెలిపారు. ‘విశ్వం’కు బెస్ట్ స్కూల్ ఎక్సెలెన్స్ అవార్డు తిరుపతి సిటీ: హైదరాబాద్ వేదికగా ఇటీవల 2025– 26 విద్యా సంవ త్సరానికి గాను తిరుప తి విశ్వం టాలెంట్ స్కూల్కు ‘‘బెస్ట్ అకడమిక్ ఎక్సెలెన్స్ స్కూల్’’, ‘‘బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్’ అవార్డులు సొంతం చేసుకుంది. విశ్వం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ విశ్వనాథ్రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ఎన్ విశ్వచందన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశ్వం పాఠశాలలో నాణ్య త, నవీన బోధనా విధానాలు, ఆధునిక మౌలిక సదుపాయాలతో రాజీలేకుండా విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రత్యేకంగా సైనిక్ స్కూల్, జవహర్ నవోదయ విద్యాలయాలు, మిలిటరీ స్కూల్స్ ప్రవేశ పరీక్షలకు సమగ్ర శిక్షణ అందిస్తూ, విద్యార్థులను చిన్న వయసు నుంచే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణా లు, దేశభక్తి భావాలను అలవరుస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రుక్మిణీపాండురంగస్వామి ఆలయంలో చోరీ కలువాయి(సైదాపురం): కలువాయిలోని రుక్మిణీపాండురంగస్వామి ఆలయంలో గత రాత్రి గుర్తు తెలియని దుండగలు చోరీకి పాల్పడ్డారు. దుండగులు ఆలయ తాళలు రంపంతో కట్చేసి ఆలయంలోని అమ్మవార్ల రెండు మంగళ సూత్రాలు, హుండీలో సొత్తు అపహరించినట్లు ఆలయ పూజారి నాగభూషణం తెలిపారు. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మఠం భూమిలో ఇరువర్గాల ఘర్షణ తిరుపతి రూరల్: హథీరాంజీ మఠం భూమిలో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం భౌతిక దాడులకు దారితీసింది. స్థానికుల కథనం మేరకు.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రెండు వర్గాల వారు తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వేనంబర్ 13లోని హథీరాంజీ మఠం భూముల్లో జరిగే అక్రమ కట్టడాలపై శనివారం సాయంత్రం ఘర్షణ పడ్డారు. స్వల్ప వివాదం తలెత్తడంతో ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఒక్కసారిగా కర్రలు, మద్యం బాటిళ్లతో దాడులకు తెగబడి, అరుపులతో భయానక వాతావరణం కల్పించారు. దీంతో స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వగా తిరుపతి రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. -
గజ..గజ..!
వామ్మో..చలి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు.. చల్లగాలులు.. పొద్దుపోతే మంచు ప్రభావం.. అర్ధరాత్రి దాటాక ఆవరిస్తున్న పొగమంచు.. రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వెరసి జిల్లావాసులు గజగజ వణుకుతున్నారు. తిరుపతి తుడా:చలి పంజా విసురుతోంది. చలి తీవ్ర తకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అనూహ్యంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. జిల్లాలో 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం చలి తీవ్రతను స్పష్టం చేస్తోంది. మంచు తీవ్రత రోజు రో జుకు పెరుగుతోంది. సాయంత్రం 4 గంటలకే మొ దలవుతున్న చలి ప్రభావం మరుసటి రోజు ఉద యం 9 గంటల వరకు కనిపిస్తోంది. ఉదయం 6 గంటల వరకు చలి మరీ ఎక్కువగా ఉంటోంది. రాబోవు రోజుల్లో మరింతగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో మార్పులతో.. ఇటీవల కురిసిన వర్షాలు, వాతావరణంలో మార్పు లు చోటు చేసుకోవడంతో చలి తీవ్రత పెరగడానికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని చెప్పారు. ఈ ఏడాది అత్యంత కనిష్టంగా ఇప్పటివర కు 17 డిగ్రీలు దిగిపోవడం చలి తీవ్రతను స్పష్టం చే స్తోంది. డిసెంబర్ చివరి, జనవరి మొదటి వారాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తుంది. పెరిగిన గిరాకీ చలి తీవ్రత పెరగడంతో స్వెట్టర్లు, శాలువలు, మంకీ క్యాప్లు, ఇతర రక్షణ దుస్తులకు గిరాకీ పెరుగుతోంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ అవసరం రావడంతో వ్యాపారులు సామాన్యుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. ధరలను అమాంతంగా పెంచి విక్రయిస్తున్నారు.వణికి పోతున్న ప్రజానీకం చలి తీవ్రత పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం జిల్లాపై తీ వ్రంగా కనిపిస్తోంది. మన్యం జిల్లాలను తలపించేలా గ్రామీణ ప్రాంతాల్లో మంచు కురు స్తోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. కమ్మేస్తున్న మంచు మంచు పల్లెల్ని కమ్మేస్తున్నాయి. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా మంచు గుప్పెట్లోకి జిల్లా వెళ్లిపో యింది. ముఖ్యంగా తిరుమలలో చలి మంచు తీవ్ర త అధికంగా ఉంది. పాలు, కూరగాయల వ్యాపారు లు, రైతులు మంచులో తడిసి ముద్దవుతున్నారు. మంచు కారణంగా చిరువ్యాపారులు, రైతుల రోజు వారి దినచర్య సమస్యగా మారింది. మంచు కా రణంగా వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నా రు. ఉదయం 7 గంటల వరకు లైట్లు వెలుతురుతో నే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. -
కమీషన్ల కోసమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
తిరుపతి రూరల్: గత ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం కమీషన్ల కోసమే కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆరోపించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం, వైద్యవిద్యను దూరం చేయడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ జగనన్న ఇచ్చిన పిలుపుతో సైన్యంలా కదిలిన పార్టీ కార్యకర్తలు, విద్యార్థి విభాగం నేతలు అనుకున్న సమయానికి కోటి సంతకాలను పూర్తి చేశారన్నారు. విద్యార్థి విభాగం నేతలకు ధన్యవాదాలు కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో యూనివర్సిటీలు, కాలేజీల చుట్టూ తిరిగి పెద్ద ఎత్తున విద్యార్థులను చైతన్యపరచి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు సేకరించిన విద్యార్థి విభాగం నేతలు అందరికీ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 15న జరిగే ర్యాలీని విజయవంతం చేయండి తిరుపతిలోని పద్మావతీపురంలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఈ నెల15వ తేదీన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాలు పత్రాలను పంపనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా ఆ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ పెద్దలు నిర్ణయించినందున ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి విద్యార్థి విభాగం నాయకులు తప్పక హాజరై విజయవంతం చేయాలన్నారు. -
ఎస్వీ పాలిటెక్నిక్లో అన్యమత ప్రచారం
తిరుపతి సిటీ: తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత ప్రచారం కలకలంరేగింది. ఇంగ్లిష్ అధ్యాపకురాలు మాధవి బోర్డుపై రాస్తున్న అన్యమత వ్యాఖ్యలను కొందరు విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఘటనపై ప్రిన్సిపల్ స్పందిస్తూ.. అధ్యాపకురాలిని విచారించి, నివేదికను ఉన్నతాధికారులకు పంపించామన్నారు. దీంతో మాధవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్పై అక్రమ ఆరోపణలు.. ఈవోకు భక్తుడి లేఖ
సాక్షి, తిరుపతి: టీటీడీ బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ చేస్తున్న అక్రమాలపై ఓ అజ్ఞాత భక్తుడు ఈవోకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల జగదీష్ అక్రమాలపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. ఈ మేరకు ఓ భక్తుడు ఈవోకు లేఖ రాశాడు. డైరెక్టర్ చేస్తున్న అక్రమాలను వివరించాడు.మెడికల్ ఇంప్లాంట్స్ కొనుగోళ్లలో టెండర్ దారులకు అనుకూలంగా మార్పులు చేసి కొందరికి మేలు చేశారు. నాణ్యత లోపించిన సర్జికల్ ఇంప్లాంట్స్ వినియోగించారు. గత మూడు నెలలుగా హాస్పిటల్లో సర్జికల్ ఇంప్లాంట్స్, మెడిసిన్స్ కొరత ఉంది. బలవంతంగా ఆన్లైన్, టెలిఫోన్ ఓపిడి రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. తెల్లవారుజామున 4 గంటలకు అపాయింట్మెంట్ ఓపిడి సేవలు ప్రారంభించడం వల్ల రోగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం, టీటీడీ చైర్మన్ అనుమతులు ఉన్నాయని జగదీష్ యదేచ్ఛగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రముఖ వైద్యులను శ్రీవారి ప్రొఫెషనల్ సేవకులుగా రాకుండా కక్ష్యపూరితంగా అడ్డుకుంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో బర్డ్ హాస్పిటల్ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర జరుగుతోంది.గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 2021లో నాసిరకం ఇంప్లాంట్స్ వాడటం వల్ల రోగులకు రెండవసారి ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాక డాక్టర్ జగదీష్ పై ఉన్న రెండు విజిలెన్స్ కేసుల పై చర్యలు తీసుకోవాలి. మార్కెట్ రేటు కంటే ఎక్కువ మొత్తంలో ఇంప్లాంట్స్ కొనుగోలు చేసి 11 కోట్ల రూపాయల నష్టం కలిగించారు. ఇలాంటి ఘటనలతో ప్రభుత్వానికి అధిక మొత్తంలో ఆర్థిక నష్టం జరుగుతోంది. గత 15 ఏళ్లలో దిగుమతి చేసిన సర్జికల్ ఇంప్లాంట్ల ధరలను పెంచి కొనుగోలు మార్గాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు. మొత్తం ఆర్థిక నష్టం సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.డాక్టర్ గుడారు వ్యక్తిగత సద్భావన, ప్రజా సంబంధాలను పెంచుకోవడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరు, ప్రతిమను ఉపయోగించారు. వారి స్వీయ ప్రచారం కోసం సంస్థాగత పవిత్రతను తీవ్రంగా దెబ్బతీశారు. ఈ ఆరోపణలన్నింటిపై విజిలెన్స్ విచారణ జరపాలి. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని లేఖలో అజ్ఞాత భక్తుడు ఈవోను కోరాడు. -
జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు గునపాడు పీడీ
చిట్టమూరు: మండలంలోని గునపాడు జెడ్పీ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పని చేస్తున్న పిడుగు భరత్ మహీపతి జాతీయ స్థాయిలో జరిగే మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ఎంఓఈ–2 భూపయ్య శుక్రవారం తెలిపారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో హ్యామర్త్రో విభాగంలో బంగారు పతకం, డిస్కస్త్రోలో వెండి పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొ న్నారు. 2026 జనవరిలో కేరళ రాష్ట్రం త్రివేండ్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆయన పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ బీవీ కృష్ణయ్య, పాఠశాల ఉపాధ్యాయులు సీతారామయ్య, పెంచలయ్య, శివప్రసాద్, వెంకటేశ్వర్లు, రేణుక, వరలక్ష్మి, శ్రీనివాసులు తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
చోరీకి వెళ్లి హత్య
తిరుపతి క్రైమ్: ఇంట్లో పనిచేసే వ్యక్తి చోరీ చేయడానికి వెళ్లి యజమానులు ప్రతిఘటించడంతో హత్య చేసి, దోచుకెళ్లిన కేసును శ్రీకాళహస్తి పోలీసులు ఛేదించినట్లు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 26వ తేదీన శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లారెడ్డి కండ్రిగకు చెందిన చెవిరెడ్డి మహదేవ్రెడ్డి, జయమ్మ నిద్రిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. దీనిని గమనించిన జయమ్మ కేకలు వేయడంతో మహదేవ్ రెడ్డి కూడా నిద్రలేచాడు. దుండగుడు భయంతో జయమ్మను కత్తితో పొడిచి, ఆమె మెడలో ఉన్న తాళిబొట్టు చేనుతో పాటు చేతికున్న గాజులను చోరీ చేశాడు. ఈ క్రమంలో ఆమె భర్త మహాదేవరెడ్డి పై దాడికి పాల్పడి, పారిపోయాడు. బాధితుల కుమారుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు మేరకు శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారన్నారు. ఈ క్రమంలో తనిఖీలు చేస్తుండగా తడ–శ్రీకాళహస్తి మెయిన్ రోడ్డులోని తంగెళ్లపాళెం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయన్నారు. ఈ కేసును ఛేదించడంలో లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, శ్రీకాళహస్తి ఎస్టీపీఓ నరసింహమూర్తి, సీఐలు నాగార్జున రెడ్డి ప్రకాష్ ఎంతగానో కృషి చేశారన్నారు. చొరీకి పథకం రచించి.. పుల్లిరెడ్డి కండ్రిగకు చెందిన రమేష్ రెడ్డి(42) జయమ్మ వద్దనే పొలంలో పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో అనుకోని కారణాలతో పూర్తి స్థాయిలో అప్పులు కావడంతో ఎలాగైనా అప్పులు తీర్చుకోవడానికి చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే పక్కా ప్లాన్ వేసి, యాజమాని అయిన జయమ్మ ఇంట్లోనే చోరీ చేసేందుకు గత నెల 26వ తేదీన రాత్రి హ్యాండ్ కట్టర్, దుస్తులు, ముఖానికి కట్టుకునే గుడ్డ, కారంపొడి తీసుకుని మృతురాలి ఇంట్లోకి ప్రవేశించారు. అయితే అక్కడ జరిగిన ప్రతిఘటనలో దంపతులపై కత్తితో దాడి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే జయమ్మ మృతి చెందగా ఆమె భర్త గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. నిందితుడి నుంచి తాళిబొట్టు, చైను, రెండు బంగారు గాజులతోపాటు చోరీతోపాటు హత్యకు ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. -
అంగన్వాడీలతో పెట్టుకుంటే..అధోగతే
తిరుపతి అర్బన్: అంగన్వాడీ వర్కర్లతో పెట్టుకుంటే చంద్రబాబు సర్కార్కు అధోగతేనని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వే లాది మంది తమ న్యాయమైన కోర్కెల సాధనకు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ వర్కర్లకు అండగా ఉంటామని చె ప్పిన చంద్రబాబు, లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాటపై నిలవలేదని మండిపడ్డారు. న్యాయమైన కోర్కెలు మాత్రమే అంగన్వాడీ వర్కర్లు అడుగుతున్నారన్నారు. గుజరాజ్ మోడల్లో చేస్తామని చెప్పడం కాదని..గుజరాజ్ హై కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అంగన్వాడీ వర్కర్ల రూ.24,800, హెల్పర్లకు 20,400 జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వాణిశ్రీ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె. నాగరాజమ్మ, ఐఏస్టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు గుడ్లూరు భారతి మాట్లాడుతూ పది రకాల యాప్లు కాకుండా ఒకే యాప్ ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీలకు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. మరోవైపు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో నరసింహులకు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గౌరవాధ్యక్షుడు ప్రసాదరావు, జిల్లా ఉపాధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, జిల్లా కార్యదర్శి మునిరాజా తదితరులు పాల్గొన్నారు. -
అపహరణల పర్వానికి తెరతీసిన టీడీపీ
్ఠవాకాడు: కూటమి నేతల మాట వినని వారిని హించించడమే కాకుండా వారిపై తప్పుడు కేసులు పెట్టి కిడ్నాప్ చేసే స్థాయికి బాబు ప్రభుత్వం దిగజారిందని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన వాకాడులోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. వాకాడు బీసీ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త, నేదురుమల్లి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు సయ్యద్ నజీర్ బాషా అనే వృద్ధుడిని గురువారం రాత్రి బాబు ప్రభుత్వం అండదండలతో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కారులో వచ్చి భయపెట్టి అపహరించుకుపోయారన్నారు. నజీర్బాషా కుమార్తె ఫామిదా నెల్లూరు 34వ వార్డు కార్పొరేటర్గా కొనసాగుతుందన్నారు. ఈమె గతంలో వైఎస్సార్సీపీలో ఉంటూ టీడీపీలో చేరి, విసిగి వేశారిపోయిందన్నారు. తమ తప్పులు తెలుసుకున్న ఫామిదాతోపాటు నలుగురు కౌన్సిలర్లు తాడేపల్లిలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి పార్టీలో చేరారన్నారు. దీంతో నజీర్బాషాతోపాటు నెల్లూరులో మరో నలుగురు కార్పొరేటర్ల బంధువులను అపహరించినట్లు తెలిసిందన్నారు. తమ కార్యకర్త నజీర్ అపహరణపై వాకాడు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. వృద్ధుడైన నజీర్కి ఏమైనా జరిగితే కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని రామ్కుమార్రెడ్డి హెచ్చరించారు. నజీర్ను తీసుకొచ్చి వారి బంధువులకు అప్పజెప్పాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వాకాడు, కోట మండలాల కన్వీనర్లు సుధాకర్నాయుడు, సంపత్కుమార్రెడ్డి, నాయకులు నాగూర్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, జనార్దన్రెడ్డి, పెంచలరెడ్డి, సుధాకర్రెడ్డి, శేషురెడ్డి, వెంకటయ్య, పెంచలయ్య, మోహన్రెడ్డి, రవి పాల్గొన్నారు. -
విష సంస్కృతికి తెర లేపుతున్నారు!
ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ చిల్లకూరు: చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన తరువాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగే హత్యలు, లైంగికదాడులు, కిడ్నాప్లు, బెదిరింపులు, దందాలు, రౌడీయిజం తదితర విషసంస్కృతి రోజు రోజుకు పెట్రేగి పోతుందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నెల్లూరులో అరాచక శుక్తులు గతంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిపై దాడి చేసి, భయాందోళనలకు గుర్తిచేసిన సంఘటన ఇంకా మరువలేదన్నారు. అలాగే రోజూ నెల్లూరులో దందాలు, హత్యలు, బెదిరింపులు సాధారణం అయ్యా యని తెలిపారు. ఈ క్రమంలోనే నెల్లూరు 24వ డివిజన కార్పొరేటర్ ఫమీదా తండ్రి నజీర్ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం గూడూరు నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రశాంతతకు మారు పేరుగా ఉండేదని, అయితే చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అన్ని వర్గాల వారిని భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించి కేసు దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బురదమడుగు చెరువు పరిశీలన దొరవారిసత్రం : మండలంలోని బురదమడుగు గ్రామ పరిధిలోని చెరువును ఇరిగేషన్ శాఖ ఏఈ వీరస్వామి శుక్రవారం సందర్శించారు. ‘సాక్షి’ దినపత్రికలో చెరువు కట్టను తెగ్గొట్టిన భూ ఆక్రమణదారులు’ అనే శీర్షికన కథనం ప్రచురితం కావడంతో సంబంధిత అధికారులు స్పందించారు. చెరువు కట్ట తెగ్గొట్టిన విషయంపై స్థానిక రైతులను కలిసి ఏఈ ఆరా తీశారు. చెరువు పొరంబోకు భూమి ఆక్రమణపై నివేదికను సిద్ధం చేసి రెవెన్యూ అధికారులకు అందజేస్తామన్నారు. అలాగే పంట కాలువ విషయంలో పూర్తి స్థాయిలో సర్వే చేయించిన అనంతరం రానున్న వేసవి కాలంలో పంట కాలువను అభివృద్ధి చేస్తామని చెప్పారు. చెరువు పొరంబోకు భూమి ఆక్రమణలు, పంట కాలువ విషయంపై స్థానిక తహసీల్దార్ శైలకుమారి దృష్టికి కూడా తీసుకువెళ్లామని ఏఈ తెలిపారు. -
వీడిన మదనపల్లి మర్డర్ మిస్టరీ
చంద్రగిరి: అదృశ్యమైన వ్యక్తి కేసును ఎట్టకేలకు మదనపల్లి రూరల్ పోలీసులు ఛేదించారు. తన భర్త అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, చర్యలు తీసుకోలేదన్న మృతుడి భార్య విజయలక్ష్మి వేదనపై శుక్రవారం సాక్షి దినపత్రికలో ‘నా భర్త అస్థికలైనా ఇవ్వండయ్యా’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. కథనంపై స్పందించిన పోలీసులు శుక్రవారం చంద్రగిరిలోని ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ రామాపురం గ్రామానికి చెందిన ఆవులపల్లె నరసింహులు(40) వ్యవసాయంతోపాటు నాటు వైద్యం చేసేవాడు. నరసింహులు కురబలకోట మండలానికి చెందిన నాగరాజు, అతని స్నేహితుడు నారాయణస్వామి, కత్తి నరసింహులతో కలసి తిరిగేవాడు. ఈ క్రమంలో నాగరాజు ఇంటికి నరసింహులు పలుసార్లు వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఇంట్లో తన భార్యతో నరసింహులు చనువుగా ఉండడంతో అతడిని నాగరాజు అనుమానించాడు. ఈ నేపథ్యంలో నరసింహులు హతమార్చాలని నాగరాజు పథకం పన్నాడు. దీంతో అక్టోబర్ 27వ తేదీన చంద్రగిరిలో నాటువైద్యం చేయాలని నాగరాజు, ఆవులపల్లె నరసింహులు చెప్పాడు. నరసింహులు, నారాయణస్వామి బస్సులో శ్రీనివాసమంగాపురానికి చేరుకున్నారన్నారు. అక్కడ సిద్ధంగా ఉన్న నాగరాజు బంధువు మునిరాజ వారిద్దరిని తన ద్విచక్ర వాహనంలో నరసింగాపురం సమీపంలోని ఓ మామిడితోటలోకి తీసుకెళ్లారు. అక్కడ నాగరాజు, నారాయణ స్వామి, కత్తి నరసింహులు కలసి ఆవులపల్లె నరసింహులు కాళ్లు చేతులు కట్టేసి కేకలు పెట్టకుండా ప్లాస్టర్తో నోటిని మూసివేశారు. అనంతరం ఆవులపల్లె నరసింహులు మెడకు తాడును బిగించి హత్య చేసి, అక్కడే గొయ్యి తవ్వి పూడ్చిపెట్టినట్లు సీఐ తెలిపారు. మృతుడు భార్య విజయలక్ష్మి ఫిర్యాదుతో తహసీల్దార్ శివరామసుబ్బయ్య సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసి, శవ పంచనామా నిర్వహించి, బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కాగా తన భర్తను చంపిన నిందితులను నుంచి తమకు ప్రాణహాని ఉందని మృతుడి భార్య విజయలక్ష్మి మీడియా ఎదుట వాపోయారు. -
తిరుపతి: వైఎస్సార్సీపీ కార్యకర్త కిడ్నాప్
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లా వాకాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త ఎస్కే నజీర్ బాషా కిడ్నాప్కు గురయ్యారు. ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నజీర్ బాషా నెల్లూరు 34 వార్డు కార్పొరేటర్ ఫమిదా తండ్రి.నిన్న వైఎస్ జగన్ సమక్షంలో కార్పొరేటర్ ఫమిదా వైఎస్సార్సీపీలో చేరారు. నిన్న రాత్రి(డిసెంబర్ 12, గురువారం) పథకం ప్రకారమే నజీర్ బాషాను కిడ్నాప్ చేసినట్టు సమాచారం. వాకాడు పోలీసులకు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఫిర్యాదు చేశారు. -
‘చచ్చిపో.. కాలేజీకి ఒకరోజైనా సెలవు ఇస్తారు’
సాక్షి,తిరుపతి: ‘నువ్వ చచ్చిపో.. చచ్చిపోతే కాలేజీకి ఒక్కరోజైనా సెలవు ఇస్తారంటూ’ అవమానించడంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.కుప్పంకు చెందిన విద్యార్థి జస్విన్ తిరుపతి ఎన్ఆర్ఐ కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 10వ తేదీన ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ప్రాణాపాయ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు.అయితే,జస్విన్ ఆత్మహత్యాయత్నానికి కాలేజీ అధ్యాపకులే కారణమని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘నీకు చదువు ఎందుకు? నువ్వు చనిపోతే కాలేజీకి ఒక రోజు సెలవు వస్తుంది’ అంటూ ఓ అద్యాపకురాలు తోటి విద్యార్థుల ముందు అమానుషంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ అవమానాలు, మానసిక ఒత్తిడి తట్టుకోలేక జస్విన్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఆవేదనజస్విన్ తల్లి రాధ కన్నీటి పర్యంతమై మాట్లాడుతూ.. ‘నా కొడుకు పట్ల కాలేజీ లెక్చరర్లు దారుణంగా మాట్లాడారు. సరైన సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేసింది’ అని ఆరోపించారు. తన కుమారుడి పరిస్థితికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.యాజమాన్యం వైఖరిపై విమర్శలుఈ ఘటనపై ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పటికీ, కాలేజీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు, సంఘాలు మండిపడుతున్నాయి. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, దళిత సంఘాలు ఎన్ఆర్ఐ కళాశాల ముందు బైటాయించి నిరసనలు చేపట్టాయి. విద్యార్థులపై వేదింపులు ఆపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
నవోదయ– 2026 మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్కు విశేష స్పందన
తిరుపతి సిటీ: స్థానిక విశ్వం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనన్స్ నిర్వహించిన నవోదయ–2026 మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్కు విశేష స్పందన లభించింది. త్వరలో నిర్వహించనున్న నవోదయ–2026 పరీక్షకు సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మో డల్ పరీక్షను స్థానిక విశ్వం స్కూల్లో గురువారం నిర్వహించారు. నవోదయ ప్రవేశపరీక్ష నమూనా లోనే రూపొందించిన ఈ పరీక్షకు మొత్తం 347 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్. విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విద్యార్థి ముందుండాలంటే చిన్న వయసులోనే పోటీపరీక్షలకు సిద్ధం కావాలన్నారు. చిన్న వయసులోనే శాసీ్త్రయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడంతోనే జాతీయస్థాయి పరీక్ష ల్లో విజయాలు సాధ్యమవుతాయన్నారు. విశ్వం విద్యార్థులు నవోదయ– 2025 ప్రవేశ పరీక్షలో సాధించిన 69 సీట్లు రాష్ట్రవ్యాప్తంగా ఏ సంస్థకీ లేని అసాధారణ రికార్డు అన్నారు. వివరాలకు 8688888802/ 9399976999 నంబరు, వరదరాజనగర్లోని వి శ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. -
అమ్మవారి సేవలో మంత్రాలయం పీఠాధిపతి
చంద్రగిరి: పద్మావతి అమ్మవారిని మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామి తన శిష్య బృందంతో కలసి గురువారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ అమ్మవారిని దర్శించుకున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళన చంద్రగిరి: నారాయణ జూనియర్ కళాశాలలో విద్యార్థి మూడో అంతస్తు నుంచి కిందపడిన ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఎన్ఎస్యూఐ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాయలసీమ అధ్యక్షుడు విజయ్ ఉత్తరాది, విద్యార్థి నాయకుడు కుమార్లతో కలసి గురువారం కళాశాల వద్దకు వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడే నిరసన వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్ని ఈ ఘటనపై నిలదీశారు. అనంతరం వారు మాట్లాడుతూ దుర్ఘటనలో అనేక అనుమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. విద్యార్థి భవిష్యత్తు ప్రమాదంలో పడేలా కాలేజీ వ్యవస్థ ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇంధన పరిరక్షణపై సీఎండీ పోస్టర్స్ ఆవిష్కరణ
–19, 20 తేదీల్లో తిరుపతిలో ప్రత్యేక ఎగ్జిబిషన్ తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 14వ తేదీ నుంచి జరిగే ఇంధన పరిరక్షణ వారోత్సవాల నేపథ్యంలో ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ గురువారం పోస్టర్ల ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్థ పరిధిలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ఇంధన పరిరక్షణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా తిరుపతిలో ఈనెల 19, 20 తేదీల్లో సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తామని, ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులకు ఇంధన పరిరక్షణ–అవశ్యకత అంశంపై స్టాల్స్ ఏర్పాటు పోటీలను నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇంధన పరిరక్షణ అంశంపై సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో విద్యార్థులకు వక్తృత్వపు, క్విజ్ పోటీలను నిర్వహిస్తారని, ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఈనెల 17వ తేదీన తిరుపతి నుంచి ఆన్లైన్ ద్వారా ఫైనల్ రౌండ్ పోటీలను నిర్వహిస్తామన్నారు. అందులో విజయం సాధించిన వారికి 20వ తేదీన బహుమతుల ప్రదానం చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కే. గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు కె.ఆదిశేషయ్య, ఎం.ఉమాపతి, జనరల్ మేనేజర్ శ్రీనివాసులు, తిరుపతి ఎస్ఈ చంద్రశేఖరరావు, ఈఈ గంగాధర్రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జయప్రకాష్, ఎన్జీవో సంస్థ ప్రతినిధి మధుబాబు పాల్గొన్నారు. -
జాతీయ జూడో పోటీలకు ఎస్వీజేసీ విద్యార్థులు
తిరుపతి సిటీ: రాజస్థాన్ వేదికగా ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న జాతీయ బ్లైండ్ జూడో చాంపియన్ పోటీలకు తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం కళాశాల ప్రిన్సిపల్ సి ప్రకాష్ బాబు జాతీయ పోటీలకు ఎంపికై న పి యశ్వంత్రెడ్డి, బీ అంజి, వీ నవీన్, ఏ జీవన్ బాబు, ఎమ్ అంజిని ప్రత్యేకంగా అభినందించారు. 14న అండర్–12 బాయ్స్ క్రికెట్ జట్టు ఎంపిక తిరుపతి ఎడ్యుకేషన్ : అండర్–12 బాయ్స్ క్రి కెట్ జిల్లా జట్టు ఎంపిక పోటీలను ఈ నెల 14వ తేదీ ఉదయం 9గంటలకు నిర్వహించ నున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసి యేషన్ (సీడీసీఏ) కార్యదర్శి మందపాటి స తీష్యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపిక పోటీలను తిరుపతి, చిత్తూరు, పీలేరులో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి డి విజన్కు సంబంధించి మంగళం రోడ్డులోని సీ వీ క్రికెట్ అకాడమీలో, చిత్తూరు డివిజన్కు సంబంధించి చిత్తూరులోని పోలీస్ గ్రౌండ్లో, మదనపల్లి డివిజన్కు సంబంధించి పీలేరు లోని పీఐఓసీ క్రికెట్ నెట్స్లో ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రికెటర్లు 01–09–2013 సెప్టెంబర్ ఒ కటో తేదీలోపు జన్మించిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వారి డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఎంపిక ప్రక్రియ ప్రాంగణంలో తెల్లని దుస్తులు, సొంత క్రీడా సామగ్రి, ఆధార్కార్డు, బర్త్ సర్టిఫికెట్లతో హాజరుకావాల న్నారు. వివరాలకు 8886185559, 90002 14966 నంబర్లలో సంప్రదించాలన్నారు. యూరియా కొరత లేదు తిరుపతి అర్బన్: జిల్లాకు యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్రావు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎరువుల దుకాణయజమానులు కొరత సృష్టించే ప్రయత్నం చేస్తే వారిపై చట్టపరమైన చర్య లు తప్పవని హెచ్చరించారు. రబీ సీజన్కు 62 వేల మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. నెలల వారీగా యూరియాను రైతులకు అవసరం అయిన మేరకు తెప్పించి ఇస్తున్నట్లు తెలిపారు. జాతీయ పోటీలకు జిల్లా షూటర్లు తిరుపతి ఎడ్యుకేషన్ : న్యూఢిల్లీ, భోపాల్ నగరా ల్లో ఈ నెల 14నుంచి జనవరి 4వ తేదీ వరకు జరగనున్న జాతీయ స్థాయి షూటింగ్ చాంపియన్ షి ప్ పోటీల ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఐదుగురు షూటర్లు అర్హత సాధించారు. వీరిలో ఎం.అద్భుత వైష్ణవి, ఎ.హారిక, పి.హితేష్ ఎయిర్ ఫిస్టల్ విభాగంలో, ఎన్.సుష్మ, బి.నందగోపాల్ ఎయిర్ రైఫిల్ విభాగాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గురువారం తిరుపతిలోని శ్రీనివాస స్పో ర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో వారిని డీఎస్డీఓ శశి ధర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా రైఫిల్ షూటింగ్ సంఘం అధ్యక్షుడు దేవరాజ్ అభినందించారు. చిత్తూరు కార్పొరేషన్: ఉ మ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన్గా రెడ్డివారిగురువారెడ్డిని(టీడీపీ)ని ని యమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం, బందారపల్లెకు చెందిన ఆయన్ను చైర్మన్గా నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. -
ఉద్యోగులపై క్రమశిక్షణ కొరడా
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగులపై సీఎండీ శివశంకర్ కొరడా ఝుళిపించారు. విధుల్లో నిర్లక్ష్యం, అనధికారక సర్వీసులు ఇవ్వడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం వంటి అంశాలపై క్షు ణ్ణంగా పరిశీలించిన ఆయన ఏకంగా 25 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎవరెవరిపై ఎందుకు చర్యలు తీసుకున్నారంటే.. తిరుపతి సర్కిల్లో ఏఈగా విధులు నిర్వహిస్తూ సీనియారిటీని పాటించకుండా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడంతో పి.ఉత్తన్నకు రెండు ఇంక్రిమెంట్లు నిలిపివేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. తిరుపతి సర్కిల్లో విధు లు నిర్వహిస్తూ గోశాల, నీటి సరఫరా ప్లాంట్లకు అనధికారిక విద్యుత్ సర్వీసులను మంజూరు చేయడంతో డీఈఈ డి.వసంతయ్యకు రెండు ఇంక్రిమెంట్లు, ఏఈఈలు వీఎస్ గిరి, ఎస్.మెహబూబ్బాషా, లైన్ ఇన్స్పెక్టర్ టీడీ లక్ష్మీపతి, లైన్మన్ ఎన్.రాధాకృష్ణ, అసిస్టెంట్ లైన్మన్ బి.దామోదరం, ఎనర్జీ అసిస్టెంట్ కె. లోకేష్లకు ఒక ఇంక్రిమెంటు వంతున ఆపివేశారు. తిరుపతి సర్కిల్లో పనిచేస్తూ సంస్థ నిబంధనలను పాటించని అంశంలో ఏఈఈలు సి.రవిచంద్ర బాబు, ఎం.మోహన్రావు, బి.వెంకటరమణ, వై.బాలగున్నయ్యకు, కర్నూలు సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, లైన్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఏఈఈలు వై.గర్జప్ప, ఎన్.మద్దిలేటికి ఒక ఇంక్రిమెంట్ ఎందుకు నిలపకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసు ఇచ్చారు. తిరుపతి సర్కిల్లో పనిచేస్తూ అనధికారికంగా లైన్లను మార్చడం, విద్యుత్ సేవల నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలపై ఏఈఈ ప్రసాద్, అసిస్టెంట్ లైన్మన్ జి.సాంబశివకు మూడు ఇంక్రిమెంట్లను ఎందుకు నిలపకూడదో చెప్పాలని షోకాజ్ జారీ చేశారు. కర్నూలు సర్కిల్లో డీఈఈగా పనిచేస్తూ అనధికారికంగా విధులకు గైర్హాజరైన డి.ఖాజావలికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. వీరిపై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ జారీ నెల్లూరు సర్కిల్లో ఇటీవల ఏసీబీకి పట్టుబడిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వై.శివశంకరయ్య, కర్నూలు సర్కిల్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న ఆర్.విశ్వశాంతి స్వరూప్ ఉన్నతాధికారుల ఆదేశాలను ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టినందుకు, గూడూరు డిస్ట్రిక్ట్ స్టోర్స్లో విద్యుత్ పరికరాల సంఖ్యను తప్పుగా నమోదు చేసిన విషయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి. శంకరయ్య, ఏఈ బి.మల్లికార్జునకు, తిరుపతి సర్కిల్లో పనిచేసే ఏఈ ఎల్.చలపతి వ్యవసాయ విద్యుత్ సర్వీసులను జారీ చేయడంలో అవినీతి ఆరోపణలు రావడంతో ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ను జారీ చేశారు. జేఈపై సమగ్ర విచారణకు ఆదేశం నెల్లూరు సర్కిల్లో జూనియర్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న వి.వెంకటేశ్వర్లుపై వచ్చిన అవినీతి ఆరోపణలు, గ్రానైట్ ఫ్యాక్టరీకి అనధికారికంగా స ర్వీసును మంజూరు చేయడం, తన భార్య పేరుతో ఉన్న విద్యుత్ సర్వీసుపై బకాయిలు ఉన్నప్పటికీ సర్వీసును రద్దు చేయక పోవడం, విధులకు గైర్హాజరైన వాచ్ మ్యాన్కు అటెండెన్స్ ఇవ్వడం వంటి అంశాలపై సమగ్ర విచారణకు ప్రత్యేకాధికారిని నియమిస్తూ ఉత్వర్వులను జారీ చేశారు. అలాగే కడప సర్కిల్లో ఏఈగా విధులు నిర్వహించిన ఎన్. రాజశేఖర్రెడ్డి కోర్టు కేసుకు సంబంధించిన అప్పీల్ను సకాలంలో ఫైల్ చేయకపోవడంపై వివరణ ఇవ్వా లని ఆదేశించారు. నెల్లూరు సర్కిల్లోని ట్రైనింగ్ సెంటర్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా విధు లు నిర్వహిస్తూ అనధికారిక కార్యక్రమాలను చేశారన్న అభియోగంపై కె.హంజానవాజ్ఖాన్పై నివేదికను సమర్పించాల్సిందిగా నెల్లూరు ఎస్ఈని ఆదేశించారు. ఇంతకు ముందు తీసుకున్న క్రమశిక్షణ చర్యలపై మరో ముగ్గురు ఉద్యోగుల చేసుకున్న అప్పీళ్లను తిరస్కరించారు. దీంతో పాటు మరికొన్ని ఫిర్యాదులపై విచారణ ప్రక్రియ జరుగుతున్నందున విచారణ పూర్తయిన తరువాత తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. -
గాయపర్చుకుని యువకుడు తిరుమలలో హల్చల్
తిరుమల : తిరుమలలో ఓ యువకుడు తనకు తాను చేతిని గాయపర్చుకుని హల్చల్ చేసిన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. తిరుమల టూటౌన్ పీఎస్ సీఐ శ్రీరాముడు కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ, అబ్బాసియా కాలనీకి చెందిన గోగుల నగేష్ 20 ఏళ్ల కిందట కూలీ పనుల నిమిత్తం వచ్చి రేణిగుంటలో ఉంటూ భవన నిర్మాణ పనులకు తిరుమలకు వచ్చి వెళుతుండేవాడు. ఈ నేపథ్యంలో నగేష్ కొడుకు శ్రీనివాస్(20) తిరుములలో ఉంటూ సమస్యలు సృష్టిస్తుండడంతో సంవత్సరం క్రితమే ఇతడిని తిరుమల నుంచి కిందకు పంపారు. అయితే ఇతను గురువారం తిరుమలకు చేరుకుని స్థానిక డీఎన్ఏ రోడ్డులో తన ప్రేమ విఫలమైందంటూ తనను తాను బ్లేడుతో గాయపరుచుకున్నాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, టీటీడీ భద్రతా సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడిపై రౌడీషీట్ను ఓపెన్ చేయడంతోపాటు, అతని కుటుంబాన్ని తిరుమలకు రాకుండా పట్టణ బహిష్కరిస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశించారు. -
నేడు యువజన విభాగం బలోపేతంపై సమావేశం
తిరుపతి మంగళం : వైఎస్సార్ సీపీ యువజన విభాగాన్ని బలోపేతం చేసేందుకు తిరుపతి లోని డీపీఆర్ కల్యాణ మండపంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఐదు జిల్లాల పార్టీ యువజన విభాగం నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ఉదయ్వంశీ తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం బలోపేతంపై ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల యువజన విభాగం రాష్ట్ర కమిటీ, జిల్లాల అధ్యక్షులు, నగర, మండల యువజన విభాగం నాయకులు ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూమన అభినయ్రెడ్డి హాజరవుతారని తెలిపారు. టెట్కు 95 శాతం మంది హాజరు తిరుపతి సిటీ: జిల్లా పరిధిలో రెండో రోజు జరిగిన టెట్కు 95 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈఓ కేవీఎస్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గురువారం ఉదయం సెషన్లో 7 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 333 మంది హాజరు కావాల్సి ఉండగా 302 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. అలాగే మధ్యాహ్నం జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో జరిగిన రెండో సెషన్ పరీక్షలకు 470 మంది హాజరు కావాల్సి ఉండగా 420మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు తెలపారు. భూసేకరణ పనులు వేగవంతం తిరుపతి అర్బన్: శ్రీసిటీ ఫేజ్ –2కు భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో శ్రీ సిటీ ఫేజ్ – 2కు సంబంధించి వెబ్ ల్యాండ్, ఎల్జీ ఫేజ్–1,2 పెండింగ్ భూసేకరణ పనులు, కోర్టు కేసులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వెబ్ ల్యాండ్పై ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్సీ, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, శ్రీ సిటీ జనరల్ మేనేజర్ భగవాన్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
ఆర్ఐఓ కార్యాలయం ముట్టడి
తిరుపతి సిటీ: చంద్రగిరి నారాయణ జూనియర్ కళాశాలలో జరిగిన దుర్ఘటనపై విద్యార్థి సంఘాలు కన్నెర్ర చేశాయి. ఈ మేరకు గురువారం తిరుపతిలోని ఆర్ఐఓ కార్యాలయాన్ని ముట్టడించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ చంద్రగిరి నారాయణ జూనియర్ కళాశాలలో యాజమాన్యం ఒత్తిడితో ఓ విద్యార్థి రెండో అంతస్తు నుంచి కిందపడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణం జరుగుతున్నా ఆర్ఐఓ ఆ కళాశాలపై విచారణ చేపట్టక పోవడం దారుణమని మండిపడ్డారు. ఆ విద్యా సంస్థలపై అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్వీయూ ప్రెసిడెంట్ మన్నం ప్రేమ్కుమార్, నగర అధ్యక్షుడు స్వరూప్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, ఎన్ఎల్ఎస్ఏ అధ్యక్షుడు సుందర్ రాజు, బీడీవీఎస్ ప్రెసిడెంట్ కొండా యుగంధర్, ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాయలసీమ అధ్యక్షుడు విజయ్ ఉత్తరాది తదితరులు పాల్గొన్నారు. -
చెరువు కట్టను తెగ్గొట్టిన భూ ఆక్రమణదారులు
చెరువు కట్టను తెగొట్టడంతో రైతులు తాత్కలికంగా వేసిన ఇసుక బస్తాలు దొరవారిసత్రం: మండలంలోని బురదమడుగు చెరు వు పొరంబోకు భూమి ఆక్రమించి సాగు చేసే ఆక్రమణదారులు పంట పొలాలు నీట మునిగిపోవడంతో గత వారం చెరువు కట్టను రాత్రికి రాత్రే తెగొట్టిన ఘ టన ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది. బురదమడుగు చెరువు కింద సుమారు 50 ఎకరాల ఆయకట్టు ఉండగా స్థానికులు పలువురు భూస్వాములు చె రువు పొరంబోకు భూమి సుమారు 30 ఎకరాల వరకు ఆక్రమించి గత కొన్నేళ్లు నుంచి సాగు చేస్తున్నారు. ఇటీవన దిత్వా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసి చెరువు నిండిపోవడంతో పొరంబోకు భూమిలో సా గైన వరి ఎక్కడ మునిగిపోతుందోనని ఆక్రమణదారు లు చెరువు కట్టను తెగొట్టి నీటిని వదిలేశారు. దీంతో చెరువు నుంచి నీరు పొలాలపై ప్రవహించడంతో పొ లాలు దెబ్బతింటున్నాయి. ఇగిగేషన్ అధికారులుతో పాటు రెవెన్యూ అధికారులు తెలిపిన ఎలాంటి చర్యలు చేపట్టలేని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
నా భర్త అస్థికలైనా ఇవ్వండయ్యా!
చంద్రగిరి: నా భర్త అస్థికలైనా ఇవ్వండయ్యా అని భర్త మృతదేహం కోసం ఓ ఇల్లాలు కాళ్లరిగెలా తిరుతున్నా పోలీసులు మాత్రం వంకలు చెబుతూ కాలయాపన చే స్తూ, ఆ ఇల్లాలికి శోకాన్ని మిగిల్చుతున్న విషాద ఘట న మదనపల్లిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. మదనపల్లె మండలం రామాపురానికి చెందిన నరసింహులు (35) అక్టోబర్ 27న కనిపించకుండా పో యాడు. కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంటూ తిరిగినా, పోలీసులు మాత్రం డైరీలో ఎంట్రీ పెట్టడానికే వారం పట్టింది. ఈ నెల 3వ తేదీన మాత్రమే అదృశ్యం కేసు నమోదు చేశారు. ఆపై నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారించారు. విచారణలో చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో హత్య చేసి పాతిపెట్టినట్టు స్పష్టమైన వివరా లు బయటకొచ్చాయి. తన భర్తను దారుణంగా హత్య చేసి, శ్రీనిసమంగాపురం సమీపంలోని ఓ తోటలో పా తిపెట్టారని తెలుసుకున్న అతని భార్య విజయలక్ష్మి, ముగ్గురు పిల్లలు విలపిస్తున్నారు. రెండు నెలల క్రితం ఘటన జరిగితే, పోలీసులు తీరిగ్గా కేసును ఛేదించడంతో, పాతిపెట్టిన మృతదేహంలో ఎముకల గూళ్లు తప్ప ఏ అవశేషాలు మిగిలే పరిస్థితి లేదు. అయినా తన భర్త అస్థికలైనా ఇప్పించండి సారూ..అంటూ మృతుడి భార్య విజయలక్ష్మి పోలీసులను వేడుకుంటోంది. -
ముమ్మరంగా ప్రభుత్వ స్కూళ్లలో సామాజిక తనిఖీ
తిరుపతి సిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సామాజిక తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై సోషియల్ ఆడిట్ ప్రక్రియ ప్రారంభించినట్లు సమగ్రశిక్షా అభియాన్ సీఎంఓ సురేష్ చెప్పారు. పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై ఆరా తీసి, ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేస్తున్నామని తెలిపారు. ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల కమిటీ సమక్షంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్లు పాఠశాల వివరాలను నమోదు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఎయిడెడ్, గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల్లో తనిఖీలు చేస్తున్నారని చెప్పారు. అన్ని వసతులు బాగుంటే గ్రేడ్–1 పాఠశాలలో అన్ని వసతులు బాగుంటే ఆ పాఠశాలను గ్రేడ్–1గా పరిగణిస్తున్నారు. మౌలిక వసతులు సరిగా లేని పాఠశాలలు, వసతి గృహాలకు గ్రేడ్ –4 స్థాయిని కేటాయించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 150 పాఠశాలలకు పైగా సామాజిక తనిఖీలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. గత ఆరు నెలలుగా పాఠశాలల్లోనూ. ప్రభుత్వ వసతి గృహాల్లోనూ నాసిరకం భోజనాలు వడ్డిస్తున్నారని, విద్యార్థులకు తగిన సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారని విద్యార్థి సంఘాలు పలుసార్లు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. జిల్లాలో పాఠశాలలు, వసతి గృహాల పరిస్థితిపై సోషల్ ఆడిట్ ద్వారా వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు ఆడిట్ జరిపి గ్రేడ్లను కేటాయించి ప్రభుత్వ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. -
63,178 స్మార్ట్ కార్డులు ఎవరి వద్ద ఉన్నాయి?
తిరుపతి అర్బన్: చంద్రబాబు సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయకపో యినప్పటికీ.. తమ మార్కు కోసం రాజకీయ కోణంలో భాగంగా ప్రశాంతంగా ఉన్న అనేక విభాగాల్లో ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు చేస్తోంది. అందులో స్మార్ట్ రేషన్కార్డుల అంశం ఒకటి. గతంలో ఉన్న పాత రేషన్కార్డుల స్థానంలో ఈ ఏడాది సెప్టెంబర్ 16 నుంచి కొత్తగా స్మార్ట్ రేషన్కార్డుల పేరుతో పసుపు రంగుతో కూడిన కార్డుల పంపిణీ చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. జిల్లాలో 1,457 చౌకదుకాణాల్లో 5,64,567 రేషన్కార్డులు ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు 5,01,389 కార్జులు జారీ చేశారు. ఇంకా 63,178 కార్డులను జారీ చేయాల్సి ఉంది. కొత్తకార్డుల దరఖాస్తుకు స్మార్ట్ ఏదీ కొత్తగా 70 వేల మంది రేషన్కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే వారికి స్మార్ట్ రేషన్కార్డులు రాలేదు. ప్రధానంగా ఏటా పెద్ద కుటుంబాల్లో ఉంటున్న అన్నదమ్ములు వివాహం అనంతరం విడిపోయి, కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు జిల్లాలో 20 వేల నుంచి 22 వేల మంది ఉన్నారు. అలాగే వివాహం కావడంతో తల్లిదండ్రుల కార్డుల నుంచి ఆడబిడ్డలు భర్త కార్డులో చేర్చడం కోసం దరఖాస్తులు చేసుకున్నవారు, పుట్టిన చిన్నబిడ్డలను ఏడాది తర్వాత రేషన్కార్డుల్లో చేర్చడానికి దరఖాస్తులు చేసుకున్నవారు, మృతి చెందిన వారిని కార్డు నుంచి పేరు తొలగించాలని దరఖాస్తులు చేసుకున్నారు. అడ్రస్ మార్పు కోసం దరఖాస్తులు చేసుకున్నవారు.. ఇలా వివిధ రకాలుగా దరఖాస్తు చేసుకున్న వినియోగదారులు జిల్లాలో 48వేల మంది ఉన్నారు. మొత్తంగా 70 వేల మంది సవరణల్లో భాగంగా కొత్త రేషన్కార్డుల్లో భాగంగా స్మార్ట్ రేషన్కార్డులు అందకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈకేవైసీ పేరుతో చాలమందికి బియ్యం అందడంలేదు. మరోవైపు అదనంగా డీలర్లుకు ఇవ్వాల్సిన 20 శాతం బియ్యం ఇవ్వకపోవడంతో ఏ డీలర్ పరిధిలోని కార్డుదారులు ఆ డీలర్ వద్ద బియ్యం తీసుకోవాల్సి వస్తోంది. మరోవైపు 1నుంచి 18 వరకు ఇస్తున్న బియ్యాన్ని 1 నుంచి 15 వరకు మాత్రమే ఇస్తున్నారు. ఎండీయూ వాహనాలు రద్దు చేశారు. 288 డీలర్ పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్నారు. బియ్యం తప్ప కందిపప్పుతోపాటు ఇతర సరుకులు ఇవ్వడం లేదు. దీంతో కార్డుదారులు నానా తిప్పులు పడుతుంటే..కొత్తగా స్మార్ట్ కార్డు ఇబ్బందులు తప్పడం లేదు. పంపిణీకి నోచుకోని 63,178 కార్డులు ఎవరి వద్ద ఉన్నయో తెలియక కార్డుదారులు అయోమయంలో పడ్డారు. మొన్నటి వరకు రేషన్ డీలర్ల వద్ద ఉండేవి. తర్వాత సచివాలయానికి పంపించాం..అక్కడికి వెళ్లి తీసుకోండి అంటున్నారు. తాజాగా వీఆర్వోల వద్దకు పంపినట్లు చెబుతున్నారు. మరోవైపు తహసీల్దార్ కార్యాలయానికి పంపినట్లు చెబుతున్నారు. ఇంకోవైపు చివరిగా ఏ డీలర్ వద్ద బియ్యం తీసుకున్నారో ఆ డీలర్ వద్ద ఉన్నాయని చెబుతున్నారు. అంటే ఉదాహరణకు ఓ కార్డుదారుడికి రేణిగుంట రేషన్ షాపు పరిధిలో కార్డు ఉంటే అతను తిరుపతిలో ఏదో ఒక డీలర్ వద్ద చివరి నెల(సెప్టెంబర్)బియ్యం తీసుకుని ఉంటే ఆ డీలర్ వద్దకు పంపినట్లు చెబుతున్నారు. మరోవైపు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి కార్యాలయానికి మిగులు కార్డులను పంపిణీ చేసినట్లు చర్చసాగుతోంది. ఈ గందరగోళంతో పలువురు స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోలేక నానా ఇక్కట్లు పడుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 63,178 కార్డులు ఉంటే వాటిని సక్రమంగా పంపిణీ చేయాల్సిన బాధ్యతను అధికారులు తీసుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పంపిణీ చేయని కార్డులను వెనక్కి పంపుతాం ఇప్పటికీ పంపిణీ చేయని స్మార్ట్ రేషన్ కార్డులు జిల్లాలో 60 వేలకు పైగా తహసీల్దార్ కార్యాలయానికి చేరాయి. త్వరలో తీసుకోండి.. లేదంటే జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి చేస్తాం. వాటిని వెనక్కి పంపాల్సి వస్తుంది. కొత్తకార్డులకు స్మార్ట్ కార్డులు త్వరలో వస్తాయి. పక్క డీలర్ వద్దకే కాకుండా రాష్ట్రంలో ఏ డీలర్ వద్దకు వెళ్లిన బియ్యం ఇవ్వాల్సి ఉంది. – శేషాచలం రాజు, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి -
● నేడు అంగన్వాడీ కార్యకర్తల మహాధర్నా ● అంగన్వాడీవర్కర్లకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎస్టీయూ మద్దతు
తిరుపతి అర్బన్: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు న్యాయమైన తమ పోరాటానికి సిద్ధమయ్యారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అంగన్వాడీల సమ్మెను బలపరచి..తాము అధికారంలోకి వస్తే అన్నీ సమస్యలకు తక్కువ వ్యవధిలోనే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు అంగన్వాడీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క సమస్యకూ పరిష్కారం చూపలేదని మండిపడుతున్నారు. పలు రకాల యాప్లతో పనిభారం తప్ప..సమస్యకు పరిష్కారం చూపలేదని దుయ్యబడుతున్నారు. గతంలో ఇచ్చిన మొబైళ్లు పాడైన నేపథ్యంలో కొత్త మొబైల్స్ను ఇవ్వాలని పోరాటాలు చేసినా, పట్టించుకోలేదని గుర్తుచేశారు. దీంతో గతంలో ఇచ్చిన మొబైళ్లను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చిన సంగతిని తెలియజేస్తున్నారు. పోరాటాలకు అంగన్వాడీలు సిద్ధం అవుతున్న విషయం తెలుసుకుని.. హుటాహుటీనా మొబైళ్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడాన్ని తప్పుపడుతున్నారు. 2,492 అంగన్వాడీ కేంద్రాలు మూతే.. కలెక్టరేట్ వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టడానికి నిర్ణయించారు. దీంతో జిల్లాలోని 2,492 అంగన్వాడీ కేంద్రాలు శుక్రవారం మూతపడనున్నాయి. వాల్పోస్టర్ల ఆవిష్కరణ తిరుపతిలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వ ర్క ర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ, ఐఎస్టీయూ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు భారతి, టీఐటీ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జయచంద్ర, సుబ్రహ్మణ్యం, తిరుపతి ప్రాజెక్టు కార్యదర్శి నాగరాజమ్మ, నాగరత్న తదితరులు పాల్గొన్నారు. హామీలు నెరవేర్చండి ప్రతిపక్షంలో ఉన్న సమ యంలో ఇచ్చిన హామీల ను నెరవేర్చాలని కోరు తున్నాం. అంగన్వాడీ వర్కర్లు అనేక సమస్య లతో బాధపడుతున్నారు. అయితే ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం సరికాదు. న్యాయమైన కోర్కెల కోసమే మా పోరాటం. శాంతియుతంగా శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించాం. న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తాం. – పద్మలీలా, అంగన్వాడీ వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు(సీఐటీయూ) పనిభారం పెరిగింది పనిభారం బాగా పెరిగింది. లెక్కలేనన్ని యా ప్లు వచ్చేశాయి. ఒక్కొ క్క అంశానికి ఒక్కొక్క యాప్ను ఇచ్చేశారు. అ న్ని యాప్లను ఒక్కటిగా తీసుకురావాలని కోరుతున్నాం. అలాగే ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు కనీస వేతనాలు రూ.26 వేలు చేయాలని కోరుతున్నాం. సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలి. – వాణిశ్రీ, అంగన్వాడీ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రీస్కూళ్లు బలోపేతం చేయాలి ప్రీస్కూళ్లను బలోపేతం చేయాలి. ప్రీస్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని వర్తింప చేయాలి. లబ్ధిదారులకు ఆయిల్, కందిపప్పు పరిమాణం పెంచాలి. మెనూ చార్జీలను పెంచాలి. ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలి. హెల్పర్ల పదోన్నతలకు నిర్థిష్టమైన గైడ్లైన్స్ రూపొందించాలి. మినీ వర్కర్ల క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. – సౌజన్య, అంగవ్వాడీ వర్కర్స్ యూనియన్ శ్రీకాళహస్తి ప్రాజెక్టు అధ్యక్షురాలుజిల్లా సమాచారం అంగన్వాడీ ప్రాజెక్టుల సంఖ్య 11 అంగన్వాడీ సెంటర్లు 2,492 అంగన్వాడీ మెయిన్ సెంటర్ల కార్యకర్తలు 2,092 అంగ్వాడీ మినీ సెంటర్ల కార్యకర్తలు 348 అంగన్వాడీ హెల్పర్లు 2,066 మంది అంగన్వాడీ పరిధిలో మొత్తం 1,46,669 మంది గర్భిణిలు 12,788 బాలింతలు 11,007 6నెలల లోపు పిల్లలు 9,627 6 నెలలపైన–3 ఏళ్ల లోపు పిల్లలు 65,433 3 ఏళ్లపైన 6 ఏళ్లు లోపు పిల్లలు 47,814 -
ఇదీ ఒక గెలుపేనా..!
ఏర్పేడులో ఎంపీటీసీ సభ్యులందరూ వైఎస్సార్ సీపీ వారే ఏర్పేడు: ‘ఎనిమిది నెలల పదవీ కాలం మాత్రమే మిగిలి ఉంది.. అందరూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులే.. అయినా టీడీపీ నేతలు ఒక్క ఎంపీటీసీ సభ్యు డు లేకపోయినా అధికారబలంతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ స భ్యులను బెదిరించి, ప్రలోభాల కు గురి చేసి 9 మందిని వైఎస్సా ర్ సీపీని ఫిరాయించేలా చేసి తమ వైపునకు తిప్పుకుని ఒక్క స్థానం కూడా లేనిచోట రాజకీ య కుయుక్తులతో ఎంపీపీ పదవిని దక్కించుకు న్నారు. గురువారం ఏర్పేడు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను చూసి ఇది కూడా ఒక్క గెలుపేనా..? అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.’ ఏర్పేడు మండలంలో ఉన్న 16 మంది ఎంపీటీసీ సభ్యుల్లో పల్లం ఎంపీటీసీ సభ్యురాలు గీత రాజీనామా చేయగా, ము సలిపేడు ఎంపీటీసీ స భ్యులు రమణమ్మ ఇటీవల మృతి చెందారు. దీంతో ప్రస్తుతం 14 మంది ఎంపీటీసీ సభ్యులు మాత్రమే ఉన్నారు. వారిలో పంగూరు ఎంపీటీసీ సభ్యురాలు ఆదిలక్ష్మి ఒక్కరే ఎస్టీ మహిళ.. అయితే ఉన్న 14మంది ఎంపీటీసీ సభ్యు లు కూడా వైఎస్సార్ సీపీ వారే. అయితే ఎంపీపీ అభ్యర్థి అయిన పంగూరు ఎంపీటీసీ సభ్యురాలు పి.ఆదిలక్ష్మితోపాటు కోబాక ఎంపీటీసీ సభ్యురా లు ఎన్.గౌరి, కందాడ ఎంపీటీసీ సభ్యురాలు జి.రేవతి, మడిబాక ఎంపీటీసీ సభ్యురాలు కె.పద్మమ్మ, చెల్లూరు ఎంపీటీసీ సభ్యురాలు ఏ.రాధ, పాపానాయుడు పేట ఎంపీటీసీ సభ్యుడు కె.మునిరాజు, వికృతమాల ఎంపీటీసీ సభ్యుడు పి.రవి, అంజిమేడు ఎంపీటీసీ బి.శ్రీనివాసులు, పాతవీరాపురం ఎంపీటీసీ సభ్యుడు టి.క్రిష్ణవేణి వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించి, టీడీపీ శిబిరంలో చేరిపోయా రు. వీరందరిని టీడీపీ నేతలు ప్రలోభాలకు, బె దిరింపులకు గురి చేసి బుధవారం మధ్యాహ్నమే ప్రత్యేక శిబిరానికి తీసుకెళ్లి, వారి సెల్ఫోన్లను లా క్కున్నారు. వారందరినీ గురువారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక వాహనంలో నేరుగా ఎంపీడీఓ కార్యాలయానికి టీడీపీ నేతలు తీసుకొచ్చారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శంకర్రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట నారాయణ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ఏర్పే డు ఎంపీడీఓ సౌభాగ్యం ఎన్నికల ప్రక్రియను ప్రా రంభించారు. అయితే మిగిలిన ఐదుగురు వైఎస్సార్ సీపీ సభ్యులు ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను బాయ్కాట్ చేయడంతో టీడీపీ మద్దతిచ్చిన 9 మంది వైఎస్సార్ సీపీ ఫిరాయింపు ఎంపీటీసీ స భ్యులతోనే ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. కాసేపటికే పంగూరు ఎంపీటీసీ సభ్యురాలు పి.ఆదిలక్ష్మిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి గెలుపొందినట్లు అధికారులు ధ్రువీకరించారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, బీజేపీ నేత కోలా ఆనంద్కుమార్ అక్కడకు చేరుకుని ఎంపీపీని అభినందిస్తూ సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులను లాక్కుని ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్నామని టీడీపీ సంబరాలు చేసుకోవడంపై ప్రజలు ఇదీ ఒక్క గెలుపేనా? అని పెదవి విరుస్తున్నారు. ఒక్క ఎంపీటీసీ లేకపోయినా.. ఏర్పేడు మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థా నాలున్నాయి. 16 స్థానాలను వైఎస్సార్ సీపీ అభ్యర్థులే గెలుచుకున్నారు. ఇక్కడ ఎంపీపీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వుడు కావడంతో నాలుగేళ్ల కిందట జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో పల్లం ఎంపీటీసీ సభ్యురాలు గీత ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఆమె వ్యక్తిగత కారణా లతో ఈ ఏడాది ఏప్రిల్లో తన పదవికి రాజీనామా చేశారు. దీంతో గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎంపీపీ ఎన్నిక జరిగింది. టీడీపీ ప్రలోభాలకు లొంగక.. టీడీపీ ప్రలోభాలు, తీవ్రస్థాయి బెదిరించినా ఆ మందూరు ఎంపీటీసీ సభ్యుడు, తాజా మాజీ ఎంపీపీ జమళ్ల శ్రీనివాసయాదవ్, బండారుపల్లి ఎంపీటీసీ సభ్యులు, వైస్ ఎంపీపీ టి.జనార్ధన్రెడ్డి, ఏ ర్పేడు ఎంపీటీసీ సభ్యుడు ఎం.భరత్కుమార్, మ ర్రిమంద ఎంపీటీసీ సభ్యుడు కె.నాగరాజరెడ్డి, గు డిమల్లం ఎంపీటీసీ సభ్యురాలు ఎం.సావిత్రి టీడీ పీ చెంతకు చేరలేదు. గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నిక అప్రజాస్వామికంగా జరగనున్నట్లు భా వించిన వీరు ఎన్నికకు గైర్హాజరయ్యారు. -
‘కూటమి నేతలు తప్పు చేసి.. వైఎస్సార్సీపీపై బురదజల్లుతారా?’
సాక్షి, తిరుపతి: కూటమి వచ్చాక తిరుమలలో అనేక ఘోరాలు జరిగాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక ప్రణాళిక ప్రకారం వైఎస్ జగన్పై కూటమి దాడి చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు వైఖరితోనే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయని.. కూటమి నేతలు తప్పు చేసి వైఎస్సార్సీపీపై బురదజల్లుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్ను దెబ్బతీయడానికి తిరుమలను చంద్రబాబు వాడుకుంటున్నారు. ఎన్నికల ముందు, తరువాత తిరుమల చూట్టు రాజకీయాలు చేస్తున్నారు. లడ్డూ, పరకామణి, పట్టు వస్త్రాలు అవినీతి అంటూ జగన్ను టార్గెట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాజకీయంగా దెబ్బ తీయడానికి స్వామివారి కూటమి నేతలు వాడుకుంటున్నారు...పదిరోజుల వైకుంఠ ఏకాదశి వద్దని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు మళ్లీ అదే కొనసాగిస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు దీనికి కారణం వైఎస్సార్సీపీనే.. పదిరోజుల దర్శనం తప్పు అంటూ ప్రచారం చేశారు. లడ్డూ కేసులో ఇప్పటి వరకు రాజకీయపరమైన అరెస్టు ఒక్కటి జరగలేదు. కాని సుబ్బారెడ్డి చేశాడని అసత్య ప్రచారం చేశారు...సింహాచలం ఆలయంలో దొంగతనం చేస్తే స్టేషను బెయిల్ ఇచ్చి వదిలేశారు. 2015 నుంచి 2025 వరకు పట్టు వస్త్రాల స్కాం జరిగితే.. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నాడు. రోజుకో మాట మాట్లాడటంలో పవన్ దిట్టా. బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఎప్పుడూ జరగని అపచారాలు తిరుమలలో జరిగాయి’’ అని భూమన ధ్వజమెత్తారు. -
క్రీడాకారుడు గణేష్కు కలెక్టర్ అభినందన
తిరుపతి కల్చరల్ : నాయుడుపేటకు చెందిన క్రీడాకారుడు గణేష్ను ఆదివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అభినందించారు. గణేష్ ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్చరీ యూత్ చాంపియన్ షిప్ టీమ్ గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిసిన క్రీడాకారుడిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. నేటి నుంచి సఖీ సురక్ష తిరుపతి అర్బన్ : ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు సఖీ సురక్ష పేరుతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మెప్మా అధికారులతో కలసి పోస్టర్లను విడుదల చేశారు. జిల్లాలోని 35 సంవత్సరాల వయస్సుపైబడిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం వెంకటగిరి నియోజకవర్గంలో 411 మహిళా సంఘాలకు, 12వ తేదీన తిరుపతిలో 425 మహిళా సంఘాలు, గూడూరు నియోజకవర్గంలో 12వ తేదీన 810 సంఘాలు, 13 వతేదీన తిరుపతిలో మిగిలిన 425 సంఘాలు, 13న శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 696 సంఘాలు, 15వ తేదీన తిరుపతిలోని మరో 1270 సంఘాలు, 16వ తేదీన పుత్తూరులోని 510 సంఘాలలోని మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. -
హక్కుల రక్షణ అందరి బాధ్యత
తిరుపతి సిటీ : మానవ హక్కుల రక్షణ పౌరులందరి బాధ్యతని వీసీ నర్సింగరావు తెలిపారు. బుధవారం ఎస్వీయూలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ మానవ హక్కులపై పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను, జ్ఞాపికలను అందజేశారు. రెక్టార్ సీహెచ్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుధారాణి, విశ్వం స్కూల్ డైరెక్టర్ ఎన్ విశ్వచందన్రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ రవిబాబు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ కోదండరామిరెడ్డి , లాయర్ రాజ్ కుమార్ పాల్గొన్నారు. మహిళా వర్సిటీలో.. తిరుపతి రూరల్ : మహిళా వర్సిటీలో మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్యతిథిగా హాజరైన క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ శ్యామ్సుందర్ మాట్లాడుతూ పౌరులందరు తమ హక్కులనే కాక బాధ్యతలను కూడా గుర్తించాలని కోరారు. సోషల్ మీడియా సైట్లో జాగ్రత్తగా ఉండాలని, ప్రధానంగా మహిళలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కో–ఆర్డినేటర్ ఆచార్య వాణి మాట్లాడుతూ మానవ హక్కులను పరిరక్షణ న్యాయ విద్యార్థులపై ఉందని తెలిపారు. అనంతరం మానవ హక్కుల పరిరక్షణపై విద్యార్థినులతో ఆచార్య టి.సీతా కుమారి ప్రతిజ్ఞ చేయించారు. -
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన
తిరుపతి రూరల్ : రాష్ట్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, మంత్రి నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్రెడ్డి విమర్శించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్యను అక్రమంగా అరెస్టు చేశారని, ఆయనను వెంటనే విడుదల చేయాలన్నారు. బకాయిలు ఉన్న కాలేజీలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించాలని అడిగితే అక్రమ అరెస్టులు చేయించడం చంద్రబాబు ఫాసిస్ట్ పాలనకు నిదర్శనమన్నారు. పెండింగ్లో ఉన్న రూ.7,800 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్రెడ్డి మాట్లాడుతూ.. ఫీజుల బకాయిలపై శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తున్న వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్యతో పాటు ఇతర విద్యార్ధులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమం ఆగదని, ఫీజులు చెల్లించే వరకు పోరాడుతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఎస్వీ వర్సిటీ అధ్యక్షుడు ప్రేమ్కుమార్ , చంద్రగిరి మండల అధ్యక్షుడు వినోద్ కుమార్, ఆర్సీపురం మండల అధ్యక్షుడు, యశ్వంత్ రెడ్డి, ఎర్రావారిపాళెం మండలం అధ్యక్షుడు శేష రెడ్డిలతో పాటు విద్యార్థి నాయకుడు ముని తదితరులు పాల్గొన్నారు. -
టీటీడీకి రెండు ఈవీ కార్లు విరాళం
తిరుమల : తిరుపతికి చెందిన లోటస్ ఎలక్ట్రిక్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో అర్జున్ కొల్లికొండ అనే భక్తుడు బుధవారం టీటీడీకి రూ.10 లక్షల విలువైన సిట్రాఝెన్ (ఈసీ3) ఎలక్ట్రిక్ కారును విరాళంగా అందించింది. అదేవిధంగా చైన్నెకి చెందిన శరవనన్ కరుణాకరన్ అనే భక్తుడు రూ.9 లక్షలు విలువైన సిట్రాఝెన్ (బసాల్ట్ ఎక్స్ ప్లస్ యంటీ) కారును విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయం ముందు కార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పేష్కార్ రామకృష్ణకు తాళాలు అందించారు. మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించాలి వరదయ్యపాళెం: మహిళలు ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని డీఆర్డీఏ పీడీ శోభన్బాబు ఆకాంక్షించారు. బుధవారం పిచ్చాటూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో విజన్ బిల్డింగ్, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధి గ్రామీణ ఆర్థిక పురోగతికి పునాది అన్నారు. డీపీఎం వెంకటేష్, ఏపీఎంలు రాధమ్మ, చంద్రబాబు పాల్గొన్నారు. -
ఒత్తిడి భరించలేకనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం
చంద్రగిరి : చదువుల ఒత్తిడిని భరించలేకనే మహీధర్రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే ఆ విషయం పక్కదారి పట్టించేందుకు నారాయణ కాలేజీ యాజమాన్యం నాటకాలు ఆడుతోందని వెఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్రెడ్డి విమర్శించారు. రెండు చేతులు కూడా సక్రమంగా పట్టని కిటికీ నుంచి విద్యార్థి కిందకు దూకాడని చెబుతున్నారంటే వీరిని ఏమనాలి..? నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చంద్రగిరి మండలం అగరాల వద్దనున్న నారాయణ విద్యాసంస్థలో అన్నమయ్య జిల్లా కలికిరికి చెందిన మహీధర్రెడ్డి అనే విద్యార్థి ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆ యువకుడు రక్తపు గాయాలతో పడుండగా కాలేజీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఏం జరిగిందని ఆరా తీయగా అతడు కిటికీలో నుంచి బయటకు వచ్చి పైపుల ద్వారా కిందకు దిగే ప్రయత్నంలో కిందపడి దెబ్బలు తగిలినట్టు బుకాయిస్తున్నారన్నారు. ప్రాణాలకు తెగించి అన్నం కోసం బయటకు వెళతారా ? కాలేజీ సిబ్బంది చెబుతున్న మాటలు చూస్తుంటే అనుమానంగా ఉందని, ఆ పిల్లాడిపై చదువుల ఒత్తిడి తేవడం వల్లనే తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోందన్నారు. నిజాలు బయటకు రావాలంటే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, నారాయణ విద్యాసంస్థల యజమాని రాష్ట్ర మంత్రి కావడం వల్ల పోలీసులు ఆ కేసును అణగదొక్కుతారు తప్ప లోతుగా విచారణ చేపట్టరని ఆరోపించారు. కాలేజీ యాజమాన్యంపై విద్యార్థుల సంఘం నుంచి పోరాడుతామని, అవసరమైతే న్యాయ స్థానాల్లో కేసులు వేస్తామని హెచ్చరించారు. అంతకుముందు రాష్ట్ర వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థ ముందు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండలం విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్, ఎస్వీయూ అధ్యక్షు ప్రేమ్కుమార్, ఆర్సీపురం అధ్యక్షులు యశ్వంత్రెడ్డి, ఎర్రవారిపాళ్యం అధ్యక్షులు శేషారెడ్డి, ఎన్ఎల్ఎస్ఏ విద్యార్థి నేత సుందర్, బీఎన్ఎస్ విద్యార్థి సంఘం నేత విక్రమ్ యాదవ్, బీసీ స్టూడెంట్ యూనియన్ నాయకులు తిరుమలేశులు పాల్గోన్నారు. -
పలువురు తహసీల్దార్ల బదిలీ
తిరుపతి రూరల్: తిరుపతి జిల్లా వ్యాప్తంగా పలువురు తహశీల్దార్లను బదిలీచేస్తూ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. తిరుపతి రూరల్ తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న రామాంజులునాయక్ను కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా బదిలీచేశారు. ఆ స్థానానికి శ్రీకాళహస్తి తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న జనార్ధన్రాజును బదిలీచేశారు. కలెక్టర్ కార్యాలయంలోని ఈ–సెక్షన్ సూపరింటెండెంట్గా ఉన్న డి.లక్ష్మీనారాయణను బీఎన్ కండ్రిగకు, అక్కడ పనిచేస్తున్న తహశీల్దారు శ్రీదేవిని సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పరిపాలన సౌలభ్యం కింద వారిని బదిలీ చేసినట్టు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పైపుల లారీ బోల్తా రేణిగుంట : మండలంలోని గాజులమండ్యం సమీపంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో శ్రీకాళహస్తి నుంచి చైన్నె వెళ్తున్న పైపుల లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి రూరల్ సీఐ మంజునాథరెడ్డి, ఎస్ఐ నాగరాజు చేరుకొని క్రేన్ల సహాయంతో లారీని తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. బైక్ ఢీకొని వృద్ధుడి మృతి డక్కిలి : బైక్ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు మండలంలోని వెంకటగిరి– రాపూరు జాతీయ రహదారిలోని లింగసముద్రం దళితవాడకు చెందిన గోనుగొడు వెంకటరామయ్య (60) అనే వృద్ధుడిని వెంకటగిరి నుంచి మాధవాయిపాళెం వైపు వెళ్తున్న కరిపం శివ అనే యువకుడు బైక్తో ఢీకొనడంతో వెంకట రామయ్య తీవ్రంగా గాయపడ్డారు. 108లో వెంకటగిరి సీహెచ్సీ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు డక్కిలి ఇన్చార్జి ఎస్ఐ కామినేని గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన శివ తీవ్ర గాయాల పాలయ్యాడు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించినట్లు సమాచారం. ప్రొఫెసర్లకు వైద్య పరీక్షలు పూర్తి తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో ఇటీవల ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన అధ్యాపకులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈమేరకు బుధవారం అధ్యాపకులు లక్ష్మణ్ కుమార్, శేఖర్రెడ్డిలను వైద్య పరీక్షల నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వెస్ట్ పోలీసులు కోర్టులో హాజరుపరచినట్లు సమాచారం. -
ఏడు గంగల జన జాతర
తేరువీధిలో నల్లగంగమ్మ శ్రీకాళహస్తిలో రెండు రోజులుగా జరుగుతున్న ఏడు గంగల జాతర వైభవంగా సాగుతోంది. అమ్మవారి గుడి వద్ద నుంచి ఏడుగురు గంగమ్మలను ఆయా జాతర కమిటీలు మంగళవారం అర్ధరాత్రి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారిని చూసేందుకు భక్తులు విశేషంగా పాల్గొని హారతులు సమర్పించారు. ముతాలమ్మ గుడి వద్ద ప్రత్యేక హారతులు సమర్పించిన తరువాత పెండ్లి మండపం వరకు చేరుకుని మొదటి గంగమ్మను స్థాపించారు. భద్రకాళీలా భక్తులకు మొదటి గంగమ్మ పొన్నాలమ్మ రూపంలో కటాక్షించింది. గంగమ్మ వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం రాత్రి 7 గంటలకు అమ్మవార్లకు ఏడు గంగమ్మల ఆలయం వద్ద నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. కాగా ఊరేగింపులో కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కొత్తపేట గంగమ్మ ఊరేగింపులో ప్రముఖ సినీ హీరో చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేష్బాబు, జూనియర్ ఎన్టీఆర్ను పోలిన డూప్లు ప్రజలను ఆకర్షించారు. – శ్రీకాళహస్తి -
Tirumala: శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 70,901 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,128 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.96 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.


