breaking news
Tirupati
-
తిరుచానూరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభం
చంద్రగిరి: తిరుపతి ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న రిజిస్ట్రేషన్ సేవల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని జిల్లా ఇంచార్జి మంత్రి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని విభజించి తిరుచానూరులో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత సులభంగా, వేగవంతంగా సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. బుధవారం తిరుచానూరులో ఏర్పాటు చేసిన నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్, స్టాంపుల శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, కలెక్టర్ వెంకటేశ్వర్, చిత్తూరు ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. తిరుచానూరు ప్రాంతంలో ఉన్న పాత సచివాలయ భవనాన్ని ఆధునీకరించి తాత్కాలికంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగా మార్చినట్లు తెలిపారు. పారదర్శకంగా రీ సర్వే 2.0 భూముల రీ–సర్వే 2.0 కార్యక్రమంపై మంత్రి ప్రత్యేకంగా స్పందిస్తూ, అత్యంత పారదర్శకంగా రీ–సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. తాజ్ సర్కిల్ నుంచి శ్రీనివాసపురం వాటర్ ట్యాంక్ వరకు ఏర్పాటు చేయనున్న శాశ్వత పైప్లైన్ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, జిల్లా రిజిస్ట్రార్ రామ్కుమార్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం తదితరులు పాల్గొన్నారు. -
వందే గోమాతరం పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జూలై 10వ తేదీన పదివేల మందితో వందే గోమాతరం–2026 కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం వీసీ ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, ప్రైవేటు విద్యాసంస్థల అధినేతలు వందే గోమాతరం పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే భారీ అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 7799884561, విశ్వం సైనిక్ స్కూల్ 7013563928ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్ వెంకట నారాయణరావు, అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రధాన కో–ఆర్డినేటర్ ఆర్కే విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టి రామకృష్ణారెడ్డి, విశ్వం విద్యా సంస్థల డైరెక్టర్ ఎన్.విశ్వచందన్రెడ్డి, అన్నమయ్య డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు శ్రీరామ్ బాబు పాల్గొన్నారు. -
లీకేజీ కుంగదీసింది
మే 3న జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్ కావడంతో బాగా రాసిన విద్యార్థులు మానసికంగా కుమిలిపోయారు. దాని ప్రభావం రీ నీట్పై స్పష్టంగా కనిపించింది. రీ టెస్ట్ రాసిన విద్యార్థులు సంతోషంగా లేరు. కటాఫ్ మార్కులు వస్తేగానీ సీటు వస్తుందనే విషయంపై క్లారిటీ రాదు. –ప్రకాష్, నీట్ విద్యార్థి తండ్రి, తిరుపతి రీ నీట్పై ప్రభావం చూపింది నీట్ లీకేజీ వ్యవహరం రీ నీట్పై పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. మే 3న నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు మంచి ర్యాంక్ సాధించినా.. రీ నీట్లో మెరిట్ స్టూడెంట్ సైతం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులను నీట్ పరీక్ష వేదనతో పాటు ఒత్తిడికి గురిచేసింది. – అనుపమ, విద్యార్థిని తల్లి, తిరుపతి క్లిష్టంగా అనిపించాయి రీ నీట్ ప్రశ్నపత్రం కాస్త క్లిష్టంగా ఉందనే చెప్పాలి. బయాలజీ, కెమిస్ట్రీ చాలా సులువుగా ప్రశ్నలు ఇచ్చారు. గతంలో జరిగిన నీట్ పరీక్ష బాగా రాశా. రీ నీట్ పరీక్ష ఫలితాలు, కటాఫ్ మార్కులు తెలిస్తే సీటు విషయం చెప్పగలం. – తల్లి నాగమణితో విద్యార్థిని హాసిని, తిరుపతి చాలా కష్టమనిపించింది రీ నీట్ పేపర్ కిష్టంగా ఉంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్లో లెంతీ ప్రశ్నలు అడగడంతో టైమ్ వృథా అయ్యింది. మేలో జరిగిన పరీక్షతో పోలిస్తే రీ నీట్ పేపర్ కఠినంగా ఉంది. మంచి ర్యాంక్ కోసం చాలా కష్టపడ్డా. – తండ్రి మహ్మద్ రఫీతో విద్యార్థి రౌనఖ్, మదనపల్లి -
సీఎం సొంతూరులో అభివృద్ధికి ‘రాజకీయ గ్రహణం’
● వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రూ.9.32 కోట్లతో అభివృద్ధి ● నేడు పశువుల పాక, గడ్డివాములకు నిలయంగా ప్రభుత్వ భవనాలు ● తుడా పార్కును ధ్వంసం చేసి అక్రమంగా వరిసాగు సాక్షి టాస్క్ఫోర్స్: 2019–24 మధ్య కాలంలో కందులవారిపల్లి పంచాయతీ పరిధిలోని నారావారిపల్లితో పాటు ఇతర గ్రామాలన్నీ నవరత్నాలతో కళకళలాడాయి. నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చొరవతో చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లి, దానికి అనుబంధంగా ఉన్న గ్రామాల్లో రూ.9.32 కోట్లతో 87 అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలనే లక్ష్యంతో సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, కమ్యూనిటీ హాల్, ఆర్ఓ ప్లాంట్, హెల్త్ సెంటర్లను నిర్మించారు. గ్రామంలో ఎక్కడా మట్టి రోడ్లు అనేవే లేకుండా సీసీ రోడ్లను నిర్మించారు. ప్రభుత్వ నిధులతో పూర్తి చేసిన ఆ భవనాలను చంద్రబాబు పాలనలో గాలికొదిలేయడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వ భవనాలన్నీ అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదు. పశువులకు నిలయంగా.. సీఎం చంద్రబాబు బంధువులమంటూ కొందరు, అధికార పార్టీకి చెందిన మరికొంత మంది సచివాలయ భవనాన్ని పశువుల షెడ్డుగా వినియోగించుకుంటున్నారు. కమ్యూనిటీ హాల్ను గడ్డివాములుగా వాడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.1.50 లక్షలతో తుడా పార్కును అభివృద్ధి చేయగా.. సీఎంకు బంధువునంటూ మరో వ్యక్తి ఏకంగా పార్కును ఆక్రమించుకుని మరీ వరి సాగు చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే అధికారులపై సైతం దౌర్జన్యానికి పాల్పడుతూ, రాజకీయంగా బెదిరింపులకు దిగుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
యాత్రలకు రైల్వేశాఖ ప్రత్యేక టూర్ ప్యాకేజీ
తిరుపతి అన్నమయ్యసర్కిల్: యాత్రలకు వెళ్లే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీలో 3 ప్రత్యేక ప్యాకేజీలను ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు తిరుపతి ఏరియా ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ సోమశేఖర్ నాయుడు వెల్లడించారు. బుధవారం ఆయన స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణతో కలసి ప్యాకేజీ టూర్ బ్రోచర్ను విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. సౌకర్యాలు: ప్రతి రైలు లో 705 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోఆర్డినెటర్లు అందుబాటులో ఉంటారు. రైలు, బస్సు, హోటల్ అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం , రాత్రి భోజనం), తాగునీరు ఉచితం. ప్రతి కోచ్కు ఒక సెక్యూరిటీ గార్డ్, సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 9281495853, 8287932313 నంబర్లను సంప్రదించాలని చెప్పారు. దీంతోపాటు ఐఆర్సీటీసీ వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు. సమావేశంలో ఏరియా మేనేజర్ ఎస్. అశోక్ కుమార్ టూరిజం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తిరుమలలో మాక్ డ్రిల్
తిరుమల: తిరుమలలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేసే దిశగా బుధవారం అక్టోపస్ ప్రత్యేక బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. యాత్రికుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఎలా స్పందించాలనే అంశంపై ఈ విన్యాసా లు చేపట్టారు. జీఎంఎల్ యాత్రికుల వసతి సముదా యం వద్ద నిర్వహించిన మాక్ డ్రిల్లో కొందరు అసాంఘిక శక్తులు చొరబడ్డట్లు ఊహించి, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అక్టోపస్ బృందాలు, పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మాక్ డ్రిల్లో తిరుమల పోలీసులు, అక్టోపస్ బృందాలు, టీటీడీ విజిలెన్స్ విభాగం, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. -
నేనున్నానని!
– గాయపడిన విద్యార్థినికి అండగా ఎంపీ గురుమూర్తి వరదయ్యపాలెం: రోడ్డు ప్రమాదంలో గాయపడి కౌన్సెలింగ్కు హాజరు కాలేకపోయిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆర్.తేజస్వినికి సీటు దక్కేలా ఎంపీ మద్దిల గురుమూర్తి చొరవ తీసుకున్నారు. ఆర్జీయూకేటి ఛాన్స్లర్కు లేఖ రాసి మానవతా దృక్పథం చాటుకున్నారు. సత్యవేడు మండలం, మదనపాళెం గ్రామానికి చెందిన తేజస్విని పదో తరగతిలో 573 మార్కులు సాధించి ఆర్జీయుకేటీ ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించింది. జూన్ 22న ఇడుపులపాయలో కౌన్సెలింగ్కు వెళ్తుండగా తిరుపతి జిల్లా రాజంపేట సమీపంలోని పుల్లంపేట వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తేజస్విని రెండు వేళ్లు కోల్పోయింది. తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి కళాశాల ఛాన్స్లర్, ఏపీఎస్సీ హెచ్ఈ చైర్మన్ ప్రొ.కె.మధుమూర్తికి లేఖ రాశారు. కౌన్సెలింగ్కు హాజరు కాలేకపోయినా అడ్మిషన్కు అనుమతించాలని లేఖలో కోరారు. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. -
అటానమస్ హోదాలో సీకాం డిగ్రీ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: సీకాం డిగ్రీ కళాశాలల అటానమస్ హోదాలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఎస్వీయూలో వీసీ ప్రొఫెసర్ నర్సింగరావు, సీకాం విద్యాసంస్థల డాక్టర్ టి సురేంద్రనాథరెడ్డి, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సీకాం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మునిరాజ్ మాట్లాడుతూ.. డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో సీకాం విద్యార్థులు రికార్డు స్థాయిలో ఫలితాలను సాధించారన్నారు. ఫలితాలలో అన్ని డిగ్రీ కోర్సులలో 90శాతం ఉత్తీర్ణత సాధించామని చెప్పారు. బీకాం సీఏ విద్యార్థిని ప్రవళిక 9.56 సీజీపీఏ సాధించగా, బీకాం బీ అండ్ ఎఫ్ కోర్సులో రాఘవిశ్రీ 9.72, బీసీఏ డీఎస్లో జితశ్రీ 9.50, బీసీఏ ఏఐలో జ్యోతి 9.53, బీబీఏలో సాహితి 9.50, బీఎస్సీ సీఎస్లో పూజిత 9.48సీజీపీఏ సాధించడం సంస్థకు గర్వకారణమన్నారు. కార్యక్రమంలో అకడమిక్ కౌన్సిల్ మెంబర్ ప్రొఫెసర్ సుమా కిరణ్, గవర్నింగ్ బాడీ మెంబర్ ప్రొఫెసర్ మోహర్రెడ్డి, సీకాం డైరెక్టర్లు టి తేజస్వరూప్, టి ప్రణీత్ స్వరూప్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
రక్త బంధం..
సహాయక చర్యల్లో పోలీసులు, స్థానికులు ఆ నలుగురూ రక్త సంబంధీకులే. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం వారిది. బంధువుల పెళ్లికని సంతోషంగా ఆటోలో బయల్దేరారు. అందరికన్నా ముందు తామే ఉండాలని ఉబలాట పడ్డారు. కానీ వారి ఆనందం ఆవిరయ్యింది. మార్గ మధ్యంలో లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని పొట్టనబెట్టుకుంది. వారిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిలింది. ఈ ఘటన పాకాల మండలం, గుంతగాందంకి వద్ద బుధవారం చోటుచేసుకుంది. దారి కాచిన మృత్యువు ముందుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా సిగ్నల్ ఇవ్వకుండా ఆగిపోవడంతో వెనుక వస్తున్న ఆటో లారీని బలంగా ఢీకొట్టింది. ఆటో ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్ పక్కన కూర్చున్న రాజశేఖర్ చనిపోగా.. సూర్యబాబు ప్రాణాలతో బయటపడ్డాడు. అలాగే వెనుక కూర్చున్న మాధవి, మేఘన, బేబి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. మధ్యలో ఉన్న వ్యక్తులు మాత్రం రక్తగాయాలతో బయటపడ్డారు. లారీ ఢీకొట్టిన సమయంలో ఆటోలో ఇరుక్కపోయి ఇద్దరు..విగతజీవులు కనిపించారు. క్షత్రగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. మృతదేహాలు, క్షత్రగాత్రులను తిరుపతి రుయాకు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రెండు గ్రామాల ప్రజలు హుటహుటిన తిరుపతి రుయా ఆస్పత్రికి పరుగులు పెట్టారు. పెళ్లి బాజాలు చూడకనే..! పెళ్లి వేడుకకు వెళ్లేందుకు మాధవి తమ్ముడు ఆటోను ఏర్పాటు చేశాడు. మాధవి కొడుకు, కూతురిని తీసుకుని తమ్ముడి పిలుపు మేరకు పెరుమాళ్లపల్లి గ్రామానికి చేరకుంది. అక్కడి నుంచి మాధవి తమ్ముడు, తల్లి, తండ్రితో పాటు బంధువులు కలిసి గంగాధరనెల్లూరు మండలం నెల్లేపల్లి గ్రామానికి చెందిన సుబ్రమణ్యం ఆటోలో పెళ్లి వేడుకకు బయలుదేరారు. మాధవి భర్తను ఇంటివద్దే వదిలేసి, పిల్లలు, బంధువులతో కలిసి బయల్దేరింది. కానీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వారి ప్రయాణం శాశ్వతంగా ఆగిపోయింది. నుజ్జునుజ్జు అయిన ఆటోకాణిపాకం: దారి కాచిన మృత్యువు ఆ కుటుంబాన్ని చిదిమేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని మృత్యుఒడికి చేర్చింది. పాకాల మండలం, గుంతగాదంకి ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన యాదమరి, చిత్తూరు రూరల్ మండలాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాలు.. చిత్తూరు మండలం, ఏనుగుంట్లపల్లి గ్రామానికి చెందిన మాధవి బావ కొడుకుకి తిరుపతి జిల్లా, రామచంద్రాపుర మండలంలో గురువారం ఉదయం 5–6గంటల మధ్య పెళ్లి జరనుంది. ఈ పెళ్లికి మాధవి, కుమార్తె, కుమారుడుతో పాటు మాధవి తల్లి, తమ్ముడు, తండ్రితో పాటు బంధువులు బయలు దేరారు. బుధవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో గుంత గాదంకి సమీపంలో మృత్యువు కబలించింది. పొట్టన పెట్టుకున్న లారీ చిత్తూరు మండలం, ఏనుగుంట్లపల్లి గ్రామానికి చెందిన కన్నయ్య కుటుంబం కూలినులతో జీవనం సాగిస్తోంది. కన్నయ్య భార్య మాధవి (37) దినసరి కూలీ. వారి కుమార్తె మేఘన (15) పలమనేరులోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మాధవి తల్లి యాదమరి మండలం, పెరుమాళ్లపల్లి గ్రామానికి చెందిన బేబి(54), అలాగే ఆమె కుమారుడు రాజశేఖర్ (22) కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. మాధవి కుమారుడు సూర్యబాబు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతను పీలేరు సంక్షేమ హాస్టల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మరికొందరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆర్థిక కష్టాల మధ్య విషాదం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని మాధవి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కుమార్తెను వెంట తీసుకెళ్లి పెళ్లిలో పాల్గొనాలన్న ఆ తల్లి ఆశ.. చివరకు విషాదంగా ముగిసింది. కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్న మాధవి మరణంతో భర్త కన్నయ్య, కుమారుడు సూర్యబాబు కన్నీరుమున్నీరవుతున్నారు. రాజశేఖర్కు తన అక్క కూతురిని కట్టబెట్టాలని చూసిన తల్లి బేబి కల నెరవేరకుండానే పోయింది. చాముండేశ్వరిగ్రామంలో విషాదం మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ప్రభుత్వ సహాయం అవసరమని గ్రామస్తులు కోరుతున్నారు. దహన సంస్కారాలపై కూడా గ్రామస్తులు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. పెళ్లి జరగాలా లేదా అన్నది కూడా ఇంకా అనిశ్చితంగానే ఉంది. పెళ్లి ఆనందం కోసం బయలుదేరిన ఆ కుటుంబం చివరకు శవాలుగా తిరిగి రావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుబ్రమణ్యంపాకాల మండలం గుంతగాదంకి వద్ద ఘోర ప్రమాదం -
దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు
తిరుపతి క్రైం : తిరుపతి జిల్లా ఏర్పేడు మండల పరిధిలోని శ్రీకాళహస్తి–తిరుపతి జాతీయ రహదారి (ఎన్హెచ్–71)పై అంజిమేడు బస్స్టాప్ సమీపంలోని దీప్ పంజాబీ దాబా వద్ద జరిగిన రూ.15 లక్షల నగదు దోపిడీ కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఆర్ల శ్రీనివాసులు కేసు వివరాలను వెల్లడించారు. జూన్ 15న ఫిర్యాదుదారు రవీంద్రరెడ్డి అలియాస్ వేణు తన వద్ద ఉన్న రూ.15 లక్షల నగదుతో ప్రయాణిస్తుండగా, నిందితులు అతడిని అడ్డగించారు. అనంతరం కత్తితో బెదిరించి నగదును అపహరించడంతో పాటు అతనితో ఉన్న బాబురెడ్డిని ఇన్నోవా వాహనం నుంచి బలవంతంగా దింపివేసి పరారైనట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఏర్పేడు పోలీసులు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు పర్యవేక్షణలో, రేణిగుంట ఎస్డీపీవో వై. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించారు. దర్యాప్తులో భాగంగా జూన్ 23 సాయంత్రం ఏర్పేడు మండలం, నీలాద్రి అపార్ట్మెంట్స్ సమీపంలో తనిఖీలు నిర్వహించి కేసులోని ఏ–2 నుంచి ఏ–9 వరకు ఉన్న ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి దోచుకున్న నగదులో భాగంగా రూ.3 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నేరానికి వినియోగించిన ఒక ఇన్నోవా వాహనం, రెండు స్విఫ్ట్ డిజైర్ కార్లు, ఒక స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రధాన నిందితురాలు లకీ్ష్మ్కాంతమ్మ పరారీలో ఉండగా, ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పలు జిల్లాలకు చెందిన ముఠా దర్యాప్తులో నిందితులు కర్ణాటక రాష్ట్రంతో పాటు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు చెందిన వారుగా గుర్తించారు. వీరిలో కొందరిపై గతంలో మోసం, దోపిడీ, దొంగతనం తదితర కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసు బృందానికి అభినందనలు కేసును ఛేదించడంలో ఏర్పేడు సీఐ బి.శ్రీకాంత్రెడ్డి, ఎస్ఐలు ఎన్.శ్రీకాంత్ రెడ్డి, కె.రవిప్రకాష్తో పాటు పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషించారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన బృందాన్ని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు అభినందించారు. -
సిద్ధరామిరెడ్డి సేవలు చిరస్మరణీయం
భాకరాపేట : సమాజాభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన వలసారెడ్డి సిద్ధరామిరెడ్డి సేవలు చిరస్మరణీయమని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చిన్నగొట్టిగల్లు మండలంలో నూతనంగా నిర్మించిన వలసారెడ్డి సిద్ధరామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సొంత నిధులతో కళాశాల భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించడం సిద్ధరామిరెడ్డి కుటుంబం సామాజిక బాధ్యతకు నిదర్శనమన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ... విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ సమాజ సేవకు సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్న సిద్ధరామిరెడ్డి కుటుంబ సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. వలసారెడ్డి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, తమ తండ్రి సిద్ధరామిరెడ్డి ప్రజా సేవనే జీవిత లక్ష్యంగా భావించారని తెలిపారు. భూమిపూజ మాటున దౌర్జన్యం పెళ్లకూరు: చిల్లకూరులో తమ నివాసం పక్కన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు మాటున పోలీసుల సాక్షిగా రెచ్చగొడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామంలో రాజకీయ కక్ష్యలతో గొడవలకు పురిగొల్పుతూ దువ్వూరు రాకేష్రెడ్డి, శిరసనంబేటి చైతన్య కృష్ణారెడ్డి, నర్రావుల లోకేష్నాయుడుతో పాటు పలువురు గ్రామస్తులు, వివిధ ప్రాంతాలకు చెందిన కూటమి నాయకులు తమ ఇంటి పక్కన స్థలంలో దౌర్జన్యంగా భూమిపూజ చేయడంపై బుధవారం బాధితురాలు కామిరెడ్డి ప్రభావతమ్మ స్థానిక పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. తమ ఇంటి పక్కన ఉన్న స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా విగ్రహ ప్రతిష్ట కోసం గుంతలు తీసి భూమిపూజ చేశారని, ఇలాంటి దౌర్జన్యకారులకు స్థానిక ఎస్సై, సీఐ తమ సిబ్బందితో ప్రత్యేక మద్దతు ఇవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి పక్కన ఉన్న స్థలంలో భూమిపూజ చేసిన దౌర్జన్యకారులతోపాటు పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మటన్ మార్కెట్పై సమగ్ర విచారణకు ఆదేశం తిరుపతి తుడా: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మటన్ మార్కెట్లో ఇటీవల జరిగిన తనిఖీలు, దినపత్రికలలో ప్రచురించిన వార్తలను అనుసరించి సమగ్ర విచారణ జరిపి నివేదికను నాలుగు వారాలలో సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఈ మేరకు త్రి సభ్య కమిటీ బుధవారం పీపీ చావిడి వద్ద నున్న మటన్ మార్కెట్ను పరిశీలించారు. మార్కెట్లో వ్యాపారులను విచారించి అందులో ఐదు షాపుల యజమానులపై కేసులు నమోదుకు సిఫార్సు చేసినట్లు కమిటీ తెలిపింది. మిగిలిన ఏడు షాపుల యజమానులకు నాణ్యమైన మటన్ మాత్రమే విక్రయించాలని ఫ్రిజ్లో రోజు తరబడి నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వెటర్నరీ డాక్టర్ పరీక్షలు నిర్వహించి సీల్ వేసిన మటన్ను మాత్రమే విక్రయించాలని సూచించారు. మున్సిపల్ అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చేవరకు మార్కెట్లో మటన్ క్రయావిక్రయాలు జరపరాదని హెచ్చరించారు. టీటీడీ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ – 500 గ్రాముల బంగారం, కేజీ వెండి అపహరణ తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని వెంకటపతి నగర్లో బుధవారం భారీ చోరీ ఘటన కలకలం రేపింది. టీటీడీ ఉద్యోగిగా పనిచేస్తున్న యశోదమ్మ ఇంట్లో సుమారు 500 గ్రాముల బంగారు నగలు, కిలో వెండి వస్తువులు చోరీకి గురైనట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనలో బాధితురాలి మనవరాలు సోనియాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల కథనం మేరకు.. వెంకటపతి నగర్లో నివాసం ఉంటున్న యశోదమ్మ (62) ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 12.50 గంటలకు తిరుపతి నగరంలో షాపింగ్ కోసమని వెళ్లి రాత్రి 9గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటికే గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి ముందున్న గేటు, తాళాలను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లోని బీరువాలో భద్రపరిచిన సుమారు 500 గ్రాముల బంగారం ఆభరణాలు, ఒక కిలో వెండి వస్తువులు అపహరించుకు వెళ్లారు. బాధితురాలు యశోదమ్మ ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ సీఐ మద్దయ్య ఆచారి తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని వేలి ముద్రలు సేకరించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ను కూడా రంగంలోకి దించారు. ఈ సందర్భంగా యశోమ్మ మనవరాలు సోనియా ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం కావడంతో ఆ దిశగా విచారణ చేస్తున్నారు. వాషింగ్ మిషన్లో తాళం యశోదమ్మ ఎప్పుడు బయటకు వెళ్లాలన్నా ఇంటి ప్రధాన తలుపు తాళం బయటే వున్న వాషింగ్ మిషన్లో పెట్టడం అలవాటు. గేటు తాళం విరిచినప్పటికీ ప్రధాన తలుపు తాళం విరచకుండా లోపలికి బయటి వ్యక్తులు ఎవ్వరు ప్రవేశించలేరని గుర్తించిన పోలీసులు కుటుంబీకులను ఒక్కొక్కరిగా పిలిపించుకుని విచారణ చేపట్టారు. కుటుంబంలో అనుమానితులను ఆరా తీయగా సోనియా పేరు బయటకు వచ్చింది. ఆమెను స్టేషన్కు తరలించి తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు. -
రీ నీట్ క్లిష్టమే!
●ఫిజిక్స్ పీడించిందంటున్న విశ్లేషకులు తిరుపతి సిటీ: రీ నీట్ పరీక్షపై లీక్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. విద్యార్థులు ఆశించిన స్థాయిలో రీనీట్ పరీక్షను ఎదుర్కొలేకపోయారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మానసింగా ఒత్తిడికి గురికావడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. రీ నీట్ పరీక్ష పేపర్ అనుకున్నంత ఈజీగా లేదని.. కష్టతరంగానే ఇచ్చారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బయాలజీ మాత్రమే కాస్త సులువగా ఉందని, ఫిజిక్స్లో ప్రశ్నలు సుదీర్ఘంగా చదివేందుకే చాలా సమయం పట్టిందని చెబుతున్నారు. కెమిస్ట్రీలో కొన్ని ప్రశ్నలు మాత్రమే మాదిరిగా ఉన్నాయని, మిగిలినవి కఠినంగా సాధారణ విద్యార్థి ఎదుర్కొలేని విధంగా ఉన్నాయని వాపోతున్నారు. మొత్తం మీద గతనెల మే 3న జరిగిన పరీక్ష కంటే ఆదివారం జరిగిన రీ నీట్ పరీక్ష ప్రశ్నపత్రం చాలా కష్టమేనని నిపుణులుసైతం విశ్లేషిస్తున్నారు. ఫిజిక్స్ కొంపముంచిందా! ప్రధానంగా ఫిజిక్స్ విద్యార్థులను ఇబ్బంది పెట్టింది. సుదీర్ఘమైన ప్రశ్నలు అడగడం, ఇంటర్ స్థాయికి మించి విశ్లేషణాత్మక ప్రాబ్లమ్స్తో ప్రశ్నలు రావడం ప్రశ్నను అర్థం చేసుకునేందుకే సమయం తీసుకునేసింది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ సైతం పూర్తి స్థాయిలో ఫిజక్స్ ప్రశ్నలకు సరైన సమాధానాలు పెట్టలేకపోయారని నీట్ ఎక్స్ఫర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. బయాలజీలో మాత్రమే విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. కెమిస్ట్రీలో సాధారణ విద్యార్థి 40శాతం, మెరిట్ విద్యార్థులు 75శాతం ప్రశ్నలను ఎదుర్కొనే స్థాయిలో ప్రశ్నలు వచ్చాయని అంటున్నారు. 2025 నీట్ ప్రశ్నపత్రంలా రీ నీట్ పేపర్ ఉందని, మార్కుల కటాఫ్ సైతం అదే స్థాయిలో ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మే 3న నీట్ బాగా రాశా ఎలాగైనా ఎంబీబీఎస్ సీటు సాధించాలని ఎంతో కష్టపడి నీట్ పరీక్షకు కోచింగ్ తీసుకుని చదివాను. మే 3న జరిగిన పరీక్ష చాలా బాగా రాశాను. సీటు పక్కా అనుకుంటున్న సమయంలో పేపర్ లీకేజ్ కారణంగా నీట్ రద్దు చేశారు. ఆదివారం రీ నీట్ పరీక్షకు హాజరయ్యాను. కానీ ఫిజిక్స్ చాలా ఇబ్బంది పెట్టింది. మేలో జరిగిన పరీక్ష ప్రశ్నాపత్రం మాదిరిగా ఉంది. – విద్యార్థిని తోరణితో తండ్రి ఎలుమలై, పుత్తూరు -
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 83,235 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,745 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకలు రికార్డు స్థాయిలో హుండీలో రూ.5.18 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. రేపటి నుంచి తపన ఎక్స్పో తిరుపతిఅన్నమయ్యసర్కిల్: తిరుపతి ప్రాచీన తపాలా బిళ్లలు, నాణేల సేకరణకు సంబంధించిన తపన ఎక్స్ పో ప్రదర్శన శనివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు భీమవరం చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. తిరుచానూరు రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయం ఎదురుగా శ్రీ బాలాజీ కల్యాణమండపం వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సేకరణ కర్తలు, పరిశోధకులు, డీలర్లు, అరుదైన చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నాణ్యాలు, కరెన్సీ నోట్లు, తపాల బిళ్లలు, ఈ ఎక్స్ పోలో ప్రదర్శించన్నుట్లు తెలిపారు. తిరుపతిలో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం తిరుపతి తుడా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో త్వరలో తిరుపతిలో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని రుయా సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కృత్రిమ అవయవాల తయారీ యూనిట్కు సుమారు 3వేల చదరపు అడుగుల స్థలం అవసరమవుతుందని అంచనా వేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్కు చెందిన డాక్టర్ రష్మీరంజన్సేథీ బృందం రుయాసుపత్రి ఆర్థోపెడిక్ విభా గం వెనుకనున్న స్థలాన్ని, పాత మెటర్నరీ క్వార్టర్స్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించిందని చెప్పారు. త్వరలో ఢిల్లీ బృందం పర్యటన ఉంటుందని, అ నంతరం తుది నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు. -
మట్టి..కొల్లగొట్టి
సత్యవేడు: మండలంలో మట్టిదోపిడీ మొదలైంది. చెన్నేరి పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీ సమీపంలో క్వారీ అనుమతి పొంది వేరొకచోట గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. రోజూ వందలాది టిప్పర్లతో రూ.లక్షల విలువైన మట్టి తమిళనాడుకు వెళ్లిపోతోంది. అడ్డుపడిన గ్రామస్తులను పట్టించుకోవడం లేదు. అధికారులనూ లెక్కచేయడం లేదు. గ్రావెల్ మాఫియాకు టీడీపీ నేతలు అండగా నిలవడంతోనే ఈ దందా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతి ఒక చోట..తవ్వేది మరో చోట చెన్నేరి పంచాయతీ పరిధిలో సర్వే నం.82, 83లో 2.42 ఎకరాల మేర తమిళనాడు చెందిన ఓ వ్యక్తి మట్టి క్వారీకి అనుమతి పొందారు. కానీ గ్రావెల్ తవ్వకాలు సర్వే నం.86లో జరుపుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా కన్నెతి చూడడం లేదు. కాలనీకి ముప్పు చేన్నేరి వద్ద ఇల్లులేని నిరుపేదలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సుమారు 20 మందికి పైగా పట్టాలు మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ కాలనీలో కొంత మంది ఇళ్లు కూడా నిర్మించుకుని నివాసాలున్నారు. ఈ ఇళ్లకు 15 అడుగుల దూరంలో మట్టి క్వారీ కొనసాగుతోంది. అందులో 20 అడుగుల లోతు వరకు పెద్ద పెద్ద గుంతలు తీసేశారు. జగనన్న కాలనీలో విద్యుత్ సౌకర్యం, నీటి వసతికి కోసం బోరు కూడా ఏర్పాటు చేశారు. ఈ మట్టి తవ్వకాల వల్ల వర్షాలప్పుడు తమ నివాసాలకు ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు నిత్యం వందలాది టిప్పర్లు తమ కాలనీ మీదుగా మట్టి తరలిస్తుండడంతో రోడ్డు గుంతలమయంగా మారిందని వాపోతున్నారు. క్వారీ గోతుల్లో ఊటనీరు చెన్నేరి జగనన్న కాలనీ సమీపంలో గ్రావెల్ తవ్వకాలు తెర వెనుక తమ్ముళ్లు చెన్నేరి జగనన్న కాలనీ వద్ద గ్రావెల్ దందా వెనుక ఓ వర్గం టీడీపీ నేతలు ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నాయకుల అండదండలతో తమిళనాడుకు మట్టి అక్రమ రవాణా జరుగుతోందని పేర్కొంటున్నారు. అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా అనుమతులు తీసుకుని గ్రావెల్ దోపిడీకి పాల్పడుతున్నట్టు ఆరోపిస్తున్నారు. -
ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఉషారాణి..!
రేణిగుంట: తాను సహజీవనం చేసిన మహిళ మోసకారి అని తెలుసుకుని దూరం పెట్టగా, కక్ష పెంచుకున్న ఆ మహిళ బ్లాక్ మెయిల్ చేసి వేధించడంతో రేణిగుంటలోని సీఆర్ఎస్ ఉద్యోగి రవి (36) ఉరివేసుకొని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం.. తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన కిల్లి రవి రేణిగుంట సమీపంలోని సీఆర్ఎస్లో ఉద్యోగం చేస్తూ బుగ్గ వీధిలోని ఓ ఇంట్లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన ఓ మహిళ పరిచయమైంది. ఆ మహిళతో మూడేళ్లుగా సన్నిహితంగా ఉన్నాడు. గతంలో మహిళకు మూడు పెళ్లిళ్లు జరిగిన విషయం గ్రహించిన రవి ఆమెని దూరం పెట్టాడు. ఇది జీర్ణించుకోలేని మహిళ సీఆర్ఎస్లోని ఉద్యోగానికి నామినీగా తన పేరును చేర్చాలని, అదేవిధంగా కోటి రూపాయలు తనకు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఆమెకు తిరుపతిలోని వామపక్ష నాయకులు అండగా నిలిచి అతనిని మానసికంగా వేధించారు. ఈ వేధింపులు తాళలేక గతంలో అనేకసార్లు మీడియా ముందు తన బాధను వెల్లడించాడు. అయినా ఆమె వేధింపులు తీవ్రం అవడంతో చేసేదేమీ లేక మంగళవారం తాను కాపురం ఉన్న బాడుగ ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందాడు. అంతకు ముందు సూసైడ్ నోట్ రాసి, సూసైడ్ నోటును తన సహచర ఉద్యోగస్తులకు, తమ్ముడికి వాట్సాప్ ద్వారా పంపించారు. సూసైడ్ నోట్లో తన చావుకు ఉషారాణి, విజయలక్ష్మి , రాధాకృష్ణ అనేవారు కారణమని వారిపై పోలీసులకు నేను గతంలో ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి వారికి శిక్ష పడేటట్టు చేయాలని కోరాడు. రేణిగుంట అర్బన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వా«దీనం చేసుకొని, విచారణ చేపట్టారు. -
● 64 మందికి సుప్రభాత సేవా టికెట్లు ఇప్పిస్తామని మోసం ● భూమన ఆగ్రహం
టీటీడీలో దళారీ రాజ్యం తిరుపతి మంగళం : టీటీడీలో అవినీతి, దళారీ వ్యవస్థలు రాజ్యమేలుతున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై మంగళవారం ఆయన తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే టీటీడీలో ప్రక్షాళన చేసి శ్రీవారి పవిత్రతను పెంపొందిస్తామంటూ గొప్పలు చెప్పారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల పాలనలో చంద్రబాబు, పవన్కళ్యాణ్, బీఆర్ నాయుడు టీటీడీని భ్రష్టుపట్టించి శ్రీవారిని అపవిత్రం చేస్తూ భక్తుల మనోబావాలు దెబ్బతినేలా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది నిజం కాదా? నిన్నటి రోజున గుంటూరుకు చెందిన 64 మందికి సుప్రభాత సేవ ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి చేత రూ.6వేల చొప్పున సుమారు రూ.4 లక్షలు వసూలు చేసి వారికి దర్శనం కల్పించకుండా దళారులు మోసం చేశారంటే టీటీడీలో దళారీ వ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థమవుతుందని భూమన తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ లేఖతో పాటు ఆరుగురు టీటీడీ ఉద్యోగుల పేరుపై శ్రీవారి సుప్రభాత సేవా టికెట్లను పొందినట్లు బాధితులు చెబుతున్నారన్నారు. దర్శనాల కోసం దళారులకు ఫోన్పే చేసి ఆధారాలు కూడా స్పష్టంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రెండేళ్ల కూటమి పాలనలో టీటీడీని ప్రక్షాళన చేశామని, భక్తులకు ఎనలేని సేవలందిస్తున్నామని చెప్పారన్నారు. అయితే ఆయన ఈ విషయాలు చెప్పిన మరుసటి రోజే తిరుమలలో ఇలా జరిగిందన్నారు. టీటీడీలో అవినీతి, అధిక ధరలకు శ్రీవారి దర్శన టికెట్లను దళారీలు విక్రయించుకునేందుకు అవసరమైన ప్రక్షాళన చేశారే తప్ప భక్తుల సౌకర్యార్థం ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీటీడీకి రూ.10 లక్షల విరాళం
వేధింపులతో చంపేసింది!తిరుమల: టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు మంగళవారం హైదరాబాద్కు చెందిన కల్లా సత్య రిషబ్ రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరికి విరాళం డీడీని అందజేశారు. -
సేవల్లో మనమే ఫస్ట్
తిరుపతి మంగళం : ప్రజలకు విశేష సేవలందించడంలో తిరుపతి జిల్లా రవాణాశాఖ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండడం గర్వకారణమని జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. తిరుపతి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో మంగళవారం విశేష సేవలందించిన మోటారు వాహన తనిఖీ అధికారులు చంద్రశేఖర్, దామోదర్నాయుడును ఆయన ఘనంగా సత్కరించి, మెమెంటోలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తిరుపతి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాలను అంచనా వేయడానికి నిర్వహించిన ఫీడ్బ్యాక్ వ్యవస్థలో తిరుపతి జిల్లా రవాణాశాఖ రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు ప్రథమ స్థానం పొందడం విశేషమన్నారు. అందులో పుత్తూరు మోటారు వాహన తనిఖీ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పుత్తూరు మోటార్ వాహనాల తనిఖీ అధికారి కార్యాలయం గత రెండు నెలలుగా వందశాతం పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ నమోదయ్యిందని, అలాగే శ్రీకాళహస్తి మోటారు వాహన తనిఖీ అధికారి దామోదరనాయుడు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి కార్యాలయం 96శాతం పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ నమోదయిందని తెలిపారు. ఎంవీఐలు సుబ్రమణ్యం, శ్రీనివాసరావు, అతికానాజ్, స్వర్ణలత, ఏవోలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్ఎస్యూలో ప్రవేశాలకు రేపే తుది గడువు తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు కోసం దరఖాస్తు చేసుకోవడానికి గురువారంతో గడువు ముగియనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పాక్శాస్త్రి కోర్సులతో పాటు, యూజీ(శాస్త్రి) 3, 4 సంవత్సరాల కోర్సుల్లోనూ, అలాగే 17 విభాగాల్లో పీజీ (ఆచార్య) 1, 2 సంవత్సరాల కాలవ్యవధి కోర్సుల్లోనూ, పీహెచ్డీ (విద్యావారధి) కోర్సుల్లోనూ ప్రొఫెషనల్ కోర్సులైన ఐటీఈపీ (బీఏ, బీఈడీ), బీఈడీ (శిక్షా శాస్త్రి), ఎమ్ఈడీ (శిక్షా ఆచార్య) కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తుల గడువు గురువారంతో ముగియనుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 7382595500, 7382585500 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. -
హానికరమైన మటన్ విక్రయం
– ఐదుగురు వ్యాపారులపై కేసు నమోదు తిరుపతి క్రైం:తిరుపతిలోని పీపీచావడి సమీపంలో ని మటన్ మార్కెట్లో ఆరోగ్యానికి హానికరమైన మటన్ను నిల్వ ఉంచి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఐదుగురు వ్యాపారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పీపీచావడి మట న్ మార్కెట్లో కొందరు వ్యాపారులు ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా నాసిరకం మటన్ను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపా రు. ఈ ఫిర్యాదును ఆధారంగా తీసుకుని తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఐదుగురు వ్యాపారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఉద్యోగాల పేరుతో మోసం తిరుపతి క్రైం : తిరుపతిలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి, యువత నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం.. తిరుపతికి చెందిన అయ్యప్ప అనే వ్యక్తి ఏఆర్ టెక్ వేవ్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులను సంప్రదించి, ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఉద్యోగాల కోసం వచ్చిన పలువురి నుంచి డబ్బులు తీసుకుని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ పేరుతో నకిలీ ఆఫర్ లెటర్లు అందజేశాడు. ఈ విధంగా మొత్తం 18 మంది యువకుల నుంచి సుమారు రూ.10 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో పాటు, డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో తాము మోసపోయినట్లు గుర్తించి జిల్లా ఎస్పీని ఆశ్రయించినట్లు బాధితులు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు కేసును ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలంకు బదిలీ చేసి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. -
మానవత్వం చాటుకున్న కలెక్టర్
తిరుపతి అన్నమయ్యసర్కిల్: కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మానవత్వం చాటుకున్నారు. కరకంబాడి సమీపంలోని బీసీ కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన నలుగురు దివ్యాంగులకు రూ.2 లక్షల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సోమవారం తిరుపతి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గంప పరశురామయ్య, గంప మునెమ్మ దంపతుల సంతానం అయిన గంప చంద్రశేఖర్, గంప రాజేశ్వరి, గంప రవి, అదే కుటుంబానికి చెందిన దేరంగుల వీరభద్రలు తమ దయనీయ పరిస్థితిని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కుటుంబంలో నలుగురు సభ్యులు మానసిక, శారీరక దివ్యాంగులుగా ఉండడంతో కలెక్టర్ చలించిపోయారు. వారి పరిస్థితిని తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి, తక్షణ సాయంగా రూ.2 లక్షల చెక్కును అందజేశారు. ఈ నలుగురికీ పెన్షన్, సదరం సర్టిఫికెట్స్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, శ్రీజనతా సేవా మిత్ర హెల్పింగ్ హాండ్స్ సభ్యులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్కు వెళ్తూ..
వరదయ్యపాళెం: కళ్లనిండా ట్రిపుల్ ఐటీ కలలు.. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో కౌన్సెలింగ్కు బయలుదేరిన ఆ చిరునవ్వు ఒక్క క్షణంలో మూగబోయింది. సత్యవేడు మండలం, మాదనపాళెంకు చెందిన ఆర్.తేజస్విని పదో తరగతిలో 573 మార్కులతో మెరిసింది. పేద కుటుంబం నుంచి వచ్చినా పట్టుదలతో చదివి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. తమ బిడ్డ జీవితం మారబోతోందన్న ఆనందంతో తల్లిదండ్రులు సోమవారం కౌన్సెలింగ్కు బయలుదేరారు. తెల్లవారుజామున రాజంపేట సమీపంలోని పుల్లంపేట వద్ద వారు ప్రయాణిస్తున్న బస్సును లారీ ఢీకొట్టడంతో ఆ కలల ప్రయాణం ఆగిపోయింది. ఈ ప్రమాదంలో తేజస్వినికి రెండు చేతివేళ్లు తెగిపోగా, కాలుకి తీవ్ర గాయమైంది. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెతో పాటు వెళ్లిన తల్లిదండ్రులు కూడా గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. తేజస్వీనికి నేరుగా సీటు ఇవ్వాలి ప్రభుత్వం స్పందించి కౌన్సెలింగ్కు హాజరు కాలేకపోయినా తేజస్వినికి నేరుగా కౌన్సెలింగ్ లేకనే సీటు ఇవ్వాలని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ఆమె కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కోరుతున్నారు. దీనిపై నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సైతం ప్రత్యేక చొరవ చూపాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అనంత లోకాలకు చదువుల తల్లిపుల్లంపేట: మండల పరిధిలోని ఉడుంవారిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చదువుల తల్లి కలవకుంట్ల.యశ్విత (16) ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్కు వెళుతూ అనంతలోకాలకు చేరింది. శ్రీకాళహస్తికి చెందిన యశ్విత సోమవారం ఇడుపులపాయలో కౌన్సెలింగ్ ఉండడంతో తండ్రి దినకర్, సోదరి రమ్యశ్రీతో కలిసి బయలుదేరింది. కాగా ప్రమాదంలో యశ్విత మృతి చెందగా తండ్రి దినకర్కు కుడికాలు విరిగిపోయింది. సోదరి రమశ్రీ తలకు బలమైన గాయమైంది. ఒకే ఇంట్లో ఒకరి మరణం, ఇరువురు గాయాలతో ఆస్పత్రి పాలవడంతో తీవ్ర విషాదాన్ని నింపింది. -
అర్జీదారులనే అనుమానిస్తారా?
తిరుపతి రూరల్: తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గ్రీవెన్స్కు వచ్చిన ప్రజలను అడ్డుకుని సవాలక్ష ప్రశ్నలతో చుక్కలు చూపించారు. కొందరి వినతిపత్రాలను తీసుకుని చదివి, వాటి విషయాలు తెలుసుకున్న తర్వాతే లోపలికి అనుమతించారు. అర్జీలు పరిశీలించే అధికారం జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు మాత్రమే ఉంటుందని, గేటు వద్ద నిలబడ్డ పోలీసులకు కాదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్దతుగా నిలిచినందుకు అరెస్ట్ తమ రిటైర్డ్మెంట్ డబ్బుతో కొన్న భూమిని నకిలీ రిజిస్ట్రేషన్లతో డెవలపర్స్కు అప్పగించేశారని, ఆ భూమిని తమకు తిరిగి ఆన్లైన్ చేయాలని రిటైర్డ్ ఆర్టీఓ ద్వారకనాథరెడ్డి, ఆయన భార్య వనజాక్షి కలెక్టరేట్కు వచ్చారు. వీరికి చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐరాల లోకేష్రెడ్డి మద్దతుగా నిలిచారు. ప్రధాన గేటు వద్ద ఆయన కారును ఆపిన పోలీసులు తన చేతిలోని అర్జీ తీసుకుని లోనికి అమతించేందుకు అభ్యంతరం తెలిపారు. ఇంతలో మరో ఎస్ఐ అక్కడకు చేరుకుని ఆయనపై అమర్యాదగా వ్యవహరిస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన గేటు వద్దనే బైఠాయించారు. ఆ తర్వాత అతన్ని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అలాగే వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ తమకు అన్యాయం చేస్తున్నారని కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్న వారిని నిబంధనల పేరుతో వేధించడం విమర్శలకు తావిచ్చింది. ప్రజలను అనుమానించడం దారుణం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాంటి వాటిని వెంట తెచ్చుకుని ఆత్మహత్యాయత్నాలకు పాల్పడతారన్న అనుమానంతో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు వచ్చిన ప్రతి అర్జీదారుడ్నీ అనుమనంగా చూడడం, అత్యుత్సాహంతో ప్రజలను సవాలక్ష ప్రశ్నలతో వేధించడం కనిపించింది. ‘మా సమస్యలు కలెక్టర్కు చెప్పుకోవడానికి వచ్చాం. గేటు వద్ద పోలీసులకు వివరాలు చెప్పాల్సిన అవసరం ఏమిటి?’ అంటూ పలువురు ప్రశ్నించడం కొసమెరుపు. -
సీఎం పర్యటనకు స్థల పరిశీలన
ఏర్పేడు: జూలై 1వ తేదీన జరగనున్న ఉపాధి హామీ పథకం పేరు మార్పు కార్యక్రమం సభాస్థలికి సోమవారం మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ షణ్ముఖ్కుమార్, రాష్ట్ర చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి గోపిచంద్ అధికారులతో కలసి సోమవారం స్థల పరిశీలన చేశారు. ఏర్పేడు మండలం మేర్లపాక, పల్లంతోపాటు శ్రీకాళహస్తి మండలం ఇలగనూరు, రేణిగుంట మండలం ఎల్లమండ్యం సమీపంలో సభాస్థలి కోసం స్థలాన్ని పరిశీలించారు. మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం వీబీజీ రామ్జీగా పేరు మార్పింది. అయితే ఈ పేరు మార్పు అధికారికంగా ప్రకటించేందుకు కేంద్రం జూలై 1వ తేదీన తిరుపతి జిల్లాలో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పెద్దలతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా హాజరు కానున్నారు. దీంతో కార్యక్రమ నిర్వహణకు స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో డీపీవో సుశీలాదేవి, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్రెడ్డి, జిల్లా డ్వామా ఏపీడీ వరప్రసాద్, ఏర్పేడు ఎంపీడీవో సౌభాగ్యం, డిప్యూటీ తహసీల్దార్ ప్రేమ్సాయి శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో రమణకుమార్, కేకే రమణ తదితరులు పాల్గొన్నారు. -
వరి పండించొద్దంటే ఎలా?
మాకు వరి పండడానికి అనుకూలమైన భూములున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వరి సాగుచేయొద్దని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా తూర్పు మండలాల్లో రబీ, ఖరీఫ్ రెండు పంట కాలాల్లోనూ వరినే ఎక్కువగా పండిస్తారు. వరి పంట సాగు చేయొద్దని చెప్పడం సరికాదు. – యచ్చం హరినాథ్యాదవ్, అమ్మవారిపట్టెడ, రేణిగుంట మండలం మామిడికి గిట్టుబాటు ధర ఏదీ? మామిడి రైతుల పరిస్థితి గత ఏడాది, ఈ ఏడాది దయనీయంగా మారింది. కూటమి ప్రభుత్వంలో మామిడికి గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను నట్టేట ముంచింది. సరైన ధర లేకపోవడంతో పంటపై పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాలేదు. ప్రభుత్వం చర్యలు చేపట్టి మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి. – కె.నరసింహారెడ్డి, రైతు, లింగనపల్లి, పాకాల మండలం -
ఆన్లైన్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్
తిరుపతి సిటీ: పాలిసెట్–2026 కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆల్లైన్ విధానంలో కొనసాగుతుందని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ద్వారకనాథ్రెడ్డి తెలిపారు. రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఆదేశాల ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ పారదర్శకంగా, సమయాభావం, విద్యార్థుల సౌకర్యార్థం ఇక నుంచి ఆన్లైన్లోనే వెరిఫికేషన్ పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమైన అన్ని ధృవపత్రాలను జాగ్రత్తగా అప్లోడ్ చేయాలని సూచించారు. మా ఊరికి బస్సు నడపండి సార్ తిరుపతి అన్నమయ్యసర్కిల్: ‘అయ్యా మా ఊరికి ఆర్టీసీ ఫ్రీ బస్సు నడపండి’ అంటూ సమాచార హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఎస్బీఆర్పురం విద్యార్థులు, గ్రామస్తులు సోమవారం తిరుపతి కలెక్టరేట్కు తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి కె.మురగారెడ్డి మాట్లాడుతూ గతంలో పుత్తూరు – ఎస్బీఆర్పురం వరకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సు పుత్తూరు డిపో నుంచి నడిచిందన్నారు. ఆ బస్సు సర్వీసును నిలిపివేశారన్నారు. గ్రామ సర్పంచ్ మణిరాజు తన సొంత ఖర్చుతో ఐదేళ్ల పాటు ప్రత్యేక బస్సును నడిపించారని చెప్పారు. ఆయన సర్పంచ్ పదవీ కాలం పూర్తి కావడంతో రెండు నెలలుగా బస్సును నిలుపుదల చేశారన్నారు. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పుత్తూరుకు వెళ్లే గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. బస్సు ఏర్పాటు కోసం ఆర్టీసీ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. చివరకు కలెక్టర్కు తమ సమస్య చెప్పుకునేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. డయల్ యువర్ సీఎండీకి 54 వినతులు తిరుపతి రూరల్: ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి 54 సమస్యలు వచ్చినట్టు ఆ సంస్థ చైర్మన్ – మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. స్థానిక కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ పరిధిలోని 9 జిల్లాల నుంచి 54 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను వివరించారన్నారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం ద్వారా నమోదయ్యే సమస్యల్ని పరిష్కరించేందుకు సంస్థ అధికారులు, సిబ్బంది ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. డైరెక్టర్లు పి. అయూబ్ ఖాన్, కే.గురవయ్య, కె.రామమోహన్రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు కె.ఆదిశేషయ్య, జె.రమణాదేవి, ఎం. మురళికుమార్, ఎన్.శోభా వాలెంటీనా, ఎం.ఉమాపతి, సిహెచ్ రామచంద్రరావు, కే.సంపత్కుమార్, ఎస్.రమణ, జనరల్ మేనేజర్లు చక్రపాణి, జగదీష్, లత పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద బాధితుడి ఆత్మహత్యాయత్నం తిరుపతి అన్నమయ్యసర్కిల్: రైల్వేకోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లె మండలం, బొమ్మవరం కమ్మపల్లి గ్రామ భూ సమస్యపై తిరుపతి కలెక్టరేట్ వద్ద రైతు వేమన తిరుపతయ్యనాయుడు దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. చిట్వేల్ రెవెన్యూ పరిధిలో తనకున్న మూడు ఎకరాల పొలం వద్ద రోడ్డు వేసిన కారణంగా తగ్గుదలకు చేరిందన్నారు. ఎత్తు పెంచాలని పలుమార్లు మండల అధికారులకు వేడుకున్నా నిర్లక్ష్యం చేశారని వాపోయారు. ‘నీ పొలం నువ్వే ఎత్తు పెంచుకో’ అంటూ అవమానించిన అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించారని మడ్డిపడ్డారు. ముందుగా బాధితుడు వేమన తిరుపతయ్య నాయుడు పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్ వద్దకు రావడంతోనే గుర్తించిన పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. అనంతరం సమస్య పరిష్కరిస్తామని చెప్పి అధికారులు అతన్ని శాంతింపజేశారు. -
ఆరు నెలలుగా జీతాల్లేవు
చిత్తూరు కలెక్టరేట్: ఆరు నెలలుగా జీతాల్లేవు.. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. జీతాలు ఇచ్చి ఆదుకోండి అని తిరుపతి జిల్లా రుయా ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులు వాపోయారు. వారు సోమవారం పీజీఆర్ఎస్లో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి వినతి పత్రం అందజేశారు. అంతకుముందు వారు నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు, రుయా ఉద్యోగుల యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ విలేకరులతో మాట్లాడారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆప్కాస్ ఉద్యోగులకు 6 నెలలుగా జీతాలు లేవన్నారు. మూడు నెలల క్రితమే ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోదన్నారు. కార్మికులతో ప్రతిరోజూ పని చేయించుకుంటూ, వేతనాల విషయంలో బాధ్యత నుంచి తప్పుకోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కార్మికులు ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, నిత్యావసర వస్తువుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి జోక్యం చేసుకుని రుయా ఆస్పత్రిలోని 12 మంది కార్మికులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆప్కాస్ పరిధిలో ఇలాంటి ఇబ్బందులు పడుతున్న కార్మికులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎఫ్ఎన్వో, ఎంఎన్వోల ప్రతినిధులు గాంధీ, సురేష్, సుధీర్, శ్రీకాంత్ రెడ్డి, ప్రసన్న, స్టెల్లా తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతి జిల్లాలో వ్యవసాయం చుట్టూ కష్టాలే
● విత్తు నుంచి ఎరువుల వరకు కోతలే ● పంటకు గిట్టుబాటు కలే ● ఆపసోపాలు పడుతున్న అన్నదాతలు ● వరి పండించొద్దంటూ కొత్త మెలికసాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి జిల్లాలో దాదాపు 1.5 లక్షల కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి. సుమారు 3 లక్షల హెక్టార్లల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా వేరుశనగ, మామిడి, వరి, చెరుకు వంటి పంటలకు ప్రభుత్వం చేయూతనివ్వకుండా కోతలు పెడుతోంది. తద్వారా పంటలు సాగు చేసే రైతులు నష్టాల్లో మునిగిపోతున్నారు. వేరుశనగ కరువే తిరుపతి జిల్లాలో ఖరీఫ్లో ప్రధానంగా వేరుశనగ సాగుచేస్తారు. సాధారణంగా 34,566 హెక్టార్లలో ఈ పంట సాగవుతుంది. ఏరువాక పౌర్ణమికి ఒక్కరోజే సమయం ఉన్నా రైతులకు పూర్తి స్థాయిలో విత్తనాలు అందలేదు. మరోవైపు జిల్లాకు అవసరమైన ఎరువులతో పోలిస్తే కేవలం 13 వేల టన్నుల ఎరువులే సరఫరా అయ్యాయి. వర్షాలు వచ్చినా విత్తేందుకు కాయలు లేక, ఎరువులు లేక రైతులు ఎదురు చూడాల్సి వస్తోంది. 2024లో నష్టపోయినా వేరుశనగ పంటకు ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు. ఆశలు ఆవిరి ప్రకృతి అనుకూలిస్తే ప్రభుత్వం అండగా ఉండడం లేదని, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మార్కెట్ సహకరించడం లేదని రైతులు వాపోతున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి దశలో సమస్యలే ఎదురవుతుండడంతో భవిష్యత్తుపై అన్నదాత ఆలోచించాల్సి వస్తోంది. రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెబుతున్న ప్రభుత్వాలు, ఆ రైతు కష్టాలను గుర్తించి తక్షణమే విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఈ ఖరీఫ్ సీజన్ తిరుపతి జిల్లా రైతులకు మరో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు కాని మామిడి జిల్లాలో లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ముఖ్యంగా 70 వేల హెక్టార్లలో తోతాపురి పంట ఉంది. ఈ ఏడాది కిలోకు కనీసం రూ.15 ధర ఇవ్వాలని రైతులు కోరినా ప్రభుత్వం రూ.4కే పరిమితం చేసింది. జిల్లాలో ఉన్న తొమ్మిది పల్ప్ పరిశ్రమల్లో కేవలం మూడు మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నాయి. కాయలను బయట అమ్ముకోలేక రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సింది పోయి.. రైతుల కష్టాలను గాలికొదిలేసింది. -
తిరుమలలో అధిక చార్జీలపై ఉక్కుపాదం
తిరుమల: తిరుమలకు వచ్చే భక్తుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న వాహనాలపై తిరుపతి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమల ట్రాఫిక్ పోలీసులు సోమవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 25 వాహనాలను సీజ్ చేశారు. తిరుమల నుంచి తిరుపతికి భక్తులను తరలించే వాహనాలపై చేపట్టిన తనిఖీల్లో మొత్తం 42 వాహనాలను పరిశీలించగా, 25 వాహనాలు నిర్ణీత చార్జీల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆయా వాహనాలను సీజ్ చేయడంతో పాటు ఒక్కో వాహనానికి రూ.1,000 చొప్పున మొత్తం రూ.25 వేల జరిమానా విధించారు. నిర్ణీత చార్జీలకు మించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గమనిస్తే సమాచారం అందించాలన్నారు. -
గ్రీవెన్స్కు 409 అర్జీలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: కలెక్టరేట్లో సోమ వారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 409 అర్జీలు అందినట్టు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, భరత్నాయక్, రోస్మండ్తో కలిసి అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 208 అర్జీలందడం గమనార్హం. పాఠశాల వద్ద బెల్ట్ షాపు వద్దు ఏర్పేడు: మండలంలోని కుక్కలగుంట పంచాయతీ, పాయల్సెంటర్లో ప్రభుత్వ పాఠశాలకు ఆనుకుని ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న బెల్ట్షాపు నిర్మాణాలను ఆపించాలని కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. సోమవారం పీజీఆర్ఎస్ సందర్భంగా స్థానికులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రాన్ని అందజేశారు. పాయల్సెంటర్ ప్రభుత్వ పాఠశాలకు ఆనుకుని టీడీపీకి చెందిన వ్యక్తులు అక్రమ నిర్మాణం చేపడుతున్నారని, తాము నిలదీసినా ఖాతరు చేయలేదన్నారు. ఇక్కడ పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శి వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఎలాంటి పట్టా లేని స్థలంలో నిర్మిస్తున్న ఈ అక్రమ కట్టడానికి ఇప్పటికే విద్యుత్ మీటర్ ఏర్పాటునకు ఎన్వోసీ, ప్రభుత్వ తాగునీటి కొళాయి కనెక్షన్ ఇచ్చారని ఆరోపించారు. తమ పిల్లల శేయస్సును దృష్టిలో ఉంచుకుని పాఠశాల ఆనుకుని అక్రమ బెల్ట్ షాపు నిర్మాణాన్ని ఆపించాలని కోరారు. -
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. పుల్లంపేట మండలంలోని కడప-చెన్నై ప్రధాన రహదారిపై సోమవారం తెల్లవారుజామున లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడాది బాలుడు, శ్రీకాళహస్తి కి చెందిన యస్విత అనే విద్యార్థి మృతి చెందారు. ప్రమాదం కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. -
భూ తగాదాలతో మహిళపై దాడి
సాక్షి టాస్క్ ఫోర్స్ : భూ తగాదాలతో అర్ధరాత్రి ఒంటరి మహిళ పై దాడి జరిగిన సంఘటన చంద్రగిరి నియోజకవర్గ ఎర్రవారిపాలెం మండలం ఈడిగపల్లిలో చోటుచేసుకుంది. బాధితురాలు కృష్ణవేణి తెలిపిన వివరాల మేరకు.. తన భర్త పేరుపై ఉన్న భూమిని ఆయన సోదరులు అక్రమంగా ఆనన్లైన్లో నమోదు చేసుకుని, ఆ భూమిపై ఇంటి పట్టా పొందడంతో పాటు ఇల్లు నిర్మాణ పనులు చేపట్టారని ఈ విషయమై తాను అభ్యంతరం వ్యక్తం చేసి నిర్మాణ పనులను అడ్డుకోవడంతో తనపై కత్తులు, కొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పోలీసుల సమక్షంలోనే జరిగినప్పటికీ, దాడిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆమె పేర్కొన్నారు.తన భర్త పేరుపై ఉన్న భూమిని తన సమీప బంధువులు రెవెన్యూ అధికారులతో కలిసి అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని కృష్ణవేణి ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భూమి వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు అధికారులను కోరారు. -
థర్డ్ పేజ్ అడ్మిషన్ల మెరిట్ లిస్ట్ విడుదల
తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ, పద్మావతి జూనియర్ కళాశాలల్లో మూడో విడత ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు సంబంధించి మెరిట్ లిస్టును అధికారులు ఆదివారం విడుదల చేశారు. రెండు దశలలో ఇప్పటి వరకు జరిగిన ఫస్ట్ ఇయర్ ప్రవేశాలలో ఎస్వీ జూనియర్ కళాశాలలో 275 మంది అడ్మిషన్లు పొందగా మిగిలిన 517 సీట్లు, పద్మావతి జూనియర్ కళాశాలలో 443 మంది ప్రవేశాల పొందగా మిగిలిన 525 సీట్లకు ఈనెల 24 నుంచి 26 వరకు జరగనున్న మూడవ విడత కౌన్సెలింగ్లో భర్తీ చేయనున్నారు. అనంతరం స్పాట్ అడ్మిషన్లు కంటే నాల్గొవ విడత కౌన్సెలింగ్ ప్రక్రియను చేపడతే మెరిట్కు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. పంచాయతీ కార్యదర్శి అదృశ్యం ఏర్పేడు: మండలంలోని ఆమందూరు గ్రామపంచాయతీ కార్యదర్శి కిషోర్కుమార్రాజు ఈనెల 8వ తేదీ నుంచి అదృశ్యమై విధులకు హాజరుకావడం లేదు. ఎంపీడీవోకు ఎలాంటి సమాచారం తెలపకుండా విధులకు డుమ్మా కొట్టారు. అతడి ఫోన్ కూడా పని చేయకపోవడంతో తాత్కాలికంగా నచ్చనేరి కార్యదర్శి వెంకటమునిని ఆమందూరు పంచాయతీకి ఇన్చార్జిగా నియమించారు. ఆయన ఇంటి వద్ద ఉన్నారా..? ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తి ఆస్పత్రిలో ఉన్నారా..? మరెక్కడికై నా వెళ్లిపోయారా..? అనేది తెలియాల్సి ఉంది. ఆమందూరు కార్యదర్శి వ్యవహారంపై ఇప్పటికే డీపీవో సుశీలాదేవికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో తరచూ ప్రజలు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి మొరపెట్టుకుంటున్నారు. ఆర్యవర్క్, ఫాబ్రిక్ పెయింటింగ్పై శిక్షణ చంద్రగిరి: యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఈనెల 29వ తేదీ (సోమవారం) నుంచి 31 రోజుల పాటు మహిళలకు ఆర్యవర్క్, ఫాబ్రిక్ పెయింటింగ్పై పూర్తి ఉచితంగా శిక్షణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళలు అర్హులన్నారు. కనీసం విద్యార్హత 10వ తరగతి చదువుకుని ఉండాలని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం అందించడం జరుగుతుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువ పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ తీసుకోదలచిన వారు ఆధార్ , రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి వారి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 79896 80587, 91775 43543, 63017 17672 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. ఒంటరి ఏనుగు దాడిలో రైతుకు గాయాలు భాకరాపేట: ఒంటరి ఏనుగు దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడిన ఘటన చిత్తూరు జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, చిన్నగొట్టిగల్లు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని దేవరకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని మైలవండ్లపల్లి గ్రామానికి చెందిన సి. లక్ష్మయ్య శనివారం రాత్రి కోటకొండ వెంకటమునితో కలిసి పొలం వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒంటరి ఏనుగు వారిపై దాడి చేసింది. ఈ దాడిలో రైతు సి.లక్ష్మయ్య తీవ్రంగా గాయపడ్డాడు. కుడి కాలు విరిగిపోయింది. కేకలు విన్న గ్రామస్తులు అతన్ని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. నీట్ పరీక్షా కేంద్రాల తనిఖీ తిరుపతి క్రైం : జిల్లాలో నిర్వహించిన నీట్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాలను ఆదివారం ఎస్పీ సుబ్బరాయుడు తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమై ఆయన కీలక సూచనలు చేశారు. విధుల్లో ఉన్న సిబ్బంది పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ సూచించారు. -
యాప్సోపాలు
– యూరియా కోసం పడిగాపులు బుచ్చినాయుడుకండ్రిగ: యూరియా పంపిణీకి సంబంధించి వ్యవసాయశాఖ ప్రవేశపెట్టిన నూతన యాప్లతో మండల రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్పై రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయశాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో సులువుగా లభించిన యూరియా కూటమి ప్రభుత్వంలో అందని ద్రాక్షలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం రైతులు ఆర్బీకేల చుట్టూ తిరుగుతున్న అధికారులు, అధికార పార్టీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. నూతనంగా ప్రవేశ పెట్టిన ఏపీఐఎమ్మెస్ యాప్లో తమ పొలం వివరాలు, ఖాతా నంబర్, తప్పనిసరిగా నమోదై ఉంటేనే ఎరువులను అందజేయనున్నామని అధికారులు కొర్రీలు పెడుతుండటంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఎకరాకు 3 బస్తాలు కావాల్సి ఉండగా 75 కిలోల యూరియాను మాత్రమే ఇస్తామని, అది కూడా యాప్లో ఓకే అయితేనేనని చెబుతున్నారన్నారు. యూరియా కోసం ఆర్బీకేలు, ప్రైవేటు డీలర్ల చుట్టూ వారం రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్నా, ఒక బస్తా సైతం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరణించిన రైతు కుంటుంబాలకు యాప్లో నమోదు కాకపోవడంతో వారికి ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దీన్ని అదునుగా తీసుకున్న కొందరు ప్రైవేటు షాపుల యాజమానులు యూరియాను పక్కదారి పట్టిసున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 93,303 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 41,688 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.58 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
నిఘా నీడలో... రీ నీట్
తిరుపతి సిటీ: జిల్లాలో యూజీ నీట్ రీ టెస్ట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 9 పరీక్షా కేంద్రాలలో ఒకరిద్దరు మినహా విద్యార్థులు చాలా వరకు పరీక్షా సమయానికి ముందే చేరుకున్నారు. భారీ బందోబస్తు నడుమ అధికారులు విద్యార్థులను పరిశీలించి పరీక్షా కేంద్రాలలోకి అనుమతించారు. ఆదివారం ఉదయం 11గంటల నుంచి విద్యార్థులను అధికారులు పరీక్షా కేంద్రంలోనికి అనుమతించడం ప్రారంభించి మధ్యాహ్నం 1.30గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేశారు. 2గంటలకు పరీక్ష ప్రారంభమై సాయంత్రం 5.15వరకు కొనసాగింది. పలు పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. 89.97శాతం హాజరు జిల్లాలో ఆదివారం జరిగిన రీ నీట్ పరీక్షకు 89.97శాతం హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. 9 పరీక్షా కేంద్రాలలో 4556మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 4099మంది హాజరయ్యారయారని, 457మంది గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ఏడాది మే 3వ తేదీ జరిగిన నీట్ పరీక్షకు 97.2శాతం మంది హాజరుకాగా రీ నీట్కు సుమారు 7శాతం హాజరు తగ్గినట్లు తెలుస్తోంది. విద్యార్థులను జల్లెడ పట్టేశారు... నీట్ పరీక్షలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండకూడదనే పరీక్షకు హాజరైన విద్యార్థులను జల్లెడ పట్టారు. ఎస్వీ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలలో ఒక నిమిషం తేడాతో ఆలస్యంగా రావడంతో విద్యార్థిని అనుమతించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రీ నీట్ పరీక్ష పేపర్ అనుకున్నంత ఈజీగా లేదని కష్టతరంగానే ఇచ్చారని పరీక్ష రాసి బయటకు వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
బకాయిలు విడుదల చేయాలి
యువగళంలో లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తం సుమారు రూ.7000కోట్ల బకాయిలు తక్షణం చెల్లించాలి. ఈ ఏడాది విద్యార్థులను ఇబ్బంది పెడితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. – చిన్న, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు, తిరుపతి తిరుగుబాటు తప్పదు విద్యా సంవత్సరం ముగిసిన సందర్భంగా జిల్లాలో పలు కళాశాలల్లో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు యాజమాన్యాలు ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా ధృవపత్రాలను అందించాల్సిందే. ఫీజుతో మెలిక పెడితే తిరుగుబాటు తప్పదు. పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండా బకాయిలు పూర్తిగా చెల్లించాల్సిందే. –పవిత్ర, ఎస్ఎఫ్ఐ, జిల్లా అధ్యక్షురాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం ఆపాలి. ప్రభుత్వ తీరుతో ఎంతో మంది గ్రామీణ, పట్టణ ప్రాంత పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల ఆగ్రహానికి గురికాకముందే ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. – గార్లపాటి శ్రీధర్, ఏపీ స్టూడెంట్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు, తిరుపతి -
తినాలనే ఆశ.. కొనాలంటేనే భయం
తిరుపతి సిటీ, తిరుపతి తుడా: నగరంలో ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు మాంసాహార, చేపల మార్కెట్లపైన, హోటళ్లపైన దాడులు చేయడంతో పెద్ద సంఖ్యలో కుళ్లిన మాంసం, చికెన్, పురుగులు పట్టిన చేపలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నగరవాసులు రెండు వారాల నుంచి నాన్ వెజ్ తినాలంటేనే జంకుతున్నారు. ముక్కలేనిదే ముద్ద దిగనటువంటి మాంసాహార ప్రియులు సైతం నాన్వెజ్ వైపు ముఖం చాటేసే స్థితికి చేరింది. దీంతో నగర ప్రజలు నాణ్యమైన తాజా మటన్, నాటుకోళ్ల కోసం నగరానికి సమీపంలోని పల్లెలకు క్యూ కడుతున్నారు. సమీపంలోని ప్రాజెక్టుల వద్ద, చెరువుల వద్ద దొరికే చేపల కోసం పల్లెదారి పడుతున్నారు. ఆదివారం చాలా వరకు నగరంలోని మటన్, చికెన్, చేపలు విక్రయించే మార్కెట్లలోనూ, నాన్వెజ్ ఆహారపదార్థాలు విక్రయించే హోటళ్లలో జనసందడి కాస్త తగ్గినట్లు కనిపించింది. పల్లెల్లో మోసం ఉండదు మాంసం విక్రయాల విషయంలో తిరుపతిలో దారుణమైన ఘటనలు బయటపడుతున్నాయి. ఇక్కడ కొనాలంటేనే ఒళ్లు జలధరిస్తోంది. అందుకే ఆదివారం కావడంతో 10 కిలోమీటర్ల సమీపంలో ఓ పల్లెలో తాజా మటన్ విక్రయిస్తుంటే అక్కడి వెళ్లి తీసుకొచ్చా. అక్కడ నాణ్యమైన మటన్ దొరుకుతుంది. – రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ టీచర్, తిరుపతి -
ఆరోగ్య యోగం
తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి ఎస్వీయూ తారకరామారావు స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా పోలీసు అధికారులు, విద్యాశాఖతో పాటు పలు శాఖాధికారులు పాల్గొన్నారు. అందరి జీవనవిధానంలో యోగా ఒక భాగం కావాలని ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. జేసీ గోవిందరావు, డీఆర్ఓ నర్సింహులు, ఎస్వీయూ వీసీ నర్సింగరావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్, ఆర్డీవో రామ్మోహన్, అడిషనల్ ఎస్పీలు శ్రీనివాసులు, శ్రీనివాసరావు, తుడా సెక్రటరీ శ్రీకాంత్, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు. షార్లో సూళ్లూరుపేట : షార్లోని స్పేస్ సెంట్రల్ స్కూల్ మైదానంలో షార్ ఉద్యోగులు వారి కుటుంబసభ్యులు, సీఐఎస్ఎప్ భద్రతా సిబ్బంది, విద్యార్థులు స్థానిక ప్రభుత్వ అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. షార్ డైరెక్టర్ ముత్తు చెళియన్, కంట్రోలర్ రమేష్బాబు షార్లోని సీనియర్ మేనేజ్మెంట్ ప్రతినిధులు ఆధ్వర్యంలో సుమారు 500 మందికి పైగా యోగాసనాలు చేశారు. డైరెక్టర్ ముత్తు చెళియన్ బెంగళూరు నుంచి ఆన్లైన్ ద్వారా మాట్లాడారు. -
అక్రమ కేసులు, అరెస్టులకు భయపడేది లేదు
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి నెల్లూరు రూరల్: తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని వరుసగా కేసులను నమోదు చేస్తున్నారని.. అక్రమ అరెస్టులు, జైళ్లకు భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. అక్రమ కేసులో అరెస్టయి నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి బెయిల్పై విడుదలైన పార్టీ నేత, డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం పరామర్శించిన అనంతరం కాకాణి మాట్లాడారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా కామిరెడ్డిపై అక్రమ కేసులను బనాయించి 97 రోజుల పాటు జైల్లో నిర్బంధించారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించడం.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ఆయన చేసిన తప్పానని నిలదీశారు. ఓ కేసులో బెయిలొచ్చిన వెంటనే మరో కేసులో పీటీ వారెంట్లు జారీ చేస్తూ జైల్లోనే ఉంచేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలున్నా, కనీస మానవతా దృక్పథాన్ని సైతం చూపలేదని విమర్శించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని టార్గెట్ చేస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అండగా నిలిచిన జగన్ కష్టకాలంలో సత్యనారాయణరెడ్డి కుటుంబానికి తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారని, స్వయంగా మాట్లాడి ధైర్యం చెప్పారని తెలిపారు. న్యాయపరమైన పోరాటం కోసం మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డిని పంపి సాయాన్ని అందించారని చెప్పారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఇసుక కేసులో 27 మందిపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కామిరెడ్డి ఆరోపించారు. రీచ్ను ఎక్కడిచ్చారు.. ఇసుకను ఎక్కడ తవ్వుతున్నారు.. గడువు ముగిసిన చోట తవ్వకాలకు అనుమతిని ఎవరిచ్చారనే మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కూటమి నేతలను డిమాండ్ చేశారు. తనపై 16.. కాకాణిపై 20 కేసులు పెట్టారని పేర్కొన్నారు. ఇసుక, గ్రావెల్ దందాలపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాను తప్పు చేశానని ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఒకవేళ అలా కాకపోతే ఆరోపణలు చేస్తున్న వారు ప్రజలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి కుట్రలకు బదులు చెల్లిస్తాం ప్రజల్లో తీవ్ర ఆగ్రహం సత్యనారాయణరెడ్డి అరెస్ట్, ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజలు తగిన సమయంలో ఎండగడతారన్నారు. అవరోధాలను అధిగమించి తిరిగి తమ మధ్యకు సత్యనారాయణరెడ్డి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. సత్యనారాయణరెడ్డి కుటుంబానికి అండగా నిలిచిన జగన్మోహన్రెడ్డి, సూళ్లూరుపేట ప్రజలు, పార్టీ శ్రేణులు, కిలివేటి సంజీవయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. పెళ్లకూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డికి సైనికుడిగా కూటమి నేతలు చేస్తున్న రాజకీయ కుట్రలకు బదులుగా తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి అన్నారు. ఆదివారం బెయిల్పై విడుదలైన కామిరెడ్డి చిల్లకూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. మండలంలోని 90 శాతం గ్రామాలకు తాగు, సాగునీటికి మూలాధారమైన స్వర్ణముఖినదిలో కూటమి నేతలంతా కలిసి యంత్రాలతో ఇసుక దోపిడీ చేయడాన్ని అడ్డుకున్నందుకు అక్రమ కేసులు పెట్టి, జైల్లో నిర్బంధించి, బెయిల్ మంజూరు కాకుండా పీటీ వారెంట్లు వేస్తూ అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు. 76 రోజుల అనంతరం చివరకు ధర్మమే గెలిచిందని వెల్లడించారు. టీడీపీ సీనియర్ నేతలు గంగాప్రసాద్, నెలవల సుబ్రమణ్యం కొనసాగిస్తున్న ఇసుక, మట్టి, గ్రావెల్ దోపిడీలపై ప్రశ్నించినందుకు 16 అక్రమ కేసులు పెట్టారన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని, రాజకీయ కుట్రలు చేస్తే భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ‘స్వర్ణముఖినదిని రక్షించుకుందాం–రైతులను కాపాడుకుందాం’ అనే నినాదాంతో పోరాటం కొనసాగిస్తామాన్నరు. ఆయన వెంట అనీల్కుమార్రెడ్డి, వేణుయాదవ్, సురేష్రెడ్డి ఉన్నారు. పోలీస్స్టేషన్లంటే ప్రజల్లో భయం ఒకప్పుడు రక్షణ కోసం వెళ్లే పోలీస్స్టేషన్లు.. నేడు భయాందోళనలకు కేంద్రాలుగా మారాయని విమర్శించారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని అణిచేయాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సాయికృష్ణ లాకప్ డెత్.. క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పోరాటాన్ని కొనసాగిస్తాం సామాన్యులపై అక్రమ కేసులు పెట్టి వ్యవస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతామని.. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో కాకాణి సారథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. -
ఉన్నత విద్యకు దూరమవుతున్న పేదలు
తిరుపతి సిటీ: జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరంలో పలు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో ఇంజినీరింగ్, పలు యూజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల పరిస్థితి అయోమయంగా తయారైంది. ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో అందకపోవడంతో తమకు ధ్రువపత్రాలను కళాశాల యాజమాన్యాలు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని, పెండింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని లేనిపక్షంలో ధ్రువపత్రాలు ఇచ్చేందుకు వీలుకాదనే సంకేతాలు విద్యార్థులకు పంపుతున్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్పుల బాట పడుతున్నారు. బాబు సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఫీజు చెల్లిస్తేనే ప్రవేశాలు నూతన అడ్మిషన్ల విషయంలో 2026–27 విద్యా సంవత్సరంలో జిల్లాలోని డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధం లేకుండా విద్యార్థులు ఫీజు చెల్లిస్తేనే ప్రవేశాలు ఉంటాయని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులను పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తుందనే నమ్మకం లేక, స్వతహాగా ఫీజులు చెల్లించలేక ఇంటర్తోనే చదువు నిలిపేసి ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 47వేల మంది విద్యార్థులకు శాపం చంద్రబాబు సర్కార్ వ్యవహార శైలితో జిల్లాలో ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన దాదాపు 47,360 మంది విద్యార్థులకు శాపంగా మారింది. ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ, ఇంజినీరింగ్, పలు రకాల వైద్య విద్యలో యూజీ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థుల భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది. కళాశాలల యాజమాన్యాలు ఫీజుల చెల్లిస్తేగాని హాల్ టిక్కెట్లు ఇవ్వమని బెదిరించడంతో తల్లిదండ్రులు చేసేదిలేక అప్పులు చేసి చెల్లించాల్సి వచ్చింది. జిల్లాలో సుమారు 47వేల మంది పేద విద్యార్థులు ఈ ఏడాది ఫీజు పరిస్థితి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మూతపడనున్న పలు కళాశాలలు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జిల్లాలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అందకపోవడంతో పలు ప్రైవేటు కళాశాలలు మూతపడనున్నాయి. జిల్లాలో ప్రస్తుతం డిగ్రీ, ఇంజినీరింగ్, పలు రకాల వైద్య విద్యతో పాటు టెక్నికల్ కోర్సులను అందిస్తున్న ప్రైవేటు కళాశాలు 108 ఉండగా అందులో సుమారు 24 కళాశాల పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్కో కళాశాలకు సుమారు రూ. 4.10 కోట్లు బకాయిలు తొమ్మిది విడతలుగా నిలిచిపోయాయి. గత ఏడాది పలు మార్లు ప్రభుత్వానికి తమ సమస్యను కళాశాల యాజమాన్యాలు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో కళాశాలలను నడపలేమని,అధ్యాపకుల జీతాలు, కళాశాల నిర్వహణ కష్టసాధ్యమవుతోందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది సుమారు 11 కళాశాలలు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.జిల్లాలో యూజీ పూర్తిచేసిన విద్యార్థులకు తప్పని తిప్పలు జిల్లాలో విద్యారంగం అస్థవ్యస్తంగా తయారైంది. ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలో ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రైవేటు కళాశాలలు రానున్న విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లించాల్సిందేనని, ఫీజురీయింబర్స్మెంట్ పై నమ్మకం పెట్టుకోవద్దని తేల్చిచెబుతున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు ఇంటర్తోనే చదువును నిలిపివేసే పరిస్థితిలో ఉన్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరికొంత ఫీజు చెల్లించలేక సాధారణ ప్రభుత్వ కళాశాలలోనూ, దూర విద్య కేంద్రాలో యూజీ కోర్సులలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.ఫీజు చెల్లిస్తేనే ప్రవేశాలు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ సక్రమంగా చెల్లించకపోవడంతో ప్రైవేటు కళాశాలలు తిరగబడుతున్నాయి. ఈ ఏడాది మా అబ్బాయిని డిగ్రీ చేర్చేందుకు నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలకు వెళ్లాం. ఎస్సీ రిజర్వేషన్ ఉందని చెప్పాం. ఫీజు ముందు చెల్లిస్తేనే ప్రవేశాలు ఇస్తామని తేల్చిచెప్పారు. – కుట్టెమ్మ, ఓ విద్యార్థి తల్లి, తిరుపతి ధ్రువపత్రాలు ఇస్తారో లేదో.. మా అబ్బాయి చంద్రగిరి లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఏడాది బీటెక్ పూరైంది. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో ఫీజు చెల్లించాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. అప్పులు చేసి ఏడాది ఫీజు చెల్లించాం. ప్రభుత్వం ఈ ఏడాది చెల్లించకపోతే ధ్రువపత్రాలు ఇస్తారనే నమ్మకం లేదు. – సరస్వతమ్మ, విద్యార్థి తల్లి, తిరుపతి -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల:తిరుమల శ్రీవారిని ఆదివారం మేఘాలయ హైకోర్టు ప్రధాన జస్టిస్ న్యాయమూర్తి రామలింగం సుధాకర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్కుమార్, చైన్నె లవ్ స్టోరీ మూవీ యూనిట్ సినీ నటుడు కిరణ్ అబ్బవరం, సినీ నటి శ్రీగౌరీ ప్రియ, రచయిత అనంత శ్రీరామ్, సినిమా నిర్మాత జి శ్రీనివాస్కుమార్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. ముక్కంటి.. జనసంద్రం శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయం భక్తజన సంద్రంగా మారింది. రికార్డు స్థాయిలో అంతరాయల దర్శన టిక్కెట్ల ద్వారా భక్తులు స్వామి అమ్మ, వార్లను దర్శించుకున్నారు. సుమారు 45వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం 434, రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 1,871 మంది, రూ.50 ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 1,875 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక రూ.500 రాహు, కేతు టిక్కెట్ల ద్వారా 3,284 మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 1,446, రూ.1500 టిక్కెట్ల ద్వారా 410 మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 244 మంది, రూ.5 వేలు టిక్కెట్ల ద్వారా 114 మంది భక్తులు పూజలు చేయించుకున్నారు . ఇక ఐదు రకాల ప్రసాదాలు కలిపి 17,864 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు
ఏర్పేడు: మండలంలోని రావిళ్లవారి కండ్రిగలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి లో ఆదివారం రెవెన్యూ సిబ్బంది హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈనెల 14న గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు గ్రామ సమీపంలోని ప్రభుత్వ అనాదీనం భూమి సర్వే నంబరు 197–1లో 4.05 ఎకరాలు భూమిలో ఉన్న ముళ్ల చెట్లను జేసీబీ పెట్టి తొలగించారు. దీనిపై సాక్షిలో ‘అదును చూసి చదును’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై ఏర్పేడు తహసీల్దార్ స్పందించి ఆదివారం ఆ భూమిలో వీఆర్వో హరితో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయించారు. విద్యుత్ షాక్తో కార్మికుడి మృతి రేణిగుంట: మండలంలోని గాజుల మండ్యం ఇండస్ట్రియల్ పరిధిలోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు విద్యుత్ షాక్తో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల కథనం.. నిండ్ర మండలానికి చెందిన పవన్ (25) ప్రైవేట్ కంపెనీలో రేకులు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై పై నుంచి కింద పడిపోయాడు. వెంటనే తిరుపతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తుండగా కార్మికుడు మృతి చెందాడు. ఘటనపై గాజుల మండ్యం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి కేసులో ముగ్గురి అరెస్టు తడ: గంజాయి అక్రమంగా కలిగి ఉన్న ముగ్గురు నిందితులను తడ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ తెలిపిన వివరాల మేరకు తడ మండలంలోని రాఘవరెడ్డినగర్కి చెందిన చిరంజీవి, పల్లెపాళెంకు చెందిన మణికంఠ, బోడిలింగాలపాడు గ్రామానికి చెందిన ఏడుమలై అనే ముగ్గురు తడ పోలీస్ రికార్డుల్లో రౌడీ షీటర్లుగా ఉన్నారు. వీరి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులకు గంజాయి అక్రమ విక్రయాలు జరుపుతున్నట్లు అనుమానం రావడంతో ఆదివారం పోలీసులు దాడి చేసి వీరి వద్ద నుంచి 1100 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. దీంతో వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. గల్లంతైన యువకుడి మృతి వెంకటగిరి రూరల్: తెలుగుగంగ కాలువలో యువకుడు గల్లంతై మృతి చెందిన ఘటన పట్టణంలోని కాంపాళెంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు కాంపాళెంకు చెందిన కరమల ప్రసాద్ (17) శనివారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రసాద్కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా మండలంలోని జంగాలపల్లి గ్రామం వద్ద తెలుగంగ కాలువలో గల్లంతైన మృతదేహం ఉన్నట్లు గుర్తించామన్నారు. మృతదేహాన్ని పరిశీలించగా ప్రసాద్గా గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బహిర్భూమి కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడి ప్రసాద్ మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నట్లు తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని చల్లపాలెం బీసీ కాలనీకి పడమర వైపున ఉన్న బహిరంగ ప్రదేశంలో ఆదివారం రూరల్ సీఐ ఇబ్రహీం సిబ్బందితో దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచిరూ.1,1000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు రూరల్ సీఐ ఇబ్రహీం తెలిపారు. తిరుమలలో ఎఫ్ఎంఎస్ కార్మికుడిపై దాడి తిరుమల: తిరుమలలో హెచ్వీసీ గెస్ట్హౌస్లో విధులు నిర్వహిస్తున్న ఎఫ్ఎంఎస్ కార్మికుడు కృష్ణపై దాడి జరిగిన ఘటనపై సీఐటీయూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెడ్డిశేఖర్పై టీటీడీ యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సుబ్రమణ్యం డిమాండ్ చేశారు. శనివారం జీఎన్సీ ఎంక్వయిరీ కార్యాలయంలో కంప్యూటర్ సిస్టమ్ విభాగంలో పనిచేస్తున్న రెడ్డిశేఖర్, ఎఫ్ఎంఎస్ కార్మికుడు కృష్ణపై భౌతిక దాడికి పాల్పడ్డారని సుబ్రమణ్యం ఆరోపించారు. ఒకవేళ కార్మికుడు తప్పు చేసి ఉంటే, సంబంధిత ఉన్నతాధికారుల సమక్షంలో చట్టబద్ధంగా వ్యవహరించాల్సిందిపోయి దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదని ప్రశ్నించారు. -
ప్రజలు పల్లెబాట పట్టారు
నగరంలో ఇటీవల బయటపడిన కుళ్లిన మాంసం, చేపలను చూసి భయపడ్డాం. ఆరోగ్యంపై ప్రభావం చూపే ఇలాంటి ఆహారాన్ని విక్రయిస్తున్నారా అని విస్తుపోయాం. అందుకే పల్లెల్లో తాజాగా దొరికే నాటుకోడి లైవ్ తీసుకునేందుకు ఆదివారం మేము మా స్నేహితులం పల్లెబాట పట్టాం. – సుబ్రమణ్యం, స్థానికుడు, తిరుపతి తక్కువకే బిర్యానీ అంటూ దగా నగరంలో కొన్ని మటన్ దుకాణాలు, హోటళ్లు వ్యాపారం కోసం ప్రజల జీవితాలతో ఆడుకోవడం దారుణం. రూ.60 నుంచి రూ.100కే బిర్యానీ అంటూ కుళ్లిన మాంసంతో ఆహార పదార్థాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరిన్ని తనిఖీలు జరగాలి. – చంద్రశేఖర్, ప్రైవేటు ఉద్యోగి, తిరుపతి -
‘సుగాలీ ప్రీతి కేసులో పవన్ చెప్పేవన్నీ అబద్ధాలే’
సాక్షి,తిరుపతి: సుగాలీ ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై రోజా ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు హయాంలోనే సాక్ష్యాధారాలు తారుమారయ్యాయి. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్సార్సీపీనే అండగా నిలిచింది. అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని పవన్ అన్నాడు. రెండేళ్లయింది.. పవన్ ఇచ్చిన హామీని గాలికొదిలేశారు.. సాయికృష్ణ కేసులో పవన్ మాటలు చేతకానితనానికి నిదర్శనం.ప్యాకేజీలు తీసుకుని పవన్ బఫూన్లా మారారు. రాష్ట్రానికి చంద్రబాబు, పవన్, లోకేష్, అనిత శనిలా పట్టుకున్నారని రోజా విమర్శించారు. -
విద్యుత్ షాక్తో మహిళ మృతి
రేణిగుంట: మండలంలోని చెంగారెడ్డిపల్లిలో రేకుల షెడ్లు నిర్మాణంలో కూలి పనులు చేస్తున్న ఓ మహిళ విద్యుత్ షాక్తో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన చంద్రశేఖర్ అతని భార్య కష్ణవేణి (28) రేణిగుంటలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం చెంగారెడ్డిపల్లెలో పని స్థలంలో నీటి మోటారు ఆఫ్ చేయడానికి వెళ్లిన కష్ణవేణి తిరిగి రాకపోవడంతో, ఆమె భర్త వెళ్లి చూడగా మోటారు సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించి, వెంటనే స్థానికుల సహాయంతో కరకంబాడిలోని అమర ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అసత్య ప్రచారాలతో ఏమీ సాధించలేరు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తాజాగా కొందరు చేస్తున్న ట్రోల్స్కి తాను భయపడనని.. అసత్య ప్రచారాలతో ఏమీ సాధించలేరని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాజకీయంగా విబేధించడం, సమర్థించడం ప్రజాస్వామ్యంలో ఒక భాగం. ఉన్నతమైనటువంటి సాంప్రదాయం కూడా. మనకు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తంచేసే వారి పట్ల అసహజమైన, అనైతికమైన దాడి హీనమైన చర్య. శుక్రవారం న్యాయవాదిగా, రాజకీయ విశ్లేషకులుగా గుంటూరు కేంద్రంగా ఉంటున్న రజిని వ్యక్తిగత పనుల నిమిత్తం తిరుపతికి విచ్చేశారు. వ్యక్తిగతంగా నేను వారితో అనేక డిబేట్లో సహచర ప్యానలిస్టుగా పాల్గొన్నాను. పలు అంశాల్లో వారితో విబేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ పరిచయంతో వారు తిరుపతికి వచ్చిన సందర్భంగా మా ఇంటికి వచ్చారు. అదే సమయంలో వారిని కలవడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా వచ్చి పలురించి వెళ్లారు. మా ఇంటికి ప్రజా జీవితంలో ఉన్నవారు ఎవరు వచ్చినా ఆ మంచి సందర్భాన్ని నా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం నా అలవాటు. నేను షేర్ చేసిన ఫొటోలను ఉపయోగించుకుని మేమేదో రహస్య సమావేశం అయినట్టు.. ఒక పార్టీకి అనుకూలంగా రాజకీయ విశ్లేషణ చేయాలని వ్యూహం పన్నినట్లు, అభ్యంతరకర భాషతో సంస్కారహీనమైన వ్యాఖ్యలతో కొందరు పోస్టులు పెట్టారు. ఈ సందర్భంగా వారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా.. ట్రోల్స్తో మీరు సాధించేది శూన్యం. అసత్య ప్రచారాలకు భయపడే వ్యక్తిని నేను కాదు. నా అభిప్రాయాలతో విబేధించి సరైన సమాచారంతో తప్పు పడితే నేనే తప్పును ఒప్పుకుంటాను. మీ వెనకాల రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టే ఇతరులకు రాజకీయ పార్టీల ముద్రను వేసే స్థాయికి దిగజారుతున్నారు’’ అని విమర్శించారు. -
ఎట్టకేలకు 24 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
తిరుపతి సిటీ: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఎట్టకేలకు 24వ తేదీ నుంచి పాలిసెట్–2026 కౌన్సెలింగ్ ప్రక్రియ జరపనుంది. గత ఏప్రిల్ 25వ తేదీన జరిగిన పాలిసెట్ పరీక్ష ఫలితాలు మే 5వ తేదీన విడుదలయ్యాయి. ఫలితాలు విడుదలై సుమారు 45 రోజులపైన గడుస్తున్నా కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టకపోడంతో జిల్లాలో పాలిసెట్లో ఉత్తీర్ణత సాధించిన సుమారు 4,438 మంది విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు కౌన్సెలింగ్ ప్రక్రియ తేదీలను ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ తేదీలు -
ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం!
చంద్రగిరి: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయిన ఘటన శనివారం మండలంలోని పనపాకం పంచాయతీలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. పనపాకం పంచాయతీ ఇరివిశెట్టివారిపల్లెకు చెందిన నాగభూషణం(57) 25 ఏళ్లు గా పంచాయతీలో ఎలక్ట్రికల్ హెల్పర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా పనపాకం పే ట సచివాలయం సమీపంలో వీధిదీపాలు పనిచేయకపోవడంతో వాటి మరమ్మతు చేయడానికి వి ద్యుత్ అధికారులతో మాట్లాడి ఎల్సీ(లైన్ క్లియరన్స్) తీసుకున్నాడు. మూడు స్తంభాల్లో దీపాలు ఏర్పాటు చేసి, నాలుగో స్తంభంలో పనిచేస్తున్న క్ర మంలో విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై కిందపడిపోయాడు. దీంతో నాగభూషణం గాయపడడంతో గ్రామస్తు లు చంద్రగిరి ఏరియా ఆ స్పత్రికి తరలిస్తుండగా మా ర్గం మధ్యలో మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే సబ్స్టేషన్ హెల్పర్ రెడ్డెప్పకు సమాచారం అందించినా సకాలంలో స్పందించలేదని, లైన్మన్ గ్రామంలో ఏ సమస్య ఉ న్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేడే నీట్ యూజీ రీ టెస్ట్
తిరుపతి సిటీ: వైద్యవిద్యలోని పలు యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కీలకమైన నీటీ యూజీ రీ టెస్ట్ ఆదివారం జరగనుంది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 పరీక్ష కేంద్రాల్లో 4,556 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణకు జిల్లా నోడల్ అధికారులు, సిటీ కోఆర్డినేటర్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, తనిఖీ సిబ్బంది, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లపై జిల్లా అధికారులు ఇప్పటికే జిల్లాలోని పలు శాఖాధికారులతో సమావేశమై చర్చించారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతర విద్యుత్, ఫ్యాన్లు, తాగునీరు, రవాణా, మెడికల్ శిబిరాలు ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదని, ఒంటిపై ఎలాంటి ఆభరణాలు ధరించకూడదని సూచించారు. అరగంట ముందే గేట్లు క్లోజ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న పరీక్షకు విద్యార్థులు అడ్మిట్ కార్డుతో ఉదయం 11 నుంచి 1.30 గంటలలోపు పరీక్ష కేంద్రాలోనికి వెళ్లాల్సి ఉంటుంది. 1.30 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసి వేయనున్నారు. ఈ లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోకపోతే విద్యార్థులు పరీక్ష రాసేందుకు అనుమతి ఉండదు. పరీక్షపై ఉన్నత స్థాయి సమీక్ష జిల్లాలో నీట్ పునఃపరీక్ష నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ శనివారం కలెక్టర్ వెంకటేశ్వర్, అధికారులతో విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నీట్ పునఃపరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సీఐఎస్ఎఫ్తో సమన్వయం చేసుకుని పరీక్ష సజావుగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. నీట్ పునఃపరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జేసీ గోవిందరావు, డీఆర్వో నరిసింహులు పాల్గొన్నారు. నీట్ కేంద్రాలివే.. నీట్ రీ టెస్ట్కు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ జిల్లాలో ఆదివారం జరగనున్న నీట్ రీ టెస్ట్కు అధికారులు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఇద్దరు ఉద్యోగులను నియమించి పర్యవేక్షించనున్నారు. పరీక్షకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా కంట్రోల్ రూమ్లో సీనియర్ అసిస్టెంట్లు సుధాకర్, మహ్మద్ షరీఫ్ విధుల్లో ఉంటారని, వారిని 96662 27014, 77029 31415 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
తడ: స్థానిక రైల్వేస్టేషన్ వద్ద శనివారం సుమారు 35 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి ఒకటో ఫ్లాట్ఫామ్ నుంచి రెండో ఫ్లాట్ఫామ్కి మారుతున్న సమయంలో విజయవాడ నుంచి చైన్నెకి వెళ్లే పినాకిని ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్టేషన్ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న సూళ్లూరుపేట జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని శరీరం గుర్తు పట్టలేని విదంగా నుజ్జు నుజ్జు కాగా మృతదేహంపై నీలం రంగు షర్టు మినహా మరెలాంటి ఆనవాళ్లు లభించలేదు. ఆ మేరకు వివరాలు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం నాగలాపురం: లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వినోభానగర్లో శనివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వినోభానగర్ హరిజనవాడకు చెందిన సంపత్ (50) తాగునీటి కోసం సైకిల్పై రామగిరికి బయలుదేరాడు. ఆ సమయంలో మార్గం మధ్యలోని కృష్ణాపురం మలుపులోని స్పీడు బ్రేకర్ వద్ద పుత్తూరు వైపు వెళుతున్న ఓ లారీ వెనుక నుంచి సంపత్ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో సంపత్ కిందపడగా, లారీ టైర్ తలపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకోగా, లారీడ్రైవర్ పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తప్పిపోయిన బ్యాగు అప్పగింత తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన తెలంగాణకు చెందిన భక్తుడు వంగ మల్లేష్ గౌడ్ అలిపిరి చెక్పాయింట్ (స్కానర్) వద్ద తన బ్యాగును మరచిపోయారు. ఈ విషయమై మల్లేష్ గౌడ్ రాత్రి 11.30 గంటలకు తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సిబ్బంది సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా బ్యాగును తీసుకెళ్లిన వాహనం (టీజీ 07 ఏడీ 0269)ను గుర్తించారు. తెల్లవారుజామున 3.30 గంటలకు బాలాజీ గెస్ట్ హౌస్ నంబర్ 4 వద్ద ఆ వాహనంలోని భక్తులను గుర్తించారు. వారిలో లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ స్కానింగ్ సమయంలో పొరపాటున ఆ బ్యాగు తమ వద్దకు వచ్చిందని తెలిపారు. అనంతరం బ్యాగును పరిశీలించగా అందులోని అన్ని వస్తువులతోపాటు 50 గ్రాముల బంగారం కూడా యథాతథంగా ఉండడంతో, బ్యాగును వంగ మల్లేష్ గౌడ్కు అప్పగించారు. ఈ సందర్భంగా భక్తుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది చొరవ, అప్రమత్తతకు కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చంద్రగిరి: అనుమానాస్పద స్థితిలో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. మృతుడి భార్య కథనం మేరకు.. స్థానిక భారతీనగర్కు చెందిన ప్రదీప్(38) ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో శ్రీనివాసమంగాపురం ఆటో స్టాండ్లో ఆటో నడుపుతున్నాడు. ఈ క్రమంలో గురువారం శ్రీనివాసమంగాపురానికి చెందిన నవీన్ కుమార్తో పాటు కొంత మందితో కలసి ప్రదీప్ మద్యం సేవించాడు. ఆపై మీ భర్త గాయాలతో పడి ఉన్నాడని భాస్కర్ అనే వ్యక్తి ప్రదీప్ భార్య మీనకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో కుటుంబ సభ్యులు చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. తన భర్త శ్రీనివాసమంగాపురం రైల్వే బ్రిడ్జ్ వద్ద మద్యం సేవించి వచ్చే క్రమంలో ఎద్దు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్లు నవీన్ కుమార్ తెలిపాడని మృతుడి భార్య తెలిపారు. ప్రదీప్కు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రదీప్ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య తన భర్త మృతిపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేడు శాసనాలపై గుడిమల్లంలో పురావస్తుశాఖ సర్వే ఏర్పేడు: దేశ చారిత్రక ఆధారాలను మరింతగా వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంలో ఏర్పేడు మండలం గుడిమల్లం నుంచి పుత్తూరు సమీపంలోని సదాశివకోన అటవీ ప్రాంతంలో ఆదివారం నుంచి సమగ్ర అధ్యయనం చేయనున్నట్ల కేంద్ర పురావస్తుశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలోనే తొలి శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న గుడిమల్లం ఆలయానికి అనుబంధంగా ఆ కాలం నాటి శిలాశాసనాలు ఇప్పటికే బయటపడగా, కొన్ని శాసన శిలలు ఆలయ ఆవరణలోనే ఉన్నాయి. అయితే గుడిమల్లం నుంచి సదాశివకోన రిజర్వాయర్ ప్రాంతంలో మరి కొన్ని విలువైన శాసన సంపద ఉన్నట్లు గుర్తించి, మైసూర్ నుంచి పురావస్తుశాఖ నిపుణుల బృందం, తిరుపతి పురావస్తుశాఖ అధికారి మునిరత్నంరెడ్డి, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా ఈ సర్వే చేపట్టనున్నారు. కేంద్ర పురావస్తుశాఖ నిపుణుల బృందంతోపాటు జిల్లా డీఎఫ్ఓ సాయిప్రసాద్, ఎఫ్ఆర్వో మాధవి వారి బృందంలో ఈ సర్వేలో పాల్గోనున్నారు. -
నవోదయ ఫలితాల్లో సత్తా చాటిన విశ్వం
తిరుపతి అర్బన్: జాతీయస్థాయిలో 2026–27కి సంబంధించి జవహార్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యా సంస్థలు సత్తా చాటాయని ఆ సంస్థ అధినేత విశ్వనాథ్రెడ్డి వెల్లడించారు. శనివారం మూడో విడత ఫలితాలు విడుదల చేశారని చెప్పారు. విశ్వం వి ద్యా సంస్థల్లో శిక్షణ పొందిన పద్మిని, చైతన్య నా యక్, ఇందు, బద్రీనాధ్, శాంతికుమారి ఇ, గోమతి, హర్ష, నవనీష్, భావన, సుహాన్ తదితరులు ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు. మూడో విడ త ఫలితాలతోపాటు 1, 2 విడతల ఫలితాలను కలుపుకుంటే మొత్తంగా 69 మందికి ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు. దశాబద్దాలుగా విశ్వం విద్యా సంస్థలు నవోదయతోపాటు సైనిక్ స్కూళ్ల ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో ఏటా ర్యాంకులు సాధిస్తుందన్నారు. నవోదయ, సైనిక్ స్కూళ్ల ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ కోరుకుంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అదనపు సమాచారం కోసం 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
నీట్, యోగాంధ్రకు పటిష్ట బందోబస్తు
తిరుపతి క్రైం : జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్తో పాటు తారకరామ స్టేడియంలో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నీట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేలా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే తారకరామ స్టేడియంలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ప్రజల రాకపోకలు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపులు, అత్యవసర సేవలు, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీలు ఆర్ల శ్రీనివాసులు (పరిపాలన), రవి మనోహరాచారి (శాంతిభద్రతలు), ఐ. రామకృష్ణ (తిరుమల), ఎస్బీ డీఎస్పీ గీతా కుమారి తదితరులు పాల్గొన్నారు. -
నేలబారు చదువులు
ఏర్పేడు: మండలం మడిబాక పంచాయతీ రాజులకండ్రిగలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఇప్పటికే పిల్లల నమోదు సంఖ్య 110కి చేరడంతో పాఠశాల హెచ్ఎం నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. అయితే ఈ పాఠశాలలో రెండు తరగతి గదులు మాత్రమే ఉండడంతో కొందరిని డెస్క్లపై, మరి కొందరిని కింద ఇరుకిరుకుగా కూర్చోబెట్టి పిల్లలకు ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. బ్యాగులేవి? సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ పేరుతో పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫామ్ దుస్తులతోపాటు స్కూల్ బ్యాగు, షూలు, బెల్ట్ అందించాలి. అయితే స్కూల్ బ్యాగులు, షూలు ఇంకా సరఫరా చేయకపోవడంతో గత ఏడాది అందించిన బ్యాగులు పూర్తిగా చిరిగిపోవడంతో వాటిని కుట్టించుకుని పాఠశాలకు వస్తున్నారు. అదనపు తరగతి గదులు మంజూరు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు. -
రాష్ట్రంలో
విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన ఇద్దరు విద్యార్థినులను శనివారం కలెక్టర్ కలెక్టరేట్లో అభినందించారు.‘కూటమి రాక్ష పాలనలో కాపులు, దళితులకు రక్షణ కరువైంది.. పచ్చనేతల దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, లైంగిక దాడులకు బలవుతున్నారు. ప్రగల్భాలు పలికే పవన్ నోట మాట రావడం లేదు. ఈ స్థితిలో కాల కూటమి నుంచి వారిని రక్షించడంతోపాటు మానవ హక్కుల పరిరక్షణకు వైఎస్సార్ సీపీ ఉధృత పోరాటం చేస్తోంది.’ అని ఆ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. కూటమి పాలనలో గాలిలో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు 15 ఉద్యోగసంఘాలతో సమీక్ష తిరుపతి కలెక్టరేట్లో కలెక్టరేట్ 15 ఉద్యోగ సంఘాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారితో చర్చించారు.ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026గాంధీరోడ్డులో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్న భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డితిరుపతి మంగళం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన కాపు నాయకుడు సాయికృష్ణ, దళితులు క్రాంతికుమార్, గంగమ్మను పోలీసులు దారుణంగా హింసించి చంపిన ఘటనలపై శనివారం వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని అనంతవీధి నుంచి చిన్నబజారువీధి, గాంధీరోడ్డు వరకు మానవహక్కులకు న్యాయపోరాట ర్యాలీని భారీగా నిర్వహించారు. ర్యాలీలో భూమన కరుణాకరరెడ్డితోపాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, మాజీ మేయర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నీలం బాలాజీతోపాటు పార్టీ శ్రేణులు, ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గాంధీరోడ్డులో రోడ్డుపై బైఠాయించి మానవహక్కులను పరిరక్షించాలని, సాయికృష్ణ, క్రాంతికుమార్, గంగమ్మ మృతికి కారకులైన పోలీసులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకాలు, దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలేనన్నారు. రెడ్బుక్ రాజ్యాంగంలో చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. సాయికృష్ణ, క్రాంతికుమార్, గంగమ్మ మృతులకు కారకులైన పోలీసులలో కేవలం నాగరాజు అనే సీఐని మాత్రమే సస్పెండ్ చేస్తే సరిపోదని ఎస్పీ కూడా బాధ్యులేనన్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని చంద్రబాబు కలిసి బేరసారాలతో సమస్యను సర్దుబాటు చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు అరాచకాలపై వైఎస్సార్సీపీ పోరాటాలు సాగిస్తూనే ఉంటుందని హెచ్చరించారు. సాయికృష్ణ, క్రాంతికుమార్, గంగమ్మ మరణాలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే ఇంతటి దారుణాలకు ఒడిగట్టిన పోలీసులను విడిచిపెట్టమని హెచ్చరించారు.హత్యలే రెడ్బుక్కు నిదర్శనం భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగుతోందనడానికి సాయికృష్ణ లాకప్ డెత్, దళితులైన క్రాంతికుమార్, గంగమ్మల హత్యలే నిదర్శనమన్నారు. సాయికృష్ణను పోలీసులు పోలీస్స్టేషన్ చంపి, బయట తీసుకెళ్లి బూడిద కూడ మిగల్చకుండా కాల్చేశారంటే ప్రభుత్వ అండదండలతోనే పోలీసులు ఇంతకు తెగించారన్నారు. వీరి హత్యలకు హోంమంత్రి అనిత నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలను చూస్తే రాష్ట్రంలో పూర్తిగా మానవహక్కులు ఉల్లంఘన అయ్యాతున్నాయన్నారు. పోలీసులు తప్పు చేస్తే పోలీసులచే విచారణ జరిపిస్తే ఎక్కడ న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. వీటిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
హిందీ పరీక్షలో ఆరె విద్యార్థికి రాష్ట్రస్థాయి ప్రథమస్థానం
కేవీబీపురం: హిందీ టాలెంట్ పరీక్షలో కేవీబీపురం మండలం ఆరె ప్రభుత్వ పాఠశాల పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఎం.కృష్ణవేణి రాష్ట్ర ప్రథమస్థానం కై వసం చేసుకుంది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు హిందీ పోటీ పరీక్షల్లో సత్తా చాటిన రాష్ట్ర విజేతలకు విశిష్ట హిందీ ప్రతిభ రత్న అవార్డు–2025 ప్రదానోత్సవం శనివారం విజయవాడ యూటీఎఫ్ భవన్లో నిర్వహించారు. ఆరె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే కృష్ణవేణి హిందీ ప్రతిభ అన్వేషణ పరీక్షల్లో పాఠశాల స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిభ కనపరిచి ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయి అధికారుల సమక్షంలో కృష్ణవేణికి బంగారు పతకం బహూకరించారు. నగదు ప్రోత్సాహం అందించారు. ఈ బహుమానాన్ని కృష్ణవేణి తల్లిదండ్రులు ఢిల్లీ బాబు, శోభన ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ప్రతిభ కనపరచిన కృష్ణవేణిని మండల ఎంఈఓలు లక్ష్మీపతి, రవికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి నాయుడు, హిందీ ఉపాధ్యాయుడు మల్లికార్జున్ అభినందించారు. -
విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు
తిరుపతి అర్బన్: జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన ఇద్దరు విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. రేణిగుంట మండలంలోని గుత్తివారిపల్లి జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థి రేష్మ ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇన్స్పైర్ మనక్ జాతీయ పోటీల్లో గెలుపొందారు. దీంతో ఆ విద్యార్థిని ఈ నెల 28 నుంచి జూలై 4 వరకు జపాన్ దేశంలో సకురా పట్టణంలో నిర్వహించే అంతర్జాతీయ పోటీలకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఆమెను అభినందించి, ఆశీర్వదించారు. అనంతరం రేష్మకు సీతారాముల కాంస్య విగ్రహాన్ని బహూకరించారు. అలాగే తిరుచానూరులోని భువ నేశ్వరి విద్యానికేతన్లో పదో తరగతి చదువుతున్న ఎం.ధన్యశ్రీ ఇటీవల జాతీయ స్థాయిలో నిర్వహించిన పెయింటింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ క్రమంలోనే ఎం.ధన్యశ్రీ శనివారం కలెక్టర్ పెన్సిల్ ఆర్ట్ చిత్రాన్ని కలెక్టర్కు బహూకరించా రు. అలాగే చిన్నారిని అభినందించి, వెంకటేశ్వరస్వామి కాంస్య విగ్రహాన్ని బహూకరించారు. -
మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి
తిరుపతి కల్చరల్: మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని, అప్పటి వరకు వైఎస్సార్సీపీ రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటుందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చిత్తూరు జిల్లా వాసి అయ్యి ఉండి కూడా మామిడి రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. మామిడి కేజీకి రూ.15 నుంచి రూ.20 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలు కలిసి మామిడికి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి సాయి కృష్ణ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో చారణ జరిపించాలని, అలాగే సీబీఐతో విచారణ చేపట్టాలని నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఏబీసీడీ వర్గీకరణతో మాదిగలు, మాలలను విడదీసి చంద్రబాబు నాయుడు ఎవరికి మేలు చేశారో చెప్పాలన్నారు. తమిళనాడు తూతుకుడి పోలీస్ స్టేషన్లో తండ్రీ కొడుకులను హింసించిన కేసులో అదే పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన సాక్ష్యం మేరకు 9 మంది పోలీసు అధికారులకు మరణశిక్ష ఇదించారని గుర్తుచేశారు. కృష్ణలంక ఘటనలోనూ అదేవిధంగా విచారణ చేపట్టాలని కోరారు. సమావేశంలో అరే అజయ్కుమార్, వెంకటేష్, తాళ్లపాక మహేష్, నాగేంద్ర పాల్గొన్నారు. -
నాయుడుపేటలో చోరీ
నాయుడుపేట టౌన్: నాయుడుపేట పట్టణంలోని అగ్రహారపేటలో ఇంట్లో ఎవరూలేని సమయంలో తాళాలు పగులగొట్టి గుర్తుతెలియని దుండగులు చోరీ చేసిన ఘటనను శనివారం వెలుగులోకి వచ్చింది. అగ్రహారపేటలో తడ రత్నమ్మ, ఆమె కుమార్తె ప్రవళికతో కలిసి నివాసం ఉంటున్నారు. రత్నమ్మ పెద్ద కుమార్తె గూడూరు వైద్యశాలలో చికిత్స పొందుతోంది. రత్నమ్మతో పాటు ప్రవళిక సోమవారం గూడూరుకు వెళ్లారు. శుక్రవారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించి చుట్టుపక్కల వాళ్లు రత్నమ్మకు సమాచారం అందించారు. రత్నమ్మ ఇంటి వద్దకు చేరుకుని పరిశీలించారు. ఇంట్లోని మూడు బీరువాలను ధ్వంసం చేసి అందులో దాచి ఉన్న సుమారు 3.5 సవర్ల బంగారు నగలు, అర కిలో పైగా వివిధ రకాల వెండి వస్తువులు, ప్రవళిక కిడ్డీ బ్యాంక్లో దాచుకుని ఉన్న రూ.15 వేల నగదును దుండగులు దోచుకెళ్లినట్టు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఇక పైరవీలదే హవా
తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఎస్వీ, పద్మావతి మహిళా జూనియర్ కళాశాలల్లో 1,750 సీట్లకు గాను ఇప్పటి వరకు 718 మంది ప్రవేశాలు పొందారు. పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో తొలి విడతలో 252 మంది, రెండో విడతలో 191 మంది అడ్మిషన్లు పొందగా మిగిలిన 525 సీట్లును మూడో విడతలో భర్తీ చేయాల్సి ఉంది. అలాగే ఎస్వీ జూనియర్ కళాశాలలో తొలి విడతలో 172 మంది, రెండో విడతలో 103మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా మూడో విడతలో మరో 517 సీట్లు భర్తీ చేయనున్నారు. 24 నుంచి మూడో విడత కౌన్సెలింగ్ మిగిలి ఉన్న సుమారు 1,032 సీట్లకు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మెరిట్ లిస్ట్ను 21, 22 తేదీలలో విడుదల చేసి విద్యార్థులకు సమాచారం అందించనున్నారు. వంద సీట్లకంటే ఎక్కువ భర్తీకాకపోవచ్చు రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసినా కనీసం రెండు కళాశాలల్లో 50 శాతం సీట్లు భర్తీ కాకపోవడం గమనార్హం. మూడో విడతలో మరో వంద సీట్లు కంటే ఎక్కువ భర్తీ కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. అనంతరం జరిగే స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో అడ్మిషన్లు భారీ స్థాయిలో పెరుగుతాయని అంచానా. స్పాట్ ప్రవేశాలలో మెరిట్ను తుంగలో తొక్కి పైరవీలదే హావా కొనసాగనుంది. టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల వివరాలు కళాశాల మొత్తం తొలి రెండో మిగిలినవి సీట్లు విడతలో విడతలో పద్మావతి జూనియర్కళాశాల 968 252 191 525 ఎస్వీ జూనియర్ కళాశాల 792 172 103 517 -
అక్రమ సంకెళ్లకు విముక్తి
తడ–నెల్లూరు మధ్య ఆరు లేన్లు తడ–నెల్లూరు మధ్య ఉన్న నాలుగు లేన్ల స్థానంలో ఆరు లేన్లు చేస్తున్నట్టు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. పెళ్లకూరు: అక్రమ సంకెళ్లకు విముక్తి లభించింది. 96 రోజులపాటు అక్రమంగా జైళ్లలో నిర్బంధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డికి శుక్రవారం ఎట్టకేలకు బెయిలు మంజూరైంది. ధర్మమే గెలిచిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. పెళ్లకూరు మండలంలోని కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖినదిలో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టడాన్ని నిరసిస్తూ మార్చి 14న రైతులతో కలిసి వైఎస్సార్ సీసీ నాయకులు అడ్డుకున్నారు. దాంతో కూటమి నేతలు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు నన్నం ప్రిస్కిల్లా, డీసీసీబీ మాజీ చైర్మెన్ సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్రెడ్డిలతో పాటు మొత్తం26 మందిపై కేసులు నమోదు చేశారు. సత్యనారాయణరెడ్డితో పాటు మరో 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు మార్చి 16న నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. రిమాండ్లో ఉన్న ఆయన్ని మార్చి 24న పెళ్లకూరు పోలీసులు మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు. రిమాండ్లో ఉన్న మరో 12 మందికి ఏప్రిల్ 8న బెయిల్ మంజూరైంది. కానీ 11మందిని మాత్రమే విడుదల చేసిన పోలీసులు చెంబేడు గోదాము విషయంలో సత్యనారాయణరెడ్డిపై అక్రమంగా కేసులు నమోదు చేసి రిమాండ్ను కొనసాగించారు. అలాగే చిల్లకూరులో జరిగిన వివాదానికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ వివిధ సెక్షన్ల కింద సత్యనారాయణరెడ్డిపై మరో అక్రమ కేసు నమోదు చేశారు. బెయిల్ మంజూరైన ప్రతిసారీ పలు పీటీ వారెంట్లు వేస్తూ రిమాండ్ నుంచి విడుదల కానివ్వకుండా గత 96 రోజులుగా జైలులో నిర్బంధించారు. చివరికి శుక్రవారం కామిరెడ్డికి బెయిల్ మంజూరైంది. -
తిరుపతి జిల్లా అదనపు ఎస్పీగా శ్రీనివాసులు
తిరుపతి క్రైమ్ : తిరుపతి జిల్లా అదనపు ఎస్పీగా ఆర్ల శ్రీనివాసులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో తిరుపతి జిల్లాలో అదనపు ఎస్పీ (క్రైమ్స్)గా విధులు నిర్వహించిన ఆర్ల శ్రీనివాసులు, తాజాగా అదనపు ఎస్పీ (పరిపాలన)గా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ ఎల్.సుబ్బరాయుడును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 7 నుంచి బీఈడీ పరీక్షలు తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో బీఈడీ చదువుతున్న విద్యార్థులకు సెకండ్ సెమిస్టర్ పరీక్షలు వచ్చే నెల 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజామాణిక్యం తెలిపారు. విద్యార్థులు ఈనెల 30వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. నేడే అన్నదాత సుఖీభవ తిరుపతి అర్బన్: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు విడతల్లో భాగంగా తొలి విడతగా శనివారం పీఎం కిసాన్ రూ.2వేలు, అన్నదాత సుఖీభవ రూ.5వేలు మొత్తం రూ.7 వేలు రైతు ఖాతాల్లో జమ కానుంది. ఈ మొత్తాన్ని శనివారం జిల్లాలో అర్హులైన 1,65689 మంది రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. 2023–24లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 1,80,654మంది అన్నదాతలకు రైతు భరోసా అందించింది. కూటమి ప్రభు త్వం వచ్చాక వివిధ కారణాలు చూపి అందులో 57,098 మందికి కోత విధించింది. ప్రతి రైతుకూ రూ.20 వేలు అని చెప్పి అందులో సవాలక్ష కొర్రీలు విధిస్తోంది. కాకిలెక్కలతో అన్నదాతలను బోల్తాకొట్టిస్తోంది. సమగ్ర నివేదిక అందిస్తాం తిరుపతి అర్బన్: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబందించి సమగ్ర నివేదికను అందిస్తామని రిటైర్డ్ ఐఏఎస్, డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్రంజన్ మిశ్రా వెల్లడించారు. శుక్రవారం తిరుపతి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ చాంబర్లో బీసీ నేతలు, సంఘాలకు చెందిన ప్రతినిధులతోపాటు సాధారణ వ్యక్తులు అందించిన అర్జీలను ఆయన స్వీకరించారు. ఆయనతోపాటు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల నుంచి స్థానిక సంస్థల్లో రిజక్వేషన్లకు సంబంధించి అర్జీల సేకరణ చేస్తున్నామని పేర్కొన్నారు. జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, బీసీ వెల్పేర్ జిల్లా అధికారి భరత్కుమార్రెడ్డి పాల్గొన్నారు. రేణిగుంటలో డెడికేటెడ్ కమిషన్ రేణిగుంట: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా శుక్రవారం రేణిగుంటలో పర్యటించారు. ముందుగా ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి.. మండలంలో జరిగిన సర్వేపై అధికారులను అడిగి వివరాలు సేకరించారు. అనంతరం బుగ్గ వీధిలో ప్రజల వద్దకు వెళ్లి ఆన్లైన్లో డేటా ఎంట్రీని పరిశీలించారు. జెడ్పీ సీఈవో రవికుమార్నాయుడు, డీపీఓ సుశీలాదేవి, డీఎల్డీఓ గంగాభవానీ, ఎంపీడీవో రవిచంద్ర, డిప్యూటీ ఎంపీడీఓ ప్రభురావు పాల్గొన్నారు. పది సప్లిమెంటరీలో 83.87 శాతం ఉత్తీర్ణత తిరుపతి అర్బన్: పదో తరగతి అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు 83.87 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. శుక్రవారం ఫలితాలు విడుదల చేయగా.. 4,556 మంది విద్యార్థులకు గాను 3,821 మంది ఉత్తీర్ణత సాధించారు. మళ్లీ 735 మంది ఫెయిలయ్యారు. వీరు ఈ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు అవకాశం కల్పించారు. సార్వత్రిక విద్యాపీఠంకు సంబంధించి 480 మంది విద్యార్థులకు గాను 428 మంది ఉత్తీర్ణత సాధించారు. యోగా డే రేపు తిరుపతి అర్బన్: అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న జిల్లా స్థాయిలో యోగా డే నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో ఆదివారం జాతీయ యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 6.30 నుంచే కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. -
గంజాయి టెస్ట్లో ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్
తిరుపతి క్రైం : గంజాయి టెస్ట్లో ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్టు తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆధ్వర్యంలో తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో 300 మంది విద్యార్థులకు బయో–చెక్ కిట్ల ద్వారా గంజాయి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈస్ట్, వెస్ట్, అలిపిరి, ఎస్వీయూ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన ఈ పరీక్షల్లో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్గా తేలింది. ఆ ఇద్దరు విద్యార్థులకు నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే టోల్ఫ్రీ 1972 (ఈగల్) లేదా 112కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. బైక్ను ఢీకొన్న లారీ ద్విచక్ర వాహనదారుడి మృతి చంద్రగిరి: ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి, పనపాకం సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. తిరుపతి రూరల్ మండలం, తనపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన రమేష్(37) కొరియర్ బాయ్గా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత పనులు ముగించుకుని పాకాల నుంచి చంద్రగిరి వైపు వస్తున్న క్రమంలో తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న లారీ పనపాకం సమీపంలో ఎదురుగా వస్తున్న రమేష్ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవరు వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో, పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లారీ డ్రైవరు జావీద్ బాషాను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సచివాలయ ఉద్యోగి అరెస్టు నాయుడుపేట టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని భరత్నగర్ సచివాలయ పరిధిలో అడ్మిన్గా పనిచేస్తున్న విజయరామయ్యపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఒట్టు విజయరామయ్యను అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరచగా.. జడ్జి రిమాండ్ విధించినట్లు సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. విజయరామయ్య భరత్నగర్ సచివాలయ సమీపంలో ఓ వివాహితతో సఖ్యత పెంచుకుని తరచూ ఇంటికి వెళ్లేవాడు. ఇంట్లో ఆ మహిళ లేని సమయంలో ఆమె కుమార్తె స్నానం చేస్తుండగా ఎవరికీ తెలియకుండా వీడియోలు తీసి బాలికను బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా గుర్తించినట్లు సీఐ వెల్లడించారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సచివాలయ అడ్మిన్ను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. -
ఒక్కొక్కటిగా ఖాళీ!
వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గంలో అభివృద్ధి అటకెక్కింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటిగా ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తుండడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మొన్న ఎకై ్సజ్, నిన్న వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయాలు తరలివెళ్లగా.. నేడు సబ్ జైలును చిత్తూరుకు తరలించేశారు. దశాబ్దాల చరిత్ర కలిగిన సత్యవేడు సబ్ జైలును మూసివేయడంతో ప్రభుత్వ పాలనా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. ఈ నెల 15 నుంచి అధికారికంగా సత్యవేడు సబ్ జైలును మూత వేశారు. శిథిలభవనం, భద్రతా లోపాల పేరుతో జైలుకు తాళం వేశారు. జైలులో ఉన్న ఏడుగురు రిమాండ్ ఖైదీలను చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. 33 ఏళ్ల పాటు సత్యవేడులో కొనసాగిన సబ్ జైలును చంద్రబాబు ప్రభుత్వం మూత వేయడంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిథిల భవవాన్ని బాగుచేయలేక.. జైలు భవనం శిథిలావస్థకు చేరిందని, పైకప్పు దెబ్బతిందని సాకులు చెబుతున్న అధికారులు, గత రెండేళ్లుగా ఆ భవనం మరమ్మతులకు నిధులు కేటాయించలేకపోయారు. ప్రజాధనంతో కొత్త భవనం నిర్మించడం చేతగాక, ఉన్న జైలును మూసేసి చేతులు దులుపుకున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే. సత్యవేడు, నాగలాపురం, వరదయ్యపాళెం, పిచ్చాటూరు మండలాల ప్రజలు ఇకపై చిన్న కేసులకూ చిత్తూరు చుట్టూ తిరగాల్సిన దుస్థితి. అంతేగాక జైలులో ఉన్న ఖైదీలను పరామర్శించేందుకు కుటుంబ సభ్యులు వెళ్లాలన్నా ఇకపై 110 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే. పోలీస్ శాఖకు గుదిబండ సబ్ జైలు మూతతో పోలీస్ శాఖపై విపరీతమైన భారం పడనుంది. ఇప్పటికే సిబ్బంది కొరతతో సతమతమవుతున్న పోలీసులు, ఇక ఒక్కో ఖైదీ కోసం ఇద్దరు చొప్పున రిమాండ్కు తరలించే సమయంలో చిత్తూరు వెళ్లాల్సి ఉంది. డిప్యూటేషన్ల పేరుతో సిబ్బందిని ఇతర చోట్లకు పంపి, ఇక్కడ శాంతిభద్రతలను గాలికొదిలేశారు. మౌనం వెనుక మతలబేంటి? సబ్ జైలు మూసివేతపై స్థానిక ఎమ్మెల్యే గానీ, అధికార పార్టీలో నియోజకవర్గ కో–ఆర్డినేటర్గా ఉన్న నేతగానీ, అధికార పార్టీ నేతలు గానీ నోరు మెదపలేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టడం, కొత్త భవనం కట్టించడం చేతకాలేదు. ఆర్టీసీ డిపోనీ మూసేస్తారా? చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సత్యవేడు కేంద్రంగా ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. ఇప్పటికే ఎకై ్సజ్ శాఖ కార్యాలయాన్ని నాగలాపురానికి, వాణిజ్య పన్నుల శాఖను పుత్తూరుకు తరలించారు. ఒకప్పుడు కళకళలాడిన తెలుగుగంగ ప్రాజెక్టు డీఈ కార్యాలయాన్ని కుదించి ఏఈతో సరిపెట్టారు. ఇప్పుడు సబ్ జైలు కూడా పోయింది. త్వరలో ఆర్టీసీ డిపోను సైతం మూత వేసేందుకు కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ దిశగా అటు చైన్నె, బెంగళూరు, చిత్తూరు సర్వీసులను ఒక్కొక్కటిగా కుదిస్తూ వస్తున్నారు. గెలిచాక మొండి చేయి ఎన్నికలు వచ్చినప్పుడు అభివృద్ధి మంత్రం జపించే నాయకులు, గెలిచిన తర్వాత సత్యవేడును పూర్తిగా విస్మరించారు. ఉన్న సంస్థలను కాపాడుకోలేని వీళ్లు, కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకొస్తారని ఎలా నమ్మాలి?. ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తున్న పాలకుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
పొగ‘దారి’!
పై చిత్రంలో కనిపిస్తున్న దృశ్యంలో ఇక్కడేదో అగ్నిప్రమాదం జరిగిందనుకుంటే పొరపాటే. తిరుపతి–శ్రీకాళహస్తి జాతీయ రహదారి, ఏర్పేడు మండలం, మేర్లపాక సమీపంలోని ఓ స్టీల్ కర్మాగారం నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో కూడిన దట్టమైన పొగ ఇది. ముందు వెళ్లే వాహనాలు కనిపించకుండా రాత్రి వేళల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ పరిశ్రమ నుంచి నిత్యం చిమ్నీలు, ఇతర మార్గాల ద్వారా దట్టమైన విష వాయువులతో కూడిన పొగ వదులుతోంది. సమీప గ్రామాలలో ఇళ్ల డాబా మీద నల్లగా దుమ్ము పేరుకుపోతోంది. ఉన్నతాధికారులు స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. – ఏర్పేడు -
భూ కబ్జాలు!
ఎమ్మెల్యే నాని అండతోనే తిరుపతి రూరల్: ‘మా భూమిని స్థానికంగా ఉంటున్న టీడీపీ నాయకుని సహకారం, ఎమ్మెల్యే పులివర్తి నాని అండతో చెర్లోపల్లికి చెందిన వడ్లమూడి రామచంద్రనాయుడు కుమారుడు చంద్రశేఖర్ నాయుడు ఆక్రమించుకున్నారు. ఆ భూమి విషయంలో తమకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ, వాటిని అమలు చేయని అధికార యంత్రాంగం ఆక్రమణదారులకు అండగా వ్యవహరిస్తోంది’ అని బాధిలు ఆరోపించారు. తిరుపతి రూరల్ మండలం, పుదిపట్ల గ్రామ పంచాయతీ, అరుందతీవాడకు చెందిన జంపాల నాగయ్య కుటుంబం శుక్రవారం తాటితోపులో ఉన్న తమ భూమి వద్దకు చేరుకున్నారు. వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు. వారిని అడ్డుకుని బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. దీంతో దళితులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులు మాట్లాడుతూ తాటితోపు సమీపంలో చెర్లోపల్లి గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నం.243/3లో 2.48 ఎకరాల దరఖాస్తు పట్టా భూమి ఉందన్నారు. తమ ఆధీనంలో ఉన్న ఆ భూమిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా దళితులమైన తమను పోలీసులు అడ్డుకోవడం బాధాకరమన్నారు. తమ తాతాల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూమి వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం వెనుక ఎమ్మెల్యే పులివర్తి నానీ హస్తం ఉందని బాధితులు ఆరోపించారు. ఆ భూములు తమవని.. కోర్టుకూడా గుర్తించిందన్నారు. ఇప్పుడు అధికారులు కాదని చెబుతూ అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చూడడానికి కూడా పోలీసులు అంగీకరించడం లేదన్నారు. వివాదస్పద భూమి వద్ద పోలీసులు మాత్రం పికెటింగ్ను యథావిధిగా కొనసాగిస్తున్నారు. తిరుపతి ఆర్డీఓ, పోలీసులపై ఫిర్యాదు దళితుల సాగు కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని అడ్డగోలుగా ఆక్రమించడానికి వచ్చిన కబ్జాదారులకు అధికారులు, పోలీసులు అండగా నిలిచి తమకు అన్యాయం చేశారని తిరుపతి ఆర్డీఓ, పోలీసు అధికారులపై హైకోర్టులో ఫిర్యాదు దాఖలు చేసినట్టు బాధిత దళిత కుటుంబీకులు వెల్లడించారు. కోర్టులో కేసు నడుస్తున్న భూమికి ఏకపక్షంగా ఒక వ్యక్తికి పోలీసు రక్షణ కల్పించే అధికారం ఆర్డీఓకు ఎవరిచ్చారు? పోలీసు రక్షణ కల్పించాల్సి వస్తే హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలే కానీ అధికారులు ఎలా ఆ నిర్ణయం తీసుకుంటారు? అని ప్రశ్నించారు. పోరాడుతాం మా తాతల కాలం నుంచి వచ్చిన భూమిని కాపాడుకోవడానికి ఎంతకై నా తెగిస్తాం. ఎంత మంది వచ్చినా ఆ భూమిని వదులుకునేది లేదు. ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. మా పిల్లల భవిష్యత్తు ఆ భూమిపైనే ఉంది. మాకు న్యాయం చేయాలి. – వి.రాజేశ్వరి, బాధితురాలు ఇది రాక్షస పాలన 1946లో మాకు డీకేటీ పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించ లేదు. దళితుల భూములను లాక్కుని పెద్దలకు అప్పగించే దుస్థితిని ఇప్పుడే చూస్తున్నాం. ఎమ్మెల్యే పులివర్తి నాని హస్తం ఉండడం వల్లనే పోలీసులు ఇంతలా దౌర్జన్యం చేస్తున్నారు. ఇది న్యాయపాలనా..? రాక్షస పాలనా..?. – గంగయ్య, బాధిత కుటుంబీకుడు, పుదిపట్లమాకు కడుపు మంట మిగిల్చారు దళితులమైన మా భూమిని లాక్కుని మాకు కడుపు మంట మిగిల్చారు. కోట్ల విలువైన భూమిని అడ్డంగా కొట్టేయాలని అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా భూమిలోకి దిగారు. న్యాయ స్థానం చుట్టూ తిరిగి ఆ భూమి మా దేనని నిర్ధారించుకున్నా ఈ దుర్మార్గపు ప్రభత్వంలో మాకు అన్యాయమే జరుగుతోంది. – జె.రమ్య, బాధితురాలు కబ్జాదారులకు ఎమ్మెల్యే నాని అండ దళిత వర్గానికి చెందిన పేదలకు అన్యాయం జరుగుతుంటే కబ్జాదారులకు ఎమ్మెల్యే నాని, పోలీసులు అండగా నిలిచారు. పేదలకు తీరని ద్రోహం చేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్లను కూడా లెక్క చేయడం లేదు. ఎమ్మెల్యే నాని అర్డర్ ముందు హైకోర్టు ఆర్డర్ పనికిరాకుండా పోయింది. – నల్లయ్య, బాధితుడు -
2002 ఓటర్ల జాబితాలో లొసుగులు
నాయుడుపేట టౌన్ః సర్ (స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా 2002 ఓటర్ల జాబితాలో పలు లొసుగులు వెలుగు చూస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు వెల్లడించారు. నాయుడుపేట పట్టణంలోని 68వ పోలింగ్ బూత్లో శుక్రవారం వైఎస్సార్సీపీ బూత్లెవల్ ఏజెంట్, మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, బీఎల్ఓ జి.విష్ణుగౌతమ్తో పాటు పలు పార్టీల బీఎల్ఓలు సైతం ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు దరఖాస్తులు అందించారు. వారి జాబితా పరిధిలో ఆర్ముగం నగర్లో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఆవుల నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల ఓట్లు జాబితాలో లేకపోవడాన్ని చూసి కంగుతిన్నారు. 30ఏళ్లుగా నాయుడుపేటలో ఉంటున్న ఆవుల నాగేశ్వరరావు 2002కు సంబంధించి ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో మ్యాపింగ్ చేయలేకపోయామని బీఎల్ఓ వెల్లడించారు. ఈ విషయమై ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు వారి పరిధిలోని ఓటర్ల జాబితాను పరిశీలన చేసుకుని ఓటు నమోదై ఉందే లేదో చూసుకోవాలని జలదంకి వెంకటకృష్ణారెడ్డి సూచించారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఇదే తరహాలో వృద్ధులు, పలువురు సీనియర్ ఓటర్లు సైతం జాబితాలో లేనట్లుగా గుర్తించారు. కర్ణాటక సీఎంకు సాదర వీడ్కోలు రేణిగుంట: తిరుమల తిరుపతి పర్యటన అనంతరం తిరుగు పయనమైన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే.శివకుమార్కి రేణిగుంట విమానాశ్రయంలో కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, ఆర్డీవో భానుప్రకాష్రెడ్డి సాదరంగా వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో కర్ణాటక సీఎం బెంగళూరు వెళ్లారు. -
ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: శేషాచలం అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి తరలించడానికి ప్రయత్నించిన కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, పోలూరు తాలూకా, మాటకనురు గ్రామానికి చెందిన రామన్ దొరై రాజుకు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, ఆరు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు... 2019లో ఎర్రచందనం అక్రమ నిరోధక దళం పెరుమాలపల్లి బీట్, టీఎన్ పాలెం సెక్షన్, ఎస్విఎన్ పి రేంజ్, తిరుపతి డివిజన్, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. నిందితుడు రామన్ దొరై రాజు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి దుంగలు తరలించడానికి ప్రయత్నిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఫారెస్ట్ సిబ్బంది అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. నేరం రుజువు కావడంతో జడ్జి అతనికి శిక్ష విధించారు. ప్రజాభిప్రాయం మేరకే అనుమతులు సైదాపురం: ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్ అనుమతులు ఇస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు వెల్లడించారు. మండలంలోని తుమ్మలతలుపూరు గ్రామంలో శ్రీగంగోడు నాగేశ్వరరావు కంపెనీ ఆధ్వర్యంలో శుక్రవారం పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పెరుమాళ్లపాడు రెవెన్యూ పరిఽధిలోని సర్వే నం. 142,143ఎలో 3.197 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినట్టు వెల్లడించారు. ఎన్విరాల్మెంట్ అధికారి అశోక్కుమార్, తహసీల్దార్ సుభద్ర పాల్గొన్నారు. ఆలయంలో అపచారం వరదయ్యపాళెం: మండలంలోని సాధనవారిపాళెం గ్రామంలోని పుట్టాలమ్మ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు భక్తులు పూజించే పవిత్ర చెట్టును నరికివేసి, ఆలయంలోని త్రిశూలం, పూజా సామగ్రిని దొంగిలించి పరారయ్యారు. ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు ఈ ఘటనను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆలయ ధర్మకర్త హేమలతమ్మ మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమరసత సేవా ఫౌండేషన్ సత్యవేడు ఖండ సహ కన్వీనర్ ఆర్. మురళి, ధర్మ ప్రచారక్ తోట హనుమంతురెడ్డి, మండల కన్వీనర్ సురేష్, సహ కన్వీనర్ ఆర్కే శ్రీను ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది. తడ–నెల్లూరు మధ్య ఆరు లేన్లు తిరుపతి అర్బన్: తడ–నెల్లూరు జాతీయ రహదారిని 4 లేన్ల నుంచి ఆరు లేన్లుగా చేస్తున్నారని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఈ అంశంపై అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూసేకరణ, ట్రాపిక్ సర్వేలు తదితర అంశాలపై చర్చించారు. జేసీ గోవిందరావు, ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్ గణపతి పాల్గొన్నారు. -
పోలీసులకు చంపే హక్కు ఉందా?
తిరుపతి కల్చరల్: పోలీస్ స్టేషన్లో నిందితుడ్ని చంపే హక్కు పోలీసులకు ఉందా.. అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్యానలిస్ట్ పసుపులేటి సురేష్ ప్రశ్నించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ కృష్ణలంకలో లాకప్ డెత్పై సుదీర్ఘంగా మాట్లాడారు. నిందితుడు గాదే సాయికృష్ణ హత్య దారుణమన్నారు. అతడిని చిత్రహింసలు పెట్టి, మర్మాంగాలపై తన్ని, గోళ్లు పీకి జంతువులు కన్నా ఘోరంగా హింసించి చంపేయడం దుర్మార్గమన్నారు. ‘నా బిడ్డ బూడిదన్నా ఇవ్వండి’ అంటే ఇవ్వకుండా అతని తల్లిని వేధిస్తున్నారని ఆరోపించారు. కూటమి నాయకులలో సుమారు 20 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపించారు. పోలీస్ కేసులు ఉంటే పోలీస్ స్టేషన్లో చంపే హక్కు పోలీసులకి ఎక్కడదని ప్రశ్నించారు. తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా నిరాహార దీక్ష చేస్తే పోలీసులను అడ్డంపెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. దీనికి నిరసనగా శనివారం 9 గంటలకు తిరుపతిలోని అనంత వీధి నుంచి గాంధీ రోడ్డు హథిరాంజీ మఠం వరకు మానవ హక్కుల పరిరక్షణ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం లక్కాకుల దినేష్ రాయల్ మాట్లాడారు. సమావేశంలో డాక్టర్ రమేష్ రాయల్, తిరుమల శెట్టి వెంకటేష్, లక్కాకుల దినేష్ రాయల్, ఎన్వీ సురేష్, నైనారు మధుబాల, శేఖర్ పాల్గొన్నారు. -
పూరి గుడిసె దగ్ధం
● రూ.50 వేల నగదు, 8 గ్రాముల బంగారం బుగ్గిపాలు చంద్రగిరి: షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరి గుడిసె దగ్ధమైన ఘటన మండలంలోని తాటికోన ఎస్టీ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. తాటికోనకు చెందిన సురేష్, అంజలి దంపతులు ముగ్గురు పిల్లలతో కలసి సమీపంలోని ఓ మామిడి తోట లో కాపలాదారులుగా ఉంటున్నారు. ఈ క్ర మంలో రోజూలాగా బుధవారం దంపతులు ఇద్దరు పిల్లలను తీసుకుని తోటకు వెళ్లారు. ఆ సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యా పించి గుడిసె కాలిపోయింది. ఈ ప్రమాదంలో బాధితులు డ్వాక్రా సంఘం కో సం ఉంచుకున్న రూ.50 వేల నగదు, 8 గ్రా ముల బంగారం, ఆధార్కార్డు, దుస్తులు, గృహపకరణాలు మంటలకు ఆహూతయ్యాయి. ఆటోవాలాల ముష్టి యుద్ధం చంద్రగిరి: మండల కేంద్రంలో ప్రయాణికులను ఎక్కించుకునే విషయమై ఆటోవాలాలు నడిరోడ్డుపై బుధవారం బాహాబాహీకి దిగి కొట్టుకున్నారు. వివరాల్లోకెళితే.. చంద్రగిరి పోలీసు స్టేషన్ సమీపంలోని జెరాక్స్ సెంటర్కు ఓ ఆటో డ్రైవర్ భార్య తన కుమారుడితో కలసి వచ్చి, పత్రాలను జెరాక్స్ చేసుకుంది. ఆపై మహిళ బయటకు రాగానే అక్కడ ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఓ ఆటో సిద్ధంగా ఉంది. అయితే సదరు మహిళ ఆ ఆటో ఎక్కకుండా, వెనుక ఉన్న తన భర్త ఆటో ఎక్కింది. ఆ ఆటో లో డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాడని అపోహకు గురైన ఆటో డ్రైవర్ అతనితో గొడవకు దిగారు. ఈ క్రమంలో మహిళ ఇది త మ ఆటో అని, ఆయన తన భర్త అంటూ చెప్పింది. అయినప్పటికీ వినిపించుకోని మరో ఆటో డ్రైవర్ ఆ మహిళ భర్తపై దాడికి దిగాడు. తన భర్తపై మరో ఆటో డ్రైవర్ దాడి చేశారంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దాడికి పాల్పడిన వ్యక్తి స్థానికంగా ఉండే కాలనీకి చెందిన బా షా అని మహిళా పేర్కొంది. ఇరువర్గాల గొ డవల నేపథ్యంలో స్థానికులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వడదెబ్బతో మహిళ మృతి ఏర్పేడు: మండలంలోని రాజుల కండ్రిగ గ్రామానికి చెందిన సూరపరాజు సుభద్రమ్మ(62) బుధవారం మధ్యాహ్నం వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వ్యవసాయ కూలీలకు భోజనం తీసుకెళ్లి, పొలాల నుంచి తిరిగి వస్తుండగా ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి పంట పొలంలోనే కుప్పకూలిపోయారు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బంగారు ఆభరణాలు, నగదు చోరీ దొరవారిసత్రం: వేణుంబాకం గ్రామ పరిధిలోని మాతమ్మ, చింతాలమ్మ ఆలయాల్లో గుర్తుతెలియని దుండగలు చొరబడి బంగారు ఆభరణాలు, నగదుతోపాటు వెండి ఆభరణాలు మంగళవారం రాత్రి చోరీ అయ్యాయి. స్థానిక పోలీసుల కథనం మేరకు.. వేణుంబాకం ఎస్సీ కాలనీలో మాతమ్మ గుడి తాళాలు పగుల గొట్టి అమ్మవారి మెడలోని బంగారు తాళిబొట్లు, కాసులు, గుండ్లుతో పాటు అక్కడే ఉన్న బీరువా తాళం బద్దల కొట్టి వెండి వస్తువులు కొన్ని చోరీ చేశారు. హుండీలోని నగదును చోరీ చేశారు. మూడున్నర సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. అలాగే గ్రామ పొలిమేర్లలో ఉన్న ముత్యాలమ్మ గుడి తాళాలు కూడా పగులగొట్టి అమ్మవారి మెడలోని తాళి బొట్లను అపహరించారు. ఈ చోరీ చోరీలపై ఆయా ఆలయాల పూజార్లు గూడూరు భూషణమ్మ, మంగళం అల్లెయ్య బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జీవీ చౌదరి తెలిపారు. పాళెంపాడులోని మాతమ్మ ఆలయంలో కూడా ఆలయ తాళాలు పగులగొట్టి గుర్తుతెలియని దుండగలు చోరీకి యత్నించారు. పిడుగుపాటుకు రైతు మృతి తొట్టంబేడు: మండలంలోని కాసరం గ్రామానికి చెందిన ఓ రైతు బుధవారం రాత్రి పిడుగుపాటుతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన కే శ్రీనివాసులు(45) పొలానికి వెళ్లి, మరో ముగ్గురు కూలీలతో ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో గాలి మొదలైంది. శ్రీనివానులు సమీపంలో పిడుగు పడగా అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తప్పించుకున్నారు. మృతునికి భార్య, కుమారుడు, ఆరు నెలల కుమార్తె ఉన్నారు. -
జూలైలో యూజీ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో అన్ని యూజీ కోర్సుల విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలు వచ్చేనెల నుంచి ప్రారంభం కానున్నాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన ఫీజును ఈనెల 27వ తేదీలోపు చెల్లించాల్సి ఉంటుందని, రూ.వెయ్యి జరిమానాతో జూలై ఒకటో తేదీ వరకు అవకాశం ఉంటుందన్నారు. పరీక్షల ఫీజు వివరాలను ఆయా కళాశాలల యాజమాన్యాలకు సమాచారం అందించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు గడువులోపు ఫీజు చెల్లించాలని సూచించారు. రెండో విడత తొలిరోజు 108 మందికి ప్రవేశాలు తిరుపతి సిటీ: టీటీడీ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు ఎస్వీ, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలల్లో 108 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఎస్వీ జూనియర్ కళాశాలలో 41 మంది విద్యార్థులు ప్రవేశాల పొందగా, పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో 67 మంది విద్యార్థినులు అడ్మిషన్లు పొందారు. శుక్రవారం వరకు రెండో విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులు అదే రోజు తరగతులకు హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు. -
రెవెన్యూ..అమ్మో పనిభారం
మెరుగైన సేవలే లక్ష్యం పుల్లంపేట: ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. బుధవారం ఆయన పుల్లంపేటలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుల్లంపేట, ఓబులవారిపల్లె, పెనగల రు, చిట్వేలి మండలాల ప్రజలకు అనుకూలంగా ఉండేలా పుల్లంపేటలో సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానంలో ఫిర్యా దుదారులు, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. మహిళల భద్రత, ఈవ్టీజింగ్ నివారణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియ మిస్తున్నట్లు తెలిపారు. కార్యాలయం ప్రారంభించిన అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటా రు. సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో కలిసి ఆయా స్టేషన్ల పరిధిలోని సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు వెంకటరావు, శ్రీనివాసులు, రవిమనోహరాచారి, రేణిగుంట డిఎస్పీ శ్రీనివాసరావు, రైల్వేకోడూరు సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు చిన్నరెడ్డెప్ప, సుజన్కుమార్, వినోద్కుమార్, అరుణ్కుమార్రెడ్డి, ప్రసాద్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. జాబ్మేళాలో 271 మందికి ఉద్యోగాలు తిరుపతి సిటీ: స్థానిక న్యూ బాలాజీ కాలనీలోని ఎస్డీహెచ్ఆర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా మొత్తం 271 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బుధవారం జరిగిన జాబ్ మేళాలో దేశంలో పలు ఎమ్ఎన్సీ సంస్థల ప్రతినిధులు పాల్గొని, అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డీవీఎస్ చక్రవర్తిరెడ్డి మాట్లాడుతూ యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకుని అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు లక్ష్యంగా కళాశాల పనిచేస్తోందని తెలిపారు. ప్రిన్సిపల్ ఉష మాట్లాడుతూ ఎస్డీహెచ్ఆర్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందిస్తూ, ఎంపిక కాని వారు నిరుత్సాహపడకుండా మరింత పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి తొట్టంబేడు: మండలంలోని తంగేళ్లపాళెం సమీపంలో చైన్నె రహదారిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెండాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్ఐ బాలకృష్ణ కథనం మేరకు.. వరదయ్యపాళెం గ్రామానికి చెందిన అర్జున్((27)తోపాటు మరో యువకుడు శ్రీకాళహస్తి నుంచి స్వగ్రామానికి బైక్పై బయలుదేరారు. తంగేళ్ల పాళెం సమీపంలో ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించబోయి అదే వాహనాన్ని ఢీకొని పడిపోయారు. అర్జున్ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. గాయవ మరో యవకుడిని శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తిరుపతి అర్బన్: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో తమకు పనిభారం రోజు రోజు కూ పెరిగిపోతోందని రెవెన్యూ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల్లో 55శాతం పైగా రెవెన్యూ సమస్యలపైనే ఉంటున్నా యి. ఓ వైపు భూతగాదాలు, భూ ఆక్రమ ణలు, మరోవైపు పాస్ పుస్తకాల జారీ, సర్వే పనులు.. ఇలా పలు వాటితో తలమునకలై ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు రెవెన్యూ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో సమస్యలు కొండవీటి చేంతాడులా పెరిగిపోతున్నాయి.మరోవైపు ఉద్యోగోన్నతుల ఊసే లేకపోవడంతో రెవెన్యూ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఖాళీగా ఉన్న తహసీల్దార్ పోస్టులను భర్తీ చేయకుండా రాజకీయ నేతలు తమకు అనుకూలంగా ఉన్న డీటీలను ఇన్చార్జి తహసీల్దార్లుగా అధికారులపై ఒత్తిడి తెచ్చి నియమించుకుంటూ తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు! దీంతో తహసీల్దార్లు మండల కేంద్రాల్లో కాకుండా కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రాధాన్యత లేని విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోందని పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ఇటీవల కోర్టు ఆదేశాలతో 200 మంది తహసీల్దార్లను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు జోన్లలో భర్తీ చేసినప్పటికీ ఇంకనూ 140 తహసీల్దార్ల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. మరోవైపు తహసీల్దార్కు అర్హత ఉన్న డీటీలను రెగ్యులర్ తహసీల్దార్లుగా నియమించకుండా రాజకీయ నేతల పనులు చేయించుకోవడానికి ఇన్చార్జ్ పగ్గాలు మాత్రమే ఇచ్చి సరిపెడుతున్నారు. పని ఒత్తిడితో సతమతం పని ఒత్తిడితో కొందరు గ్రామ రెవెన్యూ అధికారులు సతమతవుతున్నారు. శాఖకు సంబంధం లేని పనులు అప్పగించడం, సెలవు రోజుల్లో పనులు చెప్పడం, రాత్రి పగలు తేడా లేకుండా వివిధ బాధ్యతలు అప్పగిస్తుండడం మూలాన పనిభారంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుసార్లు రెవెన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేసినా, అధికారులకు వినతిపత్రాలను ఇచ్చినా పనిభారం మాత్రం తగ్గడం లేదు. పదుల సంఖ్యలో సర్వే పనులు అప్పగిస్తుండడంతో మింగలేక కక్కలేక చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి కలెక్టరేట్ వరకు ఖాళీగా ఉన్న రెవెన్యూ ఉద్యోగాలను భర్తీ చేయాలని, అర్హులైన అందరికీ ఉద్యోగోన్నతులు కల్పించాలని, లేనిపక్షంలో ఉద్యమించక తప్పదనే చర్చ ఉద్యోగుల్లో నడుస్తోంది. -
టీడీపీ కార్యాలయాల్లో బీఎల్ఓలకు ఏం పని?
● అధికార పార్టీ బీఎల్ఏల వద్దకు కలర్ జిరాక్స్లా? ● బీఎల్ఓలకు ‘సర్’ గురించి అవగాహన లేదా? ● ఓటర్లకు ముందస్తు అవగాహన ఎందుకు కల్పించలేదు? ● చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ‘సర్’పై ఎన్నో అనుమానాలు సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘సర్’ ప్రక్రియపై ఓటర్లలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులంతా స్థానిక టీడీపీ కార్యాలయాలకు వెళ్లి మ్యాపింగ్ చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేనా పారదర్శకమైన, సమగ్రమైన ఓటర్ల జాబితా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఏం జరుగుతోందనే ఆందోళన అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు ఓటర్లలో మొదలైంది. అంతా మా ఇష్టం ‘సర్’ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి బీఎల్ఓలు రాజకీయ పార్టీ నాయకులతో సంబంధం లేకుండా ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయాలి. ఆ తరువాత ఓటరు ఉన్నారా? లేదా? విచారించాలి. అనంతరం మ్యాపింగ్ చేయాల్సి ఉంది. అయితే బీఎల్ఓలు 2002 ఓటర్ల జాబితా, ప్రస్తుత జాబితాను పట్టుకుని ఇంటి పేర్లతో సరిపోయినవి, వారికి బంధుత్వం ఉన్నవి, టీడీపీ బీఎల్ఏలు చెప్పినవి మ్యాపింగ్ చేసేస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 65 శాతానికి పైగా మ్యాపింగ్ జరిగిపోయినట్టు సమాచారం. ఇదంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరిగిపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో స్థానికంగా ఉన్న అనేక మంది ఓట్లు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవగాహన లేదు ‘సర్’ ‘సర్’ ప్రకియపై తమకు అవగాహనే లేదని కొందరు బీఎల్ఓలు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా బీఎల్ఓలకు అవగాహన కల్పించాల్సి ఉందని చెబుతున్నారు. ఆ తరువాత ఓటర్లకు కూడా ‘సర్’పై అవగాహన కోసం గ్రామాలు, వీధుల్లో ప్రచారం చేయాలని సూచిస్తున్నారు. అయితే ఇవేమీ లేకుండానే ఏకంగా ‘సర్’ ప్రకియ మొదలు పెట్టేశారని బీఎల్ఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు అవగాహన లేకపోవడం వల్లే అనేక తప్పులు దొర్లుతున్నాయని, మరి కొద్ది రోజులు గడిస్తే గానీ ‘సర్’ పై పూర్తి స్థాయిలో అవగాహన వచ్చే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. ముస్లిం మైనారిటీల్లో కలకలం ముస్లిం, మైనారిటీ ఓట్లు తమకు పడవనే ఉద్దేశంతో కూటమి నేతలు వారి ఓట్లను తొలిగించేస్తున్నట్లు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మ్యాపింగ్ కోసం వివరాలు ఇవ్వొద్దని, ఇస్తే.. బయట తరమిస్తారనే భయం పుటించినట్లు తెలిసింది. అందులో భాగంగానే కొందరు ముస్లిం, మైనారిటీలు బీఎల్ఓలకు వివరాలు ఇవ్వడం లేదని సమాచారం. పుంగనూరు, వీ కోట, పలమనేరు, తిరుపతిలో ఇటువంటి ప్రచారం చేస్తున్నట్లు ముస్లిం, మైనారిటీలు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కాపులను ఉద్ధరించడం ఇలాగేనా పవన్?
తిరుపతి మంగళం : ‘కాపులే నా ఊపిరి.. కాపులే నా ప్రాణం.. కాపులే నాకు అండ.. కాపులే నా ధైర్యం.. మా కూటమి పార్టీ అధికారంలోకి వస్తే కాపులను ఉద్దరిస్తా.. కాపులను అత్యున్నత స్థానంలో ఉంచుతా.. అంటూ సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి రాగానే కాపులపై దాడులు జరుగుతున్నా, లాకప్ డెత్లు చేస్తున్నా పట్టించుకోని డిప్యూటి సీఎం పవన్కళ్యాన్ కాపులను ఉద్ధరించడం ఇలాగేనా?’ అని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ప్రశ్నించారు. విజయవాడలో కాపు నాయకుడు సాయికృష్ణ లాకప్ డెత్పై తిరుపతిలోని కాపు నాయకులతో పాటు భూమన అభినయ్రెడ్డి తీవ్రంగా స్పందించారు. దాంతో బుధవారం తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద కాపు నాయకులతో కలిసి రిలే నిరాహారదీక్ష చేపట్టారు. సాయికృష్ణ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని, వారి కుటుంబ సభ్యులకు న్యాయ చేయాలంటూ నినదించారు. అంతలోనే పోలీసులు అక్కడికి చేరుకుని రిలే నిరాహారదీక్షకు అనుమతి లేదంటూ అభినయ్రెడ్డితో కాపు నాయకులతో వాగ్వివాదానికి దిగారు. అక్కడ నుంచి ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. అయితే సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు రిలే నిరాహార దీక్ష ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మండుటెండలో కూర్చుని రెడ్బుక్ రాజ్యాంగం నశించాలి, కూటమి అరాచక పాలనను తరిమికొట్టాలి, కాపు నేత అని చెప్పుకునే పవన్కళ్యాణ్ రాజీనామా చేయాలి, హోంమంత్రి అనిత రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ తాము ఉన్నతంగా ఎదగడానికి, ఫ్యాకేజీలు తీసుకోవడానికి రాష్ట్రంలో కాపులను పవన్కళ్యాణ్ వాడుకున్నంతగా మరెవరూ వాడుకోలేదన్నారు. కాపులను వాడడం చిరంజీవి, పవన్కళ్యాణ్లకు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్లుగా కాపులమని చెప్పుకుని కాపు ఓట్లు దండుకుని కాపులకు వెన్నుపోటు పొడవడంలో పవన్కళ్యాణ్, చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నారన్నారు. సాయికృష్ణను లాకప్ డెత్ చేయడమే కాకుండా శవాన్ని కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా దహనం చేశారంటే పోలీసులు ధైర్యమేమిటని ప్రశ్నించారు. సాయికృష్ణ మృతిపై కూటమి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు, దాడులు, అక్రమ కేసులు, చివరికి లాకప్ డెత్లు కూడా జరుగుతున్నాయని మండిపడ్డారు. లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం ఇదేనా? అని ప్రశ్నించారు. దీనిపై డిప్యూటి సీఎంగా పవన్కళ్యాణ్, హోంమంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ మృతిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి న్యాయం జరిగేంతవరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. ఈ రిలే దీక్షలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, కాపు నాయకులు నీలం బాలాజీ, అనీష్రాయల్, బెల్లం రమేష్, దినేష్ రాయల్, ఎన్వీ సురేష్ రాయల్, పసుపులేటి సురేష్ రాయల్, వెంకటేష్ రాయల్, మద్దాలి శేఖర్, నయనారు మధుబాల, శారద, గోలి విజయలక్ష్మి, పద్మజ, పార్టీ నాయకులు బత్తల గీతాయాదవ్, ఉదయ్వంశీ, వాసుయాదవ్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెండు కిలోల గంజాయి స్వాధీనం
– నిందితుడి అరెస్టు సత్యవేడు: ఓ వ్యక్తి వద్ద రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, అతడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ లావణ్య తెలిపారు. సత్యవేడు మండలంలోని ఇంద్రాపురం సమీపంలో ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన వ్యక్తి పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న సంచిని పరిశీలించగా రెండు కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు డీసీ సుధాకర్(26)ను అరెస్టు చేశారు. విచారణలో చైన్నె నుంచి గంజాయి తెచ్చి శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపాడు. రెండు రోజుల క్రితం కొత్తమారికుప్పం గిరిజన కాలనీ పాఠశాలలో రెండోతరగతి చదువుతున్న ఇద్దరు బాలికలను బాత్రూమ్లో లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఇతడే అని పోలీసులు గుర్తించారు. బుధవారం సాయంత్రం నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచారు. -
నూతన ఆవిష్కరణకు ప్రశంసలు
తిరుపతి సిటీ: స్థానిక కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాల నూతన ఆవిష్కరణపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతిలో బుధవారం జరిగిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిర్వహించిన ఉత్తమ రూపకల్పనల ప్రదర్శనలో శ్రీరామ కళాశాలలో మూడో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న అమన్ విద్యార్థి రూపొందించిన ఇన్ఫ్రాబాట్ అనే రోబోటిక్ వ్యవస్థ ఉత్తమ ఆవిష్కరణగా ఎంపికై ంది. కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఇన్నోవేషన్ హబ్ ప్రదర్శనను సందర్శించి విద్యార్థి అమన్ రూపొందించిన రోబోటిక్ వ్యవస్థను ఉత్తమ ఆవిష్కరణగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థి రూపొందించిన ఆవిష్కరణ ఆర్టీఐహెచ్కి ఎంపిక కావడం గర్వకారణమన్నారు. భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను తనిఖీ చే యడం, పర్యవేక్షించడంతోపాటు అ డ్డంకులను తొలగించడం కోసం త మ విద్యార్థి అమన్ రూపొందించిన రో బోటిక్ వ్యవస్థ ఎంతో ఉపయోగకర మన్నారు. కళాశాల రీసెర్చ్ డెవలప్మెంట్ నిర్వాహకులు, విద్యార్థికి, కళాశాల సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ కే జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ వాసు, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. -
ప్రాణాలు పణం
భద్రత కనం..ఏటా ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల సామర్థ్య పరీక్షలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. మసిపూసి, మారెడు కాయ చేసిన చందంగా ముస్తాబు చేసిన డొక్కు బస్సులకు ఏటీఎస్ ప్రతినిధులు ఎఫ్సీలు ఇచ్చేస్తున్నారు. ఫలితంగా వాటిలో ప్రయాణించే చిన్నారుల ప్రాణాలు పణంగా పెట్టాల్సివస్తోంది. ●తిరుపతి మంగళం : ఫిట్నెస్ లేని చాలా బస్సులు బడి పిల్లలను తరలిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పాఠశాలలు ప్రారంభమై వారం రోజులు అవుతున్నప్పటికీ బడి బస్సుల్లో భద్రత కొరవడింది. ఇంత జరుగుతున్నా పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యం వీడడంలేదు. రవాణాశాఖ అధికారులు నిత్యం రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తున్నా యాజమాన్యంలో మార్పు రావడం లేదు. సాధారణంగా స్కూళ్లు తెరిచేనాటికే యాజమాన్యాలు బస్సులను కండిషన్లో ఉంచుకోవాలి. డ్రైవర్ల అనుభవం, నైపుణ్యం వంటి అంశాలను సీరియస్గా పరిగణించాలి. కానీ ప్రైవేటు విద్యాసంస్థ యాజమాన్యాలకు ఇవేవీ పట్టవు. దీంతో వందలాది బస్సులు సామర్థ్యం లేకపోయినా రోడ్లపై రయ్ రయ్ మంటూ తిరుగుతున్నాయి. తిరుపతి జిల్లా పరిధిలో 1200కు పైగా పాఠశాలలు, కళాశాలల బస్సులున్నాయి. వీటిలో ఎన్ని ఫిట్నెస్, ఎన్ని ఫిట్లెస్ తెలియని పరిస్థితి. కాలం చెల్లిన బస్సులకు ఫిట్నెస్? ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు రవాణాశాఖ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయనే ఆరోపణలున్నాయి. కొన్ని చోట్ల కాలం చెల్లిన బస్సులకు రంగులు వేసి, రోడ్లపై తిప్పుతున్నారు. అలాంటి బస్సులు రవాణాశాఖ లెక్కల్లోనే ఉండవు. ఉన్న వాటిల్లో ఒకటి, రెండు బస్సులకు ఫిట్నెస్ తీసు కుని వాటిని తిప్పుతూ అవసరం వచ్చినప్పుడు కాలం చెల్లిన బస్సుల్లోనే విద్యార్థులను తరలిస్తున్నారు. ఏటీఎస్ల్లో అక్రమ వసూళ్లు ఇటీవల రవాణాశాఖ అధికారులు తనిఖీలు కఠినతరం చేసినప్పటికీ ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్(ఏటీఎస్) వద్ద అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బస్సుల్లో లోపాలు ఉన్నప్పటికీ ఏటీఎస్ అధికారిక ఫీజులకు అదనంగా వసూలు చేసి ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుందని వాహన యజమానులు ఆరోపిస్తున్నారు. అదనపు మొత్తం చెల్లించని వాహనాలను రిజెక్ట్ చేసి మరమ్మతులు చేయించుకుని రావాలని సూచిస్తున్నారని చెబుతున్నారు. రెండో సారి పరీక్షలకు వస్తే సమయం, డబ్బు వృథా అవుతుందనే ఉద్దేశంతో అడిగినంత చెల్లించి ఫిట్నెస్ పొందుతున్నామని వాహన యజమానులు వాపోతున్నారు. అధిక వసూళ్లు కారణంగా విద్యా సంస్థల బస్సులను ఫిట్నెస్ టెస్ట్కు పంపించకుండా కాలం వెల్లబుచ్చుతున్నారని తెలుస్తుంది. నిబంధనలకు తూట్లు కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు అనుభవం లేని డ్రైవర్లతో పాటు ఉద్యోగ విరమణ పొందిన డ్రైవర్లను కూడా బస్సులు నడిపేందుకు నియ మిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ వేతనాలతో డ్రైవర్లను నియమించుకోవచ్చనే ఉద్దేశంతో నిబంధనలను గాలికి వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.కండిషన్ లేకుంటే ఫిట్నెస్ ఇచ్చేవాళ్లం కాదు ఏ వాహనాలైనా కండిషన్లో లేకుంటే ఫిట్నెస్ సర్టి ఫికెట్ ఇచ్చే ప్రసక్తే ఉండదు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల బస్సులకై తే ఒకటికి రెండు సార్లు పరిశీలించి మరీ ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేవాళ్లం. ఫిట్నెస్ బాధ్యతను ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్(ఏటీఎస్)కు ఇచ్చిన తర్వాత పాఠశాలలు, కళాశాలల బస్సులు ఎన్ని ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలు పొందారన్న సమాచారం కూడా రవాణాశాఖకు తెలియని పరిస్థితి. తాము నిత్యం తనిఖీ అధికారుల బృందాలతో పర్యవేక్షిస్తున్నా పాఠశాలల యాజమాన్యాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించే వాళ్లు. ఇప్పుడు రోడ్లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తే తప్ప బస్సుల ఫిట్నెస్ తెలియని పరిస్థితి. – కొర్రపాటి మురళీమోహన్, జిల్లా రవాణాశాఖాధికారివాహనాల ఫిట్నెస్ ధ్రువీకరణ ప్రైవేటుపరంవాహనాల ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లను(ఏటీఎస్లు) చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భద్రత అంశాన్ని రవాణాశాఖను ప్రత్యక్ష పర్యవేక్షణ నుంచి దూరం చేసి, ప్రైవేటు యాజమాన్యాలపై ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చింది. దీంతో ఫిట్నెస్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు వస్తున్నప్పటికీ రవాణాశాఖ అధికారులు మిన్నకుండిపోతున్నారే తప్ప, ఏమీ చేయలేని పరిస్థితి వారిది. విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ స్వార్థ ప్రయోజనాలు, స్వలాభాల కోసం చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామర్థ్యం లేకుండానే రోడ్లపై రయ్ రయ్ -
మామిడి రైతులూ ఆందోళన చెందొద్దు
రేణిగుంట: జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డితో కలిసి రేణిగుంట మండలంలోని వర్ష ప్రాసెసింగ్ యూనిట్ను కలెక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ రానున్న 10 నుంచి 15 రోజులు తోతాపురి సీజన్లో అత్యంత కీలకమైన కాలమని పేర్కొ న్నారు. రైతులు పక్వానికి రాని కాయలను కోయకుండా, పూర్తిగా పక్వానికి వచ్చిన కాయలను మాత్రమే కోసి విక్రయించాలని సూచించారు. మామిడి కిలోకు రూ.6 కంటే తక్కువ ధర చెల్లించే యూనిట్లు ఎక్కడైనా ఉంటే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు. -
పరికరాల నిర్వహణ కీలకం
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని గోడౌన్లలో విద్యుత్ పరికరాల నిర్వహణ కీలకమని సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. నెల్లూరు సర్కిల్ పరిధిలోని గూడూరు డిస్ట్రిక్ట్ స్టోర్స్, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు షెడ్లను బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ గూడూరు డిస్ట్రిక్ట్ స్టోర్ను స్మార్ట్ స్టోర్గా రూపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టోర్లోని ఏబీ కేబుల్, ట్రాన్స్ఫార్మర్లు, ఇన్సులేటర్లు, బ్రేకర్లు, క్యూబికల్స్, ఎర్త్ పైప్స్, కండక్టర్ తదితర పరికరాలను పరిశీలించి, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. టెండర్లతో పాత పరికరాల విక్రయం స్టోర్స్లో ఉన్న వివిధ పాత పరికరాలను టెండరు ప్రక్రియ ద్వారా విక్రయించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పరికరాల నిర్వహణకు రెండు నెలల్లోగా ప్లాట్ ఫామ్ నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక స్టోర్స్లో పనిచేస్తున్న కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వారికి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గూడూరు డివిజనల్ కార్యాలయంలో అధికారులతో వివిధ అంశాలపై సమీక్షను నిర్వహించారు. -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 86,601 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,111 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.32 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. బీసీ డెడికేటెడ్ కమిషన్ రేపు జిల్లాకు రాక తిరుపతి అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ జిల్లాకు శుక్రవారం రానుందని కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ చాంబర్లో శుక్రవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బీసీ సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజా ప్రతినిధులు, సాధారణ ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబందించి మీ అభిప్రాయాలను అర్జీల రూపంలో కమిషన్కు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతారన్నారు. నేడు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు తిరుపతి సిటీ: గత నెల 21 నుంచి ఈనెల 5వ తేదీ వరకు జరిగిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేయనున్నట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 34,380 మంది ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు రికార్డు స్థాయిలో ఈ ఏడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. అలాగే మరో రెండు రోజుల వ్యవధిలో ఏపీఈఏపీసెట్–2026 ఫలితాలను సైతం విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈఏపీసెట్ ర్యాంక్ ప్రక్రియలో 25శాతం ఇంటర్ మార్కులను వెయిటేజ్గా పరిగణించనున్న నేపథ్యంలో సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన వెంటనే ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రతిష్టాత్మకంగా జలధార–జలహారతి నాయుడుపేట టౌన్: ప్రభుత్వం అమలు చేస్తున్న జలధార–జలహారతి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. నాయుడుపేట మండలం సమీపంలోని పాలచ్చూరు క్యాస్కేడింగ్ సిస్టమ్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్తోపాటు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకుంటూ చెరువులు, కాలువలు, నీటి వనరులను పునరుద్ధరించడంతో భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 3,360 జలధార– జలహారతి పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం నాయుడుపేట – వెంకటగిరికి సంబంధించి ఏపీఐఐసీ ద్వారా తిమ్మాజికండ్రిగ నుంచి పండ్లూరు వరకు రూ.120 కోట్ల ఏడీబీ నిధులతో జరిగే రోడ్డు నిర్మాణానికి భూసేకరణ పనులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. డ్వామా పీడీ మద్దిలేటి, ఇరిగేషన్ ఎస్ఈ రాధకృష్ణ, ఏపీఐఐసీ జెడ్ఎం భరత్కుమార్రెడ్డి, ఆర్అండ్బీ డీఈ పరమేశ్వరి పాల్గొన్నారు. ఏసీబీ దర్యాప్తు చేయాలి తిరుపతి సిటీ: ఎస్వీయూలో రిజిస్ట్రార్పై వస్తున్న అవినీతి ఆరోపణలపైన వెంటనే ప్రభుత్వం జో క్యం చేసుకుని ఏసీబీ దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎస్వీయూ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ప్రేమ్కుమార్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ చేస్తున్న అధికార దుర్వినియోగం, పరిపాలనలో అక్రమాలు, ఆర్థిక లావాదేవీలలో ఆ యన జోక్యంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థి సంఘాల నేతలను కులం పేరుతో దూషించడం, అధ్యాపకులను ఇష్టానుసారంగా వేధించడం ఆయనకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సర్పై నిర్లక్ష్యం వద్దు
వరదయ్యపాళెం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా చూడాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ పార్టీ శ్రేణులకు సూచించారు. శనివారం తిరుపతిలో నూకతోటి రాజేష్ అధ్యక్షతన జరిగిన సర్ సమీక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వస్తున్న సమస్యలను వెంటనే వార్ రూమ్కు తెలిపి, పరిష్కరించుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావు లేకుండా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సమన్వయకర్త నూకతోటి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని బూత్లలో సర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, లీగల్ సెల్ పర్యవేక్షణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూస్తున్నామని తెలిపారు. అందరి సమన్వయంతో సత్యవేడు నియోజకవర్గంలో సర్ కార్యక్రమం విజయవంతం చేయాలని నియోజకవర్గ పరిశీలకులు దబ్బల శ్రీమంత్ రెడ్డి కోరారు. పార్టీ నిర్దేశం మేరకు సత్యవేడు నియోజకవర్గంలోని 279 పోలింగ్ బూత్లలో సర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అలాగే పూర్తిస్థాయిలో బీఎల్ఏల పనితీరును కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు సర్ నియోజకవర్గ ఇన్చార్జి వేలూరు రాకేష్ తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్రవర్మ, పార్టీ వరదయ్యపాళెం మండల అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, నియోజక వర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి, నాయకులు భానుప్రకాష్రెడ్డి, మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హెలికాప్టర్ సంచారం.. తిరుమలలో కలకలం!
సాక్షి, తిరుపతి: తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది. స్వామివారి ఆలయంపై నుంచి హెలికాఫ్టర్ వెళ్లింది. దీంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. ఆలయ పవిత్రత దెబ్బ తింటుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చోద్యం చూస్తుందా? అని మండిపడుతున్నారు. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం.. ఆలయ గర్భగుడి మీదుపై డ్రోన్లతో సహా ఎలాంటివి సంచరించకూడదు. కానీ, విమానాల సంచారం తరచూ జరుగుతోంది. ఈ విషయంలో భక్తులు ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఇటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని టీటీడీ చెబుతూ వస్తోంది. అయితే చాలాకాలం తర్వాత ఏకంగా హెలికాఫ్టర్ సంచరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. “తిరుమలలో సాధారణంగా విమానాలు వెళ్తున్నాయి… కానీ ఈసారి ఏకంగా హెలికాప్టర్ ఆలయంపైకి వచ్చింది. పవిత్రతను కాపాడాల్సిన వ్యవస్థలు మౌనంగా ఉండటం సరైందేనా?’’ అని కొందరు వాపోతున్నారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు కఠిన నియంత్రణలు అవసరమని డిమాండ్ చేస్తున్నారు.ఈ పరిణామం రాజకీయ చర్చలకు కూడా దారి తీసింది. ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ బాధ్యతల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. దీంతో తిరుమలలో విమాన రాకపోకల నియంత్రణపై సమన్వయం ఎంతవరకు ఉందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. -
యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలంటే ఉన్నత విద్యామండలికి లెక్కలేదు. ప్రవేశ పరీక్షలు నిర్వహించి నెలలు గడుస్తున్నా.. కొన్ని ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల చేయకపోగా, మరికొన్ని సెట్ల కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించలేదు. దీంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల్లో అ
ప్రవేశాల సంగతేమిటి?తిరుపతి సిటీ: 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభమైనా డిగ్రీ, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ, యూజీ కోర్సుల్లో చేరేందుకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులకు ఏమి చేయాలో పాలుపోని స్థితి నెలకొంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి పలు పీజీ, యూజీ సెట్ల ప్రవేశ పరీక్షలను ఏప్రిల్, మేలో నిర్వహించారు. దాదాపు అన్ని పీజీ, యూజీ సెట్ల ఫలితాలు విడుదలయ్యాయి. కానీ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క పీజీ, యూజీ కోర్సులకు కౌన్సెలింగ్ ప్రక్రియకు తేదీలు సైతం ప్రకటించిన పాపాన పోలేదు. మరికొన్ని పీజీసెట్లకు కౌన్సెలింగ్ అధికారులను సైతం ఇప్పటివరకు నియమించిన దాఖలాలు లేవు. జూలై నెల ప్రారంభమైనా కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. సందిగ్ధంలో తల్లిదండ్రులు పీజీ, యూజీ సెట్ల ఫలితాలు విడుదలైనా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయం చెందుతున్నారు. కౌన్సెలింగ్లో పిల్లలకు సీటు దక్కకపోతే ఏమి చేయాలనే సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థల్లో ముందస్తు పీజీ, యూజీ, ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావస్తున్న నేపథ్యంలో తమ పిల్లల పరిస్థితి ఏమిటన్న ఆలోచనలో పడ్డారు. ఇటు ప్రభుత్వ సంస్థల్లో సీటు దక్కక, అటు ప్రైవేటు సంస్థల్లో సీటు దొరకని పరిస్థితిలో ఏమి చేయాలనే అయోమయంతో ఉన్నారు. దీంతో ఇప్పటికే పలు విద్యాసంస్థల్లో టోకన్ అమౌంట్ చెల్లించి, సీటు రిజర్వ్ చేసుకుంటున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం పలు పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించి నెలలు గడుస్తున్నా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టకపోవడం దారుణం. రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన పలు పీజీ సెట్ల ఫలితాలు విడుదలైనా ప్రవేశాల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపైనా క్లారిటీ ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడ్మిషన్లపై తీవ్రప్రభావం వర్సిటీలు, ప్రభుత్వ కళాశాలలో పీజీ, యూజీ ప్రవేశాలు తగ్గడానికి ప్రధాన కారణం కౌన్సెలింగ్ ప్రక్రియను ఆలస్యం చేయడమే. ఉన్నత విద్యామండలి కార్పొరేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పెంచాలనే కుట్రతో ఇలా కౌన్సెలింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నదనే అనుమానం కలుగుతోంది. ఇలాంటి కుఠిల చర్యలతో యూనివర్సిటీల్లో అడ్మిషన్లు తగ్గి పలు కోర్సులకు చరమగీతం పాడుతున్నారు. దీంతో వర్సిటీల భవిష్యత్తు ఆందోళన స్థితికి చేరుతోందని మేధావులు, విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తమకు సీటు రాదనే సందిగ్దంతో ప్రైవేటు కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. ఎస్వీయూ, పద్మావతి మహిళా వర్సిటీల్లో పలు కోర్సుల్లో ప్రవేశాలు దారుణంగా ఉన్నాయి. కౌన్సెలింగ్ ప్రక్రియను విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే చేపడితే ఇలాంటి పరిస్థితి ఉండేదికాదని వారు ఆరోపిస్తున్నారు. యూజీ, పీజీ ప్రవేశాలపై అలసత్వం పలు పీజీ, యూజీ–2026 సెట్ల వివరాలు ప్రవేశ పరీక్ష పరీక్ష జరిగిన తేదీ ఫలితాలు విడుదల కౌన్సెలింగ్ తేదీ ఏపీ పాలీసెట్ ఏప్రిల్ 25 మే 5 ఊసేలేదు ఏపీ ఐసెట్ మే 2 మే 16 ఊసేలేదు ఏపీ లాసెట్ మే 4 మే 18 ప్రకటించలేదు ఏపీపీజీఈసెట్ ఏప్రిల్ 28–30 మే 14 ప్రకటించలేదు ఏపీపీజీసెట్ మే 8–11 మే 29 కౌన్సెలింగ్ ఊసేలేదు ఏపీఈఏపీసెట్ మే 12–19 విడుదల కాలేదు – ఏపీఎడ్సెట్ మే 8 మే 26 ప్రస్తావనే లేదు ఏపీఈసెట్ ఏప్రిల్ 23 మే 8 తేదీలు ప్రకటించలేదు ఇంటర్ ఫలితాలు విడుదలై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు డిగ్రీలో ప్రవేశాలు లేవు.కౌన్సెలింగ్కు విద్యార్థుల ఎదురుచూపు తిరుపతి జిల్లాలో పలు పీజీ, యూజీ కోర్సుల్లో చేరేందుకు సుమారు 75 వేల మంది విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏపీ పాలిసెట్, ఏపీ ఐసెట్, ఏపీ లాసెట్, ఏపీపీజీఈసెట్, ఏపీఈసెట్, ఏపీపీజీసెట్, ఏపీఎడ్సెట్ తదితర ప్రవేశ పరీక్షల ఫలితాలు ఇప్పటికే విడుదలై కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే ఏపీఈఏపీసెట్ ఫలితాలు ఇప్పటివరకు విడుదల కాకపోవడం గమనార్హం. దీనికితోడు ఇంటర్ ఫలితాలు విడుదలై దాదాపు మూడు నెలలు గడుస్తున్నా ఉన్నత విద్యామండలి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ఊసే ఎత్తడం లేదు. ఇప్పటి వరకు కౌన్సెలింగ్ అధికారులను సైతం నియమించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. -
సర్ను వేగవంతం చేయండి
తిరుపతి అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను వేగవంతంగా గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన సర్ కార్యక్రమంపై జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులతో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కొన్ని బూత్ల్లో ఆశించిన స్థాయిలో మ్యాపింగ్ పురోగతి లేకపోవడం సరికాదన్నారు. వెనుకబడిన అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రతి ఇంటినీ సందర్శించి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని చెప్పారు. ఓటర్ల జాబితాలో పొరబాట్లు, నకిలీ నమోదులు, అర్హత లేని పేర్లు లేకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు. మ్యాపింగ్, ఇంటింటా సర్వే, డేటా నవీకరణ గడువులోపు పూర్తి చేయాలని చెప్పారు. ఆర్టీఓలు రామ్మోహన్, దేవేంద్రరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్నాయక్, రోజ్మాండ్, ఎన్నికల సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పల్స్ పోలియో విజయవంతం చేయండి
తిరుపతి అర్బన్: జిల్లాలో ఈనెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్తో కలసి పల్స్పోలియో కార్యక్రమానికి చెందిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోలియో బూత్లతోపాటు బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అంగన్వాడీ, పాఠశాలల్లో అర్హులైన పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని చెప్పారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1937 పల్స్పోలియో కేంద్రాలు, 84 మొబైల్ కేంద్రాలు, 57 ట్రాన్సిట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 5 ఏళ్ల లోవు 2,59,843 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శాంతకుమారి, ఆనందమూర్తి, డీఈఓ కేవీఎన్ కుమార్,ఐసీడీఎస్ పీడీ వసంతబాయి పాల్గొన్నారు. -
పారదర్శకత ప్రశార్థకమేనా?
ఎస్వీ, పద్మావతి, ద్రావిడ వర్సిటీల్లో అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తులు వెల్లువెత్తాయి, భర్తీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.స్వర్ణముఖిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు అక్రమార్కులకు పచ్చనేతల అండ బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026అక్రమమా..సక్రమమా.. తరువాత సంగతి. గాలి ఉన్నప్పుడే తూర్పార పట్టాలన్నట్లుంది ఇసుకాసురుల సంగతి. నాయుడుపేట మండలంలోని స్వర్ణముఖి నది పొడువునా ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార పార్టీ నేతల అండతో కొందరు స్వర్ణముఖిలో బాటలు ఏర్పాటు చేసుకుని, ఉచితం పేరుతో ఇసుకను ఊడ్చేస్తున్నారు. ఫలితంగా నదిలో అగాధాలు ఏర్పడుతున్నాయి.అయ్యప్పరెడ్డిపాళెం వద్ద స్వర్ణముఖి నదిలో ట్రాక్టర్లకు ఇసుక లోడ్ చేస్తున్న అక్రమార్యులునాయుడుపేటటౌన్: ఇసుక ఉచితం పేరుతో నాయుడుపేట మండలంలోని స్వర్ణముఖి నదిని ఇసుకాసురులు ఊడ్చేస్తున్నారు. అధికార పార్టీ అండతో ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమంగా తవ్వి, తరలిస్తున్నారు. మండలంలోని ఏల్ఏ సాగరం, బీడీ కాలనీ, భీమవరం మర్లపల్లి, అన్నమేడు, అయ్యప్పరెడ్డిపాళెం, కల్లిపేడు, మూర్తిరెడ్డిపాళెం తదితర గ్రామాల్లో చాలా చోట్ల స్వర్ణముఖి నది పొర్లు కట్టలను ధ్వంసం చేశారు. ఇసుక అక్రమ తరలింపునకు ట్రాక్టర్లు రాకపోకలు జరుపుకునేలా తవ్వేశారు. పట్టణ పరిధిలోని ఎల్ఏ సాగరం బీడీ కాలనీ పమీపంలో అగ్నిమాపక శాఖ కార్యాలయం ముందున్న రహదారి వద్ద నుంచి ప్వర్ణముఖి నది వద్దకు వచ్చే ట్రాక్టర్ల కోసం నది మధ్యలో ఏకంగా దారి ఏర్పాటు చేసుకున్నారు. ఇసుక ఉచితం పేరుతో అధికార పార్టీ నేతల అండతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇంటి అవసరాల పేరుతో కొంత తరలిస్తూ అధికంగా తమిళనాడు సరిహద్దు ప్రాంతాలు, పరిశ్రమలతోపాటు ఇసుక డంపింగ్ యార్డులకు, కాంక్రీట్ మిక్స్ర్ ఫ్లాంట్లకు తరలించి, అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా మండలంలోని పలు ప్రాంతాల్లో ఇసుకను డంపింగ్ చేసుకుని, రాత్రి సమయాల్లో టిప్పర్లు, లారీల్లో తమిళనాడుకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ తరలింపులపై తమకేమి సంబంధం లేదిని పలు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో స్వర్ణముఖి నదిలో తాగునీటి పథకాలకు సంబంధింరచిన బోర్లతోపాటు వ్యవసాయ బోర్లు పైపులైన్లను సైతం ఇఽసుక అక్రమార్కులు ధ్వంసం చేస్తున్నారని రైతులు అందోళనలు చెందుతున్నారు. ఇప్పటికై నా జిల్లా మైనింగ్, ఇరిగేషన్ తదితర శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, స్వర్ణముఖి నది నుంచి జరిగే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. మర్లపల్లి సమీపంలో రాత్రి వేళ టీడీపీ నాయకుల ఫొటోలతో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ -
నిబంధనలను అతిక్రమిస్తే ఉద్యమమే
వర్సిటీల్లో అధ్యాపకపోస్టుల నియామక ప్రక్రియ యూజీసీ నిబంధనలకు అనుగుణంగా జరగాలి. పరీక్ష తర్వాత నిర్వహించే ఇంటర్వ్యూల విషయంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా నిర్వహించాలి. స్పోర్ట్స్ డీఎస్సీలా గందరగోళం సృష్టిస్తే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదు. – బండి చలపతి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పారదర్శకత లోపిస్తే తిరుగుబాటు యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల నియామక ప్రక్రియలో పారదర్శకత లోపిస్తే తిరుగుబాటు తప్పదు. అవినీతికి తావులేకుండా నిష్పక్షపాతంగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. మెరిట్ అభ్యర్థులకు పోస్టులు దక్కాలి. ప్రభుత్వం తప్పటడుగు వేస్తే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. – అశోక్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దగా చేస్తే ఊరుకోం వర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలు పారదర్శకంగా చేపట్టాలి. పేపర్ లీకేజులు, ఇంటర్వ్యూలలో పక్షపాతం వంటి వాటికి తావులేకుండా పకడ్బందీగా నియామక ప్రక్రియ చేపట్టాలి. స్పోర్ట్ డీఎస్సీలా దగా చేస్తే ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థుల ఆగ్రహానికి గురికాకతప్పదు. – ప్రేమ్ కుమార్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఎస్వీయూ అధ్యక్షులు -
నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్ చేస్తాం
తిరుపతి మంగళం : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నిబంధనలు ఉల్లంఘించి నడిపితే సీజ్ చేస్తామని తిరుపతి జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. తిరుపతి జిల్లా పరిధిలో మంగళవారం అధికారులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కలకత్తా నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న ఒక కాంట్రాక్ట్ క్యారేజీ బస్సును తనిఖీ చేయగా, సంబంధిత వాహనం ఆల్ ఇండియా పర్మిట్ పన్ను చెల్లించకుండా నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో మోటారు వాహన తనిఖీ అధికారి మోహన్ కుమార్ వాహన తనిఖీ రసీదు నమోదు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనంపై పన్ను, అపరాధ రుసుము కలిపి రూ.5.20 లక్షలు చెల్లించాలని చెప్పారు. అలాగే నిబంధనలను ఉల్లంఘించిన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వాహనాలపై పలు కేసులు నమోదు చేశారు. తిరుపతి జిల్లా పరిధిలో 30 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.5 లక్షలు జరిమానా విధించారు. అలాగే హైదరాబాదు నుంచి తిరుపతికి ప్రయాణిస్తున్న ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వాహనం నిర్దేశిత వేగ పరిమితిని మించి నడుపుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ కంట్రోల్ రూమ్ నిర్వహించిన సాంకేతిక పర్యవేక్షణలో గుర్తించారు. ఈ సమాచారంతో సంబంధిత వాహనాన్ని తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో అతివేగంగా వెళ్తున్న 10 వాహనాలపై కేసులు నమోదు చేశామని జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. ఈ తనిఖీల్లో మోటారు వాహన తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, మోహన్కుమార్, అతికానాజ్, రమణ నాయక్, ప్రసాద్ వర్మ పాల్గొన్నారు. -
టీడీపీ సోషల్ మీడియా నిర్వాహకులపై కేసు నమోదు చేయాలి
తిరుపతి మంగళం : కూటమి అరాచకాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తోందని వైఎస్సార్సీపీ అధికారిక పేజీనే నిలిపివేసిన దుర్మార్గపు ప్రభుత్వం కూటమి సర్కారు అని ఆ పార్టీ ఎస్సీసెల్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో బయట పడుతున్న కుళ్లిన మాంసంతో కూడా టీడీపీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఎస్సీ వర్గానికి చెందిన తలారి రాజేంద్రకు కుళ్లిన మాంసం విక్రయాలను అంటగడుతూ టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టడంపై మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ, తన పరువుకు భంగం కలిగిస్తూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నిర్వాహకులపై వెంటనే కేసు నమోదు చేయాలని రాజేంద్ర డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం అలిపిరి పోలీస్ స్టేషన్లో సీఐ రామ్కిషోర్కు తలారి రాజేంద్రతో పాటు పార్టీ నాయకులు వాసుయాదవ్, కోటూరు ఆంజేనేయులు, నల్లాని బాబు, కృష్ణమూర్తి, కోటి, మురళి ఫిర్యాదు చేశారు. కూటమి పాలనలోనే కూటమి నాయకులు, అధికారుల నిర్లక్ష్యంతోనే తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో కుళ్లిన మాంస విక్రయాలు సాగుతున్నాయన్నారు. వాటిని కూడా రాజకీయాలు చేయడానికి తనపై అసత్య ఆరోపణలు చేస్తూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సిగ్గుచేటని రాజేంద్ర మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో చిన్నపాటి పోస్టులు పెట్టిన వెంటనే అక్రమ కేసులు బనాయించి టెర్రరిస్టులకు ముసుగులు వేసినట్లు వేసి నిందితులుగా నిలబెట్టిన పోలీసులు తమ పరువుకు భంగం కలిగించిన టీడీపీ సోషల్ మీడియా నిర్వాహకులపై కూడా కేసుల నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తానని చెప్పారు. -
విద్యాశాఖ తనిఖీలు చేపట్టాలి
జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు పలు రకాల ఫీజుల పేరుతో తల్లిదండ్రుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా పలు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కనీస వసతులు కల్పించకుండానే భారీ ఫీజులు గుంజేస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. –శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్, జాతీయ కార్యదర్శి అమ్మకాలు అరికట్టాలి ప్రైవేటు విద్యాసంస్థలు అక్రమంగా విద్యాసామగ్రి విక్రయిస్తున్నాయి. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. తమ వద్దే యూనిఫామ్, పుస్తకాలు కొనుగోలు చేయాలంటూ అధిక ధరలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ పెద్దలకు చెందినవి కావడంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు తమకు నచ్చినచోట విద్యాసామగ్రిని తెచ్చుకునే సౌలభ్యం కల్పించాల్సి ఉంది. – అక్బర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఉల్లంఘనులపై చర్యలు తీసుకోండి నిబందనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు స్కూల్స్పై అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. విద్యకు అత్యంత ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలు అమలు చేయడానికి అధికారులకు పూర్తి బాధ్యతలు కట్టబెట్టాలి. ఈ స్కూల్ మనోళ్లది..ఆ స్కూల్ మవోళ్లది అనే తేడాలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారు ఎంతటి వారైనా చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. – గార్లపాటి శ్రీధర్, ఏపీ స్టూడెంట్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అధిక పీజులు వసూలు చేయడానికి వీలులేదు. విద్యాసామగ్రిని నిబంధనలకు విరుద్ధంగా విక్రయించకూడదు. క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాల్సిందే. మెరుగైన వసతులు కల్పించాల్సిందే. రూల్స్ను ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. ప్రతి స్కూల్ను మానిటరింగ్ చేస్తాం. – కేవీఎన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి -
పనులు వేగవంతం చేయండి
తిరుపతి అర్బన్: రైల్వే, రహదారుల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ అంశాలపై జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులుతో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వారం పనితీరులో పురోగతి చూపాలన్నారు. అలాగే ముందు వారంలో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వచ్చే వారంలో అమలు చేయాల్సి ఉందని చెప్పారు. రోడ్డు రహదారులు, రైల్వే, రెవెన్యూ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పారు. వడమాలపేట పాదిరేడు, ఏర్పేడు మండలంలోని పల్లంలో టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇంటిపట్టాల అంశాన్ని వేగవంతం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, సూళ్లూరుపేట ఆర్డీవో దేవేంద్రరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్ నాయక్, రోజ్మాండ్, ల్యాండ్ అండ్ రికార్డ్స్ అధికారి రాంప్రసాద్ పాల్గొన్నారు. అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం తిరుమల : ఒంగోలుకు చెందిన విజన్ ఆటోమొబైల్స్ సంస్థ అధినేత మంగళవారం టీటీడీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. ఎంపిడీఓ సస్పెన్షన్ సూళ్లూరుపేట రూరల్: మండలకేంద్రంలోని ఎంపీడీఓగా పనిచేస్తున్న మురళిని పంచాయతీరాజ్ కమిషనర్ సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు అందాయి. స్వచ్ఛరథం వాహనాన్ని తడ, సూళ్లూరుపేట మండలాలకు ఒకే వాహనాన్ని తిప్పినందుకు ఇటీవల తెలియడంతో ఉన్నత అధికారులు దీనిపై విచారించారు. ఆరు రోజుల నుంచి దీనిపై సంబంధిత అధికారులు పరిశీలించి పంచాయతీ రాజ్ కమిషనర్ నివేదికలు అందజేశారు. ఒకే వాహనం తిప్పినట్లు సమాచారం ఉండడంతో ఎంపీడీఓను సస్పెండ్ చేస్తునట్లు ఉత్తర్వు జారీ చేశారు. లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు తిరుపతి రూరల్: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఓ వివాహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన గోపీచంద్కు ఇప్పటికే వివాహమైనప్పటికీ మరో బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి లైంగిక దాడి చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తిరుపతి రూరల్ డీఎస్పీ బేతపూడి ప్రసాద్ కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని సోమవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య రాపూరు: ఓబులవారిపల్లి–కృష్ణపట్నం పోర్టు రైల్వే మార్గం మధ్యలోని రాపూరు సమీపంలో గుర్తు తెలియని సుమారు 25 ఏళ్ల యువకుడు మంగళవారం గూడ్సు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ హరిచందన తెలిపారు. ఇతను కాఫీ కలర్షర్ట్, గ్రేకలర్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడని, ఇతని వద్ద ఎటువంటి ఆధారాలు లేవని ఆమె తెలిపారు. రైల్వేస్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదంలో లారీ దగ్ధం రేణిగుంట: మండలంలోని మామండూరు– కుక్కలదొడ్డి మధ్య కడప రహదారిలో మంగళవారం స్క్రాప్ లోడ్తో చైన్నె నుంచి ముంబయి వెళుతున్న లారీ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుంది. మంటలను గమనించి డ్రైవర్, క్లీనర్ ముందుగానే లారీ నుంచి దిగి దూరంగా వచ్చేయడంతో ప్రాణ నష్టం తప్పింది. స్థానికులు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజిన్ మంటలను అదుపులోకి తెచ్చింది. రేణిగుంట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేశారు. వేధింపులపై విచారణ తిరుపతి సిటీ: ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్పై అదే కళాశాలకు చెందిన ఓ మహిళా అధ్యాపకురాలు తనను వేధిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్, స్టేట్ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం టీటీడీ విజిలెన్స్ అధికారులు, విజయవాడ నుంచి విచ్చేసిన స్టేట్ మహిళా కమిషన్కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం మంగళవారం విచారణ చేపట్టింది. ఫిర్యాదు చేసిన మహిళా అధ్యాపకురాలితో పాటు కళాశాలలోని పలువురు అధ్యాపకులు, సిబ్బందిని ఈ విషయంపై ఆరా తీశారు. కొందరు అధ్యాపకులు, సిబ్బంది విచారణ కమిటీకి, టీటీడీ అధికారులకు లిఖితపూర్వకంగా సమాచారం అందించినట్లు సమాచారం. అనంతరం ప్రిన్సిపల్ను టీటీడీ పరిపాలనా భవనంలో మహిళా కమిషన్ బృందంతో పాటు టీటీడీ విజిలెన్స్ అధికారులు కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా విచారణ చేసినట్లు తెలుస్తోంది. -
బడితె ఫీజు..!
ప్రైవేటు, కార్పొరేట్ ఫీజులు సామాన్యుడిని భయపెట్టేస్తున్నాయి. పేద, మధ్య తరగతి పిల్లలు కోరుకున్న పాఠశాలల్లో చదువు‘కొనే’ పరిస్థితి లేకుండా పోతోంది. ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని జలగల్లా ఫీజులం ప్రదర్శిస్తున్నారు. కఠిన నిబంధనలున్నా కార్పొ‘రేట్’ దాటికి అవి విలవిల్లాడుతున్నాయి. ఇదీ నేడు ప్రైవేటు పాఠశాలల్లో చదువుల దుస్థితి. తిరుపతి అర్బన్: జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు దోపిడీ తారాస్థాయికి చేరుకుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఏకంగా 30 శాతం అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆకర్షణీయమైన పేర్లతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్న ప్రైవేటు స్కూళ్లు, ఇదే అదునుగా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేస్తున్నారు. యూనిఫామ్, పుస్తకాలు, స్టేషనరీ పేరుతో అదనపు దోపిడీ కొనసాగుతోంది. విద్యాకేంద్రాలు వ్యాపారకేంద్రాలుగా మారిపోతున్నా విద్యాశాఖా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంతో వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. తిరుపతిలో చిన్నపాటి పాఠశాలల్లో గత ఏడాది ఎల్కేజీకి రూ.18 వేలు ఉంటే ఈ ఏడాది రూ.25 వేలకు పెంచేశారు. అలాగే మూడో తరగతికి రూ.26 వేలు నుంచి రూ.30 వేలకు పెంచడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆరో తరగతికి రూ.35 వేల నుంచి రూ.40 వేలు డిమాండ్ చేస్తున్నారు. పదో తరగతి చదివించాలంటే రూ.లక్ష ఖర్చు చేయాల్సిందేనని చర్చసాగుతోంది. మరోవైపు పుస్తకాలు, యూనిఫామ్, లైబ్రరీ, పరీక్ష ఫీజులంటూ ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో రూ.8 వేలు నుంచి రూ.10 వేలు గుంజుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. హైస్కూల్ స్థాయిలో అయితే రెట్టింపు ధరలు ఉన్నాయనని ఆందోళన చెందుతున్నారు. డీజిల్ ధరలు పెరిగాయంటూ స్కూల్స్ బస్సు చార్జీలను రెట్టింపు చేయడాన్ని పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఫీజు దోపిడీ జరుగుతున్నా, వసతులు అంతంత మాత్రమే ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మరోవైపు అన్క్వాలిఫైడ్ టీచర్లతో బోధన సాగిస్తున్నారు. ప్రైవేటులో ఫీజు దోపిడీ -
తొలగించిన టీచింగ్ అసిస్టెంట్లకు అండగా ఉంటా
తిరుపతి సిటీ: ఎస్వీయూలో తొలగించిన టీచింగ్ అసిస్టెంట్లకు అండగా ఉంటానని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం ఎస్వీ యూకు విచ్చేసిన ఆయనను వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఎస్వీయూ అధ్యక్షుడు ప్రేమ్కుమార్, విద్యార్థి నేతలు ఆయన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం వారు టీచింగ్ అసిస్టెంట్ల సమస్యలను ఎమ్మెల్సీకి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీలో 45 మంది టీచింగ్ అసిస్టెంట్లను తొలగించడం బాధాకరమని, జీవనోపాధి కోల్పొయి రోడ్డున పడిన వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ధీరజ్ రెడ్డి, రాజశేఖర్, కొండ యుగంధర్, సుకుమార్, పవన్, ప్రభ పాల్గొన్నారు. -
పారదర్శకత ప్రశార్థకమేనా?
తిరుపతి సిటీ: జిల్లాలోని ఎస్వీయూ, పద్మావతి మహిళా వ ర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు వెల్లువెత్తా యి. ఆయా వర్సిటీల్లో పలు అధ్యాపక పోస్టుల భర్తీ కోసం ఉన్నత విద్యామండలి ఆహ్వానించిన ఆన్లైన్ దరఖాస్తులకు సోమవారంతో గడువు ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వేల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నా రు. ఒక్కో పోస్టుకు 157 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో నియామకాలు పారదర్శకంగా జరపాలని అవినీతికి పాల్పడినా, రోస్టర్ విధానం సక్రమంగా అమలు చేయకపోయినా, యూజీసీ నిబంధనలకు మేర ని యామకాలు చేపట్టక పోయినా విద్యార్థి సంఘాల ఐక్యవేది క ఆధ్వర్యంలో ప్రతిఘటించి ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. స్పోర్ట్స్ డీఎస్సీలా గా యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల నియామకాల్లో గందరగోళం సృష్టిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. 125 పోస్టులకు 19,588 దరఖాస్తులు ఎస్వీయూలో 125 పోస్టులకు ఆల్లైన్ ద్వారా రికార్డు స్థాయిలో 19,588 దరఖాస్తులు అందినట్లు సమాచారం. దాదాపు 1:157 నిష్పత్తిలో పోటీ నెలకొన్నట్లు గణాంగాలు చెబుతున్నాయి. కుప్పం ద్రావిడ వర్సిటీలో 20 పోస్టులకు 2,792 దరఖాస్తులు అందాయని అధికారులు వెల్లడించారు. మహిళా వర్సిటీలో 48 పోస్టులకు సైతం అదే రీతిలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందినట్లు సమాచారం. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఈనెల 29వ తేదీన విడుదల చేయనున్నారు. జూలై 6వ తేదీ వ రకు అభ్యంతరాల స్వీకరించి, అదే నెల 7వ తేదీన అర్హత పొందిన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నారు. నిరుద్యోగులతో ఆటాడుకోవద్దు ఎన్నో సంవత్సరాల తర్వాత యూనివర్సిటీలలో పలు అధ్యాపక పోస్టుల నియామక ప్రక్రియ జరుగుతోంది. ఎస్వీయూలోనే 125 పోస్టులకు సుమారు 20 వేల మంది దరఖాస్తు చేసుకున్నారంటే పోటీ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఆశతో ఉన్నారు. వారి జీవితాలతో ఆడుకోకుండా అధ్యాప నియామకాలలో అవినీతి ఆస్కారం లేకుండా పారదర్శకంగా చేపట్టాలి. – శివశంకర్ నాయక్, జీఎన్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు రాజకీయ జోక్యాన్ని నివారించాలి వర్సిటీలలో త్వరలో చేపట్టబోయే అధ్యాపక నియామకాల్లో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నివారించాలి. రాజకీయ నాయకులు జోక్యంతో ప్రతిష్టాత్మక నియామకాల ప్రక్రియ భ్రష్టుపడుతోంది. పోటీ పరీక్షలో అభ్యర్థి సాధించిన మెరిట్తో పాటు యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలి. –ఆర్ ఆశ, పీడీఎస్ఓ, జిల్లా కార్యదర్శిపోటెత్తిన దరఖాస్తులు.. -
దొంగ ఓట్ల చేర్పులపై ప్రత్యేక నిఘా ఉంచండి
నాయుడుపేట టౌన్: స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ విధానంపై (ఎస్ఐఆర్) వైఎస్సార్ సీపీ బూత్ లెవల్ ఏజెంట్లు నిఘా పెట్టి పని చేయాలని, దొంగ ఓట్ల చేర్పునకు అడ్డుకట్ట వేయాలని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, సూళ్లూరుపేట నియోజవర్గ పరిశీలకులు బిరుదవోలు శ్రీకాంత్రెడ్డి సూచించారు. నాయుడుపేటలోని వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో సోమవారం పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన జరిగిన సమీక్షలో ముఖ్య అతిథులుగా ఎంపీతో పాటు నియోజవర్గ పరిశీలకులు పాల్గొన్నారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై పార్టీకి చెందిన బీఎల్ఏతోపాటు నాయకులందరు అవగాహన కలిగి ఉండాలన్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబు మాయల మరాటీలు దుర్మార్గంగా వ్యవహరిస్తూ తిమ్మిని బమ్మిని చేసేలా ఓటర్ల జాబితాలో దొంగ ఓట్ల చేర్పులు తదితర అక్రమాలకు పాల్పడితే వెంటనే గుర్తించి వాటిని అడ్డుకోవాలన్నారు. అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి, ఎస్ఐఆర్ ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా జరిగేలా చూడాలన్నారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ అధికారపార్టీ టక్కు టమార విద్యలకు పాల్పడే అవకాశం ఉందని, దీనిపై బీఎల్ఏలు న్యాయబద్ధమైన ఓట్ల తొలిగింపులు చేపట్టకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, న్యాయ విభాగ అధ్యక్షుడు చదలవాడ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ, పీజీ ఫలితాలు విడుదల చేయాలి
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో 5 నెలలకు కిందట నిర్వహించిన డిగ్రీ ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను, పెండింగ్లో ఉన్న పీజీ ఫలితాలను తక్షణం విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రెక్టార్ అప్పారావును కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్వీయూలో ఎగ్జామినేషన్ సెక్షన్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు ఎంతో మంది ఇబ్బందులకు గురికావల్సి వస్తోందన్నారు. సకాలంలో పీజీ, యూజీ పరీక్షల ఫలితాలను విడుదల చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. పెండింగ్లో ఉన్న పరీక్షల ఫలితాలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రెక్టార్ స్పందిస్తూ రెండు రోజులలో డిగ్రీ ఫలితాలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, తేజ, వినోద్ పాల్గొన్నారు. -
మ్యాపింగ్ కాని ఓటర్లు 9,33,387 మంది
ఓటు వజ్రాయుధం.. పాశుపతాస్త్రం.. భారత రాజ్యాంగం మనిషికి కల్పించిన గొప్ప హక్కు. అలాంటి ఓటును కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) పేరుతో ఓ కార్యక్రమం మొదలైంది. ప్రతి ఓటరూ మేల్కొని తమ వివరాలను బీఎల్వోలకు అందజేసి, ఓటుహక్కును కాపాడుకోవాల్సి ఉంది. తిరుపతి జిల్లా.. నియోజక వర్గం పేరు మొత్తం ఓటర్లు మ్యాపింగ్ మ్యాపింగ్ అయిన ఓటర్లు కాని ఓటర్లుతిరుపతి 2,95,288 1,72,143 1,23,145 చంద్రగిరి 3,13,795 1,77,876 1.35,919 శ్రీకాళహస్తి 2,49,123 1,66,536 82,578 సత్యవేడు 2,16,102 1,73,217 42,885 సూళ్లూరుపేట 2,43,284 1,74,120 69,164 వెంకటగిరి 2,45,781 1,75,098 70,683 రైల్వే కోడూరు 2,06,065 1,39,530 66,535సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రతి పౌరునికి అతి ముఖ్యమైన ఓటు హక్కుని కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఓటరు కాస్త నిర్లక్ష్యం చేస్తే.. ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ‘సర్’ హెచ్చరిస్తోంది. ఇప్పటివరకు ఎన్నిసార్లు ఎన్నికల్లో పాల్గొన్నా.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా విధిగా ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయాలి. సకాలంలో ఆ ఫారాలు ఇచ్చిన వారి ఓట్లు మాత్రమే భద్రంగా ఉంటాయి. లేదంటే ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పన పేరుతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇందులో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) మ్యాపింగ్ ప్రక్రియ కీలకంగా మారింది. సమగ్ర ప్రత్యేక సవరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగుతుంది. సర్లో ప్రధానంగా మూడు రకాల మ్యాంపింగ్ల గురించి ప్రతి ఓటరు అవగాహన ఉండాలనే విషయం స్పష్టమైంది. ఓటు భద్రంగా ఉండాలంటే వచ్చే నెల 14వ తేదీ లోపు మ్యాపింగ్ పూర్తి చేసుకోవాలి. అందుకోసం ప్రతి ఓటరు పుట్టిన గ్రామానికి వెళ్లాలి. 2002 ఓటరు జాబితాలో మీ తల్లి దండ్రుల పేరు, సీరియల్ నంబర్ తెలుసుకుని.. ఆ నంబర్ని బీఎల్వోలకు ఇవ్వాలి. వారు ఆ నంబర్తో ఓటరు జాబితాలో మ్యాపింగ్ ద్వారా చేరుస్తారు. 2002 ఓటరు లిస్టులో పేరు ఉండి, 2025 జాబితాలో కూడా పేరు ఉన్న వారు బీఎల్వో దగ్గరకు వెళ్లి సెల్ఫ్ మ్యాపింగ్ చేయించుకోవాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ‘సర్’ స్పష్టం చేస్తోంది.సర్ ప్రక్రియ ప్రారంభం తిరుపతి, చిత్తూరు జిల్లాలో మ్యాపింగ్ కాని ఓటర్లు 9,33,387 మంది ఉన్నారు. ఇందులో తిరుపతి జిల్లాలోనే 5,90,909 మంది ఉంటే.. చిత్తూరు జిల్లాలో 3,42,478 మంది ఓటర్లు ఉన్నారు. తిరుపతి, చంద్రగిరి నియోజక వర్గాల పరిధిలో ఎక్కువ మంది మ్యాపింగ్ చేయని ఓటర్లు ఉన్నారు. ఆ తరువాత స్థానంలో శ్రీకాళహస్తి, వెంకటగిరి, రైల్వేకోడూరు, చిత్తూరు నియోజక వర్గాలున్నాయి. నెల రోజుల్లోపు ఓటర్లు మ్యాపింగ్ చేసుకోలేకపోతే ఓటుహక్కు కోల్పోయే ప్రమాదమే అధికంగా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంటింటా సర్వే పూర్తయిన తరువాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఈ జాబితా ప్రతి బీఎల్వో వద్ద ఉంటుంది. ఆ జాబితాలో ఓటు ఉందో లేదోనని ప్రతి ఒక్కరు విధిగా సరిచూసుకోవాల్సి ఉంది. జాబితాలో పేరు లేకపోతే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఆ అభ్యంతరాలను ఆగస్టు 20వ తేదీలోపే స్వీకరిస్తారు. అలా ఇచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 18వ తేదీలోగా పరిష్కరించి, అదే నెల 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. జూలై ఒకటో తేదీ లోగా 18 ఏళ్లు పూర్తి అయినా కొత్త్తగా ఓటరు నమోదు కాకపోతే ఫారం–6 ద్వారా నమోదు చేసుకోవచ్చు. జాబితాలో ఓటు లేకపోతే ఫారం–7.. వేరే చోటుకు ఓటు బదలాయించడానికి ఫారం–8ని వినియోగించుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. -
న్యాయం కోసం కలెక్టరేట్ వద్ద ధర్నాలు
– పీజీఆర్ఎస్కు 461 అర్జీలు తిరుపతి అర్బన్: న్యాయం కోసం పేద కుటుంబాలకు చెందిన పలువురు కలెక్టరేట్ వద్ద పీజీఆర్ఎస్ సందర్భంగా ధర్నాలు చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్కు 461 అర్జీలు వచ్చాయి. జేసీ గోవిందరావుతోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్నాయక్, భరత్ నాయక్, రోజ్మాండ్ అర్జీలను స్వీకరించారు. గ్రామ పంచాయతీ, స్వచ్ఛభారత్, క్లాప్ మిత్ర కార్మికుల సమస్యలను పట్టించుకోరా? అంటూ ఆ విభాగాలకు చెందిన వర్క ర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. డీపీఓ సుశీలాదేవికి వినతిపత్రం అందజేశారు. వెంకటగిరి మండలం జంగాలపల్లి చెరువులో ఆక్రమణకు తొలగించాలని గ్రామస్థులు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. రేణిగుంట మండలంలోని గుత్తివారిపల్లికి చెందిన పంట కాలువలను ఆక్రమించి పూడ్చేస్తున్నారని గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. తిరుచానూరులోని సర్వే నంబర్ 252–2ఏ1లో 10 సెంట్లు, 252–3ఏ1లో 18 సెంట్లు ఆక్రమించారని బాధితురాలు డి.జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. -
రేపటి నుంచి ఇంటర్ రెండో విడత కౌన్సెలింగ్
తిరుపతి సిటీ: టీటీడీ జూనియర్ కళాశాలల్లో బుధవారం నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న రెండో విడత కౌన్సెలింగ్కు సంబంధించి ఇప్పటికే మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రుల సెల్ఫోన్లకు సమాచారం అందించామన్నారు. ఎస్వీ, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలల్లో తొలివిడత కౌన్సెలింగ్లో మిగిలిన 1,324 సీట్లకు కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్లోనూ రెండు కళాశాలల్లో బైపీసీ, ఎంపీసీ గ్రూపులకు తీవ్ర పోటీ నెలకొలనడంతో బైపీసీకి జనరల్ కేటగిరీలో 95 శాతం మార్కుల వరకు, ఎంపీసీలో 94 శాతం మార్కుల వరకు సీట్ల కేటాయింపు ఆగినట్లు సమాచారం. ‘బర్డ్’కు రూ.10 లక్షల విరాళం తిరుపతి తుడా: టీటీడీ ఆధ్వర్యంలో సేవలందిస్తున్న బర్డ్ ట్రస్ట్ ఆస్పత్రిలో గతంలో స్వాంతన పొందిన దివ్యాంగుడు పులి సందీప్ తమ కుమార్తె పేరిట ఆస్పత్రికి రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. సెరిబ్రల్ పాలసీతో బాధపడుతున్న సందీప్కు 1995లో బర్డ్ ఆస్పత్రిలో డాక్టర్ గుడారు జగదీష్ శస్త్ర చికిత్స చేసి, వైద్యం అందించారు. కోలుకున్న ఆయన ఉన్నత విద్యను అభ్యసించి సాప్ట్వేర్ సంస్థలో ఉద్యోగం సాధించారు. బెంగళూరులో ఎన్వీఐడీఐఏ సంస్థలో పనిచేస్తున్న ఆయన కుమార్తె పేరిట తన కుటుంబ సభ్యులతో కలసి రూ.10,01,016 విరాళాన్ని బర్డ్ ట్రస్టుకు అందించాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు సోమవారం డైరెక్టర్ సూచనల మేరకు బర్డ్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకారెడ్డికి చెక్కును అందజేశారు. నిరుపేదలకు, అర్థులకు వైద్యం అందించేందుకు వినియోగించాలని దాత కోరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 95,094 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 35,909 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.93 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. పీసీపీఎన్డీటీ చట్టం పటిష్టతకు టోల్ఫ్రీ నంబర్ తిరుపతి తుడా: ఆడశిశువుల సంరక్షణకు, భ్రూణహత్యల నివారణకు అమల్లో ఉన్న పీసీపీఎన్డీటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 18002332447ను ఏర్పాటు చేసిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖకాధికారి డాక్టర్ బాలకృష్ణనాయక్ తెలిపారు. పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘించేవారి గురించి సమాచారం ఇచ్చేందుకు ఈ టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేయవచ్చని, సమాచారం ఇచ్చే వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామన్నారు. గర్భంలో పెరిగే శిశువు ఆడా, మగా అని చెప్పడం, లింగనిర్ధారణ సేవలను ప్రచారం చేయడం, ప్రోత్సహించడం చట్ట విరుద్ధమని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిభ చాటుకున్న గ్రామీణ క్రికెటర్ తేజ సూళ్లూరుపేట: మండలంలోని ఆబాక గ్రామానికి చెందిన డీ తేజ(19) అండర్–19 క్రికెట్ క్రీడ లో తన ప్రతిభను చాటుకుని అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఎస్పీఏ నేషనల్ చాంపియన్ షిప్లో విజేతగా నిలిచి తన సత్తా చాటుకున్న తేజ ఇప్పుడు థాయిలాండ్లో జరగనున్న అంతర్జాతీయస్థాయి క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. తేజకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
ప్రత్యేక అవసరాల పిల్లలను ప్రోత్సహిద్దాం
తిరుపతి అర్బన్: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలపై జాలి చూపడం కన్నా...వారి ప్రతిభను, సామర్థాన్ని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారని జాయింట్ కలెక్టర్ గోవిందరావు అభిప్రాయపడ్డారు. సోమవారం తిరుపతి బైరాగిపట్టెడలోని ఎంజీఎం మున్సిపల్ హైస్కూల్ వద్ద అలింకో ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా వివిధ ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జేసీ మాట్లాడుతూ 3–18ఏళ్ల లోపు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు భవిత కేంద్రాల్లో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీఈఓ కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ అలింకో ఆధ్వర్యంలో 499 మంది విద్యార్థులకు రూ.45 లక్షలు విలువ చేసే వివిధరకాల ఉపకరణాలను అందించినట్లు తెలిపారు. సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ భరత్కుమార్రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ.65లక్షల వ్యయంతో వివిరకాల భత్యాలను అందిస్తున్నట్లు చెప్పారు. -
ఘనంగా యాత్రి సువిధా దివస్
రేణిగుంట: ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం ప్రయాణికుల కేంద్రీకృత కార్యక్రమం యాత్రి సువిధా దివస్ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రయాణికులు రాగానే తిలకం పెట్టి, స్వాగతం పలికారు. తిరుపతి రోటరీ క్లబ్ సమన్వయంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. విమానాశ్రయంలో ప్రయాణికుల బీపీ, షుగర్, బీఎంఐలను తనిఖీ చేయడానికి ఉచిత ఆరోగ్య పరీక్షలతోపాటు ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. పర్యావరణ సుస్థిరతపై తమ నిబద్ధతను ప్రదర్శిస్తూ, తపస్య విద్యార్థులు పచ్చని, ప్లాస్టిక్ రహిత ప్రపంచం కోసం వాదించే ఒక సామాజిక అవగాహన స్కిట్, నృత్య ప్రదర్శన ప్రదర్శించారు. ఐక్యత, జాతీయ గర్వానికి శక్తివంతమైన నిదర్శనంగా, తిరుపతి విమానాశ్రయానికి చెందిన భాగస్వాములందరూ సామూహిక వందేమాతరం గీతాలాపనలో పాల్గొన్నారు. విమానాశ్రయ అభివృద్ధిని తెలియజేసే పాతకాలపు ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. అనంతరం విమానాశ్రయ ఆవరణలో చెట్లను నాటారు. విమానాశ్రయ డైరెక్టర్ భూమినాథన్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. -
అర్హులందరికీ రూఫ్ టాప్ సోలార్
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ను అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా సంస్థ పరిధిలోని 9 జిల్లాల నుంచి 63 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను సీఎండీకి వివరించారు. ముగిసిన జాతీయ సదస్సు తిరుపతి సిటీ: పాలేఖర్ కృషి విజ్ఞాన కేంద్రం, రైతు నేస్తం సంయుక్త ఆధ్వర్యంలో ఎస్వీయూ బోటనీ విభాగం సహకారంతో ఐదు రోజులుగా జరిగిన ప్రకృతి వ్యవసాయంపై జాతీయ సదస్సు సోమవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ అవార్డు గ్రహిత సుభాష్ పాలేఖర్ పాల్గొని విద్యార్థుల, వ్యవసాయ రంగ నిపుణల సందేహాల ప్రశ్నోత్తరాలను నివృతి చేశారు. అనంతరం సదస్సులో ఐదు రోజుల పాటు శిక్షణ పొందిన విద్యార్థులకు, ఔత్సాహికులకు ధ్రువపత్రాలు అందజేశారు. -
తూతూ మంత్రంగా ‘సర్’ ప్రారంభం
రేణిగుంట: భారత ఎన్నికల కమిషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ రేణిగుంట మండలంలో తూతూ మంత్రంగా మొదలైంది. ఎన్నికల కమిషన్, ఉన్నత అధికారులు చేసిన ప్రకటనల ప్రకారం సోమవారం నుంచి ప్రతి గ్రామంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు వివిధ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లకు సమాచారం అందించి సర్ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. కానీ రేణిగుంట మండలంలో అనేక గ్రామాలకు సాయంత్రం వరకు వాటికి సంబంధించిన ఫామ్లు రాలేదని బీఎల్వోలు తెలపడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంది. ఉన్నతాధికారులు ఈ ప్రక్రియను అంత పారదర్శకంగా నిర్వహించాలని చెబుతున్న స్థానికంగా ఆ పరిస్థితులు కనిపించ లేదు. అనేక చోట్ల అధికార పార్టీ వారు చెప్పినట్లు బీఎల్వోలు ప్రవర్తిస్తున్నారని, ఇతర పార్టీల వారు ఆరోపిస్తున్నారు. మండలంలో 80 శాతానికి పైగా మొదటి రోజు ప్రక్రియ ఎక్కడ మొదలు కానప్పటికీ అధికారులు మాత్రం మొదటి రోజు ప్రక్రియ మొదలైనట్టు ప్రకటించటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విషయంపై తహసీల్దార్ శ్రావణ్కుమార్ని వివరణ కోరగా సర్ ప్రక్రియ మొదలైందన్నారు. అంతర్జాతీయ శిక్షణకు తొట్టంబేడు టీచర్ తొట్టంబేడు: మండలంలోని దిగువ సాంబయ్యపాళెంలోని ఫౌండేషన్ స్కూల్ ఉపాధ్యాయుడు కయ్యూరు బాలసుబ్రమణ్యం ఫిన్లాండ్లో జరిగే అంతర్జాతీయ శిక్షణకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో అమరావతిలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో బాలు పాల్గొన్నారు. ఆగస్టు 17 నుంచి 26వ తేదీ వరకు టీచర్లు ఫిన్లాండ్లోని తుర్కు, రౌమా నగరాల్లో పర్యటించి అక్కడి బోధన విద్యా విధానాలను పరిశీలిస్తారు. -
శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి
తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం కేంద్ర మంత్రి శోభా కరండ్లజే దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. గంజాయి నిర్మూలనే లక్ష్యం చంద్రగిరి : గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఆదివారం ఈ మేరకు చంద్రగిరి ప్రభుత్వ బాలుర పాఠశాల సమీపంలో పలువురు యువకులు, స్థానికేతరులకు యూరిన్ టెస్టును నిర్వహించారు. సుమారు 110 మందిని పరీక్షించగా 10 మందికి పాజిటివ్గా వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయిపై యూరిన్ టెస్టులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ పరీక్షల ద్వారా ఆరు నెలల వరకు ఎప్పుడు గంజాయి సేవించినా తెలుస్తుందన్నారు. వీరి ద్వారా గంజాయి విక్రేతలను గుర్తించి మూలాలను నాశనం చేయవచ్చని వెల్లడించారు. డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ గంజాయి ముఠాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని తెలిపారు. ఎస్ఐలు రవి ప్రకాష్ రెడ్డి, మురళీమోహన్, అరుణాచలం పాల్గొన్నారు. తిరుమలలో గుర్తుతెలియని మృతదేహం తిరుమల: తిరుమలలోని ఆళ్వార్ ట్యాంక్ (ఆల్వార్ చెరువు) పడమర భాగంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు తిరుమల టూ టౌన్ సీఐ శ్రీరాముడు తెలిపారు. నీటిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పరిశీలించగా, సుమారు 35 ఏళ్ల వయస్సు గల పురుషుడిగా గుర్తించినట్లు చెప్పారు. మృతుడు డార్క్ బ్లూ జీనన్స్ ప్యాంట్, లైట్ బ్లూ ఫుల్ హ్యాండ్ షర్ట్ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహం పరిస్థితిని బట్టి నాలుగు నుంచి ఐదు రోజుల క్రితమే నీటిలో పడి మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే తిరుమల టూ టౌన్ పోలీసులను సంప్రదించి సమాచారం అందించాలని సీఐ శ్రీరాముడు కోరారు. 9392101923, 9440796772 నంబర్లకు సమాచారం ఇవ్వవచ్చని సూచించారు. పాముకాటుతో మహిళ మృతి వరదయ్యపాళెం : మండలంలోని పెద్దపాండూరు పంచాయతీ సిద్ధేశ్వరపురంలో జమున (45) అనే మహిళ పాముకాటుతో మృతి చెందింది. ఆదివారం వేకువజామున విద్యుత్ నిలిచిపోవడంతో ఇంట్లో చీకటిగా ఉంది. ఈ సమయంలో ఇంట్లో చొరబడిన నాగుపాము ఆమెను కాటు వేసిందని కుటుంబీకులు వెల్లడించారు. వెంటనే చిన్న పాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం కోసం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించిందని తెలిపారు. ప్రాణాలు తీసిన లారీ! రైల్వేకోడూరు: రైల్వేకోడూరులోని మామిడికాయల మండీ వద్ద ఆదివారం వేకువజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మండీలో పనిచేస్తున్న రవి(22) అనే కార్మికుడు స్థానికంగా మండీలు కాయలు దింపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం వేకువ జామున మండీ వద్దే నిద్రిస్తుండగా ఓ లారీ వెనుకకు రివర్స్ వస్తూ అతనిపైకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మండీలో కనీస వసతులు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, మృతుని కుటుంబానికి రూ.20 లక్షలు చెల్లించాలని సీఐటీయూ నాయకులు సీహెచ్ చంద్రశేఖర్, జాన్ప్రసాద్, రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
మూడు ఆలయాల్లో చోరీ
రామచంద్రాపురం : మండలంలోని మూడు ఆలయాల్లో శనివారం రాత్రి దుండగులు చోరీలకు పాల్పడ్డారు. వరుసగా ఆలయాల హుండీలను లక్ష్యంగా చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. మండలంలోని చల్లావారిపల్లి ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారికి అలంకరించిన 8 గ్రాముల బంగారు కాసులు, హుండీలోని రూ.20 వేల నగదును అపహరించారు. అలాగే తాటితోపు కండ్రిగలోని రాములవారి ఆలయం, అంకాలమ్మ ఆలయాల్లోని హుండీలను పగలగొట్టి, సుమారు రూ.4 వేల నగదును దోచుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలాలకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలి ముద్రలను సేకరించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫుట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో ఆదివారం జిల్లా ఫుట్బాల్ జట్లును ఎంపిక పోటీ లు నిర్వహించారు. అండర్–13, 15 బాలబాలికల జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీలకు దాదాపు 250మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. శాప్, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కోచ్లు వినోద్, రమేష్, బాషా పర్యవేక్షణలో పోటీలను చేపట్టారు. ఎంపికై న జట్లు మదనపల్లె నిర్వహించనున్న అండర్–15 రాష్ట్ర స్థాయి బాలుర ఫుట్బాల్, అనంతపురంలో నిర్వహించే అండర్–15 రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్బాల్, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించే అండర్–13 రాష్ట్ర స్థాయి బాలుర ఫుట్బాల్, నంద్యాలలో నిర్వహించే అండర్–13 రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిథ్యం వహించనున్నారు. క్రీడాకారులను ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డెప్ప, ఉపాధ్యక్షుడు గుండ్లూరు వెంకటరమణ, సభ్యుడు అచ్యుత్ అభినందించారు. -
అప్రమత్తం.. ఓటు భద్రం
తిరుపతి అర్బన్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సోమవారం నుంచి జూలై 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎన్యుమరేషన్ ఫారమ్–2ను ఓటరు నింపి బీఎల్ఓకు అందజేయాల్సి ఉంటుంది. 23 ఏళ్లుగా తాను భారతదేశంలో ఉన్నట్లు ధ్రువీకరించే వివరాలు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలోనే పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. 23 ఏళ్ల నివాసం పేరుతో కూటమి నేతలు అక్రమాలకు పాల్పడే అవకాశముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల ఓట్లను గల్లంతు చేస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలతోపాటు ఓటర్లు సైతం అప్రమత్తంగా ఉండాలని మేధావులు సూచిస్తున్నారు. 23 ఏళ్ల తర్వాత.. 2002లో చివరిసారిగా ఓటరు జాబితా సవరణ ప్రక్రి య చేపట్టారు. 23ఏళ్ల తర్వాత ఇప్పుడు సర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 2026 ఓట్లను 2002తో మ్యాపింగ్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో రోజుకు 50 ఇళ్లను సర్వే చేయాలని బీఎల్ఓలకు టార్గెట్ పెట్టారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ తమ ఓటును మ్యాపింగ్ చేయించుకుని, తమ కుటుంబ సభ్యుల ఓట్లు మ్యాపింగ్(ఫ్యామిలీ ట్రీ) పూర్తి చేశా రా అనే అంశాలను పరిశీలించుకోవాలి. బీఎల్ఓలు చూసుకుంటారులే అనుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఓటు గల్లంతయ్యే ప్రమాదముంటుంది. 2002 నాటి ఓటర్ జాబితాలో మీ పేరు ఉంటే...ఆ వివరాలను ఎన్యుమరేషన్ ఫారమ్–2 లో నింపాలి. ఒక వేళ మీ పేరు లేకుంటే మీ తల్లిదండ్రుల పేర్లు లేదా కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేస్తూ మీ పుట్టిన తేది, ఆధార్ జతచేయాల్సి ఉంటుంది. చివరిగా పాస్పోర్ట్ సైజ్ పొటో అతికించి బీఎల్ఓలకు ఇస్తే...వారు ఓ రసీదు ను అందిస్తారు. దాన్ని భద్రపరచుకోవాల్సి ఉంటుంది. 1987కి ముందు ఓటరు జన్మించి ఉంటే ఏదైనా ఓటర్లు గుర్తింపు పత్రం సమర్పించాలి, లేదా 1987– 2004 మధ్య జన్మించి ఉంటే ఓటరుతోపాటు తల్లి లేదా తండ్రి గుర్తింపు పత్రాన్ని స్వీకరిస్తారు. 2004 తర్వాత జన్మించిన ఓటరుతోపాటు తల్లిదండ్రులు ఇద్ద రు గుర్తింపు పత్రాలను సమర్పించాలి. ఇంటికి తాళం వేసి ఉన్నప్పటికి బీఎల్ఓలు వివరాలు, పత్రాలు సేకరణ కోసం మూడుసార్లు రావాల్సి ఉంటుంది. నేటి నుంచి సర్ ప్రక్రియ ప్రారంభం -
నేడు ‘డయల్ యువర్ సీఎండీ’
తిరుపతి రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ నిర్వహించనున్నట్లు ఎస్పీడీసీఎల్ అధికారులు వెల్లడించారు. ఆదివారం వారు మాట్లాడుతూ తిరుపతి, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 8977716661కు ఫోన్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకు రావచ్చని తెలిపారు. కాల్ చేసే సమయంలో వినియోగదారులు తప్పనిసరిగా విద్యుత్ సర్వీస్ నంబర్ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గడువు పొడిగింపు తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో పలు కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 25వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి పాక్శాస్త్రి కోర్సులతో పాటు, యూజీ(శాస్త్రి) 3, 4 సంవత్సరాల కోర్సుల్లోనూ, అలాగే 17 విభాగాలలో పీజీ (ఆచార్య) 1, 2 సంవత్సరాల కాలవ్యవధి కోర్సుల్లోనూ, పీహెచ్డీ (విద్యావారధి) కోర్సుల్లోనూ ప్రొఫెషనల్ కోర్సులైన ఐటీఈపీ (బీఏ, బీఈడీ), బీఈడీ (శిక్షా శాస్త్రి), ఎమ్ఈడీ (శిక్షా ఆచార్య) కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తుల గడువు సోమవారంతో ముగియనుండగా విద్యార్థుల అభ్యర్థన మేరకు గడువును ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 7382595500, 7382585500 నంబర్ల నందు సంప్రదించాలని అధికారులు సూచించారు. వేగవంతం.. అనుసంధానం తిరుపతి రూరల్ : ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలపై ఏర్పాటు చేస్తున్న రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ను గ్రిడ్కు అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఆదేశించారు. ఆదివారం రేణిగుంట మండలం వెదుళ్లచెరువు సాగుతున్న అనుసంధాన ప్రక్రియను ఆయన పరిశీలించారు. సీఎండీ మాట్లాడుతూ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు నోడల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది, అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని కోరారు. డైరెక్టర్ పి.అయూబ్ఖాన్, చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఉమాపతి, తిరుపతి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ వి.చంద్రశేఖర రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు జయప్రకాష్, సుబ్రమణ్యం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పుణ్యకోటి, మల్లికార్జున పాల్గొన్నారు. -
పూడికతీత పేరుతో ఇసుక దోపిడీ
● రూ.100 స్టాంపు ఫీజుతో అప్పనంగా కాంట్రాక్టు ● రూ.99లక్షల పనుల పేరుతో రూ.కోట్ల సై‘ఖతం’ ● 10 ట్రాక్టర్లకు అనుమతి తీసుకుని 200 టిప్పర్లతో తరలింపు ● టన్నుకు రూ.100 రుసుము చెల్లించి.. తమిళనాడు, కర్ణాటకలో రూ.3వేలకు విక్రయం సాక్షి ప్రతినిధి, తిరుపతి : సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం పరిధిలో ఇసుక దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికారపార్టీ అండతో యథేచ్ఛగా తవ్వి తమిళనాడు, కర్ణాటకకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. అనుమతులు కొంతే ఉంటే.. అక్రమాలు కొండంతగా సాగిపోతోంది. జిల్లాలోని పిచ్చాటూరు, నాగలాపురం మండలాల పరిధిలోనిన్న ఆరణియార్ నదిలో పూడికతీత పేరుతో భారీగా ఇసుక అక్రమ తవ్వకం జరుగుతోంది. ఇందుకోసం సర్కారు పెద్ద పథకమే అమలు చేస్తోంది. అరణియార్ నదిలో భారీగా నాణ్యమైన ఇసుక నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడి ఇసుకకు తమిళనాడు, కర్ణాటకలో మంచి డిమాండ్ ఉంది. అందులోని ఇసుకను ఎలాగైనా తవ్వి తరలించి సొమ్ముచేసుకునేందుకు టీడీపీ నేతలు పన్నాగం పన్నారు. ఇసుకను తవ్వి తరలిస్తే అక్రమ రవాణా అంటారని కొత్త పంథాను అనుసరించారు. నదిలో పూడికితీత పేరుతో దోపిడీకి పూనుకున్నారు. వరదలు వచ్చినప్పుడు సమీప గ్రామాలు ముంపునకు గురవుతాయని, ఆ ప్రమాదం జరగకుండా ఉండేందుకు పూడిక తీత ఎత్తుగడ వేశారు. అనుకున్న వెంటనే.. చకచకా అనుమతులు ఇప్పించుకున్నారు. గుంటూరుకు చెందిన రఘురామ్ హ్యూమ్ పైప్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరున రూ.100 స్టాంప్ పత్రంపై రూ.99 లక్షల కాంట్రాక్టుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. డీసిల్టేషన్’ పనులను అడ్డంపెట్టుకుని దోపిడీకి తెగబడ్డారు. ఇందుకు శ్రీకాళహస్తి ఇరిగేషన్ డివిజన్ ఒప్పందమే ప్రత్యక్ష ఉదాహరణ. పేరుకు పూడికతీత.. తెరవెనుక జరుగుతోంది మాత్రం రూ.కోట్ల ఇసుక దందా. భద్రతపై బాధ్యత లేదు గుంటూరు సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో 14వ నిబంధనపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. పూడికతీత పనుల్లో అవాంఛనీయ ఘటన, ప్రమాదం, మరణం సంభవిస్తే తమకు సంబంధం లేదని, ఏజెన్సీదే పూర్తి బాధ్యతని ప్రభుత్వం పేర్కొనడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కార్మికుల భద్రతపై తమకు బాధ్యత లేదని సర్కారు తప్పుకోండం సరికాదని స్పష్టం చేస్తున్నాయి. అసలు దోపిడీ ఇక్కడే.. నిజానికి నదిలో మేట వేసిన ఇసుకను తొలగించి నీటి నిల్వ సామర్థ్యం పెంచడం ఈ పనుల లక్ష్యం. కానీ టీడీపీ సర్కార్ మాత్రం ఈ పవిత్రమైన పనిని కూడా కమీషన్ల కక్కుర్తికి వాడుకుంటోంది. గుంటూరుకు చెందిన రఘురామ్ హ్యూమ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 99 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను కారుచౌకగా కట్టబెట్టింది. అరణియార్ నదిలో ఇసుక దోపిడీకి ఈ ఏడాది మే 15వ తేదీన శ్రీకాళహస్తి ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో బీజం పడింది. పూడికతీత పనుల ముసుగులో ఇసుక దోపిడీకి ఇరిగేషన్ శాఖ ద్వారా ఒప్పందం కుదిరింది. కేవలం రూ.100 స్టాంప్ డ్యూటీ మాత్రమే చెల్లించి, ఏకంగా రూ.99 లక్షల కాంట్రాక్టును ఆ సంస్థ దక్కించుకుంది. ఈ ఒప్పందంలో సురుటుపల్లె సమీపంలోని అరణియార్ నది ఎగువ భాగంలో డీసిల్టేషన్, రవాణా, నిల్వ, లోడింగ్కు సంబంధించి 6.76 హెక్టార్లు విస్తీర్ణంలో 99 వేల మెట్రిక్ టన్నులు తరలించేందుకు రఘురాం హ్యూమ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి అనుమతులు మంజూరు చేసింది. ఈ వివరాలు బయటకు పొక్కడంతో స్థానికులు ఇసుక తరలింపును అడ్డుకున్నా టీడీపీ నేతలు లెక్కచేయలేదు. కాగితాలకే పరిమితం డస్ట్ కంట్రోల్కు నీళ్లు చల్లడం, వాహనాల వేగం 80 కిలోమీటర్లలోపునే నడపడం, లారీలపై టార్ఫాలిన్ కవర్ తప్పనిసరి. శబ్ధ కాలుష్యం 55 డెసిబెల్స్ మించకూడదు. ప్రతి నెలా గాలి, నీటి నాణ్యత నివేదికలను కాలుష్య నియంత్రణ మండలికి సమర్పించాలనే పేజీల కొద్దీ నిబంధనలు ఒప్పందంలో పొందుపరిచారు. క్షేత్రస్థాయిలో ఈ నిబంధలను పట్టించుకునే నాథుడే లేడు. దుమ్ము, ధూళితో పరిసర గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నది గట్లు కోతకు గురై పంట పొలాలు దెబ్బతింటున్నాయి. జాతీయ హరిత ట్రిబ్యూనల్, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్న స్థానికులు(ఫైల్) -
భక్తజన బ్రహ్మోత్సవం!
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీ బ్రహ్మోత్సవాలను తలపించింది. ఆదివారం ఒక్క రోజే 55 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. రాహు – కేతు పూజలకు విశేష ఆదరణ లభించింది. వివిధ టికెట్ విభాగాల్లో కలిపి మొత్తం 7,597 మంది భక్తులు రాహు– కేతు పూజలు చేసుకున్నారు. దీని ద్వారా ఆలయానికి రూ.67 లక్షల దాకా ఆదాయం సమకూరింది. దర్శన విభాగంలో సీఘ్ర దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంతరాలయ దర్శనాలతో కలిపి 7,641 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించే వివిధ సేవల్లో 545 మంది భక్తులు పాల్గొన్నారు. ప్రసాదాల విక్రయాలు కూడా భారీగా జరిగాయి. చిన్న లడ్డూలు, పులిహోర, వడలు, పెద్ద లడ్డూలు తదితర ప్రసాదాలను కలిపి 26,280 ప్రసాదాలు విక్రయించగా, 38 మంది భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. దేవస్థానం గణాంకాల ప్రకారం, ఆదివారం ఒక్కరోజే వివిధ సేవలు, దర్శనాలు, రాహు– కేతు పూజలు, ప్రసాదాల విక్రయాల ద్వారా కలిపి రూ.85,43,848 ఆదాయం లభించింది. -
‘కొండ’ంత జనం
– శ్రీవారి దర్శనానికి 30 గంటలు తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోవడంతో భక్తులు గోగర్భం వరకు బారులు తీరారు. శనివారం అర్ధరాత్రి వరకు 92,830 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 48,987 మంది తలనీలాలు అర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.60 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 30 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లోనే దర్శనమవుతోంది. ఈ క్రమంలో సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. పకడ్బందీగా ఏర్పాట్లు: అశేష భక్తజనులకు తిరుమలలో టీటీడీ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఎవరూ ఇబ్బంది పడకుండా అన్నప్రసాదాలను పంపిణీ చేస్తోంది. క్యూల్లోని వారి కోసం ప్రత్యేకంగా 20 పాయింట్లలో ఆహారం అందిస్తోంది. అలాగే 37 పాయింట్లను ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేస్తోంది. ఈ క్రమంలోనే, పారిశుద్ధ్య నిర్వహణను సైతం నిరంతరం పర్యవేక్షిస్తోంది. -
క్యాజీ.. రాజీ!
● సత్యవేడు టీడీపీలో నాటకీయ పరిణామాలు ● ఎమ్మెల్యే తనయుడికి పార్టీ పదవి ● నాడు విమర్శించిన నోటితోనే నవ్వులు సాక్షి టాస్క్ ఫోర్స్: నిన్నటి వరకు బహిరంగ వేదికలపై తిట్టుకున్న సత్యవేడు టీడీపీ నేతలు ఇప్పుడు ఒకే వేదికపై నవ్వులు చిందిస్తున్నారు. పదవుల పంపకంతో ఆధిపత్య పోరు కాస్తా, దోపిడీకి భాగస్వామ్యంగా మారిందని ఆ పార్టీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు. నాడు శత్రుత్వం.. నేడు మిత్రత్వం గతంలో తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనయుడు కోనేటి సుమన్ కుమార్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ప్రధానంగా టీడీపీ సత్యవేడు ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ‘‘మేము ఎన్నికల్లో రూ.కోట్లు అప్పులు చేసి ఖర్చు చేశాం. అధికారం వచ్చాక మమ్మల్ని పక్కన పెట్టారు. మా డబ్బులు తిరిగి ఇస్తే రాజీనామా చేస్తాం’’ అని సుమన్ కుమార్ బహిరంగంగా సవాల్ విసిరాడు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఆదివారం తిరుపతిలోని టీడీపీ కార్యాలయంలో అదే శంకర్ రెడ్డి సమక్షంలో పార్టీ సత్యవేడు నియోజకవర్గం బీఎల్ఏ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. దోపిడీకేనా..? రూ.కోట్లు ఖర్చు చేశామనిని బహిరంగంగా చెప్పిన ఎమ్మెల్యే తనయుడిపై టీడీపీ అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోలేదని పలువురు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పదవులు ఇచ్చి నగదు లెక్కను క్లోజ్ చేస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సత్యవేడులో గ్రావెల్, ఇసుక అక్రమ రవణా యథేచ్ఛగా సాగుతోంది. ఇఈ దందాల్లో వాటాల లెక్క తేలడంతోనే ఇప్పుడు రాజీ కుదిరిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
కామిరెడ్డిపై కక్షసాధింపు
●ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటున్న కిలివేటి, కామిరెడ్డి, తదితరులు (ఫైల్) పెళ్లకూరు : వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై టీడీపీ నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు అక్రమంగా కేసులు నమోదు చేయించి వేధిస్తున్నారు. మూడు నెలలుగా బెయిల్ కూడా రానివ్వకుండా కుట్రలు పన్నుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే పెళ్లకూరు పోలీసులు మూడు పర్యాయాలు కామిరెడ్డిని రిమాండ్ నుంచి కస్టడీలోకి తీసుకుని ఇబ్బందిపెడుతున్నట్లు మండిపడుతున్నారు. వేర్వేరు కేసులతో వేధింపులు పెళ్లకూరు మండలం కలవకూరు వద్ద స్వర్ణముఖినదిలో నిబంధనలకు విరుద్దంగా యంత్రాలతో టీడీపీ నేతలు చేపట్టిన ఇసుక తవ్వకాలను మార్చి 14వ తేదీన రైతులతో కలిసి వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. దీనిపై అక్రమార్కులు ఆగ్రహించి పోలీసులను ఉసిగొల్పారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జెడ్పీటీసీ సభ్యులు నన్నం ప్రిస్కిల్లా, డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్రెడ్డితో పాటు మొత్తం26 మందిపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారు. ఇందులో సత్యనారాయణరెడ్డితో పాటు మరో 11మందిని అరెస్టు చేసిన పోలీసులు మార్చి 16వ తేదీన నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఏప్రిల్ 8వ తేదీన బెయిల్ మంజూరైంది. అయితే 11మందిని మాత్రమే పోలీసులు విడుదల చేశారు. చెంబేడు గోదాము విషయంలో సత్యనారాయణరెడ్డిపై మళ్లీ కేసు పెట్టి రిమాండ్లోనే ఉంచేశారు. 70 ఏళ్లు పైబడిన కామిరెడ్డిని దారుణంగా వేధిస్తుండడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అదును చూసి చదును!
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు.. అధికార బలంతో కంటికి కనిపించిన భూములను కబళించేస్తున్నారు. అందులో భాగంగానే ఏర్పేడు మండలం రావిళ్లవారి కండ్రిగలో రూ.కోట్ల విలువైన నాలుగు ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. అడ్డుకునేందుకు యత్నించిన రెవెన్యూ సిబ్బందిని ముఖ్య ప్రజాప్రతినిధి పేరు చెప్పి బెదిరింపులకు దిగారు. ఆక్రమిత ప్రాంతంలో జేసీబీలతో చదును పనులు మొదలుపెట్టేశారు. ఏర్పేడు : మండలం పెనుమల్లం రెవెన్యూ పరిధి రావిళ్లవారి కండ్రిగ లో సర్వే నంబర్ 197/1లో 4.05 ఎకరాల ప్రభుత్వ అనాధీనం భూమి ఉంది. ఈ భూమి విలువ మార్కెట్లో రూ.4కోట్లకు పైగా పలుకుతుంది. అయితే ప్రభుత్వ భూమిపై స్థానిక టీడీపీ నేత ఒకరు కన్నేశారు. అధికార పార్టీ అండదండలు చూసుకుని ఎటువంటి అనుమతులు లేకుండా అదివారం ఉదయం జేసీబీలతో ఆ అనాధీనం భూమిని చదును చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణను గమనించిన గ్రామస్తులు వెంటనే ఫోన్ ద్వారా తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు వీఆర్ఓ హరి అక్కడకు చేరుకుని భూమి చదును పనులను అడ్డుకున్నారు. అయితే వీఆర్ఓపై సదరు టీడీపీ నేత బెదిరింపులకు దిగారు. పనులు ఆపేది లేదని తెగేసి చెప్పటంతో వీఆర్ఓ అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. గతంలో పేదల కోసం.. గత వైఎస్సార్సీపీ హయాంలో ఈ భూమిపై కోర్టులో కేసు వేయగా, ప్రభుత్వ భూమిగా తేల్చింది. అప్పట్లో ఈ భూమిని గ్రామంలోని పేదలకు ఇంటిస్థలాలుగా మంజూరు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రావడంతో విలువైన ఈ భూమిపై స్థానిక టీడీపీ నేత కన్ను పడింది. దీంతో ఆయన దర్జాగా జేసీబీ పెట్టి చదును చేసి ఆక్రమించేందుకు యత్నించారు. మే నెలలోను ఒక సారి ఇలాగే ముళ్ల చెట్లను తొలగించారు. అప్పట్లో రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఇప్పుడుఉ మళ్లీ ముళ్ల చెట్లను తొలగించి ఈ భూమి తమదేనని, కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని బుకాయిస్తున్నారు. తనకు నియోజకవర్గం ముఖ్య ప్రజాప్రతినిధి సైతం భరోసా ఇచ్చారని, ఈ భూమి తమదేనని స్పష్టం చేస్తున్నారు. అధికార బలంతో విలువైన ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకునేందుకు యత్నించిన వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే భూమి అన్యాక్రాంతం కాకుండా కంచె వేయించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమి కబ్జాకు టీడీపీ నేత యత్నం -
కావాలనే ఇబ్బంది పెడుతున్నారు
కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని కావాలనే ఇబ్బందిపెడుతున్నారు. ప్రజలకు సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం స్వర్ణముఖి నదిని కాపాడేందుకే ఆయన యత్నించారు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. అయితే అన్యాయంగా ఆయనపై వివిధ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందనేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం. 70ఏళ్లు పైబడిన వ్యక్తిని 91 రోజులుగా జైలులో నిర్బంధించడం సరికాదు. – చదలవాడ కుమార్, వైఎస్సార్సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ న్యాయ విభాగం అధ్యక్షుడు -
సైనిక్, నవోదయ ప్రవేశాలకు చాన్స్
తిరుపతి అర్బన్: సైనిక్ స్కూల్తోపాటు నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు విశ్వం స్కూల్లో శిక్షణ పొందిన పలువురు విద్యార్థులకు అవకాశం లభించినట్లు విశ్వం విద్యాసంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యాక్షుడు విశ్వనాథ్రెడ్డి వెల్లడించారు. తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం స్కూల్లో ఆయన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులతో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. సైనిక్ స్కూల్కు 59 మంది విద్యార్థులు, నవోదయ విద్యాలయాలకు 63 మంది పిల్లలు ప్రవేశాలు జరగుతున్నాయని వివరించారు. 4 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సైనిక్, నవోదయ విద్యాలయాలకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు అదనపు సమాచారం కోసం 8688888802, 9399976999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జానపద సంబరం నాయుడుపేట టౌన్: పట్టణంలోని అమీర్షావలీ దర్గా ఆవరణలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆదివారం రాత్రి జానపద సంబరాలు అంబరాన్నంటాయి. భాష సాంసృతిక శాఖ వారి సౌజన్యంతో తిరుపతి సేవా సదన్ వారి సారథ్యంలో ప్రజలను చైతన్య పరుస్తూ జానపద కళా నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో స్థానిక జీడీ డ్యాన్స్ ఇన్స్టూట్, తిరుపతి శ్రీ అకాడమి, శ్రీకాళహస్తి నాగరాజ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు పాల్గొన్నారు. -
చెప్పులు.. కుప్పలు
అలిపిరి నడక మార్గం నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు పాదరక్షణ సమస్య తలెత్తుతోంది. భద్ర పరిచే అవకాశం లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ వదిలేయాల్సి వస్తోంది. లగేజీ కౌంటర్లలో ఇతర వస్తువులను మాత్రమే తీసుకుంటూ ఉండడంతో వేసుకువచ్చిన చెప్పులను అలాగే విడిచిపెట్టేయాల్సి పరిస్థితి ఏర్పడింది. నిత్యం వేలాది మంది మెట్ల మార్గం గుండా శ్రీవారి దర్శనానికి వెళుతుంటారు.ఈ క్రమంలో బ్యాగులు, ఇతర సామగ్రితోపాటు పాదరక్షలను సైతం పెట్టుకునేందుకు కనీసం స్టాండ్ అయినా ఏర్పాటు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. తిరుగు ప్రయాణంలో తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. – అన్నమయ్యసర్కిల్ -
కనిపించవా.. కల్కీ!
కొన్నేళ్లుగా దర్శనమివ్వని భగవాన్ వరదయ్యపాళెం : ఆధ్యాత్మికవాదిగా పేరుపొందిన కల్కి అమ్మా భగవాన్ దర్శన భాగ్యం ఇక భక్తులకు దూరమేనా అంటే అది నిజమే అన్నట్టు ఇటీవలి పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. భక్తులకు నేరుగా దర్శనమిచ్చి, ఇతర కార్యక్రమాల్లో భగవాన్ పాల్గొని కొన్నేళ్లు గడిచిపోయాయి.. కొద్దిరోజుల పాటు ఆయన అనారోగ్యమే కారణంగా చెప్పుకొచ్చారు. అయితే తాజా ఘటనలను పరిశీలిస్తే భగవాన్ దర్శనం ఇక భక్తులకు ఉండదనే తెలుస్తోంది. ఇందుకు నిదర్శనంగా భగవాన్ తనయుడు కృష్ణాజీ, కోడలు ప్రీతాజీ ఆధ్యాత్మిక ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నారు. నేరుగా భక్తులకు దర్శనాలు ఇస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలు కృష్ణాజీ కనుసన్నల్లోనే జరుగుతుండడం గమనార్హం. ముక్తి గురువుగా దర్శనం వరదయ్యపాళెం మండలంలోని బత్తలవల్లం వద్ద గల ఏకం ఆలయంలో సంక్రాంతి సందర్భంగా భగవాన్ తనయుడు కృష్ణాజీ ముక్తి గురువుగా దర్శనమిచ్చారు. పదేళ్లుగా భక్తుల ముందుకు రాకుండా ఆన్లైన్ తరగతులు, ఇతర సేవా కార్యక్రమాలను తెర వెనుక నుంచి నడుపుతున్న కృష్ణాజీ, ప్రీతాజీ దంపతులు ఇప్పుడు భక్తుల ముందుకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఆధ్యాత్మిక వారసత్వం ఇక ఈ దంపతులదేనని సమాచారం. ఈ క్రమంలోనే భగవాన్ శిష్యులుగా ఉన్న సీనియర్ దాసాజీలను సైతం పిలిపించుకునే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఆ దిశగా ప్రస్తుతం ఆచార్య ఆనందగిరీజీ, ఆచార్య సమదర్శినిజీ సైతం కృష్ణాజీ వెంట ఉండడం గమనార్హం. చివరగా 74వ జన్మదినోత్సవాన.. భగవాన్ ఆధ్యాత్మిక ప్రస్థానం 1989 నుంచి ప్రారంభం కాగా, వరదయ్యపాళెం ప్రాంతానికి 1997లో వచ్చారు. బత్తలవల్లంలో ఏకం ఆలయం నిర్మించారు. భగవాన్ నివాసం సైతం అక్కడే ఉండేది. చివరగా తన 74వ జన్మదినోత్సవమైన 2023 మార్చి 7న రాత్రి 50వేలకు పైగా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆయన ఏకం ప్రాంగణంలోనే కనిపించలేదు. తమిళనాడు నేమం వద్ద ఉన్న అమ్మా భగవాన్ ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. కలసిరాని ఆలయం బత్తలవల్లంలో భారీ బడ్జెట్తో కనీవినీ ఎగుగని రీతిలో పాలరాతి బండలతో సకల హంగులతో ఏకం ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆధ్యాత్మికత క్షేత్రానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు రావడంతో వరదయ్యపాళానికి సైతం ఆ స్థాయిలో గుర్తింపు లభించింది. అయితే ఈ ఆలయం 2006లో ప్రారంభమైంది. అయితే ప్రారంభం రోజునే అపశృతి జరిగింది. ఒకేరోజు 5లక్షలకు పైగా భక్తుల రావడంతో ఆలయ ప్రారంభం తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే భారీ తొక్కిసలాట జరిగి 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆశ్రమ నిర్వాహకులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆలయాన్ని మూసివేసింది. తర్వాత కొన్నేళ్లకు ఏకం ఆలయంలో దర్శనాలు ప్రారంభమయ్యాయి. 2012 తర్వాత భగవాన్కు అనారోగ్య సమస్యలు రావడం శిష్యుల మధ్య అంతర్గత కలహాలు, అదే సమయంలో ఐటీ దాడులు, ఈడీ కేసులు వంటివి చుట్టుముట్టాయి. దీంతో పూర్తిస్థాయిలో కోలుకోలేక ఆశ్రమం ఉనికిని చాటుకోవడమే కష్టతరంగా మారింది. -
‘స్త్రీలోలుడు, వికృత చేష్టల్లో ఆరితేరినవాడు బీఆర్ నాయుడు’
సాక్షి,తిరుపతి: మహానేత వైఎస్సార్ఆర్పై శివానంద స్వామి తదితరులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం తిరుపతి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు.కొంతమంది స్వాములు టీడీపీ నేతలు కంటే దిగజారారు. కాషాయ స్వాములు పచ్చ జెండా ఎత్తుకుని మహానేత వైఎస్ఆర్పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బూతు సినిమాల నిర్మాత అట్లూరి నారాయణ కొండ మీద బ్లాక్ టికెట్లు అమ్ముతాడు. శ్రీను బాలికను అత్యాచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ఆదేశాలతో ఆధ్యాత్మిక సభ జరిగింది. స్త్రీలోలుడు, వికృత చేష్టల్లో ఆరితేరినవాడు బీఆర్ నాయుడు. అలాంటి బీఆర్ నాయుడికి కొంత మంది స్వాములు తొత్తులుగా మారారు. శ్రీను నీవు కాషాయం వేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతావా?.కొంత మంది స్వాములను టీడీపీ జెండాలు మార్చే కూలీలుగా బీఆర్ నాయుడు మార్చాడు. కొంత మంది సాధువులు కాషా వస్త్రాలు వదిలి పచ్చ చొక్కాలు వేసుకోవాలి. దేవుడిని రాజకీయ వనరుగా వాడుకుంది చంద్రబాబే. వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చిన చంద్రబాబుపై సాధువులు ఎందుకు మాట్లాడరు?.చంద్రబాబు పాలనను రామరాజ్యం అంటున్నారంటే మూటలు బాగానే అంది ఉంటాయి. రెండు కొండలను ఏడు కొండలుగా మార్చి జీవో ఇచ్చింది వైఎస్ఆరే. వేద విశ్వవిద్యాలయం స్థాపించింది వైఎస్ఆర్. పేదలకు పెళ్లిళ్లు చేసిన గొప్ప మనసున్న నాయకుడు వైఎస్ఆర్.ఊరువాడా భజన మండళ్లు నిర్మించిన గొప్ప నాయకుడుకు వైఎస్ఆర్. వెంకటేశ్వర భక్తి ఛానల్ తీసుకొచ్చింది వైఎస్ఆర్. వెంకటేశ్వర భక్తి ఛానల్ వద్దన్నది చంద్రబాబు. గోమాతను పరిరక్షించాలని కంకణం కట్టుకున్న నాయకుడు వైఎస్ జగన్. నవనీత సేవ తీసుకొచ్చింది వైఎస్ జగన్’ అని భూమన గుర్తు చేశారు. -
శతాధిక రక్తతరంగం
విజయవంతంగా గుండె మార్పిడి పద్మావతి చిన్నపిల్లల కార్డియాక్ కేర్ సెంటర్ లో శనివారం గుండె మార్పిడి శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతం చేశారు. చిట్వేలి: ఆయనో శతాధిక రక్త దానం చేసిన గొప్పదాత. ఒకరి ప్రాణాన్ని కాపాడడానికి రక్తమిస్తే ఆ రోగి కుటుంబంలో చిరునవ్వులు పూయిస్తుందని నమ్మాడు. ఈ క్రమంలో 33 ఏళ్లుగా అలుపెరగక రక్తదానం చేస్తున్నాడు. 113సార్లు రక్తదానం చేసిన డాక్టర్ దొండ్లవాగు వేణుగోపాల్ చిట్వేలి వాసి కావడం మండలానికే గర్వకారణమని చెప్పవచ్చు. తన తల్లికి శస్త్రచికిత్స సమయంలో అవసరమైన రక్తం దొరకక తీవ్ర ఇబ్బందులు పడిన వేణుగోపాల్ ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదన్న కృతనిశ్చయంతో రక్తదానం చేయడం మొదలు పెట్టి.. ప్రతి 90 రోజులకోసారి ఇప్పటివరకు 113 సార్లు రక్తదానం చేశారు. రక్తదానం ఒక సామాజిక బాధ్యత అంటారాయన. రక్తదానం చేయడంతో కుల, మత, ప్రాంతీయ రహిత అసమానతలు లేని సమాజాన్ని నిర్మించవచ్చంటారు. సామాజిక శాస్త్రవేత్తగా సమాజంలో రక్తదానం చేయడంపై యువతలో అవగాహన కల్పిస్తూ తిరుపతి జిల్లాలోని చిట్వేలి మండలాన్ని రక్తదాతల జిల్లాగా మార్చడం వెనుక వేణుగోపాల్ సంకల్పం అన్నారు. వందోసారి రక్తదానం చేసిన కార్యక్రమంలో అప్పటి కేంద్ర అసోసియేషన్ జస్టిస్ ఎంపవర్మెంట్ మంత్రి నారాయణస్వామి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. రాష్ట్ర గవర్నర్, ఉమ్మడి వైఎస్సార్ జిల్లా కలెక్టర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ నుంచి పలుసార్లు పురస్కారాలు పొందారు. హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, విశాఖపట్నం, తిరుపతిలోని స్వచ్ఛంద సంస్థలు వేణుగోపాల్ రక్తదాన దీక్షను గుర్తించి, సన్మానించారు. వేణుగోపాల్ కుటుంబంలోని 14 మంది రక్తదాతలు కావడం విశేషం. తన అన్నయ్యలు డాక్టర్ చంద్రశేఖర్, శ్రీనివాసుల స్పూర్తితో, సతీమణి రేవతి తోడ్పాటుతో రక్తదానం చేస్తున్నానన్నారు. అమెరికాలోని ఎన్ఏటీఎస్ సంస్థ–2025లో ప్లోరిడా, టాంపలో నిర్వహించిన వేడుకలకు ఆహ్వానించడం, భారతి విశ్వ విద్యాలయం డాక్టర్ వేణుగోపాల్ 113 సార్లు రక్తదానం చేయడం, రక్తదానస్పూర్తిని పెంచడాన్ని గుర్తించి గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేయడం తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. తన జీవితాతం రక్తదానాన్ని కొనసాగిస్తానని డాక్టర్ వేణుగోపాల్ అన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
తిరుపతి క్రైం: నగరంలోని సంజయ్ గాంధీ కాలనీలో ఓ యువకుడు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ఈతమాకుల వడ్డిపల్లికి చెందిన పి.భానుప్రకాష్ (26) మూడేళ్ల కిందట తిరుపతికి చెందిన వి.నాగవేణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ దంపతులు తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల భానుప్రకాష్ తన తల్లిని కలిసేందుకు వెళ్లే విషయంలో భార్యతో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తిరుపతిలోని తన నివాసంలో భానుప్రకాష్ చీరతో ఉరివేసుకుని మృతి చెందాడు. తన కుమారుడి మ రణంపై అనుమానాలు ఉన్నాయని, విచారణ జరపాలని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వేడుకగా సహస్ర దీపాలంకరణ సేవ
తిరుమల: తిరుమలలో వేంకటేశ్వర స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఆస్థాన వి ద్వాంసురాలు శోభారాజు తన శిష్య బృందంతో కలిసి భక్తి గీతాలాపన చేశారు. గాత్ర సహకారాన్ని అభిరామ్, మానస పటేల్ అందించగా, వాయిద్య సహకారాన్ని కీబోర్డుపై కళ్యాణ్, తబలాపై పాండు అందించారు. అనంతరం ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందించగా, శో భారాజు దంపతులకు, కళాకారులకు స్వామి వారి హారతి, తీర్థప్రసాదాలు అందజేశారు. కాళంగి నదిలో పడి పశువుల కాపరి మృతి బుచ్చినాయుడుకండ్రిగ: కాటూరు సమీపంలో పశువులను మేతకు తీసుకెళ్లి కాళంగి నదిలోని గుంతలో పడి పశువుల కాపరి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కా టూరు దళితవాడకు చెందిన అక్కులయ్య (66) పశువుల కాపరిగా పనిచేస్తూ, జీవనం సాగిస్తు న్నాడు. ఈ నెల 11వ తేదీన అక్కులయ్య కాళంగి నది సమీపంలో పశువులను మేతకు తీసుకె ళ్లాడు. సాయంత్రానికి పశువులు ఇంటికి వచ్చేశా యి. అక్కులయ్య రాకపోవడంతో కుటుంబ స భ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాళంగినదిలో అక్కులయ్య కోసం గాలించినా కనిపించకపోవడంతో వచ్చేశారు. శనివారం ఉదయం అ క్కులయ్య శవం నీటిలో తేలుతూ కనిపించడంతో పోలీసులకు తెలిపారు. మృతదేహన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. గోడౌన్లో అగ్నిప్రమాదం సూళ్లూరుపేట: తడ మండలం పూడి గ్రామం వద్ద చెక్కలు నిల్వ చేసిన గోడౌన్లో శనివారం ఉన్నట్టుండి మంటలు చెలరేగి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో గోడౌన్లోని చెక్కలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న సూళ్లూరుపేట సీఐ ఎం మురళీకృష్ణ, ఎస్ఐ కొండపనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. -
తొండవాడ పంచాయతీలో ప్రభుత్వ భూమి కబ్జా
తిరుపతి రూరల్: చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీలో విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకుడు మోహన్రెడ్డి అలియాస్ బుజ్జిరెడ్డి కబ్జా చేశారని బుచ్చినాయుడుపల్లికి చెందిన మహిళా రైతు రాణెమ్మ శనివారం తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ను కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రగిరి రెవెన్యూ పరిధిలో తన వ్యవసాయ భూమికి ఆనుకుని ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ నేత బుజ్జిరెడ్డి ఆక్రమించి అరుణ కాలనీకి చెందిన తన అనుచరుడు బాలకు అప్పగించారని ఆమె ఆరోపించారు. తన తాతల కాలం నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూమిపై హక్కు కోసం పలుమార్లు రెవెన్యూ అధికారులను ఆశ్రయించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని ఆ మహిళా రైతు ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం రూ.లక్షల ధరలు పలికే ఆ భూమిని కాజేస్తున్నారన్నారు. టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన అనుభవంలోని భూమిని కాజేస్తున్న కబ్జాదారుల నుంచి తన భూమిని రక్షించి న్యాయం చేయాలని ఆర్డీఓను వేడుకున్నారు. మహిళా రైతు కన్నీటి పర్యంతమవుతూ తన గోడును అధికారులకు వివరించగా, ఆమె ఫిర్యాదుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
విద్యుత్ షాక్తో జేఎల్ఎంకు గాయాలు
వెంకటగిరి రూరల్: విద్యుత్ స్తంభాలు, లైన్ల మరమ్మతు చేస్తున్న జేఎల్ఎం విద్యుత్షాక్ గురై స్తంభం పైనుంచి పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన డక్కిలి మండలం లింగసముద్రం ఫీడర్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. లింగసముద్రం సచివాలయంలో పోలి పోతన జేఎల్ఎంగా పనిచేస్తున్నారు. శనివారం మోపూరు రోడ్డు సబ్స్టేషన్ పరిధిలోని లింగసముద్రం ఫీడర్లో విద్యుత్ స్తంభం పైకి ఎక్కి లైన్ మరమ్మతు చేస్తుండగా 11కేవీ విద్యుత్ సరఫరా కావడంతో పోతన షాక్కు గురై కింద పడి, తీవ్రంగా గాయపడ్డాడు. తోటి ఉద్యోగులు, స్థానికులు పోతనను చికిత్స నిమిత్తం వెంకటగిరి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న పోతన -
మంకుపట్టు.. తల బొప్పికట్టు
తిరుపతి సిటీ: టీటీడీ జూనియర్ కళాశాలల అడ్మిషన్ల ప్రక్రియలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు తమకు ఆంగ్లమాద్యమం ఎంపీసీ, బైపీసీ గ్రూపులే కావాలని పట్టుపట్టారు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచక అధికారులు తలలుపట్టుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో ఎస్వీ, పద్మావతి మహిళా జూనియర్ కళాశాలల్లో 1,750 సీట్లకు గాను 426 మంది ప్రవేశాలు పొందారు. ఎస్వీ జూనియర్ కళాశాలలో 792 సీట్లకు గాను 172 మంది ప్రవేశాలు పొందగా, పద్మావతి జూనియర్ కళాశాలలో 968 సీట్లకు గాను 254 మంది అడ్మిషన్లు పొందారు. అడ్మిషన్ల ప్రక్రియకు హాజరైన ప్రతి విద్యార్థీ ఎంపీసీ, బైపీసీ ఇంగ్లిష్ మీడియం గ్రూపుల వైపే మొగ్గు చూపడంతో అధికారులు ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు రాయలసీమలోని ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల సిఫార్సు లెటర్లు, ఫోన్కాల్స్ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు సమాచారం. ఆ గ్రూపుల వైపే విద్యార్థుల మొగ్గు తొలి విడత కౌన్సెలింగ్లో రెండు కళాశాలల్లో అడ్మిషన్లు మందకొడిగా కొనసాగుతుంటం గమనార్హం. రెండు కళాశాలలకు కలిపి 46 వేల వరకు దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో తొలివిడత కౌన్సెలింగ్లోనే 80 శాతం సీట్లు భర్తీ అవుతాయని అధికారులు భావించారు. కానీ కనీసం 24 శాతం సీట్లు భర్తీ కాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్త మవుతోంది. కాగా తొలివిడతలో ఎక్కువ మంది విద్యార్థులు స్లైడింగ్ (గ్రూపు మార్పు) పెట్టుకోవడం కారణంగానే ప్రవేశాల్లో తేడా కనిపిస్తోందని తెలుస్తోంది. అలాగే తొలివిడతలో సీట్లు పొందిన 70 శాతం మంది విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ వైపు మొగ్గు చూపడంతో తొలివిడత ప్రవేశాలు ఆశించిన స్థాయిలో జరగలేదని సమాచారం.రేపు రెండో విడత సీట్ల కేటాయింపు ఎస్వీ, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల్లో భాగంగా రెండో విడత మెరిట్ లిస్టును సోమవారం టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. అదే రోజు సీట్లు పొందిన విద్యార్థుల సెల్ఫోన్ల ద్వారా సమాచారం అందించేందుకు చర్యలు చేపట్టారు. సీట్లు పొందిన విద్యార్థులు 18, 19, 20 తేదీల్లో జరిగే రెండో విడత కౌన్సెలింగ్కు హాజరై ప్రవేశాలు పొందాలని అధికారులు తెలిపారు. స్లైడింగ్ పెట్టుకున్న విద్యార్థులు సైతం సోమవారం విడుదల చేసే రెండో విడత మెరిట్ లిస్టును ఆన్లైన్లో పరిశీలించుకోవచ్చని తెలిపారు. -
వాయులింగేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వారాంతపు సెలవులు, శని త్రయోదశి సందర్భంగా స్వామి అమ్మవార్లను సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన సేవల్లో 986 మంది భక్తులు పాల్గొనగా, వాటి ద్వారా రూ.3,28,248 ఆదాయం లభించింది. శనివారం త్రయోదశి సందర్భంగా అత్యధికంగా 495 మంది శనీశ్వర స్వామి అభిషేక పూజల్లో పాల్గొన్నారు. వివిధ టికెట్ల విక్రయం ద్వారా రూ.54,91,250 ఆదాయం సమకూరింది. శీఘ్ర దర్శనం, ప్రత్యేక, అంతరాలయ దర్శనాలతో రూ.11,23,850 ఆదాయం వచ్చింది. లడ్డూలు, వడలు, పులిహోర తదితర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.4,39,030 ఆదాయం లభించింది. -
రైల్వేస్టేషన్ తనిఖీ
తిరుపతి అన్నమయ్యసర్కిల్: సౌత్ కోస్ట్ రైల్వే (ఎస్సీఓఆర్) జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ శనివారం తిరుపతి రైల్వే స్టేషన్ను తనిఖీ చేశారు. విజయవాడ, గూడూరు, తిరుపతి రైల్వే మార్గంలో విస్తృత తనిఖీలు నిర్వహించిన అనంతరం తిరుపతి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పన్చుజీ పూర్తి చేయాలని సూచించారు. అనంతరం గుంతకల్ రైల్వే డివిజన్ అధికారులు నిర్వహించిన సమగ్ర ప్రజెంటేషన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ బీఎస్కే రాజ్కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్, టెలికాం ఇంజినీర్ ఓబీ సురేష్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ వినీత్ కుమార్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంకుష్ గుప్త, గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్త, తిరుపతి స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
తిరుమల/శ్రీకాళహస్తి: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయాధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. అలాగే జానపద గాయకుడు గోరంట్ల వెంకన్న కూడా శనివారం తిరుమలేశుని దర్శించుకున్నారు. ముక్కంటి సేవలో జస్టిస్ బీఆర్ గవాయ్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కుటుంబ సమేతంగా శనివారం శ్రీకాళహస్తికి చేరుకుని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. -
17న ఎస్డీహెచ్ఆర్లో మెగా జాబ్మేళా
తిరుపతి సిటీ: నగరంలోని న్యూ బా లాజీ కాలనీలో ఉన్న ఎస్డీహెచ్ఆర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 17 వ తేదీ ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఉమ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాకు 2021–26 వరకు ఉత్తీర్ణులైన బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ, బీజెడ్సీ, బీసీసీ ఏ, బీబీఎం, బీసీఏ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. మేళాలో సజిలిటీ, సదర్లాండ్, ఫస్ట్సోర్స్, అలోరికా, అప్తారా, టెలిపెర్ఫార్మెన్స్, ఒమేగా హెల్త్కేర్, ఆ టోసెన్స్, పేస్, ఆల్సెట్, కాల్క్లైట్ టె క్నాలజీస్ తదితర ఎమ్ఎన్సీ సంస్థలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తా యని ఆమె తెలిపారు. మరిన్ని వివరాలకు 7989004486, 9490557045 నంబర్లను సంప్రదించాలని కోరారు. రక్తదానం చేసి, ప్రాణదాతలు కండి తిరుపతి తుడా: ఆరోగ్యవంతులైన యువత ప్రాణపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం స్విమ్స్ ఇమ్యూనో హెమటాలజీ, ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్ (బ్లడ్ సెంటర్) విభాగం సంయుక్త ఆధ్వర్యంలో పద్మావతి ఆడిటోరియంలో ప్ర పంచ రక్తదాతల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయ న ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న 18–60 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి అర్హులన్నారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ శిల్పా కడియాల, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ శరన్ బి సింగ్ , ఆర్ఎంఓ డాక్టర్ సతీ ష్, బ్లడ్ సెంటర్ విభాగాధిపతి డాక్ట ర్ శ్రీధర్ బాబు, సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ పాల్గొన్నారు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
– వైఎస్సార్ సీపీ నేత ఇంట విషాదం రామచంద్రాపురం: మండలంలోని టీవీ సఫార్ల గ్రామానికి చెందిన అనిల్కుమార్(30) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం రాత్రి గుండొడుకనం కొత్త రోడ్డులో రోడ్డు పక్కన పడి ఉన్న అనిల్కుమార్ను అటువైపుగా వెళుతున్న వాహనచోదకులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించగా మృతి చెందినట్లు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. మోటారు సైకిల్లో వెళుతూ ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య శ్రావణి, కుమారుడు కేశవనంద, కుమార్తె వి మోక్షిత ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ ఏవీ బ్రహ్మానందం రెడ్డి శనివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
బంగారు, వెండి ఆభరణాల చోరీ
పాకాల: గుర్తు తెలియిని దుండగులు ఇంటి తలుపులు పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన సంఘటన పచ్చిపాలపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఇ.బిందు తన అమ్మమ్మతో కలసి ఉంటోంది. 12వ తేదీన బిందు అమ్మమ్మ ఇంటిని శుభ్రం చేసి, తాళం వేసి వెళ్లింది. అయితే 13వ తేదీ ఇంటి తలుపులు పగలగొట్టినట్లు గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించి ఆధారాలను సేకరించారు. ఇంట్లో ఉన్న బీరువాలోని రెండు బంగారు తాళిబొట్లు, ఒక నల్లపూసల దండతో కలిపి సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలు, 80 గ్రాముల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తరుణ్ తెలిపారు. -
టీటీడీకి ట్రక్కు బహూకరణ
తిరుమల: ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ లిమిటెడ్ శనివారం టీటీడీకి రూ.31,72,532 విలువైన ట్రక్కును బహూకరించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు చేసి, టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు. టీటీడీ ట్రాన్స్పోర్ట్ ఇన్చార్జి జీఎం లక్ష్మీప్రసన్న, తిరుమల డీఐ కృష్ణయ్య పాల్గొన్నారు. విజయవంతంగా గుండె మార్పిడి తిరుపతి తుడా: టీటీడీ శ్రీపద్మావతి చిన్నపిల్లల కార్డియాక్ కేర్ సెంటర్లో శనివారం గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతపురం జిల్లా గూటి మండలానికి చెందిన 28 ఏళ్ల యువతికి నెల్లూరు జిల్లా దర్గామిట్టకు చెందిన 24 సంవత్సరాల యువకుడి గుండెను వైద్యులు సుమారు 6 గంటల పాటు శ్రమించి అమర్చారు. యువతి కొన్ని నెలలుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఇటీవల ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా గుండె పూర్తిగా క్షీణించిందని, గుండె మార్పిడి అనివార్యమని పద్మావతి ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. నెల్లూరుకు చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రి వైద్యులు నెల్లూరు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి గుండెను సేకరించారు. సాయంత్రం 4.08 గంటలకు నెల్లూరు నుంచి గ్రీన్ చానల్ ద్వారా ప్రారంభమై 5.38 గంటలకు టీటీడీ అంబులెన్స్లో పద్మావతి ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతరం వైద్యుల బృందం సుదీర్ఘంగా గుండె మార్పిడి చికిత్సను నిర్వహించి విజయవంతంగా పూర్తి చేసింది. -
తిరుమలలో జన సైనికుల ఓవరాక్షన్
తిరుమల: తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు జన సైనికులు ఓవరాక్షన్ చేశారు. శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ప్రదర్శన చేసి హంగామా సృష్టించారు. పవన్ కళ్యాణ్ అనే నేను పుస్తకాన్ని శ్రీవారి ఆలయం ముందు ప్రదర్శించారు. ఆలయం ముందు పుస్తకాన్ని వీడియోలు తీశారు జనసేన నేతలు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుమలలో రాజకీయ ప్రచారంపై నిషేధం ఉన్నా ఉల్లంఘనలకు తెరలేపారు జనసేన నేతలు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విదంగా చేసిన జనసేన వైఖరిపై విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రతా సిబ్బంది ఉన్నా ఈ ఘటన ఎలా జరిగిందనే ప్రశ్నలు తలెత్తాయి. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. ఈ ఉల్లంఘన ఎపిసోడ్తో తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యంపై చర్చ నడుస్తోంది. -
సీఎంకు సాదర స్వాగతం, వీడ్కోలు
రేణిగుంట: సీఎంతోపాటు డిప్యూటీ సీఎం, మంత్రులకు రేణిగుంట విమానాశ్రయంలో అధికారులు సాదర స్వాగతం, వీడ్కోలు పలికారు. తిరుపతి జిల్లా ఒక రోజు పర్యటన నిమిత్తం శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వేర్వేరుగా వచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో జిల్లా అధికార యంత్రాంగం సాదరంగా స్వాగతం పలికారు. తిరుపతి కార్యక్రమం అనంతరం తిరిగి ప్రయాణమైన వారికి సాదరంగా వీడ్కోలు పలికారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
రూ.7 లక్షల విలువైన నగలు స్వాధీనం సూళ్లూరుపేట రూరల్: విలాసవంతమై జీవితానికి అలువాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని సూళ్లూరుపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారని డీఎస్పీ చెంబాబు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.7 లక్షల విలువ గల నగలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ కథనం మేరకు.. సూళ్లూరుపేట మండలంలోని మన్నేముత్తేరిలో హోలీగ్రేస్ షాలోమ్ చర్చి వెనుక నివసిస్తున్న పాస్టర్ ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సూళ్లూరుపేట మండలం కొమ్మినేనిపల్లికి చెందిన పాకం మనోజ్కుమార్, నాయుడుపేట కారుమంచి కండ్రిగకు చెందిన తొప్పాని ఈశ్వర్ చోరీ చేసినట్లు గుర్తించారు స్థానిక కోటపోలూరు క్రాస్ రోడ్డు వద్ద అనుమానస్పదంగా సంచరిస్తున్న వారిని సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ అజయ్కుమార్ అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తల సమావేశంలో ఎస్వీయూ వీసీ తిరుపతి సిటీ: బెంగళూరు వేదికగా ఇండో జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ (ఐజీఎస్టీసీ) 21వ పాలకమండలి సమావేశం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ సమావేశానికి ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావు హాజరయ్యారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పాల్గొన్న ఈ సమావేశంలో వీసీ మాట్లాడుతూ భారత్, జర్మనీ మధ్య శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారం అవసరమని తెలిపారు. అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఇరు దేశాలు అన్ని రంగాల్లో బలపడేందుకు ఆవకాశం ఉందన్నారు. ఎస్వీయూ సైతం ఇంటర్నేషనల్ సైంటిఫిక్ నెట్వర్స్తో సత్సంబంధాలు కొనసాగిస్తు అంతర్జాతీయ స్థాయి పరిశోధనల వైపు అడుగులు వేస్తోందని తెలిపారు. -
గుర్తుతెలియని వ్యక్తి హత్య
సూళ్లూరుపేట రూరల్: సూళ్లూరుపేట మండలంలో పనికుదిరి గ్రామం సమీపంలోని పులికాట్ వ్యూ పాయింట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. శుక్రవారం స్థానికులు రోడ్డు పక్కన ప్యూ పాయింట్ వద్ద మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ అజయ్కుమార్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు వయస్సు 50 ఏళ్లు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. మృతి చెందిన వ్యక్తి యాచకుడిగా గుర్తించారు. అంగవైకల్యం ఉందని నడిచే అలువాటు ఉందని ప్రాథమిక విచారణలో తేలింది. రాత్రి వేళ్లలో దుండగులు పథకం ప్రకారం ఆతని తలపై రాయితో బలంగా కొట్టడంతోపాటు, పొట్టపై కత్తితో పొడిచినట్లు గాయాలను పోలీసులు గుర్తించారు. ఈ కేసును నాయుడుపేట ఇన్చార్జి సీఐ సంగమేశ్వరరావు పరివేక్షిస్తున్నారు. క్లూస్ టీం ద్వారా కేసు దర్యాప్తు చేసి, త్వరలోనే హంతకులను పట్టుకుంటామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. నిమ్మ చెట్లు, కంచె దగ్ధం సైదాపురం: మండలంలోని మొలకలపూండ్ల గ్రామంలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు రైతుల కు చెందిన నిమ్మ చెట్లు, పొలం కంచె దగ్ధమైంది. బాధితుల కథనం మేరకు.. సైదాపురం మండలంలోని మొలకలపూండ్ల గ్రామానికి చెందిన కూకటి లక్ష్మీనారాయణకు చెందిన 70 నిమ్మ చెట్లుతోపాటు విద్యుత్ మోటార్లు, వైర్లు దగ్ధమయ్యాయి. అలాగే అడుసుమల్లా వెంకటరమణయ్య, సరుపూరు పుల్లయ్యకు చెందిన పొలం కంచె కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాఽధితులు తెలిపారు. ఎర్రచందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు తిరుపతి లీగల్: అడవిలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి తరలించడానికి ప్రయత్నించిన కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. తిరుపతి ఎర్రచందనం అక్రమ నిరోధక దళం 2018లో శేషాచలం, నాగపట్ల ఈస్ట్ బీట్, ఎస్వీఎన్పీ చామల రేంజ్, కేఎంఎం కళాశాల సమీపంలోని అడవిలో తనిఖీలు చేశారు. తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, పోలూరు తాలూకా, పడిమలై గ్రామానికి చెందిన అప్పస్వామి, కాశి అడవిలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరకడానికి ప్రయత్నిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. త్వరలో ఇళ్ల సమస్యలు పరిష్కరిస్తాం తిరుపతి అర్బన్: టీటీడీ ఉద్యోగుల ఇంటి పట్టాలకు సంబంధించి అన్ని సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతామని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో ఈ అంశంపై సమావేశం నిర్వహించారు. ఇంటిపట్టాల సమస్యలకు పరిష్కారం చూపడానికి ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జేసీ గోవిందరావు, తుడా చైర్మన్ దివాకర్రెడ్డితో కలసి సమీక్షించారు. వడమాలపేట మండలంలోని పాదిరేడు, ఏర్పేడు మండలంలోని పల్లం గ్రామంలో టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి పట్టాల సమస్యలకు పరిష్కారం చూపడంతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. -
ఘనంగా ఎన్జీరంగా వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం
చంద్రగిరి: ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 1964 జూన్ 12వ తేదీన దేశంలో రెండో వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరున హైదరాబాద్లో ఏర్పాటు చేశారన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో అనేక వ్యవసాయ కళాశాలలు, పరిశోధన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు పనిచేస్తూ రాష్ట్ర రైతాంగానికి విశిష్ట సేవలను అందించినట్లు తెలిపారు. రైతుల అభ్యున్నతికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా కళాశాల తరఫున అభ్యుదయ రైతులను సన్మానించారు. జూలై 11న జాతీయ లోక్ అదాలత్ తిరుపతి లీగల్: తిరుపతి కోర్టు ఆవరణలో జూలై 11వ తేదీన తిరుపతి మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎం గురునాథ్ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ, ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థల ఆదేశాల మేరకు ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్లో సివిల్, క్రిమినల్, వివాహ సంబంధ కేసులు, మోటారు వాహన ప్రమాద కేసులు, ఇతర కేసులతోపాటు వ్యాజ్యం వేయని కేసులను పరిష్కరించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. -
తొలివిడత కౌన్సెలింగ్ నేటితో పూర్తి
తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ, పద్మావతి మహిళా జూనియర్ కళాశా లల్లో మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారంతో ముగియనుంది. తొలివిడతలో భా గంగా శుక్రవారం జరిగిన కౌన్సెలింగ్ ప్రక్రియలో ఎస్వీ జూనియర్ కళాశాలలో 40 మంది విద్యార్థులు, పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో 60 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలు పొందినట్లు అధికారులు తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మహిళా వైద్యకళాశాలలో రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలు తిరుపతి తుడా: స్విమ్స్ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఫిజియాలజీ విభాగం ఆధ్వర్యంలో 7వ రాష్ట్రస్థాయి హయగ్రీవ–2026 క్విజ్ పోటీలు ఘనంగా నిర్వహించారు. గురువారం పద్మావతి వైద్య కళాశాల లెక్చర్ గ్యాలరీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు వైద్యకళాశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలు నిర్వహించామన్నారు. వైద్య విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఫిజియాలజీ విభాగం ఏడేళ్లుగా హయగ్రీవ క్విజ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృత్తి పరమైన మెలకువలు తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ అలోక్ సచన్, విభాగాధిపతి డాక్టర్ శరణ్ బి సింగ్, పార్మాకాలజీ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఎస్వీయూలో చిరుత కలకలం తిరుపతి సిటీ: ఎస్వీయూలోని పలు ప్రాంతాల్లో చిరుత సంచరించడం కలకలం రేపింది. వర్సిటీలోని కామర్స్ విభాగం చొప్పుల రత్నం భవనం పరిసరాలు, పురుషుల హాస్టల్స్ ఐ, జీ బ్లాక్ సమీపంలో గురువారం రాత్రి సంచరించడంతో అటు విద్యార్థులు, ఉద్యోగులు భయబ్రాంతులకు గురయ్యారు. వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు చిరుత సంచరించే ప్రాంతానికి చేరుకునేలోపు చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అధికారులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టి చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ గోగర్భం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 75,428 మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.50 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. -
పాఠశాలకు తాళం
కేవీబీపురం: పాఠశాల పునః ప్రారంభం రోజే కేవీబీపురం మండలంలోని గురుకుల కండ్రిక పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి లేకుండా, విద్యా కమిటీ అనుమతి లేకుండా గతంలో విలీన ప్రక్రియ ఏర్పాటు చేసి, 3,4,5, తరగతులను ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న అంజూరు పాఠశాలలో విలీనం చేయడంతో అప్పటినుంచి ఆ గ్రామస్తులు పోరాటం సాగించారు. చివరకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు గురుకుల కండ్రిగలోని పాఠశాల కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం పాఠశాల పునః ప్రారంభం కావడంతో 3 నుంచి 5 తరగతి విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి ఉపాధ్యాయుడిని బయట కూర్చోబెట్టేశారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ఎట్టి పరిస్థితిలో పాఠశాలను తెరిచేది లేదని తేల్చారు. -
ఇది మంత్రి కొల్లు రవీంద్ర కారు ఎలా అడ్డుకుంటారు?
సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతిలో శుక్రవారం జరిగిన కూటమిపాలన విజయోత్సవ సభా ప్రాంగణం వద్ద రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కారు ప్రవేశం కల్పించడంలో చోటుచేసుకున్న జాప్యం వాగ్వాదానికి దారి తీసింది. దీంతో రెచ్చిపోయిన కారు డ్రైవర్ ఇది మంత్రి కొల్లు రవీంద్రకు చెందిన కారు ఎలా అడ్డుకుంటారు.. మూడు రోజులుగా ఇక్కడే తిరుగుతున్నా ఆ మాత్రం గుర్తు లేదా? అని నిలదీశారు. పైపెచ్చు డ్రైవర్ ప్రవర్తించిన తీరు విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు ఆగ్రహం తెప్పించింది. అసంతృప్తికి గురి చేసింది. మరో వైపు మంత్రికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది కూడా తమదైన శైలిలో వాదనకు దిగారు. పోలీసులు సర్దుబాటు ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగి, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. -
పసికందు మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన
వెంకటగిరి రూరల్: రెండు నెలల పసికందు మృతి చెందడంతో తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ ఘటన వెంకటగిరిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు.. వెంకటగిరి మండలంలోన చింతగుంట గ్రామానికి చెందిన లంకా సాయి, రత్నమ్మ దంపతులకు రెండు నెలల శిశువు ఉన్నాడు. ఆ శిశువు అనారోగ్యానికి గురికావడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలను సంప్రదించగా వైద్యులు ఇంజక్షన్ వేసిన గంటల వ్యవధిలో ఆ చిన్నారి మృతి చెందాడు. దీంతో వైద్యం వికటిచడంతో తమ బిడ్డ మృతి చెందాడని బంధువులు ఆందోళన చేశారు. దీంతో చిన్నారి మృతదేహంతో స్థానిక పోలీసు స్టేషన్కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయబోయారు. మృతి చెందిన చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించాలని పోలీసులు తెలపడంతో రెండునెలల పసికందును పోస్టుమార్టం చేయడం ఇష్టం లేక తల్లిదండ్రులు వెనుతిరిగారు. -
9వ బెటాలియన్లో ఐజీపీ
వెంకటగిరి రూరల్ : మండలంలోని వల్లివేడు సమీపంలో ఉన్న 9వ బెటాలియన్ను ఏపీఎస్పీ బెటాలియన్ల ఐజీపీ బి రాజకుమారి శుక్రవారం సందర్శించారు. బెటాలియన్లో పేరేడ్ గ్రౌండ్లో నూతనంగా నిర్మించిన పోర్టు వాల్ను ప్రారంభించారు. అనంతరం యూనిట్ అధికారులతో ప్రజా దర్భార్ నిర్వహించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. బెటాలియన్లోని యూనిట్ వైద్యశాల, బ్యారక్స్, హాస్టల్ పరిశీలించారు. అనంతరం బెటాలియన్లో ఆవరణలో మొక్కలు నాటారు. అంతకుముందు బెటాలియన్కు విచ్చేసిన ఐజీపీ బిరాజకుమారిని కమాండెంట్ ఈఎస్ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి, గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ ఈఎస్ సాయి ప్రసాద్, బెటాలియన్ అధికారులు పాల్గొన్నారు. -
తడ‘బడి’
బుడి బుడి అడుగులుసర్కారు స్కూళ్లలో వసతుల లేమి.. పంపిణీకి నోచని విద్యార్థి కిట్లు.. అందని పాఠ్యపుస్తకాలు.. తల్లుల ఖాతాల్లో జమకానీ తల్లికివందనం వెరసి.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి చెందారు. దీంతో పిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఫలితంగా తొలిరోజు 50 హాజరు నమోదైంది. తిరుపతి అర్బన్: కొత్త యూనిఫామ్, బ్యాగ్, షూ, సాక్స్, బెల్ట్ను ప్రభుత్వం అందించకపోవడంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు తొలిరోజు అసంతృప్తి చెందారు. శుక్రవారం హజరుశాతం కేవలం 50 శాతం మాత్రమే నమోదైంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విద్య, వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. సంపద సృష్టించడం తమకు మాత్రమే తెలుసంటూ ప్రతి సమావేశంలో ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న సీఎం చంద్రబాబు అభివృద్ధికి చెందిన ఏ పని చేయాలన్నా ఆర్థిక ఇబ్బందులున్నాయంటూ కాలయాపన చేస్తున్నారు. మరోవైపు ఆయన కుమారుడు లోకేష్బాబుకి విద్యాశాఖామంత్రి పదవి కట్టబెట్టారు. అయితే పాఠశాలల ప్రారంభోత్సవం రోజే బ్యాగ్, షూ, బెల్ట్తో కూడిన కిట్ ఇస్తామని చెప్పారు. అలాగే నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తల్లికివందం సైతం తొలిరోజే జమ చేస్తామని వెల్లడించారు. అయితే ఆ ఊసేలేదు. దీంతో తొలి రోజు విద్యార్థులు పాత బ్యాగ్లతోనే అసంతృప్తిగా బడికి వచ్చారు. 50 శాతం మంది తొలి రోజు పాఠశాలకు దూరంగా ఉండిపోయారు. మరోవైపు యూనిఫామ్ ఇవ్వకపోవడంతో తీవ్రమైన అంసతృప్తి వెలిబుచ్చారు. పాఠశాల తొలి రోజున పిల్లలకు చక్కెర పొంగళి పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే తొలి రోజు పెట్టకుండా వచ్చే సోమవారం అందిస్తామని వాయిదా వేశారు. ఈ ఏడాదైనా రవాణా చార్జీలు ఇచ్చేనా? గత ఏడాది ఏపీ మోడల్ స్కూళ్లలో ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతుల పిల్లలను విలీనం చేశారు. ఈ క్రమంలో తమ పాఠశాలను తమ ఊర్లోనే ఉంచాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు. రోజూ ఆటోలకు రవాణా చార్జీలు చెల్లించుకోలేక పలువురు పాఠశాలకు సక్రమంగా హాజరుకాని పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం రవాణా చార్జీలను దూరం ఆధారంగా రూ.2500 నుంచి రూ.3 వేలు ఏడాదికి విద్యార్థి తల్లి లేదా తండ్రి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. అయితే గత ఏడాది 10 శాతం మందికి కూడా రవాణా చార్జీను చెల్లించలేదు. దీంతో ఈ ఏడాదైనా చెల్లిస్తారా? లేదా అనే అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.చిరిగిన షూలతో విద్యార్థులు బడిఈడు పిల్లలు బడిలో ఉండేనా? అసంతృప్తిగా బడికి... బడిఈడు పిల్లలు బడిలో ఉండాలంటూ వేసవి సెలవుల్లో 36 రోజుల పాటు బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ప్రతి ఏటా మోడల్ స్కూళ్ల పేరుతో సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న 3,4,5 తరగతుల పిల్లలను మోడల్ స్కూల్లో విలీనం చేయడంతో బడిఈడు పిల్లలు బడికి దూరంగా ఉండిపోతున్నారని చర్చసాగుతోంది. విలీనం ద్వారా డ్రాపౌట్స్ సంఖ్యను ప్రభుత్వం పెంచేస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. -
తాగండి.. సభకు తరలిపోండి!
సాక్షి టాస్క్ఫోర్స్/శ్రీకాళహస్తి: పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఓ తెలుగు దేశం పార్టీ నాయకుడికి చెందిన మద్యం దుకాణం వద్ద కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభకు వెళ్లేందుకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. సభకు తరలించే ముందు వచ్చిన వారికి మద్యం పంపిణీ చేసి, అనంతరం బస్సుల్లో ఎక్కించి సభకు పంపించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అలాగే ఏపీ సీడ్స్ గోడౌన్ సమీపంలోని మరో మద్యం దుకాణం వద్ద కూడా నాలుగు బస్సులను సిద్ధం చేసి, అక్కడికి వచ్చిన వారికి మద్యం, బిర్యానీతో పాటు ఖర్చుల కోసం నగదు అందజేసి సభకు తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం, బిర్యానీ, నగదు పంపిణీ ద్వారా సభకు జనాలను సమీకరించారని స్థానికంగా విమర్శలు వ్యక్తం అయ్యాయి. -
కరుణించిన వరుణుడు.. పులకించిన ప్రజలు
తిరుపతి తుడా: నెల రోజులుగా వరుణుడు ఊరిస్తూ వచ్చాడు.. ఇదిగో అదిగో అంటూ కారు మబ్బు లతో దోబూచులాడాడు.. అప్పుడప్పుడు నాలుగు చినుకులు పడడం.. రెడ్డింపు స్థాయిలో ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేయడం పరిపాటిగా ఉండేది.. అయితే ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు.. ఉపశమనం తీసుకొచ్చాడు.. దీంతో ప్రజలు సేదతీరుతూ పులకించారు. శుక్రవారం మధ్యా హ్నం తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. మోస్తారు నుంచి అక్కడక్కడ కుండపోత వర్షం నమోదైంది. సుమారు రెండు గంటలకు పైగా వర్షం పడడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. గడిచిన మూడు నెలలుగా ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో తల్లడిల్లి పోయారు. వేడి గాలులు అధిక ఉక్కపోతతో ఊపిరి పీల్చుకోలేని వాతావరణంలో గడపాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నారు. ఈ ఏడాది అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదు కావడం గమనార్హం. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత ఈసారి ప్రజల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి. కుండపోత వర్షంతో వారావరణంలో కొంత మార్పులు చోటు చేసుకోవడంతో తిరుపతి నగరం చల్లబడింది. వర్షపు నీరు ఏరులై ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. వర్షంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. కూలిన చెట్టు.. ఆగిన ట్రాఫిక్.. తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లి వద్ద నడిరోడ్డుపై ఓ చెట్టు నేల కూలింది. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షం, పెనుగాలులకు చెట్టు విరిగి పడడంతో తిరుపతి నుంచి చంద్రగిరి వెళ్లే మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తుల ద్వారా ఆ చెట్టును తొలగించారు. ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా రాకపోకలు యథావిధిగా సాగేలా చర్యలు తీసుకున్నారు. -
కూలిన ఫ్లెక్సీలు..
చంద్రగిరి: తిరుపతిలో నిర్వహించిన కూటమి విజయోత్సవ సభ ప్రాంగణంలో శుక్రవారం కురిసిన వర్షానికి ఫ్లెక్సీలు కూలిపోయాయి. అయితే ఎవరికీ ఏమీ జరగలేదు. విజయోత్సవ సభ నిర్వహిస్తుండగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి భారీ వర్షం కురవడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడ్డారు. తమ వాహనాల వద్దకు చేరుకోవడానికి తంటాలు పడ్డారు. భారీ ఈదురు గాలులు వీయడంతో సభా ప్రాంగణ సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నేలకూలాయి. ఆ సమయంలో ప్రజలు రోడ్డుపై లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సభలో భోజన కష్టాలు ఎన్టీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి కావడంతో శుక్రవారం దామినేడు సమీపంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టు వద్ద ప్రజలు నరకయాతన పడ్డారు. భోజనం చేసేందుకు వెళ్లిన మహిళలను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. అప్పటికే భోజనం సరిపడనంత లేకపోవడంతో మహిళలు మండిపడ్డారు. చేసేదేమి లేక అక్కడ నుంచి అన్నమో రామచంద్రా అంటూ నిరాశతో వెనుదిరిగారు. సీఎం సభకు రావాల్సిందే అని ఆర్పీలు హుకుం జారీ చేశారు.. బలవంతంగా సభకు రప్పించారు.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు కనీసం భోజనం కూడా పెట్టలేరా? అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హాకీ సీనియర్ పురుషుల జట్టు ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా సీనియర్ పురుషుల జట్టు ఎంపికను గురువారం నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు హాజరైన క్రీడాకాలకు పోటీలు నిర్వహించి, జట్టును ఎంపిక చేశారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహిస్తున్న 16వ ఏపీ హాకీ సీనియర్ పురుషుల రాష్ట్ర స్థాయి పోటీల్లో తిరుపతి జిల్లా జట్టు పాల్గొననుంది. జిల్లా జట్టుకు ఎంపికై న హాకీ క్రీడాకారులను హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంజన్రాజ్, ఆదిత్య, కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్కృష్ణ అభినందించారు. -
మహిళలకు మరో షాకిచ్చిన చంద్రబాబు.. ఆడబిడ్డ నిధికి మంగళం!
సాక్షి, విజయవాడ: చంద్రబాబు హామీ అంటేనే మోసమని మరోసారి రుజువైంది. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన "ఆడబిడ్డ నిధి" పథకంపై చంద్రబాబు చేతులెత్తేశారు. ఎన్నికల ప్రచారంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపుతూ బుకాయిస్తున్నారు. దీంతో, మహిళల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ప్రకటించిన "సూపర్-6" హామీల్లో ఆడబిడ్డ నిధిపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రకటించారు. జూన్ 2024 నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుందని కూడా హామీ ఇచ్చారు. అయితే తాజాగా తిరుపతిలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించినంత అనుకూలంగా లేదని, భారీ సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఉందని బుకాయించారు. దీంతో ఆడబిడ్డ నిధి అమలుపై అనుమానాలు మరింత పెరిగాయి.కాగా, రాష్ట్రంలో సుమారు రెండు కోట్ల మంది మహిళలకు ఈ పథకం వర్తించనుంది. గత రెండేళ్లుగా అమలు కాలేకపోవడంతో ఒక్కో మహిళకు రూ.36 వేల మేర ప్రయోజనం దక్కకుండా పోయింది. ఇక, ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్లి ఆడబిడ్డ నిధి హామీతో టీడీపీ నాయకులు బాండ్లు పంపిణీ చేశారు. ఇప్పుడు ఆ హామీ అమలుపై మాత్రం చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ బాండ్లను నమ్మి ఎదురుచూసిన మహిళలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పుడు ఆ బాండ్లు ఏం చేయాలో మహిళలకు పాలుపోవడం లేదని అంటున్నారు. ఇక, కూటమి అధికారంలోకి వచ్చాక.. మాజీ సీఎం వైఎస్ జగన్ మహిళలకు ఇచ్చిన అన్నీ పథకాలను చంద్రబాబు రద్దు చేసిన సంగతి తెలిసిందే. కానీ, కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మాత్రం చంద్రబాబు అమలు చేయడం లేదు. దీంతో, కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి ఇవ్వాల్సిందేనని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. -
వామ్మో.. ఇదేమి ఘోరం!
తిరుపతి తుడా: తిరుపతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పెద్ద ఎత్తున కుళ్లిన మాంసం చూసి జనం వామ్మో... ఇదేమి ఘోరం.. అంటూ నివ్వెరపోయారు. నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం నగరంలోని పలు దుకాణాల్లో సోదాలు చేశారు. ఫ్రిజ్లు, వెలుపల పెద్ద ఎత్తున నిల్వ చేసిన మాంసాన్ని గుర్తించారు. పలుచోట్ల కుళ్లిపోయి, పాచిపట్టి, పురుగులు ఉండడంతో అధికారులు ఖంగుతిన్నారు. పీర్ల చావిడి స్లాటర్ హౌస్పై మెరుపు దాడి నగరంలో కుళ్లిన మాంసం నిల్వ చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు కృష్ణాపురం పోలీస్స్టేషన్ సమీపంలోని పీర్ల చావడి స్లాటర్ హౌస్పై దాడులు నిర్వహించారు. ఐదారు షాపుల్లో పొట్టేలు, మేకల తలకాయలు, కాళ్లు, ఇతర అవయవాలు నిల్వలను గుర్తించారు. ఇవన్నీ రోజుల తరబడి అపరిశుభ్రమైన ప్రదేశంలో డంప్ చేయడంతోపాటు ప్రీజర్లలో నిల్వ ఉంచడాన్ని గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. కుళ్లిపోయి, పురుగులు పట్టి దుర్వాసన వస్తున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి తిరుపతిలోని కొందరు మాంసం విక్రయించే వ్యాపారులకు చెన్నై, హైదరాబాద్తో లింకులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మెట్రో నగరాల్లో నిల్వ ఉంచిన, గడువు ముగిసిన మాంసాన్ని రసాయనాలు చల్లి తిరుపతి మార్కెట్కు దిగుమతి చేసుకుంటున్నట్లు నిర్ధారణకు వచ్చారు. లేబుళ్లు, తయారీ తేదీలు లేకుండా కుళ్లిపోయి, రంగు మారిన స్థితిలో ఉన్న తలలు, కాళ్లను పలు హోటళ్లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తేల్చారు.నిల్వ ఉంచిన మాంసం విక్రయిస్తే చర్యలు: హెల్త్ ఆఫీసర్ కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసం, ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధించడంతోపాటు వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్లు రద్దు చేస్తామని తిరుపతి నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ చెప్పారు. పలు షాపుల్లో తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేయగా, అర టన్ను మేర నిల్వ ఉంచిన పొట్టేళ్లు, మేకల తలకాయలు, కాళ్లు, ఇతర భాగాల మాంసం గుర్తించి సీజ్ చేశామని తెలిపారు. ఫ్రీజర్లో కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న మాంసాన్ని ఇనుప చువ్వలతో లాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పరిసరాలు కూడా అపరిశుభ్రతతో దారుణంగా ఉందని వివరించారు. కాగా, అధికారులు చెప్పిన దానికన్నా మరింత ఎక్కువగానే కుళ్లిన మాంసం ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. -
చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధం: భూమన
సాక్షి, తిరుపతి: రెండేళ్ల కూటమి పాలనపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని, విధ్వంస పాలన ఎవరిదో ఆధారాలతో సహా రుజువు చేస్తానని తిరుపతి సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు దీటుగా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి బదులిచ్చారు. తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి సభకు అపనమ్మకపు సభ, సంక్షోభ సభ అనే పేర్లు పెట్టుకుంటే బాగుండేదని, ఈ సభ ద్వారా మరోసారి చంద్రబాబు ప్రజలకు మాయా బజార్ సినిమా చూపించాడని ఆరోపించారు.ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా విజన్ 2047 పేరుతో ప్రజలను మరోసారి భ్రమల ప్రిజన్లో బంధించాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి పాదాల చెంత మరోసారి ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారని, "రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి సంక్షేమం" పేరుతో కూటమి నిర్వహించిన సభను నరకుడి వారసులైన చంద్రబాబు, పవన్ కళ్యాన్ల చెక్క భజన సభ అని ఎద్దేవా చేశారు. రెండేళ్ల పాలనలో చేసిందేమీ లేక కేవలం జగన్ ని తిట్టడానికి రూ.20 కోట్లు ఖర్చు చేశారని భూమన ధ్వజమెత్తారు.చంద్రబాబు అరాచక రాక్షస పాలనకు, వెన్నుపోటు, అంతులేని అవినీతికి రెండేళ్లు పూర్తయ్యానని ఆయన స్పష్టం చేశారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, చెప్పుకున్న చంద్రబాబు.. తన తప్పు లేకుంటే సీఐడీతో కేసులు ఎందుకు కొట్టేయించుకున్నాడని ప్రశ్నించారు. శ్రీవాణి టికెట్ల అమ్మకాలు, పరకామణి వ్యవహారం, డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకి సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...అందుకే జగన్పై అక్కసు వెళ్లగక్కారుచంద్రబాబు పరిపాలనా దక్షుడు కాదు.. వెన్నుపోటు వీరుడు. మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, ఈనే తేడా లేకుండా తప్పించుకోలేని విధంగా తన రెండేళ్ల పాలనలో అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచాడు. "రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి సంక్షేమం" పేరుతో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ సభలో కూటమి నాయకులు వైయస్ జగన్ గారిని తిట్టడానికే పరిమితమయ్యారు తప్ప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు గురించి మాత్రం స్పష్టంగా సమాధానం చెప్పడం లేదు.మరోసారి పచ్చి అబద్ధాలు..ఆఖరుకి తిరుమల శ్రీవారి పాదాల చెంత మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టే జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తన వైఫల్యాలకు జగనే కారణమని ఊదరగొడుతున్నాడు. "రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి సంక్షేమం" పేరుతో నిర్వహించిన ఈ సభకి అపనమ్మకపు సభ, అబద్ధపు సభ, సంక్షోభ సభ, అనాగకరిక సభ అనే పేర్లు పెట్టుకుంటే బాగుండేది. 10 వేల మంది కూడా పట్టని ఆ ప్రాంతంలో 50 వేల మందితో సభ నిర్వహిస్తున్నట్టు ప్రచారం చేసుకుని పదుల కోట్ల రూపాయల ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు చేశారు.మరోసారి మాయా బజార్ సినిమాని చూపించారువైఎస్ జగన్ పట్ల ఉన్న అక్కసు తీర్చుకోవడానికే ఈ సభను నిర్వహించారు. చంద్రబాబు అరాచక రాక్షస పాలనకు, వెన్నుపోటుకి, అన్యాయానికి, అంతులేని అవినీతి, దోపిడీ దౌర్జన్యాలకు మాత్రమే రెండేళ్లు పూర్తయ్యాయి. రెండేళ్ల పాలనలో ఆద్యంతం జగన్ పట్ల ద్వేషమే చూపించారు. ఈ సభ ద్వారా మరోసారి మాయా బజార్ సినిమాని చూపించారు. ఎర్ర బుక్కు పేరుతో చేసిన వెర్రి చేష్టలు తప్ప చేసిందేమీ లేదు. నరకుడి వారసులైన చంద్రబాబు, పవన్ కళ్యాన్లు.. చరకుడి వారసులమని చెప్పుకున్న చెక్క భజన సభ ఇది. వైఎస్ జగన్ గురించి అవాకులు చవాకులు పేలుతున్న చంద్రబాబు కొడుకు పేరు లోకేష్ కాదు.. పాపేష్, ఎర్ర బుక్కు ఎల్లేష్. తాను పప్పు అనే సంగతి లోకేష్ మరిచిపోయినా రెండు దశాబ్దాలుగా చూస్తున్న గూగుల్ మరిచిపోదు. రాబోయే రోజుల్లో తన తల్లిదండ్రులనే మర్చిపోతాడేమో.ఓటేసిన ప్రజలను నట్టేట ముంచేశారుతెలుగుదేశం అంటేనే వెన్నుపోటు పార్టీ. హంతకుల పార్టీ అని ఆనాడు గద్దర్ అన్నదే నిజమైంది. రెండేళ్ల పాలనలో చేసిందేమీ లేకపోయినా అన్ని చేసేశామని సిగ్గులేకుండా చెప్పుకున్నాడు. ఇద్దర్ని పిలిపించి భజన చేయించుకున్నాడు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీల గురించి రాష్ట్రమంతా గగ్గోలు పెడుతోంది. 23 లక్షల పెట్టుబడులు, ఉద్యోగాలు అన్ని ఉత్తమాటలే. రెండేళ్లలో చేసిన రూ.3.60 లక్షల కోట్ల అప్పులే నిజం. వైఎస్ జగన్ డీబీటీ ద్వారానే నేరుగా రూ.2.73 లక్షల కోట్లు లబ్ధిదారుల అకౌంట్లో జమ చేశాడు. కానీ చంద్రబాబు జగన్ ఇచ్చిన హామీలతో పాటు సూపర్ సిక్స్ అమలు చేస్తానని నమ్మించి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచేశాడు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశాడు. విద్యా వ్యవస్థ నాశనం చేశాడు. మహిళలకు ఉచిత బస్సు, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను కూడా 20 శాతం కూడా అమలు చేయలేదు. అయినా 2047 పేరుతో ప్రజలను భ్రమల ప్రిజన్లో ఉంచుతున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎవరికీ అర్థం కాలేదు. ఏదో మీటింగ్ కోసం రాసుకున్న ప్రసంగాన్ని ఇక్కడ చదివినట్టుంది. పవన్ కళ్యాన్ తన స్వార్థం చూసుకుంటున్నాడని గ్రహించిన కాపు సామాజిక వర్గం ఆయనకు దూరంగా జరిగింది. వారిప్పుడు ఆయన మాటలను నమ్మడం లేదు.సీబీఐ విచారణ కోరే దమ్ముందా?చంద్రబాబు నియమించిన సిట్ నివేదికే తిరుమల లడ్డూ విషయంలో మా తప్పేమీ లేదని తేల్చింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ చంద్రబాబుకి మొట్టికాయలు వేసింది. అయినా ఇంకా లడ్డూని అపవిత్రం చేశామని మాపై నిందలు వేస్తున్నాడు. మూడు రోజుల క్రితం తప్పతాగి కొంతమంది రౌడీలు గూండాల మాదరిగా తన్నుకున్నారు. స్త్రీ లోలుడైన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా నియమించిన చంద్రబాబే ఆలయ ప్రతిష్టను దిగజార్చేస్తున్నాడు.గతంలో ప్రతి సభలో కనిపించిన బీఆర్ నాయుడు ఇప్పుడెందుకు చంద్రబాబు పక్కన కనిపించడం లేదు? కొండ మీద మందు బాటిళ్లు కూడా కూటమి పాలనలో దొరికాయి. రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చడమే కాకుండా గంజాయి, ఎర్రచందనం స్మగ్మర్లను తిరుపతిలో పెంచి పోషిస్తున్నది చంద్రబాబే. తిరుపతిలో అరాచకం రాజ్యమేలుతోంది.కేసులను ఎదుర్కోకుండా ఎందుకు కొట్టేయించుకున్నారు? డీఎస్సీ 2025కింద టీచర్ ఉద్యోగాల భర్తీ పేరుతో ఒక్కో ఉద్యోగం రూ. 15 నుంచి రూ. 20 లక్షలకు అమ్మేసుకున్నాడు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా వైయస్ జగన్ గారు వెలికితీస్తే ప్రభుత్వం నుంచి ఇంతవరకు సరైన సమాధానం లేదు. శాప్ చైర్మన్ స్పోర్ట్స్ కోటా సీట్లను అమ్మేసుకుంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదు? నోటీసు ఇవ్వకుండానే నన్ను అరెస్టు చేశారని చెప్పుకున్న చంద్రబాబు.. ఆ కేసులను ఎత్తివేయించడానికి సీఐడీని ప్రలోభ పెట్టకుండా ఉండాల్సింది. అవి తప్పుడు కేసులైతే న్యాయస్థానాల్లో ఎందుకు పోరాడలేదు? డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు కోరే దమ్ముందా? పరాకామణి విషయంలో, కొండ మీద జరిగే అక్రమాలపై, శ్రీవాణి టికెట్ల గోల్మాల్పై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? చంద్రబాబు కోరినట్టు బహిరంగ చర్చకు నేను సిద్దమే. ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడి వస్తా.కూటమి దుష్ట పాలనపై పోరాటం ఆపే ప్రసక్తే లేదుచంద్రబాబు దుర్మార్గ, దుష్ట, పాపపు పాలన అంతం చేయడానికి వైయస్సార్సీపీ నిర్వహించిన నిరసనలకు మహిళలు సహా ప్రజలు పోటెత్తారు. పోలీసుల ఆంక్షలను కూడా పట్టించుకోకుండా ప్రజలు కదం తొక్కారు. చంద్రబాబు మోసపు మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించారు. కనీసం 5 వేల మందికిపైగా వైయస్సార్సీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చిన్నపోస్టు పెడితే చాలు పోలీస్ స్టేషన్లు తిప్పిస్తున్నారు. ఇలాంటి వారు వైయస్సార్సీపీ విధ్వంస పాలన అని మాట్లాడటం హేయం. ఎన్ని అణచివేతలకైనా వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదు. వెన్నుపోటు పాలనకు చరమ గీతం పాడే వరకు పోరాటం ఆపేది లేదని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. -
ప్యాకేజీ స్టార్ కాదు.. ఇప్పుడు క్యాబేజీ స్టార్!
సాక్షి, తిరుపతి: సూపర్ సిక్స్ హామీలన్నీ గాలికి కొట్టుకుపోయానని.. వెన్నుపోటు వీరుడు చంద్రబాబు మహిళలను సైతం మోసం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి రోజా అన్నారు. నగిరి నియోజకవర్గంలో ఆమె ఆధ్వర్యంలో గురువారం వైఎస్సార్సీపీ "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ చేపట్టిన ఆమె.. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని రోజా అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పైనా ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఒకప్పుడు ప్యాకేజీ స్టార్గా ఉన్న పవన్.. ఇప్పుడు క్యాబేజీ స్టార్గా మారిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన వ్యక్తి.. తన బాధ్యతలను విస్మరించారన్నారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని గతంలో ప్రకటించిన పవన్.. ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదని రోజా గుర్తుచేశారు. ఇక.. మహిళల సంక్షేమం విషయంలోనూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రోజా విమర్శించారు. మహిళలకు అండగా ఉంటామని చెప్పిన చంద్రబాబు సర్కార్.. చివరకు వారికే వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు.అలాగే వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాలనతో పోల్చుకుంటే.. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం 10 శాతం పనితీరును కూడా సాధించలేకపోయిందని అన్నారామె. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అమలు చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం సాధారణ పరిస్థితుల్లోనూ హామీలను నెరవేర్చలేకపోతోందని రోజా మండిపడ్డారు. ఈ నిరసన సందర్భంగా అందరికీ చంద్రబాబు పంగనామాలు పెట్టారంటూ సింబాలిక్గా నిరసనలు నిర్వహించారామె. -
తిరుపతిలో పొలిటికల్ హీట్
సాక్షి, తిరుపతి: నియోజకవర్గంలో ఇవాళ రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘‘వెన్నుపోటుకు రెండేళ్లు" అంటూ వైఎస్సార్సీపీ భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది. అదే సమయంలో.. ఎన్డీయే విజయోత్సవ సభను నిర్వహిస్తుండడం.. దానికి కూటమి పెద్దలు హాజరు అవుతుండడం చర్చకు దారి తీసింది.తిరుపతిలో పొలిటికల్ హీట్ నెలకొంది. అధికార ఎన్డీయే కూటమి నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ హాజరవుతున్నారు. అదే సమయంలో ఇటు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్రెడ్డి, ఆయన తనయుడు భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ ఏర్పాట్లు చేసింది.చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాల షెడ్యూల్ను వైఎస్సార్సీపీ ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ప్రెస్మీట్లో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని పార్టీ కేడర్కు, ప్రజలకు పిలుపు కూడా ఇచ్చారు. అయితే..వైఎస్సార్సీపీ కార్యక్రమాలు జరగనున్న రోజునే తిరుపతి సమీపంలోని దామినీడులో ఎన్డీయే విజయోత్సవ సభ ఏర్పాటు కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు పక్షాలు ఒకేసారి భారీ కార్యక్రమాలకు సిద్ధమవుతుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వెయ్యి మందికి పైగా పోలీసులను మోహరించినట్లు సమాచారం. కీలక కూడళ్లు, సభా ప్రాంగణాలు, ర్యాలీ మార్గాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.


