శివ.. శివా! | devotee die at Srikalahasti temple | Sakshi
Sakshi News home page

శివ.. శివా!

Feb 16 2026 4:58 AM | Updated on Feb 16 2026 5:15 AM

devotee die at Srikalahasti temple

శ్రీకాళహస్తి క్యూలైన్‌లో సొమ్మసిల్లి పడిపోయిన భక్తురాలు, కోటప్పకొండ మెట్లమార్గంలో స్పృహ తప్పిన బాలిక నందినిని తీసుకెళుతున్న పోలీసులు, వైద్యసిబ్బంది

శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి వెళ్లిన భక్తురాలి మృతి

కోటప్పకొండలో పదేళ్ల బాలికకు ఊపిరాడక అస్వస్థత

శ్రీశైలం పాతాళగంగ రోడ్డులో ఇరుక్కుపోయిన భక్తులు

కిందపడిపోయిన మల్లన్న లడ్డూ ప్రసాదం

శ్రీకాకుళం జిల్లా రావివలసలో తోపులాట.. పలువురికి గాయాలు

శైవక్షేత్రాల్లో భక్తుల భద్రతను గాలికొదిలేసిన బాబు సర్కారు

శ్రీకాళహస్తి క్షేత్రంలో అడ్డగోలు దర్శనాలు

శ్రీకాళహస్తి/శ్రీశైలం టెంపుల్‌/నరసరావుపేట/టెక్కలి రూరల్‌/మహానంది: ముక్కంటి దర్శనం కోసం శైవక్షేత్రాలకు వెళ్లిన భక్తులకు బాబు సర్కారు ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో చూపించింది. భక్తుల భద్రతను గాలికొదిలేసి.. టీడీపీ నేతలు, వీఐపీల సేవలో ప్రభుత్వ యంత్రాంగం తరించడంతో రాష్ట్రంలో అనేకచోట్ల మహాశివరాత్రి రోజున అపశృతులు చోటుచేసుకున్నాయి. శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనానికి వెళ్లిన భక్తురాలు మృతి చెందింది. కోటప్పకొండలో పదేళ్ల బాలికకు ఊపిరాడకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. శ్రీశైలం పాతాళ గంగ రోడ్డులో భక్తులు ఇరుక్కుపోవడంతో తోపులాట జరిగింది. ఇదే క్షేత్రంలో మల్లన్న లడ్డూ ప్రసాదం నేలపాలవడం భక్తులను కలచివేసింది. శ్రీకాకుళం జిల్లా రావివలసలో తోపులాట జరగ్గా.. పలువురికి గాయాలయ్యాయి. అనేకచోట్ల సామాన్య భక్తులు క్యూలైన్లలో అల్లాడిపోయారు.  

అస్వస్థతకు గురై.. భక్తురాలి దుర్మరణం 
శ్రీకాళహస్తీశ్వరాలయంలో మొదటి గేటు వద్ద సర్వదర్శనం క్యూలైన్‌లో గంటల తరబడి నిరీక్షించడంతో తోపులాట జరిగి భక్తులు కిందపడిపోయారు. అదే క్యూలైన్‌లో తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఓగిలి గొల్లపల్లి చెందిన మణెమ్మ (45) తన కుమార్తెతో కలసి ముక్కంటి దర్శనానికి మొదటి గేటులోకి వెళ్లింది. కుమార్తె తప్పిపోవడంతో ఊపిరాడక క్యూలైన్‌లో నుంచి బయటకు వచ్చేసింది.

ఆ తరువాత ఆందోళనకు గురైన ఆమెకు అకస్మాత్తుగా మూర్ఛ రావటంతో నోటినుంచి నురగలు కక్కుతూ అక్కడే కిందపడిపోయింది. అపస్మాకర స్థితికి చేరుకున్న ఆమెకు వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేసినా.. కళ్లు తెరవకపోవటంతో 108వాహనంలో హుటాహుటిన శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మణెమ్మ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.   

నేతల అడ్డగోలుతనమే ఘటనకు కారణం 
శ్రీకాళహస్తి క్షేత్రంలో టీడీపీ కూటమి నేతలు తమ అనుయాయులను అడ్డగోలుగా వీవీఐపీ మార్గంలో తీసుకెళ్లి అడ్డొచి్చన పోలీసులపైనే తిరగబడ్డారు. ప్రోటోకాల్‌ విధుల్లో నిమగ్నమైన పోలీసు అధికారులపై టీడీపీ నాయకుడొకరు వీరంగం సృష్టించారు. ‘మేం కష్టపడి పనిచేసి గెలిపించిన ప్రభుత్వమిది. మమ్మల్నే ఆపేస్తారా?’ అంటూ ఆ నాయకుడు పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయాడు. స్థానిక పోలీసు అధికారి జోక్యం చేసుకుని ఆ నాయకుడికి ప్రోటోకాల్‌ మార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.

ఇదిలావుండగా నాలుగో గేటు ద్వారా లోపలికి వచ్చే వీఐపీ లైన్‌లో ఉన్న పలువురు ప్రోటోకాల్‌ లైన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయతి్నంచడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. పలువురు నాయకులు ప్రోటోకాల్‌ లైన్‌లోకి రావడానికి పదేపదే ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భక్తుల రద్దీ అధికంగా ఉన్న వేళ రాజకీయ నేతల ఒత్తిళ్లు పెరగడంతో పరిస్థితిని అదుపులోకి తేవడం పోలీసులకు కష్టమైంది.  

‘డౌన్‌.. డౌన్‌’ అంటూ నినదించిన భక్తులు 
శ్రీకాళహస్తి క్షేత్రంలో వీవీఐపీ, ప్రొటోకాల్‌ దర్శనాల లైన్‌లో టీడీపీ నాయకులు తమ అనుయాయులను ఎలాంటి పాస్‌లు లేకుండా నేరుగా తీసుకెళ్లి దర్శనం చేయించారు. సామాన్య భక్తులకు కేటాయించిన సర్వదర్శనం క్యూలైన్లు గంటల తరబడి ముందుకు కదలకుండా ఎక్కడి  భక్తులు అక్కడే నిలబడిపోవాల్సి వచి్చంది. ఓ దశలో సహనం కోల్పోయిన భక్తులు ‘ఆలయ చైర్మన్‌ డౌన్‌.. డౌన్‌’, ‘ఈవో డౌన్‌.. డౌన్‌..’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.  

క్యూలైన్‌లో ఊపిరాడక బాలికకు అస్వస్థత 
కోటప్పకొండ మెట్ల మార్గంలో భక్తుల రద్దీ పెరగడంతో ఊపిరాడక కృష్ణా జిల్లా గూడవల్లికి చెందిన పదేళ్ల పాప నందిని అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ బాలిక మెట్ల మార్గానికి మధ్యలో ఉండిపోవడంతో కొండపైకి గాని, కొండ దిగువకు గాని తీసుకురాలేని పరిస్థితి ఎదురైంది. బాలికను చికిత్స నిమిత్తం 108 వాహనం వద్దకు తీసుకువెళ్లేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.  

పాతాళగంగ రోడ్డులో ఇరుక్కుపోయిన భక్తులు 
శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పాతాళగంగ రోడ్డులో గంటల తరబడి ఇరుక్కుపోయారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ప్రమాదకరమైనప్పటికీ రోప్‌వే దారిలోనే భక్తులు నడుచుకుంటూ వెళ్లాల్సివచి్చంది. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన మహిళా భక్తులకు సరిపడినన్ని దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు ఎదుర్కొన్నారు. ఆలయంలో సిద్ధం చేసిన మల్లన్న లడ్డూ ప్రసాదాలను కౌంటర్లకు తరలించే క్రమంలో ట్రేలు కిందపడి లడ్డూ ప్రసాదం నేలపాలైంది. ఈ ఘటనను భక్తులు మహా అపచారంగా భావిస్తున్నారు. మరోవైపు పాగాలంకరణ దర్శనం సామాన్య భక్తులకు అందని ద్రాక్షగానే మిగిలింది. కేవలం వీఐపీలకే ప్రాధాన్యత ఇవ్వగా.. భక్తులను ప్రతిచోటా పోలీసులు అడ్డుకున్నారు. భక్తులు ఒక దశలో ‘ఈఓ డౌన్‌ డౌన్‌’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.  

ఎండల మల్లికార్జునస్వామి క్షేత్రంలో.. 
శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ రావివలస ఎండల మల్లికార్జునస్వామి ఆలయం సమీపంలో మెట్లపై ఆదివారం తోపులాట జరిగింది. నిర్మాణంలో ఉన్న అయ్యప్పస్వామి ఆలయం వద్ద స్థానికులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో తోపులాట జరిగి బారికేడ్లకు ఉన్న రేకులు భక్తుల కాళ్లకు తగిలి పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నందిగాం మండలం మర్లపాడుకు చెందిన డి.శ్రీనివాసరావు, సంతబొమ్మాళి మండలం రెయ్యిపేట గ్రామానికి చెందిన ఆర్‌.అనసూయమ్మ, ఆమె భర్త సింహాచలం తదితరులు ఉన్నారు. వీరిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.  

మహానందిలో దర్శనం కరువు 
నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రంలో కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి దర్శనంకోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచి్చంది. మరోవైపు ఇదే క్షేత్రంలోని రామాలయం, ఆంజనేయస్వామి ఆలయాల దర్శనాలను ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఏకపక్షంగా నిలిపివేశారు. ఇదేమని అడిగిన భక్తులపై ‘నాకు నచి్చందే చేస్తా. అంతా నా ఇష్టం. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ విరుచుకుపడ్డారు.  

ప్రభ ఎదుట ప్రమాదకర విన్యాసాలు
శృతి మించిన పచ్చమూకల ఆగడాలు 
ఆందోళన చెందిన భక్తులు
నరసరావుపేట టౌన్‌: కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ప్రభ వద్ద ఏర్పాటు చేసిన ప్రమాదకర విన్యాసాలు భక్తుల్లో ఆందోళన కలిగించాయి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాకాని గ్రామంలో ప్రభను ఏర్పాటు చేశారు. ఆదివారం కోటప్పకొండకు తరలించుకు వెళ్లారు. ఈ సందర్భంగా విద్యుత్‌ ప్రభ వద్ద నిర్వహించిన విన్యాసాలు శృతి మించాయి. ప్రభను కనకతప్పెట్లు, డీజే ఏర్పాట్ల నడుమ ఊరేగింపుగా తీసుకువెళ్లారు.

మార్గమధ్యంలో అక్కడక్కడా జేసీబీ యంత్రాన్ని నడిరోడ్డుపై వేగంగా తిప్పుతూ విన్యాసాలు చేశారు. డీజే పాటల శబ్దానికి దీటుగా జేసీబీని రోడ్డుకు మధ్యలో తిప్పుతూ రోడ్డును ధ్వంసం చేశారు. దీంతో అటుగా వెళ్లే భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల రోడ్డు పాక్షికంగా దెబ్బతింది. జేసీబీ పొరపాటున అదుపుతప్పి ఉంటే భారీ ప్రాణనష్టం సంభవించి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తిరునాళ్ల వేళ ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు కట్టడి చేయాలని భక్తులు కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement