Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

14 questions President Murmu asked Supreme Court on timelines for clearing bills1
ఎవరు సుప్రీం?

ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతిగానీ, గవర్నర్‌గానీ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలి. ఒకవేళ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపాలను కుంటే అందుకు తగు కారణాలనూ పేర్కొనాలి. గవర్నర్ల ఆలస్యపూరిత చర్య న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుంది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా న్యాయసమీక్ష అధికారం మాకు ఉంది.సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ప్రశ్నబిల్లులకు ఆమోదముద్ర విషయంలో ఏకంగా గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించడమేంటి? గవర్నర్లు, రాష్ట్రపతి ఫలానా కాలపరిమితిలోపే నిర్ణయం వెలువర్చాలని రాజ్యాంగంలో ఎలాంటి కాలావధి ప్రస్తావన లేకపోయినా బిల్లుల విషయంలో మీరెలా కాలపరిమితిని విధిస్తారు? ఆర్టీకల్‌ 200, 201ను ఈ తరహాలోనే వినియోగించాలని గవర్నర్లు, రాష్ట్రపతికి మీరెలా దిశానిర్దేశం చేయగలరు?న్యూఢిల్లీ: రాష్ట్రాల శాసనసభలు పంపిన బిల్లులు గవర్నర్లు, రాష్ట్ర పతి వద్ద ఆమోదముద్ర కోసం నెలల తరబడి వేచిచూస్తున్న వైనంపై తీవ్ర అసహనం వ్యక్తంచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వెలువర్చిన సంచలనాత్మక తీర్పు, ఆ తీర్పులో గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించిన వైనంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసాధారణ రీతిలో స్పందించారు. బిల్లులకు ఆమోదముద్ర విషయంలో ఏకంగా గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితి విధించడమేంటని సుప్రీంకోర్టుపై రాష్ట్రపతి తాజాగా ప్రశ్నల వర్షం కురిపించారు.సర్వోన్నత న్యాయస్థానం వెలువర్చిన అత్యంత కీలకమైన తీర్పుపై ఇలా రాష్ట్రపతి తీవ్ర, విస్తృతస్థాయిలో స్పందించడం, నేరుగా సుప్రీంకోర్టునే స్పందన కోరడం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు వెలువర్చిన తీర్పులపై సందేహాలు వెలిబుచ్చుతూ ప్రశ్నలు సంధించడం కూడా ఇదే తొలిసారి అని న్యాయరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. రాష్ట్ర అసెంబ్లీలు పంపిన బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం కోసం గవర్నర్‌ రిజర్వ్‌లో ఉంచిన నేపథ్యంలో అలాంటి బిల్లులపై మూడు నెలల్లోగా రాష్ట్రపతి తన నిర్ణయాన్ని తెలపాల్సిందేనని ఏప్రిల్‌ 8వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువర్చడం తెల్సిందే.దీంతో బిల్లులపై రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కాలపరిమితిని విధించవచ్చా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగంలోని 143(1) అధికరణం ద్వారా తనకు దఖలు పడిన అసాధారణ అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి తాజాగా సుప్రీంకోర్టుకు పలు ప్రశ్నలు వేశారు. రాష్ట్రపతి మొత్తంగా 14 సూటి ప్రశ్నలు వేశారు. గత నెలలో ఇచ్చిన తీర్పులో ఏముంది? తమిళనాడు శాసనసభ ఆమోదించిన కొన్ని బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్‌ రవి ఆమోదించకుండా తన వద్దే చాలా కాలంగా పెండింగ్‌లో ఉంచడంతో డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతిగానీ గవర్నర్‌గానీ గరిష్టంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలంటూ జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌ మహాదేవన్‌ల ధర్మాసనం తేల్చి చెప్పింది. ఒకవేళ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపాలనుకుంటే అందుకు తగు కారణాలనూ పేర్కొనాలని సూచించింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై ఎటూ తేల్చకపోతే తమను మళ్లీ ఆశ్రయించవచ్చని కోర్టు స్పష్టంచేసింది. గవర్నర్ల ఆలస్యపూరిత చర్య న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా ఈ న్యాయసమీక్ష అధికారం తమకు ఉందని కోర్టు వెల్లడించింది. ఆ 14 ప్రశ్నలు క్లుప్తంగా.. ⇒ ఆర్టీకల్‌ 200 ప్రకారం తన వద్దకు వచ్చిన బిల్లులపై గవర్నర్‌ రాజ్యాంగబద్ధంగా ఏఏ రకాలైన నిర్ణయాలు తీసుకోవచ్చు? ⇒ బిల్లులపై అన్ని రకాల ఆప్షన్లను ఉపయోగించుకుంటూ నిర్ణయాలు తీసుకునే క్రమంలో రాష్ట్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలు, సూచనలకు గవర్నర్‌ ఏమేరకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది? ⇒ స్వీయ విచక్షణాధికారంతో గవర్నర్‌ తీసుకునే నిర్ణయాలను రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 ప్రకారం ఎంత మేరకు న్యాయసమ్మతమైనవిగా భావిస్తారు? ⇒ ఆర్టీకల్‌ 200 కింద గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు ఆర్టికల్‌ 361 కింద న్యాయసమీక్ష జరుపుతుందా?. రాజ్యాంగబద్ధంగా తీసుకున్న నిర్ణయాలను ఏ విధంగా సవాల్‌ చేయగలదు? ⇒ గవర్నర్‌ ఇంతకాలంలోపే నిర్ణయం వెలువర్చాలని రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేకపోయినా మీరెలా గవర్నర్‌ను ఫలానా కాలపరిమితిలోపే నిర్ణయం చెప్పాలని ఆదేశించగలరు?. ఆర్టికల్‌ 200ను ఈ తరహాలోనే వినియోగించాలని మీరెలా దిశానిర్దేశం చేయగలరు? ⇒ ఆర్టికల్‌ 201 ప్రకారం తనకు దఖలుపడిన విచక్షణాధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి వెలువర్చిన నిర్ణయాలు ఏ విధంగా న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయి? ⇒ రాష్ట్రపతి ఫలానా కాలపరిమితిలోపే నిర్ణయం వెలువర్చా లని రాజ్యాంగంలో ఎలాంటి కాలావధి ప్రస్తావన లేకపోయినా బిల్లుల విషయంలో మీరెలా రాష్ట్రపతికి కాలపరిమితిని విధిస్తారు? ఆర్టికల్‌ 201ను ఈ తరహాలోనే వినియోగించాలని రాష్ట్రపతికి ఏ అధికారంతో ఆదేశాలు ఇచ్చారు? ⇒ రాష్ట్రపతి సమ్మతి కోసం ఏదైనా బిల్లును గవర్నర్‌ పెండింగ్‌లో పెడితే ఈ బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి సుప్రీంకోర్టును సూచనలు, సలహాల కోసం సంప్రదించాలా?. ఒకవేళ సంప్రదించినా కోర్టు ఇచ్చే ఆ సలహాలు, సూచనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందా? ⇒ బిల్లులకు సంబంధించి గవర్నర్‌గానీ, రాష్ట్రపతిగానీ తీసుకున్న నిర్ణయాలు చట్టంగా మారేలోపే ఆ నిర్ణయాలను కోర్టు న్యాయసమీక్ష జరపవచ్చా?. చట్టంగా మారబోతున్న బిల్లు ల్లోని అంశాలపై కోర్టు మధ్యలోనే తీర్పులు ఇవ్వవచ్చా? ⇒ ఆర్టికల్‌ 142 ద్వారా తమకు దఖలుపడిన అసాధారణ అధి కారాలను ఉపయోగిస్తూ సుప్రీంకోర్టు అప్పటికే గవర్నర్లు/ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలు/ఉత్తర్వులు అమలుకాకుండా ప్రత్యామ్నాయ ఉత్తర్వులు/తీర్పులు వెలువర్చవచ్చా? ⇒ రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందినా సరే గవర్నర్‌ ఆమోదించని/ఆమోదం పొందని బిల్లును చట్టంగా అమలుచేయొచ్చా? ⇒ ఏదైనా చట్టం రాజ్యాంగానికి లోబడే ఉందా? లేదా? అని తేల్చి కనీసం ఐదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్‌ చేయాలనే నిబంధనను సుప్రీం కచ్చితంగా అమలుచేయాల్సిన అవసరం లేదుకదా? ⇒ ఆర్టీకల్‌ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు దఖలుపడిన అధికారాలు కేవలం చట్టాలు ఏ విధంగా అమలవుతున్నాయి? వంటి విధానపర నిర్ణయాలకే పరిమితమా? లేదంటే పరిపాలన, చట్టాల కూర్పు వంటి న్యాయస్థానాలేతర అంశాలకూ విస్తరించాయా? ⇒ సుప్రీంకోర్టుకు ఆర్టికల్‌ 131 కింద కాకుండా మరే ఇతర అధికరణం కింద రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే అధికారం ఉందా?

Metro Train In Hyderabad Charges Increased2
Hyderabad: ప్రయాణికులకు మెట్రో షాక్‌..!

హైదరాబాద్‌: ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో షాకిచ్చింది. మెట్రో ట్రైన్‌ టికెట్ల ధరలను పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం తీసుకుంది. కనిష్ట ధర రూ. 10 నుంచి రూ. 12కు పెంచగా, గరిష్ట ధర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. తాజాగా పెంచిన ధరలు మే 17 నుంచి అమల్లోకి రానున్నట్లు ఎల్‌ అండ్‌ టీ స్సష్టం చేసింది. హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి..ప్రస్తుతం కనిష్ట ధర ₹10.. గరిష్ట ధర 60 రూపాయలురెండు కిలోమీటర్ల వరకు 12 రూపాయలునాలుగు కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు6 కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు 40 రూపాయలు9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు24 కిలోమీటర్ల నుంచి ఆపై కిలోమీటర్లకు 75 రూపాయలు పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం

Shafali varma comeback in T20s3
టి20ల్లో షఫాలీ పునరాగమనం

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ పర్యటనలో 5 టి20లు, 3 వన్డేల్లో పాల్గొనే భారత మహిళల జట్టును గురువారం సెలక్టర్లు ప్రకటించారు. టి20ల కోసం 15 మందిని, వన్డేలకు 16 మందిని ఎంపిక చేయగా... రెండు టీమ్‌లకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. భారత్‌ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు మన జట్టు ఆడనున్న ఆఖరి వన్డే సిరీస్‌ ఇదే కానుంది. దూకుడైన ఆటతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ ఓపెనర్‌ షఫాలీ వర్మ భారత జట్టులో పునరాగమనం చేసింది. గత ఏడాది అక్టోబరు తర్వాత ఆమె స్థానం కోల్పోయింది. ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫు 9 మ్యాచ్‌లలో 304 పరుగులు చేసి షఫాలీ సత్తా చాటింది. అయితే షఫాలీని టి20లకు మాత్రమే ఎంపిక చేసిన సెలక్టర్లు వన్డే జట్టులో స్థానం కల్పించలేదు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ యస్తిక భాటియా కూడా తిరిగి జట్టులోకి వచ్చింది. గత ఏడాది నవంబరులో మణికట్టు గాయంతో ఆమె ఆటకు దూరమైంది. యస్తికకు వన్డే, టి20 రెండు టీమ్‌లలో చోటు లభించింది. ఇటీవల శ్రీలంకతో ముక్కోణపు టోర్నీలో ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలిచిన స్నేహ్‌ రాణా కూడా టి20ల్లో మళ్లీ చోటు దక్కించుకుంది. ఇదే టోర్నీలో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ నల్లపురెడ్డి శ్రీచరణి తొలిసారి టి20 టీమ్‌లోకి ఎంపికైంది. హైదరాబాద్‌ పేసర్‌ అరుంధతి రెడ్డి కూడా టి20 జట్టులోకి పునరాగమనం చేసింది. భారత టి20 జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్తిక భాటియా, హర్లీన్‌ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్‌జోత్‌ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్‌ఘరే. భారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), ప్రతీక రావల్, హర్లీన్‌ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్తిక భాటియా, తేజల్, దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్‌జోత్‌ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్‌ఘరే.భారత్, ఇంగ్లండ్‌ సిరీస్‌ షెడ్యూల్‌ తొలి టి20: జూన్‌ 28 నాటింగ్‌హామ్‌ రెండో టి20: జూలై 1 బ్రిస్టల్‌ మూడో టి20: జూలై 4 ఓవల్‌ నాలుగో టి20: జూలై 9 మాంచెస్టర్‌ ఐదో టి20: జూలై 12 బర్మింగ్‌హామ్‌ తొలి వన్డే: జూలై 16 సౌతాంప్టన్‌ రెండో వన్డే: జూలై 19 లార్డ్స్‌ మూడో వన్డే: జూలై 22 చెస్టర్‌ లీ స్ట్రీట్‌

Rasi Phalalu: Daily Horoscope On 16-05-2025 In Telugu4
ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు

గ్రహం అనుగ్రహం: విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువువైశాఖ మాసం, తిథి: బ.చవితి రా.2.31 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: మూల ప.2.02 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ప.12.19 నుండి 2.02 వరకు, తదుపరి రా.12.06 నుండి 1.46 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.56 వరకు, తదుపరి ప.12.21నుండి 1.12 వరకు, అమృత ఘడియలు: ఉ.7.10 నుండి 8.44 వరకు.సూర్యోదయం : 5.32సూర్యాస్తమయం : 6.20రాహుకాలం : ఉ.10.30నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకుమేషం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు ఒత్తిళ్లు. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు చికాకులు.వృషభం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కార్యక్రమాలలో అవాంతరాలు. ఆదాయం అంతగా ఉండదు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. రాజకీయవేత్తలకు పర్యటనలు వాయిదా.మిథునం: ముఖ్య కార్యాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారులకు ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగులు అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తల యత్నాలు ఫలిస్తాయి.కర్కాటకం: చిరకాల కోరిక నెరవేరుతుంది. ఆశయాలు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు సత్కారాలు.సింహం: కొన్ని కార్యాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అరోగ్యసమస్యలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవేత్తలకు చికాకులు.కన్య: కష్టమే మిగులుతుంది. అనుకున్న కార్యాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవేత్తలకు పర్యటనలు వాయిదా.తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగుల సేవలకు గుర్తింపు రాగలదు. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం.వృశ్చికం: అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు బదిలీ సూచనలు. కళాకారులకు గందరగోళంగా ఉంటుంది.ధనుస్సు: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. కార్యజయం. ఆప్తుల నుంచి అందని సమాచారం సంతోషం కలిగిస్తుంది. వాహనసౌఖ్యం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది. కళాకారులకు ప్రోత్సాహం.మకరం: రాబడికి మించిన ఖర్చులు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపారులకు లాభాలు కనిపించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం.కుంభం: రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులు మరింత లాభపడతారు. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. కళాకారులకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.మీనం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకర సంఘటనలు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు వీడతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి. రాజకీయవేత్తలు కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు.

Uganda pride and reigning Miss Uganda Natasha Nyonyozi special story5
మన శక్తిని నమ్ముకుందాం నటాషా న్యో న్యో జీ.. మిస్‌ యుగాండా!

కుతూహలం, జిజ్ఞాస, ప్రతిభ, సామాజిక బాధ్యత, లాస్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌ అందం.. అన్నిటికీ పర్యాయ పదం! నటాషా పరిచయం ఆమె మాటల్లోనే...నేను పుట్టి,పెరిగింది యుగాండాలో! అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ గ్రాడ్యుయేషన్‌ కోసం యూకే వెళ్లి, చదువు పూర్తవగానే తిరిగి నా దేశానికి వచ్చేశాను. వృత్తిరీత్యా అకౌంటెంట్‌ని, ఆంట్రప్రెన్యూర్‌ని కూడా. కంపాలాలో నాకో బ్యూటీ స్టోర్‌ ఉంది. స్కిన్‌ కేర్, మేకప్, యాక్సెసరీస్‌ లాంటివంటే నాకు చాలా ఆసక్తి. అదే నన్ను ఈ పాజెంట్‌ వైపు లాక్కొచ్చిందని చెప్పొచ్చు. మా దగ్గర కూడా అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య వివక్ష చాలా! కానీ అదృష్టవశాత్తు మా ఇంట్లో లేదు. మమ్మల్నందరినీ సమానంగా పెంచారు.బ్యూటీ విత్‌ పర్పస్‌మా తమ్ముడికి ఆటిజం. యుగాండాలో స్పెషల్‌ నీడ్స్‌ పిల్లలకు కావలసిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లేదు. వాళ్లనెలా పెంచాలో కూడా తెలియదు. తమ్ముడి కోసం అమ్మ ట్రైన్‌ అయింది. అమ్మ నడిపే స్కూల్లోనే స్పెషల్‌ నీడ్‌ చిల్డ్రన్‌ కోసం కూడా ఓ సెక్షన్‌ పెట్టింది. పిల్లల పేరెంట్స్‌కి అవేర్‌నెస్‌ కల్పిస్తోంది. అందులో నేనూ పాలు పంచుకుంటున్నాను. స్పెషల్‌ నీడ్‌ పిల్లల కోసం హెల్త్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ డెవలప్‌ అయ్యేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నా బ్యూటీ విత్‌ పర్పస్‌ అదే! అలాగే టాలెంట్‌ రౌండ్‌లో నేను పియానో ప్లే చేయబోతున్నాను. స్పోర్ట్స్‌ రౌండ్‌లో స్విమ్మింగ్‌. స్విమింగ్‌ ఈజ్‌ మై ఫేవరిట్‌ స్పోర్ట్‌.మర్యాద, మాట తీరు..రిచ్‌ కల్చర్, ట్రెడిషన్‌ వంటి విషయాల్లో మా దేశానికి, ఇండియాకు చాలా పోలిక ఉంది. ఇక్కడి రైస్, స్పైసీ ఫుడ్‌ నాకు చాలా నచ్చాయి. కొత్త వాతావరణంలో.. కొత్త మనుషుల మధ్య ఉన్నామన్న ఫీలింగే లేదు. అందరికీ అందరం ఎప్పటి నుంచో పరిచయం అన్నట్టుగానే ఉంది. కొత్త కొత్త భాషల్లో రోజూ కనీసం ఒక వర్డ్‌ అయినా నేర్చుకుంటున్నాను. అలాగే మా భాషనూ నా తోటి కంటెస్టెంట్స్‌కి నేర్పేందుకు ట్రై చేస్తున్నాను. ఐకమత్యం అసాధ్యాలను సుసాధ్యం చేయగలదని అర్థమైంది. వేగంగా వెళ్లాలంటే ఒంటరిగా ప్రయాణించాలి. కానీ సుదీర్ఘ దూరాలకు వెళ్లాలంటే మాత్రం కచ్చితంగా గుంపుగా ప్రయాణించాలి’’ అంటూ చెపాపు నటాషా. అందుకే కనెక్ట్‌ అయ్యాను.. నాకు ఇక్కడి చీరలు చాలా నచ్చాయి. కొనుక్కెళ్లాలనుకుంటున్నాను. బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రాకు బిగ్‌ ఫ్యాన్‌ని. ఆమె నటించిన బర్ఫీ సినిమా చాలాసార్లు చూశాను. అందులో ఆమె ఆటిజం అమ్మాయిగా అద్భుతంగా నటించింది. మా తమ్ముడికీ ఆటిజం కదా! అందుకే కనెక్ట్‌ అయ్యాను. విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ విషయానికి వస్తే.. ప్రతి అమ్మాయి తన శక్తిని నమ్ముకోవాలి. ఎవరైనా వెనక్కి లాగితే రెట్టింపు ఉత్సాహంతో అడుగులు వేయాలి. మన సంకల్పం గట్టిగా ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరు! – నటాషా న్యో న్యో జీ – యుగాండా– సరస్వతి రమ

Challenges Facing the ATM Industry in 20256
ఏటీఎంలకు డిజిటల్‌ గ్రహణం! 

దేశంలో డిజిటల్‌ లావాదేవీల విప్లవం ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషీన్‌ (ఏటీఎం)లకు గండి కొడుతోంది. ఒకపక్క బ్యాంకింగ్‌ వ్యవస్థలో నగదు చెలామణీ అంతకంతకూ ఎగబాకుతూ ఆల్‌టైమ్‌ గరిష్టాల్లో కొనసాగుతోంది. మరోపక్క ఏటీఎంలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. బ్యాంకులు కొత్తగా తెరుస్తున్న ఏటీఎంల కంటే మూసేస్తున్నవే ఎక్కువ కావడం విశేషం! కొత్తిమీర కట్ట నుంచి బైకులో పెట్రోలు దాకా దేనికైనా డిజిటల్‌ చెల్లింపులే నడుస్తున్నాయిప్పుడు! మన దైనందిన ఆరి్థక లావాదేవీల్లో యూపీఐ పేమెంట్స్‌ అంతలా పెనవేసుకుపోయాయి మరి. దీంతో ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాలు కూడా తగ్గుతున్నాయి. ఇదిలా ఉంటే, ఒకప్పుడు మెయిన్‌ రోడ్లపైనే కాకుండా సందుల్లో కూడా ఎడాపెడా ఏటీఎంలను తెరిచిన బ్యాంకులు.. ఇప్పుడు చడీచప్పుడు లేకుండా వాటికి తాళాలేస్తున్నాయి. ఆర్‌బీఐ నిబంధనల మేరకు ఏటీఎం ఉచిత లావాదేవీలపై పరిమితులు విధించడం, ఏటీఎం ఇంటర్‌–ఆపరబిలిటీ, వేరే బ్యాంకుల కస్టమర్లు ఏటీఎంలను ఉపయోగించుకునేటప్పుడు విధించే ఇంటర్‌చేంజ్‌ ఫీజు పెరుగుదల పెద్దగా లేకపోవడంతో బ్యాంకులు ఏటీఎంల నిర్వహణ బిజినెస్‌ పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొత్త ఏటీఎంల ఏర్పాటుకు ముఖం చాటేస్తున్నాయి. బ్యాంకింగ్‌ రంగంలో దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్‌ నాటికి 2,19,882 ఏటీఎంలు ఉండగా, 2024 డిసెంబర్‌ నాటికి వీటి సంఖ్య 2,14,398కి తగ్గిపోయింది. అంటే దాదాపు ఏడాది వ్యవధిలో 5,484 ఏటీఎంలను ఎత్తేశాయన్నమాట! ముఖ్యంగా ఆఫ్‌సైట్‌ (బ్యాంకు బ్రాంచ్‌లలో కాకుండా ఇతర లొకేషన్లలో ఉన్నవి) ఏటీఎంల విషయంలో ఈ కోత భారీగా ఉంది. 2022 సెపె్టంబర్లో గరిష్టంగా 97,072 ఆఫ్‌సైట్‌ ఏటీఎంలు ఉండగా.. 2024 డిసెంబర్‌ నాటికి ఇవి 85,913కి తగ్గిపోవడం గమనార్హం. డిజిటల్‌ రయ్‌... బ్యాంకింగ్‌ వ్యవస్థలో నగదు చెలామణీ ప్రస్తుతం ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలో రూ.34.7 లక్షల కోట్లకు పైగానే ఉంది. పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్‌) నుంచి చూస్తే రెట్టింపైంది. మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 12 శాతం కింద లెక్క. ఇంతలా నగదు వ్యవస్థలో ఉన్నప్పటికీ, ఏటీఎంల సంఖ్య పెరక్కపోగా.. అంతకంతకూ తగ్గుతుండటం విశేషం. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో ప్రతి లక్ష మంది జనాభాకు 15 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. కాగా, 2024 పూర్తి ఏడాదికి చూస్తే, 17,200 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2023తో పోలిస్తే (11,760 కోట్లు) 46 శాతం దూసుకెళ్లాయి. మరోపక్క, ఆర్‌బీఐ అనుమతితో ఈ నెల 1 నుంచి ఏటీఎం చార్జీలను బ్యాంకులు పెంచేశాయి. దీంతో ఉచిత లావాదేవీల పరిమితి దాటితే, ప్రతి లావాదేవీకి ఇప్పు డున్న రూ.21 చార్జీ రూ.23కు పెరిగింది. నెలకు సొంత బ్యాంకుల ఏటీఎంలలో 5, ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయాని కొస్తే మెట్రోల్లో అయితే 3, నాన్‌ మెట్రోల్లో 5 లావాదేవీలు ఉచితం. క్యాష్‌ విత్‌డ్రాతో పాటు బ్యాలెన్స్‌ ఎంక్వయిరీ వంటివన్నీ లావాదేవీగానే పరిగణిస్తున్నారు.ఎనీటైమ్‌ సమస్యలు...! కొన్ని బ్యాంకులు బ్రాంచ్‌ల వద్ద ఏటీఎంలను బాగానే నిర్వహిస్తున్నప్పటికీ, ఆఫ్‌సైట్‌ ఏటీఎంల విషయంలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడు చూసినా సాంకేతిక సమస్యలు, లేదంటే క్యాష్‌ లేకపోవడం వంటివి కస్టమర్లకు నిత్యకృత్యంగా మారుతున్నాయి. దీంతో అత్యవసరంగా క్యాష్‌ విత్‌డ్రా చేసుకోవాలంటే రెండు మూడు ఏటీఎంలకు తిరగాల్సి వస్తోందనేది అధిక శాతం మంది ఖాతాదారుల ఫిర్యాదు. ‘దేశంలో ప్రస్తుత ఏటీఎంల ట్రెండ్‌ను పరిశీలిస్తే, బ్యాంకింగ్‌ రంగంలో టెక్నాలజీ, ముఖ్యంగా డిజిటల్‌ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క, బ్యాంకింగ్‌ సేవలు తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాలపై బ్యాంకులు దృష్టి పెట్టడం కూడా మొత్తంమీద ఏటీఎంలు తగ్గుముఖం పట్టడానికి కారణం’ అని ఆన్‌లైన్‌ పేమెంట్‌ సరీ్వస్‌ ప్రొవైడర్‌ ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ చైర్మన్‌ రవి బి. గోయల్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల నేపథ్యంలో నెట్‌వర్క్‌ స్థిరీకరణ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.34.7 లక్షల కోట్లు: బ్యాంకింగ్‌ వ్యవస్థలో చెలామణీలో ఉన్న నగదు (జీడీపీలో ఇది 12 శాతం).2,14,398: 2024 డిసెంబర్‌ నాటికి దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల మొత్తం ఏటీఎంల సంఖ్య (స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులు సహా). ఇందులో 1,28,485 ఆన్‌సైట్, 85,913 ఆఫ్‌సైట్‌ ఏటీఎంలు ఉన్నాయి.36,000: దేశంలో వైట్‌ లేబుల్‌ ఏటీఎంల సంఖ్య దాదాపుగా. ప్రస్తుతం ఈపీఎస్, ఇండియా1 పేమెంట్స్, హిటాచి పేమెంట్‌ సరీ్వసెస్, టాటా కమ్యూనికేషన్స్‌ పేమెంట్‌ సొల్యూషన్స్, వక్రంగీ.. ఈ ఐదు ప్రైవేటు కంపెనీలు వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లుగా ఉన్నాయి. 17,200 కోట్లు : 2024లో యూపీఐ లావాదేవీల సంఖ్య (రోజువారీగా సగటు విలువ రూ. 74,990 కోట్లు) – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Retired IAS Dhanunjay Reddy and Krishnamohan Reddy were interrogated for over 13 hours7
విచారణ పేరుతో వేధింపులు

సాక్షి, అమరావతి: మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్‌ తీవ్ర వేధింపులకు గురి చేస్తోంది. గురువారం 13 గంటలకుపైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్‌ కుట్రలకు అద్దం పడుతోంది. రిటైర్డ్‌ అధికారులైన వారిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11.15 గంటల వరకు విచారణ పేరుతో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యా­లయంలో ఉంచడం గమనార్హం. తాము తదుపరి విచారణ చేపట్టేవరకు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సిట్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ బుధవారం స్వచ్ఛందంగా సిట్‌ ముందు విచారణకు హాజరయ్యారు. తొలిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వారిని విచారించిన సిట్‌ అధికారులు మరుసటి రోజు గురువారం కూడా రావాలని పేర్కొన్నారు. దీంతో వారిద్దరూ వరుసగా రెండో రోజు గురువారం కూడా విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి చేరుకున్నారు.మళ్లీ మళ్లీ.. అవే ప్రశ్నలుసిట్‌ చీఫ్‌గా ఉన్న విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఎంవో కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ తేల్చి చెప్పారు. ఆ అంశం పూర్తిగా ఎక్సైజ్‌ శాఖ, బెవరేజస్‌ కార్పొరేషన్‌కు సంబంధించినదని పేర్కొన్నారు. అయినా సరే సిట్‌ అధికారులు పదే పదే అవే ప్రశ్నలు వేస్తూ వారిని వేధించారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వారిపై మానసిక ఒత్తిడికి గురి చేసేందుకు యత్నించారు. ఇక మెయిల్‌ ఐడీలు, పాస్‌ వర్డ్‌ చెప్పమని సిట్‌ అధికారులు అడిగారు. అందుకు వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు.వెళ్లిపోవచ్చంటూ.. మళ్లీ రప్పించి..ఎట్టకేలకు రాత్రి 9.30 గంటల సమయంలో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి నుంచి సెల్‌ ఫోన్లు తీసుకుని విచారణ ముగిసిందని, వెళ్లవచ్చని సిట్‌ అధికారులు చెప్పారు. అయితే బయటకు వెళుతున్న వారిని మరోసారి వెనక్కి రప్పించారు. సిట్‌ చీఫ్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు మరోసారి విచారిస్తారని, వేచి ఉండాలని సూచించారు. అయితే రాజశేఖర్‌బాబు పనుల మీద బయటకు వెళ్లినందున ఆయన వచ్చే వరకు వేచి ఉండాలంటూ మరో గంటన్నరకుపైగా కాలహరణం చేశారు. వారిద్దరినీ మానసికంగా, శారీరకంగా వేధించడమే లక్ష్యంగా వ్యవహరించారు. సిట్‌ అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా సిట్‌ అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దాంతో ఎట్టకేలకు రాత్రి 11.15 గంటల సమయంలో విచారణ ముగిసిందంటూ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్‌ అధికారులు పంపించేశారు. ఇలా ఉద్దేశపూర్వకంగా వేధించాలని ముందుగానే రూపొందించుకున్న ప్రణాళికను అమలు చేశారు. శుక్రవారం కూడా మళ్లీ విచారణకు రావాలని వారికి సిట్‌ అధికారులు సూచించారు.సిట్‌ తీరు దారుణందర్యాప్తు పేరుతో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్‌ వేధింపులకు గురి చేస్తోంది.రాజ్యాంగం, న్యాయస్థానాల తీర్పులు అంటే ఏమాత్రం లెక్కలేనట్లు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. సీనియర్‌ సిటిజన్లు అయిన వారిద్దరినీ 12 గంటలకు పైగా విచారణ పేరుతో వేధించడం ప్రభుత్వ కుట్రకు తార్కాణం. పౌరుల స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓ నిందితుడి పట్ల సిట్‌ అధికారులు ఇలాగే వ్యవహరిస్తే న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఇంటికి వెళ్లి విచారించాలని, సాయంత్రం 5 గంటల తరువాత విచారించవద్దని ఆదేశించింది. అయినా సరే సిట్‌ తీరు ఏమాత్రం మారలేదు. సిట్‌ అధికారులు రాజకీయ పార్టీ నేతల్లా వ్యవహరించడం సరికాదు. ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళతాం. – మనోహర్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడురాజకీయ వేధింపులు...రాజకీయ కారణాలతోనే ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్‌ వేధిస్తోంది. కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. ఈ అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళతాం. – మొండితోక అరుణ్‌కుమార్, దేవినేని అవినాశ్, వైఎస్సార్‌సీపీ నేతలు మద్యం విధానంపై కేసు... ముందస్తు బెయిల్‌పై నేడు ‘సుప్రీం’ విచారణ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ఇప్పటికే అరెస్టు నుంచి తాత్కాలిక ఊరట బాలాజీ గోవిందప్ప అరెస్ట్‌పైనా తేలుస్తామన్న ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: మద్యం విధానానికి సంబంధించి అక్రమ కేసు ఎదుర్కొంటున్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారించనుంది. తాము తదుపరి విచారణ చేపట్టేవరకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అరెస్టు చేయరాదని ఆదేశిస్తూ ఈ నెల 13న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి ముందస్తు బెయిల్‌ పిటిషన్లు జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు నేడు మరోసారి విచారణకు రానున్నాయి. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఇప్పటికే స్వచ్ఛందంగా సిట్‌ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మరింత మురికిగా మార్చవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు..ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుందని తెలిసి కూడా అదే రోజు తెల్లవారుజామున బాలాజీ గోవిందప్పను ఆగమే­ఘాలపై అరెస్ట్‌ చేశారని గత విచారణ సందర్భంగా ఆయన న్యాయవాది సిద్ధార్థ్‌ దవే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గోవిందప్ప అరెస్ట్‌ అక్రమమని నిరూపిస్తామని, దర్యాప్తు సంస్థ తీరును పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. తదుపరి విచారణలో బాలాజీ గోవిందప్ప అరెస్ట్‌ సంగతి కూడా తేలుస్తామని ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ్‌ అగర్వాల్‌ అభ్యంతరం వ్యక్తం చేయగా... జస్టిస్‌ పార్దీవాలా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే గోవిందప్ప అరెస్ట్‌ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ నిరర్ధకమవుతుందంటూ వాదన వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయ­వాదులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం... ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.

Donald Trump says India has offered a trade deal with literally no tariffs8
అమెరికా  ఉత్పత్తులకు భారత్‌లో జీరో టారిఫ్‌!

దోహా: భారత్, పాక్‌ పరస్పర సైనిక చర్యలతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉన్న వేళ కాల్పుల విరమణకు ఇరుదేశాలు సమ్మతించాయని అందరికంటే ముందే ప్రకటించి అభాసుపాలైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోమారు తొందరపాటు ప్రకటన చేశారు. టారిఫ్‌లు విధించకుండానే అమెరికా నుంచి వస్తూత్పత్తుల దిగుమతికి భారత్‌ అత్యుత్సాహం చూపిస్తోందని ట్రంప్‌ గురువారం అనూహ్య ప్రకటన చేశారు. దీంతో వెంటనే భారత్‌ స్పందించింది. అలాంటిదేమీ లేదని, టారిఫ్‌ల ఖరారుపై విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతు న్నాయని, చర్చలు ఇప్పట్లో ముగిసిపోవని భారత్‌ స్పష్టంచేసింది. జీరో టారిఫ్‌ ప్రతిపాదన లేదని కుండబద్దలు కొట్టింది.మోదీ మౌనమేల?: కాంగ్రెస్‌ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించట్లేరని విపక్ష కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ‘‘ అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఖరారు చర్చల కోసం మన వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ వాషింగ్టన్‌ డీసీలో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్‌ జీరో టారిఫ్‌ అంటూ ప్రకటన చేశారు. ఈ సున్నా టారిఫ్‌కు, ఆపరేషన్‌ సిందూర్‌ ఆగిపోవడానికి మధ్య సంబంధమేంటి?. ఈ అంశంలో మోదీ ఎందుకు మౌనం వహించారు?. అమెరికాతో డీల్‌ కుదుర్చుకునేందుకు మోదీ ఏమేం అంశాల్లో తలూపారు?’’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్‌ ‘ఎక్స్‌’లో ప్రశ్నించారు.ట్రంప్‌ ఏం మాట్లాడారు?గురువారం ఖతార్‌ రాజధాని దోహాలో వ్యాపారదిగ్గజాలు, సంస్థలతో ట్రంప్‌ సమావేశమయ్యారు. చైనా, అమెరికా టారిఫ్‌ల యుద్ధం నేపథ్యంలో భారత్‌లో అత్యధికంగా ఐఫోన్‌లను తయారుచేసి అమెరికాకు ఎగుమతి చేయబోతున్నట్లు యాపిల్‌ సంస్థ ఇటీవల ప్రకటించడం తెల్సిందే. ఈ విషయం నచ్చని ట్రంప్‌ ఇదే అంశాన్ని దోహా భేటీలో యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ వద్ద ప్రస్తావించారు. ‘‘అమెరికాలో యాపిల్‌ సంస్థను ఇంతబాగా చూసుకుంటున్నా మీరేమో భారత్‌లో ఐఫోన్‌లను మరింత ఎక్కువగా తయారుచేస్తామంటున్నారు. అక్కడే కర్మాగారాలను విస్తరిస్తున్నారు. ఇది నాకు అస్సలు నచ్చలేదు. అమెరికా ఉత్పత్తులపై భారత్‌ చాలా ఎక్కువ టారిఫ్‌లు విధిస్తోంది. ప్రపంచంలో అధిక టారిఫ్‌లు విధించే దేశాల్లో భారత్‌ కూడా ఉంది. టారిఫ్‌లు పెంచాక అత్యధిక ధరలకు మీరు భారత్‌లో వస్తువులను విక్రయించడం చాలా కష్టమవుతుంది. మీకో విషయం చెప్పనా. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్‌ ఒక చక్కని ప్రతిపాదన తెచ్చింది. అసలు టారిఫ్‌లే లేకుండా వస్తువులను భారత్‌లోకి దిగుమతి చేసుకోవడానికి వాళ్లు దాదాపు అంగీకారం తెలిపారు. మీరు భారత్‌లో ఐఫోన్ల తయారీ కర్మాగారాలను నిర్మించినా అక్కడి సర్కార్‌ మిమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు. వాళ్లకు స్వప్రయోజనాలే ముఖ్యం’’ అని టిమ్‌కుక్‌తో ట్రంప్‌ మాట్లాడారు. ఈ విషయాలను మీడియాకు ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. తనతో మాట్లాడిన తర్వాత అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు టిమ్‌కుక్‌ అంగీకారం తెలిపారని ట్రంప్‌ ప్రకటించారు. భారతీయ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్‌ విధిస్తామని ట్రంప్‌ ఏప్రిల్‌ 9వ తేదీన ప్రకటించారు. అయితే 90 రోజులపాటు ఈ పెంపును తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు తర్వాత ట్రంప్‌ వెల్లడించడం తెల్సిందే.ఖండించిన భారత్‌ట్రంప్‌ మాటల్లో వాస్తవం లేదని భారత్‌ గురువారం ప్రకటించింది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పందించారు. ‘‘ టారిఫ్‌లుసహా సమగ్ర వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా మధ్య విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇవి సంక్లిష్టమైనవి. చర్చలు ముగిసిపోలేదు. ప్రతి అంశంపైనా కూలంకషంగా చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా ఏ అంశంపైనా తుది నిర్ణయాలు వెలువడలేదు. ఒప్పందం కుదుర్చుకుంటే అది ఇరుపక్షాలకు ప్రయోజనకారిగా ఉండాలి. రెండు దేశాలకూ లబ్ధిచేకూరాలి. మేం ఇదే కోరుకుంటున్నాం. చర్చలు పూర్తికాకుండానే దీనిపై మాట్లాడటం తొందరపాటు చర్యే అవుతుంది’’ అని జైశంకర్‌ వ్యాఖ్యానించారు. 2024లో ఇరుదేశాల మధ్య 129 బిలియన్‌ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది.

PM Narendra Modi agreed to caste census out of fear of deprived classes9
ఆ భయంతోనే కులగణనకు మోదీ అంగీకారం 

దర్భంగా/పట్నా: దేశంలో అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే కులగణనకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకారం తెలిపారని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు. కులగణనకు మద్దతుగా ప్రజల తరఫున ప్రతిపక్షాలు గళం విప్పాయని అన్నారు. గురువారం బిహార్‌ రాష్ట్రం దర్భంగా జిల్లాలోని మిథిలా యూనివర్సిటీ అంబేడ్కర్‌ హాస్టల్‌లో ‘శిక్షా న్యాయ్‌ సంవాద్‌’లో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. దళిత, వెనుకబడిన వర్గాల విద్యార్థులతో సమావేశమయ్యారు. అంతకుముందు యూనివర్సిటీకి చేరుకోకుండా అధికారులు అడ్డంకులు సృష్టించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. యూనివర్సిటీ గేటు వద్ద తన వాహనాన్ని నిలిపివేశారని, దాంతో వాహనం దిగి మరో మార్గంలో నడుచుకుంటూ వచ్చానని రాహుల్‌ తెలిపారు. ప్రజలు తనకు కొండంత బలం ఇచ్చారని, అందుకే బిహార్‌ ప్రభుత్వం తనను అడ్డుకోలేకపోయిందని అన్నారు. ఈ ప్రజాబలం ముందు ప్రధాని మోదీ సైతం తలవంచాల్సిందేనని స్పష్టంచేశారు. భారత రాజ్యాంగాన్ని తలతో తాకాలని మోదీకి చెప్పామని, చివరకు ఆయన ఆ పని చేయక తప్పలేదని అన్నారు. దేశమంతటా కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేశామని, దానికి కూడా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. పేదలు, అణగారిన వర్గాల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయంతోనే మోదీ ఈ రెండింటికీ అంగీకరించారని రాహుల్‌ గాంధీ వెల్లడించారు. అంబానీ, అదానీల సేవలో మోదీ సర్కారు తరిస్తోందని మండిపడ్డారు. దేశంలో కేవలం ఐదు శాతం ఉన్న ధనవంతుల బాగు కోసమే మన వ్యవస్థలు పని చేస్తున్నాయని ఆరోపించారు. దళితులు, గిరిజనుల, ఓబీసీలను పట్టించుకొనే దిక్కే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం, కార్పొరేట్‌ ప్రపంచం, మీడియాలో వారికి స్థానం దక్కడం లేదన్నారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లోనూ రిజర్వేషన్లు మూడు ప్రధాన డిమాండ్లపై యువత ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించినట్లుగానే దేశవ్యాప్తంగా కులగణన పక్కాగా నిర్వహించాలని అన్నారు. ప్రైవేట్‌ కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని తేల్చిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద కేటాయించిన నిధులను ఆయా వర్గాల సంక్షేమం కోసం జాప్యం లేకుండా విడుదల చేయాలన్నారు. ఎన్డీయే పాలనలో పెద్దగా ఆశించలేమని.. కేంద్రంలో, రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక యువత సంక్షేమం, అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యాసంస్థల్లో వెనుకబడిన వర్గాల వారి పట్ల వివక్ష కొనసాగుతోందని, మీడియాలో బీసీల ప్రాతినిధ్యం లేదని, ఈ అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని రాహుల్‌ గాంధీని ఓ విద్యార్థి కోరారు. ‘ఫూలే’ చిత్రం తిలకించిన రాహుల్‌ రాహుల్‌ గాంధీ గురువారం బిహార్‌ రాజధాని పాట్నాలోని సినిమా హాల్‌లో హిందీ చిత్రం ‘ఫూలే’ను తిలకించారు. బిహార్‌ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సైతం రాహుల్‌తో కలిసి ఈ సినిమా చూశారు. 19వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత సామాజిక ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవితం ఆధారంగా ఫూలే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

between TDP MPs and MLAs: Andhra pradesh10
ఆధి‘పచ్చ’ పోరు

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. తమ మాటే వినాలని అటు ఎంపీలు, ఇటు ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. పోస్టింగ్‌లు, కాంట్రాక్టులు, ఇతర పనుల్లో తమ మాటే నెగ్గాలని ఎవరికి వారు పట్టుబడుతుండడంతో వారి మధ్య కోల్డ్‌వార్‌ సాగుతోంది. కొన్ని జిల్లాల్లో ఈ విభేదాలు మరింత ముదిరిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి నెలకొంది. పలుచోట్ల ఎంపీల పెత్తనం ఎక్కువ కావడంతో ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.లోకేశ్‌ అండతో ‘చిన్ని’కిచినికి గాలివాన..!విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) తాను లోకేశ్‌ మనిషినంటూ నియోజకవర్గాల్లో అన్నింటికీ తనకు వాటా ఉండాలని పట్టుబట్టి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇసుక ర్యాంపులు, మద్యం షాపులు, కాంట్రాక్టుల కోసం ఎక్కడికక్కడ తన మనుషులను పెట్టి వారితో వ్యవహారాలు నడిపిస్తున్నారు. విజయవాడ నగరంతోపాటు నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో చిన్నచిన్న విషయాల్లోనూ వేలు పెడుతుండడంతో ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయనను వ్యతిరేకిస్తే లోకేశ్‌తో ఇబ్బంది వస్తుందనే ఆందోళనతో ఎవరూ బయటపడడం లేదని, కేశినేని చిన్ని తీరు అన్యాయంగా ఉందని వాపోతున్నారు.మా‘లావు’ చిక్కులునర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్ని నియోజకవర్గాల్లోనూ జోక్యం చేసుకుంటూ తన మాటే నెగ్గాలని పట్టుబడుతుండడంతో ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నిచోట్లా ప్రత్యేకంగా తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారితో పనులు చేయించేందుకు యత్నిస్తుండడంపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలోనే గురజాల, నర్సరావుపేట సీట్లను తాను చెప్పిన వారికి ఇప్పించేందుకు యత్నించినా గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, నర్సరావుపేటలో అరవింద్‌బాబు సీట్లు తెచ్చుకుని గెలిచారు. ఆ తర్వాత కూడా వారితో లావు విభేదాలు కొనసాగిసూ్తనే ఉన్నారు.నర్సరావుపేటలో జనసేన ఇన్‌చార్జిని ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేతో కయ్యానికి కాలు దువ్వుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావుకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయించిన మర్రి రాజశేఖర్‌ను చేరదీయడంతో ఆయన వర్గం రగులుతోంది. మాచర్లలో ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిని పక్కనపెట్టి తన మనుషులతోనే అన్ని వ్యవహారాలు నడిపిస్తున్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తనకు మంత్రి పదవి రాకుండా లావు అడ్డుకున్నారనే కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు లావు శ్రీకృష్ణదేవరాయలుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.సిఫార్సుల ‘పెమ్మసాని’గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ పలు నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. గుంటూరులోని తెనాలి, తాడికొండ నియోజవర్గాల్లో బదిలీలు, పనులకు ఆయన ప్రత్యేకంగా సిఫారసు లేఖలు ఇస్తుండడంతో ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెనాలిలో ఒక విద్యుత్‌ ఏఈ పోస్టు కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా వేర్వేరు వ్యక్తులను సిఫారసు చేస్తూ లేఖలు ఇవ్వడంతో ఎవరి చెప్పినట్లు చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు.తగ్గ‘వేమిరెడ్డి’!నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు జిల్లా అంతా తనదేనంటూ అన్నింట్లో జోక్యం చేసుకోవడంపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఆయనకు సీఎం తనయుడు లోకేశ్‌ అండ ఉండడంతో మైనింగ్‌ వ్యవహారాల్లో ఆయన చెప్పినట్లే జరుగుతోంది. మైనింగ్‌ డీడీగా తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకుని తాను చెప్పినట్లు వినేలా చేసుకున్నారు. దీంతో ఆయన తమ మాట కూడా వినకుండా ఎంపీ ఏది చెబితే అది చేస్తున్నారని ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. సర్వేపల్లి, వెంకటగిరి, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఎంపీకి ఏమాత్రం పొసగడంలేదు. దీంతో ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుచరులకు సంబంధించిన అక్రమ మైనింగ్‌పై ఎంపీ వేమిరెడ్డి విజిలెన్స్‌ దాడులు చేయించినట్లు సమాచారం.విశాఖలో ‘భరత్‌’నాట్యమే!విశాఖపట్నం ఎంపీ భరత్‌ సీఎం కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో అన్ని విషయాలూ తనకు తెలియాలని, తనకు చెప్పి చేయాలని అధికారులను ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యవహారాలు, గ్రేటర్‌ విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ)కి చెందిన పనులకు సంబంధించి ఆయన పెత్తనం చేస్తుండడంతో ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారు. భరత్‌ వ్యవహార శైలిపై భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడుతున్నట్లు సమాచారం. అన్ని వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటుండడంతో మిగిలిన ఎమ్మెల్యేలు పైకి ఏమీ మాట్లాడకపోయినా అంతర్గతంగా రగిలిపోతున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement