Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP Coalition govt says form Shram Shakti Sangam with 50 members1
సొంత గ్రూపులకే ‘ఉపాధి’

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: నాడు.. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో రికార్డు స్థాయిలో కోట్ల పని దినాలు కల్పించడం ద్వారా పేదరికాన్ని తొలగించే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. నేడు.. టీడీపీ కూటమి సర్కారు ‘గ్రూపు’ రాజకీయాలను ప్రోత్సహిస్తూ పల్లెల్లో చిచ్చు రాజేస్తోంది! దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రూపుల వ్యవస్థను ఏపీలో ప్రవేశపెట్టి శ్రమశక్తి సంఘాల (ఎస్‌ఎస్‌ఎస్‌) పేరుతో గ్రామాల్లో ప్రతి 50 మందికి ఓ గ్రూపు చొప్పున ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ క్రమంలో ఉపాధి పనుల్లో ఆధిపత్యం కోసం ఏలూరు జిల్లాలో సోమవారం రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. మే్రస్తిగా ఉన్నవారు తమ వర్గం వారికి అనుకూలంగా మస్తర్లు వేస్తున్నట్లు ఘర్షణకు దిగడంతో ఎనిమిది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కోవిడ్‌ వేళ సైతం ఉపాధి హామీ ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పించి ఆదుకుంటే.. కూటమి సర్కారు మాత్రం నచి్చన వారికే ఉపాధి కల్పిస్తోంది. కూలీలు ఓ గ్రూపుగా ఏర్పడి పని కావాలని దరఖాస్తు చేసుకుంటేనే ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కేటాయిస్తోంది. ఒక గ్రూపులో చేరిన కూలీలు అందులో నుంచి బయటకొచ్చి కొత్త దాంట్లో చేరేందుకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టింది. అసలు గ్రూపులతో సంబంధం లేకుండా ఏదైనా కుటుంబం వ్యక్తిగతంగా పని కావాలని కోరినా కేటాయించే అవకాశమే ఉండదు. గ్రూపులతో గ్రామాల్లో చిచ్చు.. ఒకసారి శ్రమశక్తి సంఘం ఏర్పాటయ్యాక సంవత్సరం వరకు ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రతి సంఘానికి లీడర్‌గా ‘మేట్‌’ ఉంటారు. కూలీలను సమీకరించడం మేట్‌ ప్రధాన బాధ్యత. కూలీల కుటుంబాలు ఒకసారి ఏదైనా గ్రూపులో చేరితే కనీసం ఏడాదిపాటు ఆ మేట్‌ సమక్షంలో పనిచేయక తప్పుదు. ఏ పరిస్థితుల్లోనైనా మేట్‌తో విభేదాలు తలెత్తితే ఆ కుటుంబానికి పని దక్కకుండా చేసే అవకాశం ఉంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ఉపాధి పనుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఏ పనులైనా తమకు అనుకూలంగా ఉండేవారికే కేటాయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పలువురు ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించి తమ వర్గీయులను నియమించుకున్నారు. ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లతో తాజాగా కర్నూలు జిల్లాలో ఓ ఫీల్డు అసిస్టెంట్‌ దారుణ హత్యకు గురయ్యాడు. అడ్డగోలుగా తొలగింపులు..రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగిస్తూ తమ అనుచరులకు చోటు కల్పిస్తున్నారు. వారి ఆగడాలు తట్టుకోలేక కొందరు స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు 115 మందికి పైగా తొలగించారు. అదేమంటే స్వచ్ఛందంగా రాజీనామా చేశారని ఏపీఓలు అంటున్నారు. మిగిలిన వారినీ తొలగించేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లావ్యాప్తంగా 435 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించారు. టీడీపీ ప్రభుత్వం పలువురు తప్పుకున్నారు. 40 మంది మేట్‌లను కూడా తొలగించారు. రాజీనామా చేయని ఫీల్డ్‌ అసిస్టెంట్లకు డ్వామా అధికారులు నోటీసులిస్తూ వేధిస్తున్నారు. బాపట్ల జిల్లాలో ఇప్పటివరకు 134 మందిని ఇంటికి పంపించగా నెల్లూరు జిల్లాలోని 430 పంచాయతీల్లోని ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించారు. ప్రకాశం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 721 మందికి గానూ 485 మందిని తప్పించి టీడీపీ సానుభూతిపరులను నియమించుకున్నారు. ఏలూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం రాగానే ఫీల్డ్‌ అసిస్టెంట్లు అందరూ తప్పుకోవాలని హెచ్చరించడంతో 350 మంది వైదొలిగారు. కోనసీమ, కాకినాడ జిల్లాల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కాగానే వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 32 మందిని సస్పెండ్‌ చేయగా, 45 మందిని ఇంటికి పంపించారు. హోంమంత్రి అనిత నియోజకవర్గంలో ఆరుగు ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ముగ్గురు మేట్లను తొలగించారు. శ్రీసత్యసాయి జిల్లాలో 520 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లనూ మార్చేశారు. అనంతపురం జిల్లాలో 90 శాతం ఫీల్డ్‌ అసిస్టెంట్లను మార్చారు. కర్నూలు జిల్లాలో ఉద్దే­శపూ­ర్వకంగా సస్పెండ్‌ చేయించి పలువురిని తొలగించారు.పని దినాల కల్పనలో నాడు రికార్డువైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా ఏ కుటుంబం వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నా పని కల్పించే విధానాన్ని అమలు చేసింది. ఎవరి వద్దకూ వెళ్లాల్సిన అవసరం లేకుండా కోరిన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా పనులను కేటాయించింది. పనులు కోరిన వారందరికీ జాబ్‌ కార్డులు జారీ చేసింది. దేశమంతా కోవిడ్‌తో కకావికలమైన వేళ.. గ్రామాలకు పెద్ద ఎత్తున తరలివచి్చన వారందరికీ భరోసానిచ్చి పనులు కల్పించి ఆదుకుంది. పని దినాల కల్పనలోనూ రికార్డు సృష్టించింది. ఐదేళ్లలో ఏకంగా 114.82 కోట్ల పని దినాలను కల్పించి రికార్డు సృష్టించింది. ⇒ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ పేద కూలీలకు ‘ఉపాధి’లో భారీగా కోతపడింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద పనుల కల్పన బాగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో జూన్‌–జనవరి మధ్య కల్పించిన పని దినాలను ఈ ఆర్ధిక సంవత్సరం(2024–25)లోని జూన్‌–జనవరి మధ్య కల్పించిన పనిదినాలతో పోలిస్తే ఏకంగా 2.69 కోట్ల పనిదినాలు తగ్గాయి. దీనివల్ల గ్రామీణ పేదలు వేతనాల రూపంలో రూ.700 కోట్ల మేర నష్టపోయారు. దీనిలో ఎక్కువగా నష్టపోయింది ఎస్టీ, ఎస్టీలే. ఈ విషయాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ⇒ వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా 2023 జూన్‌ నుంచి 2024 జనవరి మధ్య గ్రామీణ పేదలకు 10.87 కోట్ల పని దినాలపాటు పనులు కల్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 జూన్‌ నుంచి 2025 జనవరి వరకు కేవలం 7.18 కోట్ల పనిదినాలు మాత్రమే పనులు కల్పించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధి హామీ పథకం అమలులో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్లే పేదలకు పనుల కల్పన తగ్గిపోయినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

NAKSHA Pilot Project starts across India from 18th Feb 20252
NAKSHA Pilot Project: పట్టణాల్లో ప్రాపర్టీ కార్డ్‌!

సాక్షి, హైదరాబాద్‌: పట్టణాల్లో రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించేందుకు.. ఇళ్లు, స్థలాల వివాదాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నక్ష’ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. మున్సిపాలిటీల్లో విస్తృత స్థాయిలో సర్వే చేసి.. ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాల వివరాలన్నీ తేల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇంటి యజమాని పేరు, ఆస్తి పన్ను వివరాలు, ఆస్తి విస్తీర్ణం, సర్వే నంబర్, అనుమతి తీసుకున్న నంబర్, ప్లాన్, నల్లా కనెక్షన్‌.. ఇలా సమస్త వివరాలతో ప్రాపర్టీ కార్డుల జారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణాలు, నగరాల్లోని అణువణువు ఇకపై డిజిటల్‌ రూపంలో నిక్షిప్తం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డ్స్‌ మాడరై్నజేషన్‌ ప్రోగ్రాం (డీఐఎల్‌ఆర్‌ఎంపీ)లో భా­గంగా ‘నేషనల్‌ జియో స్పేషియల్‌ నాలెడ్జ్‌ బేస్డ్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హ్యాబిటేషన్స్‌ (నక్ష)’ కార్యక్రమాన్ని చేపట్టింది. మంగళవారం దేశవ్యాప్తంగా రెండు లక్షల వరకు జనాభా ఉన్న 152 మున్సిపాలిటీల్లో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ పట్టణాల్లో ఏడాదిపాటు పైలట్‌ ప్రాజెక్టును అమలు చేసిన తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా మార్పు, చేర్పులు చేస్తారు. అనంతరం మొదటి దశ కింద దేశవ్యాప్తంగా 1,000 మున్సిపాలిటీల్లో, ఆ తర్వాత దేశంలోని 4,912 పట్టణాలు, నగరాల్లో ‘నక్ష’ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్‌ మాదిరిగా ప్రాపర్టీ కార్డ్‌.. పట్టణాలు, నగరాల్లోని భూముల సర్వే నంబర్లు, ఇళ్లను ‘నక్ష’ కార్యక్రమం ద్వారా అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం పౌరులందరికీ ఆధార్‌ ఇస్తున్నట్టుగానే.. ప్రతీ గృహ యజమానికి ప్రాపర్టీ కార్డును విశిష్ట గుర్తింపు సంఖ్యతో ఇవ్వనున్నట్టు పురపాలక శాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ఈ కార్డుపై ‘క్యూఆర్‌’ కోడ్‌ ఉంటుందని, దానిని స్కాన్‌ చేస్తే పూర్తి వివరాలు లభిస్తాయని తెలిపారు. ఇంటి యజమాని పేరు, ఆస్తి పన్ను వివరాలు, ఆస్తి విస్తీర్ణం, సర్వే నంబర్, అనుమతి తీసుకున్న నంబర్, ప్లాన్, నల్లా కనెక్షన్‌ ఇలా సమస్త సమాచారం అందులో ఉంటుందని వెల్లడించారు. లైడార్‌ సర్వే మాదిరిగా ఇది ఉంటుందని, పైలట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో ఏడాదిపాటు పూర్తి స్థాయిలో ఈ సర్వే నిర్వహిస్తారని తెలిపారు. ఈ మున్సిపాలిటీల్లోని ప్రతి ఇంటిని త్రీడ్రీ కెమెరాలతో మ్యాపింగ్‌ చేస్తారని, ఇందుకోసం మూడు రకాల కెమెరాలను ఉపయోగిస్తారని వెల్లడించారు. ఈ సర్వే పూర్తయితే.. ఆస్తిపన్ను మదింపు పారదర్శకంగా జరుగుతుందని, స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలవుతుందని వివరించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, భవిష్యత్తులో జీఐఎస్‌ మాస్టర్‌ ప్లాన్‌ల రూపకల్పన సులభతరం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. పట్టణాల్లోని రెవెన్యూ సర్వే నంబర్లు ఎన్ని సబ్‌ డివిజన్లుగా మారాయన్న వివరాలను కూడా నమోదు చేయనున్నట్టు తెలిపారు. అర్బన్‌ ల్యాండ్‌ రికార్డులు నాలుగు రాష్ట్రాల్లోనే.. దేశంలో తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో మాత్రమే పట్టణ భూముల రికార్డులను పక్కాగా నిర్వహిస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో వాటి నిర్వహణ సరిగా లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలోనే ‘నక్ష’ ప్రాజెక్టును చేపట్టినట్టు చెబుతోంది. రెవెన్యూ, మున్సిపాలిటీలు, సర్వే ఆఫ్‌ ఇండియా, ఎంపీ స్టేట్‌ ఎల్రక్టానిక్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ), సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లు సంయుక్తంగా ఈ పైలట్‌ ప్రాజెక్టును అమలు చేయనున్నాయి. పట్టణాలు, నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ సర్వే కీలకమని కేంద్రం తెలిపింది. భూముల విలువలు వేగంగా పెరుగుతున్నందున వివాదాలకు చెక్‌ పెట్టేలా ఇది ఉంటుందని, న్యాయపరమైన అంశాల్లోనూ ఉపయోగపడుతుందని వెల్లడించింది. అదే సమయంలో ఈ సర్వే డిజిటైజేషన్‌తో ప్రణాళికాబద్ధంగా పట్టణాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు వీలుంటుందని పేర్కొంది. ఆయా ఆస్తుల యజమానులు రుణాలు తీసుకోవడానికి ఈ సర్వే అనంతరం జారీ చేసే ప్రాపర్టీ కార్డు ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. 3 పద్ధతుల్లో ఏరియల్‌ సర్వే.. రాష్ట్రంలో ఎంపిక చేసిన మున్సిపాలిటీలివే.. జడ్చర్ల, హుస్నాబాద్, కొడంగల్, వర్ధన్నపేట, యాదగిరిగుట్ట, మహబూబాబాద్, వేములవాడ, మిర్యాలగూడ, జగిత్యాల, మణుగూరు మున్సిపాలిటీలను ‘నక్ష’ పైలట్‌ ప్రాజెక్టు కోసం రాష్ట్రం నుంచి ఎంపిక చేశారు. రాష్ట్రంలోని మొత్తం 155 పట్టణాలు, 29 పట్టణాభివృద్ధి సంస్థల్లో కూడా భవిష్యత్తులో ఈ సర్వే నిర్వహించేందుకు అవసరమైన నిధులు దాదాపు రూ.700 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుందని తెలిసింది.

Rasi phalalu: Daily Horoscope On 18 Feb 2025 In Telugu3
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తి వివాదాలు పరిష్కారం

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.షష్ఠి తె.4.44 వరకు (తెల్లవారితే బుధవారం) తదుపరి సప్తమి, నక్షత్రం: స్వాతి పూర్తి (24 గంటలు), వర్జ్యం: ఉ.11.53 నుండి 1.37 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.48 నుండి 9.36 వరకు, తదుపరి రా.11.02 నుండి 11.50 వరకు, అమృత ఘడియలు: రా.10.27 నుండి 12.12 వరకు, అమృత ఘడియలు: ప.12.28 నుండి 2.03 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.30, సూర్యాస్తమయం: 5.55. మేషం... పరిచయాలు విస్తృతమవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.వృషభం.... నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్యనిర్ణయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.మిథునం... శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళపెట్టవచ్చు.కర్కాటకం... అనుకోని ప్రయాణాలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో విరోధాలు. కష్టానికి ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.సింహం... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.కన్య.... సన్నిహితులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాల విస్తరణ లో చికాకులు. ఉద్యోగమార్పులు.తుల... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.వృశ్చికం.... పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.ధనుస్సు... పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. నూతన ఉద్యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.మకరం.... ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.విలువైన వస్తువులు కొంటారు. భూవివాదాలు పరిష్కారం. కీలక నిర్ణయాలు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.కుంభం... బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.మీనం... కుటుంబంలో చికాకులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

CM Revanth orders officials On New ration cards4
వెంటనే కొత్త రేషన్‌కార్డులు: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాల్సిందేనని, ఈ మేరకు కొత్త రేషన్‌కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలసి రేషన్‌కార్డుల జారీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. కొత్త రేషన్‌కార్డుల కోసం ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, రేషన్‌కార్డుల్లో కొత్తగా పేర్ల చేర్పు, తొలగింపు కోసం వచ్చిన విజ్ఞప్తులపై ఆరా తీశారు. ప్రజాపాలన అర్జీలు, కులగణనతోపాటు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు, మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మళ్లీ దరఖాస్తులు అవసరం లేదు..: ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశం ఇచ్చినా.. మీసేవ కేంద్రాల వద్ద రేషన్‌ దరఖాస్తుల కోసం రద్దీ ఎందుకు ఉంటోందని సీఎం ఆరా తీశారు. అయితే దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్లీ చేస్తున్నాయని, అందుకే రద్దీ ఉంటోందని అధికారులు వివరణ ఇచ్చారు. వెంటనే కార్డులు జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ఆలస్యం చేయకుండా కొత్త రేషన్‌కార్డులు జారీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే కార్డుల కోసం దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో వెంటనే షురూ.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని, ఆ కోడ్‌ అమల్లో లేని జిల్లాల్లో రేషన్‌ కార్డుల జారీ మొదలుపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. కోడ్‌ ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లో కొత్త కార్డులు ఇవ్వాలని సూచించారు. కొత్త కార్డులకు సంబంధించి పౌర సరఫరాల విభాగం తయారు చేసిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ చౌహాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tuni Municipal Vice Chairman Elections Postponed5
బెదిరించారు.. బరితెగించారు

అసలు బలమే లేని మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు చంద్రబాబు సర్కారు సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, కాకినాడ జిల్లా తుని, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవుల కోసం టీడీపీ అధికార బలంతో బరితెగించింది. సంఖ్యా బలం లేకపోయినా వాటిని బలవంతంగా తమ ఖాతాలో వేసుకునేందుకు కుయుక్తులు పన్నింది.పిడుగురాళ్ల మున్సి పాల్టీ లో టీడీపీ తరఫున ఒక్క కౌన్సిలర్‌ కూడా గెలవకపోయినా సోమవారం జరిగిన ఎన్నికలో వైస్‌ ఛైర్మన్‌ పదవిని సొంతం చేసుకుందంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసైగ మేరకు పోలీసులు, రెవిన్యూ అధికారులు వేధించి, భయపెట్టి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు బలవంతంగా పచ్చ కండువా కప్పి.. మాదే మెజార్టీ అని నిస్సిగ్గుగా ప్రకటించడం విస్తుగొలుపుతోంది. తుని, పాలకొండ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవులను కూడా అదే రీతిలో సొంతం చేసుకునేందుకు ప్రయత్నిం చినా వైఎస్సార్‌సీపీ అడ్డుకోవడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.సాక్షి, నరసరావుపేట/తుని/పాలకొండ: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్‌ లేకపోయినా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను భయపెట్టి అరాచకం çసృష్టించారు. పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని మరచి ఎమ్మెల్యే ఆదేశాలతో కౌన్సిలర్లను భయాందోళనకు గురిచేసి టీడీపీ గూటికి వెళ్లేలా తమవంతు సాయం చేశారు. వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు పోటీ చేయడానికి టీడీపీ తరఫున కనీసం ఒక్క కౌన్సిలర్‌ సైతం లేకపోయినా పోటీలో నిలిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.కౌన్సిలర్లను భయపెట్టి, బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువా కప్పి తెలుగుదేశంలో చేర్చుకున్నట్లు ప్రకటించి.. యరపతినేని ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు, లోకేశ్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అంటే ఇదేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 33 స్థానాలకు 33 స్థానాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. వైస్‌ చైర్మన్‌గా ముక్కంటి అనే వ్యక్తిని ఎన్నుకోగా ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ని ఎంపిక చేసుకోవడానికి ఎలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నామినేషన్‌ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుపడటంతో మరుసటి రోజు.. అంటే ఈ నెల 4వ తేదీకి ఎన్నికను వాయిదా పడింది. అయితే రాత్రికి రాత్రే యరపతినేని ఆదేశాలతో పోలీసులు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను పాత కేసులు పేరిట వేధించి ఎన్నికకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఎన్నికల కమిషన్‌ ఈ నెల 17న సోమవారం మరోసారి వైస్‌ చైర్మన్‌ ఎన్నికలకు అవకాశం కల్పించింది. నాలుగో తేదీ నుంచి 17 వ తేదీ వరకు సుమారు రెండు వారాలు సమయం ఉండటంతో టీడీపీ నేతలు.. పోలీసు, రెవెన్యూ అధికారులను ఉపయోగించి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను వేధించడం మొదలుపెట్టారు. తునిలోనూ టీడీపీ బల ప్రయోగం కాకినాడ జిల్లా తుని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నికను మూడోసారి టీడీపీ అడ్డుకోవడంతో వాయిదా పడింది. టీడీపీ లొంగదీసుకున్న కౌన్సిలర్లను మున్సిపల్‌ కార్యాలయంలోకి అనుమతించి, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను 30 మందీ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరు ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. మిగిలిన 28 మంది వైఎస్సార్‌సీపీకి చెందినవారే. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. టీడీపీ ముందస్తు వ్యూహంలో భాగంగా కౌన్సిల్‌ హాల్‌లోకి చొరబడి ఎన్నికను అడ్డుకుంది.మరుసటి రోజూ ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. దీంతో వైఎస్సార్‌ సీపీకి చెందిన కౌన్సిలర్‌ కాసే సుమతి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక జరగాల్సి ఉన్నా, టీడీపీ దౌర్జన్యం వల్ల మళ్లీ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరుగుతుందని ఆర్వో రవికుమార్‌ తెలిపారు. కాగా, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం చైర్‌పర్సన్‌ సుధారాణి నివాసం వద్ద నుంచి వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తీసుకువెళ్లేందుకు టీడీపీ నాయకులు యత్నిం చారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అడ్డుకున్నారు.దీంతో టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావులు రాజాపై దాడికి దిగారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ శ్రేణులను పోలీసులు అక్కడ నుంచి బయటకు పంపించి వేశారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను పంపించేస్తే ఓటింగ్‌కు వస్తామని కౌన్సిలర్లు చెప్పారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల వరకు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లక పోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. టీడీపీకి సొంతంగా ఒక్క సీటు లేకపోయినా అధికార మదంతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను లొంగదీసుకోవాలని చూస్తోందని, సంతలో పశువుల్లా కొనాలనుకుంటోందని మండిపడ్డారు. అయినా మెజార్టీ లేకపోవడంతో పోలీసులను వినియోగించారన్నారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఏలూరి సుధారాణి భర్త, కో ఆప్షన్‌ సభ్యుడు ఏలూరి బాలును హౌస్‌ అరెస్ట్‌ చేశారని, మరికొందరి నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేసి భయాందోళనలు సృష్టించారన్నారు.మహిళా కౌన్సిలర్లలో గర్భిణులు ఉన్నారని, వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు టీడీపీ గూండాలు, రౌడీ షీటర్లకు సహకరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం చలో తుని కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని రాజా పిలుపునిచ్చారు. మున్సిపల్‌ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు.బెదిరింపుల పర్వం... వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల ఇళ్లకు పోలీసులను పంపించి స్టేషన్‌కు రావాలని పిలిపించి టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని బెదిరింపులకు దిగారు. మరికొంతమందికి కాంట్రాక్టులు, బిల్లుల పేరుతో తాయిలాలు ఆశచూపే ప్రయత్నం చేశారు. మరోవైపు తెలుగుదేశం నాయకులు రోజూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు ఫోన్‌ చేసి కచ్చితంగా మీరు పార్టీ మారాల్సిందేనని ఒత్తిడి చేశారు. యరపతినేని శ్రీనివాసరావు నిర్ణయించిన వైస్‌ చైర్మన్‌ అభ్యర్థికే మీరు ఓటు వేయాలంటూ బెదిరించారు. తెలుగుదేశం రౌడీల బెదిరింపులతో కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.దీంతో పోలీసుల సహకారంతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల బంధువులను బెదిరించి భయపెట్టి వాళ్ల శిబిరంలోకి బలవంతంగా తీసుకువెళ్లారు. ఇలా సుమారు 17 మందిని టీడీపీ వైపు లాగేశారు. వారితో వైస్‌ చైర్మన్‌ పదవిని దౌర్జన్యంగా లాగేసుకున్నారు. 30వ వార్డు కౌన్సిలర్‌ ఉన్నం భారతిని వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కొత్త వెంకట సుబ్బారావు వ్యాపారాలను అడ్డుకుంటామని బెదిరించి పార్టీ మారేలా చేశారని పట్టణంలోని ఆర్య వైశ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పిడుగురాళ్ల 29వ వార్డు కౌన్సిలర్‌ మునీరా దంపతులు తెలుగుదేశం నాయకుల బెదిరింపులకు లొంగక పోవడంతో నిర్మాణంలో ఉన్న వాళ్ల ఇళ్లను పొక్లెయినర్‌తో నేలమట్టం చేశారు. ఇలా బెదిరించి బరితెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.పాలకొండలోనూ అదే తీరు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్‌ కుర్చీ కోసం కూటమి నాయకులు వేస్తున్న ఎత్తులు పారడం లేదు. ముచ్చటగా మూడోసారి సోమవారం నిర్వహించిన చైర్మన్‌ ఎన్నికలో పదవి దక్కించుకోవాలని కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల అధికారి, సబ్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌ రెడ్డితో పాటు జేసీ శోభిక ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. కూటమికి చెందిన ముగ్గురు సభ్యులు, బలవంతంగా తీసుకెళ్లిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరంలేక ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.కాగా, పాలకొండ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో 17 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 19వ వార్డు కౌన్సిలర్‌ ఉద్యోగ రీత్యా తన పదవికి రాజీనామా చేశారు. మరో ఇద్దరు కౌన్సిలర్లను టీడీపీ నేతలు బలవంతంగా వారి వైపు తిప్పుకున్నారు. ఈ లెక్కన టీడీపీ బలం ఐదుకు చేరిందనుకున్నా, వైఎస్సార్‌సీపీ బలం 14గా ఉంది. ఎలాగైనా సరే గెలవాలని మంత్రి సంధ్యారాణి ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచి్చనప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి.

German elections 2025: German voters remain undecided ahead of 23 Feb 2025 elections6
German elections 2025: జర్మనీ విజేత ఎవరు?

జర్మనీ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో అనివార్యమైన ఎన్నికలు ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఫ్రెడరిక్‌ మెర్జ్‌ సారథ్యంలోని క్రిస్టియన్‌ డెమొక్రటిక్‌ యూనియన్‌(సీడీయూ), మార్కస్‌ సోడర్‌ సారథ్యంలోని క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌(సీఎస్‌యూ) కూటమి ఈసారి హాట్‌ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. ఈసారి ఈ కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలొచ్చాయి. మరోవైపు 2010 దశకంలో జర్మనీలోకి వలసలు పోటెత్తడంతో ఉద్యమంగా మొదలై ఇప్పుడు అతివాద పార్టీగా ఎదిగిన ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీ సైతం మళ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. జర్మనీలోకి పోటెత్తుతున్న అక్రమ వలసలకు అడ్డుకట్టవేయడం, ఆర్థికవ్యవస్థను పరుగులెత్తించే సత్తా ఉన్న పార్టీకే ఈసారి ఓటర్లు పట్టంకట్టనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీన జరగనున్న ఎన్నికల్లో వలసలు, ఆర్థిక వ్యవస్థ మాత్రమే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. బండేస్టాగ్‌(జర్మనీ పార్లమెంట్‌)లో అధికార పీఠంపై కూర్చునేది ఎవరనే అంశం ఇప్పుడు జర్మనీ అంతటా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈసారి ఎన్నికలు ఎందుకంత ప్రత్యేకం?ఎన్నడూలేనంతగా జర్మనీలో జనసమ్మర్థ ప్రదేశాల్లో దాడి ఘటనలు ఎక్కువయ్యాయి. అక్రమ వలసదారులే ఈ దాడులకు పాల్పడుతున్నారన్న ఆగ్రహావేశాలు స్థానికుల్లో పెరిగాయి. దీంతో అక్రమ వలసదారుల కట్టడి, శరణార్థులుగా గుర్తింపునకు సంబంధించిన నిబంధనలు కఠినతరం చేయడం వంటి డిమాండ్లు ఓటర్లలో ఎక్కువయ్యాయి. మాన్‌హైమ్, జోలింగన్, మాగ్‌డీబర్గ్, అషాఫన్‌బర్గ్‌ నగరాల్లో దాడి ఘటనలతో అక్రమవలస ఇప్పుడు∙కీలకాంశమైంది. ఇటీవల మ్యూనిక్‌లో అఫ్గాన్‌ పౌరుడు వేగంగా కారు పోనివ్వడంతో జర్మనీ జాతీయురాలు, ఆమె రెండేళ్ల కూతురు తీవ్రంగా గాయపడిన ఘటనతో అక్రమ వలసదారుల కట్టడి అంశాన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నాయి. ఈసారి ఐదుగురు ఛాన్స్‌లర్‌ పదవి కోసం పోటీపడుతున్నారు.ఫ్రిడిష్‌ మెర్జ్‌..క్రిస్టియన్‌ డెమొక్రటిక్‌ యూనియన్‌(సీడీయూ) అధినేత ఫ్రిడిష్‌ మెర్జ్‌ వైపు ఎక్కువ మంది ఓటర్లు మొగ్గుచూపే వీలుంది. ఆరున్నర అడుగుల ఎత్తు 69 ఏళ్ల వయస్సున్న మెర్జ్‌ 2002 ఏడాదిలో ఏంజెలా మెర్కల్‌ ప్రభుత్వంలో పనిచేశారు. తర్వాత రాజకీయాలు వదిలేసి పలు పెట్టుబడుల బ్యాంకుల బోర్డుల్లో సేవలందించారు. తర్వాత మళ్లీ సీడీయూ పార్టీలో చేరి పార్టీ నాయకత్వ పోరులో 2018లో మెర్కెల్, 2021లో ఆర్మిన్‌ లాషెట్‌ చేతిలో ఓటమిని చవిచూశారు. ఈసారి ‘‘ జర్మనీలో ఉన్నందుకు మరోసారి గర్వపడదాం’’ నినాదంతో సీడీయూ చీఫ్‌గా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ‘‘దేశ సరిహద్దులను పటిష్టంచేస్తా. వలసలను కట్టడిచేసేలా శరణార్థి నిబంధనలను కఠినతరం చేస్తా. పన్నులు తగ్గిస్తా. సంక్షేమ పథకాల కోసం 50 బిలియన్‌ యూరోలను ఖర్చుచేస్తా’’ అని హామీలు గుప్పించారు.ఒలాఫ్‌ షోల్జ్‌..సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ నేత అయిన ఒలాఫ్‌ షోల్జ్‌ ఇప్పటికే మూడేళ్లకు పైగా దేశ చాన్స్‌లర్‌గా సేవలందించారు. అయితే కూటమి సర్కార్‌ను నిలబెట్టుకోలేకపోయారు. రెండు నెలల క్రితం బలపరీక్షలో ఓడిపోయారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రత్యక్షంగా జర్మనీ ఆర్థికవ్యవస్థపై విపరిణామాలు చూపడంతో ఒలాఫ్‌ షోల్జ్‌ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింది. అది చివరకు ప్రభుత్వం కూలడానికి కారణమైంది. గత ఏడాది జరిగిన విశ్వాస పరీక్షలో 733 మంది సభ్యులున్న సభలో కేవలం 207 ఓట్లు సాధించడం తెల్సిందే. దీంతో అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్‌ పార్లమెంట్‌ను రద్దుచేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు.ఎలీస్‌ వీడెల్‌..2013లో ఏఎఫ్‌డీ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి పార్టీ తరఫున చాన్స్‌లర్‌ పదవి కోసం 46 ఏళ్ల నాయ కురాలు ఎలీస్‌ వీడెల్‌ పోటీపడుతున్నారు. ఈమెకు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మద్దతు ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇటీవల మ్యూనిక్‌కు వచ్చిన ప్పుడు ఈమెతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈమె కు యువతలో పెద్ద క్రేజ్‌ ఉంది. ‘‘వలసలు.. ఇమ్మిగేషన్‌కు విరుగుడుగా రిమిగ్రేషన్‌(తిరిగి పంపేయడం) తీసుకొస్తా. జర్మనీపై రష్యా ఆంక్షలను ఎత్తేసేలా కృషిచేస్తా. ధ్వంసమైన నార్డ్‌ స్ట్రీమ్‌ పైప్‌లైన్‌ను పునరుద్ధరిస్తా’’ అని ఎలీస్‌ పలు ఎన్నికల హామీ గుప్పించారు. రాబర్ట్‌ హబెక్‌..మూడు దశాబ్దాల క్రితం పర్యావరణ ఉద్యమంగా మొదలైన రాజకీయ పార్టీగా అవతరించిన ‘ది గ్రీన్స్‌/అలయన్స్‌ 90’ పార్టీకి సారథ్యం వహిస్తున్న 55 ఏళ్ల రాబర్ట్‌ హబెక్‌ సైతం చాన్స్‌లర్‌ రేసులో నిలిచారు. షోల్జ్‌ ప్రభుత్వంలో ఈయన వైస్‌ ఛాన్స్‌లర్‌గా, ఆర్థికశాఖ మంత్రిగా సేవలందించారు. ‘‘పునరుత్పాదక ఇంధన విధానాలకు పట్టం కడతా. అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌కు సాయం కొనసాగిస్తా. అణువిద్యుత్‌ శక్తి ఉత్పత్తిని తగ్గిస్తా. పవన విద్యుత్‌కు పాతరేస్తా’’ అని ఎన్నికల హామీ ఇచ్చారు. సారా వాగెన్‌ కనెక్ట్‌రష్యాకు మద్దతు పలుకుతూ తూర్పు జర్మనీలో బలమైన ఓటు బ్యాంక్‌ను సాధించిన ‘ది సారా వాగెన్‌ కనెక్ట్‌ –రీజన్‌ అండ్‌ జస్టిస్‌ పార్టీ(బీఎస్‌డబ్ల్యూ)’ సైతం చాన్స్‌లర్‌ పదవిపై కన్నేసింది. బీఎస్‌డబ్ల్యూ సహ వ్యవస్థాపకురాలు సారా వాగెన్‌ కనెక్ట్‌ తమ పార్టీ.. ఏఎఫ్‌డీకి అసలైన ప్రత్యామ్నాయ పార్టీ అని చెబుతున్నారు. ఏఎఫ్‌డీ తరహాలోనే అక్రమ వలసలపై బీఎస్‌డబ్ల్యూ పార్టీ ఉద్యమిస్తోంది. అయితే ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు అనుకూలంగా మాట్లాడుతుండటంతో ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కష్టమని అంచనాలు వెలువడ్డాయి. ఓటింగ్‌ ఎలా చేపడతారు?18 ఏళ్లు దాటిన వారంతా ఓటేయొచ్చు. అయితే ప్రతి ఒక్కరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 299 పార్లమెంట్‌ నియోజకవర్గాల కోసం ఒక ఓటు వేయాలి. దేశంలో 16 రాష్ట్రాలు ఉండగా ఓటరు తన సొంత రాష్ట్రం కోసం మరో ఓటు వేయాల్సి ఉంటుంది. రెండో ఓటులో కనీసం 5 శాతం ఓట్లను సాధించిన పార్టీ సభ్యులకు నేరుగా పార్లమెంట్‌లో సభ్యత్వం కోరే అర్హత ఉంటుంది. సంస్కరించిన పోలింగ్‌ విధానాన్ని తొలిసారిగా ఈ ఏడాది నుంచే అమలుచేయనున్నారు. దీంతో పార్లమెంట్‌లో ఇన్నాళ్లూ ఉన్న 733 సీట్లు తగ్గిపోయి 630కి చేరుకోనున్నాయి. అత్యధిక సీట్లను సాధించిన పార్టీ లేదా కూటమి నుంచి చాన్స్‌లర్‌ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం తాత్కాలికంగా అధికారంలో ఉంది. ఈసారి సీడీయూ, సీఎస్‌యూ కూటమి విజయం సాధించవచ్చని ఎన్నికల పండితులు విశ్లేషిస్తున్నారు.– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Severe shortage of immunoglobulins in government hospitals across AP7
గాల్లో దీపంలా పేదల ప్రాణాలు

టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలోని పేదల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అత్యవసర చికిత్సకు మందులు కరువయ్యాయి. కొద్దిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జీబీఎస్‌ కేసుల నమోదు పెరిగింది. దీంతోపాటు మరికొన్ని ఇమ్యూన్‌ వ్యాధుల చికిత్సలో వాడే ఇమ్యూనోగ్లోబిలిన్స్‌ ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉండటం లేదు.సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలోని పేదల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అత్యవసర చికిత్సకు మందులు కరువయ్యాయి. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా గులియన్‌ బారె సిండ్రోమ్‌ (జీబీఎస్‌) కేసుల నమోదు పెరిగింది. దీంతోపాటు మరికొన్ని ఇమ్యూన్‌ వ్యాధుల చికిత్సలో వాడే ఇమ్యూనో గ్లోబిలిన్స్‌ ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉండటం లేదు. సోమవారం నాటికి కర్నూలు, విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం, తిరుపతి, నంద్యాల, విజయనగరం, పాడేరు, మరికొన్ని జీజీహెచ్‌ల్లో ఇమ్యునో గ్లోబులిన్‌ ఇంజెక్షన్ల నిల్వలు “సున్నా’గా ఉన్నాయి. గడిచిన ఐదు, ఆరు నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొందని ఆయా ఆస్పత్రుల్లోని వైద్యాధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్య సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) నుంచి సరఫరా నిలిచిపోయిందని ప్రభుత్వానికి పలుమార్లు తెలియజేశామని చెబుతున్నారు. రాష్ట్రంలో జీబీఎస్‌ కేసులు క్రమంగా పెరుగుతుయని, ఈ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లు పలుమార్లు చెప్పడంతో ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్న రెండు, మూడు ఆస్పత్రుల నుంచి మిగిలిన వాటికి చాలీచాలనట్టుగా సర్దుబాటు చేసే పనిలో వైద్య శాఖ నిమగ్నమైంది.కేసులన్నీ రిఫర్‌ ప్రతి వెయ్యి మందిలో ఒకరు ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌కు గురవుతారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. జీబీఎస్‌ బారినపడిన వారిలోను స్వీయ రోగనిరోధక శక్తి దెబ్బతిని ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడం కోసం చికిత్స సమయంలో ఇమ్యూనో గ్లోబులిన్స్‌ థెరపీ ఇస్తుంటారు. ప్రైవేట్‌లో ఈ ఇంజెక్షన్‌ ఖరీదు రూ.40 వేల వరకు ఉంటోంది. ఇంత ఖరీదైన ఇంజెక్షన్లను కొనుగోలు చేసి, చికిత్స చేయించుకోవడం పేద, మధ్యతరగతి ప్రజలకు స్తోమతకు మించిన వ్యవహారం. ఇక జీబీఎస్‌తో పాటు, ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌తో బాధపడే చిన్న పిల్లలు... బోధనాస్పత్రుల్లో చేరిన సందర్భాల్లో చికిత్సకు ఇమ్యూనో గ్లోబులిన్స్‌ అందుబాటులో లేక ఆ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్న ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. కేవలం ఈ కారణంతో గడిచిన ఐదారు నెలలుగా అనేక కేసులను విజయవాడ, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, మచిలీపట్నం ఆస్పత్రుల నుంచి గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్‌ చేసినట్టు వెల్లడైంది. ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పాడేరు ఆస్పత్రుల నుంచి విశాఖకు, కర్నూలు ఆస్పత్రికి అనంతపురం, కడప తదితరాల నుంచి రిఫరల్‌ కేసులు పెరగడంతో ఈ ఆస్పత్రుల్లో ఇంజెక్షన్ల కొరత నెలకొన్నట్టు తెలుస్తోంది. ప్రాణాలతో చెలగాటంవైద్యశాఖలో ఏఐ వినియోగం పెరగాలి.. రోగులకు వైద్య సేవలు మరింత చేరువవ్వాలి... అంటూ సీఎం చంద్రబాబు ఊదరగొడుతుంటారు. అయితే, ఆయన చెబుతున్న మాటలకు.. చేతలకు అస్సలు పొంతన కుదరట్లేదు. అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రులకు వెళితే కనీసం మందులు కూడా అందుబాటులో లేని దీనావస్థలో ఆస్పత్రులను నెట్టేశారు. మెరుగైన వైద్యం కోసం కాకుండా.. కేవలం ఇంజెక్షన్లు, మందులు లేవన్న కారణంతో రోగులను ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి రిఫరల్‌ పేరిట ప్రభుత్వమే బంతాట ఆడుతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. దీంతో చికిత్సల్లో కాలయాపన జరుగుతోంది. వెరసి రోగులు ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు. మరోవైపు సకాలంలో చికిత్సలు అందక అమాయకులు మృత్యువాత పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఆ ఇంజక్షన్‌ ఇవ్వడంలేదుగులియన్‌ బారె సిండ్రోమ్‌ (జీబీఎస్‌) అంటువ్యాధి కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. సోమవారం జీబీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జనవరిలో 43 కేసులు నమోదు కాగా వారిలో 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో 749 ఇమ్యూనో గ్లోబులిన్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.అయితే ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద నెట్‌ వర్క్‌ ఆస్పత్రులు ఈ ఇంజక్షన్‌ను ఇవ్వడానికి ముందుకురావడంలేదన్నారు. గత ఏడాది 10 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 301 కేసులు నమోదు కాగా, వీటిలో అధిక మొత్తంలో 115 కేసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదయ్యామని వెల్లడించారు.

Sakshi Guest Column On ISRO8
గరుడుడి రెక్కలు తొడిగిన ఇస్రో!

అంతరిక్ష రంగంలో స్వావలంబన సాధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. భారత్‌ సొంతంగా తయారు చేసుకున్న క్రయోజెనిక్‌ ఇంజిన్‌ సీఈ–20ని తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న పరిశోధన శాలలో విజయవంతంగా పరీక్షించారు. అంతరిక్షంలోని శూన్య పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి జరిపిన ఈ ప్రయోగం క్రయోజెనిక్‌ టెక్నాలజీ ప్రస్థానంలో ముఖ్యమైంది. దాని ప్రాముఖ్యం తెలుసుకునేందుకు చిన్న పోలికను చూద్దాం. వాహనం నడిపేటప్పుడు... వాలుగా ఉన్న రహదారి కనిపించిన వెంటనే చాలామంది మోటర్‌ను ఆఫ్‌ చేస్తూంటారు. గురుత్వాకర్షణ శక్తి ఆధారంగానే వాహనం వేగం పుంజుకుంటుంది. వాలు మొత్తం పూర్తయిన తరువాతే మళ్లీ మోటర్‌ను ఆన్‌ చేయడం కద్దు. అచ్చం ఇలాగే ఉపగ్రహాలను అంతరిక్షంలో వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టేందుకు ఇంజిన్‌ను ఆన్‌/ఆఫ్‌ చేయాల్సి వస్తూంటుంది. అంగారక గ్రహం పైకి ఇస్రో ప్రయోగించిన ‘మంగళ్‌యాన్‌’నే ఉదాహరణగా తీసుకుంటే... ప్రయోగం తరువాత దీని ఇంజిన్‌ను సుమారు పది నెలల విరామం తరువాత ఆన్‌ చేశారు. ఇలా ఎప్పుడు కావాలిస్తే అప్పుడు ఆన్‌/ఆఫ్‌ చేసుకోగల ఇంజిన్‌ ఇస్రో వద్ద ప్రస్తుతానికి ఒక్కటే ఉంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి ఏడున జరిగిన ప్రయోగానికి ప్రాధాన్యం ఏర్పడుతుంది. సీఈ–20యూ ఇంజిన్‌ ప్రయోగంలో... అనుకున్నట్టుగానే పనిచేసింది. రీ స్టార్ట్‌ చేయాల్సినప్పుడు ఇంధన ట్యాంకుపై ఉండే పీడన పరిస్థితులను అనుకరించి మరీ ప్రయోగం నిర్వహించారు. మరిన్ని ప్రయోగాలు చేపట్టిన తరువాత మాత్రమే దీన్ని ఉపగ్రహ ప్రయోగ రాకెట్లలో ఉపయోగిస్తారు.బాగా పీడనానికి గురిచేసిన గాలిని ఒక్కసారిగా వదిలామను కోండి... న్యూటన్‌ మూడో సూత్రం ప్రకారం గాలి ఉన్న ట్యాంకు వ్యతిరేక దిశగా వేగమందుకుంటుంది. ఇదే పద్ధతిలో వేడి వాయువును ఉత్పత్తి చేసి ఒక చిన్న నాజిల్‌ గుండా విడుదల చేయడం ద్వారా వాహనాన్ని నడిపించవచ్చు. మండించేందుకు ఇంధనంతో పాటు ఆక్సిజన్‌ అవసరం ఉంటుంది. వీటినే మనం ఇంగ్లీషులో ‘ప్రొపెల్లంట్స్‌’ అని పిలుస్తూంటాం. రాకెట్‌ ప్రొపెల్లంట్స్‌ ప్రధానంగా ఘన, ద్రవ, వాయు అని మూడు రకాలు. ఘన ఇంధనం స్థానంలో కిరోసిన్‌ను, దీనికి సరిపోయే ఆక్సిడైజర్‌ ఒకదాన్నీ వాడుకోవచ్చు. సీఈ–20 ద్రవ ఇంధనంతో నడిచే రాకెట్‌. వాయువులతో పోలిస్తే ఘన, ద్రవ ఇంధనాలు రెండూ తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి.ద్రవంగా ఉన్నప్పటి కంటే నీరు వాయువుగా ఉన్నప్పుడు పదహారు రెట్లు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఈ కారణంగానే క్రయోజెనిక్‌ ఇంజిన్లలో వాడే ఇంధనాన్ని బాగా చల్లబరుస్తారు. సైన్స్‌ పరిభాషలో మైనస్‌ 153 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రత (మీథేన్‌ వాయువు మరిగే ఉష్ణోగ్రత)ను ‘క్రయో’ అని పిలుస్తారు. ‘క్రయో జెనిక్‌’ ఇంధనంగా వాడే ద్రవ హైడ్రోజన్‌ ‘–253 డిగ్రీల’ ఉష్ణోగ్రతల్లో ఉంటుంది. ద్రవ ఆక్సిజన్‌ ‘–183 డిగ్రీల’. ఈ రెండూ కలిసినప్పుడు రసాయనిక చర్య జరిగి ఆవిరి ఉత్పత్తి అవుతుంది. ఈ వాయువు ఎంత తేలికగా ఉంటే... వేగం పెరగడం అంత ఎక్కువగా ఉంటుంది. హైడ్రోజన్‌ అత్యంత తేలికైన మూలకం కాబట్టి ఇది సమర్థమైన క్రయోజెనిక్‌ ఇంధనం. కాబట్టే దీన్ని అంతరిక్ష ప్రయోగాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూంటారు. జాబిల్లి లేదా సుదూర గ్రహాలను అందుకునేందుకు ఈ క్రయోజెనిక్‌ ఇంజిన్లు, ఇంధనాలు బాగా ఉపయోగపడతాయి. భూ వాతావరణానికి అవతల మాత్రమే ఉపయోగించే ఈ క్రయోజెనిక్‌ ఇంజిన్లతో పనిచేసిన అనుభవం ప్రస్తుతానికి అమెరికా, రష్యా, జపాన్, భారత్, ఫ్రాన్స్, చైనాలకు మాత్రమే ఉంది. భూమి నుంచి వంద కిలోమీటర్లకు అవతల ఉన్న ప్రాంతాన్ని అంతరిక్షం అంటాం. క్రయోజెనిక్‌ ఇంజిన్లు బాగా సమర్థ మంతమైన వే అయినప్పటికీ వీటిని భూమ్మీది నుంచే వాడుకోవడం కష్టతరమవుతుంది. ఎందుకంటే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తిని అధిగ మించేందుకు చాలా ఎక్కువ బలం కావాలి.ట్రాఫిక్‌సిగ్నల్‌లో పచ్చలైట్‌ పడిన వెంటనే మనం ఏం చేస్తాం? వీలైనంత వేగంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాం. ఇందుకు మంచి పికప్‌ ఉన్న ఇంధనం అవసరం. అదే మీరు హైవేపై దూరం వెళుతున్నారనుకోండి... బాగా మైలేజీ ఇచ్చే ఇంజిన్‌ కావాలి. పెట్రోలు వాహనాలకు పికప్‌ బాగుంటే... డీజిల్‌ ఇంజిన్‌కు మైలేజీ ఎక్కువన్నది మనకు తెలుసు. ఇదే మాదిరిగా అంతరిక్ష ప్రయోగాల మొదట్లో జడత్వాన్ని అధిగమించి ఆకాశంలోకి ఎగబాకగలిగే, గురుత్వాకర్షణతో పోటీపడి ముందుకు దూసుకెళ్లే... వాతావరణం తాలూకూ ప్రభావాన్ని అధిగమించగలిగే ఇంజిన్‌ అవసరం. వీటన్నింటికీ ఘన లేదా ద్రవ ఇంధనాలు బాగుంటాయి. అయితే అంతరిక్షంలోకి చేరిన తరువాత మాత్రం మైలేజీ బాగా ఉండే ఇంజిన్‌ కావాలి. గతంలో సోవియట్‌ యూనియన్, అమెరికాలు రెండూ అత్యంత శక్తిమంతమైన లాంచ్‌ వెహికల్స్‌ తయారీలో పోటీపడ్డాయి. ఆ క్రమంలోనే జాబిల్లిని కూడా అందుకున్నాయి. గ్రహాలను దాటగల అంతరిక్ష వాహనాలను సిద్ధం చేయగలిగాయి. 1963లో తొలి క్రయోజెనిక్‌ రాకెట్‌ ఇంజిన్‌ ‘ఆర్‌ఎల్‌–10’ ప్రయోగం జరిగింది. ఈ క్రయో జెనిక్‌ను అమెరికా ఇప్పటికీ ఉపయోగిస్తోంది. సోవియట్‌ విషయానికి వస్తే... ఇది ‘ఆర్‌డీ–56’ లేదా ‘11డీ–56’ అనే క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను 1964లో తయారు చేసింది. తరువాతి కాలంలో సెమీ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ తయారీపై రష్యా దృష్టి పెట్టింది. ఫలితంగా అత్యంత శక్తిమంతమైన, కిరోసిన్, ఆక్సిజన్‌లను ఇంధనంగా వాడుకోగల ఆర్‌డీ–18 ఇంజిన్‌ తయారైంది. దీంతోపాటే తయారైన మరో మెరుగైన డిజైన్‌ కలిగిన క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ‘కేవీడీ–1’ రష్యా మనకు అమ్మింది. 1990ల నాటికి ఇస్రో కూడా క్రయోజెనిక్‌ టెక్నాలజీకై ప్రయత్నాలు మొదలుపెట్టింది. జపాన్, అమెరికాలను ఇవ్వమని కోరింది కూడా. అయితే ఇంజిన్లు అమ్మడంతోపాటు తయారీ టెక్నాలజీని కూడా అందించేందుకు సోవియట్‌ ముందుకు రావడంతో ఇస్రో దానిని అందిపుచ్చుకుంది. కొంత కాలానికే సోవియట్‌ కాస్తా ముక్కలయింది. రష్యాపై అమెరికా ఒత్తిడి తీసుకొచ్చి భారత్‌కు క్రయోజెనిక్‌ టెక్నాలజీ ఇవ్వరాదని కట్టడి చేసింది. ఈ టెక్నాలజీతో భారత్‌ అణ్వాస్త్రాలు తయారు చేస్తుందన్నది అమెరికా భయం. అయితే ఈ వాదన చాలా అసంబద్ధమైంది. ఎందుకంటే క్షిపణులను అవసరమైనప్పుడు క్షణాల్లో ప్రయోగించేలా ఉండాలి. కానీ ఒక క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను ఆన్‌ చేయాలంటే కనీసం 24 గంటల ముందు నుంచి దాంట్లో ఇంధనం నింపాల్సి ఉంటుంది. అంతేకాదు... కొన్ని నెలల క్రితమే అధిక ధరలకు ఈ ఇంజిన్లను అమ్మేందుకు అమెరికానే ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రష్యా తనపై అమెరికా ఒత్తిడిని కాదని ఆరు ఇంజి న్లను మనకు అప్పగించింది. కానీ.. టెక్నాలజీని ఇవ్వలేకపోయింది.ఈ సమయంలోనే ఇస్రోపై కూడా అమెరికా నిషేధం విధించింది. ఆ పరిస్థితుల్లో ఇస్రో తన వద్ద ఉన్న ఆరు ఇంజిన్లను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా సీఈ–20ని తయారు చేసింది. ఈ డిజైన్‌ రష్యా ఇంజిన్‌కు నకలు కాకపోవడం విశేషం. ఎందుకంటే రష్యా ఇచ్చిన ఇంజిన్‌లో ఇంధనం మండటం అన్నది దశలవారీగా జరుగుతుంది. సీఈ–20 మాత్రం దీనికి భిన్నం. ఇది గ్యాస్‌ జనరేటర్‌ తరహాలో పనిచేస్తుంది. ఏళ్లపాటు కష్టపడి తయారు చేసిన ఈ సీఈ–20ని మొదటిసారి 2017 జూన్‌ 5న∙జీశాట్‌–19 ప్రయో గంలో ఉపయోగించారు. అలాగే చంద్రయాన్‌–2, 3 లాంచ్‌ వెహికల్స్‌లోనూ అమర్చారు. తాజా ప్రయోగాల ద్వారా దీన్ని అవసరమైనప్పుడు ఆన్‌/ఆఫ్‌ చేసే సామర్థ్యం అందడంతో భవిష్యత్తులో ఈ ఇంజిన్‌ను గ్రహాంతర ప్రయాణాలకూ వాడుకునే వీలు ఏర్పడింది.టీవీ వెంకటేశ్వరన్‌ వ్యాసకర్త విజిటింగ్‌ ప్రొఫెసర్, ఐసర్‌ – మొహాలీ

Vallabhaneni Vamsi Bail Petition Filed In Court9
వంశీ అరెస్ట్‌ ముందస్తు వ్యూహమే

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను అరెస్ట్‌ ముందస్తు వ్యూహమే. ఆయన్ని∙అరెస్టు చేయాలని, జైల్లో పెట్టాలని ముందుగానే కొందరు తీసుకున్న నిర్ణయాన్ని విజయవాడ పోలీసులు అమలు చేశారు. వంశీపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ చేయకుండానే కేసులు పెట్టారు. ఇదంతా ఆయన్ని ఉద్దేశపూర్వకంగా కేసుల్లో ఇరికించేందుకు పన్నిన కుట్ర మాత్రమే.వీటన్నింటినీ పరిశీలించి బెయిల్‌ మంజూరు చేయండి’ అని వంశీ తరపున దాఖలు చేసిన బెయిల్‌పిటిషన్‌లో న్యాయవాది తానికొండ చిరంజీవి కోరారు. ‘రెండేళ్ల క్రితం గన్నవరంలో జరిగిన ఓ ఘటనపై సత్యవర్ధన్‌ అనే వ్యక్తి వల్లభనేని వంశీమోహన్, మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదును ఈ నెల పదో తేదీన న్యాయమూర్తి ఎదుట వాపసు తీసుకున్నాడు. అతన్ని వంశీ బెదిరించి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేశాడంటూ అతని సోదరుడు కిరణ్‌ ఈ నెల 12న పటమట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదు చేసిన కిరణ్‌ను, బాధితుడిగా అందులో పేర్కొన్న సత్యవర్ధన్‌ను విచారించకుండానే అదే రోజు హడావుడిగా కిడ్నాప్, ఎక్స్‌ట్రాక్షన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం విజయవాడ పోలీసులకే చెల్లింది. అదే రోజు (12వ తేదీ) రాత్రే విజయవాడ పోలీసులు హైదరాబాద్‌ చేరుకున్నారు. వంశీ ఇంటి వద్ద రాత్రంతా పహారా కాసి 13వ తేదీ తెల్లవారుజామునే బెడ్‌రూంలో ఉన్న ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం విజయవాడ భవానిపురం పోలీస్‌ స్టేషన్‌కు తెచ్చారు. అక్కడి నుంచి కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి రాత్రి 9 గంటల వరకు విచారణ పేరుతో కూర్చోబెట్టారు. ఆ తరువాత న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఇదంతా కొందరు పెద్దల మెప్పు కోసం పోలీసులు పడిన ఆరాటం మాత్రమే.పోలీసుల అభియోగంలో ఎలాంటి వాస్తవం లేదు. సత్యవర్థన్‌తో పోలీసులు బలవంతంగా సెకండ్‌ ఏసీఎంఎం కోర్టులో వాంగ్మూలం చెప్పించినట్లు అనుమానాలు ఉన్నాయి. సత్యవర్ధన్‌ను బెదిరించేందుకు వంశీ, అతని అనుచరులు ఓ వ్యక్తిని పురమాయించినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అదే నిజమైతే అసలైన ఆ నిందితుడు ఎక్కడున్నాడు? ఈ కేసు పూర్తిగా కల్పితమనడానికి ఇదే నిదర్శనం. కొన్నేళ్లుగా వంశీ అనారోగ్యంతో, టెయిల్‌ బోన్‌ గాయంతో బాధపడుతున్నారు.కరోనా సమయం నుంచి బ్రీతింగ్‌ సమస్యలు ఉన్నాయి. నేలపై కూర్చోవడం, పడుకోవడానికి కష్టంగా ఉంటుంది. అందువల్ల ఆయనకు వెంటనే బెయిల్‌ ఇవ్వండి’ అని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈలోగా ఆయనకు టాయిలెట్, బెడ్, ఇంటి నుంచి ఆహారం, మందుల సౌకర్యం కల్పించాలని కోరారు. జైల్లోని బ్యారక్‌లో వంశీని ఒంటరిగా ఉంచి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని, రూమ్‌లో అసిస్టెంట్‌ను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.పది రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్‌ జ్యుడిíÙయల్‌ రిమాండ్‌లో ఉన్న వల్లభనేని వంశీమోహన్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ పోలీసులు కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో వంశీ, అతని అనుచరుల నుంచి మరిన్ని వివరాలను రాబట్టాల్సి ఉందని, పది రోజులు కస్టడీకి అప్పగించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

MCLR is the minimum interest rate banks use for loans10
ఈఎంఐలు..  ఇప్పట్లో తగ్గేనా?

ఆర్‌బీఐ చాలా కాలం తర్వాత కీలకమైన రెపో రేటు ను 25 బేసిస్‌ పాయింట్లు (0.25 శాతం) తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో హమ్మయ్య రుణ రేట్లు తగ్గుతాయని, నెలవారీ ఈఎంఐ చెల్లింపుల భారం దిగొస్తుందని ఆశపడే వారు.. కొంత కాలం పాటు వేచి చూడక తప్పేలా లేదు. రెపో రేటు కోత ప్రభావం రుణాలు, డిపాజిట్లపై పూర్తిగా ప్రతిఫలించేందుకు కొన్ని నెలల సమయం తీసుకోవచ్చని విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రస్తుతం బ్యాంకింగ్‌ రంగంలో ద్రవ్య లభ్యత కొరత (లిక్విడిటీ) ఉండడాన్ని, డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంక్‌ల మధ్య నెలకొన్న తీవ్ర పోటీని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) ఆధారంగా మంజూరయ్యే రుణాలతోపాటు, డిపాజిట్లపై రేటు తగ్గింపు వెంటనే అమల్లోకి రాకపోవచ్చని.. అదే సమయంలో రెపో ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపు వేగంగా బదిలీ అవుతుందని చెబుతున్నారు. కొంత సమయం తర్వాతే.. ‘‘తాజా రేటు తగ్గింపు ప్రయోజనం కొత్త రుణాలపై అమలయ్యేందుకు కొంత సమయం తీసుకోవచ్చు. ఎందుకంటే డిపాజిట్ల కోసం పోటీ కారణంగా నిధులపై బ్యాంకులు అధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది’’అని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అజిత్‌ వెలోనీ తెలిపారు. ఫ్లోటింగ్‌ రేటు రుణాలపై ఆర్‌బీఐ రేటు తగ్గింపు వేగంగా అమల్లోకి వస్తుందన్నారు. బ్యాంకు రుణాల్లో 40 శాతం మేర రెపో ఆధారిత రుణాలు ఉన్నట్టు చెప్పారు. ఆర్‌బీఐ నిర్ణయంతో రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగిరావడం తెలిసిందే. మరోవైపు సమీప భవిష్యత్‌లో లిక్విడిటీ పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లిక్విడిటీ పెంచే అదనపు చర్యలను ఆర్‌బీఐ తీసుకోకపోతే మార్చి నాటికి వ్యవస్థ వ్యాప్తంగా రూ.2.5 లక్షల కోట్ల లోటు ఏర్పడొచ్చని అంటున్నారు. అప్పుడు ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు బదిలీకి మరింత సమయం పట్టొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపునకు రెండు త్రైమాసికాల సమయం తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఈ రుణాల రేట్లను బ్యాంక్‌లు ఆర్నెళ్లకోసారి సమీక్షించడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. దీంతో బ్యాంక్‌లు జూలై లేదా వచ్చే డిసెంబర్‌లో ఈ రుణాల రేట్లను సవరించే అవకాశం ఉంటుంది.డిపాజిట్లపై.. ఇప్పటికే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసిన వారికి తాజా రేటు తగ్గింపుతో ఎలాంటి ప్రభా వం పడదు. కొత్తగా డిపాజిట్‌ చేసే వారికి రేటు తగ్గే అవకాశాలున్నాయి. కాకపోతే వెంటనే కాకుండా క్రమంగా డిపాజిట్లపై ఈ మార్పు కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిపాజిట్ల కోసం బ్యాంక్‌ల మధ్య పోటీ ఉన్నందున రేట్లను వెంటనే తగ్గించకుండా, ఆర్‌బీఐ చర్యలతో లిక్విడిటీ మెరుగయ్యాకే డిపాజిట్లపై రేట్లు తగ్గించొచ్చని భావిస్తున్నారు. ‘‘ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్స్‌ అనుసంధానిత రుణాలపై రేట్ల మార్పు ప్రభావం వెంటనే అమల్లోకి రావచ్చు. ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై అమలు కావడానికి కొంత సమయం తీసుకోవచ్చు. మానిటరీ పాలసీ రేట్ల ప్రభావం డిపాజిట్లపై ప్రతిఫలించేందుకు కూడా రెండు త్రైమాసికాలు పట్టొచ్చు’’అని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ స్వామినాథన్‌ పేర్కొనడం గమనార్హం. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
MATA అధ్యక్షుడిగా రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి

డల్లాస్, టెక్సాస్: అమెరికాలోని ప్ర‌ముఖ తెలుగు సంఘం 'మన అమెర

title
ఇజ్రాయెల్‌లో తెలుగువారి ఇక్కట్లు

ఆర్మూర్‌: తెలంగాణ‌ ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ప్రవేశపెట్టిన టామ్‌కామ్‌ (TOMCOM) ద్వారా ఇజ్రాయెల్‌ (Israel)

title
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ దశాబ్ద వేడుకలు

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA)  దశాబ్ద వేడుకలు డిసెంబర్‌లో జరగనున్నాయి.

title
USA: ‘మాట’ నూతన కార్యవర్గం ఎన్నిక

డల్లాస్‌: మాట (మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) బోర్డు మీటిం

title
ప్రధాని మోదీతో మస్క్‌-శివోన్‌ పిల్లల అల్లరి

వాషింగ్టన్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజా అమెరికా పర్యటనలో

Advertisement
Advertisement