Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP Govt officials colluded to Loot with close contractors in capital tenders1
సిండికేటు లూటీ!

సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కాజేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు తమకు సన్నిహితులైన కాంట్రాక్టర్లతో సిండికేట్‌ను ఏర్పాటు చేసి రాజధాని నిర్మాణ పనులను అధిక ధరలకు కట్టబెడు­తున్నారు. మొన్న.. రూ.10,696.79 కోట్ల వ్యయంతో 37 ప్యాకేజీల కింద రాజధాని ముంపు నివా­రణ, రహదారుల నిర్మాణంలో మిగిలిన పనులకు అమరావతి డెవలప్‌­మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏడీసీఎల్‌) నిర్వహించిన టెండర్లలో సిండికేట్‌ బాగోతం బట్టబయలైంది. నేడు.. రూ.16,463.83 కోట్ల వ్యయంతో 22 ప్యాకేజీల కింద భూసమీకరణ ద్వారా భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు లేఅవుట్ల అభివృద్ధి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌.. మంత్రులు, జడ్జిలు, ఐఏఎస్‌ అధికారులకు బంగ్లాల నిర్మాణ పనులకు సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ఖరారు చేసిన టెండర్లలోనూ ప్రభుత్వ పెద్దల లాలూఛీ బాగోతం మరోసారి బట్టబయలైంది. ఏడీసీఎల్, సీఆర్‌డీఏ రెండు కలిసి రూ. రూ.27,160.62 కోట్ల కాంట్రాక్టు విలువతో 59 ప్యాకేజీల కింద పనులకు టెండర్లు పిలిచాయి. ఈ పనులను రూ.28,209.62 కోట్లకు సిండికేట్‌లోని ఎనిమిది కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వ పెద్దలు పంచి పెట్టారు. కాంట్రాక్టు విలువ కంటే సగటున 3.94 నుంచి 4.34 శాతం అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై రూ.1,049 కోట్లు భారం మోపారు. అదే రివర్స్‌ టెండరింగ్‌ విధానం అమల్లో ఉండి ఉంటే కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి కనీసం 8 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చేవారని.. దీనివల్ల ఖజానాకు రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల మేర ఆదా అయ్యేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సిండ్ఙికేటు’ రాజ్యం..!రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలవక ముందే సన్నిహిత కాంట్రాక్టు సంస్థలతో ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపారు. ఆ కాంట్రాక్టర్లతో సిండికేట్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 2014–19 మధ్య షాపూర్‌జీ పల్లోంజీ కాంట్రాక్టు సంస్థ నుంచి ముఖ్యనేత తరఫున కమీషన్లు వసూలు చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సాక్ష్యాధారాలతో పట్టుబడిన అధికారే ఇప్పుడూ ప్రభుత్వ పెద్దల తరఫున సిండికేట్‌ కాంట్రాక్టర్లతో చక్రం తిప్పుతున్నారు. సిండికేట్‌లోని కాంట్రాక్టర్ల ప్రతిపాదన మేరకే వారికి అధికంగా పనులు కట్టబెట్టేందుకు వీలుగా బిడ్‌ కెపాసిటీని 2 ఎన్‌ఎన్‌–బీ నుంచి 3 ఏఎన్‌–బీకి పెంచుతూ ఫిబ్రవరి 10న ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయించారు. అంతకు ముందే అంచనాలను ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి, సిండికేట్‌ కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్‌ జారీ చేయడానికి వీలుగా జ్యుడీషియల్‌ ప్రివ్యూ విధానాన్ని కూడా రద్దు చేశారు. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్డానికి వీలుగా రివర్స్‌ టెండరింగ్‌ విధానానికి కూడా మంగళం పాడారు. తమ అక్రమాలకు అడ్డొచ్చే వ్యవస్థలు.. విధానాలను అన్నింటినీ రద్దు చేశాకే రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు.పూలింగ్‌ లేఅవుట్ల అభివృద్ధికి రూ.14,887.64 కోట్లు..భూ సమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) పథకం కింద రాజధానికి రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. ఆ పథకం కింద రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలి. అందుకు రహదారులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం వంటి కనీస సదుపాయాలు కల్పించడం ద్వారా లేఅవుట్లను అభివృద్ధి చేయాలి. రాజధానికి భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వడానికే 17 వేల ఎకరాలు భూమి అవసరం. ఇందులో లేఅవుట్ల అభివృద్ధి పనులకు 18 ప్యాకేజీల కింద సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. ఈ పనులన్నింటినీ కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకే సిండికేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగించారు. రూ.14,887.64 కోట్లకు ఆ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్‌ తదితర పన్నుల రూపంలో కాంట్రాక్టర్లకు అదనంగా ఇస్తామని సీఆర్‌డీఏ చెప్పిన మొత్తాన్ని కూడా కలిపితే ఈ పనుల వ్యయం రూ.17 వేల కోట్లకు చేరుతుంది. అంటే ఎకరం భూమిలో లేఅవుట్‌ అభివృద్ధి చేయడానికే సగటున రూ.కోటి చొప్పున వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలే చెబుతున్నాయి. వాస్తవానికి అత్యాధునిక సదుపాయాలతో లేఅవుట్‌ను అభివృద్ధి చేయడానికి ఎకరానికి రూ.50 లక్షలకు మించి వ్యయం కాదని స్పష్టం చేస్తున్నారు. ఇక సీఆర్‌డీఏ ద్వారా ప్రభుత్వమే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి దిగుతూ చేపట్టిన హ్యాపీ నెస్ట్‌ ప్రాజెక్టు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌.. మంత్రులు, జడ్జీలకు బంగ్లాలు.. ఐఏఎస్‌లకు బంగ్లాల నిర్మాణ పనులను నాలుగు ప్యాకేజీల కింద కాంట్రాక్టర్లకు అప్పగించారు.– ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన కృష్ణారెడ్డికి చెందిన మేఘా సంస్థకు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద లే అవుట్లు అభివృద్ధి చేసేందుకు సంబంధించిన ఐదు ప్యాకేజీల పనులను కట్టబెట్టారు. ఈ పనుల విలువ రూ.5,608.7 కోట్లు.– ఈనాడు కిరణ్‌ సోదరుడి వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్కు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి నాలుగు పనులను ప్రభుత్వ పెద్దలు అప్పగించారు. ఈ పనుల విలువ రూ.2,813.66 కోట్లు.– బెంగళూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు చెందిన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాకు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద లేఅవుట్లకు సంబంధించి ఎనిమిది ప్యాకేజీల పనులను అప్పగించారు. వీటి విలువ రూ.3,945.47 కోట్లు.– ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఏవీ రంగరాజు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఎన్‌సీసీ సంస్థకు హ్యాపీ నెస్ట్‌తోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌ నిర్మాణం, ఓ ల్యాండ్‌ పూలింగ్‌ లేఅవుట్‌ పని అప్పగించారు. వీటి విలువ రూ.3,438.21 కోట్లు.– మంత్రి నారా లోకేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఆయన తరఫున ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన కనకమేడల వరప్రసాద్‌కు చెందిన కేఎమ్వీ ప్రాజెక్ట్స్కు ఐఏఎస్‌ అధికారుల బంగ్లాల నిర్మాణ పనులు కట్టబెట్టారు.– సీఎం చంద్రబాబుతో ఆది నుంచి సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఎల్‌ అండ్‌ టీ సంస్థకు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద లేఅవుట్‌ అభివృద్ధి చేసే ఒక ప్యాకేజీ పనిని అప్పగించారు.ఎనిమిది సంస్థలకే పనులన్నీ..రాజధాని అమరావతిలో వరద మళ్లింపు, రహదారుల అభివృద్ధి పనులను 37 ప్యాకేజీల కింద చేపట్టేందుకు రూ.15,095.02 కోట్లతో ఏడీసీఎల్‌కు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇక ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద లేఅవుట్ల అభివృద్ధి, హ్యాపీనెస్ట్, మంత్రులు, జడ్జిలు, ఐఏఎస్‌ అధికారుల బంగ్లాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌ నిర్మాణ పనులను 22 ప్యాకేజీల కింద చేపట్టడానికి రూ.22,607.11 కోట్లతో సీఆర్‌డీఏకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ రెండూ మొత్తం 59 ప్యాకేజీల కింద పనులకు టెండర్లు పిలిచాయి. వాటన్నింటినీ సిండికేట్‌లోని ఎనిమిది సంస్థలే దక్కించుకున్నాయి. ఎన్‌సీసీ సంస్థ రూ.6,124.08 కోట్లు, బీఎస్సార్‌ ఇన్‌ఫ్రా రూ.6,216.47 కోట్లు, ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్ రూ.6,031.79 కోట్లు, మేఘా రూ.7,022.38 కోట్లు, ఎమ్వీఆర్‌ ఇన్‌ఫ్రా (నారా లోకేష్‌ తోడల్లుడు విశాఖ ఎంపీ భరత్‌ సన్నిహితుడికి చెందిన సంస్థ)కు రూ.796.04 కోట్లు, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే కృష్ణయ్యకు చెందిన బీఎస్పీసీఎల్‌కు రూ.779.82 కోట్లు, ఎల్‌ అండ్‌ టీ సంస్థకు రూ.809.88 కోట్లు, కేఎమ్వీ ప్రాజెక్ట్స్కు రూ.429.23 కోట్ల విలువైన పనులను కట్టబెట్టబెట్టారు.నీకింత.. నాకింత..సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌ 59 ప్యాకేజీల కింద పనులకు పిలిచిన టెండర్లను ప్రభుత్వం ఆమోదించింది. ఆ పనులను రూ.28,209.62 కోట్లకు ఎనిమిది కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వ పెద్దలు పంచి పెట్టారు. ఆ పనులను అప్పగిస్తూ సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌ వాటితో ఒప్పందం చేసుకున్న వెంటనే కాంట్రాక్టు విలువలో పది శాతం అంటే రూ.2,820.96 కోట్లను ఆ సంస్థలకు మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ముట్టజెబుతాయి. అందులో 8 శాతం అంటే.. రూ.2,256 కోట్లను ప్రభుత్వ పెద్దలు తొలి విడత కమీషన్లుగా రాబట్టుకోనున్నారు. ఇందుకోసమే గత ప్రభుత్వం రద్దు చేసిన మొబిలైజేషన్‌ అడ్వాన్సుల విధానాన్ని పునరుద్ధరించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. సిండికేట్‌ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసే బాధ్యతను గతంలో ఆదాయపు పన్ను శాఖకు చిక్కిన అధికారికే ప్రభుత్వ పెద్దలు అప్పగించినట్లు చర్చ సాగుతోంది.

Villages Governance Sanitation works too Bad Lack of availability of central and state funds2
పల్లెల్లో పడకేసిన పాలన

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ పాలక మండళ్ల పదవీకాలం ముగియడంతో గతేడాది ఫిబ్రవరి నుంచి అంటే దాదాపు 14 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. వారికి ఇతర బాధ్యతలు ఉండటంతో పంచాయతీలపై దృష్టిపెట్టే పరిస్థితి లేదు. పైగా కేంద్ర, రాష్ట్రాల నిధులు ఆగిపోయాయి. దీనితో మెజారిటీ పల్లెల్లో పాలన పడకేసింది. మొత్తం 12,754 గ్రామ పంచాయతీల్లో 30శాతం వరకు జనాభాపరంగా పెద్ద పంచాయతీలు. వాటిలో పన్నుల వసూలు, ఇతర రూపాల్లో కొంత ఆదాయ వనరులు ఉండటంతో.. నెలవారీ ఖర్చులు కొంతవరకు వెళ్లదీసుకోగలిగే స్థితిలో ఉన్నాయి. పారిశుధ్య నిర్వహణ వంటివి చేపట్టగలుగుతున్నాయి. మిగతా 70శాతం పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఆదాయం సరిపోక పంచాయతీ సెక్రెటరీలు, ఇతర అధికారులు అప్పోసప్పో చేసి బండి లాగాల్సి వస్తోంది. అదీ రోజువా రీ నిర్వహణ కోసమే ఇబ్బంది ఎదురవుతోంది. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడ్డాయి. అప్పులు చేసి నడిపించిన సర్పంచులు.. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో చెత్త సేకరణ, ఇతర అవసరాల కోసం ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ ఉండాలనే నిబంధన అమలుచేశారు. దానితో బ్యాంకు రుణాలతో ట్రాక్టర్లు కొన్నారు. ఇప్పుడు వాటి వాయిదాలు చెల్లించలేక, డీజిల్, డ్రైవర్‌ జీతం, ఇతర నిర్వహణ ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది ఎదురవుతోంది. సర్పంచులు ఉన్నప్పుడు తమ సొంత నిధులు ఉపయోగించి, తమ పరప తితో అప్పులు తీసుకుని వచ్చి పారిశుధ్యం, ఇతర పనులు నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి క్రమం తప్పకుండా నిధులు అందేవి. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు వచి్చనా, రాకపోయినా గ్రామాల్లో నెలవారీ ఖర్చులతోపాటు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేవి. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిశాక ఎన్నికలు జరగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సుమారు రూ.1,600 కోట్లు ఆగిపోయాయి. దీనితో సొంత ఆదాయ వనరులు లేని గ్రామాల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులూ అందక.. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి కొన్ని నెలలతోపాటు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నెలలుగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు సరిగా విడుదల కావడం లేదు. పంచాయతీలకు ప్రతినెలా కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల చేస్తామని గత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రతినెలా కేంద్రం ఇచ్చే రూ.220 కోట్లకు మ్యాచింగ్‌గా రూ.220 కోట్లను కొన్నినెలల పాటు ఇచి్చంది. క్రమంగా రాష్ట్ర సర్కారు ఇచ్చే మొత్తం రూ.150 కోట్లకు తగ్గించింది. ఆ తర్వాత మొత్తంగా నిలిచిపోయింది. పంచాయతీలకు ఇవ్వాల్సిన మొత్తం సుమారు రూ.వెయ్యి కోట్లకుపైనే ఉంటుందని అంచనా. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ సందర్భాల్లో గ్రామ పంచాయతీలకు రూ.700 కోట్ల దాకా విడుదల అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనితోపాటు పంచాయతీ సిబ్బంది వేతనాలను గ్రీన్‌చానెల్‌లో చెల్లించేలా చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దీంతో పంచాయతీలపై కొంతమేర అయినా ఆర్థిక భారం తగ్గొచ్చునని భావిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల పాట్లు గ్రామాల్లో సర్పంచులు లేకపోవడం, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ నామమాత్రంగానే ఉంటుండటంతో.. పూర్తి బాధ్యత గ్రామపంచాయతీ కార్యదర్శులపైనే పడుతోంది. దాదాపు 14 నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులేమీ రాకపోవడంతో.. పంచాయతీ పరిధిలో సమకూరే అరకొర ఆదాయంతోనే నెట్టుకొస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సిబ్బందికి జీతాలు, గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణ, మొక్కలకు నీళ్లు పోయడం, తాగునీటి పైపులైన్ల లీకేజీ మరమ్మతులకు, మోటార్లు పాడైతే మరమ్మతులు చేయించడం, ఫాగింగ్, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం వంటి పనులు చేయించడానికి కూడా ఇబ్బంది ఎదురవుతున్న పరిస్థితి. గ్రామాల్లోని వీధుల్లో చెత్తాచెదారాన్ని తీసుకెళ్లి ఊరవతల ఇష్టమొచి్చనట్టుగా పడేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అప్పులు తెచ్చి నడిపిస్తున్నా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 844 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పైసా కూడా అందక అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. రోజువారీ నిర్వహణ కోసం కూడా ఇబ్బంది ఎదురవుతుండటంతో పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల ఆధ్వర్యంలో సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పులు తెచ్చి గ్రామాలను నడుపుతున్నామని, పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని కార్యదర్శులు కోరగా.. పరిశీలిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులు జరగడం లేదు ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామంలో అభివృద్ధి పనులు జరగడం లేదు. సర్పంచులు ఉన్నప్పుడే పనులు ఎంతో కొంత జరిగేవి. ఇప్పుడు ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తోంది. రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. అధికారులను అడిగితే నిధులు లేవని చెబుతున్నారు. – పాలకూరి దుర్గేష్, రెగట్టే గ్రామస్తుడు, కనగల్‌ మండలం, నల్లగొండ జిల్లా రూ.7లక్షలు అప్పు తెచ్చి పెట్టిన.. ప్రస్తుతం గ్రామాల్లో పాలకవర్గాలు లేవు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు. ఏడాదిన్నరగా ప్రజల సమస్యలను తీర్చేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఏడు లక్షల రూపాయలు అప్పుగా తెచ్చి వివిధ పనులకు ఖర్చు చేశాను. – సోమయ్య, అనంతారం గ్రామ కార్యదర్శి జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో 1,500 జనాభా ఉన్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటి నుంచి పంచాయతీలో పాలన అస్తవ్యస్తంగా మారింది. తాగునీటి మోటార్ల మరమ్మతులు, బ్లీచింగ్‌ కొనుగోలు, వీధి దీపాల నిర్వహణ, చెత్త తరలింపు, ట్రాక్టర్‌ కిస్తీ, డీజిల్‌ ఖర్చులకు కూడా ఇబ్బంది ఎదురవుతోంది. ఇప్పటివరకు లక్షకుపైగా అప్పులు తెచి్చ, రోజువారీ నిర్వహణను నెట్టుకొస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి చెబుతున్నారు. వీధి లైట్లు వెలగక.. ఇబ్బందిగా.. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల నుంచి ఎస్సీ హాస్టల్‌ మీదుగా కాసీంపల్లికి వెళ్లే మార్గంలో సుమారు 20 రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. లైట్లు పెట్టించాలని పంచాయతీ అధికారులకు చెబితే.. నిధుల కొరతతో ఇబ్బంది ఉందంటూ జాప్యం చేస్తున్నారు. చీకటి పడిందంటే చాలు ఆ మార్గంలో వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని స్థానికుడు శనిగరపు రంజిత్‌ పేర్కొన్నారు. రోడ్ల నిండా మురుగు పారుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా వలిగొండ మండల కేంద్రంలో పారిశుధ్యం దుస్థితి ఇది. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు నిండిపోయి, మోరీల పైపులు పగిలిపోయి రోడ్లపైన మురుగు పారుతోందని ప్రజలు ఫిర్యాదు చేసినా.. నిధులు లేక ఏమీ చేయలేకపోతున్నామంటూ పంచాయతీ అధికారులు చేతులెత్తేస్తున్న పరిస్థితి ఉంది. గ్రామంలో సుమారు 50 వీధి దీపాలు పని చేయడం లేదని, రాత్రయితే వీధులన్నీ చీకటేనని స్థానికులు చెబుతున్నారు. ‘‘సర్పంచులు పోయినప్పటి నుంచి ఎవరూ పట్టించుకోవడం లేదు. రోడ్లపై మురుగు పారుతున్నా, వీధి దీపాలు వెలగకున్నా.. నిధులు వచ్చాక పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు ఇచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలి’’ అని గ్రామానికి చెందిన నానచర్ల రమేష్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఊరంతా కంపు కొడుతోంది మేజర్‌ గ్రామపంచాయతీ అయిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయింది. మురుగు కాల్వలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. పాలక వర్గాలు లేక, నిధులు లేక అధికారులు పనులేవీ చేయించడం లేదు. ఇక నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లి గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. డ్రైనేజీలకు మరమ్మతులు చేయించలేని దుస్థితి నెలకొంది. గ్రామస్తులు ఇదేమిటని నిలదీస్తే.. రోజువారీ నిర్వహణ కోసమే అప్పులు చేయాల్సి వస్తోందని గ్రామ కార్యదర్శి తలపట్టుకుంటున్నారు. పంచాయతీ కోసం నియమించిన స్పెషలాఫీసర్‌ ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. చెత్త చెదారం నిండి, డ్రెయినేజీలు పూడుకుపోయి గ్రామంతా కంపు కొడుతోందని వాపోతున్నారు. నాలుగైదు లక్షల చొప్పున అప్పులు తెచ్చి పెట్టాం ‘‘గ్రామ పంచాయతీలకు రెండేళ్లుగా నిధులు రాకపోవడంతో ఒక్కో పంచాయతీ నిర్వహణ కోసం ఇప్పటివరకు రూ. నాలుగైదు లక్షలు అప్పులు తెచ్చి పెట్టాం. ట్రాక్టర్‌ డీజిల్, తాగునీటి ఎద్దడి నివారణకు మోటార్లు, పైపులైన్ల రిపేర్లకు అప్పులు తెచ్చి పెడుతున్నాం. నిధులు లేక సక్రమంగా నిర్వహణ చేయలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వమైనా గ్రాంటు విడుదల చేసి సమస్యను పరిష్కరించాలి. – బానోత్‌ రమేశ్‌నాయక్, పంచాయతీ కార్యదర్శుల సంఘం గార్ల మండల అధ్యక్షుడు, మహబూబాబాద్‌ జిల్లా

Review of SLBC tunnel led by CM today3
సొ‘రంగం’ వదిలేస్తారా?

సాక్షి, హైదరాబాద్‌/నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం సరిగ్గా ఎక్కడ కుప్పకూలిందో అక్కడ తవ్వకాలు జరిపేందుకు అవకాశాలు లేవా?.. సహాయక చర్యల్లో పాల్గొంటున్న కొందరు అధికారులు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు. ఇప్పటివరకు సొరంగం పైకప్పు కూలిన ప్రాంతం నుంచి పక్కకు కొట్టుకువచ్చిన బండరాళ్లు, మట్టి, బురద, తుక్కును తొలగించారు. ఇక సొరంగం ఎక్కడైతే కూలిందో అక్కడ శిథిలాలను తొలగించాల్సి ఉండగా, అక్కడ తవ్వకాలు జరిపితే మళ్లీ సొరంగం కుప్పకూలి సహాయక సిబ్బందికి ప్రమాదం వాటిల్లవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సహాయక చర్యలు కొనసాగించాలా? లేక నిలుపుదల చేయాలా? అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. మొత్తం 12 ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా, వారికి తోడుగా రాడార్లు, డ్రోన్లు, రోబోలు, ఎక్సవేటర్లను వాడినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షలో సహాయక చర్యల కొనసాగింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నెలరోజులు గడిచినా.. ఎమ్మార్పి–ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట (ఇన్‌లెట్‌) వద్ద నుంచి 13.94 కిలోమీటర్ల లోపలి వరకు సొరంగం–1 తవ్వకాలు పూర్తయ్యాయి. టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌ (టీబీఎం)తో తవ్వకాలను అక్కడి నుంచి ముందుకు కొనసాగిస్తుండగా గత నెల 22న సొరంగం పైకప్పు కూలి 8 మంది కార్మికులు/ఉద్యోగులు గల్లంతైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగి నెల రోజులు గడిచిపోగా ఇప్పటివరకు ఒక కార్మికుడి మృత దేహాన్ని మాత్రమే వెలికితీయగలిగారు. భూగర్భంలో 400 మీటర్ల దిగువన సొరంగాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పైకప్పు కూలినప్పుడు భారీ పరిమాణంలో బండరాళ్లు, మట్టి, శిథిలాలు ప్రమాద స్థలానికి రెండువైపులా గుట్టల్లా ఏర్పడ్డాయి. బయటికి వెళ్లే మార్గం వైపు పేరుకుపోయిన శిథిలాల తొలగింపు పనులు మాత్రమే చేపట్టగా, శనివారం నాటికి కార్మికుల ఆచూకీకి సంబంధించి డీ1 నుంచి డీ2గా గుర్తించిన ప్రాంతాల వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. దీంతో ఆదివారం కన్వేయర్‌ బెల్ట్‌ నుంచి డీ2 ప్రాంతం దిశగా తవ్వకాలు ప్రారంభించారు. ఈ ప్రాంతాల్లో తవ్వకాలు కొంత ప్రమాదకరమైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుని సింగరేణి రెస్క్యూ బృందాలు సాహసించి పనులు కొనసాగిస్తున్నాయి. కూలిన చోట శిథిలాల కిందే మిగతా కార్మికులు! కేరళ నుంచి రప్పించిన కడావర్‌ డాగ్స్‌ పసిగట్టిన ప్రాంతాలన్నింటిలో తవ్వకాలు పూర్తి చేయగా, డీ2 ప్రాంతంలో ఓ మృతదేహం లభ్యమైంది. మిగిలిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినా ఇతర కార్మికుల జాడ తెలియరాలేదు. దీంతో గల్లంతైన మిగతా కార్మికులు కచ్చితంగా సొరంగం కూలిన ప్రాంతంలో భారీ బండరాళ్లు, బురద, మట్టి శిథిలాల కిందే ఉండవచ్చని సహాయ చర్యల్లో పాల్గొంటున్న అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అక్కడ తవ్వకాలు జరిపితే సొరంగానికి పైన 400 మీటర్ల వరకు ఉన్న బండరాళ్లు, మట్టి మళ్లీ కూలి పడతాయా అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. సొరంగానికి రక్షణలో భాగంగా కాంక్రీట్‌ సెగ్మెంట్లతో లైనింగ్‌ చేశారు. అయితే డీ1 ప్రాంతం నుంచి ఆవలి వైపు ఏర్పాటు చేసిన ఓ కాంక్రీట్‌ సెగ్మెంట్‌కి పగుళ్లు వచ్చాయి. రెండు వైపులా పేరుకుపోయిన ఉక్కు, ఇతర శిథిలాలు సపోర్టుగా ఉండడంతో ప్రస్తుతానికి ఆ సెగ్మెంట్‌ కూలిపోకుండా ఉంది. ఒక వేళ శిథిలాలను తొలగిస్తే వెంటనే దానితో పాటు సొరంగం కుప్పకూలే ప్రమాదం ఉంటుందని, సహాయక సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సహాయక చర్యలు ఒకట్రెండు రోజులు నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషిoచాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఎన్జీఆర్‌ఐ నివేదిక కోసం నిరీక్షణ సొరంగం కూలిన ప్రాంతంలో ఉపతరితల భాగం ఎంత మేర పటిష్టంగా ఉంది? ఎక్కడ బలహీనంగా ఉంది? తవ్వకాలను ముందుకు కొనసాగించవచ్చా? అనే అంశాలపై స్పష్టత వస్తేనే సహాయక చర్యలు ముందుకు కొనసాగనున్నాయి. దీనిపై ఇప్పటికే ఉపగ్రహ సహాయంతో అధ్యయనాలు నిర్వహించిన నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్జీఆర్‌ఐ) నిపుణులు ఈ నెల 25 లేదా 26న నివేదిక ఇస్తామని పేర్కొన్నట్టు తెలిసింది.కాగా ప్రత్యామ్నాయంగా సొరంగానికి ఉపరితలం నుంచి బోర్‌ హోల్‌ చేసి గల్లంతైన కార్మికులను బయటకి తెచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్జీఆర్‌ఐ ఇవ్వనున్న నివేదికపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంది. సోమవారం నాటి సమీక్షకు ఎన్జీఆర్‌ఐ నిపుణులను సైతం ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రమాదం నుంచి రక్షణ కోసం ఫెన్సింగ్‌ సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో సొరంగంలో పేరుకుపోయిన బురద, మట్టి శిథిలాలు ఒక్కసారిగా కొట్టుకువచ్చి సిబ్బందిని ముంచెత్తే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే తప్పించుకోవడానికి బురదకు ఫెన్సింగ్‌ చేస్తున్నారు. బురద లోపల ఒత్తిడి పెరిగినప్పుడు ఫెన్సింగ్‌ ఉబ్బినట్టు అవుతుంది. దీనిని సంకేతంగా భావించి సహాయక సిబ్బంది అక్కడినుంచి తప్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫెన్సింగ్‌ వల్ల బురద ఒక్కసారిగా జారిపడకుండా సిబ్బందికి కొంత సమయం లభిస్తుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం డీ2 ప్రాంతంలో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు.

YSRCP Conference On GVMC Mayor Seat4
‘జీవీఎంసీ మేయర్‌ పీఠాన్ని నిలబెట్టుకుంటాం’

విశాఖ : సంఖ్యా బలం లేకపోయినా విశాఖ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని వైఎస్సార్‌సీపీ రిజనల్‌ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు మండిపడ్డారు. తాము జీవీఎంసీ మేయర్‌ పీఠాన్ని నిలబెట్టుకుంటామన్నారు కన్నాబాబు. ఈరోజు(ఆదివారం) విశాఖలో బొత్స సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కన్నబాబు, గుడివాడ్‌ అమర్నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘ టీడీపీ ఎప్పుడూ సిగ్గుమాలిన నీతిలేని రాజకీయం చేస్తుంది. కుట్రపూరితంగా మేయర్ పై అవిశ్వాసం ఇచ్చారు. రాష్ట్ర పాలనను కూటమికి ఇచ్చారు. స్థానిక సంస్థలు వైఎస్సార్‌సీపీకి ఇచ్చారు. భయపెట్టి మా వాళ్లను తీసుకెళ్తున్నారు. బొత్స అధ్యక్షతన మా కార్పోరేటర్లతో సమావేశం నిర్వహించాం. దొడ్డిదారి రాజకీయాలకు టీడీపీ పేటెంట్‌.. కూటమి తీరును ఖండిస్తున్నాం. . అదే సమయంలో వారి కుట్రలను ఎదుర్కొంటాం. అనైతికి రాజకీయాలు మానేయాలని సీఎం చంద్రబాబుకి హితవు పలుకుతున్నా’ కన్నబాబు పేర్కొన్నారు.అవిశ్వాస తీర్మానం ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి?టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా అవిశ్వాస తీర్మానం ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ప్రశ్నించారు. ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్లను కూటమి చేర్చుకుంటుంది. 30, 40 మందితో మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి సర్కార్‌ భావిస్తోంది. మా రాజకీయం మేం చేస​ఆం.. మా వారిని మేం కాపాడుకుంటాం. మా వ్యూహ రచనలతో మేయర్‌ పీఠాన్ని కాపాడుకుంటాం.’ అని గుడివాడ అమర్నాథ్‌ స్పష్టం చేశారు.విలువలు వదిలేసి.. మేయర్‌ పదవిపై కన్నేసి

Sakshi Guest Column On Northern and Southern states issues5
ఉత్తర – దక్షిణ సంకటం

ఊహించినట్లే జరుగుతోంది. ‘డీలిమిటేషన్‌’ భూతం మనల్ని వెంటాడుతోంది. జనాభా లెక్కలు దగ్గర పడిన కొద్దీ అది మనకు ఇంకా చేరువ అవుతోంది. అయినా మోదీ ప్రభుత్వం ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటోంది. కానీ ‘నియోజక వర్గాల పునర్విభజన’ భయాలు అలా కొట్టేయదగినవి కావు. ఎందుకని? కారణం వెరీ సింపుల్‌. ఇందులో బుర్ర బద్దలు కొట్టుకోవల్సిందేమీ లేదు. నియోజక వర్గాలు జనాభాపరంగా సైజులో సమానంగా ఉండాలి. ఇప్పుడలా లేవు. కాబట్టి దేశవ్యాప్తంగా నియోజక వర్గాలు ఒకే సైజులో ఉండేట్లు వాటిని పునర్‌ విభజించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో, జనసంఖ్య వేగంగా పెరిగిన రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కంటే ఎక్కువ నియోజక వర్గాలు ఏర్పడతాయి. మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 వద్దే స్థిరంగా ఉంచేట్లయితే, జనాభా నియంత్రణ పటిష్ఠంగా అమలు చేసిన రాష్ట్రాల్లో సహజంగానే నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుంది. ఆ మేరకు ఇతర రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి. ఒకరి నష్టం మరొకరికి లాభం అవుతుంది. సంఖ్య పెరిగినా ఒరిగేదేంటి?మిలన్‌ వైష్ణవ్, జేమీ హింట్సన్‌ల అధ్యయనం సూచించిందిదే! అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ పార్లమెంటు నియోజకవర్గాలు తగ్గు తాయి. ఉదాహరణకు కేరళ, తమిళనాడు చెరో 8 సీట్లు కోల్పోతాయి. ఆంధ్ర, తెలంగాణలు రెంటికీ కలిపి చూస్తే అవీ ఇన్ని స్థానాలు నష్ట పోతాయి. కర్ణాటక నుంచి 2 స్థానాలు ఎగిరిపోతాయి. జనాభాను నియంత్రించిన ఇతర రాష్ట్రాలూ ఇలాగే దెబ్బతింటాయి. పశ్చిమ బెంగాల్‌ నాలుగు, ఒడిషా మూడు, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమా చల్‌ ప్రదేశ్‌ ఒక్కో నియోజకవర్గం పోగొట్టుకుంటాయి. ఇక అనేక ఉత్తరాది రాష్ట్రాల స్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఉత్తర ప్రదేశ్‌ జాబితాకు 11 స్థానాలు అదనంగా కలుస్తాయి. బిహార్‌ 10, రాజస్థాన్‌ 6, మధ్యప్రదేశ్‌ 4 సీట్లు పెంచుకుంటాయి. ఫలితంగా, 543లో 226 సీట్లతో ఇప్పటికే ఆధిపత్యం చలాయిస్తున్న ‘హిందీ హార్ట్‌ల్యాండ్‌’ డీలిమిటేషన్‌ అనంతరం తన ప్రాబల్యాన్ని విశేషంగా 259కి పెంచుకుంటుందని యోగేంద్ర యాదవ్‌ తేల్చారు. దక్షిణాది రాష్ట్రాలు అన్నిటికీ కలిపి ప్రస్తుతం 129 సీట్లు ఉన్నాయి. పునర్విభ జన అనంతరం ఇవి 26 సీట్లు కోల్పోతాయని యోగేంద్ర యాదవ్‌ లెక్క గట్టారు. దీంతో పార్లమెంటులో వాటి ప్రాతినిధ్యం, పలుకుబడి గణనీయంగా క్షీణిస్తాయని వేరే చెప్పనక్కర్లేదు.డీలిమిటేషన్‌ సమయంలో దీన్ని దృష్టిలో పెట్టుకుని లోక్‌ సభ సీట్ల సంఖ్య పెంచే వీలుందని అంటున్నారు. ఇది కొంచెం నయం. కానీ అలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుందా? మొత్తం స్థానాల సంఖ్య పెంచినా, ప్రతి రాష్ట్ర నియోజకవర్గాలూ అదే నిష్పత్తిలో పెరుగుతాయి. అదీ ఉత్తరాదికే అనుకూలిస్తుంది. ఉత్తరాది–దక్షిణాది నిష్పత్తి ప్రకారం చూస్తే, దక్షిణాది రాష్ట్రాలకు ఒరిగేదే ఉండదు. వాటి సీట్ల సంఖ్య పెరిగినా ప్రయోజనం ఉండదు. వాటి ప్రాతినిధ్యం, పలుకు బడి పూర్వస్థితికి అంటే ఇప్పటి స్థాయికి చేరుకోవు. కాబట్టి, ఈ చర్య కూడా దక్షిణాది భయాలను తొలగించేది కాదు. పరిస్థితి ఏమీ మారదు. ఆ మధ్య ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ ఓ లెక్క వేసింది. సమస్యను ఈ గణాంక విశ్లేషణ తేటతెల్లం చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఐదు దక్షి ణాది రాష్ట్రాలకు కలిపి మొత్తం 543లో 129 సీట్లు ఉన్నాయి. అంటే 24 శాతం. ప్రస్తుత లోక్‌ సభ సీట్ల సంఖ్యను 790కి పెంచారే అనుకుందాం. అప్పుడు ఈ రాష్ట్రాల నియోజకవర్గాలు 152కి పెరుగుతాయి. నిజమే. కానీ మొత్తంలో వాటి వాటా కేవలం 19 శాతానికి కుదించుకు పోతుంది. తమిళనాడు విషయం చూస్తే, దాని వాటా ఇప్పుడున్న 7.2 నుంచి 5.4 శాతానికి పడిపోతుంది.ఏ విధంగా చూసినా దక్షిణాది రాష్ట్రాల క్షోభ అర్థం చేసుకో దగినదే!ఉత్తరాది బాధకానీ రెండో వైపు నుంచి చూస్తే, ఉత్తరాదిదీ సంకట స్థితే! ఆర్‌. జగన్నాథన్‌ గణాంక విశ్లేషణ ప్రకారం, మారిన జనాభా నేపథ్యంలో కేరళ పార్లమెంటు సభ్యుడు సగటున 18 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదే రాజస్థాన్‌ ఎంపీ సగటున 33 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ రకంగా చూసుకుంటే తమకు ఉండవలసిన వారి కంటే చాలా తక్కువ మంది ఎంపీలు ఉన్నారని, ఇది అన్యాయమని హిందీ బెల్టు కూడా వాదించగలదని జగన్నాథన్‌ అభిప్రాయపడుతున్నారు. ఇది నిజంగా భారత ప్రజాస్వామ్యానికే డైలమా! అసలు సమస్య ఇది: నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఉత్తరాది ఆందోళన పరిష్కారం అవుతుంది. అయితే, ఈ చర్య దక్షిణా దికి క్షోభ కలిగిస్తుంది. యోగేంద్ర యాదవ్‌ వాదిస్తున్నట్లు డీలిమి టేషన్‌ను వాయిదా వేయడం – లేదా శాశ్వతంగా రద్దు చేయడం ద్వారా యథాతథ స్థితి కొనసాగించవచ్చు. దక్షిణాది భయాలు తొలగి పోతాయి. మరి ఉత్తరాది వారు తమకు జరుగుతుందని భావిస్తున్న అన్యాయం మాటేమిటి? అది అలాగే మిగిలిపోతుంది. కాబట్టి, ఎలా చేసినా ఏదో ఒక పక్షం నష్టపోవడం తప్పదు.మరి దీనికి పరిష్కారం లేదా? ఇది చిటికేసినంత సులభంగా పరిష్కరించే సమస్య అయితే కాదు. నిజం చెప్పాలంటే, మన ప్రజా స్వామ్యం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో కచ్చితంగా ఇదొకటి. వాస్తవానికి వ్యవస్థలో పెను ఉపద్రవానికి దారి తీయగల ఒక నిర్మాణలోపం ఇది. దీన్ని తేలిగ్గా తీసిపారేయడమో, దాటవేయడమో సరైన వైఖరి కాదు. సవాలును సవాలుగా స్వీకరించి అమీతుమీ తేల్చుకోవాల్సిందే. ఇదంత సులభం కాకపోవచ్చు. పోనీ మరొక ప్రత్యామ్నాయం ఉందా?కరణ్‌ థాపర్‌ వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Sakshi Editorial On Youth Festival6
యవ్వనోత్సవం

జీవితంలో బాల్యం ఆటపాటల్లో శరవేగంగా గడచిపోతుంది. శరీరంలో శక్తులన్నీ ఉడిగిపోయినప్పుడు మీదపడే వార్ధక్యం కుంటినడకన సాగుతుంది. బాల్యంలో ఊహ తెలిసే దశకు వచ్చినప్పుడు త్వరగా యువకులుగా మారిపోవాలని కోరుకోవడం సహజం. నడివయసు కూడలికి వచ్చే సరికి యవ్వనం కొద్దిరోజుల్లోనే కరిగిపోతుందనే బెంగ మనసును పీడించడం కూడా అంతే సహజం. జీవితంలోని బాల్య వార్ధక్యాల మధ్య వచ్చే యవ్వనం ఒక కీలక దశ. అంతేకాదు, ఉత్పాదక దశ కూడా! బాల్య వార్ధక్య దశల్లో జీవనభారాన్ని మోసే శక్తి ఉండదు. ఒంట్లోని జవసత్త్వాలు ఉండే యవ్వనంలోనే జీవితాన్ని ఎంతోకొంత తీర్చిదిద్దుకోవడానికి కుదురుతుంది. జీవితంలో అందుబాటులో ఉన్న స్వేచ్ఛా సౌఖ్యాలను తనివితీరా అనుభవించడానికి వీలవుతుంది.యవ్వనాన్ని సార్థకం చేసుకోగలిగిన మనుషులు లోకంలో తక్కువగానే ఉంటారు. చాలామంది యవ్వనాన్ని నిరర్థకంగా గడిపేసి, వార్ధక్యంలో గడచిపోయిన రోజులను తలచుకుంటూ వగచి వలపోస్తారు. ‘లడక్‌పన్‌ ఖేల్‌ మే ఖోయా/ జవానీ నీంద్‌భర్‌ సోయా/ బుఢాపా దేఖ్‌కర్‌ రోయా’ అన్నాడు హిందీ సినీకవి శైలేంద్ర. బాల్యాన్ని ఆటపాటల్లో పోగొట్టుకుని, యవ్వనాన్ని ఒళ్లెరుగని నిద్రలో పోగొట్టుకుని, వార్ధక్యంలో వాటిని తలచుకుని రోదించే మనుషుల తీరును ఆయన మూడు ముక్కల్లో తేల్చేశాడు. ఇదే విషయాన్ని శంకరాచార్యుడు ‘బాల స్తావ త్క్రీడాసక్తః తరుణ స్తావ త్తరుణీసక్తః/ వృద్ధ స్తావ చ్చింతాసక్తః పరమే బ్రహ్మణి కో2పి న సక్తః’ అని ఏనాడో చెప్పాడు.బాల్య వార్ధక్యాలను ఎక్కువ కాలం కొనసాగించాలని ఎవరూ కోరుకోరు గాని, యవ్వనాన్ని వీలైనంతగా పొడిగించుకోవాలని, కుదిరితే గిదిరితే జీవితాంతం నిత్యయవ్వనులుగా కొనసాగాలని కోరుకోనివారు ఉండరు. నిత్యయవ్వనం మానవమాత్రులకు అసాధ్యమని అందరికీ తెలుసు. ఇది తీరే కోరిక కాదని తెలిసినా, కోరుకుంటారు. తీరని కోరికలను కూడా కోరుకోవడమే కదా మానవ స్వభావం. శుక్రాచార్యుడి శాపం వల్ల ముదిమి పొందిన యయాతి తన కొడుకు పురుడి ద్వారా పునఃయవ్వనం పొందాడు. సుకన్యను చేపట్టిన చ్యవనుడు అశ్వనీ దేవతల అనుగ్రహంతో పునఃయవ్వనం పొందాడు. జరా మరణాలను జయించి అమరులు కావడానికి దేవతలు అమృతం తాగారు. అమృతం కోసం దానవులతో కలసి క్షీరసాగర మథనం చేశారు. అమృతం దానవులకు దక్కకుండా ఉండటానికి శ్రీమహావిష్ణువు జగన్మోహిని అవతారం దాల్చి, దేవతలకు అమృతం పంచిపెట్టాడు. మన పురాణాల్లో ఉన్న ఈ గాథలు అందరికీ తెలిసినవే! ఇలాంటి గాథలు ప్రాచీన గ్రీకు పురాణాల్లోనూ ఉన్నాయి. గ్రీకుల యవ్వన దేవత హీబీ దేవతలకు ‘ఆంబ్రోజా’ అనే దివ్య ఫలహారాన్ని, ‘నెక్టర్‌’ అనే అమృతం వంటి పానీయాన్ని పంచిపెట్టిందట! ‘ఆంబ్రోజా’, ‘నెక్టర్‌’ల మహిమ వల్లనే దేవతలు నిత్య యవ్వనులు కాగలిగారని గ్రీకు పురాణాల కథనం.‘జీవితం మధుశాల యవ్వనం రసలీల/ రేపటి మాటేల? నవ్వుకో ఈవేళ’ అన్నారు వీటూరి. ‘పాడు జీవితము యవ్వనము మూడునాళ్ల ముచ్చటలోయి/ అయ్యయ్యొ నీదు పరుగులెచ్చట కోయి’ అన్నారు ఆరుద్ర. జీవితం క్షణభంగురం అని వేదాంతులు చెబుతారు. కోరికలు దుఃఖ హేతువులని, వాటిని జయించాలని ప్రవచనాలు చెబుతారు. ఎవరు ఎన్ని చెప్పినా, జీవితాన్ని ఆస్వాదించడానికి యవ్వనం ముఖ్య సాధనమనే ఎరుక కలిగినవారే ఏ క్షణానికి ఆ క్షణమే యవ్వనోద్ధృతితో జీవితాన్ని నిండుగా ఆస్వాదిస్తారు. వెర్రి వేదాంతుల మాటలను తలకెక్కించుకునే అర్భకులు– క్షణభంగుర సిద్ధాంతం బుర్రలో బొంగరంలా గింగిరాలు తిరుగుతుంటే, యవ్వనాన్ని అనవసరంగా వృథా చేసుకుని, నిష్ప్రయోజకులుగా బతుకు చాలిస్తారు.పునఃయవ్వనం పొందినవాళ్లు మనకు పురాణాల్లోను, కాల్పనిక సాహిత్యంలోను తప్ప నిజజీవితంలో కనిపించరు. నిత్యయవ్వనం మానవాళి సామూహిక ఆకాంక్ష. దీనిని నెరవేర్చడానికే ఆధునిక వైద్య పరిశోధకులు కూడా శక్తివంచన లేకుండా పరిశోధనలు సాగిస్తున్నారు. వారి వైద్య పరిశోధనలు ఫలించినట్లయితే, పునఃయవ్వనం పొందడానికి జనాలు ఎగబడి మరీ పోటీలు పడతారు. పరిశోధనలు ప్రాథమిక దశలో ఉండగానే, కొందరు అపర కుబేరులు ఖర్చుకు వెనుకాడ కుండా తమ యవ్వనాన్ని పొడిగించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్న ఉదంతాలు అడపాదడపా కథనాలుగా వెలువడుతూనే ఉన్నాయి. యవ్వనం ఉడిగి వయసుమళ్లి వార్ధక్యం ముంచుకు రావడాన్ని సహజ పరిణామంగానే చాలా కాలంగా భావిస్తూ వస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి వరకు వార్ధక్యాన్ని వ్యాధిగా గుర్తించ లేదు గాని, వార్ధక్యం కూడా ఒక వ్యాధేనని కొందరు వైద్యపరిశోధకుల వాదన. వార్ధక్యాన్ని నివారించి, వయసును వెనక్కు మళ్లించే దిశగా వైద్య పరిశోధనలు ఇటీవలి కాలంలో ముమ్మరంగా సాగుతున్నాయి. వయసును వెనక్కు మళ్లించడానికి అమృతం వంటిదేదీ అవసరం లేదని, అసలైన యవ్వన కీలకం మానవ దేహంలోనే ఉందని తాజాగా జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. మానవ శరీరంలో ఒత్తిడికి లోనయ్యే కణాలకు ‘ఏపీ2ఏ1’ అనే ప్రొటీన్‌ సరఫరాను నిలిపివేసినట్లయితే, శరీరంలోని ప్రతి కణం పునఃయవ్వనాన్ని పొందగలుగుతుందని చెబుతున్నారు. ‘ఏపీ2ఏ1’ ప్రొటీన్‌ను నియంత్రించడానికి చేపట్టే చికిత్స పద్ధతులే పునఃయవ్వన చికిత్స పద్ధతులు కాగలవని అంటున్నారు. వారి ప్రయోగాలే గనుక ఫలిస్తే, ముందుండేది ముసళ్ల పండుగ కాదు, మానవాళికి అది యవ్వనోత్సవమే అవుతుంది.

Heavy Rain In YSR And Anantapur Districts Huge Crop Loss7
AP: ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం.. 1000 ఎకరాల్లో..!

వైఎస్సార్‌ జిల్లా: వైఎస్సార్‌, అనంతపురం జిల్లాలల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం అర్థరాత్రి ఈదురు గాలులతో కూడా వడగళ్ల వానకు భారీ ఎత్తున అరటి పంటలు నేలకూలాయి. శనివారం అర్ధరాత్రి పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాలతో పాటు అనేక గ్రామాలలో నేలకొరిగిన అరటి చెట్లు నేలకూలాయి. సరిగ్గా కోతకు వచ్చిన సమయంలో భారీ పంట నష్టం ఏర్పడింది. చేతి కందిన పంట నేలకూలడంతో లబోదిబోమని అంటున్నారు రైతులు.రెండు జిల్లాలో పరిధిలో సుమారు 1000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆకస్మికంగా వచ్చిన ఈదురుగాలులతో కూడా వడగాళ్ల వానకు తన పంట పూర్తిగా నేలకొరికిందని అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పురుగుల మందుల తాగి లక్ష్మీ నారాయణ, వెంగప్ప అనే రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుత వీరికి పులివెందుల మెడికల్ కాలేజ్ లో చికిత్స అందిస్తున్నారు. పంట నష్టపోయిందని బాధతో అధికారులకు ఫోన్ చేస్తే ఈ రోజు సెలవు అన్నారని , దాంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు..పులివెందుల నియోజకవర్గంలో భారీ పంట నష్టంపులివెందుల నియోజకవర్గంలో భారీ అరటి పంట నష్టం జరిగిందని హార్టికల్చర్‌ అధికారి రాఘవేంద్ర​ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని లింగాలలో భారీగా అరటి చెట్లు నేలకూలయాన్నారు. నిన్న రాత్రి ఆకస్మాత్తుగా వచ్చిన వర్షం, ఈదురుగాలులతో తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపామని రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. మొత్తం రూ. 20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామన్నారు.

IPL 2025 csk vs mi live updates and highlights8
రుతురాజ్‌, ర‌చిన్ హాఫ్ సెంచ‌రీలు.. ముంబై పై సీఎస్‌కే విజ‌యం

IPL 2025 csk vs mi live updates and highlights:సీఎస్‌కే ఘన విజయం..చెపాక్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. చెన్నై బ్యాటర్లలో రచిన్‌ రవీంద్ర(65 నాటౌట్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌(53) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో విఘ్నేష్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్‌ చాహర్‌, జాక్స్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ‌(31) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ఆఖ‌రిలో దీప‌క్ చాహ‌ర్‌(28) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఖాలీల్ అహ్మ‌ద్ మూడు వికెట్లు సాధించాడు.సీఎస్‌కే ఐదో వికెట్ డౌన్‌..సీఎస్‌కే ఐదో వికెట్ కోల్పోయింది. 4 ప‌రుగులు చేసిన సామ్ కుర్రాన్‌.. విల్ జాక్స్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులో ర‌చిన్ ర‌వీంద్ర‌(20), ర‌వీంద్ర జ‌డేజా(5) ఉన్నారు. 16 ఓవ‌ర్ల‌కు సీఎస్‌కే స్కోర్‌: 125/5సీఎస్‌కే మూడో వికెట్ డౌన్‌.. దూబే ఔట్‌శివ‌మ్ దూబే రూపంలో సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది. 9 ప‌రుగులు చేసిన దూబే.. విఘ్నేష్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 11 ఓవ‌ర్లకు సీఎస్‌కే స్కోర్‌: 100/3.సీఎస్‌కే రెండో వికెట్ డౌన్‌.. గైక్వాడ్ ఔట్‌రుతురాజ్ గైక్వాడ్ రూపంలో సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 53 ప‌రుగులు చేసిన రుతురాజ్ విఘ్నేష్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 8 ఓవ‌ర్లకు సీఎస్‌కే స్కోర్‌: 79/2.6 ఓవ‌ర్ల‌కు సీఎస్‌కే స్కోర్‌: 62/16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే వికెట్ న‌ష్టానికి 62 ప‌రుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్‌(42), ర‌చిన్ ర‌వీంద్ర‌(20) ఉన్నారు.తొలి వికెట్ డౌన్..156 ప‌రుగుల ల‌క్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. దీప‌క్ చాహ‌ర్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 4 ఓవ‌ర్లకు సీఎస్‌కే స్కోర్‌: 35/1. క్రీజులోకి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(18), ర‌చిన్ ర‌వీంద్ర‌(14) ప‌రుగుల‌తో ఉన్నారు.రాణించిన సీఎస్‌కే బౌల‌ర్లు..చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ‌(31) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ఆఖ‌రిలో దీప‌క్ చాహ‌ర్‌(28) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఖాలీల్ అహ్మ‌ద్ మూడు వికెట్లు సాధించాడు.నూర్ ఆన్ ఫైర్‌..ముంబై ఇండియన్స్ వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోయింది. ముంబై ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్ వేసిన నూర్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో నాలుగో బంతికి రాబిన్ మింజ్ ఔట్ కాగా.. ఆఖ‌రి బంతికి తిల‌క్ వ‌ర్మ‌(31) పెవిలియ‌న్‌కు చేరాడు. 13 ఓవ‌ర్లకు ముంబై స్కోర్: 96/6సూర్య‌కుమార్ ఔట్..సూర్య‌కుమార్ యాద‌వ్ రూపంలో ముంబై ఇండియ‌న్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 29 ప‌రుగులు చేసిన సూర్యకుమార్‌.. నూర్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ధోని అద్భుత‌మైన స్టంపింగ్‌తో మెరిశాడు. 12 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోర్‌: 92/4ముంబై మూడో వికెట్ డౌన్‌..విల్ జాక్స్ రూపంలో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 11 ప‌రుగులు చేసిన జాక్స్‌.. అశ్విన్ బౌలింగ్‌లో దూబేకు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. క్రీజులోకి తిల‌క్ వ‌ర్మ వ‌చ్చాడు. 6 ఓవ‌ర్లకు ముంబై స్కోర్: 52/3ముంబై రెండో వికెట్ డౌన్ర్యాన్ రికెల్ట‌న్ రూపంలో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 13 ప‌రుగులు చేసిన రికెల్ట‌న్ ఖాలీల్ అహ్మ‌ద్ బౌలింగ్లో బౌల్డ‌య్యాడు. క్రీజులోకి కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ వచ్చాడు. 4 ఓవ‌ర్లకు ముంబై స్కోర్: 30/2రోహిత్ శ‌ర్మ ఔట్‌..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఆదిలోనే బిగ్ షాక్ త‌గిలింది. స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. ఖాలీల్ ఆహ్మ‌ద్ బౌలింగ్‌లో దూబేకు క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔట‌య్యాడు. 2 ఓవ‌ర్లకు ముంబై స్కోర్: 17/1ఐపీఎల్‌-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆంధ్ర ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజు ముంబై తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్‌ రెగ్యూలర్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా దూరం కావడంతో సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహిస్తున్నాడు.తుది జ‌ట్లుముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజుచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, ఎంఎస్ ధోని (వికెట్ కీప‌ర్‌), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్

Jana Sena MLAs Reportedly Secret Meeting in Vijayawada Over TDP9
విలువే లేకుండా పోయింది.. ఎందుకీ ఊడిగం!

కూటమి విజయానికి మనమే కారణం అయ్యాం... మనం లేకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేనా.. ఆయన సీఎం అయ్యేనా.. కాపులంతా గంపగుత్తగా ఓట్లేయకపోతే కూటమికి ఇంత మెజారిటీ ఎలా వస్తుంది.. ఇన్ని సీట్లు ఎలా వస్తాయి..ఈ కూటమి ప్రభుత్వ రథానికి మనమే చక్రాలం..మనమే ఇరుసు..మనమే ఇంధనం కానీ ఇప్పుడు మనం కరివేపాకులం అయిపోయాం. పులుసులో ముక్కలం అయిపోయాం .. మనకు ఎక్కడ విలువ గౌరవం దక్కడం లేదు.దేనికోసం ఇంత త్యాగాలు చేయాలి అంటూ జనసేన ఎమ్మెల్యేలు మదన పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామి.. అందులో 21 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వారిలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఈ ముగ్గురికి క్యాబినెట్లో స్థానం దక్కింది.. మిగతా 18 మంది వట్టి ఎమ్మెల్యేలు గానే ఉన్నారు. అయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతుందని జనసేన బాధపడుతుంది.జనసేన ఎమ్మెల్యే కన్నా టిడిపి ఇంచార్జీ మిన్నతాము ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీని ఆ నియోజకవర్గాల్లో టిడిపి ఇన్చార్జిలకే అధికారులు గౌరవిస్తున్నారని వారి మాట వింటున్నారని తమకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని జనసేన ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతూ కాసేపటి క్రితం విజయవాడలోని హోటల్లో సమావేశం అయ్యారు. దీనికి నాదెండ్ల మనోహర్ కొందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మనోహర్ తో ఎమ్మెల్యేలంతా ఈ విషయాన్ని మొరపెట్టుకున్నట్లు తెలిసింది. స్థానికంగా తమ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీని తమ మాటను పోలీసులు రెవెన్యూ పంచాయతీ అధికారులు ఎవరూ వినడం లేదని తెలుగుదేశం వారు చెబితేనే అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని మనోహర్ ఎదుట వాపోయారు.మంత్రులుగా ఉన్న ఆ ముగ్గురికి నియోజకవర్గంలో కాస్త గౌరవం ఉన్నప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు ఎవరికి ఇండిపెండెంట్గా పని చేసే అవకాశం దక్కడం లేదు. నియోజకవర్గాల పెద్ద పని ఏదైనా ఉంటే ఆ జిల్లా మంత్రి వద్దకు వెళ్లాల్సి వస్తుంది. పైగా ఆ మంత్రి కూడా లోకేష్ కంట్రోల్లో పనిచేస్తున్నారు. లోకేష్ కూడా జనసేన ను పెద్దగా పట్టించుకోకుండా జిల్లాల తన సొంత టీం ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు. దీంతో అనివార్యంగా జనసేన నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. పలుచోట్ల వ్యాపారాల్లోనూ అక్రమ ఆదాయం తెలుగుదేశం జనసేన మధ్య పోటీ నెలకొన్న తరుణంలో తెలుగుదేశం వారు పలువురు జనసేన కార్యకర్తలను వెంటాడి కొట్టిన ఘటనలు ఉన్నాయి.ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు తెలుగుదేశానికి ఊడిగించేయడం కోసమే తమ పార్టీ ఉందా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని తెలుగుదేశం ఇన్చార్జిలకు అధికారులు గౌరవం ఇవ్వడం దానికి ఎంత అవమానం అన్నది ఈ సమావేశంలో వారంతా నాదెండ్ల మనోహర్ కు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పెద్దలతో మాట్లాడి సెటిల్ చేస్తే జిల్లాలో తమ గౌరవం నిలబడుతుందని అంతిమంగా పార్టీ కూడా బలపడే అవకాశం ఉంటుందని వారు చెప్పుకున్నారు.కానీ జనసేన బలపడాలని తెలుగుదేశం ఏ కోశానా కోరుకోదు. జనసేన బలం తమకు బలం కావాలని తెలుగుదేశం భావిస్తుంది తప్పితే జనసేన సొంతంగా తన కాళ్లపై తన నిలబడి పోటీ చేసే పరిస్థితి వస్తే తెలుగుదేశానికి ఎంత ఇబ్బంది అన్నది చంద్రబాబు లోకేష్ లకు తెలుసు. అందుకే ఎక్కడికి అక్కడ జనసేన నాయకులను కార్యకర్తలను తమ కాళ్ళ కింద పెట్టి ఉంచుతూ ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం క్యాడర్ను మాత్రమే గుర్తిస్తూ పనులు పథకాలు పైరవీలు అని వాళ్ల ద్వారా జరిగేలా చూస్తున్నారు.నియోజకవర్గాల్లో పనులు అంటూ జరిగితే తెలుగుదేశం వారి ద్వారానే జరగాలి లేదంటే లేదు. అంతేతప్ప జనసేన నాయకుడికి ఎక్కడా మర్యాద దక్కకూడదు అనే సింగల్ పాయింట్ ఏజెండాతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇదంతా తమకు అవమానంగా భావిస్తున్న జనసేన ఎమ్మెల్యేలు తమ గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అంటూ మనోహర్ మీద ఒత్తిడి తెచ్చారు. మరోవైపు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ శాఖను సైతం హైజాక్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదంతా జనసేన మనుగడకు.. భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని వారు కలవరపడుతూ దిద్దుబాటు చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏ స్థాయి ఫలితాలు ఇస్తుందో చూడాలి.-సిమ్మాదిరప్పన్న

  Encounter breaks out between security forces and terrorists10
రక్షణ దళాలకు, ఉగ్రవాదులకు, మధ్య ఎన్‌కౌంటర్‌!

హిరానగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని కతూవా జిల్లాలో భారత్‌-పాక్‌ సరిహద్దు ప్రాంతమైన హిరానగర్‌ సెక్టార్‌ సన్యాల్‌ గ్రామంలో ఉగ్రవాదులకు, రక్షణ దళాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. పూంచ్‌ పోలీసులు కలిసి సంయుక్తంగా చేపట్టిన సెర్చ్‌ ఆపరేషన్‌ లో భాగంగా భారత రక్షణ దళాల బృందంపై ఉగ్రవాదులు ఆకస్మికంగా కాల‍్పులు జరపడానికి యత్నించారు. దాంతో రక్షణ దళాలు కూడా అప్రమత్తమై ఎదురుకాల్పులకు దిగింది. కొంతమంది అనుమానితులు ఆ ప్రాంతంలో నిఘా వేసినట్లు సమాచారం అందుకున్న రక్షణ దళాలు.. ఆదివారం సాయంత్రం వేళ సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు, రక్షణ దళాలకు మధ్య ఎన్‌ కౌంటర్‌ జరిగింది.నిన్న భారత ఆర్మీ బలగాలు, పూంచ్‌ పోలీసులు కలిసి జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. సురాన్‌ కోట్‌ లో ఉగ్రవాదులు మాటు వేశారన్న సమాచారంలో ఈ జాయింట్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. అయితే సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టిన విషయాన్ని పసిగట్టిన ఉగ్రమూకలు.. ఓ అటవీ ప్రాంతంలోకి జారుకున్నారు. అయితే అక్కడ ఉగ్రవాదులకు సంబంధించిన కొన్ని మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌ కొనసాగింపులో భాగంగా ఆదివారం నాడు ఉగ్రవాదులు, భారత రక్షణ దళాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌ కౌంటర్‌కు సంబంధించి ఎవరైనా గాయపడ్డారా, మరణించారా అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement