Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Cabinet transfer of lands worth Rs 3,000 crore to anonymous company1
కేంద్ర సంస్థలకు రూ.కోట్లలో..'ఉర్సాకు ఊరికే'!

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేంద్ర సంస్థలకైతే ఎకరా రూ.4 కోట్లు.. ఆర్మీకైనా సరే కోటికి తగ్గేది లేదు..! ఉర్సాకైతే ఊరికే! ఒక్క రూపాయికి కనీసం ఓ ఇడ్లీ కూడా రాదు..! మరి 99 పైసలకు రూ.3,000 కోట్ల భూములు ఎలా..? ఊరూ పేరు లేని కంపెనీపై ఔదార్యం వెనుక గుట్టు ఏమిటి? ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలు ఏర్పాటవుతుంటే ఏ ప్రభుత్వమైనా స్వాగతించి వీలైనన్ని వెసులుబాట్లు కల్పించి భూముల కేటాయింపులో ఉదారంగా వ్యవహరిస్తుంది! కానీ.. ప్రముఖ కేంద్ర సంస్థల నుంచి ఎకరా రూ.నాలుగు కోట్ల చొప్పున వసూలు చేస్తూ.. ఊరూ పేరు లేని ఓ డొల్ల కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్లకుపైగా విలువ చేసే అత్యంత విలువైన దాదాపు 60 ఎకరాలను ఎకరా 99 పైసలకే కట్టబెట్టడం నాకింత.. నీకింత లాంటి లాలూచీ వ్యవహారాలకు పరాకాష్ట! పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలకు గతంలో చంద్రబాబు సర్కారు అమరావతిలో ఎకరా రూ.4 కోట్లు చొప్పున భూములను కేటాయించింది. హడ్కో, ఎల్‌ఐసీ, గెయిల్, ఎఫ్‌సీఐ, ఆర్బీఐ, ఎస్‌బీఐ, విజయా బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్, రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, రైల్‌ ఇండియా టెక్నికల్‌ ఎకనమిక్‌ సర్వీస్‌ లాంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లు చొప్పున భూ కేటాయింపులు చేశారు. చివరకు దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్‌ ఆర్మీకి సైతం ఎకరా రూ.కోటి చొప్పున భూమిని కేటాయించడం గమనార్హం. ఇలా కేంద్ర, జాతీయ సంస్థలకు భూములిచ్చినందుకు భారీగా వసూలు చేస్తూ ఊరూ పేరు లేని అనామక ఉర్సా కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్ల విలువైన 59.86 ఎకరాల ఖరీదైన భూమిని అత్యంత కారు చౌకగా కట్టబెడుతూ తన బంధువులు, బినామీలు, సన్నిహితులకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడంలో చేతికి ఎముకే లేదని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు భూములు కేటాయించేటప్పుడు మాత్రం మార్కెట్‌ ధరను తెరపైకి తేవడం.. బంధుగణం, బినామీలకు మాత్రం కారుచౌకగా ప్రభుత్వ భూములను రాసిచ్చేయడం సీఎం చంద్రబాబుకు రివాజు అని పారిశ్రామికవేత్తలు, అధికార వర్గాలే స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. 2004లో ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ తనకు అత్యంత సన్నిహితుడైన బిల్లీ రావుకు చెందిన బోగస్‌ కంపెనీ ఐఎంజీ భారత్‌కు గచ్చిబౌలిలో 400 ఎకరాలు.. శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో 450 ఎకరాల భూమిని కేటాయించడం చంద్రబాబు భూ సంతర్పణకు పరాకాష్టగా పేర్కొంటున్నారు. విభ­జన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాను కొనసాగించారని ప్రస్తావిస్తున్నారు. భూ పందేరానికి ఆధారాలివిగో.. నారా లోకేశ్‌ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్‌ తండ్రి ఎం.పట్టాభిరామారావుకు చెందిన వీబీసీ ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌కు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏపీఐఐసీకి చెందిన 498.93 ఎకరాల భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున కేటాయిస్తూ 2015 జూలై 15న నాటి చంద్రబాబు సర్కార్‌ ఉత్తర్వులు (జీవో ఎంఎస్‌ నెంబరు 269) జారీ చేసింది. బహిరంగ మార్కెట్‌ ప్రకారం ఆ భూముల విలువ అప్పట్లోనే రూ.498 కోట్లు. ఆ తర్వాత ఆ భూములను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలోకి తెస్తూ 2015 సెపె్టంబరు 22న ఉత్తర్వులు (జీవో ఎంస్‌ నెంబరు 207) జారీ చేయడం ద్వారా వాటి విలువను మరింతగా పెంచుకున్నారు. సత్తా లేని సంస్థకు సంతర్పణ..! జనసేన, బీజేపీతో జట్టుకట్టి 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన బంధువులు, సన్ని­హి­తులు, బినామీలకు ప్రభుత్వ భూములను ఇష్టారీతిన ధారాదత్తం చేస్తున్నారు. ఊరూ పేరూ లేని ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విశాఖలోని ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు.. ఎకరం కేవలం 99 పైసలకే కేటాయించడమే అందుకు నిదర్శనం. వాస్తవంగా ఆ భూముల విలువ రూ.3 వేల కోట్లకుపైగా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేవలం రెండు నెలల క్రితం ఏర్పాటైన కంపెనీకి రూ.5,278 కోట్ల పెట్టుబడి పెట్టి డేటా సెంటర్‌ ప్రాజెక్టును నెలకొల్పే సామర్థ్యం ఉందా.. లేదా? అన్నది పరిశీలించుకోకుండా భూ కేటాయింపులు చేశారంటే.. ఆ సంస్థ ఎవరి బినామీలదో అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్ర సంస్థలకు మార్కెట్‌ ధరకే.. విశాఖలో గతంలో టీడీపీ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మార్కెట్‌ ధరకే భూమిని కేటాయించారు. కీలకమైన నావికాదళ స్థావరం ఏర్పాటుకు ఇండియన్‌ నేవీతో పాటు ఎన్‌టీపీసీ విద్యుత్‌ ప్లాంటుకు కూడా మార్కెట్‌ ధరకే భూమి ఇచ్చారు. దీనికి భిన్నంగా ఉర్సాకు విశాఖలో అత్యంత ఖరీదైన ఐటీ పార్కులో 3.5 ఎకరాలతో పాటు కాపులుప్పాడలో ఏకంగా 56.36 ఎకరాలను కేటాయించేందుకు టీడీపీ కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఉర్సా కంపెనీ గత ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని నివాస ప్రాంతంలో ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాటు అడ్రస్‌తో ఏర్పాటు కాగా ‘ఎక్స్‌’ ఖాతాలో ఇప్పటివరకూ కేవలం ఒకే ఒక పోస్టు పెట్టింది. అది కూడా భూ కేటాయింపులపై విమర్శల నేపథ్యంలో వివరణ ఇస్తూ చేసిన పోస్టు మాత్రమే. ఇక ఈ ఖాతాను కేవలం ఒకే ఒక్కరు ఫాలో అవుతుండటం గమనార్హం. దేశాభివృద్ధిలో కీలకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రక్షణ వ్యవస్థలో భాగ­స్వామిగా ఉన్న ఇండియన్‌ నేవీకి కూడా మార్కెట్‌ ధరకే భూమిని కేటాయించిన టీడీపీ ప్రభుత్వం.. ఉర్సాకు మాత్రం నామమాత్ర ధరకే సంతర్పణ చేయడం వెనుక భారీ వ్యవహారమే ఉందనే ఆరోపణలున్నాయి. విశాఖలోని కీలకమైన ఏపీ సెజ్‌లో ఎకరా ధర లీజు రూ.35 లక్షల మేర పలుకుతోంది. ఏ సంస్థకు భూమి కావాలన్నా ఇదే ధర చెల్లించి భూమిని లీజుకు తీసుకోవాల్సి ఉంటుంది. కమిషనర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ సంస్థ కార్యాలయం నిర్మాణం కోసం అనకాపల్లిలోని రాజుపాలెం వద్ద మార్కెట్‌ ధర మేరకు ఎకరా రూ.80 లక్షల చొప్పున సర్వే నెంబరు 75/3లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ 25 జనవరి 2016న టీడీపీ సర్కారు 326/2016 జీవోను జారీ చేసింది. నిబంధనలు ఏం చెబుతున్నాయి?2012లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు (జీవో నెంబరు 571– 14–9–2012) ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే సమయంలో.. మార్కెట్‌ విలువ మీద వార్షిక లీజు రెంటల్‌ పది శాతం కంటే తక్కువ ఉండకూడదు. లీజును ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మార్కెట్‌æ ధర ఆధారంగా సవరించాలి. విశాఖలో టీసీఎస్‌తో పాటు ఉర్సాకు ఇవ్వనున్న భూమి రిజిస్ట్రేషన్‌ ధరల మేరకే చదరపు గజం రూ. 30 వేల వరకు ఉంది. ఇక మార్కెట్‌ ధరను గనుక తీసుకుంటే రూ.లక్ష వరకూ పలుకుతోంది. ఇంత విలువైన భూమిని ఊరూ పేరు లేని ఉర్సాకు ఎకరం 99 పైసలకే ఇచ్చేందుకు టీసీఎస్‌ను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చి కథ నడిపినట్లు స్పష్టమవుతోంది.

China Closely Following India-Pakistan Situation2
భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు.. దాయాదితో టచ్‌లోకి చైనా

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఇందులో భాగంగా పాకిస్తాన్‌ విషయంలో భారత్‌ పలు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం చైనా ఆచితూచి అడుగులు వేస్తోంది. తాజాగా ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌- పాకిస్థాన్‌లు సంయమనం పాటించాలని చైనా భావిస్తోంది అంటూ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి చెప్పుకొచ్చారు.తాజాగా చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యీ, పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ఈ క్రమంలో వాంగ్‌ యీ మాట్లాడుతూ..‘పాకిస్తాన్‌, భారత్‌ మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఉగ్రదాడిపై నిష్పక్షపాత దర్యాప్తునకు మద్దతు ఇస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలు సంయమనం పాటించాలని బీజింగ్‌ భావిస్తోంది. పరస్పరం ముందుకు సాగాలని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేయాలని ఆశిస్తోంది’ అని చెప్పినట్లు చైనా మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాటం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేసినట్లు వెల్లడించింది.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు వ్యవహారంలో రష్యా, చైనాలు జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్‌ కోరుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ‘ఈ ఘటన దర్యాప్తు విషయంలో రష్యా, చైనా లేదా పశ్చిమ దేశాలు సానుకూల పాత్ర పోషించగలవు. భారత్‌, మోదీ అబద్ధం చెబుతున్నారా? లేదా.. పాకిస్తాన్‌ నిజం చెబుతుందా? అనేది వెలికితీసేందుకు దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు’ అని కథనాలు వెలువడ్డాయి.China breaks its silence on the ongoing tensions between India and Pakistan.Chinese Foreign Minister Wang Yi spoke with Pakistan’s Deputy PM Ishaq Dar today and said that China supports Pakistan in safeguarding its sovereignty and security interests. pic.twitter.com/wIUt1Yz0UJ— Salt News (@SaltNews_) April 27, 2025మరోవైపు.. పహల్గాంలో ఉగ్ర దాడిని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ ఖండించారు. ఈ విషయంలో భారత్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న బెదిరింపులను ఈ దాడి గుర్తు చేసిందని పేర్కొన్నారు. దాడి అనంతరం భద్రతా దళాలు స్పందించిన తీరును ప్రశంసించారు. ‘కశ్మీర్‌లో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన వారికి ఎఫ్‌బీఐ సంతాపం తెలుపుతోంది. భారత్‌ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.పహల్గాం ఉగ్ర దాడిని ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ ఖండించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడానికి ప్రాంతీయ సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీకి తాను ఫోన్‌ చేసి దాడిని ఖండించినట్లు ఆయన ప్రకటించారు. పహల్గాం దుర్ఘటనలను ఈ ప్రాంతంలోని దేశాలు ఉమ్మడి బాధ్యతగా తీసుకుని స్పందించాలని సూచించారు. ఇరాన్‌లో పర్యటించాలని ప్రధాని మోదీకి ఆయన ఆహ్వానం పలికారు.

Pakistan Violates Ceasefire Across Line Of Control3
LoC వెంబడి పాక్ కవ్వింపు చర్యలు.. దీటుగా బదులిచ్చిన భారత్

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో పాక్‌ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎల్‌వోసీ వెంబడి పాక్‌ సైన్యం కాల్పులకు తెగబడింది. కుప్వారా, పూంచ్‌లో భారత భద్రతా బలగాలపై కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్‌పై అంతే దీటుగా బదులిచ్చింది. మరోవైపు, పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై భారత్‌ స్పందించింది. భారత్ - పాకిస్తాన్ మధ్య జమ్మూకశ్మీర్ ప్రాంతంలోని సరిహద్దును వేరు చేసే సైనిక నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద పాక్‌ వరుసగా నాలుగు రోజుల నుంచి సీజ్‌ ఫైర్‌ నిబంధల్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతోంది. ఏప్రిల్‌ 27,28వ తేదీలలో కుప్వారా,పూంచ్‌ జిల్లాలో ఎల్‌వోసీ వద్ద పాక్‌ సైన్యం భారత సైన్యంపై కాల్పులకు తెగబడింది. భారత సైన్యం అదే రీతిలో వేగంగా బదులిచ్చింది’ అని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.ఏప్రిల్‌ 22న పహల్గాంలో పాక్‌ ఉగ్రవాదులు 26మంది టూరిస్టులపై కాల్పులు జరిపి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశారు. ఈ దాడి జరిపింది పాక్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థకు లష్కరే తోయిబా ఉగ్రవాదులేనని తేలింది. అందుకు తగ్గ ఆధారాల్ని సైతం భారత దర్యాప్తు సంస్థలు సేకరించాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎలోవోసీ వెంబడి పాక్‌ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని భారత సైన్యం వెల్లడించింది.

Rasi Phalalu: Daily Horoscope On 28-04-2025 In Telugu4
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలు లాభసాటి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం; తిథి: శు.పాడ్యమి రా.10.56 వరకు, తదుపరి విదియ; నక్షత్రం: భరణి రా.11.28 వరకు, తదుపరి కృత్తిక; వర్జ్యం: ప.10.04 నుండి 11.33 వరకు; దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.15 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు; అమృత ఘడియలు: సా.6.58 నుండి 8.30 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు; యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు; సూర్యోదయం: 5.40; సూర్యాస్తమయం 6.14 మేషం...రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.వృషభం...కుటుంబంలో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తప్పవు.మిథునం...వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.కర్కాటకం...పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.సింహం...అపరిమితమైన ఖర్చులు. వివాదాలకు మరింత దూరంగా ఉండండి. శ్రమ తప్పదు. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.కన్య...రుణబాధలు ఎదుర్కొంటారు. మిత్రులతో అకారణంగా తగాదాలు. దూరప్రయాణాలు. సాహసకృత్యాలకు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు.తుల....పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కష్టం ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు వేగవంతంగా సాగుతాయి.వృశ్చికం....సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.దనుస్సు...ఇంతకాలం పడిన శ్రమ వృథా కాగలదు. రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మానసిక ఆందోళన. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.మకరం....కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఒత్తిడులకు లోనవుతారు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.కుంభం....కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుండి పిలుపు రావచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.మీనం....కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

537 Pakistani nationals left India through Attari in past 4 days, exit deadline ends5
పాక్‌ వెళ్లేందుకు ముగిసిన గడువు 

చండీగఢ్‌/న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశం వీడేందుకు పాకిస్తానీలకు భారత్‌ నిర్దేశించిన గడువు ఆదివారంతో ముగిసింది. వారికి అన్ని రకాల వీసాలనూ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. దాంతో గత నాలుగు రోజుల్లో అటారీ–వాఘా సరిహద్దు గుండా తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 537 మంది పాకిస్తానీలు తిరుగుముఖం పట్టినట్టు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 14 మంది భారత దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారత్‌కు తిరిగి వచ్చినట్టు పేర్కొన్నారు. కొందరు పాకిస్తానీలు తిరిగి వెళ్లేందుకు వాయుమార్గాన్ని ఎంచుకున్నారు. వ్యాపారం, సినిమాలు, జర్నలిజం, రవాణా, సదస్సులు, ట్రెక్కింగ్, విద్య, బృంద పర్యాటకం, పుణ్యక్షేత్రాల సందర్శన ఇలా పాకిస్తానీలకు మంజూరుచేసిన 12 రకాల వీసాల గడువును భారత్‌ రద్దుచేయడం తెల్సిందే. దాంతో కొద్ది రోజులుగా పాకిస్తానీలు అటారీ–వాఘా బోర్డర్‌ వద్ద వందలాదిగా బారులు తీరుతున్నారు. ఆ దారంతా వాహనాలు కని్పంచాయి. వారిని సాగనంపేందుకు వచ్చిన భారత బంధువులు ఉద్వేగంతో వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలు కనిపించాయి. మెడికల్‌ వీసాపై వచ్చిన వారికి మాత్రం భారత్‌ వీడేందుకు మంగళవారం దాకా గడువుంది. కాగా, గడువు తీరిన నేపథ్యంలో ఇంకా భారత్‌లోనే ఉన్న పాకిస్తానీలను అరెస్టు చేస్తామని కేంద్రం తెలిపింది. వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తారు. ఈ నెల 4న అమల్లోకి వచ్చిన వలసలు, విదేశీయుల చట్టం ప్రకారం చర్యలు తప్పవని కేంద్రం పేర్కొంది. ఢిల్లీలో 5,000 మంది ఢిల్లీలో 5,000 మంది పాకిస్తానీలున్నట్లు ఇంటెలిజెన్స్‌ బ్యూరో గుర్తించింది. ఆ జాబితాను పోలీసులకు అందజేసింది. అక్రమంగా ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి సమాచారమివ్వాలని ఢిల్లీ హోం మంత్రి ఆశిష్‌ సూద్‌ ప్రజలను కోరారు. వారిని తిప్పి పంపేలా కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. దీర్ఘకాల వీసాలతో వచ్చిన పాకిస్తానీలు మహారాష్ట్రలోనూ 5,050 దాకా ఉంటారని అధికారులు తెలిపారు. తమ రాష్ట్రంలోని పాకిస్తానీలంతా వెళ్లిపోయారని బిహార్‌ ప్రకటించింది. కేరళలో 104 మంది ఉన్నట్లు గణాంకాల వెల్లడిస్తున్నాయి. తమ రాష్ట్రం నుంచి 228 మంది వెళ్లిపోయారని మధ్యప్రదేశ్‌ సర్కార్‌ తెలిపింది.

Abburi Brothers Fraud in Name of Spring Valley Villas in Hyderabad6
అబ్బో.. అబ్బూరి బ్రదర్స్‌!

అబ్బూరి సతీష్, అబ్బూరి వెంకట్, అబ్బూరి రామకృష్ణ.. అబ్బూరి ఫ్యామిలీ చేతిలో మా కష్టార్జితాన్ని పోసి పూర్తిగా మోసపోయాం. మాలా మీరెవరూ మోసపోవద్దు. వీళ్లు పెద్ద మోసగాళ్లు. నీతి, నిజాయితీ అన్నదే లేదు. ఇక్కడ మమ్మల్ని మోసం చేసినట్లే పెద్ద వెంచర్‌ పేరుతో వైజాగ్‌లో వ్యాపారం మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. – హైదరాబాద్‌లో ఉర్సా బాధితుల ఆక్రోశం సాక్షి, అమరావతి: మోసాలే లక్ష్యంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి అడుగుపెట్టిన అబ్బూరి బద్రర్స్‌ హైదరాబాద్‌లో విల్లాల పేరుతో అనేక మందికి కుచ్చుటోపీ పెట్టారు! తాజాగా ఉర్సా ముసుగులో విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా కొట్టేశారు! ఈ బాగోతం బయట పడటంతో ముసుగు దొంగల వెనక ఉన్న ముఖ్యనేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టైంది. ఈ నేపథ్యంలో ఓ ఆవారా కంపెనీకి ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల భూమిని ఎలా ధారాదత్తం చేసిందని తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అబ్బూరీ.. ఇది నిజం కాదా? ఉర్సా క్లస్టర్స్‌లో ప్రధాన ప్రమోటర్‌గా ఉన్న సతీష్‌ అబ్బూరి ఫ్యామిలీ ‘ట్వంటీ ఫస్ట్‌ సెంచురీ’ పేరుతో పలు డొల్ల కంపెనీలను నెలకొల్పి చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో ఉంటున్నామని.. ఎన్నారైలమని.. తమ నెట్‌వర్త్‌ రూ.వందల కోట్లంటూ అబ్బూరి బ్రదర్స్‌ హైదరాబాద్‌లో విల్లాలు కడతామని ప్రచారం చేసుకుని కష్టార్జితాన్ని ధారపోసిన వారికి కుచ్చుటోపీ పెట్టారు. ముగ్గురు అన్నదమ్ముల్లో వెంకట్‌ అబ్బూరి, సతీష్‌ అబ్బూరి అమెరికాలో ఉద్యోగాలు చేస్తుండగా హైదరాబాద్‌లో రామకృష్ణ అబ్బూరి పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగించారు.అమెరికాలో ట్వంటీ ఫస్ట్‌ సెంచురీ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ప్రాపర్టీస్‌ ఎల్‌ఎల్‌సీ పేరుతో సతీష్‌ అబ్బూరి కంపెనీ నమోదు అయిన విషయాన్ని కేశినేని నాని సాక్ష్యాలతో సహా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేయడం తెలిసిందే. దీనికి అనుబంధంగా ఇండియాలో ఏర్పాటైన కంపెనీలో అబ్బూరి రామకృష్ణ, అబ్బూరి లతతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), ఆయన భార్య కేశినేని జానకిలక్ష్మి డైరెక్టర్లుగా వ్యవహరించారు. కేశినేని చిన్ని వైదొలగిన తర్వాత జానకిలక్ష్మి డైరెక్టర్‌గా కొనసాగారు. అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్‌ ఎల్‌ఎల్‌సీకి అనుబంధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని ఇండియాలో ఏర్పాటు చేశారు. అంతా కలసి పంగనామం.. హైదరాబాద్‌లోని నిజాంపేట, బాచుపల్లి, గాజులరామారం, ఎల్బీనగర్‌ వద్ద ‘స్ప్రింగ్‌ వ్యాలీ’ పేరుతో విలాసవంతమైన విల్లాలు నిరి్మస్తున్నట్లు సతీష్‌ అబ్బూరి ఫ్యామిలీ భారీగా ప్రచారం చేసింది. ఆ తర్వాత కోట్లాది రూపాయలు వసూలు చేసి బిచాణా ఎత్తేసింది. సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో వందలాది మంది తమ కష్టార్జితాన్ని వీరి వద్ద ఇన్వెస్ట్‌ చేసి దారుణంగా మోసపోయారు. కంపెనీ కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో రామకృష్ణ ఫ్యామిలి రెండేళ్లు కనపడకుండా పారిపోయినట్లు ఓ బాధితుడు పేర్కొన్నారు. బాధితులు అంతా కలసి ఇండియన్‌ రియల్‌ ఎస్టేట్‌ వెబ్‌సైట్‌లో ఒక ఫోరం ఏర్పాటు చేసుకుని అబ్బూరి ఫ్యామిలీ చేతిలో ఎలా మోసపోయారో ప్రపంచానికి చాటి చెప్పారు. తమలా మరెవరూ మోసపోవద్దని హెచ్చరించారు.ఎట్టకేలకు అమెరికాలో పని చేస్తున్న సతీష్‌ అబ్బూరి ఒరాకిల్‌ కంపెనీ చిరునామా, ఫోన్‌ నంబరు వివరాలను సేకరించి అక్కడున్న వారు ఎవరైనా సాయం చేయాలంటూ ప్రాథేయపడ్డారు. దీన్ని బట్టి బాధితులు ఎంత నరకం అనుభవించారో ఊహించవచ్చు. ఆ ముగ్గురు సోదరులు తమ వెనుక పెద్ద శక్తులున్నాయని, తమను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగుతున్నారని ఓ బాధితుడు వాపోయాడు. ‘మోసగాళ్లయిన వీళ్లు వైజాగ్‌లో వెంచర్‌ ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాలా మీరు మోసపోకండి..’ అంటూ పలువురు బాధితులు గతంలోనే హెచ్చరించారు. అదే మోసగాళ్లు ఇప్పుడు ఉర్సా పేరుతో మళ్లీ విచ్చేస్తున్నారంటూ తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. ‘ట్వంటీ ఫస్ట్‌ సెంచురీ’తో తనకు సంబంధం లేదని సతీష్‌ అబ్బూరి జూమ్‌ మీటింగ్‌లో పేర్కొన్నాడు. ఇండియన్‌ రియల్‌ ఎస్టేట్‌ వెబ్‌సైట్‌లో బాధితుల వాయిస్‌లున్న పేజీలను డేటాబేస్‌ నుంచి పూర్తిగా తొలగించేశారు. ఒకపక్క బాధితులను బెదిరిస్తూ.. మరోపక్క వెబ్‌సైట్‌లో పేజీలను డిలీట్‌ చేయించటాన్ని బట్టి దొంగెవరో ప్రత్యేకించి చెప్పాలా..? అని బాధితులు మండిపడుతున్నారు. ఇలాంటి ఆవారా కంపెనీకి ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల భూమిని ఎలా ధారాదత్తం చేసిందని తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Pakistan Army Chief Missing in Action7
పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఎక్కడ? 

ఇస్లామాబాద్‌/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్‌ సయీద్‌ ఆసిఫ్‌ మునీర్‌ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్‌లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలొచ్చాయి. ‘‘తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తానూ పాక్‌ వీడారు’’ అన్నది వాటి సారాంశం. కొద్ది రోజులుగా, ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగినప్పటి నుంచీ మునీర్‌ బయట ఎక్కడా కని్పంచడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. మునీర్‌కు తీవ్ర భారత విద్వేషిగా పేరుంది. కొద్ది రోజులుగా భారత వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. పాక్‌కు కశ్మీర్‌ జీవనాడి అని, దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని, హిందువులు, ముస్లింలు భిన్న జాతులని ఇటీవలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తర్వాత రెండు రోజులకే పహల్గాం ఉగ్ర దాడి జరిగింది. ‘‘దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్‌ తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్‌ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతానని మునీర్‌ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది’’ అని కథనాలు పేర్కొంటున్నాయి. మునీర్‌ పాక్‌లోనే ఉన్నారని, రావలి్పండి బంకర్లో తలదాచుకున్నారని మరికొందరు చెబుతున్నారు. ఈ పుకార్లలో సైన్యం మనోబలం దెబ్బ తింటుందని గ్రహించిన పాక్‌ ప్రభుత్వం నష్ట నివారణకు దిగింది. ప్రధాని షహబాజ్‌ షరీఫ్, ఉన్నత సైనికాధికారులతో శనివారం మునీర్‌ దిగిన గ్రూప్‌ ఫొటో అంటూ పాక్‌ పీఎంఓ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. దాన్ని నమ్మలేమని, శనివారం సైనిక కాలేజీ ఉత్సవాల్లో ప్రధానితో పాటు మునీర్‌ పాల్గొన్నట్టుగా వచి్చన వార్తలూ నమ్మశక్యంగా లేవని మీడియా అభిప్రాయపడింది. మరోవైపు పాక్‌ సైన్యంలోని జనరల్స్, ఉన్నతాధికారులు తమ కుటుంబాలను ఉన్నపళంగా దేశం దాటిస్తున్నట్టు చెబుతున్నారు.

RCB defeated Delhi by 6 wickets8
బెంగళూరు ప్రతీకారం

దాదాపు రెండు వారాల క్రితం బెంగళూరు వేదికగా ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌... 163 పరుగులు చేసిన ఆర్‌సీబీ ఓటమి పాలైంది. అద్భుత ప్రదర్శనతో గెలిపించిన ‘లోకల్‌ ప్లేయర్‌’ కేఎల్‌ రాహుల్‌ మ్యాచ్‌ ముగిశాక ‘ఇది నా అడ్డా’ అన్నట్లుగా కాంతారా స్టయిల్‌లో సంబరం చేసుకున్నాడు. ఇప్పుడు అవే రెండు జట్ల మధ్య వేదిక ఢిల్లీకి మారింది. మ్యాచ్‌పై చర్చ కూడా కోహ్లి వర్సెస్‌ రాహుల్‌గానే సాగింది. ఈసారి ఆర్‌సీబీ విజయలక్ష్యం అదే 163 పరుగులు... 26/3తో బెంగళూరు కష్టాల్లో పడినట్లు కనిపించినా... కోహ్లి, కృనాల్‌ పాండ్యా శతక భాగస్వామ్యంతో ఆర్‌సీబీ ఘన విజయాన్ని అందుకొని బదులు తీర్చుకుంది. ఈసారి బ్యాటింగ్‌లో పరుగులు చేసేందుకు రాహుల్‌ తీవ్రంగా ఇబ్బంది పడగా... ‘దిల్లీవాలా’ కోహ్లి చక్కటి ఆటతో బెంగళూరు విజయానికి బాటలు వేశాడు. మ్యాచ్‌ ముగిశాక ప్రతీకార శైలిలో కోహ్లి విజయనాదం చేశాడు. న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య సమరం 1–1తో సమంగా ముగిసింది. సొంతగడ్డపై గత మ్యాచ్‌లో ఓడిన బెంగళూరు ఈసారి ప్రత్యర్థి మైదానంలో విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (39 బంతుల్లో 41; 3 ఫోర్లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (18 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే ఫర్వాలేదనిపించగా, భువనేశ్వర్‌ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అనంతరం బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కృనాల్‌ పాండ్యా (47 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (47 బంతుల్లో 51; 4 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 84 బంతుల్లో 119 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బ్యాటింగ్‌ తడబాటు... అభిషేక్‌ పొరేల్‌ (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్‌ కలిసి 29 బంతుల్లో 62 పరుగులు చేయగా... మిగతా బ్యాటర్లంతా కలిసి 92 బంతుల్లో 96 పరుగులు మాత్రమే సాధించడం ఢిల్లీ బ్యాటింగ్‌ పరిస్థితిని చూపిస్తోంది. భువనేశ్వర్‌ ఓవర్లో 2 సిక్స్‌లతో ధాటిని ప్రదర్శించిన పొరేల్‌ ఎక్కువ సేపు నిలవలేకపోగా, కరుణ్‌ నాయర్‌ (4) విఫలమయ్యాడు. పవర్‌ప్లేలో జట్టు 52 పరుగులు చేసింది. అయితే ఆపై ఆర్‌సీబీ స్పిన్నర్లు సుయాశ్, కృనాల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగుల రాక కష్టంగా మారిపోయింది. ఈ ఇద్దరు బౌలర్లు కలిసి 8 ఓవర్లలో 2 ఫోర్లు, 1 సిక్స్‌ సహా 50 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఒత్తిడిలో డుప్లెసిస్‌ (22), అక్షర్‌ పటేల్‌ (15) వెనుదిరగ్గా... రాహుల్‌ కూడా షాట్లు ఆడేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు. భువీ ఒకే ఓవర్లో రాహుల్, అశుతోష్‌ (2)లను అవుట్‌ చేయడంతో ఢిల్లీ 17 ఓవర్లలో 120/6 వద్ద నిలిచింది. అయితే స్టబ్స్‌ దూకుడుగా ఆడటంతో తర్వాతి రెండు ఓవర్లలో 36 పరుగులు వచ్చి స్కోరు 150 దాటింది. కీలక భాగస్వామ్యం... ఛేదనలో బెంగళూరుకు సరైన ఆరంభం లభించలేదు. ఆరు పరుగుల వ్యవధిలో బెథెల్‌ (12), పడిక్కల్‌ (0), పాటీదార్‌ (6) వెనుదిరగడంతో స్కోరు 26/3 వద్ద నిలిచింది. ఈ దశలో కోహ్లి, కృనాల్‌ కలిసి చక్కటి సమన్వయంతో జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా... నిలదొక్కుకున్న తర్వాత కృనాల్‌ ధాటిని పెంచాడు. 8 ఓవర్లలో 85 పరుగులు చేయాల్సిన సమయంలో తర్వాతి 3 ఓవర్లలో బెంగళూరు 36 పరుగులు రాబట్టడంతో పని సులువైంది. ఈ క్రమంలో సిక్సర్లతో చెలరేగిన కృనాల్‌ 38 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. 2016 సీజన్‌లో తన ఏకైక హాఫ్‌ సెంచరీని సాధించిన కృనాల్‌ ఇన్నేళ్లకు మళ్లీ ఆ మార్క్‌ను దాటడం విశేషం. ఆ తర్వాత కోహ్లి కూడా 45 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. విజయానికి 18 పరుగుల దూరంలో కోహ్లి అవుటైనా... కృనాల్, టిమ్‌ డేవిడ్‌ (5 బంతుల్లో 19 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి 9 బంతుల ముందే మ్యాచ్‌ను ముగించారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పొరేల్‌ (సి) జితేశ్‌ శర్మ (బి) హాజల్‌వుడ్‌ 28; డుప్లెసిస్‌ (సి) కోహ్లి (బి) కృనాల్‌ 22; కరుణ్‌ నాయర్‌ (సి) భువనేశ్వర్‌ (బి) దయాళ్‌ 4; రాహుల్‌ (సి) బెథెల్‌ (బి) భువనేశ్వర్‌ 41; అక్షర్‌ (బి) హాజల్‌వుడ్‌ 15; స్టబ్స్‌ (సి) హాజల్‌వుడ్‌ (బి) భువనేశ్వర్‌ 34; అశుతోష్‌ (బి) భువనేశ్వర్‌ 2; విప్‌రాజ్‌ (రనౌట్‌) 12; స్టార్క్‌ (నాటౌట్‌) 0; చమీరా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–33, 2–44, 3–72, 4–102, 5–118, 6–120, 7–158, 8–162. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–33–3, యశ్‌ దయాళ్‌ 4–0–42–1, హాజల్‌వుడ్‌ 4–0–36–2, సుయాశ్‌ శర్మ 4–0–22–0, కృనాల్‌ పాండ్యా 4–0–28–1. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: బెథెల్‌ (సి) నాయర్‌ (బి) అక్షర్‌ 12; కోహ్లి (సి) స్టార్క్‌ (బి) చమీరా 51; పడిక్కల్‌ (బి) అక్షర్‌ 0; పాటీదార్‌ (రనౌట్‌) 6; కృనాల్‌ (నాటౌట్‌) 73; డేవిడ్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–26, 4–145. బౌలింగ్‌: అక్షర్‌ పటేల్‌ 4–0–19–2, స్టార్క్‌ 3–0–31–0, ముకేశ్‌ కుమార్‌ 3.3–0–51–0, విప్‌రాజ్‌ 1–0–12–0, కుల్దీప్‌ 4–0–28–0, చమీరా 3–0–24–1. ఐపీఎల్‌లో నేడురాజస్తాన్‌ X గుజరాత్‌ వేదిక: జైపూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

KCR fires on Congress Govt at BRS silver jubilee Meeting9
కాంగ్రెస్ అన్నిట్లోనూ ఫెయిల్: కేసీఆర్‌

మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం, దగా చేశారు. ఇవాళ అప్పు పుడత లేదని మాట్లాడుతుండ్రు. నా మనసు కాలుతోంది. బాధ పడుతోంది.దుఃఖం వస్తోంది. కాంగ్రెస్‌ సర్కార్‌ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏ మాయ రోగం వచ్చె.. ఏం బీమారి వచ్చె.. ఏమేం చెప్పిరి.. ఎన్నెన్ని చెప్పిరి.. గోల్‌మాల్‌ దింపుట్ల,అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్‌ను మించినోళ్లు లేరు. అప్పుడు చెరువుల పూడిక తీసిన బుల్డోజర్లు, ఇప్పుడు ఇళ్లు కూలగొడుతున్నయి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్‌ ప్రభుత్వమే. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నరు. ఓట్లెప్పుడు వస్తయా అని చూస్తున్నరు.ఎల్కతుర్తి నుంచి సాక్షి ప్రతినిధి: అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న తెలంగాణను దేశంలోనే నంబర్‌ వన్‌గా చేసుకుంటే, ఏడాదిన్నర కాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ నాశనం చేసిందని, అన్నిట్లోనూ ఫెయిల్‌ అయ్యిందని భారత్‌ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. మా అంత సిపాయిలు లేరు..కేసీఆర్‌కు మించి ఇస్తాం.. ఆరు చందమామలు తెచ్చి ఇస్తాం.. ఏడు సూర్యుళ్లు పెడతాం అని నమ్మబలికి ఓట్లు వేయించుకుని ప్రజలను దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 420 హామీలిచ్చి ఏమీ చేయలేదని, మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించారని విమర్శించారు. రైతుబంధు లాంటి పథకాలు కావాలని తననెవరూ అడగలేదని, మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తాము పడగొట్టబోమని, ప్రజలే వీపులు సాపు చేస్తారని వ్యాఖ్యానించారు. ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు కాంగ్రెస్సే నంబర్‌ వన్‌ విలన్‌ అని అన్నారు. కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు ఇక తాను బయటకు వస్తానని ప్రకటించారు. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని చెప్పారు. బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆదివారం వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. బుక్కులు పంచిండ్రు.. బాండ్లు రాసిచ్చిండ్రు హామీలు ఇచ్చుడు కాదు.. పెద్ద పెద్ద బుక్కులు ఊరూరా పంచిండ్రు. సిగ్గు లేకుండా బాండ్‌ పేపర్లు రాసిచ్చిండ్రు. అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు..యేడికెళ్లి ఇస్తారని కాంగ్రెస్‌ నేతలను అడిగితే.. చేసి చూపిస్తాం.. మాది పెద్ద పార్టీ.. మమ్మల్ని మించిన సిపాయిలు లేరని ఇప్పుడు ఆర్థికమంత్రిగా ఉన్నాయన జబ్బలు చరిచాడు.. ఒకడు మెడలు చరిచాడు. డైలాగులు మీద డైలాగులు కొట్టారు. మధ్యలో ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి.. నాకు కాలు విరిగింది.. అయినా నేను బయల్దేరాను.. దీంతో తెలంగాణలో ఎంత మంది దేవుళ్లు ఉంటే అంతమంది దేవుళ్ల మీద ఒట్లు పెట్టిండ్రు. ఇన్ని మాటలు చెప్పి మోసం చేసిన్రు. ఉచిత బస్సు అని పెడితే జుట్లు పట్టుకుని కొట్టుకునేందుకు పనికి వస్తోంది తప్ప ఉపయోగం లేదు. ఈ ఉచిత బస్సు మాకు అవసరం లేదు అని ఆడబిడ్డలు అంటున్నరు. ఊ అంటే ఆ అంటే అబద్ధాలు చెబుతున్నారు. నమ్మి బోల్తా పడ్డం..’ అని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. అప్పుడెంత బాగుండె.. ఇప్పుడెట్లయింది? ‘ఒక ఊరిలో నాట్లు వేసే టైమ్‌ వస్తే వడ్లు ఓ రైతు అలుకుతున్నడు. మొలకకు అలుకుడు చేస్తం కదా.. పెద్ద మొగోడు అని ఒకర్ని మొలక అలికేందుకు పిలిస్తే.. ఎలుక పిల్లను చూసి ఎల్లెలకల పడ్డడట. అట్లనే మా అంత సిపాయిలు లేరు.. మేం తెచ్చి ఇస్తాం అన్నరు. ఇవాళ మమ్మల్ని నమ్ముతలేరు.. అప్పు పుడుతలేదని మాట్లాడుతుండ్రు. ఎక్కడికెళ్లి తెచ్చి చేయాలని అంటున్నరు. అపారమైన అనుభవం ఉందని అప్పుడు అన్నరు.. ఇప్పుడేమో ఎల్లెలకల పడుతుండ్రు. నా ప్రసంగం టీవీల్లో వినే కోట్లాను కోట్ల మందిని అడుగుతున్నా.. ఇంత మోసం ఉంటదా.. ఇంత దగా ఉంటదా..? ఎంత వరకు ఇది కరెక్ట్‌..? తెలంగాణను బొందల పడగొట్టిండ్రు.. ఎంత ఘోరమైన ఫలితం చూస్తున్నాం. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి ఎంత బాగుండె. ఇప్పుడెట్లయింది? నా మనసు కాలుతుంది. బాధయితంది. దుఃఖం వస్తోంది. కేసీఆర్‌ పక్కన పోంగనే ఇంత ఆగమయితదా? ఎందుకు ప్రజల గోస పోసుకుంటున్నరు? కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్లుండె. కొనేటోళ్లు ఎక్కువుండె. అమ్మేటోళ్లు తక్కువుండే. నేను 24 గంటలు కరెంటు ఇయ్యలేదా? ఇప్పుడు ఎందుకు ఇయ్య శాతనయిత లేదు? మళ్లీ తెల్లందాక కరెంటు పెట్టడానికి పోవాల్నా..? మంచినీళ్లు కూడా ఇయ్య శాతనయితలేదు. కానీ మేం ఇంత సిపాయిలం, అంత సిపాయిలం అంటున్నరు..’ అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు.ఎన్నెన్ని చెప్పిరి.. ఏమన్నా చేసిన్రా? ‘కాంగ్రెస్‌ సర్కార్‌ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏ మాయ రోగం వచ్చె..ఏం బీమారి వచ్చె.. ఏమేం చెప్పిరి.. ఎన్నెన్ని చెప్పిరి.. గోల్‌మాల్‌ దింపుట్ల, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్‌ను మించినోళ్లు లేరు. ఇక్కడ ఉన్నోళ్లు చాలరని చెప్పి ఉన్న గాంధీలు, లేని గాం«దీలు, డూప్లికేట్‌ గాం«దీలు ఢిల్లీకెళ్లి దిగిరి. స్టేజీల మీద డ్యాన్స్‌లు చేసిన్రు. కేసీఆర్‌ రైతుబంధు కింద ఏం ఇస్తుండు..రూ.10 వేలు ఇస్తుండు.. మేం రూ.15 వేలు ఇస్తమని చెప్పిన్రు. పెన్షన్లు రూ.2 వేలు ఇస్తుండు మేం వస్తే రూ.4 వేలు ఇస్తమని చెప్పిరి. ఇద్దరు ఉంటే కేసీఆర్‌ ఒక్కరికే ఇస్తుండు.. మేం ముసలిది ముసలోడికి ఇద్దరికీ ఇస్తమనిరి. దివ్యాంగులకు రూ.4 వేలు ఇస్తుండు.. మేం రూ.6 వేలు ఇస్తమన్నరు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తమన్నరు. విద్యార్థులకు ఐదు లక్షల గ్యారంటీ కార్డు ఇస్తమని చెప్పిరి. ఇక ఒకరెనుక ఒకరు ఉరికి.. రూ.2 లక్షల లోన్‌ తెచ్చుకోండి.. డిసెంబర్‌ 9న ఒక్క కలం పోటుతో ఖతం చేస్తం అన్నరు. కల్యాణలక్ష్మి కింద కేసీఆర్‌ లక్షా నూటపదహార్లు ఇస్తున్నడు.. మేం తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పిండ్రు. 420 హామీలు ఇచ్చిన్రు. ఏమన్నా చేసిన్రా .. ఏం చేయలేదు. మాట్లాడితే బీఆర్‌ఎస్, కేసీఆర్‌ మీద నిందలు వేస్తున్నారు.తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చారు ‘ఆనాడైనా, ఏనాడైనా, ఈనాడైనా తెలంగాణకు విలన్‌ నంబర్‌ వన్‌ కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ హైదరాబాద్‌ స్టేట్‌ పేరుతో ఉన్ననాడు.. ప్రజలు వద్దంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్‌ పార్టీ, జవహర్‌లాల్‌ నెహ్రూ. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం.. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్‌ పరిపాలన. 2001 నుంచి గులాబీ పార్టీ పెట్టి విజృంభిస్తే.. నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్‌ వచ్చి.. మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇస్తమని నమ్మబలికిన్రు. మళ్లీ ఎగ్గొట్టే ప్రయత్నం చేసిన్రు. 14 సంవత్సరాలు ఏడిపించిన్రు. జయశంకర్‌ సార్‌తో కలిసి పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు కాంగ్రెస్‌ గొంతు పట్టుకుంటే.. అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన్రు. మళ్లీ వెనక్కి వెళ్లారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావొచ్చు. సాగర హారాలు కావొచ్చు. వంటావార్పులు కావొచ్చు.. అనేక రూపాల్లో విజృంభించి భీకరమైన పోరాటం చేశాం. మూడేళ్ల తర్వాత రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు మళ్లీ తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. వారికి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించిన సుడి గాడుపులు తట్టుకోలేమని తెలంగాణ ఇచ్చిన్రు..’ అని మాజీ సీఎం గుర్తు చేశారు.

Indian roads are among the world deadliest10
3 నిమిషాలకో మరణం

రోజూ ఉదయం పేపర్‌ తీయగానే రోడ్డు ప్రమాద వార్తలు. బస్సులు లోయల్లోకి పడిపోవడం, ఆగి ఉన్న ట్రక్కులను ఢీకొన్న కార్లు. ద్విచక్ర వాహనాలను ఢీకొన్న పెద్ద వాహనాలు. ఈ రోజువారీ విషాదాలు నిశ్శబ్ద సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. భారత్‌లో ప్రతి మూడు నిమిషాలకొకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు. సగటున రోజూ 474 మరణాలు సంభవిస్తున్నాయి. 2023లోనే 1,72,000 మందికి పైగా భారతీయులు రోడ్లపై ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం విడుదల చేసిన అధికారిక నివేదికే పేర్కొది. వారిలో 10,000 మంది పిల్లలే. పాఠశాలలు, కళాశాలల సమీపంలో జరిగిన ప్రమాదాల్లో మరో 10వేల మంది మరణించారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వాహనాలు ఢీకొట్టి 35 వేల మంది పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. మృత్యువాత పడ్డ ద్విచక్ర వాహనదారుల సంఖ్య కూడా అధికమే. ఈ ప్రమాదాలకు అతివేగమే అతి పెద్ద కారణం. కనీస భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ప్రాణాంతకంగా మారింది. హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల 54 వేల మంది ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. కారులో సీట్‌ బెల్ట్‌ ధరించకపోవడం వల్ల 16 వేల మంది మరణించారు. ఓవర్‌ లోడ్‌ 12,000 మరణాలకు దారితీసింది. సరైన లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపడం వల్ల జరిగిన ప్రమాదాలకు బలైనవారు 34 వేలమంది. రోడ్ల వ్యవస్థ అస్థవ్యస్తం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రహదారి నెట్‌వర్క్‌ భారత్‌లో ఉంది. మొత్తం 66 లక్షల కిలోమీటర్ల పొడవైన రహదారులున్నాయి. ఇందులో జాతీయ, రాష్ట్ర రహదారుల వాటా 5 శాతం. 35 కోట్ల రిజిస్టర్డ్‌ వాహనాలున్నాయి. కానీ భారత రహదారులు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. అస్థవ్యస్తమైన రహదారుల వ్యవస్థే దీనికి కారణం. రోడ్లపై ట్రాఫిక్‌ నియమాలు సరిగ్గా లేకపోవడం, ఉన్నా పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్లు, బస్సులు, ద్విచక్రవాహనాలు, భారీ వాహనాలు, ఆటోలు, సైకిళ్లు, పాదచారులు, అక్కడక్కడా జంతువులు.. మొత్తంగా రోడ్డును అడ్డదిడ్డంగా ఉపయోగించడం వల్ల పరమాదాలు జరుగుతున్నాయి. ఫుట్‌పాత్‌ ఆక్రమణ కూడా ప్రమాదాలకు కారణంగా ఉంది. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా నియంత్రణకోసం ఎన్ని నిధులు వెచ్చించినా మారని మనుషుల తీరు, అమలులో లోపాలు, వ్యవస్థాగత నిర్లక్ష్యం సంక్షోభానికి కారణమవుతోంది. రోడ్డు ప్రమాదాలతో దేశ వార్షిక జీడీపికి 3 శాతం నష్టం కలుగుతోందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు చట్టం పట్ల గౌరవం, భయం లేకపోవడం వల్లే అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా అది ఒక పార్శ్వం మాత్రమే. నిర్మాణ, నిర్వహణ లోపాలు లోపభూయిష్టమైన రోడ్ల డిజైన్, నాసిరకం నిర్మాణం, అసమర్థ నిర్వహణ ప్రమాదాలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. రోడ్డు సూచికలు, మార్కింగ్‌ విధానం వంటి చిన్న విషయాలు కూడా అధ్వానంగా ఉన్నాయి. 59 ప్రధాన లోపాలను కేంద్ర ఉపరితల రవాణా శాఖే గుర్తించింది. రహదారుల్లో ప్రమాదానికి కారణమయ్యే 13,795 బ్లాక్‌ స్పాట్స్‌ ఉన్నాయి. వీటిలో 5,036లకు మాత్రమే దీర్ఘకాలిక మరమ్మతులు చేశారు. ఢిల్లీ ఐఐటీ ట్రాన్స్‌పోర్టేషన్‌ రీసర్చ్‌ అండ్‌ ఇంజ్యూరీ ప్రివెన్షన్‌ సెంటర్‌ నిర్వహించిన రోడ్‌ సేఫ్టీ ఆడిట్లు దేశ రహదారుల్లో మౌలిక సదుపాయాల లోపాలేంటో గుర్తించాయి. క్రాష్‌ బారికేడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం కూడా ప్రధాన కారణంగా ఉంది. బారికేడ్లున్నా లెక్క చేయకపోవడం కొంత కారణమైతే అస్థవ్యస్తమైన నిర్వహణే ఎక్కువ హాని చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. డివైడర్ల నిర్మాణంలోనూ లోపాలున్నాయి. ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎత్తులో ఉండటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. గుంతలు తవ్వి వదిలేయడం, సైన్‌ బోర్డులు పెట్టకపోవడం వల్లా ప్రమాదాలు జరుగుతున్నాయి. పటిష్టమైన రహదారుల వ్యవస్థ కాగితాలపైనే ఉందని, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని నిపుణులు చెబుతున్నారు. అనుకరణ వద్దుభారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక్కడ ప్రత్యేక ట్రాఫిక్‌ వ్యవస్థ ఉంటుంది. తదనుగుణంగా ఏర్పాట్లుండాలి. అందుకు భిన్నంగా పాశ్చాత్య రహదారుల నమూనాలను అనుకరించడం ప్రమాదాలకు కారణమవుతోందన్నది అంతర్జాతీయ నిపుణుల వాదన. రోడ్డు వెడల్పు చేయడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయన్నది నిజం కాదని చెబుతున్నారు. రోడ్డు వెడల్పు అతి వేగానికి దారి తీస్తుందని, చిన్న వాహనదారులకు ప్రాణాంతకంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. దేశాభివృద్ధికి మరిన్ని రహదారులను నిర్మించడం కీలకమేనని, అయితే అది పాదచారులు, సైక్లిస్టుల, ద్విచక్ర వాహనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆ అభివృద్ధికి నిరుపేద వర్గాలు మూల్యం చెల్లించుకోవాల్సి రాకూడదని హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement