Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comments On CBN And Yellow Media1
లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు!

పచ్చ పత్రిక ఈనాడు చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోకి పెట్టుబడుల ప్రవాహంలా వచ్చి పడుతున్నాయని అనిపిస్తుంది!. కానీ, బాబు వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు వీళ్లు చేస్తున్న విఫల ప్రయత్నాలు ఒక రకంగా ప్రజలను మోసం చేయడమే!. ఈ మధ్య కాలంలోనే రూ.33వేల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వీటితో 34 వేల మందికి ఉపాధి దొరికేసినట్లు ఈనాడు ఒక కథనాన్ని వండి వార్చింది.రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్‌ బోర్డు ఇటీవల ఆమోదించిన ప్రాజెక్టుల్లో కొన్నింటికి జగన్‌ హయాంలోనే ఒప్పందాలు కుదిరినా వాటిని బాబు గారి ఖాతాలో వేసేసి తరిస్తున్నాయి ఎల్లో పత్రికలు!. తప్పులేదు కానీ.. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలే రోత పుట్టిస్తున్నాయి. ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోయింది’ అని చంద్రబాబు అన్నట్టు.. పారిశ్రామికవేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు బాబు చెప్పారని రాసుకొచ్చింది ఈనాడు!. మొత్తం రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలిపిందని, 4.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కూడా బాబు చెప్పినట్లు ఈ కథనం చెబుతోంది. విచిత్రం ఏమిటంటే బోర్డు సమావేశం జరగడానికి ముందు రోజు టీడీపీ పాలిట్‌బ్యూరో సమావేశంలో రూ.8.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వెల్లడించారని ఎల్లో మీడియానే రాసింది. వీటిలో దేనిని నమ్మాలి?.తాజాగా ప్రకటించిన 19 ప్రాజెక్టులలో కొన్ని గత ప్రభుత్వంలోనే ఆమోదం పొందాయన్నది వాస్తవమా? కాదా? ఉదాహరణకు సత్యసాయి జిల్లాలో బీఈఎల్‌ యూనిట్, అనకాపల్లి వద్ద టైర్ల ప్యాక్టరీ, శ్రీసిటీలో డైకిన్ సంస్థలన్నీ ఇవన్ని గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంలో ఇవి వచ్చాయని, వాటిని మరింత ముందుకు తీసుకువెళుతున్నామని సీనియర్ నేత అయిన చంద్రబాబు చెప్పి ఉంటే హుందాగా ఉండేది. అలా కాకుండా అసలు జగన్ హయాంలో పరిశ్రమలే రానట్లు, ఇప్పుడే వస్తున్నట్లు చెప్పుకుంటూ పోతే ఆయనకు విలువ ఏమి ఉంటుంది!. అలాగే, లోకేష్ ఈ మధ్య శంకుస్థాపనలు చేస్తున్న క్లీన్ ఎనర్జీ కంపెనీలు కూడా గత జగన్ ప్రభుత్వంలో మంజూరు అయినవే అన్నది వాస్తవం.ఉదాహరణకు ఇంటిగ్రేటెడ్ రెన్యుబుల్ ఎనర్జీ కాంప్లెక్స్‌కు బేతపల్లిలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సంస్థ ఛైర్మన్‌ సుమంత్ సిన్హా జగన్ పారిశ్రామిక విధానాలను ప్రశంసిస్తూ ప్రసంగించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తారంగా తిరుగుతోంది. ఓర్వకల్లు వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రౌండ్ అయి చాలా ముందుకు వెళ్లింది. అదానీకి చెందిన సంస్థకు కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం భూములు కూడా కేటాయించారు.ఆ రోజులలో ఎల్లోమీడియా ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా విపరీతంగా దుష్ప్రచారం చేసేది. రామాయంపట్నం వద్ద శిర్డిసాయి కంపెనీకి చెందిన ఇండో సోలార్ ప్రాజెక్టు వస్తుంటే ఈ కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డిపై ఎన్ని అసత్య కథనాలు వండివార్చారో లెక్కలేదు. జగన్ బినామీ అని కూడా ఎల్లో మీడియా ఆరోపించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి ప్రభుత్వం ట్రాన్స్‌ఫార్మర్ల ఆర్డర్ ఇస్తోందంటూ విషపు రాతలు రాసింది. తదుపరి ఏమైందో కానీ, ఆ సంస్థ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనను ఆనందంగా ప్రచురించుకుంది. అంటే, ఆ కంపెనీ యజమానిని ఈ మీడియా బ్లాక్ మెయిల్ చేసిందని అనుకోవాలా? ఆయా కంపెనీలకు లోకేష్ శంకుస్థాపన చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, అదేదో తమ ప్రభుత్వం వచ్చాకే జరుగుతోందన్న భ్రమ కల్పించడానికి చేస్తున్న యత్నాలే బాగోలేవు.మరో ఉదాహరణ కూడా చెప్పాలి. విజయవాడ సమీపంలోని మల్లవల్లి వద్ద అశోక్ లేలాండ్ సంస్థ 2022లోనే బస్సుల తయారీని ఆరంభించింది. ఆ విషయం ఆ కంపెనీ సెబీకి కూడా తెలిపింది. కానీ, కొద్ది రోజుల క్రితమే ఉత్పత్తి ఆరంభమైనట్లు, లోకేశ్‌ ప్రారంభోత్సవం చేసినట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. సోషల్ మీడియా యుగంలో ఏదో మాయ చేయాలనుకుంటే ఇట్టే దొరికిపోతామన్న సంగతిని నేతలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు పాలన మొదలయ్యాక ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి?. కూటమి ఎమ్మెల్యేలు ఎన్ని పరిశ్రమలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు?. కాంట్రాక్టుల కోసం ఏ రకంగా ఒత్తిడి తెస్తున్నది పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్న మాట అబద్దమా?. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచర వర్గం సిమెంట్ కంపెనీలపై చేసిన దాడులు, ఇలాగైతే తాము పని చేయలేమని ఒక సిమెంట్‌ కంపెనీ హెచ్చరించడమూ తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య బూడిద తగాదా అన్నీ టీడీపీ నేతల దౌర్జన్యాలు, అవినీతి కార్యకలాపాలను ఎత్తి చూపేవే కదా?.ఆది నారాయణ రెడ్డి అనుచరుల దౌర్జన్యాలపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ ఏకంగా జిల్లా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారే!. పల్నాడులో గురజాల ఎమ్మెల్యే యరపతినేని దందాలకు రెండు సిమెంట్ కంపెనీలు కొన్నాళ్లపాటు మూతపడ్డాయి కదా?. శ్రీకాకుళం జిల్లాలో స్థానిక కూటమి నేతలు కింగ్ ఫిషర్ కంపెనీ వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి కదా?. రెడ్‌బుక్‌ కారణంగా జిందాల్‌ సంస్థ ఏపీలో పెట్టాల్సిన పెట్టుబడులను కాస్తా మహారాష్ట్రకు తరలించిందే!. గత ఫిబ్రవరి 12న ఒక అధికారిక సమావేశంలోనే చంద్రబాబు ఏపీలో పారిశ్రామికాభివృద్ది ‘-2.94 శాతం’గా ఉందని, పరిశ్రమలు మూతబడుతున్నాయని చెప్పారే. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆ పరిస్థితి ఉందనే కదా! దానికి ఆయనే బాధ్యత వహించాలి కదా?. దావోస్‌కు వెళ్లి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తామని హోరెత్తించి, చివరికి ఒక్క రూపాయి కూడా తేలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దానిని కవర్ చేయడానికి ఏపీ బ్రాండ్‌ బాగా ప్రచారమైందని ఎల్లో మీడియా ఎందుకు రాసింది? ఆ తర్వాత లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ఒకసారి, వచ్చేసినట్లు మరోసారి చంద్రబాబు, లోకేశ్‌లు ఎందుకు చెప్పారు?. చంద్రబాబు చెబుతున్నట్లు జగన్ టైంలో పెట్టుబడులు రాలేదా?. వివరాలు పరిశీలిస్తే కూటమి నేతలు అసత్యాలు చెబుతున్నారని చెప్పడానికి ఎన్నో ఆధారాలు కనిపిస్తాయి. రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ, జగన్ టైంలో లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు వచ్చాయి. అంబానీ, అదానీ వంటి ప్రముఖులు సైతం గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చారు. కొన్ని శంకుస్థాపన చేసుకుని ప్రారంభమయ్యాయి కూడా. బద్వేల్ వద్ద సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ ను చూడవచ్చు.అంతేకాదు.. ఎన్‌టీపీసీ లక్ష పదివేల కోట్ల వ్యయంతో హైడ్రో పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కొంతకాలం క్రితం ప్రధాని మోదీ దీనికే శంకుస్థాపన చేశారు. కాకపోతే దీన్ని టీడీపీ నేతలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. రిలయన్స్ బయోగ్యాస్, బిర్లా కార్బన్ ఇండియా, కోరమాండల్, అల్ట్రాటెక్, ఏసీసీ సిమెంట్స్, ఇండోసోలార్ మాడ్యూల్స్ ఇలా పలు రకాల పరిశ్రమలు సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచాయి. వాటిలో కొన్నిటిని ప్రస్తుత ప్రభుత్వ రెడ్ బుక్ విధానాల వల్ల కోల్పోయాయన్న విమర్శలు ఉన్నాయి.ఒకవైపు చంద్రబాబు పేరే బ్రాండ్ అని, ఏ కంపెనీ వచ్చినా ఆయనను చూసే వస్తున్నాయని లోకేష్‌ చెబుతుంటారు. కానీ, అత్యంత విలువైన విశాఖ భూములను కొన్ని కంపెనీలకు ఎకరా 99పైసలకే కట్టబెట్టవలసిన దుస్థితిలో రాష్ట్రం ఉంది. లీజుకు ఇవ్వాలని టీసీఎస్‌ సంస్థ కోరినా దాదాపు ఉచితంగా విక్రయించడం ఎందుకో?. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి కారుచౌకగా అరవై ఎకరాల భూమిని కట్టబెడ్టడంలోని ఆంతర్యం ఏమిటి? ఏది ఏమైనా పరిశ్రమలు, ఒప్పందాలకు సంబంధించి కాకి లెక్కలు చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి కొత్తకాదు.2014 హయాంలో ఏకంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేశారు. తీరా చూస్తే అందులో పదోవంతు కూడా వచ్చినట్లు స్పష్టంగా తెలియలేదు! నిరుద్యోగ భృతి ఎగవేయడానికి ఇలా చేస్తుండవచ్చు. ఇప్పటికైనా కాకి లెక్కలు మాని, గత ప్రభుత్వంపై బురద చల్లడం ద్వారా ఏపీ పరువును, బ్రాండ్‌ను పాడు చేయకుండా చిత్తశుద్దితో పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలని కోరుకుందాం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ED Sensational Allegations On Sonia, Rahul Gandhi In National Herald Case2
నేషనల్ హెరాల్డ్‌ కేసు.. సోనియా, రాహుల్‌పై ఈడీ సంచలన ఆరోపణ

సాక్షి, ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా రూ.142 కోట్లు ఆదాయాన్ని సోనియా, రాహుల్ గాంధీ వాడుకున్నారని తెలిపింది. నిందితులు నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారని పేర్కొంది.నేషనల్ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్‌ అంశంపై ఢిల్లీ ప్రత్యేక కోర్టులో బుధవారం జరిగిన విచారణలో భాగంగా ఈడీ వాదన వినిపించింది. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా రూ.142 కోట్లు ఆదాయాన్ని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వాడుకున్నారని ఈడీ తెలిపింది. AJLకి రూ.50 లక్షలు చెల్లించి యంగ్ ఇండియన్ కంపెనీ రూ.90.25 కోట్లు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సుమన్ దూబే , సామ్ పిట్రోడా నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. సోనియా, రాహుల్ యంగ్ ఇండియన్‌ కంపెనీలో 76% వాటాను కలిగి ఉన్నారు.నిందితులు నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తి నుండి వచ్చే అద్దె కూడా తీసుకున్నారు. నిందితులు నేరం చేయడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. నవంబర్ 2023లో ఆస్తులను అటాచ్ చేశాం. నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంపాదించినప్పుడు, వారు ఆదాయాన్ని తమ వద్దే ఉంచుకోవడం కూడా మనీలాండరింగ్‌గా పరిగణించాలి. ఈ క్రమంలో వచ్చిన డబ్బులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయి. ప్రాథమికంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేశాం’ అని చెప్పుకొచ్చింది.మరోవైపు.. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాపై ఈడీ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టులో అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని జూలైకి విచారణకు వాయిదా వేయాలని కోరారు. సింఘ్వీ అభ్యర్థనను అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వ్యతిరేకించారు.The Rouse Avenue Court began hearing the National Herald money laundering case. Notices were issued to Sonia Gandhi, Rahul Gandhi, Sam Pitroda, and others.Special counsel for ED, Zoheb Hossain submitted that the property derived from any criminal activity is a proceed of crime.…— ANI (@ANI) May 21, 2025ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్‌ ఆరోపణలతో కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. విదేశీ నిధులతో నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ.. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఈ కేసులో 2023, నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది.

Big Encounter In Chhattisgarh3
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నంబాల మృతి?

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అబూజ్మడ్ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 25 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. నారాయణపూర్‌లోని అబూజ్మడ్‌ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కీలక సమావేశం ఏర్పాటు చేశారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దంతెవాడ, బీజాపూర్‌ జిల్లాలకు చెందిన డీఆర్‌జీ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 25 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మృతుల్లో నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు బసవరాజుపై కోటిన్నర రివార్డు ఉంది. నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. వరంగల్‌ ఆర్‌ఈసీలో ఇంజినీరింగ్‌ చదివిన వ్యక్తి. నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు తండ్రి ఉపాధ్యాయుడు. 1984లో ఎంటెక్‌ చదువుతూ పీపుల్స్‌ వార్‌ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడు అయ్యాడు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు ఉన్నారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది జవాన్ల మృతి ఘటనకు సూత్రధారి బసవరాజు.

Shikhar Dhawan Buys Apartment For Rs 69 Crore In Gurugram: Report4
ఖరీదైన ఫ్లాట్‌ కొన్న శిఖర్‌ ధావన్‌.. ధర తెలిస్తే షాక్‌!

టీమిండియా మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan) ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేశాడు. గురుగ్రామ్‌ (Gurugram)లోని విలాసవంతమైన ఈ ఇంటి కోసం దాదాపు రూ. 69 కోట్లు ఖర్చు చేశాడు. కాగా భారత జట్టు మాజీ ఓపెనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శిఖర్‌ ధావన్‌.రోహిత్‌ శర్మ (Rohit Sharma)కు ఓపెనింగ్‌ జోడీగా బరిలోకి దిగిన ధావన్‌.. 2013లో టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా ఐసీసీ ఈవెంట్లో కేవలం ఐదు ఇన్నింగ్స్‌లోనే 363 పరుగులతో సత్తా చాటి ధోని సేన ట్రోఫీని ముద్దాడేలా చేశాడు.జాతీయ జట్టు తరఫున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన ధావన్‌.. శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌ల రాకతో టీమిండియాలో స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలో 2022లో చివరగా భారత్‌కు ఆడిన ధావన్‌ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.రెండు చేతులా సంపాదన.. నికర ఆస్తి?మొత్తంగా టీమిండియా తరఫున 288 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. 10867 పరుగులు సాధించాడు. ఇక ఫామ్‌లో ఉండగా రెండు చేతులా సంపాదించిన ధావన్‌.. ఐపీఎల్‌ ద్వారా కూడా కోట్లాది రూపాయలు ఆర్జించాడు. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరించి తన నెట్‌వర్క్‌ను పెంచుకున్నాడు.జాతీయ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌ నివేదిక ప్రకారం.. 2025 నాటికి శిఖర్‌ ధావన్‌ నికర ఆస్తుల విలువ రూ. 120 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇక 39 ఏళ్ల ధావన్‌ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయేషా ముఖర్జీ అనే డివోర్సీని పెళ్లి చేసుకున్న గబ్బర్‌కు కుమారుడు జొరావర్‌ ఉన్నాడు.మరోసారి ప్రేమలో గబ్బర్‌అయితే, ఆయేషాతో విభేదాల కారణంగా 2023లో విడాకులు తీసుకున్నాడు. ఇక గత కొంతకాలంగా ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌ అనే మహిళతో శిఖర్‌ ధావన్‌ డేటింగ్‌ చేస్తున్నాడు. ఈ జంట సహజీవనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గబ్బర్‌ గురుగ్రామ్‌లో కొత్త ఫ్లాట్‌ కొనడం విశేషం.గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్‌ 5, సెక్టార్‌ 54, గోల్ఫ్‌ కోర్స్‌ రోడ్‌లోని రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులో ధావన్‌ ఫ్లాట్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని ధర రూ. సుమారు 65.61 కోట్లు కాగా..స్టాంపు డ్యూటీగా రూ. 3.28 కోట్లు చెల్లించినట్లు సమాచారం.అద్బుత ఆట తీరుతోకాగా అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తంగా 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేసిన గబ్బర్‌..టెస్టు ఫార్మాట్‌లో 34 మ్యాచ్‌లు ఆడి 2315 రన్స్‌ సాధించాడు. ఇక టీమిండియా తరఫున 68 టీ20లలో 1759 పరుగులు చేసిన గబ్బర్‌.. ఐపీఎల్‌లో 221 ఇన్నింగ్స్‌లో 6769 పరుగులు సాధించాడు. తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఇప్పటికీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలా తన అద్బుత ఆట తీరుతో కోట్లు గడించాడు ధావన్‌.చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్‌.. సీఎస్‌కే కెప్టెన్‌ రియాక్షన్‌ వైరల్‌

AP People Serious Reactions On Pawan Kalyan5
పవన్‌.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?

ఏదైనా వస్తువు కొన్నాక కొన్నాళ్ళు వాడిన తరువాత దానిమీద.. దాని పనితీరు మీద అసంతృప్తి మొదలవుతుంది. అయ్యో బోలెడు డబ్బు పోసి కొన్నాను ఇది సరిగా పనిచేయడం లేదు. బాగుంది తీసుకెళ్లండి అంటూ షాపువాడు నన్ను మోసం చేసాడు అని తిట్టుకోవడం సహజం. కానీ చంద్రబాబు అనే నాసిరకం సరుకును తెచ్చుకున్న జనం దాన్ని ప్యాకింగ్ విప్పిన క్షణం నుంచీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయ్యో బయట మాటలు.. కలరింగ్.. మార్కెటింగ్ వాడి మాయ కబుర్లు నమ్మేసి ఈ దారిద్య్రాన్ని ఇంటికి తెచ్చుకున్నామే అన్నట్లుగా ప్రతి ఇంట్లోనూ తిట్టడం మొదలైంది. దుకాణంలో కౌంటర్లో చూపించేది ఒక రకం సరుకు.. మనకు పార్సిల్ చేసి ఇచ్చేది ఇంకో రకం సరుకు అన్నట్లుగా ఎన్నికల సభల్లో చంద్రబాబు.. లోకేష్.. పవన్ చెప్పింది ఒకటి. గెలిచాక చేస్తున్నది ఇంకోటి అని ఏడాది లోపే తేలిపోయింది. దీంతో పవన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి అనుకుని ఉన్న కాకినాడ ఎంపీ సెగ్మెంట్‌లోని తుని, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఇటీవల జరిపిన సర్వేలో చేదు నిజాలు వెలుగుచూశాయి. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనూ జనంలో వ్యతిరేకత ఎక్కువే ఉంది.ఎన్నికల సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు.. అత్యుత్సాహంతో విరిసిన డైలాగులు.. ఊపిన చేతులు.. హావభావాలని గుర్తు చేసుకుంటున్న జనం ఏదీ ఆ జోరు ఇప్పుడు కనిపించదేమి అని ప్రశ్నిస్తున్నారు. పైగా తెలుగుదేశం నాయకుల రౌడీయిజం.. రుబాబు.. దోపిడీ వంటి వాటిని పవన్ ఏమాత్రం ప్రశ్నించకపోవడంతో జనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకం వమ్మైనట్లు భావిస్తున్నారు. దీంతో ఇది కూడా నాసిరకం సరుకు.. ప్యాకింగ్ చూసి కోనేసాం.. లోపలంతా తాలు సరుకు అని తిట్టిపోస్తున్నారు. పైగా పవన్ కూడా పార్టీని గాలికి వదిలేసి తన అన్న నాగబాబుకు పదవి ఇప్పించుకోవడంతో సంతృప్తి చెంది ఇతర నాయకుల పొలిటికల్ కెరీర్ గురించి పూర్తిగా ఇగ్నోర్ చేయడంతో వారిలో అసంతృప్తి మొదలైంది.పైగా గ్రామాల్లో జనసేన కార్యకర్తల రౌడీయిజం వంటివి జనాల్లో చర్చకు వస్తున్నాయి. ఈ విషయాన్నే వైఎస్‌ జగన్‌ కూడా తాజాగా పార్టీ నేతల సమావేశంలో ప్రస్తావించారు. ఏడాదిలోపే ప్రభుత్వం మీద వ్యతిరేకత కమ్ముకొచ్చిందని.. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మద్దతు కూడగట్టాలని కేడర్‌కు సూచించారు. ఆయన చెప్పడం అని కాదు కానీ గ్రామాల్లో ఇప్పటికే చంద్రబాబు పాలనమీద పెదవి విరుపు మొదలైంది. ఇసుక ధరలు పెంపు.. పల్లెల్లో చిల్లర రాజకీయాలు.. రౌడీయిజం వంటివి జనంలో వ్యతిరేకతని పోగుచేస్తున్నాయి. -సిమ్మాదిరప్పన్న.

Income Tax Dept Announces Key Updates to ITR U Filing Rules6
ఐటీఆర్-యూ ఫైలింగ్ నిబంధనల్లో కీలక మార్పులు

ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్-యూ (అప్‌డేటెడ్‌ రిటర్న్) ఫైలింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సవరించడానికి అధిక సమయం ఇస్తుందని తెలిపింది. అదే సమయంలో ఆలస్యంగా సమర్పించిన రిటర్న్‌లపై భారీ జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. పన్ను సమ్మతిని మెరుగుపరచడం, మోసపూరిత ఫైలింగ్‌లను తగ్గించడం లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది.సవరణలు ఇలా..అప్‌డేటెడ్‌ రిటర్న్ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఇప్పటివరకు అసెస్‌మెంట్‌ ఇయర్‌ నుంచి 24 నెలలు గడువు ఉండేది. దాన్ని తాజాగా 48 నెలలు (4 సంవత్సరాలు)కు పెంచారు. ఇది వ్యక్తులు, వ్యాపారాలకు రిటర్న్‌ల సమయంలో తప్పులను సరిదిద్దుకోవడానికి, గతంలో ఫైల్‌ చేయని ఆదాయాన్ని నివేదించడానికి మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుంది. ఆలస్యంగా ఐటీ రిటర్న్‌లను ఫైలింగ్ చేయడాన్ని కట్టడి చేసేందుకు భారీ జరిమానాలు విధిస్తున్నట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది.మదింపు సంవత్సరం ముగిసిన 12 నెలలలోపు ఐటీఆర్‌-యూ దాఖలు చేస్తే 25 శాతం పన్ను విధిస్తారు.12 నుంచి 24 నెలల్లోపు అయితే 50 శాతం పన్ను చెల్లించాలి.మూడో సంవత్సరంలో ఫైల్ చేస్తే అదనంగా 60 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.నాలుగో సంవత్సరంలో ఫైల్ చేస్తే 70 శాతం పన్ను వర్తిస్తుంది.ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!2024-25 ఆర్థిక సంవత్సరానికి (2025-26 అసెస్‌మెంట్‌ ఇయర్) మొత్తం ఏడు ఐటీఆర్ ఫారాలను (ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్-7 వరకు) ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫారాలకు సంబంధించిన ఈ-ఫైలింగ్ సదుపాయాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. రెగ్యులర్ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేవారికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్‌ ఇయర్ 2025-26) గడువు 2025 జులై 31గా ఉంది.

Sukumar Gives Big Update About Ram Charan Movie7
రామ్‌ చరణ్‌తో సినిమా.. ‘రంగస్థలం’ మించిపోతుంది: సుకుమార్‌

మలికిపురం: తన తదుపరి చిత్రం ‘గ్లోబల్‌ స్టార్‌’ రామ్‌చరణ్‌తో ఉంటుందని ప్రముఖ సినీ దర్శకు­డు సుకుమార్‌ చెప్పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో స్వగ్రామమైన మట్టపర్రుకు కుటుంబ సమేతంగా మంగళవారం ఆయన విచ్చేశారు. గ్రామస్తులు, చిన్ననాటి స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... హీరో రామ్‌చరణ్‌తో సినిమా తీసేందు­కు కథ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తామిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని, ఆ తరువాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాన్‌ ఇండియా స్థాయికి రామ్‌చరణ్‌ ఎదిగారన్నారు. ఆయనతో తాను చేయబోయే చిత్రం ఆ స్థాయిలోనే ఉంటుందని తెలిపారు. అల్లు అర్జున్‌తో తీసిన ‘పుష్ప’ జా­తీ­య స్థాయిలో తనకు గుర్తింపు తెచ్చిందన్నారు. పుష్ప–1కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూ­సి రెండో భాగాన్ని మరింత ఫోకస్‌ పెట్టి తీశామన్నారు. స్వగ్రామం మట్టపర్రులోని తన ఇంట్లో చిన్నారితో ముచ్చటిస్తున్న దర్శకుడు సుకుమార్‌ ప్రేక్షకుల అభిరుచి ఏం మారలేదు సినిమాపై ప్రేక్షకుల అభిరుచి ఏ మాత్రం మారలేదని, అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉందని సుకుమార్‌ పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రేక్షకులు థియేటర్లను బాగా ఆదరిస్తున్నారని చెప్పారు. పట్టణ ప్రేక్షకుల్లో కొంత భాగం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. టాలెంట్‌ ఉన్నవారు చాలా మంది ఉన్నారని, అలాంటి వారిని ప్రోత్సహించేందుకు సుకుమార్‌ రైటింగ్స్‌ వంటి సంస్థల్ని స్థాపించానన్నారు. ఈ సంస్థల ద్వారా చాలామందికి ప్రోత్సాహం, టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకునే అవకాశం దక్కుతుందన్నారు. ఆ దిశగానే ఫలితాలు ఉంటున్నాయని చెప్పారు. పుట్టిన ఊరంటే అందరికీ మమకారమేరెండేళ్లకు పైగా చాలా బిజీ షెడ్యూల్స్‌లో ఇరుక్కుపోయానని, షూటింగ్స్‌ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల స్వగ్రామానికి రాలేకపోయానని సుకుమార్‌ చెప్పారు. లేదంటే ఏటా సంక్రాంతి పండుగను ఇక్కడే చేసుకునే వాళ్లమన్నారు. ఇకపైనా ఏటా ఇదే సంప్రదాయం కొనసాగిస్తానన్నారు. పుట్టిన ఊరంటే అందరికీ మమకారమే అన్నారు. కోనసీమలో గోదారి గట్లూ.. కాలువ చెంత, పొలాల మధ్య స్నేహితులతో తిరిగిన క్షణాలు, కాలేజీ రోజులు చాలా బాగుంటాయన్నారు.

How spirituality shapes CEO Shobhit Singhs business philosophy8
నాడు సన్యాసి.. ఇవాళ కంపెనీ సీఈవోగా..!

ఎందరో మేధావులు, ప్రముఖులు జీవితంలో అనుభవించాల్సిన ఆనందమంతా పొంది, బాధ్యతలు కూడా నెరవేర్చి.. చరమాంకంలో ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేస్తుంటారు. ఇక వారి శేష జీవితాన్ని ఆ దేవుని సేవకు అంకితం చేసిన ఎందరో భక్తాగ్రేసులను చూశాం. అలా కాకుండా వారందరికంటే భిన్నంగా..ఓ వ్యక్తి ఆధ్యాత్మికత నుంచి ఆధునిక జీవన విధానంలోకి వచ్చాడు. ఆయన ఆధ్యాత్మికంగా పరిపక్వత చెంది..చివరికి ప్రాంపించిక జీవితంలోకి రావడమే గాక..కోట్లు టర్నోవర్‌ చేసే కంపెనీకి సీఈవోగా ఎదిగారాయన. అంతేగాదు కుటుంబ జీవనంలో బతుకుతూనే ఆధ్యాత్మికంగా బతకొచ్చు అని నిరూపించాడు. పైగా అది మన జీవితంలో భాగమే గానీ ఎక్కడో దేవాలయాల్లో, మఠాల్లోనూ పొందే సిద్ధాంతం కాదని అంటారాయన. అది మన జీవన విధానానికే పునాది..అదే కేంద్రం బిందువని చెప్పకనే చెప్పాడు.ఆయనే స్టోన్ సఫైర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శోభిత్ సింగ్. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన సింగ్ చిన్నప్పటి నుంచి తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతవైపు ఆకర్షితుడయ్యాడు. అలా తన చదువు పూర్తి చేసుకున్న వెంటనే..కేవలం 26 ఏళ్లకే రిషికేశ్‌లోని ఒక ఆశ్రమంలో ఆధ్యాత్మికతలో మునిగిపోయాడు. అక్కడే వేద అధ్యయనం చేశాడు. ఇక పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోనే నడవాలని భావించాడు. అలా ఆ రిషికేశ్‌ ఆశ్రమం మహర్షి సంస్థలో సభ్యుడిగా కూడా మారాడు. పూర్తి సన్యాసి జీవితం గడుపుతున్న శోభిత్‌ సింగ్‌ మఠాన్ని విడిచి పెట్టి..ప్రాపంచిక జీవితంలో గడుపుతూ ఆధ్యాత్మికంగా ఉండొచ్చు అని విశ్విసించడం మొదలుపెట్టాడు. ఆయనకు ఆ ఆశ్రమంలో ఉండగానే ఆధ్యాత్మికత అంటే కేవలం ఆచారాలు లేదా ఏకాంతం లేదా 'సంసారం' నుంచి నిష్క్రమించడం కాదని బోధపడింది. మన దైనందిన జీవితంలో ప్రతిపాత్రలో దీన్ని విలీనం చేసి బతికే జీవన విధానమే అది అని తెలుసుకున్నానని చెబుతున్నాడు శోభిత్‌. అప్పుడే స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యా..అందరిలా జనజీవన స్రవంతిలో చేరి కార్పొరేట్‌ ప్రంపంచలో బతుకుతూ కూడా ఆధ్యాత్మికంగా ఎలా బతకచ్చో ఆచరించి చూపాలని నిర్ణయించుకున్నారట శోభిత్‌ సింగ్‌ఆ నేపథ్యంలోనే కొత్తమంది స్నేహితులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించి అంచలంచెలుగా విజయాలను అందుకున్నానని అన్నారు. ఈ పోటీతత్వంతో కూడిన కార్పొరేట్‌ వరల్డ్‌లో కూడా తన ఆలోచన విధానంలో ఎట్టి మర్పు రాలేదని ధీమాగా చెబుతున్నారు శోభిత సింగ్‌. ఆశ్రమంలో లేదా వ్యాపారంలో అయినా..తాను ఆధ్యాత్మికత విద్యార్థినే అంటారు. ఇక్కడ ఆధ్యాత్మికత..వినయం, సానుకూలత, సానుభూతి, గ్రహణశక్తి తదితరాలను ప్రతిబింబిస్తే..వ్యాపారంలో రాణించాలంటే కూడా ఇవన్నీ అవసరం..అదే నన్ను వ్యవస్థాపక జీవితంలోకి తీసుకొచ్చాయని నవ్వుతూ చెబుతారాయన. అదే వ్యాపార సూత్రం..ఆధ్యాత్మికత ప్రాథమిక విలువలైనా..బహిరంగత, వినయం, సానుకూలత, సానుభూతి, ఆత్మపరిశీలన, గ్రహణశక్తి తదితరాలే నా వ్యాపార సూత్రాలంటారు ఆయన. వాటితోనే తాను అందరితో సంబంధాలు నెరపీ..వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. అలాగే ప్రతి వ్యక్తికి 200% జీవితం ఉంటుందట. అంటే 100% అంతర్గత (ఆధ్యాత్మిక), ఇంకో 100% బాహ్య జీవతానికి కేటాయించి ఉంటుందంటారు సింగ్‌. ఈ ఆధ్యాత్మికత ప్రయాణం వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన జీవితంలో కూడా స్పష్టమైన వైఖరితో ఉండటం నేర్పిస్తుందట. పైగా అన్నివేళల మంచి స్పృహతో ఉంటారట. ఈ ఆధ్యాత్మికతలో మనల్ని మనం పరిశీలించటంతో జర్నీ మొదలవుతుంది..అక్కడ నుంచి మన దృక్కోణం మారుతుది..దాంతోపాటు జీవితం కూడా మారుతుంది. అలాగే ఏ విషయాలకు ఎలా స్పందించాలనే విషయంపై పూర్తి అవగాహన ఉంటుంది. అది ఈ ప్రాపంచిక జీవన విధానంలో ఎలా మసులుకోవాలో నేర్పించడమే గాక జీవితంలో ఉన్నతంగా బతకడం వైపుకు మార్గం వేస్తుందని చెబుతున్నారు శోభిత్‌ సింగ్‌. కాగా, ఆయన కంపెనీ గుజరాత్‌కు చెందిన కాగితపు ఉత్పత్తుల సరఫరాదారు. దీని టర్నోవర్‌ కోట్లలో ఉంటుందట. అంతేగాదు ఇది ఆసియాలో అతిపెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సరఫరాదారులలో ఒకటి, పైగా US రిటైలర్ల కాగితపు ఉత్పత్తి అవసరాలను కూడా తీరుస్తుంది. ముఖ్యంగా చిన్నారుల ఆర్ట్ సామాగ్రి, క్రాఫ్ట్ మెటీరియల్, పర్యావరణ అనుకూల స్టేషనరీ తదితర ఉత్పత్తులను అందిస్తుంది. (చదవండి: International Tea Day: 'టీ' వ్యాపారంలో సత్తా చాటుతున్న మహిళలు వీరే..!)

BJP MP Etela Rajender Key Comments On Kaleshwaram Notice9
కమిషన్‌ నోటీసులకు భయపడేది లేదు: ఈటల

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు పీసీ ఘోష్‌ కమిషన్‌ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఈటల రాజేందర్‌ సాక్షితో మాట్లాడుతూ..‘నోటీసులకు భయపడేది లేదు. ఇంకా నోటీసులు అందలేదు. కాళేశ్వరం కమిషన్ విచారణకు సహకరిస్తాను. చట్టాలు, కోర్టులు, కమిషన్‌పై నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీలో కొంత మంది చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. విచారణకు భయపడేది లేదు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. నేను ఆర్థిక శాఖమంత్రిగా పని చేసిన సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్‌గా ఉన్నారని చెప్పారు. పీసీ కమిషన్‌ను ఎందుకు ఇన్నిసార్లు పొడిగించారో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. తుమ్మల, కడియం, జూపల్లికి ఏం జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. కాళేశ్వరంపై జూన్ ఐదో తేదీన విచారణకు రావాలని కేసీఆర్‌కు, జూన్ ఆరో తేదీన హరీష్ రావు, జూన్‌ తొమ్మిదో తేదీన ఈటల రాజేందర్‌ను విచారణకు రావాలని పీసీ కమిషన్ జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన వెంటనే మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే, పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణకు కేసీఆర్ హాజరు అవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Chandrababu TDP coalition government abolished MDU system10
బియ్యం బండి ఆగింది.. మీ రేషన్‌ మీరే తెచ్చుకోండి

సాక్షి, అమరావతి: పనులు మానుకుని రోజంతా రేషన్‌ డిపోల దగ్గర పడిగాపులు.. బియ్యం కోసం క్యూ లైన్లో కుస్తీలు.. ఎండైనా, వానైనా అరుగులపై కూలబడి అవస్థలు.. తీరా సర్వర్లు మొరాయించడంతో ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టిన దుర్భర దృశ్యాలు రాష్ట్రంలో పునరావృతం కానున్నాయి! వీధివీధినా బెల్టు షాపుల ఏర్పాటుతో ఊరూరా మద్యపుటేరులు పారిస్తున్న టీడీపీ కూటమి సర్కారు ఇప్పటికే రేషన్‌ డోర్‌ డెలివరీ వ్యవస్థను నీరుగార్చగా, తాజాగా పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. ప్రజల అవస్థలను తొలగిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థ ‘ఇంటి వద్దకే రేషన్‌’ను చంద్రబాబు సర్కార్‌ కక్షపూరితంగా రద్దు చేసింది. ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కుతూ రాజకీయ దురుద్దేశాలతో ఏకపక్షంగా ‘ఎండీయూ’ వ్యవస్థను తొలగించింది. కేవలం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టారనే దుగ్ధతో, వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలను జీర్ణించుకోలేక కోట్లాది మంది పేదలకు సేవలందిస్తున్న ఎండీయూలపై విషం చిమ్ముతూ ఆ వ్యవస్థకే మంగళం పాడేసింది. ఇకపై మీ రేషన్‌.. మీరే తెచ్చుకోండి..! అంటూ ప్రజలను నిలువునా మోసం చేసింది. బాబు ఆగమనం.. రాష్ట్రం తిరోగమనం! టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసి, వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేస్తూ తిరోగమన పాలనకు శ్రీకారం చుట్టింది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సమయంలో.. దేశం మెచ్చిన ఎండీయూ వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చేసింది. సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన అంటూ ఊకదంపుడు ఉపన్యా­సా­లతో అరచేతిలో వైకుంఠం చూపించే సీఎం చంద్రబాబు అండ్‌ కో ఉన్న ఉద్యోగాలే ఊడగొడుతోంది. మొన్న... 2.66 లక్షల వలంటీర్ల కుటుంబాలు.. నేడు 9,260 మంది ఎండీయూ ఆపరేటర్ల కుటుంబాలు, వారిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న మరో పది వేల మంది హెల్పర్ల కుటుంబాలను నడిరోడ్డు పైకి లాగేశారు. రాష్ట్రంలో 29,500 రేషన్‌ దుకాణాల వద్దకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవడానికి నానా ప్రయాసలు పడిన ప్రజలకు సాంత్వన చేకూరుస్తూ గత ప్రభుత్వం తెచ్చిన ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్‌ విధానాన్ని చంద్రబాబు భారీ ఆర్థిక భారంగా చిత్రీకరించారు. పేదల ఇంటికి ప్రభుత్వ సేవలు చేరుతుంటే దాన్ని అనవసర భారంగా ముద్రవేశారు. మళ్లీ కూలి మానుకునే దుస్థితి.. గత ప్రభుత్వంలో ఎండీయూ వాహనం ఇంటికి వచ్చే ముందు వలంటీర్‌ ద్వారా నిర్ణీత సమయం, తేదీతో సహా లబ్ధిదారులకు సందేశం వెళ్లేది. ఇంటి యజమానే కాకుండా కార్డుదారుల్లో ఏ వ్యక్తి ఉన్నా బియ్యం ఇచ్చేవారు. రేషన్‌ బియ్యం కోసం ఏ ఒక్కరూ పనులు మానుకుని ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు రేషన్‌ కోసం కూలి పనులు మానుకుని ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది కార్డుదారులు ఉండగా వీరిలో అత్యధికం రోజువారీ పనులు చేసుకుని జీవించేవారే. వీరంతా రూ.300 – రూ.500 రోజు కూలీని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. వీరిలో సగటున కోటి మంది రేషన్‌ తీసుకోవడానికి డిపోకు వెళితే ఆ రోజు పనికి దూరం కాక తప్పదు. అంటే ఒక నెలలో ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ తీసుకోవడానికి పేదలు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి. ఇక ఏడాదికి రూ.3,600 కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు నష్టపోనున్నారు. పోనీ వెళ్లిన రోజే రేషన్‌ వస్తుందా అంటే అదీ లేదు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అనుభవాలే దీనికి నిదర్శనం. నెలకు కేవలం రూ.25 కోట్లతో సమర్థంగా నిర్వహించే ఎండీయూ వ్యవస్థను ఆర్థిక భారంగా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. ఒకవైపు 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్‌ ఇస్తుంటే.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్‌ సరుకులు ఇంటికి పంపిస్తామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఎవరి సహాయంతో రేషన్‌ డోర్‌ డెలివరీ చేస్తారో చెప్పకపోవడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎండీయూలపై నేర ముద్ర.. గతంలో చౌక దుకాణాలపై కేసుల్లేవా! ఓ విప్లవాత్మక వ్యవస్థను నిర్వీర్యం చేయాలంటే నిందారోపణలు చేయాలి. ఇదే చంద్రబాబు సర్కార్‌ స్ట్రాటజీ! అందులో భాగంగానే ఎన్నికల ముందు నుంచే రేషన్‌ అక్రమ రవాణాకు కేరాఫ్‌ అంటూఎండీయూ వ్యవస్థపై గోబెల్స్‌ ప్రచారం సాగించారు. రేషన్‌ అక్రమ రవాణా మొత్తం ఎండీయూల చేతుల్లోనే జరుగుతోందంటూ హీనాతిహీనంగా మాట్లాడారు. వాస్తవానికి ఎండీయూ ఆపరేటర్లు అంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువతే. వీరంతా సొంతూరిలో సగౌరవంగా తలెత్తుకుని జీవించేలా, సొంత కాళ్లపై నిలబడేలా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 90 శాతం రాయితీతో వాహనాలను అందించి ఉపాధి కల్పించింది. తద్వారా సామాజిక న్యాయం, సాధికారతకు బాటలు వేసింది. ఎండీయూలకు ఆర్థిక ఊరట కల్పించేందుకు వాహన మిత్ర పథకంలో భాగంగా ఏడాదికి రూ.10 వేలు చొప్పున అందించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎండీయూలపై అక్రమ రవాణాదారులుగా నిందలు మోపింది. 9,260 ఎండీయూ వాహనాల్లో ఇప్పటి వరకు 288 ఆపరేటర్లపై బియ్యం అక్రమ రవాణా కేసులు పెట్టామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మంగళవారం మీడియా ముఖంగా చెప్పారు. అంటే దాదాపు 9 వేల వాహనాలు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నట్టే కదా? పోనీ గతంలో చౌక ధరల దుకాణదారులపై రేషన్‌ బియ్యం అక్రమ నిల్వ, అక్రమ రవాణా కేసులు లేవా అంటే కోకొల్లలుగా ఉన్నాయి. వ్యవస్థల్లో లోపాలు ఎక్కడైనా సహజంగా ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ పాలన సాగించాల్సిన ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ప్రజా ప్రయోజనకారిగా ఉన్న వ్యవస్థలను శాశ్వతంగా తొలగించడం అవివేకం కాక మరేమిటన్నది ప్రశ్న? ఇక రేషన్‌ డీలర్‌ అందుబాటులో లేకపోతే ఆ నెలలో సరుకులు కచ్చితంగా ఆలస్యం అవుతాయి. కానీ ఎక్కడైనా ఎండీయూ ఆపరేటర్‌ సెలవులో ఉన్నా, అనివార్య కారణాలతో రాకున్నా వీఆర్‌వో ద్వారా లబ్ధిదారులు ఇంటి వద్దే సరుకులు పొందేలా గత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఎండీయూ వాహన ఆపరేటర్ల పోస్టు ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయడంతో పాటు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపైన నియమించి నిత్యావసరాలను సరఫరా చేసింది. గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎండీయూ వాహనాలు వెళ్లడం కష్టంతో కూడుకున్నది. ఈ పరిస్థితుల్లో అదనపు ఖర్చు చేసి ఇతర వాహనాల్లో లబ్ధిదారుల ఇళ్లకు రేషన్‌ చేరవేసింది. ఆసక్తి చూపిన ఎనిమిది రాష్ట్రాలు.. రేషన్‌ పంపిణీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2021లో రూ.530 కోట్లకు పైగా వ్యయంతో ‘ఇంటి వద్దకే రేషన్‌’ వ్యవస్థను తీసుకొచ్చింది. నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్‌ డెలివరీ చేయడంతో పాటు ఐసీడీఎస్‌(అంగన్‌వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోరి్టఫైడ్‌ బియ్యాన్ని నేరుగా సరఫరా చేసింది. దీంతో అంగన్‌వాడీలు, పాఠశాలలకు వ్యయ ప్రయాసలు తొలగిపోయాయి. గోదావరి వరదలు, విజయవాడ వరదలు లాంటి విపత్తుల సమయంలోనూ ఎండీయూలే సమర్థంగా సేవలందించాయి. ఇలా ఓ వ్యవస్థను వివిధ ప్రభుత్వ సేవలకు వినియోగించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని విస్మరించి ఏకపక్షంగా రద్దు చేయడం సిగ్గుచేటు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండీయూ వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్‌ వినియోగం పారదర్శకంగా 90 శాతానికిపైగా పెరిగింది. దేశంలో 8 రాష్ట్రాలకు పైగా రేషన్‌ డోర్‌ డెలివరీపై ఆసక్తి కనబరిచాయి.అధికారంలోకి రాగానే అడ్డుకున్న కూటమి ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది రేషన్‌ కార్డుదారులకు ఎండీయూ వ్యవస్థ ద్వారా సమర్థంగా నాణ్యమైన బియ్యం పంపిణీ జరుగుతోంది. ఒక్కో ఎండీయూ వాహనం రోజుకు 90 కార్డులకు తగ్గకుండా నెలలో 17 రోజుల పాటు ఇంటి వద్దకే వెళ్లి రేషన్‌ను చేరవేస్తోంది. కల్తీకి ఆస్కారం లేకుండా, కచ్చితమైన తూకంతో ప్రజల సమక్షంలో బియ్యాన్ని ఇంటి ముంగిట్లో అందజేస్తోంది. వివిధ కారణాలతో ఇంటి దగ్గర ఎవరైనా రేషన్‌ తీసుకోకుంటే సాయంత్రం పూట గ్రామ, వార్డు సచివాలయం వద్ద ఇచ్చేలా వెసులుబాటు ఉంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యల్లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికీ సార్టెక్స్‌ బియ్యాన్ని సరఫరా చేసింది. ఈ క్రమంలో ఎక్కడా రేషన్‌ డీలర్ల ఉపాధికి ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. కేవలం ప్రజల దగ్గరకే ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం పేరుతో ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీని నిలిపివేసింది. అధికారంలోకి రాగానే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు 2 వేలకుపైగా ఎండీయూ వాహనాలను బలవంతంగా నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో చౌక ధరల దుకాణాల్లోకి వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాలని హుకుం జారీ చేశారు. పేదల ఇంటికి రేషన్‌ వద్దు... మద్యం ముద్దుపేదల ఇంటికి రేషన్‌ వద్దు గానీ మద్యం మాత్రం ముద్దు అనే రీతిలో టీడీపీ కూటమి సర్కారు చర్యలున్నాయి. బెల్ట్‌ షాపులతో ప్రతీ గ్రామంలో మద్యం డోర్‌ డెలివరీ చేస్తూ ఇంటివద్దకే రేషన్‌ను మాత్రం అదనపు వ్యయంగా చిత్రీకరిస్తోంది.2027 వరకు ఒప్పందం గడువు ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి ఆ వాహనాలను ఆపరేటర్లకు ఉచితంగా ఇస్తామంటూ మంత్రి నాదెండ్ల ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఎండీయూ అసోసియేషన్లు, చౌక ధరల దుకాణదారుల అసోసియేషన్ల సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై విధివిధానాలు ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. 2027 వరకు ఒప్పందం గడువు ఉన్నందున మధ్యలో ఎలా వెళ్లగొడతారని ఎండీయూ అసోసియేషన్‌ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. అర్ధంతరంగా ఎండీయూలను నిలిపివేస్తే తాము ఉపాధి కోల్పోవడంతోపాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని విన్నవించినా ప్రభుత్వం ఆలకించలేదు. తమకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు లేకుండా ఎన్‌వోసీ ఇచ్చిన తర్వాతే రద్దుపై నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఎండీయూలను కొనసాగించాల్సిందేనని తేల్చిచెప్పారు. రోడ్డుపై వదిలేస్తాం అంటే ఊరుకోముఎండీయూ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే మాకు 72 నెలలకు అగ్రిమెంట్‌ చేశారు. 2027 జనవరి వరకు సమయం ఉంది. ఇంకా సుమారు 20 నెలలు కొనసాగే హక్కు మాకు ఉంది. ఇన్నేళ్లుగా మా సేవలను వినియోగించుకుని ఇప్పుడేదో ఉచితంగా వాహనం ఇచ్చేస్తున్నట్లు మాట్లాడటం సరికాదు. మాకేమైనా దానధర్మం చేస్తున్నారా? మేం పని చేయలేదా? ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రోడ్డుపై వదిలేస్తామంటే చూస్తూ ఊరుకోం. బుధవారం నుంచి మా కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం మాకు ఏం ఉపాధి చూపిస్తారో చెప్పాలి. స్పందించకుంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయించడానికి కూడా వెనుకాడబోం. మాకు న్యాయం చేయకుండా డీలర్ల ద్వారా రేషన్‌ పంపిణీ ఎలా చేస్తారో చూస్తాం. ముందుగా మాకు బ్యాంకుల నుంచి ఎన్‌వోసీ ఇప్పించి జీవనోపాధి చూపించాలి. – రౌతు సూర్యనారాయణ, ఎండీయూ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుఇబ్బంది లేకుండా సరుకులు తీసుకున్నాంఇంటి ముందుకే రేషన్‌ వాహనం రావడం వల్ల ఇబ్బంది లేకుండా సరుకు­లు తీసుకున్నాం. ఐదేళ్లు ప్రశాంతంగా ఇంటి ముందుకే వచ్చాయి. ఇప్పుడు వాహనాలు రావంటే మాలాంటోళ్లం ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా ఇంటి నుంచి రేషన్‌ షాపు అర కిలోమీటరు దూరంలో ఉంది. అంత దూరం నడిచి వెళ్లి క్యూలో నిలబడాలి. డీలర్‌ ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి. వేలిముద్రలు పడకపోతే గంటల తరబడి నిలబడాలి. మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడితే ఈ ప్రభుత్వానికి ఏం వస్తుంది? – దారుకుమల్లి వెంకటసుబ్బమ్మ, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా గిరిజనులకు ఎంతోమేలు జరిగింది గతంలో గిరిజనులంతా నిత్యావసరాలు పొందేందుకు అవస్థలు పడ్డారు. గత ప్రభుత్వం ఎండీయూ వాహ­నాలతో ఇంటింటికి బియ్యం, ఇతర నిత్యావసరాల పంపిణీని ప్రారంభించి గిరిజనులకు ఎంతో మేలు చేసింది. కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేస్తే 3 కి.మీ. దూరంలో ఉన్న మినుములూరు డీఆర్‌ డిపో నుంచి సరుకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. –పాలికి లక్కు, గిరిజనుడు, గుర్రగరువు గ్రామం, మినుములూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా మాగ్రామంలో రేషన్‌ షాపు లేదు మా గ్రామంలో రేషన్‌ షాపు లేదు. మూడు కి.మీ. దూరంలో ఉన్న బురాందొడ్డికి వెళ్లి బియ్యం, ఇతర రేషన్‌ సరుకులు తెచ్చుకునేవాళ్లం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాకు రేషన్‌ కష్టాలు తొలిగాయి. ఇంటి దగ్గరకే రేషన్‌ బండి వచ్చింది. ఇప్పుడు వాటిని తీసి వేస్తే మళ్లీ బియ్యం సంచి నెత్తిన మోయాల్సిందే. చంద్రబాబు పుణ్యమా అని పాత కష్టాలు పునరావృతమవుతున్నాయి. – రహేలమ్మ, బ్యాతోలి గ్రామం, సీబెళగల్‌ మండలం, కర్నూలు జిల్లా

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement