breaking news
NRI
-
గేదెల దాముకు సేవారత్న అవార్డు
అమెరికాలో నివసిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రవాసాంధ్ర వాసి, మన అమెరికా తెలుగు అసోసియేషన్- మాట కో కన్వీనర్ దాము గేదెలను సేవారత్న అవార్డుతో సత్కరించారు. విజయనగరం జిల్లాలోని రాజాంకు చెందిన పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు... శ్రీకాకుళం జిల్లా కత్తులకవిటికి చెందిన ఎన్నారై, సామాజిక సేవా కార్యకర్త గేదెల దాము దంపతులను సేవారత్న అవార్డుతో సత్కరించారు.అవార్డు అందుకున్న దాము మాట్లాడుతూ… తనకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. కుటుంబీకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, సేవా కార్యక్రమాలు బాధ్యతను, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దామును పలువురు కళాకారులు సత్కరించారు.అంతకు ముందు జగన్మోహిని పద్య నాటక ప్రదర్శన, కేవీ పద్మావతి శిష్య బృందంతో భరత నాట్య నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక జీఎంఆర్ వరలక్ష్మీ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం కమిటీ సభ్యులు, రాజాంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(చదవండి: ఘనంగా శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి) -
అంతర్జాతీయ వేదికపై డా. తెన్నేటి సుధాదేవికి ఘన నివాళి
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, అంతర్జాలంలో శనివారం సాయంత్రం, ప్రఖ్యాత కథా నవలా రచయిత్రి, తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు, వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి సంస్మరణ సభ నిర్వహించారునవంబర్ 23వ తేదీ హైదరాబాదులో స్వర్గస్తులైన, డా. తెన్నేటి సుధాదేవి (Dr.Tenneti Sudha Rani), వంశీ సంస్థల వ్యవస్థాపకులైన డా. వంశీ రామరాజు ధర్మపత్ని. "సుధాదేవి స్మరణలో, వివిధ దేశాల తెలుగు ప్రవాస సంస్థల ప్రతినిధులు, భారతదేశంలో చెన్నై ముంబై విశాఖపట్నం మొదలైన ప్రాంతాలలో ఉండే ప్రముఖులు ఆప్తులు కలిసి ఆమెకి నివాళులు అర్పించే విధంగా ఈ అంతర్జాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వహకులు వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమ సమన్వయకర్త రాధిక మంగిపూడి తెలియ జేశారు.సుమారు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో శిరోమణి డా వంశీ రామరాజు అంతర్జాల వేదిక మాధ్యమంగా అన్ని దేశాలనుండి తమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ నుండి మాత్రమే కాక సుమారు పది దేశాల నుండి 50 మంది వరకు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారతదేశం నుండి వంశీ సంస్థలతో అవినాభావ సంబంధం ఉన్న పద్మభూషణ్ డా.యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, డా. మేడసాని మోహన్, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ రచయిత భువనచంద్ర, సంగీత విద్వాంసులు గరికపాటి ప్రభాకర్, గాయకులు గజల్ శ్రీనివాస్, గాయని సురేఖ మూర్తి, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, సినీ నటులు సుబ్బరాయశర్మ, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, రచయిత్రి జలంధర చంద్రమోహన్, రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి, అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జుర్రు చెన్నయ్య, పొత్తూరి సుబ్బారావు తదితర వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అమెరికా, సింగపూర్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, ఉగాండా, మలేషియా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుండి కృష్ణవేణి శ్రీ పేరి, సుచిత్ర, బూరుగుపల్లి వ్యాసకృష్ణ, సత్య మల్లుల, పద్మ మల్లెల, జయ పీసపాటి, స్వాతి జంగా, విక్రమ్ సుఖవాసి, వెంకప్ప భాగవతుల, సీతాపతి అరికరేవుల , తాతాజీ & పద్మజ ఉసిరికల, శ్రీసుధ, మాధవీలలిత, సాహిత్య జ్యోత్స్న, కోనేరు ఉమామహేశ్వర రావు, శారదా పూర్ణ శొంఠి, శారద ఆకునూరి, రాధిక నోరిరాధ కాసినాథుని, కె ధర్మారావు గుణ కొమ్మారెడ్డి, డా. సత్యమూర్తి , డా. సుజాత కోటంరాజు, డా. బి కె మోహన్ పాల్గొని వంశీ సంస్థలతో సుధ గారితో తమకున్న అనుబంధాన్ని గురించి నెమరు వేసుకుంటూ ఆమెను స్మరించు కున్నారు. కల్చరల్ టీవీ వారు సాంకేతిక సహకారం అందించగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేశారు. -
ఘనంగా శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి
శంకర నేత్రాలయ దృష్టి సేవా కార్యక్రమాల కోసం నిధులు సమీకరించేందుకు 2025 నవంబర్ 22న బోటెల్ నగరంలోని ఎంపైర్ బ్యాంక్వెట్ హాల్లో నిర్వహించిన ఫండ్రైజింగ్ కార్యక్రమం సంగీత విభావరి ఘనంగా, అత్యంత విజయవంతంగా జరిగింది.కార్యక్రమం చిన్నారులు మిత్రా, మీనాక్షి, విష్ణు, జస్మితా ఆలపించిన పవిత్ర గణేశ వందనాలతో ఆరంభమైంది. కార్యక్రమం నిరంతరాయంగా సాగాలని వినాయకుడిని ప్రార్థించిన ఈ చిన్నారుల గాన ప్రదర్శన సభలోని ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. కార్యక్రమాన్ని సుందరంగా, శ్రద్ధగా ముందుకు తీసుకెళ్లిన ఎంసీలు వర అక్కెల్ల, సృజనా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ గాయకులు సుమంగళి, అంజనా సోమ్య, పార్థు, మల్లికార్జున అందించిన సంగీత ప్రదర్శనలు కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.స్థానిక కమ్యూనిటీ సభ్యులు, కమ్యూనిటీ సంస్థలు, నాయకులు, వాలంటీర్లు మరియు మిత్రుల సమిష్టి సహకారంతో ఈ సంగీత విభావరి విజయవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బోటెల్ సిటీ డిప్యూటీ మేయర్ రామి గారు, అలాగే కొత్తగా ఎన్నికైన సిటీ కౌన్సిల్ సభ్యుడు అంగులూరి తమ భార్యతో కలిసి హాజరై, శంకర నేత్రాలయ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ తమ మద్దతును తెలియజేశారు.2023 ‘Adopt a Village’ స్పాన్సర్లుగా శ్భాస్కర్ గంగిపాముల, శ్రీ రామ్ కొట్టీ;2024 స్పాన్సర్లుగా Quadrant Technologies (వంశీ రెడ్డి , శ్రీ రామ్ పాలూరి, భాస్కర్ జీ ), విక్రమ్ గార్లపాటి, వర అక్కెల్ల గారు, రాహుల్ & అనీలా, నంద కిషోర్ గజుల ;అలాగే 2025 స్పాన్సర్లుగా అశోక్ గల్లా, రాజేశ్ గుడవల్లి, అశోక్ పసుపులేటి, వినోద్ నాగుల, కృష్ణ ఉంగర్ల, శ్వేత సానగపు, రాజేశ్ అర్జా Seattle Boys Club — తదితరాలు ముందుకు వచ్చి ఈ మహత్తర సేవా కార్యక్రమానికి అందించిన మద్దతుకు శంకర నేత్రాలయ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.డెకరేషన్ టీమ్ – Seattle Decors and Events కార్యక్రమాన్ని అద్భుతంగా అలంకరించగా, ప్రతి క్షణాన్ని అందంగా బంధించిన హ్యాష్ట్యాగ్ ఫోటోగ్రఫీ, అలాగే రుచికరమైన భోజనం అందించిన Aroma Bothell, Biryani Bistro, Curry Point ఫుడ్ వెండర్ల సేవలు సభలోని వారి నుంచి విశేష ప్రశంసలు అందుకున్నాయి.SNUSA జాతీయ అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందూర్తి నాయకత్వం, మార్గదర్శకత్వం, SNUSA బృందంలోని మూర్తి రేకపల్లి, డా. రెడ్డి ఊరిమిండి, వంశి ఏరువారం, శ్యామ్ అప్పలీ, రత్నకుమార్ కవుటూరు, త్యాగరాజన్ గారి కీలక మద్దతు, అలాగే స్థానిక చాప్టర్కు సకాలంలో అందిన సహకారం ఈ కార్యక్రమం ఘనవిజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.శంకర నేత్రాలయ బోర్డ్ ట్రస్టీలు సోమ జగదీశ్ కుటుంబం, వినోద్ కుటుంబంతో ముందుండి కీలక పాత్ర పోషించగా, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ జయపాల్ రెడ్డి దొడ్డ మార్గదర్శకత్వంలో చాప్టర్ లీడర్లు, వాలంటీర్లు సమిష్టిగా శ్రమించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో దృష్టి సేవలు అందించే శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలకు ఈ ఫండ్రైజింగ్ సంగీత విభావరి విలువైన మద్దతును అందించింది.(చదవండి: ఘనంగా ‘ఆటా’ అంతర్జాతీయ సాహిత్య సదస్సు!) -
ఘనంగా ‘ఆటా’ అంతర్జాతీయ సాహిత్య సదస్సు!
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA – ‘ఆటా’) ఆధ్వర్యంలో, హైదరాదాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘ఆటా అంతర్జాతీయ సాహిత్య సదస్సు-2025’ ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఒక రోజు అంతర్జాతీయ సదస్సులో ఈ ఏటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, సుప్రసిద్ధ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా సాహిత్యంపై విస్తృత సమాలోచన జరిగింది. ఆయన హిందీ సాహిత్య సృష్టి, భావనా ప్రపంచం, ఆలోచనలు, అభిప్రాయాలు, సృజనాత్మక దృష్టికోణాన్ని తెలుగు సాహితీ వేదికకు పరిచయం చేస్తూ వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్యవేత్తలు, కవులు, రచయితలు లోతైన చర్చలు జరిపారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడెమీ తొలి అధ్యక్షుడు – కవి నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి - హైదరాబాద్ బుక్ ఫెయిర్ చైర్మన్ యాకూబ్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి, ఈ సాహిత్య సదస్సును ప్రారంభించారు. జనరంజక సాహిత్యంతో శుక్లా జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకొని, అందరికీ స్ఫూర్తిగా నిలిచారని వక్తలు అన్నారు. ఆయన రచనలు ఇతర భాషలలోకి అనువాదం కావడం, అనేక అవార్డులు సొంతం చేసుకోవడం విశేషమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భాష, సాహిత్య వికాసం కోసమే కాక, అమెరికాలోనూ తెలుగు సంస్కృతి కోసం ‘ఆటా’, ‘తానా’ లాంటి సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని సిధారెడ్డి అన్నారు. తెలుగులో నవలల పోటీలు నిర్వహించిన ఘనత ‘ఆటా’కు దక్కుతుందన్నారు. ఈ డిసెంబర్ చివరివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ సాహిత్య, సాంస్కృతిక, వైద్య సేవా కార్యక్రమాలను ‘ఆటా’ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆదివారం జరిగిన అంతర్జాతీయ సాహిత్య సదస్సులో సాహితీవేత్తలు ప్రసేన్, డాక్టర్ ఆర్. సుమన్ లత, ప్రొఫెసర్ సర్రాజు, శ్రీనివాస్ గౌడ్, రూప్ కుమార్, వారాల ఆనంద్, డాక్టర్ రెంటాల జయదేవ తదితరులు పాల్గొని, జ్ఞానపీఠ విజేత అయిన శుక్లా రచనా ప్రస్థానం, ఆయన రచనా శైలి, కవిత్వం, కథలు, కథావస్తువులు, నవలలోని ప్రత్యేకత, సినిమాలుగా – దృశ్య రూపాలుగా వచ్చిన ఆయన రచనలు తదితర అంశాలపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. ‘ఆటా’ ఇండియా బోర్డు సభ్యులు రవీందర్ రెడ్డి, జ్యోత్స్న రెడ్డి, అలాగే సాహితీవేత్త రాధిక సూరి తదితరులు సమన్వయకర్తలుగా ఈ సుదీర్ఘ సాహిత్య సదస్సు నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. వేదికపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.వచ్చే జూలైలో... బాల్టిమోర్లో ఆటా సదస్సు‘ఆటా’ ప్రస్తుత అధ్యక్షుడు జయంత్ చల్లా, అలాగే రానున్న అధ్యక్షులు – ప్రస్తుత ‘ఆటా’ వేడుకల చైర్ సతీశ్ రెడ్డి పర్యవేక్షణలో, అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డ రచయిత వేణు నక్షత్రం సమన్వయంతో ఈ సదస్సు నిర్వహించారు. మూడున్నర దశాబ్దాలుగా నిత్యం వివిధ సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు చేస్తూ, ముందుకు సాగున్న ‘ఆటా’ లక్ష్యాలనూ, కృషినీ జయంత్, సతీశ్రెడ్డి తదితరులు వివరించారు. హిందీ – తెలుగు భాషల సాహిత్య శక్తిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నంగా ఈ సదస్సు నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. దీని ద్వారా ‘ఆటా’ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని వారు పేర్కొన్నారు.అలాగే, అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో ‘ఆటా’ వారి 19వ మహాసభలు, యువజన సదస్సు వచ్చే 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్నట్లు ‘ఆటా’ ప్రతినిధులు తెలిపారు. ప్రవాసంలో ఉన్న తెలుగువారినీ, వ్యాపారవేత్తలనూ, ఐటీ నిపుణులనూ, యువతరాన్నీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడానికీ, కలసికట్టుగా ముందుకుపోవడానికీ మూడు రోజుల ఆ భారీ సదస్సు ఉపకరిస్తుందని వివరించారు.ఆదివారం రోజంతా జరిగిన సాహిత్య సదస్సులో యండమూరి వీరేంద్రనాథ్, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, స్వర్ణ కిలారి లాంటి పలువురు ప్రముఖ రచయితలు, అమెరికా నుంచి పెద్దయెత్తున వచ్చిన ‘ఆటా’ ప్రతినిధులు జయంత్ చల్లా, సతీష్ రెడ్డి, నరసింహ, సాయి సుధుని తదితరులు, వారి కుటుంబ సభ్యులు, సాహిత్యాభిమానులు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా అతిథులు, కవులు, రచయితలు, ‘ఆటా-ఇండియా టీమ్’ సభ్యులను ప్రస్తుత ‘ఆటా’ బోర్డు సభ్యులు ఘనంగా సత్కరించారు.(చదవండి: తెలంగాణ వాసి అరుదైన ఘనత..యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఉదయ్ నాగరాజు) -
H-1B వీసా: భారతీయుల విషయంలో ఏం జరగొచ్చు!
న్యూఢిల్లీ: హెచ్–1బీ, హెచ్–4 వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్స్ను, వారు చేసిన పోస్టులను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా తనిఖీ చేయబోతోంది. సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశాయి. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల విషయంలో ఇప్పటికే ఈ నిబంధన అమలవుతోంది. అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ డిసెంబర్ 15, 2025 నుంచి హెచ్–1బీ, హెచ్–4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా పరిశీలించనుంది. ఇది ఇప్పటికే విద్యార్థులు మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్లకు అమలులో ఉన్న నిబంధనను విస్తరించడం ద్వారా జరుగుతోంది.కొత్త నిబంధన వివరాలుఈ కొత్త విధానం ప్రకారం, వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ను “పబ్లిక్” సెట్టింగ్స్లో ఉంచాలి. కనీసం గత ఐదు సంవత్సరాల పోస్టులు, కామెంట్లు, వీడియోలు, ఫోటోలు వంటి సమాచారం పరిశీలనకు వస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్(ట్విటర్), లింక్డిన్.. తదితర ప్రధాన ప్లాట్ఫార్మ్లలోని కంటెంట్ను కాన్సులర్ అధికారులు పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో అభ్యర్థుల ఆన్లైన్ ప్రెజెన్స్ రివ్యూ తప్పనిసరి అవుతుంది.ప్రభావం-ఆందోళనలుఈ చర్యతో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ప్రభావితమవుతారు, ఎందుకంటే హెచ్–1బీ వీసా హోల్డర్లలో 70% పైగా భారతీయులే ఉన్నారు. వీసా ఇంటర్వ్యూలు లేదంటే స్టాంపింగ్ ప్రక్రియలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా వీసా ఆమోదం ఆలస్యం కావొచ్చు. ఒక్కోసారి తిరస్కరించబడే ప్రమాదం ఉంది. నిపుణులు దీనిని ప్రైవసీ హక్కులపై ప్రభావం చూపే చర్యగా భావిస్తున్నారు, కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం ఇది జాతీయ భద్రతా కారణాల కోసం అవసరం అని చెబుతోంది.ఇప్పటికే అమలులో ఉన్న విధానం విస్తరణఇప్పటికే విద్యార్థులు (F-1 వీసా) మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్ల (J-1 వీసా) సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే విధానం అమలులో ఉంది. ఇప్పుడు అదే విధానాన్ని తాత్కాలిక ఉద్యోగ వీసాలు (H-1B), వాటి ఆధారిత వీసాలు (H-4) వరకు విస్తరించారు. ఈ మార్పు వల్ల అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసే విదేశీ ప్రొఫెషనల్స్ మరింత జాగ్రత్తగా సోషల్ మీడియా వాడకాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. -
FIA అమెరికా అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి
న్యూయార్క్: 1970లో స్థాపించిన అమెరికా ఈస్ట్కోస్ట్లోని ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి, ఎన్నరైలకు ప్రతినిధిగా భావించే అతిపెద్ద గ్రాస్రూట్ నాన్–ప్రాఫిట్ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ USA (FIA NY–NJ–CT–NE) తన 2026 నాయకత్వ బృందాన్ని ప్రకటించింది. స్వతంత్రంగా నియమితులైన ఎన్నికల సంఘం సభ్యులు అలోక్ కుమార్, జయేష్ పటేల్, కెన్నీ దేశాయి ఎంపిక చేసిన తర్వాత సూచించిన పేర్లకు FIA బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుత అధ్యక్షుడు సౌరిన్ పరిక్ స్థానంలో 2026 అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా శ్రీకాంత్ అక్కపల్లిని ఎంపిక చేశారు.ఉపాధ్యక్షురాలిగా పృత్యి రే పటేల్, జనరల్ సెక్రటరీగా శృష్టి కౌల్ నరులా కొనసాగనున్నారు. ఈ సంవత్సరం FIA కార్యవర్గాన్ని కుదించి, కౌన్సిల్ను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. సంస్థకు స్వతంత్రంగా షా అకౌంటెంట్స్ ట్రెజరర్గా పనిచేయనున్నారు.కొత్త కార్యవర్గం 2026 జనవరి 1 నుంచి బాధ్యతలు స్వీకరించనుంది. టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, మీడియా, హెల్త్కేర్, ట్రాన్సిట్ టెక్నాలజీ, స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అనేక రంగాల్లో వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా శ్రీకాంత్ అక్కపల్లి పేరు నిలిచింది. అమెరికా–భారత దేశాల్లో ఆయన చేపట్టిన వివిధ రంగాల వ్యాపారాల విజయాలు ఆయన ప్రతిభకు నిదర్శనం.అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం, అక్కాపల్లి బోర్డు తనపై పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. FIA చైర్మన్ అంకుర్ వైద్యకు తనకు “పెద్ద కుటుంబం లాంటి సంస్థలో చోటు కల్పించినందుకు” ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తొలి తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా FIA అధ్యక్షుడిగా అవతరించడం చారిత్రాత్మకమని పేర్కొంటూ, ఇన్స్టిట్యూషన్ పట్ల నిబద్ధత, నైతికత, సేవా భావంతో పని చేస్తానని హామీ ఇచ్చారు.అనేక దశాబ్దాలుగా సంస్థతో ఉన్న సీనియర్ సభ్యులు ఆయనను ప్రశంసిస్తూ.. “నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం అక్కపల్లి ఎంపిక FIA లో విస్తృతమైన ప్రాంతీయ వైవిధ్యానికి నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తిగా సేవా భావంతో నడిచే ఈ 55 ఏళ్ల సంస్థకు అమెరికా కాంగ్రెస్ రికార్డ్లో అధికారిక గుర్తింపు ఉంది. భారత దేశ ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డుతో పాటు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. అనేక గౌరవాలను అందుకుంది. -
యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా తెలంగాణ వాసి..!
బ్రిటన్లో మన తెలంగాణ (Telangana) వాసికి అరుదైన గౌరవం దక్కింది. తాజాగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ (House of Lords)కు సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని శనిగరం (Shanigaram) గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు (Uday Nagaraju) నామినేట్ అయ్యారు. హౌస్ ఆఫ్ లార్డ్స్కు సభ్యులను ప్రధాన మంత్రి సలహా మేరకు కింగ్ ఆఫ్ ఇంగ్లండ్ నామినేట్ చేస్తారు. ఇందుకు రాజకీయ పార్టీలు, స్వతంత్ర కమిటీ, ప్రజల నుంచి కూడా నామినేషన్లు వస్తాయి. ప్రధానంగా నైపుణ్యం, అనుభవం, దేశానికి సేవ ఆధారంగా హౌస్ ఆఫ్ లార్డ్స్కు ఎంపిక చేస్తారు. ఈ పదవికి భారతీయ సంతతికి చెందిన వారిని కూడా నామినేట్ చేస్తారు. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేది బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ. ఇది చట్టాలను రూపొందించడం, ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం, ముఖ్యమైన అంశాలపై చర్చించడం వంటి ప్రధాన విధులను నిర్వర్తిస్తుంది. కాగా, గతంలో నాగరాజు బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ (North Bedfordshire) నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు హనుమంత రావు నిర్మలాదేవి దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచి కష్టపడేతత్వం కలిగిన ఉదయ్ అంచెలంచాలుగా ఎదిగారు. ఆయన విద్యాభ్యాసం అంతా వరంగల్, హైదరాబాద్నే పూర్తయింది. ఆ తర్వాత బ్రిటన్లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ లో పాలనా శాస్త్రంలో పీజీ చేశారు.ప్రపంచ సమాజం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పభ్రావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్-ట్యాంక్ ని నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలపైన ఉదయ్ కు మంచిపట్టు ఉంది.(చదవండి: శంకరనేత్రాలయ ఆధ్వర్యంలో అట్లాంటాలో భూరినిధుల సేకరణ) -
శంకరనేత్రాలయ ఆధ్వర్యంలో అట్లాంటాలో భూరినిధుల సేకరణ
జార్జియాలోని కమ్మింగ్లోని వెస్ట్ ఫోర్సిత్ హై స్కూల్, శంకర నేత్రాలయ USA సంవత్సరాంతపు మ్యూజిక్ &డ్యాన్స్ ఫర్ విజన్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని నిర్వహించడంతో సంస్కృతి, కరుణ యొక్క శక్తివంతమైన వేదికగా రూపాంతరం చెందింది. ఇది గ్రామీణ భారతదేశంలో కంటి సంరక్షణను గరిష్టంగా విస్తరించడానికి మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) చొరవ విస్తరణకు మద్దతు ఇచ్చే దాతృత్వ వేడుక. ఈ కార్యక్రమం సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమైంది. గ్రామీణ భారతదేశంలో అంధత్వాన్ని నిర్మూలించే లక్ష్యంతో స కళ,సేవ శక్తిని ప్రదర్శించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఇలా నొక్కిచెప్పారు. “వైద్య మిషన్కు మించి, MESU సానుభూతి ఉద్యమంగా నిలుస్తుంది. ప్రయాణించిన ప్రతి మైలు దృష్టి, ఆశ పునరుద్ధరించబడుతుందనే హామీని అందిస్తుంది. ”అట్లాంటాలోని భారత కాన్సుల్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్ ముఖ్య అతిథిగా హాజరై SNUSA బృందం, దాతలు, స్వచ్ఛంద సేవకులను ప్రశంసించారు. "నివారించగల అంధత్వాన్ని తొలగించే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో SNUSA నా అంచనాలను మించిపోయింది. బాల రెడ్డి ఇందూర్తి నాయకత్వాన్ని నేను అభినందిస్తున్నాను" అని ఆయన అన్నారు. ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శంకర్ సుబ్రమోనియన్, డాక్టర్ జగదీష్ శేత్, డాక్టర్ కిషోర్ చివుకుల, ఉదయ భాస్కర్ గంటి వంటి బ్రాండ్ అంబాసిడర్లు, సలహాదారుల బోర్డు సహకారాన్ని కూడా ఆయన గుర్తించారు. సన్మాన కార్యక్రమంలో, గౌరవ భారత కాన్సుల్ జనరల్ రమేష్ బాబును శంకర నేత్రాలయ USA గౌరవ బోర్డు సలహాదారుగా అధ్యక్షులు బాలా రెడ్డి ఇందుర్తి ప్రకటించారు.ఆత్మ వెలుగుతో కలిసిన వేళ: ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి దాతృత్వం, నాయకత్వం మా లక్ష్యాన్ని గణనీయంగా బలోపేతం చేశాయి. 2025 వ్యవస్థాపకుడు సౌత్వెస్ట్ అవార్డు ఫైనలిస్ట్ ట్విస్టెడ్ ఎక్స్ గ్లోబల్ బ్రాండ్స్ వెనుక చోదక శక్తిలా ఆవిష్కరణ, స్థిరత్వం, కరుణను కలిగి ఉన్నారు. సత్కార సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దృష్టి అంటే భవిష్యత్తును చూడటం మాత్రమే కాదు—అది దానిని రూపొందిస్తోంది. ఆవిష్కరణ, కరుణ కలిసి పురోగమించాలి. ఈ లక్ష్యాన్ని సాధించడం నాకు గర్వకారణం. ” ఘంటసాల బయోపిక్ “ఘంటసాల ది గ్రేట్” సృష్టికర్త దర్శకుడు సిహెచ్. రామారావు గారు, ఘంటసాలకు అసాధారణ నివాళి అర్పించినందుకు వేదికపై సత్కరించారు. మరుసటి రోజు, ఈ చిత్రాన్ని అట్లాంటాలోని హిందూ దేవాలయం ఆడిటోరియంలో, లార్డ్ బాలాజీ గర్భగుడి క్రింద ప్రదర్శించారు.తపన స్వరాన్ని కలిసిన చోటు: ఈ సాయంత్రం కార్యక్రమం టాలీవుడ్ గాయకులు మల్లికార్జున్, పార్థు నేమాని, సుమంగళిల హృదయపూర్వక సంగీత ఆవాహనతో ప్రారంభమైంది. వారి భక్తి, శాస్త్రీయ ప్రదర్శనలు ప్రేక్షకులను ఉత్సాహపరిచాయి. దీని తరువాత నటరాజ నాట్యాంజలి కూచిపూడి నృత్య అకాడమీ, అకాడమీ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్, కర్నాటిక్ స్ట్రింగ్స్ వయోలిన్ స్టూడియో, భరతకళా నాట్య అకాడమీ, విపంచి మ్యూజిక్ అకాడమీ వంటి ప్రముఖ అట్లాంటా నృత్య, సంగీత అకాడమీల నుంచి ఉత్సాహభరితమైన ప్రదర్శనలు జరిగాయి. గార్డియన్స్ ఆఫ్ సైట్: $1.625 మిలియన్లను సేకరించడం ద్వారా మన అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్ల స్ఫూర్తిని గుర్తించారు. మ్యూజిక్ &డ్యాన్స్ ఫర్ విజన్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించింది, 130 MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు, అనేక మంది కరుణామయ వ్యక్తిగత దాతల నిరంతర మద్దతు ద్వారా దాదాపు $1.625 మిలియన్ల కీలకమైన నిధులను సమీకరించింది. శ్రేయోభిలాషులు, డా. గోవింద విశ్వేశ్వర, డా. వలియా రవి, టి.ఆర్. రెడ్డి, ప్రకాష్ బేడపూడి, కాష్ బూటాని, అరవింద్ కృష్ణస్వామి, డా. వీణా భట్, జలంధర్ రెడ్డి, రఘు సుంకి, తిరుమల్ రెడ్డి కంభం,MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు, డాక్టర్. బి. కృష్ణమోహన్, డా. మాధవ్ దర్భా మరియు డా. అపర్ణ, వెంకట్ చుండి, కళ్యాణి, ప్రసన్న కుమార్,దివంగత డాక్టర్ ఉమ, ప్రభాకర్ రెడ్డి ఎరగం, నీలం జయంత్ -లావణ్య, ఆది మొర్రెడ్డి-రేఖ రెడ్డి, డాక్టర్ మంజుల మంగిపూడి, డాక్టర్ రూపేష్ రెడ్డి-మాధవి, వెంకట్ కన్నన్, డాక్టర్ ప్రసాద్ గరిమెళ్ల, అనిల్ జాగర్లమూడి, ప్యాడీ రావు -రాధ ఆత్మూరి, స్వర్ణిమ్ కాంత్, కోదండ బిందు, నారాయణ రేకపల్లి -శైలజ,డాక్టర్ ప్రియా కొర్రపాటి, ప్రతాప్ జక్కా, రాజేష్ తడికమల్ల, డాక్టర్ సుజాత &సూరి గున్నాల, డాక్టర్ శేషకుమారి మూర్తి -డాక్టర్ శ్రీనివాస మూర్తి, శివాని నాగ్పాల్, డా. సందీప్ శాండిల్య, డాక్టర్ నీతా సుక్తాంకర్ -విష్ ఈమని, వర ఆకెళ్ల, కృష్ణ-శుభా, శ్రీని SV, జోనాథన్ షులర్, డాక్టర్ రఘువీర్ రెడ్డి, మరియు పురప్రముఖులు రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, జేసీ శేకర్ రెడ్డి గార్లకు కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన $1.625 మిలియన్ల దాతృత్వం సుమారు 130 MESU అడాప్ట్-ఎ-విలేజ్ కంటి శిబిరాలకు ఉపయోగపడింది. సేకరించిన నిధుల ద్వారా శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్లు (MESUలు) మారుమూల ప్రాంతాలకు చేరుకోవడానికి, వేలాది మందికి దృష్టిని ప్రసాదించడానికి వీలు కల్పిస్తుంది. ఈ దాతలు సేవలు అందని ప్రాంతాలలో వందలాది ఉచిత శస్త్రచికిత్సలకు నిధులు సమకూరుస్తున్నారు. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి మాట్లాడుతూ, “ప్రతి అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్ ఆశ, కరుణ, అవకాశాన్ని తెస్తాడు, గ్రామాలను దృష్టి ఆశతో ప్రకాశింపజేస్తాడు. శంకర నేత్రాలయ USA తరపున, నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.సృజనాత్మకత కరుణను స్వీకరించే చోట: సాయంత్రం శంకర నేత్రాలయ USA మిషన్కు మద్దతునిస్తూ సాంస్కృతిక కార్యక్రమానికి ప్రాణం పోసిన నృత్య ఉపాధ్యాయులు, గాయకులు, ప్రదర్శనకారులను సత్కరించారు. తెరవెనుక, SNUSA అట్లాంటా బృందం అవిశ్రాంతంగా పనిచేసింది. శంకర నేత్రాలయ కోశాధికారి మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీని రెడ్డి వంగిమల్ల, మెహర్ చంద్ లంక, రాజశేఖర్ రెడ్డి ఐల, డాక్టర్ మాధురి నంబూరి, ఉపేంద్ర రాచుపల్లి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ వెంకీ నీలం, కమిటీ సమన్వయకర్తలు నీలిమ గడ్డమణుగు, రమేష్ చాపరాల, డా. కిషోర్ రెడ్డి రాసమల్లు, గిరి కోటగిరి, చాప్టర్ లీడ్స్ వెంకట్ కుట్టువా, శిల్పా ఉప్పులూరి, డాక్టర్ జనార్దన్ పన్నెల, బిజుదాస్, రామరాజు గాదిరాజు, కార్యక్రమ వ్యాఖ్యాత వసంత చివుకుల గార్లకు కృతజ్ఞతలు. అమెరికా వివిధ నగరాల నుంచి విచ్చేసిన SNUSA అతిథులు శ్యామ్ అప్పాలి, వంశీ కృష్ణ ఏరువరం, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, నారాయణరెడ్డి ఇందుర్తి, డా. శ్వేతా త్రిపాఠి, చంద్ర మౌళి సరస్వతి, శ్రీని గుప్తా, శశాంక్ రెడ్డి ఆరమడక, బుచ్చిరెడ్డి గోలి, తిరుమల్ మునుకుంట్ల, జగదీశ్ జొన్నాడ, వెంకట్రామిరెడ్డి మద్దూరి గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు.ఇది సాధ్యం చేసిన హృదయాలకు, చేతులకు నివాళిలాజిస్టిక్స్ నిర్వహణకు కోశాధికారి మూర్తి రేకపల్లికి; వేదిక, అలంకరణలు, ప్రదర్శనకారులను సమన్వయం చేసినందుకు సాంస్కృతిక చైర్ నీలిమా గడ్డమణుగుకు; భోజన ఏర్పాట్లను పర్యవేక్షించిన చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ వెంకీ నీలంకు; హోటల్, రవాణా ఏర్పాట్లను నిర్వహించినందుకు ట్రస్టీ మెహర్ లంకకు ప్రత్యేక ధన్యవాదాలు. టీవీ వీడియోలను రూపొందించిన EVP శ్యామ్ అప్పాలి, ప్రెస్ నోట్స్ సిద్ధం చేసిన డా. రెడ్డి ఊరిమిండి, సోషల్ మీడియా ప్రమోషన్ను నిర్వహించిన వంశీ కృష్ణ ఏరువరం, రత్నకుమార్ కవుటూరు, గోవర్ధన్ రావు నిడిగంటి గార్లకు కృతజ్ఞతలు. అతిథులు ఆచిస్ రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని ఆస్వాదించారు. ఈవెంట్ ఫ్లైయర్లను రూపొందించినందుకు చెన్నై బృందం - త్యాగరాజన్, దీన్ దయాళన్ అండ్ సురేష్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు. (చదవండి: డిసెంబర్ 9 నుంచి 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రారంభం) -
డిసెంబర్ 9 నుంచి 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రారంభం
తెలుగు కళల తోట.. తెలంగాణ సేవల కోట.. అంటూ తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలో ఘనంగా నిలబెడుతున్న 'తెలంగాణ అమెరికా తెలుగు సంఘం' (TTA) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో “సేవాడేస్ 2025” కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఈ TTA సేవాడేస్ 2025 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు తెలంగాణ జిల్లాల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 14న గచ్చిబౌలిలో “10K రన్”తో డ్రగ్స్పై భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. డిసెంబర్ 25న TTA 10వ వార్షికోత్సవ వేడుకలు జరుపుతారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీఏ నాయకులు 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రకటించి, కార్యక్రమాల వివరాలు తెలిపారు.TTA ఏటా నిర్వహించే ఈ సేవాడేస్లో భాగంగా ఆరోగ్యం, విద్య, సమాజ అభివృద్ధి, యువత అవగాహనా కార్యక్రమాలు, మాదకద్రవ్యాల నివారణపై చైతన్యం, రక్తదానం, ఆహార పంపిణీ, గిరిజన ప్రాంతాలకు మద్దతు.. వంటి 40కి పైగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. TTA సేవాడేస్లో భాగంగా సేవ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, నల్లగొండ, యాదాద్రితో పాటు మరిన్ని జిల్లాల్లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను TTA నాయకత్వ బృందం రూపొందించింది. TTA ఫౌండర్ పైల మల్లారెడ్డి, ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది, ఏసీ-చైర్ విజయపాల్ రెడ్డి, ఏసీ కో చైర్ మోహన్ రెడ్డి పటలోళ్ల,సేవాడేస్ సలహాదారు డా. ద్వారకానాథ్ రెడ్డి, TTA కన్వెన్షన్ 2026 చైర్ ప్రవీణ్ చింతా, 10వ వార్షికోత్సవ చైర్ DLN రెడ్డి, జాయింట్ ట్రెజరర్ స్వాతి చెన్నూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ - ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ జ్యోతి రెడ్డి దూదిపాల, EX BOD రమా కుమారి వనమా, అంతర్జాతీయ VP నర్సింహ పెరుక, సేవాడేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, 10వ వార్షికోత్సవ వేడుక కల్చరల్ చైర్ డా. వాణి గడ్డం.. అమెరికా నుంచి TTA నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.TTA 10వ వార్షికోత్సవం2025 డిసెంబర్ 25న TTA తన 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతోంది. గడిచిన దశాబ్ద కాలంలో TTA చేసిన సేవా కార్యక్రమాలు, సామాజిక సేవ, తెలంగాణతో ఉన్న అనుబంధం వంటి అంశాలు ఈ వేడుకలో ప్రధానంగా చోటు చేసుకుంటాయి. పదేళ్లుగా తెలంగాణతో తమ బంధం మరింత బలపడుతోందని టీటీఏ నాయకులు తెలిపారు.“10K రన్”తో డ్రగ్స్పై అవగాహనటీటీఏ సేవాడేస్ 2025లో భాగంగా డిసెంబర్ 14న గచ్చిబౌలిలో Say No To Drugs సందేశంతో “10K రన్” నిర్వహించబోతున్నారు. ఈ ఏడాది సేవాడేస్ ప్రధాన థీమ్ “Say No To Drugs” అని టీటీఏ నాయకులు తెలిపారు. ఈ రన్లో విద్యార్థులు, యువత, స్పోర్ట్స్ కమ్యూనిటీ, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఫిట్నెస్ను ప్రోత్సహించడంతో పాటు డ్రగ్స్ అవగాహన కోసం సమాజానికి బలమైన సందేశం ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యమని, యువత భవిష్యత్తును కాపాడేందుకు ఇటువంటి కార్యక్రమాలు కీలకమని TTA నాయకత్వం తెలిపింది. 2014లో అమెరికాలో స్థాపించిన TTA సంస్థ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో వేలాది మందికి సేవలు అందిస్తూ అమెరికాలో ఉన్న అతిపెద్ద తెలంగాణ సంఘాలలో ఒకటిగా నిలిచింది. (చదవండి: యూకేలో ప్రోస్టేట్ కాన్సర్పై అవగాహన) -
జేడీవాన్స్కు యూజర్ చురక.. నెట్టింట రచ్చ
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు ఒక అమెరికన్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. అమెరికా పాత వలస విధానం ఆ దేశ ఆశలను హరిస్తుందని అమెరికన్ల అవకాశాలను వలస కార్మికులు కొట్టేస్తున్నారని వాన్స్ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. దీనికి రిప్లై ఇచ్చిన ఓ అమెరికన్ నీభార్య పిల్లలు కూడా అమెరికన్లు కాదు వారు కూడా అమెరికన్ల అవకాశాలు దొచుకెళ్తున్నారు అని కౌంటరిచ్చారు. పాటు మరికొందరూ ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలస కార్మికులపై గుర్రుగా ఉన్నారు. విదేశీ కార్మికులు అమెరికన్ల అవకాశాలను లాగేస్తున్నారని వారిని దేశంలోకి రాకుండా నియంత్రించాలనడంతో పాటు ఇమిగ్రేషన్ పాలసీ కఠినతరం చేశారు. అంతేకాకుండా విదేశీయులకు వ్యతిరేకంగా పలు రకాల చర్యలు చేపట్టారు. తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షుడు సైతం అదే జాబితాలో చేరారు. అమెరికన్ల అవకాశాలను విదేశీయులు దొచుకెళుతున్నారంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు."అమెరికా పాత మైగ్రేషన్ విధానం అమెరికా కలలను దొంగిలించింది. దానివల్ల దేశస్థులకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. అమెరికన్లు నుంచి వారు ఉద్యోగాలు దొంగిలించి వారు ధనవంతులయ్యారు" అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్టుకు కౌంటర్ గా చాలా మంది రీపోస్టులు చేశారు. "మీ కుటుంబం విదేశీయులు కాదా అది వలస కుటుంబం కాదా" అని ఒకరు అన్నారు. "మీ భార్య,పిల్లలు కూడా అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారు" అని మరో యూజర్ పోస్ట్ చేశారు. "మీఅత్తమామలు ద్వేషిస్తున్నావు" అని ఒక యూజర్ వ్యంగ్యంగా రీపోస్ట్ చేశారు. ఇలా అమెరికా ఉపాధ్యక్షుడు సోషల్ మీడియాలో ట్రోలయ్యారు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 2014లో భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరిని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కాగా వారి కుమారుడికి వివేక్ అని నామకరణం చేశారు. ఉషా వాన్స్ వృత్తి రీత్యా లాయర్. -
ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్
జర్మనీలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యవస్థాపకుడు ,పరిశోధకుడు, మయూఖ్ పంజా దాదాపు దశాబ్ద కాలంగా విదేశాల్లో ఇక్కడి పౌరసత్వాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు. తన భారతీయ పాస్పోర్ట్ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని ప్రకటించాడు. తాను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కూడా వివరించాడు. దీంతో ఇది నెట్టింట సందడిగా మారింది.మయూఖ్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం తొమ్మిది సంవత్సరాలకు పైగా జర్మనీలో నివసిస్తున్న అతనికి గత ఏడాది పౌరసత్వానికి అర్హత సాధించాడు. కానీ దరఖాస్తు చేయ కూడదని నిర్ణయించుకున్నాడు.తాను జర్మన్ పౌరుడిగా గాకుండా, ఎప్పటికీ భారతీయుడి గానే ఉంటాని ఆయన వివరించాడు. మయూఖ్ పంజా తొమ్మిదేళ్ల క్రితం జర్మనీ వెళ్లాడు.. డాక్టోరల్ రీసెర్చ్ కోసం వెళ్లిన మయూఖ్ అక్కడే పాపులేషన్స్ అనే ఏఐ సంస్థను స్థాపించాడు. గతేడాదే జర్మన్ పౌరసత్వం పొందేందుకు అర్హుత సాధించాడు. అయినా సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేయలేదట. పాస్ పోర్ట్ అంటే తన దృష్టిలో కేవలం అదొక డాక్యుమెంట్ కాదని, అది వ్యక్తిత్వ గుర్తింపని చెప్పుకొచ్చాడు. భారతీయతను వదులుకోలేక పోతున్నానని వెల్లడించారు.జర్మనీ కథలు, చరిత్ర, భాష,సంస్కృతిని అర్థం చేసుకున్నాడు. వాటితో తాను మమేకం కాలేక పోతున్నానని, బెర్లిన్ వాతావరణం, సాంకేతిక శాస్త్రీయ పరిస్థితులలో తాను సుఖంగా ఉన్నప్పటికీ, అది తన సొంతఇంట్లో ఉన్నట్లు భావించడం లేదని ఆయన అన్నారు. ఫుట్బాల్ మ్యాచ్లో జర్మనీ గెలుపు లేదా ఓటమి తనకు పెద్దగా తేడాను కలిగించదని, భారతదేశం ప్రపంచ కప్ గెలిచినప్పుడు తన ఆనందమే వేరు అంటూ ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. తాను జర్మనీ స్నేహితుడినే తప్ప ఆ దేశంలో భాగమని భావించే వ్యక్తిని కాదన్నాడుపంజా ప్రకారం, జర్మన్ పౌరుడిగా మారడం అంటే జర్మన్ విలువలు మరియు ఆదర్శాలతో తనను తాను సమలేఖనం చేసుకోవడం. కానీ కొత్త పౌరుడిగా, శతాబ్దాల నాటి సంస్కృతి తన ఇష్టానికి అనుగుణంగా ఉంటుందని ఆయన భావించడలేదు. పైగా భారత పౌరసత్వాన్ని కాపాడుకోవడం అనేది ఏదైనా చట్టపరమైన ప్రయోజనానికి సంబంధించిందికాదు,కానీ తన నిజమైన గుర్తింపుతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం అని మయూఖ్ పంజా తెలిపారు. I have been here 9 + years and I became eligible for the German passport a year back. I could have applied for citizenship a year ago, but I did not. I have thought about this a lot and I am increasingly coming to the conclusion that I can’t do this. Because I don’t feel German.… https://t.co/amUbrxgObK— Mayukh (@mayukh_panja) December 5, 2025 సోషల్ మీడియా మయూఖ్ నిర్ణయానికి సానుకూలంగా స్పందించింది. ఆయన నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. -
ఓవర్సీస్ మొబిలిటీ బిల్లులో ప్రవాసీల హక్కులు కాపాడాలి
భారతదేశం నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్ మొబిలిటీ (విదేశీ వలస) బిల్లు–2025 లో ప్రవాసీల హక్కులు రక్షించబడేలా చూడాలని, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావులతో కూడిన ప్రతినిధి బృందం తమ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో తెలంగాణకు చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో నివసించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.42 ఏళ్లుగా అమలులో ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్–1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేయనున్న నేపథ్యంలో... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాండింగ్ కమిటీ సభ్యులు, బీజేపీ ఎంపీ డీకే అరుణ (మహబూబ్ నగర్), బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రేస్ ఎంపీలు మల్లు రవి (నాగర్ కర్నూల్), సురేష్ షెట్కార్ (జహీరాబాద్), డా. కడియం కావ్య (వరంగల్), గడ్డం వంశీక్రిష్ణ (పెద్దపల్లి), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), మాజీ ఎంపీ మధు యాష్కీలతో వారు చర్చించారు. 2021 ముసాయిదాలో ప్రవాసీ కార్మికులకు ప్రతిపాదించిన అనేక రక్షణలు కొత్త బిల్లులో లేవు. అధికారాలు కేంద్రీకృతమవడం ద్వారా దోపిడీ ప్రమాదం పెరుగుతుందని భీంరెడ్డి, శ్రీనివాస రావులు ఎంపీలకు వివరించారు.ప్రవాసుల హక్కులు బలహీనం కావద్దుబాధిత ప్రవాసీ కార్మికులు నేరుగా కోర్టులను ఆశ్రయించే హక్కు తొలగింపు.. మహిళలు, పిల్లల రక్షణలను ‘సున్నిత వర్గాలు’ అనే అస్పష్ట వర్గంలో విలీనం. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు వసూలు చేసే ఫీజుల వివరాల వెల్లడి నిబంధన రద్దు వలన రుణ బానిసత్వానికి దారి తీస్తుంది. విదేశాలకు పంపిన అనంతరం కార్మికులపై ఏజెన్సీల బాధ్యత లేకపోవడం, విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి పునరేకీకరణ నిబంధనలు బలహీనపడ్డాయి. 182 రోజుల (ఆరు నెలల) లోపు విదేశాల నుండి వాపస్ పంపబడ్డ (డిపోర్ట్) అయిన వారిని ‘రిటర్నీలు’గా పరిగణించకపోవడం లాంటి విషయాలను భారత ప్రభుత్వ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసికెళ్లాలని వారు కోరారు.‘ఎమిగ్రంట్’, ‘ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్’, ‘లేబర్’ వంటి పదాల నిర్వచనాల్లో విద్యార్థులు, ఆధారితులు, డిజిటల్ కార్మికులు వంటి వర్గాల వెలివేత. ‘మానవ అక్రమ రవాణా’ (హ్యూమన్ ట్రాఫికింగ్) కు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం. కేంద్రీకృత పాలన – రాష్ట్రాలకు, కార్మిక సంఘాలకు చోటు లేదు. ప్రతిపాదిత 'ఓవర్సీస్ మొబిలిటీ & వెల్ఫేర్ కౌన్సిల్' లో వలస కార్మికులను విదేశాలకు పంపే రాష్ట్రాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలకు ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర స్థాయి నోడల్ కమిటీలు తొలగించబడటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతుందని మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావులు ఆందోళన వ్యక్తం చేశారు.డిమాండ్లుబిల్లుపై లోతుగా అధ్యయనం చేయాలిఎమిగ్రేషన్ చెక్ పోస్టులు రద్దు అయినప్పటికీ ప్రత్యామ్నాయ నియంత్రణ వ్యవస్థ లేదు.ప్రయాణానికి ముందు శిక్షణ, విదేశాల్లో సహాయక సేవల ప్రమాణాలు స్పష్టంగా లేవు.ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ — హక్కుల కంటే పర్యవేక్షణపైనే దృష్టి.24/7 హెల్ప్లైన్లు, విమానాశ్రయ–ఎంబసీ సహాయం తప్పనిసరి కాదని ముసాయిదా చెబుతోంది.శిక్షలు కేవలం రిక్రూట్మెంట్ ఏజెంట్లపైనే; విదేశీ యాజమాన్యాలపై చర్యలు లేవు.ట్రాఫికింగ్, చట్ట విరుద్ధ ఆన్లైన్ రిక్రూట్మెంట్పై ప్రత్యేక నిబంధనలు లేకపోవడం.విధించే జరిమానాల్లో బాధితులకు పరిహారం కేటాయింపు లేదు. -
'నైటా' కొత్త అధ్యక్షుడిగా రవీందర్ కోడెల
ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్లో నివసిస్తున్న తెలుగువారు ఏర్పాటు చేసుకున్న సంస్థ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా). రానున్న ఏడాది (2026) కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కొత్త అధ్యక్షుడుగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఎంపికయ్యారు. ఏడాది పాటు ఆయన న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ కు నాయకత్వం వహించనున్నారు.అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్ లో వేల సంఖ్యలో తెలుగు, తెలంగాణ ఎన్నారైలు కుటుంబాలతో సహా స్థిరపడ్డారు. వీరందరూ వివిధ వృత్తుల్లో పనిచేస్తూ ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండేందుకు నైటాను ఆరేళ్లకిందట ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పటివరకూ ఆరు సార్లు ఏర్పాటైన కార్యవర్గాలు తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను పాటించటంతో పాటు, అమెరికాలోనే పుట్టిపెరిగిన తమ పిల్లలకు తెలుగు, తెలంగాణ పండగల ప్రాధాన్యత తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే అమెరికా సమాజంలో భాగమై వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రానున్న ఏడాదిలో కొత్త కార్యవర్గం సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల (Ravinder Kodela) వెల్లడించారు. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీకి నైటా సభ్యులు సంతాపం ప్రకటించారు. వాణి అనుగు నేతృత్వంలోని తాజా మాజీ కార్యవర్గానికి వీడ్కోలు విందును ఏర్పాటుచేశారు.కార్యక్రమంలో న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్, ప్రముఖ ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, నైటా (NYTTA) సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు.రవీందర్ కోడెల ప్రస్థానంఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలం వాస్తవ్యులు. బాల్యం నుంచి పదవ తరగతిదాకా అక్కడే గడిచింది. ఆతర్వాత హన్మకొండలో ఇంటర్, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చదివారు. ఆ తర్వాత ఫెలోషిప్ (CSIR)తో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్డీ చేశారు. చదవండి: ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే.. వచ్చేస్తున్నా!తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ వివిధ వేదికల ద్వారా తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్ తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ అమెరికా వెళ్లి అక్కడే న్యూయార్క్లో స్థిరపడ్డారు. సిటీ కాలేజీ ఆఫ్ న్యూయార్క్ (మెడికల్ స్కూల్)తో పాటు సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్లలో ప్రముఖ ఫార్మాసిస్టుగా క్యాన్సర్ నివారణ ఔషధాల తయారీలో గుర్తింపు పొందారు. -
అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
అమెరికా బర్మింగ్హామ్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరణించిన వారిలో మేడ్చల్ జిల్లా పోచారానికి చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నారు. మృతులిద్దరూ హైదరాబాద్ వాసులు. కాగా అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు. హఠాత్తుగా చెలరేగిన మంటలకు అందులో చిక్కుకున్న విద్యార్థులు ఉక్కిరి బిక్కిరయ్యారు. విద్యార్థులు శ్వాస తీసుకోలేక పెద్దగా కేకలు పెట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. తీవ్ర గాయాలైన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లాగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరంతా అక్కడి అలబామా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు. -
నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా!
మంచి ఉద్యోగం, మెరుగైన జీతం, సౌకర్యవంతమైన జీవితం, కెరీర్లో అవకాశాలు వీటికోసం కలలు కంటూ చాలామంది భారతీయులు విమానాల్లో విదేశాలకు ఎగిరిపోతున్నారు. కానీ కనిపెంచిన తల్లిదండ్రులను కన్నతల్లి లాంటి ఊరినీ, వదిలి ఉండటం అంత సులువు కాదు. దేశం కాని దేశం, మన భాషకాదు..మన తిండి కాదు, మన జాన్ జిగిరీ దోస్తులు ఆసలే లేని చోట ఉండటం చాలా వేదనతో కూడుకున్నదే. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా అన్నట్టు ఒక పక్క ఒంటరితనం, మరోపక్క ఇంటి బెంగతో ఒక్కోసారి ఊపి రాడదు. ఇదీ నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) అనుభవించే మానసిక బాధ అందుకే ఒక ఎన్ఆర్ఐ ఏం చేశాడో తెలుసా?కష్టపడి ఐదేళ్ల పాటు కెనడాలో జీవితాన్ని గడిపేసిన ఎన్ఆర్ఐ ఇక నావల్ల కాదు బాబోయ్ అంటూ ఇండియాకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. స్వదేశానికి తిరిగి రావాలన్న తన నిర్ణయంపై సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపించారు. అయిదేళ్లు కెనడాలో ఉన్నాను.విదేశాలలో జీవితం రోబోటిక్గా అనిపించింది. అందుకే ఇక భరించ లేను. ఇక్కడ స్నేహితులు ఉన్నప్పటికీ, కానీ సామాజిక ఒంటరితనం బాధిస్తోంది. దాన్ని వర్ణించడం చాలా కష్టం అని పేర్కొన్న రెడ్డిట్ పోస్ట్ వైరలవుతోంది.చదవండి: అందంగా ఉన్నారని నలుగుర్ని..చివరికి కన్నకొడుకుని కూడాకెనడాలో మితిమీరిన క్రమశిక్షణ భరించడం కష్టంగా ఉంది. ప్రతీదీ పద్ధతిగా సిస్టమ్యాటిగ్గా జరగాలి. కనీసం బియ్యం కొనడానికి దుకాణానికి వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. స్వేచ్ఛను మిస్ అవుతున్నా అనిపిస్తోందన్నాడు. భారతదేశంలో వ్యవస్థీకృత గందరగోళం ఉంది. దానిని మిస్ అవుతున్నా. కానీ ఇండియాలో గడపబోయే జీవితంపై చాలా ఆసక్తిగా ఉన్నాను. ఇండియాలో మురికి, కనీస పౌర జ్ఞానం లేకపోవడం లాంటి లోపాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇది మన ఇల్లు. అందుకే ఇండియాకు తిగిరి వచ్చేస్తున్నానని పేర్కొన్నాడు.నెటిజన్లు అతని నిర్ణయాన్ని ప్రశంసించారు. మనసుకు నచ్చినట్టు జీవించాలి భయ్యా అని కొందరు, ప్రతి దేశానికి దాని సమస్యలు ఉంటాయి. ఏ దేశానికైనా దాని లాభనష్టాలు దానికి ఉంటాయి. ప్రాధాన్యతను తెలుసుకోవాలి. ఫైనల్గా ఎక్కడ సంతోషంగా ఉంటామో, అక్కడ ఉండటమే సరైంది అని మరికొందరు ఎంతైనా మన ఇల్లు ఇల్లే కదా భాయ్.. అనే కమెంట్లు వెల్లువెత్తాయి.ఇదీ చదవండి : ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య -
యూకేలో ప్రోస్టేట్ కాన్సర్పై అవగాహన
బిబిసి (బెర్క్షైర్ బాయ్స్ కమ్యూనిటీ) ఆధ్వర్యంలో ఇటీవల బ్రిట్వెల్ లైబ్రరీలో మువెంబర్ డేని ఘనంగా నిర్వహించారు. యూకె నలుమూలనుండి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రోస్టేట్ కాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు . ఈ కార్యక్రము ద్వారా మగవాళ్ళ లో తరచుగా వచ్చే ప్రోస్టేట్ కాన్సర్ పైన అవగాహన కల్పించి , దాన్ని ఎలా నిర్ములించుకోవాలో సూచనలు చేసి ,చారిటీ ప్రోగ్రాం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రోగ్రాంతో ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన వంద మందికి పైగా పురుషులు హాజరైనారు. .ఈ ఈవెంట్లో భాగంగా మేము ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన ఛారిటీ మొత్తానికి 809 GBP(85 K INR)** పౌండ్స్ కు పైగా సేకరించారు.. నవంబరు నెల ప్రోస్టేట్ క్యాన్సర్కు అంకితం చేయబడినందున తాము ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన నడకను కూడా ప్రారంభించామని నిర్వాహకుతు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించి ,చారిటీ ద్వారా వచ్చిన ఆర్ధిక సహాయంతో ప్రోస్టేట్ కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న వారికి , రెండు తెలుగు రాష్ట్రాలలో, యుకెలో ఆర్ధికంగా ఆదుకుంటున్నామనీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి మంచి ఆలోచనతో ప్రోగ్రామ్స్ నిర్వహించడం తెలుగు వారందరికీ గర్వకారణమని పలువురు ప్రశంసించారు. ఈ ఈవెంట్ విజయానికి సహకరించిన సభ్యులు బి.బి.సి కోర్ టీం ఉన్నారు. ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన స్పాన్సర్స్ అందరికి వినమ్ర పూర్వక అభినందనలు అని కమిటీ సభ్యులు తెలిపారు. -
బ్రిటన్లో భారతీయ విద్యార్థి దారుణ హత్య
న్యూఢిల్లీ: బ్రిటన్లో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసిన బ్రిటిష్ పోలీసులు.. అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు. వీలైనంత త్వరగా తమ కుమారుడి మృతదేహాన్ని దేశానికి తీసుకురావాలని అతడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హరియాణాలోని చర్కి దాద్రికి చెందిన విజయ్కుమార్ షియోరాన్(30) యూకేలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున వెర్సెస్టర్లో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేసి పారిపోయారు. స్థానికులు విజయ్ను ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఇండియాలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్లో ఉద్యోగం చేసిన విజయ్ ఉన్నత విద్య కోసం ఈ ఏడాది ప్రారంభంలో యూకే వెళ్లాడు. బ్రిస్టల్లోని యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్లో చదువుతున్నాడు. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. -
దాంపత్య బంధాన్ని దృఢం చేసే 'ఫోర్ లవ్స్' ఫార్ములా
అమెరికాలో తెలుగు వారి మేలుకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా దాంపత్య జీవితం దృఢం చేసుకునేలా వెబినార్ నిర్వహించింది. దాంపత్య జీవితాన్ని విజయవంతంగా నడిపించేందుకు, వివాహబంధాన్ని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన కీలక మార్గాలపై నాట్స్ కాన్సస్ చాప్టర్ నుంచి వెంకట్ మంత్రి, ప్రసాద్ ఇసుకపల్లి తాజాగా 'మ్యారేజ్ మెయింటెనెన్స్ కిట్' పేరుతో ఈ వెబినార్ నిర్వహించింది. వివాహ బంధాలపై 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిలేషన్షిప్ సైకాలజీ నిపుణుడు ఛార్లెస్ రివర్స్ ఈ వెబినార్లో ముఖ్య వక్తగా పాల్గొన్నారు. వివాహ బంధం బలహీనపడటానికి ప్రధాన కారణాన్ని ఛార్లెస్ వెల్లడించారు. “జీవిత భాగస్వామి మీకు ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన మిత్రులైతే, మీరు ఇప్పుడు వారితో వ్యవహరిస్తున్న తీరులోనే వ్యవహరించగలుగుతారా? లేదా మార్చుకోవాల్సి వస్తుందా?" అనే కీలకమైన ప్రశ్నను దంపతులు తమకు తాము వేసుకోవాలని ఆయన సూచించారు. దాంపత్యంలో పురుషులు తమ భార్యల నుండి గౌరవాన్ని ఆశిస్తే, మహిళలు తమ భర్తల నుంచి ప్రేమ, శృంగారం, సంభాషణను కోరుకుంటారని తెలిపారు. ఈ అవసరాలను గుర్తించి తీర్చడమే వైవాహిక జీవిత నిర్వహణకు ముఖ్యమని ఛార్లెస్ రివర్స్ వివరించారు. అలాగే, వాదనలు పెరిగిపోయి గొడవలకు దారితీయడానికి ప్రధాన కారణం ఒకరి మాట ఒకరు వినకపోవడమే అని, స్నేహితుల్లా వ్యవహరించడం ద్వారా వీటిని నివారించవచ్చని ఛార్లెస్ తెలిపారు. దాంపత్యంలో పిల్లల కంటే, భార్యాభర్తల బంధానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే పిల్లలకు ప్రేమను పంచుకోవడంపై సరైన అవగాహన వస్తుందని ఆయన సలహా ఇచ్చారు. వివాహంలో అనేక సమస్యలకు మూలం, ప్రస్తుత దాంపత్యం కంటే, పరిష్కారం కాని బాల్య సమస్యలే అని వివరించారు. మనల్ని మనం మార్చుకోవడం ద్వారా మాత్రమే బంధాన్ని కాపాడుకోగలమని చార్లెస్ సూచించారు. ప్రతి కుటుంబానికి ఉపయోగపడే ఉత్తమ వెబినార్ నిర్వహించినందుకు సెయింట్ లూయిస్ చాప్టర్ సభ్యులను, నాట్స్ విభాగ నాయకులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: అమెరికా మోజుతో రూ.90 లక్షల ప్యాకేజీని కాలదన్నాడు! చివరికి..) -
సర్పంచ్గా పోటీ చేయాలని అమెరికా నుంచి వచ్చేశాడు..
చిన్నశంకరంపేట(మెదక్): అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. లక్షల్లో వేతనం.. అయినా గ్రామాభివృద్ధే ధ్యేయంగా సర్పంచ్ ఎన్నికల బరిలో దిగేందుకు తరలివచ్చాడు మెదక్ జిల్లా(Medak District) చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ కంజర్ల చంద్రశేఖర్. చిన్నశంకరంపేట(Chinna Shankarampeta) సర్పంచ్గా తన తాత శంకరప్ప 40 ఏళ్ల పాటు పనిచేసి గ్రామాభివృద్ధిలో భాగస్వామి అయ్యారు. గ్రామంలో ఏ నోట విన్నా శంకరప్ప చేసిన అభి వృద్ధి గురించే చెప్పుకుంటారు. అదే స్ఫూర్తితో తాను సైతం గ్రామ అభివృద్ధిలో భాగస్వామి కావాలనే లక్ష్యంతో రూ.లక్షల వేతనం అందించే సాఫ్ట్వేర్ ఉద్యోగం(Software Engineer) వదిలాడు. ఆరునెలల క్రితం పంచాయతీ నోటిఫికేషన్ వెలువడుతుందనే ప్రభుత్వ ప్రకటనతో.. చంద్రశేఖర్ అమెరికా నుంచి గ్రామానికి చేరుకున్నాడు. మూడు నెలలుగా ప్రజలతో మమేకమై స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా, ముందు వరుసలో నిలిచి గ్రామస్తుల మన్ననలు పొందుతున్నాడు. ఈనెల 30న చిన్నశంకరంపేట సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు సమాయత్తం అవుతున్నాడు. -
అమెరికా మోజుతో 90 లక్షల ప్యాకేజీని కాలదన్ని..
విదేశాల్లో ఉన్నత చదువు అనేది చాలామంది విద్యార్థుల డ్రీమ్. అందుకోసం ఎంతలా కష్టపడుతుంటారో తెలిసిందే. అయితే ఈ వ్యక్తి కూడా అలానే అనుకున్నాడు. కానీ అందుకోసం ఎంత పెద్ద డేరింగ్ స్టెప్ తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. పోనీ అంతలా సాహసం చేసినా.. మళ్లీ ఉద్యోగం సంపాదించడం కోసం ఎన్ని పాట్లు పడ్డాడో వింటే కన్నీళ్లు వచ్చేస్తాయి. అయితేనేం చివరికి ప్రతిష్టాత్మకమైన కంపెనీలోను ఉద్యోగం కొట్టి..తనలా చెయ్యొద్దంటూ యువతకు సూచనలిస్తున్నాడు. అతడే అభిజయ్ అరోరా. భారత్కి చెందిన అభిజయ్ చక్కగా స్విట్జర్లాండ్లో ఏడాదికి రూ. 90 లక్షల వేతనం ఇచ్చే ఉద్యోగాన్ని చేస్తున్నాడు. అయినా ఏదో అసంతృప్తితో యూఎస్తో చదవాలనే డ్రీమ్తో అంత మంచి ఉద్యోగాన్ని వదులుకునేందుకు రెడీ అయ్యాడు. విదేశాల్లో చదువుకున్న అనుభవమే గొప్పదని భావించాడు. అందులోనూ తన మేజనర్ కూడా మరిన్ని అర్హతలు లేకపోతే ప్రమోషన్లు పొందలేవని చెప్పడంతో రెండో ఆలోచన లేకుండా చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. ఆ తర్వాత గానీ అసలు విషయం తెలిసి రాలేదు..అరోరాకి. చేతిలో ఒక్క ఉద్యోగం ఆఫర్ లేకుండా హార్వర్డ్లో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేస్తున్నాడు. ఆ తర్వాత మనోడి కష్టాలు అంత ఇంత కాదు. ఏకంగా 400కి పైగా ఉద్యోగాలు దరఖాస్తు చేసుకుంటే అన్ని రిజెక్ట్ అయిపోయాయి. ఒక్క కంపెనీ నుంచి కాల్ కూడా రాలేదు. తనకున్న జాబ్ నెట్వర్కింగ్ కూడా హెల్ప్ అవ్వలేదు. ఏ జాబ్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు. చివరికి మొత్తం వ్యూహాన్ని మార్చాక గానీ అతడి పరిస్థితిలో మార్పు రాలేదు. అలా ఆరు నెలల తర్వాత గూగుల్ (యూట్యూబ్)లో ప్రొడక్ట్ మేనేజర్ జాబ్ని సంపాదించాడు. అయితే తనలా ఇలా తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని అంటున్నాడు. అలాగే విదేశాల్లో ఉన్నత చదవులు చదవద్దని చెప్పే ఉద్దేశ్యం కూడా కాదని అంటున్నాడు. కేవలం మంచి ఉద్యోగాన్ని వదిలేసేమందు కష్టనష్టాలు బేరీజు వేసుకోవడం మంచిది. పైగా ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్లను కూడా ఎదుర్కొనేందుకు సిద్దపడిపోవాలని కోరాడు. ఇక్కడ ఒక్కటే మనపై మనకు నమ్మకం ఉన్నంత వరకు ఏ నిర్ణయం తప్పు కాదు. ఒక్కసారి నమ్మకం సడలితే మాత్రం అన్ని తప్పులుగా, కష్టాలుగా అనిపిస్తాయంటూ నెట్టింట తన స్టోరీని షేర్ చేసుకున్నాడు అరోరా. ఆ పోస్ట్ని చూసిన నెటిజన్లు ఎంబిఏ చేసే బదులు..అంతకుమించి వేతనం అందుకునే బెస్ట్ జాబ్ని వెతుక్కోవాల్సిందని కొందరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరు భయ్యా ఇన్ని రిజెక్షన్లు ఎలా తట్టుకున్నావు, పైగా ఈ ఉద్యోగాన్ని సంపాదించడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించారో చెప్పరా ప్లీజ్ అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhijay Arora Vuyyuru | Study Abroad | Careers | AI (@abhijayarora_) (చదవండి: ఇంజనీర్ కమ్ డాక్టర్..! విజయవంతమైన స్టార్టప్ ఇంజనీర్ కానీ..) -
అమెరికాపై తగ్గని మోజు!
అమెరికాలో ఏటా రికార్డు స్థాయిలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ పెరుగుదలకు ప్రధానంగా భారతదేశం నుంచి వెళ్లే విద్యార్థులు అధికమవుతుండడం కారణంగా నిలిచింది. తాజాగా ఓపెన్ డోర్స్ 2025 నివేదికలోని వివరాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. యూఎస్లో దాదాపు ముగ్గురు అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారతీయులే ఉండడం గమనార్హం. 2024-25 విద్యా సంవత్సరంలో భారతీయ విద్యార్థుల నమోదు 3,63,019కు చేరుకుంది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 9.5 శాతం పెరుగుదలను సూచిస్తుంది.యూఎస్ వెళ్లే భారతీయ విద్యార్థులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు. ప్రాడిజీ ఫైనాన్స్ డేటా ప్రకారం ఇండోర్, భువనేశ్వర్, పంజాబ్, సూరత్, కోయంబత్తూర్, మైసూరు, నాగ్పుర్.. వంటి టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి యూఎస్ వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఈ విద్యార్థులు తరచుగా ఉపాధ్యాయులు, చిన్న వ్యాపార యజమానులు, మిడ్ కెరియర్ నిపుణుల కుటుంబాల నుంచి ఎక్కువగా ఉన్నారు.STEM కోర్సులు2024-25లో యూఎస్ మొత్తంగా 11,77,766 అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 4.5 శాతం ఎక్కువ. యూఎస్లోని ప్రతి 10 మంది భారతీయ విద్యార్థుల్లో దాదాపు 7 మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సుల్లో చేరుతున్నారు.43.4% మంది భారతీయ విద్యార్థులు గణితం, కంప్యూటర్ సైన్స్ లో చేరారు.22.8% మంది ఇంజినీరింగ్ కోర్సులను ఎంచుకున్నారు.ఓపీటీ..అమెరికా అందిస్తున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)కు ఆదరణ పెరుగుతోంది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లు దేశీయ శ్రామిక శక్తిలోకి ప్రవేశించడానికి ఓపీటీ ఎంతో తోడ్పడుతుంది. భారతీయ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ముఖ్యంగా STEMలో H-1B వీసాలు లేదా ఇతర వర్గాలకు మారడానికి ముందు వృత్తిపరమైన అనుభవాన్ని పొందడానికి ఓపీటీని ఉపయోగించుకుంటున్నారు.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్.. వివరాలివే.. -
సహజకవి అందెశ్రీకి మరణం లేదు
సహజ కవిత్వం, మాటపాటలతో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన అందెశ్రీకి మరణం లేదని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) కెనడా అభిప్రాయపడింది. టొరెంటోలో స్థిరపడిన తెలంగాణ వాసులు అందెశ్రీ సంస్మరణ సభను నిర్వహించారు. స్థానిక తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై అందెశ్రీకి నివాళులు అర్పించారు.ఉద్యమానికి ముందూ, తర్వాత కూడా తెలంగాణ ఆత్మలా అందెశ్రీ (Ande Sri) నిలిచారని కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ భావజాల వ్యాప్తిలో ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం అన్నారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులను కలుసుకొని తన మాట, పాటలతో జనాన్ని జాగృతం చేశారని అన్నారు. 2014లో కెనడాలో పర్యటించిన ఆయన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవటంతోపాటు, ఆయన ఇంటి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కెనడా ఎన్.ఆర్.ఐలు (Canada NRIs) కోరారు. అలాగే అందెశ్రీ రచనలు, కవితలు, పాటలు డిజిటలైజేషన్ చేసి భవిష్యత్ తరాలకు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి, జనరల్ సెక్రటరీ వెంకట్ రెడ్డి పోలు, సురేందర్ పెద్ది, శ్రీకాంత్ నెరవెట్ల, కృష్ణారెడ్డి చాడ, రవీందర్, అమిత పినకేసి, సుమన్ ముప్పిడి, మహేందర్ రెడ్డి, రవీందర్ కొండం, అర్షద్, ఇతర టీడీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.చదవండి: 17 ఏళ్ల తర్వాత ఇండియాకు ఎన్నారై జంట -
ఆస్ట్రేలియాలోని ఎన్నారైల సహకారం మరువలేనిది : లక్ష్మీపార్వతి
గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి పార్టీకి జగనన్నకు మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆస్ట్రేలియా వైయస్సార్సీపీ ఎన్నారై లకి పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆస్ట్రేలియాలోనీ మెల్బోర్న్ పర్యటనలో ఉన్న లక్ష్మీపార్వతి గారు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీనియర్ నాయకులని ఉద్దేశించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు చూపిస్తున్న ఆధారాభిమానాలకు పార్టీ ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ జగన్ గారు తన పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేశారని తమలో చాలామంది వారి తండ్రి పెట్టిన పథకాలను ఉపయోగించుకుని వచ్చి విదేశాల్లో స్థిరపడ్డామని వారి రుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ మద్దతు తీర్చుకుంటామని తెలియజేశారు. మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ పార్టీకి ఇదేవిధంగా కొనసాగాలని ఆకాంక్షించారు.రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలాగా భరోసా ఉంటుందని పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైసిపి నాయకులు నాగార్జున యలగాల, అనీల్ పెదగాడ, హరి చెన్నుపల్లి, శరత్ కుమార్ రెడ్డి తోట్లీ, విష్ణు వర్ధన్ రెడ్డి వాకమల్ల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మెల్బోర్న్ టీం వైయస్ఆర్సీపీ సభ్యులకు ఆస్ట్రేలియా సీనియర్ వైసీపీ లీడర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు -
17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్ఆర్ఐ జంట, వీడియో వైరల్
డాలర్ల వేటలో చాలామంది విదేశాల బాటపడతారు. కానీ అన్ని దేశాల్లోనూ, అన్ని రకాలుగా మనకు సౌకర్యంగా ఉండదు. కొన్నిచోట్ల కొన్ని సమస్యలు తప్పవు. ఇందులో అక్కడి నిబంధనలు, భాషా సంస్కృతి, వాతావరణ పరిస్థితులు, జీవన స్థితిగతులు, ఆరోగ్యం ఇలా ఈ జాబితాలోనే చాలానే ఉంటాయి. కొన్ని కావాలంటే కొన్ని సర్దుబాట్లు తప్పవు అని ఎడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. కానీ అమెరిలో ఒకటిన్నర దశాబ్దానికి పైగా ఉన్న జంట ప్రవాస భారతీయ (NRI) జంట ఇండియాకు తిరిగి వచ్చేసింది.ఎందుకు? అనుకుంటున్నారా? పదండి తెలుసుకుందాం ఈ కథనంలోఅమెరికాలో ఆరోగ్య ఖర్చులు బీమా భారం కావడంతో దాదాపు 17 ఏళ్ల తరువాత అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేసింది భారతేదేశానికి చెందిన ఎన్ఆర్ఐ జంట. వీరికి కవల పిల్లలు. యూఎస్లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తమ ఆర్థిక స్థితిపై ఒత్తిడి తెస్తోందని, బీమా చాలా ఖరీదైనదని, దీంతో అక్కడ హాస్పిటల్కి వెళ్లాలంటేనే భయం వేస్తోందని ఇన్స్టా పోస్ట్లో వెల్లడించారు.అమెరికాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆరోగ్య బీమా సేవలకంటే ముందు, మీ జేబుకు చిల్లు తప్పదు. అంటే ఏ డాక్టర్ దగ్గరికెళ్లినా, ఎలాంటి పరీక్షలు చేయించుకున్నా, మినిమం డిడక్టబుల్ ఎమౌంట్ కట్టాల్సిందే అంటూ తమ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.తాము ఎంచుకున్న చౌకైన పథకం నెలకు 1,600 డాలర్ల ప్లాన్. ఇందులో 15వేల డాలర్లు డిడక్టబుల్ ఎమౌంట్. అయితే ఈ కవర్లో ట్విన్స్ యాడ్ అవ్వలేదు.దీంతో పిల్లలకి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన ఖర్చులు విపరీతం, దీనికి ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. అందుకే ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించు కున్నాం. మంచి వైద్యులు, వేగవంతమైన సంరక్షణ, చికిత్స అందుబాటులో ఉండేలా చక్కటి వ్యవస్థ ఉంది. మేం ఇండియాకు రావడం అంటే సమస్య నుంచి పారిపోవడం కాదు, ఆరోగ్య సంరక్షణ భరించేదిగా ఉండటంతోపాటు, ఒంటరిగా మాతృత్వ భారాన్ని భరించాల్సిన అవసరం లేని జీవితం వైపు పరుగెత్తడం అని వివరణ ఇచ్చారు. తాము కోల్పోతున్న సమన్వయం, మనశ్శాంతిని వెదుక్కోవడం అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Dhara (@twinsbymyside) దీంతో నెటిజన్లు ఈ జంటతో ఏకీభవించారు. వారికి మద్దతుగా నిలిచారు. చక్కటి నిర్ణయం తీసుకున్న మీకు అభినందనలు అంటూ ప్రశంసించారు. అలాగే కొంత సర్దుబాటు అవవసరం అని కొందరు వ్యాఖ్యానిస్తే. ఇండియాలో 30వేలతో అయిపోయే అపెండిక్స్ ఆపరేషన్కు రూ. 3.74 కోట్లు అయిందంటూ ఒకరు,అక్కడ సాధారణ కట్టు , కుట్లు వేయడానికి చాలా ఖర్చవుతుంది అని మరొకరు తమ అనుభవాల్ని పంచుకున్నారు. రెండు దేశాల్లో వాటి ప్లస్లు మైనస్లూ ఉన్నాయి. కానీ చిన్న పిల్లలున్న కుటుంబాలకు ఇండియాలో మంచి ఆరోగ్య వ్యవస్థ ఉందన్నారు. ఎక్కడా పెర్ఫెక్ట్గా ఉండదు. కానీ మీకు మంచి జీవితం ఉండాలని భావిస్తున్నాను అని ఒకరు వ్యాఖ్యానించారు. వీడియో 10.6 లక్షలకు పైగా వీక్షణలు మరియు వందలాది వ్యాఖ్యలను సంపాదించింది. -
వచ్చేనెలలో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆటా వేడుకలు
గత ఇరవై సంవత్సరాలుగా ఆటా వేడుకలు పేరుతో అమెరికా తెలుగు సంఘం ఒక వినూత్న కార్యక్రమాన్ని మొదిలిపెట్టి నిర్విరామంగా నిర్వహిస్తుంది. తెలుగు భాష, సాహిత్యాలను ప్రేమిస్తూ విశేష కృషి చేస్తూ వస్తున్నది. ఉమ్మడి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమై నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆటా వేడుకలు ఘనంగా జరగటం విశేషం.ఆటా సేవల్లో భాగమైన సాహిత్య, సాంస్కృతిక, విద్యా, ఆధ్యాత్మిక, వ్యాపార రంగాల్లాంటి మరెన్నో రంగాల్లో పలు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాల ద్వారా ఆటా తన మిషన్ లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా, ఆటా తెలుగు తేజాన్ని నాలుగు దిశల విస్తరింప చేస్తూ ఉన్నది. విశ్వఖ్యాతిగా మన తెలుగును బహుళ ప్రచారం చేస్తూ భవిష్యత్తు తరాలను ప్రభావితపరుస్తూ ఉన్నది. తేనెలొలుకు తెలుగు తియ్యదనాన్ని ప్రచారం చేస్తూ తెలుగు మాతృభాష గల ప్రజలను, భాషాభిమానులను ఆకర్షిస్తూ ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్తు నిర్మాణానికి ఎంతగానో ఈ ఆటా వేడుకలు ఉపయోగపడుతున్నాయి.ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లసహాయ సహకారాలతో, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ & ఆటా వేడుకల కమిటీ చైర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటా వేడుకలు జరగబోతున్నాయి.డిసెంబర్ 12 - రంగా రెడ్డి జిల్లాలో స్కూల్ మౌలిక సదుపాయాల.అభివృద్ధి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు డిసెంబర్ 13: – సంగారెడ్డి - ఐఐటీలో స్టార్ట్ అప్ పిచ్ డిసెంబర్ 14: – హైదరాబాద్ లో సాహిత్య కార్యక్రమండిసెంబర్ 16–17: బిజినెస్ సెమినార్స్ - హైదరాబాద్, విశాఖపట్నండిసెంబర్ 20–23: స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు , స్కూల్ మౌలిక సదుపాయాల.అభివృద్ధి , ,వాటర్ ప్లాంట్ మరియు ఉమెన్స్ హెల్త్ క్యాంప్స్.డిసెంబర్ 24–25: పిల్లల కొరకు హెల్త్ క్యాంప్స్ మరియు చారిటబుల్ ప్రోగ్రామ్స్డిసెంబర్ 27: గ్రాండ్ ఫినాలే రవీంద్ర భారతి లో - సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఆటా అవార్డ్స్ ప్రధానంరెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో జరిగే అన్ని కార్యక్రమాలని ముగించుకుని హైద్రాబాద్లోని రవీంద్రభారతిలో జరిగే గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో చక్కటి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు ఎందరో కళాకారులు. చివరగా రుచికరమైన విందు భోజనంతో ముగియబోయే ఈ వేడుకలు అమెరికాలో బాల్టిమోర్ నగరంలో జులై 31 - ఆగష్టు 2 జరగబోయే ఆటా మహాసభల సన్నాహాల కోసం అందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆటా ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలు రెండూ రాష్ట్రాలలో నిర్వహిచటం గమనార్హం. డిసెంబర్ మాసంలో నిర్వహించే ఆటా వేడుకలలో ప్రవాసులు పెద్ద ఎత్తున పాల్గోవాలిసిందిగా ఆటా బోర్డ్ విజ్ఞప్తి చేసింది. తమ గ్రామాలూ, పట్టణాలలో సేవ కార్యక్రమాలు చేయాలనుకునే వారు www.ataworld.org సంప్రదించవలిసిందిగా కోరారు. -
40 ఏళ్ల సేవలు, రూ. 35 లక్షలు..ఎన్ఆర్ఐకి అరుదైన గౌరవం!
ఒక ఉద్యోగికగా తాను చేసిన సేవలకు గుర్తింపు లభించడం అంటే ఆస్కార్ వరించినంత ఆనందం. అది వ్యక్తిగత లేదా,బహిరంగ ప్రశంస అయినా, అవార్డులు, రివార్డు, నగదు బహుమతి అయినా, ఏదైనా ఎంత చిన్నదైనా కూడా గొప్ప గౌరవమే. అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాదు, నిబద్దతను పెంచుతుంది. తమ కృషికి విలువ లభిస్తుందనే భావన, ఆరోగ్యకరమైన పోటీ, పనితీరును మెరుగుకు దారితీస్తుంది. అంతిమంగా ఇది సంస్థకు ఎనలేని మేలు చేస్తుంది. ఇపుడు ఇదంతా ఎందుకూ అంటే.. భారత సంతతి వ్యక్తికి తన సంస్థనుంచి లభించిన అరుదైన గౌరవంగా నెట్టింట హాట్ టాపిక్గా మారింది.మెరికాలోని మసాచుసెట్స్లో ఉన్న మెక్డొనాల్డ్స్లో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన ఉద్యోగి బల్బీర్ సింగ్ను సంస్థ చాగా గొప్పగా సత్కరించుకుంది 40 ఏళ్ల పాటు అంకిత భావంతో పనిచేసిన మెక్డొనాల్డ్స్ ఫ్రాంచైజ్ లిండ్సే వాలిన్కు సుమారు రూ. 35 లక్షల బహుమతిని (40 వేల డాలర్లు) అందించింది. ఈవెంట్ వేదిక వద్దకు బల్బీర్ సింగ్ను లిమోజిన్ కారులో తీసుకువచ్చి, రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి మరీ దీనికి సంబంధించిన చెక్కును అందించారు. అలాగే సేవా పురస్కారం, స్మారక "వన్ ఇన్ ఎయిట్" జాకెట్నుకూడా అందుకున్నారు. ఈసందర్బంగా ఫ్రాంచైజ్ యజమాని లిండ్సే వాలిన్ మాట్లాడుతూ, బల్బీర్ సింగ్ తమ సంస్థకు గుండెలాంటి వారని కొనియాడారు. మొత్తం తొమ్మిది అవుట్లెట్లను కలిగి ఉన్న లిండ్సే వాలిన్, సింగ్ ఈ విజయాన్ని ఇతర ఉద్యోగులతో ఘనంగా సెలబ్రేట్ చేశారు. బల్బీర్ తనతో కలిసి చేసిన 40 ఏళ్ల ప్రయాణం గురించి చెప్పలేమని చెప్పలేననీ, తొమ్మిది రెస్టారెంట్లలో నాలుగు రెస్టారెంట్లను చాలా గొప్పగా, అచంచల దృష్టితో నడుపుతున్నాడు ఆమె ప్రశంసించారు. చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్లో ఆ కంపెనీల జోరుబల్బీర్ సింగ్ కెరీర్బల్బీర్ సింగ్ 40 ఏళ్ల క్రితం భారతదేశం నుండి అమెరికాకు వచ్చిన కొద్ది రోజులకే మెక్డొనాల్డ్స్లో కెరీర్ ప్రారంభించారు. తొలుత 1985లో సోమర్విల్లేలోని రెస్టారెంట్ కిచెన్లో పనిచేశారు. అలా కష్టపడి, పూర్తి నిబద్ధతతో పనిచేసి, ఒక్కో మెట్టు ఎదుగుతూ తాను పనిచేస్తున్న సంస్థలోని తొమ్మిది రెస్టారెంట్లలో నాలుగుంటిని పర్యవేక్షించే స్థాయికి చేరుకోవడం విశేషం. మొదట బల్పీర్ సింగ్ తన తండ్రి బాబ్కింగ్ వద్ద పనిచేసేవారని కంపెనీ మోటో అయిన వై నాట్ అనే పద్ధతిని స్వీకరించారని, ఇంకా ఎదగాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ఆలోచనా విధానమే మా విజయానికి కారణమని లిండ్సే వాలిన్. మరోవైపు ఈ కంపెనీలో పనిచేయడం తనకు చాలా గర్వకారణమంటూ సంతోషాన్ని ప్రకటించారు బల్బీర్ సింగ్ . -
అమెరికాలో ఆంధ్రా తల్లి,కొడుకుల హత్య కేసులో ట్విస్ట్
అనూహ్య పరిస్థితుల్లో భార్య బిడ్డలు చనిపోయి కనిపించారు. తీరని దుఃఖంలో ఉండగానే నువ్వే నిందితుడని బంధువులు ఆరోపించారు. అనుమానాలున్నాయంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిదేళ్ల తరువాత అసలు నిజం తెలిసింది. సంచలనంగా మారిన ఈ స్టోరీ వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.2017, మార్చి 23, ఆంధ్రప్రదేశ్కు చెందిన నర్రా శశికళ, ఆమె కుమారుడు అనిష్ న్యూజెర్సీలోని వారి అపార్ట్మెంట్లోశవాలై కనిపించారు. మహిళ భర్త నర్రా హనుమంతరావునే ప్రాథమికంగా నిందితుడిగా భావించారు. కానీ అనూహ్యం ఎనిమిదేళ్ల తరువాత నజీర్ హమీద్ అనే వ్యక్తిపై అభియోగాలు మోసారు. న్యూజెర్సీలోని ఒక కంపెనీలో శశికళ నర్రా భర్త సహోద్యోగే ఈ హత్యలకు పాల్పడినట్టు ప్రాసిక్యూటర్లు తెలిపారు.శశికళ, అనిష్ హత్యఏపీకి చెందిన నర్రా హనుమంతరావు న్యూజెర్సీలోని మాపుల్ షేడ్లోని ఫాక్స్ మేడో అపార్ట్మెంట్స్లో భార్య శశికళ నర్రా(38), 6 ఏళ్ల కుమారుడు అనిష్తో కలిసి ఉండేవారు. ఒక రోజు ఆఫీసునుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు ఒళ్లంతా రక్తమోడుతూ తీవ్రమైన కత్తిపోట్లతో చనిపోయి కనిపించారు. వెంటనే హనుమంత రావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.అయితే మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ హత్యలకు పాల్పడి ఉంటాడని బంధువులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు హనుమంతరావును అరెస్ట్ చేశారు. ఈ సమయంలో దర్యాప్తు అధికారులు తమ విచారణలో భాగంగా సంఘటనా స్థలంనుంచి రక్తపు మరకల నమూనాలను సేకరించి, డీఎన్ఏ పరీక్షలు చేయించారు. అయితే అది హనుమంతరావు డీఎన్ఏతో మ్యాచ్ కాకపోవడంతో ఇది మరో మలుపు తిరిగింది.ఎలా ఛేదించారంటే..బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఆఫీస్ చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ పాట్రిక్ థోర్న్టన్ అందించిన వివరాల ప్రకారం హనుమంతరావు ఇంటికి సమీపంలోనే ఉండే హమీద్ మధ్య గొడవలు ఉన్నట్టు గురించారు. కాగ్నిజెంట్ టెక్నాలజీస్లో పనిచేస్తున్న సమయంలో హను నర్రాను వేధించినట్లు గతంలో నజీర్ హమీద్ పై ఆరోపణలు రావడంతో ఆ వైపుగా దర్యాప్తు మెుదలుపెట్టారు. డీఎన్ఏ నమూనాను సేకరించాలనే ఉద్దేశంతో అధికారులు 2024లో కోర్టుకు వెళ్లారు. కాగ్నిజెంట్ కంపెనీ,హమీద్కు జారీ చేసిన ల్యాప్టాప్ను తమకు పంపమని కోరారు. చివరికి ల్యాప్టాప్ నుండి డీఎన్ఏ సేకరించారు అధికారులు. నేరస్థలంలో దొరికిన నమూనాతో హమీద్ డీఎన్ఏ సరిపోలడంతో గుట్టు రట్టయింది.మరోవైపు జంట హత్యలు జరిగిన 6 నెలల తర్వాత హమీద్ ఇండియాకు చెక్కేశాడు. అయినా కాగ్నిజెంట్ ఉద్యోగిగా కొనసాగాడు. అంతేకాదు అమెరికా పోలీసులు హమీద్ డీఎన్ఏ కోసం చాలాసార్లు ప్రయత్నించారు. భారతీయ అధికారుల ద్వారా సంప్రదించినా స్పందించలేదు. చివరికి అతడి ల్యాప్ట్యాప్ మీద నమూనాల ఆధారంగా కేసును ఛేదించారు. మరోవైపు హమీద్ను అమెరికాకు రప్పించేందుకు భారత విదేశాంగశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్లో ఆ కంపెనీల జోరుఈ దారుణమైన హత్యల వెనుక హమీద్ ఉద్దేశం ఏమిటనేది దర్యాప్తు అధికారులకు స్పష్టత లేదు కానీ హనుమంతరావుపై కోపంతోనే అతడి భార్య శశికళ, కుమారుడిపై ప్రతీకారం తీర్చుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఇన్వెస్టర్ల క్యూ : కొత్త ఐటీ నగరం వచ్చేస్తోంది! -
BMW కారు బీభత్సం: భారత సంతతి గర్భిణి దుర్మరణం
డ్రైవింగ్ సరిగ్గా రాకుండానే స్టీరింగ్ పట్టుకున్న ఒక మైనర్ అత్యుత్సాహం ఒక కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టేసింది. రెండో బిడ్డ రాక కోసం కలలు కంటున్న నిండు గర్భిణి తన కల తీరకుండానే అనంత లోకాలకు చేరింది.ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో 33 ఏళ్ల గర్భిణి భారతీయ మహిళ కన్నుమూసింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన సమన్విత ధరేశ్వర్ తన భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా అదుపు తప్పిన లగ్జరీ BMW కారు ఢీకొట్టింది. గత వారం ఈ విషాదం చోటు చేసుకుంది.శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హార్న్స్బైలోని జార్జ్ సెయింట్ వెంబడి ఉన్న ఫుట్పాత్పై వాకింగ్ చేస్తోంది ధరేశ్వర్. వేగంగా వస్తున్న BMW కారు, ముందున్న కియా కార్నివాల్ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కియా కారు ధరేశ్వర్ను బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ధరేశ్వర్ కు తీవ్ర గాయాలు అయ్యాయని, వెంటనే వెస్ట్ మీడ్ ఆసుపత్రికి తరలించినా, వారిని కాపాడలేక పోయామన్నారు. ఈ ఘటనలో రెండు కార్ల డ్రైవర్లకు ఎలాంటి గాయాలు కాలేదు. ధరేశ్వర్ భర్త, ఆమె మూడేళ్ల బిడ్డ ఎలా ఉన్నారనే దానిపై సమాచారం లేదు. ఇదీ చదవండి: మాజీ ప్రియుడి లైంగిక వేధింపులు, నాలుక కొరికేసిన యువతినిందితుడు 19 ఏళ్ల P-ప్లేటర్ (తాత్కాలిక లేదా ప్రొబేషనరీ లైసెన్స్ ఉన్న డ్రైవర్) ఆరోన్ పాపాజోగ్లుగా గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా బెయిల్ నిరాకరించారు. కాగా మృతురాలు ధరేశ్వర్ IT సిస్టమ్స్ ఎనలిస్ట్గా పని చేస్తున్నారు. చదవండి: అరగంటలో రూ. 10 లక్షలు : సేల్స్మేన్కు దిమ్మ తిరిగింది -
గ్రామాలను దత్తత తీసుకున్న శంకర నేత్రాలయ USA మిల్వాకీ దాతలు
శంకర నేత్రాలయ USA నిర్వహించిన మిల్వాకీలో ఒక చిరస్మరణీయ రాత్రి, అడాప్ట్-ఎ-విలేజ్ కంటి శిబిరాలకు మద్దతుగా $50,000(రూ. 43 లక్షలు) దాక సేకరించారు. భారతదేశంలోని పేద వర్గాలకు కంటి శస్త్రచికిత్సలు చేయడానికి రూపొందించబడిన అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమానికి మద్దతుగా శంకర నేత్రాలయ USA లైట్ మ్యూజికల్ కన్సర్ట్ను నిర్వహించడంతో పెవాకీలోని విస్కాన్సిన్ హిందూ దేవాలయం సంస్కృతి, కరుణల శక్తిమంతమైన వేదికగా రూపాంతరం చెందింది. ఈ కార్యక్రమం దాదాపు ౩50 మంది ప్రేక్షకులతో మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమైంది. గ్రామీణ భారతదేశంలో నివారించదగిన అంధత్వాన్ని నిర్మూలించే లక్ష్యంలో సమాజం, కళ, సేవ, శక్తిని ప్రదర్శించింది. వారి ప్రారంభ వ్యాఖ్యలలో, పాలకమండలి సభ్యుడు చంద్ర మౌళి సరస్వతి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్-మిల్వాకీ సత్య జగదీష్ బాదం ఇలా పంచుకున్నారు. “మిల్వాకీ సేవా స్ఫూర్తితో పసిగడుతుంది. ఈ రాత్రి, మేము కలిసి వచ్చాం. కేవలం సేకరించడానికికాదు, ఉమ్మడి ఉద్దేశ్యం ద్వారా జీవితాలను ప్రకాశవంతం చేయడానికి.” "శంకర నేత్రాలయ USA టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లోకి తన పరిధిని విస్తరిస్తూనే ఉంది. దృష్టి లోపాలతో బాధపడుతున్న నిరుపేద వ్యక్తులకు సేవ చేయాలనే మా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మిల్వాకీ నుంచి ఉత్సాహభరితమైన మద్దతు మాకు ప్రోత్సాహాన్నిచ్చింది" అని శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలారెడ్డి ఇందూర్తి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం జయప్రదం కావడంలో..పాలకమండలి సభ్యుడు చంద్ర మౌళి సరస్వతి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ సత్య జగదీష్ బాదం, కమిటీ సభ్యులు డాక్టర్ హరి బండ్ల, పోలిరెడ్డి గంటా, చాప్టర్ లీడ్స్ మహేష్ బేలా మరియు అర్జున్ సత్యవరపు, వాలంటీర్లు ఆనంద్ అడవి, సాయి యార్లగడ్డ, రవి నాదెళ్ల, శ్రీని కిలిచేటి, చండీ ప్రసాద్, క్రాంతి మల్రెడ్డి, గుప్తా కళ్లేపల్లి, పవన్ శ్రీభాష్యం, విజయ్ వల్లూరి, చంద్రశేఖర్ గుడిసె, కరుణాకర్ రెడ్డి దాసరి, రత్నాకర్ రెడ్డి, నవీన్ రెడ్డి, కొండారెడ్డి, వెంకట్ శశి కొద్దంరెడ్డి, వౌనద్ శవధరి, వెంకట్ జాలరి రెడ్డి రెడ్డి, గోపాల్ గారు, రాజా బాబు నేతి, విక్రాంత్ రెడ్డి, గోపాల్ సింగ్, శ్రీనివాస్ నిమ్మ, రంజిత్, శ్రావణి మీసరగండ, వాసవి బాదం, ప్రీతి, కీర్తి, లావణ్య, సునీత, పావని గంట, చంద్రిక, సంతోషి, భాను, సరోజిని, కావ్య వి, రాధిక పెబ్బేటి, శరణ్య రాఘవ, శరణ్య జాలరి, కిరణ్య జ్ఙాపక ముత్తూరు, డీఎస్ రెడ్డి, రవి కుమార్ గుంత, రమేష్ పుసునూరు, శ్రీనివాస్ యూర్కేరి, ప్రమోద్ అల్లాణి, పవన్ జంపాని, ప్రీతి శర్మ, అనిల్ పబ్బిశెట్టి. రాజ్ వధేరాజ్, యాజులు దువ్వూరు, ఫణి చప్పిడి, దుర్గ, ధనలక్ష్మి, కార్తీక్ పాసెం, భారతి కొల్లి, ఉమాదేవి పువ్వాడి, దుర్గా బండారుపల్లి, వెంకట కుందూరి, డా. రెడ్డి ఊరిమిండి, మూర్తీ రేకపల్లి,శ్యాంఅప్పాలి, వంశీ ఏరువారం, రత్నకుమార్కవుటూరు, త్యాగరాజన్, దీన్ దయాళన్, సురేశ్ కుమార్లు అందించిన సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన బృందం శంకర నేత్రాలయ సేవా లక్ష్యం పట్ల అంకితభావం, సహకారం, భాగస్వామ్య నిబద్ధతను ఉదహరించారు. చంద్ర మౌళి తమ వందన సమర్పణలో కార్యక్రమ వ్యాఖ్యాతలు మాలతి కర్రి, శ్రీ వల్లిల సహకారాన్ని గుర్తించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు . -
సింగపూర్లో కార్తీకమాస స్వరారాధన
సింగపూర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన సాంస్కృతిక సంస్థ "శ్రీ సాంస్కృతిక కళాసారథి", ఈ పవిత్ర కార్తీకమాస సందర్భంగా అంతర్జాల మాధ్యమంలో శనివారం "కార్తీకమాస స్వరారాధన" అనే ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత అయిన డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్తీకమాస వైశిష్ట్యం గురించిన వివిధ అంశాలను ఒక చక్కటి ప్రవచనంగా అందించారు. పోలండ్ దేశస్తుడైన యువ గాయకుడు (Zach)బుజ్జి పాత తెలుగు సినిమాలలోని ఘంటసాల పాడిన శివ భక్తిగీతాలను, శివతాండవ స్తోత్రాన్ని పాడి వినిపించడం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది.సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ "డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ తమ సంస్థ కార్యక్రమంలో తొలిసారి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, అలాగే సింగపూర్ గాయని గాయకులతో పాటుగా మాతృభాష తెలుగు కానీ ఒక విదేశీయుడైన బాలుడు చక్కగా తెలుగు భక్తి పాటలు నేర్చుకొని పాడడం చాలా అభినందనీయం" అని తెలియజేశారు.డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ తమ ప్రసంగంలో మాట్లాడుతూ కార్తీకమాసంలో వచ్చే వివిధ పర్వదినాల గురించి ఆయా రోజులలో ఆచరించే పూజలు, వాటి వెనుక ఉన్న కథలు, ప్రత్యేకతలు, కారణాల గురించి సోదాహరణంగా విశ్లేషిస్తూ వివరిస్తూ, అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా, అన్ని వయసుల వారికి అర్థమయ్యే విధంగా సులభమైన భాషలో తెలియజేశారు.సంస్థ ప్రధాన నిర్వహకవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి సభా సమన్వయం చేయగా, సుబ్బు వి పాలకుర్తి సహ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సభలో, సింగపూర్ గాయనీగాయకులు విద్యాధరి కాపవరపు, సౌభాగ్యలక్ష్మి తంగిరాల, శేషుకుమారి యడవల్లి, షర్మిల చిత్రాడ, స్నిగ్ధ ఆకుండి, శ్రీవాణి, చంద్రహాస్ ఆనంద్, హరి మానస శివ భక్తిగీతాలను ఆలపించారు. వానిలో త్యాగరాజ కృతులు వంటి సంప్రదాయ సంగీతం, శివపదం గీతాలు, చలనచిత్ర గీతాలు, లలిత గీతాలు కూడా ఉండడం విశేషం.కల్చరల్ టీవీ సాంకేతిక సహకారంతో ప్రపంచవ్యాప్తంగా 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ కార్యక్రమం ఎప్పటివలే అన్నిదేశాల తెలుగు ప్రజల మన్ననలు అందుకుంది. (చదవండి: జపాన్లో 'తాజ్' ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజనాలు) -
సౌదీ ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీలే!
హైదరాబాద్: సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్యపై గందరగోళం నెలకొంది. అయితే ఈ ప్రమాదంపై తెలంగాణ హజ్ కమిటీ స్పందించింది. ఘటనలో 45 మంది మరణించారని.. అంతా హైదరాబాద్కు చెందిన వాళ్లేనని స్పష్టత ఇచ్చింది. మరోవైపు మృతుల పూర్తి వివరాలను సమర్పిస్తామని పోలీసులు అంటున్నారు.నాలుగు ఏజెన్సీల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్లారు. మక్కా యాత్ర తర్వాత మదీనాకు బయల్దేరారు. మదీనాకు 25కి.మీ. దూరంలో ముఫ్రిహాత్ వద్ద యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నారు. ప్రమాదంలో అంతా మరణించారు. మృతుల్లో 17 మంది పురుషులు, 28 మంది మహిళలు ఉన్నారు. అంతా హైదరాబాద్కు చెందిన వాళ్లే అని హజ్ కమిటీ పేర్కొంది. మృతుల్లో మల్లేపల్లి, బజార్ఘాట్, ఆసిఫ్నగర్ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఈ ఘోర ప్రమాదంపై నగర పోలీసులు ప్రకటన చేశారు. మొత్తం 54 మంది బృందం నవంబరు 9న హైదరాబాద్ నుంచి జెడ్డాకు వెళ్లింది. నవంబరు 23 వరకు టూర్ ప్లాన్ చేశారు. వీరిలో నలుగురు వ్యక్తులు నిన్న కారులో మదీనాకు వెళ్లారు. మరో నలుగురు మక్కాలోనే ఉండిపోయారు. మిగతా 46 మంది మక్కా నుంచి మదీనాకు బస్సులో బయల్దేరారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ బస్సు చమురు ట్యాంకర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో 45 మంది చనిపోయారు. అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి ఒక్కరే బయటపడ్డారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో ఉన్నాడు అని సజ్జనార్ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా గాఢ నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం నేపథ్యంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు జెడ్డాలోని భారత ఎంబసీ వెల్లడించింది.ప్రధాని సహా పలువురి దిగ్భ్రాంతిసౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రియాద్లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ కావాల్సిన సహాయం అందిస్తున్నాయని ప్రధాని మోదీ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. -
సౌదీ ఘటనలో హైదరాబాదీ యువకుడు సురక్షితం
సౌదీ అరేబియా మదీనా సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు సజీవ దహనం అయ్యింది తెలిసిందే. మృతుల్లో అత్యధికంగా తెలంగాణ హైదరాబాద్కు చెందినవాళ్లే ఉన్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.హైదరాబాద్ అసిఫ్ నగర్, హబీబ్ నగర్కు చెందిన 44 మంది మక్కా యాత్ర కోసం అల్ మక్కా, ఫ్లై జోన్ ట్రావెల్స్ నుంచి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీన వాళ్లు అక్కడికి వెళ్లారు. మొత్తం 46 మంది ప్రయాణికులతో కూడిన బస్సు మక్కా యాత్ర తర్వాత గత రాత్రి మదీనాకు వెళ్తోంది. ఆ సమయంలో దాటాక వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 42 మంది మరణించగా.. మృతుల్లో హైదరాబాద్కు చెందిన వాళ్లే 16 మంది ఉన్నారు. అయితే మృతుల్లో నగరానికి రెండు కుటుంబాలకు చెందిన 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఒక కుటుంబంలో 8 మంది, మరో కుటుంబంలో ఏడుగురు ప్రమాదంలో సజీవ దహనం అయ్యారు. ఆ కుటుంబాల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. బస్సు డ్రైవర్తో పాటు హైదరాబాద్కు చెందిన షోయబ్ అనే యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ధృవీకరించారు.‘‘మక్కా యాత్రికులు మరణించడం దురదృష్టకరం. హైదరాబాద్ నుంచి 44 మంది యాత్రికులు వెళ్లారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ఉన్నారు. నగరానికి చెందిన 16 మంది మరణించారు. వాళ్ల వివరాలు సేకరిస్తున్నాం. షోయబ్ అనే యువకుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు’’ అని తెలిపారు. మరోవైపు.. ప్రమాద సమాచారం అందుకున్న బంధువులు ట్రావెల్ ఏజెన్సీలకు వద్దకు చేరుకుంటున్నారు. అయితే ఫ్లై జోన్ ట్రావెల్స్ నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.సాయంత్రానికే ఆ స్పష్టత: నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం దిగ్భ్రాంతిని గురిచేసింది. మెహదీపట్నం నుంచి ఒక యువకుడు ఉదయాన్నే నాకు కాల్ చేశాడు. ఇక్కడ బాధిత కుటుంబాలను కలిసాను. సంబంధిత ట్రావెల్స్ నుంచి బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. మా పార్టీ అధినేత, ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ ఇండియన్ ఎంబసీ, సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారు. బాధ్యత కుటుంబాలను ఆదుకుంటాం. ప్రతి కుటుంబాన్ని స్వయంగా వెళ్లి కలుస్తాం. మృతదేహాలను ఇక్కడికి రప్పించడంపై సందేహాలు నెలకొన్నాయి. మా బృందం ఒకటి సాయంత్రానికి సౌదీ చేరుకుంటుంది. ఆ తర్వాతే మృతదేహాల తరలింపునకు అవకాశం ఉందా? లేదా? అనే దానిపై క్లారిటీ వస్తుంది. -
సౌదీ ప్రమాదం: మృతి చెందిన హైదరాబాదీలు వీళ్లే..
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీ కొట్టి మంటలు చెలరేగడం.. అంతా గాఢ నిద్రలో ఉండడంతో సజీవ దహనం అయ్యారు. వీళ్లంతా భారత్ నుంచే అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అయితే మృతులు హైదరాబాద్కు చెందిన యాత్రికులే. ‘‘సీఎం ఆదేశాల మేరకు మృతుల వివరాల కోసం సౌదీ ఎంబసీని సంప్రదించాం. ఇప్పటిదాకా అందిన నివేదికల ప్రకారం మృతుల్లో దాదాపు 16 మంది తెలంగాణ వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ’’ అని మంత్రి దుదిళ్ల శ్రీధర్బాబు చెబుతున్నారు. Click here for the list of Passengers Detailsహైదరాబాద్ నుంచి మొత్తం 44 మంది యాత్రికులు అక్కడికి వెళ్లారు. మరణించిన 16 మంది మల్లేపల్లి బజార్ఘాట్ ప్రాంతానికి చెందిన వాళ్లని తెలుస్తోంది. రహీమున్నీసా, అబ్దుల్ ఖాదీర్ మహమ్మద్, ఫర్హీన్ బేగం, మహ్మద్ మస్తాన్, గౌసియా బేగం, మహ్మద్ మౌలానా, ఫర్వీన్ బేగం, షెహనాజ్ బేగం, షౌకత్ బేగం, మహ్మద్ సోహైల్, జకీన్ బేగం, జహీయా బేగం, మరో నలుగురు మల్లేపల్లి నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. పైన చిత్రాల్లో ఉన్నవాళ్లంతా హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లినవాళ్లే. వీళ్లలో చాలా మంది తమ బంధువుల ఫోన్లకు స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరణించిన వివరాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ట్రావెల్ ఏజెన్సీ వద్దకు బంధువులుహైదరాబాద్ నుంచి మొత్తం 44 మంది ఉమ్రా యాత్రకు వెళ్లారు. మల్లేపల్లిలోని అల్ మీనా ట్రావెల్స్ నుంచి 20 మంది, ఫ్లైజోన్స్ ట్రావెల్స్ నుంచి 24 మంది టికెట్లు బుక్ చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రమాదం నేపథ్యంలో ఏజెన్సీల వద్దకు వద్దకు జనాల తాకిడి పెరిగింది. తమ వాళ్లు ఎలా ఉన్నారనే ఆందోళనతో పలువురు అక్కడికి చేరుకుని ఆరా తీస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఘటన నుంచి బస్సు డ్రైవర్తో పాటు హైదరాబాద్కు చెందిన షోయబ్ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.ఈ ఘోర ప్రమాదంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘‘ఈ ఘటనపై రియాద్లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అయిన అబూ మాథెన్ జార్జ్తో నేను మాట్లాడా. వారు ఈ ఘటనపై సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. హైదరాబాదుకు చెందిన రెండు ట్రావెల్ ఏజెన్సీలను నేను సంప్రదించాను. ప్రయాణికుల వివరాలను రియాద్ ఎంబసీకి, విదేశాంగ కార్యదర్శికి పంపించాను. మృతదేహాలను భారత్కు తీసుకురావాలని, ఎవరైనా గాయపడినట్లయితే వారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ను కోరుతున్నా అని అన్నారు. #WATCH | Delhi | On the bus accident in Saudi Arabia, Hyderabad MP Asaduddin Owaisi says, "...Forty-two Hajj pilgrims who were travelling from Mecca to Medina were on a bus that caught fire...I spoke to Abu Mathen George, Deputy Chief of Mission (DCM) at the Indian Embassy in… pic.twitter.com/z88Pa8GmsS— OTV (@otvnews) November 17, 2025స్పందించిన విదేశాంగ శాఖసౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, తగిన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ భరోసా ఇచ్చారు. మరోవైపు.. సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంపై ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. జెడ్డాలో ఉన్న కాన్సులేట్ జనరల్, రియాద్లోని డిప్యూటీ అంబాసిడర్తో సంప్రదింపులు జరుపుతున్నారు. యాత్రికుల వివరాలపై పూర్తి సమాచారం తెలియజేయాలని కోరారు. మరోపక్క.. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి వివరాలు అందజేయాలని ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్, కో ఆర్డినేషన్ సెక్రెటరీకి తెలంగాణ ప్రభుత్వం నుంచి అదేశాలు జారీ అయ్యాయి. -
సౌదీలో ఘోర ప్రమాదం.. హైదరాబాదీలు దుర్మరణం!
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం సంభవించింది(Saudi Arabia Bus Accident). మక్కా నుండి మదీనాకు ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయి అందులోని 45 మంది సజీవ దహనం అయ్యారు. మృతులంతా హైదరాబాద్(తెలంగాణ) వాసులేనని తేలింది.స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.30గం. ప్రాంతంలో ముఫ్రిహాత్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీ కొట్టడంతో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండడంతో అగ్నికి ఆహుతి అయ్యారు. మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో 11 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద స్థలంలో అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. డ్రైవర్తో పాటు షోయబ్ అనే యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం యువకుడికి ఐసీయూలో చికిత్స అందుతోంది.సీఎం రేవంత్ దిగ్భ్రాంతిఈ ఘోర ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కేంద్రం, సౌదీ ఎంబసీతో మాట్లాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖతో ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంప్రదింపులు జరుపుతున్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు సౌదీలో బస్సు ప్రమాదానికి సంబంధించిన వివరాలు, సహయచ చర్యల వివరాలు తెలుసుకునేందుకు తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలు 24X7 సమాచారం కోసం +91 79979 59754, +91 99129 19545 ఫోన్నెంబర్లను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్తో సమన్వయం చేయాలని అధికారులకు ఇప్పటికే సీఎస్ అదేశాలు జారీ చేశారు. జెడ్డా హెల్ప్లైన్ నెంబర్ ఇదే.. సౌదీ అరేబియాలో మదీనా సమీపంలో జరిగిన దుర్ఘటనలో భారతీయ ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్: 8002440003 ద్వారా బాధితుల సమాచారం కోసం ఎప్పుడైనా సంప్రదించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. -
ట్రంప్, జేడీ వాన్స్ పరస్పరం విభిన్న వ్యాఖ్యలు
అమెరికాలో హెచ్-1బీ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విదేశీ కార్మికుల సమస్యపై సాహసోపేతమైన ప్రకటన చేశారు. విదేశీ ఉద్యోగులను చౌక కార్మికులని పేర్కొనడంతో పాటు అమెరికాకు వారి అవసరం లేదని స్పష్టం చేశారు. సీన్ హన్నిటీతో జరిగిన పాడ్కాస్ట్ సంభాషణలో వాన్స్ మాట్లాడుతూ.. డెమొక్రాట్ మోడల్ ప్రకారం.. తక్కువ వేతనాలు తీసుకునే ఎక్కువ మంది విదేశీ ఉద్యోగులు యూఎస్లో ఉన్నారని చెప్పారు. ఇది దేశంలోని ఉద్యోగాలు, వేతనాల శ్రేయస్సుకు హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. అమెరికన్ కార్మికులను శక్తివంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తద్వారా వారు అధిక వేతనాలు పొందుతారని, దేశం మెరుగుపడుతుందని తెలిపారు.భారతీయ టెక్నాలజీ రంగం, వైద్య రంగం నిపుణులు, వైట్ కాలర్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులుగా ఉన్న హెచ్-1బీ వీసాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంస్కరణల ప్రక్రియ మొదలైంది. ఇది గ్రీన్ కార్డ్, పౌరసత్వం కోసం భారతీయుల మార్గాలను నేరుగా ప్రభావితం చేయనుంది.వీసా సంస్కరణలుసెప్టెంబర్ 2025లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతమంది నాన్ ఇమ్మిగ్రెంట్ కార్మికుల ప్రవేశంపై పరిమితి విధించాలని భావించారు. దాంతో హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని సంస్కరించడానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 21, 2025 తర్వాత దాఖలు చేసిన కొన్ని హెచ్-1బీ పిటిషన్లకు అర్హత షరతుగా అదనంగా రూ.1,00,000 డాలర్లు చెల్లించాలి. ఈ భారీ రుసుము పెంపు వీసా ప్రోగ్రామ్ లక్ష్యాన్ని, లబ్ధిదారులను గణనీయంగా ప్రభావితం చేయనుంది.ట్రంప్ వైఖరి నుంచి వాన్స్ ‘యూటర్న్’వలస ఉద్యోగులకు సంబంధించి వాన్స్ చేసిన వ్యాఖ్యలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న వైఖరితో భిన్నంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాలో నిర్దిష్ట ప్రతిభ ఉన్న కార్మికులు లేరని చెప్పారు. ఆ కొరతను తీర్చడానికి విదేశీ ప్రతిభను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, వాన్స్ అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ఈ చర్చ అమెరికన్ శ్రామిక శక్తికి కీలకం ఉంది. ఒకవైపు తక్కువ వేతనాల కోసం విదేశీ కార్మికులను తీసుకురావడం ద్వారా దేశీయ ఉద్యోగాలు దెబ్బతింటాయని విమర్శకులు భావిస్తున్నారు. మరోవైపు, ట్రంప్ సూచించినట్లుగా కొన్ని ప్రత్యేక నైపుణ్యాల్లో ఉన్న అంతరాన్ని భర్తీ చేయడానికి, ఆవిష్కరణలను కొనసాగించడానికి, తయారీ రంగంలో శిక్షణ ఇవ్వడానికి హెచ్-1బీ వీసాదారులు అవసరం అని పరిశ్రమ నిపుణులు వాదిస్తున్నారు.ఇదీ చదవండి: ఏడు పవర్ఫుల్ ఏఐ టూల్స్.. -
ఆస్ట్రేలియా ఎన్నారైల మద్దతు చిరస్మరణీయం:లక్ష్మీపార్వతి
సిడ్నీ: వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తున్న ఆస్ట్రేలియా ఎన్నారై వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి అభినందనలు,కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న ఆమె పార్టీ నాయకుడు చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పార్టీ కష్టకాలంలో ఉన్న వైఎస్ జగన్పై మీరు చూపిన ఆధారాభిమానానికి పార్టీ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటుంది. మీ మద్దతు చిరస్మరణీయంగా నిలుస్తుంది’అని పేర్కొన్నారు. ‘మీ సహాయ సహకారాలు ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలుగా భరోసా ఉంటుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నారైలు మాట్లాడుతూ వైఎస్ జగన్ పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేసుకున్నారు. తమలో చాలామంది మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల విదేశాల్లో స్థిరపడ్డామని తెలిపారు. ఆ రుణం తీర్చుకునేందుకు మేము ఎల్లప్పుడూ వైఎస్ జగన్కు మద్దతుగా ఉంటాం’అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వీరం రెడ్డి, గజ్జల చంద్ర ఓబుల రెడ్డి, కోట శ్రీనివాస్ రెడ్డి, దూడల కిరణ్ రెడ్డి, నరెడ్డి ఉమా శంకర్, కృష్ణ చైతన్య కామరాజు, నల్ల జగదీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాలో లక్ష్మీపార్వతికి వైఎస్సార్సీపీ శ్రేణుల ఘనస్వాగతం
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతికి అక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. లక్ష్మీపార్వతికి నాయకులు చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ,గజ్జల చంద్ర ఓబుల రెడ్డి,వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి ,దూడల కిరణ్ రెడ్డి, కామరాజు కృష్ణ చైతన్య ,కోటా శ్రీనివాసరెడ్డి, దుగ్గింపుడి కిరణ్ రెడ్డి, సిద్ధన సురేష్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం బ్రిస్బేన్లో ఉన్న లక్ష్మీపార్వతి.. వారం రోజుల పాటు ఆస్ట్రేలియాలోనే ఉంటారు. అక్కడ వివిధ నగరాల్లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాకు ఆమె హాజరుకానున్నారు. -
అమెరికాలో అందెశ్రీకి ఘన నివాళి
ప్రజా కవి, గాయకుడు అందెశ్రీ అకాల మృతిపై అమెరికాలో ఘన నివాళి అర్పించారు. నార్త్ కరోలినా ఛార్లెట్ లో స్థిరపడిన తెలంగాణ ప్రవాసులు అందెశ్రీ మాట, పాటలను స్మరించుకున్నారు.తెలంగాణ భూమి పుత్రుడిగా, నిస్వార్థ స్వరాష్ట్ర సాధన స్వాప్నికుడిగా అందెశ్రీని తెలంగాణ సమాజం కలకాలం గుర్తుపెట్టుకుంటుందని ఎన్.ఆర్.ఐ లు అభిప్రాయపడ్డారు. ఉద్యమ సమయంలో, ఆ తర్వాత కూడా ఆయన ప్రవాసులతో అత్మీయ అనుబంధాన్ని కొనసాగించారని కొనియాడారు.అందెశ్రీ రచనలు, ఆయన గాత్రం చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రవాసులు కోరారు. రానున్న తరాలకు ఆయన రచనలు పరిచయం అయ్యేలా పాఠ్య పుస్తకాల్లో చేర్చటంతో పాటు, అందెశ్రీ పేరుపై రాష్ట్ర స్థాయిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రత్యేక స్మృతివనం ఏర్పాటు చేయాలని ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) – ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ వై. నరేందర్ రెడ్డికి విన్నవించారు.అందెశ్రీని స్మరించుకోవటంతో పాటు, నివాళులు అర్పించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మలిపెద్ది, కోర్ టీం సభ్యుడు, చార్లెట్ చాప్టర్ దిలీప్ రెడ్డి స్యాసని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నరేంద్ర దేవరపల్లి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) చార్లెట్ చాప్టర్ అధ్యక్షుడు కదిరి కృష్ణ, చార్లెట్ తెలంగాణ అసోసియేషన్ (CTA) కార్యదర్శి ప్యారం పుట్టలి, తెలంగాణ ఎన్ఆర్ఐ ప్రముఖుడు పవన్ కుమార్ రెడ్డి కొండ, స్థానిక తెలంగాణ ప్రవాసులు హాజరయ్యారు. -
మా అమ్మ రష్యాలో సెలబ్రిటీ..! మురిసిపోతున్న కుమారుడు..
ఒక వ్యక్తి నెట్టింట షేర్ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. అలాంటి క్షణం అత ఈజీగా మర్చిపోలేం కదూ..ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదూ అని కామెంట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. అసలేం జరిగిందింటే..శుభం గౌతమ్ అనే వ్యక్తి ఒక వీడియోని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. "నా అమ్మ రష్యాలో సెలబ్రిటీ" అనే క్యాప్షన్తో షేర్ చేయడంతో మరింత వైరల్గా మారింది. ఆ వీడియోలో అతడు తన తల్లితో రష్యా వీధుల్లోకి రాగానే.. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆ తల్లిని చూసి రష్యన్ ప్రజలు ఆశ్చర్యపోవడమే కాదు..ఒక్క సెల్ఫీ అంటూ ఎగబెట్టారు. ఏదో సెలబ్రిటీ మాదిరిగా అంతా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగుతుంటే..మా అమ్మకు ఒక్కసారిగా ఎంత క్రేజ్ పెరిగిపోయిందో అంటూ మురిసిపోయాడు ఆమె కుమారుడు. విదేశాల్లో మన సంప్రదాయ దుస్తులో గనుక మనం కనిపిస్తే కచ్చితంగా ప్రత్యేకంగా నిలబడటమే గాక, అందరి దృష్టిని ఆకర్షిస్తాం..అందుకు ఈ తల్లే నిదర్శనం. అంతేగాదు ఆమె కొడుకు నా తల్లి రష్యాకు ఇష్టమైన సెలబ్రిటీ అని వీడియోలో చెబుతుండటం స్పష్టంగా వినిపిస్తుంది. ఆమె కూడా అక్కడి వాళ్ల రియాక్షన్కు సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ వారితో సెల్ఫీలు దిగడం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. భారతదేశం వెలుపల మన దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు దరిస్తే..అవి మనల్ని ప్రత్యేకంగా నిలబడేల చేయడమే గాక, రియల్ సెలబ్రిటీకి అర్థం చెప్పేలా మనల్ని నిలబెడతాయి కూడా. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ రావడమే కాదు..ఆ తల్లి నిజంగా భారతదేశ బ్రాండ్ అంబాసిడర్ అని ప్రేమగా పిలుస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Shubham Gautam (@samboyvlogs) (చదవండి: సాత్విక ఆహారంతో బరువు తగ్గగలమా..? నటి, గాయని షెహ్నాజ్ సైతం..) -
జపాన్లో 'తాజ్' ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజనాలు
తెలుగువారు ఏ దేశంలో ఉన్న వారి సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పడంలో ఎపుడు ముందుంటారు. అందుకు నిదర్శనం జపాన్లో టోక్యో నగరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ (తాజ్) అధ్వర్యంలో జరిగిన కార్తీక మాసం వనభోజనాలు. నవంబర్ 8న ఈ వేడుక స్థానిక కొమట్సుగవ పార్కులో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు అందరు పాల్గొని ఆట పాటలతో సరదాగా గడిపారు. ఒక్కో కుటుంబం నుంచి ఒక్క తినుబండారం తెచ్చి వనభోజన కార్యక్రమం నిర్వహించడం విశేషం. ప్రతి ఏటా ఇలాగే వేడుక జరుపుకోవాలని వారంతా ఆకాంక్షించారు. (చదవండి: ఆటా, ఎస్ఏఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్) -
టెక్సాస్లో కారంచేడు యువతి మృతి
బాపట్ల జిల్లా: ఆమె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. తన డిగ్రీ పూర్తిచేసి మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. ఇంతలోనే మృత్యువు కబళించింది. ఛాతీలో నొప్పి, దగ్గు ఉన్నా పెద్దగా లెక్కచేయలేదు. దీంతో.. ఎప్పటిలాగే పడుకున్న ఆమె మరుసటి రోజు లేవలేదు. స్నేహితులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం అమెరికాలోని టెక్సాస్లో చోటుచేసుకుంది. వివరాలివీ..బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబానికి చెందిన యార్లగడ్డ రామకృష్ణ, వీణాకుమారిలకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తె యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23) ఇంజినీరింగ్ అయిన తరువాత ఎంఎస్ చేసేందుకు అప్పులుచేసి కుమార్తెను అమెరికాకు పంపించారు. తను కూడా ఎంతో కష్టపడి చదివి మాస్టర్స్ డిగ్రీ పొందింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ఆమెకు రెండు, మూడ్రోజులుగా దగ్గు, ఛాతీలో నొప్పి వచి్చనా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆమె శుక్రవారం నిద్రలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది. రాజ్యలక్ష్మి మృతి తల్లిదండ్రులతో పాటు, స్థానికులను కూడా కలచివేసింది. ఆమె మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎంతో కష్టపడి తనను మంచి స్థాయిలో చూడాలని ఆశపడిన తల్లిదండ్రుల కల నెరవేర్చకుండానే తనువు చాలించిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఫీనిక్స్లో సాంస్కృతిక వేడుకలు.. శంకర నేత్రాలయ యూఎస్ఏకు భారీ విరాళం
మెసా(అరిజోనా): ఫీనిక్స్లోని భారతీయ యువత ఆధ్వర్యంలో మెసా ఆర్ట్స్ సెంటర్లోని వర్జీనియా జి. పైపర్ రిపర్టరీ థియేటర్ వేదికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం, హాస్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. సేవా సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుక ద్వారా శంకర నేత్రాలయ యూఎస్ఏ నిర్వహించే గ్రామ దత్తత కార్యక్రమం కోసం 1,45,000 డాలర్లు విరాళంగా సమీకరించబడ్డాయి.“డాన్స్ ఫర్ విజన్” కార్యక్రమంలో 160 మంది యువ కళాకారులు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల నృత్య రూపకాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. యువ నాయకులు యోగాంశ్, విశాల్, జోషిత, ఆదిత్య తదితరులు సమర్థంగా కార్యక్రమాన్ని నడిపారు. మహిళా కమిటీ సమన్వయంతో నిర్వహణ విజయవంతమైంది. నృత్య గురువులకు సన్మాన పతకాలు, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.దాతలకు సన్మానంగ్రామ దత్తత కార్యక్రమానికి ముఖ్యంగా పది మంది దాతలు తమ విరాళాలతో మద్దతు అందించారు. వీరిని వేదికపై ఘనంగా సన్మానించారు. వారి సేవా దృక్పథం, అరిజోనా బృందం సమిష్టి కృషికి పలువురు అభినందనలు తెలిపారు.హాస్యంతో హృదయాల హరివిల్లు“విజన్ కోసం నవ్వులు” పేరుతో రామ్కుమార్ నిర్వహించిన తమిళ స్టాండ్అప్ హాస్య ప్రదర్శన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. కార్యక్రమం అనంతరం ఆయన అభిమానులతో ఫొటోలు దిగారు, శాలువా, సత్కార పతకంతో సన్మానితులయ్యారు.శంకర నేత్రాలయ సేవా లక్ష్యం1978లో ప్రారంభమైన శంకర నేత్రాలయం, గ్రామీణ భారతదేశంలో కంటి చికిత్స అందించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. 1988లో స్థాపితమైన శంకర నేత్రాలయ యూఎస్ఏ, మెసు ద్వారా మొబైల్ నేత్ర శిబిరాలు నిర్వహిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది.నిర్వాహకుల కృషివంశీ కృష్ణ ఇరువారం, ఆది మోర్రెడ్డి, శ్రీని గుప్తా, డాక్టర్ రూపేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమ విజయానికి కీలకంగా వ్యవహరించారు. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సేవకులు, కళాకారులు, గాయకులు, నృత్య పాఠశాలలు అందరూ తమదైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా.. టికెటింగ్, ప్రచారం, ఫోటోగ్రఫీ, ఫ్లయర్ రూపకల్పన వంటి విభాగాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చివరగా, పాల్గొన్నవారందరికీ భోజన పెట్టెలు అందజేయడం ద్వారా కార్యక్రమాన్ని ముగించారు. -
అక్కడా మన వైద్యులే!
అభివృద్ధి చెందిన దేశాల్లోని వైద్య రంగంలో మన భారతీయ వైద్యులు, నర్సులు వెన్నెముకగా నిలిచారు. ఈ దేశాల్లో పనిచేస్తున్న వైద్యుల సంఖ్య పరంగా తొలి స్థానంలో, నర్సుల సంఖ్యలో రెండవ స్థానంలో నిలిచి భారత్ తన హవాను కొనసాగిస్తోంది.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో భారతీయుల సత్తా ప్రపంచానికి తెలియనిది కాదు. ఒక్క ఐటీ నిపుణులే కాదు.. మన వైద్య నిపుణులకూ ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఆరోగ్య వ్యవస్థలకు భారతీయ వైద్య నిపుణులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్–2025 నివేదిక వెల్లడించింది. అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియాతో సహా 38 ఓఈసీడీ సభ్య దేశాలు ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కోసం ఇతర దేశాలపై ఆధారపడటం పెరుగుతోందని తెలిపింది. మనమే టాప్ఓఈసీడీ సభ్య దేశాల్లో ఇతర దేశాలకు చెందిన 8.30 లక్షల మంది వైద్యులు, 17.5 లక్షల మంది నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారు. 38 ఓఈసీడీ సభ్య దేశాల్లోని మొత్తం వైద్యుల్లో 25 శాతం, నర్సుల్లో ఆరింట ఒక వంతు ఇతర దేశాలకు చెందినవారు. వైద్యుల్లో 40%, నర్సుల్లో 37% మంది ఆసియాకు చెందినవారు కావడం విశేషం. ఓఈసీడీ దేశాల్లో సేవలు అందిస్తున్న వైద్యుల విషయంలో సంఖ్య పరంగా భారత్, జర్మనీ, చైనా టాప్–3లో నిలి^éయి. ఇక నర్సుల విషయంలో ఫిలిప్పీన్స్, భారత్, పోలాండ్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఐదుగురు వైద్యులు, నర్సులలో ఒకరు యూరోపియన్ ఎకనామిక్ ఏరియాకు (ఈఈఏ) చెందినవారు.ఆ నాలుగు దేశాలేవిశ్వవిద్యాలయాలు, కళాశాలలు, వృత్తిపరమైన ఉన్నత విద్యా కార్యక్రమాలలో 18 లక్షల నూతన విద్యార్థులకు 2024లో ఓఈసీడీ దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ 3.90 లక్షలు, యునైటెడ్ కింగ్డమ్ 3.84 లక్షల మంది విద్యార్థులకు అనుమతులను జారీచేసి అగ్రగామిగా నిలిచాయి. కెనడా 2.13 లక్షలు, ఆస్ట్రేలియా 1.82 లక్షల మంది విద్యార్థులతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.ప్రధాన దేశంగా..చాలా కాలంగా ఓఈసీడీ దేశాలకు వలస వెళ్తున్నవారిలో అత్యధికులు భారత్, చైనాకు చెందినవారే. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ప్రధాన దేశంగా ఉన్న చైనాను అధిగమించి 2023 వరకు కూడా భారత్ ఆధిక్యంలో కొనసాగింది. ఆ ఏడాది దాదాపు 6,00,000 మంది భారతీయ పౌరులు ఓఈసీడీ సభ్య దేశాలకు వలస వెళ్లారు. 2022తో పోలిస్తే ఈ సంఖ్య 8% పెరిగింది.నలుగురిలో ఒకరు బ్రిటన్కు2023లో భారత్ నుంచి వలసదారులలో దాదాపు నలుగురిలో ఒకరు యునైటెడ్ కింగ్డమ్ను (1,44,000) ఎంచుకున్నారు. ఇందులో 97,000 మంది ఆరోగ్య, సంరక్షణ కార్మిక వీసాలపై వెళ్లారు. కెనడాలో 2023లో 1,40,000 మంది అడుగుపెట్టారు. యునైటెడ్ స్టేట్స్కు 68,000 మంది భారతీయులు ఉపాధి కోసం వలస వెళ్లారు.75వేల డాక్టర్లు మనవాళ్లే2021–23 మధ్య.. ఓఈసీడీ సభ్య దేశాల్లో పనిచేస్తున్న 6.06 లక్షల మంది విదేశీ వైద్యుల్లో 12 శాతం (75,000) మంది భారతీయ డాక్టర్లు. అలాగే 7.33 లక్షల మంది విదేశీ నర్సుల్లో 17 శాతం మంది (1.22 లక్షలు) భారతీయ నర్సులు కావడం విశేషం. అత్యధిక డాక్టర్లు యూకేలో, అత్యధిక నర్సులు యూఎస్లో ఉన్నారు. -
రష్యాలో ఇండియా విద్యార్థి అదృశ్యం : విషాదాంతం
రష్యాలో గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన భారతీయ MBBS విద్యార్థి కథ విషాదాంతమైంది. రాజస్థాన్లోని అల్వార్కు చెందిన 22 అజిత్ సింగ్ చౌదరి మృతదేహం ఆనకట్టలో లభ్యమైంది. దీంతో బాధిత విద్యార్థి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.రష్యాలో దాదాపు మూడు వారాలుగా తప్పిపోయిన వైద్య విద్యార్థి అజిత్ సింగ్ చౌదరి మృతదేహాన్ని ఉఫా నగరంలోని ఆనకట్ట సమీపంలో గుర్తించారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ సంఘటన గురించి కుటుంబ సభ్యులకు , అల్వార్లోని స్థానిక ప్రతినిధులకు సమాచారం అందించింది.అజిత్ సింగ్ చౌదరి 2023 నుండి రష్యాలోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో M ఎంబీబీఎస్ డిగ్రీ చదువుతున్నాడు. అక్టోబర్ 19న ఉదయం 11 గంటల ప్రాంతంలో తన హాస్టల్ నుండి బయటకు వచ్చిన తర్వాత అజిత్ అదృశ్యమయ్యాడు. పాలు కొనుక్కుని అరగంటలోపు తిరిగి వస్తానని స్నేహితులకు చెప్పి వెళ్లిన అతను ఎంతకీ తిరిగిరాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.స్థానిక అధికారులు వైట్ నది సమీపంలో అతని బట్టలు, ఫోన్ ,బూట్లు కనుగొన్నారు. పంతొమ్మిది రోజుల తరువాత, అదే నదికి ఆనుకుని ఉన్న ఆనకట్ట వద్ద అజిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.తోటి విద్యార్థులు మృతదేహాన్ని గుర్తించారు పోస్ట్మార్టం అనంతరం అతని మృతదేహాన్ని ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాయబార కార్యాలయం, రష్యన్ అధికారుల మధ్య సమన్వయంతో స్వదేశానికి తిరిగి పంపే ప్రక్రియ రెండు మూడు రోజుల్లో పూర్తి కావచ్చని అధికారులు తెలిపారు.చదవండి: నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : సిగ్గుచేటంటూ నెటిజన్లు ఫైర్కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం అజిత్ అనుమానాస్పద మరణంతో అజిత్ తల్లిదండ్రులు రూప్ సింగ్ ,సాంత్రా దేవి శోకానికి అంతులేకుండా పోయింది. వైద్యవిద్య కోసం మూడెకరాల భూమి అమ్మినట్టు బంధువులు తెలిపారు. ఎన్నో కలలతో అజిత్ను విదేశాలకు పంపించాం, కానీ మనిషినే కోల్పోతామని అనుకోలేదంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రవుతున్నారు. ఎలా చనిపోయాడనే దానిపై వివరణాత్మక దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు అజిత్ గ్రామస్తులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. అజిత్ అదృశ్యం పట్ల త్వరగా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని మృతదేహాన్ని త్వరగా తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ కమ్యూనిటీ సభ్యులు అల్వార్ జాట్ హాస్టల్లో సమావేశం నిర్వహించారు.దీనిపై కాంగ్రెస్ నాయకుడు జితేంద్ర సింగ్ అల్వార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏదో అనుమానాస్పదంగా అనిపిస్తోందంటూ ట్వీట్ చేశారు. మృతదేహాన్ని తరలించేలా ఏర్పాటు చేయాలనీ, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ను కోరారు. ఇదీ చదవండి: Betting App Case: శిఖర్ ధావన్, రైనాపై సజ్జనార్ ఆగ్రహం -
NRI భాస్కర్రెడ్డి అక్రమ అరెస్ట్.. పోలీసుల ఓవరాక్షన్!
NRI భాస్కర్ రెడ్డి అరెస్ట్ అప్డేట్స్...విజయవాడ..విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఎన్నారై భాస్కర్ రెడ్డి, అతని సోదరుడు ఓబుల్ రెడ్డికి ముగిసిన వైద్య పరీక్షలువైద్య పరీక్షల అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రి నుంచి కోర్టుకు తరలింపుకోర్టుకు తీసుకొచ్చిన సమయంలో నడవలేని స్థితిలో భాస్కర్ రెడ్డితనను పోలీసులు తీవ్రంగా కొట్టారంటున్న భాస్కర్ రెడ్డిసోషల్ మీడియా పోస్టుల కేసుతో పాటు భాస్కర్ రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులు.సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టానని ఒప్పుకోవాలంటూ కోర్టు ప్రాంగణంలో భాస్కర్ రెడ్డిపై పోలీసుల ఒత్తిడిపోలీసుల బెదిరింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన భాస్కర్ రెడ్డి👉కూటమి ప్రభుత్వం ఎన్నారైలపై కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఎన్నారైలపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వేధింపులకు గురిచేస్తోంది. తాజాగా వైఎస్సార్సీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఓ ఎన్నారైను అక్రమంగా అరెస్ట్ చేసింది. దీంతో, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.👉వివరాల ప్రకారం.. మాలపాటి భాస్కర్ రెడ్డి లండన్లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. భాస్కర్ రెడ్డి స్వగ్రామం కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలోని చోడవరం. అయితే, భాస్కర్ రెడ్డి సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేసిన కూటమి సర్కార్ ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఈనెల ఒకటో తేదీన తన తండ్రి మరణంతో భాస్కర్ రెడ్డి.. లండన్ నుంచి స్వగ్రామం చోడవరం చేరుకున్నారు.👉అనంతరం, వైద్య పరీక్షల కోసం తాడిగడపలోని కామినేని ఆసుపత్రికి భాస్కర్ రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు.. భాస్కర్ రెడ్డితో పాటు అతని సోదరుడు ఓబుల్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. అయితే, ఏ కేసులో తనను అరెస్ట్ చేశారో.. ఎక్కడికి తీసుకువెళ్లారో అనే కనీస సమాచారం కూడా భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు పోలీసులు ఇవ్వలేదు. అరెస్ట్పై ప్రశ్నిస్తే పెనమలూరు పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. ఇక, తాజాగా వారిద్దరినీ వైద్య పరీక్ష నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తీసుకువచ్చారు. -
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా హైదరాబాదీ
సాక్షి, హైదరాబాద్: అమెరికా రాజకీయాల్లో మన హైదరాబాదీ మెరిశారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా న్యూ మలక్పేటవాసి గజాలా హష్మీ గెలుపొంది చరిత్ర స్పష్టించారు. తొలిసారి ముస్లిం మహిళ అమెరికాలో రాజ్యాంగ పదవిలోకి రావడం ద్వారా సరికొత్త రికార్డు నమోదు చేశారు. వర్జీనియా సెనేట్లో పనిచేసిన తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరిక¯న్గా ఆమె ఇప్పటికీ కీర్తి సాధించారు. గజాలా విజయం ఆమె కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచెత్తింది. చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉండే గజాలా.. సామాజిక రంగంలోనూ పేరొందారని ఆమె సోదరి డాక్టర్ రసియా హష్మీ ‘సాక్షి’కి చెప్పారు. తమ కుటుంబ ప్రతిష్టతోపాటు హైదరాబాద్ విశిష్టతను కూడా తన సోదరి నిలబెట్టారని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం హైదరాబాద్లో పర్యటించారని, చారిత్రక ప్రదేశాలను సందర్శించారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్తో అనుబంధం ఇలా... జియా హష్మీ–తన్వీర్ హష్మీ దంపతులకు గజాలా జూలై 5, 1964లో జని్మంచారు. తన బాల్యాన్ని మలక్పేటలోని అమ్మమ్మ ఇంట్లో గడిపారు. నాలుగేళ్ల వయసులో తన తల్లి, సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియాకు వలస వెళ్లారు. ఆమె తండ్రి అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్డీ పూర్తి చేసి, ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. గజాలా జార్జియా సదరన్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ ఆనర్స్ పూర్తి చేసి, అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో పీహెచ్డీ పట్టా పొందారు. గజాలా వివాహం హైదరాబాద్కు చెందిన అమెరికాలోనే నివసించే అజహర్ రఫీక్తో జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. అజహర్ ప్రస్తుతం నాసాలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. 1991లో రిచ్మండ్ ప్రాంతానికి వెళ్లారు.రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో 30 ఏళ్ల పాటు ప్రొఫెసర్గా పనిచేసి.. వేలాది మంది విద్యార్థులకు గజాలా మార్గదర్శకత్వం వహించారు. విద్యారంగంలో చేసిన సేవలు ఆమె రాజకీయ ప్రవేశానికి పటిష్టమైన పునాదిగా నిలిచాయి. ప్రొఫెసర్గా సుదీర్ఘ అనుభవం తర్వాత.. గజాలా 2019లో తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు. గజాలాకు సీఎం అభినందనలు వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన డెమోక్రటిక్ పార్టీ నేత గజాలా హష్మీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్లో జని్మంచిన గజాలా ఆ తర్వాత కాలంలో అమెరికాలో స్థిరపడి ఈ ఘనత సాధించారని కొనియాడారు. -
శ్రీ శ్రీ రవిశంకర్కు వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు
బోస్టన్ గ్లోబల్ ఫోరం (The Boston Global Forum (BGF) , AI వరల్డ్ సొసైటీ (AIWS) నుంచి 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును శ్రీ శ్రీ రవిశంకర్ ప్రదానం చేశారు.. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన, వివాదాల పరిష్కారం, మానవతా సేవలలో ఆయన చేసిన అసామాన్య సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం లభించింది. ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్తలు, విశిష్ట అతిథుల సమక్షంలో జరిగింది.గత సంవత్సరం ఈ అవార్డు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్కు యూరప్ లోను , ప్రపంచవ్యాప్తం గాను శాంతి మరియు భద్రతను ప్రోత్సహించే దిశగా చేసిన నాయకత్వ కృషికి గుర్తింపుగా ప్రదానం చేశారు. ఇంతకుముందు ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నవారు:జర్మనీ ఛాన్సలర్ ఆంగెలా మెర్కెల్ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబేఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టోఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రజలతోఈ అవార్డు ప్రపంచ శాంతి కోసం కృషి చేసే అత్యున్నత గ్లోబల్ నాయకులకు అందించే అరుదైన గౌరవాల్లో ఒకటి. -
ఆటా, ఎస్ఏఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా (American Telugu Association ATA) అమెరికాలోని తెలుగు విద్యార్థులకు మద్దతుగా మరో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -SAI తో కలిసి స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను నిర్వహించింది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మిల్వాకీలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్కు స్టూడెంట్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. విద్యార్థుల అవగాహన, భద్రత, మరియు భవిష్యత్తు అవకాశాలపై దృష్టి సారిస్తూ ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పలువురు నిపుణులు, కమ్యూనిటీ నాయకులు, ప్రొఫెసర్స్ తో పాటు పలువురు ప్రముఖులు పలు అంశాలపై ప్రసంగించారు. డీన్ , ప్రొఫెసర్ అరోరా.. విద్యార్థి జీవితాన్ని నావిగేట్ చేయడంతో పాటు విద్యార్థుల అకడమిక్ మరియు వ్యక్తిగత జీవితంలో విజయవంతం కావడానికి అవసరమైన మార్గదర్శకత్వం చేశారు. విద్యార్థుల భద్రత మరియు సెక్యూరిటీ వంటి ముఖ్యమైన అంశాలపై మిల్వాకీ పోలీస్ లెఫ్టినెంట్ కీలక సూచనలు చేశారు. హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణులు కృష్ణ రంగరాజు వివరించారు. ప్రముఖ అటార్నీ సంతోష్ రెడ్డి సోమిరెడ్డి, ప్రముఖ అటార్నీ ప్రశాంతి రెడ్డి, ఇమ్మిగ్రేషన్ పాలసీలపై కీలక సూచనలు చేశారు. ఇమిగ్రేషన్ విషయంలో చేయవలసినవి, చేయకూడనవి విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు.అమెరికా సాంస్కృతిక వాతావరణంలో ఎలా కలవాలి, స్థానిక కమ్యూనిటీలతో అనుసంధానం ఎలా పెంచు కోవాలి వంటి అంశాలపై ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లాతో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు. యూనివర్సిటీ క్యాంపస్ లైఫ్ని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి, ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాల గురించి ప్రముఖులు రవి కాకి రెడ్డి, కె.కె. రెడ్డి వివరించారు. అలాగే కిరణ్ పాశం జూమ్ కాల్ ద్వారా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆటా సెక్రటరీ సాయినాథ్, ఆటా చికాగో సభ్యులు భాను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఆటా విస్కాన్సిన్ రీజినల్ డైరెక్టర్స్ పోలిరెడ్డి గంట, చంద్ర మౌళి సరస్వతి, ఆట విస్కాన్సిన్ రీజినల్ కోఆర్డినేటర్స్ తో పాటు నిఖిల, కీర్తిక తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఆటా మిల్వాకీ టీమ్ మరియు SAI సహకారంతో నిర్వహించిన ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్గా నిలిచింది. విద్యార్థుల అవగాహన, ఆత్మవిశ్వాసం, భద్రత వంటి అంశాల్లో బలమైన పునాది వేస్తూ.. ఇటువంటి కార్యక్రమం ఆటా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మార్గదర్శకంగా, ప్రేరణగా ఆటా నిలబడుతుందనడంలో సందేహం లేదు. -
బహ్రెయిన్లో మృతి చెందిన ఐదేళ్లకు గల్ఫ్ కార్మికుడి అంత్యక్రియలకు సన్నాహాలు
ఐదేళ్ల క్రితం బహ్రెయిన్లో మృతి చెందిన జగిత్యాల జిల్లా మెటుపల్లి కి చెందిన శ్రీపాద నరేష్ మృతదేహం అతిశీతల శవాగారంలో మగ్గుతోంది. భౌతికకాయాన్ని భారత్కు పంపించడం చేయడం సాధ్యం కాదని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేయడంతో... బహ్రెయిన్లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు సమ్మతిస్తూ, మృతుని భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి) నిరభ్యంతర పత్రంపై సంతకం చేశారుతదుపరి చర్యలకు కోసం కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట సంజయ్, మంగళవారం ప్రజా భవన్ లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిని సందర్శించి మృతుడి సోదరుడు ఆనంద్ తో కలిసి నోటరీ అఫిడవిట్ (నిరభ్యంతర పత్రం) ను సీఎం ప్రజావాణి ఇంచార్జి డా. జి. చిన్నారెడ్డికి, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డికి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం, బహరేన్ లోని ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి అక్కడే అంత్యక్రియలు జరిగేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ బహ్రెయిన్ వెళ్ళి అంత్యక్రియలకు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్లు నంగి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, సామాజిక సేవకులు మొరపు తేజ, ఆకుల ప్రవీణ్, బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బహరేన్ లోని సామాజిక కార్యకర్తలు డి.వి. శివకుమార్, కోటగిరి నవీన్ కుమార్, నోముల మురళి భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు. -
జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకి
ముగ్గురు కళాశాల డ్రాపౌట్లు 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకి ప్రవేశించారు. తద్వారా మెటా అధిపతి మార్క్ జుకర్బర్గ్ రికార్డును చెరిపేశారు. ఫోర్బ్స్ ప్రకారం, మెర్కోర్ (Mercor )అనే AI-ఆధారిత రిక్రూటింగ్స్టార్టప్ వ్యవస్థాపకులైన ముగ్గురుస్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా,ప్రపంచంలోనే అతి చిన్న బిలియనీర్లుగా నిలిచారు. ఈ ముగ్గురూ, స్వయంకృషితో బిలయనీర్లుగా ఎదిగారు. వీరిలో హిరేమత్ భారతీయసంతతికి చెందినవాడు కావడం విశేషం. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన మెర్కోర్ కంపెనీ ప్రస్తుత విలువ రూ. 88,560.68 కోట్లకు (10 బిలియన్ డాలర్లు)గా ఉంది. 350 మిలియన్ల డాలర్ల తాజా నిధులతో కంపెనీ వాల్యుయేషన్ ఈ స్థాయికి ఎగిసింది. దీంతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కులైన సెల్ఫ్-మేడ్ బిలియనీర్లుగా ఈ ముగ్గురూ నిలిచారు. మెర్కోర్ సీఈవో బ్రెండన్ ఫుడీ, CTO ఆదర్శ్ హిరేమత్ , బోర్డు చైర్మన్ సూర్య మిధా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు.ఈ ముగ్గురి ప్రయాణంకాలిఫోర్నియాలోని శాన్జోస్లోని బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీ బోయిస్ స్కూలు నుంచే మొదలైంది.అక్కడ డిబేట్ టీమ్లో టాప్ మెంబర్స్గా పేరు తెచ్చుకున్నారు. ఒకే సంవత్సరంలో మూడు మేజర్ పాలసీ డిబేట్ టోర్నమెంట్స్ గెలుచు కున్న తొలి వ్యక్తులు.హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సమయంలో మెర్కోర్పై పూర్తి సమయం దృష్టి పెట్టడానికి చదువును విడిచి పెట్టాల్సి వచ్చింది. మెర్కోర్లో పని చేయకపోతే, రెండు నెలల క్రితమే పట్టభద్రుడయ్యేవాడినని, ఇంతలోనే తన జీవితం 180-డిగ్రీల యు-టర్న్ తీసుకుందని పేర్కొన్నాడు. అలాగే సూర్య మిధా జార్జ్టౌన్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం చదువుతున్న సమయంలోనే బ్రెండన్ ఫుడీని కలిశాడు. దీంతో హిరేమత్తో పాటు మిధా, ఫుడీ ఇద్దరూ తమ చదువును వదిలేశారు. అలా వారి అభిరుచులు కలిసి, నైపుణ్యాన్ని మేళవించి మెర్కోర్ నాంది పలికింది. ప్రపంచ రికార్డుకు దారి తీసింది. -
అంతర్జాతీయ న్యాయవాది డా. శ్రీనివాస్ రావుకి అరుదైన గౌరవం
ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది డా. శ్రీనివాస్ రావు కావేటిని ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. అంతర్జాతీయ న్యాయ సేవల్లో విశేష కృషి చేసినందుకు గాను డా. శ్రీనివాస్ రావు కావేటికి ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ ఇంటర్నేషనల్ కౌన్సెల్ లీడర్షిప్ ఇన్ ది యూఎస్ ఆఫ్ 2025’ అవార్డు దక్కింది. ‘బెస్ట్ ఆఫ్ బెస్ట్ రివ్యూ’ సంస్థ డా. శ్రీనివాస్ రావు కావేటికి ఈ అవార్డును అందించింది.‘బెస్ట్ ఆఫ్ బెస్ట్ రివ్యూ’ సంస్థ అందించిన ఈ గౌరవం, భారతీయ చట్టాలను అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలతో సమన్వయం చేయడంలో డా. కావేటి చేసిన అసాధారణ కృషికి దక్కిన గుర్తింపు అని చెప్పవచ్చు. అంతర్జాతీయ న్యాయ సేవలలో కావేటి లా సంస్థ ఎంతో పేరొందింది. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా అడుగుపెట్టిన డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు ఆ తర్వాత ఆస్ట్రేలియా, యూకే, అమెరికా వంటి దేశాలలో సొలిసిటర్గా, నోటరీ పబ్లిక్గా సేవలందించారు.ఆయన స్థాపించిన కావేటి లా ఫర్మ్.. అమెరికా, భారతదేశం, యూకే, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో సేవలందిస్తోంది. కార్పొరేట్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, బిజినెస్ ఇమ్మిగ్రేషన్ వంటి కీలక రంగాలలో సరిహద్దులు దాటి క్లయింట్లకు సేవలను అందిస్తోంది. ఒకే గొడుగు కింద స్థానిక, అంతర్జాతీయ న్యాయ సేవలను అందించడం ఈ సంస్థ ప్రత్యేకత. నిజాం కాలేజ్ పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు న్యాయ విద్యతో పాటు ఎంబీఏ, జర్నలిజంలో మాస్టర్స్ పట్టాలను కూడా పొందారు. న్యాయ విద్యార్థులకు, చార్టర్డ్ అకౌంటెన్సీ అభ్యర్థులకు మార్గనిర్దేశం చేస్తూ గ్లోబల్ ఎడ్యుకేటర్గా కూడా ఆయన గుర్తింపు పొందారు.(చదవండి: ఘనంగా 'ఆటా' 19 మహాసభలు కిక్ ఆఫ్ వేడుడ -
ఆమె నిజమైన దేశభక్తురాలు: కాష్ పటేల్
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్, భారతీయ మూలాలున్న కశ్యప్(కాష్) పటేల్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలపై స్పందించారు. తన ప్రేయసితో కలిసి ఎఫ్బీఐకి చెందిన జెట్లో ప్రయాణించడంపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో రాజకీయ ఆరోపణలనూ ఆయన తోసిపుచ్చారు.కశ్యప్ పటేల్(45) తన గర్ల్ఫ్రెండ్ అలెక్సిస్ విల్కిన్స్(26)తో కలిసి ఎఫ్బీఐకి చెందిన జెట్ విమానంలో అక్టోబర్ 25వ తేదీన పెన్సిల్వేనియాకు ప్రయాణించారు. అక్కడ ఓ రెజ్లింగ్ ఈవెంట్లో ఆమె గాన ప్రదర్శన ఇచ్చారు. ఈ విమాన ప్రయాణానికి అయిన ఖర్చు 60 మిలియన్ డాలర్లపైనే. దీంతో దుమారం రేగింది. ఈ ఘటనపై ఎఫ్బీఐ మాజీ ఏజెంట్ కైల్ సెరాఫిన్ ఓ పాడ్కాస్ట్లో మండిపడ్డారు. దేశం షట్డౌన్ ఉన్న టైంలో.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో.. ఎఫ్బీఐ డైరెక్టర్ ఇలా సంస్థ నిధుల్ని దుర్వినియోగం చేయడం ఏంటి? అని నిలదీశారు. దీంతో కాష్ పటేల్పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ఎఫ్బీఐకి చెందిన విమానంలో ప్రయాణించారని, పైగా అందుకు అయ్యే ఖర్చులు ఆయనే భరిస్తారని, వ్యక్తిగత ప్రయాణాల్లో విమానం వినియోగం పరిమితంగానే అదీ విధానాలకు అనుగుణంగా ఉంటుందని ఎఫ్బీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. మరోవైపు.. ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తనపై వచ్చిన విమర్శలకు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ ఆరోపణలు అసత్యమైనవని, రాజకీయంగా ప్రేరితమైనవని అన్నారు. నన్ను విమర్శించండి, కానీ నా వ్యక్తిగత జీవితం మీద దాడి చేయడం దారుణం. అలెక్సిస్ నిజమైన దేశభక్తురాలు, నా జీవిత భాగస్వామి. ఆమెపై వచ్చిన ఆరోపణలు అతి నీచమైనవి. ఆమె దేశానికి చేసిన సేవలు చాలా మందికి పదే పదే జీవితాల్లో సాధ్యం కాదు. రాజకీయ వర్గాల్లో మాకు మద్దతు ఆశించాం. కానీ, వాళ్ల మౌనం వల్ల విమర్శలు పెరిగిపోతున్నాయి. నా కుటుంబం మీద ప్రేమే నా బలానికి మూలం. ఎఫ్బీఐను పునర్నిర్మించడమే మా లక్ష్యం అని అన్నారాయన. ఎఫ్బీఐ అధికార ప్రతినిధి బెన్ విలియమ్సన్.. కాష్ పటేల్ విమాన ప్రయాణంపై జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. అవన్నీ అర్థం లేని కథనాలని కొట్టిపారేశారు. మరోవైపు.. తన విమాన ప్రయాణ వివరాలు లీక్ కావడంపై కాష్ పటేల్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎఫ్బీఐ సీనియర్ ఉద్యోగి స్టీవెన్ పాల్మర్ (విమాన విభాగం అధిపతి) రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.న్యాయనిపుణుడైన కాష్ పటేల్, అమెరికన్ సింగర్ అయిన అలెక్సిస్ విల్కిన్స్లు 2023 జనవరి నుంచి డేటింగ్లో ఉన్నారు. ఇద్దరి మధ్య వయసు తేడా 19 ఏళ్లు. అలెక్సిస్ విల్కిన్స్పై గతంలో ఇస్రాయెల్ గూఢచారి అనే ప్రచారం జరిగింది. ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలపై ప్రభావం చూపేందుకు ఆమె ప్రయత్నించిందన్నది ఆ ప్రచార సారాంశం. ఈ ఆరోపణలు చేసిన కైల్ సెరాఫిన్పై అలెక్సిస్ 5 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ పరువు నష్టం దావా వేశారు. -
మారాల్సింది బాలయ్య ఫోకస్!
అధికార పార్టీ అండదండలతో జిల్లాలో కొందరు కల్లు వ్యాపారులు పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారి ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు వంతపాడుతున్నారు. పైగా కళ్ల ముందు కల్తీ బాధితులు కనిపిస్తున్నా.. మా కళ్లకు అలాంటివేం కనిపించడం లేదంటూ నిర్లక్ష్యంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. స్వయంగా సీఎం బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కనిపిస్తున్న పరిస్థితులు ఇవి. కల్తీ కల్లుతో హిందూపురం, పరిగి మండలాలకు చెందిన పేదలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవరిస్తుండటంతో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. రెండురోజుల క్రితం చౌళూరులో కల్లుతాగిన 13 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. స్థానికంగా వైద్యం అందించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో బంధువులు వారిని పొరుగున్న ఉన్న కర్ణాటక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాలయ్య ఫోకస్ మారాలిహిందూపురంలో ఇప్పటిదాకా ఏ ఇష్యూపైనా ఎమ్మెల్యే బాలకృష్ణ నేరుగా స్పందించింది లేదు. ఇప్పుడు అధికార పార్టీ నేతల ఆధర్వ్యంలో జరుగుతున్న కల్తీ కల్లు వ్యవహారంపైనా ఆయన స్పందిస్తారన్న ఆశలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఆస్ట్రేలియా ఎన్నారై, వైఎస్సార్సీపీ సీనియర్ నేత సూర్య నారాయణ రెడ్డి బాలయ్యపై మండిపడ్డారు. ఏపీలో ప్రతీది కల్తీమయం అవుతోందని.. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులను కల్తీ కల్లు కాటేయడం బాధాకరమని అన్నారాయన. ఎప్పుడో ఒకసారి అసెంబ్లీకి వెళ్లి వైఎస్ జగన్ మీదనో, చిరంజీవి మీదనో నోటి దురద తీర్చుకోవడం తప్పించి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అన్నారు. ఆయన నియోజకవర్గంలో పేదలు కల్తీ కల్లు బారిన పడడం.. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడం బాధాకరమని అన్నారు. బాలయ్య తన నటనను సినిమాల వరకే పరిమితం చేయాలని.. పేదవాళ్ల జీవితాలతో ఆడుకోవద్దని.. ఇకనైనా ఫోకస్ హిందూపురం మీద పెడితే బాగుంటుందని సూర్య నారాయణ రెడ్డి హితవు పలికారు.జోరుగా.. హిందూపురం పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో రసాయనాలు కలిపిన కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. చౌళూరుకు సరిహద్దున ఉన్న కర్ణాటక గ్రామాల నుంచి సైతం వస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈత వనాల నుంచి అరకొరగా వచ్చే కల్లును సేకరించి అందులో డైజోఫాం, హెచ్ తదితర రసాయనాలతోపాటు తీపి కోసం(డబుల్ డెక్కర్) చాకరిన్, చక్కెర, తెలుపు కోసం మైదా కలిపి పేద ప్రజలకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. పుట్టపర్తి ప్రాంతంలో ఉన్న ఓ అధికారి కల్లు దుకాణాల నిర్వహణలో చక్రం తిప్పుతున్నారు. హిందూపురం పరిధిలోని ఓ అధికారి నెలనెలా సొసైటీల నుంచి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. హిందూపురానికి చెందిన ఓ వ్యాపారి కొన్నేళ్లుగా గీత సొసైటీలను తన ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి డైజోఫాం, హెచ్ను గుట్టుచట్టుప్పుడు కాకుండా దిగుమతి చేసుకుని తన ఫాంహౌస్లో ఈత కల్లులో కలిపిస్తున్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
కెనడాలో భారతీయుడికి 25 ఏళ్ల జైలు శిక్ష
ఒట్టావా: ఓ హత్య కేసులో భారత సంతతి వ్యక్తికి కెనడా న్యాయస్థానం 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మూడేళ్ల క్రితం బాల్రాజ్ బస్రా(25)పై నమోదైన ఆరోపణలు రుజువు కావడంతో మంగళవారం బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2022 అక్టోబర్ 17వ తేదీన యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాకు చెందిన గోల్ఫ్క్లబ్ ప్రాంతంలో చోటుచేసుకున్న విశాల్ వాలియా(38) హత్య ఘటనలో శిక్ష పడిన వారిలో బాల్రాజ్ మూడో వ్యక్తి. ఈ కేసులో ఇక్బాల్ కాంగ్(24), డియాండ్రె బాప్టిస్ట్(21)అనే వారికి ఇప్పటికే 17 ఏళ్ల చొప్పున జైలు శిక్షలు పడ్డాయి. ఈ ముగ్గురూ కలిసి వాలియాను కాల్చి చంపి, వాహనానంలో అతడిని అగి్నకి ఆహుతి చేశారు. మరో వాహనంలో పరారైన అనుమానితులను వెంటనే గుర్తించి, వెంటాడి పోలీసులు కొన్ని నిమిషాల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. -
ఉష మతం మారదు: జేడీ వాన్స్
మత విశ్వాసాల విషయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తన భార్య ఉషా వాన్స్ హిందూ మతంలో పెరిగినప్పటికీ.. క్రైస్తవ మతం స్వీకరించాలని తనకు ఆశగా ఉందంటూ ఆయన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించడం తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన మరోసారి స్పందించారు. ఆయన క్రిస్టియన్ కాదని.. ఆమెకు మతం మారే ఉద్దేశం ఏమాత్రం లేదని అన్నారాయన. తాను చేసింది అసహ్యమైన వ్యాఖ్య అంటూ కొందరు నన్ను విమర్శించారు. నేను ప్రజల మనిషిని. వాళ్లు వేసే ప్రశ్న నుంచి తప్పించుకోలేను. అయినా మరోసారి స్పష్టత ఇస్తున్నా. ఆమెకు(ఉష) మతం మారే ఉద్దేశం లేదు. అయినా మతపరమైన విషయాలనేవీ వ్యక్తిగతం. కుటుంబం, స్నేహితులతో చర్చించాల్సిన అంశం అది. క్రిస్టియన్లు తమ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలనుకుంటారు. ఇది సాధారణమైన విషయం. నా వ్యాఖ్యలు కూడా అలాంటి సాధారణ ఆకాంక్షే అని ఎక్స్ పోస్ట్లో వివరించారాయన. తనపై వస్తున్న విమర్శలను అసహ్యకరమైనవిగా అభివర్ణించిన ఆయన.. క్రిస్టియన్ మతంపై ద్వేషంతోనే వాళ్లు అలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. నా భార్యను నేను ప్రేమగా చూస్తా. అలాగే ఆమె మతాన్ని కూడా గౌరవిస్తా. నేను ఆమె మతాన్ని తక్కువ చేసినట్లు మాట్లాడినట్లుగా భావించి విమర్శలు చేయడం సరికాదు అని అన్నారాయన. What a disgusting comment, and it's hardly been the only one along these lines. First off, the question was from a person seemingly to my left, about my interfaith marriage. I'm a public figure, and people are curious, and I wasn't going to avoid the question.Second, my… https://t.co/JOzN7WAg3A— JD Vance (@JDVance) October 31, 2025యూనివర్సిటీ ఆఫ్ మిసిసిప్పీలో జరిగిన ఓ ఈవెంట్లో జేడీ వాన్స్ ప్రసంగిస్తుండగా.. భారత మూలాలున్న ఓ యువతి ఆయనపై ప్రశ్నలు గుప్పించింది. వలసలు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అవలంభిస్తున్న కఠిన వైఖరిపై నిలదీస్తూనే.. మరోపక్క మతం గురించి ఒక ప్రశ్న సంధించారు. దానికి వాన్స్ స్పందిస్తూ.. తన భార్య ఉషా, హిందూ మతంలో పెరిగినవారిగా క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాలనే ఆశ తనకు ఉందని చెప్పారు. ఆమె చాలా ఆదివారాలు తనతో పాటు చర్చికి వస్తుందని, తాను అనుభవించిన ఆధ్యాత్మిక అనుభూతిని ఆమె కూడా అనుభవిస్తే బాగుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. అంతే.. ఆయన్ని తిట్టిపోస్తూ నెటిజన్లు మండిపడ్డారు. ఉషా వాన్స్ నేపథ్యం.. జేడీ వాన్స్ సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా చిలుకూరి వాన్స్. ఈమె తెలుగు మూలాలున్న వ్యక్తి. ఉష తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి (Usha Chilukuri Vance) పుట్టిపెరిగారు. యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. యేల్ లా స్కూల్లోనే ఉషా, జె.డి.వాన్స్ (JD Vance) తొలిసారి కలుసుకున్నారు. 2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. ప్రత్యేకంగా హిందూ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకోవడం విశేషం. వీళ్లకు ముగ్గురు సంతానం. ఆమె న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. యేల్ విశ్వవిద్యాలయంలో లా అండ్ టెక్ జర్నల్కు మేనేజింగ్ ఎడిటర్గా, యేల్ లా జర్నల్కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్గా పనిచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జాన్ రాబర్ట్స్, జస్టిస్ బ్రెట్ కెవానా వద్ద విధులు నిర్వర్తించారు. 2015 నుంచి ఆమె న్యాయ సంబంధిత సంస్థలు ముంగర్, టోల్స్, ఓస్లాన్లో కార్పొరేట్ లిటిగేటర్గా పనిచేస్తున్నారు. విశేషం ఏంటంటే.. అమెరికాలో ఉష లెఫ్ట్-వింగ్, లిబరల్ గ్రూప్స్తో కలిసి పనిచేశారు. 2014లో ఆమె డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తగా నమోదు చేసుకున్నారు. అయితే.. రిపబ్లికన్ అయిన భర్త జేడీ వాన్స్ విజయంలో ఉషా కీలక పాత్ర పోషించారు. ఆ మధ్య ఈ కుటుంబం భారత పర్యటనలోనూ సందడి చేశారు. -
కలల్ని అమ్ముకున్నారు.. ఇప్పుడు స్థానం లేదంటారా?
అమెరికా ఉపాధ్యక్షుడు, ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్కు ఊహించని పరిణామం ఎదురైంది. వలసదారులు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని భారతీయ మూలాలున్న ఓ యువతి వాన్స్ ముఖం మీదే ఎండగట్టింది. అంతేకాదు.. ఆయన వ్యక్తిగత జీవితంపైనా ఆమె వేసిన ఓ ప్రశ్నతో ఆయన ఇబ్బందిపడినట్లు కనిపించారు. అమెరికాలోని మిసిసిప్పీ విశ్వవిద్యాలయంలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ Turning Point USA అనే ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వాన్స్ ప్రసంగిస్తూ.. అమెరికాలో కఠినమైన వీసా పరిశీలన విధానానికి (strict vetting process) మద్దతు ప్రకటించారు. అమెరికాలోకి చట్టబద్ధంగా వచ్చే వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో.. భారతీయ సంతతికి చెందిన ఓ యువతి మైక్ అందుకుంది. ఆయన్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ‘‘మీరు ఇంతకాలం అమెరికా కలల్ని మాకు అమ్మారు, మా యవ్వనాన్ని, సంపదను ఖర్చు పెట్టించారు. అలాంటిది ఇప్పుడేమో ఎక్కువ మంది వస్తున్నారు.. వాళ్లను వెనక్కి పంపాలి అంటారా?.. మాకు ఇక్కడ స్థానం లేదంటారా?. మేము చట్టబద్ధంగా వచ్చాం, మీ నిబంధనలు పాటించాం. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి చెందనివాళ్లమంటారా?’’ అని వాన్స్ను నిలదీశారు. ఆ సమయంలో.. A brave young woman asks JD Vance: “When you talk about too many immigrants here, when did you guys decide that number? Why did you sell us a dream? You gave us the path and now tell us we don't belong here? Why do you have to be Christian to be American?” pic.twitter.com/mQ3CTAnN58— The Tennessee Holler (@TheTNHoller) October 30, 2025కొందరు చప్పట్లు చరుస్తూ ఆమెను అభినందించడం గమనార్హం. అయితే వాళ్లను వారిస్తూ ఆమె ఈ ప్రశ్నతో గొడవ చేయాలన్నది తన ఉద్దేశం కాదంటూ స్పష్టం చేశారు. దానికి వాన్స్ సమాధానం ఇవ్వలేదు. బదులుగా.. అత్యధిక ఇమ్మిగ్రేషన్ అమెరికా సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని.. కొంతమంది అక్రమ వలసదారులు దేశానికి మేలు చేశారని.. అంతమాత్రాన అందువల్ల లక్షల మందిని అనుమతించాల్సిన అవసరం లేదు అని అభిప్రాయపడ్డారు. ఆ వెంటనే.. ఆ యువతి.. అమెరికాను ప్రేమించాలంటే క్రిస్టియన్ కావాల్సిందేనా? అని అడిగింది. దానికి వాన్స్ స్పందిస్తూ తాను మత బోధనను విశ్వసిస్తానని.. తన భార్య కూడా భవిష్యత్తులో అదే విశ్వాసాన్ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. అయితే, ఆమెకు స్వేచ్ఛ ఉందని, అది తనకు సమస్య కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. వాన్స్ వైఖరిపై ఇండో అమెరికన్లు మండిపడుతున్నారు. హిందూ భార్యను కలిగి ఉండి, మతపరమైన మార్పును ఆశించడం ద్వంద్వ వైఖరేనంటూ పలువురు వ్యాఖ్యానించారు. వాన్స్ వివాహం వేద హిందూ సంప్రదాయంలో జరిగినదని కూడా కొందరు గుర్తు చేశారు. వాన్స్ను ప్రశ్నించిన ఆమె ఎవరన్నదానిపై ఇంకా స్పష్ట త రావాల్సి ఉంది.When JD Vance had hit his lowest, it was his “Hindu” wife and her Hindu upbringing that had helped him navigate through the tough times. Today in a position of power, her religion has become a liability. What a fall. What an epic fall for the man. pic.twitter.com/Zvz7bFQ0hZ— Monica Verma (@TrulyMonica) October 30, 2025 -
కారుపై మూత్ర విసర్జన వద్దన్నాడని..
ఎడ్మంటన్: కెనడాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. తన కారుపై మూత్ర విసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని ప్రశ్నించినందుకు.. అర్వి సింగ్ సాగూ(55) దాడికి గురై మరణించారు. కెనడాలోని ఎడ్మంటన్ నగరంలో అక్టోబర్ 19వ తేదీన ఈ ఘటన జరగ్గా, ఆయన ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి.. గత శుక్రవారం ప్రాణాలు విడిచారు.అర్వి సింగ్ సాగూ.. తన స్నేహితురాలితో కలిసి నగరంలోని ఓ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లడానికి తమ కారు వద్దకు వస్తుండగా.. ఓ వ్యక్తి.. సాగూ కారుపై మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. దీంతో ఆ వ్యక్తిపై సాగూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆపమంటూ అరిచాడు. హే.. నువ్వేం చేస్తున్నావు?" అంటూ నిలదీశాడు.ఆ వ్యక్తి "నా ఇష్టం.. అంటూ దురుసుగా సమాధానం చెప్పడమే కాకుండా.. సాగూ తలపై బలంగా దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దాడు. దీంతో సాగూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడి స్నేహితురాలు వెంటనే ఆయన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. సాగూ సోదరుడు, ఆయన భార్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఘనంగా 'ఆటా' 19వ మహాసభల కిక్ ఆఫ్ వేడుక
బాల్టిమోర్: అమెరికా తెలుగు సంఘం (ATA) తన 19వ మహా సభలను పురస్కరించుకుని బాల్టిమోర్లో సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలుగు కమ్యూనిటీకి చెందిన 450 మందికి పైగా ప్రముఖులు, 30 మంది ట్రస్టీలు, 300 మందికి పైగా ఆటా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే తమ భారీ సదస్సును లాంఛనంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. దేశం నలుమూలల నుండి సుమారు 300 మందికి పైగా ఆటా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.అమెరికా అంతటా వివిధ సేవా కార్యక్రమాలతో జాతీయ తెలుగు సంఘంగా పేరుపొందిన 'ఆటా' బాల్టిమోర్లో తన 19వ మహాసభలను, యువజన సదస్సును నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్లోని బాల్టిమోర్లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ మహాసభలు జరగనుంది. ఆటా బోర్డు సమావేశం తాజాగా బాల్టిమోర్లోని రెనైసాన్స్ హార్బర్ ప్లేస్ హోటల్లో విజయవంతంగా జరిగింది.ఆటా మహాసభల కిక్-ఆఫ్ ఈవెంట్లో స్థానిక తెలుగు కమ్యూనిటీకి చెందిన 450 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో ఉల్లాసభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రసంగాలు జరిగాయి. కిక్-ఆఫ్ మీట్ విజయవంతంగా రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ల డాలర్లను సేకరించిందని ఆటా నాయకులు ప్రకటించారు. ఇది తెలుగు అమెరికన్ల ఐక్యత, అంకితభావాన్ని నొక్కి చెబుతూ ఒక ముఖ్యమైన నిధుల సేకరణ ప్రారంభాన్ని సూచించిందని తెలియజేశారు.ఆటా అధ్యక్షుడు జయంత చల్లా మాట్లాడుతూ, ‘‘బాల్టిమోర్, స్థానిక ఆర్గనైజింగ్ టీమ్లు అసాధారణమైన నిబద్ధతను అభిరుచిని ప్రదర్శించాయి. ఈ స్థాయి టీమ్వర్క్, కమ్యూనిటీ మద్దతుతో, 19వ ఆటా మహాసభ తెలుగు గుర్తింపును జరుపుకోవడంలో, యువ నాయకత్వాన్ని సాధికారికం చేయడంలో నిస్సందేహంగా కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది’’ అని అన్నారు.బోర్డు సమావేశం, కిక్-ఆఫ్ ఈవెంట్ను అద్భుతమైన విజయవంతం చేసినందుకు బాల్టిమోర్ ఆర్గనైజింగ్ టీమ్, స్పాన్సర్లు, వాలంటీర్లు, కమ్యూనిటీ మద్దతుదారులకు ఆటా నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.తెలుగు సంస్కృతి, భాష, విద్య, యువత సాధికారత, వ్యాపార నెట్వర్కింగ్ అమెరికాలోనూ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మానవతా సేవను ప్రోత్సహించడానికి ఆటా అంకితమైందన్న విషయాన్ని తెలియజేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటా నాయకత్వం బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ను సందర్శించింది. ఇది 425,000ం చదరపు అడుగుల విస్తీర్ణంతో, అనేక సమావేశ గదులు, ఎగ్జిబిట్ హాళ్లు, స్థానిక హోటళ్లకు ప్రత్యక్ష ప్రవేశంతో విస్తరించి ఉంది.ఈ కిక్ ఆఫ్ మీటింగ్ లోనే 19వ ఆటా మహాసభల టీంను కూడా ప్రకటించింది. 19వ ఆటా మహాసభల కన్వీనర్గా మేరీలాండ్ కు చెందిన శ్రీధర్ బానాలను నియమించింది. కో ఆర్డినేటర్గా వర్జీనియాకు చెందిన రవి చల్లాను నియమించింది. నేషనల్ కో ఆర్డినేటర్గా శరత్ వేములను, డైరెక్టర్ గా సుధీర్ దమిడి, కో కన్వీనర్ గా అరవింద్ ముప్పిడి, కో కోఆర్డినేటర్ గా జీనత్ కుందూర్, కో నేషనల్ కో ఆర్డినేటర్ గా కౌశిక్ సామ, కాన్ఫరెన్స్ రీజినల్ కో ఆర్డినేటర్ తిరుమల్ మునుకుంట్ల, కో డైరెక్టర్ కిరణ్ అల తదితరులను నియమించింది.అలాగే మహాసభ కోర్ టీమ్కు వ్యూహాత్మక పర్యవేక్షణ, సహాయం అందించడానికి అనుభవజ్ఞులైన నిర్వాహకులు, వివిధ నైపుణ్యం కలిగిన సభ్యులతో కూడిన అడ్ హాక్ మానిటరింగ్ అండ్ సపోర్ట్ టీమ్ను కూడా ఏర్పాటు చేసింది. రామకృష్ణ ఆల – నాష్విల్లే, టెన్నెస్సీ, రఘువీర్ మారిపెద్ది- టెక్సాస్, విజయ్ కుండూరు – న్యూజెర్సీ, జేపీ ముద్దిరెడ్డి – టెక్సాస్, రాజు కాకర్ల – పెన్సిల్వేనియా, మహీధర్ ముస్కుళ – ఇల్లినాయిను నియమించారు -
తెలివైన వాళ్లు ఇండియాను ఎందుకు వీడుతున్నారు?
డాలర్ డ్రీమ్స్...బీటెక్ చదవాలి.. అమెరికాకో..కెనడాకో.. జర్మనీకో ఎగిరిపోవాలి..ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో చదువుకోవాలి. మంచి పేరు సంపాదించాలి. మంచి విజ్ఞనాన్ని ఆర్జించాలి. ఇలా ప్రతి సంవత్సరం లక్షలాది మంది తమ ఊరు, తమ నేల, తమ మనుషుల్ని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. ఎవరో కలల కోసం, ఇంకెవరో అవకాశాల కోసం, మరెవరో గౌరవం కోసం..! కానీ ఆ ప్రయాణం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ప్రశ్నను లేపుతోంది. మన దేశం మన కలలను ఎందుకు ఆపలేకపోతోంది? భారతదేశం ఒక నేల మాత్రమే కాదు.. ఒక అనుభూతి..! జ్ఞానం, ధైర్యం, సంస్కారం కలిసిన ఒక శ్వాస..! అయినా కూడా ఈ పవిత్ర గడ్డపైనే పుట్టినవాళ్లు బయటకు ఎందుకు పరుగెడుతున్నారు? ఇది కేవలం వలస కథ కాదు.. ఇది మనసుల వేదన.. ఇది ఆశల కొత్త దిశలో పుట్టిన తపన..! ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? భారతీయులు ఇండియాను ఎందుకు వదిలి వెళ్లిపోతున్నారు? నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడకుందాం.. కాసేపు దేశభక్తిని పక్కనపెడదాం.. దేశంపట్ల బాధ్యత కలిగిన వ్యక్తులగానే చర్చించుకుందాం.. అసలు ఈ సమస్యకు కారణమేంటి తెలుసుకుందాం. నిజానికి భారత్ నుంచి బయలుదేరే ఈ ప్రయాణం కొత్తది కాదు.. బ్రిటీష్ కాలం నుంచే విదేశాలకు వెళ్లే మార్గం తెరుచుకుంది.. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం సముద్రాలు దాటారు. తరువాతి కాలంలో బెంగళూర్, హైదరాబార్, గురుగ్రామ్ నగరాలనుంచి యువత విదేశాల తరలిపోయారు. చాలామంది అక్కడే స్థిరపడిపోయారు కూడా. మన దేశంలో చిన్న వయసు నుంచే పోటీ జీవితంలో ఒక భాగమవుతుంది.ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీటు కోసం పోటీ. ఇక చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం కొత్త పోరాటం. టాలెంట్ ఉన్నవాడికి తగిన గౌరవం దక్కడం అరుదుగా మారిపోయింది. ఇక్కడ పరిచయాలు చాలా సార్లు ప్రతిభ కంటే పెద్దవిగా మారుతాయి. అసలు కష్టపడి పనిచేసిన వాడే అవకాశాలు కోల్పోతున్నాడు. అదే మనసులో మిగిలిన నిరాశ ఆలోచనగా మారుతోంది. ఇక్కడ కష్టపడి పనిచేస్తే ఫలితం రాదని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. జీవన ప్రమాణాలూ కారణమా?అంతేకాదు.. ఇండియాలో జీవన ప్రమాణాలు కూడా చాలా నాసిరకంగా ఉంటాయి. నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. వాతావరణం, పరిశుభ్రత, నకిలీ మందులు. కచ్చిత పనిగంటల పనివిధానం. మరోవైపు విదేశాల్లో జీవన విధానం మనకు కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. నిబంధనలు స్పష్టంగా ఉంటాయి.. ప్రతి ఒక్కరి శ్రమకు గౌరవం ఉంటుంది. ఎవరైనా కష్టపడి పనిచేస్తే, ఆ కష్టం వృథా కాదనే నమ్మకం అక్కడ బలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలూ ఎక్కువే. టెక్నాలజీ, హెల్త్కేర్, ఫైనాన్స్, పరిశోధన లాంటి రంగంలో ప్రపంచం తలుపులు తెరుస్తోంది. సమాన అవకాశాలు, సమాన గౌరవం అనే వాతావరణం విదేశాల్లో కనిపిస్తోంది. మరోవైపు భారతీయులు విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక భద్రత కూడా ఒక పెద్ద కారణం. నిజానికి ఇతర దేశాల్లో కూడా పన్నులు ఎక్కువే ఉంటాయి. అయితే అవి ఎక్కువగా ఉన్నా వాటి వినియోగాన్ని ప్రజలు చూస్తారు. ఇక్కడ పన్నులు చెల్లించినా అభివృద్ధి కనిపించదు. రోడ్లకు గుంతలే కనిపిస్తాయి. విద్యుత్ కోతలు కూడా వేధిస్తాయ్.. ఆస్పత్రుల సేవల్లో ఆలస్యం ఉంటుంది. చెప్పాలంటే ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేస్తున్న వాళ్లలో చాలామందికి బాధ్యత ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. ఇటు కొంతమంది నిబద్ధతతో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నా వ్యవస్థ దాన్ని అడ్డుకుంటుంది. ప్రతిభకు గౌరవం దక్కకపోవడం, అవినీతి పెరగడం, భవిష్యత్తుపై అనిశ్చితి లాంటివి భారతీయులను విదేశాలవైపు వెళ్లేలా చేస్తున్నాయి.ఒక్కసారి మీరే ఆలోచించండి... మన దగ్గర మంచి చదువు చదివిన వాళ్లు, తెలివైన వాళ్లు బ్యాగ్ వేసుకుని విదేశాలకు ఎందుకు వెళ్లిపోతున్నారు? అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా.. ఇలా ఎక్కడైనా ఛాన్స్ దొరికితే వెళ్లిపోతున్నారు. వారి తెలివితేటలు, విజ్ఞానం మనకెందుకు దూరంగా పోతున్నాయి? ఇది చూసి చాలామందికి 'అబ్బే డబ్బుల కోసం వెళ్లిపోతున్నారు' అని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. చదువుల్లో టాపర్స్, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల్లో సీట్లు సాధించిన వారు, చదువు పూర్తి చేసిన వెంటనే అమెరికా అనీ, యూరప్ అనీ, ఆస్ట్రేలియా అంటూ పక్క దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారంటే దీనికి కారణం కేవలం విలాసంగా బతకాలన్న కోరికా కాదండి. అలా వెళ్లేవాళ్లని అడిగితే 'ఇండియాలో నేను ఎంత పని చేసినా గుర్తింపు లేదు', 'రీసెర్చ్ చేయాలన్నా ఫ్రీడమ్ లేదు', 'నన్ను నమ్మే వాతావరణమూ లేదు' అని చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది మేధావులు తమ టాలెంట్ను ఉపయోగించుకోవటానికి, అభివృద్ధి చేసుకోవటానికి సరైన ప్లాట్ఫామ్ కోసం వెతుకుతుంటారు. వారి పరిశోధనలకు అవసరమైన వనరులు, స్వేచ్ఛ, ప్రోత్సాహం లాంటివి ఇండియాలో లేవన్నది ఎక్కువగా వినిపిస్తున్న విమర్శ. ఇదీ చదవండి: క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీఎంతమంది?ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022లో 2,25,260 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. 2023లో కూడా దాదాపు 2,16,219 మంది అదే పని చేశారు. 2014లో ఈ సంఖ్య 1,29,234 మాత్రమే ఉండగా, 2011 నుంచి 2023 మధ్య మొత్తం 19 లక్షల మంది భారతీయులు ఇండియా పాస్పోర్ట్ను వదిలేశారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 23,000 మంది భారతీయ మిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారు. ఇదే సమయంలో, 2014 నుంచి 2022 మధ్యలో భారత బిలియనీర్ల ఆస్తులు 280శాతం పెరిగాయి, అంటే దేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటుకంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఒకవైపు మధ్యతరగతి, ప్రతిభావంతులు అవకాశాల కోసం దేశం వదిలిపెడుతుంటే, మరోవైపు అత్యంత ధనవంతులు తమ భవిష్యత్ భద్రత కోసం విదేశాల్లో స్థిరపడుతున్నారు.ఇక బ్రెయిన్ డ్రెయిన్ అంటే కేవలం ఒక గణాంకం కాదు.. ఇది దేశం కోల్పోతున్న మేధస్సు! ప్రతి ప్రతిభావంతుడు బయటకు వెళ్లినప్పుడల్లా మన భవిష్యత్తు కొంత వెనుక్కు వెళ్లిపోతుంది. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే.. మన దేశం ఇలా మేధస్సును పోగొట్టుకోవడం ఆపాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా, ఇక్కడే ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించాలి. పరిశోధనకు పెట్టుబడి పెట్టాలి. యువతను ప్రోత్సహించే విధానాన్ని అభివృద్ధి చేయాలి. టాలెంట్ను గుర్తించి, ప్రోత్సహించాలి. అవార్డులు, గ్రాంట్లు, రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. సొంతదేశంలోనే అందరూ గర్వంగా ఎదిగేలా చేయాలి. ఎందుకంటే.. ఒకరు దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు, అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. అది సమాజం, వ్యవస్థ ఇచ్చిన సిగ్నల్ కూడా. ఈ సిగ్నల్ను మార్చేది మనమే..కానీ అది ఎప్పటికి సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి. -
క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ
చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.పంజాబ్కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది. అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్లతో సొంత డిస్పాచ్ సెటప్తో డ్రైవర్స్ నెట్వర్క్ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్ఫామ్ సొల్యూషన్స్గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్షాప్ & బియర్డ్ స్టైలిస్ట్ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారం ఇలా మొదలైంది. 75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్లెట్లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్వర్క్, బార్బర్ల కోసం బుకింగ్ యాప్ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా. -
యూఎస్లో ఈఏడీ ఆటోమెటిక్ పొడిగింపు రద్దు
అమెరికాలో వలస కార్మికుల ఉద్యోగ భద్రతకు సంబంధించిన కీలక నిబంధనను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) నిలిపివేసింది. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) ఆటోమేటిక్ పొడిగింపును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇది అమెరికాలోని ప్రవాస శ్రామిక శక్తిలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులతో సహా వేలాది మంది విదేశీ సిబ్బందిపై, ముఖ్యంగా H-4 వీసాదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించిన ఈ ప్రకటన ప్రభావం అక్టోబర్ 30, 2025 (గురువారం) లేదా ఆ తర్వాత తమ ఈఏడీను రెన్యువల్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే సిబ్బందిపై పడనుంది. ఇకపై స్వయంచాలకంగా(ఆటోమెటిక్గా) ఈఏడీ పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. నిర్దిష్ట తేదీకి ముందే దాఖలు చేయబడిన దరఖాస్తుల ఈఏడీని పొడిగించనున్నట్లు చెప్పారు.ఈఏడీ అంటే..అమెరికాలో పనిచేయడానికి అనుమతులున్న వలసదారులకు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) జారీ చేసే పత్రం. దీన్ని సాధారణంగా ఫారం I-766 / EAD కార్డు అంటారు. ఈ కార్డు ఒక నిర్దిష్ట కాల వ్యవధి కోసం యూఎస్లో పనిచేయడానికి ఒక వ్యక్తికి అనుమతి ఉన్నట్లు నిరూపించడానికి ఉపయోగపడుతుంది.జాతీయ భద్రతే లక్ష్యంగతంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లోని విధానం ప్రకారం సకాలంలో రెన్యువల్ దరఖాస్తు చేసుకుని, ఈఏడీ అర్హత కలిగి ఉన్నట్లయితే వలసదారులు తమ వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత కూడా 540 రోజుల వరకు పనిచేయడానికి అనుమతించేవారు. అయితే, కొత్త నిబంధనతో జాతీయ భద్రతను పరిరక్షించడానికి మరింత తనిఖీలు ఉంటాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అందులో భాగంగానే ఈమేరకు యూఎస్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. వలసదారులు తమ ఈఏడీ గడువు ముగియడానికి 180 రోజుల ముందుగానే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సిఫార్సు చేస్తున్నారు.ఇదీ చదవండి: నేటి నుంచి స్టార్లింక్ సర్వీసుల డెమో -
‘ద్రోహి.. అలాంటోడి కాళ్లు మొక్కుతావా?’
ఖలీస్తానీ ఉగ్రసంస్థ 'సిక్స్ ఫర్ జస్టిస్' (SFJ) ప్రముఖ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్పై బెదిరింపులకు దిగింది. ఆస్ట్రేలియాలో నవంబర్ 1వ తేదీన నిర్వహించబోయే కచేరీని నిలిపివేయాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది. బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడమే ఇందుకు కారణంగా ఎస్ఎఫ్జే చెబుతోంది. అమితాబ్(Amitabh Bachchan) హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్బనేగా కరోడ్ పతి సీజన్-17కి దిల్జీత్ దోసాంజ్(Diljit Dosanjh) గెస్ట్గా వచ్చాడు. ఆ సమయంలో పంజాబ్ బిడ్డ అంటూ దిల్జీత్ను బిగ్బీ పరిచయం చేయగా.. దిల్జీత్ అమిత్ కాళ్లను తాకి ఆశ్వీరాదం తీసుకున్నాడు. ఈ ఇద్దరి ఆలింగనం తర్వాత షో కంటిన్యూ అయ్యింది. అయితే పవిత్రమైన తలపాగా ఉండగా అమితాబ్ లాంటి వ్యక్తి పాదాలను తాకడంపై సిఖ్స్ ఫర్ జస్టిస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. SFJ Demands Akal Takht’s Action Against Diljit DosanjhSikhs For Justice (SFJ) has urged Akal Takht Sahib to summon Diljit Dosanjh for touching the feet of Amitabh Bachchan on the KBC show.SFJ’s statement, however, did not mention any protest or threat regarding Diljit’s… pic.twitter.com/xhdJMX92YG— Gagandeep Singh (@Gagan4344) October 29, 2025అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలే.. 1984 సిక్కుల ఊచకోతకు ప్రేరణగా మారాయి. అలాంలోడి పాదాలు తాకడం అంటే బాధితులందరినీ అవమానించడమే అని ఎస్ఎఫ్జే చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun) పేరిట ఒక ప్రకటన విడుదల అయ్యింది. ఇది అజ్ఞానం కాదు, విశ్వాస ఘాతకమేనని మండిపడింది. పైగా నవంబర్ 1వ తేదీని సిక్కుల ఊచకోత దినంగా గుర్తించిన నేపథ్యంలో.. అదే రోజున ఆస్ట్రేలియాలో కన్సర్ట్ నిర్వహించడం సిక్కు సమాజాన్ని అవమానించడమే తెలిపింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కన్సర్ట్ను రద్దు చేసుకోవాల్సిందేనని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని తెలిపింది. అంతేకాదు.. ఈ చేష్టలపై దిల్జీత్ను విచారించాల్సిందేనని కోరుతూ అకాల్ తఖ్త్ జథేదార్(అత్యున్నత ధార్మిక అధికారి) గియానీ కుల్దీప్ సింగ్ గర్గాజుకు లేఖ రాసింది. పంజాబీ సింగర్ అయిన దిల్జీత్ దోసాంజ్కు మాములు క్రేజ్ లేదు. అందుకే Aura Tour పేరిట ఆస్ట్రేలియాలో కచేరీ నిర్వహించబోతున్నారు. ఈ టూర్ కోసం 800 డాలర్ల రేటుతో టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. సుమారు 30 వేల మంది హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. అమితాబ్పై ఆరోపణలేంటి?.. (Is Really Amitabh Bachchan Anti Sikhs Call)1984లో ఇందిరా గాంధీని ఆమె సిక్కు బాడీగార్డులు హత్య చేశారు. అయితే ఆ తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులపై హింసాత్మక దాడులు జరిగాయి(1984 సిక్కుల ఊచకోత). ఆ సమయంలో ప్రముఖ నటుడు, ఇందిరాగాంధీకి ఆప్తుడైన అమితాబ్ బచ్చన్ “ఖూన్ కా బదలా ఖూన్” (రక్తానికి ప్రతీకారంగా రక్తమే) అనే నినాదం ఇచ్చారని, ఈ వ్యాఖ్యలు అప్పటి పరిస్థితుల్లో హింసను ప్రేరేపించాయని కొన్ని వర్గాలు ఆరోపించాయి. దూర్దర్శన్లో ఆయన ఆ నినాదం ఇచ్చారంటూ జగదీష్ కౌర్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలను 2011లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రముఖంగా ప్రచురించింది కూడా. దీంతో.. అమితాబ్ బచ్చన్ అకాల్ తఖ్త్ జథేదార్కు ఓ లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని.. నిరాధారమైనవని.. ఎంతో బాధ కలిగించాయని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తనను విమర్శించేవారు కూడా ఎలాంటి ఆధారాలు చూపలేకపోతున్నారని అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి.. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కోర్టు కూడా 2014లో ఆయనపై కేసు నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ ఆరోపణలు ఇప్పటిదాకా నిరూపితం కాలేదు. -
అడ్డంగా బుక్కైన మమ్దానీ!
న్యూయార్క్ మేయర్ (New York Mayor) పదవి పోటీల్లో ప్రధాన అభ్యర్థిగా ఉన్న భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మమ్దానీ(Zohran Mamdani) చిక్కుల్లో పడ్డారు. 9/11 దాడుల తర్వాతి పరిస్థితులతో ఇక్కడి ముస్లింలు భయం భయంగా గడిపారని, ఆ రోజులు వాళ్లకు ఎన్నో పాఠాలు నేర్పాయంటూ మాట్లాడారాయన. ఈ క్రమంలో ఆయన చెప్పిన విషయం ఇప్పుడు నెట్టింట ట్రోలింగ్కు గురవుతోంది. సెప్టెంబర్ 11 తర్వాత న్యూయార్క్లో పరిస్థితులు బాగా మారిపోయాయి. ఆ దాడుల తర్వాత ఇక్కడి ముస్లింలు భయంతో మరియు అవమానంతో జీవించాల్సి వచ్చింది. ఎంతలా అంటే.. నా మేనత్త సబ్వేలలో(అండర్గ్రౌండ్ మెట్రో) ప్రయాణించడమే మానేశారు. బహిరంగంగా హిజాబ్తో ఉండడం సురక్షితం కాదనే ఆమె ఆ పని చేశారు. కేవలం ఆమెకు మాత్రమే కాదు.. ఈ పరిస్థితులు ఎంతో మంది ముస్లింలకు ఆనాడు పాఠాలు నేర్పించాయి అని భావోద్వేగంగా మమ్దానీ మాట్లాడారు. అయితే.. మమ్దానీ ప్రసంగంపై నెట్టింట తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో.. కొందరు మమ్దానీ వంశవృక్షాన్ని తవ్వి మూలాలను బయటకు తీశారు. మమ్దానీకి ఉంది ఒకే ఒక మేనత్త అని, ఆమె పేరు మసమ మమ్దానీ అని, ఆమె టాంజానియాలో జీవిస్తోందని, 2001 ఉగ్రదాడుల సమయంలోనూ ఆమె అక్కడే ఉందని పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆమె ఫొటోను సైతం రిలీజ్ చేసి.. కట్టుకథ అల్లాడంటూ జోహ్రాన్ మమ్దానీపై మండిపడుతున్నారు. తీవ్ర విమర్శల వేళ జోహ్రాన్ మమ్దానీ మరోసారి స్పందించారు. ఆమె తన తండ్రి తరఫు చుట్టమని(సోదరి), చాలా ఏళ్ల కిందటే మరణించారని.. ఆ అనుభవం ఎదురైంది ఆమెకేనని వివరణ ఇచ్చాడు. అయితే.. మమ్దానీ వ్యాఖ్యలపై నెటిజన్లు మాత్రం శాంతించడం లేదు. ఈసారి 9/11 బాధితుల కుటుంబాలు రంగంలోకి దిగాయి. మమ్దానీ వ్యాఖ్యలు తమను అవమానించేలా ఉన్నాయంటూ తిట్టిపోస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం స్పందిస్తూ.. ట్విన్ టవర్స్ దాడుల బాధితురాలు జోహ్రాన్ మేనత్త కూడా అంటూ ఎద్దేవా చేశారు. రిపబ్లికన్ నేత ఆండ్రూ కుఓమో ఓ అడుగు ముందుకేసి మమ్దానీ జిహాద్ మద్దతుదారుడని, అందుకే 9/11 రోజున సంబురాలు చేసుకుంటాడంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇదీ చదవండి: మూన్లైటింగ్.. డాలర్లలకు కక్కుర్తిపడితే కష్టమే! -
యూఏఈ లాటరీలో జాక్పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. భారత్కు చెందిన అనిల్కుమార్ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు. అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. తన పూర్తి పేరు అనిల్కుమార్ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్కు 50దిర్హామ్(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే.. తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్కార్ కొనుగోలు చేసి.. సెవెన్స్టార్ హోటల్లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.From anticipation to celebration, this is the reveal that changed everything!Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025 -
విమానంలో కలకలం.. ప్రయాణికులపై భారతీయ విద్యార్థి దాడి
లుఫ్తాన్సా విమానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఓ భారతీయ విద్యార్థి.. తోటి ప్రయాణికులపై దాడి చేశాడు. పదునైన మెటల్ ఫోర్క్తో ఇద్దరు టీనేజర్లపై దాడికి పాల్పడ్డాడు. షికాగో నుంచి జర్మనీకి ప్రయాణిస్తున్న విమానంలో ఘటన జరిగింది. నిందితుడిని ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి(28)గా అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ హింసాత్మక ఘటన కారణంగా పైలట్లు విమానాన్ని బోస్టన్కు మళ్లించాల్సి వచ్చింది. అధికారుల సమాచారం మేరకు.. విమానం అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ప్రణీత్ కుమార్.. 17 ఏళ్ల ఇద్దరు టీనేజర్లపై ఫోర్క్తో దాడి చేశాడు. మొదట నిద్రలో ఉన్న ఓ యువకుడి భుజంపై ఫోర్క్తో గాయపరిచాడు. అనంతరం మరో యువకుడిపై తల వెనుక భాగంలో గాయపరిచాడు. అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన విమాన సిబ్బందిపై కూడా దాడి చేశాడు.ఈ ఘటన అనంతరం లుఫ్తాన్సా ఫ్లైట్ 431 బోస్టన్ లోగన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యవసరంగా దారి మళ్లించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఫెడరల్ ఏజెంట్లు, పోలీసులు విమానంలోకి ప్రవేశించి ప్రణీత్ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ఇద్దరు యువకులను ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనలో ప్రణీత్కు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, 2,50,000 డాలర్ల జరిమానా విధించవచ్చు. ప్రస్తుతం అతను ఫెడరల్ కస్టడీలో ఉన్నాడు. బోస్టన్లోని యూఎస్ జిల్లా కోర్టులో హాజరుపర్చనున్నారు. ప్రణిత్ కొన్ని సంవత్సరాల క్రితం విద్యార్థి వీసాతో అమెరికాలోకి ప్రవేశించాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అతడు అక్కడే ఉంటున్నట్లు సమాచారం. -
డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు
డాలస్, టెక్సస్: ఈ అవగాహనా సదస్సు ఏర్పాటుచేసిన ప్రముఖ ప్రవాస భారతీయ నాయుకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రపంచంలోని విభిన్న భాషలు, సంస్కృతులు, కళలు, ఆచార, వ్యవహారాలు, మతాలు అవలంభించండానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రయాలున్న దేశం అమెరికా. అందుకే అమెరికా దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు, మసీదులు, వివిధ భాషలవారి చర్చిలు, గురుద్వారాలు, సినగాగ్స్ లాంటి ఎన్నో ప్రార్ధనాలయాలు దర్శనమిస్తాయి.అనేక నగరాలలో భారతీయ మూలాలున్న లక్షలాదిమంది ప్రజలు ఎన్నో తరాలుగా ఈ జనజీవన స్రవంతిలో మమేకమవుతూ, వివిధ రంగాలలో బాధ్యాతాయుతంగా సేవలందిస్తూ, అమెరికా దేశ ఆర్ధికవ్యవస్థ బలోపేతానికి దోహద పడుతూ, మంచి గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో మనకున్న స్వేచ్ఛ, స్వాతంత్రయాలు దారి తప్పుతున్న ధోరణలతో కొన్ని ప్రాంతాలలో ప్రవాస భారతీయుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితులను గమనించి వివిధ సంఘాల ప్రతినిధులతో డాలస్ నగరంలో ఒక అవగాహనా సదస్సు ఏర్పాటుచేసి, ఇటీవల జరుగుతున్న వివిధ సంఘటనలను, విషయాలను కూలంకషంగా చర్చించి ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసేందుకు యీ సదస్సు ఏర్పాటుచేశాం అన్నారు”.➢ ముందుగా అమెరికాదేశ విధి విధానాలను, చట్టాలను తెలుసుకుని విధిగా అందరూ గౌరవించాలి. సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు వేదికమీద కేవలం ఒక్క భారతీయ జెండా మాత్రమే ఉంచకూడదు. భారత, అమెరికా దేశపు రెండు జెండాలు ఒకే సైజులో, ఒకే ఎత్తులో ఉండేటట్లుగా చూడాలి. వేదికపైన ఉన్న జెండాలలో వేదికముందు ఉన్న ప్రేక్షకులకు ఎడమవైపు భాగంలో అమెరికాదేశ పతాకం, కుడివైపు భారతదేశ పతాకం కనబడేటట్లుగా ఉంచాలి.జాతీయగీతాలు ఆలపించేడప్పుడు ముందుగా భారత జాతీయగీతం, ఆ తర్వాత అమెరికా జాతీయగీతం ఆలాపించాలి. భారత జాతీయగీతం పాడుతున్నపుడు నిశబ్దంగా, నిటారుగా నిలబడి ఉండాలి. అమెరికా జాతీయగీతం ఆలపిస్తున్నపుడు, అమెరికాదేశ జాతీయపతాకం వైపు చూస్తూ, కుడిచేతిని గుండెదగ్గర ఉంచుకోవాలి. టోపీలుధరించి ఉన్నట్లయితే జాతీయ గీతాలు ఆలపిస్తున్నంతసేపు వాటిని తీసిఉంచడం మర్యాద. ➢ భారతీయులు ముఖ్యంగా తెలుగువారి వందలాది కుటుంబాలు ఎక్కువగా ఒకేచోట నివసిస్తున్న ప్రాంతాలాలో దైవిక, ఆధ్యాత్మిక ఉత్సవాల పేరుతో కొన్ని రహదారులు మూసివేసి, లౌడ్ స్పీకర్ల మోతలు, బాణసంచాలు, నినాదాలతో వీధుల్లో సంబరాలు జరుపుకోవడం ఇతరులకు యిబ్బందికరంగా మారుతోంది. దీనికి సిటీ పర్మిషన్ ఉన్నట్లయితే, ట్రాఫిక్ డైవర్షన్ గుర్తులు, తగు పోలీస్ రక్షణ సిబ్బంది సహాయం తప్పనిసరి. ఇలాంటివి ఇళ్ళమధ్యలోగాక, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాలకు, ఆలయ ప్రాంగణాలకు పరిమితం చెయ్యడం ఉత్తమం. అలా కాకపోతే ఎన్నో ఉపద్రవాలకు గురిఅయ్యే ప్రమాదంఉంది.➢ ఉదాహరణకు ఇటీవలే ఇలాంటి సంఘటనతో తన కారులో రోడ్ మీద ఎటూ వెళ్ళడానికి వీలులేక, ఈ ఉత్సవాల జనంమధ్య చిక్కకుని, విసిగిపోయిన ఒక అమెరికన్ తన కారు దిగి తుపాకి చూపడంతో, అందరూ బెదిరిపోయి చెల్లాచెదురయ్యారు. ఆ తుపాకీ పేలినా, బంగారు ఆభరణాలు ధరించి ఆ ఉత్సవాలలో పాల్గొన్న పిల్లలు, పెద్దల సమూహంలో తొక్కిసలాట జరిగినా, ఊహకందని ప్రమాదం జరిగి ఉండేది. ఇళ్ళ మధ్యలోగాని, ఆరు బయటగాని బాణాసంచా ఏ ఉత్సవాలలోనైనా కాల్చకూడదు. అలా చేయడానికి ‘పైరోటెక్ లైసెన్స్’ ఉండాలి, అనుభవజ్ఞులైన, లైసెన్స్ ఉన్న టెక్నీషియన్స్ మాత్రమే ఆ పనిచేయడానికి అర్హులు. ➢ మన భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలవుతున్నప్పుడు దియేటర్లవద్ద హడావిడి శ్రుతిమించి రా(రో) గాన పడుతుంది. హీరోలకు అభిమానులు ఉండడం తప్పుగాదు గాని, దియేటర్లలో వారికి వందలాది కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం, పేపర్లు చించి విసిరి, ఈలలు, గోలలు, డాన్సులతో ఒక జాతరను తలపించడంతో అదే మూవీ కాంప్లెక్స్ లో ఇతర భాషల సినిమాలు వీక్షించేవారు భయకంపితులవుతున్నారు.నిజానికి ఎంతో ఖర్చుపెట్టి సినిమా చూద్దామని వచ్చిన ఆయా హీరోల అభిమానులుకూడా కేకలు, అరుపుల మధ్య ఆ సినిమాను పూర్తిగా ఆస్వాదించలేక అసంతృప్తికి లోనవుతున్నారు. పోలీసులువచ్చి ఈ గోల, గందరగోళాల మధ్య ఆడుతున్న సినిమాను మధ్యలో ఆపివేసి అందరినీ బయటకు పంపి వెయ్యడం లాంటి సంఘటనలు ప్రవాస భారతీయులందరికీ సిగ్గుచేటు, అవమానకరం. ➢ ఇక ఆయా రాజాకీయపార్టీల నాయకులు వచ్చినప్పుడు అభిమానులు చేసే హడావిడే వేరు. వీధుల్లో భారీ కార్ల ర్యాలీలు, జెండాలు, నినాదాలతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీకి వారు, ఆయా నాయకులకు అభిమానం చూపడం, సభలు సమావేశాలు నాల్గు గోడలమధ్య ఏర్పాటు చేసుకోవడం ఎవరికీ అభ్యంతరం కాకూడదు. కాని సమస్యంతా రోడ్లమీద, రాజకీయ నాయకులు బసచేసిన హోటళ్ళవద్ద ఇతరుల శాంతికి భంగం కల్పిస్తూ అభిమానులు చేసే గోలే. అదే హోటళ్ళలో అనేక వందలమంది అమెరికన్లు బసచేసి ఉన్నారనే స్పృహకూడా లేకుండా వేసున్న అరుపులు, కేకలకు పోలీస్లు వచ్చి అందరినీ తరిమికొట్టిన సంఘటనలు, సందర్భాలు చాలా విచారకరం.➢ చాలామంది ప్రవాస భారతీయులకు ఇంటి ఎదురుగాను, ప్రక్కన నివసిస్తున్న అమెరికన్ల పేర్లు కూడా తెలియవు. అమెరికా జనజీవన స్రవంతిలో భాగంఅవుతూ ఇరుగుపొరుగుతో కలసిమెలిసి జీవించడం చాలా అవసరం. ఎన్నో తరాలగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం గనుక స్థానిక, జాతీయ రాజకీయ నాయకులతో పార్టీలకతీతంగా సంభందాలు కలిగి ఉండాలి. అమెరికా పౌరసత్వం కల్గిఉన్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడం, తమ సమస్యలను, అభిప్రాయాలను రాజకీయనాయకులకు తెలియజేయడం ఎంతైనా అవసరం.➢ మరో పెద్ద సమస్య – ఊళ్ళ పేర్లను మార్చి వ్రాయడం, పలకడం. ఉదాహరణకు-1856లో ఏర్పడ్డ ‘డాలస్’ నగరాన్ని ‘డాలస్ పురం’ గా “ఉల్లాసపురం” గా పలకడం;1913లో ఏర్పడ్డ “క్యారల్టన్” అనే నగరాన్ని “కేరళాటౌన్” గా పలకడం ఎందుకంటే అక్కడ కొంతమంది కేరళ రాష్ట్రం నుంచి వచ్చినవారు ఉన్నారు గనుక; 1950లో ఏర్పడ్డ “గంటర్” అనే నగరాన్ని “గుంటూరు” గా మార్చి పలకడం ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు గనుక. ఇవి అన్నీ వినడానికి హాస్యంగానే ఉంటాయి కాని ఇవి అమెరికన్ల దృష్టిలోపడి అపహాస్యానికి, అపాయానికి గురిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి కొంతమంది అమెరికన్లు మన భారతదేశం వచ్చి మన పట్టణాల పేర్లను ఇంగ్లీష్ పేర్లతో మార్చివేస్తే ఎలా ఉంటుందో మనకు!. ఇలాంటి విపరీత మనస్తత్వానికి వెంటనే స్వస్తి పలకాలి.➢ వ్యక్తిగత శుచి, శుభ్రత పాటించకపోవడం, వాల్ మార్ట్ లాంటి స్టోర్స్ లో దొంగతనాలు చేస్తూ దొరికిపొయి చిక్కుల్లో పడడం, స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ లేదా తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయి పోలీసులతో వాగ్వివాదాలకు దిగడం, పరిసరాలను అశుభ్రపరచడం, డిపార్ట్మెంట్ స్టోర్స్ లోను, రెస్టారెంట్లలోను సెల్ ఫోన్లలో బిగ్గరగా అరచి మాట్లాడంలాంటి సంస్కృతిని విడనాడాలి.➢ వాట్స్ ఆప్, ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్ మొదలైన సాధనాల ద్వారా పంపే సందేశాలు, ముఖ్యంగా అమెరికన్ రాజకీయ విమర్శలు తరచూ అమెరికన్ అధికారులు గమనిస్తున్నారనే విషయం దృష్టిలో ఉంచుకుని మెలగాలి.➢ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు, రాజకీయ నాయకులు, సినిమా కధానాయకులు వారి అభిమానులకు సరైన దిశానిర్దేశం చెయ్యడం ఎంతైనా అవసరం. అవగాహన కల్పించడంలో ప్రసారమాధ్యమాల పాత్ర, కృషి కొనియాడ దగ్గది.➢ రెండు గంటలకు పైగా సాగిన ఈ అవగాహానా సదస్సులో తానా, ఆటా, నాటా, నాట్స్, టాన్టెక్స్, టిపాడ్, డేటా, సురభి రేడియో, గ్రేటర్ ఫోర్ట్ వర్త్ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ఎన్నో దశాబ్దాలగా డాలస్ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసంఉంటున్న రావు కల్వాల, ఎంవిఎల్ ప్రసాద్, వినోద్ ఉప్పు, చినసత్యం వీర్నపు, రవీంద్ర పాపినేని, రమాప్రసాద్, శ్రీ బండా, వినయ్ కుడితిపూడి, వి.ఆర్ చిన్ని, రాజేశ్వరి ఉదయగిరి, లక్ష్మి పాలేటి, రవి తూపురాని, వెంకట్ నాదెళ్ళ, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, అనిల్ గ్రంధి, శుభాష్ నెలకంటి, విక్రం జంగం, సురేష్ మండువ, రాజేష్ వెల్నాటి, సతీష్ రెడ్డి, విజయ్ కాకర్ల, బాబీ, రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాస్ గాలి, మాధవి లోకిరెడ్డి, రాజేష్ అడుసుమిల్లి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, మురళి వెన్నం మొదలైన ప్రవాస భారతీయనాయకులు హాజరై వారి వారి అభిప్రాయాలను సూటిగా పంచుకున్నారు.అతి తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన నాయకులకు, అనివార్యకారణాలవల్ల హాజరుకాలేకపోయినా సందేశాలను పంపిన వారికి, రుచికరమైన విందుభోజన ఏర్పాట్లు చేసిన ‘ఇండియా టుడే’ రెస్టారెంట్ వారికి, అన్ని వసతులతో కూడిన కాన్ఫరెన్స్ హాల్ ను సమకూర్చిన డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
యూకేలో భారత యువతిపై లైంగిక దాడి.. 45 రోజుల్లో రెండో ఘటన
లండన్: యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల భారతీయ యువతిపై లైంగిక దాడి జరిగింది. అయితే, ఈ ఘటన జాతి వివక్షతోనే జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి రోనన్ టైరర్ మాట్లాడుతూ..‘వెస్ట్ మిడ్ల్యాండ్స్లో 20 ఏళ్ల భారత సంతతికి చెందిన ఒక యువతిపై లైంగిక దాడి జరిగింది. శనివారం వాల్సాల్లోని పార్క్ హాల్ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆమెపై జాతి వివక్ష కారణంగానే ఇలా దాడి జరిగింది. ఇందుకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేపట్టాం. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక సీసీటీవీ ఫుటేజ్ నుండి వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులు నేరస్థుడి ఫొటోను విడుదల చేశారు. సాధ్యమైనంత త్వరగా అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆధారాలను సేకరించే అధికార బృందాలు మా వద్ద ఉన్నాయి’ అని తెలిపారు.Another racially aggravated rape in West Midlands, UK of an Indian origin woman in her 20sThe suspect is described as White and in his 30s, with short hair. pic.twitter.com/3n1RVj6zW9— Journalist V (@OnTheNewsBeat) October 26, 2025సిక్కు యువతిపై లైంగిక దాడి..ఇక, యూకేలో భారత సంతతి ప్రజలపై జాత్యాహంకార దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో ఓల్డ్బరీ పట్టణంలో 20 ఏళ్ల సిక్కు యువతిపై ఇద్దరు దుండగులు లైంగిక దాడికి పాల్పడి, జాతి వివక్ష వ్యాఖ్యలతో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఓల్డ్బరీలోని టేమ్ రోడ్ సమీపంలో ఒంటరిగా ఉన్న యువతిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా, "మీ దేశానికి తిరిగి వెళ్లిపో" అంటూ జాత్యాహంకార వ్యాఖ్యలతో దూషించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దీనిని జాతి వివక్షతో కూడిన దాడిగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఈ ఘటన స్థానిక సిక్కు సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీంతో, ప్రాంతంలో గస్తీ పెంచుతామని ఓ సీనియర్ పోలీస్ అధికారి హామీ ఇచ్చారు.❗️BREAKING ❗️A woman was raped in a racially aggravated attack in Walsall, West Midlands.Police are investigating the rape of a woman which they are treating as a racially aggravated attack in Walsall last night.The attacker is described as white, in his 30s. pic.twitter.com/pk3fatJ4he— Narinder Kaur (@narindertweets) October 26, 2025ఈ అమానుష ఘటనను బ్రిటన్ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ మాట్లాడుతూ.. "ఇది అత్యంత హింసాత్మక చర్య. 'మీరు ఈ దేశానికి చెందిన వారు కాదు' అని బాధితురాలితో అనడం దారుణం. కానీ ఆమె ఇక్కడికి చెందినవారే. ప్రతీ సమాజానికి సురక్షితంగా, గౌరవంగా జీవించే హక్కు ఉంది" అని పేర్కొన్నారు. మరో ఎంపీ జస్ అత్వాల్ స్పందిస్తూ, "దేశంలో పెరుగుతున్న జాతి వివక్ష ఉద్రిక్తతల ఫలితమే ఈ హేయమైన దాడి. దీనివల్ల ఓ యువతి జీవితాంతం మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఒకేసారి రెండు ఉద్యోగాలు : డాలర్లకు కక్కుర్తి పడితే ముప్పు తప్పదు!
మూన్లైటింగ్ ఆరోపణలపై భారత సంతతికి చెందిన వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన వార్త ఇంటర్నెట్లో దావాలనంలా వ్యాపించింది. న్యూయార్క్ స్టేట్ ఆఫీస్లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన మెహుల్ గోస్వామిని యుఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నగోస్వామి మాల్టా పట్టణంలో మరో కాంట్రాక్ట్ ఉద్యోగం చేయడాన్ని నేరంగా పరిగణించింది. 2022 మార్చిలో గోస్వామి న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్లో రిమోట్ వర్క్(work from home) తోపాటు, మాల్టాలోని సెమీకండక్టర్ కంపెనీకి కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. గోస్వామిపై అందిన ఫిర్యాదును విచారణ చేపట్టిన మోహుల్ గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. గోస్వామి మూన్ లైటింగ్ కారణంగా రాష్ట్రఖజానాకు రూ.44 లక్షల నష్టం జరిగిందని అధికారులు భావించారు. డ్యూయల్ ఎంప్లాయ్ మెంట్ రూల్ ప్రకారం అమెరికాలో రెండు ఉద్యోగాలు చేయడం నేరంగా పరిగణించిన దర్యాప్తు సంస్థప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం ప్రజలను మోసం చేయడమే అని, ప్రజా వనరుల దుర్వినియోగం అని పేర్కొంది.ప్రభుత్వ ఉద్యోగులకు నిజాయితీతో సేవ చేసే బాధ్యత ఉంది కానీ గోస్వామి ఆ నమ్మకాన్ని తీవ్రంగా ఉల్లంఘించాడని న్యూయార్క్ స్టేట్ ఇన్స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ అన్నారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే రెండో పూర్తికాలం ఉద్యోగం చేయడం అంటే ప్రజల డబ్బుతోపాటు ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడమే అవుతుందని లూసీ లాంగ్ పేర్కొన్నారు.ఏంటీ నేరం; ఏలాంటి శిక్షసరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ,రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం ఈ విషయంపై సంయుక్త దర్యాప్తు చేపట్టి,గోస్వామి అరెస్టు చేసింది. సొంత పూచీకత్తుపై విడుదలయ్యాడు. ఈ కేసు ప్రస్తుతం తదుపరి చట్టపరమైన చర్యలు పెండింగ్లో ఉంది. రెండవ డిగ్రీలో గ్రాండ్ చోరీ అభియోగం మోపబడింది, ఇది న్యూయార్క్లో తీవ్రమైన క్లాస్ సి నేరం. ఈ నేరం రుజువైతే గోస్వా మికి గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.13 లక్షల వరకు లేదా పొందిన ఆర్థిక ప్రయోజనాలకు రెట్టింపు మొత్తంలో జరిమానా విధించే అవకాశముంది.చదవండి: ఇషా, ఆకాష్ అంబానీ బర్త్డే: తరలి వెళ్లిన తారలుడాలర్లకు కక్కుర్తిపడితేడాలర్లకు ఆశ పడి విదేశాల్లో ఉద్యోగాలు చేసకుంటున్న నిపుణులైన ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షలకోసం ఆశపడితే దేశం పరువు ప్రతిష్టలకు భంగం కలగడంతో పాటు,వ్యక్తిగతంగా కూడా భారీ నష్టం తప్పదని, ఉద్యోగులు నిబద్దతగా నిజీయితీగా ఉండాలని సూచిస్తున్నారు.గతంలో అమెరికా సంస్థలతో మూన్లైట్ చేస్తూ మరో భారతీయుడు పరేఖ్, పట్టుబడ్డాడు. మూన్ లైటింగ్ ద్వారా ఐదు యుఎస్ స్టార్టప్లను మోసం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారాన్ని మొదట మిక్స్ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ CEO సుహైల్ దోషి సోషల్మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్) -
మనోళ్ల దీపావళి ఎఫెక్ట్: వెల్లువెత్తిన ఫిర్యాదులు
భారత్తో పాటు ప్రపంచంలోని నలుమూలలా భారతీయులు, మన మూలాలు ఉన్నవాళ్లు దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అయితే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేడుకల్లోనూ పలు చోట్ల అపశ్రుతి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తగా.. అదే సమయంలో విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. దీపావళి వేడుకల్లో.. గాయాలు, ప్రమాదాలు, చివరాఖరికి మరణాలు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అమెరికాలో ఈ ఏడాది జరిగిన వేడుకల్లో ‘నష్టం’ కాస్త ఎక్కువే జరిగిందని పరిస్థితులు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా.. అర్ధరాత్రి పూట అక్కడి భారతీయులు చేసిన హంగామాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో జరిగిన డ్యామేజ్ ఉదాహరణంగా నిలిచింది!.న్యూయార్క్ నగరం క్వీన్స్ ప్రాంతంలో.. బాణాసంచా కారణంగా లింకన్ స్ట్రీట్లోని మూడు నివాసాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇక్కడి దీపావళి వేడుకలకు.. అదీ కూడా అర్ధరాత్రి పూట నిర్వహణకు అసలు అనుమతే లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఫైర్వర్క్స్ గాల్లోకి ఎగసి ఓ ఇంట్లోకి నేరుగా దూసుకెళ్లిన తర్వాత మంటలు వ్యాపించాయి. మరోపక్క.. Your #Diwali celebration? My house is gone!What a sad incident, disappointing beyond words.Indians in the U.S., wake up before it's too late!! pic.twitter.com/7SQjiVBgfV— M9 USA🇺🇸 (@M9USA_) October 24, 2025UPDATE: We have received video from the homeowner showing the damage caused by the illegal and irresponsible Diwali fireworks.In addition, a vehicle and the garage were completely burned and damaged. https://t.co/vOh5Oa58o3 pic.twitter.com/436GvhB9KD— YEGWAVE (@yegwave) October 24, 2025న్యూజెర్సీలో ఒక్క ఎడిసన్ నుంచే 40 ఎమర్జెన్సీ కాల్స్ అధికారులకు వెళ్లాయట. ఆస్తి నష్టంతో పాటు ముందస్తు జాగ్రత్తగా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారట. తమ నిద్రకు భంగం వాటిల్లిందనే ఫిర్యాదులు చేసిన వాళ్లు ఉన్నారట. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేడుకలను జరగనివ్వకుండా ఆపేశారు కూడా. ఇంకోపక్క.. Look at the aftermath of these Diwali celebrations.It’s chaos. Litter everywhere. Police holding people back. Indians hanging out of cars speeding by.And these people have the audacity to compare Christmas parades to this.I’m fed up.pic.twitter.com/2gX57IcKW3— Anti-Taxxer (@mapleblooded) October 23, 2025దీపావళి వేడుకల కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించి కొందరి నివాసాలు పూర్తిగా ధ్వంసమై అయ్యాయని.. కట్టుబట్టలతో వాళ్లు రోడ్డు మీద పడ్డారని కొన్ని వీడియోలు, కథనాలు బయటకు వచ్చాయి. ‘‘ఇలా జరుగుతుందని అనుకోలేదు. మాకేం మిగల్లేదు. నా కొడుకు ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. హోటల్ గదిలో జీవించాల్సి వస్తోంది’’ అని బాధితురాలు జువానిటా కొలన్ ఓ మీడియా సంస్థతో పేర్కొనడం గమనార్హం. దీంతో.. Indians were celebrating Diwali in US. Their police and fire department came to join the celebration and played Holi. pic.twitter.com/nLLlnFlh8p— Joy (@Joydas) October 23, 2025అమెరికా దీపావళి వేడుకలపై మునుపెన్నడూ లేనిస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అందుకు ఆ స్థాయిలో జరిగిన నష్టమే కారణమని స్పష్టమవుతోంది. దీంతో అధికారులు ఇలాంటి వేడుకలను అనుమతించొద్దని.. ఒకవేళ అనుమతించినా.. సురక్షిత నిబంధనలు పాటించేలా కఠిన మార్గదర్శకాలను తీసుకురావాలని పలువురు అమెరికన్లు కోరుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించి.. పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని సమాచారం.Indians have been living a respectful life in USA, UK, Canada and other Countries for over a century. What has really changed with the current expats creating such a ruckus, nuisance, civic garbage, displaying absolute lack of civic sense, cultural bankruptcy, this Diwali❓… pic.twitter.com/dGzt3SrtIs— Raju Parulekar (@rajuparulekar) October 24, 2025 -
అమెరికాలో భార్యకు వేధింపులు ఎన్నారై భర్త అరెస్టు
భార్యపై గృహ హింసకు పాల్పడిన ఆరోపణలతో తిరుపతికి చెందిన NRI . జెస్వంత్ మనికొండ (36) ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ హింస మరియు కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన ఆరోపణలపై కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్మెంట్ (Milpitas Police Department–MPD) సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎల్మ్వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. తరువాత బెయిల్పై విడుదలయ్యాడు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది.గృహ హింస కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందిస్తేనే సత్వర న్యాయం జరుగుతుందని ఎన్జీవో ప్రతినిధి తరుణి పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో బాధితులు ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఎన్ఆర్ఐ కుటుంబాలలో గృహ హింస బాధితులకు చట్టపరమైన సహాయం, రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
గోల్డెన్ వీసా యువకుడి హఠాన్మరణం
చిన్న వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా దుబాయ్లో భారతీయ విద్యార్థి (Indian Student) ఒకరు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. దీపావళి వేడుకల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అతడు మరణించినట్టు స్థానిక మీడియా 'గల్ఫ్ న్యూస్' వెల్లడించింది. మృతుడు కేరళకు చెందిన వైష్ణవ్ కృష్ణకుమార్ (18)గా గుర్తించారు. దుబాయ్లోని మిడిల్సెక్స్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం బీబీఏ మార్కెటింగ్ చదువుతున్నాడు. అతడికి యూఏఈ గోల్డెన్ వీసా (Golden Visa) ఉందని సమాచారం.దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీలో మంగళవారం జరిగిన దీపావళి వేడుకల్లో వైష్ణవ్ పాల్గొన్నాడు. సంబరాల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటు కారణంగా మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే వైష్ణవ్కు ఎటువంటి గుండె సమస్యలు లేవని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తదుపరి దర్యాప్తు జరుపుతోందని చెప్పారు.వైష్ణవ్ మృతదేహాన్ని కేరళకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని అతడి తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు తాను చూసుకుంటున్నట్టు దుబాయ్లోని వైష్ణవ్ బంధువు నితీశ్ 'ఖలీజ్ టైమ్స్'తో చెప్పారు. శుక్రవారం నాటికి వైష్ణవ్ మృతదేహం కేరళకు చేరుకుంటుందని భావిస్తున్నారు.రెండేళ్ల క్రితం స్వస్థలానికి..అలప్పుజ జిల్లా చెన్నితల పంచాయతిలోని కరాజ్మా ప్రాంతానికి చెందిన వైష్ణవ్ కుటుంబంలో దుబాయ్లో సెటిలయింది. వైష్ణవ్ తండ్రి కృష్ణకుమార్ 20 ఏళ్లుపైగా దుబాయ్లోని ఉద్యోగం చేస్తున్నారు. వైష్ణవ్, అతడి చెల్లెలు దుబాయ్లోనే పుట్టిపెరిగారని వారి బంధువు గోపి కర్ణవర్ తెలిపారు. అలప్పుజలో ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. వైష్ణవ్ చాలా తెలివైన కుర్రాడని చెప్పారు. వైష్ణవ్ కుటుంబం చాలా అరుదుగా స్వస్థలానికి వస్తుందని, రెండేళ్ల క్రితం వారు కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుక కోసం చివరిసారిగా ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. చదవండి: ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. కానీ పక్కా పల్లెటూరు!సంతాప ప్రకటనవైష్ణవ్ కృష్ణకుమార్ మరణం పట్ల మిడిల్సెక్స్ యూనివర్సిటీ సంతాపం తెలిపింది. చిన్న వయసులోనే అతడు చనిపోవడం ఎంతో కలచివేసిందని సంతాప ప్రకటనలో పేర్కొంది. వైష్ణవ్ చదువుకున్న జెమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ కూడా సంతాపం ప్రకటించింది. వైష్ణవ్ ప్రతిభావంతుడైన విద్యార్థి అని కొనియాడింది. వైష్ణవ్ మరణంతో అతడి తండ్రి కృష్ణకుమార్, తల్లి విధు, చెల్లెలు వృష్టి విషాదంలో మునిగిపోయారు. -
అమెరికాలో ట్రక్కు బీభత్సం.. భారతీయుడి అరెస్ట్
కాలిఫోర్నియా: అమెరికాలో ఓ భారతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు మృతికి కారణమయ్యాడంటూ జశన్ప్రీత్ సింగ్ (21) అనే యవకుడిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా వార్తా కథనాల ప్రకారం.. అతడు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడని.. డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు వెల్లడైంది.2022 మార్చిలో సింగ్.. అమెరికా దక్షిణ సరిహద్దును అక్రమంగా దాటినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని బోర్డర్ పెట్రోల్(Border Patrol) ఏజెంట్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద చట్టబద్ధమైన ప్రతాలు లేవని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్’ విధానం కారణంగా కొన్ని రోజుల్లోనే అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.కాలిఫోర్నియాలో జరిగిన ట్రక్కు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో జశన్ప్రీత్ సింగ్ కూడా గాయపడ్డాడు. ట్రక్ నడుపుతోన్న సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్న అతడు.. ట్రాఫిక్లో కూడా బ్రేక్స్ వేయలేదని పోలీసు అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులైన ట్రక్ డ్రైవర్లు అమెరికాలో ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనల్లో ఇది తాజాది. గత ఆగస్టులోనూ ఇదే తరహా ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 2018లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన హర్జిందర్ సింగ్ ఆ ఘటనకు కారకుడు. 🚨 SHOCKING: ICE sources confirm Jashanpreet Singh, the semi-truck driver behind the deadly DUI crash on CA’s I-10 freeway, is an Indian illegal alien caught & released by the Biden admin at the border in March 2022. Police say Singh was speeding, under the influence, and never… pic.twitter.com/bc1n5vEC9p— Svilen Georgiev (@siscostwo) October 23, 2025 -
జార్జియాలో అద్భుతంగా 'చెంచు లక్ష్మి' నృత్య నాటిక
విద్యా సేవ కోసం సంస్కృతి పండుగ, హృదయాలను తాకిన “చెంచు లక్ష్మి” 2025 అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం, జార్జియాలోని కమ్మింగ్ నగరంలోని ఫోకల్ సెంటర్ ఒక అద్భుతమైన సాంస్కృతిక వేదికగా మారింది. నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ నిర్వహించిన “చెంచు లక్ష్మి” నృత్య నాటిక, కళా పరిమళాలను విరజిమ్ముతూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ సౌత్ ఫోర్సిత్ కౌంటీ తోడ్పాటు అందించింది. కళను విద్యా సేవతో మిళితం చేస్తూ, సమీకరించిన నిధులను ఫోర్సిత్ కౌంటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (FCEF) కు అందజేశారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు కాంతివంతమైన మార్గం వేస్తుందనే సంకేతంగా నిలిచింది. వేదికపై దీపాల కాంతి, పూజా మంత్రాల నినాదం మధ్య వేడుక ప్రారంభమైంది. మంచినీటి వంటి స్వరంతో హర్షిణి చుండి మరియు శ్రీలేఖ ఆదుసుమిల్లి సమన్వయకర్తలుగా ప్రవేశించి కార్యక్రమాన్ని నడిపారు.మాలతి నాగభైరవ ఒక అందమైన వీడియో ద్వారా ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రేరణను వివరించారు — “కళ మనసును మేల్కొలుపుతుంది, విద్య భవిష్యత్తును వెలిగిస్తుంది” అనే మంత్రాన్ని ప్రతిధ్వనిస్తూ. తర్వాత దీపప్రజ్వలన కార్యక్రమంలో, ఫోర్సిత్ కౌంటీకి చెందిన ఎన్నో ప్రముఖులు ఒకచోట చేరారు రాన్ ఫ్రీమన్ (షెరీఫ్), విలియం ఫించ్ (సొలిసిటర్ జనరల్), ఆల్ఫ్రెడ్ జాన్ (బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ చైర్మన్),మైఖేల్ బారన్ (ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్), రినీ వెల్చ్ (రోటరీ క్లబ్ డైరెక్టర్), కళ్యాణి చుండి (HC Robotics – డైమండ్ స్పాన్సర్), భారత్ గోవింద (Assure Guru CEO), నీలిమ గడ్డమనుగు (నటరాజ నట్యాంజలి), శ్రీరామ్ రొయ్యాల (Zoning Board చైర్మన్).దీప కాంతుల జ్యోతి విరజిమ్మగా, వేదిక ఒక ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. “చెంచు లక్ష్మి” — ప్రేమ, పరమాత్మకత, ప్రకృతి గాథకథ — దేవుడు నరసింహ స్వామి, భక్తి రూపిణి లక్ష్మి, మరియు అరణ్యాల గుండెల్లో పుట్టిన చెంచు లక్ష్మి మధ్య ఆధ్యాత్మిక ప్రేమగాథ.నల్లమల అడవుల సౌందర్యం, మనసుని తాకే సంగీతం, భక్తి పుష్టి తో నిండిన నాట్యరూపాలు — అన్నీ కలగలసిన ఆ అద్భుత నాటిక.నీలిమ గడ్డమనుగు దర్శకత్వంలో కళాకారులు నృత్యం, భావం, సంగీతం, కవిత్వం అన్నింటినీ మేళవించారు. తాళం, లయ, అభినయం — ప్రతి క్షణం కళా కాంతుల విరిసిన పుష్పంలా అనిపించింది.ఈ వేడుకకు 500 మందికి పైగా కళాభిమానులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.రాష్ట్ర ప్రతినిధులు టాడ్ జోన్స్ (District 25) మరియు కార్టర్ బారెట్ (District 24) ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. HC Robotics, Assure Guru వంటి సంస్థలు ప్రధాన స్పాన్సర్లుగా నిలిచి, విద్యా సేవకు తోడ్పాటును అందించాయి.వేదికపై సత్కారాలు, పుష్పగుచ్ఛాలు, ప్రశంసా ఫలకాలు అందజేయబడ్డాయి. ByteGraph వంటి సాంకేతిక బృందాలు కార్యక్రమాన్ని మల్టీమీడియా అద్భుతంగా మలిచాయి. నిర్వాహకుడు శ్రీరామ్ రొయ్యాల ,టాడ్ జోన్స్ ఈకార్యక్రమం విజయవంతంపై సంతోషం వ్యక్తం చేశారు. -
నార్త్ అమెరికాలో అత్యంత ఎత్తయిన శ్రీరాముడు
ఇటీవలి కాలంలో భారతీయ సంప్రదాయాలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా హైందవ పురాణాలకు, దేవుళ్లు దేవతలకు గతంలో ఎన్నడూ లేనంత గుర్తింపు లభిస్తోంది. దీంతో విదేశాలలో పలు చోట్ల హిందూ దేవుళ్ల ఆలయాలు, విగ్రహాలు ఏర్పాటవుతున్నాయి. అదే క్రమంలో కెనడాలోని మిస్సిసాగాలో 51 అడుగుల ఎత్తైన రాముని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, ఇది ఉత్తర అమెరికా ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణంగా నిలిచింది. ఢిల్లీ, గుర్గావ్కు చెందిన ప్రఖ్యాత కళాకారుడు నరేష్ కుమార్ కుమావత్ మనేసర్లోని మాటు రామ్ ఆర్ట్ సెంటర్లో చెక్కిన ఈ విగ్రహాన్ని పలు భాగాలుగా కెనడాకు తరలించారు. తరువాత దీనిని అమెరికా నుంచి వచ్చిన ఇంజనీర్ల బృందం ఒకటే మూర్తిగా మలచింది. ఈ నిర్మాణం విమానాల తయారీలో తరచుగా ఉపయోగించే ఫైబర్గ్లాస్ స్టీల్తో తయారు చేయడం విశేషం. ఇటీవలే జరిగిన ఈ శ్రీరాముని విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కమ్యూనిటీ సభ్యులు మాత్రమే కాకుండా దాని సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా భిన్న రంగాల ప్రముఖులు కూడా హాజరయ్యారు. రాజకీయ నాయకులలో, మహిళా లింగ సమానత్వ మంత్రి రీచర్ వాల్డెజ్, ట్రెజరీ బోర్డు అధ్యక్షుడు షఫ్కత్ అలీ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధూ కూడా హాజరయ్యారు. విగ్రహం ఏర్పాటు చేసిన హిందూ హెరిటేజ్ సెంటర్ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ, శ్రీరాముని కొలువుదీర్చడం వల్ల ఉత్తర అమెరికా అంతటా సందర్శకులకు ఆసక్తి పెరుగుతుందని గుర్తించామన్నారు. న్యూయార్క్ న్యూజెర్సీ ల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారన్నారు. చదవండి: ఇండోర్ మహారాణి : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ఆ డైమండ్స్ ఎలా మోసారండీ!ప్రజలు ఆలయాన్ని సందర్శించడంతో పాటు కెనడాలోనే ఎత్తైన శ్రీరామ విగ్రహాన్ని కూడా సందర్శిస్తున్నారు‘ అని ఆయన అన్నారు. ఉత్తర అమెరికాలో అతిపెద్ద శ్రీరామ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ‘చాలా గర్వించదగ్గ విషయం‘ అని సిద్ధూ అన్నారు. ఈ మూర్తిని ఏర్పాటు చేయడం కేవలం గర్వకారణం కాదు. ఇది సమాజానికి ఒక ఆధ్యాత్మిక బహుమతి, ధర్మం ఎల్లప్పుడూ మన మార్గాన్ని నడిపించాలని గుర్తు చేస్తుంది‘ అని కేంద్రం వ్యవస్థాపకుడు ప్రధాన పూజారి ఆచార్య సురీందర్ శర్మ శాస్త్రి అన్నారు.చదవండి: డ్రీమ్ హౌస్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిన స్వీట్కపుల్ఈ కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడు కుషాగర్ శర్మ మాట్లాడుతూ, ‘10,000 మందికి పైగా ప్రజలు భక్తి ఐక్యత కలిసి శ్రీరాముని 51 అడుగుల ఎతై ్తన మూర్తిని ఆవిష్కరించింది‘ అని అన్నారు. ‘ఇది కేవలం మన విశ్వాసానికి ఒక వేడుక మాత్రమే కాదు, సాంస్కృతిక సామరస్యం ఆధ్యాత్మిక వారసత్వానికి విలువనిచ్చే కెనడియన్లందరికీ గర్వకారణమైన క్షణం‘ అని అన్నారు. మిస్సిసాగాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే విమానాలు దిగేటప్పుడు ఆలయం మీదుగా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయని చెప్పారు. అలాగే ఈ అత్యంత ఎత్తైన రాముడి విగ్రహం త్వరలో ప్రయాణీకులను స్వాగతించే మొదటి ప్రదేశాలలో ఒకటిగా మారనుందని ఆయన పేర్కొన్నారు. -
Russia: హైదరాబాదీని రక్షించే ప్రయత్నాల్లో కేంద్రం
ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం రష్యా వెళ్లిన భారతీయులు.. బలవంతంగా సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అలా హైదరాబాద్(తెలంగాణ)కు చెందిన ఓ వ్యక్తి చిక్కుకుపోగా.. అతన్ని రక్షించాలంటూ భాదిత కుటుంబం కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అహ్మద్(37) ఈ ఏడాది ఏప్రిల్లో రష్యాకు వెళ్లాడు. ఓ నిర్మాణ సంస్థలో భాగంగా పని ఉందంటూ ఏజెంట్ నమ్మబలికి అతన్ని అక్కడికి పంపించాడు. అయితే నెలపాటు అహ్మద్ ఏపని లేకుండా ఖాళీగా ఉన్నాడు. అడిగితే.. రేపో మాపో పని చెబుతామంటూ నిర్వాహకులు చెప్పసాగారు. ఈలోపు.. అహ్మద్లా ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం 30 మందిని జమ చేసి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అక్కడ బలవంతంగా వాళ్లకు ఆయుధ శిక్షణ ఇప్పించి.. యుద్ధంలోకి దింపారు. వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఇదే అదనుగా అహ్మద్ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతని కాలికి గాయం కావడంతో రష్యా సైన్యానికి చిక్కాడు. యుద్ధం చేయాల్సిందేనని, లేకుంటే తామే చంపేసి డ్రోన్ దాడుల్లో చనిపోయినట్లు చిత్రీకరిస్తామని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక రష్యా తరఫున ఉక్రెయిన్ యుద్ధంలో అహ్మద్ పాల్గొంటున్నాడు. అయితే తన దగ్గర ఉన్న ఫోన్తో జరిగిందంతా ఓ సెల్ఫీ వీడియోగా తీసి భార్య అఫ్షా బేగంకు పంపాడు. అందులో.. తాను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ వివరించాడు. Russia mein phanse Hyderabad ke Mohammad Ahmad aur Haryana wa Rajasthan ke Anoop Kumar, Manoj Kumar aur Sumit Kumar ko jald se jald Bharat wapas laane ke liye AIMIM Party ki musalsal koshish. pic.twitter.com/U2dg1OJuez— Asaduddin Owaisi (@asadowaisi) October 22, 2025నాతో పాటు ఉన్న 26 మంది మేం యుద్ధంలో పాల్గొనమని చెప్పాం. అందులో నలుగురు భారతీయులు ఉన్నారు. వాళ్లు నా మెడపై తుపాకీ పెట్టి.. యుద్ధం చేస్తావా? చస్తావా? అని బెదిరించారు. నా కాలికి గాయమైనా కనికరించకుండా హింసించారు. ఇప్పటికే 17 మంది మరణించారు. అందులో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. ఉద్యోగాల పేరిట బలవంతంగా ఈ నరకంలోకి మమ్మల్ని లాగారు. ఎట్టిపరిస్థితుల్లో మమ్మల్ని ఇక్కడకు పంపిన ఏజెంట్ను(ముంబైకి చెందిన కన్సల్టెన్సీ) వదలొద్దు అని అహ్మద్ ఆ వీడియోలో చెప్పాడు.ఈ వీడియో ఆధారంగా అహ్మద్ భార్య అఫ్షా బేగం కేంద్ర విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. తన భర్త తమ కుటుంబానికి ఆధారమని, ఆయన్ని రక్షించాలని విదేశాంగ మంత్రి జై శంకర్ను ఉద్దేశిస్తూ వేడుకుంది. మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సైతం కలిసి సాయం చేయాలని కోరింది. దీంతో.. ఆయన అహ్మద్ను వెనక్కి రప్పించాలంటూ కేంద్రానికి, రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. అహ్మద్ భార్య, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ విజ్ఞప్తులతో కేంద్రం కదిలింది. అహ్మద్ గురించి వివరాలు సేకరించి విడిపించే ప్రయత్నం చేస్తామని మాస్కోలోని భారత రాయబార సిబ్బంది తడు మాము(Tadu Mamu) హామీ ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. రష్యా ఆర్మీలో 27 మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని, వాళ్ల కుటుంబాలతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతోంది. -
బ్రూనైలో సేవ కార్యక్రమాలతో ఘనంగా దీపావళి వేడుక
బ్రూనై దారుస్సలాం తెలుగు సంఘం, దీపావళి పండుగను దాతృత్వం సేవా కార్యక్రమాలతో అర్థవంతంగా జరుపుకుంది. ఈ సందర్భంగా సంఘం సభ్యులు విల్లేజ్ పందాన్ బి ప్రాంతంలోని పాదచారుల మార్గంలో సమాజ శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంతాన్ని సంఘం ప్రతి త్రైమాసికం శుభ్రపరుస్తూ వస్తోంది. ఈసారి బృందం ఏడు ట్రక్కుల వ్యర్థ పదార్థాలను సేకరించి, వాటిని టెలిసాయ్ రీసైక్లింగ్ సెంటర్కు తరలించింది.ఈ కార్యక్రమానికి సొమునాయుడు దాది, సతీష్ పొలమత్రసెట్టి నాయకత్వం వహించగా, రమేష్ బాబు బదరవూరి, చింత వెంకటేశ్వరరావు మద్దతు అందించారు. పనగా బి గ్రామాధ్యక్షుడు శ్రీ మహమ్మద్ రవియాని బిన్ మోర్నీ గారి నేతృత్వంలోని MPK బృందం సమన్వయం, సహకారం అందించింది.అదే రోజున, సంఘం సభ్యులు రిపాస్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. మొత్తం 24 యూనిట్ల రక్తం విజయవంతంగా సేకరించగా, కొంతమంది సభ్యులు ఆరోగ్య కారణాల వల్ల తమ రక్తదానాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నవీన్ కుమార్ సురపనేని సమన్వయం చేశారు. ఈ సేవా కార్యక్రమాలకు భారత రాయబారి హిజ్ ఎక్సలెన్సీ శ్రాము అబ్బగాని, పుష్పా అబ్బగాని హాజరై, సభ్యులను అభినందించి, సేవా కార్యక్రమాల పట్ల ప్రశంసలు తెలిపారు.తెలుగు సంఘం అధ్యక్షుడు వెంకట రమణ రావు సూర్యదేవర మాట్లాడుతూ.. “దీపావళి పండుగ ఆత్మీయత, వెలుగు దాతృత్వానికి ప్రతీక. సమాజానికి సేవ చేయడం, శుభ్రతా కార్యక్రమాలు రక్తదానం వంటి చర్యలు ఈ పండుగను మరింత అర్థవంతంగా మారుస్తాయి. సభ్యుల ఉత్సాహం సేవా మనసు సంఘానికి గర్వకారణం.” అని తెలిపారు.(చదవండి: శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా డబ్లిన్లో ఘనంగా దీపావళి వేడుకలు) -
ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్కు అరుదైన గౌరవం
ప్రపంచ శాంతికి, మానవతా విలువల పరిరక్షణకు కృషిచేస్తున్న గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్కు అరుదైన గౌరవం దక్కింది. సమాజానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరం ఈ నెల 19వ తేదీని “శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవం”గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నిర్మించేందుకు, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని, వివిధ మతాల మధ్య సుహృద్భావాన్ని పెంపొందించటం, సమాజాభివృద్ధికి కృషి చేయటం వంటి విషయాలలో గురుదేవుల చేసిన సేవకుగానూ ఈ గౌరవాన్ని ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడుతున్న మానవతావాది, ఆధ్యాత్మికవేత్త, శాంతిదూత అయిన శ్రీశ్రీ రవిశంకర్ ఒత్తిడి లేని, హింస లేని సమాజం నెలకొల్పాలనే లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలలో 8కోట్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసిందని సియాటెల్ నగర మేయర్ బ్రూస్ హారెల్, వాంకోవర్ మేయర్ కెన్ సిమ్ పేర్కొన్నారు. రవిశంకర్ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వహించిన ఒత్తిడి నిర్మూలన శిబిరాలు, యువ నాయకత్వ శిబిరాలు, సామాజిక అభివృద్ధి, సేవా కార్యక్రమాలు అక్కడి ప్రజలలో మానసిక దృఢత్వం, సౌభ్రాతృత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడటమేగాక శాంతియుత వాతావరణం, మహిళా సాధికారికతను పెంపొందించాయన్నారు. చివరగా ఇక అంతకు ముందురోజైన అక్టోబర్ 18వ తేదీన వాంకోవర్ నగరం సైతం గురుదేవుల్ని ఇదే విధంగా సత్కరించి, అక్టోబర్ 18వ తేదీని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ దినం గా ప్రకటించటం గమనార్హం.(చదవండి: శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా డబ్లిన్లో ఘనంగా దీపావళి వేడుకలు) -
అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట.. H-1B వీసా ఫీజు రద్దు
అమెరికాలోని విదేశీ విద్యార్థులకు హెచ్ -1బీ (H-1B) వీసా ఫీజు కింద వసూలు చేసే 1,00,000 డాలర్లను మినహాయిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో టెక్ కంపెనీలకు ఉపశమనం కలిగినట్లయింది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో ప్రతిభావంతులను నియమించుకునే సంస్థలకు ఇది మంచి పరిణామం. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రకారం F1 వీసాలపై అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు (భారతీయ విద్యార్థులతో సహా) ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వారిని నియమించుకునే కంపెనీలు 1,00,000 డాలర్ల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.ఇది యూఎస్ కార్పొరేట్ కంపెనీలు, స్టార్టప్లకు అక్కడే చదువుతున్న విదేశీ విద్యార్థులను నియామకం చేసుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. అమెరికన్ కంపెనీలు తక్కువ ఖర్చుతో ఈ ప్రతిభను నియమించుకోవడానికి అవకాశం ఏర్పడటంతో ఇది వారికి పెద్ద విజయం అని కొందరు భావిస్తున్నారు.భారతీయ ఐటీ సంస్థలపై ప్రభావంభారతీయ ఐటీ సేవల సంస్థలకు ఈ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అభిప్రాయలున్నాయి. సాంప్రదాయకంగా ఈ సంస్థలు భారతదేశం నుంచి ఉద్యోగులను H-1B వీసాలపై బదిలీ చేస్తుంటాయి. వీరి వీసా ఫీజు లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే భాతర ఐటీ కంపెనీలు తాము H-1B వీసాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించామని చెబుతున్నాయి. స్థానికులనే ఎక్కువగా నియమించుకుంటున్నట్లు తెలిజేస్తున్నాయి.విప్రో వంటి సంస్థల్లో యూఎస్ ఉద్యోగుల్లో దాదాపు 80% మంది స్థానిక ఉద్యోగులేనని సమాచారం. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ సైతం కొద్దిమంది ఉద్యోగులను మాత్రమే ఇమ్మిగ్రేషన్ సేవలకోసం ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. మిగిలినవారు ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్నారని తెలిపారు. టీసీఎస్ కూడా ప్రతి సంవత్సరం వేలాది వీసాల కోసం దాఖలు చేసినా కేవలం 500 మంది మాత్రమే H-1B వీసాపై యుఎస్కు వెళ్తున్నట్లు గతంలో తెలిపింది.ఇదీ చదవండి: ఒక్కరోజులో రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు స్వీకరిస్తున్నారా? -
న్యూజెర్సీ హైవే దత్తతలో నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్థులు
ఈస్ట్ విండ్సర్, న్యూజెర్సీ: భావితరంలో సామాజిక బాధ్యత పెంచేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా న్యూజెర్సీలో హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టి హైవేను శుభ్రం చేసింది. ఈస్ట్ విండ్సర్, న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో అడాప్ట్-ఎ-హైవే క్లీన్ అప్ ప్రోగ్రామ్ పేరుతో నాట్స్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ సభ్యులు, పలువురు తెలుగు విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రహదారి పరిసరాలను శుభ్రం చేశారు. ఇలా తెలుగు విద్యార్థులు నాట్స్ ద్వారా చేసిన ఈ సామాజిక సేవకు అమెరికా ప్రభుత్వం నుంచి వాలంటీర్ అవర్స్గా గుర్తిస్తుంది.. ఇది విద్యార్థుల కాలేజీ ప్రవేశాలకు ఉపకరిస్తుంది. నాట్స్ న్యూజెర్సీ నాయకులు ప్రశాంత్ కూచు నాయకత్వంలో కిరణ్ మందాడి, సుఖేష్ సుబ్బాని, రాజేష్ బేతపూడి తదితరులు హైవే దత్తత పరిశుభ్రత కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.తెలుగు వాళ్లు అమెరికా సమాజానికి సేవ చేయగలగడం పట్ల సంతోషంగా ఉందని నాట్స్ అధ్యక్షుడు శ్రీ హరి మందాడి అన్నారు. శుభ్రమైన, పచ్చని వాతావరణం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ పని గంటలు విద్యార్థులకుతమ వాలంటీర్ అవర్స్గా పాఠశాలలో ఉపయోగపడతాయన్నారు. ఇకపై ప్రతీ రెండు నెలలకొకసారి ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయని తెలుగు విద్యార్ధులు చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.నాట్స్ న్యూజెర్సీ బృందం నుంచి శ్రీనివాసరావు భీమినేని, కిరణ్ మందాడి, శ్రీనివాస్ మెంట, వంశీ వెనిగళ్ల, ప్రశాంత్ కుచ్చు, సుఖేష్ సుబ్బాని, రాజేష్ బేతపూడి, శ్రీనివాస్ నీలం, సూర్య గుత్తికొండ, శంకర్ జెర్రిపోతుల, మల్లి తెల్ల, వెంకట్ గోనుగుంట్ల తదితరులు ఈ హైవే దత్తత, పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలుగు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంచే చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన న్యూజెర్సీ నాట్స్ టీమ్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు. -
మిస్సోరీలో నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్, ట్రోఫీలు
అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేలా అనేక కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరీ తెలుగువారి కోసం వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు నిర్వహించింది. నాట్స్ మిస్సోరీ విభాగం ఆధ్వరంలో ఫెంటన్ మిస్సోరీలోని లెగసీ వీటీసీలోఈ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు జరిగాయి. తెలుగు క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపుతూ సాగిన ఈ క్రీడా సంబరం తెలుగు క్రీడా ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. చెస్టర్ఫీల్డ్ సిటీ కౌన్సిల్ సభ్యుడు గ్యారీ చేతుల మీదుగా ఈ టోర్నమెంట్ను నాట్స్ ప్రారంభించింది. ఈ టోర్నమెంట్లలో మొత్తం 25 జట్లు, 200 మందికి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ టోర్నమెంట్లు తెలుగువారి క్రీడా స్ఫూర్తిని, క్రీడల పట్ల ఉన్న మమకారాన్ని చాటి చెప్పాయి.నాట్స్ మిస్సోరీ విభాగం విశేష కృషిఈ క్రీడా పోటీలు విజయవంతం కావడానికి నాట్స్ ప్రముఖులు, మిస్సౌరీ ఛాప్టర్ నాయకత్వం, మిస్సోరీ నాట్స్ సభ్యులు విశేష కృషి చేశారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, నాట్స్ పూర్వ అధ్యక్షులు ప్రస్తుత బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కో ఆర్డినేటర్ సందీస్ కొల్లిపరతో పాటు తెలుగు అసోషియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్ మాజీ అధ్యక్షుడు సురేంద్ర బాచిన, మధుసూదన్ దద్దాల, మురళి బందరుపల్లి వంటి ప్రముఖులు ఈ పోటీల నిర్వహణను పర్యవేక్షించారు.నాట్స్ మిస్సోరీ ఛాప్టర్ బృందం తరుణ్ దివి, చైతన్య పుచకాయల, సంకీర్త్ కట్కం, రాకేష్ రెడ్డి మారుపాటి, సునీల్ స్వర్ణ, హరీష్ గోగినేని, నరేష్ రాయంకుల, నవీన్ కొమ్మినేని, శ్రీనివాస్ సిస్ట్ల తదితరులు ఈ టోర్నమెంట్ దిగ్విజయం కావడానికి ఎంతో కృషి చేచేశారు. నాట్స్ వాలంటీర్లు కూడా ఈ టోర్నమెంట్ కోసం విలువైన సమయాన్ని, సేవలను వెచ్చించారు..విజేతలకు ట్రోఫీలు పంపిణీఐదు విభాగాలలో విజేతలు మరియు రన్నరప్లకు నాట్స్ ట్రోఫీలను పంపిణీ చేసింది.. క్రీడాకారుల అంకితభావం, ప్రతిభను ఈ సందర్భంగా నాట్స్ నాయకులు కొనియాడారు. నాట్స్ మిస్సోరి విభాగం వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను దిగ్విజయం చేయడంలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
డల్లాస్ ఫ్రిస్కోలో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ పార్క్
ఫ్రిస్కో, టెక్సాస్: భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ డల్లాస్ లో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. నాట్స్ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో ఫ్రిస్కో నగరంలోని మోనార్క్ వ్యూ పార్క్ వద్ద అడాప్ట్ ఏ పార్క్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా తల్లిదండ్రులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొండ వెనుక భాగంలో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో మొక్కలు నాటి, వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా, సిటీ ఆఫ్ ఫ్రిస్కో పార్క్ విభాగం సభ్యులు పిల్లలకు శుభ్రత, పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పించారు. సీతాకోకచిలుకల సంరక్షణకు అనుకూల వాతావరణం కల్పించడంలో ఇదొక ముఖ్యమైన అడుగు అని పర్యావరణ పరిరక్షకులు తెలిపారు.గత ఆరు నెలలుగా నాట్స్ డల్లాస్ చాప్టర్ ఈ మొనార్క్ వ్యూ పార్క్ ను దత్తత తీసుకుని, అక్కడ తరచూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ కాలంలో విద్యార్థులను భాగస్వామ్యులను చేస్తోంది. పార్క్ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పచ్చదనాన్ని ప్రోత్సహిస్తూ 2,000 కు పైగా మొక్కలను నాటిన ఘనతను నాట్స్ డల్లాస్ చాప్టర్ సాధించింది.నాట్స్ చేస్తున్న నిరంతర కృషిని సిటీ ఆఫ్ ఫ్రిస్కో ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న 25 మంది యూత్ వాలంటీర్లను గుర్తించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి సిటీ ఆఫ్ ఫ్రిస్కో పార్క్ విభాగం అధికారి క్రిస్టల్, ప్రకృతి పరిరక్షకులు రిక్, లారా హాజరయ్యారు. నాట్స్ తరపున ప్రతినిధులు బాపు నూతి, రాజేంద్ర మాదాల, రవి తాండ్ర, కిశోర్ నారె, స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి, శివ మాధవ్ లు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.నాట్స్ డల్లాస్ చాప్టర్ ఇలాంటి సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని ప్రతినిధులు తెలిపారు. నాట్స్ డల్లాస్ విభాగం చేపట్టిన ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
‘అడాప్ట్-ఎ-విలేజ్’కి అపూర్వ స్పందన
సాక్షి, హైదరాబాద్: శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో అడాప్ట్-ఎ-విలేజ్కి అనూహ్య స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో.. ఎన్నారై దాతల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాల్లో వేల మంది చికిత్స అందుకుంటున్నారు. మరిన్ని గ్రామాల్లో ఉచిత మొబైల కంటి శిబిరాలు(Mobile Eye Surgical Unit) నిర్వహించేందుకు ఇంకొందరు ముందుకు వస్తున్నారుశంకర నేత్రాలయ USA అక్టోబర్ 17న అడాప్ట్-ఎ-విలేజ్ దాతలతో ముఖాముఖి సమావేశం నిర్వహించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అనేక దాతలు తమ అనుభవాలను పంచుకున్నారు. అమెరికా, సింగపూర్, యూకే నుంచి ఎన్నారైలు ఈ సేవా కార్యక్రమాన్ని మద్దతు ప్రకటించారు. తమ వంతుగా సాయం అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కంటి శిబిరాలు నిర్వహించి వీలైనంత మందికి ఉచిత చికిత్స అందించబోతున్నారు. దాతలు తమ స్వగ్రామాల్లో శిబిరాలు నిర్వహణకు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. వందల మందికి కంటి శస్త్రచికిత్సలు, స్క్రీనింగ్లు, భోజనం, రవాణా సేవలు ఉచితంగా అందజేస్తారు. అక్టోబర్ 30వ తేదీ దాకా 11 రోజులపాటు అడాప్ట్ ఏ విలేజ్ కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వస్థలం కొండా రెడ్డిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ విద్యా శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి ఇందుర్తి, రేవంత్ సోదరుడు కృష్ణారెడ్డి, హూస్టన్కు చెందిన రియల్టర్ రాఘవేంద్ర రెడ్డి సుంకిరెడ్డి తదితరులు హాజరయ్యారు. దాతలు ముందుకు రావడంతో పాటు.. స్థానిక వైద్యులు, రోటరీ క్లబ్స్, పలువురు నాయకుల సహకారంతో ఈ శిబిరం విజయవంతంగా ముందుకు సాగుతోందని బాలరెడ్డి తెలిపారు. -
శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా డబ్లిన్లో ఘనంగా దీపావళి వేడుకలు
ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని తెలుగు సంఘాలు, ముఖ్యంగా అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పూజలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఇవి సిలికాన్ వ్యాలీని కాంతిమయం చేశాయి. బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) కూడా మిల్పిటాస్లో వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలో సుమారు 25 వేలమందికి పాల్గొన్నారు. (చదవండి: టెక్సాస్ గవర్నర్ అధికార నివాసభవనంలో వైభవంగా దీపావళి వేడుకలు) -
టెక్సాస్ గవర్నర్ అధికార నివాసభవనంలోవైభవంగా దీపావళి వేడుకలు
డాలస్, టెక్సాస్: టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ , సిసిలీయా అబ్బాట్ దంపతులు రాష్ట్రంలోని కొంతమంది ప్రవాస భారతీయనాయకులను ఆహ్వానించి, తమ అధికార నివాసభవనంలో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. గత 11 సంవత్సరాలుగా ప్రతీ ఏడాదీ గవర్నర్ దంపతులు దీపావళి పండుగ జరుపుకోవడం విశేషం. గౌరవ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ దంపతులు వివిధరంగాలలో విశేషంగా కృషి చేస్తూ, టెక్సస్ రాష్ట్ర శరవేగ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలతోపాటు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ వంటకాలతో దీపావళి విందు ఏర్పాట్లు చెయ్యడమేగాక అందరికీ దీపావళి కానుకలిచ్చి సత్కరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనురాగ్ జైన్ దంపతులు ఈ సంవత్సరపు దీపావళి వేడుక ఏర్పాట్లను సమన్వయపరచారు. గౌరవ కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా డి.సి మంజునాథ్ దంపతులు, టెక్సస్ రాష్ట్ర కార్యదర్శి జేన్ నెల్సన్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. టెక్సాస్ రాష్ట్రంలోని వివిధ నగరాలైన డాలస్, హూస్టన్, ఆస్టిన్, శాన్అంటానియో, కార్పస్ క్రిస్టీ, మిడ్ల్యాండ్, ఓడిస్సా మొదలైన నగరాలనుండి 100 మందికి పైగా పాల్గొన్న ప్రవాస భారతీయులలో ప్రవాసాంధ్రులైన డా. ప్రసాద్ తోటకూర, చిన సత్యం వీర్నపు, కుమార్ నందిగం, వెంకట్ ఏరుబండి, వెంకట్ గొట్టిపాటి, సతీష్ మండువ, నీలిమ గోనుగుంట్ల, ఆషా రెడ్డి, సుజిత్ ద్రాక్షారామ్, బంగార్ రెడ్డి, రాజ్ కళ్యాణ్ దుర్గ్ వారి కుటుంబ సభ్యులున్నారు.భారత అమెరికా దేశాలమధ్య సంభందాల బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ కు ప్రవాసభారతీయులందరి తరపున డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రవాసభారతీయుల ముఖ్యమైన అన్ని ఉత్సవాలకు హాజరయ్యే గవర్నర్ మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డాలస్ లో జరిగిన మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా హాజరైన సంఘటన గుర్తుచేసుకుని గవర్నర్ కు మరోసారి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. -
H1b Visa: విదేశీ విద్యార్థులకు భారీ ఊరట
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. కొత్త H-1B వీసా దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్(USCIS) పేర్కొంది. హెచ్1బీ ఫీజు పెంపుపై స్పష్టత ఇచ్చే క్రమంలో పలు వివరాలను వెల్లడించింది.హెచ్-1బీ ఫీజు పెంపు కేవలం అమెరికా బయట నుంచి దరఖాస్తు చేసుకొన్నవారికే వర్తిస్తుందని పేర్కొంటూ అమెరికాలో చదువుకొంటున్న విద్యార్థులకు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ తీపి కబురు చెప్పింది. అలాగే.. ఫీజు పెంపు ప్రకటన వెలువడే సమయానికి అమెరికాలోనే ఉన్నవారికి మినహాయింపు వర్తిస్తుందని వెల్లడించింది.ఇదిలా ఉంటే.. 2025 సెప్టెంబర్ 19న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ప్రెసిడెన్షియల్ ప్రోక్లమేషన్’ విడుదల చేశారు. దీని ప్రకారం, కొత్త H-1B వీసా దరఖాస్తులపై $100,000 ఫీజు విధించబడుతుంది. ఈ ఫీజు 2025 సెప్టెంబర్ 21 నుంచి కొత్త H-1B వీసా పిటిషన్లకు వర్తించడం అమలైంది. అయితే.. USCIS అక్టోబర్ 20న ఫీజు అమలులో పారదర్శకత, మినహాయింపు విధానం, అర్హత ప్రమాణాలు గురించి వివరిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను తెలియజేసింది.మరోవైపు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయవాది నికోల్ గునారా మాట్లాడుతూ.. F-1 (విద్యార్థి వీసా), L-1 (ఇంటర్కంపెనీ ట్రాన్స్ఫర్ వీసా) లబ్ధిదారులు ఈ భారీ ఫీజు నుంచి విముక్తి పొందారని తెలిపారు. ఇది విదేశీ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపశమనం కలిగించే నిర్ణయమని అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మార్పులు అమెరికాలో ఉన్న ఉద్యోగదారులకు, అలాగే విద్యార్థులకు.. ఇమ్మిగ్రేషన్ ఖర్చులను తగ్గించేందుకు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారత్ నుంచి వెళ్లే విద్యార్థులు ఎక్కువగా అమెరికాలో నుంచే H-1Bకి మారుతారు. కాబట్టి. ఈ భారీ ఫీజు వాళ్లు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్ల మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్లు శనివారం ఉదయం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం మంచిర్యాలకు రెడ్డి కాలనీకి చెందిన విఘ్నేష్-రమాదేవి దంపతుల కూమార్తెలు స్రవంతి, తేజస్విలు.. వీరికి వివాహాలు జరగ్గా.. భర్త, పిల్లలతో అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఇటీవల విఘ్నేష్ తన భార్య రమాదేవితో కలిసి అమెరికాలో ఉంటున్న ఇద్దరూ కూతుళ్ల వద్దకు వెళ్లారు.విఘ్నేష్ చిన్న కూతురు తేజస్వి రెండు రోజుల క్రితం నూతన గృహ ప్రవేశం చేశారు. స్రవంతి కూతురు పుట్టిన రోజు ఉండటంతో శనివారం విఘ్నేష్, రమాదేవి, తేజస్వి, ఆమె భర్త కిరణ్ కుమార్, ఇద్దరూ పిల్లలు కారులో స్రవంతి ఇంటికి బయలుదేరారు. చికాగో సమీపంలో వీరి కారును ట్రక్కు ఢీ కొనడంతో రమాదేవి(52), తేజస్వి (32) మరణించారు. కారులో ఉన్న విఘ్నేష్, అల్లుడు కిరణ్ కుమార్, పిల్లలు గాయపడ్డారు. -
లండన్ పార్లమెంట్లో పద్మశ్రీ గరికపాటికి సన్మానం
తెలుగు సంస్కృతి సంఘం ఆధ్వర్యంలో బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ ఎంపీ వీరేంద్ర శర్మ, వలేరి వాజ్ బ్రహ్మ శ్రీ, పద్మశ్రీ గరికపాటి నరసింహ రావు గారికి సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పద్మశ్రీ గరికపాటి నరసింహ రావుభారతీయ రచనలు, పాశ్చాత్య సాహిత్యానికి ఉన్న సంబంధాన్ని, సారూప్యతలను చాలా చక్కగా వివరించారు. గరికపాటి గారు రచించిన ఒషెన్ బ్లూస్ సముద్రం గురించి, ప్రముఖ రచయిత షేక్స్ పియర్ గురించి రాసిన కవితలు అద్భుతంగా వివరించారు.భారతీయ రచనలు, మంగళ ప్రదంగా మొదలై, మంగళ ప్రదంగా నడుస్తూ, మంగళ ప్రదంగా ముగుస్తాయి అని అద్భుతంగా వివరించారు.పాశ్చాత్య రచనల్లో అతి ప్రముఖమైన షేక్స్ పియర్ రచనలైన హామ్లెట్ వంటి రచనల్లో పాత్రధారుల అన్ని కోణాలు ఆవిష్కరించబడతాయని వివరించారు. లండన్ లోని గ్లోబ్ థియేటర్ లో షేక్స్ పియర్ గారి నాటకాలు ఎంత విజయవంతంగా ప్రదర్శించబడ్డాయో వివరించారు.ఈ కార్యక్రమంలో బిట్స్ వ్యవస్థాపకులు సురేష్ మంగళగిరి ,సభ్యులు రాగసుధా ,యశ్వంత్ నూక గారు, అశ్విన్, వాస భరత్ వాస, హర్ష మైనేని, రాజ్ దేవరపు, శరత్ తమ, సుభాష్ రెడ్డి, షణ్ముఖ్, సుదర్శన్ రెడ్డి, రంజిత్, కాటిపల్లి సచిందర్ రెడ్డి, వివేక్, జయా తులసి తదితరులు పాల్గొన్నారు. -
భారతదేశ ప్రతిభకు అమెరికా సంస్థల "సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు"
"అర్చన ఫైన్ ఆర్ట్స్, అమెరికా", "శ్రీ శారద సత్యనారాయణ ట్రస్ట్ – హ్యూస్టన్, అమెరికా" సంస్థలు సంయుక్తంగా 2025 దీపావళి పండుగను మరింత దేదీప్యమానం చేస్తూ, తెలుగు సాహిత్యంలో తమదైన ముద్రను వేసిన మహనీయులకు 'సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు' ప్రదానం చేసి ఘనంగా సత్కరించాయి. ఈ నిర్వాహక సంస్థల వ్యవస్థాపకులు 'నాట్యభారతి' కోసూరి ఉమాభారతి మరియు ప్రమీల సూర్యదేవర సంయుక్తంగా ఈ అవార్డులను అందజేయడం జరిగింది.సంగీత, సాహిత్య, నాటక రంగాలలో బహుముఖ ప్రజ్ఞా ధురీణులు రామాయణం ప్రసాద రావు; కథా చైతన్య స్రవంతిగా తన కథల ద్వారా మనుషుల్లో చైతన్యాన్ని నింపిన డి.కామేశ్వరి; కథలు, కవితలు, చిత్రాలతో సృజనాత్మక లోకానికి మరింత అందంగా సొబగులద్దిన మన్నెం శారద, దూరదర్శన్ వ్యాఖ్యాతగా అందరి హృదయాలలో నిలిచిన ఓలేటి పార్వతీశం.. తమ సంస్థల తరఫున ఈ సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు కోసూరి ఉమాభారతి, ప్రమీల సూర్యదేవర పత్రికా ప్రకటనలో తెలియజేశారు.అకాడెమీ తరఫున హైదరాబాదులో జ్యోతి వలబోజు నేతృత్వంలో రచయిత్రుల బృందం పురస్కార గ్రహీతల స్వగృహాలలోనే వారిని గౌరవప్రదంగా సత్కరించి పురస్కారాలని అందజేశారు. సాహిత్య కళారంగాలలో పలువురు ప్రముఖులు ఈ పురస్కార ప్రదానంపై తమ హర్షం వ్యక్తం చేస్తూ పురస్కార గ్రహీతలను నిర్వాహకులను అభినందించారు. -
డాలస్లో ‘శ్వాస స్వర సంధ్య' తో ఈలపాట మాంత్రికుడు
డాలస్, అక్టోబర్ 12: డాలస్ నగరంలో ఆదివారం సాయంత్రం, భావప్రధానమైన సంగీతంతో, శ్రుతి-లయల అద్భుత సమన్వయంతో డా. కొమరవోలు శివప్రసాద్ గారి ఈలపాట సంగీత విభావరి, సంగీతాభిమానులైన ఆహూతులకు ఒక గొప్ప రసానుభూతిని కలిగించింది.కాపెల్లోని పింకర్టన్ ఎలిమెంటరీ స్కూల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో, "విజిల్ విజర్డ్" (Whistle Wizard) గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పద్మశ్రీ, కళారత్న డా. కొమరవోలు శివప్రసాద్ తన ఈలపాటతో శ్వాసస్వర మాధుర్యాన్ని పంచి, సభికులను మంత్రముగ్ధుల్ని చేశారు.ఎటువంటి ముందు పరిచయం లేకుండా, ఒక్క రిహార్సల్ కూడా లేకుండా నేరుగా ఈ కచేరీలో సహాయక వాయిద్యకారులుగా చేరిన రామకృష్ణ గడగండ్లకు, నిండు సరస్వతీ కటాక్షం సంపాదించుకున్న చిరంజీవి చిదాత్మ దత్త చాగంటికి, చిరంజీవి స్వప్నతి మల్లజోస్యులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియశారు.ప్రముఖ ట్రావెల్స్ సంస్థ వోల్డీలక్స్, ఇన్సూరెన్స్ సంస్థ SNR ఇన్సూరెన్స్, సిలికానాంధ్ర మనబడి డాలస్ జట్టు సభ్యులు సంయుక్తంగా ఈ సంగీత వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు.బాల్యంలోనే ఈలపాట రఘురామయ్య గారి సాహచర్యం, ఆ తర్వాత సంగీతసమ్రాట్ పద్మవిభూషణ్ డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి శిష్యరికంతో డా. శివప్రసాద్ సంగీతంలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించారు. ఎక్కువమంది చేపట్టడానికి సాహసించని ఈ అరుదైన "శ్వాసాధార సంగీత" ప్రక్రియపై ఆయన పరిశోధన చేసి, దానిని పరిపుష్టం చేశారు. ప్రతిరోజూ ఐదు గంటలకు పైగా సాధన చేస్తూ, ఉచ్ఛ్వాస-నిశ్వాసాలను నియంత్రించి, గుక్కతిప్పుకోకుండా సంగీతాన్ని సృష్టించే ఒక విశిష్ట శైలిని ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు.ఈ కచేరీలో ఆయన త్యాగరాజ కీర్తనలు, రామదాసు, అన్నమయ్య సంకీర్తనల నుండి శక్తివంతమైన "భో శంభో శివ శంభో" భక్తి గీతం వరకు, శంకరాభరణం రాగంలోని తిల్లానాల వరకు ఎన్నో ప్రఖ్యాత గీతాలను తన ఈలపాటలో అలవోకగా పలికించారు. ఆయనకు తోడుగా డాలస్కు చెందిన యువ కళాకారులు తబలా, వయోలిన్, మృదంగంపై అద్భుతమైన స్వరసమరస్యాన్ని ప్రదర్శించి, కచేరీ స్థాయిని మరింత పెంచారు. ప్రతి కీర్తన ముగిసినప్పుడు సభా ప్రాంగణం మొత్తం హర్షధ్వానాలతో మార్మోగింది.కార్యక్రమం ముగింపులో, దాదాపు రెండు వందల మంది ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో తమ అపారమైన ఆనందాన్ని, కళాకారుడి పట్ల తమకున్న గౌరవాన్ని ప్రదర్శించారు. డా. ప్రసాద్ తోటకూర, శ్రీ శ్రీకాంత్ బొర్రా దంపతులు, శ్రీమతి శారద, శ్రీ భాస్కర్ రాయవరం కళాకారులకి గౌరవ సత్కారాలని అందించారు. శ్రీ ప్రసాద్ జోస్యుల సభకు అధ్యక్షత వహించారు. శ్రీ రమేశ్ నారని, శ్రీ రంగాల మన్మధ రావు సాంకేతిక సహకారం అందించారు.శ్రీ సూర్యనారాయణ విష్ణుభొట్ల ఆడిటోరియం సదుపాయాలు, ఏర్పాట్లు, సమయపాలనలో సహాయం చేశారు. కాపెల్ విద్యాలయం అడ్మిన్ జట్టు సహకారం వల్ల మంచి సదుపాయాలతో కూడిన ప్రాంగణం ఈ సంగీత కచేరి చక్కగా జరగడానికి దోహదపడింది. 'పద్మశ్రీ', 'కళారత్న' పురస్కారాలు, రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు, మరియు ప్రపంచవ్యాప్తంగా 6,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చిన ఘనత డా. శివప్రసాద్ గారు సంప్రదాయ సంగీతానికి ఆధునికతను జోడించి, "శ్వాసలో సంగీతం" అనే కొత్త స్ఫూర్తిని ఆయన ప్రపంచానికి అందించారు. -
చికాగోలో వైస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అమెరికాలోని చికాగోలో ఘనంగా జరిగింది. వైఎస్ జగన్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు.. అంబటి రాంబాబు కి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పరమ యరసాని, శరత్ యెట్టపు, నరసింహ రెడ్డి, కేకే రెడ్డి, KSN రెడ్డి, కందుల రాంభూపాల్ రెడ్డి, ఆర్వీ రెడ్డి , వెంకట్ రెడ్డి లింగారెడ్డి, హరినాథ్ పొట్టేటి , వినీల్ తోట తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ పరిపాలన గురించి ప్రస్థావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలసిన ప్రజా పాలనను జగనన్న అందించారని కొనియాడారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనిసాగుతుందని విమర్శించారు.ఇక ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన వైస్సార్సీపీ అభిమానులు, సానుభూతిపరులు.. వైఎస్ జగన్ పై, అంబటి రాంబాబు పై వారి అచంచలమైన అభిమానాన్ని చాటారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. చికాగోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రవాసుల ప్రేమ చూస్తుంటే తనకు ముచ్చటేస్తుందన్నారు. దూర ప్రాంతాల నుంచి అమెరికాకు వచ్చినవారు వైఎస్ ఫ్యామిలీపై చూపిస్తున్న ప్రేమ మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయ్యిందన్నారు. ఈ ఏడాదిన్నర పాలనలోనే ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకతను.. తన రాజకీయ జీవితంలోనే చూడలేదన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. పెద్ద పెద్ద ప్రకటనలు చేసి.. డప్పు కొట్టుకునే కార్యక్రమాలు చేశారు. సూపర్ సిక్స్ చేసేశాం అంటున్నారు. సూపర్ సిక్స్ లో ఏం అమలు చేశారో అర్దం కావటంలేదన్నారు అంబటి. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది వైఎస్సార్.. ఆ తర్వాత వైఎస్ జగనే అన్నారు. అమ్మ ఒడి పథకాన్ని దేశం మొత్తంలో మొదటగా ప్రవేశ పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. కానీ చంద్రబాబు ఆ పథకాలను కాపీ చేసి మేమే వీటిని సృష్టించాం అని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకు అంబటి ఎంతో ఒపికగా సమాధనం ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: AI వినియోగంపై హెచ్చరిక.. యూకేలో గరికపాటి ప్రవచనాలు) -
అమెరికాలో ఐదేళ్లలో 100 మందిపైగా భారత విద్యార్థుల మృతి
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం భారత యువత ఎక్కువగా అమెరికా వెళ్తుతున్నారు. అగ్రరాజ్యంలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ స్టూడెంట్సే అధికంగా ఉన్నారు. ఉన్నత చదువులతో పాటు పనిచేసుకునే సౌలభ్యం ఉండడంతో భారత విద్యార్థుల్లో అధికశాతం అమెరికావైపు మొగ్గుచూపుతున్నారు. అయితే అమెరికాలో మన విద్యార్థుల మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.భారత విదేశాంగ శాఖ తాజా గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో అమెరికాలో దాదాపు 160 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. 2020, జూన్ నుంచి 2024 జూన్ వరకు 108 మంది భారత విద్యార్థులు (Indian Students) మరణించారు. గతేడాది నుంచి ఇప్పటివరకు మరో 10 మంది వరకు చనిపోయారు. అధికారిక లెక్కల కంటే భారతీయుల మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు అంటున్నారు. ప్రమాదాలు, దొంగతనాలు, తుపాకీ కాల్పుల కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నారని వెల్లడించారు. 40 కుటుంబాలకు సహాయం''అమెరికాలో మనవాళ్లు చనిపోతున్న విషాదకర ఘటనలు ఈ మధ్యకాలంలో తరచుగా చూస్తున్నాం. యాక్సిడెంట్లు, చోరీలు, తుపాకీ కాల్పుల్లో మనవాళ్లు ఎక్కువగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విహారయాత్రలకు వెళ్లి నీళ్లలో మునిగిపోయి చనిపోతున్న ఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపు 40 కుటుంబాలకు సహాయం అందించాం. పార్థీవదేహాలను ఇండియా పంపించడానికి, ఇక్కడ అంత్యక్రియల ఏర్పాట్ల కోసం మా వంతు సాయం చేశామ''ని వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు వంశీరెడ్డి కంచరకుంట్ల 'టైమ్స్ ఆఫ్ ఇండియాకు' తెలిపారు.జాగ్రత్తలు తప్పనిసరికాగా, నేరాలు ఎక్కువగా జరిగే గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా పనిచేస్తుండడం కూడా మన యువతపై దాడులకు మరో కారణమని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు విశ్వేశ్వర్రెడ్డి కాల్వల అన్నారు. అయితే దాడులకు గురవకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అని ఇమ్మిగ్రేషన్ (Immigration) లాయర్ జనేత ఆర్ కంచర్ల అన్నారు. హైరిస్క్ ఏరియాలు అవైడ్ చేయాలని, లేట్నైట్ బయట తిరగకూడదన్నారు. చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయరాదని సూచించారు.చెడు అలవాట్లతో..మోతాదుకు మించి మత్తు పదార్థాలు సేవించే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ కార్యదర్శి అశోక్ కోళ్ల ఆందోళన వెలిబుచ్చారు. ఇలాంటి కేసులు గత సంవత్సరంలో దాదాపు 30 వరకు తానా (TANA) దృష్టికి వచ్చినట్టు వెల్లడించారు. కాలిఫోర్నియా, టెక్సాస్, కనెక్టికట్ రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చినట్టు చెప్పారు. ఇక్కడికి వచ్చిన కొద్దిరోజులకే కొంత మంది చెడు అలవాట్లకు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.కాగా, కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీలలో ఎక్కువగా భారతీయుల మరణాలు నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే దాదాపు 60 శాతం మంది భారతీయులు (Indians) నివసిస్తున్నారు.చదవండి: ఎయిర్ బ్యాగ్.. పిల్లాడి ప్రాణం తీసింది!2025లో కాల్పుల్లో చనిపోయిన తెలుగు విద్యార్థులుఅక్టోబర్ 4, 2025: టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీనగర్ బీఎన్ రెడ్డి నగర్కు చెందిన చంద్రశేఖర్ పోలే(27) కన్నుమూశాడు. బీడీఎస్ పూర్తయ్యాక 2023లో ఉన్నత చదువుల కోసం డల్లాస్ వెళ్లిన చంద్రశేఖర్.. పెట్రోల్ బంకులో దోపిడీని అడ్డుకునే క్రమంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.సెప్టెంబర్ 3, 2025: అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్నగర్కు చెందిన యువకుడు మహ్మద్ నిజాముద్దీన్ (29) మృతి చెందాడు. కాలిఫోర్నియా శాంటాక్లారా ఏరియాలో రూమ్మేట్తో గొడవపడి, కత్తితో అతడిని పొడిచాడు. దీంతో పోలీసులు నిజాముద్దీన్పై కాల్పులు జరిపారు.జనవరి 20, 2025: హైదరాబాద్కు చెందిన రవితేజ అనే ఎంబీఏ విద్యార్థి కనెక్టికట్లోని న్యూ హెవెన్లో దుండగుల కాల్పుల్లో మృతిచెందాడు. సైన్స్లో మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లిన అతడు.. పెట్రోల్ బంకులో దోపిడీని అడ్డుకోవడంతోనే ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. -
చైనాకు గూఢచర్యం?? .. భారత సంతతి అధికారి అరెస్ట్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ నిపుణుడు ఆష్లీ జె టెలిస్(Ashley Tellis) అరెస్ట్ అయ్యారు. అమెరికా రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక పత్రాలను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకుని అక్కడి అధికారులు విచారిస్తున్నారు. అదే సమయంలో.. చైనాకు గూఢచర్యం చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు జరుగుతుండడం గమనార్హం. Who Is Ashley Tellis.. ఆష్లీ జె టెలిస్ ముంబైలో జన్మించారు. బాంబే వర్సిటీ పరిధిలోని సెయింట్ జెవియర్స్ కాలేజీలో బీఏ, ఎంఏ చదివారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో పీహెచ్డీ పూర్తి చేశారు. అక్కడే అమెరికాలోని పలు ప్రభుత్వ విభాగాల్లో కీలక పదవుల్లో పని చేసి.. విదేశీ విధాన నిపుణుడిగా ఎదిగారు. ముఖ్యంగా.. అమెరికా విదేశాంగ శాఖలో సీనియర్ అడ్వైజర్గా పనిచేస్తూ.. అమెరికా-భారత్ అణు ఒప్పందంలో కీలక పాత్ర(US-India Civil Nuclear Agreement) పోషించారు. అంతేకాదు విదేశీ విధాన పరిశోధకుడిగా ఇరు దేశాల సంబంధాలపైనా ఆయన ఎన్నో రచనలు చేశారు. ప్రస్తుతం ఆయన కార్నెగీ ఎండౌమెంట్లో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్నారు. అయితే..జాతీయ రక్షణ సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను ఆయన అనుమతి లేకుండా తన వెంట తీసుకెళ్లారనే అభియోగం నమోదైంది. 18 యూఎస్సీ సెక్షన్ 793(ఈ) ప్రకారం.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారంగా కేసు నమోదు అయింది. ప్రస్తుతం.. రహస్య ప్రాంతంలో టెలిస్ను విచారణ జరుపుతున్నారు. తూర్పు వర్జినీయా అటార్నీ ఆఫీస్ కార్యాలయం ఆయన అరెస్ట్, విచారణను ధృవీకరించింది.ఫెడరల్ అధికారులు ఏమన్నారంటే.. 64 ఏళ్ల వయసున్న టెలిస్.. దేశభద్రతకు సంబంధించిన గోప్యమైన పత్రాలను తన వెంట తీసుకెళ్లడం చట్ట ప్రకారం తీవ్ర నేరమే. తన సహ ఉద్యోగినిని రహస్య పత్రాలకు సంబంధించి ప్రింట్లు తనకివ్వమని ఆయన కోరారు. యూఎస్ ఎయిర్ఫోర్స్లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్ చేశారు. అలాగే.. చైనా అధికారులతోనూ ఆయన సమావేశమైనట్లూ ఆధారాలు ఉన్నాయి. 2022తో పాటు 2023 ఏప్రిల్ 11న బీజింగ్ అధికారులతో జరిగిన విందులోను పాల్గొన్నారు. ఈ మధ్యే చైనా అధికారులు ఆయనకు ఓ కాస్ట్లీ బ్యాగును కూడా గిఫ్ట్గా అందించారు అని అన్నారు. అయితే చైనా అధికారులతో భేటీ .. అకడమిక్కు సంబంధించినదని ఆయన అసిస్టెంట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి.. గూఢచర్యం ఆరోపణలు ఇప్పటికైతే నిర్ధారణ కాలేదు. అలాంటి అభియోగాన్ని నమోదు చేయలేదు. అయితే కీలక పత్రాలకు సంబంధించిన నేరం రుజువైతే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష, $250,000(మన కరెన్సీలో రూ. 2 కోట్ల 21 లక్షల) జరిమానా విధించవచ్చు. కేసు విచారణ దశలో ఉన్నందున కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు దక్కే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏఐ గురించి గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు -
AI వినియోగంపై హెచ్చరిక.. యూకేలో గరికపాటి ప్రవచనాలు
లండన్: ప్రఖ్యాత సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు తన తొలి యూకే పర్యటనలో భాగంగా బ్రిటిష్ ఇండియన్ తెలుగు సంస్కృతి సంఘం ఆహ్వానంపై పలు నగరాల్లో ప్రవచనాలు నిర్వహించారు. ఈ పర్యటనలో ఆయన జీవిత శిక్షకుడిగా, సాహిత్య పండితుడిగా తన మేధస్సుతో వేలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.బర్మింగ్హామ్ నగరంలో జరిగిన కార్యక్రమంలో గరికపాటి నైతిక, ధార్మిక విలువలపై ప్రసంగించారు. లండన్లో జరిగిన ప్రవచనం ప్రధానంగా ధర్మబద్ధమైన జీవనం, జాతి నిర్మాణంలో NRIల పాత్ర అనే అంశాల చుట్టూ సాగింది. ఆయన ప్రసంగంలో హాస్యం, భక్తి, తత్వశాస్త్రం మేళవించి, శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ప్రసంగంలో గరికపాటి గారు AI వాడకంపై చమత్కారమైన హెచ్చరికలు చేస్తూ, తగిన నియంత్రణ లేకపోతే దాని ప్రమాదాలు గురించి పునరుద్ఘాటించారు. అంతేకాక, ప్రతి NRI తన స్వగ్రామాన్ని దత్తత తీసుకుని దేశానికి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బిట్సెస్ బృందాన్ని సురేష్ మంగళగిరి పరిచయం చేశారు. కాటెపల్లి సచిందర్ రెడ్డి, వాసా బరత్, యశ్వంత్, రాగసుధ, షణ్ముఖ్, సుభాష్, అశ్విన్, సుదర్శన్, రాజ్ దేవరపు, శరత్ తమా, వివేక్, శ్రీనివాస్, బాలు తదితరులు కోర్ కమిటీ సభ్యులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వాలంటీర్లు, స్పాన్సర్లు అందించిన మద్దతుతో ఈ పర్యటన తెలుగు సంస్కృతికి, ధర్మబద్ధమైన జీవన దృక్పథానికి అద్భుత వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమాల్లో భజనలు, శాస్త్రీయ నృత్యాలు కూడా ప్రదర్శించబడ్డాయి. ఇది ఎన్ఆర్ఐలు తమ కళా, సాంస్కృతిక విలువలను ఎలా నిలబెట్టుకుంటున్నారనే దానికి నిదర్శనంగా నిలిచింది. -
ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్ పిక్నిక్కి అదే రూటు
న్యూయార్క్ నగరంలోని మాన్ హట్టన్ లోని సెంట్రల్ పార్క్, ప్రశాంతమైన సరస్సులు, పచ్చని పచ్చిక బయళ్లు, వనాలకు పేరొందింది. ఇక్కడే ఉన్న సెంట్రల్ పార్క్ జూ బెథెస్డా టెర్రస్ వంటి ప్రత్యేక ఆకర్షణలకు కూడా ఇది చిరునామా. అయితే ఇప్పుడు అది మరికొన్ని వైవిధ్యభరిత రుచులకు కూడా చిరునామాగా మారింది. ముఖ్యంగా భారతీయ రుచుల కోసం వెతుకుతున్న ఆహార ప్రియులకు అది తప్పనిసరి సందర్శనీయ స్థలంగా కూడా అవతరించింది. ఈ పార్క్ మధ్యలో తాజాగా తయారుచేసిన వడ పావ్ల సువాసన నాసికకు సోకుతుంటే ఆ ఉద్యానవనం మీదుగా వెళ్లే ఇండియన్ రుచుల అభిమానులు ఆగగలరా? ఇంతకీ ఈ పార్క్లో మన వంటల మార్క్ ఎలా సాధ్యపడింది?ఈ ప్రశ్నకు సమాధానం న్యూయార్క్లో నివసిస్తున్న భారతీయ జంట షౌనక్ శివానీలు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే వారి ప్రత్యేకమైన ’వడ పావ్ ప్రాజెక్ట్’ ఆలోచన దీని వెనుక ఉంది కాబట్టి. మహారాష్ట్రలోనే పుట్టి పెరిగిన వారికి వడా పావ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆ వంటకం దొరకని ప్రదేశంలో సదరు మహారాష్ట్రీయుల్ని ఉంచడం అంటే వారి జిహ్వకు ఎంత లోటో కూడా చెప్పనక్కర్లేదు. అదే విధంగా ఈ జంట కూడా న్యూయార్క్కు వెళ్లాక తమకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఐటమ్, భారతీయ సంప్రదాయ వంటకాల్లో పేరొందిన వడ పావ్ను మిస్ అయ్యారు. మసాలాతో వేయించిన బంగాళాదుంప ముద్దని మృదువైన బన్ లోపల ఉంచి, టాంగీ, స్పైసీ చట్నీలతో చవులూరింపచేసే ఈ వంటకం మిస్ అవడం కన్నా బాధ ఏముంటుంది? అంటూ వాపోయారా దంపతులు.‘ఈ నగరంలో దోసెలు, పానీపురి, కతి రోల్స్( విభిన్న రకాల వెరైటీలను రొట్టెల్లో చుట్టి అందించేవి) అందించే స్టాల్స్ చాలా ఉన్నప్పటికీ, ఇప్పటికీ వడ పావ్ మాత్రం ఇక్కడకి రాలేదు‘ అని శివాని తన అభిమాన వంటకం లేకపోవడం గురించి పంచుకున్నారు. దాంతో ‘మేం పటేల్ బ్రదర్స్(అమెరికాలో భారతీయ ఉత్పత్తులకు పేరొందిన స్టోర్)కు ట్రిప్లు వేశాం, మా రెసిపీతో ప్రయోగాలు చేశాం, చట్నీలను తయారు చేసాం ఓ ఫైన్ మార్నింగ్ నుంచి సెంట్రల్ పార్క్లో వడ పావ్ పిక్నిక్లను నెలవారిగా నిర్వహించడం ప్రారంభించాం‘ అంటూ వీరు చెబుతున్నారు.వీరి ప్రాజెక్టుకు అక్కడి భారతీయుల నుంచే కాక స్థానికుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ‘మేం ఇప్పటికే వందలాది మందికి పైగా వడ్డించాం అందరి ప్రేమ అభిప్రాయాలకు చాలా కృతజ్ఞతలు. ఇకపై మా నెలవారీ కార్యక్రమాలను మరింత ఉత్సాహఃగా కొనసాగించాలని ఆశిస్తున్నాం‘ అని వారు అంటున్నారు. వీరి రుచుల పిక్నిక్ ఆన్ లైన్ లో కూడా అనేకమందిని ఆకర్షించింది, నెటిజన్లు ఎందరో ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ‘అద్భుతం అని ఒకరంటే..‘‘ మాకు కూడా చికాగోలో ఒకటి అవసరం’’ అని మరొకరు, ‘ఓరి దేవుడా, ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. ఇప్పటికి నిజమవడం చూసి చాలా సంతోషంగా ఉంది’’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ‘‘ ఈ నగరానికి ఖచ్చితంగా వడ పావ్ అవసరం. ఇక్కడ మిలియన్ బేకరీలు ఉన్నప్పటికీ, ప్రపంచంలోని ఏ బ్రెడ్ ముంబై పావ్తో సరిపోలదు‘ అంటూ ఒక వడ పావ్ ప్రేమికుడు సగర్వంగా ఆన్లైన్లో తన అభిప్రాయం పంచుకున్నారు. ఒక భోజన ప్రియుడు మరింత ముందుకెళ్లి ‘అమెరికాలో ప్రతి మూలలో తాజా వడా పావ్, దబేలి, భేల్పురి చాట్ అవసరం’’ అంటూ తేల్చేశాడు. View this post on Instagram A post shared by The Vada Pav Project (@thevadapavproject) (చదవండి: Success Story: అతను ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్ కాదు..కానీ సంపదలో అదానీ రేంజ్..!) -
న్యూయార్క్లో ఘనంగా నైటా తెలంగాణ ఫోక్ ఫెస్టివల్, డ్యాన్స్ ఫీస్ట్
అమెరికాలో మరోసారి తెలంగాణ పల్లె జానపదం మెరిసింది. నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం. New York Telangana Telugu Association (NYTTA) దసరా వేడుకల సందర్భంగా న్యూయార్క్ లో మన సంస్కృతీ, సంప్రదాయాలు, పండగల థీమ్తో కార్యక్రమాలు ఈ వీకెండ్ లో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన తెలుగు కుటుంబాలు ఈ ఉత్సవాలను ఆద్యంతం ఎంజాయ్ చేశారు.ధూమ్ ధామ్ వ్యవస్థాపకులు రసమయి బాలకిషన్ తో పాటు రేలా రే రేలా గంగ, లావణ్య, దండేపల్లి శ్రీనివాస్ లు తెలంగాణ ఫోక్ సాంగ్స్, ఆటపాటలతో కార్యక్రమాన్ని ఉర్రూతలూగించారు. వీరితో పాటు అమెరికాలో స్థిరపడిన తెలుగు టాలెంట్ అమ్మాయిలు, అబ్బాయిలు తమ కల్చరల్ ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకున్నారు. లౌకికా రెడ్డి, కావ్యా చౌదరి, ఐశ్వర్యల ప్రత్యేక ప్రదర్శనలతో అలరించారు.న్యూయార్క్ కాంగ్రెస్ మెన్, హౌజ్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్ మెంబర్ టామ్ సూజి ఈ ఫెస్ట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ వేడుకలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. పెద్ద సంఖ్యలో స్థిరపడిన తెలుగువారు అమెరికా అభివృద్దిలో అంతర్భాగమయ్యారని సూజి అన్నారు.అమెరికాలో స్థిరపడినా సొంత ప్రాంత పండగల సంప్రదాయాలను కొనసాగిస్తూ, కొత్త తరాలకు పరిచయం చేయటం కోసమే దసరా వేడుకలను నిర్వహించామని, విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు నైటా ప్రెసిడెంట్ వాణి ఏనుగు.ఎన్ఆర్ఐ ప్రముఖులు పైళ్ల మళ్లారెడ్డితో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ పరిసరాల్లో స్థిరపడిన తెలుగు కుటుంబాలు ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. శ్రీలక్ష్మి కులకర్ణి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్, అడ్వయిజరీ కమిటీ సభ్యులు పూర్తి సమన్వయంతో వేడుకలను విజయవంతం చేశారు. -
చికాగోలో అభిమానులతో కలిసి కేక్ కట్ చేసిన అరి మూవీ టీం
అరిషడ్వర్గాలు అనే డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన మూవీ అరి. అరిషడ్వర్గాలులోని మొదటి రెండు పదాలైన అరి అనే టైటిల్తో వచ్చిన ఈ సినిమాకు మై నేమ్ ఈజ్ నోబడీ అనేది క్యాప్షన్. ఈ మూవీ అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ని సంపాదించుకుంది. ఎవరూ టచ్ చేయని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో దర్శకుడు జయశంకర్ ఈ మూవీని తెరకెక్కించారు. అర్ వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి ఈ మూవీని నిర్మించారు. వినోద్ వర్మ, సూర్య, అనసూయ,సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఇటీవల వచ్చిన సినిమాల్లో అరి కాస్త ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు.ఇక ఈ మూవీ రిలీజ్ సందర్భంగా చికాగోలోని సినీ లాంజ్ లో మూవీ టీం సందడి చేసింది. మూవీ ప్రొడ్యూసర్ ఆర్ వీ రెడ్డి తో పాటు చికాగోలోని పలువురు ప్రముఖులు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం టీం మెంబర్స్ అంతా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ‘అరి’ సక్సెస్ సాధించడంతో పలువురు అభినందనలు తెలిపారు. దర్శకుడు ఏడేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కిందని కొనియాడారు. మనిషిలోని అంతర్గత శత్రువులను ఎలా ఎదుర్కోవాలో చెప్పే ప్రయత్నంగా అరి మూవీని తెరకెక్కించారని వివరించారు. ఇంత గొప్ప సినిమాను తెరకెక్కించిన మూవీ టీమ్ ను పలువురు ప్రశంసించారు. అరికి మంచి ప్రశంసలు లభించడం, ఆదరణ దక్కుతుండటంతో మూవీ టీంలో కొత్త ఉత్తేజం వచ్చినట్టుగా కనిపిస్తోంది.(చదవండి: Karwa Chauth: భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..) -
ఇండియాకు వెళ్లిపో, భారతీయ యువతిపై జాత్యహంకార దాడి
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ఐర్లాండ్లోని డబ్లిన్లో ఒక భారతీయ మహిళపై జాత్యహంకార దాడి సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న "గో బ్యాక్ టు ఇండియా" (Go Back To India) వేధింపులు, జాతి వివక్షకు అద్దం పట్టిన ఈ ఘటన సంచలనంగా మారింది. అక్టోబర్ 8న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో బాధితురాలు స్వాతి వర్మ మొత్తం సంఘటనవీడియోనుసోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకెదురైన చేదు అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న స్వాతి ఈఘటన తనను చాలా బాధపెట్టిందని, వ్యక్తిగతం ఇది కలవర పెట్టిందని విచారం వ్యక్తం చేసింది. జిమ్ నుంచి ఇంటికి నడిచి వెడుతుండగా గుర్తు తెలియని మహిళ జాత్యహంకార వ్యాఖ్యలు చేసిందనీ, ఆధునిక సమాజంలో కూడా వలసదారులు వివక్ష, తిరస్కరణను ఎదుర్కొంటున్నారని ఈ వీడియోలో స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది.సాయంత్రం 9 గంటల ప్రాంతంలో, తాను జిమ్ సెషన్ తర్వాత ఇంటికి వెళుతుండగా, నేను నివసించే ప్రదేశానికి కొన్ని అడుగుల దూరంలో, రోడ్డు అవతలి వైపున డబ్లిన్ సిటీ యూనివర్సిటీ (DCU) బ్యాడ్జ్ ధరించినఉన్న ఒక మహిళ ఈమెను సమీపించింది. ‘నువ్వు ఐర్లాండ్కు ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇండియా తిరిగి వెళ్లిపో’’ అంటూ నానా యాగీ చేసింది. View this post on Instagram A post shared by Swati Verma (@swatayva) అంతేకాదు "నీకు వర్క్ వీసా ఉందా?" సొంత ఇల్లు ఉందా? అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడింది. అయితే తాను ఇక్కడ ఉచితంగా ఉండటం లేదనీ, టాక్స్లు కడుతూ ఇక్కడి దేశ ఆర్థిక వ్యవస్థకు తన వంతు సహకారం అందిస్తున్నాను అంటూ గట్టిగానే బదులిచ్చింది. అయినా సరే వెంటనే ఇండియాకు తిరిగి వెళ్లిపో అంటూ రెచ్చిపోయింది. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయానని భయంగా ఉందని, అసలేందో జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని స్వాతి పోస్ట్ చేసింది. అయితే జాత్యహంకారం, బెదిరింపు , ద్వేషం ఇప్పటికీ మన వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. అందుకే తనలా ఎవరికీ జరగకూడదనే ఉద్దేశంతో దీన్ని రికార్డ్ చేసి, మీతో షేర్ చేసుకుంటున్నాని తెలిపింది. బహుశా ఆమె ఆమె మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉన్నట్టు లేదు.దయచేసి ఎవరైనా ఆమెకు హెల్ప్ చేయండి. అందుకే సం దీన్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అని కూడా వివరించింది. ఈ వీడియో వైరల్గా మారింది. స్వాతి ధైర్యాన్ని మెచ్చుకుంటూనే, జాగ్రత్తగా ఉండమని సూచించారు. -
ఈబీ–5 వీసాతో అమెరికాలో స్థిరపడడం సులభం
సాక్షి, అమరావతి: అమెరికాలో స్థిరపడడానికి ఈబీ–5 ఇన్వెస్టర్ వీసా సులభ మార్గమని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఇల్యా ఫిష్కిన్ (Ilya Fishkin) అన్నారు. ఈబీ–5 ఇన్వెస్టర్ వీసా గురించిన అవగాహన సదస్సును న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ ఫండ్ గురువారం విజయవాడలో నిర్వహించింది. ఈ సందర్భంగా ఇల్యా ఫిష్కిన్ మాట్లాడుతూ.. అమెరికాలో అనేక మంది భారతీయుల గ్రీన్కార్డ్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వారు సకాలంలో గ్రీన్ కార్డ్ పొందలేకపోతే అమెరికా వీడి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.అలాంటి వారికి ఈబీ–5 ఇన్వెస్టర్ వీసా (EB-5 investor visa) అద్భుత అవకాశమని తెలిపారు. ఈబీ–5 వీసా పొందాలంటే దాదాపు రూ.9.32 కోట్లు(1.05 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందన్నారు. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రాజెక్టు పెడితే మాత్రం రూ.7.11 కోట్లు సరిపోతుందన్నారు. ఈబీ–5 ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పార్టనర్లు సుబ్బరాజు పేరిచర్ల, సంపన్న్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఈబీ–5 వీసా అమెరికాలో ఉన్న భారతీయులు శాశ్వత నివాస హక్కు పొందే అవకాశాన్ని కల్పిస్తుందన్నారు.చదవండి: అప్పుడు దివాళా.. ఇప్పుడు రోజుకు 25 లక్షల సంపాదన! -
డాలస్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
డాలస్, టెక్సస్: డాలస్ ప్రాంతంలో ఇర్వింగ్ నగరంలో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద మహాత్మాగాంధీ 156 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జగద్విఖ్యాత క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్ అక్టోబర్ 2వ తేదీన వేకువ ఝామునే మహత్మా గాంధీ మెమోరియల్ ను సందర్శించి జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. సచిన్ వెంట ప్రసిద్ధ వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్, కమ్యూనిటీ నాయకుడు సల్మాన్ ఫర్షోరి విచ్చేశారు.మహత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర సచిన్ ను సాదరంగా ఆహ్వానించి, ఈ మెమోరియల్ స్థాపన వెనుక ఉన్న కార్యవర్గ సభ్యుల శ్రమ, వేలాది ప్రవాస భారతీయుల సమిష్టి కృషి, దాతల దాతృత్వం, అనుమతి ఇవ్వడంలో అధికారులు అందించిన సహకారంతో దశమ వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకున్న వైనాన్ని సోదాహరణంగా వివరించారు.సచిన్ మాట్లాడుతూ – “గాంధీజయంతి రోజున అమెరికాలో గాంధీస్మారక స్థలిని సందర్శించి నివాళులర్పించడం తన అదృష్టమని, మహాత్మాగాంధీ జీవితం ప్రపంచంలో ఉన్న మానవాళిఅంతటికీ నిత్య నూతన శాంతి సందేశం అన్నారు. ఎంతో ప్రశాంత వాతావరణంలో, సుందరంగా, పరిశుభ్రంగా గాంధీ స్మారకస్థలిని నిర్వహిస్తున్న గాంధీ మెమోరియల్ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మరియు కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు” అన్నారు.మహాత్మాగాంధీ 156 వ జయంతి సందర్భంగా శనివారం నిర్వహించిన “గాంధీ శాంతి నడక-2025” లో వందలాది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఉత్తరాధ్యక్షులు మహేంద్ర రావు అందరినీ ఆహ్వానించి సభను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కాన్సల్ జెనరల్ ఆఫ్ ఇండియా డిసి మంజునాథ్, ప్రత్యేక అతిథులుగా సన్నీవేల్ మేయర్ సాజీ జార్జి, ఫ్రిస్కో నగర కౌన్సిల్ సభ్యుడు బర్ట్ టాకూర్, ఆంధ్రప్రదేశ్ “హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ డా. దాసరి శ్రీనివాసులు, ఐ.ఎ.ఎస్ (రి) హాజరై జాతిపితకు పుష్పాంజలి ఘటించి మహాత్మాగాంధీ జీవితంలోని ఎన్నో ఘట్టాలను, ఆయన త్యాగ నిరతిని గుర్తుచేసుకున్నారు. మహాత్మాగాంధీ శాంతి సందేశానికి చిహ్నంగా 10 తెల్లటి కపోతాలను ఆహుతుల కేరింతల మధ్య అతిథులు, నాయకుల అందరూ కలసి ఆకాశంలోకి ఎగురవేసి అందరూ కలసి శాంతినడకలో పాల్గొన్నారు.ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ నాయకులు రాజీవ్ కామత్, మహేంద్ర రావు, బి.యెన్ రావు, జస్టిన్ వర్ఘీస్, షబ్నం మాడ్గిల్, దీపక్ కార్లా, డా. జెపి, ముర్తుజా, కలై, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్, మహాత్మాగాంధీ మెమోరియల్ నాయకులు డా. ప్రసాద్ తోటకూర, తైయాబ్ కుండావాలా, మురళి వెన్నం, రాంకీ చేబ్రోలు, వినోద్ ఉప్పు, అనంత్ మల్లవరపు, కమ్యూనిటీ నాయకులు చంద్ర పొట్టిపాటి, చినసత్యం వీర్నపు, లక్షి పాలేటి, సురేఖా కోయ, క్రాంతి ఉప్పు, చిన్ని మొదలైన వారు ఈ వేడుకలలో పాల్గొన్నారు.మురళి వెన్నం హాజరైన అతిథులకు, కార్యక్రమాన్ని విజయవంతంలో కృషి చేసిన కార్యకర్తలకు, వేడి వేడి అల్పాహారం అందించిన “ఇండియా టుడే కెఫే” అధినేత వినోద్ ఉప్పు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
భార్యాబిడ్డల్ని విమానం ఎక్కించి వచ్చాడో లేదో తీవ్ర గుండెపోటు, విషాదం
ఇటీవలి కాలంలో వరుస ఎన్ఆర్ఐల మరణాలు ఆందోళన రేపుతున్నాయి. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో తన భార్య , కుమారుడికి వీడ్కోలు పలికిన కొన్ని గంటలకే UAEలో ఒక భారతీయ ప్రవాస ఇంజనీర్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుడిని హరిరాజ్ సుదేవన్ (37) (Hariraj Sudevan) గుర్తించారు.కేరళలోని అలప్పు జిల్లాకు చెందిన 37 ఏళ్ల హరిరాజ్ సుదేవన్ హరిరాజ్ సుదేవన్ గత 12 ఏళ్లుగా యుఎఇలో నివసిస్తున్నాడు. అయితే తన భార్య డాక్టర్ అను అశోక్ , 10 ఏళ్ల కుమారుడు ఇషాన్ దేవ్ హరి కేరళ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారిని విమానాశ్రయంలో దింపిన కొన్ని గంటలకే అబుదాబిలో గుండెపోటుతో మరణించాడు. అల్లుడు అకాల మరణంపై మామ అశోకన్ కేపీ తీవ్ర విచారాన్ని ప్రకటించారు. ఆయన ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామనంటూ కంట తడిపెట్టారు.ఆదివారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే ముందు తన కుమార్తె , మనవడు హరిరాజ్తో 10 రోజులు గడిపారని, అక్టోబర్ 27న తన కొడుకు పుట్టినరోజుకు హాజరు కావడానికి హరిరాజ్ ఈ నెల చివర్లో రావాల్సి ఉందని గుర్తు చేసుకున్నారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన సుదేవన్, యుఎఇలో 12 సంవత్సరాలకు పైగా సీనియర్ ఆఫ్షోర్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కుసాట్ నుండి బి.టెక్ ,ఐఐటీ మద్రాస్ నుండి ఎంటెక్ పట్టా పొందారు. హరిరాజ్, అబుదాబిలో సీనియర్ పనిచేస్తున్నారు. అంత్యక్రియల కోసం ఆయన మృతదేహాన్ని కేరళకు తరలించారు. థామస్ కుమార్తె పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి మా ఇంటికి వచ్చారని, ఎంతో సంతోషంగా గడిపామని సన్నిహిత స్నేహితుడు డిజిన్ థామస్ తెలిపారు. -
బ్రూనైలో వికసిత్ భారత్ పరుగు విజయవంతం
భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పరుగును తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్, ECO కారిడార్, బందర్ సేరిబెగావాన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ సభ్యులు, భారతీయ ప్రవాసులు మరియు బ్రూనై పౌరులతో సహా 150 మందికిపైగా ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.వికసిత్ భారత్ 2047(Viksit Bharat@2047)దిశగా భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తమ అంకితభావాన్ని ప్రకటిస్తూ, పాల్గొన్నవారు ఐక్యతతో పరుగెత్తారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, సంఘీభావం, దేశభక్తిని అద్భుతంగా ప్రతిబింబించింది.ఈ సందర్భంగా పాల్గొన్నవారిని ఉద్దేశించి భారత రాయబారి రాము అబ్బగాని అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు "దేశ అభివృద్ధి కోసం అవసరమైతే 16 గంటలపాటు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రూనై తెలుగు సంఘం సైతం సక్రియంగా పాల్గొనడం విశేషం. భారత జాతీయ కార్యక్రమాల పట్ల తమ అంకితభావాన్ని ,ప్రవాస భారతీయుల ఐక్యతను చాటిచెప్పారు. -
‘రష్యా.. పచ్చి అబద్ధం’: ఉక్రెయిన్ అదుపులో భారతీయుడు!?
ఉక్రెయిన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. రష్యా తరపున పోరాడుతున్న ఓ సైనికుడ్ని అదుపులోకి తీసుకున్నామని, అయితే అతను భారతీయుడని తెలిపింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంది(Is Indian Captured By Ukraine Army). ది కీవ్ ఇండిపెండెంట్ కథనం ప్రకారం.. పట్టుబడిన యువకుడి పేరు మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్(22). స్వస్థలం గుజరాత్ మోర్బీ. ఉన్నత విద్య కోసం రష్యాకు వెళ్లి.. ఇప్పుడు యుద్ధ సైనికుడిగా ఉక్రెయిన్కు పట్టుబడ్డాడు. ఈ మేరకు అతని స్టేట్మెంట్తో సదరు మీడియా సంస్థ ఓ వీడియో విడుదల చేసింది. ఉన్నత విద్య కోసం రష్యా వెళ్లిన మజోత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడట. ఏడేళ్ల శిక్ష పడడంతో జైలు జీవితం అనుభవిస్తున్నాడట. అయితే.. యుద్ధంలో పోరాడితే శిక్షా కాలం తగ్గిస్తామని, ఆర్థికంగా కూడా సాయం అందిస్తామని మజోత్కు రష్యా అధికారులు ఆఫర్ చేశారట. జైల్లో ఉండడం ఇష్టం లేక అందుకు అంగీకరించానని, అయితే ఆ ఒప్పందంపై సంతకం చేసింది అక్కడి నుంచి బయటపడేందుకేనని ఆ యువకుడు వీడియోలో చెప్పాడు. రష్యాలో అంతా పచ్చి అబద్ధం. నాకు ఆర్థిక సాయం అందలేదు. తగ్గిస్తామని అధికారులు చెప్పడం, జైల్లో ఉండడం ఇష్టం లేకనే ఆ ఒప్పందం కుదుర్చుకుని రష్యా తరఫున స్పెషల్ మిలిటరీ ఆపరేషన్(Special Military Operation)లో పాల్గొన్నానంటూ అతను చెప్పడం ఆ వీడియోలో ఉంది. ఉక్రెయిన్ స్థావరాన్ని చూడగానే తాను తన రైఫిల్ను పక్కన పెట్టి సాయం కోసం అర్థించానని చెప్పాడతను. తనకు రష్యాకు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని.. రష్యా జైల్లో మగిపోవడం కంటే ఇక్కడ ఉక్రెయిన్ జైల్లో శిక్ష అనుభవించడం ఎంతో నయంగా భావిస్తున్నట్లు చెప్పాడతను. Ukraine's military says they have captured an Indian national who was fighting alongside Russian forces.Majoti Sahil Mohamed Hussein is a 22-year-old student from Morbi, Gujarat, India & came to Russia to study at a university pic.twitter.com/Kzi5F4EDR4— Sidhant Sibal (@sidhant) October 7, 2025మరోవైపు ఈ కథనం తమ దృష్టికీ వచ్చిందని, అయితే ఉక్రెయిన్ నుంచి అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత విదేశాంగ చెబుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా.. ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దురాక్రమణను మొదలుపెట్టింది. అయితే ఈ యుద్ధంలో ఇతర దేశాల యువకులకు గాలం వేసి రష్యా సైన్యం ఉపయోగించుకుంటోందని.. ఉత్తర కొరియా, భారత్.. ఇలా పలు దేశాలకు చెందిన యువకులకు ఉద్యోగాలు, ఆర్థిక సాయం ఆఫర్ చేస్తుందనే విమర్శ తొలి నుంచి వినిపిస్తోంది. ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే 48 దేశాలకు చెందిన 1,500 మందికి పైగా విదేశీయులను పట్టుకున్నట్లు(Foreigners Caught in Ukraine War) నివేదికలు చెబుతున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ యుద్ధంలో భారతీయులు చిక్కుకుపోవడం పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం అవుతోంది. రష్యాలో ఉన్న భారతీయుల్లో 126 మందిని ఉక్రెయిన్ యుద్ధంలో దించారని, అందులో 12 మంది మరణించగా.. మరో 16 మంది ఆచూకీ లేకుండా పోయారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. ఇదే విషయాన్ని మాస్కో వర్గాల దృష్టికి తీసుకెళ్లిన భారత్.. ఈ యుద్దంలో చిక్కుకున్న తన పౌరులకు విముక్తి కల్పించాలని కోరింది కూడా. ప్రధాని మోదీ సైతం జోక్యం చేసుకున్న నేపథ్యంలో 96 మందిని రష్యా విడుదల చేసింది. అయితే ఇలాంటి నియామకాలు ఆపేసినట్లు రష్యా చెబుతున్నప్పటికీ.. ఆ నియామకాలు మాత్రం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ సుంకాలపై గీతా గోపినాథ్ షాకింగ్ రియాక్షన్ -
‘ఒరిగిందేం లేదు..’ ట్రంప్ టారిఫ్లకు గీతా గోపినాథ్ నెగెటివ్ మార్క్
ప్రముఖ ఆర్థిక నిపుణురాలు, భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్.. ట్రంప్ సుంకాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వాటి వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇప్పటిదాకా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారామె. పైగా ఈ 6 నెలల కాలంలో టారిఫ్లు ప్రతికూల ప్రభావాన్ని చూపాయని తేల్చేశారామె(Gita Gopinath On Trump Tariffs).ప్రపంచంలోనే అత్యధికంగా.. భారత్, బ్రెజిల్పై 50 శాతం సుంకాలను ట్రంప్ విధించిన సంగతి తెలిసిందే. అలాగే.. బ్రాండెడ్ ఔషధాలపైనా 100 శాతం టారిఫ్లు విధించారు. వీటితో పాటు చాలా రంగాలపై సుంకాలు విధించారు.. ఇంకా విధించుకుంటూ పోతున్నారు. అయితే.. లిబరేషన్ డే పేరిట ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్ వార్ మొదలుపెట్టి(Liberation Day Tariffs) ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంలో హార్వార్డ్ యూనివర్సిటీ ఎకనామిక్ ఫ్రొపెసర్ గీతా గోపినాథ్ స్పందించారు. ట్రంప్ సుంకాలను నెగటివ్ స్కోర్కార్డ్గా అభివర్ణిస్తూ.. అమెరికా ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావాన్ని విశ్లేషించారు. ఈ టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు లాభం కాకుండా నష్టం కలిగించాయని అన్నారామె. ఈ టారిఫ్లు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచినప్పటికీ.. ‘పన్నుల్లా’ వాటి భారం అమెరికా కంపెనీలు, వినియోగదారులపై పడిందని ఆమె అన్నారు. టారిఫ్ల ప్రభావంతో ద్రవ్యోల్బణాన్ని స్వల్పంగా పెరిగినప్పటికీ.. గృహోపకరణ వస్తువులు, ఫర్నిచర్, కాఫీ వంటి వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైందని.. ఇది మధ్య తరగతి కుటుంబాలపై ప్రభావం చూపినట్లు ఆమె అభిప్రాయపడ్డారు. వెరసి.. తయారీ రంగం గణనీయంగా అభివృద్ధి చెందలేదు. అలాగే, వాణిజ్య లోటు తగ్గిన సంకేతాలు కూడా లేవు. టారిఫ్లతో అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదు అని ఆమె తేల్చేశారు. స్థానిక పరిశ్రమలకు ప్రోత్సాహం, విదేశీ పోటీని తట్టుకోవడం, వాణిజ్య లోటును తగ్గించడమే లక్ష్యంగా సుంకాల మోత మోగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించుకోవడం తెలిసిందే. అయితే.. ఇందుకు భిన్నంగా ఇప్పటివరకు ఫలితాలు ఇవ్వలేదని IMF మాజీ అధికారి అభిప్రాయపడటం గమనార్హం.It is 6 months since "Liberation day" tariffs. What have US tariffs accomplished?1. Raise revenue for government? Yes. Quite substantially. Borne almost entirely by US firms and passed on some to US consumers. So it has worked like a tax on US firms/consumers. 2. Raise… pic.twitter.com/KZG3UgKB3S— Gita Gopinath (@GitaGopinath) October 6, 2025 గీతా గోపినాథ్(53) భారత సంతతికి చెందిన ప్రముఖ ఆర్థిక నిపుణురాలు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేశారు. 2019లో IMF చీఫ్ ఎకనామిస్ట్గా నియమితులై, 2022లో ఆ సంస్థకు తొలి డిప్యూటీ మేనేజర్గా బాధ్యతలు చేపట్టారు. 2025లో IMF పదవిని వీడి.. హార్వర్డ్లో తిరిగి ప్రొఫెసర్గా చేరారు.ఇదీ చదవండి: క్వాంటమ్ మెకానిక్స్కు ఎట్టకేలకు గుర్తింపు -
పెర్ఫ్యూమ్ తెచ్చిన తంటా....తీవ్ర ఆందోళనలో ఎన్ఆర్ఐ ఫ్యామిలీ
ఒక చిన్న పొరపాటుతో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఇబ్బందులు పాలయ్యాడు. అమెరికాలోని బెంటన్లో తన అమెరికన్ భార్యతో నివసిస్తున్న కపిల్ రఘును పెర్ఫ్యూమ్ బాటిల్ కారణంగా అర్కాన్సాస్లో అరెస్ట్ చేశారు. వీసాను రద్దు చేశారు. దీంతో అతని దేశ బహిష్కరణ తప్పదేమో అనే ఆందోళనలో కుటుంబం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి.ఫుడ్ డెలివరీ డ్రైవర్గా పనిచేసే రఘు అనే 32 ఏళ్ల వ్యక్తిని మే 3న బెంటన్ పోలీసులు చిన్న ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా చేసిన తనిఖీల్లో దొరికిన పెర్ఫ్యూమ్ బాటిల్ పెద్ద దుమారాన్నే రేపింది. రఘు కారు సెంటర్ కన్సోల్లో "ఓపియం" (నల్లమందు) అని రాసి ఉన్న పెర్ఫ్యూమ్ బాటిల్ను కనుగొన్నారు. అందులో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులు అనుమానించారు. అది కేవలం పెర్ఫ్యూమ్ అని రఘు పదే పదే వివరణ ఇచ్చినా, పోలీసులు విశ్వసించలేదు. చివరికి రఘుని అరెస్టు చేశారు. అప్పటినుంచి అతనికి కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. చట్టపరమైన, ఇమ్మిగ్రేషన్ సంక్షోభానికి దారితీసింది. వీసాను రద్దు చేయడంతో మరింత ఆందోళన నెలకొంది.చదవండి: నో అన్న రెండేళ్లకే గూగుల్ ఇండియా కీలక బాధ్యతలు, ఎవరీ రాగిణీ?మరోవైపు అర్కాన్సాస్ స్టేట్ క్రైమ్ ల్యాబ్ తదుపరి పరీక్షలో ఆ పదార్థం హానికరం కాదని , మాదకద్రవ్యాలు లేవని నిర్ధారించారు. అయినప్పటికీ, రఘు ఇప్పటికే మూడు రోజులు సెలైన్ కౌంటీ జైలులో గడిపాడు.మే 20న జిల్లా కోర్టు మాదకద్రవ్యాల కేసును కొట్టివేసిన తర్వాత ,ఈలోపు రఘు వీసా గడువు ముగిసిందంటూ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని, లూసియానాలోని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి తరలించి, 30 రోజుల పాటు నిర్బంధించారని రఘు న్యాయవాది మైక్ లాక్స్ వెల్లడించారు.దీనిపై బాధితుడు రఘు తీవ్ర ఆందోళన వ్యక్తంచే శారు. తన భార్య యాష్లీ మేస్, మొత్తం భారాన్ని మోస్తోందని, కోర్టు ఖర్చులు, భరించడం కష్టం మారిందని వాపోయారు. ఈ జంటకు ఈ ఏప్రిల్లో వివాహం అయింది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కార్యాలయానికి రాసిన లేఖలో, రఘు తన వీసాను తిరిగి పొందాలని విజ్ఞప్తి చేశాడు. కపిల్ రఘు విడుదల అయినప్పటికీ, @బహిష్కరణ' (deportation) స్టేటస్లో ఉంటాడని, మరింత ముఖ్యంగా, ఇది అతను పని చేయకుండా ,డబ్బు సంపాదించకుండా నిరోధిస్తుందని ఇది మరింత ఆందోళన కరమని న్యాయవాది వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉంటే తన భర్తను నిర్దోషిగా బయటకొచ్చే క్రమలో అయ్యే ఖర్చుల కోసం భార్య ఆన్లైన్లో విరాళాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో -
టీపాడ్ బతుకమ్మ- దసరా సంబరాలు.. థమన్, హీరోయిన్లు శివాని, అనన్య సందడి
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన ఆఫ్ డాలస్ (TPAD-టీపాడ్) ఆధ్వర్యంలో దసరా బతుకమ్మ వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. ప్రతీ ఏడాదిలాగానే ఈసారి కూడా డే టైమ్లో స్థానిక కళాకారులు, స్టూడెంట్స్ తమ ప్రదర్శనలతో అదరగొట్టగా సాయంత్రం బతుకమ్మ, దసరా సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన సంగీతంతో షేక్ చేశారు. ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత స్పెషల్గెస్ట్గా హాజరైన ఈ వేడుకలో హీరోయిన్లు శివాని, అనన్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.దద్దరిల్లిన అల్లెన సెంటర్టీపాడ్ వేడుకలకు వేదికైన డాలస్లోని అల్లెన ఈవెంట్ సెంటర్ దద్దరిల్లిపోయింది. ఈ మెగా ఈవెంటుకు తెలుగువారంతా భారీగా తరలి వచ్చారు. ఏటా పదిహేను వేల మందికి పైగా ఏర్పాట్లు చేస్తున్న టీపాడ్.. ఈసారి అంతకుమించి జనం వస్తారని ఊహించి అందుకు తగ్గట్టు సౌకర్యాలు సమకూర్చినా.. సుమారు రెండు వేల మంది మాత్రం కనీసం నిల్చుకునేందుకు స్థలం లేక వెనుదిరిగిపోయారు. ఉదయం 11 గంటలకే ప్రారంభమైన వేడుకలు రాత్రి 11 గంటలకు థమన్ మ్యూజిక్ కన్సర్ట్తో ముగిశాయి. మహిషాసుర మర్ధిని నృత్యరూపకంవేడుకల్లో భాగంగా తొలుత సుమారు 200 మంది స్థానిక కళాకారులు, విద్యార్థులు డ్యాన్సలు, సింగింగ్ టాలెంట్తో ఆహూతులను మెస్మరైజ్ చేశారు. రోజంతా సందడిగా సాగిన ఈ కార్యక్రమాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవన్న అనుభూతికి లోనయ్యేలా చేశారు. సాక్షాత్తూ అమ్మవార్లే కదిలివచ్చారా అన్నట్టు సాగిన 70 మంది సంప్రదాయ నృత్యకారులు ప్రదర్శించిన మహిషాసురమర్ధిని నృత్యరూపకం ప్రతి ఒక్కరిలో గూస్బంప్స్ తెప్పించాయి. డెబ్బయ్ మంది అడుగులు కాలిగజ్జెలతో నర్తిస్తుంటే స్టేడియం దద్దరిల్లిపోయింది. స్టేడియంలో ప్రతి ఒక్కరూ ఆ శబ్దానికి, నృత్యానికి పులకించి, కొత్తలోకంలో ఉన్నామా అన్న అనుభూతి కలిగింది. తెలంగాణ నేలపై నవరాత్రుల వైభవాన్ని చూడలేకపోయామే అనుకున్న వారికి ఈ వేడుక ఆ గ్యాప్ను భర్తీ చేసింది.బతుకమ్మ ఆడిన హీరోయిన్లుసాయంత్రం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. హీరోయిన్లు శివాని, అనన్య మహిళలందరితో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహపరిచారు. బతుకమ్మలను నిమజ్జనం చేసిన అనంతరం శమీవృక్షానికి, అమ్మవారికి పూజలు నిర్వహించి దేవేరులను పల్లకిలో ఊరేగించారు. ఒకరికొకరు జమ్మి ఆకులను పంచుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. ఓవైపు హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించి గిన్నిస్రికార్డ్లో నమోదు చేయిస్తే.. ఇటు టీపాడ్ డాలస్లో దాదాపు అదే స్థాయిలో బతుకమ్మ పండుగను నిర్వహించి వేలాది మంది మహిళల మనసు దోచుకుంది. కన్వెన్షనను తలపించిన ప్రాంగణంరోజంతా మీడియా ప్రతినిధులతో పాటు ఇనఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల సందడి కనిపించింది. అల్లెన సెంటర్ ప్రాంగణంలో నగలు, దుస్తులతో పాటు కన్వెన్షనను తలపించేలా అనేక వెండర్బూతలు వెలిశాయి. రకరకాల ఫుడ్కోర్టులు కొలువుదీరాయి. జోష్ నింపిన థమన్ మ్యూజిక్సంప్రదాయ వేడుకలన్నీ ముగిశాక థమన్ హైఓల్టేజీ ఎనర్జీ మ్యూజిక్ వెరీవెరీ స్పెషల్గా మారింది. ఆయన డ్రమ్స్ వాయిస్తుంటే ప్రతి ఒక్కరూ జోష్లో ఉండిపోయారు. డాలస్లోనే తన మొదటి కాన్సర్ట్ జరిగిందని చెప్పిన థమన.. మళ్లీ టీపాడ్ వేడుకపై ప్రదర్శన ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రోగ్రామ్లో సింగర్స్ పాడిన ఒక్కొక్క పాటకు స్టేడియంలో పలువురు స్టెప్పులేసి, చప్పట్లు కొట్టి హుషారు నింపారు. ఓజీ డైరెక్టర్ సుజిత ఈ వేదికపై అభిమానులనుద్దేశించి ప్రసంగించారు. ఈ మెగా ఈవెంట్ను ఫౌండేషన కమిటీ చెయిర్ రావు కల్వల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చెయిర్ పాండురంగారెడ్డి పాల్వాయి, ప్రెసిడెంట్ అనూరాధ మేకల, కోఆర్డినేటర్ రమణ లష్కర్, ఫౌండేషన కమిటీ సభ్యులు అజయ్రెడ్డి, జానకీరాం మందాడి, రఘువీర్ బండారు పర్యవేక్షించారు. వంద మంది వలంటీర్లు రెండు నెలలు శ్రమించి ఎక్కడా నిర్వహణ లోపాలు రాకుండా ఏర్పాట్లకు సహకరించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. -
పిట్స్బర్గ్లో దారుణ హత్యకు గురైన ఎన్నారై
చంద్రమౌళి నాగమల్లయ్య ఉదంతం మరువక ముందే.. అమెరికాలో భారత సంతతి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. పెన్సిల్వేనియాలో ఓ మోటల్ మేనేజర్గా పని చేస్తున్న రాకేశ్ ఇహగబన్(51)ను ఓ దుండగుడు కాల్చి చంపేశాడు. తన మోటల్ బయట జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన క్రమంలోనే ఆయన అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. పెన్సిల్వేనియా స్టేట్ పిట్స్బర్గ్లో ఉన్న ఓ మోటల్లో రాకేశ్ ఇహబగన్(Rakesh Ehagaban) మేనేజర్గా పని చేస్తున్నారు. అక్టోబర్ 3వ తేదీన(శుక్రవారం) మధ్యాహ్నా సమయంలో మోటల్ బయట పార్కింగ్ వద్ద ఏదో అలజడి వినిపించింది. బయటకు వెళ్లిన ఆయనకు.. ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న గన్తో ఓ మహిళపై కాల్పులకు దిగడం కనిపించింది. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తిని ‘‘ఆర్ యూ ఆల్రైట్ బడ్’’ అంటూ రాకేష్ పలకరించాడు. అంతే తన చేతిలో గన్ను రాకేష్ వైపు తిప్పి పాయింట్ బ్లాక్ రేంజ్లో షూట్ చేశాడు ఆ దుండగుడు. బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలి రాకేష్ మరణించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. పారిపోతున్న నిందితుడిపై కాల్పులు జరిపి పట్టుకున్నారు. ఈ కాల్పుల్లో నిందితుడితో పాటు ఓ పోలీస్ అధికారి సైతం గాయపడ్డారు. నిందితుడిని స్టాన్లీ వెస్ట్గా(38) నిర్ధారించిన పోలీసులు.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన అదనపు వివరాల ప్రకారం.. స్టాన్లీ వెస్ట్ గత రెండు వారాలుగా రాకేష్ మేనేజర్గా పని చేస్తున్న పిట్స్బర్గ్ మోటల్లోనే ఉంటున్నాడు. పార్కింగ్ వద్ద అతను కాల్పులు జరిపిన మహిళ కూడా అతనితోనే అక్కడే ఉంటోంది(ఓ చంటి బిడ్డతో సహా). అయితే శుక్రవారం ఏదో గొడవ జరిగి ఆమె వెళ్లిపోతుంటే.. స్టాన్లీ ఆమెపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆమె మెడలో తూటా దిగి తీవ్రంగా గాయపడింది. వెనక సీటులో ఉన్నా ఆమె బిడ్డకు అదృష్టవశాత్తూ ఏం కాలేదు. రక్తస్రావం అవుతుండగానే.. ఆమె తన వాహనాన్ని తీసుకుని కొద్దిదూరం పారిపోయింది. తర్వాత ఆమెను గుర్తించిన పోలీసులు.. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆమె స్పృహలోకి వస్తేనే ఏం జరిగిందనేది తెలుస్తుందని కేసు దర్యాప్తు చేస్తున్న రాబిన్సన్ టౌన్షిప్ పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఏం సంబంధం లేకుండా గొడవను ఆపేందుకు వెళ్లి భారత సంతతికి చెందిన రాకేశ్ ఇహగబన్ ప్రాణాలు పొగొట్టుకున్నారని వెల్లడించారు.సెప్టెంబర్ 10వ తేదీన.. అమెరికా టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలోని ఓ మోటల్ మేనేజర్ అయిన చంద్రమౌళి నాగమల్లయ్య(50)ను అక్కడ పని చేసే.. యోర్డాన్స్ కోబోస్ కత్తితో తల నరికి హత్య చేసిన ఘటన తెలిసిందే. గదిని శుభ్రం చేసే మెషీన్ విషయంలో చిన్నపాటి గొడవకే ఆగ్రహంతో ఊగిపోయి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు కోబోస్. ఈ దారుణం మల్లయ్య భార్య, కుమారుడి కళ్ల ముందే జరగడం గమనార్హం. తల నరికి.. దానిని కాలితో తన్ని.. ఆపై చెత్త బుట్టలో వేసిన దృశ్యాలు కలవరపాటుకు గురి చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
చికాగోలో హైదరాబాద్ యువకుడి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం పాలయ్యారు(Telugu Man Dies in US Chicago). చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మరణించినట్లు సమాచారం. మృతుడిని హైదరాబాద్ చంచల్గూడకి చెందిన షెరాజ్ మెహతాబ్ మొహమ్మద్(25)గా గుర్తించారు. ఆదివారం ఇల్లినాయిస్ ఈవెన్స్టన్ వద్ద జరిగిన ప్రమాదంలో షెరాజ్(Sheraz Chicago Road Accident) అక్కడిక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ఈ వార్తతో హైదరాబాద్లోని అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఉన్నత స్థాయి అవకాశాల కోసం తమ కుమారుడు దేశంకాని దేశం వెళ్లి ఇలా మరణించడంటూ ఆయన తండ్రి అల్తాఫ్ మొహమ్మద్ చెబుతున్నారు. మృతదేహాన్ని ఇక్కడికి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. డల్లాస్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ పోలే అనే హైదరాబాదీ యువకుడు మరణించిన ఘటన తెలిసిందే. 48 గంటలు తిరకగ ముందే మరో నగరవాసి రోడ్డు ప్రమాదంలో మరణించడం అక్కడి భారతీయ కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తిస్తోంది. -
రెడింగ్లో భవ్యంగా బతుకమ్మ జాతర
బర్క్షైర్ (యూకే): యునైటెడ్ కింగ్డమ్ రెడింగ్లోని రెడింగ్ జాతర టీమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు కుటుంబాల సమాగమంగా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమానికి వెయ్యికి పైగా మంది హాజరై, తెలంగాణ సంస్కృతిని ఘనంగా చాటారు. పారంపర్య బతుకమ్మ పాటలతో మహిళలు బతుకమ్మలు ఆడగా, యువతులు, పిల్లలు ఉత్సాహంగా డాండియా ఆడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన దుర్గాపూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి. చిన్నారులు కట్టిపడేసేలా భరతనాట్యం ప్రదర్శించగా, తెలుగు వంటకాలతో సాంప్రదాయ విందు అందించారు. వేడుకల అనంతరం బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేయడంతో కార్యక్రమం ముగిసింది. ఈ భవ్య కార్యక్రమాన్ని గత 11 ఏళ్లుగా నిరంతరంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు విశ్వేశ్వర్ మంథని, రంజిత్ నడిపల్లి, ప్రసాద్ అవధానుల, రమేశ్ జంగిలి, రఘు, చందు, రామ్రెడ్డి, రామ్ప్రసాద్, నాగార్జున మాట్లాడుతూ – “తెలంగాణ సంప్రదాయాలను తదుపరి తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం కొనసాగిస్తాం” అని తెలిపారు. -
మలేషియాలో దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
కౌలాలంపూర్, అక్టోబర్ 4: భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (BAM) ఆధ్వర్యంలో, మలేషియాలోని అన్ని భారతీయ సమాజాలు కలసి ఘనంగా “దసరా • బతుకమ్మ • దీపావళి 2025” మహోత్సవాన్ని టానియా బ్యాంక్వెట్ హాల్, బ్రిక్ఫీల్డ్స్ లో నిర్వహించాయి.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ గారు లోక్సభ సభ్యుడు, హాజరై ఆశీస్సులు అందించారు. అలాగే భారత హైకమిషనర్ మరియు మలేషియా ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొని వేడుకకు విశిష్టతను తీసుకువచ్చారు. అతిథులు మాట్లాడుతూ – “ఈ వేడుక తెలుగు వారికే పరిమితం కాకుండా భారత దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతి భారతీయుడు ఐక్యంగా జరుపుకున్న ఒక గొప్ప సాంస్కృతిక మహోత్సవం. నిజంగా కన్నుల పండుగగా నిలిచింది” అని అభినందించారు.సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పాటలు, పండుగ ప్రత్యేకతలతో కూడిన కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకలో మలేషియాలో నివసిస్తున్న అన్ని భారతీయ NRIలు విశేషంగా పాల్గొని BAM మహోత్సవాన్ని విజయవంతం చేశారు.BAM ప్రధాన కమిటీ సభ్యులు* చోప్పరి సత్య – అధ్యక్షుడు* భాను ముత్తినేని – ఉపాధ్యక్షుడు* రవితేజ శ్రీదశ్యం – ప్రధాన కార్యదర్శి, IT మరియు PR కమ్యూనికేషన్* రుద్రాక్షల సునీల్ కుమార్ –కోశాధికారి * గజ్జడ శ్రీకాంత్ – సంయుక్తకోశాధికారి * రుద్రాక్షల రవికిరణ్ కుమార్ – యువజన నాయకుడు* గీత హజారే – మహిళా సాధికారత నాయకురాలు* సోప్పరి నవీన్ – కార్యవర్గ సభ్యుడు* యెనుముల వెంకట సాయి – కార్యవర్గ సభ్యుడు* అపర్ణ ఉగంధర్ – కార్యవర్గ సభ్యుడు* సైచరణి కొండ – కార్యవర్గ సభ్యుడు* రహిత – కార్యవర్గ సభ్యుడు* సోప్పరి రాజేష్ – కార్యవర్గ సభ్యుడు* పలకలూరి నాగరాజు – కార్యవర్గ సభ్యుడుBAM అధ్యక్షుడు చోప్పరి సత్య మాట్లాడుతూ: “ఈ వేడుకను విజయవంతం చేయడంలో సహకరించిన భారత హైకమిషన్, మలేషియా ప్రభుత్వ అధికారులు, అతిథులు, స్పాన్సర్లు, కమిటీ సభ్యులు మరియు మలేషియాలోని భారతీయ సమాజానికి మనఃపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు -
అమెరికా డల్లాస్లో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో గన్ కల్చర్ మరో నిండు ప్రాణం బలి తీసుకుంది. టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో తెలంగాణకు చెందిన చంద్రశేఖర్ పోలే(27) కన్నుమూశాడు(Telangana Student Dies Dallas Gun Fire). భారత కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రశేఖర్ పోలే స్వస్థలం హైదరాబాద్ ఎల్బీనగర్ బీఎన్ రెడ్డి. బీడీఎస్ పూర్తయ్యాక 2023లో ఉన్నత చదువుల కోసం చంద్రశేఖర్ డల్లాస్ వెళ్లాడు. ఆరు నెలల కిందటే అతని మాస్టర్స్ డిగ్రీ పూర్తైంది. అయితే ఫుల్టైం ప్లేస్మెంట్ కోసం ఎదురు చూసే క్రమంలో స్థానికంగా ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో జాబ్ చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న అతనిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బుల్లెట్ గాయాలతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో బీఎన్ రెడ్డిలోని చంద్రశేఖర్ కుటుంబం నివాసం ఉండే కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. ‘‘బీడీఎస్ పూర్తి చేసి.. ఉన్నత పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన చూస్తే గుండె తరుక్కు పోతున్నది.... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్ర శేఖర్ పార్థీవ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారాయన.బీడీఎస్ పూర్తి చేసి, పై చదువుల కోసం అమెరికా (డల్లాస్) వెళ్ళిన ఎల్బీనగర్ కు చెందిన దళిత విద్యార్థి చంద్ర శేఖర్ పోలే ఈరోజు తెల్లవారు జామున దుండగులు జరిపిన కాల్పులో మృతి చెందటం విషాదకరం. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన… pic.twitter.com/RJy8BdteiD— Harish Rao Thanneeru (@BRSHarish) October 4, 2025సీఎం రేవంత్ విచారంఅమెరికాలో హైదరాబాద్కు చెందిన చంద్రశేఖర్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘అమెరికాలో పోలే చంద్రశేఖర్ మరణం ఆవేదన కలిగించింది. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు సహకారం అందిస్తాం అని ఒక ప్రకటనలో తెలిపారు. -
లండన్లో తెలుగు విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా : జిల్లాలోని మేడిపల్లి మండలం దమ్మనపేట్లో విషాదచాయలు అలుముకున్నాయి. దమ్మనపేట్కు చెందిన ఎనుగు మహేందర్ రెడ్డి (26) అనే అనే విద్యార్థి లండన్లో దుర్మరణం చెందాడు. ఉన్నత విద్యను అభ్యసించడానికి లండన్కు వెళ్లిన మహేందర్రెడ్డికి గుండెపోటు రావడంతో మృత్యువాత పడినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నిన్న(శుక్రవారం, అక్టోబర్ 3వ తేదీ) రాత్రి మహేందర్రెడ్డి చనిపోయిన విషయాన్ని అతని స్నేహితులు తండ్రి రమేష్రెడ్డికి తెలియజేశారు. ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం లండన్కు వెళ్లాడు మహేందర్రెడ్డి. కుమారడు ప్రయోజకుడు అవ్వడానికి లండన్ వెళ్లి ఇలా మృతి చెందడం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తండ్రి శోకసంద్రంలో మునిగిపోయారు. -
అమెరికాలోని ఒమాహా నగరంలో బతుకమ్మ వేడుకలు
తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం ఓమాహా నగరంలో తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో హిందూ దేవాలయ సామాజిక భవనంలో జరిగిన ఈ వేడుకలకు తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అత్యంత వైభవంగా నిర్వహించడం ద్వారా తమ సంస్కృతి, వారసత్వాన్ని నిలబెట్టడమే కాకుండా, తమ తల్లిదండ్రుల నేలతో గల అనుబంధాన్ని కొనసాగిస్తూ.. భవిష్యత్తు తరాలకు ఈ సంప్రదాయాలు అందజేయాలన్న ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహించారు. గత దశాబ్దానికి పైగా ఈ వేడుకలను అపర్ణ నేదునూరి, స్నిగ్ధ గంటా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు వెయ్యికి పైగా తెలుగు కుటుంబాలు, సంఘ సభ్యులు హాజరయ్యారు.ఈ ఉత్సవంలో సంప్రదాయకంగా అలంకరించిన రంగు రంగుల బతుకమ్మలు ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రతి బతుకమ్మను ప్రత్యేకంగా రూపొందించారు. సువాసనభరిత పూలతో అలంకరించారు. వీటిలో భక్తి, సృజనాత్మకత, తెలుగు వారసత్వం ప్రతిబింబించింది. రంగురంగులు, వినూత్నంగా అలంకరించిన బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. గత రెండు సంవత్సరాలుగా విజేతగా నిలిచిన శ్రీదేవి నలం ఈసారి కూడా తన సృజనాత్మక అలంకరణతో మూడోసారి బహుమతి గెలుపొందారు. ఇది వేల మైళ్ళ దూరంలో ఉన్నా, తెలుగు సంప్రదాయాలను సజీవంగా నిలుపుకునే నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుకలలో సంప్రదాయ తెలుగు వంటకాలు భోజన ప్రియుల నోరూరించాయి. పిల్లలు కూడా పండుగ వాతావరణంలో మునిగి తేలారు. నిజమైన తెలుగు సాంస్కృతిక అనుభవాన్ని ఆస్వాదించారు. -
టూరిస్టు వీసాపై సౌదీ వెళ్తున్నారా? ఇవి తెలియకపోతే అంతే..
ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా యాత్రలో ఉమ్రాహ్కు ప్రత్యేకత ఉంది. రంజాన్ పర్వదినం తర్వాత హజ్ యాత్ర నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో తబాబ్, అరాఫత్ పర్వత సందర్శన.. సైతానుపై రాళ్లను విసరడం.. అక్కడే ఒక నిద్ర చేయడం వంటి క్రతువులు ఉంటాయి. హజ్ సీజన్లో కాకుండా.. మక్కా యాత్ర చేయడాన్ని ఉమ్రాహ్ అంటారు. ఇప్పుడు ఉమ్రాహ్ విషయంలో సౌదీ సర్కారు కొత్త నిబంధనలను ప్రకటించింది. టూరిస్టు వీసాపై వచ్చేవారికి ఉమ్రాహ్కు అవకాశం ఉండదని తేల్చిచెప్పింది.ఏమిటీ ఉమ్రాహ్హజ్లో మాదిరిగానే ఉమ్రాహ్లోనూ క్రతువులుంటాయి. అయితే.. అరాఫత్ సందర్శన, సైతానుపై రాళ్లు వేయడం ఉండదు. ఉమ్రాహ్కు వెళ్లేవారు దోవతి, ఉత్తరీయం మాదిరి తెలుపురంగు దుస్తులను ధరించాలి. దీన్ని దీక్షగా భావిస్తారు. నిజానికి మక్కాకు 30కిలోమీటర్ల దూరంలోనే ఈ రీతిలో వస్త్రధారణ చేసి.. యాత్రను ప్రారంభించాలి. భారతీయులు మాత్రం విమానాశ్రయంలోనే ఈ దుస్తులను ధరిస్తారు. మక్కాలోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశాక.. బయటకు వచ్చి, శిరోముండనం చేయించుకుంటే.. ఉమ్రాహ్ పూర్తవుతుంది. మహిళా భక్తులు శిరోముండనం చేయించుకోరు. కానీ, మూడు లేదా ఐదు కత్తెరలు ఇస్తారు.ఉమ్రాహ్ ప్రయాణాన్ని ప్లాన్ చేయడానికి విదేశాల నుంచి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన మార్పులను అసా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ కైసర్ మహమూద్ తెలిపారు.వీసా దరఖాస్తు చేసేటప్పుడే వసతి బుకింగ్యాత్రికులు ఇకపై వసతిని ధ్రువీకరించకుండా ఉమ్రాహ్ వీసా కోసం దరఖాస్తు చేసుకోలేరు. నుసుక్ యాప్కు అనుసంధానించబడిన మసర్ వ్యవస్థ ద్వారా ప్రయాణికులు వీసా దరఖాస్తు సమయంలో ఆమోదించిన హోటల్ను ఎంచుకోవాలి. లేదా వారు సౌదీ అరేబియాలోని బంధువులతో ఉంటారని ధ్రువీకరించుకోవాలి. హోటళ్లు, రవాణా మసర్ అని పిలువబడే సౌదీ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది. టాక్సీలను కూడా పోర్టల్ ద్వారానే బుక్ చేసుకోవాలి.బంధువులతో ఉండటానికి హోస్ట్ ఐడీ అవసరంప్రయాణికులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉండాలని ప్లాన్ చేస్తే హోస్ట్ ఏకీకృత సౌదీ ఐడీ నంబర్ను అందించాలి. ఈ ఐడీ మీ వీసాకు డిజిటల్కు అటాచ్ చేస్తారు. ప్లాన్లో ఏదైనా మార్పు ఉంటే వసతి రుజువుగా అదే ఐడీతో సిస్టమ్లో అప్ డేట్ చేయాలి.టూరిస్ట్ వీసాలపై ఉమ్రాహ్ చేయకూడదు..టూరిస్ట్ వీసాపై ఉమ్రాహ్ చేయడం నిషేధించారు. ఒకవేళ ఇందుకోసం ప్రయత్నించే యాత్రికులను మదీనాలోని రియాజ్ ఉల్ జన్నా వంటి కీలక ప్రదేశాల్లో ప్రవేశం నిరాకరిస్తారు.డెడికేటెడ్ ఉమ్రాహ్ వీసా తప్పనిసరినుసక్ ప్లాట్ఫామ్ ద్వారా లేదా లైసెన్స్ పొందిన ఆపరేటర్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న డెడికేటెడ్ ఉమ్రాహ్ వీసా మాత్రమే చెల్లుబాటు అవుతుంది.ప్రయాణ మార్పులు అనుమతించరు..వీసా దరఖాస్తు సమయంలో యాత్రికులందరూ వివరణాత్మక ప్రయాణ ప్రణాళికను అప్లోడ్ చేయాలి. దీన్ని సబ్మిట్ చేసిన తరువాత ఎలాంటి మార్పులు లేదా వాయిదాలకు అవకాశం ఉండదు. ప్రయాణ తేదీలను మార్చడం కుదరవు. తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేస్తే ఏజెంట్లకు ఒక్కొక్కరికి కనీసం 734(రూ.18 వేలు) దిర్హమ్లు జరిమానా విధిస్తారు.వీసా ఆన్ అరైవల్యూకే, యూఎస్, కెనడా లేదా షెంజెన్ వీసాలు కలిగి ఉన్నవారు లేదా ఆ దేశాల్లో నివాసితులుగా ఉన్నవారు వీసా ఆన్ అరైవల్ కోసం అర్హులు. ఈ వీసా ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతుంది.హోటల్, ట్రాన్స్పోర్ట్ బుకింగ్స్ కోసం తనిఖీలుసౌదీ విమానాశ్రయాల్లో అధికారులు నుసక్ లేదా మసార్ వ్యవస్థల ద్వారా చేసిన అన్ని బుకింగ్లను ధ్రువీకరిస్తారు. చెల్లని బుకింగ్లు తిరస్కరిస్తారు. దాంతోపాటు అక్కడికక్కడే జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది.అధీకృత రవాణాకు మాత్రమే అనుమతియాత్రికులు రవాణాను ముందస్తుగా బుక్ చేసుకోవాలి. టాక్సీలు, బస్సులు లేదా హరమైన్ రైలుతో సహా అధీకృత ఛానెళ్ల ద్వారా ముందే బుక్ చేయాలి. రిజిస్టర్ కాని సర్వీసులు అనుమతించరు.హరామైన్ రైలు టైమింగ్స్మక్కా, మదీనా మధ్య సులువైన రవాణా మార్గం అయిన హరామైన్ హై-స్పీడ్ రైలు ప్రతిరోజూ రాత్రి 9 గంటల వరకు మాత్రమే నడుస్తుంది. దీని తర్వాత వచ్చే ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ రవాణాను ఏర్పాటు చేయాలి.భారీ జరిమానాలుఈ కొత్త నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే.. అంటే ఎక్కువ కాలం ఉండటం, అనధికార రవాణాను ఉపయోగించడం లేదా తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేయడం.. వంటి వాటికి కనీసం 734 దిర్హమ్ల నుంచి జరిమానాలు ఉంటాయి. ఏజెంట్లను కూడా సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది.ఇదీ చదవండి: లద్ధాఖ్లో వాణిజ్య అవకాశాలు ఇవే.. -
కెనడాలో సౌత్ ఇండియన్ సినిమాల ప్రదర్శన నిలిపివేత!
కెనడాలో భారతీయ చిత్రాల ప్రదర్శన నిలిచిపోయింది. పవన్ కల్యాణ్ ఓజీ, రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1తో పాటు పలు చిత్రాల షోలను రద్దు చేసేశారు. ఈ నిర్ణయానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. వారం వ్యవధిలో అక్కడి ఓ థియేటర్పై జరిగిన కాల్పుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని సమాచారం.అసలేం జరిగిందంటే.. ఒంటారియో(Ontario) ప్రావిన్సులోని ఓ థియేటర్పై గత వారం వ్యవధిలో రెండు దాడులు జరిగాయి. సెప్టెంబర్ 25వ తేదీన వేకువ జామున ముసుగులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. థియేటర్ ఎంట్రెన్స్ వద్ద లిక్విడ్ను చల్లి చిన్నపాటి పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో థియేటర్ బయటి భాగం స్వల్పంగా దెబ్బ తింది. అలాగే.. తాజాగా అక్టోబర్ 2వ తేదీన ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ ఘటనలోనూ అదృష్టవశాత్తూ సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.कनाडा के सिनेमाघर में आग और फायरिंगकनाडा के ओकविले में स्थित Film. Ca सिनेमा थिएटर पर हमला, 2 युवकों ने थिएटर के दरवाजे पर पेट्रोल डालकर आग लगाई, दोनों चेहरे पर मास्क लगाए SUV कार में आए थे, सिनेमाघर में फायरिंग और आग लगाई, पूरा मामला CCTV में कैद#Canada | #CCTV pic.twitter.com/evEuTSsyaj— NDTV India (@ndtvindia) October 3, 2025ఈ ఘటనల నేపథ్యంలో.. భారతీయ చిత్రాలు అందునా ప్రత్యేకించి దక్షిణ భారత చిత్రాల(South Indian Films Canada) ప్రదర్శనే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని అక్కడి థియేటర్ల నిర్వాహకులు ఓ అంచనాకి వచ్చారు. ఓక్విల్లేలోని ఫిల్మ్.సీఏ సినిమాస్(Film.ca Cinemas) ఓజీ, కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1 చిత్రాల ప్రదర్శనను మాత్రమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఫ్రాంచైజీ సీఈవో జెఫ్ నోల్ కూడా ఓ వీడియో సందేశంలో ఇదే విషయాన్ని పరోక్షంగా ధృవీకరించారు కూడా.ఎక్కడక్కెడంటే.. మరోవైపు అక్కడి ఆన్లైన్ బుకింగ్ జాబితాల నుంచి పలు భారతీయ సినిమాలను తొలగించారు. రిచ్మండ్ హిల్లోని యార్క్ సినిమాస్ కూడా ఫిల్మ్.సీఏ బాటలోనే భారతీయ సినిమాల ప్రదర్శన నిలిపివేసింది. తమ ఉద్యోగులు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వాళ్ల నగదును రిఫండ్ చేస్తామని ఒక ప్రకటనలో యార్క్ సినిమాస్ వెల్లడించింది. గ్రేటర్ టోరంటో ఏరియాలోనూ పలు థియేటర్లు ఇదే తరహా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బ్రిటిష్ కొలంబియా, అల్బర్టా, క్యూబెక్, మానిటోబా ఇతర ప్రావిన్స్లోనూ ఈ అంశంపై చర్చ జరుగుతోంది.ఇదిలా ఉంటే.. ఇది ఖలీస్తానీల పని అయ్యి ఉండొచ్చని సమాచారం. గతంలోనూ ఇదే తరహా దాడులు జరగడమే ఆ అనుమానాలకు కారణంగా తెలుస్తోంది. అయితే హాల్టన్ పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న తమను సంప్రదించాలని అక్కడి దర్యాప్తు అధికారులు కోరుతున్నారు. ఇదీ చదవండి: అనుభవానికా? లేదంటే యంగ్ బ్లడ్కి పట్టమా?? -
ఐర్లాండ్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఐర్లాండ్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐర్లాండ్లో స్థిరపడిన తెలంగాణ ఎన్నారైలు అల్లే శ్రీనివాస్, బలరాం కొక్కుల ఆధ్వర్యంలో డబ్లిన్ నగరంలో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకలకు సుమారు 750 మంది హాజరయ్యారు. దుర్గా పూజతో ప్రారంభమైన ఈ వేడుకల్లో ఆడపడుచులు బతుకమ్మ, కోలాటం, దాండియా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలకు బతుకమ్మ పండుగ విశేషాలను వివరించారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా మ్యాజిక్ షో ఏర్పాటు చేశారు. బతుకమ్మను అందంగా పేర్చిన ఆడపడుచులకు బహుమతులు కూడా ప్రధానం చేశారు. వేడుకలకు హాజరైన వారందరికీ ప్రసాదంతోపాటు రుచికరమైన వంటలు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తమ భవిష్యత్తు తరాలకు కూడా తెలియచేయాలనే లక్ష్యంతో తెలంగానైట్స్ ఆఫ్ ఐర్లాండ్ (Telanganites Of Ireland) ఆధ్వర్యంలో గత 13 ఏళ్లుగా ఏటా ఈ బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. సుమారు 40 మంది వాలంటీర్లు, 50 మంది దాతలు ముందుకొచ్చి బతుకమ్మ వేడుకల నిర్వహణకు ఏటా సహాయ సహకారాలు అందిస్తున్నారు. -
గ్లాస్గో మదర్ ఎర్త్ హిందూ టెంపుల్లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
గ్లాస్గో (స్కాట్లాండ్): నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మదర్ ఎర్త్ హిందూ టెంపుల్లో బతుకమ్మ వేడుకలను శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టెంపుల్ అధ్యక్షుడు డా. పునీత్ బెడి,,ఉపాధ్యక్షురాలు డా. మమత వుసికాలా ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.గత మూడు సంవత్సరాలుగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్న ఈ దేవాలయం, ఈ ఏడాది బతుకమ్మ పండుగను ప్రత్యేకంగా జరిపింది. డా. మమత వుసికాలా, వినీల బత్తులా, వారి స్నేహితులు, దేవాలయ కమిటీ సభ్యుల సమన్వయంతో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించారు.మహిళలు అందరూ రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను తయారు చేసి, సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో గానం చేస్తూ, నృత్యాలు, కోలాటం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా టెంపుల్లో భక్తి శ్రద్ధలతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా గడిపారు. అనంతరం సమీప సరస్సులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పండుగ అనంతరం భోజన విందు కూడా ఏర్పాటు చేయగా, అందరూ మంచి ఆహారం ఆస్వాదిస్తూ, ఉత్సాహంగా ఉత్సవాన్ని ముగించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందాన్ని ప్రకటించారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
అంతర్జాతీయ సమస్యలకు అండగా కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ కొత్త బ్రాంచ్
హనుమకొండ హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో పిట్టల సునీల్ కుమార్ మరియు భూపతి శంకర్ న్యాయవాదుల ఆధ్వర్యంలో నడుస్తున్న సునీల్ అసోసియేట్స్ సంస్థతో కరీంనగర్ వాస్తవ్యులు, సీనియర్ న్యాయవాది ప్రస్తుతం అమెరికన్ పౌరసత్వం కలిగి ఉన్న అమెరికన్ సొలిసిటర్ కావేటి శ్రీనివాసరావు ఒప్పందం కుదుర్చుకొని, హనుమకొండలో కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా కావేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ..తాను ప్రస్తుతం అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నానని అక్కడ సొలిసిటర్గా , బ్రిటన్లో అటార్నీగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని, వివిధ దేశాలలో తమ శాఖలు ఉన్నాయని తెలిపారు. హనుమకొండలో కూడా సునీల్ అసోసియేట్స్ సహకారంతో నూతన శాఖను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ఈ రోజుల్లో ప్రతి ఇంటి నుండి విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. వారిలో చాలామంది విదేశాలలో ఇమిగ్రేషన్ , వీసా, పాస్పోర్టు మరియు ఎంబసీ సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటితో పాటు భార్య భర్తలు వైవాహిక సమస్యలతో అక్కడ కోర్టు మెట్లు ఎక్కుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. అలాగే అక్కడ రోడ్డు, ఇతర ప్రమాదాలలో మరణిస్తున్న భారతీయుల సంఖ్య పెరిగిందని అలాంటి సమస్యలకు తాము పరిష్కారం చూపేలా, దేశంలో శాఖలను విస్తరిస్తున్నామని బాధితులకు అండగా ఉంటామన్నారు. వారికి సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా పరిష్కరిస్తామని.. అందుకోసం బాధితులు తమ ప్రాంతంలో గల కావేటి లా ఫర్మ్ సంప్రదించి తమ సందేహాలు నివృత్తి చేసుకోవాలని, విదేశాలలో గల చట్టపరమైన సమస్యలకు తాము పరిష్కార మార్గం చూపిస్తామని తెలియజేశారు. ఈ అవకాశాన్ని బాధితులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ కన్జ్యూమర్ కౌన్సిల్ చైర్మన్ పల్లెపాడు దామోదర్, లా కాలేజ్ సీనియర్ ప్రొఫెసర్ జెట్లింగ్ ఎల్లోసా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హన్మకొండ వరంగల్ సీనియర్ న్యాయవాదులు వరంగల్ ప్రస్తుత జనరల్ సెక్రెటరీ డి. రమాకాంత్, హనుమకొండ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మాతంగి రమేష్ బాబు, మాజీ ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణమూర్తి, మాజీ పీపీ గుర్రాల వినోద్ కుమార్, స్పెషల్ జిపి మహాత్మ, సీనియర్ న్యాయవాది కె.వి.కె గుప్తా, కేశవ్, వేల్పుల రమేష్, మామిడాలగిరి, సత్యనారాయణ, మొలుగురి రాజు , సూరయ్య, శీలం అఖిల్ రావు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. -
దసరా వేడుకల్లో హద్దుమీరిన జంట.. వీడియో వైరల్
దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సంప్రదాయ నృత్యాలు, అమ్మవారి అవతారాలకు ప్రత్యేక పూజలు, రావణ దహనం.. ఇలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలను చూడటానికి విదేశీ పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు. ఈ తరుణంలో ఓ ఎన్నారై జంట చేసిన పాడు పనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గర్భా అనేది గుజరాతీ సంప్రదాయ నృత్యం. ప్రధానంగా నవరాత్రి ఉత్సవాల సమయంలో హైలైట్ అవుతుంటుంది. ఇది దేవీ దుర్గాను ఆరాధిస్తూ.. వృత్తాకారంగా(సర్కిల్) నృత్యం చేస్తుంటారు. గర్భా నృత్యం భక్తి, ఉత్సాహం, సామూహిక ఆనందాన్ని ప్రతిబింబించే కళారూపం. అలాంటి నృత్యంలో పాల్గొన్న ఓ జంట ముద్దులతో నలుగురిలో హద్దులు దాటేసింది.గుజరాత్ వడోదరలో జరిగిన గర్బా వేడుకలో ఓ ఎన్నారై జంట చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యునైటెడ్ వే గర్భా పేరిట నిర్వహించిన వేడుకల్లో.. ప్రతీక్ పటేల్ అనే వ్యక్తి, తన భార్యతో కలిసి గర్భా చేస్తూ అత్యుత్సాహంలో ముద్దులు పెట్టుకున్న వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొట్టింది. అది కాస్త వైరల్ కావడంతో సనాతన్ సంత్ సమితి తీవ్రంగా స్పందించింది. ధార్మిక భావాలను దెబ్బతీశారంటూ ఆ జంటపై అటలదారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు అయ్యింది. అయితే విమర్శల నేపథ్యంలో ఆ జంట స్పందించింది. చేసిన పనికి లిఖితపూర్వక క్షమాపణ ఇచ్చింది. ఇది మా తప్పే. ఇంతలా విమర్శలు వస్తాయని అనుకోలేదు అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. గత 16 సంవత్సరాలు ప్రతీక్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. తాజా వీడియోపై విమర్శల నేపథ్యంలో ఆ జంట దేశం విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.The NRI couple has issued a formal apology after their kissing video at a Garba event in Vadodara went viral.The couple were called to the police station, they are Australian nationals of Indian origin. They issued a written apology.#GarbaControversypic.twitter.com/GiaLSsLY6V— ShingChana😯 (@BaanwraDil) September 28, 2025 -
కెనడాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఒట్టావా: తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్ (TDF), కెనడా ఆధ్వర్యంలో బ్రాంప్టన్ నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో NRI లు కుటుంబ సమేతంగా హాజరై ఆట, పాటలతో బతుకమ్మ పండుగ ను జరుపుకున్నారు.తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్,కెనడా నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేసి, పసందైన తెలంగాణా వంటకాలతో భోజనాలు కూడా ఏర్పాటు చేసారు. కెనడాలోనే పుట్టిపెరిగిన తెలుగు పిల్లలు మన పండగల ప్రత్యేకత తెలుసుకోవటం ఇలాంటి కార్యక్రమాలతో సాధ్యమౌతుందని టీడీఎఫ్ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీఫ్ కెనడా ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ సురేందర్ పెద్ది, అమితా రెడ్డి, టీడీఫ్ కెనడా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గంటా రెడ్డి మాణిక్ రెడ్డి స్మారక విశేష సేవా పురస్కారాన్ని మహేష్ మాదాడి, రజిని దంపతులకు టీడీఫ్ కెనడా కమిటీ తరపున అందజేశారు. 21 సంవత్సరాల నుండి కెనడాలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడానికి తోడ్పాడుతున్న ప్రతీ ఒక్కరికి టీడీఎఫ్ కెనడా కమిటీ ధన్యవాదములతో అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపింది. -
యూకేలో ఎల్టీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
యూకేలోని లూటన్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు.. లూటన్ తెలుగు అసోసియేషన్ (ఎల్టీఏ) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకున్నారు. బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. దాంతో అక్కడ దసరా వేడుక కనుల పండువలా సాగింది. బతుకమ్మలను పేర్చినవారందరికీ బహుమతులను అందజేశారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. -
ఐఐటీ హైదరాబాద్తో ఆటా చారిత్రక ఒప్పందం
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (American Telugu Association) ఆటా.. ఐఐటీ హైదరాబాద్తో చారిత్రక ఒప్పందం చేసుకుంది. ఇంజనీరింగ్లో దేశంలోనే 7వ ర్యాంక్, ఆవిష్కరణలలో 6వ ర్యాంక్ సాధించిన ఐఐటీ హైదరాబాద్ తో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా అవగాహన ఒప్పందం కుదిరింది. విద్యార్థుల గ్లోబల్ ఇంటర్న్షిప్ అవకాశాల కల్పన కోసం అవగాహన ఒప్పందం జరిగింది.వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా,ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి, ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా కొన్ని వారాల నుండి ఒక సంవత్సరం వరకు ఐఐటీలో ఇంటర్న్షిప్ అవకాశాలు లభించనున్నాయి. ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది.తెలుగు డయాస్పోరాకు చెందిన విద్యార్థులకు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు ఆధునిక పరిశోధన, ఇన్నోవేషన్లలో అనుభవం పొందే మార్గాలు ఏర్పడతాయని జయంత్ చల్లా పేర్కొన్నారు. టెక్నాలజీ, రీసెర్చ్ రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన మార్పులను అర్థం చేసుకోవడంలో యువతకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తొలిసారిగా భారతదేశం వెలుపల ఐఐటీ ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి. IITH అర్హులైన విద్యార్థులకు వసతి ఇతర సదుపాయాలు నామమాత్రపు ఫీజుతో కల్పిస్తుందన్నారు. -
సింగపూర్లో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)/TCSS ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు స్థానిక సంబవాంగ్ పార్క్ లో సెప్టెంబర్ 27, శనివారం రోజున ఘనంగా జరిగాయి. భారతదేశం నుండి వచ్చిన స్థానికుల తల్లిదండ్రులు మరియు బంధువులు కూడా ఈ వేడుకలలో పాల్గొనడం విశేషం. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది అతిథులు మరియు ఎన్నారైలు సుమారు 2500 నుండి 3000 వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలలో పాల్గొన్న అంతర్జాతీయ శ్రీ కృష్ణ మందిరం (ISKM), సింగపూర్ వారికి , వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గార్లకు TCSS సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, ఉపాధ్యక్షులు జూలూరి సంతోష్ కుమార్ మరియు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. సింగపూర్ లో నివసిస్తున్న తెలుగువారు స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ దశాబ్దానికి పైగా సింగపూర్ లో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా బతుకమ్మ వైభవాన్ని చాటిచెప్పుతూ TCSS చరిత్రలో నిలిచిపోతుందని సొసైటీ సభ్యులు అన్నారు. TCSS తో ప్రేరణ పొంది ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందించిన దాతలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి టీసీఎస్ఎస్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. గత సంవత్సరాలతో పొలిస్తే ఈ ఏడాది ఆడపడుచులు బతుకమ్మలని పోటా పోటీగా చాలా అందంగా అలంకరించి వివిధ రూపాలలో 100 పైగా బతుకమ్మలని పేర్చి తీసుకొచ్చారు. బతుకమ్మని పేర్చి తెచ్చిన ప్రతి ఆడపడుచుని రెడ్ కార్పెట్ పై స్వాగతించి తనిష్క్ జ్యూవెల్లర్స్ వారి గిఫ్ట్ హాంపర్ని బహుమతిగా అందించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దాదాపు 11 బతుకమ్మలకు, ప్రత్యేక సాంప్రదాయ ఉత్తమ వస్త్రధారణలో ముస్తాబైన ముగ్గురు ఆడపడుచులకు వెండి వస్తువులు,చీరలు, తదితర ప్రత్యేక బహుమతులు అందజేశారు. ప్రతి యేడు లాగే ఈ సారి కూడా విడుదల చేసిన సింగపూర్ బతుకమ్మ ప్రోమో పాట "సింగపూర్ చెక్కిలిపై సిరివెన్నెల కురిసేరా... పూలకే పూజ చేసే పండుగే మళ్ళొచ్చేరా" యూట్యూబ్ లో విడుదల చేసినప్పడినుండి వేల వీక్షణాలతో దూసుకుపోతుందని తెలిపారు. ఈ పాట మేకింగ్ కి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన స్థానిక ఏఐ పాల్స్ ప్రై. లి సంస్థకు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే ఈ వేడుకల్లో TCSS ప్రత్యేకంగా తయారు చేయించిన ఫోటోబూత్ , కృత్రిమబతుకమ్మ ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలను విజయవంతానికి సహకరించిన అందరికీ పేరు పేరునా నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలకు కార్పొరేట్ స్పాన్సర్స్ కు, సహకరించిన మిత్రులకు సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు చల్ల కృష్ణ మొదలగు వారు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సింగపూర్ లోని బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్ ,పుంగ్గోల్ , టాంపనీస్ ,బెడోక్ , మేల్విల్లీ పార్క్ మరియు సెరంగూన్ ప్రాంతాల నుండి బస్సులను నామ మాత్రపు రుసుముతో సమకూర్చి పండుగను విజయవంతగా నిర్వహించడం జరిగింది. సింగపూర్ వేడుకలను సొసైటీ సోషల్మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అలాగే కమిటీ ఏర్పాటు చేసిన విందుభోజనాన్ని ఆరగించి భక్తులందరూ సంతోషం ప్రకటించారు. వీరితో పాటు సొసైటీ మహిళా విభాగ సభ్యులు గడప స్వాతి, బొందుగుల ఉమా రాణి ,నంగునూరు సౌజన్య, బసిక అనిత రెడ్డి, హేమ లత, దీప నల్ల, జూలూరు పద్మజ,కాసర్ల వందన, నడికట్ల కళ్యాణి, ఎర్రమ రెడ్డి దీప్తి, హరిత విజాపుర్, సౌజన్య మాదారపు, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు, రావుల మేఘన, చల్ల లత కీలక పాత్ర పోషించారు.ఈ పండుగ వేడుకకు సహకరించిన పార్క్ యాజమాన్యానికి, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బతుకమ్మలను మరియు సంప్రదాయ ఉత్తమ వస్త్రధారణలో ముస్తాబైన ఆడపడుచుల ఎంపికలో సహకరించిన మాధవి లాలంగర్, స్వప్న ముద్దం, సృజన బైస మరియు స్వప్నకైలాసపు, బతుకమ్మ ఆటకు కొరియోగ్రఫీగా సహకరించిన దీప రెడ్డి, స్థానిక మీడియాకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాసర్ల శ్రీనివాస్, రవికృష్ణ విజాపుర్, ప్రవీణ్ కుమార్ సి హెచ్ మరియు సాత్విక నడికట్ల & సంజన బొందుగుల (జూనియర్ కమిటీ మెంబెర్స్) లు పండుగ వేడుకల వ్యాఖ్యాతలుగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
“తెలంగాణ గడ్డపై ప్రభవించిన ప్రతిభామూర్తులు” సభ విజయవంతం
డాలస్, టెక్సస్: తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత ఐదున్నర సంవత్సరాలగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్యసదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 84వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం పద్మవిభూషణ్ డా. కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తెలుగు భాషాదినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన “తెలంగాణ గడ్డపై ప్రభవించిన ప్రతిభామూర్తులు” అనే అంతర్జాల సమావేశం విజయవంతంగా జరిగింది.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అతిథులను ఆహ్వానించి సభను ప్రారంభిస్తూ తెలంగాణా గడ్డపై జన్మించిన ఎంతోమంది సాహితీవేత్తలు విశేష కృషి చేశారని, కాళోజీ జయంతి సందర్భంగా వారిలో కొంతమందిని ఈ రోజు స్మరించుకోవడం ఆనందదాయకం అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – తెలుగునేలపై ప్రభవించిన ప్రతిభావంతులు కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనేగాక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాహిత్య, సంగీత, విద్యా, వైజ్ఞానిక, వ్యాపార, శాస్త్ర, సాంకేతిక, సినీ, రాజకీయ, క్రీడా, సేవా రంగాలలో కీర్తి గడించినప్పుడు ప్రాంతాలకతీతంగా ప్రతి తెలుగుగుండె గర్వంతో ఉప్పొంగుతుంది. తెలంగాణ ప్రాంతంలో జన్మించి సాహిత్యరంగంలో విశేష కృషిచేసిన వారిలో కొంతమందిని తెలంగాణా రాష్ట్ర తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా స్మరించుకుని ఘన నివాళులర్పించుకోవడం సముచితమైనది, సందర్భోచితమైనది అన్నారు. వీరు చేసిన సాహిత్య కృషి భావి తరాలకు స్పూర్తిదాయకమైనది అన్నారు”, ముఖ్యఅతిధిగా హాజరైన ఆచార్య డా. అనుమాండ్ల భూమయ్య (పూర్వ ఉపకులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్) పద్మ విభూషణ్ డా. కాళోజీ నారాయణరావు బహుభాషా పండితులని, సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై ముఖ్యంగా నిజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అక్షర పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించిన ప్రజాకవి అని ప్రస్తుతించారు. విశిష్టఅతిథులుగా విచ్చేసిన - డా. జుర్రు చెన్నయ్య (ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సారస్వతపరిషత్తు ప్రధాన కార్యదర్శి కావేరమ్మపేట, మహబూబానగర్ జిల్లా) - ప్రముఖ పాత్రికేయుడు, సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ నిర్మాత అయిన డా. దేవులపల్లి రామానుజరావు గురించి; డా. కెడిడి మృణాళిని ( ఉపాధ్యాయురాలు, విద్యావేత్త, హైదరాబాద్) - ప్రముఖ సాహితీవేత్త, జానపద విజ్ఞాన పరిశోధకుడు అయిన ఆచార్య డా. బిరుదురాజు రామరాజు గురించి; రంగరాజు పద్మ (రచయిత్రి, ఇనుగుర్తి, మహబూబాబాద్ జిల్లా, ఒద్దిరాజు రాఘవ రంగారావుగారి కుమార్తె) - ప్రముఖ సాహితీవేత్తలు శ్రీయుతులు ఒద్దిరాజు సోదరులు సీతారామచంద్రరావు, రాఘవ రంగారావుల గురించి; డా. వి. జయప్రకాష్ (ఉపాధ్యాయుడు, సాహితీవేత్త, దేవుని తిర్మలాపురం, నాగర్ కర్నూలు జిల్లా) - ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాశరథి రంగాచార్యుల గురించి; డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు (ప్రముఖ రచయిత, విమర్శకులు, కరీంనగర్) – ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు డా. కపిలవాయి లింగమూర్తి గురించి; డా. బ్రాహ్మణపల్లి జయరాములు (అధ్యాపకులు, సాహితీవేత్త, హైదరాబాద్) - అభినవ పోతన, ఉద్ధండ పండితుడు అయిన డా. వానమామలై వరదాచార్యుల గురించి; శ్రీధర్ రావు దేశ్ పాండే (ప్రముఖ రచయిత, బోథ్, ఆదిలాబాద్ జిల్లా) - తెలుగు, ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు అయిన డా. సామల సదాశివ గురించి; డా. కొండపల్లి నీహారిణి (ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు, హైదరాబాద్, కొండపల్లి శేషగిరిరావుగారి కోడలు) - సుప్రసిద్ద చిత్రకారుడు అయిన డా. కొండపల్లి శేషగిరిరావు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుని, ఈ లబ్ధప్రతిష్టులైన జీవితాలను అద్భుతంగా ఆవిష్కరించి నివాళులర్పించారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెలో వీక్షించవచ్చును.https://youtube.com/live/nB5Pw6gfuhs -
సింగపూర్లో ఘనంగా చండీ హోమ మహోత్సవం
సింగపూర్: సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) ఆధ్వర్యంలో 28 సెప్టెంబర్ 2025 తేదీన దేవి కృపను స్మరించుకుంటూ చండీ హోమ మహోత్సవం ఘనంగా జరిగింది. సుమారు 350 మంది భక్తులు పాల్గొని, ఈ పవిత్ర హోమం ద్వారా చండీదేవి అమ్మ వారి ఆశీర్వాదాలను పొందారు. దేవి అనుగ్రహం కోసం ఈ చండీ హోమాన్ని సభ 30 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తూ వస్తోంది.కార్యక్రమం గణపతి పూజ మరియు కలశ స్థాపనంతో ఆరంభమైంది. అనంతరం గణపతి హోమం మరియు నవగ్రహ హోమం నిర్వహించబడింది. తదుపరి కవచ, అర్గళ, కీలక పఠనాలు చేసి, ఉత్సాహభరితమైన దేవీ మాహాత్మ్యం పరాయణ హోమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సుహాసిని పూజ కూడా నిర్వహించి, పూర్ణాహుతి, దీపారాధన మరియు ఉపచార పూజలతో కార్యక్రమం ముగిసింది. దేవీ మాహాత్మ్యం ఘోషతో ఆ ప్రాంగణం అంతా పవిత్రతతో నిండిపోయి, భక్తులలో ఆధ్యాత్మిక భావన మేల్కొంది.సభ తరపున వాలంటీర్లకు సత్కారం నిర్వహించారు. అలాగే ప్రాథమిక, మాధ్యమిక మరియు విశ్వవిద్యాలయ విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎడ్యుకేషన్ మెరిట్ అవార్డులతో సత్కరించారు. చివరగా భక్తులందరికీ పెరుమాళ్ దేవాలయం నుంచి తెప్పించిన ప్రసాదం పంపిణీ చేయబడింది.SDBBS అధ్యక్షులు కార్తిక్, కార్యదర్శి బాలాజీ రామస్వామి, ఈవెంట్ లీడ్ సాయి రామ్ కల్యాణసుందరం సభ పురోహితులు విజయ్, కన్నన్ మరియు కార్తిక్ లకు అలాగే కార్యక్రమానికి తోడ్పడిన వాలంటీర్ల అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. -
జర్మనీలో అంబరాన్నంటిన.. బతుకమ్మ సంబరాలు
యూరప్: జర్మనీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు మహిళలు ఉత్సాహంగా పాల్గొని పూల బతుకమ్మలను ఎత్తి, సాంస్కృతిక పాటలతో, నృత్యాలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకున్న మహిళలు, పూలతో తయారుచేసిన బతుకమ్మలను పేర్చి చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. ఈ వేడుకలు జర్మనీ వాసులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, భోజన విందులు, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించడంతో కుటుంబ సమేతంగా పాల్గొనే వాతావరణం ఏర్పడింది. బతుకమ్మ వేడుకలు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు తమ మూలాలను గుర్తుచేస్తూ, సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. -
అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ప్రవాస తెలంగాణీయులు అబుదాబిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికగా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎడారి ప్రాంతమైన అబుదాబిలో పూలు దొరకడం కష్టమైన నేపథ్యంలో, సంఘ నాయకత్వం ప్రత్యేకంగా తెలంగాణ నుండి వందలాది కిలోల పూలను తెప్పించి నగరాన్ని పూల వనంగా మార్చారు. శనివారం రాత్రి ఉదయం సామూహిక బతుకమ్మ తయారీతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యు.ఏ.ఈ.లోని భారత రాయబార కార్యాలయం నుంచి శ్జార్జీ జార్జ్ (First Secretary, Community Welfare and Coordination) ముఖ్య అతిథిగా విచ్చేసి, తెలంగాణ సంస్కృతిని ప్రశంసించారు. ఆయన ప్రవాస భారతీయుల సాంస్కృతిక అంకితభావాన్ని కొనియాడుతూ, “ఇలాంటి ఉత్సవాలు భారతీయతను ప్రపంచానికి పరిచయం చేస్తాయి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ గౌరవ అధ్యక్షుడు జయచంద్రన్ నాయర్, గౌరవ ఉపాధ్యక్షుడు శ్షాజీ వి.కె., కర్ణాటక రాష్ట్ర సంఘం అధ్యక్షుడు సర్వోత్తమ్ శెట్టి, మహారాష్ట్ర మండల్ అధ్యక్షుడు విజయ్ మానె, బీహార్ మరియు ఝార్ఖండ్ సంఘ అధ్యక్షుడు దివాకర్ ప్రసాద్, ఇండియా ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ సంఘ అధ్యక్షుడు వినాయక్ ఆవాటే, సంపంగి బ్యుటికా సంస్థల యాజమాన్యం ప్రత్యేక అతిథులుగా పాల్గొని, ప్రవాస తెలంగాణీయుల సాంస్కృతిక చైతన్యాన్ని అభినందించారు. అలాగే, తమిళ సంఘం, మలయాళి సంఘం, కన్నడ సంఘం, మరాఠీ సంఘం, గుజరాతీ సంఘం, పంజాబీ సంఘం తదితర రాష్ట్ర సంఘాల ప్రతినిధులు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి, బతుకమ్మ ఉత్సవాన్ని తమ హాజరుతో మరింత వైభవవంతం చేశారు. భారతీయ సమైక్యతకు ప్రతీకగా, వారు తమ సంఘాల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ కవి, గాయకుడు డా. కోకిల నాగరాజు, యువ గాయని సోనీ యాదర్ల ప్రత్యేకంగా ఇండియా నుంచి విచ్చేసి తమ బతుకమ్మ ఆట పాటలతో అందరినీ ఉర్రూతలూగించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలతో బతుకమ్మ ప్రాంగణం మరో తెలంగాణ ను తలపించింది. అందమైన బతుకమ్మలకు, ముందుగా వచ్చిన బతుకమ్మలకు, నాట్యం చేసిన మహిళలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఇండియా నుండి తెప్పించిన పిండి వంటలు—అరిసెలు, గారెలు, బోబట్ల వంటి వంటకాలు—అందరినీ ఆకట్టుకున్నాయి. బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం మరింత ప్రాశస్త్యం పొందుతూ అందరి మన్ననలు పొందుతున్నందుకు కార్యవర్గానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని కార్య నిర్వాహకులు రాజా శ్రీనివాస రావు, గంగారెడ్డి, వంశీ సందీప్, గోపాల్, సతీష్, పావని, అర్చన, దీప్తి, పద్మజ తదితరులు తెలియ జేశారు “విదేశాల్లో కూడా బతుకమ్మను ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం” అని నిర్వాహకులు తెలిపారు.(చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు) -
ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఆస్ట్రేలియా బ్రిస్బేన్ నగరంలోని గ్రేటర్ స్ప్రింగ్ ఫీల్డ్లో బతుకమ్మ సంబరాలను తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మలను పేర్చి అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీ మాత పూజను నిర్వహించారు. ‘బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్’ ఆధ్వర్యంలో స్థానిక స్ప్రింగ్ ఫీల్డ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు, ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో మహిళలు చిన్నపిల్లలు పాల్గొని తెలంగాణ సాంప్రదాయ నృత్యాలను కనుల విందుగా ప్రదర్శించారు.కాగా, దసరా నవరాత్రులతో పాటు తెలంగాణలో బతుకమ్మ వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి. ఈ వేడకలు భాద్రపద బహుళ అమావాస్య– అంటే మహాలయ అమావాస్య నుంచి మొదలవుతాయి. అంటే బతుకమ్మ వేడుకలు దుర్గాష్టమి నాటితో ముగుస్తాయి. అప్పుడే ఈ బతుకమ్మ వేడుకలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ వెన్నముద్ద బతుకమ్మని ఆరాదిస్తారు. ఈ రోజున నువ్వులు, వెన్న, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.;(చదవండి: మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు) -
మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
మలేషియా (malaysia) రాజధాని నగరం కౌలాలంపూర్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా శనివారం జరిగాయి. తెలంగాణా ఆడబిడ్డల గౌరవ ప్రతీక, ప్రకృతి పండుగ, బతుకమ్మలను వివిధ రకాల పూలతో అలంకరించారు. తెలుగు మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై, బతుకమ్మ ఆటపాటలతో సందడిగా గడిపారు. చిన్నా పెద్దా అంతా ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం ప్రసాదాలను ఒకరికొకరు పంచుకొని గౌరమ్మను నిమజ్జనం చేశారు. కౌలాలంపూర్లోని బ్రిక్స్ఫీల్డ్స్లోలోని కృష్ణా టెంపుల్లో ఈ వేడుకలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్ మలేషియా (Federation of nri cultural association malaysia) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు డిప్యూటీ హైకమీషనర్ సుభాషిణి నారాయణన్, పెరెక్ స్టేట్ లెజిస్లేటివ్ సభ్యురాలు శాంతి చిన్నసామి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రతీ ఏడాది బతుకమ్మ వేడుకలను నిర్వహించుకోవడం తమకు ఆనవాయితీ అని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వాసంతిసిన్ని సామిమలేషియాలో భారతీయవారసత్వాన్ని జీవం పోసేందుకు ఎఫ్ఎన్సీఏ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇండియన్ డిప్యూటీ హై కమీషనర్ శ్రీమతి సుభాషిణినారాయణన్ గారు మహిళలతో చేరి ఆడి పాడి సందడి చేసారు . అలాగే ప్రవాసీ భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయినా ఇండియన్ హై కమిషన్ ఎల్లపుడు సహాయం చేయడానికి ముందుంటుందని హామీ ఇచ్చారు. అత్యంత అందంగా అలంకరించిన బతుకమ్మకు బంగారు నాణెం బహుమతి అందించారు. అలాగే బతుకమ్మలు తీసుకొచ్చిన మహిళలందరికీ వారందరికీ వెండి నాణేలు కానుకగా ఇచ్చారు. ఉత్సవాల్లో పాల్గొన్న మహిళలకు వెండి బహుమతులు. మలేషియాలో ఉన్న తెలుగు రెస్టారెంట్లు స్పాన్సర్ చేసిన గొప్ప విందు, ఇందులో ప్రామాణిక తెలుగు వంటకాలు ప్రదర్శించారు.తెలుగు ఎక్సపెట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఇంద్రనీల్ , కోశాధికారి నాగరాజు , మలేషియా ఆంధ్రా అసోసియేషన్ విమెన్ప్రెసిడెంట్ శారదా , భారతీయ అసోసియేషన్ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ సత్య, విమెన్ప్రెసిడెంట్ గీత హజారే , భరత్ రాష్ట్ర సమితి మలేషియా వైస్ ప్రెసిడెంట్ అరుణ్, మలేషియా తెలుగుఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు , మలేషియా తెలుగు వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ మూర్తి గారు , తెలుగు ఇంటెలెక్చ్యువల్ సొసైటీ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు పాల్గొన్నారు. ఎఫ్ఎన్సీఏ మలేషియా అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తన స్వాగత ప్రసంగంలో, విదేశాల్లో సాంస్కృతికసంప్రదాయాలను కాపాడుకోవడం మరియు భారతీయ ప్రవాసుల మధ్య ఐక్యతను పెంపొందించడం యొక్కప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాన్నినిర్వహించడానికి సహకరించినస్పాన్సర్లు రాప్పినో టెక్ సొల్యూషన్స్ , టూట్కర్ సొల్యూషన్స్ ,సెంట్రల్ స్పైస్ ,టెక్మ్యాట్రిక్స్ ,రెడ్వేవ్ సొల్యూషన్స్ , టెక్డార్ట్ ,స్ప్రౌట్అకాడమీ ,బిఆర్ఎస్ మలేషియా ,జాస్ బెలూన్స్ అండ్ డెకరేటర్స్ ,లులు మనీ , బిగ్ సివెడ్డింగ్ కార్డ్స్ , శ్రీ రుచి రెస్టారెంట్, జబిల్లి , మై బిర్యానీ , శ్రీ బిర్యానీ ,స్పైసీ హబ్, ఫ్యామిలీ గార్డెన్, మైఫిన్ MY81 , MY81 , మెరిడియన్ , ఎన్ఎస్ టూర్స్ & ట్రావెల్స్ మరియు , స్వచ్ఛంద సేవకులు మరియు కోర్ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞత లుతెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డిమోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణముత్తినేని,ఉపాధ్యక్షులు రవి వర్మకనుమూరి,ప్రధాన కార్యదర్శి శివ సానిక,సంయుక్త కార్యదర్శిభాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావుగునుగంటి,యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల,సాంస్కృతికవిభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహకసభ్యులు నాగరాజుకాలేరు,నాగార్జున దేవవరపు, ఫణీంద్రకనుగంటి,సురేష్ రెడ్డి మందడి , రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి ,మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి , రజిని పాల్గొన్నారు. -
హెల్త్ కేర్ ఫ్రాడ్ : భారత సంతతి వైద్యుడికి 14 ఏళ్ల ఖైదు
అమెరికాలో హెల్త్కేర్ స్కామ్లో భారత సంతతి వైద్యుడికి శిక్షపడింది. హెల్త్ కేర్ ఫ్రాడ్ నియంత్రిత పదార్థాల చట్టవిరుద్ధ పంపిణీ నేరం భారత సంతతికి చెందిన వైద్యుడు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఏడాది ప్రారంభంలో ఆరోగ్య సంరక్షణ మోసానికి నీల్ కె ఆనంద్ దోషిగా తేలాడు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పెన్సిల్వేనియాకు చెందిన వైద్యుడు 48 ఏళ్ల డా. ఆనంద్ 2 మిలియన్ల డాలర్లకు పైగా పరిహారాన్ని, 2 మిలియన్లపై జరిమానా పైగా జప్తు చెల్లించాలని ఆదేశించింది.బీమా చెల్లింపులను క్లెయిమ్స్ కోసం తన రోగులను గూడీ బ్యాగులను అంగీకరించమని బలవంతం చేసి మరీ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. డాక్టర్ ఆనంద్ మెడికేర్, యుఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (OPM), ఇండిపెండెన్స్ బ్లూ క్రాస్ (IBC) , ఆంథమ్ అందించిన ఆరోగ్య పథకాలకు తప్పుడు మరియు మోసపూరిత క్లెయిమ్లను సమర్పించడానికి కుట్ర పన్నాడు. వైద్యపరంగా అనవసరమైన ప్రిస్క్రిప్షన్ మందుల 'గూడీ బ్యాగులు' కోసం, వాటిని అతని యాజమాన్యంలోని ఇన్-హౌస్ ఫార్మసీలు రోగులకు పంపిణీ చేశాయి. ప్రిస్క్రిప్షన్లపై ముందే సంతకం చేయడం ద్వారా లైసెన్స్ కూడా లేని తన ఇంటర్న్లు మందులు సూచించడానికి అనుమతించాడు. ఆక్సికోడోన్ను పంపిణీ చేశాడు.ఓపియాయిడ్, నొప్పి నివారిణి అయిన ఆక్సికోడోన్ అమెరికాలో ముంచెత్తుతున్న మాదకద్రవ్యాల్లో ఒకటి.ఇదీ చదవండి: బాలీవుడ్ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తేఅలాగే ఆనంద్ ప్రిస్క్రిప్షన్లపై ముందస్తు సంతకం చేశాడు. లైసెన్స్ లేని మెడికల్ ఇంటర్న్లు డాక్టర్ ఆనంద్ ముందే సంతకం చేసిన ఖాళీ ఫారమ్లలో నియంత్రిత పదార్థాల కోసం ప్రిస్క్రిప్షన్లను పూరించారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ పథకం కింద, డాక్టర్ అనేక మంది రోగులకు 20,850 ఆక్సికోడోన్ మాత్రలను ప్రిస్క్రైబ్ చేశాడు. మొత్తంగా, మెడికేర్, OPM, IBC,చ ఆంథమ్2.4 మిలియన్లకు పైగా మెడికల్ క్లెయిమ్లను చెల్లించాయి. జిల్లా న్యాయమూర్తి చాడ్ F కెన్నీ ప్రకారం, ఆనంద్ తన రోగుల అవసరాల కంటే దురాశ ,అక్రమ లాభాల ద్వారా ప్రేరేపించబడ్డాడు. రోగుల చిక్సత మీద దృష్టిపెట్టకుండా లాభాలకోసం చూసుకున్నారని కెన్నీ వ్యాఖ్యానించారు.ఏప్రిల్లో, డాక్టర్ ఆనంద్ ఆరోగ్య సంరక్షణ మోసం మరియు వైర్ మోసం, మూడు ఆరోగ్య సంరక్షణ మోసం, ఒక మనీలాండరింగ్, నాలుగు చట్టవిరుద్ధమైన ద్రవ్య లావాదేవీలు , నియంత్రిత పదార్థాలను పంపిణీ చేయడానికి కుట్ర పన్నినట్లు నిర్ధారించబడింది. భారతీయ సంతతికి చెందిన వైద్యుడు అమెరికాన నేవీలో వైద్యుడిగా కూడా పనిచేశాడు. కాగా ఈ అన్ని ఆరోపణలను ఖండిస్తూ, డా. ఆనంద్, తని కుటుంబం 2001లో న్యూయార్క్లో జరిగిన 9/11 దాడుల బాధితులతో తాను ఎలా వ్యవహరించాడో వర్ణిస్తూ వివరణ ఇచ్చారు. రోగుల పట్ల ఆయనకున్నకరుణను నేరంగా పరిగణించడం అన్యాయమని డాక్టర్ కుటుంబం వాదించింది. -
'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!
టెక్నాలజీ ఎన్నో ఆలోచనలకు తెరతీస్తుంది. సాంకేతిక సాయంతో దూరంగా ఉన్న తమ వాళ్లను తమవద్దకు చేర్చుకునేలా కొందరు భలే ఉపయోగిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా ఈ టెక్నాలజీని మన సంతోషాలకు, సంబరాలకు అనుగుణంగా మార్చుకుంటూ..ఇలా కూడా వాడుకోవచ్చా అని విస్తుపోయేలా చేస్తున్నారు. అలాంటి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ఏం ఉందంటే..అసలేంటి కథ అంటే..విదేశాల్లో నివశించే చాలామంది భారత్లో జరిగినట్లు సంస్కృతి సంపద్రాయలకు అనుగుణంగా సంబరంగా జరిగే పండుగలను మిస్ అవుతుంటారు. ఒకవేళ అక్కడ భారత కమ్యూనిటీలంతా ఒకచోట చేరి చేసుకున్న మన దేశంలో ఉన్న మాదిరి ఆనందమైతే మిస్ అయిన వెలితి తప్పక ఉంటుంది. ఇక్కడ ఉండే పండుగ కోలాహలం, సందడి..అక్కడ ఉండదు. అత్యంత నిశబ్దంగా జరిగిపోతుందంతే. అలా ఉసురుమనుకుండా హాయిగా ఎంజాయ్ చేసేలా..సరికొత్త మార్గాన్ని పంచుకున్నాడు కంటెంట్ క్రియేటర్, నటుడు విరాజ్ ఘేలాని. ఈ నవరాత్రిని తన ఇద్దరు ఎన్ఆర్ఐ స్నేహితుల మిస్ అవ్వకుండా..వారి ఫోటోలను చెరో చేతిలో పెట్టుకుని సంబరంగా గర్భా డ్యాన్స్ చేశాడు. తన స్నేహితులు మిస్ అవ్వకుండా వాళ్లు కూడా ఎంజాయ చేస్తున్నారనిపించేలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నవరాత్రిని విభిన్నంగా జరుపుకోవాలనుకున్నా, అలాగే తన స్నేహితులు ఈ పండుగ మిస్ అయ్యానని బాధపడకూడదన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేశానంటూ చెప్పుకొచ్చాడు నటుడు విరాజ్ వీడియోలో. మీరు ఇలాంటి డిజిటల్ గర్భాలో పాల్గొనేందుకు ప్రయత్నించండి, ఎందుకంటే వివిధ కారణాల రీత్యా విదేశాల్లో ఉన్నవాళ్లు నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారు అని క్యాప్షన్ జోడించి మరి అందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశాడు. అయితే నెటిజన్లలో చాలామంది తమ దేశానికి దూరంగా ఉన్నమనే ఫీల్తో ఉన్నవాళ్లందరి మనసులను తాకింది ఈ వీడియో. కానీ మరికొందరూ బాస్ భారత్లో తొమ్మిది రోజులే గర్భా డ్యాన్స్ చేస్తారు, అదే కాలిఫోర్నియాలో నెలల తరబడి ఆ డ్యాన్స్ చేస్తామంటూ వ్యంగంగా పోస్టులు పెట్టారు. ఏదీఏమైనా ఈ ఆలోచన మాత్రం అదుర్స్. చిన్న చిన్న పొరపచ్చలు సైతం ఇలా మనవాళ్లని భాగస్వామ్యం చేస్తే బాంధవ్యం బలపడటమే కాదు వాళ్లు ఖుషి అవుతారు. View this post on Instagram A post shared by Viraj Ghelani (@viraj_ghelani) (చదవండి: పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!) -
ఘనంగా శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్
శంకర నేత్రాలయ మిచిగన్ చాప్టర్ ఆధ్వర్యంలో మూడవ వార్షిక 5K వాక్ ఘనంగా ముగిసింది. ఆదివారం, సెప్తెంబర్ 14th, 2025 నాడు స్థానిక నోవై నగరంలోని ఐటిసి స్పోర్ట్స్ పార్క్ లో ఈ వాక్ నిర్వహించారు.శంకర నేత్రాలయ చేస్తున్న పలు రకాల సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలియజేయడం, అదేవిధంగా సభ్యులను ఉత్తేజ పరిచి వారి ని కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేలా చేయడం ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం సాగింది. ఎంతోమంది పాత, కొత్త మెంబర్లు ఈ కార్యక్రమానికి హాజరై 5K వాక్ లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని డెట్రాయిట్ చాప్టర్ తరఫున ట్రస్టీలు ప్రతిమ కొడాలి, రమణ ముదిగంటి; మరియు చాప్టర్ లీడ్స్ వెంకట్ గోటూరు, విజయ్ పెరుమాళ్ళ, మరియు వాలంటీర్లు సాయి గోపిశెట్టి, సుజాత తమ్మినీడి, తేజ జెట్టిపల్లి, వంశీ గోపిశెట్టి, మరియు యూత్ వాలంటీర్లు సమన్వయపరిచారు. శంకర నేత్రాలయ ప్రెసిడెంట్ డాక్టర్ బాలరెడ్డి ఇందుర్తి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తమ సూచనలు అందజేశారు. టి త్యాగరాజన్ టెక్నికల్ సహాయం అందజేసారు.ఈ 5K వాక్లో రెండు క్యాటగిరీలుగా విజేతలను ప్రకటించారు. విజేతలకు బహుమతులను అందింపజేశారు. ఈ కార్యక్రమంలో హాజరైన సభ్యులకు, కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందించిన పలువురు సభ్యులకు, శంకర నేత్రాలయ కార్యనిర్వాహక సంఘం డెట్రాయిట్ చాప్టర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. -
పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!
చాలామంది ఏదో ఒక కళ నేర్చుకుంటుంటారు. అయితే దాన్ని ఏవో కారణాలతో వదిలేయాల్సి రావొచ్చు. అయితే కొందరూ సమయం దొరికితే ఆ కళకు పదును పెట్టుకుంటూ..తనకు సాటిలేరెవ్వరూ అన్నట్లుగా ఆరితేరిపోతారు. ఆ టాలెంట్ ఊరికేపోదు ప్రపంచ మొత్తం ఆశ్చర్యపోయే రేంజ్లో రికార్డు సృష్టించి శెభాష్ అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందించే సౌది అరేబియాలో ఉంటున్న ఈ భారత సంతతి మహిళ నీను ప్రదీప్.కేరళకు చెందిన నీనుకి చిన్నప్పటి నుంచి చేతికళల పట్ల అమితాసక్తి. అయితే ఉన్నత చదువులు అభ్యసించడం వల్ల ఆ కళను కొనసాగించ లేకపోయింది. అలా ఆమె బీకామ్, ఎంకామ్ పూర్తి చేసిన అనంతరం పెళ్లి చేసుకుని సౌదీ అరేబియాకు వెళ్లిపోయింది. ఆ దంపతుల ప్రేమనురాగాలకు గుర్తుగా అరోనా, అలీనా ఇద్దరు పిల్లలు పుట్టడంతో క్షణం తీరిక లేకుండా గడిపింది. ఎప్పుడైతే పిల్లలు పెద్దవాళ్లై స్కూళ్లకు వెళ్లడం ప్రారంభించారో అప్పటి నుంచి మంచి తీరిక దొరికింది ఆమెకు. ఉదయమే భర్త సామ్సన్ జాకబ్ ఉద్యోగానికి, పిల్లలు స్కూల్కి వెళ్లిన తర్వాత చాలా ఖాళీ సమయం దొరికేది. ఆ సమయాన్ని అలా వృధాగా జారిపోనీకూడదని, తనకు ఎంతో ఇష్టమైన అభిరుచి అయిన హ్యాండ్ ఆర్ట్కి మళ్లీ పదును పెట్టుకునేందుకు రెడీ అయ్యింది. అయితే అందుకు అవసరమయ్యే ఫ్యాన్సీ క్రాఫ్ట్ టూల్స్, ఆర్ట్పరికరాలు చాలా ఖరీదుగా ఉండటమేగాక అందుబాటులో కూడా ఉండేవి కాదు. దాంతో ఆమె ఇంట్లో దొరికే వేస్ట్ మెటీరియల్స్ ఎగ్షెల్, పిస్తా షెల్లతో తన కళను మరింత సృజనాత్మక ధోరణిని జోడించి మెరుగులు పెట్టుకుంది. చెప్పాలంటే వేస్ట్తో ఇంటి అలంకార వస్తువులను తయారు చేసే స్థాయికి చేరుకుంది. అలా ఆమె పేపర్ పువ్వులు తయారు చేసే కాగితపు ఆర్ట్లో ఆరితేరిపోయింది. ఫలితంగా ఇల్లంతా నీను చేసిన పేపర్ కళాకృతులతో నిండిపోయింది. ఇక కొన్నింటిని ఈవెంట్లలోనూ, పలు స్టాల్స్ తన కళను ప్రదర్శించేది. అలా ఆమె కళ ప్రజలను ఇంప్రెస్ చేయడమే కాదు నేర్చుకునేలా ప్రేరేపించింది. ఇంతలో కోవిడ్ 19 రావడంతో తన పనికి బ్రేక్పడినా..ఆ లాక్డౌన్ని కూడా నీను సద్వినియోగం చేసుకునేలా మరింత వేగవంతంగా చేయడంపై పట్టు సంపాదించింది. రికార్డుల స్థాయికి..అలా ఆ నైపుణ్యం ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకునేందుకు దారితీసింది. క్రేప్ పేపర్ ఉపయోగించి ఒక వ్యక్తి తయారు చేసే వివిధ రకాల గరిష్ట పువ్వులకు మించి చేసే సామర్థ్యం నీనులో రికార్డు స్థాయిలో ఉందని ప్రశంసలందుకుంది. అది ఆమెకు గిన్నిస్ టైటిల్కు మార్గం సుగమం చేసింది. తన సామర్థ్యంపై ఉన్న నమ్మకంతో నీను 2023లో గిన్నిస్ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. దాదాపు రెండేళ్ల తర్వాత గిన్నిస్ వాళ్లు స్పందించడంతో ఆ సాహసానికి పూనుకుంది. అలా ఆమె కేవలం 4 గంటల 39 నిమిషాల్లో ఒక వెయ్య నూటొక్క(1101) కాగితపు పువ్వులతో కూడిన 574 అడుగుల పూల ఫ్రేమ్ని తయారు చేసి గిన్నిస్ రికార్డులకెక్కింది. అభిరుచిగా మొదలైన ఆర్ట్..రికార్డుల సృష్టించే స్థాయికి దారితీసింది. అదీగాక ఈ కళలు మానసిక ఉల్లాసం తోపాటు మనపై మనకు నమ్మకాన్ని అందిస్తాయి కూడా.(చదవండి: కర్ణుని మాదిరి జననం..! కట్చేస్తే ఇవాళ స్టార్ రేంజ్ క్రేజ్..) -
బర్లిన్లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుక
బర్లిన్, 21 సెప్టెంబర్ 2025 – బర్లిన్ హాసెన్హైడేలోని శ్రీ గణేశ ఆలయం రంగురంగుల పూలు, సాంప్రదాయ గీతాలు, నృత్యాలతో అలంకరించబడింది. తెలంగాణా అసోసియేషన్ జర్మనీ (TAG) e.V., స్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘు చాలిగంటి నాయకత్వంలో 12వసారి బతుకమ్మ ఉత్సవం ఘనంగా జరిగింది.ప్రధాన అతిథిగా భారత రాయబార కార్యాలయం (బర్లిన్) మంత్రి (పర్సనల్) డాక్టర్ మంధీప్ సింగ్ తులీ హాజరై బతుకమ్మను తలపై మోసి పూజల్లో పాల్గొన్నారు. జర్మనీలోని అనేక భారతీయ సంఘాల అధ్యక్షులు కూడా వేడుకను శుభాకాంక్షలతో అభినందించారు.300 మందికి పైగా తెలుగు మహిళలు, కుటుంబ సభ్యులు బర్లిన్ , పరిసర ప్రాంతాల నుండి చేరి బతుకమ్మలను పేర్చారు. బొడ్డెమ్మ పూజ, గౌరి పూజలు నిర్వహించిన తరువాత, సాంప్రదాయ తెలుగు వంటకాలతో విందు చేశారు. సాంప్రదాయం, వినోదం కలిసిన కార్యక్రమంలో నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఫ్యాషన్ షోలు, ర్యాంప్ వాక్స్, తంబోలా వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.వేడుక విజయవంతం కావడంలో TAG సభ్యులు – వెంకట రమణ బోయినిపల్లి, అలేఖ్య భోగ, శరత్ రెడ్డి కమిడి, బాలరాజ్ ఆండే, అవినాష్ పోతుమంచి, శ్రీనాథ్ రమణి, నరేష్ తౌటమ్, నటేష్ చెట్టి, అమూల్య బొమ్మరబోయిన – కీలకపాత్ర పోషించారు. అంతేకాక, అనేక మంది వాలంటీర్లు ఉత్సాహభరితంగా సహకరించారు.బతుకమ్మ లాంటి వేడుకలు సంప్రదాయాన్ని నిలబెట్టి, సమాజ బంధాలను మరింత బలపరిస్తాయని, ఇలాంటి కార్యక్రమాలకు ప్రవాస తెలుగు సమాజానికి TAG ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నిర్వాకులు ప్రకటించారు. TAG ఈ సమాజాన్ని ఒక యూనిట్గా బలంగా నిలబెట్టేలా నిరంతరం కృషి చేస్తుందన్నారు నవ్వులు, స్నేహం, ఆత్మీయతలతో ముగిసిన ఈ ఉత్సవంలో, బర్లిన్లోని తెలుగు సమాజం తెలంగాణా సంస్కృతి, ఆత్మ, ఐక్యతను ఘనంగా ప్రతిబింబించింది -
మానవ మృగాన్ని వేటాడిన భారతీయుడు!
అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాల్లో భారతీయులపై జరుగుతున్న జాత్యాహంకార దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఈ మధ్యే నాగమల్లయ్య అనే కర్ణాటకవాసిని డల్లాస్లో ఓ వలసదారుడు అతికిరాతకంగా తల నరికి చంపడమూ చూశాం. అయితే.. ఇందుకు భిన్నంగా కాలిఫోర్నియా స్టేట్లో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పసికందులపై అఘాయిత్యానికి పాల్పడ్డ మానవ మృగాన్ని.. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి మట్టుపెట్టాడు. అక్కడి వార్తా సంస్థల కథనాల ప్రకారం.. సెప్టెంబర్ 18వ తేదీన ఫ్రెమాంట్ సిటీ(Fremont City)లో డేవిడ్ బ్రిమ్మర్(71) అనే వ్యక్తి వరుణ్ సురేష్(29) చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య అనంతరం పోలీసులకు తానే సమాచారం అందించి నిందితుడు లొంగిపోయాడు. ఈ క్రమంలో.. విచారణ అనంతరం సెప్టెంబర్ 22వ తేదీన హత్యా అభియోగాలను పోలీసులు అధికారికంగా నమోదు చేశారు. మూడు రోజుల తర్వాత.. అంటే సెప్టెంబర్ 25వ తేదీన ఈ ఘటన ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. వరుణ్ సురేష్(Varun Suresh) పోలీసుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించాడు. చనిపోయిన డేవిడ్ బ్రిమ్మర్ గతంలో పసికందులపై లైంగిక వేధింపులకు పాల్పడి.. తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిచి వచ్చాడు. పబ్లిక్ సె* అఫెండర్ రిజిస్ట్రీలో అతని పేరు కూడా నమోదు అయ్యింది. ఇది గమనించిన వరుణ్ సురేష్.. అతన్ని ఎలాగైనా మట్టు పెట్టాలని అనుకున్నాడు. పబ్లిక్ సర్టిఫైడ్ అకౌంటెంట్ వేషంలో ఓ బ్యాగు వేసుకుని కస్టమర్ల కోసం ప్రతీ ఇంటికీ తిరిగే ముసుగులో బ్రిమ్మర్ కోసం నెలలపాటు వెతికాడు. అలా ఆఖరికి.. బ్రిమ్మర్ ఇంటి తలుపు తట్టి కలుసుకున్నాడు. ఆపై చుట్టుపక్కల వాళ్లను అతని గురించి ఆరా తీశాడు. తాను వెతుకుతున్న వ్యక్తి అతనేనని ధృవీకరించుకున్నాడు.సెప్టెంబర్ 18వ తేదీన మరోసారి డేవిడ్ బ్రిమ్మర్(David Brimmer) ఇంటి తలుపు తట్టాడు. షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ మెడలో తన దగ్గర ఉన్న కత్తితో పోట్లు పొడిచాడు. చేసిన ఘాతుకాలకు పశ్చాత్తాపం చెందుతున్నావా? అని ఆరా తీశాడు. అయితే రక్తపు మడుగులో బ్రిమ్మర్ అతన్ని తోసేసి పారిపోయే ప్రయత్నం చేయబోయాడు. ఈ క్రమంలో బ్రిమ్మర్ గొంతును కోసి తాను చేపట్టిన సర్పయాగం వరుణ్ పూర్తి చేశాడు. చేసిన నేరానికి తానేం బాధపడడం లేదని, పైగా అది తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వరుణ్ సురేష్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. వరుణ్ సురేష్ 2021లో ఓ ఆసక్తికరమైన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఫ్రెమంట్లోనే ఓ ప్రముఖ హోటల్లో బాంబు ఉందని బెదిరించడమే కాక.. చోరీకి ప్రయత్నించాడనే నేరం కింద మూడు నెలల జైలు జీవితం గడిపాడు. అయితే.. ఆ హోటల్ సీఈవో కూడా మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తే. ఆ సమయంలో అతన్ని చంపేందుకే తీవ్రంగా ప్రయత్నించాడనని వరుణ్ సురేష్ ఇప్పుడు వెల్లడించడం గమనార్హం. అలమెడా కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయం ఈ కేసు విచారణ జరుపుతోంది. వరుణ్ సురేష్ నేపథ్యం ఏంటి?.. అతను పసికందులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని(Paedophile) ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు?. అనే వివరాలు తెలియరావాల్సి ఉంది.చదవండి: ప్రాణాల కోసం పరిగెత్తినా.. తల ఎగిరి పడింది! -
మోదీపై వీడియో.. పన్నూకు బిగ్ షాక్
ఖలిస్థానీ ఉగ్రవాది, 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun)కు మరో షాక్ తగిలింది. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఉపా చట్టం (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం) కింద అతనిపై తాజాగా ఓ కేసు నమోదు చేసింది. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి పన్నూ చేసిన వీడియో ప్రకటనే ఇందుకు కారణంగా తెలుస్తోంది.పంద్రాగస్టు సందర్భంగా.. ఎర్రకోటలో దేశ ప్రధాని జెండా ఎగరేయడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి వేడుకల్లో మోదీని జెండా ఎగరేయకుండా అడ్డుకున్న వాళ్లకు భారీ నజరానా ప్రకటించాడు సిక్స్ ఫర్ జస్టిస్ ప్రధాన న్యాయ సలహాదారు గురుపత్వంత్ సింగ్. ఈ పరిణామాన్ని సీరియస్గా తీసుకున్న ఎన్ఐఏ.. UAPA (Unlawful Activities Prevention Act) కింద కేసు నమోదు చేసింది.ఆగస్టు 10వ తేదీన రిలీజ్ చేసిన ఆ వీడియోలో.. సిక్కు సైనికుల్లో ఎవరైనా సరే ప్రధాని మోదీని జాతీయ పతాకాన్ని ఎగురవేయకుండా అడ్డుకోవాలని, అలా చేస్తే రూ.11 కోట్ల బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. అంతటి ఆగకుండా.. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కలిపి "కొత్త ఖలిస్తాన్" అనే పటాన్ని కూడా విడుదల చేశాడు.ఈ చర్యలను భారత దేశ భద్రత, భౌగోళిక సమగ్రతను భంగపరిచే ప్రయత్నంగా భావిస్తూ.. ఎన్ఐఏ అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. సిక్కు సమాజంలో అసంతృప్తిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని, తీవ్ర వాద భావజాలాన్ని వ్యాప్తి చెందిస్తున్నాడని ఇదివరకే అతనిపై అభియోగాల కింద పలు కేసులు నమోదు అయ్యాయి. సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే వేర్పాటువాద సంస్థను 2007లో స్థాపించగా.. వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా ఒకడు. ఈ సంస్థను భారత్ 2019లోనే నిషేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉన్నట్లు సమాచారం. పన్నూకు అగ్రరాజ్యంతో పాటు కెనడా పౌరసత్వం కూడా ఉంది.ఇదీ చదవండి: బ్రిటన్ మినిస్టర్ కావడమే లక్ష్యమంటున్న భీమవారం వాసి! -
లాటరీకి స్వస్తి.. హెచ్–1బీ కోసం కొత్త విధానం!
వాషింగ్టన్: అత్యంత నైపుణ్యమున్న విదేశీయులకే హెచ్–1బీ వీసా ప్రక్రియలో అధిక ప్రాధాన్యత కల్పించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే హెచ్–1బీ వీసా వార్షిక రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ సర్కార్ తాజాగా తక్కువ నైపుణ్యమున్న విదేశీయులకు హెచ్–1బీ వీసా దక్కకూడదనే కుట్రకు తెరతీసింది. ఏటా ఇచ్చే 85వేల హెచ్–1బీ వీసాల పరిమితిదాటాక సంస్థల నుంచి వచ్చే అభ్యర్థనల్లో అత్యధిక నైపుణ్యంతో అధిక వేతనాలు పొందగల వారికే హెచ్–1బీ వీసాలు జారీచేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు పాత లాటరీ విధానానికి స్వస్తిపలికి అధిక నైపుణ్యం, అధిక వేతనం ఉన్న వాళ్లకే హెచ్–1బీ వీసాలను కట్టబెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఫెడరల్ రిజిస్టర్ నోటీస్ వెలువడింది. ‘‘ లాటరీ విధానానికి బదుల వెయిటేజీ విధానానికి ప్రాధాన్యత కల్పించాలి. అమెరికన్ సంస్థలు కోరే అభ్యర్థుల్లో అత్యధిక నైపుణ్యమున్న విదేశీ కారి్మకులకు మాత్రమే హెచ్–1బీల జారీలో అధిక వెయిటేజీ ఇవ్వాలి. అమెరికాకు వచ్చాక 1,62,528 డాలర్ల వార్షిక వేతనం పొందబోయే అభ్యర్థులకే వెయిటేజీ పూల్లో నాలుగుసార్లు ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ వేతన కారి్మకులకు వెయిటేజీ పూల్లో ఒక్కసారే అవకాశం ఇవ్వాలి. కిందిస్థాయి ఉద్యోగాల ఎంపికలో అమెరికన్ పౌరులకు తగు ప్రాధాన్యత కల్పించాలి. అసంబద్ధమైన విదేశీ కారి్మకుల జీతభత్యాల పోటీ నుంచి అమెరికన్లను కాపాడాలి అని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఉద్యోగి వేతన స్థాయికి అనుగుణంగా రిజి్రస్టేషన్లో ప్రాధాన్యత కల్పించడం వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. -
నాట్స్ స్వర వీణాపాణి మ్యూజిక్ థెరఫీకి మంచి స్పందన
ఎడిసన్, న్యూ జెర్సీ: ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు సర్వ సాధారణంగా మారాయి. వాటిని అధిగమించడానికి సంగీతం కూడా ఒక మార్గమని నిరూపించే కార్యక్రమం న్యూజెర్సీ ఎడిసన్లో జరిగింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో జరిగిన 'మ్యూజిక్ థెరపీ' కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు గ్రహీత, సప్తస్వర సామ్రాట్ స్వర వీణాపాణి విచ్చేసి తన స్వరాలతో అందరిని సమ్మోహితం చేశారు. సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదని, అది మనసును శాంతపరిచే ఒక శక్తిమంతమైన ఔషధం అని స్వర వీణాపాణి పేర్కొన్నారు. ఆయన అభివృద్ధి చేసిన 'స్మార్ట్-సింక్రనైజ్డ్ మ్యూజిక్ థెరపీ' పద్ధతి ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చని వివరించారు. ఈ పద్ధతిలో వివిధ రాగాలను, వాటిలోని తరంగాలను ఉపయోగించి మన మెదడులోని నరాలను ఉత్తేజపరచడం, తద్వారా ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలను నివారించడం జరుగుతుందని ఆయన తెలిపారు. నాట్స్ న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంపై ఆద్యంతం అందరిని అలరించింది. 72 మేళ కర్త రాగాలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన పాటను నాట్స్ పూర్వ అధ్యక్షుడు గంగాధర్ దేసు విన్నపం మేరకు వీణాపాణి పాడి వినిపించారు.అజాత శత్రువు దాము గేదెలకు నాట్స్ సత్కారంఅమెరికాలో పలు తెలుగు సంఘాలకు సేవలందిస్తూ అందరివాడిగా పేరు తెచ్చుకున్న ప్రముఖ సంఘ సేవకులు దాము గేదెలను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సత్కరించింది. తెలుగు వారిని కలిపే ఏ కార్యక్రమానికైనా దాము గేదెల అందించే మద్దతు అపూర్వమని కొనియాడింది. న్యూజెర్సీ ఎడిసన్లో జరిగిన ఒక కార్యక్రమంలో దాము గేదెలను నాట్స్ సేవా పురస్కారాన్ని అందించి సత్కరించింది. జూలై లో టంపా వేదికగా జరిగిన అమెరికా తెలుగు సంబరాల్లో దాము గేదెలకు నాట్స్ సేవా పురస్కారాన్ని ప్రకటించారు. ఆనాడు సంబరాల్లో సమయా భావం వల్ల అందించలేని ఆ పురస్కారాన్ని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ఎడిసన్లో ప్రత్యేకంగా దాము గేదెలను ఆహ్వానించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు గంగాధర్ దేసు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ(మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల, సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి హాజరయ్యారు. గత 40 సంవత్సరాలుగా దాము గేదెల అమెరికాలో తెలుగు సంఘాలను, తెలుగువారికి అందిస్తున్న సేవలను వారు కొనియాడారు. దాము గేదెల లాంటి సేవా దృక్పథం ఉన్న వారు సాటి తెలుగువారిలో స్ఫూర్తిని నింపుతారని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రశంసించారు.ఈ రెండు కార్యక్రమాలు విజయవంతం లో నాట్స్ నేషనల్ కోఆర్డినేటర్ మార్కెటింగ్ కిరణ్ మందాడి , నార్త్ ఈస్ట్ జోన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట కీలక పాత్ర పోషించారు, నాట్స్ న్యూజెర్సీ టీమ్ పాస్ట్ ప్రెసిడెంట్ గంగాధర్ దేసు, బోర్డు ఆఫ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మీడియా మురళి మేడిచెర్ల, న్యూజెర్సీ చాప్టర్ కోఆర్డినేటర్ కుమార్ వెనిగళ్ల, జాయింట్ కోఆర్డినేటర్ ప్రసాద్ టేకి, రాకేష్ వేలూరు, రామకృష్ణ బోను, జతిన్ కొల్ల, వెంకట చైతన్య మాదాల, రమేష్ నూతలపాటి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీ వెనిగళ్ల, రాజేష్ బేతపూడి, సూర్య గుత్తికొండ, శ్రీదేవి జాగర్లమూడి, ఈశ్వర్ అన్నం, సోమ తదితురులు సహకరించారు. సాయి దత్త పీఠం డైరెక్టర్ సుభద్ర పాటిబండ్ల, శేఖర్ & వల్లీ వేదుల, తెలుగు కళాసమితి అధ్యక్షుడు మధు అన్న మరియు వారి కార్య నిర్వాహక సభ్యులు కూడా ఈ కార్యక్రమాలకు హాజరైన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
గ్లాస్గోలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభం
తెలంగాణకు ప్రత్యేకమైన మరియు ఆడపడుచుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుబంధానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈ ఏడాది స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో నివసించే తెలుగువారు ఘనంగా ప్రారంభించారు. నిన్నటితో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డా. మమతా వుసికల,వినీల బతులా ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో అనేక మహిళలు పాల్గొని పువ్వులతో అందంగా అలంకరించిన బతుకమ్మలను తయారుచేశారు. అందరూ సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేశారు. బతుకమ్మ పాటలకు గుంపులుగా చిందులేసి ఉత్సాహంగా నర్తించి ఆధ్యాత్మికతతో కూడిన ఉత్సవాలను జరుపుకున్నారు. ఇది కేవలం పండుగ మాత్రమే కాక, విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారి ఐక్యతకు, వారి భాషా-బాషా సంస్కృతులకు నిదర్శనంగా నిలిచింది.ఈ ఉత్సవానికి మదర్ ఎర్త్ హిందూ టెంపుల్ గ్లాస్గో అధ్యక్షులు డా. పునీత్ బేడి, ఉపాధ్యక్షురాలు డా. మమతా వుసికల ముఖ్య నాయకత్వం వహించారు. వారు వచ్చే వారంలో మరింత విస్తృతంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భక్తులతో, సాంస్కృతిక ప్రదర్శనలతో, సంప్రదాయ తెలంగాణ వంటకాలతో ఆ వేడుకలు మరింత ప్రత్యేకంగా ఉండనున్నాయని నిర్వాహకులు తెలిపారు.ఈ విధంగా గ్లాస్గో నగరంలో బతుకమ్మ పండుగ ఆరంభం ప్రవాసాంధ్రులు, ప్రవాసతెలంగాణ వాసుల్లో ఆనందం కలిగించిందని, తమ పుట్టిన గడ్డ సంస్కృతిని పరిరక్షించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇది ఒక గొప్ప ముందడుగని హాజరైన వారు పేర్కొన్నారు. -
‘ట్రంప్ H1B బాంబ్’పై భారత్ స్పందన
భారత్పై 50 శాతం సుంకాలతో టారిఫ్ బాంబ్ పేల్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా H1B వీసా ఫీజు పెంపు నిర్ణయంతో మరో బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తాజాగా భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ..భారతీయ ఐటీ ఉద్యోగులు, అమెరికాలో పనిచేస్తున్న వలస కార్మికులు, విద్యార్థులపై ఈ నిర్ణయం ఆర్థిక-మానవీయ ఒత్తిడిని కలిగించే అవకాశం లేకపోలేదు అని పేర్కొంది. అమెరికా హెచ్-1బీ వీసాలకు సంబంధించి కొత్త నిబంధనలను పరిశీలిస్తున్నట్లు.. అధ్యయంన చేస్తున్నట్లు భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అంతేకాదు..నిపుణుల రాకపోకల వల్ల ప్రతిభావంతుల మార్పిడి (skilled talent exchange)తో ఇంతకాలం ఇరు దేశాలకూ పరస్పల లబ్ధి చేకూరింది. ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధికి కీలకంగా ఉంటూ వచ్చిందని, కాబట్టి ఈ నిర్ణయం ఇరుదేశాలనూ ప్రభావితం చేసే అంశమేనని పేర్కొంది. అగ్రరాజ్యం నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. మానవీయ కోణంలో పరిశీలించి ఈ సమస్యపై చర్చించి పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. 90వ దశకంలో ఇతర దేశాల నుంచి స్కిల్ ఉన్న ఉద్యోగులను అమెరికాకు రప్పించే ఉద్దేంతో హెచ్-1బీ వీసా తెచ్చారు. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి అక్కడి టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను ఈ వీసా ద్వారా రప్పించుకుంటున్నాయి. ప్రస్తుతం.. హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. అలా.. అక్కడ ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కూడా. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటి దరఖాస్తులపై ఏడాది అడ్మినిస్ట్రేషన్ ఫీజును ఏకంగా లక్ష డాలర్లుగా(రూ. 88 లక్షలకు పైగా) నిర్ణయిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి అంతేసి చెల్లించాల్సి వస్తుంది. 2024 లెక్కల ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుల్లో ఇండియా 71 శాతం వాటా కలిగి ఉండగా, చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం ఈ రెండు దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. -
H-1B Visa: కఠిన నిర్ణయంపై ట్రంప్ అలా.. మోదీ ఇలా!
హెచ్-1బీ వీసాల (H-1B visa applications) దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం లక్షలాది హెచ్1బీ వీసా ఉద్యోగులను కలవరపెడుతోంది. కంపెనీలు దరఖాస్తుల సంఖ్య తగ్గించవచ్చని.. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని.. ఇలా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సెప్టెంబర్ 20న సంతకం చేసిన ప్రోక్లమేషన్(ప్రభుత్వ ప్రకటన) ప్రకారం.. హెచ్1బీ వీసా కలిగిన ఉద్యోగులు.. కొత్తగా వీసా పొందేవారు.. వీసా పొడిగించుకునేవాళ్లు.. వీరందరూ ప్రతి సంవత్సరం 1,00,000 డాలర్లు చెల్లించాల్సిందే. గతంలో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఫీజు కేవలం $1,500 డాలర్లు మాత్రమే ఉండేది..సెప్టెంబర్ 21 నుంచి, ఒక్కో హెచ్1బీ ఉద్యోగికి $100,000 (సుమారు ₹83 లక్షలు) చెల్లించని పక్షంలో అమెరికాలోకి ప్రవేశం నిషేధం విధించబడుతుంది. ఈ మార్పు ఆదివారం ఉదయం 12:01 AM EDT (భారత కాలమానం ప్రకారం 9:30 AM IST) నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిబంధన 12 నెలల పాటు అమలులో ఉంటుంది, అయితే అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థల సిఫారసు మేరకు దీన్ని పొడిగించే అవకాశం ఉంది. అయితే.. H-1B వీసా నిషేధ అంశంలో కొన్ని మినహాయింపులకు అవకాశం లేకపోలేదు. కానీ, ఇవి సర్వసాధారణంగా అందరికీ వర్తించవు, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (Department of Homeland Security) తమ స్వంత నిర్ణయాధికారంలో మాత్రమే ఇవి వర్తిస్తాయని సమాచారం. మినహాయింపులు వీళ్లకే!అత్యవసర విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా పని చేసేవారు.. జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించని వాళ్లకు మినహాయింపు దక్కవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.. అలాగే.. అమెరికాలో కీలక రంగాల్లో పనిచేస్తున్న కంపెనీల ఉద్యోగులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(R&D), ఆరోగ్యం, టెక్నాలజీ, డిఫెన్స్ వంటి రంగాల్లో పనిచేసే సంస్థల ఉద్యోగులకు మినహాయింపు దక్కే అవకాశం లేకపోలేదు. వీటితో పాటు జాతీయ ప్రయోజనాలకు అవసరమైన పరిశ్రమలు.. ఆరోగ్య సంరక్షణ, సైబర్ భద్రత, AI, బయోటెక్, ఎనర్జీ రంగాల విదేశీ ఉద్యోగులకూ ఆ మినహాయింపు ఉండొచ్చు.ఈ మినహాయింపులు సదరు సంస్థలు స్వయంగానో లేదంటే వాళ్లు వ్యక్తిగతంగానూ దరఖాస్తు చేసినా పరిశీలించే అవకాశం ఉంది. అయితే, అనుమతి ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది పూర్తిగా ప్రభుత్వ(హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ) నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.ట్రంప్ ఏమన్నారంటే..అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలోపెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మోదీ ఏమన్నారంటే.. ట్రంప్ నిర్ణయంపై భారత ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరని, కానీ.. విదేశాలపై ఆధారపడటమే మన ప్రధాన శత్రువు అని ఇవాళ జరిగిన గుజరాత్ సభలో అన్నారు. ‘నేడు భారత్ ‘‘విశ్వబంధు’’ స్ఫూర్తితో ముందుకుసాగుతోంది. ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరు. మన అతిపెద్ద శత్రువు ఇతరదేశాలపై ఆధారపడటమే. దీన్ని మనం ఓడించాలి. విదేశాలపై ఎక్కువగా ఆధారపడితే.. దేశ అభివృద్ధి విఫలమవుతుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అత్యధిక జనాభా కలిగిన దేశం ఆత్మనిర్భర్గా మారాలి. ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. భారతదేశ అభివృద్ధిని, భావితరాలను పణంగా పెట్టలేం’ అని మోదీ పేర్కొన్నారు.అంత ఫీజు చెల్లించకపోతే..హెచ్1బీ వీసా ఫీజు చెల్లించకపోతే.. అమెరికాలోకి ప్రవేశించడానికి నిరాకరిస్తారు. ఎయిర్పోర్టులోనే ఆపేస్తారు. యూఎస్సీఐఎస్ (U.S. Citizenship and Immigration Services) వీసాను రద్దు చేయొచ్చు. కంపెనీలు గనుక ఆ ఫీజు చెల్లించలేకపోతే.. ఉద్యోగి అమెరికాలో కొనసాగలేరు. అంటే ఉద్యోగం పోతుందన్నమాట. దొడ్డిదారిన లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే.. అక్రమ వలసదారుడిగా పరిగణించబడే ప్రమాదం ఉంది. ఫీజు లేకుండా అమెరికాలో ఉండటం నేరంగా పరిగణించబడుతుంది. డిపోర్టేషన్ కూడా జరగొచ్చు. -
స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో బతుకమ్మ వేడుకల సన్నాహాలు జోరుగా
స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ఉన్న మదర్ ఎర్త్ హిందూ టెంపుల్లో ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టెంపుల్ అధ్యక్షుడు డాక్టర్ పునీత్ బెడి, ఉపాధ్యక్షురాలు మమతా వూసికల, కార్యదర్శి వినీలా బత్తుల సమర్థవంతంగా ఈ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.ఈ సందర్భంగా ఆలయంలో పలు సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు, మాతృశక్తిని ఆరాధించే విశిష్ట పూజలు నిర్వహించనున్నారు. అంతేకాక, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను కూడా ఆలయంలో ఘనంగా నిర్వహించేందుకు సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.బతుకమ్మ మరియు నవరాత్రులు మిలితంగా జరుపుకోవడం అనేది అక్కడి భారతీయ సమాజానికి విశేషమైన ఆనందాన్ని అందిస్తోంది. సామూహికంగా జరుపుకునే ఈ పండుగలు, భారతీయ సాంస్కృతిక విలువలను కొత్త తరానికి పరిచయం చేస్తున్నాయి.అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలను ఎదురుచూస్తున్నారు. -
అమెరికా పోలీసుల కాల్పుల్లో పాలమూరు యువకుడి మృతి
మహబూబ్నగర్ క్రైం: అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్నగర్కు చెందిన యువకుడు మృతి చెందాడు. ఘటన జరిగిన 2 వారాల తర్వాత ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ పట్టణంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన ప్రభు త్వ ఉపాధ్యాయులు హసానుద్దీన్, ఫర్జానాబేగం దంపతుల కుమారుడు మహ్మద్ నిజాముద్దీన్ (29) ఈ నెల 3న అమెరికాలోని కాలిఫోర్నియా శాంటాక్లారా ఏరియాలో తనతోపాటు గదిలో అద్దెకు ఉంటున్న రూమ్మేట్తో ఏసీ విషయంలో గొడవపడ్డాడు. ఆవేశంలో కూరగాయలు కోసే కత్తితో అతడి ని పొడిచాడు. వారి గది నుంచి శబ్దాలు రావటాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమా చారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. లొంగిపోవాలని హెచ్చరించినా నిజాముద్దీన్ వినకపోటంతో 4 రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన అతడి రూమ్మేట్ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం కర్ణాటకకు చెందిన ఒక విద్యార్థి నిజాముద్దీన్ తండ్రి హసానుద్దీన్కు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిజాముద్దీన్ 2016లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లి, పదేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. ఇటీవల తల్లిదండ్రులతో మాట్లాడిన అతడు.. త్వరలో ఇండియాకు వస్తానని చెప్పాడు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. మాకు న్యాయం చేయాలి నా కొడుకు 2016లో అమెరికా వెళ్లాడు. ఫ్లోరిడాలో రెండేళ్లు చదువుకున్న తర్వాత ఏడాదిపాటు వెదక గా జాబ్ వచ్చింది. నాలుగేళ్లు పని చేసిన తర్వాత 2023లో ప్రమోషన్తో కాలిఫోర్నియాకు వచ్చాడు. వీసా గడువు ముగియడంతో పొడిగిస్తామని చెప్పిన కంపెనీవాళ్లు ఆపని చేయలేదు. ప్రభుత్వ అనుమతితో ఆరు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. అయితే, రూమ్మేట్ తరుచుగా ఏసీ బంద్ చేస్తుండటంతో గొడవ జరిగిందని చెబుతున్నారు. మా బాబు స్నేహితుడు రాయచూర్కు చెందిన సయ్యద్ మొయినుద్దీన్ గురువారం ఉదయం ఫోన్ చేసి విషయం చెప్పిండు. అంతవరకు మాకు సమాచారం లేదు. ఏం జరిగిందో తెలియాలి. న్యాయం చేయాలి. దీనిపై విదేశాంగమంత్రికి ఫిర్యాదు చేస్తాం. – హసానుద్దీన్, నిజాముద్దీన్ తండ్రి -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. మహబూబ్నగర్ యువకుడి మృతి
అమెరికాలో మహబూబ్నగర్ యువకుడు మృతి చెందాడు. అయితే, తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్ను పోలీసులు కాల్చి చంపారని.. పోలీసులు ఎందుకు కాల్చి చంపారో కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్కు మృతుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవతీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు. మహబూబ్నగర్ రామయ్య బౌలికి చెందిన మొహమ్మద్ నిజాముద్దీన్.. డిసెంబర్ 2016లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి కాలిఫోర్నియాలోని శాంటా క్లారాకు వెళ్లాడు. ఆ యువకుడిని శాంటా క్లారా పోలీసులు కాల్చి చంపారు. మృతదేహం కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలోని ఓ ఆసుపత్రిలో ఉందని తమకు తెలిసిందని.. తమ కుమారుడి మృతదేహాన్ని మహబూబ్ నగర్కు తీసుకురావడంలో సాయం చేయాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. వాషింగ్టన్ డీసీలోని భారత కాన్సులేట్ ద్వారా సంప్రదింపులు జరపాలని అభ్యర్థించారు. -
గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్.. ఇదే ప్రధాన లక్ష్యం
మహిషి సంహారం కోసం ఈ లోకంలో ఉద్భవించిన హరిహర పుత్రుడు అయ్యప్పకు కేరళ సర్కారు ప్రపంచ వ్యాప్త పండగ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. గల్ఫ్లోని అబుధాబి సహా.. వేర్వేరు దేశాల్లో ఇప్పటికే అయ్యప్ప స్వామి ఆలయాలున్నా.. అమెరికా నుంచి ఆచంట వరకు అయ్యప్ప భక్తులు ఏటా శబరిగిరీశుడిని దర్శించుకుంటున్నా.. కేరళలోని శబరి కొండపై కొలువుదీరిన అయ్యప్పను విశ్వవ్యాప్తం చేయాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ)తో కలిసి సంకల్పించింది. ప్రభుత్వాలు శబరిమలను ఓ ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నారంటూ ఇంతకాలం కొనసాగుతున్న అపవాదులను తుడిచిపెట్టేందుకు కేరళ సర్కారు ప్రపంచ అయ్యప్ప భక్తులను ఏకం చేస్తోంది. ఏటా మండల, మకరవిళక్కు సీజన్లలో శబరిమలకు వచ్చే భక్తుల సాధకబాధకాలను వినేందుకు తొలిసారి ‘గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్’ (global ayyappa conclave) పేరుతో భారీ సభను ఏర్పాటు చేస్తోంది. దేవుడు అంటే నమ్మకం లేని, కరడుగట్టిన కమ్యూనిస్టుగా పేరున్న కేరళ సీఎం పినరయి విజయన్ ముందుండి ఈ కార్యక్రమాన్ని నడపడం గమనార్హం..!ఎన్నారైలు మొదలు.. సామాన్యులకూ ఆహ్వానం3 వేల మంది అయ్యప్ప భక్తులకు సరిపడేలా పంపానది తీరంలో టీడీబీ, కేరళ సర్కారు భారీ కాన్క్లేవ్కు ఏర్పాట్లు చేశాయి. భారతీయులు స్థిరపడ్డ దాదాపు అన్ని దేశాలకు చెందిన అయ్యప్ప భక్తులను ఈ వేడుకకు ఆహ్వానించాయి. ఇక సామాన్య భక్తులకు కూడా చాలా సులభంగా అవకాశం కల్పించి, పాసులను జారీ చేశాయి. శబరిమల వర్చువల్ క్యూ వెబ్సైట్ ద్వారా ఏటా ఏదో ఒక సీజన్లో అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకైతే.. సెల్ఫోన్లకు సందేశాలు పంపి మరీ ఆహ్వానించాయి. ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించి, ఐడీకార్డులను జారీ చేశాయి. అలా ఐడీకార్డులు డౌన్లోడ్ చేసుకున్న వారికి పేరుపేరునా ఫోన్ చేసి.. ‘‘మీరు తప్పకుండా వస్తున్నారు కదా? సెప్టెంబరు 20వ తేదీన మీరు ఉండాల్సిందే.. ఉదయం 8 గంటలకే రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. మరిచిపోవొద్దు’’ అని కాన్క్లేవ్ తేదీని గుర్తుచేస్తున్నాయి. అయ్యప్ప ముందు అందరూ సమానమే అన్నట్లుగా.. సామాన్య భక్తులకు కూడా సభాస్థలి వద్ద ముందు వరసలో చోటు కల్పించాయి.ఇప్పుడే ఎందుకు?ఇప్పుడే ప్రభుత్వం, టీడీబీ ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి? అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప భక్తులను కేటగిరీలుగా విభజించి, ఆదాయమార్గంగా మలచుకోవాలనేదే పినరయి సర్కారు ప్లాన్ అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం.. ‘‘ఇది ఆరంభమే. సెక్యూలరిజాన్ని మీరే అర్థం చేసుకోవాలి. మాకు అంతా సమానమే. త్వరలో మైనారిటీలకూ గ్లోబల్ కాన్క్లేవ్ ఏర్పాటు చేస్తాం’’ అని చెబుతోంది.ఇదే ప్రధాన లక్ష్యంశబరిమల అయ్యప్ప స్వామి కీర్తిని ప్రపంచానికి చాటడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీడీబీ, ప్రభుత్వం చెబుతున్నాయి. అదే సమయంలో ఏటా మాసపూజలు, ఓనం, మండల, మకరవిళక్కు(మకరజ్యోతి) సీజన్లో అయ్యప్ప కొండకు వచ్చే భక్తుల సమస్యలను తెలుసుకుని, వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడమే ధ్యేయమని వివరిస్తున్నాయి. అయ్యప్ప భక్త సంఘాల ప్రతినిధులు చెప్పే సమస్యలను శ్రద్ధగా విని, రాబోయే సీజన్ నుంచే వాటిని పరిష్కరించనున్నట్లు పేర్కొంటున్నాయి. శబరిమల అభివృద్ధికి ఇటీవలి బడ్జెట్లో రూ.1,300 కోట్ల కేటాయింపు మొదలు.. కేంద్రం ఆమోదించిన రోప్వే ప్రాజెక్టు, పథనంతిట్టలో కొత్త విమానాశ్రయానికి, రైల్వే మార్గానికి చేస్తున్న ఏర్పాట్లు, త్వరలో పరిచయం చేయనున్న హెలిట్యాక్సీలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు వివరించనున్నట్లు కేరళ పర్యాటక శాఖ చెబుతోంది.స్వాగతం ఇలా..ఈ కార్యక్రమానికి వచ్చే అయ్యప్ప భక్తులకు పథనంతిట్ట జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం స్వాగతం పలుకుతుంది. శబరిమలకు దారితీసే మార్గాలు- సీతాథోడ్, పెరునాడ్, పంపా ప్రాంతాల్లో స్వాగత వేదికలను ఏర్పాటు చేసింది. కేఎస్ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను, జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో భక్తులకు వసతి సదుపాయాలను సిద్ధం చేసింది. ఆహూతులందరికీ సెప్టెంబరు 20, 21 తేదీల్లో ప్రత్యేకంగా అయ్యప్ప దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారికి హిల్ టాప్ వద్ద పార్కింగ్ సదుపాయం ఉంటుంది. పంపా వద్ద ప్రత్యేక ఆస్పత్రిని ప్రారంభించింది. ఇక పారిశుద్ధ్యం మొదలు.. తాగునీటి సదుపాయం, భోజనాలు వంటి ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణకు భారీ బందోబస్తును సిద్ధం చేసింది.బాలారిష్టాలెన్నెన్నో..గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్ అనే భావన తెరపైకి వచ్చినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి బాలారిష్టాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులను ఆహ్వానించలేదు. అయితే.. ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, మంత్రులకు ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. ఈ కార్యక్రమం రాజకీయాలకు దూరంగా ఉంటుందని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సుకుమారన్ నాయర్ స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో పలువురు ఈ కార్యక్రమాన్ని నిర్వహించకూడదంటూ కోర్టు మెట్లెక్కారు. దీని వల్ల రాణి ఫారెస్ట్, పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్లలో పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనలతో కేరళ హైకోర్టు ఏకీభవించడంతో.. ఓ దశలో కార్యక్రమంపై నీలినీడలు అలుముకున్నాయి. కేరళ సర్కారు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు బుధవారం సానుకూలంగా స్పందించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చంటూ అనుమతి ఇవ్వడంతో.. ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.చదవండి: రూ.కోటి వ్యయంతో అతి పురాతన వైష్ణవాలయానికి పూర్వవైభవంపందళ రాజకుటుంబం దూరంగ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్కు తాము దూరంగా ఉంటున్నట్లు పందళం రాజకుటుంబం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబరులో పందళ రాజమాత మృతి చెందిన నేపథ్యంలో.. ఈ నెల 27 వరకు తాము దైవదర్శనానికి రాకూడదని పందళం ప్యాలెస్ మేనేజ్మెంట్ కమిటీ వెల్లడించింది. తాము కార్యక్రమాన్ని వారం రోజులు వాయిదా వేయాలని కోరినా, ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించింది. దీంతో.. నీలక్కల్ను దాటి తాము పంపావైపు రాలేమని తెలిపింది.శబరిమల అభివృద్ధికి దోహదం: ఎస్.శ్రీజిత్, అదనపు డీజీపీ''గ్లోబల్ కాన్క్లేవ్ ద్వారా శబరిమల అభివృద్ధికి కీలక ముందడుగు పడుతుంది. ఇది భవిష్యత్ని ఉద్దేశించి చేపట్టిన ఓ ప్రాజెక్టు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్రంగా చర్చిస్తాం. మున్ముందు అయ్యప్ప కీర్తిని ప్రపంచానికి చాటేలా కృషి చేస్తున్నాం.''అయ్యప్ప అందరివాడు: నాగ మల్లారెడ్డి, గురుస్వామి''అయ్యప్ప ముందు అందరూ సమానమే. స్వామి దగ్గర తరతమబేధభావాలుండవు. ఆయన అందరివాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలవాడు అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.''స్వామి మహిమలెన్నెన్నో: వైవి సుబ్బారెడ్డి, గురుస్వామి(కడప)''అయ్యప్ప మహిమలు ఎన్నో.. ఎన్నెన్నో..! నమ్మినవారి కొంగు బంగారం ఆ మణికంఠుడు. ఉదాహరణకు ఎరుమేలి నుంచి పంపాకు పెద్దపాదం మార్గం(45 కిలోమీటర్లు) ఎత్తైన కొండల మీదుగా ఉంటుంది. కఠిన దీక్షలు చేసి, భక్తిప్రపత్తులతో వస్తున్న వారికి ఈ దూరం ఒక లెక్కే కాదు. అలాంటి వారు ఏ మాత్రం అలసట లేకుండా వనయాత్రను పూర్తిచేసుకుంటారు. భక్తితో కాకుండా.. బలముందనే అహంకారంతో వచ్చేవారు 2 కిలోమీటర్లు నడిచినా.. 15 కిలోమీటర్ల దూరం నడిచామా? అనే భావన కలుగుతుంది. భక్తులకు కరిమల కొండ కఠిన పరీక్షలు పెడుతుంది. వాటిని అధిగమించి, స్వామిని చేరేవారి జన్మ ధన్యం.'' -
పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!
పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుని ఇండియాకు వచ్చిన భారతసంతతికి చెందిన US పౌరురాలు అనూహ్యంగా కన్నుమూసిన ఘటన కలకలం సృష్టించింది. జూలైలో జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళ మిస్సింగ్ కేసు నమోదైన తరువాత షాకింగ్ విషయాలను పోలీసులు ప్రకటించారు.పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్లోని లుధియానా జిల్లాలో అమెరికన్ పౌరురాలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోఇండియాకు వచ్చింది. లూధియానాకు చెందిన ఇంగ్లాండ్కు చెందిన నాన్-రెసిడెన్షియల్ ఇండియన్ (NRI) చరణ్జిత్ సింగ్ గ్రెవాల్ (75)ను వివాహం చేసుకోవాలని భావించింది. అతని ఆహ్వానం మేరకు రూపిందర్ కౌర్ పాంధేర్ (71) భారతదేశానికి వచ్చారు. అయితే సియాటిల్ నుండి ఇండియాకు వచ్చిన కొద్దిసేపటికే ఏళ్ల మహిళ హత్యకు గురైంది. అయితే ఫోన్లకు స్పందించకపోవడం, ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన పాంధేర్ సోదరి కమల్ కౌర్ ఖైరా తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో జూలై 28న న్యూఢిల్లీలోని అమెరికిఆ రాయబార కార్యాలయానికి సంప్రదించారు. ఎంబసీ ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గ్రెవాల్ ఆమెను కిరాయి హంతకులతో హత్య చేయించాడని తేల్చారు. ఆర్థికపరమైన కారణాల వల్లే ఈ హత్య జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాదు గ్రేవాల్తో పెళ్లికి ముందు అతనికి పెద్దమొత్తంలో డబ్బును బదిలీ చేసినట్టు కూడా గుర్తించారు. రూపిందర్ అమెరికా పౌరురాలు. యూకేలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ చార్జిత్ సింగ్ గ్రెవాల్తో పెళ్లికోసం ఇండియాకు వచ్చింది. అయితే ఆమెను తుదముట్టించాలని పథకం వేసుకున్న గ్రెవాల్ కాంట్రాక్ట్ కిల్లర్ సుఖ్జీత్ సింగ్ సోనూతో రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఆమెను కిరాతంగా హత్య చేయించాడు. అయితే ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే సమయంలోనే ఆమెను ఎవరో కిడ్నాప్ చేశాడని సోనూ దెహ్లోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ అతని వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని అంగీకరించాడు. తన నివాసంలోని స్టోర్రూమ్లో రూపిందర్ శరీరాన్ని కాల్చి, బూడిద చేసి లెహ్రా గ్రామంలోని కాలవలో పారవేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఈ మేరకు సంఘటనా స్థలంలో మృతరాలి ఎముకలను స్వాధీనం చేసుకొన్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) హర్జిందర్ సింగ్ గిల్ , స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును విచారణ సాగుతోంది. పరారీలో ఉన్నగ్రెవాల్తో పాటు, అతడి సోదరుడిపై కేసు నమోదు చేశారు. సోను వెల్లడించిన దాని ఆధారంగా బాధితురాలి అస్థిపంజర అవశేషాలు, ఇతర ఆధారాలను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు పోలీసులు ఈ ఘటన ఇటు భారత్తోపాటు, అటు అమెరికా, యూకే ఎన్ఆర్ఐ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. -
''నాకు సాయం చేయండి సార్'.. జైశంకర్కు హైదరాబాద్ యువతి అభ్యర్థన
హైదరాబాదీ యువతి భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు లేఖ రాసిందిహైదరాబాదీ యువతి హనా అహ్మద్ ఖాన్ జూన్ 2022లో చికాగోలో పోలీస్గా పనిచేస్తున్న మహ్మద్ జైనుద్దీన్ ఖాన్ (అమెరికా పౌరుడు)ని వివాహం చేసుకుంది. అనంతరం ఫిబ్రవరి 2024లో ఆమె అమెరికాలోని చికాగోలో తన భర్తతో కలిసి నివసించేవారు. కొన్నాళ్లకు జైనుద్దీన్ ఖాన్ ఆమెను మానసిక వేధింపులు, శారీరక వేధింపులకు గురి చేశాడు. కొంతకాలం తరువాత హజ్ యాత్రకు తీసుకెళ్తానని చెప్పి జైనుద్దీన్ ప్రణాళికాబద్ధంగా ఫిబ్రవరి 7, 2025న ఆమెను హైదరాబాద్కు తీసుకువచ్చాడు. సోమాజిగూడలోని పార్క్ హోటల్లో ఓ రూమ్ తీసుకున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళగా, ఆమె భర్త పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, ఆభరణాలు వంటి అన్ని వస్తువులతో హోటల్ను ఖాళీ చేసి అమెరికాకు తిరిగి వెళ్లిపోయాడు. దాంతో వెంటనే హనా అహ్మద్ పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తన భర్తను సంప్రదించడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆమె న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయాన్ని, హైదరాబాద్లోని USA కౌన్సెలేట్ను సంప్రదించడానికి ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని తన భర్తపై చట్టపరంగా పోరడడానికి, USAకి తిరిగి వెళ్లడానికి అవసరమైన వీసా మంజూరు చేయమంటుంది. న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయం, హైదరాబాద్లోని USA కౌన్సెలేట్కు ఆదేశాలవ్వగలరని ఆమె అభ్యర్థించింది. ఈ విషయంలో తీసువాల్సిన అవసరమైన చర్యలను తెలియజేయగలరంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్కు తన లేఖలో పేర్కొంది. -
గోడు వింటున్నారు.. పరిష్కారం చూపుతున్నారు
మోర్తాడ్ (బాల్కొండ): కరీంనగర్కు చెందిన రాహుల్రావు ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతను అక్కడ బ్లడ్ కేన్సర్కు గురయ్యాడు. అతనికి బోన్మ్యారో చికిత్స చేయాల్సి ఉంది. అతని రక్తం పంచుకుని పుట్టిన వారే తమ వారి శరీరంలో నుంచి ఎముకను ఇస్తేనే రాహుల్ బతికి బట్టకట్టగలడని వైద్యులు స్పష్టం చేశారు. రాహుల్ సోదరుడు రుతిక్రావు అందుకు సిద్ధం కావడంతో అతను లండన్ వెళ్లడానికి, వైద్య ఖర్చుల కోసం ప్రవాసీ ప్రజావాణిలో రాహుల్ తల్లి మంగ అభ్యర్థన పత్రం అందించింది. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రాహుల్రావు సోదరుడు లండన్ వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేయించడంతో పాటు ఖర్చు కోసం రూ.10 లక్షలను మంజూరు చేసింది. ప్రవాసీ ప్రజావాణి వినతికి స్పందించిన జిల్లా కలెక్టర్ కూడా తన విచక్షణాధికారాలను ఉపయోగించి రూ.లక్ష సాయం మంజూరు చేశారు. ప్రవాసీ ప్రజావాణి (Pravasi Prajavani) ద్వారానే తమ కుటుంబానికి రూ.11 లక్షల సాయం అందిందని రాహుల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.గంగయ్యకూ విముక్తి నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం కొడిచెర్లకు చెందిన కంచు గంగయ్య 18 ఏళ్లుగా బహ్రెయిన్లో ఉండిపోయాడు. అతను ఇంటికి రావడానికి పాస్పోర్టు లేకపోవడం, పరాయి దేశంలో సాయం చేసేవారు లేకపోవడంతో గంగయ్య భార్య లక్ష్మి ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విదేశాంగ శాఖతో, బహ్రెయిన్లోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడటంతో గంగయ్య ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. తాము చూస్తామో చూడమో అనుకున్న వ్యక్తి 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇంటికి చేరడానికి ప్రవాసీ ప్రజావాణి మార్గం చూపిందని గంగయ్య కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాహుల్, గంగయ్యలకే కాదు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది.2024, సెప్టెంబర్ 16న హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్లో ప్రారంభించిన ప్రవాసీ ప్రజావాణితో ప్రవాసులైన తెలంగాణ వాసులకు వరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని ఏ మూలన ఉన్న వారైనా తమవారు విదేశాల్లో ఏమైనా ఇబ్బంది పడితే వారి సమస్యను ప్రవాసీ ప్రజావాణి దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుండటం విశేషం. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ప్రవాసీ ప్రజావాణిని పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు ఎన్నారై అడ్వైజరీ బోర్డు చైర్మన్ బీఎం వినోద్కుమార్, వైస్చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ప్రవాసీ ప్రజావాణిలో పాల్గొంటూ వలస కార్మికుల కుటుంబ సభ్యులు ఇచ్చే వినతులను స్వీకరిస్తున్నారు.ఇప్పటి వరకు వందకు పైగా కుటుంబాల వినతులకు ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపడం ఎంతో ఊరటనిచ్చే విషయం. గతంలో గల్ఫ్ దేశాల్లో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలు ఇంటికి చేరడానికి నెలల సమయం పట్టేది. ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పిస్తే అధికార యంత్రాంగం స్పందించి వారం, పది రోజుల వ్యవధిలోనే కడసారి చూపు దక్కేలా చేస్తోంది. ఆర్థిక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు సామాజిక దృక్పథంతో ప్రజావాసీ ప్రజావాణిని కొనసాగిస్తుండటం వలసదారుల కుటుంబాలకు ఎంతో ధీమా ఇచ్చే కార్యక్రమం అని భీంరెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో చెప్పారు. వలసదారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి ప్రవాసీ ప్రజావాణి గొప్ప నిదర్శనమని తెలిపారు. వలసదారుల జీవితాల్లో వెలుగులు వలసదారుల జీవితాల్లో ప్రవాసీ ప్రజావాణి వెలుగులు నింపుతోంది. ప్రతి వారంలో రెండు రోజుల పాటు ప్రవాసీ ప్రజావాణిని నిర్వహించి వినతులను స్వీకరిస్తుండటం ఎంతో గొప్ప విషయం. వలస కార్మికులకు మేమున్నాం అనే ధీమాను ప్రభుత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి. – రంగు సుధాకర్గౌడ్, ఎన్నారై, లండన్ -
యూఎస్లో శ్రామిక కొరతను అందిపుచ్చుకునేలా..
ఐటీ జాబ్స్ కాకుండా విదేశీయుల కోసం యూఎస్లో చాలానే ఉద్యోగాలు ఉన్నాయి. యూఎస్లో పెరుగుతున్న శ్రామిక కొరత దృష్ట్యా భారత యువతకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో.. వాటిని ఎలా అందిపుచ్చుకోవాలో తెలుసుకుందాం. ఐటీ కాకుండా అమెరికాలో ప్రస్తుతం నర్సింగ్, హాస్పిటాలిటీ (హోటల్ నిర్వహణ), స్కిల్డ్ ట్రేడ్ ఉద్యోగాలు (వెల్డింగ్, ఎలక్ట్రీషియన్ వంటివి), వ్యవసాయ రంగాల్లో భారతీయ యువతకు అవకాశాలు ఉన్నాయి.కొన్ని సంస్థల సర్వేల ప్రకారం.. భారతదేశంలో 18-40 సంవత్సరాల వయసు గల జనాభా 60 కోట్ల మంది ఉన్నారు. సగటు వయసు 30 ఏళ్లలోపు ఉంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న భారతీయ కార్మికులు ప్రతి సంవత్సరం 130 బిలియన్ డాలర్లు స్వదేశానికి పంపుతున్నారు. మెరుగైన వ్యవస్థలతో ఇది 2030 నాటికి సంవత్సరానికి 300 బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇదిలాఉండగా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి టాలెంట్ హబ్గా ఎదగడానికి భారత్కు అవకాశం ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన యూఎస్ వంటి దేశాల్లో వృద్ధాప్య జనాభా పెరుగుతోంది. అందుకు తగినట్లుగా యువ జనాభా అంతంతమాత్రంగానే ఉంది. ఈ వ్యత్యాసాన్ని భారత్ భర్తీ చేస్తుంది.యూఎస్లో ఐటీయేతర ఉద్యోగ అవకాశాలునర్సింగ్, ఆరోగ్య సంరక్షణ: అమెరికాలో ఆరోగ్య సంరక్షణ రంగంలో నర్సులకు, ఇతర ఆరోగ్య నిపుణులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.హాస్పిటాలిటీ (హోటల్ నిర్వహణ): హోటల్ నిర్వహణ, క్యాటరింగ్ వంటి హాస్పిటాలిటీ రంగాల్లో కూడా భారతీయ యువతకు అవకాశాలు లభిస్తాయి.నైపుణ్యం కలిగిన ట్రేడ్ ఉద్యోగాలు: వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, గృహ నిర్మాణ కార్మికులు.. వంటి నైపుణ్యం కలిగిన ట్రేడ్ల్లో కూడా అమెరికాలో కొరత ఉంది. దీనికి తగిన శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు దొరుకుతాయి.వ్యవసాయం: అమెరికా వ్యవసాయ రంగంలో కూడా వివిధ రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.ప్రస్తుతం అమెరికా వీసా విధానాలు కఠినతరం కావడంతో ముఖ్యంగా హెచ్-1బీ వీసా వంటి వాటికి ఎంతో పోటీ ఉంది. భారత యువత వీటిని అందిపుచ్చుకోవడానికి సంబంధిత రంగాల్లో నైపుణ్యం పెంచుకోవాలి. విద్యార్హతలు సంపాదించాలి. అమెరికా వీసా నిబంధనలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా దరఖాస్తు ప్రక్రియలను జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది.వీసా విధానాలువీసా పేరుఉపయోగం / లక్ష్యంH‑2Aవ్యవసాయ రంగంలో సీజనల్ వర్కర్ల కోసం ఈ వీసా పని చేస్తుంది.H‑2Bవ్యవసాయేతర సీజనల్ / తాత్కాలిక ఉద్యోగాలు (హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు, పార్క్స్, రిసోర్ట్స్ మొదలైనవి)L‑1కంపెనీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్, మేనేజ్మెంట్, ఎగ్జిక్యూటివ్ లేదా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ వర్కర్లుO‑1అత్యుత్తమ ప్రతిభ (ఆర్ట్స్, అథ్లెటిక్స్, బిజినెస్, ఎడ్యుకేషన్, సైన్సెస్) ఉన్నవారికీ ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్బంగా అమెరికాలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ వర్థంతిని పురస్కరించుకుని ఫిలడెల్ఫియా నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.డాక్టర్ రాఘవ రెడ్డి గోసల సమన్వయకర్తగా ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో ఆళ్ళ రామిరెడ్డి తోపాటు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ప్రతినిధులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 100 మందికి పైగా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.గత 15 సంవత్సరాలుగా రాజన్నను స్మరించుకుంటూ ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో పలువురు వైఎస్సార్ అభిమానులు రక్త దానం చేసి ప్రాణ దాతలుగా నిలిచారు. ప్రజా శ్రేయస్సు కోసం మన వైస్సార్ అభిమానులు ముందుకు వచ్చి రక్త దానం చేయడం నిజంగా ప్రశంసనీయం. అదే మన రాజన్నకు ఇచ్చే ఘనమైన నివాళి అని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే 9/11 ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిని స్మరించుకుంటూ సంతాపం తెలియజేశారు. ఇక ప్రతి సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్త్నున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు.. వైఎస్సార్ అభిమానులను, సమన్వయ కర్త డాక్టర్ రాఘవ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: శంకర నేత్రాలయ యూఎస్ఏ దార్శనిక దాతృత్వానికి నివాళి)


