మాజీ ఎంపీ మధుయాష్కీ సతీమణికి తీవ్ర గాయాలు
బోస్టన్ నుంచి న్యూయార్క్ వస్తుండగా కారు బోల్తా
పక్కటెముకలు విరగడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స
సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సతీమణి డాక్టర్ సుచియాష్కీ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగనయాష్కీని బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండీ కోర్సులో జాయిన్ చేసి న్యూయార్క్కు వస్తుండగా భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండటంతో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిందని, ఈ ప్రమాదంలో డాక్టర్ సుచియాష్కీకి పక్కటెముకలు విరిగిపోయాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కాగా, మధుయాష్కీ కూడా అమెరికాలోనే ఉన్నారు. చిన్న కుమార్తె డాక్టర్ గగన న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, కాన్వొకేషన్కు హాజరయ్యేందుకు యాష్కీ దంపతులు అమెరికా వెళ్లారు.
కుమార్తెను ఎండీ కోర్సులో జాయిన్ చేసి వచ్చే సమయంలో సుచి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వేరే కారులో మధుయాష్కీ కూడా ఉన్నారని, భార్యకు ప్రమాదం జరిగిన నేపథ్యంలో గురువారం ఇండియాకు రావాల్సిన యాష్కీ, అక్కడే ఉండిపోయారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ ఫోన్లో మధుయాష్కీని పరామర్శించారు.


