హైదరాబాద్: ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్ట్కు నిరసనగా హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు రాలీ చేపట్టారు. లోక్భవన్కు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నక్లెస్ రోడ్డు వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతలో మోదీ నివాసం వద్ద రాహుల్ ధర్నాకు నిరసనగా బీజేపీ నేతలు హైదరాబాద్లో ర్యాలీకి దిగారు. గాంధీభవన్ ముట్టడికి బీజేపీ నేతలు తరలివెళ్లారు. ఈ నేపధ్యంలో బీజేపీ నేత రామచంద్రరావుతో సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు మహేష్ గౌడ్, పొంగులేటి, రాజనర్సింహలను పోలీసులు అరెస్ట్ చేశారు. గాందీభవన్ వద్ద కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. జెండా కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అరెస్ట్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తక్షణమే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలక పక్షం తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. అధికారంలో ఉంటూ పాలకపక్షం ధర్నాలు, నిరసనలతో శాంతిభద్రతలకు ఉల్లంఘిస్తోంది. కాంగ్రెస్ తీరుపై జనం నవ్వుకుంటున్నారు. పాలకపక్షం పోకడలను ప్రశ్నిస్తూ, ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. నీట్ పై పార్లమెంట్ లో చర్చకు సిద్ధమని, దమ్ముంటే కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ లో చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.


