breaking news
Guntur
-
‘ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు’
గుంటూరు: ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు. గత కొంతకాలంగా వైఎస్సార్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడుకు ఇందుకు ఉదాహరణ అని ధ్వజమెత్తారు. ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) అంబటి కుటుంబాన్ని పరామర్శించారు కారుమూరి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీసుపై దాడి ఆటవికం, అరాచకం. లడ్డుపై కూటమి ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారాన్ని అంబటి ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి నేతలకు మంచి బుద్ది ప్రసాదించాలని అంబటి పూజలు చేశారు. అంబటి కారుపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వందనాదేవి మహిళ మాట్లాడకూడని మాటలు అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు.పక్కా పథకం ప్రకారం కర్రలు,రాడ్లతో దాడిచేశారు.లడ్డుపై విషప్రచారం చేసింది మీరే... దాడులు చేసేది మీరే. చేసినవన్నీ చేసి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. జోగి రమేష్ ఇంటిపై ప్రణాళికాబద్దంగా దాడి చేశారు.. మీ పరిపాలన ఎలా ఉందో ఒకసారి సరిచూసుకోండి. ఇది రాచరిక రాజ్యం కాదు. ప్రతిపక్షంగా మేం ప్రశ్నిస్తాం. జగన్ హయాంలో అప్పులపై మీరు అబద్దాలు చెప్పలేదా?, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చెయ్యలేదా?, మంచి పరిపాలన అందించాలే తప్ప ప్రతిపక్షం లేకుండా చెయ్యాలని చూస్తే కుదరదు. దివిసీమ ఉప్పెన తరహాలో ప్రజల ఉప్పెనలో మీరు కొట్టుకుపోతారు. రాంబాబు పరిధి దాటి మాట్లాడరు. రాంబాబు అసెంబ్లీలో చంద్రబాబు భార్య గురించి మాట్లాడలేదు. లడ్డుప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడలేదా?, రైతులు,విద్యార్థులు, ఆరోగ్య శ్రీ, పేదలకు మూడు సెంట్ల స్థలాలు ఇవ్వడం గురించి ఆలోచించండి. మీరే మీ ఎమ్మెల్యేలు అరాచకాలు, దోపిడీలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. బిల్ గేట్స్ ను తీసుకొచ్చి షో చెయ్యాలని చూస్తున్నారు. అంబటి రాంబాబును పోలీస్ స్టేషన్లో శారీరకంగా హింసించారు. దాడికి పాల్పడిన వారిని వదిలేసి... దాడికి గురైనవారిని జైలులో పెట్టారు. ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదు. ఇలాగే చేస్తే అన్ని కులాలు ఏకమవుతాయి’ అని హెచ్చరించారు. -
‘లోకేష్, పవన్ పిల్లలకు కూడా ఇదే భోజనం తినిపించాలి’
తాడేపల్లి : ఏపీలోని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మరణాలపై సీఐడీ విచారణ జరపాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు డిమాండ్ చేశారు. నాసిరకం భోజనంతో ఎంతమంది పిల్లలని చంపుతారని ప్రశ్నించారు. బిల్గేట్స్తో కూడా హాస్టల్ విద్యార్థుల భోజనం తినిపించగలవా చంద్రబాబూ? అని నిలదీశారు. ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన సుధాకర్బాబు.. ఏపీలో సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు పెడుతున్న నాసిరకం భోజనంపై ధ్వజమెత్తారు. ‘ మీ పిల్లలాంటి వారు కాదా మా పిల్లలు?, లోకేష్, పవన్ కళ్యాణ్ పిల్లలకు ఇదే భోజనం పెట్టాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక 900 మంది విద్యార్థులు అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. సంక్షేమ హాస్టల్లో చదువుకునే పిల్లలకు పురుగులతో కూడిన భోజనం పెట్ఠం ఏంటి?, హాస్టల్స్లో ఉండే వారిని వెలివేసినట్టుగా ప్రభుత్వ పనితీరు ఉంది. గొప్పలు చెప్పుకునే చంద్రబాబు బిల్గేట్స్తో హాస్టల్లో భోజనం తినిపించగలరా?, దగ్గర్లో ఉన్న ఏ హాస్టల్లో ఐనాసరే ఆకస్మిక తనిఖీకి తీసుకెళ్ళాలి. మా ప్రభుత్వ హయాంలో రోజుకొక రీతిలో భోజనం పెట్టారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అంటరానితనంతో వ్యవహరిస్తున్నారు. ఏ.కొండూరులో ఎలుకలు కలిచి విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. చంద్రబాబుకు పేద విద్యార్థులంటే ఎందుకంత చిన్నచూపు?, ఇది కచ్చితంగా మానవ హక్కులను ఉల్లంఘించటమే. 900 మంది విద్యార్థులు ఆస్పత్రులు పాలయిన వైనంపై చర్చ కు సిద్దం. విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతుంటే లోకేష్ క్రికెట్ చూడటానికి కొలంబో వెళ్లాడా?, ప్రత్యేక విమానాల ఖర్చులో పది శాతం హాస్టల్స్ కి పెట్టినా విద్యార్థులకు మంచి భోజనం దొరికేది. పయ్యావుల కేశవ్ దళిత వ్యతిరేకి.అందుకే బడ్జెట్లోనూ ఎస్సీ, ఎస్టీలపై అంటరానితనాన్ని చూపించారు. నిధుల కేటాయింపు లేకుండా మాపై వివక్ష చూపించారు. లోకేష్ విమాన ఖర్చులను బయట పెట్టాలి. పవన్ కళ్యాణ్ తన పార్టీకి రెండు కోట్లు ఇచ్చారు సరే..మరి విద్యార్థుల కష్టాలు కనపడటం లేదా?, అంబేద్కర్ విగ్రహాన్ని గాలికి వదిలేశారు. అక్కడి మొక్కలకు నీరు పోసే దిక్కు లేదు. జగన్ తెచ్చిన డిజిటల్ బోర్డులు, ఆర్వో ప్లాంట్లు, గోరుముద్ద పథకం ఏమయ్యాయి?, విద్యార్థుల మరణాలు, ఆస్పత్రుల పాలవటంపై సీఐడీ విచారణ చేయాలి. విద్యార్థులకు మేలు చేయని ప్రభుత్వం దిగిపోవాలి’ అని డిమాండ్ చేశారు. -
భక్తిశ్రద్ధలతో శివరాత్రి వేడుకలు
మంగళగిరి టౌన్: మహాశివరాత్రి పర్వదినం భక్తకోటిలో అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతులు నింపింది. పరమేశ్వర పాహిమాం, శివశివ శంకర.. భక్త శుభంకర అంటూ శివనామ స్మరణతో ఆలయాలు ప్రతిధ్వనించాయి. మహాశివుడు విశేష పూజలందుకున్నాడు. లయకారుడు లంకేశ్వరుడు కరుణ కోసం ఆలయాల ఎదుట భక్తులు బారులు తీరారు. ఉపవాసాలు ఆచరిస్తూ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాత్రంతా భక్తులు జాగరణ చేశారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లోని శివాలయాలతో పాటు పలు ఆలయాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు ఆలయాలకు చేరుకున్నారు. అభిషేక ప్రియుడైన భోళాశంకరుడికి పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు నిర్వహించారు. మంగళగిరి పట్టణ పరిధిలోని శ్రీ గంగాభ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఉదయం నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. పాత మంగళగిరిలోని శ్రీహరిహర క్షేత్రంలో తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పలు సేవా సంస్థలు అన్నదాన తదితర కార్యక్రమాలు నిర్వహించాయి. ఆలయాల వద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవదాయ శాఖ అధికారులు, ఆయా ఆలయాల కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆలయాల వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
మహాకాళేశ్వరుడికి విశేషపూజలు
ఫిరంగిపురం: మండలంలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం శివాలయాల్లో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. వేములూరిపాడులోని జలపాలేశ్వరుడికి, ఫిరంగిపురంలోని కాళహస్తీశ్వరస్వామికి, రామాలయంలోని నగరేశ్వరస్వామికి, వేమవరంలోని మహాకాళేశ్వరుడికి అర్చకులు విశేషపూజలు చేశారు. వేమవరంలోని కోటిలింగాల క్షేత్రంలోని మహాకాళీ సమేత మహాకాళేశ్వరుడికి అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ముఖమండపం వద్ద అన్నపూర్ణాదేవి ఉత్సవమూర్తిని ఏర్పాటు చేసి భక్తుల స్వహస్తాలతో అక్షయ బియ్యంతో అభిషేకాలు నిర్వహింపజేశారు. అనంతరం ఏడు అడుగుల వెంకటేశ్వరుడి విగ్రహానికి భక్తులు అభిషేకాలు చేశారు. సాయంత్రం శివపార్వతుల ఉత్సవ మూర్తులకు శాంతి కల్యాణం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కోటి లింగాల క్షేత్రంలో కరసేవకులుగా పనిచేసేందుకు తుని, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, ఆరేపల్లి ముప్పాళ్ల, గుంటూరు, కడియం, మేడికుండూరు ప్రాంతాల నుంచి సుమారు 300 మంది వరకు వచ్చారు. నుదురుపాడు పీహెచ్సీ ఆధ్వర్యంలో భక్తుల కోసం వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి శౌరిజోజి తెలిపారు. కోటిలింగాల క్షేత్రంలో భక్తుల కోలాహలం -
వీఐపీలకు సేవ.. భక్తులకు లేదు తోవ
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట రూరల్: కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకే పెద్దపేట వేస్తామన్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారి దర్శనానికి వచ్చిన సామాన్య భక్తులు వీఐపీల తాకిడితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూ. 200, రూ.500 అభిషేక దర్శనం క్యూలైన్లను భక్తులు స్వామివారిని దర్శించుకున్నందుకు దాదాపు నాలుగు గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. వీఐపీలతోపాటు అధికారుల కుటుంబ సభ్యులను పెద్ద సంఖ్యలో దర్శనానికి అనుమతించారు. కింద నుంచి నేరుగా లిఫ్ట్ సదుపాయంతో వస్తున్న అధికారపార్టీ నేతలు, కార్యకర్తల వల్ల ఆ ప్రదేశంలో భారీ క్యూ కనిపించింది. ఈ సమయంలో శీఘ్ర ,అభిషేక దర్శనం క్యూలైన్ను నిలిపివేయడంతో భక్తులకు స్వామివారి దర్శనం ఆలస్యం అయింది. పోలీసులతో భక్తుల వాగ్వాదం .. స్వామి వారికి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతుందటంతో భక్తుల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. వీవీఐపీల సేవలలోనే తరిస్తారా సామాన్య భక్తులను పట్టించుకోరా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడ చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భక్తుల్లో ఆగ్రహం చల్లారకపోవడంతో పోలీసులు బెదిరింపు ధోరణిలో విరుచుకుపడ్డారు. మాకు ప్రోటోకాల్ ఉంటది ఇష్టం ఉంటే ఉండండి లేకుంటే బయటకు వెళ్లిపోండి అంటూ పోలీసులు భక్తులపై ఫైర్ అయ్యారు. ఆగ్రహంతో మాట్లాడుతున్న భక్తులు పట్ల పోలీస్ అధికారులు అసభ్యకరంగా బూతుల దండకాన్ని అందుకున్నారు. కొంతసేపటి తర్వాత జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ అక్కడికి చేరుకొని వీ వీఐపీ దర్శనాలలో ఇతరులు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్ టికెట్ల దర్శనం భేష్... ఆలయంలో ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానంలో కొనుగోలు చేసే వీఐపీ టికెట్ల విధానం సత్ఫలితాలను ఇచ్చింది. గతంలో వీఐపీ పాసుల పేరుతో ఉచితంగా దర్శనానికి అనుమతి ఇచ్చేవారు. దీని వల్ల దేవస్థానానికి ఆర్థికంగా నష్టంతో పాటు సామాన్య భక్తులు ఇబ్బందిపడేవారు. ఈ ఏడాది వీఐపీ దర్శనానికి రూ.300 టికెట్ ను నిర్ణయించి ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. దాదాపు 6 వేల మంది కి పైగా ఆన్ లైన్లో భక్తులు దర్శన టికెట్లను కొనుగోలు చేశారు. టైం స్లాట్లో స్వామివారిని శీఘ్రంగా దర్శించుకున్నారు. నరసరావుపేట నుంచి కోటప్పకొండ తిరుణాలకు వెళ్లిన భక్తులు ఆదివారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నరసరావుపేట వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను పెట్లూరువారి పాలెం రోడ్ లో నిలిపివేశారు. అక్కడ నుంచి కొండ దిగున ఘాట్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక బస్టాండ్ కు భక్తులు కాలినడకన చేరుకోవాల్సి వచ్చింది. కిలోమీటర్కు పైగా ఉన్న బస్టాండ్కు చేరుకోవాలంటే వృద్ధులు, వికలాంగులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో లేని విధంగా నరసరావుపేట వైపు నుంచి వచ్చే బస్సులను దూరంగా నిలిపివేయటంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. భక్తుల గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్న అధికారుల తీరుపై మండిపడ్డారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏడాది నుంచి ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల కోటప్పకొండకు వచ్చిన సమయంలో ప్రకటించారు. తిరునాళ్ల రోజు అందరికి స్వామి వారి ఉచిత ప్రసాదం అందజేస్తామన్నారు. అయితే ఆదివారం కొంతమందికే ఉచిత లడ్డూ ప్రసాదం అందింది. ఉదయం 11 గంటల వరకు దర్శనం చేసుకొని బయటకు వచ్చే భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేసి తరువాత లడ్డూలు లేవంటూ నిలిపివేశారు. పలువురు భక్తులు దీనిపై ప్రశ్నించడంతో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పంపిణీని తిరిగి ప్రారంభించారు. -
అభివృద్ధి పేరుతో అనైతిక పనులు సహించం
మంగళగిరి టౌన్ : శతాబ్దాల చరిత్ర కలిగిన ముస్లింల పవిత్ర ఖబరస్తాన్ను రహదారి విస్తరణలో భాగం చేయడమే కాకుండా అభివృద్ధి పేరుతో ఖబరస్తాన్పై ఫ్లై ఓవర్ నిర్మించాలని చూడడం సరికాదని ఖబరస్తాన్ పరిరక్షణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా మంగళగిరి పట్టణంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జామియా మసీద్ వద్ద ప్రారంభమై ఎంటీఎంసీ కార్యాలయం, మెయిన్ బజార్, మిద్దె సెంటర్ మీదుగా తిరిగి గౌతమ బుద్ధ రోడ్ నుంచి నిడమర్రు కూడలి వరకు జరిగింది. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా ఖబరస్తాన్ పై నుండి ఎందుకు ఫ్లై ఓవర్ నిర్మాణం చేస్తామని అంటున్నారని నిలదీశారు. ముస్లింల మనోభావాలతో చెలగాటం తగదని అన్నారు. ఖబరస్తాన్ భూమిలో ఫ్లై ఓవర్ వంటి నిర్మానాలు చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేయడం ముస్లిం మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి చేసినట్టేనని విమర్శించారు. దానిని కాపాడుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ యూసుఫ్, అహ్లె సున్నతువల్ జమాద్ అధ్యక్షులు మునీర్, తబ్లీగ్ జమాత్ అధ్యక్షులు ఱఫీ, జమాత్ ఏ ఇస్లామీ హింద్ అధ్యక్షులు అజీమ్, జమియ్యతే అహలే హదీస్ అధ్యక్షులు రఫీ, ముస్లిం యువతరం గౌరవ అధ్యక్షులు ఇక్బాల్ అహ్మద్, ముస్లిం ఫ్రంట్ అధ్యక్షులు ముహమ్మద్ రఫీ, జమాతుల సభ్యులు, ముస్లిం మహిళలు, తదితరులు పాల్గొన్నారు. -
తరలిన భారీ విద్యుత్ ప్రభలు
చేబ్రోలు: మహాశివరాత్రి సందర్భంగా వడ్లమూడి క్వారీ తిరునాళ్లలో ఆదివారం రాత్రి భారీ విద్యుత్ ప్రభలు కాంతులు వెలుగులు నింపాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోటప్ప కొండ తరువాత పేరు గాంచిన చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ తిరునాళ్లకు ఈ ఏడాది 15 భారీ విద్యుత్ ప్రభలు తరలివచ్చాయి. నారాకోడూరు నుంచి గ్రామ ప్రభ, సెంట్రల్ యూత్, మిత్రమండలి ప్రభలు వచ్చాయి. సుద్దపల్లి గ్రామ కాపు సంఘం, చేబ్రోలు, గొడవర్రు, గుండవరం, వడ్లమూడి, శలపాడు గ్రామాల నుంచి ప్రభలు తరలివచ్చాయి. నారా కోడూరు మీదుగా వడ్లమూడి క్వారీ దేవాలయం వరకు వెళ్లే మార్గాల వద్ద ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. -
నేడు పోలీస్ గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా పోలీస్ బందోబస్త్ దృష్ట్యా ఈనెల 16న జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరగాల్సిన పీజీఆర్ఎస్ (గ్రీవెన్స్)ను తాత్కలికంగా రద్దు చేసినట్లు డీపీఓ కార్యాలయపు వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. జిల్లాలోని ప్రజలు గమనించాలని, తద్వారా పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి రూరల్ : రాజధాని ముఖద్వారమైన ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ రానున్నారు. వారి రాకను పురస్కరించుకుని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం ఉండవల్లి చిన్నడొంకలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు, బిల్గేట్స్లు రాజధానిలో పలు ప్రాంతాలను పరిశీలించనున్నారని తెలిపారు. ఆ ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో పూర్తిచేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యానశాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ నగర్: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం, స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ ఎన్నికకు ఆదివారం 17 నామినేషన్లు దాఖలు అయ్యాయని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్, ఎన్టీఆర్ స్టేడియం ఎక్స్ అఫిషియో జాయింట్ సెక్రటరీ, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికల అధికారి సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. పాలకవర్గ ఎన్నికకు ఆదివారం సెక్రటరీకి 4, వైస్ ప్రెసిడెంట్ 1, ట్రెజరర్కి 2, జాయింట్ సెక్రటరీకి 4, ఎగ్జిక్యూటివ్ మెంబర్కు 6 (పురుషులు 5, మహిళలు 1) నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. నామినేషన్లకు 16వ తేదీ చివరి రోజు అని అన్నారు. గుంటూరు వెస్ట్: వడ్లమూడి వెంకట లక్ష్మమ్మ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున తెనాలికి చెందిన డాక్టర్ వడ్లమూడి బాబు రాజేంద్ర ప్రసాద్ , వడ్లమూడి గోపాలకృష్ణయ్యలు ఆదివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాకు రూ.10 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి ఈ మొత్తం వెచ్చిస్తామన్నారు. పీ4 లో భాగంగా ఈ మొత్తం చెక్కును దాతలు అందజేశారన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీఓ లక్ష్మీకుమారి, డిప్యూటీ స్టాటిస్టికల్ అధికారి జెట్టి సౌలరాజు, ప్రతిపాటి సురేష్ పాల్గొన్నారు. వ్యక్తికి తీవ్ర గాయాలు తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని కొలనుకొండ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి గుంటూరు చానల్ పక్కనే ఉన్న నీళ్లులేని కాలువలోకి దూసుకు వెళ్లింది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా పెదకాకానిలో నివాసముండే అనురాగ్ స్థానికంగా పార్శిల్ సర్వీస్లో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా కొలనుకొండ వద్ద అతని కారు డివైడర్ను ఢీకొని అదుపుతప్పి గుంటూరు చానల్ పక్కనే ఉన్న మరో కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసమైంది. స్థానికులు 108కు, తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి కారులో ఇరుక్కుపోయిన అనురాగ్ను బయటకు తీసి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ ఖాజావలి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కౌలు రైతులను విస్మరించిన బడ్జెట్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్లో కౌలు రైతుల పంట రుణాల ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో 70 శాతం సాగుభూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని, వారికి యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు మంజూరు చేస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని ప్రభుత్వం విస్మరించింది. అలాగే గుంటూరు జిల్లాకు నిధులు కేటాయింపులోనూ అన్యాయం జరిగింది. 50 గ్రామాలకు తాగునీరు అందించే గుంటూరు చానల్ పర్చూరు వరకు పొడిగింపునకు, నల్లమడ వాగు ఆధునీకరణకు నిధులు కేటాయింపు లేక పోవడం శోచనీయం. సంక్షేమ రంగానికి, వ్యవసాయ అభివృద్ధికి తగిన కేటాయింపులు లేవు. – పాశం రామారావు, కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు -
హర హర మహాదేవ..
క్వారీలోని బాలకోటేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు క్యారీలో విద్యుత్ ప్రభల వెలుగులుచేబ్రోలు: హర హర మహదేవా శంభో శంకర.. చేదుకో కోటయ్యా ... అంటూ శివనామస్మరణతో మహాశివరాత్రి సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి మారుమోగింది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఆలయం వద్దకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావటంతో ఆలయం ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి పండుగ సందర్బంగా క్వారీ బాలకోటేశ్వరస్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తిరునాళ్ల సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి భక్తులు, ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాలతో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. చేబ్రోలు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు సుమారు 15 వరకు భారీ విద్యుత్ ప్రభలను నిర్మించారు. దేవాలయం ప్రాంగణం వద్ద వంద అడుగుల పైన ఉన్న భారీ సెట్టింగ్ విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. చేబ్రోలు, తెనాలి పరిసర గ్రామాల నుంచి వందల సంఖ్యలో చిన్నచిన్న ప్రభలు, బాల ప్రభలు, మొక్కుబడు ప్రభలు తరలివచ్చాయి. ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోలలో భక్తులు దేవాలయానికి తరలివచ్చారు. దర్శనం కోసం మహిళలు, వృద్ధులు, పిల్లలు భక్తులు క్యూలైన్లతోపాటు బయట వరకు బారులు తీరారు. గంటల తరబడి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. మొక్కులు తీర్చుకోవటం కోసం మహిళలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలో పొంగళ్లు పొంగించుకున్నారు. దేవాలయ సమీపంలో జెయింట్ వీల్, రంగుల రాట్నాలు, తినుబండారాలు, పిల్లలు కొనుగోలు కోసం దుకాణాలు, చెరుకు గడల విక్రయాలు అధికంగా జరిగాయి. సమస్యలపై ప్రత్యేక దృష్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా వివిధ శాఖల అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. పారిశుద్ధ్యం, ట్రాఫిక్ వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. అర్చక బృందం ప్రత్యేక పూజలు చేశారు. అభిషేక మండపం వద్ద భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దర్శనానికి అవకాశం కల్పించారు. పటిష్ట పోలీసు బందోబస్తు తెనాలి డీఎస్పీ జనార్థనరావు పర్యవేక్షణలో జిల్లా పరిధిలోని 12 మంది సీఐలు, 30 మంది ఎస్ఐలు, 350 మందికిపైగా పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్నదానం క్వారీ బాలకోటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఆలయ సమీప ప్రాంతంలోని రెండు చోట్ల అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఆలయ ప్రాంగణం వద్ద పులిహోర, పొంగలి, లడ్డూ, మజ్జిగ ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని వివిధ భక్త బృందాలు ఏర్పాటు చేశాయి. కిక్కిరిసినస వీఐపీ క్యూలైన్ మహాశివరాత్రి సందర్భంగా క్వారీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానం వద్దకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తుల కంటే వీఐపీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. వేల సంఖ్యలో వీఐపీ పాసులను ఇష్టానుసారంగా పంపిణీ చేయటంతో సామాన్య భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. భక్తులు క్యూలైన్ల దాటి బయట వరకు దర్శనం కోసం వేచిఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా క్వారీ బాలకోటేశ్వరస్వామిని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, పొన్నూరు ఎమ్మెల్యే డి నరేంద్రకుమార్ దర్శించుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీ వాస్తవ మానటరింగ్ పాయింట్ వద్ద గంటలకొద్దీ కూర్చుని భక్తుల రాకపోకలను పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. -
గోవాడకు పోటెత్తిన భక్తులు
వేమూరు: బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం గోవాడలోని బాలకోటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. బాలకోటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. భక్తులు ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్నారు. దీంతో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతి ఏర్పాటుచేశారు. క్యూలైన్లలో నిల్చున్న భక్తులకు వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. సాయంత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగింది. పరిసర గ్రామాల రైతులు తమ పశువులను తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. భక్తులు పోటెత్తడంతో అదుపు చేసేందుకు పోలీసులు నానా వస్థలు పడ్డారు. బాల కోటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు ట్రాక్టర్లు వేసుకొని వచ్చారు. గతేడాది కన్నా ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు. భారీగా పోలీసు బందోబస్తు శివరాత్రిని పురస్కరించుకుని ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రత్యేకంగా పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. రాత్రి సమయంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నట్లు తెనాలి డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. దేవస్థానం చుట్టు పక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ జరుపుతున్నట్లు తెలిపారు. బాలకోటేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రముఖులు బాలకోటేశ్వరస్వామి పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మార్కెట్ యార్డు చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి ఉన్నారు. పలు సంఘాల ఆధ్వర్యంలో అన్నదానం బాలకోటేశ్వరస్వామి దర్శనం కోసం పలు సంఘాలు అన్నదానం ఏర్పాటుచేశాయి. ఆర్యవైశ్యులు, పద్మశాలీ, కాకతీయ ధర్మ సత్రాల వద్ద భక్తులకు ఉచితంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. బాలకోటేశ్వరస్వామి దేవస్థానం పాలక వర్గం కూడా ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. ఆర్టీసీ ప్రత్యేక సేవలు బాలకోటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందించింది. బాపట్ల, రేపల్లె, తెనాలి, గుంటూరు డిపోల నుంచి గోవాడకు ప్రత్యేక బస్సులను నడిపారు. సమాచార కేంద్రాన్ని ఏర్పాటుచేసి భక్తులకు సేవలు అందించారు. బస్సుల వద్ద రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. -
నేటి నుంచి తెలుగులో తీర్పులు
తెనాలి రూరల్: మాతృ భాష వారోత్సవాలను పురస్కరించుకొని కోర్టు తీర్పులు వారం రోజులపాటు తెలుగులోనే వెల్లడించనున్నట్లు ప్రధాన పౌర న్యాయమూర్తి(కనిష్ట విభాగం) ఏకా పవన్కుమార్ ఆదివారం తెలిపారు. తీర్పులు ప్రజల మాతృభాషలో ఉంటేనే, న్యాయస్థానాలను ఆశ్రయించే వారికి తాము ఎందుకు గెలిచామో, ఎందుకు ఓడామో కూడా స్పష్టమవుతుందని చెప్పారు. సాధ్యమైనంత వరకూ న్యాయస్థాన తీర్పులు మాతృభాషలోనే ఇవ్వడం మంచిదనీ భారత ఉన్నత న్యాయస్థానం సూచించిన విధంగా వెల్లడించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తెనాలిలోని రెండో అదనపు పౌర న్యాయమూర్తి (కనిష్ట విభాగం) పల్లగాని రాజశేఖర్ కూడా ఇటీవల తెలుగులో ఒక తీర్పు వెల్లడించడం తెలిసిందే. తెలుగులో తీర్పులు రావడం చాలా ముదావహమని, కేవలం న్యాయం కోసం వచ్చే వారికే కాక, ప్రజలందరికీ కూడా న్యాయస్థాన తీర్పులు అర్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందనీ ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నట్లు వారు వెల్లడించారు. -
పూర్తి తిరోగమన బడ్జెట్
చినగంజాం: ఇది తిరోగమన బడ్జెట్ తప్ప పేద వర్గాలకు మేలు చేసే విధంగా లేదు. సూపర్ సిక్స్ హామీలలో మహిళలకు నెలకు ఇస్తామన్న రూ.1500 బడ్జెట్లో కనిపించలేదు. విద్యారంగంలో రూ.15 వేల కోట్ల నుంచి రూ.14 వేల కోట్లకు కేటాయింపులు తగ్గించారు. సంక్షేమానికి 17.03 శాతం నుంచి 16 శాతానికి తగ్గించారు. అంగన్వాడీ, ఆశాలు వంటి స్కీం వర్కర్లకు సంబంధించి జీతాల పెంపుపై బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావనే లేదు. చేనేత వర్గాలకు రిక్తహస్తం చూపారు. పేద వర్గాల వారిపై కక్షతో ఇళ్లస్థలాలు గాని, ఇళ్ళు కట్టించే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నీ చూస్తుంటే పేద వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది. –బత్తుల బ్రహ్మానందరెడ్డి వైఎస్సార్సీపీ బాపట్ల, ప్రకాశం జిల్లాల టాస్క్ఫోర్స్ పరిశీలకులు -
పెదకాకానిలో భక్త జన సందోహం
పెదకాకాని: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానం మహాశివరాత్రి రోజున శివనామస్మరణతో మార్మోగింది. పెదకాకాని శివాయలంలో ఆదివారం భ్రమరాంబ అమ్మవారు స్వర్ణ కవచాలంకృత భ్రమరాంబదేవిగా భక్తులను అనుగ్రహించారు. తెల్లవారుజాము మూడు గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. మహాశివరాత్రి పర్వదినం కావడంతో జిల్లా నలుమూలల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కళకళలాడింది. భక్తులు పొంగలి నైవేధ్యాలతో ఓం నమఃశివాయ నామం స్మరిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, ధర్మకర్తల మండలి సభ్యులు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా క్యూలైనులు ఏర్పాటు చేసి భక్తులకు సకాలంలో స్వామి వారి దర్శనం కలిగేలా చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. క్యూలైనులలో నిల్చున్న భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో తాగునీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేశారు. మహాశివరాత్రి స్వామివారి కల్యాణం కావడంతో ఆలయాన్ని పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులందరికి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం, వర్తక సంక్షేమ సంఘం, శివాలయం మాజీ ట్రస్టు బోర్డు సభ్యులు పెండెం విజయ్, దూపాటి వెంకట్రావుల ఆధ్వర్యంలో ఉచితంగా అన్నప్రసాద వితరణ చేశారు. గూడూరి రామకృష్ణ, కాకతీయ యూత్, ఆర్యవైశ్య సంఘం, జనసేన పార్టీ, పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో పులిహోర, పొంగలి, దద్ధోజనం ఉచిత ప్రసాద పంపిణీ చేశారు. ఒక్కరోజులో స్వామి వారికి వివిధ సేవా కార్యక్రమాల ద్వారా రూ.6,50,000 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఉప కమిషనర్ తెలిపారు. రాత్రి వేళల్లో కాలక్షేపంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం విద్యుత్ కాంతులతో కళకళలాడుతుంది. స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు మల్లేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, కురుపాం ఎమ్మెల్యే టి జగదీశ్వరీ, హైకోర్టు న్యాయమూర్తి రవీంద్రబాబు, గుంటూరు 5వ నెంబరు జిల్లా జడ్జి నీలిమలు భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చక స్వాములు, వేదపండితులు వేద ఆశ్వీరవచనం చేయగా ఆలయ అధికారులు, స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. రుద్రాభిషేకం శివరాత్రి సందర్భంగా రాత్రి 11 గంటలకు లింగోద్భవ కాలమున స్వామి వారికి ఏకాదశ ద్రవ్యాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. 12గంటలకు గజవాహనంపై ఎదుర్కోలోత్సవం, తెల్లవారు జాము న 2 గంటలకు గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ పునః నిర్మాణ దాతలు కొల్లిపర వంశీకులు అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాలతలంబ్రాలు సమర్పించారు. -
ఆకట్టుకున్న ప్రభలు
వేజండ్లకు చెందిన భక్తులు పోట్టేళ్లతో ఆకర్షణీయంగా మొక్కుబడి ప్రభలను తీసుకువచ్చారు. గరువుపాలెంకు చెందిన భక్తులు గుడి ఆకారంలో ఏర్పాటు చేసిన ప్రభ ఆకట్టుకుంది. చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన రెడ్డివారి సంఘం భారీ ప్రభ భక్తులను విశేషంగా ఆకర్షించింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న ప్రేమ అభిమానంతో రాజశేఖరరెడ్డి ఫొటోను, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, బైరెడ్డి సిదార్థరెడ్డి ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రభను ప్రత్యేక ఏర్పాటు చేసిన ట్రాక్టర్పై మేళతాళలతో వేజండ్ల నుంచి క్వారీ గుడి వరకు ఊరేగింపుగా తరలివచ్చారు. యువత, గ్రామస్తులు, అభిమానుల కేరింతలతో సందడి చేశారు. -
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు వెన్నుపోటు
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను తుంగ లో తొక్కింది. విద్యా రంగానికి కేటాయింపులు పెంచకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్యాయం చేశారు. తల్లికి వందనం పథకానికి నిధులను తగ్గించడం ద్వారా వేలాది మంది విద్యార్థులను అనర్హులుగా చేయాలని ఆలోచన తగదు. – వై.థామస్ రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
అంకెల గారడిలా రాష్ట్ర బడ్జెట్
చీరాల:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడిలా ఉంది. సున్నాలు పెంచుకుంటూ పోవడం వల్ల ప్రయోజనం లేదు. మేనిఫెస్టోలో ఏ విధంగా చెప్పారో అది అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్ హామీలకు ఏ మేర కేటాయింపుల చేశారో స్పష్టత లేదు. నిరుద్యోగ భృతి, సున్నా వడ్డీ, ఆడబిడ్డ నిధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50ఏళ్లకే పింఛన్ వంటి హామీలకు కేటాయింపులు లేవు. – కరణం వెంకటేష్బాబు, వైఎస్సార్ సీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి -
ఐలాపురం వెంకయ్య మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
తాడేపల్లి : ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఇలాపురం వెంకయ్య మృతపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఐలాపురం వెంకయ్య ప్రజలకు, సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. వారి మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాక సమాజానికే తీరని లోటన్నారు. వెంకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని కోరుకుంటూ, వెంకయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఇలాపురం వెంకయ్య.. ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, శనివారం (ఫిబ్రవరి 14)న మరణించారు. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. విజయవాడలో ఆయన వ్యాపార, రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. -
సేవాలాల్ మహారాజ్కి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: సేవాలాల్ మహారాజ్కి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘బంజారా ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. సమాజ సేవే ఉన్నతమైన ధర్మమని చాటి చెప్పిన ఆ మహనీయుడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయం. నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.బంజారా ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. సమాజ సేవే ఉన్నతమైన ధర్మమని చాటి చెప్పిన ఆ మహనీయుడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయం. నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/Ri9SX9FW7V— YS Jagan Mohan Reddy (@ysjagan) February 15, 2026 -
శివరాత్రికి ముస్తాబైన క్వారీ దేవాలయం
చేబ్రోలు: మహాశివరాత్రి ఉత్సవాలకు వడ్లమూడి గ్రామంలోని క్వారీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానం సర్వాంగ సుందరంగా తయారైంది. గత రెండేళ్లుగా భక్తులు అధిక సంఖ్యలో తరలిస్తున్నారు. ఈ ఏడాది కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోటప్పకొండ తరువాత ఖ్యాతిగాంచిన క్వారీ తిరునాళ్లకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్ష మంది వరకు భక్తులు హాజరవుతారు. చేబ్రోలు మండలం నారాకోడూరు నుంచి మూడు భారీ విద్యుత్ ప్రభలు, గుండవరం, గొడవర్రు గ్రామాల నుంచి మూడు భారీ విద్యుత్ ప్రభలు, చేబ్రోలు, వడ్లమూడి, శేకూరు, శలపాడు, సుద్దపల్లి గ్రామాల నుంచి భారీ విద్యుత్ ప్రభలు పండుగ రోజు ఆలయానికి వస్తాయి. వీటితో పాటు వందల సంఖ్యలో బాల, చిన్న చిన్న ప్రభలు తరలివస్తాయి. పొంగళ్లు పొంగించి స్వామి మొక్కులు తీర్చుకోవటం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. క్వారీ బాలకోటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు ● మహాశివరాత్రి పండుగ సందర్భంగా క్వారీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానానికి రెండు రోజులుగా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శనివారం జిల్లా నలుమూలల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పొంగళ్లు పొంగించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అర్చక బృందం ఆధ్వర్యంలో బాలకోటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి వారికి రుద్రాభిషేకం, పూలంగి సేవ, బిళ్వార్చన, రుద్రాక్షాలంకారం, మహాశివరాత్రి పండుగ రోజున లింగోద్భవ కాలంలో ఏకాదశి రుద్రాభిషేకాలు, ప్రత్యేక అలంకారం తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. రెండు రోజులుగా ఆలయ ప్రాంగణం వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తుది మెరుగులు దిద్దుకుంటున్న భారీ విద్యుత్ ప్రభలు ● మహాశివరాత్రి పండుగ రోజున క్వారీ దేవాలయానికి వచ్చే భారీ విద్యుత్ ప్రభలు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. వంద అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న చేబ్రోలు, నారాకోడూరు తదితర గ్రామాల్లోని భారీ విద్యుత్ ప్రభలు నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. చేబ్రోలు గ్రామ ప్రభ ఆలయం ప్రాంగణం వద్ద ఆకర్షణీయంగా రూపుదిద్దుకొంది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకోని అధికారులు ● వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి తిరునాళ్లకు అన్ని శాఖల అధికారులు గతంలో జరిగిన లోటుపాట్లను గుర్తించి జరగబోయే క్వారీ తిరునాళ్ల పండుగ రోజు ఏర్పాట్లను సమీక్షించుకోవలసి ఉంది. భద్రత ఏర్పాట్లు గురించి, ట్రాఫిక్, ఆలయ ప్రాంగణం వద్ద రద్దీ, భారీ విద్యుత్ ప్రభల రాకపోకలు తదితర అంశాలపై గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తగిన ప్రణాళికలతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉంది. వీఐపీ దర్శనాలు, పాసుల పంపిణీపై విమర్శలు ● క్వారీ తిరునాళ్ల సందర్భంగా ఆలయం వద్ద వీఐపీ దర్శనాల పేరుతో ప్రత్యేక దర్శనానికి వెళ్లేవారికి దేవదాయ, రెవెన్యూ, పోలీసు శాఖలు ఇస్తున్న అనుమతులపై ప్రతి ఏటా విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది కూడా వీఐపీ పాసుల పంపిణీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్య భక్తులు, దర్శన టిక్కెట్టు తీసుకొన్న భక్తులను గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది. ఆలయం వద్ద కీలకంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నేతల కనుసన్నల్లో తమకు అనుకూలమైన వారికి వీఐపీ పాసులు విచ్చలవిడిగా పంపిణీ చేస్తుండటంపై పలు విమర్శలు వస్తున్నాయి. షాపుల కేటాయింపులో పచ్చ పాతం ● క్వారీ తిరునాళ్ల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో వ్యాపారం చేసుకొనే వారికి షాపుల కేటాయింపులో పచ్చపాతం వహించటంపై చిరు వ్యాపారులు విమర్శిస్తున్నారు. గతంలో అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా తమకు అనుకూలమైన వారికి, ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వటంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ● పంచాయతీ, దేవదాయశాఖలకు ఆదాయ వనరులుగా ఉన్న వాటికి ముందుగా వేలం పాటల ప్రకటనలను వ్యాపారులకు, మీడియా ద్వారా తెలియపరిచేవారు. ఈ ఏడాది మాత్రం భిన్నంగా తమకు అనుకూలమైనవారికి మాత్రమే సమచారం ఇచ్చి కేటాయింపులు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. తుది మెరుగులు దిద్దుకుంటున్న భారీ విద్యుత్ ప్రభలు -
ఓటమి బడ్జెట్
గుంటూరు● టీడీపీ మేనిఫెస్టోకు తిలోదకాలు ● విద్యారంగానికి కోతలు ● 12వ పీఆర్సీపై నిరాశే ● భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమని ప్రకటన ● వ్యవసాయ రంగానికి అంతంత మాత్రమేగుంటూరు ఎడ్యుకేషన్/ లక్ష్మీపురం (గుంటూరువెస్ట్): రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం శాసనసభలో ప్రవేశ పెట్టిన 2026–2027 బడ్జెట్పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఊహాజనిత బడ్జెట్ అని, టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు గ్యారెంటీ లేదని, ప్రాధాన్యత రంగాలకు తిలోదకాలు ఇచ్చారని మేథావులు, ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరించారని, 12వ పీఆర్సీపై నిరాశ మిగిల్చారని ఉపాధ్యాయ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గత బడ్జెట్తో పోల్చితే విద్యారంగానికి కేటాయింపులు పెంచలేదని, తద్వారా విద్యారంగం ప్రమాదంలో పడనుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులను విస్మరించిన ప్రభుత్వ తీరుపై రాబోవు రోజుల్లో ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయా సంఘాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా రైతాంగానికి కనీస కేటాయింపులు కూడా చేయకపోవడం ద్వారా ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరిని బయటపెట్టిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించే విధంగా 12వ పీఆర్సీ ప్రకటిస్తారని ఆశించిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. ఆర్థిక బకాయిలు, డీఏ బకాయిల చెల్లింపు కోసం నిధులు కేటాయించకపోవడం శోచనీయం. విద్యారంగానికి అరకొరగా కేటాయింపులు జరిపారు. పెండింగ్, డీఏ బకాయిల చెల్లింపు డిమాండ్తో ఈనెల 25న చలో విజయవాడకు తరలివెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. – వై.శ్యాంబాబు, ఎస్టీయూ, జిల్లా ప్రధాన కార్యదర్శి Iఅసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు శూన్యం. వ్యవసాయానికి తగిన కేటాయింపులు, గిట్టుబాటు ధరలు లేని పరిస్థితుల్లో ధరల స్థిరీకరణనిధికి కేవలం రూ.500కోట్లు కేటాయించడం శోచనీయం. సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు రూ.9,906 కోట్లకు పరిమితం కావడం అభివృద్ధి నిరోధకంగా ఉంది. జాబ్ కేలండర్, ఉద్యోగాల భర్తీపై ప్రస్తావన లేకపోవడంతోపాటు పాఠశాల విద్యకు రూ.32,308 కోట్ల కేటాయింపులు గతంతో పోల్చితే పెంపుదల లేదు. విశ్వవిద్యాలయాలను అభివృద్ధి పర్చేందుకు ఎటువంటి చర్యలు ప్రతిపాదించకపోవడం ఉన్నత విద్యాభివృద్ధికి విఘాతం. – కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6000, గరిష్ట ధర రూ.6800, మోడల్ ధర రూ.6400 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 4900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ 35.8640 టీఎంసీలు. -
పొగడ వృక్ష వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో 8వ రోజుకు చేరుకున్నాయి. స్వామి వారు పొగడ వృక్ష వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పురవీధుల్లో నిర్వహించిన ఊరేగింపులో భక్తులు ఆయా కూడళ్లలో స్వామివారిని దర్శించుకుని టెంకాయలు, హారతులు సమర్పించారు. మంగళగిరి పట్టణానికి చెందిన జంజనం ప్రసన్న కోటేశ్వరరావు, అనిత దంపతులు, వంగర కవిత, దుర్గా వెంకట మహేష్ దంపతులు, కుటుంబ సభ్యులు ఉత్సవ కై ంకర్య పరులుగా వ్యవహరించారు. దేవస్ధాన ఈ.వో. గోపీ ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు. -
మెడికల్–ఫార్మా మాఫియాపై ఆందోళన
లక్ష్మీపురం: మెడికల్, ఫార్మా రంగాల్లో పెరుగుతున్న అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా రాష్ట్ర సమితి పిలుపుతో గుంటూరు జిల్లా సీపీఐ సమితి ఆధ్వర్యంలో శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత, రాజ్యాంగ హక్కు అని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. నాణ్యమైన ఆరోగ్యసేవలు అందించకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ప్రైవేట్ కళాశాలల్లో స్టైఫండ్ ఎగవేతపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి అధ్యక్షత వహించారు. కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, మేడా హనుమంతరావులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్ : నాస్తిక సమాజం ఆధ్వర్యంలో మంగళగిరి మండలం నిడమర్రులోని చార్వాక ఆశ్రమంలో రెండు రోజుల పాటు జరుగనున్న 34వ నాస్తిక మేళ శనివారం ప్రారంభమైంది. పలువురు వక్తలు నాస్తిక సమాజం జెండా ఎగురవేసి, సమాజం హితం కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలకు నివాళులర్పించారు. అనంతరం నాస్తిక మేళాలో వైజ్ఞానికతకు, మతభావాలకు పొసగని మైత్రి అనే అంశంపై డాక్టర్ జయకుమార్ మాట్లాడుతూ వియాత్నం వంటి చిన్నదేశం మతరహిత దేశంలో అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్లిందని తెలిపారు. శాస్త్రవేత్తలు సత్యం కోసం శ్రమిస్తారని, మతవాదుల్లాగా దాడులు చేయరని అన్నారు. ప్రాచీన భారతంలో చార్వాకం అనే అంశంపై ఎం.వి.ఎస్. శర్మ మాట్లాడుతూ చార్వాక సిద్ధాంతం ప్రజల్లో ఒకరి నుంచి ఒకరికి తరతరాలుగా చేరుతోందని తెలిపారు. అనంతరం చార్వాక రామకృష్ణ అనే పుస్తకాన్ని డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ స్వరూపరాణి, శివారెడ్డిలు ఆవిష్కరించారు. రెండు రోజులు జరిగే ఈ నాస్తిక మేళాలో పలు అంశాలపై సదస్సులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు, హేతువాదులు, నాస్తికులు పాల్గొన్నారు. పెదగొట్టిపాడు (ప్రత్తిపాడు): కోటప్పకొండలో కొలువుదీరిన కై లాసనాథుని సన్నిధికి గొట్టిపాడు గ్రామస్తులు దశాబ్దాలుగా అందాల ప్రభ ఆనవాయితీని కొనసాగించారు. పూర్వం సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఆ గ్రామ పూర్వీకులు శివరాత్రికి భారీ ప్రభను కట్టుకుని ఎడ్ల జతలతో గ్రామం నుంచి భారీ ప్రదర్శనగా కోటప్పకొండకు తరలివెళ్లేవారు. ఈ ఏడాదీ అదే పద్ధతిని కొనసాగిస్తూ ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామ ప్రజలు ప్రభను కట్టుకుని తిరునాళ్లకు తరలివెళ్లారు. శుక్రవారం రాత్రి దేదీప్యమానంగా కాంతులీనుతున్న ప్రభ శోభాయాత్ర గ్రామంలో నేత్రపర్వంగా జరిగింది. అప్పట్లో ఎనభై అడుగుల భారీ ప్రభను నిర్మించారు. ఇప్పుడు ఊరేగింపులో పరిమితుల దృష్ట్యా ఎత్తు తగ్గించారు. తూర్పు వీధి వారు ఈ ఏడాది ప్రభను తయారు చేశారు. శనివారం ఎడ్ల బండిపై ప్రభను తిరునాళ్లకు తరలించారు. -
2029లో కూటమి అధికారంలోకి రాదు
గుంటూరు ఎడ్యుకేషన్/పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరులోని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు విజయలక్ష్మి, మౌనిక, మనోజ్ఞలను శనివారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, వైఎస్సార్ సీపీ యువజన విభాగం వర్కింగ్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధ్రెడ్డిలు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ● వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలో బలమైన నాయకుల ఇళ్లపై భౌతికదాడులకు తెగబడుతున్న కూటమి 2029లో అధికారం కోల్పోనుందని అన్నారు. 1988లో వంగవీటి మోహనరంగా హత్యానంతరం టీడీపీ అధికారానికి దూరమైందని, 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత 2016లో ముద్రగడ పద్మనాభంను చిత్రహింసలకు గురి చేసిన ఫలితమే 2019లో అధికారం కోల్పోయిందని అన్నారు. తాజాగా కాపు నాయకుడైన అంబటి రాంబాబుపై దాడికి పాల్పడిన ఫలితాన్ని టీడీపీ, జనసేన, మౌనంగా ఉన్న బీజేపీ అనుభవిస్తాయని అన్నారు. ప్రధానంగా 2029లో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగలనుందని స్పష్టం చేశారు. ● కాపులందరూ డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంట ఉన్నారనుకోవడం భ్రమ అని, పవన్ కల్యాణ్కి కూటమిలో గుర్తింపు లేదన్నారు. పవన్ కల్యాణ్కి కనీస ఫ్రొటోకాల్ ఇవ్వడం లేదనీ, రాజధాని నిర్మాణ వ్యవహారాలతోపాటు వైజాగ్లో జరిగిన సమ్మిట్లోనూ ఆయనను ఆహ్వానించలేదన్నారు. పవన్ కల్యాణ్తో ఉన్న అనేక మంది కాపులు వాస్తవాలు గ్రహించి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని చెప్పారు. ● అంబటి నివాసంపై గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆమె భర్త గళ్లా రామచంద్రరావు దగ్గర ఉండి దాడులు చేయించారని, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కమ్మని కుట్ర చేశారని అన్నారు. వారి ప్రోద్బలంతోనే కాపు నేత అంబటి రాంబాబుపై హత్యాయత్నం జరిగిందని, మా కాపుల ఓట్లతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. పార్టీలకతీతంగా కాపులకు అండగా ఉంటామన్నారు. 40 ఏళ్లుగా టీడీపీ అధికారం కోసమే కాపులను వాడుకుంటోందని, కాపు సమాజం తీవ్రమైన ఆవేదనతో ఉందన్నారు. ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం వర్కింగ్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై 2వేల మంది దాడి చేస్తే.. అందులో బాధితుడు అయిన ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటే.. నిందితులు స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారని తెలిపారు. ఒక మాజీ మంత్రిపై ఇంత కక్ష సాధింపు ఉంటే, సామాన్యుడికి భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. అంబటి అంటే గాలిలో ఒక సారి గెలిచిన ఎమ్మెల్యే కాదని, చిత్తశుద్ధితో పార్టీ కోసం పాటుపడే వ్యక్తి అని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, అంబటి రాంబాబు కుమార్తె మౌనిక పాల్గొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ కాపు నేతలపై దాడులు రాష్ట్రంలో వంగవీటి రంగా హత్య మొదలు ఇదే జరుగుతోంది వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ -
ఎన్ని ఇబ్బందులు పెట్టినా తగ్గేదేలే..
● అంబటిని ఎవరు తిట్టారో హోంమంత్రికి తెలియకపోవడం విడ్డూరం ● మాజీమంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఫైర్ పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : ఎన్ని ఇబ్బందులు పెట్టినా తగ్గేదేలేదని, అంబటి రాంబాబు వెనకడుగు వేయరని.. ప్రభుత్వ అక్రమాలకు, దౌర్జన్యాలకు తగ్గే ప్రసక్తేలేదని ఆయన కుమార్తె మౌనిక స్పష్టం చేశారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం నడవటంలేదని, ఒక నియంత రెడ్బుక్ పాలన సాగుతోందని ఆమె ఆరోపించారు. అంబటి రాంబాబు మాజీమంత్రి అయి ఉండి కోర్టు వద్ద అలా ఎలా వ్యవహరిస్తారని అంటున్న హోంమంత్రి అనితకు, మా ఇంటిపై దాడి చేసేటప్పుడు ఆయన మాజీమంత్రి అని గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. గుంటూరులో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘తిరుమల శ్రీవారిని వైఎస్సార్సీపీ నాయకుడిలా పోస్టర్లు వేసి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తుంటే, ఆ పాపాన్ని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఆయనపై దాడికి తెగబడ్డారు. అంతేకాక.. ఇంట్లో ఉన్న మాపై కూడా దాడిచేశారు. మా నాన్నపై 36 అక్రమ కేసులు బనాయించి పీటీ వారెంట్ వేస్తూ ఆయన్ను ఇబ్బందిపెడుతున్నారు. అభిమానులను ఉత్సాహపరిచేందుకే ఆయన పుష్ప సినిమాలో మాదిరిగా సైగలు చేశారు’. అని చెప్పారు. హోంమంత్రి వ్యాఖ్యలు ఎవరి గురించి? ‘నిన్న సభలో హోంమంత్రి అనిత వ్యాఖ్యలు అంబటి రాంబాబు గురించా.. లేకపోతే పరోక్షంగా లోకేశ్ గురించా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హోంమంత్రి గతంలో అమ్మ అనే మాటల్లో కూడా ఎంత అశ్లీలంగా మాట్లాడొచ్చో ప్రపంచానికి తెలియజేసిన గొప్ప మహిళ. చంద్రబాబునాయుడుని అరెస్టు చేసేటప్పుడు ఎలాంటి పదాలు వాడారో మేం వివరంగా చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. ఇక అంబటిని తిట్టిన వారికి సంబంధించిన వివరాలిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె చెబుతున్నారు.. అయితే, ఆయన్ని ఎవరు తిట్టారో ప్రపంచమంతా తెలుసు. సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. కానీ, హోంమంత్రికి తెలియకపోవటం విడ్డూరం. అంబటి రాంబాబుపై దాడి జరిగినప్పుడు ఆయనే స్వయంగా ఫిర్యాదుచేస్తే మీరు ఎంతమందిపై కేసు నమోదు చేశారు? స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి మా ఇంటి వద్ద చేసిన వ్యాఖ్యలు మీ దృష్టికి రాలేదా?’ అని మౌనిక మండిపడ్డారు. మంగళగిరి టౌన్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న గంగ, పార్వతి (దుర్గా) సమేత మల్లేశ్వర స్వామి వారికి మంగళగిరికి చెందిన బహుత్తమ పద్మశాలీ సేవా సంఘం ప్రతినిధులు శనివారం చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. ఏటా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. పట్టు వస్త్రాలను సమర్పించేందుకు విచ్చేసిన సేవా సంఘం సభ్యులకు ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలి కారు. సేవా సంఘం సభ్యులు తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం స్వామికి పట్టువస్త్రాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. పట్టువస్త్రాలు సమర్పించిన వారిలో చిల్లపల్లి మోహన్రావు, అందే నాగవరప్రసాద్, చిల్లపల్లి శ్రీనివాస్, తమ్మిశెట్టి జానకీదేవి, గంజి చిరంజీవి, గుత్తికొండ ధనుంజయరావు, దామర్ల నాగమణి, రామనాధం శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. గుంటూరు బ్రాడీపేటకు చెందిన పి.కామేశ్వరరావు కుటుంబం ఈఓ శీనానాయక్ను కలిసి రూ.1,01,116 విరాళం అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
గుండవరం, గొడవర్రు గ్రామ ప్రభల వద్ద అంబటి ప్రత్యేక పూజలు
చేబ్రోలు: మహాశివరాత్రి సందర్భంగా క్వారీ బాలకోటేశ్వరస్వామికి తరలివెళ్లే బారీ విద్యుత్ ప్రభల వద్ద శనివారం రాత్రి వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. చేబ్రోలు మండలం గుండవరం గ్రామ ప్రభ, గొడవర్రు గ్రామ ప్రభల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు, భక్తులు, అభిమానులు అంబటిని ఘనంగా సన్మానించారు. ఆయన వెంట చుక్కా నాగబాబు, రెండు గ్రామాలకు చెందిన పెద్దలు, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. -
నేడు మల్లేశ్వరస్వామి కల్యాణ వేడుకలు
● గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు ● భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఆర్జిత సేవలు నిలుపుదల పెదకాకాని: పెదకాకానిలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు శనివారం భ్రమరాంబ అమ్మవారిని వనదుర్గాదేవిగా భక్తులు దర్శించుకున్నారు. శివాలయంలో సుప్రభాతసేవ, మహా హారతులతో మొదలై స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ● సాయంత్రం స్వామి వారిని ప్రత్యేక పూలతో అలంకరించిన మయూర వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. ● సాంస్కతిక కార్యక్రమాలలో భాగంగా ఎస్.నాగమల్లేశ్వరి భాగవతారణి, వినుకొండ వారిచే హరికథ కాలక్షేపం, శ్రీ సత్యకృష్ణ కూచిపూడి కళా నిలయం, కూచిపూడి వారిచే కూచిపూడి నృత్యం, చింతా వెంకట దుర్గాప్రసాద్, విజయవాడ వారిచే మోహినీ భస్మాసుర పూర్తి నాటకం ప్రదర్శించారు. నేడు మహా శివరాత్రి ప్రత్యేక ఏర్పాట్లు ● మహాశివరాత్రి పర్వదినాన తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించడం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు అర్చక స్వాములచే స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకం జరిపి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించుట జరుగుతుందన్నారు. ● స్వామివారి మూలవిరాట్ దర్శనం, అభిషేక మండపంలో నిర్వహించే రూ.100 అభిషేకాలు, రాహు–కేతు పూజలు మినహా అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేసినట్టు తెలిపారు. ● మహాశివరాత్రి ఆదివారం నాడు భ్రమరాంబ అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తారు. రాత్రి 11 గంటలకు స్వామి వారికి రుద్రాభిషేకం జరుగుతుందన్నారు. ● రాత్రి 12 గంటలకు గజవాహనంపై ఎదుర్కోలు ఉత్సవం, తెల్లవారు జామున 2 గంటలకు గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దివ్య కల్యాణం అత్యంత వైభోపేతంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. -
బలాలపై దృష్టి సారించాలి
మంగళగిరి టౌన్ : యువత బలహీనతలను తగ్గించుకుని బలాలపై దృష్టి సారిస్తే అన్నింటా విజయం సొంతం అవుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జునరామ్ మేఘవాల్ పేర్కొన్నారు. ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో శనివారం ప్రత్యేక స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కృత్రిమ మేధ వినియోగంలో సవాళ్లు ఉన్నప్పటికీ ఆ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసి సమాజానికి ఉపయుక్తంగా మలుచుకోవాలన్నారు. గౌరవ అతిథిగా హాజరైన డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ భారత్లో శాస్త్ర, సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక సాంకేతికత వినియోగం ఎంతో ఉందన్నారు. డాక్టర్ కామత్కు వర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. వర్శిటీలో ఏడుగురు రీసెర్చ్ స్కాలర్లకు పిహెచ్డీ డిగ్రీలు ప్రసాదం చేశారు. కేంద్ర మంత్రి అర్జున్రామ్, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ కామత్లను వర్శిటీ యాజమాన్యం సత్కరించి జ్ఞాపికలను అందజేసింది. ఈ కార్యక్రమంలో వర్సిటీ వ్యవస్ధాపక కులపతి డాక్టర్ టీఆర్ పారివేందర్, వర్శిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ పి. సత్యనారాయణన్, ఉపకులపతి ఆచార్య కె. సతీష్కుమార్, ఎస్ఆర్ఎం ట్రస్టీ మెంబర్ మణిమంగై, రీసెర్చ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆచార్య డి. నారాయణ రావు, రిజిస్ట్రార్ ప్రేమ్కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ షీలా సింగ్, డాక్టర్ వినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘పరమశివుడి లింగోద్భవానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ.. పరమభక్తికి నిదర్శనం. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఆచరించే ఉపవాసం, జాగరణ నిష్టాగరిష్టతను చాటుతాయి’ అని వైఎస్ జగన్ అన్నారు.ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లన్న స్వామివారి ఆలయం కొలువై ఉన్న పవిత్ర ప్రదేశం మన రాష్ట్రమని అభివరి్ణంచారు. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణ చేసే భక్తులు భక్తి శ్రద్ధలతో శివార్చన, పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించిన వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలందరిపై ఆ పరమశివుడి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు.‘‘నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలు, జాగరణతో పరమశివుడిని ఆరాధించే ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. ‘‘ఆ మల్లికార్జునుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ!’’ అని వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలు, జాగరణతో పరమశివుడిని ఆరాధించే ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఆ మల్లికార్జునుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.ఓం నమః శివాయ !#Mahashivratri— YS Jagan Mohan Reddy (@ysjagan) February 15, 2026 -
‘బాబుకు రైతులంటే చిన్నచూపు.. మరోసారి తేలిపోయింది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుది రైతులను విస్మరించిన బడ్జెట్.. రైతు, రైతు కూలీల ప్రస్తావనే లేని వ్యవసాయ బడ్జెట్ని చూస్తున్నాం.. చంద్రబాబుకు రైతులంటే చిన్నచూపని మరోసారి తేలిపోయిందని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతాంగం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుందని.. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోయిందన్నారు.‘‘ఈ బడ్జెట్ చూశాక ప్రభుత్వం దృష్టిలో అసలు రైతులు లేరని తేలిపోయింది. బస్తా యూరియా కూడా అందించలేని ప్రభుత్వం ఇది. కిలో మంచి విత్తనాలు కూడా అందించలేని దగా ప్రభుత్వం ఇది. కానీ తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎలా చెప్పుకుంటున్నారు?. అన్నదాత సుఖీభవ కింద రూ.10,200 కోట్లు బడ్జెట్లో పెట్టాలి. కానీ రూ.6,600 కోట్లు మాత్రమే పెట్టటం ద్వారా రైతులను ఏం చేయదలచుకున్నారు?. ప్రభుత్వం దెబ్బకు రైతులంతా కూలీలుగా మారి పోతున్నారు...బడ్జెట్లో అసలు కౌలు రైతుల ప్రస్తావనే లేదు. రైతుల సంక్షేమం మీద ఈ ప్రభుత్వానికి ఒక వ్యూహం లేదు. ధరల స్థిరీకరణ నిధి కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా రూ.3 వేల కోట్లు బెట్టేవారు. గిట్టుబాటు ధరల్లేకపోతే ప్రభుత్వమే ఆదుకునేది. మరి కూటమి ప్రభుత్వం ఆ స్థాయిలో ఎందుకు కేటాయించలేదు?. జగన్ తెచ్చిన ఉచిత బీమా సౌకర్యాన్ని ఎత్తేసి రైతుల కడుపు కొట్టారు. చంద్రబాబు ఆక్వా రైతులనూ మోసం చేశారు. ఎన్నికలకు ముందు నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చి ఇప్పుడు నిలువునా ముంచారు..వైఎస్సార్ హయాంలో హార్టికల్చర్ వచ్చింది. కానీ చంద్రబాబు మాత్రం నిస్సిగ్గుగా తన ఘనత అన్నట్లుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు ప్రైవేటీకరణ మీద ప్రేమ.. చివరకు రైతు బజార్లను కూడా నిర్వహించలేక, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. చంద్రబాబు, లోకేష్కు భజన చేయటంలో కూటమి ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ప్రతిరోజూ సగటున ఒకరు, రైతు కూలీలు నలుగురు చొప్పున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ కుటుంబాలను అందుకునేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?...టీడీపీ ఎమ్మెల్యేనే పల్లె కన్నీరు పెడుతోందని వాపోయాడు. వీటన్నిటి డైవర్షన్ కోసం లడ్డూలో కల్తీ అంటూ కథలు అల్లుతారు. ఏ వర్గానికీ మేలు చేయలేక నిత్యం వైఎస్ జగన్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మూడో బడ్జెట్ పెట్టినా ఇంకా మోసాలే చేస్తారా?. ఈ బడ్జెట్ కేవలం అంకెల ఆర్భాటమే. అప్పులతోనే బండి నడుపుతామనే సంకేతం ఇచ్చారు’’ అని కన్నబాబు దుయ్యబట్టారు. -
‘దుప్పటి.. చెట్టు.. ఆవు..’ లోకేష్, పవన్పై బైరెడ్డి చెప్పిన కథ
సాక్షి, గుంటూరు: ఒక మనిషిని ఇబ్బంది పెడితే ప్రశ్నించడం ఆగిపోతుందనుకోవడం మూర్ఖత్వం అని వైఎస్సార్సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం బైరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అంబటి రాంబాబుపై దాడి చేస్తే.. దాడికి గురైన బాధితుడే జైలులో ఉన్నారన్నారు. అంబటిపై హత్యాయత్నం చేసిన టీడీపీ గూండాలు స్టేషన్ బెయిల్ తీసుకుని బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని బైరెడ్డి మండిపడ్డారు.అంబటి రాంబాబు సాధారణమైన వ్యక్తి కాదు, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజల కోసం పని చేశారు. హోం మంత్రి అర్ధ రహితంగా మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబును ఏమి పీకలేరు. మన తప్పులు మనకి చిన్నవిగా ఎదుట వారికి పెద్దవిగా కనిపిస్తాయి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న కూటమి నామరూపాలు లేకుండా పోతుంది. అంబటి రాంబాబును జైలులో పెడితే ఆయన కుమార్తె బయటకు వచ్చారు’’ అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు.జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్లు.. కుక్కలు కొట్టినట్టు కొట్టినాకూడా పవన్ కళ్యాణ్ స్పందించడు. పవన్కు ప్రతి నెలా ముట్టాల్సింది ముడుతుంది. కూలీ చేసేది జన సైనికులు.. లాభం అనుభవించేది టీడీపీ అంటూ.. జనసేన పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ.. బైరెడ్డి ఓ కథ చెప్పారు.పవన్ కల్యాణ్, లోకేష్ ఇద్దరూ కూర్చొని ఉంటే.. చంద్రబాబు వచ్చి.. మూడు వస్తువులను పంచుకోమని చెప్పి.. దుప్పటి, చెట్టు, ఆవు వారికి ఇచ్చారు. లోకేష్ పవన్తో ఇలా అన్నాడంట.. నీకు పంపకాలు సరిగా రావు.. ఇద్దరికి న్యాయంగా పంచుతానన్నాడు. దుప్పటిని పగలు అంతా నువ్వు వాడుకో.. రాత్రి అయితే తానూ వాడుకుంటానంటూ చెప్పాడు. న్యాయంగా పంచావు తమ్ముడు అన్న పవన్ కల్యాణ్.. దుప్పటి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పగటి పూట ఎండ వేడికి ఆ దుప్పటిని కప్పుకోలేకపోయాడు. రాత్రికి లోకేష్కు ఇచ్చాడు.. చలికి ఆ దుప్పటిని బాగా కప్పుకుని పడుకున్నాడంట. దుప్పటి.. లోకేష్కు ఉపయోగపడింది. పవన్కు ఉపయోగపడలేదు.తర్వాత ఇద్దరూ చెట్టు దగ్గరకు వెళ్లారు. ఇదీ కూడా న్యాయంగా పంచుతానన్న లోకేష్.. పై భాగం అంతా నేను తీసుకుంటా.. కింద భాగం అంతా నువ్వు తీసుకో అన్నాడంట.. అంటే చెట్టుకు నీళ్లు పోసేందంతా పవన్ కల్యాణ్.. కాసిన పండు తినేదంతా లోకేష్.. తర్వాత ఆవు దగ్గరకు వెళ్లారట. అన్నా.. ఇది కూడా న్యాయంగా పంచుతా.. ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో.. వెనుక భాగం అంతా నేను తీసుకుంటా.. ఆవుకు రోజూ.. మేత, నీళ్లు పోసేదంతా పవన్ కల్యాణ్.. వచ్చే పాలు పిండుకునేది లోకేష్.. ఇది జన సైనికులు పరిస్థితి ఎలా ఉందంటే.. కూలి చేసేది వీళ్లు.. వచ్చేదంతా తినేది తెలుగు తమ్ముళ్లు’’ అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వివరించారు. -
పవన్పై అంబటి రాంబాబు కుమార్తె ఫైర్
సాక్షి,గుంటూరు: తన తండ్రిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అంబటి మౌనిక తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. దాడి చేసి, తిరిగి అంబటి రాంబాబుపై కేసులు పెట్టారు. అక్రమ కేసులకు, దాడులకు భయపడేది లేదు.కూటమి నేతలు కావాలని రెచ్చగొట్టి, దాడులకు పాల్పడ్డారు. ప్రశ్నించడానికే వచ్చానన్న పవన్ ఎందుకు స్పందించడం లేదన్నారు. అంబటి రాంబాబుకు రక్షణ కల్పించడంలో హోంశాఖ విఫలమైందని మండిపడ్డారు. -
ఏపీ బడ్జెట్ అభూత కల్పన: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: ఏపీ బడ్జెట్ అంతా అంకెల గారడీ.. అప్పుల కుప్పలా ఉందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన ప్రజల్ని నమ్మించి మోసం చేసిన బడ్జెట్ ఇది అంటూ దుయ్యబట్టారు. నిరుద్యోగులను, మహిళల్ని, రైతుల్ని మోసం చేసిన బడ్జెట్. ఇది డబల్ ఇంజన్ సర్కార్ కాదు.. డబుల్ చీటింగ్ సర్కార్.. ఇచ్చిన ఒక్క హామికి కూడా సరైన నిధులు కేటాయించకుండా.. వచ్చే ఏడాదికి మరో లక్ష కోట్ల అప్పుకు రెడీ అయిపోతున్నారు. కేవలం 20 నెలల్లో లక్షల కోట్లు అప్పులు చేశారు. సంపద సృష్టి అసలే లేదు అంటూ అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ బడ్జెట్లోనూ అదే తీరు: వరుదు కల్యాణిఎన్నికల టైంలో ఊరూరా బాండ్లు పంచారు. వాటికీ ఈ బడ్జెట్కు సంబంధం ఉందా?. మోదీ, పవన్ను పక్కన పెట్టుకొని 164 సీట్లు తెచ్చుకొని ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చలేదు. తల్లికి వందనంలో కోతలు పెట్టారు. ఈ బడ్జెట్లో కూడా అదే తీరు. ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తామని నమ్మించి.. దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి ఇపుడు బడ్జెట్లో ఆ ఊసే లేదు. 50 ఏళ్లు దాటితే పింఛన్ ఇస్తామన్నారు.. దాని ఊసు లేదు. రెండు సెంట్ల స్థలం ఇస్తామన్నారు..దానికి ఒక్క రూపాయి కేటాయించలేదు. మహిళలకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు.. ఈ మూడు బడ్జెట్లలో కేటాయింపులు లేవు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి బడ్జెట్లో ప్రస్తావించలేదు. వీటన్నిమీద కౌన్సిల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము..మాయాబజార్ను తలపించింది: పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిఈ బడ్జెట్ అంతా ఊహాగానాలే.. నాలుగో తరగతి పిల్లాడు హిస్టరీ రాసినట్లు బడ్జెట్ రాసుకొచ్చారు. బడ్జెట్ ప్రసంగమంతా మాయాబజార్ను తలపించింది. ఎన్నికల ముందు 10 లక్షల కోట్లకు పైబడి అప్పులున్నాయని బురదజల్లారు. కూటమి వచ్చిన 20 నెలల్లో చేసిన అప్పు 3.10 లక్షల కోట్ల అప్పులు చేశారు. మరో లక్ష కోట్లు అప్పు చేస్తామని ముందే చెబుతున్నారు. నిరుద్యోగ భృతికి గత రెండు బడ్జెట్లలో కేటాయింపులు సున్నా. మూడో సంవత్సరం కూడా నిరుద్యోగ భృతి కేటాయింపులు సున్నా. ఆడబిడ్డ నిధికి మూడు బడ్జెట్లలో కేటాయింపులు సున్నా. 8500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుంటే.. కేవలం 3500 కోట్లను ఫీజు రీయింబర్స్మెంట్ కు కేటాయించారు.30 లక్షల మంది విద్యార్థులను రోడ్డున పడేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. నాడు-నేడు ద్వారా వైఎస్ జగన్ స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టారు. కానీ ఈ ప్రభుత్వం నాడు-నేడుకి రెండేళ్లలో చేసిన కేటాయింపులు సున్నా. ఇప్పుడు కేవలం 1500 కోట్లను నాడు నేడుకి ఇస్తామంటున్నారు...అది కూడా ఇస్తారో లేదో అనుమానమే. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ఉద్యోగులు తమ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ కమిషన్ ఛైర్మన్ను కూడా నియమించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం అసలు కొనసాగుతుందా అనే అనుమానం కలుగుతోందిఈ బడ్జెట్ పబ్లిసిటీ ఫుల్.. పనితనం నిల్: కల్పలతా రెడ్డిబడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ప్రజల ఆశలను వమ్ము చేశారు. ఆడబిడ్డ నిధి పేరుతో మోసం చేశారు. మహిళలను నిలువునా ముంచేసి.. బడ్జెట్లో మహిళా సాధికారత గురించి గొప్పగా చెబుతున్నారు. నిరుద్యోగ భృతి ఊసే ఎత్తలేదు. బడ్జెట్ను తయారు చేసిన ఉద్యోగులకు కూడా ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. పీఆర్సీ, ఐఆర్ గురించి కనీస ప్రస్తావన కూడా లేదు. హోంమంత్రి బడ్జెట్ పెట్టడంతో పోలీసులంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు. పోలీసులకు వెహికల్స్ పెట్టాం.. డ్రోన్లు పెట్టామని హోం మంత్రి చెప్పారు. హోంమంత్రి తమ బకాయిల గురించి మాట్లాడతారని పోలీసులు భావించి భంగపడ్డారు.ఈ బడ్జెట్ పనికిరాని బడ్జెట్: కుంభా రవిబాబుబడ్జెట్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ఈ బడ్జెట్ పనికిరాని బడ్జెట్. ప్రభుత్వం సంపద సృష్టికి బదులు అప్పులు సృష్టిస్తోంది. అభూత కల్పనగా బడ్జెట్ ఉంది. బడ్జెట్ అంతా అబద్ధాలతో నిండిపోయింది. ఎన్నికల సమయంలో ఏపీ అప్పులపై ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈ రోజు ఏపీ అప్పు 9.47 లక్షల కోట్లని బడ్జెట్లో చెబుతున్నారు. చంద్రబాబు ఎందుకు అప్పులపై తప్పుడు ప్రచారం చేశారో సమాధానం చెప్పాలి -
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: బొత్స
సాక్షి, అమరావతి: చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. సున్నావడ్డీ ఉందో లేదో తెలియడం లేదన్నారు. బడ్జెట్ కోసం ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారని.. 1 నుంచి 8 పేజీల వరకూ వాళ్ళను వాళ్ళు పొగుడుకోవడానికి, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సరిపోయిందంటూ దుయ్యబట్టారు.ఈ బడ్జెట్లో ఎంతసేపూ చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్లే చెప్పుకొచ్చారు. రైతులకు మద్దతు ధర గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? అంతా అంకెల గారెడీ అంటూ బొత్స నిలదీశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సున్నా వడ్డీ రుణాలు ఠంఛన్గా అందించాం.. ఈ ప్రభుత్వంలో వాటి ఊసే లేదు.. కేటాయింపులు లేవు. పనికి ఆహార పథకాన్ని నీరుగార్చే విధంగా కేటాయింపులు పెట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో 3 లక్షల 20 వేల కోట్లు మాత్రమే అప్పులు చేశామని చెప్పాం. కానీ ఇప్పుడు 9 లక్షల కోట్లు వైఎస్సార్సీపీ హయాంలో అప్పులు చేశామని చెబుతున్నారు...బడ్జెట్ అంతా తప్పులు తడకగా ఉంది.. ఎంతసేపూ చంద్రబాబు, మోదీ, పవన్, లోకేష్ల పొగడ్తలే సరిపోయాయి. ఈ 20 నెలల కాలంలో 20 లక్షల ఐడెంటిటీ కార్డులు ఇచ్చి ఒక్క కౌలు రైతులకు అయినా నష్టపరిహారం ఇచ్చారా?. ఈ బడ్జెట్ వల్ల సమాజంలో ఏ ఒక్క వర్గానికి ఉపయోగం లేదు.. రాబోయే రోజుల్లో వీటి మీద పోరాడతాం. కచ్చితంగా మండలిలో చొక్కా పట్టుకొని నిలదీస్తాం. సమాధానాలు రాబడతాం’’ అని బొత్స పేర్కొన్నారు. -
అణగారిన వర్గాల ఆశలకు ప్రతీక దామోదరం సంజీవయ్య : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: అణగారిన వర్గాల ఆశలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు, దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు.ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ..‘పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆశలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు, దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు. పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/BLmsad1bHQ— YS Jagan Mohan Reddy (@ysjagan) February 14, 2026 -
వినియోగదారుల హక్కులు కాపాడాలి
గుంటూరు వెస్ట్: వినియోగదారుల హక్కుల పరిరక్షణ ముఖ్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... కమిటీ సభ్యులు సూచించిన అంశాలసౌ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో నీళ్ల ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో వివిధ రకాల పరీక్షలు, స్కానింగ్కు నిర్దేశిత ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆహార తనిఖీ విభాగం హోటళ్లపై నిఘా పెట్టి కేసులు నమోదు చేయాల్సి ఉందని వివరించారు. గ్యాస్ డెలివరీ బాయ్ వినియోగదారుల నుంచి అధికంగా నగదు వసూలు చేస్తున్నారని, ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల వద్ద రంగుల ఐస్ క్రీములు, హానికరమైన ఆహార పదార్థాల విక్రయాన్ని కట్టడి చేయాలని సూచించారు. నగరంలో ప్లాస్టిక్ తయారీ కేంద్రాలను గుర్తించి, వాటిని తనిఖీ చేయాలని అన్నారు. సమావేశంలో డీఎస్ఓ పి.కోమలి పద్మ, డ్వామా పీడీ కె.కళ్యాణ చక్రవర్తి, సీపీడీసీఎల్ కార్యనిర్వహక ఇంజినీర్ రమేష్, అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. గుండవరం(చేబ్రోలు): మహాశివరాత్రి సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి తిరునాళ్లలో భారీ విద్యుత్ ప్రభలు ప్రధాన ఆకర్షణ. దీనిలో భాగంగా ఆలయం నిర్మాణం జరిగినప్పటి నుంచి గొడవర్రు గ్రామ ప్రభ, గుండవరం గ్రామ ప్రభలు క్రమం తప్పకుండా ఆనవాయితీగా ముందు వరసలో ఉంటాయి. వంద సంవత్సరాల నుంచి గ్రామ ప్రభలు భారీ విద్యుత్ ప్రభలను నిర్మించుకొని భక్తిశ్రద్ధలతో గ్రామంలో మహాశివరాత్రి ముందురోజు ఊరేగింపు నిర్వహించి అనంతరం పండుగ రోజున భక్తుల శివనామస్మరణలతో ఆలయానికి చేరుకుంటాయి. గుండవరం గ్రామానికి చెందిన చుక్కా వంశస్తులు ఒక సంవత్సరం, టంకశాల వంశస్తులు మరో సంవత్సరం గ్రామ ప్రభను నిర్మించి క్వారీ ఆలయానికి గ్రామ ప్రభను తీసుకువెళ్లటం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ ఏడాది చుక్కా వంశస్తులు గ్రామ ప్రభను నిర్మిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు
పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలిజిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చేబ్రోలు: విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు వద్దని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థుల హాజరు తక్కువగా ఉండటంపై కలెక్టర్ ప్రశ్నించగా వడ్లమూడి క్వారీలో గల బాలకోటేశ్వర స్వామి ఆలయంలో జాతీయ సేవా కార్యక్రమాలు నిర్వహించుటకు తీసుకువెళ్లినట్లు అద్యాపకులు తెలిపారు. అక్కడ నుంచే వస్తున్నామని అక్కడ విద్యార్థులు ఎవరు కనిపించలేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్తితుల్లో తక్షణం మార్పు రావాలని ఎన్ఎస్ఎస్ కార్యక్రమం ఎక్కడో చేయటానికి ముందు మీ కళాశాల పరిసరాలలో చేపట్టాలన్నారు. పరిసరాలలో పరిశుభ్రత అధ్వానంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యాపకుల అనధికార గైర్హాజరును ప్రశ్నించారు. మూమెంట్ రిజిస్టర్ సైతం పరిశీలించి ఎటువంటి అనుమతులు నమోదు చేయకపోవడంతో ఆరుగురు అధ్యాపకులకు షోకాజ్ నోటీస్లు జారీ చేయాలని ఆదేశించారు. గ్రంథాలయ నిర్వహణ తీరుపైనా మండిపడ్డారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. చేబ్రోలులోని సూర్య దేవర నరసయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కూడా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. జూనియర్ కళాశాలను తనిఖీ చేసి పరీక్షల సంసిద్ధత, ఏర్పాట్లు తెలుసుకున్నారు. చీలిపాలెం ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పరిశుభ్రత మెరుగుపరచాలని సూచించారు. నారా కోడూరు గ్రామంలో మైక్రో ఇరిగేషన్ క్రింద నిర్వహిస్తున్న షెడ్ను, యూనిట్లను పరిశీలించారు. జిల్లా విద్యా శాఖాధికారి షేక్ సలీం బాషా, తహసీల్దారు కె. శ్రీనివాశర్మ, ఎంఈవో రాయల సుబ్బారావు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్: జిల్లాలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. పది, ఇంటర్ పరీక్షలపై శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలన్నారు. తాగునీరు, వైద్య శిబిరాలు, అత్యవసర మందులు ఉండాలని చెప్పారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం బాషా మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు మార్చి 16వ తేదీన ప్రారంభం అవుతాయన్నారు. జిల్లాలోని 149 కేంద్రాల్లో 27,699 మంది పరీక్షలు రాస్తారని తెలిపారు. 1,714 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు. ఓపెన్ స్కూలింగ్ 10వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయన్నారు. 12 కేంద్రాల్లో 1,083 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు. ఓపెన్ స్కూలింగ్ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 2వ తేదీ నుండి ప్రారంభం అవుతాయని, ఉదయం 9 – 12 గంటల వరకు జరుగుతాయన్నారు. 9 కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు 2,003 మంది హాజరు అవుతున్నారని తెలిపారు. ప్రాంతీయ పర్యవేక్షక అధికారి జి.సునీత మాట్లాడుతూ రెగ్యులర్ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయని చెప్పారు. జిల్లాలో 87 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. మొత్తం 68,898 మంది విద్యార్థులు హాజరు అవుతున్నారని తెలిపారు. సమావేశంలో డీఆరో షేఖ్ ఖాజావలి, జిల్లా ఇంటర్మీడియట్ శాఖాధికారి జె.పద్మ, ప్రాంతీయ రవాణా అధికారి కె. శ్రీహరి, అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి
గుంటూరు వెస్ట్: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ సర్వీసు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాషా శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రవేశపెట్టిన సీపీఎస్ విధానం ఆమోదయోగ్యంగా లేదన్నారు. దీని రద్దుకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన పాలకులు నేడు చర్యలు తీసుకోవడం లేదున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపీఎస్ గురించి కూడా ప్రస్తావించడం లేదని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. ఇప్పటి వరకు ఫలితం లేదని వాపోయారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్ బాషా -
కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి
నరసరావుపేట ఈస్ట్: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలు డిమాండ్ చేస్తూ ఎస్టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన దశల వారీ ఉద్యమంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో కోటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తన హామీల్లో భాగంగా 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలనీ, అప్పటి వరకు 30 శాతం మధ్యంతర భృతిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు అధ్యక్షత వహించిన ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి మాట్లాడుతూ, రూ.34 వేల కోట్లను దశల వారీగా విడుదల చేయాలని పెండింగ్లో ఉన్న 4 డీఏలను విడుదల చేయాలని కోరారు. -
పీఆర్సీ కమిషన్ నియమించాలి
లక్ష్మీపురం: పీఆర్సీ కమిషన్ను నియమించాలని ఏపీ ఎస్టీయూ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్టీయూ మలి విడత ఉద్యమ కార్యచరణలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి సి.హెచ్.జోసఫ్ సుధీర్బాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డి.పెదబాబులు మాట్లాడుతూ దీర్ఘకాలిక ఆర్థిక బకాయిల చెల్లింపులకు రోడ్ మ్యాప్ ప్రకటించి వెంటనే చెల్లించాలన్నారు. నాలుగు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని పేర్కొన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలని తెలిపారు. సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం వర్తించేలా చేయాలన్నారు. పదవీ విరమణ చేసిన మరుసటి రోజునే ఉద్యోగికి ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సెక్రెటరీ ఎం.శ్రీధర్, రాష్ట్ర బాధ్యులు ఎస్. రామచంద్రయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ బాజీ, వై.శ్యాంబాబు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కె.విజయబాబు తదితరులు పాల్గొన్నారు. -
హేతువాద భావజాలంతోనే నాగరిక సమాజం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా హేతువాద దృక్పథంతో మనిషి మనుగడ సాధించగలిగితేనే నాగరిక సమాజం మనగడ సాధిస్తుందని ప్రముఖ హైకోర్టు న్యాయవాది, త్రిపురనేని రామస్వామి సాహితీ సమితి పూర్వాధ్యక్షులు బైరపనేని నరేష్ అన్నారు. శుక్రవారం కవి రాజు త్రిపురనేని రామస్వామి సాహితీ సమితి ఆధ్వర్యంలో జేకేసీ కళాశాల రోడ్డు రాయపాటి రంగారావు విద్యా కళాశాల ప్రాంగణంలో జాతీయ పురస్కార సభ నిర్వహించారు. హైకోర్టు న్యాయవాది, త్రిపురనేని రామస్వామి సాహితీ సమితి పూర్వాధ్యక్షులు బైరపనేని నరేష్ -
ఎడ్ల పోటీలు ప్రారంభం
చినగంజాం: శివరాత్రి పండగను పురస్కరించుకొని మండల కేంద్రం చినగంజాంలో నాటు బండి పోలురాధా ఎడ్ల పోటీలను శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. స్థానిక శ్రీ లలితా రామకోటేశ్వర ఆలయ ప్రాంగణంలో టైరుబండ్ల యూనియన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో పోటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి ఇప్పటి వరకు 12 ఎడ్ల జతలు పోటీలో పాల్గొనేందుకు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ టీఎస్సార్ ఆంజనేయులు రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. హాజరైన ఎడ్ల జతలను లాటరీ విధానంలో పోటీలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకున్నారు. నిర్ణీత సమయం 10 నిమిషాల లోపు తక్కువ సమయంలో దూరం ఎక్కువ దూరం లాగిన ఎడ్ల జతల ఆధారంగా బహుమతులు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పోటీలను తిలకించేందుకు వందల సంఖ్యలో అభిమానులు, ఉత్సాహవంతులు దూర ప్రాంతాల నుంచి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, టైరుబండ్ల యూనియన్ సభ్యులు, గ్రామ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. నకరికల్లు: సాగు చేస్తున్న పంటలకు ఈ క్రాప్ నమోదు చేసుకోవడం ద్వారా వ్యవసాయ సంక్షేమపథకాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు అన్నారు. మండలంలోని నకరికల్లు, చల్లగుండ్ల గ్రామాల్లో ఈ పంట నమోదు చేసుకున్న పంటపొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు తనిఖీచేశారు. సూపర్చెక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26లో గ్రామాల్లోని రైతుసేవకేంద్రాల సిబ్బంది నమోదు చేసిన పంటలను జియోఫెన్సింగ్తో తనిఖీ చేశామన్నారు. మండలంలో రబీ సీజన్లో 7,752 హెక్టార్లలో వరి, 1,598 హెక్టార్లలో మొక్కజొన్న, 71 హెక్టార్లలో ఇతపంటలు సాగుచేస్తున్నట్లు నమోదైందన్నారు. -
బీజేపీ మహిళ మోర్చా కమిటీ బాధ్యతల స్వీకరణ
గుంటూరు మెడికల్: బీజేపీ జిల్లా మహిళా మోర్చా నూతన కమిటీ సభ్యులు శుక్రవారం గుంటూరు లాల్పురం రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు సమక్షంలో జిల్లా మహిళ మోర్ఛా అధ్యక్షురాలు డాక్టర్ శనక్కాయల రాజామాధవి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసి ప్రమాణం చేయించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ అన్నారు. మహిళ మోర్చా ఉపాధ్యక్షునిగా వాణి వెంకట్, సాధువాణి, లక్ష్మీదేవి, చాముండేశ్వరి, స్వాతి, విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శులుగా కాసు శ్రీదేవి, కఠారి పద్మజ, కార్యదర్శులుగా రాధిక, రమ్య, రమాదేవి, లక్ష్మీప్రసన్న, పర్హానా, కోశాధికారిగా డాక్టర్ స్రవంతి, సోషల్మీడియా కన్వీనర్గా వెంకటలక్ష్మి, కార్యనిర్వాహక సభ్యులుగా లీలారాణి, ఉష, లీల, దుర్గా, పద్మా, బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహిళ మోర్చా కమిటీకి మహిళ మోర్ఛా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నడ్డి నాగమల్లేశ్వరి, గుంటూరు మిర్చి యార్డు డైరెక్టర్ శ్రావణ్కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈదర శ్రీనివాసరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కుమార్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భజరంగ్ రామకృష్ణ, తదితరులు అభినందనలు తెలిపారు. -
క్వారీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్ల
ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చేబ్రోలు: మహా శివరాత్రి సందర్భంగా వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగే తిరునాళ్ల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా శుక్రవారం పరిశీలించారు. భక్తులకు సురక్షిత తాగునీరు .. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జీవీ రమణ మూర్తి, తెనాలి డీఎస్పీ బి.జనార్ధనరావు, జిల్లా పంచాయతీ అధికారి బీవీ నాగసాయికుమార్, తెనాలి ఇన్చార్జి సబ్కలెక్టర్ లక్ష్మీ కుమారి, జడ్పీ సీఈవో జ్యోతిబసు, తహసీల్దారు కె. శ్రీనివాసశర్మ, దేవదాయశాఖ అధికారి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల కొంగు బంగారం క్వారీ బాలకోటేశ్వరుడు
సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ మట్టం శుక్రవారం 536.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 20,641 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. మహాశివరాత్రి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి చేబ్రోలు: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వడ్లమూడి క్వారీలోని బాలకోటేశ్వరస్వామి దేవాలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోటప్పకొండ తిరునాళ్ల తరువాత చెప్పుకోదగిన చేబ్రోలు వడ్లమూడి క్వారీ తిరునాళ్లకు ఓ ప్రత్యేకత ఉంది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా క్వారీ బాలకోటేశ్వరస్వామి విరాజిల్లుతున్నారు. ● సుమారు వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం వద్ద 80 ఏళ్ల నుంచి తిరునాళ్ల జరుగుతుంది. మొట్టమొదటిసారిగా చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామస్తులు ప్రభను తిరునాళ్లకు తీసుకువచ్చినట్లు పెద్దలు చెబుతుంటారు. ● మహాశివరాత్రి సందర్భంగా జరిగే తిరునాళ్లకు జిల్లా నలుమూలల నుంచి సుమారు లక్షమంది భక్తులు హాజరవుతారు. ఆలయ ధర్మకర్త చీమకుర్తి యలమందయ్య కోర్కైపె మరణానంతరం ఆయన మృతదేహాన్ని ఆలయానికి ఆగ్నేయ దిశలో తెనాలి రోడ్డు పక్కనే సమాధి చేశారు. కాలక్రమేణా భక్తుల రాక పెరగటంతో ఆలయం అభివృద్ధి చెందింది. ● సూర్యదేవర వెంకటప్పయ్య అనే భక్తుడు నిజాంపట్నం మండలం నక్షత్ర నగర్లో తనకు ఉన్న ఎకరం భూమిని ఆలయ నిర్వహణకు రాశారు. ● జిల్లాలో వడ్లమూడి క్వారీ తిరునాళ్లకు ఆదరణ, గుర్తింపు లభించటంతో అధికారులు ఈ ఆలయాన్ని దేవదాయశాఖలో విలీనం చేశారు. భారీ విద్యుత్ ప్రభలు ప్రత్యేక ఆకర్షణ... -
మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివ భక్తుల, ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం సామ్రాజ్యం తెలిపారు. గుంటూరు జిల్లాపరిధిలోని ఐదు డిపోల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు. కోటప్పకొండ తిరునాళ్లకు గుంటూరు డిపో –1 నుంచి 35, డిపో–2 నుంచి 30, మంగళగిరి నుంచి 15, పొన్నూరు నుంచి 10, తెనాలి నుంచి ఐదు, మొత్తం 95 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గోవాడలోని బాలకోటేశ్వరస్వామి ఆలయానికి పొన్నూరు నుంచి 10 బస్సులు, తెనాలి నుంచి 26 బస్సులు, క్వారీ తిరునాళ్లకు తెనాలి నుంచి 26 బస్సు లు,గుంటూరు డిపో–2 నుంచి 12 బస్సులు తిప్పుతున్నట్లు తెలిపారు. ఆయా రూట్లలో తిరిగే బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. -
నీటి సంఘాలతో సబ్కమిటీల ఏర్పాటుకు చర్యలు
తెనాలి: కృష్ణా పశ్చిమ డెల్టాలో 2026–27 సంవత్సరానికి కాల్వలు, డ్రైన్ల మరమ్మతులకు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, నీటి వినియోగదారుల సంఘాలతో సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని జలవనరులశాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు పులిపాటి వెంకటరత్నం సూచించారు. పంటలకు నీటి సరఫరా, వేసవిలో పంట కాల్వల మరమ్మతుల సన్నాహాలపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ ప్రాజెక్టు కమిటీ కార్యవర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం తెనాలిలో నిర్వహించారు. కృష్ణా పశ్చిమడెల్టా డివిజన్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు అధ్యక్షత వహించారు. గతేడాది ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో పూర్తయిన పనులు వివరాలను తెలియజేశారు. ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఎన్.సునీల్ చౌదరి సభ్యులతో మాట్లాడారు. జలవనరుల శాఖ ఎస్ఈ పులిపాటి వెంకటరత్నం మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ సీజన్లో నీటిని అందించే క్రమంలో చేపట్టాల్సిన ఓఅండ్ఎం పనులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం, నీటితీరువాలు, నీటి సరఫరాపై నీటి సంఘాలతో సమీక్షించారు. సమావేశంలో ఇరిగేషన్ డివిజన్ గుంటూరు ఈఈ వెంకట రమణ, కృష్ణ పశ్చిమ భాగం తెనాలి ఈఈ ఎస్ సుధాకర్, రేపల్లె డ్రైనేజీ డివిజన్ ఈఈ ప్రేమకుమార్, కార్యాలయం పరిపాలన అధికారి దాసరి అనిల్ కుమార్, ఇరిగేషన్, డ్రైనేజీ డీఈఈ, ఏఈలు పాల్గొన్నారు. పశ్చిమ డెల్టా సూపరింటెండెంట్ ఇంజనీరు పులిపాటి వెంకటరత్నం -
గజ వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ఏడో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం స్వామి వారు గజ వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పురవీధుల్లో నిర్వహించిన ఊరేగింపులో భక్తులు ఆయా కూడళ్లలో స్వామివారిని దర్శించుకుని టెంకాయలు, హారతులు సమర్పించారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంగళగిరి పట్టణ శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం వారు ఉత్సవ కై ంకర్య పరులుగా వ్యవహరించారు. దేవస్థాన ఈఓ గోపి ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు. దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావుతోపాటు పలువురు పాలకమండలి సభ్యులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. -
వనదుర్గాదేవిగా భ్రమరాంబ అమ్మవారు
తొందరపాటు ప్రయాణం వద్దు పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజైన శుక్రవారం భ్రమరాంబ అమ్మవారు వనదుర్గాదేవిగా భక్తులను అనుగ్రహించారు. దేవస్థానంలో శుక్రవారం ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, పంచహారతులతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 7 గంటలకు గ్రామ బలిహరణ, 8:30 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 1 గంటకు మహానివేదన, నిత్యౌపాసన, గ్రామబలిహరణ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పంచహారతులు ఇచ్చారు. మహా శివరాత్రి రోజున ఆదివారం రాహు కేతు పూజలు, 100 అభిషేకాలు మినహా అన్ని అర్జిత సేవలు నిలిపివేయడం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. తెనాలి రమేష్బాబు బృందంచే భక్తిరంజని, నటరాజ నృత్యనిలయం విజయవాడ వారిచే కూచిపూడి నృత్యం, వెనిగండ్ల ఉల్లంగుల బ్రహ్మం ఆధ్వర్యంలో గయోపాఖ్యానం నాటకం నుంచి యుద్ధసీను, నిడుబ్రోలు వేపసూరి వెంకట్రావు ఆధ్వర్యంలో బాలనాగమ్మ నాటకం నుండి ఫకీరు, సంగు సీన్లు అద్భుతంగా ప్రదర్శించారు. మహాశివరాత్రి కల్యాణ బ్రహోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం అంతటా విద్యుత్ కాంతులతో కళకళలాడుతుంది. నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : రాత్రివేళ నిద్రమత్తు వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు ఫేస్ వాష్ / గో అంటూ ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ను పోలీసులు శుక్రవారం రాత్రి చేపట్టారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా, ప్రాంతీయ రహదారులపై పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ డ్రైవ్ను నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నిద్రమత్తు కారణంగా వాహనాలపై నియంత్రణ కోల్పోయి, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని డ్రైవర్లకు తెలియజేశారు. ఆయా వాహనాలను నిలిపి డ్రైవర్లతో మాట్లాడి, ప్రమాదాలపై అవగాహన కల్పించారు. వారికి తాగునీరు అందించి, ముఖాలను నీటితో శుభ్రం చేసుకునేందుకు నీటి సీసాలను అందించారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని డ్రైవర్లకు సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని బ్లాక్ స్పాట్స్, రోడ్డు ప్రమాదాల ఏరియాలు, ప్రధాన జంక్షన్లు, టోల్గేట్ల వద్ద ఈ డ్రైవ్ను కొనసాగించారు. తొందరపాటు ప్రయాణం కంటే ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని డ్రైవర్లకు చెప్పారు. -
గుంటూరులో విధ్వంసం సృష్టించిన దుండగులు
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని జేకేసీ కళాశాల రోడ్డులో గురువారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసం సృష్టించారు. దుకాణాలతో పాటు ఇంటిని కూల్చేందుకు పొక్లయినర్తో వచ్చి దాడులకు తెగబడ్డారు. అడ్డుకోబోయిన యువతిపై హత్యాయత్నం చేశారు. జేకేసీ కళాశాల రోడ్డులోని కృష్ణా పౌల్ట్రీ ఫారం (చికెన్ షాప్)తో పాటు పక్కనే ఉన్న పాత ఇనుప సామాన్ల దుకాణం, అక్కడే పైఅంతస్తులో ఉన్న ఇంటిపై 30 మంది మూకుమ్మడిగా దాడి చేశారు. పొక్లయిన్తో వచ్చిన దుండగులు చికెన్షాప్ గ్రిల్ పగలగొట్టి లోపలకు చొరబడ్డారు. కోడిగుడ్లతో ఉన్న 150 ట్రేలను విసిరిపారేసి, కౌంటర్లోని రూ.19వేల నగదు దొంగిలించారు. షాపులోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పక్కనే ఉన్న పాత ఇనుప సామాన్ల కొట్టులోకి ప్రవేశించి, పై అంతస్తులోని ఇంట్లో నివసిస్తున్న దుకాణ యజమాని వెంకటేశ్వరరావు కుటుంబంపై దాడి చేశారు. ఇంటిలో ఉన్న రూ.1.50 లక్షల నగదును అపహరించారు. హఠాత్తుగా జరిగిన దాడికి భయకంపితులైన దుకాణదారుని కుటుంబం అరుపులు, కేకలు వేశారు. తలుపులపై విచ్చలవిడిగా కొడుతున్న వారిని వారించేందుకు ప్రయత్నించిన యువతి మీనాక్షి తలపై రాడ్డుతో దాడి చేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వచ్చిన పోలీసులను చూసిన దుండగులు పొక్లయినర్తో పాటు దానిని తెచ్చిన లారీని అక్కడే వదిలేసి పరారయ్యారు. బాధితులు పట్టాభిపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా అర్ధరాత్రి దాడి సమయంలో ఒక మహిళతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించిన పోలీసులు శుక్రవారం వారిని విడిచిపెట్టినట్లు తెలిసింది. దాడి జరిపిన వ్యక్తులు ఎవరో తమకు తెలియదని, దాడికి ఎందుకు పాల్పడ్డారో అర్థం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. -
అమరావతిలో భక్తుల కోసం వైద్య శిబిరాలు
అమరావతి: అమరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసే భక్తుల కోసం ఏర్పాటు చేయనున్న వైద్యశిబిరాలపై శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి సమీక్షించారు. అమరేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ రాజా వాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్, ఈవో రేఖలతో కలిసి వైద్య శిబిరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై చర్చించారు. అనంతరం సిబ్బందికి, శిబిరాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రతలు వివరించా రు. భక్తులకు అరోగ్యశాఖ సేవలు 24గంటలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఐఓ డాక్టర్ హనుమకుమార్, డాక్టర్ శివరత్నకుమార్, డాక్టర్ మౌనిక ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వరున్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు మంత్రి వాసంశెట్టి సుభాష్కు స్వాగతం పలికి దేవాలయంలోకి ఆహ్వానించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి సుభాష్కు ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రంతోపాటు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. వైభవంగా రాజరాజ నరేంద్ర స్వామి వార్షిక మహోత్సవాలు పెదపులివర్రు(భట్టిప్రోలు):భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో కొలువైన బాలా త్రిపుర సుందరి సమేత రాజరాజ నరేంద్ర స్వామి వార్షిక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ ఆమంచి సృజన్ కుమార్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిపారు. శుక్రవారం ఉదయం, సాయంత్రం నిత్యహోమం బలిహరణ కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారి గ్రామోత్సవం, నెమలి వాహన సేవ జరిగింది. కార్యక్రమాలను ఈవో ఇ.సాంబశివరావు పర్యవేక్షించారు. మహాశివరాత్రికి మల్లయ్య గట్టుకు లాంచీలు ఏర్పాటు విజయపురిసౌత్: ఏపీ పర్యాటక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 15వ తేదీ మహాశివరాత్రి పర్వదినాన అనుపు నుంచి ఏలేశ్వరం స్వామి మల్లయ్య గట్టుకు ప్రత్యేక లాంచీలను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక లాంచీ స్టేషన్ యూనిట్ మేనేజర్ మస్తాన్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున ఏలేశ్వరం గట్టుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం స్పెషల్ లాంచీలను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.150 గా నిర్ణయించడమైందన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. స్పెషల్ లాంచీల కోసం భక్తులు 97051 88311, 94414 53115 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మ కాయలు కనిష్ట ధర రూ.5200, గరిష్ట ధర రూ.6300, మోడల్ ధర రూ.5800 వరకు పలికింది. -
ఆర్య వైశ్యులపై వేధింపులను వెంటనే ఆపాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఆర్యవైశ్యులతో వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఆర్య వైశ్యుల సమస్యలపై చర్చించారు. ఆర్యవైశ్యులపై జరుగుతున్న వేధింపులను వెంటనే ఆపాలన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులపై వివక్ష బాగా పెరిగిందని సజ్జల అన్నారు.ఆర్యవైశ్యులను లక్ష్యంగా చేసుకుని అధికార యంత్రాంగం వేధింపులకు పాల్పడుతోందని.. చిన్న, మధ్య తరహా వ్యాపారులపై అకారణంగా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన వ్యాపార రంగానికి ప్రభుత్వం నుంచి భరోసా లేదన్న సజ్జల.. వైఎస్ జగన్ హయాంలో ఆర్యవైశ్యులకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. -
‘అసెంబ్లీని చంద్రబాబు అబద్ధాలకు వేదికగా మార్చేశారు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీని అబద్ధాలకు వేదికగా మార్చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ప్లాప్ అయిన సినిమాకు బలవంతంగా విజయోత్సవాలు చేసినట్లుగా ఉందని ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 13వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. ‘ఈ రెండేళ్ళలో సంతృప్తికరమైన అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్తున్నారు. ఏం అభివృద్ధి చేశారో చెప్పమంటే చెప్పరు. రాష్ట్రంలో పరిస్థితి క్యాష్, సూట్కేసు, రాజేష్, లోకేష్.. అన్నట్టుగా మారింది. సంపద సృష్టిని చంద్రబాబు తన కుటుంబానికి చేసుకుంటున్నారు. మద్యం ఆదాయాలు ప్రభుత్వానికి రావటం లేదు. ఉచిత ఇసుక పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఏఎంఆర్ సంస్థ చెక్పోస్టులు పెట్టి మరీ దోపిడీ చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల భూములను తమ బినామీలకు దోచి పెడుతున్నారు. గీతం యూనివర్సిటీకి అక్రమంగా ఐదు వేల కోట్ల విలువైన భూములను దోచి పెట్టారు. ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్న చంద్రబాబు ఆ పేర్లు బయట పెట్టాలి. కుప్పానికి నీళ్లు ఇవ్వటం చేతగాని వ్యక్తి చంద్రబాబు. ప్రశ్నించే వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల మీద పెట్రోలు బాంబులు దాడులు చేశారు’అంటూ ధ్వజమెత్తారు. -
డిగ్రీ ఫలితాల్లో శ్రీమేధ–కెరీర్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ
గుంటూరు ఎడ్యుకేషన్: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇటీవల ప్రకటించిన డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో శ్రీమేధ – కెరీర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో టాప్ మార్కులు సాధించారని సంస్థ డైరెక్టర్లు శేషసాయి బాబు, అన్నా నందకిషోర్ తెలిపారు. గురువారం కొత్తపేటలోని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బీకాం జనరల్ తృతీయ సెమిస్టర్ ఫలితాల్లో 600 మార్కులకు ఫాలక్ జైన్ 519 మార్కులు, పి.జైన్ 512, రిద్ది జైన్ 496, చింతపల్లి శ్రీచిన్న మల్లేశ్వరి 490, మొహమ్మద్ ఫర్హానా బేగం 482 మార్కులతోపాటు, బీకాం కంప్యూటర్స్ విభాగంలో 800 మార్కులకు గాను ఆదిత్య 674 మార్కులు, ఓర్సు వెంకటేశ్వర్లు 669, లక్షితా జైన్ 649 మార్కులతో యూనివర్సిటీ టాపర్లుగా నిలిచిచారని తెలిపారు. 5వ సెమిస్టర్ ఫలితాల్లో బీకాం కంప్యూటర్స్ విభాగంలో 850 మార్కులకు గాను బట్టు షారోనికా 726 మార్కులు, షేక్ నగినా 723, షేక్ క్యూబా కౌసిన్ 694, బి.కాం జనరల్ విభాగంలో 650 మార్కులకుగాను శరత్చంద్ర 583 మార్కులు, రితిక కుమారి 576, తేజోష్ బొత్రాజైన్ 576, షేక్ సుమయ 553, ఎం. మోక్షిత 547 మార్కులతో యూనివర్సిటీ టాపర్లుగా నిలిచారని తెలిపారు. విద్యార్థులతోపాటు అధ్యాపక, ఆధ్యాపకేతర సిబ్బందిని అభినందించారు. -
లేబర్ కోడ్లు రద్దు కోరుతూ మంగళగిరిలో కార్మికుల భారీ ర్యాలీ
మంగళగిరిటౌన్ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, లేబర్ కోడ్ల రద్దుకు మంగళగిరిలో గురువారం వివిధ కార్మిక సంఘాలు, ఏఐటీయూసీ, సీఐటీయూ, వైఎస్సార్ టీయూసీ రైతు సంఘాలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాతబస్టాండ్ వద్ద నుంచి తెనాలి రోడ్డు, మెయిన్ బజార్, గాలిగోపురం మీదుగా అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ జరి గింది. అంబేడ్కర్ సెంటర్ వద్ద జరిగిన సభలో పలువురు నాయకులు మాట్లాడారు. అంబేడ్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు.వెట్టి చాకిరి తీవ్రమైన నేరం చీరాలటౌన్: వెట్టి చాకిరీ తీవ్రమైన నేరం.. ఎవరైనా వెట్టిచాకిరీకి వ్యక్తులను నియమించుకోవడం నేరమని చీరాల ఆర్డీవో తూమాటి చంద్రశేఖరనాయుడు తెలిపారు. వెట్టి చాకిరి చట్టం అమలులోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయినందున జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా ప్రజల్లో అవగాహన పంపొందించేందుకు వెట్టి చాకిరి నేరం వాల్పోస్టర్ గురువారం చీరాల ఆర్డీవో ఆవిష్కరించారు. ఆర్డీవో మాట్లా డుతూ భారత రాజ్యాంగం వెట్టిచాకిరి నిర్మూలించిందని, ఎవరైనా ముందస్తుగా డబ్బు, అప్పులు, ఇతర కారాణాలతో వ్యక్తులను బలవంతంగా పని చేయడం విరుద్ధమన్నారు. చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్కడైనా వెట్టి చాకిరికి నియమించుకున్న సమాచారం తహసీల్దార్ కార్యాలయాల్లో అందించాలన్నా రు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.షాడోస్ ప్రతినిధి రాజా సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.అందరి సహకారంతో శివాలయం అభివృద్ధి పెదకాకాని: అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ధర్మకర్తల మండలి నూతన చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు అన్నారు. పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవం గురువారం ఘనంగా జరిగింది. మొత్తం 13 మంది పాలకమండలి సభ్యులతోపాటు ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి ధనమహేశ్వరప్రసాద్లచే ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కోసూరు పూర్ణచంద్రరావును చైర్మన్గా పాలకవర్గం సభ్యుడు వరికూటి వీరసుధాకర్ ప్రతిపాదించగా మరొక సభ్యుడు కంభంపాటి వెంకయ్య బలపరచడంతో కోసూరి పూర్ణచంద్రరావును పాలకవర్గం చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే డి నరేంద్రకుమార్ సమక్షంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ కోసూరి మాట్లాడుతూ స్వామివారికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, తన నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ నూతన పాలకవర్గం సభ్యులుగా చేబ్రోలు వెంకట భాస్కర పున్నారావు, కంభంపాటి వెంకయ్య, కొమ్మూరి మల్లికార్జునరావు, భైరపనేని ధనలక్ష్మి, కొండా లత, ధూపాటి శివ శంకరరావు, వడ్లమూడి సువర్ణలక్ష్మి, వుల్లం రాజేశ్వరి, బండారు మల్లేశ్వరి, వరికూటి వీర సుధాకరరావు, బాణావత్ మంగమ్మ, పాముదుర్తి నాగలక్ష్మి, ఎక్స్అఫిషియోసభ్యుడు పేటేటి ధనమహేశ్వరప్రసాద్లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అంబేడ్కర్ సెంటర్లో మానవహారం -
కేంద్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యం
ప్రత్తిపాడు: దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే కేంద్రం లక్ష్యమని టుబాకో బోర్డు చైర్మన్ సీహెచ్. యశ్వంత్ అన్నారు. వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం కేంద్ర బడ్జెట్ 2026పై గెస్ట్ లెక్చర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా టుబాకో బోర్డు చైర్మన్ సీహెచ్.యశ్వంత్ హాజరయ్యారు. యశ్వంత్ మాట్లాడుతూ వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డ్ సృష్టించారన్నారు. సబ్కా సాథ్ సబ్ కా వికాస్ లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. 2026 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమన్నారు. డిజిటల్ మౌలిక వసతుల విస్తరణ, ఈ–గవర్నెన్స్ బలోపేతం, ఎగుమతుల ప్రోత్సాహానికి టెక్నాలజీ వినియోగం వంటి చర్యలు భారత వాణిజ్య రంగాన్ని బలపరుస్తాయని వివరించారు. భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు అనిమేష్ బిశ్వాస్ మాట్లాడుతూ స్టార్టప్లు, ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్, గ్రీన్ టెక్నాలజీ వంటి రంగాలకు ప్రోత్సాహం ఇవ్వడం వలన యువతకు విశేష అవకాశాలు లభిస్తాయన్నారు. టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి, పెట్టుబడుల వృద్ధి ద్వారా ‘వికసిత భారత్‘ లక్ష్య సాధన వేగవంతమవుతుందని వివరించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు, కార్యదర్శి కోయి శేఖర్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.బాబు, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె.హరిబాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. – టుబాకో బోర్డు చైర్మన్ సీహెచ్.యశ్వంత్ -
కళ్లకు గంతలు కట్టుకుని పీఏసీఎస్ ఉద్యోగుల నిరసన
కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగులు గురువారం శ్యామలానగర్లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 70 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు కనబడటం లేదంటూ కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తక్షణమే సమస్యలు పరిష్కరించి తమ ఆకలి తీర్చాలని, రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, నంద్యాల జిల్లాలకు చెందిన పీఏసీఎస్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మువ్వా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రెండు నెలలకు పైగా పీఏసీఎస్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వివిధ రూపాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. శుక్రవారం(నేడు) రాష్ట్రంలోని అన్ని జిల్లాల పీఏసీఎస్ ఉద్యోగులతో కలిసి సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయాల ముట్టడించనున్నట్లు పేర్కొన్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ఈ నెల 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు మువ్వా వెంకటేశ్వరరావు, టి.వెంకటరామయ్య, కె.సత్యనారాయణ, పి.రామునాయుడు, కృష్ణమోహన్, వీరభద్రుడు, రెడ్డి సత్యారావు విజయనగరం, పార్వతీపురం మన్యం, నంద్యాల జిల్లాల పీఏసీఎస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నేడు సహకార శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి -
రుద్రాక్ష వాహనంపై మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గురువారం స్వామి వారు రుద్రాక్ష వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉత్సవ కై ంకర్య పరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మాజేటి ఉదయ్ శ్రీనివాస్, మురళీకృష్ణ, ఉదయ్కుమార్, బాలగంగాధర గుప్తా, రంగా సత్యనారాయణ, శివ మోహన్మూర్తి సురేంద్రబాబు, పెద్దబాబు, శివప్రసాదరావు, రంగారావు గుప్తా, రవీంద్రనాఽథ్ గుప్తా, గోపాలకృష్ణ కుమార్, మధు సూదన వెంకట సుబ్బారావు, చెన్నకేశవ శేషగిరిరావులు వ్యవహరించారు. ఈవో గోపీ ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు. మంగళగిరి టౌన్ : మంగళగిరిలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని మంగళగిరి రూరల్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన వివరాల మేరకు గురువారం తెల్లవారుజామున విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న వాహనాన్ని పలువురు గోసంరక్షణ వాదులు వెంబడించి కాజ టోల్గేటు వద్ద అడ్డుకుని మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాహనాన్ని స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా గో సంరక్షణ, బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఓ చిన్న వాహనంలో సుమారు 25 దూడలను పెట్టి, వాటికి ఊపిరి ఆడకుండా చేయడంతో వాటిలో ఏడు దూడలు మృత్యువాత పడ్డాయని, సుమారు 12 గంటల పాటు వాటికి నీళ్లు, ఆహారం లేక సొమ్మసిల్లి పోయాయని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 21వ తేదీన జరగనుంది. ఈ మేరకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన 21న ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, జెడ్పీటీసీలు హాజరై అజెండాలోని అంశాలపై చర్చిస్తారు. తాడికొండ: తుళ్ళూరు మండలం పెదపరిమిలోని మువ్వా చిన్న బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి దాతలు ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామ మాజీ సర్పంచ్ కొండా సాంబిరెడ్డి లక్ష రూపాయలు, మేక భారతి లక్ష రూపాయలు, కొల్లి కోటిరెడ్డి 50 వేల రూపాయలు చెక్కులను గురువారం మేనేజింగ్ ట్రస్ట్ ఎంవీ రామిరెడ్డికి అందజేశారు. దాతలు కొండా సాంబిరెడ్డి, మేక భారతి మాట్లాడుతూ నిస్వార్థంగా సేవలందిస్తున్న ట్రస్ట్కు సహకారం అందించడం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. అనంతరం దాతలను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
గుండవరం(చేబ్రోలు): పాత కక్షలు, ఆస్తి గొడవల కారణంగా జరిగిన హత్యాయత్నం కేసులోని ముగ్గురు నిందితులను చేబ్రోలు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. చేబ్రోలు పోలీసుస్టేషన్లో ఎస్ఐ పి వీరనారాయణ వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని గుండవరం గ్రామానికి చెందిన సాతర్ల వెంకటేష్కు సాతర్ల గోపి, సాతర్ల శ్రీకాంత్ల మధ్య ఆస్తి, భూ వివాదాలు, పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాతర్ల గోపి, సాతర్ల శ్రీకాంత్, తొడెమల వెంకట గోపిలు ముగ్గురు కలిసి పథకం ప్రకారం వెంకటేష్పై కత్తితో దాడి చేశారు. బాధితుడికి మెడతోపాటు పలు చోట్ల కత్తి గాయాలయ్యాయి. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, తెనాలి డీఎస్పీ జనార్థనరావు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేశారు. నిందితులను గురువారం నారాకోడూరు మినీ బైపాస్ వద్ద అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పి వీరనారాయణ తెలిపారు. -
ఎన్పీటీఈఎల్ ర్యాంకింగ్స్లో విజ్ఞాన్ యూనివర్సిటీకి ‘ఏఏ గ్రేడ్’
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీకి ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన జాతీయస్థాయి స్వయం ఎన్పీటీఈఎల్ ర్యాంకింగ్స్లో ప్రతిష్టాత్మక ‘ఏఏ గ్రేడ్’ లభించిందని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జి వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ స్వయం ఎన్పీటీఈఎల్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో విజ్ఞాన్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 29వ ర్యాంక్ సాధించి ‘ఏఏ గ్రేడ్’ను సొంతం చేసుకుందన్నారు. ఎన్పీటీఈఎల్ నిర్వహించిన వివిధ ఆన్లైన్ కోర్సులలో విజ్ఞాన్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొత్తం 4,881 కోర్సు సర్టిఫికెట్లు సాధించారని తెలిపారు. వీటిలో 145 గోల్డ్ సర్టిఫికెట్లు, 424 సిల్వర్ సర్టిఫికెట్లు, 2,136 ఎలైట్ సర్టిఫికెట్లు, 2,176 సాధారణ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు ఉన్నాయని వివరించారు. 61 ఎన్పీటీఈఎల్ స్టార్స్ సర్టిఫికెట్లు లభించడంతో పాటు, 106 మంది విద్యార్థులు టాపర్స్గా నిలిచారని వెల్లడించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ వరుసగా తొమ్మిదవ సారి జాతీయ స్థాయిలో టాప్–100లో స్థానం సంపాదించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ‘ఏఏ గ్రేడ్’ సాధించడానికి కృషి చేసిన టీం సభ్యులను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య అభినందించారు. దొంగతనం కేసులో 8 నెలల జైలుశిక్ష చీరాలరూరల్: దొంగతనం కేసులో నిందితునిపై ఉన్న నేరారోపణలు రుజువు కావడంతో గురువారం న్యాయమూర్తి నిందితునికి ఎనిమిది నెలలపాటు సాధారణ జైలుశిక్షతోపాటు రూ.100 జరిమానా విధించినట్లు టూ టౌన్ సీఐ నాగభూషణం తెలిపారు. బుర్లవారిపాలెం పంచాయతీ సాయికాలనీలో నివాసముంటున్న కుంచాల అంకుల్ ఇంటిలో 2018 మేనెలలో అర్ధరాత్రి సమ యంలో గుర్తు తెలియని దొంగలు వస్తువులు దొంగిలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 457, 380 ఐపీసీ సెక్షల కింది కేసు నమోదుచేశారు. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఆదినారాయణపురానికి చెందిన సాతుపాటి బాలరాజుని నిందితుడిగా తేల్చి సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జిషీటు దాఖలుచేశారు. నిందితుడిపై ఉన్న నేరారోపణలను ఏపీపీ సీహెచ్.పద్మావతి సాక్ష్యాదారాలతో నిరూపించారు. కేసును విచారించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జె.కాత్యాయిని నిందితునికి 8నెలల సాధారణ జైలుశిక్షతోపాటు రూ.100 జరిమానా విధించారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయకుంటే తీవ్ర ఉద్యమం
లక్ష్మీపురం: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లు నష్టదాయకమైనవని, వాటిని రద్దు చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వివిధ కార్మిక, ఉద్యోగ, రైతుసంఘాల నాయకులు హెచ్చరించారు. దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం గుంటూరు నగరంలోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ నగర కన్వీనర్ బి.ముత్యాలరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎ.అరుణ్కుమార్ అధ్యక్షతన సభ నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి.నరసింహారావు, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.రాధాకష్ణమూర్తి, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.కృష్ణ, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సీ, వైఎస్సార్ టీయూ నగర అధ్యక్షులు మురళి, రైతు కూలీ సంఘం నాయకులు పాటిబండ్ల కోటేశ్వరరావు, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కిషోర్, లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ నాయకులు ప్రసాద్, రైతుసంఘ జిల్లా కార్యదర్శి కె.అజయ్కుమార్, ఏఐకెయంయస్ రాష్ట్ర కార్యదర్శి ఘనిరాజులు మాట్లాడారు. కనీసం వేతనం రోజుకు రూ.168 ఉంటే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని విమర్శించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కనీస వేతనం రూ.800లుగా నిర్ణయించి అమలు చేస్తుందని గు ర్తు చేశారు. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేయటం నేరమని, ఆందోళనలు చేస్తే జైళ్లకు పంపేందుకు అనుకూలంగా కార్మిక కోడ్లు రూపొందించారని విమర్శించారు. ఇది కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రశ్నించేవారి గొంతు నులమటమేనని అన్నారు. ఇటీవల మోడీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం మన దేశ రైతాంగానికి తీవ్రమైన సష్టం చేస్తుందని పేర్కొన్నారు. నూతన విత్తన చట్టాన్ని రద్దు చేయాలని కార్మిక, రైతు సంఘాలు ఏకకంఠంతో వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశ, మున్సిపల్, టింబర్ ముఠా, ఆటో, అగ్రికల్చర్ యూనివర్సిటీ, రిటైర్డ్ పెన్షనర్స్, కోల్డ్స్టోరేజి ముఠా, అల్యూమినియం వర్కర్స్, సివిల్ సప్లయీస్ ముఠా, 104, 108, విద్యుత్ కాంట్రాక్టు, మెడికల్ రంగాల ఉద్యోగులు పాల్గొన్నారు. -
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పెదకాకాని: గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో గురువారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు భ్రమరాంబ అమ్మవారిని పెళ్లి కుమార్తె అలంకారంలో భక్తులు దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేకువజామున ఐదు గంటలకు సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 10.30 గంటలకు ధ్వజారోహణ, ఆలయ బలిహరణ, తదితర కార్యక్రమాలు శైవాగమ పద్ధతిన దేవస్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు, ప్రధాన అర్చకస్వామి పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాద్ పర్యవేక్షణలో వేదపండితులు, అర్చకస్వాములచే నిర్వహించినట్లు ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరు పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమాలలో పాలకమండలి చైర్మన్, సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దాతలచే రూ.5 లక్షలతో నిర్మించిన పీపీజీఎల్ షెడ్, గ్రామోత్సవాల సేవలకు దాతలు సమర్పించిన లక్ష రూపాయల విలువైన ట్రక్కును ఎమ్మెల్యే డి.నరేంద్రకుమార్, డీసీ గోగినేని లీలాకుమార్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షెడ్డు దాతలు నందిపాటి రామకృష్ణ శివకుమారి, నందిపాటి భరత్కుమార్ శోభ దంపతులు, ట్రక్కు దాతలు గోగినేని వీరాబాయి, శివరామ్ దంపతులు, భక్తులు పాల్గొన్నారు. పండగ శోభను సంతరించుకున్న పెదకాకాని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం -
తిరునాళ్ల.. చరిత వేనోళ్ల!
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్ల జాతర మహోత్సవానికి అంతా సిద్ధమయింది. మహాశివరాత్రి రోజున నిర్వహించే తిరునాళ్లకు రెండు రోజుల ముందు ఏకాదశి నుంచే కోటప్పకొండలో భక్తుల రద్దీ ప్రారంభమవుతుంది. మూడు రోజుల్లో లక్షలాది మంది భక్తులు కోటప్పకొండకు తరలివచ్చి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కొండ దిగువున విద్యుత్ ప్రభల వెలుగులతో నిర్వహించే శివరాత్రి జాగరణతో ఉత్సవం ముగియనుంది. కోటప్పకొండ తిరునాళ్లకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి కోటయ్య స్వామికి మొక్కులు చెల్లించుకుని స్వామి వారి సన్నిధానంలో శివరాత్రి జాగరణ చేస్తారు.గత ఏడాది శివరాత్రి రోజున 1.20 లక్షల మంది త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ ఏడాది 1.50 లక్షల మంది దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు.కొండ దిగువన జరిగే జాతర మహోత్సవంలో 15 నుంచి 20 లక్షల మంది పాల్గొంటారని అధికారుల అంచనాగా ఉంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు.విస్తృత ఏర్పాట్లుస్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యూలైన్లు, స్వామి వారి ప్రసాదాలు లడ్డూ, అరిసెలను సిద్ధం చేశారు.ఎండ వేడిమి లేకుండా చలువ పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. భక్తులకు అందజేసేందుకు వాటర్ బాటిల్స్, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్స్, పాలు అందుబాటులో ఉంచారు. కొండ దిగువన ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు.ఆర్ అండ్ బీ లైటింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రధాన రహదారులు, స్నాన ఘాట్ ప్రాంతాల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. బారికేడింగ్ పనులు గురువారం ప్రారంభించారు. స్నానఘాట్ల వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు సిద్ధం చేశారు. తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు.ప్రత్యేక బస్సు సర్వీసులుఏకాదశి నుంచే కోటప్పకొండకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపే విధంగా ఏర్పాట్లు చేసింది. నరసరావుపేట, చిలకలూరిపేట, గుంటూరు, వినుకొండ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులతో భక్తులను కొండకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.ఏకాదశి రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొండ మీద పార్కింగ్ రద్దీని బట్టి కార్లు, ట్రాక్టర్లకు అనుమతిస్తామని రూరల్ ఎస్ఐ కిషోర్ తెలిపారు.తిరునాళ్ల ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యంనరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కోటప్పకొండలో గురువారం ఆయన పర్యటించి తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించారు. లక్షలాది మంది వచ్చే తిరునాళ్లకు అరకొరగా ఏర్పాట్లు చేశారని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు జరిగితే చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సత్రాలకు నీటిని సరఫరా చేసే శంభులింగం చెరువును ఇప్పటి వరకు నీటితో నింపలేదని తెలిపారు. మరమ్మతులు పూర్తికాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. చిలకలూరిపేట, నరసరావుపేట నుంచి కోటప్పకొండకు వచ్చే లింకు రోడ్లు మరమ్మతులు కూడా చేపట్టలేదని తెలిపారు. ఘాట్ రోడ్డు టోల్ గేట్ ద్వారా సంవత్సరానికి రూ.60 లక్షల ఆదాయం అటవీ శాఖకు వస్తున్నా మొక్కలకు నీళ్లు కూడా అందించలేకపోతున్నారని పేర్కొన్నారు. కొండకు కిలోమీటరు దూరంలో బస్టాండ్ ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే రోజుకొక గ్రూపుతో కొండకు వచ్చి రోడ్లు ఉడ్చి వెళ్లడం మినహా ఏర్పాట్లు జరుగుతున్న తీరును పట్టించుకోవడం లేదని విమర్శించారు.తిరునాళ్ల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీనరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి కోటప్పకొండలో గురువారం ఆమె పర్యటించారు. క్యూలైన్లు, పార్కింగ్ ప్రదేశాలను తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రత చర్యలు కట్టుదిట్టం చేయాలని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, దేవదాయ శాఖలు సమన్వయంతో పని చేయాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండకూడదని ఆదేశించారు. ఆర్డీవో మధులత, ఈవో డి.చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కేసులు
ప్రత్తిపాడు: విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కేసులు నమోదు చేస్తామని విద్యుత్శాఖ ఎస్ఈ సీహెచ్.రమేష్ హెచ్చరించారు. పెదనందిపాడు మండలంలోని అన్నపర్రు, అన్నవరం, కాట్రపాడు, పాలపర్రు, పుసులూరు, రాజుపాలెం, రావిపాడు, ఉప్పలపాడు, వరగాని గ్రామాల్లో గురువారం విద్యుత్ విజిలెన్స్ విభాగం, ఆపరేషన్స్ విభాగం ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్ఈ సీహెచ్ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో 40 మంది అధికారులు, 120 మంది సిబ్బంది, 40 బృందాలుగా ఏర్పడి 3,010 సర్వీసులను తనిఖీ చేశారు. అనంతరం పెదనందిపాడు విద్యుత్ సబ్ స్టేషనులో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్ఈ తనిఖీల వివరాలను వెల్లడించారు. మీటరు ఉన్నప్పటికీ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఇద్దరికి రూ.40 వేలు, అనుమతించిన లోడుకంటే అదనంగా విద్యుత్ వాడుతున్న 84 మందికి రూ.3.06 లక్షలు, వినియోగం కంటే బిల్లు తక్కువగా వచ్చిన ఒకరికి రూ.ఐదు వేల చొప్పున మొత్తం రూ.3.51 లక్షల అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని, విద్యుత్ చౌర్యానికి సంబంధించిన పూర్తి వివరాలను 9440812263, 9440812361 నంబర్లకు నేరుగా లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలన్నారు. తనిఖీల్లో ఈఈలు ఎఏ.కరీమ్, ఏ.సత్యనారాయణ, డీఈఈలు ఏ.వెంకటేశ్వరరావు, ఎన్.మల్లికార్జునప్రసాద్, ఏఈలు డి.మురళీకృష్ణ, యూ.శివశంకర్, ఎం.సతీష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
క్వారీ తిరునాళ్లకు భారీ విద్యుత్ ప్రభలు
చేబ్రోలు: మహాశివరాత్రి సందర్భంగా వడ్లమూడి క్వారీ తిరునాళ్లకు వచ్చే భారీ విద్యుత్ ప్రభలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా పరిసర గ్రామాల నుంచి భారీ విద్యుత్ ప్రభలతో పాటు చిన్నచిన్న ప్రభలు వందల సంఖ్యలో వస్తుంటాయి. ఈ ఏడాది నారాకోడూరులో నాలుగు భారీ విద్యుత్ ప్రభలు రూపుదిద్దుకుంటున్నాయి. సుద్దపల్లి, గొడవర్రు, గుండవరం, చేబ్రోలు, వడ్లమూడి గ్రామాల నుంచి భారీ ప్రభలు అందంగా ముస్తాబై తరలిరావటానికి సిద్ధమవుతున్నాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బంది... ఆలయం వద్ద భక్తుల పొంగళ్లు చేబ్రోలు: మహాశివరాత్రికి మూడు రోజుల ముందుగానే వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రాక ఆరంభమైంది. గురువారం దశమి కావటంతో మహిళలు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక షెడ్డుల్లో పొంగళ్లు పొంగించుకొని, స్వామి వారికి సమర్పించారు. -
విద్యార్థిపై దాడి కేసులో ఏడుగురు అరెస్టు
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామ సమీపంలో కొద్ది రోజుల కిందట జరిగిన సంఘటనకు సంబంధించి బుధవారం చేబ్రోలు పోలీసులు తొమ్మిది మంది నిందితులలో ఏడుగురిని అరెస్ట్ చేశారు. విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతున్న హేమంత్కు అదేకాలేజిలో చదువుతున్న శ్రీరామ్ మధ్య వివాదం ఉంది. హేమంత్కు స్నేహితుడైన బాపట్ల జిల్లా చుండూరు గ్రామానికి చెందిన భరత్కు తెలియజేశాడు. విద్యార్థి సంఘం నాయకుడుగా ఉన్న భరత్ ఫోన్ చేసి శ్రీరామ్ను హెచ్చరించాడు. దీనిని మనసులో పెట్టుకున్న శ్రీరామ్ తన స్నేహితులతో కలసి విజ్ఞాన్ యూనివర్సిటీ ఎదురుగా ఉన్న సపోటా తోటలలోని ఖాళీ ప్రదేశానికి పిలిపించి అక్కడ క్రూరంగా, మానవత్వం మరచి దాడిచేశారు. ఈ సంఘటనను వీడియో చిత్రీకరించి సామాజిక మా ధ్యమాలలో పోస్ట్ చేసి ప్రచారం చేశారు. జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ ఆదేశాల మేరకు పొన్నూరు రూరల్ సీఐ పి కృష్ణయ్య, ఎస్ఐ పి వీరనారాయణలు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. దారా పరిమళ రిహాన్ ఉరఫ్ లక్కీ, వెలిశెట్టి ఆదర్శ్బాబు, వాకా సోమశేఖర్ బాబు ఉరఫ్ సోము, రాపోలు తిరుపతిరావు, నందం బాలకోటేశ్వరరావు, టి బాలసాయిరామ్, కొత్త సాయి అమరనాథ్లను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచటంతో న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. జీజీహెచ్లో హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ గుంటూరు మెడికల్: హజ్ యాత్రకు వెళ్లే వారికి గుంటూరు జీజీహెచ్లో రెండో రోజు గురువారం మెడికల్ స్క్రీనింగ్, వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ హజ్ యాత్రకు వెళ్లే 157 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమానికి సహకరించిన హజ్ యాత్రికులకు కృతజ్ఞతలు తెలియజేసినారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్, హాజీ హసన్ బాష పాల్గొన్నారు. ఘనంగా క్రెడాయ్ అమరావతి చాప్టర్ ప్రారంభం తాడేపల్లిరూరల్ : తాడేపల్లి విజయవాడ క్లబ్లో గురువారం క్రెడాయ్ అమరావతి చాప్టర్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ విచ్చేసి క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ 2026 డైరీని ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. క్రెడాయ్ అమరావతి చాప్టర్ కార్యవర్గ ప్రమాణ స్వీకారమహోత్సవం జరిగింది. క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్గా జి.రామ్రెడ్డి, చైర్మన్గా ఎ.నాగమల్లేశ్వరరావు, ప్రెసిడెంట్గా ఆర్.కొండలరావు, జనరల్ సెక్రటరీగా ఎన్.పి. ప్రశాంత్లను ఎన్నుకున్నా రు. క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ జి. రామ్రెడ్డి మాట్లాడుతూ రాజధాని అభివృద్ధిలో క్రెడాయ్ భాగస్వామ్యం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. క్రెడాయ్ ఏపీ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, ప్రెసిడెంట్ బాయన శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరి దాసరి రాంబాబు ఉన్నారు. -
సత్తెనపల్లి కేసులో అంబటి రాంబాబుకి రిమాండ్
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోంది. అంబటిపై ఉన్న పాత కేసు తిరగతోడిన కూటమి సర్కార్.. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలకు తెరలేపుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు బాబు సర్కార్ కుట్రలు పన్నుతోంది.సత్తెనపల్లి కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు.. 14 రోజులు రిమాండ్ విధించింది. గుంటూరు నుంచి అంబటి రాంబాబును రాజమండ్రికి తరలిస్తున్నారు. సత్తెనపల్లి కేసులో బెయిల్ పిటిషన్, జైల్లో వసతులు కల్పించాలంటూ మరొక పిటిషన్ను అంబటి రాంబాబు తరఫున న్యాయవాదులు దాఖలు చేశారు.కాగా, అంబటి రాంబాబుకు ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం(ఫిబ్రవరి 11) బెయిల్ మంజూరు చేశారు. నేడు (గురువారం) ఆయన విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పీటీ వారెంట్ జారీచేశారు.ఇలా వరుస కేసులతో బాబు సర్కార్.. ఇబ్బందులకు గురిచేస్తోంది. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరి, మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి సాగనంపింది. ప్రశ్నిస్తున్నందునే అంబటిని ఇలా దుర్మార్గంగా హింసిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్కు సంబం«ధించి షూరిటీలు అన్నీ సమర్పించిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబంరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. ఈ కేసులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఆయనను ఇవాళ (గురువారం) గుంటూరు కోర్టులో మళ్లీ హాజరుపర్చారు. ఈ కేసులో కోర్టు.. అంబటికి 14 రోజులు రిమాండ్ విధించింది. -
వైఫల్యాలపై నిలదీస్తాం.. అన్యాయాన్ని ప్రశ్నిస్తాం: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ప్రశ్నిస్తామనే కారణంగా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని.. ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల గొంతును వినిపిస్తే ప్రభుత్వం తట్టుకోలేకపోతోందన్నారు. రాష్ట్రంలో క్యాష్, లోకేష్, సూట్ కేసు అన్నట్టుగా వ్యవహారం నడుస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మండలిలో గట్టిగా నిలదీస్తాం. అన్యాయపు పోకడలను గట్టిగా ప్రశ్నిస్తామని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.‘‘అంబటి రాంబాబును అన్యాయంగా అరెస్టు చేయటం నుండి మా నేతలపై అక్రమ కేసుల వరకు చర్చిస్తాం. తిరుమల లడ్డూ విషయంలో కూడా చంద్రబాబు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. మా హయాంలో నాణ్యత లేని నెయ్యి టాంకర్లను వెనక్కు పంపాం. అవన్నీ పక్కాగా రికార్డులు కూడా ఉన్నాయి. చంద్రబాబు హయాంలోనే నాణ్యత లేని నెయ్యి వచ్చినట్టు సీబిఐ కూడా చెప్పింది. వీటన్నిటి పై మండలిలో గట్టిగా ప్రశ్నిస్తాం..సగటు హిందువు వినటానికి కూడా భయపడేలాంటి మాటలు చంద్రబాబు మాట్లాడారు. దీనిపై చంద్రబాబు హిందూ భక్తులకు క్షమాపణ చెప్పాలి. వేల కోట్ల విలువైన భూములను తమవారికి దోచి పెడుతున్నారు. గీతం యూనివర్శిటీకి ఐదు వేల కోట్ల విలువైన భూములను అక్రమంగా కట్టబెట్టారు. వీటన్నిటిపై మండలిలో చర్చిస్తాం’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
చిన్నారికి వైఎస్ జగన్ అక్షరాభ్యాసం
సాక్షి, తాడేపల్లి: చిన్నారికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్షరాభ్యాసం చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ను కలిసి తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయాలని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం దండు గోపాలపురం వైఎస్సార్సీపీ కార్యకర్త లెనిన్ వివేక్, కుటుంబ సభ్యులు కోరారు.తల్లిదండ్రుల కోరిక మేరకు వారి కుమారుడు భార్గవ్ ప్రకాష్కు అక్షరాభ్యాసం చేసి.. ఆశీస్సులు అందజేశారు. తమ కుమారుడికి వైఎస్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేసిన వివేక్ కుటుంబ సభ్యులు.. గతంలో తమ కుమార్తెకు కూడా జగన్ అన్నప్రాసన చేశారని లెనిన్ కుటుంబం గుర్తుచేసుకున్నారు. -
బాబూ.. రెవెన్యూ రికార్డులు చూడు.. వాస్తవం ఇదే: దొంతిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని హెలిప్యాడ్ స్థలం ప్రభుత్వానిదేనని.. చంద్రబాబు ఒకసారి రెవెన్యూ రికార్డులు చూస్తే వాస్తవాలు తెలుస్తాయని వైఎస్సార్సీపీ మంగళగిరి ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 223 సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టంగా ఉందని.. ఆ స్థలం రైల్వేది.. వ్యవసాయ భూమి కానేకాదన్నారు.‘‘గతంలో ఆ భూమిని రైల్వే వాళ్లు ప్యారీ కంపెనీకి లీజుకు ఇచ్చారు. కొంతకాలం తర్వాత ఆ సంస్థ మూత పడటంతో తిరిగి ఆ భూమి రైల్వే పరిధిలోకి వెళ్లిపోయింది. మధ్యలో ప్రయివేటు వ్యక్తికి భూమి ఎలా వెళ్తుంది?. ఆ స్థలం తనది అంటున్న వ్యక్తి అసలు రైతు కానే కాదు. అబద్ధాన్ని పదేపదే చెప్తే నిజం అని నమ్మే రోజులు పోయాయి. వాస్తవాలు ఏంటో జనానికి తెలిసిపోతోంది’’ అని దొంతిరెడ్డి వేమారెడ్డి పేర్కొన్నారు.‘‘తాడేపల్లిలోని వివాదాస్పద భూమి ఇప్పటికీ రైల్వే రికార్డుల్లోనే ఉంది. సర్వే నంబర్లు 223, 226 సీ2లో 10.4 ఎకరాలు రెవెన్యూ, మున్సిపాలిటీ రికార్డుల్లో ఉన్నాయి. ఆ భూమిని 22ఏలో తమ ప్రభుత్వం పెట్టలేదు.. అది 2015 లోనే నమోదు అయ్యింది. 26-05-2016న ఆ భూమి గుంటూరు కలెక్టర్ రికార్డుల్లో నోటిఫై అయ్యింది. ఆ భూమిలో ఎప్పుడూ వ్యవసాయం జరగలేదు. గతంలో ఈఐడీ ప్యారీ ఫర్టిలైజర్ కంపెనీ నడిచింది. వాస్తవాలు తెలుసుకోకుండా తమ పార్టీపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు.ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాల అమలుపై దృష్టి పెట్టాలి. రైతులకు పరిహారం, సబ్సిడీలు అందడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం 20 నెలల్లో రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేసింది. ప్రభుత్వం తీసుకున్న అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రంలో చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవడంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి. రైల్వే భూమిని ఇతరులకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని వేమారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. -
‘అసెంబ్లీలో మన గొంతు వినిపించకూడదని కుట్ర’
సాక్షి,తాడేపల్లి: శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మండలి సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..:అందరూ యుద్దంలో ఉన్నారు. నా కంటే మీకే ఇంకా బాగా తెలుసు. అందుకే మీరు కూడా బెటర్గా పోరాడతారు. మనకు అసెంబ్లీలో బలం తక్కువ. అక్కడ మన గొంతు వినపడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. ఎందుకంటే, మనకు ఆ గుర్తింపును ఇస్తే, విపక్షనేతకు కూడా సీఎంకు ఎంత సమయం ఇస్తారో దాదాపుగా సమయం మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే, మన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తలేం కాబట్టి, ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా, అన్నీ వివరిస్తున్నాం.మండలిలో బలం ఉంది కాబట్టి..:కౌన్సిల్లో మనకు బలం ఉంది. కాబట్టి మనకు మాట్లాడే అవకాశం వస్తుంది. మనకు మైక్ ఇస్తారు కాబట్టి, ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు. సబ్జెక్టుల వారీగా పూర్తి అవగాహన పెంచుకొండి. అప్పుడే మనం గట్టిగా మాట్లాడగలం. దేనికైనా మంచి ప్రిపరేషన్ అవసరం. అవగాహన పెంచుకుంటే బాగా మాట్లాడగలుగుతాం. ఏ అంశంపై మాట్లాడినా తగిన ఆధారాలు, సాక్ష్యాలు చూపి మాట్లాడాలి. అప్పుడే మన గొంతు బలంగా పోతుంది.లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు:అంబటి రాంబాబు, జోగిరమేష్ ఇళ్లపై దాడులు, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్రెడ్డిపై దాడులు కానీ, కాకాణి గోవర్థన్రెడ్డిపై అక్రమ కేసులు.. ఇవన్నీ కూడా లడ్డూ వ్యవహారంలో ప్రశ్నించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు చేసినవే. చివరకు చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని మనం గుళ్లలో పూజలు చేసినా, చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఏకంగా భౌతిక దాడులు చేస్తున్నారు. ఒక అబద్ధం సష్టించి, దానికి రెక్కలు కట్టి ప్రచారం చేయడం తొలిసారి చూస్తున్నాం. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు, వైయస్సార్సీపీకి ఏమాత్రం సంబంధం లేదు.చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబే:లడ్డూ వ్యవహారానికి సంబంధించిన పరిణామాలను ఒకసారి చూస్తే.. ఈ వ్యవహారంలో ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే. లెంపలేసుకోవాల్సిందీ చంద్రబాబే. ఒకసారి జరిగిన తీరు చూస్తే, రాష్ట్రంలో మార్చి 16, 2024న ఎన్నికల కోడ్ వస్తే, మే 13న, పోలింగ్ జరిగింది. మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు ఓకే చేసి, ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. జూన్ 4, ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాతనే నెయ్యి సరఫరా ప్రారంభమైంది. జూన్ 12, 20, 25 జూలై 4న మొత్తం నాలుగు ట్యాంకర్లను ఏఆర్ డెయిరీ సరఫరా చేసింది. అవన్నీ ల్యాబ్ పరీక్షల్లో పాస్ అయ్యాయి.ఆ తర్వాత జూలై 6, 12 తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్లు నెయ్యి నాణ్యత పరీక్షలో ఫెయిల్ కావడంతో వెనక్కి పంపారు. జూలై 23న ల్యాబ్ రిపోర్టు రావడంతో, జూలై 25న నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపించారు. అయితే ఆ ట్యాంకర్లను జూలై 27న శ్రీకాళహస్తిలో వైష్ణవి డెయిరీకి సమీపంలో పార్క్ చేశారు. ఆ తర్వాత అవే ట్యాంకర్లు మరో డెయిరీ పేరుతో ఆగస్టు, సెప్టెంబరులో తిరిగి టీటీడీకి పంపారు. అలా వచ్చిన నెయ్యిని వాడారని, సీబీఐ ఛార్జ్షీట్లో కూడా రాసింది.వెనక్కి పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీలోకి వస్తే, జరిగిన పరిణామాలు, జరిగిన తేదీలు చూస్తే మొత్తం ఇవన్నీకూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగాయి. మరి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? నిజానికి 2014–19 మధ్య ప్రీమియర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. ఆ కంపెనీ 2019లో సరఫరా ఆపేసింది. కానీ, దాన్ని కేవలం మన ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. అంతకు ముందు సరఫరాకు సంబంధించి ప్రస్తావించడం లేదు.టీటీడీలో నెయ్యి సప్లైపై ఒక పక్కా విధానం:టీటీడీలో నెయ్యి సేకరణకు టీటీడీలో ఒక పటిష్ట విధానం ఉంది. నెయ్యి తెచ్చిన ట్యాంకర్లు కేంద్ర ప్రభుత్వం అక్రిడిటెడ్ ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ తీసుకురావాలి. అలా వచ్చిన ట్యాంకర్లోని నెయ్యిని మళ్లీ టీటీడీ కూడా పరీక్షిస్తుంది. ఆ రిపోర్టు కూడా పాజిటివ్గా ఉంటేనే, లోపలికి పంపిస్తారు. ఇదే పద్ధతిలో నాణ్యత లేక మన హయాంలో 18 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపాం. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా 2014–19 మధ్య 15 ట్యాంకర్లు వెనక్కి పంపారు. మరి ఇలాంటి పద్ధతి ఉన్నప్పటికీ కూడా దొడ్డిదారిన రిజెక్ట్ చేసినవి, తిరిగి టీటీడీకి వచ్చాయంటేం, దానికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? మరి వీటన్నింటినీ మన పార్టీకి, మన ప్రభుత్వ కాలానికి ఆపాదించి రోజూ బురదజల్లుతున్నారు.2014–19 మధ్య కూడా అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలు నెయ్యి సరఫరా:సీబీఐ ఛార్జిషీటులో అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలు 2014–19 మధ్య కూడా సప్లై చేశాయి. ప్రీమియర్ డెయిరీ 2016, 2017, 2018 లో కూడా నెయ్యిని సప్లై చేసింది. కానీ, కేవలం మన ప్రభుత్వానికి ఆపాదించి కుట్రలు చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం.. స్కామ్ల మయం:మరోవైపు కూటమి ప్రభుత్వం స్కామ్ల మయంగా మారింది. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడి చేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన భూమి 54 ఎకరాలు గీతమ్ వర్సిటీకి ఇచ్చేశారు. ఏ ముఖ్యమంత్రీ తన సొంత బంధువులకు ఎవరూ ఇలా ఇచ్చుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోంది. అదే ‘క్యాష్.. సూట్కేసు.. రాజేష్.. లోకేష్.’. ఇది బాగా వినిపిస్తోంది.ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలి. పోరాడాలి. చిత్తశుద్ధితో కష్టపడి పని చేయండి. కళ్లు మూసి తెరిచేలోపు మూడేళ్లు గడుస్తాయి. వచ్చేది మన ప్రభుత్వమే. ఇప్పుడు కష్టపడి పని చేస్తున్న వారందరికీ, తగిన గుర్తింపు ఉంటుంది. పనితీరు ఆధారంగా మీకు మీ పదవులు తిరిగి వస్తాయి కూడా. అలాగే ఇంతకన్నా మంచి పదవులు కూడా దక్కే అవకాశం మీకు ఉందని వైఎస్ జగన్ వివరించారు. -
అంబటిపై కక్ష సాధింపు.. గుంటూరు కోర్టులో రాంబాబు
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏపీ పోలీసులు తాజాగా అంబటిపై మరో కేసుకు సంబంధించిన పిటీ వారెట్పై విచారణకు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కాగా, గతేదాడి నవంబర్ 12న పట్టాభిపురం వైఎస్సార్సీపీ ర్యాలీ కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. దీంతో, అంబటి జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా.. ఆయన బయటకు రాకుండా కూటమి ప్రభుత్వం మరో కేసులో అరెస్ట్కు రంగం సిద్దం చేసింది. 2023లో(ప్రైవేట్ కేసు నమోదు) సత్తెనపల్లి పరిధిలో నమోదైంది. అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పిటీ వారెంట్ జారీచేశారు. కేసుకు సంబంధించి పిటీ వారెంట్పై విచారణకు అంబటి రాంబాబును గుంటూరు తరలించారు. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటీ వారెంట్పై అంబటిని సత్తెనపల్లి పోలీసులు హాజరు పరిచారు. బెయిల్.. వెంటనే పాత కేసులో పీటీ వారెంట్.. అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్కు సంబంధించి షూరిటీలు అన్నీ సమర్పించిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత కొత్తగా 36 కేసులు నమోదు చేయగా ఆ కేసులన్నింటిలో 41 కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అంబటిపై మరో కేసును తెరపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై తన గళం వినిపిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో జరుగుతున్న వేధింపులపై అన్ని వర్గాలలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. సంబంధిత కేసులపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు వెల్లడించారు. -
అమరావతిని సందర్శించిన జర్మనీ కౌన్సిల్ జనరల్ మైకేల్ హస్సర్
అమరావతి: ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అమరావతిని జర్మనీ కౌన్సిల్ జనరల్ మైకేల్ హస్సర్ బుధవారం సందర్శించారు. తొలుత పురావస్తు మ్యూజియం, అమరావతి బౌద్ధ స్తూపాన్ని, ధ్యానబుద్ధ విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరుని దర్శించుకున్నారు. తొలుత జర్మనీ కౌన్సిల్ జనరల్ మైకేల్ హస్సర్ను ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీదేవికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిం చారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలు అందించగా ఆలయ ఈవో రేఖ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్శనలో ఆయన వెంట జర్మన్ కౌన్సిల్ ఇండియా ప్రతినిధి సందీప్, సాంస్కృతిక శాఖ డైరక్టర్ మల్లిఖార్జునరావు, శ్రీహర్ష, రామకృష్ణ, ఏపీ టూరిజం రీజనల్ డైరక్టర్ లక్ష్మీప్రసన్న, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. శ్రీనివాసరావు సత్తెనపల్లి అర్డీవో రమణకాంతరెడ్డి, తహసీల్దార్ డానియేలు తదితరులు ఉన్నారు. -
డాక్టర్ మేరీ గ్లౌరీ సేవలు మరువలేనివి
గుంటూరు మేత్రాసనం పీఠాధిపతి చిన్నబత్తిని భాగ్యయ్య నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): సేవకు ప్రతిరూపంగా నిలిచే గుంటూరు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో 36 ఏళ్లు సుదీర్ఘంగా వేలాది మంది రోగులకు చికిత్సలు చేసి, తన చేతి స్పర్శతో వారిని ఆరోగ్యవంతులుగా చేసిన దివంగత డాక్టర్ మేరీ గ్లౌరీకి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఆమెను సెయింట్గా గుర్తించే క్రమంలో రెండవ దశ అయిన పూజ్యనీయ (వెనరబుల్గా) స్థానాన్ని పొందడం గుంటూరుకే గర్వకారణమని గుంటూరు మేత్రాసనం పీఠాధిపతి చిన్నబత్తిని భాగ్యయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక సెయింట్ జోసెఫ్స్ పాఠశాల ఆవరణలో డాక్టర్ మేరీ గ్లౌరీకి దక్కిన గౌరవ పురస్కారం సందర్భంగా జె.యం.జె. సభ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవం నిర్వహించారు. ఈ నెల 17, 22 తేదీల్లో శాప్ లీగ్స్ క్రీడా పోటీలు గుంటూరు వెస్ట్(క్రీడలు): శాప్ ఆదేశాల మేరకు 31 క్రీడాంశాల్లో శాప్ లీగ్స్ పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా 17వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక బీఆర్ స్టేడియంలో అండర్–13, 15, 17, 19 బాల బాలికలు, యువతీ యువకుల చెస్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రతిభ కనబరచిన వారిని ఎంపిక చేసి ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పంపిస్తామన్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 9 గంటలకు స్థానిక బీఆర్ స్టేడియంలో అండర్–18 యువతీ యువకుల జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు జరుగుతాయన్నారు. ఎంపికై న వారిని ఈ నెల 28 నుంచి మార్చి 1 వరకు విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు పంపిస్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు శాప్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. వివరాలకు స్కేటింగ్ కోచ్ షేక్ అబ్దుల్ సలామ్ 94934 47566, సైక్లింగ్ కోచ్ కనకరావు సెల్ నెంబర్ 63011 77119ను సంప్రదించాలని కోరారు. -
ఇంజినీరింగ్ విద్యార్థిపై దాడి
ఏడుగురు నిందితుల అరెస్ట్ చేబ్రోలు: ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటనపై బుధవారం చేబ్రోలు పోలీసులు ఏడుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల జిల్లా చుండూరుకు చెందిన భరత్ నాగార్జున యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నాడు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో జరిగిన యువజనోత్సవాలకు హాజరై తిరిగి వస్తుండగా వివాదం జరిగింది. ఈ నేపథ్యలో శ్రీరామ్, ఆదర్శ్తోపాటు మరో ఏడుగురు కలిసి భరత్పై విచక్షణరహితంగా దాడి చేసి గాయపరిచారు. విద్యార్థి తండ్రి అరుణ్కుమార్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ పి.వీరనారాయణ కేసు నమోదు చేశారు. సంఘటనకు కారణమైన తొమ్మిదిమంది నిందితులతో ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. సోషల్ మీడియాలో వైరల్ గంజాయి, మద్యం మత్తులో యువకులు విచక్షణరహితంగా దాడి చేస్తున్న సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోని తోటలోకి తీసుకొని వెళ్లి విద్యార్థిపై తొమ్మిదిమంది కలిసి కొడుతున్నట్లు వీడియోలో ఉంది. పొన్నూరు, శేకూరు, తెనాలి, వినుకొండ, కొలకలూరు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కర్రలు, బెల్టుతో అతడిని తీవ్రంగా గాయపరిచారు. ముఖంపై, నడుము, కాళ్లు, చేతులు, వీపుపై దాడి చేస్తున్న సంఘటనకు సంబందించిన వీడియో వైరల్ అయింది. అపస్మారక స్థితికి చేరుకొన్న ఆ విద్యార్థి.. ప్రాణాలు కోల్పోయాడని నిందితులు భావించారు. -
కారులో చెలరేగిన మంటలు
మంగళగిరి టౌన్: కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన మంగళగిరి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు అనంతపూర్కు చెందిన ఆదిత్య జగ్గయ్యపేటలోని కెనరా బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటున్నాడు. గుంటూరులో ఉన్న కెనరా బ్యాంక్ బ్రాంచ్లో బ్యాంకుకు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు బుధవారం తన కారులో వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో తాడేపల్లిలోని బంధువుల ఇంటికి వెళుతుండగా మంగళగిరి రత్నాల చెరువు జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి రాత్రి 7.30 గంటలు అయ్యింది. ఈ క్రమంలో కారు బ్యానెట్లో నుంచి పొగలు రావడం ఆదిత్య గమనించాడు. వెంటనే కారు పక్కన ఆపి కారులో నుంచి దిగాడు. క్షణాల్లో కారులో మంటలు భారీగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అప్పటికే కారు దాదాపుగా దగ్ధమైపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుని ఉండవచ్చని, సుమారు 4 లక్షల వరకు నష్టం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. పట్టణ పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
యూనియన్ బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకోవాలి
లీడ్ బ్యాంకు మేనేజర్ రత్న మహిపాల్ రెడ్డి పొన్నూరు: స్థానిక యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో పొన్నూరులోని అంబేద్కర్ భవన్లో బుధవారం ఆర్థిక సాక్షరత వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సభలో ముఖ్యఅతిథిగా లీడ్ బ్యాంక్ మేనేజర్ రత్న మహిపాల్ రెడ్డి పాల్గొని యూనియన్ బ్యాంకు అందిస్తున్న సేవలను వివరించారు. పొదుపు సంఘాల మహిళల కోసం అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిపాజిట్లతో కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ దేవరపల్లి మణి భూషణ్, ఆర్డీవో ప్రియదర్శిని, కమ్యూనిటీ ఆర్గనైజర్లు విశ్వనాథ్, లక్ష్మీ, సుగుణ, ఆర్పీలు, ఎస్హెచ్జీ సభ్యులు, ఖాతాదారులు పాల్గొన్నారు. -
ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
తెనాలి అర్బన్: తెనాలి శివాజీ చౌక్లో నూతనంగా ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ వద్ద అనధికారికంగా ఏర్పాటు చేసిన పరదాను తొలగించేందుకు వెళ్లిన మున్సిపల్ అధికారులు, పోలీసులకు నిర్వాహకురాలు చుక్కలు చూపించింది. దానిని తొలగిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండదండలు ఉండటంతో ఏమీ చేయలేక అధికారులు వెనుదిరిగారు. ఈ ఘటన తెనాలిలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. మున్సిపల్ అధికారులు కథనం ప్రకారం... స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తృప్తి క్యాంటీన్లను నూతనంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీనిలో భాగంగా తెనాలి నందులపేటకు చెందిన జాగృతి సంఘ నిర్వాహకురాలు నాగలక్ష్మి బుర్రిపాలెం రోడ్డులోని పాత రత్నటాకీసు వద్ద క్యాంటీన్ ఏర్పాటుకు మున్సిపల్ అధికారుల అనుమతి కోరింది. ఆమెకు టీడీపీ పెద్దల అండ ఉండటంతో అక్కడ స్థలం కేటాయించారు. ఆమె ఐడీబీ బ్యాంక్లో రూ.13.70 లక్షల రుణాన్ని తీసుకుని కంటైనర్ను ఏర్పాటు చేసి, ప్రారంభానికి సిద్ధంగా ఉంచారు. తర్వాత కంటైనర్ వద్ద శాశ్వత ప్రాతిపదికన షెడ్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేసింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు కంటైనర్ వద్ద షెడ్ నిర్మించవద్దని సూచించారు. కానీ ఆమె మంగళవారం రాత్రి ఇనుప పైపులు ఏర్పాటు చేసి దానిపై పరదాలు కప్పించింది. -
ఇంజనీరింగ్ విద్యార్థి అవయవదానం
తాడేపల్లిరూరల్: ఖమ్మం జిల్లా మధిరకు చెందిన విజయ్కుమార్ (20) తాడేపల్లిలోని ఓ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య పరీక్షల అనంతరం విజయ్కుమార్కు బ్రెయిన్ డెడ్గా బుధవారం వైద్యులు నిర్ధారించారు. విజయ్కుమార్ తండ్రి సైదేశ్వరరావు, కుటుంబ సభ్యులు విజయ్కుమార్ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ జీవన్దాన్ చైర్మన్ డా. కె. రాంబాబు, హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో అవయవ దానం చేశారు. గుండె, కాలేయం మణిపాల్ హాస్పిటల్లో అవసరమైన వారికి ట్రాన్స్ప్లాంటేషన్ చేయగా, ఊపిరితిత్తులను హైదరాబాద్ కిమ్స్కు, కిడ్నీలకు విధాత హాస్పిటల్కు, కంటి కార్నియాను విజయవాడ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. విజయ్కుమార్ అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు మణిపాల్ హాస్పిటల్ వర్గాలు కృతజ్ఞతలు తెలిపారు. -
టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్)/గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు సిద్ధార్థ నగర్లోని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పెద్దిరెడ్డి పరామర్శించారు. అంబటి సతీమణి విజయలక్ష్మి, ఆయన కుమార్తెలు మౌనిక, మనోజ్ఞతో వారి ఇంటిపై జరిగిన దాడి ఘటన గురించి ఆరా తీశారు. ఇంకా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, ఉభయగోదావరి జిల్లాల కాపు సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చిన్నిమిల్లి వెంకటరాయుడు, మాజీ డెప్యూటీ సీఎం అంజాద్బాషా, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ జ్యూడీషియల్ జడ్జి జడ శ్రావణ్కుమార్లు కూడా అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. హెరిటేజ్ పెరుగులో కల్తీ జరిగిందని నివేదిక వచ్చిందని, ఏడుకొండల వెంకన్నతో పెట్టుకుంటే కర్మ రిటర్న్ అవ్వటం తఽథ్యమని హెచ్చరించారు. శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ జరిగిందని అంటూ కొత్త ఆరోపణలకు తెరదీస్తున్నారన్నారు. వీరి వెంట పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, తూర్పు సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ ఉన్నారు. -
కూరగాయలు విక్రయిస్తూ పీఏసీఎస్ ఉద్యోగుల నిరసన
రేపు సహకార శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శ్యామలానగర్లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కూరగాయలు విక్రయిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తక్షణమే సమస్యలు పరిష్కరించి తమ ఆకలి తీర్చాలని, రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన పీఏసీఎస్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. – ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు వెలుగూరి రాధాకృష్ణ మాట్లాడుతూ గత రెండు నెలలుగా పీఏసీఎస్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వివిధ రూపాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. -
దూర విద్యలో పరీక్షలే మిథ్య!
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ దూర విద్య కేంద్రం ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణ అధ్వానంగా మారింది. వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి గత 20 రోజులుగా పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న ఘటనలే నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు గత నెల ఆఖరులో ప్రారంభమయ్యాయి. వివాదాలు కూడా మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరీక్షల నిర్వహణలో లోపాలు సరిదిద్దుతున్నామంటూ అధికారులు చేస్తున్న హడావుడి చూసి అందరూ విస్తుపోతున్నారు. ఏఎన్యూ(పెదకాకాని): రాష్ట్ర వ్యాప్తంగా 114 కేంద్రాల్లో దూర విద్య పరీక్షలు జరుగుతున్నాయి. పర్యవేక్షకులను కో ఆర్డినేటర్ ఆచార్య రామచంద్రన్ నియమించారు. స్క్వాడ్లను కూడా నియమించాల్సి ఉంది. కానీ ఉన్నతాధికారులు నియమించడం గమనార్హం. సంస్కరణల పేరుతో జరుగుతున్న పరిణామాలు ఆధిపత్య పోరును చాటుతున్నాయి. రెండవ సెమిస్టర్లో ఉన్నతాధికారులు ముగ్గురు సభ్యులతో ఒక స్క్వాడ్ను ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసిన టీం.. పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని, విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడుతున్నారని గుర్తించింది. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏ ఒక్క సెంటర్ నిర్వాహకుడిని కూడా బాధ్యుడిని చేసిన సంఘటనలు లేవు. ఈ వివాదాలను సాకుగా చూపిస్తూ వర్సిటీని చక్కదిద్దేందుకు ఎఫ్ఏసీ ఇవ్వాలని ఓ అధికారి ప్రభుత్వ పెద్దలను కలిసినట్లు సమాచారం. పరీక్ష కేంద్రాలన వారికి పరోక్షంగా సహకారం అందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే వ్యవస్థను చక్కదిద్దవచ్చని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా పరీక్షల కో ఆర్డినేటర్ బుధవారం నుంచి 14 మంది మందితో 7 స్క్వాడ్లను ఎంపిక చేయడం అధికారుల మధ్య భేదాభిప్రాయాలను స్పష్టం చేస్తోంది. పరీక్షల పేరుతో ఆర్థికంగా లబ్ధి పొందడం కోసమే ఈ ఆరాటమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారదర్శకత పేరుతో రహస్యంగా తనిఖీ బృందాలను రాష్ట్రమంతా తిప్పుతుండగా... కొందరు అధికారులు కూడా కొన్ని సెంటర్ల నిర్వాహకులతో తెరవెనుక సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్ష కేంద్రాల నిర్వాహకులు మాత్రం వర్సిటీ అధికారుల పోరులో తమను బలి పశువులను చేస్తున్నారని వాపోతున్నారు. ఈ పరిణామాలపై విసిగిపోయిన కొందరు పరీక్ష కేంద్రాల నిర్వాహకులు... పరీక్షలకు ముందుగానే ఏ అధికారిని ఏ విధంగా కలిశామో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ సెంటర్ను రద్దు చేశాం.. పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై దూర విద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లును వివరణ కోరగా... ‘గత నెలలో పొదిలి సెంటర్ను రద్దు చేశాం. ప్రస్తుతం జరుగుతున్న అవకతవకలపై ఏ సెంటర్పైనా చర్యలు తీసుకోలేదు. వివరాలు సేకరిస్తున్నారు. స్క్వాడ్ ఎంపిక సహజంగా కోఆర్డినేటర్ ద్వారానే జరుగుతుంది. ఉన్నతాధికారుల నిర్ణయాన్ని అనుసరించాల్సిందే’ అని తెలిపారు. చర్యలు తీసుకుంటాం.. దూర విద్య పరీక్షల కో ఆర్డినేటర్ ఆచార్య రామచంద్రన్ను వివరణ కోరగా... ‘రెండో దశలో ముగ్గురు సభ్యులతో ఉన్నతాధికారులు ఒక స్క్వాడ్ను ఎంపిక చేశారు. సమాచారం కూడా కొంతమేర గోప్యంగా ఉంచారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు. ప్రస్తుతం 14 మందితో 7 స్క్వాడ్లను ఎంపిక చేశా. రాష్ట్రంలోని 114 సెంటర్లను షెడ్యూల్ ప్రకారం తనిఖీలు చేయాలని కోరాం. అక్రమాలకు పాల్పడితే పరీక్ష కేంద్రాల నిర్వాహకులను బాధ్యులను చేయడంతోపాటు చూసి రాతలకు పాల్పడే విద్యార్థులపైనా చర్యలు తీసుకుంటామని’ తెలిపారు. -
జీజీహెచ్లో హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో ఈ సంవత్సరం హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు మెడికల్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి బుధవారం తెలిపారు. కార్యక్రమాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబులు పర్యవేక్షించారు. 145 మంది హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ వేయడం జరిగిందన్నారు. గురువారం కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్, హాజీ హసన్ బాషా పాల్గొన్నారు. తెనాలి: నియోజకవర్గంలోని కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో వేంచేసి ఉన్న శ్రీవారాహి అమ్మవారి దేవస్థానంలో ఉచిత కోటి కుంకుమార్చన కార్యక్రమం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ మాచిరాజు వేణు గోపాల్, పెనుగొండ పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పాల్గొన్నారు. ముందుగా వారాహి అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉచిత కోటి కుంకుమార్చనను మహిళలతో చేయించారు. ఈ సందర్భంగా శ్రీవారాహి అమ్మవారి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. నిర్వాహకులు చివరిగా అతిథులను సత్కరించారు. దాచేపల్లి : మండలంలోని సారంగపల్లి అగ్రహారంలో లక్ష్మీతిరుపతమ్మ, గోపయ్య స్వామి కల్యాణ మహోత్సవం బుధవారం కనుల పండువలా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. పురోహితుడు జానపాటి సీతారామశర్మ ఆధ్వర్యంలో అమ్మవారి కల్యాణం జరిపించారు. పుణ్యదంపతులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వేద పండితులు భక్తులకు ఉత్సవ విశిష్టతను వివరించారు. ఉత్సవ కై ంకర్య పరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మాజేటి సూర్యవేణుగోపాల కృష్ణ శ్రేష్టి, కృష్ణకుమారి దంపతులు, ఎల్ కే శర్మ ఇందిరాదేవి దంపతులు వ్యవహరించారు. ఈవో గోపీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
సర్కారు శాడిజానికి 'పరాకాష్ట'
సాక్షి ప్రతినిధి, గుంటూరు, గుంటూరు లీగల్: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం బెయిల్ మంజూరు చేశారు. గురువారం ఆయన విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పీటీ వారెంట్ జారీచేశారు. ఇలా వరుస కేసులతో హింసించడం సర్కారు శాడిజానికి పరాకాష్ట అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరి, మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి సాగనంపింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఓ విష సంస్కృతికి శ్రీకారం చుట్టారని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చని పరిశీలకులంటున్నారు. ఒక కాపు నేతపై ఇంతలా కక్ష సాధించడం విడ్డూరమని వారు పేర్కొంటున్నారు. ప్రశ్నిస్తున్నందునే అంబటిని ఇలా దుర్మార్గంగా హింసిస్తున్నారని అంటున్నారు. బెయిల్.. వెంటనే పాత కేసులో పీటీ వారెంట్.. అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్కు సంబం«ధించి షూరిటీలు అన్నీ సమరి్పంచిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబంరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. ఈ కేసులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఆయనను గురువారం గుంటూరు కోర్టులో మళ్లీ హాజరుపరుచనున్నారు. అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత కొత్తగా 36 కేసులు నమోదు చేయగా ఆ కేసులన్నింటిలో 41 కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అంబటిపై మరో కేసును తెరపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై తన గళం వినిపిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో జరుగుతున్న వేధింపులపై అన్ని వర్గాలలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. సంబంధిత కేసులపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు వెల్లడించారు. సుప్రీం తీర్పులకు విరుద్ధంగా.. అంబటి రాంబాబు మాట్లాడిన ఒక్క మాటకు 36 కేసులు పెట్టారు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు కూడా విరుద్ధమని, దీని వెనుక సర్కారు రాక్షసత్వం, ఒక వ్యక్తిపై కక్ష, పగ కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ 2022లో ఇచ్చిన తీర్పు ప్రకారం ఓ కాగ్నిజబుల్ అఫెన్స్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే.. ఇక ఎక్కడా అలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ఈ ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయకుండా ఫిర్యాదుదారుల్ని సాక్షులుగా పేర్కొనవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. టీటీ ఆంథోనీ కేసులోనూ ఆర్టికల్ 141 ప్రకారం ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అదే కేసులో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పినా ఆ తీర్పును రాష్ట్రంలో అమలు చేయడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టికల్ 141, సుప్రీంకోర్టు తీర్పుల్ని లెక్కచేయడం లేదు. ఒకే కేసులో ఇన్ని ఎఫ్ఐఆర్లా..హైకోర్టు విస్మయం.. అంబటి రాంబాబుపై అనేక కేసులు నమోదు చేస్తుండడంపై హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తనపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ అంబటి లంచ్మోషన్ రూపంలో దాఖలుచేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు. ఒకే అంశంపై ఎన్ని ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారని న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రశ్నించారు. మొదటి ఫిర్యాదును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన అన్ని ఫిర్యాదులను సీఆర్పీసీ సెక్షన్ 162 కింద వాంగ్మూలాలుగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించారు. అంబటి కేసులో చట్ట ప్రకారం వ్యవహరించాలని హైకోర్టు గుంటూరు జిల్లా, మంగళగిరి గ్రామీణ పోలీసులను ఆదేశించారు. ఆయనకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఈ కేసులో తమ కుట్ర ఫలించకపోవడం వల్లనే ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో అంబటిపై ఒక కేసు తర్వాత మరో కేసు పెడుతున్నారని విమర్శకులంటున్నారు. -
అంబటి ఇంటిపై దాడి దుర్మార్గం: పెద్దిరెడ్డి
సాక్షి, గుంటూరు: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పతాక స్థాయికి చేరిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు.సౌమ్యుడైన అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడంతో పాటు బీసీ నేత మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఈ తరహా దాడులు మునుపెన్నడూ చూడలేదని.. ఈ అరాచకాలకు మంత్రి లోకేషే మూల కారణమని తేల్చి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం అయితే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే..సౌమ్యుడైన అంబటి రాంబాబు మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆ తర్వాత బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోలు బాంబులతో దాడి చేశారు. ఇలాంటి దాడులతో కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతుందో అర్ధం కావడం లేదు? ఇలాంటి దాడులతో మళ్లీ రాజకీయాలలో మనుగడ సాగించాలన్న ఆలోచన చేస్తుందా? లేదా అన్నది కూడా అర్ధం కావడం లేదు. వీరి తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, విడిపోయిన తర్వాత అయినా మాజీ మంత్రులు, శాసనసభ్యుల ఇళ్లపై దాడి చేసే సంస్కృతి ఎప్పుడూ చూడలేదు.1978 నుంచి రాజకీయాల్లో నేను కూడా ఏ పార్టీ ఇలాంటి దాడులకు పాల్పడ్డాన్ని చూడలేదు. కాపులకు అండగా ఉంటానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? ఆ రోజు అధికారం కోసం అడ్డగోలుగా అబద్దాలు చెప్పిన పవన్ కళ్యాణ్.. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పాడు. ఇవాళ ఒక్క మహిళనైనా మరి వెనక్కి తిరిగి తీసుకొచ్చాడా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయాడు. చంద్రబాబు, లోకేష్లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప.. పవన్ కళ్యాణ్ కాపులకు చేసిందేమీ లేదు.మరో వైపు, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలన్నింటికీ మూల కారణం లోకేష్. చంద్రబాబు పవన్ కళ్యాణ్, లోకేష్లు చేస్తున్న తప్పులకు వత్తాసు పలకడం తప్ప.. తన వయస్సుకు తగినట్లు ప్రవర్తించడం లేదు. ఆలాంటి ఆలోచన కూడా చేయడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , లోకేష్లకు ఒక్కటే చెబుతున్నాం. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం అయితే మీకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, మీ డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. ఇవాళ శాసనసభలో అధికార పార్టీ నేతల మొహాలు చూస్తుంటేనే వారి పరిస్థితి అర్ధం అవుతుంది. వారి మొహాల్లో భయం కనిపిస్తోంది.అంబటి రాంబాబు కుటుంబానికి వైఎస్ జగన్తో పాటు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాంబాబు మీద దాడి చేసిన వారు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని, అధికార పార్టీ నేతలు చేసిన దుశ్చర్యను ప్రజలందరూ గమనిస్తున్నారని, తగిన టైంలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. అంబటి రాంబాబుకి బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. -
మాజీ మంత్రి అంబటిపై ఆగని కూటమి కుట్రలు
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. అంబటి విడుదల కాకుండా విశ్వప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాత కేసులను తిరగతోడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అంబటిని మరో కేసులో ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు.గతేడాది నవంబర్లో పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో అంబటికి షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో ఇదే కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కుట్రకు దిగింది. అంబటి విడుదల కాకుండా పాత కేసులు తిరగతోడాలని ఆదేశాలు జారీ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో పెండింగ్లో ఉన్న పాత కేసును2023లో పెండింగ్లో ఉన్న పాత కేసును పోలీసులు తెరపైకి తెచ్చారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించి బలవంతంగా డబ్బులు వసూలు చేశారని 2023లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. జనసేన జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదుతో అప్పట్లో సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టాభిపురం కేసులో అంబటికి బెయిల్ వస్తుందని భావించిన కూటమి ప్రభుత్వం మధ్యాహ్నం నుంచి పాత కేసులను తిరగ తోడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆ ఆదేశాల మేరకు.. సత్తెనపల్లి కేసుకు సంబంధించి ఇవాళ గుంటూరు కోర్టులో పిటి వారెంట్ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటి వారెంటుకు కోర్టు అనుమతించింది. దీంతో రాజమండ్రి జైలు నుంచి పట్టాభిపురం కేసులో విడుదల కానున్న అంబటిని ఈ కేసులో కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. -
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతేగడాది నవంబర్ 12న నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది. నవంబర్ 12న వైఎస్సార్సీపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టింది. ఆ ర్యాలీ నిర్వహించే సమయంలో అంబటి తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. తాజా, కోర్టు తీర్పుతో ఈరోజే అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంబటి రాంబాబు బెయిల్కు సంబంధించి పూచికత్తుల వ్యవహారం ఇప్పటికే పూర్తయ్యింది. అంబటి తరఫు న్యాయవాదులు పదివేల రూపాయలు చొప్పున రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పించారు. రిలీజింగ్ ఆర్డర్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు బయల్దేరారు. -
‘గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్దాలే.. ప్రజా వ్యతిరేకం’
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్.. శాసనమండలి మీడియా పాయింట్ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..గవర్నర్ ప్రసంగం పూర్తిగా నిరుత్సాహ పరిచిందిగత బడ్జెట్లో చెప్పించిన మాదిరిగానే ఈ బడ్జెట్ లోనూ అబద్ధాలు చెప్పించారురాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పించడం బాధాకరం3.2 లక్షల కోట్లు అప్పులు చేసి ఎవరికిచ్చారు?.అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేశారుఏపీలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన సాగుతోందిగతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇంత చెత్తగా పాలన సాగలేదువైఎస్ జగన్ ఐదేళ్లలో సంక్షేమ పాలన అందించారుకానీ కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ది లేదుకూటమి నేతలు మహిళలను వంచిస్తున్నారుమహిళా సాధికారత కొరవడిందిరైతులకు గిట్టుబాటు ధర లేని పరిస్థితివిద్యా ప్రమాణాలు పడిపోవడం వల్ల ఆరు లక్షల మంది బడికి దూరమయ్యారుఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్నారుప్రభుత్వ భూములను కారుచౌకగా తమ మనుషులకు దోచిపెడుతున్నారుగీతం సంస్థకు వేల కోట్ల భూములు కట్టబెడుతున్నారుసంక్షేమ హాస్టల్స్ లో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారురాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నింటినీ ఎందుకు గవర్నర్తో చదివించ లేదుప్రజల తరపున ప్రశ్నిస్తామనే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదుప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలపై మేం పోరాటం కొనసాగిస్తాంచంద్రబాబు, లోకేష్, పవన్ పాలనా వైఫల్యాలను ఎండగడతాం.ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కామెంట్స్..సభలో గవర్నర్ మాట్లాడిందంతా ప్రజా వ్యతిరేక ప్రసంగంఈ ప్రభుత్వంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారువాస్తవాలను పక్కన పెట్టి గవర్నర్తో అసత్యాలు చదివించారుఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారుఉద్యోగులపై ఈ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తెస్తోందిప్రభుత్వం తెచ్చే ఒత్తిడితో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారుఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా వేధిస్తోందివాలంటీర్లకు హామీలిచ్చి ఈరోజు రోడ్డున పడేశారునిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారు మాటతప్పారుఉద్యోగాలిస్తామని మాయమాటలు చెప్పి యువతను మోసం చేశారుదేశంలోనే గవర్నెన్స్ లో ఏపీ అట్టడుగు స్థానంలో ఉందిఏపీలో శాంతి భద్రతలు లోపించాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..రాష్ట్రంలో మూడు పార్టీలు ఒకవైపు ఉంటే వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన ఉందిప్రజల ఆకాంక్షలను సభలో వినిపించాలంటే ప్రతిపక్ష హోదా కావాలికానీ ప్రజల గొంతు వినిపించకుండా మూడు పార్టీలు అడ్డుపడుతున్నాయిదేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తోందిఏపీలో మాత్రం లోకేష్ రాజ్యాంగం నడుస్తోందిలోకేష్ రాజ్యాంగంలో శాంతి భద్రతలు క్షీణించాయిమాజీ మంత్రుల ఇళ్ల పై దాడులు చేస్తున్నారుమెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేశారుప్రజలకు ఇచ్చిన ఒక్క వాగ్ధానాన్ని కూడా నెరవేర్చడం లేదుఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను గవర్నర్ చదువుతున్నారుతన ప్రసంగంలో చదువుతున్నది వాస్తవమా కాదా అని కూడా గవర్నర్ చూడటం లేదునిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందిసంక్షేమం, అభివృద్ధి లేదుఈ రాష్ట్రంలో నడుస్తోంది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యంమూడు పార్టీల నేతలు పందికొక్కుల్లా మారి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారుఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కామెంట్స్..రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీమా పార్టీకి ప్రతిపక్ష హోదా ఒక హక్కుటీడీపీ తెలుగు దొంగల పార్టీగా మారి దోచుకుంటోందిటీడీపీ దేవుళ్లను మోసం చేసే పార్టీగా మారిందిపచ్చ పార్టీ గూండాలు మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్ బాంబులు వేస్తున్నారుగత వైఎస్సార్సీపీ హయాంలో ఏనాడైనా ఇలా జరిగిందా?.175 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షలు సభలో ఎవరు వినిపిస్తారువైఎస్ జగన్కు సభలో మాట్లాడే హక్కు కావాలిఈ ప్రభుత్వం నియంత పోకడలు అనుసరిస్తోందిపీఏసీ ఛైర్మైన్ను కొట్టేసిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదుఏపీలో 3.2 లక్షల కోట్లు అప్పులు చేశారువిద్యార్ధులకు ఫీజు బకాయిలు చెల్లించలేదుప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతోనే హోదా ఇవ్వడం లేదు ప్రతిపక్షహోదా వైఎస్సార్సీపీ హక్కుప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ఎక్కడా లేదుమాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేనప్పుడు టీడీపీ ఆ పాత్ర పోషిస్తుందా?ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కామెంట్స్..గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాలు పుట్టగవర్నర్ తోనూ అబద్ధాలను పలికించారుపీఏసీ మీరే తీసుకున్నారుప్రతిపక్ష హోదా ఇవ్వరుఇక ప్రజల ఆకాంక్షలను సభలో చర్చించేవారు ఎవరు?.అప్పు చేసిన 3.2 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయిఈ 20 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా?.మూడేళ్లు ఇదేవిధంగా పబ్బం గడుపుకుందామని చూస్తున్నారుమూడేళ్ల తర్వాత వచ్చేది మా ప్రభుత్వమేవిశాఖలో భూములు కబ్జా చేశామని చెప్పుకోవడానికి టీడీపీఈ ఎంపీకి సిగ్గులేదా?. కౌన్సిల్లో ఈ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడతాంఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ కామెంట్స్..తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం చేశారులడ్డూలో ఎలాంటి కొవ్వు కలవలేదని సీబీఐ రిపోర్టు ఇచ్చిందిలడ్డూ అంశాన్ని డైవర్షన్ చేయడం కోసం మాజీ మంత్రులపై దాడులు చేస్తున్నారుచంద్రబాబు ఇప్పటికైనా ఇలాంటి చర్యలను మానుకోవాలిమీరు చేసే దుర్మార్గాలకు త్వరలోనే ప్రజలు మీకు బుద్ధి చెబుతారుఎమ్మెల్సీ ఇసాక్ బాషా కామెంట్స్..గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ అమలు చేశారని చెప్పారుసూపర్ సిక్స్ ఎక్కడ అమలు చేశారో సమాధానం చెప్పాలిప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారుహత్యాయత్నం చేసిన వారికి స్టేషన్ బెయిల్బాధితులకు రిమాండ్ వేయడమేనా మీ పాలనరాయలసీమకు మీ వల్ల అన్యాయం జరుగుతోంది రాబోయే బడ్జెట్ ఎంత నిస్సారంగా ఉంటుందో అర్ధమైపోయింది 👉ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా.. 👉 ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్.వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన..అసెంబ్లీలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన.గవర్నర్ ప్రసంగిస్తుండగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ సభ్యులుఏపీలో శాంతిభద్రతలు కాపాడాలని నినాదాలు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలు.ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్. సభ్యుల హక్కులను కాపాడాలని నినాదాలు.నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్.వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన, నినాదాల మధ్యే కొనసాగుతున్న గవర్నర్ ప్రసంగం. 👉 ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ 👉 ప్రారంభమైన ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు 👉 14న బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం 👉 నెలరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం 👉 వైస్సార్సీపీకి ప్రజల పక్షాన నిలుస్తోంది: అప్పిరెడ్డి 👉 ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించకుండా చేయాలని ప్రభుత్వం కుట్రపన్నుతుంది 👉 వైస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలి: లేళ్ల అప్పిరెడ్డి 👉 ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని వైఎస్సార్సీపీ నేతల డిమాండ్.👉 ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అసెంబ్లీ పరిసరాల్లో వైఎస్ జగన్ నిరసన ప్రదర్శన చేపడుతున్నారు.👉వైఎస్ జగన్ కొద్ది సేపటి క్రితమే అసెంబ్లీకి చేరుకున్నారు. మరికాసేపట్లో అసెంబ్లీ సెషన్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి సమావేశాల్లో పాల్గొననున్నారు.👉నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమవేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఇరు సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హాజరు కానున్నారు. అలాగే, అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం హాజరు కానున్నారు. 👉వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభను వాయిదా వేసి బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం నిర్వహించి సభ ఎన్ని రోజులు జరపాలి, ఏ అంశాలపై చర్చించాలనే విషయాలు ఖరారు చేయనున్నారు.👉14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మార్చి 12 వరకూ సమావేశాలు జరుగుతాయని ఇప్పటికే స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. మొత్తం 19 పని దినాల్లో సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో చర్చించి దీనికి ఆమోదం తెలపనున్నారు. -
రేపు మిర్చి యార్డు కార్మికుల సమ్మె
కొరిటెపాడు(గుంటూరు): ఈ నెల 12వ తేదీన జాతీయ సమ్మెలో భాగంగా మిర్చి యార్డులోని అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నట్లు నాయకులు తెలిపారు. దీనిలో భాగంగానే మిర్చి యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి చంద్రికకు మంగళవారం అన్ని సంఘాలు కలిపి సమ్మె నోటీస్ అందజేశాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ ‘కార్మిక కోడ్‘ల పేరుతో ఇప్పటివరకు ఉన్న చట్టాలను నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం కోసం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నియంత్రణలో ఉండే వ్యవసాయం, మార్కెటింగ్ వ్యవస్థ స్థానంలో ప్రైవేట్ మార్కెటింగ్కు అవకాశం కల్పిస్తూ చట్టాలు మారుస్తున్నారని, దీంతో ప్రస్తుత మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్న రైతులు, కార్మికులు, ఉద్యోగులకు చివరకు చిన్న వ్యాపారస్తులకు కూడా నష్టమేనని తెలిపారు. పై సమస్యల పరిష్కారానికై గురువారం మిర్చి యార్డులో పనిచేసే అన్ని రకాల ముఠా కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో భాగస్వాములు అవుతున్నట్లు తెలిపారు. 12వ తేదీన సమ్మె కారణంగా ఎలాంటి లావాదేవీలు జరగవు కాబట్టి రైతులు ఎవరూ మిర్చి బస్తాలు తీసుకురావద్దని తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చిన వారిలో మిర్చి యార్డు ఎగుమతి, దిగుమతి, కాపలా ముఠా కార్మిక సంఘాల నాయకులు మర్రి శ్రీనివాస్, నాగ గౌడ్, వేమెన్స్ అసోసియేషన్ నాయకులు బాబు, కృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గోవిందరావు తదితరులున్నారు. -
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల:గుంటూరుకు చెందిన ఎన్.సుధా రాణి టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. విజయపురిసౌత్: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల/ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వాణి రాణి మంగళవారం తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులు http://apgpcet.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 19వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7569333798 ఫోన్ నంబర్ను సంప్రదించాలని ఆమె కోరారు. రేపల్లె: పట్టణంలో ని శాఖా గ్రంథాలయాన్ని ఏపీ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సభ్యురాలు మగతాల పద్మజ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. పత్రికా విభాగం, పుస్తక విభాగం, రిజిస్టర్లు, రికార్డులు, శిక్షణ ఫౌండేషన్ కంప్యూటర్ రిజిస్టర్లను పరిశీలించారు. పట్టణంలోని చంద్రమౌళి పార్కులో గ్రంథాలయానికి సంబంధించిన 15 సెంట్ల భూమిలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట:జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించిన మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ విద్యార్థి షేక్ జమీర్బాషాను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అభినందించారు. మంగళవారం కలెక్టరేట్కు పిలిపించి అభినందనలు తెలియచేశారు. విద్యార్థి తల్లితండ్రులు, డీఈవో రామారావు, ప్రధానోపాధ్యాయులు టి.రవికాంత్ను సైతం అభినందించారు. జమీర్బాషా జిల్లాకే కాకుండా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘పరీక్షలపై చర్చ’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కో విద్యార్థిని మాత్రమే ఎంపిక చేయగా, ఏపీ నుంచి నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హైస్కూల్కు చెందిన జమీర్బాషా ఎంపికయ్యారు. ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడి తన ప్రతిభను చాటుకున్నారు. జమీర్బాషాకు ఎడ్యుకేషన్ కమిషనర్ విజయరామరాజు శుభాకాంక్షలు తెలియచేశారు. తెనాలి:పట్టణానికి చెందిన సంగీత సంస్థ శ్రీ సీతారామ గానసభ శాసీ్త్రయ సంగీత ఉత్సవా లు మంగళవారం సాయంత్రం స్థానిక శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఆరంభించారు. తొలుత త్యాగరాజస్వామి, గానసభ వ్యవస్థాపకులు నారుమంచి సుబ్బారావు, మాజీ అధ్యక్షుడు పిరాట్ల నారాయణమూర్తి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంగీత ఉత్సవాన్ని ప్రారంభించారు. మొదట రోజు విజయవాడకు చెందిన కుమారి మల్లాది సింధు రాజేశ్వరి సంగీత కచేరి హృద్యంగా సాగింది. వాగ్దేవి కీర్తనలను ఆలపించారు. వయొలిన్పై మీద విజయవాడకు చెందిన అంబటిపూడి కామాక్షి, మృదంగంపై విజయవాడకు చెందిన మాస్టర్ మల్లాది శివానంద ఎస్.ఎస్.వి వాయి ద్య సహకారం అందించారు. గానసభ అధ్యక్షులు పిరాట్ల రమణి పర్యవేక్షించారు. -
దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్
మార్చి 8న ప్రవేశ పరీక్ష ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ–2026 క్యాలెండర్ సంవత్సరం ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ను దూర విద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రెండేళ్ల కాలపరిమితితో ఉండే (ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం దూర విద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడారు. మార్చి 8న ఏఎన్యూ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఏపీ ఐసెట్ 2025లో ర్యాంక్ పొందిన అభ్యర్థులు నేరుగా కోర్సులలో ప్రవేశం పొందవచ్చని వెల్లడించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎనన్యూ) సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పీజీ దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. అలానే 2026 క్యాలెండర్ సంవత్సరానికి సెమిస్టర్ విధానంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ), డెబ్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో) 23 పీజీ కోర్సులకు అనుమతి లభించిందన్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు మార్చి 25వ తేదీతో ముగియనుందన్నారు. అన్ని వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్ సైట్ నుంచి లేదంటే ఫోన్ నంబర్స్ను 0863–2346222, 98484 77441 సంప్రదించవచ్చుని తెలియజేశారు. -
హోటల్స్లో ఫుడ్సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు
● పాడై నిల్వ ఉంచిన 101 కిలోల మాంసం సీజ్ ● ఐదు రెస్టారెంట్స్కు నోటీసులు జారీ గుంటూరు మెడికల్: రోజుల తరబడి వండకుండా నిల్వచేసిన మాంసం.. ఆహారం మిగిలిపోతే పడేయకుండా ఫ్రిజ్లో నిల్వ చేసిన దృశ్యాలు మంగళవారం గుంటూరు నగరంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు జరిపిన తనిఖీల్లో వెలుగు చూశాయి. వివరాల్లోకి వెళ్లితే....గుంటూరు నగరంలో మంగళవారం ఫుడ్సేఫ్టీ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్స్, తూనికలు, కొలతల శాఖ అధికారుల బృందాలుగా ఏర్పడి విస్తృతంగా హోటల్స్, రెస్టారెంట్స్, స్వీట్స్షాపులు, బేకరీలలో తనిఖీలు చేశారు. తనిఖీలలో వాళ్లకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చికెన్, మటన్, చేపలను వండకుండా ఫ్రిజ్లలో రోజుల తరబడి రెస్టారెంట్స్ నిర్వాహకులు నిల్వచేశారు. మాంసం ఐస్ గడ్డలాగా గట్టిగా మారిపోయి ఎంత పగులగొట్టినా ఐస్ ముక్కలు వస్తున్నాయే తప్ప మాంసం కనిపించలేదు. ఫ్రిజ్ అంతా రక్తంతో గడ్డకట్టుకుపోయి ఉంది. ఆహార పదార్థాలు వండే కిచెన్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతోపాటు అపరిశుభ్రంగా ఉంది. ఆహార పదార్థాల్లో సైతం నిషేధిత రంగులు కలిపి విక్రయిస్తున్నారు. పచ్చి మాంసమే కాకుండా వండిన అన్నం, బిర్యానీ, కూరలు కూడా ఫ్రిజ్లలో నిల్వ ఉన్నాయి. ఇలాంటి విస్తుపోయే నిజాలతో మైండ్ బ్లాక్ అయిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు తక్షణమే ఆయా హోటల్స్, రెస్టారెంట్స్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. మాంసం సీజ్ చేసిన హోటల్స్, రెస్టారెంట్స్ ఇవే... గుంటూరు లక్ష్మీపురం రోడ్డులోని బిస్మిల్లా రెస్టారెంట్లో 48 కేజీల మాంసం, బృందాన్గార్డెన్స్ సెంటర్లోని స్వాగత్ డిలైట్లో 25 కేజీల మాంసం, గోంగూర రెస్టారెంట్లో ఐదు కేజీల మాంసాన్ని సీజ్ చేశారు. బృందావన్ గార్డెన్స్ సెంటర్లోని సాయిరాం ఫుడ్స్లో మూడు రకాల స్వీట్లు 25కేజీల వరకు సీజ్చేసి పరీక్షల నిమితం స్టేట్ ఫుడ్సేఫ్టీ కార్యాలయానికి తరలించారు. ఏ మేరకు కల్తీలు ఉన్నాయనే విషయాలు వెలుగులోకి వచ్చిన పిదప నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్సేఫ్టీ స్టేట్జాయింట్ కంట్రోలర్ నూతలపాటి పూర్ణచంద్రరావు మీడియాకు తెలిపారు. తనిఖీలు చేసిన హోటల్స్, రెస్టారెంట్స్ ఇవే... గుంటూరు నగరంలోని గోంగూర రెస్టారెంట్, మయూర్ ఫ్యామిలీ రెస్టారెంట్, స్వాగత్ డిలైట్, 99 బిర్యానీ, ఆల్ కబీర్ రెస్టారెంట్, నవాబ్ అరేబియన్ రెస్టారెంట్, బిర్యానీ ప్యాలెస్, మద్రాస్ బిలాల్ హోటల్, బాబు బిర్యానీ, నల్లపాడు సుభాని హోటల్, శుభం హోటల్. వీటితోపాటుగా సాయిరాం ఫుడ్స్, నగరాలు బాలాజీ స్వీట్స్, బ్రాడీపేట సుజనా బేకరీలలో తనిఖీలు చేశారు. తనిఖీల్లో పాల్గొన్నవారు ఫుడ్సేఫ్టీ డిపార్ట్మెంట్ స్టేట్ ఇన్చార్జి జాయింట్ కంట్రోలర్ నూతలపాటి పూర్ణచంద్రరావు, నెల్లూరు అసిస్టెంట్ఫుడ్ కంట్రోలర్ జి.వెంకటేశ్వరరావు, కృష్ణాజిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, 10 మంది ఫుడ్ సేఫ్టీఆఫీసర్లు పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం పరిమితికి మించిన రంగులు కలిపి ఆహారం, ఆహార పదార్ధాలు తయారు చేయటం, వండిన పదార్థాలు రోజుల తరబడి నిల్వ చేయటం, పచ్చి మాంసాన్ని రోజుల తరబడి నిల్వ చేయటం, అపరిశుభ్రమైన వాతావరంణలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న స్వాగత్ డిలైట్, మద్రాస్ బిలాల్, బెంగళూరు అయ్యంగార్ బేకరీ, శుభం హోటల్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చారు. ఫుడ్ లైసెన్స్ లేకుండా రెస్టారెంట్ నిర్వహిస్తున్న అరండల్పేట నాల్గోలైన్లోని ఆల్ కబీర్ రెస్టారెంట్ వారికి నోటీసులు ఇచ్చారు. -
సంభ్రమాశ్చర్యాలు
గుంటూరుబుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026● మెడికల్ ఎగ్జిబిషన్కు విశేష స్పందన ● భారీగా తరలివస్తున్న విద్యార్థులు ● ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న మెడ్ఫ్యూజన్7తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5000, గరిష్ట ధర రూ.6700, మోడల్ ధర రూ.6000 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ 36.0923 టీఎంసీలు. విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 538.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కి 20,641 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న ఎగ్జిబిషన్.... కేవలం విద్యార్థులనే కాకుండా పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని మెడ్ఫ్యూజన్ మెడికల్ ఎగ్జిబిషన్ బాగా ఆకట్టుకుంటుంది. సందర్శకుల రాక రోజు రోజుకు పెరుగుతుండడంతో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి ఆధ్వర్యంలో వైద్య బృందం ఎప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీక్షకులకు ఎలాంటి అవాంతరాలు, అవరోధాలు లేకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నారు. అనస్తీషియా విభాగం నిర్వహించిన ఎగ్జిబిషన్ విద్యార్థులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అనస్తీషియా విభాగంలో ఏర్పాటు చేసిన ఫొటో బూత్ వద్ద విద్యార్థులు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. ఈ ఫొటో బూత్ ద్వారా అనస్తీషియాలజిస్టు చేసే వివిధ విధులు, ఆయన పాత్ర గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి వైద్య విభాగం ప్రత్యేకమే.... గుంటూరు వైద్య కళాశాలలో ఉన్న ప్రతి వైద్య విభాగం కూడా మెడికల్ ఎగ్జిబిషన్లో పాల్గొంది. ఆయా వైద్య విభాగాల ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న విజ్ఞాన విషయాలు, ఆరోగ్యకరమైన అంశాలు, అందరిని ఆకట్టుకుంటున్నాయి. అనస్తీషియా వైద్య విభాగం ఆధ్వర్యంలో కాలక్రమంలో జరిగిన మార్పులు, అభివృద్ధిని బయోస్కోప్ ద్వారా ప్రదర్శించారు. విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. వివిధ నరాలను ఉత్తేజితం చేసినప్పుడు శరీర అవయవాలు ఎలా స్పందిస్తాయో చూపించే ఎగ్జిబిట్కు విశేష ఆదరణ లభించింది. విద్యార్థుల చేతుల ద్వారానే ఇంట్యూబేషన్ ప్రక్రియను ప్రాక్టికల్గా చేయించి చూపించారు. దీంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనాటమీ వైద్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మానవ అస్థి పంజరాలు, శరీర అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు, లివర్, మెదడు వంటి అవయవాలు కళ్లతో చూసి ఆశ్చర్యానికి, ఆనందానికి లోనవుతున్నారు. తల్లి కడుపులో ఉండే పసి పిండాలను రసాయనాల్లో నిల్వచేసి చూపిస్తున్న తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఫార్మాకాలజీ వైద్య విభాగం ఆధ్వర్యంలో మందుల తయారీ, ఏఏ జబ్బులకు ఏఏ మందులు పని చేస్తున్నాయో తెలిపే చార్ట్లు, పెథాలజీ వైద్య విభాగం, రేడియాలజీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వ్యాధులను ఏ విధంగా గుర్తిస్తారనే విషయాలు ఆకట్టుకుంటున్నాయి. న్యూరాలజీ వైద్య విభాగం ఆధ్వర్యంలో బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది. మెదడుకు వచ్చే సమస్యలు, చికిత్సలు తెలిపేలా ఏర్పాటు చేసిన చార్ట్లు, చిత్రాలు పిల్లల చిట్టిమెదడులో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. పిల్లల వైద్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ చిన్నారులను, విద్యార్థులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి వైద్య విభాగం దేనికదే ప్రత్యేకతను సంతరించుకుంది. -
విద్యుత్ అదాలత్లతో సమస్యల పరిష్కారం
కొరిటెపాడు(గుంటూరు): ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో ఉన్న ఏడు సర్కిల్స్లో అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కన్జూమర్ గ్రీవెన్సె రెడ్రస్సెల్ ఫోరం(సీజీఆర్ఎఫ్) పనిచేస్తోందని సీజీఆర్ఎఫ్ చైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి ఎన్.విక్టర్ ఇమ్మానుయేల్ తెలిపారు. గుంటూరు–పొన్నూరు రోడ్లోని విద్యుత్ శాఖ సమావేశ మందిరంలో మంగళవారం విద్యుత్ అదాలత్ జరిగింది. అదాలత్లో 20 మంది విద్యుత్ వినియోగదారులు వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. వాటిలో 19 మంది సమస్యలను తక్షణమే పరిష్కరించారు. ఈ సందర్భంగా విక్టర్ ఇమ్మానుయేల్ మాట్లాడుతూ ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ఒంగోలు, పల్నాడుతో పాటు సీఆర్డీఏ సర్కిళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సర్కిళ్ల పరిధిలో ఉన్న వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సీజీఆర్ఎఫ్ పని చేస్తోందన్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేందుకు విద్యుత్ వినియోగదారుల అదాలత్లు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు సుమారు వెయ్యికి పైగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఫిర్యాదులు అందాయన్నారు. ఐదు సమస్యలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, మిగిలిన వాటిని పరిష్కరించామని వెల్లడించారు. కార్యక్రమంలో సాంకేతిక సభ్యులు డి.కృష్ణనాయక్, ఆర్థిక సభ్యులు కె.కృష్ణ, స్వతంత్ర సభ్యులు ఏ.సునీత, గుంటూరు పర్యవేక్షక ఇంజనీర్ సీహెచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానుయేల్ -
పెదకాకాని శివాలయం పాలకమండలి నియామకం
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, వేదిక (తెలుగు నాటక పరిషత్ సంఘం) సంయుక్తంగా మార్కెట్ కూడలిలోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న భారత రంగ్ మహోత్సవ్ ● అంతర్జాతీయ నాటకోత్సవం మంగళవారంతో ముగిశాయి. ఈసందర్భంగా జరిగిన సభకు వేదిక అధ్యక్షుడు డాక్టర్ ఎం.సురేష్బాబు అధ్యక్షత వహించారు. అనంతరం గుంటూరు నగర వీధుల్లో భారీగా కళాకారుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, కళాకారులు హాజరయ్యారు. గుంటూరు వెస్ట్ ( క్రీడలు) : హాకీ ఆంధ్రప్రదేశ్ గౌరవ జనరల్ సెక్రటరీగా ఉన్న గంధం హర్షవర్ధన్ను ఎఫ్ఐహెచ్–ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ సెంట్రల్ ప్యానెల్ సభ్యునిగా నియమించారని సీనియర్ హాకీ క్రీడాకారుడు కె.క్రాంతి కుమార్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ను స్థానిక తమ కార్యాలయంలో ఘనంగా సత్కరించామన్నారు. జిల్లాలో తమతోపాటు హాకీని ప్రారంభించిన ఆయన జాతీయ జట్టుతోపాటు పలు టోర్నమెంట్లలో భారత్కు ప్రాతినిధ్యం వహించారన్నారు. దీంతోపాటు అంతర్జాతీయ హాకీ రిఫరీగానూ కొనసాగుతున్నారన్నారు. జాతీయ క్రీడైన హాకీకి పట్టణంలో ఇప్పటి వరకు మైదానం లేకపోవడంతో హర్షవర్ధన్ దీనిని ఏర్పాటు చేయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు నివ్వడం సంతోషకరమన్నారు. ఈ నియామకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. హర్షవర్ధన్ సతీమణి సత్తె గీత కూడా డబుల్ ఒలింపియన్ అని పేర్కొన్నారు. సీనియర్ హాకీ క్రీడాకారులు ఇఏ. రాజ శేఖర్, జి. మాణిక్యాలరావు, సుభాని, జి.ప్రసన్న కుమార్లు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారన్నారు. నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజన, వసతి సౌకర్యాలు కల్పించేలా సంక్షేమ శాఖ అధికారులు నిబద్ధతతో బాధ్యతగా విధులు నిర్వహించాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆదేశించారు. మంగళవారం గుంటూరు వైద్య కళాశాల ఎదుట ఉన్న ఏపీఎన్జీవో కల్యాణ మండపంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ డైరెక్టర్ మల్లికార్జున, ఎక్స్ అఫీషియల్ సెక్రటరీ సత్యన్నారాయణ, ప్రాంతీయ జిల్లాల బీసీ సంక్షేమ అధికారులు, సహాయ బీసీ సంక్షేమ అధికారులు, వసతి గృహా సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వనతి గృహాల నిర్వహణ, రాబోయే టెన్న్త్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల సాధనపై గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ప్రకాశం, మార్కాపురం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల వసతి గృహా సంక్షేమ అధికారులతో జిల్లాల వారీగా, వసతి గృహాల వారీగా మంత్రి సమీక్ష నిర్వహించారు. పదవ తరగతి పరీక్షల్లో సీ గ్రేడ్ లో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారు ఉత్తమమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళగిరి టౌన్ : ఓ వివాహిత ఇద్దరు బిడ్డలతో అదృశ్యమైన ఘటన మంగళగిరి మండలం యర్రబాలెంలో మంగళవారం చోటు చేసుకుంది.తిరుపతికి చెందిన బోయ నానికి లక్ష్మి అనే మహిళతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా యర్రబాలెంలో నివాసముంటున్నారు. భర్త నాని డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. భార్య లక్ష్మి గత కొన్ని సంవత్సరాలుగా మతిస్థిమితం లేక బాధపడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తన ఇద్దరు బిడ్డలతో అదృశ్యమైంది. -
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా డాక్టర్ జి. నందకిషోర్
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పాలకవర్గం సభ్యులకు సోమవారం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఎన్నికలలో గుంటూరు ఐఎంఏ శాఖకు చెందిన డాక్టర్ జి.నందకిషోర్ సభ్యునిగా ఎన్నికయ్యారు. 13 మంది సభ్యుల ఎంపికకు మొత్తం 84 మంది వైద్యులు పోటీపడ్డారు. ఆన్లైన్లో ఎన్నికలు జరగగా అత్యధిక ఓట్లు సాధించి ఎన్నికై న 13 మందిలో డాక్టర్ నందకిషోర్ ఒకరు. 30 వేల మందికి పైగా వైద్యులు ఈ ఎన్నికలలో పాల్గొన్నారు. గతంలో డాక్టర్ నందకిషోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ కార్యదర్శిగా, అధ్యక్షునిగా పనిచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ సభ్యునిగా వైద్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఎన్నిక పట్ల ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షుడు డాక్టర్ టి.సేవ కుమార్, కార్యదర్శి డాక్టర్ బి.సాయికృష్ణ, స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ డి.అమర్, పలువురు సీనియర్ వైద్యులు అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల కు రాష్ట్ర సెకండరీ హెల్త్ డైరెక్టర్ కె.వి.ఎన్. చక్రధర బాబు రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరించారు. -
శివభక్తులపై లాఠీచార్జ్ బాధాకరం: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: శ్రీశైలం మల్లన్న ఆలయంలో శివ స్వాములపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడంపై వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొన్న పరిస్థితులను తెలుపుతూ ట్వీట్ చేశారు.‘ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పాలనలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరం. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో, ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.చంద్రబాబు పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధకలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది.జవాబుదారీతనం, బాధ్యత అన్నవి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇచ్చే సమయాన్ని ఏడు రోజులకు కుదించారు.దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు. తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు.దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు. రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది2025లో ఆంధ్రప్రదేశ్లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే..తిరుపతిలో జనవరి 8, 2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారిశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో 7గురు భక్తులు మృతి చెందారుశ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవికాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయిజాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వరుసగా జరుగుతున్న ఘటనలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది. దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబు నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయి. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగింది. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోందిభక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్లు మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 🚨 🚨 Hello India 👋🏻 👋🏻👋🏻Shiva Mala Dharana devotees were lathi charged by Andhra Pradesh Police under TDP governance.Devotees across Andhra Pradesh are living with growing fear when they step into temples under the TDP coalition government led by N. Chandrababu Naidu.… pic.twitter.com/kBILeAwLOY— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2026 -
‘రేపు వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రస్టేషనలో ఉన్నారని, ఆయన ఏదోదో చేద్దామనుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు( మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన బొత్స.. రాష్ట్రంలో పాలనను చంద్రబాబు గాలికొదిలేశారని మండిపడ్డారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని. రేపు వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారని స్పష్టం చేశారు. అదే సమయంలో చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బొత్స. ‘ రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగాలేవు. ప్రజలు అర్ధాకలితో ఉంటే పట్టించుకోవటం లేదు. రాష్ర్టంలో పాలన గాలికి వదిలేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబిఐ చెప్పింది. ఇక దాని గురించి మాట్లాడి టైం వేస్ట్ ఎందుకు?, సిట్ నివేదిక ఇచ్చాక ఇంకా కమిషన్ వేయటం ఎందుకు?, అసలు ఆ కమిషన్కి చట్టబద్ధత ఉంటుందా?, చంద్రబాబు సిట్ నివేదికను బయట పెట్టాలి. ఎల్లుండి శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. అన్ని విషయాలు అందులో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని బొత్స తెలిపారు. -
చంద్రబాబు తప్పుడు లెక్కలపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ, పనితీరు తక్కువ అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. చంద్రబాబు తప్పుడు లెక్కలపై వైఎస్ జగన్ ఫైరయ్యారు. రాష్ట్రంలో పన్నుల రాబడి, ఆర్ధిక స్థితిగతులపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారంపై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘పన్నుల రాబడిలో ఏపీ దేశంలోనే 22 వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ లెక్కలే దీనికి నిదర్శనంగా నిలిచాయి. కాని చంద్రబాబు ప్రభుత్వం కల్పిత జీఎస్డీపీ (GSDP) లెక్కలతో ప్రజలను మభ్యపెడుతోంది. రాష్ట్రం శర వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రజలను భ్రమ కల్పిస్తున్నారు.2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75% గా ఉందననీ.. జాతీయ వృద్ధిరేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు ప్రకటించారు. అలాగే 2025–26లో రాష్ట్ర వృద్ధి 10.75%గా ఉంటుందనీ..జాతీయ వృద్ధిరేటు 8.0% మాత్రమేనని ప్రకటించారు. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 మధ్య రెండేళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధిరేటు 11.09%గా చూపిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవేవీ స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావు. ఇవి పూర్తిగా చంద్రబాబు కార్యాలయంలో తయారుచేసిన అంకెలే. వాటినే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు.ఈ గణాంకాలు నిజమైతే, ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయి వృద్ధి కనిపించాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలల కాగ్ నివేదికలు చూస్తే వాస్తవ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయో తెలుస్తుంది. నిజానికి ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయాల వృద్ధి కేవలం 1.97% మాత్రమే. 11.09% వంటి భారీ జీఎస్డీపీ వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రం.. పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97% వృద్ధిని సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయకత్వంలో తయారుచేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఏపీ 22వ స్థానంలో ఉంది. అంటే చివర నుంచి రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64% పెరగ్గా.. ఏపీ పన్ను ఆదాయాలు మాత్రం 1.97% మాత్రమే పెరిగాయి. అయినప్పటికీ ఏపీ పనితీరు కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగైనదట!. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ ఏదైనా విషయాల్లో మొదటి స్థానం సాధించిందంటే.. అది కేవలం ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్షసాధింపు చర్యలు, తప్పుడు ప్రచారాల్లోనే’ అంటూ దుయ్యబట్టారు.𝗖𝗕𝗡'𝘀 𝗧𝗵𝗲 𝟮𝟮𝗻𝗱 𝗥𝗮𝗻𝗸 𝗩𝗶𝘀𝗶𝗼𝗻: 𝗛𝗶𝗴𝗵 𝗼𝗻 𝗛𝘆𝗽𝗲, 𝗟𝗼𝘄 𝗶𝗻 𝗣𝗲𝗿𝗳𝗼𝗿𝗺𝗮𝗻𝗰𝗲- 𝗟𝗜𝗘𝗦 𝗮𝗻𝗱 𝗗𝗘𝗖𝗘𝗜𝗧 𝗰𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲 𝗨𝗻𝗮𝗯𝗮𝘁𝗲𝗱At a time when State is confronting a worrying economic slowdown, very clearly evident from the Government… pic.twitter.com/lkeEp84jOQ— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2026 -
మంగళగిరిలో మేఘాలయ ఎన్హెచ్ఎం బృందం పర్యటన
మంగళగిరిటౌన్:గుంటూరు జిల్లా మంగళగిరి లో మేఘాలయ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) బృందం పర్యటించింది. ఈ మేరకు అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం కింద రాష్ట్ర ఆరోగ్య, వైద్యశాఖ అవలంబిస్తున్న విధానాలను మంగళగిరిలోని పలు యూపీహెచ్ సెంటర్లలో సోమవారం బృందం సమీక్షించింది. ఇందిరానగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్ను సందర్శించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పథకాల అమలు పై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనీమియా కింద గర్భిణులు, బాలింతలు, బాలికలు, విద్యార్థుల్లోని రక్తహీనత తగ్గించేందుకు అందిస్తున్న మాత్రలు, ఇతర చర్యల గురించి వైద్య అధికారులు వివరించారు. కార్యక్రమంలో మేఘాలయ ఎన్హెచ్ఎం సీనియర్ అధికారులు డాక్టర్ నోవెరినా మరక్, బాదోండర్ షిల్లా, ఇందిరానగర్ యూపీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూష తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిత్రకారులు వజ్రగిరి జెస్టిస్కు జాతీయ గోల్డెన్ మాస్టర్ స్ట్రోక్ అవార్డు వినుకొండ:క్రియేటివ్ ఆర్ట్స్ అధినేత అంజి ఆకొండి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మాస్టర్ స్ట్రోక్ జాతీయ చిత్రకళా ప్రదర్శనలో వినుకొండ పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారులు డాక్టర్ వజ్రగిరి జెస్టిస్ గీసిన మహేంద్ర మాత మేదరి చిత్రటానికి గోల్డెన్ స్ట్రోక్ అవార్డు లభించింది. జాతీయ సీనియర్ చిత్రకారులు దాకోజు శివప్రసాద్, వర్థమాన నటుడు సుబ్బు, ఆర్టిస్ట్ ఆనంద్, ప్రొఫెసర్ సుందర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. అవార్డు పొందిన జెస్టిస్ను పలువురు అభినందించారు. ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ చిలకలూరిపేట: లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సోమవారం చోటు చేసుకుంది. గుంటూరు రేంజ్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట పంచాయతీరాజ్ డీఈ కార్యాలయంలో పీవీ లక్ష్మీ సత్యనారాయణాచార్యులు ఏఈగా విధు లు నిర్వహిస్తున్నారు. ఓ అప్రోచ్రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ పెద్ద మస్తానయ్యకు రూ.8 లక్షలు బిల్లు చెల్లించేందుకు మూడు శాతం అంటే రూ. 24 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించటంతో, ముందస్తు వ్యూహం ప్రకారం రూ. 24వేలు లంచం తీసుకుంటుండగా ఏఈను పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు నాగరాజు, సుబ్బారావు, సురేష్, మన్మథరావు పాల్గొన్నారు. గాయత్రీ మాత ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు గుంటూరురూరల్: చౌడవరం గ్రామం దాసరిపాలెంలో కొలువై ఉన్న ప్రసిద్ధ పంచముఖి గాయత్రీ మాత దేవాలయంలో 74వ బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం గాయత్రీ మాత సూర్యనారాయణస్వామి కల్యాణమహోత్సవ 16 రోజుల పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు వెండి పట్టుచీరె అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చుట్టుపక్కల గ్రామాలు, నగరంలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ మహోత్సవాల నిర్వహణను దేవాలయ మేనేజింగ్ ట్రస్టీ వడ్డే రామిరెడ్డి, సెక్రటరీ వడ్డే విజయభాస్కర్రెడ్డి, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. -
అంతర్జాతీయస్థాయికి తెలుగు నాటకం
నగరంపాలెం: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా/ వేదిక (తెలుగు నాటక పరిషత్ల సంఘం) సంయుక్తంగా మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్ – అంతర్జాతీయ నాటక ఉత్సవం నాలుగో రోజుకి చేరింది. సోమవారం జరిగిన సభకు వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు అధ్యక్షత వహించగా, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, వైద్యురాలు ముత్తవరపు భార్గవిచౌదరి జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం జరిగిన సభలో తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు నాటకం అంతర్జాతీయ స్థాయికి సాటి అని నిరూపించేలా భారత్ రంగ్ మహోత్సవ్ కొనసాగుతుందని అన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రభావంతో నాటక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో అంతర్జాతీయ నాటకోత్సవాలను ఏపీకి తేవడం అభినందనీయమన్నారు. సీనియర్ కళాకారులు సుబ్బరాయశర్మ, బుద్దాల వెంకట్రావు, వి.పురుషోత్తమం, దేవేంద్రలను సత్కరించారు. అనంతరం ‘ఏ వెరీ సింపుల్ స్టోరీ’ అనే రష్యన్ నాటకం ప్రదర్శించారు. రష్యన్ దర్శకుడు అలెక్సి బ్లాకి అద్భుత సృజన దృశ్యరూపంగా మలిచారు. మనుషుల స్వార్థానికి, జంతువుల నిస్వార్థ ప్రేమకు మధ్య ఉన్న సన్నని గీతను నాటకం ఆవిష్కరించింది. కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా భాషా సరిహద్దులను చెరిపేస్తూ అద్భుత అభినయంతో కరుణ, స్నేహం, పరస్పర అవగాహనే జీవిత పరమార్థమని ఈ నాటకం చాటిచెప్పింది. మానవీయ విలువలు చాటిన రష్యన్ నాటకం ‘ఏ వెరీ సింపుల్ స్టోరీ’ -
రెచ్చిపోతున్న రేషన్ మాఫియా
తాడేపల్లి రూరల్: మంగళగిరి నియోజకవర్గంలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వం ఉచితంగా అందించే బియ్యంకు అధిక ధరలు ఆశ చూపి లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి కొందరు చీకటి వ్యాపారాన్ని చేస్తున్నారు. పగలు సేకరించిన బియ్యాన్ని రాత్రి సమయంలో దర్జాగా వాహనాల్లో తరలిస్తున్నారు. ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇచ్చామంటూ నిర్భీతితో బియ్యాన్ని సేకరించి తరలిస్తున్నారు. కళ్లముందే అన్ని జరుగుతున్నా వారిపై చర్యలు శూన్యం. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థతోపాటు దుగ్గిరాల మండలంలో రేషన్ షాపు లు నిర్వహిస్తున్న నిర్వాహకులు తమ జేబులు నింపుకోవడానికి అడ్డదారులు తొక్కుతూ బయో మెట్రి క్ వేయించుకుని రేషన్ ఇవ్వకుండా అరకొర నగదు ఇచ్చి లబ్దిదారులను మభ్యపెడుతు నెలకు రూ.లక్ష నుంచి రూ.2లక్షలు వెనుకవేసుకుంటున్నట్లు సమాచారం. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో 136 రేషన్ షాపులు ఉండగా, సుమారు 70వేలకు పైగా రేషన్ కార్డు దారులు ఉన్నారు. వీరికి నెలకు సుమారు 10వేల టన్నులకు పీడీఎస్ బియ్యం రేషన్ బియ్యంగా ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ముందుగానే బయోమెట్రిక్... 60ఏళ్లు దాటిన వృద్ధులు, మంచానపడ్డ వారికి ఇళ్లకు వెళ్లి రేషన్ ఇవ్వాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ నిబంధన కొంతమంది డీలర్లకు బాగా కలసి వచ్చింది. నేరుగా ఈ–పాస్ మిషన్ను లబ్ధిదా రుని ఇంటికి తీసుకువెళ్లి వేలిముద్ర తీసుకుని ఎంతో కొంత సొమ్ము ముట్టచెప్పి వచ్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రేషన్ షాపు యజమానులు సివిల్ సప్లయీస్ నుంచి బియ్యం రాగానే ఎవరైతే బియ్యం తీసుకోరో వారిని గుర్తించి వారి ఇంటికి వెళ్లి వేలిముద్రలు వేయించుకుని ఒక కేజీ బియ్యానికి రూ 5 నుంచి రూ.10 చెల్లిస్తున్నారు. బియ్యంతోపాటు పంచదార అమ్ముకుంటున్నారు. మిల్లర్లకు కేజీ రూ.25 నుంచి రూ.35 వరకు అమ్ముతున్నారు. రేషన్ డీలర్లు సేకరించిన బియ్యాన్ని హోటల్స్ కు పంపగా.. మిగిలిన బియ్యాన్ని మండలంలో ఓ వ్యక్తి సేకరించి నియోజకవర్గంలోని దుగ్గిరాల, మంగళగిరి రూరల్ పరిధిలోని పలు మిల్లులకు అర్ధరాత్రి ఆటోల ద్వారా తరలిస్తున్నారు. ఎక్కడా కూడా పోలీసులు కానీ, సివిల్ సప్లయ్ అధికారులు గానీ తనిఖీలు నిర్వహించకపోవడంతో రేషన్ మాఫియాకు హద్దు లేకుండా పోయింది. ఒక లారీ ట్రిప్ గమ్యస్థానానికి చేరితే రాత్రికిరాత్రే రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. దీంతో కేసులు పెట్టినా పట్టించుకోకుండా ఈ చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా పంచదార నిల్వలను పెద్ద పెద్ద దుకాణాలకు పంపించి, లావుగా ఉన్న పంచదారలో ఈ పంచదారను కలిపి కల్తీ చేస్తున్నట్లు సమాచారం. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. -
రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా..?
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోందని హోంశాఖ మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ నాయకులు దాడి చేయటంతో పాటు, ఆయనపై అక్రమ కేసులు బనాయించిన విషయం విదితమే. ఈ క్రమంలో సోమవారం సిద్ధార్థర్లోని అంబటి నివాసానికి వచ్చి వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ముందుగా దాడి జరిగిన కార్యాలయం, ఇంటిని పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, అంబటి రాంబాబు కుమార్తె మౌనిక, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. హోంశాఖ మాజీ మంత్రి తానేటి వనిత -
ఉబర్ తరహాలో డ్రోన్ సేవలు
గుంటూరు వెస్ట్: ఉబర్ తరహాలో డ్రోన్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో అవగాహన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఈ డ్రోన్ సేవలు ఎంతో ఉపయోగకరమన్నారు. ఉబర్ క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు పొందవచ్చన్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా రాష్ట్రంలో సేవలు లభిస్తాయని చెప్పారు. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు డ్రోన్ ద్వారా చల్లడం వంటి ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. ఒకే యాప్లో అనేక సేవలు లభిస్తాయని చెప్పారు. డ్రోన్ వినియోగం వల్ల సమయం, కూలి ఆదా అవుతుందని అన్నారు. సమీప ప్రాంతంలోనే అద్దెకు డ్రోన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్లే స్టోర్లో ఉబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్న్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా లేదా సంబంధిత క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల డ్రోన్ సేవలు పొందవచ్చన్నారు. యువత జీవితాలను కాపాడుదాం మాదక ద్రవ్యాలను నివారించి, యువత జీవితాలను కాపాడాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా సంస్థలలో మాదక ద్రవ్యాలు ప్రవేశించకుండా గట్టి నిఘా పెట్టాలని తెలిపారు. ● ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ మత్తు మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. 118 మందిపై కేసులు నమోదు చేశామని, గుంటూరు పట్టణంలో 28 హాట్స్పాట్లు, 92 ఉపయోగంలో లేని భవనాలు గుర్తించామని చెప్పారు. -
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సమావేశం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి సీతానగరంలోని సీతా భవన్లో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యక్రమాలపై సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆరు నెలల కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల ప్రకారం మార్చి 8వ –10 తేదీ వరకు కంచి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి స్వామి వారి సూచనల మేరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి హంసల దీని వరకు దేవత వృక్షాలను నాటడం జరుగుతుందని తెలిపారు. ఆషాడ మాసం వ్యాస పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. గ్రామాల కేంద్రంగా ఉన్న దేవాలయాల్లో నిరంతర పూజా కార్యక్రమాలు, దీప ప్రజ్వలనలు, ధూపదీప నైవేద్యాలు నిరాటంకంగా కొనసాగేందుకు ఆర్థిక సహకారం అందించే పెద్దల మద్దతుతో చర్యలు తీసుకుంటామన్నారు. ట్రస్ట్ కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్లో ప్రతిభ చాటిన సిబ్బందికి ఎస్పీ అభినందనలు
నగరంపాలెం: గతనెల 30 నుంచి ఈనెల రెండు వరకు రాజస్థాన్ అజ్మీర్లోని పటేల్ సింథటిక్ స్టేడియంలో ఆల్ ఇండియా పోలీస్ అథ్లెటిక్స్ పోటీలు జరగ్గా, గుంటూరు జిల్లా పోలీసులు ప్రతిభ చాటారు. పలు పోటీల్లో పతకాలు సాధించిన ఏఆర్ హెచ్సీ ఎండీ షాహిదుల్లా (బంగారు పతకం), కానిస్టేబుల్ ఎం.లక్ష్మయ్య (వెండి పతకం), విశేష ప్రతిభ చాటిన ఏఎస్ఐ ఎం.సాంబశివరావును సోమ వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. భవిష్యత్లో మరెన్నో పతకాలు సాధించి, జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు, ప్రతిష్టలు తేవాలన్నారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి పాల్గొన్నారు. -
వెట్టి చాకిరి నిర్మూలనలో భాగస్వాములు కావాలి
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా వెట్టి చాకిరి వ్యవస్థ (బాండెడ్ లేబర్) నిర్మూలనపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమష్టి కృషితోనే వెట్టి చాకిరీ నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. వెట్టి చాకిరి వ్యవస్థ ఒక సామాజిక దురాచారమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, గౌరవప్రద జీవనంకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. ప్రభుత్వం వెట్టి చాకిరి వ్య వస్థ నిర్మూలన చట్టం ద్వారా ఈ వ్యవస్థను పూర్తి గా నిషేధించిందన్నారు. చట్టంపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం, బాధితులను గుర్తించడం, పునరావాసం కల్పించడంపై పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా బలవంతపు కార్మిక వ్యవస్థ, అప్పుల బానిసత్వం వంటి ఘటనలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచా రం ఇవ్వాలన్నారు. బాధితులకు ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. సామాజిక సంస్థలు, స్వచ్ఛందసంస్థలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ గౌర వప్రదమైన జీవితం గడపాలనే లక్ష్యంతో సమాజం ముందుకు సాగాలని కలెక్టర్ కోరారు. డీఆర్వో షేఖ్ఖాజావలి, కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ.గాయత్రి దేవి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, డీపీఓ బీవీ నాగ సాయి కుమార్, కార్మిక శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మూట్ కోర్టు పోటీల్లో విజేతగా ‘సత్యభామ’
గుంటూరు ఎడ్యుకేషన్: రెండు రోజులపాటు జేకేసీ కళాశాల రోడ్డులోని జేసీ లా కళాశాలలో నిర్వహించిన 5వ జాతీయస్థాయి మూట్ కోర్టు పోటీల్లో తమిళనాడుకు చెందిన సత్యభామ స్కూల్ ఆఫ్ లా, ఈరోడ్ న్యాయ కళాశాల విద్యార్థి బృందాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో విజేతలుగా నిలిచాయి. ఆదివారం రాత్రి వరకు జరిగిన పోటీల్లో విజేతలకు వరుసగా రూ.37,500, రూ.30 వేలు చొప్పున నగదు బహుమతులను అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ సుధాకర్బాబు సోమవారం తెలిపారు. ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కళాశాల కరస్పాండెంట్ వేమన కుప్పుస్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
శేష వాహనంపై మల్లేశ్వరుడు
మంగళగిరిటౌన్ : మంగళగిరిలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం మూడవరోజు స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామిని దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు దాతలు ఆలయంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన కీర్తిశేషులు గోలి సుబ్బారావు జ్ఞాపకార్థం వారి కుమారులు గోలి చిన్నారావు, గోలి నాగేశ్వరరావు, గోలి సాంబశివరావు, గోలి శ్రీనివాసరావు వ్యవహరించారు. దేవస్థాన ఈ.ఓ. గోపి ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు. -
గుంటూరు
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 36.1380 టీఎంసీలు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 538.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 12,864 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5200, గరిష్ట ధర రూ.6800, మోడల్ ధర రూ.6400 వరకు పలికింది. 7 -
రోడ్లు ఊడ్చి పీఏసీఎస్ ఉద్యోగుల నిరసన
కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు శ్యామలానగర్లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చొక్కాలు విప్పి చీపుర్లు చేతబట్టి రోడ్లు శుభ్రం చేస్తూ, సమస్యలు పరిష్కరించి తమ ఆకలి తీర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏలూరు, కోనసీమ జిల్లాలకు చెందిన పీఏసీఎస్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ● ఏపీ పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ వెంటనే జీఓ నంబర్ 36ను అమలు చేసి పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర భృతిని ఇవ్వాలని కోరారు. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ సీలింగ్ను రూ.2 లక్షల నుంచి ఎత్తి వేయాలన్నారు. గ్రాట్యూటీ చట్టం ప్రకారం చెల్లింపులు చేయాలన్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పరభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ను చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక నాయకులు మొవ్వా వెంకటేశ్వరరావు, టి.వెంకట రామయ్య, కె.సత్యనారాయణ, బి.రఘురామ్, పి.సత్యనారాయణ, వై.రామచంద్రరావు, పి.సుబ్బారావు, కె.వీరయ్య, ఏలూరు, కోనసీమ జిల్లాల పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించి..ఆకలి తీర్చాలని విజ్ఞప్తి -
‘పబ్లిసిటీ చేసుకోవటమే తప్పితే విద్యార్థులకు ఏం న్యాయం చేశారు?’
తాడేపల్లి : చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యానికి దళిత, గిరిజన విద్యార్థులు బలవుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నా అవి చంద్రబాబుకు పట్టడం లేదని విమర్శించారు. నిజంగా చంద్రబాబుకు మానవత్వం ఉంటే హాస్టల్లోని పిల్లలకు మేలు చేయాలని టీజేఆర్ సూచించారు. ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 9వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. వైఎస్ జగన్ హయాంలో హాస్టల్స్ ఎలా ఉన్నాయో చంద్రబాబు చూసి తెలుసుకోవాలన్నారు. జగన్ హయాంలో హాస్టల్స్ కు రూ.7,245 కోట్లు ఖర్చు చేశారు. 2014-19 మధ్యలో చంద్రబాబు కేవలం రూ.455 కోట్లే ఖర్చు చేశారు. దాన్నిబట్టే సంక్షేమ హాస్టల్లో ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. జగన్ ప్రతిరోజూ మంచి భోజనం పెట్టారు.చంద్రబాబు ఎంతసేపూ పబ్లిసిటీ చేసుకోవటమే తప్ప విద్యార్థులకు ఏం న్యాయం చేశారు?, హోంమంత్రి అనిత హాస్టల్లో తిన్న భోజనంలోనే బొద్దింక వచ్చినా పద్దతి మార్చు కోలేదు. ఇప్పటికి 18 సంఘటనల్లో వేలాది మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యార్థుల అవస్థలను పట్టించుకోరా?, పోలవరం జిల్లాలో 89 మంది ఆస్పత్రి పాలయితే ప్రభుత్వం ఏం చేస్తోంది?, విద్యార్థుల అవస్థలు మీ హైటెక్ ప్రభుత్వానికి తెలియటం లేదా?, గిరిజనులు, దళితులంటే ఎందుకంత కక్ష?, అన్ని రకాల వస్తువులకూ ధరలు విపరీతంగా పెరిగి జనం అవస్థలు పడుతున్నారు. కానీ అభివృద్ధి, సంక్షేమం అద్భుతమని చంద్రబాబు తనకు తానే చెప్పుకుంటున్నారు. మీ పాలన ఎలా ఉందో కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డే తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమను చంద్రబాబు అమ్మేయపోతే జగన్ అడ్డుకున్నారు. ఇప్పటికీ అక్కడి ఉద్యోగులు భయంగానే బతుకుతున్నారు. అమరావతిలో రైతులను నిలువునా మోసం చేసారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప రాజధానిలో ఏం జరుగుతోంది?, చంద్రబాబు చీకటి ఎత్తుగడలకు రైతులు అన్యాయం అవుతున్నారు. రూ.76 వేల కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో చూపుతున్నా నిర్మాణాలు మాత్రం కనపడటం లేదు. రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు?, ఏఐ టెక్నాలజీ అని చెప్తూ మరి ఆ మేరకు పాఠ్యపుస్తకాలను ఎందుకు రూపొందించ లేదు?, టెక్నాలజీ ఉండాలిగానీ మితి మీరిన టెక్నాలజీ అవసరం లేదు. ముందు ఆకలితో ఉన్న వాడికి తిండి పెట్టండి. 23 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు అవుట్డేటెడ్ సీఎం. ఆయన ఆలోచనలు మారాలి. హెరిటేజ్ పెరుగు నాసిరకం అని ల్యాబులు నిర్ధారించాయి. సబ్ స్టాండర్డ్ అని తేల్చి చెప్పాయి. నాసిరకం పెరుగు విక్రయించినందుకు హెరిటేజ్ సంస్థ పెనాల్టీ కట్టింది. ఇలాంటి పనులు చేసినందుకు చంద్రబాబు సిగ్గు పడాలి’ అని మండిపడ్డారు. -
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసింది. సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు అరెస్టు చేసిన కేసులో బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్నారు. పోలీసులు కస్టడీ పిటిషన్ను తిరస్కరించింది. పట్టాభిపురం పోలీసులు అక్రమ కేసులుగతేడాది నవంబర్ నెలలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ‘ప్రజా ఉద్యమం’ పేరుతో ర్యాలీ నిర్వహించింది. అయితే, గుంటూరులో ఈ ర్యాలీ నిర్వహించిన అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.కేసుకు సంబంధించి గుంటూరు కోర్టులో పోలీసులు అంబటిని హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ జనవరి 31న అరెస్టు చేసిన కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీ కేసులో రిమాండ్లో కొనసాగనున్నారు. ఈ కేసులోనూ బెయిల్ వస్తే అంబటి విడుదలయ్యే అవకాశం ఉంది. 44 కేసులు కాగా కూటమి ప్రభుత్వం మాజీ మంత్రిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో గడిచిన ఎనిమిది రోజుల్లో అంబటి రాంబాబుపై 36 కేసులు నమోదు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మెుత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 44 కేసులు నమోదయ్యాయి. -
అంబటిపై కక్ష సాధింపు.. 52 కేసులు, పిటీ వారెంట్లు..
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అంబటిపై నమోదు చేసిన మరో అక్రమ కేసులో భాగంగా పట్టాభిపురం పోలీసులు.. ఆయనను నేడు గుంటూరు కోర్టులో హాజరుపర్చనున్నారు. మరోవైపు.. అంబటి ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత ఏడాది నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి నిరసిస్తూ అంబటి రాంబాబు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీని అడ్డుకుని అంబటి రాంబాబుపై దౌర్జన్యానికి దిగారు. దీంతో, తమ విధులకు అంబటి ఆటంకం కలిగించారని రాంబాబుపై అక్రమంగా కేసు నమోదు చేశారు. రాంబాబుపై నమోదైన కేసులో పిటీ వారెంట్ ద్వారా పట్టాభిపురం పోలీసులు నేడు గుంటూరు కోర్టులో అంబటిని హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో పట్టాభిపురం పోలీసులు రాజమండ్రి జైలు నుంచి అంబటిని తీసుకొని గుంటూరు బయలుదేరారు.ఇక, ఇప్పటికే రాజమండ్రి, అనపర్తి, చిత్తూరు, బాపట్లతో సహ రాష్ట్రంలో పలుచోట్ల అంబటిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 52 కేసులు నమోదయ్యాయి. మరో మూడు పిటీ వారంట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటికి ప్రత్యేక సదుపాయాలు సైతం ప్రభుత్వం కల్పించకపోవడం గమనార్హం. అంబటితో పాటు అదే బ్యారక్లో మరో ముగ్గురు ఖైదీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో అంబటి భద్రతపై అడ్వకేట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, అంబటి రాంబాబు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయనపై నమోదైన మరికొన్ని కేసుల్లో పిటీ వారెంట్లు వేయటానికి పోలీసులు రెడీ అవుతున్నారని సమాచారం. మరోవైపు.. అంబటి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు కావాలనే అంబటిని మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నారని మండిపడుతున్నారు. ప్లాన్ ప్రకారమే కక్షగట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే పోలీసులు నడుస్తున్నారని ఆరోపించారు. -
ఇంటర్కు ఇన్విజిలేటర్లేరీ?
ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో కీలకమైన ఇన్విజిలేషన్ విధులకు గుంటూరు జిల్లాలో అధ్యాపకుల కొరత ఏర్పడింది. ఈ నెల 23వ తేదీ నుంచి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు జరుగుతున్న ప్రాక్టికల్స్ ఈ నెల 10వ తేదీన ముగియనున్నాయి. థియరీ పరీక్షలపై దృష్టి సారించిన అధికారులకు ఇన్విజిలేటర్ల కొరత ఇబ్బందికరంగా మారింది. జిల్లాలోనే అధికం ప్రైవేటు అధ్యాపకులకు బాధ్యతలు -
లబోదిబోమంటున్న మహిళ
తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పోలకంపాడు నుంచి ఉండవల్లి దళితకాలనీకి వెళ్లే కరకట్టపై పట్టపగలు నలుగురు మహిళలు ఉండగా ఒక మహిళను టార్గెట్ చేసి ఆమె అరువు తెచ్చుకున్న బంగారపు గొలుసును చైన్స్నాచర్లు లాక్కెళ్లిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి పరిధిలోని దళిత కాలనీకి వెళ్లే కరకట్టపై ఉదయం కోటిచుక్కల లక్ష్మి తన బంధువులతో కలసి శుభకార్యానికి వెళుతున్నారు. ఇదే సమయంలో ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై ఎదురుగా వచ్చి వీరిని దాటుకుని వెళ్లారు. రెండునిమిషాల వ్యవధిలో తిరిగి వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న లక్ష్మి మెడలోని బంగారం గొలుసును, సూత్రాలతో సహా లాక్కెళ్లారు. ఈక్రమంలో కోటిచుక్కల లక్ష్మి కింద పడిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే చైన్ స్నాచర్లు పరారయ్యారు. పక్కనే ఉన్న మహిళలు బండి ఢీకొందని అనుకున్నారు. కానీ మెడలో తాడు లాక్కెళ్లారని చెప్పడంతో మిగిలిన మహిళలు పెద్దగా కేకలు వేశారు. అప్పటికే ద్విచక్రవాహంపై వారు పరారయ్యారు. కోటిచుక్కల లక్ష్మి బంధువుల ఇళ్లలో శుభకార్యానికి వెళుతూ.. పక్క ఇంటిల్లోని వారు గొలుసును అరువుకు తెచ్చుకుని మెడలో వేసుకుంది. సుమారు 30 గ్రాములు ఉండే ఆ బంగారు గొలుసు లాక్కెళ్లడంతో గొలుసు యజమానికి డబ్బులు ఎలా కట్టాలని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సమాచారం అందుకున్న తాడేపల్లి ఎస్ఐ సంఘటనా స్థలానికి వచ్చి బాధిత మహిళ వద్ద వివరాలు తెలుసుకున్నారు. నలుపు, ఎరుపు ద్విచక్రవాహనంపై ఒకరు హెల్మెట్ ధరించి ఉండగా, మరొకరు వెనుక కూర్చున్నారని, వారిలో ఒక టక్ చేసుకుని ఉన్నారని లక్ష్మి తెలిపింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఐ ఖాజావలి పలుచోట్ల సిసి కెమెరాలను పరిశీలించగా ఆమె చెప్పిన గుర్తులతో ఉన్న యువకులు ద్విచక్రవాహనాన్ని వేగంగా నడుపుకుంటూ ఉండవల్లి సెంటర్వైపు వెళ్లారు. జరిగిన సంఘటనపై ఎస్ఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ చుట్టుపక్కల చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న బిహార్కు చెందిన వ్యక్తులు అని పోలీసులు భావిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ ఖాజావలి సూచించారు. నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారని, పోలీస్ బందోబస్త్ ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో తాత్కలికంగా రద్దు చేశామని, అర్జీదారులు గమనించాలని అన్నారు. -
కొనసాగుతున్న వైద్య ప్రదర్శన
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో మెడ్ ఫ్యూజన్ పేరుతో ఈ నెల 4వ తేదీ నుంచి జరుగుతున్న వైద్య ప్రదర్శన ఆదివారం కూడా కొనసాగింది. డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనాటమీ, జనరల్ సర్జరీ సహా పలు విభాగాల ప్రదర్శనను సందర్శించారు. వాటి వివరాలను తమ కుమార్తెకు వివరిస్తూ, చూపించారు. వైద్య విద్యార్థులతో ముచ్చటించారు. తాను ఎంబీబీఎస్ చదివే రోజులను గుర్తు చేసుకున్నారు. ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అనంతరం ఆయన్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి శాలువాతో సత్కరించారు. ఒక్కరోజే 4,184 మంది సందర్శన... ఆదివారం 4,184 మంది ప్రదర్శనను సందర్శించారని ప్రిన్సిపల్ తెలిపారు. ముందస్తుగా వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని రావాలని సందర్శకులకు విజ్ఞప్తి చేశారు. కళాశాల వద్ద నేరుగా టికెట్లు తీసుకోవడం వల్ల ఒక్కసారిగా రద్దీ ఏర్పడే అవకాశముందని పేర్కొన్నారు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా సమస్యను నివారించవచ్చని తెలిపారు. -
లారీలో షార్ట్ సర్క్యూట్
నిమిషాల్లో దగ్ధమైన క్యాబిన్ తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కొలనుకొండ వద్ద ఒక లారీ క్యాబిన్లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలో లారీ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. సేకరించిన వివరాల ప్రకారం... విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో ఓవర్లోడ్తో వెళుతున్న ఇసుక లారీ కొలనుకొండ ప్రాంతానికి వచ్చే సరికి లారీ క్యాబిన్లో నుంచి మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ లారీ దిగి ప్రాణాలతో బయట పడ్డారు. వారి కళ్లముందే నిమిషాల వ్యవధిలో లారీ దగ్ధమైంది. సమాచారం అందుకున్న మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. సాంకేతిక లోపం, ఓవర్ లోడ్ వల్ల లారీ ఇంజిన్ వేడి ఎక్కి ఈ మంటలు వ్యాపించి ఉంటాయని పలువురు లారీ డ్రైవర్లు వ్యాఖ్యానిస్తున్నారు. -
అంబటి ఇంటి వద్ద పోలీసుల అత్యుత్సాహం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద ఆదివారం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇటీవల కాలంలో అంబటి నివాసంపై, కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడి చేసి, తిరిగి ఆయనపై అక్రమ కేసులు బనాయించిన విషయం విదితమే. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు ఆయన కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చాయి. పలువురు నేతలు కూడా ఇందులో భాగంగా వచ్చి, వెళ్తున్నారు. ఆదివారం ఇదే క్రమంలో అంబటి నివాసానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మరికొంతమంది వచ్చిన నేపథ్యంలో పట్టాభిపురం ఎస్ఐ నాగేంద్ర ఓవర్ యాక్షన్ చేశారు. అంబటి ఇంటి వద్ద ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకపోయినా స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని అంటూ హడావుడి చేశారు. అక్కడ పెట్టిన కార్లన్నీ తీయాలని చెప్పడంతో పోలీసుల తీరుపై పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ జోక్యం చేసుకొని అంబటి నివాసం వద్ద నాలుగు నివాసాల వారివే ఉన్నాయని, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాము క్రమశిక్షణగానే వాహనాలను పార్కింగ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో ఎస్ఐ నాగేంద్ర అక్కడి నుంచి వెనుదిరిగారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించటం సరికాదంటూ అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. -
ఏఆర్ బలగాలకు విజయవంతంగా శిక్షణ
నగరంపాలెం: ఏఆర్ బలగాల శారీరక దృఢత్వం, ఆయుధాల వినియోగంలో నైపుణ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా శిక్షణ (మొబిలైజేషన్) నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఆదివారం పోలీస్ కవాతు మైదానంలో జిల్లా ఏఆర్ బలగాలకు డి–శిక్షణ నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఏటా ఏఆర్ బలగాలకు శిక్షణ, డి–శిక్షణ నిర్వహించడం తప్పనిసరని అన్నారు. వీవీఐపీ, వీఐపీ కార్యక్రమాలు, విస్తృత బందోబస్త్ విధులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. పోలీస్ సిబ్బంది శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని అన్నారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు మాట్లాడుతూ ఏఆర్ బలగాలకు విజయవంతంగా శిక్షణ నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం ఏఆర్ బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పరేడ్ను జిల్లా భద్రత విభాగ ఆర్ఐ శ్రీనివాసరావు పరేడ్ కమాండర్గా వ్యవహరించారు. జిల్లా భద్రత విభాగపు పోలీస్ జాగిలం (సింబా) ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాగిలం ప్రతిభను జిల్లా ఎస్పీ ప్రశంసించారు. కార్యక్రమంలో డీఎస్పీలు సంకురయ్య (ఏఆర్), అరవింద్ (గుంటూరు పశ్చిమ), సీఐలు నాగుల్మీరా, బిలాలుద్దీన్, ఆర్ఐలు శివరామకృష్ణ, శ్రీహరిరెడ్డి, సురేష్, శ్రీనివాసరావు, ఆర్ఎస్లు, ఏఆర్ బలగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం సిగ్గుచేటు
పట్నంబజారు: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేయటం సిగ్గుచేటని హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీపై బురద జల్లేందుకే మరీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని అసత్యాలు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. లడ్డూలో కొవ్వు కలిసి ఉంటే తాము సుప్రీంకోర్టు తలుపుతట్టే వాళ్లమే కాదని స్పష్టం చేశారు. అయోధ్యకు పంపిన లడ్డూలో కూడా జంతు కొవ్వు కలిసిందని టీడీపీ చెప్పటం దారుణమన్నారు. పవన్కళ్యాణ్ ఒక్క మాటపై నిలబడే పరిస్థితి లేదని విమర్శించారు. సీబీఐ నివేదిక ఇచ్చిన తరువాత కూడా, తాజాగా ఫినాయిల్ వంటి రసాయనాలు కలిశాయని కొత్త పాట మొదలు పెట్టడం దారుణం అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరుకు వస్తే నగరం జనసంద్రం అయిందన్నారు. చంద్రబాబు దేవుడిని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు కూలడం ఖాయం పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలో ప్రజా విశ్వాసం కోల్పోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్కారీ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతోందని మండిపడ్డారు. దానిలో భాగంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై దాడులు చేశారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రుల నివాసాలను తగులబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలే తగులబెట్టేస్తారని స్పష్టం చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, కాకాని గోవర్ధన్రెడ్డి లపై అక్రమ కేసులు పెట్టి ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చి చెప్పిందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు లడ్డూ విషయంలో అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ల్యాబ్ ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. వైఎస్ జగన్కు హిందువుల ఓట్లు దూరం చేయాలనే కుట్ర జరిగిందన్నారు. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేయటంతో వైఎస్సార్ సీపీ పాప ప్రక్షాళన దీక్ష చేపట్టిందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల ఆగ్రహంతో చంద్రబాబు ప్రభుత్వం కాలి బూడిద కావడం తథ్యమన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రజలకు, వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలతో చెలగాటం తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఆధారాలతోనే సీఎం స్థానంలో ఉన్న వారు మాట్లాడాలన్నారు. కూటమిలో ఒక ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని, తనకు ఒక పార్టీ ఉందనే విషయాన్ని మర్చిపోయారన్నారు. సుప్రీంకోర్టులో చార్జిషీటు దాఖలు అయిన తరువాత కూడా టీడీపీ నేతలు ఇలా విషం చిమ్మటం సిగ్గుచేటన్నారు. ఆధారాలు అంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడులు చేశారన్నారు. కూటమికి ఆ దేవుడే ముగింపు పలుకుతాడని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ గులాం రసూల్ తదితరులు పాల్గొన్నారు. -
ఫొటోగ్రాఫర్ నాగేశ్వరరావుకు ద్రోణాచార్య సేవాపురస్కారం
తెనాలి: తెనాలి కెమెరా క్లబ్కు చెందిన ఫొటోగ్రాఫర్, శిక్షకుడు కోకాటి నాగేశ్వరరావు (నాగు) ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్లో ద్రోణాచార్య సేవా పురస్కారం స్వీకరించారు. హైదరాబాద్లోని కేబీఆర్ ఫంక్షన్హాలులో జరుగుతున్న మూడురోజుల ఫెస్టివల్లో ఆదివారం ఈ పురస్కారాన్ని జేఎన్ఏఎఫ్యూ (ఫొటోగ్రపీ), హైదరాబాద్ ప్రిన్సిపాల్ ఆనంద్, హెచ్ఓడీ కమల్రాయ్ చేతులమీదుగా బహూకరించారు. నాగేశ్వరరావును తెనాలి కెమెరా క్లబ్ సభ్యులు, పట్టణానికి చెందిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అభినందించారు. -
భూమిని కాజేసేందుకు చంద్రబాబు కుట్ర
రూ.2వేల కోట్ల విలువైన మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం చినకాకానిలో ఉన్న 72 ఎకరాల అంజుమాన్ ఇస్లామియా సంస్థకు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన వ్యవసాయ భూములను కాజేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా విమర్శించారు. గుంటూరు మంగళదాస్నగర్లోని షేక్ నూరి ఫాతిమా నివాసం నుంచి మంగళగిరికి భారీగా ర్యాలీతో తరలివచ్చారు. చినకాకానిలో ఉన్న వక్ఫ్ భూములను ఆదివారం వారు పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం మురుగుడు హనుమంతరావు, దొంతిరెడ్డి వేమారెడ్డి, షేక్ నూరి ఫాతిమాలు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం దొంగ జీవోలతో వక్ఫ్ భూములను కాజేయడానికి యత్నిస్తోందని, ఆ భూములను బడా వ్యాపారవేత్తలకు ధారాదత్తం చేసేందుకే ఈ కుట్ర అని అన్నారు. ఇప్పటికే రాజధానిలో అభివృద్ధి పేరుతో వేల ఎకరాలను ప్రభుత్వం తీసుకుందని రెండు సంవత్సరాలు గడిచినా అభివృద్ధి శూన్యమని అన్నారు. ముస్లిం సంస్థలకు చెందిన స్ధిరాస్తులను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చలో కలెక్టరేట్కు తరలిరండి ఈనెల 9న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని షేక్ నూరి ఫాతిమా కోరారు. ఈ భూములపై ఆధారపడిన పాఠశాల, మసీదు, రైతులు, షాదీఖానాలకు సంబంధించిన అందరి వద్ద నుండి అభ్యంతరాలను స్వీకరించి వాటిని కలెక్టర్కు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్ నుండి కలెక్టర్ కార్యాలయం, గ్రీవెన్స్లో అభ్యంతర పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మంగళగిరి మండల అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, తాడేపల్లి పట్టణ, మండల అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, అమరా నాగయ్య, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సుంకర రఘుపతి, వైఎస్సార్ సీపీ జిల్లా, మండల, పట్టణ మైనార్టీ నాయకులు సుభాని, చాంద్బాషా, మాలిక్బాబు, యస్కె షఫీ, హుస్సేన్, ముస్లిం సమైక్యవేదిక నాయకులు మౌలా బేగ్, హాజీ మహమ్మద్, షేక్ హుస్సేన్, షేక్ సమీవుల్లా, గుంటూరు వైఎస్సార్సీపీ నాయకులు పటాన్ సైదాఖాన్, ఖాసిం బేగ్, లియాఖత్ అలీ, సలీమ్, కరీమ్, కార్పొరేటర్ బాబు, రాజేష్, జానీ బాషా, సుభాని, రబ్బాని, శ్రీకాంత్రెడ్డి, అమీనా షరీఫుద్దీన్, జానీ బాషా తదితరులు పాల్గొన్నారు. -
మహాశక్తి దేవతగా బగళాముఖి అమ్మవారు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం మహాశక్తి అలంకరణలో పూజలు అందుకున్నారు. అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేశారు. పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. అమరావతి: మండల పరిధిలోని అత్తలూరు గ్రామంలో అత్యంత పురాతనమైన పునీత తోమాసవారి ఉత్సవాలను ఆదివారం ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే ప్రార్థన కార్యక్రమాలలో భాగంగా గుంటూరు మేత్రాసన విశ్రాంత బిషప్ రెవరెండ్ గాలిబాలి, జిల్లా వ్యాప్తంగా పలు చర్చిల నుంచి వచ్చిన 40 మంది విచారణ గురువులతో దివ్య పూజాబలి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అత్తలూరు తోమాస చర్చి ఫాదర్ చాట్ల కస్పార్ మాట్లాడుతూ అందరూ దైవం పట్ల విశ్వాసంతో, తోటి మానవుల పట్ల కరుణతో జీవించాలన్నారు. ఏసుప్రభువు మానవులకు చేసిన అనేక మంచి కార్యాలకు కృతజ్ఞతగా ఈ పండుగను నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించిన కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఐదు గంటలకు కొవ్వొత్తులతో వీధులలో ప్రదర్శన నిర్వహించారు. రాత్రికి ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో, పూలతో అలంకరించిన తేరుపై ఏసుప్రభువు విగ్రహాన్ని ఉంచి పురవీధులలో తేరు ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో విచారణ గురువులు, మఠ కన్యలతోపాటు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 3.3 సెంటీమీటర్ల అతి సూక్ష్మ వరల్డ్ కప్ నమూనా తయారీ చీరాల: అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో చరిత్ర సృష్టించిన భారత్ జట్టుకు బాపట్ల జిల్లా చీరాలకు చెందిన స్వర్ణకారుడు నక్కా వెంకటేష్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో 3.3 సెంటీమీటర్ల అతి సూక్ష్మమైన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ నమూనా తయారు చేశారు. క్రికెట్లో ఇంగ్లండ్ను ఓడించిన భారత్ యువ క్రికెటర్లకు దీనిని అంకితం చేశారు. ఈ కప్పును 0.500 మిల్లీగ్రాముల బంగారాన్ని, 2.900 మిల్లీగ్రాముల వెండిని ఉపయోగించి రెండు రోజులు పాటు శ్రమించి తయారు చేసినట్లు తెలిపారు. నకరికల్లు: సీనియర్ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ మండలంలోని అడ్డరోడ్డులో గల అభయాంజనేయ స్వామిని ఆదివారం దర్శించుకున్నారు. కొండవీడు ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయన మార్గమధ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకుడు విను కొండ కొండామాచార్యులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. రాజేంద్ర ప్రసాద్ను కలిసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. -
పోటీల్లో పాల్గొంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశాతాడేపల్లి రూరల్: చిన్నవయసులోనే ఈత నేర్చుకోవడమే కాకుండా పోటీల్లో పాల్గొనడం వల్ల చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశా పేర్కొన్నారు. ఆదివారం ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేన్ ఆధ్వర్యంలో 26వ కృష్ణా రివర్ క్రాస్ ఈతపోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశా మాట్లాడుతూ ఈత అనేది ఒకరకమైన వ్యాయామ క్రీడ అని పేర్కొన్నారు. ఈత శరీరానికి మంచి వ్యాయామం అని అన్నారు. ఏపీ ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ పి.వెంకటరమణ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతుల చెక్కులు, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె. లక్ష్మీశాను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజు గంగరాజు ఆశీస్సులతో గత 26 సంవత్సరాలుగా కృష్ణానదిలో ఈత పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాల నుండి 88 సంవత్సరాల వయస్సు వారు మొత్తం 634 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారని, మొత్తం 8 కేటగిరీలలో ఆడ, మగ పోటీదారులకు విడివిడిగా 16 గ్రూపులుగా పోటీలు నిర్వహించామని తెలిపారు. వేసవి కాలంలో సుమారు 300 మంది పిల్లలకు ఈత నేర్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరి యార్లగడ్డ రమేష్కుమార్, కన్వీనర్ వడిపినరాము, వైస్ ప్రెసిడెంట్ గోపాలం సాంబశివరావు, కె.వి.రామయ్య, ఎ. రామిరెడ్డి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
నత్తనడకన ‘ఈ–క్రాప్’
చంద్రబాబు సర్కార్ తీరుతో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ఈ–క్రాప్ నమోదు నత్తనడకను తలపిస్తోంది. పంటల విస్తీర్ణంలో ఇప్పటికి సగం మాత్రమే నమోదు చేశారు. వ్యవసాయ విధులు నిర్వర్తించాల్సిన సిబ్బందికి సర్వేల పేరుతో పనిభారం పెంచడంతో ఈ–క్రాప్ నమోదు నీరసంగా సాగుతోంది. గడువులోగా పూర్తి స్థాయిలో నమోదుకు అవకాశం కనిపించటం లేదు. ఫలితంగా రైతులు నష్టపోయే ప్రమాదముంది. చంద్రబాబు సర్కారు దగా సబ్ డివిజనులో రబీలో సాగవుతున్న పంటలకు ఈ–క్రాప్ నమోదు చేస్తున్నాం. గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు కూడా ముందుకొచ్చి పంటల నమోదుకు తోడ్పడాలని కోరుతున్నాం. – ఆర్.విజయబాబు, ఏడీఏతెనాలి: గుంటూరు జిల్లాలో తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల పరిధిలో గల వ్యవసాయ సబ్ డివిజనులో 51,170 ఎకరాల విస్తీర్ణంలో రైతులు రబీ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో మొక్కజొన్న 26 వేలు, జొన్న 22 వేలు, మినుములు, పెసలు 3 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సబ్ డివిజనులో 43 రైతు సేవ కేంద్రాలు ఉండగా, 35 మంది వీఏఏలు విధులు నిర్వర్తిస్తున్నారు. పంటల ఈ–క్రాప్ నమోదును డిసెంబరులో ఆరంభించారు. దుగ్గిరాలలో 19,918 ఎకరాలకు 10,965, తెనాలిలో 17,020 ఎకరాలకు 9,007, కొల్లిపరలో 14,232 ఎకరాలకు 6,553 ఎకరాలకు మాత్రమే ఈ–క్రాప్ నమోదు చేయగలిగారు. ప్రస్తుతానికి 26,526 ఎకరాలకే ప్రక్రియ పూర్తి అయింది. ముంచుకొస్తున్న గడువు ఈ–క్రాప్ నమోదుకు ఈ నెల 21వ తేదీతో గడువు ముగియనుంది. ఆలోగా పూర్తి చేస్తారన్న భరోసా రైతులకు చిక్కటం లేదు. ఇందుకు ప్రధాన కారణం సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షర ఆంధ్ర రిజిస్ట్రేషను వంటి పనులను అప్పగించడమే. రోజూ మధ్యాహ్నం నుంచి సచివాలయ ఉద్యోగులు ఈ విధులను నిర్వర్తించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సచివాలయం పరిధిలోని వీఏఏలు ఉదయం తమ పనులతోపాటు మధ్యాహ్నం నుంచి సర్వే, రిజిస్ట్రేషను పనులకు వెళ్లాల్సి వస్తోంది. పనిభారంతో అవస్థలు పడుతున్నారు. తరచూ సర్వర్లు మొరాయిస్తుండటం మరో సమస్య. దీంతో ఈ–క్రాప్ నమోదు పనుల్లో జాప్యం జరుగుతోంది. గతంలో సచివాలయం నుంచే నమోదుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం తప్పనిసరిగా పొలాలకు వెళ్లి, పంట వివరం, పంట రకం వంటి వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. ఎన్నో ఉపయోగాలు ఈ–క్రాప్ నమోదు రైతులకు ఎంతో కీలకం. మార్కెట్లో ధాన్యానికి ధరలు లేనపుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ఈ–క్రాప్ నమోదుతోనే అవకాశం ఉంటుంది. పంట రుణాలు తీసుకోవాలన్నా, పంటల బీమా చేసుకుని ఏదైనా ప్రకృతి విపత్తుతో పంట దెబ్బతింటే నష్టపరిహారం పొందటానికీ సదరు ఈ–క్రాప్ నమోదయితేనే వర్తిస్తుంది. అయినప్పటికీ మూడు మండలాల్లో సగం విస్తీర్ణంలో ఇంకా నమోదు చేయకపోవటంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఖరీఫ్ సీజనులో మోంథా, దిత్వా తుపాన్లకు పంట నష్టపోయిన రైతులు ఎవరికీ పరిహారం అందనేలేదు. వరి పొలంలో 33 శాతం పైబడి పంట నష్టపోతేనే ఎకరాకు రూ.10 వేలు, హెక్టారుకు రూ.25 వేల చొప్పున పరిహారాన్ని నిర్ణయించారు. సబ్ డివిజను పరిధిలో తెనాలి మండలం కంచర్లపాలెంలో కొద్దిపాటి విస్తీర్ణంలో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ అధికారులు నివేదిక పంపారు. సంబంధిత రైతులకూ పైసా పరిహారం అందలేదని చెబుతున్నారు. అలాగే 2024–25లో కొద్దిమంది రైతులకు తైవాన్ స్ప్రేయర్లు, ఆయిలింజన్లు, డ్రోన్లు, రోటావేటర్లు వంటి వ్యవసాయ సంబంధిత పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రస్తుత సంవత్సరానికి వీటి పంపిణీ నిమిత్తం బడ్జెట్ కేటాయింపే జరగలేదని అంటున్నారు. బాబు పాలనలో అన్ని రకాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఆకట్టుకున్న ‘ఆ ఊరు – ఈ ఊరు’
కొనసాగిన ‘భారత్రంగ్ మహోత్సవ్’ నగరంపాలెం: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా/ వేదిక (తెలుగు నాటక పరిషత్ల సంఘం) సంయుక్తంగా మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్ – అంతర్జాతీయ నాటక ఉత్సవం ఆదివారం మూడో రోజుకి చేరింది. వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు అధ్యక్షత వహించారు. దేశ, విదేశీ భాషలు, విభిన్న కళారూపాల సమ్మేళనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు ప్రముఖ రచయితలు, కళాసంస్థలు, నాటక పరిషత్ నిర్వాహకులు, కళాకారులు తరలివచ్చారు. బళ్లారి రాఘవయ్య ఓపెన్ థియేటర్లో పాటలు, ఆటలు, కోలాటాలు, చెక్క భజనలు, డప్పు వాయిద్యాల విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. సాయంత్రం జ్యోతిప్రజ్వలన చేసి, తెలుగు రాష్ట్రాల్లోని పలు కళాపరిషత్ నిర్వాహకులను సత్కరించారు. అనంతరం నటమిత్రారు హవ్యాసి కళా సంఘం (తిరుత్తహల్లి, కర్నాటక) ప్రదర్శించిన ఆ ఊరు – ఈ ఊరు నాటకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పల్లెటూరు కుటుంబ నేపథ్యంతో సమాజంలోని లోపాలను నిర్భయంగా ప్రశ్నిస్తూ, ప్రేక్షకులను ఆలోచనల లోకంలోకి తీసుకెళ్లింది. ఈ నాటకం జి.బి.జోషి రచించగా, హుళుగప్ప కట్టిమాని దర్శకత్వం వహించారు. కన్నడ భాషలో ప్రదర్శించినా.. కళాకారుల హావభావాలు, అభినయాలు భాషా అవరోధాలను చెరిపివేస్తూ ప్రేక్షకులకు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చాయి. -
‘విష ప్రచారం చేసిన వారికి త్వరలోనే దేవుడు గుణపాఠం చెప్తాడు’
గుంటూరు: పరమ పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం జంతువుల కొవ్వుతో తయారు చేశారని ఎటువంటి ఆధారాలు లేకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పటం దారుణమన్నారు మాజీ మంత్రి మేకతోటి సుచరిత. సీబీఐ తన చార్జ్షీట్లో తిరుమల లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు లేదని స్పష్టం చేసిందని, అయినా కూటమి నేతలకు ఇంకా సిగ్గు రాలేదని ధ్వజమెత్తారు సుచరిత.‘మొన్నటి వరకు జంతువుల కొవ్వు తిరుమల లడ్డులో ఉందని విష ప్రచారం చేశారు. సిపిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బాత్రూములు కడిగే హార్పిక్ ను లడ్డు తయారీలో ఉపయోగించారంటూ మరో విషపు ప్రచారాన్ని మొదలుపెట్టారు. దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. స్వామి వారి లడ్డు ప్రసాదం పై విష ప్రచారం చేసిన వారికి త్వరలోనే దేవుడు గుణపాఠం చెప్తాడు’ అని హెచ్చరించారు.ఒక పథకం ప్రకారం విష ప్రచారం..తిరుమల లడ్డు ప్రసాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక పథకం ప్రకారం విష ప్రచారం చేశారని వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విమర్శించారు. ‘ తిరుమల లడ్డులో ఎటువంటి జంతువుల కొవ్వు లేదని నిజాన్ని సిబిఐ బయటపెట్టినా తెలుగుదేశం నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రతిపక్ష నాయకుల ఇళ్లను దహనం చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని దహనం చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ.. అరెస్ట్కు భయపడం: కాకాణి
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వం.. నాటి బ్రిటిష్ పాలనను మించిపోయింది.. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. పోలీసులను అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యక్తిత్వం కోల్పోయాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు. అంబటి ఇంటిపై కూడా దాడి చేశారు. ఆయన కుటుంబాలకు ధైర్యం చెప్పటానికి వచ్చాం. కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలపై అంబటి ప్రశ్నించారు. దీంతో దాడి చేసి అరెస్ట్ చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేశారు.సీఎం చంద్రబాబు లడ్డూ విషయంలో అబద్ధాలు ఆడారు. కూటమి పాలన అధ్వాన్నంగా ఉంది. సమాధానం చెప్పలేక చంద్రబాబు దాడులు చేయిస్తున్నారు. గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం అన్న విషయం కూటమి నేతలు గుర్తుంచుకోవాలి. పైశాచిక ఆనందం పొందటం తప్ప ఎటువంటి ఫలితం ఉండదు. చంద్రబాబు వ్యక్తిత్వం కోల్పోయాడు. చంద్రబాబు తనని అరెస్టు చేసినందుకు మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తట్టుకోలేరు. రాంబాబు తుపాకి తూటాలకు కూడా భయపడరు’ అని అన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కాకాణి పూజిత మాట్లాడుతూ..‘మౌనిక.. తండ్రి బాధ్యతను తీసుకొంది. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంది. అంబటి కుటుంబ సభ్యులను ఈ పరిస్థితుల్లో కలుస్తామనుకోలేదు. రాజకీయాలు దిగజారిపోయాయి. వైఎస్ జగన్కు సైన్యంలా నిలబడే భావన కూటమి నేతలే కల్పిస్తున్నారు. ప్రాణాలర్పించైనా జగన్ను గెలిపించుకుంటాం. కూటమి పాలనను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మహిళలంటే గౌరవం లేదు. ప్రభుత్వం చేసే తాటాకు బెదిరింపులకు భయపడం’ అని హెచ్చరించారు. -
బీఆర్ నాయుడు అసమర్థుడు.. స్వామి భక్తుడే కాదు: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. సీబీఐ ఇచ్చిన రిపోర్టులో లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్టు చూపించగలరా? అని ప్రశ్నించారు. లడ్డూపై విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అత్యంత అసమర్థుడు. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడే కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘లడ్డూ విషయమై చంద్రబాబులో ప్రాయశ్చిత్తం కనపడటం లేదు. చంద్రబాబులో తప్పు చేశామన్న బాధ అసలే లేదు. సిగ్గూ, శరం, భయం భక్తి లేకుండా మాట్లాడుతున్నారు. సీబీఐ స్పష్టంగా చెప్పినా కూడా ఇంకా బుకాయిస్తూనే ఉన్నారు. లడ్డూపై విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. రోజా, జోగి రమేష్ మాట్లాడిన మాటల వీడియోని ఎల్లో మీడియా తప్పుగా ఎడిట్ చేసింది. కట్, పేస్ట్ వీడియోని ప్రసారం చేసి శునకానందం పొందారు. లడ్డూ ఇష్యూ మీద సంవత్సరం పైగా విచారణ జరిగింది. ఆ సిట్లో ఉన్నది చంద్రబాబు మనుషులే.చివరికి లడ్డూలో టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ వాడారని కూడా విష ప్రచారం చేస్తున్నారు. అలాంటి యాసిడ్స్ని స్వీటులో కలుపుకుని బీఆర్ నాయుడు తినగలరా?. టీటీడీ చైర్మన్ నాయుడు అత్యంత అసమర్థుడు. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడే కాదు. అలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా చేసి తిరుమల క్షేత్రానికి మచ్చ తెచ్చారు. బీఆర్ నాయుడు తన టీవీ ద్వారా హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నారు. బీఆర్ నాయుడు వచ్చాక తిరుమలలో అనేక అపచారాలు జరిగాయి. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలపై దాడులు, అపచారాలు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులే ఆలయాలపై దాడులు చేయిస్తున్నారు. చెప్పులు వేసుకుని పూజలు చేసే చంద్రబాబు హిందువని చెప్పుకోవటం సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ సనాతని అని ఎంత చెప్పుకున్నా జనం నమ్మటం ఎప్పుడో మానేశారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
నకిలీ పురుగు మందులు గుర్తించడం కీలకం
కొరిటెపాడు(గుంటూరు): నకిలీ పురుగు మందులు గుర్తించడంలో లాబోరేటరీలు కీలకంగా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు మనజీర్ జిలాని సుమూన్ కోరారు. గుంటూరులోని పురుగుమందుల పరీక్ష కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. పురుగుమందుల శాంపిల్స్ పరీక్షా విధానం, విశ్లేషణ ఫలితాలు ఇన్సైట్ యాప్లో నమోదు చేయడంపై ఏడీఏ సీహెచ్ తిరుమలాదేవి, యనలిస్ట్లను అడిగి తెలుసుకున్నారు. మనజీర్ జిలాని సుమూన్ మాట్లాడుతూ పురుగుమందుల శాంపిల్స్ను తప్పిదాలు లేకుండా పరీక్ష చేసి, నకిలీ పురుగుమందులను అరికట్టాలని సూచించారు. గుంటూరు పురుగుమందుల ల్యాబ్కు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్(ఎన్ఏబీఎల్) వచ్చేలాగా కృషి చేయాలని ఆయన సూచించారు. -
అడ్డగోలుకు అడ్డుకట్ట
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సమావేశపు అజెండాను తిరస్కరిస్తూ చైర్పర్సన్ హెనీ క్రిస్టినాకు లేఖ అందజేస్తున్న ఒకటో స్థాయీ సంఘ సభ్యులు స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని మరోసారి బహిష్కరించిన వైఎస్సార్ సీపీ సభ్యులు రూ.కోట్లాది పనులను ఏకపక్షంగా ఆమోదించడంపై నిరసన ప్రభుత్వం నుంచి స్టాంప్ డ్యూటీ నిధులు తెచ్చుకోలేని దుస్థితి జెడ్పీ చైర్పర్సన్తో విభేదించిన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు బడ్జెట్ ప్రతిపాదనలు మినహా ప్రణాళిక–ఆర్థికాంశాల అజెండాలకు తిరస్కరణ -
విద్యతో పాటు నైతికత ముఖ్యం
ఏఎన్యూ(పెదకాకాని): ప్రతి విద్యార్థి విద్యతో పాటు నైతిక విలువలు కలిగి ఉండాలని ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నా రు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం – నైతిక విలువలు అనే అంశంపై ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.సురేష్కుమార్ అధ్యక్షత వహించారు. ఏఎన్యూ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. విలువలతో కూడిన జీవితం ప్రతి విద్యార్థి విజయానికి మార్గమన్నారు. గురువు గౌరవాన్ని కాపాడలేని చదువు వ్యర్ధమన్నారు. విలువలతో కూడిన విద్య అభ్యసించిన వారు తప్పక విజయం సాధిస్తారన్నారు. కష్టపడిన వారు ఎప్పటికీ నష్టపోరని.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్, గొప్ప ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నెల్సన్ మండేలా, బెనారస్ యూనివర్సిటీ స్థాపనకర్త మదన్మోహన్ మాలవ్య వంటి మహనీయులు సమాజంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని విజేతలుగా నిలిచారని గుర్తు చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యాసంస్థ, గురువులు గర్వించేలా సమాజంలో ఉత్తమ గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య కె.గంగాధరరావు, రిజిస్ట్రార్ జి.సింహాచలం, రెక్టార్ ఆర్.శివరాంప్రసాద్లు ప్రసంగించారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు -
గంజాయి విక్రయించే ముఠా అరెస్ట్
గుంటూరు రూరల్: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను కాకుమాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నగరంలోని సౌత్ సబ్డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భానోదయ తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి వినియోగం విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్దనుంచి 3.95 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా గంజాయి సంబంధిత అక్రమ కార్యకలాపాలను నిర్మూలించడమే లక్ష్యంగా పాత నేరస్తులు, గంజాయి కేసుల్లో పాల్గొన్న నిందితులు, ఇతర అనుమానితుల కదలికలపై జిల్లా పోలీసులు కఠిన నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలో గతంలో గంజాయి కేసులో పట్టుబడి, జువైనల్ హోంలో ఉన్న ఓ మైనర్ ఇచ్చిన సమాచారం మేరకు దేవరకొండ వెంకటరంజిత్కుమార్, మరికొంత మంది గంజాయి వ్యాపారంలో పాల్గొంటున్నట్లు నిర్ధారించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా కొనసాగించామన్నారు. నిఘాలో శుక్రవారం కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపట్ల పెదనందిపాడు రహదారిలో ఉన్న డంపింగ్ యార్డు వద్ద గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద గంజాయి లభ్యమైందన్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా, వారు విశాఖపట్నం, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయిని అక్రమంగా తెచ్చి బాపట్ల, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు అంగీకరించారన్నారు. నిందితులు బాపట్లకు చెందిన దేవరకొండ వెంకట రంజిత్కుమార్, బాపట్లకు చెందిన జూటు చైతన్య పరమేశ్వరరావు, మచిలీపట్నంకు చెందిన జొన్నకూటి ఉదయ కిరణ్, బాపట్లకు చెందిన మల్లెల ఆరాధన రాజా, పొట్లూరు గణేష్ అలియాజ్ బుడ్డ గణేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఆపరేషన్లో పాల్గొన్న ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, కాకుమాను ఎస్ ఏకానాథ్ సిబ్బంది నరసింహ, అశోక్, ప్రసాద్, శ్రీను, చిరంజీవి తదితరులను డీఎస్పీ అభినందించారు. -
పదోన్నతులకు మోకాలడ్డు
● నోటిఫికేషన్లు ఇచ్చి ప్రమోషన్లు ఇవ్వడం లేదు ● కింది స్థాయి ఉద్యోగుల ప్రమోషన్లలో పక్షపాతం ● ఏళ్ల తరబడి కొన్ని పోస్టులు భర్తీ చేయటం లేదు ● పరిపాలన అధికారుల తీరుతో నష్టపోతున్న చిరు ఉద్యోగులు ● జీజీహెచ్ ఏడీ, వైద్య కళాశాల ఏడీ పనితీరుపై విమర్శలు గుంటూరుమెడికల్: గుంటూరు జీజీహెచ్ (పెద్దాసుపత్రి)లో కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామని అధికారులు రెండు నోటిఫికేషన్లు విడుదల చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులు ఏళ్ల తరబడి ఒకే సీటులో పనిచేస్తూ ఆర్థికంగా నష్టపోతూ మానసికంగా కుంగిపోతున్నారు. గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ పూసల శ్రీనివాసరావు, గుంటూరు వైద్య కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ పి.రాజేంద్రప్రసాద్లు ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటూ కింది స్థాయి ఉద్యోగుల పదోన్నతులకు మోకాలడ్డుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ● గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఆస్పత్రి అధికారులు పక్షపాతం చూపిస్తున్నారని పలువురు ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఏడేళ్లుగా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోయారు. ఆరేళ్లుగా రికార్డు అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్నా, అర్హులైన అభ్యర్థులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా, ఆసుపత్రి అధికారులు వాటిని భర్తీ చేయకుండా కాలయాపన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టులు ఎగిరిపోయాయి ● గుంటూరు జీజీహెచ్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల్లో కొన్నింటిని ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. సుమారు ఏడేళ్లుగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయకుండా ఆస్పత్రి అధికారులు మిన్నకుండి పోయారు. సదరు పోస్టులను అర్హత ఉండి తమకు ఇవ్వడం లేదని కొంత మంది ఉద్యోగులు కోర్టుకు వెళ్లడంతో ఖాళీ పోస్టు ఉన్నప్పుడు ఇస్తామని కోర్టుకు వివరణ ఇచ్చారు. తీరా నేడు ఖాళీగా ఉన్న మూడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కనుమరుగైపోయాయని పోస్టులు ఖాళీ వస్తే భర్తీ చేస్తామని ఆసుపత్రి అధికారులు చెబుతున్న సమాధానాలతో కింది స్థాయి ఉద్యోగులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అడ్మినిస్ట్రేటర్లు ఉండి కూడా .. ● గుంటూరు జీజీహెచ్లో పరిపాలనా పరమైన విషయాల్లో సలహాలు అందించి పరిపాలన సజావుగా సాగేందుకు పలువురు అడ్మినిస్ట్రేటర్లు ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక కోర్సులు చదివి ఆసుపత్రిలో పనిచేస్తున్నా, కింది స్థాయి ఉద్యోగుల పదోన్నతుల ఫైల్ ఎందుకు ముందుకు కదలడం లేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ● జిల్లా కలెక్టర్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎ.తమీమ్ అన్సారియా ఈ విషయంపై దృష్టి సారించి ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో న్యాయం చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. గుంటూరు జీజీహెచ్లో ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న పూసల శ్రీనివాసరావు, గుంటూరు వైద్య కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రాజేంద్రప్రసాద్లు గతంలో గుంటూరు జిల్లాలో ఆఫీస్ సూపరింటెండెంట్లుగా, పరిపాలనా అధికారులుగా (ఏఓ)లుగా పనిచేశారు. వీరివురు అసిస్టెంట్ డైరెక్టర్ల పదోన్నతుల కోసం పోటీ పడ్డారు. ఇరువురు కూడా పదోన్నతులు పొంది ఇతర జిల్లాలకు వెళ్లి తిరిగి గుంటూరు జీజీహెచ్కు, గుంటూరు వైద్య కళాశాలకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా వచ్చారు. వీరివురు ఏఓలుగా పనిచేస్తున్నప్పటి నుంచి రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ల నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి. ఏవో క్యాడర్లో ఉండి, ఏడీ క్యాడర్లో ఉండి కూడా కింది స్థాయి ఉద్యోగుల ప్రమోషన్లకు ఏమాత్రం చొరవ చూపించడం లేదనే విమర్శలు వీరిపై ఉన్నాయి. -
11 నుంచి సూరేపల్లిలో శివపార్వతుల కల్యాణోత్సవాలు
సూరేపల్లి(భట్టిప్రోలు): మహా శివరాత్రిని పురస్కరించుకుని భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో కొలువైన కేదారేశ్వర వాయులింగ ఆలయంలో శివపార్వతుల కల్యాణం, తిరునాళ్ల కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు విశ్వేశ్వరబాబు ఆధ్వర్యంలో సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రభను, గూడు బండ్లను అందంగా తీర్చిదిద్దారు. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు ప్రతి రాత్రి 7 నుంచి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. 15వ తేదీ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు స్వామి వారికి భక్తులచే స్వయంగా అభిషేకాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చెరుకుపల్లి: గ్రామ దేవత నెల్లెమ్మ తల్లి ఆలయ మొదటి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా శనివారం ఆరుంబాక గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పూల తో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ రావూరు నాగేశ్వరరావు, డేగల పాపారావు, రావూరి వెంకట సుబ్బయ్య దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పసుపు కుంకుమ గాజులు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కారెంపూడి: మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి రెండు రోజుల తిరునాళ్ల వైభవంగా జరుగుతోంది. రెండవ రోజు శనివారం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. బ్రహ్మంగారి గుడి ఆవరణలో ఉన్న శివపార్వతుల గుడిలో శివపార్వతుల కల్యాణాన్ని దంపతులు పీటలపై కూర్చుని జరిపించారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రికి ప్రభలు కట్టి స్వామి వారికి మొక్కులు చెల్లించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం వీరబ్రహ్మేంద్రస్వాములు గోవిందమాంబల కల్యాణాన్ని జరిపించారు. గ్రామస్తులు భారీగా తరలివచ్చి బ్రహ్మంగారికి గోవిందమాంబలకు పూజలు చేశారు. తెనాలి టౌన్: జాతీయస్థాయిలో ఉత్తమ సర్పంచ్గా అవార్డు పొందడం అభినందనీయమని ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ కొనియాడారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అభినందన సభలో నందివెలుగు సర్పంచ్ ధూళిపాళ్ల పవన్కుమార్, ఎంపీటీసీ తిన్నలూరి విజయలక్ష్మి, గ్రూప్–1 పరీక్షల్లో విజయం సాధించి డీఎస్పీగా ఉద్యోగం పొందిన నాగేశ్వరరావులను దుశ్శాలువా, పుష్పగుచ్ఛంతో అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అత్తోట దీప్తి, సీడీపీవో విజయగౌరి, డిప్యూటీ ఎంపీడీవో వైవిడి ప్రసాద్, మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. -
వైభవంగా మల్లేశ్వరుడి గ్రామోత్సవం
మంగళగిరి టౌన్: మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజులో భాగంగా ఉదయం స్వామివారికి పెళ్లికుమారుడి ఉత్సవం శోభాయమానంగా నిర్వహించారు. గణపతిపూజ, పంచామృత అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవ మూర్తిని పెళ్లి కుమారుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి 7 గంటలకు మల్లేశ్వరుడి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామోత్సవంలో పెళ్లి కుమారుడిని దర్శించిన భక్తులకు పవిత్ర చేకూరి సకల శుభాలు అందుకుంటారనేది భక్తుల నమ్మకం. పట్టణానికి చెందిన జంజనం నాగేంద్రరావు, విజయలక్ష్మి దంపతులు పెండ్లి కుమారునికి మధుపర్కాలు సమర్పించారు. మంగళగిరికి చెందిన అంబటి వెంకట సుబ్బారావు కుమారుడు విశ్వేశ్వరరావు, జక్కా వెంకటరత్నం కుమారుడు నాగ వెంకట గోపాలరావు స్వామివారి గ్రామోత్సవ కై ంకర్యపరులుగా వ్యవహరించారు. కార్యక్రమ ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించారు. -
సంకల్పం ఉంటే.. సక్సెస్ మీ వెంటే
విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ ‘ క్రీడల్లో ఓటమి అనేది బలంగా ఎదిగేందుకు లభించే గొప్ప అవకాశమని, ప్రతి అపజయం ఒక విజయంలాంటిదే.. అది మనల్ని రేపటి గెలుపునకు సిద్ధం చేస్తుంది’ అన్నారు. చదువులో రాణించే తెలివైన విద్యార్థులు ఒక్కోసారి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని, కానీ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఎప్పుడూ మానసిక ఉల్లాసంతో ఉంటారని తెలిపారు. కుంగుబాటుకు లోనైనప్పుడు పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం లేదా క్రీడల్లో పాల్గొనడం ద్వారా తిరిగి ఉత్తేజాన్ని పొందవచ్చన్నారు. చేబ్రోలు: ‘జీవితంలో ఏదైనా సాధించాలనే బలమైన సంకల్పం ఉంటే రాణించవచ్చు, చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు ప్రతిభ చాటాలి’ అని 2025 ఏషియన్ చాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్, భారత హెప్టాథ్లెట్ నందిని అగసారా పిలుపునిచ్చారు. వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో మూడు రోజుల పాటు నిర్వహించిన 19వ ఎడిషన్ జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవ్ శనివారం వైభవంగా ముగిసింది. ఆఖరి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏషియన్ చాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్, భారత హెప్టాథ్లెట్ నందిని అగసారా విచ్చేశారు. సర్టిఫికెట్లు, మెమెంటోలతో పాటు రూ.15 లక్షల విలువైన నగదు బహుమతులను విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలలో సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, అధిపతులు పాల్గొన్నారు. -
అధికారంలోకి వచ్చాక.. వడ్డీతో సహా చెల్లిస్తాం: కాపు నేతలు
సాక్షి, గుంటూరు: కాపు సామాజిక వర్గంపై కక్ష సాధింపు సరికాదని కాపు నేతలు అన్నారు. శనివారం.. మాజీ మంత్రి అమర్నాథ్, కరణం ధర్మశ్రీ ఆధ్వరంలో 100 కార్లతో అంబటి ఇంటికి తరలివచ్చిన ఉమ్మడి జిల్లా కాపు నేతలు.. అంబటి కుటుంబానికి సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అంబటి రాంబాబు కుటుంబానికి కాపులంతా అండగా ఉంటారన్నారు. ‘‘అంబటి రాంబాబును వాళ్లే రెచ్చగొట్టి వాళ్లే దాడికి పాల్పడ్డారు. అంబటి రాంబాబును హత్య చేయడానికి ప్రయత్నించి తిరిగి ఆయనపైనే కేసు పెట్టారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?’’ అంటూ కాపు నేతలు మండిపడ్డారు.‘‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ నిర్థారించింది. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టడం దారుణం. అంబటి రాంబాబుపై ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 32 కేసులు నమోదు చేశారు. పోలీసుల సమక్షంలోనే అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయించారు.‘‘టీడీపీకి కాపులు అంటే గిట్టదు. టీడీపీని కాపులు ప్రశ్నిస్తే సహించరు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని ప్రజలు ఎక్కువ కాలం అంగీకరించరు. చంద్రబాబు, లోకేష్ను చూసి ఎవరూ భయపడరు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాం’’ అని కాపు నేతలు హెచ్చరించారు. -
అధికార అహంకారమా.. గల్లా మాధవిపై అంబటి మౌనిక ఆగ్రహం
సాక్షి, గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లపై కర్రలు, రాడ్లతో దాడి చేయమని మాధవికి ఏ రాజ్యాంగం చెప్పింది అని ప్రశ్నించారు. గల్లా మాధవి అధికార అహంకారంతో మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి మరోసారి బెదిరింపులకు దిగుతున్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి మా ఇంటిపై దాడి చేశారు. ఇళ్లపై కర్రలు, రాడ్లతో దాడి చేయమని మాధవికి ఏ రాజ్యాంగం చెప్పింది. మీరు మొదటి సారి గెలిచారు. క్షమాపణ అడగటానికి వచ్చాం అంటూనే దాడి చేశామంటున్నారు. క్షమాపణ అడగడానికి వచ్చినవాళ్లు కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో వస్తారా? ఎమ్మెల్యే గల్లా మాధవి సమాధానం చెప్పాలి. మీరు మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తారు. దాడి చేయమనే మీరు మీ పిల్లలకి మెసేజ్ ఇస్తున్నారా?.కేంద్ర మంత్రి పెమ్మసాని రాజకీయాలు ప్రక్షాళన చేస్తామన్నారు. ఆయనే మరింత కలుషితం చేశారు. రాళ్లు విసురుతూ, కత్తులు దూస్తున్నా.. గునపాలతో గోడలు పొడుస్తున్నా అంబటి ధైర్యంగా కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిన మీరు ఓట్ల కోసం ఆయన దగ్గరకు రాలేదా?. వైఎస్ జగన్ మా ఇంటికి వచ్చినప్పుడు బంగారు, వెండి ఆభరణాలు పోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి నాయకులకు చేతనైంది.. తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే. అంబటి రాంబాబుపై తెలుగుదేశం గుండాలు చేసిన హత్యాయత్నానికి వ్యతిరేకంగా మద్దతివ్వటానికి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వచ్చారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడాలని నేను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కోరాను అని వ్యాఖ్యలు చేశారు. -
ఆకతాయి చేష్టలతో ‘బాంబు’ కలకలం
లక్ష్మీపురం: గుంటూరు వైద్య కళాశాలలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో ఫీడ్బ్యాక్ బోర్డుపై గుర్తు తెలియని యువకుడు శుక్రవారం అల్లాహు అక్బర్ భూమ్ అని రాసి బాక్స్లో వేయడంతో బాంబు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయి ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగ్జిబిషన్కు పలువురు విద్యార్థులు వస్తున్నారు. వారి ఫీడ్బ్యాక్ కోసం బోర్డు ఏర్పాటు చేశారు. శుక్రవారం విజయవాడలోని నాగార్జున నర్సింగ్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు వచ్చారు. ఫీడ్ బ్యాక్ బోర్డు వారిలో ప్రదీప్ సాహిత్య అనే యువకుడు ఇలా రాశాడు. బాంబు బెదిరింపు అనుకుని ఎగ్జిబిషన్ను కొద్దిసేపు నిలిపి వేశారు. నగరంపాలెం పోలీసులకు సమాచారం అందడంతో ఎవరినీ లోనికి అనుమతించలేదు. ఓ యూట్యూబ్ చానల్కు చెందిన యువకుడు దీని గురించి అడిగి, బాంబు కలకలం అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. క్లూస్ టీమ్, బాంబ్ స్క్వాడ్ కళాశాల ప్రాంగణం అంతా పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైరల్ అవ్వాలనే ఇలా చేసినట్లు చెప్పిన విద్యార్థి ప్రదీప్ సాహిత్యను మందలించి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సొంత పూచీకత్తుపై పంపించేశారు. నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కోసం స్లిప్ రాసిన విద్యార్థి -
భారత్ రంగ్ మహోత్సవం ప్రారంభం
ఐదురోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు నగరంపాలెం (గుంటూరు వెస్ట్): నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా–వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్, అంతర్జాతీయ నాటక ఉత్సవం శుక్రవారం గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు నేతృత్వంలో ఐదురోజులు కొనసాగనున్న ఈ ఉత్సవాలను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రతినిధి లీలాశర్మ, బెంగళూరు ప్రతినిధి వీణాశర్మ, ఏఎన్యూ థియేటర్ ఆర్ట్స్ డైరెక్టర్ నాగభూషణం, ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి రామచంద్రరాజు, నాటకరంగ ప్రముఖుడు కందిమళ్ళ సాంబశివరావు, నటుడు గోపీనాయుడు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా లీలాశర్మ మాట్లాడుతూ నాటకం కేవలం వినోద సాధనం మాత్రమేకాదని, సమాజాన్ని ప్రశ్నించే శక్తిమంతమైన మాధ్యమమని చెప్పారు. విశ్వవిద్యాలయ స్థాయిలో థియేటర్ ఆర్ట్స్కు లభిస్తున్న ప్రాధాన్యతను ఏఎన్యూ థియేటర్ ఆర్ట్స్ డైరెక్టర్ నాగభూషణం వివరించారు. అనంతరం కోరస్ రిపెర్టరీ థియేటర్ (మణిపురి) ఆధ్వర్యంలో కనుప్రియ నాటకాన్ని ప్రదర్శించారు. అంతకుముందు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. గుంటూరు, నరసరావుపేట, యడ్లపాడు నుంచి వచ్చిన విద్యార్థినుల సంప్రదాయ నృత్యాలు, కోలాటం, నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. -
సందడిగా విజ్ఞాన్ మహోత్సవ్
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి 19వ ఎడిషన్ విజ్ఞాన్ మహోత్సవ్ కార్యక్రమం రెండో రోజు శుక్రవారం సందడి సందడిగా సాగింది. విజ్ఞాన మహోత్సవ్లో భాగంగా నిర్వహిస్తున్న పోటీల్లో విద్యార్థులు నువ్వా–నేనా అన్న రీతిలో పోటీ పడ్డారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం (చాంపియన్ మూవీ) మాట్లాడుతూ నటుడిగా ఎదగాలంటే భాషపై పట్టు అవసరమని, మంచి నటుడిగా మారాలంటే భాషలో నైపుణ్యం పెంపొందించుకోవాలని విద్యార్థు లకు సూచించారు. మంచి విమర్శలను అంగీకరించడం ద్వారా మాత్రమే వ్యక్తి ఎదుగుదల సాధ్యమని వివరించారు. జీవితాన్ని, పుస్తకాలను, సినిమాలను గమనిస్తే అనేక మంచి ఆలోచనలు వస్తాయన్నారు. భవిష్యత్తులో ఇంట్లో కూర్చొని కూడా ‘అవతార్’ తరహా సినిమాలను రూపొందించే స్థాయికి సాంకేతికత ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు -
వెంకట సుబ్రహ్మణ్యంకు జీవన సాఫల్య పురస్కారం
పెదకాకాని: గుంటూరు విశ్వనాథ సాహిత్య అకాడమీ దశమ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ కూచిపూడి నాట్య గురువు, సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్ కాజ వెంకట సుబ్రహ్మణ్యంకు విశ్వనాథ సాహిత్య అకాడమీ జీవన సాఫల్య పురస్కారం అందించారు. వీవీఐటీయూ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. మండల పరిధిలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, అకాడమీ చైర్మన్ డాక్టర్ మద్దినేని సింహకౌటిల్య చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుబ్రహ్మణ్యం దంపతులను చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ సత్కరించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి బృందం ప్రదర్శించిన కూడిపూడి నృత్యనాటకం భక్తప్రహ్లాద ప్రేక్షకులను అలరించింది. అకాడమీ కార్యదర్శి మోదుగుల రవికృష్ణ. సభ్యులు పి.సత్యన్నారాయణరాజు, భూసురుపల్లి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
జనమే..అభిమానమై
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సంఘీభావం తెలిపేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు తాడేపల్లి రూరల్: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పర్యటనను ముందుగా కనకదుర్గ వారధి నుంచి బస్టాండ్, కనకదుర్గ ఫ్లైఓవర్, భవానీపురం మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాల్సి ఉంది. పోలీసులు, ప్రభుత్వం రాత్రికి రాత్రి రూటు మార్చి వెస్ట్ బైపాస్లో వెళ్లాలని సూచించారు.శుక్రవారం ఉదయం 11.35 గంటలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయటకు రాగా అప్పటికే ఇంటి వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు ఆయన కాన్వాయ్ను అనుసరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్కి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు, పొన్నూరు నియోజకవర్గ పరిశీలకులు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి సంఘీభావం తెలియజేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. 11.35 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ కాన్వాయ్ ప్రాతూరు అండర్పాస్కు వచ్చేటప్పటికి 12.06 గంటలు అయ్యింది. అక్కడి నుంచి జాతీయ రహదారిపై అభిమానుల మధ్య వైఎస్ జగన్ కాన్వాయ్ మంగళగిరి, తెనాలి ఫ్లై ఓవర్కు 12.15గంటలకు చేరుకుంది. కాజా టోల్గేటు 12.25కి, మంగళగిరి వెస్ట్ బైపాస్కు 12.40, వెంకటపాలెం టోల్గేటుకు 1.30 గంటలకు చేరింది. మహిళలతో కరచాలనం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెస్ట్ బైపాస్లో కృష్ణానది బ్రిడ్జిని 2.05 గంటలకు దాటి గొల్లపూడి గ్రామ శివారుకు చేరుకున్నారు. ఈ మధ్యలో తాడేపల్లి ఓల్డ్ టోల్గేట్ అండర్ పాస్ వద్ద పాతూరు, తాడేపల్లి సర్వీస్ రోడ్లో ఒక చోట, పాతూరు క్రాస్రోడ్లో తన వాహనం నుంచి బయటకు వచ్చి నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. కాజా వద్దకు భారీగా మహిళలు తరలిరాగా వారితో కరచాలనం చేశారు. కాజా టోల్గేటు వద్ద గుంటూరు నుంచి విజయవాడ వచ్చే రూట్లో మూడు నిమిషాలు ఆగి రోడ్డు వెంబడి ఉన్న కార్మికులకు, అభిమానులకు అభివాదం చేశారు. వెస్ట్ బైపాస్కు చేరుకున్న వెంటనే వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు భారీగా వచ్చి స్వాగతం పలకడంతో అక్కడ ఐదు నిమిషాలు ఆగారు. నందిగం ఆధ్వర్యంలో ఘన స్వాగతం వెంకటపాలెం టోల్గేటు వద్దకు వచ్చే సరికి మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నాయకులు నందిగం సురేష్ ఆధ్వర్యంలో రాజధాని ప్రజలు భారీగా తరలి వచ్చి వైఎస్ జగన్కు స్వాగతం పలికి భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. మహిళలు, యువకులు పూలవర్షం కురిపించారు. కాన్వాయ్లో ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డిలతోపాటు ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు కొమ్మూరు కనకారావు తదితరులు ఉన్నారు. అడుగడుగునా అడ్డంకులు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. తాడేపల్లి నివాసం నుంచి జగన్ కాన్వాయ్ బయలుదేరింది. భరతమాత సెంటర్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ను ముందుకు కదలనిచ్చి వెనుక వస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. తాడేపల్లి ఓల్డ్ టోల్గేటు వద్ద, వెస్ట్ బైపాస్ ఎంట్రన్స్లో వెంకటపాలెం వద్ద జగన్ కాన్వాయ్ను ముందుకు పంపి మిగిలిన వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అరగంట సేపు ప్రతి ఒక్కచోట అరగంట సేపు వాహనాలను నిలిపివేసి ఆటంకాలు కల్పించారు. ఫ్లెక్సీలతో యువత కేరింతలు వైఎస్ జగన్ ఇంటి నుంచి బయటకు రాగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పోయింది అధికారం అని, అభిమానం కాదు అంటూ ఫ్లెక్సీలతో యువకులు నృత్యాలు చేశారు. వైఎస్ జగన్ అభిమాని ఒకరు వేంకటేశ్వరస్వామి చిత్రపటంతోపాటు సత్యమేవ జయతే అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. బాణాసంచా కాలుస్తూ ముందుకు సాగారు. -
వేతన సవరణ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
మంగళగిరి టౌన్: 12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ (ఏపీ జీఈఎస్ఏ) రాష్ట్రప్రధాన కార్యదర్శి చాంద్ బాషా శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా గత పీఆర్సీ ముగిసి 30 నెలలు అయినా నేటికీ ఉద్యోగులకు 12వ వేతన సవరణ కమిషన్ను ఏర్పాటు చేయలేదని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు జరిగిన బడ్జెట్ సమావేశంలో 12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటన చేస్తారని ఎదురుచూశారన్నారు. అలా జరగకపోవడంతో నిరాశకు లోనయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు డిసిప్లనరీ ప్రొసీడింగ్స్ పెండింగ్లో ఉండడం వల్ల వారికి పదోన్నతులు, పెన్షన్ బెనిఫిట్లు నిలిచిపోయాయని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేసేవిధంగా ఒన్టైమ్ సెటిల్మెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్ విధానంపై ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ జీఈఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్బాషా -
మీ కోసం టోల్ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు మెడికల్: వైద్య ఆరోగ్య శాఖలో సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రభుత్వం మీకోసం టోల్ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి శుక్రవారం తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఫిర్యాదు చేసేందుకు ఫ్రీ హెల్ప్ లైన్ నంబరు 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఈ ఫిర్యాదును ప్రభుత్వం నేరుగా పరిశీలిస్తుందన్నారు. వాటి పరిష్కారంపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందన్నారు. టోల్ఫ్రీ హెల్ప్లైన్ నంబరు 1100కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని ప్రజా కూడళ్లల్లో ప్రదర్శించాలన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయం, ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయం, ప్రాథమిక ఆరో గ్య, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో టోల్ఫ్రీ నెంబరు అందరికి కనిపించే విధంగాడిస్ప్లే చేయాలన్నారు. పంచముఖ గాయత్రీ ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం వార్షికోత్సవం తెనాలి టౌన్: కొలకలూరు సమీపంలోని పంచముఖ గాయత్రీ ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం 10వ వార్షిక ప్రతిష్టా మహోత్సవాలు రెండురోజులపాటు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. విశ్వగాయత్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, శాశ్వత అధ్యక్షులు నంబూరు వెంకట కృష్ణమూర్తి నిర్వహణలో ఈ వేడుకలు నిర్వహించారు. వ్యవస్థాపక ధర్మకర్త నాగం నాగేంద్రరావు, సావిత్రి దంపతులు శాంతి హోమం జరిపించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని భక్తులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. ట్రస్ట్ కార్యదర్శి యర్రంశెట్టి హనుమంతరావు, కోశాధికారి వెలివెల రమేష్బాబు, సభ్యులు జొన్నాదుల వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చుక్కపల్లి గుంటూరు లీగల్: గుంటూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చుక్కపల్లి రమేష్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ యడ్లపాడు: కొండవీడుకోట ఫెస్ట్ –2026 ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కొండవీడుకోటను సందర్శించారు. కొండకింద, వేదిక, ఫుడ్కోర్టులు, వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే స్టాళ్లు వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే పోలీస్శాఖ నుంచి జిల్లా ఎస్పీ కృష్ణారావు పర్యవేక్షణలో డీఎస్సీ హనుమంతరావు, ముగ్గురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 180 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చిలకలూరిపేట రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్ఐ టి.శివరామకృష్ణ తెలిపారు. ఘనంగా శ్రీలక్ష్మీ గణపతి స్వామి ఆలయ వార్షికోత్సవం చాగంటివారిపాలెం(ముప్పాళ్ల): చాగంటివారిపాలెం గ్రామంలోని శ్రీలక్ష్మీ గణపతి స్వామి ఆలయ వార్షి కోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించా రు. కార్యక్రమంలో భా గంగా ఉదయం స్వా మి వారికి అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం స్వామి వారిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. స్వామికి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యం ఉందా..
పట్నంబజారు(గుంటూరుఈస్ట్):రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా, లేక నియంతృత్వ పాలన సాగుతోందా అని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పిదాలు, అసమర్థతను ప్రశ్నిస్తే దాడులు..వారి వేధింపులకు గురి చేయటం సిగ్గుచేటని ఆగ్రహంవ్యక్తంచేశారు. పవిత్ర తిరుమల తిరుపతి లడ్డూను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తూ చంద్రబాబు ఇదేదో బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారని.. ఇదే వారికి భస్మాసుర హస్తం అని గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుపై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. శుక్రవారం గుంటూరు సిద్ధార్థనగర్లోని ఆయన నివాసంలో అంబటి కుటుంబ సభ్యులను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితో కలిసి ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
చలో గుంటూరు కార్యక్రమం.. అంబటి ఇంటికి కాపు నేతలు
విశాఖ: వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కాపు నేతలు చలో గుంటూరు కార్యక్రమం చేపట్టారు,. ఉమ్మడి విశాఖ జిల్లా వైయస్సార్సీపి కాపు నేతల ఆధ్వర్యంలో నేడు చలో గుంటూరు కార్యక్రమం చేపట్టారు. విశాఖ నుంచి భారీ ర్యాలీగా కార్లతో బయలుదేరిన వైఎస్ఆర్సిపి కాపు నాయకులు..అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం తెలపనున్నారు వైఎస్సార్సీపీ కాపు నేతలు. దీనిలో భాగంగా అక్రమ అరెస్టులతో కాపులను చంద్రబాబు వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాపు నేతలు. కాపు ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడుతున్నారు. తిరుపతి లడ్డు, గీతం భూములు కబ్జా వంటి అంశాన్ని దృష్టి మళ్లించేందుకు కాపులపై దాడులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చలో గుంటూరు కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘ మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా నేడు చలో గుంటూరు కార్యక్రమం చేపట్టామన్నారు. చలో గుంటూరు కార్యక్రమం ద్వారా కాపు నేతలు.. అంబటి రాంబాబు కుటుంబానికి సంఘీభావం తెలపనున్నట్లు వెల్లడించారు. ‘ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహారిస్తుంది. పార్టీలో ఎవరికి కష్టం వచ్చినా మా స్పందన ఇలాగే ఉంటుంది. అంబటి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్తాం’ అని స్పష్టం చేశారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘ ప్రశ్నించే కాపులను చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు.. అంబటిపై అక్రమ కేసులు పెట్టారు. మేమంతా అండగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.


