గ్యాస్‌ బ్లాక్‌ దందా.. 201 సిలిండర్లు, 33 లక్షలు స్వాధీనం | UP And Rajasthan LPG Cylinder Hoarding Exposed Amid Gas Shortage Caused By Iran Conflict, Check More Details Inside | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ బ్లాక్‌ దందా.. 201 సిలిండర్లు, 33 లక్షలు స్వాధీనం

Mar 18 2026 11:41 AM | Updated on Mar 18 2026 12:26 PM

LPG cylinders hidden in bathroom And Rajasthan cattle shed

అమెరికా-ఇజ్రాయెల్‌.. ఇరాన్‌ యుద్ధం కారణంగా హార్మూజ్‌ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో భారత్‌లో గ్యాస్‌ కొరత ఏర్పడింది. దీంతో, పలు రాష్ట్రాల్లో గ్యాస్‌ సిలిండర్ల దందా కొనసాగుతోంది. తాజాగా యూపీలో బాత్‌రూమ్‌లో సిలిండర్లు దాచిన ఘటన, పశువుల పాకలో 200 సిలిండర్లు దాచి పెట్టిన ఘటనలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

బాత్‌రూమ్‌లో సిలిండర్లు..
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లను అక్రమంగా దాచిపెట్టారనే ఆరోపణ నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బదౌరా మార్కెట్‌లోని ఒక గృహోపకరణాల దుకాణంలో సోదాలు చేపట్టగా తాళం వేసి ఉన్న బాత్‌రూమ్‌ అధికారులకు కనిపించింది. అనుమానంతో గది తలుపును పగలగొట్టి చూడగా అందులో పదుల సంఖ్యలో ఫుల్‌ సిలిండర్లు, ఖాళీ సిలిండర్లు బయటపడ్డాయి. ఈ ఘటన సమయంలోనే దుకాణం యజమాని మున్నీలాల్ విశ్వకర్మ, అతని కుమారుడు అక్కడి నుంచి పారిపోయారు. అధికారులు రీఫిల్లింగ్ పరికరాలు, పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో, జాన్సా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.

పశువుల పాకలో 201 సిలిండర్లు..
రాజస్థాన్‌లోని పశువుల పాకలో అక్రమంగా నిల్వ ఉంచిన 201 ఎల్పీజీ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోట్‌పుట్లి-బెహ్రోర్ జిల్లాలోని శ్యామ్‌నగర్ ప్రాంతంలో అధికారి శశిశేఖర్ శర్మ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో పశువుల పాకలో అక్రమంగా నిల్వ ఉంచిన 106 ఫుల్‌ సిలిండర్లు, 95 ఖాళీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, పశువుల పాకకు సమీపంలోనే గుంజన్ గ్యాస్ ఏజెన్సీ పేరుతో ఏ ఏజెన్సీ నడుస్తోంది. సోదాల సమయంలో ఏజెన్సీ యజమాని మదన్ సైని అక్కడే ఉన్నారు. దీంతో, అధికారులు ప్రశ్నించగా..  సరైన పత్రాలు లేకుండానే ఏజెన్సీని నడుపుతున్నట్లు ఆయన అంగీకరించారు. అనంతరం, అధికారులు.. గ్యాస్ సిలిండర్లతో నిండిన ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా, గ్యాస్‌ సిలిండర్ల అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్‌పై రాష్ట్రవ్యాప్తంగా నిఘా ముమ్మరం చేసినట్టు అధికారులు తెలిపారు.

గ్యాస్‌ చోరీ.. 
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక సిలిండర్ నుండి మరొక సిలిండర్‌కు గ్యాస్‌ను బదిలీ చేస్తున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఫరీదాబాద్ అధికారులు ఎల్పీజీ దొంగతనం, అక్రమ రీఫిల్లింగ్, బ్లాక్ మార్కెటింగ్‌పై చర్యలను ముమ్మరం చేశారు. ఈ విషయమై జిల్లా ఆహార మరియు సరఫరాల శాఖ పలు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్‌పై 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయినట్టు చెప్పుకొచ్చారు.

ఎల్పీజీ బ్లాక్‌ మార్కెట్‌.. 33 లక్షలు స్వాధీనం
మహారాష్ట్రలో ఎల్పీజీ బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతోంది. ఇందులో భాగంగా అధికారులు తనిఖీలు చేపట్టగా 2,129 దాడుల్లో రూ.33 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న 1,208 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలకు సంబంధించి మొత్తం 23 మందిపై కేసులు నమోదు చేయగా, నిత్యావసర వస్తువుల చట్టం, 1955లోని నిబంధనల కింద 18 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎల్పీజీ డెలివరీ, బ్లాక్ మార్కెటింగ్ లేదా నిల్వలకు సంబంధించిన ఫిర్యాదులను తెలియజేయడానికి ప్రభుత్వం 9769919229 అనే వాట్సాప్, హెల్ప్‌లైన్ నంబర్‌ను జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement