breaking news
Telangana
-
రంకెలు వేస్తే అంకెలు మారవు
సాక్షి, హైదరాబాద్: అప్పుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రూ.8.21 లక్షల కోట్ల అప్పు అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయలేక, రోజూ బయటపడుతున్న అవినీతి ఆరోపణలు, స్కామ్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రోజుకో కొత్త అప్పుల లెక్క చెబుతున్నారని ధ్వజమెత్తారు. ‘రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు. మా మాట అసెంబ్లీలో ఒకటే.. బయట ఒకటే. మీరు మాత్రం శ్వేతపత్రంలో ఒకలా, అసెంబ్లీలో మరోలా, ప్రెస్మీట్లలో ఇంకోలా చెబుతున్నారు. బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, కేసీఆర్ శిష్యుడిగా చెప్తున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లే. దీనిపై అసెంబ్లీలోనైనా, బహిరంగ వేదికపైనైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం..’అని మరోసారి సవాల్ విసిరారు. రాష్ట్రానికి అప్పులు ఇప్పించేందుకు సచివాలయం చుట్టూ బాంబే, గుజరాత్ బ్రోకర్లు తిరుగుతున్నారని లంచాలు ఇచ్చి అప్పులు తెచ్చే దుస్థితి దేశంలో ఎక్కడా లేదని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కేపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి చెప్పిన అప్పుల లెక్కలకు కౌంటర్ ఇచ్చారు. రేవంత్, భట్టి..ఎవరు చెప్పింది నిజం? ‘భట్టి విక్రమార్క వెల్లడించిన పత్రాల్లో.. తెలంగాణ ఏర్పాటుకు ముందున్న రూ.84,268 కోట్ల రుణాలను, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 7 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్న రూ.15,118 కోట్ల అప్పును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో కలిపేశారు. ఈ రెండూ కలిపి రూ.99,386 కోట్లను 2023 డిసెంబర్ నాటికి ఉన్న మొత్తం బకాయి రూ.5,16,881 కోట్ల నుంచి తీసేస్తే అసలు అప్పు రూ.4,17,495 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రం, కాగ్ నివేదిక, ఆర్బీఐ గణాంకాలు, ఎకనామిక్ సర్వే అన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లేనని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3.47 లక్షల కోట్లు అప్పు చేసినట్లు మార్చి 18న అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాత్రం రూ.1.77 లక్షల కోట్లే అని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చెప్పింది నిజమా? లేక ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పింది నిజమా? నాలుగు నెలల్లో అప్పు ఎలా తగ్గింది?..’అని హరీశ్రావు నిలదీశారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4.50 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పారు. అప్పుల కోసం రూ.వందల కోట్ల కమీషన్లు ‘ప్రస్తుత ప్రభుత్వం అప్పులు కూడా పారదర్శకంగా తీసుకురాలేక బ్రోకర్లకు వందల కోట్ల రూపాయల కమీషన్లు చెల్లిస్తోంది. టీజీఐఐసీ భూముల తాకట్టు ద్వారా రూ.10 వేల కోట్ల అప్పు కోసం రూ.170 కోట్ల బ్రోకరేజ్ చెల్లించారు. హెచ్ఎండీఏ భూములపై మరో రూ.20 వేల కోట్ల అప్పు తెస్తే మొత్తం రూ.510 కోట్ల వరకు బ్రోకర్లకు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. డిస్కంలు, హైదరాబాద్ కార్పొరేషన్లు, వాటర్ బోర్డు ద్వారా మరో రూ.70 వేల కోట్ల అప్పు సమీకరించే లక్ష్యంతో మొత్తం లక్ష కోట్ల అప్పులకు రూ.1,710 కోట్ల వరకు కమీషన్లు వెళ్తున్నాయి..’అని హరీశ్రావు ఆరోపించారు. -
గన్ను స్థానంలో గంజాయి!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఒకప్పుడు మావోయిస్టుల ఏలుబడిలో ఉన్న దండకారణ్యం ఇప్పుడు గన్ ఫ్రీ జోన్గా మారింది. ఈ ప్రాంతానికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలోగా.. అక్కడ గంజాయి పండించేందుకు అరాచక శక్తులు అడుగులు వేస్తున్నాయి. ఈ శక్తులను అడ్డుకునే దిశగా తెలంగాణ పోలీసులు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక మావోయిస్టు పార్టీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో బలహీనం కావడం మొదలైంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత క్రమంగా మావోయిస్టుల పట్టు సడలిపోయింది. పారా మిలిటరీ సాయంతో ప్రభుత్వ దళాలు గ్రామాల్లోకి అడుగు పెడుతున్నాయి. ఆధార్ కార్డుల జారీ, రోడ్లు, వంతెన నిర్మాణాలు జరుగుతున్నాయి. అయి తే, ఇక్కడి ప్రజలకు మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యంగా ఉంది. ఆ తర్వాతే ఉపాధి కల్పన, ఆదాయ వనరుల పెంపునకు అవకాశం ఉంది. ఇదంతా పూర్తయి ఒకప్పుడు జనతన సర్కార్ అ«దీనంలో ఉన్న ప్రాంతాల ప్రజల తల సరి ఆదాయం సాధారణ స్థితికి చేరేందుకు సమయం పడుతుంది. ఈలోగా అక్కడ పాగా వేసేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారనే సమాచారం నిఘా వర్గాలను కలవరపెడుతోంది. గతంలో ఏఓబీలో ఈ తరహా అనుభవమే ప్రభుత్వాలకు ఎదురుకావడం ప్రస్తుత ఆందోళనకు కారణమవుతోంది. గంజాయి అడ్డాగా ఏఓబీ పీపుల్స్వార్ తొలి అడుగులు ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏఓబీ)లోనే పడ్డాయి. ఇక్కడ క్రమంగా మావోయిస్టు పార్టీ బలహీనం కావడం మొదలయ్యాక అభివృద్ధి కంటే ముందుగా అరాచక శక్తులే అడుగుపెట్టాయి. మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్న కొద్దీ సంఘ విద్రోహ శక్తులు ఏఓబీలోకి చొచ్చుకొచ్చాయి. మల్కన్గిరి, కోరాపూర్, రాయగడ జిల్లాల్లోని మారుమూల అటవీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని విస్తారంగా గంజాయి సాగు మొదలుపెట్టారు. ఇక్కడ చేతికి వచ్చే గంజాయిని ఆరంభంలో విశాఖపట్నం నుంచి రైళ్ల ద్వారా బ్యాక్ప్యాక్ బ్యాగుల్లో రవాణా చేశారు. ఆ తర్వాత ఏకంగా లారీలు, కంటైనర్ల ద్వారా రోడ్డు మార్గం నుంచి టన్నుల కొద్ది గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా తెలంగాణలోకి తీసుకురావడం మొదలైంది. ఎప్పటికప్పుడు పోలీసులు బ్రేక్ వేస్తున్నా, రాబోయే రోజుల్లో గంజాయి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో ఆపరేషన్లకు మరింత పదును పెట్టనున్నారు. ఇకపై ఉక్కుపాదం మావోయిస్టుల ఏరివేత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ బలగాలు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) విభాగాలను ఇకపై గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్టకు ఉపయోగించాలని తెలంగాణ పోలీసు విభాగం నిర్ణయించింది. ప్రస్తుతం గ్రేహౌండ్స్లో 1,200 మంది సిబ్బంది ఉండగా ఇందులో సగం మందిని యాంటీ గంజాయి ఆపరేషన్ల కోసం వినియోగించనున్నారు. గతంలో మావోయిస్టు నెట్వర్క్లోకి చొచ్చుకుపోయి ఆపరేషన్లు చేసినట్టే ఇకపై గంజాయి ఇన్నర్ సర్కిల్లోకి దూరాలనేది తెలంగాణ పోలీసుల వ్యూహంగా ఉన్నట్టు సమాచారం. ఏఓబీలో ఉన్న గంజాయి ముఠాలను చిన్నాభిన్నం చేయడంతోపాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న దక్షిణ బస్తర్పైనా డేగ కన్ను వేయాలనే యోచనలో తెలంగాణ ఖాకీలు ఉన్నారు. ఈ మేరకు గతంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్ల తరహాలోనే పొరుగు రాష్ట్రాలతో జాయింట్ ఆపరేషన్లు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
రాముడా.. రావణుడా? ఎవరి పాలన కావాలి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలి. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. రాహుల్ను ప్రధానిని చేయాల్సిన చారిత్రక అవసరం దేశంలో ఉంది. ఇందుకు తెలంగాణ ప్రజలు అండగా ఉండి.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాందీకి కృతజ్ఞత తెలపాలి. నాతో కలిసి నడవండి.. రాహుల్ను ప్రధానిని చేద్దాం. అందుకు మొదటి అడుగు మిడ్జిల్ మండలం నుంచే పడాలి. – సీఎం రేవంత్రెడ్డిసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాపాల భైరవుడు రావాలి.. రావాలి అని కొడుకు, అల్లుడు తిరుగుతున్నారని, పదేళ్లలో రూ.8.21 లక్షల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్ ప్రజలకు ఏం చేశారని సీఎం రేవంత్రెడ్డి నిలదీశారు. ‘మీ ఊళ్లలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు ఇచ్చారా? కోటి ఎకరాలకు నీళ్లు అందించారా? ఎందుకు వీళ్లు మళ్లీ రావాలి?..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనను రావణుడితో, కాంగ్రెస్ పాలనను రాముడి పాలనతో పోలుస్తూ.. రాముడి పాలన కావాలా.. రావణుడి పాలన కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధిగా 20 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా రేవంత్రెడ్డి శనివారం మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో పర్యటించారు. ముందుగా నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఆత్మీయులతో ముచ్చటించారు. ఆ తర్వాత డీసీసీబీ మాజీ చైర్మన్ ధ్యాప గోపాల్రెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మిడ్జిల్ మండలంలోని 40 గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.20 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఊర్కొండ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లతో శిలాఫలకం ఆవిష్కరించారు. సుమారు రూ.17 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ కృతజ్ఞత వందన సభలో మాట్లాడారు. ఏం చేశారని మీకు లక్షల కోట్లు వచ్చాయి? ‘పదేళ్లలో ఏం వ్యాపారం చేశారని మీకు, మీ కుటుంబాలకు లక్ష కోట్లు వచ్చాయి. తెలంగాణకు రూ.8.21 లక్షల కోట్ల అప్పులు ఎలా మిగిలాయి? బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఫామ్హౌస్లో పండించిన గంజాయి, డ్రగ్స్ను రైతు బజార్లలో పెట్టి అమ్ముతారు. మీతో పాటు పాటు దోపిడీ చేసిన ఆఫీసర్లను నిన్న మొన్న ఏసీబీ ఆఫీసర్లు పట్టుకుంటున్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్ల అక్రమ సంపాదన బయట పడుతోంది. వీళ్లకు ఈ సొమ్ము ఎక్కడిది? ప్రజల నుంచి దోచుకున్నదే కదా. కేసీఆర్కు గజ్వేల్, ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫాంహౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? కేటీఆర్కు జన్వాడలో వంద ఎకరాలు, హరీశ్రావుకు మొయినాబాద్లో 50 ఎకరాలు, కల్వకుంట్ల కవితకు శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్హౌస్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ షడ్డకుడి కొడుకు సంతోష్రావుదైతే లెక్కలు చెప్పనికే లేదు. ఇంత సంపాదన ఈ పదేళ్లలో ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడివి ఈ ఆస్తులు? ఎక్కడ సంపాదించారు. ఎందుకు తెలంగాణ అప్పుల పాలైంది? మీకు ఉరి శిక్ష వేసినా తక్కువే.. బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు దండుకున్న దుర్మార్గులు, నీచులు. వాళ్ల సంపాదన, దోపిడీ, దొంగతనాలు ఆగిపోయాయనే మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అప్పులు, తప్పులు చేసినవాళ్లు మళ్లీ వస్తే రాష్ట్రంలో ఫోన్ కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేరు. ఆడబిడ్డల మాటలు దొంగతనంగా వినేవాడు అసలు మనిõÙనా? అసెంబ్లీకి రాడు.. ప్రజాసమస్యలు ప్రస్తావించడుం. అధికారం ఇస్తే దోచుకోవడానికి మాత్రం వస్తాడట. పదేళ్లలో రాష్ర్టంలో ఆయన చేసింది ఏమంటే ఇసుక దోపిడీకి అడ్డుపడిన నేరెళ్ల దళితులపైకి లారీలు ఎక్కించుడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగినందుకు ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసి జైళ్లలో పెట్టించుడు. ప్రశ్నలు, ప్రశ్నపత్రాలను పల్లీ, బఠానీల మాదిరి అమ్ముకున్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు ఇవ్వలేదు. పరిపాలనకు పాలమూరు బిడ్డ పనికిరాడా? ఆ పశుపతి ఫామ్హౌస్లోనే కుంగికృశించి పోవాల్సిందే. అధికారం అనేది ఇక వాళ్లు మరిచిపోవాల్సిందే. నల్లమల నుంచి వచ్చిన నాకు ఏమీ తెలియదని కొందరు అవహేళన చేశారు. పరిపాలనకు పాలమూరు బిడ్డ పనికిరాడా? అహంకారానికి, అహంభావానికి ఒక హద్దు ఉంటుంది. ప్రజాయుద్ధ నౌక, పేదల గళం గద్దర్ను గడీల ముందు నిలబెట్టిన మీకు ఉరి శిక్ష వేసినా తక్కువే..’ అంటూ సీఎం మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఖర్చేందో తేల్చండి ‘ఏం అన్యాయం చేశామని ప్రజా ప్రభుత్వం పోవాలి. గంజాయి, డ్రగ్స్ అమ్మే వాళ్లను జైల్లో పెట్టినందుకా? ధాన్యం చివరి గింజ వరకు కొని రైతుల ఖాతాల్లో రూ.80 వేల కోట్లు వేసినందుకా? 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్కార్డులు, సన్న బియ్యం ఇచ్చినందుకా? రైతు రుణమాఫీ చేసినందుకా? సన్న వడ్లకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చింది వాస్తవం కాదా? జనగణనలో కులగణన చేసి వందేళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదా?కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల్లో రైతు భరోసా కోసం రూ.1.76 లక్షల కోట్లు ఖర్చు చేసింది. సరాసరి ప్రతి నెలా రూ.5,600 కోట్లు మేం ఖర్చు చేస్తున్నాం. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిందేందో లెక్కలు తేల్చండి. నా ఆత్మ బంధువులు మిడ్జిల్ ప్రజల మధ్య నుంచి చెబుతున్నా. 2034 వరకు కాంగ్రెస్దే అధికారం..’ అని రేవంత్ అన్నారు. రబ్బానీకి పదవి ఇవ్వాలి.. మిడ్జిల్ను దత్తత తీసుకోవాలి ‘2006 జూలై 2 నాడు మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు. ఆనాడు మీరు నాటిన మొక్క ఈనాడు మహావృక్షమై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచింది. ఆనాడు జెడ్పీటీసీగా నా గెలుపు నాది కాదు.. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఈ బిడ్డను ఆశీర్వదించిన మీ నిర్ణయం గొప్పది. అయితే నా వల్ల ఎవరికీ కష్టం, నష్టం రాకూడదన్నదే నా ఆలోచన. అందుకే ఆనాడు జెడ్పీ చైర్మన్ రేసులో నిలిచి జెడ్పీటీసీ అభ్యరి్థగా నాపై ఓడిన రబ్బానీకి ఈ రోజు ఒక మంచి పదవి ఇవ్వాలని డిప్యూటీ సీఎంకు సూచిస్తున్నా. నా బాధ్యతను నెరవేర్చేందుకు మిడ్జిల్ను దత్తత తీసుకోవాలని భట్టిని కోరుతున్నా. మిడ్జిల్ మండలానికి ఏమిచ్చినా, చివరికు నా ప్రాణమిచ్చినా తక్కువే..’ అని ముఖ్యమంత్రి అన్నారు. సీఎం కాన్వాయ్కు ట్రాఫిక్ చిక్కులు శంషాబాద్ రూరల్: మిడ్జిల్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్కు శనివారం ట్రాఫిక్ చిక్కులు ఎదురయ్యాయి. దీంతో బెంగళూరు జాతీయ రహదారిపై ఆయన వాహన శ్రేణి నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. రాత్రి 7.35 గంటల సమయంలో శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో కాన్వాయ్ వెళ్తుండగా.. హైవేపై ట్రాఫిక్ జాంను క్లియర్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు విన్పించాయి. ప్రజలకు మంచి చేయడమే లక్ష్యం: భట్టి ప్రజలకు మంచి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా సమస్యలను దగ్గరగా చూసిన సీఎం రేవంత్రెడ్డి అధికారులపైనే ఆధారపడి పాలన సాగించడం లేదని, ప్రజలకు దగ్గరగా సంక్షేమాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం ఓట్లు వేసి జెడ్పీటీసీగా గెలిపించిన ప్రజలను మర్చిపోకుండా వారందరికీ కృతజ్ఞతలు తెలపడం మంచి సాంప్రదాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు అనిరు«ద్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డి, రాజేష్రెడ్డి, వీర్లపల్లి శంకర్, కార్పొరేషన్ చైర్మన్లు శివసేనారెడ్డి, కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు. -
మరమ్మతులు పూర్తయ్యాకే కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణ
నాగార్జునసాగర్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు పూర్తిగా పూర్తయి, జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (NDSA), కేంద్ర జల సంఘం (CWC) సాంకేతిక అనుమతులు ఇచ్చిన తర్వాతే వాటిని తిరిగి నిర్వహిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ విజయవిహార్లో సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు."ప్రజల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. రాజకీయాల కంటే ప్రజల భద్రత, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకే మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అన్ని లోపాలను సరిదిద్దిన తర్వాత, NDSA, CWC పూర్తిస్థాయిలో పరిశీలించి అనుమతి ఇచ్చిన తరువాతే బ్యారేజీలను నిర్వహిస్తాం" అని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.1.10 లక్షల కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చయిందని, ఆ ఆస్తిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి అన్నారు.మరమ్మతులు పూర్తికాకముందే బ్యారేజీలను నిర్వహించడం ప్రమాదకరమని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో భద్రాచలం పట్టణంతో పాటు దిగువన ఉన్న సుమారు 40 గ్రామాల ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.బ్యారేజీల పునరుద్ధరణ పనులను పూర్తిగా శాస్త్రీయ విధానంలో చేపడుతున్నామని మంత్రి వివరించారు. భూగర్భ సాంకేతిక పరీక్షలు, నాన్-డిస్ట్రక్టివ్ టెస్టులు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వేలు, డ్రోన్ సర్వేలు, వందకు పైగా బోర్ హోల్స్ ద్వారా నిర్మాణాల పరిస్థితిని పరిశీలిస్తున్నామని తెలిపారు.ప్రస్తుతం NDSA సూచనల మేరకు బ్యారేజీల అన్ని గేట్లను ఎత్తి ఉంచి, నీటి ఒత్తిడి లేకుండా నిర్వహిస్తున్నామని చెప్పారు. కేంద్ర జల మరియు విద్యుత్ పరిశోధన సంస్థ (CWPRS), కేంద్ర జల సంఘం (CWC), అంతర్జాతీయ నిపుణులు కలిసి పునరుద్ధరణ నమూనాలను పరిశీలిస్తున్నారని, భద్రతపై పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతే బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతకు అత్యంత ప్రాధాన్యంనాగార్జునసాగర్ డ్యామ్ భద్రత, నిర్వహణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.అవసరమైన అన్ని మరమ్మతుల అంచనాలను వెంటనే సిద్ధం చేసి పరిపాలనా అనుమతులకు పంపాలని అధికారులను ఆదేశించారు.లైనింగ్ అవసరమైన కాలువలను గుర్తించి వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల గుండా వెళ్లే ఓపెన్ కాలువలను దశలవారీగా కప్పివేసే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. దీనివల్ల చెత్త వేయడాన్ని అరికట్టడంతో పాటు పరిశుభ్రత మెరుగుపడుతుందని చెప్పారు.ప్రతి సాగునీటి పనిలో నాణ్యత, వేగం అనే రెండు అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోనే పనులు పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులకు సూచించారు.అంతకుముందు మిర్యాలగూడలో ఎగుమతులకు అనువైన ఆధునిక రైస్ మిల్లును మంత్రి ప్రారంభించారు. అనంతరం గుల్లపోతులగండి, కేశవాపూర్, నెల్లికల్లు ఎత్తిపోతల పథకాల పనులను పరిశీలించి, వాటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.గత ప్రభుత్వంలో ప్రకటించిన అనేక సాగునీటి పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని భూమిపై అమలు చేస్తూ రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో యువజన కాంగ్రెస్ జాతీయ లీగల్ సెల్ కాన్క్లేవ్
హైదరాబాద్: యువజన కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ లీగల్ సెల్ కాన్క్లేవ్ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా హాజరైన న్యాయవాదులు, న్యాయ నిపుణులను ఉద్దేశించి ముఖ్య అతిథులు రాజ్యాంగ పరిరక్షణ, న్యాయవ్యవస్థ, న్యాయవ్యవస్థ దుర్వినియోగం, సామాజిక న్యాయం, యువ న్యాయవాదుల పాత్ర తదితర కీలక అంశాలపై ప్రసంగించారు.దేశంలోనే తొలిసారిగా యువజన కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఇలాంటి జాతీయ స్థాయి కాన్క్లేవ్ నిర్వహించడం అభినందనీయమని ముఖ్య అతిథులు కొనియాడారు. నేషనల్ లీగల్ కాంక్లేవ్ లో న్యాయవాదులకు పరస్పర అనుభవాల మార్పిడి, సమకాలీన న్యాయ అంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ఇటువంటి కాన్క్లేవ్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిభ్, జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలంబ, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, బిహర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కృష్ణ అల్లవేరు, రాజ్యసభ సభ్యులు, సీనియర్ న్యాయవాది వివేక్ టoకీయా, ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ సావంత్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జాతీయ లీగల్ సెల్ కన్వీనర్ రూపేష్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గూడూరు నిఖిల్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు నందితా రావు, సంజయ్ ఘోష్, తదితరులు పాల్గొన్నారు. -
‘ఆనాడు మీరు నాటిన మొక్క ఇప్పుడు మహావృక్షమైంది’
మహబూబ్ నగర్: ఒకనాడు మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్కే ఈరోజు మహా వృక్షమై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచందన్నారు సీఎం రేవంత్రెడ్డి. మిడ్జిల్ “కృతజ్ఞత సభ”లో ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించారు. ‘జూలై 2, 2006 నాడు మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు. ఆనాడు మీరు నాటిన మొక్క ఈనాడు మహా వృక్షమై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచింది. 20 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజున కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం సంతోషం. ఈ జిల్లాకు ఒక గొప్ప నాయకత్వం బాధ్యత నిర్వహించిన అనుభవం ఉంది. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదట ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు ఈ జిల్లా బిడ్డనే. ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డిది ఈ గడ్డనే. జైపాల్ రెడ్డి రాజకీయ ఎదగడానికి తోడ్పడిన ద్యాప గోపాల్ రెడ్డి ఈ మిడ్జిల్ బిడ్డ. అందుకే రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్తో పాటు ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. జూలై 4,2006 నా గెలిచిన గెలుపు నాది కాదు.. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఈ బిడ్డను ఆశీర్వదించిన మీ నిర్ణయం గొప్ప నిర్ణయం. నా వల్ల ఎవరికీ కష్టం నష్టం రాకూడదన్నదే నా ఆలోచన. అందుకే ఆనాడు జర్పీటీసీ అభ్యర్థిగా నాపై ఓడిన రబ్బానీకి ఈనాడు ఒక మంచి పదవి ఇవ్వాలని ఉపముఖ్యమంత్రికి సూచన చేస్తున్నా’ అని పేర్కొన్నారు. -
గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఖమ్మం జిల్లాకు చెందిన అభిరూప్గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అనిరుధ్.. కంప్యూటర్ సైన్స్ సెకండియర్ చదువుతున్నాడు. తాను ఉంటున్న బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి దూకిన అనిరుధ్.. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. -
దొంగ సొమ్ము.. దొంగకే దక్కలేదు!
హైదరాబాద్: దొంగిలించిన సొత్తుతో ఓ వ్యక్తి హోటల్లో బస చేయగా అక్కడికి వచ్చిన ఓ యువతి అందులో నుంచి రూ. లక్ష ఎత్తుకెళ్లింది. జల్సాల కోసం చోరీ చేసిన సొత్తులో కొంత మరో దొంగ కొట్టేయడంతో ఓ నిందితుడు లబోదిబోమంటూ పోలీసుల ముందు తనగొడు వెల్లబోసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని జైన్ కన్స్ట్రక్షన్స్లో గుంటూరు జిల్లా గుడిపాడు గ్రామానికి చెందిన నిమ్మగడ్డ ఫణీంద్ర(29) గత మూడేళ్ల నుంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పని చేస్తున్నాడు.నమ్మకంగా పని చేస్తున్నట్లు యజమాన్యాన్ని నమ్మించి గత నెల 26వ తేదీన యజమాని కళ్లుగప్పి కార్యాలయంలో రూ.12.33 లక్షల నగదు ఉన్న లాకర్ను ఎత్తుకెళ్లాడు. బస్సులో ఒంగోలుకు వెళ్లి చోరీ చేసిన సొత్తుతో ఒక కేటీఎం బైక్ కొనుగోలు చేశాడు. అక్కడే ఒక ఐఫోన్ కూడా కొన్నాడు. బైక్పై నెల్లూరు వెళ్లి ఓ హోటల్లో బస చేసి ఆ రాత్రికి ఓ యువతిని రప్పించుకున్నాడు. తెల్లవారి ఫణీంద్ర కళ్లుగప్పిన ఆ యువతి బ్యాగులో ఉన్న రూ.లక్ష సొత్తుతో ఉడాయించింది. నిందితుడు అక్కడి నుంచి బెంగళూరు వెళ్లి జల్సాలకు అలవాటుపడ్డాడు. దొంగిలించిన సొత్తును ఇష్టానుసారంగా ఖర్చు పెట్టాడు. అప్పటికే పోలీసులు ఫణీంద్ర కదలికలపై నిఘా పెట్టారు. ఫోన్ నెంబర్ ఆధారంగా బెంగళూరుకు 130 కిలోమీటర్ల దూరంలో ఓ బస్సులో వెళ్తున్న నిందితుడిని బంజారాహిల్స్ క్రైమ్ ఎస్ఐ యాసిన్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారించగా తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న ఫణీంద్ర మధ్య తరగతి జీవితంతో విసుగు చెంది సంపన్నులు మాదిరిగా ఉండాలని ఇప్పుడున్న జీతం సరిపోకపోవడంతో దొంగగా మారాడు. చోరీ చేసిన సొత్తుతో కేటీఎం బైక్తో పాటు ఐఫోన్ కొనుగోలు చేసి అంతకుముందు చేసిన అప్పులు తీర్చి స్టార్ హోటళ్లలో బస చేస్తూ జల్సాలు చేస్తూ అయిదు రోజుల పాటు బెంగళూరులోనే తిరిగాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కొంత సొత్తును రికవరీ చేశారు. -
మేడారంలో విషాదం.. కారు ఢీకొని బాలుడి మృతి
హైదరాబాద్: వరంగల్ ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి కుటుంబంతో వచ్చిన ఓ బాలుడిని ప్రమాదవశాత్తు కారు ఢీకొనడంతో మృతి చెందాడు. నార్లాపూర్ ఎస్ఐ అచ్చ కమలాకర్ తెలిపిన మేరకు.. అమీర్పేటకు చెందిన అలిమేకల పురుషోత్తం కుటుంబంతో కలిసి శుక్రవారం మేడారానికి వెళ్లి ఎంఎస్ఆర్ గదిలో దిగారు.చేవెళ్ల మండలం ఏలూరు గ్రామానికి చెందిన అరకటిక అరుణ్ కుటుంబం కూడా పక్కగదిలో దిగింది. ఈ క్రమంలో అరుణ్ నాలుగేళ్ల కుమారుడు తండ్రి వద్ద ఉన్న కారు తాళాలు తీసుకుని కారు స్టార్ట్ చేయడంతో ముందుకు కదిలింది. ఆ సమయంలో గది ముందు ఆడుకుంటున్న కౌశిక్ (7)పైకి కారు దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం కంటతడి పెట్టించింది. మరోవైపు, ప్రమాదానికి కారణమైన చిన్నారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మృతుడి తండ్రి పురుషోత్తం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు. -
పక్కాగా.. బస్సొచ్చేలా..
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సుల ట్రిప్పులను ఆకస్మికంగా రద్దు చేసే చర్యలను అరికట్టేందుకు ఆర్టీసీ భారీ కసరత్తు చేపట్టింది. ఉదయం మొదటి బస్సు నుంచి రాత్రి చివరి బస్సు వరకు పూర్తిస్థాయిలో నడిపేందుకు నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేసింది. సాధారణంగా డ్రైవర్లు, కండక్టర్లు వివిధ కారణాలతో చివరి ట్రిప్పు సర్వీసులను రద్దు చేస్తుండటంతో అప్పటిదాకా ఎదురుచూసిన ప్రయాణికులు చివరకు ఆటోలు, క్యాబ్లు ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజూ వందల సంఖ్యలో ట్రిప్పులు రద్దవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ఆర్టీసీ ఆదాయానికి సైతం గండి పడుతోంది. ఈ క్రమంలో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిటీ బస్సుల నిర్వహణపై సీరియస్గా దృష్టి సారించారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో అధికారులు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో స్వయంగా విధులు నిర్వర్తించేలా దిశా నిర్దేశం చేశారు. దీంతో కొద్ది రోజులుగా నగరంలో సిటీబస్సుల ట్రిప్పుల సంఖ్య పెరిగింది. గతంలో నిత్యం 34,200 ట్రిప్పులు తిరిగితే.. ప్రస్తుతం 3,5000కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. సేవలు మెరుగు.. ఏదో ఒక కారణంతో ఆర్టీసీ సిబ్బంది తెల్లవారుజామున బయలుదేరాల్సిన బస్సులను, రాత్రిపూట చేరుకోవాల్సిన చివరి సర్వీసులను రద్దు చేస్తున్నారు. దీంతో సెవెన్సీటర్ వంటి ఆటో రిక్షాలు, ఇతర మార్గాల్లో ప్రయాణికులు వెళ్తున్నారు. ప్రస్తుతం ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని డిపోల్లో బస్సులను పూర్తిగా నడపడంతో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందజేస్తున్నామని ఈడీ శ్రీధర్ తెలిపారు. ‘ప్రస్తుతం 26 డిపోల ద్వారా రోజుకు 3,200 బస్సులు నడుపుతున్నాం. వీటిలో ఏ ఒక్కటి రద్దయినా సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సిందే’ అని చెప్పారు.పెరిగిన ప్రయాణికుల సంఖ్య.. నగర ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజూ తిరిగే ప్రయాణికుల సంఖ్య 23 లక్షల నుంచి 25 లక్షలకు పెరిగింది. కొంతకాలంగా 2 లక్షల మంది అదనంగా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం 19 లక్షల మంది మహిళలు, 6 లక్షల మంది పురుషులు నిత్యం పయనిస్తున్నారు. -
ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం!
తినే అన్నంలో కల్తీలు.. తాగే పాలలో రసాయనాలు.. చివరకు పసిబిడ్డలకు పట్టే పాలపొడిలోనూ ప్రాణాంతక పదార్థాలు! కేవలం లాభార్జనే పరమావధిగా సాగుతున్న నిశ్శబ్ద ముప్పుపై హైదరాబాద్ సిటీ పోలీస్ ఉక్కుపాదం మోపుతోంది. ప్రజారోగ్యాన్ని నిలువునా దెబ్బతీస్తూ నగరవాసుల ఆయుష్షును హరిస్తున్న కల్తీ ముఠాల ఆటకట్టించేందుకు రంగంలోకి దిగిన హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్) ఏర్పాటై 100 రోజులను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మార్చి 19న శంఖారావం పూరించిన ఈ ప్రత్యేక విభాగం.. జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతర దాడులు, ఆకస్మిక తనిఖీలతో నగరంలో ఆహార కల్తీపై రాజీలేని సమరం సాగిస్తోంది.ఆరోగ్యానికి గొడ్డలిపెట్టు.. ఆహార కల్తీఆహార కల్తీ అనేది కేవలం ఒక చట్టపరమైన నేరమో, వ్యాపార మోసమో కాదు.. అది యావత్ సమాజంపై జరుగుతున్న నిశ్శబ్ద దాడి. పూర్వీకులు స్వచ్ఛమైన ఆహారంతో నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తే, నేడు కల్తీ విషం వల్ల సగటు ఆయుష్షు సగానికి పడిపోతోంది. రసాయనాలు, నాణ్యత లేని నిల్వ పదార్థాల వాడకం వల్ల పసిబిడ్డల ఎదుగుదల దెబ్బతింటోంది. యువత, వృద్ధులు క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులు, గుండె జబ్బుల బారిన పడుతున్నారు. దేశానికి వెన్నెముక లాంటి యువశక్తి రోగాల బారిన పడితే మానవ వనరుల ఉత్పాదకత తగ్గిపోతుంది. ఇది కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడమే కాకుండా, దేశ ప్రగతిని దశాబ్దాలు వెనక్కి నెడుతుంది. కల్తీ ఆహారం వల్ల చికిత్సల రూపంలో, ఉత్పాదకత తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 310 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అంచనా. అందుకే కల్తీ లేని స్వచ్ఛమైన ఆహారం పొందడం ప్రతి పౌరుడి హక్కు. ఆ హక్కును కాపాడుతూ భావితరాలకు సురక్షితమైన భవిష్యత్తును అందించడమే హెచ్-ఫాస్ట్ నిఘా పరమావధి.వంద రోజుల సమరంలో విస్తుపోయే నిజాలుటాస్క్ ఫోర్స్ డీసీపీ నేతృత్వంలో 36 మంది సుశిక్షితులైన అధికారులు, సిబ్బందితో నిరంతరం పనిచేస్తున్న హెచ్-ఫాస్ట్ విభాగం.. క్షేత్రస్థాయిలో కల్తీ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఈ వంద రోజుల్లో నగరవ్యాప్తంగా వివిధ జోన్ల పరిధిలో మొత్తం 185 కేసులు నమోదు చేసి, సుమారు 121.87 టన్నుల ప్రమాదకరమైన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. జోన్ల వారీగా వివరాలు పరిశీలిస్తే.. అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్లో 55 కేసులు నమోదు కాగా, గోల్కొండ జోన్లో 44, సికింద్రాబాద్ జోన్లో 35, చార్మినార్ జోన్లో 21, శంషాబాద్ జోన్లో 13, జూబ్లీహిల్స్ జోన్లో 12, ఖైరతాబాద్ జోన్లో 5 కేసులు నమోదయ్యాయి.స్వార్థపరులు ప్రజల ప్రాణాలతో ఏ విధంగా ఆడుకుంటున్నారో స్వాధీనం చేసుకున్న పదార్థాల వివరాలే స్పష్టం చేస్తున్నాయి. నిత్యం వాడే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్కు సంబంధించి 27 కేసుల్లో ఏకంగా 27,024.7 కేజీల నకిలీ నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. కృత్రిమ రసాయనాలతో పండ్లను మగ్గబెట్టే 16 ముఠాల గుట్టురట్టు చేసి 25,845 కేజీల పండ్లను సీజ్ చేశారు. చికెన్ వ్యర్థాల విక్రయాలకు సంబంధించిన 6 కేసుల్లో ఏకంగా 60 టన్నుల కంటే ఎక్కువ చికెన్ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. వీటితో పాటు 3 కేసుల్లో 9,260 కేజీల నిల్వ పచ్చళ్లు, 4 కేసుల్లో 4,030 కేజీల కల్తీ కోవా, 7 కేసుల్లో 3,897 కేజీల నకిలీ టీ పొడి, సుమారు 15 టన్నుల నాణ్యత లేని చికెన్/మాంసం (12 కేసులు), 3,260 కేజీల కల్తీ క్రీమ్, 530 కేజీల కల్తీ నెయ్యి (1 కేసు), సుమారు 2,706 కేజీల నాణ్యత లేని డ్రై ఫ్రూట్స్/ఖర్జూరం (2 కేసులు), 2,500 కేజీల కల్తీ పెరుగు (1 కేసు), 1,514 కేజీల కల్తీ పనీర్ (5 కేసులు), ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో 120 కేజీల నాణ్యత లేని ఫ్రైడ్ చికెన్ (2 కేసులు) స్వాధీనం చేసుకున్నారు. ఐస్ క్రీములు, బిస్కెట్లు, ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, జంక్ ఫుడ్స్ వంటి ఇతర విభాగాల్లో 34 కేసులు నమోదయ్యాయి.మరో 247 కేసులు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి బదిలీపోలీసు చర్యలతో పాటు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్(ఎఫ్ఎస్ఓ)లకు తదుపరి చర్యల నిమిత్తం 247 కేసులు అప్పగించారు. ఇందులో అత్యధికంగా పనీర్ అవుట్లెట్లపై 70 కేసులు, ప్రజల నుంచి నేరుగా వచ్చిన ఫిర్యాదులపై 90 కేసులు నమోదు చేశారు. అలాగే సమోసా తయారీ కేంద్రాలపై 11, వాటర్ ప్యాకింగ్ ప్లాంట్లపై 9, మసాలాలు/స్పైసెస్ పై 7, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై చెరో 6 కేసులు, జెప్టోపై 5, హాస్టళ్లు, మాంసం దుకాణాలపై చెరో 4 కేసులు, ఐస్ తయారీ కేంద్రాలపై 3, చికెన్ వేస్ట్/సీ ఫుడ్పై 3 కేసులు దాఖలయ్యాయి.విభాగాల సమన్వయంతోనే కల్తీకి చెక్!ఆహార కల్తీ నివారణ అనేది కేవలం ఒకే విభాగానికి పరిమితమైన అంశం కాదని, బహుళ ప్రభుత్వ విభాగాల ఉమ్మడి బాధ్యత అని పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించారు. అందుకే హెచ్-ఫాస్ట్ విభాగం.. జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల అధికారులతో సంపూర్ణ సమన్వయంతో క్షేత్రస్థాయిలో పని చేస్తోంది. కల్తీ మూలాలను తుడిచిపెట్టడానికి ఆయా భాగస్వామ్య విభాగాల ఉన్నతాధికారులతో పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ చర్యలు తీసుకుంటున్నారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం, కల్తీ నమూనాల సేకరణ వేగవంతం చేయడం, ఆకస్మిక తనిఖీలలో ఎదురయ్యే న్యాయ, క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమించడంలో పరస్పర సహకారం లభిస్తోంది. ఈ బహుళ విభాగాల ఉమ్మడి సమన్వయం వల్లే నగరంలో కల్తీ దందాను విజయవంతంగా అడ్డుకోవడం సాధ్యపడుతోంది.వ్యాపారులకు స్పష్టమైన ఆదేశాలుకల్తీ నియంత్రణతో పాటు నివారణ చర్యలపై కూడా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, తదితర తయారీ కేంద్రాలకు చెందిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వ్యాపారం పేరిట ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే పద్ధతులను ఏమాత్రం సహించబోమని వారికి నిర్మొహమాటంగా స్పష్టం చేస్తూ, కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ మార్గదర్శకాలను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ ఫుడ్ బిజినెస్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని స్పష్టం చేశారు.కల్తీ నిరోధంలో భాగంగా వ్యాపారులు తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సిబ్బంది గ్లౌజులు, మాస్కులు ధరించడం, నిల్వల్లో పాత నిల్వలను కొత్త నిల్వలను కలపకుండా 'ఫిఫో' (FIFO - First In, First Out) పద్ధతిని పాటించడం, హోటళ్లలో వాడిన నూనెను పదే పదే వాడకుండా జాగ్రత్తపడడం వంటి నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.హెచ్-ఫాస్ట్ ప్రారంభించిన తక్కువ రోజుల్లోనే ఈ విభాగం సిబ్బంది క్షేత్రస్థాయిలో అత్యంత సమర్థవంతంగా పనిచేసి ఆశించిన ఫలితాలను సాధించడం అభినందనీయమని హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు. జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల సమన్వయంతో పనిచేస్తూ ఈ బృందం దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని, ఆహార కల్తీ నియంత్రణకు హెచ్-ఫాస్ట్ కు సహకరిస్తోన్న ఆయా ప్రభుత్వ విభాగాల అధికారులకు, ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హెచ్-ఫాస్ట్ కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతి రోజు సగటున 15 వరకు కల్తీ ఆహార సమాచారాన్ని అందిస్తున్నారని తెలిపారు.“సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఆహార కల్తీ. ప్రజల కిడ్నీలను పాడుచేస్తూ, క్యాన్సర్, గుండె జబ్బుల వంటి తీవ్రమైన వ్యాధులను పంచుతూ సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ విషపూరిత రసాయనాల వాడకం వల్ల చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదల పూర్తిగా దెబ్బతింటోంది. శారీరక సామర్థ్యం దెబ్బతింటే మానవ వనరుల ఉత్పాదకత తగ్గి, దేశ ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నమవుతుంది. అందుకే ఈ దందాను మేము కేవలం ఒక చిన్నపాటి వ్యాపార మోసంగానో లేదా నిబంధనల ఉల్లంఘనగానో చూడటం లేదు; ఇది ప్రజల ఆరోగ్యంతో, అమాయకుల ప్రాణాలతో ఆడుకునే ఒక ఘోరమైన హత్యాయత్నం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ వారి ప్రాణాలను హరించే కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోం." అని హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు.ఆహార కల్తీ మహమ్మారిని అరికట్టడంలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పిలుపునిచ్చారు. పరిసరాల్లో ఎక్కడైనా ఆహార పదార్థాల కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వచ్చినా, లేదా అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్నట్లు తెలిసినా ఏమాత్రం సంకోచించకుండా వెంటనే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ నంబర్ 8712661212కు వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సురక్షిత, ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. - పీఆర్వో, హైదరాబాద్ సిటీ పోలీస్ -
‘ఇదేందిది?’: బీజేపీ సీఎంతో తెలంగాణ సీఎస్!
భోపాల్: తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజుకు శుభాకాంక్షలు చెబుతూ మధ్యప్రదేశ్కు చెందిన ఒక దినపత్రికలో ప్రచురితమైన ప్రకటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ ప్రకటనలో ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్తో కలిసి ఉన్న ఒక ఫొటో ప్రచురితమయ్యింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ ఫొటోపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు జూన్ 26న తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మధ్యప్రదేశ్కు చెందిన ఆయన కుటుంబం ప్రస్తుతం భోపాల్లో ఉంటోంది. ఆయన సీఎస్గా అత్యున్నత పదవిని చేపట్టిన తరుణంలో ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు స్థానిక పత్రికలో శుభాకాంక్షల ప్రకటనను ఇచ్చారు.ఇది సాధారణ ప్రకటనలా కనిపించినప్పటికీ, అందులో కనిపిస్తున్న ఫొటో చర్చకు దారితీసింది. ఆ ఫొటో ఏ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించినదో ప్రకటనలో పేర్కొనలేదు. అలాగే ఈ ఫొటో ఎంపికలో సంజయ్ జాజు ప్రమేయం ఉందా లేదా అనే విషయం తెలియరాలేదు. రాష్ట్రంలో అత్యున్నత పరిపాలనా పదవిలో ఉన్న అధికారి రాజకీయాలకు అతీతంగా, తటస్థంగా కనిపించాలని కొందరు అభిప్రాయపడుతుండగా, ప్రభుత్వ కార్యక్రమంలో సీఎంతో కలిసి ఫొటో దిగడం సాధారణ పరిపాలనా ప్రక్రియేనని మరికొందరు అంటున్నారు. -
భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతల రాకతో..
సాక్షి, వరంగల్: వరంగల్లోని భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రమాణాల పేరుతో ఆలయాన్ని అపవిత్రం చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో, ఆలయం మైల పండిందని బీజేపీ ఆధ్వర్యంలో ఆలయ శుద్దికి కాషాయ పార్టీ నేతలు అక్కడికి వెళ్లారు. అనంతరం, వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఆలయం వద్ద ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. భద్రకాళి ఆలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేశారు. దీంతో బీజేపీ నేతలు భద్రకాళి ఆలయం ఎదుట నిరసన తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా వేలం విషయంలో అవినీతికి పాల్పడ్డాయి. అలాంటి ఆ పార్టీ నాయకులు పవిత్రమైన భద్రకాళి దేవాలయంలో తడి బట్టలతో ప్రమాణాలకు రావడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నించారు. అంతేకాకుండా దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే భద్రకాళి దేవాలయంలో రాజకీయ పార్టీల నిరసనలు భక్తుల్లో ఆగ్రహం తెప్పిస్తున్నాయి. రాజకీయాలకు పవిత్ర దేవాలయాలను దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
‘ఈరోజే నువ్వు ఉరేసుకుని చస్తావు‘
హైదరాబాద్: తాగుడు మానుకోవాలని కోరిన భార్యను ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన మేరకు..ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన కిలారు బాలకృష్ణ, భార్గవి దంపతులు బాచుపల్లి రాజీవ్ గాం«దీనగర్లో ఉంటున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న బాలకృష్ణ మద్యానికి బానిసయ్యాడు. భార్య..మద్యం మానుకోవాలని పలుసార్లు చెప్పింది. అయితే భార్య మాటలను అవమానంగా భావించిన బాలకృష్ణ.. కొన్ని నెలలుగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. పిల్లలకు సెలవులు రావడంతో భార్గవి పుట్టింటికి వెళ్లగా.. ఏప్రిల్ 25న బాలకృష్ణ తన సోదరుడితో కలిసి మద్యం మత్తులో అక్కడికి చేరుకుని భార్యతో పాటు అత్తను దుర్భాషలాడాడు. భార్గవి సోదరుడిని చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో భార్గవి భర్త ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది.అత్తమామలు వచ్చి సర్దిచెప్పడంతో జూన్ 13న భర్త వద్దకు వెళ్లింది. మొదటి రోజే బాలకృష్ణ భార్యపై బెల్టుతో దాడి చేశాడు. జూన్ 20న ఉదయం నుంచే మద్యంతాగి భార్యపై అక్రమ సంబంధాల ఆరోపణలు చేస్తూ ఇంటి బయటే అవమానించాడు. అదేరోజు బయటకు వెళ్లే ముందు ‘ఈరోజే నువ్వు ఉరేసుకుని చస్తావు‘ అని బెదిరించిన బాలకృష్ణ, రాత్రి తిరిగి వచ్చి భార్గవిని గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్కు వేలాడదీశాడు. పిల్లలకు కూడా తల్లి ఉరేసుకుందని చెప్పి, అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడని పేర్కొన్నారు. పోలీసులు అనుమానాస్పద పరిస్థితులు గమనించి కేసు నమోదు చేశారు. విచారణలో బాలకృష్ణ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. హత్య చేసిన విషయాన్ని అంగీకరించడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
రైలుకు ఎదురెళ్లి దంపతుల ఆత్మహత్య
వరంగల్: రైలుకు ఎదురెళ్లి భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్–బీబీనగర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై గురువారం రాత్రి భార్యాభర్తలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్ తెలిపిన వివరాల మేరకు... వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన బుడిగె రవి (42), శిరీష (33) దంపతులు. వారికి 12, 13 ఏళ్ల ఇద్దరు అబ్బాయిలున్నారు. నగరానికి వచ్చిన వారు పెద్దఅంబర్పేట పరిధిలోని కుంట్లూరులో నివాసముంటున్నారు. భర్త బియ్యం వ్యాపారి, భార్య గృహిణి. గురువారం రాత్రి కృష్ణా ఎక్స్ప్రెస్కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు మృతదేహాలు స్వా«దీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కాగా, రవి, శిరీషల ఆత్మహత్య వెనుక ఆర్థిక కారణాలున్నాయని, వారు నివాసముంటున్న చోట ఓ వ్యక్తి, అతడి భార్య కలిసి రవి, శిరీష దంపతులను వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంటామని లాభాల ఆశజూపి రూ.15 లక్షలు తీసుకున్నారని బంధువులు పేర్కొన్నారు. భాగస్వామ్యం ఇవ్వకపోగా, ఇదేమిటని ప్రశ్నిస్తే బెదిరించడంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘నేను, తమ్ముడు బడికి వెళ్లాం. మేం వచ్చేసరికి అమ్మానాన్న ఇంట్లో లేరు. రాత్రవుతున్నా రాలేదని వారికి ఫోన్ చేస్తే తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో.. మంచిగా చదువుకోండి...ఇద్దరు కొట్టుకోవద్దు’అని చెప్పారని, ఆ తర్వాత వెంటనే ఫోన్ కట్ అయ్యిందని రవి పెద్ద కుమారుడు సుశాంత్ తెలిపాడు. -
డిప్యూటీ సీఎం కాన్వాయ్ను రూట్ మళ్లించిన పోలీసులు
సూర్యాపేట జిల్లా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోదాడ రూరల్ పోలీసులు షెడ్యూల్లో ఉన్న మార్గంలో కాకుండా మరో మార్గంలో తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. భట్టి విక్రమార్క బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో హైదరాబాద్ నుంచి మధిర నియోజకవర్గ పరిధిలోని ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో పార్టీ నాయకుడిని పరామర్శించేందుకు వెళుతున్న క్రమంలో అధికారులు కోదాడ మీదుగా వెళ్లేందుకు షెడ్యూల్ ఇచ్చారు. దీని ప్రకారం.. కోదాడ మీదుగా రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్రోడ్ నుంచి ఏపీలోని చైర్మహ్మద్పేట నుంచి వల్లభి వెళ్లాల్సి ఉంది.అయితే పోలీసులు కోదాడ శివారులోని దుర్గాపురం క్రాస్రోడ్ జంక్షన్ నుంచి ఖమ్మం వైపునకు కాన్వాయ్ను మళ్లించారు. అక్కడి నుంచి బొజ్జగూడెం స్టేజీ వద్దకు వెళ్లిన తర్వాత.. రూట్ ఇది కాదంటూ పోలీసులు మళ్లీ కాన్వాయ్ను వెనక్కి తిప్పి సరీ్వస్ రోడ్ మీదుగా బండపాలెం రోడ్ వద్దకు వెళ్లాక ఆ మార్గంలో వాగు ఉంది. దీంతోబండపాలెం మీదుగా చిమిర్యాల క్రాస్రోడ్ నుంచి రామాపురం క్రాస్రోడ్ దాటించొచ్చని ముందుకెళ్లారు. బండపాలెం నుంచి ముందుకు రోడ్ మార్గం లేకపోవడంతో భట్టివిక్రమార్క కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్రెడ్డిని పిలిచి ఎక్కడకు తీసుకెళ్తున్నావని మందలించారు. దీంతో అక్కడి నుంచి కాన్వాయ్ వెనక్కి మళ్లి కోదాడ–ఖమ్మం హైవే మీదుగా ముందుగా నిర్ణయించిన రూట్లోనే వల్లభికి వెళ్లారు. అయితే కోదాడ పోలీసుల తీరుపై భట్టివిక్రమార్క డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ ఘటనపై సూర్యాపేట జిల్లా ఎస్పీ విచారణ చేపట్టారు. కోదాడ రూరల్ ఎస్ఐని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసినట్టు శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రచారం సాగింది. ఈ ఘటనపై సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ విచారణ చేశామని, శుక్రవారం ఉదయం కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్రెడ్డిని తన కార్యాలయానికి పిలిపించి మందలించి పంపించానని చెప్పారు. -
ఆటోలో వచ్చి ఎత్తుకెళ్లారు.. విమానంలో వచ్చి కొనేశారు!
సాక్షి, హైదరాబాద్: చందానగర్ ఠాణా పరిధిలో జూన్ 30న ఓ చిన్నారిని తల్లి పొత్తిళ్ల నుంచి ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట్ర ముఠాను 72 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. పసికందును క్షేమంగా తల్లి ఒడికి చేర్చారు. సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ రమేష్ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బీదర్కు చెందిన మాలన్ బౌరవ్ శాంతా బాయి కుటుంబం హైదరాబాద్కు వలస వచ్చి సర్కస్లోపనిచేస్తూ జీవనం సాగిస్తోంది. గత నెల 30న తెల్లవారుజామున లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్రహరీ పక్కన ఫుట్పాత్పై శాంతాబాయి తన నెలరోజుల పాపతో నిద్రపోతుండగా తెల్లవారుజామున 2 గంటలకు వికారాబాద్కు చెందిన మహ్మద్ జుబేర్, ఇర్ఫాన్లు ఆటోలో వచ్చి.. పసిపాపను లాక్కొని పారిపోయారు. బిడ్డ ఏడుపు విన్న తల్లి నిద్రలేచి ఆటో వెనుక పరిగెత్తినా దుండగులు వేగంగా వెళ్లిపోయారు.అమ్మతనం కోసం బేరం.. కోల్కతాకు చెందిన రెహనుమా అలీ అనే మహిళకు పెళ్లయి ఐదేళ్లయినా సంతానం కలగలేదు. దీంతో ఆమె.. బంజారాహిల్స్లో ఉంటున్న తన పిన్ని నిమ్మీ జహానీ అలియాస్ సీమాను సంప్రదించింది. డబ్బులిస్తాను ఒక పసిబిడ్డను దత్తత ఇప్పించాలని కోరింది. సీమా తన స్నేహితురాలైన నేరెడ్మెట్కు చెందిన నాజియాకు విషయం చెప్పింది. నాజియా తనకు కాబోయే భర్త జుబేర్కు భారీగా డబ్బు వస్తుందని ఆశ చూపించింది. దీంతో అతను ఆటో డ్రైవర్ ఇర్ఫాన్తో కలిసి కిడ్నాప్ ప్లాన్కు స్కెచ్ వేశాడు.విమానంలో వచ్చి.. కిడ్నాపర్లు పసికందును ఎత్తుకెళ్లిన తరువాత పాపను నేరుగా నాజియా ఇంటికి తీసుకెళ్లారు. మరుసటి రోజే (జూలై 1) రెహనుమా తన పిన్ని సర్వరితో కలిసి కోల్కతా నుంచి హైదరాబాద్కు విమానంలో వచ్చింది. డీల్ ప్రకారం.. పాపను అప్పగించినందుకు రెహనుమా.. జుబేర్కు రూ.1.50 లక్షలు ఆన్లైన్ ద్వారా బదిలీ చేసింది. ఈ కేసులో మూడు రోజుల పాటు పోలీసులు వందలాది సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టారు. సాంకేతిక ఆధారాల సాయంతో కిడ్నాపర్లు కోల్కతాకు పారిపోయే లోపే సఫిల్గూడ చంద్రపురి కాలనీలో చుట్టుముట్టి జుబేర్, ఇర్ఫాన్, నాజియా, సీమా అలీ, రెహనుమా అలీలను అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ చేతుల మీదుగా ఆ పసికందును తిరిగి కన్నతల్లి ఒడికి చేర్చారు. -
‘చావవే.. చస్తే మాకు నీ శని పోతుంది’
హైదరాబాద్: లంగర్హౌస్ పరిధిలో ఓ పబ్ డ్యాన్సర్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఆమెను ప్రియుడే హత్య చేశాడా? లేక ఆత్మహత్యకు పాల్పడిందా? అనే కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా.. అంటూ స్నేహితురాలి సోదరుడికి సరదాగా ఫోన్ చేసిన మహిళ.. అనంతరం హోటల్ గదిలో ఫ్యాన్కు విగతజీవిగా వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ వెంకటరాములు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాబౌలికి చెందిన రేణుక (28)కు పదేళ్ల క్రితం వివాహమైంది. మూడేళ్ల అనంతరం దంపతులు విడిపోయారు. దీంతో తన 8 ఏళ్ల కుమారుడితో కలిసి ఆమె తల్లిదండ్రులతో నాలుగేళ్లుగా బోరబండలో నివసిస్తోంది. జేఎన్టీయూ పరిధి మంజీరా మాల్లోని ఓ పబ్లో రేణుక డ్యాన్సర్గా పని చేస్తోంది. మూడు నెలలుగా కూకట్పల్లిలోని తోటి డ్యాన్సర్ సత్య, ఆమె సోదరుడు బన్నీతో కలిసి ఉంటోంది. ప్రియుడితో కలిసి వెళ్లి.. బుధవారం సాయంత్రం మంజీరా మాల్లోని పబ్కు వెళ్లిన రేణుక గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గోల్కొండకు చెందిన ప్రియుడు ఫరూఖ్ (36)తో కలిసి లంగర్హౌస్లోని హోటల్ గ్రాండ్ వచ్చింది. వీరిద్దరికీ పబ్లో ఆరు నెలల క్రితం పరిచయమై దగ్గరయ్యారు. కాగా.. గురువారం రాత్రి 10.40 గంటలకు హోటల్ నుంచి బయటకు వెళ్లిన ఫరూఖ్ ఆ తర్వాత మరోసారి వచ్చి వెళ్లాడని, రేణుక అప్పటికీ హోటల్లోనే ఉందని హోటల్ నిర్వాహకులు తెలిపారు. బుధవారం వెళ్లిన రేణుకను ఇంటికి వస్తున్నావా అని స్నేహితురాలు సత్య, ఆమె సోదరుడు బన్నీ ఫోన్ చేశారు. రేణుక తన ఫోన్ టచ్ పని చేయట్లేదని డాటా కోసం తన మెయిల్ ఐడీ చెప్పాలని వీరి స్నేహితుడు రాజేష్ కు ఫోన్ చేస్తే రేపు చెబుతా అంటున్నాడని వాపో యింది. బన్నీ ఆమెతో మాట్లాడుతూ.. ‘అక్కా.. బాధపడకు అన్నీ రికవరీ చేసి ఇస్తాను. కానీ తనకు పార్టీ కావాలి’ అని చెప్పాడు. ఇంతలో సత్య మాట్లాడుతూ.. తన ప్రియుడు సాయి వేరే పెళ్లి చేసుకుంటున్నాడు. అతని మాట విని ఫరూఖ్ నిన్ను (రేణుక)కూడా వదిలేస్తాడేమో’ అని చెప్పింది. కాగా సాయి, ఫరూఖ్లు మాట్లాడుకోకుండా వారి ఫోన్ నంబర్లు బ్లాక్ చేయాలని రేణుక ముందే ప్లాన్ చేసుకొని వచ్చింది. హోటల్లో ఫరూఖ్ ఫోన్ రేణుకకు ఇవ్వకపోవడంతో వీరి మ«ధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఇంతలో ఫోన్ స్పీకర్ ఆన్చేసి రేణుకతో బన్నీ మాట్లాడుతూ.. అక్క సత్య పుట్టిన రోజు శుక్రవారం రాత్రి పార్టీ ఇస్తానని చెప్పాడు. ఇంతలో సత్యకు వేరే కాల్ రావడంతో ఆమె ఫోన్లో మాట్లాడ సాగింది. తాను మాట్లాడుతుంటే తమ్ముడికి ఫోన్ ఇచ్చి నువ్వు వేరే ఫోన్ మాట్లాడతావా? నేను ఉరి వేసుకొని చనిపోతానంటూ అని సరదాగా బెదిరించింది. ‘చావవే.. చస్తే మాకు నీ శని పోతుంది’ అంటూ సత్య బదులిచ్చింది.కొద్ది గంటల్లోనే..తాను రిసార్ట్లో మామిడితోటలో ఎంజాయ్ చేస్తున్నానంటూ.. నన్ను చావు అని అన్నావుగా అందుకే నేను చస్తున్నా అంటూ రేణుక వీడియో కాల్ చేసి ఫ్యాన్కు చున్నీ కట్టి ఉరి వేసుకుంటున్నా అని సత్య, బన్నీకి చూపించింది. గురువారం అర్ధరాత్రి ఒంటి గంటకు హోటల్ సర్వర్ అటుగా వెళ్తూ ఫరూఖ్, రేణుక ఉన్న 1611 నంబరు గది తలుపు తెరిచి ఉండటంతో చూశాడు. రేణుక ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. రేణుకను ఫరూఖ్ హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఫరూఖ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేణుకది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
పోలీస్ వ్యాన్ తాళం చెవి చోరీ
హైదరాబాద్: పోలీస్ వాహనం తాళం చెవిని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేయడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే..బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్ వద్ద గురువారం మధ్యాహ్నం మాజీ మంత్రి హరీ‹Ùరావుతో పాటు మరి కొంతమందిని ముందస్తు అరెస్ట్ చేశారు. వీరందరినీ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించేందుకు తెలంగాణ భవన్ వద్ద ఓ పోలీస్ వాహనాన్ని సిద్ధంగా ఉంచి హరీష్ రావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలను ఎక్కించారు. అప్పటికే హరీష్ రావును అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ వందలాదిగా తరలి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ వాహనానికి అడ్డుపడ్డారు. వ్యాన్ను స్టార్ చేయడానికి హోంగార్డు రవీందర్ నాయక్ ప్రయత్నించగా తాళం చెవి కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు తాళం చెవి దొంగిలించి హరీష్రావు వెళ్లే వాహనాన్ని అడ్డుకున్నారు. అరగంటపాటు తాళం చెవి దొరకకపోవడంతో పోలీసులు తీవ్ర ఆందోళన చెందారు. అటు నుంచి వెళ్తున్న ఓ ఆటో తాళం చెవి తీసుకొని పోలీస్ వాహనాన్ని ఆన్ చేయగా వెంటనే స్టార్ట్కావడంతో ఎట్టకేలకు వ్యాన్ కదిలింది. రవీంద్రనాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసు శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ పోలీసు శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర ప్రభు త్వం ఆమోదం తెలిపింది. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 5 వేల పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయిస్తూ జీఓ ఎంఎస్ నం. 78 జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియా మక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ద్వారా నియామక ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పటా్నయక్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ప్రభుత్వం పోలీసు శాఖలో ఉన్న ఖాళీలు, శాఖ అవసరాలు, ఆర్థిక భారం తదితర అంశాలను సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నియామకాలకు అవసరమైన స్థానిక కేడర్ వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు తదితర వివరాలను పోలీసు నియామక మండలికి వెంటనే అందజేయాలని హోం శాఖ, డీజీపీ కార్యాలయాన్ని ఆదేశించింది. అలాగే నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని పోలీసు నియామక మండలికి సూచించింది. -
‘ఈపీఎఫ్ఓ’ మెంబర్ పోర్టల్ నవీకరణ
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ను మరింత ఆ«ధునీకరించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన సామాజిక భద్రత కోడ్లో భాగంగా ఉద్యోగుల భవిష్యనిధి పథకం–2026, ఉద్యోగుల పింఛను పథకం–2026, ఉద్యోగుల డిపాజిట్ బీమా పథకం–2026 గత నెల 29నుంచి అమల్లోకి వచ్చాయి. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేయగా... వీటి అమలుకు ఈపీఎఫ్ఓ ముమ్మర కసరత్తుచేసింది. ఇందులో భాగంగా గతవారం రోజులుగా యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ అప్గ్రేడేషన్ ప్రక్రియ చేపట్టిన ఈపీఎఫ్ఓ తాజాగా నవీకరించిన పోర్టల్ను చందాదారులకు అందుబాటులోకితెచ్చింది.తాజాగా అప్గ్రేడ్ చేసిన పోర్టల్లో మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈమేరకు అధికారులు వ్యూహాత్మక కార్యాచరణతో పోర్టల్ అప్గ్రెడేషన్ పూర్తి చేశారు.⇒ ఉద్యోగంలో చేరిన వ్యక్తికి ఈపీఎఫ్కు సంబంధించి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను యూఏఎన్ అంటారు. దీన్ని ఇదివరకు ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఈ సౌకర్యాన్ని ఇప్పడు ఉమాంగ్(కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవలను ఒకేచోట పొందేందుకు భారత ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ వేదిక)యాప్ ఆధారంగా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ఆ ఉద్యోగి రిటైర్మెంట్ వరకు అదే యూఏఎన్ను కొనసాగించాల్సి ఉంటుంది.⇒ ఉమాంగ్ యాప్లో ఆధార్ ఆధారిత, ఫేస్ అథెంటికేషన్(ఎఫ్ఏటీ) ద్వారా యాక్టివేషన్ చేసుకోవాలి. నూతన యూఏఎన్ జనరేషన్ కూడా ఉమాంగ్ యాప్ ద్వారానే చేసుకోవాలి. అదేవిధంగా యూఏఎన్ రిట్రీవ్ చేసుకోవడం సులభతరమైంది. యూఏఎన్ నంబర్ మర్చిపోయినట్లైతే సభ్యులు ఆధార్, ఇతర వివరాలతో సులభంగా తిరిగి పొందే విధంగా కొత్త ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.⇒ మరణించిన సభ్యుడి పీఎఫ్ క్లెయిమ్కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు సదుపాయం పోర్టల్లో యథాతథంగా కొనసాగుతోంది.⇒ ఈపీఎఫ్ఓ హోమ్పేజీని పూర్తిగా మార్చి, క్లెయిమ్లు, పాస్బుక్, కేవైసీ, ప్రొఫైల్ సేవలను సులభంగా కనిపించేలా రూపొందించారు.ప్రస్తుతం పోర్టల్లో అందుబాటులో ఉన్న ముఖ్య సేవలు: పీఎఫ్ పాస్బుక్ చూసుకోవడం, క్లెయిమ్ దాఖలు, క్లెయిమ్ స్టేటస్ ట్రాకింగ్, కేవైసీ నవీకరణ, ప్రొఫైల్ వివరాల సవరణ, పెన్షన్కు సంబంధించిన సేవలు.⇒ క్లెయిమ్ల ప్రాసెసింగ్ను వేగవంతం చేయడం, భద్రతను పెంచడం, డిజిటల్ సేవలను ఒకే వేదికలో మరింత సమర్థంగా అందించడం తాజా మార్పుల ముఖ్య ఉద్దేశ్యం. భవిష్యత్తులో మరిన్ని ఆన్లైన్ సేవలను చేర్చేందుకు సాంకేతిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈపీఎఫ్ఓ చర్యలు చేపట్టింది.⇒ తాజాగా మెంబర్ పోర్టల్ అందుబాటులోకి రాగా... మిగిలిన సర్వీసులను విడతల వారీగా తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్ఓ వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. -
వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అక్కర్లేదు
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు ఆదేశాల మేరకు న్యాయ విచారణను ఆలస్యం చేస్తూ.. దానిని నిరంతరం కొనసాగించాలని దుర్బుద్ధితో సునీత వేస్తున్న పిటిషన్లకు సీబీఐ అడ్డుకట్ట వేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదని, ఇప్పటికే సమగ్ర విచారణ పూర్తి చేశామని సీబీఐ ప్రత్యేక కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ సవివరమైన కౌంటర్ దాఖలు చేసింది. ఆమె పిటిషన్ చట్టవిరుద్ధమని పేర్కొంటూ దీనిని కొట్టివేసి న్యాయ విచారణను వేగవంతంగా పూర్తి చేయాలని కోరింది. కిరణ్యాదవ్, అర్జున్రెడ్డి సందేశాలపై ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొంది.వారి సందేశాలపై కోర్టు ఆదేశాల మేరకు మరోసారి దర్యాప్తు చేశామని, ఫోరెన్సిక్ నిపుణుడి అభిప్రాయం కూడా తీసుకున్నామని తెలిపింది. ఇష్టారాజ్యంగా సునీత పిటిషన్లు వేస్తుండటంతో విచారణ ఆలస్యమవుతోందని, అభియోగాల ఖరారు వాయిదా పడుతోందని పేర్కొంది. ఇలా ఏళ్లు గడుస్తు పోతుంటే.. విచారణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసులో నర్రెడ్డి సునీత దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్పై ప్రత్యక కోర్టు న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావు శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సీబీఐ సమగ్ర లిఖితపూర్వక వాదనలు సమర్పించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.అర్ధరాత్రి సందేశాల మార్పిడి ఆరోపణ పూర్తిగా తప్పు..చట్టపరంగా సునీత పిటిషన్కు విచారణార్హతే లేదు. కోర్టు ఆదేశాల మేరకు పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, ఇప్పటికే మూడో సప్లిమెంటరీ ఫైనల్ రిపోర్ట్ను సమర్పించాం. కేసు ప్రస్తుతం ట్రయల్ దశలో ఉంది. ఈ సమయంలో దర్యాప్తు సరైన విధంగా జరగలేదని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేయడం సముచితం కాదు. సునీత ప్రధానంగా ప్రస్తావించిన అంశం కిరణ్యాదవ్, అర్జున్రెడ్డి మధ్య జరిగిన సందేశాల మార్పిడి. 2019, మార్చి 15 అర్ధరాత్రి 1:42 సమయంలో కిరణ్యాదవ్ మొబైల్ నంబర్ నుంచి అర్జున్రెడ్డి నంబర్కు రెండు సందేశాలు వెళ్లాయని, అవి హత్య కుట్రలో కీలక ఆధారాలన్నది పిటిషనర్ వాదన. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపాం. దర్యాప్తులో భాగంగా కిరణ్యాదవ్, అర్జున్రెడ్డిని విచారించాం. ఆ సందేశాలు హత్య జరిగిన రాత్రి కాకుండా అదే రోజు ఉదయం పంపినవని వారు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన సీఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్) నిపుణుడి అభిప్రాయాన్ని కూడా రికార్డు చేశాం. మొబైల్ ఎక్స్ట్రాక్షన్ రిపోర్ట్లో కనిపించిన సమయం యూటీసీ ఫార్మాట్లో ఉండటంతో, దానిని భారత కాలమానం (ఐఎస్టీ)కు మార్చేందుకు 5 గంటల 30 నిమిషాలు కలపాల్సి వస్తుందని నిపుణుడు వివరించారు.దీంతో రాత్రి 1:42గా కనిపించిన సందేశాలు వాస్తవానికి ఉదయం 7:12 గంటల సమయంలో పంపినవని తేలింది. కాల్ డేటా రికార్డులు (సీఆర్డీ) కూడా ఇదే విషయాన్ని నిర్ధారించాయి. కిరణ్ యాదవ్ మొబైల్ నుంచి ఉదయం 7:12:01, 7:12:30 గంటలకు సందేశాలు పంపినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. అర్ధరాత్రి సందేశాల మార్పిడి జరిగిందన్న ఆరోపణ పూర్తిగా తప్పని స్పష్టమైంది. ఈ విశ్లేషణతో హత్య జరిగిన రాత్రి సందేశాల మార్పిడి ఆధారంగా కుట్ర ఆరోపణ సత్యదూరం.ఆమె పిటిషన్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంపిటిషనర్ వరుసగా వివిధ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తుండటంతో కేసు విచారణ ఆలస్యమవుతోంది. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కూడా క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాల ప్రకారం.. సప్లిమెంటరీ చార్జ్షిట్ దాఖలు తర్వాత ట్రయల్ వేగంగా కొనసాగాల్సి ఉంది. తరచూ ఆమె కొత్త పిటిషన్లు దాఖలు వేస్తుండడంతో అభియోగాల ఖరారు (ఫ్రేమింగ్ ఆఫ్ చార్జిస్) కూడా ఆలస్యమవుతోంది.కాలం గడిచే కొద్దీ కీలక సాక్షులను సమర్థవంతంగా కోర్టులో హాజరు పరచడం, సాక్ష్యాలను సురక్షితంగా ఉంచడం కష్టతరమవుతుంది. ఆలస్యంతో విచారణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే సెక్షన్ 173 (8) సీఆర్పీసీ కింద సప్లిమెంటరీ ఫైనల్ రిపోర్ట్ సమర్పించాం. కోర్టు కాగి్నజెన్స్(ఆమోదం) కూడా తీసుకుంది. సునీత దాఖలు చేసిన పిటిషన్ చట్టపరంగా నిలబడదు.. దాన్ని కొట్టివేయాలి. -
మూసీపై హెరిటేజ్ పడగ!
కృష్ణా, గోదావరి, యమున, సరస్వతి..అన్ని నదుల పేర్లను మన ఆడబిడ్డలకు పెట్టుకుంటాం. ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు ‘మూసీ’అని పేరు పెట్టుకున్నాడా? మూసీ నది కంపు కొడుతూ విషం చిమ్ముతోంది కాబట్టే పెట్టుకోలేదు. అందుకే ఆ మూసీ మురికిని ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నా. – ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిసాక్షి, హైదరాబాద్: మూసీ నది అభివృద్ధిపై వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్రెడ్డి వేర్వేరు సందర్భాల్లో, వేర్వేరు వేదికలపై స్పష్టం చేశారు. ఒక పక్క సీఎం ఈ విధంగా మూసీ నది అభివృద్ధి కోసం పరితపిస్తుంటే.. ఇవేమీ పట్టనట్టు మరో పక్క ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఆ నదిని మరింత కాలుష్య కాసారంగా మార్చేస్తోంది.శామీర్పేటలోని జగన్గూడలో ఉన్న ప్లాంట్ నుంచి స్కిమ్డ్ వెయ్ను ట్యాంకర్లలో తరలించి నాగోల్ లోని శ్రీ సహదేవ్సింగ్ నగర్ కాలనీ వద్ద మూసీలో కలిపేస్తోంది. ప్రతిరోజూ వేల లీటర్ల డెయిరీ వ్యర్థాన్ని రాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా తీసుకువచ్చి నదిలోకి వదిలేస్తోంది. కొన్ని రోజులుగా ఈ వ్యవహారాన్ని గమనించిన కాలనీ వాసులు గత సోమవారం ఓ ట్యాంకర్ను అడ్డుకోవడంతో విషయం వెలుగులోకి వచి్చంది.ఏకంగా 50 కిలోమీటర్ల నుంచి తరలించి.. స్కిమ్డ్ వెయ్ అనేది పాల నుంచి చీజ్ (జున్ను), కాసీన్ (ప్రొటీన్ పదార్థం) వంటి పాల ఉత్పత్తుల తయారీ ప్రక్రియలో మిగిలిపోయే ద్రవ వ్యర్థం. ఇందులో సాధారణంగా నీరు, లాక్టోజ్, వెయ్ ప్రోటీన్లు, కాల్షియం, పొటాíÙయం వంటి ఖనిజ లవణాలతో పాటు లాక్టిక్ యాసిడ్ ఉంటాయి. ఇది విషపూరిత రసాయనం కానప్పటికీ అధిక సేంద్రియ భారం (ఆర్గానిక్ లోడ్) కలిగి ఉండటం వల్ల పర్యావరణానికి హాని కలిగిస్తుంది.అందువల్ల దీన్ని నేరుగా బయట పారబోయ కూడదు. పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్ (ఈటీపీ) ద్వారా శుద్ధి చేసిన తర్వాతే బయటకు విడుదల చేయాలి. కానీ హెరిటేజ్ సంస్థ మాత్రం ఈ హానికారక డెయిరీ వ్యర్థాన్ని దాదాపు 50 కిలోమీటర్లు ట్యాంకర్ల ద్వారా తీసుకువచ్చి మూసీలో పారబోస్తోంది.జలచరాలకు ప్రమాదం స్కిమ్డ్ వెయ్ లాంటి వ్యర్థాలను జనావాసాల మధ్య, నదీ జలాల్లో పారబోస్తే తీవ్ర పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా చెరువులు, వాగులు, కాలువల్లో కలిస్తే నీటిలో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ) గణనీయంగా పెరుగుతాయి. అంటే ఈ వ్యర్థాలు నీటిలో కరిగితే అందులో ఉన్న ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది. తగిన ఆక్సిజన్ లేకపోవడంతో చేపలు, ఇతర జలచరాలు చనిపోయే ప్రమాదం ఉంటుంది.మరోవైపు ఈ వ్యర్థాన్ని నేల మీద పోస్తే కొద్ది రోజుల్లోనే అది తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుంది. పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. బ్యాక్టీరియా, ఫంగస్లు ఇందులో వేగంగా పెరిగి ఈగలు, దోమలతో పాటు ఇతర కీటకాలను ఆకర్షిస్తుంది. పెద్ద మొత్తంలో ఒకేచోట పారబోస్తే నేలలో పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. భూగర్భ జలాల నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.ప్రతిరోజూ మూడు ట్యాంకర్లు.. శామీర్పేట మండలంలోని జగన్గూడలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ ప్లాంట్ నుంచి ఒక్కో ట్యాంకర్లో 18 వేల లీటర్ల చొప్పున రోజుకు కనీసం మూడు ట్యాంకర్లలో 50 వేల లీటర్లకు పైగా స్కిమ్డ్ వెయ్ను తీసుకువచ్చి మూసీలో పారబోస్తున్నారు. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో ఆ ప్లాంట్ నుంచి బయలుదేరుతున్న ఈ ట్యాంకర్లు రాత్రి సమయానికి శ్రీ సహదేవ్సింగ్ నగర్ కాలనీకి చేరుతున్నాయి.కొన్నాళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని గమనించిన స్థానికులు గత సోమవారం రాత్రి మూసీలో పొసి తిరిగి వస్తున్న ఓ ట్యాంకర్ను అడ్డుకున్నారు. అందులో హెరిటేజ్ సంస్థ జారీ చేసిన స్టాక్ ట్రాన్స్ఫర్ అడ్వైజ్, ట్యాంకర్తో పాటు అందులోని స్కిమ్డ్ వెయ్ బరువును సూచించే పత్రాలు మాత్రమే ఉన్నాయి. స్టాక్ ట్రాన్స్ఫర్ అడ్వైజ్లో ఆ ట్యాంకర్లోని పదార్థం స్కిమ్డ్ వెయ్గా పేర్కొన్న హెరిటేజ్..బరువు సూచించే పత్రంలో మాత్రం ‘పనీర్ వాటి’గా పేర్కొనడం గమనార్హం.సారూప్యత ఉన్నా ఒకటి కాదు.. స్కిమ్డ్ వెయ్, పనీర్ వాటికి మధ్య సారూప్యత ఉన్నప్పటికీ రెండూ ఒకటి కావు. స్కిమ్డ్ వే అనేది కొవ్వు తొలగించిన (స్కిమ్డ్) పాలతో చీజ్ లేదా కాసీన్ తయారీ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే వ్యర్థం కాగా.. పనీర్ వాటి అనేది పనీర్ తయారీ సమయంలో పాలు విరిగిన తర్వాత మిగిలిపోయే ద్రవం. ఇది సాధారణంగా పూర్తి కొవ్వు లేదా టోన్డ్ పాలతో తయారవుతుంది. పనీర్ తయారీలో నిమ్మరసం, వెనిగర్ లేదా సిట్రిక్ యాసిడ్ వంటి ఆమ్ల పదార్థాలను ఉపయోగించడం వల్ల ఈ ద్రవం స్కిమ్డ్ వెయ్తో పోలిస్తే ఎక్కువ ఆమ్లత్వం (యాసిడిటీ) కలిగి ఉంటుంది.దీనిపై శ్రీ సహదేవ్సింగ్ నగర్ కాలనీ వాసులు ఆ ట్యాంకర్ డ్రైవర్ను నిలదీశారు. అతడు తనకు ఏమీ తెలియని, తన యజమాని చెప్పినట్లు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో అక్కడకు వచి్చన గస్తీ పోలీసులు ట్యాంకర్ డ్రైవర్ను మందలించి పంపారు. పాల పరిశ్రమలు, డెయిరీలు తమ ద్రవ వ్యర్థాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం శుద్ధి చేసి మాత్రమే విడుదల చేయాల్సి ఉండగా.. ఇలా బహిరంగ ప్రదేశాల్లో, నీటి వనరుల్లో విడిచిపెట్టడం పర్యావరణ చట్టాల ఉల్లంఘనే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేస్తాంఇప్పటికీ ట్యాంకర్లు అర్ధరాత్రి సమయంలో వచ్చి వ్యర్థాలను డంప్ చేసి వెళ్తున్నాయి. కొన్నాళ్లుగా వీటి రాకపోకలు గమనిస్తున్నాం. గత సోమవారం డంప్ చేసి తిరిగి వస్తున్న సమయంలో అడ్డుకుంటే హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నుంచి వస్తున్న డెయిరీ వ్యర్థాలుగా తెలిసింది. దీనిపై సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించాం. – ఎం.నవీన్రెడ్డి, శ్రీ సహదేవ్సింగ్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
ఆగని అప్పుల రగడ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చేసిన అప్పులపై చెలరేగిన వివాదం మూడో రోజు కూడా కొనసాగింది. తొలిరోజు.. కేటీఆర్ చేసిన బహిరంగ చర్చ సవాల్తో రభస ప్రారంభం కాగా, రెండో రోజు గురువారం గన్పార్క్, తెలంగాణ భవన్ వేదిక గా రచ్చరచ్చ అయ్యింది. మంత్రివర్గ భేటీలోనూ చర్చనీయాంశమైంది. ఇక శుక్రవారం అప్పులపై అధికార పక్షం, విపక్షం లేఖాస్ర్తాలు సంధించుకున్నాయి. తాను చెప్పిన అప్పు లెక్కలకు కట్టుబడి ఉన్నానంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బీఆర్ఎస్ నేతలకు లేఖలు రాశారు. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీశ్రావుకు లేఖలు రాసిన ఆయన.. తాను చెప్పిన అప్పు లెక్కలు తప్పని కేసీఆర్తో చెప్పించినా, నిరూ పించినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు.దీనిపై చర్చించేందుకు సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్క్లబ్కు వస్తున్నానని, బీఆర్ఎస్ నేతలు కూడా రావాలని సవాల్ చేశారు. చెప్పినట్లే సాయంత్రం ప్రెస్క్లబ్కు వెళ్లారు. బీఆర్ఎస్ నేతలు రాకపోవడంతో వారిపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాగా మంత్రి జూపల్లి లేఖలపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్రావు.. తాను కూడా ఆయనకు ఒక లేఖ రాశారు.కాంగ్రెస్ హయాంలో చేసిన అప్పుల గణాంకాలతో పాటు, బీఆర్ఎస్ చేసిన అప్పుల లెక్కలను అందులో వివరించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి, తాను అప్పుల గురించి మాట్లాడిన వీడియోలను వాట్సాప్ ద్వారా మంత్రి జూపల్లికి పంపారు. ఇవి చూసిన తర్వాతైనా రాజీనామా చేయాలన్నారు. మరోవైపు సంగారెడ్డిలోనూ మాట్లాడుతూ..జూపల్లిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇంకోవైపు డిప్యూటీ సీఎం భట్టి కూడా శుక్రవారం.. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, కాంగ్రెస్ హ యాంలో చేసిన అప్పులు, చెల్లింపులపై గణాంకాలు వెల్లడించారు. -
రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి
హుజుర్నగర్: ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. పంటల ఎంపికలో జాగ్రత్త వహించాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజుర్నగర్, కోదాడ నియోజకవర్గాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు.వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో వ్యవసాయం ఒక పండుగలా మారిందన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి దిగుబడి నమోదైందని, భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఏడు రకాల సన్న వరిధాన్యాలకు బోనస్ కూడా కొనసాగుతోందని, ఈ చర్యల వల్ల రైతులకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు.అయితే ఎల్నినో ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం తగ్గిందని రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు.వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి అనుగుణంగా వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలని సూచించారు.ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయని, 2026 జూన్ నెలలో దేశవ్యాప్తంగా సాధారణంతో పోలిస్తే సుమారు 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. ఇది ఇటీవలి సంవత్సరాల్లో అత్యంత పొడి జూన్ నెలల్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు.తెలంగాణలో కూడా జూన్ నెలలో సుమారు 22 శాతం తక్కువ వర్షపాతం నమోదవడంతో పలు ప్రాంతాల్లో విత్తనాల విత్తడం ఆలస్యమైందన్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువ భాగం మహారాష్ట్రలో ఉండటంతో అక్కడ కూడా వర్షాలు తక్కువగా కురవడం వల్ల తెలంగాణకు గోదావరి జలాల ప్రవాహం ఆలస్యమవుతోందని మంత్రి వివరించారు.నీటి లభ్యత అనిశ్చితంగా ఉన్న ప్రాంతాల్లో అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగలిగే, ఎండలను తట్టుకునే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. రిజర్వాయర్లలో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని, ముందుగా తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అనంతరం సాగునీటి అవసరాలను తీర్చేలా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.వర్షపాతం తక్కువగా కొనసాగితే సమర్థవంతమైన నీటి నిర్వహణ ఎంతో కీలకమని చెప్పారు.వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పొడి వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని రైతులకు భరోసా ఇచ్చారు.రైతులకు ప్రభుత్వం అండగా ఉంటూనే నీటి వినియోగంలో సమర్థవంతమైన విధానాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. సరైన ప్రణాళిక, రైతుల సహకారంతో ఎల్నినో సవాళ్లను అధిగమించి తెలంగాణ వ్యవసాయం అభివృద్ధి పథంలో కొనసాగుతుందనే విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు.సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా గడ్డిపల్లి గ్రామంలో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సమీకృత పాఠశాల (ఇంటిగ్రేటెడ్ స్కూల్) నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. హుజూర్నగర్ పట్టణంలో రూ.7.25 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, రూ.4.50 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం పనులను ఆయన పరిశీలించారు. అలాగే చిలుకూరు–జెర్రిపోతులగూడ మధ్య నిర్మించిన బీటీ రహదారిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. -
‘రైతు భరోసా నిధుల విడుదలలో మరోసారి రేవంత్ ప్రభుత్వం రికార్డు’
హైదరాబాద్: రైతుభరోసా నిధులను రైతు ఖాతాలలో వేయడంలో రేవంత్ సర్కార్ మరోసారి రికార్డు సృష్టించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూన్ 30 న రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమం మొదలుపెట్టిన కేవలం 4 రోజులలోనే రైతు భరోసా పథకం కింద 6590.37 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా పథకం కింద ఈ రోజు నాలుగో విడతలో 4 నుండి 5 ఎకరాలకు వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో నేడు రూ. 1188 కోట్లను నేరుగా జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విడతలో 4.41 లక్షల మంది రైతులు రైతుభరోసా సాయాన్ని పొందారని మంత్రి తెలిపారు.మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ఇప్పటికే మొదటి మూడు విడతలలో 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయగా, ఈ రోజు 4 నుండి 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ రైతుభరోసా సాయం అందించమన్నారు. ఇప్పటివరకు రైతుభరోసా పథకం కింద మొత్తం 65.76 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.5402.37 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. -
‘సర్’ ఎఫెక్ట్: 15 లక్షల ‘ప్రవాస’ ఓట్లు గల్లంతు!
గల్ఫ్ కార్మికుల ఓట్ల గల్లంతుపై అందిన ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసింది. కరీంనగర్ టు గల్ఫ్.. ఓటు హక్కుపై నీలినీడలు కమ్ముకోవడంపై న్యాయవాది రామారావు ఇమ్మనేని మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. 15 లక్షల మంది ప్రవాసాంధ్రుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న విషయాన్ని ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. పోర్టల్ లోపాల వల్ల వీసా పత్రాలు తిరస్కరణకు గురవుతున్నాయని న్యాయవాది రామారావు పేర్కొన్నారు. ఫామ్ 6A ఆన్లైన్ ఇబ్బందులతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదంలో గల్ఫ్ వలస కార్మికులు ఉన్నారని.. ఆయన పేర్కొన్నారు. ఓట్లతో పాటు ఆస్తుల హక్కులపైనా ప్రవాసులలో ఆందోళన నెలకొంది. అసంపూర్ణ అఫీషియల్ మ్యాపింగే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.ప్రధానంగా ఓట్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి మరింత సమయం ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదులో విన్నవించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళీకృతం చేస్తే నిరక్ష్యరాస్యులు సైతం తమ ఓటు హక్కును కాపాడుకోగలుతారని, కాని పక్షంలో ఓట్ల గల్లంతు జరుగుతుందనే విషయాన్ని న్యాయవాది రామారావు ఇమ్మనేని మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. బయట దేశాల్లో ఉన్న ఇక్కడ ఓటర్లకు ఇంట్లో వాళ్ల ద్వారా గుర్తింపు కార్డు ఇచ్చినా మాన్యువల్గా ఓటు నమోదు ప్రక్రియ కొనసాగేలే చూడాలన్నారు. ఓట్ల జాబితా సవరణలో భాగంగా సాంకేతిక ఆంశాల కారణంగా ఇలా ఓటు తిరస్కరణకు గురి కావడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ అంశానికి సంబంధించిన ఫిర్యాదును రిజస్టర్ చేసిన ఎన్హెచ్ఆర్సీ.. తెలంగాణ సీఈఓ సుదర్శన్రెడ్డిని ప్రతివాదిగా చేర్చింది. -
‘నా మాటకు నేను కట్టుబడి ఉన్నా..నిరూపిస్తా’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ల మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని, అది నిరూపిస్తానన్నారు. ఈరోజు(శుక్రవారం, జూలై 3వ తేదీ) సోమాజిగూడ ప్రెస్క్లబ్లో కేసీఆర్, హరీష్రావు, కేటీఆర్ల కోసం మూడు కుర్చీలు వేశామని, కానీ వారు రాలేదన్నారు. దీనిలో భాగంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ‘ పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా.. నిరూపిస్తా. దమ్ముంటే కాదని నిరూపించండి. కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు మీరు చేసిందా కాదా?, మిషన్ భగీరథ కార్పొరేషన్ అప్పు మీరు చేసింది కాదా?, మా ప్రభుత్వం చేసిన అప్పు గురించి నేను చాలెంజ్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత అప్పులకు వడ్డీ కింది రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా కట్టాం’ అని పేర్కొన్నారు.ఇక హరీష్ రావు రాసిన లేఖ గురించి ప్రస్తావిస్తూ.. అందులో ఏమీ లేదని విమర్శించారు. ‘ నేను లేఖలో ప్రస్తావించిన వాటికి హరీష్ నుంచి సమాధానం రాలేదు. అసలు మీరు ఎందుకు ప్రెస్క్లబ్కు రాలేదో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
నెల రోజుల పసికందు కిడ్నాప్ కేసు.. 72 గంటల్లో ఛేదన
హైదరాబాద్ : నెలరోజుల పసికందు కిడ్నాప్ కేసునుసైబరాబాద్ చందానగర్ పోలీసులు 72గంటల్లో ఛేదించారు. ఈ సందర్భంగా శుక్రవారం సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి రమేష్ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.గత నెల 30వ తేదీ అర్థరాత్రి అనంతరం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిద్రిస్తున్న మహిళ వద్ద నుంచి నెల రోజుల వయస్సు గల ఆడశిశువును కిడ్నాప్ చేసిన ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా తప్పిపోయిన, కిడ్నాప్కు గురైన చిన్నారులను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించే క్రమంలో ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని కేవలం 72 గంటల్లోనే కేసును ఛేదించి పాపను సురక్షితంగా రక్షించారు.పశ్చిమ బెంగాల్కు చెందిన సాధిక మక్సూద్ అనే మహిళకు సంతానం లేకపోవడంతో పాపను అక్రమంగా తెప్పించుకునేందుకు కుట్ర పన్నినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ‘ఆమె బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్న నిమ్మి జహాన్, రహనుమా అలీల సహాయం కోరింది. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డుపై నిద్రిస్తున్న కర్ణాటక కు చెందిన కుటుంబం వద్ద నుంచి పసికందును ఎత్తుకెళ్లి ఆటోలో ఎత్తుకెళ్లారు. ఈ శిశువును తీసుకురావడానికి కిడ్నాపర్లకు సాధిక మక్సూద్ రూ.1.50 లక్షలు చెల్లించినట్లు విచారణలో తేలింది. అనంతరం పాపతో కలిసి కోల్కతాకు వెళ్లేందుకు రైల్వే టికెట్లు కూడా బుక్ చేసుకున్నప్పటికీ, వేగంగా స్పందించి వారిని అదుపులోకి తీసుకుని పాపను రక్షించాం’ అని తెలిపారు.ఈ కేసులో ఏ1 మొహమ్మద్ జుబెర్, ఏ2 మొహమ్మద్ ఇర్ఫాన్, ఏ3 సాధిక మక్సూద్, ఏ4 నిమ్మి జహాన్, ఏ5 రహనుమా అలీలను అరెస్ట్ చేసామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ క్రైమ్స్ శ్రీనివాస్, ఆర్ సి పురం ఏసీబీ వై శ్రీనివాస్ రావు, చందానగర్ సిఐ విజయ్ కుమార్, అమీన్పూర్ డిఐ భాస్కర్ తో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
పెళ్లి పేరుతో మోసం.. యువకుడి అరెస్ట్
హైదరాబాద్, నాగోలు: సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని, ఏఐ ఫోటోలను ఉపయోగించి ఆర్మీ అధికారినని నమ్మిస్తూ ఓ యువతిని మోసం చేసిన వ్యక్తిని గురువారం నాగోలు పోలీసులు అరెస్టు చేశారు.నాగోలు ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపిన మేరకు.. నాగోలు ఆనంద్నగర్కు చెందిన ఓ మహిళకు సోషల్ మీడియా ద్వారా శామీర్పేట్కు చెందిన ముకేరా గోవర్ధన్ (29) పరిచయమయ్యాడు. తాను భారత సైన్యంలో అధికారినని చెప్పి ఏఐ ఫోటోలను పంపి నమ్మించాడు. ఆ తరువాత ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలు చెప్పాడు.ఈ క్రమంలో యువతితో సహజీవనం సాగించాడు. తండ్రి చికిత్స కోసం డబ్బు అవసరం ఉందని పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నాడు. ఆ తరువాత పెళ్లి గురించి నిలదీయగా బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు నాగోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా నిందితుడికి ఇప్పటికే వివాహం జరిగిన విషయం విచారణలో బయటపడింది. అంతేకాక, గత ఏడాది ఆల్వాల్కు చెందిన మరో మహిళను కూడా పెళ్లి పేరుతో మోసం చేసి జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచి్చనట్లు పోలీసులు గుర్తించారు. -
ఎక్కడ దాక్కున్నాడో?
హైదరాబాద్, మణికొండ: నెల రోజుల పాటు రెక్కీ వేసి ఈగల్ టీం అరెస్టు చేసిన డ్రగ్స్ వ్యాపారి సయ్యద్ మహ్మద్ ముజఫర్ ఆలీ ఆచూకీని నార్సింగి పోలీసులు కనిపెట్టలేకపోయారు. బుధవారం తెల్లవారుజామున అతను తప్పించుకున్నప్పటి నుంచి ఈగల్ టీంతో పాటు నార్సింగి పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.పోలీస్ స్టేషన్ బాత్రూం వెంటిలేటర్ ద్వారా అతను బయట పడి, ఏడు అడుగుల ఎత్తు ఉన్న పోలీస్ స్టేషన్ ప్రహరీ దూకి ఔటర్ సర్వీస్ రోడ్డుపైకి పారిపోయినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. సర్వీస్ రోడ్డుపై వస్తున్న ఓ క్యాబ్ను ఆపి అందులో అత్తాపూర్లోని లెనిన్నగర్కు వెళ్లినట్టు పోలీసులు గుర్తించి క్యాబ్ డ్రైవర్ను విచారించిన విషయం తెలిసిందే. నిందితుని వద్ద సెల్ఫోన్ లేకపోవడం, అతని తల్లి, సోదరున్ని పోలీసులు ఇప్పటికే రిమాండ్కు తరలించడంతో అతని కదలికలను కనుక్కోవడం కష్టతరంగా మారింది.ఉన్నతాధికారులు సీరియస్ ఈగల్ టీం శ్రమించి పట్టుకున్న నిందితుడు నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోవటంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలిసింది. నార్సింగి ఇన్స్పెక్టర్ను మందలించడంతో పాటు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. నిందితుడు తప్పించుకునే సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అంజయ్యకు మెమో జారీ చేసినట్టు తెలిసింది. ‘‘నిందితుడు మూత్రం వస్తుందంటూ చెప్పడంతో బాత్రూంకు తీసుకెళ్లాను. అతను వెంటిలేటర్ ద్వారా పారిపోతాడని ఊహించలేదు’’ అని ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చినట్టు సమాచారం. -
అప్పు చేసి కడుతున్న బ్రో..
సిద్ధిపేట జిల్లా: సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా నవ్వించే రీల్స్.. వాటికి జోడీగా బ్రహ్మానందం లాంటి హాస్య నటుల వీడియోలు జోడిస్తుంటారు. వాహనాల వెనుక ‘నన్ను చూసి ఏడవకురా.. నీ ఏడుపే నా ఎదుగుదల’ వంటివి చూస్తుంటాం. కానీ సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఓ వ్యక్తి నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి వినూత్నంగా ఫ్లెక్సీ పెట్టారు. ఆశ్చర్యకరంగా ముఖం పెట్టిన బ్రహ్మీ ఫొటోతో ‘అప్పు చేసి కడుతున్న బ్రో’ అనే వాక్యాన్ని జోడించాడు. అటువైపు వెళ్లే వా రు ఆ ఫ్లెక్సీలు చూసి నవ్వులు చిందిస్తున్నారు.తల్లిమృతదేహం వద్ద కోతిపిల్ల రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తల్లి కోతి ప్రాణాలు కోల్పోయింది. తల్లి చనిపోయిన విషయం తెలియని పసికూన తల్లి మృతదేహాన్ని గట్టిగా హత్తుకుని ఒడిలోనే నిద్ర పోయింది. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది. – తంగళ్లపల్లి(సిరిసిల్ల) -
డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్టుపై కొనసాగుతున్న ఉత్కంఠ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అంశం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. నిన్న గురువారం తెల్లవారుజామున పటాన్చెరువు డీఎస్పీ భీమ్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భీమ్రెడ్డి ఇంట్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. రూ.200 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించారు. దీంతో పెద్ద ఎత్తున బినామీల పేరుమీద ఈ ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ తెలిపారు. నిన్న రాత్రి నోటీసులు జారీ చేసిన ఏసీబీ.. బీనామీలను విచారించాకే భీమ్రెడ్డిపై తగిన చర్యలు ఉంటాయని చెప్పారు. -
వ్యవసాయ బావిలో 24 గంటలు
కరీంనగర్ జిల్లా: నీటిలో గంటసేపు ఉంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటిది వ్యవసాయబావిలో 24 గంటలపాటు నరకం అనుభవించిందో మహిళ. బావి యజమాని చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. కరీంనగర్ కిసాన్నగర్కు చెందిన లక్ష్మి అడ్డా కూలీ. నిత్యం నగరంలోని టవర్ సర్కిల్ వద్ద ఉన్న లేబర్ అడ్డా వద్దకు పని కోసం వస్తుంది. బుధవారం ఉదయం కూడా అడ్డా మీదకు వచ్చింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పని ఉందని పిలిచాడు. రాపిడో బైక్ బుక్ చేసి తిమ్మాపూర్ స్టేజీ వరకు పంపించాడు. మరో బైక్పై వెనకే వెళ్లాడు. తిమ్మాపూర్ నుంచి తన బైక్ ఎక్కించుకొని నుస్తులాపూర్ శివారులోని ఓ రైతు వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను బెదిరించి, ఒంటిపై ఉన్న బంగారం లాక్కొని, బావిలోకి తోసేశాడు. లక్ష్మికి ఈత రావడంతో దరికి చేరి తాడు పట్టుకుంది. ఆ తాడును కోసేసి అతను అక్కడి నుంచి పరారయ్యాడు. బావిలో దొరికిన మరో ఆసరాతో బుధవారం రాత్రంతా, గురువారం మధ్యాహ్నం వరకు లక్ష్మి బావిలోనే ఉండిపోయింది. మిస్సింగ్ కేసు నమోదుతో.. బుధవారం రాత్రయినా ఇంటికి రాకపోవడంతో లక్ష్మి కొడుకు కరీంనగర్లోని త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. ఉదయం లేబర్ అడ్డా వద్ద తన తల్లిని డ్రాప్ చేశానని, ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా లక్ష్మి నుస్తులాపూర్ ఏరియాలో ఉన్నట్టు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం వ్యవసాయ బావివద్దకు వెళ్లిన పొలం యజమానికి బావిలోంచి అరుపులు వినిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు బావి వద్దకు చేరుకొని మహిళను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. రాపిడో బుక్ చేసిన వివరాలు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
తరగతి గదిలో నాగుపాము
మదనాపురం: వనపర్తి జిల్లా మద నాపురం మండలంలోని తిర్మలాయపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం ఉదయం భారీ ప్రమా దం తప్పింది. పాఠశాలలోని ఒకటో తరగతి గదిలో 30 మంది విద్యార్థులు పాఠాలు వింటున్నారు. అదే సమయంలో నాలుగు అడుగుల పొడవైన నాగుపాము క్లాసులోకి వచ్చేసింది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. నాగుపాము ప్రవేశించ డాన్ని గమనించిన ఉపాధ్యా యుడు కిరణ్కుమార్ వెంటనే హెచ్ఎంకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా ఒక్కొక్కరిని బయటకు పంపించి ప్రాణాపాయం తప్పించారు. వెంటనే కొత్తకోటలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు, హోంగార్డు కృష్ణసాగర్కు సమాచారం అందించారు. వెంటనే ఆయన పాఠశాలకు చేరుకుని పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఉపాధ్యా యులని, కృష్ణసాగర్ను గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందించారు. -
పెళ్లిరోజు నాకు ఇష్టమైన చికెన్ ఎందుకు వండలేదు..!
హైదరాబాద్: వివాహ వార్షికోత్సవం రోజే ఇంట్లో చికెన్ వండలేదని భార్యపై దాడి చేసిన భర్తను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పంజగుట్ట పోలీసులు తెలిపిన మేరకు... బీఎస్ మక్తలో నివాసం ఉన్న ప్లంబర్ ప్రతాప్ (42), భార్య దీపికతో నివాసముంటున్నారు. జూన్ 26న వీరి వివాహ వార్షికోత్సవం. ఆ రోజు రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తకు భోజనం వడ్డించగా, ‘‘పెళ్లిరోజు నాకు ఇష్టమైన చికెన్ ఎందుకు వండలేదని’’ గొడవ పడ్డాడు. మాటామాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రతాప్ పక్కనే ఉన్న కర్రతో భార్య తలపై బలంగా కొట్టాడు. స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రిలో చేరి్పంచారు. కోలుకున్న తరువాత దీపిక పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రతాప్ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. -
బాలుడిపై లైంగిక దాడి కేసు.. ఉపాధ్యాయుడికి 20 ఏళ్ల జైలు
హైదరాబాద్: మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన మదర్సా ఉపాధ్యాయుడికి నాంపల్లి న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బండ్లగూడ ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపిన మేరకు.. క్యూబా కాలనీకి చెందిన సయ్యద్ నదీం(22) షాహిన్నగర్ అలైన్ హిల్స్లోని ఓ మదార్సాలో ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నాడు. ఇదే మదర్సాలో విద్యనభ్యసిస్తున్న బాలుడి(11)ని 2022 మార్చిలో ఇంటికి తీసుకెళ్లి అసహజ రీతిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడి తండ్రి ఇచి్చన ఫిర్యాదు మేరకు పోక్సో కింద కేసు నమోదు చేసి నాంపల్లి పోక్సో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నాంపల్లి పోక్సో కేసులు 12వ ఏఎస్జే కోర్టు న్యాయమూర్తి ఎం.అర్చన కుమారీ నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరిచారు. -
ప్రముఖ రెస్టారెంట్ బార్బిక్యూ నేషన్లో కుళ్లిన మాంసం
హైదరాబాద్: ప్రముఖ రెస్టారెంట్ బార్బిక్యూ నేషన్లో నిబంధనల ఉల్లంఘనలు మరోసారి వెలుగు చూశాయి. అత్తాపూర్లోని బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో హెచ్– ఫాస్ట్, ఫుడ్సేప్టీ అధికారులు గురువారం నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఫ్రిజ్లో కుళ్లిన మాంసాన్ని గుర్తించారు. కిచెన్ లోపల అపరిశుభ్రత వాతావరణం కనిపించింది. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాడైపోయిన చికెన్, మూడు కేజీల మటన్, రెండు చేపలు, గడువు ముగిసిన ఐస్క్రీమ్లు, కుళ్లిపోయిన పండ్లను గుర్తించారు. పాడైపోయిన, నిల్వ ఉన్న మాంసంపై పాత స్టిక్కర్లను తొలగించి, కొత్తగా ప్యాక్ చేస్తున్నారు. గతంలోనూ ఇదే రెస్టారెంట్లో ఫుడ్సేప్టీ అధికారులు లోపాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. అయినా యాజమాన్యం తీరులో మార్పు రాలేదని ఫుడ్సేఫ్టీ అధికారి సౌమ్యారెడ్డి తెలిపారు. -
హైదరాబాద్ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)
-
ఎకో టౌన్కు ఓకే..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో చెత్త సమస్యలకు పరిష్కారంగా.. ఘన వ్యర్థాల నిర్వహణను మరింత ఆధునిక సాంకేతికతతో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్లో 86 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్న ఎకోటౌన్ ప్రాజెక్టులో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు ఇచ్చిన అనుమతికి తాజాగా అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈమేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ జీఓ జారీ చేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం, జపాన్లోని ప్రిఫెక్చర్కు చెందిన కిటాక్యూషూ నగరం మధ్య కుదిరిన స్నేహ, సహకార ఒప్పందంలో భాగంగా అమలు కానుంది. విజ్ఞప్తికి స్పందించి.. నగరాల్లో సర్క్యులర్ ఎకానమీ విధానాన్ని ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెట్ జీరో లక్ష్యాల సాధన కోసం ఎకోటౌన్ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సిద్ధాపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 252, 278, 361లోని 150 ఎకరాల భూమిని బదిలీ చేయాల్సిందిగా గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ టీజీఐఐసీని కోరారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించిన పరిశ్రమలు, వాణిజ్యశాఖ.. సిద్ధాపూర్లోని 86 ఎకరాల టీజీఐఐసీ భూమిని జీహెచ్ఎంసీకి ఉచితంగా బదిలీ చేసేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరి 11న అడ్వాన్స్ పొజిషన్ సర్టిఫికెట్ ద్వారా ఈ భూమిని జీహెచ్ఎంసీకి అప్పగించారు. హెచ్ఐఎంఎస్డబ్ల్యూకు వ్యర్థాల నిర్వహణ బాధ్యతలు.. 86 ఎకరాల స్థలంలో ఘనవ్యర్థాల నిర్వహణ సదుపాయాలు కలి్పంచేందుకు వీలుగా హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (హెచ్ఐఎంఎస్డబ్ల్యూ) సంస్థకు ‘క్యూర్’ స్పెషలాఫీసర్ ఇదివరకే అనుమతులిచ్చారు. ఆ అనుమతుల్ని పరిశీలించిన ప్రభుత్వం ఇప్పుడు ధ్రువీకరిస్తూ జీఓ జారీ చేసింది. సంబంధిత చట్టాలు, నిబం«ధనలు ,ప్రభుత్వ ఉత్తర్వులు, ఇంటిగ్రేటెడ్ మున్సిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ఒప్పంద నిబంధనల ప్రకారమే ప్రాజెక్టును అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ను ప్రభుత్వం ఆదేశించింది.ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు మరింత బలం..ఎకో టౌన్ ప్రాజెక్టు అమల్లోకి వస్తే హైదరాబాద్లో ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు మరింత బలం చేకూరడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, వనరుల పునరి్వనియోగం, సుస్థిర నగరాభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. జవహర్నగర్ డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారంగానూ.. నగరం నలు వైపులా ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడం తెలిసిందే. -
పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ముఖం చాటేసింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు సవాల్ విసిరిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు పోలీసులను అడ్డు పెట్టుకుని ముఖం చాటేసిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఎద్దేవా చేశారు. రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరి, చర్చకు రాకుండా తోక ముడిచి పారిపోయారన్నారు. అప్పులపై పూటకో లెక్క చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గురువారం గన్పార్క్ వద్దకు బయలుదేరిన హరీశ్ను అడ్డుకుని పోలీసులు కంచన్బాగ్ పోలీస్స్టేషన్కు తరలించగా, విడుదల అనంతరం తెలంగాణ భవ¯న్కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణకు భవన్కు మంత్రులు రాకుండా ముఖం చాటేయడంతో గన్పార్కుకు వెళ్లే క్రమంలో పోలీసులు నన్ను అడ్డుకున్నారు. సవాలు విసిరి మాట నిలుపుకోలేక పోయిన మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే రాజీనామా చేయాలి. అప్పులపై అసెంబ్లీ వేదికగా వాస్తవ లెక్కలు చెప్పినా ప్రభుత్వం తప్పుడు గణాంకాలతో తప్పుదోవ పట్టిస్తోంది’అని హరీశ్రావు విమర్శించారు. భారీగా కమీషన్లు దండుకున్నారు.. ‘గురుకుల విద్యా సంస్థలకు సంబంధించిన కిరాణా, యూనిఫాంలు, నోట్బుక్స్, ఇతర కొనుగోళ్ల టెండర్లలో దాదాపు రూ.2 వేల కోట్ల మేర అవకతవకలు జరిగాయి. కిరాణా సరుకులు, వంటనూనెలను అధిక ధరలకు కొనుగోలు చేసి కమీషన్లు దండుకున్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కలి్పంచేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచి్చన జీవోలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘించింది. స్థాని కంగా ఇవ్వాల్సిన ఆర్డర్లను గుజరాత్కు చెందిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. చేనేతల ప్రయోజనాలను కాపాడాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. లిడ్క్యాప్ ద్వారా జరగాల్సిన కొనుగోళ్లను నిలిపివేసి దళిత సంస్థలకు అన్యాయం చేశారు. నోట్బుక్స్ టెండర్లలో కమీషన్ల కోసమే నిబంధనలు మార్చారు. వివాదం బయటపడిన తర్వాత టెండర్లను రద్దు చేయడంతో ఇప్పటికీ విద్యార్థులకు నోట్బుక్స్ అందలేదు..’అని హరీశ్రా>వు ధ్వజమెత్తారు. ప్రవీణ్కుమార్పై కక్షసాధింపు ‘గురుకుల టెండర్ల అక్రమాలను ఆధారాలతో ప్రశ్నిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. ఆయన భద్రతను తగ్గించడంతో పాటు, ఉద్యోగ విరమణకు చేరువలో ఉన్న ఆయన భార్యను ఆకస్మికంగా అప్రధాన ప్రాంతానికి బదిలీ చేశారు..’అని హరీశ్రావు మండిపడ్డారు. కమీషన్ల కుట్ర: ప్రవీణ్కుమార్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. ‘జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీలను రద్దు చేసి జీవో–17 ద్వారా సింగిల్ విండో విధానం తీసుకురావడం వెనుక కమీషన్ల కుట్ర జరిగింది. హైకోర్టును తప్పుదోవ పట్టించి కొద్ది కంపెనీలకే టెండర్లు కట్టబెట్టారు. స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంస్థలకు అవకాశాలు లేకుండా చేశారు. జీవో–17ను వెంటనే రద్దు చేసి, గురుకుల టెండర్లపై సమగ్ర విచారణ జరపాలి..’అని డిమాండ్ చేశారు. -
కుర్చీ, శాలువా రెడీ చేసినా రాలేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు సవాల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన మంత్రులు చర్చకు రాకుండా తోక ముడిచి పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చకు వస్తానని చెప్పడంతో ప్రత్యేకంగా కుర్చి, శాలువా సిద్ధం చేసి మూడు గంటల పాటు వేచి చూసినా రాలేదన్నారు. గురువారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గన్పార్క్ వద్ద చర్చకు వెళ్లేందుకు సిద్ధమైతే హరీశ్రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. నన్ను కూడా తెలంగాణ భవన్ నుంచి బయటకు రానీయకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఒకవైపు మంత్రులు సవాళ్లు విసురుతుంటే మరోవైపు పోలీసులతో మమ్మలను అడ్డుకోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం. కంచ¯న్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించిన పార్టీ నేతలను పరామర్శించేందుకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. చర్చించే ధైర్యం లేక ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనించారు..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో సదస్సులు ‘రాష్ట్రంలో ’ఆర్ఆర్ టాక్స్’వసూళ్లపై ప్రధానమంత్రి వ్యాఖ్యల తర్వాత కూడా బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అమత్, హోలోగ్రామ్ టెండర్లలో అవినీతి ఆరోపణలపై విచారణ ఎందుకు జరగడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ నేతలకు చెందిన సంస్థలకు కాంట్రాక్టులు ఎలా దక్కుతున్నాయో సమాధానం చెప్పాలి. కాంగ్రెస్–బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యాయి. ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 14 డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. త్వరలో రైతు, యువజన, విద్యార్థి సదస్సులు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ముఖ్యమంత్రి, మంత్రులు ఈరోజు చర్చ నుంచి తప్పించుకున్నా ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాటం ఆగదు..’అని కేటీఆర్ అన్నారు. వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి‘ముఖ్యమంత్రి రేవంత్కు నిజంగా చర్చించే ధైర్యం ఉంటే వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. సభలో మైక్ కట్ చేయకుండా మాకు మాట్లాడే అవకాశం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి, ఎన్నికల హామీల అమలుపై పూర్తి వివరాలను ప్రజల ముందు పెడతాం. రాష్ట్ర అప్పుల విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం పొంతన లేని గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆర్బీఐ, కాగ్ వెల్లడించిన లెక్కలే దీనికి ప్రామాణికం. బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులపై వాస్తవాలు ప్రజలకు తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాకి లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా శిఖండి రాజకీయాలు చేస్తోంది..’అని కేటీఆర్ మండిపడ్డారు. -
కాంట్రాక్టు పోస్టుల నియామక ‘వివాదం’
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు పోస్టుల నియామక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఇవ్వడంపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్ళాయి. వైస్ చాన్స్లర్కు అనుకూలమైన వ్యక్తులు తమ అనుయాయులకు ఈ పోస్టులు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా సీరియస్గా ఉన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్ళేందుకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జేఎన్టీయూహెచ్ వర్గాల నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. మరోవైపు సీఎంవోకు అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. తెర వెనుక సూత్రధారులపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు యూనివర్శిటీ పరిధిలో జరుగుతున్న పలు అంశాలపై కూడా సీఎంవో దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిసింది. పాలక మండలి ఆగ్రహం: జేఎన్టీయూహెచ్లో కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో 568 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 67 పోస్టులకు నెలకు రూ. 50 వేల వేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ తరహా నియామకం చేపట్టే ముందు పాలక మండలిలో చర్చించాల్సి ఉంది. గతంలో ఏ యూనివర్శిటీలో పోస్టులు భర్తీ చేసినా ఈ నిబంధనలనే అనుసరించారు. జేఎన్టీయూహెచ్లో ముందు నియామకం చేపట్టి, ఆ తర్వాత పాలక మండలి ర్యాటిఫికేషన్కు పంపుతామని అధికారులు చెబుతున్నారు. దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే యూనివర్సిటీ పరిధిలోని సుల్తాన్ పూర్లోనూ పాలక మండలి అనుమతి తర్వాతే నియామకాలు చేపట్టారు. పోస్టులకు రాత పరీక్ష కూడా లేకపోవడంతో అధికారుల ఇష్టానుసారం భర్తీ చేసే వీలుందని చెబుతున్నారు. పాలేరు కాలేజీలో చేపట్టిన టెండర్ల వ్యవహారం, యూనివర్శిటీలో ల్యాబ్ పరికరాల కొనుగోలులో అక్రమాలు, పలు పరీక్షల నిర్వహణలో వచ్చిన ఫిర్యాదులపైనా సీఎంవో విచారణ చేపట్టాలని నిర్నయించినట్లు తెలిసింది. -
కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ!
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో దేశంలోని కంపెనీలు దూసుకుపోతున్నప్పటికీ ఉన్నత విద్యావ్యవస్థ మాత్రం పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా మారలేక కొట్టుమిట్టాడుతోంది. యూకేకు చెందిన గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనలిటిక్స్ కంపెనీ క్యూఎస్ తాజాగా విడుదల చేసిన క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్–2027 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో విశ్వవిద్యాలయాల విద్య, మారుతున్న శ్రామిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మానవ వనరుల లభ్యత ఆధారంగా రూపొందించిన ఈ సూచీలో.. భారత్ 89.4 స్కోర్తో స్వీడన్, జపాన్లను వెనక్కినెట్టి 13వ స్థానంలో నిలిచింది. అలాగే భవిష్యత్తు ఉద్యోగాల సన్నద్ధతలో భారత్ 5వ స్థానం సాధించింది. కానీ అదే సమయంలో మన కాలేజీలు మాత్రం ఇంకా పాత సిలబస్తోనే విద్యార్థులను బయటకు పంపుతున్నాయి. ఫలితంగా పరిశ్రమలు కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నా.. వాటికి సరిపోయే నైపుణ్యాలు గల అభ్యర్థులు దొరకడం లేదు. భారతీయ సాంకేతిక గ్రాడ్యుయేట్లపై పరిశ్రమలకు నమ్మకం క్రమంగా తగ్గుతోందని క్యూఎస్ గ్లోబల్ ఎంప్లాయర్ సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో భారతీయ విద్యాసంస్థల ఎంప్లాయర్ రెప్యుటేషన్ స్కోర్ 2017లో 997గా ఉండగా 2026 నాటికి అది ఏకంగా 2,132కి (స్కోర్ పెరిగేకొద్దీ నాణ్యత తగ్గినట్టు) పడిపోయింది. వలసల ముప్పు.. భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా శ్రామిక శక్తిని, విద్యార్థులను విదేశాలకు పంపుతున్న దేశం. 2030 నాటికి దాదాపు 10 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోనున్నట్లు అంచనా. ఈ పరిణామం మేధో వలసల ముప్పును తెచ్చిపెడుతోంది. దేశంలోని ప్రతిభావంతులను ఇక్కడే నిలుపుకుంటూ స్థానికంగా ఉన్న కోట్లాది మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు కల్పించడం ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది. డ్రాగన్తో పోటీ.. క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్–2027లో 92.5 స్కోర్తో చైనా 7వ స్థానంలో ఉంది. చైనా ఏటా లక్షలాది మంది స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోంది. వారంతా నేరుగా ప్రభుత్వరంగ పరిశ్రమల్లోకి, సాంకేతిక సంస్థల్లోకి ప్రవేశించేలా అక్కడ పటిష్టమైన యంత్రాంగం ఉంది. దీనివల్ల వారి స్కిల్స్ అలైన్మెంట్ స్కోరు 98.0గా ఉంది. అయితే భారీ మౌలిక వసతులు ఉన్నప్పటికీ చైనా ఫ్యూచర్ ఆఫ్ వర్క్ సూచీలో 80.2 స్కోరుతో వెనుకబడింది. చైనాలో ఇప్పటికీ తయారీ, వ్యవసాయ రంగాల్లో ఎక్కువ మంది శ్రామికులు ఉన్నారు. ఏఐ విప్లవం వల్ల ఈ ఉద్యోగాలన్నీ ఆటోమేషన్కు గురై భారీగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చైనాతో పోలిస్తే భారత్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ విభాగంలో 96.0 స్కోరుతో మెరుగ్గా ఉంది. మన సేవా రంగం, ఐటీ రంగాలు ఏఐ ద్వారా భర్తీ చేసేవి కావు. పైగా ఏఐతో కలిసి నడిచేవి. కానీ చైనాలాగా గ్రాడ్యుయేట్లను నేరుగా ఉద్యోగాల్లోకి తీసుకునే స్కిల్స్ అలైన్మెంట్ మనకు లేకపోవడం లోటుగా మారుతోంది. ఈ విభాగంలో 82.7 స్కోర్తో 18వ స్థానానికి పరిమితమైంది. ఎందుకంటే.. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాణిస్తూ ప్రపంచ అత్యుత్తమ 250 వర్సిటీల జాబితాలో చోటు సంపాదిస్తుంటే దేశంలోని మిగిలిన వెయ్యికిపైగా విశ్వవిద్యాలయాలు, 40 వేలకుపైగా కాలేజీలు కేవలం డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తున్నాయి తప్ప ఉద్యోగాలకు పనికొచ్చే నైపుణ్యాలను అందించలేకపోతున్నాయి. కంపెనీలు వెతుకుతున్న ప్రధాన నైపుణ్యాలు ఇవే – సమస్యలను విశ్లేషించడం, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత. భారతీయ విద్యార్థుల్లో ఈ నైపుణ్యాల కొరత ఎక్కువగా ఉందని టాప్ కంపెనీలు చెబుతున్నాయి. – ఉద్యోగార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ లేకపోవడం కూడా అడ్డంకిగా మారుతోందని అంటున్నాయి. – వ్యాపార దృక్పథంతో ఆలోచించడం, రిస్క్ తీసుకునే తత్వం తదితర లక్షణాలున్న ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి. -
చదువులీ గతి నుంటే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సరిపడా తరగతి గదుల్లేక వరండాలు, చెట్ల కిందే చదువులు కొనసాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేక ఒంటికైనా, రెంటికైనా క్యూలో నిలబడాల్సి వస్తోంది. వర్షం పడితే అప్రకటిత సెలవు ప్రకటించే దుస్థితి ఏర్పడింది. ఏటా రూ. 2,500 కోట్లు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే రాష్ట్రంలో విద్యా శాఖ పరిధిలో 24,984 పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు ఉండగా, వాటిల్లో 19,45,805 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలలు, సెంట్రల్ స్కూల్స్, సంక్షేమ గురుకులాలను కలుపుకుంటే రాష్ట్రంలో 39,789 పాఠశాలలు ఉండగా, 68,73,019 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో ప్రభుత్వ స్కూళ్ల కోసమే ప్రభుత్వం ఏటా సమగ్ర శిక్షా అభియాన్ కింద 2,044 కోట్లు ఖర్చు చేస్తోంది. మధ్యాహ్న భోజనం కింద మరో రూ. 600 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. సదుపాయాలు అంతంతే ప్రభుత్వ పాఠశాలలకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చించినా, మౌలిక వసతులు చేకూరడం లేదు. కనీసం బాల బాలికలకు వేర్వేరుగా పూర్తి స్థాయిలో టాయిలెట్ సదుపాయం కూడా కల్పించలేకపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో బాలుర టాయిలెట్లు 83.6 శాతమే ఉండగా, బాలికలకు ప్రత్యేకంగా 91.4 శాతం టాయిలెట్లు ఉన్నాయి. నిర్మాణాలు చేస్తున్నా..తరగతి గదుల కొరతే పాఠశాలలకు పక్కా భవనాలు, అదనపు తరగతి గదులకు ప్రభుత్వం రూ.వందల కోట్లు వెచ్చిస్తోంది. అయినా విద్యార్థులకు చెట్ల కింద చదువులు తప్పడం లేదు. కొన్నిచోట్ల ఒకే గదిలో రెండు మూడు తరగతులుకు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. 2024–25 కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే ప్రభుత్వ, ప్రైవేట్ కలుపుకొని రాష్ట్రంలో 43,154 పాఠశాలలు ఉంటే అందులో బాలికలకు ప్రత్యేకంగా 39,454 టాయిలెట్లు మాత్రమే పని చేసేవి ఉన్నాయి. 36,085 మాత్రమే బాలుర టాయిలెట్లు పని చేస్తున్నాయి. అంటే 3700 బాలికల టాయిలెట్లు, 7,069 బాలుర టాయిలెట్ల కొరత నెలకొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2024 నుంచి ఇప్పటివరకు అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ప్రభుత్వం రూ.706 కోట్లు వెచ్చించి 58,632 నిర్మాణాలు చేపట్టినట్టు ప్రభుత్వ నివేదికల్లోనే పేర్కొంది. ఇందులో టాయిలెట్లు, తరగతి గదులు, ప్రహరీల నిర్మాణానికి రూ.510 కోట్లు వెచ్చించామని చెబుతున్నా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మధ్యాహ్న భోజన వర్కర్ ఇల్లే పాఠశాలభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నారాయణపురంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం గత ఏడాది ఆగస్ట్లో కురిసిన వర్షాలకు పాడైంది. అప్పటి నుంచి స్లాబ్ నుంచి పెచ్చులు ఊడి పడటంతోపాటు కురుస్తోంది. దీంతో పాఠశాలను మధ్యాహ్న భోజనం వర్కర్ ఇంటి వసారాలో రేకుల కింద తరగతులు నిర్వహిస్తున్నారు. బిల్లులు రాక...నిర్మాణాలు జరగక సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని ముత్యాల నగర్ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఒక గదిలో రెండు తరగతుల విద్యార్థులకు, వరండాలో మూడు తరగతుల విద్యార్థులను కూర్చోబెట్టి ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ఒక్కో సారి చెట్ల కింద కూర్చోబెడుతున్నారు. మూడేళ్ల కిందట ఈ పాఠశాలకు 4 గదులు మంజూరయ్యాయి. ఆ గదులు నిర్మాణంలో ఉండగా బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. జెడ్పీ పాఠశాలలోనూ... ఇది నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి.ఇక్కడ 9 గదులున్నా లైబ్రరీ, స్టాఫ్ రూమ్, కంప్యూటర్ ల్యాబ్, ఆఫీస్ రూం కోసం నాలుగు గదులను కేటాయించారు. మిగతా ఐదు గదులున్నా సరిపోకపోవడంతో చెట్టు కింద పాఠాలు చెప్పాల్సి వస్తోంది. -
మడతపెట్టే ఎలక్ట్రిక్ సైకిల్
కోరుట్లటౌన్/జగిత్యాలరూరల్: జగిత్యాల జిల్లా కోరుట్లలోని పీఎంశ్రీ జెడ్పీ పాఠశాల విద్యార్థులు, జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లు కేంద్ర ప్రభుత్వ బిల్డథాన్కు ఎంపికయ్యాయి. ఫోల్డింగ్ ఎలక్ట్రిక్ సైకిల్ను ‘వోకల్ ఫర్ లోకల్’అనే అంశంపై ఆ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు చందా నాగరాజు పర్యవేక్షణలో కోరుట్ల విద్యార్థులు ఎస్.మాని, కె.హారిక, డి.మధులిక, జి.రేవతి, జి.ప్రణీత్ తయారు చేశారు. ఈ సైకిల్ మడతపెట్టి తక్కువ స్థలంలోనే ఉంచే సౌకర్యం ఉంది. తయారు చేసిన విధానం నాలుగు ఫీట్ల పొడవున్న పాత సైకిల్, ఒక చిన్న బ్యాటరీ, ఒక విద్యుత్ మోటారు తీసుకున్నారు. సైకిల్ను 2 ఫీట్లకు రెండు భాగాలుగా వెల్డర్ సాయంతో కట్ చేయించారు. తలుపులకు వాడే ఇండెస్ పట్టీల సాయంతో ఫోల్డింగ్ అయ్యేలా అమర్చారు. బ్యాటరీకి మోటారు బిగించి సైకిల్ ముందు భాగంలో ఫిట్ చేసి.. నడిచేలా రూపొందించారు. దీనిని బస్సులోనూ తీసుకెళ్లవచ్చు. ఇంధన వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని విద్యార్థులు ప్రాజెక్ట్లో భాగంగా నమూనాను ఆన్లైన్లో అప్లోడ్ చేయగా.. బిల్డథాన్కు ఎంపికైనట్టు సమాచారం వచ్చిందని జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, పాఠశాల హెచ్ఎం వడ్లకొండ గంగాధర్ తెలిపారు.సేఫ్ హోమ్ ఎగ్జిట్ పేరిట.. కండ్లపల్లి మోడల్ స్కూల్కు చెందిన ఎండీ.యాసర్ అబాసి, సీహెచ్.మహత్, కే.దినేష్ కలిసి గైడ్ టీచర్ సి.శివకృష్ణ (పీజీటీ) పర్యవేక్షణలో సేఫ్ హోమ్ ఎగ్జిట్ పేరిట గ్యాస్ టర్న్ ఆఫ్ డివైస్ రూపొందించారు. ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు గ్యాస్ సిలిండర్ను ఆఫ్ చేయడం మరిచిపోయినా ఈ పరికరం సిగ్నల్ ఇస్తుంది. సిలిండర్ ఆఫ్ చేస్తేనే ఇంటి తలుపులు క్లోజ్ అవుతాయి. తద్వారా ప్రమాదాలను నివారించొచ్చు. -
ఊహలు గుసగుసలాడే..!
సాక్షి, హైదరాబాద్: ఊహలకు రెక్కలు రావటం, వాటికి ఓ రూపం ఇవ్వడం ఇప్పుడే కాదు, రాతియుగంలోనూ ఉంది. ములుగు జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన అతి అరుదైన రాతి వర్ణ చిత్రాలే ఇందుకు నిదర్శనం. బృహత్ శిలా యుగంలో మనిషి కొన్ని అలంకార వస్తువులను రూపొందించే సృజనను సొంతం చేసుకున్నప్పటికీ, వ్రస్తాలు, శరీరంపై ధరించే ఆభరణాలను తయారు చేసుకోవటం మాత్రం తెలియని కాలం. అయితే మనిషి చిత్రాన్ని నిలువెల్లా అలంకరిస్తూ తమ ఊహకు ప్రాణం పోశారు ఆదిమానవులు. మన చరిత్రలో కొత్త కోణాలను ఆవిష్కరించేందుకు ఉపకరించేలా ములుగు పట్టణానికి 30 కి.మీ. దూరంలోని బండ్లపహాడ్ అటవీప్రాంతం మొద్దు గుట్ట, దర్వాజాల గుట్ట, నెమలిగుట్టల్లో ఈ చిత్రాలు వెలుగుచూశాయి. గుట్ట గుహల్లో రంగు చిత్రాలు‘పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ (ప్రిహా)’సభ్యులైన గడ్డం క్రాంతికుమార్, తాటి సాంబశివరావు తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.శ్రీనివాసన్ నేతృత్వంలో ఈ చిత్రాలను వెలుగులోకి తెచ్చారు. ఆదిమానవుల వేల ఏళ్ల పరిణామ క్రమానికి ఆ ప్రాంతం సాక్ష్యంగా నిలిచింది. అక్కడ వారి మనుగడకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. కాగా 10 వేల ఏళ్ల నుంచి వేయి సంవత్సరాల క్రితం వరకు అంటే మధ్యరాతియుగం, కొత్త రాతియుగం, బృహత్శిలాయగం కాలాల్లో ఈ ప్రాంతాల్లోని గుట్ట గుహల్లో రంగు చిత్రాలు గీశారు. వేల ఏళ్ల కాలంలో ఒక కాలం నాటి చిత్రాలపై మరో కాలంలో సూపర్ ఇంపోజ్ చేశారు. మానవాకృతులు, జింక, ఎద్దు, తాబేలు, నక్క, నెమలి, అడవి దున్న లాంటి చిత్రాలున్నాయి. కొన్ని అంతుచిక్కని గీతలతో కూడిన డిజైన్ చిత్రాలు కూడా ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఎరుపు, కొన్ని తెలుపు రంగుల్లో ఉన్నాయి. కాలక్రమంలో కొన్ని కొంత మలిగిపోగా, కొన్ని బండరాళ్ల పెచ్చులూడి కొంతమేర కనుమరుగయ్యాయి. అరుదైన మానవాకృతి చిత్రాలు మానవాకృతి చిత్రాలు వీటిల్లో అత్యంత అరుదైనవి. నిలువెత్తు చిత్రాల్లో ఓ నిలువు మనిషి చిత్రంలో శరీరం యావత్తు డిజైన్తో నింపేసి ఉంది. డిజైన్లతో కూడిన చొక్కా వేసుకుని, శరీరం నిండా ఆభణాలు ధరిస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తోంది. కానీ అప్పటికి వస్త్రధారణ పద్ధతి లేనందున, వాస్తవానికి అది చొక్కా కాదు, కానీ డిజైన్ల వల్ల అలా కనిపిస్తోంది. అంటే ఆ కాలంలో లేనిదాన్ని ఊహాజనితంగా గీశారన్నమాట. ఇక అడ్డంగా ఉన్న మనిషి బొమ్మ తల నుంచి మిగతా భాగాలన్నీ అలంకరణలతో నింపేశారు. దాన్ని చూస్తే ఈ కాలం మోడ్రన్ ఆర్ట్ స్ఫురణకొస్తుంది.ఇందులో రకరకాల ఆకృతులతో అద్భుత కాన్వాసులాగా మార్చారు. ‘గతంలో బొమ్మల లొద్దిలో గుర్తించిన కళాత్మక మానవాకృతి చిత్రాలతో పోలిస్తే ఇది మరింత భిన్నంగా, కొత్తగా కనిపిస్తోంది. ఇలాంటి చిత్రాలు చాలా అరుదు, భిన్నమైనవి..’అని శ్రీనివాసన్ పేర్కొన్నారు. ‘ఇంతటి కళాత్మక చిత్రాలను నేను ఇప్పటివరకు చూడలేదు. చాలా అరుదైన ఈ చిత్రాలను కాపాడాల్సిన అవసరం ఉంది, వీటి ఆధారంగా పరిశోధిస్తే చరిత్రలో కొత్త కోణాలు వెలుగుచూస్తాయి..’అని ఆదిమానవుల చిత్రాల నిపుణులు డాక్టర్ బండి మురళీధర్రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రాలను రసాయన ప్రక్రియ ద్వారా మెరుగ్గా మార్చి భావితరాలు చూసేందుకు వీలుగా పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు -
ఈ స్కోరు.. పిల్లలకు జరూరు!
సాక్షి, హైదరాబాద్/లాలాపేట: బడి వయసు పిల్లల్లో (6–10 ఏళ్లు) సూక్ష్మ పోషకాల లోపాలను సులభంగా గుర్తించేందుకు హైదరాబాద్లోని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు ఒక వినూత్న స్క్రీనింగ్ పద్ధతిని రూ పొందించారు. దీనికి ‘డైట్ డైవర్సిటీ స్కోర్’అని పేరు పెట్టారు. వీరు ఆహార పదార్థాలను 13 రకాలుగా వర్గీకరించారు. ఒక రోజులో ఆ చిన్నారి తీసుకునే విభిన్న ఆహార పదార్థాలనుబట్టి ఈ స్కోర్ ఆధారపడి ఉంటుంది. స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత నాణ్యమైన ఆహారాన్ని తీసుకున్నట్టు. 13 రకాల ఆహారాలతో.. భారత్ వంటి మధ్య ఆదాయ దేశాలలో పిల్లల్లో ఐరన్, క్యాల్షియం, విటమిన్ బి–12, విటమిన్–ఏ వంటి సూక్ష్మపోషకాల లోపం పెద్ద సవాలుగా మారింది. ఇది పిల్లల పెరుగుదల, రోగనిరోధక శక్తి, చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనిని నివారించడానికి పరిశోధకులు సాధారణ ఆహారాలను వాటిలోని పోషక విలువల ఆధారంగా 13 నిర్దిష్ట సమూహాలుగా వర్గీకరించారు. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి విస్తృత ఆహార సమూహాలను సాధారణంగా ఉపయోగించినప్పటికీ, పోషకాల ప్రొఫైల్స్లోని వ్యత్యాసాలను మెరుగ్గా గుర్తించడానికి పరిశోధకులు ఈ సమూహాలను మరింత ఉప–విభాగాలుగా విభజించారు. ఉదాహరణకు విటమిన్ ‘ఎ’ఎక్కువగా ఉండే క్యారెట్, క్యాప్సికమ్, తోటకూర, బొప్పాయి, మామిడి వంటి వాటిని ప్రత్యేక కేటగిరీగా చూపారు. 5 గ్రాముల కనీస కొలత భారతీయ ఆహార అలవాట్లలో కూరలు, పప్పులు కలిపి తీసుకుంటుంటారు. అందుకే కేవలం 5 గ్రాముల పరిమాణంలో ఏదైనా ఆహార పదార్థాన్ని తీసుకుంటే చాలు. స్కోరును లెక్కించవచ్చు. పరిశోధన ప్రకారం.. 24 గంటల్లో చిన్నారి తీసుకునే పాలు, పాల ఉత్పత్తులు; పండ్లు, గింజలు, కొవ్వులు, గుడ్లు, మాంసం, తృణధాన్యాలు, చిరుధాన్యాలు; పప్పులు, ఆకుకూరలు, కందమూలాలు, కూరగాయల ఆధారంగా స్కోర్ను లెక్కించొచ్చు. 13 ఆహార సమూహాల్లో కనీసం 10 గ్రూపుల ఆహారాన్ని (ప్రతీది కనీసం 5 గ్రాములు) రోజూ తీసుకునే పిల్లలు తమకు కావలసిన 70 శాతం సూక్ష్మపోషకాలను సులభంగా పొందగలుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది వారిలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా దోహదపడుతోంది. అందరికీ ఉపయోగకరం.. ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన శాస్త్రవేత్త డా. సుబ్బారావు ఎమ్.గవరవరపు మాట్లాడుతూ ‘తినే విభిన్న ఆహార పదార్థాలనుబట్టి ఎంత నాణ్యమైన ఆహారాన్ని తీసుకుంటున్నామని లెక్కించడం అత్యంత ప్రాచీన, ఆచరణాత్మకమైన సూచికల్లో ఒకటి. సంక్లిష్టంగా ఉండే ఆహార గణన ప్రక్రియను సులభంగా ఉపయోగించగల స్కోరింగ్ను సాధన రూపంలోకి మార్చడం ద్వారా.. పిల్లల్లో సూక్ష్మపోషకాల లోపముప్పును ముందే గుర్తించడానికి, వారికి సకాలంలో సరైన పోషకాహారాన్ని అందించడానికి ఈ విధానం దోహదపడుతుంది’అని తెలిపారు. పాఠశాల ఆరోగ్య కార్యక్రమాలు, ఐసీడీఎస్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పోషకాహార నిపుణులకు ఈ స్కోరింగ్ విధానం ఉపయోగపడుతుందని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి పేర్కొన్నారు. -
నా భర్తకు ఏమైనా జరిగితే ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత
చైతన్యపురి (హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బొబ్బిలి సర్కిల్ పోలీసులు తీసుకెళ్లిన తన భర్త, జర్నలిస్టు కోశిక వెంకట్రామిరెడ్డి (కేవీఆర్)ని క్షేమంగా పంపించాలని ఆయన భార్య విజయలక్ష్మి డిమాండ్ చేశారు. కేవీఆర్కు ఏమైనా జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. కర్మన్ఘాట్ మాధవనగర్ కాలనీలో నివసిస్తున్న కేవీఆర్ను నాన్బెయిలబుల్ వారంట్ ఎగ్జిక్యూషన్ పేరుతో మంగళవారం రాత్రి ఏపీ పోలీసులు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కేవీఆర్ భార్య విజయలక్ష్మిపై అనుచితంగా ప్రవర్తించడంతో ఏపీ పోలీసులపై సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు అయింది.గురువారం విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. వృత్తి ధర్మంలో భాగంగా ప్రజల తరఫున ప్రశ్నించటం నేరమా అని ప్రశ్నించారు. దేశద్రోహం కేసు పెట్టటానికి ఆంధ్రాలో ఏమైనా బాంబులు పెట్టాడా అని అన్నారు. కేవీఆర్ను తీసుకెళ్లేటప్పుడు పోలీసులు ప్రొసీజర్ ఫాలో కాలేదని, ఆయన చేతులో ఉన్న తన ఫోన్కూడా తీసుకెళ్లారని ఆమె తెలిపారు. సంచలనంగా మారిన సాయికృష్ణ కేసును మరిపించటానికి ఈ కేసును ముందుకు తీసుకొచ్చారని విమర్శించారు. తనపై అనుచితంగా ప్రవర్తించిన ఏపీ పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి డిమాండ్ చేశారు. జర్నలిస్టు కేవీఆర్కు రిమాండ్ బొబ్బిలి: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వ తీరు ను ఎండగడుతూ వార్తలు అప్లోడ్ చేస్తున్న తె లంగాణ జర్నలిస్ట్ కె.వెంకటరామిరెడ్డి (కేవీఆర్) కు విజయనగరం జిల్లా బొబ్బిలి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బా డంగికి చెందిన టీడీపీ నాయకుడు కండి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సరూర్నగర్లో కేవీఆర్ను అరెస్ట్ చేశారు. నిజానికి కేవీఆర్ను బుధవారమే బొబ్బిలి కోర్టులో హాజరుపర్చాల్సి ఉండగా.. టీడీపీ నాయకుల ప్రోద్భలంతో అతనిని పోలీసులు బెయిల్పై విడుదల చేసేందుకు వీల్లేకుండా.. తెలంగాణ లోని పోలీసులు వచ్చే వరకూ పోలీసు స్టేషన్కు, కోర్టుకు తిప్పేలా చర్యలు తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో కేవీఆర్ను బొబ్బిలి సబ్జైలుకు తరలించారు. శుక్రవారం ఇక్కడి నుంచి సెంట్రల్ జైలుకు తరలించనున్నట్టు సమాచారం. -
ఆర్టీసీని వణికించిన చైనా బ్యాటరీ
సాక్షి, హైదరాబాద్: చైనా బ్యాటరీ ఆర్టీసీని వణికిస్తోంది. దాదాపు వేయి ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతున్న ఆర్టీసీకి ఇప్పుడు వాటిల్లో చైనా తయారీ బ్యాటరీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఉన్నట్టుండి ఆ బ్యాటరీల నుంచి వచ్చే మంటలు బస్సులను దహించేస్తున్నాయి. దీంతో ప్రయాణికులున్న సమయంలో బస్సులు మండితే ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉండటమే దీనికి కారణం. మూడునాలుగు రోజుల తర్జనభర్జన తర్వాత, గత రెండు ప్రమాదాలకు గురైన జేబీఎం కంపెనీకి చెందిన అన్ని ఎలక్ట్రిక్ బస్సులను నిలిపేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రమాదాలకు కారణాలేంటి, భవిష్యత్లో మళ్లీ ప్రమాదాలు జరగకుండా తీసుకునే చర్యలేమిటి అన్న విషయంలో, ఆ బస్సులను అద్దెకిచ్చిన జేబీఎం కంపెనీ నుంచి సంతృప్తికర స్పందన వచ్చేవరకు ఆ బస్సులను డిపోలకే పరిమితం చేయాలని నిర్ణయించింది. దీంతో గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆ కంపెనీకి చెందిన 500 ఎలక్ట్రిక్ బస్సులు నిలిచిపోయాయి. బ్యాటరీలతోనే... నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం పథకం కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేసిన బస్సుల్లో, ఢిల్లీ ఫరీదాబాద్లోని జేబీఎం కంపెనీకి 500 బస్సుల సరఫరా టెండర్ దక్కింది. తన సొంత తయారీ బస్సులను ఆ సంస్థ ఏడాదిన్నర క్రితం ఆర్టీసీకి సరఫరా చేసింది. గ్రాస్కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఆ సంస్థ అద్దె ప్రాతిపదికన ఆ బస్సులను వరంగల్, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్లో తిప్పుతోంది. ఇటీవల ఆ బస్సుల్లో మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని నెలల క్రితం ఓ బస్సుకు నిప్పంటుకోగా, గత నెల 21న మరో బస్సు బుగ్గయింది. ఈ ప్రమాదానికి సంబంధించి నివేదిక అందేలోపే మూడు రోజుల క్రితం మరో బస్సు డిపోలో ఉండగా దగ్ధమైంది. వెంటవెంటనే రెండు ప్రమాదాలు చోటుచేసుకోవటం, రెండింటిలోనూ బ్యాటరీ నుంచే నిప్పు రావటంతో బ్యాటరీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఆర్టీసీ నిర్ధారణకు వచ్చింది. వెంటనే విషయాన్ని జేబీఎం సంస్థకు తెలిపి, కారణాలను విశ్లేషించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఆ కంపెనీ సాంకేతిక సిబ్బందితోపాటు బ్యాటరీ తయారు చేసిన చైనా కంపెనీ సిబ్బంది కూడా తెలంగాణకు వచ్చి బస్సులను పరిశీలించారు. కంపెనీకి షరతులు అద్దె ప్రాతిపదికపై తిప్పుతున్నందున, ఆ బస్సులను సురక్షితమైనవని నివేదిక ఇచ్చేంతవరకు డిపోలకే పరిమితం చేస్తామని ఆర్టీసీ ఆ సంస్థకు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది. » ప్రస్తుతం సమస్యకు కారణమేమిటో స్పష్టంగా తెలపాలి. శాశ్వత పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు వివరించాలి. » హైదరాబాద్ బస్భవన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ఆ బస్సుల పనితీరును స్వయంగా పరిశీలించాలి. » చైనా తయారీ బ్యాటరీ సురక్షితమని నమ్మకం కలిగించాలి. ఇక బస్సులు తిరిగి తిప్పేందుకు అన్ని విధాలా సురక్షితం, సిద్ధమని లిఖితపూర్వకంగా స్పష్టం చేయాలి. కంపెనీ నమ్మకమైందే.. చైనా బ్యాటరీలతోనే సమస్యలు ఢిల్లీ ఫరీదాబాద్కు చెందిన జై భారత్ మారుతీ ఆటో లిమిటెడ్ కంపెనీ సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేస్తూ దేశవ్యాప్తంగా 3,500 ఎలక్ట్రిక్ బస్సులను వివిధ ఆర్టీసీల్లో అద్దె ప్రాతిపదికన తిప్పుతోంది. విమానాశ్రయాల్లో ప్రయాణికులను విమానాల వద్దకు చేర్చే ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఈ సంస్థ తిప్పుతోంది. బస్సుల తయారీలో ఈ సంస్థకు మంచి పేరే ఉంది. కానీ, బ్యాటరీలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఒకేసారి 500 బస్సులను నిలిపేయటంతో ఆయా రూట్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్పేర్లో ఉన్న 300 సాధారణ డీజిల్ బస్సులను ఆయా రూట్లలో ప్రారంభిస్తున్నారు. వీటితోపాటు హైదరాబాద్లోని మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో లగ్జరీ బస్సులను ఆయా రూట్లలోనికి మళ్లిస్తున్నారు. కానీ, మరిన్ని బస్సులు వస్తేనే సర్వీసులను పునరుద్ధరించే వీలుంటుంది. -
నేను చదువుకోలేను. చెల్లిని బాగా చదివించండి
కొత్తగూడ: ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థిని ‘నేను చదువుకోలేను. చెల్లిని బాగా చదివించండి’.. అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లిలో గురువారం జరిగింది. ఎస్ఐ రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెండ్లి రాజేందర్–దేవకి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. దంపతులిద్దరూ జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్లో ఉంటూ పనులు చేసుకుంటున్నారు. పెద్ద కుమార్తె పెండ్లి చందన (16)ను వరంగల్ జిల్లా నర్సంపేట లోని అమ్మమ్మ గారింట్లో ఉంచారు. చందన ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఈ క్రమంలో గురువారం చందన పొగుళ్లపల్లిలోని ఇంటికి వచ్చి చున్నీతో ఉరేసుకుంది. ‘చదువు ఒత్తిడి తట్టుకోలేను.. తాను చదువు మానేస్తానని తల్లిదండ్రులకు చెప్పగా, చదువు మానేస్తే పెళ్లి చేసుకోవలసి వస్తుందన్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసుకుంది. చెల్లిని బాగా చదివించి డాక్టర్ను చేయాలని, అమ్మా.. నాన్న గొడవ పడకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి సూసైడ్ నోట్ను స్వా«దీనం చేసుకున్నారు. -
రిటైర్డ్ ఐపీఎస్ ఏకే ఖాన్ కుమారుడిపై చీటింగ్ కేసు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడు, మాజీమంత్రి షబ్బీర్ అలీ అల్లుడు మొహసిన్ ఖాన్పై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన బంధువు తబ్రేజ్ సైతం నిందితుడిగా ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సినీనిర్మాత వెంకట అనీశ్రెడ్డి ఇటీవల ‘మహారాగ్ని’సినిమా నిర్మించారు. ఆ సమయంలో పెట్టుబడిదారుల కోసం అన్వేషించారు. అప్పట్లో అనీశ్కు మొహిసిన్ ఖాన్, తబ్రేజ్లతో పరిచయం ఏర్పడింది. సన్లిట్ గ్రూప్ ఎండీగా తనకు విస్తృతమైన పరిచయాలు ఉన్నాయని, ఇన్వెస్టర్లను పరిచయం చేస్తానని చెప్పి మొహసిన్ ఖాన్ రూ.25 లక్షలు అనీశ్ వద్ద తీసుకున్నారు.తబ్రేజ్కు రూ.25 లక్షలు మూడు విడతల్లో ఇచ్చినట్లు బాధితుడు చెబుతున్నాడు. డబ్బులు తీసుకున్నా, పెట్టుబడిదారులను పరిచయం చేయకుండా ఇద్దరూ తప్పించుకుంటున్నారని అనీశ్ ఆరోపించారు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని సన్లిట్ గ్రూపు కార్యాలయానికి ఈ నెల 1న తాను వెళ్లానని.. ఆ సమయంలో ఆయన తన పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా చెయ్యి చేసుకున్నాడని అనీశ్ ఆరోపించారు. డబ్బులు అడుగుతావా..ఏం చేస్తావో చూద్దామంటూ బెదిరించడమే కాకుండా బౌన్సర్లతో అడ్డగించి మారణాయుధాలు చూపించి భయబ్రాంతులకు గురి చేశాడని, దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నాడు. మొహసిన్ ఖాన్ తన దవడపై బలంగా కొట్టాడని, బౌన్సర్లు కూడా చేతులతో దాడి చేశారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తబ్రేజ్ కూడా ఫోన్కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడని అనీశ్ ఆరోపించారు. తనకు మొహసిన్తోపాటు తబ్రేజ్ల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొహసిన్ ఖాన్పై గతంలోనూ ఓ క్రిమినల్ కేసు ఉంది. టోలిచౌకికి చెందిన వ్యాపారి మొహమ్మద్ అబ్దుల్ వహాబ్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 2022 సెపె్టంబర్లో ఈ కేసు నమోదైంది. ఇసుక తవ్వకాల వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించిన మొహసిన్ రూ.90 లక్షలు పెట్టుబడిగా తీసుకున్నట్టు వహాబ్ ఆరోపించారు. -
మ్యాంగో.. ఫ్లవర్..స్టిక్
సాక్షి, హైదరాబాద్: గంజాయి సాగు చేసే లారీడ్రైవర్ సత్యం మిశ్రా దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు... మరో నలుగురితో కలిసి ముఠా కట్టి స్పీడ్, ఇండియా పోస్టు ద్వారా సరుకు సరఫరా చేస్తున్నాడు... గంజాయి క్వాలిటీని బట్టి మ్యాంగో, ఫ్లవర్, స్టిక్ అనే కోడ్వర్డ్స్ పెట్టాడు... సోషల్మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ, యూపీఐ విధానంలో నగదు అందుకుని దందా చేస్తున్న సత్యం ముంబై కోసంప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఈ నెట్వర్క్ను ఛేదించిన హెచ్–న్యూ పోలీసులు సత్యంను అరెస్టు చేసినట్లు నగర కొత్వాల్ సజ్జనర్ గురువారం ప్రకటించారు. డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. అలవాటుపడి... వృత్తిగా మార్చుకుని...జార్ఖండ్కు చెందిన సత్యం మిశ్రా ఇంటర్మీడియట్ను మధ్యలోనే ఆపేసి పెయింటర్గా మారాడు. ఆపై డ్రైవింగ్ నేర్చుకుని లారీ డ్రైవర్గా వివిధ రాష్ట్రాలకు వెళ్లివచ్చే వాడు. తరచుగా ముంబై వెళ్లే సత్యానికి 2018లో అక్కడే గంజాయి వినియోగం అలవాటై బానిసగా మారాడు. ఇలా పలువురు వినియోగదారులతో సంబంధాలు ఏర్పడ్డాక తానే ఆ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. తన సోదరుడు శుభం మిశ్రాతో కలిసి స్వగ్రామమైన తాంబగుడియాలో గంజాయి పండించడం మొదలెట్టాడు. బంధువు సచిన్ మిశ్రా, స్నేహితులు ఛోటా మిశ్రా, సంతోష్ పండిట్లతో కలిసి ముఠా కట్టాడు. గ్రామంలో పలువురిని గంజాయి పండించేలా ప్రేరేపించాడు. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, రాజస్తాన్, జార్ఖండ్, ఢిల్లీ సహా 21 రాష్ట్రాల్లో ఇతడికి కస్టమర్లు ఉన్నారు. డాక్టర్నంటూ.. ఔషధాల పేరుతో... వాట్సాప్, టెలిగ్రాం యాప్స్ ద్వారా ఆర్డర్లు తీసుకునే సత్యం క్వాలిటీని బట్టి గంజాయికి మ్యాంగో, ఫ్లవర్, స్టిక్ అనే పేర్లు పెట్టాడు. ఒక మ్యాంగో అంటే 50 గ్రాములు అని లెక్క. ఇలా రూ.1500 నుంచి రూ.8 వేల వరకు విక్రయించే వాడు. ఆ మొత్తాన్ని యూపీఐ విధానంలో అందుకునే వాడు. సత్యం ముఠాకు చెందిన ఛోటే మిశ్రా డాక్టర్ రాహుల్ ఝా అవతారం ఎత్తాడు. సత్యం, శుభం మిశ్రా సిద్ధం చేసిన గంజాయి పార్శిల్ను తమ సమీపంలో ఉన్న ఇస్రీ బజార్, ఫుస్రో బజార్ పోస్టాఫీసులకు తీసుకువెళ్లేవాడు. ఔషధాల పేరుతో పార్శిల్ ఇస్తూ పోస్టాఫీస్ సిబ్బందికి అనుమానం రాకుండా ఒక్కోసారి ఒక్కో చోట నుంచి కస్టమర్కు పంపేవాడు. స్పీడ్పోస్టు, ఇండియా పోస్టు విధానాలను వినియోగించే సత్యం సరుకు సరఫరా చేసేవాడు. ముంబై నెట్వర్క్ను పర్యవేక్షించే సచిన్ మిశ్రా, సంతోష్ పండిట్ అక్కడ పర్సనల్ డెలివరీ ప్రారంభించారు. దాదాపు వెయ్యి మంది కస్టమర్ల నుంచి సత్యంకు వచ్చే ఆర్డర్ల ఆధారంగా వారి వద్దకు వెళ్లి సరుకు ఇచ్చి వచ్చేవాళ్లు. ఇలా సత్యం రూ.ఏడాదికి సుమారు రూ.5 కోట్ల వరకు టర్నోవర్ చేస్తూ రూ.2 కోట్ల వరకు ఆర్జించాడు. గుడిమల్కాపూర్లో చిక్కిన ఆధారం... జార్ఖండ్లోని ఇస్రీ బజార్ పోస్టాఫీస్ నుంచి గుడిమల్కాపూర్కు ఇటీవల ఓ పార్శిల్ వచ్చింది. ఆ వెంటనే ఫుస్రో బజార్ పోస్టాఫీస్ నుంచి ఎస్సార్నగర్కు మరో పార్శిల్ రావడంపై హెచ్–న్యూకు సమాచారం అందింది. దీనిపై సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్లు బాలస్వామి, నాగార్జున, తమ ఎస్సై మనోజ్ కుమార్, ఏఎస్సైలు చక్రపాణి, సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ ఉమాశంకర్తో కలిసి రంగంలోకి దిగారు. ఈ రెండు పార్శిల్స్ అందుకున్న సుశాంత్ వ్యాస్, లడ్డూ్డలను అదుపులోకి తీసుకుని రెండు కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో జార్ఖండ్లో సత్యంను అరెస్టు చేసి తీసుకువచ్చారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. -
‘సర్’ లోపాలమయం
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)లో పారదర్శకత లేదని, జవాబుదారీతనం కరువైందని, విధానపరమైన పలు లోపాలున్నాయని ప్రముఖ ఆర్థిక, సామాజిక విశ్లేషకులు, రచయిత డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు. దీనిని పౌర సమాజం, బుద్ధి జీవులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు 105వ జయంతిని పురస్కరించుకుని గురువారం అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని ఓ ఆడిటోరియంలో ఆయన స్మారకోపన్యాసాన్ని నిర్వహించారు. ‘ఎస్ఐఆర్ 2025–26: భారతదేశ భావనను ఛిన్నాభిన్నం చేయడమా?’అనే అంశంపై పరకాల ప్రసంగించారు. పీవీతో తనకున్న సన్నిహిత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆధునిక భారతదేశపు గొప్ప నాయకులలో పీవీ ఒకరని దగ్గర నుంచి గమనించే అవకాశం లభించడం ఒక ‘అర్హత లేని భాగ్యం’అని అభివర్ణించారు. విస్తృత చర్చ జరగాలి వందేమాతరంపై కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్, జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు వంటి ఇటీవలి కేంద్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై విస్తృతంగా చర్చ జరగాలని పరకాల అన్నారు. 2002లో చేపట్టిన విస్తృత సవరణతో పోలిస్తే ప్రక్రియ పూర్తి భిన్నంగా ఉందని పేర్కొన్నారు. కచ్చితమైన ఓటర్ల జాబితాలను నిర్వహించాల్సిన ఆవశ్యకతను ప్రస్తావిస్తూనే.. ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని అన్నారు. సమాధానం చెప్పేవారే లేరు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ముగించగా ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలు అనేకం మిగిలి పోయాయని, ఆలోపే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ముగిసిపోయాయని పరకాల చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓటర్లను జాబితాల నుంచి తీసేశారని వీటిపై ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పేవారే లేరన్నారు. అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించినట్లు సూచించే గణాంకాలను వెల్లడిస్తూ, ఈ ధోరణులను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అంబేడ్కర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, బలోపేతం చేయడానికి పారదర్శకమైన, కచ్చితమైన ఓటర్ల జాబితానే పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్ (అకడమిక్) ప్రొఫెసర్ జి.పుష్ప చక్రపాణి, రిజి్రస్టార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడికి తిరిగి ఆదాయం వస్తుందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పూర్తయ్యే అవకాశం ఉందా అని సీనియర్ మంత్రులు ఒకరిద్దరు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు ఇచ్చిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీనియర్ మంత్రులు సందేహాలు వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. మూసీలోకి నీళ్లు ఎప్పుడు రావాలి?గాంధీ సరోవర్ ప్రాజెక్టు పూర్తవడానికి ఎంత సమయం పడుతుందన్న అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ. 7వేల కోట్ల రుణం తీసుకుని మొదటి దశలో 21 కి.మీ. మేరకు పునరుజ్జీవం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మూసీ పునరుజ్జీవానికి పెట్టే పెట్టుబడికి ఆ మేరకు తిరిగి ఆదాయం వచ్చే అవకాశం ఉందా అని మంత్రులు అనుమానాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం ముందు నుంచి దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనమంతా ఏకతాటిగా ముందుకు వెళ్లాల్సిన సమయంలో సందేహాలు వ్యక్తం చేస్తే ఎలా అని రేవంత్ కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి మొదటి దశ పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.మూసీ పునరుజ్జీవం నగరానికి కొత్త శోభను తెస్తుందని, ఎలాంటి సందేహాలు అవసరం లేదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టును ముందు పెట్టి ఎన్నికలకు ప్రజల ముందుకు వెళ్దామని చెప్పారని అంటున్నారు. మంత్రివర్గ సమావేశంలో వీబీ–జీ రామ్జీ కంటే కూడా మూసీపైనే మంత్రుల మధ్య ఎక్కువ సేపు చర్చ జరిగిందని సమాచారం. వాళ్ల ఆఫీసుకు వస్తామని ఎందుకు చెప్పారు? మంత్రుల స్థాయిలో రాజకీయ వ్యూహాలు అమలు చేయడం పకడ్బందీగా సమన్వయంతో వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ వ్యూహాల అమల్లో ప్రతిపక్షాలకు అనవసర అవకాశం కల్పించడం వల్ల మనకు నష్టం జరుగుతుందన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. ప్రతిపక్షాలకు ఎలాంటి అంశాలు లేవని, అలాంటి సమయంలో మనం చేసే చిన్న తప్పిదాలు ఇబ్బందులు సృష్టిస్తాయని అన్నట్లు తెలిసింది. గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో గురుకులాల్లో అవినీతి, అప్పులపై బీఆర్ఎస్ పార్టీతో జరిగిన సవాళ్ల అంశం చర్చకు వచ్చిన సందర్బంగా ఆయన పైవ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం గన్పార్క్, తెలంగాణ భవన్ వేదికగా గురువారం జరిగిన పరిణామాలను రేవంత్ ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ అంశంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. మంత్రి జూపల్లి బీఆర్ఎస్ ఆఫీసుకు వచ్చి చర్చిస్తానని అని ఉండాల్సింది కాదని, అలా చెప్పేటప్పుడు తనకు ఒకసారి విషయం చెప్పాలి కదా అని సీఎం వ్యాఖ్యానించారు. ఒకవేళ అంటే కట్టుబడి ఉండాల్సిందని అన్నట్టు సమాచారం. గన్ పార్క్కు వెళ్లిన ముగ్గురు మంత్రులు అడ్లూరి, పొన్నం, అజారుద్దీన్ కూడా కొంతసేపు అక్కడే వేచి ఉండాల్సిందని అన్నట్టు తెలిసింది. భవిష్యత్తులో రాజకీయ వ్యూహాల అమలులో సమన్వయంతో వ్యవహారించాలని రేవంత్రెడ్డి మంత్రులకు సూచించారు. రేవంత్ షి‘కారు’ సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో గురువారం రాత్రి సరదా సన్నివేశం జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఓ ఎలక్ట్రిక్ ఎస్యూవీని డ్రైవ్ చేశారు. సచివాలయం లోపల తన సహచర మంత్రులను కూర్చోబెట్టుకుని కారులో చక్కర్లు కొట్టారు. -
ఆర్ఆర్ ట్యాక్స్ కాస్తా ఆర్పీ ట్యాక్స్ : ఏలేటి మహేశ్వర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో మాదిరిగానే ఇక్కడా సీఎంగా రేవంత్రెడ్డిని మార్చాలని ఒరిజినల్ కాంగ్రెస్నేతలు పట్టుబట్టడంతో రాహుల్ గాందీ, మల్లిఖార్జున ఖర్గే అందుకు ప్రయత్నించినా ప్రియాంకా గాందీ, కేసీ వేణుగోపాల్ అడ్డుపడ్డారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. బుధవారం మహేశ్వర్రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ నెల నెలా రెన్యువల్, రీచార్జ్ సీఎంగా రేవంత్ మారారని, ఢిల్లీకి మూటలు పంపినంత కాలం ఇది కొనసాగే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో రేవంత్–రాహల్ (ఆర్ఆర్)ట్యాక్స్కు బదులు ఇప్పుడు రేవంత్–ప్రియాంక (ఆర్పీ)ట్యాక్స్గా పరిస్థితులు మారాయని చెప్పారు. సీఎం తీరుపై హైకమాండ్కు ఎనిమిది మంది మంత్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిసిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిందని, దాదాపు వంద నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీలో కాంగ్రెస్ థర్డ్ప్లేస్కు పరిమితమైందని, రేవంత్రెడ్డి రెండేళ్ల పాలనపై తాజాగా కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నివేదిక సమర్పించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారపార్టీ పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది కాబట్టే జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే ధైర్యం సీఎం చేయడం లేదన్నారు. హైదరాబాద్లోని మూడు కార్పొరేషన్లలో ఎంఐఎం సొంతంగా పోటీచేసిన పక్షంలో ఘోర ఓటమి చవిచూడాల్సి వస్తుందనే భయం రేవంత్కు పట్టుకుందన్నారు. రైతుబంధు నిధులు ఖాతాల్లో వేసినా కూడా జిల్లాపరిషత్ ఎన్నికలు జరిపే యోచన ప్రభుత్వం చేయడం లేదన్నారు. సగానికి పైగా ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ బలపడగా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ బలహీనపడిందని, ఎన్నికలు జరిగితే రెండు సీట్లలోనే గెలుస్తుందని కనుగోలు నివేదికలో ఉందన్నారు. హిట్లర్ ఆదర్శమని రేవంత్ చేసిన వ్యాఖ్యలతో తీవ్రవ్యతిరేకత నెలకొందని, ఆయన ఇమేజీకి కూడా డ్యామేజీ జరిగిందని ఈ నివేదికలో పేర్కొన్నారని మహేశ్వర్రెడ్డి తెలిపారు. రేవంత్ ప్రవర్తన, అనుసరిస్తున్న తీరు వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు వేధింపులకు, నిరాదరణకు గురౌతున్నారని రాష్ట్ర ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ కూడా రాహుల్గాం«దీకి ఓ నివేదికను సమర్పించారని చెప్పారు. మొత్తంగా 12 మంది మంత్రులతో పాటు 34 మంది ఎమ్మెల్యేలు రేవంత్ను వ్యతిరేకిస్తున్నారని ఈ రిపోర్ట్లో వెల్లడైందన్నారు. ఇక్కడ జరుగుతున్న అనేక అవినీతి కార్యక్రమాలపై మీనాక్షి నివేదిక ఇచ్చినందునే ఆమెకు రాజ్యసభ సభ్యత్వం దక్కకుండా చేశారని ఏలేటి ఆరోపించారు. -
రూ. 200 కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్/మణికొండ/జడ్చర్ల: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. డీజీపీ కార్యాలయంలోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్లో డీఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీమ్రెడ్డి నివాసంతోపాటు బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లలో నిర్వహించిన ఏసీబీ సోదాల్లో వందల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు పట్టుబడిన స్థిరాస్తులు, బంగారం, వెండి, నగదు, బ్యాంకు నిల్వలు కలిపి దాదాపు రూ.200కోట్లకుపైనే భీమ్రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దీంతో భీమ్రెడ్డిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు లో భాగంగా నార్సింగి వేసెల్లా మెడోస్లోని భీమ్రెడ్డి నివాసంతో సహా మొత్తం 16 ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ సెంట్రల్ జోన్ జాయింట్ డైరెక్టర్ సింధు శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. డైరీలో బినామీల పేర్లు.. గురువారంనాటి సోదాల్లో ఏసీబీ అధికారులు భీమ్రెడ్డి నివాసంలో ఒక డైరీని స్వాదీనం చేసుకున్నారు. అందులో భీమ్రెడ్డి రాసుకున్న బినామీ పేర్ల ఆధారంగా ఏసీబీ అధికారులు సోదాలు మరింత వేగవంతం చేశారు. ఒక బినామీ నివాసంలో రూ.40 లక్షల నగదు సహా 16 ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ సోదాలు శుక్రవారం కూడా కొనసాగే అవకాశాలున్నాయి. సోదాల్లో భాగంగా భీమ్రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు 23 విదేశీ మద్యం సీసాలను స్వాదీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం వీటిని ఎక్సైజ్శాఖ అధికారులకు అప్పగించారు. భీమ్రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కీలక పోలీస్ స్టేషన్లు, ఆయా డివిజన్లలో బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నారాయణగూడ ఇన్స్పెక్టర్(ఎస్హెచ్వో)గా, వనస్థలిపురం ఏసీపీగా, పటాన్చెరు డీఎస్పీగా పనిచేశారు. గత ప్రభుత్వ హయాంలోని పలువురు నేతలకు భీమ్రెడ్డితో దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వనస్థలిపురం, పటాన్చెరులో పోస్టింగ్స్ కోసం గతంలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే పటాన్చెరుకు చెందిన ఓ నేతతో కలిసి పరిసర ప్రాంతాల్లో సివిల్ వివాదాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో అనేక అక్రమాలకు పాల్పడినట్లు భీమ్రెడ్డిపై ఆరోపణలున్నాయి. సోదాల్లో ఏసీబీ గుర్తించిన ఆస్తులివే.. – ఇబ్రహీంబాగ్లోని వెస్సెల్లా మెడోస్లో ఒక విల్లా. – టెలికాం నగర్లో జీ+2 నివాస భవనం, పెంట్హౌస్. – టెలికాం నగర్లోని సాయి ప్రభ రెసిడెన్సిలో ఒకఫ్లాట్, గచ్చిబౌలిలోని కాంత్రి సియోన్ అపార్ట్మెంట్స్లో ఒకఫ్లాట్. – మణికొండలోని ల్యాంకోహిల్స్ రోడ్డులో 500 చదరపు గజాలలో జీప్లస్ 5 కమర్షియల్ కాంప్లెక్స్. – మణికొండ మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో వాణిజ్య సముదాయంలో వాటా, 3,000 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్. – తెల్లాపూర్లోని అభినంద రెసిడెన్సీలో రెండు ఫ్లాట్లు. – ప్రగతి రిసార్ట్స్లో 500 గజాల నివాస స్థలం. – సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి. – కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూములు.. బెంగళూరులోని దేవనహళ్లి ప్రాంతంలో ఒక ఎకరం భూమి. – నాగోలులోని కామినేని ఆస్పత్రి సమీపంలో 200 గజాల్లో స్థలం. – జీపీఆర్ హౌసింగ్ సొసైటీలో 400 గజాల్లో స్థలం. – పటాన్చెరులో 200 గజాల్లో స్థలం. – వికారాబాద్ జిల్లా మొమిన్పేట్ ప్రాంతంలో వెయ్యి గజాల్లో స్థలంతోపాటు రెండు ఎకరాల వ్యవసాయ భూమి. – శ్రీ రాఘవేంద్ర రాక్ శాండ్ మినరల్స్ సంస్థలో రూ.75 లక్షల పెట్టుబడి. – రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామంలో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి. నగదు, బంగారం, వెండి స్వాదీనం సోదాల్లో భీమ్రెడ్డి నివాసంలో రూ.3.60 లక్షల నగదు, అదేవిధంగా సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, బ్యాంకు ఖాతాల్లో రూ.19.91 లక్షల నిల్వలను ఏసీబీ అధికారులు గుర్తించారు. బినామీ ఇంట్లో రూ.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వగ్రామం ఆలూరులోనూ సోదాలు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని డీఎస్పీ భీమ్రెడ్డి స్వగ్రామం ఆలూరులోని సొంత ఇంట్లోనూ గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన సోదరుడు వెంకట్రెడ్డిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూములకు సంబంధించి పాస్బుక్, రిజిస్టర్ డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు. తండ్రి పేరు మీద ఉన్న భూమి వివరాలనూ సేకరించారు. మణికొండలోని స్నేహితుడి ఇంట్లోనూ.. మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మెన్ కె. నరేందర్రెడ్డి నివాసంలో భీమ్రెడ్డికి సంబంధించిన డబ్బు, ఆస్తుల పత్రాలుంటాయనే అనుమానంతో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. రాయదుర్గం సీఐగా భీమ్రెడ్డి పనిచేసినప్పటి నుంచి వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. భీమ్రెడ్డి ఓ ఆస్తిని నరేందర్రెడ్డిపై రిజిస్ట్రేషన్ చేసి తిరిగి దాన్ని రద్దు చేసుకున్న డాక్యుమెంట్ భీమ్రెడ్డి నివాసంలో లభించడంతో నరేందర్రెడ్డి నివాసంలోనూ సోదాలు చేసినట్లు సమాచారం. కాగా, నరేందర్రెడ్డి నివాసంలో భీమ్రెడ్డికి సంబధించి ఎలాంటి పత్రాలు లభించలేదని తెలిసింది. రూ. 5లక్షల నగదు, నరేందర్రెడ్డికే సంబంధించిన రెండు ఆస్తుల పత్రాలను పరిశీలించినట్లు తెలిసింది. -
జీ రామ్ జీపై సుప్రీంకు..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన వీబీ–జీ రామ్ జీ (వికసిత్ భారత్– గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఆజీవికా మిషన్–గ్రామీణ్)చట్టం–2026ను జూలై 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉపాధి హామీ కూలీలకు పని కల్పించే విషయంలో గత్యంతరం లేక నోటిఫికేషన్ జారీకి ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ చట్టంలో విధించిన నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. పార్లమెంటులోనూ కేంద్రం తీరును నిలదీయాలని తీర్మానించింది. గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమై వీబీ–జీ రామ్ జీని రాష్ట్రంలో అమలు చేసే అంశంపై విస్తృతంగా చర్చించింది. సమావేశం అనంతరం సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహచర మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. కొత్త చట్టంపై ఇతర రాష్ట్రాలూ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయని తెలిపారు. టిమ్స్ ఆస్పత్రులకు 6,278 పోస్టులు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. సనత్నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రులతోపాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు చేసింది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు, 4,235 ఔట్ సోర్సింగ్ పోస్టులకు అనుమతించారు. ఈ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇక్కడ అందించే వైద్య సేవలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎల్ఓసీలు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రూ.7345 కోట్లతో మూసీ తొలి దశ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా ఫేజ్–1 పనులకు మంత్రివర్గం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తొలి దశలో 21 కి.మీ. పొడవునా అభివృద్ధి చేసేందుకు రూ.7,345.12 కోట్ల విలువైన పనుల మంజూరుకు ఆమోదం తెలిపింది. హిమాయత్ సాగర్ నుంచి ఈసా... ఉస్మాన్ సాగర్ నుంచి మూసా ప్రవాహాలు ప్రారంభమయ్యే చోటు నుంచి బాఫNఘాట్ వరకు ఈ పనులు చేపడతారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పనులు... నిర్వహణ కోసం నూతనంగా 147 పోస్టుల మంజూరుతోపాటు ఇతర శాఖల నుంచి అవసరమైన సిబ్బంది డిప్యూటేషన్కు ఆమోదం తెలిపారు. త్వరలో ఫేజ్–1 పనులకు టెండర్లు పిలవనున్నారు. ఉపాధ్యాయులకూ అల్పహారం, లంచ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అందించే అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అందించాలని నిర్ణయించారు. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించే సంకల్పంతోపాటు జవాబుదారీతనం పెంచే ఆలోచనలో భాగంగా రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి ఈ పథకం వర్తింపజేయనున్నారు. = వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో నిత్యావసర వస్తువుల గోదాముల నిర్మాణానికి 50 ఎకరాలను, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కాలపహాడ్ గ్రామంలో 10 ఎకరాలను రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు మార్కెట్ ధర ప్రకారం కేటాయించేందుకు ఆమోదం. = జవహర్ నవోదయ విద్యాలయాలకు రెండు చోట్ల ప్రభుత్వం స్థలం కేటాయించింది. మహబూబ్నగర్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాల ప్రభుత్వ భూమిని కేబినెట్ కేటాయించింది. జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మరికొన్ని సంస్థలకు భూములు కేటాయించారు. ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం తెచ్చిన వీబీ–జీ రామ్జీ చట్టంలోని నిబంధనలపై మంత్రివర్గం తీవ్రంగా నిరసన తెలిపింది. కూలీలకు ఉపాధి భరోసా కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయొద్దని జనవరిలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయంపై చర్చించింది. మరోసారి తమ నిరసనను కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించింది. వీబీ–జీ రామ్ జీ చట్టం అమలు విషయంలో ఇతర రాష్ట్రాలు ఏ నిర్ణయం తీసుకున్నాయో.. కొత్త చట్టంలో తెచ్చిన మార్పులతో రాష్ట్ర ప్రభుత్వానికి, కూలీలకు ఎలా నష్టం జరుగుతుంది తదితర అంశాలపై అధ్యయనం జరిపి మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై మంత్రివర్గం క్షుణ్ణంగా పరిశీలన జరిపింది. సమాఖ్య స్ఫూర్తి విధానానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపేలా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఉపసంఘం పేర్కొంది. ఇతర రాష్ట్రాలన్నీ కొత్త చట్టానికి ఆమోదం తెలిపాయా? లేదా? అని మంత్రివర్గం ప్రశ్నించగా, అన్ని రాష్ట్రాలూ కొత్త చట్టం అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. -
చర్చ.. రచ్చ!
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల సవాళ్లు, ప్రతిసవాళ్లతో గురువారం రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. గురుకులాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు, బీఆర్ఎస్ హయాంలో అప్పుల విమర్శలు ఇందుకు కారణమయ్యాయి. ఆయా అంశాలపై చర్చకు సిద్ధమన్న ఇరుపక్షాలు ఎలాంటి చర్చలూ జరగకుండానే గన్పార్క్, తెలంగాణ భవన్ వేదికగా పరిస్థితిని రచ్చరచ్చగా మార్చాయి. ముగ్గురు మంత్రులు గన్పార్క్ వద్దకు చేరుకుని మరోసారి విపక్షానికి సవాల్ విసరగా, గన్పార్క్ వద్ద చర్చకు సై అన్న విపక్ష నేతలు హరీశ్రావు, కేటీఆర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గన్పార్క్ వద్ద మాట్లాడిన మంత్రులు, తెలంగాణ భవన్లో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. రెండు రోజులుగా మాటల యుద్ధం అవినీతి, అప్పులపై ఉభయ పార్టీల మధ్య గత రెండు రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల జరిగిన బహిరంగ సభల్లో పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని ప్రకటించడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానికి సై అంటూనే అప్పులకు సంబంధించిన తప్పుడు లెక్కలపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమంటూ స్పందించారు. మరోవైపు గురుకులాల్లో విద్యార్థులకు సరఫరా చేసే యూనిఫాం, విద్యా కిట్లలో రూ.2 వేల కోట్ల భారీ అవినీతి జరిగిందని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ఎల్పీ ఉప నాయకుడు హరీశ్రావు, మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సవాల్ చేయగా, తాము సిద్ధమేనంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలోనే గురువారం మంత్రులు అడ్లూరి లక్ష్మణ్కుమార్, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్ గన్పార్కు వద్దకు వచ్చారు. బీఆర్ఎస్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ లేదా హరీశ్రావు తమతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే అసెంబ్లీలో ప్రత్యేకంగా దీనిపై చర్చకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. గన్పార్క్ వద్ద జూపల్లి, అడ్లూరి, అజహర్, పొన్నం కంచన్బాగ్ పోలీస్స్టేషన్కు హరీశ్ తరలింపు మంత్రులతో గన్పార్కు వద్ద చర్చకు తాను సిద్ధమంటూ హరీశ్రావు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. అయితే ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండడంతో పోలీసులు ఆయన్ను అక్కడే అడ్డుకున్నారు. కానీ తాను వెళ్లి తీరతానంటూ హరీశ్ పట్టుపట్టడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని కంచన్బాగ్ పోలీస్స్టేషన్కు తరలించారు. తెలంగాణ భవన్లోనే కేటీఆర్ బీఆర్ఎస్ హాయాంలో జరిగిన అప్పులపై తనతో చర్చించేందుకు రావాలని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావును సవాల్ చేసిన కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కు వచ్చారు. అయితే తెలంగాణ భవన్కు వస్తానన్న జూపల్లి రాకపోగా.. గన్పార్క్కు రావాలంటూ సవాల్ చేయడంతో.. కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ నుంచి గన్పార్క్ వెళ్లడానికి బయలుదేరారు. కానీ ఆయన్ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో..మీ మంత్రులు పారిపోయామంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని, తాను గన్పార్క్కు వెళ్తానని అన్నా సరే ఆయన తెలంగాణ భవన్ దాటి రాకుండా పోలీసులు నిలువరించారు. అప్పుల గణాంకాలు వెల్లడించిన జూపల్లి గాందీభవన్లో జరిగిన ప్రజలతో ముఖాముఖి అనంతరం నేరుగా గన్పార్క్కు చేరుకున్న మంత్రి జూపల్లి 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు, 2023లో బీఆర్ఎస్ దిగిపోయే నాటికి ఉన్న అప్పులను గణాంకాలతో సహా వివరించారు. తాను చెప్పిన గణాంకాలు తప్పని కేసీఆర్తో చెప్పిస్తే తాను చెప్పిన కట్టుబడి రాజీనామా చేస్తానని మరోమారు కేటీఆర్కు సవాల్ విసిరారు. మళ్లీ తెలంగాణ భవన్కు హరీశ్ ఉదయం పోలీసులు అదుపులో తీసుకున్న మాజీ మంత్రి హరీశ్రావు కంచన్బాగ్ పోలీస్స్టేషన్ నుంచి నేరుగా మళ్లీ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. అయితే చివరకు రెండు పార్టీల నేతలు అసెంబ్లీ సమావేశాలు పెట్టి అవినీతి, అప్పులపై చర్చించాలని పట్టుపట్టడం గమనార్హం. ఇలావుండగా మరో ప్రధాన పార్టీ బీజేపీ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. ఆ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని, డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజలను మభ్యపెడుతున్నాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. -
ఆదివాసీల ప్రగతికి అదనపు తోడ్పాటు అందించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధి, గిరిజన సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సచివాలయం వేదికగా ఒక కీలక సమావేశం జరిగింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన శాసనసభ్యుల బృందం ఇవాళ (గురువారం) సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని పెండింగ్ సమస్యలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు ఒక సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు.సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అర్హులైన గిరిజనుల పోడు భూములకు తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలని, దాంతో పాటు గిరిజన రైతులకు సాగునీరు అందించేలా 'ఇందిర గిరి జల వికాసం' పథకాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన విద్యార్థులకు ఉన్నత చదువులను చేరువ చేసే క్రమంలో రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిపాలనను, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత వేగంగా చేర్చడానికి వీలుగా ఐటీడీఏ (ITDA)లను ఆర్థికంగా, పరిపాలనాపరంగా మరింత బలోపేతం చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. -
TG: జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత
హైదరాబాద్: నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో నడుస్తున్న జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులలో (JBM e-Buses) వరుసగా హై వోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రయాణికుల భద్రతను దృష్ట్యా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల పరిధిలో తిరిగే జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేతకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.గత నెల జూన్ 21వ తేదీ ఉదయం 8 గంటలకు కరీంనగర్ సమీపంలో అలుగునూర్ వద్ద జరిగిన బస్సు అగ్ని ప్రమాదంపై పూర్తి నివేదిక రాకముందే మరొక ఘటన జరిగింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.ప్రమాదాల విశ్లేషణ నివేదిక, శాశ్వత నివారణ చర్యలు, బ్యాటరీ ఫిట్నెస్ సర్టిఫికేషన్, హైదరాబాద్ బస్సు భవన్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు, భద్రతకు సంబంధించిన పలు అంశాలపై స్పందించి నివేదిక సమర్పించాలని తెలంగాణ ఆర్టీసీ జేబీఎం సంస్థను కోరింది. ఆర్టీసీ విజ్ఞాపనపై స్పందించిన జేబీఎం సంస్థ పైన పేర్కొన్న పలు అంశాలపై నివేదికను సిద్ధం చేస్తోంది.భద్రతా ప్రమాణాలు, సంబంధిత నివేదికలను ఆర్టీసీ ఉన్నతాధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సంస్థ నిర్దేశించిన అన్ని షరతులను జేబీఎం యాజమాన్యం పూర్తిగా పాటించినట్లు సంతృప్తి చెందితే వాహనాల పునరుద్ధరణపై తుది నిర్ణయం తీసుకుంటారు. 100% సేఫ్టీ సర్టిఫికేట్ వస్తేనే సర్వేసుల పునరుద్ధరణ ఉంటుంది. ప్రజా రవాణాలో భద్రత విషయంలో టీజీఎస్ఆర్టీసీ ఎటువంటి రాజీ పడదని, ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఈ సందర్భంగా యాజమాన్యం స్పష్టం చేసింది. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైద్య సంస్థల్లో ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపింది. మార్క్ఫైడ్ ద్వారా ఎరువులు, విత్తనాల కొనుగోలుకు బ్యాంక్ రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించింది. నవోదయ, కేవీ సైనిక్ స్కూళ్లకు భూములు కేటాయింపు, పలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం భూములు కేటాయించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది.పాతబస్తీలో 8 చారిత్రక కామన్ల పునరుద్ధరణకు ఆమోదం తెలిపి కేబినెట్.. రూ.11.86 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. విద్యార్థులతో పాటు టీచర్లకూ మధ్యాహ్న భోజనం.. అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించాలని కేబినెట్ నిర్ణయించింది.వీబీజీ రామ్జీ చట్టం అమలుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్.. కొత్త చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. ఉపాధి హామీ చట్టంపై కేంద్రానికి మరోసారి నిరసన తెలపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి భోజన పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. టీచర్లు, లెక్చరర్లు, సిబ్బందికి అల్పాహారం-పాలు-మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆమోదం తెలిపింది.టిమ్స్ ఆసుపత్రుల్లో 6,278 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన కేబినెట్.. టిమ్స్ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మూసీ రివర్ఫ్రంట్ ఫేజ్-1 పనులకు రూ.7,345.12 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూసీ రివర్ ఫ్రంట్ కోసం 147 కొత్త పోస్టుల సృష్టికి కేబినెట్ ఆమోదం తెలిపింది. టీజీఎస్డబ్ల్యూసీకి 60 ఎకరాల భూమి కేటాయింపు, జవహర్ నవోదయ విద్యాలయాలకు ప్రభుత్వ భూముల కేటాయింపు, జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
రూ. 200 కోట్లకు పైమాటే!.. డీఎస్పీ భీమ్రెడ్డి ఆస్తుల వేటలో ఏసీబీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటిగా ఏసీబీ వలకు చిక్కుతున్నాయి. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో డీజీపీ ఆఫీస్ స్టేషనరీ వింగ్లో పనిచేస్తున్న డీఎస్పీ భీమ్ రెడ్డి నివాసాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఉదయం నుంచే ఏకకాలంలో భారీ సోదాలు నిర్వహించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. భీమ్రెడ్డి సంపాదించిన అక్రమాస్తుల విలువ సుమారు రూ. 200 కోట్ల పైమాటేనని తెలుస్తుండటంతో పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.డీఎస్పీ భీమ్ రెడ్డితో పాటు ఆయన బంధువులు, అత్యంత ఆప్తులైన బినామీల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు గురిపెట్టారు. హైదరాబాద్, జహీరాబాద్, రంగారెడ్డి, శంషాబాద్, గచ్చిబౌలి, వికారాబాద్ సహా మొత్తం 16 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఈ సోదాల సమయంలో ఏసీబీ అధికారులకు ఒక అత్యంత కీలకమైన డైరీ లభ్యమైంది. ఈ డైరీలో డీఎస్పీకి చెందిన దాదాపు 15 మంది ముఖ్య బినామీల పూర్తి చిట్టా ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ఒక బినామీ ఇల్లాంటి రహస్య స్థావరం నుంచే రూ. 40 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భీమ్ రెడ్డి కేవలం సొంత రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. గచ్చిబౌలిలోని ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ను తన కూతురి పేరిట కొనుగోలు చేయగా, బెంగళూరు నగర పరిధిలో ఒక ఎకరం ఖరీదైన భూమి ఉన్నట్లు డాక్యుమెంట్లు లభించాయి. వీటితో పాటు పలు ఓపెన్ ప్లాట్లు, సాగు భూములకు సంబంధించిన కీలక ల్యాండ్ డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.భీమ్ రెడ్డి అక్రమ సామ్రాజ్యం చాలా పెద్దదిగా ఉన్నందున, బ్యాంక్ లాకర్లు, బినామీల ఖాతాలను పూర్తిగా పరిశీలించడానికి మరో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించాల్సి ఉంటుందని ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇప్పటికే కొండలా పేరుకుపోయిన అక్రమాస్తుల ఆధారాలు లభించడంతో, మరికొద్ది సేపట్లోనే డీఎస్పీ భీమ్ రెడ్డిని ఏసీబీ అధికారులు అధికారికంగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మీరు ఉండాల్సింది గన్ పార్క్ లో కాదు జూపార్క్ లో
-
తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్, ప్రస్తుత పోలీస్ ఉన్నతాధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగించింది. 26 మందికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పోలీస్ శాఖ తొలగించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకూ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పోలీస్ శాఖ తీసేసింది. పలువురు రాజకీయ నేతలు, పోలీస్ అధికారుల గన్మెన్ల సంఖ్య తగ్గించింది. 67 మంది ప్రముఖుల గన్మెన్లను తగ్గించిన పోలీస్ శాఖ.. చాలా వరకు వన్ప్లస్, వన్ గన్మెన్లకే పరిమితం చేసింది. -
‘మంత్రులు గన్పార్క్కు కాదు.. జూపార్క్కి వెళ్లాలి’
సాక్షి, హైదరాబాద్: మంత్రులు తొడ కొట్టడం ఎందుకు? తోక మూడవటం ఎందుకు?. చేత కానప్పుడు.. మంత్రులు ఎందుకు సవాళ్లు విసిరారు అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి తప్పుల మీద.. మా మీద వేస్తున్న అప్పులు నిందల గురించి సవాల్ చేశాను. టైము, డేటు, ప్లేస్ రేవంత్నే చెప్పమన్నా.. మధ్యలో జూపల్లి దూరారు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.‘‘జూపల్లి ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్కు వస్తున్న అని తొడగొట్టారు.. జూపల్లికి స్వాగతం చెబుదామని శాలువా, దండలు రెడీ చేసుకుంటే తోక ముడిచి పారిపోయి గాంధీభవన్లో దాక్కున్నాడు. మంత్రులు రావాల్సింది గన్ పార్క్కు కాదు.. జూ పార్క్కి.. విచిత్రమైన వ్యక్తుల్ని జూ పార్క్లో పెట్టాలి. గన్ పార్క్కి బయలుదేరితే మా వాళ్లని అరెస్ట్ చేశారు.. పోలీసులను అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తున్నారు.’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూసుకుంటూ ఊరుకోవటానికి కాదు ఇక్కడ ఉన్నది కేసీఆర్ దళం.. తెలంగాణ అప్పుల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్ ఏం చెప్పింది?. పార్లమెంట్లో చెప్పారు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2 లక్షల 80 వేల కోట్లు.. రేవంత్ రెడ్డి 8 లక్షల కోట్ల అంటాడు.. భట్టి విక్రమార్క 7 లక్షల కోట్ల అప్పంటాడు. రేవంత్ రెడ్డికి అప్పులు చేయటం.. భూములను అమ్మటం, అనుముల బ్రదర్స్కి దోచి పెట్టడం ఇదే తెలుసు.’’ అంటూ కేటీఆర్ ఆరోపించారు. -
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి ఆకస్మిక బదిలీ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విభాగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ అధికారిణి జి. లక్ష్మీబాయిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను ప్రస్తుత బాధ్యతల నుండి బదిలీ చేస్తూ, హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న ఐఏఎస్,ఇతర ఉన్నతాధికారుల బదిలీల పరంపరలో భాగంగానే ఈ కీలక స్థానచలనం జరిగినట్లు సచివాలయ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ బదిలీ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బదిలీ అయిన అధికారిణి లక్ష్మీబాయి, మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి కావడం దీనికి ప్రధాన కారణం. -
తిండి తిప్పలు! తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు..
సాక్షి, హైదరాబాద్: బిర్యానీల సిటీ, ఐటీ హబ్గా పేరుగాంచిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లు, విద్యాసంస్థల హాస్టళ్ల వంటగదులు కల్తీ, నాసిరకం పదార్థాలతో నిండి ఉంటున్నాయి. నిగనిగలాడే లైటింగ్, ఏసీల నడుమ కస్టమర్లను ఆకర్షించే బడా రెస్టారెంట్ల వంటగదులు (కిచెన్లు) సైతం దారుణంగా ఉన్నాయి. ప్రముఖ విద్యాసంస్థల హాస్టళ్లలోనూ అపరిశుభ్రత తాండవిస్తోంది. ఇటీవల సీఎంసీ ఫుడ్సేఫ్టీ అధికారులు కార్పొరేషన్ పరిధిలోని ప్రముఖ హోటళ్లపై జరుపుతున్న వరుస తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నయా మోసాలు, అధ్వాన్నపు నిర్వహణను అధికారులు ఎక్స్ వంటి సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేస్తుండటంతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు.మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లోని హోటళ్లలో నిర్వహించిన తనిఖీల్లో ప్రధానంగా కుళ్లిన మాంసం, ఫ్రిజ్లలో వారాల తరబడి నిల్వ ఉంచిన, వాసన వస్తున్న చికెన్, మటన్, సీ–ఫుడ్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. – చికెన్ బిర్యానీ, కబాబ్స్ మరింత ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం నిషేధిత సింథటిక్ రంగులను వాడుతున్నారు.గడువు తీరిన సాస్లు, ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన చీజ్, బట్టర్, చిల్లీ సాస్లను వంటల్లో ఉపయోగిస్తూ దొరికిపోయారు.వంటగదుల్లో ఈగలు, బొద్దింకలు మాత్రమే కాకుండా, నిల్వ ఉంచిన పప్పులు, బియ్యం బస్తాలపై ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.లైసెన్సులు కూడా లేవు చాలా రెస్టారెంట్లకు చెల్లుబాటులో ఉన్న లైసెన్సులు కూడా లేవు. ఉన్నవారు సైతం వాటిని ప్రదర్శించడం లేదు. వాటర్ అనాలిసిస్ రిపోర్టులు గానీ, సిబ్బంది మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు గానీ అందుబాటులో లేవు. గతంలోనూ నగరవ్యాప్తంగా పలుమార్లు ఫుడ్ సేఫ్టీ రైడ్స్ జరిగాయి. అప్పట్లో కేవలం జరిమానాలతో సరిపెట్టడం వల్ల యాజమాన్యాల్లో మార్పు రాలేదని స్పష్టమవుతోంది.బ్రాండెడ్ హోటళ్లలో ఘోరం! బడా బ్రాండ్లుగా చలామణి అవుతూ, వందల రూపాయల్లో ఛార్జ్ చేసే ప్రముఖ రెస్టారెంట్లలో సైతం విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఐటీ ఉద్యోగులతో నిరంతరం కిటకిటలాడే ఒక పేరెన్నికగన్న బిర్యానీ హోటల్లో మురిగిపోయిన చికెన్ ముక్కలను, ఫ్రిజ్లో దట్టంగా ఐస్ పేరుకుపోయిన పాత నిల్వలను అధికారులు గుర్తించారు. కూకట్పల్లిలో కుటుంబ సమేతంగా వెళ్లే ఒక ఫేమస్ రెస్టారెంట్ కిచెన్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ దొరికాయి. స్టోర్ రూమ్లలోని పప్పుల బస్తాల్లో ఎలుకల విసర్జితాలు కనిపించాయి. బేకరీ ఐటమ్స్ తయారీలో వాడే బట్టర్, చీజ్ ప్యాకెట్లపై కనీసం మాన్యుఫ్యాక్చరింగ్ డేట్ గానీ, ఎక్స్పైరీ డేట్ గానీ ఉండకపోవడాన్ని అధికారులు గుర్తించారు.ఉప్పల్లో హోటల్కు రూ.25 వేల జరిమానామల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) ఫుడ్సేఫ్టీ విభాగం అధికారులు బుధవారం ఉప్పల్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న మాస్టర్ చెఫ్రెస్టారెంట్లో భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించినందుకు రూ.25 వేల జరిమానా విధించారు. స్టోర్రూమ్, డైనింగ్ ఏరియాలో ఈగలు, బొద్దింకలు అధికంగా ఉండటం, మాంసాహార పదార్థాలను తగిన ఉష్ణోగ్రతలు, పరిశుభ్రత ప్రమాణాలు లేకుండా నిల్వ చేయడం.మూతలు లేకుండా ఉంచడం,కిచెన్ సిబ్బంది వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, చెత్తబుట్టలకు మూతలు లేకపోవడం, తదితర ఉల్లంఘనలు గుర్తించి జరిమానా విధించారు. యాజమాన్యానికి నోటీసు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.కుళ్లిన చేపలు, రొయ్యలు స్వాధీనం..రసాయనాలతో కల్తీ చేస్తున్న నలుగురి అరెస్టుఅబిడ్స్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ..కుళ్లిన చేపలు, రొయ్యలు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద సోడియం బై కార్బోనేట్ రసాయనాలను మిక్స్ చేసిన 262 కిలోల వివిధ రకాల చేపలు, రొయ్యలు స్వా«దీనం చేసుకున్నారు. మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం..మచిలీపురా ప్రాంతంలో శంకర్ సింగ్ అనే వ్యక్తి మాన్సింగ్, గులాబ్సింగ్, రోహిత్ సింగ్లతో కలిసి తారా ఫిషరీష్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు.వీరు బేగంబజార్ చేపల మార్కెట్ నుండి తక్కువ ధరకే నాసిరకం రొయ్యలు, చేపలు కొనుగోలు చేసి సోడియం బై కార్బొనేట్ రసాయనాలు కలిపి డీప్ఫ్రిజ్లు, ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ ఉంచుతున్నారు. వీటిని ఫంక్షన్లకు, ఈవెంట్లకు, హోటళ్లకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో నగర టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాస రావు పర్యవేక్షణలో గోల్కొండ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఇతర సిబ్బంది దాడులు నిర్వహించారు. నిందితులను అరెస్టు చేసి రూ.90 వేల విలువైన 100 కిలోల పాడైపోయిన రొయ్యలు, 162 కిలోల వివిధ రకాల చేపలు, 6 బస్తాల ఉప్పు, 10 కిలోల సోడియం రసాయనాలను స్వా«దీనం చేసుకున్నారు. -
సెలవులు లేని ‘జూలై’
మంచిర్యాల జిల్లా: విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులగు సెలవులు లేని మాసంగా జూలై నిలవనుంది. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉద్యోగులకు ఈ నెలలో 27 పని దినాలు ఉన్నాయి. నెలలో 31రోజులు కాగా అందులో నాలుగు ఆదివారాలు మినహా సెలవులు లేవు. జూలై 11 రెండో శనివారం కూడా పని దినంగా ఇదివరకే ప్రకటించారు. -
వాహనదారులూ జాగ్రత్త.. లేదంటే ఏ'ఐ’ పట్టేస్తుంది!
వాహనదారులూ జాగ్రత్త..ఇక మీరు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ‘ఏఐ’ పట్టేస్తుంది. ట్రాఫిక్ పోలీసులు లేరు కదా అనుకుని..మీరు ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే ఇక నడవదు. మీ ఉల్లంఘనలను ఏఐ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలు ఇట్టే పట్టేస్తాయి. చలాన్ వడ్డిస్తాయి. ఆ సమాచారం మీకు నేరుగా వాట్సప్ ద్వారానో..మెసేజ్ రూపంలోనో..మెయిల్గానో వచ్చేస్తుంది. – సాక్షి, హైదరాబాద్ట్రాఫిక్ విభాగంలోనూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగించుకోవాలని మల్కాజ్గిరి పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బేగంపేటలో రెండు నెలల పాటు పైలెట్ ప్రాజెక్ట్ను నిర్వహించిన పోలీసులు..సత్ఫలితాలు రావడంతో కమిషనరేట్లో అమలు చేయాలని నిర్ణయించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులను ఆయా రోడ్లపై ఉన్న ‘ఏఐ సీసీటీవీ కెమెరాలు’ గుర్తించి..వివరాలను నేరుగా సెంట్రల్ కంట్రోల్ రూమ్ సర్వర్కు పంపిస్తాయి. అక్కడున్న సిబ్బంది ట్రాఫిక్ ఉల్లంఘన, ప్రమాదం తీరు, వాహనం నంబర్, యజమాని వివరాలు తదితరాలను విశ్లేషించి.. యాక్సెప్ట్ చేయగానే నేరుగా వాహనదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు మెసేజ్, వాట్సాప్ రూపంలో అలాగే ఈ–మెయిల్ ఐడీలకు మెయిల్ రూపంలో చలాన్ వెళ్లిపోతుంది.1.27 లక్షల కేసులు.. రూ.6.73 కోట్ల జరిమానాఅన్ని రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఒకేసారి దృష్టిపెట్టడంతో వాహనదారులకు అవగాహన రావడం లేదని భావించిన పోలీసులు.. ప్రతి రోజూ ఒకట్రెండు ఉల్లంఘనలు తీసుకొని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల్లో కమిషనరేట్ పరిధిలో 1,27,760 కేసులు నమోదు కాగా.. రూ.6.73 కోట్ల జరిమానాలు విధించారు. వీటిల్లో అత్యధికంగా అక్రమ పార్కింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ ఉల్లంఘనలు ఉన్నాయి.కీలక ప్రాంతాల్లో 75 కెమెరాలుబేగంపేటలో రెండు బహుళ జాతి కంపెనీల సాంకేతిక, నిధుల సహాయంతో నాలుగు సీసీటీవీ కెమెరాలకు ఏఐ జోడించి, రెండు నెలలు పరీక్షించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, ప్రమాదాల తీరు, వాహన రిజిస్ట్రేషన్ నంబర్లు గుర్తించడంలో సత్ఫలితాలొచ్చాయి. దీంతో మల్కాజ్గిరి కమిషనరేట్లోని కీలక కూడళ్లు, ప్రాంతాలలో 75 కెమెరాలకు ఏఐ జోడించి, వినియోగించుకోనున్నారు. ఈ ఏఐ ట్రాఫిక్ పోలీసు విభాగంలోకి ఇటీవల కొత్తగా నియమితులైన ఎస్ఐలలో బీటెక్, ఎంటెక్ చదివిన వారిని తీసుకోనున్నారు.వారి సేవలు ఇతర విభాగాల్లో.. ఇప్పటివరకు రోడ్లపై ట్రాఫిక్ ఉల్లంఘనదారులను పట్టుకునేందుకు క్షేత్ర స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ట్రాఫిక్ పోలీసులు ఉండేవారు. ఇక నుంచి ఏఐ ట్రాఫిక్ చలాన్లు జారీ చేయనుండటంతో.. సిబ్బంది సేవలను రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి ఇతర విభాగాలలో వినియోగించుకోనున్నాం. – రాహుల్ రెడ్డి, డీసీపీ, ట్రాఫిక్–1, మల్కాజ్గిరి -
పలకని చిలుక
వికారాబాద్: ఒకప్పుడు గ్రామాల్లో చిలుక జోస్యం చెప్పేవారి వచ్చేరంటే సందడిగా ఉండేది. చిలుక తేసే కార్డులో తమ భవిష్యత్ ఉంటుందని భావించేవారు. అయితే కాలం మారింది. సాంకేతికత పెరిగింది. చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చే సరికి చిలుక జోస్యానికి ఆదరణ తగ్గిపోయింది. ఒకప్పుడు ఇతరుల భవిష్యత్ చెప్పిన ఆరెగొందిలీలు నేడు వారి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. చిలుక జోస్యానికి పెట్టింది పేరు ఎక్మాయి బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామం సంచారజాతి ఆరెగొందిలీలకు పెట్టింది పేరు. ఈ గ్రామాని కి చెందిన వేలాది మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు వెళ్లి దశాబ్దాలుగా చిలుక జోస్యం చెబుతూ జీవనం సాగిస్తున్నా రు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్లో కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు, అనంతపురం, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాలు, కర్ణాటకలో బల్లారి, రాయచూరు, కలబురిగి, బీదర్, అలాగే మహారాష్ట్రలో సోలాపూర్, పుణే, ముంబై తదితర ప్రాంతాల్లో ఈ కుటుంబాలు స్థిరపడ్డాయి. ఒకప్పు డు చిలక జోస్యం వారి కుటుంబాలకు ప్రధాన జీవనాధారంగా ఉండేది. ప్రస్తుతం ఈ వృత్తికి ఆదరణ తగ్గిపోవడంతో యువత ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకుంటోంది. కొందరు వ్యవసాయ కూలీలుగా, మరికొందరు ఆటోలు నడుపుతూ, చిన్న వ్యాపారాలు, భవన నిర్మాణ పనులు, ఇతర కూలీ వృత్తుల్లో జీవనం సాగిస్తున్నారు. ఏరువాక పౌర్ణమికి.. ఆరెగొందిలీల జీవన విధానం ఇప్పటికీ సంచార స్వభావానిదే. సంవత్సరంలో ఎక్కువ కాలం వివిధ ప్రాంతాల్లో గడిపే వీరు ప్రతి ఏడాది ఏరువాక పౌర్ణమి సందర్భంగా స్వగ్రామమైన ఎక్మాయికి చేరుకుంటారు. తమ కులదైవమైన తుల్జాభవానీ మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను జరుపుకుంటారు. ఎక్కడ నివసించినా తమ మూలాలను మరువకుండా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అయితే సంచార జీవనం కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు చెబుతున్నారు. శాశ్వత నివాసం, గుర్తింపు పత్రాలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారించాలని కోరుతున్నారు. స్థిరపడిన ప్రాంతంలోనే ఓటర్లుగా నమోదు భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల్లోనే తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకుంటున్నారు. స్థిర నివాసం లేకపోవడంతో కొందరు స్వగ్రామంలో ఓటర్లుగా కొనసాగలేకపోతున్నారు. ఎక్మాయి కేంద్రంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 3 వేల కుటుంబాలకు చెందిన సుమారు 11 వేల మంది ఆరెగొందిలీలు జీవిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంప్రదాయ వృత్తి క్రమంగా అంతరించిపోతున్న నేపథ్యంలో ప్రత్యేక గుర్తింపు కలి్పంచి నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, గృహాలు, విద్య, సంక్షేమ పథకాల ద్వారా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
మహేశ్వరీ జాడ ఎక్కడ?
వికారాబాద్: కూలి పనికి వెళ్లిన తల్లి తిరిగి వస్తుందని ఆశగా ఇంటి గుమ్మం వద్ద ఇద్దరు చిన్నారుల నిరీక్షణ రోజురోజుకూ ఆవేదనగా మారుతోంది. జీవన్గీ గ్రామానికి చెందిన ఎనుముల మహేశ్వరి(35) జూన్ 8వ తేదీ అదృశ్యమై నేటికి 23 రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. మొబైల్ ఫోన్ మరో వ్యక్తి వద్ద లభించడం, రైల్వే స్టేషన్ల సీసీ ఫుటేజీల్లో స్పష్టమైన ఆధారాలు దొరకకపోవడం దర్యాప్తు ఆలస్యమవుతోంది. మండలంలోని జీవన్గీకి చెందిన ఎనుముల మహేశ్వరి భర్త అంజిలప్ప మరణానంతరం తన ఇద్దరు కుమార్తెలు అలకనంద(10), భువనేశ్వరి(12)ని పోషిస్తూ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కారి్మకురాలిగా నెట్టుకొస్తోంది. జూన్ 8న వికారాబాద్కు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్ డేటా రికార్డులు, మొబైల్ లొకేషన్ ఆధారంగా మహేశ్వరి చివరిసారిగా వికారాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వికారాబాద్, శంకర్పల్లి, లింగంపల్లి రైల్వే స్టేషన్ల సీసీ ఫుటేజీలను ప్రత్యేక బృందం పరిశీలించినప్పటికీ ఆమె ఎటు వెళ్లింది, ఎవరితో వెళ్లింది అనే విషయాల్లో స్పష్టత లభించలేదు. దర్యాప్తులో కీలకంగా మారిన మహేశ్వరి మొబైల్ ఫోన్ బెంజిమెన్ అనే వ్యక్తి వద్ద లభించడంతో అతడిని పోలీసులు విచారించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఫోన్ దొరికిందని, అక్కడ ముగ్గురు వ్యక్తులు ఓ మహిళను బలవంతంగా తీసుకెళ్తున్నట్లు చూసినట్లు అతడు చెప్పినట్టు సమాచారం. అయితే ఈ కేసుతో అతడికి ప్రత్యక్ష సంబంధం లేదని నిర్ధారణ కావడంతో ఐదు రోజుల క్రితమే విడుదల చేశారు. ప్రస్తుతం కాల్ డేటా, సీసీ ఫుటేజీలు, ప్రయాణికుల వివరాలు, రైల్వే మార్గాల్లో కదలికలు, ఇతర ఆధారాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి తెలిపారు. అమ్మా ఎప్పుడోస్తది..? ఇదిలా ఉండగా, ‘‘మా అమ్మ ఎప్పుడొస్తది’’ అంటూ ప్రతిరోజూ అడుగుతున్న ఇద్దరు చిన్నారుల పరిస్థితి గ్రామస్థులను కలచివేస్తోంది. మహేశ్వరి ఆచూకీని త్వరగా కనుగొని కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు, మహిళా సంఘాల ప్రతినిధులు పోలీసులను కోరుతున్నారు. 23 రోజులు గడిచినా ఆమె జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. మరోవైపు ఈ కేసులో దొరికిన బెంజిమెన్ను పోలీసులు వదిలిపెట్టడంపై ఆమె అన్న ఎనుముల ఈరప్ప అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసును సీరియస్గా దర్యాప్తు చేస్తలేరని ఆరోపిస్తున్నాడు. -
బీఆర్ఎస్-కాంగ్రెస్ సవాళ్ల నడుమ.. కేసీఆర్కు అద్దంకి ఫోన్
కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల అప్డేట్స్.. తెలంగాణ భవన్ నుంచి మీడియా సమావేశంలో హరీష్తెలంగాణ భవన్కు వస్తానన్న మంత్రి జూపల్లి ఎందుకు రాలేదు: హరీష్జూపల్లికి చీము, నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలిమంత్రి జూపల్లికి విషయం లేకనే చర్చకు రాలేదుమంత్రి జూపల్లి తెలంగాణ భవన్కు వస్తానని సెల్ఫ్గోల్ వేసుకున్నారుఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదుకేసీఆర్ బాధ్యతారాహిత్యంగా ఉన్నారు: అద్దంకికేసీఆర్ బయటకు రావడానికి బయపడుతున్నాడు.బీజేపీ పొత్తులొ ఎక్కువ సీట్లు లాగేందుకు బిఆర్ఎస్ బలంగా ఉందని చెప్పేందుకు కేటీఆర్- హరీష్ రావు ప్రయత్నిస్తున్నారు.జీతం తీసుకునేందుకే మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ వస్తున్నారు.కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దద్దమ్మలు హరీష్ రావు, కేటీఆర్.కేటీఆర్, హరీష్ ను పంపి తెలంగాణను ఆగం చేస్తున్నారు.కేటీఆర్- హరీష్ రావు సైడ్ యాక్టర్స్.బీజేపీ- బిఆర్ఎస్ మధ్య సీట్ల ఒప్పందం జరుగుతుంది.ప్రతిపక్ష నేత కేసీఆర్కు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఫోన్మీడియా సమావేశం నుంచే కేసీఆర్కు ఫోన్ చేసిన అద్దంకిఫోన్ లిఫ్ట్ చేసే వరకు ఇలాగే చేస్తానంటుంన్న అద్దంకిఅసెంబ్లీకి రావాలని కోరడానికే కేసీఆర్కు ఫోన్ చేస్తున్నా అంటున్న అద్దంకి. తెలంగాణ భవన్కు మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.తెలంగాణ భవన్ వద్ద మరోసారి హైటెన్షన్..గన్పార్క్కు బయలుదేరిన కేటీఆర్.గన్పార్క్కు వెళ్తుండగా కేటీఆర్ను అడ్డుకున్న పోలీసులు.పోలీసులతో కేటీఆర్ వాగ్వాదం.పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం.కేసీఆర్ రావాలంటే రాహుల్ గాంధీ రావాలిరాహుల్ గాంధీని తోలుకొస్తే.... కేసీఆర్ ను తెచ్చే భాద్యత నాదిఅక్కడేమో మంత్రులు తొడలు కొడుతున్నారు.. ఇకడేమో పోలీసులను పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారుముఖ్యమంత్రి సవాల్ విసిరితే సందట్లో సడేమియా అన్నట్టు మద్యలో జూపల్లి దూరిండుఅన్ని లెక్కలు చెప్పడానే సిద్ధంగా ఉన్నాం.సీఎం, జూపల్లికి కేటీఆర్ సవాల్.. అరెస్ట్ ఎందుకు.. చర్చకు దమ్ము లేదా?: కేటీఆర్ సవాల్తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్తో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం.సవాల్ చేసిన సీఎం తోక ముడిచి పారిపోయారు.సవాళ్ల మధ్యలో మంత్రి జూపల్లి దూరారు.చర్చకు సిద్దమైతే మంత్రి జూపల్లి ఎక్కడికి పోయారు.బహిరంగంగా చర్చించే దమ్ము మంత్రులకు లేదు.చేతకాని వాళ్లు సవాళ్లు ఎందుకు చేయాలి?.చర్చించేందుకు కనీసం అసెంబ్లీ అయినా పెట్టండి.సవాళ్లు చేయడం.. పారిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనం.ముఖ్యమంత్రి, మంత్రులు చేతకాని వాళ్లని తేలిపోయింది.విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదు.చర్చకు మంత్రి వస్తారనుకుంటే ముఖం చాటేశారు.ప్రజాక్షేత్రంలో మీ డొల్లతనం బయటపడింది.మా ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు.అప్పులపై చర్చకు రావాలని మొన్న సీఎం సవాల్ విసిరారు.గురుకులాల్లో అవినీతిపై చర్చకు వెళ్తే హరీష్రావును అరెస్ట్ చేశారు.తెలంగాణ భవన్కు వస్తానని జూపల్లి అన్నారు.తెలంగాణ భవన్కు రాకుండా జూపల్లి ఎక్కడో మాట్లాడుతున్నారు.దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి, సభలోనే చర్చిద్దాం.గన్పార్క్ దగ్గర జూపల్లి ఉంటే, మేం అక్కడికే చర్చకు వస్తాం.మేం గన్పార్క్ వెళ్తే చార్మినార్ రమ్మంటారు.చార్మినార్ వెళ్తే కొల్లాపూర్ రమ్మంటారు.అసలు తన శాఖలో ఏం జరుగుతుందో జూపల్లికే తెలియదు.లేదంటే మా వాళ్లను కంచన్బాగ్కు పంపించారు కదా..అక్కడికే రండి అక్కడే చర్చిద్దాం.సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వస్తే.. అక్కడ చర్చకు మేం రెడీ.ముఖ్యమంత్రి రేవంత్.. సెక్యూరిటీ లేకుండా చర్చకు రావాలి.హరీష్రావు చర్చలకు వస్తే అరెస్ట్ చేయిస్తారు. కంచన్బాగ్ పీఎస్కు బీఆర్ఎస్ నేతలుతెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు. హరీష్ సహా గులాబీ పార్టీలను కంచన్బాగ్ పీఎస్కు తరలింపుపోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం.. హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర బీఆర్ఎస్ నేతల బృందాన్ని అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో సిటీ చుట్టూ తిప్పుతున్న పోలీసులుపోలీసుల వాహనం వెంబడి వందలాది వాహనాల్లో బయల్దేరిన బీఆర్ఎస్ శ్రేణులుహరీష్ రావును ఎక్కడికి తీసుకెళ్తే అక్కడి వరకు వెంటే వస్తామంటున్న బీఆర్ఎస్ శ్రేణులు https://t.co/BwNMKhesLv pic.twitter.com/Z8VfKmNEG8— Telugu Scribe (@TeluguScribe) July 2, 2026 జూపల్లి కోసం కేటీఆర్ వెయిటింగ్..మంత్రి జూపల్లి కోసం తెలంగాణభవన్లో ఎదురుచూస్తున్న కేటీఆర్తెలంగాణభవన్లో చర్చ కోసం జూపల్లికి కుర్చీ ఏర్పాటు.సవాల్ చేయడం కాదు.. జూపల్లి రావాలంటూ బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కామెంట్స్..హరీష్, కేటీఆర్ కోసం రెండు గంటల పాటు ఎదురుచూశాంముగ్గురం మంత్రులం అమర వీరుల స్తూపం దగ్గరకి వచ్చి వెయిట్ చేశాంహరీష్, కేటీఆర్ చర్చకు రాలేదుబీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధంపోలీసులు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? అంటూ ప్రశ్నలు. అసెంబ్లీలో కూడా చర్చకు సిద్దమే..హరీష్ రావు సహా బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.హరీష్ను అరెస్ట్ చేసి వాహనం ఎక్కించిన పోలీసులు. హరీష్ కామెంట్స్..మంత్రి జూపల్లి తెలంగాణ భవన్కు వస్తానన్నారు.. తోక ముడిచారు.గురుకులాలపై చర్చలకు గన్పార్క్కు రమ్మన్నారు.మేము వస్తుంటే పోలీసులతో అడ్డుకుంటున్నారు.చర్చకు రావాలని పిలిచి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?.అసెంబ్లీలో కూడా చర్చకు సిద్దమే.పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.ప్రభుత్వ అవినీతిని ప్రజలు, అసెంబ్లీ ముందు పెడతాం. మరోవైపు.. మంత్రి పొంగులేటి సీఎల్పీకి చేరుకున్నారు. దమ్ముంటే మమ్మల్ని అడ్డుకోవద్దు..గన్పార్క్ బయలుదేరిన హరీష్రావును అడ్డుకున్న పోలీసులు.పాదయాత్రగా గన్పార్క్ వెళ్లేందుకు సిద్దమైన హరీష్.హరీష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.పోలీసులను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు.పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని హరీష్ ఆగ్రహం.ప్రభుత్వానికి దమ్ముంటే తమను అడ్డుకోవద్దని సవాల్మంత్రి జూపల్లి కామెంట్స్గాంధీ భవన్లో మంత్రి జూపల్లిహరీష్ రావు గన్ పార్క్ వస్తున్నానని చెప్పారుబావ బామ్మర్దులు ఇద్దరు రండినేను సైతం గన్ పార్క్ దగ్గరికి వస్తున్నానువారి సవాల్కు సమాధానం అక్కడే ఇస్తానుబావ ఒక దగ్గర బామ్మర్ది ఒక దగ్గర ఎందుకు?.ఇద్దరూ గన్ పార్క్ రండి ఇద్దరికీ అక్కడే సమాధానం ఇస్తాను.హరీష్ రావు, కేటీఆర్ వస్తే చర్చకు సిద్ధం అంటున్న మంత్రులు..ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపించండి అంటూ మంత్రుల వ్యాఖ్యలు... తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా..కారులో నుంచే మంత్రి పొన్నంకు హరీష్ ఫోన్ కాల్.మంత్రి పొన్నం తన కాల్ లిఫ్ట్ చేయడం లేదన్న హరీష్.పోలీసుల తీరుపై మాజీ మంత్రి హరీష్ సీరియస్.మంత్రులకు ఫోన్ చేసినా తీయడం లేదని వ్యాఖ్యలు..పోలీసులతో హరీష్ వాగ్వాదం..పోలీసుల అదుపులో హరీష్. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. హరీష్రావు అడ్డగింత.. గన్పార్క్కు బయలుదేరిన హరీష్రావును అడ్డుకున్న పోలీసులు.పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదంమంత్రులే గన్పార్క్ వద్దకు తనను రమ్మనారంటూ హరీష్ వాగ్వాదంమా కోసం మంత్రులు ఎదురుచూస్తున్నారు. గన్పార్క్కు బయలుదేరిన హరీష్మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మంత్రులతో చర్చకోసం అమరవీరుల స్థూపం వద్దకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలుమంత్రి జూపల్లితో చర్చ కోసం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎదురుచూస్తున్న మరో బృందంతెలంగాణభవన్లోనే కేటీఆర్ ఉంటారు.ఎక్కడైనా మేం చర్చకు సిద్దం.గురుకులాలపై అన్ని ఆధారాలతో మేము వస్తున్నాం.చర్చకు మేం సిద్ధం.మంత్రులు అక్కడే ఉండాలి.మీ చాలెంజ్లు, బహిరంగ సవాళ్లకు మేం భయపడం: మంత్రి అడ్లూరిఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వద్ద ఆధారాలుంటే చూపించాలి: మంత్రి పొన్నంఅవినీతి చేసినట్టు నిరూపిస్తే మేం రాజీనామా చేస్తాం: పొన్నం తెలంగాణలో పొలిటికల్ హీట్.. తెలంగాణ భవన్ చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు..సమావేశమైన కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు.ప్రెస్ క్లబ్ వద్ద పోలీసుల మోహరింపుకాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, గెల్లు శ్రీనివాస్గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు సిద్ధమన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్గురుకులాల్లో అవినీతి జరిగిందంటోన్న బీఆర్ఎస్మంత్రులు అడ్లూరి, అజహారుద్దీన్, పొన్నం చర్చకు రావాలంటోన్న బీఆర్ఎస్దీంతో సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వద్ద పోలీసుల మోహరింపు గన్పార్క్ చేరుకున్న మంత్రులు..గన్ పార్క్కి చేరుకున్న మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర ముఖ్య నేతలుచర్చకు రావాలంటూ బీఆర్ఎస్ నేతలకు సవాల్.. తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్..కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల నడుమ.. తెలంగాణ భవన్ వద్ద మోహరించిన పోలీసులు లు.తెలంగాణ భవన్కు చేరుకుంటున్న బీఆర్ఎస్ నేతలుమినిస్టర్ క్వార్టర్స్ నుంచి గన్ పార్క్కి బయలుదేరిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్రాష్ట్ర అప్పులపై సవాళ్లు..రాష్ట్ర అప్పులపై చర్చించేందుకు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు.10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు.చర్చకు సిద్ధమైతే తెలంగాణ భవన్కు వస్తానన్న జూపల్లి.రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పులపై చర్చకు సిద్ధమంటున్న బీఆర్ఎస్కాసేపట్లో తెలంగాణ భవన్కు రానున్న కేటీఆర్ , హరీష్ రావు.మంత్రులు వర్సెస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్గురుకుల టెండర్స్ కుంభకోణంపై చర్చించేందుకు సిద్ధమా అంటూ మంత్రులకు సవాల్ విసిరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.గురుకుల టెండర్స్ కుంభకోణంపై చర్చించేందుకు తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు బయలుదేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.అమరవీరుల స్థూపం వద్దకు కేటీఆర్, హరీష్ రావు రావాలంటున్న మంత్రులు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ , అమరవీరుల స్థూపం వద్ద పెద్ద ఎత్తున మోహరించిన పోలీస్ బలగాలు.మంత్రి అడ్లూరి కౌంటర్.. దమ్ముంటే బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై అసెంబ్లీలో చర్చకు రావాలని డిమాండ్.ఆరోపణలు చేసి తొక ముడవడం కాదు.. నిరూపించాలని డిమాండ్.ఆర్ఎస్ ప్రవీణ్ చిట్టా మా దగ్గర ఉందిఅందరి లెక్కలు తేలుస్తాం. -
డీఎస్పీ నివాసంలో ఏసీబీ సోదాలు.. 8 కోట్ల విల్లా, ఆస్తులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఏసీబీ అధికారులు సోదాల అంశం చర్చనీయాంశంగా మారింది. తాజాగా పటాన్చెరువు డీఎస్పీ భీమ్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఏక కాలంలో హైదరాబాదుతో పాటు 20 చోట్ల తనిఖీలు చేపట్టారు. గురువారం తెల్లవారుజాము నుంచే సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. సోదాల్లో భాగంగా రూ.8 కోట్ల విలువైన విల్లాలు, భారీగా అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఏసీబీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
భోజన విరామం వరకు కోర్టులోనే నిలబడండి
సాక్షి, హైదరాబాద్: పోలీస్ అధికారి అయినంత మాత్రాన అనుకున్నది చేస్తారా.. చట్టం చేతుల్లో ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తారా అని మధురానగర్ ఎస్ఐపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్న భోజన విరామ సమయం వరకు కోర్టు గదిలోనే నిలబడాలని ఎస్ఐని ఆదేశించింది. పోలీస్ కమిషనర్ నుంచి నివేదిక తెప్పించుకొని అందజేయాలని ప్రభుత్వ న్యాయవాది ఆదేశిస్తూ.. విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది. మే 18న యూసఫ్గూడ ఇంటిలో ఉండగా పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, వారిపై చర్యలతోపాటు పరిహారం ఇప్పించాలని కోరుతూ మాజీ ఎస్ఐ మహ్మద్ ఉస్మాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎస్ఐ కోర్టుకు హాజరయ్యారు. ఫొటోలను పరిశీలించిన న్యాయమూర్తి.. పిటిషనర్ కేవలం లోదుస్తులు (లుంగీ, బనియన్) ధరించి ఉన్న స్థితిలోనే ఆయన్ని బయటకు లాగడం, నిస్సహాయ స్థితిలో రోడ్డుపై వదిలేయడానికి కారణాలను వివరించాలని ఎస్ఐను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు అందిందని హోం శాఖ ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజే తెలిపారు.2023లో పోలీసులపై దాడి చేసిన క్రిమినల్ కేసులో పిటిషనర్ కుమారుడు నిందితుడిగా ఉన్నాడని, పిటిషనర్ అతన్ని కాపాడుతున్నారన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘పోలీస్ స్టేషన్కు ఎందుకు తీసుకెళ్తున్నారో మీరు పిటిషనర్కు చెప్పారా? ఆయన కుమారుడి ప్రమేయం ఏదైనా, రిటైర్డ్ అధికారి అయిన ఆయన్ని అలా బలవంతంగా లాగకూడదు కదా. అరెస్టుకు కారణాలను తెలియజేయడం మీ బాధ్యత. ఇప్పటివరకు మీరు (కుమారుడి) కేసు గురించి మాట్లాడలేదు, ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నారు’అని పేర్కొన్నారు. జీపీ అభ్యర్థన మేరకు, పిటిషనర్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమరి్పంచాలని సీపీ ఆదేశించారు. -
నెల రోజులకు చిక్కి.. గంటల్లో చెక్కేశాడు!
హైదరాబాద్, మణికొండ: నిషేధిత హష్ ఆయిల్ అమ్ముతున్న ముఠాను ఈగల్ టీం నెల రోజుల పాటు కాపు కాసి.. మెరుపుదాడులు నిర్వహించి మంగళవారం అరెస్టు చేసింది. తదుపరి విచారణ, కోర్టులో హాజరుపర్చటం నిమిత్తం వారిని నార్సింగి పోలీసులకు సాయంత్రం అప్పజెప్పారు. రాత్రంతా స్టేషన్లో ఉన్న ప్రధాన నిందితుడు సయ్యద్ మహ్మద్ ముజఫర్ అలీ బుధవారం తెల్లవారు జామున మూత్రవిసర్జనకు వెళ్తున్నా అని చెప్పి స్టేషన్ ప్రహరీ దూకి పారిపోయాడు.వివరాల్లోకి వెళ్తే.. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 258 సమీపంలో నివసించే డ్రగ్స్ విక్రేత సయ్యద్ మహ్మద్ ముజఫర్ అలీ పుప్పాలగూడలోని ఓయో హోటల్లో ఉన్నట్లు సమాచారం రావడంతో దాడి చేసి అరెస్టు చేశారు. అతనిచ్చిన సమాచారం మేరకు హష్ఆయిల్ విక్రేతలైన బుద్వేల్కు చెందిన రహీమున్నీసా, సయ్యద్ మహ్మద్ మజహర్ అలీలనూ అరెస్టు చేశారు.వీరిని రాత్రి పది గంటలకు ఈగల్ టీం బృందం నార్సింగి పోలీస్స్టేషన్లో అప్పగించారు. తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ముజఫర్ అలీ మూత్రం వస్తుందని చెప్పగా.. అక్కడే ఉన్న కానిస్టేబుల్ పక్కనే ఉన్న మూత్రశాలకు తీసుకెళ్లాడు. ఇంతలోనే ముజఫర్ అలీ బయటకు పరుగు తీశాడు. స్టేషన్ వెనుక.. మూసీ నది వైపు ఉన్న ప్రహరీని సునాయాసంగా ఎక్కి అవతలకు దూకి పరారయ్యాడు. స్టేషన్ సిబ్బంది తేరుకునే లోపే నిందితుడు అదృశ్యమయ్యాడు. విషయం తెలుసుకుని సైబరాబాద్ అడిషనల్ డీసీపీ ఉదయ్రెడ్డి బుధవారం పోలీస్స్టేషన్కు వచ్చి పరిస్థితిని సమీక్షించారు.నిందితున్ని వెంటనే అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా తప్పించుకున్న నిందితుడు ఓ క్యాబ్లో అత్తాపూర్ సమీపంలోని లెనిన్నగర్ వరకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. సదరు క్యాబ్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. నిందితుడు పరారైంది వాస్తవమేనని, అతన్ని అరెస్టు చేసేందుకు ఈగల్టీంతో పాటు తమ బృందం గాలిస్తుందని నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు. -
హిజ్రాల చేతిలో యువకుడి హత్య!
హైదరాబాద్, పహాడీషరీఫ్: పాతబస్తీ మీర్చౌక్లో అదృశ్యమైన ఓ యువకుడు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో శవమై కనిపించిన సంఘటన బుధవారం వెలుగుజూసింది. హిజ్రాల చేతిలో హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్చౌక్ ప్రాంతానికి చెందిన ఫిర్దోస్ ఖాన్ రెండో కుమారుడు ఒవేజ్ఖాన్(26) ఖాళీగా ఇంటి వద్దే ఉంటున్నాడు.ఇతనికి కొంతకాలంగా హిజ్రాలతో సంబంధాలున్నాయి. గత నెల 27వ తేదీన రాత్రి 11 గంటలకు అనారోగ్యంతో ఉన్న తండ్రిని ద్విచక్ర వాహనంపై స్థానిక దుర్రు షెహవర్ ఆసుపత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. 28వ తేదీన రాత్రి సర్దార్నగర్ షీప్ మండి సమీపంలో అతని బైక్ లభ్యమైంది. ఈ విషయమై ఫిర్దోస్ఖాన్ మీర్చౌక్ పోలీస్స్టేషన్లో 29వ తేదీన ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం బైక్ లభ్యమైన షీప్ మండి సమీపంలో ఒవేజ్ఖాన్ మృతదేహం ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ బీఎల్ఎన్ రెడ్డి కుటుంబ సభ్యులను రప్పించి పరిశీలించగా ఒవేజ్ఖాన్ మృతదేహంగా తేలింది. గాయాలు గుర్తించలేని స్థితిలో మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. దివ్యాన్షి, కరిష్మాతో పాటు మరికొందరు హిజ్రాలు అతన్ని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
నా కోరిక తీరిస్తేనే డబ్బులు, బంగారం ఇస్తా..!
హైదరాబాద్: స్నేహం పేరుతో ఒక మహిళను నమ్మించి రూ.లక్షల్లో మోసగించడమే కాకుండా తన కోరిక తీర్చాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. వెంకటగిరిలో నివసించే మహిళ (30)కు పాలపారి కుంభేదర్రెడ్డి (32) అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆమె నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారానికి తనకు డబ్బులు కావాలంటూ కటారియా జ్యువెలర్స్లో ఆమె బంగారాన్ని తాకట్టు పెట్టించి రూ.2 లక్షలు రుణంగా తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమె కళ్లు గప్పి ఇంట్లో ఉన్న గోల్డ్ తాకట్టు రశీదును దొంగిలించాడు. తన అప్పులను తీర్చుకుని ఆ బంగారాన్ని విడిపించుకుని మళ్లీ గురు గోల్డ్షాపులో రూ.3.50 లక్షలకు తిరిగి తాకట్టు పెట్టాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు నిలదీయగా ఆమెను తీవ్రంగా వేధించసాగాడు. తన కోరిక తీరిస్తేనే డబ్బులు ఇస్తానంటూ అసభ్యంగా మాట్లాడడమే కాకుండా చంపేస్తానని హెచ్చరించాడు. పరువు పోతుందనే భయంతో బాధితురాలు చివరకు రూ.3.50 లక్షలు చెల్లించి ఆ బంగారం విడిపించుకుంది. అనంతరం అప్పుల భారం, నిందితుడి వేధింపులు తట్టుకోలేకపోతున్నానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్యూమరేషన్ ఫారం 'లక్ష్యానికి దూరం'
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లో నత్తనడకన సాగుతోంది. రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా బుధవారం రాత్రి నాటికి 2.38 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగింది. ఇందులో అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 32 శాతం, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 37 శాతం, హైదరాబాద్ జిల్లాలో 42 శాతం మంది ఓటర్లకే ఎన్యూమరేషన్ ఫారాలు అందాయి. సర్–2026 షెడ్యూల్ ప్రకారం గత నెల 24న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని ప్రారంభించగా వారం రోజుల్లోగా పూర్తి చేయాలని పెట్టుకున్న లక్ష్యం నెరవేరలేదు. మరో 2, 3 రోజుల్లో గ్రామీణ జిల్లాల్లో ఫారాల పంపిణీ పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తుండగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల విషయంలో మాత్రం ఏమీ చెప్పలేకపోతున్నారు. ఈ మూడు జిల్లాల్లో గరిష్టంగా 70 శాతానికి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగే అవకాశం లేదని అంచనా వేశారు. రాష్ట్రంలోని 33.75 శాతం ఓటర్లు ఈ మూడు జిల్లాల్లోనే ఉండగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో తీవ్రంగా వెనుకబడటం ఆందోళన కలిగిస్తోంది. ఓటర్ల మ్యాపింగ్లో సైతం ఈ మూడు జిల్లాలు అట్టడుగు స్థానంలో ఉన్నాయి. ఫారాలను నింపి ఈ నెల 24లోగా స్థానిక బీఎల్ఓలకు అందించే ఓటర్ల పేర్లనే ఈ నెల 31న ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రచురించనున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ మూడు జిల్లాల్లోనే లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతు కావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిలకడ లేని ఓటర్లు... వలసల్లో భాగంగా తరచూ అద్దె ఇళ్లు మారడం, ఉద్యోగాల మార్పు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల వలసలు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు కలిగి ఉండటం, ఇళ్లకు తాళాలు వేసి ఉండటం వంటి కారణాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లో ఓటర్ల ఆచూకీని బీఎల్ఓలు కనిపెట్టలేకపోతున్నారని అధికారులు తెలిపారు. ఒకవేళ బీఎల్ఓలు మూడుసార్లు ఇంటికి వెళ్లినా తాళం వేసి ఉంటే ఆ ఇంట్లోని ఓటర్ల ఫారాలను తలుపు వద్దే పెట్టి రావాలని బీఎల్ఓలకు జీహెచ్ఎంసీ సూచించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. రెండు రోజుల్లో డిజిటలైజేషన్ మరో రెండు రోజుల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను ముగించి ఆ వెంటనే డిజిటలైజేషన్ ప్రక్రియను ఈసీ ప్రారంభించనుంది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) మళ్లీ ఓటర్ల ఇళ్లకు వెళ్లి వారు నింపిన ఫారాలను వెనక్కి తీసుకుని తమ మొబైల్ ఫోన్లోని ఈసీ యాప్ ద్వారా స్కాన్ చేసి అప్లోడ్ చేయనున్నారు. స్కాన్ చేసిన ఫారాల్లోని సమాచారాన్ని ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఫారాలను ఎలా నింపాలో ఓటర్లకు బీఎల్ఓలు అవగాహన కల్పిస్తారని అధికారులు పదేపదే పేర్కొంటుండగా బీఎల్ఓలలో అధిక శాతం మందికి ఫారాలను ఎలా నింపాలో తెలియడం లేదు. దీంతో వారికి మరోసారి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు సీఈఓ కార్యాలయం ఆదేశించింది. భాగ్యనగరంలో ఇళ్లకు రాని బీఎల్ఓలు.. హైదరాబాద్లో ఇంకా చాలా మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. బీఎల్ఓలే ఇళ్లకు వచ్చి ఫారాలు ఇస్తారని ఓటర్లు ఎదురుచూస్తున్నారు. అయితే కొందరు బీఎల్ఓలు మాత్రం తమ వద్దకు వచి్చన ఓటర్లకే ఫారాలు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే మరికొందరు బీఎల్ఓలు రాజకీయ పార్టీల కార్యాలయాలు, నేతల ఇళ్ల వద్ద మకాం వేసి ఫారాలు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేయడం గమనార్హం. -
మాంగళ్యం తంతు'నో'నేనా?
సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్ అప్గ్రెడేషన్ ప్రక్రియ వివాహ రిజిస్ట్రేషన్లకు తిప్పలు తెచ్చి పెట్టింది. ఈ అప్గ్రెడేషన్ కారణంగా ఏర్పడిన సాంకేతిక సమస్యలతో మూడ్రోజులుగా వివాహ రిజిస్ట్రేషన్ల పోర్టల్ సరిగా ఓపెన్ కావడం లేదు. సోమ, మంగళవారాల్లో అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలకూ అంతరాయం కలిగినప్పటికీ బుధవారం నాటికి వ్యవస్థ గాడిలో పడింది. అయినా వివాహ రిజిస్ట్రేషన్ల సేవలు మాత్రం సాంకేతిక సమస్యలనే ఎదుర్కొన్నాయి. దీంతో ప్రతి రోజూ సగటున 200 వరకు రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉండగా, బుధవారం కేవలం 47 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నామని, గురువారం నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. క్రమక్రమంగా.. సర్వర్ అప్గ్రెడేషన్ కారణంగా సాంకేతిక సమస్యలతో మూడ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ఇబ్బందులు పడుతుండగా, బుధవారం నాటికి ఓ కొలిక్కి వచ్చింది. ఎప్పటికప్పుడు ఎదురయ్యే సాంకేతిక సమస్యలను అధికారులు పరిష్కరిస్తుండటంతో రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్తో పాటు సబ్రిజిస్ట్రార్ల లాగిన్లో రిజిస్ట్రేషన్ లావాదేవీల నిర్వహణ సజావుగా సాగింది. ఈసీలు, ఇతర సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో బుధవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 4,300కు పైగా లావాదేవీలు పూర్తయ్యాయి. కానీ వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసే భూభారతి పోర్టల్ మాత్రం సాంకేతిక సమస్యల వలయంలోనే చిక్కుకుని పోయింది. వరుసగా మూడో రోజు బుధవారం కూడా తహసీల్దార్ల లాగిన్లో సాంకేతిక సమస్యలొచ్చాయి. లాగిన్ అవుతున్నా వెంటనే లాగ్ అవుట్ కూడా అయిపోతుండటంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించడం కష్టతరమైందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. రెవెన్యూ వర్గాల గణాంకాల ప్రకారం భూభారతి పోర్టల్ ద్వారా బుధవారం 1,840 దరఖాస్తులు రాగా, కేవలం 159 మాత్రమే పూర్తయ్యాయి. సాంకేతిక సమస్యలతో పది నిమిషాలకోసారి అంతరాయం ఏర్పడుతున్నందున లావాదేవీ పూర్తికావడం లేదని తహసీల్దార్లు చెబుతున్నారు. గత నెల 25వ తేదీ నుంచి భూభారతి గణాంకాలను పరిశీలిస్తే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం 11,700కు పైగా దరఖాస్తులు రాగా, అందులో కేవలం 3,700 వరకు మాత్రమే లావాదేవీలు పూర్తయ్యాయి. ఇందులో విరాసత్ల కోసం 1,200కు పైగా దరఖాస్తులు రాగా, కేవలం రెండంటే రెండు లావాదేవీలు మాత్రమే పూర్తి కావడం గమనార్హం. -
ధరణి, భూ భారతి పోర్టల్స్లో అక్రమాలపై ప్రత్యేక కమిటీ
సాక్షి, హైదరాబాద్: ధరణి, భూ భారతి పోర్టల్స్లో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంశంపై బుధవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ధరణి పోర్టల్పై కొనసాగుతున్న ఫోరెన్సిక్ ఆడిట్ పురోగతిపై జరిగిన సమీక్షలో కొన్ని ఆందోళనకర అంశాలు మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.ధరణి పోర్టల్ నిర్మాణంలో సహజసిద్ధమైన భద్రతా లోపాలున్నాయని, వాటిని కొందరు అక్రమార్కులు దుర్వినియోగం చేసి కొన్ని మాడ్యూళ్ల ద్వారా అనధికారిక ఎంట్రీలు చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) రూపొందించిన భూ భారతి పోర్టల్ కూడా.. ధరణి ఆధారిత సాంకేతిక నిర్మాణాన్ని అనుసరించడం వల్ల అదే తరహా లోపాలు తలెత్తే అవకాశం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా మాడ్యూల్స్ రూపొందించిన వ్యక్తులే దీనివెనుక ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోందని, ఈ నేపథ్యంలో బాధ్యులను గుర్తించడం, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ప్రారంభించడం, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు సూచించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. కమిటీలో సభ్యులుగా... మిక్కిలినేని మనుచౌదరి (కలెక్టర్, మేడ్చల్–మల్కాజిగిరి), ప్రతీక్ జైన్ (కలెక్టర్, సంగారెడ్డి), అనుదీప్ దురిశెట్టి, (సంయుక్త కార్యదర్శి, ఐటీ, కమ్యూనికేషన్స్), హర్ష వర్ధన్ (తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో), అపూర్వ్ చౌహాన్ (ప్రాజెక్ట్ డైరెక్టర్, సీఎంఆర్ఓ), మంద మకరంద్ (ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఏ, ఉట్నూర్), ఏ.సంపత్ (డీఎస్పీ, సైబర్ క్రైమ్స్), ఎం.సుభాíÙణి (డీఐజీ, రిజి్రస్టేషన్స్), ఏ.శ్రీనివాస సుబ్బారావు (సీనియర్ డైరెక్టర్ (ఐటీ), ఎన్ఐసీ) లను నియమించినట్టు తెలిపారు.మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ద్వారా పూర్తిగా కొత్తగా, అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సరికొత్త సిస్టమ్ ఆర్కిటెక్చర్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కమిటీ 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుందని వెల్లడించారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని లోకేశ్ కుమార్ పేర్కొన్నారు. భూముల రికార్డుల భద్రత, సమగ్రత, పారదర్శకత విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని ఆ ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. గిరిజన రైతులకు భూ భారతిలో ప్రత్యేక మాడ్యూల్సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన రైతులకు ఉపశమనం కలిగించేలా ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద ఉన్న పోడు భూముల వివరాలను భూ భారతి పోర్టల్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక మాడ్యూల్ను అందుబాటులోకి తీసుకొచి్చంది. 2.30 లక్షల మంది గిరిజన రైతులకు చెందిన 6.70 లక్షల ఎకరాల పోడు భూములకు ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద పట్టాలు ఉన్నా ధరణి, అనంతరం భూ భారతి పోర్టల్లో నమోదు కాకపోవడంతో రైతులు పంట రుణాలు, విద్యుత్ కనెక్షన్లు, బోర్ల అనుమతులు, పంట నష్టపరిహారం వంటి ప్రయోజనాలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యపై రైతు కమిషన్ గతేడాది చివర్లో ప్రత్యేకంగా స్పందించి, ఎస్ఎల్బీసీ, రెవె న్యూ, అటవీ, ఐటీడీఏ, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు గిరిజన రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అనంతరం సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు భూ భారతి పోర్టల్లో ప్రత్యేక మాడ్యూల్ను రూపొందించినట్లు పేర్కొంది.ఈ నేపథ్యంలో రైతు కమిషన్ చేసిన సిఫారసుల మేరకు ప్రభుత్వం భూభారతిలో ప్రత్యేక మాడ్యూల్ కోసం నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వెల్లడించారు. దీంతో ఇకపై పోడు పట్టాలున్న గిరిజన రైతులు పంట రుణాలు పొందడంతో పాటు బోర్ల అనుమతులు, విద్యుత్ సరఫరా, పంట కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపరిహారం వంటి ప్రభుత్వ సేవలు పొందేందుకు అవకాశం కలుగుతుంద న్నారు. గిరిజన రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్రెడ్డికి ఎం.కోదండరెడ్డి, రాములు నాయక్, కేవీఎన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
ఎండలు చురచుర వానలు అరకొర
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్ పావు వంతు ముగిసింది. నాలుగు నెలల పాటు కొనసాగే నైరుతి సీజన్లో రెండో నెలగా భావించే జూలై వాతావరణ అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం, అంతకంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కానీ ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. సీజన్ సాధారణ వాతావరణం కంటే భిన్నంగా ఉంటుందని హెచ్చరించింది. సాధారణంగా జూలైలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులు బలపడుతుండటంతో ఆ ప్రభావం వర్షాలపై తీవ్రంగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్లో కీలకమైన హిందూ మహా సముద్రంలో వాతావరణ పరిస్థితులు తటస్థంగా ఉండటం వర్షాభావ పరిస్థితులకు సంకేతంగా చెప్పొచ్చు. ఐఎండీ పరిశీలన ప్రకారం.. రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి వాతావరణ అంచనాలను విడుదల చేసింది. వర్షాల అంచనాలతో పాటు ఉష్ణోగ్రతల స్థితిని కూడా అంచనా వేసింది. ⇒ ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది ⇒ మధ్య తెలంగాణ ప్రాంతంలోని రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో సీజన్లో సగటు సాధారణ వర్షపాతానికి దగ్గరగా గణాంకాలు నమోదు కావొచ్చు ⇒ దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్నగర్ జిల్లాతో పాటు సమీప ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చు ⇒ తూర్పు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సాధారణ సగటు వర్షపాతం నమోదు కావొచ్చు అంతటా అధిక ఉష్ణోగ్రతలే.. నైరుతి సీజన్లో వర్షాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. సీజన్ ముగిసే నాటికి చలి తీవ్రత మొదలవుతుంది. కానీ ఈసారి నైరుతి సీజన్లో ఇంకా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వానలు ఆశించినంతగా లేకపోవడం, వాతావరణంలో మార్పులతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. జూన్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనా జూలై నాటికి భారీగా తగ్గుముఖం పడతాయి. కానీ ఈసారి జూలైలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీల్లోపు నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు అంతకంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలే కాకుండా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండనున్నాయి. -
ఏఐతో ట్రాఫిక్ నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఫిజికల్ ఇంటెలిజెన్స్ను వినియోగించేందుకు వీలుగా హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్, దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే అనలాగ్ ఏఐ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాఫిక్ నిర్వహణ చేపట్టేందుకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకున్నాయి. ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో జరిగిన ఈ కార్యక్రమంలో అనలాగ్ ఏఐ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్మాన్, మేఘా ఇంజనీరింగ్ ఎండీ పి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు. భాగ్యనగరంలో ట్రాఫిక్ సిగ్నళ్లను ఏఐ సాంకేతికతతో అనుసంధానించాలని సీఎం రేవంత్రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. ట్రాఫిక్ రద్దీకి, వాతావరణ మార్పులకు అనుగుణంగా సిగ్నళ్లు పనిచేసే విధానాన్ని తీసుకురావాలని కోరారు. భవిష్యత్తు తరాలకు అవసరమైన మేధోపరమైన మౌలిక సదుపాయాలు,ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాల అభివృద్ధికి అనలాగ్ ఏఐ, మేఘా ఇంజనీరింగ్ భాగస్వామ్యంలో చేస్తున్న ప్రయత్నాలను ఈ సమావేశంలో కృష్ణారెడ్డి, కిప్మాన్ సీఎంకు వివరించారు. ట్రాఫిక్ రద్దీని గుర్తించి తదనుగుణంగా నియంత్రణకు చర్యలు తీసుకోవడం, నీటి లీకేజీని గుర్తించి పైపులైన్ల మరమ్మతుల నిర్వహణకు ముందస్తు సూచనలు చేయడం, అవసరానికి అనుగుణంగా విద్యుత్ వాడకం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలకు దారి ఇవ్వడం వంటి కాగ్నిటివ్ సిటీ సదుపాయాల అభివృద్ధికి ఉన్న అవకాశాలను అనలాగ్ ఐఏ సీఈఓ కిప్మాన్ రేవంత్రెడ్డికి వివరించారు. నగర సమస్యల సత్వర పరిష్కారానికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించారు. నగరంలో అడ్వాన్స్డ్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫార్మ్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. సెన్సార్లు, రొబోటిక్స్ వంటి ఫిజికల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ పరికరాల వినియోగంతో సురక్షితమైన, సమర్థవంతమైన, వేగంగా స్పందించే నగర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. వేగంగా విస్తరిస్తున్న పట్టణాల అవసరాలకు తగ్గట్లు ప్రభుత్వాల పనితీరు సామర్థ్యం పెంపు, పౌర సేవల మెరుగుదల, డేటా ఆధారిత మౌలిక సదుపాయాల ప్రణాళిక తయారీకి అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ఎలా దోహదపడుతుందో ఇరు సంస్థల ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఎం.ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు, ప్రభుత్వ సలహాదారు కె.రామకృష్ణారావు, ఇన్వెస్ట్ సీఈఓ బి.అజిత్రెడ్డి పాల్గొన్నారు. -
ఏపీ పోలీసులపై తెలంగాణలో క్రిమినల్ కేసు
సాక్షి, సిటీ బ్యూరో: హైదరాబాద్లో నివసిస్తున్న జర్నలిస్టు కోశిక వెంకట్రామిరెడ్డి (కేవీ రెడ్డి)ని అదుపులోకి తీసుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన భార్య చేయి పట్టి లాగటంతో పాటు అనుచితంగా ప్రవర్తించడంపై సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగంతో పాటు చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్పై కేవీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయనగరం జిల్లా బాడంగికి చెందిన మాజీ సర్పంచ్ కండి రమేష్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా బాడంగి పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 10న కేసు నమోదు చేశారు.బీఎన్ఎస్లోని 152, 197, 296, 353, 352... ఐటీ యాక్ట్లోని 67, 67 (ఎ) సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో కేవీ రెడ్డిపై బొబ్బిలి కోర్టు ఈ ఏడాది మే 5న నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కేవీ రెడ్డిని అరెస్టు చేసి తమ ఎదుట హాజరు పరచాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేవీ రెడ్డిని అరెస్టు చేయడానికి బొబ్బిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం మంగళవారం రాత్రి 7.30 గంటలకు సాధారణ దుస్తుల్లో, ప్రైవేట్ వాహనంతో (టీఎస్ 08 ఎఫ్పీ 2712) హైదరాబాద్లోని బైరామల్గూడ మధురానగర్లో ఉన్న జీవీ రెడ్డి ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో షార్ట్, బనియన్తో ఉన్న కేవీ రెడ్డిని బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. కనీసం వ్రస్తాలు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదు. దీంతో తమ ఇంటికి వచ్చిన వాళ్లు దుండగులని, తన భర్తను కిడ్నాప్ చేస్తున్నారని భావించిన కేవీ రెడ్డి భార్య కె.విజయలక్ష్మి ఆర్తనాదాలు చేస్తూ పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఏపీ పోలీసుల వాహనాన్ని అడ్డగించారు. దీంతో తాము పోలీసులమని, కేవీ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని చెబుతూ విజయలక్ష్మిని ఒడిసి పట్టుకున్న ఏపీ పోలీసులు.. ఆమె పట్ల అభ్యంతరకరంగా, అనుచితంగా ప్రవర్తించారు. ఆమె చేయి లాగిపడేశారు. దాదాపు అర గంట పాటు ఈ హైడ్రామా నడిచింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న సరూర్నగర్ పోలీసులు ఏపీ పోలీసు అధికారుల్ని, విజయలక్ష్మిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. వారెంట్ కాపీతో పాటు తమ వివరాలు అందించిన ఏపీ పోలీసులు అక్కడ నుంచి కేవీ రెడ్డిని తమ కారులో తీసుకువెళ్లారు. ఈ క్రమంలో పోలీసుస్టేషన్ వద్ద తతంగాన్ని రికార్డు చేస్తున్న మీడియా ప్రతినిధులతోనూ ఏపీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అనంతరం ఏపీ పోలీసుల ప్రవర్తనపై విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు సరూర్నగర్ పోలీసులు బొబ్బిలి సీఐ శ్రీనివాస్ తదితరులపై మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించారనే ఆరోపణలతో క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
డాక్టర్స్ డే: పంచ ప్రాణాలు తిరిగిచ్చారు!
సాక్షి, హైదరాబాద్/అఫ్జల్గంజ్: రాష్ట్రంలోని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు సరికొత్త చరిత్ర లిఖించారు. ఒక రోగికి ఏకకాలంలో ఐదు అవయవాలను (మల్టీ విసరల్ ట్రాన్స్ప్లాంట్) విజయవంతంగా మార్పిడి చేశారు. దేశ వైద్య రంగంలో ఇదో మైలురాయి అని.. ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించడం దేశంలోనే తొలిసారి అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఉస్మానియా ఆసుపత్రి గ్యాస్ట్రో విభాగం అధిపతి డాక్టర్ మధుసూదన్ వివరించారు. జన్యు సమస్యతో పేగులు తొలగించడం వల్ల.. సిరిసిల్లకు చెందిన ఓ 30 ఏళ్ల ఇంజనీర్ జన్యుపరమైన సమస్యతో బాధపడుతూ గతంలో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరగా అక్కడి వైద్యులు పెద్ద పేగును పూర్తిగా, చిన్నపేగును కొంతమేర తొలగించారు. దీంతో రోగి ఆహారం తీసుకోవడం తగ్గిపోయి బరువు కోల్పోయాడు. ఇందుకు ఇంటస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే పరిష్కారమని తెలుసుకొని ఉస్మానియా ఆసుపత్రికి వచ్చాడు. రోగికి ఎండోస్కోపీ నిర్వహించిన వైద్య బృందం.. అతని పేగు భాగాల్లో, అక్కడి రక్తనాళాల్లో చాలా చోట్ల ట్యూమర్లు ఉన్నట్లు గుర్తించింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం మల్టీవిసరల్ ట్రాన్స్ప్లాంట్ చేయడమే పరిష్కారమని పేర్కొంది. అయితే ఇలాంటి చికిత్స దేశంలో ఇప్పటివరకు ఎవరికీ చేసిన అనుభవం లేకపోవడంతో చాలా ఆసుపత్రుల వైద్యులను ఉస్మానియా వైద్య బృందం సంప్రదించింది. చివరకు అనిల్ వైద్య అనే వైద్యుడికి కేసు వివరాలు పంపగా ఆయన సలహా మేరకు మల్టీవిసరల్ ట్రాన్స్ప్లాంట్ ప్రక్రియకు సిద్ధపడింది. అయితే ఇందుకు సరైన అవయవ దాత దొరకాల్సి ఉండటంతో 8 నెలల క్రితం జీవన్దాన్ ట్రస్ట్లో రిజిస్టర్ చేసింది. ఇటీవల ఓ 35 ఏళ్ల మహిళ బ్రెయిన్ డెడ్కు గురై ఉస్మానియాలో అడ్మిట్ కావడంతో వైద్య బృందం ఆమె బందువులను అవయవదానం కోసం సంప్రదించగా వారు ఒప్పుకున్నారు. వెంటనే వైద్య బృందం శస్త్రచికిత్స ప్రారంభించింది. బ్రెయిన్ డెడ్కు గురైన మహిళ నుంచి జీర్ణాశయం (కడుపు), డియోడినమ్ (ఆంత్రమూలం), పేంక్రియాస్ (క్లోమగ్రంథి), చిన్నపేగు (స్మాల్ ఇంటెస్టైన్), పెద్ద పేగు (లార్జ్ ఇంటెస్టైన్)ను ఏకకాలంలో సేకరించి వాటిని రోగికి శస్త్రచికిత్స ద్వారా అమర్చింది. సీఎం రేవంత్, మంత్రి దామోదర అభినందనలు అరుదైన శస్త్రచికిత్స విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన వైద్యులు, నర్సింగ్, ఇతర సహా య సిబ్బందిని సీఎం రేవంత్రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక, అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయనడానికి ఇది ఒక ఉదాహరణ అని వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. -
కాంగ్రెస్ హయాంలో కుంభకోణాల ఖని
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/రామకృష్ణాపూర్: రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో సింగరేణిని కుంభకోణాల ఖనిగా మార్చారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. బుధవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పరిధి ఎంఎన్ఆర్ గార్డెన్లో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరై రెండు గంటలపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ వచ్చాక ఓబీ టెండర్లలో సైట్ విజిట్ విధానంతో గతంలో మైనస్లో వెళ్లే కాంట్రాక్టులు 13 శాతం అధికంతో సీఎం బామ్మర్ది సృజన్రెడ్డి శోధ కన్సస్ట్రక్షన్కు కాంట్రాక్టు దక్కిందన్నారు. నైనీ బ్లాక్ టెండర్ను రద్దు చేసిన డిప్యూటీ సీఎం, వీటిని ఎందుకు రద్దు చేయరని ప్రశ్నించారు. ‘నిజం కాకపోతే రాజీనామా’ ఆరు నెలలుగా ఇవన్నీ అడుగుతున్నా డిప్యూటీ సీఎం, సీఎం నోరు విప్పడం లేదని హరీశ్రావు దుయ్యబట్టారు. తాను చెప్పేవి నిజం కాకపోతే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. సౌర విద్యుత్కు ఎన్టీపీసీ, హెచ్సీఎల్ ఒక మెగావాట్కు రూ.3 కోట్లు వెచ్చిస్తుంటే, సింగరేణి మాత్రం 67 మెగావాట్లలో ఒక మెగావాట్కు రూ.7 కోట్ల చొప్పున, మరో 107 మెగావాట్లలో రూ.5 కోట్ల చొప్పున అదనంగా రూ.500 కోట్లు కమీషన్ల కోసం చెల్లించారని విమర్శించారు. జైపూర్ పవర్ ప్లాంట్కు కేబినెట్ ఆమోదం, డీపీఆర్ లేకున్నా టెండర్లు పిలిచి అడ్వాన్సులకు కమీషన్ల కోసం పవర్ మేక్ సంస్థకు సుమారు రూ.1500 కోట్లు ఖర్చు చేశారన్నారు. లేని బొగ్గు ఉన్నట్టు చూపిస్తూ.. కంపెనీ 40 లక్షల టన్నుల బొగ్గుపై ఆదాయ పన్ను, డివిడెంట్లు, సీఎస్సార్, డీఎంఎఫ్టీ, కోల్ సెస్సుల కింద రూ.1600 కోట్లు కట్టారని హరీశ్రావు మండిపడ్డారు. అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి లేకున్నా, 1.81లక్షల టన్నులు, మందమర్రిలో 5.68లక్షల మెట్రిక్ బొగ్గు ఉన్నట్లు, శ్రీరాంపూర్లో 4.64లక్షల టన్నులు ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని అన్నారు. సదస్సు కంటే ముందు హరీశ్రావు శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కోల్మైన్ ఆఫీసర్స్ పీఆచ్చి, పీఆర్సీ అమలుపై చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సదస్సుకు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, పుట్ట మధు తదితరులు హాజరయ్యారు. -
జీఎస్టీ.. ఒక మైలురాయి సంస్కరణ
సాక్షి, హైదరాబాద్: పరోక్ష పన్నుల విధానాన్ని జీఎస్టీ సమూలంగా మార్చివేసిందని, ఇది ఒక మైలురాయి సంస్కరణ అని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ అభివచ్చించారు. భారత్లో అత్యంత ముఖ్యమైన పరోక్ష పన్ను సంస్కరణలలో ఒకటైన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లో బుధవారం జరిగిన జీఎస్టీ దినోత్సవం–2026 వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమాఖ్య స్ఫూర్తి ద్వారా జీఎస్టీ పరిచయం దేశ పరోక్ష పన్నుల పద్ధతిని సరళీకృతం చేసిందని అన్నారు. ఇది పన్ను పరిపాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని తెలిపారు. సాంకేతికత ఆధారిత నిబంధనల అమలు పన్ను పరిపాలనను ఆధునీకరించినప్పటికీ, డిజిటల్ నోటీసులు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, అప్పీల్ కాలపరిమితులకు సంబంధించిన వివాదాలతో సహా కొత్త చట్టపరమైన, కార్యాచరణ సవాళ్లకు కూడా దారితీసిందని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. మారుతున్న జీఎస్టీ వ్యవస్థను సమర్థవంతంగా కొనసాగించేందుకు పన్ను చెల్లింపుదారులు, చట్టపరమైన నిపుణులు, పన్ను అధికారులు సన్నద్ధం కావాలని జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ అన్నారు. హైదరాబాద్ జోన్ నుంచి జీఎస్టీ కలెక్షన్లు 2017–18లో రూ.10,700 కోట్లు నమోదయ్యాయని.. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.32,400 కోట్లకు చేరిందని సెంట్రల్ ట్యాక్స్, కస్టమ్స్ హైదరాబాద్ జోన్ కమిషనర్ అరుణ్ కుమార్ చెప్పారు. శంషాబాద్ వద్ద నిర్మిస్తున్న కస్టమ్స్ నూతన కార్యాలయం నిర్మాణం పూర్తయిందని, రెండు నెలల్లో కొత్త ఆఫీసులో కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. జీఎస్టీ అధికారుల కోసం 13 అంతస్తుల్లో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని తెలిపారు. సభికులను నవ్వించిన బ్రహ్మనందం..: జీఎస్టీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నటుడు బ్రహ్మనందం తన ప్రసంగం ఆద్యంతం సభికులను నవ్వించారు. ‘జీఎస్టీ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను సిన్సియర్గానే పన్ను కడుతున్నాను కదా. నాకు ఫోన్ రావడం ఏంటి అని ఆందోళన చెందా. ఈవెంట్ గురించి తెలిసి ఉపశమనం చెందాను. ఇలాంటి కార్యక్రమాలకు హాస్యనటులను కూడా పిలుస్తారా అని ఆశ్చర్యపోయా. నాకు జీఎస్టీ ఏం తెలుసు. సబ్జెక్ట్ తెలియక మాట్లాడుతుంటే వణుకు పుడుతుంది. ఈ స్టేజ్ మీద నిలుచుంటే మనిషి కొంచెమే కనిపిస్తారు. దీని వల్ల ఆ మనిషి ఎంత వణుకుతున్నాడో తెలియకుండా ఉంటుంది’అని నవ్వుతూ అన్నారు. ఎటువంటి ఆలస్యం, వైఫల్యం లేకుండా తాను పన్ను చెల్లిస్తున్నట్టు బ్రహ్మనందం తెలిపారు. -
జర్నలిస్టు భార్యపై ఏపీ పోలీసుల జులుం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో నివసిస్తున్న జర్నలిస్టు కోశిక వెంకట్రామిరెడ్డిపై (కేవీ రెడ్డి) బొబ్బిలి కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) ఎగ్జిక్యూషన్ పేరుతో ఆయన భార్యపై ఏపీ పోలీసులు జులుం ప్రదర్శించారు. బాధితురాలి ఫిర్యాదుతో సరూర్నగర్ పోలీసులు ఏపీ పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఏప్రిల్లో నమోదైన కేసులో... కేవీ రెడ్డి రెడ్బుక్ రాజ్యాంగంతోపాటు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్పై ఆన్లైన్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయనగరం జిల్లా బాడంగికి చెందిన మాజీ సర్పంచ్ కండి రమేశ్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ ఏడాది ఏప్రిల్ 10న కేసు నమోదు చేశారు. ఈ కేసులో కేవీ రెడ్డిపై బొబ్బిలి కోర్టు ఈ ఏడాది మే 5న నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కేవీ రెడ్డిని అరెస్టు చేసి తమ ఎదుట హాజరుపరచాల్సిందిగా బాడంగి పోలీసులను ఆదేశించింది. దీంతో బొబ్బిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్కు వచ్చింది. బైరామల్గూడ మధురానగర్లో ఉన్న కేవీ రెడ్డి ఇంటికి రాత్రి 7.30 గంటలకు వెళ్లారు. అప్పుడు కేవీ రెడ్డి షార్ట్, బనియన్తో ఉండగా, ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు ఆయన్ను బలవంతంగా లాక్కొని బయటకు తీసుకొచ్చారు. తమ ఇంటికి వచ్చిన వారు దుండగులని, తన భర్తను కిడ్నాప్ చేస్తున్నారని భావించిన కేవీ రెడ్డి భార్య విజ యలక్ష్మి ఆర్తనాదాలు చేస్తూ పోలీసుల వాహనాన్ని అడ్డుకుంది. ఇదే సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని ఏపీ పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో తాము పోలీసులమని, కేవీ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని చెప్పారు. కారు వద్ద ఉన్న విజయలక్ష్మిని చేయి పట్టి లాగేయడంతోపాటు ఒడిసి పట్టుకున్న ఏపీ పోలీసులు ఆమె పట్ల అభ్యంతరకరంగా, అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై సరూర్నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకొని విజయలక్ష్మిని పోలీసుస్టేషన్కు రావాల్సిందిగా కోరి, ఏపీ పోలీసులనూ తీసుకువెళ్లారు. ఠాణాలో వారెంట్ కాపీతోపాటు తమ వివరాలు అందించిన ఏపీ పోలీసులు అక్కడ నుంచి కేవీ రెడ్డిని తమ కారులో తీసుకువెళ్లారు.ఏపీ పోలీసుల ప్రవర్తనపై విజయలక్ష్మి మంగళవారం రాత్రి 8 గంటలకు సరూర్నగర్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
గోదావరిలో దూకిన మహిళ
భద్రాచలంఅర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బ్రిడ్జి పైనుంచి ఓ మహిళ బుధవారం గోదావరిలోకి దూకింది. అదే సమయాన గోదావరిలో చేపలు పడుతున్న జాలర్లు ఆమెను రక్షించి ఒడ్డు కు చేర్చారు. అనంత రం భద్రాచలం ఏరి యా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె వివరాలు ఆరా తీయగా పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో నిర్ధారణ కాలేదు. ఆ మహిళ మతిస్థిమితం కోల్పోయిందా లేక మద్యం మత్తులో ఉందా అన్నది తేలాల్సి ఉంది. కాగా, సదరు మహిళ బ్రిడ్జిపై కాసేపు తచ్చాడి దూకే క్రమాన కొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుండగా, సమీపంలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. -
రూ.5 వేల కోట్ల నిధులు పెండింగ్లోనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు రూ.5,000 కోట్లకు పైగా నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,090 కోట్ల బకాయి లు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు విడుదల చేయాల్సిన వాటా (మ్యాచింగ్ గ్రాంట్లు) రూ.2,979 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.1,200 కోట్లు ఉన్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఒకవైపు భారీ నిధుల కేటాయింపులు జరిగినా, క్షేత్రస్థాయిలో నిధుల బదిలీ నెమ్మదిగా సాగుతోంది. మే 2026లో కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం కింద రాబోయే ఐదేళ్ల కాలానికి (2026–31) గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.9,968 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ఏటా జూన్, అక్టోబర్ నెలల్లో రెండు విడతలుగా విడుదల కావాల్సి ఉంది. అయితే, కేంద్రం విధించిన కఠినమైన ముందస్తు నిబంధనల వల్ల క్షేత్రస్థాయిలో నిధులు పూర్తిగా డ్రా చేసుకోవడం ఒక సవాలుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో.. ఈ సంవత్సరంలో 16వ ఆర్థిక సంఘం మొదటి విడత నిధుల్లో కేంద్రం ఒక్కపైసా విడుదల చేయలేదు. జెడ్పీ, ఎంపీపీల్లో పాలకవర్గాలు లేక... 16వ ఆర్థిక సంఘం నిధులు తెలంగాణకు భారీగా మంజూరైనా, వాటిని పొందడంలో రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ సమస్యలు ఎదురవుతున్నాయి » కేంద్ర నిబంధనల ప్రకారం రాజ్యాంగంలోని పార్ట్ ఐగీ ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధులు (పాలకవర్గాలు) ఉన్న స్థానిక సంస్థలకు మాత్రమే నిధులు నిరంతరాయంగా విడుదలవుతాయి. » తెలంగాణలో కొత్త సర్పంచ్లు వచ్చినా, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణలో ఆలస్యం కారణంగా కొన్ని నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. » 2026–27 మొదటి విడత నిధులు పొందాలంటే గత ఆర్థిక సంవత్సరం (2025–26)కి సంబంధించిన స్థానిక సంస్థల ఆడిట్ నివేదికలను తప్పనిసరిగా ఆన్లైన్లో సమర్పించాలి. రాష్ట్రంలో ఆడిటింగ్ ప్రక్రియలు ఆలస్యం కావడం నిధుల విడుదలకు అడ్డంకిగా మారింది. » ప్రతి పైసా ఖర్చును ఈ–గ్రామ్స్వరాజ్ పోర్టల్లో నమోదు చేయాలి. పంచాయతీ కార్యదర్శులు, అధికారుల ‘మేకర్ అండ్ చెక్కర్’డిజిటల్ కీలు సరిగ్గా అప్డేట్ కాకపోవడం వల్ల ఆన్లైన్ పేమెంట్లు నిలిచిపోతున్నాయి. » 16వ ఆర్థిక సంఘం నిధులను కేవలం మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యానికి మాత్రమే వాడాలని కేంద్రం నిబంధన పెట్టింది. దీనివల్ల పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్ల జీతాల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల ఎస్ఎఫ్సీపై అదనపు భారం మోయాల్సి వస్తోంది. » స్థానిక సంస్థలు తమ సొంత పన్నుల వసూళ్లను (ఆస్తిపన్నులు మొదలైనవి) పెంచుకుంటేనే అదనపు ప్రోత్సాహక (పనితీరు ఆధారిత 20%) నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. -
పెరిగింది రూపాయే...
సాక్షి, హైదరాబాద్: కొత్తగా అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్–గ్రామీణ్ (వీబీ జీ రామ్–జీ) పథకం కింద తెలంగాణకు సంబంధించి కూలీ రేటు ఒక్క రూపాయి మాత్రమే పెరిగింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూలీ రేటును రూ.308 (గతంలో రూ.307) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రోజువారీ కూలీరేటును రూ.312గా (గతంలో రూ.307–ఐదు రూపాయలు పెంపుదల) నిర్ణయించింది. జూలై 1 (బుధవారం) నుంచి ఈ రేట్లు అమల్లోకి రానున్నట్టుగా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఈ పథకం అమలుకు గురువారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరాలున్నా, తప్పని పరిస్థితుల్లో దాని అమలుకు అంగీకరించాల్సి వస్తోంది.దీనిపై గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిధుల భారం 60:40 (కేంద్రం:రాష్ట్రం) నిష్పత్తిలో ఉండటం వల్ల రాష్ట్రానికి ఏటా దాదాపు రూ.2 వేల కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. గురువారం కేబినెట్ భేటీ అనంతరం జరిగే కేబినెట్ సబ్కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలపై అనుసరించే వైఖరిపై నిర్ణయం తీసుకోనున్నారు. -
కరుడుగట్టిన దొంగ అరెస్టు
నల్లగొండ/ఇబ్రహీంపట్నం రూరల్: తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన దొంగను నల్లగొండ జిల్లా పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో ఇటీవల వరుసగా చోరీలు జరుగుతుండడంతో దొంగలను పట్టుకునేందుకు నల్లగొండ సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం.జితేందర్రెడ్డి, మిర్యాలగూడ రూరల్ ఇన్స్పెక్టర్ పి.ఎన్.డి.ప్రసాద్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి చోరీలకు పాల్పడుతున్నది ఏపీలోని భీమవరం జిల్లా నర్సాపురం మండలం స్టేషన్పేట గ్రామానికి చెందిన కారు డ్రైవర్ భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు ముఠా అని గుర్తించారు. నిందితుడు భూష్మి శ్రీకాంత్ మంగళవారం రాత్రి డీసీఎంలో నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్నట్టు సమాచారం రావడంతో నల్లగొండ పోలీసులు హైదరాబాద్లోని బొంగుళూరు సమీపంలో ఔటర్ రింగ్రోడ్ (ఓఆర్ఆర్) వద్ద నిఘా పెట్టారు. డీసీఎం ఓఆర్ఆర్ వద్దకు రాగానే పోలీసులు వెంబడించి అడ్డుకున్నారు. డీసీఎం ఆగగానే భూష్మి శ్రీకాంత్ ఒక్కసారిగా కిందకు దూకి తన వద్ద ఉన్న ఇనుప రాడ్డుతో నల్లగొండ సీసీఎస్ హెడ్కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరిపై దాడి చేశాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా, నిందితుడు దాడిని కొనసాగించడంతో అతడి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన నిందితుడిని వనస్థలిపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం అంజనీపురం గ్రామానికి చెందిన డీసీఎం డ్రైవర్ వేల్పుల అతేంద్ర అలియాస్ అత్తిలిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ హత్య కేసులోనూ నిందితుడు.. ప్రధాన నిందితుడు భూష్మి శ్రీకాంత్ గతంలో ఓ కానిస్టేబుల్ హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నాడని ఎస్పీ తెలిపారు. అతడిపై ఇప్పటికే 30కి పైగా కేసులు ఉన్నాయని, జైలు నుంచి విడుదలైన తర్వాత మరో 40కి పైగా చోరీలకు పాల్పడినట్టు విచారణలో అంగీకరించాడన్నారు. నల్లగొండ జిల్లాలోనే ఎనిమిది కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. దొంగిలించిన సొత్తు, అతడికి సహకరించిన వారి వివరాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ వివరించారు. ప్రాణాలకు తెగించి నిందితుడిని పట్టుకున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం.జితేందర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, మిర్యాలగూడ రూరల్ ఇన్స్పెక్టర్ పీఎన్డీ.ప్రసాద్, ఎస్ఐ విజయ్కుమార్, హెడ్కానిస్టేబుళ్లు విష్ణువర్ధన్ గిరి, పుష్పగిరి, నాగరాజు, వహీద్ పాషా, ఫయాజ్, పోలీసు కానిస్టేబుళ్లు శివరాజ్, నరేశ్, గులాం దస్తగిరి, కమల్ కిషోర్, సాయి, జునైద్, ఆశ్రర్ను ఎస్పీ అభినందించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రకటించారు. -
కాంగ్రెస్లో ‘గుట్ట’ చిచ్చు
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవస్థాన పాలకమండలి నియామకం కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతోంది. కొందరు మంత్రులతో సహా, ఎమ్మెల్యేల్లో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్టు సమాచారం. కనీసం ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా సమాచారం ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటనలో భాగంగా లండన్లో ఉన్నారు. మంత్రికి కూడా తెలియకుండానే యాదగిరిగుట్ట దేవస్థాన పాలక మండలి నియామకం జరిగిందన్న ప్రచారం గాందీభవన్లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీతో సంబంధాలున్న కుటుంబంలోని వ్యక్తిని చైర్మన్గా నియమించారని, బీజేపీతో అంటకాగుతున్న చిరంజీవి కుటుంబానికి చెందిన వారిని, మాజీమంత్రి దేవేందర్గౌడ్ తనయుడు విజయేందర్ను సభ్యులుగా నియమించడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కమిటీని నియమించడానికి రెండు రోజుల ముందు నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించినా.. ఆ సమయంలోనూ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కనీసం మాటమాత్రంగా కూడా పాలక మండలి నియామకం గురించి ప్రస్తావించలేదని వారు అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాలక మండలి నియామకం విషయంపై ఇద్దరు మంత్రులు పార్టీ అధిష్టానానికి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాందీకి లేఖ రాసే యోచనలో ఉన్నట్టు సమాచారం. దేవస్థాన పాలక మండలిలో సభ్యుల నియామకానికి సంబంధించి మంత్రులు చేసిన సిఫారసులను బుట్టదాఖలు చేశారని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. అసలైన కాంగ్రెస్ నాయకులు కనుమరుగు అవుతున్నారని, పార్టీలో నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా, ఓ సీనియర్ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి స్వయంగా లేఖ రాసి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఒరిజినల్ కాంగ్రెస్ వారు కనుమరుగు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ‘ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలలి. షో అప్స్ చేస్తే..ఎక్కువ మాట్లాడితే ప్రజలకు నచ్చదు. ఇప్పుడు కాంగ్రెస్లో అందరూ కొత్తవారు వచ్చారు. ఒరిజినల్ కాంగ్రెస్ వారు, ఒరిజినల్గా తెలంగాణ కోసం కొట్లాడిన వారంతా రోజురోజుకు కనుమరుగై పోతున్నారు. ఎక్కడెక్కడి వాళ్లో కొత్త బ్యాచ్ వచ్చారు. అంతా కొత్త వారే నడిపిస్తున్నారు. నేను మునుగోడు ఎమ్మెల్యేను. యాదాద్రి జిల్లాలో నా మునుగోడు నియోజకవర్గం ఉంది. యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలిపై కనీస సమాచారం లేదు. ఇది ఏకపక్ష నిర్ణయం. అస్సలు కరెక్ట్ కాదు. గత కొన్నాళ్లుగా ప్రభుత్వ పెద్దల వ్యవహారం బాగా లేదు. వీరి వ్యవహారశైలి నచ్చకనే నల్లగొండ మీటింగ్కు వెళ్లలేదు. నన్ను అడిగితే మా నియోజకవర్గం నుంచి ఒక సభ్యుడిని అయినా వేయించుకునే వాణ్ణి. చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వారి ఖర్మ. చైర్మన్ విషయం నేను మాట్లాడ దలుచుకోలేదు. సభ్యుల విషయమైనా చెప్పాలి కదా. వాళ్లకు ఆ మాత్రం ఆలోచన కూడా లేదు. ఇటీవల రాహుల్గాంధీని కలిసినప్పుడు అన్ని విషయాలు ఆయనతో మాట్లాడాను. త్వరలోనే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్లను కలిసి మాట్లాడతా’అని అన్నారు. ‘మా బ్రదర్ వెంకట్రెడ్డి నన్ను ఉద్దేశించి దాన కర్ణుడని పాజిటివ్గానే మాట్లాడారు. మంచి ఉద్దేశంతో’నే అని తెలిపారు. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూపై విధంగా స్పందించారు. మాట్లాడాల్సింది కానీ...! ఈ విషయమై బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ కూడా స్పందించారు. రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని, ఆ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. నల్లగొండ జిల్లా నేతలతో మాట్లాడి యాదగిరిగుట్ట బోర్డును నియమిస్తే బాగుండేదని చెప్పారు. అయినా, అన్ని విషయాల్లో అందరినీ ఇన్వాల్వ్ చేయలేమని, అలా చేస్తే ఏదీ ముందుకు పోదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై తాను సీఎం రేవంత్తో మాట్లాడతానని మహేశ్గౌడ్ వెల్లడించారు. -
నేను రెడీ.. మీరు రెడీనా?
సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నానని, పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి సవాల్ చేశారు. అప్పులు, పాలనా వైఫల్యాలు, రైతుల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక పరిస్థితి దేనిపైనైనా సరే చర్చకు వరంగల్ చౌరస్తానా? అశోక్నగర్ చౌరస్తానా? అసెంబ్లీ, ప్రెస్క్లబ్, కొత్తగా రూ.200 కోట్లతో కట్టుకున్న సీఎం ఇంద్రభవనంలో అయినా చర్చకు సిద్ధమని అందుకు తేదీ, సమయం, ప్రాంతం సీఎం చెప్పాలని ఏ టాపిక్ అయినా సరే చర్చకు సిద్ధమని, ప్రభుత్వం వైఫల్యాలను గణాంకాలతో నిరూపించకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటానన్నారు. బుధవారం తెలంగాణభవన్లో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్యాదవ్, వివేకానంద తదితరులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి నల్లగొండ సభ, శిల్పకళావేదిక సభలో బీఆర్ఎస్, కేసీఆర్ను విమర్శించడంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అప్పులకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పే సంఖ్యలో తేడాలున్నాయని, వీరిద్దరూ చెప్పే దానికి పార్లమెంట్లో వీరి చీకటి మిత్రుడు రఘునందన్రావు అడిగిన ప్రశ్నకు కేంద్రం కాగ్, ఆర్బీఐ నుంచి తీసుకొని ఇచ్చిన లెక్కలకు చాలా తేడాలున్నాయన్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న అప్పులు రూ.72 వేల కోట్లు అయితే.. తాము దిగిపోయేనాటికి ఉన్న అప్పులు మొత్తం రూ.3.5 లక్షల కోట్లు అని, తమ పదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.2.78 లక్షల కోట్లు అని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ పదేళ్లలో రైతులకు రూ.1.75 లక్షల కోట్లు వ్యయం చేశారంటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.1.56 లక్షల కోట్లు వ్యయం చేశారంటున్నారని, ఇద్దరి మధ్య ఐదు నిమిషాల వ్యవధిలోనే రూ.20 వేల కోట్ల తేడా చెబితే ఎవరిని నమ్మాలని ప్రశ్నించారు. నెలకు అప్పులు, అసలు కింద ఈ ప్రభుత్వం చెల్లిస్తున్నది రూ.2,500 కోట్లలోపు ఉంటుందని కాగ్ నివేదిక చెబుతుంటే.. వీరు బయట మాత్రం రూ.6,000 కోట్లు చెల్లిస్తున్నారని అన్ని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. సీఎం కుటుంబం, మంత్రుల దోపిడీతోనే... సీఎం రేవంత్రెడ్డి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ నేతల దోపీడి వల్లనే తెలంగాణ దివాలా తీస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్రెడ్డి భావదారి్రద్యంతో మాట్లాడుతూ రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. దివాలా, ఎయిడ్స్ రోగి, కేన్సర్ పేషెంట్ అంటూ తాను పాలించే రాష్ట్రం గురించి ఏ ముఖ్యమంత్రి ఇంత నీచంగా మాట్లాడరన్నారు. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి, మరి 72 సార్లు ఎందుకు ఢిల్లీకి వెళ్లాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి మాటలు చూస్తుంటే ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని, ఆయనకు మానసిక జబ్బు ఉందేమో అన్న అనుమానం వస్తుందని కేటీఆర్ అన్నారు. రైతాంగం తీవ్ర సంక్షోభంలో.. కాంగ్రెస్ పాలనలో రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని, అట్లాంటి పరిపాలనకు సంబరాల పేరిట బలవంతపు కార్యక్రమాలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. మొన్నటికి మొన్ననే సంపూర్ణంగా రైతుబంధు వేస్తాను..అందరికీ ఇస్తాను అని చెప్పి కేవలం ఒక ఎకరానికి ఇచ్చి, ఒక్కొక్క ఎకరానికి డబ్బులు వేసిన ప్రతిసారి సంబరాలు చేసుకుంటూ ఉత్త మాటలు చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులు, విద్యార్థులు, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ఎవరికీ డబ్బులు లేవు కానీ... రాహుల్గాంధీకి మాత్రం వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానంటూ రేవంత్ చెబుతున్న తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. రేవంత్రెడ్డి పాలన మాత్రం పాతాళానికి పడిపోతుందని చెప్పారు. అది రాష్ట్ర ఆదాయం అయినా కావొచ్చు...రియల్ ఎస్టేట్ రంగం కావొచ్చు...చివరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జీఎస్టీ వసూలు ఇలా ప్రతి ఒక్క రంగంలో మందగమనం ఉందన్నారు. రేవంత్రెడ్డి పాలనలో మిగిలింది మందగమనం, మందు గమనం తప్పించి ఇంకేమీ లేదన్నారు. రేవంత్రెడ్డి ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతున్నారన్నారు. నిజంగానే రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని, మద్యం అమ్మకాలను నిషేధించాలని కేటీఆర్ సవాలు విసిరారు. నాలుక మడత తిప్పిన రేవంత్రెడ్డి ధాన్యం ప్రతి గింజా కొంటాం..తాము సేకరించిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేయకపోతే కేంద్రంపై పోరాడుతాం అన్న సీఎం రేవంత్రెడ్డి..ఇప్పుడు కేంద్రం ఎంత కోటా ఇస్తే అంతే కొంటాం అంటూ నాలుక మడత తిప్పారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ అంగుష్ట మాత్రుడని, ఆయన నోరు మూసీ కంపుకంటే ఘోరం అని వ్యాఖ్యానించారుం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేబినెట్ సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఎత్తు గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రూ. 4 వేల కోట్ల నుంచి రూ. 18,500 కోట్లకు ఆదాయం పెంచాం రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణకు వచ్చే నెలసరి ఆదాయం రూ.4 వేల కోట్లు అయితే, తాము దిగిపోయేనాటికి ఆ ఆదాయాన్ని రూ.18,500 కోట్లకు పెంచామని కేటీఆర్ అన్నారు. జీఎస్డీపీని రూ.4.5 లక్షల కోట్ల నుంచి రూ.15 లక్షల కోట్లకు చేర్చామని చెప్పారు. ఈ ప్రభుత్వం రైతులకు గడిచిన 30 నెలల్లోనే రూ.1.13 లక్షల కోట్ల బకాయి పడిందన్నారు. రైతుబంధు కింద రూ.30 వేల కోట్లు, కౌలు రైతులకు రూ.22వేల కోట్లు, రుణమాఫీ రూ.29 వేల కోట్లు, ధాన్యానికి బోనస్ రూ.16 వేల కోట్లు, కూలీలకు రూ.15 వేల కోట్లు బకాయిపడ్డారని చెప్పారు. -
‘రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం రాజీపడదు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ (యూరియా యాప్) ద్వారా ఎరువుల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం సాధ్యమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల లావాదేవీలన్నీ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నమోదవుతున్నందున తప్పుడు ఎంట్రీలు, కల్పిత బిల్లులు, అక్రమ నిల్వలు, యూరియా మళ్లింపులను సులభంగా గుర్తించామన్నారు.సిద్దిపేట జిల్లాలో 6000 యూరియా బస్తాలు మాయమైనట్టు యాప్ ద్వారా గుర్తించి, ఇద్దరు హోల్ సేల్ డీలర్లు మరియు ఒక రిటైలర్ లైసెన్స్ను వ్యవసాయ శాఖ రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో పాటు విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వ్యవసాయశాఖ అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం వలన ప్రభుత్వం అక్రమాలపై అనుసరిస్తున్న కఠిన వైఖరికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో, ఒక సొసైటీ పరిధిలో ఎరువుల సరఫరాలో జరిగిన అక్రమాలను గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకున్నామన్నారు.భవిష్యత్తులో కూడా యూరియా అక్రమాలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం రాజీపడదని, ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం యూరియా యాప్ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. యూరియా పంపిణీని పూర్తిగా ఫర్టిలైజర్ యాప్ ద్వారా నిర్వహించడం వల్ల అక్రమదారులకు అన్ని మార్గాలు మూసుకుపోయాయని మంత్రి తెలిపారు.రైతులకు సక్రమంగా అందాల్సిన యూరియాను ఎవరైనా అక్రమంగా పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో యాప్ వ్యవస్థ లేకపోవడం వల్ల అసలైన రైతులకు చేరాల్సిన యూరియాను కొందరు అక్రమంగా ప్రైవేట్ సంస్థలకు విక్రయించి రైతులను మోసం చేసే పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అలాంటి అవకాశాలకు పూర్తిగా అడ్డుకట్ట పడిందన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 3.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరఫరా ప్రణాళిక ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో 5.62 మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి తెప్పించగలిగామని చెప్పారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువచ్చి, రాష్ట్రానికి అవసరమైన యూరియాను సకాలంలో అందుబాటులోకి తీసుకురాగలిగామని పేర్కొన్నారు. ఇదంతా రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.యూరియా యాప్పై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నప్పటికీ, రైతులు రోజురోజుకూ అధిక సంఖ్యలో యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకుని కొనుగోలు చేయడం ఈ యాప్ పై వారికి ఉన్న విశ్వాసానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు యూరియా యాప్ ద్వారా 52.30 లక్షల బస్తాల యూరియాను రైతులు బుక్ చేసుకోగా, అందులో 46.03 లక్షల బస్తాలను కొనుగోలు చేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 79.29 లక్షల బస్తాల యూరియా అందుబాటులో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.రైతులకు అందాల్సిన సబ్సిడీ ఎరువులను దుర్వినియోగం చేయడానికి లేదా అక్రమాలకు పాల్పడేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వబోమని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎరువుల సరఫరా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, క్రమశిక్షణను కచ్చితంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల హక్కులను కాపాడడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీని పూర్తిగా పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో యూరియా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. -
మెడపై ఆ ఒక్క గాటు.. కిలాడీ భార్య మైండ్ బ్లోయింగ్ క్రైమ్ స్టోరీ!
సాక్షి,నిజామాబాద్: పచ్చని సంసారాల్లో అక్రమ సంబంధాల చిచ్చు రేగుతోంది. క్షణిక సుఖాల కోసం, ప్రియుడి మోజులో పడి కొందరు మహిళలు కంటిపాపల్లా చూసుకోవాల్సిన భర్తలను కడతేరుస్తున్నారు. శృంగానికి అడ్డొస్తున్నారని కన్నప్రేమను కూడా మర్చిపోయి.. రక్తం పంచుకు పుట్టిన బిడ్డలనే గొంతు పిసికి చంపేస్తున్నారు.ఇటీవల వెలుగులోకి వస్తున్న వరుస ఉదంతాలు సమాజంలో నైతిక విలువల పతనాన్ని కళ్ళకు కడుతున్నాయి.తాజాగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. ప్రియుడితో కలిసి హ్యాపీగా ఉండాలనుకున్న ఒక భార్య.. అర్ధరాత్రి వేళ భర్త మహిపాల్ను ఉరివేసి చంపేసింది. తెల్లవారాక ఏమీ తెలియనట్టు ‘గుండెపోటుతో చనిపోయాడంటూ’ ఊరంతా నమ్మించేలా హైడ్రామా ఆడింది. కానీ, పాపం పండి మెడపై ఉన్న ఉరితాడు ‘గాటు’ను గ్రామస్తులు గమనించడంతో అసలు నిజం బయటపడింది. ఇలాంటి ‘గుండెపోటు’ స్క్రీన్ప్లేలు ఈ మధ్యకాలంలో చాలా క్రైమ్ స్టోరీల్లో కామన్ అయిపోయాయి.కాబోయే భర్తలపై కూడా కక్ష!పెళ్లి ఇష్టం లేకనో, లేదా ప్రియుడితోనే జీవితం పంచుకోవాలనే మొండి పట్టుదలతోనో.. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కొందరు యువతులు కాబోయే భర్తలను కూడా టార్గెట్ చేస్తున్నారు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘సియా అగర్వాల్’ ఉదంతమే దీనికి పెద్ద ఉదాహరణ. పూణెకు చెందిన కోటీశ్వరుడైన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్తో నిశ్చితార్థం జరిగిన సియాకు, అప్పటికే చేతన్ చౌదరి అనే యువకుడితో రహస్య సంబంధం ఉంది.పెళ్లి ఇష్టం లేక, అలాగని నిశ్చితార్థం రద్దు చేసుకుంటే పరువు పోతుందని భావించిన ఆమె.. పెళ్లి షాపింగ్ నెపంతో కేతన్ నుండి కోటి రూపాయలు తీసుకుని ప్రియుడికి ఇచ్చింది .ఆ తర్వాత బర్త్డే సర్ప్రైజ్ అంటూ కేతన్ను లోహగఢ్ కోటపైకి ట్రెకింగ్కు తీసుకెళ్లి, ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం ప్రియుడితో కలిసి లోయలోకి నెట్టి అత్యంత దారుణంగా హతమార్చింది.మొదట దీనిని ప్రమాదంగా నమ్మించినా, వారి కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడి, నిందితులిద్దరూ అరెస్టయ్యారు -
రాజీనామా చేస్తానంటూ.. కేటీఆర్కు మంత్రి జూపల్లి సవాల్
హైదరాబాద్: కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులు అప్పులే కాదా? అంటూ మాజీ మంత్రి కేటీఆర్ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మిషన్ భగీరథ పేరుతోనే రూ.40 వేల కోట్ల అప్పు తెచ్చారని అన్నారు. జూపల్లి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కార్పొరేషన్ల అప్పును నేను నిరూపిస్తా.. నేను చెప్పిన లెక్క తప్పు అయితే రాజీనామా చేస్తా.. చర్చకు మీ బీఆర్ఎస్ భవన్కు రావడానికి సిద్ధం. నేను చెప్పిన లెక్క తప్పు అయితే ఈ రోజే రాజీనామా చేస్తాను. నేను చెప్పింది అబద్దం అయితే స్పీకర్కు నా రాజీనామాను ఇస్తాను. అప్పుల గురించి ఇజ్జత్ పోతుందని మాట్లాడుతున్నారు. ప్రజలు అన్నీ గమనించే మిమ్మల్ని గద్దె దించారు. తెలంగాణ రాష్టం ఇచ్చింది సోనియా గాంధీ. తామే తెచ్చామని చెప్పుకోవడం బీఆర్ఎస్ వాళ్ల భ్రమ. బీజేపీ మూడు నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పాటు ఆలస్యం కావడానికి కారణం కూడా బీజేపీనే. తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమాల వల్ల రాష్టం ఏర్పడింది’’ అని విమర్శించారు.పాత ముచ్చట్లు చెబుతున్నారు.. కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి పాత ముచ్చట్లు చెబుతున్నారని జూపల్లి చెప్పారు. ‘‘50 శాతం ఈ ప్రభుత్వం టర్మ్ అయిపోయింది.. ఏం చేసిందో ప్రభుత్వం చెప్పుకోవడం లేదంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్టం ఏర్పడిన తీరు దేశం మొత్తం చూసింది. త్యాగాలతో ఏర్పడింది తెలంగాణ రాష్టం. మిగులు బడ్జెట్, ధనిక రాష్టం, తర్వాత రూ.8 లక్షల కోట్లు అప్పు.. ఇది బీఆర్ఎస్ పరిపాలన తీరు. తాము చేసిన అప్పు రూ.3 లక్షల కోట్లు మాత్రమే అంటున్నారు కేటీఆర్.కేసీఆర్కు, కేటీఆర్కు చిన్న మెదడు, పెద్ద మెదడుకు చిల్లు పడి రాష్ట్ర ఖజానాకు చిల్లు పెట్టారు. ప్రాజెక్టుల పేరుతో తీసుకున్న రూ.2 లక్షల కోట్ల అప్పు ఎవరు కట్టాలి? రూ.20 వేల కోట్ల రుణ మాఫీ చేశాం. ఇరిగేషన్ కార్పొరేషన్ నుంచి అప్పు తెచ్చారు. మిషన్ భగీరథ కార్పొరేషన్ నుంచి రూ.40 వేల కోట్లు అప్పు తెచ్చారు. ఇది ఎవరు కట్టాలి? ప్రజలు కట్టాలా? బీఆర్ఎస్ నేతలు మాట్లాడేవి అన్ని అబద్ధాలు’’ అని అన్నారు. -
ఆదిభట్లలో అగ్నిప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల గౌర ఏరోస్పేస్లో ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంపెనీ లోపల పేలుడు పదార్థాలు పేలడంతో పెద్దగా శబ్ధం వచ్చింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే యత్నం చేస్తున్నాయి. ప్రమాదసమయంలో కంపెనీ లోపల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అక్కడి ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. -
అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఆదాయ సమీకరణపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్కు అనుగుణంగా లక్ష్యాలు సాధించాలంటే ఆదాయ సమీకరణపై సీరియస్గా దృష్టి సారించాలన్నారు. హెచ్ఎండీఏ,టీజీఐఐసీ, కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్తో పాటు వివిధ శాఖలకు సంబంధించి లీకేజీలు లేకుండా జాగ్రత వహించాలన్నారు. ఆదాయ సమీకరణకు సంబంధించి. చేజింగ్ సెల్ ఏర్పాటు చేసుకుని నిరంతరం ఫాలో అప్ చేయాలని రేవంత్ సూచించారు.‘‘అనుకుంటున్న స్థాయిలో పనిచేయాలంటే శాఖలవారీగా శాఖలవారీగా సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని లబ్ధిదారుల జాబితాను డీబీటీకి అనుసంధానం చేసుకోవాలి. పెండింగ్ ప్రాజెక్టులను, ఇతర పనులను పూర్తి చేసేందుకు అనుగుణంగా బడ్జెట్ను తయారు చేసుకోవాలి. భూసేకరణను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలి. ఊహాజనిత బడ్జెట్ కాదు.. వాస్తవికత ఆధారంగానే బడ్జెట్ను రూపొందించుకోవాలి. వివిధ శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం వీడాల్సిందే.’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
టాపిక్.. ప్లేస్.. డేట్.. టైమ్ రేవంత్ చెప్పాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తమ పాలనలో కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి చేశామని.. బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కట్టడాలను చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ప్రశంసిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగేళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టామన్న కేటీఆర్.. సీఎం రేవంత్రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తెచ్చారంటూ ప్రశ్నించారు.‘‘రాష్ట్ర అప్పులపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సీఎం రేవంత్ తీరుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆదాయం నెలకు రూ.18,500 కోట్లు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి అరాచక పాలన చేస్తున్నారు. రుణమాఫీ పేరుతో రైతులకు సీఎం రేవంత్ రూ.29 వేల కోట్లు ఎగ్గొట్టారు. అబద్దాలు చెప్పడం సీఎం రేవంత్ జన్మహక్కు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.‘‘సీఎం రేవంత్, ఆయన సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. డబ్బులు లేవంటూనే రూ.200 కోట్లతో అందాల పోటీలు నిర్వహించారు. సీఎం రేవంత్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సీఎం రేవంత్తో చర్చకు నేను సిద్ధం. టాపిక్.. ప్లేస్, డేట్.. టైమ్ రేవంత్ చెప్పాలి. సవాల్ విసిరి పారిపోయే అలవాటు సీఎం రేవంత్దే. మీ తప్పులను బయటపెట్టకపోతే రాజకీయాలను నుంచి తప్పుకుంటా. ఉద్యోగాలు, రైతు డిక్లరేషన్.. దేనిపైనైనా చర్చకు రెడీ’’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. -
KVR అరెస్ట్ వెనుక అసలు నిజం ఇదేనా? భార్య షాకింగ్ వ్యాఖ్యలు
-
తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో ‘చెత్త’ పంచాయితీ..
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీదర్ మున్సిపల్ చెత్తను గత 15 రోజులుగా తెలంగాణ సరిహద్దులోని మల్గి గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో బీదర్, మల్గి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం తెల్లవారుజాము నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.వివరాల మేరకు.. బీదర్ మున్సిపల్ డంపింగ్ యార్డు తమ గ్రామ శివారులో ఏర్పాటు చేయడంతో మల్గి గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో చెత్తను అక్కడ పడేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త డంపింగ్ కారణంగా తమకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు.మరోవైపు.. చెత్త వాహనాలను అడ్డుకున్న వారిని బీదర్ మున్సిపల్ అధికారుల బెదిరిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మీరు బీదర్కి ఎలా వస్తారో చూస్తాం అంటూ మల్గి, బీదర్ రోడ్డుపై 40 వాహనాల చెత్తను మున్సిపల్ అధికారులు పారబోసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో, పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. బీదర్, మల్గి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. -
సీటు ఇచ్చేదే లే.. బస్సు నేరుగా పోలీస్ స్టేషన్కు!
సాక్షి, మెదక్: బస్సులో సీటు విషయంలో చోటుచేసుకున్న చిన్న వివాదం కాస్తా పెద్ద రచ్చగా మారింది. మెదక్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నర్సాపూర్ వద్ద బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనతో ప్రయాణం మధ్యలోనే ఉద్రిక్తత నెలకొంది.నర్సాపూర్ వద్ద ఒక మహిళతో కలిసి బస్సులో ఎక్కిన ఓ దివ్యాంగుడు సీటు కోసం ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దివ్యాంగుడికి సీటు ఇవ్వాలని అదే బస్సులో ఉన్న మరో మహిళ కోరగా, అందుకు ఆమె నిరాకరించింది. “సీటు ఇవ్వడం సాధ్యం కాదు” అన్న మాటతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.చిన్నగా ప్రారంభమైన మాటల తూటాలు క్షణాల్లోనే గొడవగా మారి తోపులాట వరకు వెళ్లినట్లు ప్రయాణికులు తెలిపారు. పరిస్థితి అదుపు తప్పేలా మారడంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సును నేరుగా నర్సాపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.పోలీసులు బస్సులోని ప్రయాణికులను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివాదంలో ఉన్న మహిళా ప్రయాణికులకు పోలీసులు నచ్చజెప్పి, ఎలాంటి పెద్ద సమస్య లేకుండా అక్కడి నుంచే పంపించారు. అనంతరం బస్సు తిరిగి తన గమ్యస్థానానికి బయలుదేరినట్లు సమాచారం. చిన్న సీటు వివాదం కారణంగా బస్సు కొద్దిసేపు ఆగిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
రమ్యను మర్చిపోయారా?.. పదేళ్లైనా న్యాయం దక్కలేదు!
"ఆ రోజు మా జీవితాలను చీకటిలోకి నెట్టేసింది... కానీ పదేళ్లు గడిచినా న్యాయం మాత్రం దక్కలేదు.".. ఓ కుటుంబం ఆవేదన. 2016 జూలై 1... తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఘటన జరిగిన రోజు. మద్యం మత్తులో వేగంగా దూసుకొచ్చిన కారు ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. 10 ఏళ్ల చిన్నారి రమ్య, ఆమె బాబాయి, తాత.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ ప్రమాదంలో చనిపోయిన వారి జ్ఞాపకాలు మాత్రమే కాదు.. న్యాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తున్న బాధ కూడా ఇప్పటికీ అలాగే ఉంది.2016 జూలై 1న బంజారాహిల్స్ ప్రాంతంలో మద్యం మత్తులో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న వాహనంపై పడింది. ఆ ప్రమాదంలో నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల చిన్నారి రమ్య తీవ్రంగా గాయపడింది. ఆమె బాబాయి రాజేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. రమ్య కొద్ది రోజుల తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. గాయాల కారణంగా ఆమె తాత మధుసూదనాచారి కూడా కన్నుమూశారు. ఒకే ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.డ్రంక్ అండ్ డ్రైవ్పై అప్పట్లో దేశవ్యాప్త చర్చఈ కేసులో నిందితులంతా 20 ఏళ్ల లోపే కావడం.. అదీ ఇంజనీరింగ్ విద్యార్థులు కావడం గమనార్హం. రమ్య కేసు తర్వాత హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్పై విస్తృత చర్చ జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పబ్ల నియంత్రణను మరింత కఠినతరం చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. తాగి వాహనాలు నడపకండంటూ తెలుగు రాష్ట్రాల్లో ఫ్లకార్డులతో జనాలు రోడ్డెక్కి నిరసనలు చేశారు. పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించినప్పటికీ.. ఇలాంటి ప్రమాదాలు పూర్తిగా ఆగలేదు.పదేళ్లలో ఒక్కసారే విచారణ?ఈ కేసులో న్యాయం కోసం పదేళ్లుగా పోరాడుతున్నామని బాధిత కుటుంబం చెబుతోంది. కానీ ఈ పదేళ్లలో కోర్టులో కేవలం ఒక్కసారి మాత్రమే విచారణ జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు విచారణ ముందుకు సాగకపోవడం, తరచూ వాయిదాలు పడుతుండటంతో న్యాయం ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.అయితే దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.విదేశాల్లో నిందితుడు.. అదో మిస్టరీ!ఈ కేసులో శ్రవిల్, విష్ణు వినీత్లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వెంట మరో నలుగురు కుర్రాళ్లు ఉన్నప్పటికీ.. వాళ్ల గురించి స్పష్టత లేదు. అయితే కేసు తర్వాత విష్ణు వినీత్ విదేశాలకు పారిపోయాడని.. అతన్ని తిరిగి భారత్కు తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపట్టినట్లు పలుమార్లు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన ఫలితం కనిపించలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. నిందితుడిని భారత్కు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టాలన్న తమ డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.'ప్రతీకారం కాదు.. న్యాయం కావాలి'పదేళ్లు గడిచినా రమ్య జ్ఞాపకాలు ప్రతి రోజూ వెంటాడుతున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమకు ఎవరిపైనా ప్రతీకారం అవసరం లేదని.. కానీ చట్టం తన పని చేసి బాధ్యులకు శిక్ష పడాలని మాత్రమే కోరుకుంటున్నామని అంటున్నారు. కేసు విచారణను వేగవంతం చేసి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని ప్రభుత్వాన్ని, న్యాయవ్యవస్థను వారు కోరుతున్నారు. -
అర్థరాత్రి ఈడ్చుకెళ్లిన ఏపీ పోలీసులు.. జర్నలిస్ట్ కేవీఆర్ ఎక్కడ?
తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు కే. వెంకట్ రామ్రెడ్డి (KVR) అరెస్ట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అర్థరాత్రి సమయంలో ఆయన నివాసానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేవీఆర్ను అదుపులోకి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఆయనను ప్రస్తుతం ఎక్కడ ఉంచారు? ఏ పోలీస్ స్టేషన్కు తరలించారు? అనే విషయాలపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసుల బృందం మఫ్టీలో, ప్రైవేట్ వాహనంలో తెలంగాణలోని కేవీఆర్ నివాసానికి వెళ్లింది. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేవీఆర్ భార్య పోలీసులను వేడుకున్నా.. చిన్నారుల ముందే ఆయనను తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.సమాచారం ప్రకారం.. ఏపీ మంత్రి నారా లోకేష్పై కేవీఆర్ చేసిన రాజకీయ విశ్లేషణకు సంబంధించి నమోదైన కేసులో ఈ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 152, 196, 353 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదే కేసులో ఈ ఏడాది మార్చి 11న కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు వచ్చి కేవీఆర్ను అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదని తెలుస్తోంది.తాజాగా మరోసారి ప్రత్యేక బృందం తెలంగాణకు చేరుకుని కేవీఆర్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తొలుత మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ పీఎస్కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారన్నుదానిపై స్పష్టత లేదు. దీంతో ఆయన ఆచూకీపై కుటుంబ సభ్యులు, సహచర జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కేవీఆర్ భార్య ఫిర్యాదుఅయితే ఈ ఎపిసోడ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ పోలీసులపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో జర్నలిస్ట్ కేవీ రెడ్డి భార్య ఫిర్యాదు చేశారు. సివిల్ డ్రెసులో వచ్చిన ఏపీ పోలీసులు తన భర్తను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారామె.ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఒక జర్నలిస్టును అర్థరాత్రి సమయంలో మఫ్టీలో వచ్చి అదుపులోకి తీసుకెళ్లడం, కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం ఇవ్వకుండా తరలించడం పట్ల ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కేవీఆర్ను ఎక్కడ ఉంచారు? ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారు? అనే వివరాలను వెంటనే వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అరెస్టుకు గల పూర్తి కారణాలు, కేసు వివరాలు, కేవీఆర్ను ఏ పోలీస్ స్టేషన్కు తరలించారన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అంతవరకు ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఓఆర్ఆర్పై మోస్ట్ వాంటెడ్ దొంగ కోసం హైడ్రామా!
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై గత అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న ఓ నేరస్థుడిను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై.. అతడు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. చివరికి పోలీసులు కాల్పులకు దిగడంతో ఓఆర్ఆర్పై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.తెలుగు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న భూషణ్ శ్రీకాంత్ కోసం గత నాలుగు రోజులుగా నల్లగొండ సీసీఎస్ పోలీసులు ప్రత్యేక గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అతడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులోని బొంగులూరు ఎగ్జిట్ నంబర్-12 సమీపంలో ఓ డీసీఎం వాహనంలో దాక్కున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని చుట్టుముట్టి శ్రీకాంత్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.అయితే పోలీసులను చూసిన శ్రీకాంత్ వారిపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పలుమార్లు హెచ్చరించినా లొంగకపోవడంతో, పరారిని అడ్డుకునేందుకు పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.శ్రీకాంత్తో పాటు డీసీఎంలో ఉన్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నల్లగొండ సీసీఎస్ అధికారులు విచారిస్తున్నారు. ఇటు శ్రీకాంత్కు చికిత్స పూర్తి కావడంతో నల్లగొండకు తరలించారు.వందకుపైగా కేసులు! కానిస్టేబుల్ హత్య కేసులోనూ..భూషణ్ శ్రీకాంత్పై రెండు తెలుగు రాష్ట్రాల్లో దోపిడీలు, చోరీలు, దాడులు సహా 100కుపైగా క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అంతేకాదు, 2007లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన కానిస్టేబుల్ హత్య కేసులో కూడా శ్రీకాంత్ ఏ-2 నిందితుడిగా ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. చాలా కాలంగా పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ నిందితుడిని ఎట్టకేలకు నల్లగొండ సీసీఎస్ పోలీసులు సాహసోపేతంగా పట్టుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.శ్రీకాంత్ అరెస్టుతో అతడు పాల్పడిన పలు పాత కేసులు, అతడి నేర ముఠా కార్యకలాపాలు, ఇతర నిందితుల ప్రమేయంపై కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. -
కరీంనగర్లో మరో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం
సాక్షి, కరీంనగర్: ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు ప్రయాణికుల్లో ఆందోళన పెంచుతున్నాయి. 15 రోజుల క్రితం అలుగునూర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన మరువకముందే.. తాజాగా కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో నిలిపి ఉన్న మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. మంగళవారం కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో నిలిపి ఉన్న ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్యాటరీలో షార్ట్సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పక్కనే ఉన్న ఇతర బస్సులకు వ్యాపించకుండా సమయానికి చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.ఇదే జిల్లాలో జూన్ 21న అలుగునూర్ శివారులో కరీంనగర్–హైదరాబాద్ మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ అద్దె ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులందరినీ వెంటనే కిందకు దించడంతో 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం బ్యాటరీ బాక్స్ నుంచి మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. మూడు ఫైర్ ఇంజన్లు రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.తాజాగా మరోసారి అదే జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, బ్యాటరీల నాణ్యత, భద్రతా ప్రమాణాలపై సమగ్ర సాంకేతిక పరిశీలన చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. తాజా ఘటనకు గల ఖచ్చితమైన కారణాలను అధికారులు విచారిస్తున్నారు. -
యాదగిరిగుట్టలో భూకేటాయింపులకు టీటీడీ విధానం
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలు, సంస్థలు, కుల సంఘాలకు భూములు కేటాయించడానికి సంబంధించి స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానాన్ని రూపొందించాలని.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సంస్థలకు, సంఘాలకు ఏ ప్రాతిపదికన స్థలాలు కేటాయించినప్పటికీ ఆ భూముల యాజమాన్య హక్కులు మాత్రం దేవస్థానం వద్దే ఉండాలని ఆయన తేల్చిచెప్పారు.ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో మంగళవారం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండపై అతిథిగృహాల నిర్మాణం కోసం ముందుకొచ్చే దాతలు, సంస్థల జాబితాను సిద్ధం చేయాలని.. ఈ నిర్మాణాల్లోనూ టీటీడీ విధానాన్ని అనుసరిస్తూ సంస్థలకు విడతలవారీగా మాత్రమే కేటాయింపులు జరగాలని స్పష్టం చేశారు. అలాగే యాదగిరిగుట్టలో హరేరామ హరే కృష్ణ ఫౌండేషన్ కోసం మార్కెట్ ధర ప్రకారమే భూమిని కేటాయించాలని సీఎం సూచించారు. పీపీపీ విధానంలో యాదగిరిగుట్టలో టూరిజం సర్క్యూట్ అభివృద్ధియాదగిరిగుట్టలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన సాంకేతిక నివేదికపై అధ్యయనం చేసి వారంలోగా తనకు నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. వాటితోపాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, కుందూరు రఘువీర్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ కమిషనర్ ఎం. హనుమంతరావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
‘ఆ దారి’ నుంచే భారత్లోకి..
సాక్షి, హైదరాబాద్: ఇండో–బంగ్లా సరిహద్దుల్లోని రెండు రాష్ట్రాల్లో ఉన్న 53 కిలోమీటర్ల ప్రాంతం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చే వారికి కేరాఫ్ అడ్రస్గా మారింది. అసోంలో ఉన్న 25 కిమీ, పశ్చిమ బెంగాల్లోని 28 కిమీ ప్రాంతాల్లోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న బంగ్లాదేశీయులు సరిహద్దులు దాటుతున్నారు. కోల్కతా నుంచి నకిలీ గుర్తింపుకార్డులు పొంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి బెంగాల్ వాసులుగా స్థిరపడుతున్నారు. ఇలా వచ్చిన వారిలో మహిళలు, యువతులు వ్యవస్థీకృత వ్యభిచారం, పురుషులు..యువకులు దినసరి కూలీలుగా స్థిరపడుతున్నారు. ఖైరతాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఇటీవల పట్టుకున్న ఐదుగురు బంగ్లాదేశీయుల విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ రెండు రాష్ట్రాల నుంచే ఈజీ...బంగ్లాదేశ్ సరిహద్దు సుమారు 4,096 కిమీ పొడవు ఉంది. ఇది పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. అయితే పశ్చిమ బెంగాల్, అసోంల్లో ఉన్న 53 కిలోమీటర్లు మాత్రమే అక్రమంగా సరిహద్దులు దాటడానికి అనుకూలంగా ఉంది. అక్రమంగా భారత్లోకి ప్రవేశించాలని భావించే వాళ్లు బంగ్లాదేశ్లోని జషోర్ జిల్లాకు చేరుకుంటున్నారు. ఈ సరిహద్దు సుమారు 102 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. ఇందులో శార్షా ఉపజిల్లాలోని బెనపోల్ రెండు దేశాల మధ్య ప్రయాణికులు, సరుకుల రవాణాకు అత్యంత కీలకమైన ప్రాంతం. అయితే పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాలు, మాల్దా జిల్లాల్లోని 28 కిమీ...అసోంలోని ధుబ్రి జిల్లాలోని బ్రహ్మపుత్ర నది పరీవాహక ప్రాంతంలో ఉన్న మరో 25 కి.మీ ప్రాంతమే అక్రమంగా ప్రవేశానికి అనుకూలంగా ఉంటోంది.పడవలు, పంటపొలాల మీదుగా... ఈ రెండు ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో ఉన్న గేడే, కృష్ణగంజ్, తేహట్ట, ముర్షిదాబాద్ జిల్లాలోని పద్మా నది పరీవాహక ప్రాంతాలు, దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని సుందర్బన్స్ నదీ మార్గాలు, కూచ్బెహార్ జిల్లాలోని ఉత్తర సరిహద్దు ప్రాంతాలు అక్రమ వలసలకు ఉపకరిస్తున్నాయి. అలాగే అసోంలోని కరీమ్గంజ్ జిల్లాలో ఉన్న కుషియారా నది పరీవాహక ప్రాంతాలు, మాంకాచర్ జిల్లాలోని నదీ మార్గాలు, కాచర్ జిల్లాలోని కొన్ని సరిహద్దు గ్రామాల పరిసరాలు కూడా వారికి ఉపకరిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, నదులు, గ్రామాలు సరిహద్దుకు ఆనుకుని ఉండడంతో పాటు కంచె, సరైన గస్తీ లేకపోవడం అనుకూలంగా మారాయి. నదులను చిన్న పడవల ద్వారా దాటడం, రాత్రి వేళల్లో వ్యవసాయ భూముల ద్వారా ప్రవేశించి భారత్లోకి వచ్చేస్తున్నారు. హౌరా కేంద్రంగా... ఇలా అక్రమంగా వలసవచ్చే వారికి సహకరించడానికి కోల్కతాలోని హౌరాలో కొన్ని ముఠాలు పని చేస్తున్నాయి. ఈ గ్యాంగ్స్ ఆ బంగ్లాదేశీయుల్ని బెంగాల్ వాసులుగా మార్చేస్తూ నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి ఇస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అక్కడే విద్యనభ్యసించినట్లు బోనఫైడ్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నాయి. ఇలా భారతీయులుగా మారిపోతున్న ఈ బంగ్లాదేశీలను దేశంలోని వివిధ నగరాలకు తరలించడానికి దళారులూ కోల్కతాలో సిద్ధంగా ఉంటున్నారు. వీళ్లు దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ సాయంతో యువతుల్ని వ్యభిచారం వైపు, యువకుల్ని కూలీ పనుల వైపు మళ్లిస్తున్నారు. -
పెళ్లింట విషాదం
హసన్పర్తి: పెళ్లికి ఏర్పా టు చేసిన ఫ్లెక్సీని తొలగిస్తున్న తండ్రీ కొడుకులు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమారంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భీమారానికి చెందిన ఉప్పు సాంబయ్య (62) రిటైర్డ్ ఉద్యోగి. ఆయనకు భార్య రమాదేవి, ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు శరత్ (32) వివాహం వారం రోజుల క్రితం జరిగింది. పెళ్లిని పురస్కరించుకుని ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మంగళవారం చినుకులు కురవడంతో సాంబయ్య ఆ ఫ్లెక్సీ తొలగించడానికి ఉపక్రమించాడు. దీంతో అతడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. తండ్రిని రక్షించడానికి వెళ్లిన శరత్ కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇద్దరినీ చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. -
త్రిలింగ భూమిపై కమలం వికసించాలి
సాక్షి, హైదరాబాద్/ఘట్కేసర్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కు కౌంట్డౌన్ ప్రారంభమైందని.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ కల సాకారం చేయాలని పార్టీ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం వెంటనే సడక్ సే సన్సద్ తక్ (గల్లీ నుంచి చట్టసభల దాకా) పోరుబాటకు శ్రీకారం చుట్టాలన్నారు. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ లక్ష్యాలను వివరించాలని సూచించారు. తెలంగాణలో పరివర్తన, ప్రజల గొంతుకగా వారి సమస్యలపై రోడ్లపైకి వచ్చి పోరాడితేనే అధికారం సాధ్యమని.. ఈ త్రిలింగ భూమిపై కమలం వికసించేలా పోరాడాలని కోరారు. మంగళవారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అవుషాపూర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన నితిన్ నబీన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ల పాలనను తూర్పారబట్టడంతోపాటు తెలంగాణలో అధికారం చేపట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సొమ్ము రాహుల్ యాత్రలకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ పూర్తి చేయలేదని నితిన్ నబీన్ విమర్శించారు. మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టు పేరిట లూటీకి తలుపులు తెరిచిందని దుయ్యబట్టారు. అవినీతి, నేరమయ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పర్యాయపదంగా మారిందని.. దేశంలోని తుక్డే తుక్డే గ్యాంగ్లతో చేతులు కలిపి పనిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రజల శ్రమతో సంపాదించిన డబ్బును ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట ఢిల్లీకి తరలిస్తోందని.. ప్రజల డబ్బును, రైతులకు ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సొమ్మును రాహుల్ గాంధీ విదేశీ యాత్రలకు ఖర్చు చేస్తోందని ఆరోపించారు.బీఆర్ఎస్ హయాంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదే అవినీతి, అక్రమాలను కొనసాగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ లెక్కలన్నీ తేలుస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతామని ప్రకటించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎం.రఘునందన్రావు, గోడెం నగేశ్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమరయ్య, పార్టీ నేతలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్, రేఖా శర్మ, పొంగులేటి సుధాకర్రెడ్డి, చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. విభేదాలు వీడండి: సునీల్ బన్సల్ ‘తెలంగాణలో ఫైర్ ఉన్నా దానిని ఎలా ఉపయోగించుకోవడమే సమస్యగా మారుతోంది. మీలో మీరు కొట్టుకుంటున్నారు. దీంతో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిస్థితిని పక్కనపెట్టి అన్ని శక్తులను ఒకే దిశలో పెట్టే ప్రక్రియ అవసరం ’అని రాష్ట్ర కార్యవర్గ భేటీ ముగింపు సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్ పేర్కొన్నట్లు సమాచారం. నేతలంతా టార్గెట్ తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ‘రాష్ట్రంలో బీజేపీకి మరో శుత్రువు లేదు. పార్టీలోనే ఒకరికొకరు శత్రువులు ఉన్నారు. ఇదే పెద్ద సమస్య. దీన్ని అధిగమిస్తే పార్టీ అధికారంలోకి రావడం ఖాయం’అని పార్టీ రాష్ట్ర ఇన్చార్జి అభయ్ పాటిల్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.తీర్మానాలు ఇవే...» కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ కోసం రాష్ట్ర పార్టీ కృషి చేయాలని, ప్రభుత్వాన్ని గద్దె దించేలా పోరాడాలని రాష్ట్ర కార్యవర్గం రాజకీయ తీర్మానం ఆమోదించింది. » నిరుద్యోగ భృతి చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మరో తీర్మానం. » రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న రైతుల పక్షాన పోరాడాలని వ్యవసాయ రంగ తీర్మానం ఆమోదం. » ప్రధాని మోదీ పన్నెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతి, అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలను ప్రశంసిస్తూ మరో తీర్మానం. » తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు కేటాయించి అభివృద్ధికి ఎంతో సహకరిస్తోందని ఇంకో తీర్మానానికి ఆమోదముద్ర. గ్రూపులను సహించం.. కలిసి పనిచేయాల్సిందే పార్టీ ముఖ్య నేతలతో భేటీలో నితిన్ నబీన్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీలో నేతలు గ్రూపులుగా విడిపోవడాన్ని, సమన్వయ లేమి వల్ల పార్టీలో సమస్యలు తలెత్తడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంత పెద్ద నేతనైనా ఉపక్షించే పరిస్థితి లేదని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇప్పటికైనా కొందరు నేతలు పద్ధతి మార్చుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాలని ఆయన సూచించారని తెలిసింది. మంగళవారం రాష్ట్ర కార్యవర్గ భేటీ సందర్భంగా విడిగా ముఖ్య నేతలతో నితిన్ నబీన్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, వైఫల్యాలు ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉన్నందున పార్టీ నేతలంతా కలిసిమెలిసి పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని చెప్పినట్లు తెలిసింది.రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకుప్రజలు సిద్ధంగా ఉన్నారు: రాంచందర్రావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా పేరిట కూల్చివేతలతో సర్కార్ను ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అన్నారు. మూసీ ప్రక్షాళనపై బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే గాంధీ సరోవర్ వంటి భారీ ప్రాజెక్టులను ప్రకటించి లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ప్రజలను నిర్వాసితులను చేయడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు. బీజేపీకి అధికారం కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మంగళవారం ఘట్కేసర్ సమీపంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూ మనలో మనం పోరాడకుండా, విభేదించుకోకుండా ‘టీమ్ బీజేపీ’గా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తాను బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తిచేసుకుంటున్న సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి, ప్రతి అడుగులోనూ సహకరించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు రాంచందర్రావు కృతజ్ఞతలు తెలియజేశారు. నితిన్ నబీన్ నాయకత్వంలో తెలంగాణలో కూడా బీజేపీ విజయపతాకాన్ని ఎగురవేస్తుందనే పూర్తి విశ్వాసం ఉందన్నారు. -
జీవో 9పై స్టే పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఫీజు వసూలు, రీయింబర్స్మెంట్కు సంబంధించి జీవో నంబర్ 9లోని నాలుగు మార్గదర్శకాలపై ఇచ్చిన స్టేను హైకోర్టు పొడిగించింది. వచ్చే సోమవారం వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది. మంగళవారం కౌంటర్ దాఖలు చేస్తామని, అందరికీ కాపీ ఇవ్వడానికి ఈనెల 6 వరకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కాలేజీల తరఫు న్యాయవాదులు కోరారు. దీనికి సమ్మతించిన న్యాయమూర్తి.. మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తే సోమవారంలోగా రిప్లై కౌంటర్ వేయాలని కాలేజీలను ఆదేశించారు. అలాగే ఫీజుల నిర్ధారణ అంశాన్ని కాలేజీల న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకురావడంతో సోమవారం ఆ పిటిషన్లపై కూడా విచారణ చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 6న జారీ చేసిన జీవో 9ను సవాల్ చేస్తూ 100కుపైగా కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ రోజు కౌంటర్ దాఖలు చేస్తామని స్పెషల్ జీపీ రాహుల్రెడ్డి చెప్పారు. కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎల్.రవిచందర్, ఎస్.శ్రీరామ్, అవినాశ్ దేశాయ్, తరుణ్ జి.రెడ్డి వాదనలు వినిపిస్తూ కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం ఇన్ని రోజులు సమయం తీసుకుందన్నారు. -
ఎయిర్టెల్కు రెండో హెడ్క్వార్టర్గా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: ఎయిర్టెల్కు రెండో హెడ్క్వార్టర్గా హైదరాబాద్ను చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ వెల్లడించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఆయన తన అభిప్రాయాన్ని సీఎంతో పంచుకున్నారు. తెలంగాణలో ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని పెంచడానికి ఆయన ఆసక్తి కనపర్చారు. అలాగే డేటా సెంటర్ల సామర్థ్యాన్ని మరింత పెంచనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యావ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలను సీఎం ఆయనకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఏటీసీ)గా మారుస్తున్నామని, పాలిటెక్నిక్ కళాశాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. చందన్వెల్లిలోని డేటా సెంటర్ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఈ సందర్భంగా రేవంత్రెడ్డి సూచించారు. తెలంగాణలో మరింత పెద్ద సమగ్ర డేటా సెంటర్, ఏఐ మౌలిక సదుపాయాల క్యాంపస్ను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని, హైదరాబాద్లో ఎయిర్టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ ఏఐ కార్యకలాపాలపైనా పెట్టాలని కోరారు. భవిష్యత్ పెట్టుబడి అవకాశాలు, సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేలా ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ను నామినేట్ చేసి సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. భారతీ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తామని సునీల్ మిట్టల్ తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. -
11 మంది సభ్యులతో యాదగిరిగుట్ట పాలకవర్గం
సాక్షి, యాదాద్రి : యాదగిరిగుట్ట దేవస్థానం(వైటీడీ) బోర్డును ప్రభుత్వం ఎట్టకేలకు నియమించింది. ఒక చైర్మన్తో పాటు పది మంది సభ్యులు, మరో ఏడుగురు ఎక్స్అఫీషియో సభ్యులతో పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి 2009 సంవత్సరం వరకు సాధారణ పాలకవర్గం ఉంది. ఆ పాలకవర్గం పదవీకాలం ముగిసిన తర్వాత ఆలయ ఈవోలతోనే నడిపించారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. అయితే, పూర్తిగా అధికారుల ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు కొనసాగుతూ వచ్చాయి.అస్తవ్యస్తంగా పాలన..దేవస్థానానికి పాలకవర్గం లేకపోవడంతో దేవస్థానంలో అధికారుల హవా కొనసాగింది. దీంతో పలు ఆరోపణలు వచ్చాయి. దేవస్థానం అధికారి ఏసీబీకి పట్టుబడడం, డాలర్లు మాయం కావడం. దేవస్థానం గోదాం నుంచి సరుకులు దొంగిలించుకుపోతుండగా పోలీసులు పట్టుకోవడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకం, దేవస్థానంలో దుకాణాల కేటాయింపులో అక్రమాలు వంటి పలు అంశాలు రచ్చ కెక్కాయి. అలాగే భక్తుల సౌకర్యాల కంటే దేవస్థానంలో వీఐపీలకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీనికి తోడు దేవాలయం ఉద్ఘాటన తర్వాత ఒక్క రోజు లక్ష మంది భక్తులు రావడంతో సౌకర్యాల కొరత కనిపించింది.బోర్డు ఏర్పాటుపై రెండేళ్ల క్రితం సీఎం ప్రకటనసీఎం రేవంత్రెడ్డి రెండవసారి 2024 నవంబర్ 8న యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు దేవస్థానం పాలకవర్గం నియామకంపై ప్రకటన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం (వైటీడీ) బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గుట్టలో ప్రకటించిన విధంగానే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు బిల్లును 2025 మార్చి18న అసెంబ్లీలో ఆమోదించారు. నూతన చట్టం ప్రకారం 11 మంది సభ్యులు, ఏడుగురు ఎక్స్అఫీషియో సభ్యులతో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటైంది. ఇందులో వివిధ వర్గాలకు చెందిన వారిని ప్రభుత్వం నామినేట్ చేసింది. వీరితోపాటు వంశపారంపర్య ధర్మకర్త కూడా సభ్యుడిగా ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ(ఎండోమెంట్) ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, దేవస్థానం ఈవో, వై టీడీఏ వైస్ చైర్మన్, సీనియర్ ప్రధానార్చకుడు ఉంటారు. బోర్డు కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది.చైర్మన్గా సత్యనారాయణరెడ్డియాదగిరిగుట్ట దేవస్థానం (వైటీడీ) బోర్డు చైర్మన్గా ఎం.సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత డాక్టర్ మన్నె సత్యనారాయణరెడ్డి ఫార్మారంగంలో సేవలందిస్తున్నారు. ఒక సాధారణ కెమిస్ట్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు ఫార్మా రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు.సభ్యులు వీరే..వినోద్ వెంకటస్వామి : మాజీ కేంద్ర మంత్రి జి.వెంకటస్వామి కుమారుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యేకొణిదెల సురేఖ : ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సతీమణిసి.విజయారాజం : ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎల్ రాజం సతీమణితూళ్ల విజయేందర్ : మాజీ హోం మంత్రి తూళ్ల దేవేందర్గౌడ్ కుమారుడుస్వాతి కంఠమని : నాట్కో ఫార్మా యాజమాన్యానికి చెందిన వారుగుండు మల్లయ్య : హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్కు చెందిన ఆధ్యాత్మికవేత్తఎం.రాఘవేందర్రావు : సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.రఘునందన్రావు తండ్రి ఎం,రాఘవేందర్రావుడాక్టర్ లక్ష్మీనారాయణనాయక్ : వరంగల్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ ధన్వంతి భర్త, జనగామ జిల్లా కేంద్రంలో ప్రముఖ వైద్యుడుపోచబోయిన ఈశ్వరమ్మయాదవ్ : హైదరాబాద్లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్బి.నర్సింహ మూర్తి : యాదరిగుట్ట ఆలయ వంశపారంపర్య ధర్మకర్తఉమ్మడి నల్లగొండ జిల్లా వారికి దక్కని చోటు!ప్రభుత్వం నియమించిన యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్ మెంట్బోర్డులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అవకాశం దక్కలేదు. ఉమ్మడినల్లగొండకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఎంతో కాలంగా దేవస్థానం పాలక మండలి పదవులను ఆశించారు. కానీ, ఎవరికీ అవకాశం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. -
అబద్ధాలు చెప్పను
సాక్షి, హైదరాబాద్: ‘అధికారం కోసం అబద్ధాలు చెప్పను. ఏముందో అదే చెబుతా... చెప్పిందే చేస్తా. అబద్ధాల పునాదులపై ప్రభుత్వం నడపను. ఈ ప్రభుత్వం రైతులది, పేదలది, మహిళలది, నిరుద్యోగులది. పదవి శాశ్వతం కాదు... మాట శాశ్వ తం. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నా రాజకీయ జీవితం’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో రైతు భరోసా పథకం కింద ఖరీఫ్ పెట్టుబడి సాయం విడుదల సందర్భంగా నిర్వహించిన రైతు భరోసా సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మళ్లీ వస్తాడని ఇద్దరు పిల్ల రాక్షసులు చెబుతున్నారని.. ఆయన రావడం వల్ల ఆ కుటుంబానికే ఉపయోగం తప్ప ప్రజలకు ఒనగూరేదేముందని సీఎం ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారని.. అయితే బెంగాల్లో అధికారంలోకి రావడానికి బీజేపీకి 15 ఏళ్లు పట్టిందని.. ఇక్కడ కూడా అలాగే వేచి ఉండాలని ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్య అంశమని చెప్పారు. రైతుల కోసం ప్రతినెలా రూ. 6 వేల కోట్ల చొప్పున గత 30 నెలల్లో రూ. 1.75 లక్షల కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పంటా కాళేశ్వరం నీళ్లతోనే పండుతోందని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొనే వాళ్లని.. కానీ మూడేళ్లుగా అక్కడి నుంచి చుక్క నీరు రాకపోయినా తెలంగాణ రైతులు 2 కోట్ల 80 లక్షల టన్నుల ధాన్యం ఎలా పండించారో చెప్పాలని సీఎం ప్రశ్నించారు. ఫాంహౌస్లో వరి పండించి క్వింటా రూ. 4,200కు అమ్ముకున్నాయన వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టారని విమర్శించారు. కేసీఆర్ మళ్లీ వస్తాడా... ఎందుకు? ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో అయిన అప్పు రూ. 69 వేల కోట్లు అయితే, పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం రూ. 7 లక్షల కోట్లకుపైగా అప్పు చేసిందని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు కూడా విడతలవారీగా ఇచ్చారని.. బడి పిల్లల భోజన బిల్లులు, యూనిఫాం బిల్లులు, స్వయం సహాయక సంఘాల బకాయిలు, సర్పంచుల బిల్లులు... ఇలా ఏ ఒక్కటీ చెల్లించకుండా వెళ్లిపోయారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అయిందో లేదో అప్పుడే దిగిపోవాలంటున్నారని.. అడగగానే దిగిపోవడానికి తాము గడీల ముందు బానిసలమా? అని సీఎం ప్రశ్నించారు. ‘కేసీఆర్ మళ్లీ వస్తే ప్రజలకు ఏం చేస్తడు. ప్రజలకేం ఇచ్చిండని వస్తడు? మొగుడు పెళ్లాలు మాట్లాడుకునే మాటలు వినడానికా? రైతు బజార్లు తీసుకురావాల్సింది పోయి బెల్టు షాపులు తీసుకొచ్చారు. రాష్ట్రంలో తాగుడు సంస్కృతిని పెంచారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. దళితులకు 3 ఎకరాల చొప్పున భూపంపిణీ ఇవ్వలేదు. రూ. లక్ష చొప్పున రైతులకు రుణమాఫీ చేయలేదు. మేం సంసారాల్లో చిచ్చుపెట్టే తప్పుడు రాజకీయాలు చేయం. ఫోన్ ట్యాపింగ్ లాంటి పనులు మా ప్రభుత్వంలో ఉండవు’అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మోదీ వచ్చి మోరీ తీస్తడా? ‘తెలంగాణలో కూడా మోదీ పాలన వస్తదని బీజేపీ నేతలు అంటున్నారు. అయినా మోదీ వచ్చి మోరీ తీస్తాడా? ప్రతి పేదవాడి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని మోదీ చెప్పారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ లెక్కన 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఎక్కడ ఉన్నాయి ఆ ఉద్యోగాలు? తెలంగాణలో బండి సంజయ్, కిషన్రెడ్డికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు’అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ ‘ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్. వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి అధికారంలోకి వచ్చిన రోజే ఉచిత విద్యుత్పై సంతకం చేశారు. రూ. 12 వేల కోట్ల విద్యుత్ బిల్లులను కూడా మాఫీ చేశారు. ఎవరైనా ఉచిత విద్యుత్ ఇచ్చామంటే ఉరికించి కొట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఉచిత విద్యుత్ కోసం గత 30 నెలల్లో రూ. 30 వేల కోట్లు వెచ్చించాం. ప్రతిపక్ష నాయకులు మూసీ అభివృద్ధి వద్దంటారు... మెట్రో వద్దంటారు... రీజనల్ రింగ్ రోడ్ వద్దంటారు... పొర్లు దండాలు పెట్టినా అభివృద్ధి పనులు ఆపం’అని రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు. పంట మార్పిడి తప్పనిసరి ఈసారి వర్షాలు తక్కువగా పడే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నందున వర్షాలను బట్టి రైతులు పంటలు వేసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ‘మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచాం. రైతులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు వేయాలి. పంట మార్పిడి చేయాలని శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు నేను చెబితే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పుకుంటూ బతకాలనే శాపం బావబామ్మర్ధులకు ఉన్నట్లుంది. అందుకే పోటీ పడి అబద్ధాలు చెబుతున్నారు. ఎవరేం చెప్పినా 9 రోజుల్లో రైతుభరోసా కింద రూ. 9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తాం’అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. భూమి భరోసా కాదు... పంటకు భరోసా: మంత్రి తుమ్మల భవిష్యత్తులో పంట వేసిన వారికే రైతు భరోసా అందించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ ఇది భూమి భరోసా కాదని, పంటకు ఇచ్చే భరోసా అని స్పష్టం చేశారు. పంటల మార్పిడి చేయాలని, ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు పప్పు దినుసులు పండించాలని కోరారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా, రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు, వేగవంతమైన చెల్లింపులతో రైతుల జీవితాల్లో నమ్మకాన్ని నింపామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరితోపాటు రైతు వేదికల నుంచి జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు ఆన్లైన్లో పాల్గొన్నారు. -
రైతుల ఖాతాల్లో రూ.9,000 కోట్లు
హైదరాబాద్: తెలంగాణ రైతాంగం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయం అమలు చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్ తదితరులతో కలిసి పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులను నేరుగా జమ చేస్తున్నామని ప్రకటించారు."రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని... రైతు నవ్వితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని" అన్న నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి రైతు హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఇదేనని అన్నారు.ఖరీఫ్ సీజన్ నుంచే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏడు రకాల సన్న వడ్లకు బోనస్ అందిస్తామని ప్రకటించిన మంత్రి, రైతు పండించిన ప్రతి గింజకు విలువ పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ధాన్యం ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.రైతు అనుకూల విధానాలు, సకాలంలో ధాన్యం కొనుగోలు, వేగంగా రైతుల ఖాతాల్లో చెల్లింపులు, నాణ్యమైన విత్తనాలు, సాగునీటి లభ్యత వంటి చర్యలతో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో రైతు సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు, వేగవంతమైన చెల్లింపులతో రైతుల జీవితాల్లో నమ్మకాన్ని నింపామని చెప్పారు.రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి రైతు సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.80 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని, ఇది దేశంలోనే రైతు సంక్షేమంపై అత్యధిక పెట్టుబడి పెట్టిన ప్రభుత్వాల్లో తెలంగాణను నిలబెట్టిందని తెలిపారు."మాటలు కాదు... చేతలు. హామీలు కాదు... అమలు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేకత" అని మంత్రి పేర్కొన్నారు. రైతు కష్టానికి గౌరవం, పంటకు గిట్టుబాటు ధర, సాగుకు భరోసా, కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.తెలంగాణ రైతాంగం కోసం ప్రతి నిర్ణయం తీసుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతు సంక్షేమం, రైతు గౌరవం, రైతు ఆర్థికాభివృద్ధే తమ ప్రభుత్వ పరమావధి అని మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. -
ప్రపంచ ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ
హైదరాబాద్: ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమకు తెలంగాణ కొత్త కేంద్రంగా అవతరిస్తోందని, ఇకపై అత్యాధునిక విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రక్షణ వ్యవస్థల తయారీలో హైదరాబాద్ ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలవబోతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.హైదరాబాద్లో జరిగిన ఏరోమార్ట్ హైదరాబాద్–2026 అంతర్జాతీయ ఏరోస్పేస్ & డిఫెన్స్ బిజినెస్ కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, "ప్రపంచ ఏరోస్పేస్ రంగం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. పెట్టుబడులు, పరిశ్రమలు, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణే కొత్త చిరునామా" అని స్పష్టం చేశారు.భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, సూపర్సోనిక్ యుద్ధ విమానాలను నడిపిన వ్యక్తిగా ఏరోస్పేస్ రంగంలో నాణ్యత, ఖచ్చితత్వం ఎంత కీలకమో తనకు ప్రత్యక్ష అనుభవం ఉందన్నారు."ఒక్క చిన్న విడిభాగం లోపం కూడా మిషన్ విజయాన్ని ప్రభావితం చేస్తుంది. అలాంటి అత్యున్నత ప్రమాణాలను తెలంగాణ పరిశ్రమలు నేడు విజయవంతంగా అందిస్తున్నాయి" అని చెప్పారు.అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్కు అవసరమైన క్యాబిన్లు, అపాచీ యుద్ధ హెలికాప్టర్ల నిర్మాణ భాగాలు, ఎఫ్–16 యుద్ధ విమానాల రెక్కలు, ప్రపంచ ప్రఖ్యాత ఏరో ఇంజిన్ విడిభాగాలు, ఎంఆర్ఓ వ్యవస్థలు నేడు తెలంగాణలోనే తయారవుతున్నాయని మంత్రి తెలిపారు."'మేడ్ ఇన్ తెలంగాణ' అనే ముద్ర ఇప్పుడు ప్రపంచ ఆకాశంలో గర్వంగా ఎగురుతోంది" అని పేర్కొన్నారు.స్పెయిన్కు చెందిన ITP Aero, కెనడాకు చెందిన FTG Aerospace వంటి అంతర్జాతీయ దిగ్గజాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర పారిశ్రామిక విశ్వసనీయతకు నిదర్శనమన్నారు.ఫ్రాన్స్, ఇటలీ సహా 25కిపైగా దేశాల కంపెనీలు ఏరోమార్ట్లో పాల్గొనడం తెలంగాణ అంతర్జాతీయ ప్రాధాన్యతను మరింత పెంచిందని తెలిపారు.తెలంగాణలో ఇప్పటికే 1,500కు పైగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సేవలందిస్తున్న ఎంఎస్ఎంఈలు పనిచేస్తున్నాయని, పరిశ్రమలకు అవసరమైన అత్యాధునిక పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలు రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఆకర్షణీయ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చాయని చెప్పారు.డీఆర్డీఓ, రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, ప్రైవేట్ పరిశ్రమలు ఒకే నగరంలో ఉండటం హైదరాబాద్కు ప్రపంచ స్థాయి పోటీ సామర్థ్యాన్ని కల్పించిందన్నారు.యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మారుతున్న ఐటీఐలు ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంతో కూడిన యువతను తీర్చిదిద్దుతున్నాయని తెలిపారు.తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం గత కొన్నేళ్లుగా దాదాపు 30 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయగా, గత ఏడాది ఎగుమతులు 103 శాతం పెరిగి, రాష్ట్రానికి ఎన్నో దశాబ్దాలుగా అగ్రగామిగా ఉన్న ఔషధ రంగాన్నే అధిగమించడం తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయమని మంత్రి పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విమానయాన రంగ విస్తరణకు చారిత్రక నిర్ణయాలు తీసుకుందని మంత్రి వెల్లడించారు.వరంగల్ విమానాశ్రయానికి వచ్చే నెలలో శంకుస్థాపన, ఆదిలాబాద్లో పౌర-సైనిక అవసరాలకు అనువైన ఎయిర్ఫీల్డ్, కొత్తగూడెం విమానాశ్రయానికి త్వరలో కేంద్ర ఆమోదం లభించనున్నాయని తెలిపారు.ఈ మూడు కేంద్రాలు భవిష్యత్తులో విమాన మరమ్మత్తు, విమాన తయారీ, రక్షణ పరిశ్రమలకు భారీ అవకాశాలను తెరవనున్నాయని చెప్పారు.ప్రపంచ ఏరోస్పేస్ దిగ్గజాలను ఉద్దేశించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, "మీ తదుపరి తయారీ కేంద్రం తెలంగాణ కావాలి. మీ తదుపరి పెట్టుబడి హైదరాబాద్లో ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం మీకు అనుమతులు ఇచ్చే ప్రభుత్వం మాత్రమే కాదు... మీ విజయానికి భాగస్వామిగా నిలిచే ప్రభుత్వం" అని ఆయన పిలుపునిచ్చారు.ప్రజాప్రతినిధుల నుంచి అధికార యంత్రాంగం వరకు పెట్టుబడిదారులకు 24 గంటలూ అందుబాటులో ఉంటామని, పరిశ్రమల స్థాపన, విస్తరణలో ప్రతి అడుగులోనూ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు."ఏరోమార్ట్ హైదరాబాద్–2026 కేవలం ఒక పారిశ్రామిక సదస్సు కాదు... ప్రపంచ ఏరోస్పేస్ పటంలో తెలంగాణ శాశ్వత స్థానాన్ని ఖరారు చేసే చారిత్రక వేదిక" అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. -
ప్రత్యేక పోలీస్ బలగాలు రాష్ట్ర భద్రతకు బలమైన కవచం: డీజీపీ సి.వి. ఆనంద్
హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నిర్వహణ, విపత్తు నిర్వహణ, వీఐపీ బందోబస్తు, ప్రత్యేక ఆపరేషన్లలో కీలక భూమిక పోషిస్తున్న తెలంగాణ స్పెషల్ బెటాలియన్లను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరింత ఆధునికంగా, సాంకేతికంగా బలోపేతం చేయాలని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ అధికారులకు సూచించారు. జూబ్లీహిల్స్లోని తెలంగాణ స్పెషల్ బెటాలియన్ల ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని వివిధ పరిపాలనా, సాంకేతిక, సంక్షేమ అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.సమావేశానికి ముందు డీజీపీ ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలు, పరిపాలనా సెక్షన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ, ఆయుధాల నిర్వహణ, సాంకేతిక విభాగాలు, నిర్మాణ పనులు, కార్యాలయ నిర్వహణ, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం అధికారులు సమర్పించిన ప్రజెంటేషన్ను పరిశీలించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.బెటాలియన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడం, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, వాహనాల సంఖ్యను పెంచడం, సిబ్బందికి మెరుగైన నివాస క్వార్టర్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (APSP) బెటాలియన్లు నక్సల్స్ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో సివిల్ పోలీసులకు వెన్నుదన్నుగా నిలిచి ఎన్నో కీలక ఆపరేషన్లలో విశేష సేవలు అందించాయని గుర్తు చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి పోలీస్ స్టేషన్కు ప్రత్యేక బలగాలను అనుసంధానం చేయడం ద్వారా పోలీసు వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసిందన్నారు.తాను నిజామాబాద్, వరంగల్ వంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లాల ఎస్పీగా పనిచేసిన సమయంలో ప్రత్యేక బలగాల సేవలను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్లపై తరచూ నక్సల్స్ దాడులు జరిగేవని, అలాంటి పరిస్థితుల్లో స్పెషల్ పోలీస్ బెటాలియన్లు అత్యంత ధైర్యసాహసాలతో విధులు నిర్వహించి నక్సల్స్ నిర్మూలనలో కీలక పాత్ర పోషించాయని ప్రశంసించారు.రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం 13 స్పెషల్ బెటాలియన్లను ఏర్పాటు చేసి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వాటిని అభివృద్ధి చేసిందని తెలిపారు. ప్రస్తుతం ఈ బెటాలియన్లు ఎన్నికల సమయంలో భారీ బందోబస్తు, శాంతిభద్రతల నిర్వహణ, ముఖ్యమైన ఉత్సవాలు, మతపరమైన వేడుకలు, ప్రజాసమావేశాలు, వీఐపీ భద్రత, విపత్తు నిర్వహణ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల రక్షణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాయని కొనియాడారు.ఇటీవల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల సమయంలో తెలంగాణ స్పెషల్ బెటాలియన్ సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యల్లో పాల్గొనడం, ప్రాణాలు, ఆస్తులను కాపాడడంలో అంకితభావంతో పనిచేశారని అభినందించారు.బెటాలియన్ల కమాండెంట్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, పరిపాలనలో క్రమశిక్షణతో పాటు మానవతా దృక్పథం కూడా ఉండాలని సూచించారు. సిబ్బంది కుటుంబ పరిస్థితులు, ఆరోగ్యం, పిల్లల విద్య, వ్యక్తిగత సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలవాలని చెప్పారు.దూర ప్రాంతాల్లో నెలల తరబడి విధులు నిర్వహించే సిబ్బందికి కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో అధికారులు వారికి అవసరమైన మానసిక బలం అందించాలని సూచించారు.విధుల్లో పారదర్శకతడ్యూటీల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించాలని, ఎలాంటి వివక్షకు తావివ్వకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఎన్నికలు, ప్రత్యేక బందోబస్తు, వీఐపీ విధులు, ఇతర ప్రత్యేక డ్యూటీలను కూడా నిష్పాక్షికంగా కేటాయించాలని ఆదేశించారు.గతంలో 18 నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉండేవి. ఇప్పుడూ ఆ సమస్య తీరిందన్నారు. ప్రతి బెటాలియన్ పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, సమగ్ర రివ్యూ నిర్వహించాలని సూచించారు. భవిష్యత్తులో రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్ సిటీ, ఆమనగల్ ప్రాంతాల్లో కొత్త స్పెషల్ బెటాలియన్ల ఏర్పాటు అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.మిత్ర కౌన్సెలింగ్ కేంద్రాలుపోలీసు సిబ్బందిలో మానసిక ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ, "మిత్ర" కౌన్సెలింగ్ కేంద్రాలను మరింత సమర్థంగా వినియోగించాలని సూచించారు. విధుల ఒత్తిడి, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులతో బాధపడుతున్న సిబ్బందిని గుర్తించి వారికి నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించాలని ఆదేశించారు.డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, ఇతర వ్యసనాల బారిన పోలీసు సిబ్బంది ఎవరూ పడకుండా అధికారులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాంటి అలవాట్లకు గురైన వారిని శిక్షించడం కంటే ముందుగా గుర్తించి, కౌన్సెలింగ్, వైద్య సహాయం ద్వారా తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు.పోలీసు సిబ్బందిలో ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను అధికారులు, సహచరులు ముందుగానే గుర్తించి తక్షణమే స్పందించాలని సూచించారు. ప్రతి కమాండెంట్ తన పరిధిలోని సిబ్బందితో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పారు.శిక్షణకు ఎల్లప్పుడూ అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆధునిక పోలీసింగ్కు అనుగుణంగా ప్రత్యేక శిక్షణా కేంద్రాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధ వినియోగం, విపత్తు నిర్వహణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, శారీరక దారుఢ్యం, మానసిక దృఢత్వంపై నిరంతర శిక్షణ అందించాలని సూచించారు.తెలంగాణ స్పెషల్ బెటాలియన్లు రాష్ట్ర పోలీసు వ్యవస్థకు వెన్నెముక వంటివని పేర్కొన్న డీజీపీ, భవిష్యత్తు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా ఆధునికీకరణ, క్రమశిక్షణ, సాంకేతికత, సిబ్బంది సంక్షేమం అనే నాలుగు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
వెబ్సైట్ మొరాయింపు.. ఐదు రోజులుగా 'స్టాంప్స్' సేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: గత ఐదు రోజులుగా మెయింటెనెన్స్ పేరిట తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన వెబ్సైట్ పనిచేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అఫిడవిట్లు, అగ్రిమెంట్లు, అడ్వకేట్లకు సంబంధించిన వివిధ దస్తావేజులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, కోర్టు వ్యవహారాలకు అవసరమైన స్టాంప్ పేపర్లు అందుబాటులో లేకపోవడంతో అనేక పనులు స్తంభించిపోయాయి.వెబ్సైట్ తెరుచుకోకపోవడంతో స్టాంప్ పేపర్ల అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, అడ్వకేట్లు, డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ విక్రేతలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సైట్ ఎప్పుడు పునరుద్ధరించ బడుతుందోనని రోజంతా ఎదురుచూస్తూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని హైకోర్టు పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి కోర్టు, సిటీ సివిల్ కోర్టు తదితర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. స్టాంప్ పేపర్లు అందుబాటులో లేకపోవడంతో అనేక న్యాయపరమైన ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయని అడ్వకేట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా ఒక్క గంటపాటు వెబ్సైట్ పనిచేయకపోయినా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అలాంటిది వరుసగా ఐదు రోజులుగా వెబ్సైట్ పనిచేయకపోవడంతో ప్రజల సహనం పరీక్షకు గురవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే ప్రభుత్వానికి కూడా ఆదాయ నష్టం కలిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టాంప్ విక్రేతలు కూడా అమ్మకాలు లేక ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అత్యవసర సేవగా పరిగణించాల్సిన ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, వెంటనే వెబ్సైట్ను పునరుద్ధరించాలని, భవిష్యత్తులో ఇటువంటి సాంకేతిక సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని ప్రజలు, అడ్వకేట్లు, స్టాంప్ విక్రేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. -
‘‘పుష్ప’’ను మించిపోయిన స్మగ్లర్ల ప్లాన్.. ఏం చేశారంటే?
ఈగల్ ఫోర్స్, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి రూ.2.62 కోట్ల విలువైన 525 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు, ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈగల్ ఫోర్స్, ఖమ్మం ప్రాంతీయ మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం (ఆర్ఎన్సీసీ), భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు సంయుక్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం శరపాకలోని ఐటీసీ పేపర్స్ బోర్డు అండ్ స్పెషాలిటీ పేపర్స్ డివిజన్ పశ్చిమ గేటు వద్ద నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.62 కోట్ల విలువైన 525 కిలోల గంజాయి, ఒక కంటైనర్ లారీ, ఒక బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్, 5 మొబైల్ ఫోన్లు, రూ.10,570 నగదు స్వాధీనం చేసుకున్నారు.పుష్ప సినిమాలోలా లారీలో దాచి.. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో లారీలో గంధపు చెక్కలను ప్రత్యేక అర కింద దాచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. భద్రాద్రి కొత్తగూడెంలోనూ నిందితులు గంజాయిని తీసుకెళ్లడానికి ఇటువంటి ప్రయత్నమే చేశారు. నిందితుడు సహదేవ్ హంతాల్ ఒడిశాలోని అల్లూరికోట అటవీ ప్రాంతంలో గంజాయిని సేకరించినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి గంజాయి మూటలను తులసిపాకకు తరలించేందుకు కూలీల బృందాన్ని నియమించాడు. ఆ తర్వాత ఆ గంజాయిని మహమ్మద్ సైఫ్, ఫిరోజ్ భాయ్కు చెందిన కంటైనర్ లారీలో ఎక్కించారు. అధికారులు, సిబ్బందికి కనిపించకుండా గంజాయిని దాచేందుకు లారీలో ప్రత్యేక అర ఏర్పాటు చేశారు.ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్లోని తులసిపాక, మోతుగూడెం నుంచి తెలంగాణలోని భద్రాచలం, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్ర దాటి ఉత్తరప్రదేశ్కు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈగిల్ ఫోర్స్ తెలంగాణ ఖమ్మం ఆర్ఎన్సీసీ, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు ఆంధ్రప్రదేశ్లోని తులసిపాక నుంచి తెలంగాణలోని బూర్గంపాడు వరకు కంటైనర్ లారీ, దానికి ముందు వెళ్తున్న మోటార్ సైకిల్ కదలికలను గమనించారు.శరపాకలోని ఐటీసీ పేపర్స్ బోర్డు అండ్ స్పెషాలిటీ పేపర్స్ డివిజన్ పశ్చిమ గేటు వద్ద మంగళవారం రెండు వాహనాలను అడ్డగించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులతో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.నిందితుల వివరాలుసహదేవ్ హంతాల్, 20 సంవత్సరాలు, సరఫరాదారు, సిందూర్పల్లి, కుర్మనూరు, చిత్రకొండ, కాలిమేళా, మల్కన్గిరి జిల్లా (ఒడిశా)దోగ్రి త్రినాథ్, 38 సంవత్సరాలు, ఎస్కార్ట్, మారేడుమిల్లి, సోమిరెడ్డిపాలెం, అల్లూరి సీతారామరాజు జిల్లా (ఆంధ్రప్రదేశ్)కుల్దీప్ శర్మ, 27 సంవత్సరాలు, డ్రైవర్, బిజాపూర్, ససుని, అత్రోస్ (ఉత్తరప్రదేశ్)పరారీలో ఉన్న నిందితులు (సరుకు స్వీకరించేవారు)మహమ్మద్ సైఫ్, అనీఫ్ యాకూబ్ కుమారుడు, ట్రక్ యజమాని, తవీద్ మెయిన్ బజార్, సూరత్ఫిరోజ్ భాయ్రాజా మిశ్రామహమ్మద్ ఇమ్రాన్(వీరంతా ఉత్తరప్రదేశ్కు చెందినవారు) -
రైతు భరోసా నిధులు విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైస్సాఆర్కే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతుభరోసాకు సంబంధించిన నిధులు రూ. 2,482 కోట్లను సీఎం రేవంత్ ఈ రోజు ( మంగళవారం) బటన్ నొక్కి విడుదల చేశారు. తొలివిడతలో భాగంగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమయ్యాయి. 30 నెలల్లో రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషిచేశామని రూ. 2లక్షల వరకూ రుణమాఫీ చేశామని పేర్కొన్నారు.రైతు భరోసా కింద ఇప్పటి వరకూ రూ.30 కోట్లకు పైగా నిధులు విడుదల చేశామని తెలిపారు. వ్యవసాయం దండగ కాదని పండగని నిరూపించామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఎక్కడికక్కడ బకాయిలు పెట్టి సర్వనాశనం చేశారని ఆరోపించారు. విధ్యంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
తెలంగాణ సీఎస్గా సంజయ్ జాజు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎస్గా సంజయ్ జాజు ఈ రోజు ( మంగళవారం) బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా 2 గంటల 15 నిమిషాల సమయంలో ముహూర్తం చూసుకొని సచివాలయంలోని ప్రధాన కార్యదర్శి సీటులో కూర్చున్నారు. మాజీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీకాలం నేటితో ముగియడంతో ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించారు. 2029 ఫిబ్రవరి వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సంజయ్ జాజు నేపథ్యంప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు 1992 బ్యాచ్కు చెందిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్, విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్గా, ఐటీ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా రెండు తెలుగురాష్ట్రాలలో ఎంతో ప్రాముఖ్యత చెందిన మీ సేవ రూపకర్తలలో ఆయన ఒకరు. ఈ ప్రాజెక్టు రూపకల్పన, అమలులో ఆయన కీలక పాత్ర పోషించారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కేంద్ర సర్వీసుల్లో ఆయన డిప్యూటేషన్పై ఉన్నారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NHIDCL) డైరెక్టర్గా, కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా పనిచేశారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అభ్యర్థన మేరకు రాష్ట్రానికి రప్పించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. -
పాలిటిక్స్ ఏమోగానీ.. 'సర్' అయితే ఇక్కడ కూడా నడుస్తుందిగా..!
పాలిటిక్స్ ఏమోగానీ.. 'సర్' అయితే ఇక్కడ కూడా నడుస్తుందిగా..! -
తాకట్టు పెడతాడు.. తస్కరిస్తాడు!
హైదరాబాద్: బంగారం, వస్తువులు, వాహనాలను తస్కరించి తాకట్టు పెట్టిన ఉదంతాలు తరచు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. చాలా మంది చోరుల నైజమే ఇది. అయితే జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గత వారం పట్టుకున్న ముదస్సిర్ హుస్సేన్ వ్యవహారం దీనికి భిన్నం. అతను కార్లను తాకట్టు పెట్టిన తర్వాత తస్కరిస్తుంటాడు. ఆ నిందితుడిని వివిధ కోణాల్లో విచారించిన అధికారులు ఈ విషయం గుర్తించారు. మరోపక్క ఇతడికి బాస్గా వ్యవహరించిన నాందేడ్ గ్యాంగ్స్టర్ సూరజ్ సింగ్కు ఖలిస్థాన్ ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్లు బయటపడింది. దీంతో ముదస్సీర్ వ్యవహారాన్ని నగర పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.కార్ల విక్రయంతోనే మొదలైన కథ...పాతబస్తీలోని ఖిల్వత్ ప్రాంతానికి చెందిన ముదస్సిర్ హుస్సేన్ అలియాస్ షా బాబా 2022లో ముంబై వెళ్లాడు. ఆ తరువాత స్నేహితుడి ద్వారా ముంబైలో కార్లు ఖరీదు చేసి నగరంలో విక్రయించడం ప్రారంభించాడు. తొలిసారిగా అక్కడ ఓ కారును రూ.1.35 లక్షలకు ఖరీదు చేసి నగరానికి తరలించి రూ.1.75 లక్షలకు అమ్మాడు. ఇలా మొదలైన వ్యాపారాన్ని 2024 వరకు చేశాడు. ఈ సందర్భంలో ఇతడి స్నేహితుడైన షోయబ్ ద్వారా నాందేడ్కు చెందిన గ్యాంగ్స్టర్ సూరజ్ సింగ్తో పరిచయం ఏర్పడింది. పేకాటకు బానిసగా మారిపోయిన ముదస్సిర్ మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి ఆడటం మొదలెట్టాడు.ఇక్కడి నుంచి అద్దెకు తీసుకెళ్లి... ఈ పేకాట శిబిరాలకు వెళ్లడానికి ముదస్సిర్ నగరం నుంచే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అద్దెకు తీసుకునే వాడు. ఎల్లో రిజిస్ట్రేషన్ ప్లేట్ కాకుండా వైట్ ప్లేట్తో ఉన్న వాటినే తీసుకునే వాడు. దారిలో ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారులు తనిఖీ చేస్తే అది తన స్నేహితుడిదని చెప్పేవాడు. మహారాష్ట్రకు చేరడానికి ముందే ఆ వాహనానికి ఓ మారు తాళం తయారు చేయించి దగ్గర పెట్టుకునే వాడు. పేకాటలో డబ్బు వస్తే అంతా సజావుగానే ఉండేది. డబ్బు కోల్పోతే మాత్రం ఆ కారు తనదే అంటూ పేకాట శిబిరం నిర్వాహకుల వద్ద తాకట్టు పెట్టేవాడు. అలా వచ్చిన డబ్బుతో మళ్లీ పేకాట ఆడి.. అదును చూసుకుని తన వద్ద ఉన్న మారు తాళంతో ఆ వాహనాన్ని తస్కరించుకు వచ్చేవాడు.ఖలిస్థాన్ లింకులపై ఆరా... గ్యాంగ్స్టర్ సూరజ్ సింగ్తో పాటు అతడి సోదరుడు ఆకాష్ సింగ్కు ఖలిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి. సూరజ్ ముఠాతో ముదస్సిర్ 2024లో తొలినేరం చేశాడు. కర్ణాటకలోని బసవకళ్యాణ ప్రాంతంలో తన బంధువు నుంచి రావాల్సిన డబ్బు వసూలు కోసం దోపిడీకి పాల్పడ్డాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన తర్వాతే సూరజ్ ఆదేశాల మేరకు మహారాష్ట్రలో గణపతిరావు షిండే కిడ్నాప్కు పాల్పడ్డాడు. సూరజ్తో అత్యంత సన్నిహితంగా మెలిగిన ముదస్సిర్కు కూడా ఖలిస్థాన్ లింకులు ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన సందేహాలు నివృతి చేసుకోవడానికి వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ముదస్సిర్ను పోలీసు కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇతడికి తుపాకులు విక్రయించిన వ్యక్తుల వివరాలు ఆరా తీయనున్నారు. -
పట్టుకోండి చూద్దాం!(ఫోటోలు)
-
రూ.కోట్లకు కత్తెర!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయంలో గుండు పిన్ను కొనాలన్నా టెండర్ పిలుస్తుంటారు. తక్కువ కోట్ చేసిన కాంట్రాక్టర్/సప్లయర్స్కు ఆ పరికరాల సరఫరా బాధ్యతను అప్పగిస్తుంటారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో మాత్రం అత్యవసరం పేరుతో టెండర్ నోటిఫికేషన్ లేకుండానే రూ.2.61 కోట్ల విలువ చేసే 59 చైన్సా, 168 పోల్ ప్రూనర్ విత్ అడిíÙనల్ బ్యాటరీ, 530 హ్యాండిల్ ట్రి ఫ్రూనర్ విత్ అడిíÙనల్ యంత్రాలను కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారింది.నిబంధనలు తుంగలోకి..గ్రేటర్లో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ల కింద పెద్ద సంఖ్యలో చెట్లు ఉన్నాయి. ఈదురు గాలుల వర్షాలతో చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడి విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తుతోంది. చెట్లు, కొమ్మలు విరిగి లైన్లపై పడుతుండటంతో వాటిని తొలగించేందుకు పెద్ద సంఖ్యలో కూలీలను వినియోగించాల్సి వస్తోంది. కూలీలు గొడ్డళ్లతో కొమ్మలను నరకడం ఆలస్యమై గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో వినియోగదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్లు లైన్లపై పడిన చెట్ల కొమ్మల సత్వర తొలగింపు పేరుతో యాజమాన్యం ఏకంగా నిబంధనలను తుంగలో తొక్కింది. చిన్న చిన్న సివిల్ పనులు, విద్యుత్ మెటిరీయల్ కొనుగోలుకు టెండర్లు పిలిచే అధికారులు.. ముఖ్యమైన ఈ యంత్రాల కొనుగోలు విషయంలో ఈ అంశాన్ని విస్మ రించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్కు నామినేషన్ పద్ధతిలో రూ.10 లక్షల లోపు విద్యుత్ పరికరాలు కొనుగోలు చేసే అధికారం ఉంది. రూ.కోటి విలువైన పరికరాలు కొనుగోలు చేయాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి. కానీ.. డిస్కం సీఎండీ ఏకంగా రూ.2.61 కోట్ల విలువ చేసే కీలకమైన యంత్రాలను నామినేషన్ పద్ధతిలో కొనుగోలు చేయడం గమనార్హం. బహిరంగ మార్కెట్లో ఒక్కో ‘చైన్ సా ఖరీదు రూ.20 వేల లోపు ఉండగా.. డిస్కం తన బినామీ ఏజెన్సీకి ఏకంగా రూ.51 వేలు చెల్లించింది. ఇక పోల్ ప్రూనర్ విత్ అడిíÙనల్ బ్యాటరీ పరికరం రూ.45 వేలలోపు ఉండగా, డిస్కం ఏకంగా రూ.78,940 చెల్లించింది. రూ.16 వేలలోపు దొరికే ఒక్కో హ్యాండిల్ ట్రీ ప్రూనర్ విత్ అడిíÙనల్ బ్యాటరీకి రూ.18,549 చెల్లించడం గమనార్హం.ఏకపక్షంగా కొనుగోలు.. ఏకంగా రూ.2.61 కోట్లకుపైగా విలువ చేసే యంత్ర పరికరాలను టెండర్లు లేకుండా, మార్కెట్లో కంపెనీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ను, నాణ్యత, పనితీరును పరిశీలించకుండా ఏకపక్షంగా నామినేషన్ పద్ధతిలో యంత్రాలను కొనుగోలు చేయడంతో సంబంధిత అధికారులకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరినట్లు సమాచారం. -
Gachibowli: ఈ దారుల్లో 90 రోజులు వాహనాలు బంద్
హైదరాబాద్: ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి డీఎల్ఎఫ్కు, రాడిసన్ హోటల్ నుంచి ట్రిపుల్ ఐటీ వైపు 90 రోజుల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్సిటీ పనుల్లో భాగంగా ట్రిపుల్టీ జంక్షన్, డీఎల్ఎఫ్ రోడ్డులో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పనులకు ఆటంకం తలెత్తకుండా వాహనాల రాకపోకలను నిషేధించామని చెప్పారు. లింగంపల్లి వైపు నుంచి డీఎల్ఎఫ్, విప్రో రోడ్డు నుంచి డీఎల్ఎఫ్ వైపు వాహనదారులు నేరుగా ఇందిరానగర్, గచ్చిబౌలి జంక్షన్లో ఎడమ వైపు తీసుకోని రాడిసన్ హోటల్ మీదుగా డీఎల్ఎఫ్కు చేరుకోచ్చన్నారు. రాడిసన్ హోటల్ వైపు నుంచి వచ్చే వాహనదారులు డీఎల్ఎఫ్ గేట్ నెంబర్–1 వద్ద యూటర్న్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుందన్నారు. -
నా భర్త అర్ధరాత్రి మేనమరదలు ఇంటికి వెళ్తాడు..!
హనుమకొండ జిల్లా: తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఇంటి నుంచి వెళ్లగొట్టాడని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట బైఠాయించి నిరాహార దీక్ష చేపట్టింది ఓ మహిళ. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడులో సోమవారం చోటుచేసుకుంది.బాధితురాలి కథనం మేరకు.. ఐనవోలు మండలం వెంకటాపూర్కు చెందిన శ్రీజకు గుండేడుకు చెందిన డెంగు రాజుతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో కట్నంగా రూ.12 లక్షల నగదు, 16 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. పెళ్లైన మూడు నెలల నుంచే భర్త, అత్త తీవ్ర వేధింపులకు గురి చేస్తూ శారీరకంగా, మానసికంగా హింసించారని తెలిపింది.పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరగగా, తనదే తప్పు అని ఒప్పుకుని హైదరాబాద్కు తీసుకెళ్లాడని తెలిపింది. అక్కడ మద్యం సేవించి వచ్చి తనను కొట్టేవాడని ఆరోపించింది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్లి వచ్చేవాడని, ఆన్లైన్లో పేకాట ఆడి లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని వచ్చి అదనపు కట్నం కోసం వేధిస్తూ పుస్తెల తాడుతో ఉరి బిగించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.ప్రస్తుతం తన మేనమరదలుతో ఉంటున్నాడని, “నువ్వేం చేసుకుంటావో చేసుకో” అంటూ ఇంట్లోంచి తరిమేశాడని కంటతడి పెట్టుకుంది. సుమారు 20 నెలలుగా తాను పుట్టింట్లోనే ఉంటున్నానని, పోలీసుల వద్దకు పిలిపించినా తనకేమీ ఇవ్వనన్నాడని ఆరోపించింది.ఇచ్చిన కట్నం మొత్తం తమకు తిరిగి ఇచ్చి న్యాయం చేయాలని ఆమె వేడుకుంది. తనకు న్యాయం జరిగే వరకు భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేసింది. -
వరంగల్: పంట పొలంలో ‘బంగారం’ కలకలం
సాక్షి, వరంగల్: పంట పొలంలో బంగారం కలకలం రేపింది. పంపకాల పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. చెన్నరావుపేట మండలం కోపాకులపాడులో ఈ ఘటన జరిగింది. ప్రతాప్ రెడ్డి అనే రైతుకు చెందిన ఆరు ఎకరాల పంట భూమిని బాలు అనే రైతు కౌలుకు సాగు చేసుకుంటున్నారు. పొలం దున్నుతున్న క్రమంలో బంగారం లభ్యమైంది. దీంతో కూలీలు - కౌలు రైతు మధ్య వాటాల పంచాయితీ మొదలైంది. గతంలో కూడా ఈ పొలంలో బంగారం దొరికిందని ప్రచారం జరుగుతోంది.బయటకు పొక్కడంతో పోలీసుల దృష్టికి బంగారం పంచాయతీ వచ్చింది. తనకు వాటా ఇవ్వాలని ఆరేళ్ల క్రితం భూమి అమ్మిన జైపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పొలంలో మరిన్ని బంగారు నిధులు ఉన్నాయంటూ కౌలు కోసం రైతులు పోటీ పడుతున్నారు. -
మా బడిలో ఏం జరిగిందంటే..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నిత్యం విధి నిర్వహణలో నిమగ్నమయ్యే రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం విద్యార్థిగా మారిపోయారు. మాస్టార్ చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(ఈఎంఆర్ఎస్)ను కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ ఫస్టియర్ ఎకనామిక్స్ పాఠ్యాంశం టీచర్ బోధిస్తుండగా.. కలెక్టర్ తరగతిగదిలోకి వెళ్లి విద్యార్థినులతో కలిసి పాఠ్యాంశ బోధనను పరిశీలించారు. బోధన పూర్తయ్యాక పాఠ్యాంశంపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం డైనింగ్హాల్కు వెళ్లి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. మాస్టారూ.. మాలాగే..గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు శివారు పాటిమీదిగూడెం యూపీఎస్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు డాక్టర్ గోపీనాథ్ తనదైన శైలిలో గ్రామ విద్యార్థులు ఆ ఊరి పాఠశాలలోనే చదువుకునేలా చేపట్టిన ప్రయత్నాలు అభినందనలు అందుకుంటున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ముందు ఇంటింటి ప్రచారం, ఆ తరువాత డప్పు కొడుతూ బడిబాటలో ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ పాఠశాలలో చదివే పిల్లలతో తానూ సమానమంటూ స్కూల్ యూనిఫాం ధరించి గ్రామంలో నడుచుకుంటూ పాఠశాలకు చేరుకున్నారు. స్కూల్ యూనిఫాం వేసుకొని పిల్లలతో సమానంగా కూర్చున్నారు. వారి మధ్యలో కూర్చుని పాఠాలు చెబితే పిల్లలకు సులభంగా అర్థమవుతుందని, అందుకే తాను ఈ ఆలోచన చేసినట్లు తెలిపారు. ఈయన పనితీరును గుర్తించిన హెచ్ఎం సుమలతతో పాటు గ్రామస్తులు ప్రశంసించారు. -
భరోసా రెండెకరాలు దాటేనా?
నిర్మల్చైన్గేట్: రైతు భరోసా పథకం కింద ఈ నెల 30 నుంచి తొమ్మిది రోజుల పాటు పంటల సాగు పెట్టు బడికి ఆర్థిక సహాయం విడుదల చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. యాసంగి సీజన్లో ఈ పథకం కింద సాయం కోసం ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగిలింది. జిల్లాలో ని రైతులకు ఎంత భూమి ఉన్నా ఎకరాకు రూ. 6 వేల చొప్పున రెండు ఎకరాల వరకు మాత్రమే రెండు విడుతల్లో ఆర్థికసాయం అందించారు. రెండు ఎకరాల భూమి ఉన్న రైతులు సంతోషించినా అంతకంటే ఎ క్కువ భూమి ఉన్న వారు నిరాశకు లోనయ్యారు. 2018లో పథకం ప్రారంభం..రాష్ట్రంలో 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో పథకాన్ని ప్రారంభించి పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.5వేల చొప్పున అందించింది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంవత్సరం యాసంగి సీజన్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. 2024 వానాకాలం సీజన్లో పెట్టుబడి సహాయం చేయలేదు. అనంతరం రైతు భరోసా పథకంగా పేరు మార్చి 2024–25లో యాసంగిలో ఎకరానికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి శ్రీకారం చుట్టింది. 2025లో వానాకాలం సీజన్లో 1,88,597 మంది రైతులకు రూ.268.85.కోట్ల ఆర్థిక సహాయం కింద రైతుల ఖాతాలో డబ్బులను జమ చేసింది.రూ.7,500 సాయం ఎప్పుడో..రైతులకు పెట్టబడి సాయం అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం పెంచి ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు పేరు రైతు భరోసాగా మార్పు చేసి ఎకరాకు రూ.6 వేల చొప్పున ఆందిస్తోంది. రూ.7,500 హామీ మాత్రం అమలు కావడం లేదు. వడ్డీ వ్యాపారులే దిక్కు!గతంలో పంట పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది. రైతుబంధు పథకం వచ్చాక చాలావరకు అప్పులు చేయడం తగ్గింది. కానీ పథకాన్ని అమలు చేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యం కారణంగా మళ్లీ రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం..రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ఎన్ని ఎకరాలకు ఎన్ని విడతలలో అందిస్తారు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పెట్టుబడి సాయం అందుతుంది. – అంజిప్రసాద్, డీఏవో రెండెకరాలకు మాత్రమే..2025–26 యాసంగి సీజన్లో జిల్లాలో 1.88 లక్షల మంది రైతులకు రూ.168 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. రెండు ఎకరాల పైబడిన వారికి అందలేదు. ఈసారి వానాకాలం సీజన్లో అందరికీ మొత్తం విస్తీర్ణణానికి ఆర్థిక సహాయం అందిస్తారా లేక మళ్లీ రెండు ఎకరాల మేరకే అందిస్తారా అనే సందేహం రైతుల్లో కలుగుతోంది. -
అన్నదాతలకు అభయహస్తం
సమాజానికి వెన్నెముక అయిన రైతులకు అధిక ప్రాధాన్యతిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. ‘రైతు భరోసా’తో రైతుల్లో పూర్తి విశ్వాసం కలిగిస్తోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అన్నదాతలకు అభయం హస్తం అందిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ‘రైతు భరోసా’ అందించిన ప్రభుత్వం మరోసారి 2026 జూన్ 30న ఖరీఫ్ సీజన్కుగానూ ఇచ్చేందుకు సిద్ధమైంది.రైతు సంక్షేమమే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు వరంగల్ వేదికగా ‘రైతు డిక్లరేషన్’లో ప్రకటించిన విధంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నా లకు బోనస్, రైతు బీమా, రైతు కూలీలకు ‘ఇందిరమ్మ భరోసా’ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తమది రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకుంది.ప్రభుత్వం ఏటా ఎకరాకు రూ. 12 వేలు రైతు భరోసాగా అందిస్తోంది. 2025 జూ¯Œ లోనూ, 2026 మార్చిలోనూ 70 లక్షల మందికి అందించింది. మూడోసారి జూన్లో ఒకే విడతలో ఈ సాయం అందించనున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసింది. దీంతో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల మేలు చేకూరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా సన్న వరికి బోనస్ అందించడంతో రాష్ట్రంలో సన్నాల సాగు 60 శాతం పెరిగింది. దేశంలోనే తొలిసారిగా రైతు కూలీలను గుర్తించి వారిలో విశ్వాసం కలిగించేలా ‘ఇందిరమ్మ రైతు భరోసా’ అందిస్తోంది. రైతు కుటుంబాలందరికీ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తూ వేల కోట్ల రూపాయలతో రైతు బీమా కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకా రాలు లభించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం భారీగా పంటలను కొనుగోలు చేస్తోంది.నిధులు దుర్వినియోగం కాకుండా...అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటే భరించలేని బీఆర్ఎస్ పార్టీ అక్కసుతో అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. గతంలో వారి ప్రభుత్వం ‘రైతు బంధు’ పేరిట ఎకరాకు రూ. 10 వేలు మాత్రమే ఇస్తే... కాంగ్రెస్ సర్కార్ మరో రెండువేలు అధికంగా ఇస్తోంది. గత ప్రభుత్వ అవకతవకలు పునరావృతం కాకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రస్తుత సర్కారు వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. అందుకే ప్రజా నిధులు దుర్వినియోగం కావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఏమాత్రం ఉపయోగపడని భూములకు రైతుబంధు పథకం కింద రూ. 22 వేల కోట్లకుపైగా చెల్లించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసింది.రైతులకే కాకుండా రైతు కూలీలకు కూడా సమన్యాయం జరి గేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూమిలేని రైతు కూలీలకు ప్రభుత్వ నిర్ణయం శాపంగా మారకూడదని, వారిని కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో ‘వరంగల్ డిక్లరేషన్’లో ప్రకటించినట్టు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం కింద ఏటా రూ. 12 వేలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంతో వ్యవసాయ యజ్ఞంలో పాల్గొనేవారందరికీ న్యాయం చేసినట్టయ్యింది.శుభప్రదమైన ఏరువాక పౌర్ణమి మరుసటి రోజు జూన్ 30న ప్రభుత్వం నిర్వహించనున్న రైతు భరోసా పంపిణీ మరోసారి అన్న దాతల పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనంగా నిలవనుంది. రైతు సంతోషమే రాష్ట్ర సుభిక్షతకు పునాది అనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.- బి. మహేశ్ కుమార్ గౌడ్, వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు -
250 మందికి ఒకటే బాత్రూమ్
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ఇందులో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 250 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకే మరుగుదొడ్డి ఉంది. ఇంటర్వెల్ సమయంలో బాలికలు ఇలా క్యూ కడుతున్నారు. బాలురు కాంపౌండ్ వాల్ దాటి ఆరుబయటకు వెళ్తున్నారు. ‘మన ఊరు – మన బడి’కార్యక్రమం కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. కానీ బిల్లులు రాకపోవడం కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే వదిలేశాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
ఏసీబీ అన్నా.. ఏం భయం లేదన్నాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అనగనగా ఒక రైతు. ఆయన పొలానికి మట్టి తరలింపు అనుమతికి ఓ ఉద్యోగి లంచం అడిగాడు. ఇలాగే లంచం అడిగిన ఓ అధికారిని ఏసీబీకి పట్టించానని రైతు హెచ్చరించాడు.. కానీ అవినీతి అధికారి తేలిగ్గా తీసుకున్నాడు.. లంచం ఇవ్వాల్సిందేనని తెగేసి చెప్పాడు.. రైతు నుంచి రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాలివి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఈఈగా విధులు నిర్వర్తిస్తున్న ఎల్.శ్రీనివాస్ను ఓ రైతు తన పొలానికి చెరువు మట్టి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. కొద్ది రోజులుగా తిరుగుతుండగా, మట్టి తరలింపునకు రూ.4 లక్షలు ఇవ్వాలని ఏఈఈ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చివరకు రూ.2 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు రంగంలోకి దిగి వివరాలు సేకరించారు. ఈ మేరకు సోమవారం రాత్రి కార్యాలయంలో బాధిత రైతు నుంచి ఏఈఈ రూ.2 లక్షలు తీసుకుని తన డెస్క్లో పెట్టుకోగా.. ఏసీబీ అధికారులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకోవడంతో ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ పేరు చెప్పినా..:ఏఈఈ శ్రీనివాస్ను ఇంకొందరు రైతులు కూడా చెరువుల నుంచి మట్టి తరలింపునకు అనుమతి ఇవ్వాలని కోరితే లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే, ఇదే రైతు తాను గతంలో ఓ ఉద్యోగిని ఏసీబీకి పట్టించానని చెప్పినా.. లంచం ముట్టచెబితే తప్ప అనుమతి ఇచ్చేది లేదని శ్రీనివాస్ తెగేసి చెప్పినట్లు సమాచారం -
హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు ప్రమాదం
సాక్షి, నల్గొండ జిల్లా: కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. భీమవరం నుండి హైదరాబాద్ వెళుతున్న ఇంటర్సిటీ ట్రావెల్స్ బస్సు.. టైర్ పంక్చర్తో అదుపుతప్పి.. డివైడర్ను దాటి విజయవాడ వెళ్తున్న లారీని ఢీకొట్టింది.బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరికిపోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బస్సు డ్రైవర్ను బయటకుతీశారు. ట్రావెల్స్ బస్సు, లారీ డ్రైవర్లకు గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులకు ముప్పు తప్పింది.విశాఖలో కంటైనర్ బోల్తావిశాఖలోని షీలా నగర్ జంక్షన్లో కంటైనర్ లారీ బోల్తా పడింది. గాజువాక నుంచి పోర్టుకు వెళ్తున్న లారీ అదుపు తప్పింది. ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.నెల్లూరు జిల్లాలో..నెల్లూరు జిల్లాలో సంగం మండలం తరుణవాయు దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి నెల్లూరు రొట్టెల పండగకు వస్తుండగా ఘటన జరిగింది. యాత్రికుల టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. -
Hyderabad: కార్ ఆపి ఉంటే ఫ్యామిలీ రిస్క్లో ఉంటుండే..
హైదరాబాద్: కార్లలో వెళ్తున్న మహిళలను పోకిరీలు వెంబండించి భయాందోళనకు గురిచేశారు. కార్ డ్యాష్ క్యామ్లో రికార్డ్ అయిన ఈ దృశ్యాలను ఓ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. బోడుప్పల్కు చెందిన ఓ కుటుంబం ఓ ఫంక్షన్కు వెళ్లి ఘట్కేసర్ నుంచి వరంగల్ జాతీయ రహదారి మీదుగా కారులో తిరిగి వస్తోంది.ఆ సమయంలో కొందరు వ్యక్తులు కత్తులు, ఆయుధాలతో వెంబడించారు. దీంతో కారులో ఉన్న మహిళలు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఘట్కేసర్ వద్ద ఫ్లైఓవర్ దాటుతుండగా చోటు చేసుకుంది. ఈ దృశ్యాలన్నీ కారు డ్యాష్ క్యామ్లో రికార్డయ్యాయి. పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నడి రోడ్డుపై కారును వెంబడిస్తూ పోకిరీల హల్చల్హైదరాబాద్ నగర శివారులోని ఘట్కేసర్ నుండి బోడుప్పల్ హైవే మీద అర్ధరాత్రి వేళ పెళ్లికి వెళ్లి కారులో వస్తున్న కుటుంబాన్ని బైక్లపై వెంబడిస్తూ, భయబ్రాంతులకు గురిచేసిన పోకిరీలుకారు డ్యాష్ క్యామ్లో రికార్డైన దృశ్యాలు కారులో మహిళలు,… pic.twitter.com/vmuyB3yIN5— Telugu Scribe (@TeluguScribe) June 29, 2026 -
తెలంగాణలో వానల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రైతన్నలు. పలు జిల్లాల్లో లోటు వర్షపాతం
-
తెలంగాణపై కాషాయ జెండా
సాక్షి ప్రతినిధి, వరంగల్: 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణపై కాషాయ జెండా ఎగురుతుందని.. బీజేపీ అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా జోస్యం చెప్పారు. ఆ లక్ష్య సాధన కోసం ప్రతి బూత్లో పార్టీని బలోపేతం చేయాలని.. కార్యకర్తలంతా ప్రజల్లో నిరంతరం ఉండాలని పిలుపునిచ్చారు.సోమవారం మధ్యాహ్నం హనుమకొండలో వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం గిరిజన నేతలతో సమావేశమైన ఆయన.. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన పార్టీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో మాట్లాడారు. బీజేపీ విజయానికి బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీలను వెన్నముకగా అభివర్ణించారు. వారి కృషి వల్లే దేశవ్యాప్తంగా కమలం వికసిస్తోందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర కీలకమన్నారు.తెలంగాణతో బీజేపీది పోరాటాల బంధంతెలంగాణతో బీజేపీకి కేవలం రాజకీయ సంబంధం మాత్రమే కాదని.. అది పోరాటాల ద్వారా ఏర్పడిన బంధమని నితిన్ నబీన్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో బీజేపీ రాజకీయ లాభనష్టాలు చూడకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు మద్దతిచ్చిందని చెప్పారు. దివంగత సుష్మా స్వరాజ్ పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చారని గుర్తుచేశారు.బీజేపీ తెలంగాణకు కొత్త పార్టీ కాదన్న ఆయన.. 1980లో పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా గెలిచిన రెండు స్థానాల్లో ఒకటి తెలంగాణ నుంచే రావడం చారిత్రక విషయమన్నారు. అధికారం కోసం కాకుండా ప్రజాసేవ కోసం బీజేపీ పనిచేస్తోందని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల గొంతుకగా, అధికారంలో ఉన్నప్పుడు మరింత సమర్థంగా ప్రజలకు సేవ చేయాలన్నదే పార్టీ సిద్ధాంతమని చెప్పారు.బీజేపీ కార్యకర్తలంతా పూర్తిస్థాయి ప్రజాసేవకులుగత ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసమస్యలను విస్మరించి రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని నితిన్ నబీన్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని కుటుంబ ప్రయోజనాల కోసం వినియోగించిందని విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలనలో ప్రజల ఆశలు నెరవేరలేదని, తెలంగాణకు నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల్లో కనిపించే పార్ట్టైమ్ రాజకీయ నాయకుడు అని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు మాత్రం 24 గంటలూ ప్రజల కోసం పనిచేసే ఫుల్టైమ్ ప్రజాసేవకులని కొనియాడారు.వరంగల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం: జి. కిషన్రెడ్డితెలంగాణలో బీజేపీ అధికారంలో లేకపోయినా వరంగల్ అభివద్ధికి కేంద్రం గణనీయమైన నిధులు కేటాయించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీకి వరంగల్పై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. కేంద్రం చేసిన అభివృద్ధిపై నివేదికతో సహా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు వరంగల్కు ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏం చేసిందని విమర్శించే వారికి పూర్తి వివరాలతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని... కేసీఆర్, రాహుల్ గాంధీ విమర్శలు వాస్తవాలకు విరుద్ధంగా ఉందని విమర్శించారు.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అత్యధికంగా కేంద్ర నిధులు వరంగల్కే వచ్చాయని.. కానీ వాటిని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. స్మార్ట్ సిటీ నిధులతో కరీంనగర్ అభివృద్ధి చెందగా వరంగల్లో అభివృద్ధి ఎందుకు జరగలేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురుతుందని.. బీజేపీ గెలిస్తేనే వరంగల్ సుందర నగరంగా మారుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాం నాయక్, జాతీయ, రాష్ట్ర నాయకులు రావు పద్మ, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, టి.రాజేశ్వర్రావు, దొంతి దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఆ మూడు వర్గాల సాధికారతతోనే రాష్ట్రాభివృద్ధియువత, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని నితిన్ నబీన్ చెప్పారు. ఆ మూడు వర్గాల సాధికారత ద్వారానే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ సిద్ధాంతంతో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రతి కుటుంబానికీ తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. -
ఫీజు బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
సాక్షి, హైదరాబాద్/ఘట్కేసర్: ‘తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను గాలికొదిలేసిందని విమర్శించారు. సోమవారం బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఘట్కేసర్ వీబీఐటీ క్యాంపస్లో ‘వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాన్క్లేవ్’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారత్–భవిష్యత్ సవాళ్లు, 2047 వికసిత్ భారత్ లక్ష్యం, 12 ఏళ్ల మోదీ పాలన తదితర అంశాలపై పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నితిన్ నబీన్ సమాధానమిచ్చారు. మన యువతది తుక్డే తుక్డే మైండ్సెట్ కాదు‘ఇతర దేశాల్లో సాగుతున్న జెన్–జీ ఉద్యమాలను అందిపుచ్చుకోవాలంటూ కొన్ని రాజకీయశక్తులు మన దేశంలోని యువతను రెచ్చగొడుతున్నాయి. కానీ భారత్లోని జెన్–జీ ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కాదు. మన యువత అరాచకాలను విశ్వసించదు. ఇది రాళ్లు విసిరే తరం కాదు... జాతిని నిర్మించే తరం.. వారిది తుక్డే తుక్డే మైండ్సెట్ కాదు. యువ భారతీయులు దేశాభివృద్ధికి, నూతన ఆవిష్కరణలు, భవిష్యత్ భారతానికి వారి వంతు కృషి చేస్తున్నారు’ అని నితిన్ నబీన్ పేర్కొన్నారు. ‘జీవితానికి అడ్డదారులు ఉండవు...యువత, విద్యార్థులు ఏ విషయంలోనూ సత్వర మార్గాలు ఎంచుకోవద్దని.. జీవితానికి అడ్డదారులు ఉండవని నితిన్ నబీన్ సూచించారు. ‘జీవితం అనేది ఒక సుదీర్ఘ పరుగు. ఇది 100 మీటర్ల పరుగుపందెం కాదు. ఇది ఓపికకు పరీక్ష’ అని వివరించారు. జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సినంత సమయం తీసుకోవాలని.. కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తిరిగి ఆ నిర్ణయం సరైనదా కాదా అనే చర్చ జోలికి వెళ్లరాదని సూచించారు. విద్యార్థులు వాస్తవికత ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని.. అప్పుడే వారిలోని అసలైన సామర్థ్యం బయటపడుతుందన్నారు.తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని.. అలా తొలినాళ్లలో తన భవిష్యత్తు ఏమవుతుందోనని గందరగోళానికి గురైనట్లు చెప్పారు. ఈ క్రమంలో తనకు లభించిన ఎలాంటి పనినైనా నిబద్ధతతో పూర్తి చేస్తూ అందులో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశానన్నారు. ఈ కాన్క్లేవ్లో నల్సార్, ఐఎస్బీ, హెచ్సీయూ, కేయూ, ఓయూ, ఐఐటీ, ఐఐఐటీ, హార్వార్డ్, ఎన్ఐటీ, ఇఫ్లూ, బిట్స్ తదితర విద్యాసంస్థల నుంచి దాదాపు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర ఇన్చార్జి అభయ్ పాటిల్, మహారాష్ట్ర మంత్రి ఆశిష్ సెల్లార్, ఎంపీ రేఖా శర్మ, బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బీజేవైఎం అధ్యక్షుడు గణేశ్ కుండె, మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి, టెన్నిస్ క్రీడాకారిణి రష్మిక శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. -
తడవని మడి.. కంటతడి
తొలకరి పలకరించడంతో పత్తి విత్తనాలు నాటుకున్న ఈ రైతు పేరు సుధాకర్. మెదక్ జిల్లా బద్యతండాకు చెందిన ఈయన పది వేల రూపాయలు ఖర్చు చేసి ఎకరంలో పత్తి విత్తనాలు విత్తాడు. వర్షాలు లేకపోవడంతో మొలకలు రావడం లేదు. దీంతో సుధాకర్, అతని కుటుంబ సభ్యులు బకెట్లతో ఇలా నీళ్లు పోసుకుంటున్నారు. కనీసం ఈ నీళ్లతోనైనా మొలకలు వస్తాయనే ఆశతో ఉన్నారు. జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రానికి చెందిన రైతు మందరాజు మూడున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వర్షాలు లేకపోవడంతో సబ్సిడీ కింద వచ్చిన డ్రిప్ పైపులను గట్టు వెంట నేల కింద నుంచి 25 పైపులను ఏర్పాటు చేసి, 500 మీటర్ల దూరంలోని బోరునుంచి ఏర్పాటు చేసి పత్తి విత్తులకు సాగునీరు అందిస్తున్నారు. ఈయన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన మేకల నరేశ్. తనకున్న పది ఎకరాల భూమిలో ఏటా వరి, మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేస్తాడు. ఈ సీజన్లో వర్షాలు లేక పోవడంతో 8 ఎకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. భూమిలో నీరు అడుగంటి పోగా గత ఏడాది వరకు రూ.5 లక్షల ఖర్చుతో 18 బోర్లు వేశాడు. అందులో ఒక్కటీ సక్సెస్ కాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆయకట్టు రైతులు ముమ్మరంగా బోర్ల తవ్వకాలు చేపట్టారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నేటి వరకు నీటి వరద రాకపోవడంతో సాగునీటిపై రైతులకు ఆశలు సన్నగిల్లాయి. 20 ఏళ్ల నాటి కరువు ఛాయలు మళ్లీ అలుముకుంటుండటంతో రైతాంగం బోర్లు వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. చిలుకూరు, నారాయణపురం, రామాపురం, ఆర్లెగూడెం, పోలేనిగూడెం, బేతవోలు చుట్టుపక్కల గ్రామాలు రైతులు బావులవైపు మొగ్గుచూపుతున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో ఖరీఫ్ సీజన్కు అత్యంత కీలకమైన జూన్ మాసం నేటితో ముగుస్తుండటంతో రైతుల కళ్లన్నీ ఆకాశంపైనే ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు దాదాపు 15 రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించడం, వచ్చిన తర్వాత కూడా వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. మొత్తం 621 మండలాలకుగాను 485 మండలాల్లో సాధారణం నుంచి లోటు, భారీ లోటు ఉండగా, 86 మండలాల్లో భారీ, 216 మండలాల్లో లోటు, 183 మండలాల్లో సాధారణంగా నమోదైంది. ఉమ్మడి వరంగల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. హనుమకొండ జిల్లాలో 72 శాతంతో భారీ లోటు కాగా, వరంగల్ జిల్లాలో 57 శాతం, సిద్దిపేటలో 50శాతం లోటు ఉంది. ఇప్పటికే తొల కరి వానలను నమ్ముకుని పత్తి, మొక్క జొన్న, కంది తదితర పంటలు వేసిన రైతులు ఇప్పు డు మొలకలను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీరు పోయించడం, బిందెలతో మొక్క మొక్కకు నీళ్లు అందించడం వంటి అసాధారణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. భూగర్భజలాలపై చివరి ఆశ.. వానలు లేకపోవడంతో రైతులు భూగర్భజలాలపై ఆధారపడుతున్నారు. పాత బోర్లు ఎండిపోవడంతో కొత్త బోర్లు వేయిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మే నెలలో సగటు భూగర్భజలమట్టం 6.27 మీటర్లు, హనుమకొండలో 6.17 మీటర్లు, జనగాంలో 7.78 మీటర్ల లోతులో నమోదైంది. మరింత వర్షం లేకపోతే భూగర్భజలాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాలపై నమ్మకం తగ్గడంతో కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నుంచైనా సాగునీరు అందుతుందేమోనని రైతులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో సీజన్ సాధారణంతో పోలిస్తే 25 శాతం లోపే సాగు జరిగింది. గోదావరి, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై ఆశలు... ఇరిగేషన్ అధికారుల నివేదిక ప్రకారం వానాకాలం ప్రారంభమైనప్పటికీ ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు మిశ్రమంగా ఉన్నాయి. కృష్ణా బేసిన్లోని కీలక ప్రాజెక్టుల్లో చాలావరకు నిల్వలు తక్కువగా ఉండగా, గోదావరి బేసిన్లో కూడా పూర్తిస్థాయి నిల్వలు లేవు. అయితే గత ఏడాదితో పోలిస్తే మొత్తం ప్రధాన జలాశయాల్లో నిల్వలు మెరుగ్గా నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రధాన జలాశయాల్లో 402.40 టీఎంసీలు ఉన్నాయి. కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రధాన ప్రాజెక్టులు అల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల తదితర ప్రాజెక్టుల కింద 90–95 లక్షల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు ఉంది. గోదావరి బేసిన్ సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, మిడ్మానేరు, కడెం, శ్రీపాద ఎల్లంపల్లిల పరి«ధిలో 15.–18 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. అయితే కృష్ణా బేసిన్లో శ్రీశైలం, జూరాల, తుంగభద్రలో నిల్వలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. నాగార్జునసాగర్లో మాత్రం గత ఏడాదికంటే నిల్వలు మెరుగ్గా నమోదయ్యాయి. గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మానేరు ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నిల్వలు లేకపోవడంతో ఖరీఫ్ సాగు చేసే రైతులు వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. జూలై 15 డెడ్లైన్.. వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం జూన్ 20 నుంచి జూలై 15 వరకు ప్రధాన ఖరీఫ్ విత్తనాల కాలం. ఆ తర్వాత విత్తితే... చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం. పంట ఎదుగుదల దెబ్బతినడం, దిగుబడులు తగ్గిపోవడం, కోత ఆలస్యమై మార్కెట్పై ప్రభావం పడే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారి ఆదిరెడ్డి తెలిపారు. దీంతో రైతులు కూడా తక్కువ కాలంలో పండే, తక్కువ నీటితో వచ్చే పంటలు, కరువును తట్టుకునే వంగడాలపై దృష్టి పెడుతున్నారు.ఇప్పటికే కలుపు తీయాల్సింది.. నా ఐదు ఎకరాలతోపాటు 10 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా.. ఇప్పటికే భారీ వర్షాలు కురిసి విత్తనాలు వేసుకుంటే కలుపునకు దౌరలు కొట్టి, ఎరువులు వేయాల్సింది. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షంతో విత్తనం వేసుకుంటున్నా. ఈ ఏడాది వానలు ఉండవని అంటున్నారు. కౌలు ముందే చెల్లించినా వానలు పడకుంటే నష్టపోవుడే. – పుప్పాల నాగేశ్, రైతు, నెన్నెల, మంచిర్యాల జిల్లానారు పోసి చూస్తున్న.. వానలు లేవు వానాకాలం ప్రారంభమై నెల రోజులైనా సరైన వర్షాలు లేక పంటలు వేయలేని పరిస్థితి. వరి నాట్లు వేద్దామని నారుపోసి నెలరోజులు గడుస్తున్నా వర్షం జాడలేదు. ఇప్పటివరకు ఖరీఫ్ సీజన్కు తగినంత వర్షాలు లేకపోవడంతో వర్షాల కోసం ఎదురుచూస్తున్నాం. పత్తి విత్తనాలు పెట్టే సమయం కూడా దగ్గర పడుతుంది. బావులు, బోర్లు ఉన్న రైతులు పత్తి పంట వేసిన వాటికి సరిపడా నీటి తడి అందక మొలకెత్తే పరిస్థితి లేకుండాపోయింది.– ఈడబోయిన సారయ్య, రైతు, పీచర, హనుమకొండ జిల్లా -
తొలిమాసం.. లోటు వర్షపాతం..
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్ మొదటి నెల నిరాశే మిగిల్చింది. ఎలినినో ప్రభావంతో రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. జూన్ 1 నుంచి సెపె్టంబర్ 30 వరకున్న కాలాన్ని నైరుతి రుతుపవనాల సీజన్గా పరిగణిస్తారు. సీజన్లో తొలి మాసమైన జూన్లో ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 14 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 8న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. తొలివారం కొంత చురుకుగా ముందుకు సాగినప్పటికీ... ఆ తర్వాత మందగించడంతో రుతుపవనాల వ్యాప్తి జూన్ మూడో వారం నాటికి రాష్ట్రమంతటికీ విస్తరించగా... ఆ తర్వాత వర్షాలు నమోదయ్యాయి. జూన్లో రాష్ట్రంలో 13.03 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... ఇ ప్పటివరకు 11.3 సెం.మీ. వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 14 శాతం తక్కువగా వానలు కురిశాయి. గతేడాది జూన్లో 9.37 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా... 21 శాతం లోటు నమోదైంది. 16 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. హనుమకొండ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. ఇక్కడ 75 శాతం లోటు నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ వెల్లడించింది. మరో 15 జిల్లాల్లో లోటు వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో సాధారణ వర్షాలు నమోదు కాగా... మరో 5 జిల్లాల్లో అధిక వర్షాలు కురిశాయి. గతేడాదితో పోలిస్తే సగటు వర్షపాతం మెరుగ్గా కనిపిస్తున్నా... వర్షాలు ఆలస్యం కావడం... కీలకమైన జిల్లాల్లో తేలికపాటి వానలే కురవడంతో సాగు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జూన్లో అరకొర వర్షాలు నమోదుకాగా.. వచ్చే నెల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ఆశించినస్థాయిలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.ఏ జిల్లాలో ఎలా ఉందంటే... తీవ్ర లోటు: హనుమకొండ లోటు: ఆదిలాబాద్, మంచిర్యాల, ని జామాబాద్, జగిత్యాల, వరంగల్, క రీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్–మల్కాజిగిరి, జోగులాంబ గద్వాల, వనపర్తి సాధారణం: కుమ్రుంభీం ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబుబాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్నగర్, ములుగు, నారాయణపేట్ అధికం: రంగారెడ్డి, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మంజూన్.. అసాధారణందేశంలో వర్షపాతం కేవలం 85.2 మి.మీ. గత 125 ఏళ్లలో ఇలా జరగడం ఐదోసారి దక్షిణాది రాష్ట్రాల్లో 31 శాతం లోటు న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అసాధారణ వాతావరణ పరిస్థితులతో ఈ ఏడాది జూన్ నెల ప్రజలను అల్లాడించింది. ఈ నెలలో వాతావరణం సాధారణానికి భిన్నంగా, ఆందోళనకరంగానే కనిపించింది. దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి 28 వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 149.8 మి.మీ. కాగా, కేవలం 85.2 మి.మీ. మాత్రమే నమోదైంది. సుమారు 43 శాతం లోటు ఏర్పడింది. భార త వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా నివేదిక ప్రకారం, ఇలాంటి వాతావరణ పరిస్థితు లు ఏర్పడటం గత 125 ఏళ్లలో ఇది ఐదోసారి. జూన్లో 100 మి.మీ. కంటే తక్కువగా వర్షపాతం నమోదుకావడమనేది గతంలో 1905, 1926, 2009, 2014 సంవత్సరాలలో మాత్రమే జరిగింది. నైరుతి రు తుపవనాలు కేరళను కొంచెం ఆలస్యంగా జూన్ 4న తాకినప్పటికీ, ఆ తర్వాత దేశవ్యాప్తంగా వాటి విస్తరణ పూర్తిగా మందగించింది. భారీ లోటు వర్షపాతం... ప్రాంతాల వారీగా చూస్తే, మధ్య భారతదేశంలో అత్యధికంగా 56 శాతం లోటు ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో 43 శాతం, దక్షిణాదిలో 31 శాతం, వాయవ్య రాష్ట్రాల్లో 29 శాతం లోటు నమోదైంది. వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం, 1901 సంవత్సరం తర్వాత ఈ జూన్ మూడవ అత్యంత పొడి నెలగా నిలిచింది. ఇంతటి తీవ్ర వర్షపాత లోటు ఏర్పడటం 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే నమోదైంది. ఎల్నినో ప్రభావం కొంతమేర ఉన్నప్పటికీ... హిందూ మహాసముద్ర డైపోల్ తటస్థంగా ఉండటం, భూమధ్యరేఖ ప్రాంతంలో వర్షాలను ఇచ్చే మేఘాల వ్యవస్థ భారత్కు అనుకూలమైన దిశలో లేకపోవడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడం, వాయవ్య భారతం నుంచి వీచిన వేడిగాలులు క్లౌడ్ ఫార్మేషన్ను అడ్డుకోవడం వంటి పరిస్థితుల వల్ల రుతుపవనాలు స్తంభించిపోయాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 315 జిల్లాలు ప్రభావితం దేశంలో 724 జిల్లాలకుగాను 315 జిల్లాలు తక్కువ వర్షపాతం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని కేంద్రం గుర్తించింది. వాటిలో 25 శాతం కంటే తక్కువ నీటి పారుదల సౌకర్యం ఉన్న 111 జిల్లాలను ‘అత్యంత అప్రమత్తత’జిల్లాలుగా ప్రకటించింది. ఆ జిల్లాల జాబితాలో తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు చెందిన జిల్లాలు ఉన్నాయి. వాటి కోసం ‘డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కాంటింజెన్సీ ప్లాన్స్’సిద్ధం చేశారు. -
సిగాచీ.. బాధితులకు దిక్కేది?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సిగాచీ అగ్నిప్రమాద ఘటనకు నేటితో ఏడాది పూర్తవుతోంది. ఈ ఘెర అగ్నిప్రమాదంలో 54 మంది ప్రాణాలు కాలి బూడిదయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డి కూడా ప్రకటన చేశారు. అయితే ఈ ఘటన జరిగిన ఏడాది పూర్తవుతున్నా ఈ హామీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచీ పరిశ్రమలో 2025 జూన్ 30న జరిగిన ఘెర అగ్నిప్రమాదంలో 54 మంది కాలి బూడిదైన విషయం విదితమే. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మరణించిన వారిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నిరుపేద కార్మికులే కావడం గమనార్హం. నెలల తరబడి జాప్యం 54 మంది బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు కేవలం రూ.24.51 కోట్లు మాత్రమే చెల్లించారు. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి సగటున రూ.45 లక్షల మేరకే పరిహారం అందింది. మిగిలిన రూ. 55 లక్షల పరిహారాన్ని చెల్లించడంలో నెలల తరబడి జాప్యం జరుగుతోంది. పరిహారం కోసం బాధిత కుటుంబాల తరపున రాష్ట్ర ఉన్నత న్యాయస్థాయంలో పిల్ కూడా దాఖలైంది. బాధిత కుటుంబాలు పలుమార్లు జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు అందజేయడంతోపాటు కలెక్టరేట్ ఎదుట నిరసన కూడా తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో క్షతగాత్రుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఏడాది కాలంగా ఇంటివద్దనే చికిత్సలు తీసుకుంటున్నారు. అయినా వారు పూర్తి స్థాయిలో కోలుకోలేకపోతున్నారు. కాలిన గాయాలు కొంత మేరకు మానినా.. తమ సొంత పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారిందని, పనులు చేసుకునేందుకు శరీరం సహకరించడం లేదని బాధితులు వాపోతున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులను పరిహారం కింద చూపుతున్నారు సిగాచీ ప్రమాదంలో నా భర్త బాలకృష్ణ మృతి చెందారు. ఇస్తామన్న పరిహారం కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నాం. రూ.25 లక్షలతోనే సరిపెట్టారు. నా భర్త పొదుపు చేసుకున్న ఈఎస్ఐ, పీఎఫ్ డబ్బులను కూడా నష్ట పరిహారం కింద చూపుతున్నారు. ఇద్దరు పిల్లల చదువులకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. వెంటనే ఇస్తామన్న రూ.కోటి పరిహారం చెల్లించి ఆదుకోవాలి. – మల్లేశ్వరి, ముత్తంగి.వెంటనే చెల్లించాలి సిగాచీ ప్రమాదం మా కుటుంబాన్ని కష్టాల పాలు జేసింది. ఈ ప్రమాదంలో నా భర్త వీ.ఆర్.జీ. నాగేశ్వర్రావు మరణించారు. ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాను. ప్రైవేటు టీచర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పరిహారం రూ.25 లక్షలతోనే సరిపెట్టారు. మిగిలిన పరిహారం మొత్తాన్ని వెంటనే చెల్లించాలి. –హేమలత, పటాన్చెరుఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నాను అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నాను. కాళ్లు, చేతులకు అయిన గాయాలతో పనిచేయలేకపోతున్నాను. సొంత పనులు చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఇస్తామన్న హామీ మేరకు పరిహారం చెల్లించడంతోపాటు పూర్తి స్థాయి లో చికిత్స చేయించి ఆదుకోవాలి. – రాజేశ్కుమార్ చౌదరి, క్షతగాత్రుడు. -
నేడు ఖరీఫ్ రైతుభరోసా
సాక్షి, హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘రైతుభరోసా’పథకం కింద ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించిన నిధులను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం రైతుఖాతాల్లో జమ చేయనుంది. తొలుత ఖమ్మం జిల్లా మధిరలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినా, ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని చివరి నిమిషంలో వేదికను హైదరాబాద్కు మార్చారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో సీఎం రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా రైతులంతా రైతువేదికల వద్ద వీక్షించే ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో రెండు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,482.02 కోట్లు నేరుగా జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఇందులో ఒక ఎకరా ఉన్న రైతులు 14.65 లక్షల మందికాగా వారికి రూ. 878.94 కోట్లు, ఒకటి నుంచి రెండు ఎకరాలున్న భూమి ఉన్నవారు 26.72 లక్షల మంది. వారికి రూ. 1,603.08 కోట్లు చెల్లించనున్నారు. ఈ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు నేరుగా జమ అయ్యేలా వ్యవసాయ, ఆర్థిక శాఖలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. గత ఏడాది మాదిరిగానే..గత ఏడాది ఖరీఫ్–2025 సీజన్లో ప్రభుత్వం ఐదెకరాల వరకు భూములున్న రైతులకు రైతుభరోసాను నాలుగు విడతల వారీగా పంపిణీ చేసింది. మొదట రెండు ఎకరాల వరకు, అనంతరం ఒక్కో ఎకరం పెంచుతూ ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు దశలవారీగా సాయం అందించింది. మొత్తం దాదాపు 62.47 లక్షల మంది రైతులకు ఒక కోటీ ఏడు లక్షల ఎకరాలకు రూ. 6,404. 69 కోట్లు జమ చేసింది. ఈ ఏడాది కూడా అదే విధానాన్ని కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. మొదటి విడతలో రెండెకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందించనుండగా, తర్వాతి విడతల్లో ఒక్కో ఎకరం విస్తీర్ణం పెంచుతూ ఐదెకరాల వరకుగల రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు తెలిసింది. కాగా, గత యాసంగి సీజన్లో ఎకరాల విస్తీర్ణంలో కాకుండా రాష్ట్రంలో సాగు యోగ్యమైన భూమి ఉన్న ప్రతి రైతులకు పెట్టుబడి సాయం అందేలా రైతుభరోసా పథకాన్ని మార్చింది. రెండు విడతల్లో ఎకరం చొప్పున సుమారు 71.05 లక్షల మంది రైతులకు రెండు ఎకరాల విస్తీర్ణానికి రైతుభరోసా సాయం అందించింది. అయితే ఈ ఖరీఫ్లో కూడా కొత్త విధానానికి బదులుగా గతంలో అమలు చేసిన పద్ధతినే కొనసాగిస్తూ, చిన్న, సన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యం ఇస్తూ రెండెకరాల వరకు ఉన్న రైతులతోనే పంపిణీ ప్రారంభిస్తోంది. దీంతో మొదటి విడతలో చిన్న రైతుల ఖాతాల్లోనే ముందుగా పెట్టుబడి సాయం జమ కానుంది. ఆ తరువాత ఐదెకరాల వరకు విడతల వారీగా జమ కానున్నట్లు సమాచారం. కాగా, రబీ 2025– 26లో రైతు భరోసా అందరికీ రెండు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు, అప్పుడు మొత్తం రైతులు 71,05,572మందికాగా, విడుదలైన నిధులు సుమారు రూ. 5,653కోట్లు.వర్షాల కారణంగా వేదిక మార్పుప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభను సీఎం రేవంత్రెడ్డి రద్దు చేశారు. ఆ సభను హైదరాబాద్లోని శిల్పకళావేదికలో నిర్వహించాలని సీఎం మంత్రులకు సూచించడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఈ వేదిక నుంచే రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమం ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.సీఎం రేవంత్రెడ్డి రైతుభరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజాప్రతి నిధులు, వ్యవసాయ అధికారులు సమీప రైతు వేదిక లకు చేరుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి కోరారు. రాష్ట్రవ్యాప్తంగా మొ త్తం 73.32 లక్షల మంది రైతులకు రైతుభరోసా నిధులను దశలవారీగా జమ చేస్తామని మంత్రి తెలిపా రు. కొత్తగా పాస్పుస్తకాలు పొందిన రైతులు జూలై 5లోపు సమీప వ్యవసాయ విస్తరణ అధికారికి బ్యాంకు ఖాతా వివరాలు అందిస్తే, వారికి కూడా రైతుభరోసా వర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. -
వచ్చేనెలలో రైతు ఆశీర్వాద ముగింపు సభ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద మంగళవారం తలపెట్టిన రైతు ఆశీర్వాద సభను భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నామని, ఇదే సభను వచ్చే నెలలో రైతుభరోసా నిధుల పంపిణీ అనంతరం ముగింపు సభగా నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సభా ప్రాంగణం బురదమయంగా మారడంతో, రైతులు ఎలాంటి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మత్కేపల్లి క్రాస్రోడ్డు వద్ద తలపెట్టిన రైతు ఆశీర్వాద సభ ప్రాంతాన్ని సోమవారం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, మంత్రుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించాలని భావించినా వాతావరణ పరిస్థితులతో వాయిదా వేశామని తెలిపారు. తొలిరోజు ప్రారంభ సభగా అనుకున్నా, రైతు భరోసా పంపిణీ పూర్తయ్యాక ఈ సభను మరింత ఉత్సాహంతో ముగింపు వేడుకగా నిర్వహిస్తామని భట్టి స్పష్టం చేశారు. వాతావరణ శాఖ నివేదికలను అనుసరించి జూలై 6, 7 లేదా 8వ తేదీల్లో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీసు కమిషనర్ సునీల్దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
తల్లిని హత్య చేసిన కొడుకు
భూదాన్పోచంపల్లి: మద్యం మత్తులో తల్లిని హత్య చేసిన కుమారుడు.. ఆతర్వాత భయంతో తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. పెద్దరావులపల్లి గ్రామానికి చెందిన సంగెం గంగయ్య, పోశమ్మ(69) దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. గంగయ్య ఇరవై ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుమారులంతా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడగా, పోశమ్మ ఒక్కతే గ్రామంలో నివాసముంటోంది. హైదరాబాద్లోని చింతల్లో ఉంటున్న పోశమ్మ చిన్న కుమారుడు శ్రీనివాస్(42) కూకట్పల్లి బస్సు డిపోలో డ్రైవర్గా పనిచేసి అనారోగ్యం కారణంగా మూడేళ్ల నుంచి ఖాళీగా ఉంటున్నాడు. అన్నదమ్ముల మధ్య చాలాకాలంగా నెలకొన్న భూవివాదం మాట్లాడుకొనే విషయమై మూడు రోజుల క్రితమే కుటుంబంతో కలిసి పెద్దరావులపల్లికి వచ్చాడు. ఆదివారం పోలీస్ స్టేషన్కు వెళ్లి అన్న వెంకటేశ్పై ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల్లో పిలిపించి మాట్లాడుదామని పోలీసులు నచ్చజెప్పి పంపించారు. సాయంత్రం మద్యం సేవించిన శ్రీనివాస్ తన భార్య పద్మను తీవ్రంగా కొట్టడంతో ఆమె తలకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన శ్రీనివాస్ కుమారులు తండ్రిని కొట్టి, తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోయారు. భార్యాపిల్లలు హైదరాబాద్కు వెళ్లిపోగానే శ్రీనివాస్ తల్లి పోశమ్మను పింఛన్ డబ్బులు రూ.1000 అడుక్కొని మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ సైకోగా మారి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి పోశమ్మ తలపై బండరాయితో మోది హత్య చేశాడు. సోమవారం తెల్లవారుజామున మద్యం మత్తు దిగడంతో తాను చేసిన నేరానికి భయపడిపోయాడు. ఉదయం బీబీనగర్ మండలం భట్టుగూడెంకు వెళ్లి మద్యం తెచ్చుకొని ఇంట్లో తలుపులు పెట్టుకొని సేవించాడు. అనంతరం గదిలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోశమ్మ ఉదయం నుంచి కనిపించకపోవడంతో అనుమానం వచ్చి స్థానికులు తలుపుల సందులోంచి చూడగా తల్లీ కొడుకులు విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్రెడ్డి, రూరల్ సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ భాస్కర్రెడ్డి, క్లూస్ టీమ్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.భర్తను చంపిన భార్యకుటుంబ కలహాలతో మహబూబ్నగర్ జిల్లాలో ఘటనదేవరకద్ర రూరల్: భార్యాభర్తల మధ్య ఏర్పడిన కుటుంబ కలహాలు భర్తను బలితీసుకున్నాయి. భర్తపై కత్తితో దాడిచేసి భార్య హతమార్చిన ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని బస్వాయపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బస్వాయపల్లికి చెందిన కుర్వ నాగేశ్ (38)కు కోయిల్కొండ మండలం మల్కాపూర్కు చెందిన కవితతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులున్నారు. నాగేశ్ గొర్రెల పెంపకాన్ని జీవనాధారంగా చేసుకొని కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అతడికి అనుమానం కలగడంతో దంపతులిద్దరి మధ్య తరచుగా గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నాగేశ్ పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటూ, మద్యానికి బానిస కావడంతో కుటుంబ కలహాలు మరింత తీవ్రమయ్యాయి. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న నాగేశ్కు కవితకు మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే నాగేశ్పై కవిత కత్తితో దాడికి పాల్పడింది. ఈ సమయంలో ఇంట్లోనే నిద్రిస్తున్న చిన్న కుమారుడు రాము తండ్రి ఆర్తనాదాలు విని మేల్కొన్నాడు. తండ్రిపై తల్లి దాడి చేస్తుండటాన్ని చూసి భయంతో బయటకు వచ్చి కేకలు వేశాడు. బయట నిద్రిస్తున్న ఇతర కుటుంబసభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకోగా అప్పటికే నాగేశ్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తన వదినకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతోనే గొడవలు జరుగుతున్నాయని, అదే కక్షతో తన అన్నపై కత్తితో దాడిచేసి హతమార్చిందని మృతుడి సోదరుడు రాజప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. -
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదు
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన విధంగా ఎవరికీ అన్యాయం జరగకుండా ఈ విషయంలో ప్రభుత్వం ముందుకెళుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పేదల జీవితాలు దెబ్బతీయకుండా ప్రతీ నిర్ణయాన్ని మానవీయ కోణంలోనే తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను కూడా ప్రజల కోణంలో ఆలోచించి, మానవీయ దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసం అంశాలపై సోమవారం సచివాలయంలో ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ప్రాజెక్టులో భాగంగా ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణను తక్షణమే రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. అలాగే భూములు కోల్పోయే వారికి చట్టబద్ధమైన పరిహారంతో పాటు అవసరమైన పునరావాసం కల్పించడంలో ఎక్కడా రాజీపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చరిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని అన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్.లోకేశ్కుమార్, స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఐజీ రాజీవ్గాంధీ హన్మంతు, మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎండీ ఈ.వి.నర్సింహారెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’పై మధ్యంతర ఉత్తర్వులివ్వలేం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్)–2026 కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ) హైదరాబాద్ మినహా ఫారాలను తెలుగులోనే ముద్రించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. అయితే, ఉర్దూ మాట్లాడే జనాభా 20 శాతానికి పైగా ఉన్న ప్రాంతాల్లో ఆ భాషలో ఫారాలు అందించే విషయాన్ని పరిశీలించా లని ఈసీని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, బిహార్ వంటి రాష్ట్రాల్లో సర్ ఫారాలు ఏఏ భాషల్లో ముద్రించారో వివరాలివ్వాలన్నారు. అలాగే పిటిషనర్ అభ్యంతరాలపై ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను వారంపాటు వాయిదా వేశారు. ఎస్ఐఆర్ ఫారాలను కేవలం తెలుగు భాషలో మాత్రమే ముద్రించి పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ కరీంనగర్కు చెందిన ఎంఏ ముజీబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఓటర్ల నమోదు నియమావళి రూల్ 4కు ఈసీ తీరు వ్యతిరేకం.. వివక్షపూరితమని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ విజయ్సేన్రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. రాజకీయ పార్టీలన్నీ సమ్మతించాయి.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. ‘బీఎల్వోలకు ఏ భాష వచ్చో.. ఏ భాష రాదో.. తెలియదు. మైనారిటీలను తొలగించాలనే ఉద్దేశంతోనే తెలుగు, ఆంగ్ల భాషల్లో మాత్రమే దరఖాస్తు ముద్రించారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఆంగ్లంలో ఉన్న ఫారాలను కూడా హైదరాబాద్ వరకే ఇచ్చారు. తెలిసిన భాషలో పత్రం కోరడం రాజ్యాంగ హక్కు. హైదరాబాద్లో ఉర్దూ వచ్చిన వారెక్కువ. తెలుగు రాని వారి కోసం ఉర్దూలో ముద్రించాల్సిన అవసరం ఉంది’అని చెప్పారు. ఈసీ తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ‘బీఎల్వోల వద్ద తెలుగు ఫారాలతోపాటు ఆంగ్లం, ఉర్దూ డమ్మీ ఫారాలుంటాయి. ఎవరికైనా తెలుగు తెలియకుంటే ఇతర భాషలోనివి చూపించి.. తెలుగు ఫారమ్లో నింపుతారు. ఈ నెల 17న జరిగిన భేటీలో రాజకీయ పార్టీలన్నీ దీనికి ఏకగ్రీవంగా సమ్మతించాయి. తెలంగాణలో అన్ని రాష్ట్రాల వారున్నారు.. దేశంలోని అన్ని భాషల్లో సర్ ఫారాలు ప్రింట్ చేయాలనడం సరికాదు. ఇప్పటికే ప్రింటింగ్ ముగిసింది. బీఎల్వోలు పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఒకే ఫారమ్లో రెండు, మూడు భాషలిస్తే ప్రజలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఫారమ్ ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంది’అని చెప్పారు. -
సోషల్ టెక్ నిపుణుల కోసం ఫెలోషిప్ ప్రోగ్రాం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలను రూపొందించే సాంకేతిక సంస్థ ఎక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ తాజాగా తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖకు చెందిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్తో (టాస్క్) కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. సమాజంలో క్షేత్రస్థాయిలో పనిచేసే సరికొత్త సోషల్ టెక్ ప్రొఫెషనల్స్ను (సామాజిక సాంకేతిక నిపుణులు) తయారు చేయడం కోసం ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఎక్విప్ ఫెలోస్ ప్రోగ్రామ్ ప్రారంభించాయి. అకడమిక్ విద్యకు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎక్విప్ రూపొందించిన ప్రత్యేక పాఠ్యప్రణాళిక ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి అవసరమైన నైపుణ్యాలపై టాస్క్ శిక్షణ ఇస్తుంది. ఈ ఫెలోషిప్ 6–12 నెలల పాటు ఉంటుంది. ఇందులో క్లాస్రూమ్ బోధన, టెక్నాలజీ శిక్షణతో పాటు లైవ్ ప్రాజెక్టులలో క్షేత్రస్థాయి పని అనుభవం కల్పిస్తారు.ఫెలోషిప్ కాలంలో అభ్యర్థులకు ఉపకార వేతనం లభిస్తుంది. ఈ శిక్షణ పొందిన నిపుణులు ప్రభుత్వాలు, సీఎస్ఆర్ ఫౌండేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు చేపట్టే పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్, డిజిటల్ సామాజిక ప్రాజెక్టుల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తారు. -
ప్రవేశాల్లో వెనుక‘బడి’
మంచిర్యాల అర్బన్: బడీడు పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. వందశాతం నమోదు లక్ష్యం నీరుగారిపోతోంది. 2026–27 విద్యాసంవత్సరానికి మే 14నుంచి జూన్ 19వరకు బడిబాట నిర్వహించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉచితంగా యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు పంపిణీ, మధ్యాహ్న భోజనంపై విస్తృత ప్రచారం చేపట్టినా అడ్మిషన్ల లక్ష్యాన్ని చేరుకోలేదు. ఈ ఏడాది లక్ష్యం ప్రకారం 17.08 శాతం వెనుకబడిపో వడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలతో విద్యార్థుల సంఖ్య 21,39,006కు చేరడం లక్ష్యం కాగా 17,73,643 మాత్రమే అడ్మిషన్లు అయ్యాయి. గత ఏడాది కంటే ఈసారి 2,28,990 మంది చేరగా 3,65,364మంది విద్యార్థుల నమోదు చేయాల్సి ఉంది. కాగా, మంచిర్యాల జిల్లా ప్రవేశాల లక్ష్య సాధనలో 86.19శాతం నమోదు చేసి అగ్రస్థానంలో నిలువగా పెద్దపల్లి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. -
తెలంగాణలో పలువురు ఐపీఎస్ల బదిలీలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. వరంగల్ సీపీగా శ్వేత, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీగా సింధుశర్మ, సీఐడీ ఎస్పీగా చెన్నూరి రూపేష్,వికారాబాద్ అడ్మీన్ ఎస్పీగా రాజేష్ మీరా నియామకమయ్యారు. సైబరాబాద్ జాయింట్ ట్రాఫిక్ సీపీగా సన్ప్రీత్ సింగ్, సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా వై.సాయిశేఖర్, సీఐడీ ఎస్పీలుగా చెన్నూరి రూపేష్, ప్రవీణ్ కుమార్, వికారాబాద్ అడ్మీన్ ఎస్పీగా రాజేష్ మీరా బదిలీ అయ్యారు.గోల్కోండ జోన్ డీసీపీగా రాఘవేందర్ రెడ్డి, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా చంద్రమోహన్,ఇంటలిజెన్స్ ఎస్పీగా రామ్ రెడ్డి , హైడ్రా అడిషనల్ కమిషనర్గా ఆనంద్ కుమార్,ఇంటలిజెన్స్ ఎస్పీగా ఇక్బాల్ సిద్దిఖీ మెుత్తంగా 26 మంది అధికారుల బదిలీ జరిగింది.


