breaking news
Telangana
-
కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చారు..: కేటీఆర్
సిరిసిల్ల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చాడంటూ ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుబంధు పథఖం బంద్ చేసి.. కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చిండు అంటూ సెటైర్లు వేశారు. సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయిలు రాహుల్ గాంధీకి పంపించడమే రాహుల్ బంధు పథకం అంటూ విమర్శించారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను సిరిసిల్లలో కేటీఆర్ ఘనంగా సన్మానించారు. దీనిలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో నాట్లు వేసే టైమ్లోన రైతుబంధు పడుతూ ఉండేదని, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. ఇప్పటివరకూ ఎవరికైనా రైతుబంధు పడిందా? అంటూ అక్కడున్నవారిని ఉద్దేశించి ప్రశ్నించారు. సంవత్సరానికి వేయి కోట్లు కట్టి పదవి కాపాడుకుంటుండు. ఖమ్మం వెలుగుమట్లలో వెయ్యి ఇళ్లు కూల్చిండు.మహబూబ్నగర్లో దివ్యాంగుల ఇళ్ళు కూల్చారు. సీఎం సొంత ఇల్లు కొడంగల్ కోస్గిలో రెడ్డికుంటలో కట్టుకున్నాడు. రేవంత్ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువులో ఉంది. 6 గారంటీలు నూరు రోజుల్లో అమలు చేస్తా అన్నాడు.. వెయ్యి రోజులు కావస్తున్నా అమలు చేయలేదు. అనాడు మూడో పంటకు రైతుబంధు వేయాలన్నారు.. ఇవాళ మూడో నెల వచ్చినా రైతుబంధు వేయడంలేదు. ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తా అన్నారు. పంట పంటకు బోనస్ ఇస్తా అన్నారు. అత్తలకు 4 వేలు కోడలు 2,500 ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు ఇచ్చిండా..?’అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. -
‘ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్దా..?, ఓవైసీదా?’
హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన నడవడంలో లేదని, రజాకార్ పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ధ్వజమెత్తారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నిర్ణయం తీసుకునే ముందు ఓవైసీ అనుమతిని సీఎం రేవంత్రెడ్డి తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పరిపాలన ఓవైసీ చేతుల్లో ఉందా ? అంటూ ప్రశ్నించారు. ప్రజల కోసం కాదు…ఓవైసీ కోసం ప్రభుత్వం నడుస్తోందా ?’ అని నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వం ఎవరిది?, కాంగ్రెస్దా.. లేక ఓవైసీదా? అని ట్వీట్ చేశారు.❌Praja Palana✅ Razakar PalanaFor every decision, Revanth Reddy needs the permission of Owaisi.Such is the state of affairs in Congress-ruled Telangana. pic.twitter.com/pYMQHwFFxT— N Ramchander Rao (@N_RamchanderRao) March 9, 2026 ఓవైసీ పిలుపుతో వేల కోట్లు సమీకరిస్తామని అంటున్నారుతెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డాఉ. ‘ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రోజుకొక లాగా మారుతున్నాయి. ఒకవైపు పేదలు, దళితులు, గిరిజనులకు భూమి లేదని చెబుతున్నారు. కానీ జర్నలిస్టులకు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు భూమి ఇస్తామని హామీ ఇస్తున్నారు. పెన్షన్లు క్లియర్ చేయడానికి ప్రభుత్వానికి డబ్బులు లేవని అంటున్నారు. కానీ ఓవైసీ ఒక పిలుపు ఇస్తే మూసీ ప్రాజెక్ట్కు వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని చెబుతున్నారు. కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా పెండింగ్లోనే ఉంది. కానీ అమ్మాయిలకు ఉచిత EV స్కూటీలు ఇస్తామని కొత్త హామీలు ఇస్తున్నారు’ అని విమర్శించారు. -
Hyderabad: రంజాన్ ఉపవాసం పాటిస్తున్న పిల్లి
మనమేం చేస్తే పిల్లలు చూస్తారు.. అదే చేస్తారు.. కుటుంబ సభ్యులు ఏం చేస్తే ఇంట్లోని పెట్స్ కూడా అలాగే చేయడం చూస్తూనే ఉంటాం. కుటుంబ సభ్యుల్లా కలిసిపోయిన పెట్స్ చేసే కొన్ని పనులు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఓ పిల్లి రంజాన్ ఉపవాస దీక్షను అనుసరిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. మోతీనగర్ డివిజన్లో నివాసం ఉండే ఓ ముస్లిం కుటుంబం కొన్ని నెలల క్రితం ఆన్లైన్లో ఓ పిల్లిని కొనుగోలు చేసింది. దానికి జీజీ అని పేరుపెట్టి ప్రేమతో పెంచుకుంటున్నారు. రంజాన్ మాసం కావడంతో కుటుంబ సభ్యులంతా ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ఈ క్రమంలో నిత్యం వారిని అనుసరిస్తున్న ఆ పిల్లి ఉపవాస దీక్షలను పాటిస్తూ వారితో పాటు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రతిరోజూ సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటుంది. ఇఫ్తార్ సమయంలో కుటుంబ సభ్యుల వద్దకు వచ్చి కూర్చుంటుంది. ఎలాంటి ఆహార పదార్థాలు స్వీకరించదు. వారంతా ఇఫ్తార్ పూర్తి చేసుకున్న తర్వాత దానికి ఆహారం పెడితే మాత్రమే తింటుంది. పిల్లి క్రమశిక్షణతో మెలగడంపై ఇంటి యజమాని షేక్ రియాజ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – మోతీనగర్ -
లొంగిపో.. బిడ్డా
మిరుదొడ్డి (దుబ్బాక): సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన భాగ్య 16 ఏళ్ల వయసులోనే దళంలోకి వెళ్లింది. 24 ఏళ్లుగా అజ్ఞాతంలోకి ఉంది. తెలంగాణలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారని, అందులో భాగ్య కూడా ఉండొచ్చన్న ఊహాగానాలు నిన్నటి దాకా వినిపించాయి. అయితే ఈ నెల 7న సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయం తెలిసిందే. వారిలో మావోయిస్టు భాగ్య లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మావోయిస్టు భాగ్య అలియాస్ కల్పన, అలియాస్ రూపీ అలియాస్ మాధవి జీవించే ఉందని, పోలీసులు చెబుతుండగా, ఆమె పేరున రూ. 5 లక్షల రివార్డు ఉంది. ఉద్యమంలోకి వెళ్లాక ఆమె ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పనిచేస్తున్నట్టు పోలీసులకు సమాచారం ఉంది. ఎప్పుడు సావొత్తదో తెల్వదు పానం శాతగాకుంటైంది. రందితోని ఎముకల గూడయ్యాను. ఎప్పుడు సావొత్తదో తెల్వదు. 24 యేండ్ల సంది నీ కోసం కన్నులు కాయలు కాచేలా ఎదురు సూత్తున్న. 9 సంవత్సరాల కిందట మీ నాయిన నర్సయ్య చనిపోయినా నువ్వు రాలేదు. ఇప్పుడు నేను సచ్చిపోతే నువ్వు వస్తవో రావో తెల్వదు. నేను బతికుండగా నువ్వు ఎన్కౌంటరై సచ్చిపోయి వస్తవో, లొంగిపోయి పానాలతో తిరిగి వస్తవో తెల్వలేదు బిడ్డా. నువ్వు యాడున్నా పోలీసులకు లొంగిపోయి రా బిడ్డా. కడ సూపుకన్నా నోచుకుంటాను. – రంగనబోయిన ఎల్లవ్వ, మావోయిస్టు భాగ్య తల్లి -
పోలీస్ వెబ్సైట్.. అప్డేట్ మిస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు...ఈ పేరు చెప్పగానే టెక్నాలజీ గుర్తుకువస్తుంది. దీని వినియోగానికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న రాష్ట్రం అనేక ప్రాంతాలకు మార్గదర్శకమైంది. కేసు నమోదు నుంచి దర్యాప్తు, అభియోగపత్రాల దాఖలు వరకు ఆన్లైన్ విధానం కొనసాగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా... ప్రాథమిక అంశమైన అధికారిక వెబ్సైట్ నిర్వహణలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పునర్వ్యవస్థీకరణను పట్టించుకోకుండా, అధికారుల బదిలీలపై దృష్టి పెట్టకుండా, అదనపు బాధ్యతలు తప్పినా ఇన్చార్జ్లను కొనసాగిస్తూ దీని నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాజధానిలోని కమిషనరేట్లలో జరిగిన మార్పుచేర్పులను పట్టించుకోవట్లేదు. కొన్ని బదిలీ, బాధ్యతల స్వీకరణ జరిగి ఇప్పటికి నెలన్నర అవుతున్నా అధికారిక వెబ్సైట్ (tspolice.gov.in)లో మాత్రం మార్పుచేర్పులు లేవు. ఇలాంటి చిత్రాలు మరెన్నో రాష్ట్ర పోలీసు అధికారిక వెబ్సైట్లో ఉన్నాయి.వాటిలో కొన్ని ఇవి... జనవరి 17న జరిగిన ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ఐపీఎస్ అధికారి ఎస్.చైతన్యకుమార్ నగర డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీగా వచ్చారు. అంత వరకు ఈ పోస్టుకు అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు ఇన్చార్జ్గా ఉన్నారు. అంతర్థానమైపోయిన సౌత్ ఈస్ట్ జోన్ను కొనసాగిస్తున్న పోలీసు వెబ్సైట్ దీనికి చైతన్యకుమార్ డీసీపీగా ఉన్నట్లు చూపిస్తోంది. నగర పోలీసు విభాగంలో పరిపాలన డీసీపీగా కె.వెంకట లక్ష్మి నియమితులయ్యారు. అయినా ఇప్పటికీ తఫ్ఫీర్ ఇక్బాల్ను వెబ్సైట్ ఇన్చార్జ్గా కొనసాగిస్తోంది. ఈయన నగరంలో సౌత్ రేంజ్ అదనపు సీపీగా నియమితులైనా... ఇంకా సంయుక్త సీపీ శాంతిభద్రతలుగానే చూపిస్తోంది. గతంలో నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్కు డీసీపీగా పని చేసిన అపూర్వ రావు కొన్నాళ్ల ఇంటెలిజెన్స్కు బదిలీ అయ్యారు. అధికారిక వెబ్సైట్ మాత్రం ఈ విషయం పట్టించుకోలేదు. రాజధానిలోని పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లు హైదరాబాద్లో కలిశాయి. అలాగే నగరంలో ఉన్న జోన్ల పేర్లు ఈస్ట్, వెస్ట్, సెంట్రల్... నుంచి సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్... ఇలా మారాయి. ఈ అంశమూ వెబ్సైట్ నిర్వాహకులకు పూర్తిగా పట్టలేదు. రక్షితా మూర్తిని సికింద్రాబాద్ డీసీపీ అంటూ అప్డేట్ వెర్షన్ నమోదు చేసినా.. కె.శిల్పవల్లిని మాత్రం ఇప్పటికీ సెంట్రల్ జోన్ డీసీపీగానే వెబ్సైట్ సంబోధిస్తోంది. రాజేంద్రనగర్ను సైబరాబాద్తో చూపిస్తున్న సైట్... అక్కడ ఉన్న డీసీపీ శ్రీనివాస్కు బదులు యోగేష్ గౌతం అంటూ కొనసాగిస్తోంది. రాచకొండ కమిషనరేట్ పేరు మల్కాజ్గిరిగా మారింది. అవినాష్ మహంతిని దీనికి కమిషనర్గా చూపిస్తున్న వెబ్సైట్... మహేశ్వరం జోన్ను మాత్రం రాచకొండగానే కొనసాగిస్తోంది. మరికొందరు డీసీపీ పోస్టులూ రాచకొండలో ఉన్నట్లే పేర్కొంటోంది. నగర సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా కె.శ్యామ్ సుందర్ వచి్చనా... ఇప్పటికీ అపూర్వ రావే ఇన్చార్జ్ అని వెబ్సైట్ చెప్తోంది. హైదరాబాద్ వెస్ట్జోన్ డీసీపీగా పని చేసిన చింతమనేని శ్రీనివాస్ చాలా రోజుల క్రితమే సైబరాబాద్లో కొత్తగా ఏర్పడిన శేరిలింగంపల్లి డీసీపీగా వెళ్లారు. విభజన తర్వాత జూబ్లీహిల్స్గా మారిన ఈ జోన్కు రమణారెడ్డి డీసీపీగా వచ్చారు. ఈ అంశాలు వెబ్సైట్లో అప్డేట్ కాలేదు. పాతబస్తీలోని సౌత్ జోన్ చారి్మనార్ జోన్గా మారిపోయింది. అయితే పోలీసు వెబ్సైట్లో మాత్రం ఇంకా పాత పేరే కొనసాగుతోంది. -
రిటైర్డ్ జడ్జి.. డిజిటల్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరస్తులు తెలివిమీరిపోయారు. విద్యార్థులు, గృహిణులు, నిరుద్యోగులే కాదు ఉన్నత విద్యావంతులను కూడా అలవోకగా మోసం చేస్తున్నారు. కేటుగాళ్లు తాజాగా డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ జడ్జీనే మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కేటుగాళ్లు ఆయన నుంచి రూ.1.66 కోట్లను దోచుకున్నారు. ఈమేరకు మల్కాజ్గిరి పోలీసు కమిషనరేట్ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరెడ్మెట్కు చెందిన రిటైర్డ్ జడ్జి (73)కి ఫిబ్రవరి 23న గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను సీనియర్ సీబీఐ అధికారి దీపక్ కుమార్ అని పరిచయం చేసుకున్న కేటుగాడు.. మీరు ఆధార్తో అనుసంధానమైన రెండు మొబైల్ నంబర్లను మహిళలకు అభ్యంతరకరమైన కాల్స్ చేయడానికి ఉపయోగిస్తున్నారని రిటైర్డ్ జడ్జికి చెప్పాడు.ఈమేరకు బెంగళూరులోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని భయభ్రాంతులకు గురి చేశాడు. ఇదే సమయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరవ్ సారథిగా పరిచయం చేసుకున్న మరో మోసగాడు కాన్ఫరెన్స్ కాల్లో చేరి.. మానవ అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్నావని చెప్పాడు. ఈమేరకు సుప్రీంకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందన్నాడు. కుటుంబం లేదా స్నేహితులతో సహా ఎవరితోనూ ఈ విషయాన్ని చర్చించవద్దని మోసగాళ్లు హెచ్చరించారు. మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా, దొంగతనం కేసులున్నాయంటూ బ్యాంకు ఖాతాల వివరాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.విచారణ తర్వాత డబ్బు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. దీంతో అరెస్ట్, ప్రతిష్టకు నష్టం వాటిల్లుతుందని భయపడిన రిటైర్డ్ జడ్జి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 2 మధ్య నాలుగు లావాదేవీల్లో తన మూడు బ్యాంకు ఖాతాల నుంచి రూ.1.66 కోట్లను మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు. నిందితులు హామీ ఇచ్చిన విధంగా తన డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
30 నెలల్లో ‘పాలమూరు’ పూర్తి
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే 30 నెలల్లో పూర్తి చేసి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. మార్చి 2027 నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్తో సహా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందించే ప్రాజెక్టులకు అవసరమైన నిధులు, వనరులను కల్పించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కల్వకుర్తికి రూ.909 కోట్లు, నెట్టెంపాడుకు రూ.252 కోట్లు, బీమాకు రూ.200 కోట్లు, కోయిల్సాగర్కు రూ.185 కోట్లు కలిపి మొత్తం రూ.1546 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు.రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగిరం చేయడంలో భాగంగా భూసేకరణ కోసం రూ.5వేల కోట్లను కేటాయిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ఆదివారం ఆయన జలసౌధలో సమీక్షించారు. గత బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.35,200 కోట్ల అంచనాలతో పరిపాలనపర అనుమతులు జారీ చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.27,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేసినట్టు చెప్పుకుంటోందని తప్పుబట్టారు. అంత ఖర్చుచేసినా ఎకరానికి సాగునీరు అందించలేదన్నారు.తాజాగా అంచనాలు రూ.55 వేల కోట్లకు పెరిగాయని, డిస్ట్రిబ్యూటరీల వ్యయం కలిపితే రూ.80వేల కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై రూ.7,161 కోట్లను ఖర్చు చేసిందన్నారు. జూరాల ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా, పూడికతో 9 టీఎంసీలకు తగ్గిపోయిందని ఉత్తమ్ తెలిపారు. నిల్వ సామర్థ్య పునరుద్ధరణకు తక్షణమే పూడిక తొలగింపు పనులను చేపడతామని ప్రకటించారు. జూరాల నుంచి తొలగించే ఇసుకను గోదావరి పరీవాహకంలోని ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించాలని సూచించారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కృష్ణాజలాల్లో చుక్క నీళ్లను వదులుకోమన్నారు. సమీక్షలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
‘కొత్త’ మండలి భవనాన్ని ప్రారంభించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 నుంచి 2017 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభగా కొనసాగిన నిజాం కాలం నాటి ఈ భవనాన్ని ప్రభుత్వం రూ.30 కోట్ల ఖర్చుతో పునరుద్ధరించింది. ప్రస్తుతం జూబ్లీహాల్లో కొనసాగుతున్న శాసనమండలిని ఈ పునరుద్ధరించిన భవనంలోకి తీసుకురానున్నారు.ఆదివారం ఉదయం కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ వెంటరాగా, పునరుద్ధరించిన మండలి భవనాన్ని రేవంత్ ప్రారంభించి లోపలికి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కౌన్సిల్ హాల్లోని సీట్లలో ఆసీనులైన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్ తదితరులు కొద్దిసేపు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మండలి సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని..
వలిగొండ: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలి గొండ మండలం ఎం.తుర్కపల్లి గ్రామంలో ఆది వారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎం.తుర్కపల్లికి చెందిన ముంత మమత (25), మొగిలిపాక గ్రామానికి చెందిన మర్ల మత్స్యగిరి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసు కుందామని మత్స్యగిరిని ఇటీవల మమత కోరగా అతడు నిరాకరించాడు. ఆదివా రం మమత తల్లిదండ్రులు హైదరాబాద్కు వెళ్ల గా.. ఆమె సోదరి భవాని వ్యవసాయ బావి వద్ద కు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాను ప్రే మించిన వ్యక్తి మోసం చేశాడని మమత సూసై డ్ నోట్ రాసి, సోదరికి ఫోన్ చేసి ‘అమ్మానాన్న జాగ్రత్త’ అని చెప్పి చున్నీతో ఫ్యాన్కు ఉరేసు కుంది. మమత సోదరి బావి వద్ద నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కని పించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. -
బీమా డబ్బుల కోసం భర్త హత్య
ఖమ్మం రూరల్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యే భర్తను హత్య చేయించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ సీఐ ముష్క రాజు కథనం ప్రకారం.. ఖమ్మం గాంధీనగర్కు చెందిన చాగంటి రవి (55) పెయింటింగ్ పని చేస్తూ భార్య ప్రశాంతి, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. కాగా, రవిపై ఇన్సూరెన్స్ చేయించి, బీమా డబ్బులు కాజేయాలని భార్య ప్రశాంతితో పాటు మరో నలుగురు కలిసి ప్లాన్ చేశారు. ప్రశాంతికి వరుసకు సోదరుడైన దేశబోయిన శ్రీనివాస్తో పాటు జోగి రాజ్కుమార్, జోగి వెంకటేశ్, జోగి రాంబాబు కలిసి రవి పేరున రూ.66 లక్షలకు బీమా చేయించారు. సమయం చూసి అతడిని హతమార్చి ఆ సొమ్ము కాజేయాలని పథకం వేశారు. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీ రాత్రి దేశబోయిన శ్రీనివాస్.. రవి ఇంటికి వచ్చి మద్యం తాగుదామంటూ తన ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగాక ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం వైపు తీసుకెళ్లి గ్రామ శివారులో రవిని దింపి శ్రీనివాస్ వెళ్లిపోయాడు. మద్యం మత్తులో ఉన్న రవి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ముందస్తు ప్లాన్ ప్రకారం జోగి వెంకటేశ్కు చెందిన కారును రాజ్కుమార్ వేగంగా నడుపుతూ వచ్చి రవిని ఢీకొట్టి వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడిన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత భార్య ప్రశాంతి తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులకు అనుమానం వచ్చి.. విచారించగా నిందితులు అసలు విషయం ఒప్పుకున్నారు. దీంతో ఐదుగురినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రాజు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కారు, ఆటో, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సాక్షి, హైదరాబాద్/ఏజీవర్సిటీ: రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. తెలంగాణ రైతుని తలెత్తుకుని నిలబడేలా చేసేందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న మెగా మహిళా రైతు మేళా ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ మేళాను నిర్వహించారు. వ్యవసాయ వర్సిటీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. రూ.500 కోట్లతో పునరుద్ధరించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో మహిళా రైతులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మహిళా రైతులకు డ్రోన్లు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పంట మార్పిడి, సహజ వ్యవసాయ విధానాలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆహార ధాన్యాల్లో స్వావలంబన: మంత్రి శ్రీధర్బాబు అధునాతన నైపుణ్యాలు, సాంకేతికతను ఉపయోగించి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రైతులకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు ఆహార భద్రతపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల్లో స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆహార ఉత్పత్తిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. విత్తనాలు నాటినప్పటి నుంచి పంట కోసి ఇంటికి చేరేవరకు మహిళలు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఐకార్ డైరెక్టర్ జనరల్ ఎంఎల్ జాట్ మాట్లాడుతూ కొత్త సాంకేతికతలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. పంటల వైవిధ్యీకరణ, మార్కెట్లతో రైతాంగాన్ని అనుసంధానం చేయడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా 30 మంది మహిళా రైతులకు మంత్రులు అవార్డులు అందజేశారు. మెగా మహిళా రైతు మేళాలో సుమారు 6 వేల మంది మహిళా రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో శాసన మండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ అనేది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. హైడ్రా పునరుజ్జీవం కల్పించిన శివరాంపల్లిలోని చారిత్రక బమ్రుఖనుద్దౌలా చెరువును ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఓల్డ్ సిటీ ప్రజలకు అద్భుత సంస్కృతిని అందించడానికి ఈ చెరువును అభివృద్ధి చేశాం. ఇది చెరువు అభివృద్ధి మాత్రమే కాదు.. ఈ ప్రాంత ప్రజలకు కాలుష్యరహిత వాతావరణం అందించడం. నిజాం సర్కారు గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాద్ను లేక్స్ అండ్ రాక్స్ సిటీగా మార్చింది. ప్రపంచంలోనే అద్భుతమైన ఈ నగరాన్ని పాడు చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది. లండన్, దక్షిణ కొరియా, సింగపూర్ ఇలా అనేక నగరాల్లో నాగరికత, అభివృద్ధి నీటి సమీపంలోనే జరిగింది. నగరంలోనూ నిజాం సర్కార్ అనేకం నిర్మించింది. వరదల్లో అనేక మంది చనిపోతే వాటి నియంత్రణతో పాటు సాగునీరు, తాగునీరు అందించడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ నిర్మాణం చేపట్టింది. ఇవన్నీ రానురాను పాడవుతున్నాయి. నిజాం పురానాపూల్, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా యూనివర్సిటీ, కౌన్సిల్ భవనం, ఫలక్నుమా ప్యాలెస్ సహా ఎన్నో భవనాలు నిర్మించి ఇచ్చారు. వాటిని రక్షించడం, నిర్వహించడం సాధ్యం కావవట్లేదు. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్నాం. రానున్న మూడు నెలల్లో పురాతన భవనాల పునరుద్ధరణ చేపడతాం. పాతబస్తీలో మెట్రో రైల్ను వీలైనంత త్వరలో నిర్మిస్తాం’ అని చెప్పారు.పాతబస్తీలో అభివృద్ధి జరగాలి: ఒవైసీ‘పాతబస్తీ హైదరాబాద్కు గుండెకాయ వంటిది. పాతబస్తీలో తగిన స్థాయిలో అభివృద్ధి జరగాలి. అంతా కలిసి దీనిపై ఉన్న అపార్థాలను దూరం చేద్దాం, మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లోపు మెట్రో పనులు చేస్తామని సీఎం చెప్పారు. ఆ స్థాయిలో పనులు జరుగుతున్నాయి. మీరాలం ట్యాంక్పై మంజూరైన బ్రిడ్జ్ పనులకు సీఎం ఈ నెల 14న శంకుస్థాపన చేస్తారు’ అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. హెచ్ఎండీఏ కేటాయించిన రూ.20 కోట్లతో ఈ చెరువును అభివృద్ధి చేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఎంఐఎం నుంచి మాకు మద్దతు‘పాతబస్తీ నుంచి అసదుద్దీన్ దేశ ప్రతినిధిగా గొంతు వినిపిస్తున్నారు. ఒవైసీ, ఎంఐఎం నుంచి మాకు మంచి మద్దతు వస్తోంది. ప్రపంచంతో పోటీపడే నగరంగా చేయాలనే ఆక్రమణలు తొలగించి చెరువులు, పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. బమ్రుఖనుద్దౌలా చెరువు వద్ద లేక్ పోలీసింగ్ ఏర్పాటు చేయాలి. ఆడబిడ్డలు ధైర్యంగా ఇక్కడకు వచ్చేలా, వాకింగ్ చేసేలా చర్యలు తీసుకోండి. ప్రతి మహిళ స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా చేరాలి. మీరు ఉత్పత్తి చేసే వస్తువులను ఇక్కడ స్టాల్స్ పెట్టి విక్రయించుకునే అవకాశం ఇస్తాం. ఈ ప్రాంతంలో లేక్ ఎకానమీ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లను ఆదేశిస్తున్నా. వాకింగ్ చేసిన వాళ్లు ఇక్కడే వారికి కావాల్సినవి కొనుక్కునే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయండి. పాతబస్తీలో రాత్రి ఒంటి గంట వరకు వ్యాపారాలకు అనుమతి ఇస్తున్నాం. మూసీ పరీవాహక ప్రాంతంలో నైట్ ఎకానమీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పాతబస్తీలో యువతలో నిరుద్యోగం ఉంది. వీరు నైట్ ఎకానమీ ద్వారా జీవనోపాధి పొందుతారు. గండిపేట నుంచి గౌరారం వరకు మూసీ వెంట లేక్ ఎకానమీ అభివృద్ధి చేస్తాం. మూసీలో పేదల ఇళ్లు ఉంటే వారిని వీధుల్లో వదిలేయం. వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తాం. దీని అభివృద్ధితో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఉపాధి కలుగుతుంది. మీరు అందరూ వచ్చి కూర్చుని పనులు చేయించండి. ఒవైసీ ఎంఐఎం పార్టీ వర్కర్లను ఈ కోణంలో ఆదేశించాలి. మీరు ఆదేశిస్తే అన్నీ జరుగుతాయి. ఈ ప్రాంతం అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మీదే. గతంలో రంజాన్ వస్తే బిర్యానీ, కుబానీ ఇచ్చి వెళ్లే వాళ్లు. నేను వాటితోపాటు అభివృద్ధి కూడా చేస్తా’ అని అన్నారు. -
ఎస్హెచ్జీ మహిళకు డిజిటల్ హెల్త్ కార్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ కార్డుల జారీకి ముందు వారికి 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, వీటి ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందించి పంపిణీ చేస్తామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బంజారాహిల్స్లోని కొమురంభీమ్ ఆదివాసీ భవన్లో జరిగిన కార్యక్రమాలకు ఆయన మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ద్వారా ఎస్హెచ్జీ మహిళలకు 30 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలను నిర్వహించే కార్యక్రమాన్ని రాజనర్సింహ, సీతక్క లాంఛనంగా ప్రారంభించారు. బస్ స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో శిశువులకు పాలిచ్చేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. దీంతోపాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఆన్లైన్ పోర్టల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడం సమాజ అభివృద్ధికి కీలకమన్నారు. మహిళల ఆరోగ్యం బాగుండాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఎస్హెచ్జీ సభ్యులకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలకు అవకాశం ఇస్తే పంట పొలాల నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పం ఇప్పుడిప్పుడే సాకారమవుతోందన్నారు. ‘ఇందిరా మహిళా శక్తి అచీవ్మెంట్స్’ పుస్తకాన్ని సీతక్క విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ముఖ్యకార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, అనితా రామచంద్రన్, దివ్య దేవరాజన్, శ్రుతి ఓజా, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు. వినూత్న వ్యాపారాలతో రాణిస్తున్న 31 మంది మహిళలను సన్మానించి, వారికి రూ.25వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. -
నిజాం రాణులు జలకాలాడిన తటాకం!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం పాతబస్తీలో ప్రారంభించిన బమ్రుఖనుద్దౌలా చెరువు కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. 1770లో హైదరాబాద్ మూడో నిజాం సికందర్ జా ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్ ఉద్ దౌలా దీన్ని నిర్మించారు. చారిత్రక ఆనవాళ్ల ప్రకారం తొలినాళ్లలో ఈ చెరువు 100 ఎకరాలకుపైగా విస్తరించి ఉండేది. రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువులోకి చేరేది. నిజాం కాలంలో మీరాలం ట్యాంక్ను రాజులు.. బమ్రుఖనుద్దౌలా చెరువును రాణులు స్నానాల కోసం ఉపయోగించేవారు. ఈ చెరువులో వనమూలికల మొక్కలు, కొమ్మలు వేసి దిగువున నిర్మించిన బావిలోకి వచి్చన ఊటని తాగునీరుగా వినియోగించేవారు. ఔషధగుణాలున్న ఆ నీటినే నిజాం వాడారు. ఈ చెరువు చుట్టూ సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని.. అవి చెరువులో పడటంతో ఇక్కడి నీటిని సెంట్ల తయారీకి వినియోగించేవారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే బమ్రుఖనుద్దౌలా చెరువు నీరు అరబ్ దేశాలకు ఎగుమతి అయ్యేదని చెబుతున్నారు. కబ్జాల చెర విడిపించిన హైడ్రా..: హైదరాబాద్ నగరం కాలక్రమేణా విస్తరించడం, ఇతర ప్రాంతాల నుంచి వరద రాకపోవడంతో బమ్రుఖనుద్దౌలా చెరువు చివరకు 18 ఎకరాల్లో మిగిలింది. కానీ అక్రమార్కులు క్రమంగా చెరువును కబ్జా చేయడంతో 4.12 ఎకరాలకు కుంచించుకుపోయొంది. దీంతో 2024 ఆగస్టులో రంగంలోకి దిగిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆయా ఆక్రమణలను తొలగించి దశలవారీగా చెరువును తిరిగి 18 ఎకరాలకు విస్తరించింది. దాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. నాటి చారిత్రక ఆనవాళ్లను పరిరక్షిస్తూనే తాజా ఆకర్షణలతో తీర్చిదిద్దింది. అలాగే జల కాలుష్యానికి తావు లేకుండా మురుగునీటి కట్టడి, చెరువులోకి ఇన్లెట్, ఔట్లెట్స్ను పక్కాగా ఏర్పాటు చేసింది. నిజాం కాలంలో రాతితో నిర్మించిన బండ్ను చెక్కు చెదరకుండా కాపాడుతూ మరింత పటిష్టం చేసింది. చెరువు పూడికలో కలిసిపోయిన నాటి రాళ్లను బయటకు తీసి భద్రపరిచింది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్లు, చిన్నారుల కోసం ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఆక్రమణలకు వీల్లేని రీతిలో చెరువు కట్ట చుట్టూ, చెరువు లోపలి వైపు కూడా ఫెన్సింగ్ వేసింది. -
అతివలకే అందలం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మహిళ మాటకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని.. అందుకే ప్రభుత్వ పాలనలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వివిధ శాఖల్లో మహిళలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమైన శాఖలకు మహిళలనే ఉన్నతాధికారులుగా నియమించామని అన్నారు. పలు జిల్లాలకు కలెక్టర్లుగా, అవకాశమున్న చోట ఎస్పీలుగా నియమించామని తెలిపారు. ఆదివారం ప్రజా భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళ కేంద్రంగా పథకాలు..: ‘ఉక్కు మహిళ సోనియాగాంధీ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. అందుకే మహిళ కేంద్రంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాం. మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా వెయ్యి బస్సులకు యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లకు సైతం యజమానులుగా నిలబెట్టాం. ఎస్హెచ్జీలు ఉత్పత్తి చేసే వస్తువుల విక్రయం కోసం అమెజాన్తో అవగాహన కుదుర్చుకున్నాం. లోకల్ టాలెంట్ను గ్లోబల్ టాలెంట్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి... ‘దేశంలో ఇంకా మహిళలు, పురుషులు, కులాలు అంటూ ఎన్నో రకాలుగా వివక్ష కనిపిస్తూనే ఉంది. అభివృద్ధి చెందిన అమెరికాలోనూ వివక్ష ఉన్నప్పటికీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉంది. మన దేశంలోనూ కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి.. అవకాశాలు కల్పించాలి. నా ప్రయాణంలో అనేక మంది జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు నా శ్రేయోభిలాషులుగా ఉన్నారు’అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మూసీ రివర్ఫ్రంట్కు అడ్డుపడుతున్నారు.. 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా మూసీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం. కానీ కొందరు ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు. అహ్మదాబాద్లో సబర్మతి రివర్ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, యూపీలో గంగా రివర్ ఫ్రంట్ నిర్మించిన వారు హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ను మాత్రం వద్దంటున్నారు. ఈసా నది ఒడ్డున 2004లో 9 మీటర్ల బఫర్ జోన్లో అపార్ట్మెంట్ కట్టారు. నదులకు 50 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేస్తూ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. 50 మీటర్ల లోపల కట్టడాలపై నిషేదం ఉంది. 50 శాతం బఫర్ జోన్ ఉంది. అందుకే ఆ అపార్ట్మెంట్ నివాసితులను పిలిచి మాట్లాడాం. వాళ్లకు ఏడెకరాల భూమి ఇచ్చి అందులో అపార్ట్మెంట్ కట్టుకోవడానికి కావాల్సిన డబ్బు డిపాజిట్ చేస్తామని చెప్పాం. కానీ రాజకీయ జోక్యం పెరిగింది. ప్రతి పార్టీ అక్కడికి వెళ్లి సానుభూతి చూపిస్తోంది. సానుభూతితో సమస్య పరిష్కారం కాదు. 50 మీటర్ల బఫర్జోన్లో ఉన్న అన్ని కట్టడాలకు విలువ సున్నాయే. ప్రత్యామ్నాయం చూపించాలని మేం ప్రయత్నిస్తుంటే రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. బఫర్ జోన్లో ఉన్న వారికి జరిగే నష్టంపై చర్చిస్తే బాగుంటుంది. నగరాన్ని కాపాడుకోవడానికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కావడానికి అందరి సహకారం కావాలి. గాంధీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటి? ఈ నెల 13న మూసీ రివర్ ఫ్రంట్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం’అని సీఎం వివరించారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై శుభవార్త ‘జర్నలిస్టుల మధ్య ఎలాంటి తేడా లేదు. డెస్కు జర్నలిస్టులు, బ్యూరో జర్నలిస్టులు అని వేరుగా చూడం. అందరూ సమానమే. ప్రైవేటు కార్యాలయాల్లో మహిళల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇటీవలే ఈ అంశంపై చర్చ చేశాం. త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలపై ఫిర్యాదులకు ఒక వేదిక ఏర్పాటు చేస్తాం. నిజమైన జర్నలిస్టులెవరో, జర్నలిస్టు ముసుగులో వ్యాపారాలు చేస్తున్నవారెవరో తేడా తెలియాలి. అందుకోసం ప్రత్యేకంగా చట్టంపై అసెంబ్లీలో చర్చిస్తాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశం సుదీర్ఘకాలంగా ఉంది. చట్టం వల్ల ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థలాలపై నిర్ణయం తీసుకుంటాం. అతిత్వరలోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మంచి వార్త చెబుతా. ప్యూచర్ సీటీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జర్నలిస్టులకు మంచి కాలనీని డిజైన్ చేస్తాం’అని సీఎం వివరించారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామి: మంత్రి పొంగులేటి మహిళా సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే ప్రక్రియలో భాగంగా వడ్డీలేకుండా రూ. 23 వేల కోట్లు అందించినట్లు వివరించారు. రాష్ట్ర గౌరవాన్ని పెంచేలా మహిళలకు, మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అక్రెడిటేషన్ కార్డుల మంజూరులోనూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. -
‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్లో రోల్ మోడల్గా తెలంగాణ
‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలపాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పోలీసింగ్ లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘ట్రిపుల్ టీ’(టెక్నాలజీ, ట్రస్ట్, టాలెంట్) వ్యూహంతో ముందుకెళ్తున్నామన్నారు. ఆదివారం ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో పోలీస్ ఉన్నతాధికారులకు ‘తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026’ పేరిట నిర్వహించిన ప్రత్యేక కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... ఒకప్పుడు పోలీసింగ్ అంటే కేవలం శాంతి భద్రతల పరిరక్షణ మాత్రమే, ఇప్పుడు డేటా సెక్యూరిటీ, డిజిటల్ ట్రస్ట్ గా రూపాంతరం చెందిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా క్రైం కూడా భౌతిక సరిహద్దులను దాటి డిజిటల్ రూపంలోకి విస్తరించిందన్నారు. డీప్ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, ఆటోమేటెడ్ ఫిషింగ్ స్కామ్లు పోలీసులకు పెను సవాల్గా మారాయన్నారు. ప్రస్తుతం నేరగాళ్లకు ఆయుధాలతో పనిలేదని, స్మార్ట్ ఫోన్, డేటా, డిజిటల్ ఐడెంటిటీస్ తో నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఒక్క 2024లో దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రూ.22,845 కోట్లు కొల్లగొట్టారని, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 206 శాతం ఎక్కువన్నారు. సైబర్ బాధితుల్లో నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులే అధికంగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రొఫెషనలిజం, ఆపరేషనల్ రెడీనెస్, లీడర్షిప్, ఇన్నోవేషన్, కొలాబరేషన్ , ఎథిక్స్ తో కూడిన ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ ఆవశ్యకమన్నారు. ఇప్పటికే టెక్నాలజీ ఎనేబుల్డ్ పోలీసింగ్ లో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. రాబోయే రోజుల్లో డేటా అనలిటిక్స్, ఏఐ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ సాయంతో నేరాల జరగకముందే అడ్డుకునే ‘ప్రెడిక్టివ్ పోలీసింగ్’కు పెద్దపీట వేస్తామన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. ప్రజల నమ్మకాన్ని చూరగొన్నప్పుడే అసలైన పోలీసింగ్ సాధ్యమవుతుందన్నారు. నక్సలిజంపై పోరాటంలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్మరించుకున్నారు. వారి త్యాగం వృథా కాలేదన్నారు. కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష భిష్త్, రిటైర్డ్ డీజీపీలు హెచ్ జే దొర, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ కృష్ణా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటాం’
హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పనులపై సమీక్ష చేశామని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ నాయకత్వంలో కృష్ణా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్. ఆ నీటిని ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు అందిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి తెలంగాణ ఏర్పడిన తర్వాత అత్యదిక వరి సాగు ఈ ఖరీఫ్ పంటలో వచ్చింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో అత్యధిక సాగు పంటలు పండాయి. ఇరిగేషన్ విషయంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. అన్ని ప్రాజెక్టులపై రివ్యూ చేశాం. ప్రాజెక్టులకు భూ సేకరణను జూన్ 2 లోపు 5 వేల కోట్ల తో కంప్లిట్ చేస్తాం. పాలమూరు - రంగా రెడ్డి ప్రాజెక్టుకు నిధుల అంశాన్ని చర్చించాం. పాలమూరు ను 90 శాతం చేశామని గత పాలకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రూ. 55 వేల కోట్ల ప్రాజెక్టులో రూ. 27 వేల కోట్లు ఖర్చు చేస్తే అది 90 శాతం అయినట్ల..?, వారి హయాంలో నే పాలమూరు అంచనాలు రూ. 84 వేల కోట్లకు పెంచారు. రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదు.పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలంకు షిఫ్ట్ చేయడం వల్ల తీరని అన్యాయం జరిగింది. 2028 డిసెంబర్ లోపు అన్ని ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తాం’ అని తెలిపారు. -
ఆరో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకులు సాధించిన అన్నదమ్ములు
నల్గొండ జిల్లా: సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో పట్టువదలని విక్రమార్కుల్లా కష్టపడిన ఇద్దరు అన్నదమ్ములు ఆరో ప్రయత్నంలో ర్యాంకులు సాధించారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామానికి చెందిన వెలిమినేటి అలివేలు, అంజిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు విజయసింహారెడ్డి, విక్రమసింహారెడ్డి, కుమార్తె అర్చన ఉన్నారు. అంజిరెడ్డి ఆర్టీసీ కండక్టర్గా రిటైరయ్యారు. అలివేలు గృహిణి. వీరు పెద్ద చదువులు చదువుకోకపోయినా తమ పిల్లలు ఉన్నతస్థాయిలో ఉండాలని కోరుకున్నారు. ఈ మేరకు పిల్లల చదువుల కోసం హైదరాబాద్కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆరో ప్రయత్నంలో విజయం..విజయసింహారెడ్డి, విక్రమసింహారెడ్డి ఉస్మానియా యూనివర్సిటిలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం వారు సివిల్స్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగారు. ఈ క్రమంలో గతేడాది గ్రూప్–1 ఫలితాల్లో పెద్ద కుమారుడు విజయసింహారెడ్డి ఎంపీడీఓగా, చిన్న కుమారుడు విక్రమసింహారెడ్డి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఎంపికయ్యారు. అయినప్పటికీ వారిద్దరు సివిల్స్ లక్ష్యాన్ని మరువలేదు. ఐదుసార్లు విఫలమైనప్పటికీ ఆరో ప్రయత్నంలో భాగంగా శుక్రవారం విడుదలైన ఫలితాల్లో విజయసింహారెడ్డి ఆలిండియా 642వ ర్యాంకు, విక్రమసింహారెడ్డి 541వ ర్యాంకు సాధించారు. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి సివిల్స్ ర్యాంకులు సాధించటం పట్ల వారి కుటుంబ సభ్యులతో పాటు సుంకెనపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కాగా అంజిరెడ్డి కుమార్తె కుమార్తె అర్చన కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. -
‘మామిడి కొనాల మీన’తో ట్రెండ్ సృష్టిస్తున్న నాగవ్వ
సాక్షి, కరీంనగర్ డెస్క్: యక్షగానంతో ఆమె ప్రస్థానం ప్రారంభించింది. నాన్న పాటలను కైకట్టి నేర్చుకుంది. చదువుకోకున్నా జానపదాన్ని ఒంట పట్టించుకుంది. పంటపొలాల సాక్షిగా తన పాటలను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘తిరుపతి రెడ్డి’ అంటూ మొదలు పెట్టి ‘మోహన లా లి’ పాటతో పాపులర్ అ య్యింది. మంగ్లీతో జతకట్టి ‘బాయిలోనే బల్లి పలికే’ పాటతో వరల్డ్ ఫేమస్ కాగా.. ఇటీవల విడుదలైన ‘మామిడి కొనాల మీన’ పాటతో యూట్యూబ్లో ట్రెండింగ్ సృష్టిస్తోంది జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం గుల్లకోటకు చెందిన నాగవ్వ. యక్షగానంతో ప్రారంభమై..తల్లిగారి ఊరైన అంబారిపేటలో యక్షగానంతో నాగవ్వ పాట ప్రారంభమైంది. తండ్రి యక్షగానం వింటూ పెరగడంతో పాటు తనూ బతుకమ్మ పాటలు, జానపదాలు, కాముని పాటలు పాడేది. పెళ్లి తరువాత అత్తగారిల్లు గుల్లకోటకు వచ్చాక కూడా పాటను మర్చిపోలేదు. తన భర్త భజన పాటలు పాడుతూ.. నాగవ్వను కూడా గొంతు బాగుంటుందని ప్రోత్సహించడంతో పాటు కొడుకులిద్దరూ కలిసి ‘సీఎంఎస్ చానెల్’ పెట్టి జానపదాలు పాడించారు. అలా తను తొలిపాట ‘తిరుపతి రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకొచి్చంది. ‘మోహనలాలి’ పాటతో మరింత దగ్గరైంది. ‘సారంగదరియా షో’లో మూడు ఎపిసోడ్లలో పాల్గొంది. మంగ్లీతో కలిసి ‘కొప్పులోని పువ్వమ్మ బాయికాడి బతుకమ్మ’ పాట పడింది. తరువాత ‘బాయిలోనే బల్లి పలికే’ పాట ప్రపంచాన్ని ఊర్రూతలూగించింది. లక్షల్లో వ్యూస్ సంపాదించింది. ఇటీవల విడుదలైన ‘మామిడి కొనాల మీన’ పాట సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ.. వ్యూస్లో లక్షల్లో దూసుకెళ్తుంది. తనకు గుర్తింపు రావడానికి తన కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉందని నాగవ్వ చెబుతోంది. ముఖ్యంగా కొడుకులిద్దరూ తాను పాడడాన్ని ఎంతో ప్రోత్సహిస్తారని వివరించింది. క్యాష్లెస్ లావాదేవీల్లో ‘నిర్మల’యైటింక్లయిన్కాలనీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు డిజిటల్ చెల్లింపులపై రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ అల్లూరు గ్రామానికి చెందిన చిరు కిరాణా వ్యాపారి బాలసాని నిర్మల శ్రద్ధపెట్టారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించి, అత్యధికంగా రూ.5,340 క్యాష్ బ్యాక్ పొంది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె దృఢసంకల్పానికి అబ్బురపడిన కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి 26 గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. నిర్మల తన భర్త బాలసాని రవికుమార్ గౌడ్తో కలిసి ఢిల్లీలోని గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ చేతుల మీదుగా సత్కారం పొందారు.స్వనిధి రుణంతో నవచైతన్యంనిర్మల నవ చైతన్యం–2020లో సీఎం స్వనిధి పథకంలో తొలి విడతగా రూ.10వేలు రుణం పొంది ఇంట్లో కిరాణం ప్రారంభించారు. క్రమం తప్పకుండా రుణ వాయిదాలు డిజిటల్ రూపంలో చెల్లించడంతో ప్రభుత్వం రెండో విడతగా రూ.20 వేలు మంజూరు చేసింది. ఆ మొత్తంతో కిరాణంతో పాటు చీరల వ్యాపారం, కుట్టు మిషన్, మగ్గంవర్క్ ప్రారంభించి సక్సెస్ అయ్యారు. మూడోవిడత రూ.50వేలు రుణం పొంది ఆదర్శంగా నిలిచారు. -
కౌన్సిల్ హాల్ ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే పునరుద్ధరించిన అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన మండలి భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు( ఆదివారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగా పునరుద్ధరించిన భవనాన్ని పరిశీలించారు. అసెంబ్లీ సమావేశాలు నూతన భవనంలోనే జరపనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్లతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. కాగా తెలంగాణ చారిత్రక వారసత్వానికి చిహ్నంగా ఉన్న శాసనమండలి భవనాన్ని అధునాతన వసతులతో తీర్చిదిద్దారు. ఈ భవనంలో అధునాతన, సౌండ్ లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలిలో 40 మంది సభ్యులు ఉండగా, 50 మంది కూర్చునేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీంతోపాటు ముఖ్యమంత్రి, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వైస్చైర్మన్, చీఫ్ విప్, కార్యదర్శి, మంత్రులు, సభ్యుల కోసం ప్రత్యేక లాంజ్లు సిద్ధం చేశారు. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని అధునాతన డిజిటల్ టెక్నాలజీతో సీటింగ్ ఏర్పాట్లు చేశారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 08-15)
-
ఎస్సై గల్లా పట్టిన వ్యక్తిపై కేసు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: విధుల్లో ఉన్న ఎస్సై గల్లా పట్టి దాడి చేసిన ఘటనపై కరీంనగర్ పోలీసులు స్పందించారు. ఘటనపై ‘సాక్షి’లో శనివారం ‘ఖద్దర్నాక్’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ వార్తపై డీజీపీ కార్యాలయం స్పందించింది. ఉన్నతాధికారులు శనివారం ఉదయమే సీపీ గౌస్ ఆలంతో ఆరా తీశారు. అనంతరం ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై గల్లా పట్టుకుని చేతులతో దాడిచేస్తే, విధులకు ఆటంకం కలిగించాడని కేసు నమోదు చేయడం విడ్దూరం.‘ఖద్దర్నాక్’ఆ రోజు ఏం జరిగిందంటే?తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలో ఈ నెల 4వ తేదీన సాయంత్రం 6.50 గంటలకు జాతర సందర్భంగా విధుల్లో ఉన్న గన్నేరువరం ఎస్సై నరేందర్రెడ్డిపై చెన్నబోయిన రమేశ్ అనే వ్యక్తి గల్లా పట్టి దాడి చేశాడు. పోలీసులు అతడిని పోలీసు స్టేషన్కు తరలించారు. పరీక్షించగా.. తాగినట్లు గుర్తించారు. అదే సమయంలో అధికార పార్టీ నేతను స్టేషన్కు ఎలా తీసుకెళ్తారు? అంటూ రాజకీయ ఒత్తిడి మొదలైంది. దీంతో తిమ్మాపూర్ సర్కిల్, సీపీ కార్యాలయం ఉన్నతాధికారులు ఈ ఘటన విషయంలో చేతులెత్తేశారు. సాక్షాత్తూ సీసీ కెమెరా ఫుటేజీ ఉన్నా.. కేసు నమోదు చేయలేదు. సాక్షాత్తూ పోలీసులపై సామాన్యుడు దాడి చేసినా ప్రతిఘటించలేని స్థితికి చేరుకున్నామని వాపోయారు.దాడి చేస్తే.. విధులకు ఆటంకం కేసేంటి?ఘటనను సాక్షిలో శనివారం ‘ఖద్దర్’నాక్ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. కరీంనగర్ పోలీసులతో మాట్లాడారు. స్పందించిన సీపీ అదే సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేశారు. ఇది కేవలం తూతూ మంత్రపు కేసు కావడం మరో చర్చకు దారితీస్తోంది. ఎస్సై గల్లా పట్టుకుని, చేతులతో కొడితే.. ఆయనపై దాడి కేసు పెట్టకుండా కేవలం విధులకు ఆటంకం కలిగించాడని కేసు పెట్టడం.. ఉన్నతాధికారులు తలొగ్గిన తీరుకు నిదర్శనమని కిందిస్థాయి పోలీసులు విమర్శిస్తున్నారు. ఘటన జరిగినా ఉన్నతాధికారులు దాన్ని తొక్కిపెట్టడం, మీడియా ఎత్తిచూపితే తప్ప కేసు నమోదు చేసుకోలేని దయనీయ స్థితి ఎదురవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్ ల్లో మాదిరిగానే సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ పార్కింగ్ ఫీజు వసూలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ 2021, జూలై 20న జారీ చేసిన జీవో 121పై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. తెలంగాణ మున్సిపల్ చట్టం–2019 ప్రకారం వాణిజ్య భవనాల్లో పార్కింగ్ ఉచితం. దీనికి విరుద్ధంగా జీవో 121 జారీ చేశారంటూ న్యాయ విద్యార్థి ప్రేమ్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. థియేటర్లో తన నుంచి వసూలు చేసిన పార్కింగ్ ఫీజు రశీదును జత చేశారు. పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలును తాత్కాలికంగా నిలిపివేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది. -
పెంచలేక ముగ్గురు పిల్లల్ని చెరువులోకి తోసేసిన తండ్రి
సాక్షి,కామారెడ్డి: ముగ్గురు చిన్నారుల అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. పెంచలేక తన కుమార్తెలను చెరువులోకి తోసేసినట్లు తండ్రి ఇస్మాయిల్ అంగీకరించాడు.పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి ఆర్బీ నగర్కు చెందిన ఇస్మాయిల్,షబీనా దంపతులు. వారికి షీపత్(8), ఆయత్ (7), మరియం(5) కుమార్తెలు. ఇస్మాయిల్ ఆటో నడుపుతుండగా.. షబీనా కూలి పనులకు వెళ్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. అయితే, ఇటీవల ఇస్మాయిల్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రూ.5లక్షలకు పైగా అప్పులు ఉన్నాయి. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు.. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి, మరోవైపు పిల్లల్ని పెంచడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఇస్మాయిల్ దారుణానికి ఒడిగట్టాడు. పిల్లల్ని పెంచలేక స్థానిక చెరువులో తోసేశాడు. ప్రాణాలు పోయాయా? లేవా? అని నిర్ధారించుకునేందుకు అరగంట సేపు అక్కడే ఉన్నాడు.పిల్లల అదృశ్యంపై ఇస్మాయిల్ భార్య షబీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. అనుమానిత ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. తండ్రి ఇస్మాయిల్ను సైతం ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తులో తండ్రి ఇస్మాయిల్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. విచారణలో కుమార్తెలను తాను ప్రాణం తీసినట్లు అంగీకరించాడు. చెరువులో నుంచి పిల్లల్ని వెలికి తీశారు. -
గ్రేప్ ‘పండు’గ ప్రారంభం
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్లోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలోని గ్రేప్ ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. ప్రజలు నేరుగా తోటల్లోకి వెళ్లి స్వయంగా పరిశీలించి కట్ చేసుకొని కొనుగోలు చేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ హారి్టకల్చర్ వర్సిటీ ప్రాంగణంలోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలో ఈ వెసులుబాటు ఉంది.52 రకాల ద్రాక్ష చెట్ల నుంచి ఇష్టమైన పండ్లు కోసుకోవచ్చు. ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ క్షేత్రానికి సందర్శకులు రావచ్చని నిర్వాహకులు వెల్లడించారు. రకాన్ని బట్టి రూ.250 నుంచి 700 ధర నిర్ణయించారు. కార్యక్రమంలో పరిశోధన కేంద్రం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రమ్య మృతి కేసు నిందితుడికి రెడ్కార్నర్ నోటీసు
హైదరాబాద్: ఏడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి, మరో ఇద్దరు మృతికి కారణమైన నిందితుడికి బంజారాహిల్స్ పోలీసులు రెడ్కార్నర్ నోటీసు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే... 2016 జూలై ఒకటిన రమ్య(9) అనే విద్యారి్థనిని పాఠశాల నుంచి తీసుకొని ఆమె బాబాయి పి.రాజేష్, తాత మధుసూదనాచారిలు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–3 నాగార్జున సర్కిల్ నుంచి బంజారాహిల్స్ వైపు కారులో వెళ్తున్నారు. అదే సమయంలో సినీమ్యాక్స్ భవనంలోని టీజీఐ ఫ్రైడ్ పబ్లో అతిగా మద్యం తాగిన ఆర్.శ్రావిల్, కచ్చా విష్ణువినీత్ల కారు బంజారాహిల్స్ నుంచి నాగార్జున సర్కిల్ పంజగుట్ట వైపు అతివేగంగా దూసుకువచ్చింది. శ్రావిల్ నడుపుతున్న ఈ కారు అదుపుతప్పి పంజగుట్ట శ్మశానవాటిక సమీపంలోని డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపు రమ్య ఉన్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో రమ్య, మధుసూదనాచారి, రాజేష్లు మృతి చెందారు. ఈ మేరకు ఏ1 శ్రావిల్, ఏ2 విష్ణువినీత్లపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు నడుస్తుండగానే విష్ణువినీత్ అమెరికా వెళ్లాడు. ఈ నెల 17న నాంపల్లి సెషన్స్ కోర్టులో ఈ కేసు వాయిదా ఉండటంతో పోలీసులు సాక్షుల విచారణ చేపట్టారు. నిందితులను కూడా హాజరుపర్చేందుకుగాను అమెరికా నుంచి విష్ణువినీత్ను రప్పించేందుకు రెడ్కార్నర్ నోటీసు జారీ చేశారు. -
పండ్ల రవాణాపై గల్ఫ్ గుబులు
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భాగ్యనగరం పండ్ల మార్కెట్పై పడింది. అరబ్బు దేశాల్లో కార్గో రవాణాపై ఆంక్షల నేపథ్యంలో పండ్లు, ఇంటీరియర్, ఫర్నిచర్ వంటి వస్తువులపై ప్రభావం పడింది. దీంతో ఇరాన్, దుబాయ్, టర్కీ, తుర్కియో వంటి దేశాల నుంచి నుంచి హైదరాబాద్కు దిగుమతి అయ్యే యాపిల్స్, కివీ, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ విదేశీ పండ్ల దిగుమతి తగ్గింది. వీటితో పాటు ఇంటీరియర్ ఫర్నిచర్లపై ప్రభావం ఉంది. రెండింతలైన ధరలు.. రంజాన్ మాసం కావడంతో సాధారణంగానే ఖర్జూరం, బాదం వంటి డ్రై ఫ్రూట్స్కు డిమాండ్ ఎక్కువ. పశి్చమాసియాలో యుద్ధంతో ధరలు దాదాపు రెండింతలు పెరిగాయి. సాధారణంగా అక్కడి మార్కెట్లో యాపిల్స్ ధర (బాక్స్) రూ.1,200 ఉంటుంది. అదే బాక్స్ నగర మార్కెట్లో దిగుమతి అయ్యాక రూ.1,800కు విక్రయిస్తుంటారు. కానీ, యుద్ధం నేపథ్యంలో అదే బాక్స్ ధర అక్కడి మార్కెట్లో రూ.1,800 ఉండగా.. ఇక్కడికొచ్చేసరికి రూ.2,500కు పెరిగింది. నిర్మాణ సామగ్రిపైనా.. ఇంధన, చమురు దిగుమతులతో పాటు స్థిరాస్తి మార్కెట్ కూడా ప్రభావం చూపిస్తుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. సౌదీ అరేబియా, యూఏఈ నుంచి ఇనుము, స్టీల్, కాపర్ వైర్లు దిగుమతి అవుతుంటాయి. గల్ఫ్ దేశాల నుంచి పెట్కోక్ (సిమెంట్లో ఉపయోగించేవి), పాలిమర్లు, సల్ఫర్,, సున్పపురాయి దిగుమతి అవుతాయి. ఈ ముడి పదార్థాలతో ఇంటీరియర్, నిర్మాణ సామగ్రి తయారవుతుంటాయి. మార్బుల్స్, టైల్స్, గ్లాస్ వంటివి దిగుమతులపై ప్రభావం ఉంటుంది. ఈ మేరకు తుది దశ నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో పాటు ధరలలో 1–2 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం
సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల ఉద్రిక్తతల ప్రభావం మహా నగరంలోని వాణిజ్య వంట గది వరకూ చేరాయి. గృహాపయోగ వంటగది అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అత్యవసర ఆదేశాలు తాజాగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్నతరహా పరిశ్రమలపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ , 1955 కింద చమురు సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్లోని ప్రధాన గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్లలో వాణిజ్య సిలిండర్ల లోడింగ్ను తాత్కాలికంగా నిలిచిపోయి గ్యాస్ కొరతను సృష్టిస్తోంది. హోటళ్లు – రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం నగరంలోని ఫుడ్ ఇండస్ట్రీపై గ్యాస్ ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ సుమారు 70 నుంచి 80 వేలకుపైగా హోటళ్లు, రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు వాణిజ్య గ్యాస్ వినియోగంపైనే ఆధారపడి ఉన్నాయి. డిమాండ్కు సరిపడా సిలిండర్లు సరఫరా కాకపోతుండటంతో డీలర్లు చేతులెత్తేస్తున్నారు. వంటగ్యాస్ ఒక్కసారిగా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ధరలు పెరగగా, మరింత పెరుగుతాయనే ఆశతో కొందరు వ్యాపారులు నిల్వలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ శాతం హోటళ్లు, బిర్యానీ పాయింట్లు వాణిజ్య గ్యాస్పైనే ఆధారపడి ఉన్నాయి. చిన్నపాటి తోపుడు బండ్లు, ఫంక్షన్ల ఆర్డర్లు తీసుకునే క్యాటరర్లు సిలిండర్ల కోసం డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గడంతో, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సి వస్తోందని హోటల్ యజమానులు వాపోతున్నారు. రోజువారీ గ్యాస్ వినియోగం రాష్ట్ర వ్యాప్తంగా నెలకు సగటున 7 నుండి 7.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు (19 కేజీలు) అవసరమవుతుండగా, ఇందులో దాదాపు 50 – 60 శాతం వాటా కాగా.. ఒక్క గ్రేటర్ పరిధిలో ప్రతిరోజూ సుమారు 12,000– 15,000 కమర్షియల్ సిలిండర్లు అవసరమవుతాయని అంచనా ఒక మధ్యస్థ రెస్టారెంట్కు రోజుకు 2 నుండి 5 సిలిండర్లు అవసరమైతే, పెద్ద హోటళ్లకు 10 కి పైగా అవసరమవుతాయి. చిన్న టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు రోజుకు సగటున ఒక చిన్న, సగం పెద్ద సిలిండర్ను వినియోగిస్తాయి. కేంద్ర ప్రభుత్వం గహ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, కమర్షియల్ సరఫరాపై తాత్కాలిక ఆంక్షలు విధించడంతో హోటల్ యజమానులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద సాధారణంగా 2–3 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉంటాయి. సరఫరాలో జాప్యం జరిగితే హోటల్ రంగం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. సిలిండర్ల కోసం ‘పానిక్ బుకింగ్’ మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమైతే ముడి చమురు సరఫరా నిలిచిపోతుందని, తద్వారా గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ భయంతో సామాన్య ప్రజలు తమకు అవసరం లేకున్నా ముందస్తుగా సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు. -
వంటకు యుద్ధం మంట
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటింటిపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ (ఎలీ్పజీ), కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచింది. ఎల్పీజీ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.114.50 పెంచింది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.853 నుంచి రూ.913కు పెరిగింది. రాష్ట్రంలో ఇదే సిలిండర్ ధర రూ. 905 నుంచి 965కు చేరుకుందని ఆయిల్ కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రవాణా ఖర్చులను బట్టి మారనుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ ధరల పెంపు గృహ బడ్జెట్పై మరింత ఒత్తిడి పెంచనుంది. కమర్షియల్ గ్యాస్ ధరలు భారీగా పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు ఉపయోగించే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను కేంద్రం ఏకంగా రూ.114.50 పెంచింది. దీంతో ఢిల్లీలో ధర రూ.1,883కు చేరగా, హైదరాబాద్లో సుమారు రూ.2వేల వరకు ఉండే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మార్చి 1న కమర్షియల్ సిలిండర్పై రూ.28 పెంచారు. తాజా పెంపుతో ఈ ఏడాది ప్రారంభం నుంచి కమర్షియల్ సిలిండర్ ధర మొత్తం రూ.300కు పైగా పెరిగినట్లయింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ సెంటర్ల నిర్వహణ ఖర్చులు పెరగనున్నాయి. ఫలితంగా టీ నుంచి భోజనం వరకు, ఇతర అన్ని తినుబండారాల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్ల వ్యాపారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.‘మహాలక్ష్మి’కి ఊరట? తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద 42.90 లక్షల కుటుంబాలకు రూ.500 సబ్సిడీ కింద ఏటా ఆరు సిలిండర్లను ప్రభుత్వం పేదలకు అందిస్తోంది. అయితే పెరిగిన ధరలను ప్రభుత్వం భరిస్తుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ఈ పథకం కింద ఏడాదికి రూ. 740 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. పెరిగిన ధర కూడా ప్రభుత్వం భరించే పక్షంలో ఖజానాపై ఈ భారం మరింత పెరుగుతుంది. కాగా, ప్రస్తుతం పెట్రో ల్, డీజిల్ ధరలను పెంచే యోచన లేదని కేంద్రంచెబుతున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఎక్కువకాలం అధికంగా కొనసాగితే వాటి ధరల పెంపు తప్పదని విశ్లేషకులు అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. -
మహిళల భద్రత అందరి బాధ్యత
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని.. సమాజంలోని అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణను దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత రాష్ట్రంగా మార్చడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సొంత కుటుంబ సభ్యులకు ఎక్కడైనా వేధింపులు ఎదురైతే ఎలా స్పందిస్తామో ఇతర ఆడపిల్లల విషయంలోనూ యువత అలాగే స్పందించాలని.. మహిళా రక్షణ అంబాసిడర్లు కావాలని సూచించారు. మహిళలకు అండగా ఉన్న వారికే సమాజంలో మర్యాద ఉంటుందని, అదే ఉద్దేశంతో తెలంగాణ పోలీస్శాఖ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ‘స్టాండ్ విత్ హర్’కార్యక్రమాన్ని ప్రారంభించిందని సీఎం రేవంత్ చెప్పారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘స్టాండ్ విత్ హర్’కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీ హీరో సాయిదుర్గతేజ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, డీజీపీ బి.శివధర్రెడ్డి, సీఐడీ చీఫ్ చారుసిన్హా సహా మహిళా పోలీస్ అధికారులు, ఐఏఎస్ అధికారులతో కలిసి ‘స్టాండ్ విత్ హర్’బ్రోచర్ను సీఎం ఆవిష్కరించారు. డిజిటల్ క్రైం పెరిగింది.. ‘రాష్ట్రంలోని మహిళలకు సంపూర్ణమైన రక్షణ కలి్పంచామని ఎవరైనా భావిస్తే అది అసంపూర్తి రక్షణే అని భావిస్తున్నా. గతంలో కొన్ని ప్రాంతాల్లోనో, బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు వేధింపులు ఎదురయ్యేవి. కానీ ఈ రోజుల్లో ఫిజికల్ క్రైమ్ కంటే ఆన్లైన్ క్రైమ్ పెరిగిపోయింది. మహిళలను వేధించేందుకు కొందరు డీప్ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. వాటిని నియంత్రించడానికి తెలంగాణ సైబర్ క్రైం విభాగాన్ని కూడా పటిష్టం చేశాం. మనల్ని మనం సవరించుకొని మహిళలపట్ల మన బాధ్యతల్ని మనం నెరవేర్చాల్సిన సందర్భం వచ్చింది. మహిళల శక్తిసామర్థ్యాలపట్ల మా ప్రభుత్వానికి బలమైన నమ్మకం ఉంది. అందుకే రాష్ట్ర పోలీస్ శాఖలోని కీలక విభాగాలకు, ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖలకు మహిళలనే అధికారిణులుగా నియమించాం.ఆడబిడ్డలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతమైతేనే ఆ రాష్ట్రం లేదా దేశం పురోగతి సాధిస్తుంది’అని సీఎం రేవంత్ చెప్పారు. సాయిదుర్గ తేజ్ మాట్లాడుతూ సొంత తల్లిని ఎలా గౌరవిస్తామో..అదేవిధంగా ప్రతి మహిళను గౌరవించాలని సూచించారు. బైక్పై వెళ్లే సమయంలో హెల్మెట్ పెట్టుకోవడం మరవొద్దని సూచించారు. డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారతతోపాటు భద్రత కూడా సామాజిక బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలవాలన్నారు. మహిళా భద్రతపై పురుషుల్లో మరింత అవగాహన పెంచేలా స్టాండ్ విత్ హర్ ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్లు సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా పేర్కొన్నారు. -
ప్రజలు మెచ్చిన చిత్రాలకే పట్టం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025’ లో ప్రజలు మెచ్చిన సినిమాలకు పట్టం కట్టారు. అలాగే తొలి, ద్వితీయ, తృతీయ అవార్డులు దక్కించుకున్న చిత్రాలు స్వచ్ఛమైన పల్లె కథలతో రూపొందినవి కావడం విశేషం. ప్రధాన విభాగాల్లో అవార్డులు పొందినవాటిలో ఎక్కువగా చిన్న చిత్రాలు ఉండటం విశేషం. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికెట్ పొందిన చిత్రాలకు, షార్ట్ ఫిల్మ్లకు ఈ అవార్డులు ప్రకటించారు. శనివారం ప్రకటించిన ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025’లో ఉత్తమ చిత్రాలుగా నిలిచిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ (తొలి స్థానం), ‘దండోరా’ (ద్వితీయ చిత్రం), ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ (తృతీయ చిత్రం) వంటివన్నీ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కినవే. వీటితో పాటు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సినిమాలకు, అద్భుతమైన ప్రతిభ కనబరచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా అవార్డులను ప్రకటించారు. ఈ నెల 19న ఈ పురస్కారాల ప్రదానం హైదరాబాద్లో జరగనుంది. అవార్డు విజేతల్లో పలువురు ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఈ విధంగా...అవార్డు వస్తుందని అంచనా వేశాను‘కార్తికేయ 2’ సినిమాకి అవార్డులు వస్తాయని ఊహించలేదు. కానీ, తెలంగాణ రాష్ట్ర గద్దర్ అవార్డు నుంచి నేషనల్ అవార్డు వరకు కవర్ చేసింది. ‘తండేల్’ విషయంలో నాగచైతన్యకి అవార్డు వస్తుందని అంచనా వేశాను. ఎందుకంటే ఈ సినిమా కోసం ఆయన పడినది అతి కష్టం... అంటే ఫిజికల్లీ అన్నమాట. మేము షూటింగ్ చేసినప్పుడు ఉన్న క్లైమాటిక్ కండిషన్స్కి సముద్రం మధ్యలోకి వెళ్లడం అంటే సాహసమే. బోట్స్లో వెళుతున్నప్పుడు ఆ అలలు, ఆ పరిసరాల వల్ల వెళ్లేటప్పుడు... వచ్చేటప్పుడు వాంతులే. వాటిని, ఎండని నాగచైతన్య లెక్క చేయకుండా సినిమా చేశారు. షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ సినిమాకి కచ్చితంగా యూనివర్సల్ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని నాకు అనిపించింది.ఒక సినిమా హిట్ కావాలని ఎలా కోరుకుంటామో... అలానే అవార్డు రావాలనీ కోరుకుంటాం. అవార్డు విషయం తెలిసిన తర్వాత నేను ఫోన్ చేద్దామనుకునేలోపు చైతన్యగారే చేసి, మాట్లాడారు. ‘మనకి అభినందనలు.. థ్యాంక్స్ చందు’ అన్నారు. నాగార్జునగారు కూడా ఫోన్ చేశారు. కథ, కథనంతో పాటు హీరోని డిజైన్ చేసిన విధానం అద్భుతం అన్నారాయన.ఇప్పుడు చైతన్యగారు అఫీషియల్గా బెస్ట్ యాక్టర్ అవడం హ్యాపీ. నిజానికి అల్లు అరవింద్, బన్నీ వాసుగార్లు, నేను ‘తండేల్’ చేద్దామనుకున్నప్పుడు ఫిషర్ మేన్ పాత్ర కోసం నాగచైతన్య అనే ఆలోచన మాకు అప్పటికి లేదు. కానీ, ఈ కథ గురించి తెలుసుకున్న ఆయన.. నేను చేస్తాను అని వచ్చారు. ‘తండేల్’ చిత్రం మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా చేరువ కావడం సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మా సినిమా గద్దర్ అవార్డుకి ఎంపిక కావడం అనేది హ్యాపీ. దేవుడికి థ్యాంక్స్.– ‘తండేల్’ చిత్రదర్శకుడు చందు మొండేటిచైతూకు అవార్డు రావడం ఆనందం: నాగార్జునగద్దర్ అవార్డుల విజేతలందరికీ శుభాకాంక్షలు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుగ్రహీత, మా నాన్నగారు పేరిట ఏయన్నార్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు ఇది నిజమైన నివాళి. ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కగార్లకు ధన్యవాదాలు. అలాగే జయసుధగారికి ఈ ఏడాది ఏయన్నార్ అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఆమె ఇందుకు అర్హురాలు. ఎన్టీఆర్ అవార్డు పురస్కారానికి ఎంపికైన చిరంజీవిగారికి శుభాకాంక్షలు. ‘తండేల్’ సినిమాలోని నటనకు గాను చైతూకు ఉత్తమ నటుడిగా అవార్డు రావడం సంతోషంగా ఉంది. దుళ్ల కొట్టావ్ నాన్న (నాగచైతన్యను ఉద్దేశించి...).అరుదైన గౌరవంగా భావిస్తున్నానునాకు ఈ అవార్డు రావడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ఇప్పుడు నా పేరు ప్రస్తావనకు వస్తే, నేను పాడిన పాటలను ప్రేక్షకులు వెంటనే జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. అవార్డులు మనకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మాది నిజామాబాద్. భువనగిరిలో నా స్కూలింగ్ జరిగింది. వరంగల్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా (‘రాజు వెడ్స్ రాంబాయి’) కథనం సాగుతుంది. దీంతో తెలంగాణ యాస కోసం నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు.మేం (ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, ఈ పాట రచయిత మిట్టపల్లి శ్రీధర్, దర్శకుడు సాయిలు) కలిసి పని చేసుకునే ప్రాసెస్లో మేం క్రియేట్ చేసిన పాట ఇది (రాంబాయి నీ మీద నాకు .. పాటను ఉద్దేశించి..). మా టీమ్ అంతా సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం. మా కష్టానికి అవార్డుల రూపంలో ఫలితం లభించిందని అనుకుంటున్నాను. ఉత్తమ నేపథ్య గాయకుడిగా నాకు ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు అవార్డు వచ్చినా, ఇంకా అవార్డులు సాధించిన ‘దండోరా’, ‘ది గర్ల్ఫ్రెండ్’, ‘కోర్టు’, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాల్లో నేను భాగమై ఉన్నాను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను జాగ్రత్తగా పని చేసుకుంటూ వెళ్తుంటాను. – ఉత్తమ గాయకుడు అనురాగ్ కులకర్ణినా మనసుకి దగ్గరైన క్యారెక్టర్‘ది గర్ల్ఫ్రెండ్’ సినిమాకు గాను ఉత్తమ నటిగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. భూమా దేవి (‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో రష్మిక మందన్నా పాత్ర పేరు) నా మనసుకు ఎంతో దగ్గరైన పాత్ర. దర్శకుడు రాహుల్, గీతా ఆర్ట్స్, నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్యా అక్క... ఇలా ఈ టీమ్ అందరికీ కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిగార్లకు థ్యాంక్స్. – ఉత్తమ నటి రష్మికా మందన్నామా నాన్న ఎమోషనల్ అయ్యారు‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా చేయాలనుకున్నప్పుడు నేను ఏదీ ఆశించలేదు... నా మనసులో ఉన్నది ఒక్కటే... ‘ఈ సినిమా బాగా ఆడితే చాలు’. అది నెరవేరింది. నవంబరు 20న (2025) ఈ సినిమా ప్రీమియర్స్ వేశాం. చూసినవాళ్లందరూ బాగుందని మెచ్చుకున్నారు. ఆ రోజుని నేనెప్పటికీ మరచిపోలేను. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా అని భయపడ్డాను. 21న విడుదలైంది... అందరికీ నచ్చిందనే టాక్ వచ్చింది. లైఫ్లో మరచిపోలేను రోజు అది. ఇక అవార్డు రావడం అనేది షాకింగ్గా ఉంది. బలమైన కథతో నిజాయతీగా ఒక మంచి సినిమా తీయాలనే పట్టుదలతో చేస్తే, కచ్చితంగా ప్రశంసలు వస్తాయనే నమ్మకం ఏర్పడింది.మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న ఎంతో కష్టపడి చదివించారు... మేం కూడా బాగా చదువుకున్నాం. ఘోరమైన కష్టాలు చూశాం. అయినప్పటికీ సినిమాలంటే నాకున్న ఇష్టాన్ని నా తల్లిదండ్రులు కాదనలేదు. ఇవాళ నాతో పాటు, మా సినిమాకి వచ్చిన అవార్డుల గురించి వినగానే మా నాన్న ఎమోషనల్ అయ్యారు... ఏడ్చేశారు. మా అమ్మ, నా ఇతర కుటుంబ సభ్యుల సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. నా భార్య, నా కొడుకు ఈ అవార్డు గురించి విని, ఆనందపడ్డారు. ఇదంతా ఆ దేవుడి దయ. – ఉత్తమ దర్శకుడు సాయిలు కంపాటిఎన్టీఆర్ అవార్డు రావడం గౌరవం: చిరంజీవితెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2025 విజేతలందరికీ శుభాకాంక్షలు. మన సినీ పరిశ్రమలోని వారి కష్టాన్ని సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంటుంది. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుతో నన్ను గౌరవించిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కగార్లతో పాటు జ్యూరీ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఎన్టీఆర్గారి పేరుపై ఓ అవార్డు నెలకొల్పటం, ఆ అవార్డు నాకు రావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. నా ప్రయాణంలో నాకు సపోర్ట్గా నిలుస్తున్న వారందరి ప్రేమే నా బలం.అవార్డులు వస్తే ఆ కిక్కే వేరు‘దండోరా’ సినిమాకు మూడు విభాగాల్లో (ఉత్తమ ద్వితీయ చిత్రం, సపోర్టింగ్ యాక్టర్, సంగీత దర్శకుడు) అవార్డులు రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడం మంచి మోటివేషన్గా అనిపించింది. నా నెక్ట్స్ సినిమా కోసం మరింత బాధ్యతగా పని చేస్తాను. ఈసారి ఉత్తమ (తొలి) చిత్రం అవార్డు దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తాను. ‘దండోరా’లాంటి కథను ప్రేక్షకులకు చెబితే నాకు గుర్తింపు వస్తుందని నమ్మాను. రిస్కీ ప్రాజెక్ట్గా అనుకోలేదు. ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశాను. ఈ తరహా సినిమాలు తెలుగులో తక్కువగా వస్తుంటాయి.సామాజిక అంశాలు మిళితమై ఉన్న ఈ సినిమాను ఎంటర్టైనింగ్ వేలో చెబితే ప్రేక్షకులకు చేరువ అవుతుందని నమ్మాను. నేను చూసిన కొన్ని పరిస్థితులను కల్పిత కథగా అల్లుకుని, ఈ సినిమా చేశాను. ఇక ఉత్తమ సంగీత దర్శకుడిగా మార్క్ కె. రాబిన్కు అవార్డు రావడం సంతోషంగా ఉంది.ఎందుకంటే ఓ దశలో ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఆయన ఈ సినిమా కోసం వర్క్ చేశారు. మన సినిమా ద్వారా మన గురించి ప్రేక్షకులకు తెలియడం, మన కష్టాన్ని జ్యూరీ గుర్తించడం... ఇలా అవార్డులు వస్తే ఆ కిక్ వేరుగా ఉంటుంది. అలాగే ఎన్టీఆర్గారు మా ‘దండోరా’ సినిమాను ప్రశించడం మర్చిపోలేను. గద్దర్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీకి ధన్యవాదాలు. – ‘దండోరా’ చిత్రదర్శకుడు మురళీకాంత్నా తర్వాతి చిత్రాలకు ఓ బలం మా సినిమాకి అవార్డు రావడం మా కష్టానికి తగిన ఫలితంతో పాటు ప్రోత్సాహకంగా భావిస్తున్నాను. నా తర్వాతి చిత్రాలకు ఓ బలంలా అనిపిస్తోంది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రకథ రాసినప్పట్నుంచి ఇప్పటివరకు అవార్డు వస్తుందని ఊహించలేదు. ఇది నాకో సర్ప్రైజ్లా ఉంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. తొలి సినిమాకే అవార్డు అందుకోనుండటంతో నాతో పాటు నా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నారు. ‘మా వాడి కష్టానికి తగిన ఫలితంతో పాటు అవార్డు రూపంలో మంచి ప్రోత్సాహం లభించింది’ అని అందరూ హ్యాపీ.మా సినిమా అవార్డుకి ఎంపిక కావడంతో యూనిట్ ఫుల్ హ్యాపీ. నేను, తిరువీర్గారు, నిర్మాతలు సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసినిగార్లు కలిసి ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. మా సినిమా కోసం పనిచేసిన దాదాపు 300 మంది యూనిట్ మెంబర్స్కి ఈ అవార్డుని అంకితం చేస్తున్నాను.– ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ ఇది నాకో కొత్త ఆరంభం ‘మిరాయ్’ అనుకున్నప్పుడు డైరెక్షన్ మాత్రమే చేయాలనుకున్నాను... డీవోపీ (ఛాయాగ్రాహకుడు) నేను కాదు. అనుకోని పరిస్థితుల్లో ఈ బాధ్యతను కూడా నిర్వర్తించాను. అనుకోకుండా ఈ కేటగిరీకి అవార్డు కూడా వచ్చింది. ఇలా టెక్నికల్గా హై స్టాండర్డ్స్లో ఉన్న సినిమాకి అవార్డు రావడం అంటే అది నిజంగా స్పెషల్ ఫీలింగ్. అయితే ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు షూటింగ్కి ముందు చాలా వర్క్ చేయడం అవసరం. అలా ప్రీ వర్క్కి ఎక్కువ టైమ్ కేటాయించడంతో షూటింగ్ సులువు అయింది. ఈ సినిమా కోసం పక్షులు క్రియేట్ చేశాం.ఒక డైరెక్టర్గా బర్డ్ ఎలా ఉండాలి? అని చెబితే ఒక కెమెరామేన్గా ఆ బర్డ్ కలర్, టెక్ట్స్ర్, సైజ్... అవన్నీ కెమెరాకి తగ్గట్టు ఎలా ఉండాలో డిజైనర్స్కి చె΄్పాలి. అయితే ‘మిరాయ్’కి నేను రైటర్, డైరెక్టర్, డీవోపీ కావడంవల్ల నాకు ఫుల్ క్లారిటీ ఉంటుంది కాబట్టి చెప్పి, చేయించుకున్నాను. మా సినిమా కథ హై టెక్నికల్ స్టాండర్డ్స్ని డిమాండ్ చేసింది. ఎంతో జాగ్రత్తగా చేశాం. టెక్నికల్ విభాగంలోనే రెండు అవార్డు (సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్)లు రావడం పట్ల నేను, మా నిర్మాతలు (టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్) చాలా హ్యాపీగా ఉన్నాం. నేనైతే ఈ అవార్డు నా కెరీర్కి ఒక కొత్త స్టార్ట్లా భావిస్తున్నాను. – ‘మిరాయ్’ డైరెక్టర్–సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని -
‘విజయ’ పేరుతో కల్తీ నెయ్యి
లాలాపేట: సహకార స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం విజయ డెయిరీ బ్రాండ్(ఏపీ)ను మేఘనా ఫుడ్స్ అనే ప్రైవేట్ సంస్థకు ఫ్రాంచైజీ అప్పజెప్పడంతో వారు వెజిటెబుల్ ఆయిల్స్తో నెయ్యి తయారు చేసి ఏపీ విజయ పేరుతో కల్తీ నెయ్యి విక్రయిస్తున్నారని తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) తెలంగాణ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. ఒక్క హైదరాబాద్లోనే నెలకు దాదాపు 100 టన్నుల కల్తీ నెయ్యి విక్రయిస్తూ విజయ బ్రాండ్కు చెడ్డపేరు తీసుకురావడంతోపాటు తెలంగాణ పాడి రైతాంగానికి తీవ్రమైన నష్టం కల్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెజిటెబుల్ ఆయిల్తో తయారు చేసిన నెయ్యిలో మోతాదుకు మించి హానికరమైన రసాయనాలు ఉన్నట్లు ఎన్డీడీబీ(నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) పరీక్షలు చేసి తేల్చిందని అమిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం లాలాపేటలోని విజయ భవన్లో ఎండీ చంద్రశేఖర్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాటాడారు. ఏపీ డెయిరీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్లో రైతుల నుంచి పాల సేకరణగానీ, పాల విక్రయం కానీ చేయడంలేదన్నారు. ప్రైవేట్ వ్యక్తులు గుజరాత్లో తయారు చేసిన నెయ్యిని ఏపీ విజయ డెయిరీ పేరుతో హైదరాబాద్లో విక్రయిస్తూ ఇక్కడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. రైతుల ద్వారా సేకరించిన పాలు, పాల పదార్థాల నాణ్యతకు మారుపేరుగా తెలంగాణ విజయ నిలుస్తోందన్నారు. ప్రభుత్వ రంగసంస్థ అయిన విజయ తెలంగాణ బ్రాండ్ విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విజయ పేరుతో ఎవరూ కల్తీ చేసినాఅడ్డుకుని తీరుతామన్నారు.అవసరమైతే రైతులు రోడ్డెక్కి పోరాటం చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పలు లేఖలు రాసామని, స్వయంగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా స్పందనలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం స్పందించి మేఘనా ఫుడ్స్కు ఇచ్చిన విజయ ఫ్రాంచైజీని విరమించుకోవాలని, లేదంటే తెలంగాణ సహకారంతో దాన్ని తామే అడ్డుకుంటామన్నారు. పాలు, పాల పదార్థాలు కొనేటప్పుడు నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ విజయ లోగోను చూసి మాత్రమే పాలు, నెయ్యి ఇతర పాల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి వినియోగదారులకు సూచించారు. -
ముందుగానే మండుతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం నడివేసవిని తలపిస్తోంది. సీజన్ ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగతలు నమోదు కావాల్సి ఉండగా... చాలాచోట్ల సాధారణం కంటే సుమారు 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు పొడి వాతావరణం, ఆకాశం నిర్మలంగా ఉండటం, మేఘాలు లేకపోవడం, గాలిలో తేమశాతం తగ్గడంతో వేడిమి అధికంగా ఉంది. ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉండాలి. కానీ 40 డిగ్రీలకు పైబడి నమోదవుతుండటం మున్ముందు పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఏప్రిల్లో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతుండటం కలవరపెడుతోంది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్నగర్లో 40.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. నల్లగొండ మినహా అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహబూబ్నగర్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.9 డిగ్రీలు అధికంగా నమోదు కాగా... ఆదిలాబాద్లో 2.8, భద్రాచలంలో 2.7, హనుమకొండలో 2.1 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజుల పాటు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థితిలోనే నమోదవుతున్నాయి. దీంతో సాయంత్రానికి వాతావరణం చల్లబడటంతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తోంది. శనివారం ఒడిశా పరిసర ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. ఇది తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా కర్ణాటక తీరం వరకు సముద్రమట్టం నుంచి సగటున 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోంది. వచ్చేవారం చివర్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. -
గణపతీ.. లొంగిపోండి
సాక్షి, హైదరాబాద్: ‘గణపతి.. ఆయుధాలు అప్పగించి లొంగిపోండి. తెలంగాణ ప్రభుత్వం మీ ప్రాణానికి రక్షణ కల్పిస్తుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా తెలంగాణ ప్రాంతం నుంచి అజ్ఞాతంలో ఉన్న ఏడుగురు జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం సూచించారు. హింసతో ఏ సమస్యా పరిష్కారం కాదని.. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిన గాం«దీజీ మార్గంలోనే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం స్పష్టం చేశారు. సాయుధ బలగాలైనా, మావోయిస్టులైనా దేశ పౌరులేనని.. ఎవరి ప్రాణానికీ నష్టం జరగొద్దన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు. తెలంగాణ గడ్డపై హింసకు తావులేదని చెప్పారు. మావోయిస్టు పారీ్టలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న మొత్తం 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లొంగిపోయారు. 124 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ బి.శివధర్రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్కుమార్, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ అనిల్కుమార్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ సుమతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. దేశ చరిత్రలోనే భారీ లొంగుబాటు.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకు కృషి చేసిన తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సుమతితోపాటు ఇతర అధికారులను అభినందించారు. ఆయుధాలు విడిచి లొంగిపోయే మావోయిస్టుల రక్షణ, ఆరోగ్య భద్రత, ఇతర పునరావాసం విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని వెల్లడించారు. అజా్ఙతంలో ఉన్న మావోయిస్టులంతా బయటికి వచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. అయితే మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడ ఉన్నారన్నది సమాచారం తమ వద్ద లేదన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేక కుటుంబ సభ్యలతో శాంతియుత జీవితం గడుపుతారా అనేది వారి ఇష్టమని సీఎం పేర్కొన్నారు. మంత్రి సీతక్క సహా ఎందరో మాజీ మావోయిస్టులు రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎవరైనా కాంగ్రెస్ పారీ్టలో చేరాలనుకుంటే గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ అందుబాటులో ఉంటారని చెప్పారు. చర్చలే పరిష్కారం.. ‘మహాత్మాగాంధీ శాంతియుత పోరాటంతో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టారు. ప్రపంచానికి శాంతిమార్గాన్ని చూపారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం. తెలంగాణ గడ్డపై హింస కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం సైతం శాంతియుత మార్గాన్నే అనుసరిస్తోంది. మావోయిస్టుల్లో ఇంకా అజ్ఞాతంలో ఉన్న వారికి సీఎంగా పిలుపునిస్తున్నా. అందరూ జనజీవన స్రవంతిలోకి రండి. తెలంగాణ ప్రభుత్వం మీతో చర్చించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ఉంది’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. లొంగిపోయేవారు ఆత్మగౌరవంతో బతికేలా సహకరిస్తాం.. ‘ఇటీవల లొంగిపోయిన దేవ్జీ, చంద్రన్న, సుజాతక్క, రాజిరెడ్డి సహా అందరూ నన్ను కలిసి ఎన్నో అంశాలపై మాట్లాడారు. అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇస్తే జైళ్లలో ఉన్న మావోయిస్టులతోపాటు అజా్ఙతంలో ఉన్న మావోయిస్టులతో చర్చించి సీపీఎం మావోయిస్టు పార్టీని రద్దు చేస్తామని ప్రతిపాదించారు. అయితే రాష్ట్ర స్థాయిలోని అంశాలను పరిష్కరిస్తామని.. నక్సలిజం జాతీయ సమస్య కాబట్టి కేంద్రంతో మాట్లాడతామని వారికి చెప్పాను. రివార్డుల మొత్తం పెంపు, ఇల్లు, వ్యవసాయ భూమి కేటాయింపు, వైద్య సాయం కోసం లొంగిపోయిన మావోయిస్టులు చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ ప్రభుత్వం తరఫున సానుకూలంగా ఉన్నాం. లొంగిపోయిన వారికి ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వడంతోపాటు నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తాం. రివార్డుల మొత్తాన్ని పెంచే విషయంలో ఉదారంగా వ్యవహరిస్తాం. పునరావాసం మెరుగ్గా అందించే అంశంపై సీఎస్, డీజీపీ, ఇతర అధికారులతో అధ్యయం చేసి వాటిని పెంచే ప్రయత్నం చేస్తాం. చట్ట పరిధిలో ఎత్తివేయడానికి అవకాశం ఉన్న కేసులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కోర్టు పరిధిలో ఉన్న కేసుల పరిష్కారానికి అవసరమైతే ఒక కమిటీని ఏర్పాటు చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. లొంగిపోయే వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతోపాటు ఇళ్లు కట్టుకోవడానికి వారి సొంత గ్రామాల్లో స్థలాలు ఇస్తాం. భూములు అందుబాటులో లేనందున వ్యవసాయ భూమి కేటాయింపులో మాత్రం ఇప్పుడే మాట ఇవ్వలేను. లొంగిపోయిన మావోయిస్టులు సమాజంలో ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానం కొనసాగించేలా ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుంది’అని సీఎం రేవంత్ చెప్పారు. అమిత్ షా పూర్తి స్వేచ్ఛనిచ్చారు.. ‘లొంగిపోయిన మావోయిస్టుల ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక వెసులుబాటు కల్పన, నివాస స్థలం, ఇళ్ల కేటాయింపు అంశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మాజీ మావోయిస్టు నాయకుల ప్రతిపాదనలను ఇటీవల ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఈ మేరకు ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్చలు జరపడం వల్ల దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో ఆయుధాలతో, పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. 2024 తర్వాత నుంచి 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 250కిపైగా ఆయుధాలు స్వాధీనం చేశారు. బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా సమస్యలు పరిష్కరించాలని నమ్మి ముందుకు వచ్చిన అందరికీ అభినందనలు’అని రేవంత్ అన్నారు. -
స్థానికంగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు!
సాక్షి, హైదరాబాద్: సొంతింటి కలను సాకారం చేసుకునే క్రమంలో పేదలు తమ ఉపాధిని, సామాజిక జీవనాన్ని కోల్పోకుండా ఇకపై లబ్దిదారులకు ప్రస్తుతం వారు నివసిస్తున్న ప్రాంతానికి గరిష్టంగా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గృహ సముదాయాల్లోనే ఇళ్లను కేటాయించనున్నట్లు హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ వెల్లడించారు. శనివారం ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సాధారణంగా గృహనిర్మాణ పథకాల కింద ఇళ్లను కేటాయించి, లబ్ధిదారులను సుదూర ప్రాంతాలకు తరలించడం వల్ల వారి జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ సమస్య కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో అధికంగా ఉన్నట్లు గుర్తించాం. గతంలో ఉన్నట్లు కాకుండా లబి్ధదారులను దూర ప్రాంతాలకు తరలించే పరిస్థితిని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు కొత్తగా మార్గదర్శకాలను జారీ చేశాం. లబ్ధిదారుల ఎంపికలో ఆయా గృహ సముదాయాలకు సమీపంలో నివాసం ఉన్న వారికే తొలి ప్రాధాన్యం ఇస్తాం. జీవో నంబర్ 33 మార్గదర్శకాలకు అనుగుణంగా కోర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణాలు పూర్తయిన, నిర్మాణాలు కొనసాగుతున్న సుమారు 25,619 గృహాలను యుద్ధప్రాతిపదికన లబ్దిదారులకు కేటాయించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల చివరి నాటికి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి, ఇళ్ల కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేస్తాం. డబుల్ బెడ్రూమ్ గృహనిర్మాణ ప్రాజెక్టులను పూర్తి మౌలిక సదుపాయాలతో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. జూన్ నాటికి కనీసం 10 వేల ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ‘ఇందిరమ్మ’కింద ఆర్థిక చేయూత మహానగర పరిధిలో ‘ఇందిరమ్మ ఇళ్ల‘పథకం కింద స్థలాలు ఉన్న అర్హులైన లబ్ధిదారులకు సొంత గృహ నిర్మాణాలకు త్వరలో అనుమతులు, ఆర్థిక చేయూత మంజూరు చేస్తాం. ఇప్పటికే సుమారు 18,000 మంది లబ్దిదారులను గుర్తించాం. మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను ఈ నెల 31 నాటికి ప్రారంభించే విధంగా చర్యలు చేపడుతున్నాం. మహానగర్ పరిధిలో మురికివాడల స్థానంలో సుమారు 25,000 గృహాలను గరిష్టంగా జీ+5, జీ+10 వరకు భవన సముదాయాలను నిర్మించి మెరుగైన నివాస సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించాం. ప్రస్తుతం వారు ఉంటున్న ప్రాంతాల్లోనే అత్యాధునిక భవనాలను నిర్మిస్తాం. అలాగే దశాబ్దాల క్రితం నిర్మించిన శిథిలావస్థలో ఉన్న ఈడబ్ల్యూఎస్, వాంబే గృహాల స్థానంలో కూడా కొత్త భవనాలను నిర్మించి, అక్కడి నివాసితులకు మెరుగైన గృహాలను అందిస్తాం. -
పాత అసెంబ్లీ.. మళ్లీ కొత్తగా!
(సాక్షి, హైదరాబాద్) : హైదరాబాద్ నగరం నడిబొడ్డున ‘పాత అసెంబ్లీ’గా పేరుగాంచిన గ్రాండ్ టౌన్ హాల్ భవనానికి 1905లో అప్పటి నిజాం మహబూబ్ అలీ ఖాన్ శంకుస్థాపన చేశారు. 1913లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనం నాటి నుంచి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు వేదికగా నిలుస్తూ నగర చారిత్రక వైభవాన్ని గుర్తు చేస్తోంది. భారతీయ సంప్రదాయ, పాశ్చాత్య నిర్మాణ శైలి (ఇండో సెరాసోనిక్ వాస్తు శైలి లేదా ఇండో గోతిక్ నిర్మాణ శైలి) సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుంది. భవనం బాహ్య భాగంలో భారతీయ నిర్మాణ శైలికి ప్రత్యేకమైన గొప్ప కెనోపీలు, వంపు గవాక్షాలు, అలంకార స్తంభాలు, సున్నితమైన బ్రాకెట్లు కనిపిస్తాయి. అంతర్గత భాగంలో మాత్రం పాశ్చాత్య శైలిలో కోరింథియన్ స్తంభాలు, పూల అలంకరణలు, విక్టోరియన్ మింటన్ టైల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 1956 నుంచి ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు వేదికగా నిలిచిన ఈ భవనం 2017 వరకు వినియోగంలోనే ఉంది. 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏపీ అసెంబ్లీకి కేటాయించారు. రెండేళ్ల పాటు ఈ భవనంలోనే కొనసాగిన ఏపీ అసెంబ్లీని ఆ తర్వాత అమరావతికి తరలించారు. భవనంలోని విద్యుత్, ఇతర ఫర్నిచర్ తదితరాలను ఏపీకి తరలించే క్రమంలో సీలింగ్, ఫ్లోరింగ్ వంటివి దెబ్బతిన్నాయి. శిథిలావస్థకు చేరిన చారిత్రక భవనం శతాబ్దానికిపైగా వినియోగంలో ఉన్న ఈ భవనం 2017 నాటికి పైకప్పు సరైన సంరక్షణ లేకపోవడం వల్ల బలహీనంగా మారి శిథిలావస్థకు చేరింది. చారిత్రక భవనాన్ని పునరుద్ధరించి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినా నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భావించింది. ఈ దశలో కుతుబ్షాహీ టూంబ్స్తోపాటు సుమారు వంద వరకు చారిత్రక భవనాలకు మరమ్మతులు చేసి పునరుద్ధరించిన ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్, రోడ్డు భవనాల శాఖతో కలిసి పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సంకల్పించింది. భవనం అసలు నిర్మాణాన్ని కాపాడుతూ సంప్రదాయ నిర్మాణ పదార్థాలు, పాత పద్ధతులను మేళవించి నిపుణులైన కళాకారులతో రూ.30 కోట్లతో ఈ పనులు చేపట్టారు. సుమారు 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవన పునరుద్ధరణలో వందలాది కళాకారులు పాలుపంచుకున్నారు. అత్యవసర ప్రాధాన్యతతో చేపట్టిన ఈ పనులు ఏడాదిన్నర కాలంలో పూర్తి అయ్యాయి. సంరక్షణలో అనేక సవాళ్లుభవనంలో దెబ్బతిన్న లేదా కనుమరుగైన నిర్మాణ అంశాలను గుర్తించేందుకు విస్తృత పరిశోధన, సాంకేతిక పరిశీలనలు చేపట్టారు. వాటి ఆధారంగా భవనం నిర్మాణ బలాన్ని కాపాడుతూ పునరుద్ధరణ పనులు నిర్వహించారు. అయితే భవనాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరాల వల్ల కొన్ని అసలు నిర్మాణ లక్షణాలను పూర్తిగా పునరుద్ధరించడం సాధ్యపడలేదు. ప్రత్యేకంగా ప్రధాన సభా మందిరంలోని కిటికీలను తరువాతి కాలంలో నిర్మించిన బాల్కనీలు, అలంకార ప్రవేశ ద్వారం కొంతవరకు కప్పేశాయి. భవనానికి ముందు, వెనుక భాగాల్లో నిర్మించిన ఆర్సీసీ నిర్మాణాలు అసలు ఆర్కేడ్లను అడ్డుకోవడంతో సరైన గాలి, వెలుతురు లేకుండా పోయింది. మరోవైపు పాత భవనం చుట్టూ వివిధ సందర్భాల్లో చేపట్టిన ఇతర నిర్మాణాల మూలంగా భవనంలోని అసలు వర్షపు నీటిపారుదల వ్యవస్థ కూడా మూసుకుపోయింది. దీంతో తీవ్రమైన నీటి లీకేజీతో పైకప్పు బలహీనపడింది. ఈ సమస్యలను పరిష్కరించడం పునరుద్ధరణలో సవాల్గా నిలిచింది. లైమ్ మోరా్టర్ నిపుణులు, మట్టి కళాకారులు, రాగి పనివాళ్లు, సంప్రదాయ టైల్స్ తయారీదారులు, కార్పెంటర్లు సహా అనేక రంగాల కళాకారులు పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్నారు. మొత్తం 50వేలకు పైగా పనిదినాలు ఈ ప్రాజెక్టుకు వినియోగించారు. ప్రధాన సభా మందిరంలోనూ.. భవనంలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం ప్రధాన సభా మందిరంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నిర్మాణాలను తొలగించడంతో ఇటుకలతో కూడిన జాక్ ఆర్చ్ నిర్మాణం బయటపడింది. హాల్లోని గోడలపై పూసిన ఎనామెల్ పెయింట్ పొరలను కూడా తొలగించడంతో ఒరిజినల్ శైలి బయట పడింది. 10వేల చదరపు అడుగులకుపైగా గోడలపై ఉన్న పూతలను తొలగించి అసలు స్టక్కో అలంకరణలను వెలికితీశారు. కోరింథియన్ స్తంభాలు, అలంకార బ్రాకెట్లు, గవాక్షాలపై ఉన్న శిల్పాలను శుభ్రపరచి పునరుద్ధరించారు. హాల్ రెండు వైపులా తరువాతి కాలంలో నిర్మించిన బాల్కనీలు అసలు గవాక్షాల అందాన్ని తగ్గిస్తున్నాయని గుర్తించి సవరించారు. కారిడార్లలోనూ గాలి, వెలుతురు వచ్చేలా చేశారు. కారిడార్లు, మొదటి అంతస్తులో పాతకాలం నాటి విక్టోరియల్ టైల్స్తో మరమ్మతులు చేశారు. బాహ్య భాగంలో అలంకార శిల్పాలు భవనం బాహ్య నిర్మాణంలో బ్రాకెట్లు, చత్రాలు, ఫినియల్స్ వంటి అలంకార శిల్పాలు విస్తారంగా ఉన్నాయి. పునరుద్ధరణకు ముందు ఇవి తీవ్రంగా దెబ్బతిన్నాయి. చజ్జాలు విరిగిపోవడం, బ్రాకెట్లు పగలడం వంటి సమస్యలు కనిపించాయి. తర్వాత 100 మీటర్లకు పైగా చజ్జాలను సంప్రదాయ పద్ధతిలో పునర్మించారు. 1.5 నుంచి 3 అడుగుల ఎత్తు కలిగిన 250కిపైగా అలంకార పూలకుండలను సంప్రదాయ పద్ధతిలో తయారు చేశారు. రాతి నిర్మాణాన్ని శుభ్రపరిచి అసలు నేలస్థాయిని గుర్తించి చుట్టుపక్కల మట్టిని తగ్గించారు. నీటి చొరబాటును నివారించేందుకు 50 మి.మీ మందంతో గ్రానైట్ రక్షణ పొర ఏర్పాటు చేశారు. మొత్తంగా శాసన మండలి భవనం పునరుద్ధరణతో చారిత్రక నిర్మాణ కళను పునరుజ్జీవింపజేసి తెలంగాణ చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిపే ప్రయత్నాలు చేశారు. ఆధునిక వసతులతో ఏర్పాట్లుతెలంగాణ చారిత్రక వారసత్వానికి చిహ్నంగా ఉన్న శాసనమండలి భవనాన్ని అధునాతన వసతులతో తీర్చిదిద్దాం. కేవలం ఏడాదిన్నరలో పనులు పూర్తి చేసుకున్న ఈ భవ నంలో అధునాతన, సౌండ్ లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలిలో 40 మంది సభ్యులు ఉండగా, 50 మంది కూర్చునేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీంతోపాటు ముఖ్యమంత్రి, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వైస్చైర్మన్, చీఫ్ విప్, కార్యదర్శి, మంత్రులు, సభ్యుల కోసం ప్రత్యేక లాంజ్లు సిద్ధం చేశారు. భవిష్య త్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని అధునాతన డిజిటల్ టెక్నాలజీతో సీటింగ్ ఏర్పాట్లు ఉన్నా యి. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 8న ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నారు. – గుత్తా సుఖేందర్రెడ్డి, శాసన మండలి చైర్మన్ -
కన్న తండ్రే కాలయముడయ్యాడు..
కామారెడ్డి క్రైం: పోషించడం చేతకాక కన్న తండ్రే తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లల పాలిట కాలయముడయ్యాడు. తన చేతులతోనే అభం శుభం ఎరుగని చిన్నారులను చెరువులో తో సేసి హత్య చేశాడు ఓ కసాయి తండ్రి. ఈ హృదయ విదారకమైన ఘటన కామారెడ్డిలో శనివారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఆర్బీనగర్ కాలనీలో నివాసం ఉండే ఇస్మాయిల్, షహీబాలకు ముగ్గురు కుమార్తెలు షీపత్(8), అయాత్(7), మరియం(5) ఉన్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా కుమార్తెలను దుకాణంలో తినుబండారాలు కొనిస్తానని తీసుకెళ్లాడు. దగ్గర్లోని దుకాణానికి వెంట తీసుకువెళ్లిన తండ్రి, పిల్లలలు ఇంటికి తిరిగి రాలేదు. కొద్ది సేపటికి షబీనా భర్తకు ఫోన్ చేసి పిల్లలు ఎక్కడున్నారు? ఇంకా ఇంటికి రాలేదని అడిగింది. తాను పిల్లలకు తినుబండారాలు కొనిచ్చిన తర్వాత ఇంటికి వెళ్లాలని సూచించి ఆటో నడిపేందుకు బయటకు వెళ్లిపోయాన ని బుకాయించాడు. పిల్లలు తప్పిపోయినట్లు నటిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి నాటకమాడాడు. అందరూ కలిసి చాలా సేపు సమీప ప్రాంతాల్లో పిల్లల కోసం గాలించి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాయంత్రం చీకటిపడే వరకు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో గాలించారు. సీసీ కెమెరాలను పరిశీలించినా పిల్లల ఆచూకీ లభించలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులు ఇస్మాయిల్ను విచారించగా తానే పిల్లలల్ని చెరువులో తోసి హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు వెంటనే పెద్ద చెరువు వద్దకు చేరుకుని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 10 గంటల ప్రాంతంలో అయాత్, మరియంల మృతదేహాలు లభించాయి. షీపత్ మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది సహకారంతో అర్ధరాత్రి కనుగొన్నారు. విషయం బయటకు తెలియడంతో పెద్ద ఎత్తున బంధువులు, స్థానికులు పెద్ద చెరువు వద్దకు చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పోషణ భారమై పిల్లలను తానే హత్య చేసినట్లు ఇస్మాయిల్ అంగీకరించాడని పట్టణ ఎస్హెచ్వో నరహరి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. -
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి
చందానగర్: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని, ఆర్థిక స్వావలంబన సాధనే లక్ష్యంగా ఆడబిడ్డలు కష్టపడాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం చందానగర్లో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పలువురు మాజీ కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేటి సమాజంలో పురుషాధిక్యత అడుగడుగునా ఉందన్నారు. రాజకీయాలు కూడా దానికి అతీతం కాదన్నారు. పోటీ ప్రపంచంలో మహిళలు నిలదొక్కుకోవాలంటే రెట్టింపు ప్రయత్నం చేయక తప్పదన్నారు. అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడి ఆర్థిక స్వాతంత్య్రం సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తనకు కూడా కూతురు ఉందని గుర్తు చేస్తూ, యువతకు ఆయన కీలక సూచనలు చేశారు.ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడకుండా, సొంతంగా ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచే స్థాయికి ఎదిగినప్పుడే సమాజంలో గౌరవం, గుర్తింపుతో పాటు మహిళలకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్న నేపథ్యంలో విద్యావంతులు, సామాజిక స్థితిగతులపై అవగాహన ఉన్న మహిళలు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో› 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని, భవిష్యత్తులోనూ మహిళా సంక్షేమం కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం సబితారెడ్డి, సునీతారెడ్డిలు మాట్లాడుతూ మహిళలకోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. మహిళలకు భద్రత, రక్షణ కావాలంటే కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సమాజానికి విశేష సేవలు అందించిన వివిధ రంగాలకు చెందిన సుమారు 40 మంది మహిళలకు పురస్కారాలు అందజేశారు. -
సీఎస్గా జయేశ్? లేదా వికాస్?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో కీలకమైన ప్రధాన కార్యదర్శి (సీఎస్) పదవి ఎవరిని వరించనుందన్న అంశం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది, ఈనెల 31న సీఎస్గా కె.రామకృష్ణారావు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో కీలక స్థానాల్లోని 8 మంది ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల్లో నుంచి ఒకరిని సీఎం రేవంత్రెడ్డి ఎంపిక చేసుకోనున్నారు. ప్రధానంగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్; రోడ్లు–భవనాలు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ మధ్య పోటీ ఉన్నట్లు సచివాలయవర్గాల్లో చర్చ జరుగుతోంది.వీరిద్దరిలో ఒకరిని రేవంత్రెడ్డి సీఎస్గా ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ఉన్న వారిలో శశాంక్గోయల్ (ఢిల్లీలో తెలంగాణ భవనస్పెషల్ సీఎస్), సంజయ్ జాజు (కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి), సవ్యసాచిఘోష్ (రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి), నవీన్ మిత్తల్ (ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి), దాన కిషోర్ ( కార్మిక శాఖ, గవర్నర్ స్పెషల్ సీఎస్) ఉన్నారు. వీరితోపాటు ఫార్ములా ఈ–కార్ రేసులో ముద్దాయిగా ఉన్న అర్వింద్కుమార్ కూడా ఉన్నారు. అయితే, ఇటీవలే ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అన్నీతానై... జయేశ్ రంజన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కీలక అధికారిగా మారారు. ఏడెనిమిది సంవత్సరాలుగా ఆయన పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచి్చన తరువాత ఆయన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో సఖ్యంగా లేకపోవడం.. అన్నీ తానై వ్యవహరించడంతోపాటు కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే తాను జవాబుదారీ అన్నవిధంగా ఉండటంతో మంత్రి ఒత్తిడి మేరకు ఆయనను అక్కడ నుంచి తప్పించారు. ఆ తరువాత ‘టాస్్క’పేరిట సీఎం నేతృత్వంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ వ్యవహారాలను అప్పగించారు. అక్కడ నుంచి తప్పించి ఆయనకు ఈ మధ్యనే పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయితే ఆయన సీరియస్గా ఉండరన్న ప్రచారం విస్తృతంగా ఉంది. ఒక శాఖకు అధికారిగా వ్యవహరించడం వేరు.. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని వెళ్లడం వేరని ఐఏఎస్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జయేశ్రంజన్ ఏ మేరకు సఫలీకృతం అవుతారన్నది ప్రశ్నార్థకమని అంటున్నారు. మిగిలిన వారు ఎలా..? ఇక వికాస్రాజ్ అయితే.. కాస్త ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. ఇప్పటివరకు ఆయన వివాదరహితుడిగా ఉన్నారు. అదే సమయంలో చొరవ తీసుకుని అధికార యంత్రాంగాన్ని ముందుకు నడిపించిన దాఖలాలు పెద్దగా లేవని సచివాలయ వర్గాల కథనం. తెలంగాణ భవన్లో స్పెషల్ సీఎస్గా ఉన్న శశాంక్గోయల్ను పిలిచి సీఎస్ పదవిచ్చే అవకాశం లేదంటున్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్జాజు రాష్ట్రానికి రావడానికి ఇష్టపడటం లేదని సమాచారం. ఇక అర్వింద్కుమార్ సస్పెండైన నేపథ్యంలో ఆయన పేరు పరిశీలనకు వచ్చే అవకాశం లేదంటున్నారు. సవ్యసాచి ఘోష్ విషయానికొస్తే.. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కాస్త గుర్తింపు కలిగిన శాఖల ఫోకల్ పోస్టుల్లో పనిచేస్తున్నారు. ఈ మధ్యనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి పొందిన నవీన్మిత్తల్, దాన కిషోర్లకు సీఎస్ పదవి దక్కే అవకాశం లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో రానున్న రెండేళ్లు ప్రభుత్వానికి కీలకం కావడం వల్ల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను జోడెద్దులుగా ముందుకుతీసుకెళ్లకలిగే అధికారికే రేవంత్రెడ్డి పట్టం కడతారని సమాచారం. -
చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి 2025 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును ప్రకటించింది. అలాగే, పైడి జయరాజ్ అవార్డుకు సహజనటుడు కమల్ హాసన్ను ఎంపిక చేసింది. ఈ మేరకు 2025 సంవత్సరం గద్దర్ చలనచిత్ర అవార్డులను జ్యూరీ శనివారం మీడియా సమావేశంలో ప్రకటించింది. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక మందన్నా (ది గర్ల్ఫ్రెండ్)ను ఎంపిక చేసింది. అలాగే, తొలి ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి, ద్వితీయ ఉత్తమ చిత్రంగా ‘దండోరా’, తృతీయ ఉత్తమ చిత్రంగా ‘ద గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో’ ఎంపికయ్యాయి. అలాగే, జాతీయ సమైక్యతను చాటే చిత్రంగా ‘తండేల్’ నిలిచింది. రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డును ప్రసాద్ ఐ మ్యాక్స్ యజమాని రమేష్ప్రసాద్కు ప్రకటించారు. పలువురు పాతతరం వారికి స్పెషల్ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాలను ఉగాది (ఈనెల 19న) పర్వదినాన హైటెక్స్లో ప్రదానం చేయనున్నారు. మెయిన్ స్ట్రీమ్ అవార్డ్స్ అధ్యక్షుడిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వ్యవహరించారు. షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ విభాగానికి కనకమేడల విజయకృష్ణ చైర్మన్ కాగా, పుస్తకాలు– సమీక్షల పరిశీలనకు తనికెళ్ల భరణి చైర్మన్గా వ్యవహరించారు. ప్రత్యేక అవార్డుల కమిటీకి తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షుడిగా వ్యవహరించారు. జ్యూరీ 2025వ సంవత్సరానికి ఎంపిక చేసిన తుది జాబితాను ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, జ్యూరీ సభ్యులు తనికెళ్ల భరణి, రోజా రమణి, మణిశర్మ, ప్రగతి తదితరులు అందచేశారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ, ప్రదానోత్సవ నిర్వహణపై వారు చర్చించారు. అనంతరం చలన చిత్ర అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జ్యూరీ పురస్కారాల జాబితాను ప్రకటించింది. -
Hyd: ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందే: సీఎం రేవంత్
హైదరాబాద్: నగరాన్ని క్లీన్సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈ రోజు శనివారం(మార్చి 7వ తేదీ) మున్సిపల్ కమిషనర్లతో జరిగిన సమీక్షలో సీఎం రేవంత్.. ఈ మేరకు పలు సూచనలు చేశారు. ‘నగరంలో ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందే. కార్పొరేషన్స్ కోర్, అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతీరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలి. చెత్త సేకరణకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలి. ఒక్కో వాహనానికి ఒక్కో ఏరియా చొప్పున కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలి. నగరం పరిధి విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా గుర్తించిన డంప్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలి. కార్పోరేషన్ల వారీగా దగ్గరలోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలి. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పోరేషన్లలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అపరిశుభ్రత లేకుండా చూసుకోవడంతో పాటు దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలి’ అని పేర్కొన్నారు. -
కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కలకలం..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలో ఐదుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు. మిస్సింగ్ అయిన వాళ్ళంతా 10ఏళ్ల లోపు పిల్లలే. సింహాద్రి(10), కోదండ విజయ్(3) నిన్నటి నుంచి మిస్సింగ్ కాగా, ఇవాళ ఉదయం ముగ్గురు ఆడ పిల్లలు సీపల్(8), మరియం(5), ఆయాత్(7) అదృశ్యమయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన చిన్నారులు తిరిగి రాలేదు. పోలీసులు విచారణ చేపట్టారు. -
లొంగిపోయేందుకు బయల్దేరిన మావోయిస్టులు
-
సీఎం రేవంత్ సమక్షంలో వందకు పైగా మావోయిస్టుల లొంగుబాటు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో 126 మంది మావోయిస్టులు.. ఆయుధాలు విడిచి సరెండర్ అయ్యారు. వీరి కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి తీసుకొచ్చారు. లొంగిపోయిన వారిలో సినీ నటుడు కాకరాల సత్యనారాయణ కుమార్తె మాధవి సైతం ఉన్నారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ దళం మొత్తం సరెండర్ అయ్యింది. లొంగిపోయిన వారిలో కీలక మావోయిస్టు నేత సంతోష్ ఉన్నారు. 31 ఏకే-47లతో పాటు భారీగా ఆయుధాలను అప్పగించారు సంతోష్. ఇక లొంగిపోయిన వారిలో ఏవోబీ కీలకనేత చలసాని నవత సైతం ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ మావోయిస్టుల ఆయుధాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన తర్వాత వారితో ముచ్చటించారు. కాగా, మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్లైన్కు సమయం దగ్గర పడుతుండటంతో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది మావోయిస్టులు లొంగిపోగా, తాజాగా వందకు పైగా మావోయిస్టులు లొంగిపోవడం ఆ ఉద్యమం చివరి దశకు చేరిందనేదానికి నిదర్శనం. -
రేవంత్.. రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం లేదా?: హరీష్ రావు
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కొండన్నపల్లి వద్ద ఎండిపోయిన పంటలను శనివారం పరిశీలించారు. అనంతరం, హరీష్ మీడియాతో మాట్లాడుతూ..‘మూడు పంటలకు రైతుభరోసా ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి.. మూడు పంటలకూ డబ్బులు ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గరకు పోతారు?. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా?.కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పంటలు పండుతున్నాయి. హైదరాబాద్కు తాగు నీరు కాళేశ్వరం నీల్లే వెళ్తున్నాయి. రేవంత్ రెడ్డి.. ముందు చిల్లర వ్యాఖ్యలు బంద్ చేయండి. కాళేశ్వరం కూలిపోయింది అంటూ ఎన్నికల్లో అడ్డగోలు ఆరోపణలు చేస్తారా?. ప్రాజెక్ట్ను ఎండబెట్టాలని చూస్తున్నారా?. ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్ చేయించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్లలో కనీసం పది వేల ఎకరాలకు నీరు ఇచ్చిందా అని ప్రశ్నించారు. -
త్వరలో చర్లపల్లి-నాగర్కోయల్ అమృత్ భారత్.. ప్రత్యేకత ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ మీదుగా మరో అమృత్భారత్ రైలు పరుగు పెట్టబోతోంది. హైదరాబాద్ను కన్యాకుమారితో అనుసంధానిస్తూ ఈ రైలు ప్రారంభం కాబోతోంది. చర్లపల్లి నుంచి కన్యాకుమారి చేరువలో ఉన్న నాగర్కోయల్ మధ్య నడిచే ఈ రైలు.. ఈనెల 11న ప్రారంభం కానున్నట్టు తెలిసింది.జనవరిలో చర్లపల్లి–కేరళ రాజధాని తిరువనంతపురం మధ్య ఓ అమృత్భారత్ రైలు ప్రారంభం కావడం తెలిసిందే. దాంతోపాటే నాగర్కోయల్ అమృత్భారత్ కూడా మంజూరైంది. అయితే, అప్పట్లో దానికి రేక్ అందుబా టులో లేకపోవటంతో పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆ ఇబ్బందిని దాటుకుని ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్ మీదుగా రెండు అమృత్భారత్ రైళ్లు, వరంగల్ మీదుగా ఒకటి నడుస్తున్నాయి. కొత్త రైలుతో తెలంగాణకు నాలుగో అమృత్భారత్, హైదరాబాద్కు మూడోదిగా ఉండనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చర్లపల్లి–ముజఫర్పూర్ జంక్షన్(బిహార్) మధ్య ఒకటి, చర్లపల్లి–తిరువనంతపురం మధ్య మరొకటి నడుస్తున్నాయి.కాగా, హైదరాబాద్–నాగర్కోయిల్ అమృత్ భారత్ రైలు ప్రయాణంలో అనేక పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు దర్శించవచ్చు. ఈ మార్గం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలను కలుపుతుంది. మదురై, రామేశ్వరం, కన్యాకుమారీ, కుర్తాలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ఈ మార్గం సహాయపడుతుంది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం (యాదగిరిగుట్ట), భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవాలయం, తిరుమలను దర్శించుకోవచ్చు. -
సోషల్ మీడియా వల్లే నేరాలు: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : గతంలో మహిళలపై వేదింపులు పట్టణాలకే పరిమితమయ్యేవని కానీ ప్రస్తుత రోజుల్లో వాటి పరిధి పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన "స్టాండ్ విత్ హర్" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోషల్ మీడియా కారణంగానే మహిళలపై వేదింపులు పెరిగాయని సీఎం అన్నారు. నారీమణుల భద్రత కోసం కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాదని వాటిని అమలు చేసి తీరాలని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని పథకాలు మహిళల పేరు మీదే అమలు చేస్తున్నామన్నారు. మహిళ సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులు నడుపుతున్నామని రాష్ట్రం అభివృద్ధిలో దూసుకపోతుందని తెలిపారు. మహిళల భద్రత కోసం పురుషులు ముందుకు రావాలనే సందేశంతో తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. "స్టాండ్ విత్ హర్" ప్రోగ్రామ్కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తప్పు ఒకరిది.. జరిమానా మరొకరికి..
మంచిర్యాల జిల్లా: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను కట్టడి చేసేందుకు పోలీసులు ఉపయోగిస్తున్న ఈ–చలాన్ల విధానంలో అప్పుడప్పుడు దొర్లుతున్న పొరపాట్ల కారణంగా తప్పు చేయని వారికి శిక్షలు పడుతున్నాయి. ఫొటోలు తీసి జరిమానా విధించే క్రమంలో నంబర్లు సరిగా గుర్తించకపోవడంతో ఒకరు చేసిన తప్పునకు మరొకరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. రెండ్రోజుల క్రితం ఏం జరిగిందంటే..మంచిర్యాల జిల్లాలో రెండు రోజుల క్రితం మందమర్రి సమీపంలో ఒక వాహనదారుడు హెల్మెట్ ధరించలేదని పోలీసులు ఫొటో తీశారు. అయితే, ఆ ఫొటో ఆధారంగా చలాన్ జనరేట్ చేసే సమయంలో సిబ్బంది నిర్లక్ష్యమో లేదా సాంకేతిక లోపంతో నో వాహనం నంబర్ తప్పుగా నమోదైంది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన వాహన దారుడికి కా కుండా 65 కిలోమీటర్లు దూరంలోని దండేపల్లి మండలం తాళ్లపేట బస్టాండ్ సమీపంలో నిలిపి ఉంచిన ఏ తప్పు చేయని వాహనదారుడికి జరిమానా విధించినట్లు మెసేజ్ వెళ్లింది. దీంతో అతను వెంటనే ఈ–చలాన్ ఓపెన్ చేసి చూడగా, మందమర్రిలో ఉన్న వాహనాన్ని ఫొటో తీస్తే నాకు జరిమానా రావడం ఏమిటని ఆశ్చర్య పోవడమే కాకుండా ఇదేమిటని తలపట్టుకున్నాడు. దీనికి ఎవరు బాధ్యులు, నేను చేయని తప్పునకు జరిమానా ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నాడు. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి సాంకేతిక లోపాలను సరిదిద్ది, చలాన్లు విధించే ముందు నంబర్ ప్లేట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని బాధితులు కోరుతున్నారు. -
రైతు భరోసా వస్తుందా.. రాదా?
నల్లగొండ అగ్రికల్చర్ : యాసంగి సీజన్ రైతు భరోసా ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. యాసంగి సీజన్ ముగిసి నెలరోజులు దాటింది. మరో 10, 15 రోజుల్లో నాన్ ఆయకట్టు ప్రాంతంలో వరి కోతలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు భరోసాపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా దాగుడు మూతలు ఆడుతుంది. గత యాసంగిలో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని జనవరి 26న రైతుల ఖాతాల్లో ఎకరానికి 6 వేల చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత యాసంగిలో రైతు భరోసా ఇంకా ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేస్తుందో చేయదో అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. 5,16,327 ఎకరాల్లో యాసంగి సాగు..ప్రస్తుత యాసంగి సీజన్ జిల్లా వ్యాప్తంగా 5,16,327 ఎకరాల్లో వరితో పాటు వివిధ పంటలు సాగయ్యాయి. వరి సుమారు 5 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పెట్టుబడుల సమయంలో రైతుభరోసా అందక రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. పొలాలు దున్నకం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, వరి నాట్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడి కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకుని యాసంగి సాగును పూర్తి చేశారు. రైతు భరోసా వస్తుందనే ఆశతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. రైతు భరోసా డబ్బులు వస్తే కొంత ఆసరాగా ఉండేది. కానీ ప్రభుత్వం దానిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.5,65,803 మంది రైతులు..జిల్లా వ్యాప్తంగా 5,65,803 మంది పట్టాదారు పాస్ పుస్తకాలున్న రైతులు ఉన్నరు. ఎకరాలకు 6 వేల చొప్పున రూ.738.67 కోట్లు ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా నిధులను జమ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.పెట్టుబడి సాయం ఇస్తే అప్పులు తీర్చుకుంటాంప్రభుత్వం స్పందించి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలి. యాసంగి సీజన్ సాగు కోసం పెట్టుబడుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశాం. రైతు భరోసా నిధులు జమ చేస్తే అప్పులు తీర్చుకుంటాం. రైతుల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి వెంటనే రైతు భరోసా ఇవ్వాలి. – చిమట భిక్షమయ్య, రైతు, గుండ్లపల్లి, నల్లగొండ మండలం -
తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానం.. సివిల్స్లో సృజన సత్తా
సాక్షి పెద్దపల్లి: తన లక్ష్యం సివిల్స్.. ఐదుసార్లు ప్రయత్నించి విఫలమైనా కలత చెందకుండా, ధైర్యం, పట్టుదల తో ముందుడుగు వేసి ఆరోప్రయత్నంలో రాష్ట్రంలో నే ఫస్ట్ర్యాంకుతో సత్తాచాటారు సింగరేణి కార్మికుడి కూమార్తె గుడెల్లి సృజన. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితా ల్లో జాతీయ స్థాయిలో 55వ ర్యాంక్, తెలుగు రాష్ట్రా ల్లో ఫస్ట్ర్యాంకర్గా అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. దీంతో పెద్దపల్లి జిల్లా పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతోంది. రెండు ఉద్యోగాలు సాధించి.. పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన గుడెల్లి రాజేశం – రాణి దంపతుల కూమార్తె సృజన ఆర్నెల్ల వ్యవధిలోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జౌరా అనిపించారు. సింగరేణి ఆర్జీ –3 ఏరియా ఓసీపీ – వన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రాజేశం – రాణి దంపతుల ప్రోత్సాహంతో ఆమె రాష్ట్రస్థాయిలో టాపర్గా నిలిచి శెభాష్ అనిపించుకున్నారు. ఫలితాల అనంతరం సృజనతోపాటు ఆమె తల్లితండ్రులకు సింగరేణి అధికారులు, కారి్మక సంఘం నాయకులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. టీసీఎస్లో జాబ్ వచి్చనా.. సివిల్స్ వైపే మెగ్గు సృజన రామగిరి మండలంలో స్థానికంగా ఉన్న వాణి సెకండరీ పాఠశాలలో ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు చదివారు. 2012–2014 వరకు మియాపూర్లోని శ్రీచైతన్యలో ఇంటర్ పూర్తిచేశారు. మంథని జేఎనీ్టయూలో 2014–18 వరకు బీటెక్లో సీఈసీ పూర్తి చేశారు. అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ను చూసి ఐఏఎస్ ఆఫీసర్ను కావాలని కలలుగన్న సృజన.. క్యాంపస్ ప్లేస్మెంట్లో టీసీఎస్లో జాబ్ వచి్చనా.. అందు లో చేరకుండా సివిల్స్ ప్రిపరేషన్ వైపే మొగ్గు చూ పారు. ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడైంది. దీంతో 2018లో ఢిల్లీలోని ప్రముఖ వాజీరావు ఐఏఎస్ ఇనిస్టిట్యూట్లో చేరి శిక్షణ తీసుకున్నారు. ఈక్రమంలో వరుసగా ఐదుసార్లు పరాజయం పాలైనా ఏమాత్రం వెరవలేదు. పట్టుదలగా చదవి విజయం సొంతం చేసుకున్నారు. గతేడాది సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనక్కి వచ్చినా.. నిరాశ చెందక ప్రిపరేషన్ కొనసాగించారు. ఈక్రమంలోనే తెలంగాణ గ్రూప్ – వన్ పరీక్షలు రాసి 35వ ర్యాంక్తో డీఎస్పీ జాబ్ సాధించారు. డీఎస్పీ శిక్షణ తీసుకుంటూనే సివిల్స్కి సన్నద్ధమయ్యారు. అదనపు డీజీపీ మహేశ్ ఎం.భగవత్ సలహాలతో ఈసారి ఏకంగా ఆలిండియా 55వ ర్యాంకు సాధించి జిల్లాపేరును అగ్రస్థానంలో నిలిపారు. -
షాద్నగర్ విద్యార్థిని సత్తా.. సివిల్ సర్వీసెస్లో 627 ర్యాంక్
రంగారెడ్డి జిల్లా: పట్టువదలకుండా శ్రమించింది. చదువుపైనే దృష్టి సారించింది. చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది. దేశంలోనే అత్యున్నత సర్వీస్గా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో జాతీయ స్థాయిలో షాద్నగర్ విద్యార్థిని సత్తా చాటింది. గత ఏడాదికంటే మెరుగ్గా.. షాద్నగర్ పట్టణానికి చెందిన రాఘవేందర్ పదుకొనె, మమత దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో చిన్న కూతురు ఇంద్రార్చిత. తండ్రి షాద్నగర్లో బేకరీ నిర్వహిస్తున్నాడు. ఇంద్రార్చిత అఖిత భారత సర్వీస్ నియామకాలకు సంబంధించి యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో సత్తా చాటింది. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో ఆమె 627 ర్యాంకు సాధించింది. గతేడాది నిర్వహించిన పరీక్షల్లో 735 ర్యాంకు సాధించింది. తిరిగి ఈ ఏడాది పరీక్ష రాసి గతంలో కంటే మెరుగైన ర్యాంకు సాధించింది. ఇదీ అక్షరయాత్ర ఇంద్రార్చిత షాద్నగర్లో ఉన్న హెరిటేజ్ వ్యాలీ పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకు అభ్యసించింది. తర్వాత హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఆఫ్ ఉమెన్లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం ఇగ్నో యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసింది. పబ్లిక్ సరీ్వస్పై ఆసక్తి పెంచుకున్న ఆమె ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకొని సివిల్స్కు సిద్ధమైంది. సివిల్స్ ర్యాంకు సాధించడంతో పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్ సమక్షంలో లొంగిపోనున్న మావోయిస్టులు.. గణపతిపై క్లారిటీ?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టుల ఉద్యమం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. 100 మంది పీఎల్జీఏ మావోయిస్టులు లొంగిపోతున్నట్టు సమాచారం. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానున్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనున్నారు. సీఎం సమక్షంలో ఆయుధాలతో సహా మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఈ సందర్బంగా బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. లొంగిపోతున్న వారిలో పీఎల్జీఏ బెటాలియన్ కంపెనీ కమాండర్ కొరసా లక్కు, ఉకి కల్లు, చలసాని నవత, అరుణ, సుధాకర్ ఉన్నట్టు తెలుస్తోంది. -
రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)
-
వ్యభిచార కేంద్రాలపై పోలీసుల దాడి
హైదరాబాద్: వేరు వేరు ప్రాంతాలలో వ్యభిచార కేంద్రాలపై దాడి చేసి పలువురిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్పల్లి సుమిత్రానగర్లోని ఓ అపార్టుమెంట్లో వ్యభిచార కేంద్రంపై గురువారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకురాలు (40), విటుడు రవికుమార్ (47), మరో మహిళ(47)ను అరెస్టు చేశారు. మహిళను రెస్క్యూ హోంకు తరలించి, నిర్వాహకురాలు, రవికుమార్లను రిమాండ్కు తరలించారు. అదే విధంగా అదే కాలనీలోని మరో అపార్టుమెంట్లో వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకురాలు (46), విటుడు శ్రీవేంద్ర వర్మ (30)లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో మహిళను (32) హోంకు తరలించారు. -
నెరవేరిన సీఎం హామీ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా 2023 మార్చి 18న కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామం మీదుగా పాదయాత్రగా వెళుతున్న అప్పటి పీసీసీ అధ్యక్షుడు, నేటి సీఎం రేవంత్రెడ్డిని భిక్కనూరు లక్ష్మి అనే మహిళ కలిసి కూలిపోయిన తన ఇంటిని చూడమని వేడుకుంది. దీంతో రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ కూలిపోయిన ఆమె ఇంటిని చూసి తాము అధికారంలోకి రాగానే ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ‘రేవంతన్నా.. నన్ను యాది మరవకు’అన్న శీర్షికతో ‘సాక్షి’మెయిన్ ఎడిషన్లో 2023 డిసెంబర్ 31న కూలిపోయిన ఇంటిలో భిక్కనూరు లక్ష్మితో మాట్లాడుతున్న ఫొటోతో ప్రచురించిన కథనానికి సీఎంవో అధికారులు స్పందించారు. అదేరోజు జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భిక్కనూరు లక్ష్మికి వెంటనే అప్పటికే పక్క గ్రామంలో నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించాలని ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు లక్ష్మి దగ్గరకు వెళ్లి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని చెప్పారు. అయితే కూలిన ఇంటి స్థలంలోనే తాను ఇల్లు కట్టుకుంటానని ఆమె చెప్పడంతో ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపించారు. తొలి విడతలోనే లక్ష్మితో పాటు ఆమె తోటి కోడలు రాజమణికి కూడా ఇల్లు మంజూరైంది. ఎట్టకేలకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లక్ష్మి కుటుంబ సభ్యులు శనివారం గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పాదయాత్రలో ఇచి్చన మాట ప్రకారం సీఎం రేవంత్రెడ్డి లక్ష్మికి ఇల్లు మంజూరు చేశారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. వారి గృహ ప్రవేశానికి తాను హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పేద మహిళలకు న్యాయం చేసిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
తుదిదశకు ఫిరాయింపుల కేసు.. నేడు దానం నాగేందర్ విచారణ
సాక్షి హైదరాబాద్ : రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు తుదిదశకు చేరుకుంది. ఈ రోజు( శనివారం) శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యే.. దానం నాగేందర్ను విచారించనున్నారు. ఈ అంశంలో ఇది వరకే నాగేందర్ విచారణ చేపట్టాల్సి ఉండగా పలు కారణాలతో ఈ రోజుకు వాయిదాపడింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టనున్నారు.ఇక ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచారణ ఇది వరకే పూర్తవగా తీర్పును రిజర్వు చేశారు. గత నెలలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మూడు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని ఫిబ్రవరి 6వ తేదీన హెచ్చరించింది. ఈ క్రమంలోనే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు మరో అవకాశం ఇచ్చింది. అనర్హత అంశాన్ని తేల్చాలని ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తిచేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్ను ఆదేశించింది. ఇక దానం నాగేందర్ విచారణతో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తవుతుంది. -
పెరిగిన అప్పులు.. బ్యాంకర్ల వేధింపులతో
కరీంనగర్ జిల్లా: వ్యాపారంలో నష్టం, పెరిగిన అప్పులు, బ్యాంకర్ల వేధింపులతో ఓ రైస్మిల్ యజమాని భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తణుకు సురేశ్, స్వప్న (42) దంపతులకు మండలంలోని మొలంగూర్ శివారులో రైస్మిల్లు ఉంది. 2021–2022లో కస్టం మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వం వీరి రైస్మిల్లుకు ధాన్యం కేటాయించింది. అయితే అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టం వాటిల్లింది. అలాగే వ్యాపారం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు పెరిగిపోయాయి. దీంతో బకాయిలు చెల్లించాలని వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పుల బాధతో మనస్తాపం చెందిన స్వప్న శుక్రవారం ఉదయం ఇంట్లో బాత్రూములోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుర్లుండగా పెద్దకూతురు వివాహం చేశారు. చిన్నకూతురు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. సురేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. -
యువతితో పెళ్లైన హోంగార్డు ప్రేమాయణం!
హైదరాబాద్: ఇటీవల జరిగిన మేడారం జాతరకు విధులపై వెళ్లిన ముగ్గురు పిల్లలున్న ట్రాఫిక్ హోం గార్డు అక్కడ ఓ యువతితో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడమే కాకుండా రక్షణ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలివీ... శ్రీకాకుళంకు చెందిన పొంగూరు వాసుదేవరావు(38) అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఆయనకు ఇదివరకే వివాహం అయి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లను తీసుకొని భార్య ఇటీవల తన స్వగ్రామానికి వెళ్లింది. ఏడేళ్ల కొడుకుతో వాసుదేవరావు జగద్గిరిగుట్టలో అద్దెకుంటూ అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. మేడారం జాతరకు విధులపై వెళ్లాడు. అక్కడ ఇంటర్ పూర్తి చేసుకున్న ఓ విద్యార్థిని తన తల్లి కనిపించడం లేదంటూ వాసుదేవరావు కూర్చున్న ట్రాఫిక్ బూత్ను ఆశ్రయించింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగగా గంట వ్యవధిలోనే ఆమె తల్లిని కనుగొని అప్పగించాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత తరచూ ఇద్దరూ కలుసుకునే వారు. గత నెల 25వ తేదీన వాసుదేవరావు ప్రేమించిన యువతి(25)ను అమీర్పేట్లోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో మొదటి భార్యకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. తరచూ తన కూతురు బయటికి వెళ్తుండటాన్ని గమనించిన యువతి తండ్రి ఆరా తీయగా వాసుదేవరావును ఆమె పెళ్లి చేసుకున్నట్లుగా తేలింది. ఈ విషయంలోనే తమకు రక్షణ కావాలంటూ తాను వివాహం చేసుకున్న యువతిని తీసుకొని వాసుదేవరావు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఘటన వివరాలు ఆరా తీసి విచారణ చేపట్టి ఆ యువతి మేజర్ కావడంతో హోంగార్డుతో పంపించారు. ఈ విషయంపై మొదటి భార్య నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
యువతితో అసభ్య వీడియోలు తీసిన దర్శకుడు
హైదరాబాద్: వెండితెరపై వెలిగిపోవాలని నగరానికి వచ్చిన ఆ యువతిని ఓ దర్శకుడు ట్రాప్ చేసి సినిమా షూటింగ్ పేరుతో ఆమెను కారులో కూర్చుండబెట్టుకొని అసభ్యకరమైన సీన్లు తీసి సోషల్ మీడియాలో పోస్టే చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... శ్రీకృష్ణానగర్లో నివసిస్తున్న శంకర్(25) రీల్స్తో పాటు వెబ్సిరీస్లకు దర్శకత్వం వహిస్తుంటాడు. కాకినాడకు చెందిన యువతి(23) సినిమాల్లో వేషాల కోసం హైదరాబాద్కు వచ్చి యూసుఫ్గూడలోని తన స్నేహితురాలి వద్ద ఉంటున్నది. ఇటీవల ఓ వెబ్ సిరీస్లో వేషం ఉందంటూ శంకర్ ఆ యువతిని పిలిపించుకున్నాడు. కారులో కూర్చుండబెట్టుకొని కెమెరాతో షూట్ చేయసాగాడు. అసభ్యకరమైన డైలాగ్తో పాటు ఆమె చేత అసభ్య చేష్టలతో షూటింగ్ నిర్వహించి దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో యువతి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. ఇలాంటి వేషాలు వేస్తున్నావేంటంటూ ఆమెను ప్రశ్నించారు. ఆ వీడియో తొలగించాలని శంకర్కు చెప్పగా నిర్లక్ష్యం చేశాడు. మిగతా సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఆమె చేత పలికించిన డైలాగ్లు సన్నివేశాలను పోస్ట్ చేయడమే కాకుండా బ్లాక్ మెయిల్ చేయసాగాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు యువ దర్శకుడు శంకర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెరిగిన గ్యాస్ ధరలు.. డొమెస్టిక్ సిలిండర్ ఎంతంటే?
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భారత్పై పడింది. దీంతో వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్పై రూ.60 పెంపు జరగగా వాణిజ్య సిలిండర్పై రూ. 115 పెరిగింది. ఈ ధరలు తక్షణమే అమలులోకి వస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వ పథకం ఉజ్వల ద్వారా అందించే సిలిండర్ ధరలు మాత్రం యథాతథంగా ఉండనున్నట్లు తెలిపింది.ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో చమురు రవాణా చేసే నౌకలు నిలిచిపోయాయి. ఈ ప్రభావంతో చమురు ధరలు పెరిగాయి. ఈ ధరలతో హైదరాబాద్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 965కు చేరుకుంది. ఢిల్లీలో డొమెస్టిక్ ధర ప్రస్తుతం రూ. 913 ఉండగా, ముంబైలో రూ. 852 చెన్నైలో రూ.928 కి చేరుకుంది. అయితే యుద్ధప్రభావంతో భవిష్యత్తులో కొరత ఏర్పడకుండా ఉండేందుకు చమురు ఉత్పత్తులను భారీగా పెంచాలని కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే భారత్ వద్ద తాత్కాలికంగా చమురు నిల్వలు ఉన్నాయని పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది వరకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మహిళా మేలుకో.. ‘షీబాక్స్’కు చెప్పుకో!
సాక్షి, హైదరాబాద్: మహిళా భద్రత కోసం అందుబాటులో ఉన్న మరో అస్త్రం షీ–బాక్స్. పని ప్రాంతాల్లో లైంగిక వేధింపులను అరికట్టే లక్ష్యంతో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2017లో ప్రారంభించిన ఆన్లైన్ పోర్టలే ఈ షీ–బాక్స్ (సెక్స్వల్ హెరాసె్మంట్ ఎల్రక్టానిక్ బాక్స్). దేశంలో ఎక్కడ పనిచేసే మహిళలైనా, ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో ఫిర్యాదు చేసేలా దీన్ని రూపొందించారు.కాగా, 2024, ఆగస్టు 29న ఈ పోర్టల్ను మరింతగా ఆధునీకరించారు. బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతూనే, నిందితులను శిక్షించేలా ఇందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది.ప్రభుత్వ, ప్రైవేటు, వ్యవస్థీకృత లేదా అవ్యవస్థీకృత రంగాల్లో పనిచేసే మహిళలెవరైనా లైంగిక వేధింపులపై ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దేశంలో కార్యాలయాల్లో మహిళలపై వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో, బాధితులు భయపడకుండా నేరుగా ఫిర్యాదు చేయడానికి ఈ వ్యవస్థను రూపొందించారు. 2013లో అమల్లోకి వచి్చన పోష్ యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాసె్మంట్)ను సక్రమంగా అమలు చేయడంలో ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.బాధితులు బయటికి రావాల్సిన పనిలేకుండా ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయడంతోపాటు వారి ఫిర్యాదు ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు పురోగతిని ట్రాక్ చేసే వీలుంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రతీ సంస్థ ఇంటర్నల్ కంప్లైట్స్ కమిటీ ఏర్పాటు చేయడంతోపాటు ఆ వివరాలను షీ–బాక్స్ పోర్టల్లో నమోదు చేయడం తప్పనిసరి. కాగా, అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ పోర్టల్లో ఫిబ్రవరి వరకు 1,008 ఫిర్యాదులు నమోదవగా, అందులో 105 ఫిర్యాదులు పరిష్కరించారు. షీ–బాక్స్ అంటే ఏమిటి? షీ–బాక్స్ అనేది మహిళలు ఉద్యోగ స్థలాల్లో ఎదుర్కొనే లైంగిక వేధింపులపై ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు రూపొందించిన డిజిటల్ ప్లాట్ఫాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలు ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎలా ఫిర్యాదు చేయాలి? ⇒ షీ–బాక్స్ పోర్టల్ https:// shebox.wcd. gov. in/ లోకి వెళ్లాలి. ⇒ కుడిచేతి వైపు ఉన్న రిజిస్టర్ యువర్ కంప్లైంట్పై క్లిక్ చేయాలి. ⇒ అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేయాలి. ⇒ అవసరమైతే ఆధారాలు అప్లోడ్ చేయాలి. ⇒ ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత అది సంబంధిత సంస్థలోని ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీ సీ) లేదా సంబంధిత అధికారులకు పంపిస్తారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఏమవుతుంది? ⇒ ఫిర్యాదు సంబంధిత శాఖకు, ప్రైవేటు కార్యాల యం అయితే సంబంధిత కార్యాలయంలోని ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి లేదా జిల్లా స్థాయి లోని లోకల్ కమిటీ (ఎల్సీ)కి పంపిస్తారు. ⇒ అనంతరం విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ⇒ విచారణ ప్రారంభమైన తర్వాత గరిష్టంగా 90 రోజుల్లో విచారణ ప్రక్రియ పూర్తి చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ⇒ బాధితురాలికి ఫిర్యాదు స్థితి గురించి సమాచారం అందుతుంది. పోర్టల్లోకి వెళ్లి తమ ఫిర్యాదు ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు పురోగతిని ట్రాక్ చేసే వీలుంటుంది. -
టికెట్ స్కాన్ చేస్తేనే ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: రైలు టికెట్ను క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తేనే ప్రయాణికులు రైల్వే స్టేషన్లోకి ప్రవేశించగలుగుతారు. మెట్రో రైల్ స్టేషన్లలో ఉన్న తరహా విధానం త్వరలో సికింద్రాబాద్ స్టేషన్లో ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇదే కాదు, విమాన ప్రయాణికుల లగేజీ చెకింగ్, సెక్యూరిటీ చెకింగ్ తరహాలో సికింద్రాబాద్ స్టేషన్లో కూడా పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు కాబోతోంది. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిలో భాగంగా హై సెక్యూరిటీ సిస్టం ఏర్పాటు కాబోతోంది.రాత్రి కాగానే కొందరు నిరాశ్రయులు, ఆగంతకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి వెళ్లి అక్కడ ప్రయాణికులు కూర్చునే బెంచీలపై నిద్రకు ఉపక్రమిస్తారు. కానీ, వారిని అడ్డుకునేవారుండరు. ఇక అలాంటి వారు స్టేషన్లోకి ప్రవేశించలేరు. చివరకు సెక్యూరిటీ చెకింగ్ లేకుండా స్వయంగా ప్రయాణికులు కూడా స్టేషన్లోకి వెళ్లడం సాధ్యం కాదు. అలాంటి దుర్భేద్య వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించారు. వచ్చే నెలలో అందుబాటులోకి పదో నంబరు ప్లాట్ఫామ్ ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నా యి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. అతి కీలక ఎయిర్ కాంకోర్స్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరాంతానికి పూర్తిస్థాయిలో అది సిద్ధం కానుంది. ఈలోపు, పదో నంబరు ప్లాట్ఫామ్ వైపు పనులు దాదాపు ముగిసినందున, వచ్చే నెల నుంచి అక్కడి వసతులను ప్రయాణి కుల వినియోగంలోకి తేనున్నారు. భద్రత వ్యవస్థ మాత్రం పనులు మొత్తం పూర్తయ్యాకే ప్రారంభం కానుంది. పదేళ్ల క్రితం దేశంలో తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో, సికింద్రాబాద్ స్టేషన్లో బ్యాగేజీ స్కానింగ్ వ్యవస్థ ప్రారంభించారు.కానీ, నిత్యం లక్షన్నర మంది ప్రయాణికులు వచ్చే చోట ఒకటి చొప్పున రెండు వైపులా రెండు చెకింగ్ సెంటర్లు మాత్రమే ఏర్పాటు చేయడంతో ప్రయాణికుల సామర్థ్యాన్ని అది తట్టుకోలేకపోయింది. దీంతో ఒకటి రెండు రోజుల్లోనే వాటిని మూసేశారు. ఇప్పుడు స్టేషన్లోకి ఎలాంటి చెకింగ్ లేకుండా ఎవరైనా వెళ్లొచ్చు. రీడెవలప్మెంట్ పనుల్లో భాగంగా ప్రస్తుతం రూ.740 కోట్ల వ్యయంతో పూర్తిగా ఆధునీకరిస్తున్నందున, విమానాశ్రయ తరహా హంగులద్దుతున్నారు. ప్రయాణికులు, వారి సంబం«దీకులు కలిపి నిత్యం లక్షల మంది స్టేషన్కు వస్తున్నారు. దీంతో భద్రత కట్టుదిట్టంగా ఉండాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒకటో నంబరు ప్లాట్ఫామ్, అటు పదో నంబర్ ప్లాట్ఫామ్ ఉండే రెండు ప్రవేశ మార్గాల్లో దాదాపు ఆరు వరకు భద్రత తనిఖీ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు.ఎలా ఉండబోతోంది?⇒ ప్రయాణికులు ముందుగా లగేజీ స్కానింగ్ చేయించుకోవాలి. వెంట తెచ్చే ప్రతి బ్యాగును ఎక్స్రే స్కానింగ్ చేస్తారు. ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ వేస్తారా? లేదా? అన్న విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. చెక్ చేసిన తర్వాతనే లగేజీని లోనికి అనుమతిస్తారు. గంట వ్యవధిలో 30 వేల మంది వచ్చినా సరిపోయే సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ⇒ ప్రయాణికులకు సెక్యూరిటీ చెకింగ్ తప్పనిసరి. లోనికి ప్రవేశించేముందే భద్రత సిబ్బంది స్కానర్ల సాయంతో ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతారు. ⇒ లోనికి ప్రవేశించేముందు క్యూఆర్ కోడ్ సాయంతో ఆన్లైన్ టికెట్, ప్రత్యక్ష టికెట్లను స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల టికెట్ లేని వారిని నిరోధించేందుకు వీలవుతుంది. ప్రయాణికుల వెంట వచ్చే సంబం«దీకులు ఇక కచ్చితంగా ప్లాట్ఫామ్ టికెట్ కొనాల్సిందే. ⇒ పునరాభివృద్ధి తర్వాత భారీ భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయనున్నందున, సిబ్బంది సంఖ్యను కూడా భారీగా పెంచనున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, ప్రభుత్వ రైల్వే పోలీసు సిబ్బందిని అదనంగా రిక్రూట్ చేసుకోనున్నారు. -
50 లక్షల ఓటర్లు తగ్గుతారు సర్!!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో భారీగా ఓటర్లు తగ్గిపోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ‘సర్’లో ఏకంగా 50 లక్షల వరకు ఓటర్లు తగ్గిపోతారని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత ఈ సంఖ్య 2.75 కోట్ల నుంచి 2.80 కోట్ల మధ్య ఓటర్లు ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. 2002 ఓటర్ల జాబితాతో ర్యాండమ్ మ్యాపింగ్ చేసినట్టు తెలిసింది. హైదరాబాద్, శివార్లలో దాదాపు 87 లక్షల ఓటర్లు ఉంటే.. అందులో దాదాపు 15 నుంచి 20 లక్షల ఓటర్లు, గ్రామీణ జిల్లాల్లో దాదాపు 30 లక్షల వరకు ఓటర్లు తగ్గుతారని ఎన్నికల సంఘం వర్గాల నుంచి అందుతున్న సమాచారం.ఎన్నికల సంఘం రూపొందించిన ‘డెమోగ్రఫీ సిమిలర్ ఎంట్రీస్’సాఫ్ట్వేర్ ఆధారంగా బోగస్ లేదా డూప్లికేట్ ఓట్లను తొలగిస్తారు. దేశంలో ఎక్కడైనా సరే రెండో ఓటు ఉంటే..ఈ సాఫ్ట్వేర్తో తొలగించే వీలుంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా హైదరాబాద్లో ఎక్కువగా జిల్లాల నుంచి వచ్చి స్థిరపడినవారు. ఏపీ నుంచి వచ్చి స్థిరపడినవారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చి.. ఇక్కడ కూడా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. తమ స్వస్థలాల్లోనూ ఓటర్లుగా నమోదై ఉన్నారు. అలా రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న వారందరి ఓట్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తొలగిస్తారని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.ఎస్ఐఆర్ సందర్భంగా బీఎల్ఓ ఇంటింటికి సర్వేకు వచ్చిన సమయంలో ఓటర్లు తప్పనిసరిగా భౌతికంగా ఉండాలని, ఒకవేళ లేని పక్షంలో కుటుంబ యజమాని సంబంధిత వ్యక్తికి సంబంధించి అన్ని ఆధారాలను (ప్రూఫ్స్) చూపించి సంతకం చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉండే వారి ఓట్లు కనుమరుగయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. విదేశాలలో ఉన్న వారికి, రోహింగ్యాలకు ఇక్కడ ఓటు హక్కు కల్పించరు. అవసరమైతే ఎన్యుమరేటర్లు రెండుమూడుసార్లు వచ్చి మరీ తనిఖీలు చేసిన తర్వాతనే తుది జాబితాను రూపొందిస్తారు.ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ప్రతీ ఓటరు వివరాలు సేకరించి.. ఎన్యుమరేటర్ ఫామ్లో నింపిన తర్వాత ఒక ఓటరు రిసిప్ట్ కాపీ ఇస్తారని, అదే కాపీని సంబంధిత సిబ్బంది డిజిటల్ రికార్డుల్లోనూ భద్రపరుస్తారని అధికారులు చెబుతున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఒకే ఓటరు రెండుచోట్ల ఓట్లు వేసే పద్ధతిని ఈ ఎస్ఐఆర్ ద్వారా అరికట్టడానికి వీలవుతుందని, వాస్తవంగా ఎంతమంది ఓటర్లు ఉన్నారన్న విషయంలో పూర్తి స్పష్టత వస్తుందని, డూప్లికేషన్కు ఆస్కారం ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మూడో దశలో తెలంగాణ...దేశవ్యాప్తంగా ఇప్పటికే రెండు దశల్లో పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. మూడో దశలో తెలంగాణలో చేపట్టనుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానున్నట్టు సమాచారం. 2002 ఎన్నికల జాబితాతో అనుసంధానం చేసిన మ్యాపింగ్ ప్రక్రియ చేస్తోంది. ఈ సమయంలో ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే ఓటు గల్లంతయ్యే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం 4 భాగాలుగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించడం, ముసాయిదా జాబితా ముద్రణ, ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రచురణతో ఈ ప్రకియ పూర్తవుతుంది. ప్రతి ఇంటికీ నాలుగైదుసార్లు వెళ్లి వివరాలు సేకరించడం ద్వారా బీఎల్ఓలు ఎన్యుమరేషన్లో కీలక భూమిక పోషించనున్నారు.పాస్పోర్టు, రేషన్, ఆధార్ వంటి గుర్తింపు కార్డులను పరిశీలించి నిజమైన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతారు. తద్వారా డూప్లికేట్, చనిపోయిన, ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్లిన వారు, బోగస్ ఓటర్లు జాబితా నుంచి తొలగించి, వాస్తవ ఓటర్లకు మాత్రమే ఓటుహక్కు ఉండేలా ఈ ప్రక్రియను కొనసాగించాలని ఎన్నికల సంఘం ఉద్దేశం. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అన్నది రానున్న కాలంలో తెలియాల్సిందే. -
10న బీఆర్ఎస్ వర్క్షాప్ !
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేందుకు వర్క్షాప్నకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 10న హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్, అసెంబ్లీ మాజీ కార్యదర్శి సదారాం తదితరులను వక్తలుగా ఆహ్వానించినట్టు తెలిసింది.ఈ వర్క్షాప్నకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ నిర్వహణ తీరుతెన్నులు, సభా నియమావళితోపాటు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, వాటిని శాసనసభ సమావేశాల్లో లేవనెత్తాల్సిన తీరు తదితరాలపై నిపుణులు సూచనలు, సలహాలతోపాటు అవగాహన కల్పిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తర్వాతి దశల్లో కింది స్థాయి నాయకులు, క్రియాశీల కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ‘అంబేడ్కర్ విగ్రహం’పై ఉద్యమం మూసీ సుందరీకరణ పేరిట భారీ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్సేన్సాగర్ తీరాన ఏర్పాటు చేసిన భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని పట్టించుకోకపోవడంపై ఉద్యమించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నెల 10న ప్రారంభించే ‘అంబేడ్కర్ విగ్రహం’ఉద్యమ కార్యక్రమాన్ని వచ్చే నెల 14న జరిగే అంబేడ్కర్ జయంతి నాటికి తీవ్ర స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహ ప్రాంగణాన్ని మూసివేసి సందర్శకులకు కూడా అనుమతి ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.గ్రామ, మండల, జిల్లా స్థాయి మొదలుకొని దశలవారీగా అవసరమైతే ఢిల్లీ స్థాయికి ఉద్యమం తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సాగర హారం తరహాలో ఏప్రిల్ 14న హైదరాబాద్లోని అంబేడ్కర్ విగ్రహానికి ప్రభుత్వ ఆంక్షల నుంచి విముక్తి కల్పించాలనే డిమాండ్తో హుస్సేన్సాగర్ చుట్టూ మానవహారం నిర్వహించే యోచనలో ఉంది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగతోపాటు వివిధ దళిత సంఘాలు, ప్రజా సంఘాల నేతలతో త్వరలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు పార్టీ నేతలు భేటీ అవుతారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆంక్షలు విధించడంపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ‘గ్రేటర్’లో విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు గ్రేటర్ హైదరాబాద్తోపాటు కొత్తగా ఏర్పడిన మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధిలో విస్తృతంగా పార్టీ కార్యకలాపాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. గ్రేటర్ కార్పొరేషన్లకు మరో రెండు నెలల్లోపే ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తోన్న బీఆర్ఎస్ ఆ లోపే పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని భావిస్తోంది. కేటీఆర్ ఇప్పటికే గ్రేటర్లో ఇఫ్తార్ విందులు, ఇతర పారీ్టల నుంచి నేతల చేరికలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
ప్రపంచంలోనే గొప్ప నగరం హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్ /శంషాబాద్: ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన గొప్ప నగరంగా హైదరాబాద్ అవతరించనుందని, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, ట్రంప్, ఎలాన్ మస్క్ వంటి వారి సంస్థలు హైదరాబాద్కు రాబోతున్నాయని, ప్రపంచంతోనే పోటీపడే నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిర్మించిన కొత్వాల్గూడ ఎకోపార్కును ఆయన శుక్రవారం ప్రారంభించారు.బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్ ఛేంజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ భారత్ ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, శంషాబాద్ హైస్పీడ్ రైల్ టెరి్మనల్, బుద్వేల్ ట్రంపెట్, ఎకో పార్కు వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ను అద్భుతమైన నగరంగా ఆవిష్కరించనున్నాయన్నారు. హైదరాబాద్ కంటే సుందరమైన నగరం దేశంలోనే లేదన్నారు. చంద్రబాబు, వైఎస్ హయాంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని, కృష్ణా, గోదావరి నీళ్లు నగరానికి తీసుకొచ్చారని చెప్పారు. మూసీ వరదల నుంచి కాపాడుకునేందుకు నాటి నిజాం నవాబు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లను నిర్మించాడన్నారు. ఉస్మానియా ఆస్పత్రి, గోల్కొండ, అసెంబ్లీ వంటి చారిత్రక కట్టడాలు హైదరాబాద్లో ఉన్నాయని చెప్పారు. ఎంతో అందమైన హైదరాబాద్ నగరం ఆక్రమణలు, చెత్తతో నిండిపోయిందని, అలాంటి నగరాన్ని తిరిగి అందంగా, మరింత సుందరంగా చేస్తామంటే ప్రతిపక్షంలో ఉన్నవారు ఒప్పుకోవడం లేదన్నారు. మూసీ మురికిలో బతకాలని ఎవరూ కోరుకోరని, గంగా, యమున నదుల తరహాలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులు, గ్రీన్ఫీల్డ్ రోడ్లు, రేడియల్ రోడ్ల వల్ల భూములు కోల్పోయే వారికి తగిన పరిహారం అందజేస్తామని, వారికి ఎలాంటి నష్టాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఉత్తమ ప్యాకేజీని అందజేసే బాధ్యత తానే తీసుకుంటానని సీఎం చెప్పారు. నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తుంటే కేటీఆర్ అడ్డుపడుతున్నాడని, చాలాకాలం మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మూసీని నైట్ ఎకానమీ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామన్నారు. పాలపిట్ట రంగులో ఉన్న ఇందిరమ్మ చీరలు ధరించిన మహిళలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్ఛేంజ్ ప్రత్యేకతలు అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.488 కోట్లు ఖర్చు చేసి ట్రంపెట్ను నిర్మించనున్నారు. ఇది ఓఆర్ఆర్ను రేడియల్ రోడ్–2తో అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం లూపులు, ర్యాంపులు 15.36 కిలోమీటర్లు ఉంటాయి. 1.5 కిలోమీటర్ల సరీ్వస్ రోడ్ అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రంపెట్లో 59 పియర్లు, 60 స్పాన్లు ఉంటాయి. ఇది భూమి నుంచి 26 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొత్వాల్గూడ ఎకో–హిల్ పార్కు హిమాయత్సాగర్ సమీపంలో 85 ఎకరాల్లో ఎకో–హిల్పార్కును అభివృద్ధి చేశారు. ఇందులో దాదాపు 10 లక్షల మొక్కలు నాటారు. ఈ పార్కు హైదరాబాద్ నగరానికి గ్రీన్ లంగ్స్పేస్గా మారనుంది. దేశ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పక్షుల ఏవియరీ ఇక్కడ ఏర్పాటు చేశారు. 4.8 ఎకరాల విస్తీర్ణంలో 6,500 పక్షులకు ఆవాసంగా ఈ ఏవియరీ ఉంటుంది. పార్కులో 1.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ బోర్డ్ వాక్, 400 సీట్ల ఓపెన్ ఎయిర్ థియేటర్, సీతాకోక చిలుకల గార్డెన్, సెన్సరీ పార్కు, పిల్లల కోసం నేచురల్ ప్లే ఏరియా తదితర సదుపాయాలు ఉంటాయి. ఈ పార్కును సందర్శించడం వల్ల సింగపూర్లో పర్యటిస్తున్న అనుభూతి కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. పార్కు ప్రారంభించిన అనంతరం ఆయన అందులో కలియతిరిగారు. -
చావుకు అడ్డొస్తోందని భార్యపై పెట్రోల్ దాడి
తిరుమలాయపాలెం: కిడ్నీ సంబంధిత సమస్యతో నరకయాతన పడుతున్న ఓ వ్యక్తి తన జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడాలని ప్రయత్నించాడు. కానీ కుటుంబంలో విషాదం నింపొద్దని అడ్డు తగలడమే ఆయన భార్యకు శాపమైంది. ఈక్రమంలో సదరు వ్యక్తి భార్యపై పెట్రోల్ పోసి మంట అంటించాక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై జగదీశ్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తిరుమలాయపాలెంకు చెందిన తోటమళ్ల నాగభూషణం(65) రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.ఈ సందర్భంలో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి మూడు సార్లు ప్రయత్నించగా భార్య జయమ్మ అడ్డుపడింది. నానాటికీ సమస్య పెరుగుతుండడంతో అడ్డుపడుతున్న భార్యను ముందు చంపి ఆ తర్వాత తాను చనిపోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈమేరకు గురువారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ముందుగానే తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. కాగా, నాగభూషణం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉండగా అందరికీ వివాహాలు జరిగాయి.వీరి కుమారుడు మండల కేంద్రంలోనే మరోచోట ఉంటున్నాడు. ఇంట్లో నుంచి మంటలు వస్తుండగా స్థానికులు గమనించి కుమారుడికి సమాచారం ఇవ్వగా వచ్చి భార్యాభర్తలను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ నాగభూషణం శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందగా, జయమ్మ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
బస్సు అదుపుతప్పి.. లారీ, టిప్పర్ దూసుకెళ్లి..
అడ్డాకుల/హసన్పర్తి/చొప్పదండి: వాహనాల అతివేగం, నిర్లక్ష్యం ఏడు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. రాష్ట్రంలో వేర్వేరు చోట్ల శుక్రవారం జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి అవతలి వైపు మార్గంలో వస్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందగా ఓ లారీ అతివేగంగా దూసుకెళ్తూ ముందున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఇద్దరిని బలిగొంది. అలాగే ఓ టిప్పర్ సైతం మితిమీరిన వేగంతో వెళ్తూ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు స్నేహితులు మృతిచెందారు.తిరుపతి వెళ్తుండగా..ఎస్స్సై ఎం.వేణు, బాధితుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి 28 మంది ప్రయాణికులతో తిరుపతి బయలుదేరిన మహబూబ్నగర్ డిపో ఆర్టీసీ బస్సు 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదానికి గురైంది. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి శివారు, పొన్నకల్ స్టేజీ సమీపంలో డివైడర్ను ఢీకొని అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట నుంచి సిమెంట్ పైపులను మహబూబ్నగర్ తీసుకెళ్తున్న లారీని ఢీకొట్టింది.ఈ దుర్ఘటనలో లారీ, బస్సు క్యాబిన్లు నుజ్జునుజ్జు కావడంతో కొత్తకోట మండలం వడ్డెవాటకు చెందిన లారీ డ్రైవర్ నందిపేట రవి (35), కొత్తకోటకు చెందిన లారీ సహాయకుడు నాగన్న (38) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా బస్సు డ్రైవర్ పురుషోత్తం (58) చికిత్స పొందుతూ మరణించారు. మరో డ్రైవర్ రామన్గౌడ్తోపాటు 10 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో వెంకట్రామమ్మ, శాంతి, సురేశ్బాబు, శిరీష ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మిగిలిన వారు చికిత్స అనంతరం వెళ్లిపోయారు. ఇంజనీరింగ్ పరీక్ష రాసి వస్తుండగా..హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని హసన్పర్తి పెద్ద చెరువు సమీపంలో శుక్రవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఇంజనీరింగ్ పరీక్ష రాసి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరి పైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మలుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన షేక్ జునైద్ అక్రమ్ (21), వరంగల్ ఎల్లంబజార్కు చెందిన ఆకుతోట సుప్రతిక (21) మృతిచెందారు. వారిద్దరూ హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ సమీపంలోని ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు.జునైద్ ఓ ప్రైవే ట్ హాస్టల్లో ఉంటూ బైక్పై కళాశాలకు రాకపోకలు సాగిస్తుండగా సుప్రతిక ఆర్టీసీ బస్సులో కళాశాలకు వెళ్లి వస్తోంది. కళాశాలలో మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతుండటంతో శుక్రవారం పరీక్ష రాశాక జునైద్ లిఫ్ట్ ఇవ్వడంతో సుప్రతిక బైక్పై ఎక్కింది. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు నుజ్జునుజ్జు కావడంతో స్నేహి తులు కంట తడిపెట్టారు. మృతదేహాలను ఎంజీఎంకు తరలించారు. మృతులిద్దరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. జునైద్ తండ్రి షేక్ జమీల్ అక్రమ్ పాన్షాపు నిర్వహిçస్తుండగా, సుప్రతిక తండ్రి ఉమామహేశ్వర్ పండ్ల వ్యాపారి.పెళ్లి వేడుకకు వెళ్తుండగా.. తమ స్నేహితుడి పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు బైక్పై వెళ్తున్న ఇద్దరిని టిప్పర్ రూపంలో మృత్యువు వెంటాడింది. ఎస్సై నరేశ్రెడ్డి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన చిలుక ప్రదీప్కుమార్ (24), తాటికొండ సాయి కిరణ్ (24) శుక్రవారం పక్కనే ఉన్న చాకుంటలో స్నేహితుడి వివాహానికి బైక్పై వెళ్తున్నారు. మరో పది సెకన్లలో మెయిన్ రోడ్డు నుంచి చాకుంట క్రాస్ రోడ్డు దాటుతామని అనుకుంటుండగా కరీంనగర్ నుంచి ధర్మారం వైపు వెళ్తున్నటిప్పర్ వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడ్డ వారి తల మీద నుంచి టిప్పర్ వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ప్రదీప్కుమార్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, సాయికుమార్ గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. -
నేను అందరివాడిని
సాక్షి, హైదరాబాద్: బలహీనుల పక్షాన నిలబడే మొదటి వ్యక్తిగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. సామాజికంగా, ఆర్థికంగా బలహీనులుగా ఉన్న వారికి అండగా నిలిచి వారి లక్ష్య సాధన కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో భాగంగా మందకృష్ణ, సతీశ్ మాదిగ తదితరులు కలిసినప్పుడు అండగా నిలిచానన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీలో తొలి ప్రకటన చేసింది తమ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకు మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ శుక్రవారం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో కృతజ్ఞత సభ నిర్వహించింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వర్గీకరణపై వడివడిగా కదిలాం.. ‘ఎస్సీ వర్గీకరణ అంశం దశాబ్దాలపాటు నలిగింది. ఎలాగైనా వర్గీకరణ సాధించాలన్న తపనతో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు, తర్జనభర్జనలు జరిగాయి. 20 ఏళ్లుగా ఈ సమస్యను ప్రత్యక్షంగా చూస్తూ వచ్చిన నేను మీరు కోట్లాడిన ప్రతి సందర్భంలో నా చేతనైనా సాయం చేస్తూ వచ్చా. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు నాటి పాలకులు సండ్ర వెంకటవీరయ్య, సంపత్ కుమార్తోపాటు నన్ను సభ నుంచి బయటకు గెంటేశారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన ప్రజాప్రభుత్వం.. వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడంతోపాటు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది.అలాగే వన్ మ్యాన్ కమిషన్ను నియమించి ఆ కమిషన్ నివేదిక ఆధారంగా వర్గీకరణ అమలు చేసింది. ఇలా అన్నీ వేగంగా, విజయవంతంగా పూర్తి చేశాం. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించకపోవచ్చు. కానీ వీలైనంత వరకు పరిష్కారం చూపే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. పదోన్నతులు, ఉన్నత విద్య, లిడ్క్యాప్ భూముల పరిరక్షణ లాంటి సమస్యల పరిష్కారం పెద్ద విషయం కాదు.ప్రభుత్వం మీ సమస్యలను ముందుండి పరిష్కరిస్తున్నప్పుడు వెనుక నుంచి జరిగే దాడులను మీరే ఆపాలి. మీరే నాకు అండగా నిలవాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండి సమస్యలను అర్థం చేసుకొని ముందుకెళ్లాలి’అని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు, బ్రాండ్ అంబాసిడర్లు అన్నీ ప్రభుత్వ ఉద్యోగులేనని.. ప్రభుత్వం తలపెట్టిన 99 రోజుల ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మిత్రధర్మం... పేదల పక్షం... ‘మహాభారతంలో అర్జునుడు, కృష్ణుడు అందరికీ ఇష్టమే. కానీ నాకు కర్ణుడు, బార్బరికుడంటే అభిమానం. కర్ణుడు మిత్రధర్మాన్ని చివరి వరకు పాటించాడు. ఘటోత్కచుడి కుమారుడు బార్బరికుడు మాత్రం బలహీనుల పక్షాన నిలబడి పోరాడాడు. నేను కూడా బలహీనుల ఆశయ సాధన, సమస్యల పరిష్కారంలో ముందుంటా. వర్గీకరణ విషయంలో న్యాయం ఉంది. మీరు బలహీనులు కాబట్టే రాజకీయపరమైన ఒత్తిడి వచ్చినా మాదిగల పక్షాన నిలబడ్డా. నా ప్రయత్నంలో మంత్రివర్గ సహచరులు, అధికారులు సమయస్ఫూర్తి చూపి అండగా నిలబడ్డారు’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. నా శక్తి ఉన్నంత వరకు సాయం చేస్తా.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం పంచేందుకు భూములు లేవు. అలాగే ఆర్థిక వెసులుబాటు పరిమితంగా ఉంది. ఈ నేపథ్యంలో దారిద్య్రరేఖలో ఉన్న మాదిగ జాతి ముందుకు నడవాలంటే విద్య అవసరం. అందుకే నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికీ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచాం. విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తెస్తుంది. గత ప్రభుత్వం పేదలకు బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చామని చెప్పింది. చెప్పులు కుట్టుకొమ్మంది.బర్రెలు, గొర్రెలు, చేపలతో కాదు.. మీ జాతి బిడ్డలంతా కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలి. ఉన్నత స్థానాల్లోకి ఎదగాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. నా శక్తి ఉన్నంత వరకు మీకు సాయం చేస్తా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జగ్జీవన్రామ్ కుమార్తె మీరాకుమార్ ఎలా పనిచేశారో అదే స్ఫూర్తితో నేనూ పనిచేస్తా. ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు నన్ను రేవంత్ మాదిగ అన్నారు. ఇంకొన్ని పేర్లతోనూ పిలిచారు. నన్ను ఎలా పిలిచినా ఇబ్బంది లేదు.. నేను అందరి వాడిని’అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.ఎనిమిది నెలల్లోనే పూర్తి: మంత్రి దామోదర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను 8 నెలల్లోనే పూర్తి చేసి చరిత్ర సృష్టించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తదుపరి నిమిషమే సీఎంకు అసెంబ్లీలో సమాచారం ఇచ్చానని, వెంటనే సీఎం స్పందించి అసెంబ్లీలో ప్రకటన చేశారని.. కేవలం గంట వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తయిందన్నారు. వర్గీకరణతో ఉద్యోగాలు, విద్యలో మాదిగలకు అవకాశాలు పెరుగుతాయని.. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు సబ్ప్లాన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.గ్రూప్–1 ఉద్యోగాలు వచ్చాయి: అడ్లూరి ఎస్సీ వర్గీకరణ అమలుతో అత్యంత పేద కుటుంబాలకు గ్రూప్–1 లాంటి ఉద్యోగాలు వచ్చాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. వర్గీకరణ వల్లే 778 మందికి వైద్య విద్యలో ప్రవేశాలు, ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయన్నారు. దశాబ్దాల క్రితం కొట్లాడిన దానికి ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. -
మన టాప్ ర్యాంక్ 23
సాక్షి, హైదరాబాద్: సివిల్స్–2025 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏపీలోని కాకినాడకు చెందిన జీను శ్రీజశ్వంత్చంద్ర ఆలిండియా 23వ ర్యాంక్ సాధించగా తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన గూడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించారు. తెలంగాణకు చెందిన 20 మందికి వెయ్యిలోపు ర్యాంకులు లభించాయి.ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం తుది ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తోపాటు కేంద్ర ప్రభుత్వ సర్విసుల్లో 1,087 పోస్టులు ఖాళీగా ఉండగా తుది ఫలితాల్లో 659 మంది పురుషులను, 299 మంది మహిళలను కలిపి మొత్తంగా 958 మందిని సివిల్స్ విజేతలుగా యూపీఎస్సీ ప్రకటించింది. టాప్ 25 ర్యాంకులు సాధించిన వారిలో 14 మంది పురుషులు ఉండగా 11 మంది మహిళలు ఉన్నారు. మొత్తం అర్హుల్లో 317 మంది జనరల్ కేటగిరీ వారుకాగా 306 మంది ఓబీసీలు, 158 మంది ఎస్సీలు, 73 మంది ఎస్టీలు, ఉన్నారు.అలాగే ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్) విభాగం నుంచి 104 మంది ఈ జాబితాలో స్థానం సంపాదించారు. అలాగే ఐఏఎస్కు 180 మంది, ఐపీఎస్కు 150 మంది, ఐఎఫ్ఎస్కు 55 మంది, కేంద్ర సర్విసుల (గ్రూప్–ఏ)కు 507 మంది, గ్రూప్–బీ సర్విసులకు 195 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. సివిల్స్ ప్రిలిమ్స్ను 5,76,793 మంది రాయగా 14,161 మంది మెయిన్స్కు ఎంపికయ్యారు. వారిలో 2,736 మంది మాత్రమే ఇంటర్వ్యూ దశకు చేరుకున్నారు.]గతేడాదికన్నా సంఖ్య తగ్గింది సివిల్స్–2025 ఫలితాల్లో ఏపీ, తెలంగాణ అభ్యర్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే కొద్దిగా తగ్గింది. గతేడాది రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన గ్రూప్–1 పరీక్షలకు సన్నద్ధత వల్ల అభ్యర్థులు సివిల్స్పై ఎక్కువ దృష్టి సారించలేకపోయారు. విజేతల్లో ఎ క్కువ శాతం మంది ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారు, సివిల్స్ రీ–అటెంప్ట్ చేసిన వారే ఉన్నారు. తొలిసారి పరీక్ష రాసిన వారి సంఖ్య తక్కువగానే ఉంది. – వి. గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీఅనూజ్ అగ్నిహోత్రి టాపర్ రాజస్తాన్కు చెందిన అనూజ్ అగ్నిహోత్రి జాతీయ స్థాయి టాపర్గా నిలిచాడు. అనూజ్ ఎయిమ్స్ జో«ద్పూర్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తొలి ప్రయత్నంలో ఢిల్లీ, అండమాన్–నికోబార్ దీవుల సివిల్ సర్వీసు (డీఏఎన్ఐసీఎస్)లకు ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్న అతను తాజాగా మూడో ప్రయత్నంలో ఆలిండియా టాపర్గా సివిల్స్కు ఎంపికయ్యాడు. చెన్నైకి చెందిన రాజేశ్వరి సువే తన రెండో ర్యాంకు సాధించారు.అన్నా యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసిన ఆమె ఐదో ప్రయత్నంలో సివిల్స్ సాధించారు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ కామర్స్ గ్రాడ్యుయేట్ ఆకాన్‡్ష ధుల్ మూడో ర్యాంక్ పొందారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన బీఏ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ భార్గవ్ ఝన్ఝన్వాలా నాలుగో ర్యాంకు సాధించగా ఢిల్లీ లా యూనివర్సిటీ నుంచి బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) చేసిన ఇషాన్ భటా్నగర్ ఐదో ర్యాంకు పొందారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నందుకే ఈ ఫలితం: అనూజ్ సివిల్స్ ఫలితాల విడుదల అనంతరం అనుజ్ అగ్నిహోత్రి మీడియాతో మాట్లాడుతూ ‘ఈ విజయం అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తోంది. గత రెండు ప్రయత్నాల్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని అంకిత భావంతో సన్నద్ధం కావడం వల్లే ఈ ఫలితం లభించింది’అని పేర్కొన్నాడు. మరోవైపు ఆలిండియా టాపర్గా నిలిచిన అనుజ్ అగ్నిహోత్రికి రాజస్తాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా అభినందనలు తెలిపారు.ఐపీఎస్ టు ఐఏఎస్.. 23వ ర్యాంక్ సాధించిన కాకినాడకు చెందిన జీను శ్రీజశ్వంత్ చంద్ర ఐఐటీ కాన్పూర్లో బీటెక్ చేశారు. 2018లో బెంగళూరులో శామ్శాంగ్ సంస్థలో మూడేళ్లపాటు ఉద్యోగం చేశారు. సివిల్స్ కోసం ఉద్యోగానికి స్వస్తిపలికి 2020లో తొలి ప్రయత్నంలో ర్యాంక్ రాకపోయినా మరో ప్రయత్నంగా 2021లో రాసి 314వ ర్యాంక్ సాధించి పోస్టల్ శాఖలో ఉద్యోగం పొందారు. 2022లో మరోసారి సివిల్స్ రాసి ఐఆర్ఎంఎస్తోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్విసులోనూ కొలువు సాధించారు.2023లో సివిల్స్లో ఆలిండియా స్థాయిలో 162వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ ఏపీ కేడర్కు ఎంపికయ్యారు. అప్పటి నుంచీ హైదరాబాద్లోని నేషనల్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతూనే ఐఏఎస్ కోసం 2024లో మళ్లీ పరీక్ష రాశారు. 390వ ర్యాంక్ రావడం, లక్ష్యం నెరవేరకపోవడవంతో మరింత సాధన చేసి 2025లో మరోసారి పరీక్ష రాసి 23వ ర్యాంక్తో ఐఏఎస్కు ఎంపికయ్యారు. శ్రీజశ్వంత్ చంద్ర తండ్రి మాణిక్యాలరావు కుటుంబం పిఠాపురం నుంచి జగ్గంపేట వెళ్లి స్థిరపడింది. తల్లి వరలక్ష్మి ఉపాధ్యాయిని.సింగరేణి కార్మీకుడి కుమార్తెకు 55వ ర్యాంకు సివిల్స్ ఫలితాల్లో సింగరేణి కార్మీకుడి కుమార్తె జాతీయ స్థాయిలో 55వ ర్యాంకుతో సత్తా చాటింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నారు గ్రామానికి చెందిన గుడెల్లి రాజేశం–రాణి దంపుతుల కుమార్తె గుడెల్లి సృజన ఆరో ప్రయత్నంలో విజయం సాధించింది. తండ్రి రాజేశం ఆర్జీ–3 ఏరియాలోని ఓసీపీ వన్లో జనరల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. మంథని జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశాక.. 2018లో ఢిల్లీ వెళ్లి శిక్షణ తీసుకుంది. అమ్మనాన్నల ప్రోత్సాహంతోనే.. ‘మేము ముగ్గురం పిల్లలం. ఐఏఎస్ కావాలనే నా కలను అమ్మానాన్నలు వారి కలగా మార్చుకున్నారు. నా ప్రయత్నాలను ప్రోత్సహించారు. గతేడాది ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనక్కి వచ్చా. మరోసారి ప్రతి్నంచాలని ప్రోత్సహించారు. గ్రూప్–1 రాసి డీఎస్పీగా శిక్షణ తీసుకుంటూనే మరోసారి సివిల్స్కి ప్రిపేరయ్యా. అమ్మానాన్నల మాట ఈరోజు నిజమైంది. అప్పటి కరీంనగర్ కలెక్టర్ స్మితాసబర్వాల్ను స్ఫూర్తిగా తీసుకొని సివిల్స్కు ప్రిపేరయ్యా. మహేశ్ ఎం.భగవత్ సర్ సలహాలతో ఈరోజు సివిల్స్లో మంచి ర్యాంకు సాధించా.’ఐఎఫ్ఎస్ వచ్చినా ఐఏఎస్పై గురి 103వ ర్యాంకు సాధించిన బిపుల్ గుప్తా విశాఖవాసి. ఆయన తండ్రి విశాఖ స్టీల్ప్లాంట్ బ్లాస్ట్ఫర్నేస్ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ పవన్ కుమార్ గుప్తా. 2024 సివిల్స్ పరీక్షల్లో బిపుల్కు 368వ ర్యాంకు రావడంతో ఐఎఫ్ఎస్ అధికారిగా ఏపీ కేడర్లో చేరారు. ప్రస్తుతం డెహ్రాడూన్లో శిక్షణ పొందుతున్నారు. అయినా ఐఏఎస్ లక్ష్యంగా మళ్లీ సివిల్స్ రాసి ఇప్పుడు 103వ ర్యాంకు సాధించారు. బిపుల్ 2022లో ఐఐటీ మద్రాస్లో బీటెక్ పూర్తి చేశారు. తైక్వాండోలో బ్లాక్బెల్ట్ సాధించిన బిపుల్ గుప్తా తల్లి డాక్టర్ దీప గుప్త ప్రముఖ యూట్యూబర్. ఈసారి ఐఏఎస్ లభించే అవకాశం ఉందని బిపుల్ తెలిపారు.నాలుగో ప్రయత్నంలో 393వ ర్యాంకు సివిల్స్లో మూడుసార్లు విఫలమైనా పట్టుదలతో చదివి నాలుగో ప్రయత్నంలో 393వ ర్యాంకు సాధించారు తిరుపతికి చెందిన యారాశి తుషారికరెడ్డి. ఆమె తండ్రి వై.ఎం. గురువారెడ్డి తిరుపతి బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి, తల్లి మల్లీశ్వరి టీటీడీలో సూపరింటెండెంట్. తుషారిక చెన్నైలోని ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీటెక్ చేశారు. ప్రస్తుతం ఐఆర్ఎస్ లేదా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ పోస్టు రావచ్చని ఆమె అంచనా వేస్తున్నారు. గ్రూప్–2తో మురిసి.. సివిల్స్లో మెరిసి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు లక్ష్మి కుమారుడు సౌరోతు రాము సివిల్స్లో 463వ ర్యాంకు సాధించారు. రాముది సాధారణ వ్యవసాయ కుటుంబం. తండ్రి చిన్నప్పుడే చనిపోగా.. తల్లి కష్టపడి కుమారుడిని చదవించారు. ఆయన ఎన్ఐటీ వరంగల్లో బీటెక్ పూర్తి చేశారు. గత నెలలో గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. ఇప్పుడు మొదటి ప్రయత్నంలోనే సివిల్స్లో ర్యాంకు కొట్టారు.నాలుగో యత్నంలో 573వ ర్యాంకు విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎల్ఎంఎం విభాగంలో జనరల్ ఫోర్మెన్గా పనిచేస్తున్న రాజబాబు, విజయలక్ష్మి దంపతుల రెండో కుమార్తె శ్వేత ఐఐటీ హైదరాబాద్లో పూర్తి చేశారు. అనంతరం రెండుసార్లు సివిల్స్ ప్రిలిమ్స్లో విఫలమైన ఆమె మూడోసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా అనుకున్న ఫలితం రాలేదు. నాలుగో ప్రయత్నంలో 573 ర్యాంక్ సాధించారు. ప్రజాసేవ చేయాలన్నదే తన లక్ష్యమని శ్వేత పేర్కొన్నారు. ⇒ ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన గోగుళ్ల రాజశేఖర్కు చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమైనా సివిల్ సర్విసెస్లో 920వ ర్యాంకు సాధించారు. ఒడిశాలోని భువనేశ్వర్ ఐఐటీలో ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ చదివారు. నాలుగు ప్రయత్నాల్లో విఫలమైనా కుంగిపోకుండా ఐదోసారి పరీక్షలు రాసి విజయం సాధించారు.⇒ విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన ప్రమోద్విష్ణు సత్తా చాటారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 640వ ర్యాంకు సాధించారు. ఆయన విజయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ⇒ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన రాఘవేందర్ పదుకొనె, మమత దంపతుల కూతురు ఇంద్రార్చిత సివిల్స్లో 627 ర్యాంకు సాధించారు.నాలుగో ప్రయత్నంలో 178వ ర్యాంకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కాకతీయనగర్కు చెందిన బానోతు లక్ష్మీరచన సివిల్స్ ఫలితాల్లో 178వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి బానోతు వెంకటరమణ విప్రోలో ఉద్యోగి కాగా తల్లి తులశమ్మ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ తర్వాత బజాజ్ సంస్థలో అసోసియేట్ సైంటిస్ట్గా పనిచేస్తూ సివిల్స్ సాధించాలని మూడుసార్లు ప్రయతి్నంచింది. చివరకు నాలుగో ప్రయత్నంలో లక్ష్మీరచన 178వ ర్యాంకు సాధించింది. ఐఐటీ ఇండోర్లో ఆమె చదివింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సివిల్స్ సాధించాలన్న తన తండ్రి కోరిక నెరవేరలేదని.. దాంతో తనను సివిల్స్ రాయమన్నారని.. ఇప్పుడు తన తండ్రి కల నెరవేర్చినట్లయిందన్నారు.ఎంపీడీఓకు 472వ ర్యాంకుసిద్దిపేట జిల్లా మర్కూక్ మండల అభివృద్ధి అధికారి బేతి విక్రమ్ సివిల్స్లో 472 ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ విక్రమ్ మాట్లాడుతూ సాధించాలనే కృషి ఉంటే ఏదీ అసాధ్యం కాదని, తాను ఐఏఎస్ కోసం చాలా కష్ట పడ్డానన్నారు. తన కల సాకారమైందన్నారు. డిప్యూటీ కలెక్టర్కు 358వ ర్యాంకు మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్ ప్రసాద్ సాగర్ సివిల్స్లో 358వ ర్యాంకు సాధించారు. గతేడాది ఫలితాల్లో ఆయనకు 700వ ర్యాంకు వచ్చింది. గ్రూప్–1లోనూ సత్తా చాటిన వెంకటేశ్.. ప్రస్తుతం నల్లగొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్లో శిక్షణలో ఉన్నారు. ఆయన తండ్రి సత్యయ్య ట్రాన్స్కో ఏఈగా పనిచేస్తున్నారు. తల్లి యశోద గృహిణి. ఈసారి ఐఏఎస్ రాకపోతే మరోసారి ప్రయతి్నంచి లక్ష్యాన్ని చేరుకుంటానని వెంకటేశ్ ప్రసాద్ తెలిపారు.రెండో ప్రయత్నంలో...హైదరాబాద్లోని యాప్రాల్కు చెందిన ఆర్మీ విశ్రాంత అధికారి కల్నల్ శ్రీనివాస్, విశ్రాంత ఉపాధ్యాయిని బిందుల కుమారుడు డి.ఎస్.కె ప్రచేత్ సివిల్స్లో 193వ ర్యాంకు సాధించాడు. రెండో ప్రయత్నంలో సివిల్స్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. మద్రాస్ ఐఐటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.మూడో ప్రయత్నంలో 259వ ర్యాంకు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన శనిగరం వర్షిత్ రెడ్డి సివిల్స్లో 259వ ర్యాంక్ సాధించారు. వర్షిత్ హైదరాబాద్లోని బిట్స్ క్యాంపస్లో 2023లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కస్టమ్స్ విభాగంలో జీఎస్టీ విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా గతేడాది ఉద్యోగం సాధించి ప్రస్తుతం విజయవాడలో ఉద్యోగం చేస్తున్నారు. మూడో ప్రయత్నంలో సివిల్స్లో ర్యాంక్ సాధించారు. ఆయన తండ్రి శనిగరం నవీన్రెడ్డి వ్యాపారవేత్త, తల్లి కవితరెడ్డి.అటెండర్ కొడుకుకు 768వ ర్యాంకు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన కుమ్మరి శ్రవణ్కుమార్ సివిల్స్లో 768 ర్యాంకు సాధించాడు. ఆయన తండ్రి కుమ్మరి యాదగిరి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో అటెండర్గా పనిచేస్తుండగా తల్లి జ్యోతి ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గ్రూప్–1లో ట్యాక్స్ ఆఫీసర్గా ఎంపికై ఉద్యోగ శిక్షణ ఉంటూనే సివిల్స్ కోసం ప్రయతి్నంచి 6వ ప్రయత్నంలో శ్రవణ్కుమార్ లక్ష్యం చేరుకున్నాడు. లక్ష్యం పెట్టుకొని చదివానని.. సమాజంలో విద్యాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పాడు.సివిల్స్లో అన్నదమ్ములకు ర్యాంకు నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన అంజిరెడ్డి, ఆలివేలు దంపతుల కుమారులు వేలిమినేటి విక్రమసింçహారెడ్డి, విజయసింçహారెడ్డి సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. విక్రమసింçహారెడ్డి 541 ర్యాంకు, విజయసింçహారెడ్డి 682 ర్యాంకు సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోదరులిద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇటీవల జరిగిన గ్రూప్–1 పరీక్షల్లో విక్రమ్సింçహారెడ్డి 208 ర్యాంక్ సాధించి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉద్యోగంలో చేరగా విజయసింహారెడ్డి గ్రూప్–1లో 340 ర్యాంక్ సాధించి మహబూబ్నగర్లో ఎంపీడీవోగా పనిచేస్తున్నాడు.అమ్మానాన్న ప్రోత్సాహంతోనే.. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే సివిల్స్లో ర్యాంక్ సాధించానని 748వ ర్యాంకర్ పూదరి రాహుల్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన పూదరి గంగలక్షి్మ–మల్లేశం దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు రాజశ్రీకి వివాహం కాగా, పెద్దకుమారుడు రవితేజ సివిల్ సర్జన్గా శిక్షణ పొందుతున్నారు. చిన్నకుమారుడు రాహుల్ సివిల్స్లో 748వ ర్యాంక్ సాధించారు. -
గచ్చిబౌలిలో పేలిన హీలియం గ్యాస్ బెలూన్
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో హీలియం గ్యాస్ బెలూన్ పేలి నలుగురికి గాయాలయ్యాయి. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో అడ్వర్టైజ్మెంట్ గ్యాస్ బెలూన్ పేలింది. ఓ కన్వెన్షన్ లో హొలీ ఈవెంట్ లో అడ్వర్టైజ్మెంట్ కోసం బెలూన్ ఏర్పాటు చేశారు. అయితే అది గాలికి ఎగిరి వచ్చి బ్రహ్మకుమారీస్ ప్రాంగణంలో పడింది. దీన్ని బ్రహ్మకుమారీస్ వాలంటరీలు తీయడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పేలింది,. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఉస్మాన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
TG: సివిల్స్ విజేతలకు సీఎం అభినందనలు
సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ 2025 ఫైనల్ ఫలితాల్లో విజయం సాధించిన తెలంగాణ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్టం నుంచి 20 మంది సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించగా వారందరినీ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.యుపీఎస్సీ నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీకి ప్రిపేరయ్యే అభ్యర్థుల్లో పేదవారు ఉంటారని గుర్తించిన ప్రభుత్వం వారికి అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా మెయిన్స్ రాసే విద్యార్థులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే గతేడాది సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. వారిలో 51 మంది ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారు. వారందరికీ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నగదుని అందజేసింది. -
అందుకే మాదిగల వైపు నిలబడ్డా: సీఎం రేవంత్
హైదరాబాద్: చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతోందని, ఈ అంశాన్ని 20 ఏళ్ల నుంచి గమనిస్తున్నాని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ నిర్వహిస్తున్న ధన్యవాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ మేం మాటలతో గెలవలేదు.. కమిట్మెంట్తో గెలిచాం. వర్గీకరణ అంశంలో మాదిగవైపు న్యాయం ఉంది. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మాదిగల వైపే నిలబడ్డాను. తెలంగాణ పునర్నిర్మాణంలో మాదిగల భాగస్వాములు కావాలి. ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్న బలమైన ఆకాంక్షతో 2023 ఎన్నికల్లో కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023 లో మా దగ్గర అధికార యంత్రాంగం, అక్రమ సంపాదన లేదు..చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతోంది. పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి. ఎలా అయితే సాధించుకోవాలన్న తపనతో కొందరు ప్రాణ త్యాగాలు చేశారు. ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు,తర్జనభర్జనలు జరిగాయి. 20 ఏళ్ల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా నేను చూస్తూ వస్తున్నాను. మీరు కోట్లాడిన ప్రతి సందర్భంలో నా చేతనైనా సాయం చేస్తూ వచ్చాను. క్రిష్ణ మాదిగ, సతీష్ మాదిగ నా దగ్గరకు వచ్చినప్పుడు చేతనైన సాయం చేసి అండగా నిలిచాను. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి పాలకులు సండ్ర వెంకటవీరయ్య, సంపత్ కుమార్ తో పాటు నన్ను బయటకు గెంటివేశారు. నాకు మహాభారతంలో కర్ణుడు, బార్బరీకుడు అనే పాత్రలు ఇష్టం. కర్ణుడికి అవమానం జరిగినప్పుడు పోరాటం చేశారు.. మిత్రధర్మాన్ని నేరవేర్చాడు. నేను కూడా మిత్రధర్మాన్ని నిర్వర్తించాను.. మాదిగలకు నేను అండగా నిలబడ్డాను. నా శక్తి ఉన్నంతవరకూ మీకు సాయం చేస్తాను’ అని సీఎం రేవంత్ తెలిపారు. -
TG: అంగన్వాడిలో అగ్ని ప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: కొందుర్గులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అంగన్వాడీ కేంద్రంలో సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో తక్షణమే స్పందించిన స్థానికులు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది.. ఇతరాత్ర వివరాలు తెలియాల్సి ఉంది. -
తెలంగాణా సహా 22 రాష్ట్రాల్లో ‘సర్’ : నోటిఫికేషన్ జారీ చేసిన ఈసీ
తెలంగాణాలో ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’’ (SIR)కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర న్నికల సంఘం (సీఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. నకిలీ ఓటర్లను తొలగించి, ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశంలో SIR తీసుకొచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిలో భాగంగా తెలంగాణతో సహా 22 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్కు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఏప్రిల్లో ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు సంబంధించి సన్నాహకాలను, శిక్షణా కార్యక్రమాలను కూడా ఇప్పటికే చేపట్టింది. ఈసీఐ ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిసుదర్శన్ రెడ్డి శిక్షణ కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ దశలవారీగా చేపడుతోంది. దీనిపై అనేక విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. -
హైదరాబాద్ ఐఎండీ ఆఫీస్కు బాంబు బెదిరింపు మెయిల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వాతావరణ శాఖ (ఐఎండీ) కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. ఒక్కసారిగా ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. బేగంపేట ఆఫీస్లో 14 ఆర్డీఎక్స్ బాంబులను అమర్చినట్లు మెయిల్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని పోలీసుల తేల్చారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టుతో పాటు పలు జిల్లా కోర్టులకు బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.గత నెలలో రాజమండ్రి జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ బెదిరింపు రావడంతో కోర్టు భవనాన్ని ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్డుకు, కరీంనగర్ కోర్టుకు బాంబు బెదింరింపులు రావడంతో పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. న్యాయవాదులను కోర్టు సిబ్బందిని బయిటకి పంపారు. అనంతరం డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. అయితే ఇటీవల తరచుగా కోర్టులకు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని ఓ కోర్టు భవనంలో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. అంతే కాకుండా తరచుగా విద్యాలయాలకు బెదిరింపులు వస్తున్నాయి. -
తెలంగాణ గవర్నర్ గా శివప్రతాప్ శుక్ల
-
ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ!
ఆసిఫాబాద్అర్బన్: వేసవి ఎండల నేపథ్యంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం వచ్చే నెలలోనే పంపిణీ చేయాలని రాష్ట్రాలకు కేంద్ర పౌరసరఫరాల శాఖ లేఖలు రాసింది. ఈ క్రమంలో తెల్లరేషన్ కార్డుదారులకు ఏప్రిల్లోనే మూడు నెలల బియ్యం అందనుంది. గోదాముల నుంచి బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేయనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 15 మండలాల పరిధిలో 315 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల పరిధిలో 1,63,765 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 13,389 అంత్యోదయ కార్డులకు 43,821 యూనిట్లకు 468.615 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. అలాగే 1,50,356 ఆహార భద్రత కార్డులకు 4,95,204 యూనిట్లకు 2690.928 మెటిక్ టన్నులు, 20 అన్నపూర్ణ కార్డులకు 0.200 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుంది. ప్రతినెలా సుమారు 3519.743 మెట్రిక్ టన్నుల బియ్యం చొప్పున మూడు నెలలకు కలిపి సుమారు 10559.229 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయనున్నారు.జిల్లా ప్రజలకు మేలుగతేడాది వర్షాకాలంలో వరదలు, ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకుని జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను ఒకేసారి పంపిణీ చేశారు. అలాగే వేసవిలో ఎండలు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మరోసారి మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో మారుమూల గిరిజన గ్రామాల్లోని లబ్ధిదారులకు మేలు జరగనుంది. తిర్యాణి మండలంలోని పల్లెలతోపాటు పలు గ్రామాల్లో స్థానికంగా రేషన్ దుకాణాలు లేవు. ఐదారు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారు. ఒకేసారి బియ్యం అందిస్తే వీరికి దూరభారం తగ్గనుంది. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడం చేస్తే రవాణా చార్జీల ఖర్చు తగ్గి, హమాలీలు, డీలర్లకు కలిసివచ్చే అవకాశం ఉంది. అయితే బియ్యం నిల్వ చేయడం సమస్యగా మారనుంది. బియ్యం తీసుకునేందుకు ఒక కార్డుదారుడు మూడుసార్లు వేలిముద్ర వేయాలి. గతంలో జిల్లాలో సిగ్నల్, సర్వర్ సమస్యతో ఒక్కో కార్డుదారుడికి సుమారు 20 నిమిషాల సమయం పట్టింది. కేంద్రాల వద్ద పడిగాపులు తప్పలేదు. ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పౌరసరఫరాల శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.ఉత్తర్వులు అందలేదుఏప్రిల్లో ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేయడంపై ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటాం. ప్రతీ రేషన్కార్డు దారుడు ఈ నెల చివరి వరకు తప్పకుండా ఈ కేవైసీ చేయించుకోవాలి.– వసంతలక్ష్మి,జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
Hyderabad: కొండలు కరిగించేస్తున్నారు
ఇది కొత్వాల్ గూడ పరిధిలోని రెడీమిక్స్ ప్లాంటు. పూర్తిగా 111 జీఓ పరిధిలో ఉంటుంది. ఇక్కడ నిర్మాణాలకే కాదు పరిశ్రమలకు, ప్లాంట్లకు అనుమతుల్లేవు. కానీ పలు సంస్థలు ఇక్కడ సుమారు ఇరవై వరకు ఆర్ఎంసీ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. కళ్లముందే పెద్దఎత్తున క్వారీ తవ్వకాలు చేపడుతున్నా..క్రషర్ మిషన్లు, రెడీమిక్స్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నా పట్టించుకునే నాథుడే కరువమయ్యాడు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రేటర్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భూముల ధరలు ఆకాశాన్నంటాయి. రియల్టర్లు ప్రభుత్వ, ప్రైవేటు భూములే కాదు వాగులు, వంకలు, ఎత్తైన కొండలు, గుట్టలను కూడా వదలడం లేదు. తక్కువ ధరకు వాటిని కొను గోలు చేసి లేక్వ్యూల పేరుతో ఎత్తైన నిర్మాణాలు చేపడుతున్నారు. వీటికి గ్రానైట్, కంకర, రోబోసాండ్ పెద్ద మొత్తంలో అవసరం ఉంటుంది. వీటి కొనుగోలుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండటంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు పక్కనే ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లోని కొండలు, గుట్టలపై కన్నేశాయి. ఇందుకు అధికారంలో ఉన్న కొంత మంది పెద్దల సహకారం కూడా లభిస్తుండటంతో యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నాయి. పైసా ఖర్చులేకుండానే విలువైన మట్టిని తమ సైట్లోకి తరలిస్తున్నాయి. జిలెటిన్స్టిక్స్తో కొండలను పిండి చేస్తున్నాయి. అక్కడే క్రషర్ మిషన్లు, రెడీమిక్స్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, నిర్మాణాలకు అవసరమైన ముడిసరుకునంతా సమకూర్చుకుంటున్నాయి. అక్రమ మైనింగ్తో ప్రభుత్వ ఆదాయానికి పెద్దమొత్తంలో గండి పడుతోంది. ఒక్క శంషాబాద్ మండల పరిధిలోనే 20 అక్రమ ఆర్ఎంసీ ప్లాంట్లు ఉన్నట్లు అంచనా. వీటిలో ఏ ఒక్కదానికి కూడా మైనింగ్ లీజు సహా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లోకల్ బాడీ నుంచి నిరభ్యంతర పత్రం, తెలంగాణ విద్యుత్ తనిఖీ ప్రధాన అధికారి, రెవెన్యూ శాఖల నుంచి కనీస అనుమతులు లేవంటే ఆశ్చర్య పోనవసరం లేదు. కోకాపేట్లో.. కొంత మంది తీసుకున్న అనుమతులకు భిన్నంగా తవ్వకాలు చేపడుతుంటే.. మరికొంత మంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు తవ్వకాలకు పాల్పడుతున్నారు. కనీసం లీజు అనుమతులు కూడా తీసుకోకుండా రూ.కోట్ల విలువైన సహజ సంపదను కొల్లగొడుతున్నారు. కోకాపేటలోని విలువైన ప్రభుత్వ భూమిలో పరిమితికి మించి తవ్వకాలు చేపట్టారు. మొబైల్ క్రషింగ్ ప్లాంట్కు పరి్మషన్ తీసుకుని ఫిక్స్డ్ క్రషింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేశారనే ఆరోపణలున్నాయి. 15 లక్షల క్యూబిక్ మీటర్ల మైనింగ్ చేపట్టి, ప్రభుత్వానికి కనీస ఫీజును కూడా చెల్లించడం లేదు. ఈవిషయంపై శంషాబాద్ తహసీల్దార్ రవీందర్ దత్తు మాట్లాడుతూ.. ఇప్పటికే ఐదు ప్లాంట్లను సీజ్చేశామని తెలిపారు. మిగిలిన వాటిని కూడా రెండు మూడు రోజుల్లో సీజ్ చేస్తామని వివరించారు.అక్రమ క్రషర్ మాఫియా కనిపించడం లేదా? శంషాబాద్: జీవో 111 పరిధిలో చిన్న ఇల్లు కట్టడానికి సైతం అనుమతించని అధికారులకు అనుమతులు లేని అక్రమ క్రషర్ మాఫియా ఎందుకు కనిపించడంలేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. కొత్వాల్గూడ అసైన్డ్ భూముల్లో కొనసాగుతున్న క్రషర్ ప్లాంటును ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నేతృత్వంలోని నిజనిర్ధాణ కమిటీ గురువారం మధ్యాహ్నం పరిశీలించింది. మంత్రి పొంగులేటికి కుమారుడు నగరంలో నిర్మాణం చేస్తున్న ఆకాశహరŠామ్యలకు ఇక్కడ ఉన్న రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ ద్వారానే మెటీరియల్ సరఫరా జరుగుతోందన్నారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి అడ్డగోలుగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. అక్రమ మైనింగ్లో సంబం«ధమున్న పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో గరీబోళ్ల ఇళ్లు కూల్చేసి ఆ ప్రాంతాన్ని గాజాలా మార్చారన్నారు. అక్రమ మైనింగ్ చేస్తుంటే ప్రశి్నంచని అడ్డుకోలేని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం పెయిడ్ బ్యాచ్ కాదా అని నిలదీశారు. రాష్ట్రంలో ఏ ఒక్క కాంట్రాక్టును పొంగులేటి వదలడంలేదన్నారు. మొత్తం మీద రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ఏఐసీసీకి ఏటీఎంలా మారిందని ఆయన ఆరోపించారు. -
జీహెచ్ఎంసీ అప్పులు మీరే కట్టండి
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు వివిధ ప్రాజెక్టుల కోసం ఆర్థిక సంస్థలు, బ్యాంకుల ద్వారా తీసుకున్న భారీ రుణాలు. మరోవైపు బల్దియాకు అధిక ఆదాయ వనరులైన ఆస్తిపన్ను, టౌన్ప్లానింగ్ ఫీజులు భారీగా తగ్గే పరిస్థితులు. ఇంకోవైపు తీసుకున్న అప్పులన్నీ జీహెచ్ఎంసీ పేరిటే ఉండటంతో అప్పులు కట్టాల్సిన బాధ్యతతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాలు ఏళ్లకేళ్లుగా ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో కొండలా పేరుకు పోయిన బకాయిలు.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ విస్తరించి మూడు కార్పొరేషన్లుగా మారింది. దీంతో కొత్త కార్పొరేషన్లు బకాయిలు కట్టే పరిస్థితిలో లేవు. జీహెచ్ఎంసీ పరిధి ఎక్కువగా ఉన్నా ఆదాయం వచ్చే అవకాశం అంతంతమాత్రమే. దీంతో మూడు కార్పొరేషన్లు మనుగడ సాగించాలంటే, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి చెందాలంటే వివిధ ప్రాజెక్టుల (ఎస్సార్డీపీ, ఎస్ఎన్డీపీ,సీఆర్ఎంపీ) కోసం తీసుకున్న అప్పుల్ని ప్రభుత్వమే చెల్లించాల్సిందిగా జీహెచ్ఎంసీ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను కానీ, స్టాంపుడ్యూటీ ద్వారా కానీ, వృత్తిపన్ను ద్వారా కానీ, ఇతరత్రా రూపాల్లో జీహెచ్ఎంసీకి రావాల్సిన బకాయిలేవి చెల్లించకుండా, వాటి బదులు తమ అప్పులు తీర్చాల్సిందిగా కోరింది. ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తోంది. మూడు కార్పొరేషన్ల ఏర్పాటులో ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించి ప్రభుత్వం స్పెషల్ టాస్క్ఫోర్స్ కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో ఏ కార్పొరేషన్పైనా భారం లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ ఈమేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రుణ భారం గత ప్రభుత్వ హయాంలో నగరంలో భారీయెత్తున మౌలిక సదుపాయాలు కలి్పంచారు. అభివృద్ధి పనులు చేశారు. అందుకుగాను మున్సిపల్ బాండ్ల జారీ, వాణిజ్య రుణాలు, ఇతరత్రా వెరసి రూ.6,530 కోట్ల అప్పులు చేశారు. వడ్డీ సహా చెల్లింపులు పోను గత అక్టోబర్ వరకు మిగిలిన అప్పుల భారం రూ.4,877 కోట్లు. రాని బకాయిలు వివిధ రూపాల్లో ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి నిధులు రావడం లేదు. వాటిలో స్టాంపు డ్యూటీవే దాదాపు రూ.2,500 కోట్లు బకాయిలున్నాయి. మ్యుటేషన్ ఫీజులు రూ. 100 కోట్లు రావాల్సి ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల భవనాలకు సంబంధించిన ఆస్తిపన్ను తదితరాలు వెరసి వేల కోట్లు రావాలి. ఇవేవీ రాకపోవడంతో జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. అయినప్పటికీ నెలనెలా సిబ్బంది జీతాలకు దాదాపు రూ.120 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి.వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని జీహెచ్ఎంసీ ఈ విజ్ఞప్తి చేసింది. మూడు కార్పొరేషన్లలో జనాభా, మౌలిక వసతులు, ఆదాయ మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలని ఒక ఆలోచన చేశారు. కానీ, అప్పుల భారం ఉంటే ప్రగతి ముందుకు సాగదని, అభివృద్ధి ఆగిపోగలదని భావించి ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అప్పులన్నీ జీహెచ్ఎంసీ పేరిటే ఉన్నాయి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాగలదని ఆశిస్తున్నారు.‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’ నేటినుంచేనగర కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం అమలులో నగరంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తద్వారా రాబోయే కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలుపు కోసం బాట వేయవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటి వారం నగరంలోని మూడు కార్పొరేషన్ల పరిధిలో పర్యటించనున్నట్లు తెలిసింది. గ్రేటర్ నగరం మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైన నేపథ్యంలో వీటి పరిధిలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు అగ్రసేన్ మహరాజ్ జంక్షన్, చాచానెహ్రూ పార్కు, పబ్లిక్హెల్త్ ఇంజినీరింగ్ కార్యాలయం, కొత్వాల్గూడ, ఉప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల్లో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. మూడు కార్పొరేషన్ల అధికారులు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఎక్కువగా చెత్త తరలింపు వంటి పనులకు ప్రాధాన్యమిచ్చారు. నగరానికి ప్రాధాన్యం ఎందుకు ? రాజధాని హైదరాబాద్ మూడు కార్పొరేషన్లుగా మారడంతో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కలి్పంచవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. మూడు కార్పొరేషన్లు ప్రస్తుతం స్పెషలాఫీసర్ పాలనలో ఉన్నాయి. జరగబోయే ఎన్నికల్లో మూడింట రెండు కార్పొరేషన్లను గెలుచుకోవాలనేది అధికార పార్టీ ఆలోచన కాగా, ఒక కార్పొరేషన్ను మిత్రధర్మంగా ఎంఐఎంకు వదిలేశారనే ప్రచారం ఇప్పటికే మొదలైంది. మూడుకార్పొరేషన్ల ఎన్నికలూ ఒకేసారి జరుగుతాయా, లేక వేర్వేరుగానా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
విరిగిన చక్రం.. ఆగిన రైలు
జమ్మికుంట/కమలాపూర్: సికింద్రాబాద్ నుంచి హిస్సార్కు వెళ్తున్న హిస్సార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు (22737) ఇంజిన్ చక్రం హఠాత్తుగా విరిగిపోయింది. లోకో పైలట్ వెంటనే అప్రమత్తంగా వ్యవహరించి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. బుధవారం అర్ధరాత్రి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఈ సంఘటనపై స్థానికులు, రైల్వే అధికారులు తెలిపిన వివరాలివి. సికింద్రాబాద్ జంక్షన్లో బుధవారం రాత్రి బయల్దేరిన హిస్సార్ ఎక్స్ప్రెస్.. జమ్మికుంట, ఉప్పల్ రైల్వేస్టేషన్ల మధ్య గల జమ్మికుంట మండలం మడిపల్లి సమీపంలోని నంబరు 18 గేట్ వద్దకు చేరుకుంది.ఇక్కడ ఇటీవల నిర్మించిన మూడోలైన్లో రైలు వెళ్తోంది. వేకువజాము 2.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా రైలింజిన్ చక్రం విరిగినట్లు శబ్దం వచి్చంది. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ సడన్బ్రేక్ వేసి రైలు నిలిపి వేశారు. రైలు కుదుపునకు గురవడంతో ఏమైందో తెలియక ప్రయాణికులు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఆ వెంటనే లోకోపైలట్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు.వారు మరో రైలింజిన్లో అదేలైన్లో వచ్చి వెనకాల ఉన్న బోగీలను ఉప్పల్ రైల్వేస్టేషన్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇంజనీర్లు రైలింజిన్ చక్రానికి మరమ్మతులు చేసి జమ్మికుంట వైపు తీసుకెళ్లారు. ఈ సమయంలోనే వస్తున్న దక్షిణ్ ఎక్స్ప్రెస్ను ఉప్పల్ వద్ద నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం గురువారం ఉదయం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా వేకువజాము 2.30 గంటల నుంచి సుమారు 7 గంటల పాటు హిస్సార్ ఎక్స్ప్రెస్ రైలులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఇక ఈ–ఆఫీస్ పాలనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై పరిపాలన అంతా నూరు శాతం ఆన్లైన్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టం (ఓఎఫ్ఎంఎస్) ద్వారానే కొనసాగనుంది. ఈ నెల 15 నుంచి ఓఎఫ్ఎంఎస్ విధానంలోనే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మాన్యువల్ పద్ధతిలో వచ్చే ఫైళ్లను ఎట్టిపరిస్థితిలోనూ ఆమోదించబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రాయి రవి అన్ని శాఖలకు మెమో జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తుండగా ఆర్థిక శాఖ కూడా యుద్ధప్రాతిపదికన అమలుకు నిర్ణయించింది. తాజా ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ పూర్తిస్థాయిలో ఈ–ఆఫీస్లుగా అవతరించనున్నాయి. ప్రతి ఉద్యోగికి ప్రత్యేక లాగిన్...: రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం కాగితాలతో కూడిన ఫైళ్లను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కార్యాలయాల్లో కొన్నింటిని డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకువచి్చనప్పటికీ అర్జీలతో కూడిన వాటిని కాగితాల్లోనే నిర్వహిస్తున్నారు. కానీ ఇకపై కాగితాలతో కూడిన ఫైళ్లకు తప్పనిసరిగా స్వస్తి పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు ప్రతి అంశం ఆర్థికశాఖతో ముడిపడి ఉండటంతో ఫైళ్ల నిర్వహణ ఆన్లైన్ ఫైల్ మేనేజ్మెంట్ విధానంలోకి మార్పు చేయాల్సిందే. ప్రజల నుంచి లేదా ఉద్యోగుల నుంచి వచ్చే వినతులు కాగితాల్లో వస్తే వాటిని వెంటనే స్కాన్ చేసి డిజిటల్ రూపంలోకి మార్చాకే ఫైలును ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఎంఎస్ విధానంలో భాగంగా శాఖలవారీగా ప్రతి ఉద్యోగికి త్వరలో ప్రత్యేకంగా లాగిన్ ఐడీలను కేటాయించనున్నారు. ఆన్లైన్ విధానం ద్వారా ఫైళ్ల నిర్వహణ సమయం తగ్గడంతోపాటు పారదర్శకత పెరగనుంది. ఒకవేళ ఫైలు నిర్వహణలో జాప్యం జరిగినా ఉన్నతాధికారులకు తెలియడంతోపాటు కారణాలను తెలుసుకొని చర్యలు తీసుకొనే వీలుంటుందని.. ఫలితంగా జవాబుదారీతనం మరింత మెరుగవుతుందని సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. -
ఎస్ఐఆర్కు వేగంగా కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)కు ఎన్నికల సంఘం కార్యాచరణ వేగవంతం చేసింది. ఏప్రిల్ రెండో వారం నుంచి ఈ ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో ఓటర్ల ఎన్యూమరేటర్ల నుంచి సేకరించాల్సిన డేటాకు సంబంధించిన ఫారాల ముద్రణ, బీఎల్ఓలకు శిక్షణ, వారికి అవసరమైన కిట్స్ పంపిణీ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ఆర్థిక బిడ్స్ను శుక్రవారం తెరవనున్నారు. ఆ తరువాత కాంట్రాక్టర్లకు ఆ బాధ్యత అప్పగిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం 3.36 కోట్ల మంది ఉన్నారు. మూడో దశ కింద 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ కోసం ఏప్రిల్ మొదటివారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ప్రక్రియ చేపట్టడానికి అవసరమైన ప్రీ ఎస్ఐఆర్ ర్యాండమ్ పరిశీలన కొనసాగుతోంది. రాష్ట్రంలో ఉన్న 3.36 కోట్ల మంది ఓటర్ల దగ్గరకు వెళ్లి పోలింగ్ కేంద్ర అధికారులు(బీఎల్ఓ)లు పరిశీలన జరుపనున్నారు. ప్రీ ఎస్ఐఆర్ కసరత్తులో భాగంగా జరుగుతున్న ఫీల్డ్ సర్వే వివరాలు వచ్చేనెల మూడవ వారం నుంచి మొదలయ్యే అసలు ప్రక్రియకు దోహదపడనుంది. నోటిఫికేషన్ వచ్చే నాటికి... ఎస్ఐఆర్ నోటిఫికేషన్ వెలువడే నాటికి ఎన్యూమరేటర్ ఫామ్ల ముద్రణ, బీఎల్ఓలకు కిట్ల తయారీ పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కసరత్తు చేస్తున్నారు. నిర్వాచన్ సదన్ నుంచి వచ్చే మార్గదర్శకాలు, ఆదేశాలకు అనుగుణంగా ఒక వారమంతా బీఎల్ఓలకు తుది దశ శిక్షణను ఇవ్వనున్నారు.బీఎల్వోలు పూర్తి చేసే ఎన్యుమరేటర్ ఫారాల్లో ఒకటి ఓటర్కు ఇవ్వడం, ఒకదాన్ని ఎన్నికల సంఘం తన వద్ద రికార్డు చేయనుంది. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు, సందేహాలు, కొత్త గైడ్లైన్స్ మీద ఈసీ, సీఈఓ అధికారులు వాళ్లకు అవగాహన కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ పూర్తై, తుది జాబితా వెలువడటానికి నాలుగు నెలలు పట్టే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 350 ఓటర్లు.. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 350 మంది ఓటర్ల వివరాలను బూత్ లెవెల్ ఆఫీసర్లు నమోదు చేయనున్నారు. ప్రతీ 10 మంది బీఎల్ఓలకు ఒక సూపర్వైజర్ ఉంటారు. రోజూ సేకరించిన సమాచారాన్ని ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్లలో భర్తీ చేసిన తర్వాత ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ రూపంలోకి అప్లోడ్ చేస్తారు. మండలస్థాయిలో తహసీల్దారు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా. ఈఆర్వోగా రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు ఉంటారు. జిల్లాస్థాయిలో ఎలక్షన్ ఆఫీసర్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని మొత్తం 37 వేల పోలింగ్ కేంద్రాల బీఎల్ఓలు, మరో 15 వేల మంది అసిస్టెంట్ బీఎల్ఓలు, సూపర్వైజర్లు.. ఇలా దాదాపు 60 వేల మంది సిబ్బందిని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియలో పాల్గొననున్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు సేకరించిన వివరాల తర్వాత ఓటర్ల పేర్లు గల్లంతైనా, నమోదు కాకపోయినా, పేర్లతో పాటు అడ్రస్ గల్లంతు అయిన వారి ఫిర్యాదులు, అభ్యంతరాలు, అభిప్రాయాలను తీసుకుని పరిష్కరించడానికి నెల రోజుల గడువులోగా పూర్తి చేస్తారని సమాచారం, వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని పరిష్కరించిన తరువాతనే తుది జాబితా సిద్ధం చేస్తారు. ఈ ఏడాది సెపె్టంబరు నాటికల్లా ఓటరు జాబితా వెలువడే అవకాశం ఉంది. అర్హత కలిగినవాళ్ల పేర్లు జాబితాలో యధావిధిగా ఉంటాయని, సమగ్రమైన వివరాలు, నిర్దిష్టమైన ప్రూఫ్ లేనివాళ్లు మాత్రం లిస్టులో నుంచి తొలగిస్తారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
వ్యసనాల కొడుకును వధించి..
ఇందల్వాయి (నిజామాబాద్ రూరల్): మత్తు వ్యసనాలకు బానిసైన కొడుకును ఒక తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. నల్లవెల్లికి చెందిన కొత్తగొల్ల లక్ష్మి, కిషన్ దంపతులకు ఇద్దరు కొడుకుల్లో భాను ప్రకాశ్ (23) చిన్నవాడు. పదో తరగతి వరకు చదివిన భాను ప్రకాశ్ పైచదువులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. అయిదారేళ్లుగా చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలకు బానిసై తల్లిదండ్రులను వేధిస్తూ జులాయిగా తిరుగుతున్నాడు. భాను ప్రకాశ్ తరచూ గొడవ పడటంతో.. అతని అన్న గ్రామాన్ని విడిచి హైదరాబాద్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. తల్లిదండ్రులు కొద్ది రోజులుగా వేరే వారి ఇంట్లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో కొడుకుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తండ్రి కిషన్ ఇంట్లో నిద్రిస్తున్న భానుప్రకాశ్ను బుధవారం అర్ధరాత్రి గొడ్డలితో నరికి చంపాడు. ఉదయం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నామని ఎస్ఐ సందీప్ తెలిపారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
డిండి.. ‘ఏదుల’ గండి
సాక్షి, హైదరాబాద్: ఏదుల రిజర్వాయర్లో నీటిమట్టం కనీసం 440 మీటర్లు ఉన్నప్పుడే డిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు నీటిని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ సిఫారసు చేసింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండి ఎత్తిపోతల పథకానికి సైతం నీటిని తరలించడానికి అనుమతిస్తూ గతేడాది జనవరి 22న నీటిపారుదల శాఖ జీఓ 10 జారీ చేసింది. ఏదుల రిజర్వాయర్లో 336 మీటర్లు నీటిమట్టం నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించడానికి పనులు చేపట్టాలని అప్పట్లో కోరింది. గత నెల 6న నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) నేతృత్వంలోని కమిటీ డిండి ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నిల్వలు 440 మీటర్లు ఉంటేనే... ఏదుల రిజర్వాయర్లో కనీసం 437.375 మీటర్ల నీటి మట్టం ఉంటేనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నుంచి వీరాంజనేయ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నీటిని తరలించాలని గతంలో అనుమతులిచ్చారు. ఏదుల జలాశయ గరిష్ట నీటినిల్వ మట్టం (ఎఫ్ఆర్ఎల్) 445 మీటర్లు కాగా, గరిష్ట నిల్వ సామర్థ్యం 6.59 టీఎంసీలు. జలాశయంలో 440 మీటర్ల మట్టంతో 4.16 టీఎంసీలు, 437 మీటర్ల మట్టంతో 3.04 టీఎంసీల నిల్వలు, 436 మీటర్ల మట్టంతో 2.72 టీఎంసీల నిల్వలు ఉంటాయి. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించడానికి నిర్మిస్తున్న కాల్వ అడుగు (బెడ్ లెవల్) 21.643 కి.మీ.ల వద్ద 421.45 మీటర్ల మట్టాన్ని కలిగి ఉండగా, ప్రతిపాదనల ప్రకారం ఏదులలో 436.41 మీటర్ల మట్టం నుంచి నీటిని తరలించాల్సి ఉంది. డిండి ఎత్తిపోతలకు నీటిని తరలించడానికి ఏదుల రిజర్వాయర్లో ఉండాల్సిన నీటిమట్టం, డిండి ప్రాజెక్టు కాల్వ లోతు మధ్య 4.9 మీటర్ల వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించడానికి ఏదుల రిజర్వాయర్లో ఉండాల్సిన కనీస నిల్వ మట్టాన్ని 440 మీటర్లకు పెంచాలని ఈఎన్సీ(జనరల్) నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.ఏదుల రిజర్వాయర్ను 440 మీటర్లకు నింపడానికి కేవలం 2 రోజులే పడుతుందని, దీని వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేసింది. ఏదులలో 440 మీటర్ల స్థాయిలో నిల్వలున్నప్పుడే డిండి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని సూచించింది. ఈ మేరకు రెండు ప్రాజెక్టుల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరింది. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున మొత్తం 90 టీఎంసీలను తరలించడానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తుండగా, రోజుకు 0.5 టీఎంసీల చొప్పున మొత్తం 30 టీఎంసీలను తరలించుకోవడానికి డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్కర్నూల్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని 21 మండలాల పరిధిలో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. ఏదుల రిజర్వాయర్ నీటిమట్టం 440 మీటర్లకు చేరినప్పుడే డిండి ఎత్తిపోతలకు నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినట్టు మునుగోడు కాంగ్రెస్ నేత ఐలయ్య ‘సాక్షి’కి తెలిపారు. -
తొలిసారి నాన్నా అంటున్నా..
సాక్షి, హైదరాబాద్/జగిత్యాల: ‘తండ్రి ప్రేమ తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి. తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా ‘నాన్నా’అని ఇప్పటికి కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని ‘నాన్నా..’అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను..’అంటూ గణపతి కుమారుడు శ్రీనివాసరావు పేరిట ఓ ఆడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటుపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలా ఆడియో విడుదల కావడం చర్చకు దారి తీసింది. ఎంతో భావోద్వేగంతో 4.18 నిమిషాల నిడివితో ఉన్న ఈ ఆడియోలో అనేక విషయాలు ప్రస్తావించారు. ఒకప్పటి పరిస్థితులతో పోలి్చతే ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పే ఉందని, నేటి తరానికి మార్గనిర్దేశనం చేసేందుకు రావాలంటూ తన అభిలాషను బయటపెట్టారు. కాగా ఈ ఆడియో గణపతి కుమారుడిదేనని ఓ పోలీస్ ఉన్నతాధికారి నిర్ధారించారు. ఆ ఆడియోలో ఏముందంటే.. అమ్మ కన్నీటితో ఎన్ని మెత్తలు తడిచిపోయాయో.. ప్రతి కుటుంబం చిరునవ్వు వెనక కనబడని ఒక గొప్ప తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానై పెంచింది నన్ను కన్నతల్లి. అమ్మా నీకు వందనం. మీరు ఎంచుకున్న గమ్యం వైపు అడుగులు వేస్తూ అజ్ఞాన జీవితం ప్రారంభించాక అమ్మ కన్నీటితో ఎన్ని మెత్తలు తడిచిపోయాయో తెలియదు. ఏ బట్ట కట్టిందో.. ఏ తిండి తిన్నదో కూడా ఎవరికీ తెలియదు. సమాజానికి ఎదురుపడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మరిచింది. నాకు తెలిసి అమ్మ పుట్టినప్పటి నుంచి ఏ సుఖమూ అనుభవించలేదు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉంది. నాన్నా మీరు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదు. మంచో, చెడో మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం అంటే అది ఆత్మార్పణమే.. ఇది నా అభిలాష ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో పన్నెండు రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి, మీ బంధాల్లో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనేంతగా ఎదిగి సమాంతర ప్రభుత్వం నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. సమాజంలో అంతర్గతంగా సమస్యలు చాలానే ఉండవచ్చు. కానీ నేటితరం ఎంతో అవగాహనతో ఉంటూ సామాజిక మార్పులకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు. నేటి తరం యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం మార్గదర్శకాలుగా తోడైతే మన దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ఓ కొత్త నవభారతాన్ని నిర్మిస్తారని నా నమ్మకం. మీకు చెప్పగలిగే స్థానంలో నేను లేకపోవచ్చు. కానీ ఇది నా అభిలాష. -
విద్యార్థి నేత నుంచి తెలంగాణ గవర్నర్ దాకా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆయన దశాబ్దాలపాటు బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా, రాష్ట్రాల గవర్నర్ స్థాయికి ఎదిగారు. 1952 ఏప్రిల్ 1న యూపీలోని గోరఖ్పూర్లో జని్మంచిన ఆయన.. దీన్దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో (ఎల్ఎల్బీ) పట్టా పొందారు. ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 19 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. 1989లో తొలిసారి గోరఖ్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆ తర్వాత 1991, 1993, 1996లలోనూ వరుస విజయాలు సాధించారు. యూపీ ప్రభుత్వంలో కళ్యాణ్ సింగ్, రాజ్నాథ్ సింగ్, రామ్ ప్రకాష్ గుప్తాల కేబినెట్లలో జైళ్లు, గ్రామాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. 2016లో యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.2017లో ప్రధాని మోదీ కేబినెట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. పాలనాపరమైన అనుభవం, వివాదరహితుడిగా ఆయనకు పేరు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2023 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ 29వ గవర్నర్గా నియమించింది. అక్కడ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించిన ఆయన్ను తాజాగా తెలంగాణ గవర్నర్గా బదిలీ చేసింది. -
అప్పులు చేయొద్దని తల్లి మందలించిందని..
నవాబుపేట: అప్పులు ఎక్కువగా చేస్తున్నారని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు తన భార్యతో కలిసి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనలో భార్య మృతిచెందగా.. ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం జంగమయ్యపల్లిలో ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జంగమయ్యపల్లికి చెందిన మురగని రవి (25), లావణ్య (23) భార్యాభర్తలు. రవి కొంతకాలంగా ఎక్కువగా అప్పులు చేస్తుండటంతో బుధవారం రాత్రి అతడి తల్లి పద్మమ్మ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన రవి భార్య లావణ్యతో పాటు 11 నెలల కూతురిని తీసుకుని పొలానికి వెళ్లాడు. రాత్రి పొలంలోనే వారు నిద్రించారు. గురువారం ఉదయం రవి తన సోదరుడు ఆనంద్కు వీడియో కాల్ చేసి.. చెట్టుపై తాను, తన భార్య కూర్చున్నామని, తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఆనంద్ గ్రామస్తులతో కలిసి పొలానికి వెళ్లి చూడగా.. దంపతులిద్దరూ చెట్టుకు వేలాడుతూ కనిపించారు. వారిని కిందికి దింపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే లావణ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రవి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై లావణ్య తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మరోసారి ప్రజల్లోకి ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి మరోసారి ప్రజల్లోకి వెళ్తోంది. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’పేరిట 99 రోజుల కార్యాచరణతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల్లోకి వెళ్లనున్నారు. సీఎం రేవంత్రెడ్డి 10 థీమ్స్తో 99 రోజుల కార్యాచరణను ప్రకటించిన సంగతి విదితమే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ తరహా కార్యక్రమం చేపట్టడం ఇది మూడోసారి. గత రెండు విడతల్లో వచ్చి న ఆర్జీలతో రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలను అమలులోకి తెచ్చి ంది. ఇప్పుడు ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’పేరుతో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రకటించింది. పౌర సేవలు, ప్రజల అవసరాలతో మమేకమై ఉండే అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ హించనుంది. ఈమేరకు ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన విడు దల చేసింది. ఐదు స్థాయిల్లో : గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు స్థాయిల్లో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుధ్యంతోపాటు పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ఇందులో భాగస్వాములను చేసింది. మండలాలు, జిల్లా కేంద్రాల్లో వివిధ శాఖల అధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనుంది. అన్ని స్థాయిల్లోనూ గ్రామ సర్పంచి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో వస్తున్న సంస్కరణలు, వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్లను తీర్చిదిద్దే ప్రణాళికను సర్కారు ప్రజలకు వివరించనుంది. అలాగే, సోలార్ విద్యుత్తు వినియోగం పెంచటం, సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలను ప్రజలకు, రైతులకు తెలియజేయనుంది. యువతకు నైపుణ్యాల శిక్షణతోపాటు ఉపాధి కల్పించే కార్యక్రమాలను ఈ యాక్షన్ ప్లాన్లో పేర్కొంది, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించి.. లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందిరా మహిళా శక్తి సాధిస్తున్న విజయాలను, కొత్తగా వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించనుంది.కార్యాచరణ ఇలా...1వ వారం – గ్రామీణాభివృద్ధి (మార్చి 30 నుంచి ఏప్రిల్ 4) 2వ వారం – ఆరోగ్య రంగం (ఏప్రిల్ 6 నుంచి 11) 3వ వారం – అరైవ్–అలైవ్ (ఏప్రిల్13 నుంచి 18) 4వ వారం – సంక్షేమం (ఏప్రిల్ 20 నుంచి 25) 5వ వారం – పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట (ఏప్రిల్ 27 నుంచి మే2) 6వ వారం – రైతు సంక్షేమం (మే 4 నుంచి 9) 7వ వారం – విద్య (మే 11 నుంచి 16) 8వ వారం – యువత, క్రీడలు (మే 18 నుంచి 23) 9వ వారం – మహిళా సంక్షేమం (మే 25 నుంచి 30) 10వ వారం – పర్యావరణం (జూన్ 1 నుంచి 6) -
ఘనంగా భట్టి తనయుని వివాహం
సాక్షి, హైదరాబాద్ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య–సాక్షిల వివాహం శంషాబాద్ జీఎంఆర్ ఏరీనాలో గురువారం ఘనంగా జరిగింది, వధూవరులను ఆశీర్వదించడానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సహా పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, సినీ తారలు వచ్చారు. వారందరినీ డిప్యూటీ సీఎం ఆప్యాయంగా పలకరించారు. వివాహ వేడుకకు హాజరైనవారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావు, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీ సంతోశ్కుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ ప్రముఖుల్లో చిరంజీవి, నాగార్జున, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ సీనియర్ అధికారులు ఉన్నారు. -
కీలక పోస్టింగ్లన్నీ ఇన్చార్జ్లతోనే
సాక్షి, హైదరాబాద్: పోలీస్శాఖలోని కీలక పోస్టులను ఇన్చార్జ్లతో నెట్టుకొస్తున్నారు. కొందరు అధికారులు రెండు అంతకంటే ఎక్కువ విభాగాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇలా ఇన్చార్జ్ బాధ్యతల్లో ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా 14 మంది ఐపీఎస్లు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపు కోటాను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 83 మంది ఐపీఎస్లు ఉన్నారని, ఆ సంఖ్యను 105కు పెంచాలన్నారు. పెరుగుతున్న పనిభారం నిరంతర పర్యవేక్షణ అవసరమయ్యే కీలక శాఖలకు ఉండే అధికారులకు ఇతర విభా గాల బాధ్యతలు అప్పగించడంతో వారిపై పనిభారం పెరుగుతోందన్న భావన వ్యక్తమవుతోంది. కొందరు ఐపీఎస్ అధికారుల వద్దే అత్యంత కీలక శాఖలతోపాటు ఇతర విభాగాలు ఉండడంతో పనిభారంతోపాటు పర్యవేక్షణ కొరవడుతుందన్న వాదనా వినిపిస్తోంది. తెలంగాణ పోలీస్శాఖ అధికారిక వె బ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం..ప లు విభాగాలకు ఇన్చార్జ్లుగా కొనసాగుతు న్న ఐపీఎస్ అధికారులు వివరాలు చూస్తే.. ⇒ బి.శివధర్రెడ్డి డీజీపీ కోఆర్డినేషన్, హెడ్ఆఫ్ పోలీస్ ఫోర్స్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ⇒ డా.సౌమ్యా మిశ్రా జైళ్ల శాఖ డీజీ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగ కమిషనర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ⇒ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ఉన్న శిఖాగోయల్కు టీజీ సైబర్ సె క్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు, టీజీఎఫ్ఎస్ఎల్ ఇ న్చార్జ్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. ⇒ మరికొన్ని కీలక విభాగాలు చారుసిన్హా పర్యవేక్షిస్తున్నారు. సీఐడీ అడిషనల్ డీజీతోపాటు మహిళా భద్రత విభాగం, భరోసా అడిషనల్ డీజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు, ఏసీబీ డైరెక్టర్ జనరల్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లోనూ చారుసిన్హా కొనసాగుతున్నారు. ⇒ మరో సీనియర్ ఐపీఎస్ అధికారి వీవీ శ్రీనివాసరావుకు అడిషనల్ డైరెక్టర్ టెక్నికల్ సరీ్వసెస్, టీజీఎల్పీఆర్బీ చైర్మన్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు, ఇన్చార్జ్ అడిషనల్ డీజీ ట్రైనింగ్గా బాధ్యతలు అప్పగించారు. ⇒ అడిషనల్ డీజీ ఆర్గనైజేషన్, హోంగార్డ్స్, అడిషనల్ డీజీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో స్వాతిలక్రా ఉండగా, శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్ భగవత్కు అడిషనల్ డీజీ లీగల్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు, టీజీ పిక్స్ ఇన్చార్జ్ ఎండీగా సైతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ⇒ అడిషనల్ డీజీ పర్సనల్, మల్టీజోన్–2 అడిషనల్ డీజీగా దేవేంద్రసింగ్ చౌహాన్ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ⇒ సంజయ్కుమార్ జైన్ అడిషనల్ డీజీ తెలంగాణ బెటాలియన్స్, పీటీఓ హైదరాబాద్ ఇన్చార్జ్గా, షానవాజ్ ఖాసిం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్శాఖ డైరెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ⇒ ఎం శ్రీనివాసులు అడిషనల్ కమిషనర్ క్రైం హైదరాబాద్ సిటీ, డిటెక్షన్ డిపార్ట్ మెంట్ (డీడీ) ఇన్చార్జ్ డీసీపీగా, తఫ్సీర్ ఇక్బాల్ హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్ శాంతిభద్రతలు, హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ అడ్మిన్గా ఇన్చార్జ్గా, ఎల్ఎస్ చౌహాన్ డీఐజీ జోగుళాంబ జోన్, డీఐజీ చారి్మనార్ జోన్గా, భాస్కరన్ ఎస్పీ సీఐ సెల్, ఇంటెలిజెన్స్ ఇన్చార్జ్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ⇒ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఈగల్ (గతంలో టీజీ యాంటీ నార్కో టిక్స్ బ్యూరో)కు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్య డైరెక్టర్గా ఉండగా, మరో రిటైర్డ్ ఐపీఎస్ వీబీ కమలాసన్రెడ్డి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఓఎస్డీ, టీజీఐసీసీసీ డైరెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో, ఇంటెలిజెన్స్ ఓఎస్డీగా వి.శివకుమార్ పనిచేస్తున్నారు. -
తెలంగాణ నూతన గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా (73) నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్ప్ర దేశ్ గవర్నర్గా ఉన్న ఆయన్ను తెలంగాణకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించిన జిష్ణుదేవ్ వర్మను పొరుగున ఉన్న మహారాష్ట్రకు బదిలీ చేసింది. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ల (ఎల్జీ)ను మారుస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాలనాపరమైన మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో గవర్నర్లను, లెఫ్టినెంట్ గవర్నర్లను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా అనుభవం ఉన్న పలువురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయగా, మరికొందరికి కొత్తగా అవకాశం కలి్పంచింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్లకు సైతం స్థానచలనం కలిగింది. లద్దాఖ్ ఎల్జీకి ప్రమోషన్ ఇచ్చి రాష్ట్ర గవర్నర్గా పంపడం గమనార్హం. కాగా, పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనందబోస్ తన పదవికి రాజీనామా చేయగా దాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. ఇప్పటివరకు తమిళనాడు గవర్నర్గా ఉన్న ఆర్.ఎన్. రవిని బెంగాల్ గవర్నర్గా బదిలీ చేశారు.కొత్త నియామకాలు, బదిలీలు..⇒ తెలంగాణ: శివ ప్రతాప్ శుక్లా (హిమాచల్ప్రదేశ్ నుంచి బదిలీ) ⇒ మహారాష్ట్ర: జిష్ణుదేవ్ వర్మ (తెలంగాణ నుంచి బదిలీ) ⇒ పశ్చిమ బెంగాల్: ఆర్.ఎన్. రవి (తమిళనాడు నుంచి బదిలీ) ⇒ బిహార్: లెఫ్టినెంట్జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ ⇒ నాగాలాండ్: నంద్ కిశోర్ యాదవ్ ⇒ హిమాచల్ ప్రదేశ్: కవీందర్ గుప్తా (లద్దాఖ్ ఎల్జీకి ప్రమోషన్) ⇒ తమిళనాడు: రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (ప్రస్తుత కేరళ గవర్నర్కు తమిళనాడు అదనపు బాధ్యతలు) ⇒ లద్దాఖ్ ఎల్జీ: వినయ్ కుమార్ సక్సేనా (ఢిల్లీ నుంచి బదిలీ) ⇒ ఢిల్లీ ఎల్జీ: తరణ్జీత్ సింగ్ సంధూ -
సింఘ్వీ, వేం ఎన్నిక ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ వారిద్దరినీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేయగా గురువారం శాసనసభ ప్రాంగణంలో ఎన్నికల అధికారి ఉపేందర్రెడ్డికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. తగినంత సంఖ్యాబలం లేనందున బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల బరిలో ఎవరినీ పోటీకి నిలపలేదు. సాయి అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు బలపరచాలనే నిబంధనను పాటించని కారణంగా ఆయన అభ్యర్థిత్వం శుక్రవారం స్రూ్కటినీలో తిరస్కరణకు గురవుతుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రం నుంచి రాజ్యసభకు పార్టీ హైకమాండ్ ప్రతిపాదించిన సింఘ్వీ రెండోసారి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్నేహితుడు వేం నరేందర్రెడ్డి రాజ్యసభలో అడుగుపెట్టడం లాంఛనం కానుంది. సీఎం, మంత్రులు వెంట రాగా నామినేషన్లు దాఖలు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి ఉదయం 10:30 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభకు వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీకి రాగా ఆయనతో కలిసి వెళ్లి మరో సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ఉపేందర్రెడ్డికి అందజేశారు.సింఘ్వీ మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా వేం నరేందర్రెడ్డి నాలుగు సెట్లు దాఖలు చేశారు. మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం నుంచి నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి హాజరైన ఎంఐఎం ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ బలాలా, జుల్పికర్ అలీ ఒక సెట్ నామిషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఊహించినట్లుగానే బీఆర్ఎస్ రాజ్యసభ బరిలో అభ్యర్థిని దించలేదు. రాజ్యసభ సభ్యత్వాన్ని పొందేందుకు అవసరమైన 40 మంది శాసనసభ్యుల బలం లేకపోవడంతో పోటీ చేయలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రెండోసారి రాజ్యసభకు అదృష్టం: సింఘ్వీ నామినేషన్ దాఖలు అనంతరం వేం నరేందర్రెడ్డితో కలిసి గాంధీ భవన్కు వచ్చిన అభిషేక్ మను సింఘ్వీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ను కలిశారు. అనంతరం సింఘ్వీ తెలంగాణ తరఫున రాజ్యసభకు రెండోసారి వెళ్లనుండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. రెండోసారి తెలంగాణ నుంచి ఎంపీగా తనను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, కేసీ వేణుగోపాల్కు ధన్యవాదాలు తెలిపారు.వేం నరేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వెళ్లడం ఆనందంగా ఉందని.. ఇప్పటివరకు ఎలా పనిచేశానో, భవిష్యత్తులోనూ అలాగే పనిచేస్తానన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధుల కోసం పోరాడుతానని పేర్కొన్నారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసిన రేవంత్రెడ్డి, మహేశ్గౌడ్కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. -
అమ్మో... పులి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి నిజామాబాద్ జిల్లాలోకి వచ్చిన పెద్ద పులి ప్రస్తుతం కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రాంతంలో సేదతీరుతోంది. గురువారం తెల్లవారుజామున అటవీ శాఖ అమర్చిన ట్రాప్ కెమెరాకు పెద్ద పులి కదలికలు చిక్కడంతో కచ్చితంగా నిర్ధారణ అయింది. మహారాష్ట్రలోని తడోబా అడవి నుంచి వచ్చిన ఈ పులి కొన్ని నెలలుగా ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో సంచరిస్తోంది.మూడు రోజుల క్రితం కమ్మర్పల్లి రేంజ్లోకి వచ్చిన ఈ పులి ఇదేచోట వన్యప్రాణిని చంపి తిని, ఇక్కడే దాహార్తిని తీర్చుకుని సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పెద్ద పులి కదలికలపై పూర్తి స్థాయి సమాచారం కోసం అటవీ అధికారులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. గట్టుపొడిచినవాగు బ్యాక్వాటర్ ప్రాంతంలో గురువారం అటవీ అధికారుల బృందం పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో బీట్ అధికారి శ్రీదేవికి అలసట రావడంతో అక్కడే ఉన్న కల్వర్టు మీద కూర్చున్నారు.ఇది గమనించకుండా బృందంలోని మిగిలిన సభ్యులు కొంత ముందుకు వెళ్లారు. ఇదే సమయంలో వెనుక వైపు 30 మీటర్ల దూరంలో అలికిడి వినిపించడంతో శ్రీదేవి ఆవైపు చూడగా, పెద్ద పులి నడిచి వెళుతూ కనిపించింది. దీంతో ఆమె అక్కడికక్కడే మూర్ఛపోయారు. కల్వర్టుకు ఇవతలివైపు పడిపోయారు. అధికారుల బృందం తక్షణమే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కల్వర్టుకు అవతలివైపు పడిపోయి ఉంటే పులికి ఆహారం అయ్యేదానినని శ్రీదేవి విలపిస్తుండటంతో అధికారులు సైతం భయాందోళనకు గురవుతున్నారు.ఏ బిడ్డా.. ఇది నా అడ్డామన్ననూర్: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో పెద్ద పులులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అటవీ శాఖ చేపట్టిన జంగిల్ సఫారీలో భాగంగా పర్యాటకులకు తరచూ పెద్ద పులులు కనిపిస్తూ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి విధుల్లో భాగంగా సఫారీ వాహనంలో వెళ్తున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి.. గుండం వద్ద చెట్ల పొదల నుంచి వచ్చిన పెద్దపులి కనిపించింది. సఫారీ వాహనం దీపాలను ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డుపైనే ఠీవిగా నడుచుకుంటూ సాగిపోయింది. దీంతో అధికారులు తమ సెల్ఫోన్లలో పులి కదలికలను వీడియోలు తీశారు.కెమెరాకు చిక్కిన చిరుతపులిబోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కరత్వాడ గ్రామ శివారులోని లక్కాయి లొద్ది వద్ద చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. రెండు రోజుల క్రితం కరత్వాడ గ్రామానికి చెందిన ద్యాగాల గంగయ్యకు చెందిన ఆవు.. లక్కాయి లొద్ది వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిని చిరుత దాడిగానే భావించిన అటవీ శాఖ అధికారులు అక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 5.29 గంటల ప్రాంతంలో ఆవు కళేబరాన్ని చిరుత తింటున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఆవును చంపింది చిరుతేనని అటవీ అధికారులు ధ్రువీకరించారు. చిరుత సంచారం దృష్ట్యా అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పశువుల కాపరులు, వృద్ధులు అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. -
తల్లి బంగారంతో ప్రియుడికి బైక్
ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): తల్లి బంగారాన్ని అమ్మి ప్రియుడికి బహుమతిగా బైక్ను కొనిచ్చింది ఓ యువతి. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి.గంభీరావుపేట మండలానికి చెందిన ఓ యువతితో ఎల్లారెడ్డిపేటకు చెందిన యువకుడికి ఇన్స్ట్రాగామ్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఆ యువకుడు తనకు బైకు కొనివ్వాలని ప్రియురాలిని కోరాడు. ప్రియుడి కోరిక తీర్చేందుకు సదరు యువతి తల్లి బంగారాన్ని అమ్మేసి బైకు కొనిచ్చింది. తన బంగారం కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. -
ఇంటికెళ్లి విరోష్ జంటను కలిసిన సీఎం
విరోష్ జంటను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు. హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను విజయ్ దేవరకొండ ట్విటర్లో షేర్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి ఆశీర్వదించడం మా హృదయాన్ని కదిలించిందని విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు. మాపై ఆయన చూపించే ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్- రష్మిక గతనెల 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. పెళ్లి తర్వాత ఈనెల 4వ తేదీన హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్కు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. Heartfully touched that the Hon’ble Chief Minister of Telangana, Shri. @revanth_anumula garu, took the time to visit our home this evening and bless us on our wedding. Grateful for the love and affection he always shares 🙏 pic.twitter.com/QAbp9127ad— Vijay Deverakonda (@TheDeverakonda) March 5, 2026 -
భారీగా బదిలీలు.. తెలంగాణ గవర్నర్గా ఎవరంటే?
దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను నియమించారు. తెలంగాణలో ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను.. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు.ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా తరంజిత్ సింగ్ సంధును ఎంపిక చేయగా.. నాగాలాండ్ గవర్నర్గా నంద్ కిషోర్ యాదవ్ నియమితులయ్యారు. బీహార్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ నియమించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని బదిలీ చేశారు. తమిళనాడు గవర్నర్గా కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను నియమించగా.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా నియమితులయ్యారు. -
భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుక.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
-
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మళ్ళీ ట్విస్ట్
హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయం మళ్లీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ అనర్హత కేసు విచారణలో భాగంగా దానం నాగేందర్పై విచారణ పూర్తి కాలేదు. దానం నాగేందర్పై విచారణను శనివారానికి వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మరొకవైపు కడియం శ్రీహరి విచారణ పూర్తి చేశారు స్పీకర్. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఇరు వర్గాలకు సూచించారు స్పీకర్. దానంపై దాఖలైన రెండు పిటిషన్లను శనివారం విచారించనున్నారు. గత నెలలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. మూడు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని ఫిబ్రవరి 6వ తేదీన హెచ్చరించింది. ఈ క్రమంలోనే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు మరో అవకాశం ఇచ్చింది. అనర్హత అంశాన్ని తేల్చాలని ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తిచేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్ను ఆదేశించింది. ఈ క్రమంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్.. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను తేల్చేపనిలో పడ్డారు. -
ఇఫ్తార్ విందులో.. ఖర్జూర నోరార
రంజాన్ అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు.. రుచి, ఆరోగ్యం, సంప్రదాయం, ఆధునికత కలిసే ఒక ప్రత్యేక జీవనశైలి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరంలో ఉన్న ఫుడ్ లవర్స్ రంజాన్ సీజన్ వచ్చిందంటే ఇఫ్తార్ టేబుల్స్ కొత్త ట్రెండ్స్తో మెరుస్తాయి. అయితే ఈ ఇఫ్తార్లో ఎన్ని వెరైటీలు ఉన్నా ఖర్జూరాలది మాత్రం ప్రత్యేక స్థానం. కేవలం రంజాన్ మాసం కోసం దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన, రుచికరమైన ఖర్జూరాలను నగరానికి దిగుమతి చేసుకుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నగరంలో మరిన్ని వెరైటీల ఖర్జూరాలు సందడి చేస్తున్నాయి. వీటికి తోడు ట్రెడిషనల్ ఇఫ్తార్కు మోడ్రన్ టచ్ ఇచ్చే పానీయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ రెండింటినీ కలిపి చూస్తే ఈ ఏడాది రంజాన్ మాసం ఒకహెల్తీ లైఫ్ స్టైల్ స్టేట్మెంట్లా కనిపిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరోరంజాన్ (Ramadan) మాసంలో ప్రతిరోజూ ఇఫ్తార్ విందులో ఖర్జూరాలు తొలి ముద్దగా తినడం తెలిసిందే.. ఈ ఖర్జూరాల్లో అంతర్జాతీయ ఆహార ప్రయాణం దాగుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనంగా పండించిన ఫలాల్లో ఒకటైన ఖర్జూరం.. ఇప్పుడు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఒక లగ్జరీ గిఫ్ట్, న్యూట్రిషనల్ పవర్హౌస్ కూడా. విభిన్న దేశాల నుంచి వచ్చే ఈ ఖర్జూరాలకు ప్రత్యేక ఆదరణ, దానికి తగ్గట్టుగానే రేట్లు సైతం ఉంటున్నాయి. ఇందులో భాగంగా దేశీయంగా పండించే భారతీయ ఖర్జూరం(ఖజూర్) నగరంలో సులభంగా లభ్యమవుతుంది. ఈ ఖర్జూరం ఫోనిక్స్ సిల్వెస్ట్రీస్ జాతికి చెందింది. దేశంలో రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో దొరికే ఈ ఖర్జూరం గట్టిగా, ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ రకం. ఫ్రెష్గా లేదా సన్–డ్రైడ్గా వీటిని వినియోగిస్తారు. సిటీలో ‘కింగ్ ఆఫ్ డేట్స్’ (King of Dates).. అధునాతన జీవనశైలికి కేంద్రమైన హైదరాబాద్లో ఏ దేశాలకు చెందిన ఉత్పత్తులైనా సులభంగా నగరానికి చేరుకుంటాయి. ఇదే క్రమంలో ‘కింగ్ ఆఫ్ డేట్స్’గా పిలుచుకునే మొరాకో నుంచి వచ్చే మెడ్జూల్ ఖర్జూరం (Medjool dates ) పెద్ద పరిమాణంలో, అంబర్ బ్రౌన్ కలర్తో ప్రత్యేకంగా నిలుస్తుంది. కారమెల్, టాఫీ, హనీ నోట్స్తో నిండిన ఈ రకం గిఫ్టింగ్కు హాట్ ఫేవరెట్. సిటీలో ప్రీమియం డ్రైఫ్రూట్ స్టోర్లలో దీని డిమాండ్ భారీగా పెరుగుతోంది. హనీ టచ్తో సాఫ్ట్ డిలైట్గా ఉంటే. సౌదీ అరేబియాలో పండే సుక్కరి ఖర్జూరం కూడా నగరంలోని ముస్లింలు అమితంగా ఇష్టపడతారు. ఇవి మృదువుగా, తక్కువ ఫైబర్, సహజమైన తేనె రుచితో ఉంటాయి. రంజాన్ గిఫ్ట్ హ్యాంపర్లలో ఇది తప్పనిసరి ఐటమ్. ఈ రకం తాజాగా ఉన్నప్పుడు గోల్డెన్ యెల్లో, పండినప్పుడు అంబర్ బ్రౌన్గా మారుతుంది. సహజ చక్కెర ఎక్కువగా ఉండటంతో ఎనర్జీ బూస్టర్గా వీటిని పరిగణిస్తారు. అల్జీరియా, ట్యునీషియా ప్రాంతాల నుంచి వచ్చే డెగ్లట్ నూర్ రకాన్ని ‘క్వీన్ ఆఫ్ డేట్స్’గా పిలుస్తారు. ఈ రకం పాక్షికంగా ఎండిపోయి, నట్టి స్వీట్నెస్తో ఉంటుంది. బేకింగ్, కుకింగ్కు ఇవి అద్భుతంగా సరిపోతాయి. రంజాన్ డెజర్ట్స్లో ఇది ఫేవరెట్. ఇరాన్ నుంచి వచ్చే మజాఫతి ఖర్జూరం డార్క్ బ్రౌన్ నుంచి నలుపు రంగులో ఉంటుంది. సాఫ్ట్, జ్యూసీ టెక్స్చర్తో మోలాసిస్ లాంటి రుచి దీని ప్రత్యేకత. సౌదీ అరేబియా మదీనాలో మాత్రమే దొరికే అజ్వా రకానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎక్కువ. ఈ ఖర్జూరం మతపరమైన, సాంస్కృతిక విలువలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇది ప్రీమియం కేటగిరీలోకి వస్తుంది. -
భారత్ కనెక్ట్ ఈ-చలాన్: ఏపీ, తెలంగాణలో భారీ స్పందన
భారత్ కనెక్ట్ ప్లాట్ఫామ్లో ప్రారంభించిన ఈ-చలాన్ సేవకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి స్పందన లభిస్తోంది. 2025 అక్టోబర్ నుంచి ఏపీ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో 4.5 లక్షలకు పైగా, తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో 1.3 లక్షలకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి.ఫిబ్రవరి 2026లోనే ఏపీలో 1.02 లక్షలు, తెలంగాణలో 22,882 లావాదేవీలు జరిగాయి. భారత్ కనెక్ట్ ద్వారా ట్రాఫిక్ చలాన్ వివరాలు తెలుసుకుని డిజిటల్గా చెల్లించే వెసులుబాటు లభిస్తోంది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు హైదరాబాద్లో డ్రోన్ ప్రచారం కూడా నిర్వహించారు. ప్రధాన ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఇంటరాక్టివ్ స్క్రీన్లను డ్రోన్ల ద్వారా ప్రదర్శిస్తూ ఈ-చలాన్ సేవపై ప్రచారం చేశారు. ప్రస్తుతం 700కు పైగా యాప్లు, బ్యాంకుల ద్వారా ఈ సర్వీసు అందుబాటులో ఉంది.ఢిల్లీ, గుజరాత్లో కూడా ఈ కేటగిరీ ప్రస్తుతం అందుబాటులో ఉంది.“భారత్ కనెక్ట్లోని ఈ-చలాన్ సేవ, డిజిటల్ అప్గ్రేడ్ మాత్రమే కాదు. ప్రభుత్వ సంస్థలు, టెక్నాలజీ ప్లాట్ఫాంలు కలిసి పని చేస్తే పౌరులకు అందించే సేవలను సరికొత్తగా నిర్వచించేందుకు వీలవుతుందని తెలియజెప్పేందుకు ఇదొక శక్తివంతమైన ఉదాహరణ. ఈ ప్రయత్నంలో మాకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ పోలీస్, తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ శాఖలకు కృతజ్ఞతలు. ప్రజలకు అవసరమైన కీలక చెల్లింపులను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేవడంలో ఇది కీలక అడుగు,” అని ఎన్బీబీఎల్ (NBBL) ఎండీ & సీఈఓ నూపూర్ చతుర్వేది తెలిపారు. -
Hyd: ఐదంతస్తుల భవనం నుంచి పడి ముగ్గురి దుర్మరణం
హైదరాబాద్: నగరంలోని టోలిచౌకీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంస్తుతల భవనం నుంచి పడి పలువురు కార్మికులు మృత్యువాత పడ్దారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు పైనుంచి కిందకు పడిపోయారు. దాంతో ముగ్గురు అడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది..టోలిచౌకిలో జరిగిన ప్రమాదానికి సంబంధించి బిల్డింగ్కి G+2 మాత్రమే పర్మిషన్ ఉన్నట్టుగా గుర్తించారు. ఈ విషయంపై షేక్ పేట్ ఎమ్మార్వో స్పందించారు. ‘మిగతా ఫ్లోర్లకు పర్మిషన్ లేనందున బిల్డింగ్ని సీజ్ చేయబోతున్నాం. ఇద్దరు ఇక్కడికి ఇక్కడే మృతి చెందారు. ఇంకొకరు చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. మొత్తం ముగ్గురు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ఓలివ్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. మృతి చెందిన మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.’ అని తెలిపారు. -
లొంగుబాటలో గణపతి..! కుమారుడి ఆడియో వైరల్
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయేందకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ పోలీసులతో టచ్లోకి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే నేపాల్ నుంచి గణపతి ఢిల్లీకి చేరినట్లు తెలుస్తోంది. వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గణపతి సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యులు సైతం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గణపతి కుమారుడు విడుదల చేసిన భావోద్వేగ ఆడియో వైరల్గా మారింది.ఆడియోలో గణపతి కుమారుడు ఏమన్నారంటే..‘‘తండ్రి ప్రేమను తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి. తండ్రి ప్రేమ తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా "నాన్నా" అనే పదం కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని "నాన్నా" అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను. అనాలోచితంగా కానీ, అప్రమేయంగా కానీ మీరు గుర్తుకు వస్తే నా రుధిరం ఎర్రబడుతుంది. ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో పన్నెండు రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి, మీ బంధాల్లో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనే అంతలా ఎదిగి సమాంతర ప్రభుత్వమే నడపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు...మీ ప్రయాణంలో ఎంతో కఠోర శ్రమ ఉండి ఉండవచ్చు. నాన్నా! నా చిన్నతనం నుంచే మిమ్మల్ని చూడాలని, మీతో గడపాలని, నా కష్టసుఖాలు మీతో పంచుకోవాలని, మీ అండలో ఎదగాలని ఉండేది. మీ కోసం నా మనసు పడే ఆరాటం, నాలో ఉండే నా ఆవేదనతో నా కన్నులు ఎన్ని దిక్కులు చూసినా మీరు కనపడరు. నా హృదయ ఘోష మీకు వినపడదు. ప్రతీ కుటుంబపు చిరునవ్వు వెనుక కనబడని ఒక గొప్ప మనసున్న తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానే అయి పెంచింది నన్ను కన్న తల్లి. అమ్మా! నీకు వందనం. నాన్నా! మీ వివాహం తర్వాత అమ్మతో మీరు గడిపిన మధుర క్షణాలను అప్పుడప్పుడూ తన గుండె చప్పుడుగా నాతో పంచుకునేది...ఈ జీవితానికి ఆ మధుర క్షణాలు చాలు అనుకుంటూ బరువెక్కిన హృదయంతో ఓ నిట్టూర్పు విడిచేది. మన బంధువులు కూడా మీరు మనసున్న మనిషి అని, మితభాషి అని, అమ్మతో అన్యోన్యంగా ఉండేవారని అంటూ ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయం మీ ఇద్దరి జీవితాలను జీవితకాలానికి ఎడబాటు చేసింది. మీరెంచుకున్న గమ్యం వైపు అడుగులు వేస్తూ అజ్ఞాత జీవితం ప్రారంభించాక అమ్మ ఎన్ని సంవత్సరాలు తన కన్నీటితో ఎన్ని మెత్తాలు తడిసిపోయాయో ఎవ్వరికీ తెలియదు. ఏ బట్ట కట్టిందో, ఏ తిండి తిన్నదో కూడా ఎవ్వరికీ తెలియదు. సమాజాన్ని ఎదురు పడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మరిచింది...నాకు తెలిసి అమ్మ పుట్టినప్పటి నుంచి ఏ సుఖమూ అనుభవించలేదు. అమ్మ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉంది. నాన్నా! మీరు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదు. మంచో చెడో మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి దీర్ఘకాలిక పోరాటం చేయడం అంటే అది ఆత్మార్పణే. విప్లవం అంటే కష్టనష్టాలతో కూడుకున్న దారి. ఎన్నో త్యాగాలు, ఎంతో మంది యోధుల వీరమరణాలు. ఎందరో తమ తల్లిదండ్రులను, తమ కుటుంబాన్ని వదిలి ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ, ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటే అది అసామాన్యమే.ఒకప్పటి పరిస్థితులతో పోల్చితే ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పే ఉంది. సమాజ అంతర్గతంగా సమస్యలు చాలానే ఉండవచ్చు. కానీ నేటితరం ఎంతో అవగాహనతో ఉంటూ సామాజిక మార్పులకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు. నేటి తరం యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం మార్గదర్శకాలుగా తోడైతే మన దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఓ కొత్త నవభారతాన్ని నిర్మిస్తారని నా నమ్మకం. మీకు చెప్పగలిగే స్థానంలో నేను లేకపోవచ్చు. కానీ ఇది నా అభిలాష’’ అంటూ గణపతి కుమారుడు ఎమోషనల్గా మాట్లాడారు. -
స్కానింగ్ సెంటర్లోనే ప్రసవం!.. గంగరాజుపై పోక్సో కేసు
నాగర్కర్నూల్ క్రైం: మైనర్ను శారీరకంగా వాడుకుని ప్రసవానికి కారణమైన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 2న జిల్లాకేంద్రంలోని ఓ స్కానింగ్ సెంటర్లోని బాత్రూంలో మైనర్ బాలిక ప్రసవమైన సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ మైనర్ సమీప బందువు ప్రేమపేరిట మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకోవడంతో గర్భం దాల్చింది. సదరు వేసవి సెలవుల అనంతరం కేజీబీవీ హాస్టల్కు వెళ్లి అక్కడే ఉంటుంది. గర్భిణీ అనే విషయం దాచిపెట్టి కళాశాల అధ్యాపకులు, సిబ్బందికి కాలు ఫ్యాక్చర్ అయిందని, హాస్టల్ భోజనంతోనే లావు అవుతున్నానని సమాధాం చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీన బాలికకు కడుపు నొప్పి రావడంతో స్కానింగ్ కోసం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్కు రావడంతో అక్కడే ప్రసవం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు స్కానింగ్ సెంటర్కు వెళ్లి తల్లి, మగ శిశువును జనరల్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. తొలుత ఓ మైనర్ బాలుడిని తీసుకొచ్చి విచారణ జరపగా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆ బాలుడు పోలీసులకు చెప్పాడు. దీంతో బాలికను మరోసారి పోలీసులు గట్టిగా నిలదీసి.. వివరాలు సేకరించారు. తన ఇంటి సమీపంలో ఉన్న బంధువు గంగరాజు కారణమని బాలిక చెప్పడంతో... అతని గంగరాజును అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి బాలికను శారీరకంగా లోబర్చుకోవడం వల్లే తల్లి అయిందని విచారణలో తేలడంతో నిందితుడి గంగరాజుపై పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా.. నిందితుడికి ఇది వరకే పెళ్లి అయి.. ఇద్దరు పిల్లలున్నారు. -
‘మూసీ నది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్’
సాక్షి,హైదరాబాద్: మూసీ నది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్’అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గురువారం కేటీఆర్ నాగోల్ మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్ బుల్డోజర్లకు అడ్డంగా నిలబడుతాం. పేదల ఇళ్ళు కాపాడుతాం. మూసీ పేరుతో రేవంత్ రెడ్డి చేస్తోన్న లూటీని అడ్డుకుంటాం. పేము కట్టిన ఇళ్ళకు పెయింటర్ బాబు రంగులు మార్చుతున్నాడు. రేవంత్ హాయంలో ఒక్క ఇల్లు కట్టినట్లు చూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. రేవంత్ .. చేతకాకుంటే మాకు అప్పజెప్పు ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేసి చూపిస్తాం.మూసీ సుందరీకరణకు పునాది వేసిందే కేసీఆర్. మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పేదలు కన్నీరు కార్చిన ప్రభుత్వాలు మనుగడలేదు. 16వేల కోట్లతో పోయేదాన్ని లక్షా 50వేల కోట్లకు రేవంత్ పెంచారు. రెండేళ్ళు అయినా మూసీ సుందరీకరణపై డీపీఆర్ లేదు.కూల్చకుండా కూడా అభివృద్ధి చేయొచ్చని కేసీఆర్ నిరూపించారు. కోస్గిలో రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది. రేవంత్ రెడ్డి సోదరుడు ఇల్లు దుర్గం చెరువులో ఉంది. పొంగులేటి, వివేక్, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు బఫర్లో ఉన్నాయి. ఒక్క ఇల్లు కూల్చకుండా ఆరు కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేశాం. 30కోట్లతో ఉప్పల్ లో శిల్పారామాన్ని కూడా నిర్మించా’మని స్పష్టం చేశారు. -
ఉత్కంఠగా సాగిన ‘పిడిగుద్దులాట’
నిజామాబాద్ జిల్లా : మంజీర నది తీర సమీపంలోని నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్స గ్రామంలో ‘పిడిగుద్దులాట’ఉత్కంఠ భరితంగా సాగింది. శతాబ్దానికి పైగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం హున్స గ్రామస్తుల ఐకమత్యం, పోలీసుల పర్యవేక్షణలో ఈ ఏడాది పిడిగుద్దులాటను విజయవంతంగా నిర్వహించారు. సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు గ్రామస్తులు, ప్రేక్షకుల కేరింతలు, చప్పట్ల నడుమ పిడిగుద్దులాట కొనసాగింది. అనంతరం గ్రామపెద్దలు ఆట ముగిసినట్లు ప్రకటించగా గ్రామస్తులంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పిడిగుద్దులాటను తిలకించేందుకు మహారాష్ట్ర వాసులు, బోధన్ డివిజన్లోని పలు ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ విజయ్బాబు, ఎస్ఐ మచ్చేందర్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
చిట్టక్క ఎంట్రీతో పరకాల పాలిటిక్స్కి కొత్త ట్విస్ట్..!
సాక్షి, వరంగల్: గీసుకొండ నుంచి పరకాల టార్గెట్గా ‘కొండా’ వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. గతంలోనే పరకాల నుంచి ఎమ్మెల్యే అవుతానని ట్విట్టర్ ద్వారా పోస్టు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, మంత్రి కొండా సురేఖ దంపతుల కుమార్తె సుస్మితాపటేల్ (చిట్టక్క).. తాజాగా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర సాక్షిగా తన తండ్రి మురళీధర్రావు దీవెనలు, గీసుకొండ మండల ప్రజల అండతో ఎమ్మెల్యే అవుతానని మాట్లాడడంతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కాక రేపినట్లయ్యింది. ఆమె మాటలకు అనుకూలంగానే కొండా కుటుంబాన్ని గతంలో ఆశీర్వదించినట్లుగా భవిష్యత్లో కూడా ఆదరించాలని కొండా మురళి మాట్లాడడంతో పొలిటికల్ హీట్ పుట్టించినట్లయ్యింది. ఎవరు అడ్డొచ్చినా కొండా సుస్మిత అదరదు బెదరదని, ఇది అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. తప్పకుండా పరకాల నుంచే తన కుటుంబం రేసులో ఉంటుందని ఆయన విస్పష్టంగా ప్రకటించడంతో మరోసారి పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ వార్ తెరమీదకు వచ్చినట్లయ్యింది. గతంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ సుస్మితాపటేల్ బ్యానర్లు వెలిసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా కొండా, రేవూరి వర్గాలతో కాంగ్రెస్ పార్టీ కేడర్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొండా చేసిన ఈ వ్యాఖ్యల మర్మం వెనుక రాజకీయ మతలబు దాగి ఉందని, వరంగల్ తూర్పులో కూడా కొండా వ్యతిరేక వర్గాలు ఉండడంతో అదే సిద్ధాంతాన్ని పరకాలలో ప్రయోగించి.. పార్టీలో తమ పట్టు నిలుపుకోవాలన్న ఎత్తుగడలో భాగమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అప్పుడు దసరా.. ఇప్పుడు హోలీ● 2024 మే 8న గీసుకొండ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రడం భరత్ విషయంలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య జరిగిన ఫోన్లో వాగ్వాదం సోషల్ మీడియాలో వైరలైంది. తన మనిషిని కాదని ఇతరులకు పదవుల్లో ఎలా ప్రాధాన్యమిచ్చారంటూ రేవూరిని ఆమె ప్రశ్నించారు. మా వల్లే మీరు గెలిచారు.. నియోజకవర్గంలోని సొంత మండలం గీసుకొండలో మేం చెప్పినట్లే నడవాలని అప్పట్లో ఫోన్లో మాట్లాడిన మాటలు ఆడియో లీక్ అవడం సంచలనంగా మారింది. అంతకుముందే తనకు తెలియకుండా పలు మండలాలకు చెందిన వారిని పార్టీలోకి తీసుకోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయమై గీసుకొండ మండలంలోని కొండా వర్గానికి చెందిన ఒకరిపై పరకాలలో కేసు కూడా నమోదైంది. మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్యపై మంత్రి బాహాటంగానే అప్పుడు విమర్శలు గుప్పించారు.● 2024 అక్టోబర్ 13న దసరా పండుగను పురస్కరించుకొని గీసుకొండ మండలం ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని ఆయన వర్గీయులు దాన్ని ధ్వంసం చేశారు. ఈక్రమంలో కొండా వర్గీయులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ పీఎస్కు వచ్చిన మంత్రి కొండా సురేఖ సీఐ సీటులో కూర్చొని కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొండా వర్గీయులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకొని, వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేయడంతో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిందని, ఇది పార్టీ అంతర్గత వ్యవహారం కాదని, స్థానికతకు సంబంధించిన విషయమన్న సంగతి తెలిసిందే.● 2026 మార్చి 3న కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కుమార్తె, కొండా సుస్మితాపటేల్ మాట్లాడుతూ కొండా కుటుంబాన్ని గీసుకొండ ప్రజలు ఆదరించారని, భవిష్యత్లోనూ బాసటగా ఉండాలని సుస్మితాపటేల్ పరకాల నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉంటాననే సంకేతాలను ఇవ్వడం కలకలం రేపింది. దీంతో ఇప్పటికే ఉప్పునిప్పులా ఉంటున్న కొండా, రేవూరి వర్గాలు మరింత దూరమయ్యే పరిస్థితి నెలకొంది. గతేడాది డిసెంబర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ గీసుకొండ మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు గెలిచింది. కొండా వర్గం 7 స్థానాలు, రేవూరి వర్గం 9 స్థానాలు దక్కించుకుంది. ఇలా గీసుకొండ మండల కేంద్రంగా అధికార పార్టీలోనే రెండు వర్గాలు తమ ప్రాబల్యాన్ని చూపుతుండడం గమనార్హం. -
రెండో సారి.. ఎస్ఐ సస్పెన్షన్
హైదరాబాద్: డబ్బు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి సస్పెండ్ అయ్యాడు.. అనంతరం కొద్ది సంవత్సరాల తరువాత విధుల్లో చేరాడు.. ఈ క్రమంలో సిటీలోని ఓ పీఎస్లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టాడు. ఇక్కడా అతని పంథా మారలేదు..వసూళ్ల పర్వం కొనసాగించాడు. గమనించిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. పాతబస్తీ ఐఎస్ సదన్ పోలీస్స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్ను నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. వెంకటేశ్ జూన్లో స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచీ వెంకటేశ్పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో కేసులను నమోదు చేయకుండా జాప్యం చేయడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. బాధితులు, నేరస్తుల నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో విచారణ అనంతరం నగర పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. 2019లో మహబూబ్నగర్ తెల్కపల్లిలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యాపారి నుంచి డబ్బు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన కేసులో కొన్ని సంవత్సరాలపాటు సస్పెన్షన్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా అతని తీరు మారకపోవడం విచారకరం. -
మార్చిలోనే మాడ్చేసేలా..
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా మే నెలలో రికార్డు కావాల్సిన విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా ఈ నెల 3న (మంగళవారం) నమోదైంది. 2025 మే 6న రికార్డు స్థాయిలో 4,352 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా, ఈ సారి ఏకంగా 4,421 మెగావాట్లు దాటింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. వచ్చే నెలాఖరు నాటికి గ్రేటర్ రోజు సగటు విద్యుత్ డిమాండ్ 5వేల మెగావాట్లు దాటే అవకాశం లేకపోలేదు. ఒక్కసారిగా పెరిగిన విద్యుత్ డిమాండ్తో సబ్స్టేషన్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫీడర్లు ట్రిప్పవుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయానికి కారణమవుతున్నాయి. ఏప్రిల్/మే మాసాల్లో ఎండ త్రీవత ఎక్కువగా ఉంటుంది. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువగా వాడుతుంటారు. సహజంగానే ఈ సమయంలో విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా జరుగుతుంది. కానీ.. ఇందుకు భిన్నంగా మార్చి మొదటి వారంలో ఎండలు మండుతున్నాయి. -
రెండేళ్ల చిన్నారి.. రాత్రంతా చెట్లపొదల్లోనే
హైదరాబాద్: అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తల్లిదండ్రులతో వచ్చి తప్పిపోయిన రెండేళ్ల బాలుడు మంగళవారం రాత్రంతా చెట్ల పొదల్లోనే ఉన్నాడు. వందలాది కుక్కలు అక్కడే తచ్చాడుతున్నా బాలుడికి పెద్దగా ప్రమాదం తలపెట్టలేదు. ఒకటి, రెండు కాట్లు వేసి వదిలిపెట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన నార్సింగి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గండిపేట మైసమ్మ దేవాలయానికి మంగళవారం తెల్లాపూర్నకు చెందిన వడ్డె వెంకటే‹Ù, అనూష దంపతులు కుమారుడు అభిమన్యు (2)తో కలిసి మొక్కు చెల్లించుకునేందుకు వచ్చారు. సాయంత్రం 5.50కు అభిమన్యును తీసుకుని వెంకటేష్ కుళాయి వద్దకు వెళ్లారు. కొద్ది సేపట్లోనే అభిమన్యు అదృశ్యమయ్యాడు. వెతికినా ప్రయోజనం లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు ఆలయ ఆవరణలోని చెట్ల పొదల్లోనే రాత్రంతా ఉన్నాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. ఆలయ పరిసరాల్లో ఉండే వందల కుక్కలు బాలుడిని ఏమీ చేయకపోవడంతో గమనార్హం. ఈ సందర్భంగా ఇటీవల చిన్నారులను కుక్కలు తీవ్రంగా కరిచిన ఘటనలను గుర్తు చేసుకున్నారు. -
వీడిన ఉత్కంఠ.. తెలంగాణలో రాజ్యసభకు ఇద్దరు ఎవరంటే?
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు సభ్యుల జాబితాపై ఉత్కంఠ వీడింది. ఏఐసీసీ తాజాగా రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి అభిషేక్ సింగ్వి, వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో, అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ వీడింది.అలాగే, తమిళనాడు నుంచి క్రిస్టోఫర్ తిలక్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ శర్మ, హర్యానా నుంచి కరమ్ వీర్ సింగ్, చత్తీస్గఢ్ నుంచి ఫులోదేవి నేతంను కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం ఉదయం జాబితాను విడుదల చేసింది. కాగా, నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేయకుంటే.. ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. Congress releases a list of candidates for the Rajya Sabha Biennial elections.Abhishek Manu Singhvi and Vem Narender Reddy from Telangana.Phulo Devi Netam from Chhattisgarh.Karamvir Singh Boudh from Haryana.Anurag Sharma from Himachal Pradesh.M. Christopher Tilak from Tamil… pic.twitter.com/o2JwrC5Ax2— ANI (@ANI) March 5, 2026 -
వావివరసలు మరిచి.. చెల్లెపై కన్నేసి
జగిత్యాల జిల్లా: జులాయిగా తిరిగే ఓ యువకుడు వావివరుసలు మరిచి.. వరసకు చెల్లె అయిన బాలికపై కన్నేశాడు. ప్రేమ పేరిట వేధించి.. వెంటపడి.. ప్రేమ ఊబిలోకి దింపి శారీరకంగా లొంగదీసుకున్నాడు. విషయం ఎవరికైనా చెబితే బాలికతోపాటు ఆమె సోదరుడిని చంపేస్తానని బెదిరించాడు. మనస్తాపానికి గురైన ఆ బాలిక గత డిసెంబర్ 8న క్రిమిసంహారక మందు తాగింది. అప్పటినుంచి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నర్సయ్యపల్లిలో విషాదం నింపింది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్యపల్లెకి చెందిన దంపతులకు కూతురు, కు మారుడు సంతానం. తండ్రి బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లాడు. పిల్లలను చదివిస్తూ తల్లి ఇంటివద్దనే ఉంటోంది. కూతురు జగిత్యాలలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఇంటర్ చదువుతోంది. బాలికకు వరసకు సోదరుడైన కోల మహేశ్ జులాయిగా తిరుగుతూ.. ఆమెపై కన్నేశాడు. ప్రేమపేరుతో వేధించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే బాలికతోపాటు ఆమె సోదరుడిని చంపుతానని బెదిరించాడు. పెళ్లి చేసుకుందామని బాలిక కోరగా.. నిరాకరించిన మహేశ్ ‘చస్తే చావు..’ అని చెప్పడంతో మనస్తాపానికి గురైన బాలిక∙డిసెంబర్ 8న పురుగులమందు తాగింది. బంధువులు ఆమెను ముందుగా జగిత్యాలకు.. అక్కడినుంచి హైదరాబాద్ తరలించారు. తండ్రి నెల క్రితం దుబాయి నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. చికిత్స పొందుతున్న బాలిక మంగళవారం రాత్రి మృతి చెందింది.నిందితుడిపై పోక్సో, రేప్ కేసుబాలిక మరణానికి కారణమైన మహేశ్పై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో, రేప్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
యుద్ధ ప్రభావం: నగరంలో పెట్రోల్ బంకుల వద్ద పెరిగిన రద్దీ..!
సాక్షి,హైదరాబాద్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇంధన వినియోగదారుల్లో గుబులు రేపుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో.. నగరంలో పెట్రో సెగ రాజుకునే పరిస్థితి నెలకొంటోంది. చమురు కొరత ఏర్పడుతుందన్న ఆందోళనతో బంకులకు వాహనదారుల తాకిడి పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతాయని, సరఫరా నిలిచిపోతుందనే వదంతులు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా నగరంలో జరిగే విక్రయాల కంటే నాలుగు రోజులుగా 10 నుంచి 20 శాతం అధికంగా అమ్మకాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు తమ వాహనాల్లో ఫుల్ ట్యాంకులు నింపుకోవడమే కాకుండా, భవిష్యత్తు అవసరాల కోసం లీటర్ల కొద్దీ ప్లాస్టిక్ క్యాన్లలో పెట్రోల్, డీజిల్ను నిల్వ చేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. డిమాండ్కు అనుగుణంగా డీలర్లు ఆయిల్ కంపెనీలకు పంపే రోజువారీ ఇండెంట్ను కూడా భారీగా పెంచుతున్నారు. రాష్ట్రం మొత్తం ఇంధన వినియోగంలో హైదరాబాద్ మహా నగరానిదే సింహభాగం. గ్రేటర్ హైదరాబాద్ (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధి)లో పెట్రోల్, డిజిల్ వినియోగం అధికంగా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అమ్ముడయ్యే పెట్రోల్లో దాదాపు 60 శాతం, డీజిల్లో సుమారు 35 నుంచి 40 శాతం వాటా ఒక్క మహా నగరానికే దక్కుతోంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్లో ప్రతిరోజూ సుమారు 30 లక్షల నుంచి 45 లక్షల లీటర్ల పెట్రోల్, అంతకంటే కొంత తక్కువ మొత్తంలో డీజిల్ విక్రయాలు జరుగుతుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వినియోగం అదనంగా మరో 10 లక్షల లీటర్ల వరకు పెరిగినట్లు తెలుస్తోంది. ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 80 డాలర్ల మార్కును చేరుకున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడలేదు. దేశంలో సుమారు 25 రోజుల వినియోగానికి సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు సిద్ధంగా ఉన్నట్లు తెలుసోంది. అదనంగా వ్యూహాత్మక చమురు నిల్వలు మరో 74 రోజుల వరకు రక్షణ కల్పించే అవకాశాలున్నాయి. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతిన్నా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురును దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉనట్లు కేంద్రం భరోసా కల్పిస్తోంది. ఆందోళన వద్దు ఇప్పట్లో ఇంధన కొరత, ధర పెంపు ఉండబోదు. ధరల పెరుగుదలపై వదంతులను నమ్మవద్దు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్యాన్లలో ఇంధనాన్ని నిల్వ చేయడం ప్రమాదకరం. అగ్ని ప్రమాదాలకు దారితీస్తుంది. పౌరసరఫరాల శాఖ వినియోగదారులకు అవగాహన కల్పించాలి. – అమరేందర్ రెడ్డి, పెట్రోల్ డీలర్ల సంఘం -
గణపతి లొంగుబాటు?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్ నేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లొంగిపోవడానికి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన తిప్పిరి తిరుపతి, రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న తదితరులు, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సమావేశమైన సందర్భంలోనే.. గణపతి గురించిన ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. కాగా త్వరలో జరగబోయే మావోయిస్టు రహిత భారత్ సదస్సుతో పాటు మావోయిస్టు నేతల లొంగుబాట్లపై చర్చించడానికి.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డీజీపీ శివధర్రెడ్డి, ఎస్ఐబీ చీఫ్, ఐజీ సుమతి బుధవారం ఢిల్లీలో అమిత్షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గణపతి లొంగుబాటు అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు బుధవారం సాయంత్రం నుంచే దేశ రాజధానిలో గణపతి లొంగుబాటు అంశంపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారాన్ని బట్టి.. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల నేపథ్యంలో గణపతి తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నారని, ఆయన త్వరలోనే లొంగిపోవడానికి మార్గం సుగమం అయిందని తెలుస్తోంది. వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గణపతి సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యులు సైతం కోరుతున్నట్లు సమాచారం. కాగా ఆపరేషన్ కగార్ తరువాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిన గణపతి దేశం విడిచి నేపాల్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా తెలంగాణ పోలీసులతో టచ్లోకి వచ్చారని.. ఉన్నతాధికారులు ఆయనకు సేఫ్ ప్యాసేజ్ కల్పించి నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చేలా చూశారని ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలుస్తోంది. అనారోగ్యంతోనే బాధ్యతల నుంచి పక్కకు.. మావోయిస్టు ఉద్యమంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న గణపతి అనారోగ్య కారణాల వల్ల మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. అయినా జనజీవన స్రవంతిలోకి రాకుండా ఉద్యమంలో కొనసాగారు. మూడు నాలుగు దశాబ్దాల పాటు పీపుల్స్వార్ను ఆ తర్వాత మావోయిస్టు పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, సాయుధ పంథావైపు నడిపించడంలో గణపతి కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో పోలీసులకు పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. ఏది ఏమైనా గణపతి లొంగిపోతే మావోయిస్టు ఉద్యమం ముగింపునకు వచ్చినట్టేనని అంటున్నారు. సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్గా.. గణపతి 1949లో జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బీర్పూర్లో జని్మంచారు. ఆయన్ను ఉద్యమంలో టీచర్ అని పిలుస్తారు. 1970లో జరిగిన రైతు పోరాటాలు, జగిత్యాల జైత్రయాత్ర తర్వాత నక్సల్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్గా గణపతికి గుర్తింపు లభించింది. మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఆయన పర్యవేక్షణలో దేశంలో సంచలన దాడులు జరిగాయి. మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో గణపతిది కీలక పాత్రగా చెబుతారు. గణపతితో పాటు ఆయన సహచరిణి సుజాత కూడా ఇప్పటివరకు అజ్ఞాతంలోనే ఉన్నారు. -
పెద్దలు 'వేం' చేశారు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై గత కొద్దిరోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎన్నో మల్లగుల్లాలు, సుదీర్ఘ చర్చల అనంతరం కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుంచి బరిలో నిలిచే ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వీతోపాటు, రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత వేం నరేందర్రెడ్డికి అవకాశం ఇచ్చింది. అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కిరాగానే, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు స్వయంగా వేం నరేందర్రెడ్డికి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు అభినందనలు తెలిపారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఖరారైన అభ్యర్థులు గురువారం తమ నామినేషన్లను దాఖలు చేస్తారు. ఆ మూడు పేర్ల చుట్టే తిరిగిన చర్చ అభ్యర్థుల ఖరారుకు ముందు ఢిల్లీ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అభ్యర్థి ఎంపికకు సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ఢిల్లీకి చేరుకున్నా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితర కీలక నేతలు అందుబాటులో లేరు. దీంతో సీఎం వారితో జూమ్ యాప్ ద్వారా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వర్చువల్ మీటింగ్లో ప్రధానంగా మూడు పేర్ల చుట్టే సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. వేం నరేందర్రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, వినయ్కుమార్ పేర్లను అధిష్టానం తీవ్రంగా పరిశీలించింది. నెగ్గిన రేవంత్ పట్టు ! ఈ జూమ్ మీటింగ్లో అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి మధ్య చర్చ జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. వినయ్కుమార్కు అవకాశం ఇస్తే బాగుంటుందనే వైఖరితో ఆయన వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. అయితే, సీఎం రేవంత్రెడ్డి మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డికి ఈసారి ఎలాగైనా అవకాశం ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, పార్టీలో ఆయన సీనియారిటీని ఈ సందర్భంగా సీఎం వివరించినట్టు సమాచారం. సుదీర్ఘ చర్చల అనంతరం సీఎం పట్టుదలకే అధిష్టానం గౌరవం ఇచ్చింది. వేం నరేందర్రెడ్డి వైపే మొగ్గుచూపి, జాతీయ కోటాలో అభిషేక్ మను సింఘ్వీతో కలిపి ఆయన పేరును ఖరారు చేసింది. అభ్యర్థుల బయోడేటా: వేం నరేందర్రెడ్డి జననం: 1960 తల్లిదండ్రులు: వేం వెంకటమ్మ– చెన్న కృష్ణారెడ్డి విద్యార్హతలు: బీఏ కుటుంబ నేపథ్యం: భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు (కృష్ణ భార్గవ్, కృష్ణ కీర్తన్) రాజకీయ ప్రస్థానం: ఉమ్మడి ఏపీలో 2004 నుంచి 2009 వరకు మహబూబూబాద్ ఎమ్మెల్యేగా సేవలందించారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ, పార్టీలో ట్రబుల్ షూటర్గా, ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందారు. అభిషేక్ మను సింఘ్వీ జననం: 24 ఫిబ్రవరి 1959 స్వస్థలం: జోధ్పూర్ (రాజస్తాన్) తల్లిదండ్రులు: లక్ష్మీమాల్ సింఘ్వీ, కమల్ సింఘ్వీ కుటుంబ నేపథ్యం: ఇద్దరు పిల్లలు విద్యార్హతలు: ఢిల్లీలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో బీఏ, కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదుల్లో ఒకరిగా గుర్తింపు. రాజకీయ ప్రస్థానం: గతంలో పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన అపార అనుభవం ఉంది. కె.కేశవరావు రాజీనామాతో తెలంగాణలో ఖాళీ అయిన స్థానం నుంచి 2024 ఆగస్టు 28న రాజ్యసభకు వెళ్లారు. -
కండక్టర్ డ్యూటీ.. కాదంటే కోరుకున్న జిల్లాకు బదిలీ
సాక్షి, హైదరాబాద్: పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద హైదరాబాద్ నగరానికి 2 వేలకుపైగా ఎలక్ట్రిక్ బస్సులు రానుండడంతో నగరంలో పనిచేస్తున్న ఆర్టీసీ సిబ్బందిని సర్దుబాటు చేసే విషయంలో సంస్థ ఓ ప్రణాళికను ఖరారు చేసుకుంది. ఆరునెలల తర్వాత నుంచి దశలవారీగా ఈ బస్సులు రానున్నాయి. ఈ రాక ప్రారంభమైన తర్వాత నగరం మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే తిరగనున్నాయి. దీంతో ఇక్కడ పని చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బందికి పని లేకుండా పోనుంది. అలాంటి వారు దాదాపు 8 వేల మంది వరకు ఉండనున్నారు. దీంతో వారిని ఎలా సర్దుబాటు చేయాలన్న విషయంలో తాజాగా ఉన్నతస్థాయిలో సమీక్షించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. తాజాగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి రాజేంద్రనగర్ డిపోను సందర్శించారు. ఆరాంఘర్ వద్ద ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని ఆర్టీసీకే అప్పగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరనున్నారు. దీంతో ఆ స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లే క్రమంలో రాజేంద్రనగర్ డిపోకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ అందుబాటులో ఉన్న కార్మికులతో కాసేపు ఆయన మాట్లాడారు. ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత ఏర్పడే పరిస్థితులు, అదనంగా మారే సిబ్బంది సర్దుబాటు గురించి వారికి క్లుప్తంగా వివరించారు. » ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉండగా, 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత ఏకంగా 4 వేల మంది డ్రైవర్లు అదనంగా మారనున్నారు. ప్రస్తుతం 2 వేల కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇటీవల 1,700 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఆ విధుల్లోకి తీసుకున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే నాటికి మరిన్ని పోస్టులు ఖాళీ అవుతాయి. అప్పుడు మిగులుబాటులో ఉన్న డ్రైవర్లకు కండక్టర్ విధులు అప్పగిస్తారు. » కండక్టర్ పోస్టులు భర్తీ అయిన తర్వాత కూడా అదనంగా ఉండే డ్రైవర్ల నుంచి ఆప్షన్లు తీసుకుని వారి సొంత జిల్లాలు, వారు కోరిన ఇతర జిల్లాలకు బదిలీ చేస్తారు. » కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేసిన తర్వాత కూడా మిగిలిపోయే డ్రైవర్లను, ఇతర జిల్లాలకు పంపుతారు. » నగరంలో దాదాపు 4 వేల మంది వరకు గ్యారేజీ సిబ్బంది మిగిలిపోతారు. వీరిలో బస్సు నడిపే లైసెన్సులు ఉన్నవారిని గుర్తించి డ్రైవర్ డ్యూటీలు అప్పగించి వారు కోరుకున్న జిల్లాలకు బదిలీ చేస్తారు. » నగరంలోనే ఉండాలనుకునేవారికి కండక్టర్ డ్యూటీలు అప్పగిస్తారు. » కండక్టర్ పోస్టులు భర్తీ అయ్యాక మిగిలిపోయే వారిని వారు కోరుకునే జిల్లాల్లో కండక్టర్ బాధ్యతలు అప్పగిస్తారు. అప్పటికీ మిగిలిపోయే వారి ని ఇతర జిల్లాలకు బదిలీచేసి సర్దుబాటుచేస్తారు. » నగరం నుంచి వెళ్లేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉండదు. దీంతో వారి సీనియారిటీ నగరంలోనే కొనసాగేలా, ఇక్కడి వేతనమే పొందేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ పరిస్థితికి ఇదీ కారణం... ఆర్టీసీలో ఉండే ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేటు సంస్థలు అద్దె ప్రాతిపదికన(గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు) నడుస్తున్నవే. వాటిల్లో డ్రైవర్లు, మెకానిక్ సిబ్బంది ప్రైవేటు వారే ఉంటారు. కేవలం కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ సిబ్బంది ఉంటారు. నగరంలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే తిరిగేలా చర్యలు తీసుకుంటున్నందున, ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న డ్రైవ ర్లు, గ్యారేజీ సిబ్బందికి పని లేకుండా పోనుంది. వారినే సర్దుబాటు చేయాల్సి వస్తోంది. -
పట్టు పట్టి.. సన్నిహితుడికి ‘పట్టం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డికి రాజ్యసభ స్థానం ఇప్పించుకోవడంలో సఫలీకృతులయ్యారు. వాస్తవానికి, ఈ దఫా రాష్ట్రం నుంచి ఇద్దరికి రాజ్యసభకు వెళ్లే అవకాశం లభించింది. ఈ రెండు స్థానాల్లో ఒకటి అధిష్టానం కోటాకు వెళుతుందని, మరొకటి తెలంగాణ నాయకత్వానికి వస్తుందనే చర్చ మొదటి నుంచి జరిగింది.అయితే తెలంగాణకు వచ్చే ఒక స్థానం విషయంలో సామాజిక వర్గాల వారీగా సమీకరణలు తెరపైకి వచ్చాయి. అధిష్టానం కోటాలో అగ్రవర్ణాలకు చెందిన సింఘ్వీ కేటాయించాల్సి ఉన్నందున మరో స్థానాన్ని బీసీ లేదా ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలన్న ప్రతిపాదన బలంగా వినిపించింది. అయితే, ఇదే సామాజిక వర్గ కోణాన్ని సీఎం రేవంత్రెడ్డి అధిష్టానం ముందు పెట్టి తన మాట నెగ్గించుకోగలిగారని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ పార్టీ అనేక అడుగులు వేస్తోందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఇప్పటికే పలుసార్లు ప్రాధాన్యం ఇచ్చామని, ఈసారి తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన రెడ్డి నేతకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని ఆయన అధిష్టానం ముందు తన ఆలోచనను వెలిబుచ్చారని చెబుతున్నాయి.. ఈ కోణంలోనే తనకు చేదోడువాదోడుగా ఉండే అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని ఆయన మొదటి నుంచి చర్చల్లో ఉంచగలిగారని, ఆయనకు ఇవ్వడం వల్ల జరిగే ప్రయోజనాన్ని సీఎం అధిష్టానానికి స్పష్టంగా వివరించగలిగారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. పోయిన సారే అనుకున్నా... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరకకపోవడంతో తన సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డిని ఎలాగైనా రాజ్యసభకు పంపాలని సీఎం రేవంత్ అనుకున్నారు. అందులో భాగంగా పార్టీ అధికారంలోకి వచ్చి న తర్వాత తొలిసారి జరిగిన రాజ్యసభ ఎన్నిక సమయంలోనే వేం నరేందర్రెడ్డి పేరును ప్రతిపాదించారు. అయితే అగ్రవర్ణాలకు చెందిన రేణుకాచౌదరికి ఒక స్థానం ఇవ్వాల్సి రావడంతో బీసీ వర్గానికి చెందిన అనిల్కుమార్యాదవ్కు అవకాశం లభించింది. మధ్యలో వచ్చిన మరో స్థానాన్ని అధిష్టాన కోటాలో సుప్రీంకోర్టు న్యాయవాది సింఘ్వీకి కేటాయించారు. తమిళనాడు తికమక త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి డీఎంకే కేటాయించే స్థానాలు, అక్కడ పోటీ చేసే అభ్యర్థుల విషయం తేలడంలో జాప్యం జరిగింది. పరిస్థితిని బట్టి సింఘ్వీ తమిళనాడుకు వెళ్లే అవకాశం ఉందనే చర్చ కూడా జరిగింది. దీంతో అధిష్టానం కోటాకు ఒక స్థానం వెళుతుందా లేదంటే రెండు స్థానాలు తెలంగాణ నాయకులకే వస్తాయా అనే మీమాంస మంగళవారం వరకు కొనసాగింది. ఒకవేళ తెలంగాణకు రెండు స్థానాలు కేటాయించాల్సి వస్తే ఒకటి ఓసీకి మరొకటి బీసీకి ఇస్తారనే చర్చ జరిగింది. అయితే తమిళనాడు నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీకి ఒకటే స్థానాన్ని ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించడంతో సింఘ్వీ తెలంగాణకు ఖరారయ్యారు. మిగిలిన ఒక స్థానాన్ని నరేందర్రెడ్డికి కేటాయించారు. నేడు నామినేషన్లు రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని రాజ్యసభ ఎన్నికల కార్యాలయంలో తమ నామినేషన్లను వారు సమర్పిస్తారు. ఈ నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తదితరులు హాజరుకానున్నారు. ఇతర నామినేషన్లు దాఖలు కాని పక్షంలో ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఈ ఇద్దరి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటిస్తుంది. -
పూటకో బదిలీతో దెబ్బతింటున్న పాలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పూటకోమారు బదిలీ చేయడంతో పాలన దెబ్బతింటోందని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతకాని పాలనకు ఉన్నతాధికారుల బదిలీలు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణభవన్లో బుధవారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఐదుసార్లు జరిగిన బదిలీలతో విభాగాధిపతులు సగటున ఎనిమిది నెలలు కూడా తమకు అప్పగించిన స్థానాల్లో పనిచేయడం లేదన్నారు. విద్యుత్ శాఖలో రెండేళ్లలో ఐదుగురు ప్రత్యేక కార్యదర్శులు మారిన విషయాన్ని ప్రస్తావిస్తూ బదిలీలతో విద్యుత్ శాఖ అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్తోపాటు సింగరేణి, పౌర సంబంధాలు, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్ తదితర విభాగాల్లో నలుగురు చొప్పున ఉన్నతాధికారులు మారిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఐదు విడతల్లో 140 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ కాగా, 20 జిల్లాల కలెక్టర్లు మారారన్నారు. రంగారెడ్డి జిల్లాలో రెండేళ్లలో నలుగురు కలెక్టర్లు మారారని చెప్పారు. తరచూ బదిలీలపై రాష్ట్రానికి నష్టం విభాగాధిపతులుగా ఉండే సీనియర్ ఐఏఎస్లతోపాటు జిల్లా కలెక్టర్లను తరచూ మార్చడంతో రాష్ట్రానికి నష్టం జరుగుతోందని హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నచ్చని అధికారులను బదిలీలు చేస్తూ, తమకు వ్యక్తిగతంగా అనుకూలంగా పనిచేసే వారికే సీఎం, మంత్రులు పోస్టింగులు ఇస్తున్నారని చెప్పారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐదు శాతం ఎక్సెస్కు టెండర్లు కట్టబెట్టడంలో జరుగుతున్న అక్రమాలను త్వరలో బయటపెడతానని ప్రకటించారు. ఇంజనీరింగ్ శాఖలో రిటైర్డ్ అధికారులు కీలక పదవుల్లో ఉండటం వల్ల ఎక్కువ అవినీతి జరుగుతోందని హరీశ్రావు ఆరోపించారు. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సరికాదన్నారు. సీఎం అక్రమాలకు సహకరించని అధికారులను బదిలీ చేస్తున్నారని, సీఎం తప్పుల్లో భాగస్వాములు అయ్యేందుకు అనేక మంది అధికారులు ముందుకు రావడం లేదని తెలిపారు. లగచర్ల ఆందోళనల సందర్భంగా అనేక హామీల ఎగవేతకు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ను బదిలీ చేశారని తెలిపారు. పార్టీ విప్ ఉల్లంఘించి ఓటేసిన కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయడంలో చూపిన దూకుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు లోపించిందన్నారు. అక్రమ మైనింగ్ పరిశీలనకు బీఆర్ఎస్ బృందం హైదరాబాద్ శివారులోని నియోపోలిస్లో సీఎం రేవంత్రెడ్డి మేనల్లుడు అక్రమ మైనింగ్ చేస్తున్నాడని, కోట్లాది రూపాయల లీజు, రాయల్టీ ఎగవేతకు పాల్పడ్డారని హరీశ్రావు ఆరోపించారు. నిబంధనల ఉల్లంఘనలపై బీఆర్ఎస్ ప్రతినిధి బృందం గురువారం అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన క్రషర్లను పరిశీలిస్తుందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై ప్రస్తుతానికి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హరీశ్రావు వెల్లడించారు. -
‘రాజ్యసభ’కు బీఆర్ఎస్ దూరం ?
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు గురువారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ముగిసేంత వరకు పార్టీ అభ్యర్థిని బరిలోకి దించే అంశంలో గోప్యత పాటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో 120 మంది శాసనసభ్యులు ఉండగా ఇద్దరు మాత్రమే పోటీ చేస్తే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. సిట్టింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీతోపాటు మరో అభ్యర్థిని అధికార కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలుపుతోంది. అయితే బీఆర్ఎస్ మూడో అభ్యర్థిని బరిలోకి దించితే ఎన్నిక అనివార్యం అవుతుంది. ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తే కనీసం 40 ఓట్లు సాధించే అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 37 స్థానాలకు పడిపోయింది. మరో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటుండగా, వారిపై అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ స్పీకర్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 27 మందికే పరిమితమైంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలిపితే పర్యవసానాలు ఎలా ఉంటాయనే కోణంలో పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలిపితే తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని చెబుతున్న పది మంది ఎమ్మెల్యేలు ఎటు వైపు ఓటు వేస్తారనే ఆసక్తి నెలకొంది. మూడో అభ్యర్థిని పోటీలో పెడితే ఉన్న 27 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా క్రాస్ ఓటింగ్కు పాల్పడితే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందనే ఆందోళన కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా ఇష్టాగోష్టిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. రాజ్యసభ ఎన్నిక బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలపడంపై పార్టీ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో చివరి నిమిషం వరకు తమ పార్టీ వ్యూహం గోప్యంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. -
వావివరసలు మరిచి చెల్లెపై కన్నేసి...
ధర్మపురి: వావివరుసలు మరిచి ఓ యువకుడు వరసకు చెల్లె అయిన బాలికపైనే కన్నేశాడు. ప్రేమ పేరిట వేధించి..శారీరకంగా లొంగదీసుకున్నాడు. విషయం ఎవరికైనా చెబితే బాలికతోపాటు ఆమె సోదరుడిని చంపేస్తానని బెదిరించాడు. మనస్తాపానికి గురైన ఆ బాలిక గత డిసెంబర్ 8న క్రిమిసంహారక మందు తాగింది. అప్పటినుంచి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నర్సయ్యపల్లిలో విషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్యపల్లెకి చెందిన దంపతులకు కూతురు, కుమారుడు సంతానం. తండ్రి బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. పిల్లలను చదివిస్తూ తల్లి ఇంటివద్దనే ఉంటోంది. కూతురు జగిత్యాలలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఇంటర్ చదువుతోంది. వరసకు సోదరుడైన కోల మహేశ్ బాలికపై కన్నేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరంగా లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుందామని బాలిక కోరగా.. నిరాకరించిన మహేశ్ ‘చస్తే చావు..’అని చెప్పడంతో మనస్తాపానికి గురైన బాలిక పురుగులమందు తాగింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. విషయం తెలిసిన తండ్రి నెల క్రితం దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మంగళవారం రాత్రి మృతి చెందింది. బాలిక మరణానికి కారణమైన మహేశ్పై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో, రేప్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
భూసేకరణకు రూ. 5 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ అవసరాలకు రూ. 5 వేల కోట్ల విడుదల చేస్తున్నట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. జూన్ 2 నాటికి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మంత్రులు దామోదర, పొంగులేటి, సీతక్క, వివేక్తో కలిసి బుధవారం సచివాలయంలో నీటిపారుదల శాఖపై సమీక్షించారు. సింగూరు ప్రాజెక్టు భద్రతను పటిష్టం చేసేందుకు చేపట్టిన మరమ్మతులను జూలై నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించాలని ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మహానగరానికి ప్రాణధారగా నిలిచిన సింగూరు ప్రాజెక్టు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. స్వయంగా ప్రాజెక్టును సందర్శించి సమగ్ర రీతిలో సమీక్షిస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉందని నివేదికలు అందిన నేపథ్యంలో క్రమంగా నీటి నిల్వలను తగ్గించి తక్షణ మరమ్మతులు చేపట్టామన్నారు. మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును పటిష్టపరిచే వరకు పూర్తిస్థాయి మట్టం మేరకు నీటిని నిల్వ చేయరాదని నిర్ణయించామని చెప్పారు. ప్రాజెక్టులో సమస్యలను గుర్తించేందుకు అండర్ వాటర్ సర్వేలు, సోనార్ పరీక్షలు నిర్వహించి రెండు మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలన్నారు. క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన అవసరం లేకుండా ఒకే పంట సీజన్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. సింగూరు కాల్వల లైనింగ్ పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 13 కి.మీ.ల కాల్వకు గాను 9 కి.మీ.ల లైనింగ్ పూర్తయిందని, మిగిలిన 4 కి.మీ.ల మేర కాల్వకు లైనింగ్ను జూన్ 26లోగా పూర్తి చేయాలన్నారు.ఉగాది నాటికి పెద్దారెడ్డి ఎత్తిపోతలకు శంకుస్థాపన అందోల్ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన పెద్దారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ను సత్వరంగా రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు ఉగాదిలోగా శంకుస్థాపన చేస్తామన్నారు. అందోల్ నియోజకవర్గంలో చెరువుల పునరుద్ధరణ పనుల టెండర్లను పూర్తి చేసి ఈ సీజన్లో రైతులకు సాగునీరు అందించాలన్నారు. ములుగు జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణను వేగిరం చేయాలని తెలిపారు. పాలెంవాగు గేట్లు, రెగ్యులేటర్లకు మరమ్మతులు చేయాలని చెప్పారు. పాలెంవాగుపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలన్నారు. -
అదనంగా ఐపీఎస్లను కేటాయించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని..తర్వాత 2021లో జరగాల్సిన రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందని తెలిపారు. ఆ సమయంలోనూ కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని వివరించారు. బుధవారం రాత్రి ఢిల్లీలో అమిత్షాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికీ అనేక ఆధునిక సవాళ్లు దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు, హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని చెప్పారు. మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని, ప్రస్తుతం రాష్ట్రంలో 83 మంది ఐపీఎస్ అధికారులు ఉండగా.. ఆ సంఖ్యను 105కు పెంచాలని రేవంత్ కోరారు. 591 మంది మావోయిస్టులు లొంగిపోయారు.. ఇటీవలి కాలంలో మావోయిస్టుల లొంగుబాట్లపై అమిత్షాతో సీఎం చర్చించారు. అగ్ర నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం తదితర అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసింగ్లో గణనీయమైన మార్పులు వచ్చాయని రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలోనే 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని షా దృష్టికి తీసుకెళ్లారు. పలువురు అగ్రనేతలు సైతం సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారని చెబుతూ.. వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం తదితర విషయాలను వివరించారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి సహకరించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. ఈ సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, డీజీపీ బి.శివధర్రెడ్డి, అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) విజయ్కుమార్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ బి.సుమతి పాల్గొన్నారు. రాత్రికి ఢిల్లీలోనే సీఎం.. బుధవారం ఢిల్లీకి వచ్చిన సీఎం రాత్రి ఇక్కడే బస చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్కు వెళ్లి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
వాయుసేనలో అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: భారత వాయుసేనలో అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల నియామకాల అధికారి, సికింద్రాబాద్–12 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ ఆఫీసర్ వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ప్రవేశాలు పొందడానికి ఈ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ అద్భుతమైన అవకాశం అని ఆయన వివరించారు. ఈ నెల 9, 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహిళా అభ్యర్థులకు, 12, 13 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులకు, 15, 16 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర పురుష అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుందన్నారు. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయసు ఉన్న అవివాహిత యువతీ యువకులు ఉద్యోగాలకు అర్హులన్నారు. అభ్యర్థుల కనీస ఎత్తు 152 సెం.మీ, ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష, మూడేళ్ల డిప్లొమా ఇంజనీరింగ్ (పాలిటెక్నిక్), రెండేళ్ల ఒకేషనల్ కోర్సుల్లో (ఐటీఐ) ఉత్తీర్ణత సాధించినవారు అర్హులన్నారు. ఆయా విద్యార్హతల్లో మొత్తం మార్కుల్లో 50 శాతం, ఆంగ్లంలో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ రిజి్రస్టేషన్ చేసుకోనవసరం లేదని, నేరుగా ర్యాలీకి హాజరుకావచ్చని వివరించారు. అభ్యర్థులు ఒరిజినల్ లేదా డిజీలాకర్ ద్వారా ధ్రువపర్చిన విద్యార్హత పత్రాలు, స్థానికత ధ్రువీకరణ పత్రం, ఎన్సీసీ సరి్టఫికెట్ (ఉంటే), ఆధార్ కార్డు, ఇటీవల తీసుకున్న 10 పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటోలు, ప్రతి ధ్రువపత్రానికి సంబంధించిన 6 జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహిళా అభ్యర్థులు మార్చి 9న, ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులు 12న, తెలంగాణ పురుష అభ్యర్థులు 13న ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏపీ గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో హాజరుకావాలన్నారు. 1.6 కిలోమీటర్ల పరుగు పోటీ, భౌతిక, శారీరక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి రాత పరీక్ష ఉంటుందన్నారు. ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలను https:// agnipathvayu. cdac.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. -
నెల రోజుల్లో కొత్త విద్యా విధానం
సాక్షి, హైదరాబాద్: వారంలో ఉపాధ్యాయ సంఘాల తో సమావేశం ఏర్పాటు చేస్తామని, మరో నెల రోజు ల్లో కొత్త విద్యా విధానం తీసుకొస్తామని రాష్ట్ర ప్రభు త్వ సలహాదారు, తెలంగాణ విద్యా విధానం రూపకల్పనకు ఏర్పాటైన కమిటీ చైర్మన్ కె.కేశవరావు చెప్పా రు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ ఇచ్చిన నివేదిక విద్యా విధానం కాదని, సిఫారసులు మాత్రమేనని కేకే స్పష్ట చేశారు. ముర ళి నివేదికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. విద్యా కమిషన్ నివేదికతో పాటు మరో మరో 14 నివేదికలపై చర్చించి, అందరి అభిప్రాయా ల మేరకు మరో నెల రోజుల్లో కొత్త విధానం తీసుకొస్తామని చెప్పారు. విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, మేధావులతో చర్చించిన తర్వాతే హైపవర్ కమిటీ నూతన విద్యా పాలసీని రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తుందని తెలిపారు. ఈ పాలసీలోని అంశాల అమలు, వాటి సాధ్యాసాధ్యాలపైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని కేకే చెప్పారు. మురళి కమిషన్ బాగా పని చేసింది విద్యకు సంబంధించి పలు సిఫారసులు చేయడంలో మురళి కమిషన్ బాగా పని చేసిందని అన్నారు. విద్యా కమిషన్లో పీహెచ్డీ చేసిన వారు లేరనడం సరైంది కాదని, విశ్వవిద్యాలయ విభాగం హెడ్గా పనిచేసిన ప్రొఫెసర్ పీఎస్ విశ్వేశ్వర్రావు లాంటి వారు ఉన్నారని గుర్తు చేశారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ సిఫారసులతో కూడిన నివేదికను సమర్పించాయని, వీటన్నింటిపైనా చర్చిస్తామని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విశ్వవిద్యాలయ ఉప కులపతులు, ప్రొఫెసర్లు, మేధావుల స్థాయిలో మొత్తంగా 11 కమిటీలను ఏర్పాటు చేశామని కేకే వివరించారు. విద్యా రంగంలో గురువుల సేవలు వెలకట్టలేమని, తాను కూడా టీచర్గా పని చేశానని గుర్తు చేశారు. -
ప్రభుత్వ కాలేజీల్లో నిర్లక్ష్యం... ప్రైవేటులో ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ విద్యను సంస్కరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల రాష్ట్ర విద్యా కమిషన్ తన నివేదికలోనూ ఇదే పేర్కొంది. ప్రభుత్వ కాలేజీల్లో బోధనాపరమైన నిర్లక్ష్యం, ప్రైవేటు కాలేజీల్లో ఒత్తిడితో కూడుకున్న విద్య ఉంటోంది. ఇది ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రైవేటులో బట్టీ చదువుల విధానంలో ఎక్కువ ఉత్తీర్ణత శాతం నమోదవుతున్నా.. సాంకేతిక విద్యలో ఇలాంటి విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులు కూడా ఒత్తిడి కారణంగా వెనుకబడుతున్నారు. సబ్జెక్టుపై పట్టులేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఐఐటీ ముంబై అధ్యయనంలో వెల్లడైంది. గురుకుల విద్య మెరుగే.. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది 10,96,666 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్ష రాశారు. ప్రభుత్వ కాలేజీల్లో 1,84,743 మంది ఉంటే, ప్రైవేటులో 7,20,674 మంది ఉన్నారు. గురుకులాల్లో 1,00,644 మంది చదివారు. ప్రభుత్వ కాలేజీల్లో 37 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ప్రైవేటులో 64 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే, గురుకులాల్లో ప్రైవేటు కన్నా ఎక్కువగా 78 శాతం మంది పాసయ్యారు. జేఈఈ, నీట్లో కూడా గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటుతున్నారు. జాతీయ కాలేజీల్లో సీట్లు పొందినప్పటికీ ఒత్తిడికి గురికావడం లేదని ఐఐటీ మద్రాస్ అధ్యయనంలో తేలింది. దీన్నిబట్టి ఒత్తిడిలేని గురుకుల తరహా విద్యా విధానం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరహా ప్రణాళికలు రూపొందించాలని ఇటీవల జరిపిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పర్యవేక్షణే మందు.. ప్రభుత్వ కాలేజీల్లో నవంబర్ నాటికి మొత్తం సిలబస్ పూర్తవ్వడం లేదు. అధ్యాపకులకు ఎన్నికల విధులు ఉండటం, చాలాచోట్ల సబ్జెక్టు ఫ్యాకల్టీ కొరత, కాలేజీలు సరిగా జరగకపోవడం కారణాలైతే... విద్యార్థుల హాజరు శాతం కూడా తక్కువగా ఉంటోంది. ఈ ఏడాది నుంచి ముఖ గుర్తింపు విధానం తేవడంతో కొంత మార్పు కన్పిస్తోంది. అయితే, క్లాసులకు హాజరవ్వని విద్యార్థులను ప్రిన్సిపల్స్ ప్రశ్నించినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉండటం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వారు పనులకు వెళ్తున్నట్టు పలువురు ప్రిన్సిపల్స్ చెప్పారు. ప్రధానంగా ఇలాంటి పరిస్థితులను పర్యవేక్షణలో సరిచేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. మార్పులు తెస్తున్నాంప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫేసియల్ రికగ్నైజేషన్ పెట్టాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ రూం నుంచి కాలేజీలను నిత్యం గమనిస్తున్నాం. దీనివల్ల హాజరు శాతం పెరుగుతోంది. ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నాం. ఇంటర్మీడియెట్ విద్యపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ఈ ఏడాది మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. – కృష్ణ ఆదిత్య, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి -
మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు?
ఢిల్లీ: మావోయిస్టు అగ్రనేత, సీపీఐ(మావోయిస్టు) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 50 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన గణపతి.. ఆపరేషన్ కగార్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. నేపాల్లో గణపతి ఆశ్రయం పొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న గణపతి.. లొంగిపోతున్నట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గణపతి లొంగుబాటుతో మావోయిస్టులో అగ్రనేతల శకం దాదాపు ముగిసినట్లే.వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఆయన తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నారని.. త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. దశాబ్దాల పాటు సాయుధ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన గణపతి.. 2018లో ప్రధాన కార్యదర్శి పదవి నుండి వైదొలిగారు. గణపతి వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యుల కోరిక. తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆయనతో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం.గణపతి లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ అని.. వారి సాయుధ పోరాట ముగింపునకు దారితీసే పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గణపతి.. గణపతి పర్యవేక్షణలో దేశంలో సంచలన దాడులు జరిగాయి. మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో కీలక పాత్ర పోషించిన గణపతి.. షార్ట్ కట్లో పార్టీలో ఎదిగాడన్న వాదన కూడా ఉంది.1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్లో ఆయన జన్మించారు. ఉద్యమంలో గణపతిని టీచర్ అని పిలిచేవారు. 1970లో రైతు పోరాటాలు జగిత్యాల జైత్రయాత్ర ద్వారా పోరాటానికి దిగారు. నక్సల్స్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్గా గణపతికి గుర్తింపు పొందారు. ఇప్పటికీ గణపతి భార్య సుజాత ఉద్యమంలో కొనసాగుతున్నారు. గణపతి స్వస్థలం జగిత్యాల జిల్లా సారంగపూర్. -
Telangana: ఎస్సై కావలెను..!
మంచిర్యాల జిల్లా: పోలీసు సబ్ డివిజన్ కేంద్రం బెల్లంపల్లి తర్వాత తాండూర్ పోలీసుస్టేషన్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. జిల్లా సరిహద్దులో ఉన్న స్టేషన్లో గత రెండు నెలలుగా ఎస్సై పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడి ఎస్సై కిరణ్కుమార్ గత డిసెంబర్ 30న హాజీపూర్ పోలీసుస్టేషన్కు బదిలీ అయ్యారు. మాదారం ఎస్సై ఇన్చార్జిగా కొనసాగుతూ శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్–చంద్రాపూర్ జాతీయ రహదారి ఈ స్టేషన్ మీదుగానే సాగుతుంది. రెగ్యులర్ ఎస్సై లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో డిమాండ్ ఉన్న ఠాణా కావడంతో సబ్ డివిజన్ డివిజన్లోని ఓ గ్రామీణ ప్రాంత పోలీసుస్టేషన్ ఎస్సై తాండూర్కు బదిలీ కోసం ఓ ప్రజాప్రతినిధి అనుయాయుల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సానుకూలత వ్యక్తమైనా మరో ఠాణాకు ఆయనకు సంబంధించిన ఎస్సైని బదిలీ చేయించే విషయంలో పేచీ పడినట్లుగా ప్రచారంలో ఉంది. ఈ కారణంగానే బదిలీ ప్రక్రియ నిలిచినట్లు తెలుస్తోంది. ఆ ఎస్సైతోపాటు మరో ఇద్దరు ఎస్సైలు కూడా ప్రయత్నాలు చేసి అర్థంతరంగా మానుకున్నట్లు తెలుస్తోంది. బదిలీపై రావడానికి ముగ్గురు ఎస్సైలు సిద్ధంగా ఉన్నా ప్రక్రియ ముందుకు సాగకపోవడం చర్చనీయాంశమైంది. తాండూర్ ప్రాంతంలో జాతీయ రహదారిపై పలు చోట్ల బ్లాక్స్పాట్లు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు, పలువురి మృతి, గాయపడిన సంఘటనలు, మందుబాబులు, ఆకతాయిల ఆగడాలు, అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటుంటాయి.గంజాయి రవాణా మార్గంరాష్ట్రంలోకి మహారాష్ట్రలోని చంద్రాపూర్, బల్లార్షా తదితర ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవా ణా జరుగుతోంది. తాండూర్, బెల్లంపల్లి, గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సై పోస్టును భర్తీ చేస్తే శాంతిభద్రతలు పరిరక్షించే అవకాశం ఉంటుందని మండల వాసులు కోరుతున్నారు.నకిలీ పత్తి విత్తనాలకు అడ్డా...!పత్తి విత్తనాలు ఈ ప్రాంతానికి చేరుకోవడం, గుట్టుగా విక్రయించడం కొంతకాలంగా సాగుతోంది. నాలుగేళ్ల క్రితం రూ.కోటికి విలువైన పత్తి విత్తనాలను పట్టుకుని పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. గత ఏడాది తాండూర్లో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. తాండూర్ కేంద్రంగా భీమిని, కన్నెపల్లి మండలాలకు సరఫరా అవుతాయనే ఆరోపణలున్నాయి. -
విడాకుల కేసులో వెన్నెలకు ఎదురుదెబ్బ..!
వెన్నెలకి తన 21వ ఏట పెళ్ళి చేశారు పెద్దలు. భర్తకి అప్పటికే 35 ఏళ్ళు. పెళ్లి అయిన వారం కూడా గడవకుండానే హింసించడం మొదలుపెట్టాడు. అలాగే భరిస్తూ ఉండగా ఒక పాప పుట్టింది. వెన్నెలకి 25 ఏళ్ళు వచ్చాయి. విపరీతంగా అనుమానించి కొట్టడంతో తృటిలో ప్రాణం పోయే ప్రమాదం తప్పి, బతికి బయటపడింది. విడాకులు, డీ.వీ.సీ కేసులతో పాటు కూతురికి, తనకు మెయింటెనెన్స్ కోరుతూ కేసు వేసింది. కేసులు నడుస్తూ ఉండగా వెన్నెలకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఓదార్పుగా తన భుజం అందించారు. అప్పుడు వెన్నెలకి 28 సంవత్సరాలు. వెన్నెల తన సహచరుడితో దిగిన ఫోటోలు తీసుకుని వచ్చి కోర్టులో చూపించి వెన్నెల మరొకరితో సహజీవనం చేస్తోందని చెప్పడంతో కోర్టు వెన్నెలకి మెయింటెనెన్స్ తిరస్కరించింది. పాపకి మాత్రం నెలకి 7 వేలు ఇచ్చింది. భర్త దగ్గర ఉంటే ప్రాణాలకే ప్రమాదం. తనకు ఒక సహచరుడు దొరికితే చట్టం వెన్నెలనే దోషిగా చూస్తోంది. ఇప్పుడు తన దారెటు?తమను తాను పోషించుకోలేని భార్య, మైనర్ పిల్లలు, తల్లిదండ్రులు (కొన్ని సందర్భాలలో మేజర్ అయిన పిల్లల సైతం) భర్త నుంచి, తండ్రి నుంచి లేదా కొడుకు నుంచి మెయింటెయినెన్స్ పోందవచ్చు అని సెక్షన్ 125 సి.ఆర్.పీ.సి చెప్తుంది. (కొత్త చట్టంలో సెక్షన్ 144). అయితే భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఉండడానికి ఉన్న కారణాల్లో ఒక ప్రధానమైన కారణంగా మెయింటెనెన్స్ చట్టం లోని సీ.ఆర్.పీ.సీ. సెక్షన్ 125(4) – ప్రస్తుత బీ.ఎన్.ఎస్.ఎస్. లోని సెక్షన్ 144(4) ప్రకారం భర్త కాకుండా మరొక వ్యక్తితో సంబంధం కలిగి ఉంటే, భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. అంతేకాదు, సరైన కారణం లేకుండా కాపురానికి వెళ్లకపోయినా కూడా మెయింటెనెన్స్ ఇవ్వవలసిన అవసరం లేదు అని చట్టం చెప్తుంది. అనేక జడ్జిమెంట్లలో ఒకటి రెండు సార్లు లైంగిక సంబంధం కలిగి ఉండటం వలన మెయింటెనెన్స్ ఇవ్వమంటే కుదరదు అంటూ మహిళలకు అనుకూలమైన తీర్పులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా మెయింటెనెన్స్ ఎగ్గొట్టాలి అని ప్రయత్నించే భర్తలకు కోర్టులో రుజువు చేయాలి అనుకునే విషయం – తన భార్య ఒక వ్యభిచారి అని! వేరే వాళ్లతో తనకు అక్రమ సంబంధాలు ఉన్నాయి అని!స్త్రీని ఒక శరీరంగాను, మగవాడికి బానిసగాను, మగాడు పోషిస్తే తప్ప పోషించుకోలేని వ్యక్తిగాను, ‘పతి’ వ్రతగాను – చూడడం ఆపేసి ఒక మనిషిలా – ఒక మైండ్ లా చూడడం మొదలుపెట్టిన రోజున స్త్రీ తన సాధికారత తను సాధించుకోగలదు.ఇదే చట్టంలో అనేకమంది మహిళలతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్న భర్తలకు డబుల్ మెయింటెనెన్స్ వెయ్యరు కదా?వెన్నెల కేసులో ప్రస్తుత చట్టం ప్రకారం విడాకులు కాకుండా సహజీవనం సాగిస్తుంటే, లేదా వెన్నెల లైంగిక సంబంధం కారణంగా విడాకులు మంజూరు అయివుంటే తనకి మెయింటెనెన్స్ రాకపోవచ్చు. ఒకవేళ వెన్నెలది సహచర్యమే కానీ సహజీవనం కాదు అని నిరూపించగలితే మాత్రం తనకి కూడా మెయింటెనెన్స్ మంజూరు అవుతుంది. అంతే కాక, పాపకి 7 వేలు సరివవు అనుకున్నా, ఖర్చులు పెరిగాయి అనుకున్నా, కోర్టులో అప్పీల్ ద్వారా కానీ, మెయింటెనెన్స్ పెంపునకు కానీ దరఖాస్తు చేసుకోవచ్చు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comMýకు మెయిల్ చేయవచ్చు. -
పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర.. నిప్పుల గుండంలో పడిన భక్తులు
సాక్షి,నల్లగొండ : వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు అగ్నిగుండం దాటే సంప్రదాయం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అయితే ఈసారి ఆ ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదానికి దారితీసింది.భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో కొంతమంది భక్తులు నిప్పుల గుండంలో పడిపోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఇతర భక్తులు వెంటనే స్పందించి వారిని బయటకు లాగారు. ఈ ప్రమాదంలో పదకొండు మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరికి కాలిన గాయాలు, మరికొందరికి తోపులాటలో గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు.ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న భక్తులు, గ్రామస్థులు కలిసి గాయపడిన వారిని రక్షించడానికి ముందుకు వచ్చారు. నిప్పుల్లో పడిన వారిని బయటకు లాగి, వెంటనే వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్న గాయపడిన వారిని పరామర్శించారు. ఉత్సవాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు సూచించారు. -
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. కొండా సుస్మిత సంచలన ప్రకటన
సాక్షి, వరంగల్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి పోటీకి సిద్ధం అవుతున్నట్టు సుష్మిత క్లారిటీ ఇచ్చారు. దీంతో, పరకాల రాజకీయంపై ఆసక్తి నెలకొంది.మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత.. బుధవారం వరంగల్ జిల్లాలోని కొమ్మాల జాతరకు వచ్చారు. జాతర వేదికగా కొండా సుస్మితా మాట్లాడుతూ..‘నా తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం కొమ్మాల జాతర నుండి ప్రారంభమైంది. నేను కూడా రాజకీయాల్లోకి వస్తాను. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. కొండా మురళీ ఇప్పటికే ముగ్గురు నలుగురు గుండెల్లో నిద్ర పోతున్నాడు. నేను పరకాలకు వస్తా మీ బాధలు తీరుస్తాను. మీరంతా బాధల్లో ఉన్నారని నాకు అర్థం అవుతోంది. పరకాలలో ప్రతీ కార్యక్రమానికి వెళ్తాను.తెలంగాణ రాజకీయాల్లోకి నేను వస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో నేను తప్పకుండా పోటీ చేస్తాను. పరకాల నుంచి పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీకు సేవ చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. పరకాల నుంచి ఎమ్మెల్యేగా తప్పకుండా గెలుస్తాను. మా నాన్న కొంచెం ప్రశాంతంగా మాట్లాడమన్నారు. అందుకే నెమ్మదిగా మాట్లాడుతున్నా.. లేకపోతే మరోలా ఉండేది అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అబుదాబి విమానాశ్రయంపై ఇరాన్ దాడి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇజ్రాయెల్– ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆదివారం అబుదాబి ఏయిర్పోర్ట్పై జరిగిన దాడిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి వాసికి గాయాలైన ఘటన మంగళవారం వెలుగుచూసింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతిరెడ్డిపల్లికి చెందిన నందెల్లి రాజేశ్వర్రావు నాలుగేళ్లుగా బతుకు దెరువు కోసం అబుదాబిలోని ఏయిర్పోర్ట్లో క్లీనింగ్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇరాన్ మిసైల్ దాడిలో ఏయిర్పోర్ట్ అద్దాలు పగిలి రాజేశ్వర్రావుకు గాజుపెంకులు చాతి, కుడి చేతి భాగాన కుచ్చుకుపోవడంతో హాస్పిటల్కు తరలించారు. చికిత్స తర్వాత తన గదికి పంపించినట్లు తన సోదరుడు రామారావుకు మెస్సేజ్ పంపించారు. అలాగే ఏయిర్పోర్ట్ సమీపంలో ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్కు చెందిన ముగ్గురు మృతిచెందినట్లు సమాచారం అందించినట్లు తెలిపారు. విమాన రాకపోకలు నిలిచిపోవడంతో స్వదేశానికి వచ్చే పరిస్థితులు లేవని, రెండుమూడు రోజుల్లో విమాన రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలిపినట్లు చెప్పారు. జరిగిన ఘటన తెలుసుకున్న రాజేశ్వర్రావు భార్య మీనా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఎలాగైనా స్వగ్రామానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని రాజేశ్వర్రావు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాడుల నేపథ్యంలో అక్కడున్న తమ వారు ఎలా ఉంటారోనని ఆందోళన చెందుతున్నారు. రాజేశ్వర్రావుకు గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీటీ పర్యంతమయ్యారు. -
వార్.. ఆపేద్దాం టూర్
సాక్షి, హైదరాబాద్: అమెరికా– ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం అన్నింటి కన్నా పర్యాటక రంగాన్ని దెబ్బతీయనుంది. సమ్మర్ టూర్లపై ప్రభావం పడుతుందని ట్రావెల్ ఆపరేటర్లు అంటున్నారు. వేసవిలో మన దేశంలో పాఠశాలలకు సుదీర్ఘ సెలవులు ఇస్తారు కాబట్టి కుటుంబ సమేత విహారాల లీజర్ ట్రావెల్కు ఇది సరైన సమయంగా పర్యా టక ప్రేమికులు భావిస్తారు. కొత్త జంటల హనీమూన్స్కు కూడా ఇది సీజన్ లాంటిదే. ఇప్పటికే చాలా మంది తమ ట్రావెల్ ప్లాన్స్ను అమలులోకి పెట్టారు. విదేశాలకు, సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు నెలల ముందుగానే ప్రయాణ టికెట్లతో పాటు ఇతరత్రా బుకింగ్స్ కూడా చేసుకున్నారు. రద్దులు, వాయిదాలు మొదలు.. విమానయాన సంస్థలు పశ్చిమాసియాకు సేవలు నిలిపివేశాయి లేదా దారి మళ్లించాయి, ఇది గల్ఫ్ వెళ్లేవారికి మాత్రమే కాక దుబాయ్ వంటి ప్రధాన కేంద్రాల ద్వారా అమెరికా వెళ్లేవారిని ప్రభావితం చేసింది. ప్రస్తుతం ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారని మేక్ మై ట్రిప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా..‘సాధారణ పరిస్థితుల్లో.. పాఠశాల సెలవులు కుటుంబ ప్రయాణాల వల్ల వార్షిక లీజర్ అవుట్»ౌండ్ ట్రాఫిక్ లో 30–35 శాతం పెరుగుదల ఉంటుంది’‘ అని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటివో) అధ్యక్షుడు రవి గోసైన్ అంటున్నారు. 2025లో 3.27 కోట్ల మంది భారతీయులు విదేశాలకు ప్రయాణించగా వేసవి లీజర్ ట్రావెల్ అంతర్జాతీయ పర్యటనలలో 43.5 శాతం వాటాతో అతిపెద్ద చోదకంగా నిలిచింది.విహారాలకు విఘాతమే... ‘భారత్ నుంచి యూరప్, అమెరికాకు విమానాలను అనుసంధానించడానికి దుబాయ్ నాడీ కేంద్రం. ఆ ప్రయాణాలను ప్లాన్ చేసే ఎవరైనా సరే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రభావితమవుతారు’ అని ట్రావెల్ ప్లాట్ఫామ్ పిక్యూర్ట్రైల్ సహ వ్యవస్థాపకుడు హరి గణపతి అంటున్నారు. భారతీయులకు మధ్యప్రాచ్యం కీలకమైన ప్రయాణ కారిడార్. పర్యాటక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2025లో భారతీయులు సందర్శించిన టాప్ 20 దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, థాయిలాండ్, యునైటెడ్ స్టేట్స్, సింగపూర్ ఉన్నాయి. అదే సమయంలో, కొంతమంది ప్రయాణికులు అంతగా అనిశ్చితి లేని గమ్యస్థానాల వైపు తమ ప్రణాళికలను మారుస్తున్నారు. పశి్చమాసియాలో అనిశ్చితి మధ్య భారతీయ ప్రయాణికులు సింగపూర్, జపాన్, వియత్నాం, ఫిలిప్పీ¯న్స్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్ వంటి ప్రత్యామ్నాయాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. -
భర్తను హత్య చేసిన భార్యకు పదేళ్ల జైలు
రంగారెడ్డి జిల్లా: భర్తను హత్య చేసిన భార్యకు ఎల్బీనగర్ కోర్డు పది సంత్సరాల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించింది. మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్ పద్మశాలిపురంలో నివాసం ఉండే ప్రభుగౌడ్, భార్య లక్ష్మి ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేదు. భార్య లక్ష్మి కల్లు తాగి వస్తుండటంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండేది. 2017 ఏప్రిల్ 6వ తేదీన సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం రవి వంట చేయాలని భార్యను కోరాడు. ఇందుకు నిరాకరించిన ఆమె తాను పుట్టింటికి వెళ్లిపోతానని బట్టలను సిద్ధం చేసుకొని బయలుదేరింది. అదే సమయంలో మళ్లీ గొడవ పడ్డారు. దీంతో లక్ష్మి కోపంతో రగిలిపోయి రవిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. కేకలు పెడుతూ మంటలతో బయటకు పరుగులు తీసిన రవిని స్థానికులు రక్షించారు. మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. 108 అంబులెన్స్లో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్న అతడు చనిపోయాడు. ఇప్పటి మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టగర్ పి.జగదీశ్వర్ ఆదారాలను ఎల్బీనగర్లోని కోర్టుకు సమరి్పంచారు. విచారణ అనంతరం లక్ష్మికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.3 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వై.సత్యేంద్ర తీర్పునిచ్చారు. గృహ హింస కేసులో ఏడాది.. సిటీ కోర్టులు: గృహహింస కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి మనోరంజన్లోని 15వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజి్రస్టేట్ కోర్టు న్యాయమూర్తి డి.అజయ్ కుమార్ సోమవారం తీర్పు చెప్పారు. వివరాలు.. మలక్పేట్కు చెందిన తౌఫిక్ ఖాన్ అదే ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ బేగంను 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు. ఆటో డ్రైవర్గా పనిచేస్తూ మద్యం తాగి ఇంటికి వచ్చి విపరీతంగా కొడుతున్నాడని, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నాడని 2018లో సీసీఎస్ ఉమెన్ పోలీస్స్టేషన్లో ఇర్ఫాన్ బేగం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు చార్జిషీట్తో పాటు మనోరంజన్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి డి.అజయ్ కుమార్ తీర్పు వెల్లడించారు. -
నటిపై అసభ్య పోస్టులు పెట్టిన నటుడి అరెస్టు
హైదరాబాద్: సోషల్ మీడియాలో బోగస్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రముఖ నటిపై అసభ్య పదజాలంతో కామెంట్ పెట్టిన నటుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. వరంగల్కు చెందిన సినీ నటుడు రుషిత్(26) రీల్ మాయ–1 పేరుతో మూడు వారాల క్రితం ఓ బోగస్ అకౌంట్ను క్రియేట్ చేసి ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్లలో ఓ నటి మీద అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టాడు. సదరు నటికి ఓ దర్శకుడితో లింక్ ఉందంటూ ఫేక్ ప్రచారం చేశాడు. దీంతో బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు రుషిత్ బోగస్ అకౌంట్లపై లోతుగా దర్యాప్తు చేశారు. సదరు సోషల్ మీడియా సంస్థలకు కూడా లేఖలు రాసి ఆరా తీయగా నిందితుడి గుట్టు బయటపడింది. అమీర్పేటలోని ఓ హాస్టల్లో ఉంటూ సినిమాల్లో వేషాలు వేసుకుంటూ కాలం గడుపుతున్న రుషిత్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కొమ్మల్లో దాగింది కొంటె చిలకమ్మ!
హైదరాబాద్: అది ఖరీదైన, అరుదైన ఆఫ్రికన్ గ్రే చిలక. శ్రీనగర్ కాలనీలోని ఓ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఆదివారం రాత్రి ఇంట్లోంచి తుర్రుమంది. దీంతో ఆ కుటుంబమంతా విలవిలలాడింది. బ్యాటరీ లైటుతో రాత్రంతా గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఓ చెట్టు కొమ్మ సందుల్లో కనిపించింది. కిందికి తీసుకొచ్చేందుకు యతి్నంచినా ఫలితం లేకుండాపోయింది. పోలీసులు ఫైర్ ఇంజిన్కు, హైడ్రాకు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజిన్ అక్కడకు చేరుకుని నిచ్చెన పైకి లేపేందుకు యత్నిస్తుండగా శబ్దానికి ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి ఎగిరిపోయింది. దీంతో జీహెచ్ఎంసీ వీధి దీపాల విభాగానికి సమాచారమిచ్చారు. వారు బకెట్ క్రేన్లో కుటుంబ యజమానిని కూర్చోబెట్టి అలికిడి లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెట్ల కొమ్మల్లోని చిలకను 3 గంటల పాటు పోలీసులు, హైడ్రా సిబ్బంది, ఫైర్ సిబ్బంది, జీహెచ్ఎంసీ వీధి దీపాల విభాగం సిబ్బంది ప్రయతి్నంచి విజయం సాధించారు. ఆఫ్రికన్ గ్రే చిలకను పట్టుకోవడానికి నాలుగు ప్రభుత్వ శాఖల సిబ్బంది శ్రమించడం కొసమెరుపు. -
వార్ అక్కడ.. వర్రీ ఇక్కడ!
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్లోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రియల్ ఎస్టేట్, హోటల్, గోల్డ్ ట్రేడింగ్, మైనింగ్ రంగాల్లో అక్కడ భారీ పెట్టుబడులు పెట్టిన మనోళ్లు తీవ్ర ఆందోళనలో పడ్డారు. తాజా పరిణామాలు దుబాయ్ ’సేఫ్–హెవెన్’ అనే ఇమేజ్ను దెబ్బతీశాయి. దీంతో దుబాయ్, అబుదాబి, దోహా, షార్జా తదితర నగరాల్లో పెట్టుబడులు పెట్టిన తెలంగాణకు చెందిన ప్రముఖులు తలలు పట్టుకుంటున్నారు. వీరిలో ‘సీక్రెట్’పెట్టుబడులు పెట్టిన పలువురు రాజకీయ నాయకులు, వారి దగ్గరి బంధువులతోపాటు కొందరు సినీ ప్రముఖులు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారు. లెక్కకు మించి పెట్టుబడులు రాజకీయ, సినీ ప్రముఖుల్లో కొందరు బినామీల ద్వారా దుబాయ్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఉత్తర తెలంగాణకు చెందిన పలువురు కీలక నేతలు రియల్ ఎస్టేట్ (లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలు), హోటల్స్, గోల్డ్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టారని తెలిసింది. అలాగే దక్షిణ తెలంగాణకు చెందిన ఓ జిల్లాలోని కీలక నేతల్లో ఇద్దరికి దుబాయ్లో హోటల్, రియల్ ఎస్టేట్, ఐటీ, మైనింగ్ వ్యాపారాలు ఉన్నట్లు గట్టి ప్రచారం ఉంది. రియల్ ఎస్టేట్లో తెలుగువాళ్ల పెట్టుబడులు 2025లో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో రికార్డుస్థాయిలో సుమారు 249 బిలియన్ డాలర్ల లావాదేవీలు జరిగాయి. ఇందులో భారతీయ పెట్టుబడులే 30 శాతం వరకు ఉన్నట్లు దుబాయ్ ట్రేడ్ వర్గాలను ఉటంకిస్తూ ఓ నివేదిక వెలువడింది. రాజకీయ ప్రముఖులతోపాటు సినీ, రియల్ రంగంలో ఉన్న వారు పెద్దఎత్తున దుబాయ్లో పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. లగ్జరీ విల్లాలు, అపార్ట్మెంట్లు, ఆఫ్–ప్లాన్ ప్రాజెక్టులు దుబాయ్లో బూమ్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇన్వెస్టర్లు ’వెయిట్ అండ్ వాచ్’ మోడ్లోకి వెళ్లారు. ‘పానిక్ లేదు, కానీ డెసిషన్ మేకింగ్ పూర్తిగా ఆగిపోయింది. ఒక క్లయింట్ డీల్ బ్యాక్ అవుట్ చేశాడు. చాలామంది ఒప్పందాలు జాప్యం చేయమంటున్నారు. సైట్ విజిట్స్ తగ్గాయి. లావాదేవీలు 30–40% పడిపోయే అవకాశం ఉంది. లగ్జరీ సెగ్మెంట్ మరింత దెబ్బతింటోంది. ఇన్వెస్టర్లు ఆస్తుల విలువ పడిపోవడం, ఫోర్స్డ్ సేల్స్ భయంతో ఉన్నారు’అని దుబాయ్లో తెలుగు పెట్టుబడుదారులకు సంబంధించి బ్రోకర్గా పనిచేసే వ్యక్తి ఒకరు ఫోన్లో చెప్పారు. అలాగే హోటల్, పర్యాటక రంగం మరింత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో అరైవల్స్ తగ్గాయి. పామ్ జుమైరా, దుబాయ్ మెరీనా హోటల్స్ ఆక్యుపెన్సీ రేట్లు దారుణంగా పడిపోయాయి. మైనింగ్, గోల్డ్ బిజినెస్లో డైరెక్ట్ డ్యామేజ్ తక్కువే అయినా, ఇన్సూరెన్స్ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. కాంట్రాక్టులు రీ–నెగోíÙయేట్ అవుతున్నాయి. ఇవన్నీ గల్ఫ్లో పెట్టుబడిపెట్టిన తెలుగు ప్రముఖులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. -
దేవాదుల 100 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండిపోయిన జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని 38 నుంచి 100 టీఎంసీలకు పెంచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఈ మేరకు వచ్చిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. దేవాదుల సామర్థ్యం పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఓ కార్యదర్శి మాణిక్రాజ్, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్కు ఈ బాధ్యతలు అప్పగించారు. తొలుత 50 టీఎంసీలు: గోదావరి ఎత్తిపోతలు పథకం పేరుతో 1995–2000 మధ్య దేవాదుల ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. గోదావరి నుంచి జూన్–నవంబర్ మధ్యకాలంలో 150 రోజుల పాటు 50 టీఎంసీలు తరలించి 2 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించాలని అప్పట్లో యోచించారు. ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణంపై అధ్యయనం జరపడానికి 2001లో జీవో జారీ చేశారు. అయితే తొలి దశ కింద 5.18 టీఎంసీలు తరలించి 1.23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2003లో, రెండో దశ కింద 7.25 టీఎంసీలను తరలించి 1.93 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2005లో, మూడో దశ కింద 25.75 టీఎంసీలను తరలించి 2.39 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2007లో పరిపాలనపరమైన అనుమతులు జారీ అయ్యాయి. మొత్తం మూడు దశల్లో 38.16 టీఎంసీలను తరలించి 5,56,722 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు ప్రారంభించిన వైఎస్ ప్రభుత్వం 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం కింద ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. 2005లోనే ప్రాజెక్టుకి పర్యావరణ, అటవీ అనుమతులు లభించాయి. మూడు దశలు కలిపి మొత్తం రూ.6,016 కోట్ల వ్యయం అంచనాలతో ప్రాజెక్టు నిర్మించడానికి ప్రణాళిక సంఘం పెట్టుబడి అనుమతులు (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) ఇచ్చింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)లోని టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) 2007లో అనుమతులు జారీ చేసింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 2015లో దేవాదుల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 50 నుంచి 60 టీఎంసీలకు పొడిగించింది. కానీ సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో 38.16 టీఎంసీలకే పరిమితమయ్యింది. మూడు దశల కింద హనుమకొండ, వరంగల్, కరీంనగర్, భూపాలపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, ములుగు జిల్లాల్లో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. వచ్చే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం! ‘సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)’కింద ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 2005–06లో రూ.6,016 కోట్లుగా ఉండగా.. 2016–17 నాటికి రూ.13,445 కోట్లకు చేరింది. తాజాగా రూ.18,400 కోట్లకు చేరింది. దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదించాల్సి ఉంది. అంచనాల పెంపుతో పాటు, తాజాగా ప్రాజెక్టు సామర్థ్యం పెంచాలనే నిర్ణయం తీసుకోవడంతో ఈ రెండు ప్రతిపాదనలపై తదుపరి కేబినెట్ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్ఎస్పీ–2 ఆయకట్టు స్థిరీకరణ! ప్రాజెక్టు సామర్థ్యం 100 టీఎంసీలకు పెంచితే ఏడాదిలో 300 రోజుల పాటు నీళ్లను తరలించి దేవాదుల ఆయకట్టుతో పాటు ఎస్ఆర్ఎస్పీ–2 ఆయకట్టు స్థిరీకరణకు వీలుంటుందని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటివరకు రూ.14,359 కోట్ల వ్యయంతో పనులు జరిగాయి. అయితే భూసేకరణ, నిధుల సమస్యలతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. మరో రూ.4 వేల కోట్లు అవసరం మొత్తం 34,089 ఎకరాలకు గాను 31,953 ఎకరాలు సేకరించారు. మరో 2,136 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు కింద దాదాపు 5.57 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటిదాకా 3.38 లక్షల ఎకరాలకే సాగునీరు అందిస్తున్నారు. మిగతా 2,136 ఎకరాలు సేకరిస్తే మిగిలిన 2.23 లక్షల ఎకరాలకు కూడా నీరందుతుంది. ప్రభుత్వం రూ.600 కోట్లను విడుదల చేస్తే భూసేకరణ పూర్తికానుంది. పెరిగిన అంచనాల ప్రకారం భూసేకరణతో సహా మిగులు పనుల పూర్తికి మరో రూ.4 వేల కోట్లు అవసరం కానున్నాయి. మొత్తం మీద వచ్చే 18 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి 2.23 లక్షల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. -
సేవాగ్రామ్కు వెళ్లండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన 8 మంది డీసీసీ అధ్యక్షులకు ఏఐసీసీ నుంచి ట్రైనింగ్ సర్టిఫికెట్లు అందలేదు. వికారాబాద్లో 10 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ శిబిరంలో రెండు, మూడు రోజులు పాల్గొనలేదన్న కారణంతో తెలంగాణకు చెందిన ఐదుగురు, ఏపీకి చెందిన ముగ్గురు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఈ సర్టిఫికెట్లను ఏఐసీసీ జారీ చేయలేదని సమాచారం. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన డీసీసీ అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, బీర్ల అయిలయ్య, మేడిపల్లి సత్యం, చిక్కుడు వంశీకృష్ణ (ఎమ్మెల్యేలు)తోపాటు వజ్రేశ్ యాదవ్ (మేడ్చల్) ఉన్నారు. పది రోజుల శిక్షణలో భాగంగా వీరు రెండు, మూడు రోజులు గైర్హాజరైన కారణంగానే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఎన్ని రోజులు గైర్హాజయ్యారో అన్ని రోజులపాటు మహారాష్ట్రలోని సేవాగ్రామ్కు వెళ్లి అక్కడ శిక్షణతోపాటు సర్టిఫికెట్లు తీసుకోవాలని ఏఐసీసీ నుంచి శిక్షణ శిబిరాన్ని పర్యవేక్షించిన ఇన్చార్జ్లు స్పష్టం చేశారు. తమ నియోజకవర్గాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్న కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే శిక్షణకు వెళ్లలేదని, ఎమ్మెల్యేలుగా తమకుండే అనివార్య ప్రాధాన్యతలే ఇందుకు కారణమని, త్వరలోనే సేవాగ్రామ్కు వెళ్లి శిక్షణ తీసుకుంటామని డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడుతూ వెల్లడించారు. పలువురు డీసీసీ అధ్యక్షులకు శిక్షణ సర్టిఫికెట్లు ఇవ్వని విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ కూడా ధ్రువీకరించారు. గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడిన ఆయన కొన్ని పనుల వల్ల శిక్షణకు రెండు రోజుల పాటు హాజరు కాని వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేదని చెప్పారు. కనీస సహకారం లేదు : రాహుల్తో డీసీసీ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా తమను నియమించారు కానీ మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ సహకారం అందించడం లేదని రాహుల్గాందీకి ఫిర్యాదు అందింది. సోమవారం వికారాబాద్లో జరిగిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఈ ఫిర్యాదును నేరుగా రాహుల్కు చెప్పడం గమనార్హం. ‘మంత్రులే జిల్లాల్లో పెత్తనం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా మాకు సహకరించడం లేదు. ప్రభుత్వ పరంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ వ్యవహారాల్లోనూ వారి ఇష్టారాజ్యమే నడుస్తోంది. కనీసం డీసీసీ అధ్యక్షులుగా ఎక్కడ ప్రెస్మీట్ పెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఆర్థికంగా సహకరించే వారు కూడా లేరు.’అని ఓ నేత అందరి సమక్షంలోనే రాహుల్కు చెప్పినట్టు సమాచారం. ఇందుకు స్పందించిన రాహుల్ డీసీసీ అధ్యక్షులే చొచ్చుకుపోవాలని సూచించారు. ఎవరికీ భయపడొద్దని చెబుతూ పార్టీ బలోపేతానికి డీసీసీ అధ్యక్షులు ఏం చేయాలనుకున్నా చేయొచ్చని, ఈ క్రమంలో ఏ సమస్య వచి్చనా తన వద్దకే వస్తుందని, తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
రాజ్యసభ రేసులో 16 మంది
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉందని, మొత్తం 16 మంది ఆశిస్తున్నారని, సామాజిక వర్గాల వారీగా వారి జాబితాను హైకమాండ్ ఇచి్చనట్టు టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. రాజ్యసభ అభ్యరి్థత్వాల గురించి రాహుల్గాంధీ వచ్చిన సందర్భంగా ప్రస్తావనకు వచ్చినా, ఖరారు కాలేదని తెలిపారు. అభ్యర్థుల ఎంపికకు ఒకవేళ ఢిల్లీ వెళ్లాల్సి వస్తే బుధవారం వెళతామని, లేదంటే అధిష్టానం పెద్దలతో ఫోన్లో మాట్లాడతామని వెల్లడించారు.మంగళవారం గాం«దీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి నలుగురు సమర్థవంతమైన బీసీ నేతలు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ నేతలు కూడా ఉన్నారన్నారు. రాజ్యసభ అభ్యర్థిత్వాల గురించి ఏఐసీసీ అన్ని అంశాలను బేరీజు వేస్తోందని, ముఖ్యంగా సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటోందని, సామాజిక కూర్పుతోనే అభ్యరి్థత్వాలు ఖరారయ్యే అవకాశముందని చెప్పారు. జస్టిస్. బి.సుదర్శన్రెడ్డి రాజ్యసభ స్థానాన్ని అడగడం లేదని చెప్పారు. రెండింటి విధానాలూ ఒకటే మావోయిస్టు ఎజెండా, కాంగ్రెస్ విధానం ఒకటేనని, పేదల సంక్షేమం, దేశ అభివృద్ధే ధ్యేయమని మహేశ్గౌడ్ చెప్పారు. అయితే, వారు ఆయుధాలు పట్టుకున్నారని, తాము ప్రజాస్వామ్యబద్ధంగా సేవ చేస్తామని, ఇదే తేడా అని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక అని, మాజీ మావోయిస్టులు పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని చెప్పారు. అయితే, తాము ఎవరినీ పారీ్టలోకి రావాలని అడగలేదని, మాజీ మావోయిస్టులు కూడా తమను సంప్రదించలేదన్నారు.జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు తీసుకుంటామని మహేశ్గౌడ్ చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వానికి లేఖ రాశామని, మార్కెట్ విలువ ఎంత ఉందో అంత చెల్లించి ఎకరం స్థలం తీసుకుంటామని, ఇందుకోసం ఏడు జిల్లాల్లో స్థలాల ఎంపిక కూడా జరిగిందన్నారు. బీఆర్ఎస్ తరహాలో పుక్కటికిమాత్రం ప్రభుత్వ స్థలాలు తీసుకోబోమని వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు తమకు సహకరించడం లేదని డీసీసీ అధ్యక్షులు రాహుల్గాంధీకి చెప్పారని, అలాంటి చోట్ల అందరు నేతలను పిలిపించి మాట్లాడుతామన్నారు. -
భారీ జీతంతో సమ్తృప్తే!
భారీ జీతం అందుకోవాలి. వృత్తిపరంగా ఎదగాలి. ప్రపంచస్థాయిలో గుర్తింపు రావాలి. ఇదీ ఓ సగటు భారతీయ టెకీ మనసులో మాట. ఇందుకోసం అంతర్జాతీయ దిగ్గజ టెక్ కంపెనీల్లో పనిచేయాలని ఆకాంక్షిస్తుంటారు. అయితే అధిక వేతనం ఎల్లప్పుడూ పని ప్రదేశంలో సంతృప్తిని, వృత్తిపరమైన ఎదుగుదలను అందించలేదని ఒక నివేదిక వెల్లడించింది. ప్రధాన సంస్థలలో పని వాతావరణాన్ని అంచనా వేయడానికి 40,686 మంది ఉద్యోగుల రేటింగ్స్, జీతాల డేటాను విశ్లేషించిన అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ కమ్యూనిటీ యాప్ ‘బ్లైండ్’ఓ నివేదికను రూపొందించింది. పని ప్రదేశంలో సంతృప్తి, వృత్తిపరమైన ఎదుగుదల అవకాశాలు, మేనేజ్మెంట్ పనితీరును విశ్లేíÙంచింది. మన దేశంలో టెకీలు కోరుకుంటున్న ప్రధాన కంపెనీల జాబితా ఒకటైతే.. భారత్లో పనిచేయడానికి ఉత్తమ సంస్థలుగా పేరొందిన సంస్థల జాబితా వేర్వేరుగా ఉండటం ఆసక్తికరం. – సాక్షి, స్పెషల్ డెస్క్భారీ వేతనం ఉంటే.. పోటీతత్వంతో కూడిన నేటి ఉద్యోగ మార్కెట్లో సరైన పని ప్రదేశాన్ని ఎంచుకోవడం మునుపటి కంటే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. చాలామంది నిపుణులు కేవలం జీతంపైనే కాకుండా వృత్తిపరమైన ఎదుగుదల, పని సంస్కృతి, దీర్ఘకాలిక స్థిరత్వంపై కూడా దృష్టి సారిస్తున్నారు. పని–జీవిత సమతుల్యత ఉద్యోగుల సంతోషాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని తేలింది. కెరీర్ను మార్చుకోవాలనుకునే నిపుణులకు జీతం ఇప్పటికీ ప్రధాన ఆకర్షణగా ఉంది. అంటే భారీ వేతనం ఉంటే కెరీర్ మారేందుకు సిద్ధం అన్నమాట. టాప్–15లో లేవు.. భారత్లో టెకీలు, జాబ్ మార్కెట్లోకి అడుగుపెట్టేవారు అత్యధికంగా కోరుకునే సంస్థల జాబితాను బ్లైండ్ రూపొందించింది. ఇందులో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అట్లాసియన్, ఫ్లిప్కార్ట్, జీటా, ఇన్మోబి, టెకియన్ కార్ప్, ఊబర్, వాల్మార్ట్, సేల్స్ఫోర్స్, ఎడోబ్, మెటా, ఒరాకిల్, షేర్చాట్ ముందు వరుసలో ఉన్నాయి. బ్లైండ్ బెస్ట్ వర్క్ప్లేసెస్ జాబితాలో అత్యుత్తమ రేటింగ్ పొందిన టాప్–10 కంపెనీల్లో ఎన్విడియా, గూగుల్, యాపిల్, అకామాయ్ టెక్నాలజీస్, వీఎమ్వేర్, ఎడోబ్, టార్గెట్, క్రెడ్, నోకియా, థాట్వర్క్స్ ఉన్నాయి.గూగుల్, ఎడోబ్ మాత్రమే ఈ రెండు జాబితాల్లోనూ నిలిచాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి భారీ వేతనాలు ఇచ్చే కంపెనీలు టాప్–15 బెస్ట్ వర్క్ప్లేసెస్లో చోటు సంపాదించుకోలేకపోయాయి. ఎన్విడియా, యాపిల్, అకామాయ్ టెక్నాలజీస్ వంటి అత్యుత్తమ రేటింగ్ పొందిన సంస్థలకు అత్యధికంగా కోరుకునే కంపెనీల జాబితాలో స్థానం దక్కలేదు. ఉద్యోగుల సెంటిమెంట్.. అధిక జీతాలు ఎల్లప్పుడూ ఉద్యోగ సంతృప్తితో సంబంధం కలిగి ఉండవని ఈ అధ్యయనం ద్వారా వెల్లడైంది. అత్యధిక జీతాలు ఇచ్చే కంపెనీలలో మూడో వంతు కంటే తక్కువ మాత్రమే అత్యుత్తమ రేటింగ్ పొందిన పని ప్రదేశాల జాబితాలో ఉన్నాయి. ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రతిభను ఆకర్షించినప్పటికీ ఉద్యోగులను నిలుపుకోవడంలో, వారిని ఉత్సాహపరచడంలో పని సంస్కృతి, నాయకత్వం కీలక పాత్ర పోషిస్తాయని నిరూపితమైంది.ఉద్యోగుల సంతృప్తి అనేది కేవలం జీతంపై మాత్రమే కాకుండా ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది. ఉద్యోగి ఏదేని కంపెనీలో దీర్ఘకాలం కొనసాగాలంటే నాయకత్వ నాణ్యత, వృత్తిపరమైన అభివృద్ధి, పని సంస్కృతి ఇప్పటికీ కీలకమైనవి. ఆర్థిక ప్రోత్సాహకాలతోపాటు సహాయక వాతావరణాన్ని సమతుల్యం చేసే సంస్థలు మాత్రమే నైపుణ్యం కలిగిన నిపుణులను నిలుపుకోగలవు, బలమైన ఖ్యాతిని నిర్మించుకోగలవని తెలిపింది.ఏడాదిలో భారత్లోని నిపుణులు వెతికిన కంపెనీలు, పదాలు... ⇒ అత్యధికంగా వెతికిన కంపెనీల పేర్లు: మైక్రోసాఫ్ట్, గూగుల్, ఊబర్, అమెజాన్, సేల్స్ఫోర్స్, మెటా, అట్లాసియన్, యాపిల్, క్వాల్కామ్, ఈబే. ⇒ తరచూ సెర్చ్ చేసిన పదాలు: లేఆఫ్, ఆఫర్, హెచ్–1బీ, మెటా ఇండియా, గూగుల్ ఇండియా, మెటా లండన్. -
కమ్మర్పల్లిలో పులి అడుగులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోకి పెద్ద పులి ఎంట్రీ ఇచ్చింది. జిల్లా సరిహద్దుల్లోని జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో సంచరించిన పెద్ద పులి తాజాగా కమ్మర్పల్లి అటవీ రేంజ్లోకి వచ్చినట్లు ఆనవాళ్లు కనిపించాయి. కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్ కోనాపూర్ అడవుల్లో మంగళవారం పెద్ద పులి పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు జిల్లా అటవీ అధికారి వికాస్మీనా ‘సాక్షి’కి ధ్రువీకరించారు. రెండురోజుల క్రితం వరకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల అటవీ ప్రాంతంలో సంచరించిన ఈ మగ పులి తాజాగా నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోకి రావడంతో జిల్లా అటవీ శాఖ అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. రాష్ట్ర అటవీ శాఖకు సమాచారం అందించారు. కమ్మర్పల్లి రేంజ్లో పెద్ద పులి పాద ముద్రలను గుర్తించిన అధికారులు అది ఎటువైపు వెళ్లిందో? అనే విషయమై కచ్చితమైన అంచనాలకు రాలేదు. కమ్మర్పల్లి రేంజ్ అడవుల్లోనే ఉందా? లేక పక్కనే ఉన్న మెట్పల్లి, వేములవాడ, సిరిసిల్ల రేంజ్లకు వెళ్లిందా? అనేదానిపై నిర్ధారణ చేయాల్సి ఉంది. కాగా, సిరికొండ, ఇందల్వాయి రేంజ్ల్లోకి సైతం పులి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని అటవీ శాఖ భావిస్తోంది. ఈ మగపులి జోడీ కోసం మహారాష్ట్ర తడోబా నుంచి యాదాద్రి జిల్లాలోకి ప్రవేశించి తిరిగి సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల మీదుగా జగిత్యాల నుంచి నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించిందని అధికారులు చెబుతున్నారు. -
పండుగ వేళ విషాదం
సుభాష్నగర్/బోధన్/ఆర్మూర్టౌన్/హాలియా: హోలీ వేడుకలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. తెలంగాణ, ఏపీలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందారు. హోలీ సంబరాలను ముగించుకొని నది/చెరువులోకి స్నానాలకని వెళ్లిన వారు మృతి చెందారు. మరో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. విగత జీవులైన పిల్లలను చూసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సూరారంలో... పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీకి చెందిన సాగర్, అజయ్, ఛత్రపతి, కృష్ణనగర్కు చెందిన అభిషేక్, శ్రీరామ్నగర్కు చెందిన విగ్నేష్ స్నేహితులు. వీరు బహదూర్పల్లిలోని తాము చదువుకుంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విశ్వకర్మ కాలనీని ఆనుకొని ఉన్న రామన్ చెరువులో స్నానానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అజయ్, విగ్నేష్, ఛత్రపతి.. షాపులో షాంపూలు కొనితెస్తామని చెప్పగా.. సాగర్, అభిషేక్ చెరువు వద్దకు వెళ్లి లోపలికి దిగారు. అంతలోనే మిగతా ముగ్గురు స్నేహితులు అక్కడికి రాగా ఆ ఇద్దరు చెరువులో మునిగిపోతూ చేతులు ఊపారు. దీంతో బయట ఉన్న ముగ్గురు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నీళ్లలోకి దిగారు. అయితే, అక్కడ లోతుగా ఉండటంతో సాగర్, అభిషేక్ మునిగిపోయారు. ఇద్దరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మెదక్ జిల్లా హవేలీ గణపురం మండలం తొగుట గ్రామానికి చెందిన ఏసు, జ్యోతిల కుమారుడు అభిషేక్. విశ్వకర్మ కాలనీకి చెందిన సంతోష్ కుమార్, రేఖ దంపతుల చిన్న కుమారుడు సాగర్. మంజీరలో మునిగి... స్నేహితులతో హోలీ సంబరాలు జరుపుకుని మంజీరనదిలోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని ఒకటో వార్డు పరిధిలోని ఆచన్పల్లికి చెందిన సాయికుమార్ (20), రోని చౌదరి (18) మంగళవారం సాలూర సమీపంలోని మంజీర నదికి వెళ్లారు. స్నానాలు చేస్తూ నీటిలో గల్లంతై మృతి చెందారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు నదికి చేరుకుని మృత దేహాలను బయటకు తీయించారు. సాయికుమార్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి పది రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. రోని చౌదరి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆర్మూర్లో విషాదం : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో స్థానిక గోల్ బంగ్లా ప్రాంతానికి చెందిన బోగడ నరేష్ పెద్ద కుమారుడు హర్షిత్ (15) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. హర్షిత్ మంగళవారం స్నేహితులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నాడు. అనంతరం గుండ్ల చెరువు వద్ద ఉన్న ట్యాంక్బండ్కు వెళ్లాడు. ఈ క్రమంలో కాలుజారి చెరువులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో హర్షిత్ నీటిలో మునిగిపోయి మరణించాడు. సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు గల్లంతు నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సిరసనగండ్ల గ్రామానికి చెందిన కన్నకుంట్ల బబ్లూచారి(17), నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన ఆలేటి కార్తీక్(14), అదే మండలం శాఖాపురం గ్రామానికి చెందిన పోలేపల్లి నాని స్నేహితులు. వీరు హాలియాలో నివాసముంటున్నారు. బబ్లూచారి బైక్ వాషింగ్ సెంటర్లో పనిచేస్తుండగా.. కార్తీక్ 9వ తరగతి చదువుతున్నాడు. నాని ఆటోలకు రెగ్జిన్ పనిచేస్తున్నాడు. ముగ్గురు కలిసి బిర్యానీ పార్సిల్తో మంగళవారం సాయంత్రం హాలియాలోని అక్విడెక్ట్ వద్దకు వెళ్లారు. బిర్యానీ తిన్న అనంతరం కార్తీక్ చేతులు కడుక్కోవడానికి సాగర్ ఎడమ కాల్వలోకి దిగుతుండగా కాలుజారి అందులో పడిపోయాడు. కార్తీక్ను రక్షించేందుకు బబ్లూచారి కాల్వలోకి దిగుతుండగా.. అతడు కూడా కాలుజారి నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. నాని ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పగా.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. చీకటిగా ఉండటంతో వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఏపీలో... గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం శివారు కండ్రిగలో ముగ్గురు స్నేహితులు చెరువులోకి దిగి మృతిచెందారు. బోళ్ల సాయి (15), ముచ్చు వెంకట జోసఫ్ (15), దుప్పుల వినయ్కుమార్(12) హోలీ పండుగ జరుపుకొని అనంతరం గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. కాలుజారి సాయి, వెంకట జోసఫ్, వినయ్కుమార్ చెరువులో పడి మృతిచెందారు. వీరు గొల్లనపల్లి జెడ్పీ హైసూ్కల్లో చదువుతున్నారు. -
5న వాదనలు ముగించండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో గురువారం (5న) వాదనలు ముగించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులైన ప్రభుత్వం తరఫున మధ్యాహ్నం 12.30 నుంచి 2.45 వరకు.. తర్వాత పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు సమర్పించాలని స్పష్టం చేసింది. రోజుల తరబడి వాదనలు వినడం సరికాదని, క్లుప్తంగా వాదనలు ముగించాలని సూచించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్లపై ఎలాంటి చర్యలొద్దన్న మధ్యంతర ఉత్తర్వులు పొడించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా.. చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు.కమిషన్ను తప్పుబట్టడం విడ్డూరంగా ఉంది‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ,, కేంద్ర జల కమిషన్ వంటి సంస్థల నుంచి అందిన పత్రాల ఆధారంగా మాత్రమే సమగ్ర నివేదికను సమర్పించింది. ఎవరినీ నిర్బంధించడానికి ఎవరిపైనా ఎటువంటి ఆధారాలు తీసుకోలేదు. ప్రజా ప్రయోజనాలు కాపాడే విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం సర్కార్కు ఉంది. లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రతిపాదించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా ఇతర ఏ ప్రాజెక్టుపైనైనా విచారణ కమిషన్ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కమిషన్ ఏర్పాటును తప్పుబట్టడం విడ్డూరంగా ఉంది. చట్టప్రకారం ఇచ్చిన అధికారం మేరకే కమిషన్ విధులు నిర్వహించి నివేదిక అందజేసింది. కేబినెట్ సబ్కమిటీ ఆమోదం లేకుండా నాటి సీఎం, నీటిపారుదల ముఖ్య కార్యదర్శి సంతకాలతో రూ.వేల కోట్లు విడుదల చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం’ అని ఏజీ చెప్పారు. ‘రూ.1.47 లక్షల కోట్ల ఖర్చుతో నిర్మించే కాళేశ్వరం గిట్టుబాటు కాదని కాగ్ ఆక్షేపించింది. ఎకరాకు రూ.6.42 లక్షల పెట్టుబడి పెట్టింది. ఎత్తిపోతలకు విద్యుత్ వినియోగంతో రాష్ట్రంపై అదనపు భారం పడుతోంది. అంత మొత్తం పెట్టుబడికి తగిన ఆదాయం వ్యవసాయం నుంచి రావడం లేదు’ అంటూ పీవీ జగన్నాథ్రావు వర్సెస్ ఒడిశా, ఏలేరు కమిషన్లో సుప్రీంకోర్టు తీర్పులను ఏజీ ప్రస్తావించారు. -
నీటి లెక్కలపై చేతులెత్తేసిన కృష్ణా బోర్డు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టుల ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వాడుకుంటున్న నీటిని లెక్కించడానికి ఆయా ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన టెలిమెట్రీ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ విషయంలో కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేతులెత్తేసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పుతోపాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలను సాకుగా చూపి కృష్ణా జలాల లెక్కలను పర్యవేక్షించే బాధ్యతల నుంచి తప్పించుకుంది. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని 12, 13వ క్లాజుల్లోని నిబంధనల ప్రకారం నీటి వినియోగం లెక్కింపు, వాటి ఖాతాల రూపకల్పన బాధ్యత రాష్ట్రాలదేనని గుర్తు చేసింది. కృష్ణా బోర్డు నుంచి మెజర్మెంట్ బుక్స్ను తీసుకొని వాటిలో నీటి లెక్కలను రికార్డు చేసేలా సంబంధిత ప్రాజెక్టుల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కృష్ణాబోర్డు తాజాగా రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలకు లేఖ రాసింది. తొలిదశ కింద ఏర్పాటు చేసిన 18 టెలిమెట్రీ కేంద్రాలతోపాటు రెండో విడత కింద ఏర్పాటు చేయాల్సిన టెలిమెట్రీ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ, వాటికి రక్షణ కల్పించే బాధ్యత సంబంధిత రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం, 2014లోని సెక్షన్ 85(8)ఏ ప్రకారం.. ట్రిబ్యునళ్ల తీర్పులతోపాటు ఉమ్మడి ఏపీ–ఇతర రాష్ట్రాలు/కేంద్రం మధ్య జరిగిన ఒప్పందాల ఆధారంగా ప్రాజెక్టుల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరపడానికే తమ బాధ్యత పరిమితం అని గుర్తు చేసింది. ట్రిబ్యునళ్ల తీర్పులు, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే నియమాలకు లోబడి మాత్రమే ప్రాజెక్టులు (బరాజ్లు, డ్యామ్లు, రిజర్వాయర్లు, రెగ్యులేటర్లు), కాల్వల నెట్వర్క్, నీటిని తరలించే ఇతర ప్రవాహ మార్గాలపై కృష్ణాబోర్డు తన అధికార పరిధి కలిగి ఉంటుందని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 87(1) పేర్కొంటోందని ప్రస్తావించింది. కృష్ణా ట్రిబ్యునల్–1 సమర్పించిన తదుపరి నివేదిక ఆధారంగా 1976 మే 31న కేంద్ర వ్యవసాయ, నీటిపారుదలశాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లోని క్లాజ్–12కి జత చేసిన అనుబంధం బీ(1)లో ఉన్న నిబంధనలతోపాటు కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని క్లాజ్–13లో ఉన్న నిబంధనల ప్రకారం నీటి వినియోగం లెక్కింపు, వాటి ఖాతాల రూపకల్పన బాధ్యత రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని నిబంధనల ప్రకారం రాష్ట్రాలు నీటి లెక్కలను సమర్పిస్తే వాటి ఆధారంగా.. రాష్ట్ర పునర్విభజన చట్టం, 2014లోని నిబంధనల మేరకు నీటి వినియోగాన్ని క్రమబద్ధీకరించడమే తమ బాధ్యత అని తేల్చి చెప్పింది. ఇరు రాష్ట్రాలు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించాలని ఆదేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై సుప్రీంకోర్టులో కేసు ఉండడంతో దాని అమలు సాధ్యం కాలేదని తెలిపింది. సంబంధిత రాష్ట్రాలు తమ పరిధిలోని మొత్తం 31 గేజ్ స్టేషన్ల నుంచి సేకరించిన వివరాలను పంపిస్తే, వాటి ఆధారంగా తాము నీటి లెక్కలను సిద్ధం చేసి త్రిసభ్య కమిటీ ద్వారా నీటి పంపిణీ జరుపుతున్నామని తెలియజేసింది. -
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
భువనగిరి, వలిగొండ: భర్తతో గొడవల కారణంగా ఇద్దరు కన్నబిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల మహేశ్కు వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన ఎరుపుల యాదయ్య, పద్మ దంపతుల కుమార్తె ఐశ్వర్య (28)తో 2020లో వివాహం జరిగింది. మహేశ్ రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయిన ఏడాది తర్వాత వారికి కుమార్తె ఝాన్సీ (2) జన్మించింది. ఆ తర్వాత మహేశ్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఐశ్వర్య అతన్ని నిలదీసేది. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అదనపు కట్నం తేవాలని ఐశ్వర్యను మహేశ్ వేధిస్తుండడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు భర్తతో గొడవల వల్ల పుట్టింటికి వెళ్లి అక్కడే కుమారుడి (10 నెలలు)కి జన్మనిచ్చింది. అప్పట్నుంచి అక్కడే భార్య ఉంటుండగా మహేశ్ తన కుమారుడిని చూసేందుకు ఒక్కసారీ రాలేదు. పుట్టింట్లో శుభకార్యం ఉండటంతో ఇప్పుడైనా రావాలని భర్తను భార్య కోరగా తొలుత ఆమెనే అత్తారింటికి రావాలన్నాడు. దీంతో సోమవారం సాయంత్రం ఐశ్వర్య తన పిల్లలతో కలిసి అత్తారింటికి చేరుకుంది. రాత్రికి మహేశ్ విధులకు వెళ్లగా ఐశ్వర్య తన పిల్లలతో ఓ గదిలో నిద్రించింది. మంగళవారం ఉదయం ఎంతకీ ఐశ్వర్య నిద్ర లేవకపోవడంతో అత్తమామలు గది తలుపులు తెరిచి చూడగా ఇద్దరు పిల్లలు మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. ఐశ్వర్య ఫ్యాన్కు ఉరేసుకుంది. అయితే గొల్లగూడెం చేరుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు భర్తే ఐశ్వర్యను, పిల్లలను హతమార్చాడని ఆరోపించారు. భువనగిరి డీఎస్పీ రవీందర్ ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. మృతురాలి గదిలో మూడు పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకు భర్త, అత్తమామలు, ఆడపడుచులే కారణమని.. వారిని జైలుకు పంపాలని లేఖలో ఐశ్వర్య రాసింది. తన వెంట తెచ్చిన పిల్లలను తన వెంటే మృత్యుఒడికి తీసుకెళ్తన్నట్లు లేఖలో పేర్కొంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
సరికొత్తగా డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల మార్పుపై ఉన్నత విద్యామండలి కసరత్తు ముమ్మరం చేసింది. ఏడాదిగా కొత్త సిలబస్పై మేధోమథనం చేసిన మండలి.. మార్పుల అవసరం, సరికొత్త విధానాలతో ప్రయోజనాలు, జాబ్ మార్కెట్లోకి డిగ్రీ కోర్సులను తీసుకెళ్లడంపై సమగ్ర నివేదిక రూపొందించగా దీనికి సీఎం నుంచి ఆమోదం లభించింది. దీంతో 2026–27 విద్యాసంవత్సరం నుంచి ఈ మార్పులను అమల్లోకి తేవాలని విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి భావిస్తున్నారు. ఇటీవల విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో ఆయన సమావేశమయ్యారు. వేగవంతమైన కార్యాచరణ అమలు చేయాలని వీసీలను ఆదేశించారు. డిగ్రీ కాలేజీలు, కోర్సుల అకడమిక్ ఆడిట్ను చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థులు ఇష్టపడని కోర్సులను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా కొత్త సిలబస్లో భాగం చేయనున్నారు. ఆంగ్ల భాషలోనూ సమూల మార్పులకు వ్యూహరచన సిద్ధమైందని మండలి వర్గాలు తెలిపాయి. ప్రతి కోర్సుకూ పారిశ్రామిక భాగస్వామ్యంతో నైపుణ్యం పెంపొందించేలా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేసవి సెలవుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధ్యాపకులకు అవగాహన క్లాసులు నిర్వహించే యోచనలో విద్యామండలి ఉంది. డిగ్రీలో ఆధునిక సిలబస్ బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీల వైపు విద్యార్థులు మొగ్గుచూపడం లేదు. ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులే కోరుకుంటున్నారు. తక్షణ ఉపాధికి ఇదే మార్గమని భావిస్తున్నారు. అయితే ఇంజనీరింగ్ కోర్సుల్లో నైపుణ్యం కొరత కనిపిస్తోంది. కృత్రిమ మేధ ప్రభావం, బిగ్ డేటాకు కనెక్ట్ అయ్యే కంప్యూటర్ భాష, కోడింగ్లో విద్యార్థులు వెనుకబడుతున్నారు. గతంలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న వారిని నియమించుకొని ఆపై వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో కొనసాగించేవి. ప్రస్తుతం నైపుణ్యం ఉన్నవారినే ఆహ్వానిస్తున్నాయి. అందులో డిగ్రీ కోర్సుల నేపథ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయని నౌకరీ డాట్కామ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో డిగ్రీ కోర్సుల్లో ఏఐ ప్రాధాన్యతను పెంచేలా సిలబస్లో మార్పులు తేవాలని బాలకిష్టారెడ్డి సూచించారు. 20 శాతం సాంకేతిక పరిజ్ఞానంపై సిలబస్ ఉండేలా మార్పులు చేయనున్నారు. టెక్నాలజీ కోర్సులను ఆన్లైన్, ఆఫ్లైన్లో చేసేందుకు అవకాశం కల్పించడం మార్పుల్లో ముఖ్యమైనదిగా అధికారులు చెబుతున్నారు. వాటికి కొన్ని క్రెడిట్స్ కూడా ఇవ్వనున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కూడా ఇటీవల ఈ తరహా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏఐ సంబంధిత అప్లికేషన్స్తో కూడిన కోర్సులను స్వదేశీ, విదేశీ యూనివర్సిటీల ద్వారా చేసే అవకాశం కల్పించనున్నారు. ఆన్లైన్లో చేసే ఈ కోర్సులకూ క్రెడిట్స్ ఇవ్వనున్నారు. అయితే కోర్సుల ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. మారిన కోర్సులకే మెజారిటీ కోవిడ్ తర్వాత కామర్స్ కోర్సుల్లో గుణాత్మక మార్పులు చో టుచేసుకున్నాయి. ఈ–వాణిజ్యం పెరగడం, ఆన్లైన్ విధానంలో ఆడిటింగ్ చేపట్టడంతో కామర్స్ గ్రాడ్యుయేట్లకు డి మాండ్ పెరిగింది. ఇందులోనూ టెక్నాలజీతో కూడిన నైపు ణ్య మెళకువలు ఉన్నవారికే ప్రాధాన్యం లభిస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా కాలేజీలు కామర్స్ కోర్సుల్లో టెక్నాలజీని తప్పనిసరి చేశాయి. ఈ కారణంగా రాష్ట్రంలో అత్యధికంగా 37 శా తం విద్యార్థులు కామర్స్లో చేరుతున్నారు. తర్వాత స్థానంలో బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ లైఫ్సైన్స్ కోర్సులున్నాయి. వాటి కీ జాబ్ మార్కెట్ ఉండటం, ఏఐ టెక్నాలజీ సంబంధిత చా ప్టర్లు జోడించడమే ఈ మార్పులకు కారణంగా కనిపిస్తోంది. డిగ్రీ స్వరూపం మారుస్తాం సిలబస్ మార్పునకు తుది మెరుగులూ పూర్తయ్యాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యమే కేంద్రంగా డిగ్రీ కోర్సులు తేవాలన్నది మండలి ఆలోచన. ఈ క్రమంలో అన్ని రంగాల నిపుణుల సలహాలు తీసుకున్నాం. సిలబస్ మార్పుపై సబ్జెక్టు నిపుణుల ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చాం. అంతిమంగా డిగ్రీ స్వరూపం మారబోతోంది. –ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
ముఖ గుర్తింపు మస్ట్!
సాక్షి, హైదరాబాద్: ప్రతి ప్రభుత్వ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేందుకు వీలుగా ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) సాంకేతికతను వినియోగంలోకి తీసుకుని రావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. అర్హులకు కచ్చితంగా లబ్ధి జరగాలని, అదే సమయంలో అనర్హులు లబ్ధి పొందకూడదని తేల్చి చెప్పారు. ఆసరా పెన్షన్ల పథకం అమలులో ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను అమల్లోకి తెచ్చి 3 లక్షల మంది అనర్హుల పేర్లు తొలగించామని వెల్లడించారు. సాంకేతికతను సరిగ్గా వినియోగించుకోక పోవడం వల్లే ఇంత పెద్ద సంఖ్యలో అనుచిత లబ్ధి పొందారని చెప్పారు. కలెక్టర్లు ప్రతి నెలా కనీసం 10 రోజులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. ఇసుక అక్రమ మైనింగ్ జరిగినట్లు తెలిస్తే వెంటనే ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక పేరుతో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించతలపెట్టిన 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసులు పెట్టి బియ్యం రికవరీ చేయండి ‘ప్రభుత్వం సేకరించిన రూ.3,900 కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల దగ్గరే ఉంది. వాటిని రికవరీ చేసేందుకు అవసరమైతే కేసులు పెట్టాలి. కొన్ని జిల్లాల్లో ఇసుక మాఫియా అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఎక్కడ ఇసుక మాఫియా ఉన్నా, అక్రమ మైనింగ్ జరిగినట్లు తెలిసినా వెంటనే ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని సస్పెండ్ చేస్తాం. అవకతవకలకు తావు లేకుండా రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలి. పనితీరు ఆధారంగా అవార్డులు రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, మామునూర్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులతో పాటు ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలి. తెలంగాణ రైజింగ్ విజన్ అమలులో జిల్లా కలెక్టర్లు నూటికి నూరు శాతం భాగస్వాములు కావాలి. ఈ ప్రభుత్వం మిమ్మల్ని నిశితంగా గమనిస్తుంది. మీరు మంచి పని చేస్తే మిమ్మల్ని అభినందిస్తుంది. వార్షిక పనితీరు నివేదిక ఆధారంగా అవార్డులు, రివార్డులుంటాయి. జూన్లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం.. ’ అని సీఎం చెప్పారు. ఈ మూడు నెలలే కొలమానం ‘99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అత్యంత బాధ్యతతో, ఫలితాలపై దృష్టి సారించి అమలు చేయాలి. ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానం. మీ సర్వీస్ కెరీర్కు ఇవే పునాదిగా నిలుస్తాయి. అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉంది. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని కలెక్టర్లపై చర్యలు తీసుకుంటాం. సమర్ధవంతంగా పని చేస్తేనే కొనసాగింపు కలెక్టర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు సీఎస్ నివేదిక ఇవ్వాలి. (నెలలో 5 రోజుల కంటే తక్కువగా పర్యటించిన కొందరు కలెక్టర్ల పనితీరుపై ఈ సందర్భంగా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు) క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు. సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో, వారి భాగస్వామ్యంతో 99 రోజుల ప్రణాళిక అమలు చేయాలి. కొత్తగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారి నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ‘జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి. ముందుగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలన్నీ వేడుకలా జరగాలి. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామ సభలు నిర్వహించి వివిధ సంక్షేమ పథకాల అమలు ద్వారా ఆ ప్రాంతంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు.. వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వివరాలను ప్రజలకు తెలియజేయాలి. గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలు మహాలక్ష్మి, గృహజ్యోతి రూ.500 సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలన్నీ గ్రామాల వారీగా సిద్ధం చేయాలి. ఆ వివరాలను కలెక్టర్లు నివేదించాలి. ప్రతి గ్రామంలో పునరుత్పాదక విద్యుత్తుపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అన్ని పాఠశాలలు, విద్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలి..’ రేవంత్ సూచించారు. ప్రతిరోజు మధ్యాహ్న భోజనం పర్యవేక్షించాలి.. యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై అవగాహన కల్పించాలి. జాబ్ మేళాలు నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకూడదు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదు. డీఈవోలతో పాటు అక్కడి కలెక్టర్లపై చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో ప్రతిరోజు ఒక్కో అధికారి మధ్యాహ్న భోజనం పర్యవేక్షించాలి. పిల్లలతో పాటు భోజనం చేసే బాధ్యతలు వారికి అప్పగించాలి. జిల్లా కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి..’ అని సీఎం ఆదేశించారు. జూన్ 12నే పుస్తకాలు, యూనిఫామ్లు ‘వచ్చే విద్యా సంవత్సరంలో 100 నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసిన మండలాల్లో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ప్రారంభిస్తాం. ఆయా స్కూళ్లలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతో పాటు స్కూలు బస్సు సౌకర్యం, పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తాం. ఏ నియోజకవర్గంలో ఏ స్కూల్ను ఎంపిక చేయాలనే దానితో పాటు అక్కడున్న మౌలిక వసతులపై కలెక్టర్లు నివేదిక ఇవ్వాలి. వచ్చే విద్యా సంవత్సరం తొలిరోజు జూన్ 12నే రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందించాలి..’ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం సహించం.. ‘ప్రభుత్వ ఆసుపత్రులను తరచుగా సందర్శించాలి. సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం ఏటా రూ.2,500 కోట్లు ఖర్చు పెడుతోంది. అంత ఖర్చుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అద్భుతమైన సేవలను అందించే వీలుంటుంది. 35 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆస్పత్రులతో అనుసంధానం చేస్తాం. సర్జరీలు చేసే డాక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తాం. ఆస్పత్రుల్లో పరిపాలన, వైద్య సేవలను విభజిస్తాం..’ అని రేవంత్ చెప్పారు. 25 వేల బోగస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. ‘బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులుంటే, అందులో దాదాపు 25 వేల మంది కనీసం ఆధార్ కార్డు లేకుండా ఇంతకాలం జీతాలు తీసుకున్నట్లు గుర్తించాం. పదేళ్లుగా ప్రభుత్వాన్ని మోసం చేసి వీరి పేరిట జీతాలు పొందిన ఏజెన్సీలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తాం. వాటిపై ఆర్థిక శాఖ కేసులు నమోదు చేయాలి..’ అని సీఎం ఆదేశించారు. కలెక్టర్లకు సీఎం జారీ చేసిన ఇతర ఆదేశాలు ⇒ పాఠశాలలు బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి. ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలి. ⇒ రహదారులపై గుంతలు, ప్రమాదం జరిగే స్థలాల వివరాలను ప్రజల నుంచి వాట్సాప్ నంబర్ ద్వారా సేకరించి మరమ్మతులు చేపట్టాలి. ⇒ ఓఆర్ఆర్, ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల వెంట చెత్త, ఇతర నిర్మాణ వ్యర్ధాలు డంప్ చేసేందుకు వచ్చే వాహనాలపై జరిమానాలు విధించాలి. కేసులు పెట్టాలి. ఓఆర్ఆర్ ఏజెన్సీ బాధ్యత తీసుకోవాలి. ⇒ నగరాలు, పట్టణాల్లోని వర్కింగ్ ఉమెన్స్, బాయ్స్, గరల్స్ హాస్టళ్ల వివరాలు నమోదు చేయాలి. వాటిపై పర్యవేక్షణ ఉండాలి. యాజమాన్యాలు జవాబుదారీతనంతో ఉండాలి. ⇒ పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, డ్రగ్స్, ఈ–సిగరెట్ల వినియోగం జరిగితే అందుకు ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు బాధ్యత వహించాలి. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల, కళాశాలలో సైకాలజిస్ట్ ఉండేలా చూడాలి. ⇒ భూసార పరీక్షలు, పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రయోజనాలను రైతులకు వివరించాలి. ్చ -
ఆ ఆరోపణల్లో నిజం లేదు!.. HCAకు వ్యతిరేకంగా ధర్నా
తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు అమర్నాథ్ కొట్టిపారేశారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి చెక్కు లపై సంతకాలు పెట్టలేదని స్పష్టం చేశారు. కాగా HCA నుంచి విశాఖ కంపెనీకి రూ. 69 కోట్లు చెల్లింపులు జరిగాయన్న అంశం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం జింఖానా గ్రౌండ్స్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అమర్నాథ్.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని పేర్కొన్నారు. ‘‘69 కోట్ల రూపాయలు HCA నుంచి విశాఖ కంపెనీ కి చెల్లింపుల వెనుక నా ప్రమేయం లేదు. నేను ఛార్జ్ తీసుకోక ముందే ప్రాసెస్ జరిగింది. డబ్బులు చెల్లించాలి అని కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి’’ అని అమర్నాథ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఒకవైపు HCA ప్రెస్ మీట్ జరుగుతుండగానే క్రికెట్ సంఘాలు మెరుపు ధర్నాకు దిగాయి. HCAలో 70 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని.. నిధులు తప్పుదోవ పట్టించారని ఆందోళన చేపట్టాయి.మంత్రి వివేక్కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ కి 70 కోట్ల రూపాయలు అక్రమంగా చెల్లించారని ఆరోపణలు చేశాయి. మంత్రి ఆదేశాల మేరకు HCA లో ఉన్న పెద్దలు 70 కోట్లు విడుదల చేశారని క్రికెట్ సంఘాల ఆరోపించాయి. ఈ ఆరోపణను కొట్టి పారేస్తూ.. HCA ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగానే క్రికెట్ సంఘాలు మళ్లీ ఆందోళనకు దిగడం గమనార్హం. దీంతో జింఖానా గ్రౌండ్ లో గందరగోళం నెలకొంది. -
పలు జిల్లా కలెక్టర్లపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణకు చెందిన పలువురు జిల్లా కలెక్టర్లు హెడ్ క్వార్టర్స్లో ఉండటం లేదంటూ సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు(మంగళవారం, మార్చి 3వ తేదీ) జరిగిన కలెక్టర్ల సదస్సులో పలువురు జిల్లా కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు హెడ్ క్వార్టర్స్ లేకుండా హైదరాబాద్కు వస్తున్నారని, ఇది సరైన చర్య కాదన్నారు సీఎం రేవంత్. సీఎస్ అనుమతి లేకుండా రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు హైదరాబాద్కు రావడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 99 రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లొద్దని వారికి ఆదేశించారు సీఎం రేవంత్. వారందరినీ భాగస్వామ్యులను చేయాలి.. 99 రోజుల కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వాములను చేయాలన్నారు సీఎం రేవంత్. వార్డు సభ్యులు, సర్పంచులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు అందరికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, వారి విధులు, బాధ్యతలకు సంబంధించి అవగాహన కల్పించడంతో పాటు ప్రింటెడ్ మెటీరియల్ వారికి అందించాలని సూచించారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలివ్యవసాయ పంప్ సెట్లకు బదులు సోలార్ పంప్ సెట్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి.. సోలార్ మోటార్లతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలి.ఇళ్లపైన సోలార్ ప్లాంట్లు అమర్చుకోవడం.. సోలార్ విద్యుత్ వాడుకోవటం తో పాటు గ్రిడ్ కు కనెక్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై అన్ని గ్రామాల్లో విద్యుత్ శాఖ అవగాహన కల్పించాలి...గ్రామ, వార్డు సభల్లో నూతనంగా ఇచ్చిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200లోపు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలి.వాటితో గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయి కలిగిన లబ్ధిని ప్రజలకు వెల్లడించాలి..రవాణా శాఖ డాటా ఆన్లైన్ పూర్తి చేయాలిపాఠశాలలు బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి.ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు, ఇతర సరకు రవాణా వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలి.ఎక్కువ సంఖ్యలో డ్రైవర్లు కలుసుకునే చోట్లనే ఈ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి పరీక్షలు నిర్వహించాలి..రహదారులపై భారీ స్థాయిలో గుంతలు, ప్రమాదం జరిగే స్థలాల వివరాలు తెలుసుకునేందుకు వాట్సాప్ నెంబర్ ను రవాణా శాఖ ఇవ్వాలి.ఆ నంబర్కు వచ్చే సమాచారం ఆధారంగా అక్కడ మరమ్మతులు చేపట్టడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి.ఓఆర్ఆర్, ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల వెంట భారీగా చెత్త, ఇతర నిర్మాణ వ్యర్ధాలు డంప్ చేస్తున్నారు.వ్యర్ధాలను తీసుకువచ్చే వాహనాలను పట్టుకొని జరిమానాలు విధించాలి. కేసులు పెట్టాలి.ఓ ఆర్ ఆర్ ఏజెన్సీని బాధ్యులను చేయాలి . -
సొంతూరులో సత్యనారాయణ స్వామి వ్రతం.. విజయ్, రష్మిక స్పెషల్ (ఫోటోలు)
-
ఈ కారు ఎవరిదో?
నంద్యాల జిల్లా: మండల పరిధిలోని కౌలూరు సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పెట్రోల్ బంకులో ఆరు రోజులుగా ఉన్న కారు స్థానికంగా కలకలం రేపుతోంది. గత నెల 25వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తెలంగాణ రిజిస్ట్రేషన్ ( టీఎస్ 11 ఈఎఫ్ 0956) కలిగిన హ్యుందాయ్ కారును బంకు ఆవరణలో పార్క్ చేసి వెళ్లారు. వారం గడుస్తున్నా కారును తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో అనుమానం వచ్చిన బంకు యజమాని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పరిశీలించారు. వాహన వివరాల ఆధారంగా యజమాని ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


