పూటకో బదిలీతో దెబ్బతింటున్న పాలన | Harish Rao criticizes transfers of officers in the Legislative Assembly | Sakshi
Sakshi News home page

పూటకో బదిలీతో దెబ్బతింటున్న పాలన

Mar 5 2026 1:05 AM | Updated on Mar 5 2026 1:05 AM

Harish Rao criticizes transfers of officers in the Legislative Assembly

రెండేళ్లలో 140 మంది ఐఏఎస్‌ అధికారులకు స్థానచలనం  

జిల్లా కలెక్టర్ల భేటీలో సీఎం బెదిరింపులు సరికాదు: హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను పూటకోమారు బదిలీ చేయడంతో పాలన దెబ్బతింటోందని శాసనసభలో బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ హరీశ్‌రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతకాని పాలనకు ఉన్నతాధికారుల బదిలీలు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణభవన్‌లో బుధవారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. 

ఇప్పటివరకు ఐదుసార్లు జరిగిన బదిలీలతో విభాగాధిపతులు సగటున ఎనిమిది నెలలు కూడా తమకు అప్పగించిన స్థానాల్లో పనిచేయడం లేదన్నారు. విద్యుత్‌ శాఖలో రెండేళ్లలో ఐదుగురు ప్రత్యేక కార్యదర్శులు మారిన విషయాన్ని ప్రస్తావిస్తూ బదిలీలతో విద్యుత్‌ శాఖ అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. 

రాష్ట్రానికి గుండెకాయ లాంటి గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌తోపాటు సింగరేణి, పౌర సంబంధాలు, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్‌ తదితర విభాగాల్లో నలుగురు చొప్పున ఉన్నతాధికారులు మారిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఐదు విడతల్లో 140 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ కాగా, 20 జిల్లాల కలెక్టర్లు మారారన్నారు. రంగారెడ్డి జిల్లాలో రెండేళ్లలో నలుగురు కలెక్టర్లు మారారని చెప్పారు. 

తరచూ బదిలీలపై రాష్ట్రానికి నష్టం 
విభాగాధిపతులుగా ఉండే సీనియర్‌ ఐఏఎస్‌లతోపాటు జిల్లా కలెక్టర్లను తరచూ మార్చడంతో రాష్ట్రానికి నష్టం జరుగుతోందని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నచ్చని అధికారులను బదిలీలు చేస్తూ, తమకు వ్యక్తిగతంగా అనుకూలంగా పనిచేసే వారికే సీఎం, మంత్రులు పోస్టింగు­లు ఇస్తున్నారని చెప్పారు. యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఐదు శాతం ఎక్సెస్‌కు టెండర్లు కట్టబెట్టడంలో జరు­గుతున్న అక్రమాలను త్వరలో బయటపెడతానని ప్రకటించారు. 

ఇంజనీరింగ్‌ శాఖలో రిటైర్డ్‌ అధికారులు కీలక ప­ద­వుల్లో ఉండటం వల్ల ఎక్కువ అవినీతి జరుగుతోందని హరీశ్‌రావు ఆరోపించారు. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్‌ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సరికాదన్నారు. సీఎం అక్రమాలకు సహకరించని అధికారులను బదిలీ చేస్తున్నారని, సీఎం తప్పుల్లో భాగస్వాములు అయ్యేందుకు అనేక మంది అధికారులు ముందుకు రావడం లేదని తెలిపారు. 

లగచర్ల ఆందోళనల సందర్భంగా అనేక హామీల ఎగవేతకు వికారాబాద్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ను బదిలీ చేశారని తెలిపారు. పార్టీ విప్‌ ఉల్లంఘించి ఓటేసిన కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయడంలో చూపిన దూకుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు లోపించిందన్నారు. 

అక్రమ మైనింగ్‌ పరిశీలనకు బీఆర్‌ఎస్‌ బృందం 
హైదరాబాద్‌ శివారులోని నియోపోలిస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మేనల్లుడు అక్రమ మైనింగ్‌ చేస్తున్నాడని, కోట్లాది రూపాయల లీజు, రాయల్టీ ఎగవేతకు పాల్పడ్డారని హరీశ్‌రావు ఆరోపించారు. నిబంధనల ఉల్లంఘనలపై బీఆర్‌ఎస్‌ ప్రతినిధి బృందం గురువారం అక్రమ మైనింగ్‌ జరిగే ప్రాంతంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన క్రషర్లను పరిశీలిస్తుందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై ప్రస్తుతానికి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హరీశ్‌రావు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement