ఇస్లామాబాద్: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగిస్తున్న వేళ దాయాది దేశం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ మిత్ర దేశం ఇరాన్పై అమెరికా దాడులు చేయడాన్ని పరోక్షంగా వ్యతిరేకిస్తూ.. ఇజ్రాయెల్ పట్ల తమకున్న భయాన్ని వెళ్లగక్కారు. ఇదే సమయంలో భారత్ను టార్గెట్ చేసి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చివరగా.. పాక్ను సామంత దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర చేస్తోందంటూ బాంబు పేల్చారు.
ఇరాన్పై దాడుల జరుగుతున్న నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా స్పందించారు. ఈ సందర్బంగా ఆసిఫ్ మాట్లాడుతూ.. ‘అణు ఒప్పందంపై ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ అమెరికా-ఇజ్రాయెల్ టెహ్రాన్పై యుద్ధం చేయడానికే సిద్దమయ్యాయి. వ్యూహత్మకంగా దాడులు చేసి సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హత మార్చారు. ఇదంతా ఇజ్రాయెల్ ప్లాన్లో భాగంగానే జరిగింది. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇస్లామిక్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే అన్ని సంఘర్షణలలో జియోనిజం (యూదు భావజాలం) ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర పోషించింది. ప్రతీ యుద్ధం, ప్రతీ ఘర్షణలో ఇజ్రాయెల్ భాగంగానే ఉంటోంది. దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను జియోనిస్టులే నిర్ధేశిస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెతన్యాహు, మోదీ స్నేహంపై..
ఇదే సమయంలో భారత్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న బంధంపై సరికొత్త కుట్రకు తెరలేపారు. ఇజ్రాయెల్ను టార్గెట్ చేసి.. ఇరాన్పై యుద్ధం వల్ల పాకిస్థాన్ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తే భారత్, ఆప్ఘనిస్తాన్ ఏకమై.. పాక్ను టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. తమ సరిహద్దుల వద్ద ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆరోపించారు. అన్ని వైపుల నుంచి శత్రువులు తమను చుట్టుముట్టడం వల్ల పాక్ సామంత దేశంగా మారే ప్రమాదం ఉందన్నారు. పాక్ను సామంత దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నుతోందని.. ఈ కుట్రలో భారత్ భాగస్వామిగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్తో పాక్ సరిహద్దు ఇలా..
ఇదిలా ఉండగా.. పాకిస్తాన్–ఇరాన్ మధ్య సరిహద్దు మొత్తం పొడవు 909 కిలోమీటర్లు (565 మైళ్లు) ఉంటుంది. ఈ సరిహద్దు ఇరాన్లోని సిస్తాన్ అండ్ బలూచిస్తాన్ ప్రావిన్స్, పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్తో కలుస్తుంది. ఇది ఉత్తరాన ఆఫ్ఘానిస్తాన్ త్రైజంక్షన్ వద్ద ప్రారంభమై, దక్షిణాన గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వరకు కొనసాగుతుంది. సరిహద్దు భూభాగం ఎక్కువగా ఎడారి, పర్వత ప్రాంతాలతో నిండి ఉంటుంది. అందువల్ల రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి కష్టతరంగా మారింది. దక్షిణ చివర గల్ఫ్ ఆఫ్ ఒమాన్.. ఇది సముద్ర వాణిజ్యానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనది.
ఇరాన్–పాకిస్తాన్ మధ్య గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టులు, ఇంధన వాణిజ్యం ముఖ్యమైనవిగా ఉన్నాయి. అధికారిక వాణిజ్యంతో పాటు అనధికారిక స్మగ్లింగ్ కూడా విస్తృతంగా జరుగుతుంది. ఇరాన్–పాకిస్తాన్ సంబంధాలు సరిహద్దు భద్రత, వాణిజ్యం, మరియు ప్రాంతీయ రాజకీయాలపై ఆధారపడి ఉంటాయి. మొత్తంగా, ఈ సరిహద్దు ప్రాంతం రెండు దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధంను బలపరుస్తూ, వాణిజ్య మార్గంగా పనిచేస్తూ, అదే సమయంలో భద్రతా సవాళ్లును కూడా సృష్టిస్తోంది.


