మంటల్లో దౌత్య కార్యాలయాలు.. నిన్న రియాద్‌.. నేడు దుబాయ్‌.. | US Consulate in Dubai Attacked by Drone | Sakshi
Sakshi News home page

మంటల్లో దౌత్య కార్యాలయాలు.. నిన్న రియాద్‌.. నేడు దుబాయ్‌..

Mar 4 2026 7:29 AM | Updated on Mar 4 2026 8:33 AM

US Consulate in Dubai Attacked by Drone

దుబాయ్: మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై ప్రారంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి ప్రతిచర్యగా ఇరాన్ తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. తాజాగా దుబాయ్ నగరంలోని అమెరికా కాన్సులేట్‌పై డ్రోన్ దాడి జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ దాడిలో కాన్సులేట్ భవనంలో భారీగా మంటలు చెలరేగగా, దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. అంతకుముందు రోజు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై కూడా డ్రోన్లు విరుచుకుపడ్డాయి. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ దాడులు అమెరికా దౌత్య కార్యాలయాలు మనుగడకు ముప్పు కలిగిస్తున్నాయి.

దుబాయ్ కాన్సులేట్‌ ఘటన గురించి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ అక్కడి  సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని, డ్రోన్ ప్రధాన భవనం పక్కనే ఉన్న పార్కింగ్ స్థలాన్ని తాకిందని  తెలిపారు. ఇరాన్ అణ్వాయుధ ఆశయాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ప్రకటించిన విషయం విదితమే. ఇరాన్ పాలన అమెరికాకు, ప్రపంచ దేశాలకు ముప్పుగా మారిందని, వారి క్షిపణి వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.

ఈ క్రమంలో జరిగిన దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ  మృతిచెందారు. గత నాలుగు రోజులుగా సాగుతున్న ఈ భీకర పోరులో ఇరువైపులా  సుమారు 800 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు ఇరాన్ పౌరులేనని, అక్కడ మరణాల సంఖ్య 787కు చేరిందని రెడ్ క్రెసెంట్ సంస్థ వెల్లడించింది. ఇరాన్ వ్యాప్తంగా 153 కౌంటీలలో సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, బాంబు దాడుల తీవ్రత కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ క్షిపణి దాడులకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో  మిడిల్‌ ఈస్ట్‌లోని 14 దేశాలలో ఉన్న అమెరికా పౌరులను వెంటనే ఆయా దేశాలను విడిచి వెళ్లిపోవాలని స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే దుబాయ్ తదితర నగరాల్లో విమాన సర్వీసులు నిలిచిపోవడం, గగనతలం మూసివేయడంతో వేలాది మంది అమెరికన్లు స్వదేశానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement