డ్రోన్ల దాడి.. రియాద్‌లో తీవ్ర ఉద్రిక్తతలు | 2 Drones Attack US Embassy In Riyadh Flames Seen Rising | Sakshi
Sakshi News home page

డ్రోన్ల దాడి.. రియాద్‌లో తీవ్ర ఉద్రిక్తతలు

Mar 3 2026 7:14 AM | Updated on Mar 3 2026 8:43 AM

2 Drones Attack US Embassy In Riyadh Flames Seen Rising

రియాద్: మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ సైనిక చర్యకు ప్రతిస్పందనగా ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున రెండు డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడి ధాటికి రాయబార కార్యాలయం పరిసరాల్లో భారీ శబ్దం వినిపించడమే కాకుండా, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది. సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, ఈ దాడుల వల్ల భవనానికి స్వల్ప నష్టం వాటిల్లిందని, మంటలు చెలరేగగా వెంటనే అదుపులోకి తెచ్చామని వెల్లడించింది. రియాద్‌లోని దౌత్య కార్యాలయాలు ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగింది.

ప్రాంతీయంగా నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా అమెరికా విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. రియాద్, జెడ్డా, ధహ్రాన్ నగరాల్లో ఉన్న తమ పౌరులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈ ప్రాంతంలోని సైనిక స్థావరాలకు చేసే అనవసర ప్రయాణాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా రాయబార కార్యాలయాలపై దాడుల పరంపర కేవలం సౌదీకే పరిమితం కాలేదు. సోమవారం కువైట్, జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లోని రాయబార కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. భద్రతా కారణాల దృష్ట్యా అమ్మాన్‌లోని ఎంబసీ సిబ్బందిని తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా కార్యాలయం వెలుపల కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా వందలాది మంది నిరసనకారులు గ్రీన్ జోన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, భద్రతా దళాలు బాష్పవాయువును ప్రయోగించాయి. ఈ ఘర్షణల్లో ఇరుపక్షాలకు గాయాలైనట్లు సమాచారం. గత శనివారం ఇరాన్‌లోని పలు నగరాలపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 555 మంది మరణించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని భూ, జల లక్ష్యాలపై వరుస దాడులకు దిగుతోంది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

మిడిల్‌ ఈస్ట్‌లో నెలకొన్న ఈ అస్థిరత దృష్ట్యా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. తమ పౌరుల భద్రతే అత్యున్నత ప్రాధాన్యమని పేర్కొంటూ, పశ్చిమ దేశాల పౌరులు తక్షణమే మిడిల్‌ ఈస్ట్‌ను వీడి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. బహ్రెయిన్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ సహా పలు దేశాలకు ఈ ప్రయాణ హెచ్చరికలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement