Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Sindhu to compete in Asian Team Badminton Championships1
ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు సింధు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు స్టార్‌ ఆటగాళ్లతో భారత్‌ సిద్ధమైంది. ఫిబ్రవరి 3 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) గురువారం ప్రకటించింది. రెండేళ్లకోసారి జరిగే ఈ పోటీల్లో మహిళల విభాగంలో భారత జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌కాగా... పురుషుల విభాగంలో టీమిండియా రెండుసార్లు కాంస్య పతకాలు సాధించింది. ‘ర్యాంకింగ్, ప్రదర్శన, అనుభవం ఆధారంగా జట్లను ఎంపిక చేశాం. మహిళల జట్టును రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత సింధు ముందుండి నడిపిస్తుంది’ అని ‘బాయ్‌’ ఒక ప్రకటనలో తెలిపింది. పురుషుల జట్టులో భారత నంబర్‌వన్, ప్రపంచ 13వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌తోపాటు ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్, రైజింగ్‌ స్టార్స్‌ ఆయుశ్‌ శెట్టి, హైదరాబాద్‌ ప్లేయర్‌ తరుణ్‌ మన్నేపల్లి ఉన్నారు. భారత మహిళల బ్యాడ్మింటన్‌ జట్టు: పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, రక్షిత శ్రీ, మాళవిక బన్సోద్, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, ప్రియా కొంజెంగ్‌బమ్, శ్రుతి మిశ్రా, తనీషా క్రాస్టో. భారత పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు: లక్ష్య సేన్, ఆయుశ్‌ శెట్టి, కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, తరుణ్‌ మన్నేపల్లి, సాతి్వక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్, సాయిప్రతీక్, హరిహరన్‌.

Under 19 Asia Cup cricket tournament from today2
యువ భారత్‌కు ఎదురుందా!

దుబాయ్‌: యువ ఆటగాళ్ల ప్రతిభ ప్రపంచానికి తెలిసే మరో టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా నేటి నుంచి అండర్‌–19 ఆసియా కప్‌ వన్డే టోర్నమెంట్‌కు తెరలేవనుంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో నేడు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)తో యువ భారత జట్టు తలపడనుంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా జరగనున్న ఈ పోరులో ఆయుశ్‌ మాత్రే సారథ్యంలోని భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఐపీఎల్‌ సహా దేశవాళీ టోర్నీల్లో విధ్వంసక సెంచరీలతో ఇప్పటికే స్టార్‌గా ఎదిగిన 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో అండర్‌–19 ప్రపంచకప్‌ జరగనుండగా... దానికి ముందు ఈ టోర్నీ మన ప్లేయర్లకు రిహార్సల్‌గా ఉపయోగపడనుంది. అయితే సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్లేయర్లతో భారత ఆటగాళ్లు ‘హ్యాండ్‌ షేక్‌’ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పహల్గామ్‌ ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో... ఇటీవల జరిగిన పురుషుల సీనియర్‌ ఆసియాకప్, మహిళల వన్డే ప్రపంచకప్, రైజింగ్‌ స్టార్స్‌ ఆసియాకప్‌ టి20 టోర్నమెంట్‌లో భారత ప్లేయర్లు పాకిస్తాన్‌ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. ‘హ్యాండ్‌ షేక్‌పై ప్లేయర్లు ఏమీ చెప్పలేరు. టీమ్‌ మేనేజర్‌ ఆనంద్‌ దాతర్‌కు బోర్డు నుంచి స్పష్టమైన సూచనలు అందుతాయి. ఒకవేళ కరచాలనం చేయకూడదని భారత జట్టు నిర్ణయించుకుంటే ఆ విషయాన్ని మ్యాచ్‌ రిఫరీకి ముందే తెలుపుతాం’ అని ఓ అధికారి తెలిపారు. క్రీడల్లో రాజకీయాలకు తావులేదని తెలిసినా... బోర్డు నిర్ణయం మేరకే నడుచుకుంటామని ఆయన అన్నారు. భారత్‌ బరిలోకి దిగుతున్న గ్రూప్‌ ‘ఎ’లోనే దాయాది పాకిస్తాన్‌ కూడా ఉండగా... ఇరు జట్ల మధ్య ఆదివారం మ్యాచ్‌ జరగనుంది. ఈ రెండు జట్లతో పాటు యూఏఈ, మలేసియా జట్లు కూడా గ్రూప్‌ ‘ఎ’లో ఉన్నాయి. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక జట్లు గ్రూప్‌ ‘బి’ నుంచి పోటీ పడుతున్నాయి. భారత్‌ బలంగా... అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున, దేశవాళీల్లో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగే ఆయుశ్‌ మాత్రే యంగ్‌ ఇండియాకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టి20 టోర్నీలో వరుస సెంచరీలతో చెలరేగిన మాత్రేపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మొత్తం టోర్నమెంట్‌కు ప్రధాన ఆకర్షణ అయిన వైభవ్‌ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. సీనియర్‌ క్రికెట్‌లోనే తన దూకుడుతో ప్రకంపనలు సృష్టిస్తున్న వైభవ్‌... ముస్తాక్‌ అలీ టోర్నీలో శతకం బాదిన అతి పిన్నవయసు్కడిగా రికార్డు సృష్టించాడు. 15 మందితో కూడిన భారత జట్టులో ఈ ఇద్దరూ సీనియర్‌ స్థాయిలో వేర్వేరు ఫార్మాట్లలో కలిపి 30కి పైగా మ్యాచ్‌లు ఆడారు. వాటిలో 9 శతకాలు తమ పేరిట లిఖించుకున్నారు. ఈ నయా జనరేషన్‌ జోరును మిగిలిన జట్లు ఏమాత్రం అడ్డుకుంటాయో చూడాలి. వైస్‌ కెపె్టన్‌ విహాన్‌ మల్హోత్రా, వేదాంత్‌ త్రివేది, అభిజ్ఞ, హైదరాబాద్‌ ప్లేయర్‌ ఆరోన్‌ జార్జి కూడా బ్యాటింగ్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సమర్థులే. ముఖ్యంగా ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్‌కు మినహా... ఇతర జట్లకు 50 ఓవర్ల ఆటలో పెద్దగా అనుభవం లేదు. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌ గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన సెమీఫైనల్‌కు చేరడం దాదాపు ఖాయమే. భారత అండర్‌–19 జట్టు: ఆయుశ్‌ మాత్రే (కెపె్టన్‌), విహాన్‌ మల్హోత్రా (వైస్‌ కెప్టెన్‌), వైభవ్‌ సూర్యవంశీ, వేదాంత్‌ త్రివేది, అభిజ్ఞ కుండు, హర్‌వంశ్‌ సింగ్, యువరాజ్‌ గోహిల్, కనిష్క చౌహాన్, ఖిలాన్‌ పటేల్, నమన్‌ పుష్పక్, దీపేశ్, హెనిల్‌ పటేల్, కిషన్‌ కుమార్‌ సింగ్, ఉధవ్‌ మోహన్, ఆరోన్‌ జార్జి.

Olympic berth for Pro Hockey League winners3
ప్రొ హాకీ లీగ్‌ విజేతలకు ఒలింపిక్‌ బెర్త్‌

న్యూఢిల్లీ: 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే హాకీ జట్లను ఎంపిక చేసే ప్రక్రియను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) గురువారం వెల్లడించింది. విశ్వక్రీడల్లో పురుషుల, మహిళల విభాగాల్లో 12 జట్ల చొప్పున పోటీ పడనుండగా... ఆతిథ్య జట్టు హోదాలో అమెరికా నేరుగా పాల్గొననుంది. ఇక మిగిలిన 11 జట్లను ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్, ఐదు కాంటినెంటల్‌ చాంపియన్‌షిప్‌ల ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ‘ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ 2025–26, 2026–27 సీజన్‌లలో విజేతగా నిలిచిన జట్లు విశ్వక్రీడలకు ఎంపికవుతాయి. ఒకవేళ రెండు సీజన్‌లలో ఒకే జట్టు విజేతగా నిలిస్తే... రెండో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది. కాంటినెంటల్‌ చాంపియన్‌షిప్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లు కూడా విశ్వక్రీడలకు అర్హత పొందుతాయి. ఒకవేళ కాంటినెంటల్‌ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు అప్పటికే ప్రొ లీగ్‌ ప్రదర్శన ఆధారంగా ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకుంటే... తదుపరి స్థానంలో ఉన్న జట్టుకు ఆ అవకాశం దక్కుతుంది’ అని ఎఫ్‌ఐహెచ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 2028 ఆరంభంలో ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లను సైతం నిర్వహించనున్నారు. ఇందులో పురుషుల, మహిళల విభాగాల్లో 16 జట్ల చొప్పున పాల్గొననున్నాయి. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు కూడా ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకుంటాయి.

Indian Womens Football League to start from 20th of this month4
గెట్‌.. సెట్‌... కిక్‌

న్యూఢిల్లీ: పురుషుల జట్లకు నిర్వహించే ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీపై ఒకవైపు సందిగ్ధత కొనసాగుతున్నా... మరోవైపు ఇండియన్‌ ఉమెన్స్‌ లీగ్‌ (ఐడబ్ల్యూఎల్‌) 2025–2026 సీజన్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ తేదీలను అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ప్రకటించింది. కోల్‌కతాలోని నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ఈనెల 20న ఈ లీగ్‌ మొదలవుతుంది. వచ్చే ఏడాది మే 10వ తేదీ వరకు జరిగే ఈ లీగ్‌లో 8 జట్లు పోటీపడుతున్నాయి. ఈస్ట్‌ బెంగాల్‌ ఎఫ్‌సీ (కోల్‌కతా), గర్వాల్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీ (న్యూఢిల్లీ), గోకులం కేరళ ఎఫ్‌సీ (కోజికోడ్‌), కిక్‌స్టార్ట్‌ ఎఫ్‌సీ (బెంగళూరు), నీతా ఫుట్‌బాల్‌ అకాడమీ (కటక్‌), సెసా ఫుట్‌బాల్‌ అకాడమీ (సిర్కయిమ్, గోవా), సేతు ఎఫ్‌సీ (మదురై), శ్రీభూమి ఎఫ్‌సీ (కోల్‌కతా) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. తొలి మ్యాచ్‌లో సేతు ఫుట్‌బాల్‌ క్లబ్‌తో కిక్‌స్టార్ట్‌ ఎఫ్‌సీ జట్టు తలపడుతుంది. తొలి అంచె డిసెంబర్‌ 20 నుంచి జనవరి 9వ తేదీ వరకు... రెండో అంచె ఏప్రిల్‌ 20 నుంచి మే 10వ తేదీ వరకు జరుగుతుంది. ఒక్కో జట్టు 14 మ్యాచ్‌ల చొప్పున ఆడుతుంది. అత్యధిక పాయింట్లు సాధించిన జట్టుకు టైటిల్‌ లభిస్తుంది. లీగ్‌లో చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఐడబ్ల్యూఎల్‌–2కు పడిపోతాయి. ఐడబ్ల్యూఎల్‌–2లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఐడబ్ల్యూఎల్‌కు ప్రమోట్‌ అవుతాయి. కోల్‌కతాకు చెందిన ఈస్ట్‌ బెంగాల్‌ ఎఫ్‌సీ జట్టు 2024–2025 ఐడబ్ల్యూఎల్‌ చాంపియన్‌గా నిలిచింది. తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్‌ ఈస్ట్‌ బెంగాల్‌కు తొలి టైటిల్‌ దక్కడంలో ముఖ్యపాత్ర పోషించింది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 24 ఏళ్ల సౌమ్య గత ఐడబ్ల్యూఎల్‌ సీజన్‌లో 9 గోల్స్‌ సాధించి అత్యధిక గోల్స్‌ చేసిన భారత ప్లేయర్‌గా నిలిచింది. గోకులం కేరళ ఎఫ్‌సీ జట్టుకు ఆడిన ఉగాండా ప్లేయర్‌ ఫాజిలా ఇక్వాపుట్‌ 24 గోల్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలువగా... ఈస్ట్‌ బెంగాల్‌ జట్టుకు చెందిన ఘనా ప్లేయర్‌ ఎల్షాదాయ్‌ అచీమ్‌పోంగ్‌ 10 గోల్స్‌తో రెండో స్థానంలో, సౌమ్య 9 గోల్స్‌తో మూడో స్థానంలో నిలిచారు.

New Zealand take first innings lead in second Test against West Indies5
న్యూజిలాండ్‌కు ఆధిక్యం

వెల్లింగ్టన్‌: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 24/0తో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ చివరకు 74.4 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ హే (93 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్‌), డెవాన్‌ కాన్వే (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. కేన్‌ విలియమ్సన్‌ (37; 7 ఫోర్లు), డారిల్‌ మిచెల్‌ (25; 1 ఫోర్, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. విండీస్‌ బౌలర్ల ధాటికి కివీస్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోగా... మిచెల్‌ హే చివరి వరకు పోరాడి జట్టుకు 73 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం అందించాడు. ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డ బ్లెయిర్‌ టిక్నెర్‌ బ్యాటింగ్‌కు రాలేదు. కరీబియన్‌ బౌలర్లలో అండర్సన్‌ ఫిలిప్‌ 3, రోచ్‌ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన వెస్టిండీస్‌ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. జాన్‌ క్యాంప్‌బెల్‌ (14), అండర్సన్‌ ఫిలిప్‌ (0) అవుట్‌ కాగా... బ్రాండన్‌ కింగ్‌ (15 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), కవెమ్‌ హడ్జ్‌ (3 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న విండీస్‌ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 41 పరుగులు వెనుకబడి ఉంది. కివీస్‌ బౌలర్లలో జాకబ్‌ డఫీ, మిచెల్‌ రే చెరో వికెట్‌ పడగొట్టారు.

Tarun Mannepalli in the quarterfinals of the Odisha Masters Open6
క్వార్టర్స్‌లో తరుణ్‌

కటక్‌: ఒడిశా మాస్టర్స్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్, టాప్‌ సీడ్‌ తరుణ్‌ మన్నేపల్లి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్‌ తరుణ్‌ 21–16, 12–21, 21–11తో భారత్‌కే చెందిన గోవింద్‌ కృష్ణపై గెలుపొందాడు. భారత్‌కే చెందిన కిరణ్‌ జార్జి, రిత్విక్‌సంజీవి, శంకర్‌ ముత్తుస్వామి, రౌనక్‌ చౌహాన్‌ కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో శంకర్‌ 21–8, 19–21, 21–15తో ఆర్య (భారత్‌)పై, కిరణ్‌ జార్జి 21–12, 21–18తో డెండి ట్రియాన్సి (ఇండోనేసియా)పై, రిత్విక్‌ 15–21, 21–6, 21–17తో సిద్ధాంత్‌ గుప్తా (భారత్‌)పై, రౌనక్‌ 21–18, 19–21, 21–17తో వరుణ్‌ కపూర్‌పై గెలుపొందారు. శ్రియాన్షి పరాజయం మహిళల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్‌ శ్రియాన్షి వలిశెట్టి పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. శ్రియాన్షి 18–21, 18–21తో తాన్యా హేమంత్‌ (భారత్‌) చేతిలో ఓడిపోయింది. భారత్‌కే చెందిన ఉన్నతి హుడా, అనుపమ, తస్నిమ్‌ మీర్, తన్వీ శర్మ, అన్‌మోల్, ఇషారాణి బారువా కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. పురుషుల డబుల్స్‌ విభాగంలో అరిగెల భార్గవ్‌ రామ్‌–గొబ్బూరి విశ్వతేజ్‌ (భారత్‌) జోడీ క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భార్గవ్‌ రామ్‌–విశ్వతేజ్‌ ద్వయం 18–21, 24–22, 21–17తో నితిన్‌–వీరంరెడ్డి వెంకట హర్షవర్ధన్‌ నాయుడు (భారత్‌) జంటపై గెలిచింది.

Yuvraj and Harman Kaur stands unveil7
యువరాజ్, హర్మన్‌ కౌర్‌ స్టాండ్‌ల ఆవిష్కరణ

న్యూ చండీగఢ్‌లో పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (పీసీఏ) నిర్మించిన ఈ మహరాజా యద్విoద్ర సింగ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఇదే తొలి పురుషుల అంతర్జాతీయ మ్యాచ్‌. గతంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లతో పాటు మూడు నెలల క్రితం భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండు వన్డేలు జరిగాయి. గురువారం టి20 సందర్భంగా రెండు కొత్త స్టాండ్‌లను ఆవిష్కరించారు. వన్డే, టి20 వరల్డ్‌ కప్‌ల విజేత, మాజీ స్టార్‌ యువరాజ్‌ సింగ్‌తో పాటు ఇటీవల భారత్‌కు వరల్డ్‌ కప్‌ను అందించిన మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ పేర్లతో ఈ స్టాండ్‌లను ఏర్పాటు చేశారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ స్టేడియంలో ఇప్పటికే మరో మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ పేరిట పెవిలియన్‌ ఉంది.

South Africa beat India by 51 runs in the second T208
తిలక్‌ పోరాడినా... తప్పని ఓటమి

తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్‌ తర్వాతి పోరులో సునాయాసంగా తలవంచింది. పేలవ బౌలింగ్‌తో 22 అదనపు పరుగులు ఇచ్చి మరీ ప్రaత్యర్థి భారీ స్కోరుకు కారణమైన జట్టు బ్యాటింగ్‌లోనూ తేలిపోయింది. బ్యాటింగ్‌లో డికాక్‌ మెరుపులతో పాటు మంచులో కూడా పట్టు తప్పకుండా వేసిన బౌలింగ్‌తో సఫారీలు పైచేయి సాధించారు. హైదరాబాదీ తిలక్‌ వర్మ ఒంటరి పోరాటం మినహా ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు. న్యూ చండీగఢ్‌: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్‌ 1–1తో సమమైంది. గురువారం జరిగిన రెండో టి20లో దక్షిణాఫ్రికా 51 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్వింటన్‌ డికాక్‌ (46 బంతుల్లో 90; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... చివర్లో డొనొవాన్‌ ఫెరీరా (16 బంతుల్లో 30 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. భారత్‌ ఏకంగా 22 ఎక్స్‌ట్రాలు ఇవ్వగా, ఇందులో 16 వైడ్‌లు ఉన్నాయి. అనంతరం భారత్‌ 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. తిలక్‌ వర్మ (34 బంతుల్లో 62; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, బార్ట్‌మన్‌కు 4 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య మూడో టి20 ఆదివారం ధర్మశాలలో జరుగుతుంది.సమష్టి ప్రదర్శన... ఓపెనర్‌ డికాక్‌ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను దూకుడుగా మొదలు పెట్టగా, హెన్‌డ్రిక్స్‌ (8) విఫలమయ్యాడు.అర్ష్ దీప్ ఓవర్లో 4, 6 కొట్టిన డికాక్‌ బుమ్రా ఓవర్లో మరో సిక్స్‌ బాదాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 53 పరుగులకు చేరింది. మార్క్‌రమ్‌ (26 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్‌లు) నెమ్మదిగా ఆడగా, జోరు కొనసాగిస్తూ డికాక్‌ 26 బంతుల్లోనే (4 ఫోర్లు, 4 సిక్స్‌లతో) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుణ్‌ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన మార్క్‌రమ్‌ అదే ఓవర్లో వెనుదిరిగాడు. మరోవైపు అర్ధ సెంచరీ తర్వాత డికాక్‌ తాను ఆడిన తర్వాతి 19 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టాడు. అయితే సెంచరీకి చేరువైన దశలో కీపర్‌ జితేశ్‌ చురుకుదనం కారణంగా డికాక్‌ దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. బ్రెవిస్‌ (14) ఎక్కువ సేపు నిలవలేకపోయినా... ఫెరీరా, మిల్లర్‌ (12 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోరును అందించింది. బుమ్రా వేసిన చివరి ఓవర్లో ఫెరీరా రెండు సిక్సర్లు బాదాడు. తొలి 10 ఓవర్లలో 90 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా తర్వాతి 10 ఓవర్లలో 123 పరుగులు రాబట్టింది. ఓపెనర్లు విఫలం... శుబ్‌మన్‌ గిల్‌ (0) తాను ఆడిన తొలి బంతికే వెనుదిరగ్గా, 2 సిక్స్‌లు బాదిన అభిషేక్‌ శర్మ (17) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. సూర్యకుమార్‌ (5) వైఫల్యాల బాట కొనసాగగా, మూడో స్థానంలో వచ్చిన అక్షర్‌ పటేల్‌ (21) పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఫోర్, సిక్స్‌తో ఖాతా తెరిచిన తిలక్‌ ఆ తర్వాత కూడా నాలుగు బంతుల వ్యవధిలో రెండు సిక్స్‌లు బాది ఆధిపత్యం ప్రదర్శించాడు. ఎన్‌గిడి బౌలింగ్‌లో మరో సిక్స్‌తో 27 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. అయితే హార్దిక్‌ పాండ్యా (23 బంతుల్లో 20; 1 సిక్స్‌) ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత తిలక్, జితేశ్‌ శర్మ (17 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి గెలిపించేందుకు పోరాడినా లాభం లేకపోయింది. 14 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్‌ 9 బంతుల వ్యవధిలో 5 పరుగులు మాత్రమే జోడించి చివరి 5 వికెట్లు కోల్పోయింది. సఫారీలు ఒకే ఒక వైడ్‌ వేయడం విశేషం! స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (రనౌట్‌) 90; హెన్‌డ్రిక్స్‌ (బి) వరుణ్‌ 8; మార్క్‌రమ్‌ (సి) అక్షర్‌ (బి) వరుణ్‌ 29; బ్రెవిస్‌ (సి) తిలక్‌ (బి) అక్షర్‌ 14; ఫెరీరా (నాటౌట్‌) 30; మిల్లర్‌ (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–38, 2–121, 3–156, 4–160. బౌలింగ్‌:అర్ష్ దీప్ 4–0–54–0, బుమ్రా 4–0–45–0, వరుణ్‌ 4–0–29–2, అక్షర్‌ 3–0–27–1, పాండ్యా 3–0–34–0, దూబే 2–0–18–0. భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) డికాక్‌ (బి) యాన్సెన్‌ 17; గిల్‌ (సి) హెన్‌డ్రిక్స్‌ (బి) ఎన్‌గిడి 0; అక్షర్‌ (సి) హెన్‌డ్రిక్స్‌ (బి) బార్ట్‌మన్‌ 21; సూర్యకుమార్‌ (సి) డికాక్‌ (బి) యాన్సెన్‌ 5; తిలక్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) ఎన్‌గిడి 62; పాండ్యా (సి) బ్రెవిస్‌ (బి) సిపామ్లా 20; జితేశ్‌ (సి) బార్ట్‌మన్‌ (బి) సిపామ్లా 27; దూబే (బి) బార్ట్‌మన్‌ 1;అర్ష్ దీప్ (సి) మిల్లర్‌ (బి) బార్ట్‌మన్‌ 4; వరుణ్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) బార్ట్‌మన్‌ 0; బుమ్రా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్‌) 162. వికెట్ల పతనం: 1–9, 2–19, 3–32, 4–67, 5–118, 6–157, 7–158, 8–162, 9–162, 10–162. బౌలింగ్‌: ఎన్‌గిడి 3.1–0–26–2, యాన్సెన్‌ 4–0–25–2, సిపామ్లా 4–0–46–2, ఫెరీరా 1–0–14–0, బార్ట్‌మన్‌ 4–0–24–4, లిండే 3–0–23–0.అర్ష్‌దీప్‌ 13 బంతుల ఓవర్‌! 6, వైడ్, వైడ్, 0, వైడ్, వైడ్, వైడ్, వైడ్, 1, 2, 1, వైడ్, 1...అర్ష్ దీప్ సింగ్‌ వేసిన ఒక ఓవర్లో 13 బంతుల వరుస ఇది! దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్‌ వేసినఅర్ష్ దీప్ ఏకంగా 7 వైడ్‌లు వేశాడు. తొలి బంతిని డికాక్‌ లాంగాఫ్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాదగా... మిగతా 5 లీగల్‌ బంతులను కూడా చక్కగా వేసిన అతను 5 పరుగులే ఇచ్చాడు. అయితే మంచు కారణంగా బంతిపై పట్టుతప్పి అతను వేసిన వైడ్‌లు భారత శిబిరంలో అసహనాన్ని పెంచాయి.

South Africa beat team india by 51 runs in 2nd T20I9
డికాక్‌ విధ్వంసం.. రెండో టీ20లో టీమిండియా చిత్తు

ముల్లాన్‌పూర్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. తొలి టీ20లో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే.రెండో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్వింటన్‌ డికాక్‌ (46 బంతుల్లో 90; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖర్లో డొనోవన్‌ ఫెరియెరా (16 బంతుల్లో 30 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (12 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్‌ 8, కెప్టెన్‌ మార్క్రమ్‌ 29, బ్రెవిస్‌ 14 పరుగులకు ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 2, అక్షర్‌ పటేల్‌ ఓ వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఆది నుంచి తడబడింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేయడంతో 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ 4, ఎంగిడి, జన్సెన్‌, సిపాంమ్లా తలో 2 వికెట్లు తీసి టీమిండియాను కుప్పకూల్చారు. భారత ఇన్నింగ్స్‌లో తిలక్‌ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లలో జితేశ్‌ శర్మ 27, అక్షర్‌ పటేల్‌ 21, హార్దిక్‌ 20, అభిషేక్‌ శర్మ 17, సూర్యకుమార్‌ 5, అర్షదీప్‌ 4, దూబే ఒక పరుగు చేశారు. శుభ్‌మన్‌ గిల్‌, వరుణ్‌ చక్రవర్తి డకౌటయ్యారు.ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. సౌతాఫ్రికా తరఫున బ్యాటింగ్‌లో డికాక్‌ (90), బౌలింగ్‌లో ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ (4-0-24-4) చెలరేగారు. భారత ఇన్నింగ్స్‌లో తిలక్‌ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. ఈ సిరీస్‌లోని మూడో టీ20 ధర్మశాల వేదికగా డిసెంబర్‌ 14న జరుగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన క్వింటన్‌ డికాక్‌.. తొందరపాటు చర్యతో..

IND vs SA 2nd T20I: Gill Fails Again Golden Duck Fans Reacts10
ఈసారి గోల్డెన్‌ డకౌట్‌.. అతడిని ఎందుకు బలి చేస్తున్నారు?

భారత టీ20 జట్టు ఓపెనర్‌గా శుబ్‌మన్‌ గిల్‌ మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో రెండో టీ20లో గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో గిల్‌తో పాటు టీమిండియా యాజమాన్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సంజూకు ఓపెనర్‌గా మొండిచేయిఆసియా కప్‌-2025 టీ20 టోర్నీతో భారత టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌గా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు గిల్‌ (Shubman Gill). దీంతో అభిషేక్‌ శర్మ (Abhishek Sharma)కు విజయవంతమైన ఓపెనింగ్‌ జోడీగా కొనసాగుతున్న సంజూ శాంసన్‌ (Sanju Samson)ను మేనేజ్‌మెంట్‌ పక్కనపెట్టింది. వరుస మ్యాచ్‌లలో గిల్‌ విఫలమవుతున్నా.. భవిష్య కెప్టెన్‌ అనే ఒక్క కారణంతో అతడిని కొనసాగిస్తోంది.ఈసారి గోల్డెన్‌ డక్‌తాజాగా స్వదేశంలో టీ20 సిరీస్‌లోనూ సంజూకు ఓపెనర్‌గా మొండిచేయి చూపి.. యథావిధిగా గిల్‌కు పెద్దపీట వేసింది. అయితే, కటక్‌ వేదికగా తొలి టీ20లో రెండు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో ముల్లన్‌పూర్‌లో గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు.వరుసగా వైఫల్యాలుసఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే గిల్‌ మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఐదో బంతికి రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక టీమిండియా తరఫున గత ఇరవై ఇన్నింగ్స్‌లో గిల్‌ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).ఈ స్థాయిలో గిల్‌ విఫలమవుతున్నా.. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, మేనేజ్‌మెంట్‌ మాత్రం అతడికి వరుస అవకాశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓపెనర్‌గా గిల్‌ను ఆడించేందుకు సంజూను బలిచేయడాన్ని మాజీ క్రికెటర్లు సైతం ప్రశ్నిస్తున్నారు. సంజూను ఎందుకు బలి చేస్తున్నారు?టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా, బ్యాటర్‌గా మెరుగ్గా ఆడుతున్న గిల్‌ను రెండు ఫార్మాట్లకే పరిమితం చేయాలని.. టీ20లలో సంజూకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌-2026 నాటికి తప్పు సరిదిద్దుకోకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. గిల్‌ కోసం సంజూను ఎందుకు బలి చేస్తున్నారని అతడి అభిమానులు మండిపడుతున్నారు.ఇదిలా ఉంటే.. ముల్లన్‌పూర్‌ మ్యాచ్‌లో టీమిండియా పవర్‌ ప్లేలో ఏకంగా మూడు వికెట్లు కోల్పోయి 51 పరుగులే చేసింది. గిల్‌తో పాటు.. అభిషేక్‌ శర్మ (17), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (5) విఫలమయ్యారు. అన్నట్లు ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో ప్రయోగం చేసింది. వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను పంపింది.చదవండి: విరాట్‌ కోహ్లి సంచలన నిర్ణయం!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement