Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Indias semi final match against England today1
భారత్‌ ఫైనల్‌ గురి

3-2 టి20 వరల్డ్‌ కప్‌లో భారత్, ఇంగ్లండ్‌ మధ్య 5 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్‌ 3 గెలిచి, 2 ఓడింది. గత టి20 ప్రపంచ కప్‌లో భారత్‌ విజేతగా నిలిచిన సందర్భంలో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించే ముందంజ వేసింది. అంతకుముందు 2022 సెమీఫైనల్లో భారత్‌పై విజయం సాధించిన ఇంగ్లండ్‌ ఆపై టైటిల్‌నూ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి టైటిల్‌ పోరుకు ముందు ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి సెమీస్‌ సమరంలోనే ముఖాముఖికి సిద్ధమయ్యాయి. తాజా టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే రెండు జట్లూ కూడా ‘లోపాలు లేని అత్యుత్తమ ఆటతీరు’ను కనబర్చలేకపోయాయి. ఇంగ్లండ్‌ ప్రస్థానం తడబడుతూనే సాగగా... భారత్‌ కూడా తమపై ఉన్న భారీ అంచనాలకు అనుగుణంగా ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. అయితే ఇక్కడి వరకు ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదు మిగిలిన రెండు మ్యాచ్‌లు ఎలా గెలవడం అనేదే ముఖ్యం. ఈ నేపథ్యంలో భారత్‌ సొంతగడ్డపై సత్తా చాటుతుందా లేక ఇంగ్లండ్‌ అనూహ్య ఫలితాన్ని సాధిస్తుందా అనేది ఆసక్తికరం. ముంబై: టి20 వరల్డ్‌ కప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించే క్రమంలో అసలైన నాకౌట్‌ సమరానికి సిద్ధమైంది. నేడు వాంఖెడే మైదానంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ప్రత్యర్థులతో పోలిస్తే ఇంగ్లండ్‌ మరీ బలంగా ఏమీ లేదు. అయితే నాకౌట్‌ మ్యాచ్‌ ఒత్తిడిని అధిగమించి టీమిండియా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ స్ఫూర్తిదాయక సారథ్యంలో ఇంగ్లండ్‌ ఒక్కో అడుగు వేస్తూ సెమీస్‌కు చేరింది. టి20 వరల్డ్‌ కప్‌ను రెండేసిసార్లు గెలుచుకున్న ఈ రెండు జట్లు మూడో టైటిల్‌ వేటలో మరో అడుగు ముందుకు వేసేందుకు నేటి పోరులో ఎలా చెలరేగుతాయో చూడాలి. మార్పుల్లేకుండా... పిచ్, వేదికతో సంబంధం లేకుండా భారత జట్టు అన్ని రకాలుగా ఈ మ్యాచ్‌ కోసం సిద్ధంగా ఉంది. కొత్తగా వ్యూహాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా బెస్ట్‌–11తో తుది జట్టు ఎంపిక కూడా ఖాయమైనట్లే. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మైదానంలో ఇంగ్లండ్‌పైనే అభిషేక్‌ శర్మ విధ్వంసకర ఆటతో తన రాకను ఘనంగా ప్రదర్శించాడు. నాటి మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 7 ఫోర్లు, 13 సిక్స్‌లతో అతను ఏకంగా 135 పరుగులు సాధించాడు. ఇప్పుడు అలాంటి ప్రదర్శనను పునరావృతం చేయాలని అభిషేక్‌ భావిస్తున్నాడు. విండీస్‌పై గత మ్యాచ్‌లో తడబడినా ఈసారి చెలరేగితే తిరుగుండదు. మరో ఓపెనర్‌ సంజు సామ్సన్‌ ఒక్క ఇన్నింగ్స్‌తో తన విలువేంటో చూపించాడు. అదే జోరు కొనసాగించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఆపై ఇషాన్, సూర్య, తిలక్‌లతో జట్టు బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. ఈ ఐదుగురిలో ఏ ఇద్దరు చెలరేగినా జట్టు భారీ స్కోరు చేయడం ఖాయం. హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబేలు చివర్లో వేగంగా అందించే పరుగులు దీనికి అదనం. ఎనిమిదో స్థానంలో అక్షర్‌ పటేల్‌లాంటి ఆటగాడు ఉండటం టీమిండియా బలం. పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్‌ ఎప్పటిలాగే ఆరంభంలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలిగితే మన జట్టు పని మరింత సులువవుతుంది. అక్షర్‌తో పాటు వైవిధ్యమైన బౌలింగ్‌ ఉన్న వరుణ్‌ చక్రవర్తిని ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు కత్తి మీద సామే. ఇంగ్లండ్‌పై ఘనమైన రికార్డు ఉన్న స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను ఆడించాలనే భావిస్తున్నా... ఎవరినీ పక్కన పెట్టలేని పరిస్థితి. బుధవారం సిద్ధి వినాయక ఆలయంలో అభిషేక్, అక్షర్, ఇషాన్‌ కీలకం విల్‌ జాక్స్‌... ఈ వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌ చాలా సాధారణ ఆటతీరు కనబర్చింది. అతి కష్టమ్మీద నేపాల్‌పై 4 పరుగులతో నెగ్గి ఆపై విండీస్‌ చేతిలో ఓడింది. ‘సూపర్‌ ఎయిట్స్‌’లో కూడా స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్రమంలో పాకిస్తాన్, న్యూజిలాండ్‌లపై చచ్చీ చెడి గెలిచింది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా విధ్వంసకర ఆటకు చిరునామాగా నిలిచిన టీమ్‌ ఇప్పుడు అతి కష్టమ్మీద గెలుపు గీత దాటుతోంది. టోర్నీ మొత్తంలో బెస్ట్‌ ఓపెనింగ్‌ జోడీ అంటూ బరిలోకి దిగిన బట్లర్, ఫిల్‌ సాల్ట్‌ 7 మ్యాచ్‌లలో కలిపి 84 పరుగులే జోడించగలిగారు. ఏ మ్యాచ్‌లోనూ గరిష్టంగా నాలుగు ఓవర్లకు మించి వీరి భాగస్వామ్యం సాగలేదు. అయినా సరే మరో ప్రత్యామ్నాయం లేక మరోసారి జట్టు వీరినే నమ్ముకుంటోంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంగ్లండ్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన బట్లర్‌ 7 మ్యాచ్‌లలో కలిపి చేసింది 62 పరుగులే! అయినా సరే, అతని స్థాయికి తగ్గ ప్రదర్శన ఈ ఒక్క మ్యాచ్‌లోనైనా రావాలని ఇంగ్లండ్‌ కోరుకుంటోంది. బెతెల్, బాంటన్‌లను నమ్మే స్థితి లేకపోవడంతో కెప్టెన్ బ్రూక్‌ మరోసారి భారీ ఇన్నింగ్స్‌ ఆడటం అవసరం. ఆల్‌రౌండర్‌గా స్యామ్‌ కరన్‌ పెద్దగా ఆకట్టుకోకపోయినా....ఈ టోర్నీలో నాలుగు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు నెగ్గిన విల్‌ జాక్స్‌ కీలకం కానున్నాడు. ఆర్చర్‌తో పాటు రెండో పేసర్‌గా ఒవర్టన్‌పై భారం ఉంది. పిచ్‌ కొంత అనుకూలిస్తే మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ఆదిల్‌ రషీద్, డాసన్‌ కూడా ప్రభావం చూపగలరని జట్టు నమ్ముతోంది. పిచ్, వాతావరణం వాంఖెడే పిచ్‌ మొదటి నుంచీ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. మంచి బౌన్స్, చిన్న బౌండరీల కారణంగా భారీ స్కోర్లకు అవకాశం ఉంది. టోర్నీలో తొలి మ్యాచ్‌ను భారత్‌ ఇక్కడ ఆడగా... ఇంగ్లండ్‌ రెండు మ్యాచ్‌లు ఆడింది. మంచు ప్రభావం ఉంది కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. మ్యాచ్‌ రోజున వర్ష సూచన లేదు. ఒకవేళ వర్షం సమస్య కలిగించినా...రిజర్వ్‌ డే ఉంది. 17-12 భారత్, ఇంగ్లండ్‌ మధ్య 29 టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్‌ 17 మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్‌ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. తుది జట్లు (అంచనా) భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్ ), అభిషేక్, సామ్సన్, ఇషాన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్‌. ఇంగ్లండ్‌: బ్రూక్‌ (కెప్టెన్ ), సాల్ట్, బట్లర్, బెతెల్, బాంటన్, కరన్, ఒవర్టన్, జాక్స్, డాసన్, ఆర్చర్, రషీద్‌.

New Zealand in the T20 World Cup 2026 final2
కివీస్‌ కిర్రాక్‌ షో

చోకర్స్‌... క్రికెట్లో దక్షిణాఫ్రికా జట్టును ఉద్దేశించి తరచూ అనే మాట ఇది. అంటే... అన్నీ నెగ్గినా, ఎన్ని గెలిచినా, అసలైనా పోరులో తుస్సుమంటుందనే అర్థంలో వాడతారు. ఇదేలా ఉన్నా... గతం సంగతి పక్కన బెట్టినా... ఈ టి20 ప్రపంచకప్‌ వరకే చూసినా కూడా సఫారీ జట్టును ముమ్మూటికీ చోకర్స్‌ అనక తప్పదేమో! ఎందుకంటే ఈ టోర్నీలో లీగ్‌ మొదలు, సూపర్‌–8 ముగిసేదాకా అపజయమన్నదే ఎరుగని జట్టు కీలకమైన సెమీఫైనల్‌ కొచ్చేసరికి చేతులెత్తేసింది. కోల్‌కతా: ఇప్పటిదాకా ఈ టి20 ప్రపంచకప్‌లో ఎదురేలేని ఏకైక జట్టు దక్షిణాఫ్రికాను... రన్‌రేట్‌తో సెమీఫైనల్‌ చేరిన న్యూజిలాండ్‌ చిత్తు చేసింది. టోర్నీలోనే కఠినమైన ప్రత్యర్థిపై సులువుగా విజయం సాధించింది. బుధవారం ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన తొలి సెమీఫైనల్లో కివీస్‌ 7.1 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై ఘనవిజయం నమోదు చేసింది. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఫిన్‌ అలెన్‌ (33 బంతుల్లో 100 నాటౌట్‌; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీరవిహారంతో దక్షిణాఫ్రికా లక్ష్యం చిన్నబోయింది. సఫారీ జట్టు మూగబోయింది. టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్‌ బౌలింగ్‌ ఎంచుకోవడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్‌ (30 బంతుల్లో 55 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించాడు. కివీస్‌ బౌలర్లు మెక్‌కోన్‌కీ (2/9), రచిన్‌ రవీంద్ర (2/29), హెన్రీ (2/34) తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ అలెన్‌ శతక సునామీతో 12.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. టిమ్‌ సీఫెర్ట్‌ (33 బంతుల్లో 58; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా దంచేశాడు. ఈ మెగా టోర్నీలో రెండోసారి ఫైనల్‌ చేరిన న్యూజిలాండ్‌ (2021లో తొలిసారి రన్నరప్‌)... నేడు భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో ఆదివారం అహ్మదాబాద్‌లో టైటిల్‌ కోసం తలపడుతుంది. టాపార్డర్‌ తడబాటు కెప్టెన్‌ మార్క్‌రమ్‌ (18), డికాక్‌ (10), రికెల్టన్‌ (0) ఇలా టాప్‌–3 బ్యాటర్లు చేతులెత్తేశారు. 55 స్కోరు వద్ద టాపార్డర్‌ వికెట్లు కూలాయి. దీన్నుంచి తేరుకోకముందే మిల్లర్‌ (6), అప్పటిదాకా టాప్‌స్కోరర్‌ అయిన బ్రెవిస్‌ (34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇద్దరు 77 పరుగుల స్కోరు వద్దే వెనుదిరిగారు. నిజానికి ఇక్కడే సఫారీ పనైపోయింది. అయితే స్టబ్స్‌ (24 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌), యాన్సెన్‌ ఆరో వికెట్‌కు 73 పరుగులు జోడించిన భాగస్వామ్యం, 27 బంతుల్లో యాన్సెన్‌ చేసిన ఫిఫ్టీ దక్షిణాఫ్రికాను ఆదుకున్నాయి. అలెన్‌ ధన్‌ ధనాధన్‌ తొలి ఓవర్లో సీఫెర్ట్‌ రెండు బౌండరీలు, రెండో ఓవర్లో అలెన్‌ ఫోర్‌ కొట్టడంతో రెండు ఓవర్లలో కలిపి మొత్తం 19 పరుగులు వచ్చాయి. మరుసటి మూడో ఓవర్లో ఇద్దరు కలిపి కొట్టడంతో 18 పరుగులతో కివీస్‌ పరుగుల జోరందుకుంది. 4.1 ఓవర్లో జట్టు స్కోరు 50 దాటింది. ఇక బాష్‌ వేసిన పవర్‌ ప్లే ఆఖరి ఓవర్లో ఆఖరి బంతి ఒక్కటే బతికి పోయింది. అంతకుముందు పడిన ఐదు బంతుల్ని అలెన్‌ 6, 4, 4, 4, 4, 0లుగా బాదేయడంతో వరుసబెట్టి మరీ బౌండరీలైన్‌ను దాటేశాయి. 6 ఓవర్లలో 84/0. అచ్చు హైలైట్స్‌లాగే లక్ష్యంలో సగం స్కోరు కరిగింది. పవర్‌ప్లే ముగిసింది కానీ ఓపెనర్ల పవర్‌ స్ట్రోక్స్‌ మాత్రం అడ్డు అదుపు లేకుండా కొనసాగాయి. దీంతో 7.5 ఓవర్లోనే న్యూజిలాండ్‌ స్కోరు 100కు చేరింది. 28 బంతుల్లో సీఫెర్ట్, 19 బంతుల్లో అలెన్‌ ఫిఫ్టీలు సాధించారు. ఎట్టకేలకు రబడ పదో ఓవర్లో సీఫెర్ట్‌ను అవుట్‌ చేశాడు. కానీ కివీస్‌ స్కోరు 117/1. అప్పటికే సఫారీ వికెట్‌ సాఫల్యానికి ఆలస్యమైంది. అలెన్‌ దూకుడుతో న్యూజిలాండ్‌ లక్ష్యానికి చేరువైంది. యాన్సెన్‌ వేసిన 13వ ఓవర్లో అలెన్‌ వరుసగా 4, 4, 6, 6, 4 బాదేయడంతో 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న అలెన్‌ ఒక్క ఉదుటున 33 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో బంతి బౌండరీతోనే కివీస్‌ లక్ష్యాన్ని కూడా చేరుకుంది. 33 టి20 ప్రపంచకప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ప్లేయర్‌గా అలెన్‌ రికార్డు నెలకొల్పాడు. క్రిస్‌ గేల్‌ (2016లో ఇంగ్లండ్‌పై 47 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును అలెన్‌ సవరించాడు.6 ప్రస్తుత టి20 ప్రపంచకప్‌లో నమోదైన సెంచరీలు. 2010, 2014, 2016, 2022 టోర్నీల్లో అత్యధికంగా రెండేసి సెంచరీలు వచ్చాయి. మార్క్‌రమ్‌ అవుటా? ఈ టోర్నమెంట్‌ లో మూడు హాఫ్‌ సెంచరీలతో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఒకడిగా ఉన్న మార్క్‌రమ్‌ కీలకమైన ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తే... సఫారీ జట్టు భారీ స్కోరు ఖాయమే అనిపించింది. అయితే సందేహాస్పద క్యాచ్‌ అవుట్‌తో అతడు నిష్క్రమించిన ప్రభావం సఫారీ జట్టు స్కోరుపై పడింది. రచిన్‌ రవీంద్ర 8వ ఓవర్‌ నాలుగో బంతిని షాట్‌ ఆడగా బౌండరీకి దగ్గర్లో మిచెల్‌ అందుకున్నాడు. కానీ చేతివేళ్ల సందుల్లోంచి బంతి నేలను తాకినట్లుగా రిప్లేలో కనిపించినా... నిబంధనల ప్రకారం బంతి కిందే చేతివేళ్లున్నాయని థర్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ (భారత్‌) స్పష్టం చేసి అవుటిచ్చాడు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) మిచెల్‌ (బి) రచిన్‌ 18; డికాక్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) మెక్‌కోన్‌కీ 10; రికెల్టన్‌ (సి) అలెన్‌ (బి) మెక్‌కోన్‌కీ 0; బ్రెవిస్‌ (సి) సాంట్నర్‌ (బి) నీషమ్‌ 34; మిల్లర్‌ (సి) మిచెల్‌ (బి) రచిన్‌ 6; స్టబ్స్‌ (బి) ఫెర్గూసన్‌ 29; యాన్సెన్‌ (నాటౌట్‌) 55; బాష్‌ (బి) హెన్రీ 2; రబడ (సి) నీషమ్‌ (బి) హెన్రీ 0; కేశవ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–55, 4–77, 5–77, 6–150, 7–166, 8–166. బౌలింగ్‌: హెన్రీ 4–0–34–2, మెక్‌కోన్‌కీ 1–0–9–2, ఫెర్గూసన్‌ 4–0–29–1, నీషమ్‌ 3–0–42–1, సాంట్నర్‌ 4–0–25–0, రచిన్‌ రవీంద్ర 4–0–29–2. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: సీఫెర్ట్‌ (బి) రబడ 58; అలెన్‌ (నాటౌట్‌) 100; రచిన్‌ (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (12.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 173. వికెట్‌ పతనం: 1–117. బౌలింగ్‌: యాన్సెన్‌ 2.5–0–53–0, రబడ 3–0–28–1, ఎన్‌గిడి 2–0–22–0, బాష్‌ 2–0–35–0, కేశవ్‌ 3–0–33–0.

New records in T20 World Cup viewing3
టి20 ప్రపంచకప్‌ వీక్షణలో కొత్త రికార్డులు

న్యూఢిల్లీ: భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 ప్రపంచకప్‌ కొత్త ప్రసార రికార్డులు నెలకొల్పుతోంది. ఇప్పటి వరకు జరిగిన అన్నీ టోర్నీల కంటే ఈ వరల్డ్‌కప్‌నకు అత్యధి వీక్షణలు వచ్చాయని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) అధ్యక్షుడు జై షా బుధవారం తెలిపారు. పాత రికార్డులన్నింటిని తిరగరాస్తూ తాజా టోర్నమెంట్‌ వీక్షకుల సంఖ్య 500 మిలియన్‌ (50 కోట్లు)లను అధిగమించిందని వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండే టోర్నమెంట్‌గా ఇది నిలిచిందని... డిజిటల్‌ వినియోగం ద్వారానే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని జై షా అన్నారు. ‘ఈ వరల్డ్‌కప్‌ను విశ్వవ్యాప్తం చేయాలని టోర్నీ ఆరంభానికి ముందే లక్ష్యంగా పెట్టుకున్నాం. భారత్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌ వీక్షకుల సంఖ్య 500 మిలియన్‌లు దాటింది. టి20 ప్రపంచకప్‌ల చరిత్రలో ఇదే అత్యధికం. జియో హాట్‌స్టార్‌లో ఏకకాలంలో 60.5 మిలియన్ల గరిష్ట వీక్షకులను చూడటం చాలా సంతోషంగా ఉంది’ అని జై షా సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. తాజా టోర్నీలో సెమీఫైనల్స్, ఫైనల్‌ జరగకముందే... 2024లో అమెరికాలో జరిగిన వరల్డ్‌కప్‌ కంటే ఎక్కువమంది ఈవెంట్‌ను వీక్షించడం గమనార్హం. చివరి మూడు మ్యాచ్‌లు ముగిసేసరికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Dommaraju Gukesh suffers third defeat4
మళ్లీ ఓడిన గుకేశ్‌

ప్రాగ్‌ (చెక్‌ రిపబ్లిక్‌): ప్రాగ్‌ చెస్‌ ఫెస్టివల్‌ మాస్టర్స్‌ కేటగిరీలో ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌కు మూడో పరాజయం ఎదురైంది. డిఫెండింగ్‌ చాంపియన్, భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్‌ అరవింద్‌ చిదంబరంతో జరిగిన ఆరో రౌండ్‌లో గుకేశ్‌ 48 ఎత్తుల్లో ఓడిపోయాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్‌ తర్వాత గుకేశ్‌ 1.5 పాయింట్లతో చివరిదైన పదో స్థానంలో ఉండటం గమనార్హం. అరవింద్‌ 2.5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. నెదర్లాండ్స్‌ గ్రాండ్‌మాస్టర్‌ జోర్డెన్‌ వాన్‌ ఫోరీస్ట్‌ 4.5 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఇదే టోర్నీ చాలెంజర్స్‌ విభాగంలో పోటీపడుతున్న ప్రపంచకప్‌ చాంపియన్, భారత మహిళా గ్రాండ్‌మాస్టర్‌ దివ్య దేశ్‌ముఖ్‌ ఖాతాలో నాలుగో ‘డ్రా’ చేరింది. థామస్‌ బీర్డ్‌సన్‌ (నెదర్లాండ్స్‌)తో జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌ను దివ్య 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ప్రస్తుతం దివ్య మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

Satwik and Chirag pair lose at All England Badminton Championship first round 5
సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి షాక్‌

బర్మింగ్‌హామ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లోరెండో రోజు భారత షట్లర్లకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగిన నాలుగో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 33వ స్థానంలో ఉన్న కాంగ్‌ ఖాయ్‌ జింగ్‌–ఆరోన్‌ తాయ్‌ (మలేసియా) జంట 23–21, 21–12తో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న సాత్విక్‌–చిరాగ్‌ జోడీని బోల్తా కొట్టించింది. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జంట తొలి గేమ్‌లో గట్టిపోటీనిచి్చనా... రెండో గేమ్‌లో తేలిపోయింది. ఏడోసారి ఈ టోర్నీలో పోటీపడ్డ సాత్విక్‌–చిరాగ్‌ తొలి రౌండ్‌లోనే వెనుదిరగడం ఇదే తొలిసారి. 2022లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన భారత జంట 2018, 2021, 2023, 2024, 2025లలో ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓడిపోయింది. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జంట 42 నిమిషాల్లో 12–21, 15–21తో ఐదో సీడ్‌ థోమ్‌ గికెల్‌–డెల్‌పైన్‌ డెల్‌ర్యూ (ఫ్రాన్స్‌) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్‌ ఆయుశ్‌ శెట్టి (భారత్‌) 75 నిమిషాల్లో 21–19, 9–21, 17–21తో ప్రపంచ 14వ ర్యాంకర్‌ అల్వీ ఫర్హాన్‌ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు.

Finn Allen blasts fastest century in T20 World Cup history6
ఫిన్ అలెన్ వరల్డ్‌ రికార్డ్.. ప్రపంచకప్‌ చరిత్రలోనే తొలి బ్యాట్స్‌మెన్‌..!

న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఫిన్ అలెన్ సెమీస్‌లో విధ్వంసం సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ సెమీస్ మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లో సెంచరీ బాదేశాడు. ఫిన్ అలెన్ దూకుడుతో సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలోనే చేధించారు. టీ20 వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఫిన్ ‍అలెన్ ఘనత సాధించారు. ఈ విజయంతో న్యూజిలాండ్ టీమ్ వరల్డ్ కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది.కోల్‌కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫిన్ అలెన్ భీభత్సం సృష్టించాడు. ఏకంగా పది ఫోర్లు, 8 సిక్సర్లతో ఊచకోత కోశాడు. ఫిన్ అలెన్ దూకుడుతో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

T20 WC 2026: New Zealand Beat South Africa By 9 Wickets Enters Final7
T20 WC: అలెన్‌ విధ్వంసకర శతకం.. వరల్డ్‌కప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో న్యూజిలాండ్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. కోల్‌కతాలో జరిగిన తొలి సెమీస్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో బుధవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కివీస్‌.. సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ న్యూజిలాండ్‌ బౌలర్లు ఆది నుంచే నిప్పులు చెరిగారు. క్వింటన్‌ డికాక్‌ (10)ను అవుట్‌ చేసి కివీస్‌ వికెట్ల వేట మొదలుపెట్టిన కోల్‌ మెకాంచీ.. వన్‌డౌన్‌లో వచ్చిన ర్యాన్‌ రికెల్టన్‌ (0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఇక మరో ఓపెనర్‌, కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (18)ను రచిన్‌ రవీంద్ర పెవిలియన్‌కు చేర్చాడు.యాన్సెన్‌ హాఫ్‌ సెంచరీఅదే విధంగా డారిల్‌ మిచెల్‌ (6)ను కూడా అవుట్‌ చేసిన రచిన్‌ కివీస్‌ శిబిరంలో జోష్‌ నింపాడు. ఇక డెవాల్డ్‌ బ్రెవిస్‌ (34)ను జేమ్స్‌ నీషమ్‌ అవుట్‌ చేయగా.. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (29)ను లాకీ ఫెర్గూసన్‌ పెవిలియన్‌కు పంపించాడు. అయితే, మార్కో యాన్సెన్‌ హాఫ్‌ సెంచరీ (30 బంతుల్లో 55) నాటౌట్‌గా నిలవడంతో సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ 12.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్‌ నష్టపోయి 173 పరుగులు సాధించింది. ఓపెనర్లలో టిమ్‌ సీఫర్ట్‌ 33 బంతుల్లో 58 పరుగులు సాధించగా.. ఫిన్‌ అలెన్‌ విధ్వంసకర శతకం బాదాడు. Everything is flying to the boundary tonight! 🫣ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/1kQbb9uF6n— Star Sports (@StarSportsIndia) March 4, 2026ఫాస్టెస్ట్‌ సెంచరీకేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫోర్‌ బాది కివీస్‌ గెలుపును ఖరారు చేశాడు. రచిన్‌ రవీంద్ర 11 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌ సందర్భంగా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా అలెన్‌ చరిత్ర సృష్టించాడు.

T20 WC Dont Need: England Captain Harry Brook Warning To Team India8
పర్‌ఫెక్ట్‌ గేమ్‌ ఆడలేదు: టీమిండియాకు హ్యారీ బ్రూక్‌ వార్నింగ్‌

టీమిండియాతో సెమీ ఫైనల్‌ నేపథ్యంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో తాము ఇంత వరకు పరిపూర్ణమైన మ్యాచ్‌ ఆడలేదని.. అయినప్పటికీ సమిష్టిగా రాణించి విజయం సాధించామని పేర్కొన్నాడు. కాబట్టి టీమిండియాతో మ్యాచ్‌ గురించి తాము చెందాల్సిన అవసరం లేదన్నాడు.టీ20 ప్రపంచకప్‌-2026 లీగ్‌ దశలో నేపాల్‌ వంటి పసికూన చేతిలో తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్న ఇంగ్లండ్‌.. ఆ తర్వాత సూపర్‌-8లో మాత్రం అదరగొట్టింది. శ్రీలంక, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ మీద విజయాలు సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మూడు మ్యాచ్‌లలో కూడా ఆఖరి వరకు పోరాడి ఇంగ్లండ్‌ గెలిచింది.కల నిజమైన తరుణం ఇదిఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్‌ (Harry Brook) మాట్లాడుతూ.. ‘‘ఆతిథ్య జట్టు (టీమిండియా)తో సెమీ ఫైనల్‌ ఆడటం విశేషం. మా జట్టులోని చాలా మంది కల నిజమైన తరుణం ఇది. ఈ మ్యాచ్‌ కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.పర్‌ఫెక్ట్‌ గేమ్‌ ఆడలేదు.. అయినాపూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాం. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో పరిపూర్ణంగా ఆడలేదు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కొక్కరు కీలకంగా వ్యవహరించారు. టీమిండియాతో మ్యాచ్‌లో సైతం పూర్తి స్వేచ్ఛగా.. ధైర్యంగా ఆడతాం.ఈ టోర్నీలో కొన్ని ఉత్కంఠ మ్యాచ్‌లలో మేము గెలిచాము. మా బ్యాటర్లు స్పిన్‌ను ఎదర్కోవడంలో ఇబ్బంది పడతారని అంతా అనుకుంటున్నారు. కానీ మేము చక్కగా స్పిన్‌ ఆడగలము.వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లోప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన భారత స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (Varun Chakravarthy) బౌలింగ్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అతడి బౌలింగ్‌లో అత్యుత్తమంగా ఆడి వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తా’’ అని హ్యారీ బ్రూక్‌ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా టీమిండియాకు కఠిన సవాలు తప్పదని సంకేతాలు ఇచ్చాడు. తాము ఇప్పటివరకు పర్‌ఫెక్ట్‌గా ఆడకపోయినా ఎవరో ఒకరు జట్టును ఆదుకుంటారని.. గతంలో మాదిరే ఈసారి అదే పునరావృతం కావొచ్చని బ్రూక్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. కాగా ముంబై వేదికగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య గురువారం సెమీ ఫైనల్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్‌ బోర్డులో తొలి రాజీనామా

T20 WC Semis SA vs NZ: Marco Jansen Tristan Stubbs Scripts History9
T20 WC 2026: చరిత్ర సృష్టించిన సఫారీ క్రికెటర్లు

న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ అద్బుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కివీస్‌ బౌలర్ల ధాటికి టాపార్డర్‌ కుదేలైన వేళ తాను ఉన్నానంటూ ముందుకు వచ్చాడు.చరిత్ర సృష్టించిన సఫారీ క్రికెటర్లుకేవలం 77 పరుగులే చేసి సగం వికెట్లు కోల్పోయిన తరుణంలో యాన్సెన్‌ (Marco Jansen) .. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (Trisran Stubss)తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా ఈ జోడీ సరికొత్త చరిత్ర సృష్టించింది.సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జట్టుగా నిలిచింది. అంతేకాదు.. టీ20 ప్రపంచకప్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లలో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు యాభైకి పైగా పరుగులు జోడించిన రెండో జంటగా యాన్సెన్‌- స్టబ్స్‌ నిలిచారు.Marco 𝗖𝗟𝗨𝗧𝗖𝗛 Jansen 🔥Entered at 77/5 & played an innings of a lifetime to guide South Africa a fighting total! 🙌ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/CCD0QTflth— Star Sports (@StarSportsIndia) March 4, 2026టీ20 ప్రపంచకప్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లలో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు 50 ప్లస్‌ పార్ట్‌నర్‌షిప్‌ నమోదు చేసిన జోడీలు👉మార్కస్‌ స్టొయినిస్‌- మాథ్యూవేడ్‌ (ఆస్ట్రేలియా) పాకిస్తాన్‌ మీద 2021 సెమీ ఫైనల్లో 81*👉మార్కో యాన్సెన్‌- ట్రిస్టన్‌ స్టబ్స్‌ (సౌతాఫ్రికా) న్యూజిలాండ్‌ మీద 2026 సెమీ ఫైనల్లో 73👉ఏంజెలో మాథ్యూస్‌- కుమార్‌ సంగక్కర (శ్రీలంక) పాకిస్తాన్‌ మీద 2009 ఫైనల్లో 68*👉జార్జ్‌ బెయిలీ- ప్యాట్‌ కమిన్స్‌ (ఆస్ట్రేలియా) వెస్టిండీస్‌ మీద 2012 సెమీ ఫైనల్లో 68👉కార్లోస్‌ బ్రాత్‌వైట్‌- మార్లన్‌ సామ్యూల్స్‌ (వెసి​ండీస్‌) ఇంగ్లండ్‌ మీద 2016 ఫైనల్లో 54*👉మైకేల్‌ హస్సీ- మిచెల్‌ జాన్సన్‌ (ఆస్ట్రేలియా) పాకిస్తాన్‌ మీద 2010 సెమీ ఫైనల్లో 53*169 పరుగులుఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్లో టాస్‌ ఓడిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. మార్కో యాన్సెన్‌ 55 పరుగులతో అజేయంగా నిలవగా.. స్టబ్స్‌ 29 పరుగులు చేశాడు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ 34 పరుగులతో రాణించాడు. చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్‌ బోర్డులో తొలి రాజీనామా

T20 WC 1st Semi Final SA vs NZ: Jansen Fiery Fisty South Africa Score is10
T20 WC: వార్‌ వన్‌సైడ్‌ అనుకుంటే.. ఆఖర్లో దంచికొట్టేశాడే!

న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా మెరుగైన స్కోరు సాధించింది. ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీ జట్టును ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ మెరుపు అర్ధ శతకంతో ఆదుకున్నాడు. ఫలితంగా ప్రొటిస్‌ జట్టు గౌరవప్రదంగా ఇన్నింగ్స్‌ ముగించగలిగింది.టీ20 ప్రపంచకప్‌-2026 తొలి సెమీస్‌ మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతాలో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆది నుంచే కివీస్‌ బౌలర్లు నిప్పులు చెరగడంతో వరుస విరామాల్లో ప్రొటిస్‌ జట్టు వికెట్లు కోల్పోయింది. టాపార్డర్‌ కుదేలుఓపెనర్లు ఐడెన్‌ మార్క్రమ్‌ (18), క్వింటన్‌ డికాక్‌ (10), ర్యాన్‌ రికెల్టన్‌ (0) పూర్తిగా విఫలమయ్యారు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (34) కాసేపు నిలబడగా... డేవిడ్‌ మిల్లర్‌ (6) పూర్తిగా నిరాశపరిచాడు. ఫలితంగా డెబ్బై ఏడు పరుగులకే సౌతాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి తరుణంలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (29)తో కలిసి మార్కో యాన్సెన్‌ భాగస్వామ్యం నిర్మించాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 73 పరుగులు జోడించారు. 27 బంతుల్లో అర్ధ శతకంఇక ఈ మ్యాచ్‌లో యాన్సెన్‌ 27 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఈ టోర్నీలో అతడికి ఇదే తొలి హాఫ్‌ సెంచరీ. లాకీ ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాది యాభై పరుగుల మార్కు అందుకున్నాడు యాన్సెన్‌. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 55 పరుగులతో అజేయంగా నిలిచాడు.Marco 𝗖𝗟𝗨𝗧𝗖𝗛 Jansen 🔥Entered at 77/5 & played an innings of a lifetime to guide South Africa a fighting total! 🙌ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/CCD0QTflth— Star Sports (@StarSportsIndia) March 4, 2026మిగిలిన వారిలో కార్బిన్‌ బాష్‌ రెండు పరుగులు చేయగా.. కగిసో రబడ డకౌట్‌ అయ్యాడు. కేశవ్‌ మహరాజ్‌ ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. హెన్రీ పొదుపుగా బౌలింగ్‌ చేయడంతోకివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, కోల్‌ మెకాంచీ, రచిన్‌ రవీంద్ర తలా రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్‌, జేమ్స్‌ నీషమ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఆఖరి ఓవర్లో హెన్రీ కేవలం ఆరు పరుగులే ఇచ్చి ప్రొటిస్‌ జట్టును నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్‌ బోర్డులో తొలి రాజీనామా

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement