Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Sri Lanka Won Against Ireland T20 World Cup1
టీ20 ప్రపంచకప్: ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం

కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం సాధించింది. 20 పరుగులతో తేడాతో గెలిచేసింది. ఐర్లాండ్ జట్టు చివరివరకు పోరాడినప్పటికీ 143 పరుగులకే ఆలౌటైంది. దీంతో లంక గెలుపు లాంఛనమైంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 54, కమిందు మెండిస్ 44 పరుగులు చేశారు. ఐర్లాండ్ జట్టులో బ్యారీ,జార్జ్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఐర్లాండ్‌కి మంచి ఆరంభం దక్కింది. కానీ వరస విరామాల్లో వికెట్లు వరసగా పడిపోవడంతో 19.5 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది.హ్యారీ టెక్టర్ 40, రాస్ అడైర్ 34 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ, తీక్షణ తలో మూడు వికెట్లు తీయగా.. పతిరాణా 2 వికెట్లు తీశారు.

dasun shanaka bags Most ducks in T20 Internationals2
శ్రీలంక కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌ దసున్‌ షనక ఓ చెత్త రికార్డు విషయంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ‍ప్రపంచకప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 8) ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటైన అతను.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక డకౌట్లైన (113 ఇన్నింగ్స్‌ల్లో 16 సార్లు) ఆటగాడిగా అవతరించాడు. షనకకు ముందు ఈ రికార్డు జప్పి బిమెన్యిమనా (62 ఇన్నింగ్స్‌ల్లో 15) పేరిట ఉండేది. షనక, జప్పి తర్వాతి స్థానాల్లో పాల్‌ స్టిర్లింగ్‌ (158 మ్యాచ్‌ల్లో 14) ఉన్నాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఐర్లాండ్‌ ఆదిలో శ్రీలంక ఆటగాళ్లను బాగానే కట్టడి చేసింది. తొలి 10 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. 16 ఓవర్ల వరకు కూడా పరిస్థితి ఇలాగే కొనసాగింది. ఆ సమయానికి 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆ ఓవర్‌ తర్వాత ఐర్లాండ్‌ బౌలర్లు లయ తప్పారు. అనవసర వైడ్లు, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఫలితంగా చివరి 4 ఓవర్లలో లంక ఆటగాళ్లు 59 పరుగులు పిండుకున్నారు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఐరిష్‌ బౌలర్లలో జార్జియా డాక్రెల్‌ (4-0-17-2) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. మార్క్‌ అదైర్‌ (4-0-33-1), గెరాత్‌ డెలానీ (4-0-24-1) కూడా పర్వాలేదనిపించారు. మాథ్యూ హంఫ్రేస్‌ (4-0-44-0), బ్యారీ మెక్‌ కార్తీ (3-0-40-2) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. లంక ఇన్నింగ్స్‌లో కుసాల్‌ మెండిస్‌ (56 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌ కాగా.. ఆఖర్లో కుసాల్‌ మెండిస్‌ (44) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో నిస్సంక 24, కమిల్‌ మిషారా 14, పవన్‌ రత్నాయకే 5, వెల్లాలగే 10, హసరంగ ఒక్క పరుగు చేయగా.. షనక డకౌటయ్యాడు.

KL Rahul steady fifty vs Mumbai takes Karnataka closer to Ranji Trophy semi final3
రాణించిన కేఎల్‌ రాహుల్‌

ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో కర్ణాటక జట్టు గెలుపు దిశగా పయనిస్తుంది. మరో 212 పరుగులు చేస్తే ఆ జట్టు విజయం సాధిస్తుంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. మరో రోజు ఆట మిగిలి ఉంది. కేఎల్‌ రాహుల్‌ (60) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ సాధించి క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా కరుణ్‌ నాయర్‌ (9) ఉన్నాడు. వీరిద్దరూ క్రీజ్‌లో కుదురుకుంటే కర్ణాటక గెలుపు నల్లేరుమీద నడకే. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (3), ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ దేవదత్‌ పడిక్కల్‌ (39) వికెట్లు కోల్పోయింది. ముంబై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌, తనుశ్‌ కోటియన్‌ తలో వికెట​్‌ తీశారు.అంతకుముందు ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 377 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్‌ ఆనంద్‌ (70) అర్ద సెంచరీతో రాణించగా.. తనుశ్‌ కోటియన్‌ (48 నాటౌట్‌), తుషార్‌ దేశ్‌పాండే (47), ముషీర్‌ ఖాన్‌ (49), యశస్వి జైస్వాల్‌ (36), అఖిల్‌ హెర్వాద్కర్‌ (33), సిద్దేశ్‌ లాడ్‌ (25), సూర్యాంశ్‌ షేడ్గే (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్‌ పాటిల్‌, కావేరప్ప తలో 2, శిఖర్‌ షెట్టి 3, ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ చెరో వికెట్‌ తీశారు.కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు తరఫున మయాంక్‌ అగర్వాల్‌ (92) ఒక్కడే రాణించాడు. మోహిత్‌ అవస్తి, తుషార్‌ దేశ్‌పాండే తలో 4 వికెట్లు తీశారు. దీనికి ముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే చాపచుట్టేసింది.కావేరప్ప, ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ తలో 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బేశారు. ముంబై ఇన్నింగ్స్‌లో అఖిల్‌ హెర్వాద్కర్‌ (60) ఒక్కడే రాణించాడు.

Nepal just miss stunning england in t20 world cup 20264
టీ20 ప్రపంచకప్‌లో తృటిలో మిస్‌ అయిన పెను సంచలనం

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఓ పెను సంచలనం తృటిలో మిస్‌ అయ్యింది. ఇంగ్లండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 8) జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ రెప్పపాటులో ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ పటిష్టమైన ఇంగ్లండ్‌ జట్టును దాదాపుగా ఓడించినంత పని చేసింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన లక్ష్యానికి అతి సమీపంగా వచ్చి, 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. నేపాల్‌ ఓడినా, ఇంగ్లండ్‌ జట్టుకు ముచ్చెమటలు పట్టించిన వైనం క్రికెట్‌ ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌కు ఆది నుంచి మంచి ఆదరణ లభించింది. హాట్‌ ఫేవరెట్‌ ఇంగ్లండే అయినా, వాంఖడే స్టేడియంలోని (ముంబై) ప్రేక్షకులు నేపాల్‌ ఆటగాళ్లకు బ్రహ్మారథం పట్టారు. ఆ జనాలను చూసి, ఇది ఖాట్మండునా (నేపాల్‌ రాజధాని) లేక ముంబైనా అన్న అనుమానం వచ్చింది. ప్రేక్షకులు వేల సంఖ్యలో నేపాల్‌కు మద్దతిచ్చేందుకు తరలివచ్చారు. ఇందుకు నేపాల్‌ ఆటగాళ్లు తగిన న్యాయం చేశారు. వారి అభిమానులకు కావాల్సినంత మజాను అందించారు. ఇంగ్లండ్‌పై దాదాపు గెలిచినంత పని చేశారు. చివరి ఓవర్‌లో ఒక్క బౌండరీ నమోదై ఉంటే నేపాల్‌ పెను సంచలన సృష్టించేదే. 185 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్‌కు చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఈ ఓవర్‌ను సామ్‌ కర్రన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. పర్ఫెక్ట్‌ యార్కర్లు వేసి నేపాల్‌ బ్యాటర్లు కరణ్‌, లోకేశ్‌ బామ్‌ను ఇబ్బంది పెట్టాడు. కర్రన్‌ కట్టడి చేయడంతో నేపాల్‌ ఆ ఓవర్‌లో కేవలం 5 పరుగులే చేయగలిగింది. అప్పటిదాకా మెరుపులు మెరిపించిన లోకేశ్‌ బామ్‌ (20 బంతుల్లో 39 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి ఓవర్‌లో ఏమీ చేయలేకపోయాడు. కర్రన్‌ అతన్ని అద్భుతంగా కట్టడి చేశాడు. చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా.. లోకేశ్‌ సిక్సర్‌ బాది తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందిస్తాడని అంతా అనుకున్నారు. అయితే కర్రన్‌ ముందు లోకేశ్‌ పప్పులు ఉడకలేదు. కర్రన్‌ తన అనుభవాన్నంతా రంగరించి అద్భుతమైన యార్కర్లు సంధించాడు. జోఫ్రా ఆర్చర్‌ వేసిన 18వ ఓవర్‌ నేపాల్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. అప్పటివరకు ఆచితూచి ఆడిన నేపాల్‌ బ్యాటర్లు.. ఆ ఓవర్‌లో చెలరేగిపోయారు. ఆసిఫ్‌ షేక్‌, లోకేశ్‌ బామ్‌ రెండు సిక్సర్లు సహా 22 పరుగులు పిండుకొని ఇంగ్లండ్‌వైపు నుంచి మ్యాచ్‌ను తమవైపు మళ్లించుకున్నారు. ఆతర్వాత 19 ఓవర్‌లోనూ 14 పరుగులు రావడంతో ఇంగ్లండ్‌ శిబిరంలో కలవరం మొదలైంది. పసికూన అయినా, నేపాల్‌ను తక్కువ అంచనా వేయడం తప్పని అప్పుడు వారికి అర్దమైంది. కొంచెం అటుఇటు అయి ఉంటే, ఇంగ్లండ్‌ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చేది. నేపాల్‌ బ్యాటర్లు ఆది నుంచే అద్భుతంగా ఆడారు. ఓపెనర్‌ కుషాల్‌ భుర్టెల్‌ (29) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. దీపేంద్ర సింగ్‌ ఎయిరీ (44), కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (39) మూడో వికెట్‌కు 54 బంతుల్లో 82 పరుగులు జోడించి అప్పుడే ఇంగ్లండ్‌ను భయపెట్టారు. ఆఖర్లో లోకేశ్‌ బామ్‌ ఇంగ్లండ్‌ను కంగారు పెట్టాడు. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ ఓడినా, యావత్‌ క్రికెట్‌ ప్రపంచం అభిమానాన్ని చూరగొంది. అంతకుముందు నేపాల్‌ బౌలింగ్‌లో అంచనాలకు మించి రాణించింది. పటిష్టమైన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను ఇబ్బందులకు గురి చేసింది. జేకబ్‌ బేతెల్‌ (55), హ్యారీ బ్రూక్‌ (53), విల్‌ జాక్స్‌ (39 నాటౌట్‌) సత్తా చాటకపోయుంటే బౌలింగ్‌కు దిగకముందే మ్యాచ్‌ ఓడిపోయి ఉండేది. వారు ముగ్గురు రాణించడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. నందన్‌ యాదవ్‌, దీపేంద్ర సింగ్‌ తలో 2, షేర్‌ మల్లా, సందీప్‌ లామిచ్చేన్‌ చెరో వికెట్‌ తీసి సత్తా చాటారు. నేపాల్‌ తమ తదుపరి మ్యాచ్‌లో (ఫిబ్రవరి 12) ఇటలీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ తప్పక గెలిచే అవకాశం ఉంది.

Fairytale T20 World Cup start for Sher Malla as NEP spinner writes history with first ball wicket vs ENG5
చరిత్ర సృష్టించిన నేపాల్‌ బౌలర్‌

నేపాల్‌ ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌ షేర్‌ మల్లా చరిత్ర సృష్టించాడు. తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలి బంతికే వికెట్‌ తీసి అత్యంత​ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ ఘనతను మల్లా ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో సాధించడం మరింత ప్రత్యేకం. మల్లాకు ముందు కేవలం ఐదుగురు (ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌, ప్రగ్యాన్‌ ఓఝా, పరాస్‌ ఖడ్కా, నదీమ్‌ అహ్మద్‌, ఖుర్రమ్‌ ఖాన్‌) మాత్రమే ప్రపంచకప్‌ టోర్నీలో (కెరీర్‌లో) తొలి బంతికే వికెట్‌ తీశారు. వీరిలోనూ ఓ నేపాల్‌ బౌలర్‌ (పరాస్‌ ఖడ్కా) ఉన్నాడు. మరో ఆసక్తికర విశేషమేమిటంటే.. మల్లాకు ముందు మరో ముగ్గురు (పరాస్‌ ఖడ్కా, ఆరిఫ్‌ షేక్‌, కుశాల్‌ భుర్టెల్‌) నేపాల్‌ ఆటగాళ్లు కూడా కెరీర్‌లో తొలి బంతికే వికెట్‌ తీశారు.కాగా, టీ20 ప్రపంచకప్‌లో నేపాల్‌ ఇవాళ (ఫిబ్రవరి 8) ఆడుతుంది. ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జేకబ్‌ బేతెల్‌ (55), హ్యారీ బ్రూక్‌ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో విల్‌ జాక్స్‌ (38 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగతా ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ఫిల్‌ సాల్ట్‌ 1, జోస్‌ బట్లర్‌ 26, టామ్‌ బాంటన్‌ 2, సామ్‌ కర్రన్‌ 2, జోఫ్రా ఆర్చర్‌ ఒక్క పరుగు చేశారు. నేపాల్‌ బౌలర్లలో నందన్‌ యాదవ్‌, దీపేంద్ర సింగ్‌ ఎయిరీ తలో 2 వికెట్లు తీయగా.. షేర్‌ మల్లా, సందీప్‌ లామిచ్చేన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. మల్లా తొలి వికెట్‌ ఫిల్‌ సాల్ట్‌.అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్‌ 7 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. భుర్టెల్‌ (29), ఆసిఫ్‌ షేక్‌ (7) ఔట్‌ కాగా.. రోహిత్‌ పౌడెల్‌ (10), దీపేంద్ర సింగ్‌ (10) క్రీజ్‌లో ఉన్నారు. డాసన్‌, జాక్స్‌ తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ గెలవాలంటే మరో 78 బంతుల్లో 125 పరుగులు చేయాలి.

India opener down with fever ahead of T20 World Cup match vs Namibia6
టీమిండియా స్టార్‌ ఆటగాడికి అస్వస్థత

టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న టీమిండియాను జ్వరాల పీడ వేధిస్తుంది. తొలుత బుమ్రా.. తాజాగా అభిషేక్‌ శర్మ వైరల్‌ ఫీవర్‌ బారిన పడ్డారు. జ్వరం కారణంగా బుమ్రా యూఎస్‌ఏతో మ్యాచ్‌కు దూరం కాగా.. అభిషేక్‌ నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యేలా ఉన్నాడు. అభిషేక్‌కు జ్వరంతో పాటు కడుపు నొప్పి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నమీబియాతో మ్యాచ్‌ ఫిబ్రవరి 12న జరగాల్సి ఉంది. ఆ సమయానికి అభిషేక్‌ కోలుకుంటాడో లేదో చూడాలి.కాగా, నిన్న యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ జ్వరంతోనే బాధపడుతూనే బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో అతను దారుణంగా విఫలమయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు. అయితే కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (84 నాటౌట్‌) రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. స్కై మినహా భారత ఇన్నింగ్స్‌లో మిగతా వారంతా విఫలమయ్యారు. తిలక్‌ వర్మ (25), ఇషాన్‌ కిషన్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అభిషేక్‌ శర్మ, శివమ్‌ దూబే, వరుణ్‌ చక్రవర్తి డకౌట్లు అయ్యారు. రింకూ సింగ్‌ 6, హార్దిక్‌ పాండ్యా 5,అక్షర్‌ పటేల్‌ 14చ, అర్షదీప్‌ సింగ్‌ 4 పరుగులు చేశారు. యూఎస్‌ఏ బౌలర్లలో వాన్‌ స్కాల్విక్‌ 4, హర్మీత్‌ సింగ్‌ 2, మొహమ్మద్‌ మొహిసిన్‌, అలీ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం 162 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ తడబడింది. సిరాజ్‌ (4-0-29-3), అర్షదీప్‌ సింగ్‌ (4-0-18-2), అక్షర్‌ పటేల్‌ (4-0-24-2), వరుణ్‌ చక్రవర్తి (4-0-24-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమై, 24 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో సంజయ్‌ కృష్ణమూర్తి, శుభమ్‌ రంజనే తలో 37 పరుగులు చేసి టాప్‌ స్కోరర్లుగా నిలవగా.. మిలింద్‌ కుమార్‌ 34 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో అండ్రియస్‌ గౌస్‌ 6, సాయితేజ ముక్కామల 2, మొహిసిన్‌ ఖాన్‌ 8, స్కాల్విక్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేయగా.. మోనాంక్‌ పటేల్‌, హర్మీత్‌ సింగ్‌ డకౌట్లయ్యారు.

T20 World Cup: India vs Pakistan likely to go ahead after ICC, PCB talks7
క్రికెట్‌ అభిమానులకు శుభవార్త

క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్తాన్‌ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌పై అనిశ్చితి తొలిగిపోయేలా ఉంది. తొలుత పాక్‌ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేసున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ జోక్యంతో పాక్‌ క్రికెట్‌ బోర్డు ఈ మ్యాచ్‌ ఆడేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ ప్రతినిధులు ఇమ్రాన్ ఖవాజా, ముబషిర్ ఉస్మానీ పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీతో లాహోర్‌లో చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత పీసీబీ కొన్ని షరతులపై భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు అంగీకరించినట్లు సమాచారం​.కాగా, గత కొద్ది రోజులుగా భారత్‌-పాక్‌ ప్రపంచకప్‌ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ నుంచి బంగ్లాదేశ్‌ బహిష్కరణకు నిరసనగా పాక్‌ ప్రభుత్వం భారత్‌తో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఆడకూడదని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్‌ రద్దైతే ఐసీసీ సహా ప్రపంచకప్‌ బ్రాడ్‌కాస్టర్లు తీవ్రంగా నష్టపోయేవారు. ఇ​ందుకు ప్రతిగా ఐసీసీ పీసీబీపై కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశాలు ఉండేవి. చివరికి ఐసీసీ ప్రతినిధుల మధ్యవర్తిత్వంతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు తెలుస్తుంది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరగాల్సి ఉంది.ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో భారత్‌, పాక్‌, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌ తలో మ్యాచ్‌ గెలిచాయి. భారత్‌ యూఎస్‌ఏపై, పాక్‌ నెదర్లాండ్స్‌పై, వెస్టిండీస్‌ స్కాట్లాండ్‌పై, న్యూజిలాండ్‌ ఆఫ్ఘనిస్తాన్‌పై విజయాలు సాధించాయి.

Suryakumar Yadav has most Player of the match award for India in T20 History8
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌.. విరాట్‌ కోహ్లి రికార్డు బద్దలు

భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చరిత్ర సృష్టించాడు. నిన్న (ఫిబ్రవరి 7) యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికైన అతను.. భారత టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా విరాట్‌ కోహ్లి రికార్డు బద్దలు కొట్టాడు. విరాట్‌ 125 మ్యాచ్‌ల్లో 16 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలిస్తే.. స్కై కేవలం​ 105 మ్యాచ్‌ల్లోనే 17 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలిచాడు. ఈ జాబితాలో స్కై, విరాట్‌ తర్వాతి స్థానంలో రోహిత్‌ శర్మ (159 మ్యాచ్‌ల్లో 14) ఉన్నాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలిచిన ఘనత మలేషియాకు చెందిన విరన్‌దీప్‌ సింగ్‌కు (22) దక్కుతుంది. విరన్‌దీప్‌ తర్వాతి స్థానాల్లో సికందర్‌ రజా (19), సూర్యకుమార్‌ (17) ఉన్నారు.మ్యాచ్‌ విషయానికొస్తే.. నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 84 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. స్కై మినహా భారత ఇన్నింగ్స్‌లో మిగతా వారంతా విఫలమయ్యారు. తిలక్‌ వర్మ (25), ఇషాన్‌ కిషన్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అభిషేక్‌ శర్మ, శివమ్‌ దూబే, వరుణ్‌ చక్రవర్తి డకౌట్లు అయ్యారు. రింకూ సింగ్‌ 6, హార్దిక్‌ పాండ్యా 5,అక్షర్‌ పటేల్‌ 14చ, అర్షదీప్‌ సింగ్‌ 4 పరుగులు చేశారు. యూఎస్‌ఏ బౌలర్లలో వాన్‌ స్కాల్విక్‌ 4, హర్మీత్‌ సింగ్‌ 2, మొహమ్మద్‌ మొహిసిన్‌, అలీ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం 162 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ తడబడింది. సిరాజ్‌ (4-0-29-3), అర్షదీప్‌ సింగ్‌ (4-0-18-2), అక్షర్‌ పటేల్‌ (4-0-24-2), వరుణ్‌ చక్రవర్తి (4-0-24-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో సంజయ్‌ కృష్ణమూర్తి, శుభమ్‌ రంజనే తలో 37 పరుగులు చేసి టాప్‌ స్కోరర్లుగా నిలవగా.. మిలింద్‌ కుమార్‌ 34 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో అండ్రియస్‌ గౌస్‌ 6, సాయితేజ ముక్కామల 2, మొహిసిన్‌ ఖాన్‌ 8, స్కాల్విక్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేయగా.. మోనాంక్‌ పటేల్‌, హర్మీత్‌ సింగ్‌ డకౌట్లయ్యారు.

T20 WC 2026: new zealand beat afghanistan by 5 wickets9
ఆఫ్ఘనిస్తాన్‌పై న్యూజిలాండ్‌ ఘన విజయం

టీ20 ప్రపంచకప్‌ 2026లో న్యూజిలాండ్‌ ఘనంగా బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 8) ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. న్యూజిలాండ్‌ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో గుల్బదిన్‌ నైబ్‌ (63) టాప్‌ స్కోరర్‌ కాగా.. రహానుల్లా గుర్బాజ్‌ 27, ఇబ్రహీం జద్రాన్‌ 10, సెదిఖుల్లా అటల్‌ 29, దర్విష్‌ రసూల్‌ 20, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 14, మొహమ్మద్‌ నబీ 10 (నాటౌట్‌) పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్‌ 2, రచిన్‌ రవీంద్ర, మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ తలో వికెట్‌ తీశారు.న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో టిమ్‌ సీఫర్ట్‌ 65 పరుగులతో సత్తా చాటగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ 42, మార్క్‌ చాప్‌మన్‌ 28, డారిల్‌ మిచెల్‌ 25 (నాటౌట్‌), మిచెల్‌ సాంట్నర్‌ 17 (నాటౌట్‌), ఫిన్‌ అలెన్‌ ఒక పరుగు చేశారు. రచిన్‌ రవీంద్ర గోల్డెన్‌ డకౌటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో ముజీబ్‌ రహ్మాన్‌ 2, ఒమర్‌జాయ్‌, రషీద్‌ ఖాన్‌, నబీ తలో వికెట్‌ తీశారు.

hyderabad batsman aaron george under 19 world cup hero10
అండర్‌–19 క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలుపులో నగర కుర్రోడు

మల్లాపూర్‌/కాప్రా: హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌కు ప్రత్యేకమైన మణికట్టు మాయాజాలంతో పరుగులు సాధించి.. భారత జట్టు అండర్‌ 19 ప్రపంచ కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు నగరానికి చెందిన కుర్రాడు అరోన్‌ జార్జి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా డ్రైవ్‌లు కొడుతూ.. అంతకుమించిన స్ట్రోక్‌ ప్లేతో అలరిస్తూ.. టైమింగ్‌లో మైమరిపిస్తూ.. ఫ్లిక్‌లతో కట్టిపడేస్తూ.. హైదరాబాద్‌ క్రికెట్‌ స్టయిల్‌ను ప్రపంచానికి చాటాడు. బిహార్‌కు చెందిన మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీతో కలిసి టీమ్‌ఇండియా జగజ్జేతగా నిలవడంలో తనవంతు బాధ్యత నెరవేర్చాడు. బంతిని అడ్డంగా బాదేసే ఈ టి20ల కాలంలో.. క్లాస్‌ బ్యాటింగ్‌తో అరోన్‌ అదరహో అనిపించాడు. మన మల్లాపూర్‌ వాడే.. అరుదైన రికార్డు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్‌లో నివసిస్తోంది అరోన్‌ జార్జి కుటుంబం. తల్లిదండ్రులు ఇసో వర్గీస్, ప్రీతీ వర్గీస్‌. కేరళకు చెందినవారైనా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అరోన్‌ అండర్‌–19 హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌ కూడా. ప్రపంచ కప్‌లో అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో క్లిష్ట పరిస్థితుల్లో అరోన్‌ సెంచరీ (115) బాది జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (118)పైనా సెంచరీ కొట్టాడు. స్కాట్లాండ్‌పై 61 పరుగుల చక్కని ఇన్నింగ్స్‌ ఆడాడు. నగరం నుంచి అంబటి రాయుడు, తిలక్‌ వర్మ వంటి మేటి బ్యాటర్లు అండర్‌–19 క్రికెట్‌లో సెంచరీలు కొట్టినా.. ప్రపంచకప్‌లో మాత్రం ఆ ఘనతను అందుకోలేదు. ఇప్పుడు అరోన్‌ ఏకంగా రెండు సెంచరీలు కొట్టి.. టి20 ప్రపంచకప్‌లో సెంచరీలు బాదిన తొలి హైదరాబాదీగా రికార్డులకెక్కాడు. అరోన్‌ ప్రస్తుతం సైనిక్‌పురి భవన్స్‌ కాలేజీలో బీకాం (ఫైనాన్స్‌) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో 2014–17 వరకు ఉచిత శిక్షణ పొందాడు. తార్నాకలోని అకాడమీలో ఆ తర్వాత మూడేళ్లు శిక్షణ తీసుకున్నాడు. సంగీత్‌ చౌరస్తాలోని అకాడమీలో గత ఏడాది వరకు ప్రాక్టీస్‌ చేశాడు. టీమ్‌ఇండియా మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ పర్యవేక్షణలో కోచింగ్‌ తీసుకున్నాడు. ‘సాక్షి’తో తల్లిదండ్రుల సంతోషం తండ్రి ఈసో వర్గీస్‌ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి. తల్లి ప్రీతి.. తమ కుమారుడు సాధించిన ఘనతను ‘సాక్షి’తో పంచుకున్నారు. అఫ్ఘాన్‌పై తమ కుమారుడి సెంచరీని చూసి అంతులేని సంతోషం కలిగిందని తెలిపారు. భవిష్యత్‌లో జాతీయ జట్టుకు ఆడాలనేది అరోన్‌ లక్ష్యంగా వివరించారు. కాగా, ఆదివారం సాయంత్రం శంషాబాద్‌ రానున్న అరోన్‌కు ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్వాగతం పలకనున్నారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement