Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

That Didnt Work Out Vs GT Excited for Playing Against SRH: Shreyas Iyer1
ఇక్కడ ఓడినా.. SRHపై గెలుస్తాం: శ్రేయస్‌ అయ్యర్‌

గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో పరాజయంపై పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్పందించాడు. అహ్మదాబాద్‌ పిచ్‌ బ్యాటర్లకు ఆరంభంలో అంతగా అనుకూలించకపోయినా.. తాము మెరుగైన స్కోరు సాధించడం సంతోషమన్నాడు. ఏదేమైనా క్రెడిట్‌ గుజరాత్‌ బౌలర్లకు దక్కుతుందని.. వాళ్లు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. 163 పరుగులుసొంతమైదానంలో ఆదివారం జరిగిన పోరులో మాజీ చాంపియన్‌ గుజరాత్‌ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. సీజన్‌ ఆరంభంలో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో పరాజయం ఎరగకుండా సాగిన పంజాబ్‌కిది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది.టాపార్డర్‌ విఫలం కాగా... సూర్యాంశ్‌ (29 బంతుల్లో 57; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా... స్టొయినిస్‌ (31 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్‌) విలువైన పరుగులు చేశాడు. 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో ఈ జంట ఆరో వికెట్‌కు 44 బంతుల్లో 79 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హోల్డర్‌ 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... సిరాజ్, రబాడ చెరో 2 వికెట్లు తీశారు.సాయి సుదర్శన్‌ అర్ధశతకంఅనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (41 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకంతో ఆకట్టుకోగా... వాషింగ్టన్‌ సుందర్‌ (23 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్, వైశాక్‌ చెరో 2 వికెట్లు తీశారు.సిరాజ్‌ తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు... ఈ సీజన్‌లో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌... తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లతో పంజాబ్‌ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికి బతికిపోయిన ప్రియాన్ష్‌ ఆర్య (2) రెండో బంతికి అవుట్‌ కాగా... తదుపరి బంతికి కూపర్‌ (0) పెవిలియన్‌ బాట పట్టాడు. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (15) ఎక్కువసేపు నిలవలేకపోగా... నేహల్‌ వధేరా (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (19) కూడా అవుటవ్వడంతో పంజాబ్‌ జట్టు 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో స్టొయినిస్‌తో కలిసి సూర్యాంశ్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మానవ్‌ సుతార్‌ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో సూర్యాంశ్‌ వరుసగా 6, 6, 4, 4, 6 కొట్టడంతో 27 పరుగులు వచ్చాయి.ఇక కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో మరోసారి గుజరాత్‌ బౌలర్లు విజృంభించడంతో పంజాబ్‌ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆశించిన స్కోరు సాధించలేకపోయింది. స్టొయినిస్, బార్ట్‌లెట్‌ (0)ను వరుస బంతుల్లో అవుట్‌ చేసిన హోల్డర్‌ పంజాబ్‌ను కట్టడి చేశాడు.చక్కగా ఉపయోగించుకున్నారుఈ నేపథ్యంలో పంజాబ్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వికెట్‌ మీద మేము ఈ మేరకు స్కోరు చేయడం వ్యక్తిగతంగా గొప్ప విషయంగానే భావిస్తున్నా. ముఖ్యంగా కొత్త బంతితో వాళ్లు అటాక్‌ చేస్తున్న వేళ మేము మెరుగైన ఆరంభమే అందుకున్నాం. అయితే, గుజరాత్‌ బౌలర్లు ఈ వికెట్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు.సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు సంధించారు. పవర్‌ ప్లేలో మేము వరుసగా వికెట్లు కోల్పోయాము. అయినా పుంజుకోగలిగాము. మా బౌలర్లు కూడా మెరుగ్గా ఆడారు. కానీ ఈరోజు మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయాము. గెలవాలనే ఇక్కడికి వచ్చాము. అయితే, పని పూర్తి చేయలేకపోయాము.SRHపై గెలుస్తాంతదుపరి ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నాం. కచ్చితంగా ఆ జట్టుపై గెలిచి మరో రెండు పాయింట్లు మా ఖాతాలో జమ చేసుకుంటాము’’ అని పేర్కొన్నాడు. కాగా పంజాబ్‌ కింగ్స్‌ హైదరాబాద్‌ వేదికగా బుధవారం సన్‌రైజర్స్‌తో తలపడనుంది. కాగా పంజాబ్‌ ఇప్పటికి తొమ్మిదింట ఏడు విజయాలతో పట్టికలో టాప్‌లో ఉండగా.. సన్‌రైజర్స్‌ పదింట ఆరు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: నా వల్లే ఓటమి.. భారీ మూల్యమే చెల్లించాం: కమిన్స్‌

Jannik Sinner Breaks World Record, Becomes First Player In History To2
చరిత్ర సృష్టించాడు!

మాడ్రిడ్‌: పురుషుల టెన్నిస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ అద్భుతం చేశాడు. గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సాధించాడు. గ్రాండ్‌స్లామ్‌ తర్వాత అగ్రశ్రేణి టోర్నీలుగా పరిగణించే ‘మాస్టర్స్‌’ సిరీస్‌లో సినెర్‌ వరుసగా ఐదో టైటిల్‌ గెలిచాడు. ఆదివారం ముగిసిన మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో సినెర్‌ విజేతగా నిలిచాడు. ప్రపంచ 3వ ర్యాంకర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో జరిగిన ఫైనల్లో సినెర్‌ 6–1, 6–2తో అలవోకగా విజయం సాధించాడు.తద్వారా 36 ఏళ్ల చరిత్ర కలిగిన మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీల్లో వరుసగా ఐదు టైటిల్స్‌ గెలిచిన తొలి ప్లేయర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో మూడుసార్లు జొకోవిచ్‌ (సెర్బియా), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ఒకసారి వరుసగా నాలుగు మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ సాధించారు. గత ఏడాది పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ గెలిచిన సినెర్‌... ఈ ఏడాది మోంటెకార్లో, మయామి, ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోరీ్నల్లో విజేతగా నిలిచాడు. చాంపియన్‌ సినెర్‌కు 10,07,165 యూరోల (రూ. 11 కోట్ల 21 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Rajasthan Royals In Legal Trouble As New Deal Could Head To Court: Report3
మిట్టల్‌ చేతికి రాజస్తాన్‌ రాయల్స్‌.. భారీ ట్విస్ట్‌!

రాజస్తాన్‌ రాయల్స్‌ అమ్మకం విషయంలో భారీ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. అమెరికా వ్యాపారవేత్త కాల్‌ సోమాని కన్సార్టియం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)తో చట్టపరమైన యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.సంచలన ప్రకటనకాగా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ అమ్మకానికి రాగా.. కాల్‌ సోమాని కన్సార్టియం దీనిని కొనుగోలు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్య రీతిలో ఆదివారం సంచలన ప్రకటన వచ్చింది. తాము ఈ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసినట్లు మిట్టల్‌ కుటుంబం ప్రకటించింది.లక్ష్మీ మిట్టల్, ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్, అదర్‌ పూనావాలాతో కలిసి 165 కోట్ల డాలర్ల (రూ. 15,660 కోట్లు) బిడ్‌తో రాయల్స్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నారు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీతో పాటు... వేర్వేరు లీగ్‌ల్లో పార్ల్‌ రాయల్స్, బార్బడోస్‌ రాయల్స్‌ జట్లు కూడా మిట్టల్‌ సొంతం అయ్యాయి. అయితే, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్, బీసీసీఐ పాలక మండలి ఆమోదం అనంతరమే ఈ లావాదేవీ పూర్తి కానుంది.మరో మూడు నెలలుఈ ప్రక్రియ ముగియడానికి మరో మూడు నెలలు పట్టొచ్చని సమాచారం. ‘మనోజ్‌ బదాలే కన్సార్టియం నుంచి అదర్‌ పూనావాలా భాగస్వామ్యంతో రాజస్తాన్‌ రాయల్స్‌ను కొనుగోలు చేసుకోవడానికి ఒప్పందం కుదిరింది’ అని మిట్టల్‌ కుటుంబం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వివరాల ప్రకారం రాయల్స్‌ జట్టులో మిట్టల్‌ కుటుంబం 75 శాతం వాటా కలిగి ఉంటుంది. పూనావాలా 18 శాతం వాటా కలిగి ఉంటారు. మిగిలిన 7 శాతం వాటాలో పాత యజమాని మనోజ్‌ బదాలేతో పాటు ఇతర పెట్టుబడిదారులు ఉంటారు. దీంతో రాయల్స్‌ బోర్డులో లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మిట్టల్, వనిషా మిట్టల్‌–భాటియా, అదర్‌ పూనావాలా, మనోజ్‌ బదాలే సభ్యులుగా ఉంటారు.ఇక రాజస్తాన్‌ సాదుల్‌పూర్‌లో జన్మించిన లక్ష్మీ మిట్టల్‌ మాట్లాడుతూ... ‘నాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. మా కుటుంబం రాజస్తాన్‌కు చెందింది. అందుకే వాటా కొనుగోలు చేసేందుకు రాజస్తాన్‌ రాయల్స్‌ కంటే మంచి జట్టు లేదనిపించింది’ అని అన్నారు.లీగల్‌ లెటర్‌ పంపించబోతున్నాముఈ నేపథ్యంలో కాల్‌ సోమాని సన్నిహిత వర్గాలు స్పందించాయి. క్రిక్‌బజ్‌ కథనం ప్రకారం.. సోమాని కన్సార్టియం ఈ అంశం మీద చట్టపరంగా ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ‘‘అమెరికాలోని మా లీగల్‌, PR (పబ్లిక్‌ రిలేషన్స్‌) టీమ్స్‌ ఈ విషయంపై కసరత్తు చేస్తున్నాయి.లీగల్‌ లెటర్‌ పంపించబోతున్నాము. సోమాని కన్సార్టియంలో వాల్టన్‌, హాంప్‌ వంటి ‍ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి. అందరూ అనుకుంటున్నట్లు డబ్బు ఇక్కడ అసలు సమస్యే కాదు. ఏం జరిగిందో తెలియదు. చర్చలు సజావుగానే సాగినా ఇలాంటి పరిణామం ఎదురైంది.ఈ విషయంలో మాకెన్నో సందేహాలు ఉన్నాయి. బీసీసీఐకి చెల్లింపులు నిజంగానే బకాయి పడ్డాయా?.. చట్టపరంగా మాకున్న అవకాశాలు ఏమిటి? అన్న విషయాలు పరిశీలిస్తున్నాం. మా మదిలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. కావాలనే చెల్లింపుల విషయంలో వాళ్లు (బోర్డు) ఆలస్యం చేశారనిపిస్తోంది. మేము సిద్ధంగా ఉన్న వాళ్ల నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇప్పుడేమో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోంది. మేము అంతర్గతంగా ఈ సమస్యని పరిష్కరించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: నా వల్లే ఓటమి.. భారీ మూల్యమే చెల్లించాం: కమిన్స్‌

IND A vs ENG A: BCCI Announce Squad Harleen, Anushka Sharma To Lead4
IND A vs ENG A: భారత జట్టు ప్రకటన

ముంబై: ఇంగ్లండ్‌ మహిళల ‘ఎ’ జట్టుతో ఈ ఏడాది జూన్‌–జూలైలలో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లలో పాల్గొనే భారత మహిళల ‘ఎ’ జట్లను ప్రకటించారు. భారత వన్డే, టీ20 ‘ఎ’ జట్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మీడియం పేస్‌ బౌలర్‌ షబ్నమ్‌ షకీల్‌కు చోటు లభించింది. భారత వన్డే ‘ఎ’ జట్టుకు హర్లీన్‌ డియోల్‌... భారత టీ20 ‘ఎ’ జట్టుకు అనుష్క శర్మ నాయకత్వం వహిస్తారు.ఇంగ్లండ్‌ ‘ఎ’ జట్టుతో నార్తంప్టన్‌లో జూన్‌ 20న, 23న తొలి రెండు టీ20లు... చెమ్స్‌ఫోర్డ్‌లో జూన్‌25న మూడో టీ20 జరుగుతుంది. అనంతరం జూన్‌ 28న హోవ్‌లో తొలి వన్డేను... జూలై 1న, జూలై 4న టౌన్‌టన్‌లో మిగతా రెండు వన్డేలను నిర్వహిస్తారు. భారత ‘ఎ’ టీ20 జట్టు: అనుష్క శర్మ (కెప్టెన్‌), వృందా, కమలిని, ఉమా ఛెత్రి, వైష్ణవి శర్మ, ప్రేమ రావత్, పూర్వజ వర్లేకర్, జింతిమణి కలిత, సైమా ఠాకూర్, సిమ్రన్, శ్వేత సెహ్రావత్, దియా యాదవ్, మిన్ను మణి, షబ్నమ్‌ షకీల్, తనూజ కన్వర్‌. భారత ‘ఎ’ వన్డే జట్టు: హర్లీన్‌ డియోల్‌ (కెప్టెన్‌), ప్రతిక రావల్, ప్రియా పూనియా, తనీషా సింగ్, కమలిని, ఉమా ఛెత్రి, తేజల్‌ హసబి్నస్, నికీ ప్రసాద్, ప్రేమ రావత్, తనూజ కన్వర్, వైష్ణవి శర్మ, షబ్నమ్‌ షకీల్, సయాలీ సత్‌ఘరే, జింతిమణి కలిత, సైమా ఠాకూర్‌.చదవండి: నా వల్లే ఓటమి.. భారీ మూల్యమే చెల్లించాం: కమిన్స్‌

My over costing 27 Made Difference: SRH Captain Cummins Blunt Confession5
నా వల్లే ఓటమి.. భారీ మూల్యమే చెల్లించాం: కమిన్స్‌

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో పరాజయంపై సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ స్పందించాడు. తాము శుభారంభం అందుకున్నా.. దానిని కొనసాగించలేకపోవడం తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. కనీసం 180 పరుగులు స్కోరు చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నాడు. ఐపీఎల్‌-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జోరుకు బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే.హెడ్‌ మెరుపు అర్ధ సెంచరీ సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో బలహీన కేకేఆర్‌ చేతిలో జట్టు అనూహ్యంగా ఓటమిపాలైంది. ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన పోరులో కేకేఆర్‌ 7 వికెట్ల తేడాతో రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ 19 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ (28 బంతుల్లో 61; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు.మిగిలిన వారిలో ఇషాన్‌ కిషన్‌ (29 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా.. మిగతావాళ్లంతా చేతులెత్తేశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వరుణ్‌ చక్రవర్తికి 3 వికెట్లు దక్కాయి. నరైన్, కార్తీక్‌ త్యాగి 2 వికెట్ల చొప్పున తీశారు. అనంతరం కోల్‌కతా 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అంగ్‌కృష్‌ రఘువంశీ (47 బంతుల్లో 59; 5 ఫోర్లు, 2 సిక్స్‌) హాఫ్‌ సెంచరీ చేశాడు. కెప్టెన్‌ అజింక్య రహానే (36 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.ఏకంగా 47 పరుగులు సమర్పించుకుని..సన్‌రైజర్స్‌ బౌలర్లలో సాకిబ్‌ హుసేన్‌ మెరుగ్గా బౌలింగ్‌ చేశాడు. మూడు ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. మిగిలిన వారిలో శివాంగ్‌ 4 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీయగా.. ఎషాన్‌ మలింగ, కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు.కమిన్స్‌ నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 47 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్‌ తీయగా.. ఎషాన్‌ 3.2 ఓవర్లోలనే 42 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కమిన్స్‌ (Pat Cummins) మాట్లాడుతూ.. తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేనన్నాడు.తప్పంతా నాదే.. ఓటమికి కారణం నేనే!‘‘ఈరోజు మాది కాదు. మేము శుభారంభం అందుకున్నప్పటికీ దానిని కొనసాగించలేకపోయాము. కనీసం 180- 200 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేది. కనీసం 180 పరుగులైనా స్కోరు చేస్తామనుకున్నాను.మా ఇన్నింగ్స్ ద్వితీయార్థ భాగం చప్పగా సాగింది. ఇందులో నేను కూడా భాగమే. ఏదేమైనా వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలవడం మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈరోజు కూడా మా బౌలర్లు మెరుగ్గా రాణించడం సానుకూలాంశం. నాలుగో ఓవర్లో నేను ఏకంగా 27 పరుగులు ఇవ్వడం మాత్రం తీవ్ర ప్రభావం చూపింది. దీని కారణంగా మేము భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. చిన్న చిన్న తప్పిదాలే తీవ్ర ప్రభావం చూపుతాయి’’ అని కమిన్స్‌ నిరాశ వ్యక్తం చేశాడు. ఓటమికి తానే కారణమని పరోక్షంగా వెల్లడిస్తూ తప్పు తన మీద వేసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కమిన్స్‌ 8 బంతుల్లో 10 పరుగులు చేశాడు.చదవండి: ‘భారీ’ ధరకు అమ్ముడుపోయిన అర్జున్‌ టెండుల్కర్‌Pat Cummins turns the corner 👏🎥 27 runs off the over but the #SRH skipper comes back with a wicket 👊Finn Allen departs! Updates ▶️ https://t.co/muersQO7at#TATAIPL | #KhelBindaas | #SRHvKKR | @SunRisers pic.twitter.com/Aicconk2N8— IndianPremierLeague (@IPL) May 3, 2026

IPL 2026, Match 46: Gujarat Titans beat Punjab Kings6
పోరాడి ఓడిన పంజాబ్‌.. గుజరాత్‌ను గెలిపించిన సుందర్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 3) రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై గుజరాత్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో మరో బంతి మాత్రమే మిగిలుండగా వాషింగ్టన్‌ సుందర్‌ (40 నాటౌట్‌) సిక్సర్‌ బాది గుజరాత్‌ను గెలిపించాడు. అంతకుముందు సాయి సుదర్శన్‌ (57) అర్ద సెంచరీతో రాణించి, గెలుపుకు పునాది వేశాడు. అయితే గుజరాత్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. దీంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ చివ​రి ఓవర్‌ వరకు సాగింది. ఈ మధ్యలో పం​జాబ్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. బార్ట్‌లెట్‌ (4-0-38-2), అర్షదీప్‌ సింగ్‌ (4-0-24-2), జన్సెన్‌ (4-0-33-1), విజయ్‌ కుమార్‌ (4-0-31-2) తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆఖరి ఓవర్‌ వేసిన స్టోయినిస్‌ (2.5-0-26-1) లక్ష్యాన్ని కాపాడలేకపోయాడు. ఈ ఓవర్‌లో ఓ ఫోర్‌, ఓ సిక్సర్‌ వచ్చింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (5), నిషాంత్‌ సంధు (15), తెవాతియా (2), హోల్డర్‌ (2) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. బట్లర్‌ (26) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. ఆఖరి ఓవర్‌ తొలి బంతికి అర్షద్‌ ఖాన్‌ (8 నాటౌట్‌) బౌండరీ బాది లక్ష్యానికి చేరువ చేశాడు.అంతకుముందు పంజాబ్‌ పడుతూ లేస్తూ చివరికి గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. సూర్యాంశ్‌ షేడ్గే (57), మార్కస్‌ స్టోయినిస్‌ (40), ఆఖర్లో మార్కో జన్సెన్‌ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ (4-0-24-4) పంజాబ్‌ను భారీ దెబ్బకొట్టాడు. తొలుత సిరాజ్‌ (4-0-28-2), రబాడ (4-1-22-2) కూడా పంజాబ్‌ను కష్టాల్లోకి నెట్టారు. మిగతా బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ (4-0-32-1) పర్వాలేదనిపించగా.. మానవ్‌ సుతార్‌ (1-0-27-0), అర్షద్‌ ఖాన్‌ (3-0-29-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్‌ ఆర్మ 2, ప్రభ్‌సిమ్రన్‌ 15, కూపర్‌ కన్నోల్లీ డకౌట్‌, శ్రేయస్‌ అయ్యర్‌ 19, నేహల్‌ వధేరా, జేవియర్‌ బార్ట్‌లెట్‌ డకౌటయ్యారు. విజయ్‌ కుమార్‌, అర్షదీప్‌ తలో పరుగుతో అజేయంగా నిలిచారు.

Foot fracture rules Ramakrishna Ghosh out of IPL 20267
సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీజన్‌ ప్రారంభానికి ముందు నుంచే వేధిస్తున్న గాయాల సమస్య ఆ జట్టును మరోసారి గట్టి దెబ్బేసింది. గత మ్యాచ్‌లోనే (ముంబై ఇండియన్స్‌) అరంగేట్రం చేసిన ఆల్‌రౌండర్‌ రామకృష్ణ ఘోష్‌ తన తొలి మ్యాచ్‌లోనే గాయపడి సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఘోష్‌ కుడి పాదానికి ఫ్రాక్చర్‌ అయ్యింది.ఘోష్‌ సీజన్‌ మొత్తానికి దూరమైన విషయాన్ని సీఎస్‌కే యాజమాన్యం​ అధికారికంగా ప్రకటించింది. ఘోష్‌ తన తొలి మ్యాచ్‌లోనే ఓ మోస్తరు ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి కీలకమైన సూర్యకుమార్‌ యాదవ్‌ వికెట్‌ తీశాడు. ఈ వికెట్‌కు ముందే ఘోష్‌ అందరి మన్ననలు అందుకున్నాడు. విల్‌ జాక్స్‌ను ఔట్‌ చేయడానికి అతను పట్టిన అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.వాస్తవానికి ఘోష్‌ తన తొలి బంతికే గాయపడ్డాడు. ఫాలో త్రూలో అతని కాలు మెలిక పడినట్లు క్లియర్‌గా తెలిసింది. అయినా అతను మరో 17 బంతులు బౌలింగ్‌ చేశాడు. 20 ఓవర్ల పాటు ఫీల్డింగ్‌ కూడా చేశాడు. తొలి మ్యాచ్‌లోనే మంచి ఇంప్రెషన్‌ తెచ్చుకున్న ఘోష్‌ అదే మ్యాచ్‌లో గాయపడటం దురదృష్టకరం.ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ముంబైపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపు అనంతరం కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఘోష్‌పై ప్రశంసలు కురిపించాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లోనూ మంచి సామర్థ్యం చూపించాడని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌ చేసి ముంబైను 159 పరుగులకే కట్టడి చేసిన సీఎస్‌కే, ఆతర్వాత లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. బౌలింగ్‌లో అన్షుల్‌ కంబోజ్‌ (4-0-32-3), నూర్‌ అహ్మద్‌ (4-0-26-2), జేమీ ఓవర్టన్‌ (4-0-23-1) రాణించగా.. బ్యాటింగ్‌లో రుతురాజ్‌ (67 నాటౌట్‌), కార్తీక్‌ శర్మ (54 నాటౌట్‌) సత్తా చాటారు.గాయాల శాపంఈ సీజన్‌లో సీఎస్‌కేకు గాయాల శాపం వెంటాడుతోంది. ఇప్పటికే ఖలీల్ అహ్మద్, అయుష్ మాత్రే, నాథన్ ఎల్లిస్ వంటి ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఈ జట్టు దిగ్గజం ధోని కాలి కండరాల గాయంతో సతమతమవుతూ ఇంకా బరిలోకి దిగలేదు. ప్రస్తుతం రామకృష్ణ ఘోష్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సీఎస్‌కే త్వరలోనే ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం సీఎస్‌కే 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

Shubman Gill Breaks Silence On His Marriage Intentions8
పెళ్లిపై నిశ్శబ్దం వీడిన శుభ్‌మన్‌ గిల్‌

టీమిండియా టెస్ట్‌, వన్డే.. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ అయిన శుభ్‌మన్‌ గిల్‌ తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌-గుజరాత్‌ టైటాన్స్‌ ఇవాళ (మే 3) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ టాస్‌ సమయంలో గిల్ తన వివాహంపై క్లారిటీ ఇచ్చాడు.త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావా..? అని ప్రెజెంటర్ డ్యానీ మోరిసన్ అడగగా, అలాంటిదేమీ లేదని ఒక్క మాటలో సమాధానం చెప్పాడు. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలతో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లైంది.గిల్‌.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడని కొందరు.. బాలీవుడ్‌ నటీమణులు సారా అలీ ఖాన్‌, అవ్‌నీత్‌ కౌర్‌, సోనమ్‌ బజ్వా ప్రేమాయణం​ సాగిస్తున్నాడని మరికొందరు పుకార్లు పుట్టించారు. వీటిలో ఎంత మాత్రం నిజం లేదని తాజాగా గిల్‌ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్దమవుతుంది.తన పెళ్లి, డేటింగ్‌పై వచ్చిన వార్తలను గిల్‌ గతంలోనూ చాలాసార్లు ఖండించాడు. తాను సింగిల్‌గానే ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు. అయినా గిల్‌ ఏదో దాస్తున్నాడని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.ఇదిలా ఉంటే, గిల్‌ ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లోనూ గత సీజన్‌లలో మాదిరిగానే రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 3 అర్ద సెంచరీల సాయంతో 373 పరుగులు చేసి, లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.ఈ సీజన్‌లో గిల్‌ నేతృత్వంలోని గుజరాత్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ప్రధాన పోటీదారుగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.ఇవాళ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ ఆదిలోనే ప్రత్యర్దిని చావు దెబ్బకొట్టినప్పటికీ.. సూర్యాంశ్‌ షేడ్గే (58), మార్కస్‌ స్టోయినిస్‌ (29) కలిసి పంజాబ్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 78 పరుగులు జోడించి బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నారు. 15.5 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 126-5గా ఉంది.

Manish Pandey goes past MS Dhoni to join Virat Kohli, Rohit Sharma for unique IPL feat during SRH vs KKR9
చరిత్ర సృష్టించిన మనీశ్‌ పాండే

కేకేఆర్‌ వెటరన్‌ బ్యాటర్‌ మనీశ్‌ పాండే చరిత్ర సృష్టించాడు. దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ తర్వాత ఐపీఎల్‌ అన్ని ఎడిషన్లలో (19) కనీసం ఒక్క మ్యాచ్‌ ఆడిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ తరఫున బరిలోకి దిగడంతో ఈ రేర్‌ ఫీట్‌ను అందుకున్నాడు.ఐపీఎల్‌ అరంగేట్రం ఎడిషన్‌లో అరంగేట్రం చేసిన మనీశ్‌.. అప్పటి నుంచి వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున నిరంతర ప్రయాణం కొనసాగించాడు. ప్రతి సీజన్‌లో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడి స్థిరత్వాన్ని చాటుకున్నాడు. ఈ సీజన్‌లో మనీశ్‌కు సన్‌రైజర్స్‌ మ్యాచే తొలి మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో అతను రమన్‌దీప్‌ స్థానంలో బరిలోకి దిగాడు. అయితే అతనికి బ్యాటింగ్‌ అవకాశం రాలేదు. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్‌ బ్యాటర్లు మనీశ్‌ వరకు రాకుండానే ఛేదించారు.ధోనీ కూడా చేరొచ్చువిరాట్‌, రోహిత్‌, మనీశ్‌ సరసన ధోని కూడా చేరే అవకాశం ఉంది. ధోని సైతం గత 18 ఐపీఎల్‌ ఎడిషన్లలో కనీసం ఒక్క మ్యాచ్‌ అయినా ఆడాడు. ఈ సీజన్‌లో అతను బరిలోకి దిగాల్సి ఉంది. ధోని గాయం కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.ఐపీఎల్‌లో మనీశ్‌ ప్రస్థానంముంబై ఇండియన్స్‌తో కెరీర్ ప్రారంభించిన మనీశ్‌.. ఆపై ఆర్సీబీ, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ సహా మొత్తం ఏడు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. సుదీర్ఘ ఐపీఎల్‌ కెరీర్‌లో 175 మ్యాచ్‌లు ఆడిన మనీశ్‌ సెంచరీ, 22 అర్ద సెంచరీల సాయంతో 3942 పరుగులు చేశాడు. అతని స్ట్రయిక్‌ రేట్‌ 121.5గా ఉంది.

IPL 2026 KKR vs SRH: Kolkata Knight Riders won by 7 wkts10
ఎస్‌ఆర్‌హెచ్‌కు షాకిచ్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌

ఐపీఎల్‌-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ షాకిచ్చింది. ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన ‍మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధిం‍చింది. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో అంగక్రిష్ రఘువంశీ(59) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ అజింక్య రహానే(43), ఫిన్ అలెన్‌(29), రింకూ సింగ్‌(22 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో షకీబ్‌, కమ్మిన్స్, శివాంగ్‌ కుమార్‌ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో 105/2తో ప‌టిష్టంగా క‌న్పించిన స‌న్‌రైజ‌ర్స్ కేవ‌లం 60 ప‌రుగుల వ్య‌వ‌ధిలో 8 వికెట్లు కోల్పోయింది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. త్యాగీ, నరైన్‌ తలా రెండు వికెట్లు సాధించారు. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో ట్రావెస్‌ హెడ్‌(61), ఇషాన్‌ కిషన్‌(42) మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఈ ఏడాది సీజన్‌లో సన్‌రైజర్స్ ఆలౌట్ కావడం ఇదే తొలిసారి.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement