Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Under 19 world cup final Indian heros disappeared. will Vaibhav Suryavanshi also go in their way1
వైభవ్‌ సూర్యవంశీ కూడా వారిలాగే కనుమరుగైపోతాడా..?

అండర్‌ 19 వరల్డ్‌కప్‌ 2026 ఫైనల్లో చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి, భారత్‌ను ఆరోసారి జగజ్జేతగా నిలిపిన విషయం విధితమే. హరారే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. ఈ మహా విధ్వంసం కారణంగా వైభవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. టోర్నీ మొత్తంలో ఇదే తరహా ఫామ్‌ను (439 పరుగులు, ఓ వికెట్‌) కొనసాగించినందుకు ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు కూడా వైభవ్‌కే దక్కింది.ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే.. భారత్‌ అండర్‌ 19 ప్రపంచకప్‌ గెలిచిన గత ఐదు సందర్భాల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్స్‌గా నిలిచిన ఏ ఒక్క ఆటగాడు కెరీర్‌లో పెద్దగా ఎదగలేకపోయాడు. తూతూమంత్రంగా కొద్ది రోజులు లైమ్‌లైట్‌లో ఉన్నా, ఆతర్వాత శాశ్వతంగా కనుమరుగైపోయారు. దీంతో భారత ఆటగాళ్లకు ఫైనల్స్‌ కలిరాదనే భావన కలుగుతోంది.తాజాగా వైభవ్‌ సూర్యవంశీ అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలవడంతో, ఇతనికి కూడా గత ఐదు వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ హీరోలకు పట్టిన గతే పడుతుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. వైభవ్‌ దూకుడు చూసి కొందరు అలాగే జరుగుతుందని అంటుంటే.. మరికొందరేమో వైభవ్‌ టీమిండియా తరఫున అద్భుతమైన కెరీర్‌ను కొనసాగిస్తాడని అభిప్రాయపడుతున్నారు.ఇంతకీ గతంలో భారత్‌ అండర్‌ 19 వరల్డకప్‌లు గెలిచిన సందర్భాల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్స్‌ ఎవరని అనుకుంటున్నారా..? అయితే ఇది చూడండి. భారత్‌ తొలిసారి ప్రపంచకప్‌ గెలిచిన సందర్భంలో (2000) రితిందర్‌ సింగ్‌ సోధి ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్స్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్‌లో సోధి అద్భుతమైన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటి భారత్‌ తొలిసారి వరల్డ్‌కప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో సోధి తొలుత బౌలింగ్‌లో (10-0-26-0), ఆతర్వాత బ్యాటింగ్‌లో (39 నాటౌట్‌ (43)) రాణించాడు. ఈ ప్రపంచకప్‌ తర్వాత సోధి కొద్ది రోజులు లైమ్‌లైట్‌లో ఉన్నా, ఆతర్వాత కనుమరుగైపోయాడు.ఆతర్వాత భారత్‌ రెండోసారి ప్రపంచకప్‌ గెలిచిన సందర్భంలో (2008) అజితేశ్‌ అర్గల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్స్‌గా నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్‌లో అర్గల్‌ అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో (5-2-7-2) మెరిసి, భారత్‌ రెండో ప్రపంచకప్‌ సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ అయిన అర్గల్‌ ఆ ప్రపంచకప్‌ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఐపీఎల్‌లో ఓ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోవడంతో ఆటగాడిగా కనుమరుగైపోయారు. అయితే ఆశ్చర్యకరంగా అతను అంపైరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొని, క్రికెట్‌తో బంధాన్ని కొనసాగిస్తున్నాడు.భారత్‌ మూడోసారి ప్రపంచకప్‌ సాధించడంలో (2012) నాటి కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌ అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాటి ఫైనల్లో ఉన్ముక్త్‌ అద్భుతమైన సెంచరీ (111 నాటౌట్‌) చేసి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఫలితంగా అతనికి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఆ సమయంలో ఉన్ముక్త్‌ను అందరూ భావి భారత తారగా అనుకున్నారు. అయితే ఆశర్చర్యకరంగా అతని కెరీర్‌ కూడా ముందుకు సాగలేదు. అవకాశాలు లభించినా అతను ఒడిసి పట్టుకోలేకపోయాడు. భారత్‌లో కాదని వేరే దేశానికి వెళ్లినా అతని ఫేట్‌ మారలేదు. దీంతో అతను క్రమంగా కనుమరుగైపోయాడు.భారత్‌ నాలుగోసారి (2018) ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడంలో మన్‌జోత్‌ కల్రా కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాటి ఫైనల్స్‌లో కల్రా మెరుపు సెంచరీ (101 నాటౌట్‌) చేసి భారత్‌కు ఏకపక్ష విజయాన్ని అందించాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. పై ముగ్గురితో పోలిస్తే, కల్రా పరిస్థితి మరీ దారుణం. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ తర్వాత ఇతను ఎక్కడా కనపడలేదు. లిస్ట్‌-ఏ, టీ20 ఫార్మాట్‌లో కేవలం ఒకటి అరా మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వరల్డ్‌కప్‌ ఫైనల్లో సెంచరీ చేసి రాత్రికిరాత్రే హీరో ఇమేజ్‌ దక్కినా, ఎందుకో ఆ ఇమేజ్‌ను కొనసాగించలేకపోయాడు. ఢిల్లీకి చెందిన ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ మెరుపులా ఒక్కసారి మెరిసి ఆతర్వాత అదృశ్యమయ్యాడు.భారత్‌ ఐదోసారి వరల్డ్‌కప్‌ గెలవడంలో రాజ్‌ బవా కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాటి ఫైనల్లో బవా ఆల్‌రౌండర్‌గా (34 (54), 5-31) సత్తా చాటి ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్స్‌గా నిలిచాడు. ఆ ఫైనల్‌ తర్వాత బవాకు మంచి అవకాశాలే లభించినా, పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో అడపాదడపా ‍ప్రదర్శనలతో నెట్టుకొస్తున్నాడు. ఇతను శాశ్వతంగా కనుమరుగుకాకపోయినప్పటికీ.. ఇంచుమించు అంచున ఉన్నాడు.పై ఐదుగురు వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ హీరోల పరిస్థితి చూశాక వైభవ్‌ ఎమవుతాడోనని టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికర విషయం ఉంది. ప్లేయర్‌ ఆఫ​ ద ఫైనల్స్‌గా నిలిచిన ఆటగాళ్ల కెరీర్‌లు బాగా లేకపోయినా, ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలిచిన వాళ్ల కెరీర్‌లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. తాజా వరల్డ్‌కప్‌లో వైభవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్స్‌తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా కూడా నిలిచాడు. దీంతో వైభవ్‌ కెరీర్‌కు వచ్చిన ఢోకా ఏమీ లేదని ఫ్యాన్స్‌ ఊరట పొందుతున్నారు. అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకు (వైభవ్‌ సహా) ఐదుగురు (యువరాజ్‌ సింగ్‌, శిఖర్‌ ధవన్‌, శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌)ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలిచారు. వీరంతా కెరీర్‌లో అత్యున్నతి సాధించారు. వైభవ్‌ కూడా వీరి బాటలోనే నడవాలని ఆశిద్దాం.

Vaibhav Suryavanshi's official arrest demanded right after ICC Under 19 World Cup final2
వైభవ్‌ సూర్యవంశీ అరెస్ట్‌కు డిమాండ్‌

హరారే వేదికగా నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ 2026 ఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్‌ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఆరోసారి జగజ్జేతగా ఆవిర్భవించింది. ఈ మ్యాచ్‌లో యంగ్‌ ఇండియా చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌ అండర్‌ 19 క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమమైందిగా కీర్తించబడుతుంది. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్‌ కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. అండర్‌ 19 లెవెల్లోనే కాదు, యావత్‌ క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇదీ ఒకటిగా నిలిచిపోతుంది. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్‌ విధ్వంసం నభూతో నభవిష్యతి అన్నట్లుగా సాగింది. 14 కుర్ర వైభవ్‌ ఇంగ్లండ్‌ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదాడు. వైభవ్‌లోని ఫైర్‌ చూసి ఇంగ్లండ్‌ బౌలర్లు వణికిపోయారు. ఏం చేయాలో.. బంతిని ఎక్కడ వేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. వైభవ్‌ను ఆపడం ఇంగ్లండ్‌ బౌలర్ల వల్ల కాలేదు. విచక్షణారాహిత్యంగా సాగిన వైభవ్‌ ఇన్నింగ్స్‌ యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. 14 ఏళ్ల పిల్లాడు ఇంతలా రెచ్చిపోవడమేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. వైభవ్‌ విధ్వంసాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు మారణహోమంగా అభివర్ణిస్తున్నారు. ఐస్‌లాండ్‌ క్రికెట్‌ అయితే ఓ అడుగు ముందుకేసి వైభవ్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. ఐస్‌లాండ్‌ క్రికెట్‌ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇంగ్లండ్‌ బౌలర్లపై వైభవ్‌ విరుచుకుపడిన తీరును ఐస్‌లాండ్‌ క్రికెట్‌ ఎక్స్‌ రేటెడ్‌ హింసగా పేర్కొంది. Someone arrest Vaibhav Sooryavanshi right now. This violence on the field against the English bowlers is X-rated!— Iceland Cricket (@icelandcricket) February 6, 2026ఐస్‌లాండ్‌ క్రికెట్‌ ఈ ట్వీట్‌ను సరదాగా చేసినా, నెటిజన్లు దీన్ని నిజంగానే అన్వయించుకుంటున్నారు. ఎందుకంటే, ఇంగ్లండ్‌ బౌలర్లపై వైభవ్‌ విరుచుకుపడిన తీరు ఎక్స్‌ రేటెడ్‌ హింసలాగే ఉంది. ఆ బాదుడు నిజంగానే ఇంగ్లండ్‌ ఆటగాళ్లను భయబ్రాంతులకు గురి చేసింది. ఇది తలచుకొని వారు కొన్ని నెలలైనా సుఖంగా నిద్రపోలేరు. అంతలా సాగించి వైభవ్‌ బీభత్సం.ఈ సునామీ ఇన్నింగ్స్‌తో వైభవ్‌ ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. ఇందులో అత్యధిక సిక్సర్లు, ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ వంటి భారీ రికార్డులు కూడా ఉన్నాయి. వైభవ్‌ ఊచకోత కారణంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్స్‌ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌.అనంతరం కష్టసాధ్యమైన ఛేదనలో ఇంగ్లండ్‌ అద్భుతంగా పోరాడింది. అయితే లక్ష్యం అతి భారిది కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కాలెబ్‌ (115) వీరోచిత శతకంతో ఆకట్టుకున్నాడు. చివరికి ఇంగ్లండ్‌ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటై, 100 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.

T20 world cup 2026: Mohammed Siraj replaces injured Harshit Rana in India's squad3
జాక్‌పాట్‌ కొట్టేసిన సిరాజ్

అనుకున్నదే జరిగింది. టీ20 వరల్డ్‌కప్‌ జట్టులోకి హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతో వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన హర్షిత్‌ రాణా స్థానాన్ని భర్తీ చేస్తూ, ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. సిరాజ్‌ చేరిక టీమిండియా బౌలింగ్‌ బలాన్ని మరింత పెంచనున్నప్పటికీ.. ఆల్‌రౌండర్‌ హర్షిత్‌ రాణా జట్టుకు దూరం​ కావడం ఒకింత మైనస్సే అవుతుంది. ఎందుకంటే.. హర్షిత్‌ లోయర్‌ ఆర్డర్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగల సమర్దుడు. ఛేదనల్లో అతని ఇన్నింగ్స్‌లు చాలా కీలకమవుతాయి. బౌలింగ్‌ విషయంలోనూ హర్షిత్‌ ఇటీవలకాలంలో మంచి మార్కులే కొట్టేశాడు. టీ20 జట్టుకు హర్షిత్‌ లాంటి ఆల్‌రౌండర్‌ చాలా కీలకం. మరోవైపు సిరాజ్‌ చేరిక కూడా తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ ప్రూవెన్‌ బౌలర్‌. పైగా మంచి ఫామ్‌లో ఉ‍న్నాడు. గత వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ జట్టులోనూ కీలకంగా వ్యవహరించాడు. హర్షిత్‌లా బ్యాటింగ్‌ చేయలేడన్నది తప్పిస్తే, సిరాజ్‌ లాంటి బౌలర్‌ జట్టుకు ఎప్పుడూ అదనపు బలమే. సిరాజ్‌ భారత్‌ తరఫున తన చివరి టీ20ని 2024 జులైలో శ్రీలంకతో ఆడాడు. సిరాజ్‌.. బుమ్రా, అర్షదీప్‌తో కలిసి కొత్త బంతిని షేర్‌ చేసుకుంటాడు. ఈ త్రయం మరోసారి భారత్‌కు ప్రపంచకప్‌ అందించాలని ఆశిద్దాం.సుందర్‌ విషయంలో ఇంకా క్లారిటీ లేదుగాయపడిన హర్షిత్ రాణా స్థానాన్ని సిరాజ్‌తో భర్తీ చేసిన బీసీసీఐ.. మరో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు ప్రత్యామ్నాయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ప్రపంచకప్‌ జట్టులో ఉన్న సుందర్‌ చాలా రోజులుగా బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో రిహాబ్‌లో ఉన్నాడు. సుందర్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. బీసీసీఐ సుందర్‌ విషయంలో ఇంకా వేచి చూడాలని భావిస్తుంది. కాబట్టే ఇంకా అతనికి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించలేదు. ప్రపంచకప్‌ తదుపరి దశ సమయానికంతా సుందర్‌ కోలుకుంటాడని ఆశిద్దాం.ఇదిలా ఉంటే, భారత్‌ ఇవాళ (ఫిబ్రవరి 7) ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ తుది జట్టులో సిరాజ్‌కు తప్పక అవకాశం దొరుకుతుంది.టీ20 ప్రపంచకప్‌కు అప్‌డేటెడ్‌ భారత జట్టు: సూర్యకుమార్‌ యాదవ్ (సి), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (డబ్ల్యుకె), ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (విసి), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్‌, మొహమ్మద్‌ సిరాజ్‌

Indias medal hunt continues at the Asian Senior Shooting Championship4
రుద్రాంక్ష్ గురి బంగారం అర్జున్‌కు రజతం

న్యూఢిల్లీ: ఆసియా సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, రజతం... టీమ్‌ విభాగంలో బంగారు పతకం లభించాయి. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రుద్రాంక్ష్ పాటిల్‌ 251.9 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన అర్జున్‌ బబూతా 250.7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలిచాడు. రుద్రాంక్ష్ , అర్జున్, విశాల్‌ సింగ్‌లతో కూడిన భారత బృందం 1884.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. జూనియర్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు క్లీన్‌స్వీప్‌ చేశారు. హిమాన్షు (250 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... అన్‌‡్ష దబాస్‌ (247.9 పాయింట్లు) రజతం... సురేశ్‌ ప్రణవ్‌ (226.8 పాయింట్లు) కాంస్యం గెలిచారు. హిమాన్షు, అన్‌‡్ష, సురేశ్‌ ప్రణవ్‌లతో కూడిన భారత జట్టు 1887.8 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.

Ricky Bhui performed well in the Ranji Trophy with Bengal5
రాణించిన రికీ భుయ్‌

కళ్యాణి (బెంగాల్‌): బెంగాల్‌తో జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆంధ్ర కెప్టెన్ రికీ భుయ్‌ (83; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా శుక్రవారం మొదలైన ఈ పోరులో టాస్‌ నెగ్గిన బెంగాల్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన ఆంధ్ర జట్టు తొలిరోజు ఆట నిలిచే సమయానికి 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిõÙక్‌ రెడ్డి (18; 2 ఫోర్లు), శ్రీకర్‌ భరత్‌ (47; 9 ఫోర్లు) మంచి ఆరంభమే ఇచ్చారు. తొలి వికెట్‌కు 58 పరుగులు జతయ్యాక అభిషేక్‌ అవుటయ్యాడు. కాసేపటికి అర్ధసెంచరీ దిశగా పరుగులు చక్కబెడుతున్న శ్రీకర్‌ భరత్‌ను ముకేశ్‌ అవుట్‌ చేయడంతో 89 పరుగుల వద్ద ఆంధ్ర రెండో వికెట్‌ను కోల్పోయింది. టాపార్డర్‌ బ్యాటర్‌ షేక్‌ రషీద్‌ (46; 9 ఫోర్లు), కెప్టెన్‌ రికీ భుయ్‌ కుదురుగా ఆడి జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. అయితే ఈ భాగస్వామ్యం బలపడకముందే 129 స్కోరు వద్ద రషీద్‌ నిష్క్రమించాడు. స్వల్పవ్యవధిలో జ్ఞానేశ్వర్‌ (7) కూడా వికెట్‌ పారేసుకోవడంతో 147 వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో రికీ భుయ్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి (33; 3 ఫోర్లు) వికెట్‌ను కాపాడుకుంటూ జట్టు స్కోరు పెంచారు. దీంతో టీ విరామానికి మరో వికెట్‌ పడకుండా 190/4 స్కోరు చేసింది. ఆఖరి సెషన్‌లో ఆంధ్ర స్కోరు 200 దాటింది. కాసేపటికే 124 బంతుల్లో రికీ భుయ్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో పరుగులు సులువుగానే వచ్చాయి. ఆట ముగిసే దశలో వరుస ఓవర్లలో వీళ్లిద్దరు అవుటవడం ఆంధ్ర జట్టుకు ఇబ్బందికరంగా మారింది. 255 స్కోరు వద్ద రికీని ఆకాశ్‌దీప్‌ పెవిలియన్‌ చేర్చడంతో ఐదో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్లో నితీశ్‌ను ముకేశ్‌ అవుట్‌ చేశాడు. ఆట నిలిచే సమయానికి త్రిపురాణ విజయ్‌ (1 బ్యాటింగ్‌), శశికాంత్‌ (7 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలుఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) హబిబ్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 18; శ్రీకర్‌ (సి) షమీ (బి) ముకేశ్‌ 47; రషీద్‌ (సి) ఛటర్జీ (బి) ముకేశ్‌ 46; రికీ భుయ్‌ (సి) షహబాజ్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 83; జ్ఞానేశ్వర్‌ (సి) షహబాజ్‌ (బి) షమీ 7; నితీశ్‌ (సి) ఆకాశ్‌దీప్‌ (బి) ముకేశ్‌ 33; విజయ్‌ (బ్యాటింగ్‌) 1; శశికాంత్‌ (బ్యాటింగ్‌) 7; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (80 ఓవర్లలో 6 వికెట్లకు) 264. బౌలింగ్‌: మొహమ్మద్‌ షమీ 17–4–38–1, ముకేశ్‌ కుమార్‌ 18–5–50–3, సూరజ్‌ 14–3–53–0, ఆకాశ్‌దీప్‌ 17–3–64–2, షహబాజ్‌ అహ్మద్‌ 14–1–45–0. ముంబై 120 ఆలౌట్‌ ముంబై: కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో ముంబై జట్టు తమ సొంతగడ్డపైనే కుదేలైంది. తొలిరోజు ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 48.1 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. యశస్వి జైస్వాల్‌ (5), శార్దుల్‌ ఠాకూర్‌ (16)లాంటి టీమిండియా ప్లేయర్లు అందుబాటులో ఉన్న ముంబై మొదటి రోజే కర్ణాటక బౌలింగ్‌కు బెంబేలెత్తింది. ఓపెనర్‌ అఖిల్‌ హేర్వాడ్కర్‌ (60; 9 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయడంతో జట్టు స్కోరు వంద దాటింది. లేదంటే ఇంకా తక్కువ స్కోరుకే ముంబై ఇన్నింగ్స్‌ ముగిసేది. ఎందుకంటే అఖిల్‌ మినహా ఇంకెవరూ కూడా 20 పరుగులైనా చేయలేదు. సిద్దేశ్‌ లాడ్‌ (12), సూర్యాన్‌‡్ష (10) రెండంకెల స్కోరు చేశారంతే! విద్వత్‌ కావేరప్ప, ప్రసిధ్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ తలా 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆడిన కర్ణాటక 2 వికెట్లకు 110 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (28) విఫలమవగా, మయాంక్‌ అగర్వాల్‌ (54 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీతో అజేయంగా నిలిచాడు. జార్ఖండ్‌ 235 ఆలౌట్‌ జంషెడ్‌పూర్‌: ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న రంజీ క్వార్టర్స్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. ఆదిత్య సింగ్‌ (83; 10 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్ విరాట్‌ సింగ్‌ (47; 5 ఫోర్లు) రాణించారు. ఉత్తరాఖండ్‌ బౌలర్లలో జనమేజయ్‌ 4, ఆదిత్య రావత్, మయాంక్‌ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత తొలిఇన్నింగ్‌లో ఉత్తరాఖండ్‌ వికెట్‌ కోల్పోకుండా 4 పరుగులు చేసింది. అవనీశ్‌ (4 బ్యాటింగ్‌), భూపెన్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. జమ్మూ కశ్మీర్‌ 194 ఆలౌట్‌ ఇండోర్‌: మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్లో తొలిరోజే జమ్మూ కశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ శుభమ్‌ (60; 6 ఫోర్లు), టెయిలెండర్‌ యు«ద్‌వీర్‌ (41; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. మధ్యప్రదేశ్‌ బౌలర్లలో పేస్‌ బౌలర్‌ కుల్దీప్‌ సేన్‌ 5 వికెట్లు తీయగా, కార్తికేయకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం మధ్యప్రదేశ్‌ 10 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. హర్‌‡్ష (8 బ్యాటింగ్‌; 1 ఫోర్‌), యశ్‌ దూబే (14 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.

Indian badminton teams were defeated by China and Korea6
క్వార్టర్‌ ఫైనల్లో కథ ముగిసె!

కింగ్డావ్‌ (చైనా): ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి భారత పురుషుల, మహిళల జట్లు రిక్తహస్తాలతో వెనుదిరిగాయి. కనీసం కాంస్య పతకం ఖరారు కావాలంటే దాటాల్సిన క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని అధిగమించడంలో భారత జట్లు విఫలమయ్యాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత మహిళల జట్టు 0–3తో చైనా జట్టు చేతిలో... భారత పురుషుల జట్టు 1–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయాయి. 2024లో తొలిసారి ఆసియా చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు ఈసారి మాత్రం పీవీ సింధు గైర్హాజరీలో నిరాశాజనక ప్రదర్శన చేసింది. చైనాతో జరిగిన పోరులో తొలి మ్యాచ్‌లో ప్రపంచ 42వ ర్యాంకర్‌ తన్వీ శర్మ 9–21, 9–21తో ప్రపంచ పదో ర్యాంకర్‌ గావో ఫాంగ్‌ జియె చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 22–24, 18–21తో జియా యి ఫాన్‌–జాంగ్‌ షు జియాన్‌ జంట చేతిలో ఓటమి పాలైంది. మూడో మ్యాచ్‌లో రక్షిత శ్రీ 14–21, 21–15, 17–21తో జు వెన్‌ జింగ్‌ చేతిలో పరాజయం చవిచూసింది. లక్ష్య సేన్, సాత్విక్‌ లేకుండా... దక్షిణ కొరియాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత స్టార్స్‌ లక్ష్య సేన్, సాత్విక్‌ సాయిరాజ్‌– బరిలోకి దిగలేదు. లక్ష్య సేన్‌ వెన్నునొప్పితో బాధపడుతుండగా... తన తండ్రి సంవత్సరీకం కారణంగా సాత్విక్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. తొలి మ్యాచ్‌లో ఆయుశ్‌ శెట్టి 21–18, 14–21, 24–26తో యూ టే బిన్‌ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్‌లో హరిహరన్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 11–21, 13–21తో సాంగ్‌ హున్‌ చో–కిమ్‌ వన్‌ హో జంట చేతిలో ఓటమి పాలైంది. మూడో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 21–15, 21–16తో చోయ్‌ జిహూన్‌పై గెలుపొందాడు. నాలుగో మ్యాచ్‌లో పృథ్వీ–సాయిప్రతీక్‌ జోడీ 11–21, 16–21తో జిన్‌ యోంగ్‌–కి డాంగ్‌ జు ద్వయం చేతిలో పరాజయం పాలైంది. ఫలితం తేలిపోవడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో చైనా 3–1తో చైనీస్‌ తైపీపై; జపాన్‌ 3–0తో మలేసియాపై, ఇండోనేసియా 3–2తో థాయ్‌లాండ్‌ జట్టుపై గెలిచి సెమీఫైనల్‌ చేరుకున్నాయి.

Delhi court denies bail to Sushil Kumar7
రెజ్లర్‌ సుశీల్‌కు బెయిల్‌ తిరస్కృతి

న్యూఢిల్లీ: వివాదాస్పద రెజ్లర్, రెండు ఒలింపిక్‌ పతకాల విజేత సుశీల్‌ కుమార్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. హత్యానేరంపై అతను ప్రస్తుతం తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మాజీ జాతీయ జూనియర్‌ చాంపియన్‌ సాగర్‌ ధన్కర్‌ను హత్య చేసిన కేసులో సుశీల్‌ ప్రధాన నిందితుడు. తన అనుచరులు, సన్నిహితులతో కలిసి ఛత్రశాల్‌ స్టేడియంలో 2021లో యువ రెజ్లర్‌ సాగర్‌ ధన్కర్‌ను హాకీ స్టిక్స్, బేస్‌బాల్‌ బ్యాట్లతో తీవ్రంగా కొట్టి చంపాడు. అడ్డువచ్చిన సాగర్‌ స్నేహితులను సైతం సుశీల్‌ బృందం విచక్షణ రహితంగా కొట్టడంతో కొందరు గాయపడ్డారు. ఈ కేసులో సుశీల్‌ ఏ1గా తేలడంతో ఢిల్లీ పోలీసులు 2021 మేలో అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మోకాలు శస్త్ర చికిత్స కోసమని 2023, జూలైలో సెషన్స్‌ కోర్టు వారం రోజుల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అనంతరం మళ్లీ ఒలింపియన్‌ రెజ్లర్‌ను జైలుకు తరలించారు. తాజాగా మరోసారి బెయిల్‌కు ప్రయత్నించగా ఢిల్లీ కోర్టు నిర్ద్వందంగా సుశీల్‌ పిటీషన్‌ను తిరస్కరించింది.

The T20 World Cup starts from today8
'పది'oతల విధ్వంసానికి ‘సై’

హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్‌ మిల్లర్‌ కొట్టిన భారీ షాట్‌... సిక్స్‌గా మారిందనుకున్న క్షణాన వైడ్‌ లాంగాన్‌ నుంచి అనూహ్యంగా దూసుకొచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌... అసాధారణ రీతిలో బౌండరీ గీత అంచున గాల్లోకి ఎగిరి అందుకున్న క్యాచ్‌ భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టింది... ఈ ఘట్టం ఇంకా సగటు అభిమానుల కళ్లల్లో మెదులుతుండగానే మరో టి20 ప్రపంచ కప్‌ వచ్చేసింది... నాడు హీరోగా నిలిచిన సూర్యకుమార్‌ నేడు నాయకుడిగా జట్టును నడిపిస్తున్నాడు... జూన్‌ 29, 2024 గత టి20 ప్రపంచకప్‌లో భారత్‌ విజేతగా నిలిచిన రోజు... కాగా ఫిబ్రవరి 7, 2026న తాజా టి20 ప్రపంచకప్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య విరామం 588 రోజులు... ఇన్ని రోజుల్లో తేదీ మాత్రమే మారింది... భారత్‌ ఆటలో దూకుడు, గెలుపు బాట ఏమాత్రం మారకుండా సేమ్‌ టు సేమ్‌... అద్భుత ఫామ్‌తో టైటిల్‌ నిలబెట్టుకొని చరిత్ర సృష్టించేందుకు, సొంతగడ్డపై సత్తా చాటేందుకు టీమిండియా సిద్ధమైంది.రెండేళ్లు కూడా పూర్తి కాకముందే ఇరవై నెలలకే మళ్లీ ‘ప్రపంచకప్‌’ రావడం కొంత ఆసక్తిని తగ్గించడం సహజమే అయినా పోటీ విషయంలో ఏ జట్టూ తక్కువ కాదు అంటూ సమరానికి ‘సై అంటున్నాయి. బిగ్‌బాష్‌లో చెలరేగిన కుర్రాళ్లతో ఆ్రస్టేలియా రెండో టైటిల్‌ కోసం సన్నద్ధమై రాగా, టి20 స్పెషలిస్ట్‌లతో ఇంగ్లండ్‌ తమ మూడో ట్రోఫీని అందుకోవాలని పట్టుదలగా ఉంది. మరో మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ కూడా మూడో టైటిల్‌ అందుకొని ఈ ఫార్మాట్‌లోనైనా తమ స్థాయిని ప్రదర్శించాలని భావిస్తుండగా, సహ ఆతిథ్య జట్టుగా దక్కిన అవకాశాన్ని వాడుకోవాలని శ్రీలంక ఆశిస్తోంది. వివాదాల పాకిస్తాన్‌ రెండో ట్రోఫీని అందుకోగలదా అనే చర్చ సాగుతుండగా, ఒక్క వరల్డ్‌ కప్‌ వేటలో న్యూజిలాండ్‌ తమ పోరాటాన్ని కొనసాగించాలని సన్నద్ధమైంది. క్రితంసారి చేజారిన ట్రోఫీని ఈసారైనా దక్షిణాఫ్రికా గెలుచుకోగలదా చూడాలి. బంగ్లాదేశ్‌ నిష్క్రమించిన చోట ఇతర చిన్న జట్లు ఏమాత్రం ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికరం. ముంబై: టి20 ఫార్మాట్‌లో పదో ప్రపంచ కప్‌కు సమయం ఆసన్నమైంది. భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి నేడు తెర లేవనుంది. తొలి రోజు మూడు వేర్వేరు వేదికల్లో మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. గత టోర్నీ తరహాలోనే 20 జట్లు ఇందులో బరిలోకి దిగుతున్నాయి. 30 రోజుల్లో 55 మ్యాచ్‌ల పాటు ఈ ధనాధన్‌ వినోదం సాగుతుంది. ఇటలీ జట్టు తొలిసారి అర్హత సాధించగా... భద్రతా కారణాలరీత్యా భారత్‌లో ఆడలేమంటూ బంగ్లాదేశ్‌ టోర్నీ నుంచి వైదొలిగింది. మార్చి 8న అహ్మదాబాద్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహిస్తారు. భారత్‌లో ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్నాయి. శ్రీలంకలో కొలంబో, పల్లెకెలె వేదికలుగా ఉన్నాయి. మొత్తం జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌ నుంచి టాప్‌–2 టీమ్‌లు ‘సూపర్‌–8’ దశకు క్వాలిఫై అవుతాయి. ‘సూపర్‌–8’లోని రెండు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత ఫైనల్‌ జరుగుతుంది. తొలి రోజు మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. కొలంబోలో నెదర్లాండ్స్‌తో పాకిస్తాన్‌ (ఉదయం 11 గంటల నుంచి), కోల్‌కతాలో వెస్టిండీస్‌తో స్కాట్లాండ్‌ (మధ్యాహ్నం 3 గంటల నుంచి) తలపడతాయి. భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ లేదు! ఐసీసీ టోర్నీలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసే భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఈసారి లీగ్‌ దశలో ఉండటం లేదు. భారత్‌తో మ్యాచ్‌ ఆడరాదని పాక్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌ తేదీ సమయానికి ఏదైనా అనూహ్యం సంభవిస్తే తప్ప మ్యాచ్‌ జరిగే అవకాశం లేదు. ఈ రెండు టీమ్‌లు నాకౌట్‌లో ఆడాల్సి వస్తే ఏమిటనేది కూడా ఆసక్తికరం. టి20 వరల్డ్‌ కప్‌లో 2009, 2010 మినహా... 2007లో రెండు మ్యాచ్‌లతో పాటు గత ఆరు వరుస వరల్డ్‌ కప్‌లలో ఇరు జట్లు తలపడ్డాయి. భారీ విజయంపై భారత్‌ దృష్టినేడు అమెరికాతో తొలి పోరుముంబై: ఆడిన 41 మ్యాచ్‌లలో 31 విజయాలు, 6 పరాజయాలు మాత్రమే... 2 మ్యాచ్‌లు ‘టై’ కాగా వాటిలో కూడా ‘సూపర్‌ ఓవర్‌’ గెలుపుతో కలిపి మొత్తం విజయాల సంఖ్య చూస్తే 33.. మొత్తం 9 సిరీస్‌లు ఆడితే అన్నింటిలోనూ విజేత... గత టి20 వరల్డ్‌ కప్‌లో విజయం సాధించిన తర్వాత భారత జట్టు అసాధారణ రికార్డు ఇది. ఇలాంటి స్థితిలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా టీమిండియా మళ్లీ తమ జైత్రయాత్రకు సిద్ధమైంది. వాంఖెడే మైదానంలో జరిగే తమ తొలి పోరులో అమెరికాతో భారత్‌ తలపడనుంది. బలాబలాలపరంగా ఇరు జట్ల మధ్య ఉన్న అంతరాన్ని చూస్తే ఫలితం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మ్యాచ్‌ విన్నర్లతో నిండిన సూర్యకుమార్‌ బృందం తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే సునాయాస విజయం ఖాయం. గత టోర్నీలో పాక్‌ను ఓడించి సంచలనం సృష్టించిన అమెరికా ఈ సారి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. 2024లో భారత్‌ 7 వికెట్ల తేడాతో అమెరికాను అలవోకగా ఓడించింది. గాయంతో భారత బౌలర్‌ హర్షిత్‌ రాణా టోర్నీకి దూరం కాగా... అతని స్థానంలో హైదరాబాద్‌ స్పీడ్‌స్టర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌కు భారత జట్టులో చోటు దక్కింది.ఏ గ్రూప్‌లో ఎవరెవరు...గ్రూప్‌ ‘ఎ’: భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్‌ఏ. గ్రూప్‌ ‘బి’: ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్‌. గ్రూప్‌ ‘సి’: ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, నేపాల్, ఇటలీ. గ్రూప్‌ ‘డి’: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈ. సూపర్‌–8 గ్రూప్, సీడింగ్స్‌ వివరాలు గ్రూప్‌–1: భారత్‌ (ఎక్స్‌1), ఆస్ట్రేలియా (ఎక్స్‌2), వెస్టిండీస్‌ (ఎక్స్‌3), దక్షిణాఫ్రికా (ఎక్స్‌4). గ్రూప్‌–2: ఇంగ్లండ్‌ (వై1), న్యూజిలాండ్‌ (వై2), పాకిస్తాన్‌ (వై3), శ్రీలంక (వై4).

India won the Under 19 World Cup final against England by 100 runs9
యువ భారత్ 'సిక్సర్'

అంతర్జాతీయ క్రికెట్‌ వేదికపై భారత కుర్రాళ్లు మళ్లీ అదరగొట్టారు. అద్భుత ఆటతో అండర్‌–19 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకున్నారు. సంచలన బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ మెరుపు సెంచరీతో పాటు కెప్టెన్ ఆయుశ్‌ మాత్రే రాణించడంతో భారత్‌ 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ యువ జట్టును ఓడించింది. భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేయగా, ఇంగ్లండ్‌ 40.2 ఓవర్లలో 311పరుగులకు ఆలౌటైంది. ఫాల్క్‌నర్‌ సెంచరీ సాధించాడు. భారత్‌ అండర్‌–19 ప్రపంచ కప్‌ గెలుచుకోవడం ఇది ఆరో సారి కావడం విశేషం. ఈ టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌లలోనూ గెలిచిన భారత్‌ అజేయంగాముగించింది. గతంలో భారత్‌కు అండర్‌–19 వరల్డ్‌ కప్‌ అందించిన కెపె్టన్లు కైఫ్‌ (2000), కోహ్లి (2008), ఉన్ముక్త్‌ చంద్‌ (2012), పృథ్వీ షా (2018), యశ్‌ ధుల్‌ (2022) సరసన ఆయుశ్‌ మాత్రే నిలిచాడు. స్థాయి ఎలాంటిదైనా, వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా తనకు తెలిసింది మైదానంలో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించడమే అని వైభవ్‌ సూర్యవంశీ మరోసారి నిరూపించాడు. ఈ పాలబుగ్గల కుర్రాడు సునామీ ఆటతో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోయాడు. ఆ షాట్లలో పవర్, పదును, ఎక్కడా తడబాటు కనిపించకుండా పూర్తి సాధికారతతో ఆడిన వైనం నిజంగా అసాధారణం. విశేషణాలతో వర్ణించలేని గొప్ప ఇన్నింగ్స్‌ను వైభవ్‌ క్రికెట్‌ ప్రపంచానికి చూపించాడు. పాయింట్, కవర్స్, మిడ్‌ వికెట్, ఫైన్‌ లెగ్, లాంగాఫ్, లాంగాన్‌... ఇలా ప్రతీ దిశలో అత్యద్భుత షాట్లతో పరుగుల సునామీ సృష్టించిన వైభవ్‌ ఏకంగా 15 ఫోర్లు, 15 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.బౌండరీల ద్వారానే 150 పరుగులు రాబట్టిన అతని ఆట ముందు అండర్‌–19 వరల్డ్‌ కప్‌ దాసోహమంటూ భారత యువ జట్టును ఆరోసారి విశ్వ విజేతను చేసింది. వైభవ్‌ మెరుపులతో 400పైగా పరుగులు చేసి సవాల్‌ విసిరిన భారత్‌ ముందు ఇంగ్లండ్‌ నిలవలేకపోయింది. కొంత పోరాడినా లక్ష్యానికి సుదూరంగానే ఆగిపోవడంతో భారత కుర్రాళ్లు ప్రపంచ చాంపియన్లుగా సగర్వంగా నిలిచారు. హరారే: ఐసీసీ అండర్‌–19 ప్రపంచకప్‌లో భారత్‌ మరోసారి విజేతగా నిలిచింది. మొత్తం 16 సార్లు టోర్నీని నిర్వహించగా... భారత్‌ టైటిల్‌ సాధించడం ఇది ఆరోసారి కావడం విశేషం. శుక్రవారం ఇక్కడ జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత యువ జట్టు 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ అండర్‌–19 టీమ్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వైభవ్‌ సూర్యవంశీ (80 బంతుల్లో 175; 15 ఫోర్లు, 15 సిక్స్‌లు) అసాధారణ సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ ఆయుశ్‌ మాత్రే (51 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 90 బంతుల్లోనే 142 పరుగులు జోడించారు. అనంతరం ఇంగ్లండ్‌ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. కాలెబ్‌ ఫాల్క్‌నర్‌ (67 బంతుల్లో 115; 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకం నమోదు చేయగా, బెన్‌ డాకిన్స్‌ (56 బంతుల్లో 66; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. టోర్నీలో 7 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 169.49 స్ట్రయిక్‌రేట్‌తో మొత్తం 439 పరుగులు సాధించిన వైభవ్‌ సూర్యవంశీకే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు దక్కింది. రాణించిన కెప్టెన్ గత మ్యాచ్‌లో చెలరేగిన హైదరాబాదీ బ్యాటర్‌ ఆరోన్‌ జార్జ్‌ (9) ఫైనల్లో విఫలమైన అనంతరం వైభవ్, ఆయుశ్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ధాటిగా ఆడిన కెప్టెన్ 50 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి బంతికే అతను అవుట్‌ కాగా, 51 పరుగులు జత చేసిన వేదాంత్‌ త్రివేది (36 బంతుల్లో 32; 2 ఫోర్లు), విహాన్‌ మల్హోత్రా (36 బంతుల్లో 30; 2 ఫోర్లు) ఆరు పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. అభిజ్ఞాన్‌ కుందు (31 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్‌), చివర్లో కనిష్క్‌ చౌహాన్‌ (20 బంతుల్లో 37 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడు ప్రదర్శించడంతో స్కోరు 400 దాటింది. తొలి 25 ఓవర్లలో 250 పరుగులు చేసిన భారత్‌ తర్వాతి 25 ఓవర్లలో 161 పరుగులు సాధించింది.ఫాల్క్ నర్‌ మినహా... భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ బాగా తడబడింది. డాకిన్స్, బెన్‌ మాయెస్‌ (28 బంతుల్లో 45; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించి మెరుగైన స్థితిలో నిలిపినా ఆ తర్వాత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి 22 ఓవర్లలో 177/7 వద్ద ఓటమికి చేరువైంది. ఈ దశలో జేమ్స్‌ మింటో (28)తో కలిసి ఫాల్‌్కనర్‌ కొద్దిగా పోరాడాడు. భారీ షాట్లు ఆడిన ఫాల్‌్కనర్‌ అంబ్రిష్‌ ఓవర్లో 3 సిక్స్‌లు బాది 63 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే తర్వాతి ఓవర్లోనే ఖిలాన్‌ చక్కటి క్యాచ్‌తో అతను చివరి వికెట్‌గా అవుట్‌ కావడంతో భారత్‌ సంబరాల్లో మునిగిపోయింది. విధ్వంసాన్ని సృష్టిస్తూ... తొలి మూడు బంతుల్లో పరుగు తీయలేదు, నాలుగో బంతికి ఫోర్‌తో స్కోర్‌ మొదలైంది. అవతలి వైపు తొలి వికెట్‌ పడే సమయానికి 13 బంతుల్లో 10 పరుగులే. అయితే ఈ కొద్దిసేపు మాత్రమే వైభవ్‌ కాస్త ప్రశాంతంగా కనిపించాడు. పాయింట్‌ దిశగా కొట్టిన మొదటి సిక్స్‌తో జోరు షురూ చేసిన అతను అనంతరం ఎక్కడా తగ్గలేదు. ఆ తర్వాతా ఇదే మోత కొనసాగుతూ మరో 14 సిక్సర్లు అతని ఖాతాలో చేరాయి! మింటో ఓవర్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన వైభవ్‌ 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని చేరుకున్నాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ ఫర్హాన్‌ ఓవర్లో 2 సిక్స్‌లు బాదిన అనంతరం అతని తర్వాతి ఓవర్లో వైభవ్‌ మరింత చెలరేగిపోయాడు. వరుసగా 6, 6, 4, 6తో బంతిని చితక్కొట్టాడు. ఆల్బర్ట్‌ ఓవర్లో ఆఫ్‌ సైడ్‌ దిశగా సింగిల్‌ తీయడంతో 55 బంతుల్లో వైభవ్‌ శతకం పూర్తయింది. ఆ వెంటనే గ్రీన్‌ ఓవర్లో కూడా మరో 2 సిక్స్‌లు కొట్టిన అనంతరం ఆల్బర్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ 23వ ఓవర్లో మరింత పండగ చేసుకున్నాడు. వైభవ్‌ వరుసగా 2, 4, 6, 6, 4, 4 బాదగా వైడ్‌తో కలిసి మొత్తం 27 పరుగులు వచ్చాయి. 71 బంతుల్లో అతను 150 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. అర్ధసెంచరీ నుంచి సెంచరీ చేరేందుకు 23 బంతులు తీసుకున్న అతనికి సెంచరీనుంచి 150కు చేరేందుకు 16 బంతులు సరిపోయాయి. మోర్గాన్‌ ఓవర్లో కూడా 2 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టిన అతను డబుల్‌ సెంచరీ దిశగా నడిచాడు. అయితే పుల్‌–సూ్కప్‌ షాట్‌కు ప్రయత్నించి కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో వైభవ్‌ అసాధారణ ఇన్నింగ్స్‌ ముగిసింది.175 సీనియర్‌ వరల్డ్‌ కప్, మహిళల వరల్డ్‌ కప్‌తో సహా ఏదైనా ఐసీసీ టోర్నీ ఫైనల్లో అత్యధిక స్కోరు (175) సాధించిన బ్యాటర్‌గా వైభవ్‌ నిలిచాడు. అండర్‌–19 స్థాయిలో వైభవ్‌ కొత్త రికార్డులిలా... 1 భారత్‌ తరఫున వరల్డ్‌ కప్‌లో అత్యధిక స్కోరు 2 ఓవరాల్‌గా భారత్‌ తరఫున రెండో అత్యధిక స్కోరు (తొలి స్థానంలో అంబటి రాయుడు 177 నాటౌట్‌) 15 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు 30 అత్యధిక బౌండరీలు 150 బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు 5 ఐదో వేగవంతమైన సెంచరీ (55 బంతుల్లో) 30 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్స్‌లు 439 ఒకే వరల్డ్‌ కప్‌లో భారత్‌ తరఫున చేసిన పరుగుల్లో శిఖర్‌ ధావన్‌ (505) తర్వాత రెండో స్థానం. స్కోరు వివరాలు భారత అండర్‌–19 ఇన్నింగ్స్‌: ఆరోన్‌ జార్జ్‌ (సి) మాయెస్‌ (బి) గ్రీన్‌ 9; వైభవ్‌ (సి) ర్యూ (బి) లమ్స్‌డెన్‌ 175; ఆయుశ్‌ (సి) మాయెస్‌ (బి) గ్రీన్‌ 53; వేదాంత్‌ (సి) మాయెస్‌ (బి) మింటో 32; విహాన్‌ (సి) డాకిన్స్‌ (బి) మింటో 30; అభిజ్ఞాన్‌ (సి) ఆల్బర్ట్‌ (బి) మోర్గాన్‌ 40; అంబ్రిష్‌ (బి) మింటో 18; కనిష్క్ (నాటౌట్‌) 37; ఖిలాన్‌ (సి) మూర్స్‌ (బి) మోర్గాన్‌ 3; హెనిల్‌ (రనౌట్‌) 5; దీపేశ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 411. వికెట్ల పతనం: 1–20, 2–162, 3–251, 4–302, 5–308, 6–359, 7–367, 8–375, 9–393. బౌలింగ్‌: మోర్గాన్‌ 9–0–74–2, గ్రీన్‌ 5–0–49–2, లమ్స్‌డెన్‌ 8–0–81–1, మింటో 8–0–63–3, ఫర్హాన్‌ 10–0–77–0, ఆల్బర్ట్‌ 10–0–66–0. ఇంగ్లండ్‌ అండర్‌–19 ఇన్నింగ్స్‌: డాకిన్స్‌ (సి) ఖిలాన్‌ (బి) ఆయుశ్‌ 66; మూర్స్‌ (బి) అంబ్రిష్‌ 17; మాయెస్‌ (సి) హెనిల్‌ (బి) ఖిలాన్‌ 45; థామస్‌ ర్యూ (సి) ఆయుశ్‌ (బి) కనిష్క్ 31; ఫాల్క్‌నర్‌ (సి) ఖిలాన్‌ (బి) కనిష్క్ 115; ఆల్బర్ట్‌ (రనౌట్‌) 0; ఫర్హాన్‌ (సి) అభిజ్ఞాన్‌ (బి) దీపేశ్‌ 1; మోర్గాన్‌ (సి) అండ్‌ (బి) దీపేశ్‌ 0; మింటో (సి) (సబ్‌) ఇనాన్‌ (బి) అంబ్రిష్‌ 28; లమ్స్‌డెన్‌ (సి) వేదాంత్‌ (బి) అంబ్రిష్‌ 3; గ్రీన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (40.2 ఓవర్లలో ఆలౌట్‌) 311. వికెట్ల పతనం: 1–19, 2–93, 3–142, 4–174, 5–174, 6–177, 7–177, 8–269, 9–281, 10–311. బౌలింగ్‌: అంబ్రిష్‌ 9–1–56–3, హెనిల్‌ 4–2–28–0, దీపేశ్‌ 6–0–64–2, ఖిలాన్‌ 8–0–66–1, కనిష్క్ 8.2–0–63–2, ఆయుశ్‌ 5–0–31–1.

Pm Modi Congratulate Team India Under 19 World Cup Won10
ఆరోసారి భారత్‌కు ప్రపంచకప్.. ప్రధాని మోదీ ప్రశంసలు

కుర్రాళ్లు కుమ్మేశారు. ఏకంగా ఆరోసారి అండర్-19 ప్రపంచకప్ విజేతగా టీమిండియా నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శుక్రవారం జరిగిన ఫైన‌ల్‌లో ఇంగ్లండ్‌ని 100 ప‌రుగుల తేడాతో యువ భార‌త్ ఓడించింది. అలా ఆరో వ‌ర‌ల్డ్‌క‌ప్‌ని టైటిల్‌ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ.. యువ జట్టుని అభినందిస్తూ ట్వీట్ చేశారు.'భారత క్రికెట్ ప్రతిభ మెరిసింది. మన అండర్-19 జట్టు ప్రపంచకప్ సాధించినందుకు గర్వంగా ఉంది. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలానే ఆకట్టుకునే ప్రతిభ చూపించింది. ఈ విజయం చాలామంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. గెలిచిన ఆటగాళ్లకు నా అభినందనలు' అని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా యువ టీమిండియాని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఇంగ్లండ్ కష్టపడినప్పటికీ 311 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. గతంలో 2000, 2008, 2012, 2018, 2022లో వరల్డ్‌కప్ సొంతం చేసుకుంది.టీమిండియా యువ క్రికెటర్ వైభ‌వ్ సూర్య‌వంశీ.. ఈ టోర్నీ చ‌రిత్ర‌లో చిర‌స్మ‌ర‌ణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్.. ఫైనల్‌లో ఆడాడు. 14 ఏళ్ల వైభ‌వ్.. త‌న బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు (15 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసి ఫైనల్ మ్యాచ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. India’s cricketing talent shines! Proud of our U-19 team for bringing home the World Cup. The team has played very well through the tournament, showcasing exceptional skill. This win will inspire several young sportspersons too. Best wishes to the players for their upcoming…— Narendra Modi (@narendramodi) February 6, 2026

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement