ప్రధాన వార్తలు
అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర లిఖించాడు. న్యూజిలాండ్తో తొలి టీ20లో కేవలం 22 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని.. కివీస్ మీద ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.అదే విధంగా.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్ స్టార్ ఫిల్ సాల్ట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అభిషేక్ శర్మ ఈ సందర్భంగా బద్దలు కొట్టాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్- న్యూజిలాండ్ బుధవారం తొలి టీ20లో తలపడ్డాయి.నాగ్పూర్ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్ (10), టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (8) పూర్తిగా నిరాశపరిచారు.అయితే మరో ఓపెనర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అభిషేక్ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 84 పరుగులు సాధించాడు. ఇష్ సోధి బౌలింగ్లో జెమీషన్కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్కు తెరపడింది.మిగతా వారిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించగా.. రింకూ సింగ్ (20 బంతుల్లో 44 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారత్ 238 పరుగులు సాధించింది.భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 190 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. ఈ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20లలో 25 లేదంటే అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధికసార్లు హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.అంతర్జాతీయ టీ20లలో 25 లేదంటే అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధికసార్లు ఫిఫ్టీలు బాదిన క్రికెటర్లు వీరే🏏అభిషేక్ శర్మ- ఎనిమిది సార్లు🏏ఫిల్ సాల్ట్- ఏడుసార్లు🏏సూర్యకుమార్ యాదవ్- ఏడుసార్లు🏏ఎవిన్ లూయీస్- ఏడుసార్లు.
కోల్కతా నైట్రైడర్స్ ఫీల్డింగ్ కోచ్గా యాజ్ఞిక్
కోల్కతా: వికెట్ కీపర్ బ్యాటర్ దిశాంత్ యాజ్ఞిక్ను ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఫీల్డింగ్ కోచ్గా నియమించుకుంది. దేశవాళీలతో పాటు... ఐపీఎల్ అనుభవం ఉన్న ఈ రాజస్తాన్ ప్లేయర్ రాకతో తమ శిక్షణ బృందం బలం మరింత పెరుగుతుందని కేకేఆర్ యాజమాన్యం భావిస్తోంది. ‘యాజ్ఞిక్కు అపార అనుభవం ఉంది. అది జట్టుకు ఉపకరించనుంది. ఈసారి ఐపీఎల్కు కొత్త సపోర్టింగ్ స్టాఫ్తో బరిలోకి దిగనున్నాం. హెడ్ కోచ్గా అభిషేక్ నాయర్, మెంటార్గా డ్వేన్ బ్రావో, అసిస్టెంట్ కోచ్గా షేన్ వాట్సన్, బౌలింగ్ కోచ్గా టిమ్ సౌతీ, పవర్ కోచ్గా ఆండ్రీ రసెల్ వ్యవరిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో యాజ్ఞిక్ చేరుతున్నాడు. అతడి కోచింగ్ జర్నీలో ఇది ప్రత్యేకంగా నిలవడం ఖాయం’ అని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవాళీల్లో రాజస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యాజ్ఞిక్... 2011 నుంచి 2014 మధ్య 25 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం వివిధ జట్లకు శిక్షణనిచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 26 నుంచి మే 31 వరకు జరగనుంది.
టీమిండియాకు భారీ షాక్
టీ20 ప్రపంచకప్ టీమిండియాను గాయాల బెడద వదలడం లేదు. ఇప్పటికే వాషింగ్టన్ సందర్, తిలక్ వర్మ గాయాల బారిన పడగా.. తాజాగా ఈ జాబితాలోకి వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ చేరాడు. నాగ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో అక్షర్ గాయపడ్డాడు.కివీస్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్లో మూడో బంతిని డారిల్ మిచెల్ స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు. అయితే బంతిని ఆపే క్రమంలో అక్షర్ చేతి వేలికి గాయమైంది. బంతి బలంగా తగలడంతో అక్షర్ ఎడమ చేతి చూపుడు వేలు చిట్లి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పి కారణంగా ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు.మిగిలిన ఓవర్ను అభిషేక్ శర్మ పూర్తి చేశాడు. అతడి గాయంపై బీసీసీఐ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే అక్షర్ గాయం తీవ్రమైనది కానట్లుగా తెలుస్తోంది. వేలు పైన మాత్రమే చిట్లడం వల్ల రక్త స్రవమైందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కానీ శుక్రవారం జరగనున్న రెండో టీ20కు మాత్రం అక్షర్ దూరమయ్యే అవకాశముంది.ఇక తొలి టీ20 విషయానికి వస్తే.. న్యూజిలాండ్పై 48 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అభిషేక్ శర్మ 84 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రింకూ సింగ్(44) రాణించాడు. అనంతరం కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్ 78 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: అటు గిల్... ఇటు జడేజా
అటు గిల్... ఇటు జడేజా
రాజ్కోట్: రెండు నెలల విరామం అనంతరం దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ చివరి అంకానికి రంగం సిద్ధమైంది. ఒకవైపు భారత జట్టు న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతుండగా... ఈ ఫార్మాట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని టాప్ ఆటగాళ్లందరూ రంజీ ట్రోఫీలో తమ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్... పంజాబ్ జట్టుకు సారథ్యం వహిస్తుండగా... సిరాజ్ హైదరాబాద్ జట్టును నడిపించనున్నాడు. వీరితో పాటు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి ఇలా పలువురు టీమిండియా ప్లేయర్లు ఈ టోర్నీ బరిలోకి దిగనున్నారు. నవంబర్ రెండో వారంలో చివరగా రంజీ మ్యాచ్లు జరగగా... రెండో అంచె పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. రంజీ ట్రోఫీకి విరామం ఇచ్చిన సమయంలో ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీ, విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ జరిగాయి. గ్రూప్ ‘ఎ’లో భాగంగా మాజీ విజేత విదర్భతో ఆంధ్ర జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్కు అనంతపురం వేదిక కానుంది. తొలి అంచె పోటీల్లో 5 మ్యాచ్లాడిన ఆంధ్ర జట్టు 3 విజయాలు, 2 ‘డ్రా’లతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో ఉంది. విదర్భ 25 పాయింట్లతో ‘టాప్’లో కొనసాగుతోంది. మొత్తం 32 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించగా... ఇప్పటి వరకు ఒక్కో జట్లు ఐదేసి మ్యాచ్లు ఆడాయి. ఇక లీగ్ దశలో రెండేసి మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండగా... ఒక్కో గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర, విదర్భ పోరు మరింత ఆసక్తి రేపుతోంది. న్యూజిలాండ్తో చివరి వన్డేలో హాఫ్సెంచరీతో ఆకట్టుకున్న పేస్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. శ్రీకర్ భరత్, రికీ భుయ్, షేక్ రషీద్లతో ఆంధ్ర జట్టు బలంగా ఉండగా... విదర్భ జట్టు ఇటీవలే విజయ్ హజారే వన్డే ట్రోఫీ నెగ్గి ఫుల్ జోష్లో ఉంది. సొంతగడ్డపై తొలిసారి న్యూజిలాండ్ చేతిలో టీమిండియా వన్డే సిరీస్ కోల్పోగా... ఆ వెంటనే శుబ్మన్ గిల్ పంజాబ్ జట్టుతో చేరాడు. నేటి నుంచి సౌరాష్ట్రతో జరగనున్న గ్రూప్ ‘బి’ మ్యాచ్లో గిల్ పంజాబ్ జట్టును నడిపించనున్నాడు. మరోవైపు సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నాడు. కర్ణాటక తరఫున కేఎల్ రాహుల్, బెంగాల్ తరఫున మొహమ్మద్ షమీ కూడా మ్యాచ్లకు సిద్ధమయ్యారు.
శ్రమించి గెలిచిన శ్రీకాంత్
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్కు చెందిన కిడాంబి శ్రీకాంత్, ప్రస్తుత భారత నంబర్వన్ లక్ష్య సేన్ తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించగా... హెచ్ఎస్ ప్రణయ్, కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. ప్రపంచ 24వ ర్యాంకర్ కోకి వతనాబె (జపాన్)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 33వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–15, 21–23, 24–22తో గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. నిర్ణాయక మూడో గేమ్లో 20–21 స్కోరు వద్ద శ్రీకాంత్ ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే సంయమనం కోల్పోకుండా ఆడిన శ్రీకాంత్ స్కోరును 21–21తో సమం చేశాడు. ఆ తర్వాత మళ్లీ స్కోరు 22–22తో సమమైంది. ఈ దశలో శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి 24–22తో గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. 2017లో ఫ్రెంచ్ ఓపెన్లో విజేతగా నిలిచిన తర్వాత శ్రీకాంత్ మరో అంతర్జాతీయ టైటిల్ను సాధించలేకపోయాడు. మరో మ్యాచ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 68 నిమిషాల్లో 21–13, 16–21, 21–14తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై గెలిచాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో ప్రణయ్ 19–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో, కిరణ్ జార్జి 17–21, 14–21తో మో జకి ఉబైదుల్లా (ఇండోనేసియా) చేతిలో, ఆయుశ్ శెట్టి 8–21, 13–21తో అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. సింధు శుభారంభం మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ అన్మోల్ ఖరబ్ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకోగా... తన్వీ శర్మ, మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. తొలి రౌండ్లో సింధు 53 నిమిషాల్లో 22–20, 21–18తో మనామి సిజు (జపాన్)పై, అన్మోల్ 21–16, 21–17తో పాయ్ యి పో (చైనీస్ తైపీ)పై గెలుపొందారు. తన్వీ శర్మ 21–18, 18–21, 16–21తో టొమోకా మియజకి (జపాన్) చేతిలో, మాళవిక 21–23, 12–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో, ఆకర్షి 21–8, 20–22, 17–21తో జూలీ జేకబ్సన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యారు. రుత్విక జోడీ ఓటమి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్)... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీలు తొలి రౌండ్లోనే ఓడిపోయాయి. రుత్విక–రోహన్ ద్వయం 9–21, 20–22తో థోమ్ గికెల్–డెల్ఫిన్ డెల్ర్యూ (ఫ్రాన్స్) జంట చేతిలో... తనీషా–ధ్రువ్ జంట 23–21, 20–22, 6–21తో జూలియన్ మాయో–లీ పలెర్మో (ఫ్రాన్స్) ద్వయం చేతిలో ఓటమి చవిచూశాయి.
అల్కరాజ్ ముందంజ...
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో టాప్ సీడ్ అల్కరాజ్ 7–6 (7/4), 6–3, 6–2తో యానిక్ హాంఫ్మన్ (జర్మనీ)పై గెలిచాడు. 2 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో స్పెయిన్ స్టార్ 12 ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తొలి సర్వీస్లో 71 పాయింట్లకు 49... రెండో సర్వీస్లో 40 పాయింట్లకు 24 సాధించాడు. 41 విన్నర్స్ కొట్టిన అతను 30 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఇప్పటికే ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన అల్కరాజ్... ఆ్రస్టేలియన్ ఓపెన్ కూడా సాధిస్తే ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ పూర్తి చేసుకుంటాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా), పదో సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్), 11వ సీడ్ మెద్వెదెవ్ (రష్యా), 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) కూడా మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్లో జ్వెరెవ్ 6–3, 4–6, 6–3, 6–4తో అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్)పై, డిమినార్ 6–7 (5/7), 6–2, 6–2, 6–1తో హమాద్ మెజెదోవిచ్ (సెర్బియా)పై, బుబ్లిక్ 7–5, 6–4, 7–5తో ఫుచువోచిస్ (హంగేరి)పై, మెద్వెదెవ్ 6–7 (9/11), 6–3, 6–4, 6–2తో క్వెంటిన్ హేలిస్ (ఫ్రాన్స్)పై, రుబ్లెవ్ 6–4, 6–3, 4–6, 7–5తో క్వాలిఫయర్ జేమీ ఫారియా (పోర్చుగల్)పై విజయం సాధించారు.ఇతర మ్యాచ్ల్లో 14వ సీడ్ డేవిడోవిచ్ ఫోకినా (స్పెయిన్) 6–3, 7–6 (7/3), 5–7, 4–6, 6–4తో రీలీ ఒపెల్కా (అమెరికా)పై, 19వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 6–3, 6–4, 6–2తో టిరాన్టి (అర్జెంటీనా)పై నెగ్గారు. సబలెంకా సాఫీగా... మహిళల సింగిల్స్ విభాగంలో రెండుసార్లు చాంపియన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) మూడో రౌండ్లో బెర్త్ను ఖరారు చేసుకుంది. 72 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో సబలెంకా 6–3, 6–1తో జావోజువాన్ బాయ్ (చైనా)పై గెలిచింది. మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఏడో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ), ఎనిమిదో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా), 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్ల్లో కోకో గాఫ్ 6–2, 6–2తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)పై, పావోలిని 6–2, 6–3తో మగ్ధలీనా ఫ్రీచ్ (పోలాండ్)పై, మిరా ఆంద్రీవా 6–0, 6–4తో మరియా సాకరి (గ్రీస్)పై, స్వితోలినా 7–5, 6–1తో లిండా క్లిమోవికోవా (పోలాండ్)పై గెలుపొందారు.
యూకీ జోడీ శుభారంభం
ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత నంబర్వన్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మెల్బోర్న్లో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో పదో సీడ్ యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) ద్వయం 6–3, 6–4తో జేమ్స్ డక్వర్త్–క్రూజ్ హెవిట్ (ఆస్ట్రేలియా) జంటపై నెగ్గింది. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–స్వీడిష్ జోడీ ఆరు ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తమసర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. 26 విన్నర్స్ కొట్టిన యూకీ–గొరాన్సన్ మూడు అనవసర తప్పిదాలు చేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ విభాగంలో యూకీ ఆడటం ఇది ఐదోసారి. తొలిసారి మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జతగా 2014లో ఆడిన యూకీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. తొమ్మిదేళ్ల తర్వాత 2023లో సాకేత్ మైనేని (భారత్)తో కలిసి మళ్లీ ఈ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఆడిన యూకీ తొలి రౌండ్ దాటలేదు. 2024లో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)తో, 2025లో అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్)తో కలిసి బరిలోకి దిగిన యూకీ తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. డబ్ల్యూపీఎల్లో నేడు యూపీ వారియర్స్ x గుజరాత్ జెయింట్స్ రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
హైదరాబాద్ x ముంబై
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్, ముంబై జట్ల మధ్య మ్యాచ్కు రంగం సిద్ధమైంది. రెండో అంచె పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానుండగా... 42 సార్లు చాంపియన్ ముంబై జట్టుతో ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ తలపడనుంది. గ్రూప్ ‘డి’లో ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఒక విజయం, ఒక ఓటమి, మూడు ‘డ్రా’లతో 13 పాయింట్లు సాధించిన హైదరాబాద్ నాలుగో స్థానంలో... పరాజయం ఎరగని ముంబై 24 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. లీగ్ దశలో మరో రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండగా... ఈ రెండింట్లో మెరుగైన ప్రదర్శన చేయాలని హైదరాబాద్ భావిస్తోంది. స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అందుబాటులో లేకపోగా... టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అజింక్యా రహానే అందుబాటులో లేకపోయినా... శార్దుల్ ఠాకూర్ సారథ్యంలోని ముంబై జట్టు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, షమ్స్ ములానీ, సిద్ధేశ్ లాడ్లతో పటిష్టంగా ఉంది. ప్రతి గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి.
అదరగొట్టిన అభిషేక్
ఎప్పటిలాగే తనదైన శైలిలో అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్... సూర్యకుమార్, రింకూ సింగ్ దూకుడు... ఆపై బౌలర్ల ప్రతాపం... వెరసి న్యూజిలాండ్తో టి20 సిరీస్లో భారత్కు ఘనమైన ఆరంభం లభించింది. ముందుగా కేవలం బౌండరీల ద్వారానే 168 పరుగులు రాబట్టి భారీ స్కోరుతో చెలరేగిన టీమిండియా... అనంతరం ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమైంది. కివీస్ కొంత పోరాడినా లక్ష్యానికి దూరంలో నిలిచిపోయింది. నాగ్పూర్: న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ను కోల్పోయిన భారత్ టి20 సిరీస్ తొలి మ్యాచ్లో నెగ్గి 1–0తో ముందంజ వేసింది. బుధవారం జరిగిన ఈ పోరులో భారత్ 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (35 బంతుల్లో 84; 5 ఫోర్లు, 8 సిక్స్లు) సిక్సర్ల వర్షం కురిపించగా... రింకూ సింగ్ (20 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్ ) ధాటిగా ఆడారు. అభిషేక్, సూర్యకుమార్ మూడో వికెట్కు 47 బంతుల్లోనే 99 పరుగులు జోడించారు. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసి ఓడిపోయింది. గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 78; 4 ఫోర్లు, 6 సిక్స్లు), మార్క్ చాప్మన్ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. రెండో టి20 శుక్రవారం రాయ్పూర్లో జరుగుతుంది. సమష్టి ప్రదర్శన 14 సిక్సర్లతో 84 పరుగులు... 21 ఫోర్లతో 84 పరుగులు... భారత్ జోరు బౌండరీలతో ఈ తరహాలో సాగింది. ముందుగా అభిషేక్, మధ్యలో సూర్య, పాండ్యా, చివర్లో రింకూ చెలరేగి భారత్కు భారీ స్కోరును అందించారు. టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్కు దిగింది. సంజు సామ్సన్ (7 బంతుల్లో 10; 2 ఫోర్లు), ఇషాన్ కిషన్ (5 బంతుల్లో 8; 2 ఫోర్లు) ఆరంభంలోనే వెనుదిరిగినా... మరోవైపు అభిషేక్ సిక్స్తో దూకుడుగా ఆటను మొదలు పెట్టాడు. జేమీసన్, క్లార్క్ వేసిన వరుస ఓవర్లలో అతను రెండేసి సిక్స్లు బాదాడు. దాంతో పవర్ప్లేలో భారత్ 68 పరుగులు చేసింది. ఫిలిప్స్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అభిషేక్ 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సోధి ఓవర్లో సూర్య వరుసగా రెండు బౌండరీలు బాదడంతో 10 ఓవర్లలో జట్టు స్కోరు 117కు చేరింది. సూర్య అవుటైన తర్వాత హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) అదే ధాటిని ప్రదర్శించాడు. సోధి ఓవర్లో వరుసగా 4, 6, 6 బాది సెంచరీకి చేరువవుతున్న తరుణంలో అదే ఓవర్ చివరి బంతికి మరో భారీ షాట్కు ప్రయత్నించి అభిషేక్ వెనుదిరిగాడు. తక్కువ వ్యవధిలో శివమ్ దూబే (4 బంతుల్లో 9; 1 సిక్స్), పాండ్యా, అక్షర్ పటేల్ (5) అవుటైన తర్వాత ఆఖర్లో రింకూ చెలరేగిపోయాడు. క్లార్క్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టి స్కోరును 200 దాటించిన అతను... మిచెల్ వేసిన ఆఖరి ఓవర్లో 2 సిక్స్లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. ఫిలిప్స్ అర్ధ సెంచరీ న్యూజిలాండ్ ఛేదన పేలవంగా ప్రారంభమైంది. రెండో బంతికే కాన్వే (0) వెనుదిరగ్గా, తర్వాతి ఓవర్లో రచిన్ (1) కూడా అవుటయ్యాడు. పాండ్యా ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన రాబిన్సన్ (21) కూడా ఎక్కువ సేపు నిలబడలేదు. ఇలాంటి స్థితిలో ఫిలిప్స్, చాప్మన్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఫిలిప్స్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత ఐదు బంతుల వ్యవధిలో అతను మూడు భారీ సిక్స్లు బాదాడు. అక్షర్ ఓవర్లోనూ వరుసగా 4, 6 కొట్టిన అనంతరం తర్వాతి బంతికి ఫిలిప్స్ అవుట్ కావడంతో 79 పరుగుల (42 బంతుల్లో) నాలుగో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్లో చాప్మన్ను వరుణ్ అవుట్ చేయడంతో కివీస్ ఆశలు కోల్పోయింది. ఈ దశలో విజయానికి చివరి 5 ఓవర్లలో 95 పరుగులు చేయాల్సిన జట్టు చివరకు 46 పరుగులే చేయగలిగింది. డరైల్ మిచెల్ (18 బంతుల్లో 28; 4 ఫోర్లు), సాంట్నర్ (13 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు) కొంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) రచిన్ (బి) జేమీసన్ 10; అభిషేక్ (సి) జేమీసన్ (బి) సోధి 84; ఇషాన్ కిషన్ (సి) చాప్మన్ (బి) డఫీ 8; సూర్యకుమార్ (సి) రాబిన్సన్ (బి) సాంట్నర్ 32; పాండ్యా (సి) చాప్మన్ (బి) డఫీ 25; దూబే (సి అండ్ బి) జేమీసన్ 9; రింకూ సింగ్ (నాటౌట్) 44; అక్షర్ (సి) మిచెల్ (బి) క్లార్క్ 5; అర్ష్ దీప్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 238. వికెట్ల పతనం: 1–18, 2–27, 3–126, 4–149, 5–166, 6–185, 7–209. బౌలింగ్: డఫీ 4–0–27–2, జేమీసన్ 4–0–54–2, క్లార్క్ 4–0–40–1, సోధి 3–0–38–1, ఫిలిప్స్ 1–0–20–0, సాంట్నర్ 3–0–37–1, మిచెల్ 1–0–21–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) సామ్సన్ (బి) అర్ష్ దీప్ 0; రాబిన్సన్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 1; రచిన్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 1; ఫిలిప్స్ (సి) దూబే (బి) అక్షర్ 78; చాప్మన్ (సి) అభిషేక్ (బి) వరుణ్ 39; మిచెల్ (సి) (సబ్) బిష్ణోయ్ (బి) దూబే 28; సాంట్నర్ (నాటౌట్) 20; క్లార్క్ (సి) రింకూ (బి) దూబే 0; జేమీసన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–52, 4–131, 5–143, 6–189, 7–189. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–31–1, పాండ్యా 2–0–20–1, బుమ్రా 3–0–29–0, అక్షర్ పటేల్ 3.3–0–42–1, వరుణ్ 4–0–37–2, దూబే 3–0–28–2, అభిషేక్ 0.3–0–3–0.
తొలి టీ20లో భారత్ ఘన విజయం
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్ను 48 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించిందిఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ విఫలమైనప్పటికి అభిషేక్ మాత్రం కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లుతో 84 పరుగులు చేశాడు. అతడితో పాటు రింకూ సింగ్(24 బంతుల్లో 44 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(32), హార్దిక్ పాండ్యా(25) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, జాకబ్ డఫ్ఫీ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్, సోధీ, క్లార్క్ తలా వికెట్ సాధించారు.అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగల్గింది. కివీస్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు. ఫిలిప్స్ కేవలం 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్స్లతో 78 పరుగులు చేశాడు. అతడితో పాటు చాప్మన్(39)రాణించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, అర్ష్దీప్, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 రాయ్పూర్ వేదికగా శుక్రవారం(జనవరి 23) జరగనుంది.చదవండి: అరుదైన మైలురాయిని తాకిన సూర్య భాయ్
చరిత్ర సృష్టించిన జొకోవిచ్
మెల్బోర్న్: కెరీర్లో 25వ గ్రాండ్స్లామ్ సింగిల...
ప్రైజ్మనీ రూ. 90 కోట్ల 86 లక్షలు
రబాట్ (మొరాకో): నాటకీయ పరిణామాల మధ్య ఆద్యంతం ఉత్క...
సంపాదనలేని భర్త వద్దు.. భార్యే నా ATM?.. అసలేం జరిగింది?
ఢిల్లీ.. 2000 సంవత్సరం.. విమాన ప్రయాణం.. ఆమె లగేజీ...
వీనస్ విలియమ్స్కు షాక్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్...
తొలి టీ20లో భారత్ ఘన విజయం
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండి...
అరుదైన మైలురాయిని తాకిన సూర్య భాయ్
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో నాగ్పూర్ వ...
అభిషేక్ విధ్వంసం, రింకూ మెరుపులు.. టీమిండియా భారీ స్కోర్
నాగ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 21) ...
అభిషేక్ శర్మ ఊచకోత.. కేవలం 22 బంతుల్లోనే..!
నాగ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 21) ...
క్రీడలు
అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్..తొలి టి20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
వీడియోలు
ఫస్ట్ టీ20లో భారత్ ఘన విజయం
సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ
పాక్ బాటలో బంగ్లాదేశ్..! అదే జరిగితే
అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా
Vaibhav : 15వ బర్త్డే లోపు భారత్కు ప్రపంచకప్ గిఫ్ట్ ఇస్తాడా ...?
విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయిన సోఫియా డివైన్
ముంబైలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం
మహిళా షూటర్ పై లైంగిక దాడి.. జాతీయ కోచ్ అంకుశ్ పై వేటు
రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్ శిఖర్ ధావన్
ఇండియాలో మేం ఆడలేం! ICCకి బంగ్లా క్రికెట్ బోర్డు సంచలన లేఖ
