Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Virender Sehwag Trashes Riyan Parag's Leadership1
నీకూ.. నీ కెప్టెన్సీకి ఒక దండం: వీరేందర్ సెహ్వాగ్

ఐపీఎల్‌-2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తమ హోం గ్రౌండ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఘోర ఓటమి చవిచూసింది. శనివారం జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ పరాజయం పాలైంది. 229 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ బౌలర్లు కాపాడులేకపోయారు.అంతేకాకుండా కెప్టెన్ రియాన్ పరాగ్ తల తిక్క నిర్ణయాలు కూడా రాజస్తాన్ ఓటమికి ఓ కారణంగా చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో టాప్ క్లాస్ స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌, రవీంద్ర జడేజాలతో పరాగ్ చెరో ఓవర్ మాత్రమే వేయించాడు. భారీగా పరుగులు సమర్పించుకున్న బ్రిజేష్ శర్మతో మాత్రం పరాగ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయించాడు.కెప్టెన్సీతో మాత్రమే కాదు బ్యాటింగ్ పరంగా రియాన్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు.ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో పరాగ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడిన ప‌రాగ్ కేవ‌లం 88 ప‌రుగులు చేశాడు. అత‌డి అత్య‌ధిక స్కోర్ 20 ప‌రుగులగా ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌రాగ్‌పై భార‌త మాజీ ఓపెన‌ర్ వీరేందర్ సెహ్వాగ్ విమ‌ర్శ‌లు గుప్పించాడు. "రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం రియాన్ పరాగ్ కెప్టెన్సీపై పునరాలోచన చేయాలి. అత‌డు త‌మకు స‌రైన కెప్టెన్ కాదా అన్న‌ది రాజ‌స్తాన్ మ‌రోసారి ఆలోచించాలి. మీరు 25 మందినీ ఇంటర్వ్యూ చేసి ప‌రాగ్‌ను ఎంపిక చేసి ఉండొచ్చు. కానీ అత‌డు లీడర్‌గా నిరూపించుకోలేక‌పోతున్నాడు. ముఖ్యంగా అత‌డి వ్యూహాలు ఎంటో ఆర్ధం కావ‌డం లేదు. హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లో వికెట్ టేకింగ్ బౌలర్లైన రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజాల‌తో ఒక్క ఓవ‌ర్ మాత్ర‌మే బౌలింగ్ చేయించాడు. వారికి మ‌రో ఓవ‌ర్ ఇచ్చి ఉండాల్సింది. ఒక్క ఓవ‌ర్ మాత్ర‌మే ఇస్తే వికెట్లు ఏలా తీస్తారు? అత‌డు బ్యాట‌ర్‌గా కూడా విఫ‌ల‌మ‌వుతున్నాడు. ఆ ప్ర‌భావం క‌చ్చితంగా అత‌డి కెప్టెన్సీపై ప‌డుతుంది. ప‌రుగులు ఎలా సాధించాల‌న్న త‌ప‌న‌తో కెప్టెన్సీపై ఏకాగ్ర‌త‌ను కోల్పోతున్నాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే శతకం బాదేశాడు, నేను సీనియ‌ర్‌ని, ఎందుకు ప‌రుగులు చేయ‌లేక‌పోతున్నాను అని ప‌రాగ్ తెగ ఆలోచిస్తుంటాడు. ప‌దేప‌దే ఎక్కువ‌గా ఆలోచించ‌డంతో అత‌డిపై మ‌రింత ఒత్తిడి పెరుగుతుంద‌ని" క్రిక్‌బ‌జ్ ఇంట‌ర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: వైభవ్ సూర్యవంశీకి తీవ్ర గాయం.. ఐపీఎల్‌ నుంచి అవుట్‌?

IPL 2026: Chennai Super Kings vs Gujarat Titans Toss and playing 112
సీఎస్‌కే వర్సెస్‌ గుజరాత్‌ మ్యాచ్‌.. తుది జట్లు ఇవే

ఐపీఎల్‌-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజ‌రాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. గుజరాత్‌ జట్టులోకి అర్షద్‌ ఖాన్‌ రాగా.. సీఎస్‌కే జట్టులోకి ఉర్విల్‌ పటేల్‌ వచ్చాడు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్ కీపర్‌), షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్

Pakistan ODI Squad For 1st Ever Historical Series Announced3
చారిత్రాత్మక సిరీస్‌కు పాక్‌ వన్డే జట్టు ప్రకటన

జింబాబ్వే మహిళల జట్టు తొలిసారి పాకిస్తాన్‌లో పర్యటించనుంది. మే 4న మొదలయ్యే ఈ చారిత్రాత్మక సిరీస్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన పాక్‌ వన్డే జట్టును అధికారికంగా ప్రకటించారు. ఈ జట్టుకు ఫాతిమా సనా సారథ్యం వహించనుంది. మే 4, 6, 9 తేదీల్లో నేషనల్‌ బ్యాంక్‌ స్టేడియం (కరాచీ) వేదికగా మూడు మ్యాచ్‌ వన్డే సిరీస్‌ జరుగనుంది. ఈ సిరీస్‌ ఐసీసీ వుమెన్స్‌ ఛాంపియన్షిప్‌ 2025–29లో భాగం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సిరీస్‌ కోసం ఎంపిక​ చేసిన పాక్‌ జట్టులో యువ స్పిన్నర్ మోమిరనా రియాసత్‌కు తొలిసారి చోటు దక్కింది. దేశీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆమె, ఇటీవల జరిగిన నేషనల్ టీ20 టోర్నీలో 16 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. వన్డే కప్‌లోనూ 19 వికెట్లు సాధించి తన ప్రతిభను నిరూపించుకుంది.ఈ పర్యటన కోసం జింబాబ్వే జట్టు ఏప్రిల్ 29న కరాచీకి చేరుకోనుంది. ఏప్రిల్ 30 నుంచి మే 3 వరకు ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటాయి. ప్రస్తుతం ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ పట్టికలో పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉండగా, జింబాబ్వే ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారింది.జింబాబ్వేతో వన్డే సిరీస్ అనంతరం పాకిస్థాన్ మహిళల జట్టు ఐర్లాండ్‌ టీ20 ట్రై సిరీస్‌ 2026లో పాల్గొననుంది. ఇందులో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లు కూడా పోటీపడనున్నాయి. జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లండ్‌లో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026కు సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడనుంది.టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ గ్రూప్-1లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ వంటి బలమైన జట్లు ఉన్నాయి. జింబాబ్వేతో వన్డే సిరీస్‌ అనంతరం పాక్‌ జట్టు ఆదే టీమ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. ఈ సిరీస్‌ మే 12, 14, 15 తేదీల్లో నేషనల్‌ బ్యాంక​్‌ స్టేడియం వేదికగానే జరగనుంది.జింబాబ్వే సిరీస్‌ కోసం పాక్‌ వన్డే జట్టు..ఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, అయేషా జాఫర్, డయానా బేగ్, గుల్ ఫిరోజా, మోమినా రియాసత్, మునీబా అలీ (WK), నజిహా అల్వీ (WK), నష్రా సుంధు, నటాలియా పర్వైజ్, రమీన్ షమీమ్, సదాఫ్ షమాస్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా, తస్మియా రుబాబ్‌రిజర్వ్‌ ప్లేయర్లు: ఇరామ్ జావేద్, ఈమాన్ ఫాతిమా, సైరా జబీన్, తుబా హసన్, అంబర్ కైనాట్.

IPL 2026: Orange cap shared between kohli, rahul, vaibhav, abhishek in a single day4
పొద్దున్నే విరాట్‌, రాత్రికి అభిషేక్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఆసక్తికరంగా రెండూ హై స్కోరింగ్‌ మ్యాచ్‌లే అయ్యాయి. రెండు మ్యాచ్‌ల్లో సిక్సర్లు, బౌండరీల వర్షం, సెంచరీల హోరు, పరుగుల వరద పారింది. ఈ క్రమంలో నిన్నటి రోజుకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది.టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారికే ఇచ్చే ఆరెంజ్‌ క్యాప్‌ ఏకంగా నలుగురి చేతులు మారింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.ఉదయం వరకు ఆర్సీబీ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉండగా.. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ 67 బంతుల్లో అజేయంగా 152 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.సాయంత్రానికి యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ రంగంలోకి దిగి మెరుపు సెంచరీతో ఆరెంజ్‌ క్యాప్‌ను రాహుల్‌ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. రాత్రికి అదే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ తన బ్యాట్‌కు పని చెప్పి, గంటలు కూడా గడవకముందే వైభవ్‌ నుంచి ఆరెంజ్‌ క్యాప్‌ లాగేసుకున్నాడు.ఇలా ఒకే రోజులో ఆరెంజ్‌ క్యాప్‌ నాలుగు సార్లు చేతులు మారడంతో సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా స్పందించారు. ఆరెంజ్ క్యాప్ 24 గంటల మెడికల్ షాప్ ఉద్యోగిలా షిఫ్ట్‌లు మారుతోంది అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, మరొకరు "ఉదయం కోహ్లీ, మధ్యాహ్నం కేఎల్, సాయంత్రం వైభవ్, రాత్రికి అభిషేక్.. ఐపీఎల్ 2026 పూర్తిగా సినిమానే" అని అన్నాడు. ఇలాంటి రకరకాల మీమ్స్‌తో సోషల్‌మీడియా హోరెత్తింది.కాగా, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ పట్టికలో అభిషేక్ శర్మ 380 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. వైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్ తలో 357 పరుగులతో రెండో స్థానాన్ని పంచుకున్నారు. సన్‌రైజర్స్‌ మరో ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ 349 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 328 పరుగులతో ఐదో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో ఉదయం అగ్రస్థానంలో ఉండిన కోహ్లి రాత్రి కంతా ఐదో స్థానానికి పడిపోవడం​ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Not Highest Successful Chase, Punjab Kings Smash Another World Record In IPL5
పంజాబ్‌ కింగ్స్‌ మరో చరిత్ర

ఐపీఎల్‌ 2026లో పంజాబ్‌ కింగ్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 265 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన విషయం తెలిసిందే. ఈ లక్ష్య ఛేదన ఐపీఎల్‌లోనే కాకుండా యావత్‌ పొట్టి క్రికెట్‌లోనే అత్యధికం. ఈ మ్యాచ్‌కు ముందు వరకు కూడా ఈ రికార్డు పంజాబ్‌ పేరిటే ఉండేది. 2024 ఎడిషన్‌లో ఈ జట్టు కేకేఆర్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.టీ20 చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్‌లు ఇవేపంజాబ్ కింగ్స్- 265/4- ప్రత్యర్ధి- ఢిల్లీ క్యాపిటల్స్‌పంజాబ్ కింగ్స్‌-262/2- ప్రత్యర్ధి-కేకేఆర్‌సౌతాఫ్రికా- 259/4- ప్రత్యర్ధి- వెస్టిండీస్‌బ్రిస్బేన్ హీట్‌-258/2- ప్రత్యర్ధి- పెర్త్ స్కార్చర్స్ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ మరో భారీ రికార్డు కూడా నెలకొల్పింది. ఇప్పటివరకు తలో ఐదు సార్లు ఛాంపియన్లైన సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌ కూడా సాధించలేని ఘనతను సాధించింది.శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలో ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్న ఈ జట్టు.. తొలి ఏడు మ్యాచ్‌లలో ఆరు విజయాలు నమోదు చేయగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఏడు లీగ్ మ్యాచ్‌ల అనంతరం 13 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఈ గణాంకాల ద్వారానే పంజాబ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది.ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ జట్టూ తొలి ఏడు మ్యాచ్‌ల తర్వాత 13 పాయింట్లు సాధించలేదు. 12 పాయింట్లు మాత్రమే గరిష్టంగా ఉండేది. ఆ ఘనతను ముంబై, చెన్నై, గుజరాత్, రాజస్థాన్ వంటి పలు జట్లు సాధించాయి. ఇప్పుడు పంజాబ్ ఆ రికార్డును చెరిపేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.Most points in an #ipl after 7 games13 - PBKS (2026)12 - MI (2010), CSK (2014), PBKS (2014), CSK (2015), GL (2016), MI (2017), CSK (2019), GT (2022), RR (2024) pic.twitter.com/8EK78fGVzR— Erika Morris (@ErikaMorris79) April 25, 2026కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి ఢిల్లీ.. కేఎల్‌ రాహుల్‌ (152 నాటౌట్‌), నితీశ్‌ రాణా (91) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని పంజాబ్‌ ఆది నుంచే కరిగించుకుంటూ వచ్చింది. ఓపెనర్లు ప్రియాంశ్‌ ఆర్య (43), ‍ప్రభ్‌సిమ్రన్‌ (76) తమ సహజ శైలిలో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (71 నాటౌట్‌) నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా పంజాబ్‌ ఈ సీజన్‌లో తమ జైత్రయాత్రను కొనసాగించింది.

Rajasthan Royals Issue Official Update On Vaibhav Sooryavanshi's Injury6
వైభవ్‌ సూర్యవంశీ గాయంపై అధికారిక​ అప్‌డేట్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. తొడ కండరాలు పట్టేయడంతో వైభవ్‌ నొప్పితో విలవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినా నొప్పి తగ్గలేదు. నడిచేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో సహచర ఆటగాళ్ల సాయంతో వైభవ్ మైదానాన్ని వీడాడు. ఇదే మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీ చేసి భీకర ఫామ్‌లో ఉండిన వైభవ్‌ మైదానాన్ని వీడటంతో రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.వైభవ్‌ గాయం చాలా తీవ్రమైందని, దీని దెబ్బకు సీజన్‌ మొత్తానికి దూరం కావాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి రాయల్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ చెక్‌ పెట్టాడు. వైభవ్‌ గాయం తీవ్రంగా లేదని మ్యాచ్‌ అనంతరం అధికారికంగా వెల్లడించాడు. దీంతో రాయల్స్‌ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.రాథోడ్‌ మాటల్లో.. "వైభవ్ హ్యామ్‌స్ట్రింగ్‌లో కొద్దిగా అసౌకర్యం అనిపించింది. అందుకు చికిత్స అందించారు. ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు. మరో రోజు లేదా రెండు రోజుల్లో పూర్తి స్థితి తెలుస్తుంది. కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.రాథోడ్‌ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైభవ్‌ రాయల్స్‌ తదుపరి మ్యాచ్‌ సమయానికంతా సిద్దంగా ఉంటాడని తెలుస్తుంది. ఒకటి రెండు రోజుల విశ్రాంతి తీసుకుంటే సరిపొతుందని స్పష్టమవుతుంది. రాయల్స్‌ తమ తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 28న పంజాబ్‌ కింగ్స్‌తో ఆడనుంది. ఆ మ్యాచ్‌ సమయానికి వైభవ్‌ తప్పక అందుబాటులో ఉండే అవకాశం ఉంది.ఒకవేళ వైభవ్‌ ఆ మ్యాచ్‌ సమయానికి అందుబాటులో లేకపోతే రాయల్స్‌కు తీవ్ర నష్టం చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్‌లో వైభవ్‌ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా తాను గాయపడిన మ్యాచ్‌లోనూ 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ పరాజయంపాలైంది.

IPL 2026: PBKS Captain Shreyas Iyer Comments After win against DC7
వాళ్లు కొట్టినప్పుడు, మేమూ కొడతామనుకున్నా: శ్రేయస్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ నిర్దేశించిన 265 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ మరో ఏడు బంతులు మిగిలుండగానే సునాయాసంగా ఊదేసింది. ఈ గెలుపు అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ సారధి శ్రేయస్‌ అయ్యర్‌ సంతోషం వ్యక్తం​ చేశాడు. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని అన్నాడు. శ్రేయస్‌ మాటల్లో..నిజంగా చెప్పాలంటే, మాటలు రావడం లేదు. మైదానంలో తీవ్ర ఎండ, మరోవైపు బౌలర్లు వరుసగా బౌండరీలు, సిక్సర్లు ఇస్తుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో మాకు తెలుసు.పిచ్ స్పిన్‌కు సహకరిస్తుందని ముందుగా భావించినప్పటికీ, ఆశించినంత మలుపు లభించలేదు. చహల్‌ బౌలింగ్‌కు వచ్చిన తర్వాత మాత్రమే బంతి కొద్దిగా ఆగినట్లు అనిపించింది.కేఎల్‌ రాహుల్‌ ఆడిన తీరు అద్భుతం. అతని షాట్లు కళ్లకు పండుగలా అనిపించాయి. అతను ఎలాంటి ఒత్తిడిలోనూ లేనట్లు కనిపించాడు.భారీ లక్ష్యాన్ని ఛేదించే ముందు నా ఆలోచన ఒక్కటే. వాళ్లు ఎంత చేసినా, మనం ఒక్క పరుగు ఎక్కువ చేయాలి. వాళ్లు కొట్టగలిగినప్పుడు, మేమూ కొడతామనుకున్నా. ఆ సమయంలో అదే నా మైండ్‌సెట్.డ్రెస్సింగ్‌రూమ్‌లో కూడా ఇదే చర్చ జరిగింది. గత మ్యాచ్‌ల్లో 220కి పైగా లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన అనుభవం మాకు ధైర్యాన్నిచ్చింది.ప్రభ్‌సిమ్రన్‌, ప్రియాంశ్‌ పవర్‌ప్లేలోనే దూకుడుగా ఆడి బలమైన పునాది వేశారు. వారి ఆరంభాన్ని మిగతా బ్యాటర్లు కొనసాగించారు.బౌలింగ్, ఫీల్డింగ్ విషయాల్లో ఇంకా మెరుగుదల అవసరమని అంగీకరించిన అయ్యర్, ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్నామని అన్నాడు.కాగా, చారిత్రక గెలుపు తర్వాత పంజాబ్‌ను చూసి మిగతా జట్లంతా వణికిపోతున్నాయి. వీరికి ఎంత లక్ష్యమైతే సరిపోతుందని లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ సీజన్‌లో పంజాబ్‌ మునుపెన్నడూ లేనంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతే ఏకైక అజేయ జట్టుగా చలామణి అవుతుంది. మున్ముందు కూడా పంజాబ్‌ ఇదే జోరును కొనసాగిస్తే, ఈసారి టైటిల్‌ గెలవకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. గత సీజన్‌లో ఇదే శ్రేయస్‌ నేతృత్వంలో పంజాబ్‌ రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.

Axar Patel Holds These Players Responsible For Worst Ever IPL Record8
పంజాబ్‌ చేతిలో ఓటమిని సహచరులపైకి నెట్టిన అక్షర్‌ పటేల్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్దేశించిన 265 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ మరో ఏడు బంతులు మిగిలుండగానే ఛేదించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఓటమిని ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ తన ఫీల్డర్ల ఖాతాలోకి వేశాడు.మ్యాచ్‌ అనంతరం ఓటమిపై స్పందిస్తూ.. జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు."మేము మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తున్నాం. ఇలాంటి పిచ్‌పై బౌలర్లకు ఫీల్డర్లు సహకరించకపోతే, ఓడిపోవడమే సరైన ఫలితం" అంటూ కఠినంగా వ్యాఖ్యానించాడు.ముఖ్యంగా ఫీల్డింగ్ వైఫల్యమే మ్యాచ్‌ను చేజార్చిందని స్పష్టం చేశాడు. కరుణ్‌ నాయర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఇచ్చిన రెండు కీలక క్యాచ్‌లను వదిలేయడం జట్టుకు భారీ మూల్యం చెల్లింపజేసిందని అన్నాడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న అయ్యర్ 36 బంతుల్లో అజేయమైన 71 పరుగులు చేసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడని తెలిపాడు.అక్షర్ తన బౌలర్లపైనా అసహనం వ్యక్తం చేశాడు. పవర్‌ప్లేలో ప్రత్యర్థి పరుగుల వేగాన్ని నియంత్రించడంలో బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నాడు. ఢిల్లీ బౌలర్లందరూ ఓవరుకు 11కి పైగా పరుగులు సమర్పించడం జట్టు పరిస్థితిని మరింత దయనీయంగా మార్చిందని అసంతృప్తి వ్యక్తం చేశాడు.కుల్దీప్‌ రెండు వికెట్లు తీసినా 46 పరుగులు ఇచ్చాడు. తాను, నటరాజన్‌, ముకేశ్‌ కుమార్‌, ఆకిబ్‌ నబీ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నామని అన్నాడు. ఈ వికెట్‌పై 264 పరుగుల స్కోర్‌ చాలా మంచిదని అభిప్రాయపడ్డాడు. లక్‌ మా పక్షాన ఉండి, క్యాచ్‌లు పట్టుంటే ఈజీగా గెలిచేవాళ్లమని తెలిపాడు. ఈ సీజన్‌లో మేం ఓడిన మ్యాచ్‌లు చూస్తే చాలా వరకు క్లోజ్‌ మ్యాచ్‌లు. వాటిలో కొన్ని అవకాశాలను ఓడిసి పట్టుకుని ఉంటే, రెండు-మూడు అదనపు విజయాలు మా ఖాతాలో ఉండేవని అని అభిప్రాయపడ్డాడు. తప్పులు పదేపదే రిపీట్‌ చేస్తుంటే, అవకాశాలు మళ్లీమళ్లీ రావని అసహనం వ్యక్తం చేశాడు.కాగా, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తొలుత బ్యాటింగ్‌ చేసి కేఎల్‌ రాహుల్‌ (152 నాటౌట్‌), నితీశ్‌ రాణా (91) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని పంజాబ్‌ ఆది నుంచే కరిగించుకుంటూ వచ్చింది. ఓపెనర్లు ప్రియాంశ్‌ ఆర్య (43), ‍ప్రభ్‌సిమ్రన్‌ (76) తమ సహజ శైలిలో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (71 నాటౌట్‌) నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా పంజాబ్‌ ఈ సీజన్‌లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తుంది.

IPL 2026: SRH Captain Cummins comments after win against RR9
ఇలాంటి స్కోర్లను మా బ్యాటర్లు ఊదేస్తారు.. కమిన్స్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. అభిషేక్‌ శర్మ (57), ఇషాన్‌ కిషన్‌ (74), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (36) మెరుపు విన్యాసాల కారణంగా ఎస్‌ఆర్‌హెచ్‌ మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఊదేసింది.ఈ గెలుపుపై మ్యాచ్‌ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ ఇలా స్పందించాడు. సీజన్‌లో తొలి మ్యాచ్ (ఈ సీజన్‌లో కమిన్స్‌కు ఇదే తొలి మ్యాచ్‌) ఎలా సాగుతుందో ఎప్పుడూ కొంత అనిశ్చితి ఉంటుంది. కానీ మా సన్నాహాలు అద్భుతంగా జరిగాయి. అనుభవంతో ఆటను త్వరగా అర్థం చేసుకోగలుగుతున్నాను.ప్రస్తుతం టీ20 క్రికెట్ పూర్తిగా బ్యాటర్ల ఆటగా మారిపోయింది. ఇలాంటి హై స్కోరింగ్ మ్యాచ్‌లు బౌలర్లకు పెద్ద సవాలే. కానీ రెండు ఖరీదైనా ఓవర్లు వేసినా, మళ్లీ తిరిగి వచ్చి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదే టీ20 అందం.యువ బౌలర్ల ప్రదర్శనపై కమిన్స్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. ప్రఫుల్‌ హింగే ప్రస్తావన తీసుకొచ్చాడు. వీరిని ఇషాన్‌ కిషన్‌ అద్భుతంగా ముందుండి నడిపించాడని కితాబునిచ్చాడు. హర్షల్‌ పటేల్‌, జయదేవ్‌ ఉనద్కత్‌ లాంటి సీనియర్లు ఉండనే ఉన్నారని అన్నాడు. డగౌట్‌ బౌలర్లతో కలకలలాడుతుందని తెలిపాడు. యువ బౌలర్లు స్పష్టమైన ప్రణాళికలతో రాణిస్తున్నారని కొనియాడాడు.మధ్య విరామ సమయంలో జట్టు చాలా ప్రశాంతంగా ఉందని వెల్లడించాడు. ప్రత్యర్థి స్కోరు 250 దాటే అవకాశముండగా, 220 వద్ద నిలిపేయడం కీలకమైందని చెప్పాడు. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌పై పట్టుసాధించాలని భావించామని తెలిపాడు. ప్రస్తుతమున్న ఫామ్‌లో మా బ్యాటర్లు ఇలాంటి లక్ష్యాలను సులభంగా ఊదేయగలరని విశ్వాసం వ్యక్తం చేశాడు.కాగా, కమిన్స్‌ వ్యాఖ్యల్లో తన బృందంపై నమ్మకం, ధీమా కొట్టొచ్చినట్లు కనిపించింది. తన గైర్హాజరీలో ఇషాన్‌ జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడని అభిప్రాయపడ్డాడు. అలాగే బౌలర్లు, ముఖ్యంగా యువ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. బ్యాటర్ల మెరుపు విన్యాసాలపై ధీమా కనిపించింది. మొత్తంగా జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు.

IPL 2026: RR Captain Riyan Parag Comments after losing to SRH10
అదే మా కొంపముంచింది.. సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమి అనంతరం రియాన్‌ పరాగ్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌.. వైభవ్‌ సూర్యవంశీ (103) శతక్కొట్టుడుతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా, సన్‌రైజర్స్‌ ఇషాన్‌ కిషన్‌ (74), అభిషేక్‌ శర్మ (57) మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడటంతో మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్‌ రాయల్స్‌ను వెనక్కు నెట్టి (నాలుగో స్థానానికి) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమిపై మ్యాచ్‌ అనంతరం రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ ఇలా స్పందించాడు.భారీ స్కోరు చేసినప్పటికీ, క్యాచ్‌లు వదిలేయడం జట్టుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నైపుణ్య పరంగా చూస్తే మేం బాగా ఆడాం. కానీ కీలక సమయంలో చాలా క్యాచ్‌లు వదిలేశాం. అభిషేక్‌ శర్మ లాంటి నాణ్యమైన ఆటగాళ్లకు రెండో అవకాశం ఇస్తే, అతను దాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాడు. అదే జరిగింది.228 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, ఇంకా 10 నుంచి 15 పరుగులు వెనుకపడ్డాం. చివరి రెండు ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లు అద్భుతమైన యార్కర్లతో పరుగులను నియంత్రించారు.బౌలింగ్ మార్పులపై వివరణ ఇస్తూ.. ఇద్దరు ఎడమచేతి బ్యాటర్లు ఉండటంతో తాను, మరో స్పిన్నర్ కలిసి వికెట్ కోసం ప్రయత్నించాం. అయితే పిచ్ స్పిన్‌కు అనుకూలంగా లేకపోవడంతో మా ప్రణాళిక ఫలించలేదు.ఆర్చర్‌ ప్రదర్శన చాలా అద్భుతం. ఈ సీజన్ అంతా అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా క్లాసిక్ స్పెల్ వేశాడు. కొన్ని టాప్ ఎడ్జ్‌లు ఫీల్డర్ల మధ్య పడటం అతని దురదృష్టం.తదుపరి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను ఎదుర్కొననుండటంపై స్పందిస్తూ.. ప్రతి వేదిక కొత్త సవాల్. చండీగఢ్ పిచ్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం సిద్ధం చేసుకుంటాము.ఒక రోజు విరామం ఉంది. మానసికంగా ఫ్రెష్ అయి, తప్పులను సరిదిద్దుకుని మరింత బలంగా తిరిగి వస్తాం. ఫీల్డింగ్‌ వైఫల్యాలను అధిగమిస్తే రాజస్థాన్ రాయల్స్ మరింత ప్రమాదకర జట్టుగా మారడం ఖాయమని రియాన్‌ అభిప్రాయపడ్డాడు.కాగా, ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ ఓటమికి ఫీల్డింగ్‌ వైఫల్యాలు, క్యాచ్‌లు జారవిడచడమే ప్రధాన కారణమైనప్పటికీ.. బ్యాటింగ్‌లో లోపాలు సైతం గమినించదగ్గవే. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఇంకా భారీ స్కోర్‌ చేసుండాల్సింది. సూర్యవంశీ క్రీజ్‌లో ఉన్నంత సేపు సునాయాసంగా 250 ప్లస్‌ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే అతను ఔటైన వెంటనే సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఫెరియెరా మెరుపులు మినహా మధ్య వరుస బ్యాటర్లెవ్వరూ రాణించలేదు. అలాగే ఈ మ్యాచ్‌లో రియాన్‌ కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేక ఏకంగా 8 మంది బౌలర్లను ప్రయోగించాడు. స్ట్రయిట్‌ స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌, రవీంద్ర జడేజాతో తలో ఓవర్‌ మాత్రమే వేయించి మూల్యం చెల్లించుకున్నాడు. మొత్తంగా ఈ ఓటమితో రాయల్స్‌ చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement