Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

CSK Captain Ruturaj Gaikwad Comments After Match Lost Vs Punjab Kings1
‘ఏదీ కలిసిరావడం లేదు.. ఓటమికి అదే కారణం’

ఐపీఎల్ 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ ఆ జ‌ట్టు ఓడిపోయింది. బౌల‌ర్ల వైఫ‌ల్యం కార‌ణంగానే పంజాబ్‌తో మ్యాచ్‌లో ఓడిపోయామ‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. మ్యాచ్ ఓట‌మి అనంత‌రం రుతురాజ్ మాట్లాడాడు.‘ఇది చాలా క‌ఠినమైన మ్యాచ్‌. అయిన‌ప్ప‌టికి కూడా ఈ మ్యాచ్ నుంచి ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. మా బ్యాట‌ర్లు చాలా బాగా ఆడారు. ముఖ్యంగా ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలాగే శివమ్ దూబే కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా బ్యాటింగ్ విభాగం బాగా ఆడింది. మా బౌలింగ్ విభాగం మెరుగుప‌డాల్సి ఉంది. జట్టుకు ఏది అవసరమో, ఆ పాత్రకు అనుగుణంగా మారడమే ముఖ్యం. ఈరోజు వికెట్ కొంచెం గ్రిప్ అవుతున్నందున, బహుశా మరికొంత సేపు క్రీజులో నిలదొక్కుకోవాలని నాకు అనిపించింది. ఆ త‌రువాత వేగంగా ఆడాల‌ని అనుకున్నాను. అయితే.. దుర‌దృష్ట‌వ‌శాత్తు త‌ప్పుడు స‌మ‌యంలో ఔట్ అయ్యాను. నిజానికి 209 అనేది చాలా మంచి స్కోరు. పిచ్ నుంచి పేస‌ర్ల‌కు మంచి స‌హ‌కారం అందింది. రాహుల్ చాహ‌ర్‌ను ఇంపాక్ట్‌గా తీసుకోవ‌డంపై నేను ఒక్క‌టే ఆలోచించాను. ముగ్గురు సీమ‌ర్లు ఇద్ద‌రు రిస్ట్ స్పిన్న‌ర్ల‌తో ఆడాల‌ని అనుకున్నాము. ఈ కాంబినేష‌న్ జ‌ట్టుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌నుకున్నా. కానీ మా స్పిన్న‌ర్ల‌కు ఈ రోజు అస‌లు కలిసిరాలేదు. మ‌ధ్య ఓవ‌ర్ల‌లో ప్ర‌త్య‌ర్థిపై ఒత్తిడి పెంచ‌లేక‌పోయాము. అయితే మాది యువ జ‌ట్టు. అన‌వ‌స‌ర‌మైన అంచ‌నాల‌తో ఒత్తిడి పెంచుకోకూడ‌ద‌ని భావిస్తున్నాం’ అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఎంతపని చేశావ్‌ అయ్యర్‌.. పంజాబ్ జ‌ట్టుకు షాక్‌!

Shreyas Iyer Breaches Code of Conduct Again PBKS Team Reprimanded2
ఎంతపని చేశావ్‌ అయ్యర్‌.. పంజాబ్ జ‌ట్టుకు షాక్‌!

ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో సీఎస్‌కేతో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. వ‌రుస‌గా రెండు విజ‌యాల‌తో జోష్ మీదున్న పంజాబ్‌కు ఊహించ‌ని షాక్ తగిలింది. ఇప్ప‌టికే గుజరాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ న‌మోదు చేసినందుకు పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ఐపీఎల్ నిర్వాహ‌కులు జ‌రిమానా విధించారు. తాజాగా చెన్నైతో మ్యాచ్‌లో మ‌రోసారి స్లో ఓవ‌ర్ రేట్ న‌మోదు చేయ‌డంతో ఈసారి కెప్టెన్‌తో పాటు జట్టు ఆట‌గాళ్లు స‌హా ఇంపాక్ట్ ప్లేయ‌ర్ మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్న‌ట్లు ఐపీఎల్ నిర్వాహ‌కులు తెలిపారు. ఐపీఎల్‌ కౌన్సిల్‌ మాట్లాడుతూ..‘చెన్నై సూప‌ర్‌కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్లో ఓవ‌ర్ రేట్ న‌మోదు చేసింది. ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి (కోడ్ ఆఫ్ కండ‌క్ట్‌) ఆర్టికల్ 2.22 ప్ర‌కారం స్లో ఓవ‌ర్ రేట్ న‌మోదు చేసి నిబంధ‌న‌లు ఉల్లంఘించిన పంజాబ్ జ‌ట్టుపై చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. అయితే కెప్టెన్ అయ్య‌ర్‌కు ఇది0 రెండో స్లో ఓవ‌ర్‌రేట్ కావ‌డంతో అత‌ని మ్యాచ్ ఫీజులో రూ. 24 ల‌క్ష‌లు కోత విధిస్తున్నాం. అంతేకాదు జ‌ట్టులోని 11 మంది ఆట‌గాళ్లు సహా ఇంపాక్ట్ ప్లేయ‌ర్ నుంచి ఆరు ల‌క్ష‌లు లేదా వారి మ్యాచ్ ఫీజుల్లో 25 శాతం జ‌రిమానా విధిస్తున్నాం.’ అని ఐపీఎల్ కౌన్సిల్ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.మళ్ళీ తప్పు చేస్తే నిషేధం!ఈ సీజ‌న్‌లో పంజాబ్ జ‌ట్టు మూడోసారి కూడా స్లో ఓవ‌ర్ రేటును న‌మోదు చేస్తే అప్పుడు భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. అప్పుడు కెప్టెన్ కు 30ల‌క్ష‌ల జ‌రిమానా విధించ‌బ‌డుతుంది. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా తుది జ‌ట్టులోని ఆట‌గాళ్ల‌కు త‌లా 12 ల‌క్ష‌లు లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం రెండింటిలో ఏది త‌క్కువ అయితే అది జ‌రిమానా విధించ‌బ‌డుతుంది. అంతేకాదు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొనే అవ‌కాశముంది.మ్యాచ్ విష‌యానికి వ‌స్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. ఆయుశ్ మాత్రే 73 ప‌రుగుల‌తో రాణించాడు. అనంత‌రం పంజాబ్ కింగ్స్ 18.4 ఓవ‌ర్ల‌లోనే 5 వికెట్లు కోల్పోయి 210 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది.చదవండి: అంపైర్‌ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్‌!

srh ipl draft telangana players ignored kavya maran3
తెలంగాణపై కావ్య మారాన్‌ చిన్న చూపు

సాక్షి, హైదరాబాద్‌: దేశవాళీ క్రికెట్‌ పోటీల్లో సత్తా చాటుతున్న తెలంగాణ ప్లేయర్లను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఎందుకు చిన్న చూపు చూస్తోందో ఆ జట్టు యజమాని కావ్య మారాన్‌ సమాధానం చెప్పాలని తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు, శాట్‌ మాజీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఎస్‌ఆర్‌హెచ్‌ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రతినిధి నగేష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి సుమారు 100 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా ఒక్కరిని కూడా కొనుగోలు చేయకపోవడం అన్యాయమని విమర్శించారు. ఆరోన్‌ జార్జ్, అమన్‌రావు వంటి తెలంగాణ యువ ప్లేయర్లను ఎందుకు వేలంలో ఎస్‌ఆర్‌హెచ కొనుగోలు చేయలేదని నిలదీశారు. ఎస్‌ఆర్‌హెచ్‌కు తెలంగాణ డబ్బులు, మౌలిక వసుతులు కావాలి కానీ, ఇక్కడి స్థానిక ప్లేయర్లకు కనీస అవకాశాలు ఇవ్వరా? అని ప్రశ్నించారు. తెలంగాణపై ఎస్‌ఆర్‌హెచ్‌ సవతి తల్లి ప్రేమను కట్టిపెట్టాలని అన్నారు. ధర్నాలో విద్యార్థి సంఘాల నాయకులు రాజేష్‌ ప్రశాంత్, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Bodhana Sivanandan Becomes England Top Female Chess player Age 114
చెస్‌లో అద్భుతాలు సృష్టిస్తోన్న చిచ్చరపిడుగు

న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన చెస్‌ చిచ్చరపిడుగు బోధన శివనందన్‌ ఇంగ్లండ్‌ మహిళల చెస్‌ టాప్‌ ర్యాంకర్‌గా అవతరించింది. శుక్రవారం విడుదల చేసిన అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) రేటింగ్స్‌లో ఇంగ్లండ్‌కు చెందిన 11 ఏళ్ల బోధన 2366 పాయింట్లు సాధించి 72వ ర్యాంక్‌లో నిలిచింది. తొలిసారి టాప్‌–100లోకి వచ్చిన బోధన ఈ క్రమంలో 2306 పాయింట్లతో ఇంగ్లండ్‌ టాప్‌ ప్లేయర్‌గా ఉన్న 25 ఏళ్ల లాన్‌ యావోను అధిగమించింది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన బోధన తల్లిదండ్రులు 2007లో ఇంగ్లండ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. గత ఏడాది ఉమన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ హోదా పొందిన బోధన ఇటీవల జరిగిన యూరోపియన్‌ క్లబ్‌ కప్‌లో ప్రపంచ మాజీ చాంపియన్‌ మరియా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌)పై సంచలన విజయం నమోదు చేసింది. 10వ ర్యాంక్‌లో అర్జున్‌ మరోవైపు ఓపెన్‌ కేటగిరీలో తెలంగాణ ప్లేయర్‌ ఇరిగేశి అర్జున్‌ భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. తాజా రేటింగ్స్‌లో అర్జున్‌ 2751 పాయింట్లతో 10వ ర్యాంక్‌లో నిలిచాడు. 2741 పాయింట్లతో ప్రజ్ఞానంద 12వ ర్యాంక్‌లో, 2732 పాయింట్లతో ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ 15వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి 2535 పాయింట్లతో ఐదో ర్యాంక్‌లో ఉంది. 2510 పాయింట్లతో దివ్య దేశ్‌ముఖ్‌ పదో ర్యాంక్‌లో, 2470 పాయింట్లతో ద్రోణవల్లి హారిక 18వ ర్యాంక్‌లో, 2470 పాయింట్లతోనే వైశాలి 19వ ర్యాంక్‌లో ఉన్నారు.

Who Is Ayush Mhatre Fails 'Bat Test' Twice Due To Umpire Error IPL 20265
అంపైర్‌ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్‌!

గెలిచినోడి కంటే ఓడిపోయిన‌వాడి మీదే సానుభూతి ఎక్కువ‌గా ఉంటుంది. జ‌ట్టును గెలిపించినోడు హీరో అవుతాడ‌న్న‌ది కాద‌న‌లేని మాట. కానీ అదే సమయంలో ఓడిపోయిన జట్టు నుంచి మంచి ఇన్నింగ్స్ ఆడిన ఆట‌గాడు అభిమానుల మ‌న‌సులు గెలుచుకుంటాడు. ఇది ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆయుశ్ మాత్రేకు స‌రిగ్గా నప్పుతుందని చెప్పొచ్చు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే ఇన్నింగ్స్ స‌మ‌యంలో ఆయుశ్ మాత్రే వాడిన బ్యాట్ విష‌యంలో అంపైర్ అడ్డుప‌డ‌డం, ఆ త‌ర్వాత అదే బ్యాట్‌తో విధ్వంస‌కర ఇన్నింగ్స్ ఆడి అంద‌రిని మెప్పించడం విశేషం. గ‌తేడాది అనుకోకుండా వ‌చ్చిన అవ‌కాశాన్ని ఒడిసిప‌ట్టిన ఆయుశ్ మాత్రే ఈ సీజ‌న్‌కు వ‌చ్చేస‌రికి జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా మారిపోయాడు. చెన్నైకి ఓట‌మి ఎదురైనా ఆయుశ్ మాత్రే రూపంలో స‌క్సెస్ ల‌భించింద‌ని చెప్పొచ్చు.ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ వ‌రుస‌గా రెండో ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 5 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. అయితే చెన్నై ఓట‌మి చ‌విచూసిన‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు ఆట‌గాడు ఆయుశ్ మాత్రే మాత్రం సూప‌ర్‌స‌క్సెస్ అయ్యాడు. ఆయుశ్ మాత్రే గతేడాది చెన్నై జట్టు తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ముందుగా టీమ్‌లో లేకపోయినా...రుతురాజ్‌ గాయంతో తప్పుకోవడంతో జట్టుకు ఎంపికయ్యాడు. ముంబైకి చెందిన మాత్రే ముంబైలోనే ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడి 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత బెంగళూరుపై కూడా 48 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 94 పరుగులు సాధించి సత్తా చాటాడు. గత సీజన్‌ను ఘనంగా ముగించిన మాత్రే 2026 ఐపీఎల్‌ సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని భావించాడు. కానీ ఈ సీజన్‌ తొలి పోరులో మొదటి బంతికే వెనుదిరిగి నిరాశపర్చిన అతను ఈ మ్యాచ్‌లో తన కసిని ప్రదర్శించాడు. బార్ట్‌లెట్‌ ఓవర్లో వరుసగా 3 ఫోర్లతో అతను తన పరుగుల ఖాతా తెరిచిన అతను యాన్సెన్‌ ఓవర్లో 2 సిక్స్‌లు బాదాడు. ఆపై స్టొయినిస్‌ ఓవర్లో సిక్స్‌తో 29 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని అందుకున్న అతను తర్వాతి బంతినీ సిక్స్‌గా మలిచాడు. 59, 67 పరుగుల వద్ద చహల్‌ బౌలింగ్‌లో వైశాక్, శశాంక్‌ క్యాచ్‌లు వదిలేయడం అతనికి కలిసొచ్చింది.అంపైర్ పొర‌పాటు..సీఎస్‌కే ఇన్నింగ్స్ స‌మ‌యంలో ఒక విచిత్ర‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. గ్జేవియ‌ర్ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో సంజూ శాంస‌న్ ఔట‌య్యాకా మూడో స్థానంలో ఆయుశ్ మాత్రే క్రీజులోకి వ‌చ్చాడు. అయితే మొద‌ట తీసుకొచ్చిన బ్యాట్ కాస్త అనుమానంగా ఉండ‌డంతో అంపైర్ దానిని ప‌రిశీలించాడు. కానీ బ్యాట్ గేజ్ నుంచి పాస్ కాక‌పోవ‌డంతో వేరే బ్యాట్‌ను తీసుకొని వ‌చ్చాడు. కానీ ఈసారి కూడా బ్యాట్ గేజ్‌ను దాట‌క‌పోవ‌డంతో టెస్టులో మ‌రోసారి ఫెయిల్ అయ్యాడు. అయితే మాత్రే తొలుత తీసుకొచ్చి బ్యాట్‌ను అంపైర్ మ‌రోసారి చెక్ చేశాడు. అయితే ఇక్క‌డ అంపైర్ త‌న పొర‌పాటు వ‌ల్లే బ్యాట్‌కు గేజ్‌ను స‌రిగ్గా పెట్ట‌డంలో విఫ‌ల‌మైన‌ట్లు గుర్తించాడు. ఆ త‌ర్వాత మాత్రే త‌న ఫ‌స్ట్ బ్యాట్‌తోనే ఇన్నింగ్స్ కొన‌సాగించాడు.ఎవ‌రీ ఆయుశ్ మాత్రే?జూలై 16, 2007లో మ‌హారాష్ట్ర‌లోని న‌ల్ల‌సొపారా జిల్లాలో ఆయుశ్ మాత్రే జ‌న్మించాడు. ఆరేళ్ల వ‌య‌సులో క్రికెట్ ఆడ‌డం మొద‌లుపెట్టిన ఆయుశ్ మాత్రేకు టీమిండియా మాజీ ఆట‌గాడు ఎంఎస్ ధోని ఆరాధ్య క్రికెట‌ర్‌. అత‌ని ఆట‌ను చూస్తూ పెరిగిన ఆయుశ్ మాత్రే ప‌దిహేనేళ్ల వ‌య‌సులో ప్రొఫెష‌న‌ల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తన క‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు ముంబైలోని విరార్ నుంచి చ‌ర్చ్‌గేట్ వ‌ర‌కు రోజు 80 కిలోమీట్ల‌రు ప్ర‌యాణం చేసి ప్రాక్టీస్ కొన‌సాగించాడు. ఆయుష్ 2024-25 లో ఇరాని ట్రోఫీలో ముంబై తరఫున ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన ఆయుష్ 660 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో ఇటీవల సంచలనం చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో భారత క్రికెటర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ముంబై బ్యాటర్ ఆయుష్ మాత్రే బద్దలు కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత పిన్న వయసులో (17 ఏళ్ల 168 రోజులు)లో 150 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా మాత్రే రికార్డులకెక్కాడు. 2024 అండ‌ర్‌-19 టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన యంగ్ ఇండియా జ‌ట్టులో ఆయుశ్ మాత్రే స‌భ్యుడిగా ఉన్నాడు. ఇక 2025లో అండ‌ర్‌-19 జ‌ట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన ఆయుశ్‌మాత్రే ఆసియాక‌ప్‌లో భార‌త్‌ను ర‌న్న‌ర‌ప్‌గా నిలిపాడు. ఈ ఏడాది జరిగిన అండ‌ర్‌-19 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించిన ఆయుశ్ మాత్రే టీమిండియా టైటిల్ కొట్ట‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో 214 ప‌రుగులు సాధించాడు. అంతేకాదు ఆయుశ్ మాత్రే సార‌థ్యంలోనే యంగ్ ఇండియా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల‌ను వారి సొంత‌గ‌డ్డ‌పైనే ఓడించి సిరీస్‌లు కైవ‌సం చేసుకోవ‌డం విశేషం. View this post on Instagram A post shared by IPL (@iplt20)చదవండి: చెస్‌లో అద్భుతాలు సృష్టిస్తోన్న చిచ్చరపిడుగు

The stage is set for the first double header of the IPL season6
ఐపీఎల్‌లో నేడు ‘డబుల్‌’ ధమాకా

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ సీజన్‌లో తొలి ‘డబుల్‌ హెడర్‌’కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో జరిగే పోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుండగా... అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ ఎదుర్కొంటుంది. తమ తొలి మ్యాచ్‌ల్లో నెగ్గి ముంబై, ఢిల్లీ జోరు మీదుండగా ... సొంత మైదానంలో లీగ్‌లో బోణీ చేయాలని గుజరాత్‌ పట్టుదలగా ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అదృష్టవశాత్తూ ఓటమి నుంచి తప్పించుకుంది. 142 పరుగుల ఛేదనలో 26/4తో కష్టాల్లో ఉన్న సమయంలో రిజ్వీ, స్టబ్స్‌ పట్టుదలగా ఆడి గెలిపించారు. ఈ నేపథ్యంలో టాపార్డర్‌ నుంచి జట్టు మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. మరోవైపు కోల్‌కతాపై 221 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించిన ముంబై అదే దూకుడును కొనసాగించాలని భావిస్తోంది. రికెల్టన్, రోహిత్, సూర్య, తిలక్, పాండ్యాలతో టాప్‌–5 బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. గుజరాత్‌ బోణీ చేసేనా! తొలి మ్యాచ్‌లో చెన్నైని చిత్తు చేసిన ఉత్సాహంతో రాజస్తాన్‌ రెండో పోరుకు సై అంటోంది. ముఖ్యంగా వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసాన్ని అడ్డుకోవడమే గుజరాత్‌కు కీలకం కానుంది. సొంత మైదానంలో విజయంతో ఖాతా తెరవాలని ఆశిస్తున్న టైటాన్స్‌ తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయకపోవచ్చు. గత పోరులో ఫలితం ప్రతికూలంగా వచి్చనా...టాప్‌–4 బ్యాటర్లు గిల్, సుదర్శన్, బట్లర్, ఫిలిప్స్‌పైనే జట్టు ఆధారపడి ఉంది.

Punjab Kings defeated Chennai Super Kings by 5 wickets7
పంజాబ్‌ బల్లే బల్లే...

చెన్నై సూపర్‌కింగ్స్‌కి కోట లాంటి చెపాక్‌ మైదానంలో ఒక్క పంజాబ్‌కు మాత్రమే చెన్నైని ఎక్కువ సార్లు ఓడించిన ఘనమైన రికార్డు ఉంది. గత మూడు సీజన్లలో ఇక్కడ సూపర్‌ కింగ్స్‌ను మట్టికరిపించిన పంజాబ్‌ ఈసారీ దానిని కొనసాగించింది. ముందుగా చెన్నై 209 పరుగుల భారీ స్కోరు చేసినా... మరో 8 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్‌ గెలుపు సొంతం చేసుకుంది. స్పిన్నర్‌ చహల్‌ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి స్కోరును నియంత్రించగా, ఛేదనలో కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ అర్ధ సెంచరీతో పంజాబ్‌ కింగ్స్‌ జట్టును విజయం దిశగా నడిపించాడు. చెన్నై: గత ఏడాది ఐపీఎల్‌ రన్నరప్‌ పంజాబ్‌ కింగ్స్‌ ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుశ్‌ మాత్రే (43 బంతుల్లో 73; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా...శివమ్‌ దూబే (22 బంతుల్లో 33 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) సర్ఫరాజ్‌ ఖాన్‌ (12 బంతుల్లో 32; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడారు. అనంతరం పంజాబ్‌ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా... ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (34 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్‌), ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కూపర్‌ కనోలీ (22 బంతుల్లో 36; 6 ఫోర్లు) మెరిపించారు. సర్ఫరాజ్‌ జోరు... వరల్డ్‌ కప్‌ హీరో సామ్సన్‌ (7) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్రభావం చూపకపోగా... కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు) విఫలమయ్యాడు. అయితే మరోవైపు ఆయుశ్‌ మాత్రే జోరుతో స్కోరు దూసుకుపోయింది. పవర్‌ప్లేలో జట్టు 57 పరుగులు చేసింది. మాత్రేతో రెండో వికెట్‌కు రుతురాజ్‌ గైక్వాడ్‌ 55 బంతుల్లో 96 పరుగులు జోడించగా... అతని వాటా 22 పరుగులు మాత్రమే! ఆ తర్వాత తక్కువ వ్యవధిలో మాత్రే, కార్తీక్‌ (1) అవుట్‌ కాగా, అర్ష్ దీప్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతోసర్ఫరాజ్‌ చెలరేగాడు. ఆ తర్వాత వైశాక్‌ ఓవర్లో వరుసగా 4, 4, 4 కొట్టిన అతను తర్వాతి బంతికి వెనుదిరిగాడు. అర్ష్ దీప్ వేసిన ఆఖరి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి దూబే జట్టు స్కోరును 200 దాటించాడు. సమష్టి ప్రదర్శన... ఛేదనలో పంజాబ్‌ టాప్‌–4 తమ వంతు పాత్ర పోషించారు. తాను ఆడిన తొలి 6 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్‌లతో ప్రియాన్ష్ దూకుడుగా మొదలుపెట్టగా, కంబోజ్‌ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ 3 ఫోర్లు బాదాడు. పవర్‌ప్లేలో స్కోరు 68 పరుగులకు చేరింది. ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత కనోలీ, శ్రేయస్‌ అదే ధాటిని కొనసాగించారు. చహర్‌ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన శ్రేయస్‌... హెన్రీ ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. 26 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. విజయానికి 24 పరుగుల దూరంలో అతను అవుటైనా, ఇతర బ్యాటర్లు లాంఛనం పూర్తి చేశారు. ప్రశాంత్‌ వీర్‌ అరంగేట్రం... గత మ్యాచ్‌లో రూ.14.20 కోట్ల విలువైన ఆటగాడు కార్తీక్‌ శర్మతో అరంగేట్రం చేయించిన చెన్నై... ఈ మ్యాచ్‌లో మరో రూ.14.20 కోట్ల ప్లేయర్‌ ప్రశాంత్‌ వీర్‌కు తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం ఇచ్చింది. ప్రధానంగా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అయిన 20 ఏళ్ల ప్రశాంత్‌ లోయర్‌ ఆర్డర్‌లో భారీ షాట్లు ఆడగల సమర్థుడు. బీసీసీఐ అండర్‌–23 టోర్నీతో పాటు సీఎస్‌కే ట్రయల్స్‌లో ఆకట్టుకోవడంతో రవీంద్ర జడేజా తరహా ఆటగాడైన వీర్‌ను జట్టు ఎంచుకుంది. యూపీ టి20 లీగ్‌లో 155 స్ట్రయిక్‌రేట్‌లో 320 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీసి ప్రశాంత్‌ అందరి దృష్టినీ ఆకర్షించాడు.6-చెపాక్‌ మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును అత్యధికసార్లు (6) ఓడించిన జట్టుగా పంజాబ్‌ కింగ్స్‌ గుర్తింపు పొందింది. ముంబై ఇండియన్స్‌ (21 సార్లు) తర్వాత ఐపీఎల్‌లో చెన్నై జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టు పంజాబ్‌ (17 సార్లు). బెంగళూరు (16 సార్లు) మూడో స్థానానికి వెళ్లింది. 36-ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో అత్యధికసార్లు 200 పరుగులకు పైగా స్కోరు చేసిన జట్టుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ అవతరించింది. ఇప్పటి వరకు చెన్నై జట్టు 36 సార్లు 200 మార్క్‌ను దాటింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు 35 సార్లు... పంజాబ్‌ కింగ్స్‌ 33 సార్లు, ముంబై ఇండియన్స్‌ 32 సార్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 30 సార్లు ఈ ఘనత సాధించాయి. స్కోరు వివరాలుచెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) ప్రభ్‌సిమ్రన్‌ (బి) బార్ట్‌లెట్‌ 7; రుతురాజ్‌ (సి) వధేరా (బి) చహల్‌ 28; ఆయుశ్‌ (సి) మాత్రమే (బి) వైశాక్‌ 73; దూబే (నాటౌట్‌) 45; కార్తీక్‌ (ఎల్బీ) (బి) యాన్సెన్‌ 1; సర్ఫరాజ్‌ (సి) వధేరా (బి) వైశాక్‌ 32; ప్రశాంత్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–14, 2–110, 3–123, 4–130, 5–168. బౌలింగ్‌: అర్ష్ దీప్ 4–0–41–0, బార్ట్‌లెట్‌ 4–0–48–1, యాన్సెన్‌ 4–0–43–1, వైశాక్‌ 4–0–38–2, చహల్‌ 3–0–21–1, స్టొయినిస్‌ 1–0–17–0. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ (బి) హెన్రీ 39; ప్రభ్‌సిమ్రన్‌ (రనౌట్‌) 43; కనోలీ (సి) హెన్రీ (బి) కంబోజ్‌ 36; శ్రేయస్‌ (సి) చహర్‌ (బి) కంబోజ్‌ 50; వధేరా (సి) నూర్‌ (బి) హెన్రీ 10; శశాంక్‌ (నాటౌట్‌) 14; స్టొయినిస్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–61, 2–95, 3–127, 4–186, 5–186. బౌలింగ్‌: ఖలీల్‌ 3–0–28–0, హెన్రీ 4–0–54–2, కంబోజ్‌ 3.4–0–43–2, నూర్‌ 4–0–38–0, రాహుల్‌ చహర్‌ 4–0–46–0.

Nitish Kumar Reddy says bowling has improved8
‘ప్రత్యేక వ్యక్తి’ కృషి వల్లే...

కోల్‌కతా: తన బౌలింగ్‌ మెరుగుపడటం వెనుక ఒక ప్రత్యేక వ్యక్తి ఉన్నాడని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేస్‌ ఆల్‌రౌండర్, ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించాడు. గాయాలతో ఇబ్బంది పడిన సమయంలో అతడి అండతోనే తిరిగి కోలుకొని బౌలింగ్‌ లయను అందుకోగలిగానని చెప్పాడు. ఐపీఎల్‌ 19వ సీజన్‌లో భాగంగా గురువారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీశ్‌ రెడ్డి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌లో ఐదో స్థానంలో బరిలోకి దిగి 24 బంతుల్లో 39 పరుగులు చేసిన ఈ ఆంధ్ర ప్లేయర్‌... ఆ తర్వాత బౌలింగ్‌లో 2 ఓవర్లు వేసి 17 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అందులో నైట్‌రైడర్స్‌ వైస్‌ కెప్టెన్‌ రింకూ సింగ్‌ వికెట్‌ కూడా ఉంది. ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్‌ టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న నితీశ్‌... ఆ తర్వాత తక్కువ కాలంలోనే మూడు ఫార్మాట్‌లలోనూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. హార్దిక్‌ పాండ్యా తరహాలో టీమిండియాకు పేస్‌ ఆల్‌రౌండర్‌ లభించినట్లే అనుకుంటున్న దశలో గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యలు అతడిని వెనక్కి లాగాయి. గత ఐపీఎల్‌ సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన 22 ఏళ్ల నితీశ్‌... కోల్‌కతాతో పోరులో చక్కటి ప్రదర్శన కనబర్చాడు. మ్యాచ్‌ అనంతరం నితీశ్‌ మాట్లాడుతూ... ‘బౌలింగ్‌ను మరింత మెరుగు పరుచుకునేందుకు ఎప్పుడూ ప్రయతి్నస్తూనే ఉంటా. అయితే గతేడాది గాయాల కారణంగా ఎక్కువ సమయం లభించలేదు. ఈ సీజన్‌ ఆరంభానికి ముందు దొరికిన కొద్దిపాటి సమయంలో బాగా శ్రమించా. ఓ ప్రత్యేక వ్యక్తి పర్యవేక్షణలో ప్రాక్టీస్‌ చేశాను. అది ఎంతగానో ఉపయోగపడింది’ అని అన్నాడు. ‘స్లో బౌన్సర్ల’తోనే ఫలితం... అయితే ఆ ‘స్పెషల్‌ పర్సన్‌’ పేరు మాత్రం నితీశ్‌ వెల్లడించలేదు. ‘ఆ వ్యక్తి ఎవరో తర్వాత చెప్తా. కోల్‌కతాతో మ్యాచ్‌లో మా ఓపెనర్లు చక్కటి ఆరంభం ఇచ్చారు. క్లాసెన్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయడం గొప్ప అనుభూతి. దక్షిణాఫ్రికా సీనియర్‌ ప్లేయర్‌ మీకు సలహాలు ఇస్తుంటే దాని ఫలితం రాకపోదు. అందుకే మా భాగస్వామ్యం బాగా సాగింది. సీనియర్‌లు జట్టులో ఉంటే ఇలాంటి ప్రయోజనం చేకూరుతుంది. మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను వారు ఇంతకుముందే అధిగమించి ఉంటారు. వారి సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ‘స్లో బాల్స్‌’తోనే ఫలితం ఉంటుందని బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడే అర్థమైంది. అందుకే బౌలింగ్‌కు వచ్చినప్పుడు అదే ప్రయత్నించా. స్లో బౌన్సర్‌ ద్వారానే రింకూ వికెట్‌ పడగొట్టా. నెమ్మదైన బంతులతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించడం నా బలం. దాన్నే వినియోగించా. మా బౌలింగ్‌లో కావాల్సినంత వైవిధ్యం ఉంది. జైదేవ్‌ ఉనాద్కట్‌కు ఎంతో అనుభవం ఉంది. ఇషాన్‌ మలింగ, డేవిడ్‌ పేన్‌ రూపంలో మంచి బౌలర్లు అందుబాటులో ఉన్నారు. బ్యాటింగ్‌లో మా జట్టు పటిష్టంగా ఉందనేది వాస్తవం. అలాగే బౌలింగ్‌లోనూ మాకు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఉప్పల్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. అక్కడ బౌలింగ్‌ చేయడం ఎవరికైనా కష్టమే’ అని నితీశ్‌ రెడ్డి వివరించాడు. చాలా కాలంగా ఎదురు చూశా... జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంపై నితీశ్‌ రెడ్డి స్పందిస్తూ... ‘చాన్నాళ్లుగా ఇలాంటి ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నా. సరైన సమయంలో అది వచ్చింది. బౌలింగ్‌లో మెరుగవడం నా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించింది. గతేడాది ఆశించిన స్థాయిలో ఆడలేకపోయా. దీంతో మనసులో ఎన్నో ఆలోచనలు వచ్చాయి. కానీ అవన్నీ పక్కనపెట్టి నా బలాన్ని నమ్ముకున్నా. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నా. ఫిన్‌ అలెన్‌ ఎంత ప్రమాదకర ఆటగాడో అందరికీ తెలుసు. చూస్తుండగానే మ్యాచ్‌ను మార్చేసే ప్లేయర్‌ అతడు. అతడి వికెట్‌ ఆరంభంలోనే తీయడం కలిసొచ్చింది’ అని తెలిపాడు.

Billie Jean King Cup starts from 7th 9
ప్లేఆఫ్‌ బెర్త్‌ లక్ష్యంగా...

న్యూఢిల్లీ: రోజుల వ్యవధిలోనే జరిగే బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 టోర్నమెంట్‌లో సత్తా చాటేందుకు భారత మహిళల టెన్నిస్‌ జట్టు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీకి చేరుకున్న జట్టు సభ్యులంతా తుది కసరత్తుల్లో చెమటోడ్చుతున్నారు. పురుషుల టీమ్‌ టెన్నిస్‌లో జరిగే డేవిస్‌ కప్‌లాగే మహిళల విభాగంలో యేటా ఈ బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ నెల 7 నుంచి 11 వరకు ఢిల్లీలోని డీఎల్‌టీఏ కాంప్లెక్స్‌లో ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 టోర్నీని నిర్వహిస్తారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో ఆతిథ్య భారత్‌ సహా ఆరు జట్లు బరిలో ఉన్నాయి. ఇండోనేసియా, కొరియా, మంగోలియా, న్యూజిలాండ్, థాయ్‌లాండ్‌లు మిగతా జట్లు కాగా... తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నవంబర్‌లో జరిగే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. చిట్టచివరి రెండు జట్లు మాత్రం వచ్చే ఏడాది జరిగే ఆసియా–ఓసియానియా గ్రూప్‌–2కు దిగజారుతాయి. కీలకమైన ఈ టోర్నీకి ముందు జట్టు సన్నద్ధతపై కెప్టెన్‌ విశాల్‌ ఉప్పల్‌ మాట్లాడుతూ భారత అమ్మాయిల జట్టు మరోసారి ప్లే–ఆఫ్స్‌ బెర్తు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. హార్డ్‌కోర్టుల్ని ఆకళింపు చేసుకునేందుకే కాస్త ముందుగా వచ్చామని... రాగానే కసరత్తు మొదలుపెట్టామని చెప్పాడు. జట్టు అనుభవజు్ఞలు, యువ క్రీడాకారిణిలతో సమతుల్యంగా ఉందన్నాడు. వరుసగా ఈ ఏడాది కూడా ప్లే ఆఫ్స్‌ బెర్తు సాధించే సత్తా ఈ జట్టుకు ఉందన్నాడు. భారత జట్టులో ఇద్దరు తెలంగాణ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి ఉన్నారు. వీరితో పాటు రుతుజా బోసలే, అంకిత రైనా, వైదేహి, కొత్త ప్లేయర్‌ వైష్ణవి ఆడ్కర్‌ మిగతా సభ్యులు. భారత మూడో ర్యాంకర్‌ వైదేహి మాట్లాడుతూ ప్రస్తుత టోర్నీలో పటిష్టమైన జట్టే బరిలోకి దిగుతోందని చెప్పింది. ప్రతీ జట్టుపై విజయం సాధించేందుకు మా వంతు కృషి చేస్తామని తెలిపింది. గత 2025–26 సీజన్‌లో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్న సహజ మాట్లాడుతూ ‘ఎదురయ్యే ప్రతీ ప్రత్యరి్థని దీటుగా ఎదుర్కొంటాం. గతేడాది ప్లేఆఫ్స్‌ అనుభవం కూడా గడించాం. ఇప్పడు కూడా స్ఫూర్తిదాయక పోరాటం కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నాం. టెన్నిస్‌ వ్యక్తిగత ఈవెంట్‌ అయినా... ఇక్కడ మాత్రం జట్టుగా ఆడుతున్నాం. మా అందరిలోనూ ఇప్పుడు నా అనే కంటే మా మ్యాచ్‌లనే సమష్టి భావనే ఉంది’ అని పేర్కొంది. ఆశించిన ఫలితాలు సాధిస్తామనే ధీమాను శ్రీవల్లి రషి్మక వ్యక్తం చేసింది.

India tops doping disqualification list10
డోపింగ్‌ అనర్హుల జాబితాలో భారత్‌ ‘టాప్‌’

న్యూఢిల్లీ: డోపింగ్‌ ఉల్లంఘనల్లో భారత్‌ చెత్త రికార్డు మూటగట్టుకుంది. గతంలో అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్స్‌ (ఏఐయూ) అనర్హులైన అథ్లెట్ల జాబితాలో కెన్యా అగ్రస్థానంలో ఉండగా... తాజా నివేదికలో కెన్యాను అధిగమించి భారత్‌ తొలి స్థానానికి చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి మన దేశానికి చెందిన 148 మంది ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్లు డోపింగ్‌ ఉల్లంఘనలకు పాల్పడి నిషేధం ఎదుర్కొంటున్నారు. కెన్యా (146 మంది అథ్లెట్లు), రష్యా (66 మంది అథ్లెట్లు) వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో మహిళల 100 మీటర్ల జాతీయ రికార్డు హోల్డర్‌ ద్యుతీ చంద్, మిడిల్‌ డిస్టాన్స్‌ రన్నర్‌ పర్వేజ్‌ ఖాన్, తమిళనాడు స్పింటర్‌ శేఖర్‌ ధనలక్ష్మి ఉన్నారు. ద్యుతీ చంద్‌పై 2022 డిసెంబర్‌లో నాలుగు సంవత్సరాల నిషేధం పడగా... పర్వేజ్‌పై విధించిన నిషేధం జూలై 2030 వరకు కొనసాగనుంది. ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య ఆధ్వర్యంలో స్వతంత్రంగా పనిచేసే ఏఐయూ అన్నీ దేశాల డోపింగ్‌ వివరాలు సేకరిస్తుంది. డోపింగ్‌ను రూపుమాపాలని కంకణం కట్టుకున్న భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) దీనితో సంబంధం ఉన్న కేంద్రాలను గుర్తించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటోంది. అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడటం వెనక శిక్షకుల హస్తం కూడా ఉంటుందని భావిస్తున్న ఏఎఫ్‌ఐ... కోచ్‌లందరూ తమ వద్ద పేరు నమోదు చేసుకోవాలని కోరింది. ఏఎఫ్‌ఐలో నమోదు చేసుకోని కోచ్‌లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు... వారి వద్ద శిక్షణ తీసుకున్న వారిని జాతీయ అవార్డులకు అనర్హులుగా ప్రకటించింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత ఏఎఫ్‌ఐ జాతీయ శిబిరాలను వికేంద్రీకరించింది. ప్రస్తుతం రిలే జట్లకు మాత్రమే నేషనల్‌ క్యాంప్‌లు నిర్వహిస్తోంది. మిగిలిన అగ్రశ్రేణి అథ్లెట్లందరూ రిలయన్స్, జేఎస్‌డబ్ల్యూ, టాటా వంటి ప్రైవేటు సంస్థలు... ఆర్మీ, నేవీ వంటి ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement