Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Icc Meeting Latest Update And No Action On Bangladesh Cricket Board1
టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న బంగ్లా జట్టుకి రిలీఫ్

భారత్‍-శ్రీలంక వేదికగా ప్రస్తుతం టీ20 ప్రస్తుతం జరుగుతోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా.. మన దేశానికి రాకూడదని బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోవడంతో.. బంగ్లా జట్టు ప్రపంచకప్ నుంచి తప్పుకొంది. దీని స్థానంలో స్కాట్లాండ్ జట్టు టోర్నీలో అడుగుపెట్టింది. మరోవైపు 15వ తేదీన భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ మీటింగ్ జరగ్గా.. ఇందులో బంగ్లాదేశ్ జట్టుకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనకపోవడంపై నిరాశ వ్యక్తం చేసిన ఐసీసీ.. ప్రస్తుత అంశానికి సంబంధించి బంగ్లా బోర్డుపై ఎలాంటి ఆర్థిక, క్రీడాపరమైన, పరిపాలానా జరిమానా విధించబోమని ధ్రువీకరించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం.. ఈ అంశాన్ని వివాద పరిష్కార కమిటీకి తీసుకెళ్లే హక్కు.. బంగ్లా బోర్డుకి ఉందని స్పష్టం చేసింది. దీని వల్ల ఆ హక్కుకి ఎలాంటి భంగం కలగదని, అది యధాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. అలానే బంగ్లాదేశ్‌లో 2031 పురుషుల ప్రపంచకప్ జరగడానికి ముందు ఓ ఐసీసీ ఈవెంట్‌కి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన ప్రకటనలో తెలియజేసింది.ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 15న కొలంబోలో టీమిండియాతో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లో పాల్గొనాలని పాక్ జట్టుని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. భారతదేశం బయట తమ మ్యాచ్‌లని నిర్వహించాలనే అభ్యర్థనని ఐసీసీ తిరస్కరించిన తర్వాత బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకొంది. ఈ సమయంలో తమకు మద్ధతుగా నిలిచిన పాకిస్తాన్‌కి బంగ్లా బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం కృతజ్ఞతలు చెప్పారు.

South Africa Won Against Canada T20 World Cup 20262
టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా శుభారంభం

అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఘన విజయం సాధించింది. కెనడాపై 57 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో శుభారంభం చేసింది. సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ 59 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన దక్షిణాఫ్రికా జట్టు..నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ మార్క్రమ్ 59 పరుగులు చేయగా..మిల్లర్ 39, స్టబ్స్ 34 తలో చేయి వేశారు. కెనడా జట్టులోని అన్ష్ పటేల్ 3 వికెట్లు తీశాడు.అనంతరం ఛేదనలో కెనడా జట్టు మొదటి నుంచే వికెట్లు వరసగా కోల్పోయింది. ఫలితంగా నిర్ణీత ఓవర్లన్నీ పూర్తి చేసినప్పటికీ 8వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది.నవనీత్ దలివాళ్ 64, హర్ష్ థాకర్ 33 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4 వికెట్లు, జాన్సన్ 2, రబాడా, కార్బిన్ తలో వికెట్ పడగొట్టారు.

T20 WC 2026: south africa scored 213 runs vs canada3
మార్క్రమ్‌ మెరుపులు.. సౌతాఫ్రికా భారీ స్కోర్‌

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా కెనడాతో ఇవాళ (ఫిబ్రవరి 9) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్‌ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సఫారీ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కెప్టెన్‌ మార్క్రమ్‌ (59) విధ్వంసకర హాఫ్‌ సెంచరీ చేయగా.. ఆఖర్లో స్టబ్స్‌ (34 నాటౌట్‌), మిల్లర్‌ (39 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. డికాక్‌ (25), రికెల్టన్‌ (33) కూడా తలో చేయి వేశారు. బ్రెవిస్‌ (6) ఒక్కడే నిరాశపరిచాడు. కెనడా బౌలర్లలో అన్ష్‌ పటేల్‌ (4-0-31-3) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కలీమ్‌ సనా (4-0-38-0) వికెట్లు తీయలేకపోయినా పర్వాలేదనిపించాడు. మిగతా బౌలర్లందరినీ సఫారీ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. జస్కరన్‌ సింగ్‌ 4 ఓవర్లలో 49 పరుగులు, కెప్టెన్‌ దీల్‌ప్రీత్‌ బజ్వా 4 ఓవర్లలో 40 పరుగులు (ఓ వికెట్‌), సాద్‌ బిన్‌ జాఫర్‌ 3 ఓవర్లలో 38 పరుగులు, డిలాన్‌ హెలిగర్‌ ఓ ఓవర్‌లో 13 పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కెనడా 8 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతోంది. దిల్‌ప్రీత్‌ (0), యువరాజ్‌ సమ్రా (12), నికోలస్‌ కిర్టన్‌ (4), శ్రేయస్‌ మొవ్వ (9) ఔట్‌ కాగా.. నవ్‌నీత్‌ ధలీవాల్‌ (25), హర్ష్‌ థాకర్‌ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కెనడా గెలవాలంటే మరో 72 బంతుల్లో 150 పరుగులు చేయాలి. కెనడాను లుంగి ఎంగిడి (3-0-21-3) దారుణంగా దెబ్బకొట్టాడు. రబాడ (2-0-16-1) కూడా ఇబ్బంది పెట్టాడు.

Virat Kohli, Rohit Sharma Demoted To Grade B In BCCI Central Contract List For 2025-264
అనుకున్నదే జరిగింది.. రోహిత్‌, కోహ్లికి డిమోషన్‌

2025-26 బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ల విషయంలో అనుకున్నదే జరిగింది. టీమిండియా దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి డిమోషన్‌కు గురయ్యారు. గత వార్షిక కాంట్రాక్ట్‌ల్లో ఏ ప్లస్‌ గ్రేడ్‌లో ఉండిన ఈ ఇద్దరు.. ఇవాళ (ఫిబ్రవరి 9) అధికారికంగా ప్రకటించిన కాంట్రాక్ట్‌ల్లో బి గ్రేడ్‌కు పడిపోయారు. 🚨 BCCI ANNUAL CONTRACT 2025-26 🚨 pic.twitter.com/UxNOSYkEnE— Johns. (@CricCrazyJohns) February 9, 2026ఇలా జరగడానికి కారణం​ లేకపోలేదు. రోహిత్‌, విరాట్‌ టీ20, టెస్ట్‌ ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించి కేవలం​ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం కనీసం రెండు ఫార్మాట్లలోనైనా కొనసాగుతుంటేనే అత్యుత్తమ కాంట్రాక్ట్‌ లభిస్తుంది. తాజాగా బీసీసీఐ తమ అత్యుత్తమ కాంట్రాక్ట్‌ అయిన ఏ ప్లస్‌ గ్రేడ్‌ను పూర్తిగా రద్దు చేసింది. ఇప్పుడు అత్యుత్తమ కాంట్రాక్ట్‌ అంటే ఏ గ్రేడ్‌ కేటగిరి. ఇందులో ఉండాలంటే టీమిండియా తరఫున కనీసం రెండు ఫార్మాట్లలోనైనా కొనసాగుతుండాలి. రో-కో ప్రస్తుతం ఒక్క ఫార్మాట్‌క మాత్రమే పరిమితమయ్యారు కాబట్టి ఆటోమేటిక్‌గా బి గ్రేడ్‌కి పడిపోయారు. తాజా వార్షిక కాంట్రాక్ట్‌ల్లో కేవలం ముగ్గురికి మాత్రమే ఏ గ్రేడ్‌ లభించింది. టెస్ట్‌, వన్డే జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా, స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మాత్రమే ఈ కాంట్రాక్ట్‌ పరిధిలో ఉన్నారు.గ్రేడ్‌ బిలో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మతో పాటు కేఎల్‌ రాహుల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సిరాజ్‌, హార్దిక్‌ పాండ్యా, రిషబ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, యశస్వి జైస్వాల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు.గ్రేడ్‌ సిలో అక్షర్‌ పటేల్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, శివమ్‌ దూబే, సంజూ శాంసన్‌, అర్షదీప్‌ సింగ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ఆకాశ్‌దీప్‌, ధృవ్‌ జురెల్‌, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అభిషేక్‌ శర్మ, సాయి సుదర్శన్‌, రవి బిష్ణోయ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఉన్నారు. ఆయా కాంట్రాక్ట్‌ల్లో ఉన్న వారికి వార్షిక వేతనం కింద ఎంత మొత్తం అందనుందో తెలియరాలేదు. గత వార్షిక కాంట్రాక్ట్‌ల్లో ఏ ప్లస్‌ గ్రేడ్‌లో ఉండిన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజాకు రూ. 7 కోట్లు లభించేవి. గ్రేడ్‌-ఏలో ఉండిన వారికి రూ. 5 కోట్లు, గ్రేడ్‌-బిలో ఉండిన వారికి రూ. 3 కోట్లు, గ్రేడ్‌-సిలో ఉండిన ప్లేయర్లకు రూ. కోటి రూపాయలు లభించేవి.

PCB keeps 5 demands in front of ICC to revoke their stand of not play against india in T20 world cup 20265
భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు 5 డిమాండ్లు చేసిన పాక్‌ క్రికెట్‌ బోర్డు

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరగాల్సిన భారత్‌-పాక్‌ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ మ్యాచ్‌ జరగడానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉన్నా, ఇరు దేశాల క్రికెట్‌ అభిమానులకు సంబంధించి ఎలాంటి సానుకూల ప్రకటన వెలువడలేదు. తాజా పరిస్థితి చూస్తే, ఈ మ్యాచ్‌ దాదాపుగా రద్దైయ్యేట్లే కనిపిస్తుంది. ఇదే జరిగితే పాక్‌ క్రికెట్‌ బోర్డు భారీ పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.కొద్ది రోజుల కిందట పాక్‌ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ రంగంలోకి దిగి పాక్‌ క్రికెట్‌ బోర్డుతో ఇవాళ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఈ చర్చలు కొలిక్కి రాలేదని సమాచారం. భారత్‌తో మ్యాచ్‌ ఆడాలంటే పీసీబీ ఐసీసీ ముందు ఐదు గొంతెమ్మ కోర్కెలను ఉంచినట్లు తెలుస్తుంది. వీటిలో ఏ ఒక్క దానికి ఐసీసీ అంగీకరించలేదని సమాచారం. భారతీయ క్రీడా జర్నలిస్ట్‌ విక్రాంత్‌ గుప్తా సోషల్‌మీడియా పోస్ట్‌ ఆధారంగా.. పీసీబీ ఐసీసీ ముందు ఈ ఐదు డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తుంది. - బంగ్లాదేశ్‌పై శిక్షలు విధించకూడదు - భారత్–పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ పునరుద్ధరణ - టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించాలి - భారత్‌-పాక్‌-బంగ్లాదేశ్‌తో ప్రత్యేక ట్రై-సిరీస్ - అదనపు ఐసీసీ టోర్నమెంట్ కేటాయింపు అయితే, ఈ ఐదు డిమాండ్లను ఐసీసీ తిరస్కరించిందని తెలుస్తుంది. ఈ ఐదు తమ పరిధిలోకి రావని ఐసీసీ తేల్చినట్లు సమాచారం. ఈ ఐదు కాకుండా పాక్‌ క్రికెట్‌ బోర్డు ఐసీసీని ప్రత్యేక ఫండింగ్‌ కోసం కూడా డిమాండ్‌ చేసిందని తెలుస్తుంది. ఈ పాక్‌ డిమాండ్లు సోషల్‌మీడియాలో ప్రచారంలోకి రావడంతో భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. పాక్‌తో మ్యాచ్‌ అవసరం లేదని అంటున్నారు. పాక్‌పై ఐసీసీ శాశ్వత బహిష్కరణ విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పాక్‌ తమతో మ్యాచ్‌ ఆడకపోతే తమకు కలిగే నష్టమేమీ లేదని అంటున్నారు.కాగా, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు భారత్‌లో జరగాల్సిన తమ ప్రపంచకప్‌ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరిన విషయం తెలిసిందే. ఇది సాధ్యపడదని ఐసీసీ చెప్పడంతో బంగ్లాదేశ్‌ ప్రపంచకప్‌ నుంచి వైదొలిగింది. దీంతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ వరల్డ్‌కప్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ తతంగం జరుగుతుండగానే పాక్‌ క్రికెట్‌ బోర్డు బంగ్లాదేశ్‌కు కొమ్ముకాస్తూ రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్‌ను ప్రపంచకప్‌ నుంచి తప్పించిన తర్వాత పాక్‌ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్‌ ఆడమని ప్రకటించింది.

Donald Trump enters T20 World Cup 2026, announces open support to USA team6
క్రికెట్‌ ప్రపంచంలోకి ఎంటరైన ట్రంప్‌

అనునిత్యం వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, తాజాగా క్రికెట్‌ ప్రపంచంలోకి కూడా ఎంటరయ్యాడు. భారత్‌, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న తమ జట్టుకు (యూఎస్‌ఏ) ట్రంప్‌ మద్దతు ప్రకటించాడు. సోషల్‌ ట్రూత్‌లో ఓ ప్రత్యేక సందేశం పోస్ట్ చేస్తూ.. టీమ్‌ యూఎస్‌ఏ చాలా బలమైంది. అమెరికా మొత్తం మీ వెనుకే ఉంది అని పేర్కొన్నాడు. ట్రంప్‌ ఇచ్చిన మద్దతు యూఎస్‌ఏ జట్టులో కొత్త ఉత్సాహం నింపింది. రేపు (ఫిబ్రవరి 10) పాకిస్తాన్‌తో జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు ట్రంప్ సందేశం యూఎస్‌ఏ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ట్రంప్‌ మద్దతు అమెరికాలో క్రికెట్ ఎదుగుదలకు కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ట్రంప్‌కు క్రికెట్‌పై పెద్దగా అవగాహన లేదు. గోల్ఫ్‌, అమెరికన్‌ ఫుట్‌బాల్‌ వంటి క్రీడలపై అతనికి ప్రత్యేక ఆసక్తి ఉంది. అయితే ట్రంప్‌కు 2020లో అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం (ప్రస్తుతం నరేంద్ర మోడి స్టేడియం) ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనుభవం ఉంది. భారత్‌తో వాణజ్యపరమైన సంబంధాలు ఇప్పుడిప్పుడే బలపడుతున్న వేల, ట్రంప్‌ ప్రకటన భారతీయుల్లోనూ ఆసక్తి కలిగిస్తుంది. ట్రంప్‌ మద్దతు ఉంటే క్రికెట్‌ కూడా విశ్వక్రీడగా మారిపోయే అవకాశం ఉంది.అమెరికాలో క్రికెట్ అభివృద్ధి 2023లో ప్రారంభమైన మేజర్‌ లీగ్‌ క్రికెట్‌తో మొదలైంది. ఆ టోర్నీలో భారత్‌ తప్ప, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్‌ క్రికెటర్లందరూ పాల్గొంటారు. 2024 టీ20 ప్రపంచకప్‌కు సహ-ఆతిథ్యం ఇవ్వడంతో అమెరికా ప్రజలకు క్రికెట్‌ మరింత చేరువైంది. యూఎస్‌ఏలో ఇప్పటికే 150 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఇదిలా ఉంటే, యూఎస్‌ఏ జట్టు గత ఎడిషన్‌ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి పెను సంచలనం సృష్టించింది. ప్రస్తుత ఎడిషన్‌లోనూ ఆ జట్టు మరో సంచలనం సాధించే అవకాశం ఉంది. టోర్నీ ఓపెనర్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ ఆటగాళ్లు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చారు. ఈ మ్యాచ్‌లో వారి పోరాటానికి క్రికెట్‌ అభిమానులంతా ముగ్దులయ్యారు. టీమిండియా ఆ మ్యాచ్‌ను మాత్రమే గెలిచింది కానీ, యూఎస్‌ఏ జట్టు మాత్రం క్రికెట్‌ ప్రపంచాన్నంతా గెలిచింది.

T20 WC 2026: Zimbabwe beat Oman by 8 wickets7
చెలరేగిన బౌలర్లు.. మరో పసికూనను వణికించిన జింబాబ్వే

టీ20 ప్రపంచకప్‌ 2026లో జింబాబ్వే ఘనంగా బోణీ కొట్టింది. ఒమన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరిగిన మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. రిచర్డ్‌ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్‌ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్‌ ఈవాన్స్‌ (3.5-0-18-3), సికందర్‌ రజా (4-0-17-1) ధాటి​కి ఒమన్‌ 103 పరుగులకే (19.5 ఓవర్లలో) కుప్పకూలింది.ఒమన్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్‌ మెహమూద్‌ 25, వినాయక్‌ శుక్లా 28, నదీద్‌ ఖాన్‌ 20 పరుగులు చేయడంతో ఒమన్‌ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. మిగతా ఆటగాళ్లలో ఆమిర్‌ కలీమ్‌, కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌, షా ఫైసల్‌ తలో 5 పరుగులు, షకీల్‌ అహ్మద్‌ 4, జితెన్‌ రామనంది 1, వసీం అలీ 3 పరుగులు చేయగా.. హమ్మద్‌ మీర్జా, కరన్‌ సోనావలే డకౌట్లయ్యారు.అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే ఆడుతూపాడుతూ ఛేదించింది. 13.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రియాన్‌ బెన్నెట్‌ (48 నాటౌట్‌), బ్రెండన్‌ టేలర్‌ (31 రిటైర్డ్‌ హర్ట్‌) రాణించారు. మరుమని 21, సికందర్‌ రజా 5 (నాటౌట్‌) పరుగులు చేయగా.. డియాన్‌ మైర్స్‌ డకౌటయ్యాడు. ఒమన్‌ బౌలర్లలో సఫ్యాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. బ్లెస్సింగ్‌ ముజరబానీకి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Oman veteran Aamir Kaleem scripts T20 World Cup history8
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఒమన్‌ ఆటగాడు

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఒమన్‌ ఆటగాడు ఆమిర్‌ కలీమ్‌ 44 ఏళ్ల 81 రోజుల వయసులో పొట్టి ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడి, టోర్నీ చరిత్రలో అత్యధిక వయసు కలిగిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఒమన్‌ ఇవాళ (ఫిబ్రవరి 9) కొలంబో వేదికగా జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో కలీమ్‌ ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు హాంగ్‌కాంగ్‌కు చెందిన ర్యాన్‌ క్యాంప్‌బెల్‌ పేరిట ఉండేది. క్యాంప్‌బెల్‌ 2016 ప్రపంచకప్‌లో 44 ఏళ్ల 30 రోజుల వయసులో బరిలోకి దిగాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో 40లు దాటిన వారు చాలామంది ఉన్నారు. ఒమన్‌కే చెందిన మొహమ్మద్‌ నదీమ్‌ 43 వయసులో ప్రస్తుత ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాడు. ఇటలీ కెప్టెన్‌ వేన్‌ మ్యాడ్‌సన్‌ 42, ఆఫ్ఘనిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ నబీ, నెదర్లాండ్స్‌ ఆటగాడు వాన్‌డర్‌ మెర్వ్‌ 41 ఏళ్ల వయసులో ప్రస్తుత ప్రపంచకప్‌ బరిలో ఉన్నారు.కలీమ్‌ విషయానికొస్తే.. ఇతను పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించి క్రికెట్‌ కెరీర్‌ కోసం ఒమన్‌కు వలస వెళ్లాడు. ఈ జట్టు తరఫున అతను 2010లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 15 వన్డేలు, 54 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఎడమ చేతి వాటం స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన కలీమ్‌.. ఫిబ్రవరి 3న శ్రీలంక-ఏతో జరిగిన ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. ఆ మ్యాచ్‌లో అతను 47 బంతుల్లో 80 పరుగులు చేసి, తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.ప్రస్తుతం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కలీమ్‌ (5) తేలిపోయాడు. అతనితో పాటు జట్టు మొత్తం విఫలం కావడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఒమన్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్‌ మెహమూద్‌ 25, వినాయక్‌ శుక్లా 28, నదీద్‌ ఖాన్‌ 20 పరుగులు చేయడంతో ఒమన్‌ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్‌ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్‌ ఈవాన్స్‌ (3.5-0-18-3), సికందర్‌ రజా (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. వీరి ధాటికి ఒమన్‌ జట్టు విలవిలలాడింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే గెలుపు దిశగా సాగుతోంది. 7.3 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసి, లక్ష్యానికి 75 పరుగుల దూరంలో మాత్రమే ఉంది.

Heartbreak in Ranji Trophy, Sudip Kumar Gharami OUT at 299 after rescuing Bengal alone9
అయ్యో పాపం.. ఒక్క పరుగుతో ట్రిపుల్‌ సెంచరీ మిస్‌

ఆంధ్రప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో బెంగాల్‌ యువ బ్యాటర్‌ సుదిప్‌ కుమార్‌ ఘరామీ తృటిలో ట్రిపుల్‌ సెంచరీ మిస్‌ అయ్యాడు. కష్టాల్లో (43-3) ఉన్న జట్టును గట్టెక్కించి, 299 పరుగుల వద్ద ఔటయ్యాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఓ ఆటగాడు 299 పరుగుల వద్ద ఔట్‌ కావడం ఇదే మొదటిసారి. 1988-89 సీజన్‌లో మహారాష్ట్ర ఆటగాడు శంతాను సుగ్వేకర్‌ 299 పరుగుల వద్ద అజేయంగా మిగిలిపోయాడు. యావత్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో ఘరామీతో సహా ఇప్పటివరకు కేవలం ముగ్గురే 299 పరుగుల వద్ద ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో ఘరామీ 596 బంతుల్లో 31 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 299 పరుగులు చేశాడు. వనడౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతను.. ఆరో వికెట్‌కు సుమంత్‌ గుప్తాతో (81) 165 పరుగులు, ఏడో వికెట్‌కు హబీబ్‌ గాంధీతో (95) 221 పరుగుల భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఘరామీ బ్యాట్‌ నుంచి జాలువారిన ఈ మారథాన్‌ ఇన్నింగ్స్‌ ఆధునిక రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత సుదీర్ఘ ఇన్నింగ్స్‌ల్లో (12 గంటలకు పైబడి) ఒకటిగా నిలిచిపోతుంది. ఈ హీరోయిక్‌ ఇన్నింగ్స్‌తో బెంగాల్‌ను ఒంటిచేత్తో గట్టెక్కించిన ఘరామీ, ఒక్క పరుగు తేడాతో అరుదైన ట్రిపుల్‌ సెంచరీ మిస్సై నిరాశగా పెవిలియన్‌ బాట పట్టాడు. ఘరామీ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ కారణంగా ఆంధ్రతో మ్యాచ్‌లో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 629 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. ఆఖర్లో టీమిండియా ఆటగాడు, బెంగాల్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ (53) కూడా మెరుపు అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు.దీనికి ముందు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో రికీ భుయ్‌ (83) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. శ్రీకర్‌ భరత్‌ (47), షేక్‌ రషీద్‌ (46), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (33) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. టీమిండియా బౌలర్‌, బెంగాల్‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ ఐదు వికెట్లతో విజృంభించగా.. మరో టీమిండియా బౌలర్‌, బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌దీప్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు. షమీ సైతం ఓ వికెట్‌ పడగొట్టాడు.ప్రస్తుతం ఆట చివరి రోజు మూడో సెషన్‌ కొనసాగుతుంది. ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. కెప్టెన్‌ రికీ భుయ్‌ (1), నితీశ్‌ కుమార్‌ రెడ్డి క్రీజ్‌లో ఉన్నారు. బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఆంధ్ర ఇంకా 289 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్‌ ఎటూ డ్రా అవుతుంది కాబట్టి, తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కారణంగా బెంగాల్‌ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.

Big twist Bangladesh asks Mohsin Naqvi to end India T20 WC Boycott10
బిగ్‌ ట్విస్ట్‌!.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌!

టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామని ప్రకటించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)పై ఒత్తిడి పెరుగుతోంది. పాక్‌ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిందిగా శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC) ఇప్పటికే పీసీబీకి లేఖ రాసింది.ఆర్థికంగా నష్టంగతంలో తమ జట్టుపై పాకిస్తాన్‌లో ఉగ్రదాడి జరిగినా.. తిరిగి తామే మళ్లీ తొలిసారి ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని లంక బోర్డు ఈ సందర్భంగా గుర్తు చేసింది. భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు తాము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ఒకవేళ మ్యాచ్‌ రద్దు చేసుకుంటే తాము ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతామని పేర్కొంది. ఇకముందు కూడా తాము పీసీబీతో సంబంధాలు కొనసాగించాలనుకున్నామంటూ సుత్తిమెత్తగానే హెచ్చరికలు జారీ చేసింది.యూఏఈ లేఖతాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) క్రికెట్‌ కూడా పాకిస్తాన్‌కు లేఖ రాసింది. ‘‘ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు పాకిస్తాన్‌తో చాలా ఏళ్లుగా బంధం కొనసాగిస్తోంది. గతంలో పాకిస్తాన్‌ కోసం మా వేదికలు ఇచ్చి టోర్నీలు సజావుగా సాగేలా చూసుకున్నాము.అయితే, టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాక్‌ నిర్ణయం మాతో పాటు ఇతర సభ్యదేశాలను తీవ్రంగా గాయపరిచింది. ముఖ్యంగా అసోసియేట్‌ జట్లు ఆర్థికంగా భారీ ఎత్తున నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది.పీసీబీ కుటుంబంలో సభ్యులుగా ఈ విషయంలో పునరాలోచన చేయాలని.. సమస్యకు సరైన పరిష్కారం కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని యూఏఈ బోర్డు ఇ-మెయిల్‌ పంపింది. బంగ్లాదేశ్‌ సైతంఇక ఈ వివాదం అంతటికీ మూలకారణమైన బంగ్లాదేశ్‌ సైతం పీసీబీకి ఇదే సందేశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా భారత్‌-శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా.. భారత్‌లో తమకు భద్రత ఉండదంటూ బంగ్లాదేశ్‌ ఐసీసీని ఆశ్రయించిది.తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా కోరింది. అయితే, ఇందులో వాస్తవం లేదని కొట్టిపారేసిన ఐసీసీ బంగ్లాకు గడువు ఇచ్చింది. అయినా సరే బంగ్లా బోర్డు తమ వైఖరి మార్చుకోలేదు. దీంతో ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించింది.మొహ్సిన్‌ నక్వీతో చర్చలుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఉంటామంటూ పాక్‌.. మొదట టోర్నీ నుంచే వైదొలుగుతామని బెదిరించింది. అనంతరం టీమిండియాతో మ్యాచ్‌ మాత్రమే బహిష్కరిస్తామని కొత్త నాటకానికి తెరతీసింది. ఇదే జరిగితే ఐసీసీ ఆర్థికంగా భారీగా నష్టపోతుంది. ఈ ప్రభావం పీసీబీతో పాటు ఇతర సభ్య దేశాల బోర్డు మీదా పడుతుంది.మీ మద్దతుకు ధన్యవాదాలు.. కానీఈ క్రమంలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా, బంగ్లా బోర్డు అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లాం ఆదివారం పాకిస్తాన్‌కు వెళ్లారు. పీసీబీ చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీతో ఈ విషయం గురించి చర్చించారు. ఈ సందర్భంగా అమినుల్‌ ఇస్లాం.. తమకు మద్దతుగా నిలిచినందుకు పీసీబీకి ధన్యవాదాలు చెప్పినట్లు సమాచారం.అదే సమయంలో భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కాట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగకపోతే తమతో పాటు అన్ని బోర్డులు ఆర్థికంగా నష్టపోతాయని అందుకే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అమినుల్‌ నక్వీని కోరిట్లు సమాచారం.ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన నక్వీ.. ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా తటస్థ వేదికైన కొలంబోలో ఫిబ్రవరి 15న భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు షెడ్యూల్‌ ఖరారైంది. చదవండి: ముకేశ్‌ అంబానీకి నో చెప్పిన రోహిత్‌ శర్మ!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement