Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

I dont think India were the best team in the tournament: Steve Harmison1
'భార‌త్ గొప్ప జ‌ట్టేమి కాదు'.. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ అక్కసు

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2026 ట్రోఫీని భార‌త జ‌ట్టు సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో 96 ప‌రుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. మూడోసారి పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలిచి చ‌రిత్ర సృష్టించింది.ఈ నేపథ్యంలో భారత జట్టుపై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ టైటిల్ గెలిచినప్పటికీ, టోర్నీలో అత్యుత్తమ జట్టు దక్షిణాఫ్రికానేనని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీ అసాంతం భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి, సూపర్‌-8లో మాత్రం సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. అదే విషయాన్ని స్టీవ్ హార్మిసన్ ప్రస్తావించాడు."న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వారు నెలకొల్పిన భాగస్వామ్యమే భారత్‌ను విజేతగా నిలిపింది. ఫ్లాట్ పిచ్‌లపై జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శనే ఇతర జట్లకు, భారత్‌కు మధ్య తేడా చూపించింది. ఈ టోర్నీలో భారత్ అత్యుత్తమ జట్టు అని నేను అనుకోవడం లేదు. నా దృష్టిలో దక్షిణాఫ్రికానే అత్యుత్తమ జట్టు. టీమిండియా కేవలం 'బెస్ట్ మొమెంట్ టీమ్' మాత్రమే. మ్యాచ్ మలుపు తిరిగే కీలక సమయాల్లో వారు అద్భుతంగా రాణించి విజేతగా నిలిచారు. గ్రూపు స్టేజిలో భారత్ అంతగా ఆకట్టుకోలేకపోయారు. వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్‌ క్వార్టర్ ఫైనల్లోనూ టీమిండియా ఇబ్బందులను ఎదుర్కొంది.కొంతమంది మ్యాచ్ విన్నర్ల కారణంగా ఓటమి నుంచి భారత్ గట్టెక్కింది. వారే భారత్‌కు బలం. ఇక టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచిన దక్షిణాఫ్రికా, సెమీఫైనల్లో ఫిన్ అలెన్ విధ్వంసం వల్లే ఓడిపోయింది. సూపర్‌-8లో భారత్‌ను సైతం సౌతాఫ్రికా ఓడించందని" టాక్‌స్పోర్ట్ క్రికెట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్మిసన్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'గంభీర్ చాలా పెద్ద త‌ప్పు చేశాడు'

Sanjay Manjrekar Controversial Comments About Team India2
వివాదంలో సంజయ్‌ మంజ్రేకర్‌!

భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా భారత్‌ టీ20 ప్రపంచకప్‌ గెలిచినప్పటికీ తాను సంతోషంగా లేనంటూ పేర్కొన్నాడు. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ గెలిచినప్పటికీ, తన దృష్టిలో ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ గెలిచినప్పుడే అన్ని ఫార్మాట్లలో చాంపియన్‌గా భారత్‌ పరిపూర్ణమవుతుందని సంజయ్‌ మంజ్రేకర్‌ పేర్కొన్నాడు.ఇదే విషయమై సంజయ్‌ మంజ్రేకర్‌ తన సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా స్పందించాడు.‘క్రికెట్‌ అభిమానులు అన్ని ఐసీసీ ట్రోఫీలను ఒకలా చూడలేరు. నా దృష్టిలో టీ20 వరల్డ్‌ కప్‌ కంటే ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌కు ఎక్కువ ప్రాధానత్య ఉంటుంది. టీ20 వరల్డ్‌కప్‌ గెలవడం కంటే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌, ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ గెలిస్తే వచ్చే మజా వేరుగా ఉంటుంది. ఐసీసీ టైటిల్స్‌ ర్యాంకింగ్‌ ప్రకారం చూస్తే మొదట వన్డే వరల్డ్‌కప్‌, రెండో స్థానంలో ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌, మూడో స్థానంలో టీ20 ప్రపంచకప్‌, నాలుగో స్థానంలో చాంపియన్స్‌ ట్రోఫీ ఉంటాయి. కనీసం వచ్చే ఏడాది జరగబోయే ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ను టీమిండియా గెలవాలని కోరుకుంటున్నా’ అంటూ తెలిపాడు.మీ తలకు తుపాకీ పెట్టారా?అయితే సంజయ్‌ మంజ్రేకర్‌ మాటలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భారత్‌ ఐసీసీ ట్రోఫీలు గెలవడం సంజయ్‌కు ఇష్టం లేదేమో’ అంటూ కొందరు వ్యాఖ్యానించారు. ఇక కమెడియన్‌ అబిజిత్‌ గంగూలీ సంజయ్‌ మంజ్రేకర్‌కు ‘ఎక్స్‌’ వేదికగా కౌంటర్‌ ఇచ్చాడు. ‘మీరు చెప్పింది నిజమే కావొచ్చు. కానీ టీ20 ప్రపంచకప్‌ గెలిచిందని సంతోషంగా ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు తగదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మీ తలకు తుపాకీ పెట్టి ఎవరు ఇలా చెప్పమని అడగరు. సానియా మీర్జా నంబర్‌ వన్‌ ర్యాంక్‌ అందుకుంది.. కానీ అది సింగిల్స్‌లో కాదు డబుల్స్‌లో అన్నట్లుగా మీరు చెప్పిన విషయముంది. ఫార్మాట్‌ ముఖ్యం కాదు ఆమె నంబర్‌వన్‌ ర్యాంకు అందుకోవడం గొప్ప విషయం. అలాగే భారత్‌ కూడా ఏ ఫార్మాట్‌లో కప్పు కొట్టాలన్నది ముఖ్యం కాదు.’ అని ట్వీట్‌ చేశాడు.ఇదేమీ కొత్త కాదు..కాగా సంజయ్‌ మంజ్రేకర్‌ వివాదంలో చిక్కుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. 2024లో బోర్డర్ గావస్కర్‌ సిరస్ సందర్భంగ ‘కోచ్‌ గౌతమ్ గంభీర్‌ ప్రెస్‌ కానఫఫరెన్స్‌కు దూరంగా ఉంటే మంచిదేమో. మీడియ సమావేశాల కంటే కోచ్‌గా తన పని తాను సక్రమంగా చేస్తే మంచిదనుకుంటా’ అని వ్యాఖ్యానించడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. మొత్తం మీద తన చర్యలతో సంజయ్ మంజ్రేకర్ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు.చదవండి: టాప్‌ ర్యాంక్‌లోనే స్మృతి

Smriti Mandhana retains top spot in Women's ODI rankings3
టాప్‌ ర్యాంక్‌లోనే స్మృతి

భారత డాషింగ్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మంగళవారం తాజాగా విడుదల చేసిన బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన నిలకడగా ఒకటో ర్యాంక్‌లో కొనసాగుతోంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (8వ) ర్యాంక్‌లోనూ ఏ మార్పూ లేదు. అయితే జెమీమా రోడ్రిగ్స్‌ ఒక స్థానాన్ని కోల్పోయి 12వ ర్యాంక్‌లో ఉంది. ఆ్రస్టేలియా పర్యటనలో క్లీన్‌స్వీప్‌ అయిన మూడు వన్డేల సిరీస్‌లో జెమీమా నిరాశపరిచింది.చదవండి: T20 WC 2026: 'గంభీర్ చాలా పెద్ద త‌ప్పు చేశాడు'

Sanjay Manjrekar Slams Gautam Gambhir Despite T20 World Cup Win4
'గంభీర్ చాలా పెద్ద త‌ప్పు చేశాడు'

టీ20 ప్రపంచ‌క‌ప్‌-2026లో టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. తొలుత తుది జ‌ట్టులోనే లేని శాంస‌న్ ఏకంగా ప్లేయ‌ర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కీలకమైన చివరి మూడు మ్యాచ్‌లో సంజూ (97, 89, 89) సంచ‌ల‌న ఇన్నింగ్స్‌లు ఆడాడు.ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్‌లో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన శాంస‌న్‌.. స్ట్రైక్ రేట్ 199.37 321 పరుగులు చేశాడు. ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ క్రికెట‌ర్ సంజయ్ మంజ్రేకర్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను భారత్ సొంతం చేసుకున్న‌ప్ప‌టికి.. సంజూను స‌రిగ్గా ఉప‌యోగించుకోవ‌డంలో గంభీర్‌ ఆధ్వర్యంలోని టీమ్ మేనేజ్‌మెంట్ "తీవ్రమైన తప్పిదాలు" చేసిందని మంజ్రేకర్ విమర్శించాడు. టోర్నీ గ్రూపు స్టేజి మ్యాచ్‌ల‌లో శాంస‌న్‌ను తుది జ‌ట్టు నుంచి త‌ప్పించ‌డాన్ని అత‌డు త‌ప్పుబట్టాడు."సంజూ శాంస‌న్ విష‌యంలో టీమ్ మేనేజ్‌మెంట్ తీవ్ర‌మైన త‌ప్పిదాలు చేసింది. ద‌క్షిణాఫ్రికా వంటి ప‌టిష్ట‌మైన జ‌ట్టుపై ఓపెన‌ర్‌గా వ‌చ్చి సంజూ వ‌రుస సెంచ‌రీల‌తో స‌త్తాచాటాడు. ఆ త‌ర్వాత శుభ్‌మ‌న్‌ గిల్ కేవ‌లం టెస్టుల్లో బాగా ఆడాడని అతడిని మళ్ళీ టీ20ల్లోకి తీసుకొచ్చి సంజూను లోయార్డ‌ర్‌కు డిమోట్ చేశారు.దీంతో శాంస‌న్ త‌న రిథ‌మ్‌ను కోల్పోయాడు. ఈ కార‌ణంతో అత‌డిని తుది జ‌ట్టు నుంచి సైతం త‌ప్పించారు. అయితే ఒక మ్యాచ్‌కు రింకూ సింగ్ దూరం కావడంతో సంజూ మ‌ళ్లీ అవ‌కాశం ద‌క్కింది. మూడో స్ధానంలో ఇబ్బంది ప‌డుతున్న తిలక్ వ‌ర్మ‌ను బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో వెన‌క్కి నెట్టి ఆ స్ధానంలో కిషన్‌ను బ్యాటింగ్‌కు పంపారు. కిష‌న్ స్దానంలో సంజూ మ‌ళ్లీ ఓపెన‌ర్‌గా వ‌చ్చాడు. ఈసారి అత‌డు దుమ్ములేపాడు. ఏకంగా త‌న అద్భుత‌ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో జ‌ట్టును ఛాంపియ‌న్‌గా నిలిపాడు. అనుకోకుండా జ‌ట్టులోకి వ‌చ్చిన సంజూ చ‌రిత్ర‌ను తిరగ‌రాశాడు. అతడికి ఓపెనింగ్‌ స్ధానమే సరైనది" అని మంజ్రేకర్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లలో పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'భార‌త్ ఒక ఛాంపియ‌న్ జ‌ట్టు.. తప్పులు వెతకడం ఆపండి'

Mitchell Santner To Lead, Finn Allen Rested As New Zealand Name Squad For SA Series5
న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్లు దూరం

టీ20 ప్రపంచకప్‌-2026 తర్వాత న్యూజిలాండ్ తమ మొదటి అంతర్జాతీయ సిరీస్ ఆడేందుకు సిద్దమైంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కివీస్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్ మార్చి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో 18 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్ర‌క‌టించింది.ఈ జ‌ట్టుకు మిచెల్ సాంట్నర్ జట్టుకు సారథ్యం వ‌హించ‌నున్నాడు. అదేవిధంగా ప్రపంచ కప్ జట్టులో ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో చోటు దక్కింది. ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మాట్ హెన్రీలు వంటి స్టార్ ప్లేయ‌ర్లకు సెలెక్ట‌ర్లు విశ్రాంతి ఇచ్చారు.కటేన్ క్లార్క్, నిక్ కెల్లీ, జేడన్ లెన్నాక్స్‌ల‌కు సెలెక్ట‌ర్లు పిలుపునిచ్చారు. అలాగే ఆల్‌రౌండ‌ర్ జోష్ క్లార్క్‌స‌న్‌ దాదాపు రెండున్నరేళ్ల తర్వాత జ‌ట్టులోకి వ‌చ్చాడు. బెవాన్ జాకబ్స్, జాక్ ఫౌల్క్స్,టిమ్ రాబిన్సన్ కూడా పునరాగమనం చేశారు. వీరు ముగ్గురు భార‌త్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో భాగంగా ఉన్నారు.కాగా కెప్టెన్ శాంట్న‌ర్ తొలి మూడు మ్యాచ్‌ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌నున్నాడు. ఆ త‌ర్వాత ఆఖ‌రి రెండు టీ20ల్లో టామ్ లాథ‌మ్ కివీస్ జ‌ట్టును నడిపించ‌నున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌-2026 రన్నరప్‌గా న్యూజిలాండ్‌ నిలిచిన సంగతి తెలిసిందే.సౌతాఫ్రికా సిరీస్‌కు న్యూజిలాండ్ జ‌ట్టుకటేన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డేన్ క్లీవర్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, జాక్ ఫౌల్క్స్, బెవాన్ జాకబ్స్, కైల్ జెమీసన్, నిక్ కెల్లీ, టామ్ లాథమ్, జేడన్ లెన్నాక్స్, కోల్ మెక్కాన్చీ, జిమ్మీ నీషమ్, టిమ్ రాబిన్సన్, బెన్ సీర్స్, నాథన్ స్మిత్, ఇష్ సోధి.చదవండి: T20 WC 2026: 'భార‌త్ ఒక ఛాంపియ‌న్ జ‌ట్టు.. తప్పులు వెతకడం ఆపండి'

 Pakistan Cricketer Busts Umpires Favour India Claim In Blunt Admission6
'భార‌త్ ఒక ఛాంపియ‌న్ జ‌ట్టు.. తప్పులు వెతకడం ఆపండి'

టీ20 వరల్డ్‌కప్-2026 విజేత టీమిండియాపై పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్‌కు అనుకూలంగా బ్యాటింగ్ పిచ్‌లు సిద్ధం చేశారనే ఆరోపణలను వసీం కొట్టిపారేశాడు. భారత్ ఒక అద్భుతమైన జట్టు అని అతడు కొనియాడాడు.కాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని టీమిండియా ముద్దాడింది. వరుసగా రెండోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా.. ఓవరాల్‌గా మూడు సార్లు పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్రకెక్కింది.అయితే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని మెన్ ఇన్ బ్లూ టోర్నీ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ.. కొంతమంది మాత్రం భారత్ 'పిచ్‌ల రిగ్గింగ్' చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలో ఓ పాకిస్తాన్ టీవీ ఛానల్ డిబేట్‌లో వసీం భారత్‌కు మద్దతుగా నిలిచాడు."పాకిస్తాన్ కంటే భారత్ చాలా పెద్ద జట్టు. ఈ విజయానికి వారు అన్ని రకాల అర్హులు. అంపైర్లు భారత్‌కు సహకరిస్తారని లేదా వారు స్పిన్ అనుకూల పిచ్‌లు సిద్ధం చేసుకుంటారని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. కానీ ఈ టోర్నీలో పిచ్‌లు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి. కొన్నిసార్లు పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా లేనప్పటికి వారు అద్భుతంగా ఆడారు. తప్పులు వెతకడం మానేసి, ఒక క్రికెట్ జట్టు ఉన్న దేశంగా మనం వారిని అభినందించాలి. పాక్ కంటే భారత్ అద్భుతమైన జట్టు అన్న విషయాన్ని మనం అంగీకరించాలి"అని వసీం పేర్కొన్నాడు. కాగా కొంతమంది పాక్ మాజీ క్రికెటర్లు మాత్రం భారత విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Jeevan Reddy unanimously elected as the Secretary of the Hyderabad Cricket Association7
హెచ్‌సీఎ కొత్త కార్యదర్శిగా జీవన్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) కొత్త కార్యదర్శిగా ఎం.జీవన్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 15న కార్యదర్శి పదవి కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే జీవన్‌ రెడ్డితో పాటు ఈ పదవి కోసం నామినేషన్‌ వేసిన మరో నలుగురు తప్పుకున్నారు.చిట్టి శ్రీధర్, అనిల్, హరినారాయణ, బాబూరావు తమ నామినేషన్లను చివరి నిమిషంలో ఉపసంహరించుకోవడంతో జీవన్‌ రెడ్డికి పోటీ లేకుండా పోయింది. ప్రతిష్టాత్మక ఫార్మా సంస్థ ఎంఎస్‌ఎన్‌ లాబొరేటరీస్‌లో జీవన్‌ రెడ్డి వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కార్యదర్శి ఎంపిక ఖరారు కావడంతో ఈ నెల 15న కేవలం హెచ్‌సీఏ కోశాధికారి పోస్టు కోసం ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ వీఎస్‌ సంపత్‌ వెల్లడించారు. కార్యదర్శి పదవికి బాబూరావు, అనిల్‌ కుమార్, హరినారాయణ, ఆగం రావు పోటీ పడుతున్నారు.

Bumrah to prepare for 2027 ODI World Cup8
ఇక వన్డేలపై బుమ్రా గురి!

న్యూఢిల్లీ: భారత స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వరుసగా రెండోసారి జట్టు టి20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. 2024లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచిన అతను... ఈసారి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’ అవార్డుతో తన విలువను ప్రదర్శించాడు. ‘ఆల్‌ ఫార్మాట్‌’ ప్లేయర్‌ అయిన బుమ్రా చాలా కాలంగా పనిభారం తగ్గించుకునేందుకు ఎంపిక చేసిన సిరీస్‌లు, మ్యాచ్‌లలోనే బరిలోకి దిగుతున్నాడు. ఈ క్రమంలో టి20 వరల్డ్‌ కప్‌ తర్వాత అతని ప్రాధాన్యతలు కూడా మారబోతున్నాయి. ఇకపై 2027 వన్డే వరల్డ్‌ కప్‌ లక్ష్యంగా బుమ్రా సిద్ధం కానున్నాడు. ఇందు కోసం రాబోయే ఏడాదిన్నర కాలంలో అతను ఎక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడాలని నిర్ణయించుకున్నాడు. టి20 మ్యాచ్‌ల నుంచి చాలా వరకు అతను విరామం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలతో పాటు 2028లో లాస్‌ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్‌ కూడా టి20 ఫార్మాట్‌లోనే జరుగుతాయి. అయితే ఈ రెండు మెగా ఈవెంట్లు మినహాయించి మిగతా టి20 మ్యాచ్‌లలో ఎక్కువ భాగం బుమ్రా ఆడే అవకాశం తక్కువగా ఉంది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత వన్డేలపైనే అతను పూర్తి స్థాయి దృష్టి పెడతాడు. అయితే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ కూడా కీలకం కాబట్టి టెస్టుల నుంచి బుమ్రాకు విశ్రాంతి లభించడం కష్టమే. ఈ నేపథ్యంలో కోచ్‌ గంభీర్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్, టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌ కలిసి బుమ్రా గురించి పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. బుమ్రా ఫిట్‌నెస్‌ తమకు అన్నింటికంటే ముఖ్యమని, పెద్ద ఈవెంట్లలో అతని ప్రాధాన్యత గురించి చెప్పాల్సిన పని లేదని, వరల్డ్‌ కప్‌కు ముందు ఉండే 30–35 వన్డేల్లో బుమ్రా బరిలోకి దిగుతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

Indian womens hockey team to face Wales today9
‘డ్రా’ చేసుకుంటే సెమీస్‌ బెర్త్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచకప్‌ మహిళల హాకీ క్వాలిఫయింగ్‌ టోర్నీలో నేటితో లీగ్‌ దశ ముగియనుంది. మంగళవారం విశ్రాంతి దినం తర్వాత బుధవారం చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. పూల్‌ ‘బి’లో ఆతిథ్య భారత జట్టు తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో వేల్స్‌ జట్టుతో తలపడనుంది. గచ్చిబౌలి స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్‌ మొదలవుతుంది. పూల్‌ ‘బి’లో ప్రస్తుతం భారత్, స్కాట్లాండ్‌ 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఉరుగ్వే 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన వేల్స్‌ సెమీఫైనల్‌ రేసు నుంచి నిష్క్ర మించింది. నేడు జరిగే పూల్‌ ‘బి’ మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో ఉరుగ్వే (సాయంత్రం గం. 5:15 నుంచి) ఆడుతుంది. స్కాట్లాండ్‌ కూడా ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంటుంది. ఉరుగ్వే నెగ్గితే ఆ జట్టు సెమీఫైనల్‌ చేరుకుంటుంది. ఈ రెండు మ్యాచ్‌లకంటే ముందు పూల్‌ ‘ఎ’లో ఆస్ట్రియాతో ఇంగ్లండ్‌ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి), ఇటలీతో కొరియా (మధ్యాహ్నం గం. 3 నుంచి) పోటీపడతాయి. రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన ఇంగ్లండ్‌ ఇప్పటికే సెమీఫైనల్‌ చేరుకోగా... ఇటలీ, కొరియా మధ్య మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు రెండో సెమీఫైనల్‌ బెర్త్‌ లభిస్తుంది. ఒకవేళ ఇటలీ, కొరియా మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిస్తే మెరుగైన గోల్స్‌ సగటుతో ఇటలీ ముందంజ వేస్తుంది.

No clarity yet on IPL matches10
‘సిలిండర్‌’ కథ తేలితేనే షెడ్యూల్‌!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌–2026 ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వార్త ఇది. ప్రచార ప్రకటనల హోరు కనిపిస్తున్నా అసలు మ్యాచ్‌లు ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఎవరికీ తెలియదు. మార్చి 28 అని వినిపించినా దానిని కూడా బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. షెడ్యూల్‌ విషయంలో అభిమానులకు మాత్రమే కాదు అసలు బీసీసీఐ అధికారులకే స్పష్టత లేదు! మధ్య ప్రాచ్య దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం కూడా దీనికి ఒక కారణం. గల్ఫ్‌లో యుద్ధం కారణంగా మన దేశంలో గ్యాస్‌ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడంతో హోటల్స్‌లో వాడే కమర్షియల్‌ సిలిండర్‌లు దొరకడం సమస్యగా మారిపోయింది. ఐపీఎల్‌ సమయంలో హోటల్స్‌లో బస చేసే ఆటగాళ్లు, ఇతర సిబ్బంది, టోర్నీ నిర్వహణలో భాగంగా ఉండే ఎంతో మందికి భోజనం తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సిలిండర్‌లు కావాల్సిన సంఖ్యలో అందుబాటులో లేకపోతే మొత్తం వ్యవస్థ అంతా దెబ్బ తింటుంది. తాజాగా బెంగళూరు హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కూడా తమకు సిలిండర్ల కొరత బాగా ఉందని ఇప్పటికే చెప్పగా... ముంబైలో 20 శాతం హోటల్స్‌ తమ వ్యాపారానికి విరామం ఇచ్చాయి. ఈ సమస్యను ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ కూడా అంగీకరించారు. ‘గ్యాస్‌ సిలిండర్ల విషయంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నాం. మార్చి 28 వరకు అంతా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. అలా కాకుండా ఇదే సమస్య అప్పటికీ కొనసాగితే మేం ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆటగాళ్లతో పాటు ఐపీఎల్‌తో సంబంధం ఉన్న అందరిపై దీని ప్రభావం ఉంటుంది’ అని ధుమాల్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అంతా స్పష్టత వచ్చాకే ఐపీఎల్‌ షెడ్యూల్‌ ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement