Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Rumours MS Dhoni Changing His Jersey Number From 7 To 81
ధోని జెర్సీ నంబర్‌ మారనుందా?

టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్‌ ధోని ఐపీఎల్‌ 2026 సీజన్‌లో తన జెర్సీ నంబర్‌ మార్చుకోనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని జెర్సీ నంబర్‌ ఎంత అని చిన్న పిల్లాడిని అడిగినా టక్కున ఏడు అని చెప్పేస్తాడు. అంతలా పాతుకుపోయింది ధోని జెర్సీ నంబర్‌. రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్‌కు ఆడిన ధోని ఏడు నెంబర్‌ జెర్సీతోనే బరిలోకి దిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఐపీఎల్‌లోనూ సీఎస్‌కే తరఫున అదే జెర్సీ నెంబర్‌తో బరిలోకి దిగుతున్నాడు. అయితే తాజాగా ధోనినే స్వయంగా తన ఫేస్‌బుక్‌ ఖాతా వేదికగా తాను ధరించబోయే ఎనిమిదో నెంబర్‌ జెర్సీని పంచుకున్నాడు. ‘కొన్ని నంబర్లు మనతో పాటే ఉండిపోతాయి. అందులో ఏడు అనేది ఒకటి. కానీ ఇవాళ నేను 8కి స్విచ్‌ అవుతున్నా. ఎందుకనేది మీకు త్వరలోనే తెలుస్తోంది’ అంటూ ధోని ఒక క్యాప్షన్‌ జత చేశాడు. ఇది చూసిన ధోని అభిమానులు మాత్రం ‘మా ధోని ఎప్పుడు ఏడో నంబర్‌ జెర్సీకే కట్టుబడి ఉండాలి. అది మాకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది’ అంటూ పేర్కొన్నారు. మరికొందరు మాత్రం అది కేవలం అడ్వర్టైజ్‌మెంట్‌ కోసం ధోని చేసిన వీడియో అని తెలిపారు. నిజానికి ఎంఎస్‌ ధోనికి నంబర్ 7తో చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. ధోనికి ఆ నంబర్‌ ఒక ఎమోషన్‌ కూడా. ధోని పుట్టిన తేదీ జూలై 7 (07/07). అందుకే కెరీర్ ఆరంభం నుంచి ధోని అదే నంబర్‌ను వాడుతున్నాడు. భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా బీసీసీఐ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో నంబర్ 7 జెర్సీకి రిటైర్మెంట్‌ కూడా ప్రకటించి అతని జెర్సీని బీసీసీఐ మ్యూజియంలో ఉంచింది. ఇలాంటి తరుణంలో ధోని తనకు అచ్చొచ్చిన నంబర్‌ను ఐపీఎల్‌లో మార్చుకోవడం సాధ్యమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.చదవండి: ‘కెరీర్‌ ముగింపు మన చేతుల్లో ఉండదు’

PV Sindhu Opens Up On Importance Of Education For Athletes2
‘కెరీర్‌ ముగింపు మన చేతుల్లో ఉండదు’

క్రీడల్లో ఎపుడు ఏం జరుగుతుందో చెప్పలేమని, కేవలం ఒకే ఒక్క గాయంతో ఏకంగా కెరీర్‌నే ముగించాల్సి వస్తుందని భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపింది. గురుగ్రామ్‌లోని ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సింధూ క్రీడలు, చదువుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు కేవలం క్రీడలమీదే కాకుండా, చదువుపైనా దృష్టిపెట్టాలని సూచించారు. ఒక్క గాయం కెరీర్‌నే ముగించే పరిస్థితికి తీసుకొస్తుందని వ్యాఖ్యానించారు. ‘నేను కొన్నేళ్లుగా ఆడుతూనే ఉన్నా. అయితే, ఏదొక సమయంలో రిటైర్‌మెంట్‌ అవ్వాల్సిందే కదా.. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. మనం 45 లేదా 50 ఏళ్లు వచ్చాక క్రీడలు ఆడటం కష్టం. కానీ, చదువు మాత్రం మన జీవితాంతం తోడు ఉంటుంది. ప్రతి ఒక్కరూ బంగారు స్పూన్‌తో జన్మించలేరు. ఎందులోనైనా సరే కష్టపడాల్సిందే. అది చదువైనా.. క్రీడలైనా సరే అకుంఠిత దీక్షతో శ్రమించాలి. రెండింటికీ సమప్రాధాన్యం ఇవ్వాలి. నేను ఎంబీఏ పూర్తి చేశా. అయితే, ఓ వైపు క్రీడలో ఉంటూ చదువు కొనసాగించడం తేలికైన విషయం కాదని తెలుసు. ఉదయాన్నే ప్రాక్టీస్‌కు వెళ్లడం.. వచ్చాక చదువుకోవడం.. మళ్లీ సాయంత్రం సాధనకు వెళ్లడం కష్టమే. ఇక్కడే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. జీవితాంతం క్రీడల్లో కొనసాగలేం.. చదువు ఉంటే మాత్రం నిబ్బరంగా ఉండొచ్చు. క్రీడలు ముఖ్యమే కానీ, చదువును పూర్తిగా పక్కన పెట్టేసి ప్రయత్నించకూడదు. పైగా, క్రీడల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిరంతరం రిస్క్‌తో కూడుకున్నదే. ఆటలను కెరీర్‌గా ఎంచుకున్నప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయొద్దు. ఆడేటప్పుడు ఒక్క పెద్ద గాయమైతే.. కోలుకుని రావడం కష్టం. ఒక్కోసారి కెరీర్‌ ముగిసే అవకాశమూ లేకపోలేదు. ప్రమాదాలు చెప్పి రావు కదా. నేను 2016 ఒలింపిక్స్‌కు ముందు తీవ్రంగా గాయపడ్డా. కొన్నిరోజులపాటు నొప్పితోనే ఆడా. వైద్యుల వద్దకు వెళ్తే వారు ఏం చెబుతారనే భయం వెంటాడేది. మళ్లీ జీవితంలో ఆడతానా? లేదా? అనే అనుమానాలు వచ్చాయి. వైద్య చికిత్స తీసుకున్నా.మళ్లీ కోలుకుని ఒలింపిక్స్‌ బరిలోకి దిగా' అని పీవీ సింధు చెప్పుకొచ్చింది.చదవండి: బుమ్రాకు 2 కోట్ల నష్టపరిహారం!

BCCI Likely Compensate Bumrah After Latest Decision To Pay 2 Crore3
బుమ్రాకు 2 కోట్ల నష్టపరిహారం!

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు బీసీసీఐ రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ గత ఫిబ్రవరిలో 2025-26 సీజన్‌ కోసం ఆటగాళ్లకు వార్షిక ఫీజులకు సంబంధించి సెంట్రల్‌ కాంట్రాక్టు జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో ‘ఏ ప్లస్‌’ గ్రేడ్‌ను బీసీసీఐ తొలగించింది. గతంలో ఏ ప్లస్‌ కేటగిరీలో రోహిత్‌, కోహ్లీ, బుమ్రా, జడేజా ఉండేవారు. వీరిలో కోహ్లీ, రోహిత్‌లు కేవలం వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతుండగా, జడేజా రెండు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. దీంతో ఈ ముగ్గురి ఫీజు చెల్లింపు విషయంలో బీసీసీఐకి పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ ఇప్పటివరకు ఏ ప్లస్‌ గ్రేడ్‌లో ఉన్న బుమ్రాను ఏ గ్రేడ్‌కు మార్చింది. ఇదే ఏ గ్రేడ్‌లో బుమ్రాతో పాటు టెస్టు, వన్డే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, జడేజా కూడా ఉన్నారు. బీసీసీఐ ఒప్పందం ప్రకారం గ్రేడ్-ఏ ఆటగాళ్లకు ఏటా రూ. 5 కోట్లు, గ్రేడ్-బి ఆటగాళ్లకు రూ.3 కోట్లు లభిస్తాయి. గ్రేడ్ సి ఆటగాళ్లు రూ. 1 కోటి అందుకుంటారు. ఇంతకముందు ఏ ప్లస్‌ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక ఫీజు కింద రూ. 7 కోట్లు చెల్లించేవారు. దీంతో ఇప్పటివరకు ఏ ప్లస్‌లో కొనసాగిన బుమ్రా ప్రస్తుతం ఏ కేటగిరీ కింద రూ. 5 కోట్లు మాత్రమే అందుకోనున్నాడు. కానీ మూడు ఫార్మాట్లు (వన్డే, టెస్టు, టీ20లు) ఆడుతూ కూడా రూ.2 కోట్లను కోల్పోవాల్సి వస్తోంది. దీంతో బుమ్రా విషయంలో బీసీసీఐ పునరాలోచనలోన పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బుమ్రాకు మిగిలిన రూ. 2 కోట్లను నష్టపరిహారంగా అందివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మరికొందరు ఆటగాళ్ల ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని వారి కాంట్రాక్టు మొత్తాలను కూడా బీసీసీఐ పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో ఏ ప్లస్‌ కేటగిరీ దక్కించుకోవాలంటే క్రికెటర్లు మూడు ఫార్మాట్లలో ఆడుతూ కనీసం ఒక్క ఫార్మాట్‌లోనైనా టాప్‌-10 ర్యాంకులో కొనసాగాలనే నిబంధన ఉండేది. తాజాగా ఏ ప్లస్‌ను రద్దు చేయడంతో ఆ నిబంధన కూడా తొలిగిపోయింది.చదవండి: ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా ఇషాన్‌ కిషన్‌

Ishan Kishan Will SRH Captain Until Cummins Recovers Injury IPL 20264
ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా ఇషాన్‌ కిషన్‌

ఐపీఎల్‌ 2026 సీజన్‌కు సంబంధించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఆరంభ మ్యాచ్‌లకు ఇషాన్‌ కిషన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమవ్వనున్నట్లు ఇప్పటికే జట్టు మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ 2026 సీజన్‌లో ఆరంభం రోజునే డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆర్సీబీతో తొలి మ్యాచ్‌ ఆడనుంది.ఈ నేపథ్యంలోనే కమిన్స్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తాడని యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ వైస్‌ కెప్టెన్‌గా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ బాధ్యతలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ గెలవడంలో ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మలు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.అభిషేక్‌ సంగతి పక్కనబెడితే రిషబ్‌ పంత్‌,జితేశ్‌ శర్మలు గాయాల బారీన పడడంతో ఇషాన్‌ కిషన్‌కు అనూహ్యంగా జట్టులోకి పిలుపొచ్చింది. టీ20 ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్‌ కిషన్‌ అద్భుతంగా రాణించాడు. అదే ఫామ్‌ను టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగించాడు. తాజాగా కమిన్స్‌ స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన ఇషాన్‌ కిషన్‌ ఐపీఎల్‌లోనూ అదరగొట్టాలని ఆశిద్దాం.ఇక వెన్ను గాయంతో బాధపడుతున్న కమిన్స్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. వెన్నునొప్పి కారణంగానే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌కు కూడా కమిన్స్‌ దూరమయ్యాడు. ఇక కమిన్స్‌ ఆస్ట్రేలియా వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఐపీఎల్‌ 2024 సీజన్‌లో కమిన్స్‌ సారథ్యంలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఆ సీజన్‌లో సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన సన్‌రైజర్స్‌ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో ఓటమిపాలైంది. 2024 ఎడిషన్‌ నుంచి గేర్‌ మార్చిన ఎస్‌ఆర్‌హెచ్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, క్లాసెన్‌, లివింగ్‌స్టోన్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో బ్యాటింగ్‌ దుర్భేద్యంగా మారింది. అయితే 2025 సీజన్‌లో ఆశించినంతగా రాణించలేకపోయిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఆరో స్థానానికి పరిమితమయ్యింది.సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: ఇషాన్‌ కిషన్‌ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ (వైస్‌ కెప్టెన్‌), అనికేత్ వర్మ, బ్రైడన్ కార్సే, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, హెన్రిచ్ క్లాసెన్,ఘ, జయదేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్‌ కమిన్స్‌, స్మరణ్‌ రవిచంద్రన్‌, ట్రావిస్‌ హెడ్‌, జీషన్‌ అన్సారీ, సలీల్‌ అరోరా, శివంగ్‌ కుమార్‌, లివింగ్‌స్టోన్‌, జాక్‌ ఎడ్‌వర్డ్స్‌, అమిత్‌ కుమార్‌, క్రెయిన్స్‌ ఫెల్టూరా, సకిబ్‌ హుసేన్‌, ఒంకార్‌ తర్మలే, ప్రఫుల్‌ హింగే, శివమ్‌ మావి.𝐀𝐍𝐍𝐎𝐔𝐍𝐂𝐄𝐌𝐄𝐍𝐓 🚨 Pat Cummins will miss a few games while recovering from injury.Until he recovers, Ishan Kishan will be the Captain and Abhishek Sharma will be the Vice-Captain. pic.twitter.com/etXJUkQJeG— SunRisers Hyderabad (@SunRisers) March 18, 2026

RCB Sale Enters Final Stage With Price Set Around 2 Billion USD5
రికార్డు స్థాయి బిడ్‌.. తుది దశకు ఆర్సీబీ అమ్మకం!

ఐపీఎల్లో 2025లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్‌గా నిలిచింది. అయితే 17 సీజన్ల పాటు కింగ్‌ఫిషర్‌ కంపెనీ నిర్వహిస్తూ వచ్చిన ఆర్బీబీ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్సీబీ అమ్మకం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. స్వీడన్‏కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ భారీ బిడ్ పెట్టినట్లు సమాచారం. మరోవైపు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత రంజన్ ‏పై, అమెరికా సంస్థ కోల్‌బెర్గ్‌ క్రావిస్‌ రాబర్ట్స్‌ అండ్‌ కో (కేకేఆర్‌), సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ టెమాసెక్ కలసిన కన్సార్టియం కూడా పోటీలో ఉంది. కాగా మొత్తం డీల్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ప్రారంభంలో మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమానులు గ్లేజర్స్, అదార్ పూనావాలా కూడా ఆసక్తి చూపినప్పటికీ చివరికి రేసు నుంచి తప్పుకున్నారు. గ్లేజర్స్ సుమారు 1.8 బిలియన్ డాలర్ల నాన్ బైండింగ్ ఆఫర్ ఇచ్చినట్లు, అయితే ఈక్యూటీ దాన్ని దాటేలా బిడ్ పెంచినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ డీల్ సూటిగా బిడ్డింగ్ పోరుగా మారింది. డయాజియో గ్రూప్ మార్చి 31ని గడువుగా పెట్టి ఈ అమ్మకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడం వెనుక కూడా ఈ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మూడు సంస్థలు బైండింగ్ బిడ్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఫేవరెట్‏గా నిలుస్తోంది. మొదట మెజారిటీ వాటా అమ్మాలని భావించిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇప్పుడు పూర్తి విక్రయానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఫ్రాంచైజీ విలువ 1.1 బిలియన్ నుంచి 1.35 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. రైన్ గ్రూప్ ఈ అమ్మక ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. అమెరికాకు చెందిన డేవిడ్ బ్లిట్జర్, ఆదిత్య బిర్లా గ్రూప్ కలిసి కన్సార్టియంగా బిడ్ సమర్పించినట్లు తెలుస్తోంది. మార్చి 31 ఈ డీల్ కూ కీలక గడువుగా ఉంది. అయితే ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు అభిమానులు చాలా మంది ఉంటారు. ఖరీదైన జట్టుగా పేరున్న ఆర్సీబీని దక్కించుకోవడానికి రెండు ప్రధాన సంస్థలు పోటీలో ఉన్నాయి. అంతిమంగా ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆర్‌సీబీ అమ్మకం ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.చదవండి: ఐపీఎల్‌ ఖరీదైన ఆటగాడి అసహనం!

I Never Wanted To Be Selfless: Sanju Samson After T20 WC Heroics6
ఆ విషయంలో స్వార్థపరుడినే: సంజూ శాంసన్‌

టీ20 ప్రపంచకప్‌-2026 హీరో, టీమిండియా ఓపెనర్‌ సంజూ శాంసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇతరుల మెప్పు కోసం తాను ఎప్పుడూ ఏ పనీ చేయలేదని తెలిపాడు. ఎల్లప్పుడూ తన మనసు చెప్పినట్లే నడుచుకున్నానని.. ఈ విషయంలో తాను స్వార్థపరుడినే అన్నాడు.దాగుడుమూతల మాదిరి..భారత టీ20 జట్టు ఓపెనర్‌గా 2024 నుంచి రాణిస్తున్న సంజూ శాంసన్‌.. శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) పునరాగమనంతో కొన్నాళ్లు తుదిజట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత గిల్‌ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చినా.. సరిగ్గా వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభానికి ముందే ఫామ్‌ కోల్పోయాడు. దీంతో ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) భర్తీ చేశాడు.నాకౌట్‌ దశలో వరుసగా హాఫ్‌ సెంచరీలుఅయితే, కీలక నాకౌట్‌ మ్యాచ్‌లలో యాజమాన్యం సంజూకు తిరిగి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వగా దుమ్ములేపాడు. ముఖ్యంగా సెమీస్‌ చేరాలంటే వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.ఆ తర్వాత ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 పరుగులతో సంజూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మూడు సందర్భాల్లోనూ అతడి సెంచరీ చేసే అవకాశం కోల్పోవడం గమనార్హం. ఏదేమైనా భారత్‌ టీ20 వరల్డ్‌కప్‌-2026 గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సంజూ తనకు జట్టు ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ డ్రెసింగ్‌ రూమ్‌లో ఎప్పుడూ దీని గురించే మాట్లాడేవారన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు జట్టు విజయం కోసమే శ్రమించాలని దిశా నిర్దేశం చేసేవారని పేర్కొన్నాడు.ఆ విషయంలో నేను స్వార్థపరుడినే‘‘మా కోచ్‌ , కెప్టెన్‌ డ్రెసింగ్‌రూమ్‌లో కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. వ్యక్తిగత రికార్డుల కంటే కూడా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకు తగ్గట్లే ఆడాలని పదే పదే మాకు చెప్పేవారు. మా నాయకత్వ బృందం నిర్ణయానుసారమే మేమంతా నడుచుకున్నాము.నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ఆటగాడు అలాగే ఆలోచించాలి. నేనైతే నా మనసు చెప్పినట్లే జట్టు ప్రయోజనాల కోసం మాత్రమే ఆడేవాడిని. ఈ విషయంలో నేను స్వార్థపరుడినే. నా పట్ల నేను నిజాయితీగా ఉండటం ద్వారా నాలోని బలహీనతలు అధిగమించడం సులువైంది’’ అని సంజూ శాంసన్‌ చెప్పుకొచ్చాడు.కాగా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం ఇటీవలే ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించిన విషయం తెలిసిందే. రోహిత్‌ శర్మ సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో అనుభవం ఉందని.. అయితే, తమ జట్టులో యువకులు ఉన్నా జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేశారని అన్నాడు. తద్వారా టీమిండియా మరోసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచిందని పేర్కొన్నాడు.చదవండి: ’నేను, కోహ్లి, రోహిత్‌ రిటైర్‌ అవ్వాలని గంభీర్‌ కోరుకున్నా పర్లేదు’

Cameron Green Loses Cool On Interviewer When Asked Poor Form7
ఐపీఎల్‌ ఖరీదైన ఆటగాడి అసహనం!

ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభానికి మరో 10 రోజుల సమయముంది. ఈ నేపథ్యంలో గతేడాది తన ప్రదర్శనతో అంతగా ఆకట్టుకోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఐపీఎల్‌ 18వ సీజన్‌లో ఎలాగైనా టైటిల్‌ కొట్టాలనే ధ్యేయంతో సరికొత్తగా సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ జట్టు ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు కామెరున్‌ గ్రీన్‌ పై చాలా ఆశలే పెట్టుకుంది. గతేడాది జరిగిన వేలంలో ఈ ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌ను కేకేఆర్‌ రూ.25.20 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడికి ఇంత ఖర్చు చేయడం ఇదే తొలిసారి. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కామెరున్‌ గ్రీన్‌ ఆకట్టుకున్న దాఖలాలు తక్కువే. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లోనూ గ్రీన్‌ అంతగా ఆకట్టుకోలేదు. మరో పది రోజుల్లో ఐపీఎల్‌ 18వ సీజన్‌ మొదలుకానున్న నేపథ్యంలో ఇది కేకేఆర్‌కు ఒక రకంగా బ్యాడ్‌న్యూస్‌ అని చెప్పొచ్చు. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా దేశవాలీ క్రికెట్‌లో వెస్ట్‌ ఆస్ట్రేలియా తరఫున కామెరున్‌ గ్రీన్‌ మూడంకెల స్కోరును అందుకున్నాడు. న్యూసౌత్‌వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్‌ సెంచరీ మార్క్‌ సాధించాడు. ఈ సందర్భంగా ఆసీస్‌ మీడియాకు చెందిన ఒక రిపోర్టర్‌ సెంచరీ చేయడం ఎలా అనిపిస్తోందని గ్రీన్‌ను అడిగాడు. ‘ఇది నాకు గ్రేట్‌ ఫీలింగ్‌ కలిగిస్తోంది. మొదటి మూడురోజులు మంచి స్టార్ట్‌ లభించింది. కచ్చితంగా మ్యాచ్‌ గెలవబోతున్నాం’ అని చెప్పుకొచ్చాడు. అయితే దీనికి ముందు ఫామ్‌లేమీతో ఇబ్బంది పడడం ఎలా అనిపించిందంటూ మరో ప్రశ్న వేశాడు. దీనికి ‘నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్పదలచుకోలేను. వేరే ప్రశ్నకు వెళ్లండి’ అని ముక్తసరిగా సమాధానమిచ్చాడు. ప్రశ్నలు లేవు అనడంతో ఇంటర్వ్యూను అక్కడితో ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో గ్రీన్‌ ‘వేస్ట్‌ ఆఫ్‌ టైమ్‌’ అంటూ తనలో తాను గొణుక్కుంటూ వెళ్లిపోయాడని రిపోర్టర్‌ వాపోయాడు. ఆ తర్వాత వెస్ట్‌ ఆస్ట్రేలియా అసిస్టెంట్‌ కోచ్ బ్యూకాసన్‌.. గ్రీన్‌ తరఫున మీడి యాకు క్షమాపణ చెప్పడం ఆసక్తి కలిగించింది.చదవండి: గొడవ పడిన బంగ్లా కెప్టెన్‌కు బెస్ట్‌ ర్యాంకు!

If Gambhir Thought Me, Kohli, Sharma Should Move On Its Okay: R Ashwin8
’నేను, కోహ్లి, రోహిత్‌ రిటైర్‌ అవ్వాలని గంభీర్‌ కోరుకున్నా పర్లేదు’

టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన రిటైర్మెంట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ తన పనిని సరిగ్గానే చేశాడని పేర్కొన్నాడు. ఏదేమైనా సరైన సమయంలోనే తాను ఆటకు వీడ్కోలు పలికానని భావిస్తున్నట్లు తెలిపాడు.గంభీర్‌ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నాళ్లకే టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా.. టూర్‌ మధ్యలోనే అనూహ్యంగా అశూ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆసీస్‌తో తొలి టెస్టులో అశూను బెంచ్‌కే పరిమితం చేసిన యాజమాన్యం.. వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar)ను ఆడించింది.పిలిచి.. మళ్లీ తప్పించిఅయితే, రెండో టెస్టు కోసం అశూను పిలిపించింది. ఆ తర్వాత మూడో టెస్టులో అతడి స్థానాన్ని రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో భర్తీ చేశారు. దీంతో ఈ మ్యాచ్‌ ముగిసిన వెంటనే అశ్విన్‌ రిటైర్మెంట్‌ ఇవ్వడం చర్చకు దారితీసింది. ఇందుకు గంభీర్‌ కారణం అయి ఉంటాడనే ఊహాగానాలు వచ్చాయి.ఏదేమైనా టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన అనిల్‌ కుంబ్లే (619) తర్వాతి స్థానాన్ని ఆక్రమించిన అశూ (537).. ఇంకొన్నాళ్లు ఆడి ఉంటే అతడి రికార్డు సమం చేయగలిగే వాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అశూ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.అదే అతిపెద్ద బలం‘‘సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం నాకున్న అతిపెద్ద బలం. అది తప్పా, ఒప్పా అని ప్రజలు చర్చించుకున్నా నేనేం పట్టించుకోను. పెర్త్‌లో వాషీ, ఆ తర్వాత అడిలైడ్‌లో నేను, బ్రిస్బేన్‌లో జడేజా.. ఇలా ఒకరి తర్వాత ఒకరం స్పిన్‌ దళాన్ని నడిపించాము.నేను జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాను. దానర్థం వాషీ, జడ్డూకు నేను మార్గం సుగమం చేయాలనే కదా అనిపించింది. వద్దన్నా నేను పట్టుకుని వేలాడే రకం కాదు. కెరీర్‌లో నేను చాలా దూరం వచ్చేశాను. అనుకున్నవి సాధించగలిగాను. కొంతమంది ఈ విషయంలో గంభీర్‌ గురించి వారికి నచ్చినట్లు మాట్లాడారు.నేను, కోహ్లి, రోహిత్‌ రిటైర్‌ అవ్వాలని గంభీర్‌ కోరుకున్నా పర్లేదుకోచ్‌గా తన జాబ్‌ తాను చేశాడు. ఒకవేళ నేను, విరాట్‌, రోహిత్‌.. రిటైర్మెంట్‌ ప్రకటించాలని ఆయన కోరుకుని ఉండవచ్చు. హెడ్‌కోచ్‌గా ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. ఇందులో తప్పుబట్టడానికి ఏమీలేదు.స్వార్థం, ఈగో వదిలేయాలని నేను ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇప్పటికీ ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మనం మనుషులం. భావోద్వేగాలు ఉండటం సహజం’’ అని అశూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆసీస్‌ టూర్‌ తర్వాత అకస్మాత్తుగా రోహిత్‌ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పగా.. అనూహ్య రీతిలో టెస్టు దిగ్గజ బ్యాటర్‌ కోహ్లి సైతం ఇదే బాటలో నడిచాడు. దీంతో గంభీర్‌పై మరోసారి విమర్శలు వచ్చాయి. చదవండి: T20 WC Final: ’అర్ష్‌దీప్‌ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను’

Bangla Captain Mehidy Hasan Miraj Career Best Rank In ODI Bowling9
గొడవ పడిన బంగ్లా కెప్టెన్‌కు బెస్ట్‌ ర్యాంకు!

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బుధవారం వన్డే, టీ20 ర్యాంకింగ్స​్‌ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల ర్యాంకుల్లో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవలే పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో బంగ్లాదేశ్‌ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్‌తో రెండో వన్డే సందర్భంగా బంగ్లా కెప్టెన్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ నాన్ స్ట్రైక్ ఎండ్‌లో పాక్‌ బ్యాటర్‌ సల్మాన్‌ అఘాను రనౌట్‌ చేయడం వివాదం సృష్టించింది. అఘా కోపానికి కారణమై గొడవకు మూలకేంద్రంగా నిలవడమే గాక, బంగ్లాకు సిరీస్‌ విజయం దక్కడంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో తొమ్మిది స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. అదే సమయంలో ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లా కెప్టెన్‌ రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో పాకిస్థాన్‌ ఆటగాడు సల్మాన్‌ అఘా బ్యాటింగ్‌ విభాగంలో 9 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలోనూ సల్మాన్‌ అఘా ఉమ్మడిగా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. పాక్‌ కెప్టెన్‌ షహీన్‌ అఫ్రిది ఆల్‌రౌండర్ల కోటాలో 25వ స్థానంలో నిలిచాడు. ఇక భారత బ్యాటర్ల విషయానికి వస్తే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ తర్వాత టీమిండియా మళ్లీ వన్డేలు ఆడలేదు. ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ (791 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతుండగా, రోహిత్‌ శర్మ 4వ స్థానంలో (748 పాయింట్లు), శుబ్‌మన్‌ గిల్‌ 5వ స్థానంలో (716 పాయింట్లు), కేఎల్‌ రాహుల్‌ (664 పాయింట్లు) తొమ్మిదో స్థానంలో ఉన్నారు. బౌలింగ్‌ విభాగంలో కుల్దీప్‌యాదవ్‌ ఒక్కడే టాప్‌-10లో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ అక్షర్‌పటేల్‌ పదో స్థానంలో ఉన్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో పురుషుల విభాగంలో భారత్‌ నుంచి అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌లు టాప్‌-10లో కొనసాగుతున్నారు. బౌలింగ్‌ విభాగంలో వరుణ్‌ చక్రవర్తి 2వ స్థానం నిలబెట్టుకోగా, బుమ్రా ఒక స్థానం మెరుగుపరుచుకొని 702 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవలే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో మెరిసిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ 11 స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్‌ పాండ్యా రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.చదవండి: ‘కాల్‌ మీ’.. లలిత్‌ మోదీ ఆసక్తికర పోస్టు!

Former IPL Chairman Lalit Modi Cryptic Post To Sunrisers Leeds Viral10
‘కాల్‌ మీ’.. లలిత్‌ మోదీ ఆసక్తికర పోస్టు!

హండ్రెడ్‌ లీగ్‌ వేలంలో పాకిస్థాన్‌ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను సన్‌రైజర్స్‌ లీడ్స్‌ కొనుగోలు చేయడంపై భారత్‌లో పెద్ద దుమారమే రేగుతోంది. కావ్యామారన్‌కు చెందిన సన్‌రైజర్స్‌ యాజమాన్యంపై పాకిస్థాన్‌ ఆటగాళ్లను ఎలా కొనుగోలు చేస్తారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు భారత్‌లో సన్‌రైజర్స్‌ లీడ్స్‌కు చెందిన సోషల్‌ మీడియా ఖాతా ‘ఎక్స్‌’ను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా అబ్రార్‌ అహ్మద్‌ను సన్‌రైజర్స్‌ లీడ్స్‌ 190,000 పౌండ్లు (సుమారు రూ.2.34 కోట్లు) దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీ సన్‌రైజర్స్‌ లీడ్స్‌కు ఆసక్తికర సందేశాన్ని పంపించారు. ‘పాకిస్తాన్ ఆటగాడిపై రూ.2.34 కోట్లు పెట్టుబడి పెట్టడంతో అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో పడిపోయిన ఇమేజ్‌ను ఎలా తిరిగి వెనక్కి తెచ్చుకోవా లనేది నాకు తెలుసు. అందుకే ఒకసారి నాకు కాల్‌ చేయండి’ అంటూ పోస్టు పెట్టాడు. అయితే లలిత్ మోదీ తన పోస్ట్‌లో ఎక్కడా కూడా కావ్య మారన్ పేరు ప్రస్తావించలేదు. అయినప్పటికీ లలిత్ తన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన సందేశం మాత్రం సన్‌రైజర్స్‌ యాజమాన్యాన్ని ఉద్దేశించే అని స్పష్టంగా అర్థమవుతోంది.అయితే తాజాగా భారత్‌లో ఐపీఎల్‌ ప్రారంభమవుతున్న వేళ అభిమానుల్లో సఖ్యత సాధించేందుకే లలిత్‌ మోదీ.. కావ్యామారన్‌కు ఇలాంటి సందేశాన్ని పంపించి ఉంటారని తెలుస్తోంది. 2010లో పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, ఐపీఎల్ ప్రసార హక్కుల కేటాయింపులో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో లలిత్‌ మోదీ దేశం విడిచి వెళ్లాడు. ఈడీ ప్రకారం 2009లో ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ హక్కుల కేటాయింపులో మోదీ అవకతవకలు చేసి రూ.125 కోట్లకు పైగా లాభం పొందినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. లలిత్ మోదీ ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నాడు. భారత్‌లో పలు ఆర్థిక అవకతవకల కేసులు కూడా ఉన్నాయి. 2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం విధించారు. అప్పటి నుంచి విదేశీల లీగ్‌లలో కూడా భారతీయ ఫ్రాంఛైజీలు పాక్ ప్లేయ ర్లను దాదాపు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే, ఈ సంప్రదాయాన్ని సన్‌రైజర్స్ పక్కనబెట్టి మరీ అబ్రార్ అహ్మద్‌ను తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.చదవండి: మల్టీ టాలెంటెడ్.. పైలట్ అవతారమెత్తిన గ్లెన్‌ ఫిలిప్స్‌

Advertisement
Advertisement
 
Advertisement