Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Will Pakistan Boycott T20 World Cup semifinal and final vs India, PCB Mohsin Naqvi reveals1
పాక్‌ సెమీస్‌, ఫైనల్స్‌ను కూడా రద్దు చేసుకుంటుందా..?

టీ20 ప్రపంచకప్‌-2026లో పాకిస్తాన్‌ భారత్‌తో ఆడాల్సిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఒకవేళ పాక్‌ సెమీస్‌లో కాని, ఫైనల్స్‌లో కాని భారత్‌తో తలపడాల్సి వస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇదే విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీ వద్ద ప్రస్తావించగా పూర్తి స్పష్టతనిచ్చాడు. సెమీఫైనల్ లేదా ఫైనల్‌లో భారత్‌తో తలపడాల్సి వస్తే పాకిస్తాన్‌ తప్పక బరిలోకి దిగుతుందని తేల్చి చెప్పాడు. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఆడేందుకు తమకెలాంటి అభ్యంతరాలు లేవని అన్నాడు. జట్టు శక్తిపై నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ.. భారత్‌ను గెలిచి చూపిస్తామని బీరాలు పలికాడు. ప్రపంచకప్‌ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.నఖ్వీ నేతృత్వంలోని పీసీబీ అవళంబిస్తున్న ఈ భిన్న వైఖరిపై ఐసీసీతో పాటు క్రికెట్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్‌ దశలో వచ్చే భద్రతా సమస్యలు నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడే సమయంలో ఎదురవ్వవా అని అంటున్నారు. కొందేమో పాక్‌కు నాకౌట్‌ దశకు చేరేంత సీన్‌ లేదని, అందుకే ఈ తలతిక్క డ్రామాలాడుతుందని కామెంట్లు చేస్తున్నారు. అసలు పాక్‌ను ప్రపంచకప్‌ మొత్తం నుంచే బహిష్కరించి, వేరే టీమ్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.కాగా, టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా పాకిస్తాన్‌ భారత్‌తో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ పాక్‌ ఈ మ్యాచ్‌ను రద్దు చేసుకుంది. తాజాగా ఈ ఒక్క మ్యాచ్‌ మినహా మిగతా మ్యాచ్‌లు తప్పక ఆడతామని స్పష్టం చేసింది. పాక్‌ గ్రూప్‌-ఏలో భారత్‌, నమీబియా, నెదర్లాండ్స్‌, యూఎస్‌ఏతో తలపడాల్సి ఉంది. వీరి మిగతా గ్రూప్‌ మ్యాచ్‌లు ఫిబ్రవరి 7 (నెదర్లాండ్స్‌), 10 (యూఎస్‌ఏ), 18 తేదీల్లో (నమీబియా) కొలొంబో వేదికగా జరుగనున్నాయి. ఒకవేళ పాక్‌ గ్రూప్‌ దశ దాటి తదుపరి దశకు చేరితే ఆ మ్యాచ్‌లు కూడా కొలొంబోలోనే జరుగుతాయి.ఐసీసీ ఆగ్రహం పాక్‌ భారత్‌తో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ను మాత్రమే రద్దు చేసుకోవడంపై ఐసీసీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా చేయడం క్రీడా సూత్రాలకు విరుద్దమని పేర్కొంది. ఇప్పటికైతే పీసీబీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని తెలిపింది. పీసీబీ నుంచి స్పష్టత వచ్చాక తమ వైఖరి కూడా ప్రకటిస్తామని ఘాటుగా స్పందించింది.

ICC has: BCCI Breaks Silence On Pakistan Boycott Calls In T20 WC 20262
మ్యాచ్‌ రద్దు చేసుకున్న పాక్‌.. స్పందించిన బీసీసీఐ!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియాతో మ్యాచ్‌ను బహిష్కరిస్తూ పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చే అవకాశాలు ఉన్నా.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే నడుచుకునేందుకు పాక్‌ క్రికెట్‌ బోర్డు (PCB) సిద్ధమైంది.శ్రీలంకలో పాక్‌ మ్యాచ్‌లుకాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. తటస్థ వేదికైన శ్రీలంకలో పాకిస్తాన్‌ తమ మ్యాచ్‌లు ఆడేలా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) షెడ్యూల్‌ ఖరారు చేసింది.భద్రతా కారణాలా?ఇందులో భాగంగా భారత్‌- పాకిస్తాన్‌ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా తలపడాల్సి ఉంది. అయితే, తమకు అవసరం లేని విషయంలో తలదూర్చి.. బంగ్లాదేశ్‌కు మద్దతు పలుకుతూ పాక్‌తో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయం తీసుకుంది. ఇందుకు భద్రతా కారణాలు సాకుగా చూపడం గమనార్హం.కఠిన చర్యలకు సిద్ధం ఈ నేపథ్యంలో శ్రీలంకలో మిగతా మ్యాచ్‌లకు లేని ఈ సాకు.. కేవలం టీమిండియాతో మ్యాచ్‌కు మాత్రమే ఉందనడి చెప్పడం పాక్‌ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పాక్‌ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న ఐసీసీ.. కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.దేవజిత్‌ సైకియా ఏమన్నారంటేఈ పరిణామాలపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్‌ సైకియాను స్పందించాల్సిందిగా మీడియా కోరింది. ఇందుకు బదులుగా.. ‘‘ఈ విషయం గురించి మాకు అధికారిక సమాచారం వచ్చేంతవరకు నేను ఎలాంటి వ్యాఖ్య చేయలేను. మ్యాచ్‌ రద్దు విషయమై స్పష్టమైన సమాచారం లేనందున ఈ అంశం గురించి మాట్లాడే హక్కు నాకైతే ప్రస్తుతానికి లేదు’’ అని న్యూస్‌18తో పేర్కొన్నారు.ఐసీసీ చెప్పినట్లే..అయితే, బీసీసీఐ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్‌ ఎంపీ రాజీవ్‌ శుక్లా స్పందిస్తూ.. ‘‘ఐసీసీ ఓ కీలక ప్రకటన జారీ చేసింది. క్రీడా స్పూర్తి గురించి ఐసీసీ మాట్లాడింది. ఐసీసీతో మేము ఏకీభవిస్తున్నాం. ఐసీసీతో చర్చించిన తర్వాతే మేము ఈ విషయంపై కామెంట్‌ చేయగలము’’ అని పేర్కొన్నారు. కాగా పాక్‌ తమ నిర్ణయం గురించి తమకు అధికారికంగా తెలియజేయలేదని పేర్కొన్న ఐసీసీ.. సెలక్టివ్‌గా మ్యాచ్‌లు ఎంచుకోవడం సరికాదని కౌంటర్‌ ఇచ్చింది. బంగ్లాదేశ్‌ కూడా ఇలాగే తెగేదాకా లాగితే... ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించిన ఐసీసీ.. ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చిన విషయం తెలిసిందే. చదవండి: భారత్‌తో మ్యాచ్‌ రద్దు.. పాకిస్తాన్‌కు తప్పదు భారీ మూల్యం #WATCH | Delhi: On Pakistan to boycott its match against India in the ICC Men’s T20 World Cup 2026, BCCI vice president and Congress MP Rajeev Shukla says, "ICC has issued a big statement, they have spoken about sportsmanship. We completely agree with the ICC. BCCI won't make any… pic.twitter.com/qRgwHzgDls— ANI (@ANI) February 2, 2026

Sports Budget 2026: Key Points All Deatils3
‘క్రీడా’ బడ్జెట్‌ 2026: కీలక అంశాలు

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఈసారి క్రీడలకు కాస్త ప్రాధాన్యం పెరిగింది. గతంతో పోలిస్తే సుమారు రూ.1133 కోట్లకు పైగా నిధుల్ని పెంచారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో క్రీడలు, యువజన సర్వీసులకు రూ. 4479.88 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 3346.54 కోట్లు నిధులివ్వగా తాజా బడ్జెట్‌లో రూ.1133.34 కోట్ల మేర హెచ్చింపు చేశారు.దేశ వ్యాప్తంగా క్రీడా కేంద్రాల నిర్వహణ, శిబిరాలు ఏర్పాటు చేసే భారత స్పోర్ట్స్‌ అథారిటీకి రూ. 917.38 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.880 కోట్లు ఇవ్వగా కాస్త పెంచారు. అయితే డోప్‌ పరీక్షల ల్యాబోరేటరీతో పాటు జాతీయ డోపింగ్‌ నిరోధక ఏజెన్సీ (NADA) నిధుల్లో కోత పెట్టారు. డోపింగ్‌ టెస్టులకు క్రితం ఏడాది రూ.28.55 కోట్లు ఇస్తే... ప్రస్తుతం రూ.23 కోట్లకు కుదించారు. జాతీయ స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి గతంలో రూ. 78.64 కోట్లు విదిల్చిన ఆర్థిక మంత్రి తాజాగా రూ.46.98 కోట్లే కేటాయించారు.ఇక 1998లో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడాభివృద్ధి నిధిని రూ. 3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచారు. అలాగే క్రీడాకారుల ప్రోత్సాహకాలను రూ. 28 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు పెంచారు. జాతీయ క్రీడా సమాఖ్యలకు ఇచ్చే నిధుల్ని రూ. 400 కోట్ల నుంచి 425 కోట్లకు హెచ్చింపు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఖేలో ఇండియా’కు రూ.924.35 కోట్లు కేటాయించారు. గతేడాది రూ. 1000 కోట్లు నిధులివ్వగా... కేవలం రూ.700 కోట్లే వెచ్చించడంతో ఇప్పుడు దానిని తగ్గించారు.

Abhishek se darr ke bhaag gaye: Netizens react as Pakistan boycotts IND T20 WC 2026 match4
భారత్‌తో మ్యాచ్‌ రద్దు.. పాక్‌పై టీమిండియా ఫ్యాన్స్‌ సెటైర్లు

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు భారత్‌తో టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ రద్దు చేసుకోవడంపై క్రికెట్‌ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. పాక్‌ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి సోషల్‌మీడియా వేదికగా పాక్‌ జట్టును ఏకి పారేస్తున్నారు. పాక్‌ భారత్‌ చేతిలో పరాభవాన్ని ముందే ఊహించి జారుకుందని కామెంట్లు చేస్తున్నారు. అభిషేక్‌ శర్మ భయంతో పారిపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పాక్‌ తమతో మ్యాచ్‌ ఆడపోవడం​ వల్ల కలిగే నష్టం ఏమీ ఉండదని అంటున్నారు. భారత్‌తోనే కాదు, టోర్నీ మొత్తానే బాయ్‌కాట్‌ చేసుంటే పీడా పోయేదని చర్చించుకుంటున్నారు. భారత్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకున్నందుకు ఐసీసీ కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, గతేడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాక్‌ మధ్య క్రికెట్‌ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ టోర్నీలో టీమిండియా తప్పక ఆడింది కానీ, చాలా మంది భారతీయులకు పాక్‌తో తలపడటం అస్సలు ఇష్టం లేదు. మెజారిటీ శాతం భారతీయుల అభిమతానికి అనుగుణంగానే టీమిండియా ప్లేయర్లు పాక్‌ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు. అలాగే ఆసియా కప్‌ గెలిచిన తర్వాత పీసీబీ అధ్యక్షుడు, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌కు చీఫ్‌ కూడా అయిన మొహిసిన్‌ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించలేదు. భారత ఆటగాళ్లు ట్రోఫీని అందుకోవడం నిరాకరించినందుక నఖ్వీ ట్రోఫీ ఎత్తుకెళ్లిపోయిన విషయం విధితమే. ఇప్పటికీ అతను భారత్‌కు ఆ ట్రోఫీని అప్పగించలేదు. ఈ వివాదం కొనసాగుతుండగానే భారత్‌-బంగ్లాదేశ్‌ అంతర్గత విషయంలో పాక్‌ తలదూర్చింది. బంగ్లాదేశ్‌కు వత్తాసుగా ప్రపంచకప్‌ను బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగింది. చివరికి భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఐసీసీ చాలా సీరియస్‌గా పరిగణించే అవకాశం ఉంది. క్రికెట్‌కు సంబంధించి పాక్‌ను అష్టదిగ్బంధనం చేయవచ్చు. ఆర్దిక, పాలనాపరమైన చాలా శిక్షలను పీసీబీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాక్‌ జట్టును ప్రపంచకప్‌ నుంచి బహిష్కరించినా, ఆశ్చర్యపోనక్కర్లేదు.ఒకవేళ పాక్‌ ప్రపంచకప్‌లో కొనసాగితే భారత్‌తో మ్యాచ్‌ రద్దు చేసుకున్నందుకు రెండు పాయింట్లు కోల్పోతుంది. భారత్‌కు మ్యాచ్‌ ఆడకుండానే రెండు పాయింట్లు లభిస్తాయి. ఒకవేళ పాక్‌ అదృష్టం బాగుండి, తదుపరి దశకు చేరినా, అంతకంటే ముందుకు వెళ్లే సీన్‌ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌ భారత్‌తో మ్యాచ్‌ ఆడినా, ఆడకపోయినా పెద్ద తేడా ఉండదని భారతీయ క్రికెట్‌ అభిమానులు అంటున్నారు.

T20 World Cup Anthem trailer by Unnikrishnan, Sikkil Gurucharan, Ramprasad5
ఆకట్టుకుంటున్న ఉన్ని కృష్ణన్ టీ20 ప్రపంచకప్‌ గీతం

ప్రముఖ గాయకులు ఉన్నీ కృష్ణన్, పాలఘాట్ ఆర్. రాంప్రసాద్, సిక్కిల్ గురుచరణ్ ఆలపించిన టీ20 ప్రపంచకప్‌ 2026 గీతం క్రికెట్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 2023 వన్డే ప్రపంచకప్‌ కోసం వీరు రూపొందించిన Cricket Endraal Bharatham అనే గీతానికి ఇది ఎక్స్‌టెన్షన్‌గా గత నెలలో (జనవరి) విడుదలైంది. View this post on Instagram A post shared by Palghat Ramprasad (@palghat_ramprasad)T20 వెర్షన్ 2.0 పేరిట విడుదలైన తాజా గీతం సోషల్‌మీడియాలో విశేషమైన ప్రజాదరణ పొందుతుంది. 2023లో విడుదలైన వెర్షన్‌ కూడా క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగించింది. కర్ణాటక శైలిలోని సాగే తాజా గీతం దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది.గీతం ప్రత్యేకతలు - 2.0 వెర్షన్‌లో తాజా సాహిత్యం మరియు సరికొత్త స్వరరచనను ఉపయోగించారు. - T20 క్రికెట్‌కి తగిన ఉత్సాహభరితమైన, వేగవంతమైన సంగీత నోట్స్‌తో పాటను తీర్చిదిద్దారు. - కర్ణాటక రాగాల సౌందర్యాన్ని ఆధునిక తాళాలతో మేళవించి, క్రికెట్ ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా ఈ గీతాన్ని రూపొందించారు. జాతీయ స్పూర్తి ఈ గీతం కేవలం సంగీత కృషి మాత్రమే కాదు, దేశభక్తి, క్రికెట్ పట్ల ఉన్న ప్రేమను ప్రతిబింబించే సాంస్కృతిక ఉత్సవం. టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు విజయాన్ని ఆకాంక్షిస్తూ, అభిమానుల్లో ఉత్సాహాన్ని రగిలించేందుకు ఈ గీతం రూపొందించబడింది. కాగా, టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం అధికారిక గీతం కూడా రూపొందిచబడింది. ఈ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ స్వరపరిచాడు. Feel the thrill పేరిట సాగే ఈ గీతం కూడా క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. టీ20 ప్రపంచకప్‌ ఓపెనింగ్‌ సెర్మనీలో ఈ గీతాన్ని ప్రత్యేకంగా ఆలపించనున్నారు. మెగా టోర్నీ భారత్‌, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

ICC to lose This MASSIVE amount as Pakistan boycotts India match at T20 World Cup6
భారత్‌తో మ్యాచ్‌ రద్దు.. పాకిస్తాన్‌కు తప్పదు భారీ మూల్యం

భారత్‌తో టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ రద్దు చేసుకొని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చాలా పెద్ద సాహసం చేసింది. ఈ చర్య వల్ల ఐసీసీకి కలిగే నష్టం మాట అటుంచితే, పీసీబీ మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ఐసీసీ తీవ్రంగానే స్పందించింది. పీసీబీ ఇంకా అధికారికంగా తమ వైఖరిని తెలియజేయలేదని ప్రకటిస్తూనే.. ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. క్రీడా సమగ్రతను దెబ్బతీసే ఇలాంటి చర్యలను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో పీసీబీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చింది. ఐసీసీ తీసుకోబోయే చర్యలపై ఒకటి రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.కాగా, పాకిస్తాన్‌ ప్రభుత్వం భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను (గ్రూప్‌ స్టేజీ) రద్దు చేసుకుంటున్నట్లు నిన్న సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. తొలుత మెగా టోర్నీ మొత్తం నుంచి వైదొలుగుతామని బెదిరించిన పీసీబీ, చివరికి భారత్‌తో మ్యాచ్‌ మాత్రమే బాయ్‌కాట్‌ చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.వివాదం ఎక్కడ మొదలైదంటే..?ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మ‌న్‌ను త‌ప్పించ‌డంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం త‌మ జ‌ట్టును భార‌త్‌కు పంపించేందుకు నిరాక‌రించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ త‌మ మ్యాచ్‌ల‌ను శ్రీలంకకు త‌ర‌లించాల‌ని ఐసీసీని బీసీబీ కోరింది. కానీ బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది.భ‌ద్రత ప‌రంగా పూర్తి స్ధాయి హామీ ఇచ్చినా బీసీబీ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. దీంతో ఐసీసీ వ‌ర‌ల్డ్‌క‌ప్ నుంచి బంగ్లాను త‌ప్పించి వారి స్దానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి తప్పుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది. చివరికి భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే రద్దు చేసుకుంటున్న ప్రకటించింది.భారత్–పాకిస్తాన్ పోటీ ప్రాముఖ్యత - ఈ రెండు జట్ల మధ్య పోటీని “మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్” అని పిలుస్తారు. - ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఈ మ్యాచ్‌ను ఉత్కంఠగా వీక్షిస్తారు.ఆర్థిక నష్టం అంచనా - ఈ మ్యాచ్‌ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగే వ్యాపారం వందల కోట్లలో ఉంటుంది.- పాకిస్తాన్ నిర్ణయం ఐసీసీకి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. - క్రిక్‌బజ్‌ నివేదిక ప్రకారం.. ప్రతి భారత్ మ్యాచ్ విలువ సుమారు 10–11 మిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు ₹100 కోట్లు) ఉంటుంది. - పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు వచ్చే సరికి ఈ ఆదాయం మరింత పెరుగుతుంది. - ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ద్వారా రూ. 200 కోట్లకు మించి ఆదాయం వస్తుందని నిర్వహకులు అంచనా వేశారు.- మ్యాచ్ జరగకపోతే, ఐసీసీతో పాటు ప్రసార సంస్థలు భారీ నష్టాన్ని ఎదుర్కొంటాయి. దీని అంచనా రూ. 500 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.పాకిస్తాన్‌కు కలిగే నష్టాలు- భారత్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకోవడం వల్ల పాక్‌ క్రికెట్‌ బోర్డు ఆర్దికపరమైన నష్టాలతో పాటు పరిపాలనాపరమైన మరెన్నో కఠనమైన శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. - టోర్నీలో పాల్గొన్నందుకు ఇచ్చే 250,000 డాల‌ర్లు(రూ. 2 కోట్లు పైమాటే) పార్టిసిపేషన్ ఫీజును పీసీబీ కోల్పోవాల్సి ఉంటుంది.- పాక్ సెమీఫైనల్ చేరితే 790,000 డాలర్లు(సుమారు రూ. 7 కోట్లు), రన్నరప్ అయితే 1.6 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.15 కోట్లు), ఒకవేళ విజేతగా నిలిస్తే 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 కోట్లు) కోల్పోతారు.- ఐసీసీ ప్రతి ఏటా తమ సభ్యదేశాలకు ఇచ్చే రెవెన్యూ వాటాను కూడా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డు దివాళా తీయాల్సిందే. - ఫైన‌ల్‌గా పాకిస్తాన్ త‌మ ప్ర‌ద‌ర్శ‌న బ‌ట్టి 250,000 డాలర్లు(సుమారు రూ.2.29 కోట్లు) నుంచి 4.42 మిలియన్ల డాల‌ర్లు(సుమారు రూ. 38 కోట్లు) ప్రైజ్ మనీని కోల్పోయే ప్రమాదం ఉంది.- PSLకు ఇతర బోర్డులు NOCలు ఇవ్వకుండా ఆపుతుంది.- ఆసియా కప్ నుంచి పాకిస్తాన్‌ను తొలగించే అవకాశం ఉంది.

Banton, Brook help England seal series vs Sri Lanka7
బ్రూక్‌ విధ్వంసం.. టీ20 సిరీస్‌ కూడా ఇంగ్లండ్‌దే

టీ20 ప్రపంచకప్‌ 2026కు ముందు ఇంగ్లండ్‌ అదిరిపోయే ప్రదర్శనలతో దూసుకుపోతుంది. శ్రీలంక పర్యటనలో భాగంగా తొలుత వన్డే సిరీస్‌ను (2-1) కైవసం చేసుకున్న ఈ జట్టు.. తాజాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది. పల్లెకెలె వేదికగా జరిగిన రెండో టీ20లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఛేదన సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 168 పరుగులుగా సెట్‌ చేశారు. ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 16.4 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. టామ్‌ బాంటన్‌ (54 నాటౌట్‌) అజేయ అర్ద శతకంతో.. హ్యారీ బ్రూక్‌ (12 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడి ఇంగ్లండ్‌ను గెలిపించారు. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 ఫిబ్రవరి 3న జరుగనుంది.రాణించిన రత్నాయకేలంక ఇన్నింగ్స్‌లో పవన్‌ రత్నాయకే (22 బంతుల్లో 40) ఓ మోస్తరు స్కోర్‌తో రాణించాడు. మిగతా బ్యాటర్లలో నిస్సంక (34), కమిల్‌ మిషారా (36), , కుసాల్‌ మెండిస్‌ (32), అసలంక (28 నాటౌట్‌) కూడా పర్వాలేదనిపించారు. ఆఖర్లో కెప్టెన్‌ దసున్‌ షనక (6 బంతుల్లో 1) బంతులు వృధా చేసి నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 2, విల్‌ జాక్స్‌, లియామ్‌ డాసన్‌, ఆదిల్‌ రషీద్‌ తలో వికెట్‌ తీశారు.విధ్వంసం సృష్టించిన బ్రూక్‌డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని కుదించాక ఇంగ్లండ్‌ బ్యాటర్లు టామ్‌ బాంటన్‌ (33 బంతుల్లో 54 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ బ్రూక్‌ (12 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సామ్‌ కర్రన్‌ (14 బంతుల్లో 20 నాటౌట్‌; సిక్స్‌, ఫోర్‌) చెలరేగిపోయారు. జోస్‌ బట్లర్‌ (39) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడాడు. లంక బౌలర్లలో పతిరణ 2, షనక​, వెల్లాలగే తలో వికెట్‌ తీశారు.

Indian grandmasters disappoint in Tata Steel Masters chess tournament8
అర్జున్‌కు 13వ స్థానం

విక్‌ ఆన్‌ జీ (నెదర్లాండ్స్‌): టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు నిరాశపరిచారు. ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్‌ నుంచి నలుగురు గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, అరవింద్‌ చిదంబరం పోటీపడ్డారు. 14 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ 4.5 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు.చివరిదైన 13వ రౌండ్‌ గేమ్‌లో అర్జున్‌ 55 ఎత్తుల్లో నొదిర్‌బెక్‌ అబ్దుసత్తరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయాడు. క్లాసికల్‌ ఫార్మాట్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ గుకేశ్‌ 6.5 పాయింట్లతో 9వ స్థానంలో, ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో 11వ స్థానంలో, అరవింద్‌ 4.5 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచారు. 9 పాయింట్లతో నొదిర్‌బెక్‌ విజేతగా అవతరించాడు.

Indian rising star shuttler Devika wins the Thailand Masters title9
దేవిక ధమాకా

బ్యాంకాక్‌: అంచనాలకు మించి రాణించిన భారత రైజింగ్‌ స్టార్‌ షట్లర్‌ దేవిక సిహాగ్‌ తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని అందుకుంది. ఆదివారం ముగిసిన థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో దేవిక చాంపియన్‌గా అవతరించింది. హరియాణాకు చెందిన 20 ఏళ్ల దేవిక కెరీర్‌లో ఇదే తొలి సూపర్‌–300 టైటిల్‌ కావడం విశేషం. ప్రపంచ 68వ ర్యాంకర్, రెండుసార్లు జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌ గో జిన్‌ వె (మలేసియా)తో జరిగిన ఫైనల్లో దేవిక తొలి గేమ్‌ను 21–8తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో 6–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో గాయం కారణంగా గో జిన్‌ వె మ్యాచ్‌ నుంచి వైదొలిగింది. దాంతో దేవికకు టైటిల్‌ ఖరారైంది. విజేత దేవికకు 18,750 డాలర్ల (రూ. 17 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ తర్వాత థాయ్‌లాండ్‌ సూపర్‌–300 టైటిల్‌ నెగ్గిన మూడో భారతీయ క్రీడాకారిణిగా దేవిక గుర్తింపు పొందింది. టైటిల్‌ గెలిచే క్రమంలో దేవిక తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ టైటిల్‌తో ప్రపంచ 63వ ర్యాంకర్‌ దేవిక మంగళవారం విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌–40లో చోటు సంపాదిస్తుంది. ‘చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఇదే తొలి సూపర్‌–300 లెవెల్‌ టైటిల్‌. ఈ సీజన్‌లో మరిన్ని టోర్నీలు ఆడతాను. థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో అన్ని మ్యాచ్‌లు బాగా ఆడాను. కొత్త పాఠాలు నేర్చుకున్నాను. ఫైనల్లో గెలుపోటములు గురించి ఆలోచించలేదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను’ అని దేవిక వ్యాఖ్యానించింది. బెంగళూరులోని పదుకొనే–ద్రవిడ్‌ సెంటర్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ ఎక్స్‌లెక్స్‌లో ఉమేంద్ర రాణా వద్ద దేవిక శిక్షణ తీసుకుంటోంది.

Vishnuvardhan wins his 48th doubles title10
విష్ణువర్ధన్‌ ఖాతాలో 48వ డబుల్స్‌ టైటిల్‌

సాక్షి, హైదరాబాద్‌: భారత డేవిస్‌కప్‌ జట్టు మాజీ సభ్యుడు, లండన్‌ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ హైదరాబాద్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ తన కెరీర్‌లో 48వ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఎం15 టోర్నీలో తెలంగాణకే చెందిన గంటా సాయికార్తీక్‌ రెడ్డితో కలిసి విష్ణువర్ధన్‌ డబుల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 25 ఏళ్ల సాయికార్తీక్‌ రెడ్డికిది 11వ డబుల్స్‌ టైటిల్‌ కావడం విశేషం. డబుల్స్‌ ఫైనల్లో విష్ణువర్ధన్‌–సాయికార్తీక్‌ ద్వయం 6–1, 6–4తో ఇషాక్‌ ఇక్బాల్‌–దేవ్‌ జావియా (భారత్‌) జంటపై గెలిచింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విష్ణు–సాయికార్తీక్‌ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. తొలి సర్వీస్‌లో 23 పాయింట్లు, రెండో సర్వీస్‌లో 9 పాయింట్లు స్కోరు చేశారు. తమ సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోకుండా, ప్రత్యర్థుల సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశారు. తొలి రౌండ్‌లో విష్ణు–సాయికార్తీక్‌ 6–3, 6–4తో నైషిక్‌ రెడ్డి గణగామ–మాచెర్ల తీర్థ శశాంక్‌ (భారత్‌)లపై, క్వార్టర్‌ ఫైనల్లో 6–3, 7–5తో అర్జున్‌–కహీర్‌ (భారత్‌)లపై, సెమీఫైనల్లో 5–7, 7–6 (7/4), 10–8తో ఆదిత్య–అథర్వ (భారత్‌)లపై విజయం సాధించారు. 38 ఏళ్ల విష్ణు వేర్వేరు భాగస్వాములతో కలిసి 2008లో 1... 2009లో 6... 2010లో 3 ... 2011లో 5... 2012లో 1... 2013లో 1... 2014లో 3... 2015లో 4... 2016లో 5... 2017లో 10... 2018లో 2... 2021లో 1... 2023లో 3... 2024లో 2... 2026లో 1 డబుల్స్‌ టైటిల్‌ గెలిచాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement