Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Rubel Hossain retires from international cricket1
రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ బౌలర్‌

బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ రూబెల్‌ హెస్సేన్ ఏప్రిల్‌ 15, 2026న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించాడు. 36 ఏళ్ల రూబెల్‌ తన 15 ఏళ్ల కెరీర్‌లో 159 మ్యాచ్‌లు ఆడి 193 వికెట్లు తీశాడు. 27 టెస్ట్‌ల్లో 36 వికెట్లు, 104 వన్డేల్లో 129 వికెట్లు, 28 టీ20ల్లో 28 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌ తరఫున 2021 ఏప్రిల్‌లో తన చివరి మ్యాచ్‌ (టీ20) ఆడిన రూబెల్‌.. ఐదేళ్ల పాటు అవకాశాల కోసం ఎదురుచూసి చివరికి అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇకపై దేశీయ క్రికెట్‌లో కొనసాగుతూ, యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా ఉంటానని స్పష్టం చేశాడు. రిటైర్మెంట్‌ సందేశంలో అభిమానులు, కుటుంబం, మీడియాకు కృతజ్ఞతలు తెలిపాడు.పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు గడించిన రూబెల్‌ రివర్స్‌ స్వింగింగ్‌ యార్కర్లు వేయడంలో దిట్ట. 2015 వన్డే వరల్డ్‌కప్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌ను మట్టికరిపించడంలో రూబెల్‌ కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో అతను వేసిన 4-53 స్పెల్‌ బంగ్లాదేశ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.

IPL 2026: Rohit Sharma likely to miss Punjab Kings match2
ముంబై ఇండియన్స్‌కు బిగ్‌ షాక్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 16) పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. వాంఖడే వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడని తెలుస్తుంది.రోహిత్‌ ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన (Hamstring Injury) విషయం తెలిసిందే. స్కాన్‌లలో గాయం ఉందా లేదా అన్న విషయం స్పష్టంగా తెలియడం లేదు. దీంతో ఎంఐ మేనేజ్‌మెంట్‌ ముందు జాగ్రత్త చర్యగా హిట్‌మ్యాన్‌కు కొద్ది రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గుజరాత్‌తో మ్యాచ్‌ (ఏప్రిల్‌ 20) సమయానికి రోహిత్‌ పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. కాగా, ఆర్సీబీ మ్యాచ్‌లో రోహిత్‌ బ్యాటింగ్‌ చేస్తూ మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే.పంజాబ్‌తో మ్యాచ్‌కు రోహిత్‌ దూరమైతే, ఇప్పటికే కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్‌ మరింత ఇబ్బంది పడనుంది. ఈ సీజన్‌లో ముంబై తొలి మ్యాచ్‌ విజయం తర్వాత హ్యాట్రిక్‌ పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. రోహిత్‌ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో అతను ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 137 పరుగులు చేశాడు. పంజాబ్‌ మ్యాచ్‌కు రోహిత్‌ మిస్‌ అయితే అతని స్థానంలో నమన్‌ ధీర్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కవచ్చు.మరోపక్క నేటి పంజాబ్‌ మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ అందుబాటులో ఉంటాడు. జాక్స్‌ బుధవారమే జట్టుతో చేరాడు. అతను తుది జట్టులో ఉంటాడా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు.పంజాబ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టు ఏదైనా ఉందా అంటే అది పంజాబే. ఈ సీజన్‌లో పంజాబ్‌ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సొంతం చేసుకొని పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. కేకేఆర్‌తో జరగాల్సిన ఓ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది.పంజాబ్‌తో మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్‌ తుది జట్టు (అంచనా)..ర్యాన్‌ రికెల్టన్‌, నమన్‌ ధీర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌, మిచెల్‌ సాంట్నర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, మయాంక్‌ మార్కండే, జస్ప్రీత్‌ బుమ్రా

RCB defeated Lucknow Supergiants by 5 wickets3
ఆర్‌సీబీ ఆడుతూ పాడుతూ...

బెంగళూరు: సొంతగడ్డపై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ‘హ్యాట్రిక్‌’ విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన ఏకపక్ష పోరులో గెలిచి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ముకుల్‌ చౌదరి (28 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్‌ బదోని (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో రసిఖ్‌ సలామ్‌ (4/24) లక్నోను పడగొట్టగా... భువనేశ్వర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం బెంగళూరు 15.1 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేసి విజయాన్నందుకుంది. విరాట్‌ కోహ్లి (34 బంతుల్లో 49; 6 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌స్కోరర్‌గా నిలవగా...రజత్‌ పాటీదార్‌ (13 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు), జితేశ్‌ శర్మ (9 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో మరో 29 బంతులు ఉండగానే ఆర్‌సీబీ గెలుపు ఖాయమైంది. మూడు కీలక వికెట్లు తీసిన రసిఖ్‌ సలామ్‌కు కాకుండా ఒక వికెట్‌ పడగొట్టిన హాజల్‌వుడ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు ఇవ్వడం గమనార్హం. సమష్టి వైఫల్యం... చిన్నస్వామి స్టేడియంలో లక్నో ఇన్నింగ్స్‌ పేలవంగా ప్రారంభమైంది. మొత్తం పవర్‌ప్లేలో ఆ జట్టు 1 ఫోర్, 2 సిక్స్‌లతో 35 పరుగులే చేయగలిగింది. మార్క్‌రమ్‌ (12) విఫలం కాగా, మార్ష్ మాత్రం ఫర్వాలేదనిపించాడు. పూరన్‌ (1) తన వైఫల్యాన్ని కొనసాగించగా, కృనాల్‌ తన వరుస ఓవర్లలో మార్ష్ , సమద్‌ (0)లను వెనక్కి పంపించాడు. ఇలాంటి స్థితిలో బదోని కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు నుంచి ముకుల్‌ కూడా అతనికి అండగా నిలిచాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా జార్జ్‌ లిండే (7)ను బరిలోకి దించినా లాభం లేకపోయింది. ఆర్‌సీబీ పదునైన బౌలింగ్‌ ముందు మిగతా బ్యాటర్లూ తేలిపోయారు. ఆఖరి 4 ఓవర్లలో లక్నో జట్టు 5 వికెట్లు చేజార్చుకొని 29 పరుగులే చేసింది. కోహ్లి తొలిసారి... ఛేదనలో సాల్ట్‌ (7) తొందరగానే అవుటైనా... కోహ్లి జోరుగా మొదలు పెట్టాడు. గత మ్యాచ్‌లో మడమ గాయంతో ఫీల్డింగ్‌ చేయని కోహ్లి ఈ మ్యాచ్‌లో కూడా నేరుగా బ్యాటింగ్‌కే వచ్చాడు. ఐపీఎల్‌లో అతను మొదటిసారి ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా బరిలోకి దిగాడు. ప్రిన్స్‌ వేసిన నాలుగో ఓవర్లో అతను 4 ఫోర్లు బాదాడు. కోహ్లి తాను ఆడిన తొలి 14 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 34 పరుగులు సాధించడం విశేషం! మరో ఎండ్‌లో పడిక్కల్‌ (10) విఫలమైనా... పాటీదార్, జితేశ్‌ దూకుడుతో ఆర్‌సీబీ వేగంగా లక్ష్యం దిశగా దూసుకుపోయింది. షమీ ఓవర్లో పాటీదార్‌ రెండు వరుస సిక్స్‌లు కొట్టగా... రాఠీ ఓవర్లో జితేశ్‌ వరుసగా 6, 4, 6, 4 బాదాడు. వీరిద్దరు ఒకే ఓవర్లో అవుటైనా...మిగిలిన 25 పరుగులను బెంగళూరు తర్వాతి 15 బంతుల్లో సాధించి మ్యాచ్‌ ముగించింది. స్కోరు వివరాలు లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మిచెల్‌ మార్ష్ (బి) కృనాల్‌ పాండ్యా 40; మార్క్‌రమ్‌ (సి) పడిక్కల్‌ (బి) సలామ్‌ 12; పంత్‌ (సి) సాల్ట్‌ (బి) భువనేశ్వర్‌ 1; నికోలస్‌ పూరన్‌ (బి) హాజల్‌వుడ్‌ 1; ఆయుశ్‌ బదోని (సి) జితేశ్‌ (బి) సలామ్‌ 38; సమద్‌ (సి) పాటీదార్‌ (బి) కృనాల్‌ పాండ్యా 0; ముకుల్‌ (బి) సలామ్‌ 39; లిండే (సి) డేవిడ్‌ (బి) భువనేశ్వర్‌ 7; షమీ (బి) భువనేశ్వర్‌ 0; అవేశ్‌ (బి) సలామ్‌ 1; దిగ్వేశ్‌ రాఠీ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్‌) 146. వికెట్ల పతనం: 1–32, 2–35, 3–71, 4–83, 5–118, 6–124, 7–137, 8–137, 9–145, 10–146. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–27–3, హాజల్‌వుడ్‌ 4–0–20–1, రసిఖ్‌ సలామ్‌ 4–0–24–4, కృనాల్‌ పాండ్యా 4–0–38–2, సుయాశ్‌ శర్మ 4–0–34–0. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (బి) ప్రిన్స్‌ 7; కోహ్లి (సి) పూరన్‌ (బి) అవేశ్‌ 49; పడిక్కల్‌ (సి) (సబ్‌) హిమ్మత్‌ (బి) అవేశ్‌ 10; రజత్‌ పాటీదార్‌ (సి) రాఠీ (బి) ప్రిన్స్‌ 27; జితేశ్‌ (సి) ముకుల్‌ (బి) ప్రిన్స్‌ 23; డేవిడ్‌ (నాటౌట్‌) 14; షెఫర్డ్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.1 ఓవర్లలో 5 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–9, 2–66, 3–86, 4–121, 5–122. బౌలింగ్‌: షమీ 3–0–30–0, ప్రిన్స్‌ యాదవ్‌ 3–0–32–3, దిగ్వేశ్‌ రాఠీ 4–0–51–0, అవేశ్‌ ఖాన్‌ 4–0–23–2, లిండే 1.1–0–9–0.పంత్‌కు గాయం...హాజల్‌వుడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లో బంతి బలంగా తగలడంతో లక్నో కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (1) ఎడమ మోచేతికి గాయమైంది. మూడు బంతులు ఆడిన అనంతరం అతను రిటైర్డ్‌హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత 16వ ఓవర్లో తిరిగి బ్యాటింగ్‌కు వచ్చినా మరో మూడు బంతులే ఆడి అతను అవుటయ్యాడు. పంత్‌ గాయం తీవ్రత ఇంకా తెలియాల్సి ఉంది. అతను కీపింగ్‌ కూడా చేయకపోవడంతో ముకుల్‌ చౌదరి ఆ బాధ్యత తీసుకున్నాడు. ఐపీఎల్‌లో నేడుముంబై X పంజాబ్‌ వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Former Sri Lanka Captain Sangakkara Comments on incident in pakistan4
‘బుల్లెట్‌ శకలాలు ఇంకా నా శరీరంలో ఉన్నాయి’

కొలంబో: దాదాపు పదిహేడేళ్ల క్రితం... శ్రీలంక జట్టు పాకిస్తాన్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడుతోంది. లాహోర్‌లో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట కోసం లంక జట్టు గడాఫీ స్టేడియం సమీపానికి చేరుకుంది. అయితే ఆ సమయంలో అనూహ్యంగా తీవ్రవాదులు శ్రీలంక ఆటగాళ్లతో కూడిన టీమ్‌ బస్సుపై కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న పోలీసులు ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోగా, మరో 20 మంది గాయపడ్డారు.నాటి సంఘటనను సంగక్కర ఇటీవల గుర్తు చేసుకున్నాడు. తన జీవితంలో అది ఎలాంటి మార్పు తెచ్చిందో వెల్లడించాడు. ‘మేం స్టేడియానికి బయల్దేరే ముందు మా టీమ్‌ పేస్‌ బౌలర్‌ ఒకరు ఇలాంటి పిచ్‌పై బౌలింగ్‌ చేస్తే నా వెన్ను విరిగిపోవచ్చు. దానికన్నా ఒక బాంబు దాడి జరిగి ఇంటికి వెళ్లిపోతే బాగుంటుంది అని సరదాగా అన్నాడు. అయితే నిజంగానే అది జరిగింది. మరు నిమిషంలోనే మాపై ఉగ్రవాదులు దాడి చేశారు. మేం అందులో గాయపడ్డాం. నాడు దాడిలో మాపై దూసుకొచ్చిన బుల్లెట్‌ శకలాలు నా శరీరంలో ఇప్పటికీ ఉన్నాయి. ఆ దాడి నా ఆలోచనా ధోరణిని మార్చింది. ఎందుకంటే అదే సమయంలో మా దేశంలో అంతర్యుద్ధం కూడా జరుగుతూ చివరి దశలో ఉంది. కానీ మాపై రెండు నిమిషాల దాడి పెద్ద వార్తగా మారింది. కొన్నాళ్ల తర్వాత ఒక సైనికుడు ఎలా ఉన్నారంటూ మమ్మల్ని అడిగాడు. నేను బాగున్నానని చెబుతూ మీరు మాత్రం ఎన్నో ఏళ్లుగా ఇలాంటి పరిస్థితుల్లోనూ జీవిస్తున్నారు కదా అన్నాను. క్రికెట్‌ ఆడుతూ ఎంతో డబ్బు గడిస్తూ కూడా రెండు నిమిషాల దాడితో వార్తల్లో నిలిచామంటే గత 20–26 ఏళ్లుగా దేశం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో అర్థమైంది’ అని సంగక్కర గుర్తు చేసుకున్నాడు.

Iran Dominates Asian Wrestling Championships5
అటు రణరంగం... ఇటు జయకేతనం

ఒకవైపు స్వదేశంలో భీకర యుద్ధం... మరోవైపు క్రీడాంగణంలో ఇరాన్‌ మల్లయోధుల ఆధిపత్యం... అన్ని ప్రతికూలతలను అధిగమించి ఇరాన్‌ రెజ్లర్లు మరోసారి ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకాల పంట పండించారు. ఈ మెగా ఈవెంట్‌కు సన్నద్ధమవుతున్న దశలో ఇరాన్‌లో యుద్ధం జరుగుతోంది. అయినప్పటికీ దాని ప్రభావం పడకుండా ఇరాన్‌ రెజ్లర్లు కిర్గిస్తాన్‌ రాజధాని బిష్‌కెక్‌లో గతవారం ముగిసిన ఆసియా చాంపియన్‌షిప్‌లో ఏకంగా 18 పతకాలు సాధించారు. ఇందులో ఆరు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఆరు కాంస్యాలు ఉన్నాయి. దాంతో ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్‌ స్టయిల్‌లో ఇరాన్‌కే టీమ్‌ టైటిల్స్‌ లభించాయి. ప్రాణభయం వెంటాడుతున్నా అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్‌ మల్లయోధులు తమ జెండా రెపరెపలాడించిన తీరుపై ప్రత్యేక కథనం... సాక్షి క్రీడావిభాగం ‘ఈ పతకం నాకు ఎంతో ప్రత్యేకం. నా దేశం ఉన్న పరిస్థితుల్లో దీన్ని సాధించడం అత్యంత సంతృప్తికరం. గతంలో ఎన్నో పతకాలు గెలిచినా దీని స్థానం వాటన్నింటికంటే ఎక్కువ’ ఇది ఇరాన్‌ స్టార్‌ రెజ్లర్‌ అమీర్‌ హుస్సేన్‌ జారే చేసిన వ్యాఖ్య. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో రజతం సహా అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించిన అమీర్‌ హుస్సేన్‌... ఆసియా చాంపియన్‌షిప్‌లో సాధించిన పతకానికి అంత ప్రత్యేక స్థానం ఇవ్వడం వెనక... ఇరాన్‌ ప్రస్తుత పరిస్థితుల ప్రభావం ఉంది. పురుషుల 125 కేజీల ఫ్రీస్టయిల్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తర్వాత అమీర్‌ భావోద్వేగానికి గురవుతూ తన జాతీయ జెండాకు సెల్యూట్‌ చేస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఒకవైపు దేశంలో ఎక్కడ చూసిన బాంబు దాడులు, మిస్సైల్‌ మోతలతో దద్దరిల్లుతున్నా... ఇరాన్‌ రెజ్లర్లు మాత్రం ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో తమ ఆధిపత్యాన్ని వదులుకోలేదు. స్టేడియంపై బాంబుదాడితో ప్లేయర్లంతా పారిపోవాల్సిన పరిస్థితులు ఎదురైనా... ప్రాక్టీస్‌ వదలని ఇరాన్‌ రెజ్లర్లు ఈ పోటీల్లో తమ పోరాట పటిమతో పాటు గుండెధైర్యాన్ని సైతం ప్రపంచానికి చాటారు. సందిగ్ధత మధ్యే... ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనడంపై తీవ్ర సందిగ్ధత మధ్య అరకొర ప్రాక్టీస్‌తోనే ఇరాన్‌ రెజ్లర్లు ఈ టోర్నీ బరిలోకి దిగారు. ‘ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురు కాలేదు. శిక్షణపై దృష్టి కేంద్రీకరించడం పక్కన పెడితే... కనీసం సురక్షితంగా ఉంటే చాలు అనుకోవాల్సిన స్థితి. బాంబు దాడుల్లో ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళన మధ్య మా రెజ్లర్లు సాధనపై మనసు లగ్నం చేయలేకపోయారు. ఒకవైపు రెజ్లర్లు సురక్షితంగా ఉండటం... మరోవైపు వారి కుటుంబాల క్షేమంపై ఆందోళన వెరసి ప్రాక్టీస్‌ అంతంతమాత్రంగానే సాగింది’ అని పెజ్మాన్‌ చెప్పారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఇరాన్‌ రెజ్లర్లు సత్తా చాటడం వెనక టీమ్‌ స్పిరిట్‌ దాగి ఉంది. కష్టకాలంలో ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ... ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగారు. అందుకు తగ్గ ఫలితం సాధించారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య కంటే... తమ పోరాటం పెద్దది కాదని ఎప్పటికప్పుడు ప్రేరణ పొందుతూ దేశ ప్రజల కోసం ఏదో సాధించాలనే తపనను పతకాల సాధనలో చూపెట్టారు. రోడ్డు మార్గం ద్వారా... ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు రెజ్లర్లు కిర్గిస్తాన్‌లోని బిష్‌కెక్‌కు వెళ్లాల్సి ఉండగా... బాంబుదాడులతో అంతర్జాతీయ విమానాశ్రయం ధ్వంసం కావడంతో రోడ్డు మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి దాదాపు 22 గంటల పాటు బస్సులో ప్రయాణించిన అనంతరం రెజ్లర్లు పోటీలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ‘మా దేశంలో రెజ్లింగ్‌ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. లాంటి దాడులకు భయపడి మా అస్థిత్వాన్ని కోల్పోకూడదని భావించాం. అందుకే ఎంత కష్టమైనా ఈ టోర్నమెంట్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. దీని కోసం మా కోచ్‌లు మా కన్నా ఎక్కువ కష్టాలు పడ్డారు. దేశంపై మాకు ఎంతో ప్రేమ ఉంది. అదే మమ్మల్ని ఇక్కడి వరకు చేర్చింది. మ్యాట్‌పై అడుగు పెట్టిన ప్రతిసారి దేశ ప్రజలు నా వెంట ఉన్నారనే భావన కలుగుతుంది. అదే నాకు మరింత బలాన్ని ఇస్తుంది. ఈ జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం అని కర్తవ్య బోధ చేసినట్లు అనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. ఏం జరిగినా మా దేశాన్ని ప్రేమించడం మాత్రం వదలం. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఎంతో మంది చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. మతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా అణచివేతను ఖండించాల్సిందే’ అని స్వర్ణం గెలిచిన అనంతరం అమీర్‌ హుసేన్‌ వెల్లడించాడు. ‘మైదానంపై దాడి హేయమైన చర్య’ తమ అస్థిత్వంపై జరిగిన ఈ దాడిని ఇరాన్‌ రెజ్లర్లు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ‘మీరు ఎంత ధనవంతులైనా, ఎంత బలీయులైనా... మరొకరిపై మీ శక్తిని ప్రయోగించాల్సిన అవసరం లేదు. మేము ఇరాన్‌ వాసులం. మా దేశంలో చిన్న భూభాగాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధంగా లేము. మా దేశంపై దాడి చేసిన తర్వాత బదులివ్వకుండా ఎలా ఉంటాం. దేశ సరిహద్దులు క్షేమంగా ఉండాలని కోరుకోవడం ప్రతి పౌరుడి హక్కు. ఈ యుద్ధంలో ఇరాన్‌ తప్పక విజయం సాధిస్తుంది’ అని అమీర్‌ అన్నాడు. తమ మనసులోని మాటలను ప్రపంచం ముందు పెట్టడానికి ఈ టోర్నమెంట్‌ బాగా ఉపయోగపడిందని ఇరాన్‌ రెజ్లర్లు పేర్కొన్నారు. ‘ఐదు ప్రపంచకప్‌లు నిర్వహించిన ఆజాది మైదానంపై దాడి చేయడం హేయమైన చర్య. యుద్ధంలో ఇలాంటి స్థలాలపై దాడులు చేయడం సబబు కాదు. అయినా వారు మా గుండెధైర్యాన్ని దెబ్బకొట్టలేరు. ఆ స్టేడియం తిరిగి నిచ్చించుకుంటాం’ అని కోచ్‌ పెజ్మాన్‌ అన్నాడు.ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఇరాన్‌ పతక వీరులుఫ్రీస్టయిల్‌ విభాగం: మిలాద్‌ జహంగీర్‌ (స్వర్ణం; 57 కేజీలు), అహ్మద్‌ మసూద్‌ (కాంస్యం; 61 కేజీలు), సినామెహదీ ఖలీలి (కాంస్యం; 70 కేజీలు), అమీర్‌ మొహమ్మద్‌ (కాంస్యం; 74 కేజీలు), కామ్రాన్‌ ఘసెమ్‌పూర్‌ (స్వర్ణం; 86 కేజీలు), మొహమ్మద్‌ మోబిన్‌ (స్వర్ణం; 92 కేజీలు), అమీర్‌ హమీద్‌ అజార్‌పిరా (రజతం; 97 కేజీలు), అమీర్‌ హుస్సేన్‌ అబ్బాస్‌ జారే (స్వర్ణం; 125 కేజీలు). గ్రీకో రోమన్‌ విభాగం: మొహమ్మద్‌ హాజీ అలీ (కాంస్యం; 55 కేజీలు), అలీ అబ్దుల్లా అహ్మదీ వఫా (కాంస్యం; 60 కేజీలు), ఇర్ఫాన్‌ బెహ్నామ్‌ జర్కానీ (రజతం; 63 కేజీలు), అహ్మద్‌ రెజా సైఫుల్లా (కాంస్యం; 67 కేజీలు), మొహమ్మద్‌ జావద్‌ సాదత్‌ (రజతం; 72 కేజీలు), అలీ జబీహుల్లా (రజతం; 77 కేజీలు), మొహమ్మద్‌ ఆమీన్‌ (రజతం; 82 కేజీలు), గులాం రెజా (రజతం; 87 కేజీలు), మొహమ్మదాదీ అబ్దుల్లా సరావి (స్వర్ణం; 97 కేజీలు), ఆమీన్‌ మీర్జాజాదే (స్వర్ణం; 130 కేజీలు).స్టేడియంపై బాంబు దాడిఅమెరికా, ఇజ్రాయిల్‌ సంయుక్త దాడులతో ఇరాన్‌ అతలాకుతలం అయ్యింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా... లక్షలాది మంది తమ ఆనందమయ జీవనానికి దూరమయ్యారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఈ యుద్ధం ప్రభావం రెజ్లర్లపై కూడా పడింది. ఆసియా చాంపియన్‌షిప్‌నకు ముందు ఇరాన్‌ రెజ్లర్లు పాల్గొనాల్సిన జాతీయ శిబిరంపై బాంబు దాడి జరిగింది. దీంతో క్యాంప్‌ను టెహ్రాన్‌ నుంచి మరో నగరమైన మజందరాన్‌కు మార్చాల్సి వచ్చింది. ఇరాన్‌ రెజ్లింగ్‌కు కేంద్ర బిందువైన టెహ్రాన్‌లోని ఆజాది ఇండోర్‌ స్టేడియం బాంబుదాడిలో పూర్తిగా ధ్వంసమైంది. ఒకప్పుడు వేలాది మంది అభిమానులు కూర్చొని మ్యాచ్‌లు వీక్షించిన మైదానం సిమెంట్‌ దిబ్బలా మారిపోయింది. ‘ఇది చాలా కఠినమైన పరిస్థితి. మా ప్లేయర్లు ప్రాక్టీస్‌ చేసే టెహ్రాన్‌ స్టేడియం బాంబు దాడికి గురైంది. మాపై బలవంతంగా మోపిన ఈ యుద్ధం... శిక్షణ కేంద్రాన్ని పూర్తిగా దెబ్బతీసింది’ అని ఇరాన్‌ రెజ్లింగ్‌ కోచ్‌ పెజ్మాన్‌ దొరోస్తాకర్‌ అన్నారు.

Abhishek and Axar on NADA Testing List6
‘నాడా’ పరీక్షల జాబితాలో అభిషేక్, అక్షర్‌

జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) పరిధిలో నిర్వహించే పరీక్షల్లో అందుబాటులో ఉండేందుకు వీలుగా సిద్ధంగా ఉంచే ‘టెస్టింగ్‌ పూల్‌’ జాబితాలో ఇద్దరు భారత క్రికెటర్లను కొత్తగా చేర్చారు. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ల పేర్లు ఇప్పుడు ‘నాడా’ జాబితాలోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఉన్న క్రికెటర్లు స్మృతి మంధాన, శ్రేయస్‌ అయ్యర్‌లను తప్పించి వారి స్థానంలో ఈ రెండు పేర్లను జోడించారు. ఈ జాబితాలో ఉండే ఆటగాళ్లు ఏడాది పాటు డోపింగ్‌ పరీక్షల కోసం అందుబాటులో ఉండాలి. నిబంధనల ప్రకారం ఎప్పుడు, ఎక్కడ ఉంటున్నారో తమ గురించి సమాచారం అందించాల్సి ఉంటుంది. లేదంటే డోపింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. మొత్తం 348 మందితో కూడిన జాబితాను ‘నాడా’ విడుదల చేసింది. వీరిలో అత్యధిక సంఖ్యలో 118 మంది అథ్లెట్లు ఉండగా...భారత క్రికెటర్లు గిల్, జైస్వాల్, హార్దిక్‌ పాండ్యా, పంత్, బుమ్రా, రాహుల్, అర్ష్ దీప్, తిలక్‌ వర్మ వచ్చే ఏడాది కూడా కొనసాగనున్నారు. మహిళా క్రికెటర్లు దీప్తి శర్మ, షఫాలీ వర్మ, రేణుకా సింగ్‌ కూడాఈ జాబితాలో ఉన్నారు.

Vaishali wins the Womens Candidates Chess Tournament title7
వారెవ్వా వైశాలి

పాఫోస్‌ (సైప్రస్‌): ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి టైటిల్‌ దక్కించుకుంది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 14 రౌండ్ల తర్వాత తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల వైశాలి 8.5 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించింది. క్యాండిడేట్స్‌ టోర్నీ విజేత హోదాలో వైశాలి ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం డిఫెండింగ్‌ చాంపియన్‌ జు వెన్‌జున్‌ (చైనా)తో తలపడుతుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ వేదికను, తేదీను ఇంకా ఖరారు చేయలేదు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ ఫార్మాట్‌లో జరిగిన క్యాండిడేట్స్‌ టోర్నీలో చివరిరోజు వైశాలి అద్భుతం చేసింది. గతంలో ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచిన కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్‌)తో జరిగిన 14వ రౌండ్‌ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన వైశాలి 48 ఎత్తుల్లో గెలిచింది. తద్వారా ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్రపంచ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌కు అర్హత పొందింది. ఈ టోర్నీలో వైశాలి ఐదు గేముల్లో గెలిచి, ఏడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో ఓడిపోయింది. బిబిసారా అసయుబయేవా (కజకిస్తాన్‌; 8 పాయింట్లు) రన్నరప్‌గా నిలువగా... జు జినెర్‌ (చైనా; 7.5), అలెగ్జాండ్రా గొర్యాక్‌చినా (రష్యా; 7.5 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. అనా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌; 7 పాయింట్లు) ఐదో స్థానంలో, కాటరీనా లాగ్నో (6.5 పాయింట్లు) ఆరో స్థానంలో, దివ్య దేశ్‌ముఖ్‌ (భారత్‌; 5.5 పాయింట్లు) ఏడో స్థానంలో, టాన్‌ జోంగి (చైనా; 5.5 పాయింట్లు) చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచారు. విజేతగా నిలిచిన వైశాలికి 28,000 యూరోలు (రూ. 30 లక్షల 81 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. 2011లో కోనేరు హంపి తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌కు అర్హత పొందిన రెండో భారతీయ చెస్‌ క్రీడాకారిణిగా వైశాలి గుర్తింపు పొందింది. 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హు ఇఫాన్‌ (చైనా) చేతిలో హంపి ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. 2018 మేలో కాటరీనా లాగ్నోపై గెలిచి తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన జు వెన్‌జున్‌ ఆ తర్వాత నాలుగుసార్లు (2018 నవంబర్‌; 2020, 2023, 2025) ప్రపంచ టైటిల్‌ను నిలబెట్టుకుంది. మరోవైపు పురుషుల క్యాండిడేట్స్‌ టోర్నీలో ఉజ్బెకిస్తాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ జవోఖిర్‌ సిందరోవ్‌ 10 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఈ ఏడాది చివర్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ (భారత్‌)తో ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం సిందరోవ్‌ తలపడతాడు. వైశాలి తమ్ముడు, భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద 6 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Virat Kohli As Impact Player For First Time In His IPL Career 8
విరాట్‌ కోహ్లి అరుదైన ఫీట్‌!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి అరుదైన ఫీట్ సాధించాడు. త‌న ఐపీఎల్ కెరీర్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా రావ‌డం కోహ్లికి ఇదే తొలిసారి. ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి త‌న కెరీర్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓపెన‌ర్‌గానే బ‌రిలోకి దిగేవాడు. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లోనూ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ కోహ్లి ప్ర‌ధాన జ‌ట్టులో స‌భ్యుడిగానే ఆడాడు. అయితే ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లి చీల‌మండ గాయంతో ఇబ్బంది ప‌డ్డాడు. దీంతో ముంబై ఇన్నింగ్స్ స‌మ‌యంలో కోహ్లి ఫీల్ఢింగ్‌కు దూరంగా ఉన్నాడు. ల‌క్నోతో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ స‌మ‌యంలోనూ కోహ్లీ కాలికి బ్యాండేజీతో క‌నిపించ‌డంతో మ్యాచ్ ఆడేది అనుమానంగానే క‌నిపించింది. అయితే ఐపీఎల్‌లో ఇంపాక్ట్ రూల్ బ్యాట‌ర్ల‌కు ఉప‌యోగ‌క‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే కోహ్లి ల‌క్నోతో మ్యాచ్‌లో తొలుత తుది జ‌ట్టులో లేక‌పోయేస‌రికి అభిమానులు కంగారు ప‌డిన‌ప్ప‌టికీ కెప్టెన్ ప‌టిదార్ మ్యాచ్‌లో కోహ్లి ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌స్తాడ‌ని పేర్కొన్నాడు. తొలిసారి ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన కోహ్లి విలువైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 34 బంతుల్లో 49 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి. ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ల‌క్నో విధించిన 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వగా, ప‌టిదార్ (27), జితేశ్ శ‌ర్మ (23) రాణించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్‌ చౌదరీ (39), ఆయుశ్‌ బదోని (38) పర్వాలేదనిపించారు. Virat in a chase. Period. 🙇‍♂️ pic.twitter.com/1uSeL3PaF8— Royal Challengers Bengaluru (@RCBTweets) April 15, 2026

Royal Challengers Bengaluru Beat Lucknow Super Giants By 5 Wickets9
కోహ్లి, రసిక్‌ సలామ్‌ మెరుపులు.. ఆర్సీబీ ఘన విజయం

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆర్సీబీ నాలుగో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. బుధ‌వారం ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ల‌క్నో విధించిన 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వగా, ప‌టిదార్ (27), జితేశ్ శ‌ర్మ (23) రాణించారు. మ‌ధ్య‌లో వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన‌ప్ప‌టికీ చివ‌ర్లో టిమ్ డేవిడ్ (14 నాటౌట్‌), షెప‌ర్డ్ (14 నాటౌట్‌)_ఆర్సీబీని విజ‌య‌తీరాల‌కు చేర్చారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ప్రిన్స్ యాద‌వ్ 3 వికెట్లు, అవేశ్ ఖాన్ 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్‌ చౌదరీ (39), ఆయుశ్‌ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్‌ సలామ్‌ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్‌ కుమార్‌ 3, కృనాల్‌ పాండ్యా 2 వికెట్లు తీశాడు. కాగా ఆర్సీబీ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో ఏడో స్థానంలో కొనసాగుతుంది.As convincing as it gets 🙌A comfortable 5️⃣-wicket win and @RCBTweets remain unbeaten at home ✌️Scorecard ▶️ https://t.co/UztAZM9l0q#TATAIPL | #KhelBindaas | #RCBvLSG pic.twitter.com/pFkug0okkt— IndianPremierLeague (@IPL) April 15, 2026

Ball Goes Out Of Stadium As Mitchell Marsh Slams 102 Meter Six Viral10
మిచెల్‌ మార్ష్‌ కళ్లు చెదిరే సిక్సర్‌!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ క‌ళ్లు చెదిరే సిక్స్‌తో మెరిశాడు. ఆర్సీబీ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ వేసిన‌ ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్ ఆఖ‌రి బంతిని మార్ష్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్స్ సందించాడు. 102 మీట‌ర్ల ఎత్తులో వెళ్లిన బంతి స్టేడియం అవ‌త‌ల ప‌డింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి 146 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్‌ చౌదరీ (39), ఆయుశ్‌ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్‌ సలామ్‌ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్‌ కుమార్‌ 3, కృనాల్‌ పాండ్యా 2 వికెట్లు తీశాడు.102M SIX BY MITCHELL MARSH. 🤯 pic.twitter.com/YwUmYWUYx8— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2026

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement