Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

SRH All-Rounder NitishKumar Reddy Comments-Match Won Vs KKR1
‘నేనైతే ఫుల్‌ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్‌ భావోద్వేగం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ గురువారం కేకేఆర్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్‌లో బోణీ చేసింది. తెలుగు కుర్ర క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డి తనకున్న ఆల్‌రౌండర్ ట్యాగ్‌కు న్యాయం చేస్తూ మొదట బ్యాట్‌తో, ఆపై బంతితో మెరిసి జట్టు విజయంలో భాగం కావడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం నితీశ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇది నిజంగా నాకు చాలా ప్రత్యేకమైన మ్యాచ్‌. చాలా కాలంగా ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నాను. సరైన సమయంలో నేను రాణించగలిగాను. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా కష్టపడ్డా. కొన్ని బౌండరీలు ఇచ్చినా చివరికి జట్టుకు ఉపయోగపడే ప్రదర్శన ఇచ్చాను. గత సీజన్ నేను అనుకున్న ప్లాన్ ప్రకారం సాగలేదు. ఆ సీజన్‌లో నేను గాయాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. బౌలింగ్ కూడా చేయలేకపోయాను. ఆ సమయంలో నా మనసులో నెగెటివ్ ఆలోచనలు పెరిగిపోయాయి. అయితే ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందు నా బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాను. నేను పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం లభించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఎస్‌ఆర్‌హెచ్ విజయంలో కీలకపాత్ర పోషించడం ఆనందంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో నితీశ్‌కుమార్ మొదట బ్యాటింగ్‌లో 24 బంతుల్లో 39 పరుగులు చేసి ఎస్‌ఆర్‌హెచ్ స్కోరు 200 దాటడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రింకూ సింగ్‌, అనుకుల్‌రాయ్‌లను ఔట్ చేసి ఎస్‌ఆర్‌హెచ్‌కు బ్రేక్ అందించాడు. చదవండి: గెలుపు జోష్‌లో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు షాక్‌!

Abhishek Sharma Reprimanded By Demerit Point Code Of Conduct Breach2
గెలుపు జోష్‌లో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు షాక్‌!

సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వైస్‌కెప్టెన్ అభిషేక్ శ‌ర్మ‌కు ఐపీఎల్ నిర్వాహ‌కులు షాక్ ఇచ్చారు. గురువారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు గాను అభిషేక్ శ‌ర్మ మ్యాచ్ ఫీజులో 25 శాతం జ‌రిమానా విధించ‌డంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కేటాయించారు. కేకేఆర్ ఇన్నింగ్స్ స‌మ‌యంలో అభిషేక్ అస‌భ్య ప‌ద‌జాలం వాడిన‌ట్లు స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీంతో అత‌డిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ఐపీఎల్ నిర్వాహ‌కులు తెలిపారు.మ్యాచ్‌లో ఆట పరంగా అభిమానులను అలరించినప్పటికీ, మైదానంలో మాత్రం అతని ప్రవర్తన అధికారులను నిరాశకు గురిచేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3 ప్రకారం (మ్యాచ్ సమయంలో అసభ్య పదజాలం వాడటం) లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు అభిషేక్ అంగీక‌రించాడు. ఐపీఎల్ క్రమశిక్షణ చ‌ర్య‌ల్లో భాగంగా లెవల్ 1 నేరాలు తక్కువ తీవ్రత కలిగినవిగా పరిగణించబడతాయి. అయినా పదేపదే ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడితే డీమెరిట్ పాయింట్లు పెరుగుతాయి. వీటివల్ల భవిష్యత్తులో మ్యాచ్ ల నుండి కూడా సస్పెన్షన్ కు దారితీసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అభిషేక్ తన తప్పును అంగీకరించడంతో రిఫరీ శిక్షను ఖరారు చేశారు.అరుదైన రికార్డు..గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులతో సునామి ఇన్నింగ్స్ ఆడాడు. ప‌నిలో ప‌నిగా అభిషేక్ త‌న ఖాతాలో అరుదైన రికార్డును జ‌మ చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ త‌ర‌ఫున వంద సిక్స‌ర్లు బాదిన తొలి భార‌త ఆట‌గాడిగా రికార్డు సాధించాడు. ఎస్ఆర్‌హెచ్ త‌ర‌ఫున అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాడిగా డేవిడ్ వార్న‌ర్ (143 సిక్స‌ర్లు) తొలి స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శ‌ర్మ (101 సిక్స‌ర్లు), క్లాసెన్ (89 సిక్స‌ర్లు), కేన్ విలియ‌మ్స‌న్ (64 సిక్స‌ర్లు), హెడ్ (50 సిక్స‌ర్లు) త‌ర్వాతి స్థానాల్లో కొన‌సాగుతున్నారు. ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ 65 పరుగుల భారీ తేడాతో కేకేఆర్‌పై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 🚨 Meet Abhishek Sharma a FAILURE product of IPL 🚨- Matches: 78- Runs: 1822- AVERAGE : 26.79Strike Rate: 162.39- Ducks- 3- Fifties - 9- Centuries - 1Look at his average 26.79 which is below average of any player.pic.twitter.com/BjRi1v8aMz— manzur shaban (@Manzurshaban123) April 2, 2026చదవండి: రనౌటయ్యి బతికిపోయాడు లేదంటేనా!

Cameron Green Run Out Falls Prey To Bizare Mix KKR Vs SRH Match3
రనౌటయ్యి బతికిపోయాడు లేదంటేనా!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్లలో కామెరున్ గ్రీన్ ఒకడు. రూ. 25.20 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా క్రికెటర్లపై ఇంత ఖర్చు చేయడం అవసరమా అని ఒకవైపు విమర్శలు వస్తున్నప్పటికీ వాళ్లకే జాక్‌పాట్‌లు తగులుతున్నాయి. అయితే గ్రీన్ అంత హార్డ్ హిట్టర్ బ్యాటర్ కూడా కాదు. వ‌న్డే ఫార్మాట్‌లో మంచి బ్యాట‌ర్ అయిన కామెరున్ గ్రీన్ టీ20ల్లో స్ట్రైక్‌రేటు కూడా సాధార‌ణంగానే ఉంటుంది. ముంబైతో ఆడిన తొలి మ్యాచ్‌లో పెద్ద‌గా ఆక‌ట్టుకోని గ్రీన్ తాజాగా ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లోనూ ఆక‌ట్టుకోలేదు. దీనికి తోడు అత‌డిని దుర‌దృష్టం వెంటాడింది. మలింగ ఓవర్లో రఘువంశీ నేరుగా షాట్‌ కొట్టగా బంతి బౌలర్‌ కాలికి తగిలి కొద్ది దూరం వెళ్లింది. ఇదే అదనుగా రఘువంశీ, గ్రీన్‌ కాస్త సంకోచిస్తూనే పరుగు ప్రారంభించారు. అయితే వెంటనే తేరుకున్న మలింగ బంతిని అందుకొని నాన్‌స్ట్రయికర్‌ ఎండ్‌ వైపు స్టంప్స్‌ను పడగొట్టాడు. దాంతో రఘువంశీ తాను రనౌట్‌ అయినట్లుగా భావించి తిరుగుముఖం పట్టాడు. కానీ బౌండరీ లైన్‌ వద్ద అతడిని ఆపిన అంపైర్లు రీప్లేను పరిశీలించారు. పరుగు తీసే క్రమంలో ఇద్దరూ బ్యాటర్లు దాదాపు ఒకే లైన్‌లో ఉన్నారు. గ్రీన్‌ ఇంకా రఘువంశీని దాటలేదు. దాంతో నిబంధన ప్రకారం గ్రీన్‌ను అవుట్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రీన్‌ మరోసారి సోషల్‌ మీడియాలో ట్రోల్‌కు గురయ్యాడు. ‘రనౌట్‌ అయి బతికిపోయాడు.. లేదంటే మరోసారి విమర్శలకు గురయ్యేవాడే’..‘ 25 కోట్లు దండగ అని మరోసారి నిరూపించాడు’ అని కామెంట్లు చేశారు.A confusion between Raghuvanshi and Green. pic.twitter.com/wljEeRqlHF— Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2026చదవండి: కేకేఆర్‌ ఓడినా ఆ ఒక్క‌డు గెలిచాడు!

Who Is Blessing Muzarabani Shines In SRH Vs KKR 4 Wicket Haul4
కేకేఆర్‌ ఓడినా ఆ ఒక్క‌డు గెలిచాడు!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కోల్‌కతా నైట్‌రైడ‌ర్స్ (కేకేఆర్‌) వ‌రుస‌గా రెండో ఓట‌మి న‌మోదు చేసుకుంది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లో ఛేద‌నలో మంచి ఆరంభం లభించిన‌ప్ప‌టికీ దానిని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో కేకేఆర్ బ్యాట‌ర్లు విఫ‌ల‌మ‌య్యారు. దీనికి తోడు టార్గెట్ ఎక్కువ‌గా ఉండ‌డం కూడా కేకేఆర్ కొంప‌ముంచింది. అయితే జ‌ట్టు ఓడినా ఒక్క ఆట‌గాడు మాత్రం గెలిచాడు. అత‌డే జింబాబ్వేకు చెందిన‌ బ్లెసింగ్ ముజ‌ర‌బానీ.ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో మూడు ఓవ‌ర్లు వేసి 34 ప‌రుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు. కానీ గురువారం ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో మాత్రం ముజ‌ర‌బానీ త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. 4 ఓవ‌ర్లు వేసిన ముజ‌ర‌బానీ 41 ప‌రుగులిచ్చి 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఎకాన‌మీ ప‌రంగా చూసుకుంటే ఓవ‌ర్‌కు 10 ప‌రుగుల చొప్పున ఇచ్చిన‌ప్ప‌టికీ బ్యాటింగ్ పిచ్‌పై ముజ‌ర‌బానీ ప్ర‌ద‌ర్శ‌న తీసిపారేయ‌లేము. పైగా అత‌డు తీసిన నాలుగు వికెట్ల‌లో అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌, క్లాసెన్ వంటి విధ్వంస‌క‌ర బ్యాట‌ర్లు ఉన్నారు. ఈ ఐపీఎల్‌లో సికంద‌ర్ ర‌జా త‌ర్వాత జింబాబ్వే నుంచి ఆడుతున్న క్రికెట‌ర్ ముజ‌ర‌బానీ మాత్ర‌మే. మొద‌ట వేలంలో అమ్ముడుపోని ఆట‌గాడు ఇవాళ కేకేఆర్ మ్యాచ్ ఓడినా త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో మాత్రం అభిమానుల మ‌నుసులు గెలుచుకున్నాడు.వేలంలో అమ్ముడుపోలేదు..జింబాబ్వే ఆట‌గాడు అయిన బ్లెసింగ్ ముజ‌ర‌బానీకి ఇదే తొలి ఐపీఎల్ సీజ‌న్‌. రూ. 75 ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌తో వేలంలోకి దిగిన ముజ‌ర‌బానీని కొనుగోలు చేయ‌డానికి ఫ్రాంచైజీలు ఇష్ట‌ప‌డ‌లేదు. దీంతో అత‌డు అమ్ముడుపోని ఆట‌గాళ్ల జాబితాలో చేరిపోయాడు. అయితే అదృష్టం ముజ‌ర‌బానీని ముస్తాఫిజుర్ రెహ్మాన్ రూపంలో వెతుక్కుంటూ వ‌చ్చింది. బంగ్లాదేశ్‌లో హిందువుల‌పై దాడులు, ఇత‌ర కార‌ణాల రీత్యా బంగ్లా ఆట‌గాళ్ల‌ను ఐపీఎల్‌లో పాల్గొన‌కూడ‌దంటూ దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు జ‌రిగాయి. దీంతో బీసీసీఐ ఐపీఎల్‌లో ఆయా ఫ్రాంచైజీల్లో ఉన్న బంగ్లా ఆట‌గాళ్ల‌ను బ‌హిష్క‌రించాల‌ని సందేశాలు పంపింది. దీంతో కేకేఆర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జ‌ట్టు నుంచి విడుద‌ల చేసింది.వెతుక్కుంటూ అవకాశం..అత‌డి స్థానంలో నిఖార్సైన బౌల‌ర్ కోసం వెతికింది. ఈ నేప‌థ్యంలోనే అప్ప‌టికే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో జింబాబ్వే త‌ర‌ఫున 6 మ్యాచ్‌లాడిన బ్లెసింగ్ ముజ‌రబానీ 7.88 ఎకాన‌మీ రేట్‌తో 13 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మొద‌ట అస‌లు వేలంలో అమ్ముడుపోని ఆట‌గాడిగా నిలిచిన ముజ‌ర‌బానీపై కేకేఆర్ క‌న్ను ప‌డింది. దీంతో ముస్తాఫిజుర్ స్థానంలో ముజ‌ర‌బానీని రీప్లేస్ చేస్తున్న‌ట్లు కేకేఆర్ యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది.ఎవ‌రీ ముజ‌ర‌బానీ?29 ఏళ్ల ముజ‌ర‌బానీ జింబాబ్వేలోని మురేవా అనే చిన్న ప‌ట్ట‌ణంలో జ‌న్మించాడు. ఏడేళ్ల ప్రాయంలో క్రికెట్‌లో ఓన‌మాలు నేర్చుకున్న ముజ‌రబానీకి అత‌ని హైట్ ప్ల‌స్ అయింది. 6 అడుగుల 8 అంగుళాల పొడ‌వు ఉండే ముజ‌రబానీ వేసే బౌన్స‌ర్లు బ్యాట‌ర్ల‌ను ఇబ్బంది పెడుతుంటాయి. అలా 2017లో జాంబాబ్వే మాజీ క్రికెట‌ర్ తెటెండా తైబు క‌ళ్ల‌లో ప‌డిన ముజ‌ర‌బానీ రైజింగ్ స్టార్స్ అకాడ‌మీలో మూడు నెల‌ల పాటు క‌ఠిన శిక్ష‌ణ తీసుకొని బౌలింగ్‌లో మ‌రింత రాటుదేలాడు. 2017లో జింబాబ్వే త‌ర‌ఫున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ముజ‌రబానీ ఇప్ప‌టివ‌ర‌కు 18 టెస్టుల్లో 67 వికెట్లు, 57 వన్డేల్లో 70 వికెట్లు, 88 టీ20ల్లో 105 వికెట్లు ప‌డ‌గొట్టాడు.మొత్తంగా అన్ని ఫార్మాట్లు క‌లిపి 243 వికెట్లు ప‌డ‌గొట్టిన ముజ‌ర‌బానీ జింబాబ్వే త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో గ్రూప్ ద‌శ‌లో ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించ‌డంలో ముజ‌ర‌బానీదే కీల‌క‌పాత్ర‌. ఆ మ్యాచ్‌లో ముజ‌రబానీ 17 ప‌రుగుల‌కే 4 వికెట్లు తీసి ఆసీస్ ప‌త‌నాన్ని శాసించాడు. అంతేకాదు రిచ‌ర్డ్ న‌గ‌ర‌వా, సికంద‌ర్ ర‌జా త‌ర్వాత జింబాబ్వే త‌ర‌ఫున టీ20ల్లో వంద వికెట్లు తీసిన మూడో బౌల‌ర్‌గానూ ముజ‌ర‌బానీ నిలిచాడు.మ్యాచ్ విష‌యానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 226 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16 ఓవ‌ర్ల‌లో 161 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన నితీశ్‌కుమార్ రెడ్డి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.చదవండి: మూగబోయిన బ్యాట్‌.. విధ్వంస వీరుడికి ఏమైంది?The creative says it 😌 pic.twitter.com/Ta6bZ4lm5B— KolkataKnightRiders (@KKRiders) April 2, 2026Petition to change the word 𝐬𝐚𝐟𝐞 in dictionary to 𝐑𝐢𝐧𝐤𝐮 😌💜pic.twitter.com/3q7gcyXvVo— KolkataKnightRiders (@KKRiders) April 2, 2026

Chennai to face Punjab Kings at Chidambaram Stadium today5
సొంతగడ్డపై సత్తా చాటేనా!

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌లో భాగంగా శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌తో మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది. గువాహటిలో ఆడిన గత మ్యాచ్‌లో ఓడిన చెన్నై... సొంతగడ్డపై పాయింట్ల ఖాతా తెరవాలని భావిస్తోంది. రాజస్తాన్‌ రాయల్స్‌తో పోరులో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ ఇలా అన్ని రంగాల్లో పేలవ ప్రదర్శనతో ఘోర పరాజయం చవిచూసిన సూపర్‌ కింగ్స్‌... ఆ ఓటమిని పక్కనపెట్టి సమష్టిగా సత్తా చాటేందుకు సిద్ధమైంది. గాయం కారణంగా ధోనీ ఈ మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగడం లేదు. అయితే అతడు డగౌట్‌ నుంచి సూచనలు ఇవ్వనుండటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. టి20 వరల్డ్‌కప్‌ హీరో సంజూ సామ్సన్‌పై భారీ అంచనాలు ఉండగా... కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్, ఆయుశ్‌ మాత్రే, షార్ట్, శివమ్‌ దూబే, కార్తీక్‌ శర్మ కలిసి కట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో ఖలీల్, అన్షుల్‌ కంబోజ్, నూర్‌ అహ్మద్, హెన్రీ కీలకం కానున్నారు. మరోవైపు గత మ్యాచ్‌లో గుజరాత్‌పై కష్టపడి గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఆసీస్‌ ప్లేయర్‌ కూపర్‌ చక్కటి ఫామ్‌లో ఉండగా... కెప్టెన్‌ శ్రేయస్, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్, నేహల్, శశాంక్, స్టొయినిస్, యాన్సెన్‌ రాణించాల్సి ఉంది. అర్‌‡్షదీప్, జేవియర్, యాన్సెన్, వైశాఖ్, చాహల్‌ బౌలింగ్‌ భారం మోయనున్నారు. చెన్నై పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్ష సూచనలేదు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు చెన్నై, పంజాబ్‌ మధ్య 32 మ్యాచ్‌లు జరిగాయి. ఇరు జట్లు చెరో 16 మ్యాచ్‌ల్లో గెలిచి సమంగా ఉన్నాయి. పంజాబ్‌పై చెన్నై అత్యధిక స్కోరు 240 కాగా... అత్యల్ప స్కోరు 120. చెన్నైపై పంజాబ్‌ అత్యధిక స్కోరు 231 కాగా, అత్యల్ప స్కోరు 92గా ఉంది.

Sunrisers Hyderabad beat Kolkata Knight Riders by 65 runs6
ఈడెన్‌లో ‘సన్‌’ మెరిసెన్‌

ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో 201 పరుగులు చేసి కూడా సన్‌రైజర్స్‌ ఓటమిని ఎదుర్కొంది. కానీ ఈసారి అదే బ్యాటింగ్‌ బలంతో గెలుపు బోణీ చేసింది. క్లాసెన్, అభిషేక్, హెడ్‌ల దూకుడుతో ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు దానిని నిలబెట్టుకుంది. సొంత మైదానంలో పేలవ బౌలింగ్‌తో భారీగా పరుగులిచ్చిన కేకేఆర్‌ ఛేదనలో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే కుప్పకూలింది. ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకోగా... ఈ సీజన్‌లో గత ఐదు మ్యాచ్‌లకు భిన్నంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు మొదటిసారి గెలవడం విశేషం. కోల్‌కతా: ఐపీఎల్‌ మాజీ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీజన్‌లో తమ రెండో మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో గురువారం ఏకపక్షంగా సాగిన పోరులో హైదరాబాద్‌ 65 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (35 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా, అభిషేక్‌ శర్మ (21 బంతుల్లో 48; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ట్రవిస్‌ హెడ్‌ (21 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం కోల్‌కతా 16 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. అంగ్‌కృష్‌ రఘువంశీ (29 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్‌ (25 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు. ఓపెనర్ల దూకుడు... హెడ్, అభిషేక్‌ అంచనాలకు అనుగుణంగా తమ విధ్వంసక బ్యాటింగ్‌తో హైదరాబాద్‌కు శుభారంభం అందించారు. అరోరా ఓవర్లో తొలి బంతికి ఫోర్‌ కొట్టిన హెడ్, ఆ తర్వాత అదే ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. 34 పరుగుల వద్ద హెడ్‌ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను రహానే వదిలేశాడు. వరుణ్‌ వేసిన తొలి ఓవర్లో చెలరేగిపోయిన అభిషేక్‌ 2 సిక్స్‌లు, 3 ఫోర్లు కొట్టడంతో 25 పరుగులు లభించాయి. పవర్‌ప్లే ముగిసేసరికే స్కోరు 84 పరుగులకు చేరడం విశేషం. అయితే హెడ్‌ను అవుట్‌ చేసి త్యాగి తొలి వికెట్‌ తీయగా... ఆ తర్వాత 7 పరుగుల వ్యవధిలో ఇషాన్‌ కిషన్‌ (14), అభిషేక్, అనికేత్‌ వర్మ (1) వికెట్లు కోల్పోయింది. అభిషేక్‌ ఇచ్చిన క్యాచ్‌ను వరుణ్‌ అందుకునే సమయంలో బంతి నేలకు తాకినట్లు అనిపించినా...వరుస రీప్లేల తర్వాత అంపైర్‌ నితిన్‌ మేనన్‌ అవుట్‌గా ప్రకటించాడు. ఈ దశలో క్లాసెన్, నితీశ్‌ కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. క్లాసెన్‌ 34 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్‌ను అందుకోగా, ఆఖరి 3 ఓవర్లలో జట్టు 4 వికెట్లు చేజార్చుకొని 42 పరుగులు రాబట్టింది. కేకేఆర్‌ బౌలర్‌ ముజరబాని 4 వికెట్లు తీశాడు. రఘువంశీ అర్ధసెంచరీ... పేన్‌ వేసిన మొదటి ఓవర్‌ తొలి బంతికి రహానే సింగిల్‌ తీయగా... తర్వాతి ఐదు బంతుల్లో ఫిన్‌ అలెన్‌ (7 బంతుల్లో 28; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా 4, 4, 6, 6, 4 బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. అయితే కేకేఆర్‌ దూకుడు ఈ ఒక్క ఓవర్‌కే పరిమితమైంది. దూబే వేసిన రెండో ఓవర్లోనే అలెన్‌ వెనుదిరగ్గా... రహానే (8), గ్రీన్‌ (2) విఫలమయ్యారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన రఘువంశీ 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రఘువంశీ, అనుకూల్‌ రాయ్‌ (0) ఒకే స్కోరు వద్ద అవుటైన తర్వాత రింకూ సింగ్, రమణ్‌దీప్‌ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 39 బంతుల్లో 88 పరుగులు చేయాల్సిన స్థితిలో రింకూ అవుట్‌ కావడంతో కోల్‌కతా ఆశలు కోల్పోయింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) గ్రీన్‌ (బి) త్యాగి 46; అభిషేక్‌ (సి) వరుణ్‌ (బి) ముజరబాని 48; ఇషాన్‌ కిషన్‌ (సి) రింకూ (బి) ముజరబాని 14; క్లాసెన్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) ముజరబాని 52; అనికేత్‌ (సి) రింకూ (బి) రాయ్‌ 1; నితీశ్‌ రెడ్డి (సి) వరుణ్‌ (బి) అరోరా 39; సలీల్‌ (బి) అరోరా 0; దూబే (నాటౌట్‌) 9; శివాంగ్‌ (సి) రహానే (బి) ముజరబాని 4; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 226. వికెట్ల పతనం: 1–82, 2–111, 3–112, 4–118, 5–200, 6–200, 7–222, 8–226. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4–0–47–2, ముజరబాని 4–0–41–4, నరైన్‌ 4–0–39–0, వరుణ్‌ చక్రవర్తి 2–0–31–0, కార్తీక్‌ త్యాగి 4–0–48–1, అనుకూల్‌ రాయ్‌ 2–0–16–1. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: అలెన్‌ (సి అండ్‌ బి) దూబే 28; రహానే (సి) మలింగ (బి) ఉనాద్కట్‌ 8; రఘువంశీ (రనౌట్‌) 52; గ్రీన్‌ (రనౌట్‌) 2; రింకూ (సి) ఉనాద్కట్‌ (బి) నితీశ్‌ 35; అనుకూల్‌ (సి) అండ్‌ (బి) నితీశ్‌ 0; రమణ్‌దీప్‌ (సి) ఉనాద్కట్‌ (బి) మలింగ 10; నరైన్‌ (సి) అనికేత్‌ (బి) మలింగ 12; త్యాగి (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) ఉనాద్కట్‌ 5; వైభవ్‌ (నాటౌట్‌) 1; వరుణ్‌ (బి) ఉనాద్కట్‌ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (16 ఓవర్లలో ఆలౌట్‌) 161. వికెట్ల పతనం: 1–30, 2–67, 3–74, 4–120, 5–120, 6–139, 7–154, 8–159, 9–161, 10–161. బౌలింగ్‌: పేన్‌ 2–0–35–0, హర్ష్ దూబే 2–0–17–1, అభిషేక్‌ 1–0–15–0, ఉనాద్కట్‌ 3–0–21–3, ఇషాన్‌ మలింగ 2–0–14–2, శివాంగ్‌ 4–0–41–0, నితీశ్‌ 2–0–17–2. ఎట్టకేలకు... జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా... హైదరాబాద్‌ జట్టు సగటు అభిమాని మన తెలుగు ఆటగాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి రాణించాలని కోరుకోవడం సహజం. అయితే గత సీజన్‌ మొత్తం నితీశ్‌ తీవ్రంగా నిరాశపర్చాడు. 11 ఇన్నింగ్స్‌లలో కలిపి పేలవమైన స్ట్రయిక్‌ రేట్‌ 118.95తో మొత్తం 182 పరుగులే చేసిన అతని అత్యధిక స్కోరు 32 మాత్రమే. బౌలింగ్‌లో రెండే వికెట్లు తీశాడు. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో విఫలమైన అతను ఇక్కడ దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా అరోరా బౌలింగ్‌లో కొట్టిన సిక్స్‌ హైలైట్‌గా నిలిచింది. బౌలింగ్‌లో కూడా కీలకమైన రింకూ సింగ్‌ వికెట్‌ అతను పడగొట్టాడు. 200 ఐపీఎల్‌లో రహానేకు ఇది 200వ మ్యాచ్‌. ఈ మైలురాయిని అందుకున్న 11వ ఆటగాడు రహానే. అతను లీగ్‌లో ఆరు జట్లకు (కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, ముంబై, రాజస్తాన్, పుణే) ప్రాతినిధ్యం వహించాడు.

Srinidhi Deccan Football Club second draw added to their teams account7
శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ ఖాతాలో రెండో ‘డ్రా’

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ (ఐఎఫ్‌ఎల్‌)లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టు ఖాతాలో రెండో ‘డ్రా’ చేరింది. షిల్లాంగ్‌ లాజోంగ్‌ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి డెక్కన్‌ జట్టు 0–0తో ‘డ్రా’గా ముగించింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు గోల్‌ చేయడంలో విఫలమయ్యాయి. శ్రీనిధి జట్టు గోల్‌కీపర్‌ కమల్జీత్‌ సింగ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో హెడ్‌ కోచ్‌ కార్లోస్‌ వాజ్‌ పింటో శ్రీనిధి తుది జట్టులో రెండు మార్పులు చేశాడు. నానాటో లూయిస్, వాన్‌లాన్‌రెమ్డికా జట్టులోకి వచ్చారు. ఆట 11వ నిమిషంలో శ్రీనిధి కెపె్టన్‌ డేవిడ్‌ కాస్టనెడా కొట్టిన షాట్‌ను షిల్లాంగ్‌ గోల్‌కీపర్‌ రింబాయ్‌ అడ్డుకున్నాడు. చివర్లో 86వ నిమిషంలో పౌలో సెజార్‌ హెడర్‌ను మరోసారి రింబాయ్‌ నిలువరించాడు. మ్యాచ్‌ ‘డ్రా’ కావడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ లభించింది. పది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో శ్రీనిధి డెక్కన్‌ జట్టు ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. మూడు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. 11 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. డైమండ్‌ హార్బర్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ 13 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. శ్రీనిధి జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను హైదరాబాద్‌లో ఈనెల ఐదో తేదీన ఐజ్వాల్‌ ఎఫ్‌సీ జట్టుతో ఆడుతుంది.

Hikaru Nakamura is extremely impatient with the excessive precautions being taken by FIDE8
‘మేం మోసగాళ్లలా కనిపిస్తున్నామా’

పెయియా (సైప్రస్‌): ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో ఆటగాళ్లు ‘మోసాలకు’ పాల్పడకుండా ఉండేందుకు అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) తీసుకుంటున్న అతి జాగ్రత్తలపై అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ హికారు నకమురా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తమను ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ ‘మొసాద్‌’కు చెందిన వ్యక్తుల్లా చూస్తున్నారని అతను ధ్వజమెత్తాడు. క్యాండిడేట్స్‌ టోర్నీ పురుషుల విభాగంలో పాల్గొంటున్న ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్లలో నకమురా ఒకడు. ఈ టోర్నీలో విజేతగా నిలిచే ఆటగాడు ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోరులో ప్రస్తుత విజేత గుకేశ్‌ దొమ్మరాజుతో తలపడతాడు. సైప్రస్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆటగాళ్లు ఎలాంటి మోసాలకు పాల్పడకుండా ఉండేందుకు ‘ఫిడే’ పలు జాగ్రత్తలు తీసుకుంది. మెటల్‌ డిటెక్టర్లతో పాటు ఈసారి మరిన్ని కొత్త తరహా స్కానర్లను టోర్నీ జరిగే వేదికపై ఏర్పాటు చేసింది. ఈ తరహా అతి జాగ్రత్త నకమురాకు ఆగ్రహం తెప్పించింది. ‘అసలు ఆటగాళ్లు గేమ్‌ ఆడుతూ మోసం చేయడానికి ప్రయత్నిస్తారనే ఆలోచనే పనికిమాలినదని అని నా నమ్మకం. కొందరు ఆటగాళ్లే ఇలాంటి ఏర్పాటు కావాలని అడిగారని విన్నాను. ఇది పూర్తిగా అర్థరహితం. గేమ్‌కు ముందు గేమ్‌ తర్వాత కూడా వారు మమ్మల్ని స్కాన్‌ చేస్తున్నారు. మెటల్‌ డిటెక్టర్‌లే కాకుండా వేరుగా ప్రత్యేక స్కానర్లూ ఉన్నాయి. మేమేమైనా ఇరాన్‌లో పని చేస్తున్న ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొసాద్‌ ఏజెంట్లమా? ఫిడే వాస్తవంలోకి రావాలి. మేం చెస్‌ ప్లేయర్లం మాత్రమే’ అని నకమురా వ్యాఖ్యానించాడు. అసలు ఈ తరహా ఏర్పాటు చేయడానికి సరైన కారణం కూడా లేదని ఈ అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ అభిప్రాయపడ్డాడు. ‘ఆటగాళ్ల మోసం గురించి అతి చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. ఏదో ఒక చిన్న ఓపెన్‌ టోర్నీ అంటే ఏమైనా అనుకోవచ్చు. అక్కడంటే స్కానర్లవంటివి ఉండవు. కానీ ఇంత పెద్ద టోర్నీలో ఆటగాళ్లంతా ఒకే చోట ఉన్నారు. కెమెరాలు ఉన్నాయి. ఆర్బిటర్స్‌ ప్రతీ ఒక్కరినీ చూస్తున్నారు. ఎవరో ఒకరు లోపలి నుంచే సహాయం అందిస్తే తప్ప తప్పుడు పనులు చేయడానికి చాన్స్‌ ఉండదు’ అని నకమురా వివరించాడు. యుద్ధ వాతావరణం మధ్య సైప్రస్‌లో జరుగుతున్న ఈ టోర్నీ నుంచి భద్రతా కారణాలతో భారత క్రీడాకారిణి కోనేరు హంపి తప్పుకోగా... టోర్నీ ఆరంభానికి ముందు నకమురా కూడా బహిరంగంగా తన ఆందోళనను వ్యక్తం చేశాడు.

Ticket prices at record levels at FIFA World Cup Final Match  9
రూ.10.23 లక్షలకు ఒక్క టికెట్‌

జ్యూరిక్‌: గతంలో తల తాకట్టు పెట్టి అయినా ఫుట్‌బాల్‌ వీరాభిమానులు ప్రపంచకప్‌ టికెట్లు కొని మ్యాచ్‌ల్ని ప్రత్యక్షంగా తిలకించేవారు. ఇప్పుడైతే ఏకంగా ఇల్లే తాకట్టు పెట్టాలేమో! ఎందుకంటే యావత్‌ ప్రపంచాన్నే ఫుట్‌బాల్‌ ఫీవర్‌తో ఊపేసే ‘ఫిఫా’ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్‌ ధర అక్షరాలా రూ. 10,23,212. అమెరికా కరెన్సీలో 10,990 డాలర్లు. ఈ మొత్తంతో కేవలం 90 నిమిషాల టైటిల్‌ పోరును చూస్తారు. మన దేశంలో ఈ మొత్తంతో ఏడున్నర (75 గ్రాముల) తులాల బంగారు ఆభరణాల్ని కొనేయొచ్చు. ఫుట్‌బాలా... మజాకా! త్వరలో అమెరికా, మెక్సికో, కెనడా వేదికలపై ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ సంగ్రామం జరుగనుంది. ఇందులో భాగంగా రెండో కేటగిరీ, మూడో కేటగిరీ టికెట్ల ధరల్ని ‘ఫిఫా’ ఖరారు చేసింది. మొదట గతేడాది డిసెంబర్లో ‘డ్రా’ విడుదల చేసిన సందర్భంలో తొలి దశలో 8680 డాలర్ల (రూ.8 లక్షలు) ధరతో కొన్ని టికెట్లను విక్రయించారు. టోర్నీ దగ్గర పడుతుండటంతో ఫుట్‌బాల్‌ క్రేజీ ప్రపంచకప్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో ‘ఫిఫా’ పడింది. ఇందులో భాగంగా కేటగిరీ–2 టికెట్లను తొలి దశలో 5575 డాలర్ల (రూ.5.20 లక్షలు)కు విక్రయించగా... ఇప్పుడు 7380 డాలర్ల (రూ.6.87 లక్షలు)కు పెంచేసింది. కేటగిరీ–3 టికెట్ల ధరలు అప్పుడు 4185 డాలర్లు (రూ.3.90 లక్షలు) ఉంటే... ఇప్పుడు 5785 డాలర్ల (రూ.5.38 లక్షలు)కు హెచ్చింపు చేసింది. ఈ టికెట్లను కొనేందుకు అభిమానులు ‘ఫిఫా’ వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని, సేల్‌ విండో తెరవగానే నిమిషాల్లోనే అమ్ముడయ్యే అవకాశముందని ‘ఫిఫా’ తెలిపింది. మెగా ఈవెంట్‌లో గ్రూప్‌ దశలో 72 మ్యాచ్‌లు ఉండగా... బుధవారం 17 మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లనే అందుబాటులో ఉంచింది. నాకౌట్‌ దశ పోటీల టికెట్లు పై జాబితాలో లేవు. జూన్‌ 12న పరాగ్వే–అమెరికా మధ్య జరిగే మ్యాచ్‌ కోసం ప్రీమియం ధర టికెట్లన్నీ అమ్ముడుపోగా... కేవలం 2735 డాలర్ల (రూ.2.54 లక్షల) టికెట్లు కొన్ని మిగిలున్నాయి. అయితే జూన్‌ 19న ఆ్రస్టేలియా, అమెరికా మధ్య జరిగే మ్యాచ్‌ కోసం ఒక్క టికెట్‌ కూడా లేదు. అన్ని కేటగిరీల టికెట్లన్నీ హాట్‌ కేకుల్లా అమ్మడయ్యాయి. అమెరికాలో 11 వేదికలు, మెక్సికోలో 3, కెనడాలో 2 వేదికల్లో సాకర్‌ సంగ్రామం జరుగుతుంది.

Yuvraj participated in the jersey launch of the 10 IGPL franchises10
గోల్ఫ్‌తో ఎంతో ప్రయోజనం: యువీ

న్యూఢిల్లీ: గోల్ఫ్‌ ఆడటం ద్వారా ఒత్తిడి తగ్గుతుందని భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. టీమిండియా తరఫున టి20, వన్డే ప్రపంచకప్‌లు నెగ్గిన ఈ ఆల్‌రౌండర్‌... క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత గోల్ఫ్‌పై దృష్టి పెట్టాడు. క్రికెట్‌ కెరీర్‌కు ముందే గోల్ఫ్‌ ఆడి ఉంటే ఇంకా ఎంతో ప్రయోజనం చేకూరేదని... ఇప్పటికైనా యువ ఆటగాళ్లు క్రికెట్‌తో పాటు గోల్ఫ్‌ ప్రాక్టీస్‌ చేస్తే సేద తీరడంతో పాటు ఒత్తిడి దూరమవుతుందని యువీ హితవు పలికాడు. ప్రస్తుతం యువరాజ్‌ ఇండియన్‌ గోల్ఫ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐజీపీఎల్‌)కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. గురువారం ఐజీపీఎల్‌ 10 ఫ్రాంచైజీల జెర్సీ ఆవిష్కరణలో యువరాజ్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ... ‘క్రికెటర్లు క్రికెట్‌తో పాటు గోల్ఫ్‌ కూడా ఆడాలి. నేను ముందే ఈ పని చేయాల్సింది. అది నాకు క్రికెట్‌లో చాలా సహాయపడి ఉండేది. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు చిన్నప్పటి నుంచే గోల్ఫ్‌ ఆడుతారు. కానీ మనదేశంలో గోల్ఫ్‌ను కేవలం ఉన్నత వర్గాల క్రీడగా పరిగణిస్తారు. ఈ వైఖరిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. గోల్ఫ్‌ను పాఠశాల స్థాయికి తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రతీ క్రీడను ప్రయత్నించాలని భావిస్తున్నాం.మనదేశంలో క్రికెట్‌ అతిపెద్ద ఆట అని నాకు తెలుసు. కానీ గోల్ఫ్‌ కూడా ఉత్తేజకరమైన క్రీడే. అందరూ దీన్ని ప్రయత్నించాలి. దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్‌గా ఇతర క్రీడలకు కూడా నా వంతు సాయం చేయాలనుకుంటున్నా. ఐజీపీఎల్‌ లీగ్‌ గోల్ఫ్‌కు మరింత ప్రచారం కల్పిస్తోంది. దీని ద్వారా ఈ ఆట ఎక్కువ మందికి చేరువవుతుంది. ఇప్పుడు టీవీల్లో చూసే పిల్లలు... భవిష్యత్తులో గోల్ఫ్‌ ఆడేందుకు ఉత్సాహం చూపుతారు’ అని పేర్కొన్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement