Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

ICC finds USAs T20 World Cup-bound batter guilty of match-fixing1
పాక్‌కు చుక్క‌లు చూపించిన ఆట‌గాడిపై ఐసీసీ వేటు

టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు అమెరికా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఆరోన్ జోన్స్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ICC) సస్పెన్షన్ వేటు వేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. బార్బడోస్ వేదికగా జరిగిన బిమ్ టీ10 టోర్నమెంట్‌-2024 సీజన్‌లో జోన్స్ మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాడని ఐసీసీ విచారణలో ప్రాథమికంగా తేలింది. ఈ క్రమంలోనే అతడు అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లలో ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది.తనపై వస్తున్న ఆరోపణలపై 14 రోజుల సమాధానమివ్వాలని అతడిని ఐసీసీ ఆదేశించింది. ఆరోన్ జోన్స్‌పై మొత్తం ఐదు అభియోగాలు నమోదయ్యాయి. వీటిలో మూడు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పరిధిలోకి రాగా, మిగిలిన రెండు ఐసీసీ రిజిస్ట‌ర్ చేసింది. ఈ లీగ్‌లో ఆడే స‌మ‌యంలో జోన్స్‌ను బుకీలు సంప్ర‌దించ‌గా.. అత‌డు ఆ వివరాలను అధికారులకు తెలియ‌జేయ‌లేదు. ఈ కార‌ణంతో ఐసీసీ వేటు వేసింది. అమెరికా జ‌ట్టులో జోన్స్ రెగ్యూల‌ర్ స‌భ్యునిగా కొన‌సాగుతున్నాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో అమెరికా సూప‌ర్‌-8 చేర‌డంలో ఆరోన్‌ది కీల‌క పాత్ర‌. ముఖ్యంగా పాకిస్తాన్‌పై అమెరికా సాధించిన చారిత్రాత్మక విజయంలో అత‌డి ఇన్నింగ్స్ మరువలేనిది.అటువంటి ఆట‌గాడు ఇప్పుడు త‌నంతంట తానే కెరీర్‌ను ప్రమాదంలో ప‌డేసుకున్నాడు. ఈ సస్పెన్షన్ కారణంగా రాబోయే 2026 టీ20 ప్రపంచ కప్‌లో జోన్స్ ఆడే అవకాశం కోల్పోయాడు. జోన్స్ ఇప్ప‌టివ‌ర‌కు అమెరికా త‌ర‌పున 52 వన్డేలు, 48 టీ20లు ఆడాడు.చదవండి: ఓడినా పర్లేదు.. మా ప్లాన్ అదే: సూర్యకుమార్‌

Suryakumar Yadav explains why India batted second in IND vs NZ 4th T202
ఓడినా పర్లేదు.. మా ప్లాన్ అదే: సూర్యకుమార్‌

టీ20ల్లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న టీమిండియాకు న్యూజిలాండ్ ఓట‌మి రుచిని చూపించింది. బుధ‌వారం వైజాగ్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టీ20లో 50 ప‌రుగుల తేడాతో భార‌త్ ప‌రాజ‌యం పాలైంది. 216 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించ‌లేక మెన్ ఇన్ బ్లూ చ‌తిక‌ల ప‌డింది.కివీస్ బౌలర్ల దాటికి భార‌త్ 18.4 ఓవ‌ర్ల‌లో 165 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. శివమ్‌ దూబే(23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65), రింకూ సింగ్‌(39) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. బ్లాక్‌క్యాప్స్ బౌలర్లలో మిచెల్‌ శాంట్నర్‌ మూడు, డఫీ, సోధి రెండు వికెట్లు సాధించారు.అతడితో పాటు మాట్‌ హెన్రీ, ఫౌల్క్స్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 215 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక ఈ ఓట‌మిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ స్పందించాడు."ఈ మ్యాచ్‌లో కావాలనే ఆరుగురు బ్యాటర్లతో బరిలోకి దిగాం. ఐదుగురు పూర్తి స్ధాయి బౌలర్లతో ఆడాలని నిర్ణయించుకున్నాము. 180 ప్లస్ టార్గెట్‌ను చేసేటప్పుడు ఆరంభంలోనే రెండు మూడు వికెట్లు కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుంది? మిగిలిన ఆటగాళ్లు బాధ్యతను ఎలా తీసుకుంటారో పరీక్షించాలనుకున్నాము.ప్రపంచ కప్ జట్టులో భాగమైన ఆటగాళ్లందరికి ఈ సిరీస్‌లో అవకాశమివ్వాలనుకున్నాం.మేము మొదట బ్యాటింగ్ చేసినప్పుడు బాగానే ఆడుతున్నాం. కానీ ఛేజింగ్‌లో వికెట్లు పడితే మా ఆటగాళ్లు బాధ్యతను ఎలా స్వీకరిస్తారో చూడాలనుకున్నాము. మాకు మేమే ఛాలెంజ్ చేసుకున్నాము. అందుకే తొలుత బౌలింగ్ ఎంచుకున్నా. వచ్చే మ్యాచ్‌లో అవకాశం వస్తే మళ్లీ ఛేజింగ్ చేయడానికే ఇష్టపడతాం. ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా శివమ్ దూబే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి తోడుగా మరొక బ్యాటర్ క్రీజులో నిలబడి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.కాగా ఈ మ్యాచ్‌లో భారత్ ఒక బ్యాటర్‌ తక్కువగా బరిలోకి దిగింది. ఇషాన్ కిషన్‌కు విశ్రాంతి ఇచ్చి పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులో తీసుకున్నారు. అయితే ఈ ప్రయోగం ఆఖరికి బెడిసికొట్టింది.చదవండి: హార్దిక్, అర్ష్ దీప్‌ కీలకం: రోహిత్‌

Rohit Sharma on T20 World Cup Indian team 3
హార్దిక్, అర్ష్ దీప్‌ కీలకం: రోహిత్‌

న్యూఢిల్లీ: భారత జట్టు టి20 వరల్డ్‌ కప్‌ నిలబెట్టుకోవాలంటే అర్ష్ దీప్‌ సింగ్, హార్దిక్‌ పాండ్యాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని జట్టు మాజీ కెప్టెన్, బ్యాటర్‌ రోహిత్‌ శర్మ అభిప్రాయపడ్డాడు. కొత్త బంతితో అర్ష్ దీప్‌ చాలా ప్రమాదకారి అని, మిడిలార్డర్‌లో పాండ్యా బలమైన బ్యాటింగ్‌ జట్టుకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుందని రోహిత్‌ అన్నాడు. రోహిత్‌ నాయకత్వంలోనే 2024లో టీమిండియా వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచింది. ‘కొత్త, పాత బంతులను ఒకే తరహాలో స్వింగ్‌ చేయడం అర్ష్ దీప్‌ ప్రత్యేక బలం కాగా రెండు సందర్భాల్లోనూ వికెట్లు పడగొట్టగలడు. 2024 ఫైనల్లో అతను చాలా బాగా బౌలింగ్‌ చేసాడు. ఆరంభంలో డికాక్‌ వికెట్‌ తీసిన అర్ష్ దీప్‌ 19వ ఓవర్లో తక్కువ పరుగులు ఇవ్వడం విజయానికి బాటలు వేసింది. ఈసారీ అదే జరుగుతుంది. జట్టులో పాండ్యా కూడా ఆల్‌రౌండర్‌గా ఎంతో విలువైన ఆటగాడు. బ్యాటింగ్‌ చివరి నాలుగు ఓవర్లలో 50 పరుగులు రాబట్టగలడు. అవసరమైతే 50/4 స్కోరు నుంచి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టగలడు. పైగా ఏ దశలోనైనా బౌలింగ్‌ చేయగల సామర్థ్యం కూడా అతని సొంతం’ అని రోహిత్‌ ప్రశంసించాడు.

Iga Swiatek suffers another disappointment at the Australian Open4
స్వియాటెక్‌ అవుట్‌

మెల్‌బోర్న్‌: అందని ద్రాక్షగా ఉన్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను సాధించి ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ ఘనత సాధించాలని ఆశించిన పోలాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ ఇగా స్వియాటెక్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీగా జరిగే ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో ఎనిమిదోసారి బరిలోకి దిగిన స్వియాటెక్‌ ఈసారి క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని దాటలేకపోయింది. కజకిస్తాన్‌ స్టార్, ప్రపంచ ఐదో ర్యాంకర్‌ ఎలెనా రిబాకినా 7–5, 6–1తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ స్వియాటెక్‌ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో రిబాకినా చేతిలో స్వియాటెక్‌ ఓడిపోవడం ఇది రెండోసారి. 2023లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రిబాకినా 6–4, 6–4తో స్వియాటెక్‌ను ఓడించింది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో స్వియాటెక్‌పై రెండుసార్లు నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా రిబాకినా నిలిచింది. స్వియాటెక్‌తో 95 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో రిబాకినా 11 ఏస్‌లు సంధించింది. మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తొలి సర్వీస్‌లో 29 పాయింట్లకు 23 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 30 పాయింట్లకు 17 పాయింట్లు సంపాదించింది. 26 విన్నర్స్‌ కొట్టిన 2023 రన్నరప్‌... 19 అనవసర తప్పిదాలు చేసింది. నెట్‌ వద్దకు ఏడుసార్లు దూసుకొచ్చి ఆరుసార్లు పాయింట్లు గెలిచిన రిబాకినా తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, స్వియాటెక్‌ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. మరోవైపు స్వియాటెక్‌ 10 విన్నర్స్‌ కొట్టి, 25 అనవసర తప్పిదాలు చేసింది. 24 ఏళ్ల స్వియాటెక్‌ నాలుగుసార్లు (2020, 2022, 2023, 2024) ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను... ఒకసారి (2025) వింబుల్డన్‌ టైటిల్‌ను...ఒకసారి (2022) యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను సాధించింది. వచ్చే ఏడాది స్వియాటెక్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను సాధిస్తే... మరియా షరపోవా (2012లో) తర్వాత ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ పూర్తి చేసుకున్న రెండో క్రీడాకారిణిగా... ఓవరాల్‌గా 11వ క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. అనిసిమోవా నిష్క్రమణ గత ఏడాది వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అనిసిమోవా (అమెరికా) ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మాత్రం అద్భుతం చేయలేకపోయింది. అమెరికాకే చెందిన ఆరో సీడ్‌ జెస్సికా పెగూలాతో జరిగిన మ్యాచ్‌లో అనిసిమోవా 2–6, 6–7 (1/7)తో ఓడిపోయింది. అనిసిమోవాపై గెలుపుతో పెగూలా తన కెరీర్‌లో తొలిసారి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో పెగూలా ఆరు ఏస్‌లు సంధించింది. మరోవైపు అనిసిమోవా ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. అనిసిమోవా 18 విన్నర్స్‌తో పోలిస్తే 20 విన్నర్స్‌ కొట్టిన పెగూలా 21 అనవసర తప్పిదాలు చేసింది. అనిసిమోవా 44 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. నాలుగుసార్లు అనిసిమోవా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన పెగూలా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది.నేటి మహిళల సెమీఫైనల్స్‌సబలెంకా x స్వితోలినా పెగూలా x రిబాకినా మధ్యాహ్నం 2 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారంజొకోవిచ్‌ను గట్టెక్కించిన ముసెట్టి గాయంపురుషుల సింగిల్స్‌ విభాగంలో 10 సార్లు చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా), డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో జొకోవిచ్‌కు ప్రత్యర్థి లొరెంజో ముసెట్టి (ఇటలీ) గాయం గట్టెక్కించగా... సినెర్‌ 6–3, 6–4, 6–4తో ఎనిమిదో సీడ్‌ బెన్‌ షెల్టన్‌ (అమెరికా)పై విజయం సాధించాడు. ముసెట్టితో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్‌ తొలి రెండు సెట్‌లను 4–6, 3–6తో కోల్పోయాడు. మూడో సెట్‌లో మాత్రం 3–1తో ఆధిక్యంలో ఉన్నాడు. ఈ దశలో ముసెట్టి కాలికి గాయం కావడంతో అతను వైదొలిగాడు. దాంతో ఓడిపోయే అవకాశాలున్న చోట జొకోవిచ్‌ అదృష్టవశాత్తూ విజయతీరానికి చేరాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో జ్వెరెవ్‌ (జర్మనీ)తో అల్‌కరాజ్‌; సినెర్‌తో జొకోవిచ్‌ తలపడతారు. 1 ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో తొలి రెండు సెట్‌లు గెలిచి, ఆ తర్వాత గాయం కారణంగా వైదొలిగిన తొలి ప్లేయర్‌గా లొరెంజో ముసెట్టి నిలిచాడు.5 ఓపెన్‌ శకంలో (1968 నుంచి) వరుసగా ఆరు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో సెమీఫైనల్‌కు చేరిన ఐదో ప్లేయర్‌గా సినెర్‌ గుర్తింపు పొందాడు. గతంలో ఇవాన్‌ లెండిల్, ఫెడరర్, జొకోవిచ్, నాదల్‌ ఈ ఘనత సాధించారు.6 ఓపెన్‌ శకంలో (1968 నుంచి) ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో వరుసగా నాలుగుసార్లు సెమీఫైనల్‌కు చేరిన ఆరో ప్లేయర్‌గా జొకోవిచ్‌ నిలిచాడు. గతంలో గిలెర్మో విలాస్, ఇవాన్‌ లెండిల్, స్టీఫెన్‌ ఎడ్బర్గ్, ఫెడరర్, ఆండీ ముర్రే ఈ ఘనత సాధించారు.103 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా జొకోవిచ్‌ రికార్డు నెలకొల్పాడు. 102విజయాలతో ఫెడరర్‌ పేరిట ఉన్న రికార్డునుజొకోవిచ్‌ బద్దలు కొట్టాడు.2 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌ చేరిన రెండో అతిపెద్ద వయసు్కడిగా జొకోవిచ్‌ (38 ఏళ్ల 241 రోజులు) గుర్తింపు పొందాడు. కెన్‌ రోజ్‌వాల్‌ (1977లో; 42 ఏళ్ల 60 రోజులు) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

Andhras last match against Nagaland from today in Ranji Trophy5
నాకౌట్‌ బెర్త్‌ లక్ష్యంగా...

న్యూఢిల్లీ: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో చివరి దశ పోటీలకు రంగం సిద్ధమైంది. నాకౌట్‌ దశకు ముందు జరగనున్న చివరి గ్రూప్‌ మ్యాచ్‌లు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రూప్‌ ‘ఎ’లో నాగాలాండ్‌ జట్టుతో ఆంధ్ర తలపడనుంది. గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి ఫుల్‌ జోష్‌లో ఉన్న రికీ భుయ్‌ సారథ్యంలోని ఆంధ్ర జట్టు... ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా నాకౌట్‌ దశకు అర్హత సాధించనుంది. నాగాలాండ్‌లోని సోవిమా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో సత్తా చాటాలని ఆంధ్ర జట్టు భావిస్తోంది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భపై చక్కటి విజయం సాధించిన ఆంధ్ర జట్టు ప్రస్తుతం 28 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. జార్ఖండ్, విదర్భ చెరో 25 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కెప్టెన్‌ రికీ భుయ్‌తో పాటు శ్రీకర్‌ భరత్, షేక్‌ రషీద్, టీమిండియా పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అభిషేక్‌ రెడ్డి, కరణ్‌ షిండేలతో ఆంధ్ర జట్టు బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉంది. ఈ సీజన్‌లో ఏ ఒక్కరి ప్రతిభ మీదో ఆధారపడకుండా... ఆంధ్ర జట్టు సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లోనూ అదే మంత్రం జపించాలని చూస్తోంది. బౌలింగ్‌లో విజయ్, సాయితేజ, సౌరభ్‌ కుమార్, కేఎస్‌ఎన్‌ రాజు, శశికాంత్‌ కీలకం కానున్నారు. మరోవైపు తాజా సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఆరింట ఓడి... ఒక మ్యాచ్‌ ‘డ్రా’ చేసుకొని ఒకే పాయింట్‌తో పట్టిక అట్టడుగున ఉన్న నాగాలాండ్‌ జట్టు... ఆంధ్ర టీమ్‌కు ఏమేరకు పోటీనిస్తుందో చూడాలి. ఛత్తీస్‌గఢ్‌తో హైదరాబాద్‌ ‘ఢీ’ మరోవైపు గ్రూప్‌ ‘డి’లో పడుతూ లేస్తూ సాగుతున్న హైదరాబాద్‌ జట్టు తమ చివరి మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌తో తలపడనుంది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ నాకౌట్‌కు దూరమైంది. రెగ్యులర్‌ కెప్టెన్ తిలక్‌ వర్మ అందుబాటులో లేకపోగా... టీమిండియా పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. బ్యాటింగ్‌లో అభిరత్‌ రెడ్డి, అమన్‌ రావు, రాహుల్‌ సింగ్, హిమతేజ, రాహుల్‌ రాధేశ్, రోహిత్‌ రాయుడు, నితీశ్‌ రెడ్డి చామా మిలింద్‌ కలిసికట్టుగా రాణించాల్సిన అవసరముంది. బౌలింగ్‌ సిరాజ్‌తో పాటు రక్షణ్‌ రెడ్డి, నితిన్‌ సాయి యాదవ్‌ కీలకం కానున్నారు. ఇతర కీలక మ్యాచ్‌ల్లో ఒడిశాతో జార్ఖండ్‌... ఉత్తరప్రదేశ్‌తో విదర్భ... బరోడాతో తమిళనాడు... మధ్యప్రదేశ్‌తో మహారాష్ట్ర... పంజాబ్‌తో కర్ణాటక... ముంబైతో ఢిల్లీ తలపడనున్నాయి.

Last chance for Bangalore to reach the final6
బెంగళూరు ఫైనల్‌ చేరేందుకు ఆఖరి అవకాశం

వడోదర: ఇరవై రోజులుగా జరుగుతున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ‘ప్లేఆఫ్స్‌’ రేస్‌ మజిలీకి చేరింది. ఐదు జట్లలో ఒక్క రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) మాత్రమే ప్లేఆఫ్స్‌కు అర్హత సంపాదించింది. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి పది రోజుల క్రితమే అందలమెక్కిన ఆర్‌సీబీ... నేరుగా ఫైనల్‌ చేరే అవకాశాన్ని మాత్రం అందిపుచ్చుకునేందుకు ఆపసోపాలు పడుతోంది. ఇటీవల ఢిల్లీ, ముంబై జట్లతో జరిగిన వరుస మ్యాచ్‌ల్లో బెంగళూరు ఓడింది. ఇప్పుడు ఆర్‌సీబీకి మిగిలింది ఆఖరి మ్యాచ్‌. గురువారం యూపీ వారియర్స్‌తో జరిగే ఈ పోరులో గెలిస్తే లీగ్‌ నిబంధనల ప్రకారం ‘టాప్‌’లో నిలిచి ఆర్‌సీబీ టీమ్‌ నేరుగా టైటిల్‌ వేటలో నిలుస్తుంది. అలాగని ఓడితే అగ్రస్థానం ఉన్నపళంగా చేజారదు. ఎందుకంటే పట్టికలో బెంగళూరు సరసన 10 పాయింట్లు నెగ్గే అర్హత ఒక్క గుజరాత్‌ జెయింట్స్‌కే ఉంది. కానీ ఈ జట్టు రన్‌రేట్‌లో చాలా వెనుకబడి ఉంది. ఇక ప్రస్తుత మ్యాచ్‌ యూపీ వారియర్స్‌కే అత్యంత కీలకం. ఇందులో ఓడిపోతే ఇంకో మ్యాచ్‌ ఉన్నప్పటికీ యూపీ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. రాత్రి 7:30 గంటల నుంచి ‘స్టార్‌స్పోర్ట్స్‌ , ‘జియో హాట్‌స్టార్‌’లో ప్రత్యక్ష ప్రసారం

IND Vs NZ: India Lost Fourth T20 By 50 Runs7
IND Vs NZ: నాలుగోది చేజారె...

టి20 సిరీస్‌లో వరుసగా మూడు అద్భుత ప్రదర్శనల తర్వాత భారత జట్టు విశాఖ తీరంలో న్యూజిలాండ్‌ ముందు తలవంచింది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి బంతికే అభిషేక్‌ శర్మ అవుట్‌తో మొదలైన ఇన్నింగ్స్‌ చివరకు ఓటమితో ముగిసింది. 15 బంతుల అర్ధ సెంచరీతో శివమ్‌ దూబే పోరాడినా... దురదృష్టవశాత్తూ అతని నిష్క్రమణతో ఓటమి ఖాయమైంది. సీఫెర్ట్, కాన్వే, సాంట్నర్‌ల మెరుగైన ప్రదర్శనతో ఎట్టకేలకు సిరీస్‌లో తొలి గెలుపుతో కివీస్‌కు కాస్త ఊరట దక్కింది. సాక్షి, విశాఖపట్నం: న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లో టీమిండియాకు తొలి పరాజయం ఎదురైంది. సిరీస్‌ గెలుచుకున్న తర్వాత బుధవారం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో కివీస్‌ 50 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. టిమ్‌ సీఫెర్ట్‌ (36 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), డెవాన్‌ కాన్వే (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 50 బంతుల్లోనే 100 పరుగులు జోడించగా... చివర్లో డరైల్‌ మిచెల్‌ (18 బంతుల్లో 39 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిని ప్రదర్శించాడు. అనంతరం భారత్‌ 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. శివమ్‌ దూబే (23 బంతుల్లో 65; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. రింకూ సింగ్‌ (39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. సిరీస్‌లో భారత్‌ 3–1తో ఆధిక్యంలో ఉండగా, చివరి పోరు శనివారం తిరువనంతపురంలో జరుగుతుంది. ఓపెనర్ల దూకుడు... అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి కివీస్‌ ఇన్నింగ్స్‌ను జోరుగా మొదలు పెట్టిన సీఫెర్ట్‌... హర్షిత్‌ వేసిన తర్వాతి ఓవర్లో సిక్స్, ఫోర్‌ బాదాడు. అతడి మరుసటి ఓవర్లో కూడా ఓపెనర్లిద్దరు కలిసి 15 పరుగులు రాబట్టగా... రవి బిష్ణోయ్‌ తొలి ఓవర్లో కాన్వే 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 71 పరుగులకు చేరింది. 25 బంతుల్లో సీఫెర్ట్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే శతక భాగస్వామ్యం తర్వాత కివీస్‌ 35 బంతుల వ్యవధిలో 37 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కొంత దూకుడుగా ఆడగా, చివరి 3 ఓవర్లలో 47 పరుగులు రాబట్టి న్యూజిలాండ్‌ మెరుగైన స్కోరును అందుకుంది. బుమ్రా వేసిన 19వ ఓవర్లో మిచెల్, హెన్రీ (6 నాటౌట్‌) కలిసి 2 ఫోర్లు, సిక్స్‌ సహా మొత్తం 19 పరుగులు సాధించారు. దూబే సిక్సర్ల జోరు... భారీ లక్ష్య ఛేదనలో అభిషేక్‌ శర్మ (0) ఇన్నింగ్స్‌ తొలి బంతికే వెనుదిరగ్గా... కెపె్టన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (8) కూడా విఫలమయ్యాడు. సామ్సన్‌ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా భారీ స్కోరు చేయడంలో మళ్లీ విఫలం కాగా, హార్దిక్‌ పాండ్యా (2) ప్రభావం చూపలేదు. వరుసగా రెండు సిక్సర్లతో తన స్కోరును మొదలు పెట్టిన రింకూ ఆ తర్వాతా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. రింకూ అవుటైన తర్వాత దూబే మెరుపు షాట్లతో జట్టు విజయంపై ఆశలు రేపాడు. తొలి బంతికే సిక్స్‌తో ఖాతా తెరిచిన దూబే... సోధి ఓవర్లో వరుసగా 2, 4, (వైడ్‌), 6, 4, 6, 6 బాదడంతో మొత్తం 29 పరుగులు లభించాయి. డఫీ వేసిన తర్వాతి ఓవర్లో కూడా అతను మరో 2 సిక్స్‌లు కొట్టి 15 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ అతను రనౌటయ్యాడు. 31 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిన స్థితిలో హర్షిత్‌ కొట్టిన షాట్‌ బౌలర్‌ హెన్రీ చేతికి తగిలి నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌లో స్టంప్స్‌కు తగిలింది. దాంతో దూబే అవుట్‌ కావడంతో పాటు భారత్‌ గెలుపు ఆశలు ముగిశాయి. 4 రెండేళ్ల క్రితం టి20 ప్రపంచకప్‌ సాధించిన తర్వాత భారత జట్టు 40 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది. కేవలం నాలుగుసార్లు మాత్రమే టీమిండియా ఆలౌటైంది. భారత్‌ను ఆలౌట్‌ చేసిన జట్లలో జింబాబ్వే, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ ఉన్నాయి. 2 అంతర్జాతీయ టి20ల్లో ‘గోల్డెన్‌ డక్‌’గా వెనుదిరగడం అభిషేక్‌ శర్మకిది రెండోసారి. ఈ భారత క్రికెటర్ల జాబితాలో రోహిత్‌ శర్మ (3 సార్లు) తొలి స్థానంలో ఉన్నాడు. కేఎల్‌ రాహుల్, సంజు సామ్సన్, అభిషేక్‌ శర్మ (2 సార్లు చొప్పున) ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు.3 అంతర్జాతీయ టి20ల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన మూడో భారతీయ బ్యాటర్‌గా శివమ్‌ దూబే (15 బంతుల్లో) నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో యువరాజ్‌ సింగ్‌ (12 బంతుల్లో), అభిషేక్‌ శర్మ (14 బంతుల్లో) ఉన్నారు.4 రింకూ సింగ్‌ ఈ మ్యాచ్‌లో ఫీల్డర్‌గా 4 క్యాచ్‌లు అందుకొని భారత్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన అజింక్య రహానే రికార్డు (4)ను సమం చేశాడు.స్కోరు వివరాలు న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (సి) రింకూ (బి) కుల్దీప్‌ 44; సీఫెర్ట్‌ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 62; రచిన్‌ (సి అండ్‌ బి) బుమ్రా 2; ఫిలిప్స్‌ (సి) రింకూ (బి) కుల్దీప్‌ 24; చాప్‌మన్‌ (సి) హర్షిత్‌ (బి) బిష్ణోయ్‌ 9; మిచెల్‌ (నాటౌట్‌) 39; సాంట్నర్‌ (రనౌట్‌) 11; ఫోక్స్‌ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 13; హెన్రీ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–100, 2–103, 3–126, 4–137, 5–152, 6–163, 7–182. బౌలింగ్‌: అర్ష్ దీప్ 4–0–33–2, హర్షిత్‌ 4–0–54–0, బుమ్రా 4–0–38–1, రవి బిష్ణోయ్‌ 4–0–49–1, కుల్దీప్‌ యాదవ్‌ 4–0–39–2. భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (సి) కాన్వే (బి) హెన్రీ 0; సామ్సన్‌ (బి) సాంట్నర్‌ 24; సూర్యకుమార్‌ (సి అండ్‌ బి) డఫీ 8; రింకూ (ఎల్బీ) (బి) ఫోక్స్‌ 39; పాండ్యా (సి) ఫోక్స్‌ (బి) సాంట్నర్‌ 2; దూబే (రనౌట్‌) 65; హర్షిత్‌ (సి) రచిన్‌ (బి) సోధి 9; రవి బిష్ణోయ్‌ (నాటౌట్‌) 10; అర్ష్ దీప్ (సి) సాంట్నర్‌ (బి) సోధి 0; బుమ్రా (సి) సోధి (బి) సాంట్నర్‌ 4; కుల్దీప్‌ (సి) సీఫెర్ట్‌ (బి) డఫీ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్‌) 165. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–55, 4–63, 5–82, 6–145, 7–157, 8–157, 9–162, 10–165. బౌలింగ్‌: హెన్రీ 3–0–24–1, డఫీ 3.4–0– 33–2, ఫోక్స్‌ 3–0–29–1, సోధి 4–0–46–2, సాంట్నర్‌ 4–0–26–3, ఫిలిప్స్‌ 1–0–7–0.

Ben Stokes appointed England team coach8
ఇంగ్లండ్‌ కోచ్‌గా బెన్‌ స్టోక్స్‌

ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ, ఇంగ్లండ్‌-ఏ జట్టు (ఇంగ్లండ్‌ లయన్స్‌) కోచ్‌గా మారాడు. అతనితో పాటు మరో ఇంగ్లండ్‌ ఆటగాడు మొయిన్‌ అలీ కూడా లయన్స్‌ కోచింగ్‌ టీమ్‌లో చేరాడు. వచ్చే నెలలో పాకిస్తాన్-ఏతో (పాకిస్తాన్‌ షాహీన్స్‌) జరుగబోయే వైట్ బాల్ సిరీస్ కోసం ఈ ఇద్దరూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. యువ ఆటగాళ్లకు మెళకువలు నేర్పించడం ​కోసం స్టోక్స్‌-మొయిన్‌ కోచ్‌ అవతరామెత్తారు. లయన్స్‌ తమ చివరి యూత్‌ టీ20ని 2018లో.. చివరి యూత్‌ వన్డేను 2023లో ఆడింది. లయన్స్‌లో ఈ గ్యాప్‌ను కవర్‌ చేసేందుకే స్టోక్స్‌-మొయిన్‌ కోచింగ్‌ బాట పట్టారు. వీరిద్దరు ఇంగ్లండ్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో కలిసి లయన్స్‌ కోచింగ్‌ బృందంలో పని చేస్తారు. స్టోక్స్‌-ఫ్లింటాఫ్‌ గత ఎడిషన్‌ హండ్రెడ్‌ లీగ్‌లో కూడా కలిసి పని చేశారు. స్టోక్స్‌ నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఫ్లింటాఫ్‌ ఆ ఫ్రాంచైజీకి మెంటార్‌గా పని చేశాడు.ఇటీవల యాషెస్‌ సిరీస్‌ చివరి టెస్ట్‌ సందర్భంగా గాయపడిన స్టోక్స్‌ ఈ కోచింగ్‌ అనుభవాన్ని రిహాబ్‌గా ఉపయోగించుకుంటాడు. మొయిన్‌ విషయానికొస్తే.. ఇతను తాజాగా తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని, దేశవాలీ టీ20 టోర్నీ టీ20 బ్లాస్ట్‌లో ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు యార్క్‌షైర్‌ టీమ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఆటగాడిగా కెరీర్‌ చరమాంకంలో ఉన్న మొయిన్‌ ఈ కోచింగ్‌ అనుభవాన్ని తన కోచింగ్‌ కెరీర్‌కు పునాదిగా మలుచుకోనున్నాడు. పాకిస్తాన్‌-ఏ సిరీస్‌కు స్టోక్స్‌, మొయిన్‌తో పాటు మరికొంతమంది మాజీలు కూడా కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. వీరి కోచింగ్‌ బృందంలో నీల్‌ మెక్‌కెంజీ, సారా టేలర్‌, నీల్‌ కిల్లెన్‌, అమర్‌ రషీద్‌, ట్రాయ్‌ కూలీ ఉన్నారు.ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టు యూఏఈ వేదికగా పాక్‌-ఏతో మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది. స్టోక్స్‌, మొయిన్‌కు యూఏఈలో ఆడిన అనుభవం​ ఉండటం​ కూడా వారిని కోచ్‌లుగా ఎంపిక చేసేలా చేసింది. ఈ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టుకు జోర్డన్‌ కాక్స్‌ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో జేమ్స్‌ కోల్స్‌, సాకిబ్‌ మహమూద్‌ లాంటి టీ20 స్పెషలిస్ట్‌లు ఉన్నారు.ఇంగ్లండ్ లయన్స్ టీ20 జట్టు: సోనీ బేకర్, లూక్ బెంకెన్‌స్టెయిన్, జేమ్స్ కోల్స్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్ (కెప్టెన్), స్కాట్ క్యూరీ, కాల్విన్ హారిసన్, ఎడ్డీ జాక్, సాకిబ్ మహమూద్, బెన్ మెకిన్నీ, టామ్ మూర్స్, డాన్ మౌస్లీ, మాట్ రెవిస్, విల్ స్మీడ్, నాథన్ సౌటర్, మిచెల్ స్టాన్లీ, ఆసా ట్రైబ్వన్డే జట్టు: సోనీ బేకర్, లూక్ బెంకెన్‌స్టెయిన్, జేమ్స్ కోల్స్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, స్కాట్ క్యూరీ, కాల్విన్ హారిసన్, ఎడ్డీ జాక్, బెన్ మెకిన్నీ, డాన్ మౌస్లీ (కెప్టెన్), లియామ్ ప్యాటర్సన్-వైట్, మాథ్యూ పాట్స్, మాట్ రెవిస్, జేమ్స్ రెవ్, మిచెల్ స్టాన్లీ, ఆసా ట్రైబ్, జేమ్స్ వార్టన్.

tim seifert slams blasting 50, New zealand set huge target to team india in 4th T20I9
నాలుగో టీ20లో న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌

వైజాగ్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు టిమ్‌ సీఫర్ట్‌ (36 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), డెవాన్‌ కాన్వే (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మధ్యలో గ్లెన్‌ ఫిలిప్స్‌ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్‌), ఆఖర్లో డారిల్‌ మిచెల్‌ (18 బంతుల్లో 39 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.సీఫర్ట్‌, కాన్వే ధాటి​కి న్యూజిలాండ్‌ 8.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును తాకింది. సీఫర్ట్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం​ 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి, టీ20ల్లో భారత్‌పై ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన న్యూజిలాండ్‌ ఆటగాడిగా రాస్‌ టేలర్‌, కేన్‌ విలియమ్సన్‌ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో కాన్వే కూడా జోరును ప్రదర్శించాడు. పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదాడు.వీరిద్దరు ఔటైన తర్వాత న్యూజిలాండ్‌ మధ్యలో కాస్త తడబడింది. రచిన్‌ రవీంద్ర (2), మార్క్‌ చాప్‌మన్‌ (9) త్వరితగతిన ఔటయ్యారు. ఈ మధ్యలో గ్లెన్‌ ఫిలిప్స్‌ ఓ మోస్తరు మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో డారిల్‌ మిచెల్‌ బ్యాట్‌ ఝులిపించడంతో న్యూజిలాండ్‌ 200 పరుగుల మార్కును దాటింది. సాంట్నర్‌ (11), ఫౌల్క్స్‌ (13) వేగంగా పరుగులు సాధించే క్రమంలో ఔటయ్యారు. సాంట్నర్‌ను హార్దిక్‌ పాండ్యా అద్భుతమైన డైరెక్ట్‌ త్రోతో రనౌట్‌ చేశాడు. మిచెల్‌తో పాటు మ్యాట్‌ హెన్రీ (6) అజేయంగా నిలిచాడు.భారత బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ (4-0-33-2), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-39-2), బుమ్రా (4-0-38-1) కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేసి వికెట్లు తీయగా.. హర్షిత్‌ రాణా (4-0-54-0), రవి బిష్ణోయ్‌ (4-0-49-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం​ లేకుండానే 3-0తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

Bangladesh get a spot in T20 World Cup 202610
ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్‌.. మరో జట్టుగా..!

జూన్‌ 12 నుంచి ఇంగ్లండ్ మరియు వేల్స్‌ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026కు బంగ్లాదేశ్ అర్హత సాధించింది. నేపాల్‌లో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో (ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌) థాయ్‌లాండ్‌పై 39 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా ప్రపంచకప్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.మరోవైపు నెదర్లాండ్స్‌ జట్టు తొలిసారి మహిళల టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. గ్రూప్‌ దశలో స్కాట్లాండ్, థాయ్‌లాండ్, నేపాల్, జింబాబ్వేపై వరుస విజయాలు సాధించి సూపర్ సిక్స్‌లోకి ప్రవేశించిన నెదర్లాండ్స్‌.. టాప్‌-4లో (సూపర్‌ సిక్స్‌లో) బంగ్లాదేశ్‌ తర్వాత రెండో స్థానంలో నిలిచి ప్రపంచకప్‌ బెర్త్‌ కన్ఫర్మ్‌ చేసుకుంది.ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటుండగా.. సూపర్‌-6 దశలో టాప్‌-4లో నిలిచే జట్లు ప్రపంచకప్‌ బెర్త్‌లను దక్కించుకుంటాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ వరల్డ్‌కప్‌ టికెట్‌ను కన్ఫర్మ్‌ చేసుకోగా.. మిగతా రెండు బెర్త్‌ల కోసం పోటీలు జరుగనున్నాయి. ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, భారత్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, పాకిస్తాన్‌, శ్రీలంక నేరుగా అర్హత సాధించాయి.కాగా, జూన్‌ 12న బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 మొదలవుతుంది. ఈ టోర్నీలో జూన్‌ 14న భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుంది. చివరిగా జరిగిన 2024 ఎడిషన్‌లో న్యూజిలాండ్‌ విజేతగా నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు ఇదే తొలి టైటిల్‌. ఆ ఎడిషన్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ సౌతాఫ్రికాను ఓడించి, జగజ్జేతగా అవతరించింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement