Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL 2026: Shardul Thakur becomes the First Impact Player to go unused1
చరిత్ర సృష్టించిన శార్దూల్‌ ఠాకూర్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగి బ్యాటింగ్‌ కానీ, బౌలింగ్‌ కాని చేయలేదు. ఐపీఎల్‌ చరిత్రలో ఇలా జరగడం​ ఇదే మొదటిసారి.ఈ చారిత్రక ఘటనలో పాత్రధారుడు ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌. 2026 ఎడిషన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 29) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్‌ ముంబై బౌలింగ్‌ సమయంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగి ఒక్క బంతి కూడా వేయలేదు.244 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ముంబై సారధి హార్దిక్‌ పాండ్యా ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ సమయంలో శార్దూల్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా (బౌలర్‌) తీసుకున్నాడు. అయితే మ్యాచ్‌ పూర్తయ్యే వరకు హార్దిక్‌ శార్దూల్‌తో ఒక్క బంతి కూడా వేయించకపోవడం​ తీవ్ర చర్చకు దారి తీసింది.ఐపీఎల్ చరిత్రలో ఇంపాక్ట్ సబ్‌గా వచ్చి, ఏ విభాగంలోనూ పాల్గొనని తొలి ఆటగాడిగా శార్దూల్‌ చరిత్ర సృష్టించాడు. ఈ చారిత్రక తప్పిదం చేసినందుకు హార్దిక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్‌ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న వేల, ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా శార్దూల్‌ను బరిలోకి దించి బౌలింగ్‌ చేయించకపోవడమేంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.ఈ అంశాన్ని వూహ్యాత్మక తప్పిదంగా విశ్లేషిస్తూ హార్దిక్‌పై మండిపడుతున్నారు. ముంబై బ్యాటింగ్ కోచ్ పోలార్డ్‌ కూడా ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "శార్దూల్‌తో ఒక్క ఓవర్ కూడా వేయించలేదు.. నేను వెళ్లి కారణం అడుగుతాను" అంటూ వ్యాఖ్యానించాడు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 244 పరుగుల భారీ స్కోర్‌ను కూడా కాపాడుకోలేక చేతులెత్తేసింది. సన్‌రైజర్స్‌ బ్యాటర్లు ప్రతి ముంబై బౌలర్‌ను చీల్చిచెండాడి పరుగులు పిండుకున్నారు. ఫలితంగా సన్‌రైజర్స్‌ 244 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలుండగానే ఊదేసింది.ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్‌ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.

Faf du Plessis, heinrich Klaasen and Jonty Rhodes Becomes Franchise Owners in ETPL2
ఫ్రాంచైజీ యజమానిగా మారిన క్లాసెన్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విధ్వంసకర బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ ఆటకు వీడ్కోలు పలకకుండానే బిజినెస్‌మ్యాన్‌గా మారాడు. తన దేశానికే చెందిన స్టార్‌ క్రికెటర్లు ఫాఫ్‌ డుప్లెసిస్‌, జాంటీ రోడ్స్‌తో కలిసి ఓ క్రికెట్‌ ఫ్రాంచైజీకి ఓనరయ్యాడు. ఈ సౌతాఫ్రికా త్రయం యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో రోటర్‌డామ్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు.ఈ లీగ్‌ తొలి ఎడిషన్‌ (ETPL 2026) ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది. ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డుల మద్దతుతో ప్రారంభమవుతున్న ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఆమ్‌స్టర్‌డామ్, బెల్‌ఫాస్ట్, ఎడిన్‌బర్గ్, డబ్లిన్, రోటర్‌డామ్, గ్లాస్గో నగరాలకు ప్రాతినిధ్యం వహించే జట్లు ఈ లీగ్‌లో పోటీపడనున్నాయి.యజమాని.. కెప్టెన్ కూడా..!రోటర్‌డామ్ జట్టుకు డుప్లెసిస్‌ కేవలం సహ యజమాని మాత్రమే కాదు, జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించనున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో యాజమాన్యం, నాయకత్వం రెండూ ఒకేసారి చేపట్టడం అరుదైన విషయం. అనేక టీ20 లీగ్‌లలో కెప్టెన్‌గా తనదైన ముద్ర వేసిన డుప్లెసిస్‌, ఇప్పుడు అదే అనుభవాన్ని తన సొంత జట్టుకు ఉపయోగించనున్నాడు. అయితే సహ యజమానిగా, కెప్టెన్‌గా ఉండటానికి రూల్స్‌ ఒప్పుకుంటాయో లేదో చూడాలి.భీకర ఫామ్‌లో క్లాసెన్‌ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 2026లో క్లాసెన్‌ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 59.14 సగటున, 157.41 స్ట్రయిక్‌రేట్‌తో 4 అర్ద సెంచరీల సాయంతో 414 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌పై మెరుపు అర్ద శతకం చేసి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు.జాంటీ రోడ్స్‌ విషయానికొస్తే.. ఈ దిగ్గజం​ ప్రస్తుతం ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా ఉన్నాడు. అలాగే పలు టీ20 లీగ్‌ల్లో కోచింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

Pant Set To Be Axed From ODIs By Agarkar Sanju To Replace: Report3
పంత్‌పై వేటు.. సంజూకు చోటు!.. రేసులో అతడు కూడా!

ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ కొనసాగుతున్నాడు. గతేడాది మెగా వేలంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అతడిని ఏకంగా రూ. 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే, పంత్‌ మాత్రం ఈ ధరకు ఏమాత్రం న్యాయం చేయడం లేదు.వైఫల్యాల పరంపరగతేడాది 13 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 269 పరుగులు చేశాడు పంత్‌ (Rishabh Pant). సారథిగా జట్టును ఏడో స్థానంలో నిలిపాడు. ఇక ఈ ఏడాది అతడి ప్రదర్శన మరింత ఘోరంగా ఉంది. ఇప్పటికి ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి 189 పరుగులే చేశాడు పంత్‌. ఇక లక్నో ఎనిమిదింట కేవలం రెండు గెలిచి అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.భవిష్యత్‌ ప్రశ్నార్థకంఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్‌ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. టీ20 ప్రపంచకప్‌-2024లో ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడైన పంత్‌కు.. 2026 వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కలేదు. టీమిండియా తరఫున 2024లో చివరి టీ20 ఆడిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. అదే ఏడాది ఆఖరిగా వన్డే ఆడాడు.పంత్‌పై వేటు.. సంజూకు చోటు!తాజాగా ఐపీఎల్‌లోనూ వైఫల్యాల నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌-2027 జట్టు ఎంపికలో పంత్‌ పేరును కూడా కనీసం పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకుండా పోయినట్లయింది. దైనిక్‌ జాగరణ్‌ కథనం ప్రకారం.. వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌కు బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేయాలని సెలక్షన్‌ కమిటీ ఫిక్సైంది.ధ్రువ్‌ జురెల్‌ కూడా..ఇక ఈ రేసులో ధ్రువ్‌ జురెల్‌ కూడా మరో పోటీదారుడిగా ఉన్నాడు. కాగా సంజూ టీ20 ప్రపంచకప్‌-2026లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. నాకౌట్‌ మ్యాచ్‌లలో సత్తా చాటి టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ అవార్డు గెలిచాడు. ఐపీఎల్‌-2026లో ఇప్పటికే రెండు సెంచరీలు బాది సత్తా చాటాడు.ఈ నేపథ్యంలో సంజూకు వన్డేల్లోనూ పెద్దపీట వేయాలని అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ కూడా సంజూ విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. కాగా 2027 వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందు టీమిండియా 20 వన్డేలు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఐపీఎల్‌-2026తో బిజీగా ఉన్న భారత ఆటగాళ్లు జూన్‌ 14 నుంచి అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌ మొతలుపెట్టనున్నారు. ఇక పరిమిత ఓవర్ల జట్టులో స్థానం గల్లంతైనప్పటికీ.. టెస్టుల్లో మాత్రం పంత్‌ చోటుకు ఢోకా ఏమీలేదు.చదవండి: రియాన్‌ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు

BCCI Punishes RR Captain Riyan Parag For Vaping In Dressing Room4
రియాన్‌ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు

రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు చేపట్టింది. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ప్రవర్తించిన తీరుకు జరిమానాతో సరిపెట్టింది. కాగా ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమితుడైన రియాన్‌ పరాగ్‌.. సారథిగా ఆకట్టుకుంటున్నాడు.ఇ–సిగరెట్‌తో పొగ పీల్చి..పరాగ్‌ కెప్టెన్సీలో రాజస్తాన్‌ ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లలో ఆరు గెలిచింది. అయితే, పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా పరాగ్‌ (Riyan Parag) ప్రవర్తించిన తీరు వివాదానికి దారి తీసింది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో డ్రెసింగ్‌ రూమ్‌లో ఉన్న రియాన్‌ పరాగ్‌ ‘వేపింగ్‌’ (ఇ–సిగరెట్‌తో పొగ పీల్చడం) చేశాడు.భారత్‌లో నిషేధంఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అయ్యాయి. నిజానికి ద్రవరూపంలో ఉండే నికొటిన్‌ను ఉపయోగించే ఇ–సిగరెట్‌లను భారత ప్రభుత్వం 2019లోనే నిషేధించింది. అలాంటి ఐపీఎల్‌ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో కెప్టెన్‌ స్థాయిలో ఉండి పరాగ్‌ నిబంధనలు అతిక్రమించడం చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలో బీసీసీఐ రియాన్‌ పరాగ్‌పై వేటు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. ఓ జర్నలిస్టు మాత్రం అతడు చేసిన తప్పునకు విధించే శిక్ష విషయంలో ఐపీఎల్‌ నియమాల్లో స్పష్టత లేదని పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది.మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోతరియాన్‌ పరాగ్‌ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు.. క్రమశిక్షణారాహిత్యం కింద అతడి ఖాతాలో ఓ డిమెరిట్‌ పాయింట్‌ జతచేసింది. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.21 కింద ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ ఆర్టికల్‌ ప్రకారం.. టోర్నీ గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటారు.ఇదిలా ఉంటే.. వేపింగ్‌పై నిషేధం ఉన్నప్పటికీ ఈమేరకు అతిక్రమనకు పాల్పడితే లక్ష రూపాయల జరిమానా లేదా ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి తరుణంలో బీసీసీఐ మాత్రం తూతూమంత్రంగా చర్యలు తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి.చదవండి: IPL 2026: క్లాసెన్‌ సంచలన నిర్ణయం..? డిమాండ్లకు తలొగ్గి?

IPL 2026 MI vs SRH: Travis Head Angrily Kicks IPL Property Video Viral5
ట్రవిస్‌ హెడ్‌పై విమర్శలు.. ఎందుకిలా చేశావు?

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్రవిస్‌ హెడ్‌ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్‌-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా బ్యాటింగ్‌కు వస్తున్న సమయంలో హెడ్‌ ప్రవర్తించిన తీరు ఇందుకు కారణం.తొలి హాఫ్‌ సెంచరీతాజా ఎడిషన్‌లో ట్రవిస్‌ హెడ్‌ (Travis Head) ఎట్టకేలకు తొలి హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో ముంబై విధించిన 244 పరుగుల లక్ష్య ఛేదనలో హెడ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సహచర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (24 బంతుల్లో 45)తో కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 129 పరుగులు జోడించాడు.మొత్తంగా ఈ మ్యాచ్‌లో 30 బంతులు ఎదుర్కొన్న హెడ్‌.. 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 76 పరుగులు సాధించాడు. మరోవైపు.. హెన్రిచ్‌ క్లాసెన్‌ (30 బంతుల్లో 65 నాటౌట్‌) రాణించగా.. ఆఖర్లో సలీల్‌ అరోరా (10 బంతుల్లో 30 నాటౌట్‌) వేగంగా ఆడాడు. ఫలితంగా 18.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్‌ లక్ష్యాన్ని ఛేదించి.. వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. తద్వారా ఈ సీజన్‌లో ఇప్పటికి తొమ్మిదింట ఆరో గెలుపును ఖాతాలో వేసుకుంది.రొబోటిక్‌ డాగ్‌ను కాలితో తన్నిన హెడ్‌ఇదిలా ఉంటే.. అభిషేక్‌ శర్మతో కలిసి హెడ్‌ బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో.. ఐపీఎల్‌ రొబోటిక్‌ మస్కట్‌ ‘చంపక్‌’ అతడికి అడ్డుగా వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర అసంతృప్తికి లోనైన హెడ్‌.. ఆ రొబోటిక్‌ డాగ్‌ను కాలితో తన్నాడు. అంతేకాదు బ్యాట్‌తో కొట్టేందుకు కూడా ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ ప్రాపర్టీని తన్నిన కారణంగా హెడ్‌పై చర్యలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఇటు ఐపీఎల్‌ పాలక మండలి గానీ.. అటు సన్‌రైజర్స్‌ కానీ స్పందించలేదు. కాగా ఐపీఎల్‌ ప్రవర్తనా నియావళి ప్రకారం.. క్రికెట్‌కు సంబంధించిన పరికరాలు, క్లాతింగ్‌, ఇతర వస్తువులకు మ్యాచ్‌ సమయంలో హాని చేస్తే జరిమానా విధిస్తారు.చంపక్‌ ఏం చేస్తుందంటే?ఇదిలా ఉంటే.. రోబో కుక్క ‘చంపక్‌’ను ఐపీఎల్‌లో గతేడాది ప్రవేశపెట్టారు. ఇదొక కదిలే బ్రాడ్‌కాస్ట్‌ కెమెరా. మైదానంలో లో-యాంగిల్‌లో క్రికెట్‌ షాట్లు, ఆటగాళ్ల కదలికలను రికార్డు చేస్తుంది. అంతేకాదు అంపైర్లు, ప్లేయర్లకు సరదాగా షేక్‌హ్యాండ్లు ఇస్తూ సందడి చేస్తుంది. హెడ్‌ సైతం సరదాగానే చంపక్‌ను తన్ని ఉంటాడని అతడి అభిమానులు అంటున్నారు.చదవండి: IPL 2026: క్లాసెన్‌ సంచలన నిర్ణయం..? డిమాండ్లకు తలొగ్గి?Travis Head Reaction 🤣 pic.twitter.com/4JGHZNz4GA— 𝗠𝗮𝗻𝗶𝘀𝗵 (@ManishSRH) April 30, 2026

Kevin Pietersen Urges South Africa Board To Bring Back Heinrich Klaasen Out Of Retirement6
క్లాసెన్‌ సంచలన నిర్ణయం..? డిమాండ్లకు తలొగ్గి?

ఐపీఎల్‌-2026లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. క్లాసెన్ మిడిలార్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చి అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. బుధ‌వారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో క్లాసెన్ మ‌రోసారి త‌న క్లాస్ చూపించాడు.244 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో క్లాసెన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్ తొలి వికెట్‌కు 129 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. అయితే అభిషేక్‌, హెడ్‌, ఇషాన్ కిష‌న్ వికెట్ల‌ను ఆరెంజ్ వెంట‌వెంట‌నే కోల్పోయింది. దీంతో ముంబై ఇండియ‌న్స్ తిరిగి గేమ్‌లోకి వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన క్లాసెన్‌.. ముంబై బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. ‍క్లాసెన్ కేవలం 30 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అతడు దూకుడుగా ఆడడంతో లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలూండగానే సన్‌రైజర్స్‌ చేధించింది. ఈ నేపథ్యంలో క్లాసెన్‌ను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని పీటర్సన్ కోరాడు.దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ప్రపంచకప్‌ను కూడా గెలవలేదు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికా వేదికగానే జరగనుంది. ప్రోటీస్ జట్టుకు తొలి వరల్డ్‌కప్ టైటిల్ గెలిచేందుకు ఇదొక మంచి అవకాశం. కాబట్టి సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెంటనే క్లాసెన్‌ను తన రిటైర్మెంట్‌ను వెనుక్కి తీసుకోవాలని కోరాలి. ఒకవేళ అతడు తిరిగొస్తే సౌతాఫ్రికాకు ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడని" పీటర్సన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. క్లాసెన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. కుటుంబానికి సమయం కేటాయించాలనే ఉద్దేశంతో పాటు టీ20 లీగ్‌లపై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.అయితే ఐపీఎల్‌లో అతడు అద్భుతమైన ప్రదర్శన చేస్తుండడంతో తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని మాజీలు సూచిస్తున్నారు. క్లాసెన్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఆశ్చర్యపోన్కర్లేదు. గతంలో స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ కూడా తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని టీ20 ప్రపంచకప్‌-2026లో ఆడాడు. ఇప్పుడు క్లాసెన్‌ కూడా సూపర్‌ ఫామ్‌లో ఉండడంతో డికాక్‌ బాటలో నడిచే అవకాశముంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ‍క్లాసెన్ 59.14 సగటుతో 414 పరుగులు సాధించాడు.

SRH Smash MI Chase 244 To Script 100th IPL Win, Milestone In Run Fest7
చారిత్రక మైలురాయిని తాకిన సన్‌రైజర్స్‌

ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్‌పై బుధవారం జయభేరి మోగించిన కమిన్స్‌ బృందం... ఈ సీజన్‌లో వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. మొత్తంగా ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరింట గెలిచింది.వాంఖడే వేదికగా టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. రికెల్టన్‌ (55 బంతుల్లో 123 నాటౌట్‌; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... విల్‌ జాక్స్‌ (22 బంతుల్లో 46; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.52 బంతుల్లోనే 129 పరుగులుఅనంతరం హైదరాబాద్‌ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు సాధించి విజయాన్నందుకుంది. హెడ్‌ (30 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్లాసెన్‌ (30 బంతుల్లో 65 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (24 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి జట్టును గెలిపించారు. అభిషేక్, హెడ్‌ తొలి వికెట్‌కు 52 బంతుల్లోనే 129 పరుగులు జత చేశారు.చారిత్రక మైలురాయిఇదిలా ఉంటే.. ముంబైపై విజయం ద్వారా సన్‌రైజర్స్‌ చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఇది వందో విజయం. కాగా 2013లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పటికి 205 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఇందులో 104 ఓడిపోగా.. వంద గెలిచింది. ఒకటి ఫలితం తేలకుండా ముగిసిపోయింది.నిలకడైన జట్టుగానూ పేరుఐపీఎల్‌లో 13 ఏళ్లుగా కొనసాగుతున్న సన్‌రైజర్స్‌ 2016లో తొలిసారి టైటిల్‌ గెలిచింది. ఇక 2018, 2024లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. అంతేకాదు మరో నాలుగు సీజన్లలో ప్లే ఆఫ్స్‌ చేరింది. తద్వారా ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్న జట్లలో ఒకటిగా ముందుకు సాగుతోంది.

Mumbai Indians playoff qualification chances8
వరుస ఓటములు.. అయినా ముంబై ఇండియన్స్‌కు ప్లే ఆఫ్‌ ఛాన్స్‌?

ఐపీఎల్‌-2026 సీజన్‌లో ఐదు సార్లు ఛాంపియ‌న్‌ ముంబై ఇండియన్స్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొనసాగుతోంది. బుధ‌వారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓట‌మి పాలైంది. ముంబై బ్యాటింగ్‌లో అద‌ర‌గొట్టిన‌ప్ప‌టికి, బౌలింగ్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఘోరంగా విఫ‌లమైంది. 244 ప‌రుగుల భారీ టార్గెట్‌ను సైతం ముంబై బౌల‌ర్లు డిఫెండ్ చేసుకోలేక‌పోయారు. ముంబైకి ఇది ఆరువ ఓట‌మి. దీంతో హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ త‌మ ప్లే ఆఫ్‌ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది.ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవ‌లం రెండింట మాత్ర‌మే విజ‌యం సాధించింది. ఆ జ‌ట్టు ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిద‌వ స్ధానంలో ఉంది. పాయింట్ల ప‌రంగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో ముంబై స‌మానంగా ఉన్న‌ప్ప‌టికి ర‌న్‌రేట్ ప‌రంగా హార్దిక్ సేన (-0.784) వారి కంటే కాస్త మెరుగ్గా ఉంది.ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే?ప్రస్తుతం నెగటివ్ రన్ రేట్‌తో ఉన్న ముంబైకి ప్రతి మ్యాచ్ ఇప్పుడు చావో రేవో అన్నట్లుగా మారింది. ముంబైకి ఇంకా 6 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ముంబై ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముంబై ఇండియ‌న్స్ భ‌వితవ్యం ఇత‌ర జ‌ట్ల ఫ‌లితాల‌పై కూడా ఆధార‌ప‌డి ఉంటుంది.అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల బ‌ట్టి చూస్తే ముంబై మ‌రోసారి లీగ్ స్టేజీలోనే ఇంటిముఖం ప‌ట్టే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. ముఖ్యంగా జ‌స్ప్రీత్ బుమ్రా పేల‌వ ఫామ్ ముంబైకి ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ బౌల‌ర్ అయిన బుమ్రా ఈ ఏడాది సీజ‌న్‌లో త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోతున్నాడు. జూనియ‌ర్ క్రికెట‌ర్లు సైతం అత‌డి బౌలింగ్‌ను ఉతికారేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు అత‌డు కేవ‌లం రెండే రెండు వికెట్లు సాధించాడు. ఆఖ‌రిగా ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఏదైన అద్భుతం జ‌రగాలి.చదవండి: IPL 2026: భారీ తప్పిదం.. ముంబై ఇండియన్స్‌ ఓటమికి కారణం ఇదే?

Riyan Parag To Escapes BCCI Punishment Another To Be Sentenced9
BCCI: రియాన్‌ పరాగ్‌ ఎస్కేప్‌.. ఊహించని ట్విస్ట్‌!

రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్‌-2026లో భాగంగా.. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా అతడు డ్రెస్సింగ్‌రూమ్‌లో ‘వేపింగ్‌’ (ఇ–సిగరెట్‌తో పొగ పీల్చడం) చేసిన సంగతి తెలిసిందే. అతడు చేసిన పని టీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కాగా.. రియాన్‌తో పాటు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.లక్ష రూపాయల జరిమానా లేదాకాగా ద్రవరూపంలో ఉండే నికొటిన్‌ను ఉపయోగించే ఇ–సిగరెట్‌లను భారత ప్రభుత్వం 2019లోనే నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతిక్రమనకు లక్ష రూపాయల జరిమానా లేదా ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.నిజానికి ఇప్పుడు పరాగ్‌ వివాదం ప్రభుత్వ నిబంధనలకంటే బీసీసీఐ కోణంలో అతిపెద్ద సమస్యగా మారింది. ఐపీఎల్‌లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ అతడు ఇలా చేయడంపై చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ రియాన్‌ పరాగ్‌పై కఠిన చర్యలు తీసుకోనుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఊహించని ట్విస్ట్‌అయితే, రియాన్‌ పరాగ్‌ విషయంలో ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విపుల్‌ కశ్యప్‌ అనే జర్నలిస్టు ఇందుకు సంబంధించి తాజా అప్‌డేట్‌ను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. రియాన్‌ పరాగ్‌పై బీసీసీఐ నేరుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీని సారాంశం.రియాన్‌ పరాగ్‌ తప్పించునే అవకాశంఐపీఎల్‌ లేదంటే బీసీసీఐ ప్రవర్తనా నియమావళిలో ‘వేపింగ్‌’కు సంబంధించి ఎలాంటి శిక్ష విధించాలన్న అంశంపై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రియాన్‌ పరాగ్‌ తప్పించునే అవకాశం ఉండగా.. మ్యాచ్‌ అధికారులపై మాత్రం బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.🚨 BIG UPDATE FROM IPL 🚨Rajasthan Royals captain Riyan Parag could face a 2-match ban after an alleged dressing room incident.⚠️ Reports suggest he was caught vaping inside the dressing room.🔥 If confirmed, Yashasvi Jaiswal is likely to lead RR for the next two matches.… pic.twitter.com/bKD9zfpQko— True Vector (@TrueVector33) April 28, 2026ఆయనపై వేటు?ఓ ఆటగాడు అలాంటి నిషేధిత వస్తువును మైదానంలోకి తీసుకురావడమే గాకుండా.. ఓవైపు మ్యాచ్‌ జరుగుతుండగా డ్రెసింగ్‌ రూమ్‌లో వేపింగ్‌ చేయడాన్ని బీసీసీఐ భద్రతా వైఫల్యంగా భావిస్తున్నట్లు సమాచారం. అతడికి ఆ అవకాశం ఇచ్చినందుకు గానూ మ్యాచ్‌ రిఫరీ లేదంటే ఇతర అధికారులపై వేటు పడనుందని సమాచారం.కాగా పంజాబ్‌ కింగ్స్‌- రాజస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు అమిత్‌ శర్మ రిఫరీ. ఒకవేళ బీసీసీఐ గనుక రంగంలోకి దిగితే అతడికి పనిష్మెంట్‌ తప్పకపోవచ్చు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా రాజస్తాన్‌ పంజాబ్‌కు ఈ సీజన్‌లో తొలిసారి ఓటమిని రుచిచూపించింది. శ్రేయస్‌ అయ్యర్‌ సేనను పరాగ్‌ బృందం ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో రియాన్‌ పరాగ్‌ 16 బంతుల్లో కేవలం 29 పరుగులు చేశాడు.UPDATE: రియాన్‌ పరాగ్‌పై బీసీసీఐ చర్యలుచదవండి: IPL 2026: భారీ తప్పిదం.. ముంబై ఇండియన్స్‌ ఓటమికి కారణం ఇదే?

Vinod Kambli Looks Frail During Wankhede Visit For MI vs SRH, Fans React10
ఆరోగ్యం బాగోలేక‌పోయిన స్టేడియంకు వ‌చ్చిన వినోద్ కాంబ్లీ

ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ చాన్నాళ్ల తర్వాత పబ్లిక్‌లో కన్పించారు. సచిన్ టెండూల్కర్ ప్రాణస్నేహితుడు అయిన కాంబ్లీ.. బుధవారం ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వాంఖడే స్టేడియంకు వచ్చారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో కాంబ్లీ చాలా బలహీనంగా ఉండి, నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ కన్పించారు. ఇద్దరు వ్యక్తులు ఆయనను చేతులు ప‌ట్టుకుని బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. కేవ‌లం 54 ఏళ్ల వయసులోనే ఆయ‌న ఆరోగ్యం ఇంతలా క్షీణించడం చూసి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్టేడియంలోని ప్రేక్ష‌కులు "గెట్ వెల్ సూన్ సార్" అని అర‌వ‌గా.. ఆయ‌న చిరునవ్వుతో థమ్సప్ చూపిస్తూ అందరికీ అభివాదం చేశారు. వినోద్ కాంబ్లీ గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ, క్రికెట్ పట్ల ఉన్న మ‌క్కువ‌తో కాంబ్లీ స్టేడియం రావ‌డం విశేషం.ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 18.4 ఓవర్లలోనే ఊదిపడేసింది.Vinod Kambli came to Wankhede Stadium today to watch the Mumbai Indians match. There was a time when he was considered an even better batsman than Sachin Tendulkar, but some bad habits ruined his career. Seeing him like this today doesn’t feel good, but it was nice to see that he… pic.twitter.com/AJOMh1FTX3— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 29, 2026

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement