Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Bas de Leede Demand ICC for more opportunities against big teams IND1
T20 WC: ఐసీసీకి డచ్‌ క్రికెటర్‌ డిమాండ్‌.. కనీసం..

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ కీలక దశకు చేరుకుంది. నాలుగు గ్రూపుల నుంచి సత్తా చాటి టాపర్లుగా నిలిచిన జట్లు సూపర్‌-8లో అడుగుపెట్టాయి. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌.. గ్రూప్‌-బి నుంచి జింబాబ్వే, శ్రీలంక.. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌.. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ సెమీస్‌ రేసులో నిలిచాయి.పసికూనలతో పాటు ఆసీస్‌ కూడా.. ఇక మిగిలిన జట్లు గ్రూప్‌-ఎ నుంచి అమెరికా, నెదర్లాండ్స్‌, నమీబియా.. ‘బి’ నుంచి ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, ఒమన్‌.. ‘సి’ నుంచి స్కాట్లాండ్‌, ఇటలీ, నేపాల్‌.. ‘డి’ నుంచి అఫ్గనిస్తాన్‌, యూఏఈ, కెనడా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించాయి. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్‌ క్రికెటర్‌ బాస్‌ డి లీడె ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీకి డిమాండ్‌భారత్, ఆస్ట్రేలియాలాంటి జట్లతో ముక్కోణపు సిరీస్‌లు ఆడే భాగ్యమైతే దక్కనే దక్కదు... కనీసం ఇలాంటి మేటి ప్రత్యర్థులతో వార్మప్‌ మ్యాచ్‌లైనా ఏర్పాటు చేయండని అతడు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)ని కోరాడు. అసోసియేట్‌ జట్ల ఆట ఎప్పుడో ఒకసారి అది కూడా ఐసీసీ ప్రపంచకప్‌ల వరకే పరిమితమవుతోందని అన్నాడు.గట్టి ప్రత్యర్థులతో ఆడే అవకాశం తరచు దక్కడం లేదని లీడె వాపోయాడు. నెదర్లాండ్స్‌ మాజీ క్రికెటర్‌ టిమ్‌ డి లీడె కుమారుడైన బాస్‌ డి లీడె ప్రస్తుతం డచ్‌ తరఫున టీ20 వరల్డ్‌కప్‌ ఆడాడు. గ్రూప్‌ దశలో భారత్‌తో చివరి మ్యాచ్‌ ఆడిన నెదర్లాండ్స్‌ ఓటమితో మెగా ఈవెంట్‌ నుంచి నిష్క్రమించింది.కనీసం వార్మప్‌ మ్యాచ్‌లైనా ఆడండి‘ప్రస్తుత ఐసీసీ భవిష్యత్‌ పర్యటనల కార్యక్రమం, ప్రపంచ వ్యాప్త టి20 లీగ్‌లతో భారత్, ఆసీస్‌ లాంటి శాశ్వత దేశాలు, ఆటగాళ్లు ఊపిరి సలపని బిజీ షెడ్యూల్‌తో ఉంటారని మాకు తెలుసు. ఈ నేపథ్యంలో ఘనాపాఠిలతో మాకు ద్వైపాక్షిక సిరీస్‌లు, ముక్కోణపు సిరీస్‌లంటే అది అయ్యే పని కాదు. నేరుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఏర్పాటు చేయలేక పోయినా... ఈ అంతర్జాతీయ మేటి ప్రత్యర్థులతో వార్మప్‌ మ్యాచ్‌లైనా ఆడిస్తే మా జట్టుకు ఎంతో మేలు జరుగుతుంది. ఎప్పుడో ఓసారి జరిగే మెగా ఈవెంట్‌లో ఆడటం... అక్కడితో మా అంతర్జాతీయ క్రికెట్‌ (మేటి జట్లతో) అటకెక్కడం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది’ అని లీడె అన్నాడు. చదవండి: T20 WC: సిగ్గులేకుండా అబద్ధాలు.. మా ఆటగాళ్లకే నష్టం: బంగ్లాదేశ్‌ కోచ్‌ ఫైర్‌

IND vs SA: Hardik Shot Hits Teammate Knee Leaves Field IND Big Injury Scare2
T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌!

సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌ టోర్నీ-2026లో టీమిండియా సత్తా చాటుతోంది. లీగ్‌ దశలో భాగంగా గ్రూప్‌-ఎ నుంచి టాపర్‌గా సూర్యకుమార్‌ సేన సూపర్‌-8కు చేరుకుంది. వరుసగా అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లను ఓడించి అజేయంగా తదుపరి దశలో అడుగుపెట్టింది.తొలుత దక్షిణాఫ్రికాతో..ఇక ఇక్కడి నుంచే అసలు సమరం మొదలుకానుంది. గ్రూప్‌-1లో ఉన్న టీమిండియా.. సూపర్‌-8లో తొలుత దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకు ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ మొదలుకానుంది.ప్రాక్టీస్‌లో తలమునకలుఈ నేపథ్యంలో ఇప్పటికే అహ్మదాబాద్‌ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఈ క్రమంలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) బాదిన షాట్‌ కారణంగా భారత స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) గాయపడినట్లు సమాచారం. హార్దిక్‌ బాదిన బంతి సిరాజ్‌ ఎడమ మోకాలికి బలంగా తగిలినట్లు తెలుస్తోంది.గాయపడిన పేసర్‌దీంతో నొప్పితో విలవిల్లాడిన సిరాజ్‌ మధ్యలోనే నెట్‌ సెషన్‌ నుంచి నిష్క్రమించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెవ్‌స్పోర్ట్స్‌ షేర్‌ చేసిన ఈ ఫొటోలలో సిరాజ్‌ కుంటుతూ మైదానం వీడిన తీరు టీమిండియా అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.గాయాల బెడదకాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభానికి ముందు నుంచీ టీమిండియాను గాయాల బెడద వేధిస్తున్న సంగతి తెలిసిందే. యువ పేసర్‌, బ్యాట్‌తోనూ అదరగొడుతున్న హర్షిత్‌ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రపంచకప్‌ జట్టులోకి వచ్చిన సిరాజ్‌.. గ్రూప్‌ దశలో తొలుత అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా జ్వరం వల్ల తుదిజట్టు నుంచి తప్పుకోగా.. సిరాజ్‌కు ఈ అవకాశం వచ్చింది. అమెరికాతో మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ పేసర్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అయితే, తదుపరి మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులోకి రావడంతో సిరాజ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు.ఇప్పుడిలా..మరోవైపు.. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సైతం కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ సైతం గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్‌ సాధించినప్పటికీ.. తుదిజట్టులో ఇంత వరకు ఆడలేదు. ఇదిలా ఉంటే.. పటిష్ట సౌతాఫ్రికాతో పోరుకు ముందు సిరాజ్‌ కూడా గాయపడటం గమనార్హం. కాగా సూపర్‌-8లో భారత్‌.. సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఎదుర్కొంటుంది. ఈ దశలో సత్తా చాటితేనే సెమీ ఫైనల్‌ చేరే అవకాశం ఉంటుంది.చదవండి: T20 WC 2028: నేరుగా అర్హత సాధించిన బంగ్లాదేశ్‌

Told Such Blatant Lies: Bangladesh Coach Slams Nazrul Over T20 WC Row3
సిగ్గులేకుండా అబద్ధాలు.. నష్టపోయింది మేమే: బంగ్లాదేశ్‌ కోచ్‌ ఫైర్‌

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌-2026 ఆడాలన్న బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల కల కలగానే మిగిలిపోయింది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా టోర్నీ ఆరంభానికి ముందే జట్టు తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాదు.. భారత్‌తో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో కీలక క్రికెటర్లు బ్యాట్‌ స్పాన్సర్లతో పాటు ఇతర క్రికెట్‌ పరికరాల స్పాన్సర్లను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.యూటర్న్‌ల నజ్రుల్‌అయితే, వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ తప్పుకోవడంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని క్రీడా శాఖ మాజీ సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ తొలుత మీడియాకు వివరించారు. కానీ ఆ తర్వాత మాట మారుస్తూ దేశం కోసం బంగ్లాదేశ్‌ ఆటగాళ్లే ప్రపంచకప్‌ ఆడకూడదనే నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో దుమారం రేగింది.దీంతో మరోసారి యూటర్న్‌ తీసుకుంటూ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ప్లేయర్లు కూడా టోర్నీ నుంచి తప్పుకున్నారని.. తన మాటల్ని వక్రీకరించడం వల్లే అపార్థాలు మొదలయ్యాయని నజ్రుల్‌ నాలుక మడతేశారు. ఈ పరిణామాలపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ మొహమ్మద్‌ సలావుద్దీన్‌ (Mohammad Salahuddin) ఘాటుగా స్పందించాడు. సిగ్గులేకుండా అబద్ధాలునజ్రుల్‌ అబద్ధాలకోరు అని.. బుద్ధి లేకుండా ఇష్టారీతిన అవాస్తవాలు ప్రచారం చేశాడని మండిపడ్డాడు. ‘‘నేనొక ఉపాధ్యాయుడిని. నాలాంటి టీచర్లు అబద్ధాలు చెప్పేందుకు వెనుకాడతారు. కానీ అతడు మాత్రం నిర్భయంగా అందరి ముందు అబద్ధాలు చెప్పాడు.అసలు అతడు అలా ఎలా చేయగలిగాడో నాకు ఇంత వరకు అర్థం కావడం లేదు. ఆటగాళ్లే టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని అతడు చెప్పాడు. అలాంటి సమయంలో మా కుర్రాళ్లకు నేను ఎలా ముఖం చూపించగలను? అతడు అంత దారుణంగా యూటర్న్‌ తీసుకుంటాడని ఊహించలేదు.అతడు కూడా ఒక టీచర్‌. ఢాకా యూనివర్సిటీలో టీచర్‌గా పనిచేసిన వ్యక్తి. అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం సరికాదు. దీనిని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అసలు ఆయనకు ఇదెలా సాధ్యమైంది. మాటలు మార్చడం ఆయనకు అలవాటేమో! మాకు మాత్రం కాదు.మా ఆటగాళ్లు మానసికంగా కుంగిపోయారువరల్డ్‌కప్‌ ఆడాలన్న మా బాయ్స్‌ కల ఒక్క క్షణంలో చెదిరిపోయింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము. కానీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఆటగాడు నష్టపోయాడు. మా జట్టులోని ఇద్దరు ఆటగాళ్లైతే ఐదు రోజుల వరకు మానసికంగా కోమాలోకి వెళ్లిపోయారంటే నమ్మండి. మళ్లీ వాళ్లలో ఉత్తేజం నింపి మైదానంలో అడుగుపెట్టేలా చేయాల్సిన గురుతర బాధ్యత మాపై ఉంది’’ అని సలావుద్దీన్‌ ఉద్వేగానికి లోనయ్యాడు.జరిగింది ఇదీకాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్‌ నుంచి బంగ్లా ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను తొలగించారు. ఈ నేపథ్యంలో భారత్‌లో తాము ఆడాల్సిన టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల వేదికను మార్చాలని బంగ్లాదేశ్‌ పట్టుపట్టింది. భారత్‌లో తమకు భద్రత లేదని.. మరో ఆతిథ్య దేశం శ్రీలంకలో తమను ఆడించాలని ఐసీసీని కోరింది. అయితే, బంగ్లాదేశ్‌ వాదనలో నిజం లేదని తమ కమిటీ చెప్పడంతో ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. ఈ విషయంలో పునరాలోచన చేయాలని బంగ్లాదేశ్‌కు గడువు​ ఇవ్వగా.. తగ్గేదేలే అంటూ బంగ్లా పంతానికి పోయింది. దీంతో టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పిస్తూ.. ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది ఐసీసీ. దీంతో బంగ్లాదేశ్‌ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. చదవండి: T20 WC: ‘పీసీబీ చీఫ్‌ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’

India face Spain in FIH Pro League4
తొలి గెలుపు కోసం...

హోబర్ట్‌: సొంతగడ్డపై జరిగిన పురుషుల ప్రొ లీగ్‌ తొలి అంచెలో భారత హాకీ జట్టుకు నిరాశ ఎదురైంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓటమి పాలైంది. అర్జెంటీనా, బెల్జియం జట్లతో రెండుసార్లు చొప్పున ఆడిన భారత జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ గెలుపు రుచి చూడలేదు. ఇప్పుడు రెండో అంచె మ్యాచ్‌లకు భారత బృందం సిద్ధమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌తో భారత్‌ ఆడుతుంది. ఆ తర్వాత ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో ఆ్రస్టేలియాతో భారత్‌ తలపడుతుంది. ఒక రోజు విశ్రాంతి తర్వాత 24న స్పెయిన్‌తో, 25న ఆ్రస్టేలియాతో టీమిండియా ఆడుతుంది. భారత అంచె పోటీల్లో సారథ్యం వహించిన హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ వ్యక్తిగత కారణాలరీత్యా రెండో అంచె మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ స్థానంలో హార్దిక్‌ సింగ్‌ భారత జట్టుకు నేతృత్వం వహిస్తాడు. టోక్యో ఒలింపిక్స్, పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో కాంస్య పతకాలు నెగ్గిన భారత జట్టులో హార్దిక్‌ సింగ్‌ కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. ‘స్వదేశంలో జరిగిన తొలి అంచె మ్యాచ్‌ల్లో పొరపాట్లు ఎక్కడ జరిగాయో సమీక్షించాం. గెలుపు బోణీ కొట్టాలనే లక్ష్యంతోనే ఆ్రస్టేలియాకు వచ్చాం’ అని మిడ్‌ఫీల్డ్‌లో ఆడే హార్దిక్‌ సింగ్‌ వ్యాఖ్యానించాడు.

Pakistan Hockey captain Ammad Shakeel Butt banned for two years 🇵🇰5
షకీల్‌పై నిషేధం ఎత్తివేత

లాహోర్‌: పాకిస్తాన్‌ హాకీలో సంక్షోభం ముదురుతున్న వేళ ఆ దేశ సర్కారు జోక్యం చేసుకుంది. పాకిస్తాన్‌ హాకీ జట్టు కెప్టెన్‌ అమద్‌ షకీల్‌ భట్‌పై ఆ దేశ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్‌) విధించిన రెండేళ్ల నిషేధాన్ని పాక్‌ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నిషేధం నియమావళికి విరుద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. ఆ్రస్టేలియా పర్యటనలో పీహెచ్‌ఎఫ్‌ నిర్వహణ లోపంతో పాకిస్తాన్‌ హాకీ ఆటగాళ్లు వీధిన పడ్డారు. బసచేస్తున్న హోటల్‌కు నిధులు విడుదల చేయకపోవడంతో ఆటగాళ్లంతా రోడ్లపై పడిగాపులు కాశారు. దీంతో పీహెచ్‌ఎఫ్‌ నిర్వాకంపై కెప్టెన్‌ షకీల్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దీన్ని సహించలేకపోయిన పీహెచ్‌ఎఫ్‌ అధ్యక్షుడు తారిఖ్‌ బగ్తీ క్రమశిక్షణ చర్యల కింద కెప్టెన్‌పై నిషేధం విధించారు. తర్వాత తన ఆధ్యక్ష పదవికి బగ్తీ రాజీనామా చేశారు. ఆసీస్‌లో పాక్‌ అప్రతిష్టపాలుపై గుర్రుగా ఉన్న పీహెచ్‌ఎఫ్‌ ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్, దేశ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌... బగ్తీ రాజీనామాను వెంటనే ఆమోదిస్తూ అహ్మద్‌ అధ్యక్షతన అడ్‌హక్‌ కమిటీని నియమించారు. అలాగే కెపె్టన్‌ షకీల్‌పై నిషేధం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని బగ్తీ విధించిన సస్పెన్షన్‌ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

Indias last T20 against Australia womens team today6
పైచేయి కోసం...

అడిలైడ్‌: పొట్టి ఫార్మాట్‌లో మిగిలిపోయిన ఆఖరి పోరులో గట్టిగా పోరాడి పైచేయి సాధించేందుకు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్లు ‘సై’ అంటున్నాయి. ఇరుజట్ల మధ్య శనివారం ఇక్కడ ఆఖరి టి20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ ఒక్క టి20లకే పరిమితం కాని ఈ పర్యటనలో సిరీస్‌ గెలవాలంటే ఇంకా రెండు ఫార్మాట్లలోనూ సత్తా చాటాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుత టి20ల్లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌ గెలిచి 1–1తో సమంగా నిలిచాయి. నేడు జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఓవరాల్‌ సిరీస్‌లో 4–2 పాయింట్లతో (మ్యాచ్‌ విజేతకు 2 పాయింట్లు) ఆధిక్యం సంపాదిస్తుంది. దీంతో తదుపరి మూడు వన్డేలు, ఏకైక టెస్టు సిరీస్‌లకు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని టీమిండియా లక్ష్యం కూడా సిరీస్‌ కాదు... నేటి మ్యాచ్‌ విజయమే! ఇదే జట్టులో స్థయిర్యాన్ని పెంచుతుందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. బ్యాటర్లదే భారం తొలి మ్యాచ్‌లో వర్షంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో నెగ్గిన హర్మన్‌ బృందం... పూర్తిస్థాయిలో జరిగిన రెండో టి20లో చేతులెత్తేసింది. ఆతిథ్య ఆసీస్‌ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, వైస్‌ కెపె్టన్‌ స్మృతి మంధాన ఇద్దరే 30 పైచిలుకు పరుగులు చేస్తే... ప్రధాన బ్యాటింగ్‌ బలం క్రీజులోకి దిగిన వారంతా ఆసీస్‌ బౌలింగ్‌కు దాసోహమయ్యారు. అదే ఈ మ్యాచ్‌లో పునరావృతం చేస్తే వన్డే సిరీస్‌కు ముందే టీమిండియా వెనుకబడిపోతుంది. ఇది మరింత ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి టాపార్డర్, మిడిలార్డర్‌ మరింత బాధ్యతగా ఆడాలి. అప్పుడే ఈ సుదీర్ఘ ఓవరాల్‌ సిరీస్‌ (టి20, వన్డే, టెస్టు)లో భారత్‌ పుంజుకోగలుగుతుంది. లేదంటే పరాజయాలతో, పాయింట్లతో ఆఖరికి మూల్యం చెల్లించు కోవాల్సి ఉంటుంది. జెమీమా రోడ్రిగ్స్, హిట్టర్లు రిచా ఘోష్, అమన్‌జోత్‌లు దంచేసే పనిలో ముందుంటే భారత్‌ కూడా ఈ ఓవరాల్‌ సిరీస్‌లో ముందంజ వేస్తుంది. బ్యాటర్లతో పోల్చితే రేణుక, క్రాంతి, అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ, నల్లపురెడ్డి శ్రీచరణిలు బౌలింగ్‌లో కాస్త మెరుగ్గానే రాణిస్తున్నారు. మరోవైపు ఫామ్‌లోకి వచి్చన ఆతిథ్య జట్టు వరుసగా ఈ మ్యాచ్‌లోనూ రాణించి పైచేయి సాధించాలని ఆశిస్తోంది.

Key matches in the T20 World Cup from today7
‘సూపర్‌–8’ సమయం

టి20 ప్రపంచ కప్‌లో మరింత వినోదానికి నేటితో తెర లేవనుంది. పసికూనలు, పస లేని జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించగా టాప్‌–8 టీమ్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ‘సూపర్‌ ఎయిట్స్‌’లో భాగంగా నేడు జరిగే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ తలపడుతుంది. గ్రూప్‌ ‘ఎ’లో మూడు మ్యాచ్‌లు గెలిచి పాక్‌ ముందంజ వేయగా, గ్రూప్‌ ‘డి’ నుంచి కూడా మూడు విజయాలతో కివీస్‌ తర్వాతి దశకు అర్హత సాధించింది. కొలంబో: పాకిస్తాన్, న్యూజిలాండ్‌ జట్లు ఇటీవల వన్డేలు, టి20 ఫార్మాట్‌లలో తరచుగా తలపడ్డాయి. రెండున్నరేళ్ల వ్యవధిలో ఇరు జట్ల మధ్య 41 మ్యాచ్‌లు జరగ్గా... ఇందులో 17 వన్డేలు, 24 టి20లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి బలాబలాల గురించి ఇరు జట్లకు మంచి అవగాహన ఉంది. ద్వైపాక్షిక సిరీస్‌లను మినహాయిస్తే... 2022 టి20 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత రెండు జట్లు ఒక పెద్ద టోర్నీలో పోటీకి దిగడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌ జట్టు లీగ్‌ దశను దాటినా... అంచనాలకు తగినట్లుగా ఆడలేకపోతోంది. సీఫెర్ట్, అలెన్‌ మాత్రమే బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించగా... రచిన్‌ రవీంద్ర, ఫిలిప్స్, డరైల్‌ మిచెల్‌ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. బౌలింగ్‌లో కూడా డఫీ, సోధి భారీగా పరుగులిస్తున్నారు. కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ వైఫల్యం కూడా వరల్డ్‌ కప్‌లో జట్టును ఇబ్బంది పెట్టింది. ఇలాంటి స్థితిలో వరల్డ్‌ కప్‌ ఆశలు మిగలాలంటే కివీస్‌ బృందం సత్తా చాటాల్సి ఉంది. మరోవైపు పాకిస్తాన్‌కు తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడటం కాస్త కలిసొచ్చే అంశం. ముఖ్యంగా ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో మ్యాచ్‌ ఆడిన ఆ జట్టుకు పిచ్‌ పరిస్థితిపై మంచి అవగాహన ఉంది. అందుకే తమ స్పిన్‌ బలగాన్ని జట్టు నమ్ముకుంది. ప్రధాన పేసర్‌ షాహిన్‌ అఫ్రిది ఘోరంగా విఫలం కాగా... మరో పేసర్‌ ఫహీమ్‌ ఒక్క ఓవర్‌ కూడా బౌలింగే చేయలేదు. స్పిన్నర్లు ఉస్మాన్‌ తారిఖ్, అబ్రార్, షాదాబ్, నవాజ్‌లపై జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే బ్యాటింగ్‌లో ఫర్హాన్‌ మినహా సయీమ్‌ అయూబ్, సల్మాన్, బాబర్‌ ఆజమ్‌ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. తాజా పరిస్థితిని బట్టి చూస్తే ఇరు జట్లు ఫామ్‌లో సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి కాబట్టి ఆసక్తికర పోరు ఖాయం. మ్యాచ్‌ రోజున వర్షసూచన ఉంది.

Aaqib Nabis rise in domestic cricket8
‘కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌’

దాదాపు ఆరు నెలల క్రితం... నార్త్‌జోన్, ఈస్ట్‌జోన్‌ మధ్య దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌... నార్త్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జమ్మూ కశ్మీర్‌ పేస్‌ బౌలర్‌ ఆఖిబ్‌ నబీ సంచలన ప్రదర్శనతో అదరగొట్టాడు. ‘హ్యాట్రిక్‌’ సహా నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి ఈస్ట్‌ను కుప్పకూల్చాడు. తన 30వ ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లోనే అతను 9వసారి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ‘భారత్‌ తరఫున టెస్టు మ్యాచ్‌ ఆడటమే నా లక్ష్యం’ అని ఆఖిబ్‌ అప్పుడే చెప్పుకున్నాడు. వరుసగా రెండు సీజన్లలో నబీ వికెట్లు పడగొట్టిన తీరు, అతని ఓవరాల్‌ ప్రదర్శన చూస్తే ఆ రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. తాజాగా రంజీ సీజన్‌లో కూడా పలువురుసీనియర్లు, మాజీల అభిప్రాయం ప్రకారం భారత్‌ తమ తర్వాతి టెస్టు మ్యాచ్‌ను ఎప్పుడు ఆడినా... నిస్సందేహంగా అందులో నబీకి అవకాశం కల్పించవచ్చు. 29 ఏళ్ల వయసులో ఈ పేసర్‌కు టీమిండియా అవకాశం వస్తేనే అతని నిలకడైన ప్రదర్శనకు గుర్తింపు దక్కినట్లుగా భావించవచ్చు. సాక్షి క్రీడా విభాగం : జమ్మూ కశ్మీర్‌ తమ 67 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఇప్పుడు ఫైనల్‌కు చేరింది. గత ఏడాది కూడా చక్కటి ప్రదర్శనతో నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. అయితే అనుభవలేమితో ముందంజ వేయడంలో కశ్మీర్‌ విఫలమైంది. ఈ రెండు సీజన్లలో కూడా వారి విజయ గాథలో ఒకే ఒక్క ఆటగాడు బలంగా కనిపిస్తాడు. అతనే ఆఖిబ్‌ నబీ. 2024–25 సీజన్‌లో 8 మ్యాచ్‌లలో కలిపి నబీ కేవలం 13.93 సగటుతో 44 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. స్పిన్నర్‌ హర్ష్ దూబే (69) మినహాయిస్తే పేసర్లలో అతనిదే అగ్రస్థానం. ఈసారి కూడా దాదాపు అదే తరహా ప్రదర్శనతో అతను ఆకట్టుకున్నాడు. 9 మ్యాచ్‌లలో కలిపి కేవలం 12.72 సగటుతో నబీ 55 వికెట్లు తీయడం విశేషం. ఇప్పుడు కూడా స్పిన్నర్‌ మయాంక్‌ మిశ్రా (59) కాకుండా పేస్‌ బౌలర్‌గా నబీ మొదటి స్థానంలో నిలిచాడు. తాజా సీజన్‌లో అతను ఏకంగా 6 సార్లు ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మరోవైపు బ్యాటింగ్‌లో కూడా అతను తగ్గలేదు. 2 అర్ధసెంచరీలు సహా 243 పరుగులు నమోదు చేసి కీలక సమయాల్లో జట్టుకు అండగా నిలిచాడు. ఫుట్‌బాల్‌ నుంచి క్రికెట్‌ వైపు... క్రికెట్‌కు సంబంధించి బొటాబొటీ సౌకర్యాలు మాత్రమే ఉన్న బారాముల్లా పట్టణం నబీ స్వస్థలం. అక్కడి నుంచి 50 కిలో మీటర్ల దూరంలో శ్రీనగర్‌ ఉంటుంది. అత్యుత్తమ స్థాయి క్రికెట్‌ ప్రాక్టీస్‌ కావాలంటే ఎవరైనా శ్రీనగర్‌కు వెళ్లాల్సిందే. ‘కెరీర్‌లో ఎదగాలంటే ఇలాంటి విషయాలు పట్టించుకోకుండా కష్టపడాలి. పరిమిత వనరులనే వాడుకోవాలి తప్ప ఫిర్యాదులు చేయకూడదు. దేశం కోసం ఆడాలంటే దేనికైనా సిద్ధపడాలి’ అని కెరీర్‌ ఆరంభంలో చెప్పిన నబీ దానికి తగినట్లుగా తనను తాను మలచుకుకున్నాడు. కశ్మీర్‌లో స్థానికంగా కనిపించే పరిస్థితులను బట్టి ఆరంభంలో నబీ ఫుట్‌బాల్‌ను ఎంచుకున్నాడు. అయితే వేగాన్ని అమితంగా ఇష్టపడే అతని నైజం చివరకు పేస్‌ బౌలింగ్‌ వైపు మార్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన తండ్రి నబీకి ఆటలో అన్ని విధాలా అండగా నిలిచాడు. అవుట్‌స్వింగర్‌ ప్రధాన బలమైన నబీ తన ప్రతిభను మరింత తీర్చిదిద్దుకునేందుకు కెరీర్‌ ఆరంభంలో బెంగళూరుకు వెళ్లాడు. ఒక మిత్రుడు సహాయం అందించడంతో స్థానికంగా కర్ణాటక లీగ్‌లో చింతామణి క్లబ్‌ తరఫున మూడు నెలలు ఆడి ఆ టీమ్‌ తర్వాతి సీజన్‌లో ఫస్ట్‌ డివిజన్‌కు ప్రమోట్‌ కావడంలో కీలక పాత్ర పోషించాడు. బెంగళూరులో ఆడిన ఆట తనకు ఎంతో మేలు చేసిందని, పెద్ద స్థాయిలో కూడా సత్తా చాటగలననే ఆత్మవిశ్వాసం అందించిందని నబీ చెప్పాడు. ముంబైతో మ్యాచ్‌లో చెలరేగి... జార్ఖండ్‌తో ఆడిన తన తొలి రంజీ మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టడంతో నబీ గురించి అందరికీ తెలిసింది. అయితే అదే సీజన్‌లో కర్ణాటకతో మ్యాచ్‌లో ఒక చక్కటి బంతితో కరుణ్‌ నాయర్‌ను అవుట్‌ చేయడంతో అందరి దృష్టీ అతనిపై పడింది. ఇక సీనియర్‌ పర్వేజ్‌ రసూల్‌ ప్రోత్సాహం, భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ మార్గనిర్దేశనంలో నబీ బౌలింగ్‌ మరింత పదునెక్కింది. గత సీజన్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్‌ నిస్సందేహంగా అతని స్థాయిని పెంచింది. 42 సార్లు చాంపియన్‌ అయిన ముంబైని ఓడించడం ఒక ఘనత కాగా... ఈ మ్యాచ్‌లో నబీ 6 వికెట్లు పడగొట్టాడు. రోహిత్‌ శర్మ కూడా ఆడిన ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, శ్రేయస్‌ అయ్యర్, శివమ్‌ దూబే, శార్దుల్‌ ఠాకూర్‌లను నబీ అవుట్‌ చేశాడు. తాజా సీజన్‌లోనైతే క్వార్టర్‌ ఫైనల్లో మధ్యప్రదేశ్‌పై 12 వికెట్లు, సెమీస్‌ లో బెంగాల్‌పై 9 వికెట్లు... రెండు నాకౌట్‌ మ్యాచ్‌లలోనూ అతనే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కావడం విశేషం. ఇదే జోరు కొనసాగించే తన టీమ్‌ను తొలిసారి రంజీ చాంపియన్‌గా నబీ నిలుపుతాడా అనేది ఆసక్తికరం. మరోవైపు హుబ్లీలో కర్ణాటకతో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ కోసం పేస్‌కు ఏమాత్రం అనుకూలించని పిచ్‌ను తయారు చేసి నబీ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే... మైదానంలోకి దిగకముందే అతని ప్రభావం కనిపించడం నిజంగా నబీకి లభించిన పెద్ద అవార్డుగా చెప్పవచ్చు. రూ.8.40 కోట్లతో... ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా వరుసగా తన పేరు రావడం, ఎవరో పట్టించుకోకపోవడం అలవాటుగా మారిపోయిందని 2026 సీజన్‌ వేలానికి ముందు నబీ వ్యాఖ్యానించాడు. అయితే ఈసారి తన ప్రదర్శన చూస్తే కొంత నమ్మకం కలుగుతోందని కూడా అతను చెప్పాడు. చివరకు నబీ నమ్మకం నిజమైంది. ఏకంగా రూ.8.40 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌ వేలంలో నబీని తీసుకుంది. ఇన్నేళ్ల శ్రమకు అతనికి భారీ మొత్తంతో గుర్తింపు దక్కింది. ఏడేళ్ల దేశవాళీ కెరీర్‌లో నబీ 40 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో 151 వికెట్లు పడగొట్టాడు. అతని సగటు 18.62 మాత్రమే కావడం చెప్పుకోదగ్గ అంశం. వీటిలో మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శనలు నాలుగు ఉన్నాయి. 36 వన్డేల్లో 56...34 టి20ల్లో అతను 43 వికెట్లు తీశాడు.

An interesting rivalry in the India vs South Africa match9
అటు ఆల్బీ... ఇటు మోర్నీ...

అహ్మదాబాద్‌: టి20 వరల్డ్‌ కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్, గత రన్నరప్‌ మధ్య రేపు జరిగే ‘సూపర్‌ ఎయిట్స్‌’ మ్యాచ్‌పై అందరి దృష్టీ నిలిచింది. తమ ఆధిక్యాన్ని కొనసాగించాలని భారత్‌ భావిస్తుండగా, ప్రతీకారం తీర్చుకునేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమైంది. ఇరు జట్లు తమ గ్రూప్‌లలో అన్ని మ్యాచ్‌లూ గెలిచి టాపర్లుగా ముందంజ వేశాయి. అయితే మైదానం లోపలే కాకుండా బౌండరీ బయట కూడా ఒక ‘పోరు’ ఆసక్తిని రేపుతోంది. ఇరు జట్ల సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న సొంత అన్నదమ్ములు ఆల్బీ మోర్కెల్, మోర్నీ మోర్కెల్‌ ప్రత్యర్థులుగా తమ వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధమయ్యారు.రేపు మ్యాచ్‌ జరిగే సమయంలో వేర్వేరు డగౌట్లలో వీరు కనిపించనున్నారు. మోర్నీ గత కొంతకాలంగా భారత బౌలింగ్‌ కోచ్‌గా పని చేస్తుండగా, ఈ టోర్నీ కోసమే ఆల్బీని ‘ప్రత్యేక సలహాదారుడు’గా దక్షిణాఫ్రికా తీసుకుంది. శుక్రవారం ఇరు జట్ల ప్రాక్టీస్‌ సందర్భంగా ఆల్బీ, మోర్నీ గ్రౌండ్‌లోకి వచ్చినా ఒకరితో మరొకరు మాట్లాడుకోలేదు! ‘ఇప్పటి పరిస్థితుల్లో మా గురించి కాదు. మా అమ్మ గురించే అసలు ఆలోచన. ఆమెనే మా ఇద్దరిలో ఎవరికి మద్దతు ఇవ్వాలా అని ఎక్కువగా ఆందోళన చెందుతోంది’ అని ఆల్బీ వెల్లడించాడు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన ఆల్బీ దక్షిణాఫ్రికా తరఫున 58 వన్డేలు, 50 టి20 మ్యాచ్‌లు ఆడగా... స్ట్రయిక్‌ పేస్‌ బౌలర్‌గా గుర్తింపు పొందిన మోర్నీ 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టి20ల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు ఈ వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌ తరఫున స్యామ్‌ కరన్‌ బరిలోకి దిగగా... అతని సోదరుడు బెన్‌ కరన్‌ జింబాబ్వే జట్టులో ఉన్నాడు.

The stage is set for the prestigious Delhi Marathon 10
ఢిల్లీ మారథాన్‌ దిగ్గజాలతో షురూ

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ప్రతిష్టాత్మక ‘ఢిల్లీ మారథాన్‌’కు రంగం సిద్ధమైంది. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఆదివారం ఉదయం జరిగే ఈ సుదీర్ఘ పరుగును భారత బాక్సింగ్‌ దిగ్గజం విజేందర్‌ సింగ్, టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. సుమారు 30 వేల పైచిలుకు మంది ఔత్సాహికులు ఇందులో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారు. భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ), అంతర్జాతీయ మారథాన్, డిస్టెన్స్‌ రేస్‌ (ఏఐఎంఎస్‌), ప్రపంచ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) గుర్తింపు పొందిన ఈ సుదీర్ఘ పరుగులో కేవలం భారతీయులే కాదు విదేశీ మారథాన్‌ రన్నర్లు, పలువురు క్రీడాకారులు కూడా పాల్గొనేందుకు నగరానికి విచ్చేసినట్లు ఈవెంట్‌ నిర్వాహకులు తెలిపారు. ఈ మారథాన్‌ నాలుగు విభాగాల్లో జరుగుతోంది. ఇందులో మొదటిది పూర్తి మారథాన్‌. 42.195 కిలోమీటర్ల దూరం పరుగెత్తడం. దీంతో పాటు హాఫ్‌ మారథాన్‌ (21.09 కి.మీ.), 10కే (10 కిలో మీటర్లు), 5కే (5 కిలో మీటర్లు) పరుగు పందెంలు కూడా నిర్వహిస్తారు. అంటే సుదీర్ఘ పరుగు (42.21 కి.మీ) చేయలేని వారుసైతం నిరాశచెందకుండా 10కే, 5కే ఈవెంట్లో పరుగు పూర్తిచేయవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 31 దేశాల్లోని 490 నగరాలకు చెందిన ఔత్సాహికులు ఇందులో పాల్గొంటున్నారు. భారత్‌లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మారథాన్‌ ప్రియులు పరుగు పెట్టేందుకు తహతహలాడుతున్నారు. దేశీ క్రీడాకారులు అనిశ్‌ థాపా, బెలియప్ప, మన్‌ సింగ్, అక్షయ్‌ సైని, గోపీ, భాగిరథి బిస్త్, నిర్మాబెన్‌ ఠాకూర్, అశ్విని మదన్‌ జాదవ్, దిస్కెట్‌ డోల్మా, స్టాన్‌జిన్‌ డోల్కర్‌ తదితరులు కూడా పోటీపడుతున్నారు. ఆసియా క్రీడల క్వాలిఫయింగ్‌ టైమింగ్‌ను నమోదు చేసిన రన్నర్లకు ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో పోటీపడేందుకు అర్హత కూడా లభిస్తుంది. ఈ మారథాన్‌ పరుగు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తుంది. సమగ్ర వ్యర్థాల విభజన, ఒకసారి వాడి పారేసి ప్లాస్టిక్‌ను నిషేధించి... రీ సైక్లింగ్‌కు ఉపయోగపడే ప్లాస్టిక్‌ ఉత్పత్తులను ప్రోత్సహించడం... ఇందుకోసం పర్యావరణ సంస్థలు, కలిసి వచ్చే స్థానికులు, అధికారులతో మారథాన్‌ ఆర్గనైజర్లు చేతులు కలుపుతారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement