Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

T20 WC 2026: Scotland set 171 runs target to nepal1
చెలరేగిన జోన్స్‌.. నేపాల్‌ టార్గెట్‌ ఎంతంటే..?

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 17) రాత్రి 7 గంటలకు మొదలైన నామమాత్రపు మ్యాచ్‌లో స్కాట్లాండ్‌, నేపాల్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ ఓ మోస్తరు స్కోర్‌ చేసింది.ఓపెనర్‌ మైఖేల్‌ జోన్స్‌ (45 బంతుల్లో 71; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ద సెంచరీతో సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్కాటిష్‌ ఇన్నింగ్స్‌లో జోన్స్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మరో ఓపెనర్‌ జార్జ్‌ మున్సే (27), బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ (25), కెప్టెన్‌ రిచీ బెర్రింగ్టన్‌ (10), మార్క్‌ వాట్‌ (10 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో టామ్‌ బ్రూస్‌ (5), మాథ్యూ క్రాస్‌ (4), మైఖేల్‌ లీస్క్‌ (4) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యారు.నేపాల్‌ బౌలర్లలో సోమ్‌పాల్‌ కామీ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఇతను 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. మరో బౌలర్‌ నందన్‌ యాదవ్‌ కూడా పర్వాలేదనిపించాడు. ఇతను 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కుషాల్‌ భుర్టెల్‌, కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ తలో వికెట్‌ తీశారు. ఓ దశలో భారీ చేస్తుందనుకున్న స్కాట్లాండ్‌ చివర్లో త్వరితగతిన వికెట్లు కోల్పోయి ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది.అనంతరం​ ఛేదనకు దిగిన నేపాల్‌ ఆచితూచి ఆడుతుంది. తొలి 4 ఓవర్లలో ఆ జట్టు వికెట్లు కోల్పోకుండా 26 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు కుషాల్‌ భుర్టెల్‌ 14, ఆసిఫ్‌ షేక్‌ 12 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ గెలవాలంటే మరో 145 పరుగులు చేయాలి.​

After winning 2023 WC, Aussies continuous failures in ICC Tourneys2
ఐసీసీ టోర్నీల్లో దారుణంగా పతనమవుతున్న ఆసీస్‌ గ్రాఫ్‌

ప్రపంచ మేటి క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియా గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో దారుణంగా విఫలమవుతూ వస్తుంది. 2023 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆ జట్టు వరుసగా నాలుగు మెగా టోర్నీల్లో రిక్త హస్తాలతో వెనుదిరిగింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 దశలో నిష్క్రమించిన ఈ 2021 ఎడిషన్‌ జగజ్జేత.. గతేడాది ఛాంపియన్స్‌ ట్రోఫీలో సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టింది.ఆతర్వాత జరిగిన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో మట్టికరిచిన ఈ 2021-23 ఎడిషన్‌ ఛాంపియన్‌.. ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ20 ప్రపంచకప్‌ నుంచి గ్రూప్‌ దశలోనే పలాయనం చిత్తగించింది.పలు దశాబ్దాలుగా ప్రపంచ క్రికెట్‌ను మకుటంలేని మారాజుగా శాశిస్తున్న​ ఆస్ట్రేలియాకు ఉన్నట్టుండి ఈ దుస్థితి ఏంటని పరిశీలిస్తే.. పలు ఆసక్తికర విషయాలు బయటకి వస్తాయి. ఇందులో మొదటిది, అతి ముఖ్యమైనది ఆ జట్టుకు వెన్నతో పెట్టిన తలపొగరు. అనాదిగా ఆసీస్‌ ఆటగాళ్లు ఇదే తలపొగరుతో ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లను తక్కువ చేస్తూ వచ్చారు.ఇటీవలికాలంలో వారికి ఆ తల పొగరు మరీ ఎక్కువైంది. ఎంతలా అంటే, ప్రతి క్రికెటర్‌ జీవితంలో ఒక్కసారైనా తన చేతులతో పైకెత్కుకోవాలని భావించే ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టి, కెమెరాలకు ఫోజులిచ్చేంతలా. 2023 వన్డే ప్రపంచకప్‌ గెలిచిని తర్వాత ప్రస్తుత ఆసీస్‌ టీ20 జట్టు కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ బీరు తాగుతూ ప్రపంచకప్‌ ట్రోఫీపై కాళ్లు పెట్టాడు. ఆ క్షణమే ఆసీస్‌ పతనం ప్రారంభమైనట్లుంది.విజయగర్వం తలకెక్కి మార్ష్‌ చేసిన ఆ పనికి ఆసీస్‌ క్రమంగా మూల్యం చెల్లించుకుంటూ వస్తుంది. తాజాగా అదే మార్ష్‌ సారథ్యంలోని ఆసీస్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌ 2026లో పసికూన అయిన జింబాబ్వే చేతిలో దారుణంగా ఓడి, గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఆసీస్‌ జట్టు ఐసీసీ టోర్నీల్లో ఇటీవలికాలంలో పలచన పడటానికి మరో కారణం ఆ జట్టు స్టార్‌ ఆటగాళ్లు. ప్రపంచ మేటి ఆటగాళ్లుగా చెప్పుకోబడే ఆ స్టార్‌ ఆటగాళ్లకు ఐసీసీ టోర్నీలంటే చులకన భావం. వారు యాషెస్‌ సిరీస్‌ లాంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తారు కానీ, ప్రపంచ దేశాలనీ​ పాల్గొనే మెగా టోర్నీలకు ఇవ్వరు. కారణం ఎంటో వారికే తెలియాలి. గాయాలు చిన్నవైనా వారు ఇటీవలికాలంలో వాటి బూచిని చూపించి ఐసీసీ టోర్నీల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు కూడా ఇదే జరిగింది. ప్రస్తుత ఆసీస్‌ జట్టులోని స్టార్లు పాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ గాయాల పేరు చెప్పి, పొట్టి ప్రపంచకప్‌కు డుమ్మా కొట్టారు. వీరు లేని లోటు ఆసీస్‌ జట్టులో సుస్పష్టంగా కనిపించింది.ఇటీవలికాలంలో ఆసీస్‌ పతనానికి మరో కారణంగా ఆ జట్టు ఆటగాళ్లకు భారత​ ఉపఖండంపై ఉన్న చిన్నచూపు. మొదటి నుంచి వారు ఉపఖండంలో పర్యటించాలంటే ఎక్కువగా ఇష్టపడే వారు కాదు. ఇటీవలికాలంలో అది కాస్త ఎక్కువైంది. ఐపీఎల్‌ లాంటి ప్రపంచ ప్రఖ్యాత లీగ్‌ల్లో దండిగా డబ్బులు ముట్టజెప్పినా, ఎందుకో వారు ఉపఖండంలో ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఒకవేళ ఐపీఎల్‌లో ఆడినా కేవలం కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటారు. తాజాగా ముగిసిన ఐపీఎల్‌లో ఇది చాలా స్పష్టంగా బయటపడింది. ఈ విషయంలో వారి సమస్య ఏమిటో వారు స్వయంగా నోరు విప్పితే కానీ తెలీదు.పై విషయాల్లో వాస్తవాస్తవాలు పక్కన పెడితే.. ఆసీస్‌ జట్టు 2026 టీ20 ప్రపంచకప్‌ నుంచి గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడానికి మాత్రం వారి తలపొగరే కారణమని మెజారిటీ శాతం ​క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.కాగా, ఆస్ట్రేలియా జట్టు ఓసారి (2021-23) వరల్ట్‌ టెస్ట్‌ ఛాంపియన్‌గా.. ఆరు సార్లు (1987, 1999, 2003, 2007, 2015, 2023) వన్డే ప్రపంచకప్‌ విజేతగా.. ఓసారి (2021) పొట్టి ప్రపంచకప్‌ జగజ్జేతగా నిలిచి ‍ప్రపంచ క్రికెట్‌పై ఏకఛత్రధిపత్యం చలాయించిన విషయం తెలిసిందే.​

T20 WC 2026: zimbabwe, south africa and west indies are Team india super 8 opponents3
T20 WC 2026: సూపర్‌-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!

టీ20 ప్రపంచకప్‌ 2026 నుంచి ఆస్ట్రేలియా వైదొలగడంతో సూపర్‌-8 దశలో టీమిండియా ప్రత్యర్దులు ఖరారయ్యారు. సూపర్‌-8 గ్రూప్‌-1లో భారత్‌తో పాటు జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ జట్లు ఉన్నాయి. గ్రూప్‌-1 మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగుతాయి.భారత్‌ తమ తొలి సూపర్‌-8 మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.భారత రెండో సూపర్‌-8 మ్యాచ్‌ ఫిబ్రవరి 26న జరుగనుంది. చెన్నైలోని చిదంబరంలో స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లో భారత్‌ జింబాబ్వేను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌ కూడా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.భారత్‌ తమ మూడో సూపర్‌-8 మ్యాచ్‌ను మార్చి 1న ఆడుతుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో భారత్‌ వెస్టిండీస్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌ కూడా రాత్రి 7 గంటలకే ప్రారంభమవుతుంది.గ్రూప్‌-1లో మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇలా..-ఫిబ్రవరి 23- జింబాబ్వే వర్సెస్‌ వెస్టిండీస్‌ (ముంబై, రాత్రి 7 గంటలకు)-ఫిబ్రవరి 26- వెస్టిండీస్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (అహ్మదాబాద్‌, మధ్యాహ్నం 3 గంటలకు)-మార్చి 1- జింబాబ్వే వర్సెస్‌ సౌతాఫ్రికా (ఢిల్లీ, మధ్యాహ్నం 3 గంటలకు)మరోవైపు సూపర్‌-8 గ్రూప్‌-2 బెర్త్‌ల్లో ప్రస్తుతానికి మూడు ఖరారయ్యాయి. రేపు (ఫిబ్రవరి 18) జరుగబోయే మ్యాచ్‌లో నమీబియాపై గెలిస్తే.. పాక్‌ నాలుగో బెర్త్‌ దక్కించుకుంటుంది. సూపర్‌-8 గ్రూప్‌-2లో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక జట్లు ఉన్నాయి. గ్రూప్‌-2 మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. గ్రూప్‌-2కు సంబంధించి కూడా పలు సూపర్‌-8 మ్యాచ్‌లు ఖరారయ్యాయి.-ఫిబ్రవరి 22న ఇంగ్లండ్‌-శ్రీలంక (పల్లెకెలె, మధ్యాహ్నం 3 గంటలకు)-ఫిబ్రవరి 25న న్యూజిలాండ్‌-శ్రీలంక (కొలొంబో, రాత్రి 7 గంటలకు)-ఫిబ్రవరి 27న ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ (కొలొంబో, రాత్రి 7 గంటలకు)గ్రూప్‌-1, గ్రూప్‌-2లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌ మ్యాచ్‌లు మార్చి 4, 5 తేదీల్లో జరుగుతాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు మార్చి 8న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీస్‌, ఫైనల్‌కు వేదికలు ఇంకా ఖరారు కాలేదు.​

Bengal In Shocker As Jammu and Kashmir Stage Epic Comeback For Historic Ranji Trophy Final4
షమీ 8 వికెట్ల ప్రదర్శన వృధా

జమ్మూ అండ్‌ కశ్మీర్‌ క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు చేరువలో ఉంది. రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరేందుకు ఆ జట్టు మరో 83 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. మరో రోజు ఆట మిగిలి ఉంది.బెంగాల్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదిస్తున్న జమ్మూ టీమ్‌.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. శుభమ్‌ పుండిర్‌ (23), వన్ష్‌రాజ్‌ శర్మ (9) క్రీజ్‌లో ఉన్నారు. చివరి రోజు జమ్మూ లక్ష్యాన్ని ఛేదిస్తే సరికొత్త చరిత్ర అవుతుంది. రంజీ చరిత్రలో జమ్మూ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. ఇంకా చెప్పాలంటే సెమీస్‌కు చేరడం​ కూడా ఇదే మొదటిసారి.తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు వెనుకపడి కూడా అనూహ్యంగా పుంజుకొని, బెంగాల్‌ను 99 పరుగులకే (రెండో ఇన్నింగ్స్‌) కుప్పకూల్చిన జమ్మూ జట్టు, సరికొత్త చరిత్రకు అద్భుత పునాది వేసింది. అనంతరం స్వల్ప ఛేదనలో 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినా ఏమాత్రం జంక లేదు. మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి మూడో రోజు ఆటను ముగించింది.మరోసారి చెలరేగిన నబీతొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన ఆకిబ్‌ నబీ మరోసారి విజృంభించాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటి బెంగాల్‌ను మడత పెట్టడంతో పెద్ద చెయ్యి వేశాడు. అతనికి సునీల్‌ కుమార్‌ (4-27), యుద్ధ్‌వీర్‌ చరక్‌ (5-0-29-2) సహకరించారు. వీరి ధాటికి బెంగాల్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. షాబాజ్‌ అహ్మద్‌ (24) ఒక్కడే 20కి పైగా పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో సుదిప్‌ ఘరామీ సహా సుదిప్‌ చటర్జీ, ఆకాశ్‌దీప్‌ డకౌట్లయ్యారు.విజృంభించిన షమీఅంతకుముందు టీమిండియా ప్లేయర్‌ మహ్మద్‌ షమీ 8 వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో జమ్మూ తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌటైంది. బౌలింగ్‌లో చెలరేగిన నబీ బ్యాట్‌తోనూ రాణించడంతో జమ్మూ టీమ్‌ ఈ స్కోర్‌ చేయగలిగింది. నబీ (42).. యద్ద్‌వీర్‌ చరక్‌తో (33) తొమ్మిదో వికెట్‌కు 64 పరుగులు జోడించి, తన జట్టును 300 పరుగుల మార్కును దాటించాడు. అంతకుముందు కెప్టెన్‌ పరాస్‌ డోగ్రా (58), అబ్దుల్‌ సమద్‌ (82) అర్ద సెంచరీలతో రాణించారు.ఘరామీ అద్భుత శతకంఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగాల్‌.. సుదిప్‌ ఘరామీ అద్భుత శతకంతో (146) కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులు చేసింది. ఆకిబ్‌ నబీ 5, సునీల్‌ కుమార్‌ 3 వికెట్లతో సత్తా చాటారు.

T20 WC 2026 IND vs NED: Predicted XI Bumrah not needed Washi In5
IND vs NED: అతడిపై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియా హ్యాట్రిక్‌ విజయాలతో జోరు మీద ఉంది. గ్రూప్‌-ఎ నుంచి అమెరికా, నమీబియా వంటి పసికూనలపై గెలుపొందిన భారత్‌.. చివరగా దాయాది పాకిస్తాన్‌ను మట్టికరిపించిది.‘చిరకాల ప్రత్యర్థి’ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసి.. లీగ్‌ దశలో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సూపర్‌-8కు అర్హత సాధించింది. ఇక గ్రూప్‌-ఎలో భాగంగా నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా బుధవారం రాత్రి (ఫిబ్రవరి 18) మరో పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.అభిషేక్‌ శర్మ డకౌట్‌ అయినా..కాగా ఇప్పటికే సూపర్‌-8కు చేరిన తరుణంలో నెదర్లాండ్స్‌తో ఆడే తుదిజట్టులో భారత్‌ మార్పులు చేసే అవకాశం ఉంది. ఓపెనర్‌గా అభిషేక్‌ శర్మ (0,0) రెండు మ్యాచ్‌లు ఆడి డకౌట్‌ అయినా.. అతడిని కొనసాగించడం ఖాయమే. దీంతో మరోసారి సంజూ శాంసన్‌కు మొండిచేయి తప్పదు.ఇక ఇప్పటికే ఓపెనర్‌గా ఇరగదీస్తూ.. పాక్‌పై భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్‌ కిషన్‌ స్థానానికి ఢోకా లేదు. సూర్యకుమార్‌ కెప్టెన్సీలోని ఈ జట్టులో తిలక్‌ వర్మ, శివం దూబే, హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి కొనసాగటం లాంఛనమే.బుమ్రాకు రెస్ట్‌.. అతడిపై వేటుఅయితే, పాక్‌తో మ్యాచ్‌ ఆడిన ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే అతడి స్థానంలో అర్ష్‌దీప్‌ సింగ్‌ రావడం పక్కా. అదే విధంగా.. కుల్దీప్‌ యాదవ్‌ను తప్పించి.. అతడి స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ను తుదిజట్టులో ఆడించే యోచనలో మేనేజ్‌మెంట్‌ ఉన్నట్లు సమాచారం.కాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందు గాయపడిన వాషీ.. నమీబియాతో మ్యాచ్‌ నుంచి అందుబాటులోకి వచ్చాడు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినప్పటికీ అతడి విషయంలో మేనేజ్‌మెంట్‌ రిస్క్‌ తీసుకోలేదు. అయితే, నెదర్లాండ్స్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో ఆడించి తదుపరి మ్యాచ్‌లకు అతడిని సన్నద్ధం చేయనున్నట్లు సమాచారం.నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు (అంచనా)ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.చదవండి: T20 WC: ఆస్ట్రేలియా అవుట్‌.. సూపర్‌-8కు జింబాబ్వే

T20 WC 2026 IRE vs ZIM Match Abandoned, ZIM in Super 8 AUS Eliminated6
T20 WC: ఆస్ట్రేలియా అవుట్‌.. సూపర్‌-8కు జింబాబ్వే

ఊహించిందే జరిగింది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. లీగ్‌ దశలోనే ఇంటిబాట పట్టింది. గ్రూప్‌-బి నుంచి ఐర్లాండ్‌- జింబాబ్వే మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్‌ రద్దయిపోయింది.ఆస్ట్రేలియా ఎలిమినేట్‌శ్రీలంకలోని పల్లెకెలెలో వర్షం తెరిపినివ్వక పోవడంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా ఇరుజట్లకు చెరో పాయింట్‌ వచ్చింది. దీంతో జింబాబ్వే పాయింట్ల సంఖ్య ఐదుకు చేరగా... ఆస్ట్రేలియా ఎలిమినేట్‌ అయింది.మొత్తంగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్‌కప్‌ టోర్నీలో ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. ఇందులో భాగంగా గ్రూప్‌-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్‌, ఒమన్‌ వంటి పసికూనలతో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా పోటీలో ఉన్నాయి.ఐదు పాయింట్లతో అర్హత ఇక ఆది నుంచి అదరగొట్టిన శ్రీలంక ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచి ఆరు పాయింట్లతో గ్రూప్‌-బి నుంచి సూపర్‌-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. రెండో స్థానం కోసమైనా పోరాడాలని అనుకున్న ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచిన ఆస్ట్రేలియా.. తర్వాత పసికూన జింబాబ్వే చేతిలో ఓటమిపాలైంది. అనంతరం సోమవారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ చిత్తుగా ఓడింది. దీంతో ప్రస్తుతం ఆసీస్‌ ఖాతాలో కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి.మ్యాచ్‌ రద్దు కావడంతోమరోవైపు.. జింబాబ్వే ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా ఐర్లాండ్‌తో జరగాల్సిన మూడో మ్యాచ్‌ రద్దు కావడంతో జింబాబ్వేకు మరో పాయింట్‌ వచ్చింది. నెట్‌రన్‌రేటు పరంగానూ జింబాబ్వే పటిష్ట స్థితి (+1.984)లో నిలిచింది. ఫలితంగా శ్రీలంకతో కలిసి జింబాబ్వే సూపర్‌-8కు అర్హత సాధించగా.. మిచెల్‌ మార్ష్‌ సారథ్యంలోని ఆస్ట్రేలియా అవమాన భారంతో నిష్క్రమించింది.ఇక గ్రూప్‌-బి తదుపరి నామమాత్రపు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆఖరిగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఒమన్‌తో తలపడుతుంది. మరోవైపు జింబాబ్వే గురువారం శ్రీలంకను ఢీకొడుతుంది.ఆఖరి బెర్తు ఎవరిదో?ఇదిలా ఉంటే.. గ్రూప్‌-ఎ నుంచి టీమిండియా సూపర్‌-8కు చేరగా.. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌.. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ అర్హత సాధించాయి. ఆఖరి బెర్తు కోసం గ్రూప్‌-ఎ నుంచి పాకిస్తాన్‌, అమెరికా బరిలో ఉన్నాయి. కాగా గత వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో పాక్‌ను వెనక్కి నెట్టి అమెరికా సూపర్‌-8కు చేరిన విషయం తెలిసిందే.చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన కెనడా బ్యాటర్‌.. ప్రపంచ రికార్డు

Pakistan Spinner Sadia Iqbal dethrones Deepti Sharma as New ICC World No 1 T20 Bowler7
భారత స్టార్‌ను కిందకి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన పాక్‌ ప్లేయర్‌

ఐసీసీ తాజాగా ప్రకటించిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ ప్లేయర్లకు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో స్టార్‌ స్పిన్నర్‌ దీప్తి శర్మ అగ్రస్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. టాప్‌ ప్లేస్‌కు పాక్‌ స్పిన్నర్‌ సదియా ఇక్బాల్‌ ఎగబాకింది. గత వారం ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉండిన సదియా రెండు స్థానాలు మెరుగుపర్చుకుంది. సదియా (743), దీప్తి శర్మ (729) మధ్య పాయింట్ల వ్యత్యాసం 14 పాయింట్లు మాత్రమే. ఆసీస్‌ పర్యటన తొలి టీ20లో పెద్దగా ప్రభావం (2-0-19-1) చూపకపోవడంతో దీప్తి టాప్‌ ర్యాంక్‌ను కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు సదియా సౌతాఫ్రికాతో తాజాగా జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 5.82 ఎకానమీతో 5 వికెట్లు తీసి టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంది.టాప్‌-10లోకి దూసుకొచ్చిన రేణుకా సింగ్‌తాజా ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ పేసర్‌ రేణుకా సింగ్‌ టాప్‌-10లోకి దూసుకొచ్చింది. ఆసీస్‌పై తొలి టీ20లో అద్భుత ప్రదర్శన (4-1-14-2) కనబర్చడంతో ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకింది.అరుంధతి అదుర్స్‌ఇదే మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా (4-0-22-4) చెలరేగిన మరో భారత పేసర్‌ అరుంధతి రెడ్డి ఏకంగా 19 స్థానాలు మెరుగుపర్చుకొని 17వ స్థానానికి ఎగబాకింది. ఇదే మ్యాచ్‌లో రాణించిన స్పిన్నర్‌ శ్రీచరణి (3-0-14-2) ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకొని 39వ స్థానానికి ఎగబాకింది.బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఈ వారం పెద్దగా మార్పుల్లేవు. బెత్‌ మూనీ, హేలీ మాథ్యూస్‌, స్మృతి మంధన టాప్‌-3లో కొనసాగుతున్నారు. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగా.. జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తలో స్థానాన్ని మెరుగుపర్చుకొని 11, 12 స్థానాలకు ఎగబాకారు. పాక్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా ఏకంగా 31 స్థానాలు మెరుగుపర్చుకొని 29వ స్థానానికి ఎగబాకింది. మిగతా చెప్పుకోదగ్గ మార్పుల్లో సౌతాఫ్రికా బ్యాటర్‌ అనెరీ​ డెర్క్‌సన్‌ 13 స్థానాలు మెరుగుపర్చుకొని 76కు.. ఆసీస్‌ బ్యాటర్‌ జార్జియా వేర్హమ్‌ 9 స్థానాలు మెరుగుపర్చుకొని 90వ స్థానానికి ఎగబాకారు.ఆల్‌రౌండర్ల విభాగంలోనూ పెద్దగా మార్పుల్లేవు. హేలీ మాథ్యూస్‌, అమేలియా కెర్‌, దీప్తి శర్మ టాప్‌-3లో కొనసాగుతుండగా.. పాక్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా మాత్రం 5 స్థానాలు మెరుగుపర్చుకొని ఆరో స్థానానికి చేరింది.

ACC Women's Asia Cup Rising Stars 2026: India A beat Nepal by 7 Wickets8
సెమీస్‌లో భారత్‌, పాక్‌

బ్యాంకాక్‌ వేదికగా జరుగుతున్న ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టోర్నీలో చిరకాల ప్రత్యర్ధులు భారత్‌, పాకిస్తాన్‌ సెమీఫైనల్‌కు చేరాయి. ఇవాళ (ఫిబ్రవరి 17) జరిగిన మ్యాచ్‌ల్లో భారత-ఏ జట్టు నేపాల్‌పై.. పాకిస్తాన్‌-ఏ జట్టు యూఏఈపై ఘన విజయాలు సాధించి, ఫైనల్‌ ఫోర్‌లోకి ప్రవేశించాయి. సెమీస్‌లో భారత్‌, పాక్‌ ఎదుర్కోబోయే ప్రత్యర్ధులు ఎవరో రేపు జరుగబోయే బంగ్లాదేశ్‌-ఏ, మలేషియా.. శ్రీలంక-ఏ, థాయ్‌లాండ్‌ మ్యాచ్‌లతో తెలుస్తుంది.ఈ టోర్నీలో భారత్‌, పాక్‌ ఒకే గ్రూప్‌లో (ఏ) ఉన్నాయి. ఈ గ్రూప్‌ నుంచి భారత్‌, పాక్‌ మొదటి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి. ఈ గ్రూప్‌లో యూఏఈ.. భారత్‌, పాక్‌కు గట్టి పోటీనిచ్చింది. ఆ జట్టు కూడా భారత్‌, పాక్‌తో సమానంగా మూడింట రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఇవాల్టి మ్యాచ్‌లో పాక్‌ చేతిలో ఓటమితో యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్‌-ఏలో మరో జట్టు నేపాల్‌, ఆడిన 3 మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌-ఏ సెమీస్‌ బెర్త్‌ ఇదివరకే ఖరారైనప్పటికీ.. సెమీస్‌లో వారు ఎదుర్కోబోయే ప్రత్యర్ది ఎవరో మలేషియా మ్యాచ్‌ ఫలితంతో తెలుస్తుంది. ఎందుకంటే గ్రూప్‌-బిలో ఆ జట్టు స్థానాన్ని (1,2) మలేషియా మ్యాచ్‌ ఫలితం డిసైడ్‌ చేస్తుంది. గ్రూప్‌-బిలో మరో సెమీస్‌ బెర్త్‌ కోసం శ్రీలంక-ఏ, థాయ్‌లాండ్‌ పోటీపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య రేపటి మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే, ఆ జట్టుకే సెమీస్‌ బెర్త్‌ దక్కుతుంది. ప్రస్తుతం శ్రీలంక-ఏ, థాయ్‌లాండ్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్‌ గెలిచి బంగ్లాదేశ్‌-ఏ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రూప్‌లో మలేషియా ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓడి నాలుగో స్థానంలో ఉంది.ఫిబ్రవరి 20న జరిగే వేర్వేరు సెమీఫైనల్స్‌లో భారత్‌, పాక్‌ పోటీపడతాయి. సెమీస్‌లో ఈ రెండు జట్లు గెలిస్తే.. ఫైనల్లో ఎదురెదురుపడతాయి. ఈ మ్యాచ్‌ ఫిబ్రవరి 22న జరుగనుంది.నేపాల్‌ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. తనూజా కన్వర్‌ 4, మిన్నూ మణి 3, కెప్టెన్‌ రాధా యాదవ్‌ 2 వికెట్లతో సత్తా చాటడంతో నేపాల్‌ 18 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. నేపాల్‌ ఇన్నింగ్స్‌లో సమ్జానా ఖడ్కా (22) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 7.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. వ్రిందా దినేశ్‌ 39 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చింది.మరో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈని పాక్‌ 17.2 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్‌ 11 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది.

T20 WC 2026: What Happens To Australia If IRE vs ZIM Is Abandoned9
T20 WC: జింబాబ్వే రైట్‌ రైట్‌.. అదే జరిగితే ఆసీస్‌ ఇంటికే!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టోర్నీ ఆరంభానికి ముందే ప్యాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ గాయాల కారణంగా దూరమయ్యారు. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ సైతం ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు.దీంతో కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయిన ఆస్ట్రేలియా.. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో గెలుపొంది శుభారంభం అందుకుంది. అయితే, ఆ తర్వాత ఆసీస్‌ అదే జోరు కొనసాగించలేకపోయింది.జింబాబ్వే చేతిలో ఓటమి.. లంక చేతిలోనూ చిత్తుతమ రెండో మ్యాచ్‌లో అనూహ్య రీతిలో పసికూన జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోయింది ఆస్ట్రేలియా. తద్వారా జింబాబ్వే గ్రూప్‌-బి నుంచి సూపర్‌-8 అవకాశాలు మెరగుపరచుకోగా.. కంగారూ జట్టుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకతో సోమవారం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో ఆసీస్‌ సూపర్‌-8 అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.గ్రూప్‌-బి నుంచి శ్రీలంక మూడింటికి మూడు గెలిచి సూపర్‌-8కు చేరగా.. జింబాబ్వే రెండింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నెట్‌రన్‌రేటు (+1.984).పటిష్టస్థితిలో జింబాబ్వే.. అదే జరిగితే ఆసీస్‌ ఇంటికేమరోవైపు ఆస్ట్రేలియా మూడు ఆడి కేవలం ఒక్కటే గెలిచి.. 2 పాయింట్లతో ఉంది. నెట్‌రన్‌రేటు (+0.414) తదుపరి ఒమన్‌తో ఆసీస్‌ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే ఆసీస్‌ సూపర్‌-8 అవకాశాలు సజీవంగా ఉంటాయి.అయితే, దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఆస్ట్రేలియాను వర్షం గండం వెంటాడుతోంది. ఆసీస్‌ కంటే పాయింట్లు, నెట్‌రన్‌రేటు పరంగా జింబాబ్వే పటిష్ట స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో మంగళవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో గెలిస్తే జింబాబ్వే ఆరు పాయింట్లతో నేరుగా సూపర్‌-8 చేరితే ఆసీస్‌ ఇంటి బాటపడుతుంది.ఒకవేళ ఐర్లాండ్‌ చేతిలో జింబాబ్వే ఓడితే ఆసీస్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే, ఐర్లాండ్‌- జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. పల్లెకెలెలో వర్షం పడుతున్న కారణంగా ఇరుజట్ల మధ్య మ్యాచ్‌కు టాస్‌ ఆలస్యమైంది. ఒకవేళ వర్షం తెరిపినివ్వకపోతే మ్యాచ్‌ రద్దైపోతుంది.ఓడినా మరో అవకాశం కూడా!అదే జరిగితే ఇరుజట్లకు చెరో పాయింట్‌ వస్తుంది. అప్పుడు జింబాబ్వే ఖాతాలో పాయింట్ల సంఖ్య ఐదుకు చేరుతుంది. తద్వారా ఆటోమేటిక్‌గా జింబాబ్వే సూపర్‌-8కు అర్హత సాధిస్తుంది. ఆసీస్‌ టోర్నీ నుంచి ఘోర పరాభవంతో లీగ్‌ దశలోనే నిష్క్రమిస్తుంది. అన్నట్లు జింబాబ్వేకు మరో మ్యాచ్‌ కూడా మిగిలి ఉంది. శ్రీలంకతో గురువారం జింబాబ్వే తలపడుతుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఫలితం తేడాగా వచ్చిన జింబాబ్వేకు ఇంకో అవకాశం మిగిలే ఉంటుందన్నమాట. UPDATE: T20 WC: ఆస్ట్రేలియా అవుట్‌.. సూపర్‌-8కు జింబాబ్వేచదవండి: గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

T20 WC 2026: New zealand confirms super 8 berth, what are the other team qualified and what are the teams in the race of super 810
సూపర్‌-8కు న్యూజిలాండ్‌.. మిగిలిన రెండు బెర్త్‌లు ఎవరివి..?

టీ20 ప్రపంచకప్‌ 2026లో మరో సూపర్‌-8 బెర్త్‌ ఖరారైంది. కెనడాపై గెలుపుతో న్యూజిలాండ్‌ ఫైనల్‌-8కు అర్హత సాధించింది. ఇప్పటికే భారత్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక సూపర్‌-8కు చేరాయి. ఇక మిగిలింది రెండు బెర్త్‌లు మాత్రమే. ఆ రెండు ఎవరివి.. ఏయే జట్లు వాటి కోసం​ పోటీపడుతున్నాయి.. ఏ జట్లకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.. వంటి అంశాలపై ఈ కథనంలో చర్చిద్దాం.గ్రూప్‌-సి,డి నుంచి సూపర్‌-8 బెర్త్‌లు ఖరారైపోగా.. ఏ,బి గ్రూప్‌ల్లో ఓ బెర్త్‌ ఖరారైనా, మరో బెర్త్‌పై సందిగ్దత నెలకొంది. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ సూపర్‌-8కు క్వాలిఫై కాగా.. స్కాట్లాండ్‌, ఇటలీ, నేపాల్‌ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించగా.. ఆఫ్ఘనిస్తాన్‌, యూఏఈ, కెనడా టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయ్యాయి.గ్రూప్‌-ఏ నుంచి ప్రస్తుతానికి భారత్‌ ఒక్కటే సూపర్‌-8కు అర్హత సాధించింది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిన నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గ్రూప్‌ నుంచి మరో బెర్త్‌ కోసం​ టెక్నికల్‌గా 3 జట్ల మధ్య పోటీ ఉంది. అయితే ప్రధాన పోటీ మాత్రం యూఎస్‌ఏ, పాకిస్తాన్‌ మధ్యే ఉంటుంది. నెదర్లాండ్స్‌ టెక్నికల్‌గా టోర్నీలో ఉన్నా, ఆ జట్టు సూపర్‌-8 అర్హత సాధించడం దాదాపుగా అసాధ్యం.పాక్‌, యూఎస్‌ఏ మధ్య ప్రధాన పోటీగా చెప్పుకుంటున్నా, పాక్‌కే సూపర్‌-8 అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ జట్టుకు మరో మ్యాచ్‌ మిగిలి ఉంది. అది కూడా పసికూన నమీబియాతో. ఈ మ్యాచ్‌లో పాక్‌ గెలిస్తే.. నేరుగా సూపర్‌-8కు చేరుకుంటుంది. అప్పుడు యూఎస్‌ఏ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. యూఎస్‌ఏ ఇప్పటికే తమ నాలుగు గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు పూర్తి చేసుకొని, పాక్‌తో సమంగా నాలుగు పాయింట్లు కలిగి ఉంది.యూఎస్‌ఏ సూపర్‌-8కు చేరాలంటే పాక్‌ నమీబియా చేతిలో భారీ తేడాతో ఓడిపోవాలి. అప్పుడు పాక్‌, యూఎస్‌ఏ చెరి నాలుగు పాయింట్లు కలిగి ఉంటాయి. మెరుగైన రన్‌రేట్‌ ఆధారంగా యూఎస్‌ఏ సూపర్‌-8కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం యూఎస్‌ఏ పాక్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ కలిగి ఉంది.గ్రూప్‌-ఏ నుంచి టెక్నికల్‌గా సూపర్‌-8 లైన్‌లో ఉన్న మరో జట్టు నెదర్లాండ్స్‌. ఈ జట్టు తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ గెలవడం అసాధ్యమే కాబట్టి, ఆ జట్టు అనధికారికంగా సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించింది. ఒకవేళ నెదర్లాండ్స్‌ భారత్‌పై ఘన విజయం సాధించి, పాక్‌ నమీబియా చేతిలో భారీ తేడాతో ఓడితే, అప్పుడు రన్‌రేట్‌ కీలకమవుతుంది. ఇలా జరిగిన పక్షంలో యూఎస్‌ఏ, పాక్‌, నెదర్లాండ్స్‌ జట్లలో మెరుగైన రన్‌రేట్‌ కలిగిన జట్టు సూపర్‌-8కు అర్హత సాధిస్తుంది.గ్రూప్‌-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో శ్రీలంక ఇదివరకే సూపర్‌-8కు చేరిపోగా.. ఒమన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిగిలిన బెర్త్‌ కోసం జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌ జట్లు పోటీపడుతున్నాయి. అధికారకంగా 3 జట్లు రేసులో ఉన్నా, ప్రధాన పోటీ మాత్రం జింబాబ్వే, ఆస్ట్రేలియా మధ్య ఉంటుంది. ఇవాళ (ఫిబ్రవరి 17) ఐర్లాండ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో జింబాబ్వే విజయం సాధిస్తే.. మిగతా సమీకరణలతో పని లేకుండా జింబాబ్వే సూపర్‌-8కు, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియా ఇంటి బాట పడతాయి. ఒకవేళ ఆస్ట్రేలియాకు సూపర్‌-8 బెర్త్‌ దక్కాలంటే.. ఆ జట్టు తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో ఒమన్‌పై భారీ విజయం సాధించాలి. అలాగే జింబాబ్వే తమ మిగిలిన రెండు గ్రూప్‌ మ్యాచ్‌ల్లో ఐర్లాండ్‌, శ్రీలంక చేతుల్లో భారీ తేడాతో ఓడాలి. ఇవాల్టి జింబాబ్వే-ఐర్లాండ్‌ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలేలా ఉన్నాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దైనా, జింబాబ్వే సూపర్‌-8కు వెళ్తుంది. ఆసీస్‌, ఐర్లాండ్‌ ఇంటిముఖం పడతాయి. ఐర్లాండ్‌ సూపర్‌-8 అవకాశాలను పరిశీలిస్తే.. ఈ జట్టు నేడు జింబాబ్వేపై భారీ తేడాతో గెలవాలి. జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ దారుణంగా ఓడాలి. ఆస్ట్రేలియా తమ చివరి మ్యాచ్‌లో ఒమన్‌ చేతిలో ఓడాలి. అప్పుడు ఐర్లాండ్‌కు సూపర్‌-8 అవకాశం దక్కుతుంది. ఈ సమీకరణలు కార్యరూపాం దాల్చడం దాదాపుగా అసాధ్యమే కాబట్టి, ఐర్లాండ్‌ అనధికారికంగా సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించినట్టే.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement