Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

India Women beat Sri Lanka Women by 8 wkts in 3rd T20I1
షెఫాలీ మెరుపులు.. మూడో టీ20లో భారత్‌ ఘన విజయం

తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఉమెన్ ఇన్ బ్లూ.. మరో రెండు మ్యాచ్‌ల మిగులూండగానే 3-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 113 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.2 ఓవర్లలో చేధించింది.లక్ష్య చేధనలో ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 40 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(21) రాణించింది. అయితే స్టార్‌ ప్లేయర్లు స్మృతి మంధాన(1), రోడ్రిగ్స్‌(9) మాత్రం విఫలమయ్యారు.అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవ‌లం 112 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. భారత పేసర్‌ రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి లంక టాపార్డ‌ర్‌ను దెబ్బతీయగా.. దీప్తీ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటింది. శ్రీలంక బ్యాట‌ర్ల‌లో ఇమేషా దులాని 27 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. కవిషా దిల్హారి(20), హాసిని పెరీరా(25) ఫ‌ర్వాలేద‌న్పించారు. ఇక నాలుగో టీ20 ఇదే వేదికగా డిసెంబర్‌ 28న జరగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా

Virat Kohli Creates History, Breaks MASSIVE World Record With 77 Vs Gujarat In Vijay Hazare Trophy2
చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా

విజ‌య్ హ‌జారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్‌, ఢిల్లీ బాయ్ విరాట్ కోహ్లి అదరగొడుతున్నాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఆడుతున్న కోహ్లి.. అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌పై విధ్వంసకర సెంచరీతో చెలరేగిన కోహ్లి.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో గుజరాత్‌పై మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 77 పరుగులు చేశాడు.ఈ క్రమంలో కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో కోహ్లి ఇప్పటివరకు 57.87 సగటుతో 16,207 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం మైఖేల్ బెవాన్ పేరిట ఉండేది. బెవాన్ తన లిస్ట్‌-ఎ కెరీర్‌లో 57.86 సగటుతో 15,103 పరుగులు చేశాడు. తాజా హాఫ్ సెంచరీ బెవాన్ ఆల్‌టైమ్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు.లిస్ట్ ఎ క్రికెట్‌లో అత్యధిక సగటు సాధించిన బ్యాటర్లు వీరే1. విరాట్ కోహ్లి (భారత్‌): 57.87- 16,207 పరుగులు2. మైఖేల్ బెవాన్ (ఆస్ట్రేలియా): 57.86- 15,103 పరుగులు3. సామ్ హైన్ (ఇంగ్లండ్): 57.76- 3004 పరుగులు4. ఛతేశ్వర్ పుజారా (భారత్‌): 57.01-5759 పరుగులు5. రుతురాజ్ గైక్వాడ్ (భారత్‌): 56.68- 4648 పరుగులుఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. గుజరాత్‌పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కోహ్లితో పాటు కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌(70) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. గుజరాత్‌ బౌలర్లలో విశాల్‌ జైశ్వాల్‌ 4 వికెట్లు పడగొట్టగా..రవి బిష్ణోయ్‌ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం 255 పరుగుల లక్ష్య చేధనలో గుజరాత్‌ 47.4 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్‌ బ్యాటర్లలో ఆర్య దేశాయ్‌(57) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సౌరవ్‌ చౌహన్‌(49), ఉర్విల్‌ పటేల్‌(31) ఫర్వాలేదన్పించారు. ఢిల్లీ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్‌ మూడు, ఇషాంత్‌ శర్మ, అర్పిత్‌ రాణా తలా రెండు వికెట్లు సాధించాడు. హాఫ్‌ సెంచరీతో సత్తాచాటిన విరాట్‌ కోహ్లికి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

India Womens need 113 small target to win in 3rd T20I3
IND vs SL: 4 వికెట్లతో చెలరేగిన రేణుకా.. భారత్‌ టార్గెట్‌ ఎంతంటే?

తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో జరుగుతున్న మూడో టీ20లోనూ భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి కేవ‌లం 112 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఇండియ‌న్ పేస‌ర్ రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి లంక టాపార్డ‌ర్‌ను దెబ్బ‌కొట్టింది.ఆమెతో పాటు స్పిన్నర్ దీప్తీ శ‌ర్మ కూడా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ప‌ర్యాట‌క జ‌ట్టును నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమితం చేసింది. అయితే మిగితా బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన‌ప్ప‌టికి వికెట్ మాత్రం సాధించ‌లేక‌పోయారు. శ్రీలంక బ్యాట‌ర్ల‌లో ఇమేషా దులాని 27 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. కవిషా దిల్హారి(20), హాసిని పెరీరా(25) ఫ‌ర్వాలేద‌న్పించారు.కెప్టెన్ ఆత‌ప‌ట్టు కేవ‌లం మూడు ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచింది. అయితే భార‌త బ్యాట‌ర్లు ఉన్న జోరు ముందు ఈ స్ప‌ల్ప ల‌క్ష్యాన్ని లంక బౌల‌ర్లు ఎలా కాపాడుకుంటారో చూడాలి. ఇప్ప‌టికే తొలి రెండు టీ20ల్లో విజ‌యం సాధించిన భార‌త్‌.. మూడో మ్యాచ్‌లో కూడా ఎలాగైనా గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తే భార‌త్‌ మ‌రో రెండు టీ20ల మిగిలూండ‌గానే 3-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంటుంది.తుది జట్లు..శ్రీలంక: చమరి అతపత్తు(కెప్టెన్‌), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నిమేషా మదుషాని, కవిషా దిల్హరి, నీలక్షికా సిల్వా, ఇమేషా దులాని, కౌషని నుత్యంగన(వికెట్ కీప‌ర్‌), మల్షా షెహాని, ఇనోకా రణవీర, మల్కీ మదరభారత్‌: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి

Tim David suffers hamstring injury scare during BBL4
ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. ఇక కష్టమే?

టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ తొడ కండరాల (హ్యామ్‌స్ట్రింగ్ ) గాయం బారిన పడ్డాడు. బిగ్ బాష్ లీగ్ (BBL) 2025-26 సీజన్‌లో భాగంగా పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా డేవిడ్(హోబర్ట్ హరికేన్స్) తొడ కండరాలు పట్టేశాయి.151 పరుగుల లక్ష్య చేధనలో హోబర్ట్ హరికేన్స్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే 41 పరుగులు చేసి దూకుడుగా ఆడుతున్న సమయంలో అతడు అనుహ్యంగా గాయపడ్డాడు.సింగిల్ తీసే క్రమంలో అతడి కుడి తొడ వెనుక కండరాలు పట్టేశాయి. దీంతో అతడు నొప్పితో విలవిలాడాడు. ఫిజియో వచ్చి పరీక్షించిన తర్వాత, నొప్పితోనే డేవిడ్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి పరిస్థితిని చూస్తుంటే గాయం తీవ్రమైనది అనిపిస్తోంది. స్కాన్ రిపోర్ట్‌ల తర్వాత అతడి గాయం తీవ్రత తేలనుంది. ఏదేమైనప్పటికి డేవిడ్ వంటి కీలక ఆటగాడు ప్రపంచకప్‌నకు ముందు గాయపడటం ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది.ఒకవేళ అతడి గాయం తీవ్రత గ్రేడ్‌-1గా ఉంటే కోలుకోవడానికి సుమారు మూడు వారాల సమయం పడుతోంది. అదే గ్రేడ్‌-2 అయితే రెండు నుంచి మూడు నెలలు.. గ్రేడ్ 3 అయితే 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.డేవిడ్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అతడు త్వరగా కోలుకోవాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. అదేవిధంగా టీ20 ప్రపంచకప్‌-2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ఐపీఎల్ వద్దంది.. క‌ట్ చేస్తే! అక్క‌డ చుక్క‌లు చూపిస్తున్నాడు

India tops global doping list for third consecutive year5
డోపింగ్‌ టెస్టుల్లో ఇండియా అథ్లెట్స్ ముందంజ..!

భారతదేశంలో డోపింగ్ సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. బహుమతులు అందుకునే దేశాల జాబితాలో ముందుండాల్సిన మన దేశం ఇప్పుడు డోపింగ్ కు పాల్పడుతూ దొరికిపోయిన దేశాల జాబితాలో ముందంజలో ఉంది. ఈ విషయాన్ని ఎవరో తెలుసా..? ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(WADA) The World Anti-Doping Agency.. అవును ఈ విషయాన్ని బట్టబయలు చేసింది.ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ 2023 పరీక్ష డేటాలో, 5వేలకుపైగా నమూనాలను విశ్లేషించిన దేశాల జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో ఉండడం మనకు అవమానకరమే. అయితే, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ చేసిన అభ్యంతరాలను గుర్తించి వెంటనే ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని, దీని కోసం సవరించిన డోపింగ్ నిరోధక చట్టాన్ని ప్రవేశపెడతామని భారత క్రీడా మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. నిషేధిత పదార్థాలకు సంబంధించి భారతదేశ సానుకూల రేటు 3.8 శాతం ఉంది. 5,606 నమూనాల్లో 214 ప్రతికూల ఫలితాలు కనుగొన్నారు. 2022లో 3,865 పరీక్షలు నిర్వహించగా 3.2 శాతం ప్రతికూల ఫలితాలు నమోదయ్యాయి.సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి..2024లో భారత దేశంలోని అథ్లెట్లు డోపింగ్ సంబంధిత కార్యకలాపాలలో రికార్డు స్థాయిలో 260 మంది పాల్గొన్నారని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ అంటే World Anti-Doping Agency (వాడా) వెబ్‌సైట్‌లో ప్రచురించిన నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో భారత అథ్లెట్లు మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. డోపింగ్ ఉల్లంఘనలలో భాగంగా తాజా నివేదిక ప్రకారం.. భారతదేశం వరుసగా మూడవసారి ప్రపంచవ్యాప్తంగా అత్యంత దారుణమైన డోపింగ్ అఫెండర్ లిస్ట్ లో చేరింది.2030లో కామన్వెల్త్ క్రీడల శతాబ్ది ఎడిషన్‌ను నిర్వహించడానికి భారతదేశం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బిడ్ కోసం దూకుడుగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. జూలైలో స్విస్ నగరం లౌసాన్‌లోని ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన భారత ప్రతినిధి బృందం ఒలింపిక్ అండ్ పారాలింపిక్ క్రీడలను నిర్వహించడంపై సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి ఇంటర్ నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈ డోపింగ్ వ్యవహారం గురించి ఆందోళన వ్యక్తం చేసింది.ఇది ఇలా ఉండగా ఢిల్లీ ప్రధాన కార్యాలయం కలిగిన నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ గత సంవత్సరం 7,113 పరీక్షలను నిర్వహించింది, ఇందులో 6,576 మూత్ర నమూనాలు, 537 రక్త నమూనాలు ఉన్నాయి. వీటిలో, 253 మూత్ర నమూనాల్లో నిషేధిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు, అయితే ఏడు రక్త నమూనాలు డోప్ పరీక్షలో విఫలమయ్యాయి.2023లో సేకరించిన 5,606 నమూనాల్లో మొత్తం 213 కేసులు డోప్ పాజిటివ్‌గా వచ్చాయి, తాజా గణాంకాలు యాంటీ డోపింగ్ వాచ్‌డాగ్ మరింత దూకుడు పరీక్షా విధానాన్ని ప్రతిబింబిస్తాయని నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ నొక్కి చెప్పింది. అయితే, అనేక ప్రముఖ క్రీడా దేశాలు మరింత విస్తృతమైన పరీక్షలు చేసినప్పటికీ తక్కువ శాతం డోపింగ్ కు గురైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫ్రాన్స్ 11,744 నమూనాలను పరీక్షించగా, 91 డోపింగ్ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలింది. ఇది 0.8 శాతం పాజిటివిటీ రేటు. 2021 వరకు ప్రపంచ డోపింగ్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రష్యా, 10,514 నమూనాల్లో 76 నమూనాలతో 0.7 శాతం రేటును నమోదు చేసింది. చైనా కేవలం 43 డోపింగ్ వైఫల్యాలతో, 24,214 నమూనాల నుంచి అతి తక్కువగా 0.2 శాతం పాజిటివిటీ రేటును కలిగి ఉంది. అమెరికా డోపింగ్ నిరోధక సంస్థ భారతదేశం కంటే తక్కువ సంఖ్యలో, మొత్తం 6592 పరీక్షలు నిర్వహించి, 1.1 శాతం పాజిటివిటీ రేటును కలిగి ఉంది.డోపింగ్ ముప్పు ఎంత లోతుగా పాతుకుపోయిందో..?ఈ నివేదిక భారత క్రీడా సంస్కృతిలో డోపింగ్ ముప్పు ఎంత లోతుగా పాతుకుపోయిందో వెల్లడిస్తోంది. అంతేకాదు మన దేశంలో పటిష్టమైన శాస్త్రీయ, పరిశోధన వ్యవస్థ ఉండవలసిన అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పింది. వివిధ క్రీడా విభాగాల జట్లతో అనుబంధం ఉన్న భారతీయ కోచ్‌లు, వైద్యులు, ఫిజియోథెరపిస్టులకు పనితీరును మెరుగుపరిచే సప్లిమెంట్లు, మందుల వాడకంపై ప్రాథమిక జ్ఞానం లేదని కూడా ఈ గణాంకాలు చెబుతున్నాయి.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ పరిస్థితి ఆందోళన కలిగించేదిగా కనిపిస్తున్నప్పటికీ, డోపింగ్ ప్రాబల్యం పెరిగిందనే భావన సరైనది కాదని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ స్పష్టం చేసింది. బలమైన పరీక్షా విధానాలు, కఠినమైన గుర్తింపు యంత్రాంగాలను మరింత పటిష్టం చేయడం వల్లే ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చాయని నాడా ఒక ప్రకటనలో పేర్కొంది. అధిక పాజిటివిటీ రేటు కొనసాగడానికి ఇదే ప్రధాన కారణమని వివరించింది జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ.2025లో ఇప్పటివరకు నాడా మొత్తం 7,068 డోపింగ్ పరీక్షలు నిర్వహించింది. ఇందులో 110 మాత్రమే పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో పాజిటివిటీ రేటు 1.5 శాతంగా నమోదైందని తెలిపింది. డోపింగ్ ముప్పును ఎదుర్కొనే దిశగా భారత ఒలింపిక్ సంఘం తాజాగా కొత్త డోపింగ్ నిరోధక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అదే సమయంలో క్రీడల్లో అత్యున్నత స్థాయి సమగ్రతను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ డోపింగ్ నిరోధక బిల్లును కూడా ఆమోదించడం గమనార్హం. కల్తీ సప్లిమెంట్ల సమస్యను పరిష్కరించడానికి, నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేస్తోంది. ఇప్పటికైనా తగిన పరిష్కారాల ద్వారా ఇండియా అథ్లెట్స్ మరొకసారి నిషిద్ధ డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకుని మన దేశ ప్రతిష్ఠను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -పసుపులేటి.వెంకటేశ్వరరావు.

Who is Raj Limbani who claimed 5 wickets in Vijay Hazare Trophy 2025-26?6
ఐపీఎల్ వద్దంది.. క‌ట్ చేస్తే! అక్క‌డ చుక్క‌లు చూపిస్తున్నాడు

విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఓ యువ పేస్ బౌలర్ దుమ్ములేపుతున్నాడు. తన ఫాస్ట్ బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. వెటరన్ భువనేశ్వర్ కుమార్‌ను తలపించే స్వింగ్ బౌలింగ్‌తో దూసుకుపోతున్నాడు. తన సంచలన బౌలింగ్‌తో పవర్ ప్లే స్పెషలిస్టుగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడే బరోడాకు చెందిన యువ పేస్ సంచలనం రాజ్ లింబానీ.బెంగాల్‌పై అదుర్స్‌..దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రస్తుత సీజన్‌లో లింబానీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అస్సాంతో జరిగిన తొలి మ్యాచ్‌లో 3 వికెట్లతో సత్తాచాటిన రాజ్‌.. ఇప్పుడు శుక్రవారం బెంగాల్‌పై 5 వికెట్ల హాల్‌తో మెరిశాడు. అతడి బౌలింగ్ ధాటికి బెంగాల్ జట్టు కేవలం 205 పరుగులకే కుప్పకూలింది.ఆరంభంలో బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించిన లింబానీ.. ఆ తర్వాత షాబాజ్ ఆహ్మద్ వంటి కీలక ప్లేయర్లను ఔట్ చేశాడు. మొత్తంగా తన పది ఓవర్ల కోటాలో 65 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను లింబానీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో లింబాని(8) సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. దీంతో ఎవరీ రాజ్ లింబానీ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ రాజ్ లింబాని?20 ఏళ్ల రాజ్ లింబాని.. గుజ‌రాత్‌లోని క‌చ్‌లో జ‌న్మించాడు. దేశ‌వాళీ క్రికెట్‌లో బ‌రోడాకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. రాజ్ రైట్ ఆర్మ్ పేస్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్ 2024లో భారత జట్టు తరపున ఆడి తన అద్భుతమైన 'ఇన్‌స్వింగర్ల'తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆసియాక‌ప్‌లోనూ భార‌త అండ‌ర్‌-19 జ‌ట్ట‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. ఆసియా కప్‌లో నేపాల్‌పై కేవలం 13 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టి చ‌రిత్ర సృష్టించాడు.తన స్వింగ్ బౌలింగ్‌తో జానియర్ భువీగా అతడు పేరు సంపాదించుకున్నాడు. అయితే ఐపీఎల్‌-2026 వేలంలో మాత్రం రాజ్ లింబానికి నిరాశే ఎదురైంది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.అద్భుత‌ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న లింబానిని ఏ ఫ్రాంచైజీ తీసుకోక‌పోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ఎవ‌రైనా గాయ‌ప‌డితే అత‌డిని రిప్లేస్‌మెంట్‌గా తీసుకునే అవ‌కాశ‌ముంది. ఐపీఎల్‌-2025లో లింబాని గుజ‌రాత్ టైటాన్స్ నెట్‌బౌల‌ర్‌గా త‌న సేవ‌లు అందించాడు. అత‌డు ఇప్ప‌టివ‌ర‌కు డొమాస్టిక్ క్రికెట్‌లో 25 మ్యాచ్‌లు 39 వికెట్లు ప‌డ‌గొట్టాడు.చదవండి: VHT 2025-26: సచిన్‌ కొడుకు అట్టర్‌ ప్లాప్‌.. ఉతికారేశారు

Harry Brook breaks a massive World record in 4th Ashes Test Against Aussies7
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్‌.. ప్రపంచ రికార్డు బద్దలు

ఇంగ్లండ్‌ యువ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ (Harry Brook) చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 3000 పరుగుల మైలురాయిని తాకిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ పేరిట ఉండిన వరల్డ్‌ రికార్డును బద్దలు కొట్టాడు.గిల్‌క్రిస్ట్‌కు 3000 పరుగులు పూర్తి చేసేందుకు 3610 బంతులు అవసరం కాగా.. బ్రూక్‌ కేవలం​ 3468 బంతుల్లోనే ఈ మైలురాయిని తాకాడు. ఈ విభాగంలో బ్రూక్‌, గిల్‌క్రిస్ట్‌ తర్వాతి స్థానాల్లో డేవిడ్‌ వార్నర్‌ (4047), రిషబ్‌ పంత్‌ (4095), వీరేంద్ర సెహ్వాగ్‌ (4129) ఉన్నారు. మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో యాషెస్‌ టెస్ట్‌ తొలి రోజు బ్రూక్‌ ఈ ఘనత సాధించాడు.ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే.. టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 3000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో బ్రూక్‌ తన దేశానికే చెందిన డెన్నిస్‌ కాంప్టన్‌తో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో నిలిచాడు. బ్రూక్‌, కాంప్టన్‌ ఇద్దరూ 57వ ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని తాకారు. ఈ విభాగంలో డాన్‌ బ్రాడ్‌మన్‌ టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ దిగ్గజం కేవలం 33 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.ఇప్పటివరకు 34 టెస్ట్‌లు ఆడిన బ్రూక్‌ 54.18 సగటున, 10 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీల సాయంతో 3034 పరుగులు చేశాడు. ఇందులో డబుల్‌, ట్రిపుల్‌ సెంచరీలు కూడా ఉన్నాయి.మ్యాచ్‌ విషయానికొస్తే.. మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య ఇవాళ (డిసెంబర్‌ 26) యాషెస్‌ సిరీస్‌ 2025-26 నాలుగో టెస్ట్‌ (బాక్సింగ్‌ డే టెస్ట్‌) ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌ తొలి రోజే 20 వికెట్లు కుప్పకూలాయి. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌.. ఆస్ట్రేలియాను 152 పరుగులకే ఆలౌట్‌ చేసింది. జోష్‌ టంగ్‌ (11.2-2-45-5), అట్కిన్సన్‌ (14-4-28-2), బ్రైడన్‌ కార్స్‌ (12-3-42-1), స్టోక్స్‌ (8-1-25-1) ఆసీస్‌ను దెబ్బకొట్టారు.ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్‌ ఆటగాడు మైఖేల్‌ నెసర్‌ (35) టాప్‌ స్కోరర్‌ కాగా.. హెడ్‌ (12), జేక్‌ వెదరాల్డ్‌ (10), ఉస్మాన్‌ ఖ్వాజా (29), అలెక్స్‌ క్యారీ (20), కెమరూన్‌ గ్రీన్‌ (17) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. లబూషేన్‌ (6), కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (9), స్టార్క్‌ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితం కాగా.. బోలాండ్‌ డకౌటయ్యాడు.అనంతరం ఇంగ్లండ్‌ సైతం ప్రత్యర్థి బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. నెసర్‌ 4, బోలాండ్‌ 3, స్టార్క్‌ 2, గ్రీన్‌ ఓ వికెట్‌ తీసి ఇంగ్లండ్‌ను 110 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌ (41), అట్కిన్సన్‌ (28), స్టోక్స్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. జాక్‌ క్రాలే (5), డకెట్‌ (2), బేతెల్‌ (1), జేమీ స్మిత్‌ (2), విల్‌ జాక్స్‌ (5), కార్స్‌ (4) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. రూట్‌ డకౌటయ్యాడు.కీలకమైన 42 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 4 పరుగులు చేసి, 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మూడు టెస్ట్‌ల్లో గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం 3-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.

Arjun tendulkar failed against Himachal pradesh In VHT 2025-268
సచిన్‌ కొడుకు అట్టర్‌ ప్లాప్‌.. ఉతికారేశారు

విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో గోవా జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జైపూర్ వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో గోవా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గోవా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది.గోవా బ్యాటర్లలో లలిత్ యాదవ్ (104) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ దీపరాజ్ గాంకర్(71) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. హిమాచల్ బౌలర్లలో రోహిత్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టగా.. మిర్దుల్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం లక్ష్య చేధనలో హిమాచల్ ప్రదేశ్ 49.3 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది.మిడిలార్డర్ బ్యాటర్లు పి. రాజ్‌మన్‌(126) తన అద్భుతపోరాటంతో జట్టును విజయతీరాల దాకా తీసుకెళ్లినప్పటికి.. ఆఖరిలో వికెట్లు కోల్పోవడంతో హిమాచల్ ఓటమిచవిచూడాల్సి వచ్చింది. గోవా బౌలర్లలో దీపరాజ్ గాంకర్ 5 వికెట్లతో సత్తాచాటాడు. బ్యాటింగ్ బౌలింగ్‌లో దుమ్ములేపిన దీపరాజ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.అర్జున్ అట్టర్ ప్లాప్‌..అయితే ఈ మ్యాచ్‌లో గోవా ఆల్‌రౌండర్‌, సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ దారుణంగా విఫలమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అర్జున్‌.. విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. బ్యాటింగ్‌లో అతడికి కేవలం ఒక్క బంతి మాత్రమే ఆడే అవకాశం దక్కింది. కానీ బౌలింగ్‌లో మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు. 6 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్‌.. 9.70 ఏకానమి రేటుతో ఏకంగా 58 పరుగులు సమర్పించుకున్నాడు. భారీగా పరుగులు ఇవ్వడంతో అర్జున్‌తో తన పూర్తి కోటాను కెప్టెన్ పూర్తి చేయించలేదు. తొలి మ్యాచ్‌కే బెంచ్‌కే పరిమితమైన అర్జున్‌కు హిమాచల్‌పై ఆడే అవకాశం లభించింది. కానీ తనకు దక్కిన అవకాశాన్ని ఈ జూనియర్ టెండూల్కర్ అందిపుచ్చుకోలేకపోయాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అర్జున్ ఫర్వాలేదన్పించాడు. కాగా ఐపీఎల్‌-2026లో అర్జున్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ముంబై ఇండియన్స్ నుంచి అతడిని లక్నో ట్రేడ్ చేసుకుంది.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. టీమిండియా కెప్టెన్ ఎవ‌రంటే?

VHT 2025-26: All round show by Nitish Kumar Reddy vs Railways9
ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి

ఐపీఎల్‌ 2026కి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు శుభవార్త అందింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఫామ్‌లోకి వచ్చాడు. విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా రైల్వేస్‌తో ఇవాళ (డిసెంబర్‌ 26) జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. ఫలితంగా అతని జట్టు ఆంధ్రప్రదేశ్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. అలూర్‌ వేదికగా ఆంధ్ర, రైల్వేస్‌ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆంధ్ర జట్టు ప్రత్యర్ధిని 266 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. సత్యనారాయణ రాజు (10-1-41-3), కేఎస్‌ నరసింహ రాజు (10-0-68-3), హేమంత్‌ రెడ్డి (6-0-34-2), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (10-0-34-1) అద్బుతంగా బౌలింగ్‌ చేసి రైల్వేస్‌కు భారీ స్కోర్‌ చేయనివ్వలేదు. అయినా ఆన్ష్‌ యాదవ్‌ (59), రవి సింగ్‌ (76) అర్ద సెంచరీలతో పోరాడటంతో రైల్వేస్‌ ఓ మోస్తరుకు మించిన స్కోర్‌ అయితే చేయగలిగింది. ఆ జట్టు తరఫున జుబైర్‌ అలీ (48), రాజ్‌ చౌదరి (22 నాటౌట్‌) కూడా పోరాడారు. మిగతా బ్యాటర్లలలో సూరజ్‌ అహూజా 7, ప్రథమ్‌ సింగ్‌ 6, ఉపేంద్ర యాదవ్‌ 7, అశుతోష్‌ శర్మ 8, కర్ణ్‌ శర్మ 7, రాహుల్‌ శర్మ 12 పరుగులు చేశారు.అనంతరం 267 పరుగుల లక్ష్య ఛేదనలో ఆంధ్ర సునాయాస విజయం సాధించింది. బంతితో రాణించిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హేమంత్‌ రెడ్డి బ్యాట్‌తో కూడా సత్తా చాటారు. నితీశ్‌ 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు చేయగా.. హేమంత్‌ 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 41 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరికి ముందు రికీ భుయ్‌ (76) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ చేసి గెలుపుకు పునాది వేశాడు. ఓపెనర్లు అశ్విన్‌ హెబ్బర్‌ (30), శ్రీకర్‌ భరత్‌ (25), వన్‌డౌన్‌ బ్యాటర్‌ షేక్‌ రషీద్‌ (40) పర్వాలేదనిపించారు. జట్టులో ప్రతి ఒక్కరు తలో చేయి వేయడంతో ఆంధ్ర జట్టు 44.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.

Rohit Sharma's Mumbai Teammate Suffers Freak Injury10
కేకేఆర్ స్టార్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలింపు!

విజయ్ హజారే ట్రోఫీ-2025లో ముంబై బ్యాటర్, కేకేఆర్ స్టార్ అంగ్క్రిష్ రఘువంశీ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ టోర్నీలో భాగం‍గా జైపూర్ వేదికగా ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రఘువంశీ తలకు గాయమైంది. అంగ్క్రిష్ ఒక కష్టతరమైన క్యాచ్‌ను అందుకునే క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి నేలపై పడిపోయాడు.దీంతో అతడి తలకు, భుజానికి తీవ్రమైన గాయమైంది. రఘువంశీ విపరీతమైన నొప్పితో విలవిలలాడాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చిన ఫిజియోలు అతడిని స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తెసుకెళ్లారు. అనంతరం అతడిని జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.గాయం తీవ్రతను అంచనా వేయడానికి వైద్యులు స్కాన్లు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే అతడి గాయంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ పలు రిపోర్ట్‌ల ప్రకారం.. రఘువంశీ గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది. అతడు కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే ముంబై జట్టుకే కాకుండా కేకేఆర్‌కు కూడా పెద్ద ఎదురుదెబ్బే. రఘువంశీ కేకేఆర్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2025లో కేకేఆర్ 8వ స్థానంలో నిలిచినప్పటికీ.. రఘువంశీ మాత్రం దుమ్ములేపాడు. 11 ఇన్నింగ్స్‌లలో 300 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అత‌డు గాయ‌ప‌డ‌డం కేకేఆర్ మెనెజ్‌మెంట్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది.ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల న‌ష్టానికి 331 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ గోల్డెన్ డ‌క్‌గా వెనుదిరిగిన‌ప్ప‌టికి.. హార్దిక్ తమోర్ (93*), ముషీర్ ఖాన్ (55), సర్ఫరాజ్ ఖాన్ (55) రాణించారు. అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో ఉత్తరాఖండ్ త‌డ‌బ‌డుతోంది. 42 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 7 వికెట్ల న‌ష్టానికి 229 ప‌రుగులు చేసింది. అయితే రఘువంశీ మాత్రం కేవలం 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement