Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Sai Sudharsan Scripts History, Shatters Chris Gayle's Long Standing IPL Record1
సాయి సుదర్శన్‌ సరికొత్త చరిత్ర.. క్రిస్‌ గేల్‌ రికార్డు బద్దలు

గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మొదటి 50 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ పేరిట ఉండిన లాంగ్‌ స్టాండింగ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. గేల్‌ తన తొలి 50 ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌ల్లో 2061 పరుగులు చేయగా.. సాయి తన మొదటి 50 ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌ల్లో 2178 పరుగులు చేశాడు.ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌పై నిన్న (మే 3) ఆడిన ఇన్నింగ్స్‌ సాయికి ఐపీఎల్‌లో 50వది. ఈ ఇన్నింగ్స్‌లో అతను 41 బంతుల్లో 57 పరుగులు చేసి తన జట్టు గెలుపుకు పటిష్ట పునాది వేశాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (40 నాటౌట్‌) సిక్సర్‌తో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి గుజరాత్‌ను గెలిపించాడు.పై రికార్డును సాధించే క్రమంలో సాయి మరో రికార్డు ఇదివరకే నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 2000 పరుగుల మార్కును చేరడానికి అతి తక్కువ ఇన్నింగ్స్‌లు తీసుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డును చేరుకునే క్రమంలోనూ సాయి క్రిస్‌ గేల్‌ పేరిట ఉండిన రికార్డునే అధిగమించాడు. గేల్‌ ఈ మైలురాయిని 48 ఇన్నింగ్స్‌ల్లో చేరుకోగా.. సాయి 47వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు.ఈ సీజన్‌లో ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్న సాయి.. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 3 అర్ద సెంచరీల సాయంతో 385 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. తాజాగా పంజాబ్‌పై గెలుపుతో గుజరాత్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆరేసి విజయాలతో 12 పాయింట్లు కలిగి ఉంది.ప్రస్తుతం సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, ఆర్సీబీ కూడా 12 పాయింట్లు కలిగి ఉన్నప్పటికీ.. గుజరాత్‌ ఈ జట్ల కంటే తక్కువ రన్‌రేట్‌ కలిగి ఉండటంతో ఐదో స్థానంలో ఉంది. 13 పాయింట్లు కలిగి ఉన్న పంజాబ్‌ టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుంది.

Fact Check-Did Babar Azam Get-1200 PKR Won-PSL Player Of Tournament2
పాక్‌ పరువు గోవిందా.. అంత తక్కువ ప్రైజ్‌మనీనా!

పాకిస్తాన్ సూప‌ర్‌లీగ్ (పీఎస్ఎల్‌) 2026 సీజ‌న్ విజేత‌గా బాబ‌ర్ ఆజం సార‌థ్యంలోని పెషావ‌ర్ జాల్మి నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో హైద‌రాబాద్ కింగ్స్‌మెన్‌ను ఓడించిన పెషావ‌ర్ జాల్మి టైటిల్ గెలిచింది. ఈ సీజ‌న్‌లో బాబ‌ర్ టాప్ స్కోర‌ర్‌గా నిలిచి ‘బ్యాటర్ ఆఫ్ ది టోర్నమెంట్‌’ అవార్డుతో పాటు హనీఫ్ మొహమ్మద్ క్యాప్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అవార్డుతో పాటు ఆయన అందుకున్న బహుమతి విలువ కేవలం పీకేఆర్ 3,500 మాత్రమే అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.1200 మాత్రమే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. ‘ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నందునే పీఎస్‌ఎల్ నిర్వాహకులు ఆటగాళ్లకు తక్కువ ప్రైజ్‌మనీ అందించింది’.. ‘పాపం పీసీబీ దగ్గర డబ్బులేవనుకుంటా.. అందుకే ఇంత తక్కువ ప్రైజ్‌మనీ ఇస్తున్నట్లున్నారు’ అని కామెంట్లు చేశారు. అయితే నిజానికి బాబర్ ఆజం అందుకున్న బహుమతి విలువలో అంకెల సంఖ్యను సోషల్ మీడియాలో తప్పుగా చూపించినట్లు పీఎస్‌ఎల్ నిర్వాహకులు తెలిపారు. ‘బ్యాటర్ ఆఫ్ ది టోర్నమెంట్‌’ అవార్డు కింద బాబర్ ఆజం పీకేఆర్ 3,500,000 ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు 11,90, 790 రూపాయలు. ఇక టీ20 ప్రపంచకప్‌లో విఫలమైన బాబర్ ఆజం పీఎస్‌ఎల్ 2026 సీజన్‌లో మాత్రం సూపర్ హిట్ అయ్యాడు. 11 ఇన్నింగ్స్‌లు కలిపి 588 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉండడం విశేషం. అయితే కీలకమైన ఫైనల్లో బాబర్ ఆజం తొలి బంతికే ఔటైనప్పటికీ, ఓవరాల్‌గా ఒక పీఎస్‌ఎల్ సీజన్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. పీఎస్‌ఎల్ ముగిసిన మరుక్షణమే బాబర్ ఆజం టెస్టు సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ చేరుకున్నాడు. మీర్పూర్ వేదికగా మే 8 నుంచి 12 వరకు తొలి టెస్టు, మే 16 నుంచి 20 వరకు రెండో టెస్టు జరగనుంది. View this post on Instagram A post shared by 🚶🏻 (@talks.cric__) చదవండి: షాక్‌లో ఆర్సీబీ.. 18 ఏళ్ల బంధానికి స్వస్తి!

Babar Azam Peshawar Zalmi Win PSL 2026 Title3
బాబర్‌ ఆజమ్‌ జట్టుదే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ టైటిల్‌

స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ నేతృత్వంలోని పెషావర్‌ జల్మీ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026 టైటిల్‌ను కైవసం చేసుకుంది. నిన్న (మే 3) జరిగిన ఫైనల్లో కొత్త ఫ్రాంచైజీ హైదరాబాద్‌ కింగ్స్‌మెన్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, విజేతగా అవతరించింది. 2017 తర్వాత పెషావర్‌ గెలిచిన తొలి పీఎస్‌ఎల్‌ టైటిల్‌ ఇది. అలాగే కెప్టెన్‌గా బాబర్‌ ఆజమ్‌కు ఇది తొలి పీఎస్‌ఎల్‌ టైటిల్‌. పీఎస్‌ఎల్‌ ట్రోఫీని బాబర్‌ పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీ చేతుల మీదుగా అందుకున్నాడు.లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన పెషావర్‌, కింగ్స్‌మెన్‌ను 18 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూల్చంది. సైమ్‌ అయూబ్‌ (54) ఒంటరిపోరాటం​ చేయడంతో ఆ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పెషావర్‌ మీడియం పేసర్‌ ఆరోన్‌ హార్డీ 4 వికెట్లు తీసి కింగ్స్‌మెన్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. నహిద్‌ రాణా (4-1-22-2) అతనికి సహకరించాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పెషావర్‌ సైతం తడబడింది. 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆరోన్‌ హార్డీ బ్యాట్‌తోనూ నేనున్నానంటూ ముందుకొచ్చాడు. అజేయమైన అర్ద సెంచరీ (56) చేసి పెషావర్‌ను విజయతీరాలకు చేర్చాడు. అతనికి అబ్దుల్‌ సమద్‌ (48) సహకరించాడు. కింగ్స్‌మెన్‌ బౌలర్లలో మొహమ్మద్‌ అలీ 3 వికెట్లు తీసి పెషావర్‌ను ఇబ్బంది పెట్టాడు. తొలుత బంతితో, ఆతర్వాత బ్యాట్‌తో సత్తా చాటిన హార్డీకి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.కాగా, పెషావర్‌ టైటిల్‌ సాధించడంతో బాబర్‌ ఆజమ్‌ కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగానూ కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌కు ముందు పేలవ ఫామ్‌లో ఉండిన అతను.. సీజన్‌ పూర్తయ్యే సరికి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచి తన జట్టు ప్రతి విజయంలో కీలక పాత​ పోషించాడు. ఈ సీజన్‌లో బాబర్‌ 11 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 588 పరుగులు చేశాడు. పీఎస్‌ఎల్‌ చరిత్రలో ఓ ఆటగాడు ఇన్ని పరుగులు చేయడం ఇదే మొదటిసారి.

IPL 2026: RCB Bids Farewell-18-Year-Old Loyalist With Emotional Video4
షాక్‌లో ఆర్సీబీ.. 18 ఏళ్ల బంధానికి స్వస్తి!

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు సీజన్‌లో 9 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈసారి సీజన్‌లో ఆర్సీబీ సక్సెస్ వెనుక చాలా మంది ఆటగాళ్ల కృషి దాగుంది. బ్యాటింగ్ విభాగంలో కోహ్లితో పాటు కెప్టెన్ పటీదార్‌, దేవదత్ పడిక్కల్‌, టిమ్ డేవిడ్‌లు అదరగొడుతుంటే, బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యాలు స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఇక 19 ఏళ్లుగా ఒకే జట్టుకు ఆడుతున్న కింగ్ విరాట్ కోహ్లి ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. 9 మ్యాచ్‌ల్లో కోహ్లి 165.50 స్ట్రైక్‌రేట్‌తో 379 పరుగులు సాధించాడు. గతేడాది తొలిసారి చాంపియన్స్‌గా నిలిచిన ఆర్సీబీ వరుసగా ఈ సీజన్‌లోనూ కప్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఒక వార్త మాత్రం ఆర్సీబీని తెగ బాధపెట్టేస్తోంది. అదేంటంటే 18 ఏళ్ల పాటు ఆర్సీబీ ఫిజియోగా సేవలందించిన ఎవన్ స్పీచ్‌లీకి ఆర్సీబీ ఘనంగా ఫేర్‌వెల్ ఇచ్చింది. ఆర్సీబీ జట్టు వెనుక ఎవన్ స్పీచ్‌లీ పాత్ర మరువలేనిది. 2008 నుంచి 2025 సీజన్ వరకు ఎవన్ స్పీచ్‌లీ ఆర్సీబీకి ఫిజియోగా పనిచేశాడు. ఈ 18 ఏళ్లలో ఎంతో మంది ఆర్సీబీ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌తో పాటు వాళ్లు గాయాల నుంచి త్వరగా కోలుకునేందుకు ఎవన్ ఎంతో కృషి చేశారు. అయితే గత సీజన్ ముగిసిన అనంతరం ఎవన్ స్పీచ్‌లీ ఆర్సీబీ ఫిజియోగా రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎవన్ స్పీచ్‌లీకి ‘ఒక అధ్యాయం ముగిసింది’ (ఎండ్ ఆఫ్ ఎరా) పేరుతో ఫేర్‌వెల్ ఘనంగా నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోనూ ఆర్సీబీ తమ ‘ఎక్స్‌’ వేదికగా షేర్ చేసుకుంది. ఫిజియోగా రిటైర్ అయిన తర్వాత స్వదేశంలో ఉండిపోయిన ఎవన్ స్పీచ్‌లీ ఈ ఫేర్‌వెల్ వేడుక కోసం బెంగళూరుకు రావడం విశేషం. కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ ఎవన్‌కు గార్డ్ ఆఫ్ హానర్‌తో గౌరవించారు. ‘ ఎండ్ ఆఫ్ ఎరా, ఎవన్ స్పీచ్‌లీ’. నీ లెగసీని ఆర్సీబీ ఎప్పటికీ గుర్తుం చుకుంటుంది. 18 ఏళ్లుగా ఎవన్ స్పీచ్‌లీ ఆర్సీబీకి హెడ్ ఫిజియోగా వ్యవహరించారు. అందుకే అతనికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నాం.’ అని క్యాప్షన్ జత చేసింది.𝙀𝙣𝙙 𝙤𝙛 𝙖𝙣 𝙚𝙧𝙖, 𝙀𝙫𝙖𝙣 𝙎𝙥𝙚𝙚𝙘𝙝𝙡𝙮! Your legacy at RCB will always be remembered. 🙌❤️Evan Speechly was our Head Physio for 18 long years, from 2008 to 2025 - one of the OGs of RCB. He flew down to Bengaluru for a special farewell, and we were all teary eyed!… pic.twitter.com/fjVJR80V1j— Royal Challengers Bengaluru (@RCBTweets) May 4, 2026 చదవండి: ‘ఇది జట్టు వైఫల్యం.. ఆ ముగ్గురినే నిందించలేం’

IPL Owner Wanted To Send Private Plane England Pacer Reveals Bizarre Story5
IPL: బెడ్‌పై నుంచి లేవలేకపోయా!.. ఓనర్‌ వదల్లేదు!

ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ఓనర్‌ ఒకరు తనను బాగా ఇబ్బంది పెట్టారన్నాడు. ఆరోగ్యం బాగాలేకపోయినా మ్యాచ్‌ ఆడాల్సిందేనని పట్టుబట్టారని ఆరోపించాడు.బీబీసీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఐదు మ్యాచ్‌లు పూర్తైన తర్వాత.. తదుపరి మ్యాచ్‌కు మరో మూడు రోజుల సమయం ఉంది. అప్పుడు నా ఆరోగ్యం చెడిపోయింది. ప్రతీ అరగంటకు డాక్టర్‌ వచ్చి నన్ను పరీక్షిస్తూ ఉన్నారు.బెడ్‌ మీద నుంచి లేచే ఓపిక కూడా లేదుఅప్పుడే జట్టు యజమాని నాకు ఫోన్‌ చేశారు. ‘ఎలా ఉన్నావు?.. మ్యాచ్‌కు సిద్ధమేనా?’ అని అడిగారు. ‘నిజం చెప్పాలంటే నేనేమీ తినలేకపోతున్నాను. కనీసం డ్రింక్స్‌ కూడా తీసుకోలేకపోతున్నా. అసలు బెడ్‌ మీద నుంచి లేచే ఓపిక కూడా లేదు’ అని బదులిచ్చాను.ఇందుకు స్పందిస్తూ.. ‘నీ కోసం ఇంకో డాక్టర్‌ని పంపిస్తా. మెరుగైన వైద్యం ఇప్పిస్తా’ అని చెప్పారు. ఆ మరుసటి రోజే మళ్లీ నాకు ఫోన్‌ చేసి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అయితే, నా ఆరోగ్యం అస్సలు మెరుగుపడలేదని చెప్పాను.ప్రైవేట్‌ విమానం పంపిస్తాఅప్పుడు ఆయన.. ‘ఒక పని చేద్దాం. నీకోసం నేను ప్రైవేట్‌ విమానం పంపిస్తా. నువ్వు దాంట్లో మైదానానికి వచ్చి మ్యాచ్‌ ఆడు. ఆ వెంటనే అదే విమానంలో నీ బెడ్‌ వరకూ చేరుస్తాం’ అని అన్నారు’’ అని మార్క్‌ వుడ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. తాను కూడా ఓనర్‌ చెప్పిన విషయం గురించి ఆలోచించానని.. అయితే, తండ్రి మాటకు తలొగ్గి ఆ ఆలోచన విరమించుకున్నానని తెలిపాడు. కానీ ఆ ఓనర్‌ ఎవరో మాత్రం వెల్లడించలేదు.కాగా మార్క్‌వుడ్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో రెండు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 2018లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఒక మ్యాచ్‌ ఆడిన ఈ ఇంగ్లిష్‌ పేసర్‌.. 2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. లక్నో తరపున 11 వికెట్లు కూల్చాడు. చదవండి: ఇక్కడ ఓడినా.. SRHపై గెలుస్తాం: శ్రేయస్‌ అయ్యర్‌

IPL 2026: RCB Overseas Star Phil Salt Returns Home Mid Season6
ఆర్సీబీకి షాక్‌!.. స్వదేశానికి విధ్వంసకర వీరుడు!

ఐపీఎల్‌-2026లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన పాటీదార్‌ సేన.. ఇప్పటికి తొమ్మిదింట ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.అయితే, ఇటీవల గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓటమిపాలైన ఆర్సీబీ.. తదుపరి లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడనుంది. ఏకనా స్టేడియంలో గురువారం నాటి మ్యాచ్‌తో తిరిగి గెలుపు బాట పట్టాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.వేలికి గాయంగత కొంతకాలంగా జట్టుకు దూరమైన విధ్వంసకర ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ గాయం నుంచి కోలుకోలేదని సమాచారం. కాగా ఏప్రిల్‌ 18న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా సాల్ట్‌ ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌ బౌండరీ నుంచి డైవ్‌ చేస్తూ బంతిని ఆపే క్రమంలో అతడి ఎడమచేయి వేలికి గాయమైంది.యూకేకి చేరుకున్న సాల్ట్‌ఈ నేపథ్యంలో విశ్రాంతి తీసుకున్న సాల్ట్‌.. తాజాగా స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. యూకేకి చేరుకున్న అతడు గాయానికి సంబంధించి స్కానింగ్‌ చేయించుకున్నట్లు సమాచారం. కాగా గత మూడు మ్యాచ్‌లలో సాల్ట్‌ ఆడలేదు. అతడికి బదులు ఇంగ్లండ్‌ మరో స్టార్‌ జేకబ్‌ బెతెల్‌.. విరాట్‌ ‍కోహ్లితో కలిసి ఆర్సీబీ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తున్నాడు. కాగా సాల్ట్‌ ఇప్పటికి ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 202 పరుగులు సాధించాడు. అయితే, త్వరలోనే అతడు కోలుకుని తిరిగి జట్టుతో చేరతాడని ఆర్సీబీ ధీమా ఉన్నట్లు తెలుస్తోంది. ప్లే ఆఫ్స్‌ నాటికైనా సాల్ట్‌ అందుబాటులోకి వస్తాడనే ఆశాభావంతో ఉంది. ఇదిలా ఉంటే.. గుజరాత్‌ టైటాన్స్‌తో ఏప్రిల్‌ 30న మ్యాచ్‌ ముగించుకున్న ఆర్సీబీకి దాదాపు వారం రోజుల విశ్రాంతి లభించింది. దీంతో జట్ట మాల్దీవులకు విహారానికి వెళ్లినట్లు సమాచారం.చదవండి: గర్ల్‌ఫ్రెండ్స్‌.. శ్రుతిమించుతున్నారు!.. ఇకపై..

BCCI Angry On Girlfriend Culture In IPL Set To Take Drastic Action: Report7
గర్ల్‌ఫ్రెండ్స్‌.. శ్రుతిమించుతున్నారు!.. ఇకపై..

ఐపీఎల్‌లో టీమిండియా స్టార్ల వైఖరిపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ‘గర్ల్‌ఫ్రెండ్స్‌’ విషయంలో కొంతమంది శ్రుతి మించి ప్రవర్తిస్తున్నట్లు బోర్డుకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ప్రియురాళ్ల కోసం టీమ్‌ బస్సులు ఆపించడం.. తమతో కలిసి ఒకే హోటల్‌లోని ఆటగాళ్లు వారిని తీసుకువెళ్లడం పట్ల బీసీసీఐ సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది.కాగా ఐపీఎల్‌-2026 సందర్భంగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ ఇషాన్‌ కిషన్‌, పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ తరచూ తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే.ముగ్గురూ మోడల్స్‌హార్దిక్‌ పాండ్యా తన కొత్త ప్రేయసి మహీకా శర్మను స్టేడియానికి తీసుకువస్తుండగా.. ఇషాన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ అదితి హుండియా, అర్ష్‌దీప్‌ ప్రియురాలు సమ్రీన్‌ కౌర్‌ తరచూ వీరితో కలిసి జంటగా కనిపిస్తున్నారు. ఈ ముగ్గురూ మోడల్స్‌, నటీమణులన్న సంగతి తెలిసిందే. అంతేకాదు వీరు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా!టీమ్‌ బస్సులను ఆపివేస్తున్నారుఈ నేపథ్యంలో బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు దైనిక్‌ జాగరణ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇంతటితో దీనిని ఆపకపోతే.. భవిష్యత్తులో సమస్య తీవ్రమవుతుంది. ఆటగాళ్ల గర్ల్‌ఫ్రెండ్స్‌ కోసమని టీమ్‌ బస్సులను ఆపివేస్తున్నారు. వారి ఆలస్యానికి మిగతా వాళ్లు మూల్యం చెల్లించాల్సి వస్తోంది.అంతేకాదు.. కొందరు ఆటగాళ్లు గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి ఒకే హోటల్లో ఉంటున్నారు. ఈ విషయంపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం దృష్టి సారించింది. అయితే, అధికారికంగా తమ ప్రేమ బంధాన్ని ప్రకటించిన వారికి మినహాయింపు ఇస్తామని తెలిపింది.బీసీసీఐలో ఇలాంటి పాలసీ లేదుఈ ‘అఫీషియల్‌ గర్ల్‌ఫ్రెండ్‌’ రూల్‌ ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. బీసీసీఐలో ఇలాంటి పాలసీ లేదు. సాధారణంగా క్రికెటర్ల భార్యలు, కుటుంబాలను మాత్రమే.. అది కూడా కొన్ని నిబంధనలకు లోబడి బోర్డు అనుమతిస్తుంది. ఈ గర్ల్‌ఫ్రెండ్‌ కల్చర్‌పై లోతుగా విచారణ చేయాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు.బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోషన్‌ చేసిన వాళ్లే!కాగా ఆటగాళ్ల గర్ల్‌ఫ్రెండ్స్‌లో కొందరు గతంలో బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోషన్‌ చేసిన వాళ్లే. ప్రస్తుతం వాళ్లు ఏకంగా జట్టుతో టీమ్‌ బస్సులో వెళ్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ చిన్న సమాచారం లీకైనా తలనొప్పులు తప్పవని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు.. యశ్‌ దయాళ్‌ వంటి ఆటగాళ్ల విషయంలో ఏం జరిగిందో తెలిసిందే. అతడిపై ఓ అమ్మాయి, ఓ మైనర్‌ తీవ్రమైన లైంగిక దాడి ఆరోపణలు చేశారు. దీంతో ఈ సీజన్‌ నుంచి అతడిని పక్కనపెట్టింది ఆర్సీబీ. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బోర్డు పరువు దిగజారడం ఖాయం. అందుకే గర్ల్‌ఫ్రెండ్‌ కల్చర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.చదవండి: ఇక్కడ ఓడినా.. SRHపై గెలుస్తాం: శ్రేయస్‌ అయ్యర్‌

That Didnt Work Out Vs GT Excited for Playing Against SRH: Shreyas Iyer8
ఇక్కడ ఓడినా.. SRHపై గెలుస్తాం: శ్రేయస్‌ అయ్యర్‌

గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో పరాజయంపై పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్పందించాడు. అహ్మదాబాద్‌ పిచ్‌ బ్యాటర్లకు ఆరంభంలో అంతగా అనుకూలించకపోయినా.. తాము మెరుగైన స్కోరు సాధించడం సంతోషమన్నాడు. ఏదేమైనా క్రెడిట్‌ గుజరాత్‌ బౌలర్లకు దక్కుతుందని.. వాళ్లు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. 163 పరుగులుసొంతమైదానంలో ఆదివారం జరిగిన పోరులో మాజీ చాంపియన్‌ గుజరాత్‌ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. సీజన్‌ ఆరంభంలో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో పరాజయం ఎరగకుండా సాగిన పంజాబ్‌కిది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది.టాపార్డర్‌ విఫలం కాగా... సూర్యాంశ్‌ (29 బంతుల్లో 57; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా... స్టొయినిస్‌ (31 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్‌) విలువైన పరుగులు చేశాడు. 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో ఈ జంట ఆరో వికెట్‌కు 44 బంతుల్లో 79 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హోల్డర్‌ 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... సిరాజ్, రబాడ చెరో 2 వికెట్లు తీశారు.సాయి సుదర్శన్‌ అర్ధశతకంఅనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (41 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకంతో ఆకట్టుకోగా... వాషింగ్టన్‌ సుందర్‌ (23 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్, వైశాక్‌ చెరో 2 వికెట్లు తీశారు.సిరాజ్‌ తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు... ఈ సీజన్‌లో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌... తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లతో పంజాబ్‌ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికి బతికిపోయిన ప్రియాన్ష్‌ ఆర్య (2) రెండో బంతికి అవుట్‌ కాగా... తదుపరి బంతికి కూపర్‌ (0) పెవిలియన్‌ బాట పట్టాడు. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (15) ఎక్కువసేపు నిలవలేకపోగా... నేహల్‌ వధేరా (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (19) కూడా అవుటవ్వడంతో పంజాబ్‌ జట్టు 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో స్టొయినిస్‌తో కలిసి సూర్యాంశ్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మానవ్‌ సుతార్‌ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో సూర్యాంశ్‌ వరుసగా 6, 6, 4, 4, 6 కొట్టడంతో 27 పరుగులు వచ్చాయి.ఇక కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో మరోసారి గుజరాత్‌ బౌలర్లు విజృంభించడంతో పంజాబ్‌ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆశించిన స్కోరు సాధించలేకపోయింది. స్టొయినిస్, బార్ట్‌లెట్‌ (0)ను వరుస బంతుల్లో అవుట్‌ చేసిన హోల్డర్‌ పంజాబ్‌ను కట్టడి చేశాడు.చక్కగా ఉపయోగించుకున్నారుఈ నేపథ్యంలో పంజాబ్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వికెట్‌ మీద మేము ఈ మేరకు స్కోరు చేయడం వ్యక్తిగతంగా గొప్ప విషయంగానే భావిస్తున్నా. ముఖ్యంగా కొత్త బంతితో వాళ్లు అటాక్‌ చేస్తున్న వేళ మేము మెరుగైన ఆరంభమే అందుకున్నాం. అయితే, గుజరాత్‌ బౌలర్లు ఈ వికెట్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు.సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు సంధించారు. పవర్‌ ప్లేలో మేము వరుసగా వికెట్లు కోల్పోయాము. అయినా పుంజుకోగలిగాము. మా బౌలర్లు కూడా మెరుగ్గా ఆడారు. కానీ ఈరోజు మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయాము. గెలవాలనే ఇక్కడికి వచ్చాము. అయితే, పని పూర్తి చేయలేకపోయాము.SRHపై గెలుస్తాంతదుపరి ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నాం. కచ్చితంగా ఆ జట్టుపై గెలిచి మరో రెండు పాయింట్లు మా ఖాతాలో జమ చేసుకుంటాము’’ అని పేర్కొన్నాడు. కాగా పంజాబ్‌ కింగ్స్‌ హైదరాబాద్‌ వేదికగా బుధవారం సన్‌రైజర్స్‌తో తలపడనుంది. కాగా పంజాబ్‌ ఇప్పటికి తొమ్మిదింట ఏడు విజయాలతో పట్టికలో టాప్‌లో ఉండగా.. సన్‌రైజర్స్‌ పదింట ఆరు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో తొలి ముఖాముఖి పోరులో పంజాబ్‌ సన్‌రైజర్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.చదవండి: నా వల్లే ఓటమి.. భారీ మూల్యమే చెల్లించాం: కమిన్స్‌

Jannik Sinner Breaks World Record, Becomes First Player In History To9
చరిత్ర సృష్టించాడు!

మాడ్రిడ్‌: పురుషుల టెన్నిస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ అద్భుతం చేశాడు. గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సాధించాడు. గ్రాండ్‌స్లామ్‌ తర్వాత అగ్రశ్రేణి టోర్నీలుగా పరిగణించే ‘మాస్టర్స్‌’ సిరీస్‌లో సినెర్‌ వరుసగా ఐదో టైటిల్‌ గెలిచాడు. ఆదివారం ముగిసిన మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో సినెర్‌ విజేతగా నిలిచాడు. ప్రపంచ 3వ ర్యాంకర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో జరిగిన ఫైనల్లో సినెర్‌ 6–1, 6–2తో అలవోకగా విజయం సాధించాడు.తద్వారా 36 ఏళ్ల చరిత్ర కలిగిన మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీల్లో వరుసగా ఐదు టైటిల్స్‌ గెలిచిన తొలి ప్లేయర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో మూడుసార్లు జొకోవిచ్‌ (సెర్బియా), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ఒకసారి వరుసగా నాలుగు మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ సాధించారు. గత ఏడాది పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ గెలిచిన సినెర్‌... ఈ ఏడాది మోంటెకార్లో, మయామి, ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోరీ్నల్లో విజేతగా నిలిచాడు. చాంపియన్‌ సినెర్‌కు 10,07,165 యూరోల (రూ. 11 కోట్ల 21 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Rajasthan Royals In Legal Trouble As New Deal Could Head To Court: Report10
మిట్టల్‌ చేతికి రాజస్తాన్‌ రాయల్స్‌.. భారీ ట్విస్ట్‌!

రాజస్తాన్‌ రాయల్స్‌ అమ్మకం విషయంలో భారీ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. అమెరికా వ్యాపారవేత్త కాల్‌ సోమాని కన్సార్టియం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)తో చట్టపరమైన యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.సంచలన ప్రకటనకాగా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ అమ్మకానికి రాగా.. కాల్‌ సోమాని కన్సార్టియం దీనిని కొనుగోలు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్య రీతిలో ఆదివారం సంచలన ప్రకటన వచ్చింది. తాము ఈ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసినట్లు మిట్టల్‌ కుటుంబం ప్రకటించింది.లక్ష్మీ మిట్టల్, ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్, అదర్‌ పూనావాలాతో కలిసి 165 కోట్ల డాలర్ల (రూ. 15,660 కోట్లు) బిడ్‌తో రాయల్స్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నారు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీతో పాటు... వేర్వేరు లీగ్‌ల్లో పార్ల్‌ రాయల్స్, బార్బడోస్‌ రాయల్స్‌ జట్లు కూడా మిట్టల్‌ సొంతం అయ్యాయి. అయితే, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్, బీసీసీఐ పాలక మండలి ఆమోదం అనంతరమే ఈ లావాదేవీ పూర్తి కానుంది.మరో మూడు నెలలుఈ ప్రక్రియ ముగియడానికి మరో మూడు నెలలు పట్టొచ్చని సమాచారం. ‘మనోజ్‌ బదాలే కన్సార్టియం నుంచి అదర్‌ పూనావాలా భాగస్వామ్యంతో రాజస్తాన్‌ రాయల్స్‌ను కొనుగోలు చేసుకోవడానికి ఒప్పందం కుదిరింది’ అని మిట్టల్‌ కుటుంబం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వివరాల ప్రకారం రాయల్స్‌ జట్టులో మిట్టల్‌ కుటుంబం 75 శాతం వాటా కలిగి ఉంటుంది. పూనావాలా 18 శాతం వాటా కలిగి ఉంటారు. మిగిలిన 7 శాతం వాటాలో పాత యజమాని మనోజ్‌ బదాలేతో పాటు ఇతర పెట్టుబడిదారులు ఉంటారు. దీంతో రాయల్స్‌ బోర్డులో లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మిట్టల్, వనిషా మిట్టల్‌–భాటియా, అదర్‌ పూనావాలా, మనోజ్‌ బదాలే సభ్యులుగా ఉంటారు.ఇక రాజస్తాన్‌ సాదుల్‌పూర్‌లో జన్మించిన లక్ష్మీ మిట్టల్‌ మాట్లాడుతూ... ‘నాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. మా కుటుంబం రాజస్తాన్‌కు చెందింది. అందుకే వాటా కొనుగోలు చేసేందుకు రాజస్తాన్‌ రాయల్స్‌ కంటే మంచి జట్టు లేదనిపించింది’ అని అన్నారు.లీగల్‌ లెటర్‌ పంపించబోతున్నాముఈ నేపథ్యంలో కాల్‌ సోమాని సన్నిహిత వర్గాలు స్పందించాయి. క్రిక్‌బజ్‌ కథనం ప్రకారం.. సోమాని కన్సార్టియం ఈ అంశం మీద చట్టపరంగా ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ‘‘అమెరికాలోని మా లీగల్‌, PR (పబ్లిక్‌ రిలేషన్స్‌) టీమ్స్‌ ఈ విషయంపై కసరత్తు చేస్తున్నాయి.లీగల్‌ లెటర్‌ పంపించబోతున్నాము. సోమాని కన్సార్టియంలో వాల్టన్‌, హాంప్‌ వంటి ‍ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి. అందరూ అనుకుంటున్నట్లు డబ్బు ఇక్కడ అసలు సమస్యే కాదు. ఏం జరిగిందో తెలియదు. చర్చలు సజావుగానే సాగినా ఇలాంటి పరిణామం ఎదురైంది.ఈ విషయంలో మాకెన్నో సందేహాలు ఉన్నాయి. బీసీసీఐకి చెల్లింపులు నిజంగానే బకాయి పడ్డాయా?.. చట్టపరంగా మాకున్న అవకాశాలు ఏమిటి? అన్న విషయాలు పరిశీలిస్తున్నాం. మా మదిలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. కావాలనే చెల్లింపుల విషయంలో వాళ్లు (బోర్డు) ఆలస్యం చేశారనిపిస్తోంది. మేము సిద్ధంగా ఉన్న వాళ్ల నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇప్పుడేమో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోంది. మేము అంతర్గతంగా ఈ సమస్యని పరిష్కరించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: నా వల్లే ఓటమి.. భారీ మూల్యమే చెల్లించాం: కమిన్స్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement