Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

ICC Not Our Master BCB Ex-Official Fumes Amid Suspension Threat1
‘ఐసీసీ మా యాజమాని కాదు’

బంగ్లాదేశ్‌లో ఇటీవలే ఎన్నికైన కొత్త క్రికెట్‌ బోర్డు తమ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌తో అనధికారిక చర్చలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి విచారణ కమిటీ ఏర్పాటుకు సంబంధించి జాతీయ క్రీడా మండలి (ఎన్‌ఎస్‌సీ) ఐసీసీని ఆశ్రయిస్తూ గెజిట్‌ను విడుదల చేయడం తమను ఆశ్చర్యపరిచిందని బీసీబీ పేర్కొంది. ఈ గెజిట్‌ ఎన్నికైన పరిపాలన స్థిరత్వం, స్వాతంత్ర్యం, కొనసాగింపు విషయంలో అనిశ్చితి సృష్టించే అవకాశముందని తెలిపింది. ఇదే విషయమై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు మాజీ కార్యదర్శి సయ్యద్‌ అష్రఫుల్‌ హక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బీసీబీ దేశ క్రీడామండలి పరిధిలో ఉందని, ఏమైనా అభ్యంతరాలుంటే బీసీబీకి చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుత బోర్డు మాత్రం ఐసీసీకి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా అనిపించింది. బంగ్లా క్రికెట్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఐసీసీ మా యాజమాని కాదు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)లో మాకు సభ్యత్వమున్నప్పటికీ తొలి ప్రాధాన్యత మాత్రం నేషనల్‌ స్పోర్ట్స్‌ పాలసీ (ఎన్‌ఎస్‌సీ)దే. బీసీబీ రాజ్యాంగం మేరకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ఐసీసీ జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా ఉంది. అయితే ఐసీసీ మాకు సహాయకులు, మంచి మిత్రులు’ అని చెప్పుకొచ్చాడు. అంతకముందు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల కారణంగా కేకేఆర్‌ ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి రిలీజ్‌ చేయడం కూడా బంగ్లా క్రికెట్‌ బోర్డుకు రుచించలేదు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌ సమయంలో భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్‌ నిరాకరించడంతో, వేదికలు మార్చే ప్రసక్తే లేదని ఐసీసీ తేల్చిచెప్పింది. దీంతో బంగ్లా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చదవండి: కేకేఆర్‌కు మరో దెబ్బ.. కీలక ఆటగాడు దూరం!

Kolkata Knight Riders pacer Akash Deep Ruled Out Ahead IPL 20262
కేకేఆర్‌కు మరో దెబ్బ.. కీలక ఆటగాడు దూరం!

ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభానికి ముందే మూడుసార్లు చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కుడి మోకాలి గాయం కారణంగా కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌ హర్షిత్‌ రానా ఐపీఎల్‌ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. తాజాగా కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత పేసర్‌ ఆకాశ్‌దీప్‌ నడుము కింది భాగంలో నొప్పితో బాధపడుతున్నట్లు తేలింది. నొప్పి తీవ్రంగా ఉండడంతో ఆకాశ్‌ దీప్‌ దాదాపు ఎనిమిది వారాల పాటు ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కోల్‌కతా ఫ్రాంచైజీ ధృవీకరించాల్సి ఉంది.‘ఆకాశ్‌ దీప్‌ నడుము కింది భాగం స్ట్రెస్‌కు గురి కావడంతో నొప్పి తీవ్రత పెరిగింది. అతడు కోలుకునేందుకు కనీసం 8 నుంచి 12 వారాల సమయం పట్టే అవకాశముంది. దీంతో ఐపీఎల్‌లో పాల్గొనే అవకాశాలు లేవు’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా ఆకాశ్‌దీప్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ. కోటికి కొనుగోలు చేసింది. మరోవైపు శ్రీలంక పేసర్‌ మతీషా పతిరానా విషయంలోనూ ఇంతవరకు స్పష్టత రాలేదు. ఈ సీజన్‌లో రానా ఆడుతాడా? లేదా? అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. ఈ ఎదురుదెబ్బలతో ప్రస్తుతం కేకేఆర్‌ బౌలింగ్‌ విభాగంలో వైభవ్‌ అరోరా, ఉమ్రాన్‌ మాలిక్‌, బ్లెసింగ్‌ ముజరబానీ, కార్తిక్‌ త్యాగి మాత్రమే ఉన్నారు. ఇప్పటికే వీరితో ట్రయల్‌ బౌలింగ్‌ను ప్రారంభించింది.చదవండి: అమ్ముడుపోని బౌలర్‌ విధ్వంసం!

Navdeep Saini Sends Finn Allen Middle Stump KKR Intra Squad Match3
అమ్ముడుపోని బౌలర్‌ విధ్వంసం!

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తన ప్రాక్టీస్‌ను ఆరంభించింది. ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరిగిన ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌లో ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన నవదీప్‌ సైనీ విజృంభించాడు. న్యూజిలాండ్‌ విధ్వంసరకర బ్యాటర్‌ ఫిన్‌ అలెన్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాక్టీస్‌లో భాగంగా ​​కేకేఆర్‌ ఆటగాళ్లంతా శుక్రవారం పర్పుల్‌ నైట్స్‌, గోల్డెన్‌ నైట్స్‌గా విడిపోయి ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌ ఆడారు. గోల్డెన్‌ నైట్స్‌ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పర్పుల్‌ నైట్స్‌కు శుభారంభం లభించింది. ఫిన్‌ అలెన్‌ 10 బంతుల్లోనే 23 పరుగులు బాదాడు. అయితే వేలంలో అమ్ముడుపోని నవదీప్‌ సైనీ బౌలింగ్‌కు వచ్చిన తరుణంలో అతడు వేసిన తొలి బంతిని ఫిన్‌ అలెన్‌ సిక్సర్‌గా మలిచాడు. అయితే ఆ తర్వాత బంతిని సైనీ యార్కర్‌ వేయగా ఫిన్‌ అలెన్‌ వికెట్‌ నుంచి పక్కకు జరిగి భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఫిన్‌ అలెన్‌ కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. కాగా ఫిన్‌ అలెన్‌ను కోల్‌కతా రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్పుల్‌ నైట్స్‌ 6 వికెట్ల తేడాతో గోల్డెన్‌ నైట్స్‌పై విజయం సాధించింది. అంగ్‌క్రిష్‌ రఘువంశీ 55 బంతుల్లోనే 103 పరుగుల మెరుపు సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు గోల్డెన్‌ నైట్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. టిమ్‌ సీఫెర్ట్‌ (45), సార్థక్‌ రాజన్‌ (37), రింకూ సింగ్‌ (40) రాణించారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో ఫిన్‌ అలెన్‌ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 200 స్ట్రైక్‌రేట్‌తో 298 పరుగులు సాధించాడు. ఇందులో సౌతాఫ్రికాపై 33 బంతుల్లోనే సెంచరీ సాధించిన ఫిన్‌ అలెన్‌ అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఐపీఎల్‌ 2026 సీజన్‌లో కేకేఆర్‌ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. తొలి విడతలో ముంబైతో పాటు ఎస్‌ఆర్‌హెచ్‌, పంజాబ్‌, లక్నోతో ఆడనుంది.Finn Allen got out early but the trailer has been shown, the picture will be seen in the IPL match. pic.twitter.com/eYBvOwCHdO— Ayush🎃 (@AyushBandhe) March 20, 2026చదవండి: ‘అతడితోనే వైరం.. జైషాకు సంబంధం లేదు’

Ex-India Star Targets One BCCI Employee After Quitting Commentary4
‘అతడితోనే వైరం.. జైషాకు సంబంధం లేదు’

బీసీసీఐ తనను 23 ఏళ్లుగా విస్మరించిందని, అందుకే కామెంటేటర్‌ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ క్రికెటర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్‌ రాజీనామా వెనుక జై షా హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్‌ మరోసారి స్పందించారు. తన రాజీనామాతో జైషాకు ఎలాంటి సంబంధం లేదని కుండబద్ధలు కొట్టారు. శివరామకృష్ణన్‌ మాట్లాడుతూ.. ‘నా రాజీనామాకు బీసీసీఐతో సంబంధం లేదు. బీసీసీఐ పరిపాలనపై నాకు ఆగ్రహం లేదు. నా నిర్ణయం వెనుక బీసీసీఐ కార్యదర్శి, ప్రస్తుత ఐసీసీ చైర్మన్‌ జై షా హస్తం ఉందన్న వార్తలో నిజం లేదు. ఈ విషయంలోకి బీసీసీఐ యాజమాన్యాన్ని లాగవద్దు. ఇది కేవలం బీసీసీఐలో ఒక ఉద్యోగి చేసిన నిర్వాకం మాత్రమే. నా జీవిత పగ్గాలను నా చేతిలోకి తీసుకుంటున్నా. అలా చేసే హక్కు ఉందని భావిస్తున్నా’ అని వెల్లడించారు. శివరామకృష్ణన్ ఆకస్మిక నిర్ణయంపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ, "ఓహ్ నో! ఈ ఐపీఎల్‌కు ఎందుకు ఉండరు?" అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 1984లో ఇంగ్లండ్‌పై ఒకే మ్యాచ్‌లో 12 వికెట్లు పడగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన శివరామకృష్ణన్, 1985లో సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో భారత్ గెలిచిన బెన్సన్ అండ్‌ హెడ్జెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి సత్తా చాటాడు. 2000వ సంవత్సరంలో కామెంటరీ కెరీర్ ప్రారంభించిన శివరామకృష్ణన్, అంతకుముందు ఐసీసీ క్రికెట్ కమిటీలో ఆటగాళ్ల ప్రతినిధిగా కూడా పనిచేశాడు. మొత్తంగా భారత్‌ తరఫున శివరామకృష్ణన్‌ 9 టెస్టుల్లో 26 వికెట్లు, 16 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు.Don’t bring the BCCI Administration into the picture. It’s a one on one with an employee of the BCCI. Jay Shah and Co. have nothing to do with this issue. I am taking control of my life and I think I am entitled to do it.— Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) March 21, 2026

Aakash Chopra Slams IPL 2026 Overseas Stars Raise Eyebrows Missing Start5
‘వస్తారు కోట్లు పట్టుకెళ్తారు.. ప్రయోజనమెవరికీ’!

ఐపీఎల్‌ 2026 సీజన్‌ మరో వారం రోజుల్లో మొదలుకానుంది. కానీ ఐపీఎల్‌లో ఈసారి ఆటగాళ్ల గాయాల సమస్యలు పెరిగిపోయాయి. ముఖ్యంగా వేలంలో కోట్ల ధర పలికిన విదేశీ ఆటగాళ్లు గాయాలు, వ్యక్తిగత కారణాలతో లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానుండడం ఆయా ఫ్రాంచైజీలపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ వెన్ను గాయం నుంచి కోలుకోకపోవడంతో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లకు కమిన్స్‌ అందుబాటులో ఉండడం లేదు. దీంతో అతడి స్థానంలో ఇషాన్‌ కిషన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణయం తీసుకుంది. మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్‌ బౌలర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ కూడా గాయంతో దూరమయ్యాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు గాయాల బెడద తగిలింది. ఆ జట్టు స్టార్‌ మిచెల్‌ స్టార్క్‌ గాయంతో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా క్రికెట్‌ ఆస్ట్రేలియాపై విమర్శలు చేశాడు. ‘మిచెల్‌ స్టార్క్‌ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదని తెలిసింది. ఇప్పటికే జోష్‌ హాజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌లు దూరమయ్యారు. తాజాగా స్టార్క్‌ గాయంతో బాధపడుతున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) పేర్కొంది. కానీ నిజానికి అతను ఫిట్‌గా ఉన్నప్పటికీ సీఏ మాత్రం ఏవో సాకులు చెప్పి అతన్ని ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడకుండా చూస్తుంది. స్టార్క్‌ టీ20 క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికాడు. మరి రెండు నెలలుగా స్టార్క్‌ విషయంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏం చేసినట్లు? అంతేకాదు స్టార్క్‌ యాషెస్‌ సిరీస్‌ తర్వాత మళ్లీ మ్యాచ్‌లు ఆడలేదు. అయితే భారత్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ నేపథ్యంలో మొదట విశ్రాంతి తీసుకోమని పేర్కొన్న సీఏ ఆ తర్వాత మాట మార్చి ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటాడని తెలిపింది. కానీ ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. ఇక న్యూజిలాండ్‌ బౌలర్‌ లోకీ ఫెర్గూసన్‌ విషయం నన్ను మరింత ఆశ్చర్యపరుస్తోంది. గాయం లేనప్పటికీ కుటుంబంతో కొంత సమయం గడిపేందుకు ఫెర్గూసన్‌ ఐపీఎల్‌లో తొలి ఏడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదని తెలిసింది. ఇది దారుణమైన అంశం. ప్రస్తుతం ఫెర్గూసన్‌ సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్నాడు. అది ముగియగానే తన కుటుంబంతో గడిపేందుకు న్యూజిలాండ్‌ వెళ్లనున్నాడు. అది అతని వ్యక్తిగత విషయం కావొచ్చు, కానీ ఐపీఎల్‌లో ఒక జట్టుకు ఆడుతూ ఏడు మ్యాచ్‌ల తర్వాత జట్టులో చేరి రూ.కోటి తీసుకొని వెళ్లిపోతాడు. కానీ దీనివల్ల ఎవరికీ ప్రయోజనం? ప్రతీ ఐపీఎల్‌లో ఇది సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంది.’ అని వెల్లడించాడు.

Ex-coach Gary Kirsten Slams PCB Toxic Work Culture In Pak Cricket6
పాక్‌ క్రికెట్‌లో విష సంస్కృతి ఎక్కువ!

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ గ్యారీ కిర్‌స్టన్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)పై విమర్శలు గుప్పించాడు. వ్యవస్థాగత జోక్యం, వృత్తిపరమైన గౌరవం కొరవడడంతో పాకిస్థాన్‌ క్రికెట్‌ ప్రధాన కోచ్‌గా పనిచేయడం తనకు నరకంలా అనిపించిందని కిర్‌స్టన్‌ చెప్పుకొచ్చాడు. ఇటీవలే శ్రీలంక ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కిర్‌స్టన్‌ పీసీబీ చైర్మన్‌ మోసిన్‌ నఖ్వీ నేతృత్వంలో పని చేసే వర్క్‌ కల్చర్‌ దారుణంగా ఉండేదని పేర్కొన్నాడు. కిర్‌స్టన్‌ మాట్లాడుతూ.. ‘నేను చూసిన జట్లలో ఇంత స్థాయి జోక్యం ఎక్కడా చూడలేదు. కోచ్‌గా వచ్చి ప్లేయర్లతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే బయట నుంచి వచ్చే ఈ నాయిస్ చాలా కష్టంగా మారుతుంది. జట్టు ఫలితాలు సరిగా రాకపోతే కోచ్‌పైనే ఒత్తిడి పెంచడం, ఆంక్షలు విధించడం వంటి చర్యలు ప్రతికూలంగా మారుతాయి. టీమ్ బాగా ఆడకపోతే కోచ్‌ను తీసేయడం లేదా అతనిపై పరిమితులు పెట్టడం చాలా ఈజీ. కానీ అదే తప్పు. అలా అయితే కోచ్‌ని ఎందుకు నియమిస్తారు?’అంటూ కిర్‌స్టెన్ ప్రశ్నించాడు. ఇక తన భవిష్యత్‌పై కూడా క్లారిటీ ఇచ్చిన కిర్‌స్టెన్, తాజాగా శ్రీలంక క్రికెట్‌తో రెండు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2027 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ కోసం శ్రీలంక జట్టును సిద్ధం చేయడం ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ఈ టోర్నమెంట్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనుంది. 2024లో టీ20 ప్రపంచకప్‌లో లీగ్‌ స్టేజీలోనే పాకిస్థాన్‌ నిష్క్రమించడంతో పీసీబీ వైఖరితో పొసగక కిర్‌స్టన్‌ తన పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతకముందు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జాసన్‌ గిలెస్పీ నిష్క్రమణ కూడా దాదాపు ఇలాంటి పద్దతిలోనే జరగడం గమనార్హం. ఇంగ్లండ్‌పై స్వదేశంలో చారిత్రాత్మక టెస్టు సిరీస్‌ విజయాన్ని పాక్‌ జట్టుకు అందించినప్పటికీ, మోసిన్‌ నఖ్వీ నేతృత్వంలోని పీసీబీ కనీస సమాచారం ఇవ్వకుండానే గిలెస్పీని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో సంచలనంగా నిలిచింది.చదవండి: IPL 2026: పంజాబ్‌ ‘కింగ్స్‌’ అయ్యేనా?

Punjab Kings Will Become Champion For IPL 20267
IPL 2026: పంజాబ్‌ ‘కింగ్స్‌’ అయ్యేనా?

ఐపీఎల్‌ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోవడం పంజాబ్‌ కింగ్స్‌ నిలకడలేని ఫామ్‌ను ఎత్తి చూపుతోంది. ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌ ప్లేఆఫ్స్‌కు చేరిన పంజాబ్‌ కింగ్స్‌ (అప్పటి కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌) మళ్లీ 2014 ఐపీఎల్‌ సీజన్‌లో ఫైనల్‌ ఆడింది. ఆ సీజన్‌లో కేకేఆర్‌ చేతిలో ఓడిన పంజాబ్‌ రన్నరప్‌కే పరిమితమైంది. ఆ తర్వాత మళ్లీ 11 ఏళ్లకు కానీ ఆ జట్టు ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. అప్పుడు కేకేఆర్‌ అడ్డు తగిలితే ఈసారి ఆర్సీబీ పంజాబ్‌ను అడ్డుకుంది. అయితే, గత సంవత్సరం జట్టును సమూలంగా ప్రక్షాళించడం పంజాబ్‌కు కలిసి వచ్చింది. ముఖ్యంగా శ్రేయాస్‌ అయ్యర్‌ను భారీ ధరకు దక్కించుకుంది. అంతేకాదు అతడికి జట్టు పగ్గాలు అప్పగించింది. తనపై వెచ్చించిన మొత్తానికి, ఫ్రాంచైజీ యాజమాన్యం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శ్రేయాస్‌ అయ్యర్‌ జట్టును నిరుడు తుదిపోరుకు తీసుకొచ్చాడు. ఈనేపథ్యంలో ప్రధాన ఆటగాళ్లను రిటైన్‌ చేసుకున్న పంజాబ్‌ రన్నరప్‌గా నిలిచిన ఆత్మవిశ్వాసంతో ఈ సీజన్‌కు సై అంటోంది. శ్రేయాస్‌ అయ్యర్‌ సారథ్యంలో పంజాబ్‌ ఈసారైనా ‘కింగ్స్‌’ అవుతుందా? అనేది చూడాలి.అయితే పంజాబ్‌కు విదేశీ ఆల్‌రౌండర్లు ప్రధాన బలం. మార్కస్‌ స్టొయినిస్‌, మార్కో యాన్సెన్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, మిచెల్‌ ఒవెన్‌, కూపర్‌ కానొలీ బంతిని ఎంత బలంగా బాది భారీ షాట్లు సాధించగలరో..అదే బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలరు. పైగా ప్రపంచ వ్యాప్తంగా పలు అంతర్జాతీయ ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడుతున్న అపార అనుభవం ఆ ఐదుగురు ఆల్‌రౌండర్ల సొంతం. ప్రియాన్ష్‌ ఆర్యా, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరుబోర్డును పరుగులు పెట్టించగలరు. నిరుడు 400కుపైగా రన్స్‌ చేసిన ఆర్యా రెండో బెస్ట్‌ స్ట్రయిక్‌ రేట్‌ బ్యాటర్‌గా నిలిచాడు. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాలను కొనసాగించేందుకు శ్రేయాస్‌ ఎలాగూ ఉంటాడు. అర్ష్‌దీప్‌, ఫెర్గూసన్‌, యాన్సెన్‌, చాహల్‌తో పేస్‌, స్పిన్‌ బౌలింగ్‌లో వైవిధ్యం పంజాబ్‌కు కలిసి వచ్చే అంశం. పటిష్టమైన రిజర్వ్‌ బెంచ్‌ అదనపు బలం.పెద్దగా అనుభవంలేని భారత ఆటగాళ్లు జట్టులో ఉండడం పంజాబ్‌ కింగ్స్‌ బలహీనత. కెప్టెన్‌ అయ్యర్‌ మినహా ప్రియాన్ష్‌, శశాంక్‌ సింగ్‌, వధేరా, హర్‌ప్రీత్‌ బ్రార్‌, ముషీర్‌ ఖాన్‌, వైశాఖ్‌లకు అత్యున్నత స్థాయి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడింది తక్కువ. వీరందరిలో ప్రతిభకు కొదవ లేకపోయినా నిలకడగా రాణించలేకపోవడం, ఒత్తిడి సమయాల్లో ఆడిన అనుభవం పెద్దగా లేకపోవడం కీలక సమయాల్లో జట్టును దెబ్బతీస్తోంది. అలాగే చాహల్‌ మినహా పేరు కలిగిన మరో స్పిన్నర్‌ లేకపోవడం లోటు.పంజాబ్‌ కింగ్స్‌ జట్టు:స్వదేశీ ఆటగాళ్లు: శ్రేయాస్‌ (కెప్టెన్‌), ప్రియాన్ష్‌ ఆర్యా, ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్‌ (కీపర్‌), నేహల్‌ వధేరా, శశాంక్‌ సింగ్‌, విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, యజువేంద్ర చాహల్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, సూర్యాన్ష్‌ షెగ్డే, విష్ణు వినోద్‌ (కీపర్‌), యశ్‌ ఠాకూర్‌, ముషీర్‌ ఖాన్‌, హర్నూర్‌ సింగ్‌, పైలా అవినాశ్‌, ప్రవీణ్‌ దూబే, విశాల్‌ నిషాద్‌.విదేశీ ఆటగాళ్లు: స్టొయినిస్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌, మిచెల్‌ ఒవెన్‌, ఫెర్గూసన్‌, కూపర్‌ కానొలీ, బెన్‌ డ్వార్షూయిస్‌.చదవండి: జ‌ట్ల‌కు వార్నింగ్‌.. కేకేఆర్ బ్యాట‌ర్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ

Angkrish Raghuvanshi sizzles century in practice game to give Rahane headache before IPL 20268
జ‌ట్ల‌కు వార్నింగ్‌.. కేకేఆర్ బ్యాట‌ర్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ

ఐపీఎల్ 2026 సీజన్ కోసం మూడు సార్లు ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తీవ్రంగా శ్రమి‍స్తోంది. గత సీజన్‌లో దారుణంగా విఫలమైన కేకేఆర్‌.. ఈసారి మాత్రం మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తమ ట్రైనింగ్ క్యాంపును కేకేఆర్ ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో శుక్రవారం కేకేఆర్ సభ్యులు రెండు జట్లగా విడిపోయి ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడాడు. గోల్డెన్ నైట్స్ జట్టుకు రింకూ సింగ్‌ కెప్టెన్‌ కాగా.. 'పర్పుల్ నైట్స్' జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రహానే జట్టుకు ప్రాతినిథ్యం వహించిన యువ ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 55 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడితో పాటు కివీ స్టార్ ఫిన్ అలెన్ కూడా దూకుడుగా ఆడాడు. ఫ‌లితంగా ల‌క్ష్యాన్ని పర్పుల్ నైట్స్ జ‌ట్టు 19.2 ఛేదించింది.అయితే ఈ ఏడాది సీజ‌న్‌లో ర‌ఘువంశీ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌పై ఇంకా స్ప‌ష్ట‌త లేదు. గ‌త సీజ‌న్‌లో కొన్ని సార్లు మూడో స్ధానంలో, మ‌రికొన్ని మిడిలార్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చేవాడు. అయితే ఇప్పుడు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అజింక్య ర‌హానే, కామెరాన్ గ్రీన్ వంటి టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు ఉండ‌డంతో ర‌ఘువంశీని మ‌రి ఎలా ఉప‌యోగిస్తారో చూడాలి. ఈ ఏడాది సీజ‌న్‌లో కేకేఆర్ త‌మ తొలి మ్యాచ్‌లో మార్చి 29న వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.చదవండి: IPl 2026: 'ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు'.. సహచరులకు కోహ్లి వార్నింగ్‌

Virat Kohli's Big Warning For RCB Teammates Ahead Of IPL 20269
'ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు'.. సహచరులకు కోహ్లి వార్నింగ్‌

ఐపీఎల్‌-2026 సీజన్ ఆరంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ షురూ కానుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ.. టైటిల్‌ను ఎలాగైనా రిటైన్ చేసుకోవాలని పట్టుదలతో ఉంది. రజిత్ పాటిదార్ నేతృత్వంలో ఆర్సీబీ జట్టు తాజాగా చిన్నస్వామి స్టేడియంలో తమ మొదటి ట్రైనింగ్ సెషన్‌లో పాల్గోంది. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్‌, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆటగాళ్లలలో స్ఫూర్తి నింపుతూ ప్రసంగించాడు. "గత రెండు, మూడు సీజన్లలో మనం పడ్డ కష్టానికి ఫలితం గతేడాది దక్కింది. కానీ ఈసారి మరిన్ని కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి. ఎందుకంటే అన్ని జట్లు మనల్ని ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాయి. గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ సమయాన్ని వృథా చేయొద్దు. ప్రతీ సెషన్‌లోనూ ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా 120 శాతం కష్టపడాలి. ఈ టోర్నీలో సత్తాచాటేందుకు మనమంతా ఉత్సాహంగా ఉన్నామని అందరి ముఖాల్లో కనిపిస్తోంది" అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీ తొలి టైటిల్‌ సాధించడంలో కోహ్లిది కీలక పాత్ర. మొత్తం 15 మ్యాచ్‌లలో 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఏడాది సీజన్‌లోనూ ఆర్సీబీ విరాట్‌ కీలకం కానున్నాడు.చదవండి: IPL 2026: దుమ్ములేపిన ప‌ప్పు యాద‌వ్ కొడుకు.. కేవలం 16 బంతుల్లోనే

BCCI confirms dates and timings of India vs Ireland T20I series after IPL 202610
ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా.. షెడ్యూల్ ఖ‌రారు చేసిన బీసీసీఐ

భారత పురుషల క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు మ్యాచ్‌లు జూన్ 26,28వ తేదిల్లో బెల్ఫాస్ట్ వేదికగా జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. పొట్టి ప్రపంచకప్ ఛాంపియన్స్‌గా నిలిచిన తర్వాత భారత్‌కు ఇదే తొలి టీ20 సిరీస్ కావడం గమనార్హం. వాస్తవానికి ఈ సిరీస్ టీమిండియా ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో లేదు.ఐపీఎల్‌-2026 సీజ‌న్ ముగిసిన త‌ర్వాత టీమిండియా స్వ‌దేశంలో అఫ్గానిస్తాన్‌ ఒక టెస్టు, మూడు వ‌న్డేలు ఆడ‌నుంది. జూన్‌ 6-20 మధ్య టీమిండియా- అఫ్గనిస్తాన్‌ మధ్య సిరీస్‌ జరుగుతుంది. ఆ త‌ర్వాత జూలైలో ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్‌ ఖరారైంది.జూలై 1- 19 వరకు ఇరు జట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఐర్లాండ్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బీసీసీఐ ఈ ప‌ర్య‌ట‌న‌ను ఖరారు చేసింది. ఆ త‌ర్వాత భార‌త జ‌ట్టు అక్క‌డ నుంచి నేరుగా ఇంగ్లండ్‌కు వెళ్ల‌నుంది. భార‌త్, ఐర్లాండ్ జ‌ట్లు చివ‌రిసారిగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌ల‌ప‌డ్డాయి.చదవండి: IPl 2026: 'వైభవ్ అతిగా ఆలోచించకు.. జైస్వాల్ చూసుకుంటాడు'

Advertisement
Advertisement
 
Advertisement