Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Jason Holder Extracts Revenge On Virat Kohli, RCB Star Fumes Video Viral1
తీవ్ర అసంతృప్తి.. కోపంతో ఊగిపోయిన కోహ్లి!

గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్‌ కోహ్లి మెరుపులు మెరిపించాడు. ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని 81 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.అయితే, ఒకానొక దశలో సెంచరీ దిశగా పయనించిన కోహ్లి.. అనూహ్య రీతిలో అవుటయ్యాడు. జేసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి వెనుదిరిగాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కోహ్లి బ్యాట్‌ను ప్యాడ్‌కేసి కొడుతూ కోపంగా మైదానం వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా బెంగళూరు వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ గుజరాత్‌ తలపడ్డాయి. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు సాధించింది.‘సున్నా’ వద్ద కోహ్లికి లైఫ్‌! ఇక లక్ష్య ఛేదనలో భాగంగా సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన ఆర్సీబీ స్టార్‌ జాకబ్‌ బెతెల్‌ (14) ప్రభావం చూపలేకపోయాడు. మరోవైపు.. కోహ్లి ఆడిన తొలి బంతికే షార్ట్‌ మిడ్‌వికెట్‌ వద్ద వాషింగ్టన్‌ సుందర్‌ సునాయాస క్యాచ్‌ వదిలేశాడు. ఆ తర్వాత కోహ్లి చక్కటి షాట్లతో దూసుకుపోగా టైటాన్స్‌ భారీ మూల్యం చెల్లించింది.మరో ఎండ్‌లో పడిక్కల్‌ (27 బంతుల్లో 55)... కోహ్లికంటే వేగంగా పరుగులు రాబట్టి ఆర్సీబీ పనిని సులువు చేశాడు. తొలి బంతికే సిక్స్‌తో మొదలు పెట్టిన అతను సిరాజ్‌ ఓవర్లో మరో సిక్స్‌ కొట్టాడు. రషీద్‌ ఓవర్లో కోహ్లి వరుసగా సిక్స్, ఫోర్‌ కొట్టగా... ప్రసిధ్‌ ఓవర్లో పడిక్కల్‌ 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదాడు. ఆపై రషీద్‌ ఓవర్లోనూ 2 సిక్స్‌లతో చెలరేగిన పడిక్కల్‌ 20 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకోవడం విశేషం. ఆ తర్వాత 30 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది.హోల్డర్‌ వైల్డ్‌గా సెలబ్రేషన్స్‌.. తీవ్ర అసంతృప్తిలో కోహ్లిపడిక్కల్‌ను రషీద్‌ అవుట్‌ చేయగా, హోల్డర్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన కోహ్లి తర్వాతి బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. దీంతో సున్నా వద్ద లైఫ్‌ పొంది సెంచరీ దిశగా పయనించిన కోహ్లి ఇన్నింగ్స్‌కు పద్నాలుగో ఓవర్లో తెరపడింది. హోల్డర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి కోపంగా కోహ్లి వెనుదిరగగా.. హోల్డర్‌ వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు.Set batters gone 😯🎥 Rashid Khan and Jason Holder hit the timber \|/Updates ▶️ https://t.co/5ZJjfv5Nr6#TATAIPL | #KhelBindaas | #RCBvGT | @gujarat_titans pic.twitter.com/zVUsxy1NB2— IndianPremierLeague (@IPL) April 24, 2026ఇక ఆర్సీబీ మిగిలిన ఆటగాళ్లలో జితేశ్‌ శర్మ (10), కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ (8) విఫలమైనా... కృనాల్‌ పాండ్యా (12 బంతుల్లో 23 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), టిమ్‌ డేవిడ్‌ (10 నాటౌట్‌) కలిసి మ్యాచ్‌ను ముగించారు. చదవండి: అందుకే శ్రేయస్‌ అయ్యర్‌ను వదులుకున్నాం: కేకేఆర్‌ మాజీ కోచ్‌

IPL 2026: Shubman Gill comments after losing to RCB2
ఆ మూడు ఓవర్లలో తడబడ్డాం: గిల్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌, ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (100) సూపర్‌ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్‌ కోహ్లి (81), పడిక్కల్‌ (55) చెలరేగడంతో ఆర్సీబీ మరో 7 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.వాస్తవానికి గుజరాత్‌ ఈ మ్యాచ్‌లో ఇంకా భారీ స్కోర్‌ చేయాల్సింది. అయితే చివరి ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు అనూహ్యంగా పుంజుకొని వారిని కట్టడి చేశారు. ఛేదన సమయంలోనూ గుజరాత్‌కు పైచేయి సాధించే అవకాశం ఉండింది. స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు తీయగలిగినా, ఆతర్వాత ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచలేకపోయింది. చివరికి మూల్యం చెల్లించుకుంది.మ్యాచ్‌ అనంతరం గిల్‌ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకున్నాడు. అతని మాటల్లో.. పవర్‌ప్లే ముగిసే సమయానికి మంచి స్థితిలో ఉన్నాం. కానీ, 16 నుంచి 19వ ఓవర్ వరకు ఆశించిన రీతిలో పరుగులు చేయలేకపోయాము. ఆ మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాకపోవడం మ్యాచ్ గమనాన్ని మార్చేసింది.మధ్య ఓవర్లలో వికెట్లు తీయలేకపోయాంప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలంటే మధ్య ఓవర్లలో వికెట్లు తీయడం చాలా ముఖ్యం. అయితే, పవర్‌ప్లే తర్వాత మా బౌలర్లు ఆ పనిని చేయలేకపోయారు. ఆ సమయంలో కొన్ని మంచి బంతులు వేసినా, అవసరమైన స్థాయిలో లెంగ్త్‌ను మెయిన్‌టైన్‌ చేయలేకపోయారు.సుతార్‌కు బంతి ఇవ్వడంపై వివరణపిచ్ స్పిన్‌కు సహకరిస్తోందని తాను బ్యాటింగ్ చేసే సమయంలోనే గమనించాను. ముఖ్యంగా కృనాల్‌ వేసిన బంతులు బాగా టర్న్‌ అయ్యాయి. అందుకే చివర్లో మానవ్‌ సుతార్‌కు అవకాశం ఇచ్చాను.మరో రెండు వికెట్లు పడుంటే మ్యాచ్ మళ్లీ తమవైపు తిరిగేది.సాయి సుదర్శన్‌పై సరదా వ్యాఖ్యసాయి ఇటీవల రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచినా, ఈ మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. అతని ప్రదర్శనపై గిల్ ప్రశంసలు కురిపించాడు. వచ్చే మ్యాచ్‌లో అయినా సాయి తనకు పవర్‌ప్లేలో స్ట్రైక్ ఇస్తాడని ఆశిస్తున్నానంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.

Virat Kohli scales new heights in IPL with match winning 81 against Gujarat Titans3
చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి ఖాతాలో మరో రెండు భారీ రికార్డులు చేరాయి. ఈ దిగ్గజ బ్యాటర్‌ ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 24) గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ద సెంచరీ (44 బంతుల్లో 81) చేసి తన జట్టును గెలిపించాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ బౌండరీలు, సిక్సర్ల ద్వారా విరాట్‌ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 800 ఫోర్లు, ఒకే ఫ్రాంచైజీ (ఆర్సీబీ) తరఫున 300 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఈ ఘనతలను ఇప్పటివరకు ఏ ఆటగాడు సాధించలేదు.వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 300 సిక్సర్లను మాత్రం క్రిస్‌ గేల్‌ (కేకేఆర్‌, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌, పంజాబ్‌ కింగ్స్‌, ఆర్సీబీ- 357), రోహిత్‌ శర్మ (డెక్కన్‌ ఛార్జర్స్‌, ముంబై ఇండియన్స్‌- 310) సాధించారు. గుజరాత్‌పై మ్యాచ్‌ తర్వాత విరాట్‌ ఖాతాలో 807 ఫోర్లు, 303 సిక్సర్లు ఉన్నాయి. ఫోర్ల విషయంలో మాత్రం ప్రస్తుతమున్న ఆటగాళ్లలో విరాట్‌ కనుచూపు మేరల్లో కూడా ఎవరూ లేరు. ఐపీఎల్‌లో విరాట్‌ తర్వాత అత్యధిక బౌండరీలు సాధించిన ఘనత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ (768) పేరిట ఉంది. ప్రస్తుమున్న ఆటగాళ్లలో విరాట్‌ తర్వాతి స్థానాల్లో డేవిడ్‌ వార్నర్‌ (663), రోహిత్‌ శర్మ (653) ఉన్నారు.50 హాఫ్‌ సెంచరీస్‌ఈ హాఫ్‌ సెంచరీతో విరాట్‌ మరో ఘనత కూడా సాధించాడు. ఈ హాఫ్‌ సెంచరీ అతనికి ఐపీఎల్‌లో ఓపెనర్‌ 50వది. ఈ ఘనతను విరాట్‌కు ముందు డేవిడ్‌ వార్నర్‌ మాత్రమే సాధించాడు. తాజా ఇన్నింగ్స్‌తో విరాట్‌ ప్రస్తుత సీజన్‌లో లీడింగ్‌ రన్‌స్కోరర్‌గానూ అవతరించాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 328 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌, ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (100) సూపర్‌ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్‌ కోహ్లి (81), పడిక్కల్‌ (55) చెలరేగడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.

IPL 2026: RCB records after winning against Gujarat Titans4
బెంగళూరులో ఆర్సీబీ హాఫ్‌ సెంచరీ

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 24) బెంగళూరు వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.5 ఓవర్లలో సునాయాసంగా ఛేదించింది. ఈ గెలుపు ద్వారా ఆర్సీబీ ఓ అరుదైన ఘనత సాధించింది. సొంత మైదానం బెంగళూరులో తమ 50వ విజయాన్ని నమోదు చేసింది. తద్వారా ముంబై ఇండియన్స్‌ (వాంఖడే), కేకేఆర్‌ (కోల్‌కతా), సీఎస్‌కే (చెన్నై) జట్ల సరసన చేరింది. ఈ జట్లు కూడా తమతమ సొంత వేదికలపై 50 విజయాలు నమోదు చేశాయి. గత 18 సీజన్లలో కలిపి బెంగళూరులో 46 విజయాలు నమోదు చేసిన ఆర్సీబీ, ఈ ఒక్క సీజన్‌లో ఇప్పటికే (5 మ్యాచ్‌ల్లో) 4 విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో బెంగళూరులో ఆర్సీబీకి ఎదురైన ఏకైక పరాజయం ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో. ఈ మ్యాచ్‌లో 200 ప్లస్‌ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారానూ ఆర్సీబీ ఓ ఘనత సాధించింది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సార్లు 200 ప్లస్‌ టార్గెట్‌ను ఛేదించిన జట్ల జాబితాలో రాజస్థాన్‌ రాయల్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. అలాగే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఛేదించిన 206 పరుగుల లక్ష్యం ఆ జట్టుకు ఐపీఎల్‌లో రెండో అత్యధిక లక్ష్య ఛేదనగా నిలిచింది.ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్‌ లక్ష్యాన్ని ఛేదించిన టాప్‌-5 జట్లుపంజాబ్‌ కింగ్స్‌- 10ముంబై ఇండియన్స్‌- 6ఆర్సీబీ-5రాజస్థాన్‌- 5ఎస​్‌ఆర్‌హెచ్‌- 5ఐపీఎల్‌లో ఆర్సీబీ ఛేదించిన 200 ప్లస్‌ లక్ష్యాలు228 vs LSG, లక్నో, 2025206 vs GT, బెంగళూరు, 2026*204 vs KXIP, బెంగళూరు, 2010202 vs SRH, బెంగళూరు, 2026201 vs GT, అహ్మదాబాద్, 2024ఐపీఎల్‌లో ఒక వేదికపై ఒక జట్టు సాధించిన అత్యధిక విజయాలు58 - MI (వాంఖడే)55 - KKR (కోల్‌కతా)53 - CSK (చెన్నై)50 - RCB (బెంగళూరు)*40 - SRH (హైదరాబాద్)*సూపర్ ఓవర్ విజయాలతో కలిపికాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (100) సూపర్‌ సెంచరీతో కదంతొక్కాడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్‌ కోహ్లి (81), పడిక్కల్‌ (55) చెలరేగడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.

Indian womens cricket team Fourth T20 against South Africa today5
తొలి విజయం కోసం భారత్‌ నిరీక్షణ... నేడు దక్షిణాఫ్రికాతో నాలుగో టి20

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా పర్యటనలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఇప్పటికే 0–3తో సిరీస్‌ కోల్పోయిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా... శనివారం సఫారీలతో నాలుగో మ్యాచ్‌ ఆడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 9:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. త్వరలో టి20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌తో జట్టు కూర్పు సరిచూసుకోవాలనుకున్న టీమిండియాకు ఏదీ కలిసి రాలేదు. షఫాలీ వర్మ, కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ ఫర్వాలేదనిపిస్తుండగా... స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ రాణించాల్సిన అవసరముంది. మరోవైపు ఇప్పటికే సిరీస్‌ పట్టేసిన సఫారీలు ఇక ‘క్లీన్‌స్వీప్‌’పై కన్నేశారు.

Mixed results for India in Thomas Cup and Uber Cup team badminton tournaments6
భారత్‌కు మిశ్రమ ఫలితాలు

హోర్‌సెన్స్‌ (డెన్మార్క్‌): ప్రతిష్టాత్మక థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. థామస్‌ కప్‌లో భారత పురుషుల జట్టు గెలుపు బోణీ కొట్టగా... ఉబెర్‌ కప్‌లో భారత మహిళల జట్టు ఓడిపోయింది. కెనడాతో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 4–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్, భారత నంబర్‌వన్‌ లక్ష్య సేన్‌ 21–18, 19–21, 10–21తో ప్రపంచ 13వ ర్యాంకర్‌ విక్టర్‌ లాయ్‌ చేతిలో ఓడిపోయాడు. అయితే రెండో మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 21–10, 21–11తో జొనాథన్‌ బింగ్‌–కెవిన్‌ లీ జంటను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత మూడో మ్యాచ్‌లో ఆసియా చాంపియన్‌షిప్‌ రన్నరప్‌ ఆయుశ్‌ శెట్టి 21–13, 21–17తో బ్రియాన్‌ యాంగ్‌పై గెలిచి భారత్‌కు 2–1తో ఆధిక్యం అందించాడు.నాలుగో మ్యాచ్‌లో హరిహరన్‌–ఎంఆర్‌ అర్జున్‌ ద్వయం 21–7, 21–15తో లిండెమన్‌–నిల్‌ యకూరా జోడీని ఓడించి భారత్‌కు 3–1తో విజయాన్ని ఖరారు చేసింది. ఐదో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ 21–17, 21–12తో జోషువా నుగుయెన్‌పై నెగ్గడంతో భారత్‌ 4–1తో ముగించింది. సోమవారం జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఆ్రస్టేలియాతో భారత్‌ ఆడుతుంది. సింధు గెలిచినా.... మరోవైపు భారత మహిళల జట్టు గ్రూప్‌ ‘ఎ’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో 2–3తో ఆతిథ్య డెన్మార్క్‌ చేతిలో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్‌లో పీవీ సింధు 21–13, 18–21, 21–17తో లినె క్రిస్టోఫర్సన్‌ను ఓడించింది. రెండో మ్యాచ్‌లో ఉన్నతి హుడా 12–21, 23–25తో లినె జార్స్‌ఫెల్ట్‌ చేతిలో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌లో ప్రియ–శ్రుతి మిశ్రా జోడీ 17–21, 21–11, 21–23తో అమెలియా–మెటీ వెర్జ్‌ జంట చేతిలో పరాజయం పాలైంది. నాలుగో మ్యాచ్‌లో తన్వీ శర్మ 21–19, 16–21, 16–21తో అమెలియా షుల్జ్‌ చేతిలో ఓటమి చెందడంతో భారత్‌ పరాజయం ఖరారైంది. నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో సింధు–తనీషా క్రాస్టో ద్వయం తొలి గేమ్‌ను 19–21తో కోల్పోయి రెండో గేమ్‌లో 17–14తో ఆధిక్యంలో ఉన్న దశలో అలెగ్జాండ్రా బొయె–క్రిస్టీన్‌ బుష్‌ జోడీ గాయంతో వైదొలిగింది. నేడు జరిగే రెండో మ్యాచ్‌లో ఉక్రెయిన్‌తో భారత్‌ తలపడుతుంది.

Broadcasters not interested in World Cup football tournament broadcasting rights in India7
ప్రత్యక్ష ప్రసారం చూడలేమా!

టీమిండియా క్రికెట్‌ మ్యాచ్‌ ఆడుతుందంటే చాలు... అభిమానులు టీవీలకు అతుక్కుపోవడం మనదేశంలో తరాలుగా వస్తున్న ఆనవాయితీ! ఐపీఎల్‌ వచ్చాక వీక్షకుల సంఖ్య మరింత పెరిగింది. అరచేతిలో ప్రత్యక్ష ప్రసారం చూసే అవకాశం వచ్చినప్పటి నుంచి ఆ సంఖ్య కోట్లు దాటేసింది. ఇదే బాటలో బ్యాడ్మింటన్‌ లీగ్, రెజ్లింగ్‌ లీగ్, టేబుల్‌ టెన్నిస్‌ లీగ్, ఖో ఖో లీగ్, ప్రీమియర్‌ టెన్నిస్‌ లీగ్, ఆర్చరీ లీగ్‌ ఇలా లెక్కకు మిక్కిలి లీగ్‌లు కాస్తో కూస్తో ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)... క్రికెట్‌ తరహాలో దేశవ్యాప్తంగా బాగా ఆదరణ దక్కించుకుంది. మట్టి ఆటతో మనకున్న అనుబంధాన్ని మ్యాట్‌పై చూపించడంతో గ్రామీణ ప్రేక్షకులు పీకేఎల్‌కు బ్రహ్మరథం పట్టారు. అయితే ఎటొచ్చి యావత్‌ ప్రపంచం వీపరీతంగా ఆదరించే ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ పోటీలకు మాత్రం మన దేశంలో ఆదరణ చాలా తక్కువ. మరికొద్ది రోజుల్లో ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ వరల్డ్‌కప్‌ జరగనున్నా... ఇప్పటి వరకు మనదేశంలో ఈ టోర్నమెంట్‌ ప్రత్యక్ష ప్రసార హక్కులు దక్కించుకునేందుకు ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఉన్న కొద్దిమంది అభిమానులు కూడా ప్రపంచకప్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం కోల్పోనున్నారు. ఈ నేపథ్యంలో ‘ఫిఫా’ వరల్డ్‌కప్‌ ప్రత్యక్ష ప్రసార తీరు తెన్నులపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడావిభాగం యావత్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ సమరానికి సమయం దగ్గరపడుతోంది. నాలుగేళ్లకోసారి జరిగే ఫుట్‌బాల్‌ మహాసంగ్రామం జూన్‌ 11 నుంచి జూలై 19 వరకు సాగనుంది. నాలుగేళ్ల క్రితం ఖతర్‌లో జరిగిన ఈ మెగా టోర్నీని ఇప్పుడు మూడు దేశాలు కలిసి సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. కెనడా, మెక్సికో, అమెరికాలో ఈ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా 48 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతుండగా... మొత్తం 104 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. 48 జట్లను 12 గ్రూప్‌లుగా విభజించి పోటీలు నిర్వహించనున్నారు. గత వరల్డ్‌కప్‌లో కేవలం 64 మ్యాచ్‌లు మాత్రమే జరగ్గా... ఇప్పుడా సంఖ్య బాగా పెరిగింది. దీంతో సాధారణంగా ఆసక్తి కూడా మరింత పెరిగింది. ప్రపంచంలో 200కు పైగా దేశాల్లో ఫుట్‌బాల్‌ అభిమానులు ఉన్నారు. అందులో దాదాపు అన్నీ దేశాల్లో ఈ వరల్డ్‌కప్‌ ప్రసారాలు సాగనున్నాయి. కానీ మన దేశంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌ ముగిసిన 11 రోజులకే... ప్రస్తుతం ఐపీఎల్‌ జోరుగా సాగుతుండటంతో... ఎక్కడ చూసినా ఫోర్లు, సిక్స్‌లు, స్కోర్ల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. వచ్చే నెల 31వ తేదీతో ఐపీఎల్‌ ముగియనుండగా... ఆ తర్వాత 11 రోజులకే ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. క్రికెట్‌ను మతంలా భావించే మనదేశంలో మొదటి నుంచి ఫుట్‌బాల్‌కు ఆదరణ అంతంతమాత్రమే... ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, కేరళ వంటి చోట్ల తప్ప ఫుట్‌బాల్‌పై ఆసక్తి కనబర్చే వారి సంఖ్య చాలా తక్కువ. మన దేశ ఫుట్‌బాల్‌ జట్టు కూడా అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా విజయాలు సాధించలేక పోతుండటంతో పాటు... దక్షిణ అమెరికా, యూరప్‌ దేశాల హవా సాగే ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌పై మనవాళ్లకు ఆసక్తి తక్కువే. ఐపీఎల్‌ ప్రసార హక్కుల విలువ రోజు రోజుకు పెరుగుతూ ఉంటే... ఈ టోర్నమెంట్‌ ప్రసార హక్కులు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యకరం. 100 నుంచి 35 మిలియన్‌ డాలర్లలకు... తాజా ప్రపంచకప్‌తో పాటు 2030లో జరగనున్న వరల్డ్‌కప్‌ను కలిపి సంయుక్త ప్రసార హక్కులను భారత మార్కెట్‌లో 100 మిలియన్‌ డాలర్లకు నిర్వాహకులు విక్రయించే ప్రయత్నం చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో రెండు టోర్నీల ప్రసార హక్కులను 35 మిలియన్‌ డాలర్లకు తగ్గించినా... ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. ‘భారత్‌లో ఫుట్‌బాల్‌ వీక్షణ గత కొంతకాలంగా బాగా క్షీణిస్తోంది. ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ను చూస్తే 2013–14లో దాని విలువ 145 మిలియన్‌ డాలర్లు ఉండేది... అది ఇప్పుడు 60 మిలియన్‌ డాలర్లకు పడిపోయింది’ అని స్పోర్ట్స్‌ గేమింగ్‌ రంగ నిపుణుడు తెలిపాడు. చేతులు కాల్చుకున్న సోనీ, రిలయన్స్‌ 2014, 2018 ‘ఫిఫా’ వరల్డ్‌కప్‌ టోర్నీలను భారత్‌లో సోనీ స్పోర్ట్స్‌ ప్రసారం చేసింది. వీటితో 2016 యూరో కప్‌ను కలిపి మొత్తం 90 మిలియన్‌ డాలర్లకు వాణిజ్య హక్కులు దక్కించుకుంది. ఆ తర్వాత 2022 వరల్డ్‌కప్‌ ప్రసార హక్కులను 60 మిలియన్‌ డాలర్లకు రిలయన్స్‌ సొంతం చేసుకుంది. అయితే ఈ రెండు సంస్థలు కూడా ఆశించిన లాభాలు గడించలేకపోయాయి. దీంతో ఈసారి ప్రసార హక్కుల విషయంలో తర్జన భర్జన ఇంకా సాగుతోంది.‘భారత్‌లో కేవలం అభిమానులు లేకపోవడమే కాక... మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. అందుకే ప్రసార హక్కులు దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఫుట్‌బాల్‌ వీక్షణల విషయంలో జపాన్‌తో భారత్‌ను పోల్చడం అవివేకం’ అని స్పోర్ట్స్‌ గేమింగ్‌ ఈ స్పోర్ట్స్‌ లైవ్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ రోహిత్‌ అన్నారు. టైమింగ్‌తో తలనొప్పి... ఈసారి ఫుట్‌బాల్‌ పండగ జరుగుతున్న కెనడా, మెక్సికో, అమెరికా కాలమానంతోనూ మనకు ఇబ్బంది ఎదురవుతోంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామునే ఎక్కువ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో వీక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనబడటం లేదు. ఎంత ప్రధానమైన ఈవెంట్‌ అయినా... ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించే సమయంలో కాకుండా... అర్ధరాత్రి, అపరాత్రి ప్రసారం చేస్తే వీక్షణలు తగ్గడం సహజమే. ఈ టోర్నమెంట్‌లోని 104 మ్యాచ్‌ల్లో 14 మాత్రమే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రికి ముందు ప్రారంభం కానున్నాయి. 2022 ఖతర్‌ వేదికగా జరిగిన టోర్నమెంట్‌లోని 64 మ్యాచ్‌ల్లో 44 మ్యాచ్‌లు ‘ప్రైమ్‌ టైమ్‌’లోనే ప్రసారమయ్యాయి. లాభాలు లేకే... మన దేశంలో 2022 ప్రపంచకప్‌ స్పోర్ట్స్‌–18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. జియో సినిమా యాప్‌లో ఉచితంగా లైవ్‌ అందించగా... స్పోర్ట్స్‌–18 ఛానల్‌ మాత్రం ఈ మెగా టోర్నీ కోసం నెలకు 12 రూపాయలు వసూలు చేసింది. ఫుట్‌బాల్‌ దేశాల్లో ఈ ధర ఎంత భారీగా ఉన్నా... వాటి వీక్షణల్లో ఎలాంటి మార్పు రాదని... కానీ మనదేశంలో మాత్రం ఫుట్‌బాల్‌ కోసం సభ్యత్వం తీసుకునే వారు చాలా తక్కువగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఏ రంగంలో అయినా లాభాలు రాకపోతే దాన్ని కొనసాగించడం కష్టమే కాబట్టి... ఏ రకంగా చూసుకున్న మన దేశంలో ఫిఫా ప్రపంచకప్‌నకు ఆదరణ పెద్దగా ఉండదనే ఉద్దేశంతోనూ ప్రసార హక్కులు కొనుగోలు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వాణిజ్య ప్రకటనలకు సమయమేది? భారత ఫుట్‌బాల్‌ జట్టు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో సైతం అభిమానులు లైవ్‌పై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఇక ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) రోజురోజుకూ తన ప్రభావం కోల్పోతూ వస్తోంది. గత ఏడాది కాలంలో ఐఎస్‌ఎల్‌ ప్రసార హక్కుల విలువలో 97 శాతం తగ్గుదల నమోదైంది. క్రికెట్‌లో అయితే ఓవర్‌కు ఓవర్‌కు మధ్య వచ్చే వాణిజ్య ప్రకటనలతో ప్రసార కర్తలకు భారీగా డబ్బు వచ్చి పడుతుంది. కానీ... ఫుట్‌బాల్‌కు మన దేశంలో అంతటి ఆదరణ ఉండదని ప్రసార సంస్థల నిపుణులు అంటున్నారు. ‘క్రికెట్‌లో ఓవర్‌ మారినా, వికెట్‌ పడినా... వాణిజ్య ప్రకటనలకు వీలు ఉంటుంది. టెన్నిస్‌లోనూ సెట్‌ తర్వాత స్లాట్‌లు ఉంటాయి. కానీ ఫుట్‌బాల్‌లో మ్యాచ్‌లకు ముందు, తర్వాత, విరామంలో మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. మధ్యమధ్యలో వాణిజ్య ప్రకటనలకు అవకాశం చాలా తక్కువ’ అని ఆయన అన్నారు. దూరదర్శన్‌కే చాన్స్‌... మనదేశంలోని ప్రముఖ ప్రసారకర్తలు జియో హాట్‌స్టార్, ఫ్యాన్‌కోడ్, సోనీ స్పోర్ట్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లతో చర్చలు నిర్వహించాలని ‘ఫిఫా’ భావిస్తోంది. ఒకవేళ ప్రసార కర్తలు ఎవరూ ముందుకు రాకపోతే... ప్రభుత్వ ప్రసారకర్త దూరదర్శన్‌లో వరల్డ్‌కప్‌ ప్రసారమయ్యే అవకాశముంది. 1998, 2002, 2006 ప్రపంచకప్‌లోని పలు మ్యాచ్‌లను దూరదర్శన్‌ ప్రత్యక్ష ప్రసారం చేసింది. 1998 ప్రపంచకప్‌ ప్రసార హక్కుల ద్వారా దూరదర్శన్‌ రూ. 3.5 కోట్ల లాభం కూడా పొందడం విశేషం.

Divyanshu and Shambhavi pair wins gold medal8
దివ్యాంశు–శాంభవి జోడీకి పసిడి పతకం

కైరో: అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) జూనియర్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం భారత్‌ ఖాతాలో నాలుగో స్వర్ణ పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో దివ్యాంశు దేవాంగన్‌–శాంభవి క్షీరసాగర్‌ జోడీ భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది. నాలుగు జోడీల మధ్య జరిగిన ఫైనల్లో దివ్యాంశు–శాంభవి జంట 499.9 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో కొత్త ప్రపంచ రికార్డును కూడా నమోదు చేసింది. సయ్‌ చియె యింగ్‌–చెన్‌ యు ఆన్‌ (చైనీస్‌ తైపీ) జంట 498.3 పాయింట్లో రజతం గెల్చుకోగా... టిఫెన్‌ పోమెస్‌–గాస్‌పర్డ్‌ లెసియర్‌ (ఫ్రాన్స్‌) జోడీ 434.4 పాయింట్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు 17 జోడీలు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో దివ్యాంశు–శాంభవి జంట 632 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలవడంతోపాటు ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఎనిమిది మంది షూటర్లు ఎలిమినేషన్‌ పద్ధతిలో పోటీపడ్డ ఫైనల్లో భారత షూటర్‌ సమీర్‌ 7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు 17 మంది షూటర్లు బరిలోకి దిగిన క్వాలిఫయింగ్‌లో సమీర్‌ 573 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందాడు. ప్రస్తుతం భారత్‌ 4 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 12 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Sachin Tendulkar celebrated his 53rd birthday on Friday9
అమ్మ ఆశీర్వాదంతో...

ముంబై: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ శుక్రవారం తన 53వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నాడు. సచిన్‌ ఇంటి వద్ద పెద్ద ఎత్తున అభిమానుల సందడి కనిపించింది. వారి మధ్య అతను బర్త్‌డే కేక్‌ను కట్‌ చేశాడు. అంతకుముందు ఈ రోజు గొప్పగా మొదలైందంటూ తన తల్లి రజని, భార్య అంజలి, పెంపుడు కుక్కతో కలిసి ఉన్న ఫోటోతో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ‘ఆయి (అమ్మ), అంజలి, నన్ను ఇబ్బంది పెట్టేవాడితో రోజు అద్భుతంగా మొదలైంది. ఇంతకంటే ఇంకేం కావాలి’ అని సచిన్‌ వ్యాఖ్యను జోడించాడు. సచిన్‌కు అతని మాజీ సహచరులు హర్భజన్‌ సింగ్, యువరాజ్‌ సింగ్‌ తదితరులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సచిన్‌ 200 టెస్టుల్లో 15,921 పరుగులు...463 వన్డేల్లో 18,426 పరుగులు సాధించాడు. రెండు ఫార్మాట్‌లలో అత్యధిక పరుగుల రికార్డు అతని పేరిటే ఉంది. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు (51) చేసిన ఆటగాడైన సచిన్‌ ఖాతాలో 49 వన్డే శతకాలు ఉన్నాయి.

Carlos Alcaraz withdraws from French Open 10
ఫ్రెంచ్‌ ఓపెన్‌కు అల్‌కరాజ్‌ దూరం

పారిస్‌: కుడి మణికట్టు గాయం కారణంగా ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌తోపాటు రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌–1000 టోర్నీలో ఆడటం లేదని స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ ప్రకటించాడు. 2024, 2025లలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గినఅల్‌కరాజ్‌ గత ఏడాది రోమ్‌ ఓపెన్‌లోనూ విజేతగా నిలిచాడు. ఈ రెండు టోర్నీలకు అల్‌కరాజ్‌ దూరం కానుండటంతో 3000 ర్యాంకింగ్‌ పాయింట్లు కోల్పోనున్నాడు. గతవారం బార్సిలోనా ఓపెన్‌ సందర్భంగా అల్‌కరాజ్‌ మణికట్టు గాయంతో టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement