Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Bumrah to prepare for 2027 ODI World Cup1
ఇక వన్డేలపై బుమ్రా గురి!

న్యూఢిల్లీ: భారత స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వరుసగా రెండోసారి జట్టు టి20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. 2024లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచిన అతను... ఈసారి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’ అవార్డుతో తన విలువను ప్రదర్శించాడు. ‘ఆల్‌ ఫార్మాట్‌’ ప్లేయర్‌ అయిన బుమ్రా చాలా కాలంగా పనిభారం తగ్గించుకునేందుకు ఎంపిక చేసిన సిరీస్‌లు, మ్యాచ్‌లలోనే బరిలోకి దిగుతున్నాడు. ఈ క్రమంలో టి20 వరల్డ్‌ కప్‌ తర్వాత అతని ప్రాధాన్యతలు కూడా మారబోతున్నాయి. ఇకపై 2027 వన్డే వరల్డ్‌ కప్‌ లక్ష్యంగా బుమ్రా సిద్ధం కానున్నాడు. ఇందు కోసం రాబోయే ఏడాదిన్నర కాలంలో అతను ఎక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడాలని నిర్ణయించుకున్నాడు. టి20 మ్యాచ్‌ల నుంచి చాలా వరకు అతను విరామం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలతో పాటు 2028లో లాస్‌ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్‌ కూడా టి20 ఫార్మాట్‌లోనే జరుగుతాయి. అయితే ఈ రెండు మెగా ఈవెంట్లు మినహాయించి మిగతా టి20 మ్యాచ్‌లలో ఎక్కువ భాగం బుమ్రా ఆడే అవకాశం తక్కువగా ఉంది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత వన్డేలపైనే అతను పూర్తి స్థాయి దృష్టి పెడతాడు. అయితే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ కూడా కీలకం కాబట్టి టెస్టుల నుంచి బుమ్రాకు విశ్రాంతి లభించడం కష్టమే. ఈ నేపథ్యంలో కోచ్‌ గంభీర్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్, టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌ కలిసి బుమ్రా గురించి పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. బుమ్రా ఫిట్‌నెస్‌ తమకు అన్నింటికంటే ముఖ్యమని, పెద్ద ఈవెంట్లలో అతని ప్రాధాన్యత గురించి చెప్పాల్సిన పని లేదని, వరల్డ్‌ కప్‌కు ముందు ఉండే 30–35 వన్డేల్లో బుమ్రా బరిలోకి దిగుతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

Indian womens hockey team to face Wales today2
‘డ్రా’ చేసుకుంటే సెమీస్‌ బెర్త్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచకప్‌ మహిళల హాకీ క్వాలిఫయింగ్‌ టోర్నీలో నేటితో లీగ్‌ దశ ముగియనుంది. మంగళవారం విశ్రాంతి దినం తర్వాత బుధవారం చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. పూల్‌ ‘బి’లో ఆతిథ్య భారత జట్టు తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో వేల్స్‌ జట్టుతో తలపడనుంది. గచ్చిబౌలి స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్‌ మొదలవుతుంది. పూల్‌ ‘బి’లో ప్రస్తుతం భారత్, స్కాట్లాండ్‌ 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఉరుగ్వే 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన వేల్స్‌ సెమీఫైనల్‌ రేసు నుంచి నిష్క్ర మించింది. నేడు జరిగే పూల్‌ ‘బి’ మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో ఉరుగ్వే (సాయంత్రం గం. 5:15 నుంచి) ఆడుతుంది. స్కాట్లాండ్‌ కూడా ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంటుంది. ఉరుగ్వే నెగ్గితే ఆ జట్టు సెమీఫైనల్‌ చేరుకుంటుంది. ఈ రెండు మ్యాచ్‌లకంటే ముందు పూల్‌ ‘ఎ’లో ఆస్ట్రియాతో ఇంగ్లండ్‌ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి), ఇటలీతో కొరియా (మధ్యాహ్నం గం. 3 నుంచి) పోటీపడతాయి. రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన ఇంగ్లండ్‌ ఇప్పటికే సెమీఫైనల్‌ చేరుకోగా... ఇటలీ, కొరియా మధ్య మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు రెండో సెమీఫైనల్‌ బెర్త్‌ లభిస్తుంది. ఒకవేళ ఇటలీ, కొరియా మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిస్తే మెరుగైన గోల్స్‌ సగటుతో ఇటలీ ముందంజ వేస్తుంది.

No clarity yet on IPL matches3
‘సిలిండర్‌’ కథ తేలితేనే షెడ్యూల్‌!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌–2026 ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వార్త ఇది. ప్రచార ప్రకటనల హోరు కనిపిస్తున్నా అసలు మ్యాచ్‌లు ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఎవరికీ తెలియదు. మార్చి 28 అని వినిపించినా దానిని కూడా బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. షెడ్యూల్‌ విషయంలో అభిమానులకు మాత్రమే కాదు అసలు బీసీసీఐ అధికారులకే స్పష్టత లేదు! మధ్య ప్రాచ్య దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం కూడా దీనికి ఒక కారణం. గల్ఫ్‌లో యుద్ధం కారణంగా మన దేశంలో గ్యాస్‌ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడంతో హోటల్స్‌లో వాడే కమర్షియల్‌ సిలిండర్‌లు దొరకడం సమస్యగా మారిపోయింది. ఐపీఎల్‌ సమయంలో హోటల్స్‌లో బస చేసే ఆటగాళ్లు, ఇతర సిబ్బంది, టోర్నీ నిర్వహణలో భాగంగా ఉండే ఎంతో మందికి భోజనం తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సిలిండర్‌లు కావాల్సిన సంఖ్యలో అందుబాటులో లేకపోతే మొత్తం వ్యవస్థ అంతా దెబ్బ తింటుంది. తాజాగా బెంగళూరు హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కూడా తమకు సిలిండర్ల కొరత బాగా ఉందని ఇప్పటికే చెప్పగా... ముంబైలో 20 శాతం హోటల్స్‌ తమ వ్యాపారానికి విరామం ఇచ్చాయి. ఈ సమస్యను ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ కూడా అంగీకరించారు. ‘గ్యాస్‌ సిలిండర్ల విషయంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నాం. మార్చి 28 వరకు అంతా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. అలా కాకుండా ఇదే సమస్య అప్పటికీ కొనసాగితే మేం ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆటగాళ్లతో పాటు ఐపీఎల్‌తో సంబంధం ఉన్న అందరిపై దీని ప్రభావం ఉంటుంది’ అని ధుమాల్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అంతా స్పష్టత వచ్చాకే ఐపీఎల్‌ షెడ్యూల్‌ ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

BCCI big reward for T20 World Cup winner4
రూ. 6 కోట్లు ఒక్కో ప్లేయర్‌కు...

న్యూఢిల్లీ: టి20 వరల్డ్‌ కప్‌ విజేతలకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నగదు పురస్కారంతో ఘనంగా గౌరవించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ నాయకత్వంలోని చాంపియన్‌ టీమ్‌కు మొత్తం రూ.131 కోట్ల నగదు పురస్కారాన్ని అందిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ‘వరల్డ్‌ కప్‌ సొంతం చేసుకున్న ఆటగాళ్లను, వారికి అండగా నిలిచిన సహాయక సిబ్బంది, సరైన జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లకు అభినందనలు. మున్ముందూ జట్టు ఇలాంటి మరెన్నో విజయాలు అందుకోవాలి’ అని బోర్డు కార్యదర్శి దేవజిత్‌ సైకియా అన్నారు. బోర్డు ప్రకటించిన మొత్తంలో ఆటగాళ్లకు ఎంత ఇస్తారనేది అధికారికంగా ప్రకటించకపోయినా... ఇందులో రూ. 90 కోట్లను 15 మంది జట్టు సభ్యులకు ఇవ్వనున్నట్లు సమాచారం. దీని ప్రకారం ఒక్కో క్రికెటర్‌కు రూ. 6 కోట్లు చొప్పున లభిస్తాయి. మిగతా రూ.41 కోట్లను హెడ్‌ కోచ్, అసిస్టెంట్‌ కోచ్‌లతో పాటు సహాయక సిబ్బందిలోని ఇతర సభ్యులకు వారి హోదాల ప్రకారం పంచుతారు. 2024లో భారత జట్టు టి20 వరల్డ్‌ కప్‌ గెలిచినప్పుడు కూడా బోర్డు భారీ మొత్తాన్ని (రూ. 125 కోట్లు) బహుమతిగా అందించింది. వారి సరసన చేరడం గౌరవం: సూర్యకుమార్‌ భారత్‌కు టి20 వరల్డ్‌ కప్‌ను అందించిన మూడో కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ నిలిచాడు. ధోని, రోహిత్‌ శర్మ తర్వాత ఈ ఘనత అతనికే దక్కింది. అలాంటి క్రికెటర్ల సరసన తన పేరు కూడా చేరడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సూర్యకుమార్‌ అన్నాడు. ‘వరుసగా రెండు వరల్డ్‌ కప్‌లు గెలవడం చాలా సంతోషంగా ఉంది. రెండేళ్ల క్రితం గెలిచినప్పుడే మేం దానిని పునరావృతం చేయాలని భావించాం. జట్టు మంచి జోరు మీదుంది. 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణంతో పాటు పాటు అదే ఏడాది జరిగే టి20 వరల్డ్‌ కప్‌లో మళ్లీ గెలిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ధోని, రోహిత్‌లవంటి గొప్ప కెప్టెన్‌లతో నన్ను పోల్చడం చాలా గర్వంగా ఉంది. మున్ముందు కూడా మరిన్ని విజయాలు జట్టుకు అందించాలని కోరుకుంటున్నా. టోర్నీ ఆరంభానికి ముందు ధోనితో మాట్లాడా. సన్నాహాలకు సంబంధించి అతను ఇచ్చిన సూచనలు చాలా బాగా పని చేశాయి’ అని సూర్యకుమార్‌ అన్నాడు. ఫైనల్‌ ముగిశాక మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు తమ సంబరాలు కొనసాగాయని అతను వెల్లడించాడు.ఆటగాళ్లకు ఘనస్వాగతం...వరల్డ్‌ కప్‌ విజయంలో భాగమైన క్రికెటర్లు అహ్మదాబాద్‌ నుంచి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. సోమవారమే సంజు సామ్సన్‌కు తిరువనంతపురం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించగా... మంగళవారం పట్నా ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు ఇషాన్‌ కిషన్‌కు భారీ స్థాయిలో వెల్‌కమ్‌ చెప్పారు. టోర్నీలో 317 పరుగులు చేసిన ఇషాన్‌ కిషన్‌ టీమ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ‘భారత జట్టు గెలుపు, నేను అందులో సభ్యుడిని కావడం చాలా గొప్పగా ఉంది. దేశం మొత్తం గర్వించే క్షణమిది. నేను నా ఆటతోనే అందరికీ స్ఫూర్తిగా నిలవాలని భావిస్తున్నా’ అని విమానాశ్రయంలో కిషన్‌ చెప్పాడు.

Lakshya Sen satisfied with performance in All England tournament5
ఫిట్‌నెస్‌ కీలకం

న్యూఢిల్లీ: ఆధునిక బ్యాడ్మింటన్‌ ప్రమాణలకు తగినట్లు ఫిట్‌నెస్‌తో మార్పు చెందాల్సిన అవసరం ఎంతగానో ఉందని భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ అంగీకరించాడు. ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో రెండోసారి ఫైనల్లో ఓడిపోవడం నిరాశపరిచిందని అన్నాడు. స్వదేశం చేరాక మీడియాతో మాట్లాడుతూ తన ఆటతీరు, తీసుకునే ఆహారం, చేయాల్సిన కసరత్తు, ఉండాల్సిన ఫిట్‌నెస్‌ అంశాలపై తన అభిప్రాయాల్ని వెల్లడించాడు. నిరాశ నిజమే కానీ... టైటిల్‌ పోరులో ఓడిపోవడం నిరుత్సాహపరిచింది. అయినప్పటికీ ఓవరాల్‌గా టోర్నీ సానుకూలంగానే ముగిసింది. మేటి ప్రత్యర్థుల్ని ఓడించడం. నిలకడగా విజయాలు సాధించడం... ముఖ్యంగా నా ఆటతీరు నన్ను తృప్తి పరిచింది. వయసు పెరిగేకొద్దీ అలసట సహజమని, ఉన్నపళంగా కోలుకోవడానికి నేనేమీ టీనేజ్‌ కుర్రాడిని కాదు. అలాగని ఈ 24 ఏళ్ల వయసుకే నా పనైపోయిందని చెప్పడం లేదు. టోర్నీకి టోర్నీకి మధ్య విరామం, కచ్చితమైన ప్రాక్టీస్, బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ అన్నీ ఎప్పుడు కూడా ఒకేలా లేదంటే ఒకప్పటిలాగే ఉండవని చెబుతున్నా. ఉదాహరణకి చిన్న వయసులో ఏం తిన్నా జీర్ణమవుతుంది. కానీ వయసు పెరిగేకొద్దీ ఆ సామర్థ్యంలో తేడా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ ఇంకొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ముఖ్యంగా తినే ఆహారం, చేసే కసరత్తు, ఆట కోసం కలిగి ఉండాల్సిన ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ ఎప్పటికప్పుడు మారుతుంది. ఆటను అనుసరించే శిక్షణ కొన్నిసార్లు ఆటను బట్టి శిక్షణ... కొన్ని సందర్భాల్లో శిక్షణను బట్టే ఆటతీరు మార్చుకోవాల్సి వస్తుంది. కాలక్రమంలో మనం ఎలా ముందజ వేయాలనేది పరిస్థితిని మార్పు చెందుతుంది. దీన్ని బట్టి నాకు సరిపోయే నిర్దిష్టమైన శైలితో ఆడాల్సి వస్తుంది. నాకు తరచూ అయిన భుజం గాయాలు కూడా నా ఆటతీరును ప్రభావితం చేశాయి. అటాకింగ్‌ షాట్లు బాగా ఆడే నేను కొన్ని సార్లు (మ్యాచ్‌ల్లో) వెనుకబడిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటప్పుడే విశ్రాంతి తీసుకొని పుంజుకోవాలి. ముఖ్యంగా గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాను. ఈ ఏడాదంతా కీలకం ఈ సీజన్‌ చాలా కీలకం. కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడల రూపంలో రెండు మెగా ఈవెంట్లు ఉన్నాయి. దీంతో ఆల్‌ ఇంగ్లండ్‌ వైఫల్యంపై నా బృందంతో కలిసి విశ్లేషించుకొని ముందంజ వేస్తాను. ఇదొక్కటే సరిపోదని కూడా తెలుసు. ఎందుకంటేప్రతిష్టాత్మక టోర్నీలకు ముందు మరింత లోతైన విశ్లేషణ–పర్యవేక్షణ కూడా అవసరం కోర్టులో నా ఆటతీరు పదును పెట్టేందుకు... దీంతోపాటే ఈ సీజన్‌ మొత్తం ఫిట్‌గా ఉండేందుకు శ్రమిస్తాను. అంతర్జాతీయ సర్క్యూట్‌ ఒత్తిళ్లను తట్టుకునేలా మెంటల్‌ కండిషనింగ్‌ సెషన్‌ కూడా అవసరమవుతుంది. ఇందుకోసం మోన్‌ బ్రాక్‌మన్‌ నాకు తోడుగా ఉన్నాడు. అతనికి నా థ్యాంక్స్‌. అంచనాలు పెట్టుకోను నేను అంచనాలు లేకుండా ఆడేందుకే ఇష్టపడతాను. కానీ ఈసారి నేను తరువాతి దశలకు, క్వార్టర్‌ ఫైనల్స్‌ మరియు సెమీఫైనల్స్‌కు చేరుకున్నప్పుడు, ఈ ఒత్తిడిని జయించేందుకు ప్రత్యేకంగా దృష్టి పెడతాను. నా కోచింగ్‌ బృందం ప్రోత్సాహం, వెన్ను తట్టే నాన్న అండదండలు నన్ను ఎప్పటికప్పుడు బాగా సిద్ధం చేస్తున్నాయి. కొన్నాళ్లుగా ఫామ్‌ బాగుంది. శారీరకంగా మెరుగైన స్థితిలో ఉన్నాను. నైపుణ్యం పరంగా ఇంకా మెరుగవ్వాలి.

Aman Sehrawat and Antim Panghal in selection trials for Asian Championship6
ట్రయల్స్‌కు అంతిమ్, అమన్‌

న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్లు అమన్‌ సెహ్రావత్, అంతిమ్‌ పంఘాల్‌ ఆసియా చాంపియన్‌షిప్‌ కోసం నిర్వహించనున్న సెలక్షన్‌ ట్రయల్స్‌లో పోటీపడనున్నారు. అయితే పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితులతో భారత బృందం అల్బేనియాలోనే చిక్కుకుపోవడంతో ట్రయల్స్‌ను వాయిదా వేశారు. ముందనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 9, 10 తేదీల్లో ట్రయల్స్‌ జరగాల్సి ఉండగా... ఇప్పుడు దీన్ని మార్చి 17కు వాయిదా వేసినట్లు రెజ్లింగ్‌ సమాఖ్య వర్గాలు వెల్లడించాయి. పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత అమన్‌ పురుషుల 57 కేజీల కేటగిరీలో, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు కాంస్య పతకాలు నెగ్గిన అంతిమ్‌ పంఘాల్‌ మహిళల 53 కేజీల కేటగిరీలో పోటీపడతారు. నిజానికి అమన్‌ 61 కేజీల విభాగంలో, అంతిమ్‌ 55 కేజీల విభాగంలో పోటీపడేందుకు నమోదు చేసుకున్నారు. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ దాడులతో విమాన సర్వీసుల రద్దు, గల్ఫ్‌ గగన తలం మూసివేత కారణంగా అల్బేనియాలో రెండో ర్యాంకింగ్‌ సిరీస్‌లో పోటీపడేందుకు వెళ్లిన భారత జట్టు అక్కడే చిక్కుకుంది. జట్టు సభ్యుల రాక ఆలస్యం కావడంతో సెలక్షన్‌ ట్రయల్స్‌ను వారం రోజుల పాటు వాయిదా వేశారు. ఈ నెల 17న న్యూఢిల్లీ, లక్నోల్లో ట్రయల్స్‌ నిర్వహిస్తారు.

Ravindra Jadeja Gets A Rehman Dakait Welcome In Rajasthan Royals For IPL 20267
'రెహ్మాన్‌ దకైత్‌' స్టయిల్‌లో ఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా

ఐపీఎల్‌ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ తమ కొత్త ఆటగాడు రవీంద్ర జడేజాకు ప్రత్యేక స్వాగతం పలి​కింది. ఇటీవల సంచలనం సృష్టించిన బాలీవుడ్ చిత్రం 'ధురంధర్‌'లో అక్షయ్ ఖన్నా పోషించిన ‘రెహ్మాన్ దకైత్’ పాత్రను పోలి ఉండేలా ఓ స్పెషల్‌ వీడియోను రూపొందించి సోషల్‌మీడియాలో రిలీజ్‌ చేసింది. 𝐊𝐡𝐚𝐦𝐦𝐚 𝐆𝐡𝐚𝐧𝐢, 𝐑𝐚𝐣𝐚𝐬𝐭𝐡𝐚𝐧 🔥⚔️Ravindrasinh Jadeja has arrived for IPL 2026 💗 pic.twitter.com/fVUVl5zTjZ— Rajasthan Royals (@rajasthanroyals) March 10, 202684 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో జడేజా సంప్రదాయ రాజస్థానీ వేషధారణలో కనిపించాడు. 'ఖమ్మా ఘనీ, రాజస్థాన్' అంటూ అభిమానులను పలకరించాడు. ఇది ధురంధర్‌ సినిమాలో రెహ్మాన్ దకైత్ 'అస్సలాం వాలేకుం, లియారీ' అన్న సన్నివేశాన్ని గుర్తు చేసింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌మీడియాలో వైరలవుతుంది.జడేజాను 2026 ఐపీఎల్‌ వేలానికి ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 14 కోట్లకు సీఎస్‌కే నుంచి ట్రేడ్‌ చేసుకుంది. ఈ మూవ్‌ జడేజాకు హోం కమింగ్‌ లాంటిది. జడ్డూ తన ఐపీఎల్‌ కెరీర్‌ను 2008లో రాజస్థాన్‌ రాయల్స్‌తోనే ప్రారంభించాడు. ఆతర్వాత సీఎస్‌కేతో 12 సీజన్లు, గుజరాత్ లయన్స్‌తో 2 సీజన్లు ఆడి తిరిగి రాయల్స్‌ గూటికే చేరాడు. 2008లో షేన్ వార్న్ నేతృత్వంలో రాయల్స్‌ తొలి ఐపీఎల్‌ టైటిల్ గెలిచినప్పుడు జడేజా కీలక సభ్యుడు. రెండు సీజన్ల పాటు రాయల్స్‌కు ప్రాతినిథ్యం​ వహించిన జడ్డూ.. 22 ఇన్నింగ్స్‌ల్లో 430 పరుగులు చేసి, 6 వికెట్లు తీశాడు. ప్రస్తుత రాయల్స్‌ జట్టు జడేజా చేరికతో మరింత బలపడింది. సంజూ శాంసన్‌ రాయల్స్‌ను వీడటంతో ఈ సీజన్‌తో రియాన్‌ పరాగ్‌ ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. జడేజాతో పాటు ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ కూడా సీఎస్‌కే నుంచి రాయల్స్‌కు ట్రేడ్‌ అయ్యాడు. మరో ఆల్‌రౌండర్‌ డొనొవన్‌ ఫెరియెరా ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి రాయల్స్‌లోకి వచ్చాడు.అప్పటికే యశస్వి జైస్వాల్‌, వైభవ్‌ సూర్యవంశీ, షిమ్రోన్‌ హెట్‌మైర్‌, లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌, ధృవ్‌ జురెల్‌, రియాన్‌ పరాగ్‌ లాంటి విధ్వంసకర వీరులతో రాయల్స్‌ బ్యాటింగ్‌ విభాగం కలకలలాడుతుండింది. జోఫ్రా ఆర్చర్‌, నండ్రే బర్గర్‌, రవి బిష్ణోయ్‌, సందీప్‌ శర్మ, క్వేనా మఫాకా లాంటి బౌలర్లతో సమతూకంగా ఉంది.

Hemang Badani named Southern Brave head coach8
ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌కు మరో కీలక పదవి

ఢిల్లీ క్యాపిటల్స్‌ (ఐపీఎల్‌ ఫ్రాంచైజీ) హెడ్‌ కోచ్‌ హేమంగ్‌ బదానీకి మరో కీలక పదవి దక్కింది. హండ్రెడ్‌ లీగ్‌లోని సదరన్‌ బ్రేవ్‌ పురుషుల ఫ్రాంచైజీ కూడా అతన్నే హెడ్‌ కోచ్‌గా నియమించింది. ఈ రెండు ఫ్రాంచైజీలకు GMR గ్రూప్ సహ యజమానిగా ఉంది. బ్రేవ్‌ యాజమాన్యం బదానీకి డిప్యూటీగా (అసిస్టెంట్‌ కోచ్‌) ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు ఇయాన్‌ బెల్‌ను ఎంపిక చేసింది.GMR గ్రూప్‌కు ఐపీఎల్‌ హండ్రెడ్‌ లీగ్‌తో పాటు మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (Seattle Orcas), ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో (Dubai Capitals) కూడా ఫ్రాంచైజీలు ఉన్నాయి.సదరన్‌ బ్రేవ్ గత ప్రదర్శనలుసదరన్‌ బ్రేవ్‌ ఫ్రాంచైజీ హండ్రెడ్‌ లీగ్‌ తొలి ఎడిషన్‌లో విజేతగా నిలిచింది. ఆతర్వాత 2024 ఎడిషన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత ఎడిషన్‌లో మాత్రం సగం మ్యాచ్‌లు ఓడి, నాకౌట్స్‌కు కూడా చేరలేకపోయింది.కాగా, హండ్రెడ్‌ లీగ్‌ 2026 ఎడిషన్‌ జులై 21 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఎంఐ లండన్‌, సన్‌రైజర్స్‌ లీడ్స్‌ పోటీపడనున్నాయి. జులై 22న జరిగే మ్యాచ్‌లో సదరన్‌ బ్రేవ్‌ వెల్ష్‌ ఫైర్‌తో తలపడుతుంది.తొలిసారి వేలంహండ్రెడ్‌ లీగ్‌లో తొలిసారి వేలం ద్వారా ఆటగాళ్ల ఎంపిక జరుగనుంది. ఈ వేలం మార్చి 11, 12 తేదీల్లో జరుగనుంది. 18 దేశాలకు చెందిన 400 మంది ఆటగాళ్లు వేలానికి షార్ట్‌ లిస్ట్‌ అయ్యారు. ఈ వేలంలో మొత్తం 8 ఫ్రాంచైజీలు పోటీపడతాయి.

Comparing BCCI Cash Bonus For 2007 VS 2026 T20 World Cup Winners9
ఊహకందని విధంగా పెరిగిన బీసీసీఐ నజరానా

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రపంచకప్ విజేతకు నగదు బహుమతి ప్రకటించే సంప్రదాయాన్ని కొనసాగించింది. తాజాగా 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుకు రూ. 131 కోట్లు రివార్డుగా ప్రకటించింది. ఈ మొత్తం 2007 పొట్టి ప్రపంచకప్‌ విజేత అయిన నాటి టీమిండియాతో పోలిస్తే ఏకంగా 1091.67 శాతం ఎక్కువ.2007 పొట్టి ప్రపంచకప్‌ గెలిచినప్పుడు ధోని నేతృత్వంలోని భారత జట్టుకు బీసీసీఐ రూ. 12 కోట్ల నగదు నజరానాను ప్రకటించింది. ప్రత్యేక బహుమతిగా ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్‌కు రూ. 1 కోటి అందించింది. అలాగే సపోర్ట్ స్టాఫ్‌లో ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు ఇచ్చింది.అదే 2026 ప్రపంచకప్‌కు వచ్చేసరికి.. సూర్యకుమార్‌ సారథ్యంలోని భారత జట్టుకు రూ. 131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 19 ఏళ్లలో బహుమతి మొత్తం 13 రెట్లు పెరిగింది.ఈ మధ్యలో 2024 పొట్టి ప్రపంచకప్‌ గెలిచిన రోహిత్‌ శర్మ సేనకు బీసీసీఐ రూ. 125 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. 2007తో పోలిస్తే ఈ మొత్తం రూ. 113 కోట్లు ఎక్కువ.భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ గెలిచిన సందర్భాల్లో బీసీసీఐ ప్రకటించిన నగదు బహుమతి..- 2007లో రూ. 12 కోట్లు- 2024లో రూ. 125 కోట్లు- 2026లో రూ. 131 కోట్లుఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన 2026 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌ను (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.

Pakistan Born Player Claims He Coached Jasprit Bumrah, Drops Huge Bombshell10
బుమ్రాపై పాక్‌ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు

టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్‌లో జన్మించి, యూఏఈ తరఫున ఆడిన జహూర్ ఖాన్ అనే పేస్‌ బౌలర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాకు తానే కోచింగ్‌ ఇచ్చానంటూ గొప్పలకు పోయాడు. స్లో డెలివరీ వేరియేషన్‌ను బుమ్రా తన వద్దనే నేర్చుకున్నాడని అన్నాడు.జహూర్‌ మాటల్లో.. 2019లో నేను ఓ టీ10 లీగ్‌లో లెండిల్ సిమ్మన్స్‌కు ఐదు స్లో డెలివరీలతో మెయిడిన్ ఓవర్ వేసాను. ఆ వీడియో చూసిన బుమ్రా.. ఇవి ఎలా వేసావు.. హ్యాండ్ గ్రిప్ ఎలా ఉంటుందని నన్ను అడిగాడు. ఆతర్వాత ముంబై ఇండియన్స్ కోచింగ్‌ క్యాంప్‌లో నేను ఆయనకు అలాంటి బంతులే వేసి చూపించాను. జహూర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. జహూర్‌కు అంత సీన్‌ లేదని భారత క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. బుమ్రా నిరంతర అభ్యాసంతో ప్రపంచంలో అత్యుత్తమ పేసర్‌గా ఎదిగాడని కితాబునిస్తున్నారు.వాస్తవానికి స్లో బాల్‌‌ అనేది బుమ్రా అమ్ములపోదిలో ఓ అస్త్రం. స్లో బంతులను అతను అద్భుతంగా ఎగ్జిక్యూట్‌ చేస్తాడు. చాలా సందర్భాల్లో ఇలాంటి బంతులతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించాడు. ఈ స్లో బాల్స్‌ను కూడా బుమ్రా అందరికీ భిన్నంగా వేస్తాడు. మణికట్టు సాయంతో సంధిస్తాడు. బ్యాటర్లు వీటిని పసిగట్టడం కష్టమవుతుంది. తాజాగా జరిగిన ప్రపంచకప్‌లోనూ బుమ్రా ఇలాంటి బంతులను చాలాసార్లు ప్రయోగించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో జేకబ్‌ బేతెల్‌ జోరు మీద ఉన్నప్పుడు వీటితోనే అతని ఆట కట్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లోనూ యార్కర్లతో పాటు ఈ స్లో డెలివరీలను ప్రయోగించాడు. ఫైనల్లో బుమ్రా అద్వితీయ ప్రదర్శన (4 వికెట్లు) కారణంగా భారత్‌ వరుసగా రెండో పొట్టి ప్రపంచకప్‌ సాధించింది. ఈ ప్రపంచకప్‌లో బుమ్రా 8 మ్యాచ్‌ల్లో 12.43 సగటున, 6.21 ఎకానమీతో 14 వికెట్లు తీసి భారత్‌ తరఫున లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement