Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Afridi Babar named in Pakistan T20I squad for Australia series1
పాక్‌ టి20 జట్టులో షాహిన్, బాబర్‌

కరాచీ: పాకిస్తాన్‌ సొంతగడ్డపై ఆ్రస్టేలియాతో జరిగే టి20 సిరీస్‌ కోసం షాహిన్‌ అఫ్రిదిని ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకోవడంతో అతనికి ఎప్పట్లాగే రెగ్యులర్‌ జట్టులో చోటు ఇచ్చారు. ఈ ఒక్క మార్పు మినహా ఇటీవల శ్రీలంకతో ఆడిన పాకిస్తాన్‌ జట్టే... త్వరలో ఆస్ట్రేలియాతోనూ మూడు టి20ల ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడుతుంది. ఆ్రస్టేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌ జట్టుకు ఆడిన బాబర్‌ ఆజమ్‌ కూడా పాక్‌ జట్టులోకి వచ్చాడు. భారత్, శ్రీలంకలో జరగబోయే మెగా ఈవెంట్‌కు ముందు పాక్, ఆసీస్‌లకు ఇది చివరి సన్నాహక టోర్నీ! 3 మ్యాచ్‌లకు లాహోర్‌లోని గడాఫీ స్టేడియమే ఆతిథ్యమిస్తుంది. ఈ నెల 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి. ఈ టోర్నీ కోసం ఆస్ట్రేలియా ఈ నెల 28న పాకిస్తాన్‌కు చేరుకుంటుంది. పాకిస్తాన్‌ జట్టు: సల్మాన్‌ అలీ ఆఘా (కెపె్టన్‌), అబ్రార్‌ అహ్మద్, బాబర్‌ ఆజమ్, ఫహీమ్, ఫఖర్‌ జమాన్, ఖ్వాజా మొహమ్మద్, మొహమ్మద్‌ నవాజ్, సల్మాన్‌ మీర్జా, మొహమ్మద్‌ వసీమ్, నసీమ్‌ షా, సాహిబ్‌జాదా ఫర్హాన్, సయీమ్‌ అయూబ్, షాహిన్‌ షా అఫ్రిది, షాదాబ్‌ ఖాన్, ఉస్మాన్‌ ఖాన్, ఉస్మాన్‌ తారిఖ్‌.

Suryakumar Yadav reveals how Ishan Kishan tested his patience in 2nd T20I vs NZ2
ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్‌

రాయ్‌పూర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టీ20లో టీమిండియా అద‌ర‌గొట్టింది. బౌలింగ్‌లో విఫ‌ల‌మైన‌ప్ప‌టికి బ్యాటింగ్‌లో మాత్రం దుమ్ములేపింది. కివీస్ నిర్ధేశించిన 209 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని భార‌త్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 15.2 ఓవ‌ర్ల‌లో చేధించింది.త‌ద్వారా న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. త‌న రీఎంట్రీ మ్యాచ్‌లో విఫ‌ల‌మైన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్‌.. రాయ్‌పూర్‌లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. తొలి ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కిషాన్ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఏకంగా 76 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌(37 బంతుల్లో 82 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన కిషన్‌పై సూర్య‌కుమార్ ప్రశంస‌ల వ‌ర్షం కురిపించాడు. పవర్‌ప్లేలో అతడు ఆడిన తీరు అద్భుతమని సూర్య‌కొనియాడాడు. "ఇషాన్ లంచ్‌లో ఏం తిన్నాడో, మ్యాచ్‌కు ముందు ఏ 'ప్రీ-వర్కౌట్' డ్రింక్ తీసుకున్నాడో నాకు తెలియదు. కానీ అత‌డి బ్యాటింగ్ చేసిన తీరు మాత్రం అద్భుతం. కేవలం 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన స్థితిలో ఇలాంటి విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌ను నేను ఎప్పుడూ చూడ‌లేదు. ప‌వ‌ర్‌ప్లేలో తొలి రెండు ఓవ‌ర్ల‌లో మాకు కేవ‌లం 8 ప‌రుగుల‌కే వ‌చ్చాయి. అటువంటిది ప‌వ‌ర్‌ప్లేను 75 ప‌రుగుల‌తో ముగించ‌డం నిజంగా గ్రేట్‌. ఆ క్రెడిట్ మొత్తం కిష‌న్‌కే ద‌క్కాలి. 200 పైగా ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించేట‌ప్పుడు బ్యాట‌ర్ల నుంచి ఇటువంటి ఇన్నింగ్స్‌లే మేము ఆశిస్తాము. ప్ర‌తీ ఒక్కరూ పూర్తి స్వేచ్చ‌గా ఆడుతూ తమను తాము నిరూపించుకోవాలి. ఈ మ్యాచ్‌లో ఇషాన్ స‌రిగ్గా అదే చేశాడు.ప‌వ‌ర్‌ప్లేలో ఇషాన్ స్ట్రైక్ అస్సలు నాకు ఇవ్వలేదు, అందుకు కోపంగా ఉన్నాను(న‌వ్వుతూ). అయితే కిషాన్ దూకుడుగా ఆడ‌డంతో క్రీజులో కుదురుకోవడానికి నాకు స‌మ‌యం దొరికింది. చాలా రోజుల త‌ర్వాత హాఫ్ సెంచ‌రీ చేయ‌డం సంతోషంగా ఉంది. గ‌త మూడు వారాల నుంచి నెట్స్‌లో ఎక్కువ‌గా గ‌డిపాను. వాటి ఫ‌లితం ఈ మ్యాచ్‌లో స్ప‌ష్టంగా క‌న్పించింది.ఒకానొక దశలో న్యూజిలాండ్ 230 ప‌రుగులు చేసేలా క‌నిపించింది. కానీ కుల్దీప్ యాద‌వ్‌, వ‌రుణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్ర‌త్య‌ర్ధిని క‌ట్ట‌డి చేశారు. దూబే కూడా కీల‌క ఓవ‌ర్ బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. రాబోయో మ్యాచ్‌లలో ఇదే బ్రాండ్ ఆఫ్ కొనసాగిస్తాము" అని సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు.

India beat Kiwis by 7 wickets in second T203
సూర్య, ఇషాన్‌ విధ్వంసం

టి20ల్లో భారత్‌ ఆధిపత్య ప్రదర్శన కొనసాగుతోంది. సిరీస్‌ తొలి పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా మరో ఏకపక్ష గెలుపును అందుకొని 2–0తో పైచేయి సాధించింది. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన వేళ 209 పరుగుల లక్ష్యం పెద్దదిగా అనిపించినా... భారత్‌ అలవోకగా 28 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. ఓపెనర్లు విఫలమైన చోట ఈసారి నేనున్నానంటూ ఇషాన్‌ కిషన్‌ మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, ఎట్టకేలకు తన స్థాయిని చూపిస్తూ కెపె్టన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 23 ఇన్నింగ్స్‌ల తర్వాత ఈ ఫార్మాట్‌లో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో బౌండరీల (21 ఫోర్లు, 12 సిక్స్‌లు) ద్వారానే 156 పరుగులు వచ్చాయి. రాయ్‌పూర్‌: భారత జట్టు దూకుడైన బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌పై వరుసగా రెండో మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన రెండో టి20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో కివీస్‌పై గెలుపొందింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. మిచెల్‌ సాంట్నర్‌ (27 బంతుల్లో 47 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), రచిన్‌ రవీంద్ర (26 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం భారత్‌ 15.2 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 82 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 76; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 49 బంతుల్లోనే 122 పరుగులు జోడించారు. ఆ తర్వాత సూర్య, శివమ్‌ దూబే (18 బంతుల్లో 36 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు 37 బంతుల్లో అభేద్యంగా 81 పరుగులు జత చేసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. గాయం కారణంగా అక్షర్‌ పటేల్‌ ఆడలేదు. వీరిద్దరి స్థానాల్లో హర్షిత్, కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 ఆదివారం గువాహటిలో జరుగుతుంది. హాఫ్‌ సెంచరీ లేకుండానే... న్యూజిలాండ్‌ జట్టు బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించిన 7 ఓవర్లలో కలిపి 120 పరుగులు రాగా... భారత బౌలర్లు కట్టడి చేసిన మిగతా 13 ఓవర్లలో 88 పరుగులే లభించాయి. ఓపెనర్లు కాన్వే (9 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్‌), సీఫెర్ట్‌ (13 బంతుల్లో 24; 5 ఫోర్లు) కలిసి 20 బంతుల్లోనే 43 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లోనే కాన్వే 3 ఫోర్లు, 1 సిక్స్‌ బాది 18 పరుగులు రాబట్టగా, అర్ష్ దీప్ తర్వాతి ఓవర్లో సీఫెర్ట్‌ వరుసగా 4 ఫోర్లు కొట్టాడు. అయితే ఓపెనర్లిద్దరూ ఒకే స్కోరు వద్ద వెనుదిరిగారు. హర్షిత్‌ తన తొలి ఓవర్‌ను ‘మెయిడిన్‌’గా వేసినా... అతని తర్వాతి ఓవర్లో రచిన్‌ 2 భారీ సిక్స్‌లు, ఒక ఫోర్‌ బాదాడు. వరుణ్‌ ఓవర్లోనూ రెండు సిక్స్‌లతో రచిన్‌ జోరు కొనసాగించగా... కుల్దీప్‌ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు కొట్టిన గ్లెన్‌ ఫిలిప్స్‌ (19) అదే ఓవర్లో అవుటయ్యాడు. ఆ తర్వాత నాలుగు పరుగుల వ్యవధిలో మిచెల్‌ (18), రచిన్‌ పెవిలియన్‌ చేరడంతో కివీస్‌ స్కోరు వేగం మందగించింది. చాప్‌మన్‌ (10) కూడా విఫలమైనా, చివర్లో సాంట్నర్, ఫోక్స్‌ (15 నాటౌట్‌) ధాటిగా ఆడటంతో స్కోరు 200 దాటింది. చివరి 3 ఓవర్లలో వీరిద్దరు కలిసి 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో మొత్తం 47 పరుగులు రాబట్టారు. కివీస్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. అభిషేక్‌ శర్మ ‘డకౌట్‌’ ఇన్నింగ్స్‌ రెండో బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నా దానిని ఉపయోగించుకోలేక సామ్సన్‌ (6) తొలి ఓవర్లోనే నిష్క్రమించాడు. తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన అభిషేక్‌ శర్మ (0) ఈసారి మొదటి బంతికే అవుటయ్యాడు. అయితే ఇషాన్‌ మెరుపు బ్యాటింగ్‌తో లక్ష్య ఛేదన సులువుగా మారిపోయింది. ఫోక్స్‌ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిన ఇషాన్‌... సాంట్నర్‌ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత హెన్రీ ఓవర్లోనూ వరుసగా 6, 4, 4 బాది 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్‌ చేసిన తొలి 100 పరుగుల్లో 76 అతని బ్యాట్‌ నుంచే వచ్చాయి. ఇషాన్‌ వెనుదిరిగిన తర్వాత సూర్య బాధ్యత తీసుకున్నాడు. భారత కెపె్టన్‌ చాలా కాలం తర్వాత అంచనాలకు తగిన ఆటను ప్రదర్శించాడు. ఫోక్స్‌ ఓవర్లో అతను వరుసగా 4, (వైడ్‌), 4, 4, 4, 6 బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్న సూర్య ఆ తర్వాత అదే ధాటిని చివరి వరకు కొనసాగించాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (సి) పాండ్యా (బి) హర్షిత్‌ 19; సీఫెర్ట్‌ (సి) ఇషాన్‌ (బి) వరుణ్‌ 24; రచిన్‌ (సి) అర్ష్ దీప్ (బి) కుల్దీప్‌ 44; ఫిలిప్స్‌ (సి) పాండ్యా (బి) కుల్దీప్‌ 19; మిచెల్‌ (సి) పాండ్యా (బి) దూబే 18; చాప్‌మన్‌ (సి) అభిషేక్‌ (బి) పాండ్యా 10; సాంట్నర్‌ (నాటౌట్‌) 47; ఫోక్స్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–43, 2–43, 3–98, 4–125, 5–129, 6–161. బౌలింగ్‌: అర్ష్ దీప్ 4–0–53–0, పాండ్యా 3–0–25–1, హర్షిత్‌ 3–1–35–1, వరుణ్‌ 4–0–35–1, కుల్దీప్‌ 4–0–35–2, అభిషేక్‌ 1–0–12–0, దూబే 1–0–7–1. భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) రచిన్‌ (బి) హెన్రీ 6; అభిషేక్‌ (సి) కాన్వే (బి) డఫీ 0; ఇషాన్‌ కిషన్‌ (సి) హెన్రీ (బి) సోధి 76; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 82; శివమ్‌ దూబే (నాటౌట్‌) 36; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.2 ఓవర్లలో 3 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–6, 2–6, 3–128. బౌలింగ్‌: హెన్రీ 3–0–41–1, డఫీ 4–0–38–1, ఫోక్స్‌ 3–0–67–0, సాంట్నర్‌ 2–0–27–0, సోధి 3–0–34–1, మిచెల్‌ 0.2–0–2–0.

Kalinga Lancers in the Mens Hockey India League final4
ఫైనల్లో కళింగ లాన్సర్స్‌

భువనేశ్వర్‌: పురుషుల హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో వేదాంత కళింగ లాన్సర్స్‌ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కళింగ లాన్సర్స్‌ జట్టు 2–1 గోల్స్‌తో రాంచీ రాయల్స్‌పై గెలుపొందడంతో నేరుగా టైటిల్‌ పోరుకు అర్హత సంపాదించింది. కళింగ తరఫున అలెగ్జాండర్‌ హెండ్రిక్స్‌ (12వ, 32వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ సాధించగా, రాంచీ రాయల్స్‌ జట్టులో మన్‌దీప్‌ సింగ్‌ 40వ నిమిషంలో గోల్‌ చేశాడు. రాంచీకి ఫైనల్‌ చేరే అర్హత రెండో క్వాలిఫయర్‌ రూపంలో ఇంకా సజీవంగానే ఉంది. ఆదివారం ఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా రాంచీతో హైదరాబాద్‌ తుఫాన్స్‌ తలపడుతుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుతో ఆదివారం జరిగే ఫైనల్లో కళింగ లాన్సర్స్‌ అమీతుమీ తేల్చుకుంటుంది. మరోవైపు గత ఏడాది రన్నరప్‌ హైదరాబాద్‌ తుఫాన్స్‌ జట్టు రెండో క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ పోరులో హైదరాబాద్‌ జట్టు 2–0తో హెచ్‌ఐఎల్‌ జీసీ జట్టుపై విజయం సాధించింది. తుఫాన్స్‌ స్ట్రయికర్‌ శిలానంద్‌ లాక్రా అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టాడు. అతను 16వ, 39వ నిమిషాల్లో రెండు గోల్స్‌ సాధించాడు. హైదరాబాద్‌ గోల్‌కీపర్‌ జీన్‌ పాల్‌ డానెబర్గ్‌ ప్రత్యర్థి గోల్స్‌ చేయకుండా అడ్డుగోడ కట్టేశాడు.

Sabalenka advances to pre quarterfinals at Australian Open5
శ్రమించిన సబలెంకా

మెల్‌బోర్న్‌: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో బెలారస్‌ టెన్నిస్‌ స్టార్, ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా తొలిసారి కఠిన పరీక్ష ఎదుర్కొంది. తొలి రెండు రౌండ్‌లలో అలవోకగా నెగ్గిన ఈ మాజీ చాంపియన్‌కు మూడో రౌండ్‌లో మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ప్రపంచ 55వ ర్యాంకర్‌ అనస్తాసియా పొటపోవా (ఆ్రస్టియా)తో జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ సబలెంకా 7–6 (7/4), 7–6 (9/7)తో గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా రెండు సెట్‌లను టైబ్రేక్‌లో సొంతం చేసుకోవడం గమనార్హం. మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసిన గత ఏడాది రన్నరప్‌... 34 విన్నర్స్‌ కొట్టి 44 అనవసర తప్పిదాలు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను కూడా నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. క్వార్టర్‌ ఫైనల్లో చోటు కోసం 17వ సీడ్‌ విక్టోరియా ఎంబోకో (కెనడా)తో సబలెంకా తలపడుతుంది. మూడో రౌండ్‌లో ఎంబోకో 7–6 (7/5), 5–7, 6–3తో 14వ సీడ్‌ క్లారా టౌసన్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించింది. 2023, 2024లలో ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన సబలెంకా గత ఏడాది ఫైనల్లో మాడిసన్‌ కీస్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు మూడో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా), ఎనిమిదో సీడ్‌ మిరా ఆంద్రీవా (రష్యా), 12వ సీడ్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో కోకో గాఫ్‌ 3–6, 6–0, 6–3తో హైలీ బాప్టిస్ట్‌ (అమెరికా)పై, ఆంద్రీవా 6–3, 6–4తో ఎలీనా రూస్‌ (రొమేనియా)పై, స్వితోలినా 7–6 (7/4), 6–3తో డయానా ష్నయిడర్‌ (రష్యా)పై గెలుపొందారు. ఏడో సీడ్‌ జాస్మిన్‌ పావోలిని (ఇటలీ) మాత్రం మూడో రౌండ్‌ అడ్డంకిని దాటలేకపోయింది. మూడో రౌండ్‌లో పావోలిని 2–6, 6–7 (3/7)తో ఇవా జోవిచ్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. ఏడోసారి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో ఆడిన పావోలిని నాలుగుసార్లు తొలి రౌండ్‌లో, రెండుసార్లు మూడో రౌండ్‌లో, ఒకసారి నాలుగో రౌండ్‌లో నిష్క్రమించింది. అల్‌కరాజ్‌ జోరు... పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ అల్‌కరాజ్‌ మరో అలవోక విజయంతో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో అల్‌కరాజ్‌ 6–2, 6–4, 6–1తో కొరెన్‌టిన్‌ ముటెట్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచాడు. 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్‌ స్టార్‌ 30 విన్నర్స్‌ కొట్టి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్‌ చేశాడు. ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను రెండుసార్లు చొప్పున సాధించిన 22 ఏళ్ల అల్‌కరాజ్‌కు ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ మాత్రం కలిసిరావడం లేదు. ఐదోసారి ఈ టోర్నీలో ఆడుతున్న ఈ స్పెయిన్‌ స్టార్‌ గత రెండేళ్లలో క్వార్టర్‌ ఫైనల్లోనే వెనుదిరిగాడు. ఈసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అల్‌కరాజ్‌ విజేతగా నిలిస్తే... ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ ఘనత సాధించిన అతిపిన్న వయసు్కడిగా చరిత్ర సృష్టిస్తాడు. మరోవైపు మూడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఆరో సీడ్‌ అలెక్స్‌ డిమినార్‌ (ఆస్ట్రేలియా), 10వ సీడ్‌ అలెగ్జాండర్‌ బుబ్లిక్‌ (కజకిస్తాన్‌), 11వ సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో జ్వెరెవ్‌ 7–5, 4–6, 6–3, 6–1తో కామెరాన్‌ నోరి (బ్రిటన్‌)పై, డిమినార్‌ 6–3, 6–4, 7–5తో ఫ్రాన్సెస్‌ టియాఫో (అమెరికా)పై, బుబ్లిక్‌ 7–6 (7/4), 7–6 (7/5), 6–4తో టొమాస్‌ ఎచ్‌వెరీ (అర్జెంటీనా)పై, మెద్వెదెవ్‌ 6–7 (5/7), 4–6, 7–5, 6–0, 6–3తో ఫాబియన్‌ మరోజ్‌సన్‌ (హంగేరి)పై గెలిచారు. 13వ సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) 3–6, 6–7 (4/7), 3–6తో ఫ్రాన్సిస్కో సెరున్‌డోలో (అర్జెంటీనా) చేతిలో ఓడిపోయాడు.

Saurashtra beat Punjab by 194 run6
పార్థ్, ధర్మేంద్ర మాయాజాలం

రాజ్‌కోట్‌: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో పంజాబ్‌ జట్టుపై సౌరాష్ట్ర విజయం సాధించింది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా రెండు రోజుల్లోనే ముగిసిన పోరులో సౌరాష్ట్ర 194 పరుగుల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. పంజాబ్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలం కావడం ఫలితంపై ప్రభావం చూపింది. ఓవర్‌నైట్‌ స్కోరు 24/3తో శుక్రవారం రెండో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌరాష్ట్ర... చివరకు 58.5 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. ప్రేరక్‌ మన్కడ్‌ (41 బంతుల్లో 56; 10 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా (44 బంతుల్లో 46; 4 ఫోర్లు), హేత్విక్‌ కొటక్‌ (39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), పార్థ్‌ భట్‌ (37 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కీలక పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ 5 వికెట్లు పడగొట్టగా... జస్సిందర్‌ సింగ్‌ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలుపుకొని ప్రత్యర్థి ముందు 320 పరుగుల లక్ష్యం నిలవగా... పంజాబ్‌ మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చింది. భారీ ఆశలు పెట్టుకున్న శుబ్‌మన్‌ గిల్‌ (32 బంతుల్లో 14; 1 ఫోర్‌) విఫలమవడంతో పంజాబ్‌ చివరకు 39 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఉదయ్‌ శరణ్‌ (71 బంతుల్లో 31; 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... తక్కినవాళ్లంతా చేతులెత్తేశారు. సౌరాష్ట్ర బౌలర్లలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ పార్థ్‌ భట్, ధర్మేంద్ర జడేజా చెరో 5 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో గిల్‌ సహా ఐదు వికెట్లు తీసిన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పార్థ్‌ భట్‌... రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు వేసి కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీయం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లోనూ గిల్‌ను పార్థ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంతకుముందు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేయగా... పంజాబ్‌ 139 పరుగులు చేసింది. ఈ విజయంతో సౌరాష్ట్ర పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరి నాకౌట్‌ అవకాశాలను మెరుగు పరుచుకోగా... పంజాబ్‌ మూడో ఓటమితో క్వార్టర్స్‌ రేసుకు దూరమైంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరుగుతున్న మరో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 323 పరుగులకు ఆలౌట్‌ కాగా... కర్ణాటక 58 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. మహారాష్ట్రతో మ్యాచ్‌లో గోవా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌట్‌ కాగా... మహారాష్ట్ర 91 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. కేరళతో మ్యాచ్‌లో చండీగఢ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేయగా... కేరళ రెండో ఇన్నింగ్స్‌లో 5.5 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది.

Sindhu was defeated in the quarter finals7
క్వార్టర్‌ ఫైనల్లో సింధు ఓటమి

జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్స్‌ పీవీ సింధు, లక్ష్య సేన్‌ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సింధు 13–21, 17–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ చెన్‌ యు ఫె (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 18–21, 20–22తో ప్రపంచ 44వ ర్యాంకర్‌ పానిత్‌చపోన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన సింధు, లక్ష్య సేన్‌లకు మూడు వేల డాలర్ల (రూ. 2 లక్షల 75 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ, 5,040 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Suryakumar Yadav, Ishan Kishan make short work of Kiwis in record chase8
ఇషాన్‌, సూర్య విధ్వంసం.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్‌

రాయ్‌పూర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో ఊదిపడేసింది. లక్ష్య చేధనలో 7 పరుగులకే ఓపెనర్లు సంజూ శాంసన్‌, అభిషేక్ శర్మ వికెట్లను భారత్ కోల్పోయింది.అయితే ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. భారీ షాట్లతో ప్రత్యర్ధి బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. కేవ‌లం కిషన్‌ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు చేశాడు. కిషన్‌ ఔటయ్యాక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలుత ఆచితూచి ఆడిన సూర్య.. క్రీజులో సెటిల్ అయ్యాక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. టీ20ల్లో ఏడాది త‌ర్వాత త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను సూర్య అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా 37 బంతులు ఎదుర్కొన్న స్కై.. 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్‌ దూబే (18 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లతో 36 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఇష్ సోధీ, డఫీ తలా వికెట్ సాధించారు. టీ20ల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు ఇదే అత్యధిక విజయవంతమైన రన్‌ చేజ్‌ కావడం విశేషం.Let me tell to today's Generation, Ishan Kishan was our Abhishek Sharma before Abhishek Sharma existed. pic.twitter.com/wtwZ7D4bVu— Selfless⁴⁵ (@SelflessCricket) January 23, 2026కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో రచిన్‌ రవీంద్ర (44), కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (47 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెం‍డు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది.

New zealand set 209 runs target for team india in second T20I9
IND VS NZ 2nd T20I: న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌

రాయ్‌పూర్‌లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.న్యూజిలాండ్‌ ఈ స్కోర్‌ చేసేందుకు ప్రతి ఒక్కరి దోహదపడ్డారు. రచిన్‌ రవీంద్ర (44), కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (47 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటారు. కాన్వే (19), సీఫర్ట్‌ (24), ఫిలిప్స్‌ (19), డారిల్‌ మిచెల్‌ (18), మార్క్‌ చాప్‌మన్‌ (10), జకరీ ఫౌల్క్స్‌ (15 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నంతసేపు బ్యాట్‌ ఝులిపించారు. ఆఖర్లో సాంట్నర్‌, ఫౌల్క్స్‌ క్యామియో న్యూజిలాండ్‌ను 200 పరుగుల మార్కును దాటించింది.భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 2, హార్దిక్‌ పాండ్యా, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌ దూబే తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్‌ సింగ్‌ (4-0-53-0) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియాఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20లో గాయపడిన అక్షర్‌ పటేల్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చాడు. పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్‌ రాణాను ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో తెచ్చారు.మరోవైపు న్యూజిలాండ్‌ మూడు మార్పులు చేసింది. రాబిన్సన్‌ స్థానంలో టిమ్‌ సీఫర్ట్‌.. క్రిస్టియన్‌ క్లార్క్‌ స్థానంలో జకరీ ఫౌల్క్స్‌, జేమీసన్‌ స్థానంలో మ్యాట్‌ హెన్రీ తుది జట్టులో​కి వచ్చారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

Virat Kohli Test return on the cards, Senior BCCI officials contemplating historic move10
టెస్ట్‌ క్రికెట్‌లోకి విరాట్‌ కోహ్లి రీఎంట్రీ..?

టీమిండియాకు సంబంధించిన ఓ సంచలన వార్త ప్రస్తుతం క్రికెట్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. గతేడాది ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ.. సుదీర్ఘ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతుంది. టీ20 వరల్డ్‌కప్‌-2026 తర్వాత ఈ విషయం కార్యరూపం దాల్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రముఖ యూట్యూబర్ రోహిత్ జుగ్లాన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. బీసీసీఐ అధికారులు కోహ్లిని మళ్లీ టెస్ట్‌ల్లో ఆడమని సంప్రదించారు. ఈ విషయంలో ఓ బీసీసీఐ పెద్ద తలకాయ క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు. టెస్ట్‌ రిటైర్మెంట్‌ వెనక్కు తీసుకునే విషయంలో కోహ్లి కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే భారత క్రికెట్‌లో పెను సంచలనంగా మారుతుంది.కోహ్లి గతేడాది మే 12న అనూహ్యంగా 14 ఏళ్ల టెస్ట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. సరిగ్గా ఐదు రోజుల ముందే నాటి టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఐదు రోజుల వ్యవధిలో టెస్ట్‌ల నుంచి తప్పుకోవడాన్ని భారత క్రికెట్‌ అభిమానులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. రో-కో టెస్ట్‌ల నుంచి అనూహ్యంగా తప్పుకోవడం​ వెనుక భారత క్రికెట్‌లో ఓ కీలక వ్యక్తి హస్తం ఉందని టాక్‌ నడిచింది.సదరు వ్యక్తితో విభేదాల కారణంగా రో-కో టెస్ట్‌ల నుంచి అనూహ్యంగా తప్పుకున్నట్లు అ‍ప్పట్లో ప్రచారం జరిగింది. రో-కో అప్పటికే టీ20ల నుంచి వైదొలిగారు. టీ20 ప్రపంచకప్‌-2024 గెలిచిన తర్వాత వారిద్దరు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం రో-కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ, అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ, పరుగుల వరద పారిస్తున్నాడు. గత కొంతకాలంగా భారత్‌ టెస్ట్‌ల్లో ఆశాజనకమైన ప్రదర్శన చేయకపోవడంతో కోహ్లి తిరిగి రావాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ బీసీసీఐ పెద్ద తలకాయ చొరవ తీసుకొని కోహ్లితో మాట్లాడినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లే జరిగి కోహ్లి టెస్ట్‌ల్లో రీఎంట్రీ ఇస్తే.. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం అతను అతి త్వరలోనే 10000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం కోహ్లి 123 టెస్ట్‌ల్లో 30 శతకాలు, 31 అర్ధశతకాల సాయంతో 9230 పరుగులు చేశాడు. అతను మరో 770 పరుగులు చేస్తే అరుదైన 10000 క్లబ్‌లో చేరతాడు. కోహ్లి టెస్ట్‌ రీఎంట్రీపై సానుకూల వార్తలు ఎన్ని వినిపిస్తున్నా, ఇది అంత ఈజీ విషయమైతే కాదు. ఎందుకంటే 37 ఏళ్ల వయసులో కోహ్లి టెస్ట్‌ల్లోకి తిరిగి రావడం చాలా సవాళ్లతో కూడుకున్న విషయం. శారీకంగా అతను ఫిట్‌గా ఉన్నప్పటికీ.. మెంటల్‌ ఫిట్‌నెస్‌ సాధించడం అంత సులువు కాదు. కోహ్లి లాంటి వ్యక్తికి ఇది అసాధ్యం కాకపోయినా, రిటైర్మెంట్‌ వెనక్కు తీసుకోవడం లాంటి సాహసం చేయకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇటీవలికాలంలో కోహ్లి బహిరంగా చేసిన వ్యాఖ్యలను అనలైజ్‌ చేస్తే, అతని ఫోకస్‌ అంతా కేవలం 2027 వన్డే ప్రపంచకప్‌పైనే ఉన్నట్లు సుస్పష్టమవుతుంది. ఈ ప్రణాళిక ఉన్న కోహ్లి టెస్ట్‌ల్లో రీఎంట్రీ ఇచ్చి తన లాంగ్‌ టర్మ్‌ ప్లానింగ్‌ను డిస్టర్బ్‌ చేసుకోకపోవచ్చు. ఏదిఏమైనా టీ20 ప్రపంచకప్‌ పూర్తయ్యేలోపు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement