Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Prime Minister Modi praised the Indian chess player1
అర్జున్‌ దేశ యువతకు స్ఫూర్తి

న్యూఢిల్లీ: ‘ఫిడే’ వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌ప్‌ బ్లిట్జ్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణకు చెందిన అర్జున్‌ ఇరిగేశిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. దోహా వేదికగా జరిగిన ఈ టోర్నీ సెమీఫైనల్లో ఓడిన అర్జున్‌ కాంస్యం దక్కించుకున్నాడు. అంతకుముందు ర్యాపిడ్‌ విభాగంలోనూ అర్జున్‌ కాంస్యం గెలిచాడు. తద్వారా విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఒకే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ రెండు విభాగాల్లో పతకాలు సాధించిన తొలి భారత ఆటగాడిగా అర్జున్‌ నిలిచాడు. సెమీఫైనల్‌కు ముందు 19 రౌండ్‌లలో కలిపి 15 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచిన అర్జున్‌... వరల్డ్‌ నంబర్‌వన్‌ కార్ల్‌సన్‌ సహా పలువురు ప్రముఖ ఆటగాళ్లపై విజయాలు సాధించాడు. అయితే సెమీస్‌లో మాత్రం ఉజ్బెకిస్తాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ అబ్దుసత్తొరోవ్‌ నొదిర్‌బెక్‌ చేతిలో ఓడి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ‘చదరంగంలో భారత్‌ జోరు కొనసాగుతోంది. వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ బ్లిట్జ్‌ విభాగంలో కాంస్యం నెగ్గిన అర్జున్‌ ఇరిగేశికి అభినందనలు. ఇటీవల ర్యాపిడ్‌ విభాగంలోనూ కాంస్యం నెగ్గిన అర్జున్‌... బ్లిట్జ్‌లోనూ సత్తా చాటాడు. అతడి విజయం దేశ యువతకు స్ఫూర్తి. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో విజేతలకు ‘ఫిడే’ బుధవారం పతకాలు అందజేసింది. అర్జున్‌ రెండు కాంస్య పతకాలు అందుకోగా, మహిళల ర్యాపిడ్‌లో కాంస్యం గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి కోనేరు హంపికి కాంస్యం అందించారు. కార్ల్‌సన్‌ అటు ర్యాపిడ్, ఇటు బ్లిట్జ్‌ రెండు విభాగాల్లోనూ విజేతలుగా నిలిచాడు. ముగింపు కార్యక్రమంలో ‘ఫిడే’ అధికారులతో పాటు భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ పాల్గొన్నాడు. ‘నాకౌట్‌లో నమ్మకం కలిగింది’ వరల్డ్‌ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చాంపియన్‌షిప్‌లలో రెండు టైటిల్స్‌ సాధించడం పట్ల నార్వే స్టార్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు సంబంధించి ఆరంభంలో టోర్నీ కఠినంగా సాగినా...చివరకు గెలవగలనని నమ్మానని అతను చెప్పాడు. ‘ఈ టోర్నమెంట్‌ ఆశించినంత సులువుగా సాగలేదు. ఫలితం ప్రతికూలంగా కూడా వచ్చి ఉండేది. అయితే నాకౌట్‌కు వెళ్లిన తర్వాత నాపై నమ్మకం పెరిగింది. ఈ దశలో మరింత ఉత్సాహంగా, బాగా ఆడగలనని అనిపించింది. చివరకు అది బాగా పని చేసింది’ అని విజయానంతరం కార్ల్‌సన్‌ వ్యాఖ్యానించాడు. మరో వైపు రెండు టైటిల్స్‌ నెగ్గినా కార్ల్‌సన్‌ క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించాడంటూ వివాదం రేగింది. స్విస్‌ విభాగం 14వ రౌండ్‌లో హైక్‌ మారి్టరోస్యాన్‌ (ఆర్మేనియా)తో అతను తలపడిన సందర్భంలో అనూహ్య ఘటన జరిగింది. వేగంగా ఆడే ప్రయత్నంలో అతని చేతులు తగిలి బోర్డుపై ఉన్న పావులు కొన్ని కింద పడిపోయాయి. అప్పటికి అతని వద్ద రెండు సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉంది. పావులను సరైన స్థానంలో పెట్టే ప్రయత్నంలో అతను టైమింగ్‌ క్లాక్‌ను నిలిపివేశాడు. ఫలితంగా అతనికి ఆ రెండు సెకన్ల అదనపు సమయం కలిసొచ్చింది. ఇది నిబంధనలకు విరుద్ధం. దాంతో ఆర్బిటర్స్‌ జోక్యం చేసుకొని మాగ్నస్‌పై చర్య తీసుకున్నారు. మార్టిరోస్యాన్‌ను విజేతగా ప్రకటించారు. దీనికి అంగీకరిస్తూ అతను వైదొలిగాడు.

Hyderabad lost to Baroda in the Vijay Hazare Trophy2
అభిరత్, ప్రజ్ఞయ్‌ సెంచరీలు వృథా

రాజ్‌కోట్‌: ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన హైదరాబాద్‌... వరుసగా నాలుగో పోరులోనూ పరాజయం పాలైంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా బుధవారం పరుగుల వరద పారిన పోరులో బరోడా 37 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై గెలుపొందింది. మొదట బరోడ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 417 పరుగులు చేసింది. కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యా (63 బంతుల్లో 109 నాటౌట్‌; 18 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ శతకంతో విజృంభించగా... ఓపెనర్లు నిత్య పాండ్యా (110 బంతుల్లో 122; 12 ఫోర్లు, 1 సిక్స్‌), అమిత్‌ పసీ (93 బంతుల్లో 127; 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీలతో కదం తొక్కారు. ఆఖర్లో భాను పనియా (27 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడాడు. హైదరాబాద్‌ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో... బరోడా బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. ఎడాపెడా బౌండరీలు బాదిన బరోడా బ్యాటర్లు... ఈ మ్యాచ్‌లో 44 ఫోర్లు, 11 సిక్స్‌లు కొట్టడం విశేషం. మన బౌలర్లలో చామా మిలింద్‌ 2 వికెట్లు పడగొట్టగా... తనయ్‌ త్యాగరాజన్, వరుణ్‌ గౌడ్‌ చెరో వికెట్‌ తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ 49.5 ఓవర్లలో 380 పరుగులకు ఆలౌటైంది. అభిరత్‌ రెడ్డి (90 బంతుల్లో 130; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రజ్ఞయ్‌ రెడ్డి (98 బంతుల్లో 113; 11 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. అమన్‌ రావు (39; 6 ఫోర్లు, 1 సిక్స్‌), తన్మయ్‌ అగర్వాల్‌ (32; 5 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్‌ రెడ్డి (33; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. బరోడా బౌలర్లలో అతిత్‌ సేత్, మహేశ్‌ పితియా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అమిత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు కలిసి 5 సెంచరీలు నమోదు చేశారు. గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన హైదరాబాద్‌ పాయింట్ల ఖాతా తెరవలేక పట్టికలో ఏడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శనివారం చండీగఢ్‌తో హైదరాబాద్‌ తలపడనుంది. చండీగఢ్‌ కూడా ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ ఓడింది.

Mumbai beats Goa in Vijay Hazare Trophy3
సర్ఫరాజ్‌ సునామీ

జైపూర్‌: భారత ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ (75 బంతుల్లో 157; 9 ఫోర్లు, 14 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 87 పరుగుల తేడాతో గోవాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సర్ఫరాజ్‌ భారీ సెంచరీతో కదం తొక్కగా... ముషీర్‌ ఖాన్‌ (60; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్‌ తమోర్‌ (53; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటారు. యశస్వి జైస్వాల్‌ (46; 6 ఫోర్లు), కెప్టెన్‌ శార్దుల్‌ ఠాకూర్‌ (27; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), షమ్స్‌ ములానీ (22; 2 సిక్స్‌లు), తనుశ్‌ కొటియాన్‌ (23 నాటౌట్‌; 3 ఫోర్లు) కూడా బ్యాట్‌లకు పనిచెప్పారు. ఫలితంగా ముంబై జట్టు భారీ స్కోరు చేయగలిగింది. మొత్తంగా ముంబై బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో 35 ఫోర్లు, 25 సిక్స్‌లు బాదారు. గోవా బౌలర్లలో దర్శన్‌ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో తుదికంటా పోరాడిన గోవా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ (24; 5 ఫోర్లు), కశ్యప్‌ (21; 4 ఫోర్లు), స్నేహల్‌ (27; 3 ఫోర్లు, 1 సిక్స్‌), సుయాశ్‌ ప్రభుదేశాయ్‌ (31; 2 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేయగా... అభినవ్‌ (70 బంతుల్లో 100; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీ బాదగా... కెప్టెన్‌ దీప్‌రాజ్‌ (28 బంతుల్లో 70; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), లలిత్‌ యాదవ్‌ (64; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలు బాదారు. ముంబై బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ 3, యశస్వి జైస్వాల్‌ రెండు వికెట్లు పడగొట్టారు. గ్రూప్‌ ‘సి’లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ముంబై జట్టు 16 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్‌ 229 పరుగుల తేడాతో సిక్కింపై... పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో హిమాచల్‌ ప్రదేశ్‌పై... మహారాష్ట్ర 129 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌పై గెలుపొందాయి. రిషబ్‌ పంత్‌ విఫలం త్వరలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో... మెరుగైన ప్రదర్శన చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్శింస్తాడనుకున్న వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ నిరాశ పరిచాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు సారథ్యం వహిస్తున్న పంత్‌... కీలక పోరులో బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 79 పరుగుల తేడాతో ఒడిశా చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఒడిశా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెపె్టన్, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బిప్లబ్‌ సమంత్రాయ్‌ (72; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), హాఫ్‌ సెంచరీ సాధించగా... తక్కినవాళ్లంతా తలాకొన్ని పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో హృతిక్‌ షోకీన్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ తడబడింది. 42.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. పంత్‌ (28 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్‌ రాణా (2), ప్రియాన్‌‡్ష ఆర్య (5), సార్థక్‌ రంజన్‌ (1) విఫలమవడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు.ఒడిశా బౌలర్లలో దేబబ్రత ప్రధాన్, సంబిత బరల్‌ చెరో 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడిన ఢిల్లీ 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో రైల్వేస్‌ 4 వికెట్ల తేడాతో గుజరాత్‌పై... హర్యానా 7 వికెట్ల తేడాతో సర్వీసెస్‌పై గెలుపొందాయి.మయాంక్, దేవదత్‌ సెంచరీలుటీమిండియా ప్లేయర్లు మయాంక్‌ అగర్వాల్‌ (124 బంతుల్లో 132; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు), దేవదత్‌ పడిక్కల్‌ (116 బంతుల్లో 113; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో కదంంతొక్కారు. ఫలితంగా ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 67 పరుగుల తేడాతో పాండిచ్చేరిపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 363 పరుగులు చేసింది. పడిక్కల్‌తో కలిసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మయాంక్‌ అగర్వాల్‌ తొలి వికెట్‌కు 228 పరుగులు జోడించగా... కరుణ్‌ నాయర్‌ (34 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభినవ్‌ మనోహర్‌ (21 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అనంతరం ఛేదనలో పాండిచ్చేరి 50 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది. నెయాన్‌ శ్యామ్‌ (68; 9 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా... జయంత్‌ యాదవ్‌ (54), అజయ్‌ (32), కెప్టెన్‌ అమన్‌ ఖాన్‌ (34), మరిముత్తు (31), సిడాక్‌ సింగ్‌ (27) తలా కొన్ని పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో మన్వంత్‌ కుమార్‌ 3 వికెట్లు పడగొట్టగా... కరుణ్‌ నాయర్, విద్వత్‌ కవెరప్పా చెరో 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన కర్ణాటక జట్టు 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో జార్ఖండ్‌ 9 వికెట్ల తేడాతో తమిళనాడుపై... కేరళ 2 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై... మధ్యప్రదేశ్‌ 4 వికెట్ల తేడాతో త్రిపురపై విజయాలు సాధించాయి. నిప్పులు చెరిగిన ముకేశ్, ఆకాశ్, షమీభారత పేసర్లు మొహమ్మద్‌ షమీ (2/14), ముకేశ్‌ కుమార్‌ (4/16), ఆకాశ్‌దీప్‌ (4/32) సమష్టిగా సత్తా చాటారు. ఫలితంగా బెంగాల్‌ జట్టు విజయ్‌ హాజారే ట్రోఫీలో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ 9 వికెట్ల తేడాతో జమ్మూకశ్మీర్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన జమ్మూకశ్మీర్‌ జట్టు 20.4 ఓవర్లలో 63 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ పారస్‌ డోగ్రా (19), శుభమ్‌ ఖజురియా (12) రెండంకెల స్కోరు చేయగా... మిగిలినవాళ్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అంతర్జాతీయ స్థాయి బౌలర్ల ముందు జమ్మూ ప్లేయర్లు నిలవలేకపోయారు. షమీ వికెట్ల వేట ప్రారంభించగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ముకేశ్, ఆకాశ్‌ దాన్ని కొనసాగించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో బెంగాల్‌ 9.3 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 64 పరుగులు చేసి గెలిచింది. గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన బెంగాల్‌ 12 పాయింట్లతో పట్టిక మూడో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఉత్తరప్రదేశ్‌ 58 పరుగుల తేడాతో అస్సాంపై... విదర్భ 8 వికెట్ల తేడాతో చండీగఢ్‌పై నెగ్గాయి.

A feast for sports fans in 20264
ప్రపంచకప్‌లు... ప్రతిష్టాత్మక ఈవెంట్లు...

జూనియర్, సీనియర్, మహిళల వరల్డ్‌ కప్‌లతో పరుగుల లెక్కలు... మెస్సీ, రొనాల్డోల మెరుపులను చివరిసారి చూసేందుకు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూపులు... భిన్న క్రీడాంశాల్లో సత్తా చాటి అందరి దృష్టినీ ఆటగాళ్లు తమ వైపు తిప్పుకునేే కామన్వెల్త్, ఆసియా క్రీడల రూపంలో రెండు నెలల వ్యవధిలో రెండు చాన్స్‌లు... ఇక స్వదేశంలో మన షట్లర్ల స్థాయిని ప్రదర్శించేందుకు 17 ఏళ్ల తర్వాత వచ్చిన బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌ నిర్వహణావకాశం... ఇలా 2026లో పలు ప్రతిష్టాత్మక ఈవెంట్లు క్రీడాభిమానులను అలరించనున్నాయి. జనవరి నుంచి అక్టోబర్‌ వరకు నిరంతరాయంగా పది నెలల పాటు ఫుల్‌ స్పోర్ట్స్‌ జోష్‌ కనిపించడం ఖాయం.కామన్వెల్త్‌ క్రీడలు23 జులై–2 ఆగస్టు(వేదిక: గ్లాస్గో, స్కాట్లండ్‌)అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత ఆటగాళ్లు సత్తా చాటేందుకు కామన్వెల్త్‌ క్రీడలు సరైన వేదికగా నిలుస్తున్నాయి. పెద్ద సంఖ్యలో మన వర్ధమాన ఆటగాళ్లు ఈ క్రీడల ద్వారా గుర్తింపు దక్కించుకుంటున్నారు. 2022 క్రీడల్లో భారత్‌ 22 స్వర్ణాలు సహా మొత్తం 61 పతకాలు గెలిచి నాలుగో స్థానంతో ముగించింది. అయితే ఆర్థికపరమైన, నిర్వహణాపరమైన ఇతర సమస్యల కారణంగా 2026 పోటీలను కేవలం 10 క్రీడాంశాలకే పరిమితం చేశారు. భారత ఆటగాళ్లు కచ్చితంగా పతకం గెలిచే అవకాశం ఉన్న హాకీ, బ్యాడ్మింటన్, టి20 క్రికెట్, రెజ్లింగ్, టేబుల్‌ టెన్నిస్‌లను తప్పించడంతో ఈ సారి భారత్‌ పతకాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అన్నీ కలిపి 215 ఈవెంట్లలో దాదాపు 3 వేల మంది ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉంది. 2014లోనే కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన గ్లాస్గో తక్కువ వ్యవధిలో మరోసారి ఈ పోటీలకు వేదిక కానుండటం విశేషం. గతంలో బ్రిటీష్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న 74 దేశాలు తలపడే ఈ పోటీలు ఎలిజబెత్‌ మహరాణి–2 మరణించిన తర్వాత జరుగుతున్న తొలి గేమ్స్‌ కానున్నాయి. టి20 వరల్డ్‌ కప్‌7 ఫిబ్రవరి–8 మార్చి(వేదిక: భారత్, శ్రీలంక)బౌండరీ వద్ద సూర్యకుమార్‌ యాదవ్‌ అత్యద్భుత క్యాచ్‌... రోహిత్‌ శర్మ మెస్సీ స్టయిల్‌లో ట్రోఫీని అందుకున్న క్షణాలు ఇంకా మనసునుంచి చెరిగిపోక ముందే మరో టి20 వరల్డ్‌ కప్‌ వచ్చేసింది. ఈ సారి డిఫెండింగ్‌ చాంపియన్‌గా, అదీ సొంతగడ్డపై బరిలోకి దిగుతుండటం ఇప్పటికే బలంగా ఉన్న భారత జట్టు బలాన్ని రెట్టింపు చేసింది. ఈ ఏడాది క్రికెట్‌ అభిమానులను ఎక్కువగా అలరించే అవకాశం ఉన్న టి20 వరల్డ్‌ కప్‌కు భారత్‌తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. గతంలో తరహాలోనే 20 జట్లు టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాలతో పాటు ఫైనల్‌ జరిగే అహ్మదాబాద్‌ కూడా మన దేశంలో వేదికలుగా ఉన్నాయి. 2024 వరల్డ్‌ కప్‌తో పోలిస్తే రోహిత్, కోహ్లిలాంటి స్టార్లు ఈ టోర్నీలో కనిపించరు కానీ అభిõÙక్, తిలక్‌లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. తొలిసారి ఇటలీ జట్టు వరల్డ్‌ కప్‌ ఆడే అవకాశం దక్కించుకోవడం విశేషం. ఇప్పటి వరకు జరిగిన 9 టి20 వరల్డ్‌ కప్‌లలో భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్‌ రెండేసి సార్లు విజేతలుగా నిలవగా... పాకిస్తాన్, శ్రీలంక, ఆ్రస్టేలియా ఒక్కో టైటిల్‌ గెలిచాయి. మహిళల టి20 వరల్డ్‌ కప్‌12 జూన్‌–5 జులై(వేదిక: ఇంగ్లండ్‌)తొలిసారి వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచి శిఖరాన నిలిచిన ఉత్సాహంలో ఉన్న భారత మహిళల జట్టు ఈ సారి టి20 వరల్డ్‌ కప్‌పై గురి పెట్టింది. 2020లో జరిగిన టోర్నీలో అత్యుత్తమంగా రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు మిగతా 8 ప్రయత్నాల్లోనూ పేలవ ప్రదర్శనతో విఫలమైంది. అయితే ఇటీవల జట్టులో వచ్చిన మార్పులు, టి20 స్పెషలిస్ట్‌ల ప్రదర్శన మన టీమ్‌లో ఆశలు పెంచుతున్నాయి. దానికి తగినట్లుగా ఇప్పటినుంచి వరల్డ్‌ కప్‌ కోసం జట్టు సన్నాహకాలు కొనసాగుతున్నాయి. 2009లో తొలి టోర్నీని నిర్వహించిన తర్వాత ఇప్పుడు మరోసారి ఇంగ్లండ్‌ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో ఫైనల్‌ నిర్వహిస్తారు. టి20 వరల్డ్‌ కప్‌లో ఆ్రస్టేలియా ఏకంగా 6 సార్లు విజేతగా నిలవగా...ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌ ఒక్కో సారి ట్రోఫీని అందుకున్నాయి. న్యూజిలాండ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌. పురుషుల అండర్‌–19 వరల్డ్‌ కప్‌ 15 జనవరి–6 ఫిబ్రవరి(వేదిక: జింబాబ్వే, నమీబియా)యువ క్రికెటర్లు చెలరేగి భవిష్యత్తులో సీనియర్‌ జట్టుకు ప్రమోట్‌ అయ్యేందుకు అండర్‌–19 ప్రపంచ కప్‌ చక్కటి అవకాశం కల్పిస్తోంది. భారత జట్టులో అలాంటి యువ ఆటగాళ్లకు కొదవ లేదు. తమ ప్రతిభతో ఐపీఎల్‌లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న వైభవ్‌ సూర్యవంశీ, ఆయుశ్‌ మాత్రే, భారత జట్టుకు వరల్డ్‌ కప్‌ అందించేందుకు అండర్‌–19 స్థాయిలో బరిలోకి దిగుతున్నారు. కొత్త ఏడాదిలో అన్నింటికంటే ముందుగా క్రికెట్‌ అభిమానులకు అలరించే సిద్ధమైన ఈ కుర్రాళ్ల పోరులో మొత్తం 16 టీమ్‌లు బరిలోకి దిగుతున్నాయి. 2024లో టైటిల్‌ సాధించిన ఆ్రస్టేలియా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా... ఫైనల్లో ఓడిన భారత్‌ రన్నరప్‌గా నిలిచింది. అయితే మొత్తం 15 సార్లు జరిగిన అండర్‌–19 వరల్డ్‌ కప్‌లో 5 సార్లు కప్‌ గెలుచుకొని భారత్‌ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.ఆసియా క్రీడలు19 సెప్టెంబర్‌–4 అక్టోబర్‌(వేదిక: నగోయా, జపాన్‌)కామన్వెల్త్‌ గేమ్స్‌ ముగిసిన రెండు నెలల లోపే మన భారత క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఆసియా గేమ్స్‌ రూపంలో మరో అవకాశం దక్కుతోంది. ముఖ్యంగా అథ్లెటిక్స్‌ విభాగంలో ఆసియా క్రీడల్లో సుదీర్ఘ కాలంగా భారత్‌ బలమైన ముద్ర వేసింది. కోవిడ్‌ కారణంగా ఏడాది కాలం వాయిదా పడటంతో 2022లో జరగాల్సిన గేమ్స్‌ను 2023లో నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల ఈవెంట్‌గా షెడ్యూల్‌ ప్రకారం 2026లో నిర్వహిస్తున్నారు. జపాన్‌లోని నగోయా నగరం ప్రధాన వేదిక కాగా, ఐచి రాష్ట్రంలోని ఇతర వేదికల్లో కూడా పోటీలు జరుగుతాయి. 41 క్రీడాంశాల్లో కలిపి 45 దేశాల నుంచి సుమారు 15 వేల మంది అథ్లెట్లు పాల్గొనే అవకాశం ఉంది. ఆసియా క్రీడలను జపాన్‌ నిర్వహించడం ఇది మూడో సారి. 2023 ఏషియాడ్‌లో 28 స్వర్ణాలు సహా 106 పతకాలు నెగ్గిన భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది.‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌ 12 జూన్‌–20 జులై(వేదిక: అమెరికా, కెనడా, మెక్సికో)ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌ అభిమానులను అలరించేందుకు ఈ ఏడాది వరల్డ్‌ కప్‌ వచ్చేసింది. మూడు దేశాలు కలిసి టోర్నీని నిర్వహిస్తుండటం ఇదే మొదటిసారి కాగా, మొత్తం 16 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌ చరిత్రలో 2022 వరకు 32 జట్లతోనే టోర్నమెంట్‌ను నిర్వహించగా... తొలిసారి 48 జట్లు బరిలోకి దిగుతుండటం ఈ సారి అన్నింటికంటే పెద్ద విశేషం. కేప్‌ వెర్డె, క్యురాకో, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్‌ తొలిసారి ప్రపంచ కప్‌ ఆడనున్నాయి. అర్జెంటీనా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ప్రపంచ ఫుట్‌బాల్‌ చరిత్రలో దిగ్గజ స్థాయి ఆటగాళ్లుగా గుర్తింపు పొందిన లయోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో చివరి సారిగా వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. 2026 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను మైదానంలో చూసేందుకు దాదాపు 70 లక్షల టికెట్లు అందుబాటులో ఉండగా...తొలి 15 రోజుల్లోనే 15 కోట్లకు పైగా టికెట్‌ దరఖాస్తులు రావడం ఈ టోర్నీ స్థాయికి చూపిస్తోంది. ఎప్పటిలాగే భారత్‌ మాత్రం ప్రపంచకప్‌ టోర్నీలో కనిపించదు. ఆసియా నుంచి క్వాలిఫై అయ్యేందుకు 9 జట్లకు అవకాశం ఉండగా... అతి పేలవమైన ఆటతో భారత్‌ అర్హతకు సుదూరంగా ఉండిపోయింది. వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ఆగస్టు 17–23(వేదిక: న్యూఢిల్లీ)బ్యాడ్మింటన్‌లో గత కొన్నేళ్లుగా తమదైన ముద్ర వేసిన భారత్‌ రెండో సారి వరల్డ్‌ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ టాప్‌ షట్లర్లంతా పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌ ఢిల్లీలో జరుగుతుంది. గతంలో భారత్‌లో ఒకే ఒకసారి వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (2009లో హైదరాబాద్‌లో) జరిగింది. వాస్తవానికి 2023లో భారత్‌ సుదిర్మన్‌ కప్‌ను నిర్వహించాల్సి ఉండగా... కోవిడ్‌ కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో పలు వేదికల్లో మార్పులు జరిగాయి. ఈ క్రమంలో భారత్‌కు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ అవకాశం దక్కింది. 2025లో పారిస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో భారత్‌ తరఫున సాత్విక్‌–చిరాగ్‌ కాంస్యపతకం గెలుచుకున్నారు. స్వదేశంలో మన ఆటగాళ్లు ఈ సారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చే అవకాశం ఉంది.

Schedule of team india in 20265
2026లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లు ఇవే..!

2025 సంవత్సరం మరి కొద్ది గంటల్లో ముగియనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది భారత పురుషుల క్రికెట్‌ జట్టు ఆడబోయే మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దాం. 2026లో టీమిండియా చాలా బిజీగా గడపనుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లు మొదలుకొని, స్వదేశంలోనే జరిగే టీ20 ప్రపంచకప్‌, ఆతర్వాత ఇంగ్లండ్‌ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు.. ఆతర్వాత స్వదేశంలోనే ఆఫ్ఘనిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌.. ఆతర్వాత స్వదేశంలోనే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌, దాని తర్వాత న్యూజిలాండ్‌ పర్యటన.. సంవత్సరాంతంలో స్వదేశంలోనే శ్రీలంకతో సిరీస్‌.. ఇలా, ఈ ఏడాదంతా టీమిండియా బిజీబిజీగా గడపనుంది.వచ్చే ఏడాది టీమిండియా షెడ్యూల్‌ ఇదే...జనవరి, 2026: న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా3 వన్డేలు, 5 టీ20లుఫిబ్రవరి, మార్చి: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్మార్చి నుంచి మే మధ్యలో ఐపీఎల్ 2026జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్ టూర్ ఆఫ్ ఇండియా1 టెస్టు, 3 వన్డేలుజూలైలో టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్5 టీ20లు, 3 వన్డేలుఆగస్టులో టీమిండియా టూర్ ఆఫ్ శ్రీలంక2 టెస్టులుసెప్టెంబర్‌లో టీమిండియా వర్సెస్‌ ఆఫ్ఘనిస్తాన్ (తటస్థ వేదిక)3 టీ20లుసెప్టెంబర్‌, అక్టోబర్‌లో వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా3 వన్డేలు, 5 టీ20లుసెప్టెంబర్ 19-అక్టోబర్ 4: ఆసియా క్రీడలు 2026అక్టోబర్-నవంబర్‌లో టీమిండియా టూర్ ఆఫ్ న్యూజిలాండ్2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లుడిసెంబర్‌లో శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా3 వన్డేలు, 3 టీ20లు* పైన తెలిపిన షెడ్యూల్‌లో ఇంకా కొన్నింటికీ పూర్తి ఆమోదం లభించలేదు.

SA20 2025-26: Miller slams fifty, paarl royals enrolls first victory6
దుమ్మురేపిన కిల్లర్‌ మిల్లర్‌.. బోణీ కొట్టిన రాయల్స్‌

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26లో పార్ల్‌ రాయల్స్‌ బోణీ కొట్టింది. సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌తో ఇవాళ (డిసెంబర్‌ 31) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత రాయల్స్‌ బౌలర్లు చేలరేగిపోయారు. ఆతర్వాత కెప్టెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ (38 బంతుల్లో 71 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడి రాయల్స్‌ను గెలిపించాడు. ప్రస్తుత ఎడిషన్‌లో రాయల్స్‌కు ఇది విజయం కాగా.. ఈస్ట్రన్‌కేప్‌కు తొలి పరాజయం.పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఈస్ట్రన్‌కేప్‌కు రాయల్స్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. మొకొయెనా (4-0-34-4), ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ (4-0-36-3), ఫోర్టుయిన్‌ (4-0-16-0), ముజీబ్‌ రెహ్మాన్‌ (4-0-30-1), డెలానో పొట్గెటర్‌ (2-0-15-1) ధాటి​కి ఈస్ట్రన్‌కేప్‌ 149 పరుగులకే చాపచుట్టేసింది.ఈస్ట్రన్‌కేప్‌ ఇన్నింగ్స్‌లో జోర్డన్‌ హెర్మన్‌ (47) టాప్‌ స్కోరర్‌గా నిలువగా..బెయిర్‌స్టో (33) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. మిగతా బ్యాటర్లలో కెప్టెన్‌ స్టబ్స్‌, మార్కో జన్సెన్‌ తలో 17, బ్రీట్జ్కీ 13, డికాక్‌ 7, గ్రెగరి 5, ముత్తుసామి 2, నోర్జే 4, రత్నాయకే 1 (నాటౌట్‌) పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో రాయల్స్‌ కూడా తడబడింది. మిల్నే (4-0-22-0), జన్సెన్‌ (4-0-25-2), నోర్జే (4-0-21-2) పొదుపుగా బౌలింగ్‌ చేశారు. అయితే డేవిడ్‌ మిల్లర్‌.. కీగన్‌ లయన్‌ (45) సాయంతో రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. రాయల్స్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో ప్రిటోరియస్‌ (11), ట్రైబ్‌ (7), హెర్మన్‌ (9), వెర్రిన్‌ (3) విఫలమయ్యారు.

CHRIS LYNN BECOMES THE FIRST PLAYER TO COMPLETE 4000 RUNS IN BBL HISTORY7
చరిత్ర సృష్టించిన క్రిస్‌ లిన్‌

ఆస్ట్రేలియా వెటరన్‌ బ్యాటర్‌ క్రిస్‌ లిన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌లో 4000 పరుగుల మైలురాయిని తాకిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2025-26 ఎడిషన్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్‌తో ఇవాళ (డిసెంబర్‌ 31) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు (అడిలైడ్ స్ట్రైకర్స్‌కు ఆడుతూ).ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 79 పరుగులు చేసిన లిన్‌.. చారిత్రక మైలురాయిని తాకడంతో పాటు తన జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌ కెరీర్‌లో 129 ఇన్నింగ్స్‌లు ఆడిన లిన్‌ 149.77 స్ట్రయిక్‌రేట్‌తో 32 అర్ద సెంచరీలు, సెంచరీ సాయంతో 4065 పరుగులు చేశాడు.మొత్తం టీ20 కెరీర్‌లో 300 మ్యాచ్‌లు ఆడిన లిన్‌.. 57 అర్ద శతకాలు, 6 శతకాల సాయంతో 8636 పరుగులు చేశాడు. పవర్‌ హిట్టర్‌గా పేరున్న లిన్‌ ఐపీఎల్‌లోనూ మెరుపులు మెరిపించాడు. 2012-21 మధ్యలో 42 మ్యాచ్‌లు ఆడి 140.6 స్ట్రయిక్‌రేట్‌తో 10 అర్ద సెంచరీల సాయంతో 1329 పరుగులు చేశాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. లిన్‌ చెలరేగడంతో బ్రిస్బేన్‌ హీట్‌పై అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ​ చేసిన హీట్‌.. జేమీ ఓవర్టన్‌ (4-0-19-3), లియామ్‌ స్కాట్‌ (4-0-12-2), హసన్‌ అలీ (4-0-29-2), లూక్‌ వుడ్‌ (4-0-19-1), మాథ్యూ షార్ట్‌ (0.4-0-1-1) దెబ్బకు 19.4 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది. హీట్‌ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్‌ ఆటగాడు కుహ్నేమన్‌ (31 నాటౌట​) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అడిలైడ్‌ 14.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. క్రిస్‌ లిన్‌ (79 నాటౌట్‌) మెరుపు అర్ద శతకంతో అడిలైడ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.

Sikandar Raza suffers personal tragedy as younger brother passes away at 138
జింబాబ్వే కెప్టెన్‌ ఇంట తీవ్ర విషాదం​

జింబాబ్వే స్టార్‌ క్రికెటర్‌, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్‌ సికందర్‌ రజా ఇంట తీవ్ర విషాదం​ నెలకొంది. అతని 13 ఏళ్ల చిన్న తమ్ముడు మహ్మద్‌ మహ్ది అరుదైన హీమోఫీలియా వ్యాధి బాధపడుతూ మృతి చెందాడు. హీమోఫీలియా కారణంగా మహ్ది శరీరంలో రక్తం గడ్డకట్టే సామర్థ్యం తగ్గిపోయింది. దీని వల్ల ఇటీవల ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. డిసెంబర్ 29 మహ్ది హరారేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆ మరుసటి రోజే (డిసెంబర్‌ 30) మహ్ది అంత్యక్రియలు హరారేలోని వారెన్ హిల్స్ స్మశానవాటికలో జరిగాయి. చిన్న వయసులోనే తమ్ముడిని కోల్పోవడంతో సికందర్‌ రజా బాధ వర్ణణాతీతంగా ఉంది. రజా కుటుంబానికి జింబాబ్వే క్రికెట్ బోర్డు సానుభూతి తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌ సమాజం నుంచి కూడా రజాకు సానుభూతి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. 39 ఏళ్ల సికందర్‌ రజా పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో జన్మించి, ఆతర్వాత కుటుంబంతో సహా జింబాబ్వేకు వలస వచ్చాడు. కుటి చేతి వాటం స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన రజా.. తన ప్రతిభతో జింబాబ్వే క్రికెట్‌కు వన్నె తెచ్చాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రజా ప్రపంచవ్యాప్తంగా అ‍గ్రశ్రేణి ఆల్‌రౌండర్లతో పోటీపడ్డాడు. జింబాబ్వే తరఫున తొలి టీ20 శతకం చేసిన బ్యాటర్‌గా రజా గుర్తింపు కలిగి ఉన్నాడు.2013 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రజా, జింబాబ్వే తరఫున 21 టెస్ట్‌లు, 153 వన్డేలు, 109 టీ20లు ఆడాడు. ఇందులో 9 సెంచరీలు, 49 హాఫ్‌ సెంచరీల సాయంతో 8000 పైచిలుకు పరుగులు చేశాడు. అలాగే మూడు ఫార్మాట్లలో 215 వికెట్లు తీశాడు. పాకిస్తాన్‌లో జన్మించినప్పటికీ.. రజా 2023, 2024 ఐపీఎల్‌ సీజన్లలో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడాడు. అప్పటికి పాక్‌ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ప్రవేశం లేదు. రజా ఇటీవలే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా అవతరించాడు.

Virat Kohli broke a long standing record of Viv Richard by ending no 2 in ICC ODI rankings 20259
సంవత్సరాంతంలోనూ ప్రపంచ రికార్డు నెలకొల్పిన విరాట్‌

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి 2025వ సంవత్సరం చివరి రోజు కూడా ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది చివరి రోజు విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని, రెండో స్థానానికి ఎగబాకిన విరాట్‌.. చరిత్రలో అత్యధిక సార్లు (10) టాప్‌-2లో (ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో) సంవత్సరాన్ని ముగించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.నేటికి ముందు ఈ రికార్డును విరాట్‌ మరో దిగ్గజ బ్యాటర్‌, విండీస్‌ యోధుడు వివ్‌ రిచర్డ్స్‌ (9), సౌతాఫ్రికా లెజండరీ ఆల్‌రౌండర్‌ షాన్‌ పొల్లాక్‌తో (9) కలిసి షేర్‌ చేసుకున్నాడు. తాజాగా సింగిల్‌గా ఈ ప్రపంచ రికార్డును కబ్జా చేశాడు.ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో వరుసగా 2017, 2018, 2019, 2020 సంవత్సరాలను టాప్-1 బ్యాటర్‌గా ముగించిన విరాట్‌.. 2013, 2014, 2015, 2016, 2021, 2025 సంవత్సరాలను రెండో నంబర్‌ బ్యాటర్‌గా ముగించాడు. డిసెంబర్‌ నెలలో సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రెండు శతకాలు, ఓ అర్ధశతకం సాయంతో 302 పరుగులు చేసిన విరాట్‌.. ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. 2025ను నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ముగించిన ఆటగాడు మరో భారత దిగ్గజం రోహిత్‌ శర్మ కావడం మరో విశేషం. రోహిత్‌కు విరాట్‌కు రేటింగ్‌ పాయింట్ల పరంగా కేవలం 8 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. రోహిత్‌ ఖాతాలో 781 పాయింట్లు ఉండగా.. విరాట్‌ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి.ఈ ఏడాదే టెస్ట్‌లకు, అంతకుముందు ఏడాది టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్‌.. వన్డేల్లో ఈ ఏడాది అద్భుత ప్రదర్శనలు కనబర్చాడు. 13 మ్యాచ్‌ల్లో 3 శతకాల సాయంతో 651 పరుగులు చేశాడు. ఇందులో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాక్‌పై శతకం ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

She cant be same player: Aakash Chopra on RCB Replacement for Ellyse Perry10
‘ఆర్సీబీ’కి దెబ్బే.. ఆ ప్లేయర్‌కు ఎవరూ సాటిరారు!

వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)-2026లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)కి చిక్కులు తప్పవని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ఎలిస్‌ పెర్రీ లేనిలోటును ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నాడు. కాగా డబ్ల్యూపీఎల్‌ తాజా సీజన్‌ ఆరంభానికి ముందే ఆర్సీబీ కీలక ప్లేయర్‌ సేవలు కోల్పోయింది. వ్యక్తిగత కారణాలతో ఈ ఎడిషన్‌ నుంచి పూర్తిగా తప్పుకొంటున్న ఆస్ట్రేలియా స్టార్‌ పెర్రీ ప్రకటించింది.అత్యధిక పరుగులుగత మూడు సీజన్లుగా తమతోనే కొనసాగుతున్న పెర్రీని ఆర్సీబీ.. ఈ ఏడాది రూ.2 కోట్లతో జట్టు అట్టి పెట్టుకుంది. గతేడాది (2024) జట్టు టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆమె (972)...లీగ్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది. అయితే, తాజా ఎడిషన్‌కు ఆమె దూరం కావడంతో.. భారత యువ క్రీడాకారిణి సయాలీ సత్‌గరేను ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది.ఇక గతంలో గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున రెండు సీజన్లలో కలిపి 4 మ్యాచ్‌లు ఆడిన సయాలీ.. 20 పరుగులు చేయగలిగింది. తాజాగా పెర్రీ స్థానంలో.. కనీస ధర రూ.30 లక్షలకు సయాలీని ఈసారి ఆర్సీబీ ఎంచుకుంది. సదర్లాండ్‌ కూడామరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్, ఆస్ట్రేలియాకే చెందిన అనాబెల్‌ సదర్లాండ్‌ కూడా వ్యక్తిగత కారణాలతోనే లీగ్‌కు దూరమైంది. ఒక ఏడాది గుజరాత్‌ జట్టు తరఫున ఆడిన సదర్లాండ్‌ గత రెండు సీజన్లుగా ఢిల్లీతోనే ఉంది.ఈ ఏడాది రూ.2.20 కోట్లకు ఆమెను ఢిల్లీ కొనసాగించింది. సదర్లాండ్‌ స్థానంలో ఆసీస్‌ లెగ్‌స్పిన్నర్‌ అలానా కింగ్‌ను క్యాపిటల్స్‌ తీసుకుంది. కింగ్‌ గత ఏడాది యూపీ వారియర్స్‌ తరఫున ఒకే ఒక డబ్ల్యూపీఎల్‌ మ్యాచ్‌ ఆడింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆ ప్లేయర్‌కు ఎవరూ సాటిరారు!‘‘ఈసారి ఎలిస్‌ పెర్రీ రావడం లేదు. అనాబెల్‌ సదర్లాండ్‌ కూడా ఈ సీజన్‌ ఆడటం లేదు. దీంతో ఆర్సీబీ, ఢిల్లీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆర్సీబీ ఈసారి ఫేవరెట్‌గా ఉంది.కానీ ఎలిస్‌ పెర్రీ లేకపోవడం వారి గెలుపు అవకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. పెర్రీ స్థానంలో ఆర్సీబీ సయాలీ సత్‌గరేను తీసుకువచ్చింది. వీరి స్కిల్‌ సెట్‌ ఒకటే కావొచ్చు.. కానీ సయాలీ.. పెర్రీ స్థానాన్ని భర్తీ చేయలేదు. నైపుణ్యాల పరంగా ఎలిస్‌ పెర్రీకి సయాలీ దరిదాపుల్లోకి కూడా రాలేదు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. అనాబెల్‌ స్థానంలో అలనా సరైన ప్లేయర్‌ కాదని ఈ మాజీ క్రికెటర్‌ అభిప్రాయపడ్డాడు. అనాబెల్‌ మీడియం పేస్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ చేయగలదన్న ఆకాశ్‌ చోప్రా.. అలనా మంచి స్పిన్నర్‌ మాత్రమే అని.. బ్యాటింగ్‌ పరంగా ఆమె పెద్దగా ఆకట్టుకోలేదని పేర్కొన్నాడు.తారా నోరిస్‌ దూరంఇదిలా ఉంటే.. యూపీ వారియర్స్‌ జట్టు సభ్యురాలు తారా నోరిస్‌ కూడా లీగ్‌కు దూరమైంది. టీ20 వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో తన జట్టు అమెరికా తరఫున బరిలోకి దిగేందుకు నోరిస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. నోరిస్‌ స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ చార్లీ నాట్‌ను వారియర్స్‌ జట్టులోకి ఎంచుకుంది. నాట్‌ గతంలో ఎప్పుడూ డబ్ల్యూపీఎల్‌ ఆడలేదు. చదవండి: బీసీసీఐ యూటర్న్‌!.. షమీకి గోల్డెన్‌ ఛాన్స్‌!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement