Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Lionel Messi fashion show with celebrities in Mumbai on 14th1
ర్యాంప్‌పై మెస్సీ నడక

కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లయోనల్‌ మెస్సీ భారత్‌ పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. ఇన్నాళ్లు ఫుట్‌బాల్‌ మైదానంలో అతని కిక్‌లు, పాస్‌లు చూసిన అభిమానులు ముంబైలో మాత్రం కొత్త మెస్సీని చూడబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆటలో అలరించిన అతను ఓ ప్రత్యేక ఫ్యాషన్‌ షోలో ర్యాంప్‌పై నడకతో ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నాడు. ‘జీఓఏటీ (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) ఇండియా టూర్‌’లో భాగంగా మెస్సీ ఈ వారాంతంలో భారత్‌లో పర్యటించనున్నాడు. దీనికి సంబంధిన ఏర్పాట్లన్నీ ఇది వరకే పూర్తయ్యాయి. ఈ మూడు రోజుల పర్యటనలో నాలుగు ప్రధాన నగరాల్లో సెలబ్రిటీలతో కలిసి భారత అభిమానుల్ని అలరించనున్నాడు. పర్యటనలో తొలిరోజు 13న ముందుగా కోల్‌కతాలో అడుగుపెట్టే మెస్సీ అక్కడి నుంచి అదే రోజు హైదరాబాద్‌కు విచ్చేస్తాడు. ఆ మరుసటి రోజు ఆదివారం ముంబై చేరుకుంటాడు. సోమవారం ఢిల్లీలో జరిగే కార్యక్రమాలతో అతని పర్యటన ముగుస్తుంది. ఆఖరి రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకుంటాడని నిర్వాహకులు షెడ్యూల్‌ను విడుదల చేశారు. కోల్‌కతాలో వర్చువల్‌గా... కోల్‌కతాలో క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌ అంటే చెవికోసుకుంటారు. విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. అర్జెంటీనా దివంగత దిగ్గజం మారడోనా అంటే పడిచచ్చేంత అభిమానం కోల్‌కతా వాసులది. ఇప్పుడు మెస్సీ అంటే కూడా అదే స్థాయిలో ప్రాణమిస్తారు. కాబట్టి కోల్‌కతా పోలీసులు కోల్‌కతాలో మెస్సీ 70 అడుగుల భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ఏర్పాటు చేశారు. భద్రతా కారణాలరీత్యానే హోటల్‌ నుంచే ఈ ఆవిష్కరణ ఉంటుందని పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. అనంతరం బిజిబిజీగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటాడు. హైదరాబాద్‌లో.... ‘గోట్‌’ పాన్‌ ఇండియా టూర్‌ను దేశం నలువైపులా కవర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తూర్పున కోల్‌కతా నుంచి దక్షిణాన హైదరాబాద్, పశి్చమాన ముంబై, ఉత్తరాన ఢిల్లీ నగరాలకు వస్తాడు. హైదరాబాద్‌లో సెలబ్రిటీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడతాడు. ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ స్టేడియంలో ‘గోట్‌ కప్‌’లో పాల్గొంటాడు. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా మెస్సీతో కలిసి కిక్‌లు కొట్టనున్నారు. ప్రధానితో ఢిల్లీలో... హైదరాబాద్‌ నుంచి నేరుగా ఆదివారం ముంబైకి వెళ్లి అక్కడ క్లబ్‌ సహచరుడు స్వారెజ్, అర్జెంటీనా సహచరుడు రోడ్రిగోలతో కలిసి ఫ్యాషన్‌ షోలో పాల్గొంటాడు. చివరగా ఢిల్లీ చేరుకొని ప్రధాని మోదీతో భేటీ అవుతాడు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలు పూర్తయ్యాక అదే రోజు రాత్రి స్వదేశానికి బయలుదేరతాడు.

IPL auction in Abu Dhabi on 16th of this month2
వేలం బరిలో 350 మంది

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2026 సీజన్‌కు సంబంధించిన వేలం కార్యక్రమంలో పాల్గొనే ప్లేయర్ల జాబితా సిద్ధం అయింది. ఈ నెల 16న అబుదాబి వేదికగా ఈ వేలం జరగనుంది. 77 స్థానాల కోసం మొత్తం 350 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 240 మంది భారత క్రికెటర్లు కాగా... 110 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 10 ఫ్రాంఛైజీలు కలిసి గరిష్టంగా 77 మందిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అందులో 31 విదేశీ ప్లేయర్ల స్థానాలు కాగా... 46 భారత ఆటగాళ్లవి. దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ చివరి నిమిషంలో వేలం జాబితాలోకి రాగా... ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్, దక్షిణాఫ్రికా హిట్టర్‌ డేవిడ్‌ మిల్లర్, న్యూజిలాండ్‌ ప్లేయర్‌ డెవాన్‌ కాన్వే, భారత ఆటగాళ్లు వెంకటేశ్‌ అయ్యర్, పృథ్వీ షా, సర్ఫరాజ్‌ ఖాన్‌ వంటి వాళ్లు వేలం జాబితాలో ఉన్నారు. మొదట 1390 మంది ప్లేయర్లు వేలంలో తమ పేర్లు నమోదు చేసుకోగా... అందులో ఫ్రాంచైజీల ఆసక్తి మేరకు 350 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు. ఒక్కో సెట్‌లో పది మంది చొప్పున 35 సెట్‌ల పాటు వేలం సాగనుంది. ఈ జాబితాలో 238 మంది అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు ఉన్నారు. అత్యధిక ప్రాథమిక ధర రూ. 2 కోట్లతో మొత్తం 40 మంది వేలంలో ఉండగా... ప్రాథమిక ధర రూ. 30 లక్షలతో 227 మంది పోటీలో ఉన్నారు. » టీమిండియా ప్లేయర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ ప్రాథమిక ధరను రూ. 75 లక్షలుగా నిర్ణయించుకున్నారు. పృథ్వీ షా 2018 నుంచి 2024 వరకు ఐపీఎల్‌ ఆడగా... 2025 సీజన్‌ కోసం జరిగిన మెగా వేలంలో అతడిని ఏ జట్టూ తీసుకోలేదు. ఇక సర్ఫరాజ్‌ 2021 సీజన్‌ నుంచి ఐపీఎల్‌ ఆడలేదు. » 2025 సీజన్‌కు ముందు రికార్డు స్థాయిలో రూ. 23.75 కోట్ల ధర పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీ వేలానికి వదిలేసింది. అతడు ప్రాథమిక ధర రూ. 2 కోట్లతో వేలానికి రానున్నాడు. ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో రాణిస్తున్న కునాల్‌ చండేలా, అశోక్‌ కుమార్‌లపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపే అవకాశాలున్నాయి. » పది ఫ్రాంచైజీల్లో అత్యధికంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దగ్గర రూ. 64.3 కోట్లు అందుబాటులో ఉండగా... చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. 43.4 కోట్లతో రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ. 25.5 కోట్లతో మూడో స్థానంలో ఉంది. » వేలంలో ఇంగ్లండ్‌ నుంచి అత్యధికంగా 21 మంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఇందులో జేమీ స్మిత్, అట్కిన్సన్, లివింగ్‌స్టోన్, బెన్‌ డకెట్‌ వంటి వారు ఉన్నారు. » ఆ్రస్టేలియా పేస్‌ ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ కోసం అన్నీ ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశం ఉంది. గ్రీన్, స్మిత్‌తో పాటు ఇన్‌గ్లిస్, షార్ట్, కూపర్, వెబ్‌స్టర్‌ వంటి 19 మంది ప్లేయర్లు ఆ్రస్టేలియా నుంచి ఈ వేలం బరిలో ఉన్నారు. » డికాక్, మిల్లర్‌లతో పాటు దక్షిణాఫ్రికా నుంచి 15 మంది వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో నోర్జే, ఎంగిడి, కోట్జీ, ముల్డర్‌ తదితరులు ఉన్నారు. » వెస్టిండీస్‌ నుంచి అల్జారీ జోసెఫ్, షామర్‌ జోసెఫ్, షై హోప్, రోస్టన్‌ ఛేజ్‌ సహా 9 మంది ఆటగాళ్లు వేలం బరిలో ఉన్నారు. » శ్రీలంక నుంచి హసరంగ, దునిత్‌ వెల్లలాగె, తీక్షణ, నిసాంక, కుశాల్‌ మెండిస్, కుశాల్‌ పెరీరా సహా 12 మంది ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. » న్యూజిలాండ్‌ నుంచి రచిన్‌ రవీంద్ర, కాన్వే సహా మొత్తం 16 మంది ప్లేయర్లు వేలం బరిలో ఉన్నారు. » అఫ్గానిస్తాన్‌ నుంచి రహ్మనుల్లా గుర్బాజ్, నవీన్‌ ఉల్‌ హక్‌ సహా మొత్తం 10 మంది ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు.అంకెల్లో...వేలంలో ఉన్న మొత్తం ఆటగాళ్లు 350 భారత క్యాప్డ్‌ ఆటగాళ్లు 16 విదేశీ క్యాప్డ్‌ ఆటగాళ్లు 96 భారత అన్‌క్యాప్డ్‌ ఆటగాళ్లు 224 విదేశీ అన్‌క్యాప్డ్‌ ఆటగాళ్లు 14ప్రాథమిక ధర ఆటగాళ్ల సంఖ్య రూ. 2 కోట్లు 40 రూ. 1.50 కోట్లు 9 రూ. 1.25 కోట్లు 4 రూ. 1 కోటి 17 రూ. 75 లక్షలు 42 రూ. 50 లక్షలు 4 రూ. 40 లక్షలు 7 రూ. 30 లక్షలు 227

Joshua Cheptegei is also preparing to run in the Kolkata event3
కోల్‌కతాలో చెప్టెగయ్‌ పరుగు

కోల్‌కతా: టాటా స్టీల్‌ ప్రపంచ 25 కిలోమీటర్ల రన్‌కు దిగ్గజాలు కూడా సై అంటున్నారు. ఈ 25 కిలోమీటర్ల పరుగులో ఇప్పటికే 23 వేల మంది పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. రెండుసార్లు ఒలింపిక్‌ చాంపియన్, మరో మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జొషువా చెప్టెగయ్‌ (ఉగాండా) కూడా కోల్‌కతా ఈవెంట్‌లో పరుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. మహిళల డిఫెండింగ్‌ చాంపియన్‌ సుతుమ్‌ అసిఫా కెబెడే సైతం 25కె రన్‌పై ఆసక్తి కనబరిచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 21న ఈ రేసు జరుగుతుందని ప్రమోటర్స్‌ ప్రొకామ్‌ ఇంటర్నేషనల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది వరకు నమోదైన 1 గంటా 11.08 నిమిషాల రికార్డును బ్రేక్‌ చేసిన రన్నర్‌కు ప్రైజ్‌మనీకి అదనంగా 25 వేల డాలర్లు (రూ.22.46 లక్షలు) బోనస్‌గా అందజేస్తామని ప్రోకామ్‌ సంస్థ తెలిపింది. కాగా ఈవెంట్‌ మొత్తం ప్రైజ్‌మనీ 1,42, 214 డాలర్లు (రూ.కోటి 28 లక్షలు). ఈ మొత్తాన్ని మహిళలు, పురుషుల విజేతలకు సమానంగా బహూకరించనున్నారు. 29 ఏళ్ల ఉగాండ రన్నర్‌ చెప్టెగయ్‌ సుదీర్ఘ పరుగు పందెంలో ఎదురేలేని చాంపియన్‌. మూడుసార్లు 10 వేల మీటర్ల పరుగులో విజేతగా నిలిచాడు. 5కె, 10కె పరుగులు కలుపుకొని నాలుగుసార్లు ప్రపంచ రికార్డులు నమోదు చేశాడు. గతేడాది ఢిల్లీ హాఫ్‌ మారథాన్, ఈ ఏడాది బెంగళూరులో జరిగిన వరల్డ్‌ 10కె రన్‌లోనూ ఈ ఉగాండా రన్నర్‌ విజేతగా నిలిచాడు. తొలిసారిగా భారత్‌లో 25కె రన్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. పురుషుల విభాగంలో చెప్టెగయ్‌తో పాటు అల్ఫొన్స్‌ ఫెలిక్స్‌ సింబు (టాంజానియా) సహా ఇథియోపియన్‌ రన్నర్‌ హేమనొట్‌ అలివ్, లెసోతొకు చెందిన టెబెలో రమకొంగొన తదితర మేటి అథ్లెట్లు కోల్‌కతా ఈవెంట్‌కు విచ్చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇథియోపియన్‌ మహిళా రన్నర్‌ అసిఫా కెబెడె పదేళ్ల క్రితమే 25కె పరుగులో ప్రపంచ రికార్డు సృష్టించింది. బెర్లిన్‌లో 2015లో జరిగిన ఆ ఈవెంట్‌లో రికార్డు నెలకొల్పిన ఆమె 2023లో కోల్‌కతాలో జరిగిన ఈవెంట్‌లోనూ మరో రికార్డు సాధించింది. మేటి అథ్లెట్లు పాల్గొననుండటంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

India wins the first T204
హార్దిక్‌ సూపర్‌ షో

భారత జట్టులోకి కొంత విరామం తర్వాత పునరాగమనం చేసిన హార్దిక్‌ పాండ్యా తన వాడిని, స్థాయిని ప్రదర్శించాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకొని వచ్చి అంచనాలకు తగినట్లుగా చెలరేగుతూ ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. ఇతర బ్యాటర్లంతా విఫలమైన వేళ పాండ్యా మెరుపులతో భారీ స్కోరు నమోదు చేసిన భారత్‌... ఆ తర్వాత దక్షిణాఫ్రికాను 75 బంతుల్లోనే 74 పరుగులకు కుప్పకూల్చింది. టీమిండియా పటిష్ట బౌలింగ్‌ను ఎదుర్కోలేక సఫారీలు పూర్తిగా చతికిలపడటంతో ఆట ఏకపక్షంగా మారిపోయింది. దాంతో బారాబతి స్టేడియంలో దక్షిణాఫ్రికాపై భారత్‌ తొలి విజయాన్ని అందుకుంది. ఈ మైదానంలో గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కటక్‌: దక్షిణాఫ్రికాతో మొదలైన టి20 సిరీస్‌లో అలవోక విజయాన్ని అందుకొని భారత్‌ 1–0తో ముందంజ వేసింది. బారాబతి స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన తొలి టి20లో భారత్‌ 101 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఆటతో చెలరేగాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్‌గిడికి 3 వికెట్లు దక్కాయి. అనంతరం దక్షిణాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది. టి20ల్లో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (22) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టి20 గురువారం ముల్లాన్‌పూర్‌లో జరుగుతుంది. ఓపెనర్లు విఫలం... భారత్‌ స్కోరు ఒకదశలో 17/2, ఆపై 48/3... 14 ఓవర్లు ముగిసేసరికి 104/5... ఈ క్రమాన్ని చూస్తే భారత్‌ భారీ స్కోరు చేయడం అసాధ్యమనిపించింది. కానీ చివర్లో ఒక్క పాండ్యా బ్యాటింగ్‌తో అంతా మారిపోయింది. ఆఖరి 6 ఓవర్లలో భారత్‌ 71 పరుగులు సాధించగలిగింది. భారత ఇన్నింగ్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. పునరాగమనంలో శుబ్‌మన్‌ గిల్‌ (4) ఇన్నింగ్స్‌ మూడు బంతులకే పరిమితం కాగా, ఎన్‌గిడి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సూర్యకుమార్‌ (12) తర్వాతి బంతికి వెనుదిరిగాడు. పవర్‌ప్లేలో జట్టు 40 పరుగులు చేయగా, అభిషేక్‌ శర్మ (17) జోరు ఎక్కువ సేపు సాగలేదు. ఈ దశలో తిలక్‌ వర్మ (32 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్‌), అక్షర్‌ పటేల్‌ (21 బంతుల్లో 23; 1 సిక్స్‌) కలిసి కొద్దిసేపు పట్టుదల కనబర్చారు. అయితే వీరిద్దరు నెమ్మదిగా ఆడుతూ 31 బంతుల్లో 30 పరుగులే జోడించగలిగారు. అయితే పాండ్యా వచ్చీ రాగానే మహరాజ్‌ ఓవర్లో 2 సిక్సర్లు బాది ఆటకు ఊపు తెచ్చాడు. తర్వాత నోర్జే ఓవర్లోనూ అతను 2 ఫోర్లు కొట్టాడు. మరో ఎండ్‌లో శివమ్‌ దూబే (11) అవుటైన తర్వాత పాండ్యా దూకుడు కొనసాగింది. సిపామ్లా వేసిన 19వ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన పాండ్యా...నోర్జే వేసిన 20వ ఓవర్లోనూ 6, 4 కొట్టి 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టపటపా... ఛేదనలో దక్షిణాఫ్రికా మొదటి నుంచే తడబడింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే డికాక్‌ (0)ను అవుట్‌ చేసిన అర్‌‡్షదీప్, తన తర్వాతి ఓవర్లో స్టబ్స్‌ (14)ను వెనక్కి పంపాడు. అక్షర్‌ తన తొలి బంతికే మార్క్‌రమ్‌ (14) బౌల్డ్‌ చేయగా, పాండ్యా కూడా తన తొలి బంతికే మిల్లర్‌ (1) ఆట కట్టించాడు. తర్వాతి ఓవర్లో వరుణ్‌ బంతిని ఆడలేక ఫెరీరా (5) కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో దక్షిణాఫ్రికా 50/5 వద్ద నిలిచింది. రెండు సిక్స్‌లు బాదిన యాన్సెన్‌ (12) కూడా వరుణ్‌ బంతికే బౌల్డ్‌ కాగా... మరో ఎండ్‌లో కొన్ని చక్కటి షాట్లతో బ్రెవిస్‌ పోరాడే ప్రయత్నం చేశాడు. అయితే బ్రెవిస్‌ను చక్కటి బంతితో బుమ్రా డగౌట్‌కు పంపడంతో దక్షిణాఫ్రికా ఆశలు కోల్పోయింది.101అంతర్జాతీయ టి20ల్లో బుమ్రా వికెట్ల సంఖ్య. అర్ష్ దీప్ సింగ్‌ (107) తర్వాత వంద వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.100 అంతర్జాతీయ టి20ల్లో హార్దిక్‌ పాండ్యా సిక్సర్ల సంఖ్య. కోహ్లి, సూర్యకుమార్, రోహిత్‌ తర్వాత ఈ మైలురాయిని అందుకున్న నాలుగో భారత ఆటగాడిగా పాండ్యా నిలిచాడు.స్కోరు వివరాలుభారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) యాన్సెన్‌ (బి) సిపామ్లా 17; గిల్‌ (సి) యాన్సెన్‌ (బి) ఎన్‌గిడి 4; సూర్యకుమార్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) ఎన్‌గిడి 12; తిలక్‌ (సి) యాన్సెన్‌ (బి) ఎన్‌గిడి 26; అక్షర్‌ (సి) ఫెరీరా (బి) సిపామ్లా 23; పాండ్యా (నాటౌట్‌) 59; దూబే (బి) ఫెరీరా 11; జితేశ్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–5, 2–17, 3–48, 4–78, 5–104, 6–137. బౌలింగ్‌: ఎన్‌గిడి 4–0–31–3, యాన్సెన్‌ 4–0–23–0, సిపామ్లా 4–0–38–2, నోర్జే 4–0–41–0, మహరాజ్‌ 2–0–25–0, ఫెరీరా 2–0–13–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) అభిషేక్‌ (బి) అర్ష్ దీప్ 0; మార్క్‌రమ్‌ (బి) అక్షర్‌ 14; స్టబ్బ్‌ (సి) జితేశ్‌ (బి) అర్ష్ దీప్ 14; బ్రెవిస్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బుమ్రా 22; మిల్లర్‌ (సి) జితేశ్‌ (బి) పాండ్యా 1; ఫెరీరా (సి) జితేశ్‌ (బి) వరుణ్‌ 5; యాన్సెన్‌ (బి) వరుణ్‌ 12; మహరాజ్‌ (సి) జితేశ్‌ (బి) బుమ్రా 0; నోర్జే (బి) అక్షర్‌ 1; సిపామ్లా (సి) అభిషేక్‌ (బి) దూబే 2; ఎన్‌గిడి (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (12.3 ఓవర్లలో ఆలౌట్‌) 74. వికెట్ల పతనం: 1–0, 2–16, 3–40, 4–45, 5–50, 6–68, 7–68, 8–70, 9–72, 10–74. బౌలింగ్‌: అర్ష్ దీప్ 2–0–14–2, బుమ్రా 3–0–17–2, వరుణ్‌ 3–1–19–2, అక్షర్‌ 2–0–7–2, పాండ్యా 2–0–16–1, దూబే 0.3–0–1–1.

Srinivas wins three medals in Carrom World Cup tournament5
శ్రీనివాస్‌ ‘ట్రిపుల్‌’ ధమాకా... క్యారమ్‌ ప్రపంచకప్‌లో స్వర్ణాలన్నీ భారత్‌కే

సాక్షి, హైదరాబాద్‌: క్యారమ్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ ఆటగాడు శ్రీనివాస్‌ ‘ట్రిపుల్‌’ ధమకా సాధించాడు. మాల్దీవులులో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో అతను మూడు పతకాలు సాధించడం విశేషం. స్విస్‌ లీగ్‌ ఈవెంట్‌లో కాంస్యం నెగ్గిన ఈ సీనియర్‌ ప్లేయర్‌... పురుషుల డబుల్స్‌లో అభిజిత్‌ త్రిపాంకర్‌తో కలిసి టైటిల్‌ సాధించాడు. పురుషుల వ్యక్తిగత ఫైనల్లో ప్రశాంత్‌ మోరే చేతిలో ఓడిపోవడంతో రజతం సాధించాడు. టైటిల్‌ పోరులో హైదరాబాదీ ప్లేయర్‌ 25–5, 11–25, 18–25తో ప్రశాంత్‌ మోరె చేతిలో కంగుతిన్నాడు. తద్వారా స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో శ్రీనివాస్‌ ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించాడు. బంగారు పతకాలన్నీ భారత జట్టుకే లభించడం మరో విశేషం. పురుషుల డబుల్స్‌లో స్వర్ణంతో పాటు రజతం కూడా భారత జోడీలకే దక్కాయి.దీంతో భారత్‌ 7 పసిడి పతకాలు సహా 4 రజతాలు, 3 కాంస్యాలతో మొత్తం 14 పతకాలు నెగ్గింది.

Team india Won T20 Match Against South Africa6
కుప్పకూలిన సౌతాఫ్రికా.. కటక్ మ్యాచ్‌లో భారత్ గ్రాండ్‌ విక్టరీ

కటక్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో కేవలం 74 పరుగులకే ఆలౌటయ్యారు. ఈ మ్యాచ్‌లో 101 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 అధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్‌ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, శివ దూబే చెరో వికెట్‌ తీశారు.అంతకుముందు భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ శర్మ 17, శుభ్‌మన్‌ గిల్‌ 4, సూర్యకుమార్‌ యాదవ్‌ 12, తిలక్‌ వర్మ 26, అక్షర్‌ పటేల్‌ 23, శివమ్‌ దూబే 11, జితేశ్‌ శర్మ 10 (నాటౌట్‌) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సిపాంమ్లా 2, ఫెరియెరా ఓ వికెట్‌ పడగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టీ20 ముల్లాన్‌పూర్ వేదికగా గురువారం జరగనుంది.

IND VS SA 1st T20I: Team India Set 176 runs target to South Africa7
హార్దిక్‌ విధ్వంసం.. సౌతాఫ్రికా టార్గెట్‌ ఎంతంటే..?

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్‌ 9) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. ఇన్నింగ్స్‌ మధ్య వరకు తడబడినప్పటికీ హార్దిక్‌ రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారింది.తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టిన హార్దిక్‌ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది స్కోర్‌ వేగాన్ని పెంచాడు. అతనికి మరో ఎండ్‌ నుంచి సహకారం లేనప్పటికీ ఒంటరి పోరాటం చేశాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు.ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ శర్మ 17, శుభ్‌మన్‌ గిల్‌ 4, సూర్యకుమార్‌ యాదవ్‌ 12, తిలక్‌ వర్మ 26, అక్షర్‌ పటేల్‌ 23, శివమ్‌ దూబే 11, జితేశ్‌ శర్మ 10 (నాటౌట్‌) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సిపాంమ్లా 2, ఫెరియెరా ఓ వికెట్‌ పడగొట్టాడు.తుది జట్లు..భారత్‌: అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌),అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా.సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్‌), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్‌), డెవాల్డ్ బ్రీవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్‌ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుథో సిపంమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే

Special story on team india politics8
ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కొక్కరిని బలి తీసుకుంటున్న "పెద్ద తలకాయ"..!

భారత పురుషుల క్రికెట్‌కు సంబంధించిన ఓ పెద్ద తలకాయ ఒక్కో ఫార్మాట్‌లో ఒక్కో ఆటగాడిని బలి తీసుకుంటున్నాడు. బీసీసీఐ అండదండలు పూర్తిగా ఉన్న ఆ పెద్ద తలకాయ టీమిండియాలో చెప్పిందే వేదం. భారత జట్టులో అతనేమనుకుంటే అది జరిగి తీరాల్సిందే. అతడి అండదండలుంటే ఏ స్థాయి క్రికెట్‌ ఆడకపోయినా నేరుగా భారత తుది జట్టులోకి వస్తారు. అతడి ఆశీస్సులుంటే సాధారణ ఆటగాడు కూడా కెప్టెన్‌ అయిపోతాడు. భారత పురుషుల క్రికెట్‌ను శాశించే ఆ శక్తికి మరో పెద్ద తలకాయ మద్దతు కూడా ఉంది. వీరిద్దరూ తలచుకుంటే అనర్హులను అందలమెక్కిస్తారు. అర్హుల కెరీర్‌లను అర్దంతరంగా ముగిస్తారు. వీరి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ప్రశ్నించే వారిపై ఎదురుదాడి చేస్తారు. వారు చేసే ప్రతి పనికి వారి వద్ద ఓ సమర్దన స్క్రిప్ట్‌ ఉంటుంది. వారి జోలికి వెళ్లాలంటే మాజీలు, మాజీ బీసీసీఐ బాస్‌లు కూడా హడలిపోతారు. అంతలా వారు చెలరేగిపోతున్నారు.వీరి ప్రస్తావన మరోసారి ఎందుకు వచ్చిందంటే.. భారత్‌-సౌతాఫ్రికా మధ్య ఇవాల్టి నుంచి (డిసెంబర్‌ 9) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభమైంది. కటక్‌ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అందరూ ఊహించిన విధంగానే శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతోనే టెస్ట్‌ సిరీస్‌ సందర్భంగా గాయపడిన గిల్‌.. గాయం నుంచి కోలుకోగానే నేరుగా తుది జట్టులో చోటు సంపాదించాడు.వాస్తవానికి గిల్‌ స్థానం సంజూ శాంసన్‌ది. సంజూ గత కొంతకాలంగా ఓపెనర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సౌతాఫ్రికా సిరీస్‌లోనూ వరుస సెంచరీలతో విరుచుకుపడ్డాడు. అయితే గిల్‌ కోసం పైన చెప్పుకున్న పెద్ద తలకాయలు సంజూ కెరీర్‌ను బలి చేస్తున్నారు. నేరుగా మెడపై కత్తి పెట్టకుండా తొలుత స్థానచలనం చేసి గేమ్‌ను మొదలుపెట్టారు. ఆతర్వాత ప్రణాళిక ప్రకారం జట్టులో స్థానాన్నే గల్లంతు చేస్తున్నారు.ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో ఈ ప్రక్రియ మొదలైంది. రెండో టీ20 తర్వాత సంజూకు అవకాశమే ఇవ్వలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లోనూ అదే కొనసాగింది. సంజూను శాశ్వతంగా జట్టు నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఎవరికైనా ఇట్టే అర్దమవుతుంది. ఓ దశలో సదరు పెద్ద తలకాయల్లో మొదటివాడు సంజూ కెరీర్‌కు పూర్తి భరోసా ఇచ్చినట్లు నటించాడు. 21 సార్లు డకౌటైనా తుది జట్టులో ఉంటావని నమ్మించాడు.తీరా చూస్తే.. తన అనూనయుడికి అవకాశం ఇవ్వడం కోసం సంజూ కెరీర్‌నే బలి చేస్తున్నాడు. సదరు పెద్ద తలకాయకు తనకు సరిపోని ఆటగాళ్ల కెరీర్‌లతో ఆటాడుకోవడం కొత్తేమీ కాదు. దిగ్గజాలైన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలతోనే మైండ్‌ గేమ్‌ ఆడాడు. వారంతట వారే టెస్ట్‌, టీ20 కెరీర్‌లను అర్దంతరంగా ముగించుకునేలా చేశాడు. టీ20ల్లో గిల్‌ కోసం సంజూ కెరీర్‌ను పణంగా పెట్టిన ఆ పెద్ద తలకాయ.. మరో అనర్హమైన బౌలర్‌ కోసం​ షమీ లాంటి వరల్డ్‌ క్లాస్‌ బౌలర్‌ కెరీర్‌ను అంపశయ్యపై పెట్టాడు. ఇకనైనా ఈ పెద్ద తలకాయ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోకపోతే అంతర్జాతీయ వేదికపై భారత క్రికెట్‌ గౌరవం పోతుంది.

India Women's squad for Sri Lanka T20I series announced9
శ్రీలంకతో టీ20 సిరీస్‌ కోసం భారత జట్టు ప్రకటన

డిసెంబర్‌ 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం భారత మహిళల క్రికెట్‌ జట్టును ఇవాళ (డిసెంబర్‌ 9) ప్రకటించారు. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వైస్‌ కెప్టెన్‌గా స్మృతి మంధన కొనసాగనున్నారు. వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన తర్వాత భారత్‌ ఆడనున్న తొలి సిరీస్‌ ఇదే.పలాష్‌ ముచ్చల్‌తో పెళ్లి పెటాకులైన తర్వాత మంధన ఎదుర్కోనున్న తొలి పరీక్ష కూడా ఇదే. వరల్డ్‌కప్‌ స్టార్‌ షఫాలీ వర్మ ఈ జట్టులో ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. అలాగే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ స్టార్‌ జెమీమా రోడ్రిగ్స్‌, వరల్డ్‌కప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ దీప్తి శర్మ, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్ లాంటి వరల్డ్‌కప్‌ స్టార్లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. వికెట్‌కీపర్ల కోటాలో రిచా ఘోష్, జి కమలిని జట్టులో ఉన్నారు. కొత్తగా శ్రీ చరణి, వైష్ణవి శర్మ జట్టులోకి వచ్చారు.షెడ్యూల్‌..తొలి టీ20- డిసెంబర్ 21, ఆదివారం, విశాఖపట్నంరెండో టీ20- డిసెంబర్ 23, మంగళవారం, విశాఖపట్నం మూడో టీ20- డిసెంబర్ 26, శుక్రవారం, తిరువనంతపురం నాలుగో టీ20- డిసెంబర్ 28, ఆదివారం, తిరువనంతపురం ఐదో టీ20- డిసెంబర్ 30, మంగళవారం, తిరువనంతపురం

How Batting with broken hand teammate helped Sachin earn his India cap10
‘అతడి త్యాగం.. నా సెంచరీ.. టీమిండియాకు సెలక్ట్‌ అయ్యాను’

సచిన్‌ టెండుల్కర్‌.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో శతక శతకాలు సాధించిన ధీరుడిగా అతడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. రెండున్నర దశాబ్దాల కెరీర్‌లో టీమిండియా తరఫున లెక్కకు మిక్కిలి రికార్డులు సాధించి క్రికెట్‌ గాడ్‌గా నీరాజనాలు అందుకున్నాడు సచిన్‌.అయితే, తాను టీమిండియాకు ఎంపికయ్యే క్రమంలో సహచర ఆటగాడు ఒకరు తన కోసం చేసిన త్యాగం గురించి సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) తాజాగా వెల్లడించాడు. అది 1989- 90 దేశీ క్రికెట్‌ సీజన్‌. ముంబైలోని వాంఖడే వేదికగా ఇరానీ కప్‌ మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా- ఢిల్లీ జట్లు తలపడుతున్నాయి.సచిన్‌ కోసం విరిగిన చేతితోనే బ్యాటింగ్‌రెస్టాఫ్‌ ఇండియాకు ఆడుతున్న సచిన్‌ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఇంతలో తొమ్మిదో వికెట్‌ పడింది. అప్పటికి బ్యాటింగ్‌కు రావాల్సిన ప్లేయర్‌ గాయపడ్డాడు. అతడు మరెవరో కాదు.. టీమిండియా మాజీ క్రికెటర్‌ గురుశరణ్‌ సింగ్‌ (Gursharan Singh). అతడు బ్యాటింగ్‌కు వస్తేనే సచిన్‌ తన శతక మార్కును అందుకోగలడు.సచిన్‌ కోసం విరిగిన చేతితోనే బ్యాటింగ్‌ చేసేందుకు గురుశరణ్‌ సిద్ధమయ్యాడు. అతడి సహకారంతో సచిన్‌ సెంచరీ (103) పూర్తి చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌ ద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ జట్టు తరఫున అరంగేట్రానికి బాటలు వేసుకున్నాడు.అతడి త్యాగం.. నా సెంచరీనాటి ఈ ఘటన గురించి సచిన్‌ టెండుల్కర్‌ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ‘‘1989లో నేను ఇరానీ ట్రోఫీ ఆడుతున్న సమయం. టీమిండియా సెలక్షన్‌ కోసం ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఆ మ్యాచ్‌లో నేను 90 పరుగులు పూర్తి చేసుకుని సెంచరీ దిశగా పయనిస్తున్నా.ఇంతలో తొమ్మిదో వికెట్‌ పడింది. నేను శతకం పూర్తి చేసుకుని జట్టు పరువు పోకుండా కాపాడాలని అనుకున్నా. కానీ బ్యాటింగ్‌కు రావాల్సిన గురుశరణ్‌ చెయ్యి విరిగింది. అయినప్పటికీ.. అప్పటి సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ రాజ్‌ సింగ్‌ దుంగర్పూర్‌ .. గురుశరణ్‌ను నాకు మద్దతుగా నిలవాల్సిందిగా కోరారు.టీమిండియాకు సెలక్ట్‌ అయ్యానుఆయన మాట ప్రకారం గురుశరణ్‌ క్రీజులోకి వచ్చాడు. అతడి సాయంతో నేను సెంచరీ పూర్తి చేసుకుని.. టీమిండియాకు సెలక్ట్‌ అయ్యాను కూడా!.. ఆ తర్వాత గురుశరణ్‌ కూడా భారత జట్టుకు ఆడాడు. ఆరోజు గురుశరణ్‌ చూపిన ధైర్యం, ఔదార్యం మరువలేనివి.డ్రెసింగ్‌రూమ్‌లో నేను గురుశరణ్‌కు అందరి ముందు ధన్యవాదాలు తెలిపాను. విరిగిన చెయ్యితో బ్యాటింగ్‌ చేయడం అంత తేలికేమీ కాదు. నా సెంచరీ పూర్తైందా? లేదా? అన్నది ముఖ్యం కాదు. ఆ సమయంలో అతడు చూపిన ధైర్యం, జట్టు కోసం పడిన తాపత్రయం నా హృదయాన్ని మెలిపెట్టాయి’’ అని సచిన్‌ టెండుల్కర్‌.. గురుశరణ్‌ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు.మ్యాచ్‌ ఓడినా..కాగా నాటి ఇరానీ కప్‌ మ్యాచ్‌లో ఢిల్లీ విధించిన 554 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెస్టాఫ్‌ ఇండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. 209 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో గురుశరణ్‌ సాయంతో ఆఖరి వికెట్‌కు సచిన్‌ మరో 36 పరుగులు జోడించగలిగాడు. ఇక 245 పరుగులకు రెస్టాఫ్‌ ఇండియా ఆలౌట్‌ కాగా.. ఢిల్లీ 309 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, మ్యాచ్‌ ఓడినా.. వ్యక్తిగత ప్రదర్శన దృష్ట్యా సచిన్‌కు టీమిండియా నుంచి పిలుపు అందింది.చదవండి: టీమిండియాకు ఆల్‌రౌండర్లు కావలెను!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement