Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

There Was No Mutual Trust: Former Spinner Bold Claim why RCB Failed to Win1
‘అందుకే ఆర్సీబీ టైటిల్‌ గెలవలేదు.. ఈసారి ఆరెంజ్‌ క్యాప్‌ అతడికే’

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) ఆరంభ ఎడిషన్‌ నుంచి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టు టైటిల్‌ కోసం పోరాడుతూనే ఉంది. కానీ పదిహేడు సీజన్లుగా ఆర్సీబీ కల మాత్రం నెరవేరడం లేదు. విరాట్‌ కోహ్లి (Virat Kohli) వంటి సూపర్‌ స్టార్‌ జట్టుతో ఉండటం వల్ల భారీ స్థాయిలో క్రేజ్‌ సంపాదించగలిగింది కానీ.. ఇప్పటి వరకు ట్రోఫీని అందుకోలేకపోయింది.ఇందుకు ప్రధాన కారణం.. బెంగళూరు ఫ్రాంఛైజీ ఆటగాళ్లందరినీ సమానంగా చూడకపోవటమే అంటున్నాడు ఆ జట్టుకు ఆడిన షాబాద్‌ జకాతి. గతంలో రెండుసార్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ భారత స్పిన్నర్‌.. అనంతరం ఆర్సీబీకి కూడా ఆడాడు. 2014లో బెంగళూరు తరఫున.. కోహ్లి కెప్టెన్సీలో ఒక్క మ్యాచ్‌ ఆడిన షాదాబ్‌ జకాతి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఇది జట్టుగా ఆడాల్సిన ఆట..పదిహేడేళ్లుగా ఆర్సీబీకి టైటిల్‌ అందని ద్రాక్షగా ఉండటానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇది జట్టుగా ఆడాల్సిన ఆట. మనం ట్రోఫీలు గెలవాలని బలంగా కోరుకుంటే.. జట్టంతా ఐకమత్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది.చెన్నై జట్టు పటిష్టంగా ఉండటానికి కారణం.. టీమిండియాలోని ప్రధాన ప్లేయర్లు ఆ టీమ్‌తో కొనసాగడం. అంతేకాదు.. ఆ జట్టులోని విదేశీ క్రికెటర్లు కూడా అంకితభావంతో ఆడతారు. ఒక జట్టు విజయవంతం కావాలంటే.. కూర్పు సరిగ్గా ఉండాలి. నేను ఆర్సీబీకి ఆడుతున్నపుడు.. ఆ ఫ్రాంఛైజీ కేవలం ఇద్దరు- ముగ్గురు ఆటగాళ్లపై మాత్రమే దృష్టి సారించేది.నమ్మకం, సహోదర భావం లేదుయాజమాన్యం, డ్రెసింగ్‌రూమ్‌ వాతావరణానికి పొంతనే ఉండేది కాదు. నిజానికి ఆ జట్టులో మంచి మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ.. వారి మధ్య పరస్పర నమ్మకం, సహోదర భావం లోపించినట్లు అనిపిస్తుంది. సీఎస్‌కేలో మాదిరి ఆర్సీబీ ఆటగాళ్లు ఒకరితో ఒకరు మమేకం కాలేదనేది నా భావన’’ అని జకాతి స్పోర్ట్స్‌కీడాతో పేర్కొన్నాడు.గెలిచేది ఆ జట్టేఇక ఈసారి ప్లే ఆఫ్స్‌ చేరే జట్లపై తన అంచనా తెలియజేస్తూ.. ‘‘కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఈసారి కూడా క్వాలిఫై అవుతుంది. చెన్నై కూడా బలంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్లతో పాటు గుజరాత్‌ కూడా టాప్‌-4లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.అయితే, నాలుగో జట్టుగా లక్నో ఉంటుందా? లేదా ఢిల్లీ వస్తుందా? అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేను. ఈసారి ఢిల్లీ జట్టు బాగుంది. కాబట్టి ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ చేరినా ఆశ్చర్యం లేదు.అంతేకాదు.. ఢిల్లీ ఈసారి టైటిల్‌ గెలుస్తుందని నాకు అనిపిస్తోంది’’ అని షాదాబ్‌ జకాతి వెల్లడించాడు. ఇక ఆర్సీబీ ఈసారి ప్లే ఆఫ్స్‌ చేరే సూచనలు కనిపించడం లేదన్న అతడు.. విరాట్‌ కోహ్లి కోసమైనా వారు ట్రోఫీ గెలిస్తే బాగుండని పేర్కొన్నాడు.ఆరెంజ్‌ క్యాప్‌ అతడికేఇక ఈసారి కోహ్లి లేదంటే.. రోహిత్‌ శర్మ (ముంబై ఇండియన్స్‌)అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్‌ క్యాప్‌ గెలుస్తారని జకాతి అంచనా వేశాడు.ఇక పర్పుల్‌ క్యాప్‌ను పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (ముంబై ఇండియన్స్‌) దక్కించుకుంటాడని జోస్యం చెప్పాడు. స్పిన్నర్లలో కుల్దీప్‌ యాదవ్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌), యజువేంద్ర చహల్‌ (పంజాబ్‌ కింగ్స్‌)కు ఈ అవకాశం ఉందని పేర్కొన్నాడు.చదవండి: IPL: అప్పుడు బాల్‌ బాయ్‌.. ఇప్పుడు టైటిల్‌ గెలిచిన కెప్టెన్‌!.. హ్యాట్సాఫ్‌

Bangladesh To Tour Pakistan In May For White-Ball Series After PSL2
Pak vs Ban: పాకిస్తాన్‌ పర్యటనకు బంగ్లాదేశ్‌ జట్టు.. ఈసారి..

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉంది. కివీస్‌ జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు అక్కడకు వెళ్లింది. తొలి రెండు టీ20లలో ఓటమి పాలైన సల్మాన్‌ ఆఘా బృందం తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటోంది. మరోవైపు.. ఈ టూర్‌ ముగిసిన తర్వాత పాక్‌ క్రికెటర్లు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌తో బిజీ కానున్నారు.అనంతరం.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో పాక్‌ జట్టు సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడనుంది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్‌లో పర్యటించేందుకు సిద్ధమైంది. ఈ టూర్‌ (Bangladesh Tour Of Pakistan) లో భాగంగా పాక్‌- బంగ్లా జట్ల మధ్య 3 టీ20లు, 3 వన్డేలు జరుగుతాయి. ఏప్రిల్‌ 11 నుంచి మే 18 వరకు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) 10వ సీజన్‌ జరగనుండగా... ఇది ముగిసిన అనంతరం బంగ్లాదేశ్‌తో పాక్‌ జట్టు మ్యాచ్‌లు ఆడనుంది.ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలోనే విడుదల కానుంది. లాహోర్ (Lahore), ముల్తాన్ (Multan), ఫైసలాబాద్‌లో ఈ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల చాంపియన్స్‌ ట్రోఫీ టోర్నమెంట్‌ సందర్భంగా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ పాకిస్తాన్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడితో చర్చించిన.. అనంతరం ఇరు దేశాల బోర్డులు ఈ సిరీస్‌లకు పచ్చజెండా ఊపాయి. ద్వైపాక్షిక సిరీస్‌ కోసం చివరిసారిగా గతేడాది పాకిస్తాన్‌లో పర్యటించిన బంగ్లాదేశ్‌ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2–0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది.ఇదిలా ఉంటే.. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు.. బంగ్లాదేశ్‌ కూడా ఘోర ఓటములు చవిచూసింది. గ్రూప్‌-ఎలో టీమిండియా, న్యూజిలాండ్‌తో కలిసి ఉన్న ఈ ఆసియా జట్లు.. ఈ రెండు టీమ్‌ల చేతిలో చిత్తుగా ఓడాయి. అనంతరం పాక్‌- బంగ్లా మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉండగా వర్షం అడ్డుపడటంతో టాస్‌ పడకుండానే రద్దైపోయింది. దీంతో చెరో పాయింట్‌తో పాకిస్తాన్‌ బంగ్లాదేశ్‌ ఈ వన్డే టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించాయి.ఇక గ్రూప్‌-బి నుంచి చాంపియన్స్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌ తలపడ్డాయి. ఇందులో సౌతాఫ్రికా సెమీస్‌ చేరి.. అక్కడ కివీస్‌ చేతిలో ఓడి ఇంటిబాటపట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ఫైనల్లో రోహిత్‌ సేన జయకేతనం ఎగురువేసింది. ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా చాంపియన్‌గా అవతరించింది. చదవండి: వెంటిలేటర్‌పై పాక్‌ క్రికెట్‌

IPL 2025: Who is Costliest And Cheapest Skipper Check All Captains Salaries3
కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) పద్దెమినిదవ ఎడిషన్‌ ఆరంభానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో శనివారం (మార్చి 22) ఐపీఎల్‌-2025కి తెరలేవనుంది. ఇక ఈ సీజన్‌కు ముందు మెగా వేలం జరగడంతో జట్లలో చాలా మార్పులే చోటుచేసుకున్నాయి.చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తప్ప.. మిగిలిన ఐదు జట్లు తమ కెప్టెన్లను కూడా మార్చేశాయి. లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) కోసం రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు ఖర్చు చేసి.. అతడిని తమ సారథిగా నియమించుకుంది.మరోవైపు.. పంజాబ్‌ కింగ్స్‌ కూడా ఈసారి కెప్టెన్‌ కోసం భారీగానే ఖర్చుపెట్టింది. భారత జట్టు మిడిలార్డర్‌ స్టార్‌, ఐపీఎల్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)ను రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లుగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మరి మిగిలిన జట్ల కెప్టెన్లు, వారి జీతాలు ఈసారి ఎలా ఉన్నాయో చూద్దామా?కోల్‌కతా నైట్‌ రైడర్స్‌2012, 2014 2024లో చాంపియన్‌గా నిలిచిన జట్టు. గతేడాది తమకు ట్రోఫీ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ను వదులుకున్న కేకేఆర్‌.. ఈసారి అనూహ్య రీతిలో ఓ వెటరన్‌ ప్లేయర్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది.మెగా వేలం-2025లో తొలి రౌండ్‌లో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అజింక్య రహానేను రూ. 1.5 కోట్లకు కొని.. పగ్గాలు అప్పగించింది. అతడికి డిప్యూటీగా యువ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌కు బాధ్యతలు ఇచ్చింది. ఐపీఎల్‌-2025 కెప్టెన్లలో అతి తక్కువ జీతం అందుకున్న కెప్టెన్‌ రహానేనే కావడం గమనార్హం. అన్నట్లు వెంకటేశ్‌ అయ్యర్‌ జీతం రూ.23.75 కోట్లు.సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ ఈసారీ తమ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా సారథి ప్యాట్‌ కమిన్స్‌ను కొనసాగించింది. అయితే, గతేడాది అతడికి రూ. 20.50 కోట్ల మేర ముట్టజెప్పిన ఫ్రాంఛైజీ.. ఈసారి రూ. 18 కోట్లకు రిటైన్‌ చేసుకోవడం గమనార్హం.రాజస్తాన్‌ రాయల్స్‌ఐపీఎల్‌ తొట్టతొలి విజేతగా చరిత్ర సృష్టించిన రాజస్తాన్‌ రాయల్స్‌ గత కొన్నేళ్లుగా టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ సామ్సన్‌ను తమ కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. ఈసారి కూడా ‘పింక్‌’ జట్టును సంజూ ముందుండి నడిపించనున్నాడు. ఇందుకోసం రూ. 18 కోట్ల జీతం అందుకుంటున్నాడు.చెన్నై సూపర్‌ కింగ్స్‌మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్సీలో ఏకంగా ఐదు ట్రోఫీలు గెలిచిన చెన్నై.. గతేడాది నుంచి రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యంలో ఆడుతోంది. ఈసారీ అతడినే కెప్టెన్‌గా కొనసాగించిన సీఎస్‌కే.. ఇందుకోసం అతడిని రూ. 18 కోట్లకు రిటైన్‌ చేసుకుంది.ఢిల్లీ క్యాపిటల్స్‌ఈసారి కెప్టెన్‌ను మార్చిన ఫ్రాంఛైజీల జాబితాలో ఢిల్లీ ఒకటి. గతేడాది రిషభ్‌ పంత్‌ కెప్టెన్సీలో ఆడిన ఢిల్లీ.. ఈసారి టీమిండియా వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. ఇందుకోసం తమ కెప్టెన్‌కు రూ. 16.50 కోట్ల మేర చెల్లిస్తోంది.గుజరాత్‌ టైటాన్స్‌అరంగేట్ర సీజన్‌లో తమకు టైటిల్‌ అందించిన హార్దిక్‌ పాండ్యా జట్టును వీడిన తర్వాత.. అంటే గతేడాది టీమిండియా నయా సూపర్‌ స్టార్‌ శుబ్‌మన్‌ గిల్‌కు పగ్గాలు అప్పగించింది. వేలానికి ముందు గిల్‌ను రూ. 16.5 కోట్లకు రిటైన్‌ చేసుకున్న గుజరాత్‌ ఈసారీ అతడినే సారథిగా కొనసాగిస్తోంది.ముంబై ఇండియన్స్‌ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్‌ శర్మను కాదని.. గతేడాది హార్దిక్‌ పాండ్యాను ఏరికోరి కెప్టెన్‌ను చేసిన ముంబై ఘోర పరాభవం చవిచూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారీ అతడికి మరో అవకాశం ఇచ్చిన అంబానీల యాజమాన్యంలోని ముంబై... పాండ్యాను రూ. 16.35 కోట్లకు రిటైన్‌ చేసుకుంది.రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుఎంత క్రేజ్‌ ఉన్నా ఒక్క టైటిల్‌ కూడా గెలవని జట్టుగా పేరొందిన ఆర్సీబీ.. ఈసారి ఊహించని రీతిలో రజత్‌ పాటిదార్‌ను సారథిగా నియమించింది. విరాట్‌ కోహ్లి మరోసారి పగ్గాలు చేపడతాడనే ప్రచారం జరిగగా.. బెంగళూరు ఫ్రాంఛైజీ ప్రకటనతో అది జరగదని తేలింది. అన్నట్లు వేలానికి ముందు రూ. 11 కోట్లకు పాటిదార్‌ను ఆర్సీబీ రిటైన్‌ చేసుకుంది. ఐపీఎల్‌-2025 కెప్టెన్లలో రహానే తర్వాత తక్కువ జీతం ఆర్సీబీ సారథికే!చదవండి: వాళ్లను చూస్తేనే చిరాకు.. బుమ్రా, రబడ మాత్రం వేరు: డేల్‌ స్టెయిన్‌

This IPL Captain Was A Ball Boy During 2008 Season Reveals Chat With NZ Great4
IPL: వారెవ్వా..! అప్పుడు బాల్‌ బాయ్‌.. ఇప్పుడు టైటిల్‌ గెలిచిన కెప్టెన్‌!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో ఒకప్పుడు బాల్‌ బాయ్‌గా ఉన్న పిల్లాడు.. కెప్టెన్‌ స్థాయికి ఎదిగాడు. అంతేనా.. టైటిల్‌ గెలిచిన మొనగాడు కూడా అతడు!.. అంతేకాదండోయ్‌.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడు కూడా! ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది.. అవును.. శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer).సారథిగా సూపర్‌ హిట్‌ఇటీవల ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో భారత్‌ ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించిన శ్రేయస్‌.. ప్రస్తుతం ఐపీఎల్‌-2025 సన్నాహకాల్లో మునిగిపోయాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథిగా జట్టును ఫైనల్‌ వరకు చేర్చిన ఈ ముంబైకర్‌.. గతేడాది కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపాడు. గౌతం గంభీర్‌ తర్వాత కోల్‌కతాకు ట్రోఫీ అందించిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు.అయితే, మెగా వేలానికి ముందు శ్రేయస్‌ అయ్యర్‌ కేకేఆర్‌తో తెగదెంపులు చేసుకోగా.. పంజాబ్‌ కింగ్స్‌ అతడిని ఏకంగా రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసి.. పగ్గాలు అప్పగించింది. పంజాబ్‌ టైటిల్‌ కలను తీర్చాలని గత ప్రదర్శనను పునరావృతం చేస్తూ ఈసారి పంజాబ్‌ టైటిల్‌ కలను ఎలాగైనా తీర్చాలని శ్రేయస్‌ పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జియోహాట్‌స్టార్‌తో ముచ్చటించిన ఈ కెప్టెన్‌ సాబ్‌ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.అప్పుడు బాల్‌ బాయ్‌ని‘‘మా వీధిలో క్రికెట్‌ ఆడుతూ ఎంజాయ్‌ చేసేవాళ్లం. అప్పట్లో (2008) నేను ముంబై అండర్‌-14 జట్టుకు ఆడుతున్నాడు. ముంబై జట్టులో ఉన్న పిల్లలందరినీ ఐపీఎల్‌లో బాల్‌ బాయ్స్‌గా తీసుకువెళ్లారు.నేను కాస్త బిడియస్తుడిని. ఎవరితోనూ ఎక్కువగా కలవను. అయినా సరే.. అదృష్టవశాత్తూ వారిలో ఒకడిగా నాకూ అవకాశం దక్కింది. అప్పట్లో నా ఫేవరెట్‌ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌ను దగ్గరగా చూడాలని అనుకునేవాడిని.సర్‌.. నేను మీకు వీరాభిమానినిఅనుకోకుండా ఆరోజు అవకాశం వచ్చింది. ఆయన దగ్గరకు వెళ్లి.. ‘సర్‌.. నేను మీకు వీరాభిమానిని’ అని చెప్పాను. ఆయన నా మాటలకు నవ్వులు చిందించడంతో పాటు థాంక్యూ కూడా చెప్పారు. అలా మన అభిమాన క్రికెటర్లను కలిసినపుడు గ్లోవ్స్‌ లేదంటే బ్యాట్‌ అడగటం పరిపాటి. నాకూ ఆయనను బ్యాట్‌ అడగాలని అనిపించినా సిగ్గు అడ్డొచ్చింది.ఓ మ్యాచ్‌లో ఇర్ఫాన్‌ పఠాన్‌ లాంగాన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన మా పక్కకు వచ్చి కూర్చుని.. మ్యాచ్‌ ఆస్వాదిస్తున్నారా అని అడిగారు. అవును.. మేము బాగా ఎంజాయ్‌ చేస్తున్నాం అని చెప్పాను. అప్పట్లో ఇర్ఫాన్‌ భాయ్‌ క్రేజ్‌ తారస్థాయిలో ఉండేది. పంజాబ్‌ జట్టులోని అందగాళ్లలో ఆయనా ఒకరు. యువీ పాను కూడా అప్పుడు దగ్గరగా చూశాం. ఈ జ్ఞాపకాలు నా మనసులో ఎల్లప్పుడూ నిలిచిపోతాయి’’ అని శ్రేయస్‌ అయ్యర్‌ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.2015లో ఎంట్రీకాగా ఐపీఎల్‌ తొలి సీజన్‌ 2008లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ సందర్భంగా తాను రాస్‌ టేలర్‌ (RCB)ని తొలిసారి కలిసినట్లు అయ్యర్‌ వెల్లడించాడు. కాగా శ్రేయస్‌ అయ్యర్‌ 2015లో ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. నాటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌) తరఫున తన తొలి మ్యాచ్‌ ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 115 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.మొత్తంగా 3127 పరుగులు సాధించడంతో పాటు కెప్టెన్‌గా టైటిల్‌ సాధించాడు. ప్రస్తుతం పంజాబ్‌ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ మార్చి 25న గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌తో తాజా సీజన్‌ను మొదలుపెట్టనున్నాడు.చదవండి: వాళ్లను చూస్తేనే చిరాకు.. బుమ్రా, రబడ మాత్రం వేరు: డేల్‌ స్టెయిన్‌

Pakistan Origin Cricketer Collapses On Field While Playing Dies: Report5
బ్యాటింగ్‌ చేస్తూ కుప్పకూలిన పాకిస్తానీ క్రికెటర్‌.. తీవ్ర విషాదం

ఆస్ట్రేలియా క్రికెట్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పాకిస్తాన్‌కు చెందిన క్లబ్‌ లెవల్‌ క్రికెటర్‌ జునైల్‌ జఫార్‌ ఖాన్‌ (Junail Zafar Khan) దుర్మరణం పాలయ్యాడు. మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో మైదానంలో కుప్పకూలిన అతడు.. అక్కడే ప్రాణాలు విడిచాడు. ఎండ వేడిమి తట్టుకోలేకే జఫార్‌ ఖాన్‌ మరణించినట్లు తెలుస్తోంది.ఆలస్యంగా వెలుగులోకికాగా నలభై ఏళ్ల జఫార్‌ ఖాన్‌కు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. అందుకే వయసు పైబడుతున్నా లెక్కచేయక క్లబ్‌ స్థాయిలో మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఓల్డ్‌ కాంకొర్డియన్స్‌ క్రికెట్‌ క్లబ్‌కు ప్రాతినిథ్య వహిస్తున్న అతడు.. గత శనివారం ప్రిన్స్‌ అల్‌ఫ్రెడ్‌ ఓల్డ్‌ కాలేజియన్స్‌తో మ్యాచ్‌లో పాల్గొన్నాడు.నలభై ఓవర్ల పాటు ఫీల్డింగ్‌ చేసిన జఫార్‌ ఖాన్‌.. ఏడు ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేశాడు. పదహారు పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద ఉన్న వేళ అతడు కిందపడిపోయాడు. ఆస్ట్రేలియా సెంట్రల్‌ డే లైట్‌ టైమ్‌ ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు మైదానంలో కుప్పకూలిపోయాడు. తీవ్ర విషాదంలో మునిగిపోయాంఈ విషాదకర ఘటనపై ఓల్డ్‌ కాంకొర్డియన్స్‌ క్రికెట్‌ క్లబ్‌ స్పందించింది. ‘‘మా క్లబ్‌కు చెందిన విలువైన ఆటగాడు అకస్మాత్తుగా లోకాన్ని విడిచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ ఘటనతో మేము తీవ్ర విషాదంలో మునిగిపోయాం. మ్యాచ్‌ ఆడుతున్న సమయంలోనే మా క్లబ్‌ సభ్యుడు మృతి చెందడం మమ్మల్ని కలచివేస్తోంది.అతడికి చికిత్స అందించేందుకు వైద్య బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అతడి కుటుంబానికి, సహచర ఆటగాళ్లు, స్నేహితులకు మా ‍ప్రగాఢ సానుభూతి ’’ అని సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.అడిలైడ్‌లో ఉద్యోగం?కాగా 2013లో వరకు పాకిస్తాన్‌లోనే ఉన్న జఫార్‌ ఖాన్‌.. ఐటీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకునే క్రమంలో ఆస్ట్రేలియాకు మకాం మార్చినట్లు సమాచారం. అడిలైడ్‌లో ఉద్యోగం చేస్తున్న అతడు క్లబ్‌ క్రికెట్‌ కూడా ఆడుతూ.. దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. కాగా దక్షిణ ఆస్ట్రేలియాలో ఎండలు మండిపోతున్నాయి.గరిష్టంగా 40కి పైగా డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ప్రజలంతగా అప్రమత్తంగా ఉండాలని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అడిలైడ్‌ టర్ఫ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కీలక ప్రకటన విడుదల చేసింది. 42 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఉష్ణోగ్రత మించినట్లయితే..మ్యాచ్‌లు రద్దు చేస్తామని పేర్కొంది.చదవండి: వెంటిలేటర్‌పై పాక్‌ క్రికెట్‌

I Pull My Hair Out: Steyn Huge Criticism Of Fast Bowlers Namedrops Bumrah6
వాళ్లను చూస్తేనే చిరాకు.. అసలేం చేస్తున్నార్రా బాబూ!: డేల్‌ స్టెయిన్‌ ఫైర్‌

నవతరం ఫాస్ట్‌ బౌలర్ల తీరుపై సౌతాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ (Dale Steyn) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్‌ చేయడంలో దారుణంగా విఫలమవుతున్నారని.. ఒత్తిడిలో చిత్తైపోయి పరుగులు సమర్పించుకుంటున్నారని విమర్శించాడు. కనీసం ఒక్కసారి కూడా ఫీల్డింగ్‌ మార్చకుండానే ఓవర్‌ పూర్తి చేస్తున్నారని.. ఇదంతా చూస్తే తనకు చిర్రెత్తుకొస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.అయితే, టీమిండియా పేస్‌ గుర్రం జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah), సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్‌ కగిసో రబడ (Kagiso Rabada) మాత్రం ఇందుకు మినహాయింపు అని స్టెయిన్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోలో నేటి తరం ఫాస్ట్‌ బౌలర్ల గురించి మాట్లాడుతూ.. ‘‘ఈరోజుల్లో అంతర్జాతీయ స్థాయి పేసర్ల తీరు నాకు నచ్చడం లేదు.వాళ్లను చూస్తేనే చిరాకు.. ఒక్కసారి కూడా ఫీల్డ్‌ మార్చకుండానే ఓవర్‌ పూర్తి చేసేసి వెళ్తున్నారు. పదేళ్లుగా కెరీర్‌ కొనసాగిస్తున్న వారు కూడా తమకేమీ పట్టదన్నట్లుగా చేతులు దులిపేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను చూసినపుడు నాకైతే జట్టు పీక్కోవాలనిపిస్తుంది. చిరాకు వస్తుంది. ఇంతకంటే గొప్ప బౌలర్లను మనం చూడలేమా? అని నా మనసు ఆవేదన చెందుతుంది’’ అని డేల్‌ స్టెయిన్‌ చెప్పుకొచ్చాడు.బుమ్రా, రబడ మాత్రం వేరుఅదే విధంగా.. ‘‘బుమ్రా మాత్రం ఇందుకు అతీతం. అతడు పరిపూర్ణమైన ప్యాకేజ్‌లాంటివాడు. కగిసో రబడ కూడా బుమ్రా మాదిరే పర్ఫెక్ట్‌. వాళ్లిద్దరు ఎలాంటి సమయంలోనైనా బౌలింగ్‌ చేయగలగరు. వికెట్లూ పడగొట్టగలరు. నిజంగా వాళ్లిద్దరు బంగారం. కెప్టెన్‌కు సగం పని తగ్గించేస్తారు.ఇలాంటి వారి సంఖ్య పెరిగితేనే.. ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగం మరింత పటిష్టంగా ఉంటుంది. గంటకు 155 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్‌ చేశారా? లేదా? అన్నది ముఖ్యం కాదు. మనలో పది రకాల నైపుణ్యాలు ఉండవచ్చు. కానీ సరైన సమయంలో.. సరైన విధంగా స్పందించి కెప్టెన్‌ చెప్పిన పని పూర్తి చేస్తేనే దేనికైనా విలువ’’ అని స్టెయిన్‌ పేర్కొన్నాడు.70 శాతం మంది బౌలర్ల తీరు అలాగేఇక ఇదే షోలో స్టెయిన్‌తో గొంతు కలిపిన న్యూజిలాండ్‌ పేస్‌ దిగ్గజం షేన్‌ బాండ్‌.. ‘‘ఈరోజుల్లో 70 శాతం మంది బౌలర్లకు అసలు తామేం చేస్తున్నామో అన్న స్పృహ ఉండటం లేదు. కెప్టెన్లు మరింత చొరవ తీసుకోవాలి. వారి నుంచి ఎలాంటి ప్రదర్శన కోరుకుంటాన్నారో కచ్చితంగా చెప్పాలి. ఫీల్డింగ్‌ సెట్‌ చేసే విషయంలోనూ నిక్కచ్చిగా వ్యవహరించాలి’’ అని అభిప్రాయపడ్డాడు. బుమ్రా రీఎంట్రీ ఎప్పుడో?కాగా ఇటీవల జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి వెన్నునొప్పి కారణంగా బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. అయితే, ప్రధాన పేసర్‌ లేకుండానే టీమిండియా ఈ మెగా వన్డే టోర్నీలో విజేతగా అవతరించింది. స్పిన్‌కు అనుకూలించే దుబాయ్‌ పిచ్‌పై అజేయ రికార్డుతో ట్రోఫీని ముద్దాడింది. ఇక బుమ్రా ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియన్స్‌ ఆరంభ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు.. రబడ చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడాడు. ఈ ఈవెంట్లో సౌతాఫ్రికా న్యూజిలాండ్‌ చేతిలో ఓడి సెమీస్‌లోనే ఇంటిబాటపట్టింది.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్‌ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్‌: కోహ్లి

Shashank Singh unfiltered advice to Prithvi Shaw7
పృథ్వీ షా మారతాడా..?

ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలంటారు మన పెద్దలు. విజయగర్వం తలకెక్కితే పతనం తప్పదు. ఏ రంగానికైనా ఈ మాటలు వర్తిస్తాయి. ముఖ్యంగా క్రీడారంగంలో చాలా మంది ప్లేయర్లు తలపొగరుతో కెరీర్‌ ఆరంభంలోనే తెరమరుగయ్యారు. ఎంతో ప్రతిభావంతుడైన వినోద్‌ కాంబ్లీ వివాదాలతో క్రికెట్‌కు దూరమయ్యాడు. తాజాగా మరో టీమిండియా (Team India) యువ క్రికెటర్‌ కూడా ఇదే దారిలో ప్రయనిస్తున్నాడు. ఇప్పటికైనా మేలుకోకుంటే అతడి కెరీర్‌కు ముప్పు తప్పదని సహచరుడొకరు సున్నితంగా హెచ్చరించాడు.యువ క్రికెటర్‌ పృథ్వీ షా (Prithvi Shaw) గురించి క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిన్న వయసులోనే పవర్‌ఫుల్‌ బ్యాటింగ్‌తో అందరి ఆకట్టుకున్నాడు. అతడి నాయకత్వంలో యువ టీమిండియా 2018లో అండర్‌-19 వరల్డ్‌కప్‌ సాధించింది. అదే ఏడాది జాతీయ జట్టు తరపున అరంగ్రేటం చేసిన ఈ యువ సంచలనం.. సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar) తర్వాత చిన్న వయసులో టెస్టు సెంచరీ సాధించిన రికార్డు కొట్టాడు. దీంతో అతడిని అందరూ సచిన్‌తో పోల్చడం మొదలు పెట్టారు. అటు ఐపీఎల్‌లోనూ అదరగొట్టడంతో మనోడి పేరు మార్మోగిపోయింది.శశాం​క్‌ సింగ్‌ కీల​క వ్యాఖ్యలుఆటగాళ్ల జీవితాల్లో ఉ‍త్థానపతనాలు సహజం. అయితే పృథ్వీ షా మాత్రం చేజేతులారా తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్‌నెస్‌ లేమితో తన ఉనికినే ప్రశ్నార్థకం చేసుకున్నాడు. జాతీయ జట్టులో స్థానం కోల్పోడంతో పాటు రంజీల్లోనూ అతడికి చోటు కరువైంది. ఐపీఎల్‌లోనూ అతడికి తీసుకునేందుకు ఏ జట్టు ముందుకు రాలేదంటే మనోడి పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో పృథ్వీ షా గురించి అతడి బాల్యస్నేహితుడు, పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్‌ శశాం​క్‌ సింగ్‌ (Shashank Singh) కీల​క వ్యాఖ్యలు చేశాడు.తక్కువగా అంచనా వేయొద్దుమళ్లీ గాడిలో పడే సత్తా పృథ్వీ షాకు ఉందని, దీని కోసం అతడు కొన్ని పద్ధతులు మార్చుకోవాలని శశాం​క్‌ సూచించాడు. శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో శశాంక్ మాట్లాడుతూ.. ‘పృథ్వీ షాను తక్కువగా అంచనా వేస్తున్నారు. అతడు మళ్లీ మూలాల్లోకి వెళితే పూర్వ వైభవాన్ని పొందగలడు. పృథ్వీ షా నాకు 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు, అతడితో కలిసి బొంబాయిలో క్లబ్ క్రికెట్ ఆడాను. పృథ్వీ షాలో ఏముందని మీరు నన్ను అడిగితే, అతడికి కొన్ని విషయాలపై భిన్నమైన దృక్పథం ఉంది. అయితే తన జీవనశైలిని కొంచెం మార్చుకుంటే మళ్లీ గాడిలో పడతాడు. రాత్రి 11 గంటలకు బదులుగా రాత్రి 10 గంటలకు నిద్రపోతే మంచింది. అలాగే ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటే బాగుటుంది. ఈ మార్పులను అంగీకరించి, ఆచరిస్తే భారత క్రికెట్‌కు మంచి జరుగుతుంది. బహుశా అతడు ఇప్పటికే తన వెంట ఉన్న మంచి వ్యక్తులు చెప్పిన సలహాలను పాటిస్తుండొచ్చు. అతడికి నేను సలహా ఇవ్వాల్సిన అవసరం లేద’ని చెప్పాడు.చ‌ద‌వండి: అక్ష‌ర్ ప‌టేల్ ఐపీఎల్ క‌ప్ కొడ‌తాడా?ఏకంగా రూ. 5.5 కోట్లు!కాగా, పృథ్వీ షా ఇటీవల డీవై పాటిల్ టీ20-2025 టోర్నమెంట్‌లో 'రూట్ మొబైల్' జట్టుకు నాయకత్వం వహించాడు. గతేగాది సౌదీ అరేబియాలో నిర్వహించిన ఐపీఎల్‌ మెగా వేలంలో రూ. 75 లక్షల కనీస ధరకు అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేయలేదు. 2018లో అతడిని కోటీ 20 లక్షలకు వేలంలో దక్కించుకున్న ఢిల్లీ ఫ్రాంచైజీ.. నిరుడు అతడిని వదిలించుకుంది. మరోవైపు శశాం​క్‌ సింగ్‌ గత ఐపీఎల్‌లో సత్తా చాటడంతో పంజాబ్‌ కింగ్స్‌ అతడిని అట్టేపెట్టుకుంది. ఇందుకోసం ఏకంగా రూ. 5.5 కోట్లు వెచ్చించింది.

Pakistan Cricket On Ventilator In Last Two Years8
వెంటిలేటర్‌పై పాక్‌ క్రికెట్‌

అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు పరిస్థితి నానాటికి దిగజారుతుంది. ఓ సారి వన్డే వరల్డ్‌కప్‌ (1996), ఓ సారి టీ20 వరల్డ్‌కప్‌ (2009), ఓ సారి ఛాంపియన్స్‌ ట్రోఫీ (2017) గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం పసికూనలపై గెలిచేందుకు కూడా నానా తంటాలు పడుతుంది. గడిచిన రెండేళ్లలో పాక్‌ క్రికెట్‌ జట్టు అదఃపాతాళానికి పడిపోయింది. ఆ జట్టు పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్న రోగిలా తయారైంది. యూఎస్‌ఏ, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ లాంటి చిన్న జట్లు సైతం పాక్‌ను మట్టికరిపిస్తున్నాయి. స్వదేశంలో కూడా ఆ జట్టు మ్యాచ్‌లు గెలవలేకపోతుంది. సొంతగడ్డపై జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేక గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా పాల్గొన్న ట్రై సిరీస్‌లోనూ పరాజయంపాలైంది. తాజాగా పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న ఆ జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. ప్రక్షాళన పేరుతో సీనియర్లను పక్కన పెట్టిన పాక్‌ సెలెక్టర్లు ప్రస్తుతం వస్తున్న ఫలితాలతో నైరాశ్యంలో మునిగిపోయారు. ఇక ఏం చేసినా తమ జట్టు పరిస్థితి బాగుపడదని అనుకుంటున్నారు. భారత్‌లో గల్లీ క్రికెట్‌ ఆడే జట్లు సైతం పాక్‌ను ఓడించే పరిస్థితులు ఉన్నాయి. న్యూజిలాండ్‌ పర్యటనకు ముందు పూర్వవైభవం సాధిస్తామని ప్రగల్భాలు పలికిన పీసీబీ.. ప్రస్తుతం వస్తున్న ఫలితాలతో నోరు మెదపకుండా ఉంది. సీనియర్లు బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ అన్నా ఉంటే కనీసం ఈ ఘోర పరాజయాల గోస తప్పేదని అనుకుంటున్నారు. న్యూజిలాండ్‌ పర్యటనలో పాక్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడింది. తొలి మ్యాచ్‌లో కనీసం 100 పరుగులు కూడా చేయలేకపోయిన పాక్‌ బ్యాటర్లు.. ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో మ్యాచ్‌లో ముక్కీ మూలిగి 135 పరుగులు చేశారు. అయినా న్యూజిలాండ్‌ బ్యాటర్లు విధ్వంసం సృష్టించి పాక్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఊదేశారు. ఈ మ్యాచ్‌లో పాక్‌ బౌలర్లు గల్లీ బౌలర్లను తలపించారు. వరల్డ్‌ క్లాస్‌ బౌలర్‌ అని చెప్పుకునే షాహీన్‌ అఫ్రిదికి న్యూజిలాండ్‌ బ్యాటర్‌ టిమ్‌ సీఫర్ట్‌ చుక్కలు చూపించాడు. ఓ ఓవర్‌లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాది పక్కకు కూర్చోబెట్టాడు. మరో పేసర్‌ మొహమ్మద్‌ ఆలీని ఫిన్‌ అలెన్‌ వాయించాడు. ఆలీ వేసిన ఓ ఓవర్‌లో అలెన్‌ మూడు సిక్సర్లు కొట్టాడు. వాస్తవానికి ఈ సిరీస్‌ కోసం క్రికెట్‌ న్యూజిలాండ్‌ ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడిన సీనియర్లు ఐపీఎల్‌ కోసం భారత్‌కు పయనమయ్యారు. 'ఏ' జట్టుతోనే పాక్‌ పరిస్థితి ఇలా ఉంటే, సీనియర్లు ఉన్న జట్టు ఎదురైనప్పుడు పాక్‌ పరిస్థితి తలచుకుంటే జాలేస్తుంది. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో పాక్‌ క్రికెట్‌ను ఆదుకునే ఆపద్భాంధవుడెవరో చూడాలి.2023 నుంచి పాక్‌ క్రికెట్‌ జట్టు పరిస్థితిఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో టీ20 సిరీస్‌ ఓటమివన్డే ప్రపంచ కప్-2023లో ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో ఘోర పరాజయం2023 వన్డే ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమణస్వదేశంలో బంగ్లాదేశ్‌ చేతిలో టెస్ట్‌ సిరీస్‌ ఓటమిఐర్లాండ్‌ చేతిలో టీ20 మ్యాచ్‌లో షాకింగ్‌ ఓటమి2024 టీ20 ప్రపంచ కప్‌లో యూఎస్‌ఏ చేతిలో ఊహించని పరాభవం2024 టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమణజింబాబ్వే చేతిలో వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో ఓటమి2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలోనే నిష్క్రమణగత 16 టీ20ల్లో పాక్‌ కేవలం 4 మ్యాచ​్‌ల్లో మాత్రమే గెలిచింది. అది కూడా జింబాబ్వే, ఐర్లాండ్‌, కెనడాపై

Shaheen Afridi Equals Pakistans Unwanted Bowling Record During 2nd T20I Against New Zealand9
Video: అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్‌ బ్యాటర్‌.. సిక్సర్ల వర్షం​

డునెడిన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో టీ20లో పాక్‌ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిదికి న్యూజిలాండ్‌ ఓపెనర్‌ టిమ్‌ సీఫర్ట్‌ చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు సహా 26 పరుగులు పిండుకున్నాడు. తద్వారా అఫ్రిది పలు చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. టీ20ల్లో ఓ ఓవర్‌లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న పాక్‌ బౌలర్‌గా మొహమ్మద్‌ సమీ, ఫహీమ్‌ అష్రాఫ్‌ పేరిట ఉన్న చెత్త రికార్డును సమం చేశాడు. సమీ 2010లో ఆస్ట్రేలియాతో.. ఫహీమ్‌ 2021లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు సమర్పించుకున్నారు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది కూడా 4 సిక్సర్లు సమర్పించుకొని సమీ, ఫహీమ్‌ రికార్డును సమం చేశాడు. అఫ్రిది బౌలింగ్‌ను సీఫర్ట్‌ ఊచకోత కోసిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Seifert has 7 letters, so does Maximum 🤌Tim Seifert took Shaheen Afridi to the cleaners in his second over, smashing four sixes in it 🤯#NZvPAK pic.twitter.com/F5nFqmo7G6— FanCode (@FanCode) March 18, 2025ఒకే ఓవర్‌లో 26 పరుగులు సమర్పించుకోవడంతో అఫ్రిది మరో చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. తన టీ20 కెరీర్‌లో అత్యధిక​ పరుగులు సమర్పించుకున్న ఓవర్‌గా ఇది రికార్డుల్లోకెక్కింది. గతంలో అఫ్రిది టీ20ల్లో ఓ ఓవర్‌లో రెండు సార్లు (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై) 24 పరుగులు సమర్పించుకున్నాడు. అఫ్రిది ఈ చెత్త రికార్డులు నమోదు చేయడానికి న్యూజిలాండ్‌ బ్యాటర్‌ టిమ్‌ సీఫర్ట్‌ కారకుడు. అఫ్రిది వేసిన ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌లో సీఫర్ట్‌‌ శివాలెత్తిపోయి నాలుగు సిక్సర్లు బాదాడు. ఓ డబుల్‌ తీశాడు.ఈ మ్యాచ్‌లో సీఫర్ట్‌ మొత్తంగా 5 సిక్సర్లు, 3 బౌండరీలు బాది 22 బంతుల్లో 45 పరుగులు చేశాడు. సీఫర్ట్‌కు ముందు మొహమ్మద్‌ అలీ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో న్యూజిలాండ్‌ మరో ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ కూడా చెలరేగాడు. ఈ ఓవర్‌లో అలెన్‌ మూడు సిక్సర్లు కొట్టాడు. సీఫర్ట్‌ ఔటయ్యాక కూడా చెలరేగిన అలెన్‌ 16 బంతులు ఎదుర్కొని 5 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 38 పరుగులు చేశాడు. సీఫర్ట్‌, అలెన్‌ విధ్వంసం​ సృష్టించడంతో న్యూజిలాండ్‌ తొలి 7 ఓవర్లలో ఏకంగా 88 పరుగులు సాధించింది.వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన కెప్టెన్‌ సల్మాన్‌ అఘా టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. షాదాబ్‌ ఖాన్‌ (26), షాహీన్‌ అఫ్రిది (22 నాటౌట్‌), మహ్మద్‌ హరీస్‌ (11), ఇర్ఫాన్‌ ఖాన్‌ (11), అబ్దుల్‌ సమద్‌ (11) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో హసన్‌ నవాజ్‌ (0), ఖుష్దిల్‌ షా (2), జహన్‌దాద్‌ ఖాన్‌ (0), హరీస్‌ రౌఫ్‌ (1) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో జేకబ్‌ డఫీ, బెన్‌ సియర్స్‌, జిమ్మీ నీషమ్‌, ఐష్‌ సోధి తలో రెండు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు టిమ్‌ సీఫర్ట్‌, ఫిన్‌ అలెన్‌ చెలరేగిపోయారు. ఫలితంగా న్యూజిలాండ్‌ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సీఫర్ట్‌, అలెన్‌ ఔటయ్యాక తడబడిన న్యూజిలాండ్‌ 31 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. మార్క్‌ చాప్‌మన్‌ (1), డారిల్‌ మిచెల్‌ (15), జిమ్మీ నీషమ్‌ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ దశలో మిచెల్‌ హే (21 నాటౌట్‌), కెప్టెన్‌ బ్రేస్‌వెల్‌ (5 నాటౌట్‌) సహకారంతో న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. పాక్‌ బౌలర్లలో హరీస్‌ రౌఫ్‌ 2, మొహమ్మద్‌ అలీ, ఖుష్దిల్‌ షా, జహన్‌దాద్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్‌ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్‌ పాక్‌ను చిత్తుగా ఓడించింది. మూడో టీ20 ఆక్లాండ్‌ వేదికగా మార్చి 21న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే పాక్‌ సిరీస్‌ను కోల్పోతుంది.

New Zealand Beat Pakistan In 2ND T20I By 5 Wickets And Takes 2-0 Lead In Five Match Series10
న్యూజిలాండ్‌ ఓపెనర్ల ఊచకోత.. రెండో టీ20లోనూ చిత్తైన పాకిస్తాన్‌

5 టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న పాక్‌ క్రికెట్‌ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పాక్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన కెప్టెన్‌ సల్మాన్‌ అఘా టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. షాదాబ్‌ ఖాన్‌ (26), షాహీన్‌ అఫ్రిది (22 నాటౌట్‌), మహ్మద్‌ హరీస్‌ (11), ఇర్ఫాన్‌ ఖాన్‌ (11), అబ్దుల్‌ సమద్‌ (11) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో హసన్‌ నవాజ్‌ (0), ఖుష్దిల్‌ షా (2), జహన్‌దాద్‌ ఖాన్‌ (0), హరీస్‌ రౌఫ్‌ (1) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో జేకబ్‌ డఫీ, బెన్‌ సియర్స్‌, జిమ్మీ నీషమ్‌, ఐష్‌ సోధి తలో రెండు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు టిమ్‌ సీఫర్ట్‌ (22 బంతుల్లో 45), ఫిన్‌ అలెన్‌ (16 బంతుల్లో 32) చెలరేగిపోయారు. వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్‌ 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును తాకింది. పాక్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌లో టిమ్‌ సీఫర్ట్‌ శివాలెత్తిపోయాడు. ఈ ఓవర్‌లో సీఫర్ట్‌ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. అంతకుముందు మొహమ్మద్‌ అలీ వేసిన రెండో ఓవర్‌లో ఫిన్‌ అలెన్‌ కూడా చెలరేగాడు. ఈ ఓవర్‌లో అలెన్‌ మూడు సిక్సర్లు కొట్టాడు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉండగా మ్యాచ్‌ 10 ఓవర్లలోనే ముగిస్తుందని అంతా అనుకున్నారు. అయితే పాక్‌ బౌలర్లు ఒక్కసారిగా ఫామ్‌లోకి రావడంతో న్యూజిలాండ్‌ 31 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. మార్క్‌ చాప్‌మన్‌ (1), డారిల్‌ మిచెల్‌ (15), జిమ్మీ నీషమ్‌ (5) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. మిచెల్‌ హే (21 నాటౌట్‌), కెప్టెన్‌ బ్రేస్‌వెల్‌ (5 నాటౌట్‌) న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్‌ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్‌ బౌలర్లలో హరీస్‌ రౌఫ్‌ 2, మొహమ్మద్‌ అలీ, ఖుష్దిల్‌ షా, జహన్‌దాద్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్‌ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్‌ పాక్‌ను చిత్తుగా ఓడించింది. మూడో టీ20 ఆక్లాండ్‌ వేదికగా మార్చి 21న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే పాక్‌ సిరీస్‌ను కోల్పోతుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement