Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

India vs Pakistan match today in T20 World Cup1
అసలు సమరానికి సమయం

ఫిబ్రవరి 1...టి20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు నిరాకరించిన పాకిస్తాన్‌... ఫిబ్రవరి 5...మాకు అవన్నీ తెలీదు...మా కొలంబో ఫ్లయిట్‌ బుక్‌ అయిపోయిందన్న సూర్యకుమార్‌... ఫిబ్రవరి 9...భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు మేం సిద్ధమంటూ పాకిస్తాన్‌ ప్రభుత్వ ప్రకటన... ఫిబ్రవరి 15...భారత్, పాక్‌ మధ్య కొలంబోలో మ్యాచ్‌కు రంగం సిద్ధం...ప్రపంచకప్‌లో దాయాది జట్ల మధ్య సమరం అంటే ఏ ఫార్మాట్‌లో అయినా కనిపించే ఆసక్తి, ఉత్సాహమే వేరు...1992 నుంచి అభిమానులు ఇది చూస్తూనే వచ్చారు...ఫలితం ఎలా ఉన్నా, ఏకపక్షంగా సాగినా ఈ మ్యాచ్‌కు ఉండే ఆకర్షణ ఏమాత్రం తగ్గడం లేదు. దీనిపై సాగే సుదీర్ఘ వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్థితిలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ లేదంటే సహజంగానే పెద్ద చర్చే జరిగింది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది...కొలంబో వెళ్లే ఫ్లయిట్‌ టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుంటే హోటళ్లలో ఎంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమైనా ఖాళీ లేదనే సమాధానం వచ్చేస్తోంది. మైదానంలోనే ఉండి జట్టుకు మద్దతుగా నిలవాలనుకునే వేలాది మంది మాత్రమే కాదు...తమ ఇళ్లనుంచి కన్నార్పకుండా ప్రతీ బంతిని చూసే ఫ్యాన్స్‌ సంఖ్యకు లెక్కే లేదు. ఈ నేపథ్యంలో మరో వరల్డ్‌ కప్‌ పోరుకు ఇరు జట్లు సై అంటున్నాయి. ఇటీవల ఆసియా కప్‌లో 3–0తో పాక్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఈ సారి ఎలాంటి ప్రదర్శనతో చెలరేగుతుందో చూడాలి. కొలంబో: టి20 వరల్డ్‌ కప్‌లో మరోసారి తాడోపేడో తేల్చుకునేందుకు భారత్, పాకిస్తాన్‌ సిద్ధమయ్యాయి. 2012 నుంచి వరుసగా ప్రతీ టి20 వరల్డ్‌ కప్‌లో తలపడుతున్న ఇరు జట్లు ఈ సారి కూడా తటస్థ వేదికపై తమ సత్తాను పరీక్షించుకోనున్నాయి. ప్రేమదాస స్టేడియంలో నేడు (ఆదివారం) జరిగే గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను భారత్‌ ఎదుర్కొంటుంది. రెండు జట్లూ తమ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్నాయి. దాయాదిపై తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని అస్త్రాలతో టీమిండియా బరిలోకి దిగుతుండగా...ఇటీవలి వరుస ఓటముల తర్వాత ఈ సారైనా గెలిచి బదులు తీర్చుకోవాలని పాక్‌ భావిస్తోంది. కుల్దీప్‌కు అవకాశం... భారత బ్యాటింగ్‌ లైనప్‌కు సంబంధించి ఎలాంటి ఆందోళన లేదు. ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్, పాండ్యా, దూబే తమ దూకుడైన బ్యాటింగ్‌ను ఇప్పటికే ప్రదర్శించారు. రింకూ సింగ్‌కు తగిన అవకాశం రాకపోగా, తిలక్‌ వర్మ కూడా రెండు సార్లు 25 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే వీరిలో ఏ ఇద్దరు చెలరేగినా గత మ్యాచ్‌ తరహాలో భారీ స్కోరు ఖాయం. సుదీర్ఘ కాలం తర్వాత తన తొలి ప్రపంచ కప్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కించుకున్న సామ్సన్‌ మాత్రం విఫలమయ్యాడు. అభిషేక్‌ శర్మ అనారోగ్యంనుంచి పూర్తిగా కోలుకుంటే సామ్సన్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చేస్తాడు. అమెరికాపై డకౌట్‌ అయిన అభిషేక్‌ తన స్థాయికి తగినట్లు విజృంభిస్తే పాక్‌ బౌలర్లకు కష్టాలు తప్పవు. ఒంటిచేత్తో అతను అందించే ఆరంభం భారత్‌ భారీ స్కోరుకు పునాది అవుతుంది. బౌలింగ్‌కు సంబంధించి తుది జట్టులో కచ్చితంగా మార్పు ఉండవచ్చు. ఇక్కడి పిచ్‌ను బట్టి చూస్తే భారత్‌ మూడో రెగ్యులర్‌ స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది.ఇప్పటికీ ప్రత్యర్థి బ్యాటర్లకు ‘మిస్టరీ’గానే ఉన్న వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌లతో పాటు కుల్దీప్‌ను కూడా ఆడించాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. అర్ష్ దీప్ స్థానంలో అతను ఆడతాడు. పాండ్యా, దూబే కూడా బౌలింగ్‌ భారం పంచుకుంటారు కాబట్టి రెగ్యులర్‌ పేసర్‌గా బుమ్రాకు మాత్రమే అవకాశం ఉంది. ఇటీవలి ఫామ్, బలాబలాలను చూస్తే పాక్‌కంటే టీమిండియా ఎంతో ముందుంది. బాబర్‌ ఆజమ్‌ రాణించేనా... అమెరికాపై భారీ విజయం సాధించిన పాకిస్తాన్‌ జట్టులో ఎలాంటి మార్పులు లేకపోవచ్చు. పాక్‌ ఇప్పటికే ఇద్దరు రెగ్యులర్‌ స్పిన్నర్లు అబ్రార్, తారిఖ్‌లతో పాటు స్పిన్‌ ఆల్‌రౌండర్లు నవాజ్, షాదాబ్‌లతో ఆడుతోంది. అవసరమైతే అయూబ్‌ కూడా స్పిన్‌ బౌలింగ్‌ చేయగలడు. వీరిలో తారిఖ్‌ మినహా మిగతా బౌలర్లందరిపై భారత్‌ గతంలోనే తమ ప్రతాపం చూపించింది. కొత్త తరహా, చర్చనీయాంశమైన యాక్షన్‌తో ఆడే ఆఫ్‌స్పిన్నర్‌ తారిఖ్‌ ఏమాత్రం ప్రభావం చూపుతాడనేది ఆసక్తికరం. భారత్‌ తమ సన్నాహకాల్లో దీనిపై కూడా దృష్టి పెట్టి ఉండవచ్చు. పేసర్‌ షాహిన్‌ అఫ్రిది చాలా కాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈ సారి కూడా భారత బ్యాటర్లను నిలువరించడం అతనికి కష్టం కావచ్చు. లైనప్‌లో టాప్‌–4 మాత్రమే రెగ్యులర్‌ బ్యాటర్లు ఉన్నారు. అయూబ్, కెప్టెన్‌ ఆగా ఆసియా కప్‌లో భారత్‌పై వరుసగా విఫలమవగా, ఫర్హాన్‌ ఒక్కడే రాణించాడు. కెప్టెన్ అయిన తర్వాత సల్మాన్‌ ఇప్పటి వరకు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తమ జట్టుకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా స్టార్‌ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బాబర్‌ ఆజమ్‌ ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడి చాలా కాలమైంది. అతను తన సత్తాను ప్రదర్శించేందుకు ఇంతకంటే సమయం, వేదిక ఉండవని పాక్‌ అభిమానులు భావిస్తున్నారు. మేం చక్కటి క్రికెట్‌ ఆడేందుకే ఇక్కడికి వచ్చాం. అది మాత్రమే ముఖ్యం. మిగతావన్నీ అనవసర విషయాలు. షేక్‌ హ్యాండ్‌ ఇచ్చే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పను. మ్యాచ్‌ ప్రారంభమైనప్పుడే మీరు చూస్తారు. పాక్‌పై పాత రికార్డు ఇక్కడ పనికి రాదు. మళ్లీ సున్నా నుంచి స్కోరు మొదలు పెట్టాల్సిందే’ – సూర్యకుమార్‌ యాదవ్, భారత కెప్టెన్ 13 భారత్, పాక్‌ మధ్య ఓవరాల్‌గా 16 మ్యాచ్‌లు జరగ్గా...13 గెలిచిన భారత్‌ 3 ఓడింది.7-1 టి20 ప్రపంచ కప్‌లో భారత్, పాక్‌ మధ్య 8 మ్యాచ్‌లు జరగ్గా... భారత్‌ 7 గెలిచి ఒకటే ఓడింది.తారిఖ్‌పై అందరి దృష్టి... తన వైవిధ్యమైన బౌలింగ్‌ శైలితో పాక్‌ ఆఫ్‌స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌ వార్తల్లో నిలిచాడు. ‘చకింగ్‌’ చేస్తున్నాడంటూ వినిపించినా...రెండు సార్లు అతని యాక్షన్‌కు ఐసీసీ అనుమతి ఇచ్చింది కాబట్టి నిబంధనల ప్రకారం తప్పు లేకపోవచ్చు. పలువురు మాజీ అంపైర్లు కూడా ఇదే చెప్పారు. అయితే బంతి విసిరే ముందు అతను కాస్త ఆగినట్లుగా ఉంటూ (పాజ్‌) వేయడం చర్చకు దారి తీసింది. ఇది బ్యాటర్‌ను గందరగోళంలో పడేయవచ్చని...బ్యాటర్‌ కూడా కాస్త జరిగి షాట్‌ ఆడటమే దీనికి ఉపాయమని అశ్విన్‌ విశ్లేషించాడు. అయితే తారిఖ్‌ యాక్షన్‌ ఎలా ఉన్నా...అతను సాధారణ ఆఫ్‌స్పిన్నర్‌ మాత్రమేనని, భారత బ్యాటర్లు చెలరేగుతారని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయ పడ్డాడు.పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌. అయితే బౌలర్లూ ప్రభావం చూపించగలరు. మ్యాచ్‌కు ముందు రోజు మాత్రమే భారత్‌ ఇక్కడ సాధన చేసింది. పాక్‌ జట్టు కొలంబోలోనే ఉన్నా... తమ రెండు మ్యాచ్‌లను ఎస్‌ఎస్‌సీ మైదానంలో ఆడింది కాబట్టి తేడా ఉండకపోవచ్చు. అయితే మ్యాచ్‌ను వాన గండం వెంటాడుతోంది. ఆదివారం వర్షం కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తుది జట్లు (అంచనా): భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్ ), అభిషేక్, ఇషాన్‌ కిషన్, తిలక్‌ వర్మ, పాండ్యా, దూబే, రింకూ, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా పాకిస్తాన్‌: సల్మాన్‌ ఆగా (కెప్టెన్ ), ఫర్హాన్, అయూబ్, బాబర్‌ ఆజమ్, షాదాబ్, ఉస్మాన్, నవాజ్, ఫహీమ్, షాహిన్‌ అఫ్రిది, తారిఖ్, అబ్రార్‌ టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్‌ X నేపాల్‌వేదిక: ముంబై; ఉదయం 11 గంటల నుంచిఅమెరికా X నమీబియావేదిక: చెన్నై; మధ్యాహ్నం 3 గంటల నుంచి

Indian womens cricket team to play first T20 against Australia today2
మహిళల పోరులో పైచేయి ఎవరిదో!

సిడ్నీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు కూడా కీలకమైన టి20 పోరుకు సిద్ధమైంది. భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు తొలి సమరం జరుగుతుంది. వన్డే వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత స్వదేశంలో శ్రీలంకతో టి20 సిరీస్‌ ఆడి క్లీన్‌స్వీప్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌ సేన ఇప్పుడు ఒక పెద్ద జట్టుతో ప్రత్యర్థి గడ్డపై తలపడుతోంది. కెపె్టన్‌ హర్మన్‌తో పాటు రెగ్యులర్‌ ఆటగాళ్లు స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ బ్యాటింగ్‌లో చెలరేగితే భారత్‌ పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డబ్ల్యూపీఎల్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచి అద్భుతమైన ఫామ్‌తో స్మృతి ఈ సిరీస్‌కు సిద్ధమైంది. గత టి20 వరల్డ్‌ కప్‌ తర్వాతి నుంచి 143.54 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధిస్తున్న స్మృతికి ఆసీస్‌ గడ్డపై కూడా మంచి రికార్డు ఉంది. క్రాంతి, అరుంధతి, శ్రీచరణి, శ్రేయాంక, రేణుకా సింగ్‌ బౌలింగ్‌ బాధ్యతలు తీసుకుంటారు. మరో వైపు కొత్త కెప్టెన్‌ సోఫీ మోలినే నాయకత్వంలో ఆసీస్‌ బరిలోకి దిగుతోంది. గత 19 టి20 సిరీస్‌లలో ఆ్రస్టేలియా ఒక్కటి మాత్రమే ఓడింది. అలీసా హీలీ ఈ ఫార్మాట్‌నుంచి రిటైరైనా... ఇతర స్టార్లు ఎలైస్‌ పెరీ, సదర్లాండ్, మూనీ, లిచ్‌ఫీల్డ్, వోల్, వేర్‌హామ్‌లకు జట్టును ఒంటిచేత్తో గెలిపించగల సత్తా ఉంది. ఆ్రస్టేలియాలో భారత పర్యటనను ప్రతీ ఫార్మాట్‌కు వేర్వేరుగా కాకుండా తొలిసారి మూడు ఫార్మాట్‌లలో ప్రదర్శనను బట్టి సిరీస్‌ విజేతను నిర్ణయిస్తారు. 3 టి20, 3 వన్డేలు, ఒక టెస్టు తర్వాత ఇది తేలుతుంది. పరిమిత ఓవర్లలో ఒక విజయానికి 2 పాయింట్లు, టెస్టులో విజయానికి 4 పాయింట్లు...టెస్టు డ్రా అయితే చెరో 2 పాయింట్లు కేటాయిస్తారు.

South Africa beat New Zealand by 7 wickets in T20 World Cup3
మార్క్‌రమ్, యాన్సెన్‌ జోరు

అహ్మదాబాద్‌: బౌలింగ్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మార్కో యాన్సెన్‌ జోరు (4/40), బ్యాటింగ్‌లో కెప్టెన్‌ కెప్టెన్ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (44 బంతుల్లో 86 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుతో దక్షిణాఫ్రికా ఖాతాలో మరో విజయం చేరింది. గ్రూప్‌ ‘డి’లో శనివారం జరిగిన ఈ లీగ్‌ మ్యాచ్‌లో సఫారీ జట్టు 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ నెగ్గిన మార్క్‌రమ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మార్క్‌ చాప్‌మన్‌ (26 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి గెలిచింది. ఫెర్గూసన్, నీషమ్, రచిన్‌ రవీంద్రలకు తలా ఒక వికెట్‌ దక్కింది. టాపార్డర్‌ టపటపా... ఇన్‌గిడి మూడో ఓవర్లో అలెన్‌ 3 ఫోర్లు, 1 సిక్స్‌తో కివీస్‌ శిబిరానికి జోష్‌ తెచ్చాడు. యాన్సెన్‌ తర్వాతి ఓవల్లో సీఫెర్ట్‌ (13) అవుటైనా... అలెన్‌ 4, 6తో జోరు కొనసాగించే ప్రయత్నం చేశాడు. మళ్లీ ఆరో ఓవర్‌ వేసిన యాన్సెన్‌ ఈ సారి రచిన్‌ రవీంద్ర (13), అలెన్‌ (17 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుకు చెక్‌పెట్టాడు. కివీస్‌ పవర్‌ ప్లే కష్టాల నుంచి కోలుకోకముందే కేశవ్‌ మహరాజ్‌... ఫిలిప్స్‌ (1)ను బౌల్డ్‌ చేయడంతో 64 పరుగుల వద్ద కివీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది.ఈ దశలో చాప్‌మన్‌ ధాటిగా ఆడి న్యూజిలాండ్‌ స్కోరు పెంచాడు. డారిల్‌ మిచెల్‌ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్‌), ఆఖర్లో నీషమ్‌ (15 బంతుల్లో 23 నాటౌట్‌; 3 ఫోర్లు) బౌండరీలతో న్యూజిలాండ్‌ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. యాన్సెన్‌ సగటున ఓవర్‌కు 10 చొప్పున పరుగులిచ్చినా కీలక వికెట్లు తీశాడు. రఫాడించిన మార్క్‌రమ్‌ కివీస్‌ చేసిందేమీ తక్కువ స్కోరు కాదు. దీంతో ఈ గ్రూప్‌లో రెండు పోటీ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరుగుతుందనుకుంటే మార్క్‌రమ్‌ ఏకపక్షంగా మార్చేశాడు. అతను ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా మూడో ఓవర్లోనే 50 స్కోరుకు చేరుకుంది. జట్టు స్కోరు 62 పరుగుల వద్ద డికాక్‌ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అవుటయ్యాడు. కాసేపటికే మార్క్‌రమ్‌ 19 బంతుల్లోనే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున వేగవంతమైన అర్ధశతకాన్ని సాధించాడు. రికెల్టన్‌ (11 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా కెప్టెన్‌లాగే కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా 7.2 ఓవర్లలోనే వంద పరుగులు దాటింది. తర్వాత వచ్చిన బ్రెవిస్‌ (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్‌), మిల్లర్‌ (17 బంతుల్లో 24 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) ధాటిగా ఆడటంతో ఇంకో 2.5 ఓవర్లముందే సఫారీ లక్ష్యాన్ని దాటేసింది.

India lose to Belgium in Pro Hockey League4
బెల్జియం చేతిలో భారత్‌ ఓటమి

రూర్కెలా: ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ హాకీ లీగ్‌లో భారత జట్టుకు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పోరులో బెల్జియం 4–2 గోల్స్‌ తేడాతో భారత్‌ను ఓడించింది. బెల్జియం తరఫున హ్యూగో లబుషేర్‌ (11వ నిమిషం), అలెగ్జాండర్‌ హెన్‌డ్రిక్‌ (14వ ని., 17వ ని.), ఆర్థర్‌ స్లూవర్‌ (15వ ని.) గోల్స్‌ నమోదు చేశారు. భారత ఆటగాళ్లలో ఆదిత్య అర్జున్‌ (24వ ని.), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (37వ ని.) గోల్స్‌ సాధించారు. తొలి క్వార్టర్‌లో 3 గోల్స్‌ సాధించి బెల్జియం సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో క్వార్టర్‌లో ఇరు జట్లు చెరో గోల్‌ చేయగా, మూడో క్వార్టర్‌లో భారత్‌ ఖాతాలో మరో గోల్‌ చేరింది. అయితే చివరి క్వార్టర్‌లో రాణించి ఓటమినుంచి తప్పించుకోవాలని భారత్‌ చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. శనివారం జరిగిన మరో మ్యాచ్‌లో జర్మనీ 6–1 గోల్స్‌ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. నేడు జరిగే పోరులో అర్జెంటీనాతో భారత్‌ తలపడుతుంది.

T20 WC 2026: England beat Scotland by 5 wickets5
T20 WC 2026: స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం

టీ20 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లండ్ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శ‌నివారం కోల్‌క‌తా వేదిక‌గా స్కాట్లాండ్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 19.4 ఓవ‌ర్ల‌లో 152 ప‌రుగులకు ఆలౌటైంది.కెప్టెన్ రిచీ బెరింగ్టన్(49) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మైకేల్ జోన్స్(33), బ్రూస్‌(24) రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో అదిల్ ర‌షీద్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్చ‌ర్, డాస‌న్ త‌లా రెండు వికెట్లు సాధించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ త‌డ‌బ‌డిన‌ప్ప‌టికి, మిడిల్ ఆర్డర్ రాణించడంతో విజ‌యాన్ని అందుకుంది.టామ్ బాంట‌న్‌(41 బంతుల్లో 63 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాట‌గా.. జాకబ్ బెథెల్(32), సామ్ కర్రన్(28) రాణించారు. స్కాట్లాండ్ బౌల‌ర్ల‌లో మెక్‌ముల్ల‌న్‌, బ్రాడ్‌ వీల్, కుర్రీ త‌లా వికెట్ సాధించారు. ఈ విజయంతో గ్రూప్-సిలో ఇంగ్లండ్ రెండో స్థానానికి చేరుకోగా.. స్కాట్లాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది.

Indias Likely Playing XI For T20 World Cup 2026 Match Against Pakistan6
పాక్‌తో మ్యాచ్.. భార‌త తుది జ‌ట్టు ఇదే! వారిద్ద‌రిపై వేటు

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో టీమిండియా కీల‌క పోరుకు సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదిక‌గా పాకిస్తాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా.. అదే జోరును దాయాది జ‌ట్టుపై కూడా కొన‌సాగించాల‌ని భావిస్తోంది.అయితే ఈ హైవోల్టేజ్ కోసం భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. అనారోగ్యం కార‌ణంగా న‌మీబియాతో మ్యాచ్‌కు దూర‌మైన విధ్వంసక‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ.. తిరిగి పాక్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ ఇదే జ‌రిగితే సంజూ శాంస‌న్‌పై వేటు ప‌డ‌నుంది.గ‌త మ్యాచ్‌లో సంజూకు అవ‌కాశం ల‌భించిన‌ప్ప‌టికి స‌ద్వినియోగ ప‌రుచుకోలేక‌పోయాడు. దూకుడుగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అదేవిధంగా కొలంబో పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవ‌కాశముండ‌డంతో కుల్దీప్ యాద‌వ్ తుది జ‌ట్టులోకి రానున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. న‌మీబియాతో మ్యాచ్‌లో ధారళంగా పరుగులు సమర్పించుకున్న అర్ష్‌దీప్ సింగ్ లేదా రింకూ సింగ్‌లో ఎవ‌రో ఒక‌రిని ప‌క్క‌న పెట్టే అవ‌కాశ‌ముంది. పాక్‌పై కుల్దీప్ యాద‌వ్‌కు అద్భుత‌మైన రికార్డు (3 టీ20ల్లో 8 వికెట్లు) ఉంది. కాబ‌ట్టి అత‌డిని తుది జ‌ట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే ఛాన్స్ ఉంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొలంబోలో ఆదివారం వర్షం కురిసే అవకాశం 90 శాతం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒక‌వేళ మ్యాచ్ ర‌ద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ద‌క్కుతుంది.పాక్‌తో మ్యాచ్‌కు భార‌త తుది జ‌ట్టు(అంచ‌నా): సంజు శాంసన్/అభిషేక్ శ‌ర్మ‌,ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

Should India be afraid of Usman Tariq in IND vs PAK?7
'అత‌డితో జాగ్ర‌త్త‌'.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు వార్నింగ్‌

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భార‌త్-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. హై-వోల్టేజ్ పోరుకు ముందు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ స్పిన్న‌ర్ ఉస్మాన్ తారిఖ్‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌వ‌ద్ద‌ని భార‌త జ‌ట్టును భ‌జ్జీ హెచ్చ‌రించాడు.ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భార‌త్ గెలుస్తుంద‌ని నేను అనుకుంటున్నాను. కానీ పాకిస్తాన్ జ‌ట్టులో ఉస్మాన్ తారిక్ లాంటి అద్భుత‌మైన స్పిన్న‌ర్ ఉన్నాడు. అత‌డిని భార‌త బ్యాట‌ర్లు జాగ్ర‌త్త‌గా ఆడాలి. అయితే మ‌న జ‌ట్టుపై పూర్తి న‌మ్మ‌కం నాకు ఉంది. భారత జట్టు ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది. టీమిండియా ఎప్ప‌టిలాగే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడి గెలుపు జెండా ఎగ‌ర‌వేస్తార‌ని ఆశిస్తున్నాము అని ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు.కాగా ఉస్మాన్ తారిఖ్ త‌న బౌలింగ్ యాక్ష‌న్‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. అత‌డి బౌలింగ్‌ను ఆర్ధం చేసుకునేందుకు బ్యాట‌ర్లు తెగ ఇబ్బంది ప‌డుతున్నారు. బంతిని విసిరే ముందు కొద్దిసేపు ఆగి డెలివరీ చేసే అతడి బౌలింగ్ శైలి కేదార్ జాదవ్‌ను త‌ల‌పిస్తోంది. అత‌డి బౌలింగ్ యాక్ష‌న్‌పై వివాదాలు త‌లెత్తిన‌ప్ప‌టికి.. ఐసీసీ మాత్రం క్లియ‌రెన్స్ ఇచ్చింది. తారిఖ్ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 4 టీ20 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడి 11 వికెట్లు ప‌డ‌గొట్టాడు. పాక్ జ‌ట్టు కూడా అత‌డిపైనే గంపెడు ఆశ‌లు పెట్టుకుంది.చ‌ద‌వండి: T20 WC 2026: భార‌త ఆట‌గాళ్ల‌తో కరచాలనం చేస్తారా? పాక్ కెప్టెన్ రిప్లై ఇదే

Pak Captain Salman Agha Asked About Shaking Hands With Indian Players.8
భార‌త ఆట‌గాళ్ల‌తో కరచాలనం చేస్తారా? పాక్ కెప్టెన్ రిప్లై ఇదే

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ పోరుకు స‌మయం అస‌న్న‌మైంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026లో భాగంగా ఆదివారం దాయాది జ‌ట్లు తాడోపేడో తెల్చుకోవ‌డానికి సిద్ద‌మ‌య్యాయి. ఇప్ప‌టికే కొలంబోకు చేరుకున్న ఇరు జ‌ట్లు.. శ‌నివారం సాయంత్రం త‌మ ప్రాక్టీస్ సెష‌న్ష్‌లలో పాల్గోనున్నాయి.కాగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న పాక్‌ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఆసియాక‌ప్‌లో చోటు చేసుకున్న హ్యాండ్ షేక్ వివాదంపై అఘా మాట్లాడాడు. దేశాల మ‌ధ్య ఎన్ని ఉద్రిక్తతలు ఉన్నా, మైదానంలో మాత్రం క్రీడా స్పూర్తిని ప్ర‌ద‌ర్శించాల‌ని ఆఘా చెప్పుకొచ్చాడు."క్రికెట్ ఎల్ల‌ప్పుడూ క్రీడాస్ఫూర్తితోనే ఆడాలి. క్రీడ‌ల్లో రాజ‌కీయాల‌కు తావులేదు. క్రికెట్ ఒక‌ జెంటిల్‌మ్యాన్ గేమ్. ప్ర‌తీ ఒక్క‌రూ హుందాగా వ్య‌వ‌హ‌రించాలి" సల్మాన్ పేర్కొన్నాడు. అదేవిధంగా రేప‌టి మ్యాచ్‌లో భారత్-పాక్ ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటారా అన్న ప్రశ్నకు.. "రేపు మీకే తెలుస్తుంది" అని సల్మాన్ సమాధానమిచ్చాడు. టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ త్వ‌ర‌గా కోలుకోవాలని, రేపటి మ్యాచ్‌లో ఆడాలని తాను కోరుకుంటున్నట్లు అఘా తెలిపాడు.కాగా పెహ‌ల్గ‌మ్ ఉగ్ర‌దాడికి నిర‌స‌న‌గా ఆసియాక‌ప్‌లో పాక్ ఆట‌గాళ్ల‌తో భార‌త్ క‌ర‌చాల‌నం నిర‌కారించింది. ఆ త‌ర్వాత భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు, అండ‌ర్‌-19 జ‌ట్టు కూడా అదే బాట‌లో న‌డిచింది. అప్పటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మ్యాచ్‌లో పాక్ ప్లేయ‌ర్ల‌తో భార‌త్ హ్యాండ్ షేక్ చేయ‌లేదు. ఇప్పుడు పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవ‌కాశ‌ముంది.

T20 World Cup 2026: Ireland Beat by Oman 96 runs9
ఒమ‌న్‌ను చిత్తు చేసిన ఐర్లాండ్.. సెమీస్ ఆశ‌లు స‌జీవం

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో ఐర్లాండ్ బోణీ కొట్టింది. శ‌నివారం కొలంబో వేదిక‌గా జ‌రిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఒమన్‌పై 96 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఐరీష్ జ‌ట్టు త‌మ సెమీస్ ఆశ‌ల‌ను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది.టాపార్డ‌ర్ విఫ‌ల‌మైన‌ప్ప‌టికి మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు లోర్కాన్ టక్కర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్ అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ముఖ్యంగా ట‌క్క‌ర్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. టక్కర్ కేవలం 51 బంతుల్లో 94 పరుగులు (10 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. డెలానీ 30 బంతుల్లో 56 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. జార్జ్ డాక్రెల్ కేవలం 9 బంతుల్లోనే 5 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఒమ‌న్ బౌల‌ర్ల‌లో ష‌కీల్ అహ్మ‌ద్ మూడు, క‌లీం రెండు వికెట్లు సాధించారు. అనంత‌రం భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఒమ‌న్.. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి 18 ఓవర్లలో 139 పరుగులకే కుప్ప‌కూలింది.ఒమన్ బ్యాటర్లలో ఆమిర్ కలీం (50),హమ్మద్ మీర్జా (46) రాణించ‌గా.. మిగితా ప్లేయ‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 3 వికెట్లు పడగొట్టగా.. బారీ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్ చెరో రెండు వికెట్లు తీశారు.

Abhishek Sharmas parents reach Colombo while IND vs PAK availability still uncertain10
కొలంబోకు చేరుకున్న అభిషేక్ త‌ల్లిదండ్రులు.. పాక్‌తో మ్యాచ్‌కు డౌటే

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో కొలంబో వేదిక‌గా ఆదివారం పాకిస్తాన్‌-భార‌త్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆడుతాడా లేదా? అన్న‌ది ఇంకా క్లారిటీ లేదు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ గత మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో న‌మీబియాతో మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు.అయితే ఆస్ప‌త్రి నుంచి అభిషేక్ డిశ్చార్జ్ అయినప్ప‌టికి ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించిక‌పోయిన‌ట్లు తెలుస్తోంది. కానీ అభిషేక్ భార‌త జ‌ట్టుతో కలిసి కొలంబోలో అడుగుపెట్టాడు. అత‌డు ప్ర‌స్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.కాగా శనివారం (ఫిబ్రవరి 14) సాయంత్రం జరిగే నెట్ సెషన్‌లో అభిషేక్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ ప్రాక్టీస్ తర్వాతే అతను పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడతాడా లేదా అనే దానిపై టీమ్ మేనేజ్‌మెంట్ ఓ నిర్ణ‌యం తీసుకోనుంది. అయితే అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న అభిషేక్‌ను చూసేందుకు అత‌డి త‌ల్లిదండ్రులు కొలంబోకు చేరుకున్నారు. ఒకవేళ అభిషేక్ శర్మ పూర్తిగా కోలుకోకపోతే సంజూ శాంస‌న్ ఓపెన‌ర్‌గా కొన‌సాగ‌నున్నాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement