Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Vijay Hazare ODI tournament starts from today1
ఎన్నాళ్లకెన్నాళ్లకు!

బెంగళూరు: ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీకి రంగం సిద్ధమైంది. జాతీయ జట్టులో ఎంపికకు పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీ టోర్నీల్లో తప్పక ఆడాల్సిందే అనే నిబంధనల నేపథ్యంలో... స్టార్‌ ఆటగాళ్లు సైతం ఈ టోర్నీ బరిలోకి దిగనున్నారు. టి20, టెస్టు ఫార్మాట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత స్టార్‌ ప్లేయర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మతో పాటు శుబ్‌మన్‌ గిల్, సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్‌ పంత్, ఇషాన్‌ కిషన్, అభిషేక్‌ శర్మ వంటి పలువురు టీమిండియా ప్లేయర్లు తమ రాష్ట్రాల జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ‘కింగ్‌’ కోహ్లి విజయ్‌ హజారే టోర్నీలో ఆడి దాదాపు 16 సంవత్సరాలు అవుతోంది. కోహ్లి చివరగా ఈ టోర్నీ బరిలోకి దిగిన సమయంలో టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్‌ గెలవలేదు... క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ టీమిండియా ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు... మహేంద్ర సింగ్‌ ధోనీ భారత టెస్టు జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు... రాహుల్‌ ద్రవిడ్, వీవీఎస్‌ లక్ష్మణ్‌ భారత మిడిలార్డర్‌లో పరుగుల వరద పారిస్తున్నారు! తొలిసారి ఈ టోర్నీ ఆడే సమయానికి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోని కోహ్లి... ఆ తర్వాత ఇన్నేళ్లలో ఎప్పుడూ తిరిగి విజయ్‌ హజారే టోర్నీలో ఆడలేదు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి... 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు కొనసాగాలనుకుంటున్న నేపథ్యంలో... ఫామ్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకునేందుకు ఈ టోర్నీ తొలి దశ మ్యాచ్‌లు ఆడనున్నట్లు వెల్లడించాడు. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు ఒక హాఫ్‌సెంచరీతో మూడొందలకు పైగా పరుగులు చేసిన విరాట్‌... అదే జోరు దేశవాళీల్లోనూ కొనసాగిస్తాడా చూడాలి. ఇక ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ 2017–18లో చివరగా విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడాడు. » మొత్తం 32 ఎలైట్‌ జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో ఎనిమిదేసి జట్లు ఉన్నాయి. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో... ఒక్కో జట్టు మిగిలిన ఏడు జట్లతో తలపడుతుంది. గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. » బెంగళూరు, జైపూర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్‌... ఈ నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నా... ఈ ఏడాది ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన సందర్భంగా జరిగిన విజయోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన తొక్కిసలాటలో 10 మందికి పైగా అభిమానులు మృతిచెందడంతో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి లభించలేదు. » ఈ టోర్నీలో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా... గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లు బెంగళూరులో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎగబడే అవకాశం ఉండటంతో పోలీసులు మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. దీంతో బుధవారం ఢిల్లీ, ఆంధ్ర మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ మైదానానికి తరలించారు. » గతంలో విరాట్‌ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగినప్పుడు ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానం అభిమానులతో నిండిపోయింది. అందుకే ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. » ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొట్టిన రోహిత్‌ శర్మ... దక్షిణాఫ్రికాపై సైతం మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. కెరీర్‌ను పొడిగించుకోవాలనే లక్ష్యంతోనే భారీగా బరువు తగ్గిన ‘హిట్‌మ్యాన్‌’ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా సిక్కిం, గోవాతో ముంబై తలపడనుంది. » టీమిండియా టి20 కెపె్టన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై కూడా అందరి దృష్టి నిలవనుంది. ఏడాది కాలంగా విఫలమవుతున్న సూర్యకుమార్‌... వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ వరకు లయ అందుకునేందుకు ఈ టోర్నమెంట్‌ ఉపయోగపడనుంది. » ఈ ఏడాది టి20ల్లో సూర్యకుమార్‌ సగటు 12.84 కాగా... స్ట్రయిక్‌ రేట్‌ 117.87. ఇది అతడి స్థాయికి ఏమాత్రం తగినది కాదు. గత 22 ఇన్నింగ్స్‌ల్లో అతడు ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేసుకోలేదు. అయితే వచ్చే ఏడాది టి20 వరల్డ్‌కప్‌ జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కించుకున్న సూర్య... మెగా టోర్నీకి ముందు విజయ్‌ హజారే టోర్నీ ద్వారా ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నాడు. » కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ జట్టుకు రిషభ్‌ పంత్‌ సారథ్యం వహించనున్నాడు. విరాట్‌ ఆరంభ మ్యాచ్‌లు మాత్రమే ఆడనుండగా... రిషభ్‌ టోర్నీ మొత్తం అందుబాటులో ఉండనున్నాడు. ప్రస్తుతం కేవలం భారత టెస్టు జట్టులోనే కొనసాగుతున్న పంత్‌... పరిమిత ఓవర్లలో పునరాగమనం చేసేందుకు ఈ టోర్నమెంట్‌ ఎంతగానో ఉపయోగపడనుంది. » ఇటీవల జరిగిన దేశవాళీ టి20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అది్వతీయ ప్రదర్శనతో జార్ఖండ్‌ జట్టుకు టైటిల్‌ అందించిన యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌... ఈ ఆటతీరులో వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడతడు... విజయ్‌ హజారేలో సైతం అదే దూకుడు కొనసాగించాలని భావిస్తున్నాడు. » గతేడాది ఈ టోర్నీలో పరుగుల వరద పారించిన కరుణ్‌ నాయర్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ కర్ణాటక జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. 2024–25 సీజన్‌లో అతడు 8 ఇన్నింగ్స్‌ల్లో 389.5 సగటుతో 779 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు సైతం ఉన్నాయి. దీంతో పాటు రంజీల్లోనూ రాణించిన అతడికి ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. » ఐపీఎల్‌ మినీ వేలం ముగిసినప్పటికీ... ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసిన ప్లేయర్లపై ఫ్రాంచైజీలు దృష్టి సారించడం ఖాయం. గతంలో ఈ టోర్నీ ఆటతీరు ఆధారంగా... స్మరణ్, మయాంక్‌ ఐపీఎల్‌ అవకాశాలు దక్కించుకున్నారు. » ఫలితాలపై వాతావరణం ప్రభావం ఉండకూదనే ఉద్దేశంతో మ్యాచ్‌లన్నీ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేలా షెడ్యూల్‌ రూపొందించారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేసే జట్టుపై ఎలాంటి మంచు ప్రభావం పడే అవకాశం లేదు. » ఇక టి20 వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన భారత టెస్టు, వన్డే కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌పై కూడా అందరి దృష్టి నిలవనుంది. అభిషేక్‌ శర్మ సారథ్యంలో పంజాబ్‌ జట్టు తరఫున గిల్‌ బరిలోకి దిగనున్నాడు. » ప్రస్తుతం భారత జట్టులో పేస్‌ బౌలర్ల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపై పని భారం ఎక్కువవుతుండగా... ఇతర పేసర్లు నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్‌ స్పీడ్‌ స్టార్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ను సెలెక్టర్లు కేవలం టెస్టు ఫార్మాట్‌కే పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో తదుపరి తరం పేసర్లు ఎవరనేదానికి ఈ టోర్నీ ద్వారా సమాధానం లభిస్తుందా చూడాలి. గుర్‌జపనీత్‌ సింగ్‌ (తమిళనాడు), గుర్‌నూర్‌ బ్రార్‌ (పంజాబ్‌), యు«ద్‌వీర్‌ సింగ్‌ (జమ్మూ కశ్మీర్‌), అనూజ్‌ (హరియాణా), షకీబ్‌ హుసేన్‌ (బిహార్‌) రూపంలో పలువురు యువ పేసర్లు ఈ టోర్నీలో ఆడనున్నారు.హైదరాబాద్‌ X ఉత్తర ప్రదేశ్‌ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా రాజ్‌కోట్‌లో జరగనున్న మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌తో హైదరాబాద్‌ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో హైదరాబాద్‌ జట్టుకు రాహుల్‌ సింగ్‌ సారథ్యం వహిస్తుండగా... రాహుల్‌ బుద్ధి వైస్‌ కెపె్టన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల ముస్తాక్‌ అలీ ట్రోఫీ గ్రూప్‌ దశలో మెరుగైన ప్రదర్శన చేసి... సునాయాసంగా ‘సూపర్‌ లీగ్‌’కు చేరిన హైదరాబాద్‌... చివరి మ్యాచ్‌లో పరాజయంతో ఫైనల్‌ ఆడే అవకాశం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని హైదరాబాద్‌ భావిస్తోంది. కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌తో పాటు తన్మయ్‌ అగర్వాల్, తనయ్‌ త్యాగరాజన్, అమన్‌ రావు, అభిరథ్‌ రెడ్డి, కార్తికేయ, రక్షణ్‌ సమష్టిగా సత్తా చాటాల్సిన అవసరముంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో జట్టులో ప్రియం గార్గ్, ధ్రువ్‌ జురెల్, కార్తీక్‌ త్యాగి, సమీర్‌ రిజ్వీ, రింకూ సింగ్‌ కీలకం కానున్నారు.ఆంధ్ర జట్టుకు లక్కీ చాన్స్‌ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా బుధవారం జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు... స్టార్‌లతో నిండి ఉన్న ఢిల్లీ టీమ్‌తో తలపడనుంది. బెంగళూరు వేదికగా జరగనున్న మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి, రిషభ్‌ పంత్‌తో కూడిన ఢిల్లీ జట్టుపై మెరుగైన ప్రదర్శన చేయాలని ఆంధ్ర జట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి నిలవనున్న నేపథ్యంలో... మనవాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం. టీమిండియా పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆంధ్ర జట్టుకు సారథ్యం వహిస్తుండగా... శ్రీకర్‌ భరత్, రికీ భుయ్, అశ్విన్‌ హెబ్బర్, షేక్‌ రషీద్‌ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. సత్యనారాయణ రాజు, వినయ్, స్టీఫెన్‌ బౌలింగ్‌ భారం మోయనున్నారు.

Jemimah Rodrigues to captain Delhi Capitals2
ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా జెమీమా

న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఎంపికైంది. భారత జట్టు తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన జెమీమాకు ఢిల్లీ జట్టు పగ్గాలు అప్పగిస్తన్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో జెమీమా వీరోచిత సెంచరీ సాధించడంతో టీమిండియా ఆ్రస్టేలియాపై విజయం సాధించింది. ‘ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనుండటం గౌరవంగా భావిస్తున్నా. నా మీద నమ్మకముంచిన జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఈ ఏడాది నాకు ఎంతో బాగా సాగింది. వరల్డ్‌కప్‌ గెలిచిన ఆనందంలో ఉన్న సమయంలోనే ఈ వార్త నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. మూడేళ్లుగా ఇదే జట్టుతో సాగుతున్నా. ఎంతో నేర్చుకున్నా. గత మూడు సార్లు ఫైనల్‌ చేరినా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయాం. ఈ సారి ఆ గెలుపు గీత దాటుతాం’అని జెమీమా పేర్కొంది. డబ్ల్యూపీఎల్‌ ఆరంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కే ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా... 27 మ్యాచ్‌లాడి 139.67 స్ట్రయిక్‌ రేట్‌తో 507 పరుగులు చేసింది. లీగ్‌లో ఇప్పటి వరకు మూడుసార్లు ఢిల్లీ జట్టు ఫైనల్‌కు చేరగా... మూడింట్లోనూ జెమీమా ఆడింది. గతంలో ఢిల్లీ జట్టుకు మెగ్‌ లానింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరించింది. వచ్చే ఏడాది జరగనున్న డబ్ల్యూపీఎల్‌లో తమ తొలి మ్యాచ్‌లో జనవరి 10న ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది.

Global Chess League winner Alpine SG Pipers3
గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ విజేత ఆల్పైన్ ఎస్‌జీ పైపర్స్‌

ముంబై: ‘హ్యాట్రిక్‌’ సాధించాలని ఆశించిన త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్‌ జట్టుకు చుక్కెదురైంది. టెక్‌ మహీంద్రా గ్లోబల్‌ చెస్‌ లీగ్‌లో ఆల్పైన్ ఎస్‌జీ పైపర్స్‌ జట్టు కొత్త చాంపియన్‌గా అవతరించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో ఆల్పైన్ ఎస్‌జీ పైపర్స్‌ 2–0 (4–2; 4.5–1.5) పాయింట్ల తేడాతో తొలి రెండు ఎడిషన్స్‌లో టైటిల్‌ నెగ్గిన త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్‌ జట్టును బోల్తా కొట్టించింది. ఆల్పైన్ ఎస్‌జీ పైపర్స్‌ జట్టులో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, లియోన్‌ ల్యూక్‌ మెండోంకా, కరువానా (అమెరికా), హు ఇఫాన్‌ (చైనా), అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌), నినో బతియాష్విలి (జార్జియా) సభ్యులుగా ఉన్నారు. తొలి ర్యాపిడ్‌ మ్యాచ్‌లో ఆల్పైన్ జట్టు 4–2తో త్రివేణి జట్టును ఓడించింది. రెండో ర్యాపిడ్‌ మ్యాచ్‌లో అల్పైన్‌ జట్టు 4.5–1.5తో త్రివేణి జట్టును మళ్లీ ఓడించి టైటిల్‌ను ఖరారు చేసుకుంది.కాంటినెంటల్‌ కింగ్స్‌ జట్టులో అలీరెజా (ఫ్రాన్స్‌), వె యి (చైనా), విదిత్‌ (భారత్‌), జు జినెర్‌ (చైనా), కొస్టెనిక్‌ (స్విట్జర్లాండ్‌), మౌరిజి (ఫ్రాన్స్‌) సభ్యులుగా ఉన్నారు. మూడో స్థానం మ్యాచ్‌లో పీబీజీ అలాస్కన్‌ నైట్స్‌ 3–1 (2–4; 3.5–2.5; 3.5–2.5; 4–2)తో గ్యాంజెస్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ జట్టుపై నెగ్గింది. పీబీజీ అలాస్కన్‌ నైట్స్‌ జట్టులో గుకేశ్‌ దొమ్మరాజు, అర్జున్‌ ఇరిగేశి (భారత్‌), కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్‌), సారా ఖాదెమ్‌ (స్పెయిన్‌), లెనియర్‌ (అమెరికా), డేనియల్‌ దర్దా (బెల్జియం) సభ్యులుగా ఉన్నారు.

Neeraj Chopra met Prime Minister Narendra Modi on Tuesday4
నీరజ్, నేను క్రీడాంశాలపై చర్చించాం: ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: రెండు ఒలింపిక్‌ పతకాల విజేత, భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు. ఈ ఏడాది చోప్రా మాజీ టెన్నిస్‌ ప్లేయర్‌ హిమాని మోర్‌ను వివాహమాడాడు. సతీమణితో వెళ్లి ప్రధానితో కాసేపు ముచ్చటించాడు. చాంపియన్‌ అథ్లెట్‌తో భేటీని మోదీ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘నీరజ్, తన శ్రీమతి హిమానితో నన్ను కలుసుకోవడం నాకూ సంతోషాన్నిచ్చింది. ఈ సందర్భంగా చోప్రా, నేను క్రీడాంశాలపై చర్చించాం. ఇతర విషయాలపై కూడా ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది’ అని మోదీ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. 27 ఏళ్ల నీరజ్‌ చోప్రాకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు వచ్చాయి. చాన్నాళ్లు ఫిట్‌నెస్‌ సమస్యలతోసతమతమైనప్పటికీ ఈ స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ తాను ఆశించినట్లే 90 మీటర్ల మార్క్‌ను దోహా డైమండ్‌ లీగ్‌లో అధిగమించాడు. కానీ సెప్టెంబర్లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. హేమాహేమీలతో స్వయంగా తన పేరుతో నిర్వహించిన బెంగళూరు ఈవెంట్‌లో చోప్రానే విజేతగా నిలిచాడు.

Deepti Sharma tops ICC Womens T20 Bowling Rankings for the first time5
నంబర్‌వన్‌ దీప్తి

దుబాయ్‌: టీమిండియా ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ... ఐసీసీ మహిళల టి20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం దక్కించుకుంది. ఈ ఫార్మాట్‌లో భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా 28 ఏళ్ల దీప్తి రికార్డుల్లోకెక్కింది. శ్రీలంకతో జరుగుతున్న టి20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఒక వికెట్‌ పడగొట్టిన దీప్తి... తాజా ర్యాంకింగ్స్‌లో 737 పాయింట్లతో ‘టాప్‌’ ప్లేస్‌కు చేరింది. ఆస్ట్రేలియా బౌలర్‌ అనాబెల్‌ సదర్లాండ్‌ (736 పాయింట్లు), పాక్‌ బౌలర్‌ సాదియా ఇక్బాల్‌ (732 పాయింట్లు) వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నారు. బ్యాటింగ్‌ విభాగంలో భారత్‌ నుంచి అత్యుత్తమంగా స్మృతి మంధాన (766 పాయింట్లు) నాలుగో స్థానంలో ఉండగా... లంకతో తొలి పోరులో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన జెమీమా రోడ్రిగ్స్‌ (653 పాయింట్లు) ఐదు స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంక్‌కు చేరింది. రెండో మ్యాచ్‌లో దంచికొట్టిన షఫాలీ వర్మ (650 పాయింట్లు) పదో స్థానంలో ఉంది.

Haryana retained the title in the womens team category6
రన్నరప్‌ ఆంధ్రప్రదేశ్‌

సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టీమ్‌ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హరియాణా 3–0తో ఆంధ్రప్రదేశ్‌ను ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారత స్టార్‌ పీవీ సింధు ఫైనల్‌ మ్యాచ్‌కు దూరంగా ఉంది. తొలి మ్యాచ్‌లో దేవిక సిహాగ్‌ 20–22, 21–16, 21–16తో నవ్య కందేరిపై గెలిచింది. రెండో మ్యాచ్‌లో ఉన్నతి హుడా 21–14, 21–14తో సూర్య చరిష్మా తామిరిపై నెగ్గి హరియాణాకు 2–0తో ఆధిక్యాన్ని అందించింది. మూడో మ్యాచ్‌లో ఉన్నతి–అన్‌మోల్‌ ద్వయం 21–13, 24–22తో నవ్య–సూర్య చరిష్మా జంటపై గెలవడంతో హరియాణాకు టైటిల్‌ ఖరారైంది. రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ జట్టులో నవ్య, సూర్య చరిష్మా, సీహెచ్‌ఎస్‌ఆర్‌ ప్రణవి, దీపిక దేవనబోయిన, కవిప్రియ సభ్యులుగా ఉన్నారు. పురుషుల టీమ్‌ విభాగంలో తమిళనాడు చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో తమిళనాడు 3–2తో హరియాణా జట్టును ఓడించింది. విజేత జట్లు హరియాణా, తమిళనాడు జట్లకు రూ. 3 లక్షల 50 వేల చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. నేటి నుంచి ఐదు రోజులపాటు పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి.

India beat Sri Lanka by 7 wickets in second T20I7
షఫాలీ 'షో'

సాక్షి, విశాఖపట్నం: ఓపెనర్‌ షఫాలీ వర్మ ధనాధన్‌ షోతో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన రెండో టి20లో హర్మన్‌ప్రీత్‌ నేతృత్వంలోని భారత్‌ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయఢంకా మోగించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2–0తో ఆధిక్యంలో ఉంది. మొదట శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులే చేసింది. హర్షిత సమరవిక్రమ (32 బంతుల్లో 33; 4 ఫోర్లు), కెప్టెన్ చమరి (24 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుగ్గా ఆడారంతే! భారత బౌలర్లలో తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి (2/23), కొత్త స్పిన్నర్‌ వైష్ణవి శర్మ (2/32) లంక బ్యాటర్లను కట్టడి చేశారు. అనంతరం భారత మహిళల జట్టు 11.5 ఓవర్లలోనే మూడే వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (34 బంతుల్లో 69 నాటౌట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకాశమే హద్దుగా చెలరేగింది. దీంతో 8.1 ఓవర్ల ముందే లక్ష్యం మంచు ముక్కలా కరిగింది. ఆరంభం నుంచే దూకుడుగా.... చిన్న లక్ష్యాన్ని దూకుడుగా ఛేదించే క్రమంలో స్మృతి మంధాన (14) అవుటైంది. క్రీజులో ఉన్న మరో ఓపెనర్‌ షఫాలీకి జెమీమా (15 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్‌) జతయ్యాక స్కోరు వాయువేగంతో దూసుకెళ్లింది. ఇనోక వేసిన ఐదో ఓవర్లో వరుస బౌండరీలు కొట్టిన షఫాలీ... చమరి మరుసటి ఓవర్‌ మూడు బంతుల్ని 4, 6, 4గా తరలించింది. పవర్‌ప్లేలో 68/1 స్కోరు చేసింది. తర్వాత జెమీమా కూడా తానేం తక్కువ కాదని 2 ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌తో విరుచుకుపడింది. కాసేపటికి ఆమె అవుట్‌కాగా, 9 ఓవర్లలోనే భారత్‌ స్కోరు వందకు చేరింది. షఫాలీ 27 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది.గెలుపు ముంగిట కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (10) బౌల్డ్‌ కాగా, రిచా ఘోష్‌ (1 నాటౌట్‌) విన్నింగ్‌ రన్‌ తీసింది. షఫాలీ వర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. మూడో టి20 తిరువనంతపురంలో ఈ నెల 26న జరుగనుంది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్‌: విష్మి గుణరత్నే (సి అండ్‌ బి) క్రాంతి 1; చమరి (సి) అమన్‌జోత్‌ (బి) స్నేహ్‌ రాణా 31; హాసిని పెరీరా (సి అండ్‌ బి) శ్రీచరణి 22; హర్షిత (రనౌట్‌) 33; కవీశా (సి) అమన్‌జోత్‌ (బి) శ్రీచరణి 14; నీలాక్షిక (సి) శ్రీచరణి (బి) వైష్ణవి 2; కౌశిని (రనౌట్‌) 11; శాషిని (సి) స్మృతి మంధాన (బి) వైష్ణవి 0; కావ్య (రనౌట్‌) 1; మల్కిని (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 128. వికెట్ల పతనం: 1–2, 2–38, 3–82, 4–104, 5–109, 6–121, 7–122, 8–126, 9–128. బౌలింగ్‌: క్రాంతి గౌడ్‌ 3–0–21–1, అరుంధతి రెడ్డి 3–0–22–0, స్నేహ్‌ రాణా 4–1–11–1, అమన్‌జోత్‌ కౌర్‌ 2–0–11–0, వైష్ణవి శర్మ 4–0–32–2, శ్రీచరణి 4–0–23–2. భారత ఇన్నింగ్స్‌: స్మృతి మంధాన (సి) కావ్య (బి) దిల్హారి 14; షఫాలీ వర్మ (నాటౌట్‌) 69; జెమీమా రోడ్రిగ్స్‌ (సి) దిల్హారి (బి) కావ్య 26; హర్మన్‌ప్రీత్‌ (బి) మాల్కి మదర 10; రిచా ఘోష్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (11.5 ఓవర్లలో 3 వికెట్లకు) 129. వికెట్ల పతనం: 1–29, 2–87, 3–128. బౌలింగ్‌: మాల్కి మదర 2.5–0–22–1, కావ్య 3–0– 32–1, కవీశా 2–0–15–1, ఇనోక రణవీర 2–0–31–0, చమరి 1–0–17–0, శాషిని 1–0–12–0.

INDW vs SLW 2nd T20I: Team India restricted Sri lanka to 128 runs8
సత్తా చాటిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన శ్రీలంక

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంక మహిళా జట్టుతో విశాఖ వేదికగా ఇవాళ (డిసెంబర్‌ 23) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌.. శ్రీలంకను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. దీప్తి శర్మ స్థానంలో జట్టులో వచ్చిన స్నేహ్‌ రాణా (4-1-11-1) అద్బుతంగా బౌలింగ్‌ చేసింది. వైష్ణవి శర్మ (4-0-32-2), శ్రీ చరణి (4-0-23-2), క్రాంతి గౌడ్‌ (3-02-1) కూడా రాణించారు. అరుంధతి రెడ్డి (3-0-22-0), అమన్‌జోత్‌ కౌర్‌ (2-0-11-0) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్డు కూడా చెలరేగిపోయారు. ఏకంగా ముగ్గురిని రనౌట్‌ చేశారు. అమన్‌జోత్‌, క్రాంతి గౌడ్‌, శ్రీ చరణి వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌కు అద్భుతమైన త్రోలు అందించి ముగ్గురిని రనౌట్‌ చేశారు. లంక ఇన్నింగ్స్‌లో హర్షిత సమరవిక్రమ (33) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. కెప్టెన్‌ చమారి (31), హాసిని పెరీరా (22), కవిష దిల్హరి (14), కౌషిని (11) అతి కష్టంమీద రెండంకెల స్కోర్లు చేశారు. విష్మి గౌతమ్‌ (1), నీలాక్షి (2), కావ్యా కవింది (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. శశిని డకౌటైంది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ చేసి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఇదే విశాఖ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధ్యింలోకి వెళ్లింది.తుది జట్లు.. శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, కౌషని న్యూత్యాంగన(w), మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్‌హనైభారత్‌: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి

limited berths, tough competition.. Story on indian senior men's cricket team9
ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గా ఉండటం కలేనా..?

ఇటీవలికాలంలో భారత పురుషుల క్రికెట్‌లో విపరీతమైన పోటీ నెలకొంది. ఒక్కో స్థానం కోసం పదుల సంఖ్యలో పోటీపడుతున్నారు. దీంతో ఫార్మాట్‌కు ఒక్క జట్టు సరిపోదనే వాదన వినిపిస్తుంది. ఓ దశలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) రెండు జట్లతో ప్రయోగం కూడా చేసింది.1998 సెప్టెంబర్‌లో తొలిసారి సీనియర్‌ పురుషుల క్రికెట్‌ జట్లు రెండు వేర్వేరు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్నాయి. అజయ్‌ జడేజా నేతృత్వంలో ఓ జట్టు మలేసియాలో జరిగిన కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొనగా.. మొహమ్మద్‌ అజారుద్దీన్‌ సారథ్యంలో మరో జట్టు కెనడాలో పాకిస్తాన్‌తో సహారా కప్‌ ఆడింది. కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్న జట్టులో సచిన్‌ టెండూల్కర్‌, అనిల్‌ కుంబ్లే లాంటి స్టార్‌ ఆటగాళ్లు ఉండగా.. సహారా కప్‌ జట్టుకు రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీ లాంటి స్టార్లు ప్రాతినిథ్యం వహించారు. ఇలాంటి ప్రయోగమే 2021లో మరోసారి జరిగింది. షెడ్యూల్‌ క్లాష్‌ కావడంతో రెండు వేర్వేరు భారత జట్లు ఇంగ్లండ్‌, శ్రీలంక దేశాల్లో పర్యటించాయి. విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని జట్టు ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడగా.. శిఖర్‌ ధవన్‌ సారథ్యంలోని జట్టు శ్రీలంకలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడింది.పై రెండు సందర్భాల్లో ఒకే సమయంలో రెండు వేర్వేరు భారత జట్లు ఆడటమనేది షెడ్యూల్‌ క్లాష్‌ కావడం వల్ల జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విషయం​ అది కాదు. షెడ్యూల్‌ క్లాష్‌ కాకపోయినా భారత్‌కు రెండు వేర్వేరు జట్ల ఆవశ్యకత ఉంది. ఎందుకంటే 11 బెర్త్‌ల కోసం విపరీతమైన పోటీ ఉంది. ఏ స్థానం తీసుకున్నా, అర్హులైన ఆటగాళ్లు కనీసం పదుల సంఖ్యలో ఉన్నారు.వీరిలో ఒకరికి న్యాయం చేస్తే, మిగతా తొమ్మిది మందికి అన్యాయం జరుగుతుంది. అందుకే మల్టిపుల్‌ జట్ల ప్రస్తావన మళ్లీ తెరపైకి వస్తుంది. ఇలా చేస్తే, అర్హులైన ప్రతి ఒక్కరికి దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించినట్లవుతుంది. అలాగే వారి టాలెంట్‌కు కూడా న్యాయం చేసినట్లవుతుంది.ఇటీవలికాలంలో మూడు ఫార్మాట్ల భారత జట్లలో ఒకరిద్దరికి క్రమం తప్పకుండా అన్యాయం జరుగుతూ వస్తుంది. ఈ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు సంజూ శాంసన్‌. సంజూ టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్‌గా క్రమం తప్పకుండా రాణిస్తున్నా, శుభ్‌మన్‌ గిల్‌ కారణంగా అతడికి అవకాశాలు రాలేదు. తాజాగా భారత సెలెక్షన్‌ కమిటీ సంజూకి న్యాయం (గిల్‌ను పక్కన పెట్టి టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక) చేసినప్పటికీ.. వేరే కోణంలో విమర్శలు మొదలయ్యాయి.తీవ్రమైన పోటీ కారణంగా ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో స్థానం దక్కని ఆటగాళ్లు సంజూ కాకుండా చాలామంది ఉన్నారు. రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైస్వాల్‌, రిషబ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌, సాయి సుదర్శన్‌, రజత్‌ పాటిదార్‌, పడిక్కల్‌, ధృవ్‌ జురెల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, సిరాజ్‌, షమీ, చహల్‌, రవి బిష్ణోయ్‌, ఆకాశ్‌దీప్‌ లాంటి వారు అర్హులై, క్రమంగా రాణిస్తున్నా తుది జట్లలో అవకాశాలు రావడం లేదు. వచ్చినా ఏదో ఒక ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమవుతున్నారు.బెర్త్‌లు పదకొండే కావడంతో స్టార్‌ ప్లేయర్లకు కూడా కొన్ని ఫార్మాట్లలో ఈ కష్టాలు తప్పడం లేదు. కేఎల్‌ రాహుల్‌ లాంటి ఆటగాడు వాస్తవానికి ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌ అయినా అతనికి టీ20 జట్టులో అవకాశం దక్కడం లేదు. అలాగే శ్రేయస్‌ అయ్యర్‌ కూడా ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌ అయినా, అతనిదీ ఇదే అనుభవం. రిషబ్‌ పంత్‌ లాంటి డాషింగ్‌ బ్యాటర్‌ పరిస్థితి అయితే మరీ దారుణం. అతన్ని కేవలం​ టెస్ట్‌ల్లో మాత్రమే చూడాల్సి వస్తుంది. వాస్తవానికి అతనికి ఉన్న దూకుడుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సెట్‌ ప్లేయర్‌. అయినా పరిమిత బెర్త్‌ల కారణంగా పంత్‌ సింగిల్‌ ఫార్మాట్‌కే పరిమితమయ్యాడు. బౌలింగ్‌లో సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, ఆకాశ్‌దీప్‌ లాంటి వారి పరిస్థితి కూడా ఇదే. షమీ లాంటి వారికైతే మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్నా కనీసం ఒక్క ఫార్మాట్‌ జట్టులోనూ చోటు దక్కడం లేదు.మూడు ఫార్మాట్లలో మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేస్తుంటేనే పరిస్థితి ఇలా ఉంది. అదే.. గతంలో మాదిరి మూడు ఫార్మాట్లకు ఒకే జట్టు ఉంటే సెలెక్టర్లకు ఊపిరి తీసుకోవడం సాధ్యమయ్యేదా..? ఏ ప్లేయర్‌ అయినా తాను ఏదో ఒక్క ఫార్మాట్‌కు మాత్రమే పరిమితం కావాలని అనుకోడు. మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టుకు ప్రాతినథ్యం వహించాలని ప్రతి ఒక్కరు కలగంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫార్మాట్‌కు ఒక జట్టు ఎంపిక చేసే దానికంటే, పోటీ దృష్ట్యా ఒక్కో ఫార్మాట్‌కు ఒకటికి మించిన జట్లను ఎంపిక చేయడం​ మంచిదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల అర్హుడైన ఏ ఒక్కరికి అన్యాయం​ జరగకుండా ఉంటుంది. అయితే ఇలా చేసేటప్పుడు సీనియర్‌ జట్టు, జూనియర్‌ జట్టు అన్న తేడాలు ఉండకుండా చూసుకుంటే మంచింది. ఎందుకంటే, ఏ టాలెండెడ్‌ ఆటగాడైనా తాను ఎక్కువ-తక్కువగా ఉండాలని అనుకోడు.చిన్న జట్లు, పెద్ద జట్లు అన్న తేడా లేకుండా అన్ని జట్లు సమానంగా మ్యాచ్‌లు ఆడాలి. మరి ఇలాంటి ప్రయోగానికి బీసీసీఐ ఎప్పుడు శ్రీకారం చుడుతుందో వేచి చూడాలి.

INDW vs SLW 2nd T20I: India won the toss and choose to bowl, here are playing XI10
శ్రీలంకతో రెండో టీ20.. టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ దూరం

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంక మహిళా జట్టుతో విశాఖ వేదికగా ఇవాళ (డిసెంబర్‌ 23) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ ఓ మార్పు చేయగా.. శ్రీలంక తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ స్వల్ప అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌ ఆడటం లేదని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది. దీప్తి స్థానంలో స్నేహ్‌ రాణా తుది జట్టులోకి వచ్చింది.కాగా, ఇదే విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధ్యింలోకి వెళ్లింది. తుది జట్లు.. శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, కౌషని న్యూత్యాంగన(w), మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్‌హనైభారత్‌: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement