సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్ను ప్రవేశపెట్టింది. అధికారులు, ఉద్యోగులు జీన్స్, టీ–షర్టులు, తదితర ఫ్యాన్సీ దుస్తులు ధరించడంపై నిషేధం విధిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కొత్త ఆదేశాలు జారీ చేసింది.జి మ్కు సంబంధించిన ఒక ప్రొడక్ట్ను ప్రచారం చేస్తున్నట్లుగా సోషల్ మీడియా పోస్ట్తో ప్రభుత్వ అధికారులపై చర్చ, షిమ్లా అర్బన్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ఓషిన్ శర్మకు సంబంధించిన ఇటీవలి వివాదం నేపథ్యంలో ఈ ఆదేశం వెలువడింది.
మార్చి 16న పర్సనల్ డిపార్ట్మెంట్ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ తెలిపారు. ఈ నిబంధనలను పాటించనివారిపై కఠిన చర్యలుంటాయని కూడా హెచ్చరించారు. అంతేకాదు వీటిని కఠినంగా అమలు చేసేలా పరిపాలనా కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా అధికారులందరికీ కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు.
ఇదీ చదవండి: 8 ఏళ్ల కూతుర్ని రైలుకిందికి తోసేసి కాపాడొద్దంటూ గగ్గోలు
తాజా ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు , కోర్టు విచారణలతో సహా అధికారిక కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు, లాంఛనప్రాయంగా , హుందాగా కనిపించాలని రాష్ట్రం ఆదేశించింది. లేత రంగుల్లో ఉండే ఫార్మల్ దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజా సేవతో ముడిపడి ఉన్నసిబ్బంది హుందాతనాన్ని, గౌరవాన్ని ప్రతిబింబించాలని ఆదేశించింది. అలాగే పార్టీ వేర్ను కూడా ప్రభుత్వం నిషేధించింది. పురుష ఉద్యోగులు కాలర్ ఉన్న షర్టులు, ఫార్మల్ ప్యాంట్లు, ట్రౌజర్లు ధరించడం తప్పనిసరి. మహిళలు చీరలు, ఫార్మల్ సూట్లు, సల్వార్ కమీజ్, చుడీదార్ లేదా చున్నీ ఉన్న కుర్తాలను ధరించొచ్చు. ప్యాంట్లు, షర్టులు వేసుకోవచ్చు. అలాగే తగిన పాదరక్షలు ధరించాలి.
రాష్ట్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ నీరజ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులో, ఉద్యోగులు సోషల్ మీడియా, ఇతర బహిరంగ వేదికలపై బాధ్యతా యుతంగా, హుందాగా ఉండాలని ఆదేశించారు. ఉద్యోగులు ఏదైనా వేదికపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే, అవి తమ వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా పేర్కొనాలని వివరించింది.
ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారి


