భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ ‘భారీ’ ధరకు అమ్ముడుపోయాడు. టీ20 ముంబై లీగ్ తాజా వేలంలో ARCS అంధేరి ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేసింది. కనీస ధర కంటే అతడి కోసం ఫ్రాంఛైజీ ఏకంగా 400 శాతం ఎక్కువగా ఖర్చు చేయడం గమనార్హం.
ఐపీఎల్లో ముంబై నుంచి లక్నోకు
కాగా ఆటలో తండ్రి తగ్గ తనయుడు అనిపించుకోలేకపోతున్నాడు అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar). ఇప్పటికీ క్రికెటర్గా అతడికి పూర్తి స్థాయి గుర్తింపులేదు. దేశీ క్రికెట్లో కొన్నాళ్లు సొంత జట్టు ముంబైకి ఆడిన అర్జున్.. ఆ తర్వాత గోవాకు మారిపోయాడు. అయినా ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్కు పెద్దగా గుర్తింపు రావడం లేదు.
బెంచ్కే పరిమితం
ఇక ఐపీఎల్లో చాలా కాలం ముంబై ఇండియన్స్లో ఉన్నాడు అర్జున్. ఈ జట్టుకు సచిన్ మెంటార్గా ఉండగా.. అర్జున్ను కనీస ధర రూ. 30 లక్షలకు ముంబై కొనుగోలు చేసింది. ఇటీవలే అతడిని లక్నో సూపర్ జెయింట్స్కు ట్రేడ్ చేసింది. అయితే, లక్నో తుదిజట్టులోనూ అతడికి స్థానం దక్కడం లేదు. దీంతో బెంచ్కే పరిమితమయ్యే పరిస్థితి.
ధర ఎంతంటే?
ఇలాంటి తరుణంలో తొలిసారి టీ20 ముంబై లీగ్లో ఆడేందుకు అర్జున్ టెండుల్కర్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వేలంలో కనీస ధర రూ. 2 లక్షలతో పేరు నమోదు చేసుకున్నాడు.
ఈ క్రమంలో శనివారం నాటి వేలంలో అంధేరీ ఫ్రాంఛైజీ అర్జున్ కోసం పోటీపడింది. ఆఖరికి రూ. 10 లక్షల ధరకు అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్ జీతంలో ఇది దాదాపు 33 శాతం.
కాగా టీమిండియా స్టార్, 2024, 2026 వరల్డ్కప్ గెలిచిన జట్లలో సభ్యుడైన శివం దూబే కూడా అంధేరీ జట్టుకే ఆడుతున్నాడు. అతడి ధర రూ. 20 లక్షలు. ఇక తాజా వేలంలో టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ను అంధేరీ రూ. 11 లక్షలకు కొనుగోలు చేసింది.
అనుమతి వచ్చిందిలా..
ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)తో సంబంధం లేకున్నా.. ఈ టీ20 లీగ్లో ఆడేందుకు అర్జున్ టెండుల్కర్కు ప్రత్యేక అనుమతి లభించింది. స్వతహాగా ముంబైకర్ అయిన అర్జున్.. గతేడాది వేరే రాష్ట్ర టీ20 లీగ్లో ఆడనందున బీసీసీఐ నిబంధన ప్రకారం అతడు ముంబై టీ20 లీగ్లో ఆడేందుకు మార్గం సుగమమైంది.
కాగా ఐపీఎల్ కాకుండా కేవలం ఒకే ఒక్క స్థానిక లీగ్లో ఆడేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇదలా ఉంటే.. జూన్ మొదటి వారంలో టీ20 ముంబై లీగ్ జరుగనున్నట్లు సమాచారం.
👉టీ20 ముంబై లీగ్.. రిటైన్ ప్లేయర్ల జాబితా ప్రకటన
చదవండి: ద్రవిడ్ ‘ది గ్రేట్’ అన్నాడు!.. పాక్ పేసర్కు షాకిచ్చిన పీసీబీ!


