రిటైన్‌ ప్లేయర్ల జాబితా ప్రకటన | Mumbai Cricket Association announces retained players for 2026 T20 Mumbai League | Sakshi
Sakshi News home page

రిటైన్‌ ప్లేయర్ల జాబితా ప్రకటన

Apr 25 2026 12:40 PM | Updated on Apr 25 2026 12:52 PM

Mumbai Cricket Association announces retained players for 2026 T20 Mumbai League

ప్రతిష్టాత్మక టీ20 ముంబై లీగ్‌ 2026 సీజన్‌కు సంబంధించిన రిటైన్ ఆటగాళ్ల జాబితాను ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఈసారి కూడా భారత స్టార్ క్రికెటర్లు లీగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శివమ్‌ దూబే, యశస్వి జైస్వాల్‌ వంటి స్టార్లు తమ తమ ఫ్రాంచైజీలతో కొనసాగుతున్నారు.

మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు తలా ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. అనుభవజ్ఞులైన అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభకు కూడా సముచిత ప్రాధాన్యం లభించింది.

Triumph Knights Mumbai North East జట్టు సూర్యకుమార్ యాదవ్‌ను ఐకాన్ ప్లేయర్‌గా కొనసాగించింది. యువ సంచలనం ఆయుష్ మాత్రే, సూర్యాంశ్ షెడ్గే కూడా జట్టులో నిలిచారు.

గత సీజన్ రన్నరప్ SoBo Mumbai Falcons తమ ఐకాన్ ప్లేయర్‌గా శ్రేయస్ అయ్యర్‌ను రిటైన్ చేసుకుంది. అంగ్‌క్రిష్ రఘువంశీ, హర్ష్ అఘవ్ కూడా జట్టులో కొనసాగుతున్నారు.

డిఫెండింగ్ ఛాంపియన్ Mumbai South Central Maratha Royals తుషార్ దేశ్‌పాండేను ఐకాన్ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. సిద్ధేశ్ లాడ్, రోహన్ రాజే కూడా కొనసాగనున్నారు.

Bandra Blasters తరఫున యశస్వి జైస్వాల్ ఐకాన్ ప్లేయర్‌గా నిలిచాడు. సువేద్ పార్కర్, ధృమిల్ మట్కర్ జట్టులో కొనసాగుతున్నారు.

ARCS Andheri శివమ్ దూబేను రిటైన్ చేయగా, ప్రగ్నేష్ కన్పిల్లేవార్, దీపక్ శెట్టి కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.

Aakash Tigers Mumbai Western Suburbs సర్ఫరాజ్ ఖాన్‌ను ఐకాన్ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. షమ్స్ ములానీ, జే బిస్తా కూడా జట్టులో ఉన్నారు.

North Mumbai Panthers అజింక్య రహానేను రిటైన్ చేసుకోగా, అభిజ్ఞాన్ కుందు, తనుష్ కోటియన్ జట్టులో కొనసాగుతున్నారు.

Eagle Thane Strikers శార్దూల్ ఠాకూర్‌ను ఐకాన్ ప్లేయర్‌గా నిలబెట్టుకుంది. అథర్వ అంకోలేకర్, సాయిరాజ్ పాటిల్ కూడా జట్టులో ఉన్నారు.

ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్‌ మాట్లాడుతూ, ఈ రిటెన్షన్లు లీగ్ స్థాయిని మరింత పెంచుతాయని అన్నారు. యువ ఆటగాళ్లకు స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం లభించడం వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

2018లో ప్రారంభమైన ఈ లీగ్ ఇప్పటికే అనేక మంది యువ ఆటగాళ్లకు జాతీయ స్థాయికి వెళ్లే వేదికగా నిలిచింది. ఇప్పుడు అందరి దృష్టి త్వరలో జరగనున్న వేలంపై ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement