మూసేసిన డీవీసీ కేసును పునరుద్ధరించుకోవచ్చా? | Legal Advice: Reopening of Evidence Closed in Domestic Violence Case | Sakshi
Sakshi News home page

మూసేసిన డీవీసీ కేసును పునరుద్ధరించుకోవచ్చా?

Jul 29 2026 11:10 AM | Updated on Jul 29 2026 11:17 AM

Legal Advice: Reopening of Evidence Closed in Domestic Violence Case

2024లో నేను నా భర్తపై  గృహహింస కేసుతో సహా క్రిమినల్‌ కేసులు దాఖలు చేశాను. అప్పటి నుంచి నా పిల్లలతో కలిసి నా పుట్టింటిలోనే ఉంటున్నాను. 2025లో నా పిల్లల భవిష్యత్తు కోసం, అలాగే నా భర్త మాతో తిరిగి కలుస్తానని నమ్మించడంతో గృహహింస కేసు (డీవీసీ)ను ఎలాంటి షరతులు లేకుండా ఉపసంహరించుకున్నాను. కానీ, ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ మమ్మల్ని కాపురానికి తీసుకెళ్లలేదు. పైగా క్రిమినల్‌ కేసు 498 అ (సీసీ) ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఆ కేసును కూడా ఉపసంహరించుకుంటేనే మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తానంటూ అర్థం లేని షరతులు పెడుతున్నాడు. 

తన మీద పెట్టిన కేసులు తీసేసేలా మమ్మల్ని నమ్మించి మోసం చేశాడని అర్థమయ్యింది. ఇప్పుడు నా సమస్య ఏమిటంటే...నేను షరతులు లేకుండా ఉపసంహరించుకున్న DVC కేసును పునరుద్ధరించుకునే అవకాశం ఉందా? నా వ్యక్తిగత వస్తువులు, కట్నం కింద ఇచ్చిన భూమి (పత్రాలు), ఇతర సామగ్రి ఇంకా నా భర్త వద్దే ఉన్నాయి. వాటిని కోర్టు ద్వారా తిరిగి పొందడానికి నాకు చట్టపరమైన వెసులుబాటు ఏమైనా ఉందా? దయచేసి నాకు తగిన న్యాయ సలహా అందించగలరు.
– సూసన్, నెల్లూరు

ఏ కేసు అయినా ఉపసంహరించుకునేప్పుడు ఏదైనా సమస్య కొనసాగితే మరలా తిరిగి కేసు ఫైల్‌ చేసే స్వేచ్ఛ ఇవ్వాలి అని కోర్టుని కోరి ఉంటే – అలాంటి స్వేచ్ఛని కోర్టు మీకు ఇవ్వవచ్చు. కానీ మీ కేసులో మీరే స్వచ్ఛందంగా బేషరతుగా ఉపసంహరించుకున్నారు కాబట్టి మరలా అదే కేసును తిరిగి పునరుద్ధరించడం సాధారణంగా కుదరదు. 

అయితే, పరిస్థితులను బట్టి కొత్తగా గృహహింస కొనసాగితే లేదా కొత్త కారణాలు ఏర్పడితే తాజా డీవీసీ దాఖలు చేసే అవకాశం లేక΄ోలేదు. రెండవసారి డీవీసీ కేసు వేయడానికి ఎలాంటి అవరోధమూ లేదు. పైగా మీ భర్త ఉద్దేశపూర్వకం గా మోసగించి కేసు విరమించుకునేలా చేశాడని చెబుతూ, దానిని కోర్టులో నిరూపిస్తే, మీకు మేలు జరుగుతుంది. మీ వ్యక్తిగత వస్తువులు, నగలు, ఆస్తి పత్రాలు లేదా ఇతర సామగ్రిని భర్త అక్రమంగా తన వద్ద ఉంచితే, వాటి స్వాధీనం కోసం డీవీసీ కేసులోనే అదనపు మధ్యంతర ఉత్తర్వులు కోరవచ్చు.

భర్త క్రిమినల్‌ కేసు ఉపసంహరణను షరతుగా పెట్టి కాపురానికి తీసుకెళ్తానని చెప్పడం చట్టపరంగా సమంజసం కాదు. గృహ హింస కేసులు, మెయింటైనెన్స్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాగానీ కాపురం చేయటానికి అడ్డు కాదు. మీ భర్త ఇప్పటికైనా కాపురానికి తీసుకెళ్తారు అంటే, ఎవరైనా లాయర్‌ ద్వారా మధ్యవర్తిత్వం చేసి ఒప్పందం రాసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. కేసు ఉపసంహరణపై నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా న్యాయవాది సలహా తీసుకోవడం అవసరం. పటిష్టమైన ఒప్పంద పత్రాలు రాసుకుని కేసులు ఉపసంహరించుకుంటే మీకు ఇలాంటి సమస్యలు రావు.

– శ్రీకాంత్‌ చింతల
(హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు.  )

(చదవండి: టీసీఎస్‌ ఉద్యోగాన్ని కాదనుకుని రైస్‌ వ్యాపారం..! కట్‌చేస్తే ఏడాదికి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement