న్యూఢిల్లీ: దేశ రాజధాని రాజకీయాల్లో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ‘బొద్దింకల’ హడావుడి మరింత పెరిగింది! పరీక్షల రచ్చతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించిన ‘సీజేపీ’ బాటలోనే తాజాగా మరో వింత సంఘం తెరపైకి వచ్చింది. అదే ‘ఈ20 జనతా పార్టీ’ (ఈజేపీ). ఇప్పుడు ఈ కొత్త ఆన్లైన్ వేదిక కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని చుట్టుముట్టేందుకు పావులు కదుపుతోంది. ప్రభుత్వ ఇథనాల్ విధానాన్ని ఎండగడుతూ, కేంద్ర మంత్రిని టార్గెట్ చేస్తూ ఈ వర్గం సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న రచ్చ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారుతోంది.
ఇథనాల్ కలిపిన పెట్రోల్పై దేశవ్యాప్తంగా వాహనదారుల్లో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా, దీన్ని ఆసరాగా చేసుకుని ‘ఈ20 జనతా పార్టీ’ తెరపైకి వచ్చింది. ఇథనాల్ బ్లెండింగ్కు తాము వ్యతిరేకం కాదంటూనే, మరోవైపు నితిన్ గడ్కరీ అనుసరిస్తున్న ఇథనాల్ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అసలు సిసలైన 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ను అదనపు ఆప్షన్గా ఇవ్వాల్సిందేనంటూ గడ్కరీని ఇరుకున పెట్టేందుకు ఈ ‘బొద్దింకల’ స్ఫూర్తితో పుట్టుకొచ్చిన కొత్త బృందం సిద్ధమవుతోంది.
‘మా డిమాండ్ ఒక్కటే.. స్వచ్ఛమైన పెట్రోల్ మా హక్కు’ అంటూ ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వేదికగా వీరు చేస్తున్న ప్రచారం ఇప్పుడు యువతను, వాహనదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కీలకమైన ఇంధన విధానాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. ఒకవైపు ఎనర్జీ సెక్యూరిటీ అంటున్న ప్రభుత్వానికి, మరోవైపు వాహనాల మైలేజ్ పడిపోతోందని ఆవేదన చెందుతున్న వినియోగదారులకు మధ్య ఈ వివాదం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చుతోంది. మొత్తానికి, 'కాక్రోచ్ జనతా పార్టీ' బాటలోనే దూసుకొస్తున్న ఈ 'ఈ20 జనతా పార్టీ' ఉద్యమం.. రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది!
ఇది కూడా చదవండి: డిశ్చార్జ్ తర్వాత వాంగ్చుక్ ప్రణాళిక ఇదే..


