Alluri Sitarama Raju
-
ప్రత్యేక రైళ్లు పొడిగింపు
తాటిచెట్లపాలెం(విశాఖ): విశాఖప ట్నం–ఎస్ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం, విశాఖపట్నం–షాలిమర్– విశాఖపట్నం మధ్య నడుస్తున్న స్పెషల్ రైళ్లు మరికొంత కాలం పొడిగించినట్లు సౌత్ కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వై.బాలాజి కిరణ్ తెలిపారు. విశాఖలో ప్రతీ మంగళవారం బయలుదేరే విశాఖపట్నం–షాలిమర్(08508) స్పెషల్ రైలు సెప్టెంబరు 29వ తేదీ వరకు, షాలిమర్లో ప్రతీ బుధవారం బయలుదేరే షాలిమర్–విశాఖపట్నం (08507) స్పెషల్ సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడిగించారు. విశాఖలో ప్రతీ శుక్రవారం బయలుదేరే విశాఖపట్నం–ఎస్ఎంవీ బెంగళూరు(08581) వీక్లీ స్పెషల్ సెప్టెంబరు 25వ తేదీ వరకు, ఎస్ఎంవీ బెంగళూరులో ప్రతీ శనివారం బయలుదేరే ఎస్ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం (08581) వీక్లీ స్పెషల్ సెప్టెంబరు 26వ తేదీ వరకు పొడిగించారు. -
విభిన్న ప్రతిభావంతుల అర్జీలకు సత్వర పరిష్కారం
కలెక్టర్ నిశాంతి ఆదేశం పాడేరు: విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ నిశాంతి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో సోమవారం కలెక్టరేట్లో స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సోమ వారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభవంతుల నుంచి కలెక్టర్ నిశాంతి 15 అర్జీలు స్వీకరించారు. అనంతరం పలువురు దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమణిస శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇన్చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, డీఎల్పీవో కుమార్, విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ కె.కవిత, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
పశువులకు వ్యాధి నిరోధక టీకాలు
చింతపల్లి: గిరిజన ప్రాంతంలో పశువులు మృత్యువాత పడకుండా వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టినట్టు లోతుగెడ్డ పశు వైద్యాధికారి సౌజన్యదేవి తెలిపారు.సోమవారం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోగల కిన్నెర్ల గ్రామంలో పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా 52 పశువులకు బ్లాక్ క్వార్టర్ వాక్సిన్ వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బ్లాక్ క్వార్టర్ ప్రాణాంతకమైన బాక్టీరియా సంక్రమణ వ్యాధి అని చెప్పారు. వ్యాధి అతివేగంగా వ్యాప్తి చెంది పశువుల మరణానికి దారితీస్తుందన్నారు. వ్యాధి సోకిన పశువులకు జ్వరం,కుంటితనం లక్షణాలు కన్పిస్తాయని చెప్పారు. లక్షణాలను గుర్తించిన రైతులు వెంటనే చికిత్స చేయించాలని సూచించారు.లేకుంటే ఒకటి రెండు రోజుల్లో మృత్యువాత పడే అవకాశం ఉంటుందని చెప్పారు.ఈ వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం వాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతోందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మనోజ్,శివ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
తీరని దారిద్య్రం
సీఎం, డిప్యూటీ సీఎం పర్యటించినా ● పర్యటనకు ముందు హడావుడిగా పనులు ● ముగిసిన తరువాత పట్టించుకోని అధికారులు ● ప్రమాదాలకు గురవుతున్న ద్విచక్రవాహనాలు ● నరకయాతన పడుతున్న ప్రయాణికులు ● పర్యాటకులకు తప్పని అవస్థలు సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు... ఇక ‘దారి’ద్య్రం తీరినట్టేనని ఆయా గ్రామస్తులు ఎంతో సంతోషించారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు కూడా రోడ్లను అందంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. పర్యటన సమయంలో కొంత భాగం నిర్మించారు. మిగతా భాగాన్ని వదిలేయడంతో ఆ రోడ్లు ప్రస్తుతం అధ్వానపు బాటలకు కేరాఫ్ అడ్రస్గా మారాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటనలు చేసినప్పటికీ రోడ్ల దుస్థితి మారకపోవడంపై స్థానిక ఆదివాసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి,పాడేరు: సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటించడంతో అధికారులు హడావుడిగా రోడ్ల నిర్మాణం చేపట్టారు. వారి పర్యటన ఎక్కడవరకూ ఉందో ఆ మేర మాత్రమే నిర్మించి, మిగతా భాగాన్ని నిధులు లేవనే సాకుతో గాలికి వదిలేశారు.ప్రస్తుతం ఈ అధ్వాన రోడ్లలో ప్రయాణానికి ప్రజలు నరకయాతన పడుతున్నారు. కొత్త పాడేరు ఆర్అండ్బీ రోడ్డు సీఎం చంద్రబాబు గత ఏడాది ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాడేరు మండలం వంజంగి ప్రాంతంలో పర్యటించారు. సీఎం రాకతో పాడేరు కాన్వెంట్ జంక్షన్ నుంచి కొత్తపాడేరు మీదుగా లగిశపల్లి హెలిపాడ్,వంజంగి రోడ్ల అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్తపాడేరు జంక్షన్ నుంచి లగిశపల్లి వరకు మాత్రమే రోడ్డును అభివృద్ధి చేశారు.గొందూరు కాన్వెంట్ జంక్షన్ నుంచి కొత్తపాడేరు జంక్షన్ వరకు కిలోమీటరు రోడ్డుకు ఇరువైపులా వెడల్పు చేసే పనులు చేపట్టి, కంకరతో కూడిన క్రషర్ బుగ్గి వేసి మమ అనిపించారు. సీఎం పర్యటన ముగిసి 10 నెలలు కావస్తున్నా ఇంతవరకు రోడ్డును అభివృద్ధి చేయకపోవడంతో అధ్వానంగా మారింది.రోడ్డు అంచులు కోతకు గురవడంతో పాటు రోడ్డుపై రాళ్లు తేలడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం చంద్రబాబు పర్యటించడంతో రోడ్డు అభివృద్ధి చెందుతుందని ఆశపడిన పాడేరు,లగిశపల్లి,వంజంగి పంచాయతీ ప్రజలకు నిరాశే మిగిలింది. రోడ్డును అభివృద్ధి చేయకపోవడంతో వంజంగి కొండను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఓనూరు రోడ్డుదీ అదే గతి పాడేరు ఘాట్లోని మోదకొండమ్మతల్లి పాదాలు గుడి సమీపంలోని ఆర్అండ్బీ రోడ్డులోని కాఫీతోటల జంక్షన్ నుంచి మారుమూల ఓనూరుకు వెళ్లే పంచాయతీ రోడ్డు కూడా అధ్వానంగా ఉంది.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈఏడాది మార్చి 14న నందిగరువు రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చారు.అయితే ఆరోడ్డు ప్రారంభించాలంటే సుమారు 2కిలోమీటర్ల ఓనూరు జంక్షన్ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది.ఉప ముఖ్యమంత్రి పర్యటనతో కాఫీతోటల నుంచి ఓనూరు జంక్షన్ రోడ్డును అభివృద్ధి చేస్తామని ప్రకటించిన ఐటీడీఏ యంత్రాంగం ఇంజినీరింగ్ఽశాఖలతో పని ప్రారంభించింది. క్రషర్ బుగ్గితో తాత్కాలికంగా అభివృద్ధి చేసింది. ఈరోడ్డును కూడా తారురోడ్డుగా అభివృద్ధి చేస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు.క్రషర్ బుగ్గితో చదును చేసి, డిప్యూటీ సీఎం పవన్ పర్యటన ముగించిన అధికారులు ఓనూరు రోడ్డు అభివృద్ధిని గాలికి వదిలేశారు.క్రషర్ బుగ్గిపై ప్రయాణిస్తున్న వాహనాలు జారిపోయి అదుపు తప్పుడుతండడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాడేరు మండలంలోని మోదాపల్లి,వంట్లమామిడి పంచాయతీల ద్విచక్రవాహన చోదకులు నరకయాతన పడుతున్నారు. భారీ వర్షం కురిస్తే వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని గిరిజనులు వాపోతున్నారు. -
ఉద్యోగులు అందుబాటులో లేకపోతే ఉపేక్షించేది లేదు
అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగంఅరకులోయటౌన్(పాడేరురూరల్): సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేకపోయినా, సక్రమంగా విధులు నిర్వహించకపోయినా ఉపేక్షించేది లేదని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరించారు. అరకులోయ మండలం సిర్గం పంచాయతీలో సోమవారం ఆయన పర్యటించారు. గ్రామ సచివాలయాన్ని సందర్శించి, రికార్డులు పరిశీలించారు. సెక్రటరీ వారం రోజుల నుంచి విధులకు హాజరుకావడం లేదని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సెక్రటరీని తక్షణం సస్పెండ్ చేయాలని జిల్లా పంచాయతీరాజ్ అభివృద్ధి అధికారిని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం స్థానిక మండల పరిషత్ పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఉపాధ్యాయుడు విధులకు డుమ్మాకొడుతున్నట్టు తెలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సిఫారసు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగులు విధులపట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. కింది స్థాయి ఉద్యోగులు ఏవిధంగా విధులకు హాజరవుతున్నారో సంబంధిత అధికారులు పర్యవేక్షించడపోడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉమ్మడి విశాఖ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో మౌలికసదుపాయాల కల్పనపై దృష్టి
జి.మాడుగుల: పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై హెచ్ఎంలు దృష్టి సారించాలని అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ కె. స్వామినాయుడు సూచించారు. స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో సోమవారం మన బడి– మన భవిష్యత్తుపై మోడల్ ప్రైమరీ స్కూళ్లు, సీఎంఏ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో పాఠశాలలకు మంజూరైన మౌలిక సదుపాయాల గురించి హెచ్ఎంలకు వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయుల కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో పాత్రుడు,డీఆర్పీ మౌళి, ఎంఈవో బాబూరావుపడాల్, ఎంఈవో–2 వెంకటరమణమూర్తి, మండల ఇంజినీరింగ్ అధికారి మాణిక్యం,ఆశ్రమపాఠశాల హెచ్ఎం బాలరాజు,సీఆర్పీలు, పలు పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘సర్’
సాక్షి, పాడేరు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే(సర్) జిల్లాలో మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. సర్వేకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు కలెక్టరేట్కు సకాలంలో చేరుకోకపోవడంతో బీఎల్వోలకు పంపిణీ చేయలేకపోయారు.రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి సర్ ప్రారంభమైనప్పటికీ జిల్లాలోని పాడేరు,అరకులోయ నియోజకవర్గాల్లో మాత్రం జరగలేదు. కలెక్టరేట్కు సోమవారం ఎన్యుమరేషన్ ఫారాలు చేరుకోవడంతో వాటిని రెండు నియోజకవర్గాల్లోని ఎన్నికల డీటీలకు కలెక్టరేట్ అధికారుల పంపిణీ చేశారు.వాటిని ఆయా మండలాల్లోని బీఎల్వోలకు సాయంత్రం నాటికి అందజేశారు. జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్ల పరిధిలో మంగళవారం నుంచి ఓటర్ల సమగ్ర సర్వేకు రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.అరకులోయ నియోజకవర్గంలో 2,48,665 మంది ఓటర్లు,పాడేరు నియోజకవర్గంలో 2,51,087 మంది ఓటర్లు ఉన్నారు.వైఎస్సార్సీపీతో పాటు పలు రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్ల సమక్షంలో బీఎల్వోలంతా ఓటర్ల సమగ్ర సర్వే జరపడంతో పాటు ఎన్యుమరేటర్ల ఫారాలు ఓటర్లకు అందజేయనున్నారు. -
ఇళ్ల బిల్లుల కోసం ఆందోళన
భారీ ర్యాలీ, ఎంపీడీవోకార్యాలయం ముట్టడి ముంచంగిపుట్టు: పీఎం జనమన్,జనరల్ గృహాల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రం ముంచంగిపుట్టులో గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. స్థానిక కల్యాణ మండపం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, ముట్టడించారు. అనంతరం పెద్ద ఎత్తున ధర్నా చేశారు.ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల అధ్యక్ష,కార్యదర్శులు ఎం.ఎం.శ్రీను, కె.నర్సయ్య మాట్లాడుతూ బిల్లులు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోలేకపోతున్నారని, మొండిగోడలతో అసంపూర్తిగా నిర్మాణాలు నిలిచిపోడంతో తీవ్ర అవస్థలకు గురవుతున్నారని తెలిపారు. పీఎం జన్మన్ గృహాలు మంజూరు చేసి రెండు సంవత్సరాలు అవుతున్నా అసంపూర్తిగా దర్శనం ఇస్తున్నాయని,ఒక పక్క రోజురోజుకు గృహ నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. బిల్లుల మంజూరులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో గృహ లబ్ధిదారులు పడరాని పాట్లు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గృహానికి రూ. లక్ష చొప్పన పెంచిన నగదును వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. జనరల్ కేటగిరీలో ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించి, సర్వే చేసి ఏడాది అవుతున్నా నేటికీ ఒక గృహం కూడా మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. తక్షణమే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు బకాయి బిల్లులు చెల్లించాలని, జనరల్ గృహాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం గృహ నిర్మాణ బిల్లులు, సమస్యలపై ఎంపీడీవో ధర్మారావు,హౌసింగ్ ఏఈ కృష్ణరావులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కమిటీ నాయకుడు త్రినాఽథ్, మండల నాయకులు నారాయణ, జీనబంధు, సీతారామ్, నర్సంగ్రావుపడాల్, గణపతి, హౌసింగ్ లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఏపీఏఐఎంఎస్ ద్వారా ఎరువుల పంపిణీ
చింతపల్లి: చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలోని రైతులకు ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేస్తున్నట్టు వ్యవవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తిరుమలరావు తెలిపారు. గత ఏడాది రైతులు నమోదు చేసుకున్న ఈ–క్రాప్లో ఎటువంటి తప్పొప్పులు ఉన్నా, వాటిని ఈ ఏడాది ఈ యాప్ ద్వారా సరిచేసుకునే అవకాశం ఉంటుందన్నారు. గతంలో నమోదైన పంటల్లో మార్పులు చేసుకున్నా, ఆధార్ అనుసంధానం కాకపోయినా, రైతు మొత్తం విస్తీర్ణం నమోదు కాకపోయినా ఈ యాప్ ద్వారా రైతు సేవా కేంద్రంలో సరిచేసుకోవచ్చున్నారు. ఈ సంవత్సరం మీ పంటకు అవసరమైన యూరియా, డీఏపీ వంటి ఎరవులను మూడుసార్లు 20 రోజుల వ్యవధిలో పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.వ్యవసాయ భూమి, కౌలు రైతులకు మాత్రమే అందజేస్తామన్నారు. రైతులు విదిగా ఏపీఏఐఎంఎస్ యాప్లో వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. -
మాచ్ఖండ్ ఆధునికీకరణకు చర్యలు తీసుకోవాలి
ముంచంగిపుట్టు: అంధ్ర–ఒడిశా రాష్ట్రాలు మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం ఆధునికీకరణకు చర్యలు తీసుకోవాలని ఒడిశా జలవిద్యుత్ కార్పొరేషన్ డైరెక్టర్ మహంతి అన్నారు. మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. విద్యుత్ కేంద్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి ఇటీవల జరిగిన ప్రమాదం తీరుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఒడిశా జలవిద్యుత్ కార్పొరేషన్ డైరెక్టర్ మహంతి మాట్లాడుతూ మాచ్ఖండ్లో ప్రమాదం జరిగి 21 రోజులు జరుగుతున్నాయని, కొన్ని నెలల పాటు మరమ్మతు పనులు చేసే బదులుగా ఇరు రాష్ట్రాలు ఆధునికీకరణకు ముందుకు వస్తే ఎంతో బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్ర, ఒడిశా ఉన్నతాధికారులు ఆధునికీకరణపై అనుమతులు తీసుకువచ్చి పనులు మొదలు పెట్టాలని ఆయన కోరారు. మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగి 21 రోజులు గడిచిన తరువాత ఒడిశా అధికారులు ప్రాజెక్టు వచ్చి ప్రమాదంపై ఆరా తీయడంపై విమర్శలు గుప్పుమన్నాయి. సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ కె.వి.రాజారావు, కొల్లబ్ జలవిద్యుత్ కేంద్రం ముఖ్య అధికారి చితరంజన్స్వాన్, వోహెచ్పిసి డీజీఎం శ్రీనివాసురావు, ఈఈ సివిల్ కురేష్ ప్రధాన్, ఈఈ జనరేషన్ గోవిందరాజులు తదితరులున్నారు.ఒడిశా జలవిద్యుత్ కార్పొరేషన్ డైరెక్టర్ మహంతి -
బిల్లులు చెల్లించాలని ఆందోళన
ముంచంగిపుట్టు: పీఎం జన్మన్ గృహాల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శి ఎంఎంశ్రీను, కె,నర్సయ్య కోరారు. మండలంలోని బంగారుమెట్ట, లక్ష్మీపురం పంచాయతీలోని పలు గ్రామాల్లో గిరిజన సంఘం ఆధ్వర్యంలో పీఎం జన్మన్ గృహాల బకాయి బిల్లులపై ఆదివారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ పీఎం జన్మన్ బకాయిలపై మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమ వారం లబ్ధిదారులతో ధర్నా చేయనున్నట్టు తెలిపారు.గృహాలు మంజూరు చేసి రెండేళ్లయినా నేటికీ సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడంతో మొండి గోడ లు దర్శనమిస్తున్నాయని, ఉన్న ఇల్లులు తొలగించి, కొంత ఇళ్లు పూర్తికాక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెరిగిన గృహ నిర్మాణ సామగ్రి ధరలతో అవస్థలు పడుతున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.10లక్షలు గృహా నిర్మాణానికి మంజూరు చేయాలని, బకాయిలు బిల్లులు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. లక్ష్మీపురం మాజీ సర్పంచ్ కె.త్రినాథ్, గిరిజన సంఘం నాయకులు, గృహ లబ్ధిదారులు పాల్గొన్నారు. -
సమస్యల వల.. మత్స్య వేట విలవిల
● ఆశ నిరాశల మధ్య మత్స్య వేట ప్రారంభం ● అర్హులకు అందని మత్స్యకార భరోసా మహారాణిపేట: సముద్రంలో మత్స్య సంపద వేట ఆశ, నిరాశల మధ్య పునఃప్రారంభమవుతోంది. 61 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మొదలవుతున్న ఈ వేటపై మత్స్యకారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఒకవైపు సబ్సిడీ డీజిల్ అందకపోవడం, మరోవైపు అర్హులకు ‘మత్స్యకార భరోసా’ రాకపోవడం, వీటికి తోడు ‘ఎదురు అమావాస్య’ రావడంతో వేటను ఎలా ప్రారంభించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే వేట కోసం సుమారు 400 బోట్లు సిద్ధమయ్యాయి. ప్రతి ఏటా ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు సముద్ర తీరంలో మత్స్య సంపద సంరక్షణ, పునరుత్పత్తి కోసం రెండు నెలల పాటు వేట నిషేధం అమలులో ఉంటుందనే సంగతి తెలిసిందే. పది నెలల పాటు అవిశ్రాంతంగా పనిచేసిన మత్స్యకారులకు ఈ రెండు నెలలు విశ్రాంతి లభించింది. నిషేధ కాలం ముగియడంతో జూన్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచే వేటకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ, ఎదురు అమావాస్య ప్రభావం వల్ల దాదాపు 70 శాతం మంది మత్స్యకారులు జూన్ 17 నుంచి వేటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందువల్లే గతంలో ఉన్నంత సందడి ప్రస్తుతానికి ఫిషింగ్ హార్బర్లో కనిపించడం లేదు. రాని రాయితీ డీజిల్ ఆయిల్ వేట ప్రారంభ సమయం ఆసన్నమైనప్పటికీ, ప్రభుత్వ రాయితీ డీజిల్ ఆయిల్ ఇంకా హార్బర్కు చేరుకోలేదు. మార్కెట్లో పెరుగుతున్న డీజిల్ ధరలను భరిస్తూ, సొంత డబ్బులతో ఆయిల్ కొనుగోలు చేసి వేటకు వెళ్లడం తమకు కష్టంగా మారిందని మత్స్యకారులు చెబుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అయితే మత్స్యకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చి, దాని ద్వారా ప్రతి నెల ఒక్కో బోటుకు మూడు వేల లీటర్ల చొప్పున రాయితీ డీజిల్ అందించేవారని, కానీ ఇప్పుడు ఆ కార్డులు పనిచేయడం లేదని, ఆయిల్ కూడా రావడం లేదని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. అర్హులకు అందని మత్స్యకార భరోసా జిల్లాలో వేట నిషేధ కాల భృతి (మత్స్యకార భరోసా) ఇంకా చాలామందికి అందలేదు. ఇస్తామంటూ రోజులు గడుస్తున్నా సాయం అందలేదని మత్స్యకారులు వాపోతున్నారు. జిల్లాలో వేట నిషేధ కాల భృతి కోసం మత్స్యశాఖ 13,597 మంది లబ్ధిదారులను గుర్తించగా, వారిలో 11,224 మందికి మాత్రమే భృతి మంజూరైంది. మిగిలిన 2,373 మందిని వివిధ కారణాలతో ’హోల్డ్’లో పెట్టారు. వీరికి ఇప్పటివరకు ఎలాంటి భరోసా రాలేదని అధికారులు చెబుతున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించాలి ఆదివారం అర్ధరాత్రి నుంచి వేట ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరపడవల్లో తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు, లైఫ్ బోయ్లను అందుబాటులో ఉంచుకోవాలని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.లక్ష్మణరావు తెలిపారు. బోట్లలోని ట్రాన్స్పాండర్లు, జీపీఎస్లను ఎల్లప్పుడూ ఆన్లో ఉంచాలన్నారు. మత్స్యకారులు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వేట సాగించాలని ఆయన సూచించారు. ఐస్ కొరత ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్లో ఐస్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. వేటకు సిద్ధమవుతున్న బోట్లకు గత రెండు రోజుల నుంచి తగినంత ఐస్ అందుబాటులో లేదు. దీంతో మత్స్యకారులు నగరంలోని పలు ఇతర ప్రాంతాల నుంచి ఐస్ను తెచ్చుకున్నారు. ఒక్కొక్క బోటుకు సముద్రంలో వేట కోసం వెళ్లేటప్పుడు భారీ మొత్తంలో ఐస్ అవసరమవుతుంది. ఇది సకాలంలో లభించకపోవడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. -
నేటి నుంచి అంగన్వాడీ ఇంటర్వ్యూలకు కాల్ లెటర్లు
చింతపల్లి: చింతపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్లు పరిధిలో నూతనంగా అంగన్వాడీ వర్కర్లుకు నేటి నుంచి కాల్ లెటర్లు పంపిణీ చేయనున్నట్టు సీడీపీవో శ్రీదేవి తెలిపారు. మండల వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 45 కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్లు పోస్టులకు ఇప్పటికే దరఖాస్తుల స్వీకరించినట్టు చెప్పారు. పీఎం జన్మన్ పథకంలో మంజూరైన చాడీపేట, రాళ్లగెడ్డ కొత్తూరు గ్రామాలకు మినహా మిగిలిన అన్ని కేంద్రాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం నుంచి స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో కాల్లెటర్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 17న పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగే ఇంటర్యూలకు కాల్ లెటర్సుతో అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
ఘటనా స్థలంలో మృతదేహం నక్కపల్లి: మండలంలో జానకయ్యపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. సీఐ మురళి తెలిపిన వివారాల ప్రకారం ఆదివారం గ్రామానికి చెందిన కర్రి సూర్యవెంకటసాయి(13) అనేబాలుడు మరో బాలుడుతో కలసి స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న కాలువలో పడింది.సాయి ముఖం, తలపై తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు.మృతదేహాన్ని పోస్టుమార్టానికి నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు. -
వరించిన సిరి
జోరుగా వరి కోతలు పంట నూర్పిళ్లు జిల్లాలో 849 హెక్టార్లలో సాగు కళకళలాడుతున్న వరిపంటసాక్షి, పాడేరు: రబీలో వరి వ్యవసాయం గిరిజన రైతులకు కలిసొచ్చింది. రెండవ పంటగా గిరిజనులు ఈఏడాది కూడా జిల్లా వ్యాప్తంగా 849 హెక్టార్ల లోతట్టు భూముల్లో వరిపంటను గిరిజన రైతులు సాగు చేసారు.సాగు చేసిన వ్యవసాయ భూముల్లో పంట ఆశాజనకంగా ఉండడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంట కోతలు, ధాన్యం నూర్పుల పనులు జోరందుకున్నాయి. వ్యవసాయ భూములకు సాగునీరు సమృద్ధిగా ఉండడంతో పాటు వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి. పంట ఎదుగుదల సమయంలో ఏప్రిల్, మే నెలల్లో విస్తారంగా కురిసిన వర్షాలు కూడా రబీలోని వరిపంటకు ఎంతో మేలు చేశాయి. వరి పంట కళకళ జిల్లా వ్యాప్తంగా 849 హెక్లార్ల వ్యవసాయ భూముల్లో ఈ ఏడాది రబీలో వరినాట్లను రైతులు చేపట్టారు.పంట సాగు చేసిన చోట అధిక కంకులతో వరిపంట బాగా పండడంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన రైతులు తిండి గింజల అవసరాలకు రెండవ పంటగా వరి సాగును చేపడుతున్నారు,. గిరిజన రైతులు రబీలో వరిపంటను సాగు చేయడం పూర్వం నుంచి అనవాయితీగా మారింది. రబీ వ్యవసాయంలో మాత్రం గిరిజన రైతులంతా తమ వద్ద ఉన్న సంప్రదాయ ఎంటీయూ 1021 విత్తనాలనే రబీ సాగుకు వినియోగిస్తారు. తక్కువ సమయంలో అంటే 125 నుంచి 130రోజుల వ్యవధిలో పంట దిగుబడికి రావడంతో ఉత్సాహంగా కోతలు, వెనువెంటనే ధాన్యం నూర్పులు చేపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గిరిజన రైతులు ధాన్యం నూర్పుల యంత్రాలను ఉపయోగిస్తుండగా, మరికొంత మంది పాతపద్ధతిలో నూర్పులు చేస్తున్నారు. ప్రస్తుతం పంట నూర్పులు అయిన చోట ఎకరానికి 30 బస్తాలు వరకు ధాన్యం దిగుబడి రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో రబీ వ్యవసాయం ధాన్యం సిరులు కురిపిస్తుంది. సంప్రదాయ విత్తనాలతోనే సాగు రబీలో తమ వద్ద ఉన్న సంప్రదాయ విత్తనాలతోనే వరిపంటను సాగుచేశాం. వరినాట్లు వేసిన తరువాత వర్షాలు ఎక్కువుగా కురవడంతో పంటకు మేలు జరిగింది. మా పొలంతో పాటు తోటి రైతుల పంట భూముల్లోను వరిపంట బంగారంలా పండింది. పంట కోతలతో పాటు నూర్పులు పనులు చేపడుతున్నాం. –పాంగి సత్యవతి, మహిళా రైతు, బంగారుమెట్ట, పాడేరు మండలం -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
పాడేరు రూరల్: ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం సుండ్రుపుట్టు సంఘం కార్యాలయంలో జరిగింది, కమిటీ నూతన అధ్యక్షుడిగా కాకి మద్దు (ఏలూరు), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుంజా శ్రీను (పోలవరం), రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వాబా యోగి (శ్రీకాకుళం), వంతాల నాగేశ్వరరావు (అల్లూరి జిల్లా), రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కుంజం కృష్ణంరాజు (ఏలూరు), రాష్ట్ర కోశాధికారిగా ఎడ్ల సూర్యనారాయణ (పార్వతీపురం మన్యం జిల్లా) ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మరో 20 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తు ప్రజలపక్షాణ ఉండే ఆదివాసీ సంక్షేమ పరిషత్ భవిషత్ కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు.నూతన కార్యవర్గంతో ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతు ఆదివాసీల హక్కులు, చట్టాల పరిరక్షణకోసం మరింత పోరాటం చేస్తామన్నారు.రాష్ట్ర నాయకులు విజయకుమారి, బొంజుబాబు, బాలరాజు, రాంబాబు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయులకు చంద్రబాబు ప్రభుత్వం మోసం
పాడేరు: ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపా ధ్యాయ వర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఇచ్చిన మాట తప్పిందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.రఘునాఽథ్ విమర్శించారు. ఆదివారం పాడేరులో యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష హోదాలో టీడీపీ పెద్దలు అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వస్తే 12వ పీఆర్సీ అమలు చేసి ఉద్యోగ, ఉపాద్యాయులకు మెరుగైన వేతనాలు అమలు చేస్తామని, ఆర్థిక బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లిస్తామని డీఏలను బకాయి లేకుండా ఎప్పటికప్పుడు జమ చేస్తామని, సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి మెరుగైన పెన్షన్ విధాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు పూర్తవుతున్నా కనీస స్పందన లేదన్నారు. పీఆర్సీ అమలు కాకపోవడంతో పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సుమారు రూ. 30వేల కోట్ల బకాయిలు ఉంటే కేవలం రూ.9500 కోట్ల బకాయిలు మాత్రమే చెల్లించి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. మూడేళ్లుగా సరేండర్ లీవ్ బకాయిలు చెల్లించలేదన్నారు, ప్రతిపక్షంలో ,ఉన్నప్పుడు ఒకలా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహారించడం కూటమీ పార్టీలకే చెల్లిందన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే కూటమీ ప్రభుత్వం ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూడాక తప్పదని హెచ్చరించారు. యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు చిట్టిబాబు, సహాయ అధ్యక్షుడు చీకటి నాగేశ్వరరావు, కోశాధికారి ఎం. ధర్మారావు, జిల్లా కార్యదర్శులు పి.దేముడు, ఎస్,కన్నయ్య, ఎం, శ్రీను, పలు మండలాలకు చెందిన యూటీఫ్ అద్యక్ష, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు -
డ్రగ్స్కు దూరంగా ఉండాలి
పాడేరు: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని పాడేరు సీఐ డి.దీనబంధు సూచించారు. మండలంలోని గుత్తులపుట్టు సంతబయలు వద్ద ఆదివారం గ్రామస్తులకు నష్టాలతో పాటు హెల్మెట్ వినియోగం, సైబర్ నేరాలు, మహిళ భద్రతపై అవగాహన కల్పించారు. గంజాయి సాగు, రవాణా, సేవించడం చట్ట విరుద్దామన్నారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవన్నారు. గంజాయి రవాణా చేస్తూ ఇప్పటికే చాలా మంది జైలు జీవితం గడుపుతున్నారన్నారు. గ్రామాల్లో ఎక్కడైన గంజాయి రవాణాదారులు, స్మగ్లర్లు సంచరిస్తే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. ద్విచక్ర వాహనచోదకులు ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ చేసే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. మద్యం సేవించి హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. మహిళలను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. మహిళలు, విద్యార్థిలను వేధించడం, ఈవ్టీజింగ్ చేయడం నేరమన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యక్తిగత బ్యాంకు సమాచారం, పిన్ నెంబర్లు ఎవరికీ చెప్పవద్దన్నారు. ఎవరైనా మోసపూరిత లింక్లు పంపిస్తే వాటిని క్లిక్ చేయోద్దన్నారు. ప్రతి ఒక్కరు చట్టాలను గౌరవించి శాంతియుత జీవితం గడపాలని సూచించారు. అరకులోయటౌన్(పాడేరు రూరల్): మండలంలోని సుంకరమెట్ట వారపు సంతలో అరకులోయ ఎస్ఐ మల్లేశ్వరరావు ఆదివారం స్థానికులకు డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పించారు. యువత, గ్రామస్తులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. ఉన్నత విద్య అభ్యసించి, జీవితాలకు బంగారుబాట వేసుకోవాలని, ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలన్నారు. వాహనచోదకులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలన్నారు. గంజాయి సాగు, రవాణాకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. పోలీసు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డుంబ్రిగుడ: మండలంలోని సొవ్వ పంచాయతీ కేంద్రంలో ఆదివారం ఎస్ఐ సురేష్ సందర్శించారు. గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ యువత మత్తుపదార్థాలకు బానిస కావద్దని కోరారు. గంజాయి రవాణా వంటి నేరాలకు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రత పాటించాలని సూచించారు. మహిళల పట్ల గౌరవంగా ఉండాలని మహిళలను, బాలికలను వేధించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గ్రామంలోని విద్యార్థులకు పుస్తకాలు, యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. -
ప్రవేశాల్లో తీవ్ర జాప్యం
ఫలితాలు వెలువడినా..మురళీనగర్(విశాఖ): పదో తరగతి అనంతరం సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులు ఉత్తమ అవకాశంగా భావిస్తారు. పరిశ్రమలు, కంపెనీలు కూడా డిప్లమా విద్యార్థులకు ఉద్యోగాల కల్పనలో అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పాలిటెక్నిక్లలో చేరేందుకు ఆసక్తి చూపడం సహజం. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్లలో ప్రవేశాల ప్రక్రియ సకాలంలో ప్రారంభం కాకపోవడం వల్ల ప్రతి ఏడాది వేలాది సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఈ సమస్య ఏటా పునరావృతమవుతున్నప్పటికీ, ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పాలిసెట్ పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించి 40 రోజులు గడిచినా, ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యాశాఖ ఇంకా విడుదల చేయలేదు. దీంతో పాలిసెట్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అనిశ్చితిలో ఉన్నారు. జాప్యానికి కారణాలేంటి? ఈసారి ప్రవేశాల జాప్యంపై పలు కారణాలు వినిపిస్తున్నాయి. ప్రతి విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులు తప్పనిసరి. ప్రభుత్వ పాలిటెక్నిక్లకు అనుమతులు లభించినప్పటికీ, కొన్ని ప్రైవేటు కళాశాలలకు ఇంకా ఆమోదం రాలేదని తెలుస్తోంది. అలాగే కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ యాజమాన్యాలు తమ క్యాంపస్లలో కొత్త పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో కొన్ని కోరుకున్న బ్రాంచ్లకు అనుమతులు రాకపోవడంతో ప్రవేశాల ప్రక్రియలో ఆలస్యం జరుగుతోందనే చర్చ విద్యావర్గాల్లో సాగుతోంది. ప్రభుత్వ కళాశాలల్లో సీట్ల భర్తీ కొంతమేర సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ప్రైవేటు కళాశాలల్లో అనేక బ్రాంచ్ల్లో సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. వాటిని భర్తీ చేయడానికి యాజమాన్యాలు ప్రత్యక్ష ప్రవేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. వేల సంఖ్యలో సీట్లు.. అయినా పూర్తి భర్తీ లేదు నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్లలో అన్ని కోర్సులు కలిపి మొత్తం 62,456 సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో 87 ప్రభుత్వ, 178 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా, వీటిలో కలిపి సుమారు 84 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక పాలిసెట్లో ఈ ఏడాది 1,48,950 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అయినప్పటికీ ప్రతి ఏడాది వేలాది సీట్లు ఖాళీగా మిగిలిపోతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయకపోవడం గమనార్హం. పాలిటెక్నిక్ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించి ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో మెరుగైన ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 25న నిర్వహించిన పాలిసెట్కు జిల్లాలో 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 14,759 మంది విద్యార్థులను కేటాయించారు. వీరిలో 14,118 మంది హాజరై 95.66 శాతం హాజరు నమోదు చేశారు. నగర పరిధిలోని 18 కేంద్రాల్లో 6,330 మందికి గాను 6,019 మంది పరీక్షకు హాజరై 95.09 శాతం హాజరు నమోదైంది. పెందుర్తిలో 96.07 శాతం, గాజువాకలో 96.05 శాతం, మధురవాడలో 95.84 శాతం, తగరపువలసలో 95.78 శాతం, భీమిలిలో 97.68 శాతం హాజరు నమోదైంది. మే 5న విడుదలైన ఫలితాల్లో జిల్లా నుంచి 13,042 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 92.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రవేశాల షెడ్యూల్పై ఎదురుచూపులు పాలిసెట్ ఫలితాలు వెలువడి నెలకు పైగా గడిచినా ప్రవేశాలకు సంబంధించిన ఎలాంటి ప్రకటన వెలువడలేదు. గతంలో ప్రవేశాలు ఆలస్యమవడం వల్ల సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ కాకపోయాయనే ఉద్దేశంతో ఈసారి పరీక్షను ముందుగానే నిర్వహించి ఫలితాలను కూడా త్వరగా విడుదల చేశారు. ఈ సమయానికి మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తై కావాల్సి ఉండగా..ఇప్పటికీ షెడ్యూల్పై స్పష్టత లేకపోవడం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అనేక సీట్లు ఖాళీగా మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కళాశాలల్లో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమయ్యాయి. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ప్రత్యామ్నాయంగా ఇతర కోర్సుల్లో చేరిపోతున్నారు. ఫలితంగా పాలిటెక్నిక్లకు వెళ్లాల్సిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఇతర విద్యా మార్గాలను ఎంచుకునే పరిస్థితి ఏర్పడుతోంది. -
తాగునీటి సమస్య పరిష్కరించాలి
డుంబ్రిగుడ: మండలంలోని తూటంగి పంచాయతీ తూటంగి గ్రామంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, వైస్ ఎంపీపీ శెట్టి ఆనందరావు పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 200 కుటుంబాలు ఉన్న పెద్ద గ్రామమైన తూటంగిలో గడిచిన రెండేళ్లుగా తాగునీరు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. తాగునీటి సమస్య ఉండడంతో గత్యంతరం లేక స్థానికులు ఊటగెడ్డలను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీరు వినియోగంతో రోగాలు ప్రబలే అవకాశాలున్నాయని ఆందోళన చెందారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. నాయకులు రమేష్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. -
ఏడాదిగా సా...గుతూ..ఆగుతూ!
● అడ్డురోడ్డు–కోటవురట్ల రోడ్డు పనుల దుస్థితి ● నాణ్యతకు తిలోదకాలు ● పట్టించుకోని అధికారులు కోటవురట్ల : వడ్డించేవాడు మనవాడైతే..వెనక బంతిలో కూర్చున్నా ఫర్వాలేదంట.. ఇది బాగా వాడుకలో ఉన్న సామెత.. అయితే ఈ సామెతను అన్వయించుకుంటూ ఓ కాంట్రాక్టరు బిల్లులు చేసేవాడు మనవాడైతే..నాణ్యతను తుంగలో తొక్కినా ఫర్వలేదనుకుంటూ రహదారి నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఏడాదిగా సా...గుతున్న నిర్మాణ పనులతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతుండగా ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు పనులతో చూసినవారి గుండె వేదనతో రగిలిపోతోంది. సాక్షాత్తూ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని అడ్డురోడ్డు–కోటవురట్ల ప్రధాన రహదారి అభివృద్ధి పనుల తీరిది. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారులు అద్దంలా మెరిసిపోతాయ్..అంటూ బూటకపు హామీలను కూటమి నాయకులు తెగ గుప్పించేశారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఎక్కడి గోతులు అక్కడే దర్శనమిస్తుండగా కొన్ని చోట్ల అంతకు మించి అన్నట్టుగా రహదారులు విశ్వరూపం చూపిస్తున్నాయి. ప్రస్తుతం అడ్డురోడ్డు నుంచి కోటవురట్ల మండలంలోని రామచంద్రపురం జంక్షన్ వరకు రహదారి పరిస్థితి దారుణంగా ఉంది. ఈ రహదారిలో ప్రయాణిస్తే నరకం అంటే ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే హోం మంత్రి అనిత రహదారి అభివృద్ధి కోసం నానా హడావుడి చేసేశారు. శంకుస్థాపనలు చేసేశారు. కానీ నేటికీ ఈ రోడ్డు అభివృద్ధి పనులు ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్టు అలాగే ఎదురు చూస్తున్నాయి. మాటలు కోటలు దాటి... ప్రతిపక్షంలో ఉండగా ఈ రోడ్డు బాలేదంటూ అప్పటి టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఇప్పటి హోం మంత్రి అనిత ఏకంగా పాదయాత్ర చేసి విమర్శలు చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రమిస్తా, ప్రశ్నిస్తా అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రి అయిన తర్వాత రహదారి అభివృద్ధికి రూ.24 కోట్లు కేటాయిస్తున్నామంటూ హడావుడి చేశారు. కానీ నేటికి రెండేళ్లు అయినా రహదారి అభివృద్ధికి నోచుకోలేదు. 15 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రధాన రహదారిలో వాహనదారులు ఇప్పటికీ నరకయాతన అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి శాపనార్ధాలు పెడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. అయితే సదరు కాంట్రాక్టర్ తనకు తోచినప్పుడల్లా కొంత మేర పనులు చేయడం, మళ్లీ నెలల తరబడి ఆగిపోవడం జరుగుతోంది. నాసిరకంగా నిర్మాణ పనులు ప్రస్తుతం ఇందేశమ్మవాక ఘాట్రోడ్డు వద్ద పనులు ప్రారంభించగా ఈ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. వాస్తవానికి తవ్వేసిన రోడ్డు పెచ్చులను తొలగించి మెటల్తో రోలింగ్ చేసి ఆ తర్వాత తారు రోడ్డు వేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పనులు పూర్తి విరుద్ధంగా నాణ్యతకు తిలోదకాలు ఇచ్చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. తవ్వేసిన పెచ్చులను అక్కడే వదిలేసి దానిపైనే రోలింగ్ చేసి తారురోడ్డు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణ ఏదీ... దీనిపై వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పైల రమేష్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ నాణ్యతకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చేశారని ఆరోపించారు. పర్యవేక్షించాల్సిన ఆర్అండ్బీ అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదని విమర్శించారు. పెచ్చులు తవ్వి దానిమీదే రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాగే రోడ్డు వేస్తే ఏడాది తిరక్కుండానే వేసిన రోడ్డు కొట్టుకుపోతుందని చెబుతున్నారు. ఘాట్రోడ్డు కావడంతో ఏమాత్రం నాణ్యత లేకపోయినా చాలా తొందరగా రోడ్డు పాడవుతుందన్నారు. ఆర్అండ్బీ ఎస్ఈ ఈ పనులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
అనకాపల్లి టౌన్: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో శంకరం గ్రామం వద్ద రైలు నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్టు జీఆర్పీఎఫ్ ఎస్ఐ కె.టి.ఆర్. లక్ష్మి తెలిపారు. విశాఖపట్నం– విజయవాడ ట్రాక్లో మధ్యలో మృతదేహాన్ని గుర్తించామని, మృతుడి వయసు 35 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. బ్లాక్ కలర్ ట్రాక్ ఫ్యాంట్, మెరూన్ రంగు టీషర్ట్ ధరించి ఉన్నాడని తెలిపారు. ఒక టచ్ ఫోన్, ఆధార్ కార్డు, చిరిగిన జనరల్ రైల్వే టికెట్ లభించాయని, వాటి ప్రకారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామంలో కీర్తివీధికి చెందిన ఇట్లా భాస్కరరావుగా గుర్తించామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, బంధువులకు సమాచారం అందించినట్టు ఎస్ఐ చెప్పారు. -
చిట్టీల నిర్వాహకుడిపై ఫిర్యాదు
మాకవరపాలెం: చిట్టీల నగదు చెల్లించకుండా ఓ ఉపాధ్యాయుడు ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని రామన్నపాలెంగ్రామానికి చెందిన యాకా అప్పలనాయుడు(చినబాబు) జి.వెంకటాపురం ప్రభుత్వం పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఈయన చిట్టీలు నిర్వహిస్తూ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వందలాది మందితో నగదు కట్టించాడు. అంతేకాకుండా వడ్డీలకు నగదుతీసుకుని వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఏడాది కాలంగా చిట్టీలు పూర్తయినా కట్టించుకున్న నగదు ఇవ్వడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వడ్డీకి తీసుకున్న నగదు కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ గ్రామానికి చెందిన యాకా పోతురాజు, రాజుబాబు, లాలం అరుణకుమారితోపాటు కొందరు బాధితులు ఉపాధ్యాయుడు ఇంటి ఎదుట టెంట్ వేసి ఆందోళనకు దిగారు. అనంతరం ఈ గ్రామంతోపాటు వివిధ గ్రామాలకు చెందిన బాధితులు పోలీసు స్టేషన్కు చేరుకుని లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. రూ.లక్షల్లో చిట్టీలు కట్టామని, నగదును కూడా ఇచ్చామని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించాల్సివచ్చిందన్నారు. తమకు న్యాయం చేయాలని వారంతా కోరారు. బాధితుల ఫిర్యాదుపై విచారణ జరపనున్నట్టు ఎస్ఐ దామోదర్నాయుడు తెలిపారు.ఉపాధ్యాయుడి ఇంటి ముందు ఆందోళన -
హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రత్యేక మార్గదర్శకాలు
కలెక్టర్ నిశాంతి పాడేరు: హుకుంపేట మండలం మజ్జివలస, పరిసర గ్రామాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు విషయంలో ఇటీవల స్థానిక గిరిజనుల ఆందోళనలను పరిష్కారిస్తామని ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసినట్టు కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మజ్జివలస ప్రాంతంలో సర్వేలు, పరిశోధనలు, క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టాలనుకునే ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ఏజెన్సీలు ముందస్తుగా స్థానిక రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకొని అనుమతులు పొందాలన్నారు. ఈ మేరకు స్థానికుల సమస్యలను పరిష్కరించేందుకు, సమాచారాన్ని అందించేందుకు కలెక్టరేట్, ఐటీడీఏ కార్యాలయాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామస్తులు తమ సమస్యలను నేరుగా కంట్రోల్ రూం నంబర్లు 9281856953, 08935–293448 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో జరిగే అన్ని కార్యకలాపాలు చట్టాలకు అనుగుణంగా, పారదర్శకంగా, ప్రజల భాగస్వామ్యంతో గిరిజన, చట్టాలు, హక్కులను గౌరవిస్తూ నిర్వహించాలని అధికారులకు ఆదేశించామన్నారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె
రమణ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న కుమార్తె చంద్రకళ బుచ్చెయ్యపేట: అనారోగ్యంతో మృతిచెందిన తండ్రికి కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన ఆదివారం మండలంలోని వడ్డాదిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సయ్యపురెడ్డి రమణ ఆదివారం ఇంటి వద్ద గుండె పోటుతో మృతి చెందారు. ఇతనికి భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేకపోవడంతో బంధువుల సహాయంతో చిన్న కుమార్తె చంద్రకళ తండ్రికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు దుర్మరణం
చింతపల్లి: చింతపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు(35) సొలబం కృష్ణప్రసాద్ దుర్మరణం చెందాడు. శుక్రవారం రాత్రి అంతర్ల సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆయన్ను బొలోరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయన జీకే వీధి మండలం లక్కవరపేట పంచాయతీ మామిడి గ్రామ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు శనివారం చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో ఉన్న కృష్ణప్రసాద్ మృతదేహాన్ని సందర్శించి, ఘన నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్, ఎంఈవో పనసల ప్రసాద్, బోడం నాయుడు, గిరిజన ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు కిట్లంగి ప్రసాద్, పార్టీ రాష్ట్ర ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, రైతు సంఘం రాష్ట్ర సహా య కార్యదర్శి బూసరి కృష్ణారావు, జి.మాడుగులు మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకట గంగరాజు, మాజీ సర్పంచ్ దురియా పుష్పలత పాల్గొన్నారు. -
సుఖీభవ.!
రక్తదాతా..● ఆపద సమయంలో అందుబాటులో రక్త నిల్వలు ● వైఎస్సార్సీపీ హయాంలో రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటుతో విస్తృత సేవలు ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ● సీహెచ్సీలో గంటల తరబడిరోగుల నిరీక్షణ ● సాంకేతిక సమస్యతో తప్పని అష్టకష్టాలుసాక్షి, పాడేరు: రక్తదానం ఎంతో మంది ప్రాణాలను కాపాడే సంజీవిని. ఏజెన్సీ ప్రాంతంలో యువత రక్తదానంతో ప్రాణదాతలుగా నిలుస్తూ మానవత్వాన్ని చా టుకుంటున్నారు. తోటి మనుషుల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్న యువకులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. పెరిగిన రక్త అవసరాలు వైద్యపరంగా వెనుకబడిన ప్రాంతాల్లో రక్త అవసరాలు గణనీయంగా పెరిగాయి. గర్భిణులు, రక్తహీనతతో బాధపడుతున్న బాలికలు, యువతులు, మహిళలు, సికిల్సెల్ ఎనిమియా రోగులు, ప్రమాదాల కేసుల్లో అత్యవసర పరిస్థితుల్లో రక్త వినియోగం అధికమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 11 మండలాల్లో రక్తదాన శిబిరాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. 103 శిబిరాలుం 3506 యూనిట్ల సేకరణ 2022లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రం పాడేరులో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి రక్తదానంపై అవగాహన పెంచుతూ రక్త సేకరణలో కీలక పాత్ర పోషిస్తోంది ఈ సంస్థ. 2022 నుంచి ఈ ఏడాది జూన్ 12 వరకు జిల్లా వ్యాప్తంగా 103 రక్తదాన శిబిరాలను నిర్వహించి 3506 యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన రోగులకు అందించింది. అలాగే పాడేరు జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్కు నేరుగా వచ్చిన దాతల నుంచి గత ఆరు నెలల్లో 778 యూనిట్ల రక్తాన్ని సేకరించి వినియోగించారు. రెండు చోట్ల బ్లడ్ బ్యాంకులు పాడేరు జిల్లా ఆసుపత్రి, అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రులు బ్లడ్ స్టోరేజ్ పాయింట్ల స్థాయి నుంచి బ్లడ్ బ్యాంకులుగా అప్గ్రేడ్ అయ్యాయి. దీంతో ఏజెన్సీ ప్రాంత రోగులకు సకాలంలో రక్తం అందే పరిస్థితి ఏర్పడింది. గతంలో విశాఖ, అనకాపల్లి, నర్సీపట్నం ప్రాంతాల నుంచి రక్తం తెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. అదే విధంగా చింతపల్లి, ముంచంగిపుట్టు సీహెచ్సీల్లో కూడా బ్లడ్ స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేయడంతో అత్యవసర సేవలు మరింత మెరుగుపడ్డాయి. విద్యార్థి దశ నుంచే మానవత్వం ఏజెన్సీ ప్రాంతంలోని విద్యార్థులు, యువత రక్తదానంలో ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారు. కళాశాలల్లో రక్తదానంపై అవగాహన పెరగడంతో అనేక మంది 10 నుంచి 30 సార్లు రక్తదానం చేసిన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో, తదితర అధికారులు కూడా శిబిరాల నిర్వహణకు సహకరిస్తూ రక్తదానంపై చైతన్యం తీసుకొస్తున్నారు. ‘అభా’ యాప్తో అవస్థలు ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులు సాంకేతిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో చికిత్స పొందాలంటే ముందుగా అభా యాప్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. శనివారం అధిక సంఖ్యలో రోగులు సీహెచ్సీకి తరలివచ్చారు. రోగుల మొబైల్లో యాప్ను డౌన్లోడ్ చేసి, ఫోన్ నంబర్ నమోదు చేయాలి. అనంతరం ఓటీపీ నమోదు చేసిన తరువాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ప్రక్రియ ఉండటంతో ఆలస్యం ఏర్పడింది. సిగ్నల్స్ లేకపోవడంతో యాప్ సక్రమంగా పని చేయడం లేదు. దీంతో రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. కొంతమంది రోగులకు మొబైల్ ఫోన్లు లేకపోవడంతో మరింత ఇబ్బందులు ఎదురయ్యాయి. గిరిజన ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు ఉండటంతో యాప్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. అవసరం లేని కొత్త నిబంధనలతో రోగులను ఇబ్బందులకు గురిచేయడం తగదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వేధిస్తున్న సిబ్బంది కొరత కొన్ని గంటల తరువాత యాప్ పని చేయడం ప్రారంభించడంతో రిజిస్ట్రేషన్ కోసం రోగులు పోటీపడ్డారు. అనంతరం వైద్య సేవలు పొందగలిగారు. ఇదిలా ఉండగా, సీహెచ్సీలో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. కేవలం ఇద్దరు వైద్యులే అందుబాటులో ఉండటంతో రోగులు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైద్యులు ఒకవైపు ఓపీ, మరోవైపు అత్యవసర కేసులను చూసుకోవాల్సి రావడంతో పని ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, అభా యాప్ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని రోగులు కోరుతున్నారు. ఐలా చైర్మన్గా యార్లగడ్డ ఎన్నిక అక్కిరెడ్డిపాలెం: ఆటోనగర్ ఇండస్ట్రియల్ లేబర్ అసోసియేషన్ (ఐలా) ఎన్నికల్లో యార్లగడ్డ సాంబశివరావు ప్యానెల్ సత్తా చాటింది. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి కొల్లి ఈశ్వరరావు ప్యానెల్పై యార్లగడ్డ సాంబశివరావు ఒక్క ఓటు తేడాతో విజయం సాధించి చైర్మన్గా ఎన్నికయ్యారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత రెండోసారి చైర్మన్ పదవిని సాంబశివరావు దక్కించుకోవడం విశేషం. ఓట్ల లెక్కింపు రాత్రంతా ఉత్కంఠభరితంగా సాగగా, రెండు ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇతర పదవులకు జరిగిన ఎన్నికల్లో కొల్లి ఈశ్వరరావు ప్యానెల్కు చెందిన బాపిరాజు వైస్ చైర్మన్గా, నిర్మల్ దుర్గర్ జాయింట్ సెక్రటరీగా, ఎ.సూర్యనారాయణరాజు ట్రెజరర్గా, కోటేశ్వరరావు సభ్యుడిగా ఎన్నికయ్యారు. పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రక్తదానంపై ఏజెన్సీలో పెరిగిన చైతన్యంరక్తదానం చేయాలంటే.. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఆరోగ్యవంతులైన వ్యక్తులు రక్తదానం చేయవచ్చు. రక్తపోటు, హిమోగ్లోబిన్, శరీర ఉష్ణోగ్రత తదితర పరీక్షల అనంతరం మాత్రమే రక్త సేకరణ చేస్తారు. రక్తదానం వల్ల ఎలాంటి వ్యాధులు సంక్రమించవు. రక్తదానం చేసిన తర్వాత 10 నిమిషాల విశ్రాంతి తీసుకుని అల్పాహారం తీసుకుంటే తిరిగి సాధారణ పనులు చేసుకోవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. అందుబాటులో రక్తనిల్వలు జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకులో నిరంతరం రక్త నిల్వలు అందుబాటులో ఉంచుతున్నాం. రెడ్ క్రాస్ సొసైటీ శిబిరాలతో పాటు నేరుగా బ్లడ్ బ్యాంకులో సేకరించిన రక్త నిల్వలను భద్రపరుస్తున్నాం. గర్భిణులు, బాలింతలు, రక్తహీనత సమస్య ఉన్న రోగులకు అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నాం. రక్తదానం చేస్తున్న యువతకు అభినందనలు. – డాక్టర్ రాజీవ్ సపల, బ్లడ్ బ్యాంకు ఇన్చార్జి, జిల్లా సర్వజన ఆస్పత్రి, పాడేరుశిబిరాలు నిర్వహిస్తున్నాం.. జిల్లా వ్యాప్తంగా రక్తదానంపై యువకులు, విద్యార్థుల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. రెడ్క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. యువకులు, విద్యార్థులు, అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు స్వచ్ఛందంగానే ముందుకు వస్తూ రక్తదానం చేస్తున్నారు. – జి.గౌరిశంకర్రావు, రెడ్క్రాస్ సొసైటీ, జిల్లా ప్రధాన కార్యదర్శి, పాడేరు 30 సార్లు రక్తదానం చేశా.. రక్తదానంతో తోటి మనుషుల ప్రాణాలు కాపాడవచ్చు. ఇప్పటి వరకు 30 సార్లు రక్తదానం చేశా. ఇది సామాజిక బాధ్యతగా భావిస్తున్నాను. ఇన్ని సార్లు రక్తదానం చేసినా ఆరోగ్యంగానే ఉన్నాను. అవకాశం ఉన్నంత వరకు రక్తదానం చేస్తా. – జె.వికాస్, చింతలవీధి, పాడేరు మండలం ప్రతి మూడు నెలలకు రక్తదానం ప్రతి మూడు నెలలకు ఒకసా రి రక్తదానం చేస్తున్నాను. రక్తదానంతో ప్రాణదాతలు కండి అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. ఇప్పటికి 20 సార్లు రక్తదానం చేశా. రక్తదానంపై అపోహాలు వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. – ఓంటేబు సుమన్, గూడ గ్రామం, హుకుంపేట మండలం రక్త అవసరాలు గుర్తించా.. గిరిజన ప్రాంతంలో ప్రత్యక్షంగా రక్తం అవసరాలు గుర్తించా ను. నాది తెలంగాణా రాష్ట్రం. గత 14 ఏళ్లుగా ఇక్కడే వృత్తిరీత్యా పాడేరులోనే స్థిరపడ్డాను. ఇప్పటి వరకు 30 సార్లు రక్తదానం చేశాను. తోటి మనుషుల రక్త అవసరాల తీర్చడం సంతోషంగా ఉంది. – గట్ల సంతోష్కుమార్, ఫోటోగ్రాఫర్, పాడేరు -
బీచ్లో మద్యం విక్రయాల నిర్ణయంపై ‘ఐద్వా’ నిరసన
మహారాణిపేట: సముద్ర తీరంలో మద్యం విక్రయాలకు అనుమతినిచ్చే ప్రభుత్వ ‘బీచ్ షాక్’ నిర్ణయాన్ని నిరసిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో శనివారం ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి.ప్రభావతి, జిల్లా నేతలు ఆర్.ఎన్. మాధవి, సత్యవతి, బి. పద్మ మాట్లాడుతూ.. గోవా కల్చర్ పేరుతో బీచ్లలో మద్యం అమ్మకాలు జరపడం దుర్మార్గమన్నారు. ఖజానా నింపుకోవడానికి, మద్యం సిండికేట్ల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. కుటుంబాలు, మహిళలు ప్రశాంతత కోసం వచ్చే బీచ్లో మద్యం అందుబాటులోకి వస్తే మహిళల రక్షణ గాల్లో కలిసిపోతుందని, పర్యావరణం ధ్వంసమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో బెల్ట్ షాపులు, గంజాయి, డ్రగ్స్ రవాణాను అణచివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐద్వా ప్రతినిధులు డి.కొండమ్మ, ఆర్.వరలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు బి.ఎల్. నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
లయిన్స్కు వరుసగా మూడో ఓటమి
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ ఐదో సీజన్లో సింహాద్రి వైజాగ్ లయిన్స్ వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. శనివారం వైఎస్సార్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భీమవరం బుల్స్ 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భీమవరం బుల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 219 పరుగులు చేసింది. రేవంత్ (58), సాత్విక్ (69) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లయిన్స్ బ్యాటర్లు విఫలమవడంతో జట్టు 17.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. బుల్స్ బౌలర్ యశ్వంత్ ఐదు వికెట్లు తీసి మ్యాచ్ను ఏకపక్షం చేశాడు. దీంతో బుల్స్ వరుసగా మూ డో విజయాన్ని నమోదు చేసింది. బుల్స్ విజయానందం -
అప్పన్నకు విశేషంగా ఆర్జితసేవలు
● ఘనంగా సహస్రనామార్చన ● వైభవంగా నిత్యకల్యాణం సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి శనివారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం సహస్రనామార్చనని ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణ మండపంలో వేదికపై వేంజేపచేశారు. 1001నామాలతో స్వామికి అర్చన చేశారు. విశేషంగా హారతులు అందజేశారు. వైభవంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి శనివారం నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి,భూదేవిలను వేదికపై వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెళ్లం, మాంగళ్యదారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. -
ఏయూలో ఉద్యోగాల పేరుతో దళారుల దందా
ఎవరూ నమ్మి మోసపోవద్దన్న అధికారులు విశాఖ విద్య: ఏయూలో ఉద్యోగాల భర్తీ పేరుతో కొందరు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఇటీవల ఏయూ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయగా, మరికొన్ని తాత్కాలిక అధ్యాపక పోస్టుల భర్తీకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలతో పరిచయాలు ఉన్నాయంటూ కొందరు దళారులు నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజులుగా యూనివర్సిటీలోని కొందరు వ్యక్తులు, బయట ఉన్న మధ్యవర్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై ఏయూ యాజమాన్యం స్పందించింది. ఉద్యోగాల భర్తీ పేరుతో ఎలాంటి అక్రమాలు జరిగినట్లు ఇప్పటివరకు తమకు ఫిర్యాదులు అందలేదని ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు స్పష్టం చేశారు. ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయాలని, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశ్వవిద్యాలయం పేరును దుర్వినియోగం చేసినా, ఉద్యోగులు ఇటువంటి చర్యలకు పాల్పడినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఏయూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లు ప్రముఖ దినపత్రికలు, ఏయూ అధికారిక వెబ్సైట్ ద్వారానే విడుదల చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వచ్చే దళారులు, మధ్యవర్తులను నమ్మి ఎవరూ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని నిరుద్యోగులకు రిజిస్ట్రార్ సూచించారు. -
30 కిలోల గంజాయి స్వాధీనం
● నలుగురి అరెస్టు ● కారు, బైక్, సెల్ ఫోన్లు సీజ్ నర్సీపట్నం:గంజాయి తరలిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నలుగురిని శనివారం అరెస్టు చేశారు. నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపిన మేరకు వివరాలు... ముందుస్తు సమాచారంతో రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, నాతవరం, నర్సీపట్నం ఎస్ఐలు వై.తారకేశ్వరరావు, రాజారావు, సిబ్బంది బెన్నవరం వద్ద మాటు వేసి గంజాయి తరలిస్తున్న కారును అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన రామాని రాజేష్ ఐటీఐ చదివాడు. హైదరాబాద్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. విద్యార్థి దశ నుంచే రాజేష్కు గంజాయి సేవించే అటవాటు ఉంది. ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. స్నేహితులైన రుద్రరాజు వర్మ, షేక్ షయాంబాషా, ముంగర సురేష్తో ఈ నెల 9న ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా పటేల్ గ్రామానికి వెళ్లి 30 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. హైదరాబాద్లో కారును అద్దెకు తీసుకున్నారు. ఒక బైక్ను కొనుగోలు చేశారు. రాజేష్, రుద్రరాజు దినేష్ వర్మ కారులో గంజాయి తీసుకువస్తున్నారు. మిగిలిన ఇద్దరు బైక్పై వస్తూ నాతవరం మండలం బెన్నవరం వద్ద పోలీసులకు చిక్కారు. నలుగు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి గంజాయి, కారు, బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని హైదరాబాద్ తీసుకువెళ్లి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయించి వచ్చిన డబ్బును పంచుకునేందుకు నలుగురు నిందితులు ఆలోచన చేశారని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలోచాకచక్యంగా వ్యవహరించిన సీఐ రేవతమ్మ, ఎస్ఐలు తారకేశ్వరరావు, రాజారావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
లాభాల వేటలో పది ’ఉక్కు’ కుటుంబాల్లో నిండిన చీకట్లు!
నాసిరకం ముడి పదార్థాలు, సిబ్బంది కొరత,పని ఒత్తిడి కలిసి సృష్టించిన విషాదం అధికారుల కమిటీ విచారణలో వెలుగుచూస్తున్న దిగ్భ్రాంతికర వాస్తవాలు ఉత్పత్తి కోసం భద్రతకు తిలోదకాలు? ప్రమాదానికి ముందు నుంచే ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలన్న ఒత్తిడి తీవ్రంగా పెరిగిందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. లాడిల్ పూర్తి సామర్థ్యం 150 టన్నులు కాగా, ప్రమాదం జరిగిన రోజు దాదాపు 140 టన్నుల ద్రవపు ఉక్కుతో ప్రక్రియ నిర్వహించినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, సమయాన్ని ఆదా చేయడంపైనే దృష్టి పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఉత్పత్తి వ్యయం తగ్గింపు పేరుతో కొన్ని కీలక భద్రతా ప్రక్రియలను కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని కార్మికులు చెబుతున్నారు. అలాగే కొన్ని విభాగాల్లో 12 గంటల పని విధానాన్ని అమలు చేస్తుండగా, ఉత్పత్తిని వేతనాలతో అనుసంధానించడం ద్వారా ఉద్యోగులపై మరింత ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపిస్తున్నారు. ఫలితంగా భద్రతా ప్రమాణాల కంటే ఉత్పత్తి లక్ష్యాలకే ప్రాధాన్యం దక్కుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ను కుదిపేసిన ఘోర ప్రమాదం వెనుక ఉత్పత్తి లక్ష్యాల కోసం జరిగిన హడావుడి, భద్రతా నిబంధనల పట్ల నిర్లక్ష్యం, నాసిరకం ముడిపదార్థాల వినియోగం ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడవుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లాడిల్లో ద్రవపు ఉక్కు పేలి 10 మంది కార్మికుల ప్రాణాలు బలిగొన్న ఈ ఘటనపై సాగుతున్న దర్యాప్తులో ఒక్కో వాస్తవం వెలుగులోకి వస్తోంది. సాధారణంగా లాడిల్లోని ద్రవ ఉక్కును శుద్ధి చేసి ఆక్సీకరణ ప్రక్రియ పూర్తిచేసిన తర్వాతే కంటిన్యూయస్ కాస్టింగ్ యంత్రానికి తరలిస్తారు. ఇందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్వోపీ) ప్రకారం కనీసం 18 నిమిషాల సమయం అవసరం. అయితే ఉత్పత్తి వేగం పెంచాలన్న ఒత్తిడితో ఈ ప్రక్రియను కేవలం 10 నిమిషాల్లో ముగించినట్లు విచారణలో తేలినట్టు సమాచారం. ఈ తొందరపాటే చివరకు ఘోర విషాదానికి దారితీసిందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నాసిరకం ముడిపదార్థాల వినియోగం కారణంగా ప్లాంట్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికితోడు ఆక్సీకరణ ప్రక్రియను పూర్తిస్థాయిలో నిర్వహించకపోవడం వల్ల లాడిల్లో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడి పేలుడు సంభవించినట్లు ప్రాథమిక నిర్ధారణలు సూచిస్తున్నాయి. ఆక్సీకరణలో ఏం తప్పు జరిగింది? పిగ్ ఐరన్ను కరిగించిన అనంతరం బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి వచ్చే ద్రవ లోహంలో అవసరాన్ని బట్టి ఫెర్రోమాంగనీస్, ఫెర్రోసిలికాన్ వంటి పదార్థాలను కలుపుతారు. ఆ తర్వాత ఆక్సీకరణ ప్రక్రియ చేపడతారు. ఈ సమయంలో ఆక్సిజన్ను ప్రవేశపెట్టడంతో కార్బన్ మోనాకై ్సడ్, కార్బన్ డయాకై ్సడ్ వంటి వాయువులు ఉత్పత్తి అవుతాయి. కొన్నిసార్లు ఈ వాయువులు ద్రవపు ఉక్కులోనే చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆర్గాన్ గ్యాస్ను ఉపయోగించి బాటమ్ పర్జింగ్ నిర్వహిస్తారు. దీంతో ద్రవ ఉక్కులో చిక్కుకుపోయిన వాయువులు, మలినాలు బయటకు వస్తాయి. అలాగే ద్రవపు ఉక్కు నాణ్యతను నిర్ధారించేందుకు నమూనా పరీక్షలు కూడా నిర్వహించాలి. అయితే ఈ కీలక దశలను పూర్తిస్థాయిలో పాటించకపోవడం, శుద్ధి ప్రక్రియను తొందరపాటుతో ముగించడం వల్లే ప్రమాదం సంభవించినట్లు విచారణలో తేలినట్టు సమాచారం. దీంతో లాడిల్లో ఒక్కసారిగా తీవ్ర ప్రతిచర్య చోటుచేసుకుని, సుమారు 1,600 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ద్రవ ఉక్కు భారీగా ఎగసిపడింది. భవనం పైకప్పును తాకిన ద్రవపు ఉక్కు తిరిగి వర్షంలా కురిసి అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడింది. ఘటనాస్థలంలోనే ఎనిమిది మంది మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ప్రమాదంపై విచారణ జరుపుతున్న ముగ్గురు సభ్యుల కమిటీతో పాటు ఫైర్, ఫ్యాక్టరీస్ శాఖల అధికారులు నిర్వహించిన తనిఖీల్లోనూ ఇదే అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. లోకేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం ప్రమాదం అనంతరం సిబ్బంది కొరత అంశంపై మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కార్మిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల ప్రమాదం జరగలేదని, అదే కారణంగా బాధితుల సంఖ్య తగ్గిందని ఆయన వ్యాఖ్యానించినట్లు ప్రచారం కావడంతో కార్మికులు మండిపడుతున్నారు. వాస్తవానికి తగిన సిబ్బంది, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉండి ఉంటే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి నివారించే అవకాశం ఉండేదని వారు వాదిస్తున్నారు. సిబ్బంది కొరత, పెరిగిన పనిభారం, ఉత్పత్తి ఒత్తిడి, భద్రతా నిబంధనల ఉల్లంఘనలు కలిసి ఈ ఘోర ప్రమాదానికి కారణమయ్యాయని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.21 మంది పని 11 మందితోనే.. సీ్టల్ ప్లాంట్లో ప్రైవేటీకరణ చర్యలు వేగం పుంజుకున్న తర్వాత సిబ్బంది సంఖ్య భారీగా తగ్గిందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. గత కొన్నేళ్లలో దాదాపు 10 వేల మంది ఉద్యోగులు తగ్గిపోవడంతో మిగిలిన వారిపై పనిభారం విపరీతంగా పెరిగిందని చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన విభాగంలో సాధారణంగా 21 మంది పనిచేయాల్సి ఉండగా 11 మంది మాత్రమే విధుల్లో ఉన్నారని సమాచారం. అనుభవజ్ఞులైన ఉద్యోగులు, సాంకేతిక నిపుణుల సంఖ్య తగ్గిపోవడంతో పర్యవేక్షణ వ్యవస్థ బలహీనపడిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
ఫేషియల్ విధానంరద్దు చేయాలి
అరకులోయటౌన్(పాడేరు రూరల్): అరకులోయటౌన్ (పాడేరు రూరల్): ఉపాధి హామీ పథకంలో అమలు చేస్తున్న ఫేషియల్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని వైఎస్సార్సీపీ ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన కొత్త మార్పులు కూలీలకు ఇబ్బందులను కలిగిస్తున్నాయన్నారు. నూతన విధానం వల్ల ఉపాధి కూలీలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, పాత విధానాన్నే కొనసాగించాలని కోరారు. ప్రతిరోజూ పని ప్రదేశంలో ఫొటోలు అప్లోడ్ చేయడం, ఫేషియల్ ద్వారా హాజరు నమోదు చేయడం వల్ల పనులు సమయానికి పూర్తి కావడంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి, ఉపాధి కూలీలకు అనుకూలమైన విధానాన్ని అమలు చేయాలని ఆయన కోరారు. -
రెండు ట్రాక్టర్లు, పొక్లెయిన్ స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న పొక్లెయిన్, ట్రాక్టర్లు మాకవరపాలెం: మట్టిని అక్రమంగా తవ్వుతున్న పొక్లెయిన్, తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని వజ్రగడ సమీపంలో నిత్యం అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అందిన సమాచారంతో శుక్రవారం అర్ధరాత్రి సిబ్బందితో దాడి చేసినట్టు ఎస్ఐ దామోదర్నాయుడు తెలిపారు. ఈ దాడిలో ఒక పొక్లెయిన్, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించామన్నారు. గంగవరం, రామన్నపాలెం, పైడిపాల తదితర ప్రాంతంలోనూ చెరువులు, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో రాత్రి వేళల్లో మట్టి తరలింపు జరుగుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రెండేళ్ల పాలన అస్తవ్యస్తం
● ఎన్నికల హామీలు నెరవేర్చలేని చేతకాని ప్రభుత్వం ● మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాడుగుల రూరల్: చంద్రబాబు రెండేళ్ల పాలనకే రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని, సూపర్ సిక్స్ హామీలు గాలికొదిలేశారని, అన్ని వర్గాల వారిని మోసం చేశారని శ్రీకాకుళం, మన్యం జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ధ్వజమెత్తారు. ఽశుక్రవారం మాడుగులలో వైఎస్సార్సీపీ బైక్ ర్యాలీ అనంతరం ఆయన స్థానిక పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. తల్లికి వందనం పేరు మార్చి ఎంతో మందికి అర్హులకు వర్తింప చెయ్యలేదన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 ఇవ్వలేదన్నారు. గతంలో అర్హులందరికీ పింఛన్లు అందిస్తే, నేడు ఎంతో మంది దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు పింఛను కోసం ఎదురు చూస్తున్నారని వాపోయారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిత్యం తమ నాయకుడు జగన్మోహన్రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకుని ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. డీఎస్సీ –2025 పోస్టుల భర్తీలో ప్రతి దశలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్నారు. రెండు సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏమి మేలు చేశారని ప్రశ్నించారు. దీనిపై తాము చేపట్టిన ర్యాలీ మాడుగులలో విజయవంతం అయిందన్నారు. ఈ ర్యాలీకి పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలి రావడం ఆనందదాయకమన్నారు. లక్ష్యానికి మించి అన్ని గ్రామాలు నుంచి తరలి వచ్చిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. మారుమూల గ్రామాలకు రోడ్లు వేశా.. నియోజకవర్గంలో తన హయాంలో మారుమూల గ్రామాలకు సైతం రహదారులు నిర్మించామని, మాడుగుల నడిబొడ్డున కోట్లాది రూపాయలతో పంచాయతీరాజ్ అతిథి గృహం నిర్మించామని బూడి తెలిపారు. జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి ఎంతోమందికి సొంతింటి కల సాకారం చేశామన్నారు. నేడు సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఎన్నికల హామీలు అమలు చెయ్యలేని సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్ –1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, తదితరులు పాల్గొన్నారు. -
జేసీ ఎదుటే ఆత్మహత్యాయత్నం
ఆనందపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ఒక్కసారిగా రణరంగంగా మారింది. భూ కబ్జాదారుల వేధింపులతో విసిగిపోయిన ఓ బాధితుడు ఏకంగా విశాఖ జేసీ ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఆనందపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘ఒక నెల–ఒక నియోజకవర్గం’ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో.. ముకుందపురం గ్రామానికి చెందిన ఓ అర్జీదారుడు తన భూమిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని, తనకు న్యాయం చేయాలంటూ సభలోకి దూసుకొచ్చాడు. పెద్దగా కేకలు వేస్తూ అలజడి సృష్టించిన అతడు, అంతటితో ఆగకుండా ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను శరీరంపై కుమ్మరించుకున్నాడు. జేసీతో పాటు అక్కడున్న అధికారులు షాక్కు గురయ్యారు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు స్పందించి, అతడిని గట్టిగా పట్టుకుని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. త్వరితగతిన సమస్యల పరిష్కారం అంతకుముందు జేసీ విద్యాధరి మాట్లాడుతూ ఇప్పటికే నాలుగు శుక్రవారాల సందర్శనలు ముగిశాయని, ఇక సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెడతామన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం ఆనందపురం మండలం నుంచి 30 దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం 190 అప్లికేషన్లు అందినట్లు తహసీల్దార్ ఎస్.శ్రీనివాసబాబు వెల్లడించారు. అలాగే పొడుగుపాలెం గ్రామస్తులు తమ ప్రాంతంలో రోడ్డు విస్తరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వరరావు, ఆర్డీవో సంగీత్ మాధుర్, ఆనందపురం ఎమ్పీడీవో వి.జానకి, భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రీన్, హెల్తీ వైజాగ్ దిశగా కార్యాచరణ
డాబాగార్డెన్స్: విశాఖ నగరాన్ని పచ్చదనం, ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణహిత రవాణా, వారసత్వ పరిరక్షణకు ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జీవీఎంసీ పలు వినూత్న కార్యక్రమాలను చేపడుతోందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక భాగస్వామ్యం, వారసత్వ ప్రదేశాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. జీవీఎంసీ పరిధిలో మొత్తం 174 పార్కులు ఉండగా, వాటిలో 151 ఎకరాల విస్తీర్ణంలో 139 కాలనీ పార్కులు ఉన్నాయని తెలిపారు. వీటిలో మరింత అభివృద్ధి అవసరమైన 60 పార్కులను గుర్తించి, ఆరు ప్యాకేజీలుగా విభజించి రూ.10.97 కోట్ల అంచనా వ్యయంతో ప్రత్యేక థీమ్ పార్కులుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. జీవీఎంసీ పరిధిలో ప్రతి సోమవారం ‘సైక్లింగ్ డే’గా స్వచ్ఛందంగా పాటించాలని నిర్ణయించినట్లు కమిషనర్ తెలిపారు. సైక్లింగ్ సంస్కృతిని ప్రోత్సహించేందుకు సాగర్నగర్ బీచ్ సమీపంలో 10 అడుగుల వెడల్పుతో 700 మీటర్ల పొడవున బీచ్ ఫ్రంట్ సైక్లింగ్ ట్రాక్ను రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఆరిలోవ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పరిసరాల్లో 2.70 మీటర్ల వెడల్పుతో 5.20 కిలోమీటర్ల పొడవున రూ.3 కోట్ల వ్యయంతో సిటీ సైక్లింగ్ ట్రాక్ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. -
రైతుల ప్రయోజనాలు లక్ష్యంగా ప్రణాళికలు
సాక్షి, పాడేరు: జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగుకు సంబంధించి గిరిజన రైతుల ఆర్థిక ప్రయోజనాలు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వ్యవసాయ, అనుబంధ విభాగాల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. రాబోయే ఆరు, ఏడు నెలల కాలానికి సంబంధించి చిరుధాన్యాల సాగుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వెదురు సాగును ప్రోత్సహించాలని, వచ్చే శుక్రవారంలోగా ప్రతి మండలంలో బంజరు భూములను గుర్తించాలన్నారు. 1200 మంది రైతులకు ఉచితంగా కంది విత్తనాల కిట్లను పంపిణీ చేయాలన్నారు. ఉద్యాన వనశాఖ ద్వారా పండ్ల తోటల పెంపకం, తోటల విస్తరణకు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. అరకులోయ మండలం కొత్తవలసలో ఔషధ మొక్కల పెంపకం, 30 ఎకరాల్లో పూల తోటలను సాగు చేయాలన్నారు. ముంచంగిపుట్టు ప్రాంతంలో పుట్టగొడుగులు, జీడిపప్పు ప్రోసెసింగ్ యూనిట్లు ప్రారంభించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన అధికారులు నందు, బాలకరణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఈసారి ‘నీట్’గా రాసేయండి
విశాఖ విద్య: నీట్ పరీక్ష రద్దు వ్యవహారం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేసింది. నెలలు, సంవత్సరాల తరబడి ప్రత్యేక శిక్షణలతో పరీక్ష రాస్తే.. లీకేజీ భూతం విద్యార్థుల భవిష్యత్తు ఆశలపై నీళ్లు చల్లింది. ఈ నేపథ్యంలో జూన్ 21న మళ్లీ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న వేళ.. విద్యార్థులను ఎన్నో సందేహాలు, అనుమానాలు, భయాలు వెంటాడుతున్నాయి. ఆ భయాలను పటాపంచలు చేస్తూ, మనోధైర్యంతో ముందుకు సాగేందుకు మానసిక నిపుణులు, లైఫ్ కోచ్లు పలు సూచనలు చేస్తున్నారు. ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో పరీక్షను ఎలా ఎదుర్కోవాలో ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు వారి మాటల్లోనే.. -
ప్రజారోగ్యానికి ప్రాధాన్యం
● కలెక్టర్ నిశాంతి ● బ్లడ్ బ్యాంక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన అరకులోయటౌన్(పాడేరు రూరల్): ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నామని కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో బీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్(బెంగళూరు) సౌజన్యంతో రూ.95 లక్షల నిధులతో తలపెట్టిన రక్త నిధి(బ్లడ్ బ్యాంక్) నూతన భవన నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్కరికి రక్తం ఎంతో అవసరమని, అత్యవసర సమయంలో మైదాన ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులపై ఆధారపడకుండా స్థానికంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. త్వరలోనే ఈ భవనం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు దేవదాసు, చిరంజీవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పాత తప్పుల విశ్లేషణ అవసరం
రీ–ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వారిలో పరీక్ష భయం సహజంగానే ఉంటుంది. ఒకే సిలబస్ను 24 నుంచి 36 నెలల పాటు చదవడం వల్ల వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే పూర్తిగా సిలబస్ కవర్ చేశారు కాబట్టి, మళ్లీ మొదటి నుంచి చదవడం కంటే.. పాత పరీక్షలో చేసిన తప్పులను విశ్లేషించుకోవాలి. బలహీనంగా ఉన్న కాన్సెప్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిరంతరాయంగా చదవకుండా, మధ్యమధ్యలో ఆరోగ్యకరమైన స్టడీ బ్రేక్స్ తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ పూజిత జ్యోస్యుల, సైకాలజిస్ట్ -
అలసట చదువులు వద్దు..
పరీక్ష రద్దయిందని బాధపడుతూ కూర్చోవద్దు. ఇది మరో అవకాశంగా భావించాలి. గత పరీక్షలో చేసిన పొరపాట్ల జాబితాను తయారుచేసుకోవాలి. దీంతో మరింత మెరుగ్గా పరీక్ష రాసే అవకాశం వస్తుంది. వీలైనన్ని మాక్ టెస్టులు రాయడం వల్ల సమయపాలన, ప్రశ్నల ఎంపిక, ఒత్తిడి నిర్వహణ మెరుగవుతాయి. వీటితో పాటు తగినంత నిద్ర, సరైన ఆహారం, కొద్దిపాటి వ్యాయామం మానసిక ప్రశాంతతను పెంచుతాయి. అలసటతో చదివే గంటల కంటే, ఉత్సాహంగా చదివే కొద్ది గంటలే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని గుర్తుంచుకోవాలి. – అలజంగి ఉదయ్కుమార్, లైఫ్ కోచ్ -
నిర్ణీత గడువులోగా అర్జీల పరిష్కారం
పాడేరు : ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి స్వీకరిస్తున్న అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపేందుకు ఆయా శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంతి ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఆర్డీవో భుజంగరావు 126 అర్జీలు, రెవెన్యూ క్లీనిక్లో 44 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల్లో ప్రతి బుధవారం జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్కు అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలన్నారు. గ్రీవెన్స్లో వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించి సమస్య త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూ డీడీ పరిమల, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి పి.బాబు నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నంద్, డీఆర్డీఏ పీడీ మురళి, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తి, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్, ఎల్డీఎం మాతునాయుడు, జిల్లా పరిశ్రమల అధికారి ఆర్.వి.రమణరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు సమగ్ర సమాచారంతో హాజరు కావాలి అధికారులకు కలెక్టర్ నిశాంతి ఆదేశం పీజీఆర్ఎస్కు 126, రెవెన్యూ క్లీనిక్కు 44 అర్జీలు -
రెండేళ్ల దగా..
అరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఎంపీ తనూజ రాణి, ఎమ్మెల్యే మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, వైఎస్సార్సీపీ శ్రేణులుఅరకులోయ టౌన్(పాడేరు రూరల్): సీఎం చంద్రబాబు రెండేళ్ల పాలనలో అంతా మోసమేనని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే రేగం ఆధ్వర్యంలో అరకులోయ నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్సీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ఆర్ జంక్షన్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం మానవహారంగా ఏర్పడి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. రెండేళ్లలో ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పింఛన్ల కోసం గ్రామ సచివాలయాల చుట్టూ పత్రాలు పట్టుకుని తిరుగుతున్నారన్నారు. ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు అడవితల్లి బాట పేరుతో రోడ్లు వేస్తామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఒక్క రోడ్డయినా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. జగన్ హయాంలో ప్రజల చెంతకు పథకాలు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ మాజీ సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రజల చెంతకు ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందాయన్నారు. కూటమి ప్రభుత్వంలో పథకాలు ఏ ఒక్కటి ప్రజలకు పూర్తి స్థాయిలో అందడం లేదన్నారు. అంక్షల పేరుతో పింఛన్లతో పాటు సంక్షేమ పథకాలకు కోతలు పెడుతున్నారని ఆరోపించారు. సమష్టి కృషితోనే మళ్లీ అధికారం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చింతలపూడి వెంకట్రామయ్య మాట్లాడుతూ ప్రస్తుతం అరకులోయ పార్లమెంట్ పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీకి పూర్తి పట్టుందన్నారు. అందరూ సమష్టిగా పని చేసి, రాబోయే మూడేళ్లలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్కుమార్, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నరావు, జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.చినసత్యం, ఉమ్మడి జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమ్మిడి ఆశోక్, పెదబయలు జెడ్పీటీసీ సభ్యుడు కూడా బోంజుబాబు, మాజీ ఎంపీపీ ఉమమహేశ్వరరావు, అనంతగిరి ఎంపీపీ తెడబాబరికి మితుల, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, పార్టీ ఆరు మండలాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ విభాగాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పాడేరు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అరాచకాలు, వెన్నుపోటుకు నిరసనగా శుక్రవారం నియోజకవర్గ కేంద్రం పాడేరు పట్టణంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన భారీ ర్యాలీ దద్దరిల్లింది. పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపుతో నియోజకవర్గంలో ఐదు మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు శుక్రవారం పాడేరుకు స్వచ్ఛందంగా భారీ ఎత్తున తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ సినిమా హాల్ సెంటర్, పాత బస్టాండ్, మెయిన్ బజారు, సాయిబాబు గుడి మీదుగా పట్టణ శివారు వీఆర్ ఫంక్షన్ హాల్ వరకు రెండున్నర కిలోమీటర్ల మేర సాగింది. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని, త్వరలోనే ఈ ప్రభుత్వాన్ని సాగనంపటానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి. వీఆర్ ఫంక్షన్ హాల్ వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేళ్ల ముందు ఎన్నికల సమయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ పేరుతో ఆచరణ సాధ్యం కాని ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక నిలువునా మోసం చేశారన్నారు. డీఎస్సీ పేరుతో నిరుద్యోగులతో ఆటలాడి ఉద్యోగాలు అర్హులకు దక్కకుండా అమ్ముకున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని మోసం చేశారన్నారు. అన్నదాతలకు కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సొమ్ముతో సంబంధం లేకుండా ఏటా రూ.20వేలు ఇస్తామని చెప్పి దగా చేశారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రోజురోజుకు హత్యలు, హత్యచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయన్నారు. కూటమి రెండేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూటమి పార్టీలను చిత్తుగా ఓడించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ తమ పోరాటాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అడుగడుగునా అడ్డంకులు ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన ర్యాలీకి పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ర్యాలీకి అనుమతి లేదని, తాము చెప్పిన మార్గంలోనే ర్యాలీ చేపట్టాలని పోలీసులు ఆంక్షలు విధించారు. మైక్ ఏర్పాటుకు సైతం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని చుట్టుముట్టారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ముందుగా నిర్ణయించుకుని అనుమతి పొందిన మార్గం మీదుగా ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు అడ్డుకొని వేరే మార్గం మీదుగా వెళ్లాలని సూచించారు. కానీ భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావడంతో పోలీసులు ఏం చేయలేక చేతులెత్తేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుడు ఏడువాక సత్యారావు, ఎంపీపీలు కోరాబు అనుషాదేవి, బోయిన కుమారి, బడుగు రమేష్, వైఎస్సార్సీపీ మండలాల అధ్యక్షులు సీదరి రాంబాబు, నుర్మాని మత్య్సకొండం నాయుడు, పాంగి గుణబాబు, కంకిపాటి గిరిప్రసాద్, బిడిజన అప్పారావు, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సీదరి మంగ్లన్నదొర, వంజరి సీతారం నాయుడు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అద్యక్షురాలు కురుసా పార్వతమ్మ, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బూసరి కృష్ణారావు, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, వైస్ ఎంపీపీలు కుంతూరు కనకాలమ్మ, కుడుముల సత్యనారయణ, ఆనంద్, పలువురి ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచ్లు, నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.పాడేరు పట్టణంలో నిరసన ర్యాలీ చేపడుతున్న ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, నియోజకవర్గ పరిశీలకుడు ఏడువాక సత్యారావు, వైఎస్సార్సీపీ శ్రేణులుఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులుమాటల గారడీతో మభ్యపెట్టి.. ‘సూపర్’ హామీలతో బురిడీ కొట్టించి అధికార పీఠమెక్కిన చంద్రబాబు వంచన పర్వానికి రెండేళ్లు గడిచాయి. ఎన్నికల ముందు జనం ముందుకొచ్చి ఎప్పటిలాగానే ఎడాపెడా హామీలు గుప్పించిన ఆ నయవంచక బాబు.. అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి పాతరేసి, దోపిడీకి ఎర్ర తివాచీ పరిచారు. ఈ రెండేళ్ల మోసాల్ని తూర్పారబడుతూ ఏజెన్సీ వీధులు నిరసనజ్వాలలతో హోరెత్తాయి. సంపద సృష్టిస్తానంటూ సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్న చంద్రబాబు మోసకారి పాలనపై మన్యం భగ్గుమంది. కల్లబొల్లి కబుర్లతో కాలాన్ని నెట్టుకొస్తున్న దగాకోరు ప్రభుత్వ తీరును ఎండగడుతూ పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తాయి.హామీలు అమలు చేసేది ఎప్పుడు? ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేది ఎప్పుడని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ పేరుతో యువతను మోసం చేశారన్నారు. క్రీడా కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టి, అర్హులైన అభ్యర్థులను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతితో పాటు మహిళలకు ఆడబిడ్డ నిధి పథకాలకు ఇప్పటికీ అతీగతీలేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్అమలు లేనట్టేనా! ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ రాష్ట్రలో కూటమి ప్రభుత్వం సూపర్సిక్స్ పేరుతో గద్దెనెక్కి రెండేళ్ళు కావస్తున్నా పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, మహిళలపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. -
జలకళ లేని ‘జోలాపుట్టు’
ముంచంగిపుట్టు: జోలాపుట్టు స్పిల్వే జలాశయం జూన్ మొదటి వారం వచ్చినా జలకళ లేక వెలవెలబోతోంది. ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి ఈ జలాశయం నీరు ఆధారం. జోలాపుట్టులో ఉన్న ప్రధాన, స్పిల్వే జలాశయాల్లో పూర్తి స్థాయి నీటి మట్టం 2750 అడుగులు కాగా.. ప్రధాన జలాశయంలో 2718.30 అడుగుల నీటి మట్టం శుక్రవారం నమోదైంది. అయితే జోలాపుట్టు స్పిల్వే జలాశయం పూర్తిగా అడుగంటిపోయింది. ప్రసుత్తం మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో నీటి సమస్య లేదు. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన నాటికి వర్షాలు పడి, నీటి మట్టం స్థాయి పెరిగితే నీటి సమస్య తీరుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. -
విద్యా కిట్లు ఎక్కడ?
సాక్షి, పాడేరు: వేసవి సెలవులు అనంతరం ప్రభుత్వ పాఠశాలలు శుక్రవారం తెరుచుకున్నాయి. పునః ప్రారంభం రోజునే విద్యార్థులకు అందించాల్సిన విద్యా కిట్లు జిల్లాలో ఎక్కడా కానరాలేదు. చిరిగిన బ్యాగులు, నలిగిన పుస్తకాలతో విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. స్కూళ్లు తెరిచే రోజునే బ్యాగులు, పుస్తకాలు, యూనిఫాం, బెల్ట్, బూట్లు, సాక్సులు పంపిణీ చేస్తామన్న కూటమి ప్రభుత్వం మాట తప్పింది. కేవలం పుస్తకాల పంపిణీతో తొలిరోజు మమ అనిపించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు మే నెల నాటికే విద్యా కానుక కిట్లను అందుబాటులోకి తేచ్చేది. వేసవి సెలవులు అనంతరం పాఠశాలల ప్రారంభం రోజునే బ్యాగులు, యూనిఫాంతో పాటు పుస్తకాలు పంపిణీ చేసేది. కూటమి పాలనలో గత విద్యా సంవత్సరం వలే ఈ ఏడాది కూడా పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులు విద్యా కిట్లను పొందలేకపోయారు. మరోవైపు విద్యార్థుల హాజరు శాతం బాగా తక్కువగా ఉంది. అన్ని యాజమాన్య ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి తొలి రోజు 30 శాతం మాత్రమే విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. వచ్చిన విద్యార్థులకు చాలా చోట్ల పుస్తకాలు మాత్రమే పంపిణీ చేశారు. అల్లూరు, పోలవరం జిల్లాల యూనిట్గా విద్యా శాఖ పని చేస్తుంది. ఈ రెండు జిల్లాల పరిధిలోని 22 మండలాల్లో 2,913 పాఠశాలలకు సంబంధించి 1,77,733 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో చదువుతారని విద్యాశాఖ అంచనా వేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల ప్రా రంభం రోజునే బ్యాగులు, పుస్తకాలు, ఇతర మెటీరి యల్ కిట్టును జగనన్న విద్యా కానుక పేరిట విద్యార్థులు అందుకునేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ రెండేళ్లలో ఆ పరిస్థితి లేకపోవడంతో విద్యార్ధులు ఉసూరుమంటున్నారు. విద్యార్థులకు సరిపడా బ్యాగులు, బూట్లు, సాక్సులు, బెల్ట్లు, యూని ఫాం క్లాత్లను కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు అందుబాటులోకి తేలేకపోయింది. గత విద్యా సంవత్సరంలో నాసిరకం బ్యా గులు పంపిణీ చేశారు. ఆ చిరిగిన బ్యాగులే విద్యార్థులకు ఈ ఏడాది కూడా దిక్కవుతున్నాయి. కొత్త బ్యాగు లు లేకపోవడంతో అనేక పాఠశాలల్లో విద్యార్థులంతా కొత్త, పాత పుస్తకాలను నెత్తిన పెట్టుకుని మోసుకెళ్లిన దృశ్యాలు జిల్లాలో పలుచోట్ల శుక్రవారం కనిపించాయి. గుడివా డ పాఠశాలలో మాత్రం అందుబాటులో ఉన్న బ్యాగు ల ను కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజే శారు. విద్యకు కూటమి ప్రభుత్వం ఇస్తున్నా ప్రాధా న్యం ఇదేనా? అంటూ పలువురు చర్చించుకున్నారు. పునః ప్రారంభం రోజున వెలవెలబోయిన ప్రభుత్వ పాఠశాలలు యూనిఫామ్లు, విద్యాకానుక, పుస్తకాలు అందించని ప్రభుత్వం చిరిగిన బ్యాగులు.. నలిగిన పుస్తకాలతో బడులకు వచ్చిన విద్యార్థులు -
పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయించాలి
అరకులోయటౌన్(పాడేరు రూరల్): పెండింగ్లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రను వైఎస్సార్ సీపీ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం అరకులోయ జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఆమెను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తడబారికి సురేష్కుమార్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు సుందర్రావు, సీనియర్ నాయకులు శెట్టి లక్ష్మణ్రావు, సంపత్కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయా మండలాల పరిధిలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజురు చేసిన భవనాల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని విమర్శించారు. గ్రామ స్థాయిలో అంగన్వాడీ భవనాలు, నాడు–నేడు కింద పాఠశాలల భవనాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఇప్పటికీ అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రజా సమస్యలపై అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు శ్రీకారం చుట్టాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు.జెడ్పీ చైర్పర్సన్ సుభద్రకు వినతి -
సముద్ర భద్రతపై మత్స్యకారులకు అవగాహన
అచ్యుతాపురం రూరల్: పూడిమడక మత్స్యకారులకు సముద్ర భద్రతపై శుక్రవారం మైరెన్ ఎస్ఐలు జి.పైడిరాజు, బి.హెచ్.వి.ఎస్.ఎన్. రాజు, ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు డి.కె.స్వామి, ఎస్ఈ మహేష్, ఇండియన్ నేవీ ఉద్యోగి సందీప్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో మత్స్యకారులు, మత్స్యకార నాయకులతో మాట్లాడారు. సముద్ర భద్రత, వేట నిషేధ కాలంలో నిబంధనలపై అవగాహన కల్పించారు. అక్రమ రవాణా, అనుమానాస్పద కార్యకలాపాలు, విదేశీ బోట్ల సంచారం గమనించిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1093, కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ టోల్ ఫ్రీ నంబర్ 1554కు సమాచారం అందించాలని కోరారు. -
విశాఖ తీరానికి అంతరిక్ష రక్షణ
విశాఖ విద్య: విశాఖ తీరంలో పర్యాటకుల భద్రత కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒక కీలకమైన పరిశోధన ప్రాజెక్టును చేపట్టింది. బీచ్లలో అత్యంత ప్రమాదకరంగా మారే ‘రిప్ కరెంట్ల’ గుర్తింపునకు ప్రాధాన్యత ఇస్తూ ఈ అధ్యయనం సాగనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (సాక్) ఈ ప్రాజెక్టును ఏయూకు మంజూరు చేసింది. రెండేళ్ల కాలవ్యవధి కలిగిన ఈ పరిశోధన మొత్తం వ్యయం సుమారు రూ.22 లక్షలు. సాక్ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్కుమార్, ఏయూ వాతావరణ–సముద్ర శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సి.వి.నాయుడు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. కృత్రిమ మేధస్సు, ఉపగ్రహ సాంకేతికత ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా కృత్రిమ మేధస్సు(ఏఐ), ఉపగ్రహ సాంకేతికతను ఉపయోగించనున్నారు. సముద్ర గమనాన్ని, వాతావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా విశాఖ తీరంలో రిప్ కరెంట్లు ఎప్పుడు, ఎక్కడ ఏర్పడతాయో ముందస్తుగానే అంచనా వేస్తారు. ఇందుకోసం ప్రత్యేక ఏఐ ఆధారిత హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు. నాలుగు సంస్థల సమన్వయం ఈ పరిశోధన ద్వారా లభించే సమాచారం, ఫలితాలు తీర ప్రాంత భద్రతా పోలీసులు, జీవీఎంసీ, పర్యాటక శాఖ, బీచ్ నిర్వహణ సంస్థలకు ఎంతో ఉపయోగపడతాయి. ప్రమాద సూచనలు సకాలంలో అందడం వల్ల ఆయా ప్రభుత్వ విభాగాలు వెంటనే స్పందించి నివారణ, రక్షణ చర్యలు చేపట్టే వీలుంటుంది. పర్యాటకులకు పెరగనున్న భద్రత ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే బీచ్లలో ప్రమాదవశాత్తూ మునిగిపోయే ఘటనలు, మరణాల సంఖ్య భారీగా తగ్గుతుందని ఏయూ సముద్ర శాస్త్ర విభాగాధిపతి ఆచార్య సి.వి.నాయుడు తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల పట్ల పర్యాటకులకు ముందే అవగాహన కల్పించవచ్చని, తీర ప్రాంత విపత్తుల నివారణలో, ప్రజా భద్రతలో ఇదొక విప్లవాత్మక మార్పు కానుందని ఆయన స్పష్టం చేశారు. -
ఓ మై ఘాట్..
రంపచోడవరం: మూడు రాష్ట్రాలను అనుసంధానం చేసే మారేడుమిల్లి – భద్రాచలం ఘాట్ రోడ్డులో ప్రయాణికులకు భద్రత కరవైంది. ఈ రోడ్డులో అనేక ప్రమాదకరమైన మలుపులు ఉన్నా కనీస రక్షణ చర్యలు తీసుకోవడం సంబంధిత అధికారులు విఫలమయ్యారు. అనేక సార్లు భారీ వాహనాలు నిలిచిపోవడంతో ఘాట్ రోడ్డులో రాకపోకలు స్తంభించిపోతున్నాయి. వాహనాల్లోనే ప్రయాణికులు గంటలు తరబడి నరకయాతన పడుతున్నారు. ఇటీవల ఘాట్ రోడ్డులో వ్యాన్ బోల్తా పడి 17 మంది గాయపడ్డారు. ఘాట్ రోడ్డులో భద్రత వైఫల్యాలతో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకర మలుపులు మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డు పాములేరు నుంచి ప్రారంభమై సోకులేరు వ్యూ పాయింట్ వద్ద ముగుస్తుంది. ఈ రోడ్డు సుమారు 30 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ మధ్యలో పది వరకు అత్యంత ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కలిపే మార్గం కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇటువంటి ఘాట్ రోడ్డులో ఆర్అండ్బీ అధికారులు నిర్వహణ పనులు, రక్షణ చర్యలు పటిష్టంగా చేపట్టలేదు. ప్రతిపాదించినా.. ఘాట్ రోడ్డు సేప్టీ పనులు కోసం రూ.2 కోట్ల 60 లక్షలతో ప్రతిపాదనలు పెట్టినా, రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదు. ప్రయాణికుల భద్రత చర్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఘాట్ రోడ్డులోని ప్రమాదకర మలుపుల్లో రక్షణ కోసం ఐరన్ గడ్డర్లు ఏర్పాటు చేయాలి.కానీ అనేక చోట్ల రక్షణ చర్యలు లేవు. ఇటీవల రోడ్డు భవనాలు భవనాల శాఖ గోతులమాయంగా ఉన్న ఘాట్లో నాలుగు కిలోమీటర్లు మేర కొత్త రోడ్డును నిర్మించింది. పాములేరు నుంచి సింగిల్ రోడ్డు ఉండడంతో అనేక సార్లు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆర్అండ్బీ శాఖ కిలోమీటరన్నర రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పెడితే కేవలం 700 మీటర్ల మేర నిర్మాణానికే నిధులు మంజూరు చేశారు. ప్రమాదాల్లో కొన్ని.. ఘాట్ రోడ్డులో గత ఏడాది యాత్రికుల బస్సు అదుపు తప్పి లోయలో పడి తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2019 అక్టోబర్ 15న కర్ణాటకకు చెందిన యాత్రికులు వాహనం మలుపు తిప్పుతుండగా లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు.రక్షణ చర్యలు తీసుకుంటున్నాం ఘాట్ రోడ్డులో రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. సింగిల్ రోడ్డును డబుల్ చేసేందుకు పనులు మొదలు పెడతాం. ఇటీవల నాలుగు కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. త్వరలో మిగిలిన సింగిల్ రోడ్డు పనులు పూర్తి చేస్తాం. ప్రయాణికులు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకుంటాం. – ప్రదీప్, జేఈ, ఆర్అండ్ బీ అవగాహన లేక.. ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. కొన్నిసార్లు భారీ వాహనాలు వెళ్లిపోతున్నాయి. అటువంటి సందర్భాల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికి కొందరు డ్రైవర్లకు ఘాట్ రోడ్డుపై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. – ఐ.శ్రీనివాసరావు, ఎస్ఐ, మారేడుమిల్లి అధికారులు స్పందించాలి ఘాట్ రోడ్డులో ప్రయాణించే వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘాట్ రోడ్డులో జరుగుతున్న ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు సేప్టీ చర్యలు తీసుకోవాలి. – బాలు అక్కిస, హ్యూమన్ రైట్ వాచ్ చైర్మన్, రంపచోడవరం -
మలేరియా నివారణకు పటిష్ట చర్యలు
జిల్లా అధికారి సుజాత చింతపల్లి: జిల్లాలో మలేరియా జ్వరాలు ప్రబలకుండా పూర్తి స్థాయి జాగ్రత్తలు చేపడుతున్నామని జిల్లా మలేరియా అధికారిణి సుజాత తెలిపారు. గురువారం ఆమె స్థానిక ఏరియా ఆసుపత్రిని సందర్శించి, ల్యాబ్లో మలేరియా రికార్డులను పరిశీలించారు. అనంతరం వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల నేపథ్యంలో జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. మలేరియా ప్రభావిత ప్రాంతాలను గుర్తించి, మొదటి విడతగా జిల్లాలోని 1,604 గ్రామాల్లో మలేరియా స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 890 మలేరియా కేసులు నమోదయ్యాయని, రెండు మరణాలు సంభవించాయని ఆమె వెల్లడించారు. ముఖ్యంగా అనంతగిరి, పాడేరు, కొయ్యూరు, గూడెం కొత్తవీధి మండలాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా నిర్ధారణ కిట్లు, అవసరమైన మందులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు. గ్రామాల్లో వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశామని ఆమె తెలిపారు. ఆరోగ్య కేంద్రాల నుంచి పాడేరు జిల్లా ఆసుపత్రికి, చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న రోగుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ, వారికి తక్షణ వైద్య సేవలు అందేలా పర్యవేక్షిస్తున్నామని సుజాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి సబ్ యూనిట్ అధికారి చిట్టిబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
15 నుంచి ఓటర్ల వెరిఫికేషన్
● పెదబయలు తహసీల్దార్ లక్ష్మయ్య పెదబయలు: కలెక్టర్ ఆదేశాల మేరకు, మండలంలో ఓటర్ల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తహసీల్దార్ డి.లక్ష్మయ్య తెలిపా రు. గురువారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ వచ్చి వివరాలను సేకరిస్తారని, ప్రజలు వారికి సరైన సమాచారం అందించి సహకరించాలని కోరారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ మండలంలో ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో 11 రెవెన్యూ గ్రామాల పరిధిలో 703 మంది రైతులకు రీ–సర్వే పట్టాదారు పాసు పుస్తకాలను గ్రామ సభల ద్వారా పంపిణీ చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. భూ రీ–సర్వే పూర్తయిన మిగిలిన గ్రామాల్లో కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే పట్టాల పంపిణీ చేపడతామని పేర్కొన్నారు. ప్రజలు తమ రెవెన్యూ సమస్యలు లేదా ఇతర ఫిర్యాదులను తెలియజేయడానికి ప్రతి సోమవారం తమ కార్యాలయంలో జరిగే పీజీఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ వెంకటరమణ, ఆర్ఐ పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
బడుల్లో సమస్యల తోడు
● నాడు–నేడు పనులకు నిధుల కొరత ● సౌకర్యాల కల్పనపై ‘కూటమి’ నిర్లక్ష్యం ● నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం సాక్షి, పాడేరు: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో, ప్రభుత్వ పాఠశాలలు అనేక సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత విద్యాసంవత్సరంలో అనేక సమస్యల నడుమ చదువు పూర్తి చేసిన విద్యార్థులు, ఈ ఏడాది కూడా అదే పరిస్థితులను ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంది. అసంపూర్తిగా మౌలిక సదుపాయాలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు పథకం రెండో విడతలో భాగంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల పరిధిలోని 967 పాఠశాలల అభివృద్ధికి పనులు చేపట్టారు. అయితే, ప్రభుత్వం మారిన తర్వాత ఈ పనులకు నిధుల కొరత ఏర్పడటంతో ఆ పనులన్నీ అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఫలితంగా మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం సమగ్ర శిక్షా నిధులతో పాఠశాలల భవన నిర్మాణాలను చేపట్టినప్పటికీ, అవి కూడా పూర్తికాకపోవడంతో విద్యార్థులకు తరగతి గదుల సమస్య వెంటాడుతోంది. అందని విద్యా కిట్లు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పూర్తిస్థాయిలో అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. రెండు జిల్లాల పరిధిలోని 2,913 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు లక్షా 77 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసినప్పటికీ, ఇతర కిట్ల సరఫరాలో తీవ్ర జాప్యం నెలకొంది.దాదాపు 1,77,733 మంది విద్యార్థులకు షూలు, బ్యాగులు, బెల్టులు ఇంకా అందలేదు.కేవలం 20,561 మంది విద్యార్థులకు మాత్రమే యూనిఫాం క్లాత్ చేరింది. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు కూడా సరఫరా కాలేదు. స్కూల్ ప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు పుస్తకాలతో పాటు అన్ని కిట్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, ఆ మాటలు కార్యరూపం దాల్చలేదు. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలు తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు కిట్లు అందేవని, కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల వివరాలు ప్రాథమిక : 2,551 ప్రాథమికోన్నత : 91 ఉన్నత : 271 మొత్తం : 2,913 విద్యార్థుల సంఖ్య : 1,77,733 -
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
● ఎస్పీ అమిత్బర్దర్ ● పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష పాడేరు: జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ శాఖలోని అన్ని విభాగాల సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా ఎస్పీ అమిత్బర్ధర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, బాధితులకు తక్షణ సహాయం అందేలా చూసి, నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలన కోసం కఠినంగా వ్యవహరించాలని, కొత్తగా అందుబాటులోకి వచ్చిన డ్రగ్ డిటెక్షన్ కిట్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు వంటి సాంకేతిక పరికరాల ద్వారా నిఘాను పటిష్టం చేయాలన్నారు. సంకల్పం కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గిరిజన గ్రామాల్లో మహిళా భద్రత, సైబర్ నేరాలు, బాలికల రక్షణ, ‘శక్తి’ యాప్ వినియోగం, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్ను గుర్తించి, నిరంతరం వాహన తనిఖీలు చేపట్టాలని, రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, అలాగే రాత్రిపూట గస్తీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసుల దర్యాప్తు, ఇంటెలిజెన్స్ సమాచార సేకరణ, నేరాల ఛేదన, శాంతిభద్రతల పరిరక్షణలో విశిష్ట సేవలందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా ఎస్పీ నగదు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఈగల్ టీమ్ అధికారులు పాల్గొన్నారు. -
ఘనంగా పాకలపాటిగురుదేవుల జన్మదిన వేడుకలు
జి.మాడుగుల: స్థానిక రామలయం ప్రాంగణంలోని శ్రీ దామరాజు వెంకటయేగేంద్రుల (పాకలపాటి గురుదేవులు) ఆలయంలో గురువారం ఆయన 115వ జన్మదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు, వైఎస్సార్సీపీ నాయకులు మత్స్యరాస వెంకటగంగరాజు (బుజ్జి) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మొదట వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య గురుదేవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భజన బృందాల సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలరాజు పలువురు అర్చకులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ డాక్టర్ మత్స్యరాస వెంకటలక్ష్మి, వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డాక్టర్ తెరబరికి సురేష్ కుమార్, జీసీసీ గోడౌన్ సూపరింటెండెంట్ ఎం.సింహచలంరాజు, సమరసతా సేవా ఫౌండేషన్ జిల్లా ప్రముఖ్ మత్స్యరాస మత్స్యరాజు, కోటేశ్వరరావు, గిరి, నరసింహమూర్తి తదితర భక్తులు పాల్గొన్నారు. -
ప్రకృతి ఒడిలో పైనాపిల్ సిరులు
రైతులకు సకాలంలోవిత్తనాల పంపిణీ ● పీపీ బడుగు రమేష్బాబు కొయ్యూరు: రైతులకు సరిపడా విత్తనాలను వ్యవసాయ శాఖ సకాలంలో పంపిణీ చేయాలని ఎంపీపీ బడుగు రమేష్బాబు కోరారు. గురువారం ఆయన పాడేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంగతల్లి, తహశీల్దారు కె.ప్రసాదరావుతో కలిసి సింగవరం రైతు సేవా కేంద్రంలో 90 శాతం సబ్సిడీపై వచ్చిన వరి విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. వర్షాకాలం సమీపిస్తుండటంతో సాగు పనుల కోసం రైతులు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారని, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.వ్యవసాయాధికారి శివరామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. మండలంలోని 17 రైతు సేవా కేంద్రాల్లో ప్రస్తుతం విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రధానంగా బీపీటీ 5204, ఎంటీయూ 1318, ఆర్ఎన్ఆర్ 15048, ఎంటీయూ 1121, ఎంటీయూ 1064 రకాల వరి విత్తనాలను నిల్వ ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అంబటి నూకాలు, ఏఎస్వో చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
అధ్వానంగా జి.మాడుగుల– చుట్టుమెట్ట రహదారి
● మెరుగుకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు ● వెంటనే మరమ్మతులు చేపట్టాలనిఅధికారులకు ఆదేశం జి.మాడుగుల: మండలంలోని జి.మాడుగుల–చుట్టుమెట్ట గ్రామాల మధ్య రహదారి పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. వర్షం కురిస్తే చాలు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించడం కూడా సాధ్యం కాక స్థానిక గిరిజన ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై చుట్టుమెట్ట గ్రామస్తులు పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు వినతిపత్రం అందజేశారు.దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి, రహదారి సమస్యను వివరించారు. రోడ్డు మరమ్మతుల కోసం వెంటనే చర్యలు చేపట్టాలని, తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రామస్తుల కష్టాలను తీర్చేందుకు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నుర్మాని మత్స్యకొండం నాయుడు, మాజీ సర్పంచ్ ఐసరం హనుమంతరావు, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గబ్బాడి శేఖర్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణతులసీ దళార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ తులసీ దళాలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ● శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణం జరిపారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రంలను అందజేశారు. -
ఆవులింతలు
అధికారుల● యథేచ్ఛగా పశువుల అక్రమ రవాణా ● పాడేరు కేంద్రంగా దందా ● హింసిస్తూ తరలిసున్నా పట్టించుకోని వైనంగుత్తులపుట్టులోని పశువుల సంత సాక్షి, పాడేరు: ఏజెన్సీ ప్రాంతంలో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. బక్రీద్ పండుగకు ముందు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అధికారులు, ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో పశువుల అక్రమ వ్యాపారం జోరందుకుంది. సంతల్లోనే అక్రమ దందా పాడేరు మండలంలోని గుత్తులపుట్టు వారపు సంత కబేళాలకు పశువుల తరలింపు కేంద్రంగా మారింది. గురువారం జరిగిన ఈ సంతలో కబేళా వ్యాపారులు భారీగా కొనుగోళ్లు చేశారు. సుమారు రూ. 50 లక్షల విలువైన పశువుల క్రయవిక్రయాలు జరిగినట్లు సమాచారం. గిరిజన రైతులు, దళారుల నుంచి పశువులను కొనుగోలు చేసిన వ్యాపారులు, వాటిని వ్యాన్లు మరియు మినీ లారీల్లో తరలించారు. పశువులను ఎక్కించే సమయంలో కూలీలు చేస్తున్న హింసాత్మక చర్యలు పశు ప్రేమికులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. మినీ వ్యాన్లలో సామర్థ్యానికి మించి పశువులను కుక్కి, ఘాట్ రోడ్ల గుండా తెలుగు రాష్ట్రాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు. అధికారుల ఉదాసీనత ప్రభుత్వం పశువుల అక్రమ తరలింపుపై నిషేధం విధించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. అరకులోయ, పాడేరు, చింతపల్లి మండలాల మీదుగా జాతీయ రహదారికి చేరుకుంటున్న ఈ వాహనాలను తనిఖీ చేయాల్సిన పోలీస్, పశుసంవర్ధక శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లా సరిహద్దులోని తాటిపర్తి, డౌనూరు చెక్పోస్టుల వద్ద కూడా ఎటువంటి తనిఖీలు చేపట్టకపోవడం గమనార్హం. కేవలం మార్కెటింగ్ శాఖ మాత్రమే పశువుల వ్యాపారుల నుంచి మార్కెట్ సెస్ను వసూలు చేయడానికే పరిమితమైంది తప్ప, అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమైంది. రాజకీయ అండతోనే సాగుతోందా? మైదాన ప్రాంతాలైన నక్కపల్లి, పాయకరావుపేట, తుని, కాకినాడ, రాజమండ్రి మరియు విజయవాడకు చెందిన బడా వ్యాపారులు మన్యంలో ఈ అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. వీరి వెనుక కూటమి నేతల అండ ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. స్థానిక దళారులకు అడ్వాన్స్లు ఇచ్చి పశువులను కొనిపిస్తూ, చెక్పోస్టుల వద్ద ఉన్న సంబంధిత శాఖల అధికారులకు ముడుపులు చెల్లించడం వల్లే ఈ అక్రమ రవాణా సులభంగా సాగిపోతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, ఏజెన్సీలో పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.పటిష్ట నిఘాకు ఆదేశం ఏజెన్సీ సంతలు, మైదాన ప్రాంతాల్లో పశువుల రవాణాపై ప్రత్యేక తనిఖీలు చేపడతాం. అనకాపల్లి జిల్లా సరిహద్దు చెక్పోస్టులతో పాటు రాత్రిపూట కూడా పటిష్ట నిఘా ఉంచేలా సంబంధిత పోలీసు బృందాలకు కఠిన ఆదేశాలు జారీ చేశాం. – అమిత్బర్ధర్, ఎస్పీ, పాడేరుతనిఖీలు శూన్యం గుత్తులపుట్టు సంతలో పశువులను హింసించి లారీల్లో ఎక్కిస్తున్న తీరు దారుణంగా ఉంది. భారీగా అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు తనిఖీలు చేయడం లేదు. – రంధి చిన్నయ్య, సంత ఆశీలు నిర్వాహకుడు, గుత్తులపుట్టు -
వంతెన నిర్మాణానికి స్థల పరిశీలన
ముంచంగిపుట్టు : మండలంలోని సుజనకోట పంచాయతీ పరిధిలోని కుమ్మరిపుట్టు మత్స్యగెడ్డపై వంతెన నిర్మాణానికి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారులు బుధవారం స్థల పరిశీలన నిర్వహించారు. కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డపై వంతెన లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నాటు పడవల ద్వారా ప్రయాణించడం ప్రమాదకరంగా మారిందని సుజనకోట మాజీ సర్పంచ్ వెంగడ రమేష్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వేణుగోపాల్కు వంతెన నిర్మాణానికి సంబంధించిన నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వేణుగోపాల్, ఏఈ రాయుడు కుమ్మరిపుట్టు మత్స్యగెడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. వంతెన నిర్మాణానికి అనువైన ప్రదేశాలను గుర్తించి కొలతలు తీసుకున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజనుల నుంచి అవసరమైన వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఈఈ వేణుగోపాల్ మాట్లాడుతూ, కుమ్మరిపుట్టు మత్స్య గెడ్డపై వంతెన నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలి భర్త దామోదరం, గ్రామస్తులు కృష్ణ, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో భారీ వర్షం
● విద్యుత్ వైర్లపై కూలిన చెట్లు ● సీలేరులో నిలిచిన సరఫరా సీలేరు: ఆంధ్రా –ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ వర్షంతో ఊరట పొందారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉండగా, అనంతరం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సుమారు గంటపాటు కురిసింది. భారీ వర్షం, గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ వైర్లపై కూలిపోవడంతో సీలేరులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న జెన్కో సిబ్బంది వెంటనే ఘటనాస్థలాలకు చేరుకుని చెట్లను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.అలాగే ఆంధ్ర–ఒడిశా సరిహద్దు అంతర్రాష్ట్ర రహదారిపై, సీలేరు సమీపంలో ఓ భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలిపోవడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భద్రాచలం నుంచి సీలేరు మీదుగా విశాఖపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులు ఆలస్యంగా నడిచాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
ఎస్.రాయవరం: కొరుప్రోలు గ్రామంలో బావిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ప్రసాదరావు బుధవారం తెలిపారు. ఈ మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ప్రత్తిపాటి సురేష్(35) మంగళవారం ఇంటి నుంచి పెద్ద చెరువుల్లో మట్టి తవ్వకాల్లో ట్రాక్టర్ నడిపేందుకు వెళ్లాడు. అప్పటినుంచి ఇంటికి రాలేదు. బుధవారం పెద చెరువు సమీపంలో గల బావిలో మృతదేహంగా తేలియుండటాన్ని పంచాయతీ సిబ్బంది చెప్పడంతో తండ్రి అబ్బులు పరిశీలించారు. సమాచారం అందుకున్న ఎస్.రాయవరం పోలీసులకు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహంపై ముఖంపై, కడుపు భాగంలో గాయాలై ఉండడాన్ని చూసి తండ్రి అబ్బులు తమ కుమారుడిని ఎవరో కొట్టి బావిలో పడేశారని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు ఇచ్చారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నక్కపల్లి ఆసుపత్రికి తరలించామన్నారు. -
నేనున్నా..
ధైర్యంగా ఉండండి.. ‘మీ వెంటే ఉంటా.. న్యాయం జరిగేలా చూస్తా’సెవెన్హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న వైఎస్ జగన్ సాక్షి, విశాఖపట్నం: ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను, వారి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పరామర్శించారు. విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా రామ్నగర్లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి చేరుకున్న ఆయన.. అక్కడ చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులవద్దకు వెళ్లి వారి చేతులు పట్టుకుని మాట్లాడిన జగన్. ‘నేనున్నాను.. అధైర్యపడొద్దు’ అంటూ భరోసా కల్పించారు. బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదనను ఓపికగా విన్న ఆయన, ఈ కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇంటి పెద్ద దిక్కు ఆసుపత్రిపాలవడంతో కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై బాధితులు, సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్న జగన్, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో చర్చించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యుత్తమ వైద్యం అందించాలని, ప్రాణాలను కాపాడటమే మొదటి ప్రాధాన్యంగా చూడాలని సూచించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనిస్తామని తెలిపారు. పరిహారం అందేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని జగన్ డిమాండ్ చేశారు. ఆ పరిహారం లభించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. ఒకవేళ పరిహారం అందించకపోతే, భవిష్యత్తులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఉక్కు కర్మాగార బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని, వారి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని జగన్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, విశాఖ రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ స్పీకరు తమ్మినేని సీతారాం, ఎంపీలు గొల్ల బాబూరావు, తనూజారాణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలునాయుడు, ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి, మాజీ మంత్రులు అమర్నాథ్, పేర్ని నాని, బాలరాజు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, తలశిల రఘురాం, కుంభా రవిబాబు, పాలవలస విక్రాంత్, విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, చిన్న శ్రీను, బొడ్డేటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్రాజ్, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్ కుమార్, చింతలపూడి వెంకట రామయ్య, జిల్లాపరిషత్ చైర్పర్సన్ సుభద్ర, సమన్వయకర్తలు తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు, మలసాల భరత్కుమార్, చింతాడ రవికుమార్, మాజీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబూరావు, శోభా హైమావతి, రెడ్డి శాంతి, విశ్వసరాయి కళావతి, సీఈసీ సభ్యుడు కోలా గురువులు, పార్టీ జిల్లా కార్యాలయం పర్యవేక్షుకుడు రవి రెడ్డి, ఎస్ఈసీ సభ్యులు గొలగానిహరి వెంకట కుమారి, జియ్యాని శ్రీధర్, కట్టమూరి సతీష్, రొంగలి జగన్నాథం, ఐహెచ్ ఫారూఖీ, పీలా వెంకటలక్ష్మి, నియోకవర్గ పరిశీలకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, పేడాడ రమణికుమారి, శరగడం చిన అప్పలనాయుడు, వీసం రామకృష్ణ, సతీష్ వర్మ, జహీర్ అహ్మద్, గండి రవికుమార్, కొండా రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. స్టీల్ప్లాంట్ బాధితులకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ భరోసా చికిత్స పొందుతున్న కార్మికులు, కుటుంబాలకు పరామర్శ వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా మెరుగైన వైద్యం అందించాలంటూ వైద్యులకు సూచన రూ. కోటి పరిహారం ఇచ్చే వరకు పోరాడతాం అప్పటికీ పరిహారం అందకపోతే వచ్చే మన ప్రభుత్వంలో నెల రోజుల్లోనే సాయం అందిస్తా -
పర్యటన సాగిందిలా..
స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం 11.15 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి 11.47 గంటలకు బయలుదేరి..రాంనగర్ సెవెన్ హిల్స్ ఆసుపత్రికు చేరుకున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. మీడియాతో మాట్లాడారు. 1.45 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి షీలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి 2.05 గంటలకు చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం 2.40 గంటలకు బయలుదేరి 2.55 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. 3.07 గంటలకు విమాన మార్గంలో గన్నవరం బయలుదేరి వెళ్లారు. -
నాసిరకం ముడిపదార్థాలే దెబ్బతీశాయా?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్లో ప్రమాదానికి నాసిరకం ముడిపదార్థాలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్వోపీ) పాటించకపోవడం వంటివి కారణాలన్న అనుమా నాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. లాడెల్లో మలినాలను తొలగించేందుకు వీలు గా చేయా ల్సిన ఆర్గాన్ బాటమ్ పర్జింగ్ చేయకపోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని భావిస్తున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ప్లాంట్ను ఆర్థిక సమస్యలు వేధిస్తున్న నేపథ్యంలో బయటి నుంచి మాంగనీస్, సిలికా మాంగనీస్, పెట్రోకోక్, అల్యూమినియం తదితర ముడిపదార్థాలను తక్కువ ధర పేరుతో నాసిరకమైనవి కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నాసిరకం ముడిపదార్థాలను హాట్ మెటల్లో వేసినప్పుడు మలినాల వల్ల ఇటువంటి పేలుడు సంభవించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లాడెల్లో ఉండే లీకుల వల్ల ద్రవపు ఉక్కు కింద పడిపోవడం జరు గుతుంటుందని.. ఇటువంటి పేలుడు మాత్రం మలినాల వల్లే జరిగే అవకాశం ఎక్కువ అనే నిపు ణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించే ప్రక్రియ జరుగుతోందన్న విమర్శలు బలంగా ఉన్నాయి. స్టీల్ప్లాంట్లో ఒక్కో విభాగాన్ని ప్రైవేటుకు అప్పగించడంతోపాటు వేలసంఖ్యలో కార్మికుల తొలగింపు, వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపుతున్నారు. ఈ వ్యవహారాలపై కార్మికులు, కార్మికసంఘాలు మొత్తుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వంలోని నేతలు ఎవరూ మాట్లాడటం లేదు. పేలుడుకు మలినాలే కారణమా..: లాడెల్ నుంచి 1,600 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ద్రవపు ఉక్కు లీకుల వల్ల కిందపడటం సాధారణంగా జరుగుతుంటుందని స్టీల్ప్లాంట్ సిబ్బంది సైతం చెబుతున్నారు. అయితే ఏకంగా పేలుడు జరగటం ఇదే మొదటిసారి అని గుర్తుచేస్తున్నారు. తాజాగా జరిగిన దుర్ఘటనలో మాత్రం ఏకంగా లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు పేలి ఎగసిపడిందని అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ప్రమాద స్థలానికి దూ రంగా ఉన్న ప్రాంతంలోని మందపు గ్లాసులు కూడా పగిలి అక్కడున్న వారిపైన కూడా లాడెల్ నుంచి ఎగసిన ద్రవపు ఉక్కు పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ స్థాయిలో పేలుడు సంభవించేందుకు ప్రధాన కారణం.. నాసిరకం ముడిసరుకులతోపాటు ఎస్వోపీని పాటించకపోవడమేనని చెబుతున్నారు. కవ్వంతో మజ్జిగను చిలికితే వెన్నె పైకివచ్చిన విధంగానే సాధారణంగా ఆర్గాన్ బాటమ్ పర్జింగ్ వల్ల లాడెల్లో మలినాలు పైకివస్తాయి. ఈ ప్రక్రియలో లాడెల్కు కిందినుంచి పైపు పంపించి.. ఆర్గాన్ గ్యాస్ పంపిస్తారు. తద్వారా లాడెల్లో ఉన్న 150 టన్నుల ద్రవపు ఉక్కులో ఉన్న మలినాలు బయటకు వస్తాయి. ఉత్పత్తి వ్యయం తగ్గింపు సాకుతో ఈ ప్రక్రియను సరిగ్గా చేయడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా స్క్రాప్ ఇనుమును ప్రాసెస్ చేసే సమయంలో తేమ ఉన్నా.. మలినాలుంటే ఇటువంటి పేలుడు సంభవిస్తుందని అధికారులు అంటున్నారు. గతంలో నూజివీడులో ఐర న్ స్క్రాప్ దుకాణంలో ఇటువంటి పేలుడు సంభవించి ఐదుగురు మరణించారని గుర్తుచేస్తున్నారు. ఇక్కడ కూడా అదే తరహాలో పేలుడు సంభవించిన నేపథ్యంలో.. నాసిరకం ముడిపదార్థాలతో పాటు ఆర్గాన్ బాట మ్ పర్జింగ్ చేయకపోవడమే కారణమని పేర్కొంటున్నారు. తక్కువ సిబ్బంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ప్లాంట్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ నిరంతరం ఒక యుద్ధ ప్రక్రియలాగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆరువేల మంది కాంట్రాక్టు సిబ్బందిని తొలగించారు. మూడువేల మంది రెగ్యులర్ ఉద్యోగులను కూడా వీఆర్ఎస్ పేరుతో ఇంటికి సాగనంపారు. దీంతో స్టీల్ప్లాంట్లో సిబ్బంది కొరత నెలకొంది. ఉదాహరణకు ప్రమాదం జరిగిన స్టీల్ మెల్టింగ్ షాప్–1 వద్ద 21 మంది సిబ్బంది ఉండాల్సి ఉంది. అయితే ఇక్కడ 11 మంది మాత్రమే ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎనిమిదిమంది మాత్రమే పనిచేస్తున్నారు. సరిపడిన సిబ్బంది లేకపోవడంతో పాటు ఉత్పత్తి పెంచాలనే ఒత్తిడితో తమకు ప్లాంట్ ఆపరేట్ చేసేందుకు ఇవ్వాల్సిన సరైన సమయం కూడా ఇవ్వడం లేదని కార్మికులు వాపోతున్నారు. గంటలో చేయాల్సిన పనిని అరగంటలో చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారని పేర్కొంటున్నారు. దీంతో ఎస్వోపీని పాటించకుండా హడావుడిగా ప్లాంట్ను రన్ చేస్తుండటం కూడా ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ప్లాంట్ను నిర్వీర్యం చేసే లక్ష్యంతో ప్లాంట్లో ప్రైవేటీకరణ, ఉద్యోగులను తొలగింపు సాగుతున్నాయి. -
రెండు దుకాణాలు దగ్ధం ● సుమారు రూ.35 లక్షల ఆస్తి నష్టం
ఎస్.రాయవరం: అడ్డురోడ్డు వాణిజ్య కేంద్రంలో రెండు దుకాణాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 35 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలివి. రాజస్థాన్ ప్రాంతానికి చెందిన నేషనల్ హర్డ్వేర్ దుకాణం, నాతవరానికి చెందిన మారుతి ఎలక్ట్రికల్ దుకాణాల్లో బుధవారం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పెయింట్ డబ్బాలు అంటుకోవడంతో మంటలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మారుతీ ఎలక్ట్రికల్ శానిటరీ దుకాణం పూర్తిగా కాలిబూడిదైపోవడంతో రూ.25 లక్షల వరకు, నేషనల్ హార్డ్వేర్ దుకాణంలో సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక సీఐ ఎల్.రామకృష్ణ, ఎస్ఐ ప్రసాద్ హుటాహుటిన అక్కడకు చేరుకుని నక్కపల్లి ఫైరింజన్కు సమాచారం అందించి మంటలను అదుపు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియలేదని చెప్పారు. స్థానిక వీఆర్వో వేణు నష్టం అంచనా విలువ నమోదు చేసుకున్నారు. మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు పోలీసులు చెప్పారు. -
జీవ ఎరువుల వినియోగంతో నేల సారవంతం
చింతపల్లి: గిరిజన జీవ ఎరువుల వాడకం ద్వారా నేల సారవంతం కావడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. బుధవారం వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయశాఖ సంయుక్తంగా స్థానిక వారపు సంతలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల్లో అధికంగా రసాయన ఎరువులు వాడకం వల్ల భూమి సారం తగ్గుతుండడంతో పంటలు దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. భూమిలో సారం పెరగడానికి జీలుగు,జనుము వంటి పచ్చిరొట్ట పంటలను పుష్పించే దశకు ముందే నేలలో కలియ దున్నడం వల్ల నేల సారం పెరుగుతుందన్నారు. జీవ ఎరువులు వాడకంతో ఎకరానికి 20 కిలోలు యూరియా వినియోగాన్ని తగ్గించుకోవచ్చునని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి మధుసూదనరావు మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల్లో పచ్చిరొట్ట విత్తనాలు, జీవ ఎరువులు, వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్బంగా శాస్త్రవేత్తలు సందీప్నాయక్, వెంకటేష్ బాబు, జోగారావు రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులు, జీవ ఎరువులు వినియోగం, నేల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. రైతులకు ద్రవ,జీవ ఎరువులు, వర్మీ కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు పంపిణీ చేపట్టారు. పాలిటెక్నిక్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ అప్పలస్వామి -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
● జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ● పీజీఆర్ఎస్లో 255 అర్జీలు స్వీకరణ ముంచంగిపుట్టు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. బుధవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ హాజరై ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను జేసీకి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజల నుండి మొత్తం 255 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్కు వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారితనం ముఖ్యమని, నిర్దేశించిన గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల సమస్య పరిష్కారం కాకపోతే, ఆ విషయాన్ని స్పష్టంగా అర్జీదారుడికి తెలియజేయాలన్నారు. ఒకే సమస్యపై అర్జీలు పదేపదే వస్తే సంబంధిత శాఖల అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మండల స్థాయి అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజల సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని వేగంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రోడ్లు, తాగునీరు, ఆరోగ్యం, ఇరిగేషన్, గిరిజన సంక్షేమం, పీఆర్, రెవెన్యూ, సీసీ రోడ్లు, ఉపాధి హామీ, గృహ నిర్మాణం, మత్స్యశాఖ, పింఛన్లు, విద్యుత్, భూ సమస్యలపై అధిక సంఖ్యలో అర్జీలు వచ్చాయి. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగానే ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించి 38 మందికి వైద్య సేవలు అందించారు. అలాగే ఉచిత ఆధార్ నమోదు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఆర్డీవో భుజంగరావు, జిల్లా పంచాయతీ విస్తరణ అధికారి పీఎస్కుమార్, డీఎంహెచ్వో నాయక్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ, సీఐ లక్ష్మణరావు, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వేణుగోపాల్, హౌసింగ్ డీఈ రాజుబాబు, ఎంపీడీవో ధర్మారావు, ఎంఈవో కృష్ణమూర్తి, పీఆర్ ఏఈ మురళీకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజేష్, ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణ, ఏటీడబ్ల్యూవో స్వర్ణలత, సీడీపీవో విమలకుమారి పాల్గొన్నారు. -
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
● భర్త వేధింపులే కారణం ● దర్యాప్తులో గుర్తించిన పోలీసులు ● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు ● జి.మాడుగుల సీఐ లక్ష్మణరావు వెల్లడి పెదబయలు: మండలంలోని లక్ష్మీపేట పంచాయతీ మండభ గ్రామంలో ఓ వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి జి.మాడుగుల సీఐ ఎస్. లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండభ గ్రామానికి చెందిన కించెయి నవీన్సాగర్, అరుణ (27) దంపతులు. భర్త నవీన్సాగర్ తరచూ వేధింపులకు గురిచేస్తుండటంతో మనస్తాపానికి గురైన అరుణ మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన నవీన్సాగర్ తలుపులు తెరిచి చూడగా, భార్య అరుణ ఉరికి వేలాడుతూ కనిపించింది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉన్నట్లు పోలీసులు తెలిపారు.మృతురాలి తండ్రి మఠం దేవరాజు ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం జి.మాడుగుల సీఐ ఎస్. లక్ష్మణరావు, ఎంఆర్వో లక్ష్మయ్య, క్లూస్ టీమ్, ఆర్ఎఫ్ఎస్ఎల్ బృందాలు ఘటనాస్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించాయి. అరుణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముంచంగిపుట్టు సీహెచ్సీకి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మణరావు తెలిపారు. -
ఆధార్ సేవలు మరింత వేగవంతం
ముంచంగిపుట్టు: ప్రజలకు ఆధార్ సేవలను మరింత సులభతరంగా, వేగవంతంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఆధార్ కేంద్రాన్ని ఆమె, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఆధార్ నమోదు చేసుకున్న 26 మంది లబ్ధిదారులకు వారు నమోదు పత్రాలను అందజేశారు. అనంతరం జేసీ మాట్లాడుతూ.. ఆధార్ కార్డులలో తప్పుల సవరణ, కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేట్ వంటి సమస్యల పరిష్కారం కోసమే ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఐదు నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలన్నారు. అలాగే పెద్దలు తమ వేలిముద్రలు, కంటిపాప (ఐరిస్) అప్డేట్స్, పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీలలో తప్పుల సవరణతో పాటు ఉచిత డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చని సూచించారు. పదేళ్లు దాటిన ఆధార్ కార్డులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు పత్రాలను అప్డేట్ చేసుకోవాలని ఆమె కోరారు. అనంతరం మండల కేంద్రంలోని జీటీడబ్ల్యూఏబాలికల పాఠశాల–1లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేసీ, పీవో ఆదిత్య వర్మ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, విద్యార్థి దశ నుంచే మొక్కల పెంపకంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎలీపవో పీఎస్ కుమార్, ఎంపీడీవో ధర్మారావు, ఆధార్ జిల్లా కోఆర్డినేటర్ నాగరాజు, హెచ్ఎం లక్ష్మి, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ -
వీధి దీపాలు ఏర్పాటు
సాక్షి,పాడేరు: పట్టణంలోని ప్రధాన రోడ్లు, జంక్షన్లు, అన్ని వీధుల్లో వీధి లైట్ల ఏర్పాటు పనుల్లో మేజర్ పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెల 9న సాక్షిలో ప్రచురితమైన ‘చిమ్మ చీకట్లు... జనానికి ఇక్కట్లు’ అనే కథనానికి జిల్లా పంచాయతీ అధికారులు సానుకూలంగా స్పందించారు. పాడేరు పట్టణంలోని అన్ని వీధి స్తంభాలకు రెండు రోజుల్లోగా లైట్లు ఏర్పాటు చేసి, విద్యుత్ వెలుగులతో ప్రజల ఇబ్బందులను తొలగించాలని డీపీవో చంద్రశేఖర్, డీఎల్పీవో పీఎస్ కుమార్ స్థానిక పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు డిప్యూటీ ఎంపీడీవో రమేష్ పర్యవేక్షణలో గత రెండు రోజులుగా వీధి లైట్ల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం సాయంత్రానికి అన్ని వీధుల్లోని స్తంభాలకు లైట్లు ఏర్పాటు పూర్తి అవుతుందని పంచాయతీ అధికారులు తెలిపారు.నిందితుడు రౌతు మల్లేష్పై పీడీ యాక్టు నర్సీపట్నం: శాంతిభద్రతలకు విఘాతం కలిస్తూ, తరుచూ నేరాలకు పాల్పడుతున్న నర్సీపట్నంకు చెందిన నిందితుడు రౌతు మల్లేష్(45)పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పీడీ యాక్టు నమోదు చేసి, అరెస్ట్ చేసి విశాఖ సెంట్రల్ జైల్కు తరలించామని టౌన్ సీఐ గపూర్ తెలిపారు. మల్లేష్ అనేక సంవత్సరాలుగా ఇంటి దొంగతనాలు, నార్కోటిక్స్ కేసులు, హత్యాయత్నం, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డాడరన్నారు. జిల్లాలో ఇతర జిల్లాల్లో సుమారు వందకుపైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని తెలిపారు. అతని నిరంతర నేర కార్యకలాపాలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించి, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ విజయ్కృష్ణన్, ఎస్పీ తుహిన్సిన్హా ఆదేశాల మేరకు నిందితుడిపై పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
వాణిజ్యకేంద్రంలో అగ్ని ప్రమాదం
టెట్ నుంచి ఉపశమనం కల్పించాలి కశింకోట: టెట్ ఉత్తీర్ణత నుంచి 2010 కంటే ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులకు ఉపశమనం కల్పించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జల వెంకట సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. అనకాపల్లి జీవీఎంసీ మెయిన్ స్కూల్లో సంఘం జిల్లా అభ్యాస వర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. అభ్యాస వర్గ జిల్లా అధ్యక్షుడు మడ్డు చంద్రరావు అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల జీవితాల్లో ఆందోళన కలిగించిన టెట్ తప్పనిసరి ఉత్తీర్ణత నియమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి పార్లమెంట్లో శాసనం ద్వారా మార్పు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 18న కలెక్టర్ కార్యాలయం వద్ద సంఘం ఆధ్వర్యంలో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ ఉత్తీర్ణత నియమం ఉపసంహరణ కోరుతూ నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులంతా పాల్గొనాలని కోరారు. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ అమలు ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలన్నారు. ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. సంఘ రాష్ట్ర అదనపు కార్యదర్శి చిరంజీవి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పాఠశాలలను బేసిక్ ప్రైమరీ స్కూలుగా మార్పు చేసి ఫౌండేషన్ పాఠశాల వ్యవస్థను తొలగించాలన్నారు. సెమిస్టర్ 1 పాఠ్య పుస్తకాలను పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు అందజేయాలన్నారు. -
పోలీసులపై గంజాయి స్మగ్లర్ల దాడి
చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చి పోతున్నారు. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లా మీదుగా మైదాన ప్రాంతానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను వెంబడించిన పోలీసులపైనే దాడికి పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. చింతపల్లి మండలంలో గంజాయి స్మగ్లర్లు దాడికి పాల్పడడంతో పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. చింతపల్లి మండలం ఆంధ్రా – ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు వచ్చి న ముందస్తు సమాచారం మేరకు అన్నవరం పోలీసులు లోతుగెడ్డ వంతెన సమీపంలో రామారావుపాలెం–మేడూరు జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున వాహనాల తనిఖీ నిర్వçహించారు. అదే సమయంలో ఏఓబీ సరిహద్దు ప్రాంతం బలపం కోరుకొండ నుంచి రామారావుపాలెం మీదుగా అటుగా వచ్చి న వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లు ఒక్కసారిగా పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనాలతో పోలీసులపైకి దూసుకెళ్లారు. దీంతో స్మగ్లర్లను నిలువరించడానికి పోలీసులు ప్రయత్నించడంతో మరింత రెచ్చిపోయి పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడడంతో అన్నవరం ఎస్ఐ రెండు రౌండ్లు తుపాకీని గాల్లోకి పేల్చారు.తప్పించుకుని పారిపోతున్న నలుగురిని పట్టుకోగా, మరో నలుగురు పారిపోయారు. వారి నుంచి రూ.కోటి విలువైన 290 కిలోల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో రాజస్థాన్కు చెందిన అర్జున్కుమార్, విశాఖపట్నంకు చెందిన ఇమ్రాన్ఖాన్, మల్కన్జిల్లా(ఒడిశా)కు చెందిన కిసాన్కార్, అల్లూరి జిల్లా బలపం గ్రామానికి చెందిన పాంగి శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. అన్నవరం పోలీసులు ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. -
ఆదివాసీల ఫిర్యాదుపై తహసీల్దార్ విచారణ
రావికమతం: ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హైదరాబాద్కు చెందిన చుండూరు ఉషారాణి,భర్త నాగేశ్వరరావు బెదిరిస్తున్నారని, అధికారుల ద్వారా స్వాధీనం చేసుకోడానికి యత్నిస్తున్నారని, ఈ విషయంపై కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని చీమలపాడు పంచాయతీ జెడ్.జోగుంపేట గ్రామానికి చెందిన ఆదివాసీలు చేసిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ అంబేడ్కర్ మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ సర్వే నంబరు 66–2లో 78 ఎకరాల జిరాయితీ భూమిలో పది ఎకారాలను తాను కొనుగోలు చేశానని చెప్పారు. అనంతరం తహసీల్దార్కు డాక్యుమెంట్లు చూపించారు. మీ దగ్గర ఏమైనా డ్యాకుమెంట్లు ఉంటే చూపించాలని ఆదివాసీలను తహసీల్దార్ అడగగా తాము చాలా సంవత్సరాల నుంచి సాగులో ఉన్నామని ఈ భూమి తమకే చెందుతుందని ఆదివాసీలు తెలిపారు. దీనిపై నివేదికను జిల్లా అధికారుల అందజేస్తానని తహసీల్దార్ చెప్పారు.ఎటువంటి గొడవలు జరగకుండా కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రావికమతం, రోలుగుంట, బుచ్చెయ్యపేట పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
విచారణకు అధికారుల గైర్హాజరుపై ఆగ్రహం
ఏపీవోతో ఫిర్యాదుదారుల వాగ్వాదం రోలుగుంట: వీఆర్పీ అక్రమాలపై చేపట్టిన విచారణకు అధికారులు గైర్హాజరవడంతో ఫిర్యాదు దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కొమరవోలులో వీఆర్పీ కృష్ణ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఉపాధి హామీ కూలీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 4, 6 తేదీల్లో అధికారులు విచారణ జరిపారు. మళ్లీ మంగళవారం నిర్వహించిన విచారణకు ఎంపీడీవో వి.ఎస్.నాగేశ్వరరావు, ఏపీడీ చిన్నారావు హాజరు కాలేదు. ఏపీవో మాత్రమే హాజరుకావడంతో ఫిర్యాదుదారులు బి.వి.జె,పాత్రుడు, బండారు వరహాలుదొర, వంటాకుల సత్తిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచరాణాధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తురున్నారని వారు ఆరోపించారు. ఉన్నతాఽఽఽధికారులు వస్తేనే తాము సహకరిస్తామని వారు ఏపీవోతో తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఏపీవో, ఫిర్యాదుదారుల మధ్య వాగ్వాదం జరిగింది. విచారణ నిర్వహించకుండానే ఏపీవో వెనుదిరిగారు. దీనిపై ఎంపీడీవో నాగేశ్వరరావుని సాక్షి సంప్రదించగా తాను డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటన డ్యూటీలో పాల్గొనాల్సి వచ్చిందని, ఏపీడీ చిన్నారావు తమశాఖ పీడీ నిర్మాలాదేవి ఆదేశాల మేరకు గొలుగొండ మండలంలో విధులు నిర్వాహించాల్సి వచ్చిందని వివరించారు. -
‘ఉక్కు’ మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి
మహారాణిపేట(విశాఖ): విశాఖ స్టీల్ప్లాంట్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు వెంటనే కోటి రూపాయల పరిహారం అందించాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర డిమాండ్ చేశారు. విశాఖలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు రూ.10 లక్షల పరిహారం అందించాలని కోరారు. స్టీల్ప్లాంట్లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు తీరని లోటు అన్నారు. మృతుల కుటుంబాల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించాలని కోరారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే ఉచిత వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. -
ప్రజలకు అందుబాటులోఉండాలి
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హుకుంపేట: సచివాలయ ఉద్యోగులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం సూచించారు. మండలంలో మట్టుజోరు గ్రామ సచివాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. రికార్డులను పరిశీలించిన అనంతరం సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతులకు సకలంలో సబ్సిడీతో కూడిన విత్తనాలు,ఎరువులు, పురుగు మందులను పంపిణీ చేయాలని ఏవో సుధాకర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కార్యదర్శి సాల్మన్రాజు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన
సాక్షి, పాడేరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రెండేళ్ల కాలంలో రాక్షస పాలన అందించారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తయినందుకు నిరసనగా మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్ల పాలనలో ఆ హామీలను పూర్తిగా విస్మరించి, నిరంకుశంగా పాలించడం దారుణమన్నారు. చివరకు సూపర్ సిక్స్ హామీలను కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారని విమర్శించారు. గిరిజనులకు నూరు శాతం ఉద్యోగాలు కల్పించే జీవోనంబరు 3ను అమలు చేస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు వారికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు పాలనలో అమలుకాని హామీలను, వైఫల్యాలను గ్రామగ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక ఎన్నికలలో నూరు శాతం స్థానాలలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. అనంతరం చంద్రబాబు వెన్నుపోటుకు నిరసనగా ఎమ్మెల్యేతో పాటు నేతలంతా కలిసి నల్ల బెలూన్లను ఎగురవేశారు. మండల పార్టీ అధ్యక్షుడు సీదరి మంగ్లన్నదొర, జిల్లా మహిళా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, పాడేరు నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఉర్వశిరాణి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టి.బి.సురేష్కుమార్, మాజీ వ్యవసాయ మండలి అధ్యక్షురాలు మినుముల సరస్వతి, మాజీ పీఎసీఎస్ పర్సన్ ఇన్చార్జి లకే రామసత్యవతి, ఎంపీటీసీలు లకే రామకృష్ణపాత్రుడు, సన్యాసిరావు, పార్టీ జిల్లా, స్థానిక నాయకులు వనుగు బసవన్నదొర, బొంజుబాబు, దశమూర్తి, కిల్లు కోటిబాబునాయుడు, బోనంగి వెంకటరమణ, సుదర్శన్, రాజేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.వెన్నుపోటుకు రెండేళ్లు కరపత్రాలను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజురౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఏ ఎన్నికలు వచ్చినా చంద్రబాబుప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి వైఎస్సార్సీపీ పాలనతోనే ప్రజల సంక్షేమం సాధ్యం పార్టీ జిల్లా అఽధ్యక్షుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు -
పచ్చని చెట్లూ పచ్చనేతల పాలు
బుచ్చెయ్యపేట: మండలంలో గల పెదమదీన గ్రామంలో విలువైన అకేషియా చెట్లను ఆర్ధరాత్రి నరికి తరలించారు. గ్రామానికి ఆనుకుని విశాలంగా కొండ ప్రాంతం ఉంది. అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిలో సుమారు 150 ఎకరాల్లో ఏపుగా అకేషియా చెట్లు పెరిగి ఉన్నాయి. సోమవారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు ట్రాక్టర్లు లోడు వరకు నరికి పట్టుకుపోయారు. ఇదే చెట్ల విషయంలో గతంలో గ్రామంలో కూటమి నేతలు గొడవలు పడ్డారు. ఈ ఏడాది జనవరిలో కూటమికి చెందిన సర్పంచ్ భర్త కె.వి.ఆర్ నాయుడు కొండ ప్రాంతంలో ఉన్న చెట్లను నరికి గ్రామ అభివృద్ధి పనులకు వినియోగిస్తామని పంచాయితీ తీర్మానం చేయించారు. అప్పట్లో సర్పంచ్ భర్త ప్రభుత్వ భూమిలో చెట్లు నరికిస్తుండగా ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ వియ్యపు అప్పారావు వర్గీయులు అడ్డుకున్నారు. వేలం వేయకుండా ప్రభుత్వ భూమిలో ఉన్న చెట్లు నరకొద్దని తెలపగా దీనిపై ఇరు వర్గాలు వారు గొడవ పడ్డారు. జనవరి 20వ తేదీన గ్రామ రామాలయం వద్ద కూటమి నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కారాలు విసురుకుంటూ కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా పలువురు గాయపడ్డారు. డీఎస్పీ, సీఐ, పలు పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలకు చెందిన వారిపై కేసులు నమోదు చేశారు. వారం రోజుల పాటు గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు. ఈ గొడవల కారణంగా మనస్థాపానికి గురైన సర్పంచ్ భర్త కె.వి.ఆర్ నాయుడు అకాలంగా మృతి చెందారు. మరలా ఇదే భూమిలో చెట్లు నరికి వేయడంపై గ్రామంలో చర్చనీయాంశమైంది. అర్ధరాత్రి పూట ప్రభుత్వ భూమిలో అకేషియా చెట్లు తరలించడంతో గ్రామంలో మరలా గొడవలు జరిగే అవకాశం ఉందని ఆందోళన నెలకొంది. గ్రామంలో ప్రభుత్వ భూమిలో విలువైన అకేషియా చెట్లు నరికివేత కూటమి నేతల పనేనని మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జోగా కొండబాబు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కె.అచ్చింనాయుడు ఆరోపిస్తున్నారు. చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
రైతుల సమక్షంలోనే భూముల రీసర్వే
చింతపల్లి: రెవెన్యూ శాఖ చేపడుతున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వారి సమక్షంలోనే చేపట్టాలని ఎంపీపీ కోరాబు అనూషదేవి డిమాండ్ చేశారు. మంగళవారం కిటుమలు పంచాయతీ పరిధిలోని రాచపనుకు గ్రామంలో జరిగిన భూ హక్కు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వేనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం జియో ట్యాగింగ్ చేసి ఇస్తోందే తప్ప, కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న రీసర్వే ప్రక్రియలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, దీనివల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. దేశంలోనే రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ధ్యేయంతో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ రీసర్వే వ్యవస్థను తొలిసారిగా తీసుకువచ్చారని గుర్తుచేశారు. పొలాల వద్ద రైతులు లేని సమయంలో అధికారులు ఏకపక్షంగా రీసర్వే చేపడితే హద్దులు మారే అవకాశం ఉందదన్నారు. దీనివల్ల రైతులు తమ భూములను నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే లోపాల వల్ల తలెత్తే సమస్యల పరిష్కారం కోసం రైతులు మళ్లీ ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి కల్పించవద్దని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు న్యాయం చేసే దిశగానే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హెచ్. త్రివేణి, సర్వే డీటీ బాలరాజు దొర, రెవెన్యూ సిబ్బంది, రైతులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూషదేవి డిమాండ్ -
గిరిజనులను కించపరిచేలా ‘పెద్ది’ సినిమాలో పదజాలం
● దర్శక, నిర్మాతలపైగిరిజన సంఘాలు ఫిర్యాదు ● ఎట్రాసిటీ కేసుకు డిమాండ్ చింతపల్లి: ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలో గిరిజన జాతిని కించపరిచేలా ఉన్న పదాలకు బాధ్యులను చేస్తూ ఆ చిత్ర దర్శక, నిర్మాతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఏఎస్పీ నవజ్యోతి మిశ్రాకు వారు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏపీ జేఏసీ జిల్లా నాయకులు దేపూరి శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. పెద్ది సినిమాలో వాడిన కొన్ని పదాలు, సంభాషణలు గిరిజనుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఈ సినిమాలో గిరిజనులను ఉద్దేశించి ‘కొండ నా....’ అని తిట్టడం, అలాగే కాళ్లు పట్టుకోవడం.. వంటి సన్నివేశాలను చిత్రీకరించడం గిరిజన సమాజాన్ని అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద పదాలపై సెన్సార్ బోర్డు తక్షణమే జోక్యం చేసుకుని, ఆ సంభాషణలను సినిమా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. గిరిజన జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు గాను ఈ సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయితలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సాగిన కోటిబాబు, చింతర్ల మధుబాబు, ట్రైబల్ శక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కంఠా బాలకృష్ణ, దేపూరి సునీల్ కుమార్, రీమల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా పరదేశిమాంబ జాతరలు
దేవరాపల్లి: మండలంలోని ముషిడిపల్లి, గరిశింగిలో పరదేశి మాంబ అమ్మవారి పెద్ద పండగలను మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముషిడిపల్లిలో సుమారు 30 ఏళ్ల తర్వాత, గరిశింగిలో 18 సంవత్సరాల తర్వాత భారీ స్థాయిలో నిర్వహించడంతో అధిక సంఖ్యలో బంధు మిత్రులు, భక్తులు హాజరయ్యారు. దీంతో గ్రామాలు సందడిగా మారాయి. తెల్లవార జాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసాయి. అమ్మవారి ప్రతిరూపంగా చెక్కతో తీర్చిదిద్దిన బండి ప్రభ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం నిర్వహించిన దేవతామూర్తుల వేషధారణలు, బిందెల డ్యాన్స్, మహిళల కోలాట ప్రదర్శనలు, రాత్రికి నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం బూడి పూజలు గరిశింగి, ముషిడిపల్లిలో పరదేశి అమ్మవారిని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు దర్శించుకుని పూజలు చేశారు. ఆయా గ్రామాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు తీర్థ, ప్రసాదాలను అందజేశారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి వెంట జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, డాక్టర్ వరదపురెడ్డి సింహాచలం నాయుడు, వైఎస్సార్సీపీ మాడుగుల బీసీ సెల్ అధ్యక్షుడు ఆదిరెడ్డి త్రినాఽథస్వామి, సీనియర్ నాయకులు చింతల సత్య వెంకటరమణ, వరదపురెడ్డి లలితానాయుడు, గూడెపు రాము, గూడెపు మోహన్, గూడెపు అప్పారావు, ముషిడిపల్లిలో లెక్కల తాతబాబు, బొడ్డు నారాయణమూర్తి, బొడ్డు పెద అప్పారావు తదితరులున్నారు. దేవరాపల్లిలో... మండల కేంద్రం దేవరాపల్లి రెల్లి వీధిలో పోలమాంబ అమ్మవారి పండగ మంగళవారం ఘనంగా జరిగింది. స్థానికులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు వరదపురెడ్డి చంద్రరావు, గంగవంశం సంతోష్, వరదపురెడ్డి అప్పలనాయుడు, కొరుప్రోలు శ్రీను, పాచిల వెంకటరావు తదితర్లు పాల్గొన్నారు. శంభువానిపాలెంలో పరదేశమ్మ అమ్మవారి ఒడ్డు పండగ మంగళవారం ఘనంగా జరిగింది. వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, రాత్రి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.ముషిడిపల్లిలో 30 ఏళ్లు, గరిశింగిలో 18 ఏళ్ల తర్వాత భారీ ఎత్తున నిర్వహణ -
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
బుచ్చెయ్యపేట: మండలంలో గల పీపీ ఆగ్రహారం శివారు గొర్లెపాలెం గ్రామానికి చెందిన యువకుడు వెలుగుల ప్రసాద్(24) బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం సాయంత్రం గ్రామం నుంచి వెళ్లి పోయి అనకాపల్లి ఏఎంఏఎల్ కాలేజీ వద్ద ట్రైన్ క్రింద పడి మృతి చెందాడు. ఇతని మృతికి గల కారణాలు తెలియడం లేదు. గ్రామానికి చెందిన వెలుగుల సత్తిబాబు, మాణిక్యంలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవశాయం చేసుకుని జీవిస్తున్న సత్తిబాబు తన కుమార్తెకు వివాహం చేయగా కుమారుడు ప్రసాద్కు వివాహం చేయడానికి చూస్తున్నారు. ఇంటర్ చదివిన ప్రసాద్ ప్రస్తుతం లంకెలపాలెం వద్ద ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. తమ కుమారుడు ఆత్మహత్యకు కారణమేమిటో తల్లిదండ్రులకు అంతుచిక్కడం లేదు. అందివచ్చిన కుమారుడు అకాల మృతితో ప్రసాద్ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. ప్రసాద్ మృతదేహానికి బుధవారం శవ పంచనామా నిర్వహిస్తారని గ్రామస్తులు తెలిపారు. -
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
మహారాణిపేట: స్టీల్ప్లాంట్లో జరిగిన దురదృష్టకర ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులు ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పారు. సెవెన్హి ల్స్ ఆసుపత్రిలో ఉన్న ముగ్గురిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు టెర్మినల్ బెనిఫిట్స్తో పాటు రూ.25 లక్షల పరిహారం, పిల్లలకు ఉచిత విద్య, నివాస సదుపాయం కొనసాగింపు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించే నిర్ణయాలను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఘటనకు గల కారణాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ ఇప్పటికే విచారణ ప్రారంభించిందన్నారు.జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ -
నేడు విశాఖకు మాజీ సీఎం వైఎస్ జగన్
స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం విశాఖకు రానున్నారు. విశాఖ స్టీల్ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్ర గాయాలతో నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో పాటు, ప్రస్తుతం సెవెన్హిల్స్, కిమ్స్ ఐకాన్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్ జగన్ స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే.. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11:20కి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాంనగర్లో గల సెవెన్హిల్స్ ఆసుపత్రికి 11:40కి చేరుకుని, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తిరిగి మధ్యాహ్నం 1:10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1:50కి షీలానగర్లో ఉన్న కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 2:20 గంటలకు ఆసుపత్రి నుంచి బయలుదేరి 2:30కి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని తిరిగి గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రయాణమవుతారు. -
గుమ్మం దాటిన అడుగు.. తిరిగి రాలేదు
అతడికి ఆ రోజు మామూలే అనిపించింది. టిఫిన్ తిన్నాడు. చొక్కా వేసుకున్నాడు. చేతిలో లంచ్బాక్స్ పట్టుకున్నాడు. గుమ్మం దాటుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు..భార్య అక్కడే నిలబడి సాగనంపింది. అది తన చివరి చూపు అవుతుందని అతనికి తెలియదు. లోపలున్న ఆమెకూ తెలియదు. ఆ సాయంత్రం తిరిగి రాని ఆ చూపు, ఇప్పుడు ఆ ఇంటిలో శాశ్వత నిశ్శబ్దమైపోయింది. విశాఖ స్టీల్ప్లాంట్లో మెల్టింగ్ షాప్ అంటే సాధారణ పని స్థలం కాదు. అది 1,600 డిగ్రీల సెల్సియస్ వేడి రాజ్యం. రాయి కరిగి నీరయ్యే వేడి. ఉక్కు లావాలా ప్రవహించే వేడి. ఆ నిప్పుల కొలిమి పైన వేలాడుతున్న లాడెల్ క్రేన్ సోమవారం సాయంత్రం ఒక్కసారిగా తెగిపడింది. కరిగిన ఉక్కు వెల్లువలా ముంచెత్తింది. మిగతా కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తారు. కానీ ఆ ఎనిమిది మంది మాత్రం తప్పించుకోలేకపోయారు. వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా ముద్దలైపోయాయి. ఆ రాత్రి, ఆ ఎనిమిది ఇళ్లలో దీపాలు వెలిగాయి..కానీ వెలుతురు రాలేదు. గుమ్మం వైపే చూస్తూ నిద్రపోయిన పిల్లలు ఒక ఇంట్లో పిల్లలు అమ్మను అడిగారు..‘నాన్న ఎప్పుడొస్తారు?’ ‘రాత్రికి వస్తారు’ అని ఆమె చెప్పింది. గుమ్మం వైపు చూస్తూ చూస్తూ వాళ్లు నిద్రపోయారు. తెల్లవారింది. నాన్న రాలేదు. ఆ పిల్లలకు ఇంకా అర్థం కాలేదు..నాన్న ఇక ఎప్పటికీ రారని. మరో ఇంట్లో ముసలి తల్లి కొడుకు కోసం అన్నం వడ్డించి కూర్చుంది. అన్నం చల్లారిపోయింది. ఆమె ఆశలూ ఆవిరైపోయాయి. వీళ్లేం సరిహద్దుల్లో తుపాకులు పట్టలేదు. ప్రాణాంతక వ్యాధితో పోరాడలేదు. కేవలం పొట్టకూటి కోసం పనికి వెళ్లారు. కానీ వారు నమ్ముకున్న పని స్థలం వారికి రక్షణ ఇవ్వలేకపోయింది. అరిగిపోయిన క్రేన్లు. కాలం చెల్లిన సాంకేతికత. లాభాల కోసం ప్రాణాలను పణంగా పెట్టే నిర్ణయాలు. ఎందుకంటే ప్లాంట్ ఆపితే ప్రొడక్షన్ ఆగుతుంది, లాభాలు తగ్గుతాయి, పై అధికారులు ప్రశ్నిస్తారు. ఆ కార్పొరేట్ భయాల మధ్య ఎనిమిది మంది నిరపరాధుల ప్రాణాలు బూడిదయ్యాయి. మూడేళ్లుగా పోరాడుతూనే నడిపిన ప్లాంట్ విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పటి నుంచి కార్మికులు దాదాపు మూడేళ్లుగా పోరాడుతున్నారు. వేతన కోతలు, వీఆర్ఎస్ పేరుతో సిబ్బంది తగ్గింపు, ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నా..‘కన్నతల్లిలాంటి’ ఈ ప్లాంట్ను గుండెల్లో పెట్టుకుని నడిపించారు. అదే ప్లాంట్లో ఇప్పుడు అడుగుపెట్టాలంటే భయంగా ఉందని కార్మికులే చెప్తున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం తర్వాత మంగళవారం ప్లాంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆవేదన గాలిలో తేలింది. ఒకే దశాబ్దంలో మూడు విషాదాలు విశాఖను ఒకే దశాబ్దంలో మూడు పెద్ద విషాదాలు వెంటాడాయి. ఎల్జీ పాలిమర్స్, హెచ్పీసీఎల్, ఇప్పుడు స్టీల్ప్లాంట్. ప్రతిసారీ ఒకే డ్రామా పునరావృతమవుతుంది. ప్రమాదం జరుగుతుంది, విచారణ కమిటీలు వేస్తారు, నివేదికలు వస్తాయి, కేసులు పెడతారు. కొన్ని నెలల తర్వాత అంతా మర్చిపోతారు. కానీ సర్వం కోల్పోయిన ఆ కుటుంబాలు ఎలా మర్చిపోతాయి? అంకెలుగా మిగిలిపోకూడదు రేపు వీరి పేర్లు పేపర్లలో వస్తాయి. టీవీల్లో చర్చలు జరుగుతాయి. రెండు రోజుల తర్వాత ప్రభుత్వ రికార్డుల్లో కేవలం అంకెలుగా మిగిలిపోతారు. న్యాయం అంటే కొన్ని లక్షల పరిహారం విసిరేయడం కాదు. వ్యవస్థ మారాలి. పరిశ్రమల్లో లాభాల కంటే కార్మికుల ప్రాణాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. పని కోసం ఇల్లు దాటిన ప్రతి మనిషి, క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవడం వారి హక్కు. ఆ హక్కును కాపాడడం వ్యవస్థ బాధ్యత. రేపు మరో తల్లి కన్నీరు కార్చకుండా ఉండటమే.. వీరికి ఇచ్చే నిజమైన నివాళి. – సాక్షి, విశాఖపట్నం -
ప్రమాద తీవ్రతకు శిథిల సాక్ష్యాలుగా..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్ ఎస్ఎంఎస్–2 విభాగంలో సంభవించిన ఘోర ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్న అంతర్గత దృశ్యాలివి. లాడిల్ పేలి అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ద్రవరూప ఉక్కు ఒక్కసారిగా ఉప్పొంగి పడటంతో ప్లాంట్ లోపలి క్యాబిన్ల అద్దాలు, ఇనుప రేకులు పూర్తిగా ఛిన్నాభిన్నమయ్యాయి. పేలుడు ధాటికి భారీ కేబుళ్లు సైతం కాలిపోయి వేలాడుతుండగా, పరిసరాల్లోని యంత్రాలు, ఫ్యాన్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న యాజమాన్య ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, హెల్మెట్లు ధరించిన రక్షణ సిబ్బంది ధ్వంసమైన యంత్రాలను, కాలిపోయిన భాగాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్లాంట్ అంతటా దట్టమైన బూడిద, కాలిపోయిన అవశేషాలు పేరుకుపోయి భీతావహ వాతావరణాన్ని తలపిస్తోంది. -
వీఆర్ఎస్ ఇచ్చి ఉంటే ఇలా జరిగేదా?
స్టీల్ప్లాంట్ పరిస్థితి దృష్ట్యా గతేడాది నా తండ్రి వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారులు తిరస్కరించారు. 1991 నుంచి స్టీల్ప్లాంట్ సెంట్రల్ మెకానిక్ మెయింట్నెన్స్లో పనిచేసిన నా తండ్రిని, ఏడాది కిందటే ఆ విభాగం నుంచి ఎస్ఎమ్ఎస్–2కి బదిలీ చేశారు. ఎటువంటి శిక్షణ ఇవ్వకుండా, కనీస భద్రతా ప్రమాణాలు లేనిచోటుకి పంపించారు. కుటుంబానికి దికై ్కన తండ్రిని కోల్పోయిన తాము ఇప్పుడు ఏమైపోవాలి. అమ్మ సూర్యకుమారి గృహిణి. చెల్లి దీపిక ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. వారిని సముదాయించడం నా వల్ల కావడం లేదు. – హనీష్, మృతుడు కృష్ణ కుమారుడు -
స్టీల్ప్లాంట్ క్షతగాత్రులను పరామర్శ
గాజువాక/అక్కిరెడ్డిపాలెం : స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన, చికిత్స ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుందని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అలాగే కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా క్షతగాత్రులను పరామర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, ఎంపీ భరత్, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
మంత్రి లోకేష్ వ్యాఖ్యలు అహంకారపూరితం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మహారాణిపేట: స్టీల్ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన సమయంలో కార్మిక సంఘాల నాయకులపై మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్రంగా ఖండించారు. మంగళవారం కేజీహెచ్లో మృతుల కుటుంబాలను వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్లతో కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో 6 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించి, పని భారాన్ని రెట్టింపు చేయడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ప్రమాదానికి గత ప్రభుత్వానికి ముడిపెడుతూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. నాడు సీఎం వైఎస్ జగన్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి, ప్రధానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. కేంద్రంతో మాట్లాడి ప్రైవేటీకరణను ఆపలేని కూటమి నాయకులు తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే కార్మిక సంఘాలపై, వైఎస్ జగన్పై ఫ్రస్ట్రేషన్తో విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రమాదంపై సమగ్ర విచారణ జరగాలి
గాజువాక : స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణ నిర్వహించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఉక్కు ప్రమాద మృతులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండేళ్లుగా వీఆర్ఎస్, రిటైర్మెంట్వాళ్లతో కలుపుకొని సుమారు 9,500 మంది కార్మికులను తొలగించారన్నారు. ఉన్న కార్మికులపై విపరీతమైన ఒత్తిడి పెంచారని, ఉత్పత్తి ఆధారితంగా జీతాలు చెల్లిస్తామని షరతు పెట్టారని అన్నారు. దీనివల్ల కార్మికులపై అదనపు భారం పడిందన్నారు. మొన్నటివరకు పది మంది చేయాల్సిన పనిని ఇప్పుడు ముగ్గురు చేస్తున్నారన్నారు. కార్మికులపై అంత భారం పడినప్పుడు వారికి కల్పించాల్సిన భద్రతా ప్రమాణాలపై యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. భద్రతా ప్రమాణాలు తీసుకోకపోవడమే కాక, సీనియర్ ఉద్యోగులను బలవంతంగా వీఆర్ఎస్ పెట్టించేసి, ఉన్నవాళ్లపై ఒత్తిడి పెంచారన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు యాజమాన్యం ఆ బాధ్యత కూడా తీసుకోకుండా ఈరోజు ఇంతమంది కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణమైందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు కనీసం కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇవ్వడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన
10న కలెక్టర్ ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ రౌండు టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ లోయటౌన్(పాడేరు రూరల్): రాష్ట్రంలో అవినీతి, అరాచకపాలన సాగుతోందని, ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు సోమవారం నల్లబెలూన్లు ఎగురవేశారు. ఈ సందర్భంగా అరకులోయ టీటీడీ కల్యాణమండపంలో నిర్వహించి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చి, అర్హులైన అభ్యర్థులను మోసం చేశారని ధ్వజమెత్తారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హులతో ఆడుకున్నారని ఆరోపించారు. డీఎస్సీలో అక్రమలకు బాధ్యతవహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదవికి రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. భవిషత్లో డీఎస్సీ అభ్యర్థుల పోరాటలకు వైఎస్సార్ సీపీ మద్దతు సంపుర్ణంగా ఉంటుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్లపాలనలో ఎన్నో అరాచకాలను చూశామని, వైద్యం, విద్యా ఇలా అన్ని రంగాలు అక్రమా లకు నిలయాలుగా మారాయన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు మరణిస్తున్నా, ఆస్పత్రుల్లో రోగు లతో పాటు శిశువులు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుకూడా ఉండడం లేదన్నారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు కుట్రపన్నుతున్నాయని చెప్పారు. ఆదివాసీ చట్టాలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం అక్రమంగా హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి యత్నిస్తోందని ఆరోపించారు. పీసా కమిటీ తీర్మానం లేకుండా ప్రాజెక్టుల ఏర్పాటు, మైనింగ్ తవ్వకాలకు అక్రమంగా అనుమతులు జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయే లక్ష్యం : స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీకోసం పనిచేసిన వారికే సముచితస్థానం లభిస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో ని మండల అధ్యక్షులతో పాటు ఎంపీపీ,జెడ్పీటీసీ స భ్యులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయ కులు సమష్టిగా పనిచేయాలని సూచించారు. త్వరితగతిన సభ్యత్వాలు పూర్తి : నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వాల నమోదును త్వరితగతిన పూరిత చేయాలనిఎమ్మెల్యే సూచించారు. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధిలో భాగంగా ఇన్సూరెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ప్రతి కార్యకర్త ఆన్లైన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేలా చూడాలని, నూరు శాతం గుర్తింపు కార్డులు జారీ చేయాలని చెప్పారు. జగనన్న ప్రభుత్వ హాయాంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వంచేస్తున్న కుట్రను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య,ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణ్,ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, జెడ్పీటీసీ సభ్యురాలు జానకమ్మ, ఎంపీపీలు ఈశ్వరి,వైఎస్సార్ సీపీ జిల్లా జనరల్ సెక్రెటరీ చిన్నసత్యం, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, ఆరు మండలాల మండల అధ్యక్షులు పరుశురాం,రామూర్తి,సూర్యనారయణ,అనిల్, చిన్నబాబు,పార్టీ సీనియర్ నాయకులు అశోక్,ఆనంద్, నర్సింగరావు, జగన్కుమార్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.ముంచంగిపుట్టు : మండల కేంద్రం ముంచంగిపుట్టులో కలెక్టర్ నిశాంతి ఆధ్వర్యంలో ఈ నెల 10న పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్టు ఎంపీడీవో ధర్మారావు తెలిపారు. మండల ప్రజా పరిషత్ ఆవరణంలోని వెలుగు కార్యాలయం వద్ద ఉదయం 10గంటలకు అర్జీలు స్వీకరించనున్నట్టు చెప్పారు. జిల్లా,మండల స్థాయి అధికారులు పాల్గొంటారని తెలిపారు. మండల ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు. -
వెన్నుపోటు చంద్రబాబుకు కొత్తకాదు
నర్సీపట్నం: వెన్నుపొటు పొడవడం సీఎం చంద్రబాబుకు కొత్తకాదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం, ఓటర్ల జాబితాపై బీఎల్ఏలకు శిక్షణ కార్యక్రమం, పార్టీ విస్త ృతస్థాయి సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్రెడ్డి బీఎల్ఏలు విధులు, బాధ్యతులు గురించి అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి అమర్నాథ్ మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ఆశయాలను నుండి పుట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. వైశ్రాయి హోటల్ నుండి పుట్టింది టీడీపీ అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం బలంగా ఉండడం వల్లనే స్పీకర్ తనయుడు సిహెచ్.విజయ్కు రాజ్యసభ సీటు వచ్చిందన్నారు. కోర్టు తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న పనులను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే గణేష్, ఆయన అనుచరులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఈ అక్రమ కేసులకు భవిష్యత్తులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఓట్లు కోల్పోవడం వల్ల పక్క రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిబెంగాల్లో అధికారం కోల్పోవడంతో పాటు సీఎం అభ్యర్థులు ఓడిపోయారన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని మన పార్టీ సానుభూతిపరుల ఓటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు.ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు పెడితే జిల్లా గెలిచే మొదటి సీటు నర్సీపట్నమే అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాజ్యాంగం అమలైతే..ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. మెడికల్ కాలేజీను ప్రవేటుపరం చేద్దామని కూటమి ప్రభుత్వం పూనుకుంటే మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి హెచ్చరికతో ఎవరు ముందుకు రాలేదన్నారు. మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ లైటరైట్ గిప్టుగా స్పీకర్ తనయుడు విజయ్కు చంద్రబాబు రాజ్యసభ సీటు ఇచ్చారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవగా ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ తప్పుడు కేసులు పెట్టి గణేష్ను స్పీకర్ కుటుంబం ఇబ్బందులకు గురి చేసిందన్నారు. పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, మాజీ ఎంపీ డాక్టర్ బి.సత్యవతి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. స్పీకర్ మూల్యం చెల్లించక తప్పదు: గణేష్అక్రమ కేసులు పెట్టి తనను, తన అనుచరులను ఇబ్బంది పెట్టిన స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోకపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి వైదొలుగుతానని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆవేదన చెందారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్పీకర్ నియోజకవర్గ ప్రజలకు రూ.760 కోట్లు బాకీ ఉన్నారని, ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బు, అధికారం ఉందని విర్రవీగితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 2029లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మీకంటే ఆలోచన శక్తిని భగవంతుడు నాకు ఇస్తాడు. మీరుచేస్తున్న అరాచకాలకు వంతపాడుతున్న మీ పార్టీ నాయకులు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల అధ్యక్షుడు సుర్ల చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు ఏకా శివ, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు వాసు, వెంకటరత్నం, నాగేశ్వరరావు, పాణిశాంతరామ్, ఎంపీపీలు మణికుమారి, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు పాల్గొన్నారు.ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వం మాజీ మంత్రి గుడివాడ అమర్నాఽథ్ -
తరగని సమస్యలు
సాగు భూములు ఖాళీ చేయాలని బెదిరింపులు తుమ్మపాల: అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజా సమస్యలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఒకే సమస్యపై పదే పదే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా శాశ్వత పరిష్కారం కావడం లేదు. ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్కు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వారం సైతం 281 అర్జీలు నమోదు కావడం గమనార్హం. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మందిరంలో కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి, డీఆర్వో వై.సత్యనారాయణరావు అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఏడీ సర్వే, ఇరిగేషన్, బీసీ వెల్ఫేర్, ఏపీఎస్ఆర్టీసీ, డ్వామా, తాగునీరు తదితర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పెండింగ్ అర్జీలు అధికంగా ఉన్న శాఖల అధికారులకు ప్రత్యేక సూచనలు జారీ చేస్తూ, సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వారం మొత్తం – 281 వినతులు రాగా, వాటిలో రెవెన్యూ క్లినిక్ –143, పీజీఆర్ఎస్ –138 నమోదయ్యాన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాశీపురంలో ఏళ్ల తరబడి తీరని మురుగు వ్యధ ఏళ్ల తరబడి తీరని వ్యధగా ఉన్న మురుగు కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ దేవరాపల్లి మండలం కాశీపురం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. స్వచ్ఛభారత్ పేరుతో పంచాయతీకి నిధులు మంజూరవుతున్నా పాత పోస్టాఫీసు సమీపంలో దుర్గంధంగా తయారైన కాలువను కనీసం పట్టించుకోవడం లేదని, అనేకసార్లు అర్జీలు చేసినా బుట్టదాఖలు చేస్తున్నారని, దాదాపు వంద నివాసాల మురుగునీరు దిగువకు పోకుండా నిలిచిపోతుందని, దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడంతో వర్షాలు పడినప్పుడు ఇళ్లలోకి చేరుతుందని, పాలకులు, అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. తాగునీరు లేక అర్జీదారుల విలవిల కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో అర్జీదారుల దాహం తీరేందుకు చుక్కనీరు కూడా దొరకలేదు. రెండు వారాల క్రితం కలెక్టరేట్ బయట ఆర్భాటంగా ప్రారంభించిన మజ్జిగ చలివేంద్రం చుట్టుపు చూపుగానే పెట్టి మూసేశారు. మజ్జిగ లేదు కదా.. కనీసం మంచినీరు కూడా లేకపోవడంతో అర్జీదారులు మండుటెండలో దాహంతో ఇబ్బందులు పడ్డారు. అర్జీలు రాసేందుకు సరైన సౌకర్యాలు లేక అనేక మమంది ఎండలోనే నిల్చోని తమ సమస్యలపై అర్జీలు రాసుకున్నారు. పలువురు వృద్ధులు గంటల తరబడి కలెక్టరేట్ బయటే అధికారుల రాక కోసం నిరీక్షించారు. అధికారులు మాత్రం చుట్టపు చూపుగానే వచ్చి అర్జీలు తీసుకుని వెళ్లిపోవడంతో వారంతా అసహనం వ్యక్తం చేశారు. రావికమతం: ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తూ ఆధారపడి జీవనం సాగిస్తున్న భూములను ఖాళీ చేసి వెళ్లిపోవాలని కొంతమంది రాజకీయ పలుకుబడితో బెదిరిస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని చీమలపాడు పంచాయతీ జెడ్.జోగుంపేట గ్రామానికి చెందిన ఆదివాసీలు కోరుతున్నారు. దీనిపై సోమవారం కలెక్టర్, ఎస్పీలకు వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు. కళ్యాణపులోవ జలాశయం ఎగువన జెడ్.జోగుంపేటలో పదెకరాల భూములను తరతరాలుగా తాము సాగు చేస్తున్నామన్నారు. వాటిని హైదరాబాద్కు చెందిన చుండూరు ఉషారాణి, ఆమె భర్త నాగేఽశ్వరరావు 2025 నుంచి ఖాళీ చేయాలని వివిధ రూపాల్లో ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. వారి నుంచి తమకు రక్షణ కల్పంచి న్యాయం చేయాలని ఆదివాసీలు చీడిపల్లి దేముడమ్మ, రెచుకట్ల లోవమ్మ కోరారు. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె. జనార్దన్ మాట్లాడుతూ ఆదివాసీల భూములను పెత్తందారులు రాజకీయ పలుకుబడితో ఖాళీ చేయాలని బెదిరించడం దారుణమని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. పింఛన్ అడిగితే కేసు నమోదు చేశారు? ‘పింఛన్ సొమ్ము ఇవ్వలేదని గ్రామ సచివాలయంలో అడిగినందుకు నా కుమారుడిపై కేసు నమోదు చేసి వేధిస్తున్నారని, దళిత వృద్ధురాలిలైన నన్ను, నా కుమారుడ్ని తీవ్ర దుర్భాషలాడిన సచివాలయ ఉద్యోగిపైనా కేసు నమోదు చేసి మాకు న్యాయం చేయాలి’ అంటూ పాయకరావుపేటకు చెందిన మారెళ్ల అప్పలనర్స కలెక్టరేట్ బయట ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నెల 1న మా ఇంటి వద్ద పింఛన్ నగదు ఇవ్వలేదు. 2న సచివాలయానికి వెళ్లి అడిగినందుకు ఆగలేరా అంటూ మాపై దురుసుగా ప్రవర్తించారని, పింఛన్ ఇవ్వకపోవడంతో మందులు కొనుక్కోలేకపోయానని, రోజువారి మాత్రలు లేక ఇబ్బంది పడుతున్నానంటూ ఆవేదన వెళ్లబుచ్చింది. నా కుమారుడు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని పోలీసులు సచివాలయ ఉద్యోగి తప్పుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేయడం దారుణమంది. న్యాయం కోసం కలెక్టర్ను కలిసేందుకు వస్తే లోపలికి పంపించడం లేదని వాపోయింది. దివ్యాంగులు, వృద్ధులు కలెక్టర్ను కలిసే అవకాశం లేదని, కింద అధికారులు వస్తారని బయటే ఉంచేశారని ఆవేదన వ్యక్తం చేసింది. -
నిన్నటివరకు సెలవులో.. నేడు మృత్యు ఒడికి..
గాజువాక : వారం రోజుల సెలవు తరువాత విధులకు వచ్చిన ఆ ఉద్యోగి మృత్యు ఒడికి చేరడంతో ఓ కుటుంబం గుండెలవిసేలా రోదిస్తోంది. అగనంపూడి దరి శనివాడకు చెందిన భాను కుమార్కు 2018లో ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల క్రితం వివాహమైంది. మూడు నెలల క్రితం ఒక కుమారుడు పుట్టాడు. ఈ నేపథ్యంలో భానుకుమార్ వారం రోజులపాటు పెటర్నిటీ సెలవు తీసుకున్నాడు. ఆదివారం వరకు సెలవులో ఉన్న అతడు సోమవారం మధ్యాహ్నం బీ షిఫ్ట్కు వచ్చాడు. డ్యూటీకి వచ్చిన రెండున్నర గంటల వ్యవధిలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వాస్తవంగా అతడు సీ షిఫ్ట్కు రావాల్సి ఉంది. కొలీగ్ ఒకరు కోరడంతో తన డ్యూటీని బీ షిఫ్ట్కు మార్చుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతడి మృతి వార్తతో కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. -
స్టీల్ప్లాంట్ దుర్ఘటనతో ఎనిమిది కుటుంబాల్లో తీరని విషాదం
సాక్షి, విశాఖపట్నం/ఉక్కునగరం/అక్కిరెడ్డిపాలెం: ఉద యం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు భార్యతో ‘సాయంత్రం త్వరగా వచ్చేస్తా’ అన్నారో కార్మికుడు.. ‘నాన్న వచ్చేటప్పుడు స్వీట్లు తీసుకురావా’ అని అడిగిన కూతురి తల నిమిరి ముద్దాడి వెళ్లారో తండ్రి.. ‘జాగ్రత్త నాయనా’ అని వెన్నుతట్టిన ముసలి తల్లికి ధైర్యం చెప్పి డ్యూటీకి బయలుదేరాడో కొడుకు.. రక్తాన్ని చెమటగా మార్చి, దేశ ప్రగతికి ఇనుప కవచాన్ని నిర్మించేందుకు ఆ చేతులు విశాఖ ఉక్కు కర్మాగారంలోకి అడుగుపెట్టాయి. కానీ, కాలం ఇంత క్రూరంగా మారుతుందని.. తాము నమ్ముకున్న కర్మాగారమే తమకు అగ్నిసమాధి అవుతుందని ఆ కార్మికులు ఊహించలేకపోయారు. ఒక్కటంటే ఒక్క క్షణం.. కేవలం ఆ ఒక్క క్షణంలో సంభవించిన అగ్నిప్రళయం ఎనిమిది మంది కార్మికులను మాంసపు ముద్దలుగా మార్చేసింది. కళ్లెదుటే ప్రాణాలు కరిగిపోతుంటే, కాపాడుకోలేక మిగిలిన శోకం.. ఉక్కునగరాన్ని కన్నీటి సముద్రంగా మార్చింది. 1600 డిగ్రీల అగ్నిప్రళయం సోమవారం సాయంత్రం 4,15 గంటల సమయం.. ‘బీ’ షిఫ్ట్ విధులు సాఫీగా సాగిపోతున్నాయి. స్టీల్ మెల్ట్ షాప్ (ఎస్ఎంఎస్–1) విభాగంలో, నేలమట్టానికి దాదాపు 9 మీటర్ల ఎత్తున ఉన్న సీసీడీ సెక్షన్ అంతా కార్మికులు, అధికారుల అలికిడితో సందడిగా ఉంది. బ్లాస్ట్ఫర్నేస్లో ఎర్రగా కాగిన హాట్మెటల్ను భారీ లేడిల్లో ఎస్ఎంఎస్కు తరలించి, ద్రవపు ఉక్కుగా మార్చే కీలక ప్రక్రియ జరుగుతోంది. ఉత్పత్తి లక్ష్యాలను అందుకునే క్రమంలో సీసీడీ మిషన్–2 పై లేడల్ను ప్లేస్ చేసి, రొటేట్ చేయడం ప్రారంభించారు. అంతా సజావుగానే ఉందనుకున్న మరుక్షణమే.. ఊహకందని కాలసర్పంలా ఆ ఘోర విస్పోటనం సంభవించింది. ద్రవరూపంలో ఉన్న ఆ నిప్పుల నరకం షాప్ ఫ్లోర్పై సునామీలా దూసుకురావడంతో, చుట్టుపక్కల ఉన్న భారీ యంత్రాలు సైతం మంటల్లో చిక్కుకున్నాయి. క్షణాల వ్యవధిలో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. కనీసం కళ్లు తెరిచి చూడడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి ఎటు పరుగెత్తాలో కూడా తెలియని ఓ నరకప్రాయ వాతావరణం అక్కడ ఏర్పడింది. ఊహకే అందని నరకయాతన! 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరిగే నీరు తగిలితేనే చర్మం ఊడిపోతుంది. అలాంటిది 1600 డిగ్రీల సెల్సియస్ అంటే పటిష్టమైన ఇనుము, రాళ్లు సైతం నీరులా కరిగిపోతాయి. ఈ అగ్ని ద్రవం మనిషి శరీరంపై పడితే.. కనీసం రక్తం కారడానికి, లేదా చర్మం కాలడానికి కూడా సమయం ఉండదు. క్షణాల వ్యవధిలో మాంసము, ఎముకలు సైతం బూడిదగా మారిపోతాయి. ఆ వేడి నుంచి వెలువడే శ్వాస గొంతులోకి వెళ్తే ఊపిరితిత్తులు క్షణంలో మాడిపోతాయి. ప్రమాద స్థలంలో కార్మికులు అనుభవించిన ఆ క్షణ కాల నరకయాతన వర్ణనాతీతం, హృదయవిదారకం. కళ్లెదుటే కరిగిపోయిన మనుషులు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్లు, సహచర కార్మికులకు అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి కన్నీరు ఆగలేదు. నిలువెత్తు మనుషులు క్షణాల వ్యవధిలో బొగ్గు ముద్దలుగా మారిపోయారు. కనీసం వారు ధరించిన దుస్తులు గానీ, ముఖాలు గానీ ఆనవాళ్లు లేకుండా పోయిన స్థితి వర్ణనాతీతం. మరోవైపు శరీరమంతా కాలిన గాయాలతో, ప్రాణ రక్షణ కోసం క్షతగాత్రులు చేసిన ఆర్తనాదాలు ఉక్కునగర వాతావరణాన్ని శోకసంద్రంగా మార్చాయి. వారిని వెంటనే ప్లాంట్ జనరల్ ఆసుపత్రికి, నగరంలోని కిమ్స్, సెవెన్ హిల్స్ ఆసుపత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు ప్లాంట్ మెయిన్ గేట్ వద్దకు, ఆసుపత్రుల వద్దకు పరుగున చేరుకున్నారు. తమ వారు బతికే ఉన్నారో లేదో తెలియక, లోపలికి వెళ్లనివ్వక వారు ఆసుపత్రి కారిడార్లలో గుండెలు పగిలేలా ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని ద్రవింపజేసింది. బతుకులు.. బుగ్గయ్యాయి ఈ ఘోర ప్రమాద బాధితుల్లో మేనేజర్ స్థాయి అధికారి గోల్డ్ కుమార్ నుంచి.. రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారీ కాంట్రాక్ట్ కార్మికుల వరకు ఉన్నారు. నక్క వెంకటరమణ, త్రినాథ్, అప్పలరాజు వంటి కాంట్రాక్ట్ కార్మికుల ఇళ్లల్లో ఈ ప్రమాదం కోలుకోలేని చీకట్లను నింపింది. అరకొర జీతాలు, కనీస భద్రత లేని వాతావరణం.. అయినా సరే, కేవలం కుటుంబ పోషణ కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధుల్లో చేరిన ఆ పేద బతుకులు.. కరిగిన ఉక్కు సముద్రంలో కలిసిపోయాయి. కన్నీరుమున్నీరు ‘నువ్వే పోతే మాకు దిక్కెవరు నాన్నా?‘ అని పిల్లలు, ‘పొద్దునే కదా కళ్లముందు తిరిగావు.. ఇంతలోనే శవమయ్యావా?‘ అంటూ మృతుల భార్యలు ఆసుపత్రి నేలపై పొర్లి ఏడుస్తుంటే.. అక్కడ ఉన్న పోలీసుల కళ్లు సైతం చెమర్చాయి. ఇప్పుడు ఆ అభాగ్య కుటుంబాలను ఆదుకునే నాథుడెవరు? తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారి పిల్లల భవిష్యత్తు ఏంటి? అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. మార్చురీ వద్ద ఉద్రిక్తత పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్కు తరలించాలని అధికారులు ప్రయత్నించగా, క్షతగాత్రుల కుటుంబీకులు, తోటి కార్మికులు అడ్డుకున్నారు. ‘మా వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమేంటో చెప్పాలి.. మాకు ఏం న్యాయం చేస్తారో తేల్చాలి’ అంటూ మార్చురీ ముందే బైఠాయించారు. యాజమాన్యం నిర్లక్ష్యమేనా? ఈ ఘోర దుర్ఘటనపై ఉక్కు కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్లాంట్లో భద్రతా ప్రమా ణాలను తుంగలో తొక్కడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కీలకమైన విభాగాల్లో కాలానుగుణంగా యంత్రాల ఫిట్నెస్ పరీక్షించకపోవడం వల్లే లాడిల్ పేలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించి, మృతుల కుటుంబాలకు భారీ పరిహారంతో పాటు ఇంట్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అమ్మని బాగా చూసుకోరాకంటతడి పెట్టిస్తున్న క్షతగాత్రుడి వీడియో వర్మా.. తమ్ముడి మీద ఎప్పుడూ చిరాకు పడకే.. తమ్ముడిని బాగా చదివించురా...నువ్వు కూడా బాగా చదువుకోమ్మా... అమ్మని బాగా చూసుకోండి...ఉంటాను డాడీ...అంటూ స్టీల్ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పైడిరాజు వీడియో అందర్నీ కన్నీటి సంద్రంలో ముంచేస్తోంది. ఒంటినిండా గాయాలతో చికిత్స పొందుతున్న ఆ బాధితుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో పిల్లలకు జాగ్రత్తలు చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. నవ్వుతూ వెళ్లిన నాన్న నల్లటి ముద్దయ్యాడు నాన్న ఎప్పుడు వస్తారు? అని అడుగుతున్న చిన్నారులు సాయంత్రానికి మార్చురీల వద్ద గుండెలవిసేలా రోదనలు కంట్రోల్ రూమ్ ఏర్పాటుమహారాణిపేట: విశాఖ స్టీల్ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై పూర్తి సమాచారం ప్రజలకు, సంబంధిత సంస్థలకు అందుబాటులో ఉండేలా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు, క్షతగాత్రుల సమాచారం కోసం 0891–2590100, 0891–2590101, 0891–2590102 నంబర్లను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేందుకు గుర్తించిన ఆస్పత్రులకు ప్రత్యేక ఇన్చార్జీలను నియమించినట్లు కూడా వెల్లడించారు. మెడికవర్ హాస్పిటల్ (ఇసుకతోట)– ప్రత్యేక ఉప కలెక్టర్ : 91000 64971, ఎంజీఎం–సెవెన్ హిల్స్ (రాంనగర్)– ఆర్డీవో సంగీత్ మాధుర్ : 98499 03852, కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ , షీలానగర్, గోపాలపట్నం తహసీల్దార్ : 9100064976, స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్, ఉక్కునగరం, గాజువాక తహసీల్దార్ త్రినాథ్: 98499 03843 సరైన నిర్వహణ లేకే..డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని సిఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్, అధ్యక్షుడు కేఎం శ్రీనివాస్ ఒక ప్రకటనలో ఆరోపించారు. కాలం చెల్లిన యంత్రాలు వాడడం, నాసిరకం ముడిసరుకు, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే లాడిల్ పేలి 8 మంది కార్మికులు ప్రా ణాలు కోల్పోయారని మండిపడ్డారు. ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రల్లో భాగంగానే భద్రతను గాలికొదిలేసి, అనుభవం లేని కాంట్రాక్ట్ కార్మికులతో పనులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ దుర్ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
8 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు
కశింకోట: ఒడిశా నుంచి రాజస్థాన్కు మోటారు బైక్పై గంజాయి తరలిస్తున్న ఇద్దర్ని కశింకోట వద్ద సోమ వారం అరెస్టు చేసినట్టు సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. స్థానిక పీఏసీఎస్ సమీపంలో జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడినట్టు తెలిపారు. రాజస్థాన్లోని బిల్వారా జిల్లా రతన్పురా గ్రామానికి చెందిన డ్రైవర్ ఈశ్వర్ గుజ్జర్ (27), అదే జిల్లాకు చెందిన కూలీ మహమ్మద్ సల్మాన్ (30)లను అరెస్టు చేశామన్నారు. రాజస్థాన్ నుంచి అనకాపల్లి వచ్చి పూడిమడక మార్గంలోని వంతెన వద్ద బైక్ను దొంగిలించి ఒడిశా వెళ్లి గంజాయి కొనుగోలు చేసి తరలిస్తుండగా ఎస్ఐలు లక్ష్మణరావు, సతీష్, ఏఎస్ఐ మణికుమారి, సిబ్బంది పట్టుకున్నార న్నారు. దొంగిలించిన బైక్తో పాటు గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా పోలీసులను అభినందించారు. -
ఉపమాక ఆలయ చోరీ కేసులో నిందితులు అరెస్టు
నక్కపల్లి/అనకాపల్లి: ఉపమాక వేంకటేశ్వర స్వా మి ఆలయంలో ఈనెల 3వ తేదీన జరిగిన చోరీకి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తుహిన్సిన్హా విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఆలయంలో భారీ చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈనెల 3వ తేదీ రాత్రి ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి ఉపమాక ఆలయ ప్రాంగణంలోకి వెనుక ప్రాంతం నుంచి ప్రవేశించారన్నారు. ఆస్థాన మండపంలో ఉన్న హుండీని, ఆండాళ్లమ్మవారి సన్నిధిలో ఉన్న హుండీని కట్టర్తో కట్చేసి వాటిలో భక్తులు స్వామివారికి కానుకల రూపంలో సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలతోపాటు, నగదును అపహరించారన్నారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి క్లూస్ టీములను రంగంలోకి దించి విచారణ ప్రారంభించామన్నారు. నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల సీఐల నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసామన్నారు. సీసీ ఫుటేజీ లద్వారా విచారణ వేగవంతం చేసామన్నారు. దీనిలో భాగంగా ఈనెల 7వ తేదీన ఉద్దండపురం బస్టాప్లో ఇద్దరు అనుమానిత వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో ఈ చోరీ చేసింది తామేనని అంగీకరించారన్నారు. నక్కపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన కశిరెడ్డి శ్రీహరి, గంట్యాడ చిన్నలను అరెస్టు చేసామన్నారు. వీరి నుంచి రూ.2.38,078 నగదు, సమారు రూ. 8 లక్షల విలువైన బంగారు కానుకలు (56 గ్రాములు) సుమారు రూ.7.20 లక్షలు విలువైన 2.600 గ్రాముల వెండి ఆభరణాలు స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీటి మొత్తం విలువ రూ.17.68 లక్షలుంటుందని ఎస్పీ చెప్పారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. నగదు ఆభరణాలతోపాటు, నేరానికి ఉపయోగించిన సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీ జరిగిన ఐదురోజుల వ్యవదిలోనే కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేయడంతో పాటు నూరుశాతం చోరీ సొత్తును స్వాధీనం చేసుకోగలిగామన్నారు. ఈ కేసు చేధించడంలో నర్సీపట్నం డీఎప్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు మురళి, రామకృష్ణ, అప్పలనాయుడలతోపాటు, ఎస్ఐలు సన్ని బాబు, సాహెబా అంజుమ్, మహ్మద్ ఆలీ షరీఫ్ ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి వారి కి నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లాలో అన్ని ప్రధాన దేవాలయాల వద్ద భద్రతా చర్యల్ని కట్టుదిట్టం చేయాలని, రాత్రి గస్తీ నిర్వహించాలని ఆదేశించినట్టు ఎస్పీ తెలిపారు. -
ఓటరు జాబితాల నిర్వహణలో బీఎల్ఏలదే కీలక పాత్ర
అనకాపల్లి టౌన్: ఓటరు జాబితాల నిర్వహణలో బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) పాత్ర అత్యంత కీలకమని వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ అన్నారు. పట్టణంలోని న్యూకాలనీ రోటరీ కల్యాణ మండపంలో నియోజకవర్గ పరిధిలోని 251 మంది బీఎల్ఏలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై ప్రత్యేక శిక్షణ కార్య క్రమం నిర్వహించారు. సమన్వయకర్త భరత్కుమా ర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి (కోఆర్డినేషన్) హర్షవర్ధన్రెడ్డి పాల్గొని ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, సవరణ దరఖాస్తుల సమర్పణ విధివిధానాలపై అవగాహన కల్పించారు. నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా బీఎల్ఏ లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పార్టీ నియమించిన ఏజెంట్లు ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేపట్టాలని, పార్టీకి పడే ఏ ఒక్క ఓటూ జాబితా నుంచి తొలగిపోకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో 23 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితాపై సమగ్ర రివిజన్ జరుగుతోందని, ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం ఆమోదించిన ఏవైనా రెండు గుర్తింపు కార్డులు (డాక్యుమెంట్లు) తప్పనిసరిగా ఉండేలా ఓటర్లను నేరుగా కలిసి చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. 100 రోజుల పాటు సాగే ఈ ప్రక్రియలో అధికారులు ఓటర్ల తొలగింపు, సవరణలను పారదర్శకంగా నిర్వహిస్తున్నారో లేదో నిరంతరం గమనించాలన్నారు. ముఖ్యంగా ద్వంద్వ ఓట్ల (డబుల్ ఓట్లు) నమోదుపై తగిన ఆధారాలు సేకరించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎక్కడైనా అర్హులైన వారి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నట్లు గమనిస్తే, వెంటనే ఆ ఓటరు పూర్తి వివరాలను పార్టీ లీగల్ టీమ్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇప్పుడు తయారయ్యే ఓటర్ల జాబితాయే భవిష్యత్తులో వైఎస్సార్సీపీ విజయానికి కీలకం కానుందని, కాబట్టి ప్రతి ఏజెంట్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువులు కూడా సరఫరా చేయలేకపోతోందని జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ విమర్శించారు. దొడ్డిదారిలో ఒక్కో డీఎస్సీ పోస్టును రూ.లక్షలకు అమ్ముకుంటూ అర్హులకు అన్యాయం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా సూపర్ సిక్స్లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రైతులు, జర్నలిస్టులు, మహిళలపై దాడులు, అత్యాచారాలకు సంబంధించిన ఫొటోలను తెరపై ప్రదర్శిస్తూ చంద్రబాబు నిరంకుశ పాలనను సమన్వయకర్త భరత్ కుమార్ ఎండగట్టారు. యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1500 సాయం, అమ్మఒడి, కొత్త పింఛన్లు వంటి ఏ ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. నియోజకవర్గ పరిశీలకులు సతీష్ వర్మ మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ఓట్లను అడ్డదారిలో తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టాలన్నారు. నర్సీపట్నం నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరై నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి మాట్లా డుతూ ప్రతి ఓటూ కీలకమైందని, బూత్ లెవెల్ ఏజెంట్లు ఇళ్లకు వెళ్లినప్పుడు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి ఓటు నమోదుకు అవసరమైన వివరాలను సేకరించాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబా బు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షు డు జాజుల రమేష్, వివిధ వార్డుల ఇంచార్జ్ లు కె.ఎమ్. నాయుడు, బొడ్డేడ శివ, కోరుకొండ రాఘవ, అల్లు త్రినాథ్, బుద్ధ భాస్కర్ రావు, మళ్ల బుల్లిబాబు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
కార్మికులకు వివాహం నుంచి ప్రసూతి వరకు ఆర్థిక సాయం నిర్మాణ కార్మికులకు అండగా సంక్షేమ బోర్డు
సీతంపేట: భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పలు పథకాలను అమలు చేస్తోంది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచే ఈ నూతన సంక్షేమ పథకాల అమలు ప్రక్రియ ప్రారంభమైంది. బోర్డులో నమోదైన 18 నుంచి 60 ఏళ్ల వయస్సు గల అర్హులైన కార్మికులు ఈ లబ్ధిని పొందవచ్చు. వివాహ కానుక, ప్రసూతి సాయం కింద రూ. 20,000 చొప్పున, సహజ మరణ ఉపశమనంగా రూ. 60,000, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ. 20,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. వీటితో పాటు కార్మికులకు ఉచిత భోజనం, స్టైపెండ్తో కూడిన 15 రోజుల వృత్తి నైపుణ్య శిక్షణను కూడా ఇస్తున్నారు. ఆయా పథకాలకు అర్హులైన కార్మికులు తమ ఆధార్, లేబర్ కార్డ్, బ్యాంకు వివరాలతో సమీప కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు. 1. వివాహ కానుక : రూ. 20,000 మహిళా కార్మికురాలి వివాహానికి, కార్మికుడు/కార్మికురాలి ఇద్దరి కుమార్తెల వివాహానికి ఆర్థిక సహాయం. కార్మికుడిగా రిజిష్టర్ అయిన ఏడాది తరువాత ఈ పథకం వర్తిస్తుంది. దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలు భవన నిర్మాణ కార్మికుని / కార్మికురాలు, పెళ్లి కుమార్తె ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, వివాహా ధ్రువీకరణ పత్రం (ఏపీ సేవ పోర్టర్లో పొందినది తప్పని సరిగా ఉండాలి), బ్యాంక్ పాస్ పుస్తకం మొదటి పేజి జిరాక్స్, భవన నిర్మాణ కార్మికుని గుర్తింపు కార్డు , అప్డేట్ రెన్యూవల్ రశీదులు జిరాక్సులు జతపర్చాలి. 2.ప్రసూతి సహాయం : రూ. 20,000 కార్మికుని భార్య , వారి కుమార్తెలకు, మహిళా కార్మికులకు ప్రసూతి ఆర్థిక సహాయం, కార్మికుడు రిజిష్టర్ అయిన ఏడాది తరువాత ఈ పథకం వర్తిస్తుంది. దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలు భవన నిర్మాణ కార్మికుని, ప్రసూతి సహాయం పొందే మహిళ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, కాన్పు సర్టిఫికెట్, జనన ధ్రవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ పుస్తకం మొదటి పేజి జిరాక్స్, భవన నిర్మాణ కార్మికుని గుర్తింపు కార్డు, అప్డేట్ రెన్యూవల్ రశీదుల జిరాక్సు జతపర్చాలి. 3. సహజ మరణ ఉపశమన పథకం: రూ. 60,000 సహజ మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలు మృతి చెందిన వ్యక్తి..నామిని, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, భవన నిర్మాణ కార్మికుని గుర్తింపు కార్డు, ఆప్డేట్ రెన్యూవల్ రశీదులు జిరాక్సు, ఏపీ సేవా పోర్టర్ ద్వారా జారి చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, నామిని బ్యాంక్ పాస్ పుస్తకం మొదటి పేజి జిరాక్స్, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్, రేషన్ కార్డు జిరాక్స్ జతచేయాలి. 4. అంత్యక్రియలకు వ్యయ సహాయ పథకం / మట్టి ఖర్చులకు సహాయం: రూ. 20,000 మరణించిన కార్మికుల అంతిమ సంస్కారాలకు ఆర్థిక సహాయం దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలు మరణించిన వ్యక్తికి సంబంధించిన నామిని ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, భవన నిర్మాణ కార్మికుని గుర్తింపు కార్డు, అప్డేట్ రెన్యూవల్ రశీదులు జిరాక్స్, ఏపీ సేవా పోర్టర్ ద్వారా జారి చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, నామిని బ్యాంక్, పాన్ పుస్తకం మొదటి పేజి జిరాక్స్, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్, రేషన్ కార్డు జిరాక్స్, ఎఫ్వీఆర్, పంచనామా జిరాక్స్ కాపీ (ప్రమాద మరణానికి వర్తిస్తుంది), మెడికల్ సర్టిఫికెట్ (ప్రమాద మరణానికి వర్తిస్తుంది) జతపర్చాల్సి ఉంటుంది. 5. కార్మికులకు వృత్తి నైపుణ్య శిక్షణ రిజిస్టర్ అయిన భవన నిర్మాణ కార్మికులకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు 15 రోజులు శిక్షణ, ఉచిత భోజన సౌకర్యాలతో పాటు రోజుకు రూ. 300 చొప్పున భృతి చెల్లింపు భవన నిర్మాణ కార్మికుడిగా నమోదు చేసుకునేందుకు కావలసిన పత్రాలు కార్మికుడు/ కార్మికురాలు వయస్సు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వారు నమోదుకు అర్హులు. అప్లికేషన్ ఫారం, స్వీయ ధ్రువీకరణ పత్రం, 2 పాస్ పోర్టు సైజు కలర్ ఫొటోలు, కార్మికుని ఆధార్ కార్డు జిరాక్స్,. నామిని, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్, కార్మికుని బ్యాంక్ అకౌంట్ మొదటి పేజి జిరాక్స్, రూ. 110లు చెల్లించిన యూనియన్ బ్యాంక్ చలానా అవసరం. -
‘పెద్ది’లో ఆదివాసీలను కించపరిచే దృశ్యాలు తొలగించాలి
● బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి ● గిరిజన సంఘాల డిమాండ్ పాడేరు: ఇటీవల విడుదలైన పెద్ది చలనచిత్రంలో ఆదివాసీ సమాజాన్ని, గిరిజనులను ఉద్దేశించి అత్యంత హీనంగా, కించపరిచే విధంగా చిత్రీకరించిన దృశ్యాలను, సంభాషణలను తక్షణమే తొలగించాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు మసాడ ఈశ్వరరావు, సీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మోరి మోహన్, ప్రధాన కార్యదర్శి సాగిన వెంకటరావు డిమాండ్ చేశారు. ఆదివారం పాడేరులో వారు విలేకరులతో మాట్లాడారు. సినిమాలో వివాదాస్పద సీన్లను తొలగించడంతో పాటు హీరో, దర్శకుడు, చిత్ర యూనిట్ అంతా గిరిజన సమాజానికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జాతీయ, రాష్ట్ర ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆదివాసీ సమాజం మొత్తాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సినిమాల్లో సమాజంలోని ఒక నిర్దిష్ట జాతిని అత్యంత అవమానకరంగా కించపరచడం, హేళన చేస్తూ మాట్లాడటం చట్టరీత్యా నేరమని వారు స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సినిమా సెన్సార్ బోర్డుకు ఈ వివాదాస్పద దృశ్యాలు ఎందుకు కనిపించలేదని వారు ప్రశ్నించారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఆ సీన్లను తక్షణమే తొలగించాల్సిందేనని వారు పట్టుబట్టారు. -
మన అద్దాల రైలుకు అరుదైన గుర్తింపు
సాక్షి, విశాఖపట్నం: అద్దాల రైలులో అరుదైన పర్యాటక మార్గం.. సరికొత్త మైలురాయిని అందుకుంది. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన నేషనల్ టూరిజం సర్వేలోని ‘ఇండియన్ రూట్స్’ ఎడిటర్స్ ఛాయిస్ విభాగంలో విశాఖ–అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే అత్యుత్తమ పర్యాటక రైలు మార్గంగా అగ్రస్థానంలో నిలిచింది. తూర్పు కనుమల ప్రకృతి సోయగాలు, సొరంగ మార్గాలు, పచ్చని లోయలు, జలపాతాల మధ్య ఆహ్లాదకరంగా సాగే ఈ రైలు ప్రయాణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ అవార్డు దక్కింది. జూన్ 15న గోవాలో జరగనున్న ‘ఇండియా టుడే టూరిజం సమ్మిట్ అండ్ అవార్డ్స్–2026’ కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందించనున్నారు. విశాఖ– అరకు మార్గంలో పర్యాటకుల కోసం మొట్టమొదటి విస్టాడోమ్ (అద్దాల బోగీ) కోచ్ను 2017 ఏప్రిల్ 16న అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు లాంఛనంగా ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి విస్టాడోమ్ కోచ్. ఆ తర్వాత పర్యాటకుల నుంచి వచ్చిన విశేష స్పందన, డిమాండ్ మేరకు ఈ మార్గంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విస్టాడోమ్ కోచ్ల సంఖ్యను పెంచుతూ వచ్చారు. అనంతరం, పూర్తి స్థాయి అత్యాధునిక ఎల్ హెచ్ బి విస్టాడోమ్ కోచ్లతో అప్గ్రేడ్ చేసిన రైలు (విశాఖ–కిరండూల్ ఎక్స్ప్రెస్)ని 2021 నవంబర్ 22న ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ రైలు మార్గానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి ప్రయాణంలో 100 శాతం ఆక్యుపెన్సీతో ఈ రైలు నడుస్తోందని విశాఖపట్నం డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు. దేశంలోనే నం.1 పర్యాటక రైలు మార్గంగా ఎంపిక ఇండియాటుడే అవార్డుల జాబితాలో చోటు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి విస్టాడోమ్ రైలు ప్రారంభం -
వైభవంగా అప్పన్న సహస్ర నామార్చన
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని స్థానిక రామాలయ ప్రాంగణంలో ఆదివారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి సహస్ర నామార్చన పూజ అత్యంత వైభవంగా జరిగింది. సింహాచలంలోని ప్రముఖ ’సింహాద్రి మఠం’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విశేష పూజా కార్యక్రమంలో చుట్టుపక్కల గిరిజన గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల అప్పన్న నామస్మరణలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉత్సవాల కోసం వేదికపై శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి నమూనా విగ్రహాన్ని అందంగా అలంకరించి ప్రతిష్టించారు. సింహాచలం దేవస్థానం విశ్రాంత ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, సింహాద్రి మఠం గురుస్వాములు కశిరెడ్డి సురేంద్రస్వామి, అప్పారావుస్వామిల పర్యవేక్షణలో అర్చక బృందం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు ఉదయం నుంచే భక్తులకు స్వామివారి అనుగ్రహం కలిగేలా వరుసగా ఆశీర్వచనాలను అందజేశారు. పూజలో భాగంగా మొదట విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మండపారాధనలను వైభవంగా జరిపారు. అనంతరం 1001 దివ్య నామాలతో స్వామివారికి భక్తిశ్రద్ధలతో సహస్ర నామార్చన పూర్తి చేసి, విశేష హారతులు సమర్పించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి చిత్రపటాలను, పూజా సామగ్రిని నిర్వాహకులు ఉచితంగా పంపిణీ చేశారు. పూజా కార్యక్రమాలు అనంతరం మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమ విజయవంతానికి మండల పరిధికి చెందిన స్వాములు దొన్నొ, సత్యం, కర్రిబాబు, వెంకటలక్ష్మి, అతీరామ్, సీతారామ్, ఎంపీటీసీ భర్త దామోదరం తదితరులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన గిరిజన భక్తులు ఘనంగా అన్నసమారాధన -
కూటమి రెండేళ్ల పాలనపై నేడు రౌండ్ టేబుల్ సమవేశం
అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం అరకులోయ టౌన్ (పాడేరు రూరల్): కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అరకులోయలోని టీటీడీ కల్యాణ మండపంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న ఆరాచక పాలన, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన అబద్దపు హమీలు, భవిష్యత్తు చర్చిస్తామన్నారు. ఈ సమావేశానికి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు ఆదివాసీ మేధావులు, నిరుద్యోగ, యువతీ యువకులు, పార్టీ శ్రేణులు హాజరు కావాలని ఆయన కోరారు.విరగ్గాసిన పనస కాయలతో పనస చెట్టు గూడెంకొత్తవీధి: ఈఏడాది మన్యంలో పనస దిగుబడి ఆశాజనకంగా ఉంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున చెట్ల నిండా కాయలు కనిపిస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులు కలిసివస్తే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని గిరి రైతులు తెలిపారు. -
హరిత వృద్ధిలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోంది
తగరపువలస: హరిత వృద్ధితో భారత్ అగ్రగామిగా ఎదుగుతోందని మాజీ హై కమిషనర్ బైసాబ్ చరణ్ ప్రధాన్ పేర్కొన్నారు. గంభీరంలోని ఐఐఎంవీ ప్రాంగణంలో ‘ఇంటర్ డిసిప్లీనరీ డెసిషన్ సైన్సెస్ అండ్ అనలిటిక్స్ ల్యాబ్’ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘గ్రీన్ ఎకానమీ’ అంతర్జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన చరణ్ ప్రధాన్ మాట్లాడుతూ అంతర్జాతీయ కూటముల ద్వారా ప్రపంచ వాతావరణ పరిపాలనలో భారత్ నాయకత్వ స్థానానికి చేరుకుంటోందని స్పష్టం చేశారు. అనంతరం ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ పృథ్వితేజ్ ఇమ్మడి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు ప్రొఫెసర్ రవి సమన్వయకర్తగా వ్యవహరించగా కోపెన్హాగన్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ అబిద్ హుస్సేన్, సదరు ల్యాబ్ విభాగాధిపతి శివశంకర్ పటేల్, జమ్ము కాశ్మీర్ లక్ష్మీపత్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ సి.విజయశేఖర్, ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మోనికా సింఘానియా, జీ2వో సోలార్ సీటీఓ వివేక్ వర్థన్, డీన్ కావేరీ కృష్ణన్, మారిశెట్టి విజయభాస్కర్, పీఆర్ శర్మ, అమిత్ శంకర్, నెక్కంటి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
వేటసాగేదెలా?
భరోసా ఎగ్గొట్టారు.. సబ్సిడీ ఆపేశారు.. మహారాణిపేట: వేట నిషేధ కాలం ముగిసి, ఈ నెల 15 నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వారి బతుకులను సంకటంలోకి నెట్టింది. వేట ప్రారంభానికి వారం రోజుల సమయం కూడా లేని ఈ సంధి కాలంలో, బోట్లను నడపడానికి అత్యంత కీలకమైన రాయితీ డీజిల్ ఆయిల్ను ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడం తీర ప్రాంతంలో తీవ్ర ఆందోళన రేపుతోంది. అప్పులు తెచ్చి బోట్లను మరమ్మతులు చేయించుకున్న యజమానులు ఇప్పుడు సబ్సిడీ ఆయిల్ రాక, వేటకు వెళ్లలేక అగమ్యగోచర స్థితిలో పడ్డారు. ప్రస్తుతం డీజిల్ ధర లీటరుకు రూ.104.10 పైసలకు చేరినా, ప్రభుత్వం మాత్రం పాత తొమ్మిది రూపాయల సబ్సిడీనే కొనసాగించడం మత్స్యకారుల నడ్డి విరుస్తోంది. పెరుగుతున్న ధరల దృష్ట్యా డీజిల్ సబ్సిడీని లీటరుకు రూ.25కు పెంచాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఒక ఏడాదికి సంబంధించిన ‘మత్స్యకార భరోసా’ నిధులను ఎగ్గొట్టడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఇంకా ఎంతోమంది అర్హులకు ఈ సాయాన్ని అందకుండా నిలిపివేసింది. ప్రభుత్వ ఆర్థిక సాయం అందక, డీజిల్ కొరతతో ఇప్పటికే నష్టాలతో కునారిల్లుతున్న మత్స్య పరిశ్రమను కూటమి సర్కార్ మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోందని మత్స్యకార వర్గాలు మండిపడుతున్నాయి. అమ్మవారికి పూజలతో వేటకు శ్రీకారం ఈ నేపథ్యంలో ఈనెల 9వ తేదీ మంగళవారం విశాఖ ఫిషింగ్ హార్బర్లో శ్రీశ్రీశ్రీ గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంప్రదాయంగా గంగమ్మ తల్లి ఆశీస్సులతోనే వేట ప్రారంభించే మత్స్యకారులు, జాతర అనంతరం అధికారికంగా సముద్రంలోకి వెళ్లనున్నారు. మత్స్యకారుల ఆందోళన అయితే ప్రస్తుతం సబ్సిడీ డీజిల్ సరఫరాపై స్పష్టత లేకపోవడంతో వేట ప్రారంభానికి ముందు మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో సబ్సిడీ అందకపోతే నిర్వహణ వ్యయం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం మత్స్య పరిశ్రమ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని పేర్కొంటూ చమురు సంస్థలు ఇటీవల కాలంలో పలు మార్లు డీజిల్ ధరలను పెంచాయి. గతంలో లీటరు డీజిల్ ధర రూ.96.22 ఉండగా, ప్రస్తుతం అది రూ.104.10కు చేరుకుంది. ఈ పెరుగుదల మత్స్యకారుల నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా పెంచింది. భారంగా మారిన డీజిల్ ధరలు 32 కి.మీ. మేర తీరప్రాంతం విశాఖ జిల్లా పరిధిలో 32 కిలోమీటర్ల తీరప్రాంతం, 32 మత్స్యకార గ్రామాలు, 15 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 667 మరపడవలు, 3,094 మోటారు పడవలు, 611 సంప్రదాయ ఇంజిన్ లేని తెప్పలు ఉన్నాయి. వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. డీజిల్ సబ్సిడీ పెంచాలి చంద్రబాబు ప్రభుత్వం లీటరు డీజిల్పై రూ.9 సబ్సిడీ అందిస్తోంది. అయితే గతంలో డీజిల్ ధర లీటరుకు రూ.70 ఉన్న సమయంలో కూడా ఇదే స్థాయిలో సబ్సిడీ అందించేవారని మత్స్యకారులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ధరలు రూ.100 దాటినా సబ్సిడీ మొత్తంలో ఎలాంటి పెంపు లేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సబ్సిడీని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా అందని ఆయిల్ సబ్సిడీ మరో వారం రోజుల్లో వేట ప్రారంభం కానున్నప్పటికీ, మత్స్యకారులకు అందాల్సిన డీజిల్ ఆయిల్ సబ్సిడీ ఇంకా విడుదల కాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డుల ద్వారా ప్రతి నెల ఒక్కో బోటుకు 3 వేల లీటర్ల చొప్పున సబ్సిడీ డీజిల్ అందించేవారు. దీంతో బోటు యజమానులకు నెలకు రూ.27 వేల వరకు ఆదా అయ్యేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. మత్స్య పరిశ్రమపై నిర్లక్ష్యం వీడాలి రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. డీజిల్ ధరలు భరించలేని స్థాయిలో పెరిగిపోవడంతో మత్స్యకారులు, బోటు యజమానులు ఎలా బతకాలో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పటికై నా సర్కార్ నిర్లక్ష్యం వీడి, లీటర్ డీజిల్పై రూ.25 సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఆప్కాఫ్ చార్జీలను తక్షణమే రద్దు చేయాలి. మత్స్యకారులను వలసల బాట పట్టించే విధానాలను ఆపాలి. ఈ సమస్యలపై హార్బర్లలోని సాంప్రదాయ మత్స్యకారులు, సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి మత్స్య పరిశ్రమను కాపాడాలి. –జానకిరామ్ వాసుపల్లి, ప్రెసిడెంట్, మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ -
శ్రమదానంతో పాఠశాలకు కంచె ఏర్పాటు
గూడెంకొత్తవీధి: మండల పరిధిలోని రింతాడ పంచాయతీ కడుగుల గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు స్వయంకృషితో స్థానిక ప్రభుత్వ పాఠశాల చుట్టూ రక్షణ కంచెను ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు, బడి సమయాల్లోనూ పశువులు, ఇతర జంతువులు పాఠశాల ఆవరణలోకి వచ్చేవి. అలాగే విద్యార్థులు తరగతులు జరుగుతున్న సమయంలో బయటకు వెళ్లే ప్రమాదం కూడా ఉండేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావించిన గ్రామస్తులంతా ఏకమయ్యారు. అధికారుల నిధుల కోసం ఎదురుచూడకుండా తామే శ్రమదానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా అడవి నుంచి వెదురు బొంగులు, గట్టి కర్రలను సేకరించి తీసుకువచ్చారు. పాఠశాల చుట్టూ పటిష్టమైన కంచెను నిర్మించడంతో పాటు, రాకపోకల నియంత్రణ కోసం ఒక గేటును కూడా ఏర్పాటు చేశారు. గ్రామస్తులు చూపిన ఈ చొరవను, పాఠశాల పట్ల వారికున్న బాధ్యతను పలువురు అభినందిస్తున్నారు.కడుగుల గ్రామస్తుల ఆదర్శం -
కూటమి పాలనలో గిరిజనాభివృద్ధి శూన్యం
● రెవెన్యూ అధికారుల అండతో భూఆక్రమణలు ● మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ధ్వజంపాడేరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల కూటమి పాలనలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఒక్క కొత్త పథకం కూడా రాలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పసుపులేటి బాలరాజు విమర్శించారు. ఆదివారం పాడేరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే జీవో నెంబర్ 3 కోల్పోయి గిరిజన యువత నిరుద్యోగంతో సతమతమవుతుంటే, అల్లూరి జిల్లాను జోన్–2 పరిధిలోకి చేర్చి ఉద్యోగాలు, బదిలీల్లో ప్రభుత్వం మరింత అన్యాయం చేసిందని మండిపడ్డారు. జిల్లాలో స్థానిక కాఫీ, అటవీ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు నెలకొల్పకుండా, గిరిజనులకు నష్టం చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం వందలాది ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా ఇస్తున్నారని ఆరోపించారు. స్థానికులు చిన్న దుకాణాలు పెట్టుకోవడానికి కూడా సెంటు భూమి ఇవ్వడం లేదని నిలదీశారు.జిల్లా వ్యాప్తంగా రెండేళ్లుగా అధికారుల అవినీతి హెచ్చుమీరిందని బాలరాజు ఆరోపించారు. పాడేరు పట్టణంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను నిరోధించే బోర్డులను రాత్రికి రాత్రే తొలగిస్తూ కొంతమంది రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని, అమాయక గిరిజనుల భూములను కాజేస్తున్నారని మండిపడ్డారు. మట్టి, ఇసుక, రాయి తరలింపుల్లో అధికారుల చేతివాటం మితిమీరినా జిల్లా అధికారుల నియంత్రణ కరువైందన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నాయని, ఇటీవల తానే స్వయంగా పాడేరులో రూ.1,400 పెట్టి సిలిండర్ కొనాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాడేరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతున్నా, కొంతమంది జిల్లా అధికారుల ద్వంద్వ వైఖరి వల్ల రోడ్ల విస్తరణ పనులు జరగడం లేదన్నారు. ఒక మాజీ మంత్రిగా అభివృద్ధి పనుల వివరాలు అడిగితే ఇవ్వడానికి కూడా అధికారులు వెనుకాడుతున్నారన్నారు. అధికార యంత్రాంగం, పాలకులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని ఆరోపించారు. గిరిజన సమస్యలపై త్వరలోనే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం అని బాలరాజు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు శరభ సూర్యనారాయణ, నాయకులు పాంగి నాగరాజు, బోధా నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ధారాలమ్మ తల్లిని దర్శించుకున్న అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం
సీలేరు: ధారకొండ ధారాలమ్మ తల్లిని ఆదివారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వ హించిన అనంతరం పసుపు కుంకుమలు ఎమ్మెల్యే సమర్పించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట గూడెంకొత్తవీధి ఎంపీపీ బోయిన కుమారి, వైఎస్సార్సీపీ చింతపల్లి మండలం మాజీ అధ్యక్షుడు మోరి రవి, బీసీ సెల్ నాయకులు బుజ్జి, అరకు నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జి పాంగి విజయ్, వైఎస్సార్సీపీ అరకు నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జి రామ్, గుల్లెల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ సాగేని నాగరాజు, అరకు మండల యువజన విభాగం అధ్యక్షుడు బోయి కిరణ్ కుమార్, తెరవాడ వెంకట్రావు పాల్గొన్నారు. -
వైభవంగా మోదమ్మ ఉత్సవాలు ప్రారంభం
● పాదాల గుడికి తరలివచ్చిన భక్తజనం ● భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఘటాల సమర్పణ సాక్షి, పాడేరు: భక్తుల ఆరాధ్యదైవం శ్రీ మోదకొండమ్మతల్లి ఉత్సవాలు ఆదివారం పలు గ్రామాల్లో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పాడేరు ఘాట్ రోడ్డులోని మోదమ్మ పాదాల గుడి వద్ద మూడేళ్లకు ఒకసారి జరిగే అమ్మవారి జాతరను జన్ని కుటుంబ సభ్యులు, మోదాపల్లి పంచాయతీ గిరిజనులు ఘనంగా ప్రారంభించారు. అమ్మవారి ఉత్సవాల ప్రారంభంతో ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి, ఇంటి పండగను జరుపుకున్నారు. భక్తులు మోదమ్మకు ఘటాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు. పాదాల గుడి ఆవరణతో పాటు పరిసరాల్లోని కాఫీ తోటల్లో భక్తులంతా వంటావార్పులు చేస్తూ సందడి చేశారు. జాతరకు వచ్చిన భక్తులకు జన్ని కుటుంబం ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. పాదాల గుడితో పాటు నక్కలపుట్టు, తుంపాడ, గుత్తులపుట్టు గ్రామాల్లోనూ మోదకొండమ్మతల్లి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, పాదాలు, ఘటాలను గ్రామాల్లో ఊరేగించి, సతకం పట్టు వద్ద ప్రతిష్టించారు. ఆయా గ్రామాల్లో ఈ నెల 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు మోదమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. మంగళవారం జరగబోయే ప్రధాన ఊరేగింపు సంబరాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు, నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నక్కలపుట్టులోని మోదకొండమ్మతల్లి ఆలయాన్ని మాజీమంత్రి బాలరాజు సందర్శించారు. సతకం పట్టు వద్ద కొలువుదీరిన మోదమ్మ ఉత్సవ విగ్రహాలను, పాదాలను ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు శరభ సూర్యనారాయణ, మండల నాయకులు పాంగి నాగరాజు, బోద నారాయణ, పాడేరు వర్తక సంఘం నాయకులు ఉడా త్రినాథ్ పాల్గొన్నారు.నక్కలపుట్టులో ఘటాలను ఊరేగిస్తున్న భక్తులు, ఘటాలను దర్శించుకున్న మాజీ మంత్రి బాలరాజు -
అమ్మవారికి బంగారం ముక్కు పుడక
దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లి ప్రజల ఆరాధ్య దైవం సన్యాసమ్మ అమ్మవారికి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయ దంపతులు కాలిపు అప్పారావు, మణి పావు తులం బంగారంతో తయారీ చేయించిన ముక్కు పుడకను బహుకరించారు. దానిని ఆలయ ధర్మకర్త వరదపురెడ్డి సన్యాసిరావు (లలితానాయుడు)కు అందజేశారు. అప్పారావు,మణి దంపతులను ఆలయ ధర్మకర్త అభినందించి, అమ్మవారి తీర్థ, ప్రసాదాలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరదపురెడ్డి సింహాచలం నాయుడు, వేచలపు అప్పలనాయుడు, కె.వి.రమణ, గుండు రాంబాబు, వరదపురెడ్డి చంద్రరావు, గొర్లి తాతారావు, చొక్కాకుల రమణ, గంగవంశం సంతోష్, కొరుప్రోలు శ్రీను తదితర్లు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2026
అటు ప్రకృతి కన్నెర్ర.. ఇటు వ్యాపారుల దోపిడీతో గిరిజన జీడి రైతులు లబోదిబోమంటున్నారు. గత కొన్ని నెలలుగా కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలకు జీడి పంట తీవ్రంగా దెబ్బతింది. పిక్కలు నాణ్యత కోల్పోవడంతో గత ఐదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ధరలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్గా మారి తక్కువ ధరలకే కొనుగోలు చేస్తూ, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ముంచంగిపుట్టు: గిరిజన ప్రాంతంలో గత కొన్ని నెలలుగా కురిసిన అకాల వర్షాలు జీడి పిక్కల పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వడగండ్ల వానలు, ఈదురు గాలుల కారణంగా జీడి పిందెలు, పిక్కలు చెట్టు నుంచే రాలిపోయాయి. దీనికి తోడు తేమ కారణంగా జీడి పిక్కలు పూర్తిగా నాణ్యత లోపించాయి. ఫలితంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జీడి పిక్కల ధరలు భారీగా పడిపోయాయి. ఈ పరిస్థితిని ప్రైవేట్ వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గత ఏడాది కిలో జీడి పిక్కల ధర రూ. 160 నుంచి రూ. 180 వరకు పలకగా, ఈ ఏడాది ప్రారంభంలోనే రూ. 120కు పడిపోయింది. ప్రస్తుతం వ్యాపారులు రూ. 140 లోపే ధర నిర్ణయిస్తూ గిరిజన రైతుల పొట్ట కొడుతున్నారు. గిరిజన సహకార సంస్థ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులు ఆశించిన మద్దతు ధరతో కొనుగోలు చేయకపోవడంతో గిరిజన జీడి రైతుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. వారపు సంతల్లో సైతం ప్రైవేట్ వ్యాపారుల హవా నడుస్తోంది. తప్పని ఆవేదన ఉద్యానవన శాఖ అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలో సుమారు 18,349 ఎకరాల్లో జీడి తోటలు విస్తరించి ఉన్నాయి. దీని ద్వారా సాధారణంగా 12 వేల టన్నులకు పైగా జీడి దిగుబడి రావాల్సి ఉంది. కానీ, గత రెండు నెలలుగా మన్యంలో కురిసిన విస్తారమైన వర్షాల వల్ల జీడి పిక్కలు అధికంగా నేలపాలయ్యాయి. దీంతో పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, కొంతమంది ప్రైవేట్ వ్యాపారులు సంతల్లో కాకుండా నేరుగా గిరిజన గ్రామాల్లోని రైతుల వద్దకే వెళ్లి జీడి పిక్కలను కొనుగోలు చేస్తున్నారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, పంట చేతికి రాకముందే అడ్వాన్సులు ఇచ్చి, తూకాల్లో సైతం మోసాలకు పాల్పడుతున్నారని రైతులు వాపోతున్నారు. గత ఐదేళ్లలో ఇదే అత్యంత కనిష్ట ధర ప్రతి ఏడాది జీడి పిక్కలకు రూ. 150 నుంచి రూ. 180కు పైగా ధర లభించేది. కానీ, ఈ ఏడాది వ్యాపారులు కేవలం రూ. 110 నుంచి రూ. 140 వరకు మాత్రమే ఇస్తున్నారు. గత ఐదు సంవత్సరాలలో ఇంత తక్కువ ధర ఎప్పుడూ లేదు.. అని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారపు సంతల్లో వ్యాపారులు సిండికేట్గా మారి, తమకు నచ్చిన ధరనే నిర్ణయిస్తూ మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు అకాల వర్షాలతో పంట దెబ్బతిని నష్టపోతే, మరోవైపు వ్యాపారుల సిండికేట్ వల్ల మద్దతు ధర దక్కక గిరిజన రైతులు లబోదిబోమంటున్నారు.వ్యాపారుల దోపిడీతో నష్టం వర్షాల వల్ల జీడి పంటకు భారీ నష్టం వాటిల్లింది. పిక్కలపై నల్లమచ్చలు రావడంతో మార్కెట్లో ధర పూర్తిగా పడిపోయింది. ప్రతి ఏడాది గిరిజన రైతులను ఆర్థికంగా ఆదుకునే ఏకై క పంట జీడి. కానీ ఈ ఏడాది అటు దిగుబడి లేక, ఇటు ధర రాక గిరిజన రైతులు రెండు విధాలా అన్యాయానికి గురవుతున్నారు. వ్యాపారులు సైతం సిండికేట్గా మారి తమకు నచ్చినట్లు ధరలు నిర్ణయిస్తూ, తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. – ఎం.ఎం. శ్రీను, మండల అధ్యక్షుడు, గిరిజన సంఘం, ముంచంగిపుట్టునాణ్యత లోపించి, నల్లమచ్చలు వచ్చాయి ఈ ఏడాది జీడి పంట మేము ఆశించినంత దిగుబడి రాలేదు. దీనికి ముఖ్య కారణం అకాలంగా విస్తరంగా కురిసిన వర్షాలే. వర్షాల వల్ల జీడి పిక్కలు పూర్తిగా నాణ్యత కోల్పోయాయి. పిక్కలపై నల్లమచ్చలు అధికంగా వచ్చాయి. దీనికి తోడు వారపు సంతల్లో జీడి పిక్కల ధర సైతం ఎన్నడూ లేని విధంగా అతి తక్కువగా పలుకుతోంది. వ్యాపారులు చాలా తక్కువ ధరకే కొనుగోలు చేస్తుండటంతో మేము తీవ్రంగా నష్టపోతున్నాం. – వి. రామో, గిరిజన జీడి రైతు, వనుగుపుట్టు, ముంచంగిపుట్టు మండలం అటు ప్రకృతి కన్నెర్ర ఇటు వ్యాపారుల దోపిడీ! అకాల వర్షాలతో నల్లబడిన పిక్కలు ఐదేళ్లలో ఇదే అత్యంత కనిష్ట ధర! సంతల్లో వ్యాపారుల సిండికేట్ తూకాల్లోనూ నిలువు దోపిడీ పట్టించుకోని జీసీసీ -
అగ్నిగుండంలా సీలేరు
సీలేరు: జూన్ మొదటి వారం ముగుస్తున్నా, రుతుపవనాలు సమీపిస్తున్నా మన్యంలో ఎండ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. మే నెల తరహాలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ఉదయం 8 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం సీలేరు పరిసర ప్రాంతాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి తీవ్రమైన ఉక్కపోత, ఎండ దెబ్బకు జనం అల్లాడిపోయారు. ఆదివారం జరిగిన సీలేరు, దారకొండ వారసంతలకు మారుమూల గ్రామాల నుంచి వచ్చిన గిరిజన రైతులు, వ్యాపారులు ఎండ తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గొడుగులు ఆసరాగా చేసుకొని, దుకాణాల వద్ద ప్లాస్టిక్ కవర్లు కట్టుకుని వ్యాపారాలు సాగించారు. ఎండ తట్టుకోలేక చాలామంది శీతల పానీయాల వైపు మొగ్గు చూపారు. సంతలకు కాలినడకన వచ్చిన గిరిజనులు తలకు వస్త్రాలు చుట్టుకుని కనిపించారు. తీవ్రమైన ఎండల కారణంగా మధ్యాహ్నం వేళ జనసంచారం లేకపోవడంతో ఆటోలు, ఇతర వాహనదారులు రోడ్డు పక్కనే వాహనాలు నిలుపుకోవాల్సి వచ్చింది. మన్యంలోని మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నప్పటికీ, సీలేరులో మాత్రం చినుకు పడకపోవడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
అనకాపల్లి: పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక మెయిన్రోడ్డు జీవీఎంసీ కార్యాలయం వద్ద ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్తో నిరసన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని సాకుగా చూపి చమురు ధరలను విపరీతంగా పెంచడం దుర్మార్గమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్పై రూ.8 పెంచడంతో పా టు కమర్షియల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర ను భారీగా పెంచి ప్రజల నడ్డివిరిచారన్నారు. పొదుపు చర్యలు చేపట్టండి, విదేశీ ప్రయాణాలు మానేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టు వినియోగించండి అని చెబుతున్న ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులు విదేశీ పర్యటనలో చార్టెడ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు వాడుతున్నారన్నారు. బయటికి మాత్రం సైకిల్ తొక్కుతూ ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, ఆర్.శంకరరావు, గంటా శ్రీరామ్, గనిశెట్టి సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఆర్.రాము, వి.వి.శ్రీనివాసరావు, జి.దేముడు నాయుడు, ఎం.రాజేష్, కాళ్ల తెల్లయ్యబాబు, కె.సుభాషిణి, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆబోతు రమణకు ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం
దేవరాపల్లి: హెల్ప్ పుల్ హ్యాండ్స్ సామాజిక వారధి స్వచ్ఛందసేవా సంస్థ వ్యవస్థాపకుడు, రైవాడ గ్రామానికి చెందిన ఆబోతు రమణ విజయవాడలో ఆదివారం ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. మాదకద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిర్వహించిన ‘దండి మార్చ్ 2.0’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కోఆర్డినేటర్స్కు అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని విజయవాడలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ సేవా రంగంలో విశిష్ట సేవలను అందిస్తున్న ఆబోతు రమణకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఘనంగా సత్కరించి పురస్కారాలను అందజేశారు. సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న రమణను పలువురు ప్రశంసించారు. రమణ అవార్డులను అందుకోవడం పట్ల హెల్ప్ పుల్ హ్యాండ్స్ సామాజిక వారధి స్వచ్చంధ సేవా సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. -
గుర్తు తెలియని మహిళ మృతి
మర్రిపాలెం: కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఓ గుర్తుతెలియని మహిళ (సుమారు 45 ఏళ్లు) మృతి చెందింది. జ్ఞానాపురం సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ సమీపంలోని ఫుట్పాత్పై ఆమె మృతదేహం ఉన్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. ఆమె అక్కడ భిక్షాటన చేస్తూ జీవించే మహిళగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోబోటిక్ సర్జరీతో మెరుగైన క్యాన్సర్ వైద్యం
ఎన్టీపీసీ సింహాద్రి హెడ్ అయస్కాంత్ జెనా అగనంపూడి(విశాఖ): అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి, పరిశోధనా సంస్థ 12వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ హెడ్ అయస్కాంత జెనా మాట్లాడుతూ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీపీసీ సహకరిస్తుందని తెలిపారు. ఆస్పత్రితో రోబోటిక్ సర్జరీ యూనిట్, 3 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రి డైరెక్టర్ డా. ఉమేష్ మహంతశెట్టి మాట్లాడుతూ 12 ఏళ్లలో క్యాన్సర్ సంరక్షణలో సంస్థ విశేష పురోగతి సాధించిందన్నారు. ఆధునిక వైద్య సాంకేతికత, డయాగ్నస్టిక్ సదుపాయాలతో సమగ్ర చికిత్స అందిస్తున్నామని తెలిపారు. చికిత్సతో పాటు పునరావాసం, మానసిక మద్దతు కూడా సమగ్ర క్యాన్సర్ సంరక్షణలో భాగమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘ప్రేరణ’ పేరుతో క్యాన్సర్ బాధితులు, రోగం నుంచి కోలుకున్న వారు, వైద్యులు, సహాయకులతో ఒక ప్రత్యేక గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది రోగుల్లో మానసిక ధైర్యం పెంపొందించేందుకు నెలవారీ సమావేశాలు నిర్వహిస్తుందని వివరించారు. అలాగే నాల్గవ వార్షిక క్యాన్సర్ కాంగ్రెస్ కూడా నిర్వహించారు. ఇందులో అంతర్జాతీయ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ శైలేష్ వి శ్రీఖండో, వైస్ అడ్మిరల్ ఆర్తి సారిన్ పాల్గొని ఆధునిక క్యాన్సర్ చికిత్స విధానాలు, రోబోటిక్ సర్జరీ, రేడియోథెరపీ వంటి అంశాలపై చర్చించారు. ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి సుమారు 150 మంది వైద్య నిపుణులు, పీజీ విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లు హాజరయ్యారు. -
వీఆర్పీపై సమగ్ర విచారణ జరపాలి
రోలుగుంట : కొమరవోలు అవలో జరుగుతున్న ఉపాధి పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని కూలీలు పది రోజుల క్రితం కలెక్టర్ విజయకృష్ణన్కు, పీడీకి, ఎంపీడీవోకు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవోకు ఫిర్యాదు చేశారు. దీనిలో పనుల కెళుతున్న ఉపాధి కూలీ నుంచి వారానికి రూ.100 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. డబ్బులిచ్చిన వారికి వారానికి ఆరు రోజుల మస్తరు, ప్రభుత్వ ఇస్తున్న కూలీ వేతనం పూర్తిగా మంజూరు చేస్తున్నారని, లేకుంటే మూడు రోజులు, నాలుగు రోజులు మస్తర్లు వేస్తున్నారన్నారు. ఈ ఫిర్యాదుపై కలెక్టర్ ఆదేశించిన విచారణ మేరకు ఈ నెల 4న ఎంపీడీవో వి.ఎస్ నాగేశ్వరరావు, ఏపీవో ఈశ్వరరావు, ఏపీడీ పని ప్రదేశానికి వెళ్లి విచారణ జరిపారు. అయితే విచారణ తీరుపై బాధిత ఉపాధి కూలీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం మళ్లీ అధికారులు పని ప్రదేశానికి ఆలస్యంగా వచ్చి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కొందరు తమ వద్ద వారానికి రూ.100 ఇవ్వాలని, డబ్బులు ఇవ్వకపోతే గ్రూపు మారిపోవాలని వీఆర్పీ మొయ్యా కృష్ణ బెదిరిస్తున్నారని అధికారులకు తెలిపారు. మేట్లు వీఆర్పీకి ఇవ్వడానికి అని చెప్పి వారానికి రూ.100 ఇవ్వాలని తీసుకున్నారని మరికొందరు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కూలీలు పని ప్రదేశం నుంచి వెళ్లిపోవడంతో విచారణ అర్ధంతరంగా నిలిచిపోయింది. దీనిపై ఫిర్యాదుదారులు అఽఽఽధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వీఆర్పీపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, తమకు శ్రమకు తగ్గ వేతనాలు అందించాలని కోరారు. దీనిపై ఎంపీడీవోని సాక్షి సంప్రదించగా విచారణ వేగవంతం చేసి, నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని, మేట్లు, కూలీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.కొమరవోలులో ఉపాధి కూలీల డిమాండ్ -
వడదెబ్బతో వైఎస్సార్సీపీ నాయకుడు ప్రసాదరావు మృతి
చీడికాడ: వడదెబ్బతో చీడికాడకు చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు పరువాడ ప్రసాదరావు(68)శనివారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తన పింఛను దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రసాదరావు సచివాలయానికి పలుమార్లు తిరగడంతో వడదెబ్బ గురైనట్టు చెప్పారు.సాయంత్రం సచివాలయం నుంచి వచ్చి అస్వస్థతకు గురై పడిపోవడంతో సపర్యలు చేశామని చెప్పారు.శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఛాతీలో నొప్పివస్తోందని చెప్పడంతో గ్రామంలోని పీహెచ్సీకి తరలించామన్నారు.అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భార్య నిర్మల తెలిపారు.ప్రసాదరావు భౌతికకాయాన్ని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం,పార్వతీపురం మన్యం జిల్లాల రిజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు సందర్శించి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఆయన వెంట ఎంపీపీ కురచా జయమ్మనారాయణరావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు, వైస్ ఎంపీపీ ధర్మిశెట్టి కొండబాబు, సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు,చీడికాడ గ్రామశాఖ అధ్యక్షుడు పరువాడ మహేష్ తదితరులున్నారు. వీరితోపాటు పలు రాజకీయపార్టీలకు చెందిన నాయకులు నివాళులర్పించారు. -
యలమంచిలి యువకుడికి గిన్నిస్ బుక్లో స్థానం
యలమంచిలి రూరల్: యలమంచిలి కాకివానివీధికి చెందిన కె.జగదీష్ పాల్ ఎలక్ట్రానిక్ కీ బోర్డు వాయించడంలో ప్రతిభ చూపి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం లభించింది.గత ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరిగిన నాన్ స్టాప్ కీ బోర్డ్ ప్లే పోటీల్లో జగదీష్ పాల్ ప్రతిభ చూపి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందాడు. ఈ పోటీల్లో 22 దేశాలకు చెందిన సుమారు 2,000 మంది పాల్గొన్నారు. పోటీల్లో భాగంగా దక్షిణ భారత దేశ శాసీ్త్రయ సంగీత సరళి స్వరాలతో పాటు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ఎలక్ట్రానిక్ కీ బోర్డును గంట సేపు వాయించాడు.ఈ మేరకు జగదీష్ పాల్కు శనివారం పెందుర్తి ఐపీసీ చర్చిలో ధ్రువీకరణపత్రం,మెడల్ అందజేసి అభినందించారు. జగదీష్ పాల్ తండ్రి పీటర్ పట్టణంలో కాకివాని వీధిలో జేసీపీఎఫ్ చర్చి నిర్వహిస్తున్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తత
ప్రజలతో మాట్లాడుతున్న సీఐ శ్రీనివాసరావు కొయ్యూరు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఓటీపీలు, నకిలీ క్యూఆర్ కోడ్ల పట్ల జాగ్రత్త వహించాలని సీఐ బి. శ్రీనివాసరావు సూచించారు. ఆయన ఎస్ఐ కిషోర్వర్మతో కలిసి శనివారం రాత్రి కాకరపాడు వై–జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు సరైన రికార్డులు కలిగి ఉండాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. గూడ్స్ వాహనాలలో ప్రయాణికులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ట్రాఫిక్ నిబంధనలను గౌరవించడంతో పాటు, మహిళల పట్ల ఎవరూ దురుసుగా ప్రవర్తించరాదని, అసభ్యకర పదజాలం వాడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని సీఐ స్పష్టం చేశారు. -
రక్షిత మంచినీటి పథకం పరిశీలన
సంపతిపురం వద్ద సమగ్ర రక్షిత నీటి పథకాన్ని పరిశీలిస్తున్న జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, బృందం కశింకోట: సమగ్ర భారీ రక్షిత మంచినీటి పథకాన్ని శనివారం జెడ్పీ సీఈవో నారాయణమూర్తి పరిశీలించారు. కశింకోటకు సమీపంలో సంపతిపురం వద్ద అధికారుల బృందంతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం ఏలేరు కాలువ నీటిని నిల్వ ఉంచే జలాశయాన్ని పరిశీలించారు. వేసవి సందర్భంగా తాగునీటికి ఇబ్బంది కలగకుండా సమర్థంగా పథకాన్ని నిర్వహించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి సందీప్, ఎంపీడీవో సీహెచ్. చంద్రశేఖర్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాస్, ఏవో ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాల పంపిణీ
ఉపకరణాలను పంపిణీ చేస్తున్న కలెక్టర్ నిశాంతి సాక్షి,పాడేరు: పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచితంగా ఉపకరణాలను కలెక్టర్ నిశాంతి పంపిణీ చేశారు. కలెక్టరేట్లో శనివారం సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పలు సమస్యలతో బాధపడుతున్న జిల్లాలోని 186 మంది ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలతో పాటు ప్రత్యేక సామగ్రి, విద్యాకిట్లు పంపిణీ చేశామన్నారు. దివ్యాంగ విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు వైద్యశిబిరాలను నిర్వహించి, వైద్యులతో క్షుణ్ణంగా పరిశీలన జరిపిన తరువాత వారికి అవసరమయ్యే పరికరాలు, సామగ్రిని పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, గిరిజన సంక్షేమశాఖ డీడీ పరిమళ, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు పాల్గొన్నారు. -
మోదమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
నక్కలపుట్టులో విద్యుత్ దీపాల అలంకరణలో మోదకొండమ్మతల్లి ఆలయం పాడేరు–నక్కలపుట్టు ఆర్అండ్బీ రోడ్డులో విద్యుత్ దీపాల అలంకరణ సాక్షి, పాడేరు: మోదకొండమ్మ తల్లి జన్మస్థలంగా, అమ్మవారి పాదాలు ఉన్న పవిత్ర ప్రాంతంగా భక్తులు విశ్వసించే పాడేరు ఘాట్ రోడ్డులోని పాదాల గుడి వద్ద మోదమ్మ ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలయ నిర్వాహకులైన జన్ని కుటుంబీకులు ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అనవాయితీ. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది కూడా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను మోదాపల్లి ప్రాంతం నుంచి ఆదివారం ఉదయం ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. మంగళవారం అమ్మవారి అనుపోత్సవాన్ని, బుధవారం మధ్యాహ్నం భక్తులకు భారీ అన్నసమారాధనను నిర్వహించనున్నారు. నక్కలపుట్టులో... పాడేరుకు సమీపంలోని కిండంగి పంచాయతీ నక్కలపుట్టులోనూ మోదమ్మ ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రధాన రహదారితో పాటు అమ్మవారి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సతకంపట్టు నుంచి వంతాడపల్లి తోటలలోని మోదమ్మ పాత ఆలయం వరకు, అలాగే పాడేరు రోడ్డులోని కొత్త ఆలయం వరకు ఘటాల ఊరేగించి ఉత్సవాలను ఊరేగిస్తారు. -
ఏపీఎల్ రన్ రణరంగం
విశాఖ స్పోర్ట్స్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఐదో సీజన్కు తెరలేవనుంది. కప్ను కై వసం చేసుకునేందుకు ఏడు జట్లు సిద్ధమవగా..మంగళవారం రాత్రి వైఎస్సార్ స్టేడియం ఫ్లడ్లైట్ల వెలుతురులో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈసారి తొలిసారిగా ఏపీఎల్ మ్యాచ్లను మూడు వేదికల్లో నిర్వహించేందుకు నిర్వాహక కమిటీ ఏర్పాట్లు చేసింది. మూడు వేదికల్లో మ్యాచ్లు లీగ్ దశలో మొదటి ఫేజ్ మ్యాచ్లు విశాఖ వేదికగా ఈ నెల 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక్కడ మొత్తం 11 మ్యాచ్లు నిర్వహిస్తారు. ఆ తర్వాత తొలిసారిగా కడప స్టేడియంలో 9 మ్యాచ్లు, మంగళగిరి స్టేడియంలో 8 మ్యాచ్లు జరగనున్నాయి. మంగళగిరి వేదికగా నాకౌట్ పోటీలు నిర్వహించి, జూన్ 30న ఈ సీజన్కు ముగింపు పలకనున్నారు. రెండో టైటిల్ ఎవరిదో? ఏపీఎల్లో ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లలోనూ ప్రతిసారీ కొత్త జట్టు విజేత నిలిచింది. కోస్టల్ రైడర్స్ మాత్రమే రెండుసార్లు ఫైనల్కు చేరి, 2022లో విజేతగా నిలిచింది. 2023లో రాయలసీమ కింగ్స్, 2024లో వైజాగ్ వారియర్స్ చాంపియన్లగా నిలవగా.. ప్రస్తుతం తుంగభద్ర వారియర్స్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది. గత సీజన్లో వైజాగ్ వారియర్స్ను విజేతగా నిలిపిన స్థానిక స్టార్ క్రికెటర్ కేఎస్ భరత్ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడమే కాకుండా, ఈ సీజన్ ఏపీఎల్కు దూరం కావడం గమనార్హం. రూ.16.25 లక్షలతో శశికాంత్ టాప్: గత సీజన్లలో అశ్విన్ హెబ్బర్, హనుమ విహారి, నితీష్ కుమార్ రెడ్డి, అవినాష్లు అత్యధిక ధరకు అమ్ముడుపోగా.. ప్రస్తుత సీజన్లో స్థానిక ఆటగాడు కేవీ శశికాంత్ను రూ.16.25 లక్షల భారీ మొత్తానికి డిఫెండింగ్ చాంపియన్ తుంగభద్ర వారియర్స్ దక్కించుకుంది. గత సీజన్లలో గిరినాథ్, హేమంత్, అశ్విన్, హనుమ విహారి ‘మోస్ట్ వేల్యుబుల్ ప్లేయర్స్’గా నిలిచారు. గత సీజన్ రికార్డులు గత సీజన్లో అభినవ్ 269 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హనుమ విహారి, అశ్విన్ హెబ్బర్, మహీప్ కుమార్, రషీద్ (ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నందున అందుబాటులో లేడు) తర్వాత స్థానాల్లో నిలిచారు. సిక్సర్ల విషయానికొస్తే అశ్విన్ అత్యధికంగా 25 సిక్సర్లు, రోహిత్ 20 సిక్సర్లు బాదారు. బౌలింగ్లో సత్యనారాయణ, శశికాంత్లు చెరో 14 వికెట్లతో రాణించారు. ఈసారి వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్, ఉత్తరాంధ్ర లయన్స్, బెజవాడ టైగర్స్ వంటి 7 ఫ్రాంచైజీల మధ్య జరగబోయే ఈ పోరులో ఎవరు అత్యధిక పరుగులు, వికెట్లు సాధిస్తారో చూడాలి. -
మహిళను వేధించిన రౌడీ షీటర్కు రిమాండ్
అచ్యుతాపురం రూరల్: సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు పెట్టి మహిళను కించపరిచిన రౌడీ షీటర్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టు సీఐ చంద్రశేఖరరావు శనివారం తెలిపారు. పూడిమడక గ్రామానికి చెందిన ఎరిపల్లి కాసులు (కిరణ్) అదే గ్రామానికి చెందిన మహిళను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు పెట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, యలమంచిలి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం రిమాండ్ విధించడంతో కేంద్ర కారాగారానికి తరలించినట్టు సీఐ చెప్పారు. కిరణ్పై గతంలో రాంబిల్లి, కశింకోట, అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లలో 10 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. అచ్యుతాపురం పోలీసుస్టేషన్లో కిరణ్పై రౌడీ షీట్ నమోదైంది. అనంతరం అచ్యుతాపురం సీఐ చంద్రశేఖరరావు పూడిమడక సచివాలయంలో గ్రామస్తులతో మాట్లాడుతూ మహిళలను, ఇతర వ్యక్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘పెద్ది’లో గిరిజనులకు అవమానం
సాక్షి, పాడేరు : పెద్ది సినిమాలో గిరిజనులను కించపరిచే విధంగా ఉన్న ‘కొండ నా...’ అనే డైలాగ్ను వెంటనే తొలగించి దర్శకుడు బుచ్చిబాబు గిరిజనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. శనివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టి.సురేష్కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుల్లిబాబు ఆధ్వర్యంలో పలువురు నేతలు కలెక్టర్ నిశాంతితో పాటు పోలీసు అధికారులను కలిశారు. వారు మాట్లాడుతూ..‘పెద్ది’లో గిరిజనుల మనోభావాలకు భంగం కలిగించేలా డైలాగులు పెట్టడం బాధాకరమన్నారు.ఆ వివాదాస్పద డైలాగ్ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు, పాడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డైలాగ్ను తొలగించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
తాండ్ర సింగారం గిరిలో మధురాహారం
మన్యం మామిడి తాండ్ర భలే రుచికొండ మామిడి పండ్లుమా ఆహార అలవాట్లలో భాగం కొండ ప్రాంతాల్లో లభించే మామిడిపండ్లతో తాండ్రను తయారు చేసుకోవడం మాకు పూర్వం నుంచి వస్తున్న ఆచారం. మా ఆహార అలవాట్లలో ఒక భాగం. పులుపు, తీపి కలగలిసిన ఈ మామిడి తాండ్రను ఈ సీజన్లో మేమంతా ఎంతో ఇష్టంగా తింటాం. ముఖ్యంగా పిల్లలు దీనిని అమితంగా ఇష్టపడతారు. ఏటా లాగే ఈ ఏడాది కూడా మామిడితాండ్రను పోసుకుని, భద్రపరుచుకుంటాం. – తాంగుల గుణావతి, చినలబుడు, అరకులోయ మండలం -
ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్
నర్సీపట్నం: ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ముఠాను నాతవరం పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు బైక్ల చోరీల వివరాలను శనివారం వెల్లడించారు. నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు, సిబ్బంది వెదురుపల్లి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. అదే సమయంలో బైక్పై వస్తున్న ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులను సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించగా వారు పారిపోయేందుకు యత్నించారు. వారిని వెంబడించి పట్టుకుని విచారించగా నాతవరం పరిసర ప్రాంతాల్లో పలు ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసినట్టు అంగీకరించారన్నారు. నిందితులు మాతిరెడ్డి మనోజ్, కిల్లంపల్లి సుబ్రహ్మణ్యం కిరణ్, వంతల కొండలబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేసిన వాహనాలను ఒడిశా ఏజెన్సీ సరిహద్దు ప్రాంతాల్లో విక్రయించి వచ్చిన డబ్బులతో తమ వ్యక్తిగత అవసరాలు, విలాసవంతమైన జీవనానికి అలవాటు పడినట్లు డీఎస్పీ వివరించారు. కొనుగోలు చేసి మైదాన ప్రాంతాలకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.నాలుగు బైక్లు స్వాధీనం -
జాతీయ రహదారిపై 79 కిలోల గంజాయి పట్టివేత
సబ్బవరం: మండలంలోని అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిపై ఉన్న మర్రిపాలెం టోల్ప్లాజా వద్ద గంజాయి తరలిస్తున్న ముఠాను సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 79 కిలోల గంజాయితో పాటు రెండు వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. వివరాలను పరవాడ డీఎస్పీ బి. మోహనరావు, సబ్బవరం సీఐ జి. రామచంద్రరావుతో కలిసి శనివారం సాయంత్రం సబ్బవరం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్. సుదర్శన్, అబీబీ ఖాన్, హుస్సేన్ ఖాన్.. విశాఖ చేరుకుని, అప్పటికే విశాఖ చేరుకున్న మధ్యప్రదేశ్కు చెందిన లఖన్ బేరాగి, కమల్ ప్రజాపత్లతో కలిసి ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లా కుల్బాని ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కులాన్, కలియా అనే వ్యక్తుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి, రెండు వాహనాల్లో మధ్యప్రదేశ్లోని భోపాల్కు తరలించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో సబ్బవరం పోలీసులకు అందిన సమాచారంతో సీఐ జి. రామచంద్రరావు ఆధ్వర్యంలో పోలీసులు మర్రిపాలెం టోల్ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిందితులను అదుపులోకి తీసుకుని, నాలుగు గోనె సంచుల్లో ఉన్న 79 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి రవాణాకు ఉపయోగించిన ఒక టెంపో, ఒక కారును సీజ్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.3.95 లక్షలు కాగా, వాహనాలతో కలిపి మొత్తం ఆస్తుల విలువ రూ.7.75 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ సింహాచలం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఐదుగురు అరెస్టు -
పౌష్టికాహారంతో తల్లీబిడ్డ ఆరోగ్యం
కొయ్యూరు: గర్భిణులు, బాలింతలు బలమైన పౌష్టికాహారం తీసుకుంటేనే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని రాజేంద్రంపాలెం వైద్యాధికారి డాక్టర్ జగదీష్ నాయక్ సూచించారు. ఇందుకోసం రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ద్వారా పిల్లల్లో వచ్చే ఆరోగ్య సమస్యలను, లోపాలను గుర్తించేలా శనివారం అంగన్వాడీ వర్కర్లతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ఆహారపు అలవాట్లు మారాలని, దీనివల్ల పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులను దూరం పెట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో ధూమపానం, మద్యపానం వల్ల వచ్చే అనర్థాలను వివరించారు. అనంతరం సీడీపీవో దేవామణి మాట్లాడుతూ.. ఏఐ సహాయంతో పిల్లల్లో ఉండే శారీరక, మానసిక లోపాలను ఏ విధంగా గుర్తించవచ్చో అంగన్వాడీ కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు, బీపీసీ శేఖర్ పాల్గొన్నారు. -
హెచ్డబ్ల్యూవో రత్నకుమారికి రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు
ఉత్తమ హెచ్డబ్ల్యూవో అవార్డు, సర్టిఫికెట్తో కూడా రత్నకుమారి ముంచంగిపుట్టు: స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల వసతి గృహ నివాస అధికారి కూడా రత్నకుమారికి రాష్ట్ర స్థాయి ఉత్తమ హెచ్డబ్ల్యూవో అవార్డు లభించింది. విజయవాడలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ భార్గవి చేతుల మీదుగా అవార్డు, సర్టిఫికెట్ను అందుకున్నారు. వసతి గృహంలో విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించడం, మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారిని బాధ్యతాయుతంగా చూసుకోవడంలో రత్నకుమారి శ్రద్ధ కనబరిచారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సేకరించిన సానుకూల ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆమెను ఏటీడబ్ల్యూవో స్వర్ణలత, తోటి హెచ్డబ్ల్యూ వోలు, ఉపాధ్యాయులు అభినందించారు. -
గ్రామీణ ఆరోగ్య సేవల్లో ఆశా కార్యకర్తల పాత్ర కీలకం
ఢిల్లీ ఎయిమ్స్ బృందం ప్రశంసలుజి.మాడుగుల: గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఆశా కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని న్యూఢిల్లీకి చెందిన ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) బృంద సభ్యులు దిలీప్ కుమార్, విద్యాసాగర్ తెలిపారు. మండలంలోని గడుతూరు పంచాయతీలో శుక్రవారం ‘విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్’ సమావేశం నిర్వహించారు. ఎయిమ్స్ ఆధ్వర్యంలో, ఈక్విప్ వైఎస్ కసుమ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న ఆరోగ్య సమస్యలు, పారిశుధ్యం, పోషకాహార లోపాలపై సమగ్రంగా చర్చించి, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. వ్యాధుల ముందస్తు గుర్తింపు.. : మలేరియా, డెంగ్యూ, క్షయ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి బాధితులకు సకాలంలో వైద్యం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎయిమ్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా శిశు, మాతృ మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు సూచించారు. తీవ్రమైన మరియు మధ్యస్థ పోషకాహార లోపాలతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి, వారిని వెంటనే పోషకాహార పునరుద్ధరణ కేంద్రాలకు తరలించాలని తెలిపారు. ఆశా కార్యకర్తలకు ప్రత్యేక అవగాహన కల్పించి, ప్రతిరోజూ గ్రామ సందర్శనలు నిర్వహించేలా చూడాలని ఎయిమ్స్ బృందం సూచించింది. గ్రామీణ ప్రజల్లో ఆరోగ్య అవగాహన, పరిశుభ్రత, పోషకాహారంపై చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అచ్చంనాయుడు, ఎయిమ్స్ ప్రతినిధులు దిలీప్ కుమార్, విద్యాసాగర్, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పేరినాయుడు, హెల్త్ అసిస్టెంట్ బాలయ్యదొర, ఏఎన్ఎం శాంతికుమారి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యం
సాక్షి,పాడేరు: రానున్న స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయడంతో పాటు ప్రతి పంచాయతీలోను వైఎస్సార్సీపీ జెండాలు ఎగరాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని 26పంచాయతీల నేతలతో తన క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా అన్ని పంచాయతీల్లోను వైఎస్సార్సీపీ విజయం కోసం కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలోను గడప గడపకు తిరిగి కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో మోసాలను గిరిజనులకు సమగ్రంగా వివరించాలన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమాన్ని కూడా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఓటర్ల వెరిఫికేషన్పై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎండగట్టాలన్నారు. అర్హులందరికీ ఓటు హక్కు ఉండే విధంగా బూల్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యమన్నారు. వైఎస్సార్సీపీ ఐడీ కార్డుల వెరిఫికేషన్ను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ నెల 12న పాడేరులో వైఎస్సార్సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీని విజయవంతం చేయాలన్నారు.ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబుతో పాటు అన్ని పంచాయతీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు 107 వినతులు
వినతులు స్వీకరిస్తున్న జేసీ తిరుమణి శ్రీపూజ సాక్షి,పాడేరు: స్థానిక ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పలు గ్రామాల ప్రజల నుంచి 107 వినతులను స్వీకరించారు. తాగునీరు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు గిరిజనులు తమ వ్యక్తిగత సమస్యలు పరిష్కరించాలని జేసీని కోరారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు వచ్చిన వినతులను పరిశీలించి ఆయా వినతులను సకాలంలో పరిష్కరించాలని అన్నిశాఖల అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై మరింత సమాచారం, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రజలు 1100 కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డీడీ పరిమళ, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆశా కార్యకర్తలుగా గుర్తించండి
సాక్షి, పాడేరు: గ్రామాల్లో తోటి గిరిజనులకు వైద్య సేవలు అందిస్తూ అహర్నిశలూ శ్రమిస్తున్న తమను ఆశా కార్యకర్తలుగా గుర్తించి, వేతనాలు పెంచాలని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమానికి సీఐటీయూ నాయకులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లా డుతూ.. గత పదేళ్లుగా జిల్లాలో 700 మంది సీహెచ్డబ్ల్యూలు తీవ్ర వెట్టిచాకిరికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా కార్యకర్తలతో సమానంగా అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ, సీహెచ్డబ్ల్యూలకు కేవలం రూ.4 వేల అరకొర వేతనం మాత్రమే చెల్లించడం దారుణమైన అన్యాయమని మండిపడ్డారు. తక్కువ వేతనంతో ఎలా బతకాలి? ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10 వేల వేతనం చెల్లిస్తున్నారని, తమకు కూడా వారితో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీహెచ్డబ్ల్యూలు ఆందోళనలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. గిరిజన ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న వీరి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. ఉద్యమం ఉధృతం చేస్తాం: సీహెచ్డబ్ల్యూల న్యాయసమ్మతమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో సీఐటీ యూ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్రావు, ఆశా కార్యకర్తల సంఘ నాయకులు పద్మ, దాసమ్మ, పార్వతి, ఈశ్వరమ్మ, పెద్ద సంఖ్యలో సీహెచ్డబ్ల్యూలు పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి
చింతపల్లి: గిరిజన రైతాంగం వచ్చే ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలను వినియోగించడం అత్యంత కీలకమని స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ డాక్టర్ అప్పలస్వామి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉన్నత పర్వత శ్రేణి గిరిజన మండలాల రైతులతో విత్తన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు 80 శాతానికి పైగా మొలక శాతం కలిగిన విత్తనాలను మాత్రమే సాగుకు వినియోగించాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అధిక ఖర్చుతో కూడిన హైబ్రిడ్ రకాల కంటే.. మధ్యకాలిక, స్వల్పకాలిక పంట రకాలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. స్థానిక సంప్రదాయ రకాలతో అదనపు ఆదాయం మైసూర్ మల్లిక వంటి స్థానిక భూమాతృక విత్తన రకాల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా డాక్టర్ అప్పలస్వామి వివరించారు. ఈ రకాలను వాడటం వల్ల జన్యు వనరుల పరిరక్షణతో పాటు, నాణ్యమైన విత్తనోత్పత్తి, విలువ ఆధారిత మార్కెటింగ్ ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. మాజీ వ్యవసాయ పరిశోధనా స్థానం సలహా మండలి సభ్యుడు పి.దేముడు మాట్లాడుతూ.. ఉన్నత శ్రేణి పర్వత ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయానికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. స్థానికంగా వరి, రాగితో పాటు సంప్రదాయ పంట రకాలను పరిరక్షిస్తూ, మైదాన ప్రాంతాల్లో సేంద్రియ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ను గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధ్రువీకరించిన విత్తనాలే వాడాలి వ్యవసాయ శాఖ ద్వారా ధ్రువీకరించిన విత్తనాలను వాడటం వల్ల మెరుగైన మొలక, ఏకరీతి పంట పెరుగుదల మరియు అధిక ఉత్పాదకత సాధ్యమవుతుందని సీనియర్ శాస్త్రవేత్త కె.బయ్యపురెడ్డి వివరించారు. రైతులకు బీజామృతం తయారీ, విత్తన శుద్ధి, సహజ వ్యవసాయంలో దాని ప్రాముఖ్యతను శాస్త్రవేత్త సందీప్ నాయక్ వివరించారు. బీజామృతం వినియోగం ద్వారా మొలక శాతం మెరుగుపడి, వేర్ల అభివృద్ధి చెందడమే కాకుండా మొక్కల ప్రారంభ పెరుగుదల బలంగా ఉంటుందన్నారు. మండల వ్యవసాయాఽ దికారి మధుసూదన్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ, పరిశోధనా స్థానం సంయుక్తంగా సూచించే శాసీ్త్రయ సాగు పద్ధతులను రైతులు విధిగా పాటించాలని కోరారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు ఉమామహేష్, జోగారావు, బాలహుస్సేన్రెడ్డి, వెంకటేష్, టాటా ట్రస్ట్ టెక్నికల్ ఆఫీసర్ అప్పలరాజు తదితరులు రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం రైతులకు పంటల సాగు సాంకేతికతలపై కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే ఎసరాడ, ఏబులం, దుచ్చరపాలెం గ్రామ రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేశారు. -
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
ప్రజలను ముంచే ప్రభుత్వం డుంబ్రిగుడ: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నయవంచక పాలనకు రెండేళ్లు నిండాయని, ఇది ప్రజా సంక్షేమాన్ని కోరే మంచి ప్రభుత్వం కాదని, ప్రజలను ముంచే ప్రభుత్వమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని మూడు రోడ్ల జంక్షన్లో నిరసన ర్యాలీ, మానవహారం కార్యక్రమాలు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన సభలో ఎమ్మెల్యే మత్స్యలింగం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క మాటను నిలబెట్టుకోకుండా హామీలన్నింటినీ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. యువత, నిరుద్యోగులకు ఘోర అన్యాయం డీఎస్సీ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను సైతం రకరకాల సాకులతో ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించి, నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు నుంచి వారం వారం లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్న ఈ ప్రభుత్వం, పేద ప్రజలకు మాత్రం గోరంత కూడా సంక్షేమ పథకాలు అందించడం లేదని దుయ్యబట్టారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇదే మండలంలో పర్యటించి, అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆ మాట చెప్పి ఏడాది కావస్తున్నా, నేటికీ ఒక్క రోడ్డు కూడా పూర్తిగా నిర్మించని దారుణమైన పరిస్థితిని మనం చూస్తున్నామని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీపీ బాకా ఈశ్వరి, జెడ్పీటీసీ చటారి జానకమ్మ, వైస్ ఎంపీపీ శెట్టి ఆనందరావు, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, మహిళా మండల అధ్యక్షురాలు బంగారు శాంతి, ఉమ్మడి జిల్లాల మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమ్మిడి అశోక్, నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జి పాంగి విజయ్, పార్టీ ఉపాధ్యక్షుడు రాంప్రసాద్, మండల కార్యదర్శులు మఠం శంకర్, రామునాయుడు, లీలారాణి, మహిళా నాయకురాలు బబిత, పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, పార్టీనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కాంప్లెక్స్లో చేతివాటం
● రద్దీనే ఆసరాగా దొంగతనాలు ● మహిళలు, వృద్ధులే ప్రధాన లక్ష్యం ● పెరుగుతున్న నగదు, సెల్ఫోన్ చోరీలు ● గస్తీ పెంచాలని ప్రయాణికుల విజ్ఞప్తి అనకాపల్లి టౌన్: పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మహిళలు, వృద్ధులే లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లను తస్కరిస్తున్నారు. సాధారణ ప్రయాణికుల వలే కలిసిపోయి బస్సు ఎక్కి, దిగే సందర్భంలో ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకించి ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో దొంగలు తమ చేతికి పని చెబుతున్నారు. కాంప్లెక్స్ పరిసరాలలో పోలీసులు కనిపించకపోవడంతో వీరి పని సులువవుతోంది. రూరల్ జిల్లాకు ప్రధాన కేంద్రమైన అనకాపల్లికి ఎక్కువగా చోడవరం, మాడుగుల, బుచ్చెయ్యపేట, నర్సీపట్నం, యలమంచిలి, మునగపాక తదితర మండలాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో ఎక్కువగా పల్లె జనం కావడంతో దొంగలు వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తమ పనిని సులువుగా కానిచ్చేస్తున్నారు. ఇక్కడ కాంప్లెక్స్లో సీసీ కెమెరాలు తగినన్ని లేకపోవడంతో దొంగలు తెలివిగా వస్తువులను అపహరించి తప్పించుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. ● ఈ నెల 3న చోడవరం మండలం జుత్తాడ గ్రామానికి చెందిన ఒక ప్రయాణికురాలు అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో తన తల్లి దగ్గరకు వెళ్లడానికి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్లో రాంబిల్లి బస్సు ఎక్కింది. స్థానిక బైపాస్ దగ్గరకు రాగానే తన బ్యాగ్లో నగదు చూడగా, అందులో రూ.80 వేలు మాయమయ్యాయి. ● జనవరిలో ఇదే ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సు ఎక్కుతున్న వృద్ధురాలి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు తులం బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ● గతేడాది డిసెంబర్లో ఇదే ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికురాలి మెడలో నుంచి నాలుగు తులాల బంగారు వస్తువులను కాజేశారు. పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలి కాంప్లెక్స్లో సివిల్ దుస్తులలో పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలి. కాంప్లెక్స్కు ఎక్కువగా వివిధ గ్రామాల నుంచి ప్రయాణికులు వస్తుంటారు. వారికి అమాయక మాటలు చెప్పి దొంగలు తమ పని కానిచేస్తున్నారు. సీసీ కెమెరాలు ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి. – మద్దాల భాను, అనకాపల్లి సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కాంప్లెక్స్లో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన ఆరు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆర్టీసీ శాఖ ఆధ్వర్యంలో మరో ఐదు ఏర్పాటు చేయడానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఇన్గేట్, యలమంచిలి, చోడవరం బస్సులు ఎక్కే దగ్గర కూడా తగినన్ని కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ప్రయాణికులు అపరిచిత వ్యక్తులతో మాట్లాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – వి. ప్రవీణ, జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ చోరులకు అడ్డాగా మారింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీనే ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సులు ఎక్కి దిగే సమయాల్లో సులువుగా తమ పని కానిచ్చేస్తున్నారు. ఇక్కడ పోలీసుల గస్తీ లేకపోవడం, పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల చోరులు తప్పించుకుంటున్నారు. -
ఊపిరితిత్తుల క్యాన్సర్కు కేజీహెచ్లో క్లినికల్ ట్రయల్స్
● రూ.68 లక్షల విలువైన వైద్యం ఉచితంగా ● ఏడాది పాటు ఇమ్యూనోథెరపీ, పరీక్షలు ● ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా డాక్టర్ శిల్పా మహారాణిపేట: ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న పేద రోగులకు కేజీహెచ్ ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ఊపిరితిత్తుల క్యాన్సర్పై జాతీయ స్థాయిలో జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు కేజీహెచ్ ఎంపికై ంది. ఈ ట్రయల్స్కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా కేజీహెచ్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ కె.శిల్పా వ్యవహరించనున్నారు. రూ.68 లక్షల విలువైన వైద్యం.. ఉచితంగా! ఈ క్లినికల్ ట్రయల్స్ ద్వారా రోగులకు ఎంతో మేలు చేకూరనుందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. 18 నుంచి 65 ఏళ్ల లోపు వయస్సు ఉండి, ఏ దశ (స్టేజ్)లోనైనా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన రోగులకు ఈ ట్రయల్స్ ద్వారా ఏడాది పాటు పూర్తిగా ఉచితంగా వైద్యం అందిస్తారని వెల్లడించారు. సాధారణంగా ఇచ్చే కీమోథెరపితో పాటు, ఎంతో ఖరీదైన ‘ఇమ్యునోథెరపీ’ని కూడా క్లినికల్ ట్రయల్ ద్వారా ఏడాది పాటు ఉచితంగా అందజేయనున్నట్లు వివరించారు. ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్కు ఇంతటి అత్యాధునిక వైద్యం ఉచితంగా లభించడం ఇదే ప్రథమమన్నారు. ఒక్కో సైకిల్కు సుమారు రూ.4 లక్షల విలువ చేసే ఇమ్యునోథెరపీ మందును.. ప్రతి మూడు వారాలకు ఒకసారి చొప్పున, ఏడాదికి మొత్తం 17 సార్లు పూర్తిగా ఉచితంగా ఇస్తామని స్పష్టం చేశారు. బాధితులు సద్వినియోగం చేసుకోవాలి క్యాన్సర్ రోగులకు ఆర్థిక భారం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కేజీహెచ్లో ఉచితంగా అందిస్తున్నామని మెడికల్ ఆంకాలజీ హెచ్వోడీ డాక్టర్ కె.శిల్పా తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులు, వారి కుటుంబ సభ్యులు అధైర్యపడకుండా కేజీహెచ్ ఆంకాలజీ విభాగాన్ని సంప్రదించి, ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
పర్యావరణ పరిరక్షణతోనే భవిత
జిల్లా కలెక్టర్ నిశాంతిసాక్షి,పాడేరు: పర్యావరణ పరిరక్షణతోనే ప్రజల భవిత ఆధారపడి ఉందని కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏపీఆర్ పాఠశాల, వైద్య కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్తో పాటు అధికారులు, విద్యార్థులు పలు రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలితో పాటు పచ్చని పరిసరాలను అందించేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు. మనకు జన్మనిచ్చిన అమ్మపేరుతో ప్రతి ఒక్కరు మొక్కలను నాటి తల్లులపై ప్రేమతో పాటు భూమాతను కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. డీఎఫ్వో ఉమామహేశ్వరి, జానపద కళలు, సృజనాత్మక అకాడమి చైర్మన్ వంపూరి గంగులయ్య, డ్వామా పీడీ విద్యాసాగర్, గిరిజన సంక్షేమ డీడీ పరిమళ, డీపీవో చంద్రశేఖర్, సర్వశిక్ష ఏపీసీ స్వామినాయుడు, గురుకులం ఓఎస్డీ మూర్తి, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీ, డీఎల్పీవో కుమార్, వైద్య కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ చంద్రమోహన్, ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీకుమారి పాల్గొన్నారు. ప్రకృతిని కాపాడుకుందాం.. జేసీ తిరుమణి శ్రీపూజ డుంబ్రిగుడ: మొక్కలు నాటి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందామని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అరకు పైనరీలో శాంతినగర్ వీఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అరకు రేంజ్ డీఎఫ్వో ఉమామహేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ ప్లాస్టిక్ను నిర్మూలించి కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. మానవాళికి లభించిన విలువైన సంపద ఏదైనా ఉందంటే పర్యావరణమేనని.. దానిని భావితరాలకు భద్రంగా అందించాల్సి బాధ్యత మనందరిపై ఉందన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రహిత అడ్డాకుల దొనలను ఆమె పరిశీలించారు. ఈకార్యక్రమంలో అరకు రేంజ్ ఫారెస్ట్ అధికారి బి.కోటేశ్వరరావు, ఫారెస్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పెద్దేరులోకి దూసుకుపోయిన 108 అంబులెన్స్
బుచ్చెయ్యపేట: మండలంలోని వడ్డాది మేజర్ పంచాయతీలో 108 అంబులెన్స్కు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి వడ్డాది నుంచి బుచ్చెయ్యపేట వైపు వెళ్తున్న ఈ వాహనం పెద్దేరు నదిపై డైవర్షన్ రోడ్డులో డౌన్ నుంచి అప్ ఎక్కేటప్పుడు ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి డౌన్లోకి జారుకుంది. ఈ క్రమంలో డ్రైవర్ బ్రేక్ వేసినా పట్టకపోవడంతో దిగువ పెద్దేరు నదిలోకి దూసుకుపోయింది. అంబులెన్స్ సగ భాగం డైవర్షన్ రోడ్డుపైన, సగ భాగం పెద్దేరు నదిలో గాల్లో వేలాడుతూ ఉండిపోయింది. ఆ సమయంలో అంబులెన్స్లో రోగులెవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంబులెన్స్ వెనుక వాహనాలు, పాదచారులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అత్యవసర పరిస్థితిలో రోగులను ఆస్పత్రికి తరలించే 108 అంబులెన్స్కు బ్రేక్లు పట్టకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కండీషన్ లేని 108 వాహనాల వల్ల ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వాపోతున్నారు. తప్పిన ప్రమాదం -
యువకుడిని కాపాడిన లైఫ్గార్డులు
యువకుడిని కాపాడిన పోలీసులు, లైఫ్గార్డులుమహారాణిపేట: కెరటాల ఉధృతికి సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని పోలీసులు, స్విమ్మర్లు కాపాడారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం రాజపురం గ్రామానికి చెందిన ఎం.మణికంఠ మిలటరీ పరీక్షలు రాయడానికి ఇటీవల విశాఖకు వచ్చాడు. శుక్రవారం గోకుల్ పార్క్ వద్ద తీరంలో స్నానం చేస్తుండగా, ఒక్కసారిగా వచ్చిన అలల ఉధృతికి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. గమనించిన కానిస్టేబుల్ భాస్కరరావు, లైఫ్గార్డులు రవివర్మ, కళ్యాణ్ వెంటనే అప్రమత్తమై మణికంఠను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి, అతని తమ్ముడు వరుణ్కు అప్పగించినట్లు మైరెన్ ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. -
అడవుల పెంపకంలో సీడ్ బాల్స్ కీలకం
ముంచంగిపుట్టు: సులభమైన పద్ధతిలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి సీడ్ బాల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ముంచంగిపుట్టు ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎం.మురళీకృష్ణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో గిరిజన రైతులకు, ప్లాంటేషన్ మేసీ్త్రలకు సీడ్ బాల్స్ తయారీపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవు పేడ, కట్టె పొయ్యి బూడిద, సేంద్రియ ఎర్రమట్టి, జీవామృత ద్రావణాలను ఉపయోగించి రైతుల చేత స్వయంగా సీడ్ బాల్స్ను తయారు చేయించారు. ఈ సందర్భంగా రేంజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. సీడ్ బాల్స్ పద్ధతి ద్వారా స్థానిక అటవీ విత్తనాలను నాటడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ముఖ్యంగా జాఫ్రా, నల్లమద్ది, తెల్లమద్ది, చింత, అడ్డ, నేరేడు వంటి వృక్ష జాతుల విత్తనాలను సీడ్ బాల్స్గా మార్చి భూముల్లో వేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఈ పద్ధతి వల్ల విత్తనాలను పక్షులు, కీటకాల బారి నుంచి రక్షించవచ్చన్నారు. ఎటువంటి ప్రత్యేక సంరక్షణ, నీటి సదుపాయం లేకపోయినా.. వర్షం పడగానే ఇవి మొలకెత్తి ఏపుగా వృక్షాలుగా పెరుగుతాయన్నారు. అందువల్ల గిరిజన రైతులంతా ఈ సాంకేతికతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు. అనంతరం పనసపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థినులతో కలిసి ఫారెస్ట్ అధికారులు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి సీహెచ్.నారాయణపడాల్, ఫారెస్ట్ బీట్ అధికారులు వెంకటరాజు, శ్రీను, స్థానిక గిరిజన నాయకులు, రైతులు, ప్లాంటేషన్ మేస్త్రిలు పాల్గొన్నారు. ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణ -
సూపర్ మోసం
పాడేరు అంబేడ్కర్ సెంటర్లో నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, వైఎస్సార్సీపీ నేతలు సాక్షి, పాడేరు: సార్వత్రిక ఎన్నికల ముందు సూపర్ సిక్స్తోపాటు అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు, వాటిని అమలు చేయకుండా పేద ప్రజలను వంచించారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రమైన పాడేరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాత బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి ఈ నిరసన ర్యాలీ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పాడేరు పురవీధులు హోరెత్తాయి. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నేతలు తీవ్రంగా ఖండించారు. అనంతరం, సూపర్ సిక్స్ హామీల కరపత్రాలు, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన బాండ్లను ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మితో కలిసి దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా నిరసనను కొనసాగించారు. చంద్రబాబుది వంచన పాలన సూపర్ సిక్స్తో పాటు ఎన్నో ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, తీరా పీఠం ఎక్కాక ప్రజలకు వంచన పాలన అందించడం దారుణమని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలంతా నోటికి వచ్చినట్టు అడ్డగోలు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఉచిత గ్యాస్, ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, వలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణ.. వంటి అబద్ధపు హామీలతో ప్రజలను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, 2029 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా ఈ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి పాలనలో నరకం: మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు నరకం చూస్తున్నారని వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. అమలుకాని హామీలను ఇచ్చి సీఎం చంద్రబాబు ప్రజలను ఘోరంగా మోసం చేశారని మండిపడ్డారు. ప్రజల కష్టాలను, సమస్యలను పక్కనబెట్టి చంద్రబాబు నిరంకుశంగా పాలిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని ఆమె పేర్కొన్నారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, నియోజకవర్గ ఎస్టీసెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కిల్లో ఉర్వశిరాణి, ఎంపీటీసీ లకే రామకృష్ణపాత్రుడు, మాజీ పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి లకే రామసత్యవతి, యువజన విభాగం అధ్యక్షుడు గల్లెలి లింగమూర్తి, మాజీ సర్పంచ్లు, సీనియర్ నాయకులు వంతాల రాంబాబు, లక్ష్మణరావు, బొంజుబాబు, నాగరాజు, కన్నాపాత్రుడు, కోటిబాబునాయుడు, గంగరాజు, సుదర్శన్, నరేష్, రాజేష్ పాల్గొన్నారు. అబద్ధపు హామీలతో వంచన రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా గుణపాఠం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు కూటమి పాలనకు వ్యతిరేకంగా నిరసన హోరెత్తిన నినాదాలు మేనిఫెస్టో ప్రతుల దహనం ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసనకు విశేష స్పందన -
విద్యుత్షాక్తో పాడి గేదెలు మృతి
నాతవరం: విద్యుత్ వైర్లు తెగిపడడంతో షాక్కు గురై రెండు పాడిగేదెలు మృతిచెందాయి. మండలంలో రాజుపేట అగ్రహం గ్రామానికి చెందిన రెడ్డి నాయుడు శుక్రవారం ఉదయం తన మకాం నుంచి పశువులను మేతకు పొలంలోకి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో విద్యుత్ వైర్లు ఆకస్మాత్తుగా తెగి ముందుగా వెళ్తున్న రెండు పాడి గేదెలపై పడడంతో షాక్కు గురై అవి అక్కడికక్కడే మృతిచెందాయి. కొంత దూరంలో నడుస్తున్న రైతు రెడ్డి నాయుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈచుట్టు పక్కల వారు గమనించి సంఘటన స్థలానికి చేరుకుని రైతు నాయుడుకు ధైర్యం చెప్పడంతో పాటు నాతవరం విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని నేలపై పడి ఉన్న విద్యుత్ వైర్లను తొలగించారు.అందిన సమాచారం మేరకు పశువైద్యాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృతిచెందిన రెండు గేదెలను పరిశీలించారు. వీటి విలువ రూ.2లక్షలుంటుందని అంచనా. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కశింకోట: మండలంలోని ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం... అనకాపల్లి నుంచి తాళ్లపాలెం వైపు వెళుతున్న బైక్ను ఉగ్గినపాలెం వద్ద వెనుకగా వ్యాన్ వచ్చి ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న తాళ్లపాలెం శివారు బంగారయ్యపేటకు చెందిన అందపు నాగదుర్గ (18) తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ నుజ్జు అయింది. విషయం తెలుసుకున్న మిత్రుడు సింగంపల్లి శేఖర్ సంఘటనా స్థలానికి చేరుకొని నాగదుర్గను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.వైద్యులు పరీక్షించి మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు నిర్థారించారు. తల్లి లోవలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్ఐ బి.సతీష్ దర్యాప్తు చేపట్టారని సీఐ తెలిపారు..ప్రమాదానికి కారణమైన వ్యాన్, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. -
సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ఆత్మహత్య
మాడుగుల రూరల్: స్థానిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, టీడీపీ మాడుగల పట్టణ మాజీ అధ్యక్షుడు శ్రీనాధు మధు(52) గురువారం అర్ధరాత్రి మాడుగులలో తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పిప్పలమోడి వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్ట ఆయన బంధువులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ జి. నారాయణరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ చెప్పారు. మధు మృతి పట్ల స్థానిక వ్యాపారులు, రాజకీయనాయకులు, ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. మధుకు భార్య, కుమారై, కుమారుడు ఉన్నారు. -
మెనూ ప్రకారం రుచికరమైన భోజనం
దేవరాపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని మధ్యాహ్న భోజన పథకం జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్, పాయకరావుపేట ఎంఈవో గాంధీ నిర్వాహకులకు సూచించారు. మండలంలోని 53 ప్రభుత్వ పాఠశాలల్లోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఎంఈవో–2 వి. ఉషారాణి ఆధ్వర్యంలో శుక్రవారం ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాణ్యత లోపించకుండా మెనూ ప్రకారం సకాలంలో రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు. భోజనం తయారీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కుక్, హెల్పర్లకు వివరించారు. అనంతరం వంటలను తయారీ చేయించి రుచి చూశారు. కార్యక్రమంలో సీఆర్పీలు రమణ తదితర స్థానిక ఎంఈవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


