Alluri Sitarama Raju
-
అంగన్వాడీ భవనాల పూర్తికి ప్రతిపాదనలు
రావికమతం : జిల్లాలో 9 ప్రాజెక్ట్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న 208 అంగన్వాడీ భవనాలను పూర్తి చేసేందుకు రూ.11 కోట్లు నిధులు మంజురూ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.సూర్యలక్ష్మి తెలిపారు. మంగళవారం స్దానిక ఐసీడీఎస్ కార్యాలయంలో మంగళవారం కిశోర వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కిశోర వికాసంపై రూపొందించిన 18 అంశాలపై బాలికులకు అవగాహన కల్పించారు. తదనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా లో 9 ఐసీడీఎస్ ప్రాజెక్ట్లు పరిధిలో 1908 అంగన్వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయని, వీటిలో నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడీ భవనాలకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించామన్నారు. అలాగే 24 ఖాళీగా ఉన్న సూపర్ వైజర్ పోస్టులు భర్తీ చేయాలని కోరామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆయాలు, కార్యకర్తలకు సంబంధించి 236 మందిని నియమించడానికి నోటిఫికేషన్ విడుదల చేశామని ఆమె తెలిపారు. మే ఒక్కటి నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులలో కిశోర బాలికలకు కిశోర వికాసం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీని ద్వారా కిశోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలు, పోషకాహార ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. దీని కోసం ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో 15 నుంచి 20 మందిని గ్రూపులుగా విభజించి మంగళవారం, శుక్రవారం సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీవో మంగతాయారు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం. రమేష్ పాల్గొన్నారు. -
ఇటుక బట్టీలపై విజిలెన్స్ దాడులు
ఎస్.రాయవరం : మండలంలో ఇటుక బట్టీలపై విజులెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. వమ్మవరం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల యజమానులు అక్రమంగా చెరువు మట్టిని తరలించి ఇటుక తయారికి వినియోగిస్తున్నారని మంగళవారం సాక్షి దినపత్రికలో ‘హోంమంత్రి ఇలాకాలో మట్టి మాఫియా’ అనే శీర్షికన వార్త వెలువడింది. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు స్పందించి వమ్మవరం ఇటుక బట్టీలపై దాడులు నిర్వహించారు. మట్టి నిల్వలను పరిశీలించి కొలతలు తీసుకున్నారు. మట్టి ఎన్ని క్యుబిక్మీటర్లు ఒక్కో బట్టీవద్ద ఉన్నదీ, ఆ యజమాని ఎక్కడ నుంచి మట్టి తరలించారనే వివరాలు నమోదు చేసుకుని కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఈ తనిఖీలల్లో మైన్ ఇన్స్పెక్టర్ సత్యమూర్తి, నర్సీపట్నం ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, సీఎస్డీటీ సూరి స్థానిక వీఆర్ఏలు పాల్గొన్నారు. -
కన్నీట్ సుడులు
రెండేళ్ల కష్టం.. ఎన్నో ఆశలు.. ఒక వైద్య సీటు కోసం జీవితాన్నే పుస్తకాలకే అంకితం చేసిన లక్షలాది విద్యార్థుల కలలను నీట్ రద్దు నిర్ణయం ఒక్కసారిగా ఛిద్రం చేసింది.ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తుండగా.. మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనలోకి నెట్టేసింది.● నీట్ రద్దుతో విద్యార్థుల కన్నీటి పర్యంతం ● ప్రభుత్వ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం ● రెండేళ్ల శ్రమ బుగ్గిపాలేనని ఆవేదన సాక్షి, విశాఖపట్నం/మద్దిలపాలెం : వైద్యుడై సమాజానికి సేవ చేయాలని, తెల్లకోటు వేసుకుని స్టెతస్కోప్తో రోగి నాడి పట్టుకోవాలని.. లక్షలాది మంది విద్యార్థులు రెండేళ్లుగా కంటిమీద కునుకు లేకుండా శ్రమించారు. మే 3వ తేదీన పరీక్ష రాసి బయటకు వచ్చేటప్పుడు, వారి కళ్లలో ఒక రకమైన సంతృప్తి.. ’అమ్మా, నాన్నా.. నేను డాక్టర్ అవుతాను’ అన్న ధీమా. కానీ, ఆ సంతోషం చిటికెలో ఆవిరైపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నీట్ యూజీ 2026 రద్దు నిర్ణయం, లక్షలాది మంది విద్యార్థుల గుండెల్లో గునపమై దిగినట్టయింది. ప్రతిభావంతులు బలి రాజస్థాన్లో వెలుగు చూసిన ’పేపర్ లీక్’ ఉదంతం దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పునాదులను కదిలించింది. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించడం, పరీక్షను రద్దు చేయడం సరైన నిర్ణయమే కావచ్చు. కానీ, అక్రమాలకు పాల్పడిన కొందరు స్వార్థపరుల వల్ల, రాత్రింబవళ్లు కష్టపడి చదివిన లక్షలాది మంది సాధారణ విద్యార్థులు ఇప్పుడు అనిశ్చితిలో పడిపోయారు. ఆగిపోయిన కల.. ఆవిరైన శ్రమ చిన్న చిన్న గదుల్లో బందీలై, పుస్తకాలే ప్రపంచంగా బతికిన విద్యార్థుల ఆవేదన వర్ణనాతీతం. ‘రెండేళ్ల శ్రమ.. వేల గంటల సాధన.. అంతా ఒక్క నిర్ణయంతో బూడిదలో పోసిన పన్నీరైంది. మళ్లీ అదే ఏకాగ్రతతో పుస్తకాలు పట్టగలమా? ఆ ఉత్సాహం మళ్లీ వస్తుందా?’ అని విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లిదండ్రుల పరిస్థితి మరింత దయనీయం. తమ పిల్లల చదువు కోసం రెక్కల కష్టం ధారబోసి, కోచింగ్ సెంటర్లకు రూ.లక్షలు కుమ్మరించిన వారు, ఇప్పుడు తమ బిడ్డల నిరాశను చూసి తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటుండగాం తల్లిదండ్రులు వారిని ఓదార్చలేని పరిస్థితి నెలకొంది. మా తప్పేంటి? నిజాయితీగా చదివి, కష్టపడి పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు మళ్లీ అదే ఒత్తిడిని భరించాల్సి వస్తోంది. ఒకరి అక్రమంం లక్షల మందికి శిక్షగా మారిందనే భావన విద్యార్థుల్లో కనిపిస్తోంది. ‘మళ్లీ చదవాలి.. మళ్లీ ఒత్తిడి భరించాలి.. మళ్లీ పరీక్ష హాల్లో కూర్చోవాలి’.. అనే ఆలోచన వారిని మానసికంగా అలసటకు గురిచేస్తోంది. ఎన్టీఏ భరోసా సరిపోతుందా? రీ–ఎగ్జామ్ కోసం కొత్తగా దరఖాస్తు చేయక్కర్లేదని, ఫీజు కట్టనవసరం లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెబుతోంది. కానీ, విద్యార్థులకు కావాల్సింది ఆర్థిక వెసులుబాటు కాదు, మానసిక స్థైర్యం. ఒకసారి రాసిన పరీక్షను, అది కూడా లీకేజీ మరకల మధ్య మళ్లీ రాయాల్సి రావడం అంటే, ప్రతిభావంతులైన విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే. వ్యవస్థ మారేది ఎప్పుడు? ఒక పేపర్ లీక్.. ఒక రద్దు.. వేలాది మంది విద్యార్థుల కన్నీళ్లు. ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న అక్రమార్కులకు కఠిన శిక్ష పడాల్సిందే. ఈ రద్దు నిర్ణయం వ్యవస్థను ప్రక్షాళన చేస్తుందేమో కానీ, విద్యార్థుల మనసులకు తగిలిన గాయాన్ని మాత్రం అంత సులభంగా మాన్పలేదు. కొత్త షెడ్యూల్ రావచ్చు.. కొత్త హాల్ టికెట్లు జారీ అవ్వొచ్చు.. కానీ, పోగొట్టుకున్న సమయాన్ని, మానసిక ప్రశాంతతను మళ్లీ తెచ్చి ఇచ్చేది ఎవరు? దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి మే నెల 3న జరిగిన నీట్ పరీక్ష లీకేజీతో రద్దు అయినట్టు వార్తల్లో చూశాం. నీట్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలను పోలిన సుమారు 140 ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ సోషల్ మీడియాలో లీకై ందంటే ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో అర్ధమవుతుంది. అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. ఈ పేపర్ లీకేజీ వెనక ఎవరున్నా..వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. – గిరిజారాణి, నీట్ విద్యార్థిని తల్లి -
బస్సు మెకానిజంపై డ్రైవర్లకు అవగాహన
ఆర్టీసీ డ్రైవింగ్స్కూల్ల్లో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న మెకానికల్ ఇంజినీర్ అశ్విని అనకాపల్లి : నిరుద్యోగ యువతీ, యువతులకు ఉద్యోగ ఆవకాశాల్లో భాగంగా ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ) ఆధ్వర్యంలో 13 వ డ్రైవింగ్ స్కూల్ బ్యాచ్కు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ప్రజారవాణాశాఖ అనకాపల్లి డిపో గ్యారేజ్ మెకానికల్ ఇంజినీర్ అశ్విని అన్నారు. మంగళవారం డ్రైవర్లకు బస్సు మెకానిక్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రైవర్లకు బస్సు మెకానిజంపై శిక్షణ, అవగహన కల్పించడం వల్ల వారిలో నైపుణ్యాన్ని వెలికితీయవచ్చన్నారు. కొన్ని సందర్భాల్లో బస్సులు మార్గమధ్యంలో ఆగిపోయినపుడు ఈ శిక్షణ వారికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డ్రైవింగ్ స్కూల్ అసిస్టెంట్ బాపు నాయుడు, డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ జి.వి.రమణ పాల్గొన్నారు. -
లోతుగెడ్డ రేంజ్లో చిరుత సంచారం
● అప్రమత్తంగా ఉండాలి ● డీఆర్వో అప్పారావు సూచన చింతపల్లి: మండలంలోని లోతుగెడ్డ అటవీ రేంజ్ పరిధిలోని బందబయలు, లింగాలగుడి పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతుగెడ్డ డీఆర్వో అప్పారావు సూచించారు. మంగళవారం బందబయలు, లింగాలగుడి గ్రామాల్లో అటవీశాఖ అధికారులు దండోరా వేయించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం లింగాలగుడి గ్రామానికి చెందిన ఓ గిరిజనుడి మేకను చిరుత ఎత్తుకెళ్లిందని, అలాగే మరో గిరిజనుడిపై దాడి చేయబోగా అతను చాకచక్యంగా తప్పించుకున్నాడని తెలిపారు. లింగాలగుడి పరిసరాల్లో చిరుతపులి అడుగుజాడలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిరుత గ్రామాలపై పడి పశువులు, మనుషులపై దాడి చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గిరిజనులు పంట చేలకు, ఊటగెడ్డలకు, అటవీ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లరాదని హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. చిరుతపులి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయే వరకు అటవీశాఖ గాలింపు చర్యలు కొనసాగుతాయని, ప్రజలు సహకరించాలని కోరారు. ఒకవేళ చిరుత పశువులపై దాడి చేస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి బాబూరావు, ఎఫ్బీవోలు నాగరత్నం, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో జనుము విత్తనాలు
అనకాపల్లి: చెరకు, కూరగాయ పంటలకు అవసరం మేరకు నీటి సదుపాయం కల్పించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్చార్జి ఏడీఆర్ టి.శ్రీలత తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్ఏఆర్ఎస్ కార్యాలయంలో శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు, సలహాలు అందించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పంటలను బెట్ట నుంచి కాపాడటానికి పంట వ్యర్థాలతో మల్పింగ్ చేయాలి. ఖరీఫ్కు ముందు పచ్చిరొట్ట పైరు వేసుకోవాలి. వర్షాలు పడగానే విత్తుకోవడానికి వీలుగా విత్తనాలను ముందుగా సేకరించుకోవాలి. పరిశోధన స్థానంలో జనము విత్తనాలు ఎస్యూఐఎన్.037, జేఆర్జే 610 రకాలు కిలో రూ.130 చొప్పున అందుబాటులో ఉన్నాయి. విత్తనాల కోసం రైతులు సంప్రదించాలని సూచించారు. చెరకు మొక్క, కార్శి తోటలలో వరుసల మధ్య అంతర కృషి చేపట్టాలి. చెరకులో కొరడా తెగులు ఆశిస్తే ప్రొపికొనజోల్ 1 మి.లీ లేదా అజోక్సిస్ట్రోబిన్, టెబుకోనజోల్ 1 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పీక పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే క్లొరాంట్రినిలిప్రోల్ 0.3 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఖరీఫ్ పంటగా నువ్వులు వేసుకోవడానికి నేలను తయారు చేసుకుని అధిక దిగుబడినిచ్చే వైఎల్ఎం. 66, 146 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కూరగాయల్లో బొగ్గు కుళ్లు తెగులు ఆశించవచ్చని, నివారణకు లీటరుకు 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ను మొక్కమొదలు చుట్టూ నేల తడిచేలా పోయాలి. మామిడిలో పండు ఈగ నివారణకు 2 మి.లీ మిథైల్ యూజినాల్, 3 గ్రా, కార్బోప్యూరాన్ 3జి గుళికలను లీటరు నీటిలో కలిపిన ద్రావణాన్ని ప్లాస్టిక్ సీపాలో పోసి తోటలో అక్కడక్కడా చెట్ల కొమ్మలకు వేలాడ దీయాలి. ఖాళీ పొలాల్లో వేసవిలోతు దుక్కులు దున్నుకోవాలని ఆమె చెప్పారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు కె.వి.రమణమూర్తి, వి.గౌరీ, ఆర్.సరిత, వి.చంద్రశేఖర్, ఎ.అలివేణి తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం
పాడేరు: జిల్లాలో వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేసి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకునేందుకు కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలోని కొత్త పాడేరు గ్రామంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు నూతనంగా నిర్మించిన నివాస గృహంతో పాటు పార్టీ జిల్లా కార్యాలయాన్ని మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఒకే ప్రాంగణంలో నివాస గృహాన్ని, పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం శుభపరిణామన్నారు. ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటూ మరింత సేవ చేయాలని ఆయన సూచించారు. అనంతరం ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అతిథులను ఘనంగా సన్మానించి, అమ్మవారి చిత్రపటాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ విప్ కరణం ధర్మశ్రీ, అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్, అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు చింతలపూడి వెంకటరామయ్య, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, జీసీసీ మాజీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. అత్యధిక స్థానాలు కై వసంచేసుకునేందుకు కృషి వైఎస్సార్సీపీ శ్రేణులకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపు పాడేరులో పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం -
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సు ప్రవేశ పరీక్షలు ప్రారంభం
పరీక్ష కేంద్రం నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు మాకవరపాలెం : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సు ప్రవేశ పరీక్షలకు 273 మంది విద్యార్థులు హాజరయ్యారు. తామరం అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం నుంచి ఈ ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంజినీరింగ్లో ప్రవేశాలకు ఈ నెల 18 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు ఈ నెల 20 వరకు పరీక్షలు జరుగుతాయని కళాశాల ప్రిన్సిపాల్ మోహన్రావు తెలిపారు. నిత్యం రెండు విడతల్లో జరిగే పరీక్షలకు గంటన్నర ముందుగా కేంద్రానికి హాజరుకావాలన్నారు. మొదటి రోజు 273 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. -
బీసీ వసతిగృహ విద్యార్థినికి
అవార్డు ప్రదానంబీసీ సంక్షేమశాఖ మంత్రి సబిత నుంచి అవార్డు అందుకుంటున్న బీసీ వసతిగృహ విద్యార్థిని రుత్తల దుర్గ నర్సీపట్నం: ఇటీవల విడుదులైన టెన్త్ ఫలితాల్లో 574 మార్కులు సాధించిన బీసీ బాలికల వసతిగృహం విద్యార్థిని రుత్తల దుర్గ మంగళవారం రాష్ట్రస్థాయి అవార్డు అందుకుంది. టెన్త్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎంజేపీ గురుకులాలు, బీసీ వసతిగృహాల విద్యార్థులకు అమరావతిలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సబిత, బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ ఎ.మల్లికార్జున్రావు, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ చేతుల మీదగా విద్యార్థిని దుర్గ అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందుకుంది. దుర్గను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వసతిగృహం వార్డెన్ బి.వెంకటలక్ష్మి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
సుమారు రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత
అనకాపల్లి : ఏజెన్సీ ప్రాంతం నుంచి అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట, జాతీయ రహదారి మీదుగా కారులో తరలిస్తున్న 194 కేజీల గంజాయితో పాటు(వీటి విలువ సుమారుగా రూ.97లక్షలు) కారు, ముగ్గురు వ్యక్తులు, మూడు సెల్ఫోన్లు, ఒక బైక్ స్వాదీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. తమ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంజాయి రవాణాపై జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ, గంజాయి స్మగ్లర్లు ప్రత్యేక మార్గాల్లో రవాణా చేయడం జరుగుతుందని, గత ఏడాది కంటే ఈ ఏడాది గంజాయి(డ్రైయి) రవాణా తగ్గినప్పటికీ హషీష్ అయిల్ పెరిగిందన్నారు. ఈనెల 11న జిల్లాలో బుచ్చియ్యపేట పోలీస్స్టేషన్ పరిధిలో ఈగిల్ టీమ్, స్పెషల్ బ్రాంచ్ పర్యవేక్షణలో అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు బుచ్చియ్యపేట పోలీసులు బంగారుమెట్ట–అనకాపల్లి రోడ్డులోని గొన్నవానిపాలెం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. గంజాయితో వెళుతున్న కారుకు రూట్ మ్యాప్ ద్వారా వెళుతున్న సమయంలో బైక్ను నడుపుతున్న వ్యక్తిని పట్టుకుని ప్రశ్నించగా, వెనుక కారులో 194 కిలోల గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులు పటుబడ్డారని తెలిపారు. చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన గుమ్మాల పేరునాయుడు (గతంలో 6 కేసులు), అల్లూరి జిల్లా పెదబయలు మండలం, గజ్జేడు గ్రామానికి చెందిన మండిపల్లి సత్తిబాబు(గంజాయి సాగుదారు), చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన గొల్లవిల్లి గణేష్(కారు డ్రైవర్)ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందుతుల కోసం గాలిస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ పట్ల జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఎక్కడైనా గంజాయి వినియోగిస్తున్నా, విక్రయిస్తున్నా తక్షణమే 112 లేదా 1972 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. రెండేళ్లలో జిల్లాలో గంజాయి రవాణా గణనీయంగా తగ్గిందని, ఈ ఏడాది ఇప్పటి వరకూ 46 కేసులు నమోదు చేసి, మొత్తం 1,177 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందన్నారు. 7.14 లీటర్ల హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రాసిక్యూషన్ విభాగంతో సమన్వయం ద్వారా ఈ ఏడాది 13 కేసుల్లో 24 మందికి శిక్షలు పడేలా చేశామని, ఇందులో 16 మందికి 10 నుండి 15 ఏళ్ల జైలు శిక్ష పడిందన్నారు. ఎన్డీపీఎస్ కేసుల్లో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేటి వరకూ రూ.1.25 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎం.శ్రావణి, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, కొత్తకోట ఎస్ఐ ఎం.శ్రీనివాస్, బుచ్చయ్యపేట ఎస్ఐ ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు. బుచ్చెయ్యపేట ఎస్ఐకు ఎస్పీ అభినందన బుచ్చెయ్యపేట: స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావును ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం అభినందించారు. బుచ్చెయ్యపేట రోడ్డులో సుమారు రూ.కోటి విలువ గల సుమారు 194 కిలోల గంజాయి, స్మగ్లర్లను చౌకచక్యంగా పట్టుకోవడంతో ఎస్ఐని సత్కరించారు.ఎస్ఐతో పాటు బుచ్చెయ్యపేట పోలీస్స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
వందో రోజు కొనసాగిన దళిత రైతుల దీక్షలు
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పంచదార్ల దళిత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం వందవ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ ఎటువంటి పరిహారం ఇవ్వకుండా దళిత రైతులకు చెందిన డీ పట్టా భూములను లాక్కొనేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు.దళితులు దీక్షలు చేపట్టి వంద రోజులైనా కూటమి నేతలు పట్టనట్టు వ్యవహరించడం శోచనీయమన్నారు.నిరుపేదలైన దళితుల భూముల్ని లాక్కొంటున్న ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వేలాది ఎకరాలకు దోచిపెడుతోందని విమర్శించారు.పంచదార్ల రైతులకోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని తెలిపారు.అనంతరం దీక్ష శిబిరం వద్ద పలువురు దళిత సంఘాలు,విదసం నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐడీ బాబు,జి.దేముడు నాయుడు,చందక రామకృష్ణ,ధోనీ కాసియా,రేబాక రాము,ఎం.డి. రాజు,సూర్య,శివ,ఆర్ కృష్ణ,నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
మిన్నంటిన సంబరం
సాక్షి, పాడేరు: మన్యవాసుల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం అమ్మవారి పుట్టినరోజు వేడుకలను ఆలయ కమిటీ చైర్మన్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఉదయం 6 గంటల నుంచే భక్తుల తాకిడి మొదలైంది. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, శివరత్నం దంపతులు ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ టి. నర్సింగరావు దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేపట్టారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసమారాధన నిర్వహించగా, వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతిదేవి, కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్య, జీసీసీ మాజీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, విశాఖపట్నంకు చెందిన నేతలు గణేష్గౌడ్, పద్మశేఖర్, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రముఖులకు శాలువాలు కప్పి సత్కరించి, అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. వైభవంగా ఊరేగింపు అమ్మవారి ఉత్సవ విగ్రహ ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది. సాయంత్రం ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు దంపతులు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు కలిసి ఉత్సవ విగ్రహానికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని పల్లకీలో కొలువుదీర్చి, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. పాడేరు పురవీధుల్లో సాగిన ఈ ఊరేగింపులో తీన్మార్ వాయిద్యాలు, కేరళ డప్పులు, శక్తి, పులి, రాక్షస వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయవంతంగా వేడుకలు మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు వేడుకల నిర్వహణపై ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ముందుగా ప్రకటించిన విధంగానే మే 10, 11, 12 తేదీల్లో ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేశారు. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, మంగళవారం వాతావరణం అనుకూలించడంతో ఊరేగింపు ప్రశాంతంగా, భారీ భక్తజన సందోహం మధ్య ముగిసింది. పాడేరులో ఘనంగా మోదమ్మ పుట్టినరోజు వేడుకలు పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు తరలివచ్చిన భక్తజనం దర్శించుకున్న ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు సత్తాచాటిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు -
ఎమ్మెల్సీ రవిబాబు దంపతులకు సత్కారం
సాక్షి,పాడేరు: పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు దంపతులను, వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,డాక్టర్ నర్సింగరావు దంపతులు ఘనంగా సన్మానించారు.అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్,అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్,అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి, కరణం ధర్మశ్రీ, వెంకట్రామయ్య, మాజీ జీసీసీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, వడ్డాది జెడ్పీటీసీ దొండా రాంబాబు, చింతపల్లి ఎంపీపీ అనుషాదేవి తదితర నేతలకు భాగ్యలక్ష్మి స్వాగతం పలికారు. -
మహిళా భద్రతకు పాటుపడాలి
నర్సీపట్నం : మహిళా భద్రతపై మహిళా పోలీసు సిబ్బంది దృష్టిసారించాలని, మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాల నియంత్రణకు మహిళా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని అనకాపల్లి మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ, నర్సీపట్నం ఇన్ఛార్జీ డీఎప్పీ ఈ.శ్రీనివాసులు సూచించారు. స్థానిక ప్రవేటు కళ్యాణమండపంలో డివిజన్లోని మహిళా పోలీసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలను ఆరికట్టేందుకు కృషి చేయాలని, మహిళల రక్షణపై పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రచార రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన శక్తి యాప్ అవశ్యకతను మహిళలు, బాలికలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్, రూరల్ సీఐలు గపూర్, రేవతమ్మ, పాయకరావుపేట సీఐ శంకర్రావు, డివిజన్ పరిధిలో మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
నీట్ పరీక్ష రద్దు చేయడం దారుణం
నీట్ పరీక్ష రద్దు చేయడం దారుణం. ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పరిపాటిగా మారింది. నీట్ నిర్వహణలో లోపాన్ని గుర్తించకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఎన్డీఏ ప్రభుత్వానికి తగదు. మా పాపతో పాటు ఎంతో మంది విద్యార్థులు కష్టపడి ఏడాది పాటు ప్రిపేరు అయ్యారు. తీరా పరీక్ష రాసిన తరువాత పరీక్ష రద్దు చేయడం సరికాదు. ఈ విధమైన చర్య విద్యార్ధుల భవిష్యత్తును దెబ్బతీస్తుంది. ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నాను. – వి.వి.ఎన్.హరికృష్ణ, విద్యార్థిని తండ్రి, నర్సీపట్నం -
వైద్య రంగంలో నర్సులు కీలకపాత్ర
సాక్షి, పాడేరు: నర్సింగ్ వృత్తిని దైవంగా భావించి, ప్రజలకు విశేష సేవలు అందించిన ఆదర్శ మూర్తి ఫ్లోరెన్స్ నైటింగేల్ స్మృత్యర్థం మంగళవారం జిల్లా ఆస్పత్రిలో ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నైటింగేల్ చిత్రపటానికి నర్సింగ్ సూపరింటెండెంట్లు ఎం. అన్నపూర్ణ (గ్రేడ్–1), ఎం. ఇందిర, జి. చంద్రకళ (గ్రేడ్–2) పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి తోటి సిబ్బందికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. వైద్య రంగంలో నర్సింగ్ వ్యవస్థ పోషిస్తున్న కీలక పాత్రను, వారు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి నర్సింగ్ బృందం మొత్తం పాల్గొంది. సేవ, త్యాగాలకు నిదర్శనం నర్సులు ముంచంగిపుట్టు: సేవాభావానికి, త్యాగానికి నిదర్శనం నర్సులని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ ధరణి కొనియాడారు. మంగళవారం మండల కేంద్రంలోని సీహెచ్సీలో ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని వైద్యులు, సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ థెరిసా, ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నర్సులందరూ కలిసి కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. వైద్య రంగంలో వారు అందిస్తున్న విశేష సేవల గురించి పలువురు ప్రసంగించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ధరణి మాట్లాడుతూ..ఆసుపత్రుల్లో నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివన్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో నర్సులు తమ ప్రాణాలకు తెగించి వైద్యులతో కలిసి పనిచేశారని, ప్రజల ఆరోగ్య రక్షణలో వారు చేస్తున్న కృషి వర్ణనాతీతం అని పేర్కొన్నారు. వైద్యులు రమేష్, ఆదిత్యతో పాటు సీహెచ్సీ సిబ్బంది సురేష్, రమేష్, రాంబాబు, నూకాల మ్మ, వనిత, నాగమణి, తేజవతి పాల్గొన్నారు. ఘనంగా ప్రపంచ నర్సుల దినోత్సవం -
ప్రమాదవశాత్తూ ఆర్మీ ఉద్యోగి మృతి
వార్షిక ప్రణాళిక అమలుతో మహిళా సంఘాల అభివృద్ధి సబ్బవరం: వార్షిక ఆర్థిక ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేసి, గ్రామీణ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని డీపీఎం ఐబీ పి.వెంకటరమణ సూచించారు. సబ్బవరం మండల సమాఖ్య కార్యాలయంలో ఏఏపీ–1 సెక్షన్ పరిధిలో రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడారు. సబ్బవరం మండల సమాఖ్యతో పాటు అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, గొలుగొండ, చోడవరం, యలమంచిలి మండలాలకు చెందిన ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్లకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వీవో స్థాయిలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక తయారీ, కార్యవర్గ సభ్యులకు, ఎస్హెచ్జీ సభ్యులకు అవగాహన కల్పించడం, బడ్జెట్ ప్రక్రియపై శిక్షణ అందించినట్లు ఆయన తెలిపారు. వీఎంవోఎస్ఏ అంఽశాలపై టీవోటీ కె.శ్రీనివాసరావు వివరించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సామాజిక భద్రత, ఆస్తుల సృష్టి, ప్రవర్తనలో మార్పు, సుస్థిర జీవనోపాధి వంటి అంఽశాలపై సభ్యులతో చర్చించి గ్రామ, మండల స్థాయి ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏడు మండలాలకు చెందిన అధికారులు, సిబ్బందితో పాటు సబ్బవరం మండలంలోని 58 గ్రామ సంఘాల లీడర్లు పాల్గొన్నారు. -
పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఆవుల శేఖర్ నర్సీపట్నం: పేదలకు ఇళ్ల స్థలాలు, సాగు భూములు దక్కే వరకు పోరాటాలు ఆగవని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు ఆవుల శేఖర్ పేర్కొన్నారు. అనకాపల్లిలో జిల్లా అధ్యక్షుడు అర్జున్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో శేఖర్ మాట్లాడారు. ఏళ్ల తరబడి గ్రామీణ పేదలకు సాగు భూములు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయమని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ భూములన్నీ రాజకీయ పలుకుబడి కలిగిన వారి చేతుల్లో ఉన్నాయన్నారు. కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా రాష్ట్ర ప్రభుత్వం భూములు కట్టబెడుతుందన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులను అమలు చేస్తే పేదలకు ఇళ్ల స్థలాలు, సాగుభూములు అందుతాయన్నారు. పేదల సంక్షేమ పథకాలు కత్తిరించాలనే గ్రామాల్లో సర్వే చేస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెలుగుల అర్జున్రావు, బాలేపల్లి వెంకటరమణ, జిల్లా ఆఫీస్ బేరర్లు కొండలరావు, అప్పలనాయుడు, లవరాజు, బంగారయ్య, అప్పారావు, నాగేశ్వరరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
వేసవి సెలవుల్లో పనులు అప్పగించడం అన్యాయం
అనకాపల్లి: సెలవుల్లో వాట్సాప్ ఆదేశాల ద్వారా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం సరికాదని, లిఖితపూర్వక ఉత్తర్వులు లేకుండా, కేవలం వాట్సాప్ సందేశాల ద్వారా విద్యా సంబంధిత పనులను అప్పగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాప్టో) జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు అన్నారు. స్థానిక డీఈవో కార్యాలయంలో సోమవారం డీఈవో గిడ్డి అప్పారావు నాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని, కేంద్ర కార్యాలయం నుంచి ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు లేనప్పటికీ, జిల్లాలో మాత్రం మే 12 నాటికి ఫౌండేషన్ ప్లాన్, మండల ప్లాన్, స్కూల్ లెవల్ ప్లాన్న్లను సిద్ధం చేయాలని ఒత్తిడి చేయడం సరి కాదన్నారు. తక్షణమే ఈ ఒత్తిడి ఆపాలని, ఉపాధ్యాయుల సెలవు హక్కు గౌరవించాలని, వాట్సాప్ ద్వారా కాకుండా అధికారిక ప్రొసీడింగ్స్ ద్వారా మాత్రమే విధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాప్టో జిల్లా కార్యదర్శి యేశపోగు సుధాకర్రావు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు ఎస్.దుర్గాప్రసాద్, గొంది చిన్నబ్బాయ్, కె. పరదేశి, కార్యవర్గ సభ్యుడు వై.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రైతులంటే ఇంత చులకనా...?
చోడవరం : గోవాడ చెరకు రైతులు ఉద్యమానికి మరోసారి సిద్ధమౌతున్నారు. రైతు సంఘాల నాయకులు, పలు రైతు ఉద్యమకారులు కలిసి చోడవరంలో బుధవారం సమావేశమయ్యారు. భారతీయ జనతాపార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు, రైతు ఉద్యమకారుడు ఎ.ఆర్.జి శర్మ ఇంటి వద్ద రైతు సంఘాల నాయకులంతా హాజరయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వారంతా తప్పుబడ్డారు. రైతులంటే ప్రభుత్వానికి చాలా చులకనగా ఉందని, మరోసారి ఉద్యమానికి చెరకు రైతులు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ కార్మికులంతా సిద్ధం కావాలంటూ ఈ సమావేశం నిర్ణయించింది. అవసరమైతే రైతుల తరపున న్యాయపోరాటానికై నా వెళదామని ఏ.ఆర్.జి శర్మ ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులకు తెలిపారు. పార్టీలు, రాజకీయాలు ముఖ్యం కాదని, 24 వేల మంది చెరకు రైతులు, కార్మికుల జీవన్మరణ సమస్యగా మారిన గోవాడ ఫ్యాక్టరీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటికే మొదటి దశ ఉద్యమం చేసినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ మేరకు ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపడం జరిగిందని, వారి హామీ మేరకు ఏమీ జరగకపోవడంతో మరోసారి ఉద్యమానికి అంతా సిద్ధమవ్వాలని నిర్ణయించారు. చెరకు రైతుల బకాయిలు, కార్మికుల జీత బకాయిలు రూ. 30 కోట్లు వరకూ ఫ్యాక్టరీ చెల్లించాల్సి ఉందని, అవి ఇప్పటి వరకూ చెల్లించలేదని, అంతేకాకుండా వచ్చే సీజన్ గానుగాట ఆడిందీ లేనిదీ ఏమీ చెప్పకపోవడంతో రైతులు చెరకు పంట వేయాలా వద్దా అనే మీమాంశలో ఉన్నారని, అదీ ప్రభుత్వం తేల్చలేదని సమావేశంలో రైతు సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఇప్పటికై నా వీటిపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయకపోతే త్వరలోనే రెండో దశ ఉద్యమం చేయడానికి అంతా సిద్ధంగా ఉండాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో రైతు సంఘం జిల్లా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, జనసేన నియోజకవర్గ నాయకుడు జెర్రిపోతుల నానాజీ, రైతు సంఘాల ప్రతినిధులు మహాలక్ష్మినాయుడు, దాడి అమర్, పెదబాబు పాల్గొన్నారు. -
తాటి చెట్టుపై నుంచి పడి యువకుడి మృతి
పాయకరావుపేట : పట్టణానికి చెందిన యువకుడు తాటి చెట్టు పై నుంచి పడి మృతి చెందినట్టు ఏఎస్ఐ గోవిందు తెలిపారు. పట్టణంలో రాజుగారిబీడుకు చెందిన పంజాబీ పవన్ కుమార్ (21) తాటిముంజులు తీయడం కోసం స్థానికంగా గల తాటిచెట్టు ఎక్కి 40 అడుగులు ఎత్తు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితుల సహాయంతో తుని ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఏఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. -
‘రహదారి లేదని చెప్పడం అన్యాయం’
మాట్లాడుతున్న బుద్ద మురళీ తాతారావు అనకాపల్లి: స్థానిక మెయిన్రోడ్డు రఘరాం లే అవుట్ను ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 1535/3లో 7.603 సెంట్ల జీరాయితీ భూమిలో గేటు నిర్మిస్తున్న సమయంలో లే అవుట్ ప్రతినిధి కాండ్రేగుల వెంకట పరమేశ్వరరావు ఈనెల 9వ తేదీన తమ భూమిలో గేటు నిర్మించుకోవడం తప్పు అని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని స్థల యజమాని బుద్ద మురళీ తాతారావు అన్నారు. స్థానికంగా ఉన్న తమ భూమిలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లే అవుట్కు ఆనుకుని ఉన్న తమ స్థలానికి ఇటు రహదారి లేదని చెప్పడం అన్యాయమన్నారు. లే అవుట్ సైడ్ గేటు ఏర్పాటు చేసుకోవాలంటే రూ. 50 లక్షలు చెల్లించాలని పరమేశ్వరరావు చెప్పడం తగదని మురళీ తాతారావు అన్నారు. ఇదే విషయంపై సోమవారం పట్టణ పోలీస్స్టేషన్లో కాండ్రేగుల వెంకట పరమేశ్వరరావుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాతారావు కుటుంబ సభ్యులు విల్లూరి గణేష్, దాడి నాని, ఆడారి శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
త్వరితగతిన అర్జీలు పరిష్కరించాలి
అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలంటు రైతుల నిరసన భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల నిరసన తుమ్మపాల: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోను రీఓపెన్ కాకూడదని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఅర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయిలలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి వారితో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరించి దరఖాస్తుదారునికి తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్కు 123, రెవెన్యూ క్లినిక్కు 145 మొత్తం 268 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లను తక్షణం నిలిపేయాలి.. ఏళ్ల తరబడి సాగులో ఉన్న రైతుల భూములకు అనధికారక లేఅవుట్ చూపించి తప్పుడు పద్ధతిలో చేస్తున్న రిజిస్ట్రేషన్లను తక్షణమే నిలిపివేసి రైతులకు రక్షణ కల్పించాలంటు పరవాడ మండలం దేశపాత్రునిపాలెం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి వినతిపత్రం అందించారు. గ్రామంలో సర్వే నంబర్ల 274, 276, 279, 290, 291, 298, 347లో మొత్తం 60 ఎకరాల రైతుల భూమిలో కొంత భూమిని కొనుగోలు చేసిన ఓ ప్రైవేటు రియల్టర్ మిగిలిన రైతుల భూములను కూడా కలిపి అనధికారక లేఅవుట్ వేసినట్లు తెలిపారు. అనధికారక జీపీఏ పత్రాలతో ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేస్తూ రైతుల భూముల్లోకి వచ్చి ముప్పుతిప్పలు పెడుతున్నారని, రౌడీమూకలతో భూముల్లోకి వచ్చి వివాదాలు సృష్టిస్తున్నట్లు తెలిపారు. తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నా పోలీసులు సివిల్ వివాదం అంటూ చేతులు దులుపుకోవడం, అధికారులు జీపీఏలతో కొనసాగిస్తున్న రిజిస్ట్రేషన్లను నిలిపివేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గ్రామాల్లో విచారణ చేపట్టి తమ భూములకు సంబంధించి సృష్టిస్తున్న తప్పుడు పత్రాలను రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు. సాగు భూములను కాపాడాలి.. ఎస్ఈజెడ్ నిర్మాణం కోసం కె.కోటపాడు మండలం పలు గ్రామాల్లో చేపడుతున్న బలవంతపు భూసేకరణ నిలిపేసి సాగు భూములను కాపాడాలంటు ఏపీ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా నాయకులు రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జిల్లాలో అత్యధిక రిజర్వాయర్లు కలిగి ప్రతి ఎకరం నీటి సౌకర్యంతో నిత్యం పంటలు పండే చోట ఎస్ఈజెడ్ అంటు భూములను సేకరించి కంపెనీలతో కలుషితం చేయడం మానుకోవాలన్నారు. అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే వేల ఎకరాల భూముల సేకరణ జరిగిందని, జిల్లాలో మిగిలిన భూములను వ్యవసాయ ఆధారిత ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఎస్పీ కార్యాలయానికి 65 ఆర్జీలు అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 65 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట పరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య వేధింపులు, ఇతర విభాగాలకు సంబంధించిన అర్జీలు వచ్చాయన్నారు. వాస్తవాల ఆధారంగా సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్, సీఐ సేనం రమేష్ పాల్గొన్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
నర్సీపట్నం : నర్సీపట్నం మండలం, గబ్బాడ గ్రామ సమీపం నెల్లిమెట్ట వద్ద యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు రూరల్ ఎస్ఐ రాజారావు తెలిపారు. రోలుగుంట మండలం, బుచ్చింపేట గ్రామానికి చెందిన లాలం సాయి కుమార్ (30) ఈ నెల 10వ తేదీ సాయంత్రం అదే గ్రామానికి చెందిన సతీష్, రాజేష్, నానాజీలతో కలిసి గబ్బాడ గ్రామం, నెల్లిమెట్ట వద్ద మద్యం సేవించినట్టు ఎస్ఐ తెలిపారు. అనంతరం మృతుడు సాయికుమార్, రాజేష్ బైక్పై నర్సీపట్నం వైపు రావడం జరిగిందన్నారు. బైక్పై వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగి సాయికుమార్ మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య లాలం రాజ్యలక్ష్మి సాయికుమార్ మృతిపై అనుమానం వ్యక్తి చేయడంతో ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
ప్రముఖ వైద్యుడు శ్రీరామ్మూర్తి మృతికి సంతాపం
బుచ్చెయ్యపేట: వడ్డాదిలో పేదల వైద్యుడిగా పేరొందిన ప్రముఖ వైద్యుడు బెన్నాబత్తుల శ్రీరామ్మూర్తి (68) (పెంటబాబు డాక్టర్ ) గుండె పోటుతో మృతి చెందారు. రెండు రోజుల కిందట హైదరాబాద్లో ఉన్న తన కుమారుడి దగ్గరకు వెళ్లిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం విశాఖలోని ఓ పైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐదు దశాబ్దాలుగా బుచ్చెయ్యపేట, చినఅప్పనపాలెం, బంగారుమెట్ట, దిబ్బిడి, ఎల్బీ పురం, భీమవరం, వడ్డాది, వీరవల్లి, పోతనపూడి, కుముదాంపేట, లోపూడి, శింగవరం తదితర గ్రామాల ప్రజలకు తక్కువ ఖర్చుతోనే వైద్య సేవలు అందించేవారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సేవలతో పాటు నిరుపేదలకు ఫీజు తీసుకోకుండా వైద్య సేవలు అందించేవారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు లేని సమయంలో, కరోనా కాలంలో కూడా పలువురికి వైద్య సేవలు అందించి పేదల పెన్నిధిగా పేరొందారు. శ్రీరామూర్తి అకాల మరణంతో పలు గ్రామాల ప్రజలు, పలువురు వైద్యులు, నాయకులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అతని పెద్ద కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా భార్య, కుమారుడు ఉన్నారు. -
దూరవిద్య పరీక్ష కేంద్రం మంజూరు
అరకులోయటౌన్: స్థానిక ప్రభుత్వ మహి ళా డిగ్రీ కళాశాలకు ఆంధ్రాయూనివర్సిటీ దూరవిద్య పరీక్ష కేంద్రం మంజూరైనట్టు ప్రిన్సిపాల్ పట్టాసి చలపతిరావు సోమవారం తెలిపారు. ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ 167ను కేటాయించారన్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి యూజీ థియరీ పరీక్షలు, బీఏ, బీకాం, బీఎస్సీ థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దూర విద్య పరీక్ష కేంద్రం మంజూరు చేసిన ఏయూ వైస్ చాన్సలర్, సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఇతర అధికారులకు చలపతిరావు, కళాశాల అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. -
దేవాలయ భూములకు నష్టపరిహారం ఇప్పించండి
అచ్యుతాపురం రూరల్ : దుప్పితూరులో పద్మశాలీల ఆరాధ్య దైవమైన శ్రీ భద్రావతీ సమేత భావనాఋషి ఆలయ భూములకు నష్టపరిహారం ఇప్పించాలని ఆలయ కమిటీ సభ్యులు అనకాపల్లి కలెక్టర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా తమ సొంత నిధులతో స్వామికి నిత్య దీప ధూప నైవేద్యాలు, ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. ఆలయ భూములకు పరిహారంతో పాటు భూమికి భూమి ఇవ్వాలని వినతిపత్రం ద్వారా కలెక్టర్ను కోరారు. నష్టపరిహారం చెల్లించకుండా ఆలయ భూములను ఆక్రమిస్తున్న ఏపీఐఐసీ, బ్రాండిక్స్ సంస్థలు నిర్మిస్తున్న ప్రహారీ నిర్మాణాన్ని నిలిపివేయాలన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఆలయ కమిటీ చైర్మన్ మాడెం సూరి అప్పారావు, ఉపాధ్యక్షుడు శేశెట్టి రాంబాబు, సెక్రటరీ మాడెం అప్పారావు, కమిటీ సభ్యులు అంజూరి అప్పలరాజు, శేశెట్టి నర్సింగరావు, శేశెట్టి నానాజీ, వానపల్లి ముకుందేశ్వరరావు, వానపల్లి సన్యాసిరావు, అముదూరి అర్జునరావు తదితరులు ఉన్నారు. -
చిరిగిన దోమతెరలే గతి
రెండేళ్లుగా చిరిగిన దోమతెరలతో ఇబ్బందులు పడుతున్నాం.వాటిని సూదులతో కుడుతున్నా ఫలితం లేక పోతోంది.దోమతెరలన్నీ చిరిగిపోవడంతో వాటిని కట్టుకున్నా దోమలు లోపలికి వచ్చి కుడుతున్నాయి.సాయంత్రం అయితే దోమల బెడద అధికంగా ఉంది.పొగపెడుతున్నా దోమ కాట్లు తప్పడం లేదు.ఈఏడాది కూడా తమ గ్రామంలో ఏకుటుంబానికి దోమతెరలు పంపిణీ చేయలేదు. –వంతాల మదు, ఎర్రగుప్ప గ్రామం, పాడేరు మండలందోమల నివారణ మందు పిచికారీ చేయలేదు దోమకాట్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.నా భర్త భాస్కరరావు మలేరియా జ్వరంతో పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా ఇంటి వద్ద గాని, చుట్టు పక్కల ఇళ్ల వద్దగాని ఇంత వరకు దోమల నివారణ మందు పిచికారీ చేయలేదు.దోమతెరలు కూడా పంపిణీ చేయలేదు. –వంతాల లక్ష్మి, బక్కలపనుకు గ్రామం, పాడేరు -
ఘాట్రోడ్డులో తప్పిన ప్రమాదం
సాక్షి, పాడేరు: మైదాన ప్రాంతం నుంచి జి.మాడుగుల జీసీసీ బంక్కు పెట్రోల్,డీజిల్ రవాణా చేస్తున్న ఆయిల్ట్యాంకర్కు పాడేరు ఘాట్లో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.పాడేరు ఘాట్ రోడ్డు నుంచి అతివేగంగా దిగుతున్న టిప్పర్ను తప్పించేందుకు ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి రోడ్డు పక్కనున్న కొండవైపునకు మళ్లించాడు.కొండకు ఆనుకుని ట్యాంకర్ ఒరిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.టిప్పర్,ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.పాడేరు ఘాట్లోని ఏసుప్రభువు విగ్రహం మలుపు సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.ఆయిల్ ట్యాంకర్ నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ లీకు అయింది.పొక్లెయినర్ సాయంతో ట్యాంకర్ను రోడ్డుపైకి తీశారు.కొండకు ఆనుకుని ఒరిగిన ఆయిల్ ట్యాంకర్ -
ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి కుట్ర
పాడేరు రూరల్: ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని కాఫీ రైతుల సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పాలికి లక్కు తెలిపారు. మండలంలో వంట్లమామిడి పంచాయతీ ఓనూరు తదితర గ్రామాల్లో ఆయన సోమవారం ఉపాధి హామీ పథకం వేతనదారులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో పాత విధానాన్ని కొనసాగించాలన్నారు. కొత్త విధానం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సక్రమంగా పనులు కల్పించకపోవడంతో గిరిజనులు వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందని తెలిపారు. రోజు వారీ కూలీ రూ.600కి పెంచాలని డిమాండ్ చేశారు. -
లబ్బూరు వద్ద మూడు బైకులు ఢీ
ఒకరు మృతి..ముగ్గురికి తీవ్ర గాయాలు ముంచంగిపుట్టు: మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు గ్రామ సమీపంలో ఆదివారం మూడు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎస్ఐ పి.నాని అందించిన వివరాలు... మండలంలోని మాకవరం పంచాయతీ కిందుగూడ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు బైకుపై ముంచంగిపుట్టు నుంచి కిందుగూడ వెళ్తుండగా అదే సమయంలో మేభ గ్రామానికి చెందిన సుబ్బరావు, రెడ్డి బైకు ముంచంగిపుట్టు బయలుదేరారు. జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు గ్రామ సమీపంలోని ఏకలవ్య పాఠశాల ఎదురుగా ఈ రెండు బైకులు ఢీ కొన్నాయి. అదే సమయంలో కించాయిపుట్టు పంచాయతీ కేంద్రానికి చెందిన నాగేశ్వరరావు బైకుపై వస్తుండగా.. ప్రమాదానికి గురైన రెండు బైకులు అతనిపై దుసుకుపోయాయి.దీంతో అందరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.క్షతగ్రాతులను హూటహూటిన ముంచంగిపుట్టు సీహెచ్సీకి తరలించారు.రెడ్డి పరిస్థితి విషమయంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి,అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించారు.కేజీహెచ్లో చికిత్స పొందుతూ రెడ్డి(25) సోమవారం మృతి చెందాడు.కిందుగూడకు చెందిన నాగేశ్వరరావు పాడేరు జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నాడు. మేభకు చెందిన సుబ్బరావు ముంచంగిపుట్టు సీహెచ్సీలో వైద్య సేవలు పొందుతున్నాడని, కేసు నమోదు చేశామని ఎస్ఐ నాని తెలిపారు. -
విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యేలా కృషి
జి.మాడుగుల: మండలంలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని పాడేరు గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ పరిమళ ఆదేశించారు. టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు స్థానిక బాలుర ఆశ్రమ పాఠశాలలో–2లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న తరగతులను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కేంద్రాలకు సబ్జెట్ టీచర్లు తప్పని సరిగా తరగతులకు హాజరయ్యే విధంగా ఆశ్రమ పాఠశాల హెచ్ఎంలు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధ్యాయుల అందించే బోధనను సక్రమంగా వినియోగించుకుని ఉత్తీర్ణులు కావాలని ఆమె విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల హెచ్ఎం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
సీలేరు రూట్లో మరో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసు
సీలేరు: విశాఖపట్నం డిపో నుంచి అనకాపల్లి జిల్లా మీదుగా సీలేరు దారాలమ్మ తల్లి ఘాట్ రోడ్డులో మరో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసు మంగళవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని విశాఖ ఆర్టీసీ డీఎం మాధురి తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు సీలేరు వస్తుందని చెప్పారు. బస్సు సిబ్బంది భోజనానంతరం బయలుదేరి 6.30 గంటలకు భద్రాచలం చేరుకుంటుందని, మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు అక్కడ బయలుదేరి, మధ్యాహ్నం 12 గంటలకు సీలేరు చేరుకుంటుందని ఆమె తెలిపారు. అక్కడి నుంచి విశాఖప ట్నం బయలుదేరుతుందని డీఎం చెప్పారు. రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించామని, ఈ సర్వీసును ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. -
విస్తారంగా వర్షాలు
సాక్షి.పాడేరు: వేసవిలోనూ జిల్లాలో రోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.ఉదయం పొగమంచు,మధ్యాహ్నం వరకు అధిక ఎండ,సాయంత్రం నుంచి భారీ వర్షం కురవడం వంటి విభిన్న వాతావరణ పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి.సోమవారం జిల్లా కేంద్రం పాడేరుతో పాటు పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.రోజు వర్షాలు కురుస్తుండడంతో ప్రధాన గెడ్డలు,వాగుల్లో వరదనీరు పొంగి ప్రవహిస్తోంది. వర్షపాతం వివరాలు: పెదబయలు 29.5, పాడే రులో 26.5, హుకుంపేటలో 26.5,చింతపల్లిలో 17.5, ముంచంగిపుట్టులో 9, కొయ్యూరులో 5.5, జి.మాడుగులలో 4.3, జీకే వీధిలో 1.8 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. పాడేరులో కురుస్తున్న వర్షం -
పౌడర్ రాస్తేనే ముఖ హాజరు నమోదు
ముంచంగిపుట్టు: ఫొటోలు తీసుకోడానికి, ఏదైనా శుభకార్యాలకు,ఫంక్షన్లకు వెళ్తే ముఖానికి పౌడర్ రాసుకుని వెళ్లడం అందరికీ తెలుసు. గిరిజన ప్రాంతంలో ఉపాధి వేతనదారులు మాత్రం పనులు చేసేందుకు వెళ్లినప్పుడు పౌండర్ రాసుకుంటున్నారు.కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనుల చేసేందుకు ముఖ గుర్తింపు ఆధారిత హాజరు ప్రవేశపెట్టింది. ఆ యాప్ సక్రమంగా పని చేయకపోవడంతో హాజరు నమోదుకాక జిల్లాలో వేతనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముఖానికి పౌడర్ రాసుకుంటే కొంతమందికి హాజరు నమోదవుతోంది. దీంతో వేతనదారులు పనికి వెళ్లే ముందు తప్పనిసరిగా పౌడర్ రాసుకోవలసి వస్తోంది. సోమవారం వనుగుమ్మ పంచాయతీ పనస గ్రామంలో చాలా మంది ఉపాధి కూలీలు పౌడర్ రాసుకుని వెళ్లి ముఖ హాజరు నమోదుకు యత్నించారు. కానీ కొంతమందికే హాజరు నమోదు అయింది.దీంతో మిగిలిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ హాజరు విధానాన్ని తక్షణమే రద్దు చేసి,పాత పద్ధతిలోనే పనులు కల్పించాలని వనుగుమ్మ పంచాయతీ పనసగ్రామానికి చెందిన వేతనదారులు కోరుతున్నారు.పనసలో ముఖంపై పౌడర్తో వచ్చి హాజరు నమోదు చేసుకుంటున్న వేతనదారుడుముఖ హాజరు కోసం పని ప్రదేశంలో నిరీక్షిస్తున్న వేతనదారులు -
పోర్టులో కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం
సాక్షి, విశాఖపట్నం : మేజర్ పోర్టులతో పోటీపడుతూ 100 మిలియన్ టన్నుల హ్యాండ్లింగ్ లక్ష్యంతో పాటు.. కాలుష్య రహిత పోర్టుగా మార్చడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్నామని విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్ డాక్టర్ అంగముత్తు స్పష్టం చేశారు. పోర్టు పరిధిలో పలు కీలక మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభంతో పాటు కొత్త ప్రాజెక్టులకు సోమవారం శంకుస్థాపనలు చేశారు. పబ్లిక్ ప్రొమెనెడ్ అభివృద్ధి, పోర్టు నిర్వహణ వ్యవస్థ, 38 టీకేఎం రైల్వే ట్రాక్ల విద్యుదీకరణ, పరిపాలనా భవనంలోని డిస్ప్లే కారిడార్, ఎస్టీపీ సమీపంలో 170 కిలోవాట్ల రూఫ్టాప్ సోలార్ వ్యవస్థ, ప్రస్తుత ఎంసీహెచ్వీ రైల్వే ట్రాక్ అప్గ్రెడేషన్, ఎస్ఎల్ కాలువ జెట్టీ సమీపంలో మరమ్మతులు, రైల్వే ట్రాక్ల్లో మలుపుల సవరణతో మెరుగుదల పనులతో పాటు కస్టమ్స్ సరిహద్దు గోడ నిర్మాణాన్ని చైర్మన్ డా.అంగముత్తు ప్రారంభించారు. భద్రత, మౌలిక సదుపాయాల బలోపేతానికి సంబంధించిన పలు ముఖ్యమైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. వీటిలో అన్ని గేట్ల వద్ద అండర్ వెహికల్ స్కానింగ్ సిస్టమ్ల ఏర్పాటు, కార్గో గేట్ల వద్ద రేడియోలాజికల్ డిటెక్షన్ పరికరాల ఏర్పాటు, కాన్వెంట్ జంక్షన్ ఆర్చ్ నుంచి హెచ్–7 జంక్షన్ వరకు బీటీ రోడ్డుకు రీగ్రేడింగ్ పనులు, ఓహెచ్సీ లోపలి రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు, సీనియర్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నేడు మోదమ్మ పుట్టినరోజు ముగింపు ఉత్సవం
సాక్షి, పాడేరు: తెలుగు రాష్ట్రాల భక్తుల ఆరాధ్యదేవత పాడేరులోని మోదకొండమ్మతల్లి పుట్టిన రోజు ముగింపు ఉత్సవాన్ని మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు.మూడు రోజుల పుట్టిన రోజు వేడుకలకు మోదకొండమ్మతల్లి ఆలయ కమిటీ చైర్మన్,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు శ్రీకారం చుట్టారు.ఆదివారం పుట్టిన రోజు ప్రారంభ ఉత్సవాన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు.సోమవారం కూడా మోదమ్మకు ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు చేశారు.భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.మంగళవారం అమ్మవారి పుట్టిన రోజు ముగింపు ఉత్సవాలకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఉదయం నుంచి మోదమ్మకు పూజలు చేయడంతో అమ్మవారి ఘటాలను ఉరేగిస్తారు.మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నసమారాధన నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి మోదమ్మ ఉత్సవ విగ్రహం,పాదాలను పాడేరు వీధుల్లో ఊరేగిస్తారు.నేలవేషాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు,డప్పు వాయిద్యాల హోరులో మోదమ్మ ఊరేగింపు సంబరం జరగనుందని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తెలిపారు.రాత్రి కళా ప్రదర్శనలను ఏర్పాటు చేశామని,అన్ని వర్గాల భక్తులు మోదమ్మ పుట్టిన రోజు వేడుకను విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
విజృంభన
మలేరియా ● అరకొరగా దోమ తెరల పంపిణీ ● 1.50 లక్షల కుటుంబాలకు గాను ఇచ్చింది 34వేలే ● దోమల నివారణ మందు పిచికారీ 1604 గ్రామాలకే పరిమితం సాక్షి, పాడేరు: జిల్లాలో మలేరియా జ్వరాలు చాపకింద నీరులా విజృంభిస్తున్నాయి.కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడం, పారిశుధ్యం కొరవడడం తదితర కారణాలతో దోమలు వృద్ధి చెంది మలేరియాను వ్యాప్తి చేస్తున్నాయి. దీంతో పలువురు జ్వరాల బారిన పడుతున్నారు. చికిత్స కోసం జిల్లా ఆస్పత్రితో పాటు పీహెచ్సీలకు క్యూ కడుతున్నారు. ఒక్క పాడేరు జిల్లా ఆస్పత్రిలోనే ఆరుగురు గిరిజనులు మలేరియాతో చికిత్స పొందుతున్నారు. చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ సింగవరం గ్రామానికి చెందిన కిముడు దయాకర్ అనే టెన్త్ విద్యార్థి ఈనెల 9వతేదీన మలేరియాతో మృతిచెందాడు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండడం, గిరిజన విద్యార్థి మృతిచెందడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మలేరియా నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని వాపోతున్నారు. క్రమంగా పెరుగుతున్న కేసులు జిల్లాలోని 11 మండలాల పరిధిలో 1604 మలేరియా పీడిత గ్రామాలను మలేరియాశాఖ గుర్తించగా,ఈఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 399 మలేరియా కేసులు నమోదయ్యాయి.ఈఏడాది జనవరి 21, ఫిబ్రవరిలో 43, మార్చిలో 106, ఏప్రిల్లో 165,మే నెలలో ఇంత వరకు 64 మంది మలేరియా జ్వరాల బారిన పడ్డారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రితో పాటు అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి,ముంచంగిపుట్టు,చింతపల్లి కమ్యూనిటీ ఆస్పత్రులు, పాటు పీహెచ్సీల పరిధిలో మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు మలేరియా రోగుల తాకిడి ఎక్కువగా ఉంది.కొంతమంది రోగులు మైదాన ప్రాంత ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో మలేరియా కేసులకు అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు.ప్రస్తుతం పాడేరు పట్టణ పరిధిలోని లోచలిపుట్టుకు చెందిన కె.నీలకంఠం,బక్కలపనుకుకు చెందిన వంతాల భాస్కరరావు,వంట్లమామిడి గ్రామానికి చెందిన జనపరెడ్డి జస్వంత్,జి.మాడుగుల మండలం పెదలోచలి పంచాయతీ ఇందుగుల గ్రామానికి చెందిన భార్యభర్తలు సీదరి బంగారయ్య,చిలకమ్మ,మరో గిరిజనుడు జగ్గారావులు మలేరియా జ్వరాలతో వైద్యసేవలు పొందుతున్నారు. చిరిగిన దోమతెరలు చూపిస్తున్న ఎర్రగుప్ప ఆదివాసీలుభయపెడుతున్న దోమలు జిల్లాలో పలు ప్రాంతాలు దోమల అడ్డాగా మారాయి. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు గ్రామాల్లోను అదే పరిస్థితి.సాయంత్రం 4గంటల నుంచే దోమలు దాడి చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాడేరులో మలేరియా కేసులు నమోదవుతున్నప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క ఇంటి వద్ద దోమల నివారణ మందు పిచికారీ చేయలేదు.జిల్లాలో 3,500 గ్రామాలుండగా,1,604 గ్రామాల్లోనే దోమల నివారణ మందు పిచికారీ చేశారు. ఆయా గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో పనులు జరపలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదు నెలల్లో 399 కేసులు ఓ గిరిజన విద్యార్థి మృతి జిల్లా కేంద్రం పాడేరులోనూమలేరియా కేసులు భయాందోళన చెందుతున్న ప్రజలు నివారణపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం 34,900 దోమతెరలే పంపిణీ జిల్లాలో అన్ని గ్రామాల్లోను దోమల బెడద అధికంగా ఉంది. దోమ కాట్లతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అరకొరగా దోమతెరలను పంపిణీ చేసింది. 1.50 లక్షల కుటుంబాలు ఉంటే కేవలం 34,900 దోమతెరల పంపిణీకి గత నెలలో కలెక్టర్ నిశాంతి ప్రారంభించారు. అవి కనీసం మలేరియా పీడిత గ్రామాలకు కూడా సరిపడని పరిస్థితి. గత ఏడాది ఒక్క దోమతెర కూడా పంపిణీ చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన దోమతెరలనే ప్రస్తుతం గిరిజనులు వినియోగిస్తుండగా, వాటికి కాలం చెల్లడంతో చిరిగిపోయాయి. దోమతెరలు లేక దోమకాట్లతో గిరిజనులు రాత్రి సమయంలో నరకయాతన అనుభవిస్తున్నారు. -
క్రీడా శిక్ష ణ కేంద్రాలకు విశేష స్పందన
● ఆరోగ్యం, ఆత్మరక్షణ కల్పించేందుకు యోగా, తైక్వాండోలో శిక్షణ చోడవరం: వేసవి సెలవులు రావడంతో వివిధ క్రీడల్లో ప్రారంభమైన వేసవి శిక్షణ కేంద్రాలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆయా విభాగాల స్పోర్ట్స్ యూనిట్లు ఇప్పటికే అన్ని కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించాయి. ఆత్మరక్షణ, ఆరోగ్య రక్షణలకు కీలకంగా మారిన తైక్వాండో, యోగాలో జిల్లా వ్యాప్తంగా పలు కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు. 30రోజుల పాటు ఈ కేంద్రాలు నిర్వహించనున్నారు. తైక్వాండో అసోషియేషన్, చోడవరం పతంజలి యోగా కేంద్రాల ఆధ్వర్యంలో ఈ శిబిరాలు ప్రారంభమయ్యాయి. తైక్వాండోలో... ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణ చాలా అవసరం. అందులో బాలికల ఆత్మరక్షణ విషయంలో అప్రమత్తత అవసరమని భావించి స్పోర్ట్స్ అథారిటీ ఈ వేసవి శిక్షణ తరగతుల్లో తైక్వాండో క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చింది. బాలబాలికలు కలిపి 30రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్వంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ జిల్లాలో ఐదు కేంద్రాల్లో తైక్వాండో జూడో క్రీడలపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లం మురళి తెలిపారు. చోడవరం, అనకాపల్లిపట్టణం, అనకాపల్లిలో గాంధీనగరం, పరవాడ, బుచ్చెయ్యపేట(వడ్డాది) ప్రాంతాల్లో వేసవి ఉచిత శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. 5నుంచి 16సంవత్సరాల వయస్సు కలిగిన బాలబాలికలు ఈ శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 1 నుంచి నెలాఖరు వరకూ నిర్వహించే శిక్షణ తరగతులకు విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో హాజరవుతున్నట్టు మురళి తెలిపారు. యోగాలో .. అందరికీ ఆరోగ్యాన్ని అందించే యోగాలో శిక్షణ ఇచ్చేందుకు చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం ప్రారంభించారు. ఇక్కడి ఉషోదయ విద్యాసంస్థల ప్రాంగణంలో ఉన్న యోగా కేంద్రంలో ఉచితంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని యోగా గురువు పుల్లేటి సతీష్ తెలిపారు. యోగా వల్ల విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం, శరీర సౌష్టవంతోపాటు ఏకాగ్రత లభిస్తుందన్నారు. ఈ కేంద్రాన్ని ఈనెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. -
ఏపీ వెటర్నరీ అసోసియేషన్ జోన్–1 జాయింట్ సెక్రటరీగా ప్రదీప్ కుమార్
ముంచంగిపుట్టు: ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసోసియేషన్ జోన్–1 జాయింట్ సెక్రటరీగా స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ లావేటి ప్రదీప్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని వెట్ హోమ్లో ఆదివారం నిర్వహించిన అసోసియేషన్ ఎన్నికల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు తోటి పశువైద్యాధికారులు, సిబ్బంది, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశుసంవర్ధక రంగ అభివృద్ధికి, పశువైద్యుల సంక్షేమానికి మరియు వృత్తిపరమైన ఐక్యత కోసం అంకితభావంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అందరి సహకారం కోరారు. -
రహదారి కోసం వినూత్న నిరసన
తాడిగుడ జలపాతం మార్గంలో డోలీ యాత్ర అనంతగిరి (అరకులోయ టౌన్): తమ గ్రామానికి రహదారి నిర్మించాలని కోరుతూ అనంతగిరి మండలంలోని అమలగుడ గ్రామ గిరిజనులు ఆదివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మండల కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమలగుడ నుంచి తాడిగుడ జలపాతానికి వెళ్లే మార్గంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర ‘డోలీ యాత్ర’ చేపట్టి ప్రభుత్వానికి తమ గోడును వినిపించుకున్నారు. విన్నవించినా స్పందన కరువు : ఈ సందర్భంగా గ్రామస్తులు కొర్రా గోపి, కౌసల్య మాట్లాడుతూ.. గ్రామంలో రహదారి, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని గతంలోనే ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (గ్రీవెన్స్) ద్వారా కలెక్టర్కు, ఎంపీడీవోకు వినతిపత్రాలు సమర్పించామని తెలిపారు. అయినప్పటికీ, ఇప్పటివరకు అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటకులకు తప్పని ఇబ్బందులు : ఈ రహదారి కేవలం స్థానిక గిరిజనులకే కాకుండా, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తాడిగుడ జలపాతానికి వెళ్లే పర్యాటకులకు కూడా ప్రధాన మార్గమని వారు గుర్తు చేశారు. ప్రతిరోజూ అధిక సంఖ్యలో పర్యాటకులు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారని, సరైన రోడ్డు లేక అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇప్పటికై నా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి, అమలగుడ గ్రామం వరకు తక్షణమే రహదారి నిర్మించాలని, గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. -
క్రీడాకారులు ఫూల్
స్విమ్మింగ్ పూల్..విశాఖ స్పోర్ట్స్: ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతుల్లోకి ఈ కాంప్లెక్స్ వెళ్లినప్పటి నుంచి క్రీడాకారుల శిక్షణ గాలికొదిలేసి, కేవలం లాభార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ ఆస్తులపై పెత్తనం చెలాయిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో సుమారు 1500 నుంచి 1800 మంది వరకు, వింటర్ సీజన్లో కూడా రోజుకు 300 మందికి పైగా శిక్షణ కోసం ఇక్కడికి వస్తుంటారు. సమ్మర్ సీజన్లో ఒక్కొక్కరు నుంచి రూ.3000 వసూలు చేస్తున్నారు. ఇంతమంది వస్తున్నా అందుకు తగ్గట్టుగా కనీస సదుపాయాలు కల్పించడంలో ప్రైవేట్ నిర్వాహకులు ఘోరంగా విఫలమయ్యారు. తీవ్ర ఇబ్బందులు శిక్షణార్థుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. పూల్లో ఈత నేర్చుకోవడం కంటే, ఒడ్డున నిరీక్షించడానికే ఎక్కువ సమయం వృథా అవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మూడు గంటల పాటు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ టైమ్ స్లాట్లు కేటాయించి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, కనీస పర్యవేక్షణ కరువైంది. 16 అడుగుల లోతు గల ప్రధాన పూల్..పక్కనే ఉన్న 3 నుంచి 6 అడుగుల లెర్నింగ్ పూల్లో కలిపి నిత్యం వందలాది మంది కిక్కిరిసిపోతున్నారు. గంట స్లాట్లో ఒక చిన్నారికి కేవలం అరనిమిషం పాటు మాత్రమే నీటిలో స్విమ్మింగ్ చేసే అవకాశం దక్కుతోందని, మిగిలిన 20 నిమిషాల నుంచి అరగంట సమయం కేవలం క్యూలో నిలబడటానికే సరిపోతోందని వాపోతున్నారు. కోచ్ల కొరత వందలాది మంది పిల్లలకు కేవలం ముగ్గురు కోచ్లు, నలుగురు లైఫ్ గార్డులు మాత్రమే అందుబాటులో ఉండటం నిర్వాహకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. శిక్షణ గురించి ప్రశ్నిస్తే ‘కోచ్లు దొరకడం లేదు’ అనే రొటీన్ సమాధానం వస్తోందని, అసలు బాధ్యతాయుతమైన కాంట్రాక్టర్ ఎక్కడ ఉంటాడో కూడా తెలియని పరిస్థితి నెలకొందని క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దలు స్వతంత్రంగా ప్రాక్టీస్ చేద్దామన్నా విపరీతమైన రద్దీ వల్ల నిరాశే ఎదురవుతోంది. ఎంవీపీ కాలనీలోని ఎస్3 స్పోర్ట్స్ కాంప్లెక్స్లోనే ఇదే పరిస్థితి ఇదే తరహా పరిస్థితి ఎంవీపీ కాలనీలోని ఎస్3 స్పోర్ట్స్ కాంప్లెక్స్లోనూ కనిపిస్తోంది. ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల క్రీడాకారుల భద్రత, రక్షణ, నాణ్యమైన శిక్షణ అనే అంశాలు మరుగున పడిపోయి, క్రీడా ప్రాంగణాలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయనేది నగ్న సత్యం. విశాఖ కీర్తి ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికై నా జీవీఎంసీ కమిషనర్ , కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, ఈ ప్రైవేట్ సంస్థల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలని, ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు న్యాయం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. -
నూకాంబికను దర్శించుకున్న క్రీడల ఉన్నతాధికారి
బంగార్రాజు దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ న్యూఢిల్లీ డైరెక్టర్ తటపర్తి బంగార్రాజు దంపతులు కుటుంబ సమేతంగా ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు. న్యూఢిల్లీ నుంచి విశాఖ ఎయిర్పోర్డుకు వచ్చి అక్కడ నుంచి కారులో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ బంగార్రాజు దంపతులను శాలువాలతో సత్కరించి అమ్మవారి ఫొటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ టెన్నికోయిట్ అసోసియేషన్ చైర్మన్ కె.ఎన్.వి. సత్యనారాయణ పాల్గొన్నారు. -
పోయిన పర్సు బాధితుడికి అందజేత
మునగపాక : మునగపాక పీఏస్కు చెందిన హెచ్సీ సాగర్ మానవత్వం చాటుకున్నారు. ఉమ్మలాడకు చెందిన ఆడారి సాయి ఆదివారం సాయంత్రం తన పర్సును పోగొట్టుకున్నాడు. ఈ పర్సులో రూ.15వేల నగదుతో పాటు పలు ఏటీఎం కార్డులు ఉన్నాయి. పర్సు కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో నిస్సహాయకునిగా ఉండిపోయాడు. కాగా కేసు విచారణలో భాగంగా ఆదివారం రాత్రి ఉమ్మలాడ వెళ్లిన హెచ్సీ సాగర్కు పర్సు కనిపించింది. దీంతో పర్సులోని అడ్రసు గుర్తించి బాధితుడు సాయికి ఫోన్ చేశారు. సంబంధిత పర్సును మునగపాక పోలీసు స్టేషన్లో బాధితుడు సాయికి హెచ్సీ సాగర్ అందజేశారు. దీంతో స్టేషన్ ఎస్ఐ ప్రసాదరావుతో పాటు ఇతర సిబ్బంది సాగర్ మానవత్వం పట్ల అభినందనలు తెలిపారు. పోయిన పర్సు దొరకడంతో హెచ్సీ సాగర్కు బాధితుడు సాయి కృతజ్ఞతలు తెలిపాడు. -
అంబులెన్సులు మూలకు.. గిరిజనుల ప్రాణాలు గాలికి..
పట్టించుకోని అధికారులు సీలేరు: జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్య సేవలు అందక గిరిజనులు విలవిలలాడుతున్నారు. అత్యవసర సమయంలో రోగులను మెరుగైన చికిత్స కోసం మైదాన ప్రాంతాలకు తరలించే అంబులెన్సులు నెలల తరబడి మూలన పడి ఉన్నా, జిల్లా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతం.. సమస్యలు అధికం సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఇక్కడ రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణులు, ఇతర అత్యవసర వైద్యం అవసరమయ్యే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మెరుగైన చికిత్స కోసం ఇక్కడి నుంచి రోగులను 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతపల్లి లేదా చింతూరు ఏరియా ఆసుపత్రులకు తరలించాల్సి ఉంటుంది. మూలకు చేరిన రెండు వాహనాలు సీలేరు ఆసుపత్రికి చెందిన ప్రధాన అంబులెన్సు మూడు నెలల క్రితం మరమ్మతులకు గురై ప్రస్తుతం పాడేరులోని గ్యారేజీలో ఉంది. దీని స్థానంలో అధికారులు ఒక పాత అంబులెన్సును కేటాయించారు. అయితే అది కేవలం నెల రోజులు మాత్రమే తిరిగి, మళ్లీ చెడిపోయింది. ప్రస్తుతం అది దుప్పులవాడ సబ్ సెంటర్ వద్ద నిరుపయోగంగా పడి ఉంది. గత మూడు నెలలుగా సీలేరు ఆసుపత్రికి సరైన అంబులెన్సు సౌకర్యం లేక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. జెన్కో అంబులెన్సే దిక్కు ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో జెన్కో సంస్థకు చెందిన సీఎస్సార్ అంబులెన్సు మాత్రమే అందుబాటులో ఉంది. ఒకే వాహనం అటు జెన్కో ఉద్యోగులకు, ఇటు సీలేరు ఆసుపత్రి పరిధిలోని సుమారు 50 గూడాల గిరిజన ప్రజలకు సేవలు అందించాల్సి వస్తోంది. ఏకకాలంలో ఇద్దరు ముగ్గురు రోగులకు అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎవరిని తరలించాలో తెలియక సిబ్బంది, రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వైద్య శాఖ అధికారులు ఇప్పటికై నా స్పందించి సీలేరు ఆసుపత్రికి తక్షణమే ఒక నూతన అంబులెన్సును మంజూరు చేయాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గ్యారేజీలో ఉన్న పాత వాహనాలకు త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. -
ఆర్మీ ఉద్యోగి భౌతికకాయం ఊరేగింపు
పట్టణంలో ఊరేగింపుగా తీసుకువెళుతున్న ఆర్మీ ఉద్యోగి రాపేటి పూర్ణచంద్రరావు భౌతికకాయం అనకాపల్లి టౌన్: వెంకుపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి రాపేటి పూర్ణచంద్రరావు(37) ఆర్మీలో విధులు నిర్వహిస్తూ శుక్రవారం డెహ్రాడూన్లో మృతి చెందారు. ఈయన మృతదేహం ఆదివారం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఊరేగింపుగా, పట్టణం గుండా గ్రామానికి చేరుకుంది. గ్రామానికి చేరుకున్న మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు అమర్రహే అంటూ నినాదాలు చేశారు. తన విధుల్లో భాగంగా ట్రక్ నడుపుతుండగా ప్రమాదానికి గురై మరణించినట్టు బంధువులు తెలిపారు. చంద్రశేఖర్కు భార్య గ్రేషి, ఐదేళ్ల కుమారుడు కనిష్క్, రెండేళ్ల కుమార్తె కారుణ్య ఉన్నారు. ఈ అనుకోని సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
పంట పొలాలు ముంపునకు గురైతే బాధ్యులెవరు..?
మునగపాక: భూసేకరణ చేపట్టకుండా మునగపాక దరి సాగునీటి కాలువల్లో రెయిలింగ్ పనులు చేపట్టడం సరికాదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త కరణం ధర్మశ్రీ విమర్శించారు. పూడిమడక రోడ్డు విస్తరణలో భాగంగా ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువల్లో రెయిలింగ్ పనులు చేపట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్తో కలిసి సాగునీటి కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ మునగపాక, తోటాడ రెవెన్యూ పరిధిలో వేలాది ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించే కాలువలను మూసేసి రెయిలింగ్ పనులు చేపట్టడం సరికాదన్నారు. ముందుగా రైతుల నుంచి భూసేకరణ చేపట్టి కాలువల నిర్మాణాలు చేపడితే బాగుండేదన్నారు. అలా కాకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువల్లో రెయిలింగ్లు ఏర్పాటు చేయడం ద్వారా పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే విపత్తు సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. రహదారి విస్తరణను ఈ ప్రాంత ప్రజలతో పాటు రైతులు కూడా సమ్మతిస్తున్నారని అయితే రైతులకు నష్టం వాటిల్లేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరికాదన్నారు. బాధితులకు ఇచ్చే పరిహారం నేరుగా అకౌంట్లో వేసేలా చూడాలన్నారు. బాధితులకు అండగా వైఎస్సార్సీపీ నిలబడుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు లోచల సుజాత,వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు,మాజీ ఎంపీపీ దాసరి గౌరీలక్ష్మి అప్పారావు, పాటిపల్లి ఎంపీటీసీ ఇల్లా శిరీషా నాగేశ్వరరావు పాల్గొన్నారు. భూసేకరణ చేపట్టకుండా సాగునీటి కాలువల్లో రెయిలింగ్ పనులు సరికాదు బాధితులకు పరిహారం నేరుగా అందించాలి టీడీఆర్లు వద్దంటున్నా ప్రభుత్వంలో కానరాని స్పందన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త ధర్మశ్రీ -
లేబర్ కోడ్ జీవో ప్రతుల దహనం
చింతపల్లి: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలంటూ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జీవో ప్రతులను పారిశుధ్య కార్మికులతో కలిసి ఆస్పత్రి ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం కార్మికులపై కక్ష కట్టి నాలుగు కోడ్లను అమలు చేసేందుకు చూస్తుందన్నారు. ఆ కోడ్లు అమలు జరిగితే బ్రిటీష్ కాలంలో పోరాటం చేసి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలు రద్దవుతాయన్నారు. చట్టాలను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా 30 కోట్ల మంది రోడ్డెక్కి ఆందోళన చేసినా ఫలితం లేకపోయిందన్నారు. కార్మికులు చేస్తున్న పోరాటాలకు కేంద్రం సరైన గౌరవం ఇవ్వడం లేదన్నారు. కోడ్లు అమలైతే ఎనిమిది గంటల పనిని 12 గంటలకు పొడిగిస్తారన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పాలన చూస్తుంటే బ్రిటీష్ కాలంలో ఉన్నామన్న పరిస్థితి నెలకొందన్నారు. దీనిలో ఆస్పత్రి పారిశుధ్య కార్మికుల సంఘ అధ్యక్షుడు రామారావు, లక్ష్మి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షాల జోరు
పాడేరు: మన్యంలో వర్షాల పరంపర కొనసాగుతోంది. ఉదయం పూట మంచు కురుస్తున్నా, మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. అయితే సాయంత్రం అయ్యేసరికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం పాడేరుతో పాటు ఏజెన్సీలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షం వల్ల జనజీవనానికి కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ, రైతుల్లో మాత్రం ఆనందం వ్యక్తమవుతోంది. ఈ వర్షాలకు వ్యవసాయ భూములన్నీ తడిసి ముద్దవుతుండటంతో, వేసవి దుక్కులకు ఎంతో మేలు జరుగుతుందని గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జి.మాడుగులలో.. జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు మరియు భీకర శబ్దాలతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగులు పడటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వర్షం ధాటికి మండలంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ముఖ్యంగా లంబసింగి–జి.మాడుగుల, పాడేరు జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండటంతో, మట్టి రోడ్డు కాస్తా బురదమయంగా మారింది. దీనివల్ల వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణ పనులకు కొంత సమయం ఆటంకం ఏర్పడింది.ఉరుములు, మెరుపుల ప్రభావంతో జి.మాడుగుల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.భీకరమైన శబ్దాలతో పిడుగులు పడటంతో ఏ క్షణాన ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని గ్రామస్తులు వణికిపోయారు. అయితే, ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యవసాయ పనుల్లో రైతుల నిమగ్నం -
పడకేసిన వైద్యం
కేజీహెచ్ మందుల కౌంటర్ల వద్ద రోగుల పడిగాపులుఖాళీల భర్తీలో ప్రభుత్వం విఫలం ఆస్పత్రుల్లో బదిలీల వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉన్న వైద్యులలో కొందరు ఆస్పత్రికి వచ్చి కేవలం ముఖ గుర్తింపు హాజరు వేసి, ఆపై తమ వ్యక్తిగత పనులకు లేదా ప్రైవేటు ప్రాక్టీసులకు వెళ్లిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నర్సులు, ఫార్మసిస్టులే ‘డాక్టర్ల’ అవతారం ఎత్తుతున్నారు. తమకున్న పరిమిత వైద్య పరిజ్ఞానంతో వారు మందులు రాసి ఇస్తున్నారు. ఇది ఒకరకంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే. అత్యవసర పరిస్థితుల్లో రోగులు చేసేదేమీ లేక, తమ జేబులు ఖాళీ అయినా సరే ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల బాట పడుతున్నారు. యూపీహెచ్సీ, పీహెచ్సీల్లో అందుబాటులో లేని వైద్యులు వైద్యుల అవతారం ఎత్తుతున్న నర్సులు, ఫార్మసిస్టులు కాని రాని స్పెషాలిస్ట్ వైద్యులు 66 యూపీహెచ్సీలు, 9 పీహెచ్సిల్లో అరకొర సౌకర్యాలు -
మోదమ్మకు నీరాజనం
ప్రత్యేక పూజలు నిర్వహి స్తున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు.శివరత్నం దంపతులు,ఆలయ కమిటీ ప్రతినిధులువిద్యుత్ వెలుగుల్లో మోదకొండమ్మ ఆలయంసాక్షి, పాడేరు: తెలుగు రాష్ట్రాల గిరిజనుల ఆరాధ్యదైవం, పాడేరు గ్రామ దేవత శ్రీ మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల తొలిరోజే పాడేరు పురవీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ ఆదివారం వేకువజామున 5.30 గంటల నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, గూడెంకొత్తవీధి జెడ్పీటీసీ శివరత్నం దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం వారికి వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాల హోరులో పట్టువస్త్రాలతో ఎమ్మెల్యే దంపతులు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు దంపతులు ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి భక్తిశ్రద్ధలతో వస్త్రాలను అందజేశారు. లోక కల్యాణార్థం ఎమ్మెల్యే దంపతులు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ● పుట్టినరోజు వేడుకల సందర్భంగా మోదకొండమ్మ తల్లి విగ్రహాన్ని నూతన వర్ణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల తేదీలను కూటమి ప్రభుత్వం మే 17, 18, 19 తేదీలకు మార్చినప్పటికీ, భక్తులు మాత్రం తమ మనోభావాలకు అనుగుణంగా పాత తేదీలనే పరిగణనలోకి తీసుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మైదాన ప్రాంతాల నుంచే కాకుండా స్థానికంగా ఉన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఘటాలు సమర్పించారు. ● ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఉచిత ప్రసాదాల పంపిణీని ప్రారంభించారు. విశ్వబ్రాహ్మణ సంఘం నేత కొమ్మోజి వెంకటరమణ, పలువురు భక్తుల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు కూడా సురేష్, ఉర్వశిరాణి, సుబ్రహ్మణ్యం, ఆలయ కమిటీ సభ్యులు సల్లా రామకృష్ణ, బోనంగి వెంకటరమణ పాల్గొన్నారు. 12న ప్రధాన వేడుక: ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు శ్రీ మోదకొండమ్మ తల్లి అసలు పుట్టినరోజు వేడుకను ఈనెల 12వ తేదీన (మంగళవారం) అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు.మంగళవారం ఉదయం 101 డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారి ఘటాలను పాడేరు పురవీధుల్లో ఊరేగిస్తామని తెలిపారు. మధ్యాహ్నం భారీ అన్నసమారాధన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు మరియు ఘటాలతో శోభాయాత్ర ఉంటుందన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు.. : వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, భక్తులందరూ ఈ వేడుకలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ విశేశ్వరరాజు కోరారు. పాడేరులో ఆధ్యాత్మిక కాంతులు మన్యం ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారు ఆదివారం నాడు కొత్త రంగుల అలంకరణలో భక్తులకు శోభాయమానంగా దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పుట్టినరోజు వేడుకల (జన్మదినోత్సవం) సందర్భంగా ఆలయం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంగురంగుల అలంకరణలు, మిరుమిట్లు గొలిపే కాంతులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయానికి విద్యుత్ వెలుగుల శోభ నెలకొంది. ఘనంగా పుట్టినరోజు వేడుకలు ప్రారంభం ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు దంపతులు తొలిపూజలు అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ తరలివచ్చిన భక్తజనం -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు పాల్గొన్నారు. ● శ్రీ వరావరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రంలను అందజేశారు. -
అధికారుల ‘చెత్త’ ఆలోచన
కొయ్యూరు: అధికారుల అనాలోచిత నిర్ణయాలకు బూదరాళ్ల పంచాయతీకి కేటాయించిన ట్రాక్టరే నిదర్శనం. సాధారణంగా చెత్త తరలింపు కోసం రహదారులు బాగున్న ప్రాంతాలకు ట్రాక్టర్లు ఇస్తారు. కానీ, అందుకు భిన్నంగా కొండ ప్రాంతంలో ఉండి, కనీసం వాహనం వెళ్లడానికి వీలులేని బూదరాళ్ల పంచాయతీకి ట్రాక్టర్ను కేటాయించారు. ఫలితంగా ఆ వాహనం గత మూడేళ్లుగా మూలన పడి తుప్పు పడుతోంది. వింత పోకడలు.. అదనపు భారం ఈ కేటాయింపులో మరో విచిత్రం ఏమిటంటే.. ట్రాక్టర్ ఇంజిన్ను 2023లో ఇవ్వగా, దానికి తగిలించే ట్రాలీని (తొట్టెను) 2025 డిసెంబర్లో ఇచ్చారు.బూదరాళ్ల పంచాయతీకి ఇంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఏడాదికి రూ. 1.30 లక్షలు కూడా దాటదు. ట్రాక్టర్కు డ్రైవర్ జీతం నెలకు రూ. 15 వేల చొప్పున ఏడాదికి రూ. 1.80 లక్షలు అవుతుంది. దీనికి డీజిల్, మరమ్మతుల ఖర్చులు కలిపితే ఏడాదికి రూ. 2 లక్షలు దాటుతుంది. ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీకి ఇది మోయలేని భారం. అవసరం ఉన్న చోట ఇవ్వకపోవడమే శాపం కొయ్యూరు మండలంలో 33 పంచాయతీలు ఉండగా, రాజేంద్రపాలెం, బూదరాళ్లను గ్రేడ్–1 పంచాయతీలుగా గుర్తించారు. బూదరాళ్లలోని ఐదు గ్రామాల్లో ట్రాక్టర్ తిరగడానికి అనువైన వీధులు పది కూడా లేవు. అదే ఈ ట్రాక్టర్ను రాజేంద్రపాలెం వంటి మైదాన ప్రాంత పంచాయతీకి ఇచ్చి ఉంటే ఉపయోగకరంగా ఉండేది. ప్రస్తుతం రాజేంద్రపాలెంలో రిక్షాల ద్వారా చెత్తను తరలిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి లీలాకృష్ణ స్పందిస్తూ.. గ్రామాల్లో ట్రాక్టర్ వెళ్లడానికి దారి లేకపోవడంతో ప్రస్తుతం రిక్షాల ద్వారానే చెత్తను తరలిస్తున్నాం. ట్రాక్టర్ వినియోగంలో లేని విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం అని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, ఈ ట్రాక్టర్ను కొయ్యూరు, రాజేంద్రపాలెం లేదా చీడిపాలెం వంటి అవసరమున్న పంచాయతీలకు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. కొండపై గ్రామానికి ట్రాక్టర్ కేటాయింపు! -
అరకు పైనరీ అందాలు అద్భుతం
● అరుణాచల్ప్రదేశ్అటవీ శాఖ బృందం ప్రశంస డుంబ్రిగుడ: స్థానిక ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న అరకు పైనరీ అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని అరుణాచల్ప్రదేశ్ అటవీ శాఖ బృందం చైర్మన్ నాలోంగ్ మిజే, నాంసై ఎమ్మెల్యే జెడ్ నామ్సూన్ ప్రశంసించారు. శుక్రవారం రాత్రి ఇక్కడ పైనరీని సందర్శించి, బస చేశారు. గిరిజన సంప్రదాయ, సంస్కృతి పరిరక్షణపై హర్షం వ్యక్తం చేశారు. వీఎస్ఎస్ సభ్యులు, పైనరీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన గిరిజన వంటకాలు, అరకు కాఫీని ఆస్వాదించారు. సంప్రదాయ థింసా నృత్యంతో సందడి చేశారు. అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వం పీసీడీఎఫ్ పి.సుబ్రహ్మణ్యం, ఏపీఎఫ్డీసీ శ్రీకంఠనాథ్రెడ్డి, పాడేరు డీఎఫ్వో ఉమా మహేశ్వర్, పైనరీ మేనేజర్ చంద్రశేఖర్, వీఎస్ఎస్ చైర్మన్ భారతి పాల్గొన్నారు. -
సకాలంలో గ్యాస్ అందక ఇబ్బందులు
● ఉదయం 10.30 నుంచి రాత్రి 8 గంటల వరకు పడిగాపులు ● మాకవరపాలెంలో ఆందోళనకు దిగిన వినియోగదారులు మాకవరపాలెం: సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న హెచ్పీ గ్యాస్ వినియోగదారులకు ప్రతి శనివారం, సోమవారం గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తుంటారు. అయితే గత నెల రోజులుగా సకాలంలో సిలిండర్లు అందించడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలోని సుమారు 50 మంది వినియోగదారులు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటలైనా గ్యాస్ వ్యాన్ రాకపోవడంతో పడిగాపులు కాశారు. తీరా 8 గంటలకు వ్యాన్ వచ్చినా 20 సిలిండర్లు మాత్రమే ఉండడంతో వినియోగదారులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న 50 మందికి సిలిండర్లు ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని ఆందోళనకు దిగారు. ఇదే విషయమై సివిల్ సప్లయి డీటీ అశోక్కు వినియోగదారులు ఫోన్లో ఫిర్యాదు చేశారు. మహిళలు ఉదయం నుంచి రాత్రి వరకు గ్యాస్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఏ సమయంలో గ్యాస్ పంపిణీ చేస్తారో ముందుగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామన్నారు. దీనిపై స్పందించిన డీటీ మాట్లాడుతూ సిలిండర్ల కోసం ఉన్న 50 మందికీ గ్యాస్ పంపిణీ చేస్తామని తెలిపారు. సోమవారం నుంచి ఏ సమయంలో గ్యాస్ అందజేస్తామనే విషయాన్ని వినియోగదారులకు తెలియజేయడంతో పాటు నిర్ణీత సమయానికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
నీలిబందలో వైద్య శిబిరం
రోలుగుంట: మండలం అర్ల గిరిజన పంచాయతీ శివారు నీలబంద గ్రామంలో బుచ్చింపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో శనివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నీలిబందలో జ్వరాలు శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. వైద్యుడు ఎల్.శివప్రసాద్ సిబ్బందితో కలసి గ్రామంలో జ్వరపీడితుల ఇళ్లను సందర్శించారు. రోగులను కలసి వారి పరిస్థితులు తెలుసుకున్నారు. దీనిలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరంలో రోగులకు వైద్య పరీక్షలు చేశారు. రక్తపు నమూనాలు తీశారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు ఆరోగ్య జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని వేడి ఆహారం, మరగకాచిన నీటిని తాగాలన్నారు. -
ఓ(ఆ)న్ డ్యూటీ!
సాక్షి, విశాఖపట్నం: దేశంలోని ప్రధాన పోర్టులతో పోటీపడుతూ సముద్ర వాణిజ్య రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాఖపట్నం పోర్టు.. ప్రస్తుతం కొందరు అధికారుల ‘సొంత’ ప్రయోజనాలకు వేదికగా మారుతోంది. పోర్టు ప్రగతిని పరుగులు పెట్టించాల్సిన యంత్రాంగం, దిశానిర్దేశం లేక చతికిలపడుతోంది. ముఖ్యంగా మార్కెటింగ్ విభాగం పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్క’లా తయారైంది. ఏటా ప్రతిష్టాత్మక ఐఐఎంల నుంచి మేధావులను నియమించుకుంటున్నా, వారి మేధస్సు పోర్టు అభ్యున్నతికి కాకుండా.. ట్రాఫిక్ విభాగాధికారుల వ్యక్తిగత పనులకు పరిమితమవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. విధి నిర్వహణలో ఉండాల్సిన సిబ్బందిని అధికారుల సొంత పనులకు వినియోగించుకుంటూ ‘ఆన్ డ్యూటీ’ని కాస్తా ‘ఓన్ డ్యూటీ’గా మార్చేయడం పోర్టు భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. ప్రచారమెక్కడ? ప్రగతి ఏది? ఒక సంస్థ అభివృద్ధి చెందాలంటే కేవలం మౌలిక సదుపాయాలు ఉంటే సరిపోదు.. ఆ వసతులను ప్రపంచానికి చాటిచెప్పే బలమైన ప్రచార యంత్రాంగం ఉండాలి. విశాఖ పోర్టులో కంటైనర్ టెర్మినల్ సహా తొమ్మిది సంస్థలు కార్గో నిర్వహణలో పాలుపంచుకుంటున్నాయి. నిజానికి ఈ సంస్థల నుంచి కార్గో ఉత్పత్తి పెరగాలంటే పోర్టు యాజమాన్యం చొరవ చూపాలి. ఎప్పటికప్పుడు వాణిజ్య వర్గాలతో సమావేశమై, ‘ట్రేడ్ మీట్స్’ నిర్వహిస్తూ ఎగుమతి, దిగుమతిదారులకు అవసరమైన సౌకర్యాలపై చర్చించాలి. కానీ, ఇక్కడ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పోర్టు ఆదాయంలో 90 శాతం కేవలం భూములు, భవనాల లీజుల ద్వారానే వస్తోంది తప్ప, సరకు రవాణా నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయ వృద్ధి శూన్యం. కార్గో నిర్వహణ చేసే ప్రైవేటు సంస్థలు వృద్ధి సాధిస్తున్నా, దానివల్ల పోర్టుకు రావాల్సిన రాబడి పెరగకపోవడం అధికారుల ఉదాసీనతకు నిలువెత్తు నిదర్శనం. ఐఐఎం మేధస్సు.. ఫైళ్లకే పరిమితం పోర్టు కార్యకలాపాలను విస్తరించాలని, అంతర్జాతీయ స్థాయి విక్రయ వ్యూహాలను రచించాలని ప్రతి రెండేళ్లకోసారి ఐఐఎం నిపుణులను నియమించుకుంటున్నారు. వీరిని మార్కెటింగ్ ప్రమోషన్ కోసం వినియోగించాల్సి ఉండగా, ట్రాఫిక్ విభాగాధికారులు వీరిని తమ వ్యక్తిగత వ్యవహారాలు చూసుకునే ‘అసిస్టెంట్లు’గా మార్చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయ ఫైళ్లను సిద్ధం చేయడం, అధికారుల ఇంటి పనులు, వ్యక్తిగత పనులు చక్కబెట్టడానికే వీరి సమయం సరిపోతోందని సమాచారం. పోర్టు మార్కెటింగ్కు ఊపిరి పోయాల్సిన నిపుణులను ఇలా వినియోగించుకోవడం వల్ల కొత్త వ్యాపార అవకాశాలన్నీ పక్కదారి పడుతున్నాయి. సామర్థ్యం ఉన్నా.. సాఫల్యమెక్కడ? కాగితాల్లో పోర్టు సామర్థ్యం అద్భుతంగా పెరుగుతోంది. 2008–09లో 80 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న సామర్థ్యం ఇప్పుడు 120 మిలియన్ టన్నులకు చేరింది. కానీ, ఆ సామర్థ్యానికి తగ్గట్టుగా కార్గో నిర్వహణ జరుగుతుందా అంటే సమాధానం ‘లేదు’ అనే వస్తోంది. ఉదాహరణకు కంటైనర్ టెర్మినల్ సామర్థ్యం 1.3 మిలియన్ టీయూవీలు కాగా, ప్రస్తుతం అందులో సగం కూడా వాడకం జరగడం లేదు. ఇతర ప్రాంతాలకు మళ్లుతున్న కార్గోను ఆకర్షించేలా దూకుడుగా వ్యవహరించాల్సిన పోర్టు ట్రాఫిక్ విభాగం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సరకు రవాణా వృద్ధి కూడా అక్కడ ఉన్న ప్రైవేటు సంస్థల సొంత ప్రయత్నాలే తప్ప, పోర్టు అధికారుల చొరవ ఏమాత్రం లేదన్నది బహిరంగ రహస్యం. నిర్లక్ష్యం నీడలో ‘సాగర’ వాణిజ్యం పోర్టుకు వచ్చే నౌకలు బెర్తుల కోసం రోజుల తరబడి బయటే వేచి చూడాల్సిన దైన్యం నెలకొంది. ట్రాఫిక్ విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో, అక్కడ అధికారులదే రాజ్యంగా మారింది. సంస్థ ప్రయోజనాల కంటే వ్యక్తిగత లాభాలకే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ట్రేడ్ మీట్లు నిర్వహించి పోర్టు సౌకర్యాలను వివరించాల్సిన బాధ్యతను గాలికొదిలేశారు. ఎక్కడో ఒకచోట ఏడాదికో, రెండేళ్లకోసారి తూతూమంత్రంగా సమావేశాలు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు. మార్కెటింగ్ విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ విభాగమే సర్వస్వంగా వ్యవహరిస్తోంది. అధికారుల ఈ ‘సొంత’ పోకడల వల్ల విశాఖ పోర్టు అపారమైన నష్టాన్ని చవిచూస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, మార్కెటింగ్ విభాగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి, పోర్టు ప్రగతికి బాటలు వేయకపోతే.. విశాఖ పోర్టు తన పూర్వ వైభవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పోర్టు వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
అడవినే నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు అడ్డాకుల సేకరణ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వడం లేదు. ప్రభుత్వం, జీసీసీ అడ్డాకులకు కనీస మద్దతు ధర ప్రకటించకపోవడం, కొనుగోళ్లకు దూరంగా ఉండడంతో దళారీ వ్యాపారులదే రాజ్యమవుతోంది. ప్లాస్టిక్ నిషేధం నేపథ్యంలో అడ్డాకులకు మైదాన
సాక్షి, పాడేరు: తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలల్లో అడ్డాకులకు ఆదరణ బాగుంది. దీంతో అడ్డాకుల వ్యాపారం మన్యం సంతల్లో భారీగా జరుగుతోంది. అయితే గిరిజనులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. అడవుల్లో ప్రాణాలకు తెగించి అడ్డాకులను సేకరిస్తున్న గిరిజనులు వాటిని బాగా ఆరబెట్టి, ఎండిన తరువాత కావిడలుగా కట్టి సంతలకు మోసుకెళ్లి అమ్మకాలు జరుపుతుంటారు. అడవుల్లో జంతువుల బెడదను కూడా తప్పించుకుని కష్టపడి అడ్డాకులను సేకరిస్తే ధరల విషయంలో మాత్రం అన్యాయం జరుగుతుంది. వారపు సంతల్లో వ్యాపారుల దోపిడీ ఏజెన్సీలోని వారపు సంతల్లో రెండు వారాలుగా అడ్డాకుల వ్యాపారం జరుగుతుంది. వంట్లమామిడి, హుకుంపేట, అరకు, సుంకరమెట్ట, డముకు, గుత్తులపుట్టు, జి.మాడుగుల, అన్నవరం, లోతుగెడ్డ, చింతపల్లి, దారకొండ వారపు సంతల్లో ప్రతి వారం రూ.లక్షల్లో అడ్డాకుల వ్యాపారం సాగుతుంది. గిరిజనులంతా మారుమూల గ్రామాల నుంచి అడ్డాకులను కాలినడకన సంతలకు తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నారు. కావిడ అడ్డాకుల(రెండు దిండ్లు)కు మైదాన ప్రాంతాలలో రూ.6 వేలు నుంచి రూ.8 వేల వరకు ధర ఉంది. అయితే ఎస్.కోట, గాజువాక, కొత్తకోట, నర్సీపట్నం వ్యాపారులు కేవలం రూ.3 వేల ధరకు మించి కొనుగోలు చేయకపోవడంతో గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడంతో అడ్డాకులను అమ్మే గిరిజన రైతులంతా ఉసూరుమంటున్నారు. తక్కువ ధరకు భారీగానే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు లారీలు, వ్యాన్లలో మైదాన ప్రాంతాలకు తరలించి మంచి లాభాలు పొందుతున్నారు. కొనుగోలుకు జీసీసీ దూరం గిరిజనుల అడవుల్లో సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించి కొనుగోలు చేయాల్సిన జీసీసీ.. 15 ఏళ్ల నుంచి దూరంగానే ఉంది. అడ్డాకులను జీసీసీ కొనుగోలు చేయకపోవడంతో సంతల్లో దళారీ వ్యాపారులదే రాజ్యంగా మారింది. ప్లాస్టిక్ నిషేధంతో అడ్డాకులకు మైదాన ప్రాంతాల్లో గిరాకీ పెరిగింది. హోటళ్లలో అడ్డాకులను అధికంగా వినియోగిస్తున్నారు. నగర ప్రాంతాల్లో హోటళ్ల యాజమానులు అడ్డాకులను వ్యాపారుల నుంచి అధిక ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఆ మేరకు గిరిజనులకు ఆ ధర దక్కడం లేదు. వంట్లమామిడి ఘాట్ రోడ్డులో అడ్డాకులను విక్రయిస్తున్న గిరిజనులు ఏజెన్సీ సంతల్లో దళారుల దోపిడీ మైదాన ప్రాంతాల్లో అడ్డాకులకు డిమాండ్ మన్యంలో గిట్టుబాటు ధర కరువు కష్టానికి తగ్గ ఫలితమివ్వని అడ్డాకుల సేకరణ ఉసూరుమంటున్న గిరిజనులు జీసీసీ కొనుగోలు చేయాలి అడ్డాకులకు సంతల్లో దళారీల బెడద ఉంది. పూర్వం వలే జీసీసీ అడ్డాకులను కొనుగోలు చేసి గిరిజనులకు న్యాయం చేయాలి. మైదాన ప్రాంతాల్లో డిమాండ్ ఉన్న అడ్డాకులను తక్కువ ధరకు కొని మైదాన ప్రాంత వ్యాపారులు అధిక లాభాలు పొందుతున్నారు. గిరిజనులను మోసం చేయడం దారుణం. – పాంగి లక్కు, గిరిజన రైతు సంఘం నేత, గుర్రగరువు, పాడేరు మండలం గిట్టుబాటు ధర కల్పించాలి ఏజెన్సీలోని సంతల్లో అడ్డాకులకు గిట్టుబాటు ధర కరువైంది. కావిడ అడ్డాకుల దిండును రూ.3 వేలకు మించి వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి మోసం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలి. – గొల్లోరి హిరమ్మ, సంతవలస గ్రామం, డుంబ్రిగుడ మండలం -
డయాలసిస్కు వెళ్తూమృత్యు ఒడికి
గాజువాక: కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఒక వ్యక్తి డయాలసిస్ కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివి.. కూర్మన్నపాలేనికి చెందిన ఇందుకూరి సతీష్ (45) హెచ్పీసీఎల్లో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొద్ది కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నాడు. డయాలసిస్ చేయించుకోవడం కోసం చినగంట్యాడ జంక్షన్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లడం కోసం ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. వందడుగుల రోడ్ సిగ్నల్ జంక్షన్కు వచ్చేసరికి జాతీయ రహదారిపై కుక్కలు అకస్మాత్తుగా అడ్డంగా వచ్చాయి. దీంతో సతీష్ తన ద్విచక్ర వాహనాన్ని స్లో చేశాడు. దీంతో వెనకనే వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు అతడిని బలంగా ఢీకొట్టి ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గాజువాక ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతుని బావమరిది దండు గోపాల కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు సీఐ ఎస్కే హుస్సేన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మలేరియాతో గిరిజన విద్యార్థి మృతి
చింతపల్లి: మలేరియాతో ఓ గిరిజన విద్యార్థి మృతి చెందిన సంఘటన అంజలిశనివారం పంచాయతీ గింగవరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మృతుడు తండ్రి కిముడు సింహాచలం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింగవరం గ్రామానికి చెందిన కిముడు దయాకర్(15) అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతూ ఇటీవల పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం విద్యార్థికి జ్వరం రావడంతో శుక్రవారం లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా.. మలేరియా పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి దినేష్ విద్యార్థి తండ్రి సింహాచలానికి తెలియజేశారు. ఆస్పత్రిలో మలేరియాకు సంబంధించిన మందులు లేవని, బయట మెడికల్ షాపులో కొనుగోలు చేసుకోవాలని చెప్పి ఇంటికి పంపేసినట్టు సింహాచలం తెలిపారు. ఇంటికి వెళ్లిన తరువాత బయట కొనుగోలు చేసిన మాత్రను బాలుడికి వేశారు. ఆ మాత్ర వేసిన కొంత సేపటికే బాలుడు అవస్మారక స్థితికి చేరుకోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఆటోలో తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడ్ని పరీక్షించిన వైద్యాధికారి లావణ్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. లంబసింగి వైద్యులు పరీక్షలు చేసి, పాజిటివ్ వచ్చిన వెంటనే చింతపల్లి ఆస్పత్రికి తరలించి ఉంటే తమ బిడ్డ బతికే వాడని, వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగా తమ బిడ్డ మరణించాడని బాలుడి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు.ఇటీవల పది ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత -
13వ తేదీలోగా గిరిజన హోంస్టే క్లస్టర్ల గుర్తింపు
● జేసీ తిరుమణి శ్రీపూజ ● అధికారులతో సమీక్ష సమావేశం సాక్షి, పాడేరు: పీఎం దాజుగౌ పథకంలో భాగంగా జిల్లాలో హోంస్టే క్లస్టర్లను ఈ నెల 13వ తేదీలోగా గుర్తించాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ స్థానిక మహిళలు, యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. చింతపల్లి మండలం లంబసింగి, అరకులోయ, డుంబ్రిగుడ కేంద్రాలుగా మూడు హోంస్టే క్లస్టర్లను గుర్తించి, సమగ్ర వివరాలు సేకరించాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలంతా గిరిజన గ్రామాలను సందర్శించి, పర్యాటకానికి అనువైన క్లస్టర్లను గుర్తించాలన్నారు. గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత, పర్యాటకుల ఆకర్షణ వంటి ఆంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అరకు, డుంబ్రిగుడ, అనంతగిరి, చింతపల్లి మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్గా హోంస్టేలను చేపడుతున్నామన్నారు. 100 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందన్నారు. కొత్త గదుల నిర్మాణాలకు రూ.5 లక్షలు, ఇళ్లు ఉండి మరమ్మతులకు రూ.3 లక్షలు, పర్యాటకుల వసతుల అభివృద్ధి పనులకు రూ.5 లక్షలు మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా టూరిజం అధికారి దాసు, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు జిల్లాలోని అన్ని గ్యాస్ ఏజెన్సీలలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ తిరుమణి శ్రీపూజ తెలిపారు. గ్యాస్ బుకింగ్ ప్రక్రియ అనంతరం ఓటీపీ వచ్చిన వారంతా గ్యాస్ పొందాలన్నారు. గ్యాస్ సిలెండర్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. -
రాయల్ బెంగాల్ టైగర్‘మంజునాథ్’ దత్తత
కై లాసగిరిపై‘త్రిశూలం’ అందాలు ఆరిలోవ: కై లాసగిరిపై వీఎంఆర్డీఏ ఏర్పాటు చేసిన డమరుకంతో కూడిన త్రిశూలాన్ని శనివారం మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, కొండపల్లి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను కూడా వారు ప్రారంభించారు. ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్బాబు, లోకం మాధవి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్భరత్ పాల్గొన్నారు. ఖర్చుపై పొంతన లేని ప్రకటనలు.. త్రిశూలం ప్రారంభోత్సవం అనంతరం ఎంపీ శ్రీభరత్ మీడియాతో మాట్లాడారు. త్రిశూలం నిర్మాణ వ్యయంపై ఆయన భిన్నమైన లెక్కలు చెప్పడంతో అధికారులు విస్మయానికి గురయ్యారు. గతేడాది ఆగస్టులో శంకుస్థాపన చేసిన సమయంలో దీని వ్యయం రూ.1.55 కోట్లుగా శిలాఫలకంపై పేర్కొన్నారు. అయితే, నిర్మాణం పూర్తయిన అనంతరం.. ప్రారంభోత్సవ శిలాఫలకంపై రూ.3కోట్లుగా ముద్రించారు. కానీ, ఎంపీ శ్రీభరత్ ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించడంతో అధికారులు అవాక్కయ్యారు. వాస్తవ లెక్కల కంటే రెట్టింపు ఖర్చు చేసినట్లు చెప్పడం చర్చనీయాంశమైంది. ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణుల దత్తత కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ‘మంజునాథ్’ అనే రాయల్ బెంగాల్ టైగర్ను ఏడాది కాలానికి కమల్ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ దత్తత తీసుకుంది. ఆ సంస్థ యజమాని దీపక్ కర్నాని బృందం శనివారం జూ క్యూరేటర్ జి.మంగమ్మను కలిసి, పులి వార్షిక నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.54,000ల చెక్కును అందజేశారు. అనంతరం పులి ఎన్క్లోజర్ వద్ద క్యూరేటర్ ఇతర అధికారులతో కలిసి దాతలకు దత్తత పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా క్యూరేటర్ మాట్లాడుతూ.. వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావడానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. దత్తత తీసుకున్న సంస్థ ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బృందం సభ్యులు బి.భానువెంకట ప్రతాప్, ఉదయ కిరణ్, జూ అసిస్టెంట్ క్యూరేటర్ గోపి, జూ వైద్యుడు డాక్టర్ భాను తదితరులు పాల్గొన్నారు. -
జోన్ సరే.. కొలువుల బోర్డు ఏది?
సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాల పోరాటం తర్వాత విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటవుతుందన్న సంతోషం నిరుద్యోగ యువతలో కనిపించడం లేదు. 2019లో జోన్ ఏర్పాటుపై ప్రకటన వెలువడినప్పటి నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తూనే ఉంది. దీనిపై మొదటి నుంచి వైఎస్సార్ సీపీ ఆందోళన చేస్తున్నా.. టీడీపీ, జనసేన నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో కేంద్రం ఇక్కడ బోర్డు ఏర్పాటుపై కాలయాపన చేస్తోంది. జోన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ, అందులో ఆర్ఆర్బీపై స్పష్టత ఇవ్వకపోవడం ఉత్తరాంధ్ర నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దేశవ్యాప్తంగా 19 జోన్లలో 21 ఆర్ఆర్బీలు ఉండగా, విశాఖ విషయంలో మాత్రం సాంకేతిక కారణాల సాకుతో జాప్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంప్రతిపత్తి లేని ‘పేపర్ జోన్’? సాధారణంగా భారతీయ రైల్వేలో ఏ జోన్ ఏర్పడినా, ఆ పరిధిలో ఉద్యోగ నియామకాల కోసం ప్రత్యేకంగా ఒక ఆర్ఆర్బీ ఉంటుంది. కానీ కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ విషయంలో కేంద్రం భిన్నమైన వైఖరిని అవలంబిస్తోంది. సికింద్రాబాద్, భువనేశ్వర్లలో ఇప్పటికే బోర్డులు ఉన్నాయని, వాటి ద్వారానే ఇక్కడి నియామకాలు చేపట్టవచ్చనేది అధికారుల వాదనగా కనిపిస్తోంది. అయితే, ఒక భారీ జోన్ను నిర్వహించేటప్పుడు దానికి స్వయంప్రతిపత్తి కలిగిన నియామక మండలి లేకపోతే, అది కేవలం ఒక ‘పేపర్ జోన్’గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఆర్ఆర్బీ ఇవ్వరెందుకు? ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 ప్రధాన కార్యనిర్వాహక జోన్లు ఉండగా, ఆర్ఆర్బీలు మాత్రం 21 ఉన్నాయి. కొన్ని పెద్ద జోన్ల పరిధిలో ఒకటి కంటే ఎక్కువ బోర్డులు ఉండగా, మరికొన్ని బోర్డులు రెండు, మూడు జోన్ల అవసరాలను తీరుస్తున్నాయి. గతంలో వాల్తేరు డివిజన్ భువనేశ్వర్ బోర్డు పరిధిలో ఉండేది. కానీ ఇప్పుడు కొత్త జోన్ కేంద్రంగా విశాఖ అవతరించిన తర్వాత కూడా పాత బోర్డులపైనే ఆధారపడటం ఈ ప్రాంత అభ్యర్థుల ఉపాధి హక్కులను కాలరాయడమే అవుతుందనే వాదన వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర యువత ఉపాధికి ముప్పు ఆర్ఆర్బీ విశాఖకు కేటాయించకపోతే నియామక ప్రక్రియ మొత్తం ఒడిశా లేదా తెలంగాణలోని బోర్డుల నియంత్రణలోకి వెళ్తుంది. దీని వల్ల నోటిఫికేషన్లు వెలువడినప్పుడు స్థానిక అవసరాల కంటే ఆయా బోర్డుల పరిధిలోని ఇతర ప్రాంతాలకే ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర అభ్యర్థులు తమ సొంత ప్రాంతంలోని రైల్వే లైన్లలో పని చేయాలన్నా.. ఇతర రాష్ట్రాల్లోని ఆర్ఆర్బీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడనుంది. పరీక్షలు, దరఖాస్తుల పరిశీలన, వైద్య పరీక్షల కోసం అభ్యర్థులు వందల కిలోమీటర్ల దూరంలోని భువనేశ్వర్ లేదా సికింద్రాబాద్ వెళ్లడం భారంగా మారుతుంది. రైల్వే గ్రూప్–డి వంటి పోస్టులకు స్థానిక భాషా పరిజ్ఞానం కీలకం. ఇతర రాష్ట్రాల బోర్డులు నియామకాలు చేపట్టినప్పుడు, తెలుగు అభ్యర్థులకు సమాచారం చేరవేయడంలోనూ, ప్రశ్నపత్రాల రూపకల్పనలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని వల్ల తెలుగు విద్యార్థులు సాంకేతికపరంగా వెనుకబడే ప్రమాదం ఉంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు అనేది కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదు, అది ఉత్తరాంధ్ర ఆత్మగౌరవంతో ముడిపడి ఉంది. కేవలం భవనాలు, ప్లాట్ఫాంలు పెంచితే అది అభివృద్ధి అనిపించుకోదు. స్థానిక యువతకు ఉపాధి దొరికినప్పుడే రైల్వే జోన్ కల సాకారమవుతుంది. తక్షణమే కేంద్రం స్పందించి విశాఖకు ప్రత్యేక ఆర్ఆర్బీ మంజూరు చేయాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు. జోన్ ఇచ్చి.. బోర్డును విస్మరిస్తే ఎలా? నేను గత మూడేళ్లుగా రైల్వే గ్రూప్–డీ, ఇతర పోటీ పరీక్షల కోసం శ్రమిస్తున్నాను. ఉత్తరాంధ్ర నిరుద్యోగుల కలలు నిజం కావాలంటే విశాఖలో ఆర్ఆర్బీ ఏర్పాటు చేయడం అత్యవసరం. స్థానికంగా బోర్డు అందుబాటులో లేకపోతే, ఉద్యోగ నోటిఫికేషన్లలో దొర్లే తప్పులను గానీ, ఫలితాల జాప్యాన్ని గానీ ప్రశ్నించే హక్కు అభ్యర్థులకు లేకుండా పోతుంది. ఏదైనా చిన్న సమస్య తలెత్తినా, ఫిర్యాదు చేయడానికి పొరుగు రాష్ట్రాల్లోని కార్యాలయాలకు వెళ్లడం మాలాంటి వారికి ఆర్థికంగా, మానసికంగా పెనుభారం. విశాఖను రైల్వే జోన్ కేంద్రంగా ప్రకటించి, ఆర్ఆర్బీని మాత్రం కేటాయించకపోవడం అంటే.. నియామకాల కోసం మమ్మల్ని మళ్లీ ఇతర రాష్ట్రాలపై ఆధారపడేలా చేయడమే. – కె.అప్పారావు, రైల్వే ఉద్యోగ అభ్యర్థి స్థానికతకు ప్రాధాన్యం పెరుగుతుంది విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ వస్తుందని ప్రకటించినప్పుడు ఉత్తరాంధ్ర యువతలో ఎన్నో ఆశలు చిగురించాయి. కానీ ఇప్పుడు ఆర్ఆర్బీ ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం దక్కాలంటే విశాఖలోనే సొంత బోర్డు ఏర్పాటు చేయాలి. ఒకవేళ భువనేశ్వర్ బోర్డు ద్వారానే రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగితే, వారు పరీక్ష కేంద్రాలను కూడా అక్కడే కేటాయించే అవకాశం ఉంది. దీని వల్ల స్థానిక అభ్యర్థుల కంటే ఇతర ప్రాంతాల వారికే ఎక్కువ వెసులుబాటు కలుగుతుంది. ఒక స్వతంత్ర జోన్కు స్వయంప్రతిపత్తి కలిగిన నియామక బోర్డు లేకపోతే, అది అధికారాలు లేని కేవలం ఒక నామమాత్రపు కార్యాలయంగానే మిగిలిపోతుంది. – ఎం.మన్మధరావు, ఉద్యోగార్థి -
మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు
మండుటెండలో మంచు విందు● పోలీసుల కృషితోనే భార్య హంతకుడికి శిక్ష ● ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా మేఘాల కొండలుగా పేరొందిన వంజంగి హిల్స్ మండు వేసవిలోను ప్రకృతి రమణీయతతో కనువిందు చేస్తున్నాయి. శనివారం వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు వంజంగి కొండల నిండా మేఘాలు, పొగమంచు ఆకట్టుకున్నాయి. – సాక్షి, పాడేరు నేటి నుంచి మోదమ్మ జాతర సాక్షి, పాడేరు: మినుములూరు గ్రామంలో ఆదివారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు మోద కొండమ్మతల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మినుములూరు పాత ఊరు నుంచి మోదకొండమ్మతల్లి పాదాలు, ఘటాలను ఉదయం 7 గంటలకు ఊరేగించిన అనంతరం మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన శతకంపట్టు వద్ద కొలువుదీర్చనున్నారు. అనంతరం మూడు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మోదమ్మకు ప్రత్యేక పూజలతో పాటు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల విజయవంతానికి అన్ని వర్గాల భక్తులు సహకరించాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ మినుముల కన్నాపాత్రుడు, ఇతర కమిటీ ప్రతినిధులు కోరారు.చింతపల్లి: ఏజెన్సీలో మహిళల రక్షణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నవరం పంచాయతీ పరిధి పూతికమెట్ట గ్రామంలో భార్యను హత్యచేసిన భర్త రామారావుకు యావజ్జీవ కారాగార శిక్ష పడడం పోలీసుల కృషి ఫలితమేనన్నారు. ఈ హత్యానేరంపై సీఐ లోతుగా విచారణ జరిపి సాక్షుల వివరాలతో న్యాయస్థానం ముందు హాజరుపరిచారన్నారు. ఈ తీర్పు మహిళలను వేధించే వ్యక్తులకు కనువిప్పు లాంటిందన్నారు. మహిళలను వేధించినా, హత్య చేసినా, శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. ప్రతి పోలీసు స్టేషన్లోను శక్తి బృందాలను పోలీసు శాఖ ఏర్పాటు చేసిందని చెప్పారు. మహిళలను ఆకతాయిలతో పాటు ఏ ఒక్కరూ వేధించినా, హింసించినా శక్తి బృందాల అప్రమత్తమై రక్షణ కల్పించడంతో పాటు నిందితులను కఠినంగా శిక్షిస్తాయన్నారు. గిరిజన ప్రాంతంలో గంజాయిని పూర్తి స్థాయిలో కట్టడి చేశామన్నారు. గంజాయితో పట్టుబడిన నిందితులకు న్యాయస్థానం కఠినంగా శిక్షలు విధిస్తుందన్నారు. ఈ సమావేశంలో చింతపల్లి, అన్నవరం ఎస్ఐలు వెంకటరమణ, సాయికుమార్ పాల్గొన్నారు. -
గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం
కె.కోటపాడు: మండలంలోని పైడంపేటలో శనివారం ఉదయం జామి ఈశ్వరరావు, జామి హరికృష్ణ ఇళ్లలో వంట చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమీపంలో గల డోర్కర్టెన్స్కు, ఇంటి దూలాలకు మంటలు వ్యాపించాయి. అదుపు చేసేందుకు స్థానికులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇళ్లలో గల దుస్తులు, నిత్యావసర సరుకులు, బంగారం, నగదు, ధాన్యం కాలిబూడిదయ్యాయని బాధితులు హరికృష్ణ, ఈశ్వరరావు తెలిపారు. స్థానికుల సమచారంమేరకు చోడవరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. డి.గొటివాడలో...మాడుగుల: మండలంలో డి.గొటివాడలో వంట గ్యాస్ లీక్ అవడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు సమాచారం మేరకు వివరాలు... శుక్రవారం రాత్రి గ్యాస్ స్విచ్ ఆఫ్చేయకుండా గ్రామానికి చెందిన చుక్కల జగ్గారావు నిద్రపోయాడు. శనివారం తెల్లవారుజామున టీ పెట్టడానికి గ్యాస్ వెలిగించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇంటిలో సామగ్రి దగ్ధమైంది. జగ్గారావుకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు విశాఖ కేజీహెచ్కు తరలించారు. -
రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీల్లో జస్వంత్ ప్రతిభ
నాతవరం: రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన అనిమిరెడ్డి జస్వత్ మండలానికే వన్నె తెచ్చాడని నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు అభినందించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ నాతవరం హైస్కూల్లో చదువుతున్న జస్వంత్ అనకాపల్లి జిల్లా జట్టు తరపున బేస్బాల్ పోటీలలో పాల్గొన్నారన్నారు. ఈ నెల 5,6,7, తేదీల్లో కర్నూల్ జిల్లా వెనుగొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జస్వంత్ ప్రతిభ చూపించడంతో సెమీఫైనల్కు చేరుకోవడం జరిగిందన్నారు. మారుమూల నాతవరం మండలం నుంచి జిల్లా తరఫున క్రీడల్లో రాణించడం అభినందనీయమన్నారు. జిల్లాలో ఈ జట్టు తరుఫున పోటీల్లో నర్సీపట్నం, మాకవరపాలెం మండలాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారని ఎస్ఐ తెలిపారు. -
హైవేపై డివైడర్ను ఢీకొన్న కారు
● ఎనిమిది మందికి గాయాలు ● నవ వధూవరులు కుటుంబంతో అన్నవరం వెళ్తుండగా ప్రమాదం యలమంచిలి రూరల్: డ్రైవర్ నిద్రమత్తు,నిర్లక్ష్యం కారణంగా శనివారం నవ వధూవరులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.యలమంచిలి మండలం మర్రిబంద వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో రహదారి పక్కన నడిచి వెళ్తున్న మహిళ,కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ తల్లి తీవ్రంగా గాయపడగా మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపిన వివరాలు..విశాఖపట్నం అక్కయ్యపాలెంలో శుక్రవారం వివాహం జరిగిన నవ వధూవరులు కుటుంబంతో అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయానికి కారులో బయలుదేరారు.యలమంచిలి దాటిన తర్వాత మర్రిబంద వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొంది. కారు అతివేగంగా ప్రయాణిస్తుండడంతో ముందు చక్రాలు రోడ్డుపై ఊడి పడ్డాయి.డివైడర్ పక్కనున్న సోలార్ పలకలు విరిగిపోయాయి.విరిగిన సోలార్ పలక రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మహిళపై పడడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో డ్రైవర్ తల్లికి కాలు విరిగింది.మిగిలిన ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.కారు ముందు భాగం నుజ్జవడం బట్టి ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే యలమంచిలి రూరల్ ఎస్ఐ ఉపేంద్ర సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిశీలించి, వివరాలు సేకరించారు. క్షతగాత్రులను హైవే అంబులెన్సులో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన పాదచారి రుత్తల లక్ష్మి భర్త రామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
తాగునీటి సమస్య పరిష్కరించడంలో విఫలం
● వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శ పాడేరు రూరల్: గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని నివారించడంలో సంబంధిత అధికారులు, పాలకులు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ పాడేరు నియోజకవర్గ అధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాడేరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండ తీవ్రత పెరగడంతో గ్రామాల్లోని రక్షిత తాగునీటి పథకాలు, బోర్లు, బావులు మరియు ఊటగెడ్డలు అడుగంటిపోయాయని, దీనివల్ల ప్రజలకు గుక్కెడు నీరు దొరకని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో గిరిజన గ్రామాల్లో చేపట్టిన జల్ జీవన్ మిషన్ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని, అధికారుల పర్యవేక్షణ లోపంతో తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారాయని ధ్వజమెత్తారు. నీటి కోసం మహిళలు మైళ్ల దూరం నడవాల్సి వస్తోందని పేర్కొన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీర్చడానికి ప్రత్యేక దృష్టి సారించాలని, లేనిపక్షంలో మహిళలతో కలిసి సంబంధిత కార్యాలయాల వద్ద భారీ ఆందోళనలు చేపడతామని డిమాండ్ చేశారు. -
రోడ్డుపై పశువులను వదిలితే చర్యలు
పాత తేదీల్లోనే వేడుకలు మోదకొండమ్మ తల్లి ఉత్సవాల తేదీలను కూటమి ప్రభుత్వం కావాలనే మార్చడం అత్యంత అన్యాయం. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని, ఆ కారణంగా పాత తేదీల్లో జాతర నిర్వహిస్తే పోలీసు బందోబస్తు ఇవ్వలేమని ఉన్నతాధికారులతో చెప్పించడం ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దల కుట్రలో భాగమే. ఎన్నికలు, కౌంటింగ్ ప్రక్రియలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయనే వాస్తవాన్ని అమ్మవారి భక్తులందరూ గమనిస్తూనే ఉన్నారు. కేవలం రాజకీయ విద్వేషంతోనే పోలీసు బందోబస్తును సాకుగా చూపి తేదీలను మార్చడం శోచనీయం. మే 12వ తేదీన అమ్మవారి పుట్టినరోజు. దశాబ్దాలుగా వస్తున్న ఆచారాల ప్రకారం ఆ రోజే పండుగ జరపాలని భక్తులంతా బలంగా నమ్ముతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మేము పెద్దల సమక్షంలో ముందుగా నిర్ణయించిన ప్రకారం.. పాత తేదీల్లోనే (మే 10, 11, 12) అమ్మవారి పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. తెలుగు రాష్ట్రాలలోని భక్తులందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపకు పాత్రులు కావాలని కోరుతున్నా. – మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు ఎమ్మెల్యే, మోదకొండమ్మ ఆలయ కమిటీ చైర్మన్ -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
పాడేరు: జిల్లాలో ఈనెల 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షా నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని జేసీ సూచించారు. అన్ని వసతులు ఉన్న కేంద్రాలనే ఎంపిక చేయాలని ఆదేశించారు. పరీక్షలు పారదర్శకంగా జరిగేలా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. జిల్లాలోని తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని జేసీ వెల్లడించారు. ప్రథమ సంవత్సరం జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 1,051 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ కలిపి 492 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 139 మంది ఇన్విజిలేటర్లను, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు. విద్యార్థులంతా పరీక్ష ప్రారంభ సమయానికి ముందుగానే తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్ఐవో భీమశంకర్, పలు కళాశాలల అధికారులు పాల్గొన్నారు. జేసీ తిరుమణి శ్రీపూజ ఆదేశం -
మోదమ్మ పుట్టినరోజు వేడుకలకు
శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026సర్వం సిద్ధం!ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లుసాక్షి, పాడేరు: ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దైవం, పాడేరు మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు వేడుకలను మినీ జాతరను తలపించేలా ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 12న అమ్మవారి జన్మదినం సందర్భంగా, పాత సంప్రదాయాల ప్రకారం మే 10వ తేదీ ఆదివారం నుంచే ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. తేదీల మార్పుపై కూటమి కుట్ర! మోదకొండమ్మ ఉత్సవాలను మే 10, 11, 12 తేదీల్లో నిర్వహించాలని రెండు నెలల క్రితమే ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అధ్యక్షతన కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.42 లక్షల వ్యయంతో కోల్కతా నుంచి ప్రత్యేక లైటింగ్, సాంస్కృతిక ప్రదర్శనలకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో అడ్వాన్సులు కూడా చెల్లించారు. అయితే, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగితే తమకు మైలేజీ రాదని భావించిన కూటమి ప్రభుత్వం, రాజకీయ కుట్రకు తెరలేపింది. భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా, జిల్లా ఇన్చార్జి మంత్రి సంధ్యారాణి ఒత్తిడితో కలెక్టర్ ద్వారా ఉత్సవాల తేదీలను మే 17, 18, 19కి మారుస్తూ ప్రకటన చేయించారు. దీనిపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అమ్మవారి పుట్టినరోజు వేడుకలను మాత్రం పాత తేదీల ప్రకారమే నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ముస్తాబవుతున్న మోదమ్మ ఆలయం వేడుకల నేపథ్యంలో మోదకొండమ్మ ఆలయం నూతన శోభను సంతరించుకుంది. అమ్మవారి మూలవిరాట్కు ప్రత్యేక రంగులు వేస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ వెలుగులతో తీర్చిదిద్దనున్నారు. ఈనెల 10న ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే డప్పు వాయిద్యాల నడుమ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, భక్తులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు ప్రారంభిస్తారు. 11వ తేదీ సోమవారం లోక కల్యాణార్థం అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. 12వ తేదీ మంగళవారం ఉదయం 101 డప్పుల హోరుతో పాడేరు పట్టణంలో ఘటాల ఊరేగింపు ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు భారీ అన్నసమారాధన, మధ్యాహ్నం 2 గంటల నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాల ప్రతిమలతో గ్రామ ప్రదక్షిణ జరుగుతుంది. ● రాత్రి వేళ పాత బస్టాండ్, ఆలయ ఆడిటోరియంలో భారీ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారిక ఉత్సవాలను వాయిదా వేసినప్పటికీ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తన సొంత ఖర్చుతో ఈ వేడుకలను నిర్వహిస్తుండటంపై భక్తుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. పాత తేదీల ప్రకారమే ఈనెల 10 నుంచి 12 వరకు నిర్వహణ కూటమి సర్కారు తేదీల మార్పుపై భక్తుల ఆగ్రహం మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల మనోభావాలు తగ్గట్టుగా చర్యలు -
మృతదేహానికీ వివక్షేనా?
మహారాణిపేట/కొయ్యూరు : ‘పేదవాడికి ప్రాణం ఉన్నప్పుడు వైద్యం దొరకదు.. ప్రాణం పోయాక గౌరవం దక్కదు’. ఉత్తరాంధ్రకు తలమానికం అని చెప్పుకునే కేజీహెచ్లో గిరిజనుల పట్ల అమానుషత్వం మరోసారి బట్టబయలైంది. ఒక ఎంపీటీసీ హోదాలో ఉన్న గిరిజన నాయకుడి మృతదేహాన్ని తరలించడానికి ‘మహాప్రస్థానం’ వాహనాన్ని నిరాకరించి, వ్యవస్థ ఎంతటి మొద్దునిద్రలో ఉందో చాటిచెప్పారు. ప్రజాప్రతినిధులు రోడ్డెక్కితే తప్ప కదలని ఈ మొండి యంత్రాంగంపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆఖరి ప్రయాణానికి అడ్డంకులు గూడెంకొత్తవీధి మండలం దామణాపల్లి ఎంపీటీసీ కొర్ర బీమరాజు (45) అనారోగ్యంతో పోరాడుతూ శుక్రవారం ఉదయం కేజీహెచ్లో తుదిశ్వాస విడిచారు. కొండ కోనల నుంచి మెరుగైన వైద్యం అందుతుందని ఆశతో వచ్చిన ఆ కుటుంబానికి, మరణం తర్వాత కోలుకోలేని చేదు అనుభవం ఎదురైంది. కనీసం మృతదేహాన్ని తరలించడానికి ‘మహాప్రస్థానం’ వాహనాన్ని గానీ, అంబులెన్స్ను గానీ కేటాయించమని వేడుకున్నా.. ఆసుపత్రి అధికారులు కనికరించలేదు. దిక్కుతోచని స్థితిలో అమాయక గిరిజనులు ‘వాహనాలు అందుబాటులో లేవు’ అంటూ సిబ్బంది చెప్పిన మాటలు బాధితుల గుండెల్లో బాణంలా గుచ్చుకున్నాయి. ఆసుపత్రిలోని ఎస్టీ సెల్కు సమాచారం అందించినా, అక్కడ కూడా స్పందన కరువైంది. తమ వారిని కోల్పోయిన బాధ ఒకవైపు, పార్థివ దేహాన్ని ఇంటికి ఎలా తీసుకెళ్లాలో తెలియని అయోమయం మరోవైపు.. ఆ గిరిజనుల వేదన వర్ణనాతీతం. వ్యవస్థల మధ్య సామాన్యుడు, ముఖ్యంగా గిరిజనుడు ఎంతటి అగౌరవానికి గురవుతున్నాడో ఈ దృశ్యాలు కళ్లకు కట్టాయి. నేతల జోక్యంతో కదిలిన యంత్రాంగం ఈ విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్పర్సన్, నేరుగా సూపరింటెండెంట్తో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగడంతో నిమిషాల వ్యవధిలోనే ‘లేవన్న’ వాహనాలు ప్రత్యక్షమయ్యాయి. మారని వైఖరి..ఒక ఎంపీటీసీ హోదాలో ఉన్న వ్యక్తికే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే, ఇక సామాన్య గిరిజనుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే రోగుల పట్ల కేజీహెచ్ సిబ్బంది వైఖరి మారాలని, మరణంలోనైనా వారికి గౌరవం దక్కాలని స్థానికులు కోరుతున్నారు. చివరికి సుభద్ర, భాగ్యలక్ష్మి బాధితులను పరామర్శించి, వాహనం ఏర్పాటు చేసి పంపించడంతో ఆ విషాద ప్రయాణం ముందుకు సాగింది. -
గిరి ప్రదక్షిణ వైభవంపై పాట రాస్తా
ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్కప్పస్తంభానికి మొక్కుకుంటున్న కాసర్ల శ్యామ్ సింహాచలం : సింహాచలం పుణ్యక్షేత్రం, గిరిప్రదక్షిణ ఉత్సవ విశిష్టతను చాటిచెప్పేలా త్వరలోనే ఒక అద్భుతమైన పాటను రాస్తానని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ తెలిపారు. శుక్రవారం ఆయన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని మహిమాన్విత కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న ఆయనకు, అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ ‘బలగం’ సినిమాలోని ‘ఊరూ పల్లెటూరు దీనితీరే అమ్మ తీరు’ పాటకు జాతీయ అవార్డు రావడం ఆ స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆయనకు క్షేత్ర మహత్యాన్ని వివరించి, స్వామివారి వైభవంపై పాటలు రాయాలని కోరగా.. తప్పకుండా గిరిప్రదక్షిణ ఉత్సవంపై పాట రాస్తానని శ్యామ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం పీఆర్వో అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి శుక్రవారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెళ్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. ఘనంగా గరుడసేవ.. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి శుక్రవారం గరుడసేవ ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వెండి గరుడ హవనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేషంగా హారతులు అందజేశారు. -
జిప్సం లారీలు అడ్డగింత
మాకవరపాలెం : ప్రమాదాలకు కారణమవుతున్న జిప్సం లారీలను మండలంలోని భీమబోయినపాలెం గ్రామస్తులు అడ్డుకున్నారు. విశాఖ కోరమండల్ నుంచి గత నెల రోజులుగా తాళ్లపాలెం, మాకవరపాలెం, నర్సీపట్నం మీదుగా భారీలోడుతో జిప్సం లారీలు రావాణా అవుతున్నాయి. రాజమండ్రి వెళ్లే ఈ లారీలు టోల్ చార్జీలు చెల్లించకుండా ఉండేందుకు ఇటుగా వెళుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ లారీల నుంచి జిప్సం పౌడర్ రోడ్డుపై జల్లుకుంటూ లారీలు వెళుతున్నాయి. దీంతో వెనుక వచ్చే ద్విచక్రవాహనదారుల కళ్లలో ఈ పౌడర్ పడి ఇబ్బందులు పడుతున్నారు. కళ్లలో పడిన వెంటనే మంట వస్తుందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. ఈ జిప్సం కారణంగా భీమబోయినపాలెం గ్రామానికి చెందిన పప్పల అశోక్కుమార్ ద్విచక్ర వాహనంపై వెళుతూ తీవ్రంగా గాయపడినట్టు గ్రామస్తులు తెలిపారు. నిత్యం ఎవరో ఒకరు ఈ కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తాజామాజీ సర్పంచ్ రుత్తల కిశోర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు రెండు లారీలను అడ్డుకున్నారు. అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు. అధికారులు స్పందించి ఈ మార్గం గుండా ఈ లారీలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని ద్విచక్ర వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
బురదనీరే శరణ్యం
తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దూరంగా ఉన్న ఊటగెడ్డ నీటిపైనే నిత్యం ఆధారపడుతున్నాం. అంతదూరం నుంచి నీళ్లను మోసుకుని తీసుకురావడానికి నరకం చూస్తున్నాం. వర్షాలు కురిస్తే మరిన్ని ఇబ్బందులు పడాల్సిందే. బురద నీరే శరణ్యం. – సీదరి రోజా, దాయత్తి, అనంతగిరి మండలంవిన్నవించినా చర్యలు శూన్యం గ్రామంలో రూ.15లక్షలతో తాగునీటి పథకాన్ని గత ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు నిలిచిపోయాయి. బోరు ఒక్కటే తవ్వారు. ట్యాంకుల నిర్మాణాలు కూడా జరగలేదు. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సమస్యను కలెక్టర్, పీవోలకు విన్నవించినా ఉపయోగం లేదు. – పాంగి చిన్నమ్మలు, కొత్తపాడేరు, పాడేరు మండలం -
ప్రత్యేక తరగతులకు విద్యార్థుల గైర్హాజరు
కొయ్యూరు: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో తప్పిన విద్యార్థుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు స్పందన కరువైంది. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పిల్లలను బడికి పంపాలని కోరుతున్నా విద్యార్థులు రావడం లేదు. కొయ్యూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం 54 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఫెయిలైన 46 మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి ఉండగా, శుక్రవారం నాటికి కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. వీరిలో ముగ్గురు బాలికలు ఉన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఈ తరగతులు కొనసాగుతాయని, విద్యార్థులు హాజరు కావాలని ఎన్నిసార్లు కోరినా ఫలితం ఉండటం లేదని అక్కడి ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారిని వెంటనే పాఠశాలకు పంపాలని ఆమె కోరారు. -
నీలిబందలో జ్వరాలు
రోలుగుంట : మండలంలోని అర్ల గిరిజన పంచాయతీ కొండ శిఖరాగ్రాన ఉన్న నీలిబంద గ్రామంలో పలువురు జ్వరాలతో మంచాన పడ్డారు. జ్వరంతో సకాలంలో చికిత్స పొందని పరిస్థితిలో ఇదే గ్రామానికి చెందిన డిప్పల సురేష్(2) ఇంటి వద్దే శుక్రవారం మృతి చెందినట్టు పీవీటీజీ సంఘ నాయకుడు గెమ్మిల వాసు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివి. జి.మాడుగుల మండలం నుంచి నీలిబంద గ్రామానికి వలస వచ్చిన గిరిజనులు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. జ్వరాల బారిన పడిన వారిలో డిప్పల సూరిబాబు (3), గెమ్మిల నవీన్(2), వంతల అఖిల్ (2), డిప్పల రమేస్(8), కొర్ర ప్రవీణ్(2), కొర్ర రుక్తి(5) ఉన్నారు. ఈ గ్రామం నుంచి మండలంలోని బుచ్చింపేట పీహెచ్సీకి వైద్యానికి రావాలంటే కొండ శిఖరాగ్రం నుంచి మేలైన రవాణా మార్గం, వాహనాలు రాకపోకలు లేని పరిస్థితిలో 13 కిలోమీటర్లు నడచుకుని డోలిమోతతో రావాలి. ఈ గ్రామానికి ఆశా కార్యకర్త కానీ, ఏఎన్ఎం కాని లేరు. ఎవరు అనారోగ్యం బారిన పడినా బుచ్చింపేట పీహెచ్సీకి 13 కిలోమీటర్ల దూరం నడిచి రావాల్సిందే. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పందించి, తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి, రవాణా సదుపాయాలు మెరుగుపరచాలని, ఏఎన్ఎంని నియమించాలని కోరారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరపీడితులకు తక్షణ వైద్యం అందించాలని ఆయన డిమాండు చేశారు. -
‘మీకోసం’ వినతులు గడువులోగా పరిష్కారం
జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పాడేరు: జిల్లా కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు సమగ్ర సమాచారంతో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జేసీ శ్రీపూజతో పాటు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇంచార్జ్ డీఆర్వో లోకేశ్వరరావు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి 24 వినతులు, రెవెన్యూ క్లినిక్లో 9 వినతులను అధికారులు స్వీకరించారు.అర్జీదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో వారికి స్పష్టంగా వివరించాలని జేసీ అధికారులను ఆదేశించారు.జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో నిర్వహించే పిజిఆర్ఎస్కు హాజరుకాకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఫిర్యాదుదారులతో అధికారులు మర్యాదగా మెలగాలని, ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే అందుకు గల సాంకేతిక లేదా ఇతర కారణాలను వారికి అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ, హౌసింగ్ పీడీ బాబు, జిల్లా వ్యవసాయాధికారి నందు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కొంటా వెంకటరావు, జిల్లా ఖజానా అధికారి ప్రసాద్ బాబు, ఎల్డీఎం మాతునాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం
ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశం పాడేరు: జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్యవర్మ ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మిస్తున్న మల్టీపర్పస్ సెంటర్లు, జిల్లాలోని ఇతర నిర్మాణ పనుల పురోగతిపై ఆయన సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. జిల్లాలో మంజూరైన 35 మల్టీపర్పస్ సెంటర్లు, 46 హాట్ బజార్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు, విద్యుదీకరణ, ఇతర మరమ్మతు పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు.కలెక్టరేట్ ఎస్సీఏ, ఆర్టికల్ 275, డీఏజేజీ నిధుల కింద చేపట్టిన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. కన్వర్జెన్సీ పనుల్లో జాప్యం జరగకుండా నిధులను సద్వినియోగం చేసుకుంటూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పూర్తయిన వన్ స్టాప్ సెంటర్లలో అంగన్వాడీ, వీడీవీకే, మినీ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని, వచ్చే 15 రోజుల్లో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, ఐటీడీఏ ఏవో హేమలత, ఏడీఎంహెచ్వో డాక్టర్ ప్రతాప్, ఏటీడబ్ల్యూవోలు, ఇంజనీరింగ్, వెలుగు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆకలి కేకలు
ఎన్జీవో హోమ్ వద్ద సాక్షితో మాట్లాడుతున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది మహారాణిపేట: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిర్ణీత సమయంలోనే జీతాలు ఇస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇపుడు వారిని నెలల తరబడి పస్తులు పెడుతోంది. ఏకంగా 13 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం నగరంలోని ఎన్జీవో హోమ్కు వచ్చిన ఆంధప్రదేశ్ నాన్ గజిటెడ్, గజిటెడ్ ఆఫీసర్స్(ఏపీఎన్జీజీవోస్) రారష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ను బాధిత ఔట్సోర్సింగ్ సిబ్బంది కలిసి, తమకు జీతాలు ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. దీంతో ఈ విషయం మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలో రెండు సార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో జీతాల కోసం ఔట్ సోర్సింగ్ సిబ్బంది వినతులు ఇచ్చారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో సిబ్బంది కుటుంబ పోషణకు నానా కష్టాలు పడుతున్నారు. కావాలనే ఫైల్ తొక్కిపెట్టారు? కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్), ఆంధ్రా మెడికల్ కాలేజీ(ఏఎంసీ)లో 36 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్నారు. వీరికి గత ఏడాది ఏప్రిల్ నుంచి జీతాలు చెల్లించట్లేదు. దీంతో తమ కుటుంబాల జీవనం సాగించేదెలా? అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అన్ని అనుమతులూ పొందిన ఈ ఫైల్ను ఎంప్లాయిమెంట్ అధికారికి పంపకుండా కేజీహెచ్లోనే తొక్కిపెట్టారని ఆరోపిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం కోసం ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ నుంచి అనుమతి వచ్చినా ఫైల్ కదలకుండా తొక్కిపెట్టడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఇంటింటికీ రక్షిత తాగునీరు లక్ష్యం
జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ సాక్షి, పాడేరు: జిల్లాలోని ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ‘జల్ జీవన్ మిషన్’ పనులను వేగవంతం చేసి 2028 నాటికి హర్ ఘర్ జల్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో తాగునీరు, పారిశుధ్య మిషన్ జిల్లా కమిటీ సమావేశాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జల్ జీవన్ మిషన్లో పెండింగ్లో ఉన్న తాగునీటి పథకాల పనులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ తాగునీరు మరియు మరుగుదొడ్ల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. తాగునీటి పథకాలకు అవసరమైన విద్యుత్ కనెక్షన్లు, పైపులైన్ల తవ్వకాలకు సంబంధించి రోడ్డు కటింగ్ అనుమతులను విద్యుత్, ఆర్అండ్బీ శాఖలు వెంటనే మంజూరు చేయాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.అనంతరం, అమరావతిలో సీఎం చంద్రబాబు కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులోని అంశాలపై జేసీ తిరుమణి శ్రీపూజ జిల్లా అధికారులతో సమీక్షించారు. ఆయా శాఖల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యతలను వివరించారు. ఈ సమావేశంలో పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అల్లూరి ఆశయ సాధనకు కృషి
సాక్షి,పాడేరు: దేశ స్వాతంత్య్రం,గిరిజనుల హక్కుల కోసం బ్రిటీషు సామ్రాజ్యంతో పోరాడి, చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం చారిత్రాత్మకమని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అన్నారు. కలెక్టరేట్లో ఆయన వర్థంతిని గురువారం నిర్వహించారు. దీనిలో భాగంగా అల్లూరి చిత్రపటంతో పాటు విగ్రహానికి జేసీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి పోరాటం, ధైర్యసాహసాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.అల్లూరి ఆశయాలకు అనుగుణంగానే ప్రతి ఒక్కరు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలన్నారు. గిరిజన యువత బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, ఎస్డీసీ నీలకంఠరావు, సీఐ దీనబంధు, కలెక్టరేట్ ఏవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. చింతపల్లి: మన్యంలో అల్లూరి సీతారామరాజు చేపట్టిన ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి ఫలాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన అల్లూరి వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అతి చిన్న వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, మన్యంలో స్వాతంత్య్ర కాంక్షను నింపిన మహనీయుడు అల్లూరి అని ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ఏజెన్సీ ప్రాంతంలోని సమస్యల పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తడబారికి సురేష్ కుమార్, పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బూసరి కృష్ణారావు, గూడెంకొత్తవీధి మండల పార్టీ అధ్యక్షులు కంకిపాటి గిరిప్రసాద్ పాల్గొన్నారు. అలాగే చింతపల్లి మాజీ మండల పార్టీ అధ్యక్షులు మోరి రవి, కో–ఆప్షన్ సభ్యుడు నాజర్ వల్లి, పార్టీ జిల్లా కోశాధికారి కుందేరి రామకృష్ణ, పీసా కమిటీ కార్యదర్శి గబులంగి నాగేశ్వరరావు, నాయకులు కరీం, చంటిబాబు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ మాధవ్ కొయ్యూరు: అల్లూరి పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ మాధవ్ పిలుపునిచ్చారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి పురస్కరించుకుని గురువారం ఆయన మంప, రాజేంద్రపాలెంలోని అల్లూరి స్మారక మందిరాలను సందర్శించి, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజేంద్రపాలెం పార్కులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం గొప్ప విషయమని కొనియాడారు. రాజేంద్రపాలెం, మంప అల్లూరి స్మారక పార్కుల అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ను కూడా నిధులు కేటాయించాలని కోరగా, ఆయన తన కోటా నుంచి నిధులు ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు. గతంలో రాజ్యసభ సభ్యులు సురేష్ ప్రభు ఇచ్చిన రూ. 50 లక్షలతో ఈ పార్కులను అభివృద్ధి చేశామని, ఆ తర్వాత మాజీ ఎంపీ కొత్తపల్లి గీత కూడా రూ. 10 లక్షలు కేటాయించారని గుర్తుచేశారు. అల్లూరి పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ పార్టీ మండల అధ్యక్షులు సంపరి శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు ఎం. శాంతకుమారి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నరేంద్ర, స్వప్న కుమారి, గాదే శ్రీనివాసరావు, పాడేరు ఏఎంసీ చైర్మన్ మంగతల్లి, బీజేపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు పరశురామరాజు, పరమేశ్వరరావు, ట్రైకార్ డైరెక్టర్ కృష్ణారావు, పాంగి రాజారావు, కురుసా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పాడేరు రూరల్: ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గురువారం పాడేరులో అల్లూరి వర్థంతి నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనర్స, పలు ప్రజా సంఘాల నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఆదివాసీల భూములు, వన్యప్రాణులు, సహజ వనరులు, కార్పొరేట్ శక్తులకు నిలుదోపీడీకి గురికాకుండా కాపాడుకునేందుకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, అధ్యక్షుడు ధర్మన్నపడాల్, జిల్లా ఉపాధ్యక్షుడు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. డుంబ్రిగుడ: స్థానిక యూనియన్ బ్యాంక్ ఆవరణలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద అల్లూరి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఆయన వర్థంతి నిర్వహించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన సేవా సంఘం అధ్యక్ష, కార్యదర్శి కమ్మిడి, సూర్యప్రకాశ్, నవసూర్య, వైఎస్సార్సీపీ మండల కార్యదర్శి మఠం శంకర్ పాల్గొన్నారు. -
10 నుంచి హనుమజ్జయంతి పూజలు
సింహాచలం: సింహగిరి మెట్లమార్గంలో కొలువై ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 10 నుంచి 12 వరకు హనుమజ్జయంతి పూజలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. 10వ తేదీ ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, సహస్రనామార్చన, సుందరకాండ పారాయణం నిర్వహిస్తారు. 11న ఉదయం 6 గంటల నుంచి స్వామికి అభిషేకం, 8 గంటల నుంచి సహస్రనామార్చన, సుందరకాండ పారాయణం ఉంటాయి. 12న హనుమజ్జయంతిని పురస్కరించుకుని ఉదయం 6 గంటల నుంచి పంచామృతాభిషేకాలు, 7 గంటలకు విశేష అలంకరణ చేస్తారు. 7.30 గంటల నుంచి లక్ష తమలపాకుల పూజ, 9 గంటల నుంచి పట్టాభిషేక పారాయణం, 9.30 గంటల నుంచి హవనం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ విశేష పూజల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు, ప్రసాదాలను స్వీకరించాలని ఈవో కోరారు. -
స్ఫూర్తి కేంద్రాలుగా అల్లూరి నడియాడిన ప్రాంతాలు
నర్సీపట్నం: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడియాడిన ప్రాంతాలను జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ తెలిపారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి మదుం వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లా పాండ్రంగి, పశ్చిమగోదావరి జిల్లా మోగల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని మంప, రాజేంద్రపాలెం, అనకాపల్లి జిల్లాలోని కృష్ణదేవిపేట ప్రాంతాలను అల్లూరి స్ఫూర్తి కేంద్రాలుగా మార్చబోతున్నామన్నారు. త్వరలో లంబసింగిలో అల్లూరి సీతారామరాజు మ్యూజియం ప్రారంభమవుతుందన్నారు. జూన్ 4న పాండ్రంగిలో భారతమాత పార్కును ప్రారంభించనున్నామన్నారు. ఓబీసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ, టౌన్ అధ్యక్షుడు బోళెం అప్పన్న దొరబాబు, నర్సీపట్నం రూరల్ అధ్యక్షుడు నిద్దర శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బోళెం శివ పాల్గొన్నారు. గొలుగొండ: కృష్ణదేవిపేట గ్రామంలో ఉన్న అల్లూరి సమాధి వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఘన నివాళులర్పించారు. అల్లూరి, గంటందొర, మల్లుదొర సమాధులకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గాదె శ్రీనివాసరావు, సునీల్రెడ్డి, సురేంద్రమోహన్, సత్యనారాయణ, సూర్యనారాయణ పాల్గొన్నారు. -
కొయ్యూరులో వాహన తనిఖీలు
● డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిపై చర్యలు ● ఐదు వాహనాలు స్వాధీనం కొయ్యూరు: సరైన డ్రైవింగ్ లైసెన్స్లు లేకుండా నడుపుతున్న ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కిషోర్వర్మ తెలిపారు. సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కాకరపాడు జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను, యజమానులు అన్ని రకాల పత్రాలను చూపించిన తర్వాతే అప్పగిస్తామని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. కొన్ని చోట్ల మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారు కనిపిస్తే వారి తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్లపై పశువులను వదిలే యజమానులపై చర్యలు తీసుకుంటామని, లేనిపక్షంలో ఆ పశువులను గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు స్వీయ నియంత్రణతో డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు అని ఎస్ఐ కిషోర్వర్మ పేర్కొన్నారు. -
కార్టూన్లు వేద్దాం రండి..!
నాతవరం: ఈ వేసవిలో కార్టూన్లు వేద్దాం రండి అంటున్నారు ప్రముఖ కార్టూనిస్టు, రచయిత, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అంబటి చంటిబాబు మాస్టారు. ఈ పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడిని జయించి, విజ్ఞానం, వినోదం, మానసిక వికాసం కోసం కార్టూన్లు దోహదపడతాయని ఆయన చెబుతున్నారు. నాతవరం మండలం చమ్మచింత ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న చంటిబాబు మాస్టారు విద్యార్థులకు వేలిముద్రలతో చిత్రాలు, కార్టూన్ల ద్వారా పలు సామాజిక విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు ఆసక్తి ఉన్న వారందరికీ కార్టూన్లు, వేలిముద్రల ద్వారా పలు చిత్రాలు వేయడంపై చమ్మచింతలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు ఎటువంటి ఫీజు తీసుకోవడం లేదు. పిల్లల కోసం వేలిముద్రలు చిత్రాల పుస్తకం, మనోహరం, కార్టూన్ల పుస్తకం, కార్టూన్ల శతకం రాశానని, అవి ఎంతో గుర్తింపునిచ్చాయని చంటిబాబు తెలిపారు. కార్టూన్లు గీయడం వల్ల పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను బయటకు తీయవచ్చునన్నారు. -
25, 26 తేదీల్లో ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె
బీచ్రోడ్డు: ఎస్బీఐ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25, 26 తేదీల్లో అఖిల భారత భారతీయ స్టేట్ బ్యాంక్ కార్మిక సంఘం అధ్వర్యంలో దేశ వ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు సంఘం కార్య నిర్వాహక సభ్యురాలు ఎ.సుష్మ తెలిపారు. ఈ మేరకు సమ్మె వివరాలను నగరంలోని సంఘం కార్యాలయంలో గురువారం వెల్లడించారు. తాము ఎదుర్కొంటున్న 16 సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు విన్నవించుకున్నా పరిష్కారం లభించలేదన్నారు. 29 ఏళ్లుగా మెసెంజర్లు, అర్మ్డ్ గార్డుల నియామకం చేపట్టలేదని, వాటిని తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. శాశ్వత ఉద్యోగాల భర్తీ, ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ తదితర అంశాలను వెంటనే పరిష్కరించాలన్నారు. సమావేశంలో సంఘం విశాఖ ప్రాంత ఉపాధ్యక్షుడు పి.సతీష్, సహాయ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
డీసీఐఎల్లో సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం
విశాఖ సిటీ: పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఖర్చులను తగ్గించుకునే దిశగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్) కీలక అడుగు వేసింది. పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద 150 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన సౌర విద్యుత్ ప్లాంట్ను సీతమ్మధారలోని సంస్థ ప్రధాన కార్యాలయ భవనంపై ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ను డీసీఐఎల్ ఎండీ, సీఈవో కెప్టెన్ ఎస్.దివాకర్ గురువారం ప్రారంభించారు. కేంద్ర ఓడరేవుల శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ భాగస్వామ్యంతో లెడ్యూర్ లైటింగ్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసింది. గత మార్చి 29న డీసీఐఎల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ప్లాంట్ పనులను వర్చువల్గా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎండీ కెప్టెన్ ఎస్.దివాకర్ మాట్లాడుతూ.. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం దిశగా డీసీఐఎల్ తన ప్రయాణాన్ని వేగవంతం చేసిందన్నారు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు సుమారు 750 యూనిట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని, అంటే నెలకు 22,500 యూనిట్లు, ఏడాదికి సుమారు 2.7 లక్షల యూనిట్ల విద్యుత్ లభిస్తుందని వెల్లడించారు. దీని వల్ల సంస్థకు నెలకు రూ. 2.5 లక్షలు, ఏడాదికి సుమారు రూ. 30 లక్షల మేర విద్యుత్ ఖర్చులు ఆదా అవుతాయని వివరించారు. ఈ ప్లాంట్ వల్ల ఏడాదికి సుమారు 220 నుంచి 240 టన్నుల కార్బన్ డయాకై ్సడ్ ఉద్గారాలు తగ్గుతాయని, ఇది 10 వేల మొక్కలు నాటడంతో లేదా 50 ప్యాసింజర్ వాహనాలను రహదారిపై నుంచి తొలగించడంతో సమానమని ఆయన పేర్కొన్నారు. -
గంజాయి జోలికి వెళ్తే జీవితాలు ఛిన్నాభిన్నం
ముంచంగిపుట్టు: గంజాయి సాగు, రవాణా వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయని స్థానిక సీఐ ఎస్. లక్ష్మణరావు హెచ్చరించారు. సీఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారిగా గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించి, సిబ్బందితో మండలంలోని శాంతిభద్రతల పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం మండలంలోని పనసపుట్టు పంచాయతీ, సంగంవలస గ్రామంలో పర్యటించిన సీఐ, గిరిజనులతో మమేకమయ్యారు. ప్రజలకు భద్రత మరియు చట్టాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సదస్సులో ఆయన కీలక విషయాలను వివరించారు. యువత తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో అక్రమ మార్గాల్లో వెళ్లి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. వాగులు, గెడ్డల వద్ద ప్రమాదాలు జరగకుండా పిల్లలను ఒంటరిగా పంపవద్దని తల్లిదండ్రులను కోరారు. మహిళల రక్షణ చట్టాలు, దొంగతనాల నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. బాల్య వివాహాలను అరికట్టాలని, గ్రామంలోకి వచ్చే కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి, గిరిజన ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పి. నాని, సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.సీఐ లక్ష్మణరావు హెచ్చరిక -
ఆందోళన బాట
సమస్యలు పరిష్కరించకపోతే మహారాణిపేట: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే, భవిష్యత్తు కార్యచరణను ప్రకటించడానికి త్వరలోనే సమావేశం అవుతామని హెచ్చరించారు. గురువారం నగరంలోని ఎన్జీవో హోమ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సంఘ నేతలతో కలిసి మాట్లాడారు. కొత్త పీఆర్సీ కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే పీఆర్సీ చైర్మన్ను నియమించి, ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పెరిగిన ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగులకు తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న డీఏలు, సరెండర్ లీవ్ బకాయిలను ఒక క్రమపద్ధతిలో వెంటనే విడుదల చేయాలని, యాక్ట్ 30 ప్రకారం అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. సెలవు రోజుల్లో ఒత్తిడి చేయడం తగదు ప్రభుత్వ లక్ష్యాల సాధన కోసం ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, అయితే సెలవు రోజుల్లో కూడా వారిని పని చేయమని ఒత్తిడి తీసుకురావడం సరికాదని విద్యాసాగర్ పేర్కొన్నారు. విశ్రాంతి ఉంటేనే ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలరని వివరించారు. అలాగే, ఐవీఆర్ఎస్ కాల్స్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదని, దానిని కేవలం ఒక మోడల్గా మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డుల ద్వారా పూర్తిస్థాయి ప్రయోజనం అందడం లేదని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ను మంజూరు చేయాలన్నారు. ఏపీ ఎన్జీజీవో ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడుతూ.. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, అదే స్ఫూర్తితో రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏపీ ఎన్జీజీవో విశాఖ అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, కార్యదర్శి ఎం. రవికుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, పి. అప్పలరాజు, వై. నారాయణరావు, జి. చంద్రరావు, అనిత, రత్నకుమారి, పి. కృష్ణమూర్తి, టి.గోపాలకృష్ణ, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు రవి తదితరులు పాల్గొన్నారు. -
మోదమ్మ ఉత్సవాల్లో ‘కూటమి’ రాజకీయం
● ఉత్సవ సమావేశానికి మొక్కుబడిగా ఆహ్వానం ● ప్రభుత్వం రూ.కోట్లు ఇస్తే.. బలవంతపు వసూళ్లు ఎందుకు? ● ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు ధ్వజం సాక్షి, పాడేరు: స్థానిక ఆరాధ్య దైవం మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను కూటమి ప్రభుత్వం రాజకీయమయం చేస్తోందని పాడేరు ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్సవాలకు సంబంధించి కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించనున్న సమావేశానికి రావాలని కోరుతూ అధికారులు పంపిన ఆహ్వాన పత్రాన్ని ఆయన తిరస్కరించారు. గురువారం రాత్రి లోచలిపుట్టు క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన రెవెన్యూ అధికారులకు ఆ పత్రాన్ని తిరిగి ఇచ్చేస్తూ.. ఇటువంటి మొక్కుబడి ఆహ్వానాలు తనకెందుకని, ఈ సమావేశానికి హాజరయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 40 ఏళ్ల మోదకొండమ్మ తల్లి పండగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం రాజకీయ కోణంలో ఉత్సవ తేదీలను మార్చడం దారుణమన్నారు. ఇది భక్తుల మనోభావాలను కించపరచడమేనని మండిపడ్డారు. మొదట తన అధ్యక్షతన నిర్ణయించిన మేరకు మే 10, 11, 12 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, ఈ తరుణంలో తేదీలను మార్చడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికే లైటింగ్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు అడ్వా న్స్లు చెల్లించామని గుర్తు చేశారు. తాము చెల్లించిన అడ్వాన్సుల మేరకే కలకత్తా లైటింగ్ను వినియోగించుకుంటున్న ప్రభుత్వం.. ఎగ్జిబిషన్ నిర్వాహకులను మాత్రం పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వడం దారుణమన్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 2 కోట్లు ఇస్తోందని ప్రచారం చేసుకుంటున్న కమిటీ పెద్దలు, మళ్లీ ప్రజల నుంచి బలవంతంగా చందాలు ఎందుకు వసూలు చేస్తున్నారని ఆయన నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. ఉత్సవ తేదీలు మార్చినా, ఈ నెల 12వ తేదీన మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు వేడుకను మాత్రం తాము అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. -
కొయ్యూరు మండలంలో ఈ ఏడాది మొక్కజొన్న పంట పండుగలా కనిపిస్తున్నా, రైతుల మనసుల్లో మాత్రం ఆందోళన గూడుకట్టుకుంది. ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి వచ్చినా, వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రాకపోవడం.. వచ్చినా తక్కువ ధర అడుగుతుండటంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా
● దిగుబడి పెరిగినా అందని గిట్టుబాటు ధర ● రూ.22 నుంచి రూ.16కు పడిపోయిన ధర ● తేమ సాకుతో వ్యాపారుల కొర్రీలు ● ఆందోళనలో రైతాంగం కొయ్యూరు: ఏ వస్తువుకై నా ఉత్పత్తి విపరీతంగా పెరిగి, డిమాండ్ తగ్గితే ఆ వస్తువు ధర పడిపోవడం సహజం. ప్రస్తుతం మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. కిందటి ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతో లాభాలు వస్తాయన్న ఆశతో ఈ ఏడాది రైతులు భారీ విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేశారు. అయితే, ఉత్పత్తి విపరీతంగా పెరగడంతో మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. ఫలితంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధరల తగ్గుదల.. వ్యాపారుల కొర్రీలు.. గత ఏడాది కిలో మొక్కజొన్నను రూ. 22 కు కొనుగోలు చేసిన వ్యాపారులు, ప్రస్తుతం రూ. 16 కంటే ఎక్కువ ఇవ్వలేమని తెగేసి చెబుతున్నారు. దీనికి తోడు తేమ శాతం పేరుతో వ్యాపారులు పెడుతున్న నిబంధనలు రైతులకు శాపంగా మారాయి. పొత్తులను వారం రోజుల పాటు, గింజలను మరో వారం పాటు ఎండబెట్టాలని వ్యాపారులు కోరుతున్నారు. గతంలో ఆరకముందే కొనుగోలు చేసిన వ్యాపారులు, ఇప్పుడు పూర్తిగా ఆరితే తప్ప కొనబోమని చెబుతున్నారు. గింజలు ఎంత ఎక్కువగా ఆరితే, అంతగా బరువు తగ్గిపోయి మరింత నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి భారం.. దొరకని కూలీలు మొక్కజొన్న సాగులో ఎకరాకు సుమారు 3 టన్నుల దిగుబడి వస్తుంది. అయితే, ఎకరాకు పెట్టుబడి ఖర్చు రూ. 40 వేలు దాటిపోతోంది. గత ఏడాది ధర (రూ.22) లభిస్తేనే రైతులకు కనీస లాభాలు వచ్చేవి. ప్రస్తుత ధరతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరుగుతుండటంతో, కూలి డబ్బులు ఇస్తామన్నా మొక్కజొన్న కోతలకు కూలీలు దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. కోళ్లు, చేపల దాణాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఆశపడి సాగు చేసిన తమకు, ఇప్పుడు వ్యాపారులు ముఖం చాటేయడం లేదా ధర తగ్గించడం కోలుకోలేని దెబ్బని మన్యపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న రైతు కన్నీరుపెట్టుబడి కూడా వచ్చేలా లేదు లాభాలు వస్తాయన్న ఆశతో ఈ ఏడాది మొక్కజొన్న పంట వేశాం. తీరా చూస్తే, వ్యాపారులు ఒక్కసారిగా ధర తగ్గించడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నాం. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొంది. ఈ నష్టాలను భరించలేక వచ్చే ఏడాది నుంచి ఈ పంట సాగును మానేయాలని నిర్ణయించుకున్నాం. ఒకవైపు ధర లేక ఇబ్బంది పడుతుంటే, మరోవైపు కూలి డబ్బులు ఇస్తామన్నా పనులకు ఎవరూ రాకపోవడంతో సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. – పి.ఏసు, మొక్కజొన్న రైతు, కొయ్యూరు -
ఉదయం మంచు.. మధ్యాహ్నం నిప్పులు
సాక్షి, పాడేరు: మన్యం ప్రాంతంలో వాతావరణం దోబూచులాడుతోంది. ఒకే రోజులో రెండు విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తుండటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు పాడేరుతో పాటు సమీప ప్రాంతాలలో దట్టమైన పొగమంచు కప్పేసింది. చల్లటి వాతావరణం వల్ల వాహనదారులు, ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు. అయితే, ఉదయం 9 గంటల తర్వాత మంచు వీడి ఎండ మొదలైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపడంతో మన్యం ప్రాంతం నిప్పుల కొలిమిని తలపించింది. కొయ్యూరులో 35.1, అరకులోయలో 33.1, అనంతగిరిలో 31.2, చింతపల్లిలో 30.1, పెదబయలులో 30.3, ముంచంగిపుట్టులో 29.4, హుకుంపేటలో 29.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 4గంటల నుంచి వాతావరణం చల్లబడింది. -
త్రిశక్తి ఆలయంలో ధ్వజస్తంభానికి శంకుస్థాపన
ఉక్కునగరం: జీవీఎంసీ 87వ వార్డు లక్ష్మీపురం కాలనీలోని త్రిశక్తి అమ్మవార్ల ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గాజువాక వైఎస్సార్సీపీ ఇన్చార్జి తిప్పల దేవన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. కార్యక్రమంలో వార్డు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొడ్డ గోవింద్, గాజువాక బీసీ సెల్ అధ్యక్షుడు చిత్రాడ వెంకటరమణ, 76వ వార్డు పరిశీలకుడు ముద్దపు దామోదర్, కమిటీ ప్రతినిధులు సూర్యనారాయణ, కనకారావు, బాబూరావు, అప్పలరాజు, ప్రసాద్, అంజయ్య, కనకారావు తదితరులు పాల్గొన్నారు. -
రీ సర్వేలో వసూల్ రాజాలు
మహారాణిపేట: జిల్లాలో జరుగుతున్న భూముల రీ సర్వేలో అవినీతి కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది. కొంత మంది సర్వేయర్లు వసూల్ రాజాలుగా మారుతున్నారు. తమ కార్యాలయంలో అన్నీ తామై చేసేస్తామని రైతులను నమ్మబలుకుతూ రాయ‘బేరాలు’నడుపుతున్నారు. ఇక్కడకు వచ్చే అధికారులు తమ గుప్పిట్లోనే ఉంటారని, వారందరికీ వాటాలు ఇచ్చి.. మీకు అనుకూలంగా పనులు చేస్తామని నమ్మించి, రైతుల్ని నిలువునా ముంచేస్తున్నారు. 64 గ్రామాల్లో రీ సర్వే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జిల్లాలోని పెందుర్తి, గాజువాక, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, విశాఖ రూరల్ మండలాల పరిధి 64 గ్రామాల్లో రీ సర్వే చేపట్టారు. రెండో విడత రీ సర్వే ఇంకా ఓ కొల్కికి రాలేదు. మూడో విడత రీ సర్వే వివాదాలతో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. చిన్న, సన్నకారు రైతుల భూములు ఏళ్ల తరబడి తమ సాగులో ఉన్నా.. సరైన రికార్డులు లేవన్న సాకుతో పెండింగ్లో పెట్టారు. జిరాయితీ భూముల సర్వేకు కూడా సర్వే బృందం వెనుకడుగు వేస్తోంది. తమ ఆధీనంలో ఉన్న పొలాలకు సంబంధించి ఆన్లైన్లో రైతుల పేర్లు లేకపోవడం, క్రయ విక్రయాలు జరిగినా రికార్డులు అప్డేట్ చేయకపోవడం సమస్యలకు కారణమవుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి కొందరు అధికారులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని రైతులు వాపోతున్నారు. ఆధునిక టెక్నాలజీ.. అయినా తప్పులే! డ్రోన్లు, జీపీఎస్ యంత్రాలతో సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ, జిరాయితీ, ఇనాం తదితర భూముల రీ సర్వే చేస్తున్నారు. మండల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్వో తదితరులకు మండల, డివిజనల్ సర్వేయర్లు, చైన్మన్లు, ఇతర సిబ్బంది సహకారం అందిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో ముడుపుల వ్యవహారంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న చిన్న సాంకేతిక సమస్యలను సాకుగా చూపి సర్వేలు నిలుపుదల చేస్తున్నారని సమాచారం. వీటి పరిష్కారం పేరిట సర్వేయర్లు అన్నీ తామై చక్రం తిప్పుతున్నారు. మండలానికి ఇద్దరు ముగ్గురు సర్వేయర్లు కేవలం వసూళ్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. ముడుపులు చెల్లించుకుంటేనే రీ సర్వే పూర్తి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. లేకుంటే ఒకరి సాగులో ఉన్న భూమిని రికార్డుల్లో మరొకరి పేరిట చేర్చుతున్నారని చెప్తున్నారు. మరోవైపు రీ సర్వేలో దళారులు ప్రవేశించి అనధికార వసూళ్లకు పాల్పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. ‘సాంకేతిక’చిక్కులు.. తప్పని అవస్థలు రెవెన్యూ రికార్డుల్లో ఒకలా, సాగులో ఇంకోలా ఉంటే రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ భూమి, ట్యాంక్ అని ఉంటే రైతుల తిప్పలు వర్ణనాతీతం. అన్నదమ్ముల తగాదాలు, కుటుంబ వివాదాలు, గ్రామ కంఠం, ఇనాం భూముల్లో రీ సర్వే పూర్తవ్వాలంటే చేతులు తడపాల్సిందేనని రైతులు వాపోతున్నారు. కొంత మంది అధికారులు ఇలాంటి జాబితాను వీఆర్వోలకు అందించి, వారిని రైతుల వద్దకు పంపి బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి రైతుల సాగులో ఉన్నా.. రికార్డుల్లేని భూములకు ముడుపులివ్వకుండా పాస్ పుస్తకాలు ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
అభివృద్ధికి దూరం!
అల్లూరి స్మారకం..రాజేంద్రపాలెంలో అభివృద్ధికి నోచుకోని అల్లూరి పార్కు కొయ్యూరు: తెలుగుజాతి పౌరుషానికి ప్రతీక, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ పాలకులపై పోరాటం సాగించిన చారిత్రక ప్రాంతాలు నేడు పాలకుల, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. అల్లూరిని బ్రిటీష్ వారు బంధించిన మంప, ఆయనను కాల్చి చంపిన రాజేంద్రపాలెం వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ ఒక భారీ పర్యాటక కారిడార్ ఏర్పాటు చేస్తామని పాలకులు దశాబ్ద కాలంగా హామీలు ఇస్తున్నప్పటికీ, అవి నేటికీ కాగితాలకే పరిమితమయ్యాయి. అసంపూర్తిగా సుందరీకరణ దేశం గర్వించదగ్గ విప్లవ వీరుల జ్ఞాపకాలను భావితరాలకు అందించేలా భద్రపరచాల్సింది పోయి, ఇక్కడ అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లూరి చరిత్రను తెలుసుకోవాలని ఆకాంక్షతో అనేక ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడి దుస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంప పార్కు.. కేంద్ర సాంస్కృతిక శాఖ నిధులతో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో రెండేళ్ల క్రితం ఇక్కడ పనులు ప్రారంభమయ్యాయి. అల్లూరి స్నానం చేసే కొలనును ఆధునికీకరించి, చుట్టూ నడక దారిని ఏర్పాటు చేసినప్పటికీ పనులు పూర్తికాలేదు. ● అక్కడ ఉన్న స్మారక స్థూపంపై అల్లూరి జనన, మరణ వివరాలు కనీసం పొందుపరచలేదు. చరిత్రను వివరించేందుకు ఏర్పాటు చేసిన దృశ్య ఫలకాలు కూడా అసంపూర్తిగా ఉండటంతో పర్యాటకులకు సరైన సమాచారం అందడం లేదు. కనీసం చిన్న పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు. రాజేంద్రపాలెంలో అదే తీరు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రాజేంద్రపాలెంలో అల్లూరితో పాటు ఆయన అనుచరులు గాం గంటన్నదొర, మల్లుదొర, బోనంగి పడాల్ విగ్రహాలను గత ప్రభుత్వంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఆవిష్కరించారు. అయితే, ఆ విగ్రహాల చుట్టూ పార్కును సుందరీకరించి, మొక్కలు నాటి నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. సరైన వసతులు లేకపోవడంతో పర్యాటకుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. ఆగిపోయిన రోప్వే ప్రాజెక్టు అల్లూరి తన పోరాట వ్యూహాలను రచించిన ఉర్లకొండ గుహ మంపలోని కొలనుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఎత్తైన కొండపై ఉండటంతో పర్యాటకులను ఆకర్షించేందుకు ఇక్కడికి రోప్వే నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ, ఆ ప్రతిపాదన నేటికీ ఆచరణకు నోచుకోలేదు. నేడు ప్రముఖులు రాక.. మంప, రాజేంద్రపాలెం ప్రాంతాల అభివృద్ధిపై చర్చ జరుగుతున్న తరుణంలో, గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ ప్రాంతాలను సందర్శించనున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. కనీసం ఇప్పటికై నా పాలకులు స్పందించి, మన్యం వీరుడి జ్ఞాపక చిహ్నాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. కార్యరూపం దాల్చని పర్యాటక కారిడార్ దశాబ్దకాలంగా ప్రతిపాదనలతో సరి కానరాని రోప్వే శిథిలావస్థలో చరిత్ర సాక్ష్యాలు చెదురుతున్న విప్లవ వీరుడి జ్ఞాపకాలు నేడు అల్లూరి వర్ధంతి మంప పార్కులో ఏర్పాటుచేసిన అల్లూరి విగ్రహంపార్కును అభివృద్ధి చేయాలి మంపలో అల్లూరి స్మారక పార్కును చూసేందుకు ప్రజలు వస్తారు.అయితే ఇక్కడ ఆశించిన స్థాయిలో సౌకర్యాలు లేవు. పార్కులో పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఉర్లకొండ గుహకు మార్గం ఏర్పాటుచేయాలి. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి. – బి.శివరామరాజు, మాజీ ఎంపీటీసీ, మంప -
పీఎం జన్మన్ పనులు వేగవంతం
చింతపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం జన్మన్ పథకం పనులను బుధవారం పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని లంబసింగి ప్రాంతంలో పర్యటించిన ఆయన, అక్కడ జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల భవన సమస్యపై గ్రామస్తులతో చర్చ లంబసింగిలో పీఎం జన్మన్ పథకం కింద నిర్మించ తలపెట్టిన పాఠశాల భవనం విషయంలో తలెత్తిన కొన్ని సాంకేతిక, స్థల సమస్యలపై పీవో గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, భవన నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ సమస్యపై క్షుణ్ణంగా విచారణ జరిపి, పూర్తి వివరాలతో కూడిన నివేదికను రెండు రోజుల్లోగా సమర్పించాలని తహసీల్దారు శంకర్రావును ఆయన ఆదేశించారు. వసతి గృహాల్లో సౌకర్యాల పరిశీలన అనంతరం లంబసింగిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను పీవో సందర్శించారు. అక్కడ అదనంగా నిర్మిస్తున్న భవన సముదాయాలను పరిశీలించి, పనుల నాణ్యతపై ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, గడువులోగా పనులు పూర్తి చేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యం అదే.. ఈ సందర్భంగా పీవో ఆదిత్యవర్మ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన వైద్యం, మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా పీఎం జన్మన్ పథకం ద్వారా మారుమూల గిరిజన గ్రామాల్లో సమూల మార్పులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) ప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ డీఈ రఘునాథ నాయుడు, జేఈ కిషోర్, ఇతర రెవెన్యూ, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ -
11 నుంచి పైడితల్లి అమ్మవారి జాతర
భీమునిపట్నం: భీమిలి లోని నేరెళ్లవలస కాలనీ లోని గ్రామదేవత పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఈనెల 11 నుంచి 13వతేదీ వరకు అమ్మవారి జాతర మహోత్సవాలు జరగనున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. వేడుకల్లో భాగంగా 11 తొలేళ్ల ఉత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఊరేగింపు జరుగుతుంది. ఇందులో నేలవేషాలు, సాముగారడీలు, చెక్కభజనలతో పాటు పెద్ద ఎత్తున బాణాసంచా విన్యాసాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. 12న అనుపు వేడుక సందర్భంగా అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించడం, మొక్కులు చెల్లింపులు జరుగుతాయని, 13న అమ్మవారికి కుంకుమ పూజలతో పాటు సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. -
‘తుమ్మపాలలో క్వారీకి అనుమతులు ఇవ్వొద్దు’
అనకాపల్లి: మండలంలోని తుమ్మపాలలో క్వారీ (మెస్సర్స్ ఆర్ఎంసీ రెడిమిక్స్ ఇండియా) కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని కూటమి నేతలు వ్యతిరేకించారు. క్వారీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వవద్దని పది మంది వ్యతిరేకించగా, ఐదుగురు మాత్రం అంగీకారం తెలిపారు. క్వారీ వల్ల గ్రామంలో ప్రజలు వివిధ రకాల వ్యాధులు బారిన పడుతున్నామన్నారు. తుమ్మపాల సర్వే నంబర్ 04లో 4.90 హెక్టారులో రోడ్డు మెటల్, బిల్డింగ్ స్టోన్ తవ్వకాలకు 74,901 క్యూబిక్ మీటర్ల నుంచి 2,66,410 క్యూబిక్ మీటర్లకు గ్రావెల్ 14,021 క్యూబిక్ మీటర్లను సంవత్సరానికి తవ్వకాలు చేపట్టారన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న ఆర్డీవో షేక్ అయిషాకు క్వారీకి అనుమతులు ఇవ్వద్దని వినతిపత్రం అందజేశారు. -
అస్వస్థతకు గురై ఉపాధి వేతనదారుడు మృతి
రావికమతం: అస్వస్థతకు గురై ఓ ఉపాధి వేతనదారుడు మృతిచెందాడు. మండలంలో మేడివాడకు చెందిన కుంచాల శ్రీనివాస్ (40)బుధవారం గ్రామంలో ఉపాధి పనికి వెళ్లాడు. 10 గంటల సమయంలో అస్వస్థతకు గురవడంతో ఇంటికి వెళ్లిపోయాడు. కొంతసేపటికి అపస్మారక స్థితికి చేరుకోవడంతో రావికమతం పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండడంతో కేజీహెచ్కు తీసుకెళ్లాలని అక్కడి వైద్య సిబ్బంది సూచించారు. అయితే కుటుంబ సభ్యులు రావికమతంలో గల ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. శ్రీనివాస్ ఉపాధి పనులు చేయడంతో పాటు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి భార్య మల్లేశ్వరి, కుమారుడు,కుమార్తె ఉన్నారు. -
వ్యవసాయ పరికరాల కోసం దరఖాస్తుల స్వీకరణ
అనకాపల్లి: జిల్లాలో 2026–27 ఏడాదికి గాను రైతులకు వ్యవసాయ పరికరాలను అందించేందుకు ఈనెల 19వ తేదీ వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పలేట్ తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లాలో ఈ–పంట నమోదు ఆధారంగా యంత్రాల మంజూరుకు రూ.266.44 లక్షలు కేటాయించినట్టు చెప్పారు. ఆన్లైన్లో నమోదుచేసుకున్న రైతులను ఈనెల 23 నుంచి 25వ తేదీ వరరూ డివిజన్ల వారీగా లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి, ఆశాదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
చింతపల్లి ఏరియా ఆస్పత్రి సందర్శన
చింతపల్లి: రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిలో సాయిరాం బుధవారం చింతపల్లిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి, అందుతున్న సేవలను పరిశీలించారు.తొలుత స్థానిక ఏరియా ఆస్పత్రికి వెళ్లిన ఆయన, అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత భోజనం నాణ్యతపై ఆరా తీశారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రి భవనం చిన్నదిగా ఉండటం వల్ల రోగుల సంఖ్య పెరిగినప్పుడు బెడ్స్ సరిపోవడం లేదని పలువురు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.దీనిపై సాయిరాం స్పందిస్తూ.. నూతన ఆస్పత్రి భవన నిర్మాణం తుది దశకు చేరుకుందని, అది పూర్తయిన వెంటనే రోగులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా భవనాన్ని పూర్తి చేయిస్తామని ఇంజనీరింగ్ అధికారులు ఈ సందర్భంగా కమిషన్ సభ్యునికి వివరించారు. ఈ పర్యటనలో ఆస్పత్రి పర్యవేక్షకురాలు నీలవేణి, ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి, వార్డెన్ వినాయకరావు, ఏఎంసీ డైరెక్టర్ బేతాళుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలను సకాలంలో అందజేయాలని తహసీల్దారు శంకర్రావును కోరారు. భూ సమస్యల పరిష్కారంలో జాప్యం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు నరేంద్ర పాల్గొన్నారు.రోగుల సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిలో సాయిరాం -
జాతీయ రహదారి మార్గంలో జీపు బోల్తా
జి.మాడుగుల: వంజరి–లంబసింగి జాతీయ రహదారిపై బుధవారం ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపు బ్రేకులు ఫెయిల్ కావడంతో బండరాయిని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. జి.మాడుగుల నుంచి తాజంగి వైపు ప్రయాణికులతో జీపు బయలుదేరింది. మార్గమధ్యలో బ్రేకులు సరిగా పడటం లేదని గమనించిన ప్రయాణికులు డ్రైవర్ను అప్రమత్తం చేశారు. ములకాయిపుట్టు గ్రామ సమీపంలోకి వచ్చేసరికి జీపును నిలిపివేయాలని డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే రోడ్డు వాలు (డౌన్)గా ఉండటంతో బ్రేకులు అస్సలు పడలేదు. ప్రమాదాన్ని పసికట్టిన డ్రైవర్, వాహనం లోయలో పడకుండా ఉండేందుకు సమయస్ఫూర్తితో జీపును కుడివైపు ఉన్న మట్టి రోడ్డు వైపు మళ్లించాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని ఢీకొన్న జీపు పక్కకు బోల్తా పడింది. ఈ ఘటనలో బూసుపల్లి గ్రామానికి చెందిన జి చంద్రమ్మ, ఏఎన్ఎం సొలభం–2 ఈశ్వరమ్మ, జి.మాడుగులకు చెందిన ఈశ్వరి, మలివలస గ్రామానికి చెందిన కొర్రాచొంచల, వంతాల భూమి, కిల్లో డొంబయ్, అరకువేలీకి చెందిన వంతాల భాగ్యలక్ష్మి, ములకాయిపుట్టుకు చెందిన కిల్లో వినోద్కుమార్, లాజర్, కిముడు నాయుడు, పెదకిల్తారికి చెందిన వనగల కృష్ణవంశీ, చింతల దేవి గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది. ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు చింతపల్లి: మండలంలోని తాజంగి జలాశయం సమీపంలో బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. బాధితులు లంబసింగి నుండి జి.మాడుగుల మండలం గెమ్మెలి గ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నియంత్రణ కోల్పోయి.. జలాశయం సమీపంలోకి రాగానే ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గెమ్మెలి గ్రామానికి చెందిన ఉల్లి పద్మ, ఉల్లి నరసమ్మ, గెమ్మెలి రాజులమ్మలు గాయపడ్డారు. ఆస్పత్రికి తరలింపు ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యురాలు చందన బాధితులకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. 12 మందికి గాయాలు -
ఎన్డీడీ బోర్డు బృందం సందర్శన
కశింకోటలోని డెయిరీ ఫాం పరిశీలిస్తున్న ఎన్డీడీ బోర్డు ప్రతినిధుల బృందం కశింకోట: స్థానిక సంఘ మిత్ర పోడర్ గ్రోయర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కో–ఆపరేటివ్ సొసైటీని జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు బృందం బుధవారం సాయంత్రం సందర్శించింది. ఈ సందర్భంగా ఇక్కడి పశుగ్రాస క్షేత్రాలు, డెయిరీ ఫారం, బయో గ్యాస్ ప్లాంట్ యూనిట్ను పరిశీలించింది. బృందంలో బోర్డు ప్రతినిధులు లతా, సదాశివం, అనూష హాజరయ్యారు. పాడి రైతుల అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు తమ బోర్డు నుంచి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. రైతులంతా సంఘంగా సంఘటితమై అభివృద్ధి చెందడానికి కృషి చేయాలన్నారు. సొసైటీ చైర్మన్ శిలపరశెట్టి చిట్టమ్మ, ఉపాధ్యక్షుడు ఎ. అప్పలనాయుడు, బోర్డు డైరెక్టర్లు బొడ్డేడ బాలాజీ, కాండ్రేగుల నాగేశ్వరరావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ సమస్య పరిష్కరించడంలో విఫలం
● ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అమర్ విమర్శ ● రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం పాడేరు రూరల్: రాష్ట్రంలో వంట గ్యాస్ కొరతను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అమర్ విమర్శించారు. బుధవారం ఆయన పాడేరులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సమస్యతో సామాన్యులు అల్లాడుతుంటే, పాలకులు మరియు అధికారులు మాత్రం తప్పుడు ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిరోజూ రరెండు లక్షల సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. గ్యాస్ బుకింగ్ చేసుకుని నెలలు గడుస్తున్నా.. ఓటీపీలు రాకపోవడంతో లబ్ధిదారులు ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీపీ వస్తేనే గ్యాస్ అనే నిబంధన వల్ల గ్యాస్ అందక సామాన్యులు పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని అమర్ ఆరోపించారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు దీనిని అదునుగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్లో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు విక్రయిస్తున్నారన్నారు. కమర్షియల్ సిలిండర్ రూ.4 వేల నుంచి రూ.5వేలకు పైనే వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ పంపిణీని క్రమబద్ధీకరించాలని, బ్లాక్ మార్కెట్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సంబంధిత కార్యాలయాల వద్ద లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అమర్ హెచ్చరించారు. -
కారు ఢీకొని యాచకురాలు దుర్మరణం
యలమంచిలి రూరల్: మండలంలో పులపర్తి దాటిన తర్వాత నయారా పెట్రోల్ బంక్ సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. రహదారిపై నడిచి వెళ్తుండగా యలమంచిలి నుంచి తుని వైపు వెళ్తున్న కారు ఆమెను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుంది. యాచకురాలుగా భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియలేదని,ఎవరికై నా తెలిస్తే 9440796104 నంబరుకు ఫోన్ చేయాలని ఎస్ఐ కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
మనసులు గెలిచిన ప్రేమికులు
ముంచంగిపుట్టు: సాధారణంగా ప్రేమించుకున్న జంటలు పెద్దలను ఎదిరించి వెళ్లిపోవడం, ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు పెద్దలు అంగీకరించడం మనం చూస్తుంటాం. కానీ, ముంచంగిపుట్టు మండలంలోని జర్జుల పంచాయతీ పరిధిలో ఒక ప్రేమ జంట తమ పెళ్లికి తల్లిదండ్రులను ఒప్పించిన తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నేటి యువతకు ఇది ఒక వినూత్న పాఠంలా నిలుస్తోంది. ఏం జరిగింది? స్థానిక గ్రామానికి చెందిన ఒక యువతీ యువకుడు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పకుండా బయటకు వెళ్లి వివాహం చేసుకున్నారు. అయితే, తాము పెళ్లి చేసుకున్నప్పటికీ, తమను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మనసు నొవ్వకూడదని ఆ జంట భావించింది. తమపై వారు పెంచుకున్న మమకారాన్ని, తమ కోసం వారు పడిన కష్టాన్ని గుర్తించి ఒక విచిత్రమైన, భావోద్వేగపూరితమైన ఒప్పందానికి శ్రీకారం చుట్టారు. వినూత్నమైన ’తంతు’.. బుధవారం గ్రామ పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల తల్లిదండ్రులను కూర్చోబెట్టి, ఆ ప్రేమికులు ఒక ఆసక్తికరమైన కార్యక్రమం నిర్వహించారు. తాము చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు తల్లిదండ్రులు తమ కోసం చేసిన ప్రతి పనికి, పడిన ప్రతి కష్టానికి గుర్తుగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. చిన్నప్పుడు తమకు స్నానం చేయించినందుకు, తినిపించినందుకు, దుస్తులు కొనిచ్చినందుకు.. ఇలా ప్రతి జ్ఞాపకానికి గుర్తుగా రూ.10 నుంచి రూ.50 వరకు తల్లిదండ్రుల చేతిలో పెడుతూ వారి ఆశీస్సులు తీసుకున్నారు. నగదుతో పాటు కొత్త దుస్తులు, అవసరమైన వస్తువులను కానుకలుగా సమర్పించి వారి మనసులను గెలుచుకున్నారు. ఆదర్శంగా నిలిచిన వైనం ఎటువంటి గొడవలు, మనస్పర్థలు లేకుండా, తల్లిదండ్రుల పట్ల భక్తి శ్రద్ధలతో ఆ ప్రేమ జంట వ్యవహరించిన తీరును చూసి గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు. తమ స్వార్థం కోసం తల్లిదండ్రులను వదిలేసే ఈ రోజుల్లో, వారి కష్టాన్ని స్మరించుకుంటూ ఈ విధంగా వినూత్నంగా కలిసిపోవడం చూసి పలువురు మెచ్చుకున్నారు. ఇది నేటి యువతకు ఒక మంచి ఆదర్శమని స్థానికులు చర్చించుకుంటున్నారు.పెద్దల సమక్షంలో తల్లిదండ్రుల్ని ఒప్పించేందుకు వినూత్న ప్రయత్నం -
తప్పుడు కేసులు పెట్టిన వారు శిక్షార్హులు
నర్సీపట్నం: తప్పుడు కేసులు పెట్టిన వారు భవిష్యత్తులో శిక్ష అనుభవించక తప్పదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లి దొర పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నర్సీపట్నం పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాల వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చిందన్నారు. స్టే ఇచ్చినప్పటికీ పనులు చేస్తుండడంతో వాటిని ప్రజలు దృష్టికి తీసుకువెళ్లేందుకు చెరువు వద్దకు గణేష్ వెళ్తే స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు దాడి చేశారన్నారు. పెద్ద చెరువు ప్రజల ఆస్తి అక్కడ అనధికారికంగా వాచ్మెన్ను పెట్టడం దారుణమన్నారు. వాచ్మెన్తో తప్పుతు ఫిర్యాదు చేయటం మరింత దుర్మార్గమన్నారు. వారిపై మాజీ ఎమ్మెల్యే కేసు పెట్టిన పోలీసులు పట్టించుకోలేదన్నారు. స్పీకర్ ఆదేశాలతో పోలీసులు ఏకపక్షంగా మాజీ ఎమ్మెల్యే గణేష్, అనుచరులు పీఏ బాబు, పట్టణ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఏకా శివ, సుర్లనాయుడులపై కేసు పెట్టారన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామని లీగల్ సెల్ ప్రతినిధి బుల్లిదొర పేర్కొన్నారు. భవిష్యత్తులో వీరంతా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. -
వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు దారుణం
నర్సీపట్నం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరులే దాడి చేసి తమ నాయకులపై కేసులు పెట్టడం దారుణమని వైఎస్సార్సీపీ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్పీకర్ సొంత నియోజకవర్గంలో అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లకాలం ఒకేలా ఉండదని, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందన్న విషయం టీడీపీ నాయకులు గుర్తించుకోవాలని సూచించారు. -
లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతి
గాజువాక/రావికమతం: శ్రీనగర్ జంక్షన్ జాతీయ రహదారిపై ఓ లారీ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావికమతం మండలం గడ్డిప గ్రామానికి చెందిన గల్లా రవి(48) లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. బయ్యవరంలోని ఒక సిమెంట్ ఫ్యాక్టరీనుంచి సిమెంట్ లోడుతో లారీలో శ్రీనగర్కు చేరుకున్నాడు. మంగళవారం రాత్రి లారీని శ్రీనగర్లో ఆపి విశ్రాంతి తీసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచి కొద్దిసేపు అటు, ఇటు తిరిగి మళ్లీ పడుకున్నాడు. ఎంతసేపటికీ నిద్ర లేవకపోవడంతో ఇతర లారీల సిబ్బంది లేపారు. అయినప్పటికీ లేవకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించిన పోలీసులు రవి మృతి చెందినట్టు నిర్థారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆయనకు భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు వంశీ,హర్ష,కుమార్తె వనిత ఉన్నారు. భార్య రాజేశ్వరికి కొన్నాళ్ల కిందట ఓ ఆపరేషన్ జరిగింది. ఆది వికటించించడంతో ఆమె ఆరోగ్యం దెబ్బతింది.ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చిక్సిత పొందుతోంది. రవి మరణ వార్త విన్న గుడ్డిప గ్రామస్తులు సంఘటన స్థలం చేరుకుని మృతదేహాన్ని తరలించారు. మృతుడి తల్లి,భార్య,పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.దీంతో గుడ్డిప గ్రామంలో విషాధ ఛాయులు అలుముకున్నాయి. కుమారుడు వంశీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఏయూ శతాబ్డి ఉత్సవాల క్రీడలు విజయవంతం
మాట్లాడుతున్న వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మద్దిలపాలెం: ఏయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయని వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ తెలిపారు. వర్సిటీ సిబ్బంది సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఉత్సవాలకు కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, సిబ్బంది మధ్య ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషించాయన్నారు. సెనేట్ సమావేశ మందిరంలో స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించిన రన్–అప్ టీమ్ సభ్యులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల నిర్వహణలో రన్–అప్ టీమ్ చూపిన కృషి, కట్టుదిట్టమైన ప్రణాళిక, సమన్వయం అభినందనీయమన్నారు. శతాబ్ది ఉత్సవాలు కేవలం వేడుకలు మాత్రమే కాకుండా విశ్వవిద్యాలయ సాంస్కృతిక, క్రీడా, శాసీ్త్రయ వారసత్వాన్ని ప్రతిబింబించే వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రన్ అప్ టీమ్ సభ్యులకు జ్ఞాపికలు అందించి అభినందించారు. సమావేశంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ఆచార్యులు విజయమోహన్, హరనాథ్, వర్సిటీ అధికారులు మంజుల, సాంబమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
క్వాంటమ్ కంప్యూటర్పరీక్షల్లో ప్రతిభ
● ముగ్గురు చింతపల్లి విద్యార్థినులకు అభినందన చింతపల్లి: స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులకు మంగళవారం విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నిర్వాహకులు ప్రశంసా పత్రాలను అందించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయభారతి తెలిపారు. తమ కళాశాలకు చెందిన సీహెచ్భవాని, ఆర్.విమోచన, వి.కృష్ణవేణి ఇటీవల విశాఖలో నిర్వహించిన క్వాంటమ్ కంప్యూటర్ పరీక్షల్లో ప్రతిభ కనపరిచారన్నారు. ఈ మేరకు వారిని విజయవాడ ఆహ్వానించినట్టు తెలిపారు. అక్కడ మిషన్ డైరెక్టర్ శ్రీధర్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న ప్రశంసాపత్రాలతోపాటు నగదు బహుమతులను అందించినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
యలమంచిలి రూరల్: మండలంలోని పులపర్తి సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు. విశాఖపట్నం పోర్టు నుంచి బొగ్గు లోడుతో హైదరాబాద్ వెళ్తున్న లారీని యలమంచిలి దాటిన తర్వాత పులపర్తి కూడలి సమీపంలో నిర్మాణంలో ఉన్న నయారా పెట్రోల్ బంక్ వద్ద ఆపి టైర్లలో గాలిని డ్రైవర్ పులగల సుబ్రహ్మణ్యం(32) తనిఖీ చేసుకుంటుండగా అనకాపల్లి నుంచి తునివైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందినట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు.మృతుడు పాయకరావుపేట మండలం వి. కొత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.మృతుని బావ గారా సంజీవరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. -
వైభవంగా మత్స్యమాడుగులమ్మ సంబరం
● భారీగా తరలివచ్చిన భక్తజనం ● భక్తిశ్రద్ధలతో అనుపు ఉత్సవం జి.మాడుగుల: మండల కేంద్రం జి.మాడుగుల ప్రజల ఆరాధ్య దైవం మత్స్య మాడుగులమ్మ తల్లి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ ఉత్సవాలకు జిల్లాలోని గిరిజన ప్రాంతాల నుండే కాకుండా, మైదాన ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గిరిజన సంప్రదాయం ప్రకారం.. మంగళవారం సాయంత్రం మాజీ ఎంపీ దివంగత మత్స్యరాస మత్స్యరాజు స్వగృహం నుంచి ఘటాలను మత్స్యరాస వంశీయులు, భక్తులు ఊరేగింపుగా బయలుదేరారు. వీటిని స్థానిక రామాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సతకం పట్టు వద్దకు తీసుకువచ్చారు. మూడు రోజుల పాటు విశేష పూజలందుకున్న ఈ ఘటాలతో పాటు, అమ్మవారి అనుపు ఉత్సవం గ్రామ పురవీధుల్లో అత్యంత వైభవంగా జరిగింది. డప్పు వాయిద్యాలు, శక్తి వేషధారణలు, తీన్మార్ స్టెప్పులు, బాణసంచా వేడుకల మధ్య ఈ కార్యక్రమం సాగింది. జాతర సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పరిసర గ్రామాల నుంచి మహిళలు అమ్మవారికి ప్రీతిపాత్రమైన మట్టి ఘటాలను తలపై పెట్టుకొని, డప్పు వాయిద్యాల మధ్య పురవీధుల గుండా వచ్చి ఆలయంలో సమర్పించారు. గంతకొండపై కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమలు, నూతన వస్త్రాలు సమర్పించి భక్తి చాటుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రులు మత్స్యరాస బాలరాజు, మణికుమారి, జెడ్పీటీసీ డాక్టర్ మత్స్యరాస వెంకటలక్ష్మి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస రామరాజు, మాజీ ఎంపీపీ ఎం. వెంకట గంగరాజు, ప్రధాన కార్యదర్శి గసాడి రెడ్డిబాబు, ఎంపీటీసీలు విజయకుమారి, మాజీ పాడేరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎం. గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. -
జూన్ 1 నుంచి కార్యకలాపాలు
రైల్వే చట్టం–1989 ప్రకారం తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే జోన్లను పునర్వ్యవస్థీకరించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఏర్పాటు చేశారు. మంగళవారం విడుదలైన గెజిట్ ప్రకా రం జూన్ 1 నుంచి ఈ జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. జోన్ పరిధిలో మొత్తం నాలుగు డివిజన్లు ఉంటాయి. గతంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను ఈ జోన్లో చేర్చారు. అదేవిధంగా వాల్తేరు డివిజన్ను విభజించి.. దానిలో కొంత భాగంతో కొత్తగా విశాఖపట్నం డివిజన్ను ఏర్పాటు చేశారు. మరోవైపు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు కొనసాగనున్నాయి. -
చింతలపూడి–చోద్యంరహదారిని పునర్నిర్మించాలి
కొయ్యూరు: మండలంలోని చింతలపూడి నుంచి చోద్యం వరకు ఉన్న 24 కిలోమీటర్ల ప్రధాన రహదారి పూర్తిగా పాడైపోయిందని, వెంటనే దాని స్థానంలో కొత్త రహదారిని నిర్మించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ మాట్లాడుతూ.. గతంలో వేసిన రోడ్డు పూర్తిగా ధ్వంసమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు బాలారం నుంచి బకులూరు వరకు ఉన్న నాలుగు కిలోమీటర్ల రహదారిని, కించెలి నుంచి చమ్మచింత వరకు ఉన్న ఐదు కిలోమీటర్ల మేర రోడ్డును తక్షణమే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఐ నేతలు ఉల్లి సూరిబాబు, ఇరువాడ దేముడు, కార్మిక సంఘం నాయకులు వియ్యపు నానాజీ, గిరిజన సమాఖ్య మండల కార్యదర్శి ధార మల్లేష్, మొల్ల సుబ్బారావు, పొట్టిక మలేష్ పాల్గొన్నారు. -
మా గ్రామంలో మద్యం దుకాణం వద్దు
అర్జునగిరి గ్రామస్తుల నిరసనచీడికాడ : మా గ్రామంలో అర్ధంతరంగా మద్యం దుకాణం ఏర్పాటు వద్దంటూ మండలంలోని అర్జునగిరికి చెందిన గ్రామ పెద్దలు, మహిళలు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బోడాల రమాదేవి, ఎంపీటీసీ పెంటకోట అమ్మతల్లినాయుడు మాడుగుల వ్యవసాయ కమిటీ డైరెక్టర్ జాజిమొగ్గల ప్రసాద్ మాట్లాడుతూ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటుకు అధికారులు సిండికేటు నాయకులు కుట్ర పన్నుతున్నారన్నారు. గ్రామంలో నివాసితుల మధ్య ఈ దుకాణం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. సిండికేటు నాయకులు వారిలో వారికి ఉన్న విభేదాలతో గ్రామంలో అల్లర్లు సృష్టించేందుకు ఈ దుకాణం ఏర్పాటుకు ముందుకు వస్తున్నారన్నారు. ఈ మద్యం దుకాణం ఇప్పటికే కోణం గ్రామ శివారు గుడివాడలో పెట్టి, అక్కడ నుంచి ప్రస్తుతం చీడికాడలో నిర్వహిస్తున్నారని, ఆ దుకాణాన్నే అర్జునగిరికి మార్చాలని చూస్తున్నారని అన్నారు. దీనిపై మాడుగుల ఎకై ్సజ్ సీఐ ఉపేంద్రతో పాటు, జిల్లా సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ నేతలు జె.ప్రసాద్, పి.నూకునాయుడు, కె.గణపతి, కె.శ్రీనివాసరావు, టి.అప్పలనాయుడు, జె.సత్యనారాయణ, చొక్కా కుల దాలినాయుడు, చీకటి శివ, పెంటకోట సూరిబాబు, ఎంపీటీసీ పి.అమ్మతల్లినాయుడు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల రక్షణకు చట్టం చేయాలి
కొయ్యూరు: జర్నలిస్టుల సంక్షేమానికి, రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ పి. సోమసుందరం, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు కోరారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన జిల్లా ప్రథమ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కోవిడ్ సమయంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి కరోనా వల్ల మృతి చెందిన కొందరు జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారని వారు గుర్తు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించామని తెలిపారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాల మంజూరు, అక్రిడిటేషన్ల జారీ వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. మన్యం ప్రాంతంలో విలేకరులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు, చింతల కిషోర్ ప్రసంగించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీఐ బి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జర్నలిస్టులు వాస్తవాలను ప్రతిబింబించాలని, నిజాయితీగా ఉంటూ ప్రజలకు సేవ చేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బడుగు రమేష్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ ప్రసాద్, ఎంపీడీవో ప్రసాదరావు, ఎస్ఐలు కిషోర్ వర్మ, సీదరి శ్రీనివాస్లను జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ఇలావుండగా జిల్లా అధ్యక్షుడిగా పాడేరుకు చెంతిన ప్రభుదాస్, ప్రధాన కార్యదర్శిగా దయానంద్, 15 మంది సభ్యులతో కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి అధ్యక్షుడిగా ప్రణిత్కుమార్, ప్రధాన కార్యదర్శిగా వి.జోషీను ఎన్నుకున్నారు. ఐదుగురు సభ్యులతో కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నేతలు సోమసుందరం, ఐవీ సుబ్బారావు -
షార్ట్ సర్క్యూట్తో క్వారీ లారీ దగ్ధం
కోటవురట్ల : బ్యాటరీ షార్ట్ సర్క్యూట్తో క్వారీ లారీ దగ్ధమైంది. రాజుపేట శివారు పరదేశమ్మతల్లి ఆల యం సమీపంలో కోటవురట్ల వైపు వెళుతున్న క్వారీ లారీ ఇంజిను నుంచి మంగళవారం రాత్రి మంటలు రావడంతో లారీ డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమయ్యారు. వెంటనే లారీని ఆపి కిందికి దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. బ్యాటరీ వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్టు లారీ సిబ్బంది తెలిపారు. స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. లారీ ఇంజిను భాగంగా దాదాపు 70 శాతం దగ్ధమైనట్టు స్థానికులు తెలిపారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
నేతలు హెల్మెట్ ధరించకపోతే రెట్టింపు జరిమానా
నక్కపల్లి: రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడేందుకు బైక్లు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించేందుకు మంగళవారం అడ్డురోడ్డు నుంచి నక్కపల్లి వరకు జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సురక్షిత రోడ్లు, సురక్షిత జీవితం అనే నినాదంతో సాగిన ఈ ర్యాలీ ద్వారా బైక్ వినియోగదారులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రూ.రెండు లక్షలు పెట్టి బైక్ కొనేవారు ఐదొందలు పెట్టి హెల్మెట్ కొని ధరించడానికి వెనుకాడుతున్నారన్నారు. మీరు మీ కుటుంబం రోడ్డున పడకుండా సురక్షితంగా ఉండేందుకు హెల్మెట్ ధరించాలన్నారు. రాజరకీయ నాయకులు హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే రెట్టింపు జరిమానా విధించాలని పోలీసులను ఆదేశించారు. ఈ విషయంలో ఎవరికి మినహాయింపు ఉండదన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు పలువురు ప్రాణాలు కోల్పోయారన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారానే వీటిని అరికట్టగలమన్నారు. ఈ ర్యాలీలో హెల్మెట్ ధరించి మంత్రి స్వయంగా బైక్ నడిపారు. ఈ ర్యాలీలో యువతీ యువకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మోహన్రావు, సీఐలు మురళి, రామకృష్ణ, శంకర్రావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
సీఎంకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు...
మాడుగుల రూరల్ : గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి 2024–25 క్రషింగ్ సీజన్కు సంబంధించి చెరకు సరఫరా చేసిన చెరకు బకాయిలు ఇప్పించాలని కోరుతూ మూడుసార్లు జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా, సీఎంకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని కె.జె.పురం గ్రామానికి చెందిన విశ్వనాధ సుబ్బారావు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. 31192 జనరల్ నెంబరుతో సుగర్ ప్యాక్టరీకి ప్రతి ఏటా గతంలో చెరకును సరఫరా చేసేవాడినని, గడిచిన 2024–25 క్రషింగ్ సీజన్కు సంబంధించి, 162 టన్నులు 968 కిలోల చెరకును సుగర్ ఫ్యాక్టరీకి సరఫరా చేసినట్టు తెలిపారు. దీంట్లో కేవలం 7 టన్నులు 3 కిలోల చెరకుకు సుమారు రూ.22,000 ఇవ్వగా, మిగిలిన 155 టన్నులు 965 కిలోలు చెరకుకు గాను సుమారు రూ.4,92,342 బకాయిలు రావాల్సి ఉందన్నారు. బకాయిలు కోసం పలు పర్యాయాలు గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి వెళ్లి కోరినా పేమెంట్ ఇవ్వలేదన్నారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, హృదయ సంబంధిత సమస్యల వల్ల విశాఖలో ప్రెవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నామని, బకాయిల కోసం ఈ ఏడాది జనవరి 5, మార్చి 30న, ఏప్రిల్ 6వ తేదీన అనకాపల్లి జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేశానన్నారు. అయినా అధికారుల నుంచి స్పందన లేదని, తనకు రావాల్సిన బకాయిలు రాక, ఆరోగ్యం బాగా లేక, ఇబ్బందులు పడుతున్నామన్నారు. గత నెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాత పూర్వకంగా బకాయిలు ఇప్పించాలని ఫిర్యాదు చేసినట్టు సుబ్బారావు పేర్కొన్నారు. కాగా ఈ సమస్యపై తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సుగర్స్ కమిషనర్ ఈ నెల 4న ఫ్యాక్టరీ మనేజింగ్ డైరెక్టర్కు లేఖ పంపడం జరిగిందని, అయినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. అలాగే 2023–24, 2024–25 క్రషింగ్ సీజన్లో చెరకు రవాణా చార్జీలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
పాఠశాల బస్సుల తనిఖీ
చింతపల్లి: జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి విద్యార్థులను చేరవేస్తున్న బస్సుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ సాయిరమేష్ తెలిపారు. మంగళవారం చింతపల్లిలోని కింగ్స్ ఆర్మీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన బస్సులను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సుల్లోని సీటింగ్ సదుపాయాలు, విద్యార్థుల భద్రతకు అవసరమైన అత్యవసర పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు వంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు వివరించారు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు చేపడుతున్నట్లు సాయిరమేష్ పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
శ్వాసకు ‘బ్రేక్’.. వెంటిలేటర్ల షాక్
మహారాణిపేట: కేజీహెచ్.. ఉత్తరాంధ్ర ప్రజలకే కాక, పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ పేదలకు కూడా ఒక నమ్మకమైన వైద్య కేంద్రం. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో అత్యవసర ప్రాణవాయువును అందించే వెంటిలేటర్ల వ్యవస్థ కుప్పకూలడం రోగుల పాలిట శాపంగా మారింది. రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఊపిరితిత్తులు సహకరించని సమయంలో శ్వాస అందించేందుకు వెంటిలేటర్ ఎంతో కీలకం. ముఖ్యంగా రోడ్డు ప్రమాద బాధితులకు, అగ్నిప్రమాద క్షతగాత్రులకు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఇది జీవనాధారం. ఇటువంటి కీలకమైన పరికరాలు మెజారిటీ సంఖ్యలో మూలపడటం ఆందోళన కలిగిస్తోంది. పరిమితమైన వనరులు కేజీహెచ్లో అధికారికంగా 1,187 పడకలు ఉన్నప్పటికీ, ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య అంతకు రెట్టింపుగా ఉంటోంది. ప్రతిరోజూ సుమారు 2500 మందికి పైగా ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ఓపీ విభాగం కిటకిటలాడుతుంటుంది. నిత్యం వందలాది మంది ఇన్పేషెంట్లుగా చేరుతుంటారు. సుమారు 26 విభాగాలు కలిగిన ఈ ఆస్పత్రిలో రోగుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెరగకపోగా, ఉన్న సౌకర్యాలు కూడా కంటికి కనిపించకుండా పోతున్నాయి. 92 మాత్రమే పని చేస్తున్నాయి ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో, అత్యవసర వార్డుల్లో మొత్తం 415 వెంటిలేటర్లు ఉండగా, ప్రస్తుతం అందులో కేవలం 92 మాత్రమే పనిచేస్తుండటం గమనార్హం. మిగిలిన 323 వెంటిలేటర్లు చిన్నపాటి మరమ్మత్తులకు గురయ్యాయి. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో వెంటిలేటర్లను మంజూరు చేసింది. ఆ సమయంలో ఇవి అద్భుతంగా పనిచేసినప్పటికీ, ఆ తర్వాత సరైన నిర్వహణ లేకపోవడంతో పనికిరాకుండా పోయాయి. మరమ్మత్తులు చేయించడంలో అధికారుల అలసత్వం, కొత్త వాటి కొనుగోలులో జాప్యం వెరసి పేద రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తక్షణ చర్యలు అవసరం ఆస్పత్రిలో క్యాజువాలిటీ, ఐసీయూ, ఐఆర్సీ, ఈఎండీ, సీసీయూ వంటి కీలక విభాగాల్లో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ యంత్రాలకు మరమ్మత్తులు చేయించాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి, నిధుల విడుదల, నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించాలని బాధితులు, ప్రజలు కోరుతున్నారు. పేదలకు తప్పని ఆర్థిక భారం కేజీహెచ్ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్ సౌకర్యం ఉచితంగా లభిస్తుంది. అదే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే రోజుకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు అవుతుంది. అంత భారీ మొత్తంలో బిల్లులు చెల్లించలేక, రోగి కోలుకోక నిస్సహాయ స్థితిలో ఉన్న సామాన్యులు మళ్లీ కేజీహెచ్కే పరుగులు తీస్తున్నారు. కానీ ఇక్కడకు వచ్చాక వెంటిలేటర్లు అందుబాటులో లేవని తెలిసినప్పుడు వారి ఆవేదన వర్ణనాతీతం. -
రాజేంద్రపాలెం పీహెచ్సీలో ఒక్కరే దిక్కు
● మరో వైద్యుడు లేక ఇబ్బందులు కొయ్యూరు: రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత నెల రోజులుగా రెండో వైద్యుని పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ పనిచేసిన వైద్యురాలు స్నేహలతారెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేసి, అన్నమయ్య జిల్లాలో జరిగిన కౌన్సెలింగ్ ద్వారా మరో పోస్టింగ్ పొందారు. ఆమె వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఖాళీని భర్తీ చేయలేదు. ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆసుపత్రిలో ప్రస్తుతం ఒక్కరే వైద్యుడు ఉండటంతో పెరిగిన ఓపీ రోగులను చూడటంతో పాటు, గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం భారంగా మారింది. ఈ నేపథ్యంలో, తాత్కాలికంగా యూ.చీడిపాలెంకు చెందిన ఒక వైద్యుడిని ఇక్కడకు డిప్యూటేషన్పై నియమిస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. త్వరలో జరగబోయే రెండో విడత కౌన్సెలింగ్లో ఇక్కడకు కచ్చితంగా వైద్యుని నియమిస్తామని సంబంధిత శాఖాధికారులు చెబుతున్నారు. -
వైభవంగా మోదకొండమ్మ ఘటాలు ఊరేగింపు
మాడుగుల : మాడుగుల మోదకొండమ్మ ఘటాలు ఊరేగింపు మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. డప్పులు వాయిద్యాలతో మహిళా కోలాటాలు నడుమ అమ్మవారి ఊరేగింపు కన్నుల పండువగా జరిగింది. ముందుగా అమ్మవారి ప్రతి రూపమైన ఘటాలను ఆలయ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, కమిటీ సభ్యుడు దేవరాపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు శిరస్సున పెట్టుకుని సతకం పట్టు వద్దకు అడుగులు వేశారు. అనంతరం వేలాది మంది భక్తులు అమ్మవారి ఘటాలు శిరస్సున పెట్టుకుని సంబరంలో పాల్గొన్నారు. ఆలయం నుంచి సతకం పట్టు వద్దకు భారీ మందుగుండు సామగ్రి, కోలాటాలు, నడుమ సతకం పట్టు వద్దకు సంబరంగా చేరుని అక్కడే కొలువు దీరారు. జూన్ 2వ తేదీ వరకు అమ్మవారు అక్కడే దర్శన మిస్తారు. తిరిగి పండగ రోజు మరలా ఆలయానికి చేరుకోవడంతో అమ్మవారి నెల రోజుల పండగ పూర్తి అవుతుంది. అమ్మవారు గ్రామంలో కోట ప్రాంగణంలో ఉన్న సతకం పట్టు వద్దకు చేరగానే అంతవరకు మండుటెండలో ఉన్న వాతావరణం ఇక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. దీంతో మాడుగుల ప్రజలు అమ్మవారి మహిమగా భావించి ఆనందం వ్యక్తం చేశారు. -
అక్రమ అరెస్టులతో పోరాటాలు ఆపలేరు
అచ్యుతాపురం రూరల్ : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మండలంలో దుప్పితూరు గ్రామాన్ని వైఎస్ఆర్సీపీ జిల్లా ముఖ్య నాయకులు హాజరై దుప్పితూరు గ్రామస్తులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాఽథ్, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు శోభా హైమవతి, నర్సీపట్నం నియోజకవర్గ పరిశీలకులు భీశెట్టి సత్యవతి, మాజీ ఎంపీపీ ఎస్ఈసీ సభ్యులు బోదెపు గోవింద్, అనకాపల్లి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత, నాలుగు మండలాల వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. గ్రామస్తులకు అండగా వైఎస్సార్సీపీ : మాజీ మంత్రి అమర్నాథ్ గ్రామస్తుల సమస్యలు పరిష్కరించి పరిశ్రమలు నెలకొల్పాలని మాజీ మంత్రి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ అన్నారు. దశాబ్దాలు గడుస్తున్నా నిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీ ఇవ్వకుండా అక్రమంగా ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టడం, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి, మహిళలను సైతం ఈడ్డుకుంటూ బలవంతంగా వ్యాన్లలో తరలించడం అత్యంత దుర్మార్గపు చర్య అన్నారు. ఇటువంటి సంస్కృతి మునుపెన్నడూ చూడలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దుప్పితూరు గ్రామస్తుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా..: ధర్మశ్రీ ఇంటికో ఉద్యోగం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, పునరావాసం కల్పించాలని అడిగినందుకు మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా అరెస్ట్లు చేయడం అత్యంత దుర్మార్గమని యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. భూ నిర్వాసితులపై ఆటవికంగా వ్యవహరించడమంటే ప్రజా స్వామ్యంలోనే ఉన్నామా? అనే దుస్థితి నెలకొందన్నారు. భూములిచ్చిన రైతుల గోడు పట్టదా...? బొడ్డేడ ప్రసాద్ కార్పొరేట్ కంపెనీలకు తొత్తులుగా మారి బలవంతంగా భూ సేకరణలు చేసి రైతులకు అన్యాయం చేయాలని కోవడం అప్రజాస్వామ్యమని అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. 22 సంవత్సరాలుగా దుప్పితూరు గ్రామస్తులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. నిర్వాసితుల సమస్యలు పూర్తిగా పరిష్కరించే వరకూ ప్రహరీ నిర్మాణ పనులు వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై అనుచితంగా ప్రవర్తించడం కిరాతకం : మాజీ ఎంపీ సత్యవతి అక్రమ కేసులతో గ్రామస్తులను భయబ్రాంతులకు గురిచేసి పోరాటాలను ఆపాలనే దురాలోచన అత్యంత దుర్మార్గమని మహిళలపై అనుచితంగా వ్యవహరించడం అత్యంత కిరాతకమని అనకాపల్లి మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి అన్నారు. దుప్పితూరు సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వక్తలు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు అధ్యక్షతన జరిగిన ఈ చలో దుప్పితూరు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేశంశెట్టి పైడియ్యనాయుడు, ఉప సర్పంచ్ దేశంశెట్టి ఈశ్వర్రావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ శెట్టి నాగేశ్వర్రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రగడ తాతబాబు, భావనారుషి ఆలయ కమిటీ అధ్యక్షుడు మాడెం సూరి అప్పారావు పాల్గొన్నారు. గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అమర్నాథ్, వైఎస్సార్సీపీ నాయకులు -
గోబంద ఆక్రమణకు ప్రయత్నాలు
నక్కపల్లి: మండలంలో డి.ఎల్.పురంలో సర్వే నంబరు 81లోని సుమారు 91 ఎకరాల్లో ఉన్న గోబందను ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామ తాజామాజీ సర్పంచ్ కిల్లాడ రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు ఆరోపించారు. మంగళవారం వారు గోబంద ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏన్నో ఏళ్ల నుంచి గ్రామానికి చెందిన వారు పశువులను మేపుకోవడంతో పాటు వాటికి నీరు పెట్టేందుకు దీనిని వినియోగిస్తున్నార ని చెప్పారు. ఈ బందలో డి.ఎల్.పురం మత్స్యకా రులు చేపలవేట చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. పర్యావరణాన్ని కాపాడడంలో ఇటువంటి గోబందలు, చిత్తడి నేలలు ఎంతో కీలకమని చెప్పారు. ఆర్సిలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ప్లాంట్వారు ఈ గోబందను ఆక్రమించి ఇక్కడ ఉన్న నీటిని ప్లాంట్ అవసరాలకోసం వినియోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే స్టీల్ప్లాంట్కు అవసరమైన నీటిని ఏలేరు, పోలవరం కాలువలనుంచి వాడుకునేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతించిందన్నారు. గోబందలో నీటిని ఎలా వినియోగించుకుంటారని ప్రశ్నించారు.ఇక్కడకు దేశ, విదేశపక్షులు వచ్చి జీవిస్తుంటాయన్నారు. గోబందపై సర్వాధికారాలు డి.ఎల్.పురం గ్రామస్తులకు చెందేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆక్రమణకు గురికాకుండా, ఇక్కడ ఉన్న నీటి నిల్వలను ఫ్యాక్టరీలకు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈకార్యక్రమంలో సీపీఎం నాయకులు కోటేశ్వరరావు, కృష్ణంరాజు, సత్యనారాయణ, అప్పలనాయుడు, గోవిందు, అజయ్,నానాజీ తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని రైలు ఢీకొని మహిళ మృతి
అనకాపల్లి : మండలంలో శంకరం రైల్వే బ్రిడ్జి సమీపంలో సుమారు 60 సంవత్సరాలు మహిళలను విజయవాడ–విశాఖ రైల్వే ట్రాక్లపై సోమవారం రాత్రి గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి మంగళవారం తెలిపారు. స్థానికలు, రైల్వే గ్యాంగ్ మ్యాన్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతురాలు గ్రీన్ కలర్ చీర ధరించి ఉన్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతురాలు వద్ద ఉన్న బ్యాగ్ ఆధారంగా ఆమె యాచకురాలుగా గుర్తించడం జరిగిందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్కు తరలించడం జరిగిందని ఎస్ఐ చెప్పారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్.7382058996ను సంప్రదించాలన్నారు. -
పాలిసెట్ ఫలితాల్లో 90.64 శాతం ఉత్తీర్ణత
తుమ్మపాల: పాలిసెట్–2026 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. 90.64 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ ఐ.వి. ఎస్.ఎస్.శ్రీనివాసరావు తెలిపారు.బాలురు 4,468 (88.48 శాతం), బాలికలు 3,673 (93.41 శాతం) మొత్తం 8,141 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొ న్నారు. జిల్లాకు చెందిన మొసూరి హర్షవర్ధన్ ఆదిత్య 85వ ర్యాంక్, కాపుశెట్టి గుణ దీపిక వెంకట సాయిశ్రీ 158వ ర్యాంక్, గాది యశ్వంతి 163వ ర్యాంక్ సాఽధించారు. కె.కోటపాడు: పాలిసెట్–2026 ఫలితాల్లో కె.కోటపాడు మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. కింతాడ పంచాయతీకి చెందిన కిలపర్తి సృజన్ 120 మార్కులకు గాను 119 మార్కులు సాధించి 36వ ర్యాంక్ సాధించాడు. యరకన్నపాలెం విద్యార్థిని గాడి యశ్వంతి 120 మార్కులకు 117 మార్కులను సాధించి 116వ ర్యాంక్ పొందింది. దేవరాపల్లి: దేవరాపల్లికి చెందిన విద్యార్థిని వెత్సా షణ్ముఖి 39వ ర్యాంక్ సాధించింది. 120 మార్కులకు గాను 119 మార్కులు పొందింది. కాగా ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో షణ్ముఖి 588 మార్కులు సాధించింది. ఈమె తండ్రి వెత్సా జోగిరాజు (రాజేష్) రేషన్ డీలర్గా పని చేస్తుండగా, తల్లి పరమేశ్వరీ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు.మంచి ర్యాంక్ సాధించిన షణ్ముఖిని గ్రామానికి చెందిన పలువురు అభినందించారు. ఈ సందర్భంగా షణ్ముఖి మాట్లాడుతూ సివిల్స్లో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని తెలిపింది. దేవరాపల్లిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పాలిసెట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంక్లు సాధించారు. తమటపు గోపిచంద్ 1,533వ ర్యాంక్, లక్కరాజు అనుష్క 4,174వ ర్యాంక్, కాటా భరత్కుమార్ 4,562వ ర్యాంక్, టి.ఉష 5,292వ ర్యాంక్, పరవాడ చందన 6,438వ ర్యాంక్, జి. హేమలత 7,708వ ర్యాంక్ను సాధించారు. వీరికి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు కొరుప్రోలు శ్రీను, గంగవంశం సంతోష్, ఉపాధ్యాయులు పెద్దాడ వెంకటరమణ, వేచలపు అప్పలనాయుడు తదితర్లు అభినందించారు. -
బాబు మాటను బేఖాతరు చేసిన కేంద్రం
వాల్తేరు డివిజన్లో కీలక ఆదాయాన్ని తెచ్చిపెట్టే కేకే లైన్ను విశాఖలోనే ఉంచాలంటూ జోన్ ప్రకటన వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం చేస్తూనే ఉన్నారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ఇటీవల డేటా సెంటర్ శంకుస్థాపనకు వచ్చిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో చంద్రబాబు చర్చించారు. అరకుతో కూడిన కేకే లైన్ విశాఖ జోన్లో కలపాలని కోరారు. అప్పుడే చంద్రబాబు అభ్యర్థనను రైల్వే మంత్రి తోసి పుచ్చినట్లు సమాచారం. ఇప్పుడు వాల్తేరు డివిజన్ విభజన తీరు చూస్తుంటే కేంద్రం వద్ద చంద్రబాబు పరపతి ఏపాటిదో అర్థమవుతోంది. కేకే లైన్ను ఒడిశాకే కట్టబెడుతూ గెజిట్ విడుదల చేయడం బాబు అసమర్థతకు నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముడసర్లోవలో కొనసాగుతున్న జోన్ ప్రధాన కార్యాలయం పనులు -
ఏపీడీపీఎంఎస్పై శిక్షణ
శిక్షణ కార్యక్రమంలో అతిథులు, ఆహ్వానితులు బీచ్రోడ్డు: భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీడీపీఎంఎస్(అప్డేటెడ్ వెర్షన్)పై శిక్షణ కార్యక్రమాన్ని వీఎంఆర్డీఏలో మంగళవారం నిర్వహించారు. ఆర్డీడీటీపీ చామంతి మార్గదర్శకత్వంలో సాఫ్ట్టెక్ బృందం ఆధ్వర్యంలో శిక్షణ జరిగింది. అప్డేటెడ్ వెర్షన్లోని కొత్త ఫీచర్లు, డ్రాఫ్టింగ్ టూల్స్, బిల్డింగ్ అప్లికేషన్స్, లేఅవుట్ అప్లికేషన్స్ ఆన్లైన్ ప్రాసెస్పై సమగ్ర అవగాహన కల్పించారు. అప్లికేషన్ సమర్పణ నుంచి ఆమోదం వరకు ఉండే దశలను ప్రాక్టికల్గా వివరిస్తూ పాల్గొన్నవారికి శిక్షణ ఇచ్చారు. -
కేకే లైన్ కట్
జోన్ గిఫ్ట్దక్షిణ కోస్తా రైల్వే జోన్కు గెజిట్ విడుదల 3,413 కి.మీ పరిధిలో విశాఖ కేంద్రంగా కొత్త జోన్ కేకే లైన్పై కేంద్రం నిర్ణయంతో అసంతృప్తి సాక్షి, విశాఖపట్నం: రైల్వే జోన్ కోసం విశాఖ వాసులు దశాబ్దాలుగా ఎదురుచూసిన కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రకటన వెలువడిన ఏడేళ్ల తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 1 నుంచి వీఎంఆర్డీఏ భవనంలో తాత్కాలికంగా ఈ జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈ గెజిట్ తీపి కబురు కంటే చేదు నిజాలనే ఎక్కువగా మోసుకొచ్చింది. కీలకమైన ఆదాయ వనరుల పంపిణీ, విభజన అంశాల్లో కేంద్రం తీవ్ర నిరాశకు గురిచేసింది. ‘కామధేనువు’ లాంటి కేకే లైన్ మొత్తాన్ని ఒడిశాలోని రాయగడ డివిజన్కు కట్టబెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్థికంగా దెబ్బకొట్టిన విభజన వాల్తేరు డివిజన్ విభజన తీరు ఏపీకి తీరని అన్యాయం చేసేలా ఉంది. ఇనుప ఖనిజం రవాణా ద్వారా భారీ ఆదాయం తెచ్చే కిరండూల్ మార్గాన్ని రాయగడకు కేటాయించడం ద్వారా కొత్త జోన్ ఆర్థిక వెన్నెముకను కేంద్రం విరిచేసింది. విశాఖకు కేవలం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండి, నిర్వహణ ఖర్చులు భారమయ్యే మార్గాలను మాత్రమే ఇచ్చారు. అంటే, రాబడి వచ్చే మార్గాలన్నీ పక్క రాష్ట్రానికి.. ఖర్చులు పెరిగే మార్గాలు మాత్రం విశాఖకు అన్నట్టుగా ఈ విభజన సాగింది. -
ఏలేరు కాలువలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య
కోటవురట్ల: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఏలేరు కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలివి..నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి జోగినాధునిపాలేనికి చెందిన మాజీ కౌన్సిలర్ వర్రి శ్రీనివాసరావు(48) యండపల్లి వద్ద ఏలేరు కాలువలోకి సోమవారం సాయంత్రం దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలేరు కాలువ వద్ద శ్రీనివాసరావు చెప్పులు, కారు ఉండడంతో అతని భార్య నర్సీపట్నం పోలీసు స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేసింది. అక్కడ మిస్సింగ్ కేసు నమోదు చేయగా మంగళవారం ఉదయం యండపల్లి ఏలేరు కాలువలో అతని మృతదేహం తేలింది. అప్పులు పెరిగిపోవడంతో తట్టుకోలేక ఏలేరు కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బంధువులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
పెదబయలు: వారపు సంతలో చెట్టు పడి మృతి చెందిన మహిళల కుటుంబాలకు అండగా ఉంటామని ఒడిశా రాష్ట్రం పొట్టంగి నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్ర కడం అన్నారు.పెదబయలు వారపు సంతలో చెట్టు పడి ఇద్దరు మహిళలు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన సోమవారం సాయంత్రం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను, వారి కుటుంబాలను పరామర్శించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందించాలని కోరారు. ఒడిశా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయంఅందజేస్తామని చెప్పారు. చెట్టు పడి మృతి చెందిన దుర్ఘటన తీవ్రంగా బాధించిందన్నారు.ఈ కార్యక్రమంలో పొట్టంగి నియోజకవర్గ ఇన్చార్జి కమిడి కామేష్, బ్లాక్ ప్రెసిడెంట్ మదన్,జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ రామకృష్ణ పడాల్ తదితరులు పాల్గొన్నారు. ఒడిశా రాష్ట్రం పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర కడం -
విశాఖలో గిరిజన రైతు బజారు ఏర్పాటు చేయాలి
ఎమ్మెల్సీ కుంభా రవిబాబుడుంబ్రిగుడ: విశాఖనగరంలో ప్రత్యేకంగా గిరిజన రైతు బజారు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు కోరారు. గిరిజన రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదని, వారి కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వద్ద క్యాబేజీ కిలో రూ.3 నుంచి రూ.5కు కొనుగోలు చేసి, మార్కెట్లో రూ.30 నుంచి రూ.50 విక్రయిస్తున్నారని తెలిపారు. చింతపండు కిలోరూ.50 కి కొనుగోలు చేసి, రూ.200 వరకూ విక్రయిస్తూ దళారులు లాభపడుతున్నారన్నారు. గిరిజనులు పండించే దినుసులు, కూరగాయలు, వాణిజ్య పంటలైన కాఫీ, మిరియాలు, పసుపు, అల్లం, చింతపండు, జీడిపిక్కలకు వారపుసంత్లో కూడా సరైన ధరలు లేక నష్టపోతున్నారని తెలిపారు. అందువల్ల విశాఖలో ప్రత్యేక గిరిజన రైతు బజారు ఏర్పాటు చేసి, గిరిజన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. గిరిజన ఉత్పత్తులను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో కోల్డ్స్టోరేజ్లు ఏర్పాటు చేసి, రవాణా సదుపాయాలు కల్పించాలన్నారు. -
ఆదివాసీలను మోసగిస్తున్న గిరిజన మంత్రి
ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బాలదేవ్,ధర్మనపడాల్ పాడేరు రూరల్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదివాసీలను నమ్మించి మోసం చేస్తున్నారని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పొద్దు బాలదేవ్,ధర్మనపడాల్ అన్నారు. సోమవారం పాడేరు మోదకొండమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జీవో నంబర్ 3పై మంత్రి మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయలేదని చెప్పారు. వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్, ప్రత్యేక డీఎస్సీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతంలో చేపట్టిన హైడ్రోపవర్ ప్రాజెక్టులు నిలిపివేయాలని, ప్రత్యేక గిరిజన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, పాడేరు గిరిజన ప్రాంతాన్ని జోన్– 1లోనే కొనసాగించాలని, గతంలో ఆదివాసీ ఉద్యోగ, ప్రజా సంఘాలతో పాటు నిరుద్యోగ యువతీయువకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. గతంలో పలుమార్లు గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
గడువులోగా వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తి
పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులో నిర్మిస్తున ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అప్పగించాలని కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. కళాశాల నిర్మాణ పనుల పురోగతిపై కళాశాల ప్రిన్సిపాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్, ఏపీ ఎస్ఎంఐడీసీ ఎస్ఈ, ఈఈ, డీఈలు, కాంట్రాక్టర్లతో సోమవారం ఆమె సమీక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్ధేశించిన గడువులోగా మెడికల్ కళాశాలకు సంబంధించిన అన్ని భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. అవసరమైన ఫర్నిచర్, ఇతర పరికరాలను అమర్చుకోవాలని అధికారులను ఆదేశించారు.కళాశాల విద్యార్థులకు, రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తూ ప్రణాళికతో పనులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జీజీహె చ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ఏపీఎంఐడీసీ ఎస్ఈ విజయభాస్కర్, డీఈ వర్మ, పలువురు అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ నిషాంతి ఆదేశం -
రాకాసిరాయి కల్వర్టుపై నిలిచిన ట్రాలీ
రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ముంచంగిపుట్టు: మండల కేంద్రం ముంచంగిపుట్టు నుంచి కుమడ వెళ్లే మార్గంలో రాకాసిరాయి గ్రామ సమీపంలోని కల్వర్టుపై ఓ ట్రాలీ మరమ్మతులకు గురై సోమవారం ఉదయం నిలిచిపోయింది.దీంతో ఈ మార్గంలో గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి. రూడకోట వారపు సంతకు వెళ్లే వ్యాపారుల వాహనాలు,ఆర్టీసీ బస్సు,ఆటోలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.ఒడిశాకు చెందిన ట్రాలీలో పెద్ద క్రేన్ తరలిస్తున్న సమయంలో ఆగిపోవడంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారు.కొంత మంది వాహనాలను తిప్పి వెనక్కి వెళ్లిపోయారు. కుమడ, బాబుశాల, భూసిపుట్టు, జామిగూడ, రూడకోట పంచాయతీల్లో విధులకు వెళ్లే ఉద్యోగులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్లారు.ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు ట్రాలీ కల్వర్టుపై ఉండిపోయింది. డ్రైవర్ రెండు గంటల పాటు శ్రమించి బాగు చేసిన తరువాత కల్వర్టుపై నుంచి ట్రాలీని తరలించడంతో వాహన రాకపోకలు యథావిధిగా సాగాయి. -
ముఖం గుర్తించట్లే!
సాక్షి,పాడేరు: జాతీయ ఉపాధి హామీ పథకంలో వేతనదారుల హాజరు విధానానికి సంబంధించి కేంద్ర ప్ర భుత్వం ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరు కష్టజీవులకు శాపంగా మారి, వారిని పనికి దూరం చేస్తోంది. పని ప్రదేశాల్లో లేకుంటే, వారి పేరుతో హాజరు వేసే వీలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోగా, సాంకేతిక కారణాలతో హాజరు నమోదు కాక వేతనదారులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో సెల్ టవర్లు లేకపోవడంతో పాటు ఉన్నచోట్ల కూడా పూర్తిస్థాయిలో సెల్ సంకేతాలు లేవు. ఈ పరిస్థితిలో ముఖ ఆధారిత హాజరుకు గిరిశిఖర గ్రా మాల గిరిజనులు ప్రతిరోజు నరకయాతన పడుతున్నారు. కొండలెక్కాలిసిందే... అనంతగిరి,డుంబ్రిగుడ,ముంచంగిపుట్టు,పెదబయలు, చింతపల్లి, జీకే వీధి,హుకుంపేట,పాడేరు మండలాల్లో సుమారు 100వరకు గిరిశిఖర గ్రామాలు ఉన్నాయి.మారుమూల గ్రామాలు కావడంతో సెల్సంకేతాలు లేవు. దీంతో ముఖ ఆధారిత హాజరుకు ఎత్తైన కొండలు ఎక్కి ఉదయం,సాయంత్రం సమయాల్లో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కొన్ని గ్రామాల గిరిజనులు 3నుంచి 5కిలోమీటర్ల దూరం నడిచి ముఖ ఆధారిత హాజరు వేసుకుంటున్నారు.గత మూడు నెలల నుంచి ముఖ ఆధారిత హాజరుకు మారుమూల గ్రామాల గిరిజనులు నరకయాతన పడుతున్నారు.ఉపాధి పనులు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా భారీగా జరుగుతున్నాయి.జిల్లాలో 1.57లక్షల జాబ్కార్డులున్నాయి. ఈ కార్డుదారుల్లో సుమారు 20వేల మంది మారుమూల గ్రామాల గిరిజనులున్నారు. వీరికి ముఖ ఆధారిత హాజరు సక్రమంగా నమోదు కావడం లేదు. నిత్యం ఆందోళనలు జిల్లాలోని మారుమూల గ్రామాల గిరిజనులంతా సెల్ టవర్ల నిర్మాణాలకు డిమాండ్ చేస్తున్నారు.సెల్ సంకేతాల సమస్యతో ఉపాధి హామీ పనులు చేసిన తామంతా ముఖ ఆధారిత హాజరు వేయలేకపోతున్నామని, తమకు ఈ బాధ తప్పించాలని జిల్లాలో ఏదో ఒక గ్రామంలో రోజూ వేతనదారులు ఆందోళనలు చేస్తున్నారు. ముంచంగిపుట్టు మండం బంగారుముట్ట పంచాయతీలోని పలు గ్రామాల్లో సోమవారం ఉపాధి హామీ వేతనదారులు నిరసనకు దిగారు. ఇటీవల డుంబ్రిగుడ మండలంలోని కమలబంద,పెదబయలు మండలంలోని గొలుగొండ గిరిజనులు ఆందోళన చేశారు. అనంతగిరి మండలం కీవర్ల పంచాయతీ బొంగిజా గ్రామంలోని 450మంది గిరిజనులు సోమవారం మోకాళ్లపై నిలుచొని గ్రామ సమీపంలో ధర్నా చేశారు.ప్రతి రోజు సుమారు 12 కిలోమీటర్లు నడిచి గంగవరం ప్రాంతంలో ముఖ ఆధారిత హాజరు వేసుకుంటున్నామని.ఒక్కోసారి కొండలెక్కుతున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కలెక్టర్,ఇతర అధికారులు తమ మారుమూల గ్రామాల్లో సెల్టవర్లు ఏర్పాటు చేసి, ఈ సమస్యను పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. అప్పన్న అన్నప్రసాద పథకానికి రూ.5 లక్షల విరాళం సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శాశ్వత అన్నప్రసాద పథకానికి విజయవాడలోని భారతీనగర్కి చెందిన కోనేరు జగన్నాథ్, శిరీష దంపతులు రూ.5,01,116 విరాళాన్ని అందేశారు. సోమవారం సింహగిరికి వచ్చిన దాతలు సంబంధిత చెక్కును ఆలయ సూపరింటెండెంట్ సత్య శ్రీనివాస్కి అందజేశారు. దేవస్థానం తరపున దాతలకు స్వామివారి దర్శనం కల్పించి, ప్రసాదం అందజేశారు.సెల్టవర్లు ఏర్పాటు చేయాలి అన్ని గిరిశిఖర గ్రామాల గిరిజనులకు మేలు చేసే విధంగా సెల్టవర్లు ఏర్పాటు చేయాలి. ముఖ ఆధారిత హాజరు కోసం మారు మూల గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సెల్ సంకేతాల సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్న పట్టించుకోవడం లేదు. –గోవిందరావు, సీపీఎం జిల్లా నాయకుడు, అనంతగిరి మండలం రోజూ ఇబ్బందులే ఉపాధి హామీ కూలిపనులు చేస్తున్న తామంతా ముఖ ఆధారిత హాజరుకు ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నాం.సెల్ సంకేతాలు ఉన్న దూర ప్రాంతాలతో పాటు,కొండలెక్కి హాజరు వేసుకోవడం బాధగా ఉంది.సెల్టవర్ల వ్యవస్థను అందుబాటులోకి తేవాలి –పాంగి వసంతకుమార్, కమలబంద గ్రామం, డుంబ్రిగుడ మండలం -
బీభత్సం
భారీ వర్షం... ఈదురుగాలుల పెదబయలు వారపు సంతలో కూలిన భారీ చెట్టు నలుగురుకి తీవ్ర గాయాలు చెట్టు కింద చిక్కుకున్న చిట్టమ్మ, ఇచ్చమ్మ మృతదేహాలుపెదబయలు: మండల కేంద్రం పెదబయలులో సోమవారం జరిగిన వారపు సంతకు జిల్లాలోని పలు ప్రాంతల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి ప్రజలు వచ్చారు. సంత జరుగుతున్న సమయంలో మధ్యాహ్నం 3గంటలకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇంటికి కావలసిన సరుకులు కొనేందుకు సంతకు వచ్చిన ఒడిశా రాష్ట్రం కోరాపుట్టు జిల్లా పాతులొంగి పంచాయతీ జర్రాయి గ్రామానికి చెందిన కొర్ర చిట్టమ్మ(30),కోడా ఇచ్చమ్మ(40)లు సంతలో టార్పాలిన్తో కప్పిన కర్రల పందిరిలోకి వెళ్లి కూర్చున్నారు. ఈదురు గాలులకు సంత ప్రాంగణంలో ఉన్న భారీ చెట్టు వారు ఉన్న పందిరిపై కూలిపోయింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి భర్త, పిల్లలు ఉన్నారు. ఒడిశా రాష్ట్రం పాతులొంగి గ్రామానికి చెందిన పి.మోని, కుడ గ్రామానికి చెందిన కె.ప్రమీలతో పాటు పి.పూర్ణచందర్,ఎస్.కోములు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను 108 వాహనంలో హుటాహుటిన స్థానిక పీహెచ్సీకి తరలించారు.వైద్యాధికారి నిఖిల్ వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్య సేవల కోసం మోని,ప్రమీలలను అంబులెన్స్లో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. చెట్టు కింద ఉన్న ఇద్దరు మహిళల మృతదేహాలను ఎస్ఐ వెంకటేష్,పోలీసులు అతికష్టం మీద బయటకు తీసి, పోర్టుమార్టానికి ముంచంగిపుట్టు సీహెచ్సీకి తరలించారు.ఎంపీడీవో కార్యాలయ ఏవో పూర్ణయ్య,ఆర్ఐ పూర్ణయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. భారీ చెట్లతో భయం..భయం.. పెదబయలు వారపు సంత ప్రాంగణం చుట్టూ భారీ చెట్లు ఉండడంతో సంతకు వచ్చిన వారు నిత్యం భయాందోళనకు గురవుతున్నారు. సంతకు ఆనుకుని మండల ప్రజా పరిషత్ కార్యాలయం,నివాస గృహాలు ఉన్నాయి.భారీ చెట్లు తొలగించాలని గతంలోనే మండల ప్రజా పరిషత్ సమావేశంలో సభ్యులు తీర్మానం చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదు. గతంలో పలుమార్లు చెట్లు కూలి సంతకు వచ్చిన వారు గాయపడిన సంఘటనలున్నాయి. గతంలో మండల పరిషత్ కార్యాలయంపై చెట్టు పడి భవనం ధ్వంసమైంది. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి, భారీగా ఉన్న చెట్లు తొలగించాలని మండల కేంద్రం వాసులు కోరుతున్నారు. జి.మాడుగుల మండలంలో...జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో సోమవారం కుండపోతగా వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి.గెడ్డలు,వాగుల్లోకి భారీగా నీరు చేరింది.లంబసింగి–జి.మాడుగుల, పాడేరు జాతీయ రహదారి పనుల్లో భాగంగా వేసిన మట్టి రోడ్డు బురదమయంగా మారింది. ఈరోడ్డులో రాకపోకలు సాగిస్తున్న వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భీకర శబ్దాలతో పిడుగులు పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వర్షం కారణంగా జాతీయ రహదారి నిర్మాణ పనులకు ఆటంకం కలిగింది. చెట్టు కింద నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్న పోలీసులుడుంబ్రిగుడ మండలంలో బాలిక మృతిఒడిశాకు చెందిన ఇద్దరు మహిళలు మృతి -
తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రతిఘటన తప్పదు
పాడేరు రూరల్: తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రతిఘటన తప్పదని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స తెలిపారు. సోమవారం గిరిజన భవన్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల గెస్ట్ ఉపాధ్యాయ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విధుల నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను తొలగించేందుకు ఇచ్చిన నోటీసును తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ విద్యార్థుల పట్ల ప్రభుత్వం, ఉన్నతాధికారుల వైఖరి మార్చుకోవాలన్నారు. జిల్లా స్థాయి కమిటీ (డీఎల్సీ) ద్వారా నియమితులైన గెస్ట్ ఫ్యాకల్టీ ఉపాధ్యాయులను ఏవిధంగా తొలగిస్తారని ప్రశ్నించారు. ప్రిన్సిపాళ్లు కక్షకట్టి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రిన్సిపాళ్లు గిరిజన విద్యార్థులకు సక్రమంగా భోజనం కూడా పెట్టడం లేదన్నారు. ఉత్తరభారత దేశం నుంచి వచ్చిన ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలు అర్థం కాక విద్యార్థులు చదువులో వెనుకబడిపోతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు ఏకంగా 115 మంది ఏకలవ్య పాఠశాలల గెస్ట్ ఉపాధ్యాయుల తొలగించేందుకు రంగం సిద్ధం చేశారన్నారు.ఈ ప్రయత్నాలను విరమించుకోకపోతే ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శేషాద్రి, గిరిజన సంఘం నాయకులు బాలదేవ్,ధర్మనపడాల్,ఏకలవ్య ఉపాధ్యాయుల సంఘం నాయకులు శ్యాంసుందర్, అరుణ్,సత్య, తదితరులు పాల్గొన్నారు.ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స -
పిడుగుపాటుకు బాలిక మృతి
డుంబ్రిగుడ: మండలంలోని కండ్రుమ్ పంచాయతీ సిందేరిగుడ గ్రామానికి చెందిన సొంగుల దివ్య(13) అనే గిరిజన బాలిక పిడుగుపాటుకు గురై మృతి చెందింది. బాలిక తండ్రి కోగేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. దివ్య తన అక్క, తోటి స్నేహితులతో కలిసి కొంకొడికూర(ఆకుకూర) సేకరణకు సమీపంలోని కొండకు సోమవారం వెళ్లింది. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో కొంకొడికూర సేకరించిన వారు తిరిగి ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యంలో వారికి సమీపంలో పిడుగుపడింది. దీంతో దివ్య కుప్పకూలిపోయింది. సొంగుల మీరా అనే బాలిక అస్వస్థతకు గురైంది. మిగిలిన స్నేహితులు దివ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విగత జీవిగా పడిఉన్న దివ్య, గాయపడిన బాలికలను 108 వాహనంలో డుంబ్రిగుడ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే దివ్య మృతి చెందినట్లు వైద్యాధికారి రాంబాబు తెలపడంతో కుటుంబ సభ్యులు భోరున విలపించారు. అస్వస్థతకు గురైన బాలికకు వైద్య సేవలందించి ఇంటికి పంపారు. దివ్య డుంబ్రిగుడ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. వేసవి సెలవులకు ఇంటికెళ్లింది. పిడుగుపాటు రూపంలో మృతువు ఆమెను కబళించింది. మృతిరాలికి అక్క, ఇద్దరు సోదరులున్నారు. -
మోదకొండమ్మతల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
జిల్లా ఇన్చార్జి మంత్రి సంధ్యారాణి ఆదేశంసాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదేవత పాడేరు మోదకొండమ్మతల్లి ఉత్సవాలను ఈనెల 17,18,19తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం కావాలని జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ప్రచార పోస్టర్ను మంత్రి సోమవారం ఆవిష్కరించారు.అధికారులు,ఉత్సవ,ఆలయ కమిటీ ప్రతినిధులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.తాగునీరు,ఆహారం,విశ్రాంతి గదులను సిద్ధం చేయాలని సూచించారు. 100 ప్రత్యేక బస్సులు నడపాలని, పోలీసు యంత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.ఉత్సవాల మూడు రోజులు ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.ఈ సమావేశంలో కలెక్టర్ టి.నిశాంతి, ఎస్పీ అమిత్బర్దర్, జేసీ తిరుమణి శ్రీపూజ,ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ,ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి,పలుశాఖల అఽధికారులు,ఉత్సవ,ఆలయ కమిటీ ప్రతినిధులు,పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
విరిగిన విద్యుత్ స్తంభాలు.. తెగిన వైర్లు
పెదబయలు: ఈదురుగాలతో కూడిన భారీ వర్షానికి మండలంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలిపోయాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు విరిపోయాయి. మరి కొన్ని చోట్ల విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో పెదబయలు,ముంచంగిపుట్టు మండలాల్లో 46 పంచాయతీలకు సోమవారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 33కేవీ లైన్ మరమ్మతులకు గురి కావడంతో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. పెదబయలు నుంచి పాడేరు వెళ్లే మార్గంలో పడిన చెట్లను తొలగించి, తెగిపోయిన విద్యుత్ వైర్లను విద్యుత్శాఖ అధికారులు సరిచేస్తున్నారు.రెండు మండలాల్లో విద్యుత్ సరఫరా లేక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
నూకాంబిక ఆలయానికి పోటెత్తిన భక్తులు
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వివిధ ప్రాంతాల నుంచి కుటుంబసమేతంగా వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొంతమంది భక్తులు ఆలయం వద్ద వంటకాలు చేసి నైవెద్యంగా సమర్పించారు. అమ్మవారి ఆలయానికి నిత్యం కూరగాయలు ఉచితంగా అందజేస్తున్న వ్యాపారవేత్త మళ్ల జగ్గాప్పారావు దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించు కున్నారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు భక్తులకు ఉచితంగా మజ్జిగ, ప్రసాదం, తాగునీరు అందజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్లు ఏర్పాట్లు చేశారు. పట్టణ, ట్రాఫిక్ సీఐలు జి.ప్రేమ్కుమార్, ఎం.వెంకటనారాయణలు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. -
మళ్లీ చిగురించేనా?
ఉమ్మడి విశాఖ మన్యంలో ఒకప్పుడు పచ్చని బంగారంలా విరాజిల్లిన వెదురు సాగు ఇప్పుడు వెలవెలబోతోంది. అటవీ శాఖకు కాసుల వర్షం కురిపించిన వెదురు కూపీలు, నేడు సరైన నిర్వహణ లేక ఉత్పాదకతను కోల్పోతున్నాయి. గతంలో కోట్లాది రూపాయల ఆదాయంతో పాటు వందలాది మంది గిరిజన కూలీలకు ఉపాధినిచ్చిన ఈ రంగం, ఇప్పుడు నిధుల కొరత, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పోటీతో సంక్షోభంలో పడింది. మన్యం వెదురు..విక్రయాల పెంపునకు ప్రణాళిక ఈ ఏడాది 50 వేల వెదురు గడలను విక్రయించాం. వచ్చే ఏడాది ఈ విక్రయాలను మరింత పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తు న్నాం. ప్రస్తుతం కొన్ని కూపీలలో సిద్ధంగా ఉన్న వెదురును నరకడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. – వైవీ నర్సింగరావు, డీఎఫ్వో, చింతపల్లి●కొయ్యూరు: ఒకప్పుడు వెదురు విక్రయాల ద్వారా అటవీ శాఖకు రూ. 4 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. కానీ ప్రస్తుతం ఆ ఆదాయం రూ. కోటి కూడా దాటడం లేదు. గతంలో వందలాది మంది కూలీలకు వెదురు ద్వారా ఉపాధి లభించేది. అయితే, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. నిర్వహణ లోపం.. గతంలో వెదురు నరికిన తర్వాత అటవీ శాఖ పర్యవేక్షణలో మొదళ్లను శుభ్రం చేసి, మట్టిని సర్దేవారు. దీనివల్ల వెదురు తిరిగి ఏపుగా పెరిగేది. నిధుల కొరత కారణంగా ప్రస్తుతం ఈ నిర్వహణ పనులు నిలిచిపోవడంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ముదిరిపోవడంతో.. వెదురు 30 ఏళ్లు దాటిన తరువాత పూతకు వచ్చి ఎండిపోతుంది. ఎండిన చోట కొత్త మొక్కలను నాటకపోవడం వల్ల వెదురు విస్తీర్ణం తగ్గుతోంది. అస్సాం వెదురు నుంచి పోటీ తక్కువ ధరకు లభించే అస్సాం వెదురు స్థానిక మార్కెట్లో గట్టి పోటీనిస్తోంది. దీనివల్ల ఇక్కడి వెదురు విక్రయాలపై ప్రభావం పడుతోంది. స్థానిక వెదురుకు ఎంతో ప్రత్యేకత కొయ్యూరు మండలంలోని పెదవలస, నల్లగొండ, కొండసంత, గంగవరం, సోలాబు, బూదరాళ్ల, మర్రిపాకల, యూ.చీడిపాలెం, ఆర్వీ నగర్, సీలేరు వంటి ప్రాంతాల్లో వెదురు కూపీలు అధికంగా ఉండేవి. అస్సాం వెదురుతో పోలిస్తే ఇక్కడి వెదురు ఎంతో దృఢమైనది. అందుకే ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, నాణ్యతను కోరుకునే వ్యాపారులు మన ప్రాంతపు వెదురుకే ప్రాధాన్యత ఇస్తారు. పేపర్ మిల్లుల విధానంలో మార్పు.. రెండు దశాబ్దాల క్రితం వరకు ఇక్కడ సేకరించిన వెదురునంతా రాజమండ్రి పేపర్ మిల్లుకు తరలించేవారు. అప్పట్లో పేపర్ తయారీకి వెదురునే ప్రధానంగా వాడేవారు. కాలక్రమేణా వెదురుకు ప్రత్యామ్నాయంగా సరుగుడు వంటి ఇతర కలప రకాలు అందుబాటులోకి రావడంతో, పేపర్ మిల్లులు వెదురు కొనుగోలును నిలిపివేశాయి. ఎంఎఫ్ఐ సంస్థ ప్రోత్సాహం వెదురు సాగును పునరుద్ధరించేందుకు మ్యాంగ్రోవ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నడుం బిగించింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు (పోలవరం ప్రాంతం) జిల్లాల్లో లక్షలాది వెదురు మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. వెదురు సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి, వారికి అవసరమైన శిక్షణను అందిస్తోంది. ఆదాయమిలా.. 20 అడుగుల వెదురు గడ ప్రస్తుతం రూ. 250 పైగా పలుకుతోంది. ఒకసారి నాటితే కనీసం 25 ఏళ్ల వరకు స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఫర్నీచర్, పేపర్ తయారీ, బయో ఇంధనం, వస్త్ర పరిశ్రమల్లో వెదురుకు భారీ డిమాండ్ ఉంది. ప్రభుత్వం నిర్వహణ పనుల కోసం నిధులు కేటాయించి, రైతులకు సరైన ప్రోత్సాహం అందిస్తే వెదురు సాగు తిరిగి పూర్వవైభవాన్ని పొందే అవకాశం ఉంది. వెలవెలబోతున్న సాగు అటవీశాఖ నిర్వహణలోపం కోల్పోతున్న ఉత్పాదకత ఒకప్పుడు వేలాది మందికి ఉపాధి ఇప్పుడు నిధుల కొరత, ఇతర రాష్ట్రాల పోటీతో సంక్షోభం -
పెన్షన్దారుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
వెంకటేశ్వర్లు, ప్రభుదాస్లను శాలువాలతో సత్కరించి, మెమెంటో ఆందజేసిన సంఘం జిల్లా కమిటీ సభ్యులు అనకాపల్లి: ప్రభుత్వ పింఛన్దారులకు నెల మొదటి తేదీన పింఛను జమఅవుతుందని, 30 నెలల డీఆర్ బకాయిలు సంక్రాంతి పండగ రోజున చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక నర్సింగరావుపేట ఏపీటీఎఫ్ భవనంలో ఆధివారం సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డాది జగన్నాథరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర జేఏసీతో కలిసి సమస్యలు సాధనకు కృషి చేస్తున్నామని, అనకాపల్లి జిల్లాలో నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను దశలు వారిగా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం జిల్లా సభ్యులు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను శాలువాలతో సత్కరించి, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రభుదాస్, జిల్లా కార్యదర్శి బి.ఎల్.ఎన్.శర్మ, గౌరవాధ్యక్షుడు సీహెచ్.సోమేశ్వరరావు, సీనియర్ పెన్షనర్ జి.ఎస్.ఆర్.శేషగిరిరావు, విశ్రాంత డిప్యూటీ డీఈవో కె.వి.గౌరీపతి, సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
దేవుని భూములపై కబ్జా నీడ
తగరపువలస: దాతలు భక్తితో దేవుడికి సమర్పించిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులు భీమిలి నియోజకవర్గంలో కబ్జాదారుల పాలవుతున్నాయి. ఆస్తులను సంరక్షించాల్సిన దేవదాయ శాఖ అధికారుల అలసత్వం, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వెరసి భూములు చేతులు మారుతున్నా అడిగే వారే కరువయ్యారు. వరుసగా అన్యాక్రాంతమవుతున్న భూములు ఇటీవల ఆనందపురం మండలం శిర్లపాలెంలో పాండ్రంగి వేణుగోపాల స్వామి దేవస్థానానికి చెందిన 22.70 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏకంగా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినా అధికారులు పట్టించుకోలేదు. ‘సాక్షి’ కథనాలతో ఉన్నతాధికారులు స్పందించి సర్వేకు ఆదేశించే వరకు స్థానిక సిబ్బంది మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే దాకమర్రి నీలయమ్మ సత్రానికి చెందిన 23 ఎకరాల పల్లం భూముల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 1966 నుంచి ఈ భూములపై ఒక్క పైసా శిస్తు కూడా వసూలు చేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టించుకోని ఈవోలు సంగివలస ముగ్గురు అమ్మవార్ల ఆలయానికి వస్తున్న ఈవోలు చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూముల రక్షణ బాధ్యతను దిగువ స్థాయి సిబ్బందికి వదిలేయడంతో వారు ఆడింది ఆటగా సాగుతోంది. ఆలయ పరిసరాల్లో నిత్యం కొత్త దుకాణాలు వెలుస్తున్నా నియంత్రణ లేదు. చిల్లపేటతో పాటు భీమిలి టౌన్ సర్వే నంబర్ 18లో ఉన్న లంగర్ఖానా భూములు కూడా రోజురోజుకు ఆక్రమణలకు గురవుతున్నాయి. భక్తుల ఆందోళన దాతలు సదుద్దేశంతో ఇచ్చిన సత్రం భూములు, లంగర్ఖానా ఆస్తులు హారతిలా కరిగిపోతుంటే దేవాదాయ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, సమగ్ర సర్వే నిర్వహించి కబ్జాకు గురైన దేవుని భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. -
‘బ్రాండిక్స్లో కాంట్రాక్ట్ అడగడం అవాస్తవం’
అచ్యుతాపురం రూరల్: దుప్పితూరు గ్రామంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని అడిగితే, బ్రాండిక్స్ పరిశ్రమలో కాంట్రాక్ట్లు అడిగామని తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకరరావు ఆదివారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. బ్రాండిక్స్ పరిశ్రమలో గతంలో ఎన్నడూ తాను కాంట్రాక్ట్లు కావాలని పాకులాడలేదని బ్రాండిక్స్ ఇండియా భాగస్వాముల్లో ఒకరైన దొరస్వామి శ్రీలంకకు చెందిన బ్రాండిక్స్ యాజమాన్యంతో కుమ్మకై ్క వారి దగ్గర వందల కోట్ల రూపాయలు తీసుకొని లబ్ధిపొంది దుప్పితూరు గ్రామంలో ప్రహరీ నిర్మాణ పనులు జరగడానికి సహకరించి తెరవెనుక కూటమి ప్రభుత్వం అండదండలతో నిర్వాసితులకు అన్యాయం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. బ్రాండిక్స్ నుంచి కాంట్రాక్ట్లు అడిగానని పచ్చమీడియా పత్రికల్లో అవాస్తవాలు రాయించారని అన్నారు. గ్రామంలో కొందరు కూటమి నేతలు కాంట్రాక్ట్లు దక్కించుకొని ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారని, దొరస్వామి చౌదరి స్థానిక కూటమి నేతలు, పోలీసుల సహాయంతో నిర్వాసితులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. స్ధానికంగా దుప్పితూరు గ్రామ సర్పంచ్గా, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న తనపై తప్పుడు అరోపణలు చేసి బురద జల్లితే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. సమావేశంలో తనకు మద్దతుగా ఎస్ఈసీ మెంబర్ బోదెపు గోవింద్, మండల వైస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కోన లచ్చన్నాయుడు, కో–జెడ్పీటీసీ నర్మాల కుమార్, యలమంచిలి వైఎస్ఆర్సీపీ పట్టణ బొద్దపు యర్రయ్య దొర, కూండ్రపు వెంకునాయుడు, బలిరెడ్డి శ్రీను, జువ్వల నాయుడు, మాడెం సూరి అప్పారావు, దుంగా రమణ, దొడ్డి కృష్ణ అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


