Delhi
-
ఎర్రకోట కారు పేలుడు కేసు.. ఛార్జ్షీట్లో సంచలన విషయాలు
ఢిల్లీ: ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో పాటియాలా హౌస్ కోర్టులో 7,500 పేజీల చార్జ్షీట్ దాఖలైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉమర్ ఉన్ నబీ సహా 10 మందిని నిందితులుగా ఎన్ఐఏ పేర్కొంది. ఢిల్లీలో గత ఏడాది నవంబర్ 10న బాంబు పేలుడులో 11 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అన్సార్ గజ్వతుల్ హింద్ (AGuH) సంస్థతో ముడిపడినట్టు ఎన్ఐఏ వెల్లడించింది AGuH అనేది అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్కాంటినెంట్ (AQIS) ఆఫ్షూట్.. 2018లో కేంద్రం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.UA(P) యాక్ట్ భారతీయ న్యాయ సంహిత, ఎక్స్ప్లోసివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్తో సహా అనేక సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిందితుల్లో పలువురు వైద్యులు.. AQIS/AGuH ఆలోచనలతో ప్రేరణ పొంది దాడి చేసినట్ట ఎన్ఐఏ తెలిపింది. 2022లో శ్రీనగర్లో రహస్య సమావేశం నిర్వహించారని.. AGuHని AGuH ఇంటరిమ్”గా పునరుద్ధరించి “ఆపరేషన్ హెవెన్లీ హింద్” ప్రారంభించినట్టు ఎన్ఐఏ పేర్కొంది. నిందితులు.. వాణిజ్య రసాయనాలతో TATP ఎక్స్ప్లోసివ్ తయారు చేశారు. ఐఈడీలు, రాకెట్, డ్రోన్ మౌంటెడ్ బాంబులు పరీక్షించారు. ఏకే-47, క్రింకోవ్ రైఫిళ్లు, పిస్టల్స్ లాంటి నిషేధిత ఆయుధాలు అక్రమంగా సేకరించారు.డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, ఫోరెన్సిక్, వాయిస్ అనాలిసిస్తో ఎన్ఐఏ ఆధారాలు సేకరించింది. జమ్మూ కశ్మీర్, హర్యానా, యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఎన్సీఆర్లో విస్తృత దర్యాప్తు చేపట్టింది. 88 సాక్షులు, 395పైగా డాక్యుమెంట్లు, 200పైగా ఆధారాలు సేకరించింది. ఇంకా కొందర నిందితుల కోసం ఎన్ఐఏ గాలింపు కొనసాగుతోంది. -
ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదులుతున్న బస్సులో..
ఢిల్లీ: ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో దారుణం జరిగింది. స్లీపర్ బస్సులో ఓ మహిళపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ కేసులో బస్సు డ్రైవర్, కండక్టర్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. బస్సులో ఇద్దరు వ్యక్తులు తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె పేర్కొంది. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగ్గా.. నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బాధితురాలు పీతంపురలోని మంగోల్పురిలోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తోంది. మే 11వ తేదీ రాత్రి సదరు మహిళ పని ముగించుకుని ఎప్పటిలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో సరస్వతి విహార్లోని బస్టాప్ వద్ద ఓ స్లీపర్ బస్సు ఆగింది. బస్సు తలుపు వద్ద నిలబడిన వ్యక్తిని ఆమె సమయం ఎంత అని అడిగింది. ఆ సమయంలో నిందితులు ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు.అనంతరం నిందితులు బస్సును నాంగ్లోయ్ వైపు నడిపారు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటన అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. బస్సును పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరుగుతోందని.. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. -
కేంద్రం తీపి కబురు, అయినా.. ఆందోళనే!
భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంచదార ఎగుమతులపై సెప్టెంబర్ దాకా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ మార్కెట్లో ధరలు పెరగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అమెరికా, ఈయూలకు మాత్రం ఈ బ్యాన్ వర్తించబోదని స్పష్టం చేసింది. అయితే కేంద్రం తాజా ప్రకటనపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారులలో ఒకటి. ఇటీవల వర్షాభావం, పంట ఉత్పత్తి తగ్గుదల, నిల్వలపై ఒత్తిడి కారణంగా దేశీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. పండుగల సీజన్లో వినియోగం అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యగా ఎగుమతులను నిలిపివేసింది.ముడి, శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులపై సెప్టెంబర్ 30వ తేదీ వరకు కేంద్రం నిషేధం విధిస్తూ సంచలన ప్రకటన చేసింది. సెప్టెంబర్ తర్వాత పరిస్థితిని సమీక్షించి, ఎగుమతులపై కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వర్షాకాలం తర్వాత పంట ఉత్పత్తి స్థాయిలు, నిల్వలు, ధరలపై ఆధారపడి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందని సమాచారం. అయితే.. ఈ చర్య దేశీయ మార్కెట్లో ధరలను నియంత్రించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ప్రపంచ మార్కెట్లో చక్కెర కొరతకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో.. దేశీయంగా ధరలు తగ్గే అవకాశం ఉంది. వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు. అయితే అంతర్జాతీయంగా భారతదేశం చక్కెర ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో.. ఎగుమతులు నిలిపివేయడం వల్ల ప్రపంచ మార్కెట్లో సరఫరా తగ్గి ధరలు పెరగవచ్చు. అలాగే వ్యాపారాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎగుమతులపై ఆధారపడిన వ్యాపారులు, ట్రేడర్లు నష్టపోవచ్చు. కేంద్రం తాజా నిర్ణయంపై ఆర్థిక విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే.. ఈ నిర్ణయం తాత్కాలికంగా దేశీయ మార్కెట్కు మేలు చేస్తుంది. కానీ ప్రపంచ మార్కెట్లో అస్థిరతను పెంచుతుంది. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాలు భారత చక్కెరపై ఆధారపడుతున్నందున, అక్కడ ధరలు పెరగడం ఖాయం. -
త్వరలో పెట్రోల్ మోత!
న్యూఢిల్లీ: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నప్పటికీ, పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా కొనసాగితే దశలవారీగా ధరలు పెరగొచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. అంటే త్వరలోనే సామాన్య ప్రజల ఖర్చులపై అదనపు భారం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాల్సి రావొచ్చని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా వ్యాఖ్యానించారు. ముడిచమురు, ఎరువుల కోసం భారత్ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉన్న నేపథ్యంలో కొంత భారాన్ని బదలాయించడం తప్పకపోవచ్చని ఆయన తెలిపారు. సరఫరాపరమైన అవాంతరాలు ఇప్పుడిప్పుడే భారత్పై ప్రభావం చూపించడం మొదలవుతోందని స్విట్జర్లాండ్లో ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మల్హోత్రా చెప్పారు. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్– ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక ముడిచమురు ధరలు అంతర్జాతీయంగా భారీ స్థాయిలో ఎగిసినప్పటికీ దేశీయంగా మాత్రం ప్రభుత్వం రిటైల్ పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచకుండా యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కానీ, క్రూడాయిల్ రేట్లు పెరుగుతూ, రూపాయి విలువ పడిపోతూ, చమురు దిగుమతుల భారం తడిసి మోపెడవుతుండటంతో ధరల పెంపు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మల్హోత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు ఇప్పటివరకు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెరిగిన చమురు ధరల భారాన్ని భరిస్తున్నాయి, కానీ అవి ఇంకెంతకాలం నష్టాలను భరించగలవో ఆందోళన కలిగిస్తోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా వ్యాఖ్యానించడం.. త్వరలో పెట్రోల్ ధరలు పెరగక తప్పదనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కూడా పెరిగిన ముడి చమురు ధరలను వినియోగదారులపై కొంతవరకు మోపాల్సిందేనని అభిప్రాయపడింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని భారత్కు తట్టుకునే సామర్థ్యం ఉందని పేర్కొంది. -
పసిడిపై పన్ను పిడుగు
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న బంగారం దిగుమతులు, విదేశీ మారకద్రవ్యంపై తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.బంగారం కొనుగోళ్లను ఏడాదిపాటు వాయిదా వేసుకోవాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన రెండు రోజులకే ఈ దిశగా కఠిన చర్యలకు దిగింది. తగ్గిపోతున్న రూపాయి విలువను కాపాడేందుకు, అవసరం లేని దిగుమతులను కట్టడి చేసేందుకు పసిడి, వెండిపై దిగుమతుల సుంకాన్ని కేంద్రం గణనీయంగా పెంచింది. ఇప్పటి వరకు 6 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతం చేసింది. ప్లాటినంపై కస్టమ్స్ సుంకాన్ని 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచింది. బుధవారం నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. ఆభరణాలు, వాటి విడిభాగాలు, కాయిన్లు, కడ్డీలు సహా భౌతిక రూపంలోని దిగుమతులు అన్నింటికీ ఈ సుంకాలు వర్తిస్తాయి. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత ఎగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకీ చర్యలు..? ⇒ కస్టమ్స్ డ్యూటీ పెంచడానికి అంతర్జాతీయంగా నెలకొన్న తీవ్ర ప్రతికూల పరిస్థితులను ప్రభుత్వం కార ణంగా పేర్కొంది. అంతర్జాతీయ సంక్షోభాల్లో అవసరంలేని దిగుమతులను నియంత్రించడం స్థూల ఆర్థిక స్థిరత్వానికి సాయం చేస్తుందని అధికారుల వాదన. ⇒ డాలర్తో రూపాయి విలువ ఆల్టైమ్ కనిష్టమైన 95.75 స్థాయికి పడిపోయింది. 2025 డిసెంబర్లో 90 స్థాయిలో ఉంటే, ఐదు నెలల్లోనే 6% పతనమైంది. దీంతో దిగుమతులకు మరిన్ని రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాది క్రితం రూపాయి విలువ 84.2 స్థాయిలో ఉండడం గమనార్హం. ⇒ పశ్చిమాసియాలో ఘర్షణలతో సరఫరా సమస్యలు ఏర్పడి, అంతర్జాతీయంగా ముడి చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. భారత్కు ప్రధాన సరఫరా మార్గమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సరఫరా తగ్గిపోయింది. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ 108 డాలర్లకు చేరింది. యుద్ధానికి ముందు ఈ ధర 70 డాలర్లలోపే ఉండడం గమనార్హం. దీంతో ఎరువుల ధరలూ భారీగా ఎగిశాయి. ⇒ భారీ ధరలపై ముడి చమురు, ఎరువులు, బంగారం దిగుమతుల కోసం డాలర్ల అవసరం అనూహ్యంగా పెరిగింది. దీంతో రూపాయి విలువ బక్కచిక్కిపోతోంది. ఫలితంగా విలువైన విదేశీ మారకం నిల్వలు తరిగిపోతున్నాయి. ఫిబ్రవరి 27 నాటికి 728.49 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారకం నిల్వలు మే 1 నాటికి 690 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. కరెంట్ ఖాతా లోటు విస్తరించే రిస్క్ ఏర్పడింది. ⇒ ఆయిల్ అండ్ గ్యాస్ తర్వాత దిగుమతి చేసుకుంటున్న రెండో అత్యంత విలువైన కమోడిటీ పసిడే. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి అయిన ముడి చము రు, ఎరువులు, వంట నూనెలు, పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులకే ప్రాధాన్యం ఇస్తూ, అంత అవసరం లేని బంగారం, వెండి ఇతర విలువైన లోహాల డిమాండ్ను తగ్గించాలన్నది కేంద్ర సర్కారు యోచన. ⇒ ప్రపంచంలో చైనా తర్వాత భారతే పసిడిని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. ఇది ఏటా 700–800 టన్నుల మధ్య ఉంటోంది. 2025–26లో విలువైన లోహాల దిగుమతుల విలువ అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024–25)తో పోల్చి చూస్తే 26.7% పెరిగి 102.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో పసిడి దిగుమతులే 71.98 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. పరిమాణం పరంగా మాత్రం 4.75% తగ్గి 721.03 టన్నులుగా ఉంది. ధరలు పెరిగినప్పటికీ ప్రజల కొనుగోళ్ల విలువ తగ్గలేదని ఈ డేటాతో స్పష్టమవుతోంది. ⇒ తాజా సుంకాల పెంపుతో దిగుమతులు (పరిణామం పరంగా) 10–15% తగ్గొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నా యి. గతంలో సుంకాలు పెంచిన సందర్భాల్లోనే దిగుమతులు తగ్గడం గమనార్హం. ⇒ అధిక సుంకాలతో పసిడి అక్రమ రవాణా పెరిగే ప్రమాదమూ ఉంటుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయెలరీ కౌన్సిల్ హెచ్చరించింది. ⇒ పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత ఆర్బీఐ సహా అన్ని సెంట్రల్ బ్యాంక్లు విదేశీ మారకం ఆస్తుల్లో బంగారానికి వెయిటేజీని పెంచడం విశేషం. ఆర్బీఐ వద్ద 880 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఇక గృహాల్లో అయితే 30,000 టన్నులు (5 ట్రిలియన్ డాలర్ల విలువ) ఉండొచ్చని అంచనా.సుంకాలు ఇలా.. బంగారం, వెండిపై 5 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10 శాతానికి చేరింది. ఒక శాతంగా ఉన్న వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి సెస్సు (ఏఐడీసీ)ను 5 శాతానికి పెంచారు. మొత్తం కలసి 15 శాతానికి చేరింది. ఇక విక్రయాలపై 3 శాతం జీఎస్టీ కూడా కలుపుకుంటే పసిడి, వెండిపై స్థూల పన్ను భారం ఇంతకుముందున్న 9.18 శాతం నుంచి 18.45 శాతానికి పెరిగింది. ప్లాటినంపై 6.4 శాతం నుంచి 15.4 శాతానికి కస్టమ్స్ సుంకం పెరగ్గా, దీనికి 3 శాతం జీఎస్టీ జోడిస్తే మొత్తం పన్ను 18.86 శాతానికి చేరినట్టయింది. ధరలు పెరిగిపోవడంతో మే నెల రిటైల్ ద్రవ్యోల్బణంపై ఈ ప్రభావం పడనుంది. అసలు పూర్తి ప్రభావం జూన్ నెల డేటాలో కనిపించనుంది. ఇప్పటికే ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణం పెరుగుదలలో బంగారం, వెండి ధరల పాత్ర ఉండడం గమనించొచ్చు. ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయెలరీ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే స్పందిస్తూ.. 10 గ్రాముల బంగారంపై పన్నుల భారం రూ.27,000కు చేరుకున్నట్టు (జీఎస్టీ కూడా కలసి) చెప్పారు. భారం ఎంతంటే..⇒ దిగుమతి పసిడి/వెండి విలువ (ఇన్వాయిస్ ధర, బీమా, రవాణా చార్జీ) రూ.1,00,000 ⇒ దీనిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10%= రూ.10,000 ⇒ సర్చార్జీ/ఏఐడీసీ బేసిక్ డ్యూటీ 5% = రూ.5,000 ⇒ మొత్తం = 1,15,000 ⇒ దీనిపై 3 శాతం జీఎస్టీ = రూ.3,450 ⇒ పన్ను అనంతరం మొత్తం విలువ రూ.1,18,450 -
ప్రధాని మోదీ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చెప్పిన పొదుపు సూత్రాలను పాటించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా.. తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను సగానికి సగం తగ్గించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే.. ప్రభుత్వ వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని సూచించారు.సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్(తెలంగాణ) వేదికగా జరిగిన బీజేపీ బహిరంగ సభ నుంచి దేశ ప్రజలకు ప్రధాని మోదీ పలు పొదుపు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంధన వినియోగాన్ని తగ్గించాలని.. సొంత వాహనాలకు బదులు కార్పూలింగ్, ప్రభుత్వ రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని.. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రొత్సహించాలని అన్నారు. అయితే దానిని ఆచరించడంలో భాగంగా.. ప్రధాని మోదీ ఇప్పుడు తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలనుకుంటున్నారు. ఇంధన పొదుపు, మితవ్యయ (austerity) చర్యలలో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.ఈ మేరకు ఎస్పీజీ (Special Protection Group)కి కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించాలని.. భద్రతా ప్రమాణాలు తగ్గకుండా, అవసరమైన వాహనాలు మాత్రమే ఉండాలని పీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి. అలాగే కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలి కానీ కొత్త వాహనాలు కొనరాదని సూచించినట్లు సమాచారం అందుతోంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు పలు బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంలు ఆచరణలోకి దిగారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 13 నుంచి 8కి తగ్గించమని ఆదేశించారు. రాజస్థాన్ సీఎం భజన్లాల్శర్మ తన కాన్వాయ్లో అనవసరపు వాహనాలు ఉండకూడదని సిబ్బందికి సూచించారు. మరోవైపు.. కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా ఇంధన పొదుపు చర్యలు పరిశీలిస్తున్నాయి. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కూడా తన ఎస్కార్ట్ వాహనాన్ని వాడకూడదని నిర్ణయించారు. -
బిడ్డ కోసం కెరీర్ను కొనసాగించాలనుకోవడం క్రూరత్వం కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: విద్యావంతురాలైన మహిళ తన కెరీర్ను కొనసాగించాలని నిర్ణయించుకోవడం, తన బిడ్డకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని భావించడం క్రూరత్వం లేదా భర్తను నిర్లక్ష్యం చేయడంగా భావించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక మహిళ డెంటిస్ట్గా తన వృత్తిని కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడాన్ని క్రూరత్వంగా పేర్కొంటూ కుటుంబ న్యాయస్థానం తీర్పింవ్వగా గుజరాత్ హైకోర్టు సమర్ధించింది. ఈ తీర్పులను తిరోగమనవాదం, అతి సంప్రదాయవాద ధోరణిగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. రెండు కోర్టుల తీర్పులను కొట్టివేసింది.భార్య వృత్తిపరమైన గుర్తింపు కేవలం భర్త ఇష్టాయిష్టాలకు లోబడి ఉండదని స్పష్టం చేసింది. వేరుగా ఉంటున్న భార్యాభర్తల పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మంగళవారం పైవ్యాఖ్యలు చేసింది. వివాహ బంధంతో రాజీపడే అవకాశం ఎంతమాత్రం లేదని మహిళ చేసిన వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. వివాహ బంధం పునరుద్ధరించలేనంతగా దెబ్బతిన్నదనే కారణంతో కింది కోర్టులు మంజూరు చేసిన విడాకుల ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, ఈ విడాకులు మహిళ క్రూరత్వం లేదా పరిత్యాగం ఆధారంగా కాదని స్పష్టం చేసింది.కేసు వివరాలివీ.. పిటిషనర్లయిన భర్త భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ కాగా, భార్య దంత వైద్యురాలు. పుణెలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న డెంటిస్ట్కు 2009లో కల్నల్తో వివాహమైంది. పెళ్లయిన వెంటనే భర్త వెంట ఆమె సరిహద్దుల్లోని కార్గిల్కు వెళ్లారు. వారికి ఒక కుమార్తె పుట్టింది. బిడ్డకు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తడంతో ప్రత్యేక వైద్యం కోసం అహ్మదాబాద్ వెళ్లారు. కుమార్తె వెంట ఉండిపోవాల్సి రావడంతో అహ్మదాబాద్లోనే డెంటల్ క్లినిక్ ఏర్పాటు చేసుకున్నారు. భర్తకు ఇది నచ్చలేదు. విషయం ఫ్యామిలీ కోర్టుకు, ఆపై హైకోర్టుకు వెళ్లింది. రెండు కోర్టులూ దీనిని భార్య కూరత్వంగానే పేర్కొన్నాయి. భర్త ఎక్కడ ఉద్యోగం చేస్తే భార్య కూడా అక్కడే నివసించడం తప్పనిసరి విధి అని ఫ్యామిలీ కోర్టు పేర్కొంది. -
ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్?
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. మహారాష్ట్రలోని నాసిక్లో ప్రశ్నపత్రాలను ముద్రించినట్లు సమాచారం. నేరుగా ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్ అయినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. లీక్ అయిన పేపర్ తొలుత రాజస్తాన్లోని జైపూర్కు, తర్వాత సికార్ పట్టణానికి, అక్కడి నుంచి దేశంలో ఇతర ప్రాంతాలకు సోషల్ మీడియా వేదికల ద్వారా చేసినట్లు అంచనా వేస్తున్నారు. నాసిక్ ప్రింటింగ్ ప్రెస్కు సంబంధించిన ఓ వ్యక్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నీట్ పేపర్ను చైన్ నెట్వర్క్ ద్వారా ఇతరులకు చేరవేసినట్లు తెలుస్తోంది.హరియాణాలోని గురుగ్రామ్కు చెందిన ఓ డాక్టర్కు ఈ పేపర్ ఇలాగే చేరింది. రాజస్తాన్లోని జైపూర్కు చెందిన ఖతీక్ అనే వ్యక్తి ఆ డాక్టర్ దగ్గర ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. తర్వాత జైపూర్ నుంచి పేపర్ సికార్లోని రాకేశ్ కుమార్కు చేరింది. అతడు సికార్లోని ఒక కోచింగ్ సెంటర్ ఎదుట ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఏజెంట్గా పని చేస్తున్నాడు. సికార్లో నీట్ శిక్షణ పొందుతున్న కొందరు విద్యార్థులకు పేపర్ను విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. లీకైన పేపర్ అంచెలంచెలుగా ఢిల్లీ, జమ్మూకశ్మీర్, బిహార్, కేరళ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలకు విస్తరించింది. డబ్బులిచ్చినవారికి సోషల్ మీడియా ద్వారా పంపించారు. ఏమిటీ గెస్ పేపర్? గెస్ పేపర్ ముసుగులో ఎవరికీ అనుమానం రాకుండా అసలైన ప్రశ్నపత్రానికి మరికొన్ని కొన్ని ప్రశ్నలు కలిపి విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. గెస్ పేపర్ అంటే విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ట్యూటర్లు రూపొందించే ప్రశ్నలు. గత ఏడాది, అంతకుముందు ఏడాది పరీక్షల్లో వచ్చిన ప్రశ్నల ఆధారంగా ఈ గెస్ పేపర్ రూపొందిస్తుంటారు. విద్యార్థులు తమ సన్నద్ధతను పరీక్షించుకోవడానికి గెస్ పేపర్లు సాధన చేస్తుంటారు.మే 3న నీట్ పరీక్ష జరగ్గా, 15 రోజుల ముందు లీకైన పేపర్ను విక్రయించడం ప్రారంభించారు. రూ.30 వేల నుంచి రూ.30 లక్షల దాకా అభ్యర్థులు వెచ్చించినట్లు ప్రచారం సాగుతోంది. రాజస్తాన్లోని నాగౌర్కు చెందిన ఓ విద్యార్థి పరీక్షకు నాలుగు రోజుల ముందు సికార్ టౌన్కు చేరుకున్నాడు. రూ.28 లక్షలు ఖర్చు చేసి, నీట్ ప్రశ్నపత్రం కొనుగోలు చేశాడు. అతడిని దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. ‘పేపర్ సిద్ధంగా ఉంది’అంటూ తనకు ఫోన్కాల్ వచ్చిందని అతడు పేర్కొన్నాడు. ఎలా బయటపడింది? పేపర్ లీక్ మాఫియా చాలా పకడ్బందీగా వ్యవహరిస్తుంది. ఎక్కడా తమ గుట్టు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ఈసారి అదృష్టం బాగాలేక అడ్డంగా దొరికిపోయారు. ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఏజెంట్ రాకేశ్ కుమార్ రూ.30,000కు ‘గెస్ పేపర్’ను తనకు తెలిసిన సికార్ విద్యార్థికి విక్రయించాడు. ఈ విద్యార్థి దాన్ని సికార్లో హాస్టల్ను నడిపించే తన తండ్రికి చేరవేశాడు. ఆ తండ్రి తన హాస్టల్లో ఉంటున్న నీట్ విద్యార్థులకు ఆ పేపర్ను అందించాడు. మే 3న పరీక్ష ముగిసిన తర్వాత గెస్ పేపర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో చెప్పాలంటూ ఓ కోచింగ్ సెంటర్ లెక్చరర్ను కోరాడు. గెస్ పేపర్లో మొత్తం 281 ప్రశ్నలు ఉండగా, అందులో బయాలజీలో 90 ప్రశ్నలు, కెమిస్ట్రీలో 45 ప్రశ్నలు అసలైన ప్రశ్నపత్రంలో అచ్చుగుద్దినట్లుగా వచ్చేశాయి. అంతేకాకుండా కెమిస్ట్రీకి సంబంధించిన 45 ప్రశ్నలు గెస్ పేపర్లో ఉన్నట్లు సరిగ్గా అదే వరుస క్రమంలో ఉన్నాయి. కనీసం కామాలు, ఫుల్స్టాప్ల్లోనూ మార్పుల్లేవు. దీనిపై అనుమానం వచ్చిన హాస్టల్ నిర్వాహకుడు తొలుత సికార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు పట్టించుకోలేదు.తప్పుడు ప్రచారం చేయొద్దంటూ మందలించారు. దాంతో అతడు ఎన్టీఏ అధికారులకు సమాచారం చేరవేశాడు. అనంతరం ఎన్టీఏ సిబ్బంది ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)తోపాటు రాజస్తాన్ పోలీసులను అప్రమత్తం చేశారు. రాజస్తాన్ ఎస్ఓజీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రాకేశ్ కుమార్ సహా దాదాపు 20 మందిని అరెస్టుచేశారు. జేఈఈ–నీట్ పరీక్షల కోచింగ్కు సికార్ ప్రసిద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతుంటారు. పేపర్ లీక్ అంశంలో మొత్తం నెట్వర్క్ను ఛేదించే పనిలో సీబీఐ నిమగ్నమైంది. -
‘నీట్’ పరీక్ష రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్య అభ్యసించి, డాక్టర్గా ప్రజలకు సేవలందిస్తూ జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఆశయంతో జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)కు హాజరైన లక్షలాది మంది అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పిడుగులాంటి వార్త వినిపించింది. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్(యూజీ)–2026 పరీక్షను రద్దు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. నీట్ ప్రశ్నపత్నం లీక్ అయినట్లు అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో జాతీయ పరీక్షా వ్యవస్థలో పారదర్శకతను కాపాడటం, విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేసింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీబీఐని కేంద్రం ఆదేశించిందని, దర్యాప్తు సంస్థకు తమ పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని, అవసరమైన రికార్డులు సమకూరుస్తామని ఎన్టీఏ స్పష్టంచేసింది. పరీక్ష జరిగిన నాలుగు రోజుల తర్వాత.. అంటే మే 7న సాయంత్రం అవకతవకలకు సంబంధించిన సమాచారం ఎన్టీఏకు అందింది. స్వతంత్ర ధ్రువీకరణతోపాటు అవసరమైన చర్యల కోసం మే 8వ తేదీ ఉదయం కేంద్ర దర్యాప్తు సంస్థలకు నివేదించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని కాపాడేందుకే.. పరీక్షకు ముందే 410 ప్రశ్నలతో కూడిన ‘గెస్ పేపర్’కొందరు అభ్యర్థుల మధ్య సర్క్యులేట్ అయ్యిందని, అందులో 120 కెమిస్ట్రీ, 100కు పైగా బయాలజీ ప్రశ్నలు అసలైన ప్రశ్నపత్రంతో యథాతథంగా సరిపోలాయన్న ప్రచారంతో ‘నీట్’ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చినట్లు ఎన్టీఏ పేర్కొంది. ఈ నెల 3న భారత్తోపాటు విదేశాల్లో జరిగిన నీట్(యూజీ)–2026 పరీక్షను 22.79 లక్షల మంది రాశారు.పేపర్ లీకేజీతో వారంతా నిరాశకు గురయ్యారు. పరీక్ష మళ్లీ నిర్వహిస్తామని, అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎన్టీఏ ప్రకటించింది. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలియజేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించడం వల్ల అభ్యర్థులకు, తల్లిదండ్రులకు అసౌకర్యం కలిగే మాట నిజమేనని ఎన్టీఏ అంగీకరించింది. కానీ, పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని కాపాడేందుకు నీట్ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ‘గెస్ పేపర్’కోసం రూ.30 లక్షలు ‘గెస్ పేపర్’కోసం ఒక్కో విద్యార్థి దాదాపు రూ.30 లక్షల చొప్పున వెచ్చించినట్లు తమ విచారణలో తేలిందని రాజస్తాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) ఏడీజీ విశాల్ బన్సాల్ మీడియాకు తెలిపారు. ఈ గెస్ పేపర్ పరీక్షకు 15 రోజుల ముందే అభ్యర్థులకు చేరిందన్నారు. డెహ్రాడూన్ నుంచి కేరళ మీదుగా సికార్కు చేరిన ఈ పేపర్ను ఒక్కో విద్యార్థి రూ.20 వేల నుంచి రూ.30 లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడిందన్నారు.పరీక్ష ముందు రాత్రి అంటే.. మే 2వ తేదీ రూ.30 వేలకు కూడా కాపీలు అమ్మినట్లు ఆధారాలు లభించాయని ఎన్టీఏకు, కేంద్ర పభుత్వానికి నివేదించారు. ఎస్ఓజీ దర్యాప్తులో భాగంగా లభించిన ఆధారాలతో ఇప్పటివరకు మాస్టర్మైండ్ సహా 20 మందికి పైగా అదుపులోకి అనుమానితులను తీసుకున్నట్లు సమాచారం. నీట్ పేపర్ లీకేజీకి జైపూర్కు చెందిన మనీష్ అనే వ్యక్తిని మాస్టర్ మైండ్గా గుర్తించారు. రాజస్తాన్లో సికార్ పట్టణానికి చెందిన ఒక కోచింగ్ కెరీర్ కౌన్సెలర్ను అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ నీట్ పేపర్ లీక్ అంశం దేశవ్యాప్తంగా దుమారం సృష్టించింది. పలు ప్రాంతాల్లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎన్టీఏ స్పందించి పరీక్షను రద్దు చేసింది. లీకేజీ వ్యవహారంలో ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే రాజస్తాన్ పోలీసుల దర్యాప్తులో లభించిన వాట్సాప్ చాటింగ్లు, స్క్రీన్షాట్లు, బ్యాంక్ లావాదేవీల వివరాలు, యూపీఐ చెల్లింపులు, క్రిప్టో చెల్లింపులను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పరీక్ష జరిగిన అన్ని సెంటర్ల సీసీటీవీ ఫుటేజీ, బయోమెట్రిక్ డేటాను సేకరించారు. ఆ డేటాను, ఆధారాలను రాజస్తాన్ పోలీసులు సీబీఐకి అప్పగించారు. నీట్(యూజీ) పేపర్ లీక్ అంశంపై సీబీఐ మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ముఖం చాటేసిన విద్యాశాఖ మంత్రి నీట్ పేపర్ లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మౌనం వహించారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించేందుకు ప్రయత్నించగా, తప్పించుకుని కారెక్కి వెళ్లిపోయారు. మహారాష్ట్రలో వ్యక్తి అరెస్టు నీట్ పేపర్ లీక్ అంశానికి సంబంధించి మహారాష్ట్రలోని నాసిక్లో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజస్తాన్ పోలీసులు అందించిన సమాచారం మేరకు అతడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతడిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించడానికి రాజస్తాన్ పోలీసుల బృందం రానున్నట్లు పేర్కొన్నారు. సందేహాలు – సమాధానాలునీట్ రద్దు కావడంతో అభ్యర్థులు, తల్లిదండ్రుల్లో రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి. వీటిపై నీట్ వర్గాలు కొంత స్పష్టత ఇచ్చాయి. ⇒ మళ్లీ పరీక్ష ఎప్పుడు? నీట్ తేదీని ఇంకా ప్రకటించలేదు. ఎప్పుడు నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయించలేదు.⇒ మళ్లీ రిజిస్టర్ చేసుకోవాలా? అవసరం లేదు. ఇప్పటికే చేసుకున్న రిజిస్ట్రేషన్ డేటా, అభ్యర్థిత్వాన్ని త్వరలో మళ్లీ నిర్వహించే పరీక్షకు బదిలీ చేస్తారు.⇒ ఫీజు చెల్లింపు మాటేమిటి? ఈ ఏడాది నీట్ రాసిన అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయడానికి అదనంగా ఫీజులు చెల్లించాల్సిన పనిలేదు. గతంలో చెల్లించిన రుసుమును అభ్యర్థులకు తిరిగి(రీఫండ్) చెల్లిస్తారు. ⇒ అడ్మిట్ కార్డులు కొత్తగా ఇస్తారా? అవును. కొత్త అడ్మిట్ కార్డుల జారీపై త్వరలో అధికారికంగా ప్రకటన చేస్తారు. ⇒ పరీక్షా కేంద్రాలను మారుస్తారా? మే 3న జరిగిన పరీక్షకు ఎంచుకున్న కేంద్రాలనే తిరిగి నిర్వహించే పరీక్షకు కూడా కొనసాగిస్తారు.పది రోజుల్లోగా షెడ్యూల్: ఎన్టీఏ డైరెక్టర్నీట్ పునఃపరీక్ష షెడ్యూల్ను రాబోయే 7 నుంచి 10 రోజుల్లోగా ప్రకటిస్తామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మంగళవారం తెలిపారు. అతి త్వరలో తన బృందంతో చర్చిస్తానని, పూర్తి పరీక్షల షెడ్యూల్, తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల విద్యా క్యాలెండర్, ప్రవేశాల షెడ్యూల్కు అంతరాయం కలగకుండా వీలైనంత తక్కువ సమయంలోనే పరీక్ష నిర్వహించడానికి కృషి చేస్తామని చెప్పారు. మరో వారం, పది రోజుల్లోగానే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. లీకేజీ ఘటన నిజంగా బాధాకరమని, ఇలాంటివి తక్షణమే ఆగిపోవాలని అభిషేక్ సింగ్ తేల్చిచెప్పారు. పేపర్ లీకేజీలు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అలాగే మొత్తం వ్యవస్థకు ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు. జరిగిన దానికి తాము బాధ్యత తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. నీట్కు ముందు విద్యార్థుల మధ్య పీడీఎఫ్ ఫార్మాట్లో సర్క్యులేట్ అయిన కొన్ని ప్రశ్నలు అసలు ప్రశ్నపత్రంతో సరిపోలడంతో పరీక్షను రద్దు చేయాలని తాము సిఫార్సు చేశామని వివరించారు. మొత్తం పేపర్ లీక్ కాలేదని చెప్పారు. -
ఆ ఏరియాలో ల్యాండ్ కొన్నారు.. బ్యూరోక్రాట్స్కి లక్కు లక్కలా అతుక్కుంది
భోపాల్: సుమారు 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల లక్కు లక్కలా అతుక్కుంది. కొన్నేళ్ల క్రితం యాభై మంది బ్యూరోక్రాట్లు ఒకే ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూమి విలువ పెట్టిన పెట్టుబడితో పోలిస్తే 11 రెట్లు పెరిగింది.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లోని కోలార్ ప్రాంతానికి సమీపంలో గురాడి ఘాట్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని 2022 ఏప్రిల్లో ఒకే రోజు 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రూ. 5.5 కోట్లకు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన భూమిని భవిష్యత్తులో ప్లాట్లుగా మార్చాలని నిర్ణయించారు.భూమి కొనుగోలు చేసిన వారిలో ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా కేడర్కు చెందిన అధికారులు ఉన్నారు. కొనుగోలు చేసిన 16 నెలల తర్వాత, అంటే 2023 ఆగస్టులో మధ్యప్రదేశ్ కేబినెట్ రూ. 3,200 కోట్లతో వెస్ట్రన్ బైపాస్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కీలక నిర్ణయం తీసుకుంది. కొనుగోలు సమయంలో ఆ భూమి వ్యవసాయ భూమి. కానీ బైపాస్ ఆమోదం వచ్చిన 10 నెలల్లోపే ఆ భూమి నివాస ప్రాంతంగా మార్చారు. ఫలితంగా వ్యవసాయ భూమి ధరతో పోలిస్తే నివాస ప్రాంతం ధర అనేక రెట్లు ఎక్కువగా ఉండటంతో ఆ భూమి విలువ దాదాపు 11 రెట్లు పెరిగింది.భూమి నివాస ప్రయోజనాల కోసం విభజించినప్పటికీ, ఇప్పటివరకు అక్కడ ఎలాంటి హౌసింగ్ సొసైటీ అభివృద్ధి కాలేదు. సాధారణ ప్రక్రియ ప్రకారం, మొదట ప్లాట్లు కేటాయించాలి లేదా భూమిని రిజిస్టర్డ్ సొసైటీకి బదిలీ చేయాలి. కానీ ఇలాంటివి చేయకుండా నిబంధనలను ఉల్లంఘించి వ్యవసాయ భూమిని నివాస ప్రాంతంగా మార్చారు. 2022 ఏప్రిల్ 4న ఒకే రిజిస్ట్రేషన్ పత్రం ద్వారా 2.023 హెక్టార్ల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ లావాదేవీలో 50 మంది షేర్హోల్డర్లు కలసి ఆస్తిని సొంతం చేసుకున్నారు. భూమి రూ. 5.5 కోట్లకు రిజిస్టర్ చేయబడింది. అయితే ఆ సమయంలో దాని మార్కెట్ విలువ రూ. 7.78 కోట్లుగా ఉందని దైనిక్ భాస్కర్ నివేదించింది.ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత, కుటుంబ సభ్యుల లేదా బినామీ పేర్లలో ఉన్న స్థిర ఆస్తుల (భూమి, ఇల్లు) వివరాలను ప్రతి సంవత్సరం జనవరి 31లోపు ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియలో (IPR) ఐదు ఎకరాల భూమిని 50 మంది బ్యూరోక్రాట్లు కొనుగోలు చేసినట్లు చూపించినా, ఆ భూమి మొత్తం 41 మంది పేర్లలోనే ఉందని రికార్డులు వెల్లడించాయి. పదహారు నెలల తర్వాత, 2023 ఆగస్టు 31న మధ్యప్రదేశ్ కేబినెట్ రూ. 3,200 కోట్ల వెస్ట్రన్ బైపాస్ ప్రాజెక్టును ఆమోదించింది. ప్రతిపాదిత మార్గం ఆ భూమి నుండి 500 మీటర్ల దూరంలోనే వెళ్లనుందని సమాచారం.2022లో ఈ ఐదు ఎకరాల భూమి చదరపు అడుగుకు దాదాపు రూ. 81.75 రేటుకు కొనుగోలు చేశారు. 2024 జూన్లో భూమి వినియోగం మారిన తర్వాత రేటు చదరపు అడుగుకు రూ. 557కు పెరిగింది. 2026 నాటికి ప్రస్తుత మార్కెట్ రేటు చదరపు అడుగుకు రూ. 2,500 నుండి రూ. 3,000 మధ్య ఉంది. అందువల్ల ఆ భూమి మార్కెట్ విలువ రూ. 55 కోట్ల నుండి రూ. 65 కోట్ల మధ్యగా ఉందని అంచనా. -
నీట్ పేపర్ లీకేజీ మాస్టర్మైండ్ అరెస్ట్
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీట్ పేపర్ లీకేజీ మాస్టర్మైండ్ రాజస్థాన్కు చెందిన మనీష్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు 15మంది అరెస్టయ్యారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు నాసిక్లో పేపర్ను ముద్రించినట్లు గుర్తించారు. పరీక్షకు 42గంటల ముందు పేపర్ లీక్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మే 3న నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్షలో ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు రాజస్థాన్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (SOG) దర్యాప్తులో బయటపడింది. కోచింగ్ సమయంలో విద్యార్థులు సౌలభ్యం కోసం తయారు చేసే గెస్ పేపర్లోని 120 ప్రశ్నలు.. నీట్ పరీక్షలోని అసలు ప్రశ్నాపత్రంతో సరిపోవడంతో లీకేజీ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో నీట్ యూజీ 2026 పరీక్షలు నిర్వహించే జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) పరీక్షను రద్దు చేసి, రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.పేపర్ లీకేజీ కేసులో రాజస్థాన్ ఎస్వోజీ ఇద్దరిని మాస్టర్మైండ్స్గా అరెస్టు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో (రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర) లీక్ నెట్వర్క్పై విచారణ కొనసాగుతోంది.22 లక్షలకుపైగా విద్యార్థులు ఈ నిర్ణయంతో ప్రభావితమయ్యారు. ఎన్టీఏ తెలిపిన ప్రకారం.. కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా రీ-ఎగ్జామ్ త్వరలో నిర్వహించనుంది. ఇప్పటికే చెల్లించిన ఫీజులు రిఫండ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే పేపర్ లీకేజీతో విద్యార్థుల్లో అనిశ్చితి, మానసిక ఒత్తిడి పెరిగింది. -
వాహన, వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్షాక్?
సాక్షి,న్యూఢిల్లీ: వంటగ్యాస్, పెట్రోల్,డీజిల్ వినియోగదారులకు బిగ్షాక్ తగలనుంది. వచ్చే వారంలో కేంద్రం లీటర్ పెట్రోల్కు రూ.2 నుంచి రూ.4వరకు.. వంట గ్యాస్ సిలిండర్పై రూ.40 నుంచి రూ.50వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇరాన్-అమెరికా యుద్ధంలో ఆయిల్ కంపెనీలకు లక్ష కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అయితే, పెట్రోల్,డీజిల్ ధరలు పెంచకపోతే ఆ భారం భరించలేమని కంపెనీలు చెబుతున్నాయి. ఒక్కసారిగా రేట్లు పెంచితే ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని కేంద్రం ఆందోళనలో ఉంది.ఈ క్రమంలో దశలవారీగా పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. హర్మూజ్ను మూసివేయడంతో భారత్కు ముడిచమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో కంపెనీలు రష్యా,పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి ఎక్కువ రేట్లకు ముడిచమురును కొనుగోలు చేస్తున్నాయి. -
మోదీవి సూచనలు కావు.. ప్రభుత్వ వైఫల్యాలు
వనరులను ఆదా చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంపై ప్రతిపక్ష నేత రాహల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన వినియోగం తగ్గించుకోవాలని, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, బంగారం కొనకూడదని, మెట్రోలో ప్రయాణించాలని, ఇంటి నుంచే పని చేయాలని ప్రజలకు మోదీ చేసిన పిలుపు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు.మోదీ జవాబుదారీతనం కోల్పోయారని పేర్కొంటూ సోమవారం ఎక్స్ ఖాతాలో రాహుల్ గాంధీ ఓ పోస్ట్ చేశారు. ‘‘దేశ ప్రయోజనాల విషయంలో ప్రధాని మోదీ రాజీ పడ్డారు #CompromisedPM. 12 ఏళ్లు దేశాన్ని పాలించాక.. ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదు అనే స్థితికి వచ్చారా?. ఆయన చేసినవి ఉప దేశాలు కావు.. ప్రభుత్వ వైఫల్యాలు. రాజీన పడిన ప్రధాని దేశాన్ని నడపడం కష్టం’’ అని రాహుల్ తన పోస్టులో రాసుకొచ్చారు. मोदी जी ने कल जनता से त्याग मांगे - सोना मत ख़रीदो, विदेश मत जाओ, पेट्रोल कम जलाओ, खाद और खाने का तेल कम करो, मेट्रो में चलो, घर से काम करो।ये उपदेश नहीं - ये नाकामी के सबूत हैं।12 साल में देश को इस मुक़ाम पर ला दिया है कि जनता को बताना पड़ रहा है - क्या ख़रीदे, क्या न…— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2026ఆర్థిక సంక్షోభ భారం ప్రజలపై మోపి.. ప్రధాని మోదీ బాధ్యత వహించకుండా తప్పించుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. మరోవైపు మోదీ సలహాలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. మోదీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పాలని అంటోంది. ఆయన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని.. దేశంలో వాస్తవ పరిస్థితులను ప్రజలను వివరించాలని కోరుతోంది. ఇరాన్–అమెరికా యుద్ధం మూడు నెలలు గడిచినా.. దేశ ఇంధన భద్రతను రక్షించడంలో మోదీ విఫలమయ్యారు. ప్రజలపై భారాన్ని మోపడం అనైతికం. ఎన్నికలు, రాజకీయాలు మాత్రమే ప్రధాని ప్రాధాన్యం అవుతున్నాయని.. ఆయన వ్యాఖ్యలతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతుందని సంకేతాలిచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. మరో కాంగ్రెస్ నేత ఎంపీ కార్తి చిదంబరం మాట్లాడుతూ.. మోదీ చేసినవి అప్పీల్గా లేవని.. తీవ్రమైన ఆదేశాలుగా ఉన్నాయని.. వాటి వెనక కారణాలు చెప్పేందుకు పార్లెమంట్ను ప్రత్యేకంగా సమావేశపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. తమిళనాడు ప్రతిపక్షం డీఎంకే సైతం మోదీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
మోదీ చెప్పినవి.. మనతో అయ్యే పనేనా??
ఏడాది పాటు బంగారం కొనొద్దు.. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి.. వర్క్ ఫ్రమ్ హోంకు ప్రాధాన్యం ఇవ్వండి.. కూరల్లో వంటనూనెకు తగ్గించి వాడండి.. విదేశీ ప్రయాణాలు చేయొద్దని.. ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ నేపథ్యంలోనే ఆయన చేసిన సూచనలపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ఇవి అసలు ఆచరణ సాధ్యమేనా? అనేదానిపై ఆర్థిక నిపుణులు స్పందించారు. హైదరాబాద్ సభలో మోదీ ఏం మాట్లాడారు?.. కరోనా టైంలో అలవాటు అయిన వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ మీటింగ్ విధానాలను మళ్లీ ఆచరించడం ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గించవచ్చు. ఈవీలను ప్రొత్సహిస్తే మరీ మంచిది. బంగారం కొనుగోలు ఒక సంవత్సరం పాటు ఆపితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. ప్రతి కుటుంబం వంటనూనె వినియోగాన్ని తగ్గిస్తే ఆరోగ్యానికి, ఆర్థిక వ్యవస్థకు లాభం. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి.. రైతులు సహజ వ్యవసాయానికి మారితే దిగుమతులపై ఆధారపడకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది అని అన్నారు. మోదీ సూచనలు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనవని ఆర్థిక నిపుణులు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో అవి ఆచరణ సాధ్యమా? అంటే కష్టమేనని అంటున్నారు. మరీ ముఖ్యంగా బంగారం భారతీయ కుటుంబాల్లో ఆర్థిక భద్రతకు ప్రతీక. అలాంటి దానిని ఏడాదిపాటు కొనుగోలు నిలిపివేయడం అనేది భారతీయ సాంప్రదాయాలకు విరుద్ధమని.. ఆచరణలో సాధ్యమయ్యేది కాదని అంటున్నారు. ఎనర్జీ నిపుణులు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గడం సాధ్యమే. ఇది కొంత వరకు సాధ్యమే. కానీ ఇది ప్రధానంగా ఐటీ రంగం ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. తయారీ, రవాణా రంగాల్లో ఇది అసాధ్యమంటున్నారు. అలాగే రైతులు సహజ వ్యవసాయం వైపు మారడం మంచి ఆలోచనే అయినప్పటికీ.. వాళ్లకు ప్రోత్సాహకాలు, మరింత శిక్షణ అవసరమని.. ప్రభుత్వాలు ఆ భారం భరించే స్థితిలో ఉందా? అని వ్యవసాయ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక వంటనూనె వినియోగం తగ్గించడంపైనా ఇటు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇది ఆచరణ సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మోదీ పిలుపు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనదే. కానీ ప్రజల జీవనశైలిలో మార్పులు తేవడం సులభం కాదు. దీని కోసం ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అవగాహన కార్యక్రమాలు అవసరం. ఇంధన సంక్షోభం వంటి జాతీయ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రజల సహకారం కీలకమని నిపుణులు గుర్తు చేస్తున్నారు. పొలిటికల్ రియాక్షన్స్మోదీ పొదుపు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కు పెట్టింది. మోదీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పాలని అంటోంది. ఆయన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని.. దేశంలో వాస్తవ పరిస్థితులను ప్రజలను వివరించాలని కోరుతోంది. ఇందుకోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేస్తోంది. దేశ ఇంధన భద్రతను రక్షించడంలో మోదీ విఫలమయ్యారని విమర్శిస్తోంది. ఈ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇస్తోంది. మోదీ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు గుప్పించారు. అది దూరదృష్టితో కూడిన నిర్ణయమని అన్నారాయన. -
విజయ్-రాహుల్ రీల్స్.. ఎందుకు బ్లాక్ చేశారు?
కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలకు దిగింది. విజయ్-రాహుల్ గాంధీ దిగిన ఫొటోలను, రీల్స్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని అంటోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్షాట్లను ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఆధారాలుగా చూపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైలైట్గా నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం.. ప్రమాణ స్వీకార వేదిక, అక్కడికి వచ్చిన అతిథులు.. పార్టీ శ్రేణులు.. అభిమానులను సెల్ఫీ వీడియోలు తీస్తూ సందడి చేశారు. నెట్టింట ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వేడుకలో రాహుల్ గాంధీతో విజయ్ తీసిన ఫొటోలు, రీల్స్ను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిందని.. దీని వెనుక కేంద్రం ప్రమేయం ఉందని ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీవత్సా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘‘విజయ్తో రాహుల్ గాంధీ రీల్ గంట వ్యవధిలోనే కోటి లక్ష మంది చూశారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటో నాలుగున్నర కోట్ల మందికి రీచ్ అయ్యింది. కానీ, హఠాత్తుగా అవి కనిపించకుండా పోయాయి. ఈ బ్లాకింగ్ వ్యవహారంపై ఇన్స్టా మాతృక సంస్థ మెటా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రొద్భలంతోనే ఇది జరిగి ఉంటుంది’’ అని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ చర్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బహుశా ఇన్స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో పొరపాటు వల్ల అలా జరిగి ఉండొచ్చని.. కాసేపటికే అవి పునరుద్ధరించబడ్డాయని ఒక ప్రకటన ఇచ్చింది. రాహుల్ గాంధీ-విజయ్ రీల్ తాత్కాలికంగా బ్లాక్ అయిన ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. మరోవైపు కేంద్రం ప్రకటనపై ఇన్స్టాగ్రామ్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలకు సంబంధించిన పోస్టులపై కేంద్రం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. ‘‘సోషల్ మీడియాలో విపక్ష ముఖ్యనేతల అకౌంట్లపై కేంద్రం నిఘా పెడుతోంది. ఎక్స్(ట్విటర్), యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో రీచ్ తగ్గేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా స్వరాన్ని అణచివేస్తోంది. ఆయన ఫాలోవర్స్, సబ్స్క్రయిబర్ల సంఖ్య తగ్గడం ఈ కుట్రలో భాగమేనని అంటోంది” అని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. ఏం జరిగింది?.. తమిళనాడు సీఎం విజయ్-కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రీల్స్కు, ఫొటోలకు విపరీతమైన రియాక్షన్ వచ్చింది. ఆ వెంటనే అవి కాసేపు కనిపించకుండా పోయాయి. ఈ ఎపిసోడ్పై ఎవరేం అన్నారంటే.. 👇కాంగ్రెస్ ఆరోపణ: ఇది కేంద్రం కుట్ర.. జనాల్లో ప్రతిపక్ష నాయకుడి క్రేజ్ను తగ్గించే ప్రయత్నమే!విజయ్ ఫ్యాన్స్: బీజేపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందిబీజేపీ స్పందన: బహుశా.. అల్గారిథమ్స్, ఇన్స్టాగ్రామ్లో టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగి ఉండొచ్చు ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ: కేంద్రానికి సంబంధం లేదు.. ఇన్స్టాగ్రామ్ దీనిపై వివరణ ఇస్తుందిఇన్స్టాగ్రామ్: ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదుట్రెండింగ్ హ్యాష్ట్యాగ్స్: #RahulGandhi, #ThalapathyVijay, #InstagramBlock వంటి హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి.మీమ్స్: ఈ ఘటనను హాస్యాత్మకంగా చూపిస్తూ మీమ్స్ సందడి చేశాయి -
చంద్రబాబు 30వ సారి హస్తినబాట
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోమవారం మరోసారి ఢిల్లీకి రానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఆయన హస్తినబాట పట్టడం ఇది 30వ సారి. చంద్రబాబు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి రానున్నారు. ఆయన తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ కానున్నారు. అనంతరం జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కలవనున్నారు. ఆ తర్వాత కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సమ్మిట్కు హాజరుకానున్నారు. అయితే, సీఎం తరచూ ఢిల్లీ పర్యటనకు వచ్చి కేంద్ర మంత్రులను కలుస్తున్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సాధించింది శూన్యమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు పరపతితో తెచ్చిందేమీ లేదు! చంద్రబాబు 2024లో సీఎం అయిన తర్వాత ఢిల్లీకి వచ్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం ఇది 13వ సారి. ఆయన ఢిల్లీకి వచి్చన ప్రతిసారి ‘రాష్ట్రం కోసం అది తెస్తాం.. ఇది తెస్తాం’ అని లీకులు ఇవ్వడం, పెద్ద ఎత్తున ప్రచారం చేయడం... కేంద్ర మంత్రులతో భేటీ ముగిశాక మాత్రం ‘కేంద్రం సహకరిస్తోంది. లేఖలు ఇచ్చాం’ అనే పాత పాటే పాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసే సాధారణ స్కీములు మినహా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా చంద్రబాబు తెచ్చిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.కేంద్రం ఇచ్చే నిధులే తప్ప, తనకున్న పరపతితో రాష్ట్రానికి అదనపు బడ్జెట్ కేటాయింపులు సాధించడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఇప్పటికీ నిధుల కేటాయింపులు, సాంకేతిక అనుమతుల విషయంలో జాప్యం జరుగుతుండటం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘అయినను పోయిరావలె హస్తినకు‘ అన్న చందంగా చంద్రబాబు 30వ సారి ఢిల్లీ పర్యటనకు వస్తున్నారు. ఈసారి అయినా రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారా? లేక రాజకీయ అవసరాలే అజెండాగా ఈ పర్యటన ఉంటుందా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ఆర్థిక నేరాలకు అడ్డాగా..!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఆర్థిక నేరాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన 2024 క్రైం ఇన్ ఇండియా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా నమోదైన ఆర్థిక నేరాల కేసుల్లో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. ఒకవైపు కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండగా.. దర్యాప్తు చేసి నేరస్తులపై చార్జిషిట్లు దాఖలు చేయడంలో రాష్ట్ర పోలీసుల పనితీరు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నట్లు నమోదైంది. దేశంలోనే ఫస్ట్.. 45.5 శాతం జంప్ ఈ నివేదిక ప్రకారం 2024కుగాను దేశవ్యాప్తంగా 2,14,379 ఆర్థిక నేరాలు నమోదవగా అందులో అత్యధికంగా తెలంగాణలో 39,127 కేసులు నమోదయ్యాయి. అంటే దేశంలోని మొత్తం ఆర్థిక నేరాల్లో 18.2 శాతానికిపైగా కేసులు ఇక్కడే రికార్డయ్యాయి. 2023లో రాష్ట్రంలో 26,881 కేసులు నమోదవగా 2024 నాటికి ఈ సంఖ్య 39,127కు చేరింది. కేవలం ఏడాది వ్యవధిలోనే ఏకంగా 45.5 శాతం మేర కేసులు పెరిగాయి. చీటింగ్, ఫోర్జరీ కేసులే అధికం రాష్ట్రంలో నమోదైన మొత్తం 39,127 ఆర్థిక నేరాల్లో 38,312 కేసులు ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్కు సంబంధించినవే. ఆ తర్వాతి స్థానంలో నేరపూరిత నమ్మకద్రోహం కింద 801 కేసులు, నకిలీ కరెన్సీ కింద 14 కేసులు నమోదయ్యాయి. నేరాల రేటును (లక్ష జనాభాకు నమోదయ్యే కేసులు) పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా ఆర్థిక నేరాల సగటు రేటు లక్ష జనాభాకు 15.3 శాతంగా ఉంటే.. తెలంగాణలో ఇది ఏకంగా 102.1 శాతంగా నమోదైంది. మెట్రో నగరాల్లోకెల్లా హైదరాబాద్లోనే అధిక కేసులు.. దేశంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఆర్థిక నేరాల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరింది. 2024కు సంబంధించి కేవలం హైదరాబాద్ మెట్రో నగర పరిధిలోనే ఏకంగా 61,007 కేసులు విచారణ దశలో ఉన్నట్లు పోలీసులు రికార్డులు సమరి్పంచారు. వాటిలో 95 శాతానికిపైగా నకిలీ పత్రాల సృష్టి, రియల్ ఎస్టేట్ మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్స్కు సంబంధించినవే ఉన్నాయి.దర్యాప్తులో నత్తనడక.. దేశవ్యాప్తంగా ఆర్థిక నేరాలకు సంబంధించి పోలీసులు దాఖలు చేసే చార్జిషిట్ రేటు సగటున 53.3 శాతంగా ఉంటే తెలంగాణలో అది కేవలం 39.8 శాతంగానే ఉంది. హైదరాబాద్లోనూ పరిస్థితి దాదాపు ఇదే విధంగా ఉంది. దర్యాప్తులో జాప్యం, సరైన ఆధారాలు సేకరించడంలో వెనుకబాటు వల్ల రాష్ట్రంలో చార్జిషీట్ల దాఖలు రేటు తక్కువగా ఉందని.. సకాలంలో శిక్షలు పడకపోవడం వల్లే ఇలాంటి నేరాలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ఉగ్రదాడుల హెచ్చరికలు.. ఢిల్లీలో హైఅలర్ట్.. !
ఢిల్లీ: దేశ రాజధానిలోని కీలకమైన ప్రదేశాల్లో ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ల (IEDలు)తో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం అందడంతో హైఅలర్ట్ ప్రకటించారు. జాతీయ వార్త సంస్థ ఇండియా టుడేకు నిఘా వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాలను IEDలతో లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దాంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అత్యంత సున్నితమైన రద్దగా ఉండే ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. హెచ్చరిక నేపథ్యంలో, నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయం బయట కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరొకవైపు పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించి, అదనపు బారికేడ్లను ఏర్పాటు చేశారు.కీలక ప్రదేశాలలో మోహరించిన భద్రతా దళాలు కూడా లక్ష్యంగా మారే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తానీ గ్యాంగ్స్టర్-ఉగ్రవాది షాజాద్ భట్టికి సంబంధించిన ఒక ముఠాను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛేదించిన కొన్ని వారాల తర్వాత ఈ తాజా హెచ్చరిక వెలువడింది. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా, ఈ ముఠా సభ్యులు ఢిల్లీలో హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. -
ఎండలో వడదెబ్బ ఉండదిక..!
న్యూఢిల్లీ: ఎండా కాలంలో మిట్టమధ్యాహ్నం వేళ బయటకు వెళ్లినప్పుడు సేద తీరేందుకు కాసింత నీడ దొరికితే చాలు అనుకుంటాం. ఎక్కడైనా చలివేంద్రాలు కనబడితే దాహం తీర్చుకుని ఊరట పొందుతాం. బతుకుతెరువు కోసం, అత్యవసర పనుల నిమిత్తం ఎండలో బయటకు వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పుడు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ఎండదెబ్బ తప్పదు. అలాంటి వారి కోసం ప్రభుత్వమే శీతల కేంద్రాలు ఏర్పాటు చేస్తే..?ఢిల్లీ ప్రభుత్వం అలాంటి ఏర్పాటే చేసింది. అధిక ఉష్ణోగ్రతల నుంచి హస్తిన పౌరులకు ఊరట కల్పించేందుకు 'కూలింగ్ జోన్' ఏర్పాటు చేసింది. జామా మెట్రో స్టేషన్ వెలుపల దీన్ని అందుబాటులోకి తెచ్చింది. పగటిపూట ఎండలో శ్రమించే వారికి ఉపశమం కల్పించే ఉద్దేశంతో దీన్ని నిర్మించారు. వేడి నుండి ఉపశమనం పొందడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరైనా ఈ కూలింగ్ జోన్ సందర్శించవచ్చు. ఇందులో సుమారు 100 కుర్చీలు, 10 పెద్ద కూలర్లు, ఓఆర్ఎస్, ప్రథమ చికిత్స సామాగ్రి ఉంటాయి. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (DDMA) సిబ్బంది ఇక్కడ సేవలు అందిస్తారు.హీట్ యాక్షన్ ప్లాన్ కింద ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కూలింగ్ జోన్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలొ మరిన్ని ప్రాంతాల్లో వీటిని అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ వ్యాప్తంగా ప్రధాన మెట్రో స్టేషన్లు, బస్ స్టాప్ల వద్ద మరిన్ని కూలింగ్ కేంద్రాలను అందుబాటులోకి తేనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఏర్పాటు చేసిన శీతల కేంద్రాల్లో అందిస్తున్న సేవలపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీటిని వార్డు స్థాయికి విస్తరించాలని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారు.చదవండి: ఐపీఎల్లో పరుగుల వరద.. కారణం ఇదే!ఎండలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు కూలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉపయోగపడతాయని ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ అండ్ యాక్షన్ ఫర్ డెవలప్మెంట్ (IRADE) డిప్యూటీ డైరెక్టర్ రోహిత్ మగోత్రా అన్నారు. వీటిని జిల్లా స్థాయికే పరిమితం చేయకుండా వార్డు స్థాయికి విస్తరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సలహాయిచ్చారు. అలాగే వడగాల్పులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శీతలీకరణ వాహనాలను మొహరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు.రోజు రోజుకు ఎండలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో పనిచేసే కార్మికులను తీవ్రమైన వేడి, వడగాల్పుల నుంచి కాపాడటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (CEEW) ఫెలో డాక్టర్ విశ్వాస్ చితాలే అన్నారు. కూల్ రూఫ్లు, నెట్-జీరో కూలింగ్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. Delhi Government’s ‘Cooling Zone’ gift for the public amid scorching heat pic.twitter.com/VmHaImfihs— ANI (@ANI) May 9, 2026 -
నిజంగానే వచ్చేస్తున్నాయా?
ఈసారైనా వర్షాలు టైంకి పడతాయా? అనే కోట్లాది దేశ ప్రజలకు మదిలో మెదిలే ప్రశ్న. ప్రతీసారి అంచనాలు వేయడం.. అవి తప్పడం.. గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా చూస్తున్నది. అయితే ఈసారి కచ్చితమైన సమాచారం ఉందని.. ఆన్ టైంకే వర్షాలు పడతాయని బల్ల గుద్ది మరీ చెబుతోంది భారత వాతావరణ శాఖ. మునుపెన్నంతగా.. ఈ మే నెలలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో తీర రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ.. పుదుచ్చేరిలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. అయితే దీనిని రుతుపవనాల రాకకు సంకేతంగానే భావిస్తున్నారు వాతావరణ నిపుణులు. వాళ్ల అంచనా ప్రకారం.. మరో రెండు వారాల్లోనే అండమాన్, నికోబార్ దీవులకు వర్షాలు మొదలవుతాయి. కాబట్టి.. జూన్ 1వ తేదీనాటికి కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయన్నమాట. ఇందుకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా.. తమ దేశంలో వర్షాకాలం ముగిసిందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణ ప్రజలకు అది మరో దేశపు వెదర్ బులిటెన్ మాత్రమే కావొచ్చు. భారత రుతుపవనాల కదలికలను గమనించే వాతావరణ శాస్త్రజ్ఞులకు మాత్రం ఈ ప్రకటన ఎంతో కీలకం. ఈ ప్రకటన ఆధారంగానే భారత్కు రుతుపవనాల రాకను అంచనా వేస్తారు.భారత మాన్సూన్ను అర్థం చేసుకోవాలంటే.. భూమధ్యరేఖ చుట్టూ తిరుగుతూ ఉండే ఒక అజ్ఞాత మేఘాల బెల్ట్ను ఊహించుకోవాలి. భూమధ్యరేఖ వద్ద ఉన్న ఈ మేఘాల బెల్ట్ ప్రతి సంవత్సరం సూర్యుడి కదలికను అనుసరిస్తూ దిశ మార్చుకుంటుంది. అంటే.. ఉత్తరార్థగోళం వేసవిలో ఉత్తర దిశగా, దక్షిణార్థగోళం వేసవిలో దక్షిణ దిశగా కదులుతూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వర్షాలను మోసుకెళ్తుంది. ఆస్ట్రేలియాలో రుతుపవనాల ప్రభావం తగ్గిపోవడంతో దక్షిణ భాగం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అప్పుడది కచ్చితంగా ఉత్తర దిశగా కదిలి, సముద్రం నుంచి తేమతో నిండిన గాలులను దక్షిణ ఆసియాకు లాగి వర్షాలు కురిపిస్తుంది. తద్వారా ఆ ప్రాంతంలో రుతుపవనాలు సమయానికి రావడానికి మార్గం సుగమం చేస్తుంది. ఆస్ట్రేలియాలో వర్షాకాలం ముగిసిన వెంటనే ఈ బెల్ట్ ఉత్తర దిశగా భూమధ్యరేఖ దాటి మాల్దీవులు, శ్రీలంక వైపు కదిలి, భారతదేశంలోని అండమాన్–నికోబార్ దీవులకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇది కేరళ తీరానికి చేరి, దేశమంతా వర్షాలను విస్తరింపజేస్తుంది. అందువల్ల ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ప్రకటన.. భారత్కు రుతుపవనాలు సకాలంలో వస్తాయన్న స్పష్టమైన సంకేతంగా భావించబడుతోంది. ఈ సహజ చక్రం వల్ల.. మే–సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల రాకతో భారత్లో వర్షాలు పడతాయి. సెప్టెంబర్ చివరికి ఈ బెల్ట్ తిరిగి దక్షిణ దిశగా కదిలి, ఆస్ట్రేలియాలో వర్షాకాలం మొదలవుతుంది. ప్రస్తుతం ఈ పరిస్థితులు కనిపిస్తుండడం.. సరైన దిశలో మేఘాల బెల్ట్ కదలికలు ఉండడంతో.. రుతుపవనాల రాక సమీపిస్తోందని వాతావరణ శాఖ ధీమాగా చెబుతోంది. అయితే.. ఈసారైనా ఆ అంచనా ఫలిస్తుందో చూడాలి. -
ఏపీ సెంట్రల్ జైళ్లలో కిక్కిరిసిన ఖైదీలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2024’ నివేదిక ఆంధ్రప్రదేశ్ జైళ్ల పరిస్థితిపై పలు ఆందోళనకర అంశాలను వెల్లడించింది. రాష్ట్ర జైళ్ల సగటు ఆక్యుపెన్సీ రేటు సామర్థ్యానికి లోపే ఉన్నప్పటికీ.. కీలకమైన సెంట్రల్ జైళ్లు మాత్రం ఖైదీలతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు తీవ్ర సిబ్బంది కొరత వేధిస్తోంది. మంజూరైన పోస్టుల్లో 30 శాతం ఖాళీగానే ఉండటం, ఖైదీల ప్రవర్తనలో మార్పులు తెచ్చే ‘కరెక్షనల్’ సిబ్బంది రాష్ట్రంలో ఒక్కరు కూడా లేకపోవడం, యువ నేరస్థులను మంచి మార్గంలోపెట్టే ’బోస్టల్ స్కూల్స్’ లేమి ఏపీ జైళ్ల శాఖలోని డొల్లతనానికి అద్దం పడుతున్నాయి. ఎన్సీఆర్బీ గణాంకాల్లో ‘ఏపీ’ ముఖ్యాంశాలు...⇒ ఏపీ జైళ్ల శాఖలో 2,637 పోస్టులు మంజూరు కాగా.. 1,840 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఏకంగా 797 పోస్టులు (దాదాపు 30 శాతం) ఖాళీగా ఉన్నాయి. ⇒ జైలు శిక్ష అనుభవిస్తున్న వారిలో పరివర్తన తీసుకువచ్చే కరెక్షనల్ సిబ్బంది (ప్రొబేషన్ లేదా వెల్ఫేర్ ఆఫీసర్లు, సైకాలజిస్టులు తదితరులు) ఏపీ జైళ్లలో ఒక్కరు కూడా లేకపోవడం తీవ్ర ప్రతికూల అంశం. ⇒ యువ నేరస్థులను సన్మార్గంలో పెట్టే ‘బోస్టల్ స్కూల్స్’, ‘స్పెషల్ జైళ్లు’ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేవు. ⇒ రాష్ట్రంలో 260 మంది ఖైదీలు (156 మంది శిక్ష పడినవారు, 103 మంది విచారణ ఖైదీలు, ఒక డిటెన్యూ) మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ⇒ జైళ్లలో ఉన్న మొత్తం 7,861 మందిలో అత్యధికులు విచారణ ఖైదీలే (అండర్ట్రయల్స్) కావడం మరో ఆందోళనకర అంశం. ⇒ ఏకంగా 5,705 మంది (72.5 శాతం) కోర్టు తీర్పుల కోసం ఎదురుచూస్తున్నారు. ⇒ విచారణ నిమిత్తం 2024లో ఖైదీలను 81,205 సార్లు కోర్టులకు తరలించారు. వైద్య సహాయం కోసం 10,191 సార్లు ఆస్పత్రులకు తీసుకెళ్లారు.⇒ జైళ్ల బడ్జెట్ వినియోగానికి సంబంధించి రాష్ట్రాల జాబితాలో (లక్షదీ్వప్ మినహాయించి) ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. -
బడుల పగ్గాలు పేరెంట్స్కే!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 15 లక్షల ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, బడ్జెట్ బాధ్యతలను ఇకపై నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకే అప్పగించనుంది. బడులను కేవలం ప్రభుత్వ సంస్థలుగానే కాకుండా సామాజిక ఆస్తులుగా అభివృద్ధి చేయడమే ఈ విధానం లక్ష్యం. జాతీయ విద్యా విధానం(ఈఎన్సీ)–2020, విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ)–2009 ఆధారంగా విద్యాశాఖ రూపొందించిన కొత్త మార్గదర్శకాలు మే 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. చెక్బుక్ పవర్ కొత్తగా తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు చెక్బుక్ పవర్. ఇకపై ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) అధ్యక్షుడు (తల్లిదండ్రుల్లో ఒకరు) పేరిట స్కూలుకు ఉమ్మడి బ్యాంకు ఖాతా ఉంటుంది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా నిధులను వాడటం సాధ్యం కాదు. పాఠశాలలో రూ.30 లక్షల లోపు నిర్మాణ పనులను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) అనుమతి లేకుండానే ఎస్ఎంసీలు నేరుగా చేపట్టవచ్చు. ప్రైవేట్ కంపెనీల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను సేకరించేందుకు కూడా అనుమతి కల్పించారు. ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే నిధుల వినియోగంలో పారదర్శకత సాధించేందుకు ప్రభుత్వ ఆడిట్తో పాటు వార్షిక సోషల్ ఆడిట్ను తప్పనిసరి చేశారు. స్కూల్కు వచ్చే ప్రతి పైసా ఖర్చుల వివరాలను పబ్లిక్ నోటీస్ బోర్డుపై బహిరంగంగా ప్రదర్శించాలి. జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తూ, ఏవైనా అవకతవకలు జరిగితే పోలీస్, ఆరోగ్య శాఖలతో కలిసి నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఎస్ఎంసీకి ఇచ్చారు.కమిటీ స్వరూపం ఇదీ → 75% తల్లిదండ్రులే: కమిటీలోని మొత్తం సభ్యులలో మూడు వంతుల మంది విద్యార్థుల తల్లిదండ్రులే ఉంటారు. → 50% మహిళలు: కమిటీలో సగం మంది సభ్యులు తప్పనిసరిగా మహిళలే అయి ఉండాలి.→ 25% ఇతర సభ్యులు: పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక కౌన్సిలర్ లేదా పంచాయతీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, స్థానిక విద్యావేత్తలు మిగతా పావు శాతం ఉంటారు. → పదవీకాలం: ఈ కమిటీని రెండేళ్ల కాలవ్యవధికి ఎన్నుకుంటారు. ప్రతి నెలా విధిగా ఒకసారి సమావేశమవ్వాలి. -
40 ఏళ్ల రైల్వే రిజర్వేషన్ వ్యవస్థకు గుడ్బై
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే గత 40 ఏళ్లుగా అమలు చేస్తున్న ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్సీ)కి త్వరలో గుడ్బై చెప్పనుంది. ఆగస్ట్ నుంచి ఆధునిక సాంకేతికతతో రూపొందించిన అప్గ్రేడెడ్ రిజర్వేషన్ విధానానికి మారనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మార్పుల సమయంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రయాణికుల అభిప్రాయాలను సైతం ప్రస్తుతం వాడుతున్న రైల్ యాప్ల ద్వారా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అందరికీ అనుకూలంగా, అత్యంత సులువైన విధానాన్ని తెచ్చేందుకు రైల్వే శాఖ రిజర్వేషన్ ప్రక్రియకు మార్పులు చేస్తోంది. ఇందుకు కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకుంటోంది. 1986లో ప్రారంభమైన రిజర్వేషన్ భారతీయ రైల్వేల్లో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ 1986లో ప్రారంభమైంది. అప్పటి నుంచి పలు దశల్లో సాంకేతిక నవీకరణలు చేపట్టినా, ప్రస్తుతం పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయి అప్గ్రేడ్ అవసరమైంది. దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్ డిమాండ్లో ప్రస్తుతం 88 శాతం వరకు ఆన్లైన్ సేవల ద్వారానే నెరవేరుతోందని రైల్వే శాఖ తెలిపింది. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 10గంటలకు ఏసీ, 11 గంటలకు స్లీపర్ క్లాస్లకు సంబంధించి బుక్ చేసుకోవాల్సి ఉంటోంది. ఐదు నిమిషాల ముందే యాప్ ఓపెన్ చేస్తుండగా.. యాప్ ఓపెన్ అవ్వకపోవడం, ఓపెన్ అయ్యాక బఫర్ అవ్వడం వంటి సమస్యలను ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. టిక్కెట్ బుక్ చేసి పేమెంట్ చేశాక కూడా కన్ఫర్మేషన్ అని చూపించేందుకు నిమిషాల వ్యవధి తీసుకుంటోంది. ఈ ప్రక్రియలో ఒక్కోసారి టిక్కెట్ క్యాన్సిల్ అని కూడా వస్తోంది. ఇటువంటి సమస్యలను అధిగమించేలా కొత్త రిజర్వేషన్ విధానం ఉండాలని అధికారులకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశాలు ఇచ్చారు. అందుకే పాత పద్దతికి చెక్ పెట్టి అందరూ మెచ్చేలా కొత్తదనంతో ముందుకు రావాలని సన్నహాలు చేస్తోంది. టికెట్ కన్ఫర్మేషన్ను అంచనా వేస్తున్న ఏఐ 2025లో ప్రారంభించిన రైల్వే సూపర్ యాప్ ‘రైల్వన్’ప్రస్తుతం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో వెయిటింగ్ లిస్ట్ టికెట్ల కన్ఫర్మేషన్పై కచ్చితమైన అంచనాలు ఇస్తోంది. ప్రయాణికుడు టికెట్ బుక్ చేసిన వెంటనే అది కన్ఫర్మ్ అయ్యే అవకాశాలపై యాప్ సూచనలు అందిస్తోంది. రైల్వే శాఖ ప్రకారం వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మేషన్ అంచనా కచ్చితత్వం గతంలో 53 శాతం ఉండగా, ఏఐ వినియోగంతో ఇప్పుడది 94 శాతానికి పెరిగింది.ఒకే యాప్లో అన్ని సేవలు ‘రైల్ వన్’యాప్లో రిజర్వుడ్, అన్రిజర్వుడ్, ప్లాట్ఫామ్ టికెట్ల బుకింగ్, క్యాన్సిలేషన్, రీఫండ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అదనంగా ట్రైన్ లైవ్ రన్నింగ్ స్టేటస్, ప్లాట్ఫాం సమాచారం, కోచ్ పొజిషన్, ట్రైన్ టైమ్టేబుల్, ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారానికి ‘రైల్ మదద్’వంటి సేవలు కూడా అందిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ ఈ యాప్ ద్వారా సుమారు 9.29 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. వీటిలో 7.2 లక్షల అన్రిజర్వుడ్ టికెట్లు, 2.09 లక్షల రిజర్వుడ్ టికెట్లు ఉన్నాయి. అన్రిజర్వుడ్ టికెట్లలో ప్లాట్ఫాం టికెట్లు కూడా ఉన్నాయి. ఈ యాప్ను ఇప్పటివరకు గూగుల్ ప్లే స్టోర్లో 3.16 కోట్ల సార్లు, ఆపిల్ పరికరాల్లో 33.17 లక్షల సార్లు డౌన్లోడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. -
ట్రాఫిక్ ప్రమాదాల్లో రోజుకు 546 మంది మృతి
న్యూఢిల్లీ: నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతిచోట ఇప్పడు ట్రాఫిక్ అనేది సాధారణంగా మారిపోయింది. వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువ అవుతోంది. దీంతో పాటు ప్రమాదాలు కూడా అధికవుతున్నాయి. దేశంలో సగటున ప్రతిరోజూ ట్రాఫిక్ సంబంధిత ప్రమాదాల్లో 546 మంది మరణిస్తున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా వెల్లడించింది. ఏటేటా ఎగబాకుతున్న రోడ్డు ప్రమాదాలతో పాటు ట్రాఫిక్ సంబంధ యాక్సిడెంట్లు కూడా ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది.2024లో ట్రాఫిక్ ప్రమాదాల్లో 1.99 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఎన్సీఆర్బీ తెలిపింది. 2023తో పోలిస్తే మరణాల సంఖ్య 0.79 శాతం పెరిగిందిని వెల్లడించింది. 2023లో 1.98 లక్షల మంది మరణించారు. ట్రాఫిక్ ప్రమాదాలు కూడా పెరిగాయి. 2024లో 4.95 లక్షల ప్రమాదాలు జరగ్గా, 2023లో 4.91 లక్షల యాక్సిడెంట్లు నమోదయ్యాయి. ట్రాఫిక్ ప్రమాదాలు కారణంగా 2024లో 4.52 లక్షల మంది క్షతగాత్రులయ్యారు.ఆ మూడు రాష్ట్రాల్లోనే ఎక్కువట్రాఫిక్ ప్రమాదాల మరణాల్లో ఉత్తర ప్రదేశ్ (27,071), తమిళనాడు (20,390), మహారాష్ట్ర (19,475) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మొత్తం మరణాల్లో ఈ మూడు రాష్ట్రాల్లో 33.6 శాతం నమోదు కావడం గమనార్హం. ఉత్తర ప్రదేశ్లో 13.6 శాతం, తమిళనాడులో 10.2 శాతం, మహారాష్ట్రలో 9.8 శాతం మరణాలు సంభవించినట్టు ఎన్సీఆర్బీ తన నివేదికలో పేర్కొంది. ట్రాఫిక్ మరణాలే అత్యధికంప్రమాదాల వివరాల సేకరణలో భాగంగానే ట్రాఫిక్ ప్రమాదాల సమాచారాన్ని కూడా ఎన్సీఆర్బీ సేకరించింది. దేశవ్యాప్తంగా సంభవించిన మొత్తం ప్రమాదాల్లో ట్రాఫిక్ సంబంధిత దుర్ఘటనల మరణాలు అత్యధికంగా 42.6 శాతంగా నమోదయ్యాయి. ఆకస్మిక మరణాలు (16.2 శాతం), ఇతర కారణాలు (15.9 శాతం), నీటిలో మునిగిపోవడం (8.6 శాతం), కిందపడటం (5.7 శాతం), విషప్రయోగం (4.6 శాతం), విద్యుదాఘాతం (3.4 శాతం), ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం (1.3 శాతం), ప్రకృతి వైపరీత్యాలు (1.7 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పైవాటిలో ప్రకృతి విపత్తులు మినహా మిగతావి నివారించదగినవి.రైలు ప్రమాదాలు లేవు2024లో నమోదైన 1.99 లక్షల ట్రాఫిక్ సంబంధిత మరణాలలో 88 శాతం (1.75 లక్షలు) రోడ్డు ప్రమాదాల వల్లే సంభవించాయని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడిస్తోంది. ఈ కాలంలో ఎలాంటి రైలు ప్రమాదం నమోదు కాలేదు. అయితే, రైళ్ల నుంచి పడిపోవడం లేదా రైల్వే ట్రాక్లపై ప్రజలను ఢీకొనడం వల్ల 17,029 మంది మరణించగా, రైల్వే ప్రాంగణంలో పేలుళ్లు, అగ్నిప్రమాదాలు వంటి ఘటనల్లో 5,384 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా, రైల్వే క్రాసింగ్ల వద్ద జరిగిన ప్రమాదాల్లో 1,888 మరణాలు నమోదయ్యాయి.టూవీలర్ ప్రమాదాలే ఎక్కువరోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు (84,599 మరణాలు) ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. 25,769 పాదచారులు మరణించారు. కారు ప్రమాదాల్లో 23,739 మరణాలు సంభవించాయి. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో అత్యధికంగా తమిళనాడులో 11,786 మంది చనిపోయారు. ఉత్తర ప్రదేశ్లో 8,575 మరణాలు నమోదయ్యాయి. ఎస్యూవీ, కారు లేదా జీపు ప్రమాదాల వల్ల యూపీలో అధిక సంఖ్యలో 4,575 మంది మృతి చెందారు.చదవండి: చోరీ వీడియో వైరల్.. కట్ చేస్తే సర్ప్రైజ్! -
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎంపికయ్యారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఎమ్మెల్యేలు ఆయనను ఏకగ్రీవంగా సీఎంగా ఎన్నుకున్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం శనివారం (రేపు) అధికారంలోకి రానుంది. రేపు ఉదయం 11 గంటలకు సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ కోల్కతాలో పర్యటించి, బీజేపీకి చెందిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ న్యూటౌన్లోని బిస్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ వర్గాల ప్రకారం, సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనుండగా, ఇద్దరు మహిళలకు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించే నిర్ణయం తీసుకున్నారు.బెంగాల్లో బీజేపీకి చెందిన తొలి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన నందిగ్రామ్, భవానిపూర్ రెండు నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. భవానిపూర్లో 15 వేల ఓట్ల మెజార్టీతో మమతా బెనర్జీని ఓడించారు.కౌన్సిలర్ టూ సీఎంసువేందు అధికారి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ‘జెయింట్ కిల్లర్’గా పేరుపొందిన నేత. ఆయన కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తృణమూల్ కాంగ్రెస్ ద్వారా ఎదిగి, చివరికి బీజేపీలో చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.జననం: 15 డిసెంబర్ 1970, కార్కులి గ్రామం, పూర్బ మెదినిపూర్, పశ్చిమ బెంగాల్తల్లిదండ్రులు: సిసిర్ అధికారి (మాజీ యూనియన్ మంత్రి, ఎంపీ), గాయత్రి అధికారివిద్య: 2011లో రబీంద్ర భారతి యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేశారువివాహం: అవివాహితుడురాజకీయ ప్రస్థానం1995: కాంగ్రెస్లో కాంతి మునిసిపాలిటీ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు1998: తండ్రితో కలిసి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరారు2006: కాంతి దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, అదే సంవత్సరం కాంతి మునిసిపాలిటీ చైర్మన్గా కూడా అయ్యారునందిగ్రామ్ ఉద్యమం2007: నందిగ్రామ్లో భూసేకరణ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారుటీఎంసీకి ప్రజాదరణ తెచ్చారుఈ ఉద్యమం మమతా బెనర్జీని రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు తెచ్చిందితృణమూల్ కాంగ్రెస్లో ఎదుగుదల2009: తమ్లుక్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు2014: మళ్లీ తమ్లుక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు2016: నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, మమతా బెనర్జీ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు2018–2020: నీటి వనరులు, సాగు శాఖ మంత్రిగా కూడా పనిచేశారుబీజేపీలో చేరిక2020 నవంబర్–డిసెంబర్: టీఎంసీ నుంచి రాజీనామా చేసి, 19 డిసెంబర్ 2020న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారుకారణం: మమతా బెనర్జీ వారసుడిగా అభిషేక్ బెనర్జీని ముందుకు తేవడంపై విభేదాలుఎన్నికల విజయాలు2021: నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు2026: నందిగ్రామ్, భవానిపూర్ రెండింటిలోనూ గెలిచి, మమతా బెనర్జీని ఆమె స్వస్థల నియోజకవర్గంలో ఓడించారుఇది 1967 తర్వాత మొదటిసారి ఒకే వ్యక్తి రెండు నియోజకవర్గాల్లో గెలిచి, సిట్టింగ్ సీఎంను ఓడించిన ఘట్టంముఖ్య పదవులు2009–2016: లోక్సభ సభ్యుడు (తమ్లుక్)2016–2020: పశ్చిమ బెంగాల్ మంత్రివర్గంలో రవాణా, నీటి వనరులు శాఖలు2020–2021: జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్2021–2026: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత2026 నుంచి: పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిజెయింట్ కిల్లర్ అనే బిరుదు: మమతా బెనర్జీని నందిగ్రామ్ (2021), భవానిపూర్ (2026)లో ఓడించడం వల్ల ఈ పేరు వచ్చింది.నైపుణ్యం: గ్రామీణ స్థాయిలో బలమైన కేడర్ నిర్మాణం, ఉద్యమాల ద్వారా ప్రజల్లో ప్రభావం చూపడం ఆయన ప్రత్యేకత.బీజేపీ తొలి సీఎం: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి చెందిన మొదటి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. -
పట్టుబడింది రూ.1,444 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దమొత్తంలో సీజ్ చేసింది. వీటి మొత్తం విలువ రూ.1,400 కోట్లకు పైమాటేనని ఈసీఐ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు 5 రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) పటిష్టంగా అమలు చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా (144) అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్నికల నియమావళి ముగిసినట్లు వెల్లడించింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధాన కార్యదర్శులు, సీఈఓలు, డీజీపీలు, ఉన్నతాధికారులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో పలు దఫాలుగా సమీక్షా సమావేశాలు నిర్వహించామని వివరించింది. ఇందులో భాగంగా 376 మంది వ్యయ పరిశీలకులు, 7,470 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 7,470 స్టాటిక్ సరై్వలెన్స్ బృందా (ఎస్ఎస్టీ)లను మోహరించామని వెల్లడించింది. కీలకంగా మారిన ఐటీ వేదిక ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఈఎస్ఎంఎస్) అనే ఐటీ వేదికను ఈసీ వినియోగంలోకి తెచ్చింది. దీని ద్వారా వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం మెరుగుపడి సమాచార మార్పిడి వేగవంతమైంది. ఫిబ్రవరి 26వ తేదీన ఈఎస్ఎంఎస్ యాక్టివేట్ చేసినప్పటి నుంచి మే 6వ తేదీ వరకు పట్టుబడిన మొత్తం సొత్తు వివరాలను ఈసీ వెల్లడించింది. ఈ కాలంలో పట్టుబడిన సొత్తు విలువ రూ.1444.96 కోట్లు. ఇందులో నగదు రూ.154.89 కోట్లు, మద్యం విలువ రూ.183.33 కోట్లు, డ్రగ్స్ రూ.337.88 కోట్లు, విలువైన లోహాలు రూ.250.14 కోట్లు, ఉచితాలు తదితరాల విలువ రూ.518.73 కోట్లుగా రికార్డయింది. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడులో అత్యధికంగా రూ.662.28 కోట్లు సీజ్ చేయగా, పశ్చిమ బెంగాల్ రూ.573.41 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. అస్సాంలో రూ.117.24 కోట్లు, కేరళలో రూ.80.67 కోట్లు, పుదుచ్చేరిలో రూ.9.72 కోట్లు పట్టుబడ్డాయి.40.14 శాతం పెరుగుదల2021 సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పట్టుబడిన సొత్తు విలువ రూ.1029.93 కోట్లు. ఆ గణాంకాలతో పోలిస్తే 2026 ఎన్నికల్లో 40.14 శాతం పెరుగుదల నమోదైంది. పశ్చిమ బెంగాల్లో సీజ్ల శాతం అత్యధికంగా 68.92% పెరగ్గా, తమిళనాడులో 48.40% పెరుగుదల నమోదైందని ఎన్నికల సంఘం వివరించింది. -
బడి బాగు 'బోధనలోనే ల్యాగు'
సాక్షి, హైదరాబాద్/సాక్షి న్యూఢిల్లీ: పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, వసతులపరంగా జాతీయ స్థాయిలో రాష్ట్రం ముందు వరుసలో ఉన్నప్పటికీ నాణ్యతతో కూడిన విద్యావిధానం ఆశాజనకంగా లేదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. 2014– 15 నుంచి 2024–25 విద్యాసంవత్సరం మధ్య దేశవ్యాప్తంగా పాఠశాలల్లో పరిస్థితిపై నీతి ఆయోగ్ అధ్యయనం చేపట్టింది. దీని ఆధారంగా ‘స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టం ఇన్ ఇండియా: టెంపోరల్ అనాలసిస్ అండ్ పాలసీ రోడ్మ్యాప్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్’నివేదికను గురువారం విడుదల చేసింది. యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్), పరక్ (పెర్ఫార్మెన్స్ అసిస్మెంట్, రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్), ఎన్ఏఎస్ (నేషనల్ అచీవ్మెంట్ సర్వే), ఎసర్(యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్) నివేదికలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. వసతుల్లో మెరుగే కానీ... నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం.. వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులున్నాయి. స్కూళ్లలో విద్యుత్ వసతి, కంప్యూటర్లు, ఇంటర్నెట్, స్మార్ట్ క్లాస్రూమ్ల విస్తరణ గణనీయంగా పెరిగింది. అలాగే విద్యార్థుల నమోదు రికార్డు స్థాయిలో ఉంది. 2014–15 విద్యాసంవత్సరంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతస్థాయి పాఠశాలల వరకు విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 87.93 శాతం ఉండగా 2024–25 నాటికి అది 111.6 శాతానికి చేరింది. అలాగే మాధ్యమిక స్థాయిలో విద్యార్థుల నమోదు 76.7 శాతం నుంచి 99.9 శాతానికి పెరిగింది. దేశంలోనే అత్యధిక మాధ్యమిక నమోదుగల రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. ప్రధానంగా 8వ తరగతి తర్వాత డ్రాపౌట్ల సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు తగినన్ని ఉండటంతో విద్యార్థులు వాటిపైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో విద్యార్థుల నమోదు సంతృప్తికరంగా ఉందని నీతి అయోగ్ అభిప్రాయపడింది. కానీ బోధన, అభ్యసన కార్యక్రమాల్లో మాత్రం పెద్దగా పురోగతి లేదని పేర్కొంది. ప్రధానంగా బోధనలో నాణ్యత లోపించడం, గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో విద్యార్థులు అత్యంత వెనుకబడి ఉండటం, ప్రాథమిక అభ్యసన, అవగాహన తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 9వ తరగతి పరీక్షల్లో విద్యార్థుల గణితం, సైన్స్ ఫలితాలు జాతీయ సగటు కంటే తక్కువగా నమోదయ్యాయి. లాంగ్వెజెస్లో జాతీయ సగటుతో సమానంగా ఉన్నప్పటికీ గణితం, సైన్స్, సోషల్లో రాష్ట్రం వెనుకబడి ఉంది. ‘నాస్’2017–21 గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో అభ్యసన క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. 5వ తరగతిలో లాంగ్వెజెస్, గణితం, ఈవీఎస్ సబ్జెక్టుల్లో విద్యార్థుల ప్రతిభ పతన స్థాయిలో ఉంది. 8వ తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో మార్కులు భారీగా తగ్గాయి. కరోనా తర్వాత పాఠశాలలు, విద్యార్థుల తీరు ఇంకా కోలుకోలేదని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. 3వ తరగతి నుంచి 5వ తరగతి ఫౌండేషనల్ లిటరసీ నుంచి కాన్సెప్ట్యువల్ లెర్నింగ్కి మారే దశలో లెర్నింగ్ గ్యాప్స్ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రైవేటు స్కూళ్ల వైపు మళ్లుతుండటంతో.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో నిర్మాణాత్మక సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో 2,245 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేరని.. అయినప్పటికీ వాటిలో 1,016 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వివరించింది. 5,001 సింగిల్ టీచర్ స్కూళ్లలో 62 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జనాభా మార్పులు, ప్రైవేటు పాఠశాలల వైపు తల్లిదండ్రుల మొగ్గు, ప్రభుత్వ పాఠశాలలపై విశ్వసనీయత లోపిస్తుండటం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు నివేదిక విశ్లేషించింది. రాష్ట్రంలో మొత్తం 43,154 పాఠశాలలు ఉన్నప్పటికీ వాటిలో అధిక సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలే ఉండటం మరో ప్రధాన సమస్య అని నీతి ఆయోగ్ గుర్తించింది. కేవలం 974 పాఠశాలలే 1 నుంచి 12 వరకు ఇంటిగ్రేటెడ్/కాంపోజిట్ స్కూల్స్గా ఉన్నాయని తెలిపింది. దీనివల్ల విద్యార్థులు తరచూ స్కూళ్లు మారాల్సి వస్తోందని.. ఇది భవిష్యత్తులో డ్రాపౌట్లకు దారితీసే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని హెచ్చరించింది. బాలికల విద్యలో ముందంజ నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం.. ఆడపిల్లల చదువుల విషయంలో రాష్ట్రం అత్యుత్తమ పనితీరు కనబరుస్తోంది. 2024–25 విద్యాసంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో బాలికల జీఈఆర్ జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ 115.6 శాతంగా నమోదైంది. ప్రాథమికోన్నత స్థాయిలో బాలికల నమోదు పదేళ్లలో 88.91 శాతం నుంచి 113.4 శాతానికి ఎగబాకింది. సెకండరీ స్థాయిలో 78.58 శాతం నుంచి 101.5 శాతానికి చేరి 100 మార్కును దాటేసింది. హయ్యర్ సెకండరీలో బాలికల నమోదు 49.58 శాతం నుంచి 71.3 శాతానికి చేరుకుంది. దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక మరుగుదొడ్లు అంతంతే.. వీల్చైర్ తదితర సదుపాయాల కోసం ర్యాంపుల ఏర్పాటులో రాష్ట్రం 28.3 శాతం నుంచి 76.7 శాతానికి ఎగబాకిందని నీతి ఆయోగ్ పేర్కొంది. కానీ దివ్యాంగులకు ప్రత్యేకంగా వినియోగపడే మరుగుదొడ్లు కేవలం 6.8 శాతం బడుల్లోనే ఉన్నాయని తెలిపింది. అయితే పదేళ్ల కిందట ఇది 2.7 శాతంగా ఉండేదని వివరించింది. రాష్ట్రానికి నీతి ఆయోగ్ కీలక సిఫార్సులు.. – భవిష్యత్తులో తెలంగాణ విద్యావ్యవస్థ రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ దిశగా ముందుకు సాగాలి. – ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీపై మరింత దృష్టి పెట్టాలి. – కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ అమలు చేయాలి. – టీచర్ ట్రైనింగ్ను ఆధునీకరించాలి. – ఏఐ ఆధారిత లెర్నింగ్ టూల్స్ వినియోగాన్ని పెంచాలి. -
టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం
తమిళనాడు రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని టీవీకే చీఫ్ విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. మరికాసేపట్లో ఆయన తమిళనాడు గవర్నర్తో భేటీ కానున్నారు. ఆ సమావేశం అనంతరం కోర్టుకు వెళ్లే యోచనపై ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్లు తగ్గాయి. దీంతో మిగతా పార్టీల నుంచి మద్దతు కూడగట్టాలని విజయ్ నిర్ణయించారు. ఈలోపు.. బలనిరూపణకు రెండు వారాల గడువు కోరుతూ గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. అయితే.. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం కావొద్దన్న ఉద్దేశంతో సీఎంగా ప్రమాణం చేయాలని ఆయన భావించారు. ఇదే విషయాన్ని లోక్భవన్కు కబురు పంపగా.. మద్దతుదారుల లిస్ట్తో రావాలని టీవీకేకు గవర్నర్ అర్లేకర్ కబురు పంపారు. దీంతో కాంగ్రెస్ మద్దతుతో కూడిన మొత్తం జాబితాను బుధవారం సాయంత్రం గవర్నర్కు విజయ్ సమర్పించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు సరిపడా బలం లేదని.. కాబట్టి సీఎంగా ప్రమాణం చేయడానికి కుదరదని చెబుతూ విజయ్కు గవర్నర్ షాకిచ్చారు. 118 ఎమ్మెల్యేల మద్దతుతోనే రావాలంటూ స్పష్టం చేశారు. దీంతో టీవీకే వర్గాలు నిరాశకు లోనయ్యాయి. ఇవాళ మరోసారి గవర్నర్తో భేటీ కావాలని విజయ్ నిర్ణయించారు. గతంలో.. సాధారణంగా ఎన్నికల్లో అతిపెద్ద(లార్జెస్ట్) పార్టీలను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడమో.. లేదంటే ఆ పార్టీలు తాము ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని ముందుకు రావడమో భారత రాజకీయాల్లో పరిపాటిగా వస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాతే అవి బల నిరూపణకు వెళ్తుంటాయి. 2013లో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి 31 సీట్లు, ఆప్కు 28 సీట్లు, కాంగ్రెస్కు 8 సీట్లు వచ్చాయి. అయితే మ్యాజిక్ ఫిగర్(36) లేకున్నా.. బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానం అందింది. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా వెనక్కి తగ్గింది. దీంతో ఆప్ కాంగ్రెస్ సహాయంతో మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2018లో కర్ణాటక ఎన్నికల తర్వాత లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి ఆహ్వానం లభించింది. ఆ సమయంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కోర్టు తలుపు తట్టింది. దీంతో కోర్టు త్వరగా బలనిరూపణ జరపాలని గవర్నర్కు సూచింది. చివరకు మెజారిటీ నిరూపించుకోలేక యడియూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. 2017 కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా(17) నిలిచినా అప్పటి గవర్నర్ బీజేపీ(13)ని ఆహ్వానించారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 21. బీజేపీ తన మిత్రపక్షాలతో మెజారిటీ నిరూపించుకుంది ప్రభుత్వం కొనసాగించింది. ఆ సమయంలో కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. కోర్టు గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది. ఇప్పుడు విజయ్ టీవీకే లార్జెస్ట్ పార్టీగా అవతరించినా.. గవర్నర్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటునకు ఒప్పుకోవడం లేదు. ముందుగానే బలం చూపించాలనే కోరుతున్నారు. విజయ్ కోరినట్లు రెండు వారాల గడువు ఇచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.కాబట్టి విజయ్ పార్టీ వీలైనంత త్వరగా బలాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. లేకుంటే గవర్నర్ మరొకరికి అవకాశం ఇవ్వొచ్చు. ఈ మేరకు ఆయన న్యాయనిపుణులతోనూ సంప్రదింపులు జరిపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కాబట్టి గవర్నర్ గనుక ప్రభుత్వ ఏర్పాటునకు ఒప్పుకోకపోతే న్యాయస్థానం తలుపు తట్టాలని విజయ్ భావిస్తున్నారు. నేషనల్ లెవల్లోనూ..గతంలో జాతీయ స్థాయిలోనూ ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. 1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన జనతా పార్టీకి ఆహ్వానం లభించింది. మోరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. 1989లో జనతా దళ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి.. వీపీ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు. ఆ టైంలో ఆయనకు బయట నుంచి మద్దతు లభించింది. ఇక 1996లో లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి ఆహ్వానం లభించింది. కానీ అటల్ బిహారీ వాజ్పేయి బలనిరూపణలో విఫలమై 13 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది, 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ (INC) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి.. యూపీఏ కూటమి ఏర్పడి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. -
మమతను పదవి నుంచి గెంటేయండి
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి నుంచి మమతా బెనర్జీని గెంటేయాలని సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వ్యాఖ్యానించారు. ఎన్డిటీవీకి చెందిన పద్మజా జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మమత వైఖరి క్షమించరానిదని, ఆమె వ్యవహారశైలి మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాలుగా మారిందన్నారు. రాజీనామా చేయకపోతే గవర్నర్ తన అధికారాలను ఉపయోగించి పదవి నుంచి మమతను తొలగించాలని అన్నారు.''మమతా బెనర్జీ వ్యవహారశైలి అవమానకరంగా ఉంది. ఆమెకు కచ్చితంగా గుణపాఠం నేర్పాలి. ఆమె ఇలా చేసినందుకు నాకు సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే తనకు తాను రాజీనామా చేసివుంటే హుందాగా పదవి నుంచి తప్పుకునేవారు. రాజీనామా చేయకపోవడం వల్ల గవర్నరే ఆమెను తొలగించే పరిస్థితి వచ్చింది. ఆమె ఇప్పుడు గవర్నర్ దయ మీద ఆధారపడి పదవిలో ఉన్నారు కాబట్టి, వెంటనే గవర్నర్ ఆమెను అధికారికంగా తొలగించాలి. అప్పటికీ సీఎం కుర్చీ వదలను అంటే నిర్దాక్షిణ్యంగా ఆమెను గెంటేయాల''ని మహేష్ జెఠ్మలానీ అన్నారు.ఒకవేళ మమతా బెనర్జీ సీఎం కార్యాలయంలోనే తిష్ట వేస్తే, గవర్నర్ పోలీసులను పంపి ఆమెను ఖాళీ చేయించవచ్చని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మమత గౌరవించాలని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ధ్రువీకరించిన క్షణం నుంచే ఓటర్ల తీర్పు అమల్లోకి వస్తుందని, ఇప్పుడు సీఎం కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తిగానే మమతను పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఎన్నికల సంఘమే అసలైన విలన్: మమతముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని మమతా బెనర్జీ మంగళవారం ప్రకటించారు. ఎన్నికల ఫలితాలపై ఆమె కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాతీర్పుతో ఓడలేదని, కుట్ర కారణంగా ఓడిపోయామని చెప్పారు. తాము బీజేపీతో పోరాటం చేయలేదని, ఎన్నికల సంఘంతో పోరాడామని అన్నారు. ''నేను ఓడిపోలేదు. లోక్సభవన్కు వెళ్లి గవర్నర్కు రాజీనామా లేఖ సమర్పించే ప్రసక్తే లేదు. మా ఓట్లను చోరీ చేశారు. చరిత్రలో ఇదో చీకటి అధ్యాయం. ఇందులో ఎన్నికల సంఘమే అసలైన విలన్'' అంటూ మమతా బెనర్జీ మండిపడ్డారు. చదవండి: తమిళనాడులో విజయ్ గెలుపు.. ట్రెండింగ్లో అన్నామలై!మమతను తొలగించాల్సిందే: హిమంత బిస్వశర్మమమతా బెనర్జీ వ్యవహారశైలిపై బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ స్పందించారు. ఆమెను పదవి నుంచి తొలగించాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీతో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే, ఆమెను బలవంతంగా తొలగించాల్సి ఉంటుంది. దేశం ఆమె ఇష్టానుసారం నడవదు. గవర్నర్ కొంత కాలం వేచి చూస్తారు, ఆ తర్వాత ఆమెను తొలగిస్తారని అన్నారు. #TheBuckStopsHere with @PadmajaJoshi Mamata Banerjee should be taught a lesson, she's a disgrace to the very concept of democracy and rule of law: Mahesh Jethmalani (@JethmalaniM), Senior Advocate, Supreme Court pic.twitter.com/bMQXpBGcop— NDTV (@ndtv) May 5, 2026 -
పత్తి దిగుబడి పెంపుకోసం రూ.5,659 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో పత్తి పంట దిగుబడి పెంపుకోసం ఐదేళ్లపాటు అమలయ్యే మిషన్కు రూ.5,695.22 కోట్లు కేటాయించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోది సారథ్యంలో భేటీ అయిన కేబినెట్ 2026–27 నుంచి 2030–31 కాలంలో అమలయ్యే ‘మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ’కింద ఈ మొత్తం వెచి్చంచాలని నిర్ణయించింది. దేశంలో పండే పత్తిలో నాణ్యత తగ్గడంతోపాటు దిగబడి క్రమంగా తగ్గిపోతుండటం వంటి సమస్యల పరిష్కారానికి ఈ నిధులను వెచి్చస్తారంది. వ్యాధులు, చీడపీడలను తట్టుకునే, అధిక దిగుబడులనిచ్చే వంగడాలను అభివృద్ధి పర్చడం, ప్రస్తుతమున్న సాంకేతికతను మరింత విస్తృతం చేయడం ఈ మిషన్ లక్ష్యాలని ప్రభుత్వం తెలిపింది. దీనితో దేశంలోని 32 లక్షల మందికి లబ్ధి కలుగనుందని పేర్కొంది.చెరకు కనీస ధర పెంపు అక్టోబర్ నుంచి మొదలయ్యే 2026–27 సీజన్కుగాను చెరకు కనీస ధరను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. న్యాయమైన, లాభదాయక ధర (ఎఫ్ఆర్పీ)ని క్వింటాలుకు రూ.10 చొప్పున రూ.365కి పెంచేందుకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. తాజాగా ఆమోదించిన ఎఫ్ఆర్పీ 2025–26 సీజన్ ధర క్వింటాల్కు రూ.355 కంటే 2.81 శాతం ఎక్కువని ఆయన వివరించారు. మిల్లులకు చెరకు సరఫరా చేసే రైతులకు రక్షణగా 10.25 శాతం రికవరీ రేటు ఆధారంగానే క్వింటాలకు ధర రూ.365 ఉంటుందని తెలిపారు. ఇది ప్రస్తుత 2025–26 సీజన్ ధర రూ.355 కంటే 2.81 శాతం అధికమని చెప్పారు. ఒకవేళ రికవరీ రేటు 10.25 శాతం కంటే ప్రతి 0.1 శాతం పెరిగితే, క్వింటాల్కు అదనంగా రూ.3.56 చెల్లిస్తారన్నారు. 9.5 శాతం కంటే తక్కువ రికవరీ ఉన్న మిల్లులకు చెరకు సరఫరా చేసే రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, వారికి ఎటువంటి కోత విధించకుండా క్వింటాల్కు రూ. 338.30 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. 2026– 27లో చెరకు ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ.182 చొప్పున ఉంటుందన్న అంచనా ప్రాతిపదికన ఎఫ్ఆర్పీ100.5 శాతంగా నిర్ణయించామని చెప్పారు. దీనివల్ల రైతులకు అదనంగా రూ.లక్ష కోట్ల మేర లాభం చేకూరనుందని వివరించారు. -
అంతర్జాతీయ వేదికపై భారతీయ కళా వైభవం
ఘనంగా మెట్ గాలా 2026 న్యూఢిల్లీ: ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మెట్ గాలా 2026’వేడుక న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వేదికగా ఘనంగా జరిగింది. ఈ ఏడాది ‘కాస్ట్యూమ్ ఆర్ట్’థీమ్తో జరిగిన ఈ వేడుకలో, భారతీయ ప్రముఖులు తమ సంప్రదాయ కళా వైభవాన్ని, ఆధునిక ఫ్యాషన్ను జోడించి ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. వేడుకలో ప్రత్యేక ఆకర్షణలు గౌరవ్ గుప్తా రూపొందించిన దుస్తుల్లో ఇషా అంబానీ మెరిసిపోయారు. అజంతా కుడ్య చిత్రాల స్ఫూర్తితో రూపొందిన ఈ గౌను, వజ్రాలు, విలువైన రత్నాలతో పొదిగి ఉంది. ఈ దుస్తుల తయారీకి 1,200 గంటల శ్రమ, 50 మందికి పైగా కళాకారులు పనిచేశారు. మెట్ గాలా అరంగేట్రం చేసిన దర్శకుడు కరణ్ జోహార్, ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ పెయింటింగ్స్ స్ఫూర్తితో రూపొందించిన ‘ఫ్రేమ్డ్ ఇన్ ఎటరి్నటీ’కాస్ట్యూమ్ ధరించారు. మనీష్ మల్హోత్రా రూపొందించిన ఈ అద్భుతమైన జాకెట్ తయారీకి సుమారు 5,600 గంటల సమయం పట్టింది. హైదరాబాద్కు చెందిన పారిశ్రామికవేత్త సుధా రెడ్డి, 15 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.125 కోట్లు) విలువైన చారిత్రక నెక్లెస్తో అందరి దృష్టిని ఆకర్షించారు. మనీష్ మల్హోత్రా రూపొందించిన నేవీ బ్లూ వెల్వెట్ లెహంగా ఆమెకు రాజసాన్ని తెచ్చిపెట్టింది. నటాషా పూనావాలా ‘ఆర్కిడ్ పెక్టోరల్’శిల్పాన్ని ధరించి వినూత్నంగా కనిపించగా, అనన్య బిర్లా స్టెయిన్లెస్ స్టీల్ మాస్్కతో, జైపూర్ రాజవంశీయులు గౌరవి కుమారి, సవాయ్ పద్మనాభ్ సింగ్ సంప్రదాయ దుస్తుల్లో రాజసం ఉట్టిపడేలా మెరిశారు. నేపథ్యం, వివాదాలు మెట్ గాలా అనేది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ నిధుల సేకరణ కోసం ఏటా నిర్వహించే అతిపెద్ద వేడుక. అయితే, ఈ ఏడాది ఈ వేడుక కొంత వివాదానికి కూడా దారి తీసింది. అమెజాన్ సంస్థాధినేత జెఫ్ బెజోస్, ఆయన భార్య లారెన్ బెజోస్ ఈ ఏడాదికి గౌరవ సహాధ్యక్షులుగా, ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. -
మోదీ ఉండటం భారత ప్రజల అదృష్టం: ట్రంప్
పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపునకుగానూ ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ఇది స్పష్టమైన ప్రజాతీర్పు అని, చరిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ విషయాన్ని వైట్హౌజ్ ప్రతినిధి కుశ్ దేశాయ్ మీడియాకు వెల్లడించారు. ‘‘బెంగాల్ విజయంపై ట్రంప్ మోదీకి అభినందనలు తెలియజేశారు. అంతేకాదు.. గత నెలలో ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఆ టైంలో మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయన వంటి నేత ఉండటం భారత ప్రజల అదృష్టమని అన్నారు’’ అని కుశ్ దేశాయ్ అన్నారు. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు బ్రేకులు వేస్తూ.. బెంగాల్లో బీజేపీ బంపర్హిట్ కొట్టింది. మూడింట రెండొంతులకుపైగా మెజారిటీతో కైవసం చేసుకోవడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బెంగాల్లో మెజారిటీ మార్కు 147 కాగా.. బీజేపీ ఏకంగా 206 సీట్లు సాధించింది. తృణమూల్ 81 సీట్లకే పరిమితమైంది. -
రాజ్యాంగం ఏం చెబుతోంది?
ప్రజాతీర్పుతో మేం ఓడిపోలేదు. కుట్ర చేసి మమ్మల్ని తక్కువ సీట్లకు పరిమితంచేశారు. అలాంటప్పుడు నేను రాజీనామా చేయాలనే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది? నేను ఓడిపోలేదు. లోక్భవన్కు వెళ్లి గవర్నర్కు రాజీనామాలేఖ సమర్పించే ప్రసక్తే లేదు.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చెబుతున్న మాట ఇది. ఇంతకీ రాజ్యాంగం ఏం చెబుతోంది.. ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయిన ముఖ్యమంత్రి తాను రాజీనామా చేయబోనని మొండికేస్తే రాజ్యాంగం ప్రకారం గవర్నర్ తదుపరి కార్యాచరణను అమల్లోకి తీసుకురావచ్చు. ఆ అధికారం రాజ్యాంగం గవర్నర్కు ప్రసాదించింది. శాసనసభ అనేది శాశ్వతసభ కాదు. ఐదేళ్ల కాలపరిమితి ముగియగానే శాసనసభ రద్దవుతుంది. తదుపరి ఎన్నికల్లో మెజారిటీ ఎమ్మెల్యేలున్న పార్టీని కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కోరవచ్చు. పాత సీఎం రాజీనామా చేయాలని ఆదేశించవచ్చు. రాజీనామాచేయకపోతే పాత మంత్రిమండలి, కేబినెట్ మంత్రుల పదవులను గవర్నర్ రద్దుచేస్తారు.ఒకవేళ పాత ముఖ్యమంత్రి తనకు కొత్త ఎమ్మెల్యేల్లో సరిపడా బలం ఉందని విశ్వసిస్తే బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించవచ్చు. అయితే తాజా ఎన్నికల్లో టీఎంసీ ఎమ్మెల్యేల సంఖ్య సాధారణ మెజారిటీకి సరిపడా లేదు కాబట్టి బలనిరూపణలో మమత ఓడిపోవడం ఖాయం. మెజారిటీ సీట్లు సాధించిన పార్టీనే గవర్నర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. నేటితోనే టీఎంసీ ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తోంది. దీంతో రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం చూసినా టీఎంసీ పాలన ముగిసినట్లే. మమత ఆటోమేటిక్గా సీఎం పదవిని కోల్పోయినట్లే లెక్క. గవర్నర్ కోరనిది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం కూడా మమతకు లేదు. -
కేకే లైన్ పాయే
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు ప్రభుత్వం మరోసారి గాలికొదిలేసింది. వాల్తేర్ డివిజన్లో అత్యంత కీలకమైన కొత్తవలస– కిరండూల్ రైల్వే లైన్ (కేకే లైన్)ను విశాఖపట్నం రైల్వే డివిజన్లో కొనసాగించేలా చూడటంలో ఘోరంగా విఫలమైంది. సీఎం చంద్రబాబుతో పాటు కూటమి ఎంపీలు పట్టించుకోకపోవడంతో వాల్తేర్ రైల్వే డివిజన్లో అత్యధిక ఆదాయం వచ్చే ముఖ్యమైన లైన్లన్నీ ఒడిశాకు వెళ్లిపోయాయి. కేకే లైన్ ద్వారా ఏడాదికి సగటున రూ.3 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని, ఈ లైన్ను కొత్తగా ఏర్పాటు చేసే విశాఖపట్నం రైల్వే డివిజన్ పరిధిలో కొనసాగించేలా చూడాలని ఉత్తరాంధ్ర ప్రజలు, రైల్వే ఉద్యోగ సంఘాల నాయకులు చాలాకాలం నుంచి కోరుతున్నారు. ఈ విషయంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి వినతిపత్రాలు అందించారు. అయినా చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే కేకే లైన్ను కోల్పోవాల్సి వచ్చిందని రైల్వే ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. వాల్తేర్ డివిజన్లో కీలకమైన కేకే లైన్ను రాయగడ డివిజన్లో చేర్చడం వల్ల విశాఖపట్నం డివిజన్కు ఆర్థికంగా తీవ్ర నష్టం కలుగుతుందని, ఆ ప్రభావం విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్పై పడుతుందని అభిప్రాయపడుతున్నారు. కేకే లైన్ను రాయగడ డివిజన్లో కలుపుతున్నట్లు కేంద్రం ప్రకటించినప్పటికీ అందులో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు మౌనంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ ఒకటో తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 3(4) కింద సోమవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్, భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్లోని కొన్ని ప్రాంతాలను విభజించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఇక నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి. భువనేశ్వర్ కేంద్రంగా కొనసాగుతున్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోని వాల్తేర్ డివిజన్ను రద్దు చేశారు. దాని స్థానంలో కొత్తగా విశాఖపట్నం డివిజన్, ఒడిశాలోని రాయగడ కేంద్రంగా మరో డివిజన్ ఏర్పాటు చేశారు. విశాఖపట్నం డివిజన్ను దక్షిణ కోస్తా జోన్లో, రాయగడ డివిజన్ను తూర్పు కోస్తా జోన్లో చేర్చారు. ఇనుప ఖనిజం రవాణా ద్వారా ఆదాయం వచ్చే కేకే లైన్ను రాయగడకు కేటాయించి, కేవలం ప్రయాణికుల రద్దీ ఉండే లైన్లను మాత్రమే విశాఖపట్నం డివిజన్లో ఉంచారని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే భూమి కేటాయింపు విభజన హామీల ప్రకారం రాష్ట్రానికి రైల్వే జోన్ సాధన కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేష కృషి చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే రైల్వే జోన్ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రైల్వేశాఖ రూపొందించింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖపట్నంలోని ముడసర్లోవలో భూమి కేటాయించింది. ఆ భూమిలోనే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్ ఇటీవల ప్రకటించారు. విశాఖపట్నం డివిజన్ ఇలా.. విశాఖపట్నం డివిజన్ మొత్తం 463 రూట్ కిలో మీటర్ల పరిధిలో ఉంటుంది. ఇందులో ఇచ్ఛాపురం–విశాఖపట్నం–దువ్వాడ మార్గం (270 కి.మీ.), విజయనగరం–కూనేరు మార్గం (102 కి.మీ.), నౌపడ జంక్షన్–పర్లాఖేముండి సెక్షన్ (39 కి.మీ.), బొబ్బిలి జంక్షన్–సాలూరు సెక్షన్ (17 కి.మీ.), సింహాచలం నార్త్–దువ్వాడ బైపాస్ వంటి పర«దీయ మార్గాలు (35 కి.మీ.) ఉన్నాయి. రాయగడ డివిజన్ ఇలా... రాయగడ డివిజన్ మొత్తం 696 రూట్ కిలో మీటర్లలో ఉంటుంది. కోరాపుట్–సింగపూర్ రోడ్(164 కి.మీ.), కొత్తవలస–కిరండూల్ కేకే లైన్(442 కి.మీ.) కూనేరు–థేరువాలి (36 కి.మీ.), గుణుపూర్–పర్లాఖేముండి (54 కి.మీ.) సెక్షన్లు ఈ డివిజన్లో ఉంటాయి. దక్షిణ మధ్య రైల్వేలో మార్పులు దక్షిణ మధ్య రైల్వే జోన్ (సికింద్రాబాద్) పరిధిలో హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు యథావిధిగా కొనసాగుతాయి. వీటికి అదనంగా పరిపాలన అవసరాల దృష్ట్యా గుంతకల్ డివిజన్ నుంచి రాయచూర్–వాడి సెక్షన్ (108 కి.మీ.)ను సికింద్రాబాద్ డివిజన్కు బదిలీ చేస్తారు. గుంటూరు డివిజన్ నుంచి విష్ణుపురం–పాగిడిపల్లి–జాన్పహాడ్ సెక్షన్ (142 కి.మీ.) కూడా సికింద్రాబాద్ డివిజన్కు బదిలీ అవుతుంది. సికింద్రాబాద్ నుంచి కొండపల్లి–మోటుమర్రి సెక్షన్ (46 కి.మీ.) మాత్రం విజయవాడ డివిజన్కు బదిలీ చేస్తారు. కాగా, తూర్పు కోస్తా రైల్వే (భువనేశ్వర్) పరిధిలో సంబల్పూర్ డివిజన్, పునర్వ్యవస్థీకృత ఖుర్దా రోడ్ డివిజన్, కొత్తగా ఏర్పడే రాయగడ డివిజన్ కొనసాగుతాయి. -
హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు!
సాక్షి, అమరావతి, సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం తాజాగా సిఫారసు చేసింది. న్యాయాధికారుల కోటా నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో సోమవారం సమావేశమైన కొలీజియం ఈమేరకు తీర్మానం చేసింది. ఈ ముగ్గురి పేర్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం గతేడాది అక్టోబర్లో సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది.తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై వీరిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సిఫారసు చేసింది. గంధం సునీత ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన జిల్లా జడ్జిగా ఉన్నారు. ఆలపాటి గిరిధర్ విశాఖపట్నం సేల్స్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా కొనసాగుతున్నారు. పురుషోత్తంకుమార్ ఏపీ జుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా ఉన్నారు. సుప్రీంకోర్టు సిఫారసులకు కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత సంబంధిత ఫైలు ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం వారి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది.గంధం సునీత...గంధం సునీత 1977 జూలై 14న కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లిలో గంధం వీరయ్య, శివనాగేంద్రమ్మ దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. స్థానిక ఎస్డీఎన్ఎస్డీఎస్ పాఠశాలలో 10వ తరగతి, మచిలీపట్నం లేడీయాంప్తిల్ కాలేజీలో ఇంటర్, విజయవాడ గాంధీ మహిళా కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మాంటిస్సోరి కాలేజీలో ఎల్ఎల్బీ చేసి టాపర్గా బంగారు పతకం సాధించారు. 1999 జూలై 1న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. విజయవాడలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2008 నుంచి 2010 వరకు గుడివాడలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పని చేశారు. 2010లో సివిల్ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అనంతరం జిల్లా జడ్జిగా పలు చోట్ల పని చేశారు. 2019–23 వరకు హైకోర్టు రిజిస్ట్రార్గా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2023 నుంచి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన జిల్లా జడ్జిగా ఉన్నారు.ఆలపాటి గిరిధర్...ప్రకాశం జిల్లా కొండేపి మండలం గోగినేనివారిపాలెంలో జన్మించారు. తండ్రి బాపయ్య చౌదరి స్వాతంత్ర సమరయోధుడు, విశాంత్ర ప్రధానోపాధ్యాయుడు. ఒంగోలు ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో లా డిగ్రీ పొందారు. 1998 ఆగస్టు 27న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. గిరిధర్ ఒంగోలు జిల్లా కోర్టుతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తరువాత న్యాయాధికారిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో న్యాయాధికారిగా పనిచేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా వ్యవహరించారు. కర్నూలు, విజయనగరం, విశాఖపట్నంలో ప్రధాన జిల్లా జడ్జిగా పని చేశారు. హైకోర్టులో రిజిస్ట్రార్గా వ్యవహరించారు. ప్రస్తుతం విశాఖపట్నం ఏపీ వ్యాట్ అప్పిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.చింతలపూడి పురుషోత్తం కుమార్విశాఖపట్నంలో చింతలపూడి రాంబాబు, రామరత్నం దంపతులకు జన్మించారు. రాంబాబు విశ్రాంత జిల్లా జడ్జి కాగా ఆ కుటుంబంలో మూడు తరాలుగా న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా సేవలు అందిస్తున్నారు. పురుషోత్తం కుమార్ ఆంధ్ర వర్సిటీలో మెరైన్ బయాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఉస్మానియా నుంచి లా డిగ్రీ పొందారు. 2002 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎస్.రవి వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి జిల్లా కోర్టు, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2010లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అటు తరువాత వివిధ హోదాల్లో పలు జిల్లాల్లో పనిచేశారు. హైకోర్టులో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. రిజిస్ట్రార్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2025 జనవరి నుంచి ఏపీ జుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. -
టీఎంసీ ఓటమిపై కాంగ్రెస్ సంబురాలు.. రాహుల్ చురకలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. కేరళంలో అధికారం తప్పించి మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపెట్టలేదు. అయితే సింగిల్ డిజిట్ సీట్లతో తమిళనాడులో అధికారంలో భాగం అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇటు బెంగాల్లో రెండు సీట్లు గెలవడం కంటే.. టీఎంసీ ఓటమిపైనే హస్తం శ్రేణులు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ఈ పరిణామంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓటమితో కొందరు కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నట్లు రాహుల్ గాంధీకి సమాచారం వెళ్లింది. దీంతో సొంత పార్టీ నేతల తీరుపైనే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘ టీఎంసీ ఓటమిని చూసి కొందరు కాంగ్రెస్ నేతలు మురిసిపోతున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు. బెంగాల్, అసోంలో ప్రజల తీర్పును అపహరించడం అనేది భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే క్రమంలో బీజేపీ వేసిన మరో అడుగు.. .. ఇది ఓ పార్టీకో, మరో పార్టీకో చెందింది కాదు. ఇది దేశం గురించి.. చిల్లర రాజకీయాలు పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా అన్ని పార్టీలు కలిసికట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది’’ అని రాహుల్ హితవు పలికినట్లు సమాచారం. అంతకు ముందు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. కేరళలో కాంగ్రెస్ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు బెంగాల్, అస్సాం విషయంలో బీజేపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీదీకి మద్దతుగా.. బెంగాల్లో ఓట్ల చోరీ జరిగిందన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ఏకీభవించారు. బెంగాల్తో పాటు అస్సాంలోనూ ఓట్లను బీజేపీ దోచుకుందని అన్నారాయన. ‘‘బెంగాల్లో వందకు పైగా స్థానాలు అన్యాయంగా బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. ఎన్నికల ప్రక్రియలో సీసీటీవీ కెమెరాలు ఆపివేయడం, కౌంటింగ్ సెంటర్లలో అనుమానాస్పద కదలికలు జరిగాయి. ఇది ఒక పెద్ద “ఎలక్షన్ మేనిప్యులేషన్ ప్లేబుక్”లో భాగమని ఆయన ఆరోపించారు. -
బెంగాల్లో సువర్ణాధ్యాయం మొదలు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో దశాబ్దాల నిరీక్షణ తర్వాత సువర్ణాధ్యాయం మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. హింస, భయం, బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి పలికి బెంగాల్ను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన చరిత్రాత్మక విజయాలను ఆయన అపూర్వం, అద్వితీయంగా అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోమవారం ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో భారీ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి మోదీ పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టిన తొలి ఎన్నికల్లోనే కార్యకర్తలకు ఆయన ఇచ్చిన మార్గదర్శనం సత్తా చాటిందని మోదీ ప్రశంసించారు. ప్రజలే దేవుళ్లు.. బెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపుర ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టిన ప్రజలకు సైతం కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా, ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’కి భారత్ ఎందుకు మాతృభూమిగా ఉందో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రపంచానికి చాటిచెప్పాయన్నారు. గతేడాది బిహార్ ఎన్నికల సమయంలో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు ఎన్డీఏ ప్రభంజనం విస్తరిస్తుందని తాను చెప్పిన మాటలు నేడు నిజమయ్యాయని చెప్పారు. గంగామాతతోపాటు బ్రహ్మపుత్ర, కామాఖ్యా మాతల ఆశీర్వాదం తమపై మెండుగా ఉందన్నారు. అందుకే అస్సాం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీకి హ్యాట్రిక్ విజయం సాధ్యమైందన్నారు. పుదుచ్చేరిలో గత ఐదేళ్లలో ఎన్డీఏ అమలు చేసిన విజన్కు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇ చ్చారన్నారు. ప్రస్తుతం దేశంలో 23 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని, ‘నాగరిక్ దేవో భవ’(ప్రజలే దేవుళ్లు) అనే మంత్రంతో తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. శ్యామాప్రసాద్ కల సాకారం పశ్చిమ బెంగాల్ను భారత్లో అంతర్భాగంగా ఉంచేందుకు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని ధారపోశారని మోదీ గుర్తుచేశారు. 1951లో ‘దేశం కోసం జీవించాలి, దేశం కోసం మరణించాలి’అన్న ఆశయంతో ఆయన ప్రారంభించిన ప్రస్థానం, నేటి చారిత్రక విజయంతో ఆయన కల సాకారమైందన్నారు. బెంగాల్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని, నేటి నుంచి భయం నుంచి విముక్తి పొందిందని ‘బాంగ్లాయ్ పోరిబోర్తన్ హోయే గెచే’(బెంగాల్లో మార్పు వచ్చేసింది) అని నినదించారు. వందేమాతరం 150వ వసంతంలో భరతమాతకు, బంకించంద్ర ఛటర్జీకి, అరవిందుడికీ బెంగాల్ ఓటర్లు చారిత్రక నివాళి అర్పించారన్నారు. ఇకపై అభివృద్ధి, విశ్వాసం, కొత్త ఆశలు బెంగాల్లో అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తాయన్నారు. యువతకు ఉద్యోగాలు, మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో చొరబాటుదారుల ఆటకట్టిస్తామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం తొలి కేబినెట్లోనే పేదలకు ఉచిత వైద్యం అందించే ‘ఆయుష్మాన్ భారత్’పథకానికి పచ్చజెండా ఊపుతామని స్పష్టం చేశారు. అంగ్, బంగ్, కలింగ్...ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు యుద్ధ సైరన్లు మోగుతూ, అస్థిరత, అరాచకం రాజ్యమేలుతున్న తరుణంలో, పశ్చిమాసియా సంక్షోభం వెంటాడుతున్నా.. భారత ప్రజలు మాత్రం స్థిరత్వం కోసం ఓటు వేశారని మోదీ విశ్లేషించారు. వికసిత భారత్ లక్ష్యంగా దేశం ఏకతాటిపై నిలబడి సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటోందని చెప్పారు. ప్రాచీన భారతదేశంలో అంగ్ (బిహార్), బంగ్ (బెంగాల్), కలింగ్ (ఒడిశా) రాష్ట్రాలు ఆర్థిక, రాజకీయ, వాణిజ్య మూలస్తంభాలుగా ఉండేవని గుర్తుచేశారు. ఆసియా ఖండం మొత్తం కళింగ ఓడరేవుల ద్వారా వాణిజ్యం సాగేదని, బెంగాల్ సాంస్కృతిక కేంద్రంగా ఉండేదని గుర్తుచేశారు. బానిసత్వంలో ఆ స్తంభాలు బలహీనపడ్డాయని, ఇప్పుడు మళ్లీ ఆ మూడు ప్రాంతాల ప్రజలు బీజేపీని ఎంచుకోవడం ద్వారా వికసిత భారత్కు బాటలు వేస్తున్నారని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.మహిళా వ్యతిరేకులకు గుణపాఠంపార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించిన రాజకీయ పక్షాలు మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని తాను ముందే హెచ్చరించానని గుర్తుచేశారు. అన్నట్లుగానే కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే ఆ ఆగ్రహాన్ని రుచి చూశాయన్నారు. మహిళా విరోధిగా ముద్రపడిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి సైతం యూపీలో మహిళలు తగిన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. కేరళలో కమ్యూనిస్టుల పదేళ్ల దుష్పరిపాలనను ప్రజలు తిరస్కరించారని, అయితే వచ్చే ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్కు కూడా మహిళలు తగిన సమాధానం ఇస్తారన్నారు. నేడు దేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం లేకపోవడం కేవలం రాజకీయ మార్పు కాదని, ప్రజల ఆలోచనా విధానంలో వచ్చిన భారీ మార్పు అని మోదీ విశ్లేషించారు. యావత్ ప్రపంచం, దేశం కమ్యూనిజాన్ని, అడవుల్లో అంతరించిపోతున్న మావోయిజాన్ని తిరస్కరించినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం అదే భావజాలాన్ని అక్కున చేర్చుకుంటూ విపరీత దిశలో పయనిస్తోందని ధ్వజమెత్తారు. విపక్షాలవి కేవలం విభజన రాజకీయాలైతే, తమవి విశ్వాసం నింపే రాజకీయాలని వ్యాఖ్యానించారు. కుటుంబ, వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు.మోదీపై చెక్కుచెదరని విశ్వాసం: నితిన్ నబిన్12 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత కూడా ప్రధాని మోదీ నాయకత్వంపై, మోదీ గ్యారంటీపై ప్రజల్లో నమ్మకం ఏమాత్రం చెక్కుచెదరలేదనడానికి ఈ విజయాలే నిదర్శనమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మభూమి అయిన బెంగాల్ను మోదీ బీజేపీ మయం చేశారని కొనియాడారు. విజయోత్సవ సంబరాల అనంతరం మంగళవారం నుంచే బీజేపీ శ్రేణులు మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవలో, దేశ నిర్మాణంలో నిమగ్నమవుతాయని చెప్పారు. సమావేశం ప్రారంభంలో మోదీకి పూలమాల వేసి సత్కరించేందుకు నబిన్ ముందుకు రాగా, ఆ మాలను మోదీ ఆప్యాయంగా తిరిగి నబిన్ మెడలోనే వేసి నాయకుల పట్ల తనకున్న గౌరవాన్ని, నిరాడంబరతను చాటుకున్నారు. -
టీఎస్పీఎస్సీ నియామకాలు తుది తీర్పునకు లోబడే..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చేపట్టే నియామకాలు తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దూరవిద్య ద్వారా పొందిన డిగ్రీల చెల్లుబాటు, తెలంగాణ వెలుపల ఉన్న విశ్వవిద్యాలయాల స్టడీ సెంటర్ల గుర్తింపునకు సంబంధించిన వివాదంపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పి)పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జూలై 29కి వాయిదా వేసింది. ఈలోగా జరిగే నియామకాలు కేసు తుది తీర్పునకు లోబడే ఉంటాయని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2017 నోటిఫికేషన్లో ఆమోదం.. 2022లో తిరస్కరణ రాష్ట్రానికి చెందిన ఎ. విజయచంద్రారెడ్డి తదితరులు టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా ఎస్ఎల్పీ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ 2014 రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల స్టడీ సెంటర్ల ద్వారా విద్యార్థులు దూరవిద్యలో డిగ్రీలు పొందారని తెలిపారు. 2017లో టీఎస్పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లో ఆ సర్టీఫికెట్లను ఆమోదించారని.. కానీ 2022 నోటిఫికేషన్లో యూజీసీ నిబంధనల ప్రకారం తెలంగాణ వెలుపల ఉన్న వర్సిటీల పరిధిలోకి వస్తాయనే కారణంతో వాటిని తిరస్కరిస్తున్నారన్నారు.రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని.. ఈ డిగ్రీల ఆధారంగా అభ్యర్థులకు అవకాశం కల్పించాలని వాదించారు. ఈ వాదనలపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఒక రాష్ట్ర చట్టం కింద ఏర్పాటైన విశ్వవిద్యాలయం కేవలం ఆ రాష్ట్ర భౌగోళిక పరిధి లోపలే పనిచేయాలి. ఆ రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాల్లో స్టడీ సెంటర్లను నిర్వహించడానికి వీల్లేదు’అని యూజీసీ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. దూరవిద్య ద్వారా పొందిన డిగ్రీలకు యూజీసీ లాంటి చట్టబద్ధమైన సంస్థల గుర్తింపు లేకుంటే ఆయా డిగ్రీలను విద్యాపరమైన అర్హతలుగా పరిగణించలేమని పేర్కొంది.అలాగే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచిందని.. అలాంటప్పుడు 2017 నుంచి 2020 మధ్య విద్యార్థులు తెలంగాణలో ఉంటూ వేరే రాష్ట్ర వర్సిటీల స్టడీ సెంటర్లలో ఎలా ప్రవేశాలు పొందారని, వాటికి గుర్తింపు ఎలా ఉంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ప్రస్తుతానికి నియామక ప్రక్రియను నిలిపివేయబోమని.. కానీ నియామకాలన్నీ తమ తుది తీర్పునకు లోబడే జరుగుతాయని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. -
తమిళనాడులో నూతన ప్రభుత్వం.. విజయ్ ముందున్న దార్లు ఇవేనా?
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సంచలనం సృష్టించారు. 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి, ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించారు. కేవలం రెండేళ్ల క్రితం ఏర్పడిన టీవీకే 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 106 స్థానాల్లో మెజారిటీని సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు అవసరం. మ్యాజిక్ ఫిగర్కు మరో 12 సీట్ల దూరంలో ఉంది. ఈ క్రమంలో తమిళనాడు నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ ముందు నాలుగు మార్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిల్లో ఏఐఏడీఎంకేతో పొత్తు గతంలో టీవీకే–ఏఐఏడీఎంకే మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏఐఏడీఎంకే తన రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకోవడానికి టీవీకేతో కలిసే అవకాశం ఉంది. అయితే, విజయ్ బీజేపీని ఆదర్శ శత్రువుగా పేర్కొన్నందున, ఏఐఏడీఎంకే బీజేపీని వదిలేయమని అడగవచ్చు. ఇది పెద్ద సవాలుగా మారవచ్చు.చిన్న పార్టీలతో పొత్తు డీఎంకే లేదా ఏఐఏడీఎంకేతో పొత్తు లేకుండా, పీఎంకే, డీఎండీఎకే, వీసీకే, ఎంఎంఎంకే వంటి చిన్న పార్టీలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇలా చేస్తే, విజయ్ తన స్వంత రాజకీయ వారసత్వాన్ని నిర్మించుకునే అవకాశం ఉంటుంది.కాంగ్రెస్ మద్దతు స్థానిక పార్టీలను పక్కన పెట్టి, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కాంగ్రెస్ ఇప్పటికే టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది.స్వతంత్రుల మద్దతు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు పొందడం ద్వారా కూడా విజయ్ మెజారిటీ సాధించే అవకాశం ఉంది. -
సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్ తగిలింది. రామోజీరావు చనిపోయిన నేపథ్యంలో కేసును కొనసాగించవద్దని మార్గదర్శి తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అలాగైతే రామోజీ ఆస్తులు అటాచ్ చేసి, బాధితులకు పంచుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ క్రమంలో తాము ఇప్పటికే అందరికీ చెల్లింపులు చేశామని ముకుల్ రోహత్గీ చెప్పుకొచ్చారు. అనంతరం, ఆ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని మార్గదర్శికి సుప్రీంకోర్టు ఆదేశించింది.కాగా, మార్గదర్శి కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్షియర్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను మార్గదర్శి సేకరించింది. ఈ నేపథ్యంలో రామోజీరావు చనిపోవడంతో కేసు మెయింటైనబుల్ కాదని హైకోర్టులో మార్గదర్శి వాదనలు వినిపించింది. దాంతో ఎఫ్ఐఆర్ తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఉండవల్లి సవాల్ చేశారు.దీంతో, సుప్రీంకోర్టు.. ఆర్బీఐ, ఏపీ , తెలంగాణ ప్రభుత్వాలు, కిరణ్, రామోజీరావులకు నోటీసులు జారీ చేసింది. ఉండవల్లి తరఫున వాదనలు సీనియర్ న్యాయవాది పరమేశ్వరన్, న్యాయవాదులు అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. ఈరోజు వాదనల తర్వాత తదుపరి విచారణను వాయిదా వేసింది. -
ఉపరాష్ట్రపతికి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
భారతదేశ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కూడా విషెస్ తెలియజేస్తూ ఓ సందేశం ఉంచారు.‘‘భారతదేశ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. దేశానికి దీర్ఘకాలం మీరు సేవలు అందించాలని.. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా’’ అని వైఎస్ జగన్ కోరారు. అయితే..Heartiest birthday greetings to the Hon’ble Vice President of India, Shri C.P. Radhakrishnan Garu. May God bless you with a long and healthy life in the continued service of our nation.@CPR_VP @VPIndia— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2026వైఎస్ జగన్ చేసిన ట్వీట్కు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ స్పందించారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెప్పారాయన.చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ భారత దేశపు 15వ ఉపరాష్ట్రపతి. తమిళనాడుకు చెందిన ఈయన.. బీజేపీలో సుదీర్ఘకాలం పని చేశారు. లోక్సభ సభ్యుడిగా, తమిళనాడు బీజేపీ చీఫ్గా, ఆపై పలు రాష్ట్రాలకు గవర్నర్గానూ పని చేశారు. -
బెంగాల్లో బీజేపీ ముందంజ!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కౌంటింగ్లో కాసేపు టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ కొనసాగింది. అయితే ఈ రేసులో టీఎంసీ వెనకబడిపోయింది. బీజేపీ అగ్రనేతలు కౌంటింగ్లో జోరు చూపిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలంతా ముందంజలో ఉన్నట్లు సమాచారం. సువేందు అధికారి, నిశిత్ ప్రామాణిక్ (మథాభంగా (SC)), రేఖా పత్రా (హింగల్గంజ్ (SC)), రత్నా దేవనాథ్(పనిహాటి), అనందమయ్ బర్మన్(మాటిగారా–నక్సల్బరి), శిఖా చటర్జీ(డాబ్గ్రామ్–ఫుల్బారి), శంకర్ ఘోష్ (సిలిగురి) అంతా ఆధిక్యం కనబరుస్తున్నారు. అయితే భవానీపూర్లో మాత్రం ఆసక్తికర పోరు నడుస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాసేపు ముందంజలో కొనసాగారు. ఆ వెంటనే బీజేపీ రాష్ట్ర చీఫ్ సువేందు అధికారి లీడ్లోకి వచ్చారు. నందిగ్రాంలోనూ ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ లీడ్తో బీజేపీ శ్రేణుల్లో సంబురాలకు సిద్ధమయ్యాయి. ఈ ఎన్నికలు మమతా వర్సెస్ జనతా అని.. ప్రజల్లో ఆమెపై ఉన్న కోపం విస్పష్టమని బీజేపీ అంటోంది. మొత్తం 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో అధికారం కైవసం చేసుకునేందుకు 148 స్థానాలు అవసరం. అయితే ఒక నియోజకవర్గంలో రీపోలింగ్ కారణంగా 293 స్థానాలకుగానూ 147 సీట్లు కైవసం చేసుకుంటే సరిపోతుంది. -
‘ప్రజాశక్తి విజయం సాధించింది’.. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెల్లడి కానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దీదీ నాలుగోసారి అధికారంలోకి వస్తారా? బీజేపీ టీఎంసీకి చెక్ పెడుతుందా? అనేది తేలిపోనుంది. మొత్తం 294 స్థానాల్లో అధికారం కోసం కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 148. అయితే ఫాల్తా రీపోలింగ్ నేపథ్యంలో.. ఆ సంఖ్య 293-147గా మారింది.ప్రజాశక్తి విజయం సాధించింది.. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ బెంగాల్ ప్రజల ఆకాంక్షలను మేం నెరవేరుస్తాంపశ్చిమ బెంగాల్లో కమలం వికసించింది 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ప్రజాశక్తి విజయం సాధించింది బీజేపీ సుపరిపాలన రాజకీయాలు గెలిచాయి పశ్చిమ బెంగాల్ ప్రజల ప్రతి ఒక్కరికీ నేను నమస్కరిస్తున్నాను ప్రజలు బీజేపీకి అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మా పార్టీ సాధ్యమైన ప్రతిదీ చేస్తుందని నేను హామీ ఇస్తున్నానుబెంగాల్ ఫలితాలపై స్పందించిన మమత ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ ఓట్లను దొంగిలించింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ హవామెజార్టీ మార్క్ దాటిన కమలంబీజేపీ ఓట్లు దొంగలించింది: మమతా బెనర్జీఎన్నికల ఫలితాలు.. ఆధిక్యంపై స్పందించిన మమతా బెనర్జీటీఎంసీ శ్రేణులకు కీలక సూచనలు ఈ ఫలితాలు చెంది నిరాశ చెందొద్దుమూడు రౌండ్ల కౌంటింగే జరిగిందికౌంటింగ్ నిలిపివేశారు70 స్థానాల్లో కౌంటింగ్పై ఈసీ అప్డేట్ ఇవ్వడం లేదుతుది ఫలితాల్లో మనదే విజయంతొందరపడి కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లొద్దుబీజేపీ ఓట్లు దొంగిలిస్తోందిబెంగాల్లో కమల వికాసంభారీ ఓటమి దిశగా తృణమూల్ కాంగ్రెస్193 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ97 స్థానాల్లో టీఎంసీకాంగ్రెస్ 1, సీపీఎం 2 స్థానాల్లో ఆధిక్యంబెంగాల్ విజయోత్సవాల్లో మోదీసాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీపశ్చిమ బెంగాల్ సహా అస్సాంలో బీజేపీ క్లీన్స్వీప్ పుదుచ్చేరి(కేంద్రపాలిత ప్రాంతం)లో ఎన్డీయే కూటమి ఘన విజయంవిజయోత్సవాల్లో పాల్గొననున్న మోదీ బెంగాల్లో కమల వికాసంతృణమూల్ చేజారిన పశ్చిమ బెంగాల్విజయం దిశగా దూసుకెళ్తున్న బీజేపీఇప్పటికే 150+ స్థానాల్లో స్పష్టంగా కొనసాగుతున్న లీడ్125 స్థానాల ఆధిక్యంలో టీఎంసీలెఫ్ట్ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంఇతరులు ఒక స్థానంకాంగ్రెస్ ఆధిక్యం జీరో అనూహ్య విజయ దిశగా బీజేపీబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంముస్లిం ప్రాబల్యం ప్రాంతాల్లో బీజేపీ అధిక్యంముస్లింలో చీలిక ఏర్పడిందని విశ్లేషకుల అభిప్రాయం.ఈ చీలిక ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్పూర్లో స్పష్టంగా.. దక్షిణ బెంగాల్, కూచ్ బెహర్లో మాత్రం టీఎంసీ వైపు మొగ్గునిరాశలో టీఎంసీ శ్రేణులుబెంగాల్ ఎన్నికల్లో ఓటమి దిశగా తృణమూల్ కాంగ్రెస్టీఎంసీ శ్రేణుల్లో తీవ్ర నిరాశబోసిపోతున్న టీఎంసీ కార్యాలయం కాళిఘాట్లోని మమత నివాసం వద్ద నిశబ్ద వాతావరణంమెజారిటీ లీడ్లో బీజేపీబెంగాల్లో 150 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం133 స్థానాల ఆధిక్యంలో టీఎంసీకాంగ్రెస్, సీపీఎం తలో మూడు చోట్ల లీడ్నాలుగోసారి సీఎం కావాలన్న మమతా బెనర్జీ ఆశలపై బీజేపీ నీళ్లుబెంగాల్లో కాషాయం జెండా రెపరెపలుసంబురాల్లో బీజేపీ శ్రేణులులీడ్లో ఆర్జీకర్ బాధితురాలి తల్లిఆధిక్యంలో రత్నా దేవనాథ్(54)దేశాన్ని కుదిపేసిన ఆర్జీకర్ హత్యాచార ఘటనఈ ఘటన బాధితురాలి తల్లే రత్నా దేవనాథ్ పనిహాతి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీఆధిక్యంలో కొనసాగుతున్న రత్నా దేవనాథ్బెంగాల్లో బీజేపీ ఆధిక్యం142 సీట్లలో లీడ్లో బీజేపీ111 సీట్లలో టీఎంసీమూడు చోట్ల కాంగ్రెస్కు ఆధిక్యంలీడ్ ఖాతా తెరవని సీపీఎంబెంగాల్లో టఫ్ ఫైట్హోరాహోరీగా టీఎంసీ, బీజేపీ మధ్య పోరురెండో స్థానంలో కొనసాగుతున్న టీఎంసీమమతా బెనర్జీని దోబూచులాడుతున్న లీడ్కాసేపు దీదీ.. కాసేపు అధికారి సువేందు ఆధిక్యంలో.. భవానీపూర్లో రౌండ్ రౌండ్కీ మారుతున్న సీన్బెంగాల్ కౌంటింగ్లో మారుతున్న సీన్కొనసాగుతున్న ఈవీఎంల ఓటింగ్టీఎంసీ కంటే ఆధిక్యంలో బీజేపీ107 సీట్లలో టీఎంసీ, 127 స్థానాల్లో బీజేపీ లీడ్నాలుగు చోట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ భవానీపూర్లో వెనకంజలో మమతప్రారంభమైన ఈవీఎం కౌంటింగ్బెంగాల్లో ప్రారంభమైన ఈవీఎంల కౌంటింగ్మరో గంటలో ట్రెండ్స్ మొదలయ్యే చాన్స్ఫలితాలపై అప్పుడే రానున్న స్పష్టతటీఎంసీ శ్రేణుల మౌనంవెలువడుతున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుపోస్టల్లో బీజేపీకి ఆధిక్యంవెలవెలబోతున్న టీఎంసీ ఆఫీస్కాళీఘాట్ మమతా బెనర్జీ నివాసం వద్దా గంభీర వాతావరణం బెంగాల్లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్బెంగాల్లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుఆధిక్యంలో బీజేపీ.. 118 స్థానాల్లో లీడ్టీఎంసీ 107రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల లీడ్ఖాతా తెరవని సీపీఎందీదీ వెనకంజ.. బీజేపీ కామెంట్బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలీడ్లో ఆ పార్టీ అగ్రనేతలువెనకంజలో మమతా బెనర్జీఇవి జనతా వర్సెస్ మమతా ఎన్నికలు :బీజేపీమమతా బెనర్జీపై జనాలకు ఉన్న కోపం విస్పష్టం :బీజేపీఆధిక్యంలో.. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యంటీఎంసీ 108బీజేపీ 117కాంగ్రెస్ 5సీపీఎం 0ఇతరులు 0అధిర్ రంజన్ వెనుకంజమూడు దశాబ్దాల తర్వాత స్టేట్ పాలిటిక్స్లోకి అధిర్ రంజన్ రీఎంట్రీముర్షీదాబాద్ జిల్లా బరహంపూర్ నుంచి కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ పోటీపోస్టల్ బ్యాలెట్లో వెనుకంజలో కాంగ్రెస్ సీనియర్ నేత వెనకంజలో మమతా బెనర్జీదీదీకి పోస్టల్ బ్యాలెట్లో షాక్వెనకంజలో కొనసాగుతున్న టీఎంసీ అధినేత్రిఅధికారి సువేందు ముందంజఆసక్తికరంగా భవానీపూర్ పోరుఇటు.. నందిగ్రాంలోనూ ఆధిక్యంలో సువేందుఆధిక్యంలోకి సువేందుభవానీపూర్లో ఆసక్తికరంగా పోరుతొలుత మమతా బెనర్జీకి ఆధిక్యంకాసేపటికే లీడ్లోకి వచ్చిన బీజేపీ అధికారి సువేందుఆధిక్యంలో కొనసాగుతున్న బీజేపీ అగ్రనేతలు బెంగాల్లో హోరాహోరీపోస్టల్ బ్యాలెట్లో టీఎంసీ ముందంజస్వల్పంగా వెనకబడిన బీజేపీ106 స్థానాల్లో టీఎంసీ, 100 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలీడ్ ఖాతా తెరవని కాంగ్రెస్, లెప్ట్ పార్టీమరికాసేపట్లో ముగియనున్న పోస్టల్ బ్యాలెట్ఆధిక్యంలో మమతా బెనర్జీభవానీపూర్లో సీఎం మమతా బెనర్జీ ఆధిక్యంవెనుకబడిపోయిన బీజేపీ రాష్ట్ర చీఫ్ అధికారి సువేందుగత ఎన్నికల్లో ఇక్కడే దీదీని ఓడించిన సువేందుబీజేపీ అగ్రనేతల ముందంజబెంగాల్ ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలుపోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో బీజేపీ అగ్రనేతల ముందంజబీజేపీ శ్రేణుల్లో సంబురాలు! పోస్టల్ బ్యాలెట్లో.. ఆసక్తికరంగా పోస్టల్ బ్యాలెట్టీఎంసీ-బీజేపీ హోరాహోరీమరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈవీఎం ఓట్ల లెక్కింపుమూడంచెల భద్రత నడుమ.. బెంగాల్ వ్యాప్తంగా మొదలైన ఓట్ల కౌంటింగ్ భద్రం కోసం మూడంచెల వ్యవస్థప్రశాంతంగా కౌటింగ్ ప్రారంభమైందన్న సిలిగురి కమిషనర్ సయ్యద్ వాకార్ రజా తనిఖీలు ముమ్మరంగా జరుగున్నాయని.. శాంతియుతంగా కౌంటింగ్ కొనసాగేలా చేస్తామని వ్యాఖ్య #WATCH | Siliguri, West Bengal | On the counting of votes, Siliguri Commissioner of Police (CP) Syed Waqar Raza says, "Everything will be done peacefully. All things are in proper order. Frisking is being done here, and there is a 3-tier security system, and we hope that… pic.twitter.com/4fiRZU0kE8— ANI (@ANI) May 4, 2026 ఆ స్థానంలో ఏం జరగనుందో?బెంగాల్లో హాట్ సీట్గా భవానీపూర్మమతా బెనర్జీ వర్సెస్ అధికారి సువేందుగత ఎన్నికల్లో గురువు మమతను ఓడించిన బీజేపీ సువేందుఈసారి తనదే గెలుపని సువేందు ధీమాప్రారంభమైన కౌంటింగ్పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైన కౌంటింగ్తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపుమమతా బెనర్జీ సంచలన ఆరోపణలుబెంగాల్ కౌంటింగ్ వేళ మమతా బెనర్జీ సంచలన ఆరోపణలుపలు ప్రాంతాల్లో కరెంట్ కట్ చేస్తున్నారని, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీటీవీలు పని చేయడం లేదన్న దీదీస్ట్రాంగ్ రూమ్ల వద్దకు పలు వాహనాలు వచ్చి వెళ్లాయని ఆరోపణఈ చర్యల వెనుక బీజేపీ ఉందని మమతా బెనర్జీ వ్యాఖ్య అప్రమత్తంగా ఉండాలని టీఎంసీ శ్రేణులకు పిలుపుఅనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచనమమత సూచనలతో రాత్రంతా స్ట్రాంగ్ రూమ్ల వద్దే పడిగాపులు కాసిన టీఎంసీ శ్రేణులుఅందరి చూపు బెంగాల్ వైపు.. కాసేపట్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంఅందరి చూపు పశ్చిమ బెంగాల్ వైపుటీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నాలుగోసారి సీఎం అవుతారా?దీదీ విజయపరంపరకు, ఆధిపత్యానికి బీజేపీ చెక్ పెడుతుందా?ఎస్ఐఆర్(ఓట్ల తొలగింపు ప్రక్రియ) నేపథ్యంలో ఆసక్తికరం కానున్న ఫలితాలుజాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసే ఫలితం కావడంతో ఉత్కంఠకౌంటింగ్ కోసం ఈసీ.. బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ కోసం ఈసీ భారీ ఏర్పాటుభారీగా నమోదైన పోలింగ్ శాతం77 ఓటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్75 వేల మంది భద్రతా సిబ్బందిఫాల్తాలో ఈ నెల 21న రీపోలింగ్.. 24 కౌంటింగ్మిగిలిన 293 స్థానాలకు ఇవాళ జరగనున్న కౌంటింగ్ -
దీదీ నాలుగోసారి సీఎం అవుతారా?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో కౌంటింగ్ షురూ కానుంది. మొత్తం 294 స్థానాలు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో అధికారం కైవసం చేసుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148. ఒక్క ఫాల్తా తప్ప అన్ని ఫలితాలు ఇవాళ వెలువడతాయి. ఆ నియోజకవర్గంలో 24న ఉప ఎన్నిక జరగనుంది. మిగిలిన 293 స్థానాల ఓట్ల కౌంటింగ్ కోసం 77 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బెంగాల్ ఫలితాలను అటు ఢిల్లీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నుడూలేని విధంగా ఈసారి భారీగా పోలింగ్ నమోదు కావడం ఇందుకు మరో కారణం. టీఎంసీ, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. నాలుగోసారి మమతా బెనర్జీ సీఎం అవుతారా?.. బెంగాల్లో మమతకు బీజేపీ చెక్ పెడుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తర్వాత ఈవీఎంలను లెక్కించనున్నారు. రెండు గంటల తర్వాత ట్రెండ్స్ వెలువడే చాన్స్ ఉంది. మరోవైపు కౌంటింగ్ హాల్లో సెల్ఫోన్లు నిషేధించారు. కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎస్ఐఆర్ తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా భవానీపూర్లో మమత వర్సెస్ అధికారి సువేందు మధ్య టఫ్ వార్ తప్పదనే అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా.. బెంగాల్ ఫలితాలు జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. కొద్ది గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెర పడనుంది. -
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, 9 మంది మృతి
ఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు జరిగిన ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. వివేక్ విహార్లోని భవనంలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇప్పటివరకు 12 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మంటల్లో చిక్కుకున్నవారి కోసం రెస్క్యూ కొనసాగుతోంది. ఏసీ పేలడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భవనంలో అపార్ట్మెంట్ వాసులు చిక్కుకుపోయారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న రెండో అంతస్తు నుండి మృతదేహాలను వెలికితీశారు. 2,3,4వ అంతస్తుల్లోని ఫ్లాట్లలో మంటలు వ్యాపించాయి. స్వల్ప గాయాలైన ఇద్దరిని చికిత్స నిమిత్తం గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో 12 ఫైర్ ఇంజన్లు, డీడీఎంఏ సిబ్బంది, ట్రాఫిక్ అధికారులు, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర బృందాలు అక్కడికి చేరుకున్నారు. స్థానిక మునిసిపల్ కౌన్సిలర్ పంకజ్ లూత్రా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సమాచారం అందగానే నేను అక్కడికి వెళ్లాను. రెండో అంతస్తు వెనుక భాగంలో ఐదు మృతదేహాలు, మరో మృతదేహం వెనుక వైపు, పై అంతస్తులో మూడు మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. డీఎన్ఏ పరీక్షలు చేస్తే తప్ప బాధితుల వివరాలు తెలియవు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని కొందరు అంటున్నారు, కానీ అధికారికంగా నిర్ధారణ కాలేదని తెలిపారు. -
బీమాలో ఆటోమేటిగ్గా 100% ఎఫ్డీఐలు
న్యూఢిల్లీ: బీమా రంగంలోకి ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతించడానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం బ్రోకింగ్ సంస్థలు సహా ఇంటర్మీడియరీలు, బీమా కంపెనీల్లోకి 100 శాతం ఎఫ్డీఐలకు అనుమతి ఉంటుంది. అయితే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో (ఎల్ఐసీ) మాత్రం 20 శాతం పరిమితి అమలవుతుంది. ఈ మేరకు ఫారిన్ ఎక్చ్సేంజ్ మేనేజ్మెంట్ (ఫెమా) 2026 నిబంధనలను సవరించారు. బీమా రంగంలో ఆటోమేటిక్ మార్గంలో ఎఫ్డీఐలను 74 శాతం నుంచి 100 శాతానికి పెంచడానికి సంబంధించిన సబ్కా బీమా సబ్కీ రక్షా బిల్లు 2025ని 2025 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించింది. ఆ తర్వాత 2026 ఫిబ్రవరిలో కేంద్ర వాణిజ్య శాఖలో భాగమైన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) దీన్ని నోటిఫై చేసింది. మరోవైపు, 10 శాతం వరకు చైనా వాటాలున్న విదేశీ కంపెనీలు భారత్లో ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెట్టేందుకు వెసులుబాటు కల్పిస్తూ కూడా ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం చైనా/హాంకాంగ్ పెట్టుబడులు 10 శాతం వరకు ఉన్న విదేశీ కంపెనీలు, భారత్లో ఎఫ్డీఐలకు అనుమతి ఉన్న రంగాల్లో, ఆటోమేటిక్ మార్గంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే, చైనా, హాంకాంగ్లతో పాటు భారత్తో సరిహద్దులు పంచుకుంటున్న దేశాల్లో రిజిస్టరయిన సంస్థలకు మాత్రం ఇది వర్తించదు. ఇప్పటివరకు కనీసం చైనా వాటా ఒక్క శాతం ఉన్నా భారత్లో ఇన్వెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటోంది. 2000 నుంచి 2025 డిసెంబర్ వరకు భారత్లోకి వచ్చిన మొత్తం ఎఫ్డీఐల్లో 0.32 శాతం వాటాతో (2.51 బిలియన్ డాలర్లు) చైనా 23వ స్థానంలో ఉంది. -
30 ఏళ్ల జడ్జి.. భార్యతో గొడవపడి బలవన్మరణం?
ఢిల్లీ: ‘నాన్నా బ్రతకడం కష్టంగా ఉంది. నేను ఇబ్బందుల్లో ఉన్నాను’ అని తండ్రికి ఫోన్ చేసిన ఓ 30 ఏళ్ల జ్యుడిషియల్ ఆఫీసర్.. ఆ మరుసటి రోజే శవమై పోయాడు. ఎంతటి కష్టమొచ్చిందో తెలియదు కానీ తన ఇబ్బందిని పూర్తిగా తండ్రికీ చెప్పుకోలేక, ఇటు భార్యతోనూ పూర్తిగా ఇమడలేక తనువు చాలించాడు. తాను ఇబ్బందుల్లో ఉన్నానని, బ్రతకడం చాలా కష్టంగా అనిపిస్తుందని తండ్రితో అన్నాడే కానీ, విషయం మాత్రం చెప్పలేదు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు ఆ న్యాయాధికారి దక్షిణ ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన అనుమానిత ఆత్మహత్య క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. అమాన్ శర్మ.. ఉత్తర ఢిల్లీలోని కర్కర్దూమాలో డీఎల్ఎస్ఏ(డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ) సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అయితే శనివారం ఆ అధికారి కాస్తా తన గ్రీన్ పార్క్ ఇంట్లో విగతజీవిగా మారిపోయాడు. తన బావ అమాన్ శర్మ.. బాత్రూమ్లో సూసైడ్ చేసుకున్నాడని బావమరిది పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో విషయం బయటకొచ్చింది. చనిపోయే ముందు భార్యతో గొడవ.. కన్నీళ్లుఅతను చనిపోయే ముందు భార్యతో గొడవ పడినట్లు స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల వారు తెలిపిన సమాచారం ప్రకారం.. అతను చనిపోవడానికి కొన్ని గంటల ముందు భార్యతో గొడవ పడి విపరీతంగా ఏడ్చేశాడని పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య ఏం గొడవ జరిగిందో తెలీదు కానీ ఇద్దరు విపరీతంగా అరుచుకున్నారన్నారు. నాకు ఫోన్ చేసి ఇబ్బంది ఉందన్నాడు..తన కొడుకు చనిపోవడానికి ముందు రాత్రి ఫోన్ చేసి మాట్లాడాడని, తాను చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా తెలిసింది. ‘ నేను తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా.. “నాకు జీవించడం కష్టంగా మారింది’ అని తండ్రి స్సష్టం చేశారు. అనుమానిత ఆత్మహత్యగా కేసు నమోదుఇది ఆత్మహత్యగా కనిపిస్తోంది, మేము వచ్చేసరికి ఉరి వేసుకుని వేలాడతున్నాడు.. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు గుర్తించలేదు, అనుమానిత ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్నాం. అన్ని కోణాల్లో విచారణ చేపట్టాం’ అని పోలీసులు తెలిపారు. -
బీజేపీలో చేరినా.. అరెస్ట్ తప్పదా?
రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను పావుగా వాడుకుంటోందని కేంద్రంలోని బీజేపీపై తీవ్ర విమర్శ ఒకటి ఉంది. ఈ క్రమంలోనే ఈడీ, సీబీఐ, ఐటీ రైడ్లను బూచిగా చూపించి ప్రతిపక్ష నేతలను లొంగదీసుకుంటోందని ప్రతిపక్షాలు తిట్టిపోస్తుంటాయి. తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీ ఇదే తరహాలో తమ గూటికి చేర్చుకుందనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ.. అయితే ఈ జంపింగ్ ఎపిసోడ్లో ఇప్పుడు ఇంకో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆప్ (AAP) నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సందీప్ పాఠక్ అరెస్టు అయ్యే చాన్స్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార నివాసం నుంచి ఆయన గుట్టుచప్పుడు కాకుండా జారుకున్నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. ఆయన వెనుక ద్వారం నుంచి కారులో బయటకు వెళ్లిపోయినట్లు ఉంది. ప్రస్తుతం ఆయన ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని ఓ జాతీయ మీడియా కథనం ఇచ్చింది. పంజాబ్లో ఆయనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. అందుకు ఒకటి అవినీతి సంబంధితమైంది కాగా, మరొకటి మహిళా వేధింపుల కేసుగా తెలుస్తోంది. ఇవి నాన్బెయిలబుల్ కేసులుగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. కాగా బీజేపీ లీగల్ సెల్ ఆయనకు సహాయం అందించేందుకు రంగంలోకి దిగింది.ఆప్ నుంచి బీజేపీలో చేరిన వెంటనే సందీప్పై ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. పంజాబ్ ఆప్ ప్రభుత్వం ప్రతీకారం పేరిట చిల్లర రాజకీయాలు చేస్తోందని బీజేపీ, అకాళీదళ్ విమర్శిస్తుండగా.. అంతా పద్ధతి ప్రకారమే జరుగుతోందని ప్రభుత్వం ఆ విమర్శలను తిప్పికొట్టింది.గత నెలలో ఆప్ రాజ్యసభ సభ్యులలో ఏడుగురు ఒకేసారి పార్టీని వీడి బీజేపీలో చేరారు. రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, స్వాతి మాలివాల్, విక్రమ్జిత్ సహ్నే ఈ లిస్ట్లో ఉన్నారు. మాలివాల్(ఢిల్లీ) తప్ప మిగతా ఆరుగురు పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అయితే.. పార్టీ మారిన వాళ్ల సంఖ్య 2/3 వంతు కావడంతో వీళ్లపై ఫిరాయింపుల యాంటీ-డిఫెక్షన్ చట్టం (Tenth Schedule) వర్తించబోదని.. అనర్హత వేటు పడకపోవచ్చనే నిపుణులు చెబుతున్నారు.కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదివిన సందీప్ పాఠక్.. ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్గా పని చేశారు. ఆప్ పార్టీలో ఆరంభం నుంచి క్రియాశీలకంగా పని చేశారు. గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయంలో ఈయన వ్యూహాలే కీలకమయ్యాయి. అదే ఏడాది ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అయితే ఆప్ తన ఆత్మను కోల్పోయిందని ఆరోపిస్తూ.. ఇటీవలె బీజేపీలో చేరారు. -
సుప్రీం కోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేంద్ర ఉద్యోగులను నియమించడంపై అభ్యంతరాలతో ఆ పార్టీ వేసిన పిటిషన్ను శనివారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. మైక్రో అబ్జర్వర్లు ఎంపిక విషయంలో కేంద్రం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా కోర్టు పూర్తిగా సమర్థించింది. ‘‘రాష్ట్రమైనా.. కేంద్రమైనా.. ప్రభుత్వ ఉద్యోగులు వారి విధుల్లో భాగంగానే పని చేస్తారు. వారికి ఎలాంటి విధేయతలు ఉండవు. మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండడంలో తప్పేముంది?. ఆ ఎంపికలో పూర్తి అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. సిబ్బంది నియామకంపై రాజకీయ పార్టీలను ఈసీ సంప్రదించాల్సిన అవసరం లేదు. ఈ వ్యవహారంలో రాజకీయం చేయడం తగదు’’ అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా ఉన్న రాష్ట్ర ఉద్యోగులను తప్పించి ఆ స్థానంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమించారంటూ ఈసీపై టీఎంసీ ఆరోపణలకు దిగింది. అయితే ఈసీ ఆ ఆరోపణల్ని తోసిపుచ్చింది. కేంద్ర ఉద్యోగులతో పాటు రాష్ట్ర ఉద్యోగులు కూడా కొనసాగుతారని స్పష్టం చేసింది. అయినప్పటికీ టీఎంసీ పార్టీ శుక్రవారం కోల్కతా హైకోర్టులో ఓ పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. అయితే ఇక్కడ కూడా మమతా బెనర్జీకి బిగ్ షాకే తగిలింది. ఈ విషయంలో ఈసీకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని.. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమంటు సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.పశ్చిమ బెంగాల్లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. మునుపెన్నడూ లేని స్థాయిలో పోలింగ్ శాతం నమోదుకాగా.. కనీవినీ ఎరుగని రీతిలో ఒక్క హింసాత్మక ఘటన కూడా చోటు చేసుకోలేదు. అయితే రెండో విడత పోలింగ్ తర్వాత అధికార టీఎంసీ సంచలన ఆరోపణలకు దిగింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ధర్నాకు దిగింది. అయితే ఆ ఆరోపణల్ని ఈసీ ఖండించింది. మే 4వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. రేపే పలు బూత్లలో రీపోలింగ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అతి పెద్ద జిల్లా దక్షిణ 24 పరగణాలకు చెందిన పలు బూత్లలో రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. కమలం గుర్తు కనిపించకుండా ఈవీఎంలకు ట్యాప్ అతికించారంటూ బీజేపీ ఫిర్యాదు చేసింది. దీంతో పాటు అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సౌత్ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్, మగ్రాహట్ పశ్చిమ్ నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో శనివారం (మే 2, 2026) తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మగ్రాహట్ పశ్చిమ్లోని 11 పోలింగ్ కేంద్రాలు, డైమండ్ హార్బర్లోని 4 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ఉత్తర్వులో పేర్కొంది.142 మగ్రాహట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, 143 డైమండ్ హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 ఏప్రిల్ 2026న జరిగిన పోలింగ్కు సంబంధించి రిటర్నింగ్ అధికారులు,పరిశీలకుల నివేదికల ఆధారంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 58(2) ప్రకారం ఆ రోజు జరిగిన పోలింగ్ చెల్లదని కమిషన్ ప్రకటించింది.అందుకు అనుగుణంగా మే 2, 2026న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి ఉత్తర్వులో తెలిపారు. పోలింగ్ ప్రాంతంలో డప్పులు కొట్టి విస్తృతంగా ప్రచారం చేయాలని, అలాగే పోటీ అభ్యర్థులకు లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. -
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు భారీ ఊరట లభించింది. అస్సాం సీఎం సతీమణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో శుక్రవారం సుప్రీం కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలని చూస్తున్న అస్సాం పోలీసులకు భంగపాటు కలిగింది. వ్యక్తిగత స్వేచ్ఛ (Article 21)ను తేలికగా ప్రమాదంలో పడేయరాదని ముందస్తు బెయిల్ తీర్పు సందర్భంగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ చందుర్కర్లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఒకవేళ అరెస్ట్ గనుక జరిగితే కచ్చితంగా ఆయన్ని బెయిల్పై విడుదల చేయాలని అస్సాం పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో.. విచారణలో సహకరించాలని, సాక్ష్యాలను ప్రభావితం చేయరాదని, దేశం విడిచి వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని పవన్ ఖేరాకు కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు.. ఈ బెయిల్లో అవసరమైతే అదనపు షరతులు కూడా విధించవచ్చని ట్రయల్ కోర్టుకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వాదనలు ఇలా.. 👉ఖేరా తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మనూ సింఘ్వీ వాదించారు. ‘‘ఇది పరువు నష్టం కేసు మాత్రమే. కస్టడీ విచారణ అవసరం లేదు. అరెస్ట్ అవమానకరం. అలాగే ఈ కేసు అనూహ్యమైంది. సీఎం హిమంత చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.👉అస్సాం పోలీసుల తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. ‘‘పవన్ ఖేరా మీడియా సమావేశంలో చూపించిన పాస్పోర్ట్ పత్రాలు నకిలీ, కల్పితమైనవి. వాటిలో ఉన్న సర్కారీ ముద్రలు, QR కోడ్లు, అధికారిక గుర్తులు ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి విచారణ అవసరం. అందుకు కస్టడీ తప్పనిసరి. ఈ పత్రాల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం కూడా ఉండి ఉండొచ్చు. 👉కోర్టు తీర్పు.. కస్టడీ అవసరం లేదు. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నాం. విచారణకు ఖేరా పోలీసులకు సహకరించాలిముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రింకీ భూయాన్ శర్మపై పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఆమెకు 3 దేశాల పాస్పోర్టులు ఉన్నాయని, దీంతోపాటు ఆమె ఆస్తులను అఫిడవిట్లో వెల్లడించకుండా దాచి పెట్టారని పలు పత్రాలకు మీడియాకు ప్రదర్శించారాయన. అయితే.. ఈ వ్యవహారంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు. పరువు నష్టం దావాకు వెళ్లడంతో గువాహతి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే అనూహ్యంగా ఆయన తెలంగాణ హైకోర్టులో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ అత్యవసర పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఆయనకు వారంపాటు మధ్యంతర ఊరట ఇస్తూ.. ముందస్తు బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే.. అస్సాం పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఊరటపై సుప్రీం కోర్టు స్టే విధించింది. గువాహతి హైకోర్టు(అస్సాం)లో పిటిషన్ వేయాలని ఖేరాకు సూచించింది. దీంతో ఆయన స్టే తొలగించాలంటూ మరోసారి పిటిషన్ వేయగా.. మరోసారి చుక్కెదురైంది. ఈ తరుణంలో.. పవన్ ఖేరా అరెస్ట్కు రంగం సిద్ధం అవుతోందన్న ప్రచారం ఉధృతంగా సాగింది. ఈలోపు ఆయన గువాహతి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే కోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. దీంతో కచ్చితంగా అరెస్ట్ అవుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టగా.. కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయని ‘యాక్సిస్ మై ఇండియా’
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసిన అనంతరం వివిధ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించాయి. అయితే, ప్రముఖ సంస్థ యాక్సిస్ మై ఇండియా (Axis My India) మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయబోమని ప్రకటించింది. బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ను ఎందుకు విడుదల చేయలేదో చెప్పింది యాక్సిస్ మై ఇండియా.ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. దాదాపు 60-70 శాతం మంది ఓటర్లు సర్వేలో తమ అభిప్రాయాన్ని చెప్పడానికి నిరాకరించారు. ప్రజలు తమ మనసులో ఏముందో వెల్లడించడానికి ఇష్టపడకపోవడంతో మౌనమే ప్రధాన అవరోధంగా మారిందంటూ చెప్పుకొచ్చారు. ఎందుకో బెంగాల్ ఓటర్లు మాత్రం గుంబనంగా ఉన్నారని తెలిపారు. కేవలం 20-30 శాతం మంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫలితాలను అంచనా వేయడం శాస్త్రీయంగా సరైనది కాదని.. అది సరైన ఫలితాన్ని ప్రతిబింబించదని సంస్థ భావించిందని ఆయన పేర్కొన్నారు.పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్పై బీజేపీ స్పల్ప ఆధిక్యత సాధిస్తుందని మాట్రిజ్, పి–మార్క్ ఫలితాలు తెలియజేశాయి. టీఎంసీకి 125–140 స్థానాలు వస్తాయని, బీజేపీకి 146–161 స్థానాలు లభిస్తాయని మాట్రిజ్ వెల్లడించింది. పి–మార్క్ అంచనా ప్రకారం బీజేపీకి 150–174 సీట్లు, టీఎంసీకి 118–138 సీట్లు లభిస్తాయి. బీజేపీకి 142–171, టీఎంసీకి 99–127 సీట్లు లభించేందుకు ఆస్కారం ఉన్నట్లు ‘పోల్ డైరీ’ఎగ్జిట్ పోల్ తేల్చింది.తృణమూల్ కాంగ్రెస్ తన సంక్షేమ పథకాలు మరియు సంస్థాగత బలంతో బీజేపీ సవాల్ను తట్టుకుంటుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మరికొన్ని సర్వేలు బీజేపీ భారీ విజయంతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంచనా వేస్తున్నాయి. లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ కూటమి ఈసారి కూడా ఒక అంకె (సింగిల్ డిజిట్) స్థానాలకే పరిమితం కావచ్చని మెజారిటీ పోల్స్ అభిప్రాయపడ్డాయి. యాక్సిస్ మై ఇండియా వంటి అనుభవజ్ఞులైన సంస్థ కూడా అంచనా వేయలేకపోయిందంటే.. బెంగాల్ ఓటరు తీర్పు ఎంత ఉత్కంఠభరితంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. -
కవిత టీఆర్ఎస్కు ఈసీ ఆమోదం.. ఇక్కడే ఓ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో పార్టీకి లైన్ క్లియర్ అయ్యింది. కల్వకుంట్ల కవిత స్థాపించిన టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అయితే ఈ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె కోరుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర సేనకు ఈసీ గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కవిత కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్లో తెలంగాణ ఆత్మ లోపించిందని.. అందుకే తాను కొత్త పార్టీ పెట్టానని ఆమె ఆవిర్భావ సభలో వ్యాఖ్యానించారు. అయితే.. ఆ ప్రకటన తర్వాత పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఒరిజినల్.. ఒరిజినలేనంటూ బీఆర్ఎస్ పార్టీ సెటైర్లు వేసింది. అదే సమయంలో ఆమె పార్టీ పేరుపై ఈసీకి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ క్రమంలో ఆ అభ్యంతరాలను పరిశీలించిన ఈసీ ఓ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు మీద కాకుండా.. తెలంగాణ రక్షణ సేన పేరుతో కవిత పార్టీకి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం బంజారాహిల్స్లోని కవిత నివాసానికి వెళ్లిన అధికారులు సంబంధిత లేఖను అందజేసినట్లు సమాచారం. -
ఆ చట్టాన్ని సవరించండి
న్యూఢిల్లీ: అత్యాచార బాధిత బాలికల గర్భవిచ్ఛిత్తికి సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మైనర్ను గర్భాన్ని మోయాలంటూ బలవంతం చేయజాలమని పేర్కొన్న అత్యున్నత న్యాయస్థానం.. బాధిత మైనర్ తన అవాంఛిత గర్భాన్ని 20 వారాలు దాటిన తర్వాత సైతం తొలగించుకునేందుకు అనుమతించేలా చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరింది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం గురువారం వెలువరించిన ఈ నిర్ణయం అత్యాచార బాధితులు, ముఖ్యంగా చిన్నారుల ప్రాథమిక హక్కుల విషయంలో ఒక మైలురాయిగా మారనుంది. 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి 30 వారాల గర్భాన్ని తొలగించాలంటూ ఏప్రిల్ 24వ తేదీన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం ఎయిమ్స్ను ఆదేశించడం తెల్సిందే. దీనిపై ఎయిమ్స్ వేసిన క్యూరేటివ్ పిటిషన్పై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. గర్భవిచ్ఛిత్తికి సంబంధించిన ఉత్తర్వులను రద్దు చేయాలన్న ఎయిమ్స్ వినతిపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిణామం చెందేలా చట్టాలు ఉండాలి. అత్యాచారం వంటి కారణాలతో గర్భం దాల్చినప్పుడు, దాన్ని తొలగించుకునేందుకు సమయ పరిమితి విధించడం సరికాదు. ఆ మేరకు చట్ట సవరణ చేయండి. ఇటువంటి కేసుల విచారణను వారంలోపే పూర్తి చేసేలా మార్పులు చేపట్టండి. విచారణ ఆలస్యంతో కలిగే మానసిక వేదనను ఆ చిన్నారి ఎందుకు అనుభవించాలి?’అని సీజేఐ ప్రశ్నించారు. ఎయిమ్స్ వాదనను ఖండించిన ధర్మాసనం ఇది చిన్నారికి, లోపలున్న పిండానికి సంబంధించిన సమస్య కాదని, చిన్నారికి మరో చిన్నారికి సంబంధించిన అంశమని ఎయిమ్స్ తరఫున సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు. ‘ఇప్పటికే 30 వారాలు గడిచాయి కాబట్టి, గర్భస్థ శిశువు స్వతంత్రంగా జీవించగలిగే స్థితిలో ఉన్న ప్రాణం. ఒకవేళ ఇప్పుడు గర్భస్రావం చేస్తే, అది తీవ్ర వైకల్యాలతో కూడిన సజీవ శిశువు అవుతుంది. మరోవైపు, మైనర్ అయిన ఆ తల్లి జీవితాంతం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఆమె తిరిగి గర్భం దాల్చే అవకాశాన్ని కూడా కోల్పోవచ్చు’అని భాటి వివరించారు. స్పందించిన ధర్మాసనం..‘అన్ని వివరాలను బాలిక తల్లిదండ్రులకు చూపించండి. వారు ఆ గర్భాన్ని ఉంచుకోవాలని నిర్ణయించుకుంటే, అలాగే కానివ్వండి. ఆ చిన్నారి మానసిక ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని వారు భావిస్తే, నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఇవ్వండి. వారే క్యూరేటివ్ పిటిషన్ వేయాలి. ఒక సైకియాట్రిస్ట్ను, కౌన్సెలర్ను వారితో మాట్లాడించండి. అంతిమ నిర్ణయం వారిదే కావాలి’అని ధర్మాసనం స్పష్టం చేసింది. పౌరుల తరపున నిర్ణయాలు తీసుకోవడం ఎయిమ్స్ పని కాదని, వారు కేవలం వైద్య సేవలు మాత్రమే అందించాలని తేల్చిచెప్పింది. స్కూలుకెళ్లే వయస్సు.. ‘ఇది చిన్నారిపై జరిగిన అత్యాచార ఉదంతం. గర్భ విచ్ఛిత్తికి అనుమతి ఇవ్వకపోతే, ఆ బాధితురాలి మనసుపై జీవితాంతం ఒక చెరగని మచ్చగా మిగిలిపోతుంది. ఆ చిన్నారికి ఎటువంటి శాశ్వత శారీరక వైకల్యం కలగనంత వరకు, గర్భస్రావం చేపట్టాల్సిందే. ఇష్టం లేని గర్భాన్ని బలవంతంగా రుద్దకూడదు. ఆమె ఒక చిన్నపిల్ల. స్కూలుకెళ్లి చదువుకోవాల్సిన వయస్సులో మనం ఆమెను తల్లిని చేయాలనుకుంటున్నాం. ఈ క్రమంలో ఆ చిన్నారి అనుభవిస్తున్న బాధను, అవమానాన్ని ఒక్కసారి ఊహించండి’అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. -
బెంగాల్లో హోరాహోరి!
న్యూఢిల్లీ: పార్టీల పోటాపోటీ ప్రచారంతో హోరెత్తిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్పోల్స్ ఫలితాలు కూడా ఒకట్రెండు సంచలన అంచనాలతో హోరెత్తాయి.పశ్చిమ బెంగాల్లో తుది విడత పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసిన వెంటనే ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ప్రకటించాయి. కీలక రాష్ట్రమైన బెంగాల్లో ఈసారి మమతా బెనర్జీ పార్టీకి పరాజయం తప్పదని కొన్ని సంస్థలు వెల్లడించగా, ఆమె వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావడం తథ్యమని మరికొన్ని సంస్థలు అంచనా వేశాయి. మరో పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో అధికార డీఎంకే కూటమి స్పష్టమైన మెజార్టీతో మళ్లీ జయకేతనం ఎగురవేయనున్నట్లు అత్యధిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) మూడో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇక్కడ అన్నాడీఎంకే కూటమి రెండో స్థానంలో నిలుస్తుందని వెల్లడించాయి. అయితే విజయ్ మరో ఎంజీఆర్గా అవతరించబోతున్నారని యాక్సిస్ మై ఇండియా సంస్థ ప్రకటించడం గమనార్హం. టీవీకే పార్టీ 35 శాతం ఓట్లతో 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అతిపెద్ద పార్టీగా నిలవబోతోందని ఆ సంస్థ తేల్చిచెప్పింది. అస్సాంలో ఎన్డీయే మరోసారి నెగ్గడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టంచేశాయి. కమ్యూనిస్టుల అడ్డా అయిన కేరళలో ఈసారి వారికి పరాభవం తప్పదని, పినరయి విజయన్ గద్దె దిగబోతున్నట్లు పేర్కొన్నాయి. రాష్ట్రంలో వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ ఓడిపోతుందని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే సూచనలున్నాయని వెల్లడించాయి. కేరళ ప్రజలు మార్పునకు అనుకూలంగా ఓటు వేశారని తెలిపాయి. పుదుచ్చేరిలో ఎన్డీయేకు మళ్లీ స్పష్టమైన విజయావకాశాలు ఉన్నట్లు అభిప్రాయపడ్డాయి. టీఎంసీపై బీజేపీకి స్వల్ప ఆధిక్యం పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్పై బీజేపీ స్పల్ప ఆధిక్యత సాధిస్తుందని మాట్రిజ్, పి–మార్క్ ఫలితాలు తెలియజేశాయి. టీఎంసీకి 125–140 స్థానాలు వస్తాయని, బీజేపీకి 146–161 స్థానాలు లభిస్తాయని మాట్రిజ్ వెల్లడించింది. పి–మార్క్ అంచనా ప్రకారం బీజేపీకి 150–174 సీట్లు, టీఎంసీకి 118–138 సీట్లు లభిస్తాయి. బీజేపీకి 142–171, టీఎంసీకి 99–127 సీట్లు లభించేందుకు ఆస్కారం ఉన్నట్లు ‘పోల్ డైరీ’ఎగ్జిట్ పోల్ తేల్చింది. అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సందర్భాలు గతంలో ఉన్నాయి. వాస్తవమైన ఫలితాలను అంచనా వేయడంలో అవి విఫలమయ్యాయి. -
పెట్రోల్ ధర రూ.10, డీజిల్ ధర రూ.12.50 పెరిగిందా?
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిందనే కథనాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే, ఆ కథనాల్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఖండించింది. దేశంలో ఇంధన ధరలు పెరగలేదని, స్థిరంగా ఉన్నట్లు పేర్కొంది.కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పెట్రోల్ ధరలను రూ.10, డీజిల్ ధరలను రూ.12.50 పెంచినట్లు సోషల్ మీడియా పోస్టులు వైరల్గా మారాయి. ఇంధన ధరల పెంపుపై వస్తున్న వదంతులను భారత ప్రభుత్వం బుధవారం ఖండించింది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన అధికారిక ఉత్తర్వు అంటూ ప్రచారంలో ఉన్న ఓ పత్రాన్ని ట్వీట్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో షేర్ చేసింది. ఆ పత్రం ‘నకిలీ’దని ప్రకటించింది. వదంతులను నమ్మొద్దని కోరింది. ఇంధన ధరలు పెరిగాయంటూ సర్క్యూలేట్ అవుతున్న పత్రాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ చెక్ చేసింది. అది ఫేక్ న్యూస్ అని తేల్చింది. భారత ప్రభుత్వం అటువంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదు’అని పేర్కొంది.🚨FAKE NEWS!An order circulating on social media claims to be issued by the Ministry of Petroleum and Natural Gas, stating that petrol and diesel prices have been increased by ₹10 and ₹12.50, respectively.#PIBFactCheck:❌ This order is #FAKE .✅ The Government of India… pic.twitter.com/tMmJa0Y4qA— PIB Fact Check (@PIBFactCheck) April 29, 2026 -
బెంగాల్ పోలింగ్: టేపుతో ఈవీఎంల ట్యాంపరింగ్?
పశ్చిమ బెంగాల్ ఎన్నికల తుది విడత పోలింగ్ వేళ.. అధికార, ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలకు దిగాయి. కేంద్ర బలగాల సాయంతో బీజేపీ రిగ్గింగ్కు పాల్పడుతోందని, ఎన్నికల పరిశీలకులు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే ఓడిపోతున్నాననే భయంతో ఆమె అలా మాట్లాడుతున్నారని.. రౌడీయిజంతో ఆ పార్టీనే ఓటర్లను భయపెడుతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగానే..పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై గుర్తులకు టేప్ అంటించి ఉండడం కలకలం రేపింది. పలు నియోజకవర్గాల్లో అధికార పక్షం తమ కమలం గుర్తును దాచేసి ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. సౌత్ 24 పరగణాలోని పోలింగ్ బూత్ల్లో.. అదీ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పట్టున చోట ఇది ఎక్కువగా జరిగిందని అంటోంది.ఇంతకాలంగా మమతా బెనర్జీని రక్షిస్తున్న డైమండ్ హార్బర్ మోడల్ ఇదేనా? అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది. అభిషేక్ బెనర్జీ కూడా ఈ మోడల్తోనే లోక్సభ ఎన్నికల్లో నెగ్గారా? అంటూ బీజేపీ జాతీయ ఐటీ సెల్ ఇంచార్జి అమిత్ మాలవీయా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు.ఫల్తా నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూత్లలో బీజేపీ గుర్తు ఉన్న బటన్ను టేప్తో కప్పి, ఓటర్లు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. ఈ విధానాన్ని వారు “డైమండ్ హార్బర్ మోడల్” అని పిలుస్తున్నారు. ఇది మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గతంలో గెలుపు కోసం ఉపయోగించిన టెంప్లేట్ అయి ఉండొచ్చు. మమతా బెనర్జీ తన క్రిమినల్ కేసులున్న టీఎంసీ అభ్యర్థి జెహంగీర్ ఖాన్కు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ మోడల్ను రక్షిస్తున్నారు అని మాలవీయా విమర్శించారాయన. అదే సమయంలో పలు చోట్ల తమ గుర్తును కూడా టేపుతో దాచేశారని సీపీఎం ఆరోపిస్తోంది. ఈ సంచలన ఆరోపణల నడుమ.. ఆ వీడియో వైరల్ అవుతోంది.అయితే టీఎంసీ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. బీజేపీ తప్పుడు ప్రచారానికి దిగిందని అంటోంది. మాలవీయా సోషల్ మీడియాలో పోస్టులు చేసే బదులు తమ బాసుల దృష్టికి విషయం తీసుకెళ్తే సరిపోతుంది కదా.. అప్పుడు వాళ్లు ఈసీని ప్రయోగించి చేయాల్సింది చేస్తారు అని ఎద్దేవా చేస్తోంది. మరోవైపు.. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. దర్యాప్తులో వాస్తవమని తేలితే రీపోలింగ్ అంశం పరిశీలిస్తామని చెబుతోంది. This is what Mamata Banerjee was defending when she spoke up for Jehangir Khan, a criminal contesting on a TMC ticket from Falta in Diamond Harbour.In several polling booths, the option to vote for the BJP has been blocked using a tape, effectively preventing voters from… pic.twitter.com/sKw3mcdA86— Amit Malviya (@amitmalviya) April 29, 2026 -
ఇంధన కొరతపై ఎన్హెచ్ఆర్సీలో కేసు నమోదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత నెలకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అందిన ఫిర్యాదు మేరకు జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసింది. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటం, డీజిల్ కొరత, ఎల్పీజీ సరఫరాలో అంతరాయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. ప్రజల దైనందిన జీవనానికి, వ్యవసాయానికి మూలాధారమైన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత వల్ల అంబులెన్సులు, అత్యవసర వైద్యసేవలు, ప్రజారవాణా, ఆహార సరఫరా వ్యవస్థలకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంధన కొరత సృష్టించడం ప్రాథమిక హక్కులతో పాటు వినియోగదారుల హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. ఈ కృత్రిమ కొరతను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. జిల్లాల వారీగా ఇంధన నిల్వల వివరాలను పారదర్శకంగా వెల్లడించటంతో పాటు అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే బంకులు, ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిల్వల పర్యవేక్షణకు ఆటోమేటిక్ ట్యాంక్ గేజింగ్ (ఏటీజీ) వ్యవస్థ, బంకుల వద్ద స్టాక్ తెలిసేలా పబ్లిక్ డ్యాష్బోర్డ్, ఆన్లైన్ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమీక్షించి ఇంధన సరఫరాను గాడిలో పెట్టాలని ఆయన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. -
బాబు సర్కారు పాపం వల్లే ఏపీలో ఇంధన కృత్రిమ కొరత
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ను వణికిస్తున్న ఇంధన కొరత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ స్వయంకృతాపరాధమేనని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. కమర్షియల్ డీజిల్ను రిటైల్ బంకుల్లో కొనుగోలు చేసేందుకు వీలుగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కమిషనర్ ఇచ్చిన అక్రమ ఆదేశాలే ఈ కృత్రిమ కొరతకు కారణమని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్తో ఎంపీ అవినాష్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో డిమాండ్కు, సప్లైకి మధ్య ఉన్న భారీ వ్యత్యాసంపై కేంద్ర కార్యదర్శితో చర్చించారు. ఏపీలో నెలకొన్న దయనీయ పరిస్థితులను వివరిస్తూ ఆధారాలతో కూడిన ఒక లేఖను ఆయనకు అందజేశారు. కేంద్ర కార్యదర్శితో భేటీ అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఏపీలో డిమాండ్, సప్లైకి మధ్య ఇంత గ్యాప్ ఎందుకు ఉందని, దేశంలో కేవలం ఒక్క ఏపీలోనే ఈ కొరత ఎందుకు ఉందని కేంద్ర కార్యదర్శిని అడగగా... దీనికి కేంద్ర కార్యదర్శి ఇచ్చిన సమాధానాలు విస్మయం కలిగించాయని అనంతరం అవినాష్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా ఆయన తన ఆఫీసు నుంచి దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చారని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అన్ని ఆయిల్ కంపెనీలకు ఒక సర్క్యులర్ రాశారని... కమర్షియల్ డీజిల్, బల్క్ డీజిల్ను సామాన్య ప్రజలు కొనుగోలు చేసే సాధారణ పెట్రోల్ బంకుల్లో (రిటైల్ అవుట్లెట్లలో) అమ్మాలని ఆ సర్క్యులర్లో ఆదేశించారన్న విషయాన్ని కేంద్ర పెట్రోలియం కార్యదర్శి తెలిపారన్నారు. ఇది సివిల్ సప్లైస్ కమిషనర్ ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారో తెలియజేస్తోందని అవినాష్ రెడ్డి విమర్శించారు. బల్క్ బయ్యర్లకు దోచిపెట్టే పన్నాగం బల్క్ డీజిల్ను సాధారణ రిటైల్ బంకుల నుంచి విక్రయించాలంటూ ఏపీ సివిల్ సప్లైస్ కమిషనర్ ఆయిల్ కంపెనీలకు లేఖ రాయడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని వైఎస్ అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు. సాధారణ బంకుల్లో లీటర్ డీజిల్ రూ.98కి లభిస్తుండగా, కమర్షియల్ బల్క్ డీజిల్ ధర రూ.153గా ఉందన్నారు. ఈ వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని బల్క్ కొనుగోలుదారులకు లాభం చేకూర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కుట్రకు తెరతీసిందని ఆరోపించారు. ‘ఒక్కో బల్క్ బయ్యరు రిటైల్ బంకులకు వచ్చి ఐదు వేల నుంచి 10 వేల లీటర్లు తీసుకెళ్తే, ఇక సామాన్య ప్రజలకు డీజిల్ ఎలా దొరుకుతుంది? సామాన్యులు ఇంధనం కొనుగోలు చేసే చోట కమర్షియల్ వారికి అవకాశం ఎలా ఇస్తారు? బల్క్ బయ్యర్స్ కొనుగోలుకు ప్రత్యేక వ్యవస్థ ఉన్నప్పటికీ ఇలాంటి సర్క్యులర్ ఇవ్వడం ముమ్మాటికీ చట్ట వ్యతిరేకమే‘ అని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం చెబుతున్నది ఒకటి.. రాష్ట్రంలో జరుగుతున్నది మరొకటి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా, ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని ఎంపీ అవినాష్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 4,510 ఇంధన కేంద్రాల్లో దాదాపు 70 శాతం పనిచేయడం లేదని, ఎక్కడ చూసినా ’నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇంధనాన్ని రేషనింగ్ పద్ధతిలో ఇస్తున్నారని, కార్లకు 10 నుంచి 15 లీటర్ల డీజిల్, ద్విచక్ర వాహనాలకు రూ.200 విలువైన పెట్రోల్ మాత్రమే పరిమితంగా పోస్తున్నారని అవినాష్ రెడ్డి వివరించారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఇలాంటి కొరత ఏమాత్రం లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు డ్రామాలు.. కేంద్రం మొట్టికాయలు ఈ ఇంధన కొరత సమస్యకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బుకాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అవినాష్ రెడ్డి విమర్శించారు. సమీక్షల పేరుతో ఆయిల్ కంపెనీలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ ఉద్దేశపూర్వకంగా లీకులు ఇస్తూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అయితే, ఈ ఇంధన సంక్షోభానికి ఏపీ ప్రభుత్వమే ప్రధాన కారణమని కేంద్రం కుండబద్దలు కొట్టిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జారీ చేసిన సర్క్యులర్ వల్లే ఈ దుస్థితి తలెత్తిందని, తక్షణమే ఆ సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి ఇప్పటికే లేఖ రాసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. కేవలం ఏపీలో మాత్రమే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ సర్క్యులర్ ద్వారా కమర్షియల్ డీజిల్ను సాధారణ బంకుల్లో కొనుగోలు చేసే అవకాశం కలి్పంచడమే అని అవినాష్ రెడ్డి విమర్శించారు. బ్లాక్ మార్కెట్ మాఫియాతో కుమ్మక్కు.. కళ్లు తెరిచి పరిస్థితిని చక్కదిద్దాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగించాల్సింది పోయి, బ్లాక్ మార్కెట్ మాఫియాతో కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఎంపీ అవినాష్రెడ్డి ఆరోపించారు. డీజిల్ కొరత వల్ల అగ్రి, ఆక్వా, రవాణా సహా అన్ని వర్గాల ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధనం, ఎల్పీజీ సిలిండర్ల అనైతిక హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్ విచ్చలవిడిగా జరుగుతోందని తెలిపారు. కేంద్రం నుంచి తగినంత చమురు సరఫరా ఉన్నప్పటికీ ఏపీలో ఇంధన కొరత ఎందుకు ఉందో విచారణ జరపాలని, పర్యవేక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయాలని ఆయన కేంద్ర కార్యదర్శిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కళ్లు తెరిచి పరిస్థితిని సరిదిద్దాలని, వివాదాస్పద సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన ఫిర్యాదుకు స్పందించిన కేంద్రం.. రెండు మూడు రోజుల్లో ఏపీలో పరిస్థితిని చక్కదిద్దుతామని హామీ ఇచ్చినట్లు అవినాష్ రెడ్డి చెప్పారు. -
ఈశాన్యం ప్రగతికి యాక్ట్ ఈస్ట్, యాక్ట్ ఫాస్ట్
గాంగ్టక్: ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు భారతదేశానికి అష్టలక్ష్ములు అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వ విధానం కేవలం ‘యాక్ట్ ఈస్ట్’మాత్రమే కాదని.. ‘యాక్ట్ ఫాస్ట్’కూడా అని స్పష్టంచేశారు. ఈశాన్య రాష్ట్రాలను శరవేగంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. ప్రధాని మోదీ మంగళవారం ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో పర్యటించారు.రాజధాని గాంగ్టక్లో నిర్వహించిన సిక్కిం రాష్ట్రావతరణ 50వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాలు, అనుసంధానం, ఆరోగ్య సంరక్షణ, విద్య, పట్టణాభివృద్ది, విద్యుత్, పర్యావరణం, పర్యాటకం, వ్యవసాయ రంగాలకు సంబంధించి రూ.4,018 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు స్వర్ణజయంతి మైత్రి మంజరి పార్కులో ఆర్కిడ్ పుష్పాల తోటను సందర్శించారు. ఈశాన్యానికి స్వర్గం సిక్కిం సిక్కిం ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే ప్రధాన ఆధారమని ప్రధానమంత్రి చెప్పారు. రాష్ట్రంలో అనుసంధానాన్ని మెరుగుపరచడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని, దీనివల్ల పర్యాటకుల రాక మరింత పెరుగుతుందని అన్నారు. పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రా నుంచి ఎక్స్ప్రెస్వే నిర్మించడం, పర్యాటకుల రాకపోకలను పెంచడానికి గాంగ్టక్లో రింగ్ రోడ్ నిర్మించడం సహా సిక్కింలో మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. రాష్ట్ర ఆవతరణ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో మోదీ 35 నిమిషాలపాటు ప్రసంగించారు. రాష్ట్రానికి రోప్వే, స్కైవే ప్రాజెక్టులు రానున్నాయని, నాథులాలో ఎక్స్ప్రెస్వే నిర్మించనున్నట్లు తెలిపారు. సిక్కింలో ప్రకృతి, సంస్కృతి సజీవంగా కనిపిస్తాయని అన్నారు.ఇక్కడి రహదారుల పరిశుభ్రత, గాలి స్వచ్ఛత చూస్తే సిక్కిం ప్రజలు ప్రకృతి పరిరక్షణకు నిజమైన ప్రతినిధులు అని తెలుస్తోందంటూ ప్రశంసించారు. సేంద్రియ వ్యవసాయం వంటి కార్యక్రమాల ద్వారా సిక్కిం సహా ఈశాన్య ప్రాంతం భవిష్యత్ వృద్ధికి, సుస్థిరాభివృద్ధికి కేంద్రంగా మారనుందని వెల్లడించారు. సిక్కిం రాష్ట్రం శాంతి, ఆధ్యాత్మికత, శ్రేయస్సులకు నిలయమని కొనియాడారు. హిమాలయ రాష్ట్రాన్ని సందర్శించాలంటూ పర్యాటకులకు పిలుపునిచ్చారు. సహజసిద్ధమైన అందాలు వీక్షించాలని, ఆర్కిడ్ తోటల్లో విహరించాలని సూచించారు. ఇక్కడ పర్యావరణ అనుకూల పర్యాటక రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దాదాపు 1,000 హోమ్స్టేలను నిర్మిస్తున్నారని, సాహస పర్యాటక రంగానికి మౌలిక సదుపాయాల పరంగా కూడా ఊతం లభిస్తోందని వివరించారు. ఈ రాష్ట్రం ‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని చెప్పారు. ఈశాన్యానికి స్వర్గం సిక్కిం అని ఉద్ఘాటించారు. ఫుట్బాల్ ఆడిన మోదీ ప్రధాని మోదీ గాంగ్టక్లో విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సాకర్ సెషన్ చాలా ఉత్తేజపర్చేలా ఉందని అభివరి్ణంచారు. గాంగ్టక్లో ఈ అందమైన ఉదయం వేళ యువ మిత్రులతో కలిసి ఫుట్బాల్ ఆడటం గొప్ప అనుభూతిని ఇచ్చిందని స్పష్టంచేశారు. తనతోపాటు ఫుట్బాల్ ఆడిన విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి మోదీ ఫోటో దిగారు. సిక్కింలో క్రీడా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, ముఖ్యంగా ఫుట్బాల్, ఆర్చరీ రంగాల్లో క్రీడాకారులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోందని తెలిపారు. -
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయా?
సాక్షి,న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచనుందనే ప్రచారం జోరందకుంది. అయితే, ఆ ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఇంధన ధరల్ని పెంచడం లేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరుగుతున్నా, ఇంధన రిటైలర్లు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నా ప్రజల మీద భారం వేయకుండా ధరలను స్థిరంగా ఉంచుతామని తెలిపింది.ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే ఊహాగానాలు కొన్ని రాష్ట్రాల్లో కలకలం రేపాయి. దీనివల్ల అవసరానికి మించి ఇంధన కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇంధన ధరల పెంపుదలపై వస్తున్నవన్నీ ఊహాగానాలే. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన లేదు. వదంతులను నమ్మొద్దు. దేశంలో తగినంత పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ నిల్వలు ఉన్నాయి. ధరలు స్థిరంగా ఉన్నాయి, రేట్లలో ఎలాంటి పెరుగుదల ఉండదు’అని స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు కారణంగా చమురు ధరలు పెరుగుతున్నా.. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల్ని స్థిరంగా ఉంచింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వరంగ చమురు సంస్థలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు ఇంధనాన్ని విక్రయించడం వల్ల భారీ నష్టాల్ని చవిచూస్తున్నాయి. ఫలితంగా పెట్రోల్పై లీటరుకు రూ. 20 వరకు, డీజిల్పై లీటరుకు దాదాపు రూ.100 వరకు నష్టాలు వస్తున్నాయి. రోజువారీ నష్టాలు సుమారు రూ.2,400 కోట్ల వరకు చేరుతున్నాయని కొద్దిరోజుల క్రితం సుజాత శర్మ తెలిపారు. పెరిగిన చమురు ధరలు గత రెండు నెలల్లో అంతర్జాతీయ ముడి చమురు ధరలు 50 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో ఈ పెరుగుదల మరింత తీవ్రంగా మారింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించాయి. ప్రతీకారంగా ఇరాన్ హర్మూజ్జలసంధిని మూసివేసింది. ఫలితంగా గల్ఫ్ దేశాలనుంచి రవాణా అయ్యే చమురు నౌకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత సంవత్సరం బ్యారెల్కు సుమారు 70 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధర, ఈ నెలలో సగటున 114 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా, భారత్లో రిటైల్ ఇంధన ధరలు ఏప్రిల్ 2022 నుండి ఇప్పటివరకు మారలేదు. -
మరో ఇద్దరు ఎంపీల జంప్?.. ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసిన ప్రతిపక్షం
చండీగఢ్: మాకు ఇప్పుడే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చింది అంటూ పంజాబ్ ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) ప్రధాన కార్యదర్శి బిక్రమ్ సింగ్ మజీతియా సోషల్ మీడియాలో ఆప్ కన్వినర్ కేజ్రీవాల్ను ఉద్దేశిస్తూ పోస్టు పెట్టారు. ‘రాష్ట్రంలో మీ పార్టీ పని అయిపోయింది. మొన్న పార్టీ మారిన ఏడుగురే కాదు, మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా పార్టీ మారబోతున్నారు. అలెర్ట్ అవ్వండి’ అని ఆయన పేర్కొన్నారు.అదే సమయంలో మరో ఇద్దరు లోక్సభ సభ్యులు కూడా త్వరలో ఆమ్ ఆద్మీ పార్టీని వీడవచ్చని వర్గాలు సూచిస్తున్నాయి. తరచూ ఆప్ను వీడే నేతల జాబితా పెరుగుతుండగా, మజీతియా ఈ విషయాన్ని కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్లను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రస్తావించారు. అయితే, ఆప్ ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు.గత వారం యువ ఎంపీ రాఘవ్ చద్దా ఆప్ను వీడి బీజేపీలో చేరారు. ఫలితంగా ఆప్ రాజ్యసభలో పార్టీ బలంలో మూడింట రెండు వంతులు కోల్పోయింది. చద్దా తన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆప్ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించగా, ఆప్ మాత్రం ఆయనను ద్రోహిగా అభివర్ణించింది. -
ఏపీలో డీజిల్ కొరత వెనుక రూ.150 కోట్ల భారీ స్కామ్!
సాక్షి,ఢిల్లీ: ఏపీలో డీజిల్ కొరత వెనుక రూ.150 కోట్ల భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం నాలుగు నెలల్లో మూడు కోట్ల లీటర్ల డీజిల్ను రిటైల్ అవుట్లెట్స్ నుంచి సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.అయితే ఈ ఆదేశాల వెనుక వందల కోట్ల స్కాం ఉన్నట్లు బయటపడింది. అమరావతి కాంట్రాక్టర్లకు లాభం చేకూరేలా ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దీనిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి, ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.రిటైల్, బల్క్ డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం రూ.50. రిటైల్ బంకుల్లో ధర రూ.98 కాగా, బల్క్లో రూ.153. రిటైల్ బంకుల నుంచి డీజిల్ను రవాణా చేయాలని ప్రభుత్వం సూచించడం ద్వారా ప్రతి లీటర్పై రూ.50 లాభం వచ్చేలా నిర్మాణ సంస్థలకు అవకాశం కల్పించింది. ఈ లాభాల్లో వాటాలు పొందేందుకు ఎత్తుగడ వేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. చివరకు ఈ కుట్ర బహిర్గతమైంది -
ఏపీలో ఇంధన కొరత..NHRCకి కేతిరెడ్డి ఫిర్యాదు
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇంధన కొరతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ కేంద్ర పెట్రోలియం శాఖ, సుప్రీంకోర్టు లీగల్ సెల్, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రాలు పంపింది.కేతిరెడ్డి ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదులో దేశంలో ఇంధన కొరత సామాన్యుల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. రవాణా అంతరాయం, అత్యవసర సేవలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. ఈ కొరత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవన హక్కు), ఆర్టికల్ 14 (సమాన హక్కులు)తో పాటు వినియోగదారుల హక్కులకు భంగం కలిగిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.తక్షణ చర్యల కోసం నిల్వల పారదర్శకత, ఆకస్మిక తనిఖీలు, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు, డిజిటల్ పర్యవేక్షణ, ప్రజా డ్యాష్బోర్డ్, వినియోగదారుల ఫిర్యాదు వ్యవస్థ, రాష్ట్రాలతో సమన్వయం వంటి సూచనలు చేశారు. అలాగే ఐవోసీఎల్,బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి, దేశవ్యాప్తంగా అంతరాయం లేకుండా సరఫరా జరిగేలా చూడాలని కోరారు. -
అడ్డంగా దొరికిపోయిన రాఘవ్ చద్దా!
రాజకీయాల్లో మార్పులు సాధారణమే. కానీ ఆ మార్పులు డిజిటల్ యుగంలో ప్రజల నమ్మకాన్ని, నేతల ఇమేజ్ను ఒక్కసారిగా కుదిపేస్తాయి. అందుకు రాఘవ్ చద్దానే ఉదాహరణ. ఆమ్ ఆద్మీ పార్టీలో యువ నేతగా ఎదిగిన చద్దా.. బీజేపీలో చేరడానికి జెన్జీ జీర్ణించుకోలేకపోయింది. #UnfollowRaghavChadha అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతూ.. లక్షలాది ఫాలోవర్లు ఆయన్ని వదిలి వెళ్లిపోతున్నారు. తద్వారా దేశంలోనే అతిపెద్ద డిజిటల్ నిరసనకు ఆయన కారణమయ్యారు. చద్దా ఆప్ ఉన్నప్పుడు యువతకు దగ్గరగా ఉన్న నాయకుడిగా, మరీ ముఖ్యంగా సాధారణ సమస్యలపై మాట్లాడే వ్యక్తిగా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్నారు. కానీ ఆప్ను తిడుతూ బీజేపీలో చేరిన వెంటనే ఆయనపై విశ్వాసం ఉంచిన యువతలో నిరాశ, కోపం వ్యక్తమైంది. ఈ నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న ప్రజాదరణను కూడా గణనీయంగా ప్రభావితం చేసింది.కేవలం 24 గంటల్లోనే 1 మిలియన్కి(10 లక్షల మందికి) పైగా ఫాలోవర్స్ తగ్గిపోయారు. ఇప్పటిదాకా మొత్తం 2.3 మిలియన్ల మంది అన్ఫాలో చేశారు. ఇంకా అవుతూనే ఉన్నారు. జెన్జీ ఐకాన్గా పేరు పొందిన రాఘవ్ చద్దా పార్టీ మారడాన్ని యువత నమ్మక ద్రోహంగా ఫీలవ్వడమే ఈ ఫలితమని స్పష్టమవుతోంది. అయితే..ఈ పరిణామం తర్వాత ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రతీ ఓ సంచలన వీడియో విడుదల చేశారు. డ్యామేజ్ కంట్రోల్కి దిగిన రాఘవ్ చద్దా.. ఫాలోవర్లను కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ కొన్ని ఆధారాలు చూపించాడు. ఈ ఏడాది ఏప్రిల్లో అదీ ఈ మధ్యే క్రియేట్ చేసిన అకౌంట్ల ద్వారా రాఘవ్ చద్దాను ఫాలో చేయిస్తున్నారని.. వాటిలో పోస్టులు.. ప్రొఫైల్ ఫోటోలు.. ఎలాంటి ఎంగేజ్మెంట్ లేదని.. కేవలం బాట్స్ (bots) ద్వారా ఫాలోవర్స్ సంఖ్యను కృత్రిమంగా పెంచే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. నిజమైన ప్రజాదరణను నకిలీ ఫాలోవర్లతో కాపాడలేరు అని రతీ ఆ వీడియో చేయడం ఈ చర్చను మరింత వేడెక్కించింది. ఈ వీడియోతో సోషల్ మీడియాలో రాఘవ్ చద్దా విశ్వసనీయతపై పెద్ద ప్రశ్నలు తలెత్తాయి. సోషల్ మీడియా కాలంలో.. నాయకుల విశ్వసనీయత కేవలం సభల్లో ఇచ్చే ప్రసంగాలపై ఆధారపడదు. వారి డిజిటల్ ఇమేజ్, ప్రజలతో ఉన్న అనుబంధం, ఫాలోవర్ల ప్రతిస్పందన కూడా ముఖ్యమే. రాఘవ్ చద్దా కేసు.. సోషల్ మీడియా యుగంలో ప్రజల నమ్మకం ఎంత త్వరగా మారిపోతుందో, డిజిటల్ ఇమేజ్ ఎంత కీలకమో గుర్తు చేసింది. -
డీ-కంపెనీకి గట్టి దెబ్బ
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కనుసన్నల్లో నడుస్తున్న నెట్ వర్క్కు గట్టి దెబ్బ తగిలింది. దావూద్ సన్నిహితుడు, డ్రగ్ కింగ్పిన్ సలీం డోలాను టర్కీ(తుర్కీయే) భారత్కు అప్పగించింది. తాజాగా ఇస్తాంబుల్లో అతన్ని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి డిపోర్ట్ చేసినట్లు సమాచారం. ఇది డీ-కంపెనీపై భారత ప్రభుత్వం చేపట్టిన భారీ అణచివేత చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కొన్ని దశాబ్దాలుగా అండర్వరల్డ్ మాఫియా నడిపిస్తూ అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్, ఆయుధాలు, అక్రమ వ్యాపారాల నెట్వర్క్ను నడిపిస్తూ వచ్చింది. హవాలా లావాదేవీల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తూ వచ్చాడు. ఈ నెట్వర్క్ ద్వారా వచ్చిన సొమ్మును పాకిస్తాన్ ఐఎస్ఐకి కూడా చేరుతుందని భారత ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. 70వ దశకంలో ముంబై బేస్డ్గా ప్రారంభమై.. ఇప్పటికీ ఆసియా, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికా రీజియన్లలో క్రైమ్-టెర్రర్ నెట్వర్క్గా కొనసాగుతోంది. అయితే.. దావూద్ అనుచరుడు సలీం డోలా వంటి సహచరులు ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. డోలా దావూద్కు అత్యంత సన్నహితుడిగా తెలుస్తోంది. ఇతని అరెస్టు, భారత్కు డిపోర్ట్ కావడంతో ఈ నెట్వర్క్లోని కీలక లింక్ తెగిపోవడం గ్యారెంటీ అని అధికారులంటున్నారు. తద్వారా దావూద్ ఇబ్రహీం కంపెనీకి గట్టి దెబ్బ తగిలిందని విశ్లేషిస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ చర్యను ఒక ఘన విజయంగా చెబుతోంది. అంతర్జాతీయ స్థాయిలో నేరగాళ్లను పట్టుకోవడంలో భారత్ తన శక్తిని చూపిందని.. టర్కీతో ఉన్న సహకారం ఈ ఆపరేషన్ విజయానికి దోహదపడిందని ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రగ్ మాఫియాపై పోరాటంలో ఇది ఒక మైలురాయిగా అభివర్ణించింది. -
‘చద్దా.. మా వల్లే నీ వివాహం జరిగింది’
ఢిల్లీ: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్కు షాకిస్తూ బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆప్ నేతల నుంచి సోషల్ మీడియాలో నెటిజన్ల వరకు చద్దాపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాను పార్టీ మారడాన్ని చద్దా సమర్ధించుకుంటూ.. జస్ట్ ఉద్యోగం మారినట్టు పార్టీ మారాను అని వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలకు ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.ఎంపీ రాఘవ్ చద్దా వ్యాఖ్యలపై ఆఫ్ నేత సౌరభ్ భరద్వాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా భరద్వాజ్.. ఏడాది కాలంగా బీజేపీతో కలిసి రాఘవ్ చద్దా కుట్ర పన్నాడు. మధ్య తరగతి ప్రజల సమస్యలపై ప్రస్తావించే నాయకుడిగా ఇమేజ్ బిల్డప్ చేసుకోవడం కూడా అందులో భాగంగానే జరిగింది. రాఘవ్ చద్దా ఎంపీ కావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కారణం. ఆప్ వల్లే ఆయన ఎంపీ అయ్యారు. రాజ్యసభ ఎంపీని చేయడం వల్లే రాఘవ్ చద్దాకు గుర్తింపు వచ్చింది. ఆ హోదా కారణంగా అతనికి పెళ్లి జరిగింది. ఓ సెలబ్రెటీ ఆయనను పెళ్లి చేసుకున్నారు. లేకపోతే రాఘవ్ చద్దాను ఎవరూ పట్టించుకునే వారు కాదు.రాజకీయాలను ఉద్యోగాలతో పోల్చవద్దు. మనం ఉద్యోగాలు మారినప్పుడు లేదా ఒక కంపెనీలో పనిచేసినప్పుడు, దానికి సిద్ధాంతంతో సంబంధం లేదు. మీరు సిద్ధాంతం కారణంగానే ఒక పార్టీలో చేరి, దానిలో ఉన్నారు. ప్రజలు ఉద్యోగాలు మారినప్పుడు కూడా, వారు తమ మాతృ సంస్థకు వ్యతిరేకంగా కుట్రలు చేయరు అని మండిపడ్డారు.Response to Raghav’s Video Raghav Chaddha says his changing party is like someone switching a job from one company to another.Though it’s not the same but even when people switch jobs, they don’t hatch conspiracy against their parent companyFor more than a year, Raghav… pic.twitter.com/RxfnTsv9Ms— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) April 27, 2026ఇదిలా ఉండగా.. రాఘవ్ చద్దా బీజేపీలో చేరిన తర్వాత ఒక వీడియో విడుదల చేశారు. ఆ సందర్బంగా ఆయన ఆప్ను “toxic work environment” అని పిలిచారు. ఆయన ప్రకారం, పార్టీలో పని చేయడాన్ని అడ్డుకోవడం, పార్లమెంట్లో మాట్లాడే అవకాశాన్ని నిరాకరించడం, పార్టీ అవినీతిలోకి వెళ్లడం వల్లే తాను ఆప్ను వీడినట్లు చెప్పారు. ఒక ఉద్యోగి ఎలా అయితే కంపెనీ మారుతారో అలాగే నేను కూడా పార్టీ మారాను అని అన్నారు. అంతటితో ఆగకుండా..‘నేను రాజకీయాల్లో కెరీర్ కోసం రాలేదు. నేను ఒక పార్టీని స్థాపించాను. నా యవ్వనంలో 15 సంవత్సరాలు రక్తం, చెమట, కష్టంతో ఈ పార్టీకి ఇచ్చాను. నేను భయంతో కాదు, నిరాశ, అసంతృప్తి, అసహ్యం వల్లే పార్టీని విడిచాను. ఒక వ్యక్తి తప్పు కావచ్చు, ఇద్దరు తప్పు కావచ్చు, కానీ ఏడు మంది తప్పు కావడం సాధ్యం కాదు’ అని కామెంట్స్ చేశారు. -
బిడ్డ పుట్టాక ఇప్పుడు అత్యాచారమంటే ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో కూడిన సహజీవన సంబంధంలో నేరం అనే ప్రశ్నకు తావులేదని సుప్రీంకోర్టు పేర్కొంది. సహజీవన సంబంధం నుంచి బయటకు రావడం ఎంతమాత్రం నేరం కాదని కూడా స్పష్టం చేసింది. ఇద్దరి సమ్మతితో ఏర్పడిన సంబంధాలకు, లైంగిక నేరాలకు మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలని జస్టిస్ బి.వి.నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ మహిళ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నిందితుడు పెళ్లి పేరుతో పిటిషనర్తో సహజీవనం చేశాడు. వారికి ఒక బిడ్డ కూడా పుట్టాడు. ఆ చిన్నారికి ఏడేళ్లు. నిందితుడిని కలిసే సమయానికి పిటిషనర్ వయస్సు 18 ఏళ్లు. అప్పటికే ఆమె వితంతువు. అయితే, నిందితుడు తనకు అప్పటికే వివాహమైన విషయాన్ని బాధితురాలి వద్ద ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టాడు‘అని పిటిషనర్ న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘వారిద్దరికీ ఒక బిడ్డ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆమె అత్యాచారం ఆరోపణలు చేస్తోందా? ఇద్దరు మేజర్లు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధంతో తలెత్తే పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమ్మతంతో ఏర్పడిన సంబంధం విఫలమైనప్పుడు, దానిని నేరంగా ఎలా పరిగణిస్తారు?‘అని ప్రశ్నించింది. ఇలా అడగడం బాధితురాలిని నిందించినట్లుగా అనిపించినప్పటికీ, సంబంధంలో ఉన్న ’సమ్మతి’(కన్సెంట్) స్వభావాన్ని అర్థం చేసుకోవడం న్యాయపరంగా ముఖ్యమని స్పష్టం చేసింది. పెళ్లి కాకుండానే అతనితో కలిసి ఉండాలని, బిడ్డను కనాలని ఆమె ఎందుకు నిర్ణయించుకుందని ఈ సందర్భంగా ధర్మాసనం నిలదీసింది. అయితే, బాధితురాలి పరిస్థితి పట్ల కోర్టు సానుభూతి వ్యక్తం చేసింది. బిడ్డ పోషణ కోసం ఆమె న్యాయబద్ధంగా భరణం కోసం పిటిషన్ వేయవచ్చని సూచించింది. -
ఢిల్లీ ఎక్సైజ్ కేసులో కొత్త వివాదం
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కొత్త వివాదం రాజుకుంది. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగతంగా గానీ, న్యాయవాది ద్వారా గానీ హాజరుకావడం లేదని జడ్జి స్వరణ కాంత శర్మకు ఓ లేఖ రాశారు.‘‘న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. తప్పుడు ఆరోపణలతో నన్ను జైలుకు పంపారు. అందుకే నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. జడ్జి స్వరణ కాంత శర్మపై నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. కానీ, ఆమెపై విశ్వాసం లేదు. అందుకు కారణం ఆమె బీజేపీ అనుబంధ కార్యక్రమాలకు వెళ్లడం. కాబట్టి ఆమె ఎదుట విచారణకు హాజరు కాలేను. నా మనసాక్షి ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయంలో మహాత్మా గాంధీ సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించాలని అనుకుంటున్నాను. ఈ విషయంలో అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా’’ అని లేఖలో కేజ్రీవాల్ తెలిపారు.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జడ్జి స్వరణ కాంత శర్మ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ కేజ్రీవాల్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె బీజేపీకి దగ్గరి మనిషని, ఆమె పిల్లలు కూడా కేంద్ర విభాగంలో పని చేస్తున్నారని.. కాబట్టి ఆమెను కేసు నుంచి తప్పించాలని కోరారాయన. అయితే హైకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. కేవలం అనుమానాలు, ఊహాగానాల ఆధారంగా రిక్యూసల్ ఇవ్వలేం. ఇది న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నా కుటుంబ ప్రస్తావనతో కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు సరికాదు. ఆయన కచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అని జడ్జి శర్మ వ్యాఖ్యానించారు. -
ఐఎండీ హెచ్చరిక.. రానున్న రోజుల్లో..
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉత్తర, దక్షిణ భారత్కు ఐఎండీ హీట్వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో 44.5°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తీర ప్రాంతాల్లో వేడి-తేమతో వాతావరణ మండుతోంది. ఉత్తర భారతంలో రాత్రి వేళల్లో వేడి గాలులు వీస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది.మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. తగినంత నీళ్లు తాగాలని.. తేలికపాటి బట్టలు ధరించాలి. బయట శ్రమతో కూడిన పనులు నివారించాలని వాతావరణ శాఖ సూచించింది. పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏప్రిల్-జూన్లో తూర్పు, మధ్య, ఉత్తర-పశ్చిమ భారత్లో సాధారణం కంటే ఎక్కువ హీట్వేవ్ రోజులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.ఐఎండీ తాజా అంచనాల ప్రకారం.. వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు (40°C నుండి 44°C) మధ్య నమోదవుతున్నాయి. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో అత్యధికంగా 44.5°C ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 5°C, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. తీర ప్రాంతం, తూర్పు రాష్ట్రాల్లో ఉక్కపోత (వేడి, తేమ) ఎక్కువగా ఉంటుంది. వాయువ్య భారతదేశంలో ఏప్రిల్ 27 వరకు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదు. ఆ తర్వాత క్రమంగా తగ్గుతాయి. ఇతర ప్రాంతాల్లో మొదట ఉష్ణోగ్రతలు పెరిగి, ఆపై తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
కేజ్రీవాల్దే లేటు!
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పుట్టుకే ఒక ఉద్యమం. అవినీతి వ్యతిరేక పోరాటం నుంచి పుట్టిన ఈ పార్టీ, ఢిల్లీ గడ్డపై వరుస ఘనవిజయాలతో ప్రజాస్వామ్యానికి కొత్త ఆశ చూపింది. కానీ 14 ఏళ్ల తర్వాత.. అవినీతి, అంతర్గత విభేదాలతో ఘోరంగా దెబ్బ తింటోంది. ‘‘సరైన మార్గంలో కొనసాగి ఉంటే పార్టీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు’’ అని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే పేర్కొనడమే ఇందుకు నిదర్శనం.ఢిల్లీ ఓటమి తర్వాత.. రాజ్యసభ ఎంపీలు గుడ్బై చెప్పడం ఆప్కు తగిలిన మరో భారీ షాక్. రాజ్యసభలో ఆ పార్టీకి చెందిన 10 మందిలో.. ఒకేసారి ఏడుగురు బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడైన రాఘవ్ చద్దా ఆధ్వర్యంలోనే ‘ఆపరేషన్ లోటస్’ జరగడం మరో ట్విస్ట్. ఆప్లో ఇబ్బందులు ఎదురైనందు వల్లే వారీ నిర్ణయం తీసుకుని ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్నగా అసంతృప్తి మొదలై.. పార్టీ విలువలు దూరమవుతున్నాయనే భావన.. నాయకత్వంపై నమ్మకం తగ్గిపోవడం.. పార్టీలో కీలక స్థానం నుంచి తనను తొలగించడం.. చివరకు ఆయన్ని, ఇతర ఎంపీలతో కలిసి పార్టీని వీడేలా చేశాయన్నది చద్దా స్టేట్మెంట్తో స్పష్టమవుతోంది. అయితే..ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేజ్రీవాల్ ప్రధానంగా పార్టీని పునర్నిర్మించడంపై దృష్టి పెట్టారు. వరుసగా వలంటీర్లతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే పంజాబ్పై ఆయన ఫోకస్ పెట్టారు. అయితే ఈ అసంతృప్త జ్వాలలను కేజ్రీవాల్ ముందే పసిగట్టినట్లు తెలుస్తోంది. వాళ్లను శాంతింపజేయాలని ఆయన ప్రయత్నాలు కూడా చేశారట!. ఈ క్రమంలో వాళ్ల కోసం మరో ఆఫర్ కూడా చేసినట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ‘‘మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఇప్పుడే రాజీనామా చేయండి. వచ్చే టర్మ్లో మళ్లీ టికెట్లు ఇస్తాం..’’ అని కేజ్రీవాల్ వాళ్లకు చెప్పాలనుకున్నారు. ఇందుకోసం వాళ్లతో ఓ సమావేశం నిర్వహించాలని కూడా భావించారు. అయితే..ఈలోపే ఆలస్యం అయ్యింది. ఎంపీలు ముందే నిర్ణయం తీసేసుకుని రాజీనామాలు చేసేసి బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. కేజ్రీవాల్ చివరి నిమిషం దాకా వేచి ఉండకుండా.. తొందరపడి ఉంటే ఇది జరిగి ఉండేది కాదని, కొంతలో కొంతైనా డ్యామేజ్ కంట్రోల్ అయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. ఆప్లో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ను, అధిష్టానం-నాయకుల మధ్య దూరాన్ని ఈ ఎపిసోడ్ బయట పెట్టింది.ఆప్ను వీడింది రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, స్వాతి మలివాల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీఆప్లో మిగిలిందిసంజయ్సింగ్, ఎన్.డి.గుప్తా, బల్బీర్ సింగ్ సీచెవాల్సభ్యత్వం ఉంటుందా?ఆప్ను వీడిన ఎంపీలు 2/3 వంతుకు పైగా(10లో ఏడుగురు) ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం.. వాళ్ల రాజ్యసభ సభ్యత్వాలకు ఎలాంటి ఢోకా లేదు. -
రాజకీయాల్లోకి నన్ను, సైన్యాన్ని లాగడం అన్యాయం
పార్లమెంట్ సాక్షిగా తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంపై రచయిత, మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే స్పందించారు. తనను, సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడం అన్యాయమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లడఖ్ ఘర్షణలో మనం భూభాగం కోల్పోలేదని ఉద్ఘాటించిన ఆయన.. సైన్యం ఎల్లప్పుడూ రాజకీయాలకు దూరంగా, ప్రజల విశ్వాసంతో ముందుకు నడుస్తుందని చెప్పారు. 2020లో లడఖ్లో భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత చైనా సైన్యం భారత భూభాగంలోకి ప్రవేశించిందా? లేదా? అనే ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. దీనిపై ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నరవణే స్పందిస్తూ.. ‘‘ఆ సమయంలోనే నేను చెప్పాను. ప్రభుత్వం ఆ సమయంలో మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. చైనాకు మనం ఒక్క అంగుళం భూభాగం కూడా కోల్పోలేదు. ఈరోజు కూడా అదే మాట చెబుతున్నా. ఎవరైనా నమ్మకపోతే అది వారి ఇష్టం. ఎంత సాక్ష్యం చూపించినా.. నమ్మకానికి సిద్ధంగా లేని వారు తమ అభిప్రాయాన్ని మార్చుకోలేరు కదా. సైనిక వ్యవహారాల్లో రాజకీయ నాయకత్వం నేరుగా జోక్యం చేసుకోదు. నిర్ణయాలు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ తీసుకుంటుంది. ఆ కమిటీకి ప్రధాని అధ్యక్షత వహిస్తారు. నన్ను, సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడం అన్యాయం. భారత సైన్యం ఎప్పటికీ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. అదే మన ప్రజాస్వామ్య బలం. వ్యక్తిగతంగా ఓటు హక్కు ఉన్నా.. సంస్థగా మాత్రం అది రాజకీయ పార్టీకి కొమ్ము కాయదు. భారత ప్రజలు ఎప్పటికీ సైన్యంపై విశ్వాసం ఉంచారు. చిన్న చిన్న వివాదాలు ఆ బంధాన్ని దెబ్బతీయలేవు అని అన్నారాయన. నరవణే రాసిన “Four Stars of Destiny” అనే మెమోయిర్(జ్ఞాపకాల పుస్తకం) ఇంకా పబ్లిష్ కాలేదు. ఈ పుస్తకం ప్రచురణకు సిద్ధంగా ఉన్నా, రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం 2023 నుంచి పెండింగ్లో ఉంది. కానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్ సమావేశాల్లో దానిని ప్రదర్శించడం.. అందులోని కొన్ని భాగాలను ప్రస్తావించడంతో రాజకీయ వివాదం చెలరేగింది. అందులో నరవణే తన నాలుగు దశాబ్దాల సైనిక జీవితం, ముఖ్యంగా 2020 లడఖ్–చైనా ఘర్షణ.. గల్వాన్ లోయ సంఘటనలు, అగ్నిపథ్ నియామక పథకం వంటి అంశాలను ప్రస్తావించారు. లడఖ్ ఉద్రిక్తత సమయంలో తాను కేంద్రానికి ఆదేశాలు అడిగితే.. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ “Jo Uchit Samjho Woh Karo” (మీకు సరైనదనిపిస్తే అదే చేయండి) అన్నారని నరవణే ప్రస్తావించారు. రాజకీయ నిర్ణయం తీసుకోవడానికి మోదీ సర్కారు వెనుకాడిందని.. నిర్ణయాన్ని పూర్తిగా సైన్యానికి వదిలేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిపై రాజ్నాథ్ సింగ్, అమిత్ షా సహా కేంద్ర మంత్రులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. “ప్రచురించని పుస్తకాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడం సరైంది కాదు” అని అన్నారు. సభలో తీవ్ర వాగ్వాదాలు జరిగి.. స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షం నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టేదాకా పరిస్థితి వెళ్లింది. కానీ అది తర్వాత వాయిస్ ఓటుతో కొట్టివేయబడింది.అయితే.. ఈ దుమారంపై నరవణే ఇదివరకు కూడా స్పందించారు. ఆ సమయంలో ప్రభుత్వం తమను వదిలేయలేదని స్పష్టం చేశారు. మీకు సరైనదనిపిస్తే అదే చేయండి అనే వ్యాఖ్యలను రాజకీయ పక్షాలు తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నిజానికి సర్కారు నుంచి తమకు పూర్తి మద్దతు ఉందని, పరిస్థితి చెయ్యిదాటితే చైనా సైనికులపై కాల్పులు జరపడానికి అన్ని అధికారాలూ తమకు ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. -
ఇష్టంలేకుండా గర్భం కొనసాగించాలని ఏ కోర్టు ఆదేశించజాలదు
న్యూఢిల్లీ: ఇష్టంలేకుండా మహిళను మరీముఖ్యంగా మైనర్ బాలికను అవాంఛిత గర్భం కొనసాగించాలని ఏ న్యాయస్థానమూ ఆదేశించజాలదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఏడునెలల తన అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు 15 ఏళ్ల బాలికకు అనుమతినిస్తూ శుక్రవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ‘‘జన్మనివ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే హక్కు పుట్టబోయే బిడ్డ కంటే గర్భంతో ఉన్న మహిళకే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఇష్టంలేని గర్భం కొనసాగిస్తే దీర్ఘకాలంలో ఆ టీనేజర్ మానసిక ఆరోగ్యం, విద్యావకాశాలు, సామాజిక స్థితిగతులు మొత్తంగా ఆమె అభివృద్ధి మీద దుష్ప్రభావం పడే ఆస్కారముంది. ఒకరికి ఆమె జన్మనివ్వాలా వద్దా అనే స్వయంనిర్ణాయాధికారానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. అవాంఛిత గర్భాన్ని నువ్వు కొనసాగించాల్సిందేనని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మనం ఆదేశిస్తే అది ఆమెకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది. -
చద్దా షాక్.. స్పందించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: తమ పార్టీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమవుతున్నట్టు ఎంపీ రాఘవ్ చద్దా చేసిన ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. 'బీజేపీ మరోసారి పంజాబీలకు గట్టి దెబ్బ కొట్టింద'ని ఎక్స్లో ఆయన పోస్ట్ పెట్టారు. ఒకే ఒక్క వాక్యంతో తన స్పందన తెలియజేశారు. ఈ పరిణామంపై ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశముంది. పంజాబ్కు బీజేపీ ద్రోహంపంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఇదే విధంగా స్పందించారు. పంజాబ్కు బీజేపీ ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఆపరేషన్ లోటస్ను గతంలో శరద్ పవార్, శివసేన (యూబీటీ), కాంగ్రెస్ పార్టీలపైనా ప్రయోగించిందని గుర్తు చేశారు. పంజాబ్లో కమలం పార్టీ ఆటలు చెల్లవని వ్యాఖ్యానించారు.''పంజాబ్కు బీజేపీ ద్రోహం చేసింది. ఇదే వాషింగ్ మెషీన్ను శరద్ పవార్, శివసేన (యూబీటీ), కాంగ్రెస్ పార్టీల పైకి ఉపయోగించారు. పంజాబ్లో బీజేపీకి పట్టు లేదు. బీజేపీలో చేరుతున్న ఆ ఏడుగురు ఎంపీలు పంజాబ్కు ప్రాతినిధ్యం వహించరు, వాళ్లు దేశద్రోహులు. ఫిరాయింపు ఎంపీలకు బీజేపీలో ఏమీ దక్కదు. పొత్తు పెట్టుకున్న పార్టీని నాశనం చేయడం బీజేపీ నైజం. పంజాబ్ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది. పంజాబ్ ప్రజలు నాకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నార''ని భగవంత్ మాన్ అన్నారు.తమ పార్టీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనంపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అనురాగ్ ధంధా మాట్లాడుతూ.. ''ఈ నాయకుల స్వభావాన్ని దేశం మొత్తం చూసింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నాయకత్వంలో ఆప్ మళ్లీ అధికారంలోకి వస్తుందని వారికి తెలుసు. పంజాబ్ ప్రజలు వారికి తగిన విధంగా సమాధానం ఇస్తార''ని వ్యాఖ్యానించారు. నబిన్ను కలిసిన ఆప్ ఎంపీలుకాగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ శుక్రవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ను కలిశారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో వారికి పుష్పగుచ్చాలతో నబిన్ సాదర స్వాగతం పలికారు. స్వయంగా స్వీట్లు తినిపించారు. చదవండి: రాఘవ్ చద్దాకు కేంద్ర మంత్రి పదవి?Delhi: Rajya Sabha MPs Raghav Chadha, Sandeep Pathak and Ashok Mittal meet BJP National President Nitin Nabin at the party headquarters 2/3rd MPs of AAP in the Rajya Sabha announced merging with the BJP. pic.twitter.com/cRLnmOQRFZ— ANI (@ANI) April 24, 2026 -
‘ఆపరేషన్ లోటస్’.. బీజేపీలో చేరిన నలుగురు ఆప్ ఎంపీలు
ఢిల్లీ: బీజేపీ తలపెట్టిన ఆపరేషన్ లోటస్ సక్సెస్ అయ్యింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పది మంది రాజ్యసభ ఎంపీలలో ఏడుగురుని బీజేపీ ఆకర్షించింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమక్షంలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా,అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ బీజేపీలో చేరారు. ఏడుగురు ఎంపీలు వీడడంతో ఆప్ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది.ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా ప్రకటించిన రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్లు శుక్రవారం ఢిల్లీలో పార్టీ అధినేత నితిన్ నబిన్ సమక్షంలో బీజేపీలో చేరారు. మిగిలిన నలుగురు ఎంపీలు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీలు ఉన్నారు. వారి ఏ పార్టీలో చేరుతారనేది స్పష్టత లేదు. అయితే, ఆ నలుగురు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆప్కు రాజీనామా వార్తలతో ఆ నలుగురు ఎంపీలతో పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో సంప్రదించే ప్రయత్నం చేశారు. కానీ వారు అందుబాటులోకి రాలేదని సమాచారం.మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్లో అధికారంలో ఉన్న ఆప్ లక్ష్యంగా బీజేపీ భారీ ‘ఆపరేషన్ లోటస్’కు శ్రీకారం చుట్టింది. గతంలో పంజాబ్ ఇంఛార్జిగా పని చేసిన రాఘవ్ చద్దాను ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ పక్కన బెట్టారు. ఈ అసంతృప్తితో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.అదే సమయంలో కమలం నేతలు రాఘవ్ చద్దా ద్వారా ఆప్లో చీలిక తెచ్చింది.పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న పంజాబ్లో బీజేపీ అధికారంలోకి రావాలని పార్టీ అధిష్టానం ఆశిస్తోంది. మొన్నటి దాకా అకాలీ దళపై ఆధారపడ్డ బీజేపీ..ఇక నుంచి పంజాబ్లో సొంతంగా ఎదగాలని దూకుడుగా వెళ్తోంది. Today, exercising the provisions of the Constitution of India, more than two-thirds of the AAP MPs in the Rajya Sabha have merged with the BJP.Seven MPs have signed the document, which was submitted to the Hon’ble Chairman of the Rajya Sabha.I, along with two other MPs,…— Raghav Chadha (@raghav_chadha) April 24, 2026 -
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు చుక్కెదురు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాకు మరోసారి చుక్కెదురైంది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గువాహతి హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. గురువారం ఆయన వేసిన పిటిషన్ను కొట్టేసింది. దీంతో ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ కేసు నేపథ్యం ఏప్రిల్ 5న గువాహటిలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించినది. ఆ సమయంలో పవన్ ఖేరా.. అసోం సీఎం భార్య రింకీ భుయాన్ శర్మకు మూడు పాస్పోర్టులు ఉన్నాయని, దుబాయ్లో ఆస్తులతో పాటు విదేశీ కంపెనీలలో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. అందుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు మీడియాకు ప్రదర్శించారు. అయితే..ఆ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన రింకీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆయనపై అసోం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అంతేకాదు.. ఆయన ప్రదర్శించింది ఫేక్ డాక్యుమెంట్లుగా పేర్కొంటూ ఫోర్జరీ అభియోగాలు కూడా చేర్చారు. ఈ కేసు అసోం పోలీసులు ఢిల్లీలోని పవన్ ఖేరా నివాసంలో తనిఖీలు జరిపారు.అయితే ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా మొదట తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్య హైదరాబాద్ నుంచి(సనత్ నగర్) పోటీ చేసిందని.. తనకు ఆధార్ కూడా ఇక్కడే ఉందని.. కాబట్టి ఈ కేసు విచారణే ఇక్కడే జరగాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ఆయనకు అరెస్ట్ నుంచి తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. ఈలోపు..అసోం పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన మధ్యంతర బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు.. ముందస్తు బెయిల్ కోసం గువాహతి హైకోర్టులోనే పిటిషన్ వేయాలని సూచించింది. అయితే కోర్టుకు సెలవులు ఉన్నాయని.. తన మధ్యంతర బెయిల్ను పొడిగించాలని ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు అందుకు ఒప్పుకోలేదు. గువాహతి కోర్టునే ఆశ్రయించమని చెప్పింది. తాజాగా.. ఇవాళ(ఏప్రిల్ 24న) గువాహతి హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. ఈ పరిణామంతో పవన్ ఖేరా అరెస్ట్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే.. కాంగ్రెస్ వర్గాలు దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తున్నాయి. అసోం సీఎం హిమంత బిస్వా శర్మ మాత్రం.. “అసత్య ఆరోపణలు చేసినందుకు ఆయన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని.. ఎక్కడున్నా వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోవాలని” అంటున్నారు. -
ఢిల్లీకి వస్తా.. బీజేపీని తరిమి కొడతా
సాక్షి, ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తర్వాతి లక్ష్యం జాతీయ రాజకీయాలేనని ప్రకటించారామె. అయితే అది అధికారం కోసం కాదని.. కేవలం బీజేపీ పతనం కోసమేనని వ్యాఖ్యానించారు.కోల్కతాలో జరిగిన ఎన్నికల సభలో ఆమె బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్ విజయం తర్వాతే ఢిల్లీకి వస్తా.. బీజేపీని తరిమి కొడతా అంటూ మాట్లాడారామె. ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తోంది. నేను బెంగాల్లో పుట్టాను.. ఇక్కడే చస్తాను. కానీ, బెంగాల్లో గెలిచాక ఢిల్లీకి తప్పకుండా వెళ్తాను. నాకు కావాల్సింది అధికారం కాదు. బీజేపీ పతనం. ఢిల్లీలోనూ వాళ్లను ఇదే తరహాలో ఎదుర్కొంటాను. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడతానని’’ అని దీదీ వ్యాఖ్యానించారు.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ఈసారి మరింత ఉత్కంఠభరితంగా మారింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపిస్తుండగా.. బీజేపీ మాత్రం ఆమె ప్రభుత్వంపై అవినీతి, దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఓటర్ల స్పందన కూడా విశేషంగా ఉంది. గురువారం జరిగిన తొలి దఫా పోలింగ్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. సుమారు 92 శాతం టర్నౌట్ నమోదైంది. చివరిసారిగా 2011లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కాగా.. ఇప్పుడా రికార్డు చెరిగిపోయింది. ఆ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ దారుణ పరాజయం పాలైంది.తాజా భారీ ఓటింగ్ను ప్రధాని నరేంద్ర మోదీ ‘‘మార్పు కోసం ప్రజల సంకల్పం’’గా అభివర్ణించారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఇది తమ విజయానికే సంకేతామని మమతా బెనర్జీ అంటున్నారు. రెండో విడత పోలింగ్ 2026 ఏప్రిల్ 29న జరగనుంది. ఈ విడతలో మిగిలిన 142 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. మే 4వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
మేలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్న నామినేటెడ్, పార్టీ సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియ మేలో పూర్తికానుందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ పనితీరుతోపాటు కులగణన తదితర కీలక అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. పార్టీ కేడర్కు గుర్తింపు.. పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని మహేశ్గౌడ్ తెలిపారు. అందులో భాగంగానే టీపీసీసీ పూర్తిస్థాయి కార్యవర్గ నియామకంతోపాటు వివిధ కార్పొరేషన్లు, బోర్డులకు సంబంధించిన నామినేటెడ్ పదవుల భర్తీపై రాహుల్ గాందీతో విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు. ఈ నియామకాల ప్రక్రియను మేలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని.. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మహేశ్గౌడ్ చెప్పారు. ఏఐసీసీ ఓబీసీ భేటీ హైదరాబాద్లో జరపాలి.. బీసీల సాధికారతపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని దేశవ్యాప్తంగా చాటేలా రాబోయే ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించాలని రాహుల్ గాంధీని కోరినట్లు మహేశ్గౌడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి తెలంగాణ వేదికగా మరింత మద్దతు కూడగట్టేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ రిజర్వేన్ల అంశాన్ని కూడా జోడించాలని రాహుల్కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ఏ దశలోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్లా ఒక్కరోజు సర్వే కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై ప్రతిపక్షాల విమర్శలను మహేశ్గౌడ్ ఖండించారు. సర్వే ప్రక్రియలో ఎక్కడా లోపం జరగలేదని.. అత్యంత శాస్త్రీయంగా వివరాల నమోదు జరిగిందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హడావుడిగా ఒక్క రోజులోనే సర్వే చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయలేదని.. ఎన్యూమరేటర్లు నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి క్షుణ్ణంగా వివరాలు సేకరించారని వివరించారు. ఈ వాస్తవ డేటా ఆధారంగానే భవిష్యత్తులో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అవసరమైన విధానాలను రూపొందిస్తామని ఆయన చెప్పారు. సమాజంలో ప్రతి వర్గానికి సామాజిక న్యాయం దక్కాలన్న రాహుల్ గాంధీ ఆశయాన్ని తెలంగాణలో 100 శాతం అమలు చేసి తీరుతామని మహేశ్గౌడ్ ఉద్ఘాటించారు. -
మృగాడి వాంఛాగ్ని.. విస్తుపోయిన పోలీసులు
ప్రశాంత ఉదయం ఓ మృగాడి వాంఛాగ్నితో భయానకంగా మారింది. ఆదరించి అన్నం పెట్టిన కుటుంబానికి తీరని ద్రోహం చేశాడో దుర్మార్గుడు. కామంతో కళ్లు మూసుకుపోయి వాళ్ల బిడ్డను బలిగొన్నాడు. ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్యాచార ఘటనతో దేశ రాజధాని ఉలిక్కి పడింది. అయితే నిందితుడు రాహుల్ మీనా చెప్పింది విని పోలీసులు సైతం విస్తుపోయారు. సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తె(22) కేసులో షాకింగ్ విషయం ఒకటి వెలుగు చూసింది. యువతి దారుణ హత్యాచారం కంటే ముందు తన సొంతూరులో మరో మహిళపైనా రాహుల్ అత్యాచారానికి తెగబడ్డాడు. ఆపై విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. అంటే.. 24 గంటలు గడవక ముందే రెండు రాష్ట్రాల్లో రెండు ఘాతుకాలకు పాల్పడ్డాడన్నమాట. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ ఆల్వార్ జిల్లా రాజ్గఢ్కు చెందిన రాహుల్ మీనా(23) తెలిసినవాళ్ల ద్వారా రికమండేషన్తో ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో పనివాడిగా చేరాడు. సర్వెంట్ క్వార్టర్స్లో అతనికి ఆశ్రయం ఇచ్చారు. ఆ సమయంలో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న అధికారి కూతురిపై కన్నేశాడు రాహుల్. అలా ఎనిమిది నెలల పాటు అదను కోసం ఎదురు చూశాడు. అయితే ఇంటి సరుకుల కోసం ఇచ్చిన డబ్బు గోల్మాల్ చేశాడని.. బయట అధికారి పేరు చెప్పి అప్పులు చేశాడని.. తేలడంతో రాహుల్ను పనిలోంచి తీసేశారు. దీంతో అతను సొంతూరికి వెళ్లిపోయాడు. అయితే అతని తప్పుడు ఆలోచనలు ఆగలేదు. దీంతో మళ్లీ ఢిల్లీకి పయనం అయ్యాడు. ఏప్రిల్ 21న.. పొరుగింట్లో మహిళ ఒంటరిగా ఉండడం గమనించి ఆపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమె ఒంటి నిండా పంటి గాట్లు పెట్టి చిత్రహింసలు పెట్టాడు. ఆపై విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి బయల్దేరాడు. భార్య ఒంటిపై గాయాలు గమనించిన ఆ భర్త.. ఈ ఘటనపై ఫిర్యాదు కూడా చేశాడు. ఏప్రిల్ 22న ఉదయం.. ఢిల్లీ చేరుకున్న రాహుల్.. నేరుగా ఆగ్నేయ ఢిల్లీలోని కైలాశ్ హిల్స్ అపార్ట్మెంట్కు వెళ్లాడు. ఇంతకు ముందు పని చేసిన వాడే కావడంతో సెక్యూరిటీ ఇబ్బందులేవీ అతనికి ఎదురు కాలేదు. ఆ టైంలో ఐఆర్ఎస్ అధికారి, ఆయన భార్య జిమ్కు వెళ్లారు. పని మనిషి కోసం తాళం చెవి బయట ఉంచుతారనే విషయమూ రాహుల్కు తెలుసు. తాళం తీసి లోపలికి వెళ్లిన రాహుల్ నేరుగా పైన గదిలో చదువుకుంటున్న ఐఆర్ఎస్ అధికారి కూతురి(22) దగ్గరకు వెళ్లాడు. తన కోరిక తీర్చాలని ఆమెను బతిమాలాడాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి బెడ్ ల్యాంప్, చేతికి దొరికిన వస్తువులతో తల మీద కొట్టాడు. రక్త స్రావంతో స్పృహ కోల్పోయిన ఆమెను మెట్ల మీద నుంచి కిందకు ఈడ్చుకొచ్చాడు. అక్కడ ఆమెపై అత్యాచారం జరిపాడు. ఆపై.. ఆమె వేలి ముద్రలతో లాకర్ తెరవడానికి ప్రయత్నించాడు. అయితే.. వేళ్లకు రక్తం ఉండడంతో అది ఓపెన్ కాలేదు. దీంతో స్క్రూ డైవర్ సాయంతో లాకర్ తెరిచి.. అందులో ఉన్నదంతా తనతో తెచ్చుకున్న బ్యాగులో నింపేసుకున్నాడు. మొబైల్ చార్జర్ కేబుల్తో యువతికి ఉరి వేసి ఊపిరి తీశాడు. యువతితో జరిగిన పెనుగులాటలో ప్యాంట్కు, షూస్కు రక్తపు మరకలు అంటడంతో.. వాటిని అక్కడే పడేసి ఐఆర్ఎస్ అధికారి కొడుకు దుస్తులు, చెప్పులు ధరించి పారిపోయాడు. రక్తపు మడుగులో దుస్తులు లేకుండా విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి ఆ అధికారి దంపతులు నిర్ఘాంతపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్లో ఉదయం 6.28 గంటలకు నిందితుడు అపార్ట్మెంట్లోకి ప్రవేశించి.. సుమారు గంట తర్వాత వేరే దుస్తులు, బ్యాగుతో బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం 15 బృందాలు రంగంలోకి దిగాయి. అయితే.. ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ద్వారకలో గాలింపు చేపట్టారు. చివరకు బుధవారం సాయంత్రం ఓ లాడ్జిలో దాక్కున్న రాహుల్ను అరెస్ట్ చేశారు. రాహుల్ మీనా ఫోన్లో పోర్న్ కంటెంట్ అడ్డగోలుగా ఉంది. రోడ్లపై వెళ్లే యువతులను అసభ్యంగా ఫొటోలు తీసినట్లు పోలీసులు గుర్తించారు. తనకు పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఎక్కువగా ఉందని.. అందుకే ఈ నేరాలకు పాల్పడినట్లు రాహుల్ ఒప్పుకున్నాడు. రాహుల్కు బెట్టింగ్ యాప్లతో పాటు డ్రగ్స్ అలవాటు కూడా ఉందని నిర్ధారించారు. అతని నేర చరిత్ర చిట్టాను మరింత లోతుగా పరిశీలించాలని పోలీసులు భావిస్తున్నారు. -
హైకోర్టు తీర్పు సర్కార్కు చెంపపెట్టు
సాక్షి న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, వాటిని చట్టపరంగా కోర్టు ముందు సమర్థవంతంగా ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే అవినీతి కేసుల్లో చట్టబద్ధమైన, పారదర్శకమైన చర్యలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ‘ఎన్నికల హామీలు ఎందుకు అమలు కాలేదు? అవినీతి కేసుల్లో చర్యలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? మీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వాలే కాబట్టి.. దొంగలుదొంగలు కలిసి తెలంగాణను దోచుకోవడంలో పోటీపడుతూ రాష్ట్రాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారా? అనే అంశాలపై ప్రజలకు వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా, కేసీఆర్ కుటుంబంపై కానీ, గత ప్రభుత్వ అక్రమాలపై కానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ‘నేను గిచ్చినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చెయ్యి’అన్న చందంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. అధికారంలోకి రాగానే.. కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు, మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి పెద్ద పెద్ద హామీలిచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావొస్తున్నా.. ఏ ఒక్క అవినీతి, అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టలేదు, చర్యలు తీసుకోలేదని కిషన్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. -
ఆ రూ.3 వేలు తీసుకోకపోయి ఉంటే.. 26 మంది ప్రాణాలు నిలబడేవి
ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది. ఈ సందర్భంగా ఆ మారణహోమానికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఎన్ఐఏ విచారణలో తేలిన వివరాల ప్రకారం పహల్గాం ఉగ్రదాడి ముందు రోజు (ఏప్రిల్ 21, 2025 రాత్రి) ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఇద్దరు కాశ్మీర్ స్థానికులు ఫర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ ఆశ్రయం కల్పించారు. ఉగ్రవాదుల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చే అవకాశమున్నప్పటికీ, వారు చెప్పలేదు. ఇందుకోసం ఉగ్రవాదుల నుంచి రూ.3,000 తీసుకున్నట్లు విచారణలో బయటపడింది.ఆ రాత్రి ఫైజల్ జాట్ అలియాస్ సులేమాన్ షాక్, హబీబ్ తాహీర్ అలియాస్ జిబ్రాన్, హంజ్జా ఆఫ్గానీ అనే ముగ్గురు ఉగ్రవాదులు ఆయుధాలతో ఆ ఇద్దరి ఇళ్లకు వచ్చారు. వారు ఉర్దూ, పంజాబీ భాషల్లో మాట్లాడుతుండగా, పెద్ద దాడి జరగబోతుందనే విషయం స్థానికులకు అర్థమైంది. సుమారు ఐదు గంటల పాటు అక్కడే గడిపి, భోజనం చేసి, అవసరమైన వంట పాత్రలు, బ్లాంకెట్, టార్పాలిన్ షీట్ తీసుకెళ్లారు.ఏప్రిల్ 22న మధ్యాహ్నం 12:30 వరకు ఫర్వేజ్, బషీర్ ఇళ్ల వద్దే ఉన్న ఉగ్రవాదులు ఆ తర్వాత బైసరీన్ వ్యాలీలో దాక్కున్నారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఫర్వేజ్, బషీర్ పహల్గాంలో టూరిస్టులను గుర్రాలపై బైసరీన్ వ్యాలీకి తీసుకెళ్లారు. అక్కడే మారణహోమం జరిగింది. దాడి జరుగుతున్నా తమకేం పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయారని ఎన్ఐఏ విచారణలో తేలింది. జూన్ 22, 2025న ఎన్ఐఏ ఆ ఇద్దరు స్థానికులను అదుపులోకి తీసుకుని, ఛార్జ్షీట్లో వారి పేర్లను చేర్చింది.ఫర్వేజ్, బషీర్ తీసుకున్న ఆ మూడు వేల రూపాయలే 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఘటన జరిగి ఏడాది గడిచినా, బాధితుల కళ్ల ముందు ఆ దృశ్యాలు ఇంకా కదలాడుతూనే ఉన్నాయని, వారు కన్నీటి పర్యంతమవుతున్నారని తెలుస్తోంది. -
పశ్చిమాసియా యుద్ధంపై రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
బెర్లిన్: శాంతి చర్చల్లో భారత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని.. పశ్చిమాసియా యుద్ధంపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపాలని ఇప్పటికే ఇరుదేశాలను ప్రధాని మోదీ కోరారని గుర్తు చేశారు. బెర్లిన్(జర్మనీ)లోని భారత రాయబార కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పడంలో న్యూఢిల్లీ తన వంతు పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.పశ్చిమాసియా సంక్షోభంలో భారతదేశానికి ఏదైనా పాత్ర ఉందా అన్న ప్రశ్నకు సమాధానంగా రాజ్నాథ్ మాట్లాడుతూ రేపు ఒక సమయం రావచ్చు.. అప్పుడు భారత్ ఈ విషయంలో తన పాత్రను పోషించి విజయం సాధించడం కూడా సాధ్యమేనని తేల్చిచెప్పారు. ‘‘యుద్ధాన్ని ముగించాలని ప్రధాని మోదీ రెండు వైపులా విజ్ఞప్తి చేశారు. దౌత్యపరమైన విషయాల్లో మా ప్రధానికి చాలా సమతుల్యమైన దృక్పథం ఉంది’’ అని రాజ్నాథ్ పేర్కొన్నారు.కాగా, ఇరాన్ అణు శుద్ధి కార్యక్రమంపై తలెత్తిన విభేదాల కారణంగా పాకిస్థాన్లో జరగాల్సిన ఇరాన్-అమెరికా రెండో రౌండ్ శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో రెండు వారాల కాల్పుల విరమణ పొడిగింపును ప్రకటించారు. ఇరుపక్షాలను తిరిగి చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చేసిన అభ్యర్థన మేరకు, ఇరాన్ నాయకులు ఒక ఏకీకృత ప్రతిపాదనతో వచ్చే వరకు దాడులను వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫామ్లో రాసుకొచ్చారు.అయితే, ఈ కాల్పుల విరమణ పొడిగింపును ఇరాన్ త్రోసిపుచ్చింది. ఇది అకస్మాత్తుగా దాడి చేయడానికి సమయాన్ని పొందేందుకు పన్నుతున్న కుట్రగా ఇరాన్ అభివర్ణించింది. ఓడిపోయే పక్షం షరతులు విధించలేదు. దిగ్బంధం కొనసాగితే దానికి సైనికపరమైన సమాధానం తప్పదంటూ ఇరాన్ ప్రతినిధి మహదీ మొహమ్మదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. -
నాలుగేళ్ల తర్వాత గోధుమ రైతులకు గుడ్న్యూస్
దేశ రాజధాని రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో గోధుమల సేకరణ ప్రక్రియను పునప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)ను ఆదేశించింది. 2021-22 సీజన్ నుంచి నిలిచిపోయిన ఈ ప్రక్రియను తక్షణమే తిరిగి ప్రారంభించాలని ఢిల్లీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 24 నుంచి సేకరణ కేంద్రాలు ప్రారంభంతాజా అధికారిక సమాచారం ప్రకారం, 2026 ఏప్రిల్ 24 నుంచి ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో సేకరణ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. నరేలా, నజాఫ్గఢ్ మండిలో రైతుల కోసం ప్రత్యేక సేకరణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతులు తమ పంటను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లే అవసరం లేకుండా ఇంటికి సమీపంలోనే కనీస మద్దతు ధరకు విక్రయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోంది.21,000 మంది రైతులకు లబ్ధిరాజధాని ప్రాంతంలో సుమారు 29,000 హెక్టార్ల విస్తీర్ణంలో గోధుమ సాగు జరుగుతోంది. ఏడాదికి దాదాపు 80,000 మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తి అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఢిల్లీలోని సుమారు 21,000 మంది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ‘రైతు సోదరులు తమ కష్టార్జితానికి సరైన ధర పొందడంతోపాటు ప్రయాణ ఖర్చులు, సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.బలోపేతం కానున్న రేషన్ వ్యవస్థకేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఢిల్లీ ప్రభుత్వం రాసిన లేఖకు తక్షణ స్పందన రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వల్ల రైతులకు లాభం చేకూరడంతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా లభించే ఆహార ధాన్యాల సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.అవసరమైన పత్రాలుసేకరణ కేంద్రాల్లో తమ పంటను విక్రయించాలనుకునే రైతులు ఈ క్రింది ధ్రువీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని అధికారులు సూచించారు.1. భూమి రికార్డులు2. బ్యాంక్ పాస్బుక్3. గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు వంటివి)అప్పుడు ఎందుకు సేకరణ ఆపారంటే..నాలుగేళ్ల క్రితం (2021-22 నుంచి) ఢిల్లీలో గోధుమల కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడానికి ప్రధానంగా కొన్ని పరిపాలనాపరమైన, క్షేత్రస్థాయి కారణాలు ఉన్నాయి. కొన్ని ఏళ్లుగా ఢిల్లీలో ఎఫ్సీఐ నేరుగా కొనుగోలు చేసే కేంద్రాల సంఖ్య తగ్గిపోయింది. దీనివల్ల రైతులు తమ పంటను అమ్ముకోవడానికి పొరుగు రాష్ట్రాలైన హరియాణా, ఉత్తరప్రదేశ్ మండీలకు వెళ్లాల్సి వచ్చేది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొనుగోలు ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పనపై సరైన ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ స్తంభించిపోయింది.2021-22 సమయంలో బహిరంగ మార్కెట్లో గోధుమలకు మంచి ధర లభించడం, ఎగుమతులకు అవకాశం ఉండటంతో రైతులు కూడా ప్రభుత్వ కేంద్రాల వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. దీన్ని సాకుగా చూపి అధికారులు కొనుగోలు కేంద్రాలను క్రమంగా తగ్గించారు. రాజధాని ప్రాంతంలో పట్టణీకరణ పెరగడం వల్ల సాగు భూమి తగ్గుతోందన్న కారణంతో సేకరణ ప్రాధాన్యతను తగ్గించారు. కానీ, ఇప్పటికీ సుమారు 29,000 హెక్టార్లలో సాగు జరుగుతూనే ఉంది. ఈ కారణాల వల్ల గత నాలుగేళ్లుగా రైతులు తమ పంటను మద్దతు ధర కంటే తక్కువకు దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ సేకరణ ప్రారంభించడం వల్ల రైతులకు ఆర్థిక భరోసా లభించనుంది.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
నేటి నుంచే కేదార్నాథ్ దర్శనం
సాక్షి, న్యూఢిల్లీ: కేదార్ నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి విచ్చేసే భక్తుల శివనామ స్మరణతో హిమాలయ పర్వత శ్రేణులు మార్మోగి పోను న్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయ ద్వారాలు బుధవారం ఉదయం 8 గంటలకు భక్తుల దర్శనం కోసం తెరుచుకోనున్నాయి. ఆరు నెలల శీతాకాల విరామం తర్వాత అక్షయ తృతీయ శుభ ఘడియల్లో కేదార్నాథ్ ఆలయం తెరచుకుంటోంది. ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర ఆలయం నుంచి బాబా డోలీ (ఉత్సవమూర్తి) ఇప్పటికే కేదార్నాథ్ ధామ్కు చేరుకున్నారు.ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు భక్తుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 14.5 లక్షల మందికి పైగా భక్తులు చార్ధామ్ యాత్ర కోసం నమోదు చేసుకున్నారు. ఇందులో ఒక్క కేదార్నాథ్ దర్శనం కోసమే 4,95,173 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ 15,000 మంది భక్తులను దర్శనానికి అనుమతించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని ఫోటోలు తీయడం, ఇన్స్టా గ్రామ్ రీల్స్ చేయడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. -
నిప్పుల కొలిమి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో మంగళవారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని బందాలో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. యూపీతోపాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. అదే సమయంలో, ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన టాప్–20 నగరాల్లో 19 మన దేశంలోనివే కావడం గమనార్హం. మరో మూడు రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ సీజన్లో యూపీ, హరియాణా, జార్ఖండ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణానికి మించి వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.వీటితోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇవే పరిస్థితులుంటాయని హెచ్చరించారు. మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన టాప్–20 జాబితాలో యూపీలోని బందా, బిహార్లోని భాగల్పూర్, ఒడిశాలోని తాల్చేర్, పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ నగరాలు న్నాయి. ఇక్కడ 44 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వీటితోపాటు బిహార్లోని బెగుసరాయ్, మోతిహారి, ముంగేర్, భోజ్పూర్, సివాన్లతోపాటు యూపీ, పశ్చిమ బెంగాల్లలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు రికార్డయ్యాయి. టాప్–20 నగరాల్లో మనదేశంలో లేని ఏకైక నగరం నేపాల్లోని లుంబిని మాత్రమే కావడం గమనార్హం. మధ్యప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా భోపాల్లో ‘నైట్ హీట్ వేవ్’(రాత్రిపూట వడగాల్పులు) హెచ్చరికలు జారీ అయ్యాయి. -
మోదీ ఓ ఉగ్రవాది!
చెన్నై: బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. దీంతో ఖర్గే, కాంగ్రెస్లపై బీజేపీ విమర్శల వర్షం కురిపించింది. ఈ విమర్శల దుమారానికి తమిళనాడు ఎన్నికల ప్రచారపర్వం వేదికగా నిలిచింది. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న ఖర్గే మంగళవారం చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘పెరియార్ ఈవీ రామస్వామి, సీఎన్ అన్నాదురై సిద్ధాంతాలను నమ్మే అన్నాడీఎంకే నేతలు ఇప్పుడు ప్రధాని మోదీ పంచన చేరారు. అన్నాడీఎంకే నేతలు అసలు ఎలాంటి వాళ్లో ఇప్పుడు అందరికీ తెల్సివచ్చింది. అన్నాదురై ఫొటో పట్టుకుని ప్రచారంచేసే అన్నాడీఎంకే నేతలు ఏకంగా మోదీతో ఎందుకు పొత్తుపెట్టుకోవాల్సి వచి్చంది? మోదీ ఒక ఉగ్రవాది.ఆయనకు సమానత్వం అంటే అస్సలు గిట్టదు. సమానత్వం, న్యాయం అంటే బీజేపీకి సుతరామూ ఇష్టం ఉండదు. అలాంటి బీజేపీ నేతలతో అన్నాడీఎంకే నేతలు పొత్తుకు సై అన్నారు. అన్నీ తెల్సి పొత్తుకు సిద్ధపడ్డారంటే వీళ్లంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చాలని కంకణం కట్టుకున్నట్టే లెక్క’’అని ఖర్గే అన్నారు. ‘‘ఆరో, ఏడో నంబర్ ఈసీ దరఖాస్తుల ద్వారా ఓటర్ల జాబితాను బీజేపీ తిమ్మినిబమ్మిని చేస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ను మోదీ తన జేబులో వ్యక్తిలా మార్చుకున్నాడు. బీజేపీకి అనుబంధ కార్యాలయంగా ఈసీ తయారైంది. తమిళనాడులో ఎన్నికల ప్రచారం చివరిదిశలో మోదీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.రాజకీయ పార్టీల కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను రంగంలోకి దింపుతున్నారు. ఎన్నికలప్పుడు ఐటీ, ఈడీ దాడులు ఎందుకు ఎక్కువవుతున్నాయి? అందులోనూ ఎంపికచేసిన వ్యక్తుల మీదనే ఎందుకు ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి?’’అని ప్రశ్నించారు. తమిళనాడులో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్కు, రాహుల్గాందీకి మధ్య మనస్పర్థలున్నాయనే వార్తలను ఖర్గే కొట్టిపారేశారు. ‘‘వాళ్లిద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలిసి ఎన్నికల్లో పనిచేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, మణిపూర్ నుంచి ముంబైదాకా అన్ని ప్రాంతాల ప్రజలను రాహుల్ కలుపుకొని పోతున్నారు.కాంగ్రెస్, డీఎంకేలు సొంత లక్ష్యాల విషయంలో విభిన్నంగా ఆలోచిస్తాయికానీ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఉక్కు సంకల్పంతో కలిసి ముందడుగేస్తాయి’’అని ఖర్గే అన్నారు. ‘‘మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం బీజేపీకి లేదు. ఒకవేళ ఉద్దేశం ఉంటే సీట్లు పెంచిన తర్వాతే ఇస్తామనడం ఏంటి? ఇప్పుడే, 543 సీట్లలోనే 33 శాతం అమలుచేయవచ్చుకదా?’’అని సూటి ప్రశ్నవేశారు. ‘‘జనాభా నియంత్రణను సాధిస్తూ ప్రగతిపథంలో ముందుకెళ్తున్న దక్షిణాది రాష్ట్రాలను అణగదొక్కేందుకే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో మోదీ దక్షిణభారత రాష్ట్రాలకు అన్యాయంచేయాలని కుట్ర పన్నారు’’అని ఆరోపించారు. మండిపడిన బీజేపీమోదీనుద్దేశించి ఖర్గే చేసిన ‘ఉగ్రవాది’వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘‘దేశ ప్రధాని పట్ల విపక్ష కాంగ్రెస్ వైఖరి ఏస్థాయిలో ఉందో ఖర్గే మాటలతో స్పష్టమైంది. ఖర్గే పొరపాటున మోదీని ఉగ్రవాది అనలేదు. ఉద్దేశపూర్వకంగానే రాహుల్గాంధీ సూచనలమేరకే ఉగ్రవాది అని సంబోధించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సాహసించామనే అక్కసుతోనే మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలుచేస్తున్నారు.ఇలాంటి నేతలు, పార్టీకి ఓటర్లు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారు’’అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. బీజేపీ ఘాటుగా స్పందించడంతో ఖర్గే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘‘ప్రధాని మోదీ ఎప్పడూ మమ్మల్ని బెదిరిస్తుంటారు. ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి కీలక సంస్థలన్నీ మోదీ చేతుల్లో ఉన్నాయి. మోదీని ఉగ్రవాది అని నేను నేరుగా అనలేదు. విపక్ష పార్టీలను మోదీ బెదిరించి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే అర్థంలోనే ఆ పదం ఉపయోగించా’’అని ఖర్గే అన్నారు. -
వాహనదారులకు అలెర్ట్.. పెట్రోల్కి గుడ్బై?
ఢిల్లీ: వాహనదారులకు అలెర్ట్. పశ్చిమాసియా యుద్ధం కారణంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్రం పెట్రోల్లో ఇథనాల్ కలిపి అమ్మకాలు నిర్వహించేలా డ్రాఫ్ట్ బిల్లు (ప్రతిపాదిత చట్టం) సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, ఆ డ్రాఫ్ట్ బిల్లులో గతంలో చెప్పినట్లుగా పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపి అమ్మకాలు నిర్వహించేలా కాకుండా.. 85శాతం ఇథనాల్.. 15శాతం పెట్రోల్ మాత్రమే వాహనాల్లో వినియోగించేలా కేంద్రం ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. భారత్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 90శాతం విదేశాల నుంచి ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. రానున్న రోజుల్లో చమురు దిగుమతులు తగ్గించుకునేలా ప్రయత్నాలు ప్రారంభించిందిఇదే అంశంపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు సంబంధం ఉన్న సీనియర్ ప్రభుత్వ అధికారులు జాతీయ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ప్రభుత్వం ఇథనాల్ 85 (ఈ85) అంశాన్ని డ్రాఫ్ట్ రూపంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. అంతేకాదు ఇథనాల్ 85పై ఇటు ప్రభుత్వంలో అటు మార్కెట్లో సైతం ఏకాభిప్రాయం ఉంది ప్రాథమిక పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ85 కోసం ఇంజన్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో విడుదలయ్యేందుకు రెండేళ్ల సమయం పడుతుందని అంచనా. మరో అధికారి మాట్లాడుతూ..ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు సైతం 15శాతం పెట్రోల్,85శాతం ఇథనాలు కలిపి అమ్మకాలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న డ్రాఫ్ట్ బిల్లుపై అంగీకారం తెలిపాయని,త్వరలో అధికారిక ప్రకటన చేస్తాయన్న ఆయన.. ‘మార్కెట్ ఏకాభిప్రాయం ఇప్పటికే కుదిరింది. ఈ85 కోసం వాహనాల ప్రాథమిక పరీక్షలు కూడా పూర్తయ్యాయి’అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఈ20 పెట్రోల్కు భిన్నంగా, ఈ85ను ఒక ప్రత్యేక ఇంధన గ్రేడ్గా ప్రవేశపెట్టనున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ20 వేరియంట్లో ఇథనాల్ మిశ్రమాన్ని 27శాతం వరకు కలపవచ్చు. ఇంధన సంక్షోభం మధ్య కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశానికి కీలక మలుపు కానుంది. పెట్రోల్పై ఆధారాన్ని తగ్గించి, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు మద్దతు లభించనుంది. పర్యావరణానికి ప్రయోజనం కలిగించడమే కాకుండా, చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. అయితే, కొత్త ఇంజిన్లు, మౌలిక సదుపాయాలు, వినియోగదారుల అవగాహన వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఈ85 ప్రవేశం భారత ఇంధన రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. -
PM Modi : పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 21న జహాగ్రామ్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభ అనంతరం హెలిప్యాడ్ వైపు వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న దుకాణం వద్ద ఆగి, స్థానిక స్ట్రీట్ ఫుడ్ అయిన ఝల్మురి రుచి చూశారు. అక్కడి ప్రజలతో సరదాగా మాట్లాడారు. ఆ క్షణాల ఫొటోలు, వీడియోలను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు.ఈ సంఘటనతో ఆ దుకాణం యజమాని విక్రమ్ కుమార్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. మోదీ రాకతో నేను ఓవర్నైట్లో ఇంటర్నెట్ సెన్సేషన్గా మారాను అని విక్రమ్ మీడియాతో చెప్పుకొచ్చాడు. ఊహించని విధంగా ప్రజలు తన దుకాణానికి పోటెత్తుతున్నారని, ఫోన్కాల్స్ ఎక్కువై సమాధానం చెప్పలేక ఫోన్ను ఫ్లైట్ మోడ్లో పెట్టాల్సి వచ్చిందని వివరించాడు. కస్టమర్లతో పాటు రీల్స్ తీసుకునేవారు, సెల్ఫీలు దిగేవారు కూడా పెరిగారని చెప్పాడు.ప్రధాని మోదీ కొనుగోలు చేసిన ఝల్మురి ధర కేవలం రూ.10 మాత్రమేనని విక్రమ్ వెల్లడించాడు. మోదీ షేర్ చేసిన వీడియో 24 గంటల్లోపే ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల వ్యూస్, ఫేస్బుక్లో 11 కోట్ల వ్యూస్ దాటింది. అంతేకాదు, ఝల్మురి కోసం గూగుల్లో గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సెర్చ్లు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.ప్రధాని సభ ముగించుకుని హెలిప్యాడ్ వైపు వెళ్తున్నప్పుడు నా స్టాల్ వద్ద ఆగారు. ఝల్మురి ధర ఎంత అని అడిగారు. నా నేపథ్యం, చదువు గురించి తెలుసుకున్నారు. నేను తొమ్మిదో తరగతి వరకు చదివానని చెప్పాను’అని విక్రమ్ గుర్తు చేసుకున్నాడు. తరువాత మోదీ సోషల్ మీడియాలో ‘జహాగ్రామ్లో మసాలా ఝల్మురి రుచి చూశాను’ అని రాశారు. ఆ రోజు ఆయన నాలుగు సభలు నిర్వహించినప్పటికీ, ఈ చిన్న విరామం ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా, మోదీ స్వయంగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ ఒక్క క్షణం వెనుక విక్రమ్ కుటుంబం దీర్ఘ ప్రయాణం ఉంది. 12 ఏళ్ల క్రితం వారు బీహార్ నుంచి జహాగ్రామ్కి వచ్చారు. చిన్న చిన్న స్టాళ్లలో మారుతూ, చివరికి రాజ్ కాలేజ్ మోర్ వద్ద ప్రభుత్వ అనుమతితో 77 అడుగుల స్థలం పొందారు. అక్కడే శాశ్వతంగా ఝల్మురి అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. కుటుంబం జహాగ్రామ్లోని బఛ్ఛుర్దోహా ప్రాంతంలో ఇల్లు కూడా నిర్మించుకుంది. షాపు నుంచే వచ్చే ఆదాయంతో ఆ ఇల్లు నిర్మాణం సాగిందని విక్రమ్ తెలిపారు. ఇప్పుడు తన దుకాణం రద్దీ పెరిగింది. కస్టమర్లతో పాటు నెటిజన్లను ఆకర్షిస్తోంది. Jhalmuri break in Jhargram! pic.twitter.com/LJNjEojAW4— Narendra Modi (@narendramodi) April 19, 2026 -
ఎల్లుండే బెంగాల్ పోలింగ్.. ఈసీ కొత్త ఆంక్షలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఆంక్షలను తెర మీదకు తెచ్చింది. టూవీలర్స్ ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఎన్నికలు జరగబోయే 152 నియోజకవర్గాలకు ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. గురువారం తొలి దఫా పోలింగ్ నేపథ్యంలో.. ఈ రెండ్రోజుల పాటు బైక్ ప్రయాణాలపై నిషేధం విధించింది ఈసీ. సాయంత్రం 6 నుంచి వేకువ జామున 6 దాకా రోడ్లపై బైక్ ఎక్కడానికి వీల్లేదు. అయితే.. అత్యవసరం సేవల కోసం మాత్రమే మినహాయింపు ఉంటుందని ఈసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్య బైక్లు రోడ్ల మీద తిరగవచ్చు. కానీ, ఒంటరిగానే వెళ్లాల్సి ఉంటుంది. అంటే పిలియన్ రైడింగ్(pillion riding) కు అనుమతి లేదన్నమాట. అలాగే.. బైక్ ర్యాలీలకు అస్సలు అనుమతి లేదు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. అయితే.. పగటి పూట పిలియన్ రైడింగ్ విషయంలో టూవీలర్స్ వాహనదారులకు మాత్రం ఈసీ కాస్త ఊరట ఇచ్చింది. పిల్లలను విద్యా సంస్థల్లో దింపడం, వేడుకలకు హాజరు కావడం, మెడికల్ ఎమర్జెన్సీలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఓట్లు వేయడానికి వెళ్లేవారికి కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. పోలింగ్కు విఘాతం కలగవచ్చనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ చెబుతోంది. బెంగాల్లో ఏ ఎన్నికలు జరిగినా.. హింసాత్మక ఘటనలు జరగడం చూస్తున్నదే. అందుకే అక్కడి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బెంగాల్లో ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి తీరతామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఈసీ భావిస్తోంది. అయితే.. బెంగాల్ ఎన్నికల కోసం ఈసీ ఈ కొత్త ఆంక్షలు తేవడం ఇదే తొలిసారి కాదు. 2021 బెంగాల్ ఎన్నికల టైంలోనూ ద్విచక్ర వాహనాలపై ఇలాంటి ఆంక్షలే విధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ ఈసీ ఈ తరహా నిర్ణయమే అమలు చేసింది. -
ఇండియా ఫస్ట్ లగ్జరీ ట్రైన్కు గడ్డు కాలం.. 43 ఏళ్ల చరిత్రలో..
ప్యాలెస్ ఆన్ వీల్స్.. భారతదేశపు మొదటి లగ్జరీ హెరిటేజ్ ట్రైన్.. 1982లో ప్రారంభమైన ఈ విలాసవంతమైన రైలు.. రాజస్థాన్, ఆగ్రా ప్రాంతాల గుండా ప్రయాణిసూ.. 7 రాత్రులు/8 రోజుల పర్యటనలో కవర్ చేస్తోంది. ఎడారులు, కోటలు, చారిత్రక నగరాల గుండా సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు రాజస్థాన్ రాజరిక వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. అయితే, ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా.. ఈ సీజన్లో అంతర్జాతీయ ప్రయాణాల మందగమనం సాగుతోంది.విదేశీ ప్రయాణికులు లేకపోవడంతో ఈ రైలులో క్యాబిన్లు కూడా నిండటం లేదు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిరత, ఉద్రిక్తతలు ప్రపంచ పర్యాటకంపై పడింది. ముఖ్యంగా భారత్లోని పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ సీజన్లో జైసల్మేర్కు జరిగిన చివరి ప్రయాణంలో కేవలం 30 మంది మాత్రమే ప్రయాణించారు. ఈ రైలు సామర్థ్యం 84 మంది కాగా.. చాలా తక్కువ మంది ప్రయాణించారు.పర్యాటక రంగానికి పెద్ద దెబ్బతక్కువ బుకింగ్ల కారణంగా రెండు ప్రయాణాలను ముందుగానే రద్దు చేశారు. నిబంధనల ప్రకారం, రైలు నడవాలంటే కనీసం 14 క్యాబిన్లు బుక్ అవ్వాలి. కానీ ఈ సీజన్లో చాలాసార్లు ఆ సంఖ్య 10 కూడా దాటలేదు సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ప్రణాళిక చేసిన 32 ట్రిప్పులలో 10 ట్రిప్పులు రద్దయ్యాయి, ఇది పర్యాటక రంగానికి పెద్ద దెబ్బగా అధికారులు చెబుతున్నారు.43 ఏళ్ల చరిత్రలో..43 ఏళ్ల చరిత్రలో షెడ్యూల్ చేసిన ప్రయాణాలలో దాదాపు మూడొంతులు రద్దు కావడం ఇది రెండోసారి. గత సీజన్లో కూడా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా 10 ట్రిప్పులు రద్దయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఈ రైలు ఆదరణ క్రమంగా తగ్గుతూ వచ్చింది. టికెట్ ధరలు రూ. 6 లక్షల నుండి రూ.21 లక్షల వరకు ఉండటం కూడా డిమాండ్ తగ్గడానికి ఒక కారణంగా అధికారులు చెబుతున్నారు. యుద్ధ వాతావరణం కారణంగా విదేశీయులు అంతర్జాతీయ ప్రయాణాలు చేయడానికి వెనుకాడుతున్నారు. గతంలో ప్యాలెస్ ఆన్ వీల్స్ 70 నుండి 80 శాతం ఆక్యుపెన్సీతో నడిచేది. కానీ ఈ సీజన్ చివరి ట్రిప్పులో అది కేవలం 26 శాతానికి పడిపోయిందని టూర్ ఆపరేటర్లు అంటున్నారు.రాజస్థాన్ పర్యాటకంపై తీవ్ర ప్రభావంలగ్జరీ రైలు బుకింగ్లు తగ్గడంతో రాజస్థాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. రైలు వచ్చే సమయంలో ప్రదర్శనలు ఇచ్చే స్థానిక జానపద కళాకారులు ఆదాయం కోల్పోయారు. అలాగే, జైసల్మేర్ వంటి నగరాల్లోని హోటళ్లు, గైడ్లు, చిన్న వ్యాపారస్తులు కూడా పర్యాటకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రత్యేకతలు ఏంటంటే..మొఘల్ చక్రవర్తులు, రాజస్థాన్ రాజుల వైభవాన్ని గుర్తు చేసే 'ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలును 1982లో రాజస్థాన్ పర్యాటక అభివృద్ధి సంస్థ (RTDC), భారతీయ రైల్వే సంయుక్తంగా ప్రారంభించాయి. పూర్వం రాజస్థాన్, గుజరాత్ పాలకులు, బ్రిటిష్ వైస్రాయ్లు ప్రయాణించిన అసలైన కోచ్లను ఆధునికీకరించి దీనిని రూపొందించారు. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ లగ్జరీ రైళ్లలో ఒకటిగా పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది.ప్రయాణ మార్గం:ఈ రైలు ఢిల్లీ రైల్వేస్టేషన్(సఫ్దర్జంగ్) నుంచి బయలుదేరి జైపూర్ చేరుకుంటుంది. అనంతరం రెండో రోజు జైపూర్ సిటీ ప్యాలెస్(హవా మహల్, అంబర్ కోట) సందర్శన ఉంటుంది. మూడో రోజు రత్నాంబోర్-ఫతేపుర్ సిక్రి చేరుకుంటుంది. నాలుగో రోజు ఆగ్రా చేరుకుని తాజ్ మహల్ సందర్శన అనంతరం ఖజురాహోకు ఐదో రోజు చేరుకుంటారు. అనంతరం ఆరో రోజు రాత్రి ఢిల్లీకి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. చివరగా ఏడో రోజు మధ్యాహ్నం ఈ ట్రైన్ ప్రయాణం ముగుస్తుంది.రైలులోని సౌకర్యాలు:ప్రతి కోచ్ రాజస్థానీ శైలిలో అలంకరించబడి ఉంటుంది. వై-ఫై, అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయి. 'మహారాజా, 'మహారాణి అనే రెండు అద్భుతమైన రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ ఇండియన్, కాంటినెంటల్, రాజస్థానీ వంటకాలు లభిస్తాయి. ఖరీదైన వైన్, పానీయాలు లభించే బార్, విశ్రాంతి తీసుకోవడానికి లాంజ్ ఉన్నాయి. ప్రయాణ అలసటను పోగొట్టుకోవడానికి ఆయుర్వేద స్పా సౌకర్యం కూడా ఉంది. -
మహిళా రిజర్వేషన్లకు సరికొత్త ‘మార్గం’
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే కీలకమైన ‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల’ అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రత్యేకంగా దృష్టి సారించింది. గతంలో పార్లమెంట్లో ఎదురైన సాంకేతిక, రాజ్యాంగపరమైన ఆటంకాలను అధిగమిస్తూ, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సరికొత్త రూపం ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కేవలం రాజకీయ నినాదంగా కాకుండా, న్యాయస్థానాల్లో నిలబడేలా పటిష్టమైన సవరణలతో బిల్లును మళ్లీ పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏమిటా కొత్త వ్యూహం? ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లు గట్టెక్కాలంటే అదే పాత పద్ధతిలో కాకుండా ‘ప్రత్యామ్నాయ మార్గాల’ను అన్వేషించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం న్యాయ నిపుణులు, రాజ్యాంగ కోవిదులతో ఉన్నత స్థాయి సంప్రదింపులు జరుపుతోంది. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని భవిష్యత్తులో ఎవరూ కోర్టులో సవాల్ చేయకుండా, చేసినా అది వీగిపోకుండా ఉండేలా రాజ్యాంగబద్ధమైన లోపాలను సరిదిద్దడంపై దృష్టి పెట్టింది. గతంలో బిల్లు నిలిచిపోవడానికి కారణమైన వివాదాస్పద అంశాలపై చర్చలు జరపకుండానే, ఒక మధ్యేమార్గం ద్వారా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేసేలా ఏకాభిప్రాయం సాధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా అటు సామాజికంగా, ఇటు రాజకీయంగా వారికి లబ్ధి చేకూరేలా మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. న్యాయ సలహాలు తీసుకోవడంతోపాటు ఇతర పార్టీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని బిల్లులో సవరణలు చేయబోతున్నారు. కోర్టులో గతంలో ఇచ్చిన తీర్పులను అధ్యయనం చేసి లోపాలు లేని ముసాయిదా రూపొందించబోతున్నారు. నిపుణుల కమిటీ కసరత్తు మహిళా రిజర్వేషన్ల విషయంలో సీనియర్ న్యాయ సలహాదారులు ప్రస్తుతం సవరణల ముసాయిదాపై తీవ్ర స్థాయిలో కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచాలన్న ప్రభుత్వ సంకల్పం చెక్కుచెదరలేదని, ఈ విషయంలో చట్టపరమైన చిక్కులు రాకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నామని, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన, రాజ్యాంగబద్ధమైన మార్గాన్ని అన్వేషిస్తున్నామని అధికార పక్షం చెబుతోంది. మొత్తానికి శాసన, పరిపాలన వ్యవస్థలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలన్న దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -
కొండను ఢీకొట్టిన ప్రైవేట్ జెట్
రాయ్పూర్: ఛత్తీస్ఘడ్లో ప్రైట్ జెట్ కుప్పకూలింది. సోమవారం జష్పూర్ జిల్లాలో ఓ ప్రైవేట్ విమానం కొండచరియను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జష్పూర్-నారాయణ్పూర్ అటవీ ప్రాంతంలో విమానం చెట్టును ఢీకొట్టింది. అనంతరం కొండ చరియల్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కొండను ఢీకొట్టడంతో విమానం నుండి దట్టమైన పొగ, మంటలు వెలువడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. Jashpur - Reports of a possible aircraft crash have emerged from the Narayanpur region in Jashpur district of Chhattisgarh. According to preliminary information, an aircraft was seen flying at a low altitude over the hilly terrain before crashing. Thick plumes of smoke have been… pic.twitter.com/fX99UyuirT— NextMinute News (@nextminutenews7) April 20, 2026 -
టీవీకే విజయ్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
సాక్షి, చెన్నై: టీవీకే అధినేత విజయ్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్ ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడిపై మండిపడింది. ఈ మేరకు విజయ్కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.విజయ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెరంబదూర్, తూర్పు తిరుచ్చి ఈ రెండు అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో ఒక చోట రూ.111కోట్లు..మరో చోట రూ.220 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దాఖలైన పిటిషన్లో విజయ్ దాదాపూ 100కోట్ల ఆస్తుల వివరాలు దాచారంటూ కోర్టు తెలిపారు. ఆ పిటిషన్పై మద్రాస్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. విచారణలో ఒక చోట రూ.111కోట్లు ఒక చోట రూ.220 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో ఆస్తుల వివరాల ఎందుకు వెల్లడించారని విజయ్ని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఇది క్లరికల్ పొరటపాటు అనుకోవడానికి వీల్లేదు. రూ.100కోట్ల ఆస్తుల వివరాల్ని ఎందుకు వెల్లడించలేదో వివరణ ఇవ్వాలని విజయ్కు జారీచేసిన నోటీసుల్లో సూచించింది. విజయ్తో పాటు ఆదాయపు పన్ను, ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. Breaking: Madras High Court issues notice on plea alleging discrepancies in actor-politician Vijay’s election affidavits; seeks response from authorities including Election Commission. Court says "This is an irregularity. More than 100 crores not disclosed in one of the… pic.twitter.com/b09BhWcCng— Bar and Bench (@barandbench) April 20, 2026 -
రాజస్థాన్ రిఫైనరీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
జైపూర్ : రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మరికొన్ని గంటల్లో ప్రధాని మోదీ చేతులు మీదిగా ప్రారంభం కానున్న ఆయిల్ రిఫైనరీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధాని మోదీ మంగళవారం (ఏప్రిల్ 21, 2026) రాజస్థాన్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన బలోత్రాలోని పచ్పద్రలో దేశపు తొలి గ్రీన్ఫీల్డ్ సమీకృత రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను దేశానికి అంకితం చేయనున్నారు. రూ.79,450 కోట్లకు పైగా పెట్టుబడితో చేపట్టిన ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్ భారత్ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అంచనా. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే,ఇప్పుడీ ఈ రిఫైనరీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్న తొలి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్.ఇందులో క్రూడ్ ఆయిల్ను రిఫైన్ చేయడమే కాకుండా,పెట్రోకెమికల్ ఉత్పత్తులు తయారు కానున్నాయి. #WATCH | Rajasthan: Fire broke out at Refinery-cum-Petrochemical Complex at Pachpadra in Balotra. Firefighters have arrived at the refinery to control the fire. More details awaited. pic.twitter.com/q7ztFGVbAA— ANI (@ANI) April 20, 2026 -
బాధాకరమే.. పరాజయం కాదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ మహిళా వ్యతిరేకి అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయడానికి తాము చేసిన ప్రయత్నాలను ఆ పార్టీ ఆడ్డుకుందని విమర్శించారు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళలకు వారి న్యాయమైన హక్కును కల్పించే ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. కిరణ్ రిజిజు శనివారం మీడియాతో మాట్లాడారు. బిల్లు ఆమోదం పొందకపోవడం బాధాకరమే అయినప్పటికీ దీన్ని తాము పరాజయంగా భావించడం లేదన్నారు.మహిళల హక్కులను హరించివేసిన కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోందని, అందుకు మహిళలు ఆ పార్టీకి తగిన గుణపాఠం నేర్పిస్తారని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందన్నారు. మహిళలకు హక్కులను దూరం చేసి, అది విజయంగా భావించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక మనస్తత్వం బట్టబయలైందని, అది ఆ పార్టీకి ఒక నల్ల మచ్చ అని వ్యాఖ్యానించారు. ఆడబిడ్డల మనోభావాలను కాంగ్రెస్ గాయపర్చిందని మండిపడ్డారు. దేశంలో మహిళలకు గౌరవం ఇవ్వాలని, వారికి సాధికారత కల్పించాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టంచేశారు. మహిళల బాగు కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని బలవంతం చేయలేం రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేయడానికి ప్రభుత్వం, అధికార కూటమి తీవ్రంగా ప్రయత్నించాయని.. చివరకు సఫలం కాలేకపోయాయని కిరణ్ రిజిజు చెప్పారు. ఒక బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలంటూ ప్రతిపక్షాన్ని భౌతికంగా బలవంతం చేయలేమన్నారు. పార్లమెంట్లో బిల్లులపై ఓటింగ్ ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుందని తెలిపారు. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో లోక్సభలో 12 బిల్లులు, రాజ్యసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. లోక్సభ ఉత్పాతకత 93 శాతం, రాజ్యసభ ఉత్పాదకత 110గా నమోదైందని అన్నారు. -
మహిళలు క్షమించరు!
న్యూఢిల్లీ: నారీ శక్తికి చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం దక్కాలన్న పవిత్రమైన ఆశయంతో తెచ్చిన మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఓడించిన పాపం పూర్తిగా విపక్షాలదేనంటూ ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. వాటి ముసుగు తొలగి అసలు రంగు బయట పడిందన్నారు. ‘‘మా ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ప్రయత్నించినా బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందలేకపోయాం. ఇందుకు దేశ మహిళలందరితో పాటు నేను కూడా ఎంతగానో దుఃఖిస్తున్నా. వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా’’అని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమల్లోకి తెచ్చేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు శుక్రవారం లోక్సభలో వీగిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని శనివారం రాత్రి జాతినుద్దేశించి 30 నిమిషాల పాటు ప్రసంగించారు. ‘‘కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ తదితర విపక్షాలు దేశ మహిళల చిరకాల ఆకాంక్షను అత్యంత కర్కశంగా నలిపేశాయి. బిల్లును ఓడించడం ద్వారా భ్రూణ హత్యకు పాల్పడ్డాయి. పైగా అందుకు నిండు సభలోనే సంబరాలు చేసుకున్నాయి. బల్లలను చరుస్తూ హర్షాతిరేకాలు వెలిబుచ్చాయి. మహిళల ఆత్మగౌరవాన్ని అత్యంత దారుణంగా గాయపరిచాయి’’అంటూ తూర్పారబట్టారు. మహిళల ఆకాంక్షలను ఆ పార్టీలు కాలరాసిన తీరును దేశ పౌరులంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. ‘‘విపక్షాల పాపానికి ఎన్నటికీ నిష్కృతి లేదు. అందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు. మహిళా శక్తిని విపక్షాలు తేలిగ్గా తీసుకుంటున్నాయి. కానీ భారత మహిళ దేన్నయినా మర్చిపోతుందేమో గానీ తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే మాత్రం సహించబోదు. రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, సమాజ్వాదీ తదితర పార్టీలు తలపెట్టిన ద్రోహాన్ని మహిళలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అవి ఎన్నటికీ మర్చిపోలేని రీతిలో గట్టి గుణపాఠం చెప్పి తీరతారు’’అని మోదీ స్పష్టం చేశారు. మహిళా సాధికారతకు పట్టం కట్టేందుకు జరుగుతున్న కృషి విపక్షాల స్వార్థ రాజకీయాల కారణంగా నిలిచిపోయే పరిస్థితి నెలకొందంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘లోక్సభలో మాకు సంఖ్యా బలం లేకపోయింది. అయినా నిరాశ పడబోం. మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు, రిజర్వేషన్ల చట్టం సత్వర అమలుకు బీజేపీ, ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధితో పోరాడుతూనే ఉంటాయి. ఆ మార్గంలో నెలకొన్న ప్రతి అడ్డంకినీ తొలగించి తీరతాం’’అని ప్రకటించారు. ‘‘పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి అవసరమైన 66 శాతం ఓట్లను మేం సాధించలేకపోవచ్చు. కానీ దేశ మహిళల ఆశీర్వాదాలు మాత్రం 100 శాతం మాతోనే ఉన్నాయి’’అని ప్రధాని పేర్కొన్నారు. పునాదులు కదులుతాయని భయం! కుటుంబాల చెప్పుచేతుల్లో నడిచే కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ వంటి పార్టీలు మహిళల ఎదుగుదలను సహించలేవని మోదీ ఆరోపించారు. ‘‘మహిళలను ఎదగనిస్తే తమ స్వార్థ రాజకీయ పునాదులు పూర్తిగా కదిలిపోతాయని వాటి భయం. అధికారం ఎప్పటికీ తమ కుటుంబానికే పరిమితం కావాలని కోరుకుంటాయి. తమ కుటుంబంలోని మహిళలు తప్ప దేశ మహిళల రాజకీయ ఎదుగుదల సహించలేవు’’అంటూ ఎద్దేవా చేశారు. జనాభాలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో కూడా సముచిత ప్రాధాన్యం దక్కడం తక్షణావసరమని ఆయన పునరుద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్ల అంశం 40 ఏళ్లుగా పెండింగ్లోనే ఉందని గుర్తు చేశారు. ‘‘అందుకే మహిళల సమున్నత ఆకాంక్షలకు రెక్కలు తొడిగే ఉదాత్త లక్ష్యంతోనే సవరణ బిల్లు తెచ్చాం. ఆ క్రమంలో ఎవరికీ ఎలాంటి అన్యాయమూ జరగకుండా జాగ్రత్త పడ్డాం. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర... ఇలా ప్రాంతాలవారీగా సమతుల్యతతో దెబ్బతినకుండా నిజాయతీతో కృషి చేశాం. లోక్సభలో ప్రతి రాష్ట్రానికీ ప్రస్తుతమున్న ప్రాతినిధ్యం సంఖ్యాపరంగానే గాక నైష్పత్తికంగా కూడా యథాతథంగా కొనసాగేలా చూశాం. ఇదే విషయాన్ని విపక్షాలన్నింటికీ పదేపదే చెప్పాం. అయినా దేశ హితం, మహిళా సాధికారత కంటే స్వార్థానికే అవి పెద్దపీట వేశాయి. బిల్లును ఓడించడం ద్వారా రాజ్యాంగాన్ని కూడా అవమానించాయి. రాజ్యాంగం ముందు, దేశ మహిళా శక్తి ముందు నేరస్తులుగా నిలబడ్డాయి’’అంటూ మండిపడ్డారు. ‘‘లోక్సభ స్థానాల పెరుగుదలతో తమిళనాడు, పశ్చమబెంగాల్ గొంతుకను పార్లమెంటులో మరింతగా విన్పించే సువర్ణావకాశం అక్కడి అధికార పార్టీలు డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్కు వచ్చింది. దాన్ని అవి కాలదన్నాయి’’అంటూ ప్రధాని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘21వ శతాబ్దపు మహిళలు దేశంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్నీ నిశితంగా గమనిస్తున్నారు. విపక్షాల అసలు ఉద్దేశాలను వారు అర్థం చేసుకుంటున్నారు’’అంటూ హెచ్చరించారు. పరాన్నజీవిలా కాంగ్రెస్! కాంగ్రెస్పై ప్రధాని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. దేశ ప్రగతికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ ఆ పార్టీది ఆది నుంచీ ప్రతికూల భావజాలమేనంటూ దుయ్యబట్టారు. దేశ వెనకబాటుకు, అది ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ కాంగ్రెసే ఏకైక కారణమని ఆరోపించారు. ‘‘సంస్కరణలకు కాంగ్రెస్ నిత్య వ్యతిరేకి. ఆ పేరు వింటేనే ఉలిక్కిపడుతుంది. జాతి నిర్మాణానికి, మెరుగుదలకు ఉద్దేశించి ప్రతి ప్రయత్నాన్నీ అడ్డుకుంటూ వచ్చిన చరిత్ర కాంగ్రెస్ది. దశాబ్దాలుగా ప్రతి సంస్కరణనూ వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంది. జన్ధన్ యోజన మొదలుకుని ఆధార్, డిజిటల్ చెల్లింపులు, జీఎస్టీ దాకా ఇందుకు తార్కాణాలెన్నో. ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లను, ఆర్టికల్ 370, త్రిపుల్ తలాక్ రద్దునూ కాంగ్రెస్ గుడ్డిగా వ్యతిరేకించింది’’అంటూ ఆక్షేపించారు. ‘‘దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నానాటికీ బలహీనపడుతోంది. ప్రజాదరణ, సొంత బలం కోల్పోయి ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి పరాన్నజీవిలా మనుగడ సాగిస్తోంది. కానీ ఆ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ బలోపేతం కావొద్దని కోరుకుంటోంది’’అంటూ ఎద్దేవా చేశారు. ‘‘మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా 40 ఏళ్లుగా కాంగ్రెస్ గుడ్డి వ్యతిరేకిస్తోంది. సవరణ బిల్లుకు మద్దతిచ్చి ఆ తప్పిదాలను సరిచేసుకుంటుందని, కొత్త చరిత్ర లిఖిస్తుందని ఆశించా. కానీ ఆ చరిత్రాత్మక అవకాశాన్ని కాంగ్రెస్ పోగొట్టుకుంది. ఆ పార్టీ నమ్ముకున్నది విభజన రాజకీయాలను మాత్రమే. అందుకే ఉత్తరాది, దక్షిణాది విభజన అంటూ డీలిమిటేషన్పై అవాస్తవాలను ప్రచారం చేసింది’’అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రతికూల భావజాలానికి దేశ మహిళలు తగిన రీతిలో బదులిచ్చి తీరతారని హెచ్చరించారు. -
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన మూడోదశ 2028 వరకు కొనసాగింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం 83,977 కోట్ల రూపాయల కేటాయింపులు జరుగుతాయి. భారత్ మ్యారీ టైం ఇన్సురెన్స్ పూల్ ఏర్పాటు ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.నిరంతర సముద్రయాన బీమా కవరేజీ కోసం 12,980 కోట్ల రూపాయలు కేటాయింపులు ఉంటాయి. ప్రపంచ అస్థిరత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నౌకల బీమా కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. యుద్ధ ప్రమాద నష్టాలను కవర్ చేసేలా బీమా ఉంటుంది.రాజమండ్రి (నిడదవోలు)-(దువ్వాడ) మధ్య 3, 4వ రైల్వే లైన్ ట్రాక్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 198 కిలోమీటర్ల రూట్లో, 458 కిలో మీటర్ల ట్రాక్ ఏర్పాటు కానుంది. 9,889 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.మరిన్ని కీలక నిర్ణయాలుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అదనపు డీఏ నిధుల విడుదలకు క్యాబినెట్ ఆమోదం ఈ ఏడాది జనవరి నుంచి అదనంగా పెరిగిన రెండు శాతం డీఏడీఏ పెంపుతో ఖజానాపై 6,791 కోట్ల రూపాయల అదనపు భారం 50.46 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు,68.27 శాతం పెన్షన్ దారులకు ప్రయోజనంఘజియాబాద్, సీతాపూర్ థర్డ్ , ఫోర్త్ రైల్ లైన్ విస్తరణకు 14,926 కోట్ల రూపాయలు -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
సాక్షి, ఢిల్లీ: కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డియర్ అలవెన్స్ను 2 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఉద్యోగుల వేతనాలపై 8వ వేతన కమిషన్ ప్రతిపాదనలు ఇంకా పరిశీలనలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో DA పెంపు ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా చెప్పొచ్చు. తాజా పెంపుతో డీఏ ప్రస్తుతం 60 శాతానికి చేరింది. ఈ ఏడాది జనవరి నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనుంది. ఒకవైపు ఉద్యోగ సంఘాలు 8వ వేతన కమిషన్ కింద వేతన నిర్మాణంలో పెద్ద మార్పులు కోరుతూ.. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.83గా పెంచాలని, కనీస బేసిక్ పే రూ.18,000 నుంచి రూ.69,000కి పెంచాలని ప్రతిపాదించాయి. అలాగే, వేతన లెక్కల్లో ఆధారపడిన తల్లిదండ్రులను కూడా ‘కుటుంబం’ నిర్వచనంలో చేర్చాలని.. వేతన వ్యత్యాసానికి పరిమితి పెట్టాలని, ద్రవ్యోల్బణానికి అనుసంధానంగా అలవెన్సులు ఇవ్వాలని సూచిస్తున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు, కేంద్రం సముద్ర రవాణా రంగానికి కూడా పెద్ద ఊరట ఇచ్చింది. సావరిన్ మారిటైం ఫండ్ పేరుతో రూ.13,000 కోట్ల నిధిని కేబినెట్ మీటింగ్లో ఆమోదించింది. దీని ద్వారా భారత్ నుంచి బయలుదేరే నౌకలకు స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఇన్సూరెన్స్ అందించనుంది. ఇది సముద్ర రవాణా రంగానికి భద్రతా పరంగా కీలకంగా మారనుంది.గ్రామీణ రహదారి అభివృద్ధి కోసం కూడా కేంద్ర మంత్రి మండలి మరో నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY)ను 2028 వరకు పొడిగించింది. అదనంగా రూ.3,000 కోట్ల కేటాయింపును ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడటానికి ఇది తోడ్పడనుంది. -
బిల్లు వీగిపోవడమంటే బీజేపీ ఓడిపోవడమే: రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిపోయిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిన్న సవరణతో మహిళా రిజర్వేషన్లు పెంచవచ్చు. సీట్లు పెంచడానికి మహిళా రిజర్వేషన్లు ముసుగు వేశారని మండిపడ్డారు. బీజేపీ విధానాలకి ఓటమి ఇది అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘దక్షిణ భారతానికి జరిగే అన్యాయాన్ని అడ్డుకున్నాం. మహిళా బిల్లు చాటున డీలిమిటేషన్ బిల్లును తెచ్చారు. ఎన్డీయే నిజాయితీగా బిల్లును తీసుకురాలేదు. బిల్లు వీగిపోవడం అంటే బీజేపీ ఓడిపోవడమే. బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని కాలరాయాలని చూసింది. ప్రధాని మోదీ కుట్రలను కాంగ్రెస్ సమర్థవంతంగా అడ్డుకుంది. దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలను కాంగ్రెస్ ఎండగట్టింది. ఇది రాజకీయ విధానాల ఓటమి కాదు.. బీజేపీ విధానాల ఓటమి. రాజ్యాంగం మార్చడానికి, రిజర్వేషన్లు రద్దు చేసేందుకు అబ్ కీబార్ చార్ సౌ అన్నారు బీజేపీకి 400 సీట్లు ఇచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తే రేపే మద్దతు ఇస్తాం. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా పెట్టాలి. హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ జరగాలి అని వ్యాఖ్యలు చేశారు. 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎంతో మంది మహిళా నేతలను కాంగ్రెస్ తయారుచేసింది’ అని చెప్పుకొచ్చారు. -
బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పండి
ఢిల్లీ: బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు పరిశ్రమ) ఏర్పాటు చేయాలని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రీన్స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుందని తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం ఉదయం సమావేశమయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్–2047 విజన్లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను సీఎం కేంద్ర మంత్రులకు వివరించారు. తెలంగాణలో పాత వాహనాల స్క్రాప్తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులను సీఎం కోరారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, భారీ పరిశ్రమలు, పారిశ్రామిక ఉత్పత్తికి ఉన్న అనుకూలతల వలన దేశ పారిశ్రామిక ఉత్పత్తి లక్ష్యాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలవగలదని కేంద్ర మంత్రులకు సీఎం వివరించారు.హైదరాబాద్లో హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అలాగే మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు సీఎం విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ను 2034 నాటికి కాలుష్యం లేని నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థలను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు సీఎం విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. -
విపక్షాలు శిక్ష అనుభవించక తప్పదు: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు పెద్ద తప్పు చేశాయని అన్నారు. శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు పెద్ద తప్పు చేశాయి. కోట్ల మంది మహిళలకు విపక్షాలు సమాధానం చెప్పాలి. రాబోయే రోజుల్లో ఆ పార్టీలు శిక్ష అనుభవించక తప్పదు’’ అని అన్నారు. పండుగ చేసుకుంటున్నారా?: కిరణ్ రిజిజుమహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం ఘోరమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కాంగ్రెస్తో పలుమార్లు సంప్రదింపులు జరిపాం. అయినా అడ్డుకున్నారు. మహిళా బిల్లును అడ్డుకుని పండుగ చేసుకోవడం దుర్మార్గం. ఈ బిల్లు ఎలా అప్రజాస్వామికమో రాహుల్ గాంధీ చెప్పాలి అని కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. మూడు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన కేంద్రం.. మహిళా రిజర్వేషన్లతో పాటు డీలిమిటేషన్ సంబంధిత మొత్తం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే శుక్రవారం సాయంత్రం రాజ్యాంగ సవరణ-131పై లోక్సభలో ఓటింగ్ జరగ్గా మెజారిటీ చేరుకోలేక ఆ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. మహిళా రిజర్వేషన్లకు తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని.. ఎన్డీయే ప్రభుత్వం రాజకీయానికి దిగిందని.. డీలిమిటేషన్ అంశాన్ని ఈ రిజర్వేషన్లతో ముడిపెట్టడంతోనే ఓడించామని విపక్షాలు చెబుతున్నాయి. అయితే డీలిమిటేషన్తో ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగదని.. మహిళా రిజర్వేషన్ల విషయంలో తాము చిత్తశుద్ధితోనే వ్యవహరించామని ఇటు కేంద్రం అంటోంది. -
నేడు కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ.. ఏం జరగనుంది?
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ శనివారం అత్యవసరంగా సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఉదయం 11.30 గంటలకు సమావేశం జరగనుంది. తాజా రాజకీయ పరిస్థితులను సమీక్షించడంతో పాటు సమావేశంలో పలు ‘కీలక నిర్ణయాలు’ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని పలు జాతీయ ఛానళ్లు, వార్తా సంస్థలు కథనాలు వెలువరించాయి.దాంతో మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలపై ఆర్డినెన్స్ తేవడం వంటి చర్యలు ఉండొచ్చంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు వంటి పలు కీలక నిర్ణయాలను మోదీ సర్కారు ఇలాంటి అత్యవసర కేబినెట్ సమావేశాల్లోనే తీసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాటి భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సమావేశ ఎజెండాను కేంద్రం వెల్లడించలేదు.ఎన్డీయే నేతల సమీక్ష: మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు వీగిపోవడానికి దారితీసిన కారణాలపై అధికార ఎన్డీయే కూటమి సమీక్ష చేపట్టింది. శుక్రవారం రాత్రి లోక్సభలో ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్డీఏ పక్షాల పార్లమెంటరీ పార్టీ నేతలు సమావేశమయ్యారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్రాం మేఘ్వాల్తో పాటు లలన్సింగ్ (జేడీ–యూ), జయంత్ చౌదరి (ఆరెల్పీ), చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేజీ–ఆర్వీ), కింజరాపు రామ్మోహన్నాయుడు (టీడీపీ) తదితరులు వారిలో ఉన్నారు. -
దక్షిణాది ప్రాతినిధ్యానికి కోత దేశద్రోహమే: రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేవలం అధికారంలో కొనసాగడం కోసం దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలకు, చిన్న రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్ నిజానికి దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చే కుట్ర. ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యే’’అంటూ దుయ్యబట్టారు. రాజ్యాంగ (131వ) సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల బిల్లులపై శుక్రవారం లోక్సభలో జరిగిన చర్చలో రాహుల్ సుదీర్ఘంగా మాట్లాడారు. సవరణ బిల్లును ‘చాలా ప్రమాదకరమైనది’గా అభివర్ణించారు. ‘‘మోదీ సర్కారు పూనుకున్న ఈ దేశ వ్యతిరేక చర్యకు విపక్షాలు మద్దతిచ్చే ప్రసక్తే లేదు. సవరణ బిల్లును ఓడించి తీరతాయి’’అని పేర్కొన్నారు. అది ఆమోదం పొందదని బీజేపీకి కూడా తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను, ప్రధాని మోదీ తీరును ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఎండగట్టారు. దళితులు, ఓబీసీలకు అన్యాయం కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది అసలు మహిళా బిల్లు కానే కాదని రాహుల్ కొట్టిపారేశారు. ‘‘నిజమైన మహిళా బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని పదేళ్ల తర్వాత అమలు చేస్తామని బీజేపీ చెబుతోంది. ఇది కేవలం మహిళల మాటున దాక్కుని దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేందుకు చేసిన సిగ్గుమాలిన చర్య! జమ్మూకశ్మీర్లో, అస్సాంలో బీజేపీ ఇదే పని చేసింది. దాన్నిప్పుడు దేశమంతటా అమలు చేసే పనిలో పడింది. వారికి దమ్ముంటే పాత బిల్లును ఇప్పుడే తేవాలి. దాన్ని ఈ క్షణం నుంచే అమలు చేసేలా విపక్షాలన్నీ మద్దతిస్తాయి’’అని సవాలు చేశారు. ఓబీసీలు, దళితులకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించకుండా వారిని అధికారానికి దూరం చేయడమే బీజేపీ ఉద్దేశమని రాహుల్ ఆరోపించారు. అందుకే కులగణనకు ముందే హడావుడిగా బిల్లు తెచ్చిందని ఆక్షేపించారు. ‘‘బీజేపీ నేతలు ఓబీసీలను, దళితులను హిందువులని పిలుస్తారు. కానీ దేశ అధికార నిర్మాణంలో వారికి కనీస స్థానమివ్వరు! కార్పొరేట్ రంగంలో, న్యాయవ్యవస్థలో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, మీడియాలో దళితులు, ఓబీసీలు ఎక్కడున్నారు?’’అంటూ నిలదీశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ’మనువాదాన్ని’తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. దక్షిణాది, ఈశాన్య ప్రజలకు అండగా కాంగ్రెస్ దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని రాహుల్ అన్నారు. ‘‘అక్కడి సోదరసోదరీమణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత సమాఖ్యలో మీరంతా సమాన భాగస్వాములే. లోక్సభలో మీ ప్రాతినిధ్యాన్ని తాకే సాహసం చేయడానికి బీజేపీని అనుమతించబోం’’అని చెప్పారు. ‘‘గతంలో ఇందిరాగాం«దీ, వాజ్పేయి వంటి ప్రధానులు కూడా డీలిమిటేషన్ సవాలును ఎదుర్కొన్నారు. కానీ దానివల్ల దేశానికి జరిగే ప్రమాదాన్ని గుర్తించి వెనక్కి తగ్గారు’’అని ఆయన గుర్తు చేశారు. ‘16’లోనే అంతా దాగుంది! ప్రసంగం సందర్భంగా దేశ ప్రజలకు రాహుల్ గాంధీ ఒక పజిల్ ఇచ్చారు. ‘‘నిన్న లోక్సభలో ప్రధాని ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనించా. ఆయనలో ఉత్సాహమే లేదు. ఎందుకంటే ఈ బిల్లు పాస్ కాదని ఆయనకు తెలుసు. అంతలో తేదీ చూసి ఆశ్చర్యపోయా! అది ఏప్రిల్ ‘16’. అసలు మర్మమంతా అందులోనే దాగుంది! మీ సమస్యలన్నింటికీ సమాధానం ‘16’లోనే దొరుకుతుంది. అదేమిటో ఎవరికైనా అర్థమైతే ఎక్స్లో నాకు మెసేజ్ చేయండి’’అంటూ సభికుల్లో ఆసక్తి రేకెత్తించారు. మోదీ ఓ మాంత్రికుడు! ప్రధాని మోదీపై లోక్సభలో రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయనను బాలకోట్, సిందూర్, పెద్ద నోట్ల రద్దు మాంత్రికునిగా అభివర్ణించి సభలో కలకలం రేపారు. ‘‘ఒక బడా వ్యాపారవేత్తతో మోదీ కుమ్మక్కయ్యారు. ఈ మాంత్రికుని చరిత్ర, ప్రధాని అయ్యేదాకా జరిగిన ప్రతి విషయమూ ఆ బడా వ్యాపారవేత్తకు పూర్తిగా తెలుసు. ఆ రహస్యాల సాయంతోనే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. అమెరికాతో పలు ఒప్పందాలు కూడా ప్రధానిగా మోదీ రాజీ పడటం వల్లే జరిగాయి’’అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. అభ్యంతరకర పదాలు వాడినందుకు ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని మంత్రులు రాజ్నాథ్సింగ్, కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. బాలాకోట్, సిందూర్ ప్రస్తావనతో సాయుధ దళాలను రాహుల్ అవమానించారని దుయ్యబట్టారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. మోదీకి, నాకు భార్య బాదరబందీ లేదు లోక్సభలో నవ్వులు పూయించిన రాహుల్ మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుపై ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీని, తనను ఉద్దేశించి రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరికీ భార్య తాలూకు బాదరబందీ లేదంటూ సభలో నవ్వులు పూయించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు చేసిన సరదా వ్యాఖ్యలు ఇందుకు నేపథ్యమయ్యాయి. ‘‘కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ ఆయన భార్యపై అందమైన కవిత అల్లారు. దాంతో నా భార్య తనకోసం నేనలా కవిత చెప్పలేదని నాపై అలిగింది’’అని రిజిజు చెప్పుకొచ్చారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ, ‘‘జాతి నిర్మాణంలో మహిళలే ప్రధాన చోదక శక్తి. మగవాళ్లను వాళ్లెంతగానో ప్రభావితం చేస్తారు. తల్లి, సోదరి, భార్య నుంచి ఎంతో నేర్చుకుంటాం. అయితే ప్రధానికి, నాకు భార్య బాదరబందీ లేదనుకోండీ! కాకపోతే తల్లి, సోదరి ఉన్నారు’’అనడంతో సభికులంతా గొల్లున నవ్వారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపైనా ఈ సందర్భంగా రాహుల్ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘గురువారం సభలో నా సోదరి ప్రియాంక గొప్పగా ప్రసంగించింది. ఆ క్రమంలో 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను సాధించలేని దాన్ని తను కేవలం ఐదే నిమిషాల్లో చేసి చూపించింది. అదేమిటో తెలుసా? అమిత్ షాను నవ్వించడం!’’అనడంతో సభంతా మరోసారి నవ్వుల్లో మునిగిపోయింది. ఏమిటా ‘16 పజిల్’? లోక్సభలో ప్రసంగం సందర్భంగా రాహుల్ పేర్కొన్న ‘16 పజిల్’ఏమై ఉంటుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు మర్మమంతా 16 సంఖ్యలోనే దాగుందని, అదేమిటో ఎవరికైనా అర్థమైతే చెప్పాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పలు ఊహాగానాలకు తెర తీశాయి. బహుశా అధికార ఎన్డీఏ కూటమికి చెందిన 16 మంది టీడీపీ లోక్సభ సభ్యులు రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారన్నది ఆయన ఉద్దేశం కావచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. 16 సంఖ్య ‘ఎప్స్టీన్’లా ధ్వనిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేసింది. తద్వారా, ఆ సెక్స్ కుంభకోణానికి సంబంధించి విడుదలైన 16 నిమిషాల వీడియో టేప్ను ఉద్దేశించి రాహుల్ ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని సంకేతమిచ్చింది. -
మతాచారాలపైనా న్యాయ సమీక్ష
న్యూఢిల్లీ: మతాచారాలపై కూడా న్యాయ స్థానాలు సమీక్ష చేపట్టవచ్చని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇలాంటి సందర్భాల్లో న్యాయమూర్తులు తమ వ్యక్తిగత నమ్మకాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై తీర్పులిచ్చేటప్పుడు అంతరాత్మ సాక్షిగా, విస్తృత రాజ్యాంగ చట్రాన్ని మాత్రమే మార్గదర్శకంగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంతోపాటు వివిధ ప్రార్థనా స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలో ఏర్పాటైన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్, ప్రస్తుత అంశం కేవలం హిందూ ఆచారాలకు లేదా శబరిమలకు సంబంధించింది కాదన్నారు. అన్ని మతాలు, విశ్వాసాలు, మనస్సాక్షికి సంబంధించిన అంశాలను నియంత్రించే రాజ్యాంగ చట్రానికి సంబంధించిందని ధావన్ అన్నారు. సమాజంలో విభేదాలు ఉన్నప్పుడు వాటి మధ్య సామరస్యం సాధించడమే న్యాయస్థానం లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఏ వ్యక్తి అయినా ఒక మతాన్ని ప్రశ్నించవచ్చు కానీ, అది గౌరవప్రదమైనది, నిజాయతీతో కూడినదై ఉండాలన్నారు. మతాచారాలను సమీక్షకు గురిచేయడం చాలా అయోమయానికి తావిచ్చే అంశమని ధావన్ అభిప్రాయపడ్డారు. శబరిమల ఆచార సంరక్షణ సమితి తరఫున సీనియర్ లాయర్ వి.గిరి వాదనలు వినిపిస్తూ..శబరిమల ఆలయంలోకి 10–50 ఏళ్ల మహిళలను మినహాయించాలన్న ఉమ్మడి వివేకం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రతి ఆలయానికి కొన్ని విశిష్ట ఆచారాలుంటాయని ఆరాధనలో అవి కూడా భాగంగా కొనసాగుతుంటాయని గిరి తెలిపారు. ఇటువంటి వాటన్నిటినీ ఒకే గాటనకట్టి ఆర్టికల్ 25(1) హక్కును ఇవి ఉల్లంఘిస్తున్నాయా, బలపరుస్తున్నాయనా అని చూడటం సరికాదని తెలిపారు. ‘ఆర్టికల్ 25(1) ప్రకారం, నేను అనుసరించే మతాన్ని, అంటే విగ్రహారాధనతో సహా హిందూ మతాన్ని ఆచరించడమే నా ప్రాథమిక హక్కు అని’ పేర్కొన్నారు. అంతకుమునుపు, ఆత్మన్ ట్రస్ట్ తరఫున లాయర్ ఎంఆర్ వెంకటేశన్..‘రుతుస్రావం సమయంలో మహిళలు స్వచ్ఛందంగా దేవాలయాల్లోకి, పూజా మందిరాల్లోకి ప్రవేశించరు. అది క్రమశిక్షణ, విశ్వాసంతో పెనవేసుకుపోయిన ఆచారం. ఇందులో వివక్షకు తావులేదు. దీనికి శాస్త్రీయ వివరణ ఇవ్వలేను. శాస్త్రం ముగిసినప్పుడు నమ్మకం మొదలవుతుంది’అని తెలిపారు. కాగా, ఈ అంశంపై ఐదు రోజులపాటు జరిగిన విచారణ వచ్చే వారం కూడా కొనసాగనుంది. -
నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మహిళా రిజర్వేషన్లను ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నా యని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. మహిళల హక్కులకు ఎవరు అ డ్డుపడుతున్నారో దేశ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మహిళలే వారికి బుద్ధి చెబుతారని స్పష్టంచేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల హేతుబద్దీకరణకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాలలో దాదాపు 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అన్ని స్థానాల్లో ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉండేలా చేయడం డీలిమిటేషన్తో సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై శుక్రవారం లోక్సభలో జరిగిన చర్చకు అమిత్ షా సమాధానమిచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజన హక్కును ప్రజలకు దక్కకుండా చేసిందని, ఇప్పటికీ అదే పని చేస్తోందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లను ప్రజలు ముక్తకంఠంతో స్వాగతిస్తుండగా, విపక్ష ‘ఇండియా’కూటమి మాత్రం వ్యతిరేకిస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణను ఎవరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు. కాలానుగుణంగా నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగం వీలు కల్పిస్తోందని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా వారికి సీట్లను పెంచే నిబంధనలు కూడా ఉన్నాయని తెలిపారు. డీలిమిటేషన్ను వ్యతిరేకించడం ద్వారా ఎస్సీ, ఎస్టీల సీట్ల పెంపును కూడా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. అమిత్ షా ఇంకా ఏం మాట్లాడారంటే.. పారదర్శకంగా పునర్విభజన ‘‘ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు గల కారణాలపై సభలో చాలామందికి అనుమానాలు ఉన్నాయి. 2026 తర్వాత నిర్వహించే జనగణన అనంతరం జరిగే పునర్విభజనలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ‘నారీశక్తి వందన అధినియం’లో పేర్కొన్నాం. 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు డీలిమిటేషన్ను నిలిపివేశారు. నిలిపివేసిన సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా మాత్రమే ‘నారీశక్తి వందన అధినియం’ను అమలు చేయగలం. అందుకే ఈ బిల్లు తీసుకొచ్చాం. 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న లోక్సభ స్థానాలు 127 వరకు ఉన్నాయి. ఇది ‘ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ’అనే సూత్రానికి విరుద్ధం. కొన్నిచోట్ల 45 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉండగా, మరికొన్ని చోట్ల 6 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉన్నారు. దీనివల్ల ప్రతి ఓటు విలువ సమానంగా లేదు. తెలంగాణలోని మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఏకంగా 48 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్క ఎంపీ ఇంత భారీ జనాభా ఆకాంక్షలను ఎలా నెరవేర్చగలరు? ఈ అసమానతలను తొలగించి మహిళా రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలంటే పునర్విభజన అనివార్యం. పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లిఖితపూర్వకంగా హామీ ఇస్తాం కుల గణనను ఆలస్యం చేయడానికి ప్రభు త్వం కుట్ర పన్నిందని, అందుకే హడావుడిగా మూడు బిల్లులు తీసుకొచ్చిందన్న విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న ప్రచారంలో నిజం లేదు. ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై లిఖితపూర్వకంగా హామీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. సభను గంటసేపు వాయిదా వేస్తే ఇప్పుడే ఆ సవరణ చేస్తాం. మతపరమైన రిజర్వేషన్లకు తావులేదుమతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు తావులేదు. ‘ఇండియా’కూటమి బుజ్జగింపు రాజకీయాల కోసమే ముస్లిం రిజర్వేషన్ల డిమాండ్ను తెరపైకి తెస్తోంది. దేశంలో ఓబీసీలకు అతిపెద్ద వ్యతిరేక పార్టీ కాంగ్రెస్సే. మండల్ కమిషన్ను ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. మోదీ ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. జాతీయ ఓబీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించిన ఘనత మాదే. మహిళా సాధికారతకు బీజేపీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తోంది. గ తంలో సుష్మా స్వరాజ్, ఆనందిబెన్ పటేల్ లాంటి వారికి సీఎంలుగా అవకాశం ఇచ్చాం. పీవీని కాంగ్రెస్ సొంత మనిషిగా చూడలేదు దేశంలో మహిళలకు రిజర్వేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో ప్రారంభించిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదే. 1992లో 72, 73వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి పీవీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. పీవీ కాంగ్రెస్ నేత అయినప్పటికీ, ఆ పార్టీ ఆయనను ఏనాడూ సొంత మనిషిగా అంగీకరించలేదు. ఆయన మరణానంతరం భౌతికకాయానికి అవమానం జరిగింది. కాంగ్రెస్ పీవీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన మహనీయుడు పీవీ పేరును గర్వంగా చెప్పండి. కాంగ్రెస్ ఆయనను విస్మరించడం శోచనీయం’’అని అమిత్ షా ఆక్షేపించారు. -
నారీ.. సారీ
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు పార్లమెంటులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు, లోక్సభ స్థానాల సంఖ్యను 816 పెంచేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్సభలో వీగిపోయింది. ముందునుంచీ ఊహించినట్టుగానే బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని అధికార పక్షం సాధించలేకపోయింది. శుక్రవారం సాయంత్రం లోక్సభలో చేపట్టిన కీలక ఓటింగ్లో మొత్తం 540 మంది సభ్యులకు గాను 528 మంది పాల్గొన్నారు.బిల్లు ఆమోదానికి 352 ఓట్లు రావాల్సి ఉండగా 298 మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. 230 మంది విపక్ష సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో సవరణ బిల్లు వీగిపోయినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. దానితో పాటుగా ప్రవేశపెట్టిన డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ఆ రెండు బిల్లులూ రాజ్యాంగ సవరణ బిల్లుతోనే ముడిపడి ఉన్నందున వాటిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో ఒక బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి! ఈ నేపథ్యంలో మోదీ సర్కారు లోక్సభ స్థానాల పెంపు యత్నాలకు తాత్కాలికంగా తెర పడినట్టే. సవరణ బిల్లువీగిపోయినంత మాత్రాన నిరాశ చెందబోమని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు తమ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుందని రిజిజు పేర్కొన్నారు. కాంగ్రెస్, తృణమూల్, సమాజ్వాదీ, డీఎంకే తదితర పక్షాలు ఎంతటి మహిళా వ్యతిరేకులో ఈ ఉదంతం మరోసారి రుజువు చేసిందంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు దుయ్యబట్టారు. మహిళా బిల్లు ముసుగులో స్వీయ రాజకీయ లబ్ధి కోసం లోక్సభ నియోజకవర్గాలను పెంచుకోవాలన్న బీజేపీ కుట్రలకు అడ్డుకట్ట పడిందని కాంగ్రెస్ తదితర పార్టీలు చెప్పుకొచ్చాయి. 2029 లోక్సభ ఎన్నికల్లోనే గాక దేశవ్యాప్తంగా ఇకపై జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ విపక్షాలు మహిళల ఆగ్రహ జ్వాలలను చవిచూడక తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. సవరణ బిల్లును విపక్షాలు ఓడించడాన్ని బీజేపీ మహిళా ఎంపీలు తీవ్రంగా నిరసించారు. శుక్రవారం సాయంత్రం లోక్సభ వాయిదా పడ్డ అనంతరం పార్లమెంటు ఆవరణలో వారు ధర్నాకు దిగారు. ‘మహిళలకు జరిగిన అవమానాన్ని భారత్ సహించబోదు’ అంటూ ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజె, అన్నపూర్ణా దేవి, రక్షా ఖడ్సే, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. విపక్షాల తీరును నిరసిస్తూ బీజేపీ మహిళా ఎంపీల నినాదాలు పార్లమెంటు ప్రత్యేక భేటీ మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు వీలుగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్టానికి మోదీ సర్కారు కీలక సవరణలు చేపట్టింది. అందుకోసం రూపొందించిన మూడు బిల్లుల ఆమోదానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచింది. రాజ్యాంగ (131వ సవరణ), డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లులను గురువారం లోక్సభలో ప్రవేశపెట్టింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేయాలని, అందుకోసం లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 816కు పెంచాలని, అందుకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని రాజ్యాంగ సవరణ బిల్లులో కీలక ప్రతిపాదనలు చేసింది. మూడు బిల్లులపై గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం దాకా లోక్సభలో 18 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగింది. 130 మందికి పైగా ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును సభ ఓటింగ్కు చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు విపక్ష నేత రాహుల్గాంధీ కూడా సభలో ఉన్నారు. బిల్లు వీగిన అనంతరం రిజిజు మాట్లాడుతూ ఇది పూర్తిగా విపక్షాల పాపమేనన్నారు. దేశ మహిళలను గొప్పగా గౌరవించుకునే సువర్ణావకాశాన్ని అవి కోల్పోయాయంటూ ఆక్షేపించారు. ‘‘కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి. దేశ మహిళలు ఆ పార్టీని ఎప్పటికీ క్షమించరు’’ అంటూ దుయ్యబట్టారు. మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేదాకా తమ ప్రభుత్వం విశ్రమించబోదని మంత్రి చెప్పారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచే బిల్లును ఓడించి కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్వాదీ పార్టీలు సంబరాలు చేసుకోవడం దారుణమని అమిత్ షా ఆక్షేపించారు. మహిళల పట్ల వారి వివక్షకు ఇది అద్దం పట్టిందన్నారు. రాజ్యాంగంపై మోదీ సర్కారు తలపెట్టిన దాడిని మాత్రమే తాము ఓడించామని లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ స్పష్టం చేశారు. ఎన్డీఏకు ‘ఐదు’ అదనం ‘ఇండియా’కు 3 తక్కువ మహిళా చట్ట సవరణ బిల్లుపై చేపట్టిన ఓటింగ్లో అధికార ఎన్డీఏ కూటమికి దాని పూర్తి బలం కంటే 5 ఓట్లు అదనంగా రావడం విశేషం. అదే సమయంలో విపక్ష ఇండియా కూటమికి మొత్తం బలం కంటే 3 ఓట్లు తగ్గాయి. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నింటికీ కలిపి 293 మంది, ఇండియా కూటమి పార్టీల్లో 233 మంది ఎంపీలున్నారు. అయితే ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లొచ్చాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. -
30 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ సేకరించండి
సాక్షి, న్యూఢిల్లీ: యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రల్హాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ధాన్యం యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్కు అనుకూలమని కేంద్ర మంత్రికి తెలియజేశారు. గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని వివరించారు.ఢిల్లీలో జోషిని ఆయన నివాసంలో సీఎం, రాష్ట్ర మంత్రి శుక్రవారం ఉదయం కలిశారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్రం సూచించిన విషయాన్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్లో 90 ఎల్ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటకు సంబంధించిమొత్తం 30 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో), 5 ఎల్ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ కేంద్ర మంత్రికి తెలియజేశారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి సీఎం, మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారు. బకాయిలు విడుదల చేయండి 2014–15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషికి రేవంత్, ఉత్తమ్ విన్నవించారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరారు.పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు గానూ పోషకాహార బియ్యాన్ని పాఠశాలలు, వసతిగృహాలు, ఐసీడీఎస్ల పరిధిలో పంపిణీ చేసేవారని... ఇటీవల దానిని నిలిపివేసినందున వెంటనే దానిని పునఃప్రారంభించాలని సీఎం, మంత్రి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, సెక్రటరీ కోఆర్డినేషన్ అద్వైత్ సింగ్, కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి సానుకూలం: ఉత్తమ్ ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి 30లక్షల బాయిల్డ్ రైస్, 5లక్షల మెట్రిక టన్నుల రారైస్ సేకరణకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. భేటీ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ప్రస్తుత యాసంగిలో 1.48కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి జరుగుతోందని, ఇందులో 90లక్షల మెట్రిక టన్నుల మేర కొనుగోలు చేయనున్నట్లు వివరించామన్నారు. కాగా, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా.. ఢిల్లీలోని అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి రాధాకృష్ణన్ చిత్రపటం వద్ద నివాళులరి్పంచారు. -
ఓడిన మహిళా రిజర్వేషన్ బిల్లు
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. ఈరోజు( శుక్రవారం, ఏప్రిల్ 17వ తేదీ) లోక్సభ వేధికగా జరిగిన ఓటింగ్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, అలాగే కొత్త జనాభా గణన నిర్వహించకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలు కల్పించే డీలిమిటేషన్ బిల్లును లోక్సభ తిరస్కరించింది.సుదీర్ఘ చర్చల అనంతరం ప్రవేశపెట్టిన రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు వీగిపోవడంతో మిగతా రెండు బిల్లులకు ఓటింగ్ అవసరం లేకుండా పోయింది. ఈ ఓటింగ్లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొనగా, అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. బిల్లు ఆమోదానికి కావాల్సిన ఓట్ల సంఖ్య 352. దాంతో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దాంతో మిగతా రెండు బిల్లులు డీలిమిటేషన్, మహిళ రిజర్వేషన్ బిల్లులను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. బిల్లులివే..రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026: మహిళా రిజర్వే షన్లను 2029 నుంచే అమలు చేయడానికి వీలుగా గతంలోని జనగణనను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం.కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026: అసెంబ్లీల్లో 33శాతం మహిళల కోటా అమలుకు వీలుగా కేంద్ర పాలిత ప్రాంతాలో నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టడం.డీలిమిటేషన్ బిల్లు-2026: దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలుగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం.బిల్లులు ప్రవేశఫెట్టేముందు కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ‘ఓబీసీలను వ్యతిరేకించే పార్టీల్లో కాంగ్రెస్ ముందుంటుంది. చరణ్ సింగ్,కేసరిలాంటి ఓబీసీలకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ది. ఓబీసీల కోసం కాకాసింగ్ కాలేకర్ చేసిన సూచనలను కాంగ్రెస్ తుంగలో తొక్కింది. మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను సైతం కాంగ్రెస్ ఆమోదించలేదు. వీపీ సింగ్ వచ్చిన తర్వాత మండల్ కమిషన్ రిపోర్టుకు మోక్షం దక్కింది. రాజీవ్ గాంధీ తన జీవితాంతం మండల్ కమిషన్ నివేదికను వ్యతిరేకిస్తూ వచ్చారు. 15-20 సార్లు ఎన్నికల్లో ఓడిపోయాక కాంగ్రెస్కు ఓబీసీలు గుర్తుకొచ్చారు. బీజేపీ మాత్రమే అత్యంత వెనకబడిన ఓబీసీ నాయకుడు మోదీని ప్రధానినిన చేసింది. మోదీ ప్రభుత్వంలో 27మంది కేంద్రమంత్రులు ఓబీసీలే. మొత్తం క్యాబినెట్లో ఓబీసీల శాతం 40. 1992,72,73 సవరణల ద్వారా వీపీ నరసింహరావు పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. పీవీ నరసింహరావును ఎప్పుడూ కాంగ్రెస్ తన సొంత మనిషిగా భావించలేదు. 1996లో దేవేగౌడ 81వ సవరణ ద్వారా మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. మహిళా బిల్లును బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదు. మన్మోహన్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన పార్టీలే మహిళా బిల్లును వ్యతిరేకించాయి.కాంగ్రెస్ కుట్రతోనే తన అనుకూల పార్టీలతో మహిళా బిల్లును వ్యతిరేకించింది.ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును.. అడ్డుకుంటున్న వారికి ప్రజాక్షేత్రంలో మహిళలు బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు. -
రాహుల్ వ్యాఖ్యలపై కంగన ఫైర్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఎన్డీఏ నాయకులు తప్పుబట్టారు. మోదీ మెజీషియన్ అంటూ రాహుల్ వ్యాఖ్యనించడంతో లోక్సభలో శుక్రవారం మధ్యాహ్నం గందరగోళం రేగింది. రాహుల్ క్షమాపణ చెప్పాలని అధికార సభ్యులు డిమాండ్ చేయడంతో సభ దద్దరిల్లింది. సభ వెలుపల పలువురు నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాహుల్ తీరును తప్పుబట్టారు.లోక్సభలో రాహుల్ గాంధీ న్యూసెన్స్ చేశారని ఫైర్ అయ్యారు బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్. పార్లమెంట్ బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగం తలనొప్పి తెప్పించిందని, ఆయన మాటలు ఇబ్బందికరంగా అనిపించాయన్నారు. సభాపతి కూడా ఆయన్ను ఆపమన్నారని తెలిపారు. పార్లమెంట్ ప్రతిష్టను రాహుల్ అపహాస్యం చేశారని కంగన ఫైర్ అయ్యారు.రాహుల్ హద్దులు దాటారు: చిరాగ్రాహుల్ గాంధీ తన ప్రసంగంలో హద్దులు దాటారని.. ఆయన ప్రసంగం తనకు నిరాశ కలిగించిందని కేంద్ర మంత్రి, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ పనికిరారని అన్నారు. "రాహుల్ ప్రసంగం ప్రతిపక్ష నాయకుడి పదవి గౌరవాన్ని తగ్గించేలా ఉంది. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసి హద్దులు దాటారు. మీ పార్టీలో తొలిసారి ఎంపీలుగా ఎన్నికైన వారికి మీరెలాంటి ఉదాహరణ ఇస్తున్నారు? సొంత ఎంపీల ముందే తనను తాను నవ్వులపాలు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కీలక పాత్ర ఉంటుంది, కానీ ప్రతిపక్ష నాయకుడు తనను తాను అపహాస్యం చేసుకోవాలనుకుంటే, కేవలం హాస్య ప్రసంగాలు చేయాలనుకుంటే, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి అర్హుడని నేను అనుకోను అని చిరాగ్ పాశ్వాన్ అన్నారు.కరెక్ట్ కాదు: హేమమాలిని ప్రధానమంత్రిని ఇంద్రజాలికుడు అని పిలవడం సరికాదని సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని అన్నారు. రాహుల్ గాంధీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, అందులో నిర్దిష్టమైన విషయం ఏమీ లేదని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు స్పందిస్తూ.. మెజీషియన్ అనే పదం అనుచితమైంది కాదని స్పష్టం చేశారు.చదవండి: నాకు, మోదీకి భార్యల సమస్య లేదు.. రాహుల్ సరదా కామెంట్స్ -
'నాకు, మోదీకి ఆ బాధ లేదు.. హమ్మయ్య! అమిత్ షా నవ్వారు'
ఢిల్లీ: లోక్సభలో మూడు కీలక బిల్లులపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నవ్వులు పూయించారు. తనకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి భార్యల సమస్య లేదని సరదాగా వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు విరిశాయి. 131 రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై చర్చలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పాత్ర గురించి గొప్పగా చెప్పారు.ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మహిళల నుంచే నేర్చుకుంటారని అన్నారు. దైనందిన జీవితంలో ప్రతి విషయంలోనూ మహిళల సహకారం అవసరం ఉంటుందని వివరించారు. “మన జాతీయ భావన, దృక్పథంలో మహిళలు ఒక కేంద్ర, చోదక శక్తి. మనమందరం, ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరం మన జీవితాల్లోని తల్లులు, సోదరీమణులు, భార్యలైన మహిళల నుంచి ఎంతో ప్రభావితమయ్యాం, స్ఫూర్తి పొందాం, నేర్చుకున్నాం“ అంటూ మహిళలపై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సరదాగా చేసిన ఓ వ్యాఖ్యకు రాహుల్ గాంధీ కూడా సరదాగానే సమాధానం ఇచ్చారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లాగా తాను తన భార్య కోసం కవిత రాయనందుకు ఇంట్లో తిట్లు తిన్నానని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. దీనికి రాహుల్ జవాబిస్తూ.. "నిజానికి నాకు, ప్రధానమంత్రికి భార్యల సమస్య లేదు. కాబట్టి మాకు అలాంటి సలహాలు అందవు. కానీ మాకు మా అమ్మలు, సోదరీమణులు ఉన్నారు" అని అన్నారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.నేను చేయలేని పని ప్రియాంక చేసిందిగురువారం లోక్సభలో తన సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగంపై కూడా రాహుల్ సరదా వ్యాఖ్యలు చేశారు. "నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను చేయలేని పనిని నిన్న నా సోదరి ఐదు నిమిషాల్లో సాధించడం చూశాను. అదే అమిత్ షా గారిని నవ్వించడం" అని రాహుల్ అనగానే సభికులందరూ పగలబడి నవ్వారు. చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ ప్రతిపక్షాలకేరాహుల్ వ్యాఖ్యలతో కలకలంకాగా, ఆపరేషన్ సిందూర్, బాలకోట్ వంటి అంశాలపై ప్రధాని మోదీ మ్యాజిక్ చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో లోక్సభలో గందరగోళం రేగింది. ప్రధానమంత్రిని అవమానించిన రాహుల్ క్షమాపణ చెప్పాలని ఎన్డీఏ సభ్యులు డిమాండ్ చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదని అన్నారు. రాహుల్ గాంధీని సభ నుంచి బహిష్కరించాలని పట్టుబట్టారు. -
డీలిమిటేషన్.. ఢిల్లీలో బీసీ సంఘాల మెరుపు ధర్నా
సాక్షి, ఢిల్లీ: కులగణన తర్వాతనే డీలిమిటేషన్ చేపట్టాలని ఢిల్లీలో బీసీ సంఘాలు మెరుపు ధర్నా నిర్వహించాయి. డీలిమిటేషన్ పత్రాలను చింపివేసి బీసీ నేతలు నిరసనలు తెలిపారు. డీలిమిటేషన్ వల్ల బీసీలకు ఎలాంటి ప్రయోజనం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి అన్నారు. పెంచిన అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు మహిళల పేరుతో మళ్లీ అగ్రకులాలకు దక్కుతాయన్నారు.దేశవ్యాప్తంగా బీసీ కులగణన పూర్తి చేసి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలి. మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోట కల్పించాలి. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తాo’’ అని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.బీసీలు బీజేపీని క్షమించరు: మాజీ ఎంపీ వీహెచ్బీసీ ప్రధాని అయి ఉండి బీసీలకే మోదీ ద్రోహం చేస్తున్నారు. మహిళా బిల్లులో బీసీ సబ్ కోట కల్పించకపోతే బీసీలు బీజేపీని క్షమించరు. బీజేపీ బీసీలకు చేస్తున్న మోసంపై ఊరూరా తిరిగి చెప్తాo పోరాడతాం: బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్మహిళా బిల్లు పేరుతో బీసీలను రాజకీయంగా తొక్కి పెట్టాలని చూస్తున్నారు. దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహిళల అక్రందనను కేంద్రం పట్టించుకోవడం లేదు. స్థానిక సంస్థలలో లాగానే చట్టసభల్లో కూడా బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచకుండా డీలిమిటేషన్ చట్టం చేస్తే ఉపయోగం లేదు. బీసీ హక్కుల కోసం బీసీ సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా పోరాడతాంబీసీలంటే పార్టీలకు చిన్న చూపు: శంకర్రావుదేశంలో బీసీలను పట్టించుకునే నాధుడే లేడు. బీసీలు అంటే అన్ని పార్టీలకు చిన్న చూపు. బీసీల ఓట్ల మీద ఉన్న ప్రేమ సీట్ల మీద లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలను చేర్చకపోతే కేంద్రంపై తిరగబడతాం -
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతుండగా మైక్ కట్
సాక్షి, ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతున్న మహిళా ఎంపీ మైక్ కట్ చేయడంపై వైఎస్సార్సీపీ ఎంపీలు తనూజ రాణి, గురుమూర్తి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మైక్ కట్ చేసిన సభాస్థానంలో టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఉన్నారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున చర్చలో ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజారాణి పాల్గొన్నారు. టీడీపీ హయాంలో మహిళలపై కొనసాగుతున్న హింసను ఆమె ప్రస్తావించారు. ఏపీలో మహిళను తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిని చేసిన ఘనత వైఎస్ జగన్ది. నామినేటెడ్ పోస్టుల్లో, కాంట్రాక్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ది. అమ్మ ఒడి, మహిళల పేరుపైనే ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 2019-24 వైఎస్ జగన్ పరిపాలనా కాలం మహిళలకు స్వర్ణయుగం లాంటిది. ఏపీలో మహిళలపై హింస జరుగుతుంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన ఘటన తీవ్ర ఆందోళనకరం. అధికార పార్టీలోని ప్రజాప్రతినిధులు మహిళలను వేధిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు’’ అని తనూజరాణి మండిపడ్డారు. -
పవన్ ఖేరాకు మళ్లీ చుక్కెదురు.. అరెస్ట్ తప్పదా?
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. అసోం సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యల కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆ బెయిల్పై స్టే విధించగా.. దానిని తొలగించాలని వేసిన మరో పిటిషన్ను శుక్రవారం తోసిపుచ్చింది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రింకీ భుయాన్ శర్మపై ఏఐసీసీ మీడియా చైర్మన్ పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయని ఆరోపించారాయన. ఈ నేపథ్యంలో ఆయనపై ఆమె పరువు నష్టం దావా కేసు వేశారు. తనపై ఆరోపణల క్రమంతో తప్పుడు పత్రాలను సృష్టించి ఫోర్జరీకి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గువాహటిలో ఆయనపై కేసు నమోదు అయ్యింది. అయితే.. ఈ వ్యవహారంపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అస్సాం పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఖేరా భార్య హైదరాబాద్ నగరంలో పోటీ చేశారని.. ఇక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయని.. కాబట్టి పిటిషన్ ఈ కోర్టులోనే విచారణకు అర్హత ఉందని పవన్ ఖేరా తరఫు లాయర్లు వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు.. వారంపాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది(ఏప్రిల్ 10న) హైకోర్టు. ఈలోపు సంబంధిత కోర్టుకు బెయిల్కు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. అయితే.. ఈ ఊరటను అస్సాం పోలీసులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. పవన్ ఖేరా తెలంగాణ హైకోర్టులో సమర్పించిన ఆధార్, ఇతర పత్రాలు కూడా తప్పుడువేనని వాదించారు. దీంతో అక్కడ పవన్ ఖేరాకు ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది(ఏప్రిల్ 15న). అదే సమయంలో..గువాహటి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాలని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు సూచించింది. అయితే.. అస్సాంలో న్యాయస్థానాలకు సెలవులు ఉన్నాయని.. తన ట్రాన్సిట్ యాంటీసిపేటరీ బెయిల్పై స్టే ఎత్తివేయాలని.. ఆ స్టేను మంగళవారం దాకా పొడిగించాలని ఖేరా సుప్రీం కోర్టును అభ్యర్థిస్తూ మరో పిటిషన్ వేశారు. అయితే సుప్రీం కోర్టు ఇవాళ(ఏప్రిల్ 17) ఆ అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. ఇవాళ శుక్రవారం. సోమవారం పిటిషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉంది. ఆ మాత్రం ఉపశమనం ఇవ్వకపోవడానికి నేనేమైనా క్రిమినల్నా? లేక ఉగ్రవాదినా? అని పవన్ ఖేరా కోర్టు ముందు వాదనలు వినిపించారు. అయితే.. ఈ వ్యవహారంలో తామేమీ చేయలేమని.. అస్సాం కోర్టుకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, తమ గత ఆదేశాలు ప్రభావితం చేయబోవని.. కాబట్టి ఆలస్యం చేయకుండా పిటిషన్ వేసుకోవాలని.. అవసరమైతే అత్యవసర పిటిషన్కు వెళ్లమని ఖేరాకు సుప్రీం కోర్టు సూచించింది. అయితే ఈలోపు ఈ ఆదేశాలతో అస్సాం పోలీసులు పవన్ ఖేరాను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు.లొంగిపోతే మంచిదిసుప్రీం కోర్టు ఆదేశాలపై అస్సాం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. పోలీసులు స్పందించడం కంటే ముందే.. ఎక్కడున్న పవన్ ఖేరా గువాహటికి వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోవడం మంచిదని సూచించారు. -
ఆ బిల్లులకు వైఎస్సార్సీపీ మద్దతు
ఢిల్లీ: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. నియోజకవర్గాల పెంపుపై ప్రభుత్వం చెబుతున్న విషయాలు లిఖితపూర్వకంగా బిల్లులో పెట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ వ్యత్యాసాలు లేకుండా చూడాలని.. అన్ని పార్టీలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలని కోరారు. డీలిమిటేషన్ ప్రక్రియ విపక్షాలను అణచివేసేదిగా ఉండకూడదన్నారు.మహిళా రిజర్వేషన్కు సంపూర్ణ మద్దతిస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ది. సంక్షేమ పథకాలన్నీటిని మహిళలకు భాగస్వామ్యం కల్పించారు. ఇళ్ల పట్టాలు మహిళల పేర్లతోనే ఇచ్చారు. నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తూ పట్టుబడ్డారు. అసభ్యకరమైన వీడియోలు బయటపడ్డాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిర్యాదు చేసిన మహిళపైనే కేసులు పెడుతున్నారు. మహిళలను వేధిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి. సూత్రప్రాయంగా ఈ బిల్లులను అంగీకరిస్తున్నాము. కానీ, మేము లేవనెత్తిన అన్ని అంశాలను ప్రభుత్వం నివృత్తి చేయాలి’’ అని మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
రేవంత్ హైబ్రిడ్ ఫార్ములా.. ఎంఐఎం ప్లాన్: కిషన్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్పై తెలంగాణ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. మహిళల రిజర్వేషన్లకు మజ్లిస్ వ్యతిరేకం అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా.. అసదుద్దీన్ చెప్పినది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘డీలిమిటేషన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. నార్త్, సౌత్ మధ్య యుద్ధం వస్తుందని మాట్లాడుతున్నారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం చేస్తామని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. రెవెన్యూ ఎక్కువగా వస్తుందని హైదరాబాద్లోనే రేవంత్ అసెంబ్లీ సీట్లు పెంచుతారా?. డబ్బు ఎక్కువగా ఉన్న వారికి ఎక్కువ ఓటు విలువ ఇస్తారా? అని ప్రశ్నించారు.మహిళల రిజర్వేషన్లకు మజ్లిస్ వ్యతిరేకం. హైదరాబాద్లో తమ సీట్లు పోతాయని మజ్లిస్ భయం. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కుమ్మకై తెలంగాణలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన ఫార్ములాను రేవంత్ రెడ్డి ద్వారా అసదుద్దీన్ చెప్పించారు. నియోజకవర్గాలు పెరిగితే మహిళలు, యువతకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త నాయకత్వం వస్తే తమ పీఠాలు కదులుతాయని మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ సహా విపక్షాలు అడ్డుకుంటున్నారు. ఎంఐఎం మహిళలకు వ్యతిరేక రాజకీయాలు చేస్తోంది. మహిళా రిజర్వేషన్కు అడ్డుపడాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఎంఐఎం కలిపింది. మహిళలను అనగదొక్కే పార్టీ మజ్లిస్ పార్టీ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీ రాజకీయ పార్టీ ప్రధాని మోదీ ఫొటోను వాళ్ల ఆఫీసుల్లో పెట్టుకోవాలి. ఏపీలో లోక్సభ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి. తమిళనాడులో లోక్సభ సీట్లు 39 నుంచి 59కి పెరుగుతున్నాయి. సౌత్లో పెరిగినట్టుగానే నార్త్లో కూడా లోక్సభ సీట్లు పెరుగుతాయి. దేశమంతా ఒకే నిష్పత్తిలో సీట్లు పెరుగుతున్నప్పుడు వచ్చిన నష్టమేంటి?. సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని అడ్డుకోవాలి. గెజిట్ నోటిఫై కాకుండా రాజ్యాంగ సవరణ చేయలేం. అన్ని పార్టీలతో మాట్లాడినప్పుడు ఒప్పుకుని పార్లమెంట్కు వచ్చాక అడ్డుకోవడమేంటి? అని ప్రశ్నించారు. -
భార్యకు భరణం భర్త నిరంతర బాధ్యత
న్యూఢిల్లీ: భార్యకు భర్త ఇచ్చే భరణం నామమాత్రంగా ఉండరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భార్య పోషణ భర్త ప్రాథమిక, నిరంతర బాధ్యత అంటూ స్పష్టత ఇచ్చింది. భార్య గౌరవప్రదంగా జీవించేలా భర్త ఈ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుందని పేర్కొంది. భరణం న్యాయబద్ధంగా, సహేతుకంగా ఉండాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్ల ధర్మాసనం గురువారం తెలిపింది. ఇరుపక్షాల సామాజిక హోదాకు, భర్త ఆర్థిక సామర్థ్యానికి తగినట్లుగా ఉండాలని పేర్కొంది. వివాహ బంధంలో ఉండగా భార్య ఎలాంటి జీవన ప్రమాణాలను అనుభవించిందో, విడిపోయిన తర్వాతా అదే స్థాయి గౌరవంతో జీవించేలా భర్త భరణం చెల్లించాలని తెలిపింది. అదే సమయంలో, భరణాన్ని నిర్ణయించడంలో ఇరుపక్షాల అవసరాలను బేరీజు వేస్తూ సమతూకం పాటించాలని సూచించింది. ఒక మహిళకు ఇస్తున్న నెలవారీ వేతనం మొత్తాన్ని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్కు చెందిన ఓ జంటకు 2023 మే 7వ తేదీన హిందూ ఆచారం ప్రకారం వివాహమైంది. అత్తవారింట్లో వేధింపులతో ఏడాదికే పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పట్నుంచి ఆ దంపతులు వేరుగానే ఉంటున్నారు. తనకు ఎటువంటి ఆదాయ వనరులు లేనందున భరణం ఇప్పించాలంటూ ఆమె చంపావత్లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో, న్యాయస్థానం నెలకు రూ.8 వేలు భరణంగా నిర్ణయించింది. బాధితురాలు ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లారు. ఆ న్యాయస్థానం రూ.15 వేలకు భరణం మొత్తాన్ని పెంచింది. ఆపైన బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా పైవిధంగా తీర్పు వచ్చింది. -
3 ప్రాంతాల్లోనూ సమానంగా కేటాయించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: ‘రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సీట్లు సమానంగా ఉండాలి. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో సీట్లను సమానంగా కేటాయించాలి. అప్పుడే డీలిమిటేషన్కు సార్థకత ఉంటుంది. సీట్ల పంపకాలు సరిగా జరగకపోతే వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. ఇబ్బందులు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలి..’ అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు కారణంగా ఏపీలో ఒక్క సీటు తగ్గినా, రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకోబోమని వైఎస్సార్సీపీ లోక్సభా పక్షనేత పెద్దిరెడ్డి మిథున్రెడ్డి తేల్చి చెప్పారు. ఏపీలో ఎంపీ సీట్లు 25 నుంచి 38 స్థానాలకు పెరుగుతాయని కేంద్ర హోంమంత్రి ప్రకటించినప్పటికీ రాష్ట్రంలో మూడు ప్రాంతాలకూ సరైన విధంగా సీట్లు కేటాయింపు జరగకపోతే చూస్తూ ఊరుకోబోమన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్రకు సరైన ప్రాధాన్యత దక్కాల్సిందేనన్నారు. డీలిమిటేషన్ వల్ల రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు డీలిమిటేషన్ బిల్లు, పునర్విభజన కమిషన్ బిల్లులకు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. అనంతరం వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఇతర ఎంపీలు ‘సాక్షి’తో మాట్లాడారు. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని వైఎస్సార్సీపీ ఎంపీలు గుర్తు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని మహిళలకు పెద్దపీట వేశారన్నారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లతోపాటు అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, చేయూత, మహిళల పేరిటే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు లాంటివి మహిళా సాధికారత, సామాజిక హోదా పెంపునకు దోహదపడ్డాయన్నారు.పొదుపు సంఘాల పునరుజ్జీవం: పీవీ మిథున్రెడ్డి‘వైఎస్సార్ ఆసరా/సున్నా వడ్డీ ద్వారా మహిళల రుణాలను మాఫీ చేయడంతోపాటు పొదుపు సంఘాలకు వైఎస్ జగన్ ప్రాణం పోశారు. వైఎస్సార్ చేయూత ద్వారా 45–60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సహాయం అందించారు. అమ్మఒడి ద్వారా పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్దే. సామాజిక న్యాయంలో భాగంగా మహిళల పేరిటే ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి రికార్డు సృష్టించారు. మహిళల భద్రత కోసం దిశ యాప్ ప్రవేశపెట్టి అండగా నిలిచారు’ అని ఎంపీ మిథున్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఎల్లప్పుడూ మహిళల పక్షపాతి అని గుర్తు చేశారు.మహిళా భద్రతకు పెద్దపీట: ఎంపీ అవినాశ్రెడ్డివైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల్లో 75 శాతం నిధులు మహిళలకే కేటాయించి మహిళా పక్షపాతిగా నిలిచారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు దిశ యాప్ లాంటి వాటితో మహిళా భద్రతకు పెద్దపీట వేశారన్నారు. జెడ్పీ చైర్పర్సన్, మునిసిపల్ పదవుల్లో 50 శాతానికి పైగా మహిళలకే ఇచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్దేనని గుర్తు చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లకు మద్దతు ప్రకటించడమే కాకుండా అన్ని రంగాలలో వైఎస్సార్సీపీ వారిని ప్రోత్సహించిందని తెలిపారు.అన్ని ప్రాంతాల్లో సీట్లు సమానంగా ఉండాలి: వైవీ సుబ్బారెడ్డిరాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సీట్లు సమానంగా ఉండాలి. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో సీట్లను సమానంగా కేటాయించాలి. అప్పుడే డీలిమిటేషన్కు సార్థకత ఉంటుంది. మూడు ప్రాంతాల్లో సీట్ల పంపకాలు సరిగా జరగకపోతే వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. ఏ ప్రాంతానికి నష్టం జరగడానికి వీల్లేదు. ఒక ప్రాంతానికి తగ్గించి.. మరో ప్రాంతానికి పెంచితే అనేక ఇబ్బందులను ఎదుర్కొనాల్సిన పరిస్థితులు వస్తాయి. అటువంటి ఇబ్బందులు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది.లక్షల మంది మహిళలకు ఇళ్లు: ఎంపీ గురుమూర్తిరాష్ట్రంలో 33 లక్షల మంది మహిళల ఇంటి కల నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్దే అని తిరుపతి ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా గూడు లేక అవస్థ పడుతున్న వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు అందచేసి అండగా నిలిచారన్నారు. మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో న్యాయం చేసింది జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. మహిళలకు ఎల్లప్పుడూ మంచి చేసే ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. మహిళా రిజర్వేషన్లపై టీడీపీది కపట నాటకమని దుయ్యబట్టారు. టీడీపీ అధిష్టానం మహిళలను గ్యాలరీలో కూర్చోబెట్టి ప్రేక్షక పాత్రకే పరిమితం చేసిందని విమర్శించారు.మహిళలకు పదవులు వైఎస్ జగన్ చలవే: ఎంపీ డాక్టర్ తనూజారాణివైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ మహిళలకు పెద్ద ఎత్తున పదవులు ఇవ్వబట్టే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు మహిళలకు పదవులు ఇచ్చారని అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి చెప్పారు. దళిత మహిళను హోంమంత్రిగా చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కిందన్నారు. తొలిసారిగా మహిళకు ఉపముఖ్యమంత్రి పదవి సైతం జగన్ హయాంలోనే దక్కిందన్నారు. వైఎస్ జగన్ నాడు దళిత మహిళలకు పెద్ద పదవులు ఇచ్చారు కాబట్టే ఆయన చలవతో ఇవాళ హోంమంత్రి పదవిలో దళిత మహిళ ఉన్నారని గుర్తు చేశారు. ఎంపీ బైరెడ్డి శబరి అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో యథేచ్ఛగా మహిళలపై దాడులు జరుగుతుంటే బైరెడ్డి శబరి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రజాప్రతినిధులే మహిళలను లైంగికంగా వేధిస్తుంటే బైరెడ్డి శబరికి కనపటడం లేదా అని నిలదీశారు. సీఎం చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసేందుకే శబరి లోక్సభలో ఇష్టానుసారం మాట్లాడారని విమర్శించారు. -
రాజకీయ ఆయుధంగా డీలిమిటేషన్
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల సాకుతో లోక్సభ స్థానాల పెంపునకు బలవంతంగా ఆమోదముద్ర వేయించుకునేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. బీజేపీకి బాగా అలవాటైన బుల్డోజర్ పద్ధతినే ఈ విషయంలోనూ పాటిస్తోందంటూ లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉప నేత గౌరవ్ గొగొయ్ తూర్పారబట్టారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని సవరించేందుకు గురువారం లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై చర్చను ఆయన ప్రారంభించారు. అవి మహిళా వ్యతిరేక బిల్లులంటూ మండిపడ్డారు. కులగణనకు, రాజ్యాంగానికే గాక దేశ సమాఖ్య నిర్మాణానికి కూడా ఆ బిల్లులు వ్యతిరేకమని ఆరోపించారు.ఆ బిల్లుల ద్వారా డీలిమిటేషన్కు దొడ్డిదారిన ఆమోదం పొందడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం తప్ప మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం కానేకాదని కుండబద్దలు కొట్టారు. బీజేపీ కేవలం తన రాజకీయ బలాన్ని పెంచుకునేందుకే డీలిమిటేషన్ను రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని గొగొయ్ ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్లపై ఆ పార్టీకి నిజంగా చిత్తశుద్ధే ఉంటే లోక్సభ స్థానాలను పెంచకుండా ప్రస్తుత సంఖ్య 543తోనే ఆ చట్టాన్ని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ ద్వారా అనుచిత రాజకీయ లబ్ధి పొందడమే మోదీ సర్కారు ఏకైక ధ్యేయమని పునరుద్ఘాటించారు.ఈ గెర్రీమాండరింగ్ (నియోజకవర్గాల సరిహద్దులను ఒక పార్టీకి లబ్ధి చేకూరేలా మార్చడం) ప్రయత్నాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ‘‘అసలు లోక్సభ స్థానాల పెంపు ఆలోచన ఎక్కడినుంచి వచి్చంది? ఎన్ని స్థానాలను పెంచాలన్న అంశంపై మోదీ సర్కారు తనంత తానుగానే ఎలా నిర్ణయం తీసుకుంటోంది? ఏదైనా పార్లమెంటరీ నివేదిక ఆధారంగా ఇందుకు పూనుకున్నారా? లేదా నాగపూర్ (ఆరెస్సెస్) నిర్దేశాల మేరకా? లేదంటే ఇది కేవలం ఆకాశం నుంచి ఊడిపడ్డ ఆలోచనా?’’అంటూ ధ్వజమెత్తారు. దేశమంతటా ‘అస్సాం’ప్రయోగం రాజకీయ ప్రయోజనాల కోసం డీలిమిటేషన్ను ఆయుధంగా మలచుకోవడం బీజేపీకి అలవాటేనని గౌరవ్ గొగొయ్ ఆరోపించారు. ‘‘గతంలోనూ ఆ పార్టీ ఎన్నోసార్లు ఇందుకు పాల్పడింది. జమ్మూకశ్మీర్, అస్సాంల్లో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను ఇష్టానుసారంగా మార్చేసి అనుచిత లబ్ధి పొందింది. దాంతో ఇప్పుడదే ప్రయోగాన్ని దేశమంతటా చేసేందుకు మోదీ సర్కారు నిశ్చయించుకుంది.అందుకు మహిళా రిజర్వేషన్లను సాకుగా వాడుకుంటోంది’’అని ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు నిజంగా సిగ్గుచేటంటూ దుయ్యబట్టారు. 2029 లోక్సభ ఎన్నికల నుంచే మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేయాలని మోదీ సర్కా రు భావిస్తే అందుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ దానికి డీలిమిటేషన్తో ముడిపెట్టడానికి వీల్లేదు. లోక్సభ స్థానాలను పెంచే ప్రయత్నానికి స్వస్తి చెప్పి ప్రస్తుతమున్న 543 స్థానాలకే తక్షణం అమలయ్యేలా మహిళా రిజర్వేషన్లను వర్తింపజేయాలి’’అని గొగొయ్ డిమాండ్ చేశారు.కులగణనకు బీజేపీ వ్యతిరేకిరాజ్యాంగాన్ని మోదీ సర్కారు క్రమేపీ అన్నివిధాలా బలహీనపరుస్తూ వస్తోందని గౌరవ్ గొగొయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘కులగణన పట్ల కేంద్రం సానుకూలంగా లేదన్న అనుమానాలు కూడా నానాటికీ బలపడుతున్నాయి. మోదీ సర్కారు అందుకు తొలినుంచీ వ్యతిరేకే. కేవలం మా నేత రాహుల్గాంధీ ఒత్తిడి కారణంగానే కులగణనకు అయిష్టంగా అంగీకరించింది’’అని ఆయన చెప్పుకొచ్చారు.తాజాగా మూడు బిల్లులను ప్రవేశపెడుతూ లోక్సభలో కేంద్ర న్యాయ మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ ప్రసంగించిన తీరును గొగొయ్ ఎద్దేవా చేశారు. ‘‘మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఇప్పుడే తొలిసారిగా తాము ప్రవేశపెడుతున్నాం అన్నట్టుగా మంత్రి మాట్లాడారు. కానీ 2023లోనే ఆ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఆ సందర్భంగా కూడా సభలో వాళ్లు సరిగ్గా ఇవే వాదనలు చేశారు. అప్పట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలనే ఇప్పుడు మేఘ్వాల్ మళ్లీ యథాతథంగా అప్పజెప్పారంతే!’’ అని తూర్పారబట్టారు. -
ముస్లిం కోటా ఉండబోదు
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్లలో ముస్లింలకు కోటా ప్రత్యేక ఉండబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘‘మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగం అనుమతించబోదు. అవి రాజ్యాంగ విరుద్ధం. కనుక ముస్లిం మహిళలకు మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించే ప్రస్తకే లేదు’’అంటూ కుండబద్దలు కొట్టారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు నిమిత్తం కేంద్రం గురువారం లోక్సభ లో మూడు బిల్లులు ప్రవేశపెట్టడం తెలిసిందే. వాటిపై చర్చ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ సభ్యులు అఖిలేశ్యాదవ్, ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ ముస్లిం మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ‘‘మహిళలు జనాభాలో సగ భాగం. ముస్లిం మహిళలను వారిలో భాగంగా పరిగణించడం లేదా?’’అని అఖిలేశ్ ప్రశ్నించారు.మహిళా రిజర్వేషన్లు ఓబీసీ, ముస్లిం మహిళలకు కూడా వర్తించేలా నిబంధనలు చేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే సవరణ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇవ్వబోదన్నారు. తాజా బిల్లులను ఉపసంహరించుకుని 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టంలో వెనుకబడిన తరగతులతో పాటు ముస్లిం మహిళలను కూడా చేర్చాలని ధర్మేంద్ర యాదవ్ కోరారు. దీనిపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. వారి డిమాండ్ను తోసిపుచ్చారు. ‘‘సమాజ్వాదీ పార్టీ కావాలనుకుంటే అన్ని టికెట్లూ ముస్లిం మహిళలకే ఇచ్చుకొమ్మనండి. ఎవరొద్దంటున్నారు? మాకైతే ఏ అభ్యంతరమూ ఉండబోదు’’అని మంత్రి వ్యాఖ్యానించారు. -
చాణక్యుడు బతికి ఉంటే.. బీజేపీ చాతుర్యానికి ఆశ్చర్యపోయేవాడు
న్యూఢిల్లీ: చాణక్యుడు ఇప్పుడు గనుక బతికి ఉంటే బీజేపీ నాయకుల రాజకీయ చాతుర్యం చూసి ఆశ్చర్యపోయేవాడని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. గురువారం మూడు బిల్లులపై జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని, దేశ సమగ్రతపై అతిపెద్ద దాడి ప్రారంభించిందని ఆరోపించారు. ఒకవైపు మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూనే మరోవైపు ఓబీసీల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. చిన్న రాష్ట్రాల ప్రాబల్యాన్ని తగ్గించి, ప్రజాస్వామ్యాన్ని ముక్కలు చేసి, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. తన మాటలకు అమిత్ షా నవ్వుతున్నారని, ఈ స్కీమ్ వెనుక ఆయనే ఉన్నారని చెప్పారు. అమిత్ షా నవ్వుతున్నారంటే తన వ్యాఖ్యలతో ఆయన ఏకీభవించినట్టేనని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో ఏకైక చాంపియన్గా మారాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోందని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కల్పించిన ఘనత కాంగ్రెస్దేనని ప్రియాంక తేల్చిచెప్పారు. ‘ఒక ఓటు, ఒక పౌరుడు, ఒకే విలువ’అనే విధానాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మహిళలకు ఓటు హక్కు లభించిందన్నారు. అమెరికాలో ఓటు హ క్కు కోసం మహిళలు 150 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడున్న స్థానాల ఆధారంగానే రిజర్వేషన్లు కేవలం అధికారం కోసమే మహిళా రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుంటున్నారని మోదీ ప్రభుత్వంపై ప్రియాంక నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించినట్లయితే దేశంలో ప్రజాస్వామ్యం ఉనికిలో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళా కోటా చట్టాన్ని డీలిమిటేషన్తో ఎందుకు ముడిపెట్టారో చెప్పాలని నిలదీశారు. లోక్సభలో ప్రస్తుతం ఉన్న స్థానాల ఆధారంగానే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. -
మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ ప్రతిపక్షాలకే
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుతో ముడిపడి ఉన్న నియోజకవర్గాల పునర్వీభజనలో ఏ ఒక్క రాష్ట్రంపైనా వివక్ష చూపే ప్రసక్తే ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. అది పెద్ద రాష్ట్రమైనా లేక చిన్న రాష్ట్రమైనా.. ఉత్తర, దక్షి ణ, తూర్పు, పశ్చిమ రాష్ట్రమైనా కూడా ఎలాంటి అ న్యాయం జరగదని స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్వీభజనలో సంస్కరణలను వ్యతిరేకించేవారిని మహిళలు ఎప్పటికీ క్షమించబోరని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ప్రధాని మోదీ జోక్యం చేసుకున్నారు. దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడారు. నియోజకవర్గాల పునర్వీభజన ప్రక్రియతో ఏ ఒక్క రాష్ట్రంలోనూ లోక్సభ స్థానాల నిష్పత్తి తగ్గదని వెల్లడించారు.లోక్సభ స్థానాలకు సంబంధించి ఆ నిష్పత్తిలో ఎటువంటి మార్పు ఉండదని, పెరుగుదల కూడా అదే నిష్పత్తిలో ఉంటుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుపై అధికార పక్షం ఘనతను(క్రెడిట్) ఆశించడం లేదని.. ఆ క్రెడిట్ను ప్రతిపక్షాలే తీసుకోవచ్చని సూచించారు. ప్రతిపక్షాలకే ఖాళీ చెక్కు ఇచ్చేస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వ ఖర్చుతో ప్రతిపక్షాలకు ప్రచారం చేస్తామని, హోర్డింగ్లపై ప్రతిపక్ష నాయకుల ఫొటోలు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ల అమలును ఒకవేళ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తే తనకు సహజంగానే రాజకీయ ప్రయోజనం దక్కుతుందన్నారు. కానీ, విపక్షాలు సహకరిస్తే ఎవరికీ ఎలాంటి రాజకీయ ప్రయోజనమూ లభించదని చెప్పారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే.. ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు.. ‘‘చట్టసభల్లో రిజర్వేషన్ అనేది ఈ దేశ మహిళల హక్కు. కాబట్టి వారికి తాము ఏదో ఇస్తున్నామనే భ్రమలో ఎవరూ ఉండకూడదు. రిజర్వేషన్లపై మాకు క్రెడిట్ వద్దు. ఈ విషయంలో హామీ(గ్యారంటీ) అనే పదాన్ని వాడాలని మీరు కోరుకుంటే నేను ఆ పదాన్నే వాడతాను. నేను వాగ్దానం(ప్రామిస్) చేయాలని మీరు కోరుకుంటే నేను ఆ పదాన్నే ఉపయోగిస్తా. ఎందుకంటే ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు పదాలతో ఆడుకోవాల్సిన అవసరమే ఉండదు. నియోజకవర్గాల పునర్వీభజనపై ఎవరికీ ఎలాంటి సందేహాలు, భయాందోళనలు అవసరం లేదు. ఏ ఒక్క రాష్ట్రానికీ అన్యాయం జరగదు, వివక్ష చూపడం ఉండదు. దయచేసి రాజకీయ కోణంలో చూడొద్దు మహిళలకు హక్కులు కల్పించడాన్ని గతంలో వ్యతిరేకించినవారు మహిళల నుంచి ఆగ్రహాన్ని చవిచూశారు. తగిన పర్యవసానాలు ఎదుర్కొన్నారు. అలాంటి వారిని మహిళలు క్షమించలేదు. మహిళా రిజర్వేషన్లను దయచేసి రాజకీయ కోణంలో చూడొద్దని అందరినీ కోరుతున్నా. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు మనల్ని గమనిస్తున్నారు. వారు మన నిర్ణయాలను పరిశీలిస్తారు. నిర్ణయం కంటే కూడా మన ఉద్దేశాన్ని ఎక్కువగా బేరీజు వేస్తారు.మన ఉద్దేశంలో ఏమాత్రం లోపం ఉన్నా మహిళలు మనల్ని ఎప్పటికీ క్షమించరు. 2023లో పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్లపై చర్చ జరుగుతున్న సమయంలో ‘త్వరపడండి’అంటూ ప్రజలు గొంతెత్తారు. కానీ, 2024లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయలేకపోయాం. చాలా తక్కువ సమయం ఉండడమే అందుకు కారణం. ఇప్పుడు మనకు తగినంత సమయం ఉంది. 2029లో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఇకపై ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. అదే నేటి అనివార్యత. ఆ ధైర్యం లేక సాంకేతిక సాకులు వెతుకుతున్నారు మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని వ్యతిరేకిస్తే ప్రతిపక్షాలకే ప్రమాదం. దేశంలోని నారీ శక్తి అంతా నిశితంగా గమనిస్తోంది. మహిళల హక్కులను వ్యతిరేకించిన వారి పట్ల చరిత్ర ఎప్పుడూ దయతో వ్యవహరించలేదు. ఎంపీలందరినీ మహిళలు గమనిస్తున్నారు. రిజర్వేషన్ల విషయంలో ఎంపీల్లో తప్పుడు ఉద్దేశాలు ఉంటే ఆ విషయం మహిళలు ఎప్పటికీ మర్చిపోరు. అందుకే మన ఉద్దేశాల్లో నిజాయతీ ఉండాలి. మహిళా రిజర్వేషన్ల అమల్లో ఇప్పటికే 30 ఏళ్లు ఆలస్యం జరిగింది. మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు సాంకేతిక సాకులు (టెక్నికల్ బహనేబాజీ) వాడుతున్నాయి. మహిళల హక్కులను బహిరంగంగా తిరస్కరించే ధైర్యం వారికి లేదు. అందుకే సాంకేతిక సాకులు వెతుకుతున్నారు. కానీ, ఇప్పుడు మీరు మహిళలను మోసం చేయలేరు.నల్ల రంగు దుస్తులు ధరించినవారికి కృతజ్ఞతలు మహిళా కోటా చట్ట సవరణ బిల్లుకు నిరసనగా కొందరు నల్ల రంగు దుస్తులు ధరించి సభకు రావడాన్ని గమనించాం. నల్ల రంగు దుస్తులు దిష్టి తగలకుండా కాపాడే ‘కాలా టికా’లాగా పనిచేస్తాయి. కొందరు కొన్నిచోట్ల నల్ల జెండాలు కూడా ఎగురవేశారు. మన దేశంలో ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు దిష్టి పోవడానికి నల్లటి తిలకం దిద్దుకొనే సంప్రదాయం ఉంది. ఈ రోజు నల్ల రంగు దుస్తులు ధరించి వచి్చనవారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’’అని ప్రధాని మోదీ చెప్పారు. -
తెలంగాణ బలిదానాలకు కాంగ్రెస్సే కారణం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమంపై లోక్సభలో చెలరేగిన దుమారంపై కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి ఘాటుగా స్పందించారు. దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో జరిగిన బలిదానాలకు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమని విరుచుకుపడ్డారు. గురువారం లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కిషన్రెడ్డి జోక్యం చేసుకొని వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రజలను కానీ పవిత్రమైన తెలంగాణ ఉద్యమాన్ని కానీ అవమానించే ఉద్దేశం తేజస్వీ సూర్యకు లేదన్నారు. ఒకవేళ అలా మాట్లాడి ఉంటే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యల వెనుకున్న అసలు ఉద్దేశాన్ని సభకు సవివరంగా తెలియజేశారు. కాంగ్రెస్ తప్పుడు విధానాలు, మోసపూరిత వైఖరి వల్లే తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. -
తేజస్వీ వ్యాఖ్యలను తిప్పికొట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు తెలిసింది. తేజస్వీ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ, బీజేపీ నేతల తీరును ప్రజల్లో ఎండగట్టాలని సూచించినట్లు సమాచారం. కాగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా, పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని ఆయన చెప్పారు. గురువారం సీఎం ఢిల్లీ తుగ్లక్రోడ్డులోని తన అధికారిక నివాసంలో పలువురు పార్టీ ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్లమెంట్లో రాష్ట్ర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తేజస్వీ వ్యాఖ్యలపై స్పందిస్తూ గట్టిగా తిప్పికొట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. కాగా, తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రొద్భలంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. గతంలో ‘తల్లిని చంపి, బిడ్డను బతికించారు’ అంటూ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలే... తాజాగా తేజస్వీ విమర్శలకు దోహదం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఢిలీల్లోని తెలంగాణ భవన్లో ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, యెన్నెం శ్రీనివాస్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు, మాజీమంత్రి బసవరాజు సారయ్య విలేకరులతో మాట్లాడారు. -
డీలిమిటేషన్ దంగల్కు... రంగం సిద్ధం!
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమలు చేసేందుకు మోదీ సర్కారు తలపెట్టిన కీలక కసరత్తు నిర్ణాయక దశకు చేరింది. రిజర్వేషన్ల చట్టం సత్వర అమలు, అందుకు వీలుగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026, డీలిమిటేషన్ బిల్లు–2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లు–2026ను కేంద్రం గురువారం లోక్సభలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వాటి డిమాండ్ మేరకు ఈ అంశంపై డివిజన్ (ఓటింగ్)కు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. బిల్లుకు అనుకూలంగా 251 ఓట్లు, వ్యతిరేకంగా 185 ఓట్లు వచ్చాయి. అనంతరం మూడు బిల్లులనూ కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. లోక్సభ నిబంధన 66లోని ప్రొవైజోను సస్పెండ్ చేసి డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల బిల్లులను ఒకేసారి పరిశీలించి ఆమోదించేందుకు అనుమతివ్వాలంటూ కేంద్ర న్యాయ మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ తీర్మానం ప్రవేశపెట్టారు. బిల్లులు రాజ్యాంగ సవరణతో ముడిపడ్డాయి గనుక ఇందుకు అనుమతించాలని కోరారు. స్పీకర్ అనుమతితో బిల్లులపై మొదలైన చర్చ గురువారం అర్ధరాత్రి దాకా సుదీర్ఘంగా సాగింది. బిల్లుకు అనుకూలంగా అధికార, వ్యతిరేకంగా విపక్ష సభ్యుల వాదనలతో సభ హోరెత్తిపోయింది. బిల్లులపై ఓటింగ్కు శుక్రవారం సాయంత్రం నాలుగింటికి ముహూర్తం ఖరారైంది. వాటిలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి. మోదీ సర్కారుకు అందుకు అవసరమైన సంఖ్యా బలం లేని నేపథ్యంలో బిల్లు ఎలా గట్టెక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దాంతో ఓటింగ్పై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హోరాహోరీ వాదనలు పార్లమెంటు మూడు రోజుల ప్రత్యేక సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం లోక్సభ సమావేశం మొదలవగానే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును విపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించడంతో దానిపై 40 నిమిషాల పాటు తీవ్ర చర్చ జరిగింది. చివరికి డివిజన్ ఓటింగ్ అనంతరం సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లును హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. తర్వాత చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగొయ్ మోదీ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ల సాకుతో లోక్సభ స్థానాలను అడ్డదిడ్డంగా పెంచుకుని రాజకీయ లబ్ధి పొందడమే బీజేపీ అసలు లక్ష్యమంటూ మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల నిమిత్తం పార్లమెంటు గతంలోనే చట్టం చేశాక మళ్లీ దానికి మార్పులను ప్రతిపాదించడం వెనక మతలబు ఏమిటని కాంగ్రెస్ సభ్యుడు కె.సి.వేణుగోపాల్ కేంద్రాన్ని నిలదీశారు. రాజ్యాంగ సవరణ బిల్లును ఇతర బిల్లులతో కలిపి చర్చకు చేపట్టరాదంటూ అభ్యంతరం వెలిబుచ్చగా దాన్ని అమిత్ షా తోసిపుచ్చారు. ఒకే అంశానికి సంబంధించిన పక్షంలో వాటిని ఉమ్మడిగా చర్చకు చేపట్టిన ఉదంతాలు గతంలో ఉన్నాయని స్పీకర్ బిర్లా స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి అంతమే! రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు రూపంలో దేశ ప్రజాస్వామ్యంపై మోదీ సర్కారు బాహాటంగా దాడికి దిగిందని కాంగ్రెస్ సభ్యురాలు ప్రియాంకా గాంధీ వద్రా దుయ్యబట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే దేశంలో ప్రజాస్వామ్యమే పూర్తిగా అంతమైపోతుందని అభిప్రాయపడ్డారు. లోక్సభ స్థానాలను పెంచకుండా ప్రస్తుత 543 సీట్లకే మహిళా రిజర్వేషన్లను వర్తింపజేయడంలో కేంద్రానికి ఇబ్బందేమిటని ఆమె నిలదీశారు. సవరణ బిల్లు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వేణుగోపాల్ ఆరోపించారు. వాటి విషయంలో ఇంత హడావుడి ఎందుకని సమాజ్వాదీ పార్టీ సభ్యుడు అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లకు తమ పార్టీ మద్దతిస్తుందని స్పష్టం చేస్తూనే, జనగణన జరుగుతుండగానే ఈ హడావుడి కసరత్తు ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. బిల్లు ఉద్దేశాలను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సంక్షిప్తంగా ప్రసంగించారు. 2029 లోక్సభ ఎన్నికల నాటికి కూడా మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోతే వారికి తీరని నష్టం జరుగుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్సభ స్థానాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయమూ జరగబోదని స్పష్టం చేశారు. ‘‘బిల్లును వ్యతిరేకించే పార్టీలు పూడ్చుకోలేని విధంగా నష్టపోవడం ఖాయం. అది మాకే లబ్ధి చేకూరుస్తుంది’’ అని అన్నారు. అనంతరం విపక్షాల ప్రసంగాల మధ్యలో అమిత్ షా అప్పుడప్పుడూ జోక్యం చేసుకుంటూ వాటి వాదనలను తిప్పికొడుతూ వచ్చారు. డీలిమిటేషన్ అనంతరం దక్షిణాది రాష్ట్రాల బలం ఇప్పటితో పోలిస్తే మరింత పెరుగుతుందే తప్ప తగ్గబోదని సోదాహరణంగా వివరించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశాక కూడా పురుషులకు గానీ, ఏ రాష్ట్రానికి గానీ ఎలాంటి అన్యాయమూ జరగొద్దనే లోక్సభ, అసెంబ్లీల్లో స్థానాలను 50 శాతం మేరకు పెంచుతున్నట్టు వెల్లడించారు. నల్ల దుస్తులతో డీఎంకే మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ డీఎంకే సభ్యులు నల్ల దుస్తులతో సభకు హాజరయ్యారు. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని ఆ పార్టీ సభ్యుడు టి.ఆర్.బాలు డిమాండ్ చేశారు. ప్రతిపాదత బిల్లుల అసలు లక్ష్యం డీలిమిటేషనే తప్ప మహిళా రిజర్వేషన్ల అమలు కాదని ఆరోపించారు. కె.సుబ్బరాయన్ (సీపీఐ), ఎన్.కె.ప్రేమ్చంద్రన్ (ఆరెస్పీ) తదితర విపక్ష సభ్యులు మాట్లాడుతూ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. జేడీ(యూ) తదితర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సభ్యులు బిల్లులకు మద్దతుగా మాట్లాడారు. ముహూర్తం... సాయంత్రం 4! మూడు బిల్లులపై లోక్సభలో ఓటింగ్ మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు మోదీ సర్కారు ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై శుక్రవారం సాయంత్రం నాలుగింటికి లోక్సభ కీలక ఓటింగ్ చేపట్టనుంది. స్పీకర్ ఓం బిర్లా గురువారం సభలో ఈ మేరకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం మోదీ తన చాంబర్లో కీలక భేటీ జరిపారు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అధ్యక్షుడు నితిన నబీన్, పలు ఎన్డీఏ పక్షాల నేతలు తదితరులు అందులో పాల్గొన్నారు. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మద్దతు కూడగట్టడంపై వారంతా చర్చలు జరిపారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని కాంగ్రెస్తో పాటు పలు కీలక విపక్ష పార్టీలు బుధవారమే ప్రకటించడం తెలిసిందే. అధికార ఎన్డీఏ కూటమికి పార్లమెంటు ఉభయ సభల్లోనూ సొంతంగా మూడింట రెండొంతుల మెజారిటీ లేదు. ఈ నేపథ్యంలో లోక్సభలో శుక్రవారం జరిగే ఓటింగ్లో బిల్లు ఎలా గట్టెక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
15 మంది మృతి.. ఓ మహిళ మాత్రం ఇన్స్టాగ్రామ్ రీల్తో బతికింది
చండీగఢ్ : 15 మంది ప్రాణాలు బలిగొన్న పడవ ప్రమాదంలో ఓ మహిళ మాత్రం చావు అంచున ఉన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ను గుర్తు చేసుకుని అద్భుతంగా ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ సంఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.పోలీసుల వివరాల ప్రకారం, గత వారం ఉత్తరప్రదేశ్లోని మథురలో పెను విషాదం చోటు చేసుకుంది. వృందావన్లోని యమునా నదిలో 20–30 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. వేగంగా వీస్తున్న గాలుల కారణంగా పడవ అదుపు తప్పి, అనంతరం సీ ఘాట్ వద్ద ఉన్న పాంటూన్ వంతెనను ఢీకొనడంతో బోల్తా పడిందని జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాశ్ సింగ్ తెలిపారు.ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆ రోజు ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నాటికి మొత్తం 15 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అయితే, గల్లంతైన వారిలో లూధియానాకు చెందిన 54 ఏళ్ల రాజిందర్ కౌర్ బంగా మాత్రం చావు అంచు నుంచి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు నీటిలో మునిగి ఊపిరాడక హాహాకారాలు చేస్తుండగా, బంగా మాత్రం తాను గతంలో ఇన్స్టాగ్రామ్లో చూసిన వీడియోను గుర్తు చేసుకుని ప్రాణాలను కాపాడుకున్నట్లు స్వయంగా మీడియాకు తెలిపారు.‘నేను గతంలో నీటిలో మునిగితే ఎలా బయటపడాలో వివరిస్తూ ఇన్స్టాలో అప్లోడ్ చేసిన టిప్స్ వీడియో చూశాను. ప్రమాద సమయంలో ఆ సూచనలు గుర్తుకు వచ్చాయి. నోరు తెరవలేదు, చేతులను నిటారుగా ఉంచాను, కాళ్లను కదిలించాను. ఈత రాకపోయినా ఆ సూచనల వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగాను’ అని ఆమె పేర్కొన్నారు. -
దక్షిణాదిలో పెరగనున్న పార్లమెంట్ స్థానాలు ఎన్నంటే : అమిత్షా
సాక్షి,న్యూఢిల్లీ: డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగనుందంటూ విపక్షాల ఆరోపణలకు కేంద్ర హోంమంత్రి అమిత్షా కౌంటర్ ఇచ్చారు. బిల్లుతో దక్షిణాదిలో పార్లమెంట్ స్థానాలు 129 నుంచి 195కు పెరుగుతాయి. బిల్లుతో లాభం తప్ప నష్టం జరగదు. బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు చాలా లాభం. కర్ణాటక, తెలంగాణ బాగా లాభపడతాయి. ఈ బిల్లుతో తెలంగాణలో ఎంపీల సంఖ్య 17 నుంచి 26కు.. ఏపీలో ఎంపీ సీట్లు 25 నుంచి 38కి పెరుతాయి. అలాగే తమిళనాడులో 59కి, కర్ణాటకలో 28 నుంచి 42 స్థానాలు.. కర్ణాటకలో 28 నుంచి 42 స్థానాలకు పెరుగుతాయి. మేం సందేహాలకు సమాధానం ఇస్తాం.. వాకౌట్ చేయాల్సిన పనిలేదని విపక్షాల ఆరోపణలకు అమిత్షా ఎద్దేవా చేశారు. కాగా, జనాభా మార్పులను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటరీ, రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్ నిర్వచించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు ఉద్దేశించిన మూడు కీలక బిల్లులను కేంద్రం ఇవాళ(ఏప్రిల్ 16, గురువారం) లోక్సభలో ప్రవేశపెట్టారు. వీటిపై చర్చలో భాగంగా ప్రధాని సభలో ప్రసంగిస్తూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజకీయ రంగు పులమొద్దన్నారు.‘‘దేశ ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన బిల్లు ఇది. మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ అందరికీ దక్కుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి నష్టపోవద్దు. క్షేత్రస్థాయిలో మహిళా నాయకత్వం సిద్ధంగా ఉంది. నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలని వారంతా భావిస్తున్నారు. అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత నాది. బీసీ వర్గాల్లో జన్మించిన నాకు ప్రధాని పదవి దక్కడం రాజ్యాంగ నిర్మాతల చలవే...డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. గ్యారెంటీగా అంశాన్ని ఈ విషయాన్ని చెపుతున్నా. ఇప్పుడున్న నిష్పత్తిలో నియోజకవర్గాల్లో పెరుగుతాయి. మా విధానాల్లో స్పష్టత ఉంది. గతంలో జరిగిన మహిళలకు జరిగిన వివక్ష అనే పాపాన్ని కడిగేస్తున్నాం. సాంకేతిక అంశాలతో వ్యతిరేకించొద్దు. బిల్లును ఎలాగా ఆమోదించాలో సమయం నిర్ణయిస్తుంది. మూడు దశాబ్దాల పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు. మహిళా బిల్లుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతివ్వాలి. ఈ బిల్లును తేవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు’’ అని ప్రధాని మోదీ అన్నారు.డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ విపక్షాలను హెచ్చరించారు. “దేశ పార్లమెంట్ చరిత్రలో ఈ రోజును మర్చిపోలేం. మహిళా రిజర్వేషన్ గొప్ప బిల్లు. ఈ చారిత్రక సమయంలో పాలు పంచుకోవడం నా అదృష్టం. ఈ బిల్లులతో దేశానికి సరికొత్త దశ, దిశను ఇస్తున్నాం. వికసిత్ భారత్ అంటే రోడ్లు, రైళ్లు, మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు. మహిళల స్వావలంబన కూడా ఉంటేనే అది సంపూర్ణ వికసిత్ భారత్ అవుతుంది. దేశ రాజకీయాల్లో, వికసిత్ భారత్ సాధనలో మహిళల పాత్ర కీలకం...మహిళలకు అవకాశమిస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారు. రాజకీయాల్లో తమ శక్తిని చాటేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఎవరికైనా అవకాశమిస్తేనే కదా.. వారి సామర్థ్యం తెలుస్తుంది. రాజకీయాల్లో సామర్థ్యం, అనుభవం ఉన్న మహిళలు పుష్కలంగా ఉన్నారు. దేశ ప్రగతిలో మహిళలకూ బాగస్వామ్యం కల్పించాల్సిందే. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు.. మహిళలకు మనం ఇస్తున్న కానుక కాదు. అది వారి హక్కు" అని మోదీ వ్యాఖ్యానించారు.“ఈ బిల్లును తీసుకురాగానే కొందరు విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ మాట్లాడుతున్నారు. అలాంటి వారిని ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం, ఉత్తరాది, దక్షిణాది అనే భేదభావం మాకు లేదు. ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని హామీ ఇస్తున్నాం” అని మోదీ స్పష్టం చేశారు.ఈ బిల్లుతో కేవలం దేశంలోని మహిళలకు వారి హక్కులను కల్పిస్తున్నాం. ఈ బిల్లుపై క్రెడిట్ నాకు అవసరం లేదు. మీరే (విపక్షాలను ఉద్దేశిస్తూ) తీసుకోండి.. మహిళా బిల్లుపై అన్ని పార్టీల నేతల ఫొటోలూ వేసుకోండి. ఈ బిల్లును అడ్డుకోకుండా సహకరించి మీ గొప్పతనం చాటుకోండి. మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిద్దాం” అని మోదీ విపక్షాలను కోరారు. -
సీబీఎస్ఈ టెన్త్ టాపర్లు వీరే!
ఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి బోర్డు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. పరీక్ష రాసిన వారిలో 93.66% మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 94.99 శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా, బాలురు 92.69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా చూస్తే ఉత్తీర్ణత శాతం గతేడాది (93.66) కంటే ఈసారి 0.04 శాతం పెరిగింది.ఈ ఏడాది దేశవ్యాప్తంగా 24.72 లక్షల మంది పరీక్షలు రాయగా వారిలో 23.16 లక్షల మంది పాసయ్యారు. ఈ ఏడాది 10వ తరగతి బోర్డు పరీక్షల్లో మొత్తం 2,21,574 మంది విద్యార్థులు (8.96 శాతం) 90 శాతానికి పైగా మార్కులు సాధించగా.. 55,364 మంది విద్యార్థులు (2.24 శాతం) 95 శాతానికి పైగా మార్కులు సాధించారు. టాపర్స్ వివరాలను సీబీఎస్ఈ అధికారికంగా ప్రకటించలేదు. పులువురు విద్యార్థులు వందకు వంద శాతం స్కోరు సాధించినట్టు వార్తలు వస్తున్నాయి.పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరు విద్యార్థులకు 100 శాతం మార్కులు వచ్చినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. బిధాన్నగర్లోని భవన్స్ గంగాబక్స్ కనోరియా విద్యామందిర్ విద్యార్థిని అనిషా ఘోష్, రాజ్పూర్ సోనార్పూర్లోని బీడీఎం ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి జయశిర్ష్య బసు 500కి 500 మార్కులు సాధించారు. కాగా, మెడిసిన్ చదవాలన్నది తన లక్ష్యమని జయశిర్ష్య బసు తెలిపాడు. 12వ తరగతిలో పీసీఎంబీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ) కోర్సులో చేరాలనుకుంటున్నట్టు చెప్పాడు. వంద శాతం మార్కులు సాధించడం పట్ల అనిషా ఘోష్ ఆనందం వ్యక్తం చేసింది. అయితే కవల సోదరి అనిష్కకు 496 మార్కులు రావడం కొంచెం నిరాశకు గురిచేసిందని తెలిపింది. తామిద్దరం కష్టపడి చదివామని, స్కూల్ కూడా బాగా సహకరించిందని చెప్పింది.చదవండి: 'నాన్న'గా గర్వించే క్షణం! పూరీకి చెందిన టీనా రాత్, ఘజియాబాద్కు చెందిన దక్ష్, గురుగ్రామ్కు చెందిన తానయ్ శ్రీవాస్తవ, సోనిపట్కు చెందిన మనన్ కూడా వంద శాతం స్కోరు చేసినట్టు మీడియా వెల్లడించింది. కోచింగ్ కంటే సొంత ప్రిపరేషన్ ద్వారానే మంచి మార్కులు సాధించామని పలువురు టాపర్లు తెలిపారు. రోజుకు దాదాపు 13 గంటలు చదివానని దక్ష్ వెల్లడించాడు. తాను 10 నుంచి 12 గంటల పాటు ప్రిపరేషన్ సాగించానని టీనా రాత్ తెలిపింది. కార్డియాక్ సర్జన్ కావాలన్నదే తన లక్ష్యమని చెప్పింది. అప్పుడు, ఇప్పుడు సేమ్సీబీఎస్ఈ టెన్త్ 2026 ఫలితాల్లో విజయవాడ, తిరువనంతపురం రీజియన్లు 99.79 శాతం ఉత్తీర్ణతతో టాప్లో నిలిచాయి. గతేడాది ఫలితాల్లో కూడా ఈ రెండు రీజియన్లే మొదటి స్థానంలో ఉండడం విశేషం. కాగా, విజయవాడ రీజియన్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. -
ఏపీ విభజనపై ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: ఏపీ విభజనపై బెంగళూరు సౌత్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ విభజనతో ఏపీ విభజనను పోల్చారు. ఏపీ విభజనను బ్రిటీష్ కంటే చెత్తగా కాంగ్రెస్ చేసింది’ అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను దక్షిణ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇదే అంశంపై ఎంపీ తేజస్వీ సూర్య స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల తాము సీట్లను, ప్రభావం తగ్గిపోతుందనే భావన దక్షిణాది ప్రాంతాల్లో నెలకొంది. అయితే, ప్రభుత్వం అన్ని రాష్ట్రాల వాటాను 50శాతానికి పెంచుతుంది. తద్వారా ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తుందని స్పష్టం చేశారు. -
రేవంత్ది ఫూలిష్ ప్రతిపాదన.. లోక్సభలో తేజస్వీ సూర్య
సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్ విషయంలో ప్రతిపక్షాలు చేస్తోంది రాద్ధాంతమేనని.. మహిళా రిజర్వేషన్ల బిల్లు అడ్డుకోవడమే వాళ్ల ధ్యేయంగా కనిపిస్తోందని బెంగళూరు సౌత్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులపై చర్చ సందర్భంగా ఆయన విపక్షాలపై ధ్వజమెత్తారు. 1996 నుంచి మహిళా రిజర్వేషన్ల బిల్లు పెండింగ్లో ఉంది. గత ప్రభుత్వాలు ఈ బిల్లును విస్మరించాయి. కానీ, ప్రధాని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని మహిళలందరి తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు. కానీ, మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆలస్యమయ్యేలా ప్రతిపక్షాలు కొత్తదారులు వెతుక్కుంటున్నాయి. రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ తప్పనిసరి. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నాయి. తమిళనాడులోనూ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. కానీ, డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు. డీలిమిటేషన్ వద్దని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ, అదే జరిగితే కేరళలో పది సీట్లు పెరుగుతాయి. ఇది కేరళకు లాభమే గానీ నష్టం కాదు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదనలో అర్థమే లేదు. డీలిమిటేషన్ సాకుగా చూపించి మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవాలని విపక్షాలు చూస్తున్నాయి. 1996లో మొదలైన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పుడు ఓ కొలిక్కి వస్తోంది. ఈరోజు కోసం దేశం 40 ఏళ్లుగా ఎదురు చూస్తోంది. 2029లో అమలయ్యే మహిళా రిజర్వేషన్లతో దేశం అభివృద్ధిలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. సూర్యనారీశక్తి బిల్లును విపక్షాలు అడ్డుకోవడం సరికాదు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చావడానికైనా నేను సిద్ధం’’ అని తేజస్వీ సూర్య ప్రసంగించారు.సీఎం రేవంత్ ప్రతిపాదనపై స్పందిస్తూ.. డీలిమిటేషన్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వాదనను చర్చ సందర్భంగా తేజస్వీ సూర్య తప్పుబట్టారు. ‘‘రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన హైబ్రిడ్ వాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. జీఎస్డీపీ ఆధారంగా సీట్ల సంఖ్య పెంచమని రేవంత్ అన్నారు. ఆ సలహా ఆయనకు ఎవరు ఇచ్చారో తెలియదు. ఆయనత ఎచ్చిన ప్రతిపాదన ఫూలిష్గా ఉంది. జీఎస్డీపీ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఆ లెక్కన సీట్ల సంఖ్య మారుతూ ఉండాలా?. ఆదాయం ప్రకారం ఓట్లు ఇస్తే అంబానీకి లక్ష ఓట్లు ఇవ్వాలి. రాజ్యాంగం ప్రకారం.. ఒకరికి ఒక్క ఓటే ఉంటుంది. డీలిమిటేషన్ ఏపీ, తెలంగాణలో 52 శాతం సీట్లు పెరుగుతాయి. తమిళనాడులో 49 సీట్లు పెరుగుతున్నాయి. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో 23.9 శాతం సీట్లు పెరుగుతాయి. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్ల పెంపు అనేది రాజ్యాంగబద్ధమే. డీలిమిటేషన్తో సీట్ల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు న్యాయమే జరుగుతుంది’’ అని తేజస్వీ అన్నారు. -
డీలిమిటేషన్ బిల్లులపై చర్చకు లైన్ క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: 131 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్సభలో గురువారం ఓటింగ్ జరిగింది. డీలిమిటేషన్ బిల్లులపై చర్చకు విపక్షాలు డివిజన్ కోరాయి. అందుకు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. సభలో ఉన్న మొత్తం 333 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొన్నారు. అనుకూలంగా 207, వ్యతిరేకంగా 126 మంది ఓటు వేశారు. మరో 86 మంది సభకు హాజరే కాలేదు. దీంతో డీలిమిటేషన్ బిల్లులపై సభలో చర్చకు మార్గం సుగమమైంది. అంతకు ముందు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాక.. మూడు కీలక బిల్లులను లోక్సభలో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘావాల్, అమిత్ షాలు ప్రవేశపెట్టారు. అయితే.. రాజ్యాంగ విరుద్ధంగా 131 సవరణ బిల్లు తీసుకొచ్చారని.. తక్షణమే దానిని వెనక్కి తీసుకోవాలని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లుపై చర్చకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ డివిజన్ కోరగా.. చివరకు అత్యధిక ఓట్లు చర్చకు అనుకూలంగా పడ్డాయి.చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్సభ సీట్లను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడంతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు.. అలాగే లోక్సభ- అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు ఉన్నాయి. -
లోక్సభలో డీలిమిటేషన్ మంట
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే లోక్సభ వేడెక్కింది. డీలిమిటేషన్, 131 రాజ్యాంగ సవరణ బిల్లులను గురువారం కేంద్రం ప్రవేశపెట్టింది. ఆ వెంటనే ఎన్డీయే కూటమి, కాంగ్రెస్-మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. 2023లోనే మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చాం. 2024 నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశాం. ఆ టైంలోనే 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదు?. జనాభా లెక్కలు, మహిళా రిజర్వేషన్ బిల్లుల తర్వాతే డీలిమిటేషన్ ఉంటుందని అన్నారు. ఇప్పుడేమో రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లు తీసుకొచ్చారు. బిల్లుకు అసలు కారణం వేరే ఉంది. రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం హైజాక్ చేయాలని చూస్తోంది.131 రాజ్యాంగ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ‘‘కేంద్రం తెచ్చిన బిల్లులను కేసీ వేణుగోపాల్ అవమానించారు. బిల్లును సభలో పెట్టకుండా ఎలా చర్చిస్తాం?. బిల్లు పూర్తిగా ప్రవేశపెట్టకుండానే అభ్యంతరం ఏంటి?. సభలో బిల్లు పెట్టాక మీ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. చర్చల సమయంలో అన్నింటకీ సమాధానం చెబుతాం’’ అని బదులిచ్చారు. అయితే బిల్లులను సభలో ప్రవేశపెట్టడంపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.Congress MP KC Venugopal opposes the introduction of Constitution (One Hundred and Thirty-First Amendment) Bill, 2026, Union Territories Laws (Amendment) Bill, 2026 and Delimitation Bill, 2026. pic.twitter.com/vTpO7phzQL— ANI (@ANI) April 16, 2026చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్సభ సీట్లను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడంతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, లోక్సభ- అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు ఉన్నాయి. ఇందులో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు. మిగతా రెండూ చట్టపరమైన బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. మిగతా రెండింటికీ సాధారణ మెజారిటీ సరిపోతుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్సభ ప్రారంభమైన వెంటనే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వీటిని ప్రవేశపెట్టారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే ఇంకో బిల్లును హోంమంత్రి అమిత్ షా సభ ముందు ఉంచారు. అనంతరం వీటిపై చర్చ సభలో చేపట్టారు. ఈ బిల్లులపై నేటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్లో చర్చించనున్నారు. ఈ మూడింటిపై ఒక్కో సభలో 18 గంటలపాటు ఎంపీలు మాట్లాడుతారు. ప్రధాని మోదీ ఈ సాయంత్రం లోక్సభలో ప్రసంగించే అవకాశం ఉంది. రాజ్యసభలో 18న చర్చ ఉంటుంది. -
డీలిమిటేషన్పై కేంద్రం క్లారిటీ
ఢిల్లీ: డీలిమిటేషన్పై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ఉన్న సీట్లకు 50 శాతం పెంచుతున్నట్లు పేర్కొంది. బిల్లులో ఈ విషయం స్పష్టంగా ఉందన్న సమాచార శాఖ.. పార్లమెంట్ చర్చ సందర్భంగా మరింత క్లారిటీ ఇస్తామని తెలిపింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఢిలిమిటేషన్ ఉంటుందన్న అపోహలను కేంద్రం కొట్టిపారేసింది. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.తమిళనాడులో 58కి, కేరళంలో 30కి పెరుగుతాయన్న కేంద్రం.. డీలిమిటేషన్తో దక్షిణాదిలో సీట్లు తగ్గవని తెలిపింది. రాష్ట్రాలకు చట్టబద్ద రక్షణ ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బిల్లులోని అంశాలను ముక్కలుగా చదవి విశ్లేషించొద్దని కేంద్రం పేర్కొంది. 2029 లోక్సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, అందుకోసం లోక్సభ స్థానాలను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.డీలిమిటేషన్ 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా తాజాగా జరుగుతున్న జనగణన ప్రాతిపదికన జరగాలని ఆప్, ఆర్జేడీ వంటి పార్టీలు డిమండ్ చేస్తున్నాయి. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇందుకు విపక్షాల మద్దుతు మోదీ ప్రభుత్వానికి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. పార్లమెంటు సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.రేపటి (ఏప్రిల్ 16, గురువారం) నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే మోదీ సర్కారు హడావుడిగా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలను తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. మరోవైపు డీలిమిటేషన్తో తమకు తీవ్ర అన్యాయం జరగనుందని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి. ఈ ప్రక్రియను పార్లమెంటులోనే సవాలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి. -
సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల
ఢిల్లీ: సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 93.70గా నమోదైంది. గతేడాది 93.66 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణత శాతం 94.99శాతం ఉండగా బాలురుది 92.69శాతంగా ఉంది. ప్రాంతాల వారీగా చూస్తే త్రివేండ్రం అత్యధికంగా 99.79శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సంస్థల వారీగా చూస్తే కేంద్ర విద్యాలయాలు (KV) అత్యుత్తమ ఫలితాలను సాధించాయి. వీటి ఉత్తీర్ణత శాతం 99.57శాతంగా నమోదైంది. ఫలితాల తర్వాత సప్లమెంటరీ పరీక్షలు మే మధ్యలో ప్రారంభం కానున్నాయి. అలాగే లిస్ట్ ఆఫ్ కాండిడేట్స్ విండో ఏప్రిల్ 16 నుండి 20 వరకు అందుబాటులో ఉంటుంది. గతంలో ఫలితాల సమయంలో వెబ్సైట్లు మొరాయించడం, సర్వర్లు డౌన్ వంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యేవి. ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా ఫలితాలను విద్యార్థులు నేరుగా స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేలా డిజీలాకర్, ఉమాంగ్ యాప్స్లలో అందుబాటులోకి తెచ్చింది. తద్వారా విద్యార్థులు తమ స్మార్ట్ఫోన్ల ద్వారానే కేవలం నిమిషాల వ్యవధిలో స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
కాంగ్రెస్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నేత, ఏఐసీసీ మీడియా చైర్మన్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన తాత్కాలిక ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. కాగా, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో గువాహటిలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ను అస్సాం పోలీసులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ చందుర్కర్ ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అస్సాం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా దరఖాస్తు చేసుకుంటే.. దానిపై తమ ఉత్తర్వుల ప్రభావం పడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
కీలక పదవి దక్కిన వెంటనే ఈడీ రైడ్స్!
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులతో పంజాబ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రముఖ వ్యాపారవేత్త, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్కు చెందిన అనేక ప్రదేశాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వీటిల్లో దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థగా పేరున్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కూడా ఉంది. ఈడీ అధికార వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఆప్ రాజ్యసభ సభ్యుడు అశోక్ మిట్టల్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయనకు సంబంధించిన వ్యాపార, విద్యా సంస్థల్లో ఈడీ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతున్నాయి. పంజాబ్తో పాటు గురుగ్రామ్లో 8-9 ప్రదేశాల్లో.. ఏకకాలంలో ఇవి జరుగుతున్నాయి. ఇప్పటికే ఎల్పీయూలోని పలు విభాగాల రికార్డులను పరిశీలించారు. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయనే అనుమానాలపై దర్యాప్తు కొనసాగుతోంది. రాఘవ్ చద్దా తీరుతో విసిగిపోయిన ఆప్ ఆయన్ని పక్కనపెట్టి ఏప్రిల్ 2వ తేదీన అశోక్ మిట్టల్ను రాజ్యసభ ఉపనేతగా నియమించింది. ఈ క్రమంలో పార్టీ లోపల కీలక స్థానంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఈడీ రైడ్స్ జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఎవరీ అశోక్ మిట్టల్అశోక్ మిట్టల్ ప్రముఖ వ్యాపారవేత్త. అంతేకాదు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) స్థాపకుడు, ఛాన్సలర్ కూడా. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆప్ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయగా.. ఎన్నిక ఏకగ్రీవమైంది. మిట్టల్ 2024లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ సభ్యుడిగా కూడా నియమితులయ్యారు. ఇప్పటికే ఆప్ నేతలు పలువురు కేసులు, విచారణలు ఎదుర్కొంటున్నారు. తాజా ఈడీ రైడ్స్ పరిణామాన్ని ఆప్ పార్టీకి పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆప్ మాత్రం రాజకీయ ఒత్తిళ్లతో జరుగుతున్న దాడులుగా ఆరోపిస్తోంది. -
లోక్సభ స్థానాలు 850కి పెంపు!
సాక్షి, న్యూఢిల్లీ: 2029 లోక్సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, అందుకోసం లోక్సభ స్థానాలను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో లోక్సభలో స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుంచి 850 దాకా పెరిగే అవకాశముంది! వీటిలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 815కు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గరిష్టంగా 35కు మించకుండా స్థానాలుంటాయి. మహిళలకు 33 శాతం లెక్కన వాటిలో గరిష్టంగా 280 నుంచి 281 స్థానాల దాకా రిజర్వు చేయనున్నారు. దీనికి వీలు కల్పించేందుకు ఉద్దేశించిన 3 బిల్లులను గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది.2029కి ముందే మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు, అందుకోసం లోక్సభ స్థానాల పెంపుకు వీలు కల్పించేలా రాజ్యాంగ (131వ)సవరణ బిల్లు–2026, దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు వీలుగా డీలిమిటేషన్ బిల్లు–2026, ఈ ప్రక్రియను ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీలకు కూడా వర్తింపజేసేందుకు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు–2026 వీటిలో ఉంటాయి. ఈ మూడు బిల్లులకూ ఈ ప్రత్యేక సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటి ముసాయిదా ప్రతులను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంగళవారం ఎంపీలందరికీ పంపింది. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం త్వరలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది.లోక్సభ స్థానాల తుది సంఖ్యను పునర్విభజన కసరత్తు అనంతరం కమిషనే ఖరారు చేయనుంది. ఈ కారణంగానే పెరగనున్న లోక్సభ స్థానాల సంఖ్యను రాజ్యాంగ సవరణ బిల్లులో స్పష్టంగా పేర్కొనలేదు. ‘అన్ని రాష్ట్రాలకు కలిపి గరిష్టంగా 815కు మించకుండా, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35కు మించకుండా లోక్సభ స్థానాలుండాలి’అని మాత్రమే తెలిపారు. లోక్సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో స్థానాల సంఖ్యను 50 శాతం పెంచాలని మోదీ సర్కారు నిర్ణయించడం తెలిసిందే.ఇందుకోసం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటూ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టనున్నట్టు రాజ్యాంగ సవరణ బిల్లులో వెల్లడించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపుకు వీలుగా రాజ్యాంగంలోని పలు అధికరణలకు సవరణలను కూడా ప్రతిపాదించారు. నారీశక్తి వందన్ అధినియమ్గా పేర్కొనే మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలకు పార్లమెంటు ప్రత్యేక భేటీలో ఆమోదం పొందనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే వెల్లడించడం తెలిసిందే. ఈ ప్రక్రియ ఆలస్యమైతే చట్టసభల్లో విధాన నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆశిస్తున్న మహిళలందరికీ తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. 2029 నుంచే అమలయ్యేలా... మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2023లో పార్లమెంటు ఆమోదించడం తెలిసిందే. దీని ప్రకారం లోక్సభ, అసెంబ్లీల్లో 33 శాతం సీట్లను మహిళలకు ప్రత్యేకిస్తారు. అయితే ఈ చట్టం 2034కు ముందు అమల్లోకి వచ్చే పరిస్థితులు లేవు. మహిళా రిజర్వేషన్లు అమలవాలంటే ప్రస్తుతం కొనసాగుతున్న జనగణన–2027 ప్రక్రియ ముగిసి, ఆ లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పుననర్విభజన చేపట్టాల్సి ఉండటమే అందుకు కారణం. కానీ మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమల్లోకి తేవాలని మోదీ సర్కారు భావిస్తోంది. ‘‘తదుపరి జనగణన, దాని తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది.కానీ లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు వీలైనంత త్వరగా అమలయ్యేలా చూడటం చాలా ముఖ్యం. అందుకు అనుగుణంగా మహిళా రిజర్వేషన్ల చట్టానికి అవసరమైన సవరణలు చేపట్టడమే లక్ష్యం’’అని ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాలో కేంద్రం పేర్కొంది. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న, అంటే 2011 జనాభా లెక్కల ఆధారంగానే లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించింది. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వు చేసే స్థానాలను రొటేషన్ పద్ధతిలో కేటాయిస్తారని తెలిపింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. అనంతరం వాటి పొడిగింపుపై పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుంది. మూడు బిల్లులపై 18 గంటల చర్చ మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన మూడు కీలక బిల్లులను గురువారం లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టనుంది. రాజ్యంగ (131వ సవరణ) బిల్లు–2026, డీలిమిటేషన్ బిల్లు–2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు–2026పై గురు, శుక్రవారాల్లో సభలో చర్చ జరగనుంది. అందుకు 18 గంటల సమయం కేటాయించారు. అనంతరం వాటిపై ఓటింగ్ చేపడతారు. తర్వాత మూడు బిల్లులపై శనివారం రాజ్యసభలో 10 గంటల పాటు చర్చ, అనంతరం ఓటింగ్ జరుగుతాయి. గురు, శుక్రవారాల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక కూడా జరుగుతుందని పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి.లోక్సభ స్థానాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు లబ్ధి?లోక్సభ నియోజకవర్గాల పెంపులో దామాషా ప్రాతినిధ్య విధానాన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్సభ స్థానాలను గరిష్టంగా 850 దాకా పెంచాలని రాజ్యాంగ సవరణ బిల్లు–2026లో కేంద్రం ప్రతిపాదించింది. ‘‘వాటిని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించే విషయంలో దామాషా విధానాన్ని అనుసరించనున్నారు. దీనిద్వారా దక్షిణాది రాష్ట్రాలకే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశముంది’’అని కేంద్ర వర్గాలు వివరించాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం లోక్సభలో వెల్లడించే అవకాశమున్నట్టు తెలిపాయి.నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోనున్న విషయం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలు కొన్ని దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణను సమర్థంగా పాటిస్తూ వస్తున్నాయి. దాంతో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే వాటిలో జనాభా పెరుగుదల తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గి ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం పెరుగుతుందని విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి.వాడీవేడిగా సమావేశాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే మోదీ సర్కారు హడావుడిగా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలను తెరపైకి తెచి్చందని కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. మరోవైపు డీలిమిటేషన్తో తమకు తీవ్ర అన్యాయం జరగనుందని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి. ఈ ప్రక్రియను పార్లమెంటులోనే సవాలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి.డీలిమిటేషన్ 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా తాజాగా జరుగుతున్న జనగణన ప్రాతిపదికన జరగాలని ఆప్, ఆర్జేడీ వంటి పార్టీలు డిమండ్ చేస్తున్నాయి. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇందుకు విపక్షాల మద్దుతు మోదీ ప్రభుత్వానికి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కని్పస్తోంది. పార్లమెంటు సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. డీలిమిటేషన్కు కమిషన్ ⇒ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వం ⇒ సభ్యులుగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ⇒ ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది సభ్యులులోక్సభ, అసెంబ్లీ స్థానాల పునర్ వ్యవస్థీకరణ కోసం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది. దానికి సుప్రీంకోర్టు ప్రస్తుత, లేదా రిటైర్డ్ న్యాయమూర్తి చైర్మన్గా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, లేదా ఎన్నికల కమిషనర్తో పాటు సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ఈ ప్రక్రియలో రాష్ట్రాల భాగస్వామ్యం నిమిత్తం ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది చొప్పున అసోసియేట్ సభ్యులను నియమిస్తారు. వీరిలో ఐదుగురు ఎంపీలను లోక్సభ స్పీకర్, ఐదుగురు ఎమ్మెల్యేలను రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు నామినేట్ చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులు 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు భారీగా వలసలు పెరగడం, జనాభా పెరుగుదల రేటులో మార్పులతో నియోజకవర్గాల మధ్య సమతుల్యత దెబ్బతిన్నదని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరి్టకల్ 81, ఆరి్టకల్ 55కు కీలక సవరణలు చేస్తూ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా నియోజకవర్గాలను పునర్ వ్యవస్థీకరించనున్నారు. -
లోక్సభ స్థానాలు 850కి పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: 131వ రాజ్యాంగ సవరణకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా లోక్సభ స్థానాలపై కీలక నిర్ణయం తీసుకుంది.లోక్సభ స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించేలా ప్రణాళిక రూపొందించింది. లోక్సభ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రతిపాదనలను ఎంపీలకు తెలియజేసింది.ఈ నెల 16 నుంచి 18 వరకు ప్రత్యేక లోక్సభ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్పై చర్చ జరగనుంది.ప్రస్తుతం దేశంలో మొత్తం 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో 530 స్థానాలు రాష్ట్రాలకు, 13 స్థానాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించబడ్డాయి. ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచేలా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం ప్రతిపాదనలు ఎంపీలకు అందించింది. -
హర్ముజ్ బ్లాకేడ్తో భారత్పై తీవ్ర ప్రభావం!
హర్ముజ్ జలసంధిని అమెరికా సైన్యం దిగ్బంధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. సౌదీ అరేబియా సహా పలు దేశాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు రిక్వెస్ట్లు చేస్తున్నాయి. చైనా సహా ఇంకొన్ని దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అదే సమయంలో.. ఈ బ్లాకేడ్ ప్రభావంతో ప్రపంచ ఇంధన మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ పరిణామం భారత్పై కూడా తీవ్ర ప్రభావం చూపే చాన్స్ కనిపిస్తోంది.గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర ప్రస్తుతం 99 డాలర్ల వద్ద ఉంది. హర్ముజ్ బ్లాకేడ్ కొనసాగితే అది 150 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ గల్ఫ్ దేశాలపై అధికంగా ఆధారపడుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి బిల్లులు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం, వాణిజ్య లోటు పెరిగే అవకాశం లేకపోలేదు. పైగా జలసంధి ద్వారా రోజుకు 12 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సరఫరా జరుగుతుంది. ఈ మార్గం మూసుకుపోతే భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్ర తరం కావొచ్చు. అలాగే పెరిగిన ఇంధన ధరలు నేరుగా రవాణా, విద్యుత్, ఆహార ధరలపై ప్రభావం చూపెట్టొచ్చు. హర్ముజ్ బ్లాకేడ్పై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.అదంతా ఉత్త ప్రచారమే!భారత నౌకలకు హర్ముజ్ జలసంధి మార్గాన్ని ఇరాన్ మూసేసిందని ఒక ప్రచారం నడుస్తోంది. అయితే అది ఉత్తదేనని ఇరాన్ అంటోంది. న్యూఢిల్లీలో ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘భారతదేశం మా స్నేహపూర్వక దేశం. హర్ముజ్ మార్గం భారత నౌకలకు తెరిచే ఉంటుంది. అమెరికా ఈ బ్లాకేడ్తో తప్పు లెక్కలు వేసింది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలను ధ్వంసం చేస్తుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది’’ అని హెచ్చరించారు.మొత్తంగా, హోర్ముజ్ బ్లాకేడ్ భారత్కు ఇంధన భద్రతా సంక్షోభం తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ఇరాన్ ఇచ్చిన హామీ కొంత ఉపశమనం కలిగిస్తోంది. కానీ ధరల పెరుగుదల, సరఫరా అంతరాయం వంటి సమస్యలు భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారే అవకాశం లేకపోలేదు. -
పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ అమలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: పోలింగ్ కేంద్రాల్లో దొంగ, నకిలీ, డూప్లికేట్ ఓట్ల బెడదను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో ఫింగర్, ఐరిస్ బయోమెట్రిక్ వ్యవస్థను అమలుచేయాలని సుప్రీంకోర్టులో న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలుచేశారు. ఓటింగ్ ప్రక్రియలో అత్యంత పారదర్శకతను కోరుతూ దాఖలైన ఈ పిటిషన్ను విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చిల ధర్మాసనం స్వీకరించింది. ఓటు వేసే ముందు ఓటర్ల వేలిముద్రలు, ఐరిస్, ముఖ గుర్తింపు (బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్) తనిఖీని తప్పనిసరి చేయాలని, వీటిని అమలుచేసేలా కేంద్రప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘాలను ఆదేశించాలని ధర్మాసనాన్ని పిటిషనర్ కోరారు. పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత, న్యాయవాది ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ, దొంగ ఓట్లు, ఒకరి బదులు మరొకరు ఓటేయడం, నగదు ప్రలోభాల వంటి ఘటనలు ఎక్కువయ్యాయి. పాత ఓటర్ ఐడీ కార్డులు, వాటిపై సరిగా కన్పించని ముఖాలు, కార్డుల్లో టైపింగ్ తప్పిదాలు, రియల్టైమ్తో అనుసంధానంకాని పాత సమాచారం వంటి లోపాలు దొంగ, నకిలీ ఓట్ల వ్యవస్థ తిష్టవేయడానికి కారణమవుతున్నాయి. ఫింగర్, ఐరిస్తో ఇలాంటివన్నీ ఆగిపోతాయి. పోలింగ్ వ్యవస్థలో లోపాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ అనేది అత్యంత అవసరం. ‘ఒక పౌరుడికే ఒకే ఓటు’అనే రాజ్యాంగ స్ఫూర్తిని బయోమెట్రిక్ విధానం కాపాడుతుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1950 కింద ఆధార్ను ఇప్పటికే సరైన గుర్తింపు కార్డుగా పరిగణిస్తున్నారు. అదే తరహాలో పోలింగ్ బూత్లలో బయోమెట్రిక్ను అమలుచేయవచ్చు’’అని ఆయన కోర్టులో వాదించారు. ‘‘మార్చి 28న ఈసీకి వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాస్తవానికి రాజ్యాంగంలోని 324 అధికరణం ద్వారా సంక్రమించిన సర్వాధికారాలతో ఈసీ ఇలాంటి అత్యంత పారదర్శకమైన విధానాలను స్వీయనిర్ణాయాధికారాలతో అమలుచేయవచ్చు’’అని ఆయన గుర్తుచేశారు. తర్వాత కోర్టు స్పందించింది. ‘‘బయోమెట్రిక్ తనిఖీల విధానాన్ని పోలింగ్ కేంద్రాల్లో తీసుకురావాలంటే ప్రస్తుత ఎన్నికల నిబంధనల్లో భారీ మార్పులు చేయాల్సి ఉంటుంది. అధునాతన సాంకేతికతను దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అమలుచేయాలంటే కేంద్రప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. ఇప్పుడు జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫింగర్, బయోమెట్రిక్ ఐరిస్ను అమలుచేయాలని ఆదేశించలేం. ఏర్పాట్లన్నీ అయిపోయిన ఈ దశలో ఇప్పటికిప్పుడు వినూత్న విధానం అమలు అసాధ్యం. తదుపరి సార్వత్రిక ఎన్నికలు లేదా శాసనసభల ఎన్నికల నాటికి ఈ బయోమెట్రిక్ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాల్సి ఉంది’’అని ధర్మాసనం పేర్కొంది. బయోమెట్రిక్ విధానం అమలుపై మీ స్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, పలు రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. -
నారీ శక్తికి పట్టం కట్టేందుకే!
న్యూఢిల్లీ: చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కోసం మహిళల దశాబ్దాల ఎదురుచూపులకు అతి త్వరలో తెర పడనుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేలా నారీ శక్తి వందన్ అధినియమ్కు రాజ్యాంగ సవరణ చేపట్టనున్నట్టు గుర్తు చేశారు. ఇందుకోసం గురువారం నుంచి పార్లమెంటు మూడు రోజుల పాటు సమావేశం కానుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో జరిగిన ‘నారీ శక్తి వందన్’సదస్సును ఉద్దేశించి మోదీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల రూపంలో ఈ శతాబ్దిలోకెల్లా అతి ముఖ్యమైన నిర్ణయాన్ని భారత్ అతి త్వరలో తీసుకోబోతోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దాన్ని నారీ శక్తికే అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘మహిళా రిజర్వేషన్ల చట్టానికి రాజ్యాంగ సవరణ ద్వారా మన పార్లమెంటు కొత్త చరిత్ర సృష్టించనుంది. మనందరి జీవితకాలంలో దేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన నిర్ణయంగా ఇది మిగిలిపోనుంది. మహిళా సాధికారతకు నిదర్శనంగా, వారి శక్తియుక్తులకు నిజమైన నివాళిగా నిలవనుంది. భారత్లో స్త్రీ పురుష సమతావాదం, సామాజిక న్యాయం కేవలం నినాదాలు కావని, రోజువారీ పని సంస్కృతి మొదలుకునిఅత్యున్నత నిర్ణయ ప్రక్రియ దాకా అన్నింట్లోనూ అవి విడదీయలేని భాగమని నిరూపించనుంది. భారత మహిళలు ఇప్పటికే పాలనలో అన్ని స్థాయిల్లోనూ నిర్ణాయక పాత్ర పోషిస్తూ తమను తాము నిరూపించుకుంటున్నారు. మున్ముందు మరిన్ని పెద్ద బాధ్యతలను సమర్థంగా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నారు’’అంటూ కొనియాడారు. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 2027 జనగణనతో ముడిపడి ఉన్నాయి. దాంతో ప్రస్తుత చట్టం ప్రకారం వాటిని 2034 నుంచి మాత్రమే అమలు చేయడం వీలు పడుతుంది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేసేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. లోక్సభ స్థానాల సంఖ్యను 816కు పెంచనున్న నేపథ్యంలో 273 స్థానాలు మహిళలకు రిజర్వు కానున్నాయి. అత్యున్నత పదవుల్లో ‘ఆమె’ స్వాతంత్య్ర సంగ్రామం మొదలుకుని రాజ్యాంగ పరిషత్తు దాకా మహిళలు కీలక పాత్ర పోషిస్తూ వచ్చారని మోదీ గుర్తు చేశారు. స్వతంత్ర భారతానికి పునాదిరాయి వేయడంలో వారి పాత్ర ఎనలేనిదన్నారు. ‘‘దేశ నిర్మాణంలో కీలకమైన పాత్రలు పోషించే అవకాశం దొరికిన ప్రతిసారీ అద్భుత పనితీరుతో భారత మహిళలు నిత్యం తమను తాము నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి దాకా అత్యున్నత బాధ్యతలను అద్భుతంగా నెరవేరుస్తున్నారు. విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం వంటి రంగాల్లో మహిళ భాగస్వామ్యం చురుగ్గా ఉన్నచోట మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 14 లక్షల మందికి పైగా మహిళలు స్థానిక పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. 21 రాష్ట్రాల్లోని పంచాయతీల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు 50 శాతానికి చేరింది. ఈ ఘనతను చూసి ప్రపంచమే విస్తుపోతోంది’’అంటూ ప్రధాని హర్షం వెలిబుచ్చారు. అన్ని పార్టీలదీ అదే ఆకాంక్ష మహిళా రిజర్వేషన్ల బిల్లును 2023లో పార్లమెంటులో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా ఆమోదించాయని, 2029లోపే దాన్ని అమలు చేయాలని ఆకాంక్షించాయని మోదీ గుర్తు చేశారు. చర్చలు, పరస్పర సహకారం ద్వారా దీన్ని పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ‘‘దీనిపై దేశవ్యాప్తంగా మహిళల్లో పట్టరాని ఉత్సాహం కనిపిస్తోంది. లోక్సభ, అసెంబ్లీల్లో పెద్ద సంఖ్యలో కాలు పెట్టేందుకు వారు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. ఆ కలలకు ఇప్పుడిక రెక్కలు రానున్నాయి’’అని అభిప్రాయపడ్డారు.గృహస్తును కాకపోయినా సాదకబాధకాలు తెలుసు! మహిళల ఆర్థిక సాధికారత వల్ల కుటుంబాల్లో వారికి గౌరవాదరాలు పెరిగాయని మోదీ అభిప్రాయపడ్డారు. తాను గృహస్తును కాకపోయినా ఇంటిని నడపడంలోని సాదకబాధకాలు బాగా తెలుసని ఆయన చెప్పడంతో సమావేశంలో పాల్గొన్న మహిళలంతా పెద్దపెట్టున చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు! ‘‘ఇల్లు మొదలుకుని వాహనం దాకా కుటుంబ ఆస్తులన్నీ గతంలో ప్రధానంగా పురుషుల పేర్లతోనే ఉండేవి. పీఎం ఆవాస్ యోజన తదితరాలతో పరిస్థితి మారింది. ఆస్తులకు మహిళలు యజమానులవుతున్నారు. గత 11 ఏళ్లలో 3 కోట్ల మందికి పైగా మహిళలు ఇంటి యజమానులయ్యారు’’అని ప్రధాని అన్నారు. ‘‘గతంలో ఇళ్లలో తండ్రీ కొడుకులు వ్యాపారం గురించి చర్చించుకుంటుంటే మహిళలు వారికి చాయ్ బిస్కట్లు ఇచ్చేందుకే పరిమితమయ్యేవారు. మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించడంతో ఇప్పుడు పరిస్థితులు మారాయి. వ్యాపార నిర్ణయాలకు సంబంధించి అమ్మతో కూడా చర్చిద్దామని కొడుకులు తండ్రులతో అంటున్నారు’’అని చెప్పుకొచ్చారు. -
హైదరాబాద్ – తిరుపతి... విమానయానం సామాన్యుడికి గగనమే
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్– తిరుపతి మార్గంలో విమాన చార్జీల పెంపుపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఉడాన్’ లక్ష్యాల్లో ఒకటైన ‘సామాన్యుడికి విమానయానం’ ఆశయానికి విరుద్ధంగా ఈ చార్జీల బాదుడు కొనసాగుతోందని మండిపడ్డారు. పెరిగిన విమాన చార్జీలపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి ఎంపీ లేఖ రాశారు. లేఖలో ముఖ్యాంశాలు.. దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే తిరుపతికి వెళ్లే విమాన ప్రయాణం అత్యంత ఖరీదుగా మారింది.దీనిప్రకారం హైదరాబాద్ నుంచి గోవా (రూ.3,000–రూ.6,500), ఢిల్లీ (రూ.3,900–రూ.7,000), చెన్నై (రూ.2,500–రూ.4,000)కు ఉన్న చార్జీల కంటే తిరుపతి రూట్లోనే అత్యధికంగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్–తిరుపతి మధ్య కనీస చార్జీ రూ.6,000 నుంచి ప్రారంభమై రూ.9,500 వరకు ఉంటోంది. కొన్ని సందర్భాల్లో ఇది రూ.14,500కు చేరుతోంది. ఇక 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు 13,367 విమానాల్లో దాదాపు 11.84 లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్–తిరుపతి రూట్లో ప్రయాణించారు.కేవలం మార్చి 2026లోనే 864 విమాన సర్విసుల ద్వారా 88 వేల మందికిపైగా ప్రయాణించారు. రోజుకు ఈ రూట్లో 16 నుంచి 17విమానాలు నడుస్తున్నాయంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ విమానయాన సంస్థలు తెలివిగా పెద్ద విమానాల సంఖ్యను తగ్గించి, చిన్న విమానాలను నడుపుతూ సీట్ల కొరతను సృష్టిస్తున్నాయి. తద్వారా చార్జీలు పెంచి భక్తులను దోచుకుంటున్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల్లో అత్యధికులు మధ్యతరగతి వారు, వృద్ధులు ఉంటారు. వారిపై ఆరి్థక భారం మోపడం అన్యాయం. -
ఢిల్లీలోని ఆ ఇంట్లో చేసేది ఏంటి?
దేశ రాజధాని నగరంలో మరో సెక్స్ రాకెట్ బట్టబయలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... సెంట్రల్ ఢిల్లీలో, అజ్మేరీ గేట్ సమీపంలోని ఎస్.ఎన్. మార్గ్లో ఉన్న ఒక ఇంటిపై 12వతేదీన పోలీసులు మెరుపు దాడి చేశారు. అక్కడ ఎనిమిది మంది యువతులు, పలువురు పురుషులు అక్రమ అశ్లీల కార్యకలాపాలలో నిమగ్నమై ఉండటాన్ని కనుగొన్నారు. ఎనిమిది మంది మహిళల్లో ఒకరు 17 ఏళ్లు కూడా నిండని మైనర్ అని తేలింది. ఈ ముఠా సూత్రధారి రాహుల్, తన భార్య కుమారితో కలిసి ఈ మొత్తం కార్యకలాపాన్ని నడుపుతున్నాడు. మేనేజర్లు గోపీ రామ్ పరిహార్, లుమాకాంత్ పాండే, ఆలియా పింకీలను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ ఆ సంస్థ నిర్వహణను పర్యవేక్షించే బాధ్యత వహించారు. పోలీసులు ఆ ప్రాంగణంలో సోదాలు నిర్వహించగా, ఎనిమిది వేర్వేరు గదులలో పలువురు పురుషులు, మహిళలు అశ్లీల, చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ మొత్తంలో నగదు (సుమారు రూ.1.97 లక్షలు), విదేశీ కరెన్సీ, గంజాయి, లైంగిక సామర్థ్యాన్ని పెంచే క్యాప్సూల్స్, వందలాది మద్యం సీసాలు, బీర్ క్యాన్లు, కండోమ్లు, లావాదేవీల లెడ్జర్లు, కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న ఎనిమిది మంది మహిళల్లో ఒకరు 17 ఏళ్లలోపు మైనర్ అని సమాచారం.నగ్నంగా వచ్చెయ్.. నచ్చిన వారితో ఎంజాయ్ఆ ఇంటిలో నడుస్తున్న వ్యభిచారం మరింత కొత్త పుంతలు తొక్కినట్టు తెలుస్తోంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే నగ్నంగా మారాలనేది నిబంధన కాగా అక్కడ అందరూ నగ్నంగానే సంచరిస్తారట. ఆ తర్వాత అక్కడ ఉన్న అమ్మాయిల్లో నచ్చిన వారితో ఎంజాయ్ చేయవచ్చునట. ఇక అక్కడ జరిగే తంతు పోర్న్ వీడియోలకు తీసిపోని రీతిలో ఉంటుందట. వీరి క్లయింట్లు అందరూ దేశవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, భిన్న రంగాల ప్రముఖులు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. ఇప్పటి వరకూ దీనిపై పోలీసులు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయనప్పటికీ సోషల్ మీడియా లో ఈ వార్త వైరల్ అవుతోంది.దేశరాజధానిలో విచ్చలవిడిగా...గత కొంత కాలంగా ఢిల్లీలో పెద్ద సంఖ్యలో వ్యభిచార అడ్డాలు, సెక్స్ రాకెట్లు వెలుగు చూస్తుండడం దేశ రాజధాని నగర ప్రతిష్టను మసకబారుస్తోంది. ఢిల్లీ–ఎన్ సిఆర్ ప్రాంతంలో నకిలీ డేటింగ్ యాప్ ప్రొఫైల్ల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుని అశ్లీల చిత్రాల దందాలు ఆన్ లైన్ దోపిడీ (సెక్స్టార్షన్) పెరిగాయని పోలీసు రికార్డులు సూచిస్తున్నాయి, అలాగే ఢిల్లీ పోలీసులు, తరచుగా స్పా సెంటర్లు లేదా క్లబ్ల ముసుగులో నడుస్తున్న అక్రమ సెక్స్ రాకెట్లు బయటపడుతున్నాయి.గత ఏడాది మార్చి లో పహర్గంజ్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు ఒక సెక్స్ రాకెట్ను ఛేదించారు. ఆ సమయంలో 10 మంది నేపాలీ జాతీయులు ముగ్గురు మైనర్లతో సహా 23 మంది మహిళలను రక్షించారు. మానవ అక్రమ రవాణాలో పాల్గొన్న ఏడుగురిని అరెస్టు చేశారు. అదే మార్చి నెలలో గ్రాండ్ ప్లాజాలోని బ్లిస్ వెల్నెస్ స్పాపై జరిపిన దాడిలో, విదేశీయులు మైనర్లతో కూడిన సెక్స్ రాకెట్ను నడుపుతున్నందుకు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ ఢిల్లీలోని లజ్పత్ నగర్లో రెండు స్పా సెంటర్ల పేరిట నడుస్తున్న వ్యభిచార రాకెట్పై దాడి అనంతరం ఇద్దరు మేనేజర్లను అరెస్టు చేశారు.ఈ ఆపరేషన్ లో తొమ్మిది మంది మహిళలను రక్షించారు. ఇలా చెప్పుకుంటూ పోతే పోలీసులు దాడులు, అరెస్టులు కు దొరుకుతున్నవే పెద్ద జాబితా అవుతుంది. ఇక. దొరకని ముఠాలు ఎన్ని ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు చిరునామాగా ఉండాల్సిన దేశ రాజధాని నగరంలో ఇలాంటి పరిస్థితి ఉండడం అవాంఛనీయం. దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి స్థాయిలో నివారించాల్సిన అవసరం కనిపిస్తోంది. -
క్లీన్ ఎలక్షన్స్.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
ఎన్నికల్లో అవకతవకలు నివారించే ఉద్దేశంతో దాఖలైన ఓ పిటిషన్పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని కచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెబుతూ సోమవారం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను గుర్తించేలా చేతివేళ్లు (Fingers), కంటి (Iris) సంబంధిత బయో మెట్రిక్ గుర్తింపు ఏర్పాట్లు చేయాలని ఓ పిటిషన్ దాఖలైంది. తద్వారా నకిలీ ఓట్లకు చెక్ పెట్టవచ్చని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ను పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత, జస్టిస్ జే బాగ్చీలతో కూడిన ధర్మాసనం.. ఇది విచారణకు అర్హత ఉన్న అంశమని వ్యాఖ్యానించింది. అలాగే పిటిషన్పై స్పందన తెలియజేయాలంటూ ఈసీకి, కేంద్రానికి, పలు రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో.. బయో మెట్రిక్ అంశాన్ని ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు వర్తింపజేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని సీజే బెంచ్ తోసిపుచ్చింది. అది సాధ్యమయయే పని కాదని పేర్కొంది. కేంద్రం, ఎన్నికల సంఘం, రాష్ట్రాల నుంచి స్పందన తర్వాత ఈ పిటిషన్పై తదుపరి విచారణ ఉండే అవకాశం ఉంది.అడ్వొకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ వేసిన ఈ పిటిషన్లో.. ఒక ఓటర్ స్థానంలో మరొకరు ఓటేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. డూప్లికేట్ ఓటింగ్, గోస్ట్ ఓటింగ్.. ఇలాంటి అక్రమాలు ఎన్నికల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వీటిని అరికట్టడానికి పోలింగ్ బూత్ల వద్ద బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్ అమలు చేయాలి.సీజే బెంచ్ ఏమందంటే.. ఓటర్ల గుర్తింపులో బయోమెట్రిక్ అవసరమా?. ఇలాంటి చర్యను వచ్చే పార్లమెంట్ లేదంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. దేనికంటే ముందు అమలు చేయాలి? అనే అంశం పరిశీలించాల్సి ఉంది.ఇప్పటికే ఈవీఎంల అవకతవక అంశం, ఈసీ పాత్రపై ఆరోపణలతో దేశ ఎన్నికల ప్రక్రియపై దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. బ్యాలెట్ ఎన్నికలు తిరిగి నిర్వహించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలో.. క్లీన్ ఎలక్షన్స్ కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి సాంకేతిక పరిష్కారాన్ని ఎలక్షన్ల ప్రక్రియలో చేర్చవచ్చనే అంశాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించాలనుకోవడం విశేషం. -
29 తర్వాత అఖిలపక్షం పెట్టండి
న్యూఢిల్లీ: ఎంతో కీలకమైన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, ఇతర అంశాలను తేల్చకుండా మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై చర్చించడం వృథా ప్రయాసేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీన రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన వెంటనే అఖిల పక్ష భేటీని ఏర్పాటు చేసి వీటిపై చర్చ జరపాలని కోరారు. ఈ మేరకు ఖర్గే ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం చూస్తుంటే రాజకీయ లబ్ధి కోసమే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని హడావుడిగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను సంప్రదించకుండా, డీలిమిటేషన్ తీరును వివరించకుండానే ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో సభలో అర్థవంతమైన చర్చ ఎలా సాధ్యమని భావిస్తున్నారంటూ ఖర్గే నిలదీశారు. మరోవైపు, మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లో జాప్యంతో కోట్లాది మంది మహిళలకు అన్యాయం జరుగుతుందంటూ ఖర్గేకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లేఖ రాశారు. -
ఓటర్ల జాబితాలో భారీ ప్రక్షాళన
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే రెండో దశలో భాగంగా 9 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓట్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విజయవంతంగా ప్రక్షాళన చేసింది. పారదర్శకమైన ఎన్నికలే లక్ష్యంగా నకిలీ, బోగస్ ఓట్లకు చెక్ పెడుతూ ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ భారీ ప్రక్షాళనలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నకిలీ, బోగస్, చనిపోయిన ఓటర్ల పేర్లు ఇలా మొత్తంగా 5.18 కోట్ల పేర్లను జాబితా నుంచి అధికారులు తొలగించారు. ఈ సవరణల అనంతరం ఆయా రాష్ట్రాల్లోని మొత్తం ఓటర్ల సంఖ్య 45.81 కోట్లకు చేరుకుంది. గతంతో పోలిస్తే 10.2 శాతం మేర ఓటర్ల సంఖ్య తగ్గడం గమనార్హం. మొత్తంగా 66,88,636 పేర్లు ఓటర్ల జాబితా నుంచి తీసేశారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 25.47 లక్షల ఓట్లకు కోత పడగా.. ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్లో 24.16 లక్షల పేర్లను అధికారులు తొలగించారు. శుక్రవారం యూపీ తుది ఓటర్ల జాబితా విడుదల కావడంతో రెండో దశ ప్రక్షాళన ప్రక్రియ అధికారికంగా ముగిసినట్లయింది. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రెండో దశ ఎస్ఐఆర్ ప్రక్రియను యూపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల్లో విజయవంతంగా పూర్తి చేశారు. -
బీజేపీ ఎంపీలకు ‘త్రీ-లైన్’ విప్ జారీ
ఢిల్లీ: ఏప్రిల్ 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో బీజేపి (BJP) తన ఎంపీలకు 'త్రీ-లైన్ విప్' జారీ చేసింది. ఈ సమావేశాల సమయంలో పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా పార్లమెంట్కు హాజరుకావాలని ఆదేశించింది. ప్రభుత్వం కొన్ని కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకునే అవకాశం ఉన్నందున, సభ్యులందరూ సభకు హాజరై ప్రభుత్వానికి మద్దతు తెలపాలని పార్టీ చీఫ్ విప్ స్పష్టం చేశారు.కేంద్ర మంత్రులతో సహా ఎంపీలందరూ ఈ మూడు రోజుల పాటు సభలోనే ఉండాలని.. ఈ సమయంలో ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవని, హాజరు కచ్చితంగా ఉండాలని విప్ స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించనుంది. ముఖ్యంగా, రిజర్వేషన్ల అమలు కాలపరిమితికి సంబంధించి కీలక సవరణలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.2023 నాటి 'నారీ శక్తి వందన్ అధినియం' ప్రకారం.. మహిళా రిజర్వేషన్లు తదుపరి జనాభా గణన మరియు నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్) తర్వాతే అమలు కావాల్సి ఉంది. అయితే, జనాభా గణనలో జాప్యం జరుగుతున్నందున 2011 జనాభా లెక్కల ఆధారంగానే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.మరోవైపు, ప్రధాని మోదీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బిల్లు తీసుకొస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపై స్పష్టత లేకుండా, ఈ చారిత్రాత్మక చట్టంపై అర్థవంతమైన చర్చ జరపడం అసాధ్యమని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు. -
అన్ని పార్టీల పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోదీ లేఖ
ఢిల్లీ: అన్ని పార్టీల పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నారీ శక్తి వందన్ అదినియమ్ ద్వారా మహిళా శక్తిని మరింత బలోపేతం చేయాలన్న ప్రధాని.. వీలైనంత తొందరగా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలన్న అంశంపై విస్తృత ఏకాభిప్రాయం ఉందని పేర్కొన్నారు.ఈ బిల్లుపై రాజకీయ పార్టీలతో సంప్రదింపులు పూర్తి చేశాం. 2029 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి. మహిళలకు రిజర్వేషన్ వల్ల ప్రజాస్వామ్యం మరింత బలోపేతం. పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాలి’’ అని ప్రధాని లేఖలో పేర్కొన్నారు.Congress president and Rajya Sabha LoP Mallikarjun Kharge writes to PM Narendra Modi, "I have just received your letter on the special session of Parliament for a discussion on the Nari Shakti Vandan Adhiniyam from the 16th of April...This special sitting has been called without… pic.twitter.com/SqkvavZmPs— ANI (@ANI) April 12, 2026 -
మోదీ-రాహుల్ మధ్య ఆసక్తికర సంభాషణ
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఈ ఉదయం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాసేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరిగాయి. పార్లమెంట్ ఆవరణలో ప్రేరణ్ స్థల్ వద్ద ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ నివాళులర్పించి ప్రసంగించారు. అంతకు ముందు పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్నాక ప్రధాని మోదీ అక్కడే వేచి ఉన్న రాహుల్ గాంధీకి, ఇతరులకు నమస్కరించారు. అనంతరం ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు.మోదీ మాట్లాడుతుండగా.. రాహుల్ గాంధీ తల ఊపుతూ, వేళ్లు కదిలిస్తూ సమాధానం ఇస్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఈ ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందనే కుతూహలం నెలకొంది. అయితే రాహుల్ను ప్రధాని మోదీ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.అనంతరం మోదీ మాట్లాడుతూ.. జ్యోతిరావ్ పూలే సమాజానికి వెలుగునిచ్చిన మహానుభావుడు. ఆయన ఆలోచనలు నేటికీ సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం మార్గదర్శకంగా ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సమాజంలో అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం మనందరికీ ప్రేరణ. ఆయన చూపిన మార్గం నేటి భారతదేశానికి అవసరమని వ్యాఖ్యానించారు.రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. నివాళి వేదికపై ఇద్దరు నేతలు పరస్పరం మాట్లాడుకోవడం, స్నేహపూర్వకంగా పలకరించుకోవడం అక్కడి వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. #WATCH | Delhi: Prime Minister Narendra Modi arrives at Prerna Sthal on the Parliament premises to pay a floral tribute to Mahatma Jyotiba Phule on his 200th birth anniversary today.Lok Sabha Speaker Om Birla, Lok Sabha LoP Rahul Gandhi, Union Minister Arjun Ram Meghwal, former… pic.twitter.com/QexqUVky1Z— ANI (@ANI) April 11, 2026 -
పునర్విభజనతో ప్రజా ఉద్యమం!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ నియోజకవర్గాల పెంపు (పునర్విభజన)తో రాష్ట్రాల మధ్య వివక్ష, అంతరాలు పెరుగుతాయని, ఫలితంగా ప్రజా ఉద్యమాలు తప్పవని సీఎం రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చిరించారు. రైతు చట్టాల్లాగే డీలిమిటేషన్ బిల్లును కూడా వెనక్కి తీసుకోకతప్పదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర ద్రోహం చేస్తోందని అన్నారు. ఈ రాష్ట్రాలను రాజకీయంగా అణగదొక్కే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఇది పార్టీల సమస్య కాదని, ప్రాంతాల సమస్య అని చెప్పారు. ‘ఇప్పటికే మేము తీవ్రమైన బాధతో ఉన్నాం.. గాయపడి ఉన్నాం.. మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టొద్దు’ అని హెచ్చరించారు. శుక్రవారం ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన అనంతరం.. రాత్రి తన అధికారిక నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అప్పుడు బండి, కిషన్రెడ్డిలకు చప్రాసీ పదవి కూడా దొరకదు‘నియోజకవర్గాలను ఏ ప్రాతిపదికన, ఎలా పెంచాలి అనే దానిపై కనీస చర్చ లేకుండా ఎందుకింత అర్జెంటుగా? దేశంలో 50 శాతం నియోజకవర్గాల పెంపు జరిగితే ఉత్తరాదికే పూర్తి అడ్వాంటేజ్గా మారుతుంది. కేవలం ఉత్తరాది రాష్ట్రాలతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దుస్థితి వస్తుంది. చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగడమే కాకుండా ప్రాముఖ్యత కోల్పోతాయి. చిన్న రాష్ట్రాలు మరింత చిన్నగా, పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా మారిపోతాయి. ఆర్థిక ప్రాతిపదికన, మెరిట్ డిజబిలిటీ విధానంలో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పెంపు ఉండాలి.చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న గ్యాప్ అలాగే కొనసాగాలి. ప్రస్తుతం కేరళ, యూపీ మధ్య 60 సీట్ల తేడా ఉంది. పునర్విభజన జరిగితే అది ఏకంగా 99కి పెరుగుతుంది. ఇది ముమ్మాటికీ చిన్న రాష్ట్రాలకు ఉరితాడు లాంటిదే. భవిష్యత్తులో ఉత్తరాది సీట్లు పెరిగితే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో చోటు దక్కించుకున్న బండి సంజయ్, కిషన్రెడ్డి లాంటి దక్షిణాది బీజేపీ నేతలకు కనీసం చప్రాసీ పదవి కూడా దొరకదు..’ అని సీఎం అన్నారు.అందమైన ముసుగులో మోసం‘నియోజకవర్గాల పెంపు అనేది అందమైన ముసుగులో చేస్తున్న మోసం. బీజేపీ పెడుతున్న ఈ మెలికల్లో వారి రాజకీయ స్వార్థం దాగుంది. గతంలో ఇలాగే హడావుడి చేసి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చారు. రైతుల ఆందోళనతో మళ్లీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఈ బిల్లుపై సౌత్లో రియాక్షన్ వస్తే, బీజేపీ పాలిత చిన్న రాష్ట్రాలు సహా.. ఇతర చిన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తే కేంద్రం ఏం చేస్తుంది? ఈ బిల్లును అడ్డుకోవాల్సి వస్తే నేను కాదు ప్రజలే తిరగబడతారు.మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు..మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను దివంగత ప్రధాని రాజీవ్గాంధీ అమలు చేశారు. సోనియాగాంధీ గతంలోనే మహిళా రిజర్వే షన్ బిల్లును పెట్టారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల కోసం సీట్లు పెంచాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడున్న 543 లోక్సభ స్థానాల్లోనే 181 సీట్లను మహిళలకు కేటాయించి రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కదా? కేంద్రం లీకులు ఇస్తున్న ఇతర సవరణలపై ఇండియా కూటమితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయించాం..’ అని రేవంత్ తెలిపారు.కేటీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటని రేవంత్రెడ్డి విమర్శించారు. ‘గతంలో బీఆర్ఎస్లో సీనియర్లుగా ఉన్న ఆలె నరేంద్ర, దేశిని చిన్న మల్లయ్య, ఈటల రాజేందర్, విజయశాంతి లాంటి ఎంతోమందికి ఏం జరిగిందో, వారిని ఎలా గెంటేశారో అందరికీ తెలుసు..’ అని వ్యాఖ్యానించారు.


