ప్రపంచంలోనే అతి పెద్ద ఇల్లు ఎక్కడుందో తెలుసా? అది ఎక్కడో విదేశాల్లో కాదు… మన భారతదేశంలోనే ఉంది. గుజరాత్లోని వడోదరలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రెసిడెన్స్గా గుర్తింపు పొందింది. ఇది కేవలం పర్యాటక ప్రదేశం కాదు, మ్యూజియం కూడా కాదు – రాజ గైక్వాడ్ కుటుంబం ఇప్పటికీ ఇక్కడే నివసిస్తోంది.
లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దదిగా ఉన్న ఈ మహల్ దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండటం దీని వైభవాన్ని చూపిస్తుంది. 1890లో బరోడా మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III ఈ అద్భుతమైన రాజభవనాన్ని నిర్మించాడు. ఆ కాలంలో ఇల్లు అనేది కేవలం నివాస స్థలం కాదు, శక్తి, సంపద, సంస్కృతికి ప్రతీక. ఈ ప్యాలెస్ నిర్మాణానికి అప్పట్లోనే దాదాపు 2.7 లక్షల పౌండ్లు ఖర్చు చేయబడ్డాయి.
ప్రముఖ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాబర్ట్ చిషోల్మ్ దీనిని రూపకల్పన చేశారు. భారతీయ, ఇస్లామిక్, యూరోపియన్ శైలుల అద్భుత సమ్మేళనం ఈ నిర్మాణంలో కనిపిస్తుంది. ప్రతి మూలలో రాజ వైభవం ప్రతిబింబిస్తుంది. ప్యాలెస్ లోపలికి వెళ్లినప్పుడు దాని వైశాల్యం మనసును ఆశ్చర్యపరుస్తుంది. విశాలమైన దర్బార్ హాల్ బెల్జియం గాజుతో చేసిన ఫ్లోర్, ఇటలీ నుండి తెచ్చిన వెనీషియన్ మొజాయిక్ డిజైన్లతో అలరారుతుంది. ప్యాలెస్ ప్రాంగణంలో గోల్ఫ్ కోర్టు, క్రికెట్ మైదానం, అందమైన తోటలు మాత్రమే కాదు, ఈ ప్యాలెస్ లో చిన్న జూ కూడా ఉంది. ఇది ఒక ఇల్లు కాదు, ఒక స్వంత ప్రపంచం లాంటిది. అప్పట్లోనే ఆధునిక సౌకర్యాలు కూడా ఇందులో ఏర్పాటు చేయబడ్డాయి.1890లలోనే లిఫ్ట్ సౌకర్యం ఉండటం విశేషం.
అత్యాధునిక ప్లంబింగ్, విద్యుత్ వ్యవస్థలు కూడా అమర్చబడ్డాయి. అంతేకాదు, మహారాజా సాయాజీరావు గైక్వాడ్ కళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. భారతదేశపు ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మను ఆహ్వానించి అనేక అద్భుత తైలవర్ణ చిత్రాలను వేయించారు. నేటికీ ఆ అరుదైన కళాఖండాలు ఈ ప్యాలెస్ కే గర్వకారణంగా నిలుస్తున్నాయి. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కేవలం ఒక రాజభవనం మాత్రమే కాదు, భారతదేశ చరిత్ర, సంస్కృతి, వైభవానికి నిలువెత్తు సాక్ష్యం.


