హరియాణాలోని గురుగ్రామ్లో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. ప్రముఖ లగ్జరీ హబ్ ‘32 అవెన్యూ’ CEO ధ్రువ్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.500 కోట్ల రియల్ ఎస్టేట్ కుంభకోణం చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి
పోలీసుల ప్రకారం, శర్మ ఒక వాణిజ్య భవనంలోని ఒకే అంతస్తును దాదాపు 25 మంది విక్రయించాడు. భారీ మోసపూరిత ఆపరేషన్కు సంబంధించి గురుగ్రామ్ పోలీసులు శుక్రవారం శర్మను అరెస్టు చేశారు. ఈ ఫిర్యాదుల విలువ మొత్తం రూ. 500 కోట్ల దాకా ఉంటుందని దర్యాప్తు అధికారుల అంచనా. నకిలీ ఒప్పందాలు, తప్పుదారి పట్టించే హామీలు, లాభాల ఆశ జూపి విక్రయించాడనేది ఆరోపణ.
అయితే కొనుగోలుదారులకు సంబంధిత ఆస్తిని స్వాధీనం చేయకుండా ఏవేవో సాకులు చెబుతూ జాప్యం చేయడం, యాజమాన్య పత్రాలు ఇవ్వలేదని ఫిర్యాదు చేయడంతో ఈ మెగా స్కాం వెలుగులోకి వచ్చింది. ప్రతి లావాదేవీని చట్టబద్ధంగా కనిపించేలా చేయడానికి అనేక నకిలీ పత్రాలను సృష్టించి కొనుగోలు దారులను మోసం చేశాడు. ఈ విధంగా 2022 - 2023 మధ్యకాలంలో ఈ కాంప్లెక్స్లోని 3,000 చదరపు అడుగుల మొదటి అంతస్తు యూనిట్ను విక్రయించి, శర్మ వివిధ వ్యక్తుల నుండి సుమారు రూ. 500 కోట్ల మేర మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. జనవరిలో ట్రామ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి ఒకరు అప్రా మోటెల్స్, 32 మైల్స్టోన్ విస్టాస్ ప్రైవేట్ లిమిటెడ్పై ఫిర్యాదు చేశారని గురుగ్రామ్ పోలీసుల ప్రతినిధి తెలిపారు. దీంతో పాటు ఇతర ఫిర్యాదుల మేరకు పలు కేసులు నమోదయ్యాయి. అధికారులు బ్యాంకు రికార్డులు, ఆర్థిక లావాదేవీలు మరియు ప్రాజెక్టుకు సంబంధించిన షెల్ ఎంటిటీలను పరిశీలిస్తున్నారు.
ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు తర్వాత, ధ్రువ్ దత్ శర్మను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని అరెస్టులు చేసేఅవకాశంఉందని పేర్కొన్నారు. నిందితుడిని నగర కోర్టులో హాజరుపరిచి ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకున్నారు.
మరోవైపు రూ.64 లక్షలు మోసం చేశారని ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక జంట ఆరోపించారు. వారి ఫిర్యాదుమేరకు డిసెంబర్లో సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో సీఈఓ ధ్రువ్ శర్మ, అతని సోదరి, తల్లిదండ్రులు, ఇతరులపై నేరపూరిత కుట్ర, నేరపూరిత నమ్మక ద్రోహం, మోసం, ఫోర్జరీ లాంటి అభియోగాలు మోపడం గమనార్హం. అంతేకాదు 32వ అవెన్యూ ఉద్యోగి కార్మికులకు గత కొన్ని నెలలుగా జీతం చెల్లించలేదట.
గతంలో ఫోర్బ్స్ 30 అండర్ 30లో చోటు సంపాదించుకున్న ధ్రువ్ శర్మ అవినీతి వ్యవహారం, భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, నియంత్రణ, పెట్టుబడిదారుల రక్షణ గురించి ఆందోళనలను మరింత పెంచింది.


