వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అప్పీల్స్ కోర్టు భారీ ఊరట దక్కింది. వలసదారులను నిర్బంధించే విషయంలో ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని అప్పీల్స్ కోర్టు సమర్థించింది. దీంతో, కోర్టులో భారీ విజయం దక్కింది. ఈ మేరకు ధర్మాసనం తరఫున 2-1 మెజారిటీతో జడ్జి ఎడిత్ హెచ్ జోన్స్ తీర్పు రాశారు.
కాగా, అమెరికాలో ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వలసదారులను అరెస్టు చేసినప్పుడు హోంలాండ్ భద్రతాధికారులు బాండ్ హియరింగ్ను నిరాకరిస్తున్నారు. బాండ్ హియరింగ్కు అనుమతి ఇవ్వకుండానే వలసదారులను నిర్భందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వలసదారుల నిర్భందాలపై పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఐదో సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు.. ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని సమర్థించింది. ధర్మాసనం తరఫున 2-1 మెజారిటీతో జడ్జి ఎడిత్ హెచ్ జోన్స్ తీర్పు రాశారు. ఈ సందర్భంగా.. బాండ్ హియరింగ్ నిర్భందాలకు అనేక కోర్టులు వ్యతిరేకంగా తీర్పులిస్తున్నాయి. కానీ ఇది రాజ్యాంగం, ఫెడరల్ వలస చట్టాలకు అనుగుణంగానే ఉంది. వలస, జాతీయ చట్టాలకు ప్రభుత్వం సరిగానే అర్థం చెప్పిందని అభిప్రాయపడ్డారు. అనుమతిలేని విదేశీయులు దేశంలో ఎక్కడ పట్టుబడినా బాండ్పై విడుదలకు అనర్హులని స్పష్టం చేశారు. వారు ఎంతకాలం దేశంలో ఉన్నారన్నదీ అప్రస్తుతమని పేర్కొన్నారు.
అయితే, గతంలో విదేశీయులు సరిహద్దుల్లో అరెస్టయితే.. వారికి ఎటువంటి నేర చరిత్రా లేకపోతే వలసదారుల కోర్టులో బాండ్ హియరింగ్ను కోరేవారు. కోర్టులూ వారికి బాండ్లను మంజూరు చేసేవి. కానీ, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలసదారులపై ఉక్కుపాదం మోపారు. అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేశారు.

ఈ నేపథ్యంలో మెక్సికోకు చెందిన ఇద్దరు వలసదారులు అమెరికాలో పదేళ్లుగా ఉంటున్నారు. గత ఏడాది వారు తమను నెలలపాటు నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు వేశారు. వారికి గత అక్టోబరులో టెక్సాస్ కోర్టు బాండ్లు మంజూరు చేసింది. గత జులైలో ట్రంప్ యంత్రాంగం బాండ్ల విధానాన్ని తిరగదోడింది. తాజాగా అప్పీల్స్ కోర్టు ఆ విధానాన్ని సమర్థించింది. కాగా, ఇలాంటి నిర్బంధాలను ఇటీవల దిగువ కోర్టులు తప్పుబడుతున్న నేపథ్యంలో ఈ తీర్పు ట్రంప్నకు భారీ న్యాయ విజయంగా చెప్పవచ్చు.


