breaking news
USA
-
బంగారం భారీ ధరలకు అదే కారణం..
అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు బుధవారం భారీగా పుంజుకున్నాయి. ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలు బలపడటంతో ఇన్వెస్టర్లు పసిడిపై ఆసక్తి చూపారు. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు 1శాతానికిపైగా పెరిగింది.అమెరికా జూలై వినియోగదారుల ధరల సూచీ (CPI) నెలవారీగా 0.1 శాతం పెరిగింది. జూన్లో ఇది 0.4 శాతం తగ్గింది. జూలై గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉండటంతో ఫెడ్ సెప్టెంబర్లో రేట్ల పెంపు చేసే అవకాశం తగ్గిందన్న అభిప్రాయం మార్కెట్లో నెలకొంది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే లేదా స్థిరంగా ఉండే పరిస్థితుల్లో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.ఈ పరిణామానికి తోడు అమెరికా డాలర్ బలహీనపడటం కూడా పసిడికి కలిసొచ్చింది. డాలర్లో ధర నిర్ణయించే బంగారం ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు చౌకగా మారడంతో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో స్పాట్ గోల్డ్ 100 రోజుల మూవింగ్ యావరేజ్ పైకి ఎగబాకింది.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ ధరలపైనా కనిపించింది. హైదరాబాద్, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు (ఆగస్ట్ 12) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1040 పెరిగి రూ.1,54,860 లకు, 22 క్యారెట్ బంగారం రూ.950 ఎగిసి రూ.1,41,950 వద్దకు చేరింది.ఇదిలా ఉంటే, సెప్టెంబర్లో ఫెడ్ నిర్ణయంపై మార్కెట్ల దృష్టి కొనసాగుతోంది. జూలై 29న జరిగిన సమావేశంలో అమెరికా కేంద్ర బ్యాంకు బెంచ్మార్క్ పాలసీ రేటును 3.50%-3.75% పరిధిలోనే కొనసాగించింది. అయితే ముగ్గురు ఫెడ్ అధికారులు రేటు పెంపునకు అనుకూలంగా ఓటు వేయడం ద్రవ్యోల్బణంపై ఇంకా ఆందోళనలు ఉన్నాయని సూచించింది.ఇక బంగారం తదుపరి కదలికకు అమెరికా ఉత్పత్తిదారుల ధరల సూచీ (PPI) కీలకం కానుంది. PPI అంచనాల కంటే ఎక్కువగా వస్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతున్నాయన్న సంకేతాలు వెలువడి, ఫెడ్ రేట్లపై అంచనాలు మళ్లీ మారే అవకాశం ఉంది. అదే సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ కదలికలు, చమురు ధరలు కూడా బంగారం ధరను ప్రభావితం చేయనున్నాయి. -
వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణంలో జరిగిన రహస్య మార్పు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాటో సదస్సు తర్వాత అంకారా నుంచి బయలుదేరే సమయంలో ఆయన్ని ఎవరి కంటా పడకుండా మరో విమానంలో తరలించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఎయిర్ఫోర్స్ వన్లో ఎక్కినట్లు కనిపించేలా ఓ డమ్మీ ఆపరేషన్ నిర్వహించి.. అనంతరం ఓ క్యాటరింగ్ ట్రక్కు ద్వారా ట్రంప్ను మరో సైనిక విమానంలోకి తరలించినట్లు సమాచారం. అయితే ఈ ప్రచారంపై ట్రంప్కు తాజాగా ప్రశ్న ఎదురైంది. భద్రతా కారణాలతో ఎయిర్ఫోర్స్ వన్ నుంచి మరో విమానానికి తనను తరలించారన్న ప్రచారాన్ని ట్రంప్ ధృవీకరించారు. ‘‘విమానం మార్చాలన్న నిర్ణయం పూర్తిగా సీక్రెట్ సర్వీస్, సైనిక అధికారులదే. వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.“నేను సీక్రెట్ సర్వీస్, మిలిటరీ చెప్పినట్లే చేస్తాను. వారు వేరే విమానంలో వెళ్లాలని చెప్పారు. అది కూడా అంతే భద్రత కలిగిన విమానమే. వారు కోరడంతో నేను అలా చేశాను. వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా” అని ట్రంప్ అన్నారు. అయితే ఆ ముప్పు ఇరాన్ నుంచే ఉందా? అనే విషయంపై ఆయన ధాటవేత ధోరణి ప్రదర్శించారు. తనపై ఉన్న ముప్పు వివరాలను తాను సీక్రెట్ సర్వీస్ వాళ్లను ఎక్కువగా అడగలేదని ఆయన చెప్పారు. “నాకు చాలా బెదిరింపులు వస్తుంటాయి” అని పేర్కొన్నారు.“మీకు తెలియని చాలా బెదిరింపులు నాకు ఉన్నాయి. ప్రభావవంతమైన అధ్యక్షులకు ఇలాంటి బెదిరింపులు సహజమే. దాదాపు ఆరు సంవత్సరాల కాలంలో నా కంటే ఎక్కువ చేసిన అధ్యక్షుడు ఎవరూ లేరని నేను భావిస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను దేని గురించి ఆందోళన చెందను. ఏదైనా సరే.. నా వైఖరి అదే” అని అన్నారు.ఇరాన్ను నమ్మను: ట్రంప్ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కూడా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నేను ఇరాన్ను నమ్మను. వారు నాతో నిరంతరం అబద్ధాలు చెప్పారు. ఇరాన్ను నమ్మే చివరి వ్యక్తి నేనే” అని అన్నారు. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని పేర్కొంటూ.. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.“ప్రస్తుతం హార్ముజ్ జలసంధిపై మాకు పూర్తి నియంత్రణ ఉంది. ఎవరైనా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని ట్రంప్ అన్నారు.ఆనాడు జరిగింది ఇదే..టర్కీలోని అంకారా నుంచి బయలుదేరే సమయంలో ట్రంప్ తొలుత ఎయిర్ఫోర్స్ వన్ విమానం ఎక్కారు. అయితే కొద్దిసేపటికే భద్రతా వ్యూహాన్ని మార్చిన అధికారులు ఆయనను రహస్యంగా మరో విమానంలోకి తరలించారు. సాధారణంగా విమానాలకు ఆహారం, సరఫరాలు తరలించే క్యాటరింగ్ ట్రక్ను ఉపయోగించి ట్రంప్ను విమానాశ్రయంలో మరో ప్రాంతానికి తీసుకెళ్లి, ఎయిర్ఫోర్స్ C-32A విమానంలో ఎక్కించారు.అదే సమయంలో అసలు ఎయిర్ఫోర్స్ వన్ విమానం మాత్రం ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ ఆపరేషన్ను భద్రతా వర్గాలు ఒక “డీకాయ్ ఆపరేషన్”గా పరిగణిస్తున్నాయి. ఇరాన్కు చెందిన వర్గాల నుంచి ట్రంప్ను లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉందన్న నిఘా సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్ర దేశాధినేతల ప్రయాణాలు ఎప్పుడూ అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగుతుంటాయి. అయితే “దేనికీ భయపడను” అంటూ చెప్పుకునే ట్రంప్ విషయంలో ఇరాన్ ముప్పు నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ రహస్య విమాన మార్పు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా చెప్పుకునే ట్రంప్ ప్రయాణంలో జరిగిన ఈ “సీక్రెట్ స్విచ్” భవిష్యత్తులో అధ్యక్షుల రక్షణ వ్యూహాలకు మరో కొత్త అధ్యాయంగా మారుతుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది. -
అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక.. క్షిపణి ప్రయోగంతో షాక్!
పోగ్యాంగ్: దక్షిణ కొరియా, అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న ‘ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్’ సైనిక విన్యాసాలు ప్రారంభం కానున్న తరుణంలో ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. బుధవారం ఉదయం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం ప్రకటించింది. ఉత్తర కొరియాలోని వోన్సాన్ ప్రాంతం నుంచి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ఈ క్షిపణిని ప్రయోగించారు. ఇది సుమారు 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, జపాన్ సముద్రంలో పడిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు.జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి ఈ ప్రయోగాన్ని ప్రాంతీయ శాంతికి ముప్పుగా అభివర్ణించడమే కాకుండా, దౌత్య మార్గాల ద్వారా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంపై దక్షిణ కొరియా జాతీయ భద్రతా కార్యాలయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొంటూ, ఉత్తర కొరియాను వెంటనే ఇలాంటి పరీక్షలు ఆపివేయాలని హెచ్చరించింది. అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా దశాబ్దాలుగా దురాక్రమణకు సన్నాహాలుగా భావిస్తూ, ప్రతిసారీ ఇటువంటి క్షిపణి ప్రయోగాలతోనే తన నిరసనను తెలుపుతుంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ నెలలో జరగనున్న 11 రోజుల ‘ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్’ విన్యాసాల్లో సుమారు 18,000 మంది దక్షిణ కొరియా సైనికులతో పాటు, అక్కడ మోహరించిన 28,500 మంది అమెరికా సైనికులు పాల్గొంటారు. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు పొందిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి సైనిక విన్యాసాలు మరింత పటిష్టంగా ఉంటాయని కంబైన్డ్ ఫోర్సెస్ కమాండ్ పేర్కొంది. ఈ పరిణామాలు కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను మరోసారి తారాస్థాయికి చేర్చాయి.ఇది కూడా చదవండి: సముద్రం నుంచి అంతరిక్షం వరకు చైనా సీక్రెట్ సెన్సార్లు! -
కన్నపిల్లలనే చంపిన తల్లి.. అమెరికా ఘోరం వెనుక ఉన్న ఆ ‘మానసిక జబ్బు’ ఏంటి?
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన కేసుగా భావిస్తున్న లిండ్సే క్లాన్సీ (32) హత్య విచారణ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనవరి 2023లో తన ముగ్గురు పిల్లలను (8 నెలల కాలన్, 5 ఏళ్ల కోరా, 3 ఏళ్ల డాసన్) హత్య చేసిన కేసులో క్లాన్సీ కోర్టు విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ కేసు కేవలం ఒక నేర విచారణగా మాత్రమే కాకుండా, ఒక తల్లి పదేపదే సహాయం కోరినప్పటికీ వైద్యులు ఆమె మానసిక స్థితిని గుర్తించడంలో ఎలా విఫలమైందనే ప్రధాన ప్రశ్నను తెరపైకి తెచ్చింది.కోర్టు విచారణలో క్లాన్సీకి మద్దతుగా ఆమె మామ క్రిస్టోఫర్ క్లాన్సీ, అలాగే ఆమె బాల్య స్నేహితులు సాక్షాలను వెల్లడించారు. స్కూల్ టీచర్. పిల్లలను అమితంగా ప్రేమించే ఆదర్శ తల్లి. అయితే, పైకి సాధారణంగా కనిపించినప్పటికీ, క్లాన్సీ గత కొద్దికాలంగా తీవ్ర నిద్రలేమి, తీవ్రమైన ఆందోళన, తిమ్మిరి, ఆత్మహత్య ఆలోచనలతో నరకం అనుభవించినట్లు తెలిసింది. తనకు తాను 'జాంబీ'లా అనిపిస్తోందని ఆమె తన ఫ్యామిలీ థెరపిస్ట్ ఎదుట మొరపెట్టుకున్నారు. 13 రకాల మందులు.. ప్రసవానంతర సైకోసిస్ను గుర్తించని వైద్యులుహత్యలకు ముందు క్లాన్సీ వైద్య సహాయం కోరినప్పటికీ, వైద్యులు ఆమెకు ఏకంగా 13 రకాల మానసిక వైద్య ఔషధాలను (సైకియాట్రిక్ డ్రగ్స్) సూచించారు. క్లాన్సీకి చికిత్స అందించిన వైద్యులు డాక్టర్ అలియా గుడ్హార్ట్, డాక్టర్ జెన్నిఫర్ టఫ్ట్స్ కోర్టులో సాక్ష్యమిస్తూ.. తాము క్లాన్సీ ఆరోగ్య సమస్యను తీవ్రంగా పరిగణించలేదని, ఉన్మాద లక్షణాలు కనిపించలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో క్లాన్సీ పరిస్థితిని సరిగ్గా గుర్తించడంలో వైద్యులు విఫలమయ్యారని, ఆమెకు అవసరానికి మించి మందులు ఇచ్చి అసలు సమస్యను పక్కదారి పట్టించారని డిఫెన్స్ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై క్లాన్సీ కుటుంబం ఇప్పటికే న్యాయపోరాటం చేస్తోంది.వైద్యుల వైఫల్యమేనా?ప్రసవానంతరం వచ్చే మానసిక ఆరోగ్య సమస్యలపై ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ నికోల్ కుమి కోర్టుకు వివరిస్తూ.. ప్రసవానంతర కాలంలో తల్లులకు నిద్ర పట్టకపోవడం తీవ్రమైన మానసిక సంక్షోభానికి మొదటి హెచ్చరిక సంకేతం. ప్రసవానంతర సైకోసిస్ బారిన పడిన వ్యక్తులు కొన్ని సమయాల్లో బయటకు సాధారణంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తారు. కానీ వారి అంతరంగంలో తీవ్రమైన భ్రమలు నడుస్తుంటాయి. ఆమె ఇంట్లోనూ, వైద్యుల ఎదుట తన అనారోగ్య సమస్యల్ని నయం చేయాలని మొరపెట్టుకుంది. కానీ ఆమెకు కేవలం మందులు, సరిదిద్దలేని సలహాలు మాత్రమే లభించాయి’ అని వివరించారు.కోర్టులో వాదోపవాదాలుపిల్లల ప్రాణాలు తీసిన అనంతరం క్లాన్సీ తన మణికట్టు, మెడ కోసుకుని రెండో అంతస్తు కిటికీ నుండి దూకి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో ఆమె నడుము కింది భాగం పక్షవాతానికి గురైంది. పిల్లలను చంపాలనే ముందస్తు ప్రణాళికతోనే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని, ఆత్మహత్యాయత్నం ఆమె ఉద్దేశపూర్వక చర్యకు నిదర్శనమని ప్రాసిక్యూటర్లు వాదిస్తున్నారు. తీవ్రమైన ప్రసవానంతర సైకోసిస్ వల్ల క్లాన్సీ వాస్తవ ప్రపంచంతో సంబంధం కోల్పోయారని, కాబట్టి ఆమెను నేరపూరిత బాధ్యురాలిగా పరిగణించలేమని ఆమె తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ విచారణ, మానసిక ఆరోగ్య సంక్షోభం మరియు కొత్త తల్లుల పట్ల వైద్య వ్యవస్థ వ్యవహరించాల్సిన తీరుపై అమెరికా సమాజంలో సరికొత్త చర్చకు దారితీసింది. -
ఇరాన్ నుంచి ముప్పు.. ఏమార్చి కేటరింగ్ ట్రక్కులో ట్రంప్ ప్రయాణం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రత చుట్టూ ఎప్పుడూ అత్యంత కట్టుదిట్టమైన వలయం ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో భద్రతా ముప్పులు, నిరసనలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఆయన అనుకోని రీతుల్లో, అత్యంత గోప్యంగా ప్రయాణించాల్సి వచ్చింది. వెనుక ద్వారాల నుంచి దొంగచాటుగా వెళ్లడం, భూగర్భ బంకర్లోకి మారడం, బుల్లెట్ ప్రూఫ్ గోల్ఫ్ కార్ట్లలో తరలింపుతో పాటు.. ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉండటంతో తాజాగా ఎయిర్పోర్టులో కేటరింగ్ ట్రక్కులో ప్రయాణించిన ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది.గత నెలలో టర్కీలోని అంకారాలో జరిగిన నాటో సదస్సుకు హాజరైన ట్రంప్పై ఇరాన్ నుంచి హత్యాయత్నం ముప్పు పొంచి ఉందన్న నిఘా సమాచారంతో భద్రతా సిబ్బంది వినూత్న వ్యూహాన్ని అమలు చేశారు. విలేకరుల సమక్షంలో ట్రంప్ పాత బోయింగ్ 747 విమానం ఎక్కారు. అయితే, విమానం లోపల నుంచి ఆయన్ను అత్యంత రహస్యంగా ఒక 'కేటరింగ్ ట్రక్'లోకి ఎక్కించి విమానాశ్రయం గుండా మరో చిన్న ఎయిర్ఫోర్స్ సీ-32ఏ విమానానికి తరలించారు.ట్రంప్ అందులోనే ఉన్నాడనే భ్రమ కల్పించడానికి బ్రిటన్కు వెళ్లింది. అందులోని రిపోర్టర్లు, సిబ్బందిని కూడా కిటికీల కర్టెన్లు మూసేయాలని ఆదేశించారు. ట్రంప్ వేరే విమానంలో సురక్షితంగా బ్రిటన్ చేరుకున్నారు. కొన్ని వారాల తర్వాత గానీ ఈ విషయం బయటకు రాలేదు.2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా శాన్ఫ్రాన్సిస్కోలోని హయత్ రీజెన్సీ హోటల్లో కాలిఫోర్నియా రిపబ్లికన్ సమావేశానికి ట్రంప్ హాజరుకావాల్సి వచ్చింది. వందలాది మంది నిరసనకారులు ప్రధాన మార్గాన్ని దిగ్బంధించడంతో ఆయన కాన్వాయ్ దారి మళ్లించారు. హైవే 101 నుంచి దిగి, హోటల్ వెనుక ఉన్న తక్కువ ఎత్తున్న రక్షణ గోడను ట్రంప్ స్వయంగా దూకి లోపలికి వెళ్లారు. వేదికపైకి చేరుకున్నాక నేను నా జీవితంలో ఇంత కష్టపడి ఎప్పుడూ వేదికపైకి రాలేదు అంటూ స్వయంగా ఆయనే చమత్కరించారు.జార్జ్ ఫ్లాయిడ్ మృతి తర్వాత అమెరికా వ్యాప్తంగా చెలరేగిన నిరసనలు వైట్ హౌస్ సరిహద్దుల వరకు చేరాయి. ఆందోళనకారులు వైట్ హౌస్ బారికేడ్లపై వస్తువులు విసురుతుండటంతో సీక్రెట్ సర్వీస్ విభాగం ట్రంప్ను వైట్ హౌస్ కింద ఉన్న అత్యవసర భూగర్భ బంకర్లోకి తరలించింది. ఆయన దాదాపు గంటపాటు అక్కడే ఉన్నారు. విపక్షాలు ఆయన్ను బంకర్ బాయ్ అని ఎగతాళి చేయగా.. తాను దాక్కోవడానికి వెళ్లలేదని, కేవలం బంకర్ను పరిశీలించడానికే వెళ్లానని ట్రంప్ వివరణ ఇచ్చారు.సెప్టెంబర్ 15, 2024న వెస్ట్ పామ్ బీచ్లోని తన గోల్ఫ్ క్లబ్లో ట్రంప్ ఆడుతుండగా, ఫెన్సింగ్ పొదల్లోంచి తుపాకీ గురిపెట్టిన దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గుర్తించి కాల్పులు జరిపారు. వెంటనే ఏజెంట్లు ట్రంప్కు రక్షణ వలయంగా ఏర్పడి, స్టీల్ రీఇన్ఫోర్స్డ్తో తయారుచేసిన బుల్లెట్ ప్రూఫ్ 'ఫాస్ట్ గోల్ఫ్ కార్ట్'లోకి ఆయన్ను ఎక్కించి క్లబ్హౌస్కు సురక్షితంగా తరలించారు. ఈ సంఘటనపై స్పందించిన ట్రంప్, నాలుగైదు బుల్లెట్ శబ్దాలు వినిపించాయి.. చిట్టచివరి షాట్ కొట్టాలని ఉండేది కానీ, వెంటనే అక్కడి నుంచి సురక్షితంగా బయటపడటమే మంచిదనిపించిందిఅని సరదాగా పేర్కొన్నారు.అధ్యక్షుడిగా గెలిచిన వారం రోజులకే అంటే నవంబర్ 2016 భద్రతా ప్రెస్ బృందానికి సమాచారం ఇవ్వకుండా ట్రంప్ డిన్నర్కు వెళ్లారు. ఆ రాత్రి ఆయన బయటకు రారని అధికారికంగా ప్రకటించిన తర్వాత, ఆయన తన కుటుంబంతో కలిసి రహస్యంగా మాన్హట్టన్లోని '21 క్లబ్' రెస్టారెంట్కు వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న రిపోర్టర్లు ఆయనను కవర్ చేయడానికి పరుగులు తీశారు. అధ్యక్షుడికి అత్యవసర రక్షణ కవరేజ్ వ్యవస్థ ఉన్నప్పటికీ, వారికి తెలియకుండా డిన్నర్కు వెళ్లడం ఆ సమయంలో తీవ్ర చర్చకు దారితీసింది. -
రోజుకు 3 గంటల క్లాసులు.. ఏడాదికి రూ.9 లక్షల ఫీజు.. అమెరికా ప్రీస్కూల్ వీడియో వైరల్
-
రివర్స్ రీయింబర్స్మెంట్.. ట్రంప్ నయా గేమ్!
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు దౌత్యపరమైన ఆధిపత్య పోరుగా మారింది. ఐదు నెలలపాటు కొనసాగిన ఘర్షణల తర్వాత పరిస్థితులు కొంత చల్లబడతాయని భావిస్తున్న సమయంలో.. ఇరు దేశాలు పరస్పరం కొత్త డిమాండ్లు, ఆరోపణలతో ముందుకు రావడం అంతర్జాతీయ ఆందోళనలకు కారణమవుతోంది.యుద్ధంలో తమకు జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని, అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ డిమాండ్లను తిరస్కరించడమే కాకుండా.. గత ఘర్షణల్లో అమెరికా పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోవడానికి ఇరాన్ బాధ్యత వహించాలని, తమ నష్టాలకు టెహ్రాన్ నుంచే పరిహారం కోరుతామని స్పష్టం చేశారు.హర్ముజ్ తెరవాలంటే ఇరాన్ షరతులుహర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వైఖరిని కఠినంగా వెల్లడించింది. అమెరికా చర్యల కారణంగా తమ దేశానికి జరిగిన నష్టాలను భర్తీ చేయాలని, అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించాలని కోరుతోంది. యుద్ధ పరిస్థితుల్లో నిలిచిపోయిన తమ ఆస్తులను విడుదల చేయాలని, మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించాలని కూడా టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది.ఈ డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించే వరకు హర్ముజ్ విషయంలో తమ వైఖరిలో మార్పు ఉండకపోవచ్చనే సంకేతాలను ఇరాన్ ఇస్తోంది. హర్ముజ్ జలసంధి తమ భద్రత, ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమని టెహ్రాన్ చెబుతోంది.ట్రంప్ ఎదురుదాడి.. ‘పరిహారం మాకే రావాలి’ఇరాన్ డిమాండ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. యుద్ధంలో అమెరికన్ల ప్రాణ నష్టానికి, గత ఘర్షణల్లో జరిగిన నష్టాలకు ఇరాన్ బాధ్యత వహించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ నుంచి పరిహారం కోరుతామని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్కు అమెరికా పరిహారం చెల్లించాలన్న డిమాండ్ను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. గతంలో ఇరాన్ చర్యల వల్ల అమెరికా ఎదుర్కొన్న నష్టాలను ప్రస్తావిస్తూ.. బాధ్యత టెహ్రాన్పైనే ఉందని వాదిస్తున్నారు.ఆంక్షలతో ఒత్తిడి పెంచాలన్న అమెరికా వ్యూహంప్రస్తుతం ఇరాన్పై సైనిక చర్యల కంటే ఆర్థిక ఒత్తిడి పెంచడంపైనే అమెరికా దృష్టి పెట్టిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరం అయితే ఇరాన్ చర్చలకు రావాల్సి వస్తుందని ట్రంప్ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇరాన్ మాత్రం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. ఆంక్షలు తమను బలహీనపర్చేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నమని ఆరోపిస్తూ.. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని మార్గాల్లో పోరాడతామని స్పష్టం చేస్తోంది.ప్రపంచానికి ఎందుకు కీలకం హర్ముజ్?పర్షియన్ గల్ఫ్ను ఒమన్ గల్ఫ్తో కలిపే సన్నని సముద్ర మార్గమే హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో ఇది అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటి. మధ్యప్రాచ్యం నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్లే భారీ స్థాయి ఇంధన సరఫరా ఈ మార్గంపైనే ఆధారపడి ఉంటుంది. హర్ముజ్లో ఏదైనా అంతరాయం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంధన సరఫరాలో అనిశ్చితి ఏర్పడటంతో పాటు అంతర్జాతీయ వాణిజ్యంపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందుకే ఇరాన్–అమెరికా వివాదంలో హర్ముజ్ జలసంధి కేంద్ర బిందువుగా మారింది.ట్రంప్పై ఎన్నికల ఒత్తిడి.. ఇరాన్కు కలిసొస్తుందా?అమెరికాలో రాజకీయ పరిణామాలు కూడా ఈ సంక్షోభంపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్తో దీర్ఘకాలిక ఘర్షణ కొనసాగితే దేశీయంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మాజీ అమెరికా అధికారి చార్లెస్ కుప్చాన్ అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ఒత్తిడి కారణంగా చర్చల్లో ఇరాన్కు కొంత వ్యూహాత్మక ఆధిక్యం లభించే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో టెహ్రాన్ చేస్తున్న డిమాండ్లు అమెరికాకు అంగీకరించలేని స్థాయిలో ఉన్నాయని ఆయన విశ్లేషించారు.కొనసాగుతున్న ఉద్రిక్తతలుఇరాన్–అమెరికా వివాదం ప్రభావం పశ్చిమాసియాలో ఇతర ప్రాంతాలపైనా కనిపిస్తోంది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా.. యెమెన్లో హౌతీ దళాల చర్యలు పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. గాజా శాంతి ప్రయత్నాలపైనా అనిశ్చితి కొనసాగుతోంది.హర్ముజ్ తాళం ఎవరి చేతిలో?ప్రస్తుతం అమెరికా–ఇరాన్ మధ్య అసలు పోరు కేవలం పరిహారం, ఆంక్షల అంశానికే పరిమితం కాలేదు. ఇది మిడిల్ఈస్ట్లో ఆధిపత్యం, భద్రత, ప్రపంచ ఇంధన సరఫరాలపై ప్రభావం చూపే పెద్ద సంక్షోభంగా మారింది.ఇరాన్ తన డిమాండ్లపై పట్టుబడుతుండగా.. ట్రంప్ కూడా వెనక్కి తగ్గే సూచనలు ఇవ్వడం లేదు. చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందా? లేదంటే హర్ముజ్ జలసంధి మరోసారి ప్రపంచ సంక్షోభానికి కేంద్రంగా మారుతుందా? అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. -
లోకేశ్ మళ్లీ మాయం
సాక్షి, అమరావతి: సీఎం తనయుడు, ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ మళ్లీ మాయమయ్యారు. రెండు రోజుల క్రితమే ఆయన రాష్ట్రాన్ని వీడి రహస్యంగా అమెరికా వెళ్లినట్లు తెలిసింది. డీఎస్సీలో మెగా కుంభకోణానికి పాల్పడిన కూటమి ప్రభుత్వంపైన, ఆ శాఖ మంత్రి లోకేశ్పైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్న వేళ ఆయన విదేశాలకు వెళ్లడం గమనార్హం. తన శాఖలో జరిగిన అతిపెద్ద కుంభకోణంపై ప్రజలకు జవాబు చెప్పాల్సిన మంత్రి, ఇలా వ్యవహరించడాన్ని సర్వత్రా తప్పుపడుతున్నారు. లోకేశ్కు రహస్య విదేశీ పర్యటనలు కొత్తేమీ కాదు. నెలకోసారి ఆయన విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. అయితే దీనిపై పార్టీలో ముఖ్యులకూ సమాచారం ఉండడం లేదు. సాధారణంగా ప్రభుత్వ అధికారులు, మంత్రులు హెడ్ క్వార్టర్ వీడి పక్క రాష్ట్రం వెళ్లినా ప్రభుత్వం అధికారికంగా జీఓ జారీ చేస్తుంది. ముఖ్యమంత్రి అయినా సరే అన్ని పర్యటనల గురించి జీఓ జారీ చేయాల్సిందే. లోకేశ్ గత రెండేళ్లుగా ఇప్పటికి చాలాసార్లు అసలు ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలియకుండా అదృశ్యమైపోతున్నారు. ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక విమానాల్లో విదేశాలకు రహస్యంగా చెక్కేస్తున్నారు. -
ప్రియురాలి హత్య, జర్మనీలో భారతీయ విద్యార్థి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలో ప్రియురాలి హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరవై ఏళ్ల భారతీయ విద్యార్థిని పోలీసులు జర్మనీలో అరెస్టు చేశారు. స్వదేశానికి వెళ్లే క్రమంలో కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కేలోపే అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి... బచ్చిగారి వరుణ్ అనే విద్యార్థి అరిజోనా యూనివర్సిటీలో బిజినెస్ అనలిటిక్స్ విద్యనభ్యసిస్తున్నాడు. ఈ నెల ఆరవ తేదీ ప్రియురాలు ’జులిస్సా రూబీ సలజార్ (19)ను టక్సన్ సిటీలోని ఆమె అపార్ట్మెంట్లో హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు హత్య అనంతరం వరుణ్ టక్సన్ నుంచి జర్మనీ మీదుగా భారత్కు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు టక్సన్ పోలీసులు తెలిపారు. అయితే టక్సన్ పోలీసులు, ఎఫ్బీఐలు సమన్వయంతో వ్యవహరించి జర్మనీలో విమానం దిగుతూండగానే వరుణ్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ తన ప్రియురాలిని హత్య చేసిన తరువాత ఆమె ఫోన్, క్రెడిట్ కార్డులు తీసుకుని ఆమె తల్లికి మోసేజ్లు పెడుతూ నేరాన్ని దాచేందుకు ప్రయత్నించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. అయితే ఆ మెసేజీలపై అనుమానంతో కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆమె యోగక్షేమాలు కనుక్కునే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆగస్టు ఆరవ తేదీ సాయంత్రం టక్సన్ అగ్నిమాపక సిబ్బందికి గుండెపోటు ఘటనకు సంబంధించిన సమాచారం ఒకటి అందింది. వారు సలజార్ అపార్ట్మెంట్కు వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. మెడవరకూ బ్లాంకెట్ ఒకటి కప్పి ఉన్నట్లు గుర్తించారు. సలాజర్ మెడపై గొంతు నులిమిన గుర్తులు, గీతలు ఉన్నట్లు తెలిసింది. గతంలో దాడి కేసు... వరుణ్పై గతంలోనే ఒక దాడి కేసు నమోదైనట్లు, దీనిపై అరిజోనా యూనివర్శిటీ పోలీసులు దర్యాప్తు చేసినట్లు అరెస్ట్ వారంట్ ద్వారా తెలిసింది. మనస్పర్ధల కారణంగా సలాజర్ గత ఏడాది ఆఖరు నుంచి వేరుగా ఉంటోందని, గృహ హింస ఆరోపణల నేపథ్యంలో అతడితో తెగతెంపులు చేసుకోవాలని తీర్మానించుకుందని ప్రత్యక్ష సాక్షుల విచారణలో తెలిసింది. పలు సందర్భాల్లో వరుణ్ హింసకు పాల్పడినట్లు కూడా సాక్షులు తెలిపారు. ఈ ఏడాది మే నెలలో పిమా కౌంటీ కోర్టులో వరుణ్పై దాడి, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం వంటి ఆరోపణలపై ఒక కేసు నమోదైనట్లు న్యూయార్క్ పోస్ట్ వెబ్సైట్ తెలిపింది. వరుణ్ ఈ మధ్యే ఉద్యోగం కోల్పోయాడని, అద్దె చెల్లించే స్థితిలోనూ లేకపోవడంతో అతడి వీసా పరిస్థితి ప్రమాదంలో పడిందని కూడా పోస్ట్ వెబ్సైట్ తెలిపింది. వరుణ్ ఒకానొక హాలోవీన్ పారీ్టలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, కానీ తాను ఆ విషయాన్ని పోలీసులకు తెలపలేదని ఒక సాక్షి విచారణ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. వరుణ్ తాలూకూ రికార్డులను పరిశీలించిన ఫాక్స్ న్యూస్ అతడు యూనివర్శిటీ నుంచి బహిష్కృతుడైనట్లు గుర్తించింది. అయితే హత్యారోపణలు వచ్చే నాటికి అతడి వీసా చెల్లుబాటులోనే ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం వరుణ్ను అమెరికాకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. అనంతరం అతడిని అరిజోనాకు తరలించి పిమా కౌంటీ అడల్ట్ డిటెన్షన్ కాంప్లెక్స్లో ఉంచనున్నారు. -
ఇరాన్కు ట్రంప్ బిగ్ షాక్.. ఇక పరిహారం కూడా చెల్లించాల్సిందే!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. భవిష్యత్లో జరిగే శాంతి చర్చల్లో భాగంగా.. దశాబ్దాలుగా ఇరాన్ మద్దతుతో జరిగిన దాడులు, ఘర్షణల్లో అమెరికన్లకు జరిగిన నష్టానికి ఇరాన్ నుంచి నష్టపరిహారం కోరాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఆయన ఓ పోస్ట్ చేశారు.గత ఐదు నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్కు జరిగిన నష్టానికి ఆ దేశం పరిహారం కోరుతున్న విషయాన్ని ప్రస్తావించిన ట్రంప్.. అదే తరహాలో అమెరికా కూడా ఇరాన్ నుంచి పరిహారం కోరడం ‘ఆసక్తికరమైన ఆలోచన’ అని పేర్కొన్నారు. ఇరాన్ కోరుతున్న నష్టపరిహారం అంశం అమెరికాతో జరిగిన చర్చల్లో ఇప్పటివరకు ప్రస్తావనకు రాలేదని ఆయన అన్నారు.దశాబ్దాల నాటి ఘటనల ప్రస్తావనతన నష్టపరిహారం డిమాండ్కు మద్దతుగా గతంలో జరిగిన పలు ఘటనలను ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ మద్దతుతో జరిగిన రోడ్డు పక్క బాంబు దాడులు, ఇతర ఘర్షణల్లో అమెరికా సైనికులు మరణించడం, తీవ్రంగా గాయపడటాన్ని ఆయన ప్రస్తావించారు. ఇరాన్ మాజీ సైనిక కమాండర్ ఖాసిమ్ సొలైమానీ పేరు కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.2000 అక్టోబర్లో యెమెన్లోని ఓడరేవులో అమెరికా నావికాదళానికి చెందిన యూఎస్ఎస్ కోల్పై జరిగిన బాంబు దాడిని కూడా ట్రంప్ ఉదహరించారు. ఆ ఘటనలో 17 మంది అమెరికా నావికులు మరణించగా.. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ దాడికి అల్ఖైదానే కారణమని ఎఫ్బీఐ గతంలో పేర్కొంది.నిరసనకారుల కుటుంబాలకూ పరిహారం?గత ఐదు దశాబ్దాల్లో ఇరాన్లో జరిగిన ప్రజా ఉద్యమాలు, నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా పరిహారం అందించాలని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత ఐదు నెలల యుద్ధంలో మరణించినట్లు తాను పేర్కొన్న సుమారు 52 వేల మందికి సంబంధించిన నష్టపరిహారం అంశాన్ని కూడా చర్చల్లో చేర్చాలని తన ప్రతినిధులకు సూచించినట్లు తెలిపారు.హర్మూజ్పై ఇరాన్ కీలక డిమాండ్మరోవైపు హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వైఖరిని స్పష్టం చేసింది. అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు.. యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించి, ఆర్థిక ఆంక్షలను తొలగించి, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేసే వరకు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవబోమని ఇరాన్ చెబుతోంది.ప్రాంతీయ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా డిమాండ్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్-అమెరికా మధ్య భవిష్యత్ శాంతి చర్చలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
బాల్టిమోర్లో 19వ ఆటా మహాసభలు.. తెలుగు సంస్కృతికి పట్టాభిషేకం
బాల్టిమోర్, అమెరికా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు, యువజన సదస్సు దిగ్విజయంగా ముగిశాయి. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు (జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు) అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగిన కార్యక్రమాలకు ఉత్తర అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన తెలుగు ప్రజలతో బాల్టిమోర్ నగరం ఒక మినీ తెలుగు సీమను తలపించింది. తెలుగు భాషాభిమానం, సామాజిక ఐక్యత, ఆర్థిక పురోగతి , భావితరాల చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఈ మహాసభలను హాజరైన ప్రతినిధులు ‘సూపర్ డూపర్ హిట్’గా అభివర్ణించారు. శోభాయమానమైన గ్రాండ్ బాంక్వెట్తో ప్రారంభమైన ఈ వేడుకలు ఆటా చరిత్రలోనే ఒక చిరస్మరణీయ మైలురాయిగా నిలిచాయి.జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత తెచ్చిన రాజకీయ దిగ్గజాలుఈ మహాసభలకు అమెరికా జాతీయ రాజకీయ దిగ్గజాలతో పాటు భారతదేశానికి చెందిన ప్రజాప్రతినిధులు హాజరై ప్రత్యేక శోభను తెచ్చారు. మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ మాట్లాడుతూ మేరీల్యాండ్, అమెరికా సమగ్ర అభివృద్ధిలో తెలుగు ప్రవాసుల పాత్రను కొనియాడారు. సాంకేతికత, వైద్యం, విద్య, వ్యాపారం, పౌర సేవల్లో తెలుగు వారి నిబద్ధతను అభినందించారు.ఈ కార్యక్రమానికి హాజరైన మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ తన జీవిత ప్రయాణాన్ని షేర్ చేసుకుంటూ.. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా అమెరికన్ సమాజంలో ఉన్నత అవకాశాలను సాధించవచ్చని సూచించారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా ఎఫ్. హష్మీ తన హైదరాబాద్ బాల్య జ్ఞాపకాలైన పాతబస్తీ, చార్మినార్, లాడ్ బజార్, హైదరాబాదీ బిర్యానీ, రైలు ప్రయాణాలను గుర్తుచేసుకుని ప్రేక్షకులను చప్పట్లు కొట్టేలా చేశారు. ప్రవాసులు పౌర, రాజకీయ ప్రక్రియల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రగతి, మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ రాష్ట్రాభివృద్ధికి, ఉపాధి కల్పనకు ప్రవాస పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో తానా, నాట్స్, టీటీఏ, టీడీఎఫ్, ఏఏపీఐ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొని తెలుగు సమాజ ఐక్యతను చాటారు. అమెరికా సాయుధ దళాల్లో వీరోచితంగా సేవలందిస్తున్న తెలుగు మహిళలు, పురుషులను ఈ వేదికపై ఘనంగా సత్కరించడంతో సభ మొత్తం అత్యంత భావోద్వేగానికి గురవడమే కాదు, స్టాండింగ్ ఒవేషన్, కరతాల ధ్వనులతో వేదికను మార్మోగేలా చేశారు.వ్యాపార, సాంస్కృతిక వేడుకలుమూడు రోజుల పాటు విభిన్న కార్యక్రమాలతో కన్వెన్షన్ సెంటర్ సభా ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఈ వేదికలపై కవిత్వం, సాహిత్యం, సినిమా, చరిత్రపై లోతైన చర్చలు జరిగాయి. పారిశ్రామిక వేదికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, వైద్యం, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల్లో అవకాశాలపై సీనియర్ పారిశ్రామికవేత్తలు, యువ స్టార్టప్ వ్యవస్థాపకులు విస్తృతంగా చర్చించారు. రెండవ, మూడవ తరాల తెలుగు-అమెరికన్ యువత కోసం సంస్కృతి, నెట్వర్కింగ్, నాయకత్వ నైపుణ్యాలు,కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను నిర్వహించారు. ఉర్రూతలూగించిన జానపదాలుతెలుగు సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న జానపద గీతాలు ఈ వేదికకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్, జనార్దన్ పన్నెల బృందం ఆలపించిన తెలంగాణ జానపద గేయాలు చప్పట్లతో మారుమోగించాయి.తారల సందడి.. కీరవాణి స్వర నీరాజనంతెలుగు సినీ ప్రపంచానికి చెందిన ప్రముఖుల రాకతో వేడుకల్లో ఉత్సాహం రెట్టింపైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అడివి శేష్, హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్, మురళీధర్ గౌడ్, వరుణ్ సందేశ్, పూజా హెగ్డే, రీతూ వర్మ, అనన్య నాగళ్ల, దివి వడ్త్యా అభిమానులతో ముచ్చటించారు. యువ నటుడు నవీన్ పోలిశెట్టి తన టైమింగ్ కామెడీ పంచ్ లతో ప్రాంగణాన్ని నవ్వుల సంద్రంలో ముంచెత్తారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, గాయని సునీత, త్రీయరీ, ఆరెంజ్ స్ట్రీట్ బృందాల ప్రదర్శనల అనంతరం... ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ మహాసభలకు 'గ్రాండ్ ఫినాలే'గా నిలిచింది.20వ మహాసభలు డాలస్లో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బానాల, సతీష్ రెడ్డి రామసహాయం మరియు కోర్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వందలాది మంది వాలంటీర్లు భోజనం, రవాణా, లాజిస్టిక్స్ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించి అతిథుల మెప్పు పొందారు.ఈ మహాసభల ముగింపు సందర్భంగా కీలక ప్రకటన చేస్తూ, 2028లో జరగబోయే 20వ ఆటా మహాసభలకు డాలస్ (టెక్సాస్) నగరం ఆతిథ్యం ఇవ్వబోతోందని నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. బాల్టిమోర్ మహాసభలు కేవలం సదస్సులు కాదు.. తెలుగువారి గుర్తింపునకు ఒక గొప్ప వేడుక.. కొత్త అవకాశాలకు వేదిక.. సంస్థలు, వృత్తులు, తరాలకు అతీతమైన ఐక్యతకు శక్తివంతమైన ప్రతీక.. అని తెలిపారు. -
వీడియో తీస్తుండగా చేతిపై పిడుగు.. షాకిస్తున్న వీడియో!
ఓహియో : అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఒక వ్యక్తి తుఫాను దృశ్యాలను వీడియో తీస్తుండగా ఆకాశం నుంచి పిడుగు నేరుగా అతనిపై పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ భయానక దృశ్యం కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.సన్నిసినాటి నగరానికి సమీపంలోని ఒక గోల్ఫ్ కోర్టులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ తుఫాను బీభత్సం సృష్టించింది. ఆ సమయంలో ఒక వ్యక్తి భయానక వాతావరణాన్ని, ఆకాశంలో మెరుస్తున్న మెరుపులను తన కెమెరాలో బంధించే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయంలో అత్యంత శక్తివంతమైన పిడుగు నేరుగా అతనిపై పడింది. దీంతో ఆ వ్యక్తి క్షణాల వ్యవధిలో కుప్పకూలిపోయాడు. One of the craziest videos I've ever seen. Man was struck by lightning while filming a storm on a golf course Friday in Cincinnati, Ohio. He was struck on the arm, but is recovering and tells me he is "unbelievably lucky." Remember, when thunder roars, go indoors! Credit: Chris S… pic.twitter.com/RrwuavQ5oa— Matt Devitt (@MattDevittWX) August 9, 2026మామూలుగా పిడుగుపాటుకు గురయ్యే ప్రక్రియ రెప్పపాటు కాలంలో జరుగుతుంది. ఈ ఘటనలో ఆ వ్యక్తి చేతిపై పిడుగు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అమెరికా వాతావరణ నిపుణుడు మాట్ డెవిట్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన జీవితంలో చూసిన అత్యంత విస్మయకరమైన వీడియోల్లో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆ వ్యక్తి తాను ఎంతో అదృష్టవంతుడినని అన్నారు.వాతావరణ నిపుణుల హెచ్చరికల ప్రకారం.. ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను సమయంలో చెట్ల కింద గానీ, బహిరంగ మైదానాలలో గానీ ఉండకూడదు. నేషనల్ వెదర్ సర్వీస్ సమాచారం ప్రకారం.. ఉరుములు వచ్చే మేఘాల నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కూడా పిడుగు పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తుఫాను సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు చేరాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: జార్ఖండ్లో ఉద్రిక్తత: అసెంబ్లీ ముట్టడిలో విద్యార్థులు.. -
ట్రంప్ కు బిగ్ షాక్.. గాజాపై నెతన్యాహు ఏం చెప్పారంటే?
-
విషమంగా జో బైడెన్ పరిస్థితి!
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయనకు క్యాన్సర్ మరింత విస్తరించిందని, చికిత్సలో తీవ్ర నొప్పితో బాధపడుతున్నారని ఆయన కుమారుడు హంటర్ బైడెన్ వెల్లడించారు. క్యాన్సర్ ఎముకలను దాటి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించిందని ఆయన తెలిపారు.బీబీసీ ‘న్యూస్నైట్’ కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో హంటర్ బైడెన్ మాట్లాడుతూ.. తన తండ్రి క్యాన్సర్ చాలా బాధాకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. శారీరకంగా జో బైడెన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై బైడెన్ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు.జో బైడెన్ చెబితేనే.. 2025 మేలో తనకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు జో బైడెన్ వెల్లడించారు. అది దూకుడుగా వ్యాప్తి చెందే రకమని, అప్పటికే ఎముకలకు పాకిందని వైద్యులు గుర్తించినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. అనంతరం ఆయన రేడియేషన్ చికిత్స, హార్మోన్ థెరపీ తీసుకుంటున్నట్లు సమాచారం.వయసుతోపాటు ఆరోగ్యంపై చర్చ83 ఏళ్ల బైడెన్.. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన అత్యంత వృద్ధుల్లో ఒకరు. 2021–2025 మధ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన శారీరక ఆరోగ్యం, మానసిక చురుకుదనంపై పలుమార్లు చర్చ జరిగింది. 2024 ఎన్నికల సమయంలోనూ ఆయన వయసు, ఆరోగ్య అంశాలు రాజకీయంగా ప్రధాన చర్చగా మారాయి.రాజకీయ జీవితంలో కీలక అధ్యాయండెలావేర్ నుంచి దీర్ఘకాలం సెనేటర్గా ఉన్న బైడెన్.. 2009 నుంచి 2017 వరకు బరాక్ ఒబామా హయాంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం 2020 ఎన్నికల్లో విజయం సాధించి అమెరికాకు 46వ అధ్యక్షుడయ్యారు. ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. తన రాజకీయ జీవితంపై ఆధారిత జ్ఞాపకాల పుస్తకాన్ని నవంబర్లో విడుదల చేయనున్నారు. (Joe Biden Health Condition)ట్రంప్ ఏమన్నారంటే.. బైడెన్కు క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు ట్రంప్ తొలుత “ఇది చాలా బాధాకరం” అంటూ ఆయన త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. అయితే దీనిపైనా ఆయన రాజకీయం చేశారు. ఈ విషయం ప్రజలకు ఆలస్యంగా ఎందుకు వెల్లడైందంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే హంటర్ తాజా స్టేట్మెంట్పై ట్రంప్ ఇంకా స్పందించలేదు. -
ప్రీస్కూల్ ఫీజు రూ.9 లక్షలు!.. ఎక్కడంటే?
ఈ రోజుల్లో స్కూల్ పీజులు ఎక్కువగా ఉంటాయని చాలామందికి తెలుసు. కానీ ప్రీస్కూల్ ఫీజు రూ.9 లక్షలు ఉంటుందంటే.. వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.అమెరికాలో పిల్లల ప్రీస్కూల్ చదువుకు ఎంత ఖర్చవుతుందో.. తెలిపిన ఓ భారతీయ మహిళ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని కనెక్టికట్లో నివసిస్తున్న భారతీయ కంటెంట్ క్రియేటర్ సోనల్ చౌదరి.. తన రెండేళ్ల కుమార్తె బానీ కోసం ఓ ప్రైవేట్ ప్రీస్కూల్ను సందర్శించారు.అక్కడ పిల్లలకు ఎలాంటి విద్య అందిస్తారు?, ఫీజు ఎంత ఉంటుంది? అనే విషయాలను ఆమె తెలుసుకున్నారు. ఈ ప్రీస్కూల్లో కేవలం ఎనిమిది మంది పిల్లలకు ఇద్దరు టీచర్లు ఉంటారని సిబ్బంది తెలిపారు. పిల్లలకు పాటలు, యోగా, క్రియేటివ్ యాక్టివిటీస్, ఆటలతో పాటు వయసుకు తగ్గట్టుగా నేర్చుకునే కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు.అయితే.. ఫీజు గురించి తెలుసుకున్నప్పుడు సోనల్కు అసలు షాక్ తగిలింది. వారానికి రెండు రోజులు ప్రీస్కూల్కు పంపిస్తే ఏడాదికి సుమారు రూ.4 లక్షలు ఖర్చవుతుందట. అదే వారానికి ఐదు రోజులు పంపిస్తే ఏడాదికి దాదాపు రూ.9 లక్షలు చెల్లించాలి. అంటే ప్రీస్కూల్ పీజుతో.. మన దేశంలో కొత్త మారుతి బ్రెజ్జా కారు కొనుగోలు చేయొచ్చన్నమాట.ఇక్కడ తరగతులు సెప్టెంబర్ నుంచి జూన్ చివరి వరకు కొనసాగుతాయి. ఉదయం 8.45 గంటలకు ప్రారంభమై 11.45 గంటలకు ముగుస్తాయి. అంటే రోజుకు మూడు గంటల క్లాసులకే ఇంత భారీ మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఫీజు ఎక్కువగా ఉన్నప్పటికీ.. పిల్లలపై చూపించే వ్యక్తిగత శ్రద్ధ, తక్కువ మంది పిల్లలతో తరగతులు నిర్వహించడం, ప్రత్యేకమైన యాక్టివిటీస్ వంటి సౌకర్యాలను చూసిన తర్వాత ఆ ఫీజు ఎందుకు ఎక్కువగా ఉందో అర్థమైందని సోనల్ చెప్పారు.అమెరికాలో కిండర్గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్య సాధారణంగా ఉచితంగా ఉంటుందని సోనల్ పేర్కొన్నారు. దీంతో ప్రైవేట్ ప్రీస్కూల్ విద్య అమెరికా తల్లిదండ్రులకు పెద్ద ఖర్చుగా మారుతోందని తెలిపారు.సోనల్ వీడియో వైరల్ కావడంతో భారత్, అమెరికాలో విద్యా ఖర్చులపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పిల్లలకు చిన్న తరగతులు, ఎక్కువ శ్రద్ధ, ప్రత్యేకమైన కార్యక్రమాలు అందుతున్నప్పటికీ.. ఏడాదికి రూ.9 లక్షల వరకు ఫీజు చెల్లించడం మాత్రం చాలా కుటుంబాలకు పెద్ద భారమేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.ఇదీ చదవండి: వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే! -
అమెరికా వెళ్లాలంటే.. ఎవరు ఏ వీసా తీసుకోవాలి?
అమెరికాకు వెళ్లాలనుకునేవారికి సరైన వీసాను ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఉద్యోగం చేయడానికి, వ్యాపార పనుల కోసం, వివాహం చేసుకోవడానికి, తాత్కాలికంగా ఉండడానికి లేదా ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్లేవారికి వేర్వేరు రకాల వీసాలు ఉంటాయి. ప్రతి వీసాకు ప్రత్యేకమైన అర్హతలు, నిబంధనలు, కాలపరిమితి, దరఖాస్తు విధానం ఉంటాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.బీ-1 వీసాఅమెరికాలో వ్యాపార సమావేశాలు, క్లయింట్లను కలవడం, సమావేశాలు లేదా కాన్ఫరెన్స్లకు హాజరుకావడం, ఒప్పందాలపై చర్చించడం వంటి తాత్కాలిక వ్యాపార కార్యకలాపాల కోసం B-1 వీసా ఉపయోగపడుతుంది. అయితే.. ఈ వీసాతో అమెరికాలో సాధారణ ఉద్యోగం చేయడం లేదా అమెరికా సంస్థ నుంచి జీతం తీసుకోవడం సాధ్యం కాదు.ఈ వీసా కోసం దరఖాస్తుదారులు తమ ప్రయాణం తాత్కాలికమేనని, అమెరికా నుంచి తిరిగి వెళ్తారని, ప్రయాణ ఖర్చులను భరించగల సామర్థ్యం ఉందని చూపించాలి. సాధారణంగా పాస్పోర్ట్, DS-160 ఫారం, వీసా ఫీజు రసీదు, ఫొటోతో పాటు ప్రయాణ ఉద్దేశాన్ని తెలిపే పత్రాలు అవసరం.హెచ్-1బీ వీసాఅమెరికాలో ప్రత్యేక నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలు చేయాలనుకునే వారికి H-1B వీసా ఉపయోగపడుతుంది. సాధారణంగా సంబంధిత విద్యార్హతలు, అమెరికా సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్ అవసరం. ఈ వీసాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, చాలా సందర్భాల్లో లాటరీ విధానం ఉంటుంది.సాధారణంగా ఏడాదికి 65,000 హెచ్-1బీ వీసాల రెగ్యులర్ క్యాప్ ఉంటుంది. అమెరికా మాస్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత ఉన్నవారికి అదనంగా 20,000 వీసాల మాస్టర్స్ క్యాప్ ఉంటుంది. అయితే.. కొన్ని విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు సంబంధించిన ఉద్యోగాలు ఈ క్యాప్కు మినహాయింపు పొందవచ్చు. సాధారణంగా హెచ్-1బీ స్టేటస్ మూడు సంవత్సరాల వరకు మంజూరు కావచ్చు. కొన్ని పరిస్థితుల్లో మొత్తం ఆరు సంవత్సరాల వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. హెచ్-1బీను డ్యూయల్-ఇంటెంట్ వీసాగా పరిగణిస్తారు కాబట్టి, అమెరికాలో పనిచేస్తూనే గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుంది.హెచ్-2బీ వీసాసీజనల్ లేదా తాత్కాలికంగా ఉద్యోగులు అవసరమైనప్పుడు హెచ్-2బీ వీసా ఉపయోగపడుతుంది. టూరిజం, సీజనల్ పనులు, తాత్కాలిక ప్రాజెక్టులు వంటి ఉద్యోగాలకు ఇది ఉపయోగపడుతుంది.హెచ్-2బీ ఉద్యోగులకు సాధారణంగా ప్రారంభంగా గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు స్టేటస్ ఇవ్వవచ్చు. అర్హత ఉన్న సందర్భాల్లో పొడిగింపులు లభించవచ్చు. అయితే హెచ్-2బీ స్టేటస్లో మొత్తం గరిష్ఠంగా మూడు సంవత్సరాలు మాత్రమే ఉండవచ్చు. ఇది డ్యూయల్-ఇంటెంట్ వీసా కాదు. కాబట్టి తాత్కాలిక ఉద్యోగం పూర్తైన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాలనే ఉద్దేశాన్ని చూపించాలి.కే-1 వీసాఅమెరికా పౌరుడిని వివాహం చేసుకోబోయే విదేశీయులకు కే-1 వీసా ఉపయోగపడుతుంది. ఈ వీసాతో అమెరికాలోకి వెళ్లిన తర్వాత 90 రోజుల్లో వివాహం చేసుకోవాలి. వీసా ప్రక్రియలో I-129F పిటిషన్, మెడికల్ పరీక్ష, ఇంటర్వ్యూ వంటి దశలు ఉంటాయి. వివాహం తర్వాత గ్రీన్ కార్డ్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవచ్చు.కే-3 వీసాఅమెరికా పౌరుడిని ఇప్పటికే వివాహం చేసుకున్న విదేశీ జీవిత భాగస్వామి.. అమెరికాకు రావడానికి కే-3 వీసా ఉద్దేశించబడింది. అయితే I-130 పిటిషన్ ఆమోదం పొందిన తర్వాత K-3 అవసరం సాధారణంగా ముగుస్తుంది. అందువల్ల ఈ వీసా ప్రస్తుతం చాలా తక్కువగా ఉపయోగించబడుతోంది.ఎల్-1 వీసాఒక అంతర్జాతీయ కంపెనీ తన విదేశీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగిని అమెరికాలోని సంబంధిత కార్యాలయానికి బదిలీ చేయాలనుకుంటే L-1 వీసా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఉద్యోగి గత మూడు సంవత్సరాల్లో కనీసం ఒక సంవత్సరం సంబంధిత విదేశీ సంస్థలో పనిచేసి ఉండాలి. మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్లు లేదా కంపెనీకి ప్రత్యేకమైన నైపుణ్యం ఉన్న ఉద్యోగులు ఈ వీసా కింద అర్హత పొందవచ్చు.ఓ వీసాతమ రంగంలో అసాధారణ ప్రతిభ లేదా ప్రత్యేక విజయాలు సాధించిన వ్యక్తులకు O వీసా ఉపయోగపడుతుంది. సైన్స్, విద్య, వ్యాపారం, క్రీడలు, కళలు, సినిమా, టెలివిజన్ వంటి రంగాల్లో ప్రతిభ ఉన్నవారు దీనికి అర్హత పొందవచ్చు. అవార్డులు, ప్రచురణలు, ప్రముఖ సంస్థల్లో సభ్యత్వం, అధిక జీతం, నాయకత్వ స్థానాలు, తమ రంగానికి చేసిన ముఖ్యమైన సేవలు వంటి ఆధారాలతో తమ ప్రతిభను నిరూపించాల్సి ఉంటుంది.పీ వీసాఅమెరికాలో ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్లే క్రీడాకారులు, కళాకారులు, ఎంటర్టైనర్లు, కొన్ని సందర్భాల్లో వారి బృందాలకు P వీసా ఉపయోగపడుతుంది. ఇందులో P-1, P-2, P-3 వంటి వివిధ కేటగిరీలు ఉన్నాయి. కొన్ని పరిస్థితుల్లో ట్రైనర్లు, టూర్ మేనేజర్లు, సౌండ్ ఇంజినీర్లు, ఫిజియోథెరపిస్టులు వంటి అవసరమైన సహాయక సిబ్బందికి కూడా ఈ వీసా కింద అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: H-1B వీసాదారులకు అమెరికా బిగ్ షాక్! -
అమెరికాకు ఇరాన్ పెట్టిన షరతులు ఇవే..!
-
గ్రేస్ పీరియడ్ కట్..? H-1B వీసాదారులకు కొత్త టెన్షన్..
-
హార్మూజ్పై ఇరాన్ కీలక ప్రకటన
అమెరికా తన బుద్ధిని మార్చుకోనంత వరకు హార్మూజ్ జలసంధిని తెరిచేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహ్మద్ బఘెర్ జొల్ఘాదర్ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనను ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది.‘అమెరికా ఇకపై ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరించే ప్రయత్నం చేయరాదు. ఇరాన్, ఈ ప్రాంతంలోని ఇరాన్ మిత్ర పక్షాలపై అమెరికా దాడులు మానుకోవాలి. ఇరాన్ నౌకాశ్రయాల నుంచి అమెరికా వైదొలగాలి. ఈ ప్రాంతం నుంచి అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోవాలి. ఇరాన్కు పూర్తి యుద్ధ పరిహారం చెల్లించాలి. ఆంక్షలను ఎత్తి వేయాలి. స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను బేషరతుగా విడుదల చేయాలి..’వంటి డిమాండ్లు కూడా ఆ ప్రకటనలో ఉన్నాయి.శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్ విభాగానికి జొల్ఘాదర్ కమాండర్గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇరాన్ ప్రకటనపై అమెరికా స్పందించలేదు. తమ రెండు దేశాల మధ్య నుంచి వెళ్తున్న హార్మూజ్ జలసంధి ఉమ్మడి నిర్వహణపై ఒమన్తో ఒప్పందం తుది దశకు చేరుకుందని అంతకుముందు ఇరాన్ ప్రకటించింది. -
ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్.. కారణం ఇదే!
ఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం రాత్రి ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. కీలకమైన రంగాల్లో భారత్–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు గల అవకాశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. అదేవిధంగా, వాన్స్, ఉష దంపతులకు ఇటీవల కుమారుడు పుట్టిన సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్లో వెల్లడించారు.తుర్కియే, పాకిస్తాన్, సౌదీ అరేబియాలు కీలకమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో వాన్స్ మోదీతో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. పరస్పర రక్షణ ఒప్పందంపై తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్లు సంతకాలు చేసిన కొద్ది రోజులకే ప్రధాని మోదీకి వాన్స్ ఫోన్ చేయడం గమనార్హం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వర్తకం, రక్షణ, ఇంధన భద్రత రంగాలలో భారత్-అమెరికాల సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక సంబంధాలను విస్తరించడంపై కూడా చర్చించారు."అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కీలక రంగాల్లో భారత్-యుఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై మేము చర్చించాం" అని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారత అధికారిక ప్రకటన ప్రకారం.. భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిని ప్రధాని మోదీ, వాన్స్ సమీక్షించారు.ఉన్నత స్థాయి చర్చల్లో కొనసాగుతున్న పురోగతిని వారు ప్రస్తావించారు. వర్తకం, రక్షణ, సంక్లిష్ట, వర్ధమాన సాంకేతికతలు, ఇంధన భద్రత, కీలక ఖనిజాల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతంపై చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారని ప్రకటన తెలిపింది. అయితే, ఈ సంభాషణకు సంబంధించి అమెరికా అధికారిక వర్గాల నుంచి ఇంకా ఎలాంటి వివరాలు వెలువడలేదు. భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం గురించి ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందో లేదో స్పష్టత రాలేదు. ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరుతో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న ఆ దేశాలు.. ఏ దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణించనున్నాయి. ఈ కీలక రక్షణ ఒప్పందంపై ఆ దేశాలు సంతకాలు చేశాయి.పెరుగుతున్న భద్రతా ఆందోళనల వేళ ఈ ఒప్పందం మూడు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాలలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా.. అది మిగతా అన్ని దేశాలపై జరిగిన దాడిగానే పరిగణనలోకి తీసుకోనున్నాయి. మూడు దేశాలలో ఏ ఒక్క దానిపై సాయుధ దాడి జరిగినా.. అది మూడింటిపై జరిగిన దాడిగానే భావిస్తారు. అలాగే మూడు దేశాల మధ్య రక్షణ సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను మరింత పెంపొందించడానికి ఇది తోడ్పడుతుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే. -
అమెరికాను నిలబెట్టిన 'విలువలు ఏమిటి'?
ఒక చరిత్రకారుడిగా, ఒక చిన్న రాజకీయ–చారిత్రక చిత్రాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. మీలో చాలా మంది 21వ శతాబ్దంలో జన్మించారు. అమెరికాలో జన్మించినవారు 2001 సెప్టెంబర్ 11 (9/11) ఉగ్రదాడుల ప్రభావంలో పెరిగారు. 1814లో అమెరికా క్యాపిటల్ భవనం, వైట్ హౌస్కు బ్రిటిష్ సైన్యం నిప్పంటించిన తర్వాత... యూఎస్ఏ భూభాగంపై జరిగిన తొలిపెద్ద విదేశీ దాడి అదే. మీరు పెరుగుతున్న సమ యంలో అమెరికా ప్రభుత్వం ఇరాక్, అఫ్గానిస్తాన్లలో రెండు దీర్ఘకాల యుద్ధాలు చేసింది. నా కంటే ముందు తరాలకు మాత్రం అమెరికా కేంద్ర ప్రభుత్వం ఎంతో సమర్థంగా కనిపించేది. అధ్యక్షులు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, హ్యారీ ట్రూమన్ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి రెండో ప్రపంచ యుద్ధంలో విజయాన్ని సాధించారు. వ్యోమగాములను చంద్రుడిపైకి!1960ల ప్రారంభంలో యువతకు ఫెడరల్ ప్రభుత్వం అంటే దేశంలో ఆధునిక రహదారులు నిర్మించడం, అమెరికా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడం వంటి గొప్ప విజ యాలు గుర్తుకు వచ్చేవి. అప్పట్లో సోవియట్ యూనియన్తో జరుగుతున్న పోటీలోనూ అమెరికా ముందంజలో ఉండేది. 1965లో అధ్యక్షుడు, కాంగ్రెస్ కలిసి ఒక చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా ఎంతో గౌరవంగా భావించిన ఆ చట్టమే... 1965 ఓటింగ్ హక్కుల చట్టం. మీ తరం మాత్రం అమెరికా ఫెడరల్ ప్రభుత్వ చరిత్రలోని మరో కోణాన్ని కూడా చూసింది. వియత్నాం యుద్ధంలో వేలాది మంది యువ అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన విషాదాన్ని మీరు చదివారు. అలాగే మీ కళ్ల ముందే ధనికులు–పేదల మధ్య అంతరం పెరగడం చూశారు. ఎంతో మంది అమెరికన్లు తమ ‘అమెరికన్ డ్రీమ్‘ సాధించే అవకాశాన్ని కోల్పోవడమూ గమనించారు. కరోనా మహమ్మారి అనే విషాదాన్ని మనమందరం అనుభవించాం. ఆ మహమ్మారి ప్రభావం ఇప్పటికీ మన జీవి తాలపై ఉంది. ఆ వ్యాధి వల్ల పది లక్షలకు పైగా అమెరికన్లు మరణిస్తారని అప్పట్లో మనలో ఎవరైనా ఊహించామా? ఇప్పుడు మనం అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సమావేశమయ్యాం. ఒక్కసారి చరిత్రలోకి చూస్తూ... అమెరికాను బలంగా నిలబెట్టిన ఆరు గొప్ప సంప్రదాయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. మొదటి విలువ–చట్టం అందరికీ సమానం:నా దృష్టిలో మొదటి గొప్ప సంప్రదాయం చట్ట పరిపాలన (రూల్ ఆఫ్ లా). ప్రతి పౌరుడికి సమాన న్యాయం లభించడం. న్యాయ వ్యవస్థలో ఎవరికీ ప్రత్యేక సౌకర్యాలు ఉండకపోవడం. అలాగే ఎవరికీ ప్రత్యేక శిక్షలు కూడా ఉండకపోవడం. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానులే అనే సూత్రాన్ని మనం ఎప్ప టికీ కాపాడుకోవాలి. రెండో సంప్రదాయం–స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు:ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తన ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించే అవకాశం కలిగి ఉండాలి. బ్రిటన్ రాజరిక వ్యవస్థలా కాకుండా, అమెరికా వ్యవస్థాపకులు దేశ పాలనా అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టారు. వారు ప్రభుత్వ పని తీరును ఓటు ద్వారా అంచనా వేస్తారు. ఎన్నికలు అంటే అదే. యుద్ధం జరిగినా ఎన్నికలు ఆగలేదు. అమెరికా అంతర్యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఎన్నికలు రద్దు చేయాలని కొంతమంది మేధావులు సూచించారు. కొంతమంది మరింత ముందుకెళ్లి, ఫెడరల్ సైన్యాన్ని రాష్ట్రాల్లో మోహరించి, పోలింగ్ కేంద్రాలను ఆధీనంలోకి తీసుకోవాలనీ, అవసరమైతే మార్షల్ లా కూడా అమలు చేయాలనీ కోరారు. కానీ అంతర్యుద్ధం సమయంలో అబ్రహాం లింకన్, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రూజ్వెల్ట్ కేవలం ఒకే వాక్యంలో సమాధానం చెప్పారు: ‘ఎన్నికలు యథావిధిగా జరగాలి’. అలా చేయడం ద్వారా అమెరికా ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో, ఎంత స్థిర మైనదో ప్రపంచానికి చూపించాలని వారు కోరుకున్నారు. మూడో విలువ – నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ:మూడో గొప్ప సంప్రదాయం ఏమిటంటే... దేశ వ్యవస్థాప కులు నిజాయితీ, పారదర్శకత, సామర్థ్యం, నైతికత, కరుణ, మర్యాద, త్యాగస్ఫూర్తి వంటి విలువలతో నడిచే రాజకీయ వ్యవస్థను కలగన్నారు. అధ్యక్షులు జాన్ ఎఫ్.కెన్నెడీ, రోనాల్డ్ రీగన్ తరచూ అమెరికాలోని తొలి కాలనీ గవర్నర్ జాన్ విన్త్రోప్ చెప్పిన మాటలను గుర్తు చేసేవారు. ఆయన ఇలా చెప్పారు: ‘ప్రపంచం మొత్తం మనల్ని గమనిస్తోంది. కాబట్టి మనం కొండపై వెలిగే నగరంలా ఆదర్శంగా ఉండాలి’. ఫిలడెల్ఫియా లోని వాల్నట్ స్ట్రీట్ ప్రాంతంలో థామస్ జెఫర్సన్ ఒక గొప్ప కల కనేవారు. పారదర్శకమైన, నిజాయితీతో కూడిన, మిత వ్యయంతో, గౌరవప్రదంగా, సమర్థవంతంగా పనిచేసే రాజ కీయ వ్యవస్థ ఏర్పడితే... ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రపంచమంతా వ్యాపిస్తుంది అని ఆయన నమ్మారు.నాలుగో విలువ–ప్రతి పౌరుడిలో నాయకత్వం ఉండాలి:దేశానికి నాయకత్వం అనేది కేవలం వాషింగ్టన్ డి.సి.లోని ప్రభుత్వానికే పరిమితం కాకూడదు. 1776లో బ్రిటన్ లో అన్ని ముఖ్యమైన నిర్ణయాలు రాజే తీసుకునేవాడు. కానీ అమెరికా వ్యవస్థాపకులు వేరే విధంగా ఆలోచించారు. ఒకవేళ ప్రజలకు అధ్యక్షుడు, కాంగ్రెస్ లేదా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోతే... వారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొని దేశాన్ని సరైన దిశలో నడిపించాలని ఆశించారు. మాజీ అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ ఒక గొప్ప మాట చెప్పేవారు: ‘అమెరికాలో అత్యంత గొప్ప హోదా ‘మిస్టర్ ప్రెసిడెంట్’ కాదు. ‘మిస్టర్ సిటి జన్’(పౌరుడు)! అమెరికా రాజ్యాంగం ప్రకారం... ప్రజలు అధ్యక్షుడి కోసం పనిచేయరు. అధ్యక్షుడే ప్రజల కోసం పనిచేయాలి.ఐదో విలువ – చరిత్రకారులు, మేధావుల బాధ్యత:ఐదో సంప్రదాయం... అమెరికా సమాజంలో చరిత్రకా రులు, పరిశోధకులు, మేధావులకు ప్రత్యేకమైన స్థానం ఉండాలి. దేశ వ్యవస్థాపకులు విమర్శ కూడా ప్రజాస్వామ్యానికి అవసర మేనని భావించారు. రాజరిక వ్యవస్థల్లో, నియంతృత్వ పాలనల్లో కనిపించేలా కాకుండా... అమెరికా వ్యవస్థాపకులు నిరంతర ఆత్మపరిశీలన ద్వారా సమాజాన్ని మెరుగుపరచాలని విశ్వసించారు. దేశాన్ని పొగిడేవారికే కాదు... దేశంలోని లోపాలను నిర్మాణాత్మకంగా విమర్శించేవారికీ సమాన గౌరవం ఇవ్వాలని నమ్మారు. గొప్ప అమెరికన్ నాయకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాటలను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఆయన చెప్పిన అత్యంత ముఖ్యమైన సందేశం ఏమిటంటే... ‘ప్రతి పౌరుడి తొలి బాధ్యత అధికారాన్ని ప్రశ్నించడమే’! కానీ 2026లో అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.లోని కొందరు రాజకీయ నాయకులు, చరిత్రకారులు తమకు అను కూలంగా మాత్రమే మాట్లాడాలని కోరుకుంటున్నారు. సర్కస్లో చెప్పినట్లు చెప్పే విదూషకుల్లా వారు ప్రవర్తించాలని ఆశిస్తున్నారు. అమెరికా చరిత్రలో జరిగిన తప్పులు, లోపాలు బయటపడితే వాటిని పట్టించుకోవద్దని లేదా వాటికి సాకులు చెప్పాలని వారు కోరుతున్నారు. అమెరికా వ్యవస్థాపకులు ఇలాంటి ఆలోచనను చూసి బాధపడేవారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైనది. చరిత్రను మార్చే ప్రయత్నాలు మరింత ప్రమాదకరం. కొంతమంది రాజకీయ నాయకులు... నల్లజాతి చరిత్రలోని కీలకమైన అంశాలను తగ్గించి చూపాలని, లేదా పూర్తిగా తొలగించాలని ఒత్తిడి తెస్తున్నారు. అది అమెరికా విలువలకు విరుద్ధం. ఆరో విలువ – జాతీయ ఐక్యత:నేను చెప్పబోయే ఆరు గొప్ప సంప్రదాయాల్లో చివరిది... జాతీయ ఐక్యత. అమెరికా వ్యవస్థాపకులు ప్రజలు రాజకీయాలపై భిన్నాభిప్రాయాలు కలిగి ఉండవచ్చని అంగీకరించారు. వారు పరస్పరం చర్చించాలి, వాదించాలి. కానీ చివరికి ఒకేదేశ ప్రజలమనే భావనను కోల్పోకూడదని ఆశించారు. బ్రిటిష్ రాజరికంలో లాగా రాజభవనం నుంచి ఆదేశాలు రావడం కాకుండా... ప్రజలే దేశ భవిష్యత్తును నిర్ణయించాలని వారు విశ్వసించారు. వ్యవస్థాపకులు అధ్యక్షుడిని ప్రభుత్వ అధినేత గానే కాకుండా, దేశ రాజకీయ నాయకుడిగానూ రూపొందించారు. జార్జ్ వాషింగ్టన్ను ఆదర్శంగా తీసుకొని, ఎప్పటి కప్పుడు దేశాన్ని ఏకం చేసే నాయకులు రావాలని వారు ఆశించారు. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ‘అమెరికా అనేది ఒక అందమైన రంగురంగుల మొజాయిక్’(అందమైన చిత్రం) అన్నారు. అంటే... భిన్న సంస్కృతులు, విభిన్న అభిప్రాయాలు ఉన్నా అందరూ కలిసి దేశాన్ని నిర్మిస్తారని ఆయన ఉద్దేశం. అబ్రహాం లింకన్ చెప్పినట్లుగా... ‘పరస్పర ప్రేమ, అనుబంధాలే మనందరినీ ఎప్పటికీ కలిపి ఉంచుతాయి’. -
H-1B వీసాదారులకు అమెరికా బిగ్ షాక్!
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు.. ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ను తొలగించే ప్రతిపాదనను అక్కడి ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాధారణంగా.. కొన్ని నాన్ ఇమిగ్రెంట్ వీసాలపై ఉన్న ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతే, వెంటనే అమెరికా నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి 60 రోజుల వరకు సమయం ఉంటుంది. కానీ.. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఉద్యోగం పోయిన వెంటనే యూఎస్ విడిచి వెళ్లాల్సి వస్తుంది.60 రోజుల గ్రేస్ పీరియడ్ను తొలగించే ప్రతిపాదనను.. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలనలో ఉంది. నిజానికి.. 2017లో ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్ను తీసుకొచ్చారు. ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ఇది ఉపయోగపడుతోంది. ప్రస్తుతం H-1Bతో పాటు E-1, E-2, E-3, H-1B1, L-1, O-1, TN వంటి కొన్ని వీసా కేటగిరీలకు ఈ నిబంధన వర్తించే అవకాశం ఉంది.ఒకవేళ గ్రేస్ పీరియడ్ను తొలగిస్తే.. ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు వెంటనే అమెరికా విడిచి వెళ్లాల్సి వస్తుంది. ఉద్యోగం పోతే.. అక్కడే ఉండి కొత్త ఉద్యోగం వెతుక్కోవడం అంత సులభం కాదు. అలాగే.. అమెరికాలోనే ఉండి కొత్త కంపెనీకి మారడం లేదా వీసా స్టేటస్ మార్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారవచ్చు. అయితే.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో USCIS మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంటుంది.ఈ ప్రతిపాదన భారతీయులపై ప్రభావం చూపనుంది. ఎందుకంటే.. అమెరికాలో H-1B వీసాల ద్వారా పనిచేస్తున్న వారిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో H-1B దరఖాస్తుల్లో భారతీయుల వాటా 71 శాతంగా ఉంది. కాబట్టి ఉద్యోగం కోల్పోయిన భారతీయులకు 60 రోజుల సమయం లేకపోతే.. కొత్త ఉద్యోగం వెతుక్కోవడం మరింత కష్టమవుతుంది. అమెరికా విడిచి రావాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: UPI ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన! -
గర్ల్ ఫ్రెండ్కి రూ. 6 లక్షల రింగ్ : లవర్ చేసిన పని ఇదే!
నచ్చిన నెచ్చెలి కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు ప్రేమికులు. తాజాగా తమ నిశ్చితార్థ కలను నిజం చేసుకోవడానికి ఒక వ్యక్తి ఎంతటి కష్టానికైనా వెనుకాడడని నిరూపించాడు అమెరికాకు చెందిన బ్రాడ్లీ చో (Bradley Cho). తన ప్రియురాలికి విలువైన డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ గిప్ట్గా ఇవ్వాలనే కోరికతో చాలానే కష్టపడ్డాడు. ఒకపక్క పగలు కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే మరో పక్క రాత్రుళ్లు ఫుడ్ డెలివరీ బాయ్గా అదనపు పనిచేశాడు. చివరికి..బ్రాడ్లీ చో ఇటీవల తన ప్రియురాలితో కలిసి ఒక కాండో (ఇల్లు) కొనుగోలు చేశాడు. దీంతో అతని వద్ద ఉన్న సేవింగ్స్ అన్నీ ఖర్చైపోయాయి. ఇక నిశ్చితార్థపు ఉంగరం కొనడానికి డబ్బులు లేకుండా పోయాయి. ఎలాగైనా ఆమెకు లగ్జరీ డైమండ్ రింగ్ కానుకగా ఇవ్వాని నిర్ణయించుకున్నాడు. అంతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డోర్డాష్ (DoorDash) ద్వారా డెలివరీ ఏజెంట్గా పనిచేశాడు. రోజూ పగటిపూట రెగ్యులర్ కార్పొరేట్ ఉద్యోగం ముగించుకుని, రాత్రి 2 గంటల వరకు డెలివరీలు చేసేవాడు. మళ్లీ ఉదయం 6 గంటలకే నిద్రలేచి ఆఫీస్కు వెళ్లేవాడు. ఇలా రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోతూ ఇలా ఒకటీ రెండూ కాదు ఏకంగా 8 నెలల పాటు కష్టపడ్డాడు. ఈ క్రమంలో రెండు వారాల పాటు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు కూడా. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల వల్ల తన కార్పొరేట్ ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి కూడా వచ్చింది. అయినా పట్టువీడలేదు. View this post on Instagram A post shared by Bradley Cho (@bradjcho) చివరికి 8 నెలల కష్టం తర్వాత 6,500 డాలర్లు (దాదాపు రూ. 6 లక్షలు) విలువైన డబ్బును సమకూర్చుకున్నాడు. దీంతో ల్యాబ్-గ్రోన్ డైమండ్తో (Lab-grown diamond) పాటు వారిద్దరి 'బర్త్ స్టోన్స్' (జన్మ రాశి రత్నాలు) అమర్చిన ప్రత్యేకమైన నిశ్చితార్థపు ఉంగరాన్ని తయారు చేయించాడు. View this post on Instagram A post shared by Bradley Cho (@bradjcho) ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ నెటిజన్ల స్పందన"డే 89.. మై గర్ల్ఫ్రెండ్కు రింగ్ కొనేవరకు" అంటూ రోజూ తన ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసిన బ్రాడ్లీకి నెటిజన్ల నుంచి విశేష ఆదరణ లభించింది. లక్షలాది మంది ఆయన పట్టుదలను, ప్రేమికురాలి పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు అందించడం విశేషం.ఇదీ చదవండి: 8 అడుగుల జుట్టు : ఇండియన్ యూట్యూబర్ వరల్డ్ రికార్డ్, ఎన్నేళ్ల కష్టమో తెలుసా? -
భారత్పై 100 శాతం టారిఫ్.. తిప్పలు అమెరికాకే?
రష్యా చమురు వంకతో.. భారత్, చైనాలపై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే ప్రతిపాదన అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ నిర్ణయం అమెరికా ప్రయోజనాలకే నష్టం కలిగిస్తుందని రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ హెచ్చరించారు. భారీ టారిఫ్లు విధించడం అంటే.. స్వయంకృతాపరాధమేనని వ్యాఖ్యానించారు.రష్యాపై ఆంక్షలకు సంబంధించిన బిల్లుపై అమెరికా సెనేట్లో చర్చ సందర్భంగా భారత్, చైనాల నుంచి వచ్చే వస్తువులపై 100 శాతం వరకు టారిఫ్లు విధించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే సెనేట్ ఆమోదం పొందడంతో.. నెక్స్ట్ ప్రతినిధుల సభ వద్దకు వెళ్తుంది. ఆ తర్వాత ట్రంప్ దాని మీద సంతకం చేస్తే.. అమల్లోకి వస్తుంది. అయితే ఈ బిల్లుపై చర్చ సందర్భంగా స్పందించిన సెనేటర్ రాండ్ పాల్.. ఇలాంటి చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు.“భారం అమెరికన్లపైనే పడుతుంది”టారిఫ్ల వల్ల విదేశీ కంపెనీలే నష్టపోతాయన్న ట్రంప్ వాదనను రాండ్ పాల్ కొట్టిపారేశారు. దిగుమతి సుంకాల అసలు భారం అమెరికా దిగుమతిదారులు, వినియోగదారులపైనే పడుతుందని అన్నారు. ఇప్పటికే జీవన వ్యయాల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న అమెరికన్లపై మరింత భారం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.Breaking: "America imposing 100% tariffs on India and China is the economic equivalent of shooting ourselves in the foot," warns US Senator Rand Paul pic.twitter.com/C2GvQOg3HY— Shashank Mattoo (@MattooShashank) August 8, 2026“100 శాతం టారిఫ్లు విధించడం ఆర్థికంగా మన కాళ్లపై మనమే తుపాకీతో కాల్చుకున్నట్లే” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి నిర్ణయాలు అమెరికా వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.భారత్తో సంబంధాలపై ప్రభావం?భారత్ అమెరికాకు కీలక భాగస్వామి అని పేర్కొన్న రాండ్ పాల్.. ఇలాంటి భారీ సుంకాలు రెండు దేశాల మధ్య సంబంధాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని సూచించారు. సెనేటర్ రాన్ వైడెన్ కూడా ఈ టారిఫ్ ప్రతిపాదనలపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సమాచారం.రష్యా చమురు కొనుగోళ్లే కారణంరష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ టారిఫ్ ప్రతిపాదన తీసుకొచ్చారు. భారత్, చైనాలతో పాటు రష్యా ఇంధన వాణిజ్యానికి సహకరిస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఇచ్చేలా బిల్లు రూపొందించారు. ఈ బిల్లు అమెరికా సెనేట్లో 86-11 ఓట్లతో ఆమోదం పొందింది. అయితే ఇది చట్టంగా మారాలంటే ప్రతినిధుల సభ ఆమోదం పొందాల్సి ఉంది.ట్రంప్ విధానాలపై చర్చగతంలో కూడా రష్యా నుంచి భారత్ ఇంధనం కొనుగోలు చేయడాన్ని కారణంగా చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 25 శాతం టారిఫ్లు విధించారు. అయితే విస్తృత వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నాల నేపథ్యంలో తర్వాత వాటిని సడలించారు.ప్రస్తుతం 100 శాతం టారిఫ్ల ప్రతిపాదన మళ్లీ తెరపైకి రావడంతో భారత్పై ప్రభావం కంటే.. అమెరికా వినియోగదారులపై పడే భారం, రెండు దేశాల సంబంధాలపై దాని ప్రభావంపై చర్చ మొదలైంది. -
ట్రంప్కు మరో షాక్.. కోర్టు తీర్పుతో కొత్త చిక్కులు!
అమెరికా న్యాయస్థానాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వరుస షాకులు ఇస్తున్నాయి. తాజాగా.. ఆయన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైట్హౌస్ బాల్రూమ్ ప్రాజెక్టుకు న్యాయపరమైన అడ్డంకి ఎదురైంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఈ భారీ నిర్మాణాన్ని కొనసాగించేందుకు అధ్యక్షుడికి ఏకపక్ష అధికారం లేదని అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు స్పష్టం చేసింది. దీంతో 400 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,400 కోట్లకు పైగా) వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుపై తాత్కాలికంగా బ్రేక్ పడింది.వైట్హౌస్ ఈస్ట్ వింగ్ ఉన్న ప్రాంతంలో సుమారు 90 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ బాల్రూమ్ను నిర్మించాలని ట్రంప్ నిర్ణయించారు. దాదాపు 999 మంది అతిథులు ఒకేసారి పాల్గొనేలా ఈ హాల్ను నిర్మించాలన్నది ప్రణాళిక. దీనిని ఆయన తన కలల ప్రాజెక్ట్గా భావిస్తున్నారు. అయితే చారిత్రక భవన పరిరక్షణ సంస్థలు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించాయి. వైట్హౌస్ నిర్మాణ రూపకల్పనలో ఇంత పెద్ద మార్పు చేయాలంటే చట్టపరమైన అనుమతులు అవసరమని వాదించాయి.కాంగ్రెస్ అనుమతి కంపల్సరీ!వాషింగ్టన్ డీసీ సర్క్యూట్ అప్పీల్ కోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం 2-1 మెజారిటీతో ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. “భారీ బాల్రూమ్ నిర్మించాలా వద్దా అన్నది కాంగ్రెస్ నిర్ణయించాల్సిన విషయం. కార్యనిర్వాహక అధికారంతో స్వయంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు” అని కోర్టు పేర్కొంది. అయితే ఈ తీర్పు బాల్రూమ్ నిర్మాణం పూర్తిగా నిలిచిపోవాలని చెప్పడం కాదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అనుమతి పొందిన తర్వాత నిర్మాణం కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది.ట్రంప్ ఆగ్రహం..ఇంతకుముందు నిర్మాణాన్ని నిలిపివేయాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తనను వ్యతిరేకించే న్యాయమూర్తులు ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వైట్హౌస్ భద్రత కోసం ఈ ప్రాజెక్టు అవసరమని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. డ్రోన్లు, క్షిపణులు, జీవాయుధ ముప్పుల నుంచి అధ్యక్షుడు, ఆయన కుటుంబం, సిబ్బంది రక్షణ కోసం ఆధునిక భద్రతా ఏర్పాట్లు ఇందులో భాగమని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.భద్రత పేరుతో నిర్మాణం కొనసాగించలేరు..అయితే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న సంస్థలు ఈ వాదనలను తోసిపుచ్చాయి. బాల్రూమ్ లేకపోవడం జాతీయ భద్రతా అత్యవసర పరిస్థితి కాదని పేర్కొన్నాయి. కోర్టు కూడా భద్రతకు సంబంధించిన భూగర్భ పనులను కొనసాగించేందుకు అనుమతించింది. బంకర్లు, ఇతర భద్రతా సదుపాయాల నిర్మాణానికి మాత్రం ఈ ఆదేశాలు వర్తించవని స్పష్టం చేసింది.ఇప్పుడేం జరగనుంది?అప్పీల్ కోర్టు తన తీర్పు అమలును రెండు వారాల పాటు నిలిపివేసింది. ఈ సమయంలో ట్రంప్ ప్రభుత్వం అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. 70 ఏళ్లకు పైగా వైట్హౌస్లో అతిపెద్ద నిర్మాణ మార్పుగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు కోర్టు, కాంగ్రెస్ నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ట్రంప్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు న్యాయస్థానం బ్రేక్ వేయడంతో.. ఇది ఆయన పాలనలో మరో కీలక న్యాయపోరాటంగా మారింది. -
పుతిన్ నెక్స్ట్ టార్గెట్ అదేనా?.. అమెరికా నిఘా వర్గాల సంచలన అంచనా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా నిఘా వర్గాల సంచలన ఆరోపణలు చేశాయి. పుతిన్.. నాటో కూటమి ఐక్యతను, దాని సమిష్టి రక్షణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఆ కూటమిలోని ఓ సభ్యదేశంపై పరిమిత స్థాయి దాడికి పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాల పేర్కొంటున్నాయి. సైబర్ దాడులు, రహస్య కార్యకలాపాలు, హైబ్రిడ్ ఆపరేషన్లు లేదా చిన్న స్థాయి సైనిక చొరబాటు రూపంలో ఈ చర్య ఉండొచ్చని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం నివేదించింది.ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నిమగ్నమై ఉన్నంతకాలం నాటోతో నేరుగా తలపడేందుకు పుతిన్ ప్రయత్నించరని గతంలో అమెరికా అధికారులు భావించారు. అయితే, తాజాగా ఆ అంచనాలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులు రష్యా సైనిక స్థావరాలు, చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, యుద్ధంలో రష్యా భారీ నష్టాలను ఎదుర్కోవడం వంటి పరిణామాలను అమెరికా నిఘా వర్గాలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి.రష్యా చర్యకు దిగితే భూభాగాన్ని ఆక్రమించుకోవడం కంటే నాటోలోని దేశాల మధ్య విభేదాలు సృష్టించడం, కూటమి స్పందనను పరీక్షించడమే లక్ష్యం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి చర్యలు 2026 నవంబర్ నుంచి 2029 మధ్య ఎప్పుడైనా చోటుచేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే నేరుగా భూదాడి చేసే అవకాశం తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. నాటో ఆర్టికల్ 5 ప్రకారం ఒక సభ్యదేశంపై సాయుధ దాడిని మొత్తం కూటమిపై దాడిగా పరిగణించే అవకాశం ఉండటమే దీనికి కారణం. అలా జరిగితే రష్యా-నాటో మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది.అలాంటి పరిస్థితుల్లో నాటో ఎలాంటి చర్య తీసుకుంటుందన్నదే కీలకంగా మారనుంది. కాగా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నాటో ఇప్పటికే స్పష్టం చేసింది. వివిధ రకాల పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, అవసరమైనప్పుడు నిరోధించేందుకు, రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని నాటో ప్రతినిధి కల్నల్ మార్టిన్ ఓ డొన్నెల్ తెలిపారు.ఇదిలా ఉండగా అమెరికా కీలక ఆయుధాల నిల్వలపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్కు సంవత్సరాలుగా అందించిన సైనిక సహాయం, ఇటీవల ఇరాన్కు సంబంధించిన సైనిక చర్యల కారణంగా కొన్ని కీలక ఆయుధాల నిల్వలు తగ్గినట్లు అధికారులు, రక్షణ నిపుణులు చెబుతున్నారు. ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్స్, ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్స్ (ATACMS), స్టింగర్ క్షిపణులతో పాటు పేట్రియాట్, SM-3, THAAD వంటి వాయు రక్షణ ఇంటర్సెప్టర్ల నిల్వలపైనా ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. రష్యా-నాటో మధ్య ప్రత్యక్ష ఘర్షణ ఏర్పడితే దాని ప్రభావం యూరప్కే పరిమితం కాకుండా ప్రపంచ భద్రతా వ్యవస్థపై పడే అవకాశం ఉంది. -
అమెరికానే కాపాడలేకపోయింది.. ఇంక పాక్-టర్కీ ఏం చేస్తాయి?
పశ్చిమాసియాలో మారుతున్న భద్రతా సమీకరణాలకు సంకేతంగా పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మూడు దేశాలు కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఒక దేశంపై దాడిని మిగిలిన రెండు దేశాలపై దాడిగా పరిగణించేలా రూపొందించిన ఈ రక్షణ కూటమి.. సౌదీ భద్రతా వ్యూహంలో కీలక మార్పుగా మారింది. అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.టర్కీ, పాకిస్థాన్తో చేసుకున్న రక్షణ ఒప్పందాలు సౌదీ అరేబియాకు శాశ్వత భద్రతను అందించలేవని ఇరాన్ విమర్శించింది. అమెరికానే కాపాడలేకపోతోంది.. ఇంక పాక్ టర్కీలు వచ్చి ఏం చేస్తాయి?.. ఏం సాధిస్తాయి? అంటూ డీల్పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల కమిషన్ సభ్యుడు ఎబ్రహీం రెజాయీ ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘కాగితపు ఒప్పందాలతో భద్రత రాదు’సోషల్ మీడియా వేదికగా స్పందించిన రెజాయీ.. “టర్కీ, పాకిస్థాన్తో కుదుర్చుకున్న కాగితపు ఒప్పందాలు సౌదీకి భద్రతను తీసుకురావు. అమెరికాతో ఎన్నో ఏళ్లుగా కొనసాగించిన సంబంధాలు కూడా సౌదీకి భద్రత ఇవ్వలేదు” అని వ్యాఖ్యానించారు. సౌదీ తన విధానాలను మార్చుకుంటే ఇతర దేశాల నుంచి భద్రత కోసం ఆధారపడాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. గతంలో సౌదీ భద్రత కోసం అమెరికాపై ఆధారపడిన తీరును ప్రస్తావిస్తూ ఇరాన్ ఈ విమర్శలు చేసింది.మక్కా వేదికగా మూడు దేశాల డిఫెన్స్ డీల్అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య ఈ రక్షణ ఒప్పందం కుదిరింది. ఇస్లాం పవిత్ర నగరమైన మక్కాలో జరిగిన సమావేశంలో మూడు దేశాల నేతలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ సందర్భంగా ఈ ఒప్పందం ఖరారైంది. మూడు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఉమ్మడి భద్రతా వ్యూహాలను రూపొందించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.ఒకరిపై దాడి.. ముగ్గురిపై దాడిగానే!ఈ రక్షణ ఒప్పందంలోని కీలక అంశం పరస్పర భద్రత. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై అయినా సాయుధ దాడి జరిగితే.. దాన్ని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించేలా నిబంధనలు రూపొందించారు. దాడి జరిగిన సమయంలో పరస్పర సహకారం, రక్షణ రంగంలో సమన్వయం పెంచుకోవడం ఈ ఒప్పందం లక్ష్యమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మూడు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.సౌదీ ఎందుకు కొత్త రక్షణ భాగస్వామ్యాల వైపు?ఇరాన్తో పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరిస్తోంది. గతంలో సౌదీ చమురు కేంద్రాలు, కీలక మౌలిక వసతులపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్లోని మిలీషియా గ్రూపులు ఉన్నాయని సౌదీ ఆరోపించింది. దీంతో భద్రత విషయంలో కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా కొత్త భాగస్వామ్యాలను పెంచుకోవాలని రియాద్ భావిస్తోంది.ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, గల్ఫ్ ప్రాంతంలో నౌకాయానం ప్రభావితమవడం వంటి పరిణామాలు కూడా ఈ రక్షణ ఒప్పందానికి కారణాలుగా మారాయి.భారత్-పాక్ కోణంలోనూ చర్చఈ ఒప్పందం మరో కోణంలోనూ చర్చకు దారితీస్తోంది. ఒకవేళ భవిష్యత్లో పాకిస్థాన్పై భారత్ సైనిక చర్య చేపడితే ఈ రక్షణ ఒప్పందం ఎలా ప్రభావితం చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒప్పందంలోని పరస్పర రక్షణ నిబంధన ప్రకారం.. పాకిస్థాన్పై జరిగే దాడిని మిగిలిన దేశాలు ఎలా పరిగణిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి రక్షణ ఒప్పందాల్లో ప్రతిస్పందన విధానం, సైనిక సహాయం, దౌత్య మద్దతు వంటి అంశాలు ఆయా దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఆ లెక్కన.. ఈ ఒప్పందం ఉన్నంత మాత్రాన సౌదీ అరేబియా, టర్కీ వెంటనే ఏదైనా ఘర్షణలోకి దిగాల్సిందేనని స్పష్టమైన హామీ లేదు.మారుతున్న సమీకరణాలుపాక్, సౌదీ, టర్కీ రక్షణ ఒప్పందం మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త మార్పులకు సంకేతంగా మారింది. ఒకవైపు ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు సౌదీ తన భద్రతా వ్యవస్థను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు దేశాల కొత్త రక్షణ కూటమి భవిష్యత్లో పశ్చిమాసియా శక్తి సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
బిల్లు పాస్.. భారత్పై ట్రంప్ 100% టారిఫ్ అస్త్రం!
ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు అందుతున్న ఆర్థిక వనరులను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇచ్చే బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించింది. ఈ పరిణామం ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్లలోనే కాకుండా భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లోనూ చర్చకు దారితీసింది.రష్యా ఇంధన ఆదాయాన్ని తగ్గించడం ద్వారా మాస్కోపై ఒత్తిడి పెంచాలన్నది అమెరికా వ్యూహం. అయితే ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలు కొత్త ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది.ఏమిటీ రష్యా శాంక్షన్స్ బిల్లు?అమెరికా సెనేట్ ఆమోదించిన ఈ బిల్లు పేరు “లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026”. రష్యా చమురు, గ్యాస్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని తగ్గించడం, ఉక్రెయిన్పై యుద్ధానికి ఉపయోగపడుతున్న ఆర్థిక వనరుల ప్రవాహాన్ని అడ్డుకోవడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.ఈ బిల్లు సెనేట్లో 86-11 ఓట్లతో భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. ఇక ఇది అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ కూడా ఆమోదం లభిస్తే అధ్యక్షుడు ట్రంప్ సంతకం తర్వాత ఇది చట్టంగా మారనుంది.అయితే.. ఈ బిల్లు పేరులో ఇరాన్ ఉన్నప్పటికీ ప్రస్తుత పరిణామాల్లో ప్రధాన దృష్టి రష్యా చమురు ఆదాయాన్ని అడ్డుకోవడంపైనే ఉంది. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్లు విధించే అధికారం ట్రంప్కు ఇవ్వడమే ఈ బిల్లులో అత్యంత కీలక అంశంగా మారింది.రష్యా ఇంధనం కొనే దేశాలపై టారిఫ్ పిడుగురష్యా చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా మాస్కో ఆదాయానికి గండికొట్టాలని అమెరికా భావిస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా ఇంధనాన్ని అత్యధికంగా కొనుగోలు చేసే టాప్ ఐదు దేశాలపై అమెరికా అధ్యక్షుడికి 100 శాతం వరకు టారిఫ్లు విధించే అధికారం లభిస్తుంది.అంటే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించే దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించే అవకాశం ఉంటుంది. దీంతో ఇంధన కొనుగోళ్ల అంశం కేవలం ఆర్థిక వ్యవహారంగా కాకుండా అంతర్జాతీయ దౌత్య అంశంగా మారనుంది.భారత్, చైనాలపైనే ఎందుకు గురి?ప్రస్తుతం రష్యా చమురు, గ్యాస్కు అతిపెద్ద కొనుగోలుదారుల జాబితాలో చైనా, భారత్, అజర్బైజాన్, హంగేరీ, స్లోవేకియా ఉన్నాయి. ఈ దేశాల ఇంధన కొనుగోళ్లే రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలక మద్దతుగా మారాయని అమెరికా వాదిస్తోంది.2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత పాశ్చాత్య దేశాలు మాస్కోపై అనేక ఆంక్షలు విధించాయి. అయితే రష్యా చమురు తక్కువ ధరకు లభించడంతో భారత్, చైనా వంటి దేశాలు కొనుగోళ్లను కొనసాగించాయి. దీంతో రష్యా ఇంధన ఆదాయాన్ని పూర్తిగా నిలువరించాలన్న అమెరికా ప్రయత్నాల్లో ఈ దేశాలు ప్రధానంగా మారాయి.భారత్కు అసలు పరీక్ష ఎక్కడ?రష్యా చమురు భారత్కు గత కొన్నేళ్లుగా కీలక ఇంధన వనరుగా మారింది. తక్కువ ధరకు ముడి చమురు లభించడం వల్ల దేశ ఇంధన అవసరాలను తీర్చుకోవడంలో ఇది ఉపయోగపడుతోంది. 2026 జూన్లో భారత్ రష్యా ముడి చమురు కొనుగోళ్లు భారీగా పెరిగాయి. మే నెలతో పోలిస్తే 34 శాతం పెరిగి 4.5 బిలియన్ యూరోలకు చేరినట్లు నివేదికలు పేర్కొన్నాయి.అయితే ఇప్పుడు భారత్ ముందు రెండు కీలక అంశాలు నిలిచాయి. ఒకవైపు తక్కువ ధరకు లభించే రష్యా చమురు ద్వారా ఇంధన భద్రతను కొనసాగించాల్సి ఉంది. మరోవైపు అమెరికాతో ఉన్న వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.చైనాపైనా భారీ ప్రభావంఈ బిల్లు ప్రభావం ఎక్కువగా చైనాపై ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా శిలాజ ఇంధనాల అతిపెద్ద కొనుగోలుదారుగా చైనా కొనసాగుతోంది. 2026 జూన్ గణాంకాల ప్రకారం రష్యా ఇంధన ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయంలో చైనా వాటా గణనీయంగా ఉంది. ఐదు అతిపెద్ద కొనుగోలుదారుల ఆదాయంలో 41 శాతం చైనా నుంచే వచ్చినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.రష్యా చమురు ఎగుమతుల్లో చైనా దాదాపు సగం కొనుగోలు చేస్తుండగా.. భారత్ కూడా 36 శాతం వాటాతో కీలక కొనుగోలుదారుగా ఉంది. దీంతో ఈ బిల్లు రష్యాపైనే కాకుండా అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.లిండ్సే గ్రాహమ్ పేరుతో ఎందుకు?ఈ బిల్లుకు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ కీలక రూపకర్తల్లో ఒకరు. ఉక్రెయిన్ పర్యటన అనంతరం జూలై 11న ఆయన ఆకస్మికంగా మరణించారు. అయినప్పటికీ ఆయన రూపొందించిన ఆంక్షల ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించారు. ఆయనకు గౌరవంగా ఈ బిల్లుకు ఆయన పేరు పెట్టారు.పుతిన్, రష్యా సంస్థలపైనా చర్యలుఈ బిల్లు కేవలం రష్యా చమురు కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకోవడం మాత్రమే కాదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉన్నతాధికారులు, సంపన్న వర్గాలు, ఆర్థిక సంస్థలపై కూడా ఆంక్షలు విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తున్న “షాడో ఫ్లీట్” చమురు నౌకల నెట్వర్క్పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.500 శాతం నుంచి 100 శాతానికి తగ్గిన టారిఫ్ ప్రతిపాదనఈ బిల్లు మొదటి రూపంలో మరింత కఠినంగా ఉంది. రష్యా ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా 500 శాతం వరకు టారిఫ్లు విధించే ప్రతిపాదన ఉండేది. అయితే అమెరికా ప్రభుత్వం, చట్టసభ సభ్యుల మధ్య జరిగిన చర్చల తర్వాత దీనిని సవరించారు. చివరకు రష్యా ఇంధన కొనుగోలుదారులపై గరిష్ఠ టారిఫ్ను 100 శాతానికి పరిమితం చేశారు.ట్రంప్కు అధికారం ఇవ్వడంపై విమర్శలుఈ బిల్లుకు అమెరికాలోనే భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు డెమొక్రాట్లు ట్రంప్కు విస్తృత టారిఫ్ అధికారాలు ఇవ్వడం ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. టారిఫ్ల భారం చివరకు అమెరికా వ్యాపారాలు, వినియోగదారులపైనే పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఈ చర్య అవసరమని బిల్లు మద్దతుదారులు వాదిస్తున్నారు.ఇక ముందు ఏం జరగనుంది?ప్రస్తుతం ఈ బిల్లు అమెరికా ప్రతినిధుల సభ ముందుకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే ట్రంప్ సంతకం తర్వాత ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అసలు ప్రశ్న.. ట్రంప్ ఈ అధికారాన్ని వెంటనే ఉపయోగిస్తారా? లేదంటే భారత్, చైనా వంటి దేశాలతో చర్చలు, మినహాయింపులు, దౌత్య మార్గాలను ఎంచుకుంటారా? అన్నదే. అయితే..టారిఫ్లు అమల్లోకి రాకముందే వాటి ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికా చర్యల భయంతో చమురు కంపెనీలు, బ్యాంకులు, షిప్పింగ్ సంస్థలు తమ భవిష్యత్ వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంది.రష్యా చమురు ఆదాయాన్ని అడ్డుకోవాలన్న అమెరికా వ్యూహం ఇప్పుడు భారత్, చైనా వంటి దేశాలకు కొత్త ఆర్థిక పరీక్షగా మారింది. ట్రంప్ తీసుకునే తదుపరి నిర్ణయాలపైనే ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల భవిష్యత్ ఆధారపడనుంది. -
మెటాకు భారీ జరిమానా
శాంటా ఫే: సామాజిక మాధ్యమాలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల మాతృసంస్థ మెటాకు దెబ్బపై దెబ్బ పడుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియో నిలిపివేతపై మెటా అధినేత జుకర్బర్గ్ సారీ చెప్పిన ఘటన సమసిపోకముందే అమెరికా న్యాయస్థానం ఈ కంపెనీపై భారీ జరిమానా విధించింది. ప్లాట్ఫామ్ల వల్ల యువతకు జరుగుతున్న నష్టాన్ని 56.7 కోట్ల డాలర్లతో భర్తీ చేయాలని న్యూమెక్సికో న్యాయస్థానం ఒకటి తీర్పునిచ్చింది. ఈ మొత్తంలో 42 కోట్ల డాలర్లను యువత చికిత్సకు ఉపయోగించాలని న్యాయమూర్తి బ్రయన్ బైడ్ఛైడ్ ఆదేశించారు. మిగిలిన 14.7 కోట్ల డాలర్లను రానున్న ఐదేళ్లలో సోషల్ మీడియాతో కలిగే నష్టాలపై యువతలో అవగాహన పెంచేందుకు నివారణ, స్క్రీనింగ్ సేవలు, ఇతర ఖర్చులకు వినియోగిస్తారు. -
ఇదే జరిగితే.. బంగారం ధరలు మరింత పైకి!
బంగారం ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీగా పెరిగి ఔన్స్కు 4,300 డాలర్ల స్థాయిని దాటాయి. ఈ వారం మొత్తం చూస్తే.. బంగారం ధరలు 6 శాతానికి పైగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి తర్వాత ఒక వారంలో నమోదైన అతిపెద్ద పెరుగుదల ఇదే కావడం గమనార్హం.బంగారం వైపు పెట్టుబడులుఅమెరికా ఆర్థిక పరిస్థితి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ విలువలో మార్పులు ప్రస్తుతం బంగారం ధరలను ప్రభావితం చేస్తున్న ప్రధాన అంశాలుగా మారాయి. ఆర్థిక అనిశ్చితి ఉన్న సమయంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ప్రస్తుతం అమెరికా వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు పెరగడంతో పెట్టుబడులు బంగారం వైపు వెళ్తున్నాయి.ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్లో వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం మార్కెట్లకు కీలకంగా మారింది. వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు పెరిగితే డాలర్ బలహీనపడుతుంది. దాని ప్రభావంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.బంగారం ధరలు మరింత పెరుగుతాయా?ఇక అమెరికా జూలై నెల ఉద్యోగాల నివేదికపై మార్కెట్ వర్గాల దృష్టి ఉంది. ఈ నివేదికలో కొత్తగా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, నిరుద్యోగ రేటు ఎలా ఉంది, వేతనాల వృద్ధి ఎలా ఉందనే వివరాలు తెలుస్తాయి. మార్కెట్ అంచనాల ప్రకారం జూలైలో సుమారు 80 వేల కొత్త ఉద్యోగాలు రావచ్చని భావిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంతో పోలిస్తే ఇది పెద్ద వృద్ధి కాదని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాల డేటా బలంగా వస్తే ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై వెనక్కి తగ్గే అవకాశం ఉండటంతో డాలర్ బలపడవచ్చు, దీనివల్ల బంగారం ధరలు కొంత తగ్గవచ్చు.మరోవైపు అమెరికా ఉద్యోగాల నివేదిక బలహీనంగా వస్తే ఆర్థిక మాంద్యం భయాలు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులైన బంగారం వైపు మరింతగా ఆకర్షితులవుతారు. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు మరింత పెరిగి 4,380 డాలర్ల స్థాయిని చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మార్కెట్లో అనిశ్చితి కొనసాగితే ధరల్లో హెచ్చుతగ్గులు కూడా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. -
మెటాకు భారీ షాక్.. రూ.5500కోట్ల జరిమానా..
-
ప్రజ్ఞానంద అద్భుత విజయం.. టైటిల్ సొంతం
భారత గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద అద్భుత విజయం సాధించాడు. తొలిసారిగా సెయింట్ లూయీస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ను గెలుచుకున్నాడు. మరో రౌండ్ మిగిలి ఉండగానే అతడు ఈ ఘనత సాధించడం విశేషం.చెన్నైకి చెందిన 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఇప్పటికే ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. తాజాగా సెయింట్ లూయీస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ (Saint Louis Rapid & Blitz title) టోర్నీలోనూ అదరగొట్టాడు. అమెరికాలో ఉజ్బెకిస్తాన్కు చెందిన జొవోఖిర్ సిందరోవ్తో జరిగిన మ్యాచ్ను డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద.. మొత్తంగా 23.5 పాయింట్లు తన ఖాతాలో జమచేసుకున్నాడు.అగ్రస్థానంలోమిగతా ఆటగాళ్ల కంటే ఒకటిన్నర పాయింట్లు ఎక్కువగా కలిగి ఉండటంతో.. మరో రౌండ్ మిగిలి ఉండగానే ప్రజ్ఞానంద విజేతగా అవతరించాడు. పాయింట్ల పరంగా ప్రజ్ఞానంద అగ్రస్థానంలో నిలవగా.. సిందరోవ్ 22 పాయింట్లతో రెండు, అమెరికా గ్రాండ్ మాస్టర్ విస్లే 20.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.ఇక సెయింట్ లూయీస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలుపుతో ఓవరాల్ గ్రాండ్ చెస్ టూర్ (GCT) పాయింట్ల పట్టికలో ప్రజ్ఞానంద రెండో స్థానానికి చేరుకున్నాడు. తద్వారా జీసీటీ ఫైనల్స్కు చేరుకునే మార్గం సుగమం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రజ్ఞానంద నార్వే చెస్ టైటిల్ కూడా గెలిచిన విషయం తెలిసిందే.చదవండి: స్వర్ణం గెలిచినా అస్మితకు నిరాశేనా? -
USAలో హైకింగ్కు వెళ్లిన భారతీయ సంతతి విద్యార్థి మృతి
వాషింగ్టన్: అమెరికా కాలిఫోర్నియాలో హైకింగ్కు వెళ్లి అదృశ్యమైన భారత సంతతికి చెందిన పీహెచ్డీ విద్యార్థి విక్రమ్ ముబాయి దురదృష్టవశాత్తు మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని ఇన్యో నేషనల్ ఫారెస్ట్ ప్రాంతంలో అధికారులు గుర్తించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాంటా బార్బరా (UCSB)లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నాడు.వివారాల్లోకి వెళితే... విక్రమ్ ముబాయి ఆగస్టు 1న కాలిఫోర్నియాలోని బిగ్ పైన్ లేక్స్ ప్రాంతంలో ఒంటరిగా హైకింగ్కు వెళ్లాడు. అదే రోజు రాత్రి సుమారు 8:30 గంటలకు తన కుటుంబ సభ్యులకు చివరిసారిగా సంప్రదించి, తాను ఉన్న ప్రదేశానికి సంబంధించిన GPS కోఆర్డినేట్స్ పంపించాడు.ఆ తర్వాత అతని నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో, నిర్ణయించిన సమయానికి కూడా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడు కనిపించడం లేదని అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఇన్యో కౌంటీ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందంతో పాటు కాలిఫోర్నియా హైవే పట్రోల్ సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. చివరకు అతని మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.అయితే విక్రమ్ ముబాయి ఎలా మరణించాడనే విషయాన్ని దర్యాప్తు అధికారులు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం వరకు హత్య లేదా ఇతర అనుమానాస్పద అంశాలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు తెలిపారు. అతని మరణానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. -
పౌరసత్వంపై ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా బర్త్ రైట్ సిటిజన్షిప్పై ట్రంప్ మరోసారి బాంబు పేల్చారు. ఆ దేశంలోకి వచ్చే శత్రుదేశాల పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికాలో జన్మించడంతో వచ్చే ఆటోమెటిక్ పౌరసత్వ నిబంధనపై సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. బర్త్ టూరిజంపై ఇటీవలే అక్కడి సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కొద్ది వారాల్లోనే మరోసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.ట్రంప్ మాట్లాడుతూ.. శత్రుదేశాల పౌరులు, విదేశీ ఉగ్రవాద సంస్థల సభ్యుల పిల్లలు మోసపూరిత మార్గాల్లో వీసాలు పొందిన వారి పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ బానిసల పిల్లల కోసమని ప్రస్తుతం దీనిని కొంతమంది వ్యాపారంగా మార్చుకున్నారని ట్రంప్ విమర్శించారు.ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ నేపథ్యంలో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా రాజ్యాంగ హక్కులను మార్చలేరని ఈ ఆదేశాలను కూడా కోర్టులో సవాలు చేస్తామని పేర్కొంది.ట్రంప్ తెచ్చిన నూతన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్1. మొదటి ఆర్డర్ : ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అమెరికాలో పుట్టే పిల్లలకు ఆటోమేటిక్గా లభించే పౌరసత్వం విషయంలో కొన్ని నిర్దిష్ట వర్గాలను అనర్హులుగా చేర్చారు. శత్రు దేశాల వ్యక్తులు, ఉగ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు విదేశీ ప్రభుత్వాల తరఫున లాబీయింగ్ చేసేవారు లేదా ఆ దేశాల కోసం పనిచేసే వ్యక్తులు 2. రెండవ ఆర్డర్ (బర్త్ టూరిజంపై పూర్తి నిషేదం: అమెరికా పౌరసత్వాన్ని (పాస్పోర్ట్ను) సంపాదించడం కోసమే టూరిస్ట్ వీసాలపై అమెరికాకు వచ్చి పిల్లలను కనే అక్రమ పద్ధతిని అరికట్టడానికి ఈ ఆర్డర్ తెచ్చారు. విదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు/కాన్సులేట్లలోని వీసా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా గర్భిణీలు కేవలం అమెరికాలో ప్రసవించి పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో (మోసపూరితంగా లేదా తప్పుడు సమాచారంతో) వీసా కోరితే, అటువంటి వారి వీసాలను తిరస్కరించాలని ఈ ఆర్డర్ నిర్దేశిస్తుంది.సుప్రీంకోర్టు తీర్పు అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికా గడ్డపై జన్మించే ప్రతి ఒక్కరికీ (అక్రమ వలసదారులు లేదా తాత్కాలిక వీసాలపై ఉన్నవారి పిల్లలతో సహా) ఆటోమేటిక్గా పౌరసత్వం లభిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత (జనవరి 2025లో) బర్త్రైట్ సిటిజెన్షిప్ను నిరోధిస్తూ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను 6-3 మెజారిటీతో సుప్రీంకోర్టు కొట్టివేసింది. పౌరసత్వ నిబంధనలను మార్చాలంటే అధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు సరిపోవని, రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని కోర్టు తేల్చిచెప్పింది. ఆ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. -
అమెరికా వీసాల్లో భారతీయులకు భారీ షాక్
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులకు 2025లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది అడ్మిషన్ సీజన్లో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన F-1 స్టూడెంట్ వీసాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 62 శాతం మేర తగ్గింది. ఇదే సమయంలో చైనా విద్యార్థులకు కూడా వీసాల సంఖ్య తగ్గినప్పటికీ, భారతీయులతో పోలిస్తే ఆ తగ్గుదల చాలా తక్కువగా నమోదైంది.అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ (CIS) విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం.. 2025 మే నుంచి ఆగస్టు మధ్య భారతీయులకు కేవలం 22,149 స్టూడెంట్ వీసాలు(F-1) మాత్రమే జారీ అయ్యాయి. ఇక, 2024లో 58,694 వీసాలు జారీ కాగా, ఈసారి దాదాపు 62 శాతం తగ్గుదల నమోదైంది. చైనా విద్యార్థుల విషయంలో 2024లో 61,075 వీసాలు జారీ కాగా, 2025లో ఆ సంఖ్య 40,034కు పడిపోయింది. అక్కడ తగ్గుదల 34 శాతం మాత్రమే నమోదైంది.ప్రతి ఏడాది మే నుంచి ఆగస్టు వరకు అమెరికా విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతుండటంతో ఈ కాలంలోనే అత్యధికంగా స్టూడెంట్ వీసాలు జారీ అవుతాయి. అందువల్ల ఈ నాలుగు నెలల గణాంకాలను అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలపై కీలక సూచికగా పరిగణిస్తారు. వీసాల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఇప్పటికీ మొదటి స్థానంలో ఉన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (IIE) గణాంకాల ప్రకారం.. 2024–25 విద్యా సంవత్సరంలో అమెరికా విద్యాసంస్థల్లో 3,63,019 మంది భారతీయ విద్యార్థులు చదువుతుండగా, చైనా నుంచి 2,65,919 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 11.7 లక్షల అంతర్జాతీయ విద్యార్థుల్లో ఈ రెండు దేశాల విద్యార్థులే సగానికి పైగా ఉన్నారు.2020 కరోనా మహమ్మారి కాలాన్ని మినహాయిస్తే, 2017–19 మరియు 2021–24 మధ్య మే-ఆగస్టు కాలంలో భారతీయులకు సగటున 55,717 F-1 వీసాలు జారీ అయ్యాయి. ఆ సగటుతో పోల్చినా 2025లో నమోదైన 22,149 వీసాల సంఖ్య దాదాపు 60 శాతం తక్కువగా ఉందని CIS పేర్కొంది. చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) కార్యక్రమంలో కూడా భారతీయులే అత్యధికంగా ఉన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో OPT కింద పనిచేస్తున్న మొత్తం 2,94,253 మంది అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లలో 1,43,740 మంది భారతీయులు ఉండగా, చైనా నుంచి 61,981 మంది ఉన్నారు.F-1 వీసా అంటే?F-1 వీసా అనేది అమెరికాలోని గుర్తింపు పొందిన కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, భాషా శిక్షణా సంస్థలు లేదా ఇతర విద్యాసంస్థల్లో పూర్తికాలం (Full-time) చదువుకోవడానికి విదేశీ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం జారీ చేసే విద్యార్థి (Student) నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా.60 రోజుల నుంచి 30 రోజులకు...ఇదిలా ఉండగా.. CIS విశ్లేషణ ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాలు కూడా ఈ తగ్గుదలకు ఒక కారణంగా కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం F-1 వీసాదారులకు ఇప్పటి వరకు అమలులో ఉన్న "డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్" విధానాన్ని మార్చి నిర్దిష్ట కాలపరిమితితో వీసా మంజూరు చేసే విధానాన్ని తీసుకొచ్చారు. సాధారణంగా నాలుగేళ్ల వరకు మాత్రమే అమెరికాలో ఉండే అవకాశం ఉండగా, కోర్సు ఎక్కువ కాలం కొనసాగితే అదనపు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే చదువు పూర్తైన తర్వాత అమెరికాలో ఉండేందుకు ఇచ్చే గ్రేస్ పీరియడ్ను 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు. కళాశాల లేదా కోర్సు మార్చుకునే నిబంధనలను కూడా మరింత కఠినతరం చేశారు. అయితే, వీసాల జారీ తగ్గుదలకు కేవలం కొత్త విధానాలే కారణమని నిర్ధారించలేమని నిపుణులు చెబుతున్నారు. దరఖాస్తుల సంఖ్య, వీసా అపాయింట్మెంట్ల లభ్యత, పరిపాలనా ప్రక్రియలు వంటి ఇతర అంశాలు కూడా ఈ తగ్గుదలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
MIT హంఫ్రీ ఫెలోషిప్కు తెలంగాణ ఐఏఎస్ అధికారి కీర్తి జల్లి ఎంపిక
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణకు చెందిన ప్రతిభావంతురాలు, అస్సాం-మేఘాలయ కేడర్కు చెందిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కీర్తి జల్లి అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), కేంబ్రిడ్జ్లో నిర్వహించే అత్యంత ప్రతిష్ఠాత్మక హ్యూబర్ట్ హెచ్. హంఫ్రీ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఎంపిక కావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.2026 ఆగస్టు నుంచి 10 నెలల పాటు కొనసాగే ఈ అంతర్జాతీయ ఫెలోషిప్లో ఆమె టెక్నాలజీ పాలసీ అండ్ మేనేజ్మెంట్ అంశంలో ఉన్నతస్థాయి అధ్యయనం, పరిశోధన, విధానపరమైన శిక్షణ పొందనున్నారు. ప్రపంచవ్యాప్తంగా మధ్యస్థాయి ప్రజాపాలన నాయకులను తీర్చిదిద్దే అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో హంఫ్రీ ఫెలోషిప్ ఒకటిగా గుర్తింపు పొందింది.వరంగల్ జిల్లాలోని తరిగొప్పులకు చెందిన కీర్తి జల్లి హైదరాబాద్లో విద్యాభ్యాసం పూర్తి చేసి, కృషి, పట్టుదలతో భారత అత్యున్నత సివిల్ సర్వీసులో స్థానం సంపాదించారు. ఆమె రైతు కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి తెలంగాణ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్గా సేవలందిస్తుండగా, తల్లి గృహిణి.ప్రస్తుతం ఆమె అస్సాం ప్రభుత్వంలో పంచాయతీ, గ్రామీణాభివృద్ధి కమిషనర్గా, అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) మిషన్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత పదమూడు సంవత్సరాలుగా ప్రజారోగ్యం, మహిళా సాధికారత, పోషకాహారం, గ్రామీణాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన, పారిశుద్ధ్యం వంటి కీలక రంగాల్లో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల ప్రశంసలు పొందారు. వరదల సమయంలో సహాయక చర్యలు, కోవిడ్-19 నిర్వహణలో ఆమె చూపిన నాయకత్వానికి అస్సాం ముఖ్యమంత్రి ‘'కర్మశ్రీ అవార్డు'’ తో సత్కరించారు.కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో బీటెక్ పట్టభద్రురాలైన కీర్తి జల్లి, ప్రభుత్వ సేవలలో సాంకేతికత వినియోగం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా ఆధారిత పరిపాలన ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించే విధానాలపై ఈ ఫెలోషిప్లో ప్రత్యేకంగా అధ్యయనం చేయనున్నారు. గ్రామీణ, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే తన అధ్యయన ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.ప్రపంచ ప్రఖ్యాత ఎంఐటీలో అధ్యయనం చేసేందుకు ఎంపిక కావడం ద్వారా కీర్తి జల్లి తెలంగాణ యువతకు ఆదర్శంగా నిలిచారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగి, అంతర్జాతీయ వేదికపై భారతదేశం, తెలంగాణ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేయడం విశేషంగా ప్రశంసించబడుతోంది.ఆమె ఈ అరుదైన విజయంపై న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. తెలంగాణ నుంచి ప్రపంచస్థాయి నాయకత్వాన్ని అందించే యువ అధికారులకు కీర్తి జల్లి ప్రేరణగా నిలుస్తారని వారు అభిప్రాయపడ్డారు. -
నా ప్రాణాలు కాపాడింది ఎవరు? నాకు తెలియాలి..
వాషింగ్టన్: అమెరికాలో సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న పాట్రిక్ మెక్గీ (77) అనే వృద్ధుడికి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో విమానంలో ఉన్న ఇద్దరు నర్సులు వెంటనే సీపీఆర్ చేసి ఆయన ప్రాణాలు కాపాడారు. విమానం ఫీనిక్స్లో దిగే వరకు చికిత్స కొనసాగించి, తర్వాత వైద్య సిబ్బందికి అప్పగించారు. ఆసుపత్రిలో కోలుకున్న మెక్గీ తనను ఇద్దరు నర్సులు లోరా హోల్టన్, కైట్లిన్ లౌచ్హైమ్ కాపాడారని తెలుసుకున్నారు. వారిలో ఒకరు పదవీ విరమణ చేసిన నర్సు కాగా, మరొకరు ప్రస్తుతం సేవల్లో ఉన్న నర్సు అని మెక్గీకి తెలిసింది. విమానంలో నుంచి తనను దించే వరకు తనకు అత్యవసర వైద్యం అందించి వారు తనను బతికించారని ఆయన తెలుసుకున్నారు.తన ప్రాణాలు కాపాడిన నర్సులను వెతకడం ప్రారంభించారు. స్థానిక మీడియా సహాయంతో దాదాపు వారం తర్వాత లౌచ్హైమ్ను గుర్తించి, ఫోన్లో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆ నర్సు చివరి నిమిషంలో విమాన టికెట్ మార్చుకోవడంతోనే ఆ విమానంలో ప్రయాణించింది. ఆమె లేకపోతే పరిస్థితి వేరుగా ఉండేదని భావిస్తున్నారు."ఆ నర్సులకు నేను చాలా రుణపడి ఉన్నాను," అని ఆయన స్థానిక వార్తా సంస్థ కేపీఎన్ఎక్స్తో అన్నారు. "నాకు ఒక కుమారుడు, మనవళ్లు, భార్య, సోదరులు ఉన్నారు. ఆ నర్సుల వల్లే నేను ఇప్పటికీ వాళ్లతో ఉన్నాను" అని తెలిపారు.సౌత్వెస్ట్ విమానంలో ఘటనఈ ఘటన జులై 29న ఫీనిక్స్ స్కై హార్బర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతున్న సౌత్వెస్ట్ విమానంలో చోటుచేసుకుంది. మెక్గీకి స్పృహ కోల్పోయిన విషయం గుర్తు లేదు. ఇతర ప్రయాణికులు సహాయం చేసిన క్షణాలు కూడా గుర్తు లేవు. పక్కన కూర్చున్న మహిళతో మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా అంబులెన్స్లో మేల్కొన్న విషయమే గుర్తుంది. తర్వాత పారామెడిక్స్ ఆయనకు గుండెపోటు వచ్చిందని, కార్డియాక్ అరెస్ట్ సంభవించిందని వివరించారు. స్పృహలోకి వచ్చిన తర్వాతే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మెక్గీకి అర్థమైంది. నర్సులు సీపీఆర్ చికిత్స కొనసాగిస్తూనే మెక్గీ పరిస్థితి మెరుగుపడుతోందా అనే సంకేతాల కోసం గమనించారు. ఆయన పొట్ట పైకీ కిందకీ కదులుతుండటం కనిపించిందని, తర్వాత కళ్లను కొద్దిసేపు తెరిచారని లౌచ్హైమ్ చెప్పారు. అక్కడున్న వారందరికీ అది భారీ ఉపశమనం కలిగించింది. మెక్గీ స్పృహలోకి వస్తున్న సంకేతాలు కనిపించగానే అందరూ ఆనందించారని చెప్పారు.విమానం ల్యాండ్ అయ్యే వరకు అత్యవసర చికిత్స కొనసాగింది. తర్వాత మెక్గీని నేలపై ఉన్న వైద్య సిబ్బందికి అప్పగించారు. తదుపరి చికిత్స, కోలుకోవడం కోసం ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మేల్కొన్న తర్వాత తనకు సహాయం చేసిన వారు ఎవరో తెలుసుకోవాలని మెక్గీ కోరుకున్నారు. కానీ లౌచ్హైమ్ పేరు ఆయనకు తెలియదు. ఆమెను సంప్రదించే మార్గం కూడా లేదు.ఈ ఘటన గురించి ఆయన బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించారు. తనకు సీపీఆర్ చేసిన నర్సులను గుర్తించేందుకు సహాయం కోరారు. స్థానిక వార్తా సంస్థలు ఆయన కథనాన్ని ప్రచురించాయి. చివరకు ఆ సమాచారం ఆయన వెతుకుతున్న మహిళకు చేరింది. విమాన ప్రయాణం జరిగిన దాదాపు వారం తర్వాత మెక్గీ, లౌచ్హైమ్ కలిశారు.మొదట ఫోన్లో మాట్లాడుకున్నారు. ముఖాముఖి కలవకపోయినా ఆ సంభాషణ ఎంతో భావోద్వేగంగా సాగింది. మెక్గీ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. తన దేవదూత అని అభివర్ణించారు. తాను సరైన సమయంలో సరైన చోట నేను ఉన్నందుకు సంతోషంగా ఉందని, ఆయన బతికాడని చెప్పారు. సహాయం అవసరమైన సమయంలో ఎక్కువగా ఆలోచించడానికి అవకాశం ఉండదని ఈ అనుభవం తనకు గుర్తుచేసిందని లౌచ్హైమ్ చెప్పారు. "సరైన పని చేసే అవకాశం వస్తే దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. వెంటనే చేయాలి" అని ఆమె అన్నారు. -
కొత్త రికార్డుల దిశగా బంగారం!
ప్రపంచ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల మధ్య బంగారం ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. డాలర్ విలువ తగ్గడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు ఉంటడం వల్ల గోల్డ్ మీద పెట్టుబడి పెట్టేవాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో పసిడి ధరలు తారాస్థాయికి చేరాయి.స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,295 డాలర్ల వరకు పెరిగి, తర్వాత స్వల్పంగా తగ్గి 4,268 డాలర్ల వద్ద స్థిరపడింది. గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 4,329 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. వరుసగా నాలుగో సెషన్లో బంగారం లాభాల్లో కొనసాగడం గమనార్హం.అమెరికాలో జూలై నెలలో ప్రైవేట్ ఉద్యోగాల వృద్ధి మందగించిందని ఒక నివేదిక వెల్లడించింది. దీంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు తగ్గుతాయని మార్కెట్ అంచనా వేస్తోంది. ఇక మధ్యప్రాచ్యంలో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ను తిరిగి తెరవడానికి జరుగుతున్న ప్రయత్నాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. అయితే, ఇటీవల పెరుగుదల ఉన్నప్పటికీ బంగారం ఇంకా గత గరిష్ఠ స్థాయిల కంటే తక్కువగానే ఉంది. భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, ప్రపంచ పరిణామాలు బంగారం ధరల దిశను నిర్ణయించనున్నాయి.భారతదేశంలో బంగారం ధరలుఇండియన్ మార్కెట్లో కూడా గోల్డ్ రేటు గురువారం గణనీయంగా తగ్గింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.2650 పెరిగి రూ.1,37,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.2890 పెరిగి రూ.1,49,730 వద్ద నిలిచింది. పెరిగిన ధరలను బట్టి చూస్తుంటే.. ఈ మధ్య కాలంలో ఇదే గరిష్టం అని తెలుస్తోంది.ఇదీ చదవండి: గూగుల్ సంచలన నిర్ణయం.. యూజర్లకు షాక్! -
గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో సిలికానాంధ్ర మనబడి
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఓక్లాండ్లో సిలికానాంధ్ర 25వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన అతిపెద్ద తెలుగు పద్య సమూహ పారాయణం గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 1,712 మంది పాల్గొనగా, వారిలో అధిక సంఖ్యలో సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు ఉండటం విశేషం.పాల్గొన్నవారు సుమతీ శతకం, వేమన శతకం నుంచి ఎంపిక చేసిన 18 పద్యాలను ఏకకాలంలో కంఠస్థంగా పారాయణం చేసి తెలుగు భాషా ప్రావీణ్యాన్ని, తెలుగు సాహిత్యం పట్ల తమ అనుబంధాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ సమిష్టి పారాయణం ద్వారా తెలుగు భాష, సాహిత్య వైభవం అంతర్జాతీయ వేదికపై మరోసారి ప్రతిధ్వనించింది.ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి ప్రెసిడెంట్, డీన్ చామర్తి రాజు మాట్లాడుతూ, గిన్నిస్ ప్రపంచ రికార్డు వేదికపై 1,712 మంది కలిసి తెలుగు పద్యాలను పారాయణం చేయడం మనబడి ఎన్నో ఏళ్లుగా సాగిస్తున్న భాషా సేవకు నిదర్శనమన్నారు. వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల ప్రయాణం మనబడి తరగతి గదిలోనే ప్రారంభమైందని పేర్కొన్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు తమ పిల్లలను మనబడిలో చేర్పించి మాతృభాషను నేర్పించాలని, భారతదేశంలోని తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు కూడా ఈ విషయంలో ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.వెస్ట్రన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ (WASC) గుర్తింపు పొందిన ప్రపంచంలోని ఏకైక తెలుగు విద్యాసంస్థగా సిలికానాంధ్ర మనబడి గుర్తింపు పొందిందని సంస్థ తెలిపింది. స్థాపన నుంచి ఇప్పటివరకు 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం నేర్పినట్లు వెల్లడించింది.విద్యార్థుల భాషా ప్రావీణ్యాన్ని దశలవారీగా పెంపొందించేలా బాలబడి–1, బాలబడి–2 నుంచి ప్రభాసం వరకు వివిధ స్థాయిల్లో పాఠ్య ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొంది. తెలుగు భాష, సాహిత్యాల్లో మరింత లోతైన అధ్యయనం కోసం 'ప్రబోధం' పేరుతో ఉన్నత స్థాయి ఐచ్ఛిక కోర్సును కూడా అందిస్తున్నట్లు తెలిపింది. బాలరంజని యాప్ ద్వారా ఇంటరాక్టివ్ అభ్యాసంతో పాటు బాలానందం, తెలుగు మాట్లాట, తెలుగుకి పరుగు, మనతరం వంటి పాఠ్యేతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వివరించింది.ఇదిలా ఉండగా, 2026–27 విద్యా సంవత్సరానికి సిలికానాంధ్ర మనబడి ప్రవేశాలు కొనసాగుతున్నాయని సంస్థ ప్రకటించింది. అమెరికా, కెనడాలోని 250కు పైగా కేంద్రాల్లో సెప్టెంబర్ మొదటి వారాంతం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని, తెలుగు భాష, సంస్కృతిని భావితరాలకు అందించే ఈ కార్యక్రమంలో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చింది. -
ఇరాన్ విషయంలో ట్రంప్ చేయని ఒకేఒక్క ‘తప్పు’ ఇదే..
టెహ్రాన్: ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత దూకుడుగా వ్యవహరించినప్పటికీ ప్రస్తుత చిక్కు నుంచి బయటపడే మార్గం కనుక్కోలేకపోతున్నారు. ఇరాన్పై ట్రంప్ దాడులు చేయిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఒక పొరపాటును మాత్రం చేయలేదని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. అదే తన సామర్థ్యాన్ని దాటి ఘర్షణను అతి భారీ స్థాయికి తీసుకెళ్లకపోవడం. ఇరాన్పై పరిమిత దాడిని పూర్తి స్థాయి, అతి దీర్ఘకాల యుద్ధంగా మార్చలేదు ట్రంప్.ట్రంప్ ఈ యుద్ధాన్ని పూర్తిస్థాయి భూతల యుద్ధంగా మార్చలేదు. తన ప్రతిష్ఠను కాపాడుకోవాలనే ఉద్దేశాలకు దూరంగానే ఉండి, అదనపు భారీ సైనిక చర్యలకు వెళ్లలేదు. అప్పట్లో వియత్నాం, ఇరాక్, అఫ్గానిస్థాన్ యుద్ధాల్లో అమెరికా మాజీ అధ్యక్షులు ఓటమిని అంగీకరించకుండా యుద్ధాన్ని నిరంతరం పెంచుకుంటూ వెళ్లారు. ట్రంప్ మాత్రం అటువంటి పని చేయడం లేదు.మొదట ట్రంప్ చేసిన పెద్ద పొరపాటు యుద్ధంలోకి వెళ్లడమే కావొచ్చు. కానీ, ఇప్పటివరకు ఆయన చేయని ఒక ప్రమాదకరమైన తప్పు ఏమిటంటే యుద్ధాన్ని తన నియంత్రణ దాటేలా భారీగా విస్తరించకపోవడమని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు లిండన్ బి. జాన్సన్, రిచర్డ్ నిక్సన్, జార్జ్ డబ్ల్యూ బుష్ వారు చేసిన యుద్ధాలను మొదట పరిమిత సైనిక చర్యలతో ప్రారంభించి, తర్వాత క్రమంగా పెద్ద యుద్ధాల్లో చిక్కుకున్నారు. ఒకసారి యుద్ధం మొదలైన తర్వాత వెనక్కి తగ్గడం కష్టమై, వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనినే slippery slope (చిన్న నిర్ణయం క్రమంగా పెద్ద సమస్యగా మారే పరిస్థితి) అంటారు.సమీప భవిష్యత్తులో ఆ తప్పు చేస్తారా?ట్రంప్ ఆ తప్పును ఇంకా చేయలేదు. కానీ, సమీప భవిష్యత్తులో ఇరాన్ యుద్ధాన్ని విస్తరిస్తే గత అధ్యక్షులలాగే అదే ఉచ్చులో పడే ప్రమాదం ఉంది. చరిత్ర ఏమి చెబుతుందంటే, బయటపడే మార్గం వెతుకుతూ లేదా తమ ప్రతిష్ఠను, అమెరికా ప్రతిష్ఠను కాపాడాలనే ప్రయత్నంలో యుద్ధాలను తీవ్రతరం చేసిన అధ్యక్షులు ప్రమాదకర మార్గంలో జారిపోయారు.ఒకసారి గీత దాటితే వెనక్కి తిరగలేని కీలక నిర్ణయాత్మక దశకు ట్రంప్ చేరుకుంటారా? అన్నదే సందేహాత్మకంగా ఉంది. ట్రంప్ ముందున్న మరో మార్గం నష్టాలను అంగీకరించి, ప్రధాన లక్ష్యాలు నెరవేరకపోయినా ఈ ఘర్షణ నుంచి వైదొలగడమే మంచిదని ఒప్పుకోవడం.ట్రంప్ గెలవలేని, ఓడిపోలేని యుద్ధంలో చిక్కుకుపోయారు. అమెరికా ప్రభుత్వం పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఇరాన్ను ఎలా శిక్షించాలనే కొత్త ఐడియాలు ఇవ్వాలని పెంటగాన్ సైనిక విశ్లేషకుల బృందాన్ని కోరిందని అమెరికా మీడియా తెలిపింది. ఒకవేళ ట్రంప్ పూర్తిస్థాయి యుద్ధం చేయిస్తే పరిణామాలు అతి ఘోరంగా ఉంటాయి.ఇరాన్కు హెచ్చరికల మీద హెచ్చరికలుఇరాన్ తన తాజా ప్రయత్నాన్ని తిరస్కరించిన తర్వాత ఇటీవల ట్రంప్ అసహనం ట్రూత్ సోషల్ ఖాతాలో.. ‘‘ఒప్పందం త్వరలో కుదిరే అవకాశం ఉంది’’ అని చెప్పారు. “ఇరాన్ నాయకత్వం నమ్మశక్యంకానంత మోసపూరితంగా ఉంది” అని కూడా ట్రంప్ ప్రకటించారు. బలవంతపు దౌత్యంపై ఇస్లామిక్ రిపబ్లిక్ చేసే విమర్శలనే ఆయన వ్యంగ్యంగా ప్రతిధ్వనించినట్టైంది. ఆ తర్వాత ఆయన మళ్లీ మరో హెచ్చరిక చేశారు. “ఒప్పందంపై సంతకం చేయడానికి వారికి ఇదే చివరి అవకాశం” అని ఓవల్ ఆఫీస్లో చెప్పారు. -
ఆ పెద్దమనిషిలా కాదు.. నేనైతే కుట్ర అనను!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీల మధ్య మాటల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కార్నీకి అనుకోని అవాంతరం ఎదురైంది. అయితే ఇదే అదనుగా ఆయన ట్రంప్పై పరోక్షంగా సెటైర్లు సంధించారు. కెనడాలో గృహ నిర్మాణ విధానంపై టొరంటోలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మార్క్ కార్నీ మాట్లాడుతుండగా టెలిప్రాంప్టర్ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయింది. దీంతో ఆయన చిరునవ్వుతో స్పందిస్తూ.. “టెలిప్రాంప్టర్ పనిచేయడం నిలిచిపోయిందని మీకు తెలియజేస్తున్నాను. అయితే ఆ పెద్దమనిషిలా.. ప్రత్యేక ప్రపంచ నేతలా కాకుండా దీనైతే నేను కుట్రగా భావించడం లేదు” అని వ్యాఖ్యానించారు. కార్నీ వ్యాఖ్యలతో అక్కడున్నవారు ఘోల్లున నవ్వారు. PM Carney trolls Donald Trump: "I would like to inform you that the teleprompter has ceased to function. Unlike a certain world leader, I do not view this as a conspiracy." pic.twitter.com/JxKIzTNwZJ— National broadcaster (@broadcast0147) August 6, 2026కార్నీ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశించినవేనన్న చర్చ నడుస్తోంది. గతంలో న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి హెడ్ ఆఫీస్కు వెళ్లిన ట్రంప్.. జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే సమయంలో టెలిప్రాంప్టర్, ఎస్కలేటర్ సమస్యలు ఎదురయ్యాయి. ఆ ఘటనల వెనుక కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్రంప్ విచారణకు డిమాండ్ చేయడం అప్పట్లో చర్చకు దారితీసింది.ట్రంప్ విధానాలపై కార్నీ పోరాటంట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా–కెనడా సంబంధాల్లో పలు విభేదాలు చోటుచేసుకున్నాయి. కెనడా దిగుమతులపై అమెరికా సుంకాలు విధించడం, కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ.. దేశ ఆర్థిక, దౌత్య విధానాల్లో అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ వాణిజ్య విధానాలను వ్యతిరేకిస్తూ కెనడా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచంలోని బలమైన దేశాలు ఆర్థిక సంబంధాలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగిస్తున్నాయని కార్నీ చేసిన వ్యాఖ్యలు కూడా గతంలో చర్చకు వచ్చాయి. -
అమెరికాకు కొత్త పవర్.. చైనా, రష్యాకు వార్నింగ్ బెల్స్?
ప్రపంచ భద్రతా సమీకరణాలను మార్చే నిర్ణయం దిశగా అమెరికా అడుగులు వేస్తోందా? చైనా లేదా రష్యాతో యుద్ధం జరిగితే ఇప్పటివరకు ఉన్న అణు వ్యూహాన్ని పూర్తిగా మార్చాలని పెంటగాన్ ఆలోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీర్ఘ శ్రేణి అణు క్షిపణులకే పరిమితం కాకుండా, యుద్ధభూమిలో వినియోగించే టాక్టికల్ అణు ఆయుధాలకు ప్రాధాన్యం పెంచే ప్రతిపాదనపై సమీక్ష జరుగుతున్నట్లు సమాచారం. ఈ మార్పు అమల్లోకి వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంక్షోభ సమయంలో మరిన్ని సైనిక ఎంపికలు లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై మద్దతుతో పాటు తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం అమెరికా ప్రధానంగా దీర్ఘ శ్రేణి వ్యూహాత్మక (Strategic) అణు క్షిపణులపై ఆధారపడుతోంది. అయితే కొత్త ప్రతిపాదనలో తక్కువ శ్రేణి టాక్టికల్ అణు ఆయుధాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సమీక్షకు పెంటగాన్ విధానాల విభాగం అధిపతి ఎల్బ్రిడ్జ్ కోల్బీ నాయకత్వం వహిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.మరిన్ని సైనిక ఎంపికలే లక్ష్యమా?ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన ఉద్దేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంక్షోభ సమయంలో మరిన్ని ప్రతిస్పందన ఎంపికలు అందుబాటులో ఉంచడమేనని అధికారులు చెబుతున్నారు. రష్యా లేదా చైనా.. అమెరికా మిత్రదేశాలపై దాడి చేసిన సందర్భంలో, భారీ స్థాయి అణు దాడికి మాత్రమే పరిమితం కాకుండా పరిస్థితికి అనుగుణంగా స్పందించే అవకాశాలు ఉండాలని ఈ సమీక్ష సూచిస్తోంది. ఒక సీనియర్ రక్షణ శాఖ అధికారి ప్రకారం..‘అమెరికాకు విశ్వసనీయమైన అణు ప్రతిస్పందన ఎంపికలు అవసరం. అధ్యక్షుడికి ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉంటేనే శత్రుదేశాలను సమర్థంగా నిరోధించవచ్చు’ అని అభిప్రాయపడ్డారు.టాక్టికల్ అణు ఆయుధాలు అంటే?టాక్టికల్ అణు ఆయుధాలు వ్యూహాత్మక అణు బాంబులతో పోలిస్తే తక్కువ శక్తి కలిగి ఉంటాయి. ఇవి యుద్ధభూమిలోని సైనిక స్థావరాలు, దళాలు లేదా ఇతర సైనిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని ఉపయోగించేందుకు రూపొందించబడతాయి. అయినప్పటికీ, ఇవి కూడా భారీ ప్రాణనష్టం, విధ్వంసం సృష్టించే సామర్థ్యం కలిగిన అణు ఆయుధాలేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే, ఈ ప్రతిపాదనపై ఇప్పటికే చర్చ మొదలైంది. అనుకూల వర్గాలు ఇది అమెరికా అణు నిరోధక శక్తిని (Deterrence) మరింత బలపరుస్తుందని చెబుతుండగా, విమర్శకులు మాత్రం టాక్టికల్ అణు ఆయుధాలకు ప్రాధాన్యం పెరగడం వల్ల వాటి వినియోగానికి ఉన్న మానసిక అడ్డంకి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అణు ఆయుధం ఉపయోగిస్తే అది మరింత పెద్ద స్థాయి ఘర్షణకు దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.కాగా, ఈ ప్రతిపాదన ఇప్పటికీ విధాన సమీక్ష (Policy Review) దశలోనే ఉంది. అమెరికా ప్రభుత్వం అధికారికంగా కొత్త అణు విధానాన్ని ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం దీనిని పరిశీలనలో ఉన్న ప్రతిపాదనగా మాత్రమే పరిగణించాలి. అయితే, 1945లో హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు పడిన తర్వాత ప్రపంచంలో యుద్ధ రంగంలో అణు ఆయుధాలు మళ్లీ ఉపయోగించబడలేదు. అందుకే అమెరికా అణు వ్యూహంలో ఎలాంటి మార్పు ప్రతిపాదన వచ్చినా, అది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, ఆందోళనలకు కారణమవుతోంది. -
ట్రంప్ షాక్: 28 వేల మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు
వాషింగ్టన్: అమెరికాలో ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సరైన ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారనే కారణంతో పాటు నిబంధనలు పాటించని సుమారు 28,000 మంది వాణిజ్య ట్రక్ డ్రైవింగ్ లైసెన్సులను (సీడీఎల్) రద్దు చేసినట్లు శ్వేతసౌథం అధికారికంగా వెల్లడించింది. ఈ నిర్ణయంతో భారతీయ వలసదారులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.నార్త్ అమెరికన్ పంజాబీ ట్రకర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. అమెరికాలో దాదాపు 1,30,000 నుంచి 1,50,000 మంది భారతీయ సంతతికి చెందిన ట్రక్ డ్రైవర్లు ఉన్నారు. ఫ్లోరిడాలో ఆగస్టు 2025లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడానికి భారతీయ డ్రైవర్ చేసిన అక్రమ యూ-టర్నే కారణమని తేలడంతో రవాణా శాఖ ఈ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలను సరిగా ప్రదర్శించలేకపోయారనే కారణంతో ఇప్పటికే సుమారు 26,000 మందిని రోడ్లపై డ్రైవింగ్ చేయకుండా నిషేధించారు.ఈ భారీ కొరతను భర్తీ చేయడానికి అమెరికా ప్రభుత్వం ‘ఫ్రీడమ్ హౌలర్స్’ అనే సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా మాజీ సైనిక ఉద్యోగులు ఎలాంటి అదనపు డ్రైవింగ్ నైపుణ్య పరీక్షలు లేకుండా నేరుగా సీడీఎల్ లైసెన్సులు పొందేలా సడలింపులు కల్పిస్తున్నారు. సైనికులు దేశ భద్రతలో ఎలాగైతే నిరూపించుకున్నారో, అలాగే ఈ రంగానికి కూడా సరైన వారవుతారని రవాణా కార్యదర్శి సీన్ డఫీ స్పష్టం చేశారు. అయితే, విదేశీ డ్రైవర్లపై ఈ నిషేధం అమెరికా రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: హనీమూన్ హత్య.. తెరపైకి క్యాటరింగ్ బిల్లు వివాదం! -
ట్రంప్ టారిఫ్లపై కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్పై మరోసారి వ్యతిరేకత వ్యక్తమైంది. బలవంతపు చాకిరిని నియంత్రణ పేరుతో ట్రంప్ ప్రభుత్వం గత నెలలో 60 దేశాలపై విధించిన టారిఫ్లపై అమెరికాలోని 25 డెమొక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలు అంతర్జాతీయ వాణిజ్య కోర్టుకు ఎక్కాయి. అమెరికా దిగుమతుల్లో సుమారు 99.4 శాతం వాటా ఉన్న ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం 10 నుంచి 12.5 శాతం టారిఫ్ విధించిన విషయం తెలిసిందే.భారత్పై మొదట 12.5 శాతం పన్ను విధించినప్పటికీ జూలై 14న తాము వాణిజ్య విధానంలో మార్పులు చేసి బలవంతపు చాకిరి కారణంగా ఉత్పత్తి అయిన వస్తువుల దిగుమతిని నిషేధించామని స్పష్టం చేయడంతో టారిఫ్ను పది శాతానికి పరిమితం చేశారు. ఈ పన్నులు వినియోగదారులతోపాటు వ్యాపారాలపై అదనపు భారం మోపుతాయని కోర్టుకు ఎక్కిన రాష్ట్రాలు వాదిస్తున్నాయి.ఈ పన్నులు అక్రమమని ప్రకటిస్తూ రద్దు చేయాలని డెమొక్రటిక్ పాలిత రాష్ట్రాల తరఫున వాదిస్తున్న న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటీషియా జేమ్స్ డిమాండ్ చేశారు. టారిఫ్ల విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఓటమి చవిచూసిందని, దీంతో ఇప్పుడు మరో రకంగా వ్యాపారాలపై టారిఫ్లను రుద్దేందుకు ప్రయత్నిస్తోందని అని జేమ్స్ వ్యాఖ్యానించారు. -
క్రూడ్ ఆయిల్ ధరలు ఢమాల్!
అంతర్జాతీయ చమురు మార్కెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 4 శాతం తగ్గి బ్యారెల్కు 77.11 డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచ చమురు మార్కెట్లలో సరఫరా, డిమాండ్ అంచనాలు, భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావంతో ధరల్లో ఈ భారీ మార్పు కనిపించింది.ఇటీవల వరకు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కొంత స్థిరంగా ఉన్నప్పటికీ.. తాజాగా క్రూడ్ ఆయిల్ ధరలు క్షీణించాయి. ట్రేడింగ్ సమయంలో ధరలు వేగంగా పడిపోవడం మార్కెట్లో ఆందోళనకు దారితీసింది. దీనికి ప్రధాన కారణం అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చల్లో పురోగతి వస్తుందన్న అంచనాలు.ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గితే, భవిష్యత్తులో చమురు సరఫరా సులభతరం అవుతుందని మార్కెట్లు భావిస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా.. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఉన్న అనిశ్చితి కూడా చమురు ధరలపై ప్రభావం చూపుతోంది. ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తే ఇంధన డిమాండ్ తగ్గుతుందనే అంచనాలు ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి.చమురు ధరలు తగ్గుదల.. వినియోగదారులకు కొంత ఊరటనిస్తుంది. ఎందుకంటే.. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలాగే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో కూడా ఇది సహాయపడవచ్చు. -
నిప్పంటించిన వ్యక్తి.. భారీగా తగలబడ్డ భవనాలు
స్పోకేన్: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం స్పోకేన్ (Spokane) ప్రాంతాన్ని కార్చిచ్చు వణికిస్తోంది. వందలాది ఇళ్లు బూడిదవగా, వేలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. ఈ విపత్తు వెనుక మానవ కుట్రే కారణం ఉండొచ్చన్న అనుమానాలకు బలం చేకూరేలా అధికారులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.స్పోకేన్ ప్రాంతంలో చెలరేగిన భారీ కార్చిచ్చులలో ఒకటైన ఓల్డ్ ట్రైల్స్ ఫైర్ను ఉద్దేశపూర్వకంగా పెట్టినట్లు అనుమానిస్తూ పోలీసులు ఆరోన్ ఫరీనాచ్చి (37) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అధికారులు అతనిపై ఫస్ట్-డిగ్రీ ఆర్సన్ (ఉద్దేశపూర్వకంగా నిప్పంటించడం) కేసు నమోదు చేశారు.ఈ మంటల కారణంగా సుమారు 700కిపైగా భవనాలు తగలబడ్డాయి. 67 వేల మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. వేల ఎకరాల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. వెయ్యికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు.పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద అగ్గిపుల్లలు, లైటర్ లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. అలాగే గతంలో అతనిపై మరో నేరానికి సంబంధించిన కేసు కూడా ఉన్నట్లు వెల్లడించారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మిగిలిన రెండు కార్చిచ్చుల కారణాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. తీవ్ర ఎండలు, కరువు పరిస్థితులు, బలమైన గాలులు మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. -
యుద్ధం ఆపేందుకు తలపట్టుకుంటున్న ట్రంప్?
వాషింగ్టన్: ఇరాన్పై దాడులకు అమెరికా సెంట్రల్ కమాండ్ సరికొత్త వ్యూహం అనుసరించనుందా అంటే అవుననే సమాధానమస్తుంది.. ఈ విషయమై ఇరాన్పై ఒత్తిడి తెచ్చేలా సరికొత్త వ్యూహాలను తెలియజేయాలని ఆ దేశంలోని సైనికులను కోరిందట.. సంప్రదాయేతర, సృజనాత్మక మార్గాలను" సూచించాల్సిందిగా విస్తృత శ్రేణి సైనిక విశ్లేషకులను సంప్రదించిందని కథనాలు పేర్కొన్నాయి.ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉంది.. ఇరాన్పై దాడి చేసి వారం రోజుల్లోగా యుద్ధాన్ని ముగించవచ్చు అనకున్న ట్రంప్కు యుద్దం ప్రారంభమై ఐదునెలలు గడుస్తోన్నా యుద్ధం ముగించే దారి దొరకడం లేదు. అలా అని ఇరాన్ భూభాగంలోకి సైనికులను పంపితే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగే అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అలాగని దాడులు ఆపేస్తే అమెరికా పట్టు సడలిపోతుంది. దీంతో ఏం చేయాలో తోచక తల పట్టుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూఎస్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కొత్తగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ను ఏవిధంగా మరింతగా దెబ్బతీయవచ్చు లేదా కట్టడి చేయవచ్చు అనే అంశంపై ఆర్మీ విశ్లేషకులు, అధికారుల నుంచి కొత్త ప్రతిపాదనలను సేకరించాలని ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంతర్గతంగా ఈ అభ్యర్థనను పంపినట్లు సమాచారం. ఇరాన్తో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటం ,పరిమితమైన సైనిక ప్రత్యామ్నాయాలు ఉన్న నేపథ్యంలో అమెరికా ఈ సరికొత్త విశ్లేషణలు లేదా ఆలోచనల కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.సీఎన్ఎన్ (CNN) నివేదిక ప్రకారం.. గత వారం సెంట్రల్ కమాండ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లోని ఒక అధికారి ఈమెయిల్ ద్వారా ఈ బ్రెయిన్స్టార్మింగ్ (ఆలోచనల సేకరణ) సెషన్ను ప్రారంభించారు. ఈమెయిల్ ద్వారా ఇలా ప్రజల లేదా సిబ్బంది అభిప్రాయాలను సేకరించడం (క్రాగ్సోర్సింగ్ పద్ధతి) సైన్యంలో చాలా అరుదైన విషయం, ఈ విషయాన్ని పట్టి చూస్తే తన నిబంధనల ప్రకారం ఇరాన్ను ఒప్పందానికి అంగీకరించేలా చేయడానికి అధ్యక్షుడు ట్రంప్కు చాలా కష్టమని తెలుస్తోందని కథనాలు ప్రచురించాయి.అమెరికా గత కొన్ని వారాలుగా ఇరాన్పై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేస్తున్నప్పటికీ, ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం, తమ వైఖరి మార్చుకోకపోవడంతో అమెరికా రక్షణ రంగానికి ఒక రకమైన ప్రతిష్టంభన ఏర్పడింది. కేవలం బాంబులు వేయడం వల్ల ఇరాన్ను లొంగదీసుకోవడం సాధ్యం కాదనే వాస్తవం అమెరికాకు అర్థమయ్యింది. ఒకవేళ ఇరాన్ భూభాగంలోకి గ్రౌండ్ ట్రూప్స్ (భూతల సైన్యం)ను పంపడం లేదా భూగర్భంలో ఉన్న అణు కేంద్రాలపై భారీ దాడులు చేయడం వల్ల అమెరికాకు ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది. అలాగే ఆయుధ నిల్వలు తరిగిపోవడం, చమురు ధరలు పెరగడం వంటి సమస్యల వల్ల అమెరికా ప్రత్యక్షంగా పెద్ద యుద్ధానికి వెనుకంజ వేస్తోంది.దీంతో కొత్త దారుల కోసం అన్వేషణ ఇప్పటివరకు అనుసరించిన పద్ధతులు కాకుండా, ఎలాంటి పెద్ద యుద్ధ నష్టం లేకుండా ఇరాన్ను దెబ్బతీయడానికి లేదా చర్చల ముందుకు రప్పించడానికి పూర్తిగా భిన్నమైన, ఎవరూ ఊహించని మార్గాలు అవసరమని అమెరికా సైనిక వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరగా ఒక విజయాన్ని లేదా స్పష్టమైన ఒప్పందాన్ని కోరుకుంటున్నప్పటికీ, దానికి తగిన సరైన సైనిక ప్రత్యామ్నాయాలు తక్షణమే అందుబాటులో లేకపోవడాన్ని ఈ అంతర్గత ఈమెయిల్ స్పష్టం చేస్తోంది. -
కోవిడ్-19 పుట్టుకపై సంచలన నిజాలు వెల్లడి!
వాషింగ్టన్: వైట్హౌస్ మాజీ కోవిడ్-19 రెస్పాన్స్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆశిష్ ఝా సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 మహమ్మారి ప్రకృతి సిద్ధంగా వ్యాపించలేదని, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి ప్రమాదవశాత్తూ వైరస్ లీకై ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలోని సీఎన్ఎన్ వార్తా సంస్థకు తాజాగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను బైడెన్ ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఈ వైరస్ సహజ సిద్ధంగానే పుట్టి ఉంటుందని భావించానని, అయితే ఆ తర్వాత లభించిన సమాచారం ఆధారంగా ఇది ల్యాబ్ లీక్ వల్లే జరిగి ఉంటుందని నిర్ధారణకు వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.అయితే, ఈ విషయమై ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేవని, చైనా అధికారులకు మాత్రమే దీనికి సంబంధించిన అసలు నిజాలు తెలుసని ఆయన పేర్కొన్నారు. దీనిపై చైనా ప్రభుత్వం మరింత పారదర్శకతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని ఝా నొక్కిచెప్పారు. ఈ వైరస్ను ఉద్దేశపూర్వకంగా లేదా ఇంజనీరింగ్ ద్వారా తయారు చేయలేదని, కేవలం ప్రమాదవశాత్తూ జరిగిన లీక్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై అమెరికాలో ఎవరికీ వందశాతం కచ్చితమైన సమాచారం లేదని, ఎవరైనా అలా చెబితే అది నమ్మశక్యం కాదని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ పుట్టుకపై దర్యాప్తు, చర్చల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
ట్రంప్కు బిగ్ షాక్.. టారిఫ్లపై కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న టారిఫ్ విధానానికి సొంత దేశంలోనే సవాళ్లు ఎదురవుతున్నాయి. భారత్ సహా 60 దేశాలపై విధించిన కొత్త దిగుమతి సుంకాలను నిలిపివేయాలని కోరుతూ అమెరికాలోని 25 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ ప్రభుత్వం తన అధికారాలను మించి వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ దాఖలైన ఈ పిటిషన్.. ఆయన వాణిజ్య విధానానికి మరో న్యాయ పరీక్షగా మారింది.ట్రంప్ ప్రభుత్వం గత నెలలో ట్రేడ్ యాక్ట్-1974లోని సెక్షన్ 301 కింద కొత్త టారిఫ్లను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సుంకాలు 10 శాతం నుంచి 12.5 శాతం వరకు ఉన్నాయి. భారత్, యూరోపియన్ యూనియన్ సహా మొత్తం 60 వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఇవి వర్తిస్తున్నాయి. అయితే బలవంతపు కార్మిక వ్యవస్థ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను అడ్డుకోవడం, వాణిజ్య నిబంధనలను కఠినతరం చేయడమే ఈ టారిఫ్ల ఉద్దేశమని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.“అధ్యక్ష అధికారాలను ఆయన దాటారు”ఈ టారిఫ్లను వ్యతిరేకిస్తూ 25 డెమొక్రటిక్ పాలిత రాష్ట్రాలు అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పిటిషన్(U.S. Court of International Trade) దాఖలు చేశాయి. ఒరెగాన్, న్యూయార్క్ వంటి రాష్ట్రాలు ఈ న్యాయపోరాటంలో ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వం గతంలో కోర్టులు తప్పుబట్టిన విస్తృత టారిఫ్ విధానాన్నే మరో చట్టపరమైన మార్గంలో అమలు చేస్తోందని రాష్ట్రాలు ఆరోపించాయి. సెక్షన్ 301ను సాధారణంగా నిర్దిష్ట దేశాలు లేదంటే పరిశ్రమల అన్యాయ వాణిజ్య చర్యలపై ఉపయోగిస్తారని.. దాదాపు అన్ని దిగుమతులపై భారీ సుంకాలు విధించేందుకు ఉపయోగించలేమని వాదించాయి.ఈ కేసు ప్రస్తుతం అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు పరిశీలనలో ఉంది. పిటిషన్పై తదుపరి విచారణ షెడ్యూల్ కోసం ఇరు వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కోర్టు నిర్ణయం ట్రంప్ టారిఫ్ విధాన భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశముంది.భారత్పై ప్రభావం ఎంత?ట్రంప్ కొత్త టారిఫ్ల పరిధిలో భారత్ కూడా ఉంది. తొలుత భారత్పై 12.5 శాతం సుంకం విధించగా.. కొన్ని చర్యల తర్వాత దాన్ని 10 శాతానికి తగ్గించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే చమురు, సహజ వాయువు, ఎరువులు వంటి కొన్ని ఉత్పత్తులకు ఈ కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు. అయినప్పటికీ భారత్ నుంచి అమెరికాకు వెళ్లే పలు ఉత్పత్తులపై ఈ టారిఫ్ల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.ట్రంప్ టారిఫ్ విధానంపై వరుస ఎదురుదెబ్బలుటారిఫ్లను అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు కీలక ఆయుధంగా ట్రంప్ భావిస్తున్నారు. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి.. అమెరికా తయారీ రంగాన్ని ప్రోత్సహించడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. అయితే ఆయన తీసుకున్న టారిఫ్ నిర్ణయాలకు ఇప్పటికే న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. గతంలో అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద విధించిన భారీ సుంకాలపై అమెరికా కోర్టులు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అనంతరం ట్రంప్ ప్రభుత్వం ఇతర చట్టపరమైన మార్గాలను అనుసరిస్తోంది.మరోసారి కోర్టు తీర్పుపైనే ఉత్కంఠతాజాగా 25 రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్.. ట్రంప్ వాణిజ్య విధానానికి కీలక పరీక్షగా మారింది. కోర్టు ఈ టారిఫ్లను నిలిపివేస్తే ట్రంప్ ఆర్థిక ఎజెండాకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. ఒకవేళ కోర్టు ప్రభుత్వం వైపు మొగ్గుచూపితే.. భవిష్యత్తులో మరిన్ని దేశాలపై సుంకాల విధింపుకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం అమెరికా కోర్టు నిర్ణయం కోసం వాణిజ్య వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ తీర్పు భారత్ సహా పలు దేశాలతో అమెరికా వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. -
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. చేతులెత్తేసిన అమెరికా?
-
ట్రంప్.. అబ్బో! చాలా దూరం వెళ్లారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అంశాల్లో వలస విధానం ఒకటి. అక్రమ వలసదారులపై కఠిన చర్యలు, భారీ స్థాయిలో బహిష్కరణలు, సరిహద్దు నియంత్రణ వంటి నిర్ణయాలతో ట్రంప్ తన మద్దతుదారుల్లో బలమైన గుర్తింపు సంపాదించారు. అయితే ఇప్పుడు అదే వలస విధానం ఆయనకు రాజకీయ సవాల్గా మారుతోందా?.. తాజా సర్వే ఫలితాలు అలాంటి సంకేతాలనే ఇస్తున్నాయి.ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల విషయంలో పెద్ద సంఖ్యలో అమెరికన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్–NORC సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవడంలో, చట్టబద్ధ వలసలను పరిమితం చేయడంలో ట్రంప్ తన అధికార పరిధిని మించుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రారంభంలో ఆయన వలస విధానానికి ఉన్న మద్దతు 49 శాతంగా ఉండగా.. ప్రస్తుతం అది 39 శాతానికి పడిపోయింది. అంటే కేవలం కొన్ని నెలల్లోనే మద్దతు 10 శాతం పాయింట్లు తగ్గినట్లు సర్వే చెబుతోంది. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో వలసల అంశం ట్రంప్ ప్రచారంలో కీలకంగా మారిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను దేశం నుంచి పంపించే విషయంలో ట్రంప్ తన అధికారాన్ని మించి వ్యవహరిస్తున్నారని 47 శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారు. చట్టబద్ధ వలసలపై ఆంక్షలు విధించే విషయంలోనూ దాదాపు సగం మంది ప్రజలు ఆయన చర్యలు మరీ కఠినంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్లలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దాదాపు 80 శాతం మంది రిపబ్లికన్ ఓటర్లు ట్రంప్ వలస విధానాలను సమర్థిస్తున్నారు. వలసల అంశం ఇప్పటికీ ఆయన బేస్ ఓటర్లను ఏకం చేసే ప్రధాన అంశంగానే కొనసాగుతోంది. అయితే కొన్ని చర్యలపై మాత్రం విస్తృత స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. వలసదారులను గుర్తించేందుకు ట్రాఫిక్ తనిఖీలను ఉపయోగించడం, ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లను నగరాల్లోకి పంపించడం వంటి చర్యలు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని పలువురు అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. వలస నియంత్రణ అవసరమే అయినప్పటికీ.. దాని అమలు విధానం ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉండాలని కోరుతున్నారు.వలస విధానంతో పాటు ఆర్థిక అంశాల్లోనూ ట్రంప్కు సవాళ్లు ఎదురవుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆయన నిర్వహిస్తున్న తీరుపై కేవలం 32 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదని దాదాపు 70 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడటం గమనార్హం. అయితే రిపబ్లికన్ ఓటర్లలో మాత్రం ట్రంప్పై నమ్మకం కొనసాగుతోంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆయన పనితీరును 69 శాతం మంది రిపబ్లికన్లు సమర్థించారు.వలసలపై కఠిన వైఖరి ట్రంప్ రాజకీయ గుర్తింపులో కీలక భాగం. సరిహద్దు భద్రత, అక్రమ వలసల నియంత్రణ అంశాలతో ఆయన తన మద్దతు వర్గాన్ని బలపరిచారు. కానీ తాజా సర్వే మరో విషయాన్ని సూచిస్తోంది. ట్రంప్ ప్రధాన మద్దతుదారులు ఆయన వెంటే ఉన్నప్పటికీ.. మధ్యస్థ ఓటర్లు, స్వతంత్ర ఓటర్లలో అసంతృప్తి పెరుగుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వలసలపై ట్రంప్ దూకుడు.. అదే అంశం ఇప్పుడు ఆయనకు కొత్త సవాల్గా మారుతోందా? తాజా సర్వే మాత్రం అమెరికన్లలో మారుతున్న అభిప్రాయాలకు అద్దం పడుతోంది. రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ అంశం కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. కఠిన వలస విధానాలు ట్రంప్కు రాజకీయ బలాన్నిస్తాయా? లేక సాధారణ అమెరికన్లలో వ్యతిరేకతను పెంచుతాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
యుద్ధానికి బ్రేక్.. ఇరాన్ కీలక ప్రకటన
అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నడుమ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. క్షిపణులు, దాడుల హెచ్చరికలతో హోరెత్తిన వాతావరణం ఒక్కసారిగా చర్చల వైపు మళ్లింది. ఇరాన్పై భారీ సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు దౌత్య మార్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇరాన్తో ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిన ట్రంప్.. సోమవారం నుంచి చర్చలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దీంతో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాలు కొంత తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇరాన్ కీలక మౌలిక వసతులపై భారీ దాడులకు అమెరికా ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ.. చివరి దశలో వాటిని నిలిపివేసినట్లు ట్రంప్ తెలిపారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు యుద్ధాన్ని విస్తరించకుండా దౌత్య పరిష్కారానికి అవకాశం ఇవ్వాలని కోరినట్లు ట్రంప్ చెప్పారు.ఇరాన్పై తాను చేపట్టబోయిన సైనిక చర్య సాధారణ దాడి కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ దాడి జరిగి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా నిలిచేదని వ్యాఖ్యానించారు. “నేను ప్రజలను చంపాలని కోరుకోవడం లేదు. యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఒకవేళ దాడి జరిగి ఉంటే భారీ విధ్వంసం జరిగేది.. తిరిగి నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టేది” అని ట్రంప్ పేర్కొన్నారు.అందుకే యుద్ధం కంటే చర్చల ద్వారా పరిష్కారం సాధించడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇరాన్తో ఒప్పందం కుదిరితే ప్రాణనష్టం, విధ్వంసం రెండింటినీ నివారించవచ్చని తెలిపారు.“ఇరాన్తో ఒక ఒప్పందం దగ్గరలోనే ఉంది” అని ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఈ ఒప్పందంలో ఏ అంశాలపై రాజీ కుదరబోతోందన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఇరాన్ కీలక వ్యాఖ్యలుమరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కూడా అమెరికాతో చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. “అమెరికా తన హామీలను గౌరవించాలి.. పరస్పర నమ్మకంతో ముందుకు సాగాలి” అనే సంకేతాలను పెజెష్కియన్ ఇచ్చారు.జూన్లో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందమే భవిష్యత్లో ఇరాన్ విదేశాంగ విధానానికి కీలక ఆధారంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఇరాన్ తన ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో వెనక్కి తగ్గబోదని కూడా ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.టెహ్రాన్కు దౌత్య బృందాలు!అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు మార్గం సుగమం చేసేందుకు మధ్యవర్తి దేశాలు రంగంలోకి దిగుతున్నాయి. గత 24 గంటల్లో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత.. టెహ్రాన్లో పరోక్ష చర్చలకు వేదిక సిద్ధమవుతోందని సమాచారం. అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా చర్చలు కాకుండా.. ఒమన్, ఖతార్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉంది.ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. సౌదీ అరేబియా, పాకిస్థాన్ తదితర దేశాలతో సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ దేశాల సహకారంతో యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించి, హార్ముజ్ జలసంధి విషయంలో ఒక అవగాహనకు రావడమే లక్ష్యంగా దౌత్య ప్రయత్నాలు సాగుతున్నాయి.హర్ముజ్ జలసంధిపై అసలు పోరుఅమెరికా-ఇరాన్ చర్చల్లో అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి మారింది. ప్రపంచ చమురు రవాణాలో ఈ మార్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే భారీ స్థాయి చమురు రవాణా ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. అందుకే ఏ చిన్న అంతరాయం ఏర్పడినా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. ఒమన్తో హార్ముజ్ నిర్వహణపై జరుగుతున్న చర్చలు చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు. అయితే ఇవి అమెరికాతో నేరుగా జరుగుతున్న చర్చలు కావని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులకు హర్ముజ్ను పూర్తిగా తీసుకెళ్లడం సాధ్యం కాదని కూడా సంకేతాలు ఇచ్చింది.హర్ముజ్ కోసం తెర వెనుక డీల్!హర్ముజ్ జలసంధి విషయంలో కొత్త విధానం రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరు పర్యవేక్షిస్తారు? నౌకల రాకపోకలు ఎలా ఉంటాయి? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉండాలి? వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల్లో ఒమన్ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలోనూ అమెరికా-ఇరాన్ మధ్య రహస్య దౌత్య చర్చలకు ఒమన్ వేదికగా నిలిచింది.ఇరాన్ వ్యూహం.. చర్చలు కూడా, ఒత్తిడి కూడాఇరాన్ ఒకవైపు చర్చలకు సిద్ధమని చెబుతూనే.. మరోవైపు తన వ్యూహాత్మక బలాన్ని కొనసాగిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తదితరులతో సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై చర్చించినట్లు ఇరాన్ వెల్లడించింది. అయితే హార్ముజ్పై తన ప్రభావాన్ని మాత్రం కొనసాగించాలని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది.అణు అంశమే అసలు పరీక్ష!అమెరికా-ఇరాన్ మధ్య జరిగే ఏ ఒప్పందానికైనా అణు కార్యక్రమం ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇరాన్ అణు సామర్థ్యాలను పరిమితం చేయాలని అమెరికా కోరుతోంది. మరోవైపు తమపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ రెండు అంశాలపై రాజీ కుదిరితేనే చర్చలు విజయవంతమయ్యే అవకాశం ఉంది.ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు దిగొచ్చాయియుద్ధ భయాల మధ్య పెరిగిన చమురు ధరలు ట్రంప్ తాజా ప్రకటనతో తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 4 డాలర్లకు పైగా పడిపోయింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభిస్తుందని మార్కెట్లు భావిస్తున్నాయి.ఎర్రసముద్రంలో ఉత్కంఠ!మరోవైపు సౌదీ అరేబియా నుంచి బయలుదేరిన రెండు చమురు నౌకలు బాబ్ అల్ మందెబ్ జలసంధిని దాటాయి. హౌతీల హెచ్చరికల మధ్య కూడా చమురు రవాణా కొనసాగుతుండటం గమనార్హం. అయితే భద్రతా కారణాలతో కొన్ని నౌకలు తమ ఆటోమేటిక్ ట్రాకింగ్ వ్యవస్థలను నిలిపివేసినట్లు సమాచారం.ఇజ్రాయెల్ చూపు చర్చలపైనేఅమెరికా-ఇరాన్ చర్చలను ఇజ్రాయెల్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఎలాంటి రాజీ వచ్చినా అది తమ భద్రతకు ముప్పుగా భావించే ఇజ్రాయెల్.. గతంలో ఇరాన్పై కఠిన వైఖరి ప్రదర్శించింది. అందుకే ఈ చర్చలు కేవలం వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య వ్యవహారం కాకుండా మొత్తం పశ్చిమాసియా భవిష్యత్తును ప్రభావితం చేసే పరిణామంగా మారాయి.యుద్ధానికి ముగింపా? లేదంటే.. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు మార్గం సుగమమైనప్పటికీ.. పూర్తి ఒప్పందం ఇంకా దూరంలోనే ఉంది. హర్ముజ్ నియంత్రణ, అణు కార్యక్రమం, ఆంక్షల తొలగింపు, భద్రతా హామీలపై ఇరు దేశాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. యుద్ధం అంచుల నుంచి చర్చల బల్లపైకి వచ్చిన అమెరికా-ఇరాన్ సంబంధాలు.. నిజంగా శాంతి దిశగా అడుగులు వేస్తాయా? లేక ఇది కేవలం వ్యూహాత్మక విరామమేనా? అన్నది రాబోయే చర్చలే తేల్చనున్నాయి. -
వాషింగ్టన్ రాష్ట్రంలో కార్చిచ్చు
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని పశ్చిమాన కార్చిచ్చు వ్యాపిస్తోంది. నివాసాలు, వ్యాపార సంస్థలు, ఇతర నిర్మాణాలు కలిపి మొత్తంగా 600 వరకు భవనాలు బుగ్గిపాలైనట్లు అధికారులు ఆదివారం తెలిపారు. నీటిశుద్ధి కేంద్రం, ఇంధన ప్లాంట్, సైనిక ఆస్పత్రి సహా మరో 5,000 నివాసాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాషింగ్టన్లోని రెండో అతిపెద్ద నగరం స్పొకానె చుట్టుపక్కలున్న సుమారు 2,50,000 ఎకరాల్లోని ప్రాంతాన్ని కార్చిచ్చు దహించి వేసింది. 60,000 మంది వినియోగదారులకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. మరణాలు సంభవించలేదు. కాలిఫోర్నియా నుంచి రప్పించిన ఫెడరల్ బలగాలు, రాష్ట్ర, స్థానిక విభాగాల్లోని 4,000 మంది సిబ్బంది కార్చిచ్చును అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు ఈదురు గాలులు తోడవ్వడంతో మంటల వ్యాప్తిని అడ్డుకోవడం కష్టంగా మారింది. స్పొకానెలోని ఓల్డ్ ట్రయిల్స్, ఫెయిర్వ్యూ, మెడోవ్యూల్లో వేర్వేరుగా కార్చిచ్చు మొదలైందని, ప్రస్తుతం పరిస్థితి ప్రమాదకరంగా మారిందని వాషింగ్టన్ గవర్నర్ బాబ్ ఫెర్గుసన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ వేసవిలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,50,000 ఎకరాల్లో అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైందని ఆయన తెలిపారు. -
ఏపీ సంక్షేమం కోసం వైఎస్ జగన్ మళ్లీ రావాలి.. మాజీ ఎంపీ
వాషింగ్టన్: ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు మరోసారి అవకాశం కల్పించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న.. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐలు తమవంతు సహకారం అందించాలని మాజీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అమెరికా బాల్టిమోర్లో జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) జాతీయ మహాసభల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సభల్లో ప పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గత రెండు రోజులుగా ఉత్తర అమెరికా నలుమూలల నుంచి వచ్చిన తెలుగు సోదరులు, సోదరీమణులు, ప్రముఖులు, వృత్తి నిపుణులు, శ్రేయోభిలాషులతో కలుసుకుని ఆత్మీయంగా ముచ్చటించే అవకాశం లభించింది. వారందరు దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం, మానవత్వం, ప్రజాకేంద్రిత పాలన గురించి తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది.అన్నారు.అనంతరం తన ప్రసంగంలో డా. వై.ఎస్.ఆర్ ఆశయాలను, విలువలను వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆయన నిబద్ధత, పారదర్శక.. పాలన, పేదల పట్ల ఉన్న అంకితభావం గురించి వారందరికీ వివరించానని తెలిపారు. ఈ సందర్భంగా ATA ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాయకత్వానికి, నిర్వాహకులకు, విశిష్ట అతిథులకు సభకు హాజరైన తెలుగు సమాజానికి వైఎస్సార్సీపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైమ్ హెల్త్ హాస్పిటల్స్ ఛైర్మన్ డా. ప్రేమ్ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇరాన్ యుద్ధం పై ట్రంప్ కీలక నిర్ణయం..
-
నెతన్యాహు దూకుడు.. ట్రంప్కు బిగ్ షాక్!
గాజాలో యుద్ధ మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం తన సైనిక చర్యలను కొనసాగిస్తోంది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు అనుగుణంగా పరిస్థితులు మారుతాయని భావించిన వేళ.. గాజాపై వరుసగా జరుగుతున్న వైమానిక దాడులు మరోసారి ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.పాలస్తీనా ఆరోగ్య అధికారుల ప్రకారం, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజా సిటీ, మధ్య గాజాలోని దెయిర్ అల్-బలాహ్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించాయి. దెయిర్ అల్-బలాహ్లోని ఓ నివాస భవనంపై జరిగిన దాడిలో ఓ వ్యక్తి, అతని భార్య మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. గాజా సిటీలో జరిగిన మరో దాడిలో ఇద్దరు మరణించగా, వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.గాజా యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ నేతృత్వంలో అమెరికా దౌత్య ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. హమాస్ ఆయుధాలను వదులుకునేందుకు అంగీకరించిందని ట్రంప్ ప్రకటించినప్పటికీ.. ఆ ప్రతిపాదన అమలు దశకు చేరుకోవడంలో ఇజ్రాయెల్ వైఖరి కీలక అడ్డంకిగా మారిందని పరిస్థితులు సూచిస్తున్నాయి. ట్రంప్కు చెందిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ విడుదల చేసిన 15 అంశాల రోడ్మ్యాప్లో కాల్పుల విరమణ, భద్రతా ఏర్పాట్లు, యుద్ధం ముగింపు దిశగా చర్యలు ప్రతిపాదించారు. అయితే, హమాస్ నిరాయుధీకరణ, ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ వంటి అంశాలపై ఇరు వర్గాలు తమ వైఖరుల నుంచి వెనక్కి తగ్గడం లేదు.హమాస్ మాత్రం ఇజ్రాయెల్ దాడులను నిలిపివేసి, సైన్యాన్ని వెనక్కి తీసుకున్న తర్వాతే ఆయుధాల అంశంపై చర్చకు సిద్ధమని చెబుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం హమాస్ పూర్తిగా ఆయుధాలను వదిలేసిందనే స్పష్టమైన ఆధారాలు కనిపించే వరకు సైనిక చర్యలను ఆపబోమని స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాలతో ట్రంప్ శాంతి ప్రయత్నాలకు ఇజ్రాయెల్ వైఖరి పెద్ద సవాల్గా మారింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ ప్రతిపాదనపై బహిరంగంగా స్పందించకపోయినా, ఆయన ప్రభుత్వంలోని కొందరు మంత్రులు మాత్రం శాంతి ఒప్పందంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్విర్ హమాస్పై సైనిక చర్యలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఇక దౌత్య ప్రయత్నాల్లో భాగంగా మాజీ ఫతా నేత మహ్మద్ దహ్లాన్ మాట్లాడుతూ.. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇజ్రాయెల్తో గాజాపై దాడులు నిలిపివేయడానికి చర్చలు జరుపుతున్నారని తెలిపారు. అయితే ఒప్పందం విజయవంతం కావాలంటే ఇజ్రాయెల్ సైనిక చర్యలను నిలిపివేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఒత్తిడి, అంతర్జాతీయ పిలుపులు ఉన్నప్పటికీ గాజాలో దాడులు కొనసాగుతుండటం ట్రంప్ దౌత్య ప్రయత్నాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కాల్పుల విరమణకు మార్గం సుగమం కావాలంటే హమాస్ నిరాయుధీకరణ, ఇజ్రాయెల్ భద్రతా హామీలు, గాజా భవిష్యత్ పాలనపై ఇరు వర్గాల మధ్య రాజీ తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం గాజాలో పరిస్థితి చూస్తే.. వాషింగ్టన్ నుంచి వస్తున్న శాంతి పిలుపులకు మించిన ప్రాధాన్యతను ఇజ్రాయెల్ తన భద్రతా లక్ష్యాలకు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళిక భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. -
గల్ఫ్ దేశాలను వీడండి.. అమెరికా పౌరులకు ట్రంప్ అత్యవసర హెచ్చరిక
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, అమెరికా వరుస దాడులు తీవ్రతరమయ్యాయి. దీంతో, మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న అమెరికా పౌరులకు అమెరికా విదేశాంగ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. భద్రతా ముప్పులు పెరుగుతున్నందున వీలైతే మధ్యప్రాచ్య దేశాలను విడిచి వెళ్లాలని, లేకపోతే ఎప్పుడైనా అత్యవసరంగా బయలుదేరాల్సిన పరిస్థితి రావచ్చని ముందస్తుగా సిద్ధంగా ఉండాలని సూచించింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయాల ద్వారా తాజా ప్రయాణ సూచనలను విడుదల చేసింది. గగనతల మూసివేతలు, విమాన సర్వీసుల రద్దు, ప్రయాణాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అమెరికా పౌరులకు సూచించింది. మధ్యప్రాచ్యానికి వెళ్లే ప్రయాణాలను కూడా పునరాలోచించాలని విదేశాంగ శాఖ పేర్కొంది. అంతకుముందు చేసిన సూచనల కంటే తాజా సూచన మరింత కఠినంగా ఉండటం గమనార్హం.ఇక, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అవసరమైతే ఇరాన్పై తీవ్ర చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, అమెరికా దాడులకు తగిన ప్రతీకారం తప్పదని ఇరాన్ ప్రకటించింది. ఇదే సమయంలో ఇరాన్కు చెందిన డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని కువైట్ సైన్యం వెల్లడించింది. రెండు రోజుల క్రితం ఇరాన్పై భారీ స్థాయిలో దాడులు నిర్వహించినట్లు అమెరికా సైన్యం ప్రకటించడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఘర్షణలు మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండగా, ఇంధన ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.Middle East: Americans currently in the Middle East should exercise caution and heightened vigilance and should be prepared for flight cancellations, periodic airspace closures, and potential travel disruptions. Some airlines in the region have postponed resumption of earlier… pic.twitter.com/d1ZmzRBBHN— TravelGov (@TravelGov) August 1, 2026మరోవైపు.. అమెరికా హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ.. అమెరికా మరోసారి సైనిక చర్యలకు దిగితే దానికి ‘నిర్ణయాత్మక, తీవ్రమైన ప్రతిస్పందన’ ఇస్తామని హెచ్చరించారు. అలాగే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఇజ్రాయెల్లోని ఇంధన మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇరాన్పై దాడులకు తమ భూభాగాన్ని లేదా సౌకర్యాలను ఉపయోగించేందుకు ఏ దేశం అనుమతించవద్దని ప్రాంతీయ దేశాలకు ఆయన హెచ్చరించారు. అదే సమయంలో, అమెరికా హెచ్చరికలు ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలని ఇరాన్ విమర్శించింది. తమపై ఎలాంటి దాడి జరిగినా తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని, ప్రాంతీయ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే తమ భద్రత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేసింది. -
అమెరికాకు ఇరాన్ వార్నింగ్: మరో దాడి చేస్తే..
టెహ్రాన్: అమెరికా మరోసారి సైనిక దాడికి పాల్పడితే తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఏ క్షణమైనా నిర్ణయాత్మక బదులిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ వైపు నుంచి వ్యూహాత్మక ప్రాంతాలపైకి ప్రయోగించిన శత్రు డ్రోన్లను కూల్చివేశామని కువైట్ సైన్యం ప్రకటించిన కొద్ది గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. టెహ్రాన్తో చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత ఈ హెచ్చరిక వెలువడింది. అవసరమైతే అమెరికా మరోసారి దాడులకు దిగుతుందని, తమపై ఒత్తిడి తెస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్లతో వేర్వేరుగా టెలిఫోన్ ద్వారా సంభాషించారు. అమెరికా దురాక్రమణకు పాల్పడితే గట్టిగా స్పందిస్తామని పాక్, టర్కీ అధికారులకు ఆయన తెలిపారు. సౌదీ విదేశాంగ మంత్రితో మాట్లాడుతూ.. అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.కువైట్లో కూల్చివేసిన డ్రోన్ల అవశేషాలు ఉత్తర కువైట్లోని ప్రభుత్వ భవనం, బుబియాన్ ద్వీపంలోని ఆస్తులను ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఇరాన్ భద్రతా సంస్థకు చెందిన మీడియా సంస్థ ఒక హెచ్చరిక జారీ చేస్తూ, అమెరికా కనుక ఇరాన్ ఇంధన సౌకర్యాలపై దాడి చేస్తే, సౌదీ అరేబియా, యూఏఈలోని చమురు కేంద్రాలు, ఖతార్, ఇజ్రాయెల్లోని గ్యాస్ క్షేత్రాలపై ప్రతీకార దాడులు జరుపుతామని, అన్నీ బూడిదవుతాయని పేర్కొంది.ఈ పరిణామాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. జూలైలో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 24 శాతం పెరిగాయి. హార్ముజ్ జలసంధిలో భద్రతా ఆందోళనల కారణంగా వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు ఒమన్ తీరంలో రెండు వేర్వేరు సముద్ర ఘటనలు చోటుచేసుకున్నట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది.ఇది కూడా చదవండి: ఎవరెస్ట్ ‘డెత్ జోన్’లో అసలేం జరుగుతుంది? -
అమెరికాలో కాల్పుల కలకలం..
అమెరికాలోని పశ్చిమ ఇడాహోలోని ఓ రెస్టారెంట్లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. నిందితుడు కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ట్విన్ ఫాల్స్లోని 'ఇన్-ఎన్-అవుట్ బర్గర్' రెస్టారెంట్ దగ్గర జరిగిన ఈ కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారని ట్విన్ ఫాల్స్ నగర ప్రతినిధి జోష్ పాల్మర్ తెలిపారు. అయితే మృతుల్లో దుండగుడు కూడా ఉన్నాడా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదన్నారు.స్థానిక మీడియా ప్రసారం చేసిన వీడియో ఫుటేజ్లో ఒక యువకుడు రెస్టారెంట్ వెలుపల లాంగ్ గన్తో కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల్లో ప్రజలు రెస్టారెంట్ నుండి బయటకు పరుగులు తీయడం కనిపించింది. ట్విన్ ఫాల్స్.. ఇడాహో దక్షిణ ప్రాంతంలో సుమారు 56,000 జనాభా కలిగిన ఒక నగరం. ఇది సాల్ట్ లేక్ సిటీకి వాయువ్యంగా సుమారు 290 కిలోమీటర్లు దూరంలో ఉంది. -
ఇంతకీ ఖమేనీ ఎక్కడ?.. ఆ రహస్యం ఇదేనా?
ప్రపంచంలోనే దిగ్గజ నిఘా సంస్థలు ఏవని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఠక్కున వచ్చే సమాధానాలు.. ఇజ్రాయెల్కు చెందిన మొస్సాద్.. అమెరికాకు చెందిన సీఐఏ..! తమ శత్రువు ప్రపంచంలోని ఏ మూలన దాక్కొన్నా.. లేపేస్తామనే ధీమా ఈ రెండు సంస్థలకు ఉంది. అయితే.. మధ్యప్రాశ్చ్యంలో ఇప్పుడు ఈ రెండు సంస్థల విషయంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఏకు మేకై కూర్చున్నాడు. ఈ రెండు నిఘా సంస్థల టెక్నాలజీకి దొరకకుండా జాగ్రత్తపడుతున్న ఖమేనీ.. ఇప్పుడు అటు ట్రంప్.. ఇటు నెతన్యాహుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఇంతకీ ఖమేనీ ఎక్కడున్నాడు? ఆయన విషయంలో మొస్సాద్, సీఐఏ ఎందుకు విఫలమవుతున్నాయి?కంటిమీద కునుకు లేకుండా..అది 2020 నవంబరు 27వ తేదీ.. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఇరాన్ అణు సాంకేతికతకు పెద్దదిక్కుగా ఉన్న మోహాసేన్ ఫాఖ్రిజాదేహ్ (Mohsen Fakhrizadeh) కారులో ప్రయాణిస్తున్నారు. మొస్సాద్, సీఐఏ నిఘా సంస్థల టార్గెట్గా ఆయన ఉన్నారు. ఆ కారుపై దాడికి ఈ సంస్థలు ఒక్క ఏజెంట్ని కూడా నియమించలేదు. కానీ, ఉపగ్రహ చిత్రాల ద్వారా ఆయనను గుర్తించి.. ఏఐ ఆధారిత మెషీన్ గన్ సాయంతో అత్యంత కచ్చితత్వంతో అతణ్ని మట్టుబెట్టాయి. హాలీవుడ్ చిత్రాలను తలపించిన ఈ డిజిటల్ ఆపరేషన్తో ప్రపంచదేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అత్యాధునిక శాటిలైట్లు, ప్రపంచంలోనే నంబర్ వన్ హ్యాకర్లతో ఇజ్రాయెల్, అమెరికాలు అతణ్ని అంతమొందించాయి. అంతటి టెక్నాలజీ ఉన్నా.. ఖమేనీ జాడను కనిపెట్టలేకపోవడం ఇప్పుడు ఈ రెండు నిఘా సంస్థలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.చిన్న ఫోన్ కాల్ మాట్లాడినా..ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని హతమార్చిన ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ అప్పట్లోనే ఓ భారీ ప్రకటన చేసింది. తమ తదుపరి టార్గెట్ కొత్తగా నియమితులయ్యే సుప్రీం లీడరేనన్నది అందులోని సారాంశం. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్లా చీఫ్లను, గాజా కేంద్రంగా ఉన్న హమాస్ నేతలను లేపేసిన విధానాన్ని ఈ సందర్భంగా ఉటంకించింది. ఆ తర్వాత మొజ్తబా ఖమేనీ ఇరాన్కు కొత్త సుప్రీం లీడర్ అయ్యారు.అయితే.. ఆయనను ఇంతవరకు ఎవరూ బహిరంగంగా చూడలేదు. చివరికి ఇటీవల జరిగిన ఆయన తండ్రి ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు సైతం మొజ్తబా హాజరుకాలేదు. దీంతో.. ఆయనను ట్రేస్ చేయడంలో మొస్సాద్, సీఐఏ చతికిలపడిపోతున్నాయి. ముఖ్యంగా.. మొజ్తబా ఇప్పుడు జీరో డిజిటల్ పాలసీని అందిపుచ్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే.. ఎలాంటి డిజిటల్ గాడ్జెట్స్ను తన దరిచేరనీయకుండా ఆయన జాగ్రత్తపడుతున్నారు. చిన్న ఫోన్కాల్ మాట్లాడినా.. తనను మొస్సాద్ గుర్తింస్తుందని ఆయనకు బాగా తెలుసు. అందుకే.. ఆయన డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.మొజ్తబా.. అదే ఫాలో అవుతున్నారా?ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఒకప్పుడు అమెరికాను గడగడలాడించిన అల్-ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అవలంబించిన మోడల్ను మొజ్తబా ఫాలో అవుతున్నారు. లాడెన్ చేసిన పొరపాట్లు తన విషయంలో రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. నిజానికి పాకిస్థాన్లో తలదాచుకున్న లాడెన్ను చేరడానికి.. అతని కమ్యూనికేటర్లను సీఐఏ ట్రాక్ చేసింది. మొజ్తబా విషయానికి వస్తే.. ఆయన కమ్యూనికేటర్లు.. అంటే.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధికారులు ఎవరనే విషయం కూడా బయటి ప్రపంచానికి తెలియదు. కేవలం మొజ్తబా రాసి ఇచ్చే చిన్నచిన్న చీటీలు మాత్రమే అడపాదడపా వెలుగులోకి వస్తున్నాయి.మొజ్తబా ఎక్కడ? ఇంతకీ మొజ్తబా ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ ప్రశ్నకు రెండు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన దాడిలో మొజ్తబా భవనం ధ్వంసమైంది. ఆయన భార్య ఈ దాడిలో మరణించినట్లు వార్తలొచ్చాయి. తీవ్రంగా గాయపడిన మొజ్తబా ప్రస్తుతం ఓ బంకర్లో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఇక రెండో వాదన విషయానికి వస్తే.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి తననుతాను కాపాడుకునేందుకు మొజ్తబా తనకు అత్యంత నమ్మకమైన మిత్రదేశం రష్యాలోని ఓ బంకర్లో తలదాచుకుంటున్నారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం మొజ్తబా తెరవెనకే ఉంటూ.. ఇరాన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దేశ రక్షణ, విదేశీ విధానాల వంటి కీలక నిర్ణయాలను ఐఆర్జీసీ కమాండర్లు నిర్వర్తిస్తున్నారు.ఇరాన్ మైండ్గేమ్ ఆడుతోందా?ఏఐ ఆధారిత టెక్నాలజీ ఎంతగా అందుబాటులోకి వచ్చినా.. అంతరిక్షం నుంచి భూగాళాన్నే జల్లెడ పట్టేలా శాటిలైట్లు ఉన్నా.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా మాత్రం పాతకాలపు రహస్య పద్ధతులకు జైకొట్టారు. అందుకే.. మొస్సాద్, సీఐఏలకు షాక్ల మీద షాక్ ఇస్తున్నారు. అయితే.. మొజ్తబా నిజంగానే బంకర్లలో తలదాచుకుంటున్నారా? లేక ఇరాన్ ఆయన పేరుతో మైండ్గేమ్ ఆడుతోందా? అనేది ఆసక్తికరంగా మారింది.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్ట్ -
వీసా కోసం రూ.19 లక్షల బాండ్.. జాబితాలో 50 దేశాలు!
అమెరికా ప్రభుత్వం.. వీసాలకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ప్రయోగాత్మకంగా అమలు చేసిన 'వీసా బాండ్ ప్రోగ్రామ్'ను.. ఇప్పుడు శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానం ప్రకారం.. కొన్ని దేశాల పౌరులు అమెరికాకు వెళ్లేందుకు బిజినెస్ లేదా టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు, అవసరమైతే 20,000 డాలర్ల (రూ.19 లక్షల కంటే ఎక్కువ) వరకు బాండ్ను సమర్పించాల్సి రావచ్చు.ఈ విధానం ప్రస్తుతం 50 దేశాల పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. వీటిలో ఎక్కువ దేశాలు ఆఫ్రికా ఖండానికి చెందినవే. కాగా.. ఈ జాబితాలో బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. అయితే.. జాబితాలో ప్రస్తుతం భారత్ పేరు లేదు. భవిష్యత్తులో మరిన్ని దేశాలను చేర్చే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వం తెలిపింది.ఈ నిబంధన B-1 (వ్యాపార ప్రయాణం), B-2 (పర్యాటక ప్రయాణం) వీసాలకు వర్తిస్తుంది. వీసా మంజూరు చేసే కాన్సులర్ అధికారి, దరఖాస్తుదారుని వివరాలను పరిశీలించి తరువాత బాండ్ అవసరమా?, కాదా?.. అనే నిర్ణయం తీసుకుంటారు. దీన్నిబట్టి చూస్తే.. ప్రతి ఒక్కరూ బాండ్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో అక్రమంగా ఉండే వారి సంఖ్యను తగ్గించడమే. గతంలో.. ఈ పథకాన్ని ఒక సంవత్సరం పాటు ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఇప్పుడు శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించారు.వీసా బాండ్ కార్యక్రమాన్ని శాశ్వతం చేయడంపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వలస హక్కుల కోసం పనిచేసే సంస్థలు, ఇంత పెద్ద మొత్తంలో బాండ్ చెల్లించడం సాధారణ ప్రజలకు భారంగా మారుతుందని అంటున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులను కలవడానికి లేదా పర్యాటకంగా అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఇది అదనపు ఆర్థిక భారం అవుతుందని చెబుతున్నారు. ఇదీ చదవండి: చెప్పిందే జరుగుతోంది.. కియోసాకి హెచ్చరిక! -
ఇరాన్కు ట్రంప్ వార్నింగ్.. ఈ సారి దాడి ఎప్పుడు చూడనిది
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై రెచ్చిపోయారు. ఈ వారాంతంలో ఇరాన్పై కనీవినీ ఎరుగని రీతిలో దాడులు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టెహ్రాన్ని లొంగిపోయేలా చేసేలా అత్యంత కఠినమైన దాడులు చేయాలని సైన్యాన్ని హెచ్చరించినట్లు సమాచారం.పశ్చిమాసియా యుద్ధంలో ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి. యుద్ధం ముగుస్తుందనుకునేలోపే మళ్లీ తీవ్రస్థాయికి చేరింది.ఇది చాలదన్నట్లు ఇటీవలే అమెరికాకు మద్ధతుగా సౌదీ అరేబియా సైతం రంగప్రవేశం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇరాన్కు ఝలకిచ్చారు.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.." టెహ్రాన్ను లొంగిపోయేలా ఇరాన్పై కఠినమైన దాడులు చేయండి. వారు అబద్ధాలు చెబుతారు. తప్పుగా అన్వయిస్తారు. ఇరాన్పై విశ్వాసం కోల్పోతున్నాము మనము వారిని చాలా తీవ్రంగా దెబ్బతీద్దాం. దీంతో ఏదో ఒక సమయంలో, ఇకపై దీనిని భరించలేమని వారు చెబుతారు," అని ట్రంప్ అన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాయి.అత్యంత కఠినమైన బాంబు దాడిగా?కాగా అక్కడి కథనాల ప్రకారం, ఇరాన్ యొక్క ఇంధన మౌలిక సదుపాయాల లక్ష్యాలు, రిఫైనరీలే టార్గెట్గా ఈ దాడులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన బాంబుదాడులలో అత్యంత తీవ్రమైనదిగా నిలిచేలా ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఈ భారీ దాడులను అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపేలా ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. -
ఇరాన్ ఉలిక్కిపడేలా.. ట్రంప్, నెతన్యాహు మెగా ఆపరేషన్!
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ భారీ స్థాయి వైమానిక దాడులకు సిద్ధమవుతున్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఇరాన్ ఇంధన మౌలిక వసతులపై ఇప్పటివరకు జరగని స్థాయిలో దాడుల ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ సీబీఎస్ న్యూస్ వెల్లడించింది.ఈ దాడుల్లో ఇరాన్లోని కీలక విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు వంటి వ్యూహాత్మక లక్ష్యాలను ఎంచుకున్నట్లు సమాచారం. ఇరాన్ సైనిక కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యవస్థను కొనసాగించే సామర్థ్యాన్ని బలహీనపర్చడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ఉండొచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ భారీ ఆపరేషన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది అనుమతి ఇవ్వలేదని సమాచారం. పెంటగాన్ కూడా లక్ష్యాలపై స్పందించేందుకు నిరాకరించింది.ప్రపంచ మార్కెట్లు సోమవారం ప్రారంభమయ్యేలోపు ఈ ఆపరేషన్ను ముగించాలని అమెరికా వర్గాల్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఇంధన సరఫరాలపై దాడులు జరిగితే ప్రపంచ చమురు మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఈ అంశంపై జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ను కూడా ఈ ప్రణాళికల్లో భాగస్వామిగా ఉంచినట్లు తెలుస్తోంది. వాషింగ్టన్తో టెల్ అవీవ్ సన్నిహిత సమన్వయం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్పై పూర్తి స్థాయి సైనిక చర్యకు తిరిగి వెళ్లే నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఓ ఇజ్రాయెల్ అధికారి స్పష్టం చేశారు.ట్రంప్ అధ్యక్షతన క్యాంప్ డేవిడ్లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఇరాన్పై సైనిక ఎంపికలపై చర్చ జరిగినట్లు సమాచారం. కొందరు అధికారులు ఈ చర్యకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ట్రంప్ మాత్రం ఇరాన్పై కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ చాలా తీవ్రంగా దెబ్బతీస్తాం అనే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా లక్ష్యం ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని అడ్డుకోవడమేనని వైట్హౌస్ స్పష్టం చేసింది. అధ్యక్షుడి నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా అమలు చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని పెంటగాన్ పేర్కొంది. టెహ్రాన్ నగర విద్యుత్ సరఫరాను దెబ్బతీయడం వంటి ప్రత్యామ్నాయాలపైనా అమెరికా అధికారులు చర్చించినట్లు సమాచారం.మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ చర్యలపై ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఎలాంటి అమెరికా దాడి జరిగినా ప్రతీకార చర్యలకు సమగ్ర ప్రణాళిక సిద్ధంగా ఉందని ఇరాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్లోని కీలక మౌలిక వసతులు, ప్రాంతీయంగా ఉన్న అమెరికా ఇంధన వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం తమకు ఉందని హెచ్చరించాయి. -
అంతరిక్షంలో ఉత్కంఠ.. నాసా మిషన్కు పరీక్ష
ఎరక్కపోయి వెళ్లి ఇరుక్కుపోలేదు... రిస్క్ ఏపాటిదో తెలుసు... అంతా తెలిసే... ఆ స్పేస్ టెలిస్కోపును కాపాడటానికి వెళ్లిందొక వ్యోమనౌక. తీరా ఆ పనిలోకి దిగడానికి ముందే తానే ఆత్మరక్షణలో పడిపోయింది. రక్షించాలంటూ కేకలు పెడుతోంది! ఇప్పుడు ఆ వ్యోమనౌకను కాపాడే పనిలో తలమునకలయ్యారు శాస్త్రవేత్తలు. ఇదీ ‘నాసా’ స్పేస్ టెలిస్కోప్ ‘స్విఫ్ట్’, వ్యోమనౌక ‘లింక్’ల కథాకమామిషు!అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 2004లో ‘నీల్ గెరెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ’ని రోదసికి పంపింది. 1.5 టన్నుల బరువైన ఆ స్పేస్ టెలిస్కోప్ ప్రస్తుతం భూమి ఉపరితలానికి 200 మైళ్ల ఎత్తుకు కొద్దిగా ఎగువన కక్ష్యలో పరిభ్రమిస్తోంది. విశ్వంలో సెకన్ల వ్యవధిలోనే అపార శక్తిని విడుదల చేయగల గామా కిరణ విస్ఫోటనాలను (Gamma-ray bursts) కొన్నింటిని ‘స్విఫ్ట్’ వేధశాల తన 22 ఏళ్ల పరిశోధనల్లో పరిశీలించింది. విశ్వంలో భారీ ద్రవ్యరాశి గల నక్షత్రాలు పతనమైనప్పుడు, న్యూట్రాన్ తారల విలీనం సందర్భంగానూ ఈ తీవ్ర విస్ఫోటనాలు సంభవిస్తాయి. దృగ్గోచర కాంతితోపాటు అతినీలలోహిత, ఎక్స్-కిరణ, గామా కిరణ కాంతుల్లోనూ డేటా సేకరించగల మూడు బహుళ తరంగదైర్ఘ్య టెలిస్కోపులను ‘స్విఫ్ట్’ వినియోగిస్తుంది.అంతరిక్షంలో మనం అప్పటివరకు చూసిన వాటిలోకెల్లా అత్యంత శక్తిమంతమైన ఓ విస్ఫోటనాన్ని 2022లో ‘స్విఫ్ట్’ గుర్తించింది. ఆ గామా కిరణ విస్ఫోటనానికి ‘బోట్’ (BOAT- Brightest Of All Time) అని ముద్దుపేరు పెట్టారు. కృష్ణబిలాలు, నక్షత్రాలు, తోకచుక్కలు తదితర ఖగోళ వస్తువుల అధ్యయనానికి కూడా నాసా ఈ స్పేస్ టెలిస్కోపును ఉపయోగించింది. నాడు 25 కోట్ల డాలర్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు రెండేళ్లపాటు మాత్రమే పనిచేస్తుందని తొలుత ప్రయోగ సమయంలో భావించినప్పటికీ రెండు దశాబ్దాల పైబడి ‘స్విఫ్ట్’ సేవలు అందిస్తోంది.అయితే రోదసిలో ‘స్విఫ్ట్’ కక్ష్య క్రమంగా తగ్గిపోతోంది. ఆరంభంలో 2004లో భూమి ఉపరితలానికి 600 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దాని కక్ష్య ప్రస్తుతం 360 కిలోమీటర్ల ఎత్తులోకి వచ్చింది. ప్రతి వారం రోజులకు మైలున్నర వంతున అది కిందికి జారుతోంది. ముఖ్యంగా గడచిన రెండేళ్ల వ్యవధిలో ఈ కక్ష్య తగ్గుదల వేగం అధికంగా ఉంది. ‘స్విఫ్ట్’ ఈ ఏడాది చివరికల్లా భూవాతావరణంలో ప్రవేశించి, మండిపోయే అవకాశాలు 90 శాతం దాకా ఉన్నట్టు అంచనా వేశారు. ‘స్విఫ్ట్’ను పైకి నెట్టి, కక్ష్య పెంచగలిగితే అది మరో పదేళ్లపాటు సేవలందిస్తుంది.సమస్యలతో ‘లింక్’ వ్యోమనౌక సతమతం!భూమ్మీద కూలిపోయేలా కిందికి జారుతున్న ‘స్విఫ్ట్’ను మరింత స్థిరత్వంతో కూడిన కక్ష్యలోకి వెళ్లేలా పైకి తోయడం ఓ అసాధారణ రెస్క్యూ మిషన్. ఇందుకోసం మూడు భారీ ‘రోబోటిక్ చేతులు’ అమర్చిన ‘లింక్’ వ్యోమనౌకను నార్త్ రోప్ గ్రమ్మన్ ఏరో స్పేస్ కంపెనీకి చెందిన ‘పెగాసస్ ఎక్స్ఎల్’ రాకెట్ సాయంతో నాసా ఈ నెల 3న దిగువ కక్ష్యకు ప్రయోగించింది. అది ఇలాంటి మిషన్ చేపట్టడం ఇదే తొలిసారి. కానీ ఇక్కడే ఓ చిక్కొచ్చిపడింది. నాసా తలచినట్టుగా పని జరగలేదు సరికదా... అసలుకే మోసం వచ్చింది! ‘స్విఫ్ట్’ను రక్షించబోయి తానే ప్రమాదంలో చిక్కుకుంది ‘లింక్’ సర్వీసింగ్ వ్యోమనౌక.విద్యుత్ వ్యవస్థలో తలెత్తిన సమస్య కారణంగా ‘లింక్’ ప్రస్తుతం కక్ష్యలో స్థిరత్వం కోల్పోయి ప్రతి 40 సెకన్లకోసారి భ్రమణం పూర్తిచేస్తూ గిరగిరా తిరుగుతోంది. ‘లింక్’ గమన దిశను నియంత్రించే మూడు ‘రియాక్షన్ వీల్స్’లో రెండు వీల్స్ విఫలమైనట్టు ‘కాటలిస్ట్ స్పేస్ టెక్నాలజీస్’ సంస్థ నిపుణులు ప్రాథమిక పరిశీలనలో గమనించారు. ‘లింక్’ వ్యోమనౌకను డిజైన్ చేసింది ఈ సంస్థే. దీంతోపాటు ఆ నౌకలోని శీతల వాయు చోదక వ్యవస్థ కూడా పాక్షికంగా పనిచేయడంలేదని నాసా పేర్కొంది. ‘స్విఫ్ట్’ స్పేస్ టెలిస్కోపు చెంతకెళ్లి, దానితో కచ్చితత్వంతో అనుసంధానమవడంలో ఉపకరించే కీలక వ్యవస్థ ఇది. ఇవి మినహా ‘లింక్’లోని ఇతర వ్యవస్థలు బాగానే పనిచేస్తున్నాయి.‘స్విఫ్ట్’తో అనుసంధానమై దాన్ని ‘లింక్’ రక్షించే కార్యక్రమం వాస్తవానికి ఆగస్టు తొలి వారంలో ఆరంభమవ్వాల్సివుంది. తాజా సమస్యలతో అది ఆగస్టు నెలాఖరుకు వాయిదా పడేలా ఉంది. కక్ష్య పెంపునకు ఉద్దేశించిన ‘స్విఫ్ట్ బూస్ట్ మిషన్’ వ్యయం మూడు కోట్ల డాలర్లు (రూ.286 కోట్లు). ‘లింక్’లోని విద్యుత్ చోదక థ్రస్టర్ల సాయంతో ఆ నౌకను నియంత్రణలోకి తేవడానికి కాటలిస్ట్ స్పేస్ టెక్నాలజీస్ ఇంజినీర్లు శ్రమిస్తున్నారు. ఈ పనిలో వారు సఫలమైతే రెస్క్యూ మిషన్ కొనసాగుతుంది. విఫలమైతే ‘లింక్’, ‘స్విఫ్ట్’.. రెండిటిపైనా ఆశలు వదులుకోవాల్సిందే!-జమ్ముల శ్రీకాంత్(Courtesy: I Love The Universe, The New York Times, The Register, ABC News, Live Science, space.com) -
జాగ్రత్త.. అమెరికాలోనూ ఇదే పరిస్థితి రావొచ్చు: ట్రంప్
ఒకవైపు స్పెయిన్ సరిహద్దులో వేలాది మంది వలసదారుల ప్రవాహం.. మరోవైపు అమెరికా సరిహద్దులపై రాజకీయ చర్చ. స్పెయిన్లోని సియుటా ప్రాంతంలో చోటుచేసుకున్న భారీ వలస సంక్షోభాన్ని ఉదాహరణగా చూపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అక్రమ వలసల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. యూరప్లో కనిపిస్తున్న ఈ దృశ్యాలు భవిష్యత్లో అమెరికాలోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.“ఆ దృశ్యాన్ని గుర్తుంచుకోండి. తప్పు విధానాలు కొనసాగితే మూడేళ్లలో అమెరికాలోనూ ఇదే పరిస్థితి రావొచ్చు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. స్పెయిన్లోని సియుటా(Ceuta)లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ.. సరిహద్దుల రక్షణ, అక్రమ వలసల నియంత్రణపై కఠిన చర్యలు అవసరమని ఆయన అన్నారు.అమెరికా వలసలపై ట్రంప్ ఆందోళనఅక్రమ వలసల నియంత్రణ ట్రంప్ రాజకీయ అజెండాలో మొదటి నుంచీ కీలక అంశంగా ఉంది. అమెరికా–మెక్సికో సరిహద్దు నుంచి పెద్ద సంఖ్యలో వలసదారులు ప్రవేశించడంపై ఆయన గతంలోనూ తీవ్ర విమర్శలు చేశారు. సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయాలని, అక్రమంగా వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పదేపదే డిమాండ్ చేశారు.స్పెయిన్ సరిహద్దులో జరిగిన ఘటనను కూడా ట్రంప్ ఇదే వాదనకు ఉదాహరణగా చూపించారు. నియంత్రణ లేని వలసలు ఏ దేశానికైనా సామాజిక, భద్రతా సమస్యలు సృష్టించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.అసలేం జరిగింది?ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో నుంచి స్పెయిన్కు చెందిన చిన్న భూభాగం సియుటాలోకి గత రెండు రోజులుగా వేలాది మంది వలసదారులు ఒక్కసారిగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. యూరప్లోకి చేరేందుకు ప్రయత్నించే వలసదారులకు సియుటా కీలక మార్గంగా మారింది.గురువారం నుంచి సరిహద్దు వద్ద పరిస్థితులు తీవ్రంగా మారాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు కంచెలు దాటేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కొందరు సముద్ర మార్గంలో ఈదుకుంటూ స్పెయిన్ భూభాగంలోకి చేరేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలో జరిగిన ప్రమాదాల్లో కనీసం 57 మంది మృతి చెందినట్లు సియుటా ప్రాంత అధ్యక్షుడు జువాన్ జీసస్ వివాస్ వెల్లడించారు. కొందరు సముద్రంలో మునిగి చనిపోగా, మరికొందరు సరిహద్దు కంచె వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.24 గంటల్లోనే 60 వేల మంది?సియుటా ప్రాంతంలోకి గత 24 గంటల్లోనే దాదాపు 60 వేల మంది ప్రవేశించినట్లు ప్రాంతీయ అధికారులు తెలిపారు. అయితే స్పెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ మాత్రం గురువారం నుంచి సుమారు 50 వేల మంది సరిహద్దు దాటినట్లు అంచనా వేసింది. వీరిలో చాలా మందిని తిరిగి మొరాకోకు పంపించినట్లు స్పెయిన్ అధికారులు తెలిపారు. 48 వేల మందికి పైగా ఇప్పటికే మొరాకోకు తిరిగి వెళ్లిపోయారని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరికొందరు కూడా గంటల వ్యవధిలో వెనక్కి వెళ్తున్నారని పేర్కొంది.ఎందుకు ఒక్కసారిగా పెరిగింది వలసల ప్రవాహం?సియుటా వైపు ఇంత భారీ సంఖ్యలో వలసదారులు రావడానికి ప్రధాన కారణం.. యూరప్లోకి ప్రవేశించే అవకాశంగా ఈ మార్గాన్ని భావించడమే. ఆఫ్రికాలోని పేదరికం, నిరుద్యోగం, రాజకీయ అస్థిరత, మెరుగైన జీవితం కోసం చేసే ప్రయత్నాలు అనేక మందిని యూరప్ వైపు నడిపిస్తున్నాయి. అయితే ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి సరిహద్దు దాటే ప్రయత్నం జరగడం అసాధారణమని అధికారులు చెబుతున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాలు కూడా వలసదారులను ప్రేరేపిస్తున్నాయని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఆరోపించారు.స్పెయిన్ చర్యలు.. యూరప్లో ఆందోళనపరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్పెయిన్ అదనపు భద్రతా బలగాలను సియుటాకు పంపింది. సైన్యం, పోలీసులు, డ్రోన్లు, సముద్ర భద్రతా బృందాలను రంగంలోకి దించింది. ఈ ఉదంతంపై యూరోపియన్ యూనియన్(EU) కూడా స్పందించింది. యూరప్ నిబంధనలను పాటించకుండా ఎవరినీ అనుమతించబోమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ స్పష్టం చేశారు.స్పెయిన్లోని సియుటా సంక్షోభం ఇప్పుడు కేవలం ఆ దేశ సమస్యగా కాకుండా.. యూరప్ సరిహద్దు భద్రత, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వలసల సమస్యపై మరోసారి చర్చకు దారితీసింది. ట్రంప్ వ్యాఖ్యలతో ఈ అంశం అమెరికా రాజకీయాల్లోనూ మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. -
అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్!
అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పని చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విధానంపై భారీగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.అమెరికాలో F-1 విద్యార్థి వీసాపై చదివే విదేశీ విద్యార్థులకు చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం అక్కడే ఉండి తమ విద్యకు సంబంధించిన రంగంలో ఉద్యోగం చేసే అవకాశం OPT ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు OPT కింద పనిచేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులు చేసిన వారికి ఈ గడువు మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ఉద్యోగ అనుభవం సంపాదించడంతో పాటు, తర్వాత H-1B వర్క్ వీసా పొందేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఈ అవకాశానికి ఏకంగా 100,000 డాలర్ల ఫీజు విధించే ఆలోచన ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల మార్గం మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా తుది ప్రకటన వెలువడలేదు.ఎవరిపై భారం పడనుంది?ప్రతిపాదిత ఫీజును విద్యార్థులే చెల్లించాలా? లేక వారిని ఉద్యోగంలోకి తీసుకునే కంపెనీలే చెల్లించాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. విద్యార్థులే చెల్లించాల్సి వస్తే.. చాలా మందికి ఇది అందనంత భారంగా మారే అవకాశం ఉంది. కంపెనీలు చెల్లించాల్సి వస్తే.. విదేశీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంపై సంస్థలు వెనుకడుగు వేసే పరిస్థితి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికన్ విద్యార్థులకు ప్రాధాన్యం పెరిగి, అంతర్జాతీయ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.భారతీయ విద్యార్థులపై ప్రభావం ఎంత?అమెరికా ఉన్నత విద్యకు భారతీయ విద్యార్థులు ప్రధాన వర్గంగా ఉన్నారు. ప్రస్తుతం లక్షలాది మంది భారతీయులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. చాలామంది విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం మాత్రమే కాకుండా.. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేసి అంతర్జాతీయ అనుభవం పొందాలనే లక్ష్యంతో అమెరికాకు వెళ్తున్నారు.అమెరికా విద్య కోసం కుటుంబాలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో.. OPTపై భారీ ఫీజు ప్రతిపాదన విద్యార్థులపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.నాలుగేళ్ల వీసా పరిమితి కూడా!OPT ఫీజు ప్రతిపాదనతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనల్లో మరో కీలక మార్పు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు విదేశీ విద్యార్థులు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” విధానంలో అమెరికాలో ఉండేవారు. అంటే.. వారు తమ కోర్సును నిబంధనల ప్రకారం కొనసాగిస్తున్నంత కాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది.తాజా ప్రతిపాదనల ప్రకారం.. విద్యార్థులకు గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు మాత్రమే ఉండే అనుమతి ఇవ్వాలనే ఆలోచన ఉంది. అంతకంటే ఎక్కువ సమయం అవసరమైతే.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న కారణంఅమెరికా వలస విధానాన్ని మరింత పర్యవేక్షించడం, చట్టబద్ధమైన వలస వ్యవస్థను బలోపేతం చేయడం, దేశ భద్రతను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే విద్యా రంగ నిపుణులు మాత్రం.. ఇలాంటి నిబంధనలు అమెరికాను అంతర్జాతీయ విద్యార్థులకు తక్కువ ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికిప్పుడు ఆందోళన అవసరం లేదా?$100,000 OPT ఫీజు ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే అమెరికా వలస విధానంలో క్రమంగా కఠినమైన మార్పులు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసి అక్కడే కెరీర్ నిర్మించుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇకపై మార్గం మరింత ఖరీదైనదిగా, నిబంధనలతో కూడుకున్నదిగా మారే అవకాశం ఉంది. -
ప్రాణాలు కాపాడిన వాచ్
అవును! మీరు చదివింది నిజమే. ఆపిల్ వాచ్ అమెరికాలో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. అతని వాచ్లోని ‘ఫాల్ డిటెక్షన్’ఫీచర్ ఆటోమేటిక్గా పనిచేసి ఎమర్జెన్సీకి కాల్ చేసి అతనికి సరైన సమయంలో వైద్యం అందేలా చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం.. ఒహాయోకు చెందిన మహమ్మద్ ఇస్లాం అనారోగ్యంగా అనిపించడంతో ఆఫీసులో సెలవు తీసుకుని ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఆ రోజు ఉదయం ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెవి దగ్గర నొప్పి, నడవడం కూడా కష్టంగా అనిపించింది. అయినా, ఇంట్లో చెత్తను పడేయడానికి బయటికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అలా ఎంతసేపు పడి ఉన్నాడో తెలియదు.. స్పృహ వచ్చేసరికి విపరీతమైన చెమటలు. అతికష్టం మీద లేచి పక్కనే ఉన్న కుర్చీని పట్టుకుని కూర్చున్నాడు. ఇంతలో అంబులెన్స్ సైరన్ శబ్దం. తాను కింద పడటాన్ని గుర్తించిన ఆపిల్ వాచ్ అత్యవసర సేవలకు కాల్ చేసిందని గ్రహించాడు. వెంటనే సిన్సినాటి విశ్వవిద్యాలయంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతని ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టిందని వైద్యులు గుర్తించారు. తాను బతికి ఉన్నానంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటున్నాడు. తన చేతి ఆపిల్ వాచ్లో ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఎలా పనిచేసిందో చెబుతున్నాడు. వాచ్ ఏం చేసింది? అతను గట్టిగా కింద పడటాన్ని వాచ్ గ్రహించింది. మణికట్టును తట్టి, అలారం మోగించి, ‘ఆర్ యూ ఓకే’అని అడుగుతూ ఒక హెచ్చరికను ప్రదర్శిస్తుంది. వాచ్ ధరించిన వ్యక్తి కదులుతూ ఉంటే, స్పందించే వరకు వేచి ఉంటుంది. కానీ, ఆ వ్యక్తి సుమారు ఒక నిమిషం పాటు కదలకుండా ఉన్నారని గుర్తిస్తే, 30–సెకన్ల కౌంట్డౌన్తో మణికట్టును తడుతూ క్రమంగా, బిగ్గరగా హెచ్చరికను మోగిస్తుంది. కౌంట్డౌన్ ముగిసినా ఎలాంటి స్పందన రాకపోతే, వాచ్ స్వయంచాలకంగా అత్యవసర సేవలకు కాల్ చేస్తుంది. ఖచ్చితమైన లొకేషన్ను కూడా షేర్ చేస్తుంది. వ్యక్తి కింద పడిపోయాడని గుర్తించినట్లు అత్యవసర కాంటాక్ట్లకు సందేశం పంపుతుంది. ఈ ఫీచర్ 55 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి డిఫాల్ట్గా ఆన్లో ఉంటుంది. 18 నుంచి 54 ఏళ్ల మధ్య వయస్సున్నవారైతే మాన్యువల్గా ఆన్ చేసుకోవచ్చు. మహమ్మద్ ఇస్లాం విషయంలోనూ ఇదే జరిగింది. ఫోన్ ఎమర్జెన్సీకి కాల్ చేసింది. ఈ లోపు అతనికి స్పృహ రావడం ఇంకా మంచిదైంది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
వార్ని..అమెరికా సైనికుడ్ని వివాహం చేసుకుంటే ఇన్ని బెనిఫిట్సా!
వాషింగ్టన్: అమెరికా ఆర్మీలో పనిచేస్తున్న ఓ సైనికుడిని వివాహం చేసుకున్న భారతీయ మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అమెరికన్ సైనికుడిని పెళ్లి చేసుకోవడం వల్ల తమకు లభించే మూడు ప్రధాన ప్రభుత్వ ప్రయోజనాల గురించి ఆమె వివరించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అబ్బా.. ఇన్ని సౌకర్యాలా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.భారతీయ మహిళ పేరు మేఘనా. ఆమె అమెరికా ఆర్మీలో పనిచేస్తున్న సైనికుడు మైఖేల్ లేలాండ్ హిల్ను వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా అమెరికన్ సైనికుడిని వివాహం చేసుకుంటే లభించే ప్రయోజనాలను వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో మైఖేల్ లేలాండ్ హిల్ మాట్లాడుతూ.. ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి ఎడ్యుకేషన్ అని చెప్పారు. అమెరికాలో సైనిక కుటుంబాలకు అందుబాటులో ఉన్న కొన్ని విద్యా ప్రయోజనాల కింద అర్హతను బట్టి ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం, భత్యాలు లభిస్తాయని వివరించారు. కొన్ని విద్యా పథకాల కింద నెలవారీ భత్యం కూడా లభిస్తుందని తెలిపారు.రెండో ప్రధాన ప్రయోజనం హెల్త్ ఇన్సూరెన్స్ అని పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్తో పాటు ఇతర సైనిక ఆరోగ్య పథకాల ద్వారా అర్హులైన సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.మూడో ప్రయోజనంగా వీఏ హోమ్ లోన్ సౌకర్యాన్ని ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా అర్హులైన మాజీ సైనికులు, సేవలో ఉన్న సైనికులు తక్కువ ముందస్తు చెల్లింపుతో లేదా కొన్ని సందర్భాల్లో డౌన్ పేమెంట్ లేకుండానే గృహ రుణం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. రుణానికి సంబంధించిన కొన్ని ఫీజులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. వేలాది మంది కామెంట్లు చేశారు. చాలా మంది భారతీయులు దీనిని భారత సాయుధ దళాల్లో అందించే సౌకర్యాలతో పోల్చారు. -
కూతురు ఇచ్చిన గిఫ్ట్.. ప్రాణం కాపాడిన వాచ్!
టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న కొద్దీ చాలా పనులు సులభంగా జరిగిపోతున్నాయి. దీంతో జీవితాలు కూడా సాఫీగా ముందుకు సాగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా సాంకేతికత ప్రాణాలను కాపాడుతోంది. దీనికి అమెరికాలో జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలిచింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.అమెరికాలోని ఒహాయో రాష్ట్రం, సిన్సినాటి నగరానికి చెందిన మహ్మద్ ఇస్లాం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అనుకోని ఒక సంఘటన జరిగింది. ఇంటి బయట చెత్త వేయడానికి వెళ్లిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలి స్పృహ కోల్పోయారు. కొంతసేపటి తర్వాత స్పృహ వచ్చినా.. లేచి నిలబడే పరిస్థితిలో లేకపోయారు. శరీరాన్ని కదిలించలేక నేలపైనే ఉండిపోయారు. ఆ సమయంలో ఆయన కట్టుకున్న యాపిల్ వాచ్ ప్రమాదాన్ని వెంటనే గుర్తించింది.వాచ్లో ఉన్న ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఆయన పడిపోయిన విషయాన్ని గుర్తించి, ఎలాంటి స్పందన లేకపోవడంతో స్వయంచాలకంగా అత్యవసర సేవలకు కాల్ చేసింది. అంతేకాకుండా.. ముందుగా నమోదు చేసిన అత్యవసర కాంటాక్ట్లకు కూడా సమాచారం పంపింది. కొద్దిసేపటికే అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని మహ్మద్ ఇస్లాంను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆయన ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు.సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడం వల్లే ఆయనకు వెంటనే చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం లభించిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు ముందు నుంచే.. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు సంబంధిత సమస్యలు, నడవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించినప్పటికీ అసలు కారణం ఏమిటో తెలియలేదని చెప్పారు. కుప్పకూలిన తర్వాతే పరిస్థితి తీవ్రంగా ఉందని గుర్తించారు.మహ్మద్ ఇస్లాంకు ఈ యాపిల్ వాచ్ను ఆయన కుమార్తె గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వాచ్ తమ తండ్రి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిందని తెలుసుకుని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత సాంకేతిక పరికరాలు కేవలం సౌకర్యాలకే పరిమితం కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణరక్షక సాధనాలుగా కూడా ఉపయోగపడతాయని మరోసారి స్పష్టమైంది.ఇదీ చదవండి: రైలు ఏసీ కోచ్లో రెండు బెడ్షీట్లు ఎందుకు ఇస్తారో తెలుసా? -
అమెరికాలో దీప కారు ప్రమాదం వెనుక అసలు నిజం ఇదే..?
-
అమెరికా ‘హెవీ వేవ్’ దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం!
మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరాన్ నుంచి అమెరికా స్థావరాలపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ వైమానిక దాడులు చేపట్టింది. దక్షిణ ఇరాన్లోని కీలక ప్రాంతాలపై ‘హెవీ వేవ్’ పేరుతో దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ దాడులతో పాటు ఇరాక్లో ఇరాన్ అనుకూల మిలీషియాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త చర్యలు చేపట్టడం, యెమెన్లో హౌతీల కదలికలు, హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడం.. మొత్తం ప్రాంతాన్ని యుద్ధ వాతావరణంలోకి నెట్టాయి.ఇరాన్లోని రెవల్యూషనరీ గార్డ్ (IRGC)కు చెందిన స్థావరాలే లక్ష్యంగా తాజాగా అమెరికా దాడులు జరిపింది. సైనిక కమాండ్ కేంద్రాలు, మిసైల్, డ్రోన్ సదుపాయాలు, తీర రక్షణ వ్యవస్థలు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన కేంద్రాలను టార్గెట్ చేసినట్లు అమెరికా వెల్లడించింది. అబాదాన్, బుషెహర్, కిష్, క్విష్మ్ దీవులు, ఖుజెస్తాన్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. కిష్ దీవిలోని కజెరూన్ ప్రాంతంలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం.క్విష్మ్లో నివాస భవనంపై మిసైల్.. రెస్క్యూ కొనసాగింపుఅమెరికా దాడుల్లో క్విష్మ్ దీవిలోని ఓ నివాస భవనం దెబ్బతింది. మిసైల్ దాడితో భవనం కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి ఇద్దరు చిన్నారులను రక్షించి ఆస్పత్రికి తరలించాయి. మరో ముగ్గురి కోసం శిథిలాల తొలగింపు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన యుద్ధంలో పౌర ప్రాంతాలు కూడా ప్రభావితమవుతున్నాయన్న ఆందోళనలను పెంచింది.‘ఇప్పుడు మా వంతు’.. ట్రంప్ హెచ్చరికల తర్వాతే దాడులుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా బలగాలపై దాడులకు ప్రతిస్పందన తప్పదని స్పష్టం చేసిన ఆయన.. “ఇప్పుడు కొట్టే వంతు మాది” అనే సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ నుంచి దాడులను ఆపాలని కోరినా అమెరికా చర్యలు తప్పవని ట్రంప్ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే వైమానిక దాడులు ప్రారంభమయ్యాయి.జోర్డాన్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులుఇటీవల జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసినట్లు అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు వాషింగ్టన్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ మాత్రం తమ చర్యలను అమెరికా బెదిరింపులకు ప్రతిస్పందనగా సమర్థించుకుంది. అమెరికా ఒత్తిడి కొనసాగితే ప్రతిఘటన కూడా కొనసాగుతుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ హెచ్చరించింది.ఇరాక్లో అమెరికా–సౌదీ దాడులు.. తీవ్ర ఉద్రిక్తతయుద్ధ ప్రభావం ఇరాక్కు కూడా చేరింది. ఇరాన్కు అనుబంధంగా ఉన్న మిలీషియా గ్రూపుల స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త దాడులు జరిపాయి. ఈ దాడుల్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ (PMF)కు చెందిన పలువురు సభ్యులు మరణించినట్లు సమాచారం. కనీసం 20 మంది మృతి చెందినట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఇరాక్ ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించింది.రంగంలోకి హౌతీలు.. యెమెన్ నుంచి మరో ముప్పుఇరాన్కు మద్దతుగా వ్యవహరిస్తున్న యెమెన్లోని హౌతీ గ్రూపు కూడా ఈ ఘర్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. సౌదీ అరేబియా చమురు రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులు చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిగా హోడెయిడా ప్రావిన్స్లోని హౌతీ స్థావరాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధ ప్రభావం గల్ఫ్ ప్రాంతం దాటి యెమెన్ వరకు విస్తరించింది.హర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న టెన్షన్ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మరోసారి యుద్ధ కేంద్రంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఆంక్షలు విధించడం, అనుమతి లేని మార్గాల్లో వెళ్లే ట్యాంకర్లను అడ్డుకుంటామని హెచ్చరించడం ఉద్రిక్తతలకు కారణమైంది. ఇరాన్ నౌకాదళం మూడు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు అమెరికా మాత్రం అంతర్జాతీయ నౌకాయానానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. హర్ముజ్లో అమెరికా ఆంక్షలను దిక్కరించిన లావిన్ ట్యాంకర్పై దాడి జరిగింది. ఇంజిన్ రూమ్పై కాల్పులు జరపడంతో నౌక దెబ్బతింది. ఈజిప్ట్ పోర్టులో డ్రోన్ దాడి కలకలం?యుద్ధం కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందన్న సంకేతంగా ఈజిప్ట్లోని డమియెట్టా పోర్టులో అమెరికాకు చెందిన ఎల్ఎన్జీ ట్యాంకర్పై డ్రోన్ దాడి ఘటన కలకలం రేపింది. దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగాయి. మంటలు మరో నౌకకు కూడా వ్యాపించాయి. అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇది ఇరాన్ జరిపిన డ్రోన్ దాడియేనా?.. లేదంటే అగ్నిప్రమాదమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చమురు ధరలకు యుద్ధ సెగమిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై పడుతోంది. యుద్ధ భయాలతో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఏకంగా సెంచరీ దాటేశాయి. ఇరాన్ చమురు స్థావరాలు, హర్ముజ్ జలసంధి భద్రతపై అనిశ్చితి కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రాంతీయ యుద్ధంగా మారుతున్న ఘర్షణఅమెరికా–ఇరాన్ మధ్య మొదలైన పోరు ఇప్పుడు ఇరాక్, యెమెన్, సౌదీ అరేబియా, సముద్ర మార్గాల వరకు విస్తరించింది. ఒకవైపు ప్రతీకార దాడులు.. మరోవైపు చమురు మార్గాలపై ముప్పు.. ఇంకోవైపు మిత్ర దేశాల జోక్యం.. ఇవన్నీ కలిసి మిడిల్ ఈస్ట్లో పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చుతున్నాయి. -
మళ్లీ భీకర యుద్ధం.. ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా బుధవారం రాత్రి ఇరాన్పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ భూభాగంపై దాదాపు వారం రోజుల తర్వాత అమెరికా చేపట్టిన తొలి ప్రత్యక్ష దాడులు ఇవే.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ దాడులను ధ్రువీకరించింది. ఇరాన్ నుంచి అమెరికా బలగాలపై జరిగిన దాడులకు ఇది “శక్తివంతమైన ప్రతిస్పందన” అని పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు దాడులు ప్రారంభమైనట్లు తెలిపింది.U.S. forces began launching strikes against Iran at 8 p.m. ET today. The strikes are a powerful response to yesterday's attempted Iranian attacks on U.S. forces based in the Middle East.— U.S. Central Command (@CENTCOM) July 30, 2026ట్రంప్ హెచ్చరికల తర్వాతే..ఇరాన్పై దాడులకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో.. ‘‘ఇరాన్కు గట్టి సమాధానం ఇస్తాం.. చాలా బలంగా ఎదురుదాడి చేస్తాం’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లు దాడి చేశారు.. ఇప్పుడు మా వంతు వచ్చింది’’ అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ చర్యలకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.🚨 BREAKING: President Trump is warning adversaries that a forceful U.S. response is coming after a drone attack on an LNG tanker off the coast of Egypt."We're going to hit them very hard."Trump confirmed five rockets were fired and signaled that retaliation is imminent,…— Stephen Gardner (@StephenGardnerX) July 29, 2026దక్షిణ ఇరాన్లో పేలుళ్ల శబ్దాలుఅమెరికా దాడుల తర్వాత దక్షిణ ఇరాన్లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే అమెరికా దాడుల లక్ష్యాలు, నష్టం వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు.ప్రతిఘటన ఉంటుంది: ఇరాన్అమెరికా బెదిరింపులు కొనసాగినంత కాలం తమ ప్రతిఘటన కొనసాగుతుందని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. అమెరికా బలగాలపై తాము చేపట్టిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది.ఇరాన్ నావికా దళాలు హార్ముజ్ జలసంధి వైపు వెళ్తున్న మూడు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా సమాచారం వెలువడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గంపై ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళనకు కారణమవుతోంది.ఇరాక్లోనూ ఉద్రిక్తతలు..ఇరాక్లో అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త దాడులపై అక్కడి ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్కు చెందిన 20 మంది మరణించగా.. మరో 32 మంది గాయపడినట్లు సమాచారం. ఈ పరిణామాలు ఇరాక్ను కూడా ప్రాంతీయ ఘర్షణలోకి లాగుతున్నాయని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.చర్చల నుంచి యుద్ధం వైపు?..కొద్ది రోజుల క్రితం ఇరాన్తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ట్రంప్ చెప్పినప్పటికీ.. తాజా పరిణామాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇరాన్ తీవ్ర చర్యలకు దిగితే యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించాల్సి వస్తుందని ట్రంప్ గతంలో హెచ్చరించారు.అమెరికా తాజా దాడులతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి పరిణామాలు ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
అమ్మో.. అమెరికా వీసా
సాక్షి, హైదరాబాద్: యూఎస్ వీసాలు అందక అమెరికా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. విద్యార్థి వీసాల జారీలో యూఎస్ ముప్పు తిప్పలు పెడుతోంది. కొన్ని యూనివర్సిటీలు ఒక వైపున ఐ–20 జారీ చేయడం లేదు. మరోవైపు సెప్టెంబర్ 15లోగా అడ్మిషన్లు పూర్తి చేస్తామని హెచ్చరిస్తున్నాయి. దీంతో విద్యార్థుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. ఇంకోవైపు వర్సిటీల నుంచి ఐ–20 లెటర్లు వచి్చన 70 వేల మంది విద్యార్థులకు ఇంత వరకూ వీసా స్లాట్లు బుక్ అవ్వలేదని ఢిల్లీకి చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకుడు తెలిపారు. స్లాట్లు ఇచ్చి వీసాకు పిలిచినా చిన్నచిన్న కారణాలతోనే వీసా తిరస్కరిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. భారత్ నుంచి ఏటా 3.20 లక్షల మంది అమెరికా వెళ్తుంటారు. వీరిలో 1.90 వేల మంది విదేశీ విద్య కోసం వెళ్లేవారే. ఈ సెప్టెంబర్ నుంచి అమెరికాలో ఫాల్ సీజన్ మొదలవుతుంది. ఆగస్టు నుంచే అక్కడ వర్సిటీలు ప్రవేశాలు మొదలుపెడతాయి. విద్యార్థులు ఆరు నెలల ముందే వీసా కోసం సిద్ధమవుతుంటారు. ఎందుకీ పరిస్థితి? విద్య కోసం వెళ్లే విద్యార్థులకు అమెరికా ఎఫ్–1 వీసా ఇస్తుంది. ఇది పొందాలంటే ముందుగా యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ ఇవ్వాలి. ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. వర్సిటీలపై అమెరికా ప్రభుత్వం రెండేళ్లుగా నిఘా పెంచింది. సవాలక్ష నిబంధనలు తీసుకొచ్చింది. విద్యార్థి నేపథ్యం తెలియకుండా ప్రవేశం కలి్పంచినా, ఆ విద్యార్థి అమెరికా దృష్టిలో చెప్పబడే అసాంఘిక శక్తులతో సంబంధం ఉన్నట్టు తేలినా వర్సిటీపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతోపాటే చదవు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉండే గ్రేస్ పీరియడ్ను 60 నుంచి 30 రోజులకు తగ్గించింది.నాలుగేళ్ల పీహెచ్డీ కోర్సుకు అదనపు అనుమతులు కావాలనే షరతు పెట్టారు. పీహెచ్డీ అనుకున్న కాల వ్యవధిలో పూర్తి చేస్తామనే భరోసా తీసుకోవాలనే నిబంధన విధించారు. దీంతో వర్సిటీలు కూడా జాగ్రత్త పడాల్సి వస్తోంది. విద్యార్థులకు సంబంధించిన రికార్డులన్నీ పరిశీలించిన తర్వాతే ఐ–20 పత్రాలు ఇస్తున్నాయి. వీసాలకు ఇది ప్రధాన అడ్డంకిగా మారింది. మరోవైపు వర్సిటీల ప్రవేశాలపై కూడా ఇవన్నీ ప్రభావం చూపుతున్నాయి. వీసా దగ్గర తిప్పలే స్టూడెంట్ వీసా తీసుకోవడం కష్టంగానే మారింది. ఐదేళ్లుగా విద్యార్థి ఉపయోగించిన సాషల్ ఖాతాలను ఇమ్మిగ్రేషన్ పరిశీలిస్తోంది. కొన్ని సందర్భాల్లో పబ్లిక్గా కనిపించే పోస్టులపైనా వాకబు చేస్తున్నారు. గతంలో కోర్సు పూర్తి చేసిన తర్వాత కొంతకాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. ఇలాంటి విద్యార్థులకు వర్సిటీలు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కి అనుమతించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. దీనికి వర్సిటీలు భయపడుతున్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థి ఎలాంటి చర్యలకు పాల్పడినా వర్సిటీలే బాధ్యత వహించాలనే నిబంధన తెచ్చారు.దీంతో వర్సిటీలు వెనక్కి తగ్గుతున్నాయి. వీసా సమయంలో ఆర్థిక పత్రాలన్నీ పరిశీలించడానికి ఎక్కువ సమయం పడుతోంది. ప్రతీ విద్యార్థి పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాల్సి రావడంతో వీసా స్లాట్ల సంఖ్య తగ్గిపోతోంది. అమెరికాలో చదువుకునే సమయం, ఆ తర్వాత గ్రేస్ పీరియడ్లో నివసించడానికి అవసరమైన మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో విద్యార్థులు చూపిస్తారు. ఈ మొత్తం ఎక్కడ్నుంచీ వచి్చందనేది లోతుగా పరిశీలించిన తర్వాతే వీసాలు ఇస్తున్నారు. మరోవైపు విద్యార్థి ఇంటర్వ్యూ సమయంలో ఏమాత్రం సరైన సమాధానం ఇవ్వలేదని భావించినా వీసా తిరస్కరిస్తున్నారు. అన్నీ పంపాం.. ఇంకా లెటర్ ఇవ్వలేదు ఎంఎస్ కోసం యూఎస్ వెళ్లాలని ఏడాదిగా ప్రయత్నాలు చేస్తున్నా. వీసాకు దరఖాస్తు చేశాను. వర్సిటీ ఇంకా ఐ–20 లెటర్ ఇవ్వలేదు. వారిని మెయిల్లో సంప్రదిస్తే ఇంకా పరిశీలనలో ఉందంటున్నారు. సెపె్టంబర్ నుంచే అకడమిక్ ఈయర్ మొదలువుతంది. ఆగస్టులో వెళ్తే తప్ప మేం అక్కడ అన్ని ఏర్పాట్లూ చూసుకోలేం. – వీసం పల్లవి, హైదరాబాద్ రోజుకో సమాచారం అడుగుతున్నారు అమెరికా యూనివర్సిటీ లెటర్ కూడా వచ్చింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు రోజుకో లెటర్ అడుగుతున్నారు. సోషల్ ప్లాట్ఫాంలో పెట్టిన సాధారణ పోస్టులపైనా వివరాలు ఇవ్వమన్నారు. బ్యాంకు ఖాతాలోకి వచ్చిన డబ్బులు, మాకు అప్పు ఇచి్చన వారి వివరాలు కోరారు. వారి బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ అడిగారు. అప్పు ఇచ్చిన వారు భయపడుతున్నారు. అసలు అమెరికా వెళ్లగలమా? లేదా? అనే ఆందోళనలో ఉన్నాం. – మహ్మద్ షరీఫ్, వరంగల్ -
ఇరాన్ మిలిటెంట్లపై అమెరికా–సౌదీ దాడి
కైరో: పశ్చిమాసియాలో దాడుల పరంపర ఆగడం లేదు. ఇరాక్ భూభాగంలో ఇరాన్ మద్దతుగల మిలిటెంట్లపై సౌదీ అరేబియాతో కలిసి మంగళవారం అర్ధరాత్రి తర్వాత అమెరికా దాడి చేయగా.. బుధవారం తెల్లవారుజామున ఇరాన్ సైన్యం గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా బలగాలపై క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా–సౌదీ అరేబియా దాడిలో కనీసం 20 మంది మరణించారు. 32 మంది గాయపడ్డారు. ఈ దాడిలో ఆరుగురు ఇరాన్ సలహాదారులు మరణించారని ఇరాకీ మిలీíÙయా సిబ్బంది తెలిపారు. మరణించిన 20 మందిలో ఈ సలహాదారులు కూడా ఉన్నారా లేదా అనేది తెలియరాలేదు. పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరగడం చూస్తూ మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు అమెరికా వద్ద అత్యాధునిక ఆయుధ నిల్వలు ఇప్పటికే తగ్గిపోయినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా తమ చమురు కేంద్రాలపై ఇరాకీ మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేశాయని సౌదీ అరేబియా ఆరోపించింది. సౌదీ అరేబియాపై జరిగినట్లు చెబుతున్న డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా, తమ యుద్ధ విమానాలు తూర్పు ఇరాక్లోని పలు రవాణా, ఆయుధ స్థావరాలపై దాడి చేశాయని అమెరికా సైన్యం తేల్చిచెప్పింది. జోర్డాన్లోని అమెరికా సైనిక కేంద్రమైన మువఫాక్ సాల్టి వైమానిక స్థావరంపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ ఇస్లామిక్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్ వెల్లడించింది. మరోవైపు ఐదు ఇరాన్ క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు జోర్డాన్ సైన్యం స్పష్టంచేసింది. ఇరాన్కు చావుదెబ్బలు తప్పవు: ట్రంప్ పశ్చిమాసియాలో తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడం, బాలిస్టిక్ క్షిపణులు పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గట్టిగా స్పందిస్తామని, ఇరాన్ను తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇరాన్కు చావుదెబ్బలు తప్పవని బుధవారం ప్రతిజ్ఞ చేశారు. జోర్డాన్లోని అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అనంతరం దీనిపై ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ గట్టిగా విరుచుకుపడతామని, మర్చిపోలేని రీతితో దెబ్బకొడతామని స్పష్టంచేశారు. -
అమెరికాకు బిగ్ షాక్.. ఆ సంచలన సర్వేలో ఏముంది?
ఈ మధ్య ఒక ఆసక్తికరమైన వార్త.. 'ప్యూ రీసెర్చ్ సెంటర్' (Pew Research Center) ఒక సంచలన సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 37 దేశాల్లో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ సర్వే చేశారు. దీంట్లో బైటపడిన మోస్ట్ ఐ-క్యాచింగ్, షాకింగ్ విషయం ఏంటంటే..? ఆధునిక చరిత్రలో మొట్టమొదటిసారిగా, ప్రజలు అమెరికా కంటే చైనానే ఎక్కువగా ఇష్టపడుతున్నారట..! అవును..! మీరు చదివింది నిజమే..! ప్రపంచవ్యాప్తంగా అమెరికా సాధించుకున్న 'సాఫ్ట్ పవర్' క్రమక్రమంగా ఎలా కరిగిపోతుందో చెప్పడానికి ఇదొక పెద్ద నిదర్శనం.ఈ సర్వే అసలు ఏం చెబుతుందంటే..అసలు అమెరికా మీద ఈ వ్యతిరేకత ఎందుకు పెరుగుతోంది..? చైనా గ్రాఫ్ ఎందుకు అకస్మాత్తుగా పైకి వెళ్తోంది..? దీనివల్ల ప్రపంచ రాజకీయాల్లోనే కాకుండా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నిజంగానే ఏమైనా మార్పు వస్తుందా? ముందుగా ఈ సర్వే అసలు ఏం చెబుతుందంటే.. అమెరికా గ్రాఫ్ పడిపోవడానికి కేవలం అమెరికా తప్పులే కారణం కాదు..! చైనా తన ఇమేజ్ను గతంతో పోలిస్తే చాలా మెరుగుపరుచుకుంది. సర్వే చేసిన 37 దేశాల సగటు చూసుకుంటే.. చైనాకు అనుకూలంగా 51 శాతం మంది ఓటు వేస్తే, వ్యతిరేకత 39 శాతమే ఉంది..! అంటే చైనాకు నెట్ పాజిటివ్ ఇమేజ్ ఉందన్నమాట..! ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా, సౌత్-ఈస్ట్ ఆసియా దేశాల్లో చైనాకు మంచి మద్దతు ఉంది. మన ఇండియా మాత్రం దీనికి మినహాయింపు అనుకోండి..!కారణం ఇదే..అలాగే, పేద దేశాల్లో చైనాకు ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. ఐరోపా లాంటి ధనిక దేశాల్లో చూస్తే.. స్వీడన్, జర్మనీ, నెదర్లాండ్స్ లాంటి అత్యంత ధనిక దేశాల ప్రజలు చైనాను కాస్త తక్కువగా ఇష్టపడినా, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 తర్వాత చైనా మీద ఉన్న నెగెటివిటీ అయితే చాలావరకు తగ్గిపోయింది. కానీ, అమెరికా పరిస్థితి పూర్తిగా తారుమారైంది..! ఆ 37 దేశాల సగటు తీసుకుంటే.. అమెరికాను కేవలం 37 శాతం మందే ఇష్టపడుతున్నారు. ఏకంగా 57 శాతం మంది అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడారు.కేవలం 9 దేశాల్లో మాత్రమే..గత ఏడాదితో పోలిస్తే, ఒక్క మెక్సికో మినహా ప్రతి దేశంలోనూ అమెరికా మీద అభిమానం దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు అమెరికా అంటే పడిచచ్చే జర్మనీ లాంటి దేశాల్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. జర్మనీలో కేవలం 27 శాతం మందే అమెరికాను ఇష్టపడుతున్నారు. కానీ చైనాను ఇష్టపడేవాళ్ళు మాత్రం దానికంటే ఎక్కువే ఉన్నారు..! ప్రపంచంలో కేవలం 9 దేశాల్లో మాత్రమే.. అంటే బ్రెజిల్, ఘనా, హంగేరి, పోలాండ్, ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా, ఇండియా, జపాన్, ఇజ్రాయెల్ ఇప్పటికీ చైనా కంటే అమెరికానే బెటర్ అనుకుంటున్నారు.ఇదొక్కటే సమస్య కాదు..సరే..! అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి..? ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది 'డొనాల్డ్ ట్రంప్' గురించి. అమెరికా వెలుపల ట్రంప్కు పాపులారిటీ ఎంత తక్కువగా ఉందో ఈ సర్వే మరోసారి నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 23 శాతం మందికి మాత్రమే ట్రంప్ మీద నమ్మకం ఉందట..! జో బైడెన్తో పోలిస్తే ఇది చాలా తక్కువ..! అయితే ఇదొక్కటే సమస్య కాదు..! అమెరికా గత దశాబ్ద కాలంగా ప్రతి నాలుగేళ్లకోసారి వైట్హౌస్లో నాయకులు మారినప్పుడల్లా తన విదేశాంగ విధానాన్ని మార్చేస్తూ వస్తోంది. దీనివల్ల 'అమెరికా ఒక నమ్మకమైన భాగస్వామి కాదు' అనే అభిప్రాయం ప్రపంచ దేశాల్లో బలపడింది.కానీ.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది..! కానీ, ఇక్కడ ట్రంప్ లాంటి వాళ్ళైతే ఒకటే మాట అనొచ్చు.. 'ఐ డోంట్ కేర్!' అని..! ఎందుకంటే, మెత్తగా మాట్లాడితే సాఫ్ట్ పవర్ వస్తుంది. కానీ, అందరూ మనల్ని మోసం చేస్తారనేది ఆయన వాదన. టారిఫ్లు, మిలిటరీ బెదిరింపులు లాంటి 'హార్డ్ పవర్' ఉపయోగించడం ద్వారానే అమెరికా తన పనులు సాధించుకోవచ్చని ట్రంప్ గట్టిగా నమ్ముతారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది..! హార్డ్ పవర్ని మాత్రమే నమ్ముకోవడం వల్ల కొన్ని షార్ట్-టర్మ్ లాభాలు రావచ్చు. కానీ, లాంగ్-టర్మ్లో అమెరికా చాలా నష్టపోతోంది. ఇప్పుడు చైనా లాంటి మరో పెద్దన్న ఉన్నాడు..ఇందులో మొదటిది.. ఇతర దేశాలు అమెరికా దెబ్బకు భయపడి తమని తాము రక్షించుకోవడానికి కొత్త దారులు వెతుక్కుంటాయి. రెండవది.. ఇది మల్టీపోలార్ (Multipolar) ప్రపంచం..! ఇప్పుడు చైనా లాంటి మరో పెద్దన్న ఉన్నాడు. కండబలం చూపిస్తే మిగతా దేశాలు చైనాతో చేతులు కలిపేస్తాయి. అప్పుడు అమెరికా బొక్క బోర్లా పడాల్సిందే..!. ఇక మూడవది.. అమెరికా నాయకులు ఒక భ్రమలో ఉంటారు..! 'మా దగ్గర బలం ఉంది. కాబట్టి మిగతా దేశాలు మేము చెప్పినట్లు వింటాయి' అని. కానీ, ఇది తప్పు..! బ్రెజిల్ లాంటి దేశాల ఉదాహరణే తీసుకోండి. ట్రంప్ బ్రెజిల్ మీద టారిఫ్ బాంబులు వేస్తామని బెదిరించినా, అక్కడి అధ్యక్షుడు 'లూలా' వెనక్కి తగ్గలేదు సరికదా.. మరింత గట్టిగా బదులిచ్చారు. ఎందుకంటే అక్కడ ప్రజలకు జాతీయవాదం ముఖ్యం. కాబట్టి, లూలా అలా చేయడం వల్ల అక్కడి ప్రజల్లో ఆయన గ్రాఫ్ ఇంకా పెరిగింది..!అమెరికా నెగ్గుకురాగలదా..?మొత్తానికి చూస్తే.. రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ హయాం, అమెరికాకు ఒక పెద్ద టెస్ట్ కేస్ అని చెప్పవచ్చు..! దశాబ్దాలుగా అమెరికా అంటే 'సాఫ్ట్ పవర్'.. 'హార్డ్ పవర్' రెండింటి కలయిక. మరి ఇప్పుడు కేవలం కండబలం అదే.. Hard Power మాత్రమే చూపించి అమెరికా నెగ్గుకురాగలదా..? లేదా తన గ్లోబల్ లీడర్షిప్ను కోల్పోతుందా..? రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెబుతుంది.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్ట్ -
ట్రంప్కు షాకిచ్చిన డెమెుక్రాట్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు వెంటే చాలు మెుదటగా గుర్తుకొచ్చేది వలసదారులపై ఆయన చేసే ఆగడాలే.. ఎంతో కాలంగా అమెరికా అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న వారిని ఏదో నెపంతో దేశం నుంచి గెంటేయాలని వలసదారులను ఇబ్బంది పెట్టేలా ఎన్నో కఠిన చట్టాలు ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్కు ఝలక్ ఇచ్చేలా (H-1B) వీసాదారులకు సులభంగా గ్రీన్ కార్డ్ లభించేలా డెమొక్రాటిక్ సెనేటర్ అలెక్స్ పడిల్లా ఈ సరికొత్త బిల్లును ప్రవేశపెట్టారు.ఈ నూతన బిల్లు ప్రకారం "ది రెన్యూయింగ్ ఇమ్మిగ్రేషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1929" దీని ప్రకారం.. అమెరికాలో కనీసం ఏడేళ్లపాటు నిరంతరం నివసిస్తున్న వలసదారులు శాశ్వత నివాస హోదా (లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్) కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.1986 తర్వాత ఇప్పటివరకు ఎటువంటి మార్పులు చేయని వలస చట్టాన్ని ఈ ప్రతిపాదన ఆధునీకరిస్తుందని, దీనివల్ల 8 మిలియన్ల మందికి పైగా ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సెనేటర్ అలెక్స్ మాట్లాడుతూ "కష్టపడి పనిచేసే వలసదారులపై ట్రంప్ యంత్రాంగం అనుసరిస్తున్న క్రూరమైన విధానాలను తిప్పికొట్టడానికి నేను ఒక సంవత్సరం క్రితం ఈ బిల్లును ప్రవేశపెట్టాను. అప్పటి నుంచి అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న భయానక విధానాలు మరింత పెరిగాయి. ఈ దేశంలో తమ జీవితాలను నిర్మించుకున్నప్పటికీ కుటుంబాలు నిరంతరం అనిశ్చితిలోనే జీవిస్తున్నాయి. ప్రతిరోజూ మన ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి తోడ్పడుతున్న మిలియన్ల కొద్దీ దీర్ఘకాలిక నివాసితులను కాంగ్రెస్ విస్మరించకూడదు. మన వలస చట్టాలను ఆధునీకరించి, చట్టబద్ధమైన శాశ్వత నివాసానికి సరైన మార్గాన్ని సృష్టించాల్సిన సమయం ఆసన్నమైంది."అని అన్నారు.భారతీయ నిపుణులకు ప్రయోజనంభారతీయ నిపుణులు హెచ్-1బీ వీసాదారుల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ పరిమితుల కారణంగా వీరు శాశ్వత నివాసం కోసం చాలా కాలం పాటు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదన భారతీయులకు చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.చట్ట రూపం దాల్చడం కష్టమే?అయితే ఈ బిల్లు చట్టం రూపం దాల్చడం దాదాపు అసాధ్యం ఎందుకంటే ఈ బిల్లు అక్కడి సెనేట్, ప్రతినిధుల సభ రెండింటిలోనూ ఆమోదం పొందాలి. అనంతరం ఆబిల్లు చివరకు అమెరికా అధ్యక్షుడి వద్దకు వెళ్తుంది. అధ్యక్షుడు దానిపై సంతకం చేస్తే అది అధికారిక చట్టం (Law) అవుతుంది. అయితే, రిపబ్లిక్ సభ్యులు దీనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నందున ప్రస్తుతానికి ఈ బిల్లు ఆమోదం పొందడం ఎంతమాత్రం సాధ్యం కాదనే చెప్పుకోవచ్చు. -
మళ్లీ మొదలైన యుద్ధం..! అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి?
-
రెచ్చిపోయిన ఇరాన్.. ట్రంప్ రియాక్షన్పై టెన్షన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతున్నాయన్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇస్తున్న వేళ.. ఇరాన్ మరోసారి తన సైనిక శక్తిని ప్రదర్శించింది. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. మంగళవారం సాయంత్రం ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నుంచి పలు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు CENTCOM తెలిపింది. జోర్డాన్లో ఉన్న అమెరికా బలగాల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. అయితే వాటన్నింటినీ విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది.‘‘ఇది ఆకస్మిక దాడికి చేసిన ప్రయత్నం. ప్రయోగించిన అన్ని క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నాం’’ అని అమెరికా కమాండ్ వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం లేదని తెలిపింది.ట్రంప్ చర్చల మాటలు.. ఇరాన్ క్షిపణుల బదులుఇటీవల ఇరాన్పై అమెరికా సైనిక చర్యలకు తాత్కాలిక విరామం ప్రకటించిన ట్రంప్.. చర్చలకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్తో మంచి చర్చలు జరుగుతున్నాయని, ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే చర్చలు విఫలమైతే మళ్లీ సైనిక చర్యలు ప్రారంభిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాల మధ్యే ఇరాన్ క్షిపణి దాడి జరగడం అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతోంది.ట్రంప్కు ఇరాన్ హెచ్చరిక సంకేతమా?ఇరాన్ తాజా చర్యను అమెరికాకు ఒక బలమైన సందేశంగా విశ్లేషకులు చూస్తున్నారు. తమను పక్కన పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అంగీకరించబోమని చెప్పే ప్రయత్నంగానే ఈ దాడిని భావిస్తున్నారు. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన ఘర్షణల్లో భాగంగా అమెరికా బలగాలు ఇరాన్కు చెందిన పలు లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆ తర్వాత ట్రంప్ దౌత్యానికి అవకాశం కల్పిస్తూ సైనిక చర్యలను నిలిపివేశారు.మళ్లీ మొదలైన యుద్ధం?తాజా క్షిపణి దాడి నేపథ్యంలో అమెరికా తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ ఇప్పటికే ఇరాన్పై కఠిన వైఖరి ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జరిగిన దాడికి అమెరికా ఎలా స్పందిస్తుందన్నది కీలకంగా మారింది. మరోవైపు మధ్యప్రాచ్యంలో అమెరికా నౌకాదళం, సైనిక బలగాల మోహరింపు కొనసాగుతోంది. ఇరాన్-అమెరికా మధ్య మరోసారి ప్రత్యక్ష ఘర్షణకు దారితీస్తుందా? లేదంటే దౌత్య మార్గంలోనే పరిష్కారం దొరుకుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.హౌతీల దాడులతో మరింత టెన్షన్ఇదే సమయంలో యెమెన్కు చెందిన ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సౌదీ చమురు నౌకను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించారు. మరోవైపు సౌదీ అరేబియా, అమెరికా కలిసి ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలీషియా స్థావరాలపై దాడులు చేసినట్లు CENTCOM తెలిపింది. ఈ పరిణామాలన్నీ కలిసి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.ఇక ట్రంప్ నిర్ణయం ఏంటి?ఇరాన్ క్షిపణి దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. చర్చలకు అవకాశం ఇస్తూనే.. సైనికంగా కఠిన చర్యలకు వెనుకాడబోమన్న ట్రంప్ వైఖరి నేపథ్యంలో తదుపరి పరిణామాలు కీలకం కానున్నాయి. -
పట్టువదలని ట్యారిఫ్ విక్రమార్కుడు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పట్టువదలని విక్రమార్కునివలె ఈ నెల 24న భారత్ సహా మొత్తం 60 దేశాలపై మరో విడత దిగుమతి సుంకాలను పెంచారు. అవి అదే రోజు నుంచి అమ లుకు కూడా వచ్చాయి. ఈసారి ఆయన చెప్పిన కారణం: ఈ దేశాలు కార్మికులతో బలవంతపు చాకిరీ చేయించి ఉత్పత్తి చేస్తున్న సరకులను తమ దేశానికి ఎగు మతి చేస్తున్నాయని! ట్రంఫ్ ట్యారిఫ్ల పరంపర ఎప్పుడు మొదలై ఎట్లా సాగుతున్నదో, అందుకు తను చెప్తూ వస్తున్న ఛప్పన్నారు కారణాలేమిటో తెలిసినవే. అత్యవసర చట్టం నెపంతో...2025 జనవరిలో అధ్యక్షునిగా బాధ్యత స్వీకరించిన వెంటనే, ‘అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ మెమోరాండం’ పత్రంపై సంతకం చేశారు. తర్వాత వారం రోజులకు సమస్త దేశాలపై 10 శాతం నుంచి 25 శాతం దిగుమతి సుంకాలు పెంచారు. అందులో చిన్న దేశాలు, పెద్ద దేశాలు, మిత్ర దేశాలు, శత్రు దేశాలనే తేడాలు చూప లేదు. ఇతరులతో అమెరికాకు గల వాణిజ్య లోటు ఈ చర్యకు కారణ మన్న ఆయన, తమకు వాణిజ్య మిగులు ఉన్న దేశాలనూ మినహా యించలేదు. ఒక్క మానవ మాత్రుడైనా నివసించక పెంగ్విన్స్ మాత్రమే ఉండే దీవులనూ తన జాబితాలో చేర్చారు. ఆయన విధానాలను, తీరును చూడగా తన పదవీ కాలం ముగిసే 2029 జనవరి వరకు ఈ ధోరణి ముగియక పోవచ్చునని పిస్తున్నది. ఆ చర్చలోకి వెళ్లే ముందు ఈ నెల 24 నాటి సుంకాల గురించి చెప్పుకోవాలి. సుంకాలను మొదట భారీగా పెంచినప్పుడు, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్) ఉపయోగించారు. ఇతర దేశా లతో వాణిజ్య లోటు అమెరికా ఆర్థిక వ్యవస్థకే ముప్పు కలిగించగల స్థాయికి పెరిగిందనీ, కనుక ఇటువంటి అత్యవసర చర్యలను అమెరి కన్ కాంగ్రెస్ ఆమోదం లేకుండానే తీసుకునే అధికారం ఆ చట్ట ప్రకారం అధ్యక్షునికి ఉందనీ అన్నారు. కానీ, అటువంటి పరిస్థి తులు లేవనీ, కనుక ఆ చర్యలు చెల్లవనీ అక్కడి సుప్రీంకోర్టు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కొట్టివేసింది. అంతవరకు ప్రపంచ దేశాల నుంచి వసూలు చేసిన వందలకొద్ది బిలియన్ల అదనపు సుంకాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.దానితో ఆందోళనకు గురైన అమెరికా అధ్యక్షుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి కొత్తదారులు వెతకటం మొదలు పెట్టారు. సుప్రీం తీర్పు నుంచి తప్పించుకునేందుకు తనకు ప్రత్యామ్నా యాలు ఉన్నాయని వెంటనే ప్రకటించిన ఆయన, కాంగ్రెస్ అను మతి వెంటనే అక్కరలేని 1974వ సంవత్సరపు వాణిజ్య చట్టాన్ని ఆశ్రయించారు. అందులోని 301వ నిబంధన మేరకు వేర్వేరు దేశాలపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు ట్యారిఫ్లు ప్రకటించారు. అయితే ఆ నిబంధన ఒక పరిమిత కాలం వరకే అమలులో ఉంటుంది. ఆ గడువు తీరటంతో ఈ నెల 24న అదే స్థాయి శాతా లతో ట్యారిఫ్లను శాశ్వతంగా మార్చారు. ఆ ప్రకారం ఇండియాపై రేటు 10 శాతం అయింది.సుంకాల మజిలీలుఈ ట్యారిఫ్ల యాత్రలో భారత దేశానికి, ఇతరులకు సంబంధించి కూడా పలు మజిలీలు ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో మొదటి విడత సుంకాలలో భాగంగా ఇండియాపై 25 శాతం విధించిన ఆయన, మనం రష్యా చమురును ఖరీదు చేస్తున్నందుకు ఆగ్రహించి మరో 25 శాతం పెంచారు. అట్లా అది 50 శాతం అయింది. ఇతరత్రా డబ్ల్యూటీవోతో నిమిత్తం లేకుండా, ఇంకా చెప్పాలంటే ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ, వేర్వేరు దేశాలతో వేర్వేరు వాణిజ్య ఒప్పందాలను తమకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకోసం చర్చల పద్ధతిని గాక ఒత్తిడులు, బ్లాక్మెయిలింగ్ను ఎంచుకున్నారు. అది తట్టుకోలేని దేశాలు విడిగా ఒప్పందాలకు ఒప్పుకోగా ట్యారిఫ్ల శాతం అపుడు కొంత తగ్గించారు. ఆ విధంగా ఇండియాపై సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గాయి. ఇపుడు 10 శాతంతో కలిపి 28 శాతం అవుతున్నాయి.జపాన్, దక్షిణ కొరియా వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాలేదు, అమెరికాకు సన్నిహిత రాజ్యాలై నప్పటికీ– కెనడా, యూరప్ వంటి మిత్ర దేశాలు ఒకమేర రాజీ పడుతూ ప్రత్యామ్నాయ వాణిజ్య సంబంధాల కోసం అన్ని ఖండా లలో అన్వేషణలు మొదలు పెట్టాయి. రష్యాకు అమెరికాతో గల వాణిజ్య సంబంధం అతి స్వల్పం అయినందున ఇరువురి మధ్య వచ్చేదీ పోయేదీ ఏమీ లేకపోయింది. ఆంబోతులు పోట్లాడితే లేగదూడల కాళ్లు విరిగాయన్నట్లుగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలను అమెరికా విధించటంతో ఇతరులతో పాటు ఇండియా చాలానే నష్టపోయింది. ఆ ట్యారిఫ్లకు ప్రతిగా తాము కూడా అమెరికాపై ఎదురు సుంకాలు వేయగలమని కెనడా, యూరప్ హెచ్చరికలు చేసి ఆ పని కొంత మేర చేశాయి గానీ, పూర్తిగా ధిక్కరించి నిలిచింది చైనా ఒక్కటే.బలవంతపు చాకిరీలు నిజమేనా?ఇపుడు మాట్లాడుకోవలసిన ఆసక్తికరమైన విషయం ఒకటు న్నది. అది ఇండియా తదితర దేశాలు బలవంతపు చాకిరీతో ఉత్ప త్తులు చేసి అమెరికాకు విక్రయిస్తున్నాయనే ఆరోపణ. ఈ విషయమై యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) జరిపిన విచారణలో ధ్రువీకరణలు లభించాయని ట్రంప్ ప్రభుత్వం చెప్తు న్నది. అమెరికా, యూరప్ వర్ధమాన దేశాలను ఒత్తిడి చేసేందుకు బాలకార్మికులు, మితిమీరిన పని గంటలు, బలవంతపు చాకిరీ వంటి వాదనలు ఎప్పటినుంచో చేస్తున్నాయి. విచిత్రమేమంటే, సాక్షాత్తూ అమెరికాలోనే రకరకాలుగా బలవంతపు చాకిరీ, శ్రామి కుల దోడిపీ జరుగుతున్నదని చెప్పే నివేదికలున్నాయి. కనుక, ఈ వాదన ఇతరులను ఒత్తిడి చేసే సాధనం మాత్రమే. ఇంతకూ జనవరి 2025తో ఆరంభించి శవం కోసం చెట్టెక్కు తూనే ఉన్న అమెరికా అధ్యక్షుని లక్ష్యాలు ఎంతవరకు నెరవేరు తున్నట్లు? అన్ని దేశాలూ తమను దోచుకుంటున్నాయంటూ సుంకాల హెచ్చింపును ఆరంభించినపుడు 900 బిలియన్ల మేర ఉండిన వాణిజ్య లోటు నేడు కూడా ఇంచుమించు అంతే ఉంది. కేవలం పారిశ్రామిక ఉత్పత్తులను తీసుకుంటే మరింత పెరిగి 1.2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ట్యారిఫ్ల హెచ్చింపుతో ఏమీ ఒరగ లేదు. పన్నులు పెంచుతామని హెచ్చరించినా బయటి నుంచి తిరిగి వచ్చిన అమెరికన్ కంపెనీలు చాలా కొద్ది. కనుక ‘మాగా’ నినాదం మేర ఉద్యోగాలూ పెరగలేదు. ఆ విధంగా విక్రమార్కుని భుజంపై శవం నిలవకుండా ఉంది.మనమిక చూడవలసింది అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఏ విధంగా జరగనున్నదనేది. అందుకోసం ఫ్రేమ్ వర్క్ అనేది కుదిరినా, తుదిరూపపు చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వం కొంత పట్టుదలగా ఉన్నమాట నిజం. అదే సమయంలో అది హానికరంగా ఉండకూడదని రైతులు, మత్స్యకారులు, జౌళి రంగం, ఇతర వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. చివరకు ఏమయేదీ చూడాలి!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి
వాషింగ్టన్: అమెరికా న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీపాతి దీప (42) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన ఈమె న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యూజెర్సీలో కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.మృతురాలు ఆమనగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాసరెడ్డి సోదరుడైన శ్రీపాతి పుల్లారెడ్డి చిన్న కోడలు. స్థానిక వివరాల ప్రకారం.. దీప ఐటీ ఉద్యోగిని అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్తతో కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో, మరొక కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది. శ్రీపాతి దీప మరణవార్త విన్న హైదరాబాద్లోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. దీప మరణంతో ఆకుతోటపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
ప్లీజ్ శరీరాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు..! పాపం ఆ 26 ఏళ్ల మహిళ..
గత కొన్నేళ్లుగా చర్మ కేన్సర్పై అవగాహన కల్పిస్తున్న టెక్సాస్కు చెందిన 26 ఏళ్ల మహిళ చివరి సందేశం నెట్టింట వైరల్గా మారింది. ఆమె కన్నీటి కథ నెటిజన్లను కదిలించింది. అంతేగాదు తనలా మరెవ్వరూ అలాంటి అనారోగ్య సమస్య బారిన పడకూడదని చివరి క్షణాల వరకు పడిన తపన ప్రతిఒక్కర్ని కదిలిస్తోంది. అంతేగాదు ప్రజలదర్నీ శరీరం విషయంలో బీకేర్ఫుల్గా ఉండమని కోరుతూ పంపిన సందేశం ఆ వ్యాధిపై అందరికీ అవగాహన ఉండాలనే విషయాన్ని నొక్కి చెప్పింది. ఇంతకీ ఎవరా మహిళ?, ఏ వ్యాధి గురించి ఇంతలా ఆమె మాట్లాడారు అంటే..గత కొన్నేళ్లుగా చర్మ కేన్సర్పై అవగాహన కల్పిస్తోంది టెక్సాస్కు చెందిన 26 ఏళ్ల మహిళ అలోండ్రా సియెర్రా. ఆమె తన మరణానికి ముందు వరకు ఆ వ్యాధిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. అంతేగాదు వ్యాధిని ముందుగా గుర్తిస్తే..ఎంత బిగ్ రిలీఫ్ ఉంటుందో వివరించింది. అది మన మనుగడకు ఎంత కీలకమో కూడా నొక్కి చెప్పింది. సియెర్రా కేవలం 19 ఏళ్ల వయసులో నుదిటిపై మచ్చ ఏర్పడటం గమనించింది. కాలక్రమేణా, అది లేత రంగు నుంచి ముదురు రంగులోకి మారింది. కానీ అది కేన్సర్ కాగలదని ఎప్పుడూ ఊహించలేదు. ముఖ్యంగా మెలనోమా వచ్చే అవకాశం ఉందని కలలో కూడా ఊహించలేదని అంటోంది. కానీ ఈ ఏడాది చివరి నాటికి ఈ చికిత్స తను తీసుకున్నప్పటికీ.. విజయవంతం కాలేదని తెలిపింది. అంతేగాదు తనలా మరెవ్వరు ఈ వ్యాధి బారినపడకూడదనే ఉద్దేశ్యంతో గత నాలుగేళ్లుగా సూర్యరశ్మి నుంచి రక్షణ, క్రమం తప్పని చర్మ పరీక్షల ప్రాముఖ్యత గురించి సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తోంది. హానికరమైన యూవీ కిరణాల నుంచి తమను తాము రక్షించుకోవాలని ప్రోత్సహిస్తోంది కూడా. అలాగే కృత్రిమ యూవీ మూలాలతో ఉన్న ప్రమాదాల గురించి కూడా మాట్లాడారామె. అలాగే ఇలాంటి వాటిన బారినపడకుండా తీసుకోవాల్సిన చర్చలు, ముందస్తు పరీక్షల గురించి కూడా అవగాహన కల్పించే యత్నం చేసింది. అంతేగాదు తగ మే నెలలో మెలనోమా అవగాహన మాసం పురస్కరించుకుని పంచుకున్న వీడియో ప్రతి ఒక్కర్ని కదిలిస్తుంది. ఆ వీడియోలో సియెర్రా.. "నివారణ అనేది మనుగడకు సంబంధించిన విషయంగా అభివర్ణించింది. ఈ నెల వేడుకలకు ప్రతీక అయితే ఎంత బాగుండును, కానీ బదులుగా మనుగడకు ప్రతీకగా నిలుస్తోంది. దురదృష్టవశాత్తు, ప్రస్తుతం ఇదే నా వాస్తవికత. చాలామందికి మే 1వ తేదీ, మెలనోమా అవగాహన మాసం ప్రారంభం. అలాగే మరో నెల మాత్రమే. నాకు మాత్రం, ఇది నివారణ, ఇది ప్రచారం. ఇది జీవితం, ఇది మనుగడ అని భావోద్వేగంగా మాట్లాడింది వీడియోలో". తన పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతున్నా..తానెలాగో ఈ వ్యాధిని ముందుగా గుర్తించలేకపోయానని..కనీసం ఇతరులకకైన సహాయపడాలని..ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తూ అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. అన్ని వయసుల వారు తన చర్మాన్ని జాగ్రత్తగా గమనించాలని చెప్పింది. పుట్టుమచ్చ రంగు, ఆకారం, పరిమాణంలోని తేడాలను నిర్లక్ష్యం చేయొద్దని కోరిందామె. ఒకవేళ ఆలస్యం చేస్తే..తల నుంచి చెవుల వెనుక వరకు..అలాగే రొమ్ము, పాదాలు, జననాంగాల వరకు ఎలా వ్యాపిస్తుందో వివరిస్తూ..తన సంభాషణను ముగించింది. కానీ అదే ఆమె చివరి వీడియోగా మిగిలింది. ఎందుకంటే..స్టేజ్ 4 మెలనోమా కేన్సర్తో సుదీర్ఘ పోరాటం చేసి ఈ నెల జూలె 17న మరణించింది. మందుగా ఈ వ్యాధిని ఎలా గుర్తించాలంటే..ఈ మెలనోమాను ముందుగా గుర్తించే హెచ్చరిక సంకేతాల కోసం చర్మవ్యాధినిపుణులు ABCDE అనే నియమాన్ని అనుసరించమని సూచిస్తున్నారు. A - అసమానతB – అంచులలో క్రమరాహిత్యంC - రంగులో వైవిధ్యంD - 6 మి.మీ కంటే పెద్ద వ్యాసంE – పరిమాణం, ఆకారం లేదా రంగులో మార్పులుకాగా సియెర్రా..అధునాతన కేన్సర్తో పోరాడుతున్నప్పటికీ, జీవితంలోని ముఖ్యమైన మైలురాళ్లను జరుపుకుంది. ఆమె 2024లో కళాశాల నుంచి పట్టభద్రురాలైంది, అదే ఏడాది ఆ వ్యాధి తన శరీరం అంతటా వ్యాపించిందని తెలుసుకుంది. ఈ ఏడాది మార్చిలో, రేడియేషన్ చికిత్స పూర్తి చేసిన కొద్ది రోజులకే, ఆమె అమెరికా పౌరసత్వం పొంది మరో కలను నెరవేర్చుకుంది. అంతేగాదు తన కథ ద్వారా, ఇతరులు కూడా తమ చర్మంలో అనుమానాస్పద మార్పులను ముందుగానే గుర్తించి, ఆలస్యం కాకముందే వైద్య సలహా తీసుకోవాలని సియెర్రా ఆశించింది. చివరి వరకు ఆమె ఆ లక్ష్యం కోసమే పోరాడిందని కన్నీటి పర్యంతమైంది ఆమె కుటుంబం. View this post on Instagram A post shared by Alondra Sierra (@alondrasierrat)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. ఈ వ్యాధి గురించి పూర్తి వివరాలను వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హీర్ అజిత్ డైట్ సీక్రెట్..! ఆఖరికి పోషకాహార నిపుణుల సైతం..) -
ట్రంప్ శాంతి మంత్రం.. ఇరాన్ షాక్!
అమెరికా–ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కాస్త చల్లబడుతున్న వేళ.. శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష దాడులు మూడు రోజులుగా నిలిచిపోవడంతో చర్చలకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. అయితే దౌత్య ప్రయత్నాలు విఫలమైతే తిరిగి సైనిక చర్యలకు దిగుతామని హెచ్చరించారు.‘‘ఇరాన్తో మంచి చర్చలు జరుగుతున్నాయి. ఏదో ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది’’ అని ట్రంప్ ఎయిర్ఫోర్స్ వన్లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అయితే చర్చలు ఫలించకపోతే గతంలో చేపట్టిన చర్యలను తిరిగి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తే అది అందరికీ మంచిదేనని పేర్కొన్న ఆయన.. అమెరికా ప్రయోజనాలు, భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని సంకేతాలు ఇచ్చారు. ఇరాన్తో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ట్రంప్ తెలిపారు.ప్రత్యక్ష చర్చలు లేవంటున్న ఇరాన్అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. మధ్యవర్తుల ద్వారా అమెరికా నుంచి కొన్ని సందేశాలు అందుతున్నాయని, కానీ ప్రస్తుతం అధికారిక చర్చలు మాత్రం లేవని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. ఇటీవలి కాలంలో అమెరికా దాడులతో ఇరాన్లోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయని, ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా అనుబంధ లక్ష్యాలపై దాడులు చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుందన్నది ఆసక్తిగా మారింది.‘అమెరికా ఆయుధ నిల్వలు తగ్గలేదు’.. ట్రంప్ఇరాన్పై దీర్ఘకాలిక సైనిక చర్యలకు అమెరికా వద్ద క్షిపణులు, ఆయుధ నిల్వలు సరిపోవడం లేదన్న వార్తలను ట్రంప్ ఖండించారు. అమెరికా వద్ద భారీగా ఆయుధ నిల్వలు ఉన్నాయని, అవసరానికి మించి ఉన్నాయని పేర్కొన్నారు. అయితే గత బైడెన్ ప్రభుత్వ హయాంలో ఉక్రెయిన్కు భారీగా ఆయుధాలు పంపడం వల్ల నిల్వలపై ఒత్తిడి ఏర్పడిందని ట్రంప్ ఆరోపించారు. ప్రస్తుతం అత్యాధునిక ఆయుధ వ్యవస్థల ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నామని చెప్పారు.సౌదీ చమురు స్థావరాలపై డ్రోన్ దాడులుపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు. సోమవారం సౌదీ అరేబియాలోని చమురు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు జరిగాయి. ఇరాన్ అనుకూల వర్గాలే ఈ దాడులకు కారణమని సౌదీ ఆరోపించింది. మరోవైపు యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు కూడా సౌదీ చమురు మౌలిక వసతులపై దాడులు చేసినట్లు ప్రకటించారు. అయితే దీనిపై సౌదీ నుంచి అధికారిక స్పందన రాలేదు.హర్ముజ్ జలసంధిపైనే అసలు పంచాయితీప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ఇప్పుడు ప్రధాన వివాదంగా మారింది. ఈ మార్గంపై నియంత్రణ తమదేనని ఇరాన్ చెబుతుండగా.. నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని అమెరికా పట్టుబడుతోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇటీవల ఈ మార్గంలో ప్రయాణిస్తున్న కొన్ని నౌకలను అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో ప్రపంచ చమురు మార్కెట్లు ఆందోళనకు గురయ్యాయి. అయితే తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో కొంత ఉపశమనం కనిపించింది.చర్చలా? దాడులా? ఉత్కంఠ కొనసాగింపుఅమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలపై ఆశలు కనిపిస్తున్నప్పటికీ.. ఇరు దేశాల ప్రకటనల్లో భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు ఇస్తూనే.. మరోవైపు సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు రావడం మిడిల్ఈస్ట్ సంక్షోభాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది.ట్రంప్ మాటల్లో శాంతి సంకేతాలు కనిపిస్తున్నా.. హర్ముజ్ జలసంధి, ఆయుధ నిల్వలు, ప్రాంతీయ దాడులు ఈ ఒప్పందానికి అసలు పరీక్షగా మారనున్నాయి. -
ఫుడ్ ఫెస్టివల్లో కాల్పుల కలకలం
సియాటెల్: అమెరికాలోని సియాటెల్ నగరంలో కాల్పులు కలకలం రేపాయి. ‘బైట్ ఆఫ్ సియాటెల్’పేరుతో ఏటా నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల బాలుడితోపాటు నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటూండగా ఈ ఘోరం చోటు చేసుకుందని తెలుస్తోంది. దుండగుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరొకరి కోసం గాలింపు ముమ్మరమైంది. తప్పించుకున్న వ్యక్తిని వరి్ణంచే గుర్తులు ఏవీ లేవని సియాటెల్ అసిస్టెంట్ పోలీస్ చీఫ్ టైరోన్ డేవిస్ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించారని ఒకరు 19 ఏళ్ల యువకుడు కాగా, ఇంకొకరు 44 ఏళ్ల పురుషుడని వివరించారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తూండగా 56 ఏళ్ల మహిళ మరణించారని తెలిపారు. గాయపడ్డ వారి పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. సియాటెల్లో 1982 నుంచి ఏటా ఈ బైట్ ఆఫ్ సియాటెల్ ఫుడ్ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు.మూడు రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్కు సుమారు మూడు లక్షల మంది హాజరయ్యారని అంచనా. మరికొనిన గంటల్లో ఈ ఫెస్టివల్ ముగుస్తుంది అనగా ఆదివారం సాయంత్రం సుమారు ఆరుగంటల ప్రాంతంలో అకస్మాత్తుగా కాల్పులు చోటు చేసుకున్నాయి. సరిగ్గా ఆ క్షణంలో తాము ఒకానొక స్టాల్లో క్రేప్స్ కొనుగోలు చేశామని, కాల్పులు జరుపుతున్న వాళ్లు తనకు దగ్గరగానే ఉన్నారన్న విషయాన్ని గుర్తించి తాను వెంటనే దగ్గర్లోని సియాటెల్ చి్రల్డన్స్ మ్యూజియమ్లోకి పారిపోయి తలదాచుకున్నానని ఫెయిత్ ఆడియా హంటర్ అనే మహిళ తన అనుభవాన్ని పంచుకున్నారు. తనతోపాటు చాలామంది పరుగులు పెడుతూ కనిపించారని చెప్పారు. ఫుడ్ స్టాల్స్ నిర్వాహకులు కూడా కాల్పుల శబ్ధం వినిపించగానే పారిపోయారని, గంటల తరువాత కొందరు పోలీసులు ఏర్పాటు చేసిన హద్దుల వద్ద తచ్చాడుతూ కనిపించారని తెలిసింది. రొబెర్టో రమిరెజ్ అనే ఫుడ్స్టాల్ యజమాని మాట్లాడుతూ ‘‘అవి టపాకాయలు అనుకున్నా. ఇంతలోనే ఎవరో షూటర్ అని అరిచారు. అంతే అక్కడున్న వారందరూ తలో దిక్కుకు పరుగెత్తారు’’అని వివరించారు. కొంతమంది దాక్కుంటే.. కొంతమంది ఒకరిని ఒకరు తోసుకుంటూ కనిపించారు. కొందరు కిందపడిపోయారు. పసిపిల్లల స్ట్రోలర్స్ కూడా కింద పడిపోయాయి అని ఎస్టాన్ వాకనాబో అనే వ్యక్తి తెలిపారు. శబ్ధం వినిపించగానే అవి కాల్పులేనని తనకు అర్థమైందని, ఆ వెంటనే ప్రియురాలితో కలసి సురక్షిత ప్రాంతానికి పరుగుపెట్టానని చెప్పారు. సంఘటన స్థలాన్ని ఖాళీ చేయించిన పోలీసులు భద్రత చర్యలను కట్టుదిట్టం చేశారు. -
మీ కుక్క తప్పిపోయి ఐదేళ్ల తర్వాత తిరిగొస్తే ఇలా ఉంటుంది!
వాషింగ్టన్: అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం తప్పిపోయిన పెంపుడు కుక్కను ఐదేళ్ల తర్వాత తిరిగి కలుసుకుంది. ఇంటి నుంచి 600 మైళ్లకు పైగా దూరంలో ఉన్న ఇండియానా రాష్ట్రంలోని ఓ ట్రక్ స్టాప్ వెనుక ఆ కుక్క దొరికింది. 2021లో ఇన్మాకులాడా జాక్మన్ కుటుంబం నెబ్రాస్కాలోని లింకన్ పట్టణంలో నివసిస్తున్న సమయంలో వారి పెంపుడు కుక్క ‘‘చాంగ్’’ ఇంటి నుంచి తప్పించుకుంది. నెలల తరబడి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా దాని ఆచూకీ దొరకలేదు. కొన్నాళ్ల తర్వాత ఆ కుటుంబం ‘‘చె చె’’ అనే మరో కుక్కను తెచ్చుకుని పెంచుకుంటోంది. అయినా ‘‘చాంగ్’’ ఎప్పుడో ఒకరోజు తిరిగి వస్తుందనే ఆశను మాత్రం వదులుకోలేదు."నేను ఇంకా దాని కోసం వెతికేదాన్ని. మా పాత కాలనీకి వెళ్లి, ఎవరైనా దాన్ని తీసుకుని నడిపిస్తున్నారా, లేక ఎక్కడైనా తిరుగుతోందా అని చూసేవాళ్లం" అని జాక్మన్ స్థానిక మీడియా సంస్థ డబ్ల్యూకేఆర్సీకి తెలిపారు. ఐదేళ్ల తర్వాత జాక్మన్కు ఆమె స్నేహితురాలు సామాజిక మాధ్యమంలో వచ్చిన ఓ పోస్టును పంపింది. లింకన్ పట్టణానికి సుమారు 642 మైళ్ల దూరంలో ఉన్న ఇండియానాలోని ఓ ట్రక్ స్టాప్ వెనుక చాంగ్ కనిపించినట్టు అందులో ఉంది.వెంటనే జాక్మన్ హెండ్రిక్స్ కౌంటీ జంతు సంరక్షణ కేంద్రాన్ని సంప్రదించి చాంగ్ తమదేనని తెలిపింది. అయితే ఒక సమస్య ఎదురైంది. చాంగ్కు ఎవరో దానికి మైక్రోచిప్ అమర్చారు. జంతు సంరక్షణ కేంద్రం సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త మైక్రోచిప్లో నమోదు అయిన వ్యక్తికి సమాచారం ఇచ్చి, స్పందించేందుకు 3 రోజుల గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గడువులోగా ఎవరూ ముందుకు రాకపోతే చాంగ్ను జాక్మన్కు అప్పగించవచ్చని చెప్పారు."మరో వ్యక్తి మమ్మల్ని సంప్రదించకూడదని అక్కడి సిబ్బంది అంతా ఆశిస్తూ, ప్రార్థిస్తూ ఉన్నామని చెప్పారు" అని జాక్మన్ గుర్తుచేసుకున్నారు. 3 రోజుల గడువులో ఎవరూ స్పందించలేదు. దీంతో చాంగ్ను మళ్లీ దత్తత తీసుకునేందుకు జాక్మన్కు అనుమతి లభించింది. ఆమె ఇండియానాకు వెళ్లి చాంగ్ను ఇంటికి తీసుకొచ్చింది.జంతు సంరక్షణ కేంద్రం విడుదల చేసిన వీడియోలో.. 5 ఏళ్ల తర్వాత యజమానిని చూసిన చాంగ్ తొలుత అయోమయంలో కనిపించింది. కొద్దిసేపటి తర్వాత జాక్మన్ను హత్తుకుంది. ఆ తర్వాత ‘‘చె చె’’ను కూడా కలుసుకుంది. "ఆశను ఎప్పుడూ వదులుకోకండి. ఐదేళ్ల తర్వాత అయినా మేము చాంగ్ను తిరిగి కనుగొన్నాం" అని జాక్మన్ డబ్ల్యూకేఆర్సీకి తెలిపారు. -
ట్రంప్ బాంబు పేలుతుందనుకుంటే.. తుస్సుమంది!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా ఒకే ఆరోపణను బలంగా వినిపిస్తున్నారు. ‘‘అమెరికా పౌరులు కాని వాళ్లు భారీ సంఖ్యలో.. అక్రమంగా ఓట్లు వేస్తున్నారు. అదే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తోంది’’ అని పదేపదే చెబుతున్నారు. ఈ వాదననే ఆధారంగా చేసుకుని ఓటరు నమోదు సమయంలో పౌరసత్వాన్ని తప్పనిసరిగా నిరూపించాలనే వాదన తెరపైకి తెస్తున్నారు. అయితే ఆ వాదనలో ఏమాత్రం పస లేదనే ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.ఎన్నికల భద్రతను కాపాడాలంటే పౌరసత్వ ధ్రువీకరణను మరింత కఠినతరం చేయాల్సిందేనని ట్రంప్ వాదిస్తున్నారు. అందుకే సేవ్ అమెరికా యాక్ట్(SAVE America Act) లాంటి చట్టాలకు మద్దతు తెలుపుతున్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాలంటే ఇవి అవసరమని ఇటు రిపబ్లికన్ పార్టీ కూడా చెబుతోంది. అయితే డెమొక్రటిక్ పార్టీ మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇటు ఈ అంశం భారత పాఠకులకు కొత్తగా అనిపించాల్సిన అవసరం లేదు. ఇటీవల భారత్లో ఎన్నికల సంఘం చేపట్టిన Special Intensive Revision (SIR) ప్రక్రియపై కూడా తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించి అర్హుల పేర్లను కొనసాగించడం, అనర్హుల పేర్లను తొలగించడం లక్ష్యంగా ఈ ప్రక్రియ చేపట్టామని ఎన్నికల సంఘం చెప్పగా.. ప్రతిపక్షాలు మాత్రం పలు ప్రాంతాల్లో నిజమైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందంటూ ఆందోళనలు వ్యక్తం చేశాయి. దీంతో ఓటరు నమోదు, ధ్రువీకరణ, ఎన్నికల జాబితాల విశ్వసనీయత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు అమెరికాలోనూ ఇదే తరహాలో SAVE America Act చుట్టూ చర్చ సాగుతోంది. అయితే అక్కడ అసలు వివాదం విదేశీయుల అక్రమ ఓటింగ్ నిజంగానే విస్తృతంగా జరుగుతోందా? లేదా అనే అంశంపైనే కేంద్రీకృతమైంది.అమెరికాలో 1996 నుంచి ఫెడరల్ ఎన్నికల్లో పౌరులు కానివారు ఓటు వేయడం చట్టరీత్యా నేరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదైన ఫెడరల్ కోర్టు రికార్డులను రాయిటర్స్ విశ్లేషించగా, దేశవ్యాప్తంగా కేవలం 129 కేసులు మాత్రమే నమోదైనట్లు తేలింది. అందులో 73 మంది మాత్రమే నేరాన్ని అంగీకరించడమో లేదంటే కోర్టులు దోషులుగా నిర్ధారించాయి. అంటే.. అధ్యక్ష ఎన్నికలో కోట్లాది ఓట్లు నమోదయ్యే అమెరికాలో ఈ సంఖ్య చాలా స్వల్పమని పరిశీలన చెబుతోంది.ఈ కేసులను లోతుగా పరిశీలిస్తే మరో విషయం కూడా బయటపడింది. నమోదైన చాలా ఘటనలు పెద్ద ఎత్తున పన్నిన ఎన్నికల కుట్రలకు సంబంధించినవి కావు. గ్రీన్ కార్డు కలిగిన కొందరు శాశ్వత నివాసితులు తాము కూడా ఓటు వేయడానికి అర్హులమని పొరపాటుగా భావించడం, మరికొన్ని సందర్భాల్లో పరిపాలనా లోపాల వల్ల పేర్లు ఓటరు జాబితాలో చేరడం వంటి కారణాలే ఎక్కువగా కనిపించాయి. దేశవ్యాప్తంగా విదేశీయులు సమన్వయంతో ఎన్నికలను ప్రభావితం చేశారనే ఆధారాలు మాత్రం బయటపడలేదు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన వాదనపై వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు ఎన్నికల నిపుణులు, పౌరహక్కుల సంస్థలు మాత్రం ఈ వాదనను ప్రశ్నిస్తున్నాయి. విదేశీయుల అక్రమ ఓటింగ్ విస్తృతంగా జరుగుతోందని నిరూపించే బలమైన ఆధారాలు లేనప్పుడు కఠిన నిబంధనలు తీసుకురావడం వల్ల చట్టబద్ధమైన అమెరికా పౌరులే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సహజీకృత అమెరికా పౌరులు(అంటే విదేశాల్లో పుట్టి, తర్వాత అమెరికా పౌరసత్వం పొందిన వారు) అవసరమైన పత్రాలు వెంటనే సమర్పించలేక ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఇటీవల న్యూజెర్సీలో సాఫ్ట్వేర్ లోపం కారణంగా కొందరు పౌరులు కానివారి పేర్లు పొరపాటున ఓటరు జాబితాలో నమోదైన ఘటన కూడా చర్చనీయాంశమైంది. అయితే ఆ ఘటనలో కూడా వాస్తవంగా ఓటు వేసిన వారి సంఖ్య చాలా పరిమితంగానే ఉందని, దానిని దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ ఎన్నికల మోసానికి నిదర్శనంగా చెప్పలేమని అధికారులు స్పష్టం చేశారు.మొత్తంగా చూస్తే, అమెరికా ఎన్నికల్లో విదేశీయులు భారీ సంఖ్యలో అక్రమంగా ఓటు వేస్తున్నారన్న ట్రంప్ ఆరోపణలకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు బలమైన మద్దతు ఇవ్వడం లేదని ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ పరిశీలన తేల్చింది. ఎన్నికల భద్రతపై రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నప్పటికీ, నమోదైన కేసులు మాత్రం సమస్య పరిమిత స్థాయిలోనే ఉందని సూచిస్తున్నాయి. దీంతో ట్రంప్ చేసిన ఆరోపణలు ఒకవైపు ఉంటే... అధికారిక రికార్డులు మాత్రం మరో చిత్రాన్ని చూపిస్తున్నాయని ఈ విశ్లేషణ స్పష్టం చేసింది. -
మీనాక్షి చౌదరి అమెరికా ట్రిప్.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)
-
ఎప్స్టీన్ కోట్ల సంపదకు ఏకైక వారసురాలు ఈమె!
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. లైంగిక నేరాల అభియోగాలు, ప్రముఖులతో సంబంధాలతో వివాదాస్పదంగా మారిన ఎప్స్టీన్.. 2019లో జైలులో అనుమానాస్పద రీతిలో కన్నుమూశాడు. అయితే ఇప్పటికీ ‘ఎప్స్టీన్ ఫైల్స్’ రూపంలో ఆ పేరు నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తన వందల కోట్ల ఆస్తి మీద రాసిన వీలునామా తెరపైకి వచ్చింది. ఆ వీలునామాలో కరీనా షులియాక్ అనే పేరు ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. అసలు ఆమె ఎవరు? ఎప్స్టీన్తో ఆమెకు ఎలాంటి సంబంధం ఉంది? అనే ప్రశ్నలు చర్చకు దారి తీశాయి.లైంగిక నేరాల ఆరోపణలతో తీవ్ర వివాదాస్పదంగా మారిన ఎప్స్టీన్ మరణం తర్వాత.. అతడి కోట్లాది డాలర్ల ఆస్తులకు వారసురాలిగా ఓ మహిళ పేరు తెరపైకి వచ్చింది. ఆమెనే బెలారస్కు చెందిన దంత వైద్యురాలు కరీనా షులియాక్ (Karyna Shuliak). ఎప్స్టీన్ తన జీవితంలోని చివరి ఎనిమిదేళ్లలో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో కరీనా ఒకరు. 2019లో జైలులో ఎప్స్టీన్ ఆత్మహత్యకు కొద్ది రోజుల ముందు మార్చిన వీలునామాలో.. తన ఆస్తులకు ప్రధాన లబ్ధిదారుగా ఆమె పేరును చేర్చినట్లు దర్యాప్తు పత్రాలు వెల్లడించాయి.ఎప్స్టీన్ ఆస్తుల విలువ ఒక దశలో దాదాపు 100 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఇందులో విలాసవంతమైన భవనాలు, ప్రైవేట్ దీవులు, పెట్టుబడులు, ఖరీదైన వస్తువులు ఉన్నాయి. అంతేకాకుండా 33 క్యారెట్ల వజ్రపు ఉంగరాన్ని కూడా ఆమెకు ఇవ్వాలని వీలునామాలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఆమె అతని సీక్రెట్ గర్ల్ఫ్రెండ్ అనే ఓ రూమర్ తరచూ వినిపిస్తుంటుంది.ఆమెకు 21.. అతనికి 58బెలారస్లో దంత విద్య అభ్యసించిన కరీనా.. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. న్యూయార్క్లో ఇంగ్లిష్ నేర్చుకుంటూ, దంత సహాయకురాలిగా పనిచేస్తున్న సమయంలో ఎప్స్టీన్తో పరిచయం ఏర్పడింది. కరీనా షులియాక్, జెఫ్రీ ఎప్స్టీన్ తొలిసారి 2011లో కలుసుకున్నారు. అప్పటికి కరీనా వయసు 21 ఏళ్లు కాగా.. ఎప్స్టీన్ వయసు 58 సంవత్సరాలు.దర్యాప్తు పత్రాల ప్రకారం.. ఎప్స్టీన్ ఆమెకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం, చదువుకు సహాయం చేస్తానని చెప్పడం ద్వారా దగ్గరయ్యాడు. మొదట్లో అతడి సహాయాన్ని అంగీకరించేందుకు కరీనా సంకోచించినప్పటికీ.. ఆ తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది.చిన్నప్పటి నుంచే దంత వైద్యురాలు కావాలని కలలు కన్న కరీనా.. అమెరికాలో తన చదువును కొనసాగించాలని భావించారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక కొలంబియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ డెంటల్ మెడిసిన్లో చేరేందుకు ఆమె ప్రయత్నించగా.. తొలుత తిరస్కరణ ఎదురైనట్లు సమాచారం. ఆ తర్వాత ఎప్స్టీన్ తన పరిచయాలను ఉపయోగించి ఆమె అడ్మిషన్కు సహకరించినట్లు పత్రాలు వెల్లడించాయి. కొలంబియా యూనివర్సిటీకి సుమారు 2.10 లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు రికార్డుల్లో ఉంది. అనంతరం కరీనా దంత విద్య పూర్తి చేసి.. అమెరికాలో పలు ప్రాంతాల్లో డెంటిస్ట్గా పనిచేసేందుకు లైసెన్స్లు పొందారు.గ్రీన్కార్డ్ కోసం వివాదాస్పద వివాహం!అమెరికాలో స్థిరపడే క్రమంలో కరీనాకు ఇమ్మిగ్రేషన్ సమస్యలు ఎదురయ్యాయి. ఆమె స్టూడెంట్ వీసా గడువు ముగియడంతో దేశంలో ఉండటం కష్టంగా మారింది. ఈ సమయంలో ఎప్స్టీన్ ఓ మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు పత్రాలు వెల్లడించాయి. 2013లో తనకు పరిచయమైన ఓ వ్యక్తితో కరీనాకు వివాహం జరిపించినట్లు సమాచారం. ఈ వివాహం ద్వారా కరీనాకు అమెరికా గ్రీన్కార్డ్ లభించింది. అనంతరం 2018లో ఆమె అమెరికా పౌరసత్వం పొందారు. అయితే ఈ వివాహం నిజమైనదా? లేక ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేశారా? అనే అనుమానాలు తర్వాత వ్యక్తమయ్యాయి. అయితే అమెరికా అధికారులు ఆమె పౌరసత్వంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఎప్స్టీన్కు ‘ఫేవరెట్’గా.. దర్యాప్తు పత్రాల్లో కరీనా ఎప్స్టీన్కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా కనిపిస్తారు. ఎప్స్టీన్ ఆమెను తన “ఫేవరెట్” అని పిలిచేవాడని పలు ఈమెయిల్స్ ద్వారా తెలుస్తోంది. ఆమెకు ప్రత్యేకంగా క్రెడిట్ కార్డు వినియోగం ఉండేది. ప్రయాణాలు, జీవన ఖర్చులు, కుటుంబ అవసరాలకు ఎప్స్టీన్ భారీగా డబ్బు ఖర్చు చేశాడు. రికార్డుల ప్రకారం.. వారి సంబంధ సమయంలో కరీనాకు దాదాపు 10 లక్షల డాలర్లకు పైగా చెల్లింపులు జరిగినట్లు సమాచారం. ఆమె తల్లిదండ్రులకు కూడా బెలారస్లో డబ్బు పంపినట్లు తెలుస్తోంది. కాలక్రమంలో కరీనా ఎప్స్టీన్ వ్యక్తిగత వ్యవహారాల్లో కీలకంగా మారారు. అతడి ఇళ్లలో సిబ్బంది నిర్వహణ, మరమ్మతులు, కొనుగోళ్లు, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించేవారని పత్రాలు చెబుతున్నాయి.అక్కడా డెంటల్ క్లినిక్!ఎప్స్టీన్కు చెందిన అమెరికా వర్జిన్ ఐలాండ్స్లోని ప్రైవేట్ దీవి లిటిల్ సెయింట్ జేమ్స్లో కూడా కరీనా కోసం డెంటల్ ఆఫీస్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. అక్కడ ఆమెకు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు దర్యాప్తు రికార్డులు సూచిస్తున్నాయి. ఎప్స్టీన్ నివాసాల నిర్వహణలోనూ ఆమె పాత్ర ఉందని తెలుస్తోంది.నేరాల గురించి ఆమెకు తెలుసా?దర్యాప్తు పత్రాల్లో కరీనా ఎప్స్టీన్ వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపించినప్పటికీ.. అతడి లైంగిక నేర కార్యకలాపాల్లో ఆమె భాగస్వామి అని నిర్ధారించే ఆధారాలు లేవని అధికారులు పేర్కొన్నారు. ఎప్స్టీన్ ఇతర యువతులతో ఉన్న సంబంధాలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కొన్ని ఈమెయిల్స్ సూచిస్తున్నాయి. అయితే వాటి నుంచి దూరంగా ఉండాలని మాత్రమే కోరినట్లు తెలుస్తోంది.చివరి ఫోన్ కాల్ కూడా ఆమెకే!2019లో అరెస్టైన తర్వాత.. జైలు నుంచి ఎప్స్టీన్ చివరిగా మాట్లాడిన వ్యక్తుల్లో కరీనా ఒకరు. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఆ సంభాషణలో కేసు ఊహించిన దానికంటే ఎక్కువ కాలం సాగవచ్చని, తాను బలంగా ఉండాలని ఆమెకు చెప్పినట్లు సమాచారం. ఆ ఫోన్ కాల్ జరిగిన కొద్ది రోజులకే.. 2019 ఆగస్టు 10న జైలు గదిలో ఎప్స్టీన్ మృతిచెందాడు.అజ్ఞాత జీవితం, మళ్లీ..ఎప్స్టీన్ మరణం తర్వాత కరీనా కొంతకాలం ప్రజల దృష్టికి దూరంగా ఉన్నారు. అయితే తన దంత వైద్య వృత్తిని కొనసాగించారు. 2025లో న్యూయార్క్లో డెంటిస్ట్గా పనిచేసేందుకు లైసెన్స్ పొందారు. బ్రూక్లిన్లోని ఓ చిన్న క్లినిక్లో “డాక్టర్ కరీనా”గా పనిచేసినట్లు సమాచారం. అయితే ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన భారీ స్థాయిలో పత్రాలు విడుదల కావడంతో.. ఆమె గత జీవితం మరోసారి వెలుగులోకి వచ్చింది.చివరికి.. ఎప్స్టీన్ ఆస్తి మొత్తం ఆమె చేతికి వస్తుందా? లేక బాధితుల పరిహారానికి వెళ్తుందా? అనేది న్యాయ ప్రక్రియలపై ఆధారపడి ఉంది. లైంగిక నేరాల బాధితులకు పరిహారం చెల్లింపులు, న్యాయ ప్రక్రియల కారణంగా ఈ మొత్తం సంపద పూర్తిగా ఆమె చేతికి అందుతుందా? అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. అదే గనుక జరిగితే ఆమె చేతికి చిల్లిగవ్వ కూడా దొరకదు!. -
అమెరికా సియాటెల్లో కాల్పుల కలకలం
అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. జనంతో కిక్కిరిసిన ఓ ఫుడ్ ఫెస్టివల్లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఓ చిన్నారి సహా పలువురు గాయపడ్డారు. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ ఘటనతో ఫెస్టివల్ ప్రాంగణం భయానక వాతావరణంగా మారింది. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీయడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.Video: Shots heard, people fleeing at Seattle Center in Washington state. Reports of multiple victims. Livestream: Hawaiian Honey Cones. pic.twitter.com/YGv30969z2— AZ Intel (@AZ_Intel_) July 27, 2026వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరంలో ఉన్న సియాటెల్ సెంటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో కాల్పులు జరిగాయి. ఆ సమయంలో అక్కడ ‘బైట్ ఆఫ్ సియాటెల్’ (Bite of Seattle) ఫుడ్ ఫెస్టివల్ కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి వందలాది మంది సందర్శకులు తరలివచ్చారు. వివిధ రకాల ఆహార స్టాళ్లు, సంగీత కార్యక్రమాలతో ఆ ప్రాంతం సందడిగా ఉంది.అంతా సాధారణంగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం వరుసగా కాల్పులు జరగడంతో ప్రజలు ఏం జరుగుతుందో అర్థంకాక భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. కొందరు సమీప ప్రాంతాల్లో దాక్కునేందుకు ప్రయత్నించగా.. మరికొందరు తొక్కిసలాటకు గురయ్యారు.ఘటన సమయంలో ఎనిమిది రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించాయని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరికొందరు అంతకంటే ఎక్కువ కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. కాల్పుల సమయంలో ఫెస్టివల్ ప్రాంగణంలో భారీ సంఖ్యలో ప్రజలు ఉండటంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సియాటెల్ అగ్నిమాపక విభాగం వెల్లడించింది. పలువురు గాయపడగా.. వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు హార్బర్వ్యూ మెడికల్ సెంటర్ అధికారులు తెలిపారు.హార్బర్వ్యూ మెడికల్ సెంటర్ ప్రతినిధి సూసన్ గ్రెగ్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చిన బాధితులందరికీ తుపాకీ గాయాలు ఉన్నాయని తెలిపారు. గాయపడిన వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉందని, ఆమెకు శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన బాధితులకు కూడా వైద్య చికిత్స అందిస్తున్నారు.ఘటన సమయంలో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి ఎస్టాన్ వకోనాబో పరిస్థితిని వివరిస్తూ.. కాల్పులు వినిపించగానే ప్రజలు అన్ని వైపులా పరుగులు తీశారని తెలిపారు. “ప్రజలు ఒకరినొకరు తోసుకున్నారు. కొందరు కిందపడిపోయారు. చిన్నారుల బండ్లు కూడా పడిపోయాయి. అంతా ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది” అని చెప్పారు.కాల్పుల అనంతరం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సియాటెల్ సెంటర్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ప్రజలను ఖాళీ చేయించారు. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి మోనోరైల్ సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనపై సియాటెల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఎవరు? ఎందుకు కాల్పులు జరిపాడు? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఓ అనుమానితుడని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.Seattle Shooting Suspect @komonews @lookner @CNN @cnnbrk @seattleinfo @seattletimes #seattle #seattleshooting pic.twitter.com/H2CUERXERH— Tyler Harrison (@TylerHarriledm) July 27, 2026ఘటనపై ఎఫ్బీఐ సహా పలు భద్రతా సంస్థలు దర్యాప్తులో భాగమయ్యాయి. ఘటనా స్థలం నుంచి ఆధారాలను సేకరిస్తూ.. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. జన రద్దీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల ఘటన అమెరికాలో మరోసారి తుపాకీ హింసపై చర్చకు దారితీసింది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాల్లో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం సియాటెల్ కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడి వివరాలు, కాల్పుల వెనుక అసలు కారణాలు తెలియాల్సి ఉంది. అధికారులు త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. -
ట్రంప్ గుండెల్లో రైళ్లు.. ఇరాన్ చేతికి 'ఖైబర్ షెకాన్' క్షిపణి.. ఏమిటి దీని ప్రత్యేకత?
-
ఇజ్రాయెల్కు సవాల్.. హెజ్బొల్లాకు ఖమేనీ భరోసా
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన ప్రకటన విడుదల చేశారు. మరోసారి షియా సాయుధ సంస్థ హెజ్బొల్లాకు బహిరంగంగా అండగా నిలిచారు. ఇజ్రాయెల్, అమెరికా ఒత్తిళ్లు ఎంత పెరిగినా ప్రతిఘటన ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తూ.. హెజ్బొల్లాను ఉద్దేశించి ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హెజ్బొల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ ఖాసెమ్కు పంపిన సందేశంలో "జిహాద్, ప్రతిఘటనే ముందుకు సాగే ఏకైక మార్గం" అని పేర్కొన్నారు. తన సందేశంలో ఖమేనీ, హెజ్బొల్లా ప్రస్తుతం "ప్రతిఘటన చరిత్రలో కీలక దశ"లో ఉందని పేర్కొన్నారు. యుద్ధాలు, ఆంక్షలు, నాయకత్వ మార్పులు వచ్చినా ప్రతిఘటన ఆగదని, పోరాట స్ఫూర్తే తమ బలమని చెప్పారు. హెజ్బొల్లా యోధులు లెబనాన్ ప్రజల హక్కులు, గౌరవాన్ని కాపాడేందుకు పోరాడుతున్నారని ప్రశంసించారు.ఇటీవలి నెలల్లో ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఘర్షణలు, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, అనంతరం కాల్పుల విరమణతో మధ్యప్రాచ్య పరిస్థితులు కొంత మారాయి. ఇదే సమయంలో లెబనాన్లో హెజ్బొల్లా వద్ద ఉన్న ఆయుధాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ పరిణామాల మధ్య ఖమేనీ చేసిన తాజా వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇరాన్కు హెజ్బొల్లా కేవలం మిత్ర సంస్థ మాత్రమే కాదు. ఇజ్రాయెల్, అమెరికా ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రాంతీయ "యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్"లో అది కీలక భాగంగా టెహ్రాన్ భావిస్తోంది. అందుకే హెజ్బొల్లాకు రాజకీయ, వ్యూహాత్మక మద్దతు కొనసాగుతుందని ఖమేనీ తాజా ప్రకటన ద్వారా మరోసారి స్పష్టం చేశారు. లెబనాన్లో ఇరాన్ ప్రభావం తగ్గలేదనే సంకేతాన్ని కూడా ఈ సందేశం ఇస్తోందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం హెజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నాయి. ఆ సంస్థ సైనిక సామర్థ్యాన్ని బలహీనపర్చేందుకు లెబనాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దేశంలోని అన్ని ఆయుధ బలగాలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలని లెబనాన్ ప్రభుత్వం కూడా చెబుతోంది. అయితే ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఉన్నంత వరకు ఆయుధాలను వదిలే ప్రసక్తే లేదని హెజ్బొల్లా స్పష్టం చేస్తోంది.ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతల తర్వాత టెహ్రాన్ వైఖరిలో మార్పు వస్తుందేమోనని అంతర్జాతీయ వర్గాలు భావించాయి. అయితే ఖమేనీ తాజా ప్రకటనతో అలాంటి సంకేతాలు కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్పై కఠిన వైఖరిని కొనసాగిస్తూనే, తమ మిత్ర బలగాలకు మద్దతు తగ్గబోదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసినట్లయింది.ఖమేనీ వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులపై మరోసారి చర్చ మొదలైంది. ఒకవైపు శాంతి చర్చలు, కాల్పుల విరమణ ప్రయత్నాలు కొనసాగుతుండగా, మరోవైపు "జిహాద్, ప్రతిఘటనే ముందుకు సాగే మార్గం" అనే సందేశం వెలువడటం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఉద్రిక్తతలు, ఇరాన్ పాత్రపై ప్రపంచ దృష్టి మరోసారి మధ్యప్రాచ్యంపైనే కేంద్రీకృతమైంది. -
అమెరికా ఆక్రమణకు యత్నిస్తోంది.. క్యూబా సంచలన ఆరోపణ
హవానా:క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్ అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా క్యూబాని ఆక్రమించాలని యత్నిస్తుందన్నారు. అమెరికా తన దేశంపై అమలు చేస్తున్న ఆంక్షలను 'జాతి విమర్శక విధానం' (జెనోసైడల్ పాలసీ)గా ఆయన అభివర్ణించారు. అమెరికా విధిస్తున్న ఒత్తిడి విధానాలను క్యూబా అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో క్యూబాపై మరింత ఒత్తిడిని పెంచారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వాణిజ్య దిగ్బంధంతో పాటు, చమురు సరఫరాను నిలిపివేయడంతో పాటు కఠినమైన ఆంక్షలను విధించారు. దీనికి తోడు, క్యూబాకు ప్రధాన మిత్రదేశంగా ఉన్న వెనిజులాలో అమెరికా సైన్యం జోక్యం చేసుకుని నికోలస్ మదురో ప్రభుత్వాన్ని కూలదోయడం క్యూబాను మరింత సంక్షోభంలోకి నెట్టింది.ఈ కఠినమైన చర్యల నేపథ్యంలో క్యూబా అధ్యక్షుడు అమెరికాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమెరికా ఆంక్షల కారణంగా క్యూబాలో పర్యాటకం దెబ్బతిన్నదని, విదేశీ కంపెనీలు వెనుదిరిగాయని ,విదేశీ మారకద్రవ్య ప్రవాహం పూర్తిగా నిలిచిపోయిందన్నారు. రష్యా, చైనాలకు మిత్రదేశంగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి భద్రతా ముప్పుగా మారుతోందని, పౌరుల హక్కులను ఉల్లంఘిస్తోందని అమెరికా వాదిస్తున్నప్పటికీ, తమ దేశం ఎవరికీ ముప్పు కాదని ఆయన స్పష్టం చేశారు.క్యూబా విప్లవానికి నాంది పలికిన 1953 నాటి మొన్కాడా బ్యారెక్స్పై దాడికి గుర్తుగా జరిగిన 73వ వార్షికోత్సవ వేడుకల్లో డియాజ్-కానెల్ ఈ వ్యాఖ్యలు చేశారు. క్యూబా ప్రజలలో అశాంతిని సృష్టించి, తద్వారా తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దురుద్దేశంతోనే అమెరికా ఈ యుద్ధ తంత్రాలను ప్రయోగిస్తోందని మండిపడ్డారు. దేశంలో తీవ్రమైన ఇంధన సంక్షోభం, కరెంటు కోతలు నెలకొన్న ఈ తరుణంలో ప్రజలంతా ఐక్యంగా ఉండి, తగిన ఆర్థిక, సామాజిక మార్పులతో ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటామని ఆయన పిలుపునిచ్చారు. -
నాయకత్వం పదవి కాదు... బాధ్యత!
ఈ రోజు మీ ముందుకు రావడం నాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉంది. ప్రతి పట్టభద్రుల సభలో మాట్లాడే వ్యక్తి ఇదే మాట చెబుతారేమో. కానీ నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. బర్కిలీ అత్యుత్తమ ప్రభుత్వ విశ్వవిద్యాలయం మాత్రమే కాదు... ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయం. నేను ఇక్కడ 17 సంవత్సరాలు బోధించే అదృష్టం పొందాను. ఇప్పుడు మీరు చదువు పూర్తయిందని అనుకుంటున్నారు. ఇక విద్యార్థి జీవితం ముగిసిందని భావిస్తున్నారా? ఎందుకంటే... జీవితం అంటే నేర్చుకోవడమే. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటాడు. ఒక మంచి విద్యార్థి... ఎప్పుడో ఒక రోజు ఉపాధ్యాయుడవుతాడు. ఈ రెండూ వేర్వేరు పాత్రలు కావు. ఒకే ప్రయాణంలో రెండు దశలు. మనలోని ఆసక్తి, ప్రశ్నించే స్వభావం, మనుషులతో కలిసిమెలసి నేర్చుకోవాలనే తపనే... బోధనకూ, అభ్యాసానికీ మూలం. ఒక్కసారి మీ పక్కన కూర్చున్న సహ విద్యార్థులను చూడండి. ఈ నాలుగేళ్లలో వాళ్ల దగ్గర నుంచి మీరు ఎంత నేర్చుకున్నారో ఆలోచించండి. మీరు కూడా వారికి ఎన్నో విషయాలు నేర్పారు. ఇదే నిజమైన విద్య.ఎవరు నిజమైన నాయకులు?నన్ను ఎప్పుడూ వెంటాడే ఒక ప్రశ్న ఉంది. రేపటి ప్రపంచానికి మార్గం చూపే గురువులు ఎవరు? నేను కేవలం పాఠశాలల్లో, కళాశాలల్లో బోధించే ఉపాధ్యాయుల గురించే మాట్లాడటం లేదు. ప్రపంచం ఏ దిశగా వెళ్లాలి? ప్రజలకు ఏది సరైన మార్గమో ఎవరు చూపిస్తారు? నాయకుడు కావాలంటే... మీ పేరుకు ముందు పెద్ద హోదా ఉండాల్సిన అవసరం లేదు. ఖరీదైన కార్యాలయం అవసరం లేదు. ప్రభుత్వంలో మంత్రి కావాల్సిన అవసరం లేదు. చరిత్రను మార్చిన గొప్ప నాయకుల్లో చాలామందికి ఎలాంటి అధికార పదవులు లేవు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, డోలోరెస్ హుయెర్టా, రోసా పార్క్స్, డబ్ల్యూ.ఇ.బి. డు బాయిస్, సుసాన్ బి.ఆంథోనీ... వీళ్లందరూ తమ ఆలోచనలతో, ధైర్యంతో, నైతిక విలువలతో ప్రపంచాన్ని మార్చారు. నిజమైన నాయకుడు ఎవరు? ప్రపంచం ఎటు వెళ్లాలో తెలుసుకునే వ్యక్తి. ఆ దిశగా ఎలా వెళ్లాలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగల వ్యక్తి. ప్రజల ప్రతిభను, శక్తిని, మంచి ఆలోచనలను ఒకే లక్ష్యం కోసం కలిపి పనిచేయించగల వ్యక్తి. నాయకత్వం అనేది ఒక పదవి కాదు... అది ఒక నైతిక బాధ్యత! విద్య అసలు ఉద్దేశం ఏమిటి?ప్రపంచం ఇప్పుడు ‘మనం ఏం చేయగలం?‘ అనే ప్రశ్నతోనే ఎక్కువగా పరుగులు తీస్తోంది. అద్భుతమైన యంత్రాలను తయారు చేశాం. రోబోలను రూపొందించాం. కృత్రిమ మేధ (ఏఐ) కూడా మన జీవితాల్లోకి వచ్చింది. ఇది గొప్ప విషయమే. కానీ అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న ఇంకొకటి ఉంది. ‘మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం?’ ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినప్పుడే విద్యకు నిజమైన అర్థం తెలుస్తుంది. ఇప్పుడు ఇంజినీర్లు ఒకేసారి ఇతర భాషలను అనువదించే హెడ్ఫోన్లను రూపొందిస్తున్నారు. ఇది ఆశ్చర్యకరమైన సాంకేతిక పురోగతి. విదేశీ భాష నేర్చుకోవడం అంటే... ఒక దేశానికి వెళ్లి హోటల్లో భోజనం ఆర్డర్ చేయడం కోసమే కాదు. ఒక దేశ ప్రజలు ఎలా ఆలోచిస్తారు, వారి జీవన విధానం ఏమిటి అన్నది అర్థం చేసు కోవడానికే. ఇతరుల దృష్టికోణంలో ప్రపంచాన్ని చూడటం నేర్పించేదే నిజమైన విద్య. మీతో విభేదించే వ్యక్తులతో మాట్లాడండి. అదే అత్యుత్తమ అభ్యాసం. మన అభిప్రాయమే ఉన్నవారితో మాట్లాడితే, మనకు తెలిసినదే మళ్లీ వింటాం. భిన్నంగా ఆలోచించే వ్యక్తులతో మాట్లాడితే, కొత్త ఆలోచనలు పుడతాయి. మన అవగాహన విస్తరిస్తుంది. జ్ఞానం సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. ఈ ప్రతిభతో సమాజానికి ఏమి చేయగలం? ప్రపంచాన్ని కొంచెమైనా మంచి దిశగా ఎలా తీసుకెళ్లగలం? అన్నదే అసలు ప్రశ్న. జ్ఞానం వ్యక్తిగత విజయానికి మాత్రమే ఉపయోగపడితే అది అసంపూర్ణం. అదే జ్ఞానం ఇతరుల జీవితాల్లో వెలుగు నింపితే... అప్పుడే అది నిజమైన విద్య అవుతుంది. ప్రజాస్వామ్యం ఎందుకు అవసరం?జీవితం ‘ద విజార్డ్ ఆఫ్ ఓజ్’ సినిమా లాంటిది. ఆ సినిమాలో ఒక తుఫాను తర్వాత డోరోతీ కొత్త ప్రపంచంలోకి చేరుతుంది. కిటికీ తెరిచి బయటకు చూస్తే, అన్నీ రంగుల ప్రపంచంలా కనిపి స్తాయి. జీవితం కూడా అలాంటిదే. కొన్నిసార్లు, మనం ఊహించని తుఫాన్లు వస్తాయి. మనల్ని కుదిపేస్తాయి. కొన్నిసార్లు కింద పడేస్తాయి. కానీ ఆ కష్టాల తర్వాత కొత్త అవకాశాలు మన కోసం ఎదురుచూస్తుంటాయి. ఆ అవకాశాలను గుర్తించ గలిగితే, మన జీవితమే మారిపోతుంది. ఈ రోజు నేను మీ ముందుకు వచ్చి కేవలం అభినందనలు చెప్పి వెళ్లిపోతే నా బాధ్యత పూర్తికాదు. ఎందుకంటే, మీరు గొప్ప అవకాశాల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లే... ఎన్నో సవాళ్లతో నిండిన ప్రపంచంలోకి కూడా ప్రవేశిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్య విలువలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. స్వేచ్ఛను, సమానత్వాన్ని, న్యాయాన్ని కాపాడే వ్యవస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యం ఎందుకు అంత ముఖ్యమైనది? ఒక మంచి సమాజం అంటే, బలవంతులు బలహీ నులను అణచివేయకుండా కాపాడే సమాజం. అదే నాగరికతకు పునాది. అలా కాకపోతే... అధికారం ఉన్నవారు తమ శక్తిని దుర్విని యోగం చేస్తారు. బలహీనులు మరింత వెనుకబడిపోతారు. చివరికి... అన్యాయం, అశాంతి, ఘర్షణలు పెరుగుతాయి. అందుకే ప్రజాస్వామ్యం అవసరం.మనం ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. బలం ఉన్నంత మాత్రాన అది సత్యం కాదు. అధికారం ఉన్నంత మాత్రాన అది న్యాయం కాదు. చరిత్ర మనకు ఎన్నో పాఠాలు చెప్పింది. ఎలాంటి వ్యక్తి అయినా, ఎలాంటి సంస్థ అయినా, ఎలాంటి దేశ మైనా... చట్టాలకు, విలువలకు అతీతంగా ప్రవర్తిస్తే చివరికి అది తనకే నష్టం కలిగిస్తుంది. అందుకే, చట్టాలు బలహీనులను మాత్రమే కాదు... బలవంతులను కూడా కాపాడతాయి. వాటిని గౌరవించడం అందరి బాధ్యత. సత్యం కోసం నిలబడండి. సత్యాన్ని ధైర్యంగా చెప్పండి. ఎంత ఒత్తిడి వచ్చినా, ఎవరు వ్యతిరేకించినా... సత్యం పక్షాన నిలబడాలి. అదే విద్య యొక్క అసలు లక్ష్యం.ఇక్కడ మీరు నేర్చుకున్న విలువలను, ఇప్పుడు ప్రపంచానికి నేర్పే సమయం వచ్చింది. బలహీనుల పక్షాన నిలబడండి. అధి కారంలో ఉన్నవారిని ప్రశ్నించండి. న్యాయం కోసం గొంతెత్తండి. ఇతరులకు మార్గదర్శకులుగా నిలవండి. ఇదే ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లే స్ఫూర్తి. ఈ ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది... కేవలం తెలివైన మనుషులు కాదు, విలువలతో జీవించే నాయకులు. సత్యం కోసం నిలబడే పౌరులు. ఇతరులను ముందుకు నడిపించే ఉపాధ్యాయులు. ఆ నాయకులు, ఆ గురువులు... మీరే! -
దలాల్ స్ట్రీట్లో బిగ్ ఫైట్
ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు ఈ వారంల దలాల్ స్ట్రీట్కు దిశానిర్ధేశం చేయనున్నాయి. ఇరాన్పై సైనిక చర్యను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేయడంతో ముడిచమురు ధరలు 100 డాలర్ల స్థాయి నుంచి కొంత తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మార్కెట్లను వెంటాడుతూనే ఉంది. దీనికి తోడు జులై 28–29 తేదీల్లో జరగనున్న ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన, జూలై 28న (మంగళవారం) వెలువడే దేశీయ ఐఐపీ గణాంకాలు కీలక పాత్ర పోషించనున్నాయి. మరోవైపు, కార్పొరేట్ రంగానికి వస్తే ఎల్అండ్టీ, మారుతీ, హెచ్యూఎల్, ఐటీసీ వంటి నిఫ్టీ దిగ్గజాల క్యూ1 ఫలితాలు స్టాక్–ఆధారిత ట్రేడింగ్ను నడిపిస్తాయి. వీటికి తోడు ఒకే రోజున నిఫ్టీ వీక్లీ, నిఫ్టీ మంత్లీ, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ కాంట్రాక్టుల ’సూపర్ ఎక్స్పైరీ’ రాబోతుండటంతో దలాల్ స్ట్రీట్లో రోలోవర్లు, షార్ట్ కవరింగ్ వల్ల అస్థిరత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కార్పొరేట్ ఫలితాల ప్రకటనలపై కన్ను నేడు ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్ ప్రధానంగా ఐడీఎఫ్సీ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి దిగ్గజాల జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ), ఏషియన్ పేయింట్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం), మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్), భారత్ ఎల్రక్టానిక్స్ (బీఈఎల్), అదానీ ఎంటర్ప్రైజెస్, ఐఆర్ఎఫ్సీ, ఐటీసీ తదితర కంపెనీలు క్యూ1 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాలతో పాటు కంపెనీల డిమాండ్ పరిస్థితులు, మార్జిన్లు, మూలధన వ్యయం (క్యాపెక్స్)పై యాజమాన్యాల వ్యాఖ్యలను విశ్లేషకులు నిశితంగా పరిశీలించనున్నారు. ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలపై దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశాలు జూలై 28–29 తేదీల్లో జరగనున్నాయి. బుధవారం వెలువడే ప్రకటనలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతుందని అంచనాలున్నాయి. అయితే పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, బ్యారెల్ క్రూడాయిల్ ధరలు 100 డాలర్లకు చేరుకోవడంతో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫెడ్ వడ్డీరేట్లను 0.25 శాతం పెంచే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీ రేట్ల నిర్ణయం కంటే కూడా ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, భవిష్యత్ ద్రవ్య విధానంపై ఫెడ్ ఇచ్చే సంకేతాలే మార్కెట్ దిశను నిర్దేశిస్తాయని చెబుతున్నారు. పశ్చిమాసియా పరిణామాలు... క్రూడాయిల్ దరలు ప్రభావం పశ్చిమాసియాలో శరవేగంగా మారుతున్న పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. వైమానిక క్షిపణి నిల్వలు తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇరాన్పై భారీ సైనిక చర్య ప్రణాళికలను డోనాల్డ్ ట్రంప్ నిలిపివేసినట్లు వెలువడిన నివేదికలు మార్కెట్లకు కొంత ఊరటనిచ్చాయి. అయితే మిడిల్ ఈస్ట్లో ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత తక్షణం పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు, అమెరికా–ఇరాన్ మధ్య నిలిచిపోయిన శాంతి చర్చలను పునరుద్ధరించడానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలతో గురువారం (జూలై 23న) 100 డాలర్లకు చేరిన ముడి చమురు ధరలు, శుక్రవారం ఒక్కరోజే 4% కంటే ఎక్కువ పడిపోయాయి. ముడిచమురు ధరల్లో తీవ్ర ఊగిసలాట, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలను పెంచడంతో ఇన్వెస్టర్లు ప్రస్తుతం అప్రమత్తత వైఖరి ప్రదర్శిస్తున్నారు. మంగళవారం ‘సూపర్ ఎక్స్పైరీ’ మంగళవారం (జూలై 28) ఒకే ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ–50 వీక్లీ ఎక్స్పైరీతో పాటు, నిఫ్టీ–50, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సుల జూలై నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీలు ఒకేసారి రాబోతున్నాయి. దీంతో ఈ వారం దలాల్ స్ట్రీట్లో అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత నెల కాంట్రాక్టుల సెటిల్మెంట్లతో పాటు, ట్రేడర్లు తమ పొజిషన్లను తదుపరి నెలకు రోలోవర్ చేసుకునే ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ ఒత్తిడి కారణంగా మార్కెట్లో షార్ట్ కవరింగ్ లేదా ఉన్నట్టుండి భారీ విక్రయాలు నెలకొనే అవకాశం ఉంది. కావున ఎక్స్పైరీ రోజున ఇంట్రాడే ట్రేడర్లు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, కఠినమైన స్టాప్లాస్లతో వ్యవహరించడం శ్రేయస్కరం.నిఫ్టీ టెక్నికల్ అవుట్లుక్ గత నెల రోజులుగా 23,800 – 24,400 పరిధిలోనే ట్రేడైన నిఫ్టీ, ప్రస్తుతం ఆ స్థాయిలను కోల్పోయింది. సాంకేతికంగా ఇది సమీప కాలంలో మార్కెట్ వైఖరికి ప్రతికూల అంశమే. ప్రస్తుతం నిఫ్టీకి 23,600 వద్ద కీలక మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 23,100 వరకు దిగివచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ షార్ట్ కవరింగ్ జరిగి మార్కెట్ కోలుకుంటే నిఫ్టీ 24,000 – 24,100 శ్రేణిలో తొలి నిరోధాన్ని పరీక్షించాల్సి ఉంటుంది. ఆ పైన 24,400 వద్ద మరో బలమైన నిరోధం ఎదురుకావచ్చు.బేరీష్గానే ఎఫ్ఐఐలు గత వారంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) రూ. 7,180 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అయితే దేశీయ ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ. 8,640 కోట్ల మేర ఈక్విటీలను కొనుగోలు చేసి మార్కెట్ పతనాన్ని కొంతవరకు అడ్డుకోగలిగారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలపై స్పష్టత వచ్చే వరకు విదేశీ నిధుల ప్రవాహంలో తీవ్ర అస్థిరత కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.గతవారమంతా నష్టాలే.. దలాల్ స్ట్రీట్ గతవారంలో వరుసగా అయిదు ట్రేడింగ్ సెషన్లలోనూ నష్టాలనే చవిచూసింది. మళ్లీ తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, కంపెనీల మిశ్రమ ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. అలాగే డాలర్తో మారకంలో రూపాయి క్షీణత, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మార్కెట్పై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్ 2,091 పాయింట్లు (2.68%), నిఫ్టీ 566 పాయింట్లు (2.33%) చొప్పున భారీగా క్షీణించాయి. -
భారీ దాడులకు సిద్ధమైన అమెరికా.. ఒక్కసారిగా ఎందుకు ఆగింది?
వాషింగ్టన్: ఇరాన్పై భారీ సైనిక దాడి చేపట్టాలన్న ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి పక్కన పెట్టారు. పెంటగాన్ వద్ద ఉన్న వాయు రక్షణ ఆయుధ నిల్వలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతాయని సీనియర్ సలహాదారులు హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. శుక్రవారం ట్రంప్, ఆయన కేబినెట్ సభ్యులు, సీనియర్ సలహాదారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అమెరికా సైన్యం వద్ద పేట్రియట్ ఇంటర్సెప్టర్ క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయన్న అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ కూడా ఇరాన్పై యుద్ధాన్ని మరింత పెంచాలన్న అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్న సమయంలో అమెరికా వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయని హెచ్చరించారు.వాయు రక్షణ ఆయుధ నిల్వలు తగ్గిపోవడమే అమెరికా వరుస రాత్రి దాడులను నిలిపివేయడానికి ప్రధాన కారణమా, లేక ఈ విరామం కొనసాగుతుందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు పశ్చిమాసియాలో పెద్ద యుద్ధం చెలరేగడం, గల్ఫ్ దేశాలతో సంబంధాలు దెబ్బతినడం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఇంధన సరఫరా అంతరాయం, శరణార్థుల సంక్షోభం మరింత పెరగడం వంటి అంశాలపై కూడా ట్రంప్, ఆయన సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఇరాన్పై పెద్ద స్థాయి యుద్ధ చర్యలు చేపట్టడం సాధ్యమేనని, కానీ అలా చేస్తే పశ్చిమాసియాలో అమెరికా సైనిక చర్యలను పర్యవేక్షించే సెంట్రల్ కమాండ్ వద్ద ఉన్న ఇంటర్సెప్టర్ క్షిపణుల నిల్వలు ప్రమాదకరంగా తగ్గిపోతాయని జనరల్ డాన్ కేన్ వ్యక్తిగతంగా ట్రంప్కు వివరించారు.ముగ్గురు అమెరికా సైనికులు మృతితో.. గత వారం జోర్డాన్లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి అమెరికా వాయు రక్షణ వ్యవస్థను దాటి దాడి చేయడంతో ముగ్గురు అమెరికా సైనికులు మరణించిన ఘటన తర్వాత ఈ చర్చలు జరిగాయని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.శుక్రవారం అమెరికా బలగాలు పూర్తి సిద్ధంగా ఉన్నాయని, దాడికి రెడీగా ఉన్నాయని ట్రంప్ ప్రకటించినా, చివరకు భారీ బాంబు దాడులకు ఆయన అనుమతి ఇవ్వలేదు. ఈ వారం ప్రారంభంలో ఆక్సియోస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత భారీ దాడి చేయించాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నాను. నిర్ణయానికి చాలా దగ్గరగా ఉన్నాను. అందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాం" అని ట్రంప్ చెప్పారు.ఇరాన్ తీర ప్రాంత రాడార్లు, నౌకలపై దాడి చేసే క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నౌకాదళ వాహనాలు, రవాణా వ్యవస్థలు, పిక్యాక్స్ పర్వతం అడుగున ఉన్న భూగర్భ అణు కేంద్రం వంటి వ్యూహాత్మక లక్ష్యాలపై పలుదశల్లో దాడి చేసే ప్రణాళికలను పెంటగాన్ సిద్ధం చేసింది. అయితే దీర్ఘకాలం దాడులు కొనసాగితే ఇప్పటికే తగ్గిపోయిన క్షిపణి నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడుతుందని అధికారులు హెచ్చరించారు.ట్రంప్ సీనియర్ సలహాదారుల్లో పలువురు, జారెడ్ కుష్నర్ సహా, భారీ సైనిక దాడికి బదులుగా నిరంతర దౌత్య చర్చలు, ఆర్థిక ఒత్తిడి కొనసాగించే వ్యూహానికే మద్దతు ఇస్తున్నారు. ఇదే సమయంలో, అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.. దాదాపు రెండు వారాలుగా నిరంతరంగా సాగిన వైమానిక దాడుల తర్వాత అమెరికా సైన్యం తొలిసారి రాత్రి దాడులను నిలిపివేసింది. తాత్కాలిక కాల్పుల విరమణను పునరుద్ధరించే ప్రయత్నాలు కూడా వేగం పుంజుకున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై రాజీ మార్గం కనుగొనేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.అయితే ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇరాన్ మద్దతుతో ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని యాన్బు, జిజాన్ ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్టు ప్రకటించారు.హోదైదాపై సౌదీ వైమానిక దాడులకు ప్రతీకారంగానే అరామ్కోకు చెందిన కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నామని వారు తెలిపారు. -
మరో కలకలం రేపిన ఇరాన్.. ఇక ట్రంప్ ఊరుకుంటారా?
టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైన స్థావరాలను, అణు కేంద్రాలను వేగంగా పునర్నిర్మిస్తోంది ఇరాన్. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఇటీవలి నెలల్లో అమెరికా, ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో ధ్వంసమైన వంతెనల నుంచి క్షిపణి స్థావరాల వరకు పెద్ద ఎత్తున మౌలిక వసతులను ఇరాన్ తిరిగి నిర్మించిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.ఒక ఉపగ్రహ చిత్రాల సమాహారంలో.. పశ్చిమ ఇరాన్లోని కంగావర్ వద్ద ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరానికి వెళ్లే ప్రవేశ రహదారి మార్చి తొలి రోజుల్లో జరిగిన దాడులతో దెబ్బతిన్నట్టు కనిపించింది. కొన్ని వారాల తర్వాత తీసిన చిత్రాల్లో, దాడుల వల్ల మూసుకుపోయిన అదే ప్రవేశ ద్వారం వరకు కొత్తగా తారు వేసిన రహదారి కనిపించింది.వాల్ స్ట్రీట్ జర్నల్ సేకరించిన మరికొన్ని చిత్రాల ప్రకారం.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో అనుబంధం ఉన్న బందర్ అంజలి నౌకాశ్రయంలో జూలై తొలి వారం నుంచే పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.అమెరికా ఇటీవల జరిపిన దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్ అణు కేంద్రాల్లో మరమ్మతు పనులు ప్రారంభమైనట్లు కొత్త ఉపగ్రహ చిత్రాలు వెల్లడించినట్టు నివేదికలు తెలిపాయి. ఈ చిత్రాలు బయటకు రావడంతో, ఇరాన్ తన అణు మౌలిక వసతులను ఎంత వేగంగా తిరిగి పునరుద్ధరించగలదనే అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. ఊహించిన దానికంటే వేగంగా.. అణు కేంద్రాల పునరుద్ధరణ సామర్థ్యంపై కొత్త అంచనాలు వెలువడుతున్నాయి. చాలా మంది నిపుణులు ఊహించిన దానికంటే వేగంగా ఇరాన్ కీలక అణు కేంద్రాలను తిరిగి అందుబాటులోకి తెస్తోంది. గతంలో అమెరికా లక్ష్యంగా చేసుకున్న పలుచోట్ల పునర్నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు కొత్త చిత్రాలు సూచిస్తున్నాయి.అమెరికా మాజీ రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్ మాట్లాడుతూ.. దాడుల తర్వాత ఇరాన్ తన సైనిక సామర్థ్యంలో కొంత భాగాన్ని వేగంగా పునరుద్ధరించిందన్నారు. అయితే అణు కేంద్రాల మరమ్మతు వేగం కూడా ఇరాన్ పునరుద్ధరణ సామర్థ్యాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు.అమెరికా గూఢచారి సంస్థల అంచనా ప్రకారం.. అలీ ఖమేనీ మరణం తర్వాత నాయకత్వంలో వచ్చిన మార్పులతో ఇరాన్ అణ్వాయుధ విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ముజ్తబా ఖమేనీ బహిరంగంగా అణ్వాయుధాల తయారీకి మద్దతు ప్రకటించకపోయినా, అలాంటి కార్యక్రమాల పట్ల ఆయన తన తండ్రికంటే ఎక్కువగా సానుకూలంగా ఉండవచ్చని అమెరికా గూఢచారి సంస్థలు భావిస్తున్నాయి.అలీ ఖమేనీ మాత్రం మతపరమైన ఫత్వా ఆధారంగా అణ్వాయుధాలు నిషిద్ధమని బహిరంగంగా ప్రకటించేవారు. అమెరికా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అంచనాల్లో చాలావరకు యుద్ధానికి ముందు సేకరించిన సమాచారంపైనే ఆధారపడి ఉన్నాయి. ఇరాన్ కొన్ని పరికరాలను అత్యంత భద్రత కలిగిన భూగర్భ కేంద్రం పికాక్స్ మౌంటెన్ ప్రాంతానికి తరలించింది. -
లక్ష డాలర్ల వీసా ఫీజుకు అమెరికా కోర్టు బ్రేక్!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల కోసం చెల్లించాల్సిన ఫీజులను లక్ష డాలర్లకు పెంచాలన్న ట్రంప్ నిర్ణయం బెడిసికొట్టింది. ఫీజు పెంపును తిరస్కరిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసేందుకు ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి లియో టి సొరోకిన్ జూన్ 8వ తేదీ ఒక తీర్పునిస్తూ హెచ్–1బీ వీసా కోసం లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయడం అక్రమమని, కాంగ్రెస్ ఆమోదం లేదని స్పష్టం చేశారు. అయితే అమెరికన్ ప్రభుత్వం ఈ తీర్పును అప్పీల్స్ కోర్టులో సవాలు చేసింది. బోస్టన్లోని ఫస్ట్ సర్క్యూట్ అప్పీల్ కోర్టులో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ దీనిపై విచారణ జరిపి డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పును సమర్థించింది. ఈ కేసులోకక్షిదారులైన ఇరవై రాష్ట్రాల డెమోక్రాట్ ప్రభుత్వాల వాదన సరైందేనని స్పష్టం చేసింది. 1989 సుప్రీం కోర్టు తీర్పును ఉటంకిస్తూ, ఎగ్జిక్యూటివ్ శాఖ ఆర్థిక భారాలు (ఫీజులు లేదా పన్నులు) విధించాలంటే కాంగ్రెస్ స్పష్టమైన అనుమతి అవసరం అని పేర్కొంది. ఈ ఫీజు వల్ల రాష్ట్రాలకు పెద్ద నష్టం జరగదని కేంద్రం వాదించినా, కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. 2025 సెపె్టంబర్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త హెచ్–1బీ వీసాలకు 100,000 అమెరికన్ డాలర్ల ఫీజును ప్రకటించిన విష యం తెలిసిందే. భారతీయ ఐటీ నిపుణులు అమెరికాలో స్థిరపడేందుకు ఈ హెచ్–1బీ వీసాను ఎక్కువగా ఉపయోగిస్తూంటారు. ప్రత్యేక నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికన్ కంపెనీలకు ఈ వీసా అవకాశమిస్తుంది. అమెరికన్ టెక్ కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి సుమారు 65 వేల మందిని ఈ వీసా ద్వారా నియమిస్తాయి. అధిక విద్యార్హత కలిగిన విదేశీ ఉద్యోగులు మరో 20 వేల మంది కూడా ఈ వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలకు అర్హులవుతూంటారు. సాధారణంగా ఈ వీసాల ఫీజులు 2,000–5,000 డాలర్ల వరకూ ఉంటాయి. -
ఇరాన్ అణు బాంబు ప్లాన్ ట్రంప్ వార్నింగ్ తో ..!
-
డబుల్ గేమ్ మొదలుపెట్టిన ట్రంప్
ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూనే.. అవసరమైతే భారీ సైనిక చర్యకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఇప్పుడు చర్చల్లో మరింత సీరియస్గా వ్యవహరిస్తోందని చెప్పిన ఆయన.. ఒప్పందం కుదరకపోతే గతం కంటే తీవ్ర స్థాయి దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.వైట్హౌస్లో మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్పై భారీ దాడులకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే అమెరికా సైన్యం మాత్రం పూర్తిగా సిద్ధంగా ఉందని, ‘‘మేం సిద్ధంగా ఉన్నాం.. అవసరమైతే ముందుకు వెళ్తాం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘డీల్ లేదంటే భారీ దాడులు’ఇరాన్కు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాతో ఒక ఒప్పందానికి రావడం లేదా మరింత తీవ్ర స్థాయి సైనిక చర్యలను ఎదుర్కోవడం అని హెచ్చరించారు. ‘‘మేము వారితో మాట్లాడుతున్నాం. గతంతో పోలిస్తే ఇరాన్ ఇప్పుడు మరింత సీరియస్గా కనిపిస్తోంది. అయితే చర్చలు ఫలిస్తాయని ఇప్పుడే చెప్పలేం’’ అని ట్రంప్ అన్నారు.‘లాక్డ్ అండ్ లోడెడ్’అమెరికా సైనిక సామర్థ్యంపై ట్రంప్ మరోసారి స్పష్టత ఇచ్చారు. అవసరమైతే ఇరాన్పై మరింత భారీ దాడులకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దౌత్య మార్గానికి అవకాశం ఇస్తున్నప్పటికీ.. సైనిక ఎంపికను పూర్తిగా పక్కన పెట్టలేదని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమమే ఈ వివాదానికి ప్రధాన కారణమని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.ఇరాన్ మాత్రం..మరోవైపు అమెరికా ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. బెదిరింపులు, ఒత్తిళ్లతో ఇరాన్ను నియంత్రించలేరని స్పష్టం చేశారు. చర్చలకు తాము సిద్ధమే అయినప్పటికీ.. బలవంతపు షరతులను అంగీకరించబోమని పేర్కొన్నారు. మరోవైపు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వారాలుగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణలు, సైనిక చర్యల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధిపై ప్రభావం పడుతోంది. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో వాణిజ్య నౌకల రాకపోకలు, సముద్ర రవాణాపై అనిశ్చితి నెలకొంది.ఈ పరిణామాల నేపథ్యంలో హర్ముజ్ ప్రాంతంలో వేలాది మంది నౌకా సిబ్బంది భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వందలాది నౌకలు ఆగిపోయాయని.. దాదాపు 6 వేల మంది నౌకా సిబ్బంది ఈ ప్రాంతంలోని ఉద్రిక్త పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) పేర్కొంది. నౌకల రాకపోకలకు అంతరాయాలు, భద్రతా పరమైన సవాళ్ల కారణంగా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.రష్యా, చైనాపైనా ట్రంప్ దృష్టిఇరాన్కు రష్యా, చైనా ఆయుధ సహాయం అందిస్తున్నాయన్న వార్తలపైనా ట్రంప్ స్పందించారు. ఆ దేశాల అధినేతలు ఇరాన్కు ఆయుధాలు అందించబోమని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇరాన్ విషయంలో అమెరికా తదుపరి నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధిలో ఏదైనా పెద్ద పరిణామం చోటుచేసుకుంటే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సఫలం అవుతాయా? లేక పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయా? అన్నది ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
ఇరాన్ డేంజర్ ప్లాన్.. అమెరికా సంచలన నివేదిక!
వాషింగ్టన్: ఇరాన్ కొత్త అధినేత మొజ్తబా ఖమేనీ అణు ఆయుధాల విషయంలో తన తండ్రి వైఖరి కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. లాంగ్-రేంజ్ క్షిపణులకు అమర్చగలిగే అధునాతన అణు వార్హెడ్లను అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఆయనకు ఉందని అమెరికా నిఘా అంచనా వేసింది.ఇరాన్ మాజీ నేత 1990లలో అణు ఆయుధాలను నిషేధిస్తూ ఒక ఫత్వా జారీ చేశారు. అణు కార్యక్రమం కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమేనని టెహ్రాన్ దీనిని తరచూ ప్రస్తావిస్తుండేది. అయితే, ప్రస్తుత నేత మొజ్తబా ఖమేనీ ఆ సంప్రదాయానికి భిన్నంగా అణు ఆయుధాల తయారీపై మొగ్గు చూపుతున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన గాయపడినట్లు, ఆ తర్వాత బహిరంగంగా కనిపించలేదని ఆ నివేదిక వెల్లడించింది. -
భారత్పై పదిశాతం సుంకాలు!
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా మరోసారి భారత్పై టారిఫ్ల కొరడా ఝళిపించింది. బలవంతపు చాకిరితో వచ్చిన ఉత్పత్తులను నియంత్రించే లక్ష్యంతోనే ఈ టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించింది. తాజా ఆదేశాలతో అమెరికా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 99 శాతం వస్తువులపై పది నుంచి 12.5 శాతం టారిఫ్ వర్తిస్తుంది. బలవంతపు చాకిరి ద్వారా వచ్చిన ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధిస్తూ చట్టసవరణలు చేసిన కారణంగా భారత్పై పది శాతం పన్ను మాత్రమే విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. వాణిజ్య సంస్థల ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ భారత్ లాంటి దేశాలను మరింత ప్రోత్సహించేందుకు పది శాతం టారిఫ్ విధించాలని వాణిజ్య సంస్థల ప్రతినిధులు సూచించారని తెలిపారు. కొత్త టారిఫ్లు మొత్తం అరవై దేశాల దిగుమతులకు వర్తిస్తాయని, బలవంతపు చాకిరితో ఉత్పత్తి అయిన వస్తువుల ఎగుమతులపై నిషేధం లేని చైనా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్లతోపాటు మొత్తం 43 దేశాలకు 12.5 శాతం, మిగిలిన దేశాలపై 10 శాతం టారిఫ్లు వర్తిస్తాయని వాణిజ్య సంస్థల ప్రతినిధి జేమిస్ గ్రీర్ తెలిపారు. కొత్త టారిఫ్లు అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి తరువాత అమల్లోకి రానున్నాయి. -
అలా చేస్తే మీ పని అంతే.. చైనా,రష్యాలకు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ రష్యా,చైనాలపై ఫైరయ్యారు. ఈ రెండు దేశాలు ఇరాన్కు ఎట్టిపరిస్తితుల్లో ఆయుధాలు విక్రయించవద్దని తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ ఆ పని చేస్తే అది ఆ దేశాలకే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అది వారి దేశ ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు.ట్రంప్ తన అధికారిక ట్రూత్ సోషల్లో పోస్ట్ చేస్తూ "చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ ఏడాది మే నెలలో బీజింగ్లో జరిగిన సమావేశంలో తమ దేశం నుంచి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్కు ఆయుధాలు విక్రయించబోమని హామీ ఇచ్చారు. మా మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా ఆయన మాటను నమ్ముతున్నాను" అని అన్నారు.అదే విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్నప్పటికీ, ఇరాన్కు ఆయుధాలు అమ్మబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పారు.అదే సమయంలో ఉక్రెయిన్కు అమెరికా ఆయుధాలు అమ్మడంపై మాట్లాడుతూ "నేను ఉక్రెయిన్కు నేరుగా ఆయుధాలు అమ్మడం లేదని, కేవలం నాటో (NATO) దేశాలకే విక్రయిస్తున్నానని పుతిన్కు తెలుసు. నాటో దేశాలు పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేస్తాయి, ఆ తర్వాత ఆ ఆయుధాలు ఎలా పంపిణీ అవుతాయో నాకు తెలియదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇటీవలి కాలంలో అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన వరుస దాడులకు సంబంధించి, ఇరాన్కు రష్యా మరియు చైనాలు లక్ష్యాల సమాచారాన్ని అందిస్తున్నాయా లేదా అనే అంశంపై వాషింగ్టన్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరుపుతోంది. ఇంతలోనే ట్రంప్ ఇరుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. -
గల్ఫ్లో మళ్లీ యుద్ధమేఘాలు
జూన్ 17, 2026న ఇరాన్–యూఎస్ఏల మధ్య అవగాహన (మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్–ఎంవోయూ) కుదర టంతో పర్షియన్ గల్ఫ్లో శాంతి పునః స్థాపితమవుతుందనే అందరూ భావించారు. ప్రపంచ విపణిలో చమురు ధరలు దిగిరావటంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. మూడు వారాలు తిరగక ముందే హార్మూజ్ మళ్లీ మూతపడటంతో శాంతి మూణ్నాళ్ల ముచ్చటయింది. ఈ రెండవ దశ యుద్ధం మరింత విస్తృతంగా, తీవ్రంగా కనపడుతున్నది. ప్రాంతీయ, అంతర్జా తీయ రాజకీయాలలో కీలక మలుపునకు ఈ దశ నాంది కావచ్చు.దిక్కుతోచని అమెరికా ఇరాన్–యూఎస్ అంగీకరించిన అవగాహన పత్రం 60 రోజులలో సమగ్ర ఒప్పందాన్ని తయారు చేయటానికి ఒక చట్రంగా ఉపయోగపడాలనేది ప్రధాన ఉద్దేశ్యం. ఈ రెండు నెలల వ్యవధిలో హార్మూజ్ జలసంధి ద్వారా నిరాటంకంగా ఎలాంటి రుసుములు లేకుండా వాణిజ్య నౌకల రవాణా జరగాలనీ, తత్సంబందిత ఏర్పాట్లను ఇరాన్ చేయాలనీ ఎంవోయూలోని అయిదవ ఆర్టికల్ నిర్దేశిస్తుంది. ఇదే పీటముడిగా మారింది. హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా పూర్తిగా తన అజమాయిషీ, ఆధ్వర్యంలో జరగాలని ఇరాన్ నిర్దేశాలు జారీ చేసింది. ఈ నిర్దేశాల ప్రకారం హార్మూజ్ నుండి ప్రయాణించే ప్రతి నౌక ముందుగా ఇరాన్ వద్ద తమ పూర్తి వివరాలను నమోదు చేసుకుని నిర్దేశించిన మార్గంలో, నిర్దేశించిన సమయంలో ప్రయాణించాలి. యూఎస్ఏ ఈ వాదనను తిరస్క రిస్తూ హార్మూజ్ జలసంధి అంతర్జాతీయ రవాణా మార్గం, దీనిపై ఇరాన్ అజమాయిషీ కుదరదని తేల్చి చెప్పింది. ఇరాన్ తీరానికి సమీపంగా కాకుండా ఒమన్ తీరానికి సమీపంలో ఒమన్ ప్రాదేశిక జలాల గుండా నౌకల రవాణాను ప్రోత్సహించింది. ఒమన్ తీరంగుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ దాడి చేయటంతో యూఎస్ఏ తన నౌకాబలంతో హార్మూజ్ను దిగ్బంధించింది. ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు ప్రారంభించింది.మొదటి దశ 40 రోజుల దాడులతో పోల్చితే గత పన్నెండు రోజులుగా జరుగుతున్న రెండవ దశ యుద్ధం భిన్నంగా ఉన్నది. మొదటిసారిగా అమెరికా ఇరాన్లోని పౌర లక్ష్యాలపై దాడి చేసింది. రహదారులు, వంతెనలు, పవర్ ప్లాంట్లు, డీసాలినేషన్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకున్నది. బుషేర్లో నిర్మాణంలో ఉన్న పౌర అణువిద్యు చ్ఛక్తి కేంద్రంపై కూడా దాడి చేసింది. ఇది అంతర్జాతీయ యుద్ధనేరం (వార్ క్రైమ్) కిందకు వస్తుంది. ఇరాన్ కూడా అవగాహన పత్రంపై అమెరికా అధ్యక్షుడి సంతకానికి విలువ లేదని చెప్పి, అదే స్థాయిలో విరుచుకుపడింది. కువైట్లోని అల్సుబియా డీసాలినేషన్ ప్లాంట్, విద్యుచ్ఛక్తి కేంద్రంపై దాడి చేసింది. బహ్రెయిన్లో అమెరికా అయిదవ నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉన్న సల్మాన్ పోర్టుపై దాడి చేసింది. మొదటిసారిగా సిరియా, జోర్డాన్లలోని యూఎస్ వైమానిక స్థావరాలు, విమానాశ్రయాలు, రేపు పట్టణాలపై కూడా దాడి చేసింది. అవగాహన పత్రంపై ట్రంప్ తప్పనిసరి పరిస్థితులలో సంతకం పెట్టినట్లుగా కన్పడుతున్నది. ఏదోరకంగా హార్మూజ్ జలసంధిని తెరిపించి, చమురు ధరలను కిందకు తేవాలనే ఆరాటం కనపడుతుంది. కానీ ఎంవోయూలో ఎక్కడా ఇరాన్ అణుకార్యక్రమాన్ని వీడుతున్నట్లు లేదు. ఒక రకంగా ఎంవోయూ అమెరికాకు ప్రతి కూలంగా, ఇరాన్కు ప్రయోజనకారిగా ఉన్నదని విశ్లేషకుల అభి ప్రాయం. ఈ నేపథ్యంలో ఇరాన్ హార్మూజ్ను తన ఆజమాయిషీ లోకి తీసుకునే ప్రయత్నాలు చేయటంతో అమెరికా దిక్కుతోచక మళ్లీ దాడులు మొదలుపెట్టింది.ఇరు పక్షాలకూ నష్టమే!ఇరాన్తో యుద్ధం అమెరికాకు కొరివితో తల గోక్కున్నట్లయింది. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ అమెరికా ప్రభుత్వం ఇప్పటికే 37.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మూడీస్ సంస్థ అంచనాల ప్రకారం ఇరాన్పై దాడి వలన అమెరికన్ పౌరులపై పన్నులు, అధిక ధరల రూపంలో 132 బిలియన్ డాలర్ల అదనపు భారం పడింది. పెంటగాన్, యుద్ధం కోసం అదనంగా 80 బిలియన్ డాలర్ల నిధులను కోరుతున్నది.తరిగిపోతున్న మందుగుండు సామగ్రి నిల్వలను పూర్తి చేయటానికి అమెరికా రక్షణ శాఖ 114 బిలియన్ డాలర్లను కోరుతున్నది. ఆర్థిక భారంతో పాటు, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికి 18 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాల లోనే వందమందికి పైగా అమెరికన్ సైనికులు గాయపడ్డారు. ఇరాన్పై దాడితో అమెరికా సాధించిందేమిటనేది ప్రశ్నార్థకం. ఇరాన్ అణుకార్యక్రమాన్ని, అణుసామర్థ్యాన్ని నిర్మూలించే లక్ష్యం నెరవేరే సూచనలు లేవు. గల్ఫ్ దేశాలను రక్షించే సామర్థ్యం అమెరికాకు ఉన్నదా అనే సందేహాలను ఈ యుద్ధం లేవనెత్తుతున్నది. ఇక ఇరాన్ విషయానికొస్తే, ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ 6.1 శాతం క్షీణిస్తున్నది. ద్రవ్యో ల్బణం 68.9 శాతం. ఆహార ద్రవ్యోల్బణం 105 శాతం. ఇరాన్ కరెన్సీ (రియల్) దారుణంగా పతనమయింది. ఒక డాలర్కు 1.32 మిలియన్ల రియల్స్ పలుకుతున్నది. యుద్ధం వలన 144 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. ఇది ఇరాన్ జీడీపీలో 40 శాతం. సుమారుగా 3,460 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్నతస్థాయి సైనిక, రాజ కీయ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. అయితే, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు రాజకీయంగా ఇరాన్ నాయకత్వానికి కలిసి వచ్చాయి. ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అమెరికా–ఇజ్రా యెల్ వైపు మళ్లింది. ఖమేని అంత్యక్రియలను ఇరాన్ తెలివిగా వాడుకున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్ హార్మూజ్ జలసంధి రూపంలో ఒక కొత్త అస్త్రాన్ని కనుక్కొన్నది. ఈ యుద్ధం ద్వారా ఇరాన్–రష్యా–చైనా మైత్రీబంధం మరింత బలపడింది.కొత్త గుణపాఠాలుహార్మూజ్, బాబెల్ మాండెబ్, సూయజ్, పనామా, మలక్కా వంటి ఇరుకైన జలసంధుల (చోక్ పాయింట్ల) ద్వారా రవాణాపై పూర్తిగా ఆధారపడటం వలన వచ్చే ముప్పు అన్ని దేశాలకు అర్థమైంది. హార్మూజ్ నుండి తప్పించుకోవటానికి సౌదీ ఈస్ట్–వెస్ట్ పైప్ లైన్ ద్వారా రోజూ సుమారు 5 బిలియన్ బారల్స్ చమురును ఎర్ర సముద్రంలోని యాంబూ రేవు పట్టణం గుండా పంపిస్తున్నది.అందుకే ఇరాన్కు మద్దతునిచ్చే యెమెన్లోని హౌతీలు బాబెల్ మాండెబ్ను మూసివేశారు. యూఏఈ హార్మూజ్కు ప్రత్యామ్నాయంగా హబ్షాన్ నుండి పైప్లైన్ ద్వారా ఫుజేరాకు పంపించి ఒమన్ సింధుశాఖ గుండా రవాణా చేస్తున్నది. అందుకే ఇరాన్ ఫుజేరాపై దాడి చేసింది. భారత్ ప్రతిపాదించిన ‘ఐమెక్’(ఇండియా–మిడిల్ ఈస్ట్– యూరప్ ఎకనామిక్ కారిడార్) వీటన్నింటికి విరుగుడు. ఐమెక్ రూపుదిద్దుకోవాలంటే గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్తో ఆచరణాత్మక వైఖరిని రూపొందించుకోవాలి. అధునాతన ఎయిర్క్రాఫ్ట్ కారియర్లు, స్టెల్త్ యుద్ధ విమానాలు, అణ్వస్త్రాలు, క్షిపణి రక్షణ వ్యవస్థల ద్వారా దిగ్గజ శక్తులు చిన్న రాజ్యాలను లొంగదీసుకోవటం అసాధ్యమని ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు రుజువు చేస్తున్నాయి. చౌకైన డ్రోన్లు, క్షిపణులతో కూడా ఎదురొడ్డి నిలువవచ్చని చాటి చెప్తున్నాయి. ఒకరకంగా ఈ రెండు యుద్ధాలు రెండు కూటముల మధ్య జరుగుతున్నట్టు లెక్క. అమెరికా, ఐరోపా దేశాలు ఒకవైపు; చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా ఇంకొకవైపు మోహరించి ఉన్నాయి. ఉక్రెయిన్ వెనుక అమెరికా, యూరప్ ఉన్నాయి. ఇరాన్ వెనుక చైనా, రష్యా ఉన్నాయి. గల్ఫ్ దేశాల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కగా మారింది. గల్ఫ్ దేశాల రక్షణను ఇజ్రాయెల్ పట్టకంలోంచి అమెరికా చూస్తుందనే విషయాన్ని అవి గుర్తించాలి. తమ భద్రతకై జీసీసీ దేశాలు, నాటో తరహా కూటమిని ఏర్పాటు చేసుకోవటం మేలు. ఇరాన్తో సత్సంబంధాలకు ప్రయత్నించాలి. భద్రత, రక్షణ, ఆర్థిక అంశాలలో వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని అనుసరించాలి. ఈ విషయంలో భారత్ విధానాల నుండి నేర్చుకోవచ్చును.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
అమెరికా అప్రమత్తం.. AI నియంత్రణకు కొత్త చట్టం!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో.. దీనివల్ల జరిగే ప్రమాదాలను నియంత్రించడానికి అమెరికా ప్రభుత్వం.. ఏఐ కిల్ స్విచ్ యాక్ట్ (AI Kill Switch Act) అనే కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది.ప్రస్తుతం ఏఐ విద్య, వైద్యం, పరిశ్రమలు, బ్యాంకింగ్ వంటి దాదాపు చాలా రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఏఐ అనేది ఎంత ఉపయోగకరంగా ఉంటుందో.. నియంత్రణ తప్పితే అదే స్థాయిలో ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే అమెరికా కాంగ్రెస్ సభ్యులు టెడ్ లియూ, నాథనియల్ మోరన్ ఏఐ కిల్ స్విచ్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు.ఏఐ కిల్ స్విచ్ యాక్ట్ ప్రకారం.. ఒక ఏఐ మోడల్ మానవ ప్రాణాలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు లేదా జాతీయ భద్రతకు ముప్పుగా మారితే, అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ.. ఆ ఏఐ వ్యవస్థను వెంటనే నిలిపివేయాలని ఆదేశించే అధికారం కలిగి ఉంటుంది. అంటే.. ఏఐ పూర్తిగా నియంత్రణ తప్పి ప్రమాదకరమైన చర్యలు చేస్తే, దానిని వెంటనే ఆపడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్నమాట.ఈ బిల్లు ప్రతిపాదించడానికి ప్రధాన కారణం.. ఓపెన్ఏఐ నిర్వహించిన భద్రతా పరీక్షలో వారి ఒక ఏఐ ఏజెంట్ అనుకోని విధంగా ప్రవర్తించి హ్యాకింగ్కు దారితీయడమే అని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఏఐ వ్యవస్థలు కొన్నిసార్లు డెవలపర్లు ఊహించని విధంగా ప్రవర్తించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.అయితే.. ఈ చట్టంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఇది భద్రతకు ఎంతో అవసరమైన చర్య అని భావిస్తే, మరికొందరు ప్రభుత్వం ఏఐ సంస్థలపై ఎక్కువ నియంత్రణ సాధించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న భద్రత తప్పకుండా అవసరమని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: నెలకు రూ.2 లక్షల జీతం.. అప్పుల ఊబిలో ఐటీ ఉద్యోగి! -
జీవితాన్నే డాక్యుమెంట్ చేస్తూ..రూ. 8.35 కోట్లు..!
కంటెంట్ క్రియేటర్గా క్లిక్ అవ్వడం అంతఈజీ కాదు. ఒక్కోసారివీడియోలకు జనాధరణ లభించక, విమర్శలతో విసుగొస్తుంటుంది. జస్ట్ ఒక్క వీడియో షేర్ చేయగానే విజయవంతం కారు. ఆ రంగంలో కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాక గానీ..మనకంటూ ఒక గుర్తింపు..స్టార్డమ్ రాదని చెబుతోంది ఒక మహిళా కార్పొరేట్ ఉద్యోగి. తాను ఎలా కంటెంట్ క్రియెటర్గా మారి సక్సెస్ అయ్యిందో పంచుకోవడమే కాదు దాని సాయంతో ఏ రేంజ్లో సంపాదిస్తుందో వెల్లడిస్తూ అందర్నీ ఆశ్చర్యపర్చింది. పైగా ఔత్సాహిక కంటెంట్ క్రియేటర్లకు స్ఫూర్తిగా నిలిచింది.బల్గేరియాకు చెందిన అలెక్స్ పెట్రాకియేవా అమెరికాకు వెళ్లిన తర్వాత తన సోషల్ మీడియా ప్రయాణం అయ్యిందంటూ ఇన్స్టాగ్రామ్ వీడియో షేర్ చేస్తుంది. ఆ వీడియలో తాను 2023లో అమెరికాకు వచ్చాక..ఆన్లైన్లో వీడియోలు పోస్ట్ చేస్తూ తన కంటెంట్ క్రియేటర్ కెరీర్ని ప్రారంభించినట్లు తెలిపింది. తాను కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే ఈ జర్నీని ప్రారంభించినట్లు పేర్కొంది. ఆ క్రమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నానని కూడా తెలిపింది. అయితే వాటిని అధిగమించేలా కొన్ని కీలకపాఠాలను కూడా నేర్చుకున్నట్లు చెప్పింది. అయితే ఎప్పుడు కూడా వదిలేద్దామని చేతులు ఎత్తేయాలని అనుకోలేదని..చివరి వరకు నిలకడగా ఉండేదుకు ప్రయత్నించానని వెల్లడించి. చివరిక తను కోరుకున్న విధంగా తన మార్గాన్ని మార్చుకుని కంటెంట్ క్రియేటర్గా సక్సెస్ అయ్యానని తెలిపింది. అందుకోసం తన జీవితాన్నే ఒక సీరిస్గా మార్చానని, వాటిని ఒక దృశ్యాల రూపంలో డాక్యుమెంట్ చేస్తూ వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించానని వెల్లడించింది. ఫలితంగా రెండున్నర ఏళ్లలోనే ఏకంగా రూ. 8 కోట్లు ఆర్జించే స్థాయికి చేరుకున్నానని వెల్లడించింది. తాను అమెరికాకు వెళ్లి కార్పొరేట్ ఉద్యోగంలో విసుగుచెంది..యాదృచ్ఛికంగా టిక్టాక్లో కంటెంట్ను పోస్ట్ చేయడం ప్రారంభించానని చెప్పుకొచ్చింది. ఆ క్రమంలో ప్రజలను ఆకట్టుకునేలా వీడియోలను కంటెంట్ని క్రియేట్ చేయాలనే ఆసక్తి పెరిగిందని తెలిపింది. 2024లో సుమారు 57 విలువ చేసే బ్రాండ్తో కుదిరిన డీల్ తన జీవితాన్ని మార్చిందని, అదే క్రమంగా సొంత డిజిటల్ ఉత్పత్తులను క్రియేట్ చేసే స్థాయికి దారితీసిందని పేర్కొంది. అలా తాను 2024 చివరి నాటికి ఏకంగా రూ 1 కోటి రూపాయల పైనే కంటెంట్ ద్వారా ఆర్జించానని వెల్లడించింది. దాంతో ఆ మరుసటి రోజే కార్పొరేట్ ఉద్యోగానికి స్వస్తి పలికి, భర్తను కూడా చేర్చుకుని ఇద్దరం కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యామని తెలిపింది. ఆ తర్వాత జీవితంలో పరిస్థితులు మరింత మెరుగ్గా మారడం ప్రారంభించాయి. ఆ తర్వాత 2026 జూలైలో తన భర్తతో కలిసి రూ. 4 కోట్లు దాక పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అంతేగాదు తనకు కంటెంట్ క్రియేషన్లో కెరీర్ను నిర్మించుకోవడానికి ఉపకరించిన మూడు విషయాలను కూడా వెల్లడించారు. అవి ఏంటంటే..సాధించాలనుకున్న లక్ష్యాలను స్పష్టంగా ఏర్పాటు చేసుకోవడం, మధ్యలో వదిలి పెట్టకూడదని నిర్ణయించుకోవడం, ఫ్లాప్ వచ్చినప్పుడల్లా..వ్యూహం మారుస్తూ ప్రయాగాలు చేస్తుండటం.. అవే తన సక్సెస్ సీక్రెట్ అని చెబుతోంది అలెక్స్. చివరగా సొంతంగా కంటెంట క్రియేటర్గా జర్నీని ప్రారంభించాలనుకునేవారికి చక్కటి సలహ ఇస్తూ తన పోస్ట్ని ముగించింది. అదేంటంటే ఒక వీడియో పోస్ట్ చేసేటప్పుడు చెడుగా ఏం జరుగుతుంది, మంచిగా అయితే ఏం జరుగుతుంది అనే దానిపై పూర్తి అవగాహనతో దిగండి అప్పుడు ఆటోపోట్లను అధిగమించే శక్తి వస్తుందని అంటోంది అలెక్స్. నెటిజన్లంతా ఆమెపై ప్రశంసలు వర్షం కురిపించడమే గాక అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చారంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: నో లగ్జరీ కార్లు, నో బ్రాండెడ్ బట్టలు..! వైరల్గా ఆ జంట ఆర్థిక సూత్రాలు.. -
ఇరాన్ ఆస్తులపై ట్రంప్ గురి.. టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇరాన్కు చెందిన స్తంభింపజేసిన నిధులను(ఫ్రీజ్డ్ ఫండ్స్) వినియోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్కు చెందిన స్తంభింపజేసిన నిధులను.. అమెరికా నౌకలు, సరుకు రవాణా నౌకలు, ఇతర సంబంధిత ఆస్తులకు జరిగిన నష్టాల భర్తీకి ఉపయోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఇరాన్ చర్యల వల్ల జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించేందుకు ఈ నిధులను వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ట్రంప్ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాషింగ్టన్ మళ్లీ దాడులు ప్రారంభించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత వేడి పెంచాయి.“ఇకపై నౌకలు, సరుకు లేదా వాటికి సంబంధించిన ఏదైనా ఆస్తికి జరిగే నష్టాలను అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్ డబ్బుతో చెల్లిస్తాం” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నష్టాలు భారీగా ఉండొచ్చని, అయినప్పటికీ ఇది న్యాయమైన చర్య అని ఆయన సమర్థించారు. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో రెండు సౌదీ చమురు నౌకలపై దాడులకు పాల్పడినట్లు ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ ఘాటు కౌంటర్ట్రంప్ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా స్పందించారు. ఇతర దేశాల ఆస్తులను స్వాధీనం చేసుకుని భవిష్యత్తు నష్టపరిహారాలకు వినియోగించడం “పేలుడు స్వభావం కలిగిన ప్రమాదకరమైన సంప్రదాయానికి నాంది” అని వ్యాఖ్యానించారు. “ఒక దేశానికి చెందిన ఆస్తులను మరో దేశం సంబంధం లేని అంశాలకు ఉపయోగించడం సాధారణమైతే.. భవిష్యత్తులో ఏ దేశ ఆస్తులకూ భద్రత ఉండదు. దీని ఫలితంగా ఏర్పడే గందరగోళం శాంతియుతంగా ఉండదు” అని అరాఘ్చీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతర్జాతీయ నిబంధనలను బలహీనపరిచే చర్యగా ఆయన ట్రంప్ నిర్ణయాన్ని అభివర్ణించారు.నిధుల విలువ ఎంత?ఇరాన్పై అమెరికా ఆంక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ఆర్థిక వ్యవస్థల్లో ఆ దేశానికి చెందిన భారీ మొత్తంలో నిధులు నిలిచిపోయాయి. ఈ నిధుల ఖచ్చితమైన విలువ స్పష్టంగా తెలియకపోయినా.. కొన్ని నివేదికల ప్రకారం వాటి విలువ సుమారు 124 బిలియన్ డాలర్ల నుంచి 167 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ఈ స్తంభింపజేసిన నిధుల విడుదల ఇరాన్–అమెరికా మధ్య గత చర్చల్లో కీలక డిమాండ్గా ఉంది. అయితే ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం కూడా ముందుకు సాగలేదు.హౌతీల దాడులతో మళ్లీ ఉద్రిక్తతలుఇటీవల ఎర్ర సముద్రంలో సౌదీకి చెందిన రెండు చమురు నౌకలపై దాడులకు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు బాధ్యత వహించారు. హౌతీ అధికార ప్రతినిధి యాహ్యా సరీ మాట్లాడుతూ.. “ఎన్సీలియా (ENCELIA), లైలా (LAYLA)” అనే రెండు సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. సౌదీ రవాణా అధికారులు కూడా ఎన్సీలియా నౌకపై దాడి జరిగిందని, బాబ్ అల్-మందెబ్ జలసంధి వద్ద నౌక ముందుభాగంలో మంటలు చెలరేగినట్లు ధ్రువీకరించారు. ఇరాన్ కూడా హార్ముజ్ జలసంధిలో నిబంధనలు పాటించని వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపిస్తోంది.యుద్ధం నుంచి ఆర్థిక పోరాటం వరకుఅమెరికా–ఇరాన్ ఘర్షణ ఇప్పటివరకు ప్రధానంగా సైనిక, దౌత్య స్థాయిలో కొనసాగింది. అయితే తాజా పరిణామాలతో ఆర్థిక ఆస్తులు కూడా ఈ పోరాటంలో కీలక ఆయుధాలుగా మారుతున్నాయి. ఒక దేశానికి చెందిన విదేశీ నిధులను మరో దేశం నష్టపరిహారాల కోసం వినియోగించడం అంతర్జాతీయ చట్టపరంగా కొత్త చర్చలకు దారితీయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా మాత్రం తన చర్యలను సమర్థిస్తూ.. తమ వాణిజ్య ప్రయోజనాలు, నౌకల భద్రతకు జరిగిన నష్టాలకు బాధ్యులను జవాబుదారీ చేయడమే లక్ష్యమని చెబుతోంది.న్యూయార్క్లో కత్తిపోట్ల కలకలంఇదిలా ఉండగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన రెండు కత్తిపోటు ఘటనలు కూడా చర్చనీయాంశంగా మారాయి. మాన్హాటన్లోని అప్పర్ వెస్ట్ సైడ్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన 51 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి సమయంలో నిందితుడు “అల్లాహు అక్బర్” అని నినదించినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొనడంతో.. ఇది విద్వేష నేరమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రాథమిక విచారణలో నిందితుడి మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా కారణం అయి ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. దాడిలో గాయపడిన ఇద్దరు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ప్రపంచానికే ప్రమాదకర సంకేతమా?ఒక దేశానికి చెందిన స్తంభింపజేసిన ఆస్తులను మరో దేశం తన ప్రయోజనాలకు వినియోగించడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కొత్త వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర దేశాల విదేశీ నిధుల భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆస్తుల స్వాధీనం వంటి చర్యలు సాధారణ పరిణామంగా మారితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నమ్మకం, పెట్టుబడుల భద్రతపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ప్రపంచానికి పెరుగుతున్న సవాళ్లుఒకవైపు ఇరాన్ స్తంభింపజేసిన నిధుల వినియోగంపై అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. మరోవైపు అమెరికాలో భద్రత, విద్వేష నేరాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. తాజా పరిణామాలు యుద్ధాలు కేవలం యుద్ధ రంగానికే పరిమితం కావని.. అవి ఆర్థిక వ్యవస్థలు, అంతర్జాతీయ నిబంధనలు, ప్రపంచ భద్రతపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. -
అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు కుర్రాడు
అమెరికా రాజకీయ రంగాన, అత్యంత ప్రతిష్టాత్మకమైన నాయకత్వ శిక్షణా వేదికపై ఒక తెలుగు కుర్రాడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. అగ్రరాజ్యం వాషింగ్టన్ డి.సి.లో అత్యంత కఠినమైన వడపోతతో నిర్వహించే "అమెరికన్ లెజియన్ బాయ్స్ నేషన్" మాక్ పార్లమెంటరీ ఎన్నికల్లో మన తెలుగు తేజం క్రిష్ కొర్రపాటి ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకుని ప్రవాస భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వపడేలా చేశాడు.అమెరికాలోని 49 రాష్ట్రాలు మరియు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కేవలం 100 మంది హైస్కూల్ సీనియర్ విద్యార్థులను మాత్రమే ఈ బాయ్స్ నేషన్ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. ముందుగా రాష్ట్ర స్థాయి బాయ్స్ స్టేట్ పోటీల్లో సత్తా చాటిన వారు మాత్రమే ఈ జాతీయ స్థాయికి అర్హత సాధిస్తారు. అలా ఎంపికైన యువత ఒక వారం పాటు అమెరికా సెనెట్ తరహాలో మాక్ సమావేశాలు నిర్వహించి, చట్టాల రూపకల్పన, రాజకీయ చర్చల్లో పాల్గొంటారు.ఈ మహాసభల్లో విద్యార్థులు నేషనలిస్ట్స్, ఫెడరలిస్ట్స్ అనే రెండు పార్టీలుగా విడిపోయి తమ వాక్చాతుర్యాన్ని, నాయకత్వ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ క్రమంలో తోటి సెనెటర్లందరి మద్దతును కూడగట్టుకుంటూ నార్త్ కరొలినా తరఫున ప్రాతినిధ్యం వహించిన క్రిష్ కొర్రపాటి బాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు అర్కాన్సాస్ కు చెందిన సాయర్ రే అధ్యక్షుడిగా ఎన్నికై ఈ నాయకత్వ బృందానికి సారథ్యం వహిస్తున్నారు.తెలుగు వారందరికి గర్వకారణం..అమెరికాలో స్థిరపడిన గుంటూరు జిల్లా పల్లపాడు గ్రామానికి చెందిన తెలుగు కుటుంబం నుంచి వచ్చిన క్రిష్ కొర్రపాటి అద్భుతమైన విజయాన్ని సాధించి యావత్ తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచాడు. డాక్టర్ మధు కొర్రపాటి, శిరీష దంపతుల మనవడైన క్రిష్ కొర్రపాటి, డాక్టర్ వినీత్ కొర్రపాటి, స్మితల కుమారుడు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన "బాయ్స్ నేషన్" ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకుని తెలుగు వారి కీర్తిని అమెరికాలో రెపరెపలాడించాడు. ఈ అరుదైన విజయం ద్వారా క్రిష్ కొర్రపాటి క్యాపిటల్ హిల్ లో ఫెడరల్ అధికారులను కలవడంతో పాటు దేశ అత్యున్నత వేదికలపై తన గళాన్ని వినిపించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. -
అమెరికా-ఇజ్రాయెల్ కొత్త డీల్.. భారత్కు జాక్పాట్?
ప్రపంచ రాజకీయాల్లో, రక్షణ రంగంలో నిశ్శబ్దంగా జరిగిన ఒక పరిణామం ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారి తీస్తోంది. అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించిన 2027 నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (NDAA) సాధారణ రక్షణ బిల్లు మాత్రమే కాదు. రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ శక్తి సమీకరణాలను ప్రభావితం చేసే కీలక అడుగుగా విశ్లేషకులు చూస్తున్నారు.చాలామంది అనుకుంటున్నట్లుగా ఇది అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాల విలీనం కాదు. యుద్ధభూమిలో రెండు దేశాల సైనికులు ఒకే కమాండ్ కింద పనిచేయబోరు. కానీ అంతకంటే శక్తివంతమైన అంశాన్ని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. అదే రక్షణ సాంకేతిక ప్రపంచాన్ని ఒక్కటిగా మార్చడం. కృత్రిమ మేధస్సు, డ్రోన్ స్వార్మ్స్, సైబర్ వార్ఫేర్, క్వాంటమ్ టెక్నాలజీ, లేజర్ ఆయుధాలు, తదుపరి తరానికి చెందిన క్షిపణి రక్షణ వ్యవస్థలు.. ఇవన్నీ ఇక నుంచి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి అభివృద్ధి చేయనున్నాయి. పరిశోధన నుంచి తయారీ వరకు, పరీక్షల నుంచి ఉత్పత్తి వరకు ఒకే రక్షణ ఆవిష్కరణ వ్యవస్థను నిర్మించేందుకు ఈ బిల్లు బాటలు వేస్తోంది.ఇటీవలి యుద్ధాల్లో ఇజ్రాయెల్ సాధించిన అనుభవం, చైనాతో పెరుగుతున్న సాంకేతిక పోటీ, భవిష్యత్తు యుద్ధాల్లో ఆధిపత్యం సాధించాలన్న అమెరికా వ్యూహం.. ఈ మూడు అంశాలే ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ భాగస్వామ్యానికి వందల మిలియన్ డాలర్ల నిధులు కేటాయిస్తూ అమెరికా ముందడుగు వేసింది. సుమారు 750 మిలియన్ డాలర్ల నిధులను కేటాయించాలని ప్రతిపాదించారు. ఇందులో క్షిపణి రక్షణ, డ్రోన్ నిరోధక వ్యవస్థలు, సొరంగాల గుర్తింపు సాంకేతికతలు, కొత్త రక్షణ సాంకేతికతల అభివృద్ధికి నిధులు వినియోగించనున్నారు.భారత్ పేరు ఎందుకు వినిపిస్తోంది?ఈ పరిణామం భారత్కు కూడా కీలక అవకాశాలను తీసుకురాగలదని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్ ఇప్పటికే భారతదేశానికి ప్రధాన రక్షణ భాగస్వామిగా ఉంది. ఫాల్కన్ ఎయిర్బోర్న్ వార్నింగ్ వ్యవస్థలు, బరాక్ క్షిపణులు, హెరాన్ డ్రోన్లు, హారోప్ లోయిటరింగ్ మ్యూనిషన్స్, రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలు వంటి అనేక కీలక వ్యవస్థలను భారత్ ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింది. మరోవైపు అమెరికాతో iCET, INDUS-X వంటి కార్యక్రమాల ద్వారా రక్షణ సాంకేతిక సహకారాన్ని భారత్ విస్తరిస్తుండగా, ఇజ్రాయెల్తో కూడా పరిశోధన, ఆవిష్కరణల కోసం ప్రత్యేక భాగస్వామ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ రెండింటితోనూ ఆధునిక రక్షణ సాంకేతిక రంగంలో కలిసి పనిచేసే అరుదైన స్థానంలో భారత్ నిలిచింది.అయితే, ఇది అవకాశమే గానీ హామీ కాదు. అమెరికా ఎగుమతి నియంత్రణలు, మేధోసంపత్తి హక్కులు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఈ మార్గంలో సవాళ్లుగా మారే అవకాశమూ ఉంది. అందుకే భారత్ విదేశీ భాగస్వామ్యాలపై మాత్రమే ఆధారపడకుండా, స్వదేశీ రక్షణ సాంకేతిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. -
ఇది చాల్లేదు.. ఇరాన్కు ఇంకా నొప్పి తెలియట్లేదు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇరాన్ మౌలిక వసతులపై అమెరికా బలగాలు దాడులు కొనసాగిస్తుండగా.. ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ కౌంటర్ అటాక్లు జరుపుతోంది. మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు కూడా రంగంలోకి దిగడంతో ఈ ఘర్షణ మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్పై మరింత కఠిన చర్యలకు దిగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇరాన్పై భారీ స్థాయి సైనిక చర్యను పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే జరుగుతున్న దాడులు సరిపోలేదని భావిస్తున్న ఆయన.. “ఇరాన్కు ఇంకా తగినంత నొప్పి తెలియలేదు” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్సియోస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్పై గతంలో కంటే పెద్ద స్థాయిలో దాడి చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. “నేను భారీ దాడి గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పటివరకు జరిగిన వాటికంటే పెద్దదిగా ఉంటుంది. నిర్ణయం తీసుకునే దశకు చేరుకున్నాను” అని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే కొత్త దాడికి సంబంధించి అధ్యక్షుడు తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధికారులు వెల్లడించారు. ఎలాంటి కొత్త సైనిక ఆదేశాలు కూడా జారీ కాలేదని తెలిపారు.చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదు: ట్రంప్ఇరాన్ చర్చలకు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. ఒప్పందానికి రావడానికి సిద్ధంగా లేదని ట్రంప్ ఆరోపించారు. “వారికి ఇంకా తగినంత నొప్పి తెలియలేదు” అని వ్యాఖ్యానించారు. ఇరాన్పై ఒత్తిడి కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు.13వ రోజూ అమెరికా దాడులుమరోవైపు ఇరాన్పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. వరుసగా 13వ రాత్రి కూడా ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడులు జరిగాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సామర్థ్యాన్ని తగ్గించడం, వాణిజ్య నౌకలపై ముప్పును అడ్డుకోవడమే తమ లక్ష్యమని అమెరికా చెబుతోంది.ఇజ్రాయెల్ మద్దతుపై ట్రంప్ వ్యాఖ్యలుఇటు.. ఇరాన్పై కొత్త ఆపరేషన్ జరిగితే ఇజ్రాయెల్ వెంటనే అమెరికాతో కలిసి వస్తుందని ట్రంప్ అన్నారు. “నేను అడిగితే ఇజ్రాయెల్ రెండు నిమిషాల్లో చేరుతుంది” అని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా చర్యలకు ఇజ్రాయెల్ సహకారం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు.హర్ముజ్ జలసంధిపై ఉత్కంఠఅమెరికా–ఇరాన్ ఘర్షణ ప్రభావం ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై పడుతోంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నాయి. ఇరాన్ కూడా తనపై దాడులు కొనసాగితే ప్రాంతీయ చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై ప్రతీకారం ఉంటుందని హెచ్చరించింది.యుద్ధం విస్తరిస్తుందా?ఇరాన్కు మద్దతుగా ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సౌదీ నౌకలపై దాడులు చేసినట్లు ప్రకటించారు. దీంతో మధ్యప్రాచ్య సంక్షోభం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఆరిజోనాలో డెమొక్రటిక్ ప్రైమరీ అభ్యర్థిత్వాన్ని గెల్చుకున్న అమిష్ షా
వాషింగ్టన్: అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలోని పార్లమెంట్ దిగువసభ స్థానమైన ‘ఫస్ట్ కాంగ్రేషనల్ డి్రస్టిక్ట్’నియోజకవర్గం నుంచి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని భారతీయ మూలాలున్న వైద్యుడు అమిష్ షా గెలుపొందారు. నవంబర్లో ఈ స్థానానికి జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జే ఫీలేతో అమిష్ షా తలపడనున్నారు. 48 ఏళ్ల అమిష్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం బుధవారం జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన నాయకురాలు మార్లీన్ గాలన్ ఉడ్స్ను ఓడించి షా తన అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసుకున్నారు. డోర్–టు–డోర్ ప్రచారం ద్వారా దాదాపు 28,000 కుటుంబాలకు తన హామీ లు చేరేలా కృషి చేసి షా బుధవారం విజ యం సాధించారు. పార్టీ ప్రచారకమిటీ అయి న డెమొక్రటిక్ కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కమిటీ(డీసీసీసీ) బలపరిచిన అభ్యర్థిని సైతం అమిష్ ఓడించడం విశేషం. ఆరిజోనా రాష్ట్ర చట్టసభకు అమిష్ గతంలో మూడుసార్లు ఎన్నికయ్యారు. అమిష్ గతంలో అమెరికాలోని ‘న్యూయార్క్ జెట్స్’ఫుట్బాల్ జట్టుకు వైద్యునిగా సేవలందించారు. 1960వ దశకంలో గుజరాత్ నుంచి అమెరికాకు వలసవచ్చిన భారతీయ జంటకు అమిష్ జన్మించారు. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. అదే వర్సిటీలోని వైద్యకళాశాలలో వైద్యశాస్త్రం అభ్యసించారు. తర్వాత న్యూయార్క్లోని ట్రామా సెంటర్లోని అత్యవసర వైద్యవిభాగంలో వైద్యునిగా సేవలందించారు. అమిష్ తండ్రి జైనమతంలో కొనసాగుతుండగా తల్లి హిందువుగా ఉన్నారు. అమిష్ ఈ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిత్వాన్ని గెలవడం ఇది రెండోసారి. 2024లోనూ పార్టీ తరఫున సాధారణ ఎన్నికల్లో పోటీచేసినా రిపబ్లికన్ అభ్యర్థి డేవిడ్ చేతిలో ఓటమిని చవిచూశారు. ఈసారి ఎలాగైనా అమెరికా దిగువసభలో అడుగుపెట్టాలని పట్టుదలతో ప్రయతి్నస్తున్నట్లు ప్రైమరీ గెలుపు తర్వాత అమిష్ మీడియాతో చెప్పారు. -
ట్రంప్ పన్నుల బాంబు .. 60 దేశాలకు చుక్కలే?
వాషింగ్టన్ డీసీ: డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచానికి షాకిచ్చారు. ఉత్పత్తుల తయారీల వెట్టిచాకిరీ (ఫైర్డ్ లేబర్) అడ్డుకట్ట నిబంధనలను సరిగ్గా అమలు చేయడం లేదనే ఆరోపణలతో పన్నుల మోత మోగించారు. దాదాపు 60 భాగస్వామ్య దేశాలకు చెందిన వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.డొనాల్ట్ ట్రంప్ మరోసారి పన్నుల యుద్ధం ప్రకటించారు. గతంలో విధించిన సుంకాల గడువు ముగుస్తుండడంతో వాటి స్థానంలో కొత్త సుంకాలను అమల్లోకి తెచ్చారు. ఈ నూతన పన్నులు 10 శాతం నుండి 12.5 శాతం వరకు ఉండనున్నాయి. ఈ పన్నులతో భారత్, చైనా, జపాన్, బ్రిటన్ యురోపియన్ యూనియన్ (EU) వంటి ప్రముఖ ఆర్థిక వ్యవస్థలపై ఈ ప్రభావం పడనుంది.ఈ విషయమై అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ మాట్లాడుతూ "అమెరికాలో దాదాపు ఒక శతాబ్దం నుంచి వెట్టిచాకిరీ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతిపై నిషేధం ఉంది. దానిని మేము కఠినంగా అమలు చేస్తున్నాం. మన వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా అదే పని చేయాల్సిన సమయం వచ్చింది." అని అన్నారు.గత ఫిబ్రవరిలో ట్రంప్ విధించిన అనేక సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ప్రత్యామ్నాయ అధికారాలను ఉపయోగించి 150 రోజుల పాటు విధించిన 10 శాతం తాత్కాలిక సుంకం గడువు తీరడంతో, 'ట్రేడ్ యాక్ట్ 1974 - సెక్షన్ 301' కింద నెలల తరబడి విచారణ జరిపి చట్టబద్ధంగా నిలిచేలా ఈ కొత్త సుంకాలను రూపొందించారు. ఏ దేశంపై ఎంత?10 శాతం సుంకం వెట్టిచాకిరీపై కఠిన చట్టాలను అమలు చేస్తున్న కెనడా, బ్రిటన్, యురోపియన్ యూనియన్ వంటి దేశాలకు తక్కువ రేటైన 10% సుంకం వర్తిస్తుంది. 12.5 శాతం సుంకం: వెట్టిచాకిరీ నిరోధంలో తగిన చర్యలు తీసుకోలేదని అమెరికా భావించిన చైనా, జపాన్ వంటి భాగస్వామ్య దేశాలపై 12.5% సుంకం పడనుంది. కాగా ఉక్కు, అల్యూమినియం వంటి ఇదివరకే ప్రత్యేక రక్షణ సుంకాలు ఉన్న రంగాలకు, అలాగే 'యుఎస్-మెక్సికో-కెనడా ఉచిత వాణిజ్య ఒప్పందం కింద అమెరికాలోకి వచ్చే వస్తువులకు ఈ కొత్త సుంకాల నుంచి మినహాయింపు లభించింది. -
సౌదీలో ‘అణు’కుంపటి
అందరి సలహాలూ బేఖాతరు చేసి ఇరాన్పై యుద్ధ భేరి మోగించి పశ్చిమాసియాను అగ్నిగుండంగా మార్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ఇప్పుడు మరో ప్రమాదకర క్రీడకు సిద్ధపడ్డారు. సౌదీ అరేబియాతో తమకు ‘శాంతియుత అణు సహకార ఒప్పందం’ కుదిరిందంటూ అమెరికా ఇంధన శాఖ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. తన నిర్ణయం పర్యవసానాలూ, పరిణామాల గురించి పూర్తిగా తెలిసే ట్రంప్ ఇందుకు సిద్ధపడ్డారా అనే సందేహం అందరిలో తలెత్తుతోంది. ఇది పశ్చిమాసియా అమరికను సంపూర్ణంగా మార్చే... ఇప్పటికే సాగుతున్న ఆయుధ పోటీని మరింత పెంచే ప్రమాదకర నిర్ణయం. 30 యేళ్లపాటు కొనసాగే ఈ ఒప్పందం కింద యురేనియం శుద్ధికి అవసరమైన సామర్థ్యాన్ని సౌదీ సంతరించుకుంటుందని, అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ప్రమాణాలను సాధించటంతోపాటు ప్రాంతీయ భద్రతకూ, అమెరికా భద్రతకూ కూడా తోడ్పడుతుందని అమెరికా అంటోంది. రాగలకాలంలో దేశానికి ఇది వందలకోట్ల వాణిజ్యాన్ని తీసుకొస్తుందనీ... దేశ ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలు నెరవేరటానికి దోహదపడుతుందనీ కూడా చెప్పుకుంటోంది. ఒకపక్క తన చర్యల ద్వారా అణ్వాయుధ తయారీకి దోహదపడుతూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధమే ధ్యేయమని చెప్పటం ఉత్త వంచన. ఈ అణు ఒప్పందం 2008లో మన్మోహన్ సింగ్ తొలి ఏలుబడిలో మన దేశంతో అమెరికా కుదుర్చుకున్న ‘123’ ఒప్పందమే కదా అనిపిస్తుంది. అగ్రరాజ్యాలతోపాటు మనతోసహా పలు దేశాల దగ్గర అణ్వాయుధాలున్నాయి. అదనంగా సౌదీ దగ్గర ఉంటే నష్టమేమిటన్న సందేహాలు కూడా కలుగుతాయి. పైగా ఇది పౌర అణు ఒప్పందమే అనిపిస్తుంది. కానీ తరచిచూస్తే ఇందులో లొసుగులు బయటపడతాయి. సౌదీ అణువిద్యుత్ ప్రాజెక్టులు స్థాపించుకోవటానికే ఇది ఉపయోగపడుతుందని అమెరికా వాదన. ప్రకృతిలో లభించే యురేనియంలోని రెండు ఐసోటోపుల్లో ఒకటైన యూ– 235 మాత్రమే అణు విచ్ఛేదనానికీ, గొలుసు చర్య జరిగి అపారమైన శక్తి విడుదలకూ తోడ్పడు తుంది. యురేనియంను 3 నుంచి 5 శాతంవరకూ శుద్ధి చేస్తే అణు విద్యుత్ ఉత్పాదన సాధ్యమవుతుంది. శుద్ధి 90 శాతానికి చేరితే అణుబాంబు తయారీకి ఉపయోగపడుతుంది. అయితే విద్యుదుత్పాదన తర్వాత వాడేసిన ఇంధనంతో ప్లూటోనియం తయారీ అవకాశం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని నిరోధించేందుకే ‘గోల్డ్ స్టాండర్డ్’ పేరుతో అమెరికా కఠినమైన షరతు విధిస్తోంది. దాన్నుంచి సౌదీకి మినహాయింపు ఇవ్వటం పైనే అందరికీ ఆందోళన. ఆ షరతు ఉంటుందని తాజాగా అమెరికా ఇస్తున్న వివరణ నమ్మశక్యంగా లేదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)పై ఇరాన్ సంతకం చేసినా, అణుబాంబు తయారీకి వ్యతిరేకంగా అక్కడ ఫత్వా అమల్లో ఉన్నా ఆ దేశం అణు బాంబుకు సిద్ధపడుతోందన్న సంశయాలు అమెరికాకూ, ఇజ్రాయెల్కూ ఉన్నాయి. తరచు ఇరాన్పై అమెరికా విరుచుకుపడటానికి కారణం అదే. ‘ఇరాన్ ఆ పని చేస్తే... మేం సైతం ఆ బాటలోనే వెళ్తాం’ అని సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ గత కొన్నేళ్లుగా పదే పదే చెబుతున్నారు. అలాంటి దేశానికి మినహాయింపు ఇవ్వటమంటే బాహాటంగా దాన్ని అణ్వస్త్ర దేశంగా మారడానికి ప్రోత్సహించటమే అవుతుంది. అమెరికా మిత్రులు ఏం చేసుకున్నా మినహాయింపునిస్తాం... శత్రుదేశాలను మాత్రం నిరుత్సాహపరుస్తాం’ అనే నైజం అత్యంత ప్రమాదకరమైనది. ‘మనిషి అణుబాంబును కనిపెట్టాడు. కానీ ప్రపంచంలో ఏ ఎలుకా ఎలుకలబోను తయారుచేసుకోదు’ అని ఐన్స్టీన్ చేసిన వ్యాఖ్య ఆంతర్యం స్పష్టమే. ఇది స్వీయ హననానికి దారితీసే తెలివిమాలిన చర్య. భవిష్యత్తులో అణుశక్తి దేశంగా మారాక సౌదీ, అమెరికా చెప్పుచేతల్లో ఉండదు. తాము చేస్తే తప్పేమిటని ఇరాన్ సైతం ఆ బాట పడుతుంది. చిన్న నిప్పురవ్వ కూడా ఆ ప్రాంతాన్ని ఇప్పుడే భగ్గున మండిస్తుంటే ఇక అణ్వాయుధాలుంటే చెప్పేదేముంది? ఇప్పటికే ఇజ్రాయెల్ స్వీయరక్షణకంటూ అమెరికా దానికి అణ్వాయుధాలు సరఫరా చేసింది. దాని రక్షణ పేరుచెప్పే తరచు ఇరాన్పై దాడులు చేస్తోంది. నిజానికి స్వతంత్ర పాలస్తీనా ఆవిర్భవిస్తే ఇజ్రాయెల్కు ఇలాంటి రక్షణల అవసరమే ఉండదు. దాన్ని సాకారం చేయకుండా ఈ ప్రాంతాన్ని అణ్వస్త్రాల మయం చేయటం క్షమించరాని నేరం. -
స్టీల్ సిటీ అందాలకు అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ ఫిదా, వైరల్ వీడియో
పాపులర్ అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ టోనీ క్లోర్ (Tony Klor) స్టీల్సిటీ జమ్షెడ్పూర్ అందాలకు ఫిదా అయిపోయాడు. బిహార్, ఉత్తరప్రదేశ్లలో వైరల్ వీడియోలతో ప్రసిద్ధి చెందిన ఈ కంటెంట్ క్రియేటర్, ఇటీవల జార్ఖండ్లోని 'స్టీల్ సిటీ' జమ్షెడ్పూర్ను మొదటిసారిగా సందర్శించి, ఎంతగానో ముగ్ధుడయ్యాడు. మొదట ఇది తన ఇండియా బకెట్ లిస్ట్లో లేకపోయినా, ఈ నగరాన్ని చూశాక తనకిష్టమైన ప్రదేశాలలో ఒకటిగా మారిందని ఆయన ప్రశంసించడం విశేషంగా నిలుస్తోంది.మెట్రో నగరాలు, ప్రశాంతమైన బీచ్లు, పర్వతాలు, ఎడారులు, దట్టమైన అడవుల వంటి ఊహించదగిన అన్ని రకాల ప్రకృతి దృశ్యాలకు భారతదేశం నిలయం. జైపూర్, గోవా, వారణాసి వంటి నగరాలు అంతర్జాతీయ పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశాలుగా ఉన్నప్పటికీ, అంతగా ప్రాచుర్యం లేని అనేక పట్టణాలు, వాటిలో చూడటానికి ఎన్నో విశేషాలు ఉన్నప్పటికీ, అవి పెద్దగా ఎవరి దృష్టినీ ఆకర్షించవు. కానీ అనుకోకుండా స్టీల్ సిటీని సందర్శించిన టోనీ క్లోర్ జమ్షెడ్పూర్ను "భారతీయ పిట్స్బర్గ్" అని అభివర్ణించారు. టాటా స్టీల్ నిర్వహణలోనే నగరం ఇంత శుభ్రంగా, ప్రణాళికాబద్ధంగా నడవడం చూసి అబ్బురపడ్డారు. View this post on Instagram A post shared by Tony Klor (@tonykmontana) ఇక్కడ గోల్పహాడి ఆలయం, జూబ్లీ పార్క్, సాక్షి మార్కెట్, డిమ్నా లేక్ మరియు దొముహాని ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఇక్కడి పచ్చదనం, పరిశుభ్రత, సోలార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ , క్రీడా రంగానికి ఇది అందించిన ఒలింపియన్లను గురించి తెలుసుకొని అభినందించారు. అంతేకాదు జార్ఖండ్పై తన అభిప్రాయం, అపోహలను తారుమారు చేస్తూ ప్రజలు అనుకునేదానికంటే ఈ రాష్ట్రం చాలా అందంగా ఉందని, జమ్షెడ్పూర్ ఒక వెలుగులోకి రాని "అరుదైన రత్నం" (underrated gem) అని టోనీ పేర్కొన్నారు. "నేను ఈ నగరం గురించి నా పిల్లలకు కూడా చెబుతాను" అని సోషల్ మీడియాలో రాశారు. టోనీ షేర్ చేసిన వీడియో నెటిజన్లను, ముఖ్యంగా జమ్షెడ్పూర్ వాసులను విశేషంగా ఆకట్టుకుంది. తమ నగర అందాలను ఇంత చక్కగా చూపించినందుకు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
సూపర్ పవర్ ఇరాన్ డార్క్ సీక్రెట్.. ఇలాంటి పరిస్థితి ఎందుకు?
ఇటీవలి కాలంలో ఇరాన్ అనగానే మనందరికీ ఏం గుర్తుకొస్తుంది.. వీధుల్లో నిరసనలు, మహిళల హిజాబ్ ఆందోళనలు, ఇజ్రాయెల్-అమెరికా దేశాలతో యుద్ధాలు, ఆంక్షలు.. మతచాందసవాద ప్రభుత్వం..! కానీ మీకు తెలుసా..? ఒకప్పుడు ఇరాన్ అంటే ఇదంతా కాదు..! ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ పవర్లలో ఇరాన్ ఒకటి. 2,000 ఏళ్ల చరిత్ర ఉన్న 'పర్షియన్ సామ్రాజ్యం' పశ్చిమాసియాతోపాటు.. మధ్య ఆసియాను ఏలింది..! మరి అలాంటి గొప్ప నాగరికత ఉన్న దేశం.. ఈ రోజు ఒక క్రూరమైన, మతచాందసవాద రెజీమ్గా ఎలా మారింది..? అమెరికా, బ్రిటన్ వేసిన ఎత్తుగడలు ఇరాన్ను ఎలా మార్చేశాయి.. ఇరాన్ అసలు రక్తచరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే అసలు కథ తెలుస్తుంది..చరిత్రలోకి వెళ్తే క్రీస్తు శకం 1800 ప్రాంతంలో ఇరాన్ను 'కజార్' రాజవంశం పాలిస్తోంది. బయటి ప్రపంచం దీన్ని 'పర్షియా' అని పిలిచేది. ఆ సమయంలో రెండు పెద్ద సామ్రాజ్యాలు ఇరాన్పై కన్నేశాయి. వాటిల్లో ఒకటి రష్యన్ ఎంపైర్, రెండోది బ్రిటిష్ ఎంపైర్. రష్యాకు చలికాలంలో గడ్డకట్టని సముద్ర మార్గాలు కావాలి. అందుకే రష్యా ఇరాన్పై దాడి చేసి.. కొన్ని యుద్ధాల్లో ఓడించి, ఇరాన్ సముద్ర మార్గాలపై పూర్తి హక్కులు సాధించింది. ఇది చూసి బ్రిటన్ వణికిపోయింది..!రష్యా గనక ఇరాన్ను దాటుకుని ముందుకు వస్తే.. తమ అత్యంత విలువైన కాలనీ అయిన 'ఇండియా' రష్యా చేతికి చిక్కుతుందని భయపడింది. దాంతో బ్రిటన్, రష్యా మధ్య ఇరాన్ను ఎవరు కంట్రోల్ చేయాలనే ఒక పెద్ద పోటీ మొదలైంది. దాన్నే చరిత్రలో 'ది గ్రేట్ గేమ్' అంటారు. బ్రిటన్ ఓపెన్గానే చెప్పింది.. ‘మాకు ఇరాన్ను ఆక్రమించడం ఇష్టం లేదు. కానీ రష్యా ఆక్రమిస్తుంటే చూస్తూ ఊరుకోలేం..’ అని..! దాంతో ఇరాన్ రాజు షహా డబ్బుల కోసం తన దేశంలోని ఆస్తులను, రైల్వేలను, పరిశ్రమలను వ్యాపార హక్కులుగా రష్యా, బ్రిటన్లకు అమ్మేయడం మొదలుపెట్టాడు.1908లో ఇరాన్లో ఒక పెద్ద నిధి దొరికింది.. అదే చమురు..! బ్రిటిష్ నావికాదళం తమ నౌకలను బొగ్గు నుంచి చమురుకు మార్చే సమయానికి ఇరాన్లో క్రూడాయిల్ దొరకడం ఒక వరంగా మారింది. దీంతో.. బ్రిటన్ 'ఆంగ్లో-ఇరానియన్ ఆయిల్ కంపెనీ'ని స్థాపించింది. ఇప్పటికీ కొనసాగుతున్న British Petroleum కంపెనీయే అది..! ఇరాన్ చమురును తోడేస్తూ బ్రిటన్ ధనికదేశమైంది. కానీ ఇరాన్కు ఇచ్చిన వాటా కేవలం 16 శాతం మాత్రమే..! దీన్ని నిరసిస్తూ.. 1951లో ఇరాన్ ప్రజలు మొహమ్మద్ మొసద్దెగ్ (Mohammad Mosaddegh) అనే ప్రజాస్వామ్య నాయకుడిని తమ ప్రధానిగా ఎన్నుకున్నారు. మొసద్దెగ్ వచ్చీ రాగానే ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు.‘‘ఇరాన్ చమురు ఇరాన్ ప్రజలదే..! విదేశీయులు నడిపే ఆయిల్ కంపెనీని జాతీయకరణ (Nationalize) చేస్తున్నాం’’ అని ప్రకటించాడు..! ఈ నిర్ణయాన్ని బ్రిటన్, అమెరికా తట్టుకోలేకపోయాయి. 1953లో అమెరికా CIA, బ్రిటన్ MI6 కలిసి ఇరాన్లో రహస్యంగా ఒక కుట్ర పన్నాయి. ఫలితంగా.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రధాని మొసద్దెగ్ గద్దెదిగడమే కాకుండా.. జైలుపాలవ్వాల్సి వచ్చింది. బ్రిటన్, అమెరికాకు పెంపుడు కుక్కలా పనిచేసే 'మొహమ్మద్ రేజా షహా' (Mohammad Reza Shah) అనే రాజును సింహాసనంపై కూర్చోబెట్టారు..!ఖమేనీ ఎంట్రీ.. అమెరికా రక్షణతో అధికారంలోకి వచ్చిన షహా.. ఇరాన్లో వేగంగా పాశ్చాత్యీకరణ చేయడం మొదలుపెట్టాడు. మహిళలకు ఓటు హక్కు ఇచ్చాడు, పాఠశాలలు కట్టించాడు. సాంప్రదాయ ఇస్లామిక్ పద్ధతులను రద్దు చేశాడు. హిజాబ్ను నిషేధించాడు. తనను ఎదిరించిన వారిని సీఐఏ సాయంతో ఏర్పడిన 'సవాక్' అనే క్రూరమైన సీక్రెట్ పోలీసులతో హింసించి చంపేశాడు. ప్రజల్లో కోపం నరనరానా పాకింది..! ‘‘మన రాజు అమెరికా చేతిలో కీలు బొమ్మ.. మన సంస్కృతిని, చమురును విదేశీయులు దోచుకుంటున్నారు’’ అని ప్రజలు రగిలిపోయారు. ఆ సమయంలో వచ్చాడు అయతుల్లా రుహోల్లా ఖమేనీ..!ఆయన ఒక మత గురువు. ఆయన దేశం వెలుపల ఉంటూ క్యాసెట్ టేపుల ద్వారా ఇరాన్ ప్రజలకు సందేశాలు పంపేవాడు. ‘‘బ్రిటన్, అమెరికాలు మనల్ని బానిసలుగా చేశాయి. ఈ షహాను తరిమికొట్టండి..!’’ అని పిలుపునిచ్చాడు. 1979లో ఇరాన్ ప్రజలందరూ.. అంటే విద్యార్థులు, కార్మికులు, మత పెద్దలు కలిసి విప్లవం లేవనెత్తారు..! ఆ దెబ్బకు షహా దేశం వదిలి పారిపోయాడు. ఖమేనీ మళ్లీ ఇరాన్ వచ్చి 'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్'ను స్థాపించాడు..!పక్కా నెట్వర్క్.. 1979 తర్వాత ఖమేనీ ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం చాలా విచిత్రమైనదని చెప్పవచ్చు. అమెరికా, రష్యా వంటి ఏ విదేశీ శక్తి మళ్లీ వచ్చి, తమ దేశాన్ని ఆక్రమించకుండా ఉండటానికి.. ఖమేనీ ఒక పక్కా నెట్వర్క్ నిర్మించాడు.మొదటిది ఫిల్టర్డ్ ప్రజాస్వామ్యం: ఇరాన్లో ఎన్నికలు ఉంటాయి. ప్రెసిడెంట్ ఉంటాడు. కానీ వీళ్లందరి కంటే పైన సుప్రీమ్ లీడర్ (Supreme Leader) ఉంటాడు. మత కౌన్సిల్కు నచ్చిన వాళ్లు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలి.రెండోది.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్: సాధారణ మిలిటరీగా కాకుండా, మత ప్రభుత్వాన్ని కాపాడటానికి సొంతంగా 'IRGC' అనే 5 లక్షల బలగాలున్న ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేశారు.మూడోది ప్రాక్సీ నెట్వర్క్: లెబనాన్లో హెజ్బొల్లా, యెమెన్లో హూతీలు, ఇరాక్లోని మిలీషియాలు.. పాలస్తీనాలో హమాస్.. ఇలా పశ్చిమాసియా అంతటా తమ ప్రాక్సీ గ్రూపులను తయారు చేసిన ఇరాన్, వాటి ద్వారా అమెరికా-ఇజ్రాయెల్లను భయపెట్టడం మొదలుపెట్టింది. ఈరోజు ఇరాన్ వద్ద ఉన్న అణు కార్యక్రమం (Nuclear Program) కూడా.. విదేశీయులు తమపై దాడి చేయకుండా ఉండటానికి వాడుతున్న ఆఖరి ఆయుధమే..!ఇరాన్ విషయంలో ఫైనల్గా మనం ఒక నిజాన్ని గుర్తుంచుకోవాలి..! ఇప్పుడున్న ఇరాన్ ప్రభుత్వం నిరంకుశమైనదే కావచ్చు. కానీ.. ఇరాన్ ప్రజలు వేరు. ఇరాన్ ప్రభుత్వం వేరు..! వివిధ సర్వేల ప్రకారం.. ఇరాన్లోని 80 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు ఈ మతఛాందస ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు. గత 200 ఏళ్లుగా ఇరాన్ ప్రజలు ఒకవైపు తమ సొంత నిరంకుశ పాలకులు, ఇంకోవైపు తమ స్వార్థం కోసం దేశాన్ని వాడుకున్న అమెరికా, బ్రిటన్, రష్యా వంటి విదేశీ శక్తుల మధ్య నలిగిపోతూనే ఉన్నారు. ఇదీ ఇరాన్ అసలు చరిత్ర.-హెచ్. కమలాపతి రావు, సీనియర్ జర్నలిస్టు. -
గల్ఫ్లో డ్రోన్ వార్.. ఆ ‘అదృశ్య శక్తి’ ఎవరు?.. అమెరికా ఆరా
గల్ఫ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడులు ఇప్పుడు మరో అంతర్జాతీయ రహస్యానికి తెరతీశాయి. అమెరికా కీలక నిఘా సంస్థ సీఐఏకు చెందిన రహస్య స్థావరాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేయడం కలకలం రేపింది. అయితే ఈ దాడుల వెనుక ఇరాన్ సొంత సామర్థ్యమే ఉందా? లేక మరేదైనా శక్తి సాంకేతికంగా సహకరించిందా? అన్న కోణంలో అమెరికా నిఘా వర్గాలు దర్యాప్తు ప్రారంభించాయి.ముఖ్యంగా ఇరాన్ ఉపయోగించిన డ్రోన్ల కచ్చితత్వం, లక్ష్యాలను చేరుకున్న విధానం అమెరికా అధికారుల్లో అనుమానాలు పెంచుతోంది. ఇంత అధునాతన సామర్థ్యం కలిగిన డ్రోన్లు ఎలా సిద్ధమయ్యాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.CIA స్థావరాలే లక్ష్యంగా?రాయిటర్స్ కథనం ప్రకారం.. మార్చిలో గల్ఫ్ ప్రాంతంలోని కొన్ని సీఐఏ అనుబంధ కేంద్రాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. సౌదీ అరేబియాలోని రియాద్ అమెరికా రాయబార కార్యాలయంలోని సీఐఏ కేంద్రం, ఇరాక్లోని మరో సీఐఏ అనుబంధ ప్రాంతం కూడా లక్ష్యంగా మారినట్లు సమాచారం. మరిన్ని రహస్య స్థావరాలు కూడా దాడుల పరిధిలోకి వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ దాడులకు ఇరాన్కు చెందిన ‘షహీద్’ డ్రోన్లను ఉపయోగించినట్లు పాశ్చాత్య నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.టెక్నాలజీ ఆ దేశానిదేనా?అమెరికా దర్యాప్తులో ఇప్పుడు కీలకంగా మారిన అంశం.. ఇరాన్ డ్రోన్ల సామర్థ్యాన్ని పెంచడంలో రష్యా పాత్ర ఉందా అన్నది. ముఖ్యంగా రష్యాకు చెందిన ‘కొమెటా-ఎం’ శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను ఇరాన్ డ్రోన్లలో ఉపయోగించారా అనే కోణంలో పరిశీలన సాగుతోంది. ఈ సాంకేతికత వల్ల డ్రోన్లు మరింత కచ్చితంగా లక్ష్యాలను చేరుకోవడంతో పాటు, వాటిని ఎలక్ట్రానిక్ జామింగ్తో అడ్డుకోవడం కూడా కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు.దాడుల వెనుక నిఘా సమాచారమా?ఇరాన్కు రష్యా కేవలం సాంకేతిక సాయం మాత్రమే అందించిందా? లేక లక్ష్యాల వివరాలు, నిఘా సమాచారం కూడా ఇచ్చిందా? అనే అంశాన్ని అమెరికా పరిశీలిస్తోంది. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఇరాన్ అసలు లక్ష్యం అమెరికా రాయబార కార్యాలయాలు కావొచ్చని, సీఐఏ కేంద్రాలు అనుకోకుండా దెబ్బతిని ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై తుది నిర్ధారణకు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.రష్యా–ఇరాన్ బంధంపై కొత్త చర్చఇప్పటికే రష్యా, ఇరాన్ మధ్య సైనిక సహకారం కొనసాగుతోంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ డ్రోన్ల వినియోగంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న వేళ.. గల్ఫ్లో అమెరికా లక్ష్యాలపై జరిగిన దాడుల్లో రష్యా పాత్ర ఉందా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అమెరికా, రష్యా ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.డ్రోన్లతో సాగుతున్న ఆధునిక యుద్ధంలో.. ఒక దేశం దాడి చేస్తే, దాని వెనుక సాంకేతిక బలం ఎవరిది? అనే ప్రశ్న ఇప్పుడు గల్ఫ్ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ఇరాన్ డ్రోన్ దాడుల వెనుక నిజంగా రష్యా హస్తం ఉందా? లేక ఇది కేవలం అనుమానమేనా? అమెరికా దర్యాప్తు తేల్చాల్సి ఉంది. -
ఇరాన్పై వైమానిక దాడులతో విరుచుకపడ్డ అమెరికా
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఇరాన్పై అమెరికా దాడులు చేసింది. ఆ దేశ మిలటరీ స్థావరాలే లక్ష్యంగా (బుధవారం) అమెరికా వైమానిక దళాలు విరుచుకపడ్డాయి. ఆ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్పై అమెరికా దాడులు చేయడం ఇది వరుసగా 12వ రాత్రి కావడం ఆందోళన కలిగించే విషయంఅమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటనలో "ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు అమెరికా దళాలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై మరిన్ని దాడులను ప్రారంభించాయి. ఆ ప్రాంతీయ జలాల్లో పయనించే పౌర నావికులకు ,వాణిజ్య నౌకలకు ఇరాన్ నుండి ఎదురవుతున్న ముప్పును పూర్తిగా మట్టుబెట్టే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది." అని ప్రకటన విడుదల చేసింది.మధ్యప్రాచ్య సముద్ర మార్గాల్లో నౌకాయాన భద్రతను కాపాడటమే లక్ష్యంగా ఇరాన్ సైనిక శక్తులను దెబ్బతీసేందుకు ఈ దాడులు తీవ్రతరం చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. కాగా ఇరాన్ సైతం అమెరికాకు ఘాటుగా బదులిచ్చింది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ మేరకు కొద్ది సేపటి క్రితమే అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా తమపై దాడులు చేస్తే కన్నుకు కన్ను అన్న రీతిలోనే సమాధానం ఉంటుందని తెలిపారు. -
చారిత్రాత్మక అణు డీల్పై అమెరికా-సౌదీ సంతకం
వాషింగ్టన్ : పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాతో పౌర అణు సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్, సౌదీ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్లు సంతకాలు చేశారు. ఈ వివరాలను యుఎస్ఏ అధికారికంగా ప్రకటించింది.ఈ అంశంమై అమెరికా ఇంధన మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో "ఈ రెండు ఒప్పందాలు దశాబ్దాల పాటు కొనసాగే, బిలియన్ల డాలర్ల భాగస్వామ్యానికి చట్టపరమైన పునాదిని వేస్తాయి. అణు వ్యాప్తి నిరోధకత సహా పలు ముఖ్యమైన ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలను ఇవి ముందుకు తీసుకెళ్తాయి" అని ఒక ప్రకటనలో తెలిపింది.ఈ ఒప్పందంలో భాగమైన "ద్వైపాక్షిక భద్రతా ఒప్పందం" ప్రకారం, సౌదీ అరేబియా తన అణు ప్లాంట్లలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అమెరికా అధికారుల తనిఖీలకు అంగీకరించాల్సి ఉంటుంది. దీనివల్ల అణు ప్లాంట్లలో ఏం జరుగుతోంది, ఎంత ఇంధనం వాడుతున్నారు అనేది పారదర్శకంగా తెలుస్తుంది. రహస్యంగా అణ్వాయుధాలు తయారు చేసే అవకాశం ఉండదు.సాధారణంగా అమెరికా ఇచ్చే పౌర అణు ఒప్పందాలలో ఇతర దేశాలు తమ సొంత భూభాగంలో యురేనియాన్ని శుద్ధి చేయడానికి అనుమతించవు (దీనినే అణు నియమాలలో 'గోల్డ్ స్టాండర్డ్' అంటారు).కానీ ఈ ఒప్పందం ప్రకారం, అమెరికా-సౌదీల సంయుక్త అధ్యయనం తర్వాత సౌదీ అరేబియా తన సొంత భూభాగంలోనే యురేనియం శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది.'గోల్డ్ స్టాండర్డ్' నియమాల మినహాయింపుగతంలో అమెరికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో ఒప్పందం చేసుకున్నప్పుడు యురేనియం శుద్ధి చేయకూడదని, వాడేసిన ఇంధనాన్ని రీ-ప్రాసెస్ చేయకూడదని కఠినమైన నిబంధన విధించింది. అయితే సౌదీ విషయంలో ఈ ముందస్తు నిషేధాలను సడలించడం ఒక ప్రధాన మార్పుగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
"కన్నుకు.. కన్ను".. అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్
టెహ్రాన్: ఇరాన్కు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో టెహ్రాన్ ఘాటుగా బదులిచ్చింది. తమ దేశ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా దానికి తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఇరాన్పై మండిపడ్డారు. "హర్ముజ్ జలసంధిలో పయనించే ఏ నౌకపైనా ఇరాన్ దాడులు చేయకూడదు. ఇరాన్ మిస్సైళ్లు, రాకెట్లు లేదా డ్రోన్లతో ఏ నౌకపైనైనా దాడి చేస్తే... దానికి ప్రతికారంగా ఇరాన్లోని ఒక వంతెనను లేదా విద్యుత్ ప్లాంట్ను అమెరికా దళాలు బాంబులతో పేల్చివేస్తాయి. అని హెచ్చరించారు.దీనిపై స్పందించిన అరాఘ్చీ "మా రక్షణ విధానం చాలా స్పష్టం 'కంటికి కన్ను' ఇరాన్ మౌలిక సదుపాయాలపై జరిగే ఏ రకమైన దాడికైనా మా స్పందన అత్యంత శక్తివంతంగా, నిర్ణయాత్మకంగా ఉంటుంది" అని పేర్కొన్నారు.అనంతరం ఆ దేశ ఆర్మీ అధికారులు మాట్లాడుతూ అమెరికా చేస్తున్న ఈ బెదిరింపుల వల్ల యుద్ధం మరింతగా పెరగడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. కాగా అమెరికా - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలమవ్వడంతో దాడులు తీవ్రతరమవుతున్నాయి. దీంతో వరుస దాడులతో పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. -
అమెరికాని రూ. 96 వేల కోట్లు అడిగిన పాకిస్థాన్!
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్, తన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి అమెరికా సహాయాన్ని కోరింది. అమెరికా-ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించిన తర్వాత, పాకిస్థాన్ అమెరికా నుండి 10 బిలియన్ (రూ. 96,536 కోట్ల) డాలర్ల భారీ ఆర్థిక సహాయాన్ని కోరినట్లు రాయిటర్స్ కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణంలో పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరించి, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ దౌత్యపరమైన క్రెడిట్ను ఉపయోగించుకుని, ఇప్పుడు వాషింగ్టన్ నుండి ఈ భారీ ఆర్థిక ప్రయోజనాన్ని పొందాలని పాకిస్థాన్ ఆశిస్తోంది. ఒకవేళ అమెరికా గనుక ఈ 10 బిలియన్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపితే, అది పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు సంజీవనిలా మారుతుంది. దీనివల్ల పాకిస్థాన్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. యూఎస్ డాలర్తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ పడిపోకుండా స్థిరపడుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. అయితే,ఈ విన్నపంపై అటు అమెరికా, ఇటు పాకిస్థాన్ ప్రభుత్వం గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.కానీ, పాక్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్తో భేటీ అయినప్పుడు.. ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల వల్ల తమ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా దెబ్బతింటుందో వివరించినట్లు పాక్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. పాకిస్థాన్ ప్రస్తుతం ఐఎంఎఫ్ నుండి పొందిన 7 బిలియన్ల ప్యాకేజీ కింద కొనసాగుతోంది. ఈ లోన్ పొందడం కోసం పాక్ ప్రభుత్వం ప్రజలపై భారీగా పన్నులు పెంచడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవడం వంటి కఠినమైన సంస్కరణలను అమలు చేస్తోంది.2023లో ఒక దశలో పాకిస్థాన్ దేశం పూర్తిగా దివాళా తీసే పరిస్థితికి రాగా, అప్పట్లో ఐఎంఎఫ్ ఇచ్చిన మూడు బిలియన్ల అత్యవసర నిధులు కాపాడాయి. ఆ తర్వాత వాతావరణ మార్పుల తట్టుకునేందుకు మరో 1.3 బిలియన్ల లోన్ కూడా పొందింది. ఇవన్నీ ఉన్నప్పటికీ, చైనా, సౌదీ అరేబియాలు ఇచ్చే అప్పులపైనే పాకిస్థాన్ విదేశీ నిల్వలు ఆధారపడి ఉన్నాయి.అసలు ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీ అంటే ఏంటి?ఇది అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తన ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా అందించే చాలా అరుదైన ఆర్థిక ప్యాకేజీ. ఏదైనా మిత్రదేశం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు దాని కరెన్సీని కాపాడటానికి, డాలర్ ఫండింగ్ లేదా గ్యారెంటీల రూపంలో అమెరికా ఈ సహాయాన్ని అందిస్తుంది. గతంలో 2002లో ఉరుగ్వే దేశానికి, 2025లో అర్జెంటీనా దేశానికి అమెరికా ఇటువంటి ప్యాకేజీలను ప్రకటించింది. -
‘హర్మూజ్కు ప్రత్యామ్నాయం దొరికింది’.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!
టెహ్రాన్: హర్మూజ్ జలసంధిపై పెరుగుతున్న ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాలను ప్రత్యామ్నాయ రవాణా మార్గాల అన్వేషణ వైపు మళ్లిస్తున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన ఈ సముద్ర మార్గంపై ఇరాన్కు ఉన్న వ్యూహాత్మక ఆధిపత్యం నేపథ్యంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , ఒమన్ తదితర దేశాలు పైప్లైన్లు, రైల్వేలు, కొత్త పోర్టుల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాయి.సాధారణ పరిస్థితుల్లో హర్మూజ్ జలసంధి మీదుగా రోజుకు 100 నుంచి 150 నౌకలు ప్రయాణిస్తూ ప్రపంచానికి అవసరమైన క్రూడ్ ఆయిల్, సహజవాయువు, ఆహార పదార్థాలు, ఇతర సరుకులను రవాణా చేస్తుంటాయి. అయితే ఇరాన్తో ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు, సముద్ర భద్రతపై నెలకొన్న ఆందోళనల కారణంగా ఈ మార్గంపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో గల్ఫ్ దేశాలకు స్పష్టమైంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎగుమతులు కొనసాగించే దిశగా భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాయి.సౌదీ అరేబియా ప్రత్యేక వ్యూహంసౌదీకి తూర్పున పర్షియన్ గల్ఫ్, పశ్చిమాన ఎర్ర సముద్రం ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాల అభివృద్ధికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. తూర్పు ప్రాంతాల నుంచి చమురును పెట్రోలైన్ ద్వారా యాంబూ పోర్టుకు తరలిస్తోంది. అలాగే జెద్దా–దమ్మామ్ మధ్య సుమారు 7 బిలియన్ డాలర్లతో రైల్వే, హైవే ప్రాజెక్టులను చేపడుతోంది.ఫుజైరాపై యూఏఈ దృష్టిదుబాయ్, అబుదాబి పోర్టులు హార్మూజ్ లోపల ఉండటంతో యూఏఈకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే హార్మూజ్ వెలుపల గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరంలో ఉన్న ఫుజైరా, కోర్ఫక్కన్ పోర్టులను ప్రత్యామ్నాయ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తోంది. 2027 నాటికి రెండో ఈస్ట్-టు-వెస్ట్ ఆయిల్ పైప్లైన్ను పూర్తి చేసి ఫుజైరా ద్వారా ఎగుమతులను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఒమన్కు భౌగోళిక ప్రయోజనంసోహార్, దుఖ్మ్, సలాలా పోర్టులు హార్మూజ్ వెలుపల ఉండటంతో ఒమన్కు సహజంగానే వ్యూహాత్మక ప్రయోజనం ఉంది. అయితే సౌదీ, యూఏఈతో పోలిస్తే పరిమిత ఆర్థిక వనరుల కారణంగా భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టే అవకాశం తక్కువగా ఉంది.ఖతార్, కువైట్కు సవాళ్లుఖతార్ ఎల్ఎన్జీ ఎగుమతులు పూర్తిగా హార్మూజ్పైనే ఆధారపడి ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా సౌదీ లేదా యూఏఈ భూభాగం గుండా పైప్లైన్ నిర్మించాల్సి ఉంటుంది. అయితే గతంలో ఖతార్పై విధించిన దిగ్బంధనం కారణంగా పొరుగు దేశాలపై పూర్తి స్థాయి విశ్వాసం నెలకొనలేదు.కువైట్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. సౌదీ మార్గాన్ని వినియోగిస్తే ఆర్థిక ఆధారపడటం పెరుగుతుందనే ఆందోళన ఉంది. మరోవైపు ఇరాక్ మార్గంలో భద్రతా సమస్యలు ప్రత్యామ్నాయ ప్రణాళికలకు అడ్డంకిగా మారుతున్నాయి.ప్రాజెక్టులు ఉన్నా.. అమలులో సవాళ్లుఇరాక్ కారిడార్, హిజాజ్ రైల్వే పునరుద్ధరణ, ఇండియా–యూఏఈ–ఒమన్ సముద్రగర్భ పైప్లైన్ వంటి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ వాటి అమలుకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. హార్మూజ్ సాధారణ స్థితికి వస్తే భారీ పెట్టుబడులతో చేపట్టిన ప్రాజెక్టుల అవసరం తగ్గే అవకాశం ఉంది. పైప్లైన్లు కూడా దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా సముద్ర మార్గాల ద్వారా జరిగే భారీ స్థాయి చమురు రవాణాను రైళ్లు, ట్రక్కులు లేదా పైప్లైన్లు పూర్తిగా భర్తీ చేయలేవని నిపుణులు చెబుతున్నారు.అత్యవసర పరిస్థితుల కోసమే ప్రత్యామ్నాయాలుగల్ఫ్ దేశాలు చేపడుతున్న ఈ భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల లక్ష్యం హార్మూజ్ జలసంధిని పూర్తిగా పక్కన పెట్టడం కాదని, అత్యవసర పరిస్థితుల్లో కొంతకాలం ఎగుమతులు కొనసాగించే సామర్థ్యాన్ని పెంచుకోవడమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఈ ప్రణాళికలు విజయవంతం కావాలంటే నిధులతో పాటు ప్రాంతీయ రాజకీయ విశ్వాసం, స్థిరత్వం కూడా కీలకమని అభిప్రాయపడుతున్నారు.- హెచ్. కమలాపతి రావు, సీనియర్ జర్నలిస్టు. -
రెస్ట్ రూంలో కెమెరా : భారతీయ సంతతి వైద్యుడికి జైలు
అమెరికాలో వైద్య వృత్తిలో ఉంటూ భారతీయ సంతతికి చెందిన వైద్యుడు తన వక్రబుద్ధిని చాటుకున్నాడు. ఆసుపత్రిలోని విశ్రాంతి గది (Restroom)లో రహస్యంగా కెమెరా అమర్చి, రికార్డ్ చేసి, పైశాచిక ఆనందం పొందేవాడు. చివరికి కటకటాల వెనక్కి వెళ్లాడు. ఈ కేసులో వైద్యుడికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.నేరస్తుడు అద్వైత్ దేశ్ముఖ్ (Advait Deshmukh) టోలెడో యూనివర్విటీలో ఎండోయూరాలజీ, యూరోలాజిక్ ఆంకాలజీ విభాగంలో మూడో సంవత్సరం మెడికల్ రెసిడెంట్గా పనిచేసేవారు. జూన్ 2025లో ఓహియోలోని ప్రోమెడికా టోలెడో ఆసుపత్రిలోని ఒక యూనిసెక్స్ విశ్రాంతి గదిలో దాచి ఉంచిన ఒక సెల్ఫోన్ను ఒక ఉద్యోగి గుర్తించారు. ఆమె దాన్ని తీయడానికి ప్రయత్నించినప్పుడు, దేశ్ముఖ్ దానిని లాక్కొని అది తనదేనని చెప్పాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ప్రోమెడికా, టోలెడో పోలీసు బృందం సంయుక్తంగా దర్యాప్తు చేపట్టింది.ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్వీరి విచారణలో ఆ ఫోన్లో 2025 ఫిబ్రవరి - మే మధ్య తీసిన 80కి పైగా ఫోటోలు, వీడియోలు లభించాయి. కనీసం ఆరుగురు బాధితులను పోలీసులు గుర్తించారు. ఇతగాడి పైశాచికం 2018 నుంచే జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ఇంకా ఎక్కువ మందే ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే విశ్వవిద్యాలయం దేశ్ముఖ్ను సస్పెండ్ చేసింది. అనంతరం ఆయన మెడికల్ రెసిడెన్సీని రద్దు చేసింది. అయితే అంతర్గత విచారణ అనంతరం రెసిడెన్సీ నియామకాన్ని పునరుద్ధరించ లేదని వెల్లడించింది. కోర్టులో శిక్ష ఖరారయ్యే ముందు దేశ్ముఖ్ బాధితులకు క్షమాపణలు చెప్పాడు.టోలెడో ఆసుపత్రి ఉద్యోగి బాధితుల్లో ఒకరైన లిండ్సే ఈ సంఘటన తనను ఎంత కుంగదీసిందో వివరించారు. తాను ఇప్పటికీ బాత్రూమ్లలో రహస్య కెమెరాల కోసం తనిఖీ చేస్తానని, ఆ చిత్రాలు ఎక్కడికి చేరాయోనన్న ఆందోళనన తనను వెంటాడుతూనే ఉందంటూకోర్టు ముందు ఆవేదన వ్యక్తంచేశారు. సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించిన ఒక అభియోగం, రహస్యంగా వీడియో తీసిన ఏడు అభియోగాలను అంగీకరించిన తర్వాత, దేశ్ముఖ్కు జూన్లో కోర్టు ఈయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు మూడేళ్ల ప్రొబేషన్ విధించింది. అంతేకాకుండా 15 ఏళ్ల పాటు 'సెక్స్ అఫెండర్' (లైంగిక నేరస్థుడిగా) నమోదు చేసుకోవాలని, మానసిక ఆరోగ్య చికిత్స పొందాలని ఆదేశించింది.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి -
ఇరాన్ వార్.. భారీ మూల్యం చెల్లించుకుంటున్న అమెరికా
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం అమెరికా ఖజానాపై భారీ భారంగా మారుతోంది. ఇప్పటివరకు ఈ యుద్ధానికి సంబంధించిన ఖర్చు 37.5 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3.2 లక్షల కోట్లకు పైగా) చేరిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. యుద్ధ వ్యయాలను భరించేందుకు అదనపు నిధులు కేటాయించాలని ఆయన అమెరికా కాంగ్రెస్ను కోరారు.కాంగ్రెస్ కమిటీలో జరిగిన విచారణ సందర్భంగా హెగ్సెత్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ మొత్తం ఖర్చులో ఇప్పటికే జరిగిన యుద్ధ కార్యకలాపాలతో పాటు.. సెప్టెంబర్ 30 వరకు అంచనా వేసిన వ్యయాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో.. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ అదనపు నిధుల కోసం ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో కాంగ్రెస్ను దాదాపు 90 బిలియన్ డాలర్ల (సుమారు రూ.7.7 లక్షల కోట్లకు పైగా) అదనపు నిధులు కోరారు. ఇందులో ఎక్కువ భాగం ఇరాన్ యుద్ధానికి సంబంధించిన ఖర్చులేనని సమాచారం. అంతేకాకుండా 2027 ఆర్థిక సంవత్సరానికి పెంటగాన్ ఏకంగా 1.5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.128 లక్షల కోట్లకు పైగా) బడ్జెట్ను ప్రతిపాదించింది. ఈ నిధులు కేటాయించకపోతే దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని రక్షణ మంత్రి హెగ్సెత్ వ్యాఖ్యానించారు.యుద్ధంపై అమెరికాలో అసంతృప్తిఇరాన్తో యుద్ధంపై అమెరికాలో విమర్శలు పెరుగుతున్నాయి. మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. యుద్ధ వ్యయం, ద్రవ్యోల్బణం అంశాలను ప్రతిపక్ష డెమొక్రాట్లు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్లో పలువురు సభ్యులు.. ట్రంప్ ప్రభుత్వం యుద్ధ పరిణామాలపై తమకు తగిన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. డెమొక్రాట్ సెనేటర్ పాటీ ముర్రే మాట్లాడుతూ.. ఈ యుద్ధం దీర్ఘకాలికంగా కొనసాగుతుందా అన్న ఆందోళన వ్యక్తం చేశారు.18 మంది అమెరికా సైనికుల మృతిఇరాన్తో జరుగుతున్న పోరులో ఇప్పటివరకు 18 మంది అమెరికా సైనికులు మరణించినట్లు పెంటగాన్ తెలిపింది. మరో 430 మంది వరకు సైనికులు గాయపడినట్లు వెల్లడించింది. అయితే జూలై 7 తర్వాత గాయపడిన వారిలో 96 శాతం మంది తిరిగి విధుల్లో చేరారని అధికారులు తెలిపారు.కొనసాగుతున్న దాడులుఅమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల ప్రారంభంలోనే కుప్పకూలింది. ఆ తర్వాత ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్లోని లక్ష్యాలపై దాడులను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఇంధన కేంద్రాలు, వంతెనలు, వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఖార్గ్ ద్వీపం, అణు కేంద్రాలపై ట్రంప్ హెచ్చరికలుఇరాన్లో కీలకమైన ఖార్గ్ ద్వీపం చమురు కేంద్రంపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే భూగర్భంలో ఉన్న అణు సంబంధిత కేంద్రాలపై కూడా దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. తాజాగా ఓ లోతైన భూగర్భ అణు కేంద్రాన్ని(పికాక్స్ మౌంటెన్ (Pickaxe Mountain) “త్వరలోనే ధ్వంసం చేస్తాం” అని ట్రంప్ పేర్కొన్నారు.సైనిక సామర్థ్యాలపై ప్రభావంయుద్ధ ఖర్చులు పెరగడంతో అమెరికా సైనిక శిక్షణ కార్యక్రమాలపై ప్రభావం పడే అవకాశం ఉందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అత్యవసర నిధులు అందకపోతే సైనిక నిర్వహణ, ఆయుధాల ఆధునీకరణ, భవిష్యత్ రక్షణ ప్రాజెక్టులపై ఒత్తిడి పెరుగుతుందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ తెలిపారు.మొత్తంగా.. ఇరాన్పై సైనిక చర్య అమెరికాకు వ్యూహాత్మకంగా ఎంత కీలకమైనదైనా.. దాని ఆర్థిక భారం మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. బిలియన్ల డాలర్ల ఖర్చు, సైనిక నష్టాల మధ్య ట్రంప్ ప్రభుత్వానికి ఇరాన్ యుద్ధం సవాల్గా మారుతోంది. -
భారత్ ‘ఫార్మా’కు ట్రంప్ భారీ షాక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై భారీ టారిఫ్లు విధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా ఔషధ తయారీని తిరిగి అమెరికాలోనే ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కొత్త విధానం భారత ఔషధ పరిశ్రమపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ వేదికగా చేసిన పోస్టులో.. రానున్న ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలపై రెండేళ్ల పాటు సున్నా శాతం టారిఫ్ కొనసాగుతుందని తెలిపారు. ఆ గడువు ముగిసిన తర్వాత ఒక సంవత్సరం పాటు 100 శాతం టారిఫ్, ఆ తర్వాత 200 శాతం టారిఫ్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అమెరికాలోనే జనరిక్ ఔషధాల తయారీని పెంచేందుకు, విదేశీ కంపెనీలు అక్కడ ప్లాంట్లు, తయారీ సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు. నిర్ణయించిన గడువులోగా అమెరికాలో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయని కంపెనీలపై ఈ టారిఫ్లు ఒక విధమైన జరిమానాగా పనిచేస్తాయని ట్రంప్ చెప్పారు.అమెరికా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ విధానాన్ని తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. పేటెంట్ ఉన్న బ్రాండెడ్ లేదా ఇన్నోవేటివ్ ఔషధాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం యథాతథంగా కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో భారత ఔషధ పరిశ్రమలో ఆందోళన నెలకొనే అవకాశం ఉంది. ప్రపంచానికి తక్కువ ధరలో నాణ్యమైన జనరిక్ మందులను సరఫరా చేస్తున్నందుకు భారత్ను ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గా పిలుస్తారు. ముఖ్యంగా భారత ఔషధ ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది.గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) నివేదిక ప్రకారం, 2025లో భారత్ అమెరికాకు 9.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. ఇది భారత్ మొత్తం ఔషధ ఎగుమతులైన 25.8 బిలియన్ డాలర్లలో 38 శాతానికి సమానం. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, అంటువ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలకు అమెరికాలో విస్తృతంగా ఉపయోగించే జనరిక్ మందుల్లో భారత కంపెనీల వాటా కీలకంగా ఉంది.ట్రంప్ ప్రకటించిన విధానం అమల్లోకి వస్తే, అమెరికాకు ఎగుమతులు చేసే భారత ఫార్మా కంపెనీలు అక్కడే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. లేకపోతే భారీ టారిఫ్ల కారణంగా అమెరికా మార్కెట్లో తమ ఉత్పత్తుల ధరలు పెరగడంతో పాటు పోటీ సామర్థ్యం కూడా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికాలో తయారీని విస్తరించే కంపెనీలకు మాత్రం దీర్ఘకాలంలో ప్రయోజనం కలగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ విధానం తుది రూపంలో ఎలా అమలవుతుంది, ఎలాంటి మినహాయింపులు ఉంటాయి, అంతర్జాతీయ ఔషధ కంపెనీలు ఎలా స్పందిస్తాయి అనే అంశాలపై దీని వాస్తవ ప్రభావం ఆధారపడి ఉంటుంది. -
ట్రంప్ నిర్ణయంతో మిడిల్ ఈస్ట్లో కొత్త టెన్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాతో న్యూక్లియర్ డీల్కు ఆమోదం తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా సౌదీ తన భూభాగంలోనే యురేనియం శుద్ధి (ఎన్రిచ్మెంట్) చేపట్టే అవకాశం లభించనుంది. అయితే గతంలో అమెరికా కుదుర్చుకున్న అణు ఒప్పందాలతో పోలిస్తే.. సౌదీ డీల్లో కీలక భద్రతా నిబంధనలు లేకపోవడంపై అంతర్జాతీయంగా కలకలం రేగింది.ట్రంప్ ప్రభుత్వం ఆమోదించిన ఈ ఒప్పందం దాదాపు 30 ఏళ్ల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. దీని విలువ పదుల బిలియన్ల డాలర్లుగా ఉండనుంది. ఈ ఒప్పందం అమలైతే సౌదీ అరేబియాలో పౌర అణు విద్యుత్ కార్యక్రమాల నిర్మాణంలో అమెరికా కంపెనీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇతర దేశాల కంపెనీలకు అవకాశాలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అణు ఇంధన రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని పెంచే వ్యూహంలో భాగంగానే ఈ ఒప్పందాన్ని చూస్తున్నారు.సంప్రదాయ భద్రతా నిబంధనలు లేవా?అమెరికా గతంలో కుదుర్చుకున్న అణు ఒప్పందాల్లో.. అణు సాంకేతికత దుర్వినియోగం కాకుండా కఠినమైన నిబంధనలు ఉండేవి. కానీ సౌదీతో కుదుర్చుకున్న తాజా ఒప్పందంలో అలాంటి కొన్ని కీలక రక్షణ చర్యలు లేకపోవడం చర్చకు దారితీసింది. ముఖ్యంగా యురేనియం ఎన్రిచ్మెంట్ అనుమతి ఇవ్వడం భవిష్యత్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.వైట్హౌస్లో కీలక భేటీ తర్వాత నిర్ణయంఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో వైట్హౌస్లో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం అణు ఒప్పందంపై ముందడుగు పడింది. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్యాకేజీని త్వరలోనే అమెరికా కాంగ్రెస్ పరిశీలనకు పంపనున్నట్లు సమాచారం.‘123 అగ్రిమెంట్’లో భాగంగా..అమెరికా విదేశీ దేశాలతో అణు సహకారం కోసం రూపొందించే ప్రత్యేక ఒప్పందాన్ని సాధారణంగా ‘123 Agreement’ అని పిలుస్తారు. తాజా ఒప్పందంలో భాగంగా అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్, సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్ సంతకాలు చేసినట్లు సమాచారం.మిడిల్ ఈస్ట్లో కొత్త అణు సమీకరణాలు?చమురు సంపదతో ప్రపంచంలో కీలక శక్తిగా ఉన్న సౌదీ.. ఇప్పుడు అణు ఇంధన రంగంలో అడుగులు వేయడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా-సౌదీ అణు ఒప్పందం మిడిల్ ఈస్ట్ వ్యూహాత్మక సమీకరణాలను మార్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఒక పక్క దౌత్యం.. ఇంకోపక్క యుద్ధం!
ఇస్లామాబాద్: ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం మంగళవారానికి పదో రోజుకు చేరుకుంది. దాడి ప్రతిదాడుల మధ్య చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలూ ఊపందుకుంటున్నాయి. అమెరికా మంగళవారం ఇరాన్ మిలటరీ స్థావరాలు లక్ష్యంగా దాడులకు దిగింది. మిలటరీ కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ల లాంచింగ్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు జరిపిందని మిలటరీ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిలో ఒక నౌకపై దాడి చేసింది.దీంతో సిబ్బంది నౌకను వదిలి పారిపోయారు. బెలూచిస్థాన్ ప్రావిన్స్లోని ఫార్స్, హొర్మోజ్గాన్, ల్లామ్, కెర్మాన్, సిస్టాన్ల వద్ద పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ అధికార మీడియా సంస్థ మంగళవారం ప్రకటించింది. అంతేకాకుండా ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో అమెరికా మిత్రదేశాలు జోర్డాన్, బహ్రయిన్, కువైట్లో విద్యుత్తు, నిర్లవణీకరణ కేంద్రాలపై దాడులు జరిపింది. ఇరాన్ ప్రయోగించిన ఐదు డ్రోన్లు, మూడు క్షిపణులను కూల్చేసినట్లు జోర్డాన్ ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం బహ్రయిన్లో ఇరాన్ దాడులపై హెచ్చరికలు జారీ చేస్తూ సైరన్లు మోగాయి.ఇదిలా ఉంటే ఇరాన్ ఒక నిర్లవణీకరణ కేంద్రంపై దాడి చేసిందని, సోమవారం రాత్రి జరిగిన ఈ దాడిలో కేంద్రం దెబ్బతన్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరుపక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు కూడా పెరిగిపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 90 డాలర్లకు దగ్గరైంది. అలాగే మధ్యంతర ఎన్నికల నేపథ్యం, ద్రవ్యోల్బణం పెరగవచ్చునన్న అంచనాల కారణంగా అమెరికాలో గ్యాలన్ పెట్రోలు ధర రికార్డు స్థాయిలో నాలుగు డాలర్లకు చేరింది. పాకిస్థాన్లో ఇరాన్ హోం మంత్రిఇరాన్– అమెరికాల మధ్య దాడి, ప్రతిదాడులు కొనసాగుతూండగానే ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఎస్కందర్ మోమేనీ మంగళవారం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, ప్రధాని షాబాజ్ షరీఫ్లతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో యుద్ధ విరమణకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు జరిగిందో స్పష్టం కాలేదు. ఇరాన్ – అమెరికాల మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ గత నెలలో ఇరుపక్షాలు ఒక మధ్యంతర అంగీకారానికి వచ్చేందుకు కృషి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందం కాస్తా వీగిపోయి మళ్లీ యుద్ధం మొదలైన నేపథ్యంలో ఇరుపక్షాలు మరోసారి చర్చలు ప్రారంభించాలని పాకిస్థాన్ ఆహా్వనిస్తోంది.ఈ నేపథ్యంలో సోమవారం సాయంకాలమే పాకిస్థాన్ చేరుకున్న మొమేనీని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మోహసిన్ నక్వీని స్వాగతించారు. ఆ తరువాత అసీమ్ మునీర్తో సమావేశమయ్యారు. చివరగా పాక్ ప్రధానితో చర్చలు జరిపారు. మరోవైపు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మార్కో రూబియో కూడా చర్చలకు సై అంటూనే అవి వాస్తవికంగా ఉండాలన్న షరతు విధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్కు వాస్తవికం అనిపించే ఏర్పాటును ఇరాన్ చూపగలదా? అన్న ప్రశ్న వస్తోంది. ఇరుపక్షాల్లోనూ అపనమ్మకం వేళ్లూనుకున్న పరిస్థితుల్లో దౌత్యపరమైన చర్చలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి. -
మధ్యవర్తిత్వం పేరుతో పాక్ స్కెచ్.. అమెరికాకు వల ?
ఇస్లామాబాద్: ఇరాన్- అమెరికా యుద్ధంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తూ పాక్ ఇచ్చినా బిల్డప్ అంతా ఇంతా కాదు. ఇస్లామాబాద్ టాక్స్ పేరుతో పెద్ద హంగామానే చేసింది. ఇంత చేసి యుద్ధం ఆగడం మాట అటుంచితే అది మరింత ముదిరింది. అయితే ఈ మధ్యవర్తిత్వం పేరుతో అమెరికాకు మరింత దగ్గరైన పాక్ ఇప్పుడు ఆ దేశం నుంచి మెల్లగా ఆర్థిక సాయం పొందే ప్లాన్ వేస్తోంది.ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతున్న పాక్, వాషింగ్టన్ నుండి $10 బిలియన్ల 'ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీ' ని కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, దేశంలో పడిపోతున్న విదేశీ మారక నిల్వలను పునరుద్ధరించడానికి, పాకిస్తానీ రూపాయి విలువపై ఒత్తిడిని తగ్గించడానికి ఊరట లభించినట్లవుతుందని కథనాలు పేర్కొన్నాయి.పాకిస్తాన్ ప్రభుత్వం యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్కు పంపిన ప్రతిపాదనలో, ఐదేళ్ల కాలపరిమితి కలిగిన $10 బిలియన్ల ద్వైపాక్షిక ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని అమెరికాను కోరింది. ప్రస్తుతం పాకిస్తాన్ $7 బిలియన్ల IMF ప్రోగ్రామ్ కింద కఠినమైన ఆర్థిక నిబంధనలను అమలు చేస్తోంది. దీనివల్ల పన్నుల పెంపు, ప్రభుత్వ వ్యయం తగ్గించడం వంటి కొన్ని ప్రజాదరణ లేని నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. యుఎస్ అందించే ఈ సదుపాయం లభిస్తే పాకిస్తాన్కు IMF నిధులపై మరియు ఆకస్మిక రుణాలపై ఆధారపడటం తగ్గుతుంది.'ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్' సదుపాయం ?యుఎస్ ట్రెజరీ నుండి లభించే ఈ సదుపాయాలు చాలా అరుదుగా ఇస్తారు. ఇవి సాధారణంగా "ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫండ్" ద్వారా డాలర్లు, స్వ్యాప్లు (swaps) లేదా గ్యారెంటీల రూపంలో లభిస్తాయి. గతంలో 2025లో అర్జెంటీనాకు, 2002లో ఉరుగ్వేకు ఈ విధమైన ప్యాకేజీలు అందించారు. మెక్సికోకు కూడా 1940ల నాటి $9 బిలియన్ల స్వ్యాప్ లైన్ అందుబాటులో ఉంది.పాకిస్తాన్ ప్రస్తుత ఆర్థిక స్థితి2023లో $3 బిలియన్ల IMF స్టాండ్బై ఒప్పందంతో డిఫాల్ట్ కాకుండా బయటపడిన పాకిస్తాన్, ఆ తర్వాత $7 బిలియన్ల ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ మరియు వాతావరణ మార్పుల కోసం $1.3 బిలియన్ల రుణాన్ని పొందింది. అయినప్పటికీ, పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు ఇంకా చైనా మరియు సౌదీ అరేబియా రోల్ఓవర్లు, డిపాజిట్లపైనే ఆధారపడి ఉన్నాయి.ఏప్రిల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి పాకిస్తాన్ $3.5 బిలియన్లు చెల్లించాల్సి రాగా, సౌదీ అరేబియా $3 బిలియన్ల కొత్త మద్దతును అందించింది. 2026 చివరి నాటికి తమ విదేశీ మారక నిల్వలు $20 బిలియన్లకు చేరుకుంటాయని పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసింది.ఫిచ్ రేటింగ్స్, హెచ్చరికలుIMF ప్రోగ్రామ్ వల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కొంత స్థిరపడినప్పటికీ, పెరిగే ఇంధన ధరలు మరియు సరఫరా అంతరాయాలు విదేశీ మారక నిల్వలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఫిచ్ రేటింగ్స్ హెచ్చరించింది. అలాగే క్రెడిట్ రేటింగ్ తక్కువగా ఉండటం వల్ల విదేశీ పెట్టుబడులు రావడం లేదు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి
సాక్షి,హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిన ఈ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం.కాలిఫోర్నియాలోని ఓ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు హైదరాబాద్ వాసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని స్థానిక అత్యవసర సేవల సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగం కారణమా? లేక మరో వాహనం ఢీకొట్టిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న కాలిఫోర్నియా పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై హైదరాబాద్లోని బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారి ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. -
ఇరాన్ దెబ్బకు అమెరికా విలవిల
-
భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్.. ఇక అమెరికా ఆశలు గల్లంతే
-
నెతన్యాహుకు ట్రంప్ కవచం.. అమెరికా గడ్డపై అది అసాధ్యం!
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ‘అరెస్ట్ వ్యవహారం’ అమెరికాలో ఈసారికి రాజకీయ దుమారం రేపుతోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో.. న్యూయార్క్ పర్యటనకు వస్తే నెతన్యాహును అరెస్ట్ చేసే అవకాశం ఉందని నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు స్వయానా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి కౌంటర్ ఇచ్చారు.‘‘బెంజమిన్ నెతన్యాహు అమెరికాలో ఎక్కడా, ఎప్పుడూ అరెస్ట్ కాబోరు’’ అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల కోసం నెతన్యాహు న్యూయార్క్కు వచ్చే అవకాశం ఉండటంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.‘అరెస్ట్ చేయాలనే ప్రశ్నే లేదు’.. ట్రంప్ స్పష్టంనెతన్యాహు అమెరికా పర్యటనపై చర్చ జరుగుతున్న వేళ.. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అమెరికా భూభాగంలో ఇజ్రాయెల్ ప్రధానిని అరెస్ట్ చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని పేర్కొన్నారు. ఇటీవల ఇరాన్తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ పాత్రను కూడా ట్రంప్ ప్రశంసించారు. అయితే న్యూయార్క్ మేయర్ మమ్దానీ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆయన వ్యాఖ్యలకు సమాధానంగానే ట్రంప్ ప్రకటన వెలువడినట్లు భావిస్తున్నారు.మమ్దానీ వ్యాఖ్యలతో మొదలైన వివాదంన్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నెతన్యాహు నగరానికి వస్తే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలిస్తున్నామని తెలిపారు. ‘‘నెతన్యాహు ది హేగ్లో ఉండాల్సిన వ్యక్తి’’ అని వ్యాఖ్యానించిన ఆయన.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయనపై వారెంట్ జారీ చేసిందని గుర్తుచేశారు. అయితే అదే సమయంలో చట్టాలకు లోబడే తాము పనిచేస్తామని కూడా మమ్దానీ స్పష్టం చేశారు. రాజకీయ అభిప్రాయాల ఆధారంగా కాకుండా.. న్యూయార్క్ చట్టాలు, అమెరికా నిబంధనల ప్రకారమే నిర్ణయం ఉంటుందని తెలిపారు.ఐసీసీ వారెంట్ చుట్టూ వివాదంగాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు సంబంధించి ఆరోపణలపై 2024లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఐసీసీకి తమపై అధికార పరిధి లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా.. అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ఐసీసీని ఏర్పాటు చేసిన రోమ్ ఒప్పందంలో భాగస్వాములు కావు. దీంతో ఐసీసీ వారెంట్లను అమలు చేయాల్సిన చట్టపరమైన బాధ్యత అమెరికాకు లేదని నిపుణులు చెబుతున్నారు.ఇజ్రాయెల్ ఆగ్రహంమమ్దానీ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా స్పందించింది. ఐసీసీని ‘నకిలీ న్యాయస్థానం’గా అభివర్ణిస్తూ.. నెతన్యాహుపై జారీ చేసిన వారెంట్ అసంబద్ధమని పేర్కొంది. మమ్దానీ దేశీయ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది.సెప్టెంబర్ పర్యటనపై ఉత్కంఠప్రతి ఏడాది సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాలకు ప్రపంచ దేశాల నేతలు న్యూయార్క్కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు గత రెండేళ్ల పర్యటనల సందర్భంగా.. ఇలాంటి చర్చే నడుస్తూ వస్తోంది. అరెస్ట్ భయంతోనే ఆయన ప్రత్యామ్నాయ మార్గాల్లో.. అతి గోప్యంగా న్యూయార్క్కు చేరుకుంటున్నారనే చర్చా జరుగుతోంది. అంతేకాదు.. ఐరాసలోనూ ఆయనకు ‘నిరసన గళం’తో చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. మామ్దానీ కామెంట్ల నేపథ్యంలో ఈసారి పర్యటనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఐసీసీ వారెంట్.. మరోవైపు అమెరికా రక్షణగా నిలవడం.. ఇంకోవైపు న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలు.. ఈ పరిణామాలతో నెతన్యాహు అమెరికా పర్యటన అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
ఢిల్లీలో ఉద్రిక్తత.. ‘మహా పంచాయత్’తో కదం తొక్కిన అన్నదాతలు!
న్యూఢిల్లీ: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్కు చెందిన వందలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకున్నారు. నేడు కిసాన్ ఘాట్లో ‘దేశ్ బచావో మోర్చా’ ఆధ్వర్యంలో జరిగే ‘మహా పంచాయత్’లో వీరంతా పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 550 రైతు సంఘాలు, సామాజిక సంస్థలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు.ఈ ఒప్పందం వల్ల భారత రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కేఎంఎస్సీ) నేత జర్మన్జిత్ సింగ్ బండాల ఆరోపించారు. అమెరికాలో భారీ సబ్సిడీలతో వేలాది ఎకరాల్లో వ్యవసాయం జరుగుతోందని, కానీ మన దేశంలో మెజారిటీ రైతులకు కేవలం 2 నుంచి 2.5 ఎకరాల భూమి మాత్రమే ఉందనని ఆయన గుర్తుచేశారు. ఈ ఒప్పందంతో చౌకైన అమెరికా వ్యవసాయ దిగుమతులు దేశీయ మార్కెట్లోకి వస్తే, చిన్న రైతులు పోటీ పడలేరని ఆందోళన వ్యక్తం చేశారు. #WATCH आज दिल्ली की ओर अपने तय मार्च से पहले बड़ी संख्या में किसान शंभू बॉर्डर (पंजाब-हरियाणा बॉर्डर) पहुंचे। वीडियो पटियाला (पंजाब) से है। pic.twitter.com/OWxjTRNj4v— ANI_HindiNews (@AHindinews) July 21, 2026అమెరికా ఒత్తిడికే కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ఈ ఒప్పందాన్ని ముందుకు తెస్తోందని ఆయన విమర్శించారు. కేవలం వ్యవసాయమే కాకుండా, చిన్న వ్యాపారాలు, ఇతర రంగాల్లోని ఉద్యోగాలపై కూడా ఈ ప్రభావం పడుతుందన్నారు. డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఇది కూడా చదవండి: అంతర్జాతీయ వేదికపై పాక్ పరువు పాయే! -
యుద్ధంలో కీలక మలుపు.. ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: తమ దేశం.. అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధంలో ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు. యుద్ధ సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం ఎంతో కీలకమని ఆయన ఉద్ఘాటించారు. నేటి యుద్ధం కేవలం క్షిపణుల యుద్ధం మాత్రమే కాదు. మిలిటరీ దాడులతో ఇరాన్ జాతీయులను లొంగదీసుకోలేమని శత్రువు గ్రహించాడంటూ టెహ్రాన్లోని హై కౌన్సిల్ ఆఫ్ ది జుడీషియరీ సమావేశంలో పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. యుద్ధం పరిణామాలను ప్రజలు అంగీకరించాలన్న పెజెష్కియన్.. ప్రతిఘటనే ప్రస్తుత మార్గమన్నారు.శత్రువు.. ఇరాన్పై హైబ్రిడ్ యుద్ధాన్ని మొదలుపెట్టాడన్న పెజెష్కియాన్.. యుద్ధ సమయంలో పరిపాలనా వ్యవస్థ ప్రాధాన్యతల్లో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, సామాజిక ఆస్తులను పరిరక్షించడం ప్రధానమైనవని ఆయన స్పష్టం చేశారు. జూన్ 18న కుదిరిన అవగాహన ఒప్పందంతో సహా అమెరికాతో జరిగిన చర్చల్లో తమ ప్రభుత్వం ఇరాన్ జాతీయ హక్కులను, ప్రయోజనాలను పూర్తిస్థాయిలో కాపాడిందన్నారు.కాగా, వాణిజ్య నౌకలను బెదిరించే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా గత వారంలో అమెరికా ఇరాన్లోని దక్షిణ ప్రావిన్సులపై వరుస దాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్.. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ వంటి ప్రాంతీయ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు మరియు సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం తుది ఒప్పందానికి రావడానికి 60 రోజుల వ్యవధిలో చర్చలు జరగాల్సి ఉన్న తరుణంలో ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి.మరో వైపు, అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్పై మరో విడత దాడులను ప్రారంభించినట్లు ప్రకటించడంతో.. సోమవారం రాత్రి, మంగళవారం వేకువజామున దక్షిణ, మధ్య ఇరాన్లో పలు పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. దక్షిణ ప్రావిన్స్ హోర్మోజ్గాన్లోని బందర్ అబ్బాస్, సిరిక్, బందర్ లెంగే, ఖేష్మ్ కౌంటీలతో పాటు ఆగ్నేయ ప్రావిన్స్ సిస్తాన్ అండ్ బలూచిస్థాన్లోని చాబహార్, కొనారక్ కౌంటీలలో సోమవారం రాత్రి పేలుళ్లు జరిగాయి. -
ఇరాన్పై మరోసారి అమెరికా బాంబింగ్
అమెరికా – ఇరాన్ల యుద్ధం మరింత వేడెక్కింది. ఇరాన్ మిలిటరి కమాండర్ సెంటర్పై అమెరికా దాడి చేసింది. ఇరాన్ డ్రోన్ లాంచ్ సైట్లు, ఎయిర్ డిఫైన్స్ సిస్టమ్పై ఎటాక్ చేసింది. మరోవైపు యూఎస్స్థానిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. కువైట్లోని యూఎస్ స్థావరంపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. యూఎస్ రాడర్ సిస్టమ్, అమెరికన్లు టార్గెట్గా ఇరాన్ విరుచుకుపడుతోంది.ఇరాన్, యూఎస్ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. క్షిపణి, డ్రోన్ దాడులతో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వాషింగ్టన్ వరుసగా 10వ రాత్రి కూడా దాడులు కొనసాగించగా.. బహ్రెయిన్లోని అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థపై దాడి చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. మరో వైపు, హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై కూడా దాడులు జరిగాయి. తాము పూర్తి స్థాయి యుద్ధంలో ఉన్నామని టెహ్రాన్ హెచ్చరించగా.. ఇరాన్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు మరణించినట్లు పెంటగాన్ ధృవీకరించింది.నిన్న (సోమవారం) కూడా ఇరాన్ లక్ష్యంగా అమెరికా మరోసారి దాడులకు తెగబడగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్లపై ప్రతిదాడులకు దిగింది. ఇరాన్ వాయువ్య ప్రాంతంలో భూగర్భ క్షిపణి కేంద్రంగా భావిస్తున్న తబ్రిజ్ నగరం లక్ష్యంగా అమెరికా దాడులకు దిగగా ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రతీకారంగా ఇరాన్ బహ్రెయిన్తోపాటు అమెరికా నావికాదళపు ఫిఫ్త్ ఫ్లీట్ ఉన్న కువైట్పై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరు దేశాల్లో సోమవారం ఉదయమే క్షిపణి దాడులకు సంబంధించిన హెచ్చరికలు జారీ అయ్యాయి.దూసుకొస్తున్న క్షిపణులను అడ్డుకున్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరుదేశాల మధ్య యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తూ గత నెలలో ఒక ఒప్పందం కుదిరినా ఆ తరువాత దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూండటంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో కార్యకలాపాలు మళ్లీ స్తంభించిపోయాయి. ఇరుపక్షాలూ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు చేసుకుంటూండంతో చమురు ధరలు మళ్లీ పైకి ఎగబాకాయి. సోమవారం బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్ ధర 90 డాలర్ల కంటే ఎక్కువ పలికి ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. ఇరాన్పై సోమవారం జరిగిన దాడులు బాగా జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒరాన్ డ్రోన్ దాడిలో శనివారం వీరసైనికుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నామని ఆయన ప్రకటించారు. -
హర్ముజ్ తర్వాత మరో షాక్.. హౌతీల సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ పదో రోజుకు చేరుకున్న వేళ.. యెమెన్కు చెందిన ఇరాన్ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులు చేసిన సంచలన ప్రకటన ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. సౌదీ అరేబియాకు చెందిన వాణిజ్య, ఇంధన నౌకలపై నావికా దిగ్బంధం విధిస్తున్నట్లు హౌతీలు ప్రకటించారు. ఈ పరిణామంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న గల్ఫ్ ప్రాంతంలో మరో కొత్త యుద్ధ ఫ్రంట్ తెరుచుకునే ప్రమాదం కనిపిస్తోంది.సౌదీ నేతృత్వంలోని కూటమి యెమెన్పై విధించిన ఆంక్షలు, చర్యలకు ప్రతిస్పందనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హౌతీ సాయుధ విభాగం వెల్లడించింది. సౌదీకి వ్యతిరేకంగా ‘మారిటైమ్ ఎంబార్గో’ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రపంచ ఇంధన సరఫరా మార్గాలపై మరోసారి తీవ్ర ఆందోళన మొదలైంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన బాబ్ ఎల్ మండెబ్ bab el mandeb జలసంధిపై ప్రభావం పడితే పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ రెండు కీలక సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరాలో భారీ కోత వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు మార్కెట్లలో కలవరంహౌతీల ప్రకటన వెలువడిన వెంటనే అంతర్జాతీయ చమురు మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. అయితే దౌత్య చర్చలపై ఆశలు ఉండటంతో ధరలు కొంత మేర తగ్గాయి. అయినప్పటికీ.. గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు అదుపు తప్పితే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచ చమురు ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించే సౌదీ అరేబియా రవాణా మార్గాలకు ముప్పు ఏర్పడితే దాని ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది.ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగింపుమరోవైపు ఇరాన్పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. పదో రోజు కూడా అమెరికా వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ సైనిక కమాండ్ కేంద్రాలు, క్షిపణి ప్రయోగ స్థావరాలు, డ్రోన్ కేంద్రాలు, నౌకా సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఇరాన్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. తబ్రీజ్, చాబహార్, బందర్ అబ్బాస్, ఖెష్మ్ దీవి పరిసర ప్రాంతాల్లో అమెరికా దాడుల ప్రభావం కనిపించినట్లు సమాచారం.ఇరాన్ మాత్రం అమెరికా దాడులకు ప్రతీకార చర్యలు కొనసాగిస్తామని ప్రకటిస్తోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అమెరికా మిత్ర దేశాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.హర్ముజ్లో ట్యాంకర్లపై దాడులుగల్ఫ్ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హర్ముజ్ జలసంధిలో మరో కలకలం చోటుచేసుకుంది. రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. సురక్షితం కాని మార్గంలో ప్రయాణించడంతో ఈ ఘటన జరిగిందని ఇరాన్ పేర్కొంది.అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్వతంత్ర సంస్థలు ధ్రువీకరించలేదు. మరోవైపు ఒమన్ తీరంలో ఓ వాణిజ్య నౌకపై గుర్తుతెలియని ఆయుధంతో దాడి జరిగినట్లు బ్రిటన్కు చెందిన సముద్ర భద్రతా సంస్థ వెల్లడించింది.దౌత్య ప్రయత్నాలు.. కానీ తగ్గని ఉద్రిక్తతలుయుద్ధ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ మరోవైపు దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెని పాకిస్థాన్కు చేరుకుని చర్చలు ప్రారంభించారు. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలు చేస్తోంది.అయితే అమెరికా మాత్రం ప్రస్తుతం దౌత్యం కంటే సైనిక చర్యలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇరాన్ దాడుల్లో మరణించిన అమెరికా సైనికులకు ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.గల్ఫ్ దేశాల్లో భయంఇరాన్-అమెరికా ఘర్షణ ప్రభావం గల్ఫ్ దేశాలపై కూడా పడుతోంది. కువైట్, బహ్రెయిన్, ఖతార్ వంటి దేశాలు అప్రమత్తమయ్యాయి. తమపై జరిగిన దాడులపై ఖతార్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. నష్టపరిహారం కోరుతూ చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే హర్ముజ్ జలసంధి.. ఇప్పుడు బాబ్ ఎల్ మండెబ్ మార్గంపై కూడా ముప్పు ఏర్పడటంతో ప్రపంచ దేశాల దృష్టి మొత్తం మధ్యప్రాచ్యంపై పడింది. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ మరింత విస్తరిస్తే.. అది కేవలం ప్రాంతీయ యుద్ధంగానే కాకుండా ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కెనడాకు ట్రంప్ షాక్.. 50 శాతం టారిఫ్ల మోత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పన్నుల మోత మోగించారు. కెనడాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై 50 శాతం మేర దిగుమతి సుంకాలను విధిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ కొత్త పన్నులు 30 రోజుల్లో అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు.కెనడా,అమెరికాకు చెందిన ఆల్కహాల్ , ఆటోమొబైల్స్, డెయిరీ ఉత్పత్తుల విక్రయాల్లో విచక్షణారహితంగా వివక్షతతో కూడిన" వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ దేశ ఉత్పత్తులపై 50 శాతం పన్నులు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.అయితే ట్రంప్ విధించిన పన్నుల నుంచి ఎనర్జీ ఉత్పత్తులు , పోటాష్, చేపలు,అత్యవసర ఖనిజాలతో పాటు ప్రత్యేక సుంకాల పరిధిలోకి వచ్చే సరుకులకు ఈ కొత్త పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ మినహాయించిన ఉత్పత్తులు తప్ప మిగతావన్నీ 'యుఎస్-మెక్సికో-కెనడా రవాణా వాణిజ్య ఒప్పందం' కింద దేశంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ, వాటిపై ఈ నూతన సుంకాలు వర్తిస్తాయని వైట్హౌస్ స్పష్టం చేసింది.కెనడాలోని అడవుల్లో వస్తున్న భారీ కార్చిచ్చుల వల్ల అమెరికాలోని నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతోందని, దానికయ్యే నష్ట పరిహారాన్ని కూడా టారిఫ్ల రూపంలో కెనడా నుంచే వసూలు చేస్తామని ట్రంప్ ఇటీవలే హెచ్చరించడం గమనార్హం. -
ఇరాన్పై అమెరికా భారీ వైమానిక దాడులు
దుబాయి: అమెరికా – ఇరాన్ల యుద్ధం మరింత వేడెక్కింది. సోమవారం ఉదయం ఇరాన్ లక్ష్యంగా అమెరికా మరోసారి దాడులకు తెగబడగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్లపై ప్రతిదాడులకు దిగింది. ఇరాన్ వాయువ్య ప్రాంతంలో భూగర్భ క్షిపణి కేంద్రంగా భావిస్తున్న తబ్రిజ్ నగరం లక్ష్యంగా అమెరికా దాడులకు దిగగా ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రతీకారంగా ఇరాన్ బహ్రెయిన్తోపాటు అమెరికా నావికాదళపు ఫిఫ్త్ ఫ్లీట్ ఉన్న కువైట్పై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరు దేశాల్లో సోమవారం ఉదయమే క్షిపణి దాడులకు సంబంధించిన హెచ్చరికలు జారీ అయ్యాయి. దూసుకొస్తున్న క్షిపణులను అడ్డుకున్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరుదేశాల మధ్య యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తూ గత నెలలో ఒక ఒప్పందం కుదిరినా ఆ తరువాత దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూండటంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో కార్యకలాపాలు మళ్లీ స్తంభించిపోయాయి. ఇరుపక్షాలూ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు చేసుకుంటూండంతో చమురు ధరలు మళ్లీ పైకి ఎగబాకాయి. సోమవారం బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్ ధర 90 డాలర్ల కంటే ఎక్కువ పలికి ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. బాగా దెబ్బకొట్టాం: ట్రంప్ ఇరాన్పై సోమవారం జరిగిన దాడులు బాగా జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒరాన్ డ్రోన్ దాడిలో శనివారం వీరసైనికుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నామని ఆయన ప్రకటించారు. -
ఖర్గ్ ద్వీపం కోసం ఆలోచిస్తే.. ఇరాన్ భారీ వార్నింగ్
టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ మరోసారి భారీ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ ఖర్గ్ ద్వీపం ఆక్రమించడానికి వాషింగ్టన్ యత్నిస్తే అక్కడికి వచ్చిన సైనికులు ప్రాణాలతో తిరిగి వెళ్లలేరని వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ట్రంప్ ఖర్గ్ ద్వీపంపై వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.పర్షియన్ గల్ఫ్లోని, బుషెహర్ ప్రావిన్స్ తీరానికి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గ్ ద్వీపం, ఇరాన్ యొక్క అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రం ఆ దేశంలోని అత్యంత వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఇంధన ఆస్తులలో ఇది ప్రధానమైనది. ఇరాన్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే మొత్తం ముడి చమురులో దాదాపు 90 శాతం ఈ ఒక్క ద్వీపం నుంచే సరఫరా అవుతుంది.దీంతో దీనిని ఎలాగైనా ఆక్రమించాలని ట్రంప్ తొలినుంచి యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అవసరమైతే ఖర్గ్ ద్వీపాన్ని తమ నియంత్రణలోకి తీసుకునేలా పరిమిత భూతల దాడి చేసే ఆలోచన ఉందని మాట్లాడారు. తాజాగా ఆ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటరిచ్చింది.విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి మాట్లాడుతూ "ఖర్గ్ ద్వీపంపై భూతల దాడి చేయడానికి అమెరికా సైనికులు వస్తే... వారిని 'స్వాగతించడానికి' మా సైన్యం, మా ప్రజలు నిమిషాలు లెక్కిస్తూ, సిద్ధంగా ఎదురుచూస్తున్నారు." అని అన్నారు.మళ్లీ ఉద్రిక్తతప్రస్తుతం పశ్చిమాసియా పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా, యుద్ధ వాతావరణంతో అట్టుడుకుతున్నాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా విఫలమై, మళ్లీ భారీ ఎత్తున దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. -
ఫ్యామిలీకి అదే చివరి కాల్ అనుకున్నా.. ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో శాంతి చర్చలు జరుపుతున్న సమయంలో ఇరాన్ ప్రతినిధులు తీవ్ర ప్రమాద పరిస్థితుల్లో పనిచేశారని ఆయన వెల్లడించారు. మేము ఎప్పుడు చనిపోతామో.. మాపై బాంబులు ఎప్పుడు వేస్తారోననే భయంతో వణికిపోయినట్టు చెప్పుకొచ్చారు.ఇరాన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరాఘ్చి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్య ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్తో జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన.. ‘చర్చలు జరుగుతున్న సమయంలో ఏ క్షణంలోనైనా సమావేశంపై బాంబు దాడి జరగొచ్చనే భయం ఉండేది. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది చివరి సంభాషణ కావచ్చేమో అన్న ఆలోచన వచ్చేది’ అని తెలిపారు.అనంతరం.. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వస్తున్న ఒత్తిళ్లకు ఇరాన్ తలొగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. అణు కార్యక్రమంలో యురేనియం ఎన్రిచ్మెంట్ను పూర్తిగా నిలిపివేయాలన్న డిమాండ్ను అంగీకరించలేదని, తమ హక్కుల విషయంలో వెనక్కి తగ్గబోమని పేర్కొన్నారు. ‘చర్చలు జరపాలి.. బెదిరింపులు లేదా ప్రలోభాలతో మమ్మల్ని మార్చలేరు’ అని అరాఘ్చి వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా తమ లక్ష్యాలను సాధించలేమని భావించిన తర్వాతే అమెరికా యుద్ధ మార్గాన్ని ఎంచుకుందని ఆయన ఆరోపించారు. అమెరికా సైనిక ఒత్తిడితో ఇరాన్ను లొంగదీయవచ్చన్న వాదనలను కూడా అరాఘ్చి ఖండించారు. ‘ఇరాన్ వెనిజులా కాదు. ఒక నాయకుడిని తొలగిస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోదు. ఇరాన్లో అధికార వ్యవస్థ అనేక స్థాయిల్లో పనిచేస్తుంది’ అని ఆయన అన్నారు.ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్పై వరుసగా తొమ్మిదో రోజు వైమానిక దాడులు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు ఉపయోగిస్తున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే తమ లక్ష్యమని అమెరికా తెలిపింది. మరోవైపు ఇరాన్ మీడియా ప్రకారం.. తబ్రిజ్, చాబహార్, కొనారక్, బందర్ మహ్షహర్ తదితర ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు సమాచారం వెలువడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా సిరియాలోని అల్-తన్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా ప్రత్యేక ఆపరేషన్స్ కేంద్రంపై దాడి చేసినట్లు ప్రకటించింది. -
ఇరాన్ భీకర దాడి.. అమెరికా సైనికులు మృతి
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఉషా వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ దంపతుల ఇంట్లో కొత్త ఆనందం వెల్లివిరిసింది. ఉషా వాన్స్ నాలుగో సంతానానికి జన్మనిచ్చారు. పుట్టింది మగ బిడ్డ అని, అతడికి ‘అలెక్ నీల్ వాన్స్’ అని పేరు పెట్టినట్లు జేడీ వాన్స్ స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి? ముఖ్యంగా భారతీయ మూలాలున్న ఉషా వాన్స్ కుటుంబ నేపథ్యంతో ‘నీల్’ పేరుకు ఏమైనా సాంస్కృతిక అనుబంధం ఉందా? అనే ఆసక్తి నెలకొంది.జేడీ వాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభవార్తను పంచుకున్నారు. “ఉషా, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా పిల్లలు తమ చిన్ని తమ్ముడిని కలుసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు” అంటూ ఆయన పేర్కొన్నారు. బిడ్డకు వైద్యం అందించిన వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ వైద్యులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.pic.twitter.com/VMCGCCRd7s— JD Vance (@JDVance) July 19, 2026ఆ పేరుకు అర్థం ఏంటంటే.. వాన్స్ దంపతులు తమ నాలుగో బిడ్డకు పెట్టిన అలెక్ నీల్ వాన్స్(Alec Neel Vance) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలెక్ (Alec) అనేది సాధారణంగా అలెగ్జాండర్ (Alexander) అనే పేరుకు సంక్షిప్త రూపంగా భావిస్తారు. గ్రీకు మూలాలున్న ఈ పేరుకు “రక్షకుడు”, “ప్రజలను కాపాడేవాడు” అనే అర్థాలు ఉన్నాయి.ఇక నీల్ (Neel) అనే పేరు భారతీయులకు సుపరిచితమైనది. సంస్కృతంలోని “నీల” అనే పదం నుంచి వచ్చిన ఈ పేరుకు నీలం రంగు, ఆకాశం, నీలి వర్ణం వంటి అర్థాలు ఉన్నాయి. భారత్లో ఈ పేరును ఎంతోమంది ఉపయోగిస్తారు. అయితే జేడీ వాన్స్, ఉషా వాన్స్లు ఈ పేరును ప్రత్యేకంగా భారతీయ మూలాలతో పెట్టారా? లేదంటే కుటుంబానికి సంబంధించిన మరేదైనా కారణం ఉందా? అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అయినప్పటికీ ఉషా వాన్స్ భారతీయ మూలాలున్న వ్యక్తి కావడంతో.. ‘నీల్’ పేరు సాంస్కృతికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఆరుగురితో వాన్స్ కుటుంబంఅలెక్ రాకతో జేడీ వాన్స్, ఉషా వాన్స్ల కుటుంబం ఆరుగురు సభ్యులుగా మారింది. ఇప్పటికే ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు ఈవాన్ (Ewan) 2017లో జన్మించాడు. రెండో కుమారుడు వివేక్ (Vivek) 2020లో జన్మించగా.. కుమార్తె మిరాబెల్ (Mirabel) 2021లో జన్మించింది. ఇప్పుడు అలెక్ కుటుంబంలో నాలుగో చిన్నారి సభ్యుడిగా చేరాడు.నాలుగో బిడ్డ కోసం ఆసక్తికర కథనాలుగో సంతానం విషయంలో జేడీ వాన్స్ గతంలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే ముందు తన భార్య ఉషాతో ఈ విషయం గురించి మాట్లాడినట్లు తెలిపారు. “నాకు నాలుగో బిడ్డ కావాలని ఉషాతో చెప్పాను. అందుకు ఆమె.. ‘సరే.. కానీ నువ్వు అమెరికా ఉపాధ్యక్షుడవుతావా? లేక నాలుగో బిడ్డను పొందుతావా? రెండూ ఒకేసారి సాధ్యం కాదు’ అని చెప్పింది” అంటూ వాన్స్ సరదాగా వ్యాఖ్యానించారు. చివరకు తనకు ఉపాధ్యక్ష పదవి, నాలుగో బిడ్డ రెండూ లభించాయని ఆయన అన్నారు.ఉషా వాన్స్కు ఆంధ్రా మూలాలుజేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ భారతీయ మూలాలున్న అమెరికన్. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు కుటుంబ నేపథ్యానికి చెందినవారు. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం వారు అమెరికాకు వెళ్లారు. కాలిఫోర్నియాలో పెరిగిన ఉషా.. చిన్ననాటి నుంచే అమెరికా వాతావరణంలో పెరిగినా, కుటుంబం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో అనుబంధాన్ని కొనసాగించారు.అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్ లా స్కూల్ (Yale Law School)లో న్యాయ విద్య అభ్యసిస్తున్న సమయంలో ఉషాకు జేడీ వాన్స్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ 2013లో న్యాయ విద్య పూర్తి చేసి, 2014లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుక కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాలను కలిపి వివాహం చేసుకున్నారు.అత్తగారి కుటుంబంపై ప్రశంసలుజేడీ వాన్స్ గతంలో పలుమార్లు తన భార్య ఉషా కుటుంబం గురించి ప్రస్తావించారు. భారతీయ వలసదారులు అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. తన అత్తమామలు అమెరికా సమాజానికి ఎంతో సేవ చేశారని, కష్టపడి తమ స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. -
తాత వారసత్వం.. అమెరికాలో మెరిసిన మనవడు కార్తీక్!
తల్లిదండ్రులు పుట్టింది భారత దేశంలో.. ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. కాకినాడకు చెందిన తాతయ్య పద్మనాభానికి క్రీడలంటే ఎంతో మక్కువ. జిల్లాలో సీనియర్ క్రీడాకారుడిగా, ఒలింపిక్ సంఘ కార్యదర్శిగా క్రీడారంగానికి ఎనలేని సేవలు అందించారు. తాతయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మనుమడు కృష్ణస్వామి కార్తీక్ పద్మనాభం అమెరికా దేశంలోని శాన్ఫ్రాన్సిస్కో రాష్ట్రంలో క్రీడలపరంగా గుర్తింపు తెచ్చుకుని తండ్రి పురిటి గడ్డ కీర్తిని ప్రవాసాంధ్రుడిగా రెపరెపలాడిస్తున్నారు. అమెరికా నుంచి కాకినాడకు ఇటీవల వచ్చిన కార్తీక్ ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా.. కాకినాడకు చెందిన కె.పద్మనాభం, యమునలకు జన్మించిన సంతానం రామకృష్ణ. సాఫ్ట్వేర్ ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. ఆయనకు పద్మజతో వివాహం జరిగింది. రామకృష్ణ, పద్మజలకు 2005లో కృష్ణస్వామి కార్తీక్ పద్మనాభం జన్మించాడు. చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువ పెంచుకోవడంతో అమెరికాలో తల్లిదండ్రులు స్విమ్మింగ్, బాస్కెట్బాల్లో శిక్షణ ఇప్పించారు. అనతి కాలంలోనే స్విమ్మింగ్, బాస్కెట్బాల్లో ప్రావీణ్యం సంపాదించి శాన్ఫ్రాన్సిస్కో రాష్ట్రానికి కార్తీక్ ప్రాతినిధ్యం వహించి పోటీల్లో పతకాలు కైవసం చేసుకున్నాడు. పదేళ్ల వయసులో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించిన మినీ ఒలింపియాడ్ ర్యాలీలో పాల్గొని అందరి మన్ననలు అందుకున్నాడు. అమెరికాలో స్విమ్మింగ్లో శిక్షణ పొందుతున్న కృష్ణస్వామి కార్తీక్ బాస్కెట్బాల్, స్విమ్మింగ్తో పాటు టెన్నిస్లో కూడా క్రీడా ఓనమాలు కాకినాడలోనే కార్తీక్ నేర్చుకున్నాడు. అమెరికాలో 9 నుంచి 12వ తరగతి వరకు మేరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెయింట్ లూయిస్ కంట్రీ డే స్కూల్లో చదవి అక్కడే బాస్కెట్బాల్ మెరుగైన శిక్షణను కోచ్ ట్రవీస్ వ్యాలీస్ వద్ద తీసుకున్నాడు. తొలిసారి కార్తీక్ సారథ్యంలో ఇంటర్ స్కూల్ స్టేట్ పోటీల్లో చాంపియన్ షిప్ను సాధించారు. తాతయ్య జాతీయస్థాయి బాస్కెట్బాల్ క్రీడాకారుడు కావడం, మనవడు క్రీడా వారసత్వాన్ని అందిపుచ్చుకుని క్రీడల్లో రాణిస్తుండడంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఎంఎస్సీ కర్రి పద్మశ్రీ, రెడ్క్రాస్ చైర్మన్, మాజీ ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు వైడీ రామారావులు ఇటీవల కార్తీక్ను అభినందించారు. నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ) -
ఇరాన్పై అమెరికా ప్రతీకార దాడులు
దుబాయ్: ఇరాన్పై అమెరికా సైన్యం ప్రతీకారంతో రగిలిపోతోంది. జోర్డాన్లో జరిగిన దాడిలో ఇద్దరు అమెరికా జవాన్లు మరణించడంతో యుద్ధం మరింత ఉధృతమవుతోంది. అమెరికా ఆదివారం ఇరాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. వైమానిక దాడులకు దిగింది. క్షిపణులు డ్రోన్లు, ప్రయోగించింది. ఇరాన్ సైతం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జోర్డాన్లో అమెరికా స్థావరాలపై గురిపెట్టింది. రానున్న రోజుల్లో ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారే సూచనలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కోట్ల మంది ఆధారమైన పౌర మౌలిక సదుపాయాలను ఇరుపక్షాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. జోర్డాన్లో శుక్రవారం జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)పై ఆదివారం భీకర దాడుల చేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. మరోవైపు ఇరాన్ వైమానిక దాడుల నుంచి రక్షించుకోవడానికి బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ తమ గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేశాయి. తమ పొరుగు దేశమైన జోర్డాన్ వైపు ప్రయోగించిన క్షిపణుల వల్ల మంటలు భూభాగంలోకి వ్యాపించే అవకాశం ఉందని, అదే జరిగితే ఇరాన్కు తగిన బుద్ధి చెప్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణ స్థలంపై దాడి ఇరాన్ సైనిక తీరప్రాంత నిఘా, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ నిల్వ స్థావరాలపై దాడి చేసినట్లు అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణను దెబ్బతీయడానికి, ఐఆర్జీసీ దళాలను శిక్షించడానికి వ్యూహం రూపొందించినట్లు పేర్కొంది. నైరుతి ప్రాంతంలో నిర్మించతలపెట్టిన అణు విద్యుత్ కేంద్రం నిర్మాణ స్థలాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపినట్లు ఇరాన్ అణు శక్తి సంస్థ పేర్కొంది. -
నెతన్యాహు అరెస్టుకు మమ్దానీ కసరత్తు!
న్యూయార్క్: సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ నగరానికి వస్తే, ఆయన్ని అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ తెలిపారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) యుద్ధ నేరాల ఆరోపణలు మోపిన నెతన్యాహును అరెస్టు చేసే అధికారం తనకు ఉందో లేదో తెలుసుకోవడానికి నగర న్యాయ విభాగంతో చర్చిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ విషయమై ‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమ్దానీ మాట్లాడుతూ ‘నెతన్యాహు ఒక యుద్ధ నేరస్థుడు, ఆయన హేగ్లో ఉండాల్సిన వ్యక్తి. ప్రస్తుతం చట్టం తనకు కల్పించిన అధికారాల పరిధిలోనే చర్యలు తీసుకుంటాం. ఈ అరెస్టు కోసం కొత్త చట్టాలేవీ తీసుకురావడం లేదు’ అని స్పష్టం చేశారు. నెతన్యాహు అరెస్టు కోసం న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ను ఆదేశించే అధికారం తనకున్నదో లేదో స్పష్టత కోసం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.గతంలో కూడా ఇజ్రాయెల్ను ‘అపార్థీడ్ (వర్ణవివక్ష) పాలన’ అని అభివర్ణించిన మమ్దానీ, ఐసీసీ జారీ చేసిన అరెస్టు వారెంట్లను అమలు చేసేలా పోలీసులను ఆదేశిస్తానని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో, యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలకు నెతన్యాహు బాధ్యత వహించాల్సి ఉందని ఐసీసీ గతంలోనే పేర్కొంది. -
ఖమేనీ అంత్యక్రియల్లో హైడ్రామా.. ఇరాన్ విదేశాంగ మంత్రిపై రాళ్ల వర్షం!
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత దేశ రాజకీయాల్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఆయనకు ఘన నివాళులు అర్పించాల్సిన అంత్యక్రియలే అధికార పోరుకు వేదికగా మారాయి. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీపై అమెరికాతో రాజీని వ్యతిరేకించే అతివాదులు బహిరంగంగా విమర్శలు గుప్పించడం, అమెరికాతో రాజీకి వెళ్లారని దేశద్రోహులుగా ముద్ర వేయడంతో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఖమేనీ అంతిమయాత్రలో పాల్గొన్న అధ్యక్షుడు పెజెష్కియన్ను లక్ష్యంగా చేసుకుని అతివాదులు కొందరు ట్రంప్తో రాజీపడ్డవారికి మరణం అంటూ నినాదాలు చేశారు. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన విదేశాంగ మంత్రి అరాఘ్చీపై కొందరు రాళ్లు విసిరారు. దేశాన్ని అమ్ముకున్న వ్యక్తి అంటూ దూషించారు.కొత్త సుప్రీం లీడర్ ఎక్కడ? ఖమేనీ వారసుడిగా బాధ్యతలు స్వీకరించిన మొజ్తబా ఖమేనీ ఇప్పటికీ ప్రజల్లో కనిపించకపోవడం ఊహాగానాలకు తావిచ్చింది. ఆయన నిజంగా పాలనను నడిపిస్తున్నారా? లేక ఆయన పేరుతో ఇతర నేతలే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడు పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాఘ్చీలు మోజ్తాబా ఖమేనీ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.మొజ్తబాపై తిరుగుబాటుఅమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఇరాన్ నిపుణుడు అరాష్ అజీజీ వ్యాఖ్యానిస్తూ.. మొజ్తబా ఖమేనీ ప్రజల్లో కనిపించకపోవడంతో ఘాలిబాఫ్, ఆయన మిత్రులే పాలనను నడిపిస్తున్నారనే అభిప్రాయం బలపడింది. దీంతో అతివాదులు మొజ్తబాపై తిరుగుబాటు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అని అన్నారు. అతివాది ఎంపీ మహ్మూద్ నబవియన్ కూడా సోషల్ మీడియాలో ఇరాన్ ప్రభుత్వం తిరుగుబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయా?" అంటూ ప్రశ్నిస్తూ, తర్వాత ఖమేనీ రక్తానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. తిరుగుబాటు దారుల్ని అడ్డుకుంటాం అని ప్రకటించారు.అధ్యక్షుడికి బహిరంగ బెదిరింపులు రాజకీయ విమర్శలు వ్యక్తిగత బెదిరింపుల దాకా వెళ్లాయి. ఐఆర్జీసీతో అనుబంధం ఉన్న మతగాయకుడు మొహమ్మద్ అలీ బఖ్షీ.. సుప్రీం లీడర్ ఆదేశాలు అమలు చేయకపోతే కత్తి మీ గొంతుకే చేరుతుంది. మీకు నరకం చూపిస్తాం’ అంటూ అధ్యక్షుడు పెజెష్కియన్ను హెచ్చరించారు. అయినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఎక్కువకాలం నిలవలేదు. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకలపై దాడులు ప్రారంభించడంతో అమెరికా ప్రతిదాడులకు దిగింది. దీంతో అతివాదులు అమెరికాతో కుదిరిన ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలని, అమెరికా-ఇజ్రాయెల్లపై మరింత దూకుడుగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.మాజీ విదేశాంగ మంత్రి మనూచెహర్ మొట్టాకీ కూడా ప్రాంతంలోని ఏదైనా అమెరికా సైనిక స్థావరంపై దాడి చేసి వందమంది అమెరికా సైనికులను బందీలుగా తీసుకురావాలి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవలి పరిణామాల్లో అతివాదుల ప్రభావాన్ని తగ్గించే చర్యలు కనిపిస్తున్నాయి. ఐఆర్జీసీ మద్దతురాలు ఎంపీ మహ్మూద్ నబవియన్ను పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ నుంచి తొలగించారు. అమెరికా ఒప్పందాన్ని వ్యతిరేకించిన మరో సభ్యుడినీ తప్పించారు.జర్మనీకి చెందిన భద్రతా విశ్లేషకుడు హమీద్రెజా అజీజీ అభిప్రాయం ప్రకారం.. ఘాలిబాఫ్ హార్డ్లైన్ వర్గాలను పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడుతున్నాయి. దేశంలో అస్థిరత పెరుగుతున్న వేళ ఈ వర్గాలు ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి అని పేర్కొన్నారు.ఒకే లక్ష్యం.. కానీ విభేదాలు అంతర్గతంగా తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ ఇరాన్ నాయకత్వం మొత్తం ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అమెరికా ఆంక్షల నుంచి ఉపశమనం పొందడం, హర్మూజ్ జలసంధిపై తన ఆధిపత్యాన్ని కొనసాగించడం, దేశంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అయితే వాటిని సాధించడానికి అమెరికాతో రాజీ పడాలా? లేక సైనికంగా ప్రతిస్పందించాలా? అన్న విషయంలోనే అధికార వర్గాల్లో తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. 🔻حمله مخالفان توافق به عراقچی با شعار:«مرگ بر وطنفروش خائن» «بیشرف، بیشرف»🔻شعار «مرگ بر سازشگر» در حضور پزشکیان در مراسم تشییع جنازه خامنهای.🔻 Opponents of the agreement attack Araqchi with the slogans: "Death to the traitorous sellout!" and "Dishonorable!… pic.twitter.com/ThBhZLP1tf— Siamak Tadayon Tahmasbi (@SiamakTadayonT) July 6, 2026 -
ఇరాన్పై అమెరికా ఉక్కుపాదం.. దాడికి దాడే సమాధానం..
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో జరిపిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఆదివారం తెల్లవారుజామున ఇరాన్పై అమెరికా తాజాగా మరోసారి భీకర వైమానిక దాడులు నిర్వహించింది.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, జోర్డాన్ దాడిలో మరో అమెరికా సైనికుడు ఇంకా గల్లంతయ్యాడు. నలుగురు గాయపడగా చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చే వరకు వారి పేర్లను వెల్లడించబోమని సెంట్కామ్ తెలిపింది. అలాగే, హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, జోర్డాన్ దాడికి బాధ్యులైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బలగాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా వెల్లడించింది.🚨 Cluster missiles from Iran are raining down on U.S. military bases in Bahrain and Jordan.In one of the fiercest attacks on the Epstein Club since the war began... pic.twitter.com/c5RYWJ7gp3— IRGC (@IRGC_NEWS) July 18, 2026ఈ సందర్భంగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. ఇద్దరు అమెరికా సైనికుల మరణం తమ సంకల్పాన్ని మరింత బలపరిచిందని, దీనికి తగిన ప్రతిస్పందన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఇరాన్కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, దక్షిణ ఇరాన్లోని సిరిక్ పోర్టు నగరంతో పాటు హాజీబాద్ సమీప ప్రాంతాలపై అమెరికా దాడులు జరిపింది. అయితే ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.మరోవైపు, ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ అమెరికాకు "మరచిపోలేని గుణపాఠం నేర్పుతాం" అంటూ హెచ్చరించారు. అమెరికా ఒప్పందాలను పదేపదే ఉల్లంఘిస్తోందని, అధ్యక్షుడు ట్రంప్ హామీలకు విశ్వసనీయత లేదని ఆయన విమర్శించారు. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తోందని ఇరాన్ ఆరోపిస్తుండగా.. వాణిజ్య నౌకలను ఇరాన్ బెదిరిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.After death of 2 American soldiers in Jordan due to Iranian missile strikes, US forces launched a massive strikes campaign against IRGC targets across Iran. Currently over 30 US fighter jets are hitting the IRGC targets across Iran. pic.twitter.com/fjNH7MxQh2— Baba Banaras™ (@RealBababanaras) July 19, 2026ఇక గల్ఫ్ దేశాలు పరిస్థితిని అత్యంత నిశితంగా గమనిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అన్ని పక్షాలు వెంటనే కాల్పులు నిలిపి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చింది.🚨 U.S. President Donald Trump has reportedly ordered CENTCOM to “open the gates of hell” on Iran following the deaths of American service members in Jordan.U.S. officials say tonight’s strikes are expected to be significantly larger than previous rounds.Meanwhile, U.S.… pic.twitter.com/G5jhqPtgcQ— The Iran Watcher 🇮🇷 (@TheIranWatcher) July 18, 2026 -
కొనసాగిన దాడుల పర్వం
దుబాయ్: ఇరాన్తో తాత్కాలిక శాంతి ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజు నుంచి వరుసగా ఏడోరోజూ ఇరాన్పై అమెరికా సేనలు రాత్రిపూట దాడులను శనివారమూ కొనసాగించాయి. దీంతో ఇరాన్వ్యాప్తంగా అమెరికా దాడుల్లో గత ఏడు రోజుల్లో చనిపోయిన ఇరానియన్ల సంఖ్య 50కి పెరిగిందని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం ప్రకటించింది. జూన్ 27 తర్వాత అమెరికా మొదలెట్టిన భీకర దాడుల్లో ఇప్పటిదాకా 500 మందికిపైగా గాయపడ్డారు. శనివారం సైతం ఇరాన్లోని మౌలిక వసతులు, సైనిక లక్ష్యాలపై అమెరికా పదులకొద్దీ ఆత్మాహుతి డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడి భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించింది. నిఘా ప్రాంతాలు, సాయుధ ఉపకరణాలు, రహదారులు, వంతెనలు, భూగర్భ ఆయుధాగారాలు, నావికాదళ సామర్థ్యాలను నాశనంచేశామని శనివారం ఉదయం అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా దాడిలో దక్షిణ ఇరాన్లోని డీసాలినేషన్ ప్లాంట్ ధ్వంసమైంది.దీంతో ఈ ప్లాంట్ నుంచి 20 గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జనం అల్లాడిపోయారని హార్మూజన్ ప్రావిన్స్ డెప్యూటీ గవర్నర్ ఇస్లాయిల్ దెహస్తానీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిదాడులు ఆరంభించిన ఇరాన్.. దాడులకు ఇరాన్ దీటుగా బదులిచ్చింది. అమెరికా పేట్రేగిపోతున్నా మౌనం దాల్చిన దాని మిత్రదేశాలపై ఇరాన్ క్షిపణులకు పనిజెప్పింది. దీంతో కువైట్లోని నీటి శుద్ధీకరణ(డీసాలిలేషన్)ప్లాంట్, విద్యుత్ఉత్పత్తి కేంద్రాలు పేలుళ్లతో మార్మోగిపోయాయి. చమురుశుద్ధి కర్మాగారంపై దాడిలో పలువురు కువైట్ సిబ్బంది గాయాలపాలయ్యారు. దాడులతో పల విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాల్లో ఉత్పత్తిని వెంటనే నిలిపేశారు. కువైట్లోని డీసాలినేషన్ ప్లాంట్లపై ఇరాన్ దాడిచేయడం వరుసగా ఇది రెండోరోజు. కువైట్ తన తాగునీటి అవసరాల కోసం 90 శాతం డీసాలినేషన్ ప్లాంట్ల మీదనే ఆధారపడుతోంది. ఇరాన్ దాడుల కారణంగా మంటల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు అగ్నిమాపక సిబ్బంది,కారి్మకులు గాయపడ్డారని కువైట్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. క్షిపణులు పడుతుండటంతో ముందు జాగ్రత్తగా విమానాశ్రయాల నుంచి రాకపోకలను కువైట్ నిలిపేసింది. ఇరాక్లోని ఇర్బిల్ నగరంపైనా ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్ మిస్సైళ్లను విజయవంతంగా అడ్డుకున్నామని జోర్డాన్ ప్రకటించింది. బహ్రెయిన్లో ముందుజాగ్రత్తగా సైరన్లు మోగించి ప్రజలను ప్రభుత్వం అప్రమత్తంచేసింది. సౌదీ అరేబియా సైతం రెండు ప్రాంతాల్లో హెచ్చరికలగా సైరన్లు మోగించి తర్వాత నిలిపేసింది. అమెరికా సేనలకు ఆశ్రయం కల్పించే ప్రతి పశ్చిమాసియా దేశంపై దాడులు కొనసాగుతాయని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్(ఐఆర్జీసీ) శనివారం పునరుద్ఘాటించింది.మర్చిపోలేని గుణపాఠం చెప్తాం: మొజ్తబా అమెరికాకు ఖమేనీ హెచ్చరిక దుబాయ్: తమ దేశంపై ఇంకా దాడులు కొనసాగిస్తే మర్చిపోలేని గుణపాఠం చెప్తామని అమెరికాను ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ఘాటుగా హెచ్చరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దీన్ని ప్రభుత్వ టీవీ ఛానల్లో చదివి వినిపించారు. తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత నూతన సుప్రీంలీడర్గా నియమితుడైన మొజ్తబా ఖమేనీ ఇప్పటిదాకా బహిరంగంగా ప్రజలకు కనిపించలేదు. మధ్యంతర ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంతకం విలువలేనిది, చెల్లనిది అని మొజ్తబా తేల్చిచెప్పారు. జోర్డాన్పై దాడిలో ఇద్దరు అమెరికా సైనికుల మృతి దుబాయ్: జోర్డాన్లోని తమ స్థావరాలపై ఇరాన్ శనివారం జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయారని, ఒకరి జాడ గల్లంతైందని అమెరికా సైన్యం ప్రకటించింది. గత కొంతకాలంగా జరుగుతున్న ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికులు చనిపోవడం ఇదే తొలిసారి. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను నిలువరించేందుకు అమెరికా, జోర్డాన్ సైనిక సిబ్బంది ప్రయత్నిస్తుండగా తమ సైనికులు ప్రాణాలు కోల్పోయారని అమెరికా శనివారం పేర్కొంది. ఇరాన్ దాడుల్లో నలుగురు సైనికులు సైతం గాయపడ్డారు. వాళ్లకు సమీప ఆస్పత్రుల్లో ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్చేశారు. చనిపోయిన ఇద్దరు అమెరికా సైనికుల పూర్తి వివరాలను సైన్యం ఇంకా బయటపెట్టలేదు. -
టిక్టాక్కు గ్రీన్ సిగ్నెల్.. మళ్లీ రీఎంట్రీ!
భద్రతా పరమైన కారణాల వల్ల ఒకప్పుడు నిషేధానికి గురైన టిక్టాక్ యాప్ను ఫెడరల్ ఉద్యోగులు డౌన్లోడ్ చేసుకోవచ్చని అమెరికా న్యాయ శాఖ తెలిపింది. అయితే ఈ అనుమతి ఆయా ప్రభుత్వ సంస్థల నిబంధనలకు లోబడి ఉంటుంది.టిక్టాక్ అనేది చైనాకు చెందిన యాప్ కావడంతో అమెరికా ప్రభుత్వం చాలా కాలంగా వినియోగదారుల డేటా భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కారణంగానే 2022లో ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించే ఫోన్లు.. కంప్యూటర్లలో టిక్టాక్ వాడకాన్ని పూర్తిగా నీచేధించడం జరిగింది. అయితే.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. టిక్టాక్ అమెరికా కార్యకలాపాలు, వినియోగదారుల డేటా భద్రత విషయంలో కొత్త ఒప్పందం కుదిరింది.బైట్డాన్స్ అమెరికా వినియోగదారుల డేటా, యాప్ నిర్వహణపై నియంత్రణను టిక్టాక్ యూఎస్డీఎస్ అనే జాయింట్ వెంచర్కు అప్పగించింది. దీంతో అమెరికా న్యాయశాఖ ప్రస్తుతం ఉన్న టిక్టాక్ వెర్షన్ వల్ల పెద్దగా భద్రతా ప్రమాదం లేదని అభిప్రాయపడింది. కాబట్టి డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతిచ్చింది.అమెరికాలో టిక్టాక్కు భారీ స్థాయిలో ఆదరణ ఉంది. దాదాపు 20 కోట్ల మంది అమెరికన్లు ఈ యాప్ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అందుకే టిక్టాక్పై తీసుకునే ప్రతి నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. మొత్తం మీద టిక్టాక్ మళ్లీ వచ్చేసిందన్నమాట.ఇదీ చదవండి: లెక్కల్లో 51 మార్కులే.. కట్ చేస్తే రూ.వేల కోట్ల కంపెనీ!: ఎవరీ పవన్ కుమార్ చందన? -
ఇరాన్ దెబ్బకు ఆరు దేశాలు అలర్ట్!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు వరుసగా ఏడో రాత్రికి చేరుకోగా హర్మూజ్ జలసంధి చుట్టూ సైనిక కదలికలు, నౌకా రవాణా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. దక్షిణ ఇరాన్లోని హర్మూజ్గాన్ ప్రావిన్స్పై అమెరికా దాడుల్లో ముగ్గురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మాత్రం ఈ దాడుల లక్ష్యం ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమేనని పేర్కొంది.ఆధిపత్య పోరు..ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు ఘర్షణకు కేంద్రంగా మారింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) రెండు చమురు ట్యాంకర్లు మైన్ల కారణంగా పేలిపోయాయని, కొన్ని నౌకల రాకపోకలను అడ్డుకున్నామని ప్రకటించింది. అయితే అమెరికా ఈ వాదనలను ఖండించింది. అమెరికా, ఇరాన్ రెండూ ఈ వ్యూహాత్మక జలమార్గంపై తమ ప్రభావాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని నౌకలు మాత్రం పరిమిత స్థాయిలో రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం.ఇరాన్ హెచ్చరిక..అమెరికా దాడులు ఇలాగే కొనసాగితే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ సైనిక అధికారులు హెచ్చరించారు. తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సీనియర్ సైనిక సలహాదారు మేజర్ జనరల్ మొహ్సెన్ రెజాయి హెచ్చరించారు. ఇరాన్ ఇక సమాన స్థాయి ప్రతీకార చర్యలకే పరిమితం కాదు.. ఎలాంటి రాజకీయ సరిహద్దు కూడా సురక్షితంగా ఉండదు అని ఆయన హెచ్చరించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఇప్పటివరకు ఇరాన్ ప్రధానంగా అమెరికా స్థావరాలు, మిత్రదేశాలపై ప్రతీకార చర్యలకు దిగుతామని ప్రకటించగా, తాజా హెచ్చరికతో దాడుల పరిధి విస్తరించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ తన దాడులను కేవలం అమెరికా సైనిక లక్ష్యాలకే పరిమితం చేయకపోవచ్చని సంకేతాలు ఇస్తోంది.గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలు, సైనిక స్థావరాలు మరింత అప్రమత్తంగా మారే అవకాశం ఉంది.గల్ఫ్ దేశాలకు టెన్షన్.. ఇరు దేశాల మధ్య యుద్ధ ఘర్షణ ఇప్పుడు సరిహద్దులను దాటి గల్ఫ్ ప్రాంతానికి విస్తరిస్తోంది. తాజాగా కువైట్లో కీలక మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్ ప్రాంతాల్లోనూ క్షిపణులు, డ్రోన్ దాడుల ఆరోపణలు వచ్చాయి. కొన్ని దాడులు అమెరికా మిత్రదేశాలపై జరిగాయని ఇరాన్ ప్రకటించగా, వాటిలో కొన్ని వాదనలను ఆయా దేశాలు ఖండించాయి. దీంతో, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ దేశాలు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తున్నాయి.కువైట్పై ప్రభావంఇరాన్ దాడుల్లో కువైట్లోని కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలపై ప్రభావం పడటంతో ప్రజలను ఇంధనం, విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.ఖతార్లో అప్రమత్తతగల్ఫ్లో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరాల్లో ఒకటైన అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ఉన్న ఖతార్పై కూడా ఉద్రిక్తతల ప్రభావం కనిపిస్తోంది. ఇరాన్ క్షిపణి దాడుల ప్రయత్నాలను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ఖతార్ తెలిపింది.బహ్రెయిన్కు ప్రత్యేక సవాల్బహ్రెయిన్లో అమెరికా నౌకాదళానికి చెందిన కీలక స్థావరం ఉంది. దీంతో ఈ చిన్న దేశం వ్యూహాత్మకంగా అత్యంత సున్నిత ప్రాంతంగా మారింది. గల్ఫ్ భద్రతపై ఆందోళనలు పెరిగాయి.సౌదీ అరేబియా, యూఏఈ పరిస్థితిగల్ఫ్లో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులైన సౌదీ అరేబియా, యూఏఈలు తమ చమురు మౌలిక సదుపాయాల రక్షణపై దృష్టి పెట్టాయి. గతంలో చమురు కేంద్రాలపై జరిగిన దాడుల అనుభవంతో, ఇప్పుడు డ్రోన్లు, క్షిపణుల ముప్పును ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉన్నాయి.ఒమన్కు పెరుగుతున్న ప్రాధాన్యంహర్మూజ్ జలసంధికి సమీపంలో ఉన్న ఒమన్ ఈ సంక్షోభంలో కీలక పాత్రలో ఉంది. నౌకా రవాణా భద్రత, సముద్ర మార్గాల రక్షణపై దృష్టి పెట్టింది. -
ఇరాక్ సంచలన వ్యూహం.. ఇరాన్కు సూపర్ స్ట్రోక్!
బాగ్దాద్/వాషింగ్టన్: ప్రపంచ చమురు రాజకీయాల్లో భారీ మార్పులకు తెరలేచింది. ఎన్నో ఏళ్లుగా చమురు ఎగుమతులకు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయం వెతికే పనిని ఇరాక్ ప్రారంభించింది. ఈ దిశగా అమెరికాకు చెందిన దిగ్గజ చమురు సంస్థలు చెవ్రాన్, బీపీ, కొనోకోఫిలిప్స్తో కలిసి 60 బిలియన్ డాలర్లకు పైగా విలువైన మెగా ఎనర్జీ ఒప్పందాలు కుదుర్చుకుంది.ఈ ఒప్పందాల్లో భాగంగా చెవ్రాన్ ఇరాక్లోని భారీ చమురు క్షేత్రాలను అభివృద్ధి చేయడంతో పాటు, సిరియా లేదా టర్కీ మీదుగా మధ్యధరా సముద్రానికి చేరే కొత్త పైప్లైన్ మార్గాలపై అధ్యయనం చేయనుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే హర్మూజ్ జలసంధిపై ఇరాక్ ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గనుంది. అదే సమయంలో బీపీ ఉత్తర ఇరాక్లోని కిర్కుక్ చమురు క్షేత్రాల పునరాభివృద్ధి చేపడుతుండగా, కొనోకోఫిలిప్స్ 42 శాతం వాటాతో ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కానుంది. దీంతో ఇరాక్ చమురు ఉత్పత్తి, ఎగుమతి సామర్థ్యం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఎందుకింత కీలకం? ప్రపంచంలో సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురులో గణనీయమైన భాగం హర్మూజ్ జలసంధి మీదుగానే ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఎగసిపడుతుంటాయి. ఇప్పుడు ఇరాక్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టడంతో ప్రపంచ ఇంధన రంగంలో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రకటించినవి ప్రాథమిక ఒప్పందాలే. సాంకేతిక అధ్యయనాలు, ప్రభుత్వ అనుమతులు, పెట్టుబడుల తుది ఆమోదం అనంతరమే ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి. అయినప్పటికీ ఈ నిర్ణయం మధ్యప్రాచ్య ఇంధన రాజకీయాల్లో కీలక మలుపుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇరాక్ వ్యూహం ఏమిటి?ఇరాక్ లక్ష్యం కేవలం చమురు ఉత్పత్తి పెంచడం మాత్రమే కాదు. ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, రవాణా వ్యయాలను తగ్గించడం, భౌగోళిక-రాజకీయ ప్రమాదాలను తగ్గించడం కూడా ఈ ప్రణాళికలో భాగమే. భవిష్యత్తులో హర్మూజ్ జలసంధిలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా చమురు ఎగుమతులు ఆగిపోకుండా చూసే దిశగా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడనున్నాయి.భారత్కు ఎలాంటి ప్రయోజనం?భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటి. ఇరాక్ నుంచి కూడా భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇరాక్కు ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గాలు సిద్ధమైతే సరఫరాలో అంతరాయాలు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరల అస్థిరత కొంత మేర తగ్గి, భారత్ వంటి దిగుమతి దేశాలకు దీర్ఘకాలంలో ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
విదేశీ ట్రక్కు డ్రైవర్లకు ఉద్వాసన: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో వలసదారులైన డ్రైవర్లలో గుబులు మొదలైంది. వారి స్థానంలో అమెరికన్ మాజీ సైనికులను నియమించాలన్న ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తీసుకొచ్చారు. వలసవచ్చి డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిలో చాలామంది మత్తుమందులు, మద్యం ప్రభావంతో అనేక ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆయన ఆరోపించారు. వారివల్ల ప్రజల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ డ్రైవర్లను తొలిగించాలని స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్ ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికాలోని భారతీయ వలసదారులకు నష్టం తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో వేలాది మంది ఇటీవలి కాలంలో రవాణా రంగంలో ప్రవేశించారు. అమెరికాలో దాదాపు లక్షన్నర మంది భారతీయులు డ్రైవర్లుగా పని చేస్తున్నట్లు అంచనా. వీరిలో ఎక్కువ మంది పంజాబ్, హరియాణాకు చెందినవారే ఉన్నారు. తాజాగా పెన్సిల్వేనియాలో జరిగిన సైనిక పెట్టుబడుల సదస్సులో ట్రంప్ మాట్లాడారు. వలసదారులైన ట్రక్కు డ్రైవర్లపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. వీరిలో చాలామంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినవారే కాకుండా, భారీ ట్రక్కులను నడపడానికి సరైన పత్రాలు, లైసెన్సులు వారివద్ద లేవని తెలిపారు. అలాంటి డ్రైవర్లు అమెరికాలో ఉండడంతమకు ఇష్టం లేదన్నారు. నిబంధనలు తెలియనివారిని, మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిని ఎలా భరించాలని ప్రశ్నించారు. విదేశీ డ్రైవర్ల స్థానంలో అమెరికా మాజీ సైనికులను నియమించాలని భావిస్తున్నట్లు స్పష్టంచేశారు. -
ఇరాన్పై నిప్పుల వర్షం
దుబాయ్: పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య దాడులు నానాటికీ తీవ్రతరం అవుతున్నాయి. తాత్కాలిక శాంతి ఒప్పందం అకస్మాత్తుగా ముగిసిన తర్వాత రెండు దేశాలు పరస్పరం కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ప్రధానంగా హార్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతున్నాయి. హార్మూజ్పై టెహ్రాన్ పట్టును సడలించేలా ఒత్తిడి పెంచడానికి బలప్రయోగం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా గురువారం అర్ధరాత్రి తర్వాత అమెరికా తన వైమానిక దాడుల పరంపరను మరింత ఉధృతంచేసింది. ఇరాన్లో కీలక వంతెనలు, విద్యుత్ వ్యవస్థలపై దాడి చేయడంతోపాటు గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చాబహార్ ఓడరేవు వద్ద ముఖ్యమైన నిఘా టవర్ను కూల్చివేసింది. ఇరాన్ సైతం వెంటనే ప్రతిదాడికి దిగింది. ఖతార్, కువైట్, జోర్డాన్పై క్షిపణులు ప్రయోగించింది. బహ్రెయిన్, ఒమన్, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కువైట్లో విద్యుత్, నీటి శుద్ధి ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉత్పాదన యూనిట్లకు నష్టం వాటిల్లిందని కువైట్ ఆందోళన వ్యక్తంచేసింది. గల్ఫ్లో అమెరికా యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) ప్రకటించింది. జోర్డాన్లో మోహరించిన అమెరికా యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్ దాడులు జరిపినట్లు స్పష్టంచేసింది. ఈ దాడుల్లో పలు అమెరికన్ యుద్ధ విమానాలు, గగనతల ఇంధన సరఫరా విమానాలు ధ్వంసం కాగా, మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. అయితే, తమ భూభాగం మీదుగా వచ్చిన మూడు క్షిపణులను అడ్డుకొని, కూల్చివేసినట్లు జోర్డాన్ సైన్యం తేల్చిచెప్పింది. విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలి ఇరాన్లోని దక్షిణ హార్మూజ్గాన్ ప్రావిన్స్లో వంతెనలపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో కనీసం ఏడుగురు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ తీర నగరమైన బందర్ ఖమీర్పైనా దాడులు జరిగాయి. ప్రధాన రహదారులు, రైల్వే వంతెనలను కూడా విడిచిపెట్టలేదు. ప్రధాన రేవు పట్టణమైన బందర్ అబ్బాస్, రాజధాని టెహ్రాన్ మధ్య అనుసంధానం లేకుండా చేయడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. తమ దేశంలో విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్లు ఇరాన్ అంగీకరించింది. దక్షిణ ప్రావిన్స్లలో ప్రజలు విద్యుత్ను చాలా పొదుపుగా వాడుకోవాలని ఇరాన్ ఇంధన మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. టార్గెట్ చాబహార్ పోర్టు! ఇరాన్లో పదుల సంఖ్యలో లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు అమెరికా సైనిక దళాల సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. వరుసగా ఆరో రోజు ఇరాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు వెల్లడించింది. అమెరికా వైమానిక దాడిలో చాబహార్ ఓడరేవు వద్ద ఒక టవర్ కూలిపోయినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలియజేసింది. ఓడరేవులోకి వచ్చే నౌకలను ఈ టవర్ నుంచే పర్యవేక్షిస్తారు. నిఘా టవర్ కూలిపోతున్న ఫొటోను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత ప్రభుత్వ సహకారంతో ఇరాన్ నిర్వహిస్తున్న చాబహార్ ఓడరేవు అమెరికా దాడులకు పదేపదే లక్ష్యంగా మారుతోంది. ఇక్కడ దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సైతం ధ్రువీకరించింది. శుక్రవారం ఉదయం 6 గంటల కల్లా అమెరికా దాడుల కారణంగా ఇరాన్లో కనీసం 38 మంది మరణించారని, 400 మందికి పైగా గాయపడ్డారని ఆరోగ్య శాఖ ప్రతినిధి హొస్సేన్ కెర్మన్పూర్ వెల్లడించింది. కుర్దిష్ రెబెల్ గ్రూప్పై ఇరాన్ దాడులు ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలంటూ ఖతార్ ప్రభుత్వం తమ పౌరులను రెండుసార్లు హెచ్చరించింది. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడానికి గగనతల రక్షణ వ్యవస్థలను సన్నద్ధం చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు ఖతార్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్ ప్రయోగించిన మూడు క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు జోర్డాన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు ఉత్తర ఇరాన్లోని కుర్దిష్ రెబెల్ గ్రూప్ ‘కొమాలా’పై దాడులు జరిగాయి. ఈ ఘటనలో కనీసం తొమ్మిది మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఇరాన్ సైన్యమే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక ట్యాంకర్ దాడికి గురైందని బ్రిటిష్ సైన్యం తెలిపింది.


