breaking news
Orissa
-
● గుప్తేశ్వర్లో భక్తుల కోలాహలం
జయపురం: దక్షిణ ఒడిశాలో ప్రసిద్ధ శివ క్షేత్రం జయపుర సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి గుప్తేశ్వర్ మహాశివరాత్రి దినాన శివ నామంతో ప్రతిధ్వనించింది. ఒడిశా రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా చత్తీస్గఢ్, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మొదలగు రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు గత మూడు దినాలుగా గుప్తేశ్వర్కు చేరుకున్నారు. ఆదివారం గుప్తేశ్వర్ మహా శివ లింగాన్ని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులకు దర్శనమిచ్చేందుకు శివలింగాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. కొరాపుట్ జిల్లా బ్రాహ్హణ సమాజ్ ప్రపంచ శాంతి కొరకు విశ్వశాంతి హోమం నిర్వహించారు. జయపురం దేవాలయ ధర్మాదాయ అధికారి తహసీల్దార్ సవ్యసాచి జెన, జయపురం సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్, కుంధ్ర పోలీసు అధికారి అశ్విణీ పట్నాయిక్ గుప్తేశ్వర్ మహాశివరాత్రి వేడుకలను పర్యవేక్షిస్తున్నారు. -
ఓం నమః శివాయ
భువనేశ్వర్: మహా శివ రాత్రి పర్వదినం పురస్కరించుకుని ఏకామ్ర క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోయింది. లింగరాజ స్వామి ఆలయం దీపాల దివ్య వెలుగుల్లో దేదీప్యమానమై సుగంధ పుష్పాల పరిమళాలతో పరవశించింది. భక్తుల ‘ఓం నమః శివాయ’ ఘోషతో మార్మోగి, భక్తి తరంగాలు ఆలయ ప్రాంగణమంతా విరిసాయి. ఘనంగా శివపార్వతుల కల్యాణం జయపురం: మహాశివరాత్రి సందర్భంగా జయపురం పట్టణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివపార్వతుల కల్యాణం ఘనంగా జరిగింది. మంగళ వాయిద్యాలతో శివుడు, పార్వతీ దేవిని తీసుకురావటం, ముహూర్తపు రాటలు వేయటం, శతమానాలను ముత్తైదువులు వెళ్లి తీసుకు రావటం సంప్రదాయకంగా నిర్వహించారు. మార్మోగిన మహేంద్ర గిరులు పర్లాకిమిడి: మహాశివరాత్రి పురస్కరించుకుని రాయగడ బ్లాక్ మహేంద్రగిరిలో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి మహేశ్వరుని దర్శించుకున్నారు. మహేంద్రగిరిలో కుంతీ మందిరం వద్ద షామియానాలు ఏర్పాటుచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పోలీసులు దర్శనాలు కల్పించారు. అలాగే పర్లాకిమిడిలో మెడికల్ వద్ద అర్ధనారీశ్వర మందిరం, డోలా ట్యాంకు వద్ద రామలింగేశ్వర మందిరం, రాజవీధిలో పోడుగుకోవెల, సీతాసాగరం వద్ద మల్లికార్జున స్వామి, మడ్డువా మాధవ మందిరాల్లో భక్తులు విరివిగా దర్శించి దీపాలు వెలిగించి శివరాత్రి జాగారాలు చేశారు. -
గుప్తేశ్వర్లో విదేశీ పర్యాటకులు
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలో శబరినది ఒడ్డున పర్వత గుహలో వెలసి ఉన్న, గుప్తేశ్వరుని దర్శించేందుకు మహాశివరాత్రి నాడు మొదటి సారి విదేశీ పర్యాటకులు వచ్చారు. వారిని చూసి స్థానిక గిరిజనులు అబ్బుర పడ్డారు. కొరాపుట్ జిల్లాను మావో ముక్తి ప్రాంతంగా ప్రకటించటంతో నేడు శివరాత్రికి విదేశీయులు గుప్తేశ్వర్ వచ్చారని పరిశీలకులు తెలిపారు. ఇద్దరు నకిలీ మావోయిస్టులు అరెస్టు రాయగడ: ఇద్దరు నకిలీ మావోయిస్టులను పోలీసులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో వెబ్ చానల్ రిపోర్టర్ అనుబ్రత బర ఉండగా మరొకరు బాలి మాఝిగా పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం జిల్లా పోలీసుల సమక్షంలో 15 మంది మావోయిస్టులు లోంగిపొయిన సంగతి తెలిసిందే. అయితే వారు లొంగిపోయిన తరువాత జిల్లాలోని శెశిఖాల్ పోలీస్ స్టేషన్ పరిధి దుమ్మాగుడ, చందిలి పోలీస్స్టేషన్ పరిధిలోని పాయికోపొడ, కళ్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంభారుగుడ ప్రాంతాల్లో ఒకే రోజు మూడు మావో బ్యానర్లు కలకలం సృష్టించాయి. నకిలీ మావోలు ఆ బ్యానర్లను ఏర్పాటు చేసినట్టు భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఇది నిజమని తేలడంతో వారిని అరెస్టు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ, ఎస్పీ ఇన్చార్జి అమూల్య కుమార్ ధల్ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సోమవారం ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించే విలేకర్ల సమావేశంలో వెల్లడిస్తారని తెలిపారు. రచయిత నాగరాజుకు సాహితీ శిరోమణి బిరుదు ప్రదానం రాయగడ: ప్రముఖ కవి, రచయిత, సీనియర్ పాత్రికేయుడు భళ్లమూడి నాగరాజుకు సాహితీ శిరోమణి బిరుదు వరించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న బాపూజీ కళా మందిరంలో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో సిక్కోలు సాహితీ సంబరాలు, జాతీయ స్థాయి శతాధిక కవి సమ్మేళనం ఆదివారం జరిగింది. ఇందులో పాల్గొన్న నాగరాజు స్వియ కవిత వినిపించారు. ఆయన రచించిన 138 కవితలు, 40 కథలు వివిధ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మంచి కవిగా గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమంలొ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు కత్తిమండ ప్రతాప్, జాతీయ కార్యదర్శి పార్థశారథి, శ్రీకాకుళం విభాగం అధ్యక్షుడు మణిపాత్రుని నాగేశ్వరరావు, ఉత్తరాంధ్ర అధ్యక్షుడు డబ్బీరు గొవిందరావు, కన్వీనర్ భొగెల ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. దేశం నలుమూల నుంచి వందమందికి పైగా కవులు, రచయితలు కార్యక్రమంలొ పాల్గొన్నారు. గురజాడ ఫౌండేషన్ అమెరిక రాయగడ శాఖ వారు సాహితీ రత్న బిరుదు ప్రదానం చేశారు. సత్తాచాటిన కిశోర్చంద్ర రథ్ పర్లాకిమిడి: ఈ నెల 13 నుంచి 15 వరకు 45వ జాతీయ ఆథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీలు మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లోని గోకల్పూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగాయి. ఈ పోటీల్లో గజపతి జిల్లా పర్లాకిమిడికి చెందిన సీనియర్ క్రీడాకారుడు, ఎకై ్సజ్శాఖ విశ్రాంత ఉద్యోగి కిశోర్చంద్ర రథ్ వంద మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం, 400 మీటర్ల రేస్లో స్వర్ణం, ట్రిపుల్ జంప్లో బ్రాంజ్, లాంగ్జంప్లో వెండి పతకం కై వసం చేసుకున్నాడు. పర్లాకిమిడి క్రీడాకారుడు గతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించాడు. ఈయన విజయంపై స్థానిక క్రీడాకారులు హర్షం వెలిబుచ్చారు. -
అదుపుతప్పిన బస్సు
పర్లాకిమిడి: జాతీయ రహదారి 326–ఎ మోహనా బ్లాక్ చాందిపుట్ కళాశాల సమీపంలో విక్రాంత్ ప్రైవేట్ బస్సు మరో బస్సును ఢీకొట్టడంతో 30మంది యాత్రికులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గజపతి జిల్లా మోహనా పోలీస్ ష్టేషన్ పరిధి చాందిపుట్ ప్రైవేట్ కళాశాల సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో విక్రాంత్ ప్రైవేట్ బస్సు ఆర్.ఉదయగిరి నుంచి సంబల్పూర్ వెళ్లి అక్కడ నుంచి బరంపురం వెళ్తుండగా.. మరో బస్సును ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో అదుపుతప్పి రోడ్డు పక్కన కొండకు ఢీకొంది. ఈ సంఘటనలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ఏడుగురుకి తీవ్రగాయాలవ్వడంతో క్షతగాత్రులను చంద్రగిరి, మోహనా ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో జాయిన్ చేశారు. సంఘటనా స్థలానికి మోహనా అగ్నిమాపకదళం చేరుకుని క్షతగాత్రులను మోహన, చంద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. మోహనా పోలీసు అధికారులు ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీజేడీ జిల్లా మహిళ అధ్యక్షురాలుగా అనసూయ
● రాష్ట్ర సాధారణ కార్యదర్శిగా శుభ్రపండ రాయగడ: ఎస్డీసీ మాజీ చైర్పర్సన్, బీజేడీ సీనియర్ నాయకురాలు అనసూయా మాఝి ఆ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. అలాగే బీజేడీ రాష్ట్ర శాఖ మహిళా సాధారణ కార్యదర్శులుగా మున్సిపల్ చైర్పర్సన్ శుభ్ర పండ, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝిలు నియమితులవ్వగా రాష్ట్ర శాఖ కార్యదర్శులుగా ఇప్పిలి నాగలక్ష్మి, సుజాత మండంగి, రజని మండంగిలు జాబితాలో ఉన్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదివారం ఈ మేరకు ప్రకటించారు. అలాగే అనుగుల్ జిల్లాకు మహిళా అధ్యక్షురాలుగా బబితా ప్రధాన్, బౌధ్ జిల్లాకు దీప్తిప్రభ స్వయ్, బరఘడ్కు కల్పన మాఝి, బలంగీర్కు గితా బిషి, దేవఘడ్కు అరుణి ప్రధాన్, గజపతికి సంజుక్త బెహర, జగత్సింగ్పూర్ జిల్లాకు లోరా మహపాత్రో, కలహండికి సబితా ప్రధాన్, కంధమాల్ జిల్లాకు పూనమ్ కన్హర్, కేంద్రపడకు సరిత సాహు, మల్కన్గిరికి సమారి తంగుల్, నవరంగపూర్కు మంజులా మాఝి, నువాపడకు సంతోషిణి సలమ, నయాఘడ్ కు బిరజాలక్ష్మీ సాహు, సంబల్పూర్కు సంసుక్త మెహర్, శుభం పూర్కు పద్మిని బఘార్, సుందరఘఢ్కు రంజన పండ, రౌర్కలా కు సంధ్యారాణి లక్ర, భద్రక్కు బిద్యుత్లత నాయక్, ఉపాధ్యాక్షురాలుగా దేవిదత్త మహాంతి, కటక్కు అనిత బెహర, ఉపాధ్యాక్షురాలుగా పూర్ణిమా సింగ్, ఢెంఖానాల్కు సాగరిక మిశ్ర, ఉపాధ్యాక్షురాలుగా శుభలక్ష్మీ సాహు, ఝార్సుగుడకు జయంతి బాహు, ఉపాధ్యాక్షురాలుగా పద్మిణి సింగ్, కేంఝర్కు కమలిని పాత్రో, ఉపాధ్యాక్షురాలుగా సావిత్ర శేఠి, కొరాపుట్ కు పార్వతీ మస్తీ, ఉపాధ్యాక్షురాలుగా ఉర్మిల ముదులి, పూరి జిల్లాకు కస్తూరా స్వయ్, ఉపాధ్యాక్షురాలుగా మానసి హరిచందన్లు నియమితులైన జాబితాలో ఉన్నారు. అనసూయా మాఝి శుభ్రపండ -
సీలేరులో ఒడిశా ఎంపీ, ఎమ్మెల్యే
సీలేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): మహాశివరాత్రి సందర్భంగా ఒడిశాకు చెందిన నవరంగ్పూర్ ఎంపీ బలభద్ర మాజ్జి, మల్కన్గిరి ఎమ్మెల్యే నరసింహ మడకామి సీలేరును సందర్శించారు. సరిహద్దులోని పప్పులూరు గ్రామంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తూ, మార్గమధ్యలో సీలేరులోని ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారికి ఘనస్వాగతం పలికి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించింది. సీలేరు ప్రకృతి సౌందర్యం, గుంటవాడ జలాశయం చాలా బాగున్నాయని ఎంపీ ప్రశంసించారు.ఎప్పుడూ వార్తల్లో వినే సీలేరును స్వయంగా చూడటం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సాగును అరికట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని వారిని ఎస్ఐ యాసిన్ కోరారు. ఒడిశా నుంచి వస్తున్న గంజాయి వల్ల ఈ ప్రాంతంలో కేసులు పెరుగుతున్నాయని వివరించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందిస్తూ, తమ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
ఆనంద్పూర్ బ్యారేజ్ ప్రాజెక్ట్కు మార్గం సుగమం
● ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం భువనేశ్వర్: రాష్ట్ర మంత్రి వర్గం 36వ సమావేశం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన లోక్ సేవా భవన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో 5 ప్రధాన ప్రతిపాదనలు ప్రవేశ పెట్టారు. వాటిలో ఒకటి కొత్త ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ తెలిపారు. మంత్రి వర్గం సమావేశం అనంతరం తీర్మానాల వివరాల్ని ఆమె మీడియాకు వివరించారు. ఆర్థిక శాఖ ప్రతిపాదించిన 2026–27 బడ్జెట్కు సంబంధించిన వివరాలు త్వరలో ప్రారంభం కానున్న శాసన సభ సమావేశంలో ప్రవేశ పెడతారు అన్నారు. మరో ప్రతిపాదన రాష్ట్ర కార్మిక, ఉద్యోగుల బీమా శాఖ ప్రవేశ పెట్టగా జలవనరుల శాఖ 3 ప్రతిపాదనలను మంత్రి మండలికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదించింది. ఇంటిగ్రేటెడ్ ఆనంద్పూర్ బ్యారేజ్ ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఆనంద్పూర్ బ్యారేజ్ ప్రాజెక్టులో భాగంగా భూగర్భ పైప్లైన్ పంపిణీ వ్యవస్థల నిర్మాణానికి రాష్ట్ర మంత్రి వర్గం అనేక కీలక టెండర్లను ఆమోదించింది. వైతరణి నదిపై నిర్మించిన ఈ ప్రధాన ప్రాజెక్టు కెంజొహర్, బాలాసోర్ జిల్లాల్లోని సుమారు 60,000 హెక్టార్ల పంట పొలాలకు సాగు నీటిపారుదల కల్పించడం ఈ పథకం లక్ష్యం. బ్యారేజీ నిర్మాణంతో సాలంది నది వ్యవస్థను బలోపేతం చేసి కాలువల ద్వారా 3,000 హెక్టార్లకు ప్రారంభ పంపిణీ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన 57,000 హెక్టార్ల కమాండ్ ఏరియా (సీసీఏ)లో సంప్రదాయ కాలువల నిర్మాణం కోసం భూసేకరణలో తలెత్తుతున్న జాప్యం నివారించేందుకు ప్రభుత్వం ఆధునిక భూగర్భ పైప్లైన్ వ్యవస్థలకు నడుం బిగించింది. ఈ అధునాతన వ్యవస్థ కింద 57,000 హెక్టార్ల ప్రాంతానికి 9 ప్యాకేజీలుగా విభజించి ప్రాజెక్టు తదుపరి కార్యాచరణకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేయడంతో మార్గం సుగమంమైంది. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ (సీఏడీ)తో సహా అన్ని పనులు ఈపీసీ–టర్న్కీ ప్రాతిపదికన నిర్వహిస్తారు. టెండరు ఆమోదం తేదీ నుండి 24 నెలలలోపు పూర్తి చేయాలని మంత్రి వర్గం కాల పరిమితి నిర్ధారించింది. ఈ పైప్లైన్లు బాలాసోర్ జిల్లాలోని కీలక వ్యవసాయ ప్రాంతాలలో వేలాది హెక్టార్లకు సమర్థవంతమైన సాగు నీటి పారుదలకు హామీపూర్వకంగా పని చేస్తాయని మంత్రి మండలి ఆశాభావం వ్యక్తం చేసింది. -
శ్రీకాకుళం యాసే గుర్తింపునిచ్చింది
అరసవల్లి: శ్రీకాకుళం యాసే తమకు గుర్తింపునిచ్చిందని ప్రముఖ రీల్స్ స్టార్స్ ముప్పన శ్రీనివాస్, రమణమ్మ దంపతులు అన్నారు. ఫ్యామిలీలో జరుగుతున్న పలు ఆసక్తికరమైన, హాస్యపరమైన సంభాషణలను మన శ్రీకాకుళం యాసలోనే రీల్స్ చేస్తూ ‘సూపర్ శ్రీనివాస్’ పేరుతో నలుగురినీ నవ్వించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మాఘమాసం ఆదివారం పురస్కరించుకొని అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. నవ్వించడమే లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా గత ఆరేళ్లుగా రీల్స్ చేస్తున్నామన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు తమను గుర్తించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలం తలగాం గ్రామమని, తన భార్య రమణమ్మది వీరఘట్టం మండలంలోని బిటివాడ అని శ్రీనివాస్ తెలిపారు. -
కబడ్డీ విజేతగా పల్నాడు జట్టు
సంతబొమ్మాళి: నందన్న ఆలయ వారోత్సవాల్లో భాగంగా మండలంలోని గొదలాం గ్రామంలో జరిగిన రాష్ట్రస్థాయి ఆహ్వాన కబడ్డీ పోటీల విజేతగా పల్నాడు జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పల్నాడు, గుంటూరు జట్లు తలపడ్డాయి. విజేతగా నిలిచిన పల్నాడు జట్టుకు రూ.50 వేల నగదు, షీల్డ్, ద్వితీయ స్థానంలో నిలిచిన గుంటూరు జట్టుకు రూ.30 వేలు, షీల్డ్ను స్థానిక ఎస్ఐ వై.సింహాచలం చేతులమీదుగా అందజేశారు. సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచిన కృష్ణ, తూర్పుగోదావరి జట్లుకు చెరో రూ.20 వేలు చొప్పున నగదును అందజేశారు. బెస్ట్ రైడర్గా బ్రహ్మారెడ్డి, బెస్ట్ డిఫెండర్గా ఇమ్యుల్, ఆల్ రౌండర్గా హరీష్లు నిలిచారు. కార్యక్రమంలో నిర్వాహకులు అడ్డి తిరుపతిరావు, రిఫరీలుగా రమేష్, పిలక ధనుంజయకుమార్, దూపాన రమణారెడ్డి, రెడ్డి అప్పన్న, దూపాన కృష్ణారెడ్డి, సూరాడ దాసురాజు, అప్పిలి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ విజేతగా ఎస్పీ–11
విజేతలకు ట్రోఫీని అందజేస్తున్న సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, తదితరులు రాయగడ: జిల్లాలోని టికిరి సమితి దొరాగుడలో గల ఉత్కళ అలూమిన కర్మాగారం ఆధ్వర్యంలో స్టేక్ హోల్డర్స్ వన్ డే క్రికెట్ మ్యాచ్ ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్లో రాయగడ జిల్లా యంత్రాంగం–11, ఎస్పీ–11, విశాఖపట్నం రైల్వే–11, టికిరి రైల్వే–11, సిఆర్పిఎఫ్ నాలుగొ బెటాలియన్–11, హిండాల్ కో–11 జట్లు పాల్గొన్నాయి. ఉత్కల అలూమిన యూనిట్ హెడ్ రవి నారాయణ మిశ్రో ముఖ్యఅతిథిగా పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఫైనల్ టికిరి రైల్వే–11, ఎస్పీ–11 మధ్య జరిగింది. ఎస్పీ–11 విజేతగా, టికిరి రైల్వే–11 రన్నర్గా నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి రాయగడ సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఫైనల్కు చేరుకున్న క్రీడాకారులతో కరచాలనం చేసి వారికి అభినందించారు అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ అందరి మధ్య స్నేహం మెరుగుపరుచుకునేందుకు ఇటువంటి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. -
కల్యాణం.. కమనీయం
వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన మహిళలు పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని వీరబ్రహ్మేంద్రస్వామి మందిరంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని రాత్రి 7 గంటల సమయంలో వీరబ్రహ్మం, గోవిందమాంబల కల్యాణ మహోత్సవం గజపతి జిల్లా స్వర్ణకారుల సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహంచారు. అంతకు ముందు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబలను తిరువీధి నిర్వహించారు. వేద పండితుడు వనమాలి మణిశర్మ ఆధ్వర్యంలో ఈ వివాహా మహోత్సవాన్ని చేపట్టారు. వరుడు తరఫున దేవు నాగేశ్వర్ రావు ఆచారి దంపతులు, వధువు తరఫున బాణాల భవానీశంకర్ ఆచారి దంపతులు ఘనంగా జరిపించారు. కల్యాణ మహోత్సవం అనంతరం తలంబ్రాలను వధూవరులకు వారి బంధువుల తరఫువారు వేసి ఘనంగా ఆశీర్వాదాలు పొందారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. -
సాహిత్య సంబరం
శ్రీకాకుళం కల్చరల్: శ్రీ శ్రీ కళావేదిక శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాపూజీ కళామందిర్లో ఆదివారం సిక్కోలు సాహితీ సంబరం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన శతాధిక కవి సమ్మేళనంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 142 మంది కవులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఫ్రీ ఆర్టీసీ బస్సు ప్రభావం, ప్రజా సమస్యలు, సామాజిక అంశాలు, రాజకీయ లబ్ధి, అమెరికా అధ్యక్షుడు భారత్ వ్యతిరేక విధానం, తదితర అంశాలపై కవులు తమ గళాన్ని విప్పారు. వీరి కవితాగానాలు ప్రజలను చైతన్య పరిచేవిగా ఉన్నాయి. పాల్గొన్న కవులందరినీ సాహితీ శిరోమణి పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, జాతీయ ప్రధాన కార్యదర్శి టి.పార్థసారథి, కన్వీనర్ భోగెల ఉమామహేశ్వరరావు, అధ్యక్షులు మణిపాత్రుని నాగేశ్వరరావు, రాష్ట్ర సభ్యులు ముట్నూరు ఉపేంద్ర శర్మ, కిల్లాన శ్రీనివాసరావు, ఆర్.వి.రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. సిక్కోలు కవులకు నిలయం సిక్కోలు కళలకు నిలయమని అంటారు. సాహిత్యానికి కూడా. కవులందరూ చక్కగా కవితా గానాలు చేశారు. రాబోయే రోజుల్లో మలేషియాలో కూడా పెద్ద ఎత్తున సాహితీ కార్యక్రమం నిర్వహిస్తాం. – కత్తిమండ ప్రతాప్, శ్రీ శ్రీ కళా వేదిక అంతర్జాతీయ చైర్మన్ సిక్కోలు చరిత్ర గొప్పది సిక్కోలు చరిత్ర గొప్పదనం కోసం పద్యరూపంలో చదివాను. పాల్గొనే వారందరికీ మన గొప్పదనం తెలియాలి. కవుల కోసం మంచి వేదికను ఏర్పాటు చేశారు. – వాడాడ శ్రీనివాసరావు, కవి ఎక్కువ మంది పాల్గొన్నారు శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన కవితోత్సవంలో మేము అనుకున్న దాని కన్నా ఎక్కువ మంది పాల్గొన్నారు. ఎంతో మంది కువులు ప్రజాసమస్యలను ఎత్తి చూపారు. సమాజాభివృద్ధికి ఇలాంటి కవిత్వాలు రావాలి. – డబ్బీరు గోవిందరావు, శ్రీశ్రీ కళావేదిక ఉత్తరాంధ్ర అధ్యక్షుడు కత్తి కంటే కలం గొప్పది కత్తి కంటే కలం గొప్పదని తెలియజేశాను. కవులు తమ రచనల ద్వారా సమాజాన్ని ఉద్ధరిస్తారు. కలం గొప్పదనాన్ని తోటి కవులకు వినిపించాను. – ముట్నూరు సౌందర్య లహరి, యువకవి -
లింగరాజ్ ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ దంపతులు
భువనేశ్వర్: పవిత్ర మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి సతీసమేతంగా లింగరాజ్ ఆలయాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల శాంతి, శ్రేయస్సు కోసం దైవిక ఆశీస్సులు కోరుతూ లింగరాజ్ మహా ప్రభువుకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక మహోత్సవాన్ని ప్రారంభించి కళాకారులు ప్రదర్శించిన భక్తి, సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు. మహా శివరాత్రి భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక మేల్కొలుపును సూచిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ పవిత్ర మహాశివ రాత్రి అందరిలో ధర్మాన్ని, అంతర్గత బలాన్ని ప్రేరేపిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రముఖ గాయని గీతా పట్నాయక్ కన్నుమూత
భువనేశ్వర్: ప్రముఖ నేపథ్య గాయని గీతా పట్నాయక్ (71) కటక్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో ఆదివారం మరణించారు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో ఆమె ఆస్పత్రిలో చేరారు. సోమవారం సతిచురా శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గీతా పట్నాయక్ రాష్ట్ర చలన చిత్ర అవార్డుల జ్యూరీ సభ్యురాలు. ఆమె మొదటి పాట ‘జగబంధు పొరి జొణె సామంత’. ఆమె 15 ఏళ్ల వయసులో ‘ఒదినొ మేఘొ’లో తొలి సారిగా పాడారు. హిందీ, గుజరాతీ, రాజస్థానీ, మరాఠీ భాషలలో నేపథ్య గానం అందించారు. బిశ్వొ దెఖొ మధుమాయారే జీబొనొ పాటకు ఆమె రాష్ట్ర అవార్డులను అందుకుంది. అక్షయ సాహిత్యం, అక్షయ సంగీత సత్కారం పొందారు. యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు పలాస: పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తాజాగా బొడ్డపాడు రెవెన్యూ పరిధిలోని ఎంఐజీ లే అవుట్ పక్కన పెంటిభద్ర గిరిజన గ్రామం సర్వే నంబర్ 410లోని మెండులో ప్రొక్లెయినర్తో గ్రావెల్ తవ్వేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా ఈ కంకరను ట్రిప్పర్లతో తరలిస్తున్నారు. ఇటీవల పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీష రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో పలాస మండలంలో ఎక్కడ కూడా గ్రావెల్ తవ్వకాలకు అనుమతి లేదని మైనింగ్ అధికారులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కూడా తీవ్రస్థాయిలో స్పందించి అక్రమ తవ్వకాలు జరిగితే తన వరకు తీసుకు రావద్దని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అయినప్పటికీ అక్రమ తవ్వకాలు జరగుతుండడం విశేషం. ఈ విషయంపై పలాస తహసీల్దార్ టి.కల్యాణ చక్రవర్తిని వివరణ కోరగా ఎవరికీ అనుమతులు లేవని, తాను అక్కడికి వెళ్లి పరిశీలిస్తానని తెలియజేశారు. -
ఆటో బోల్తా
● పలువురికి గాయాలు టెక్కలి రూరల్: సంతబొమ్మాళి మండలంలోని వడ్డితాండ్ర గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆటోలో మహేంద్రగిరి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ఒడిశా రాష్ట్రం గారబంద వద్ద ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో సంతబొమ్మాళి మండలంలోని వడ్డితాండ్రకి చెందిన ఎన్.వాసు, ఎన్.శాంతి, ఎన్.లక్ష్మి, ఎల్.ధనలక్ష్మితో పాటు కొత్తూరుకు చెందిన ఎ.హీరమ్మ గాయపడ్డారు. గాయపడిన వారిని ఆటోలో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు. సౌండ్ సిస్టం సామగ్రి దగ్ధం సంతబొమ్మాళి: మండలంలోని కొల్లిపాడు గ్రామంలో దూపాన భాస్కరరావుకు చెందిన సౌండ్ సిస్టం సామగ్రి దగ్ధమయ్యాయి. గ్రామంలోని ఒక ఇంట్లో ఈ సామగ్రి ఉండగా.. శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపు రూ.20 లక్షల నష్టం వచ్చినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. కాగా ప్రమాదానికి గల కారణం తెలియలేదు. తేనెటీగల దాడిలో పలువురికి గాయాలు టెక్కలి రూరల్: మండలంలోని అయోధ్యపురం పంచాయతీ పరిధి చొంపాపురం గ్రామ సమీపంలో ఉన్న గెడ్డ వద్ద ఆదివారం తేనెటీగలు దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చొంపాపురం గ్రామానికి చెందిన పి.రంగారావు, పి.రాంప్రసాద్లు గ్రామ సమీపంలోని గెడ్డ వద్దకు వ్యక్తిగత పనులు నిమిత్తం వెళ్లారు. అయితే అదే సమయంలో అక్కడ చెట్టుపైనున్న తేనెపట్టు ఒక్కసారిగా కదలడంతో తేనెటీగలు ఇరువురిపై దాడి చేశాయి. అలాగే అదే సమయంలో అటుగా గుడి నుంచి వస్తున్న ఎస్.ఆదిలక్ష్మిపై సైతం దాడి చేశాయి. అలానే కొంతదూరంలో ఉన్న వృద్ధుడు ఎన్.సోమేశ్వరరావుతో పాటుగా డి.ముకుంద అనే వ్యక్తిపై సైతం దాడి చేశాయి. దీంతో గాయపడిన వారిని హుటాహూటీన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. బస్సు బోల్తా... ఏడుగురికి గాయాలు ● సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సాలూరు: పట్టణ బైపాస్ రోడ్డు డంపింగ్యార్డు వద్ద ఆదివారం వేకువజామున ఒడిశా బస్సు బోల్తా పడి పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన బస్సు డంపింగ్ యార్డు సమీపానికి వచ్చేసరికి డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వేకువజామున ఉదయం నాలుగు గంటల సమయంలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్తో పాటు 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ అప్పలనాయుడు తన సిబ్బందితో అంబులెన్స్ను తీసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పట్టణ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందిన వారిలో ఒకరిని డిశ్చార్జ్ చేశారు. మిగిలిన ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం విజయనగరం రిఫర్ చేసినట్టు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. మీనాక్షి తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. -
లింగరాజ ఆలయం
ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కళకళలాడుతున్న.. ● మహా శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లువిద్యార్థినుల ఆగ్రహంజయపురం: జయపురం విక్రమదేవ్ కళాశాలలో+3 (డిగ్రీ) చదువుతున్న విద్యార్థినులు ఏకమై కళాశాల యాజమన్యం వ్యవహరిస్తున్న తీరుపై శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పరీక్ష పేపర్ల ఫలితాలను చాలాకాలంగా వెల్లడించలేదని ఆరోపించారు. కళాశాల అధికారులు ప్రశ్నా పత్రాల విధానం ఎలా ఉండబోతుందో స్పష్టత ఇవ్వడం లేదని, అలాగే సరైన సిలబస్ అందించకపోవడంతోపాటు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నామని మండిపడ్డారు. వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా విశ్వవిద్యాలయ అనుబంధంగా కళాశాల ఉన్నప్పటికీ నేటికీ పరీక్షలు సక్రమంగా నిర్వహించక పోవటం ఏమిటని కళాశాల అధికారులను నిలదీశారు. అనంతరం విద్యార్థినులంతా భారీ ర్యాలీ నిర్వహించారు. సేవ పరమ ధర్మం: గవర్నర్ భువనేశ్వర్: నిజమైన గొప్పతనం మనం మన కోసం ఏం సాధిస్తామో దానిలో కాదు, ఇతరుల కోసం మనం ఏం చేస్తామో దానిలో ఉందని రాష్ట్ర గవర్నర్ హితవు పలికారు. అర్గూస్ వార్తా సంస్థ నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ ఒడిశా సమ్మాన్ ఉత్సవ్ – సీజన్ 2.0లో ఆయన శనివారం ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధైర్యం, కరుణ, నిబద్ధత ద్వారా సమాజాన్ని మార్చిన వ్యక్తులను గుర్తించే అర్థవంతమైన చొరవగా ఈ కార్యక్రమాన్ని అభివర్ణించారు. ఈ కార్యక్రమం ఒడిశా ఆత్మను బలోపేతం చేసిన నిశ్శబ్ధ మార్పు సృష్టికర్తలకు నివాళిగా పేర్కొన్నారు. వార్త సేకరణ, ప్రసారంలో అసాధారణ సహకారం అందజేసే క్షేత్ర స్థాయి సిబ్బందిని సత్కరించడం మీడియా పారదర్శక పోకడకు శక్తివంతమైన సాధనంగా ఉండగలదన్నారు. కార్యక్రమంలో అర్గూస్ న్యూస్ సీఈఓ ప్రకాష్ సాహు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దుర్గాశిష్ ప్రసంగించారు, వార్తలు, కథనాల సేకరణ, ప్రసారం రంగాల్లో విశేష ప్రతిభ ప్రదర్శించిన పాత్రికేయ వర్గాలను ఈ కార్యక్రమంలో సత్కరించారు. విద్యుత్ షాక్తో యువకుడికి గాయాలురాయగడ: విద్యుత్ షాక్తో యువకుడు గాయాలు పాలైన ఘటన జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి ధమునిపొంగ పంచాయతీలోని పురుణాభట్ట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గాయాలైన వ్యక్తి సుశాంత కాశీగా గుర్తించారు. వెంటనే అతడిని కల్యాణ సింగుపూర్లోని సీహెచ్సీకి చికిత్స కోసం తరలించారు. సమితిలోని ధమునిపొంగ పంచాయతీ కొత్తగుడ గ్రామానికి చెందిన సుశాంత్ అనే యువకుడు పురుణాభట్ట గ్రామంలోని ఒకరి ఇంటిపై పనిచేస్తున్న సమయంలో అదే ఇంటిపై నుంచి వెళ్లే ఒక విద్యుత్ వైర్కు తాకడంతో షాక్కు గురై కిందపడిపోయాడు. దీంతో అతడికి గాయాలయ్యాయి. అక్కడివారు వెంటనే అతడిని హాస్పిటల్కు తరలించారు.భువనేశ్వర్: స్థానిక ఏకామ్ర క్షేత్ర ఆరాధ్య దైవం మహా ప్రభువు లింగరాజ్ ఆలయంలో మహా శివరాత్రి వేడుకల సన్నాహాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఈ వేడుకలు శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు స్థానిక పాలన అధికార యంత్రాంగం మరియు కమిషనరేట్ పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సన్నాహాలలో భాగంగా కమిషనరేట్ పోలీసులు ఉన్నత స్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా యంత్రాంగం, కమిషనరేట్ పోలీసులు, లింగరాజ్ ఆలయ ట్రస్ట్ ప్రముఖులు, సేవాయత్లు (ఆలయ సేవకులు), వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రముఖ శైవ తీర్థయాత్ర కేంద్రాలలో ఒకటైన లింగరాజ్ ఆలయంలో జాగర రాత్రి వేడుకల యొక్క అన్ని అంశాలకు సంబంధించి వివరణాత్మక చర్చలు జరిగాయి. భువనేశ్వర్, కటక్ జంట నగరాల పోలీస్ కమిషనర్ ఎస్.దేవదత్త సింగ్, భువనేశ్వర్ డీసీపీ జగమోహన్ మీనా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సురేష్ కుమార్ రౌత్రాయ్, బాబూ సింగ్, సమీర్ మహంతి, కార్పొరేటర్ బిరాంచి మహాసూపకర్ వంటి స్థానిక నాయకులు కూడా హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం ఆచారాలు అంతరాయం లేకుండా జరిగేలా చూసేందుకు అధికారులు సేవాయత్లతో విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా మహా దీప దర్శనం కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ సంస్థల మధ్య సమన్వయంతో ఆలయ సముదాయంలో రద్దీ నియంత్రణ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ సంఘటనల నివారణ, సకాలంలో మహా శివ రాత్రి ప్రత్యేక పూజాదుల నిర్వహణకు ప్రాధాన్యత కల్పించారు. ఉత్సవాల సమయంలో అనుబంధ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు. భక్తులకు క్రమబద్ధమైన క్యూ దర్శనం, అవసరమైన చోట పాస్ వ్యవస్థను అమలు మరియు మెరుగైన రద్దీ నిర్వహణపై దృష్టి సారించాలని కోరారు. జాగారం రాత్రి భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యాలు, భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించి రద్దీ నివారణకు ప్రత్యేక పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. ఉత్సవం పురస్కరించుకుని లింగరాజు ఆలయం పరిసరాల్లో వాహనాల రవాణా నిబంధనలను జారీ చేశారు. ఆలయం అనుసంధాన మార్గాల గుండా వాహనాల రాకపోకల్ని మల్లించారు. ఈ మేరకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. అన్ని విభాగాల సమగ్ర ప్రణాళిక మరియు సమన్వయ ప్రయత్నాలతో చారిత్రాత్మక లింగరాజ ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణతో జరిగేలా జాగ్రత్త వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శివరాత్రికి ముస్తాబు పర్లాకిమిడి: తెలుగు సొండివీధి వద్ద బలుంకేశ్వరీ స్వామి మందిరం శివరాత్రి పర్వదినానికి ముస్తాబవుతోంది. అతి పురాతన బలుంకేశ్వర స్వామి దర్శనం ఆదివారం వేకువజామున 3 గంటల నుంచి ప్రారంభమవుతుందని ప్రధాన పూజారి తెలియజేశారు. బలుంకేశ్వరీ స్వామి మందిరం వద్ద పుష్కరిణీ గతంలో పర్లాకిమిడి పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి పుణరుద్ధరణ చేస్తామని చెప్పి ఏడాదైనా ఇంతవరకూ పనులు జరగలేదనే కారణంగా ఆలయ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆ తర్వాత ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కూడా బలుంకేశ్వర స్వామి పుష్కరిణీ సందర్శించి పుణరుద్ధరణకు తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. కానీ ఇంతవరకూ జరుగపోవడంతో పూజారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి పర్వదినం నాడు రాత్రి పది గంటల సమయంలో బలుంకేశ్వర స్వామికి లింగాభరణం చేపడతామని పూజారులు తెలియజేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తిమృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మాత్తిలి సమితి ఉదులిబేఢ గ్రామం సమీపంలో శనివారం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరు గాయపడ్డారు. మల్కన్గిరి నుంచి జయపూర్ను కలిపే 326 జాతీయ రహదరిపై జిల్లా కేంద్రం నుంచి గోవిందపల్లి వైపు వెళ్తున్న చిప్స్ లోడుతో ఉన్న టిప్పర్ వాహనం ఉదులిబేఢ సమీపంలో మోటర్ సైకిల్పై వెళ్తున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న కేశవ్ గౌడ్ (29) అక్కడికక్కడే మృతి చెందాడు. కేశవ్ రోజు కూలీగా పని చేస్తున్నాడు. ఈయన మృతితో కుటుంబం రోడ్డున పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మాత్తిలి ఐఐసీ దీపాంజలి ప్రధన్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి టిప్పర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. -
ఆత్మగౌరవం కాపాడాలి
సచివాలయ ఉద్యోగులంటే ప్రభుత్వం చాలా చులకనగా చూస్తోంది. సర్వేల పేరిట ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 70 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఎవరికి నచ్చినట్లు వారు తిడుతున్నారు. కనీస గౌరవం ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్నారు. గత సెప్టెంబర్ 1 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరికలు చేశా. అయితే సర్వేలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ మరింత పెంచారు. దీంతో ఒత్తిడి తట్టుకోలేక చచ్చిపోతున్నారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగుల మరణాలపై విచారణ కమిషన్ వేయాలి. – కూన వెంకట సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి, శ్రీకాకుళం ●ఆర్ఫన్ సర్వే తదితర 32 రకాల సర్వేలతో పాటు నెలవారీ ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ, ఆఖరికి బూత్లెవల్ ఆఫీసర్ల (బీఎల్ఓ) బాధ్యతలు వీరికే అప్పగించారు. దీనికితోడు ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో తిట్లు, చీవాట్లు నిత్యకృత్యం. షోకాజ్ నోటీసులు.. ఓ వైపు సర్వేల ఒత్తిడి, మరో వైపు విధుల నిర్వహణతో సతమతమవుతూనే ఎప్పటికప్పుడు ప్రగతినివేదికలను అందిస్తున్నా చిన్నపాటి కారణాలు చూపిస్తూ, ఐవీఆర్ఎస్ కాల్స్లో అవినీతికి పాల్పడుతున్నారంటూ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ అవుతున్నాయి. గత నెలలో జిల్లాలో 564 మందికి షోకాజ్ నోటీసులివ్వడం గమనార్హం. ఐవీఆర్ఎస్ కాల్స్లో సచివాలయ ఉద్యోగుల శాఖ మినహా మిగతా 56 ప్రభుత్వ శాఖల ఉద్యోగుల అవినీతి ప్రస్తావన రావడం లేదని, షోకాజ్లు, సస్పెన్షన్ల ఊసే లేదంటూ కొందరు సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కేరళలో వలస కార్మికుడి మృతి
రాయగడ: ఉపాధి కోసం కేరళ వెళ్లిన వలస కార్మికుడు మృతి చెందాడు. మృతుడు జిల్లాలోని కాసీపూర్ సమితి శుంగేర్ పంచాయతీలోని బొండేయి గ్రామానికి చెందిన సంతోష్ నాయక్ (39)గా గుర్తించారు. మూడు నెలల క్రితం కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఉపాధి కోసం కేరళ రాష్ట్రం వెళ్లాడు. ఆ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలోని ఎదబానాపురం ప్రాంతంలో ఒక హోటల్లో పని చేస్తుండేవాడు. శుక్రవారం రాత్రి సంతోష్ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో తోటి స్నేహితులు హాస్పిటల్కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సమాచారాన్ని సంతోష్ కుటుంబీకులకు అందించారు. సంతోష్కు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు తీవ్ర విషాదానికి గురయ్యారు. మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో జిల్లా యంత్రాంగం సహకరించాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన జిల్లా యంత్రాంగం అందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. కాసీపూర్లోని యువకులు గత కొద్ది ఏళ్లుగా ఉపాధి కోసం వెళ్లి మృత్యువాత పడుతుండడం పరిపాటిగా మారింది. జిల్లాలో బృహత్తర పరిశ్రమలు ఉన్నప్పటికీ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో వలస కార్మికులుగా మారి ఇంటికి విగతజీవులుగా తిరిగి రావడం విచారకరం. -
విద్యార్థులు దేశ పురోగతిలో భాగస్వాములు కావాలి
రాయగడ: విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి దేశ పురోగతిలో భాగస్వాములు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ నవీన్చంద్ర నాయక్ అన్నారు. స్థానిక అటానమస్ కళాశాలలో వాణిజ్యశాస్త్ర విభాగం తరఫున వికసిత భారతదేశం కోసం వికసిత ఒడిశా అభివృద్ధి అనే అంశంపై శనివారం జరిగిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అన్నివర్గాల ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, పేదరికాన్ని తగ్గిస్తూ సమానత్వం, విద్య, ఆరోగ్య రంగాలను మెరుగుపరచడం ద్వార దేశ పురోగతిని సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. సదస్సులో అధ్యాపకులు కిశోర్కుమార్ దాస్, డాక్టర్ బిశ్వమోహన్ జెన్న, డాక్టర్ అజయ్ ప్రతాప్ యాదవ్, డాక్టర్ ప్రణయ్ పరాశర్, అధ్యాపకులు బాతేశ్వర్ సింగ్, డాక్టర్ సచిన్ గుప్తా, డాక్టర్ సమీర్ కుమార్ మిశ్ర, డాక్టర్ మలయ రంజన్ మహాపాత్రో పాల్గొన్నారు. కళాశాల ప్రిన్పిపాల్ డాక్టర్ సరస్వతి రాయ్, కామర్స్ విభాగం అధిపతి సుబ్రత్ కుమార్ ప్రధాన్, డాక్టర్ మానసీ మహంతిల అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు చివరిలో సావనీర్ను అతిథులు ఆవిష్కరించారు. -
● ఘనంగ కలశ యాత్ర
జయపురం: జయపురం సమితి ఉమ్మరి గ్రామ పంచాయతీ గగణాపూర్లో దాదాపు 400 ఏళ్లకు పైగా చరిత్ర గల బాలుంకేశ్వర్ మహాదేవ్ ఆలయంలో యజ్ఞమండప ప్రతిష్ట, మహాశిరాత్రి సందర్భంగా శనివారం మహా కలశ శోభా యాత్ర నిర్వహించారు. జయపురం లోకనాథ్ దేవాలయ ప్రాంగణంలో గల ఖజురి బంద(ఖజురి చెరువు)లో పవిత్ర జలాన్ని కలశాల్లో నింపుకుని వేద మంత్రోచ్ఛరణలు మధ్య లోక్నాథ్ ఆలయ కూడలి నుంచి శోభాయాత్ర బయల్దేరింది. వందలాది మంది మహిళలు పవిత్ర కలశాలతో శోభాయాత్రలో పాల్గొన్నారు. కలశ శోభాజాత్ర రఘునాత్ మందిరం, సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గం గుండా గగణాపూర్ కు బయల్దేరింది. గగణాపూర్ బాలుంకేశ్వర్ మహదేవ్ మందిరంలో యజ్ఞప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు, మహాశివరాత్రి వేడుకలు మూడు దినాలు జరుగుతాయని పూజారులు వెల్లడించారు. -
శరవేగంగా రాయపూర్–విశాఖ కారిడార్ నిర్మాణం
జయపురం: చత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న రాయపూర్–విశాఖపట్నం 6 లైన్ల భారత మాల ఆర్థిక కారిడార్ పనులు త్వరిత గతిన పూర్తి చేస్తున్నారు. ఈ భారత మాల కారిడార్ 2026 జూన్లో ప్రజలకు అంకితం అవుతుందని భారత జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు వెల్లడించారు. ముఖ్యంగా ఈ కారిడార్లో రెండు టన్నెళ్లు, రహదారులు పరిశీలించి ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. ఈ కారిడార్ ఎక్స్ప్రెస్ హైవే జాతీయ అంతర్జాతీయ ఇంజినీర్లతో నిర్మిస్తున్నారు. దాదాపు 468 కిలోమీటర్ల పొడవుగల ఈ కారిడార్ చత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతుంది. చత్తీస్గఢ్ రాష్ట్రం రాయపూర్ సమీప అవనపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం సమీప సబ్బవరం వరకు వేస్తున్న 6 లైన్ల భారత మాల ఆర్థిక కారిడార్ ను రూ.16 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ కారిడార్ ఒడిశా రాష్ట్రంలో నవరంగపూర్, కొరాపుట్ జిల్లాల మీదుగా వేశారు. ఈ ప్రాజెక్టులు హైబ్రిడ్ అన్యూనిటీ మోడల్ లో 15 ప్యాకేజీలుగా విభజించి నిర్మాణం చేపట్టారు. వాటిలో చత్తీస్గఢ్లో 3 ప్యాకేజీలు ఒడిశాలో 8 ప్యాకేజీలు, ఆంధ్రప్రదేశ్ లో 4 ప్యాకేజీలు ఉన్నాయి. వాటిలో ఇంతవరకు 3 ప్యాకేజీల పనులు నిర్మాణాధీనంలో ఉన్నాయి. -
అమర వీరులకు నివాళులు
రాయగడ: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు భజరంగ దళ్, విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో శనివారం ఘన నివాళులు అర్పించింది. స్థానిక గాంధీ పార్క్లో ఈ మేరకు ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాబూరావు మహంతి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ దేశం పట్ల భక్తిని ,అమర వీరుల త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. అనంతరం పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్ల చిత్రపటాల వద్ద దీపాలు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. భజరంగ దళ్ కోఆర్డినేటర్ శంకర్ బెహర, బి.రాజేష్ పాల్గొన్నారు. -
గూడ్స్ ఇంజిన్లో మంటలు
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ రైల్వే స్టేషన్ సమీపంలో బొగ్గు లోడుతో ఉన్న గూడ్స్ ఇంజిన్లో మంటలు చెలరేగాయి. శనివారం మధ్యాహ్నం రాయగడ నుంచి టిటలాఘడ్ వైపు వెళుతున్న గూడ్స్ ట్రైన్ బిసంకటక్ స్టేషన్కు సమీపంలో లయన్ క్లియర్ లేక నిలిచిపోయింది. అదే సమయంలో ఇంజిన్ భాగంలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే బిసంకటక్ రైల్వే స్టేషన్ మాస్టర్కు సమాచారం అందించారు. అనంతరం బిసంకటక్ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. ట్రైన్ ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యా పించినట్లు ప్రాథమిక దర్యాప్తులో భావిస్తున్నారు. రెండు గంటల అనంతరం టిట్లాఘడ్ వైపు ట్రైన్ బయలు దేరింది. -
గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి
రణస్థలం: లావేరు మండలం బుడతవలస గ్రామ సచివాలయ విలేజ్ సర్వేయర్ పొట్నూరు రఘునాథ్ (50) గుండెపోటుతో మృతి చెందారు. ఈయన శుక్రవారం జిల్లా పరిషత్లో జరిగిన జాయింట్ ఎల్పీఎం మీటింగ్కు హాజరయ్యారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. ఈయనకు భార్య వరలక్ష్మి, కుమారె, కుమారుడు ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వేయర్ జోషిల, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వెంకటేశ్వరరావు, లావేరు తహసీల్దార్ జీఎల్వీ శ్రీనివాసరావు మృతదేహానికి నివాళి అర్పించారు. -
గిరిజన రైతుల ఆందోళన
కొత్తూరు : ప్రభుత్వం పంపిణీ చేసిన డీ పట్టా భూముల్లో వాటర్ ట్యాంకు పనులు చేపడితే సహించేది లేదని మెట్టూరుగూడకు చెందిన గిరిజన రైతులు శనివారం ఆందోళనకు దిగారు. పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవన సాగిస్తున్న తమ భూముల్లో వాటర్ ట్యాంకు పనులు చేపట్టడం సరికాదంటూ నిరసన వ్యక్తం చేశారు. నష్ట పరిహారం చెల్లించే వరకు పనులు చేపట్టవద్దన్నారు. నోటిఫైడ్ కాని సర్టిఫికెట్తో పీజీ సీటు! ● లింగాలవలస పీహెచ్సీ వైద్యుడిపై దర్యాప్తు టెక్కలి: గిరిజన ప్రాంతంలో పీహెచ్సీ ఉందంటూ టెక్కలి మండలం లింగాలవలస పీహెచ్సీ వైద్యుడు పవన్తేజ ట్రైబల్ నోటిఫైడ్ సర్టిఫికెట్తో పీజీ సీటులో జాయిన్ అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులు పీజీ సీటుకు అర్హత సాధించాలంటే మూడేళ్లు రూరల్ పీహెచ్సీ, రెండేళ్లు గిరిజన ప్రాంతాల్లోని పీహెచ్సీలో వైద్య సేవ లు అందజేయాలి. లింగాలవలస పీహెచ్సీ రూరల్ ప్రాంతంలో ఉన్నప్పటికీ దానికి సమీపంగా కొన్ని గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఇదే కారణంతో సదరు వైద్యుడు తనకు సర్వీసు పూర్తి కాకపోయినప్పటికీ ఐటీడీఏ అధికారుల నుంచి సర్టిఫికెట్ను సంపాదించి పీజీలో జాయిన్ అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పీహెచ్సీకి ప్రస్తుతానికి ఎటువంటి ట్రైబల్ నోటిఫైడ్ కాలేదు. కొద్ది రోజుల తర్వాత ఈ విషయం బయపడింది. దీనిపై కొందరు గిరిజన ప్రాంతాల వైద్యులు వైద్య ఆరోగ్య శాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై...ఆరోపణలు ఎదుర్కొంటున్న పీహెచ్సీ వైద్యుడి వద్ద ప్రస్తావించగా.. తాను పనిచేస్తున్న పీహెచ్సీ పరిధిలో అధికంగా గిరిజన గ్రామాలు ఉన్నాయని, ఐటీడీఏ లో నిర్వహించే ప్రతి ఆరోగ్య సమీక్షలకు హాజరయ్యేవాడినని, జీఓ ప్రకారమే సర్టిఫికెట్తో పీజీలో జాయిన్ అయ్యానని స్పష్టం చేశారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీలో పనిచేసిన విశ్రాంత ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ఆర్ శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.అప్పారావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని సంఘ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ పెన్షన్ సంబంధిత సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్నారి భువన్కు విరాళాల వెల్లువ శ్రీకాకుళం క్రైమ్/పలాస: ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగిలి షాక్కు గురై కుడి చేయి కోల్పోయిన మూడేళ్ల చిన్నారి భువన్ పట్ల దాతలు సహృదయత చాటుకున్నారు. చిన్నారి పడుతున్న కష్టానికి కనికరించి శనివారం నాటికి దాదాపు రూ.8 లక్షల 60 వేలు వరకు ఆర్థికంగా సాయపడ్డారు. ఈ నెల 4న వజ్రపుకొత్తూరు మండలం కొండవూరులో భువన్తో పాటు నాయనమ్మ అడ్డి తులసమ్మ విద్యుత్ షాక్కు గురైన సంగతి తెలిసిందే. ‘సాక్షి’ కథనాలతో పాటు పలు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరగడంతో వివిధ గ్రామాల యువకులు, ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు, రైల్వే, విద్యుత్తు, ప్రయివేటు ఉద్యోగులు, కార్మికులు చేయూత అందించారు. ప్రమాదం జరిగిన నాటినుంచి స్థానిక శ్రీ వేదసరస్వతీ దేవీ, శ్రీ గణేష్ యువజన సంఘాల యువత గ్రామస్తుల సహకారంతోనే కాకుండా బయట నుంచి కూడా వివిధ మార్గాల్లో విరాళాల సేకరించేందుకు కృషిచేశారు. రూ. 25 వేల నుంచి రూ.లక్షకు మించి ఇచ్చిన వారిలో కొండవూరు గ్రామస్తులు, వేదసరస్వతి, గణేష్ సంఘాల యువత, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం, మంచినీళ్లపేట సీమెన్ గ్రూప్, పూండి–గోవిందపురం కె.ఎం.వి.సేవా సమితి, పూండి–నౌపడ రైల్వే ట్రాక్మెన్స్, మహదేవపురం, కవిటి అగ్రహారం యువత, ఉద్యోగులు, కాశీబుగ్గ పవన్కళ్యాణ్ సేవాసమితి, పూండి యువతరం సేవాసమితి, మర్రిపాడు గ్రామస్తులున్నారు. విద్యుత్తు విజిలెన్స్ విచారణ.. ప్రస్తుతం రాగోలు జెమ్స్లో చికిత్స పొందుతు న్న భువన్, తులసమ్మల వద్దకు విద్యుత్తు విజిలెన్స్ ఎస్ఐ రామారావు, సిబ్బంది వెళ్లి ప్ర మాదంపై విచారణ చేశారు. సంబంధిత నివేదికలను ఉన్నతాధికారులకు అందించి బాధితు లు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక గ్రామంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపడతామన్నారు. -
మధ్యాహ్న భోజనంలో అక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు
మల్కన్గిరి: జిల్లాలోని ఎం.వి.55 గ్రామంలో ఉన్న అరవింద ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం, నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయంటూ స్థానికులు జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్కు శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై తక్షణమే దర్యాప్తు చేయాలని జిల్లా విద్యాశాఖధికారిని కలెక్టర్ ఆదేశించారు. దానితో డీఈవో చిత్తరంజార్ దాస్, అదనపు విద్యాశాఖ అధికారితో కలిసి పాఠశాలను సందర్శించారు. బియ్య్ం, స్టాక్ రికార్డులు, ఇతర పత్రాలను పరిశీలించారు. సుమారు 42 బస్తాల మధ్యాహ్న భోజన బియ్యం పునఃప్రాసెసింగ్ కోసం ఒక మిల్లుకు పంపినట్లు బయటపడింది. అయితే జిల్లా సరఫరా అధికారి ద్వారా అందించబడే మధ్యాహ్న భోజన బియ్యం ప్రత్యేక పోషకాహారంతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్ కావడంతో దాన్ని మళ్లీ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అక్రమాలలో బాధ్యత వహించిన ప్రధానోపాధ్యాయురాలి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమెకు సోకాజ్ నోటీసు జారీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. -
సర్వేలతో చచ్చిపోతున్నాం..!
● భారం మోయలేకపోతున్నామని సచివాలయ ఉద్యోగుల ఆవేదన ● ఏకంగా 32 రకాల సర్వేల నిర్వహణలో బిజిబిజీ ● పనిఒత్తిడితో ఇప్పటికే పలువురి ఆత్మహత్యఅరసవల్లి: ‘‘సచివాలయాలు శుద్ధ దండగ.. అసలు వాళ్లు ఉద్యోగులేనా.. ఎందుకూ పనికిరారు..’’ ఇవీ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు ‘‘సచివాలయాలు దరిద్రాలయాలు..’ ఇవీ స్థానిక కూటమి ప్రజాప్రతినిధుల దుర్భాషలు..ఇక చోటామోటా నేతల తిట్ల దండకం సరేసరి. కానీ..సచివాలయాల్లో ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ ప్రచారావసరాలకు కావాలి. వారినే ఇంటింటికీ పంపించాలి. ఎడపెడా సర్వేలు చేయించుకుని ప్రభుత్వ ప్రగతి అంటూ ప్రగల్భాలు పలకాలి. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అంటూ సచివాలయాల పేర్లు మార్చిన ప్రభుత్వం ఉద్యోగుల విధులను సైతం అస్తవ్యస్తంగా మార్చేసింది. ఉద్యోగుల మెడపై కత్తి పెట్టి మరీ ఒత్తిడి తెచ్చి సర్వేలు చేయించుకుంటోంది. ఈ ఒత్తిడి భరించలేక కొందరు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసేస్తే.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడి తనవు చాలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల ట్విట్టర్ క్యాంపెయిన్ సమాచారం మేరకు 2024 సెప్టెంబర్ నుంచి ఈ నెల 10వ తేది లోపు 70 మంది ప్రాణాలు కోల్పోయారని సంఘం సభ్యులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే రెండు మరణాలు సంభవించగా...వివిధ కారణాలు చూపి పదుల సంఖ్యలో రాజీనామాలు చేసేశారు. ప్రతి నెలా సర్వేలు...టార్గెట్లు! సచివాలయ పరిధి విధులతో పాటు అదనంగా పదుల సంఖ్యలో సర్వేలు చేయడంపై ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి నెలా ఏకంగా 32 సర్వేలను చేయడం టార్గెట్గా పెట్టారు. ప్రధానంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర సర్వే, పీఎం కిసాన్ డ్రోన్స్ ఓబురేషన్ సర్వే, ఎన్సీడీసీ సర్వే, ఇ– క్రాప్ బుకింగ్ సర్వే, ఎఫ్ఎం సర్వే, ఆధార్ సర్వే, కౌశలం సర్వే, మనమిత్ర ద్వారా అందిస్తున్న 564 సేవలపై సర్వే, కొత్త రేషన్ కార్డుల సర్వే, బయోమెట్రిక్ అప్డేషన్ సర్వే, పి–4, పాస్బుక్స్ సర్వే, ఏహెచ్ఎస్ సర్వే, అభ సర్వే, సెమి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. అర్హత పరీక్షల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1.34 లక్షల మందికి సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 6880 మంది ఉద్యోగులు విధుల్లో చేరారు. వీరికి అనుసంధానంగా వలంటీర్ల వ్యవస్థ కూడా అమలు చేయడంతో వలంటీర్ల ద్వారానే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలు, గుర్తింపు, లబ్ధిని కూడా ఇంటింటికీ అందించేవారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేయడంతో పాటు ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడి లేకుండా విధుల నిర్వహించుకునేవారు. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నమైంది. వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడేసి వారి విధులన్నీ సచివాలయాల ఉద్యోగులకు అప్పగించేశారు. దీంతో పనిభారం ఎక్కువైంది. -
యూత్ రిసోర్స్ కేంద్రం ప్రారంభం
రాయగడ: విద్యావంతులైన యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ మేరకు జేకేపూర్లోని జేకే పేపర్ మిల్కు చెందిన స్పర్స్, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా శనివారం యూత్ రిసోర్స్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అశుతోస్ కులకర్ణి హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యావంతులైన యువతులకు ఈ కేంద్రంలో ఉచితంగా ఎస్ఎస్సీ, రైల్వే, ఓఎస్ఎస్సీ, పోలీస్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ కల్పిస్తుందన్నారు. తొమ్మిది నెలల పాటుగా కొనసాగే ఈ శిక్షణలో భాగంగా గణితం, జనరల్ నాలెడ్జి, ఇంగ్లిష్, ఒడియా గ్రామర్, కంప్యూటర్ విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ కల్పించడం జరుగుతుందని వివరించారు. రాబోయే రోజుల్లో గ్రామీణ, పట్టణ పిల్లల మధ్య అవకాశాల అంతర్యాన్ని తగ్గించడంలో ఈ కేంద్రం ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో జేకే పేపర్ మిల్ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు బిశ్వజీత్ ద్వివేది, మేనేజర్ ఆదిత్యా పట్నాయక్, మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అర్చనా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం యువతులకు శిక్షణకు సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేశారు. -
భలే భల్లూకం
రాయగడ: ఎలుగును చూస్తే భయంతో పారిపోతారు. అది ఎక్కడ దాడి చేస్తుందోనని దాన్ని తరిమే ప్రయత్నం చేస్తారు. అయితే అందుకు ఇక్కడ భిన్నంగా ఉంది. అందరితో ఈ భల్లూకం కలిసిమెలసి ఉంటోంది. వారు ఇచ్చే బిస్కెట్లు కూడా తింటోంది. ఈ వింత సంగతిని చూసేందుకు చుట్టు పక్కల ప్రజలు వెళ్తున్నారు. వారు తీసుకువచ్చిన తినుబండారాలను భళ్లూకానికి ఇచ్చి ఆనందంతో పరవశించిపోతున్నారు. ఈ విడ్డూరమైన దృశ్యం జిల్లాలోని పద్మపూర్ సమితి గుడారి సమీపంలో గల మొరిచొగుడలో గత కొద్ది రోజులుగా కొనసాగుతోంది. సమీపంలో ఉన్న అడవి నుంచి ప్రతిరోజూ సాయంత్రం ఆ ఎలుగు అక్కడే ఉన్న ఆదివాసీలకు సంబంధించిన మందిరానికి మెట్లను మరీ ఎక్కి వెళ్లి ఆ మందిరంలో గల పూజారి దగ్గరకు వెళ్లి అతను ఇచ్చే ప్రసాదాన్ని తింటుంది. అదేవిధంగా అక్కడకు వచ్చే భక్తులు ఇచ్చే బిస్కెట్లు, ఇతర ఆహారాన్ని తిని సరాసరి తను వచ్చే అడవులకు వెళ్లిపోతోంది. ఇలా ప్రతీ రోజు సాయంత్రం జరుగుతుంది. గుడారి అటవీ రేంజ్ అధికారులు మాత్రం ఎలుగుకు దూరంగా ఉండాలని, అదేవిధంగా ఆహారాన్ని ఇచ్చే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. అయితే దాదాపు వారం రోజులు ఇలా గడుస్తున్నా ఇంతవరకు భల్లూకం ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టలేదు సరికదా వారు ఇచ్చే ఆహారాన్ని ఎంతో ముచ్చటగా తిని వెళుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. -
తల్లిదండ్రులకు పాదపూజ
జయపురం: జయపురం సరస్వతీ శిశు విద్యామందిరం అరవింద్ నగర్లో మాతృ, పితృ పూజా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో యోగా వేదాంత సమితి సభ్యులు ఇతిశ్రీ మిశ్రా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలాగే కె.సుశీలా రాజ్, గంగా భాయి, సంతోషిణీ పాత్రోశ్యామ సుందర్ బరాల్, కె.గోవిందరాజ్, మీనతి కుమార్ పట్నాయక్ గౌరవ అతిథిలుగా హాజరయ్యారు. విద్యాలయ ప్రధాన ఆచార్యులు డాక్టర్ రమణీ రంజన్ దాస్ అధ్యతన జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల స్వాగతగీతాలాపనతో ప్రారంభమైంది. అనంతరం మాతృ, పితృ భక్తి ప్రధాన నృత్య ప్రదర్శణ నిర్వహించారు. అలాగే విద్యార్ధులు తమ తల్లిదండ్రులకు పూలు, చందనం ధూప దీపాలతో పాదపూజలు చేశారు. కార్యక్రమంలో ప్రధాన ఆచార్యులు మాట్లాడుతూ.. పిల్లలను తల్లి దండ్రులు ప్రాణం కంటే మన్నగా ప్రేమించి వారి ఉన్నతే లక్ష్యంగా తీర్చి దిద్దుతారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు గురువు, దైవాలని ఉద్బోంధించారు. 178 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
మళ్లీ సొంతగూటికి గణేష్ సావుంతా
రాయగడ: రాయగడ జిల్లా బీజేడీ ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు కాసీపూర్కు చెందిన గణేష్ సావుంతా కొద్ది రోజుల క్రితం బీజేడీ ప్రాథమిక సభ్యత్వానికి, అదేవిధంగా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ సీనియర్ నాయకుడు సుధీర్ దాస్, జిల్లా అధ్యక్షుడు జగన్నాథ సరక, ఉపాధ్యక్షుడు పట్నాన గౌరీ శంకరరావుల సమక్షంలో తిరిగి తన రాజీనామ పత్రాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపై తాను బీజేడీలోనే ఉంటూ కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు పార్టీకి సేవలు అందిస్తానని వివరించారు. అయితే కొద్ది రోజుల క్రితం పార్టీకి రాజీనామ చేసినట్లు ప్రకటించిన గణేష్, తిరిగి తన రాజీనామను ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఒక్కక్కరూ బీజేడీ నుంచి వైదొలుగుతుండడంతో పార్టీ ప్రాధాన్యత కోల్పోతుందని భావించిన ఆ పార్టీ సీనియర్ నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పిన వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక పావులను కదుపుతున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. -
శివ నగరి
మహేంద్ర గిరి..మహేంద్రగిరి కొండమీద ఆహ్లాద వాతావరణంభీమమందిరం వద్ద కిక్కిరిసిన జనాలు (ఫైల్)పర్లాకిమిడి: శివరాత్రి పర్వదినం సందర్భంగా గజపతి జిల్లా రాయగడ బ్లాక్లో ఉన్న మహేంద్రగిరి పర్వతంపై శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు శివరాత్రి జరగనుంది. ఈ యాత్రకు విచ్చేసే యాత్రికులకు, భక్తులకు అన్ని విధాల సౌకర్యాలను జిల్లా యంత్రాంగం సమకూర్చుతుంది. ఆంఽధ్రప్రదేశ్ మందస మండలం సాబకోట, కించిలింగి మీదుగా మహేంద్రగిరి పర్వతాలు చేరుకోవచ్చు. లేదా పర్లాకిమిడి నుంచి రాయగడ మీదుగా మీదుగా కోయిపూర్ మీదుగా రోడ్డు సౌకర్యం ఉంది. భారతదేశంలో ఏడు కుల పర్వాతాల్లో మహేంద్రగిరి పర్వతం ఒకటి. తూర్పు కనుమల్లో 1501 మీటర్లు (4,925 అడుగుల) ఎత్తులో ఉన్న మహేంద్రగిరి పర్వతం కొరాపుట్లో దేవమాళి పర్వతం తర్వాత అత్యంత ఎత్తైన పర్వతంగా ఉంది. ఈ పర్వతాలు జీవనవైవిధ్యం మూలంగా కేంద్రప్రభుత్వ పురావస్తు శాఖ గుర్తించింది. మూడు కాలాలు ఒకసారి మనం ఆ పర్వతాలలో పొందే అనుభూతి కలుగుతుంది. మహేంద్రగిరి పర్వతం దిగువున గోకర్ణేశ్వర మందిరం, పరశురాం మందిరం, కుంతీ, యుధిష్టర, భీమ మందిరాలు ఉన్నాయి. పాండవులు మహేంద్రంలో కుంతీ మందిరంలో శివలింగం -
పేదల కోసమే ‘జగన్నాథ్ దర్శన్’ పథకం
● నబరంగ్పూర్లో ప్రారంభించిన సీఎం మోహన్ చరణ్ మజ్జికొరాపుట్: ప్రతి పేదవాడు పూరీని దర్శించుకోవాలనే శ్రీ జగన్నాథ్ దర్శన్ పథకం ప్రారంభించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి ప్రకటించారు. శుక్రవారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో మండయ్ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 60 ఏళ్లు నిండిన పేదలు పూరి వెళ్లి రావడానికి పూర్తి ఏర్పాట్లు ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని సీఎం పేర్కొన్నారు. ఈ పథకం ఈ రోజు గంజాం, సంబల్పూర్, భద్రక్, బరిపద జిల్లాల నుంచి ఈ పథకం ప్రారంభమైనట్లు తెలిపారు. జిల్లా వాసులకు ఆరోగ్య పరిరక్షణ కోసం మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఈ కాలేజీ పూర్తయితే నబరంగ్పూర్ జిల్లాతో పాటు కలహండి జిల్లా, సమీప చత్తీస్గఢ్ రాష్ట్ర ప్రజలకు ఉపయెగ పడుతుందన్నారు. ఈ నిర్మాణం పనులు త్వరగా ప్రారంభమవుతాయన్నారు. జాజ్పూర్, కొంధమాల్, తాల్చేర్ లలో మెడికల్ కాలేజీలు ఈ 20 నెలలలో పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. మరో మూడు మెడికల్ కాలేజీలు డెంకనాల్, భద్రక్, జగత్ సింగ్ పూర్ జిల్లాల్లో నిర్మిస్తామన్నారు. దాదాపు రూ.440 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయన్నారు. నబరంగ్పూర్ కాలేజీకి నూతన భవనం నిర్మిస్తామన్నారు. త్వరలో జయపూర్–గోపాల్పూర్ మధ్య 6 లైన్ల జాతీయ రహదారి నిర్మిస్తామన్నారు. నబరంగ్పూర్–జయపూర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రానున్న రెండేళ్లలో అన్ని పనులు పూర్తి చేస్తామని సీఎం మోహన్ చరణ్ మఝి ప్రకటించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ప్రభాతీ పరిడా, మంత్రులు ముఖేష్ మహలింగ్, నిత్యానంద గొండో, ఎంపీ బలబద్ర మఝి, రాజ్య సభ ఎంపీ మున్నా ఖాన్, ఎంఎల్ఎలు గౌరీ శంకర్ మఝి, మనోహర్ రంధారి, నర్సింగ బొత్ర, కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, ఎస్పీ సంపత్ సందీప్ పాల్గొన్నారు. -
ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
జయపురం: జయపురం మున్సిపాలిటీలోని నాలుగో నంబర్ వార్డు లింగరాజ్నగర్ ఖెందుగుడలో ప్రభుత్వ స్థలాల్లో ఉన్న ఆక్రమణల తొలగింపునకు అధికారులు శుక్రవారం శ్రీకారం చుట్టారు. అయితే స్థానిక ప్రజలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకుంది. ఎంతో కాలంగా నోటీసులు ఇచ్చినా ఆక్రమణదారులు ఇళ్లను తొలగించక పోవటంతో అధికారులు తొలగింపునకు సిద్ధమయ్యారు. మున్సిపల్ అధికారులు, జయపురం అదనపు తహసీల్దార్ చిత్తరంజన్ పట్నాయక్, తహసీల్ కార్యాలయ సిబ్బంది, మున్సిపల్ అదనపు కార్యనిర్వాహక అధికారిణి పూజా రౌత్, పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్రరౌత్, పోలీసులతో ఆక్రమణలను తొలగించే చర్యలు చేపట్టారు. అయితే ఆక్రమణల తొలగింపుపై అధికారులు ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని ఆక్రమణదారులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కూలీలకు చెందిన ఇళ్లను కూల్చి వేస్తూ పెద్దల దుకాణాలు, భవనాలు ఎందుకు విడిచి పెడుతున్నారని అధికారులను సూటిగా ప్రశ్నించారు. ధనికులు, పేదలు అనే బేధం లేకుండా చర్యలు తీసుకోవాలని, మరోసారి సర్వే నిర్వహించిన తరువాతనే తొలగింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబాల భద్రతపై వారు భయం వ్యక్తం చేస్తూ రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై అదనపు కార్యనిర్వాహక అధికారిని ప్రశ్నించగా జయపురం సబ్కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగింపు చర్యలు చేపట్టామన్నారు. అనంతరం ప్రజలు సబ్కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యను వివరించారు. ఈ నేపథ్యంలో లింగరాజ్ నగర్ ఖెందుగుడ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ తాత్కాలికంగా పది రోజులు నిలిపి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. -
‘విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలి’
రాయగడ: విద్యారంగం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ విద్యార్థుల్లో పోటీతత్వం మెరుగుపరిచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సెంచూరియన్ విశ్వవిద్యాలయం (ఎపి) వైస్ చాన్స్లర్ డాక్టర్ ప్రశాంత్ కుమార్ మహంతి అన్నారు. స్థానిక పితామహల్లో గల సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా చదువుపై శ్రద్ధ వహించాలని అన్నారు. సెంచూరియన్ విద్యాసంస్థల ప్రాంతీయ డైరక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ పాఢి మాట్లాడుతూ జీవితాన్ని రూపొందించడం, మెరుగైన సమాజాన్ని స్థాపించడంలో విద్యార్థుల పాత్ర కీలకమన్నారు. భార్యకు గుర్తుగా.. రాయగడ: మృతి చెందిన భార్యకు గుర్తుగా సొంత ఖర్చులతో కల్యాణ మండపాన్ని నిర్మిం ప్రేమను చాటుకున్నాడు ఓ భర్త. జిల్లాలోని గుణుపూర్లో ఉదయ్ నాయక్ నివసిస్తున్నాడు. అతని భార్య మృదుభాషిణి 2022లో మృతి చెందారు. అయితే తన భార్యపై గల ప్రేమతో ఈ ప్రాంతంలొ ఏదైన గుర్తుగా ప్రజలకు వినియోగపడే పని చేయాలని సంకల్పించుకున్న నాయక్ గుణుపూర్లోని త్రినాథస్వామి మందిరం సమీపంలో సుమారు 1000 చదరపు అడుగుల స్థలంలో సుమారు ఎనిమిది లక్షల రూపాయలతో కల్యాణ మండపాన్ని నిర్మించారు. గత ఏడాది పనులు ప్రారంభించగా.. ఇప్పుడు నిర్మాణం పూర్తికావడంతో దాన్ని ప్రజలకు అంకితం చేశారు. భార్యపై ఉన్న ప్రేమను ఈ విధంగా చాటుకోవడంతో అందరూ నాయక్ను అభినందించడంతో పాటు ప్రజాహిత కార్యక్రమాల కోసం సొంత ఖర్చులతో అందరికీ వినియోగపడే కల్యాణ మండపం నిర్మించి ఇవ్వడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. -
మాజీ మంత్రి కాన్హు చరణ్ లెంకా మృతి
భువనేశ్వర్: భారత పార్లమెంటు మాజీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంపీ కాన్హు చరణ్ లెంకా (86) కన్నుమూశారు. ఆయన కేంద్రంలో పీవీ నరసింహారావు హయాం ప్రభుత్వంలో రైల్వే, వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. కాన్హు చరణ్ లెంకా 1988–94 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. కటక్ జిల్లా చౌద్వార్ నియోజక వర్గం నుంచి ఎన్నికై 1995 నుంచి 2000 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. శాసన సభ ఆవరణలో తుది వీడ్కోలు కాన్హూ చరణ్ లెంకా భౌతిక కాయం రాష్ట్ర శాసన సభకు చేరిన తర్వాత ప్రభుత్వ లాంచనాలతో తుది వీడ్కోలు పలికారు. శాసన సభ స్పీకరు సురమా పాఢి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్ప గుచ్ఛంతో నివాళులర్పించారు. -
సరోజినీనాయుడు సేవలు చిరస్మరణీయం
గార : మహిళలకు స్వేచ్ఛ లేని రోజుల్లో విద్యావేత్తగా, గాన కోకిలగా పేరుగాంచిన సరోజినీనాయుడు చిరస్మరణీయరాలని కె.మత్స్యలేశం సర్పంచ్ బి.లలిత అన్నారు. శుక్రవారం సరోజినినాయుడు జయంతి సందర్భంగా స్థానిక బుద్ధా పాఠశాలలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నత విద్యావేత్తగా, రచయిత్రిగా, మహిళా స్వేచ్ఛ కోసం మహిళా విద్య కోసం నిరంతరం శ్రమించిన మహిళా పక్షపాతి సరోజినీనాయుడు అని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బి.ఎర్రన్న, ప్రిన్సిపాల్ నంద్యాల శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
కోర్టు ముందు హాజరైన మావో నేత ఆజాద్
రాయగడ: మావో నేత ఆజాద్ అలియాస్ దున్న కేశవరావును శనివారం జిల్లాలోని బిసంకటక్ ఫస్ట్క్లాస్ జ్యూడిషియల్ డివిజనల్ కోర్టులో హాజరుపరిచారు. జిల్లాలోని చంద్రపూర్లో మావోయిస్టు నాయకుడు ఆజాద్, సబ్యసాచి, నిఖిల్తో పాటు మరో 200 మంది సాయుధులైన మావోయిస్టులు చంద్రపూర్ టెలిఫొన్ ఎక్స్చేంజీ, బీఆర్సీ కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేశారు. ఈ మేరకు చంద్రపూర్లో మే 20 వ తేదీ 2010లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి చంద్రపూర్ ఐఐసీగా విధులు నిర్వహించే కై లాస్ చంద్ర బురుడా మావోలపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా కొంతమందిని పర్లాకిమిడిలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయగా, మావో నేత ఆజాద్ను శనివారం బిసంకటక్ కోర్టులో హాజరుపరిచారు.వృద్ధురాలికి గాయాలు రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి పరిధి సికరపాయి పంచాయతీలోని బిరిడి గ్రామానికి చెందిన ఆదివాసీ వృద్ధురాలు గాయాలకు గురయ్యింది. శుక్రవారం రాత్రి మంచంపై పడుకున్న ఆమె మంచం కింద వెచ్చదనం కోసం అగ్గితో కుంపటిని పెట్టుకుని నిద్రించింది. ఈ క్రమంలో అర్ధరాత్రి ఆమె మంచానికి నిప్పు అంటుకుని వీపు భాగం పూర్తిగా కాలిపోయి గాయాలు పాలైంది. దీంతో అరచి కేకలు వేయడంతో కుటుంబీకులు ఆమెను మంటల నుంచి రక్షించి వెంటనే సమీపంలోని హాస్పిటల్కు చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు.వరిగడ్డి కుప్పలు దగ్ధం జయపురం: సబ్ డివిజన్ పరిధి బొయిపరిగుడ సమితి లక్ష్మీపూర్ మాలిగుడ గ్రామంలోని ఒక కల్లంలో కుప్పలుగా వేసిన గడ్డి వాములు అకస్మాత్తుగా కాలి బూడిదయ్యాయి. 12 ఎకరాల్లో పండిన ధాన్యం నూర్పులు జరిగిన తర్వాత గడ్డిని రైతులు కల్లంలో కుప్పలు వేశారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఆ గ్రామ రైతులు జగబందు మాలి, తైల మాలి, హరిహర మాలి, నరేంద్ర మాలి, బలభద్ర మాలి మొదలగు వారు కల్లంలో కుప్పలు వేసిన గడ్డి వాములు కాలిపోయాయి. కల్లానికి సమీపంలోని కాయగూరల మడుల్లో ఉంటున్న కొంతమంది మంటలు వేయగా, బాగా గాలి వీచి అగ్గి రవ్వలు గడ్డి వాములపై పడి అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక విభాగం అధికారులు వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు రూ.80 వేల నష్టం ఉంటుందని అంచనా వేశారు.ట్రాన్స్ఫార్మర్లో మంటలు రాయగడ: పట్టణంలోని కేఎస్కో లోపల ఉన్న ట్రాన్స్ఫార్మర్లో శనివారం మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడి వారు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటపాటుగా శ్రమించి మంటలను అదుపుచేయగలిగారు. ఈ ఘటనలో ఎటువంటి ధన, ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి తీసుకున్నారు. 10 లీటర్ల విదేశీ మద్యం బాటిళ్ల స్వాధీనం మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితిలో అక్రమ మద్యం అమ్మకాలపై కలిమెల పోలీసులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఐఐసీ ప్రభుదత్త విశ్వాల్ నేతృత్వంలో పోలీసులు పనిమేట్లా గ్రామంలో దాడులు చేసి ఒకరిని అరెస్టు చేసి పది విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తి ఎం.పి.వి.61 గ్రామానికి చెందిన రంజిత్ రాయ్గా గుర్తించారు. శుక్రవారం రంజిత్పై కేసు నమోదు చేశారు. -
కలకలం
మావో బ్యానర్లరాయగడ: జిల్లాలోని శేశిఖాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల దుమ్మాగుడ, చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల పాయికొపొడ, కల్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కుంభారగుడ ప్రాంతాల్లో మావో బ్యానర్లు కలకలం సృష్టించాయి. ఒకే సారి మూడు ప్రాంతాల్లో మావో బ్యానర్లు దర్శనం ఇవ్వడంతో ఆయా ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొన్నాళ్ల కిందట జిల్లా పోలీస్ కార్యాలయంలో 15 మంది మావోలు పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలొ లొంగిపొవడంతో జిల్లాలో మావోల బెడద పొయిందని భావిస్తున్న సమయంలొ మళ్లీ ఒకే రోజు మూడు ప్రాంతాల్లో మావో బ్యానర్లు కనిపించడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పట్టణానికి కేవలం కిలొమీటరున్నర దూరంలో ఉన్న దుమ్మాగుడ వంటి ప్రాంతంలొ మావోబ్యానర్లు ఏర్పాటు కావడం ఆందోళనకు గురిచేస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి వీటిని మావోలు ఏర్పాటు చేశారు. శనివారం నాడు ఆయా ప్రాంతాలకు సీఆర్పీఎఫ్ దళాలు చేరుకుని మావో బ్యానర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురవ్వొద్దని సీఆర్పీఎఫ్ దళాలు కోరాయి. మూడు ప్రాంతాల్లో దర్శనం ఇచ్చిన మావో బ్యానర్లలో మావో రాష్ట్ర శాఖ కార్యదర్శి మేఘా జాని, డొంబురు మాఝిల పేరిట ఉన్నాయి. ఇటీవల కాలంలొ మావోలుగా చెప్పుకుని పోలీసుల సమక్షంలో లొంగిపొయిన సవ్యసాచి పండ, నిఖిల్ రౌత్ అనే వ్యక్తులు ఆదివాసీలు కాదని బ్యానర్లలో రాసి ఉండటం కనిపించింది. ఆదివాసీ పేర్లతో మావోలుగా జీవనాన్ని కొనసాగించిన వారు ఆదివాసీల పేర్లు చెప్పుకుని వ్యాపారం చేసేవారని వారికి త్వరలొ బుద్ధి చెబుతామని వివరించారు. అదేవిధంగా జిల్లాలో ఏర్పాటువుతున్న బృహత్తర పరిశ్రమలు దొపిడికే ప్రాధాన్యమిస్తున్నాయని ప్రజల సంక్షేమం కోసం ఏమాత్రం కృషి చేయడం లేదని బ్యానర్లలో వివరించారు. ఆ బ్యానర్లు సందేహాస్పదమే.. మావో పేర్లతో జిల్లాలో మూడు ప్రాంతాల్లో మావోల పేర్లతో వెలసిన బ్యానర్లు సందేహాస్పదంగా ఉన్నాయని అడిషనల్ ఎస్పీ, ఎస్పీ ఇన్చార్జి అమూల్య కుమార్ ధల్ ప్రకటించారు. ఈ మేరకు స్థానిక ఎస్డీపీఓ కార్యాలయం ప్రాంగణంలో శనివారం నాడు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోలంటూ ఏర్పాటుచేసిన బ్యానర్లలొ పేర్కొన్న మావో నాయకుల పేర్లను తామెప్పుడు వినలేదని, అదేవిధంగా అయితే దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజానిజాలు నిగ్గు తేలుస్తామని భరోషా ఇచ్చారు. జిల్లాలొ మావోల సంఖ్య పూర్తిగా కనుమరుగువుతున్న నేపథ్యంలో శనివారం నాడు మూడు ప్రాంతాల్లో దర్శనం ఇచ్చిన బ్యానర్లకు సంబంధించి మూడు కేసులను నమోదు చేశామని అన్నారు. -
కుటుంబ సంక్షేమంపై దృష్టిసారించాలి
పర్లాకిమిడి: కుటుంబ సంక్షేమంపై సిబ్బంది దృష్టిసారించాలని అధికారులు అన్నారు. గజపతి జిల్లాలో మహిళా, శిశుఅభివృద్ధి శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలతో కన్వర్జెన్స్ సమావేశాన్ని కలెక్టరేట్ హాల్లో శుక్రవారం జరిగినది. ఏడీఎం ఫల్గునీ మఝి, జిల్లా పరిషత్ ఆదనపు కార్యనిర్వాహణాధికారి పృద్వీరాజ్ మండళ్, ప్రోగ్రాం, ప్రోటెక్షన్ అధికారిని సరలా పాత్రో, డీడబ్ల్యూవో మనోరమాదేవి పాల్ అంగన్వాడీ కేంద్రాల్లో శిశువులకు నెలసరి రేషన్, కిశోర్ దివాస్, బాలలకు పోషకాహార అద్వికా షెషన్సు ద్వారా సరఫరా, బాలలకు తరచూ హెల్త్, బరువు కోలతలు చేపట్టాలని ఏడీఎం మఝి సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీ రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలైన 40 మంది ఆదివాసీ వృద్ధ మహిళలకు శుక్రవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు, నూనె, బంగాళదుంపలు తదితర నెలకు సరిపడే నిత్యావసరాలను పంపిణీ చేసినట్లు ట్రస్టు నిర్వాహకురాలు ఎం.నళిని తెలియజేశారు. ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీధర్ ఆచార్య ప్రతీనెలా ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. అదేవిధంగా వంద మంది అనాథ ఆదివాసీ పిల్లలను ట్రస్టు ద్వారా ఉచితంగా చదివించడంతో పాటు వారికి వసత, భోజన సౌకర్యాలను కల్పిస్తున్నారని తెలియజేశారు. -
నాడు కొడుకు.. నేడు తండ్రి..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒక ఇంటిపై విధి ఎంత క్రూరంగా విరుచుకుపడిందన్నది సారిపల్లి గ్రామం కన్నీళ్లతో చెబుతోంది. ఎనిమిది నెలల కిందట కొడుకును రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన ఆ తండ్రి... ఇంకా ఆ బాధ నుంచి కోలుకోకముందే అదే తరహా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది. నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామానికి చెందిన నడిపేన శ్రీనివాసరావు(58) వృత్తి రీత్యా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బస్సు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హరీష్ భోగాపురం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా డ్రైవర్ వృత్తి చేస్తున్నాడు. చిన్న కుమారుడు పురుషోత్తం కూడా తండ్రివలే డ్రైవర్ వృత్తి చేస్తూ భక్తులను సుదూర ప్రాంతాల్లో తీర్థ యాత్రలకు తీసుకువెళ్లేవాడు. సుమారు ఎనిమిది నెలల కిందట భక్తులను కాశీ యాత్రకు తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అలాంటి ప్రమాదంలోనే తండ్రి కూడా కన్నుమూయడం ఆ కుటుంబాన్ని కలిచివేస్తోంది. -
శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
శ్రీ మందిరం ఆదాయం లెక్కింపు నగదు : రూ. 6,96,748 బంగారం : 5 గ్రాముల 300 మిల్లీ గ్రాములు వెండి : 81 గ్రాముల 100 మిల్లీ గ్రాములు – భువనేశ్వర్/పూరీప్రమాదం జరిగిందిలా.. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో వేగంగా వెళ్తున్న బస్సు బాలాసోర్–భద్రక్ రోడ్డు మార్గంలో బహనాగా చౌరస్తా సమీపంలో రెండు బ్రిడ్జిల మధ్య అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఆ ధాటికి బస్సు అద్దం పగిలిపోయి డ్రైవర్ కిందపడి చనిపోయారు. బస్సులో ఉన్న మరో డ్రైవర్కు, వంటమనిషికి గాయాలయ్యాయి. డ్రైవర్ వెనక సీటులో కూర్చొన్న కొండ వెలగాడకు చెందిన భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 10 మందికి గాయాలయ్యాయి. బస్సులో ఉన్న 40 మంది నెల్లిమర్ల మండలం కొండ వెలగాడ గ్రామస్తులే.తీర్థయాత్ర ముగిసే వేళ..భువనేశ్వర్/కొరాపుట్: బాలాసోర్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉదయం సుమారు 5.15 గంటల ప్రాంతంలో బాలాసోర్–భద్రక్ రోడ్డు మార్గంలో బహనాగా చౌరస్తా సమీపంలో కోల్కతా నుంచి పూరీకి వెళ్తున్న శ్రీ వెంకటలక్ష్మి యాత్రికుల బస్సు అదుపు తప్పి డివైడర్పైకి దూసుకెళ్లింది. ఫలితంగా బస్సు డ్రైవర్ వంతెనను ఢీకొట్టడంతో వంతెన కిందకు ఊగిసలాడింది. డ్రైవర్ కిందకు పడడంతో అక్కడికక్కడే మరణించాడు. ఖంతపడా ఠాణా పోలీసులు ఘటనా స్థలం చేరి సహాయక చర్యలు పర్యవేక్షించారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ వాసులు. కాశీయాత్రకు బయల్దేరి ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. క్షతగాత్రులను ఖంతపడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ఖంతపడా ఠాణా పోలీసులు, బహనాగా అగ్నిమాపక విభాగం, జాతీయ రహదారి పోలీసులు సంయుక్తంగా గాయపడిన ప్రయాణికులను సంఘటన స్థలంలో రక్షించి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ప్రమాదాన్ని గమనించి తక్షణమే చొరవ కల్పించుకుని బాధితులకు సహాయక చర్యలు చేశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి గాయపడిన వారిని ఆదుకున్నారు. కాశీయాత్ర ముగుస్తుందనగా.. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా నుంచి కాశీ యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం సంభవించడంతో ఘటనా స్థలంలో బస్సు డ్రైవర్ నడిపేన శ్రీనివాస రావు (55) మృతి చెందాడు. అతడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామస్తుడు. ఘటనా స్థలం సందర్శించిన బాలాసోర్ జిల్లా ఖంతపొడా ఠాణా పోలీసులు మృతదేహం స్వాధీనపరచుకుని శవ పరీక్షల కోసం సొరొ ఆస్పత్రికి తరలించినట్లు ఠాణా అధికారి తెలిపారు. కాశీ యాత్ర కోసం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం నుంచి ఈ నెల 2వ తేదీన 40 మంది యాత్రికులతో ఈ బస్సు బయల్దేరింది. మరో రెండు రోజుల్లో వీరి యాత్ర పూర్తి కానున్న చివరి దశలో ఘోర ప్రమాదానికి గురైందని నెల్లిమర్ల మండలం నివాసి జి. గణేష్ ‘సాక్షి’కి వివరించాడు. యాత్రికులు అంతా 45 ఏళ్లు పైబడిన వారుగా పేర్కొన్నాడు. యాత్రికుల్లో 28 మంది మహిళలు ఉన్నారు. కాశీ యాత్ర ముగించుకుని పూరీ, కోణార్క్ సందర్శనకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగిందని వాపోయాడు. అంతా స్వల్ప గాయాలతో చికిత్స పొంది కోలుకున్నట్లు వివరించాడు. ఫకీర్ మోహన్ వైద్య బోధన ఆస్పత్రిలో వీరికి చికిత్స కొనసాగిస్తున్నారు. గాయపడిన వారిలో 8 మంది మహిళలు ఉన్నారు. బాధితులకు వసతి, చికిత్స వంటి మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఈ సంఘటనపై విచారణ చేపట్టిన ఖంతపొడా ఠాణా ఏఎస్ఐ ఉదయ్ భక్త్ సాక్షికి తెలిపారు. డ్రైవర్ శవ పంచనామా శనివారం జరుగుతుందన్నారు. సాయం కోసం నిరీక్షణ ప్రమాదం తర్వాత మార్గమధ్యంలో స్తంభించి పోయిన యాత్రికులు సాయం కోసం నిరీక్షిస్తున్నారు. తిరుగు ప్రయాణానికి అనుకూలమైన సౌకర్యాలు కల్పించాలని అభ్యర్థిస్తున్నారు.ప్రమాదానికి గురై వంతెనపై ఊగిసలాడుతున్న యాత్రికుల బస్సుమరో రెండు రోజులు ఆగితే.. ఈ నెల 2వ తేదీన వీరు విజయనగరం జిల్లా నుంచి తీర్థయాత్రలకు బయల్దేరారు. కాశీ కూడా చూసి వచ్చేశారు. మరో రెండు రోజుల్లో యాత్ర పూర్తవుతుంది. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు నడిపేన శ్రీనివాసరావు కుమారుడు ఎనిమిది నెలల కిందటే చనిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి మరో చావు కబురు వినిపించడం విషాదకరం.ఇంకా చీకటి తెరలు తొలగని వేకువ. అంతా మగత నిద్రలో ఉన్న వేళ. రోడ్డుపై దూసుకెళ్తున్న బస్సు అకస్మాత్తుగా ఆగింది. బస్సులో ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లేచి చూసే సరికి బస్సు వంతెనపై నుంచి వేలాడుతోంది. రెండు బ్రిడ్జిల మధ్య ఉన్న పొడవాటి డివైడర్ను బస్సు ఢీకొట్టడంతో డ్రైవర్ బస్సు అద్దంతో పాటు బయటికి తుళ్లిపోయి వంతెన కిందకు పడి ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడో విజయనగరం జిల్లా నుంచి తీర్థయాత్రలకు బయల్దేరి కాశీ చూసుకుని మరో రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోతామనగా.. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన టూరిస్టు బస్సు అదుపు తప్పి వంతెనపై వేలాడిన వాహనం ఒకరి మృతి, 14 మందికి గాయాలు బాధితులు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల వాసులు -
కేంద్రమంత్రిని కలిసిన బెంగాళీ సమాజ్ సభ్యులు
మల్కన్గిరి: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మల్కన్గిరి జిల్లా బెంగాళీ సమాజ్ సభ్యులు ఢిల్లో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా మల్కన్గిరిలో గత ఏడాది డిసెంబర్ 7, 8 తేదీల్లో యం.వి.26 హిందూ బెంగాళీ గ్రామంపై జరిగిన సమూహ దాడి విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని పునః పరిశీలించాలని కోరారు. బెంగాళీ సమాజ జిల్లా అధ్యక్షుడు గౌరాంగ కర్మకార్ నేతృత్వంలో గోపాల్చంద్ర విశ్వాస్, నిర్మాయ్ చంద్రపాల్, మాణికలాల్ చక్రవర్తి, కమలేష్ రాయ్, ఉత్తమ్ బసు, భవాని శంకర్ ముఖర్జీ, సంజయ్ సర్కార్, నిహార్ రాయ్లు ఢిల్లీలో ఆదివాసీ అభివృద్ధి మంత్రి జువల్ ఓర్మ్, సమ్బిత్ పాత్రో, ఎంపీ వృద్రనారాయన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ను కలిసి తమ సమస్యలను వివరించారు . -
జగన్నాథ ఆలయంపై డ్రోన్ ఎగురవేత
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ ఆలయంపై నిషేధిత పరిధి ప్రాంతంలో డ్రోన్ ఎగురవేసి పర్యాటకుడు పట్టుబడ్డాడు. నో–ఫ్లై జోన్ నిబంధన ఉల్లంఘన ఆరోపణ కింద నిందితుని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కర్ణాటకకు చెందిన 25 ఏళ్ల యువకుడు అభ్యుదయ సిన్హాగా గుర్తించారు. శ్రీ మందిరం ఉత్తర ద్వారం పరిసరాల్లో డ్రోన్ సరంజామాతో పోలీసులకు చిక్కాడు. సింహద్వార్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్యాన్సర్పై అవగాహన అవసరం రాయగడ: మహిళల్లో తరచూ కనిపించే బ్రెస్టు క్యాన్సర్పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కేంద్రాస్పత్రి ఏడీఎంవో డాక్టర్ మమత చౌదరి అన్నారు. స్థానిక సాయిప్రియ మహిళా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయం ప్రాంగణంలో జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలొ ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. వివిధ స్టేజీల్లో కనిపించే బ్రెస్టు క్యాన్సర్ ఎలా సంభవిస్తుంది, తీసుకునే జాగ్రత్తలు గురించి ఆమె వివరించారు. గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ లోక్నాథ్ రాజు మాట్లాడుతూ.. జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలని అన్నారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మితంగా ఆహారం తీసుకోవడం, క్రమతప్పకుండా వ్యాయామం చేయడంతో ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. క్లబ్ అధ్యక్షురాలు పొట్టాం రమాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులకు సన్మానించారు. -
కొనాబాయిలో అగ్ని ప్రమాదం
● ఎనిమిది పూరిళ్లు దగ్ధం రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి పరిధి కొనాబాయి గ్రామంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది పూరిళ్లు దగ్ధమయ్యాయి. విలువైన పత్రాలు , డబ్బులు, పత్తి, రాగులు తదితరమైనవి కాలి బూడిదైనట్లు గుర్తించారు. మధ్యాహ్నం కొనాబాయిలోని మానిక్ హుయికకు చెందిన ఇంట్లో తొలుత మంటలు చెలరేగి.. పక్కనే ఉన్న మిగతా ఇళ్లకు వ్యాపించాయి. గ్రామస్తులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అయితే సిబ్బంది వచ్చేలోగానే ఇళ్లు కాలిపొయాయి. తరువాత నిప్పులను ఆర్పివేశారు. -
ఆకట్టుకున్న ‘విచలిత మట్టి’
జయపురం: జయపురం సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో సబ్డివిజన్ కుంద్ర సమితి పరిధిలోని కుంద్ర గ్రామంలో గల బిజూ పట్నాయక్ కళాశాల రజిత ఉత్సవ వేదికపై ప్రదర్శించిన ‘విచలిత మట్టి’ సామాజిక నాటకం సమాజంలో రుగ్మతలతోపాటు ఆదర్శాలను ప్రతిభింబింపచేసింది. జగదీష్ అధికారి కలం నుంచి వెలువడిన ‘విచలిత మట్టి’ నాటకానికి నిరంజన్ పాణిగ్రహి దర్శకత్వం వహించారు. జి.మహేష్, ఈశ్వర్సరాఫ్ సంగీతం సమకూర్చారు. నాటకంలో మహమ్మద్ షరీఫ్, సురేష్ హోత్త, పంచానన మిశ్ర, నృశింహ షొడంగి, మోహన్రావు, అనిల్ జెనా, సరోజ్ మిశ్ర, నిరంజన్ పాణిగ్రహి, పవిత్ర మల్లిక్, విజయలక్ష్మి పాణిగ్రహి, మనిష, ప్రీతి, ప్రతీక్ష, సాస్వతి, స్మైల్, ప్రాణిత, ఆర్యన్, నివేదన్ పాణిగ్రహి తమ పాత్రలకు జీవం పోశారు. ఈ నాటకంలో జన్మభూమిని ప్రేమించటం, మొక్కలు నాటడం వలన కలిగే ప్రయోజనాలు, మానవ జీవితంలో విద్య యొక్క ఆవస్యకతకు ప్రాధాన్యత ఇచ్చారు. మరో పక్క మద్యపానం వలన కలిగే అనర్థాలు నాటకం ద్వారా ప్రజలకు తెలియజేశారు. అవిభక్త కొరాపుట్లో ఆదివాసీల దుర్భర జీవణ పరిస్థితిని ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు నటులు నటించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివాసులు, న్యాయవాది మధ్య జరిగిన వివాదం ఈ నాటకంలో ప్రదర్శించి ప్రేక్షకులను అలరించింది. ఈ నాటకంలో కళాకారుల నటన, నృత్య ప్రదర్శనలు చూపరుల ప్రశంసలు అందుకున్నాయి. నాటక ప్రదర్శనకు గోపాల సామంతరాయ్, లాలూ మిశ్ర, ఆర్యన్, నివేదన పాణిగ్రహి సహకరించారు. -
ఇన్విజిలేషన్లో ఆటోమేషన్ సరికాదు
శ్రీకాకుళం: మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి అనారోగ్యంతో ఉన్న ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం డీఈవో రవిబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్విజిలేషన్ విధులు నిర్వహించడంలో ఆటోమేషన్ విధానాన్ని అవలంబించడం సరికాదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు పలు ఇబ్బందులు ఉంటాయని, వాటిని పరిశీలించి మినహాయింపు ఇవ్వాలని కోరారు. 220 పని దినాలు తక్కువ కాకుండా పనిచేసిన పాఠశాలలకు రెండో శనివారం సెలవుగా ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పప్పల రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు తంగి మురళీమోహన్రావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బి.రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కరణం సీతరాజు, రూరల్ మండల అధ్యక్షుడు రెడ్డి వెంకటరమణ, ఎం.ఆనందరావు, ఎం.భాస్కరరావు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి గారబంద ఎస్.వి.టి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోష్ చట్టంపై అవగాహన, బాల్యవివాహాల నివారణ, ఎస్.ఓ.పిపై శిబిరాన్ని జిల్లా న్యాయ సేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రౌళో ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ శిబిరంలో జస్టీస్ కార్నర్ చారిటబుల్ ట్రస్టు సభ్యులు భాగ్యలక్ష్మి నాయక్, గారబంద సబ్ ఇన్స్పెక్టర్ లోకనాథ బెహరా, గారబంద ఎస్.వి.టి ప్రధాన ఉపాధ్యాయులు బి.గంగాధర్ పాల్గొన్నారు. విద్యార్థినులకు చట్టాలపై అవగాహన అవసరమన్నారు. ఈ శిబిరంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హిరమండలం: ఎల్.ఎన్.పేట మండల కేంద్రం సమీపంలో ఉన్న తాయిబాంబాపురం నిర్వాసిత కాలనీకి చెందిన రైతు సురవరపు సింహాచలంకు చెందిన ఎనిమిది బస్తాల ధాన్యం చోరికి గురైనట్లు ఆయన తెలిపారు. కాలనీ సమీపంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ధాన్యాన్ని నిల్వ చేశామని, పాఠశాల ప్రహరీ విరగ్గొట్టి ధాన్యం బస్తాలను అపహరిచినట్లు వాపోయాడు. ధాన్యం విలువ సుమారు రూ.15 వేలు ఉంటుందన్నారు. దీనిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం క్రైమ్: ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు కె.శంకరరరావుకు తోటి సిబ్బంది స్వచ్ఛందంగా ఒక్కరోజు వేతనం రూ.4.07 లక్షలను అందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఈ చెక్ను శంకరరావుకు అందజేశారు. మందస: మందస రాజవంశీయులు, టెరిటోరియల్ ఆర్మీ మాజీ అధికారి పటాయత్ ప్రతాప్ కేసరి సింగ్ దేవ్(78) గుండెపోటుతో ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఉన్న ఖార్వేలనగర్లో మరణించారు. ఆయన మరణంతో మందస, ఒడిశాలో విషాదచాయలు అలముకున్నాయి. దివంగత రాజ జగన్నాథ రాజమణి రాజ్ దేవ్ ద్వితీయ కుమారుడైన ప్రతాప్ కేసరి సింగ్ దేవ్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయి. చెక్కు అందజేస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి -
గ్రీన్ ఎకానమీ సాధనకు కృషి
భువనేశ్వర్: భారత్లో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) సహకారంతో రాష్ట్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు విభాగం ఆధ్వర్యంలో 2వ విడత ఒడిశా ఫారెస్ట్రీ సెక్టార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ 14వ జాతీయ వర్క్షాప్ గురువారం కూడా కొనసాగింది. రెండో రోజు స్థితిస్థాపక, హరిత అటవీ ఆర్థిక వ్యవస్థపై కీలకమైన చర్చలు జరిపారు. దేశీయ, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా అటవీ వ్యవసాయ శాస్త్రం విస్తరణపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ భాస్కర్ జ్యోతి శర్మ మాట్లాడుతూ సమన్వయ ప్రయత్నాల ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రాలు, జైకా వంటి అంతర్జాతీయ భాగస్వాముల మధ్య సహకారం వాతావరణ స్థితిస్థాపక అటవీ రంగం వైపు భారత దేశం ప్రయాణాన్ని ఎలా వేగవంతం చేస్తుందో వర్క్షాప్ ప్రదర్శించిందన్నారు. వన సురక్ష సమితి, స్వయం సహాయక బృందాల సామాజిక సభ్యులతో భాస్కర్ జ్యోతి శర్మ సంభాషించారు. జీవనోపాధి మద్దతు చొరవలు, పర్యావరణ పునరుద్ధరణకు ఒడిశా నిబద్ధతను పునరుద్ఘాటించారు. జైకా ఇండియా సీనియర్ ప్రతినిధి వాకమట్సు ఈజీ సమక్షంలో వర్క్షాప్ ఫలితాలను అభివృద్ధి నిపుణుడు సిద్ధార్థ్ పరమేశ్వరన్ ప్రదర్శించారు. వాతావరణ అనుకూలత, అటవీ పరివర్తన , డిజిటల్ పరివర్తన భవిష్యత్ సహకారానికి మూలస్తంభాలుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతో కూడిన బహుళ భాగస్వామ్య సహకారం ప్రాముఖ్యత ఈ కార్యకలాపాల ప్రధాన ఇతివృత్తమని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, ఫారెస్ట్ ఫోర్స్ హెడ్ డాక్టర్ కె.మురుగేశన్, ఓఎఫ్ఎస్డీపీ అదనపు పీసీసీఎఫ్ (ప్రాజెక్ట్సు) డైరెక్టర్ జి.రాజేష్, సంయుక్త ప్రాజెక్ట్ డైరెక్టర్ స్వయం మల్లిక్ ప్రసంగించారు. -
ధాన్యం బస్తాల స్వాధీనం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితిలో పలు ధాన్యం మండీల్లో జరుగుతున్న అన్యాయాలపై ఫిర్యాదులు అందడంతో జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ గురువారం ఓ ప్రత్యేక బృందాన్ని పంపించారు. సరఫరాశాఖ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ వెళ్లి పరిశీలించారు. కొంతమంది వ్యాపారులు ధాన్యాన్ని ఒక చోటు నుంచి మరోక చోటుకు తరలిస్తున్నాని తెలుసుకొని దాడులు చేపట్టారు. బడలి పంచాయతీలో పరిధిలో ఒక ప్రైవేట్ గోదాంలో ప్రశాంత్ అనే వ్యక్తి నిల్వ ఉంచిన 200 క్వింటాళ్ల ధాన్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మాన్యంకొండ ప్రాంతాంలో ట్రాక్టర్తో 40 క్వింటాళ్లు, గొంపకొండ ప్రాంతంలో రెండు వ్యాన్లలో సుమారు 80 క్వింటాళ్ల ధాన్యాన్ని స్వాధీనం చేసుకుని కలిమెల పోలీసు స్టేషన్కు తరలించారు, డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. -
సమస్యలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు
● బీఎస్పీ నాయకుల ఆరోపణ రాయగడ: రాయగడ వంటి వెనుకబడిన జిల్లాలో సమస్యలు తిష్టవేసినప్పటికీ ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం విచారకరమని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్ర టకిరి అన్నారు. స్థానిక హోటల్ తేజస్వీలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యధికశాతం మంది ఆదివాసీ, హరిజనులు నివసిస్తున్న జిల్లాలో తాగునీటి సమస్య ప్రతీ గ్రామంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అన్నారు. జిల్లాలో 18 మేగా తాగునీటి ప్రాజెక్టులు నిర్మాణదశలో ఉండగా.. ఇందులో ఒకటి మాత్రమే పనిచేస్తుందని వివరించారు. 2024వ ఏడాది నాటికి మేగా తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేవిధంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినప్పటికీ వాటి దాఖలాలే కరువయ్యాయని అన్నారు. జిల్లాలోని మూడు శాసనసభ నియోజకవర్గాలతో పాటు కొరాపుట్ ఎంపీ స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఉన్నప్పటికీ ఏనాడుకూడా జిల్లా లొ ఉన్న సమస్యలకు సంబంధించి అసెంబ్లీ, లోక్సభలో ప్రస్తావించలేదని ఆరొపించారు. ఇదిలాఉండగా జిల్లాలొని నియమగిరి పర్వత ప్రాంతాల్లొ ఉన్న డొంగిరియా ప్రజల ఆర్ధిక,సామాజిక రంగాల అభివృధ్దిని దృష్టిలొ పెట్టుకుని ఒపిలిపి సంస్థను ఏర్పాటు చేశారని అయితే దాని కాలపరిమిత పూర్తవ్వడంతో సంస్థను మూసివేశారని అన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జాడలు కనుమరుగవుతున్నాయని అన్నారు. అదేవిధంగా గత బిజేడి ప్రభుత్వం స్పెషల్ డెవలప్మెంట్ కౌన్పిల్ (ఎస్డీసీ )ని ఏర్పాటు చేసిందని ఆ ప్రభుత్వం పరాజయం పాలవ్వడంతో ప్రస్తుతం గల బీజేపీ ప్రభుత్వం దాని ఊసే తీసుకురావడం లేదని అన్నారు. ప్రత్యేకంగా ఆదివాసీల అభివృద్ధి కోసం ఆవిర్భవించిన సంస్థను పునహా ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. మనోరేగ పథకంలో గాంధీ పేరును తొలగించిన విషయమై కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఆ పేరు గురించి ఆందోళనలు చేస్తున్నారే తప్పా ప్రజలకు అవసరమ్యే సమస్యల గురించి పట్టించుకోకపొవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు శూన్యం జిల్లాలో ఇండాల్, ఇంఫా, జేకేపేపర్ మిల్, వేదాంత్ , ఉత్కల అలూమిన వంటి బృహత్తర పరిశ్రమలు ఉన్నా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకపొవడంతో వారు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తుందని బీఎస్పీ రాష్ట్ర శాఖ సాధారణ కార్యదర్శి గంగాధర్ పువ్వల అన్నారు. పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోతున్న నిరుద్యోగ యవతీ, యువ కులు అక్కడ నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ విషయమైన ప్రజా ప్రతినిధులు పట్టించుకొకపొవడం , ప్రస్తావించకపొవడం ప్రజలు చేసుకున్న దుర్భాగ్యమని అన్నారు. సమావేశంలొ ఆ పార్టీ రాష్ట్ర శాఖ కన్వినర్ జితు జకసిక, జిల్లా పరివేక్షకులు రామ్దాస్ టకిరి, జిల్లా ఉపాధ్యాక్షులు జగం బెనియాలు పాల్గొన్నారు. -
జాతీయ పెన్షన్ పథకంపై శిక్షణ
పర్లాకిమిడి: జిల్లా ట్రెజరీ కార్యాలయం ప్రాంగణంలో జాతీయ పెన్షన్ పథకం (ఎన్.పి.ఎస్)పై శిక్షణ శిబిరాన్ని ట్రెజరీ, ఆడిట్ డైరెక్టరేట్ (భువనేశ్వర్) మనోరంజన్ సాహు గురువారం ప్రారంభించారు. ఈ శిబిరంలో అకౌంటెంట్ ఆరవింద సాహు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న ఎన్.పి.ఎస్పై అవగాహన, వివిధ సమస్యల పరిష్కారం, అభియోగాలను వివరించారు. కొత్తగా ఉద్యోగాలలో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్.పి.ఎస్ ఖాతా ఎలా తెరవాలి, వాటికి కావాల్సిన డాక్యుమెంట్లు, సంసోదన ప్రక్రియ, ఇతర విషయాలపై మార్గదర్శకాలను వివరించారు. ఈ శిబిరంలో జిల్లా కోశాధికారి ప్రియబ్రతో షడంగి, సంగీత కుమారి, అదనపు జిల్లా కోశాధికారి, ఇతర ఉపకోశాధికారులు, ప్రభుత్వ విభాగాల డి.డి.ఓ.లు, ఎన్.పి.ఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ శిబిరం 13వ తేదీ వరకు జరగనుంది. -
ఆది శంకరాచార్యులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆది శంకరాచార్యులపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆరామ ద్రావిడ సంఘం ప్రతినిధులు అంపోలు రుద్ర కోటేశ్వర శర్మ, వనమాలి వెంక టరమణమూర్తిశర్మ, శృంగారం ధనుంజయ శర్మ, దార్లపూడి రవిశర్మలు ఖండించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు వినతిపత్రం గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన జీ యర్స్వామి వ్యాఖ్యలు ఆధారాలు లేనివని మండిపడ్డారు. విమర్శలను నిరూపించే సత్తా అతని కి ఉందా అని ప్రశ్నించారు. ఆది శంకరాచార్యులు చతుర్మయీ పీఠం స్థాపించి నాలుగు వేదాలను స్థాపించారని తెలిపారు. ఆయన తర్వాత రామాచార్యులు, ఆగ్రచార్యులు, భాస్కరాచార్యులు ఈ పీఠాలను నిర్వహించారని, ఇదంతా చారిత్రాత్మకమైనది గుర్తు చేశారు. రామరాయి పీఠం, నాలుగు వేదాలు, శివతత్వంను భోదించే శిలాఫలకాలు ఉన్నాయన్నా రు. పంచాయతనాలు, సుబ్రహ్మణ్య పీఠం ఇందుకు నిదర్శనమని వివరించారు. చిన జీయర్స్వామి తన మాటలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. -
విందు భోజనాలకు వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు..
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం ● మరొకరికి గాయాలు రాయగడ: విందు భఓజనాలకు వెళ్లి తిరిగి తమ స్వగ్రామానికి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలకు గురయ్యారు. ప్రమాదంలొ మృతి చెందిన వారిలో జిల్లాలోని పద్మపూర్ సమితి ఇందుపూర్ గ్రామానికి చెందిన నాయబ్ సర్పంచ్ కల్పన కై బర్త (55), ఆమె మనవరాలు పవిత్ర కై కబర్త (9 ఉన్నారు. గాయాలు తగిలిన వ్యక్తి శ్రీరాం కై బర్తగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను సమీపంలో ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించగా.. గాయపడిన శ్రీరాంను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. వివరాల్లోకి వెళితే .. బుధవారం శ్రీరాం, అతని భార్య కల్పన, మనవరాలు పవిత్రలు బైక్పై గజపతి జిల్లాలోని పర్లాకిమిడి విందు భోజనాలకు వెళ్లారు. కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం తిరిగి స్వగ్రామానికి బయలు దేరారు. ఈ క్రమంలో రాయగడ జిల్లా పద్మపూర్ సమితి పరిధిలోని కొరడ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ వారిని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలొ కల్పన, పవిత్రలు తీవ్రగాయాలకు గురై సంఘటన స్థలం వద్దే మృతి చెందగా గాయాలతో శ్రీరాం బయటపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెల్పపారు. -
బంద్ ప్రశాంతం
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలు, వాణిజ్య ఒప్పందాలు, ప్రైవేటీకరణ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు పలు కార్మిక సంఘాలు, పార్టీలు గురువారం నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. ట్రేడ్ యూనియన్ కో–ఆర్డినేషన్ సెంటర్ (టీయూసీసీ) రాష్ట్ర కమిటీ, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్ టీయూసీ), ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ), హింద్ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ ), ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్(ఏఐసీసీటీయూ), అనుబంధ రాజకీయ పార్టీలు సమ్మెలో పాల్గొన్నాయి. 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని తప్పుపట్టాయి. కొత్తగా రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. – సాక్షి నెట్వర్క్ భువనేశ్వర్: నిర్మానుష్యంగా రహదారి -
గవర్నర్తో మంత్రి భేటీ
భువనేశ్వర్: లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటితో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పాలన, అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై వారు నిర్మాణాత్మక చర్చలు జరిపారు. త్వరలో బడ్జెటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరివురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బంద్లో చిక్కుకున్న పెళ్లికొడుకు భువనేశ్వర్: దేశవ్యాప్త బంద్లో భాగంగా భువనేశ్వర్లో వాహనాల రాకపోకలను ఆందోళనకారులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో వివాహ వేదిక వద్దకు వెళ్తున్న పెళ్లికుమారుడి వాహనాన్ని అడ్డుకోవడంతో బంధువులంతా ఆందోళనకు గురయ్యారు. స్థానిక జయదేవ్ విహార్ స్క్వేర్లో జాతీయ రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తమ వాహనాన్ని బంద్ నుంచి మినహాయించాలని కోరడంతో ఆందోళనకారులు సానుకూలంగా స్పందించి దారి ఇవ్వడంతో పెళ్లికుమారుడు, బంధువులు ముందుకు కదిలారు. నేడు నబరంగ్పూర్లో సీఎం మోహన్చరణ్ మజ్జి పర్యటన కొరాపుట్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజ్జి శుక్రవారం నబరంగ్పూర్ జిల్లాకి రానున్నారు. ఉదయం మండయ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. పడాలగుడ ప్రాంతంలో నిర్మించనున్న మెడికల్ కళాశాల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే శ్రీ జగన్నాథ తీర్థ యోజన పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలు పూరీ జగన్నాథ దర్శనం ఉచితంగా చేసుకోవడానికి సహాయం అందుతుంది. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి ప్రభాతీ పరిడా, మంత్రులు ముఖేష్ మహాలింగ్, నిత్యానంద గొండోలు పాల్గొంటారు. సుమారు రు.400 కోట్ల విలువ గల వివిధ ప్రాజెక్ట్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. హజ్ యాత్రికులకు వైద్యపరీక్షలు జయపురం: కొరాపుట్ జిల్లా అధికార యంత్రాంగం, కొట్పాడ్ ఆరోగ్య కేంద్రం సంయుక్తంగా జయపురం సబ్ డివిజన్ కొట్పాడ్లోని మసీదులో అవిభక్త కొరాపుట్కు చెందిన 39 మంది హజ్ యాత్రికులకు గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. కొట్పాడ్ నుంచి 8 మంది ముస్లింలో హజ్యాత్రకు విదేశాలకు వెళ్తున్నట్లు మతపెద్దలు వెల్లడించారు. దూడను చంపిన పులి! రాయగడ: జిల్లాలోని మునిగుడ అటవీ రేంజ్ పరిధిలో డిమిరిగుడ సమీపంలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. గురువారం ఓ దూడపై దాడి చేసి పులి తిన్నట్లు అనుమానిస్తున్నారు. దూడను కట్టి ఉన్న ప్రాంతంలో పులి అడుగు జాడలు కనిపించినట్లు గ్రామస్తులు అటవీ శాఖ వారికి తెలియజేయడంతో రేంజర్తో సహా సిబ్బంది చేరుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రైవేటు బస్సు యజమానుల సమస్యలు పరిష్కరించాలి
జయపురం: తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేటు బస్ యాజమాన్య సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు జయపురం ప్రైవేటు బస్సుల యాజమాన్య సంఘ కార్యదర్శి, రవాణ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, పీడీ, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారులపై రాష్ట్ర హైకోర్టులో కొన్ని ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు మా జగత్ జననీ ప్రైవేట్ యజమానుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు అశోక్ కుమార్ రోయ్, కార్యదర్శి బి.ఎస్.ఆర్.శానాపతి, ఉపాధ్యక్షులు అజయ్ రావత్, తిరుపతిపాణిగ్రహి, ఫిరోజ్ తెలిపారు. గురువారం సంఘనాయకులు విలేకరులతో మాట్లాడారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ సమయంలో ఇతర కార్యక్రమాలలో పాల్గొన్న బస్సులు రూట్ పర్మిట్ పొందినట్లు వారు ఆరోపించారు. అలాగే ప్రైవేట్ బస్సు స్టాండ్లోని దుకాణాలను మున్సిపాలిటీకి కేటాయించక పోవటం, బస్సు స్టాండ్లో ఉన్న స్టాళ్ల అద్దెలు మున్సిపాలిటీకి జమచేయక పోవటం, ఎన్నికలు జరగకుండానే ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం జోన్–11లో ఉపాధ్యక్షుడుగా తానే స్వయంగా ప్రకటించు కోవటం మొదలగు అంశాలను ప్రస్తావించారు. అయితే వారి ఆరోపణలను ప్రైవేట్ బస్ యజమానుల సంఘ కార్యదర్శి తీవ్రంగా ఖండించారు. తన సొంత బంధువులను మోసం చేసి జైలుకు వెళ్లిన వ్యక్తి చేసిన ఆరోపణల్లో ఎంత వరకు నిజం ఉందో ప్రజలు తెలుసు కోవాలన్నారు. -
నేటి నుంచి.. జగన్నాథ దర్శన యోజన ఆరంభం
భువనేశ్వర్: పూరిలో జగన్నాథుని దర్శనం కోసం ప్రభుత్వం జగన్నాథ దర్శన యోజనకు సంకల్పించింది. శుక్రవారం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నవరంగ్పూర్ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. దీనిలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 వేల మంది వృద్ధులకు పూరీ శ్రీ మందిరంలో రత్న వేదికపై కొలువుదీరిన జగన్నాథున్ని సులభంగా దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ఉచిత రాకపోకలు, వసతి, భోజనం, సులభ దర్శనం, మహా ప్రసాదం వగైరా ఏర్పాట్లు ప్రభుత్వం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంది. తొలి దశలో 500 మంది భక్తులు పూరీ చేరుకుని జగన్నాథుని దర్శనం చేసుకుంటారు. స్వామిని దర్శించుకున్న తర్వాత వారంతా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పూరీ సర్క్యూట్ హౌస్లో జిల్లా మేజిస్ట్రేట్ దివ్యజ్యోతి పరిడా అధ్యక్షతన గురువారం సన్నాహక సమావేశం జరిగింది. ఆధ్యాత్మిక, మతపరమైన పథకం కావున సేవా దృక్పథంతో పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో రాష్ట్రంలో 5 జిల్లాల నుంచి 500 మంది భక్తులు రానున్నారు. 13వ తేదీ సాయంత్రం దాదాపు 200 మంది చేరుతారు. మిగిలిన వారు 14వ తేదీ ఉదయం వస్తారని పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి సరోజ్ కుమార్ స్వంయి తెలిపారు. 60 నుంచి 75 సంవత్సరాల వృద్ధులు, వితంతువులు ఈ పథకంలో చేరవచ్చు. సంబంధిత జిల్లా యంత్రాంగం వారి జాబితాను తయారు చేసి పూరీ జిల్లా యంత్రాంగానికి అందజేస్తుంది. -
ఆటోను ఢీకొట్టిన కారు
కంచిలి: మకరాంపురం వద్ద జాతీయ రహదారిపై జాడుపూడి నుంచి సోంపేట వెళ్తున్న ఆటోను ఒడిశాకు చెందిన కారు బుధవారం ఉదయం ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్, మరో మహిళ ఉన్నారు. కారులో డ్రైవర్ ఉన్నాడు. ఈ ఘటనలో కవిటి మండలం రాపాకపుట్టుగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నల్లాన సుందరరావు తీవ్రంగా గాయపడగా, మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రుడిని సోంపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మొసళ్లను సంరక్షించాలి
రాయగడ: మొసల్లను సంరక్షించడంతో పర్యావరణ సమతుల్యానికి ఎంతో దోహదపడుతుందని గంజాం కళాశాల అధ్యాపకులు మహేంద్ర శతపతి అన్నారు. స్థానిక అటానమస్ కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం మొసల్ల సంరక్షణ స్వర్ణోత్సవ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొసల్ల సంరక్షణ కోసం చిత్తడి నేలల ఆరోగ్యానికి చాలా ముఖ్యమని అన్నారు. ఇవి జల ఆవరణ వ్వవస్థలో అగ్ర మాంసాహారులుగా పాత్ర పోషిస్తుంటాయని వివరించారు. నీటి వనరులను శుభ్రతగా ఉంచడంతోపాటు ఇతర జంతువుల జనాభాను నియంత్రించే విషయంలో కీలక పాత్ర పోషిస్తుంటాయన్నారు. వీటిని సంరక్షించడంతో ఆర్థిక లాభాలతోపాటు పర్యావరణానికి ఎంతో దోహదపడుతుంటాయన్నారు. ఈ సదస్సులో అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ సరస్వతి రాయ్, జంతుశాస్త్ర విభాగాధిపతి పూజా పట్నాయక్, డాక్టర్ రాజేష్ స్వయ్, అధ్యాపకురాలు జ్యోతి, రమేష్ హుయిక, తదితరులు పాల్గొన్నారు. -
సౌర విద్యుత్కు ఆదరణ
శ్రీకాకుళం: రూఫ్ టాప్ సౌర విద్యుత్తు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు దేశాభివృద్ధికి దోహదపడవచ్చని ఆర్కే టెక్నాలజీస్ అధినేత పైడి చందు బుధవారం తెలిపారు. సూర్యకాంతితో విద్యుదుత్పత్తి మూలంగా కరెంట్ బిల్లు పూర్తిగా తగ్గడంతో పాటు అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్ గ్రిడ్కు చేరి తిరిగి వినియోగదారుడికే ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చు తక్కువే కాబట్టి ప్రతి ఒక్కరూ సౌర ఫలకాలు తమ ఇళ్లపై ఏర్పాటు చేసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీని వినియోగించుకోవాలన్నారు. ఏపీఈపీడీసీఎల్, నెడ్క్యాప్ అన్ని విధాలా సహకారం అందిస్తున్నాయని చెప్పారు. నేడు దేశవ్యాప్త సమ్మె రణస్థలం: లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని కోరుతూ గురువారం తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం రణస్థలం, పైడిభీమవరంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఉమ్మడిగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఎన్.నాగేశ్వరరావు, కె.బోగేష్, బి.తోటయ్య, గురు, ఈశ్వరరావు, రమణ, రామారావు తదితరులు పాల్గొన్నారు. గార: సర్వశిక్ష అభియాన్ పధకం కింద నియమితులైన పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్ల విషయంలో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్ట్ పార్ట్టైమ్ టీచర్ల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి పి.వి.సత్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం గారలో ఆయన విలేకరుతో మాట్లాడుతూ 13 ఏళ్లుగా సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఆర్ట్స్, క్రాప్ట్స్, వ్యాయాయ ఉపాధ్యాయులందరూ సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం–2009కి లోబడి 2013 నుంచి రెగ్యులర్ చేయడంతో పాటు ఇతర ప్రయోజనాలను కల్పించాలన్నారు. పూర్తిస్థాయి ఉద్యోగులగా గుర్తించాలని కోరారు. 17న జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: శాప్ ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్ఏ) ఆధ్వర్యంలో ఈ నెల 17న శ్రీకాకుళంలో జిల్లాస్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్డీఓ ఎ.మహేష్బాబు తెలిపారు. శాంతినగర్కాలనీలో ఉన్న ఇండోర్ స్టేడియం వేదికగా అండర్–13, అండర్–15, అండర్–17, అండర్–19 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా ఎంపికలు మొదలుకానున్నాయని చెప్పారు. విజేతలగా నిలిచిన బాలురు, బాలికలను ఈ నెల 21 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నామని తెలిపారు. వివరాలకు 7680075375, 9390352942 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఉద్యోగాల పేరిట మోసం హిరమండలం: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఘరానా మోసానికి పాల్పడిన వ్యక్తిని హిరమండలం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై వి.హేమంత్ కళ్యాణ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేజర్ పంచాయతీ హిరమండలం చిన్న కోరాడ వీధికి చెందిన బోయిన జనార్దనరావు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఓ ఐదుగుర్ని మోసం చేశాడు. వారి వద్ద నుంచి రూ.13.50 లక్షలు వసూలు చేశాడు. దీనిపై బాధితుడు టి.సంతోష్ ఫిర్యాదు మేరకు హిరమండలం పోలీస్స్టేషన్లో 2025లో చీటింగ్ కేసు నమోదైంది. నిందితుడు జనార్దనరావును బుధవారం పోలీసులు అరెస్టు చేసి కొత్తూరు కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సూచించారు. -
ముగిసిన స్వీయ రక్షణ నైపుణ్య శిబిరం
రాయగడ: స్థానిక అటానమస్ కళాశాలలో నిర్వహిస్తున్న స్వియ రక్షణ నైపుణ్య శిబిరం బుధవారంతో ముగిసింది. కళాశాల ప్రిన్సిపాల్ సరస్వతి రాయ్ అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు సభలో ఆదర్శ్ డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ శ్యామ మోహన్ పాత్రో ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. ఆత్మరక్షణ, ఆత్మ విశ్వాసాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వీయరక్షణ, భద్రతను తెలుసుకోవాలని సూచించారు. ఆత్మరక్షణ అనేది కేవలం శారీరక నైపుణ్యం మాత్రమే కాదని, మనో ధైర్యానికి ప్రతీకని అన్నారు. నేటి సమాజంలో విద్యార్థులు ఇటువంటి శిక్షణ తీసుకోవడం ఎంతో మేలన్నారు. అటానమస్ కళాశాల పీజీ కౌన్సిల్ చైర్మన్ పి.ఆరుణ్ కుమార్, అధ్యాపకురాలు టి.జ్యోతి, ఉదయ్ నాయక్, తదితరులు ప్రసంగించారు. అనంతరం విద్యార్థులకు శిక్షణకు సంబంధించిన ధ్రువపత్రాలను అందజేశారు. -
వైద్య రంగంలో హైటెక్ మరో ముందడుగు
భువనేశ్వర్: వైద్య రంగంలో హైటెక్ గ్రూప్ మరో ముందడుగు వేసింది. ఆరోగ్యం, చికిత్స, వైద్య రంగాల్లో సమయానుకూల విధానాల అనుసరణ దృక్పథంతో ఒడిశా మెడికల్ డివైసెస్ ఎక్స్పో 2026 నిర్వహణకు సారథ్యం వహిస్తుంది. ఈ నెల 13 నుండి 15 వరకు బారముండా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ ప్రదర్శన జరుగుతుంది. వైద్య రంగంలో విశేష అధునాతన చికిత్స విధానాల్ని విస్తృతపరచాలని హైటెక్ సంకల్పించింది. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వైద్య, చికిత్స రంగాల్లో పలు అధునాతన సాంకేతిక, వైజ్ఞానిక పరికరాల ప్రాధాన్యత పుంజుకుంటుంది. ఈ పరిస్థితిపై రాష్ట్రంలో వైద్య వర్గాలకు పూర్తి అవగాహన కల్పించి ప్రజలకు అధునాతన శైలిలో నాణ్యమైన చికిత్స, వైద్య సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ఈ ఏడాది ఒడిశా మెడికల్ డివైసెస్ ఎక్స్పో 2026 నిర్వహణ బాధ్యతల్ని స్వీకరించినట్లు హైటెక్ గ్రూప్ డైరెక్టర్ అనిల్ కుమార్ పాణిగ్రాహి తెలిపారు. దేశ వ్యాప్తంగా పేరొందిన వైద్య పరికరాల ఉత్పాదనలు ఈ ప్రదర్శనలో చోటు చేసుకుంటాయి. వాటి వినియోగం, చికిత్స, వైద్య రంగాల్లో ప్రయోగం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు పెద్ద సంఖ్యలో అనుభవజ్ఞులైన వైద్య ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాలుపంచుకుంటారని ఆయన వివరించారు. 50 పైబడి ప్రముఖ వైద్య పరికరాల ఉత్పాదన సంస్థలు, 1500 మంది వైద్య ప్రముఖులు, వివిధ వర్గాల పారా మెడికల్ ప్రతినిధులు ఈ ప్రదర్శనలో పాలుపంచుకుంటారు. ఈ కార్యక్రమం పురస్కరించుకుని స్థానిక హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆడిటోరియంలో బుధ వారం ఒడిశా వైద్య పరికరాల ప్రదర్శన – 2026 పోస్టరు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హైటెక్ గ్రూప్ డైరెక్టర్ అనిల్ కుమార్ పాణిగ్రాహితో ఒడిశా వైద్య సేవల సంఘం (ఒంసా) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషోర్ చంద్ర మిశ్రా, శ్రీకాంత్ కుమార్ సామల్ హాజరు అయ్యారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో అధునాతన సాంకేతిక వైద్య పరికరాలు గణనీయమైన మార్పును తీసుకువస్తాయని వీరంతా వివరించారు. -
మార్చి 29 నుంచి మజ్జిగౌరి చైత్రోత్సవాలు
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం, కొర్కెలు తీర్చే చల్లని తల్లి మజ్జిగౌరి వార్షిక చైత్రోత్సవాలు మార్చి 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బుధవారం నాడు మందిరం కార్యాలయంలో మేనేజింగ్ ట్రష్టీ రాయిసింగి బిడిక ఆధ్వర్యంలో జరిగిన కమిటీ సభ్యుల సమావేశంలో నిర్ణయించారు. ఉత్సవాల్లో భాగంగా మార్చి 28 వ తేదీ సాయంత్రం మందిరం సమీపంలో గల జంఝావతి నది వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించి శుద్ధమైన గంగాజలాలను తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో నిలపడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. 29 నుంచి అమ్మవారి చైత్రోత్సవ పూజలను నిర్వహిస్తారు. ఐదు రోజుల పాటుగా జరిగే ఉత్సవాలు ఏప్రిల్ 2 వ తేదితో ముగుస్తాయి. రూ.16 లక్షలతో ఉత్సవాలు ఈ ఏడాది అమ్మవారి చైత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించింది. అందుకు సుమారు రూ.16 లక్షలను కేటాయించింది. ఇందులొ ఐదు రోజుల పాటుగా జరిగే పూజల కోసం అదేవిధంగా విద్యుత్ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం నిధులు కేటాయించేందుకు సమావేశంలో నిర్ణయించారు. గంజాం జిల్లా నుంచి ఏటాలా ఈసారి కూడా పూజలు నిర్వహించేందుకు పండితులను రప్పించాలని సమావేశంలో నిర్ణయించారు. ఐదు రోజుల పాటు నిర్వహించే విశేష పూజలతో పాటు చండీహోమం కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తారు. ఉత్సవాలను తిలకించేందుకు హాజరయ్యే భక్తులకు తాగునీటి సౌకర్యాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు ఆది,మంగళ, బుధవారాల్లో అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో పాటు చైత్రోత్సవాల్లొ వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు సమావేశంలో చర్చించారు. సమావేశంలో ట్రస్ట్ సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, దేవేంద్ర బెహర, రాధాక్రిష్ణ దొలాయి. మంగరాజ్, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. -
దారికాచిన మృత్యువు
● జమ్ము వద్ద రోడ్డు ప్రమాదం ● వృద్ధురాలు దుర్మరణం నరసన్నపేట : పాతపట్నం మండలం తిడ్డిమికి చెందిన దువ్వారి జానకమ్మ(60) అనే వృద్ధురాలు జమ్ము గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. సోదరుడు తూలుగు దుర్యోధనరావు హస్తికలను శ్రీకూర్మంలో కలిపేందుకు బంధువులతో కలిసి గురువారం వేకువజామున ఆటోలో వెళ్తుండగా ఈ ఘటన చోసుకుంది. జమ్ము గ్రామానికి ముందు ఆటో ఆపి రోడ్డుకు మరో వైపు కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి ఆటో వద్దకు వస్తుండగా పాతపట్నం వైపు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో పైకి ఎగిరిన ఆమె కారు బోనెట్పైనుంచి రోడ్డుమీదకు తుళ్లిపడింది. కాలు, తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. జానకమ్మ మృతితో తిడ్డిమి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. జానకమ్మ కుమార్తె గుంపు శ్రీలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఎస్సై బి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీజేడీకి జిల్లా ఉపాధ్యక్షుని గుడ్ బై
రాయగడ: బీజేడీ పార్టీకి జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్ సావుంతా రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగన్నాథ సరక, రాష్ట్ర శాఖ సాధారణ కార్యదర్శి సుధీర్ దాస్లకు పంపించారు. కొద్ది రోజుల కిందట బీజేడీ అధినేత రాయగడ జిల్లాకు కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఆ జాబితాలో జిల్లా ఉపాధ్యక్షునిగా నియమితులైన సావుంతా పదవిలో కొద్ది రొజులు మాత్రమే కొనసాగిన తర్వాత ఆ పార్టీకి రాజీనామ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాయగడ శాసన సభ పరిధిలో గల కాశీపూర్లో అత్యంత కీలకమైన పార్టీ నాయకుడిగా పనిచేస్తున్న సావుంతా రాజీనామా చేయడంతో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. బీజేడీ పార్టీలో అవిభక్త కొరాపుట్ జిల్లాలోనే మంచి పట్టుఉన్న రాజ్యసభ మాజీ ఎంపి నెక్కంటి భాస్కరరావు ఇదివరకే పార్టీకి గుడ్బై చెప్పి బిజు స్వాభిమాన్ మంచ్ ను ఏర్పాటు చేశారు. దీంతో ఈ జిల్లాలొ ఆయన లేని కొరత పార్టీకి కొట్టొస్తున్నట్లు కనబడుతుంది. ఈ నేపథ్యంలో బీజేడీ జిల్లాలో ఉనికి కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. బీజేడీ జిల్లా అధ్యక్షుడు జగన్నాధ సరక పార్టీని ఏ దిశవైపు నడిపించుకుని వెళ్తారో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
పశ్చిమ బెంగాల్ దంపతులకు మగశిశువు దత్తత
పర్లాకిమిడి: పశ్చిమ బెంగాల్ దంపతులకు గజపతి జిల్లా రెవెన్యూ ఏడీఎం మునీంద్ర హానగ బుధవారం ఒక మగశిశువును దత్తత నిమిత్తం అందజేశారు. ఇప్పటివరకూ 76 మంది శిశువులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దత్తత నిమిత్తం జిల్లా నుంచి అందజేశారు. ఒక అవివాహిత ఈ శిశువుకు జన్మనిచ్చి పెంచలేక ప్రభుత్వ చైల్డ్ ప్రోటెక్షన్ యూనిట్కు అందజేసింది. తదనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు కాశీనగర్ బ్లాక్ రాణిపేట గ్రామంలో పౌష్యసంతాన కేంద్రం నిస్సాన్ సలోంకు పంపి ఆలనపాలన చూశారు. సంతానం లేని పశ్చిమ బెంగాల్ దంపతులు నాలుగేళ్ల కిందట పోర్టల్లో దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం వారికి చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, సంతాన దత్తత కేంద్రం (రాణిపేట) అధికారులు సమక్షంలో ఏడీఎం మునీంద్ర బిడ్డను అందజేశారు. బిడ్డను చేరదీసి అందుకున్న ఆ తల్లి కన్నీళ్లు కార్చింది. బిడ్డ అప్పగింతలో డీసీపీయూ అరుణ్ కుమార్ త్రిపాఠి, ప్రత్యూష్ కుమార్ సూర్య, శిశుసంక్షేమ సమితి చైర్మన్ అశ్వినీ కుమార్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యకర పర్యావరణం
అడవులతోనే..భువనేశ్వర్: అడవులతోనే ఆరోగ్యకర వాతావరణం సాధ్యమవుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ మంత్రి గణేష్ రామ్ సింగ్ ఖుంటియా పిలుపునిచ్చారు. భారత దేశంలో జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) సహాయ అటవీ ప్రాజెక్టుల 14వ జాతీయ వర్క్షాప్ ప్రారంభోత్సవం పురస్కరించుకుని బుధవారం మంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమం 3 రోజులపాటు నిరవధికంగా కొనసాగుతుంది. అటవీ పర్యావరణ పరిరక్షణ, అటవీ ఉత్పాదనల ప్రోత్సాహం తదితర రంగాల్లో జాతీయ ప్రముఖులతో జపాన్ నుంచి నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భావి అటవీ సన్నద్ధత శీర్షికతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వాతావరణ మార్పులు, డిజిటల్ పరివర్తన, అటవీ ఆర్థిక వనరుల సుస్థిరత దిశలో భావి కార్యాచరణ రూపకల్పన ఈ వర్క్షాపు ప్రధాన లక్ష్యంగా వక్తలు పేర్కొన్నారు. భారత దేశ అటవీ రంగంలో సాంకేతికత, స్థిరత్వం ఏకీకరణకు వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేసేందుకు ప్రముఖులు అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని నిర్మాణాత్మక కార్యాచరణ ఖరారు చేస్తారు. జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) రెండో విడత ఒడిశా ఫారెస్ట్రీ సెక్టార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కార్యకలాపాలు త్వరలో పూర్తి కానున్నాయి. వర్ధమాన పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాజెక్టు 3వ విడతని కొనసాగించాలని మంత్రి ప్రతిపాదించారు. ఈ చర్యతో భారత దేశంలో అత్యంత దుర్బల జనాభాను రక్షించడం సుసాధ్యం అవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో జైకా భాగస్వామ్యం కీలక పాత్ర పోషించిందని మంత్రి ప్రశంసించారు. 2వ విడత ఒడిశా ఫారెస్ట్రీ సెక్టార్ డెవలప్మెంట్ వచ్చే సంవత్సరం మార్చిలో పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో 3వ విడత అమలు చేసి కొనసాగించాలని మంత్రి కోరారు. సమృద్ధ ఒడిశా 2036 దార్శనికతకు ఈ కొనసాగింపు దోహదపడుతుందన్నారు. వికసిత్ భారత్ 2047లో సమృద్ధ ఒడిశా కీలక అంశంగా నిలుస్తుందన్నారు. ఈ ప్రతిపాదనపై అనుభవజ్ఞులైన అంతర్జాతీయ విధాన నిర్ణేతలు చర్చించాలని తెలిపారు. వర్కుషాపు ప్రారంభోత్సవ సభలో జైకా భారత దేశ డెవలప్మెంట్ ఆపరేషనన్స్ చీఫ్ వినీత్ ఎస్.సరిన్ మరియు జైకా ఇండియా సీనియర్ ప్రతినిధి వాకమత్సు ఈజీ కీలక ప్రసంగాలు చేశారు. భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ కె. బి. సింగ్, ఒడిశా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఫారెస్ట్ ఫోర్స్ ప్రముఖుడు డాక్టర్ కె. మురుగేషన్, అదనపు పీసీసీఎఫ్ (ప్రాజెక్ట్సు), ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.రాజేష్ తదితర ప్రముఖులు వర్కుషాపు కార్యశైలి ప్రధాన అంశాలపై ప్రసంగించారు. -
24 కేజీల గంజాయి స్వాధీనం
నరసన్నపేట: తక్కువ డబ్బులకు ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి ఎక్కువ డబ్బులకు ఇతర ప్రాంతాల్లో అమ్మకానికి తీసుకువెళ్తున్న ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 24 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం నరసన్నపేట సీఐ మరడాన శ్రీనివాసరావు, ఎస్సై బలివాడ గణేష్లు విలేకరులకు వివరాలు వెల్లడించారు. మడపాం టోల్గేట్ వద్ద మంగళ, బుధవారాల్లో పోలీసులు వాహనాల తనిఖీ చేపడ్డారు. లారీల్లో కొందరు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీయగా వారి వద్ద గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా భీమనాపూర్కు చెందిన ఇస్సాకో రైతా, గంజాం జిల్లా కమల పడార్ గ్రామానికి చెందిన సాగర్ పహాన్లు హైదరాబాద్కు 12 కేజీల గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. అలాగే ఉత్తరప్రదేశ్ బాగ్పట్ జిల్లా తాండ గ్రామానికి చెందిన ఆసిఫ్ఖాన్, ఆదిల్ ఖాన్లు జైపూర్లో 12 కేజీల గంజాయి కొనుగోలు చేసి కొరాపుట్ మీదుగా ఉత్తర ప్రదేశ్ వెళ్తుండగా మడపాం వద్ద పట్టుబడ్డారు. ఈ నలుగురినీ వేర్వేరు కేసుల్లో అరెస్టు చేశామని సీఐ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. -
క్యాన్సర్పై అవగాహన
రాయగడ: జిల్లాలోని మునిగుడకు సమీపంలో గల వేదాంత్ అలూమిన కర్మాగారం ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అవగాహన, చైతన్య ర్యాలీని నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తించగలిగితే నయమయ్యే అవకాశాలు ఉన్నాయని, ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్పందించి వైద్యులను సంప్రదించాలన్నారు. అప్రమత్తంగా వ్యవహరించాలని ప్లకార్డులు పట్టుకుని విద్యార్థులు నినాదాలు చేశారు. కర్మాగారం పరిసర ప్రాంతాల్లో ఇటువంటి తరహా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ఆయా ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను తరచూ ఏర్పాటు చేస్తున్నామని కర్మాగారం సీఈఓ ప్రణబ్ కుమార్ భట్టాచార్య అన్నారు. ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
కాలిబూడిదైన ఎలక్ట్రికల్ స్కూటీ
రాయగడ: పార్కింగ్ చేసి ఉన్న ఒక ఎలక్ట్రికల్ స్కూటీ కాలిబూడిదైన ఘటన జిల్లాలోని సదరు సమితి పితామహల్ వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పితామహల్ గ్రామంలో నివసిస్తున్న సుభాష్ చంద్ర బిశ్వాల్ అనే వ్యక్తి పదిహేను రోజుల క్రితం బ్యాటరీతో నడిచే ఎలక్ట్రికల్ స్కూటీని కొనుగోలు చేశాడు. మంగళవారం యథావిధిగా తన ఇంటి ముందు పార్కింగ్ చేసి రాత్రి పడుకున్నారు. అర్థరాత్రి భారీ శబ్ధం రావడంతో ఇంటి బయటకు వచ్చి చూడగా చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. అనంతరం పార్కింగ్ చేసిన స్యూటీ నుంచి మంటలు చెలరేగడంతో ఉలిక్కిపడ్డాడు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే స్కూటీ మంటలకు పూర్తిగా దగ్ధమయ్యింది. అయితే ఏ కారణంతో స్కూటీలో మంటలు చెలరేగాయి అనేది తెలియడం లేదు. స్కూటీలో షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. -
ఏఐ వినియోగంపై అవగాహన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం రాత్రి సురక్షత ఇంటర్నెట్ దినోత్సవాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్ర్ ప్రధాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఏడాది థీమ్గా స్మార్ట్టెక్, సేఫ్ చాయిసెస్–ఎక్స్ఫ్లోరింగ్ ది సేఫ్ అండ్ రెస్సాన్సిబుల్ యూజ్ ఆఫ్ ఏఐపై ప్రత్యేకంగా చర్చించారు. జిల్లా సమాచార శాస్త్రఅధికారి, జిల్లా ఈ–గవర్నెన్స్ మేనేజర్ కార్యక్రమంలో పాల్గొని ఈ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన, సురక్షిత డిజిటల్ పౌరులుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగాన్ని జాగ్రత్తగా, తెలివిగా ఎలా ఉపయోగించాలో వివరించారు. మరోవైపు జిల్లా సమాచార శాస్త్ర అధికారి ఏఐ వినియోగం వల్ల కలిగే లాభాలు, నష్టాలపై వివరంగా చర్చించారు. సైబర్ నేరాల నుంచి దూరంగా ఉండేందుకు ఇంటర్నెట్ను సురక్షితంగా ఉపయోగించాలంటూ విద్యార్థులను సూచనలు ఇచ్చారు. సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
మొబైల్ నెట్వర్క్ సౌకర్యాన్ని కల్పించాలి
జయపురం: కొరాపుట్, రాయగడ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు 4జీ మొబైల్ నెట్వర్క్ సౌకర్యాన్ని కల్పించాలని కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి శంకర ఉల్క విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర సంచార మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కొరాపుట్, రాయగడ జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు నేటికీ మొబైల్ నెట్వర్క్ సేవలు అందడం లేదని తెలిపారు. దీంతో ఆదివాసీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అత్యవసర పరిస్థితిలోనూ వైద్య సేవలు, విద్య, బ్యాంకింగ్ తదితర సేవలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు స్పందించి నెట్వర్క్ సదుపాయం కల్పిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.విద్యార్థులకు బహుమతులు అందజేత జయపురం: బొయిపరిగుడ సమితిలోని సాహిద్ లక్ష్మణ నాయిక్ డిగ్రీ కళాశాల, ఉన్నత మాధ్యమిక విద్యాలయంలో గతంలో నిర్వహించిన హిందీ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను బుధవారం అందజేశారు. స్వచ్ఛాసేవి సంస్థ, ఖాదీ గ్రామోద్యోగ అయోగ్లు సంయుక్తంగా ఈ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో బొయిపరిగుడ స్వచ్ఛంద సంస్థ సెడా కార్యదర్శి మురళీధర్ బరడ, సమితి విద్యాధికారి సుసాంత కుమార్ కడమ్, సాహిద్ లక్ష్మణ నాయిక్ ఉన్నత మాధ్యమిక విద్యాలయ పరిచాలన కమిటీ అధ్యక్షుడు కుముద్ రంజన్ మహరాణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ స్నేహలత పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు. ఘంటసాలకు నివాళి పర్లాకిమిడి: గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 52వ వర్ధంతి సభను పర్లాకిమిడి చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి ఆధ్వర్యంలో పాతపట్నం రోడ్డులో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు చలన చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో చైతన్య సమితి సభ్యుడు పారిశెల్లి రామరాజు (పాతపట్నం), కార్యదర్శి బర్నాల జనార్ధనరావు, అధ్యక్షుడు కె.ఆనందరావు, అంపోలు శ్రీను, ఎస్.ఎన్.పండా తదితరులు పాల్గొన్నారు. రాయగడ: గాన గంధర్వుడు ఘంటసాల సినీ జగతికి ఆశాదీపమని ప్రముఖ కవి, రచయిత, సీనియర్ పాత్రికేయులు భళ్లమూడి నాగరాజు అన్నారు. స్థానిక స్పందన సాహితీ, సాంసృతిక సంస్థ ఆధ్వర్యంలో రామలింగేశ్వర మందిరం ప్రాంగణంలో బుధవారం ఘంటసాల వర్ధంతి సభను నిర్వహించారు. అంతకుముందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్పందన సంస్థ సాంస్కృతిక విభాగం కార్యదర్శి కేకే ఎం.పట్నాయక్, సహ కార్యదర్శి బాలకృష్ణ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
14న రాష్ట్రీయ లోక్ అదాలత్
పర్లాకిమిడి: స్థానిక జడ్జి కోర్టులో జిల్లా న్యాయసేవా ప్రాధికరణ ఆధ్వర్యంలో మంగళవారం సివిల్ కోర్టులో వివిధ మోటారు వాహన చట్టాలు, లోక్ ఆదాలత్ కార్యక్రమం ప్రణాళిక, ఎం.సి.ఐ.ఏ.పి చట్టాలపై జిల్లా న్యాయ సేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రవులో అవగాహన కల్పించారు. ఈ న్యాయ సేవా ప్రాధికరణ, లీగల్ హెల్ప్ ఎయిడ్ సదస్సులో జిల్లా జడ్జి, చైర్మన్ జగదీష్ ప్రసాద్ మహంతి, అదనపు జిల్లా సెషన్సు జడ్జి, ముఖ్యమాజిస్ట్రేట్ సివిల్ సత్యనారాయణ పాత్రో, కోర్టు రిజిస్ట్రారు నరోత్తమ శెఠి, మహిళా కోర్టు (ఫ్యామిలీ) జడ్జి రస్మితా సాహు, ఎస్.డి.జె.ఎం విష్ణుప్రియ సామంతరే, జె.ఎం.ఎఫ్.సి సత్యజిత్ పాణి, ప్రోహిబిషన్ సివిల్ జడ్జి అభిమా మహాంకుడో, పర్లాకిమిడి బార్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.ఫృథ్వీరాజ్, సీనియర్ లాయర్ హీరాచంద్, ట్రాఫిక్ ఐఐసీ బల్లిక్ ప్రధాన్ తదితరులు హాజరయ్యారు. ఈ నెల 14వ తేదీన జిల్లా కోర్టులో ప్రఽథమ రాష్ట్రయ లోక్ అదాలత్ జరుగనున్నదని జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహంతి ఈ సందర్భంగా తెలియజే శారు. ఈ రాష్ట్రీయ లోక్ ఆదాలత్లో బ్యాంకు రుణాల ఎగవేత, చెక్బౌన్స్, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి చలాన్లు కట్టడం, మోటారు దుర్ఘటన నష్టపరిహారం కేసులు, లేబర్, శ్రమ విభాగం, కుటుంబ కోర్టు కేసులు వంటివి పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు ఈ నెల 14న పర్లాకిమిడి జిల్లా కోర్టుకు హాజరై దీర్ఘకాలిక కోర్టు కేసులకు పరిష్కరించుకోవాలన్నారు. కాశీనగర్, ఆర్.ఉదయగిరి, మోహన కోర్టుల్లో కూడా లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా న్యాయసేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రౌళో తెలియజేశారు. -
ముగిసిన సాంస్కృతిక పోటీలు
ఆదివాసీ జానపద నృత్యం చేస్తున్న విద్యార్థులుజయపురం: విక్రమదేవ్ విశ్వ విద్యాలయం (జయపురం) ఆధ్యర్యంలో నిర్వహించిన ఇంటర్ కళాశాలల స్థాయి సాహిత్య, సాంస్కృతిక పోటీలు–2026 సోమవారం రాత్రితో ముగిశాయి. విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతలో సృజనాత్మకత, ప్రతిభ, సాంస్కృతిక సమన్వయాన్ని ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. సంగీతం, నృత్య విభాగాలలో పోటీలు నిర్వహించారు. సంగీత పోటీల్లో క్లాసికల్, ఓకల్(సోలో), లైట్ ఓకల్(సోలో), ఇన్స్ట్రమెంటల్ మ్యూజిక్ (సోలో) విభాగాలలో నిర్వహించిన పోటీలలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయ రాజకీయ విజ్ఞాన విభాగాధిపతి మహేశ్వర్ దురియ, ఆల్ ఇండియా రేడియో జయపురం ఏ–గ్రేడ్ కళాకారుడు సనాతన్ పురోహిత్ దాస్, సమాజ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సాగరిక మిశ్ర, బీఈడీ అధ్యాపకురాలు కస్తూరీ ఆచార్య, రసాయనిక శాస్త్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ స్మిత సాగర్ శతపతి వ్యవహరించారు. నృత్య పోటీలలో క్లాసికల్ డాన్స్, కంటెంపరరీ డాన్స్, జానపద నృత్యాలు నిర్వహించారు. ఈ నృత్య పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఒడియా విభాగ సహాయ అధ్యాపకురాలు సుకాంతి సోయ్, ఒడియా విభాగ ప్రభుత్వ అధ్యాపకులు సంతోషిణి, జయపురం కళాకారుడు వై.గౌరీశంకర్ వ్యవహరించారు. ముఖ్యఅతిథిగా విక్రమదేవ్ యూనివర్సిటీ జయపురం రిజిస్ట్రార్ మహేశ్వర్ చంద్ర నాయక్ పాల్గొన్నారు. శని, ఆది, సోమవారాల్లో జరిగిన ఈ పోటీలతో విశ్వవిద్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. -
డీఈఓకు అవార్డు ప్రదానం
పర్లాకిమిడి: రాష్ట్ర స్థాయిలో గజపతి జిల్లా విద్యాశాఖకు ‘స్టెమ్ ఎక్స్లేన్సీ’ అవార్డును భువనేశ్వర్లో ఖాన్ అకాడమీ ద్వారా జిల్లా ముఖ్య విద్యాధికారి డాక్టర్ మయాధర్ సాహును ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేశారు. రాష్ట్ర స్థాయిలో అత్యధిక ఫస్ట్ క్లాస్లు సాధించి, టెన్త్ బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ఆయనను అభినందిస్తూ ఖాన్ అకాడమీ ప్రిన్సిపాల్ గాయత్రీ పట్నాయక్ ఎక్స్లెన్సీ అవార్డును సోమవారం అందజేశారు. స్టెమ్ ఎక్స్లెన్సీ ప్రోగ్రాం ద్వారా మోహన్కుమార్ నాయక్, గుంపు ఈశ్వరరావు టీచర్ లెర్నింగ్ కోర్సులు అభ్యసించి వాటిని జిల్లాలోని ఇతర ఉపాధ్యాయులకు తెలియజేయడం ద్వారా గజపతి జిల్లాలో విద్యార్థులు గత విద్యా సంవంత్సరంలో మంచి విజయాలు సాధించారన్నారు. ఫిబ్రవరి 19వ తేదీన జరుగనున్న ఒడిశా టెన్త్ బోర్డు పరీక్షల్లో కూడా గజపతిజిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని గాయత్రి పట్నాయక్ కోరారు. జిల్లాలో ఉన్నత పాఠశాలల్లో ఖరడ పి.ఎం.శ్రీ బి.ఎం.ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మోహన్రావుకి ఈ సందర్భంగా ఖాన్ అకాడమీ ప్రత్యేక అవార్డును ఇచ్చి సత్కరించింది. ‘వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి’ జలుమూరు: పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, దీని కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని డీఈఓ ఎ.రవిబాబు అన్నారు. మంగళవారం లింగాలవలస ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. టీచర్లు విద్యార్థులను గమనించి ఏ అంశంలో వెనుకబడ్డారో అందులో సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం పథ కం పరిశీలించారు. ‘ఏయూ డిస్టెన్స్ సెంటర్ కొనసాగించాలి’ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): శ్రీకాకుళంలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ డిస్టెన్స్ సెంటర్ను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ స్టడీ సెంటర్ వద్ద విద్యార్థు లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి చందు, పి.ఖగేష్లు మాట్లాడుతూ ఏయూ డిస్టెన్స్లో చదివే విద్యార్థులు క్లాసులకు వెళ్లగా, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ వైజాగ్ ట్రాన్స్ఫర్ చేశారని, కొత్తగా ఎవరిని ఇక్కడికి అలాట్ చేయలేదని, విద్యార్థుల కోసం సపోర్టింగ్ స్టాఫ్ ఎవరూ లేరని చెప్పడం దారుణమన్నారు. 2025– 2026లో 1500 మందికి పైగా విద్యార్థులు ఈ సెంటర్ ద్వారా అడ్మిషన్ తీసుకున్నారని, ఇప్పుడు సడన్గా ఈ హెల్ప్ సెంటర్ మూసివేయడం వల్ల వీరికి ఇబ్బంది ఎదురవుతుందన్నారు. -
కల్యాణం చూతము రారండి..!
● నేడు శ్రీనివాసుని కల్యాణ మహోత్సవం ● భక్తులకు ప్రవేశం ఉచితం శ్రీకాకుళం కల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవం బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించనున్నట్లు టీటీడీ కార్యాలయం సూపరింటెండెంట్ క్రాంతి కుమార్ వెల్లడించారు. నగరంలోని టీటీడీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. స్వామివారి ఆశీస్సులు భక్తుల చెంతకే చేర్చాలనే సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా కల్యాణం జరపనున్నట్లు తెలిపారు. దీనినే లోక కల్యాణం అని పిలుస్తారని చెప్పారు. ఈ కల్యాణోత్సవం కోసం సాక్షాత్తు తిరుమల క్షేత్రం నుంచి వేద పండితులు, అర్చక స్వాములు విచ్చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమల ఆలయం నుంచి వచ్చే విగ్రహాలకు వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీవారి కల్యాణం జరిపించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత అన్నారు. దైవ దర్శనం కోసం తిరుమల వెళ్లలేని భక్తులకు, వారి సౌకర్యార్థం అందుబాటులోకి స్వామివారిని తీసుకొచ్చి ఆశీస్సులు అందించాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కల్యాణోత్సవానికి ప్రవేశం ఉచితమని, భక్తులంతా విచ్చేసి దేవదేవుని కృపాకటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. సమావేశంలో టీటీడీ కల్యాణ ప్రాజెక్టు సూపరింటెండెంట్ హరికృష్ణ, జిల్లా ప్రోగ్రాం అసిస్టెంట్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు
జయపురం: సంబాద్ దినపత్రిక గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలలో గుర్తింపు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమని కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర చంద్ర పట్నాయిక్ అన్నారు. సంబాద్, డిజిటల్ ఎడిషన్ జయపురం స్థానిక డీపీ అకాడమీ స్టేడియంలో నిర్వహించిన మెగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జయపురంలో ఇండోర్ స్టేడియం నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రణాళికల విభాగ డిప్యూటీ డైరెక్టర్ సూర్యకాంత బెహరా ప్రారంభించిన ఈ పోటీలలో కొరాపుట్, రాయగడ, మల్కన్గిరి, నవరంగపూర్ జిల్లాల నుంచి 86 టీమ్లకు చెందిన 172 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. బహుమతి ప్రదానోత్సవానికి సంబాద్ జయపురం ఎడిషన్ చీఫ్ నవీన్ చంద్ర సాహు అధ్యక్షత వహించారు. 15 ఏళ్ల వయసు లోపు బాలుర డబుల్స్లో సాయిశ్రీ శతపతి, శౌమ్య పాఢీ లు చాంపియన్లుగా నిలిచారు. 15 ఏళ్ల లోపు బాలికల గ్రూపులో డబుల్సు లో నితేష్ పట్నాయిక్,మహమ్మద్ అరజిరాజ,లు, పురుషుల డబుల్స్లో శ్మితరంజన్ తంబ,అభినాష్ పంగిలు, 80 ఏళ్ల వయసు లోపు గ్రూపులో సిద్దార్ధ నాయిక్, అశోక్ బెహర, 70 ఏళ్ల గ్రూపు లో కన్హూ పట్నాయిక్, సిద్దార్ధ నాయిక్ చాంపియన్లుగా నిలిచారు. -
చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి
రణస్థలం: లావేరు మండలంలోని బుడుమూరు పంచాయతీ కూనపువానిపేట గ్రామానికి చెందిన మొండి సన్యాసి(71) శ్రీకాకుళం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లావేరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గ్రామ కోనేరులో స్నానానికి వెళ్లాడు. అకస్మాత్తుగా కాలుజారి చెరువులో పడిపోయాడు. స్థానికులు గుర్తించి ఇంటికి చేర్చారు. అప్పటికే నీరు ఎక్కువగా తాగడం వలన శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. కుమారుడు మొండి సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చత్తీస్గఢ్ సీఎంకు ఆహ్వానం పలాస: భిలాయిలో ఈనెల 22వ తేదీన జరగనున్న వాడబలిజ తెలుగు మహా సమ్మేళనానికి చత్తీష్ఘడ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు రాయిపూర్లోని సీఎం ఇంటికి మహాసభ సన్నాహక కమిటీ సభ్యులు మంగళవారం వెళ్లి ఆహ్వానించారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ సీఎం వస్తానని మాటిచ్చారని స్టీరింగ్ కమిటీ చైర్మన్ మొరిపల్లి బాబూరావు తెలిపారు. సీఎంను ఆహ్వానించిన వారిలో బర్రి జోగారావు, డాక్టర్ లండ జగన్నాధరావు, కొండప్ప కూర్మారావు, బైపల్లి దేవదాసు, కంబాల పాపారావు, లోకేష్ కుమార్, వాసుపల్లి గణేష్, కూర్మారావు తదితరులు ఉన్నారు. ప్రత్యేక తరగతులకు మినహాయింపు ఇవ్వాలి శ్రీకాకుళం: శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఫిబ్రవరి 15వ తేదీన ఉపాధ్యాయులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ నుంచి మినహాయింపు ఇవ్వాలని డీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు పేడాడ కృష్ణారావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పూజారి హరిప్రసన్న, ఎన్ని వెంకట ప్రసాద్లు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. పదో తరగతి 100 రోజుల ప్రణాళికలో భాగంగా శివరాత్రి రోజు ఆదివారం అయినప్పటికీ జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ప్రణాళికలో ఇవ్వడాన్ని డీటీఎఫ్ వ్యతిరేకిస్తోందన్నారు. అదేవిధంగా శివరాత్రి మరుసటి దినం స్థానిక సెలవు ప్రకటించుకునే ఆనవాయితీ ఉంది కాబట్టి, అదేరోజు జరుగనున్న జీవశాస్త్రం ప్రీ ఫైనల్ పరీక్షను వాయిదా వేయాలని కోరారు. ఆ పరీక్షను మరుసటి రోజు నిర్వహించుకునేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 15న సిక్కోలు సాహితీ సంబరం శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళా మందిర్లో శ్రీశ్రీ కళా వేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన సిక్కోలు సాహితీ సంబరాలు నిర్వహించనున్నట్లు కళా వేదిక ఉత్తరాంధ్ర అధ్యక్షుడు డబ్బీరు గోవిందరావు, కన్వీనర్ భోగెల ఉమామహేశ్వరరావు తెలిపారు. నగరంలో గాంధీ పార్కులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిక్కోలు సాహితీ సంబరానికి హాజరయ్యే కవులకు సాహితీ శిరోమణి బిరుదును ఇవ్వనున్నట్లు తెలిపారు. సామాజిక స్థితిగతులపై 20 వరుసలకు మించని కవితను బోర్డర్ గీసిన ఏ–4 తెల్ల కాగితంపై డీటీపీ లేదా చక్కగా రాసిన ఒక కాపీని రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించాలన్నారు. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకు రావాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రకారం కవులకు కవితా పఠనం, సత్కారంనకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. కవులు నేరుగా కవితా శీర్షిక చదివి, అనంతరం కవిత చదవాలి. పుస్తకావిష్కరణ కార్యక్రమాలు ఉండే కవులు వాటిని కవితాపఠనం తర్వాత చేయాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో అధ్యక్షుడు మణిపాత్రుని నాగేశ్వరరావు, శ్రీశ్రీ రాష్ట్ర కార్యదర్శి ముట్నూరు ఉపేంద్ర శర్మ, ఉపాధ్యక్షుడు ఇద్ది పాపయ్య, కార్యదర్శులు వాడాడ శ్రీనివాస్, చాడ శ్రీనివాస్, ఐఎన్డీ ప్రసాద్, కిల్లాన శ్రీనివాస్, తాళ్లూరి విజయ లక్ష్మణ్ పాల్గొన్నారు. చోరీ కేసులో ముగ్గురికి రిమాండ్ హిరమండలం: హిరమండలం పోలీస్స్టేషన్ పరిధిలో బుల్లెట్ దొంగతనం కేసులో ముగ్గురు ముద్దాయిలను రిమాండ్కు తరలించామని ఎస్ఐ హేమంత్ కల్యాణ్ మంగళవారం తెలిపారు. 2025 డిసెంబర్లో హిరమండలం గిరిజాల వీధిలో జరిగిన బుల్లెట్ దొంగతనం కేసులో బుల్లెట్తో పాటు ముగ్గురు ముద్దాయిలను కొత్తూరు కోర్టు హాజరు పరచగా రిమాండ్ విధించారన్నారు. ముద్దాయిలను అంపోలు జిల్లా జైలుకు తరలించామని పేర్కొన్నారు. -
పసిప్రాణానికి పరీక్ష
నాన్న మెడపై రెండు చేతులు వేసి మురిసిపోయే అబ్బాయి ఇకపై ఆ పని చేయలేడు. అమ్మ చేతిని తన చిన్ని చేతులతో తడిమి తడిమి ముద్దు చేసే పిల్లాడికి దేవుడు ఒక చేతిని దూరం చేశాడు. నానమ్మ గోరుముద్దలు తినిపిస్తున్న వేళ అనుకోకుండా జరిగిన విద్యుదాఘాతం మూడేళ్ల బాలుడి జీవితాన్ని మార్చేసింది. ఒంటి నిండా గాయాలతో, కంటి నిండా నీటితో ఆస్పత్రి మంచంపై పడి ఉన్న కుమారుడిని చూసి అమ్మానాన్నలకు శోకం ఆగడం లేదు. ఇప్పటికే ఒక చేతిని కోల్పోయిన పిల్లాడికి చికిత్స చేయించడానికి వారి స్థోమత సరిపోవడం లేదు. పిల్లాడి దుస్థితి తలచుకుని, తమ ఆర్థిక స్థితి తెలుసుకుని ఆ దంపతులు నరకయాతన పడుతున్నారు. దాతలపైనే భారం వేశారు. శ్రీకాకుళం రూరల్ : తన మూడేళ్ల మనవడిని మేడ మీదకు తీసుకెళ్లిన తినిపిద్దామని చూసిన నానమ్మకు దేవుడు పరీక్ష పెట్టాడు. పిల్లాడికి తినిపిస్తుండగా విద్యుత్ షాక్ తలగడంతో ఇద్ద రూ తీవ్రంగా గాయపడ్డారు. వజ్రపుకొత్తూరు మండలం కొండవూరులో ఈనెల 4న ఘటన చోటుచేసుకోగా తీవ్ర గాయాలపాలైన నాయనమ్మ అడ్డి తులసమ్మ, మనవడు మూడేళ్ల అడ్డి భువన్లు ప్రస్తుతం రాగోలు జెమ్స్లో చికిత్స పొందుతున్నారు. బాబు కుడిచేయి పూర్తిగా కాలిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీసేయాల్సి వచ్చింది. తులసమ్మకు కూడా శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యింది. పిల్లాడి తండ్రి సింహాచలం, తాత మల్లేషు దినసరి కూలీలు. రెక్కాడితే గానీ డొక్కాడదు. ఇలాంటి పరిస్థితుల్లో బాబు వైద్య చికిత్స కోసం వారు అల్లాడుతున్నారు. ఈ దంపతులకు భువన్ కంటే ముందు ఒక బాబు జన్మించి చనిపోయాడు. భువన్ పుట్టాక గానీ వారికి ఆ బాధ తీరలేదు. మూడేళ్ల వయసున్న కుమారుడికి ఇప్పుడు ఈ దుస్థితి రావడంతో ఏం చేయాలో తెలీక వారు కుమిలిపోతున్నారు. గ్రామంలోని యువత, యువ జన సంఘాలు వారికి తోచినంత ఆర్థికసాయం అందిస్తున్నారు. చిన్నారికి పూర్తిస్థాయిలో చికిత్స అందించాలంటే ఇంకా సాయం అవసరమవుతుంది. దీంతో ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం అర్థిస్తున్నారు. ఆ సాయమే తమ బిడ్డ బతుకులో వెలుగు నింపుతుందని కోరుతున్నారు. సాయం చేయదలచుకున్న వారు 95054 01583 నంబర్ను సంప్రదించాలని కోరుతున్నారు. విద్యుదాఘాతంలో తీవ్రంగా గాయపడిన మూడేళ్ల చిన్నారి ఒక చేతిని కోల్పోయిన బాలుడు నానమ్మ తినిపిస్తుండగా విద్యుత్షాక్ చికిత్స కోసం అవస్థ పడుతున్న తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఎదురుచూపు -
కొబ్బరి పీచు ఉత్పత్తులపై మహిళలకు అవగాహన
రణస్థలం: కొబ్బరి పీచుతో తయారు చేసే ఉత్పత్తులపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని కొబ్బరి పీచు పరిశ్రమ రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయాధికారి వి.శ్రీబులాల్ అన్నారు. లావేరు మండలంలోని లావేరు కేంద్రంలో కొబ్బరి పీచు పరిశ్రమపై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఏడాది 3,600 కోట్ల కొబ్బరి పీచు ఉత్పత్తులు(వస్తువులు) తయారు చేస్తున్నట్లు చెప్పారు. కొబ్బరి పీచు పరిశ్రమ ఏర్పాటు చేసుకునే వాళ్లకు రూ.10 వేల నుంచి రూ.5 కోట్ల వరకు రుణ సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు 35 శాతం రాయితీ అందిస్తామన్నారు. కాయిర్తో వస్తువుల తయారీకి సంబంధించి ఉచితంగా శిక్షణలు ఇస్తున్నట్లు వివరించారు. శిక్షణ కాలంలో ప్రతీనెల రూ.3 వేల గౌరవ భృతి అందిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారని వివరించారు. ఈ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలోని రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయం నుంచి డిల్లీ, హర్యానా, పంజాబ్, హిమచల్ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సేవలందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు 1000 వరకు ఉన్నాయన్నారు. సమావేశంలో ఏవో డి.మహేష్నాయుడు, ఏపీజీవీబీ మేనేజర్ నాగరాజు, లావేరు కొబ్బరి పీచు పరిశ్రమ అధ్యక్షులు ఇనపకుర్తి మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ–హత్య–ప్రమాదం కేసులో మలుపు
● నిజాన్ని అంగీకరించిన ప్రియురాలు ● సీసీ టీవీ ఫుటేజ్ బహిర్గతం భువనేశ్వర్: స్థానిక నీలాద్రి విహార్లో సోమవారం జరిగిన ప్రేమ–హత్య–ప్రమాదం కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం స్నేహితురాలు నిజం అంగీకరించింది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బహిర్గతమైంది. తన మాజీ ప్రియుడు దినేష్ కండి సత్యబ్రత ప్రధాన్ను పొడిచి చంపాడని స్నేహితురాలు అంగీకరించింది. హత్య నిందితుడు దినేష్ను పట్టుకోవడానికి పోలీసులు పలు చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. సీసీ టీవీలో నిజం బట్టబయలు సత్యబ్రత హత్య కేసులో సీసీటీవీలో నిజం బయటపడింది. గొంతు కోతకు గురైన తర్వాత పారిపోతున్న సత్యబ్రత సీసీ టీవీలో కనిపిస్తున్నాడు. సత్యబ్రతను అతని ప్రేయసి, దినేష్ కండి వెంబడిస్తున్నారు. మరోవైపు, చంద్రశేఖర్పూర్ ఠాణాలో శిశు భవన్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి బీదల వాడ ఇళ్లపై పడి బీభత్సం సృష్టించిన కారు యజమానిని పోలీసులు విచారిస్తున్నారు. హత్య కుట్ర నుంచి కారుతో తప్పించుకోవడానికి ఎవరు ప్రయత్నించారో తెలుసుకోవడానికి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కారు యజమానికి హత్యతో సంబంధం కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రేమికుల వారంలోని చాక్లెట్ దినోత్సవం సందర్భంగా తన స్నేహితురాలికి చాక్లెట్లు బహుమతిగా ఇవ్వడానికి ప్రియుడు సత్యబ్రత ప్రధాన్ నీలాద్రి విహార్లో నివసించే ప్రేయసి దగ్గరకు వచ్చాడు. అతను బ్రహ్మగిరి ప్రాంతంలోని హసిన్పూర్కు చెందినవాడు. అతను తన స్నేహితురాలితో కొంత సమయం గడిపాడు. ఇంతలో ఆ అమ్మాయి మరో ప్రియుడు దినేష్ కండి లోపలికి వచ్చాడు. సత్యబ్రతను తన ప్రియురాలితో చూసిన తర్వాత అతను మితిమీరిన ఉక్రోషంతో అందుబాటులో ఉన్న కూరగాయలు కోసే కత్తిని తీసి సత్యబ్రతపై దాడి చేశాడని ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన సత్యబ్రత తీవ్ర రక్తస్రావంతో తప్పించుకునే ప్రయత్నంలో నీలాద్రి విహార్ కూడలి వద్ద మరణించాడు. -
తవుడు లోడుతో లారీ బోల్తా
రాయగడ: కొరాపుట్ నుంచి రాయగడ మీదుగా ఆంధ్రప్రదేశ్ వైపు తవుడు లోడుతో వస్తున్న లారీ స్థానిక సిరికొన కూడలి వద్ద సోమవారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. వేగంగా వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతొ అదుపుతప్పి బోల్తా పడిందని పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. రోడ్డెక్కిన్న రైతులు మల్కన్గిరి: ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి పోట్టేర్ ధాన్యం కేంద్రం వద్ద సోమవారం ధర్నా చేశారు. టోకెన్ ఉన్నప్పటికీ ధాన్యం విక్రయం చేసుకోలేపోతున్నామని వాపోయారు. కలిమెల–మోటు ముఖ్య రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మిల్లర్లు, పరిపాలనా అధికారుల మధ్య కుమ్మక్కు కారణంగా ధాన్యం విక్రయాలు జరగడం లేదని నిరసన తెలియజేశారు. విషయం తెలుసుకున్న కలిమెల పోలీసులు, తహసీల్దార్, కలిమెల సరఫరా ఇన్స్పెక్టర్ చిన్మయ్ సాహు, పోట్టేరు ల్యాంప్ ఎండీ సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చించి రహదారి క్లియర్ చేయించారు. రైతులతో చర్చించి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఇదే సమస్యపై లుగేల్ పంచాయతీ రైతులు కూడా ఇటీవల ఆందోళన చేపట్టిన విషయం విదితమే. ‘వీసీల ఖాళీలు భర్తీ చేయాలి’ భువనేశ్వర్: రాష్ట్రంలో అత్యధిక విశ్వ విద్యాలయాల్లో వైస్ చాన్స్లర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ పరిస్థితిపై సత్వరమే స్పందించాలని బిజూ యువ జనతాదళ్, ఛత్ర (విద్యార్థ) జనతా దళ్ ప్రతినిధి బృందం మంగళ వారం లోక్ భవన్లో గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటిని కలిసి అభ్యర్థించింది. ఒడిశా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్స్లర్ల నియామకంలో జాప్యంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. 13 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు వైస్ చాన్స్లర్లు లేకుండా కాలక్షేపం చేస్తున్నాయి. ఆయా బాధ్యతలు తాత్కాలిక అధికారులు నిర్వహిస్తు పబ్బం గడుపుతున్నారు. ఇదే తరహాలో అనేక బోధన, సహాయ ప్రొఫెసర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ కోసం తక్షణ నియామకాలు కోరుతూ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్కు వినతి పత్రం సమర్పించింది. గిరిజనులకు రగ్గుల పంపిణీ మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి నక్కమాముడి పంచాయతీలోని గిరిజనులకు ప్రముఖ దిన పత్రిక సమాజ్ తరఫున మంగళవారం రగ్గులు పంపిణీ చేశారు . సమాజ్ పత్రిక రిలీఫ్ ఫండ్ ఒడిశా రాష్ట్రంలో సామాజిక సేవా సంస్థగా పనిచేస్తుంది. ఈ సంస్థను ఉత్కళమణి గోపబంధు దాస్ సమాజ విపత్తులు, ఆరోగ్య సమస్యలు, విద్యాఅభివృద్ధి కోసం స్థాపించారు. లోక్ సేవక్ మండల్, సమాజ్ పత్రిక రాష్ట్ర సంపాదకుడు, ప్రింటర్, పబ్లిషర్ రాజేంద్ర కుమార్ జేనా ఆదేశాల మేరకు జిల్లా ప్రతినిధి గోపీకృష్ణ పట్నాయాక్ నేతృత్వంలో రగ్గుల పంపిణీ ప్రక్రియను చేపట్టారు. నక్కమాముడి పంచాయతీలోని బయాపడా, దామోదర్బెఢా, సురిబెడా, తుంబాపదర్ తదితరగ్రామాల్లో రగులు పంపిణీ చేశారు. గతంలో కూడా గిరిశిఖర గ్రామాల్లోని ప్రజలకు సమాజ్ పత్రిక తరుఫున బోండఘట్టీలో రగ్గులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దామోధర్ బెఢా, వార్డు సభ్యుడు ఆర్జున్ ముదిలీ, కోరుకొండ ప్రతినిధి నిరంజాన్ మాల, కుడుములగూమ్మ ప్రతినిధి గణేష్దాస్ పాల్గొన్నారు. -
రైతు సమస్యలపై బీజేడీ శ్రేణుల ఆందోళన
రాయగడ: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని బీజేడీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక ఆద్వర్యంలో స్తానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ముందుగా స్థానిక కపిలాస్ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి అక్కడ ఆందోళన చేపట్టారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నాయకులు ధ్వజమెత్తారు. రైతులు ఈ ఏడాది ఖరీప్ సీజన్లో ధాన్యం క్రయవిక్రయాలకు సంబంధించి పడుతున్న పాట్లు అంతాఇంతా కాదని జగన్నాథ సరక అన్నారు. టోకెన్ల మంజూరు విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంతో ఇప్పటికీ మండీల్లో ధాన్యం పడి ఉన్నాయని అన్నారు. రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటున్నామని చెబుతున్న బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయడం లేదని ఆరోపించారు. బిజేపీ హయాంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం చివరకు అమ్ముకునేందుకు కూడా అవకాశం కల్పించలేని ప్రభుత్వం ఉన్నా లేకపొయినట్లేనని అన్నారు. ఇదిలాఉండగా ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన ప్రభుత్వం ప్రజలతో చెలగాటమాడుతోందని అన్నారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ప్రజలు రానున్న కాలంలో ప్రజలు బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి ప్రజల భద్రతను మరిచారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని సరక అన్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి వారిని నట్టేటా ముంచివేసిందని అన్నారు. అనంతరం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ కలెక్టర్ లిజారౌత్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఆందోళన కార్యక్రమంలో బీజేడీ పార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా మాజీ అధ్యక్షుడు సుధీర్ దాస్, ఉపాధ్యక్షుడు పట్నాన గౌరీశంకరరావు, దేవాషీశ్ ఖడంగ, రాయగడ మున్సిపల్ వైస్ చైర్మన్ శుభ్ర పండ, జగదీష్ పాత్రో, అనసూయా మాఝి పాల్గొన్నారు. -
పూరీ సముద్ర తీరంలో నత్తల గుంపు
భువనేశ్వర్: పూరీ సముద్ర తీరంలో అసాధారణ దృశ్యం పర్యాటకులు, స్థానికుల దృష్టిని ఆకర్షిస్తోంది. లెక్కకు మిక్కిలిగా సజీవ సముద్ర నత్తలు ఇసుక ప్రాంతంలో తిరుగుతున్నట్లు కనిపించాయి. ఈ అరుదైన దృశ్యం నీలాద్రి బీచ్, బ్లూ ఫ్లాగ్ బీచ్ వద్ద తారసపడుతుంది. పర్యాటకులు, సందర్శకులు, స్థానికుల్ని అబ్బురపరుస్తుంది. సముద్ర నత్తలు రాత్రి సమయంలో పెద్ద గుంపులుగా ఒడ్డుకు చేరుతున్నాయి. ఇసుక మీదుగా కదులుతు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. సూర్యోదయం తర్వాత ఒకటి నుండి రెండు గంటలలోపు సముద్ర గర్భం వైపు పయనమై అదృశ్యమవుతున్నాయి. సందర్శకులను ఈ దృశ్యం మంత్రముగ్ధుల్ని చేస్తోంది. పూరీ బీచ్లో ఇంతకు ముందు ఇలాంటి ప్రకృతి సహజమైన రమణీయ దృశ్యాలను చూడలేదని సందర్శకులు మురిసిపోతున్నారు. సాగర తీరంలో నత్తల కదలికను ప్రత్యక్షంగా తిలకించేందుకు తెల్లవారుజామున సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఇంత పెద్ద సంఖ్యలో సముద్ర నత్తలు లోతైన నీటిని వదిలి ఒడ్డుకు రావడానికి గల కచ్చితమైన కారణం అస్పష్టంగానే ఉంది. ఈ సంఘటన వాతావరణ మార్పులతో ముడిపడి ఉందా లేదా మరేదైనా సహజ పరిస్థితులతో సంభవిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ దృశ్యం బీచ్కి వెళ్లేవారిలో మరియు ప్రకృతి ప్రియుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తుంది. సముద్ర నత్తల ప్రవర్తన, పూరీ తీరప్రాంతంలో వాటి కదలికను ప్రభావితం చేసే అంశాలను అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు జరగాలని మేధావుల వర్గం అభిప్రాయపడుతోంది. -
250 కొత్త అంబులెన్స్ల ప్రారంభం
భువనేశ్వర్: అత్యవసర ఆరోగ్య సంరక్షణ పటిష్టత కార్యాచరణలో భాగంగా కొత్తగా 250 కొత్త అంబులెన్స్లను ప్రవేశ పెట్టారు. స్థానిక కళింగ స్టేడియం ఆవరణలో మంగళ వారం ఏర్పాటు చేసిన 2వ విడత రాష్ట్ర అంబులెన్స్ విస్తరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ జెండా ఊపి కొత్త అంబులెన్స్ల సేవలను ప్రారంభించారు. సకాలంలో వైద్య సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 428 కొత్త అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. దీని కోసం రాష్ట్ర నిధుల నుంచి దాదాపు రూ. 111 కోట్లు వెచ్చించారు. తొలి విడత కింద గత ఏడాది డిసెంబర్ 23న 150 అంబులెన్స్ సేవలు ప్రారంభించారు. అనారోగ్య పరిస్థితుల్లో అత్యవసర ప్రతిస్పందనను బలోపేతం చేసి బాధితులను సకాలంలో ఆస్పత్రులకు చేరదీయడంలో అవాంఛనీయ జాప్యం తొలగించడం లక్ష్యంగా పేర్కొన్నారు. దీని వల్ల అవాంఛనీయ మరణాల రేటును తగ్గించడం సాధ్యం అవుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవల్లో భాగంగా 866 అంబులెన్స్లను నడిపిస్తున్నారు. అదనంగా జనని ఎక్స్ప్రెస్ పథకం కింద 500 ప్రత్యేక అంబులెన్స్లు ప్రత్యేకంగా గర్భిణులు, అనారోగ్య పిల్లల సేవల కోసం వినియోగిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మండలాల నుంచి జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రులు, కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్కు రాత్రింబవళ్లు సేవలను నిర్వహించడానికి సన్నాహాలు చురుకుగా కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో రౌర్కెలా, జైపూర్ వంటి ఎయిర్స్ట్రిప్లకు అంబులెన్స్ సేవలు త్వరలో విస్తరిస్తాయని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా విమానాశ్రయాలలో ఐదు అడ్వాన్న్స్డ్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్ ) అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఝార్సుగుడలోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఇలాంటి రెండు అంబులెన్స్లు ఉన్నాయి. ఈ సేవల ద్వారా రోజుకు సగటున 5,000 మందికి పైబడి రోగులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, ఏకామ్ర భువనేశ్వర్ నియోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కమ్ కార్యదర్శి ఎస్.అశ్వతి, జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ డాక్టర్ డి. బృంద పాల్గొన్నారు. -
ముగిసిన శ్రీలక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు
రాయగడ: అమలాభట్ట సమీపంలోని శ్రీక్షేత్ర టౌన్ షిప్లొ కొలువైయున్న శ్రీలక్ష్మీనృసింహ స్వామి ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా ఈ నెల ఐదో తేదీ నుంచి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఉదయం సాత్తుమురై వసంతోత్సవం, చోర్ణోత్సవం, అష్టోత్తర శనకలశాభిషేకం, చక్రస్నానం ప్రధాన ఘట్టాలు జరిగియి. అలాగే స్వామి వారు గరుడ వాహనంలో ఊరేగింపుగా వెళ్లారు. కోలాటాల నడుమ కొనసాగిన గరుడ సేవ వైభవంగా ముగిసింది. మంగళవారం స్వామి వారికి విశేష హోమాలు, పూర్ణాహుతి, నీరాజనం, మంత్రపుష్పములు, పుణ్యకోటి వాహన సేవ, శ్రీపుష్పయాగం, నిత్య విశేష హోమ పూజలతో కార్యక్రమాలు పూర్తయ్యాయి. ముగింపు రోజున నిర్వహించిన స్వామివారి అన్నప్రసాదసేవలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవమూర్తిని సమీపంలోని నదికి తీసుకువెళ్లి చక్రస్నానం చేశారు. జలాభిషేకంతోపాటు స్వామి వారికి ప్రత్యేకంగా స్నానమాచరించారు. చక్రస్నానం పుణ్య ఘట్టంలో భక్తులు పెద్దసంఖ్యలో భాగస్వాములయ్యారు. -
పర్యాటకులను కాపాడిన లైఫ్గార్డ్లు
భువనేశ్వర్: పూరీ స్వర్గద్వార్ సెక్టార్ 10 తీరంలో అందుబాటులో ఉన్న లైఫ్గార్డ్ల సత్వర స్పందన 5 మంది పర్యాటకుల అమూల్య ప్రాణాలు కాపాడింది. ఈ తీరంలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు బలమైన అలల ధాటికి కొట్టుకుపోయి ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న పర్యాటకులను సురక్షితంగా ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక భారీ అల అకస్మాత్తుగా ఎగసిపడి 5 మంది పర్యాటకులను ముంచెత్తింది. వారిలో నలుగురు చత్తీస్గఢ్ ప్రాంతీయులు కాగా మరొకరు మహారాష్ట్ర పర్యాటకుడు ఉన్నారు. పర్యాటకులు స్వాతి కానోజీ, భవన్ కానోజీ, శిఖా కానోజీ, ఛత్తీస్గఢ్కు చెందిన ఖగేశ్వర్ కానోజీ, మహారాష్ట్రకు చెందిన కృష్ణ కానోజీ ఉన్నారు. ప్రథమ చికిత్స తర్వాత వీరంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. పర్యాటకులను మహేంద్ర బెహెరా, ఎ. భగబన్, కేడీ బెహెరా, పి.తిరుపతి లైఫ్గార్డ్ల బృందం రక్షించింది. -
ఘనంగా హిందూ సమ్మేళనం
జయపురం: రాష్ట్రీయ స్వయంసేవక సంఘం(ఆర్.ఎస్.ఎస్) శతాబ్ది వేడుకల సందర్భంగా జయపురం సమితి ధనపూర్ గ్రామ పంచాయతీతో జయపురం ఆర్ఎస్ఎస్ వారు పంచాయతీ స్థాయి హిందూ సమ్మేళనం సోమవారం నిర్వహించింది. కార్యక్రమంలో ధన్పూర్ పంచాయతీలోని 9 గ్రామాల నుంచి 1500 మంది సనాతనులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ధనపూర్ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు విద్యాధర పూజారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ హిందూ సంప్రదాయాన్ని సంస్కృతిని మనం కాపాడుకోవాలని, మత మార్పిడిని అరికట్టాలని పిలుపు నిచ్చారు. సమ్మేళనంలొ ముఖ్యవక్తగా విశ్వనాథ్ మాలి, ఆర్ఎస్ఎస్ నేత రంజిత్ బెహరాలు హిందూ సంస్కృతిపై ప్రసంగించారు. ఈ సందర్భంగా కలశ జాత్ర, గీతా యజ్ఞం,నామ సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. -
12న ట్రేడ్ యూనియన్ సమ్మె
పర్లాకిమిడి: ఈ నెల 12వ తేదీన చేపట్టనున్న ట్రేడ్ యూనియన్ సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఇందులో భాంగా అఖల భారత ఖేత్ మజ్దూర్ సభ ఆధ్వర్యంలో జిల్లాలోని గుసాని సమితి ఉప్పలాడ సవరవీధిలో ఖేత్ మజ్దూర్ సభ అధ్యక్షులు తిరపతి గోమాంగో అధ్యక్షతన సోమవారం సమావేశం జరిగింది. వ్యవసాయ కూలీల ఇళ్లకు ఉచితంగా 300 యూనిట్ల కరెంటు, దినసరి కూలీ రోజుకు రూ.600, జంగిల్ జమ్మి పట్టాలు, ఆర్ఐ, అమీన్లు నెలకు కనీసం 15 రోజులు గ్రామాల్లో పనిచేసి జీ వీ జీ రాం జీ చట్టానికి బదులుగా మహాత్మాగాంధీ గ్రామీణ నిశ్చిత ఉపాధి పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్) అమలు చేయాలని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధిదారులకు రూ.5 లక్షలు మంజూరు చేయాలని సమావేశంలో డిమాండ్చేశారు. ఈ డిమాండ్లతో ఈనెల 12న చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త బంద్కు అందరూ సహకరించాల్సిందిగా కోరారు. సమావేశంలో మోజేష్ శోబోరో, కై లాస్ శోబోరో, మాథ్యూ రయితో, తమాస్ రయితో, మోహితీ మండల్, సంతోషి శోబోరో ఉన్నారు. -
ప్రేమకథ
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ప్రమాదం వెనుక.. అదే కారు.. భువనేశ్వర్: స్థానిక శిశు భవన్ కూడలి ప్రాంతం ఓవర్ బ్రిడ్జిపై సోమవారం ఉదయం ఘోర కారు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ బతికి బట్ట కట్టడం విశేషం. బారికేడ్ను కారు ఢీకొట్టి ఫ్లైఓవర్ నుంచి కింద పడి సమీపంలోని మురికివాడలో ఇళ్ల సముదాయంలో కుప్ప కూలింది. తృటిలో ఘోర ప్రాణ హాని తప్పింది. అయితే ఈ ప్రమాదం వెనుక ఓ క్రిమినల్ ప్రేమ కథ బయటపడడం సంచలనంగా మారింది. కారు ఓవర్ బ్రిడ్జి బారికేడ్ను అతి వేగంగా ఢీకొట్టి అడ్డంకులను (కంచె) ఛేదించి ఫ్లైఓవర్పై నుంచి కిందకు పడిపోయింది. ఈ క్రమంలో మధ్యలో ఒక చెట్టును ఢీకొని చివరికి సమీపంలోని ఇంటి పైకప్పుపై కూలింది. డ్రైవర్ ప్రమాదం నుంచి బయటపడగా అతడిని శిథిలాల నుంచి రక్షించి సత్వర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతనికి గాయాలయ్యాయి కానీ సురక్షితంగా ఉన్నట్లు వైద్య వర్గాల సమాచారం. అతడి వివరాలను ఇంత వరకు బయటపెట్టలేదు. ఇతర ప్రాణనష్టం జరగలేదు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలకు గురిచేసింది. ఘటనా ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదం క్యాపిటల్ పోలీస్ ఠాణా పరిధిలోకి చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో అనేక ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ప్రేమకథ, ఓ హత్యాయత్నం వంటి విషయాలు బయటకు వచ్చాయి. సత్యబ్రత ఏ కారులోనైతే భువనేశ్వర్ వచ్చాడో అదే కాదు శిశు భవన్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి కింద పడడం గమనార్హం. ఈ కారు పూరీ జిల్లా బ్రహ్మగిరి ప్రాంతంలో రిజిస్టర్ చేసి ఉంది. సత్యబ్రత మరణం గురించి సమాచారం అందడంతో కారు యజమాని మరో డ్రైవర్తో కలిసి వాహనాన్ని తిరిగి తీసుకురావడానికి భువనేశ్వర్కు వెళ్లాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నగరం నుంచి పారిపోయే ప్రయత్నంలో వాహనం అతి వేగంగా నడపడంతో నియంత్రణ కోల్పోయి శిశు భవన్ స్క్వేర్ వద్ద ఉన్న బారికేడ్ను ఢీకొట్టి ఫ్లైఓవర్ కింద ఉన్న సిమెంటు రేకుల పైకప్పుపైకి దూసుకెళ్లినట్లు దుర్ఘటన పరిసర దృశ్యాలు ధ్రువీకరిస్తున్నాయి. దీంతో పోలీసులు పోలీసులు కారు యజమాని, డ్రైవర్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. హత్య గురించి కారు యజమానికి ఇంత త్వరగా ఎలా తెలిసిందో? నిందితుడితో అతనికి ముందస్తు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు వర్గాలు పరిశీలిస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇదో త్రికోణ ప్రేమ వ్యవహారంగా తెలుస్తుంది. పూరీ జిల్లా బ్రహ్మగిరి ప్రాంతానికి చెందిన సత్యబ్రత ప్రధాన్ ఇటీవల పూర్ ప్రాంతంలోని ఓ పార్లర్లో పనిచేస్తున్న తన స్నేహితురాలిని కలిసేందుకు కారులో భువనేశ్వర్ వచ్చాడు. ఆ స్నేహితురాలు అనుకోని విధంగా సత్యబ్రతపై దాడి చేసి అతడి గొంతు కోసింది. జగత్సింగ్పూర్కు చెందిన లిజ్జా భోయ్ అనే మహిళే ఈ స్నేహితురాలిగా పోలీసులు గుర్తించారు. ఆమెకు జగత్సింగ్పూర్కు చెందిన దినేష్ కండి అనే వ్యక్తి సహకరించినట్లు అనుమానిస్తున్నారు. వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లిజ్జాకు అనేక మందితో సంబంధాలు ఉన్నాయని సత్యబ్రతకు తెలిసి దానిపైనే ప్రశ్నించేందుకు రాగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ సంఘటన జరిగిన నివాసం వెలుపల ఏర్పాటు చేసిన ిసీసీటీవీ కెమెరాలో దాడికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. సంఘటన స్థలంలో అనేక మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన తర్వాత సత్యబ్రత సహాయం కోసం రోడ్డుపైకి పరిగెత్తాడు. గాయపడిన స్థితిలో ఉన్న అతన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత సత్యబ్రత ప్రాణాలు వదిలేశాడు. -
హోంగార్డుతో సహా యువకుడు మృతి
కొరాపుట్: హోంగార్డుతో సహా మరో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. సోమవారం కొరాపుట్ జిల్లా నందపూర్ ఎస్డీపీఓ దేవేంద్ర మాలిక్ ఈ కేసు వివరాలు ప్రకటించారు. నందపూర్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న హోంగార్డు భగవాన్ ఖోరా (50), హీకిం పుట్ గ్రామానికి చెందిన ఉగ్రసేన్ పంగి (33) మృతి చెందినట్లు ప్రకటించారు. వీరిద్దరూ బైక్ మీద నందపూర్ నుంచి నీలదోరాపుట్ గ్రామానికి వెళ్లి కనిపించకుండాపోయారు. దీంతో రెండు కుటుంబాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించగా నందపూర్–హందీపుట్ మార్గంలో 55వ రాష్ట్ర రహదారి పై పెటియాబాద్ వద్ద వంతెన పై బైక్ అద్దం ముక్కలు కనిపించాయి. అగ్నిమాపక సిబ్బంది సాయంతో కింద వాగులో గాలించగా బైక్ తో పాటు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ కేసుని పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు.భగవాన్ ఖోరా ఉగ్రసేన్ -
ఘనంగా నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు
● గజవాహనంపై ఊరేగిన స్వామివారు ● నేటితో ముగియనున్న ఉత్సవాలు రాయగడ: అమలాభట్ట సమీపంలోని శ్రీక్షేత్ర టౌన్షిప్లో గల శ్రీనృసింహస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ఆఖరి ఘట్టానికి చేరుకుంటున్నాయి. ఈ నెల ఐదో తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారంతో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో స్వామి వారికి ఆదివారం గజవాహనంపై ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభోగంగా నిర్వహించారు. ప్రత్యేకంగా స్వామివారి ఉత్సవ మూర్తిని అలంకరించి గజవాహనంపై వేదపండితులు మంత్రోచ్ఛరణల మధ్య కూర్చొబెట్టారు. అనంతరం స్వామి వారికి మందిరం చుట్టూ ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి వారి ఊరేగింపు ఉత్సవాన్ని కనులారా వీక్షించారు. స్వామి వారి పాద స్పర్శకు భక్తులు పోటీపడ్డారు. వేద పండితులు భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం కల్పించడంతో పాటు గజవాహంపై ఆశీనులైన స్వామి వారి పాదాల చెంత ఉన్న పుష్పాలు, అక్షితలను వారిపై వేసి ఆశీర్వాదాలు పలికారు. శ్రీలక్ష్మీ హయగ్రీవ హోమం ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం శ్రీలక్ష్మీ హయగ్రీవ హోమాన్ని చేపట్టారు. వేదపండితులు నిర్వహించిన హోమంలొ భాగంగా చిన్న పిల్లలను కూర్చొబెట్టారు. హోమం వద్ద పుస్తకాలు,పెన్నులు, పెన్సిళ్లు ఉంచిపూజించారు. అనంతరం వాటిని పిల్లలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా భక్తి, బుద్ధి అనే అంశంపై వేదపండితులు ఫణిహారం భాస్కరాచార్యులు వివరించారు. చదువుతో పాటు విద్యార్థులు ఆధ్యాత్మికతపై కూడా శ్రద్ధ కనబరచాలన్నారు. మన హైందవ సంప్రదాయాలను, సంస్కృతిని వారికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఇటువంటి కార్యక్రమాల్లో పిల్లలకు కూడా అవకాశం కల్పిస్తుండటం శుభపరిణాంగా అభివర్ణించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు చేసేదెప్పుడు?
● టోకెన్ల గడువు ముగుస్తున్నా పట్టించుకోవడం లేదు ● సిబ్బంది పనితీరుపై రైతుల అసంతృప్తి జయపురం: ధాన్యాన్ని అమ్మేందుకు రైతులకు ఇచ్చి న టోకెన్ల గడువు ముగుస్తున్నా.. కొనుగోలు చేయటం లేదని జయపురం సమితి కుములి గ్రామ పంచాయతీ రైతులు ఆరోపించారు. జిల్లా పౌర సరఫరాల అధికారికి పలువురు రైతులు సోమవారం ఫిర్యాదు చేశారు. మండీలకు ధాన్యం తీసుకువచ్చి నా కొనుగోలు చేయడం లేదని పౌర సరఫరాల అధికారి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మండీలలో ఉన్న ధాన్యం కోసం సంచులు, ధారాలు సమకూ ర్చాలని జిల్లా ప్రధాన పౌర సరఫరాల అధికారి గతంలో తెలియజేసినప్పటికీ.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ ధాన్యం మండీలలో పడి ఉన్నాయన్నారు. తాము ఆర్థికపరమైన సమస్యలు ఎదురుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్ల క్ష్యం పట్ల తగిన చర్యలు తీసుకొని, టోకెన్ల గడువు ముగియక ముందే ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
కేంద్ర బడ్జెట్పై అవగాహన
జయపురం: స్థానిక ఓ హోటల్లో జయపురం జాగరణ మంచ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ తీసుకువచ్చిన 2026–27 బడ్జెట్పై అవగాహన కల్పించారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో అఖిల భారత సంఘర్ష్ వాహిణీ ప్రముఖులు, ఇంజినీర్ అన్యదా శంకర్ పాణిగ్రహి ముఖ్యఅతిథిగా పాల్గొని పలు అంశాలను వివరించారు. గోమాత సంరక్షణకు ప్రత్యేక పథకాలు బడ్జెట్లో ప్రస్తావించలేదన్నారు. స్వదేశీ భారత్. సమృద్ధి భారత్ నిర్మాణం కోసం తగిన ప్రాధాన్యత కల్పించారని కొనియాడారు. ముఖ్యంగా స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తగిన పథకాలు రూపొందించాల్సి ఉందన్నారు. మధ్య తరగతి కుటుంబాలకు ఆదాయపు పన్ను రాయితీలు కల్పించారన్నారు. స్వదేశీ ఉత్పత్తులు ప్రజలు వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు స్వదేశీ ఉత్పత్తు వినియోగించిన నాడే దేశ ఆర్థిక ప్రగతి అని, నేడు దేశంలో ప్రతి ఇంటిలోనూ విదేశీ వస్తువులు ఉంటున్నాయన్నారు. దేశాన్ని ఆర్థికంగా, సమృద్ధిగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఒడిశా ప్రొఫెసర్ డాక్టర్ సీతానాథ్ రాయగురు, స్వదేశీ జాగరణ మంచ్ రాష్ట్ర సహాయకో ఆర్డినేటర్ మనోరంజన్ రౌత్రాయ్, చార్టెడ్ అకౌంటెంట్ రవి శంకర్, పట్టణంలో ప్రముఖ వ్యాపార వేత్త సంజయ్ కుమార్ జైన్ తదితరులు పాల్గొని బడ్జెట్పై అభిప్రాయాలను వెల్లడించారు. -
40 రోజులు.. 20 చోరీలు
● జిల్లాలో ఆగని దొంగతనాలు ● స్వైర విహారం చేస్తున్న దొంగలు ● భయాందోళనలో ప్రజలు శ్రీకాకుళం క్రైమ్ : ఏడాది ప్రారంభమై నలభై రోజులవుతోంది. అప్పుడే జిల్లాలో 20 చోరీలు జరిగాయి. అటు ఇచ్ఛాపురం నుంచి ఇటు జేఆర్పురం వరకు దొంగలు వీర విహారం చేస్తున్నారు. ఇది అంతర్రాష్ట్ర ముఠా పనేనన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. తాళం వేసిన ఇళ్లు, ఒంటరి మహి ళలు, వృద్ధులే కాక బంగారు దుకాణాలు, దేవాలయాలు, బ్యాంకులే వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. అంతర్రాష్ట్ర ముఠా పనేనా..? గత ఏడాది జిల్లాలో దాదాపు 398 చోరీలు జరగగా రూ.3.82 కోట్ల సొత్తు పోయింది. చోరీలు అధిక శాతం చేసింది అంతర్రాష్ట్ర ముఠాల సభ్యులే. 57.5 శాతం ఉన్నది వారే. దుప్పట్లు, బూరలు, ప్లాస్టిక్ బొమ్మలు, ఎలక్ట్రికల్ వస్తువులైన హోంథియేటర్లు అమ్మడమే కాక పాడైపోయిన టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషీన్లు, ఫర్నిచర్లు కొంటామన్న నెపంతో ఊరూరా తిరిగి రెక్కీ చేయడమే వీరి పని. తర్వాత వరుస చోరీలు చేసి చెక్కేస్తారు. 2026లో దాదాపు 20 చోరీలు ఇప్పటికే జరిగాయి. గత మూడు రోజుల్లోనే నాలుగు చోరీలు జరిగాయి. దేవాలయాల్లో.. ● గత నెల 9న కాశీబుగ్గ చిన్నతిరుపతి ఆలయంలో ఆరున్నర తులాల బంగారం, 15 కిలోల వెండి రూ. 80 వేలు నగదు చోరీతో పాటు సీసీకెమెరాలు డీవీఆర్ చెరువులో పడేశారు. ● అదే రోజు కొత్తూరు మండలం పారాపురం సత్యసాయిబాబా గుడిలో 28 కిలోల వెండి పాదుకలు చోరీకి గురయ్యాయి. ● దీనికి ముందురోజే నరసన్నపేట సత్యవరం పాదాలమ్మ తల్లిగుడి, దూకుల పాడులోని జ్యోతి రామలింగేశ్వరస్వామి గుడిలో దొంగతనాలు జరిగాయి. వరుస దొంగతనాలు ● సోమవారం జిల్లాకేంద్రంలోని పీఎన్కాలనీ 2వ లైన్లో రిటైర్డ్ నేవీ ఉద్యోగి ఏవీ మూర్తి ఇంటిలో 4 తులాలకు పైగా బంగారం చోరీకి గురైంది. ● ఈ నెల 7న మందస మండలం బాలిగాంలో వరుస ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడి దాదాపు ఒకటిన్నర తులాల బంగారం, ఆరు తులాల వెండి కాజేశారు. ● అదే రోజు పలాస బత్తుల వీధిలో ఓ వృద్ధురాలికి మత్తు మందిచ్చి రూ. 2.50 లక్షల నగదు, పావు తులం బంగారం పట్టుకుపోయారు. ● అదే రోజు రోటరీ నగర్కు చెందిన సునీతా పాత్రో ఇంట్లోని బీరువాలో 5 తులాల బంగారం చోరీకి గురైంది. ఇళ్లకు వచ్చి మరీ ● గత నెల 5న ఆమదాలవలస చంద్రయ్యపేటలో మహిళను ఓ అగంతకుడు కత్తితో బెదిరించి రెండున్నర తులాల తాడు పట్టుకుపోయాడు. ● గత నెల 20న సారవకోట మండలం బద్రిగ్రామంలో పట్టపగలే మహిళ కాళ్లుచేతులు కట్టి 3 తులాల బంగారం చోరీ చేశారు. ● గతనెల 17న వజ్రపుకొత్తూరు మండలం పూండి–గోవిందపురంలో పంచాయతీ కార్యదర్శి శరత్చంద్రదొర ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి 75 తులాల వెండి, ఐదున్నరతులాల బంగారం, రూ. 90 వేలు నగదు చోరీ చేశారు. ● ఇదే పూండిలో ఓ బంగారం దుకాణంలో 18 తులాల బంగారు ఆభరణాలను మధ్యప్రదేశ్కు చెందిన ముఠా దోచుకుపోయింది. ● గత నెల 7న ఫాజుల్బేగ్పేటకు చెందిన గౌరీదేవి ఇంట్లో 2 తులాల బంగారం, రూ. 40 వేలు నగదు చోరీకి గురైంది. ● 10న ఇచ్ఛాపురం అప్పన్నపేటలో రామారావు ఇంట్లో తులంన్నర బంగారం చోరీకి గురయ్యాయి. టెక్కలి రూరల్: టెక్కలి పరిధిలోని పలు మొబైల్ షాపుల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి ప్రయత్నిస్తుండటంతో యజమానులు భయాందోళనకు గురవుతున్నారు. సోమ వారం వేకువజామున స్థానిక అంబేడ్కర్ జంక్షన్ సమీపంలో ఉన్న గణేష్ మొబైల్ షాపులో సోమవారం వేకువ జామున దొంగతనానికి ప్రయత్నించగా యజమాని ఒక్కసారిగా కేకలు వేయడంతో పారిపోయాడు. ఈ నెల 5న కూడా ఓ చోరీ ప్రయత్నం జరిగింది. వస్తువులు చోరీకి గురి కాకపోవడంతో పోలీసులకు చెప్పలేదు. కానీ యజమానుల్లో మాత్రం భయం మెదులుతోంది. -
21 నుంచి జాతీయ స్థాయి నాటక పోటీలు
అరసవల్లి: ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా దివంగత కొన్నా చిన్నారావు, చిన్నమ్మడు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఈ నెల 21 నుంచి 23 వరకు జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో నిర్వహిస్తున్నట్లు శ్రీసుమిత్ర కళాసమితి అధ్యక్షుడు, ఆదిత్యాలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం అరసవల్లిలో ఆహ్వాన పత్రికలను సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకరశర్మ మాట్లాడుతూ మూడు రోజుల పాటు సాయంత్రం 6 గంటల నుంచి నాటికల ప్రదర్శన మొదలవుతుందన్నారు. 21న ‘మాయాజాలం’, ‘తరమెల్లిపోతున్నదో’, 22న ‘సమయం’, ‘సూక్తం’, 23న ‘మమ్మల్ని బ్రతకనివ్వండి..’, ‘నిన్ను నీవు గెలుచుకో..’ తదితర నాటికలు ప్రదర్శితమవుతాయని ప్రకటించారు. అనంతరం విశిష్ట అతిథుల చేతులమీదుగా బహుమతి ప్రదానంతో మూడు రోజుల కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. కార్యక్రమంలో సుమిత్ర కళాసమితి సభ్యులు మండవల్లి రవి, నక్క శంకరరావు, కొంక్యాన మురళి, కర్రి అశోక్కుమార్, ప్రధాన విజయరాం, కొమ్మనాపల్లి హరికృష్ణ, ఫల్గుణరావు, పందిరి సంగీత, వీవీఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. చదరంగంతో మేధాశక్తి టెక్కలి: చదరంగంతో మేధాశక్తి మరింత పెరుగుతుందని టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు అన్నారు. ఆదిత్య కళాశాలలో అంతర్ కళాశాలల చదరంగం పోటీలను సోమవారం ప్రారంభించారు. జేఎన్టీయూవీ స్థాయి టోర్నమెంట్ కోసం క్రీడాకారుల ఎంపికలో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 30 కళాశాలల నుంచి 100 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. జీఎంఆర్ఐటీ పీడీ పి.అరుణ్కుమార్, జేఎన్టీయూ పీడీ డి.నాగరాజు తదితరులు ఈ పోటీలకు పర్యవేక్షకులుగా వ్యహరిస్తున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, కో–ఆర్డినేటర్ మురళీధర్, పీడీలు లక్ష్మణమూర్తి, మురళీమోహన్, తేజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. హయ్యర్ పింఛన్ కోసం పెన్షనర్ల ధర్నా శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలో సుమారు 17 లక్షల మంది పింఛనుదారులు హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేయగా వారిలో ఎక్కువ మంది దరఖాస్తులు తిరస్కరించడాన్ని నిరసిస్తూ ఆల్ పెన్షనర్స్, అండ్ రిటైర్డు పెన్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని జ్యోతీరావు పూలే పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎం.ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్వాకం వల్ల పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస పెన్షన్ రూ.తొమ్మిది వేలు, కరువు భత్యం చెల్లించాలన్నారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలు విడనాడాలని డిమాండ్ చేశారు. పింఛనుదారులు సమస్యల పరిష్కారానికి ఈ నెల 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ప్రకటించారు. నిరసన కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పి.సుధాకర్, బి.జనార్దన్, పి.వాసుదేవరావు, బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. లాడ్జిలో వ్యక్తి మృతి రణస్థలం: పైడిభీమవరంలో ఓ లాడ్జీలో బీహార్ రాష్ట్రానికి చెందిన రాకేష్ కుమార్(46) అనే వ్యక్తి మృతి చెందాడు. పూసపాటిరేగ మండలంలోని ఒక ప్లైవుడ్ పరిశ్రమలో పని కోసం మూడు రోజుల క్రితం వచ్చిన ఈయన పైడిభీమవరంలోని ఎస్ఎస్ లాడ్జిలో దిగాడు. ఆదివారం రాత్రి భోజనం కోసం లాడ్జి నిర్వాహకులు రాకేష్ రూమ్కు వెళ్లి చూడగా విగత జీవిగా కనిపించాడు. వెంటనే జె.ఆర్.పురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతని వద్ద లభించిన మందుల ప్రకారం అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. రాకేష్కుమార్కు భార్య, కుమారుడు ఉన్నారు. లాడ్జి సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితుడి ఇంటికే కన్నం
● చోరీ కేసులో ఇద్దరు అరెస్టు పలాస: కాశీబుగ్గ రోటరీనగర్లోని సునీత పాత్రో ఇంట్లో ఈ నెల 7న జరిగిన చోరీ కేసులో కాశీబుగ్గ పోలీసులు ఇద్దరు నిందితులు తెల్లి దీనబందు, టెంకు నాగరాజులను అరెస్టు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సహబాద్ అహ్మద్ సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. సునీత పాత్రో భర్త బతుకు తెరువు కోసం చైన్నె వలసపోయాడు. ఇతనితో దీనబంధు అనే వ్యక్తి కలిసి ఎలక్ట్రికల్ పనులు చేసేవాడు. ఆ సమయంలో అతని ఇంటికి వెళ్తుండేవాడు. సునీత కాశీబుగ్గలోని ఓ షోరూమ్లో పనిచేస్తున్నారు. దీనబంధుకు ఆర్థిక అవసరాల నిమిత్తం డబ్బు అవసరం ఏర్పడింది. దీంతో సునీత ఇంట్లో బంగారు ఆభరణాలు ఉండటం గమనించి దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శనివారం సునీత ఇంటి తాళాన్ని చాకచక్యంగా సంపాదించాడు. ఓ షాపులో పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తి వద్దకు వెళ్లి ఇంట్లో బీరువా రిపేరు ఉందంటూ సునీత ఇంటికి తీసుకెళ్లాడు. బీరువాలో బంగారు ఆభరణాలు ఉన్నాయని, వాటిని తీసుకెళ్లి అమ్ముకుంటే డబ్బులు వస్తాయని, అందులో సగం వాటా ఇస్తానని చెప్పాడు. అనంతరం సుత్తితో బీరువా తెరిచి రూ.7.50 లక్షలు విలువైన ఆరు రకాల బంగారు అభరణాలు అపహరించుకుపోయారు. బాధితురాలు సునీత ఇంటికి వచ్చి చూడగా చోరీ జరగడాన్ని గమనించి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి కాశీబుగ్గ బంకేశ్వరగుడి సమీపంలో ఒకరిని, జి.ఎం.ఇ కాలనీ వద్ద ఒక షాపు వద్ద మరొకరిని అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పలాస కోర్టులో సోమవారం హాజరుపరిచారు. కేసును ఛేదించిన కాశీబుగ్గ సీఐ రామకృష్ణ, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
11 మంది బాల కార్మికుల గుర్తింపు
రాయగడ: సదరు సమితి చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల బాకురుగుడలో ఎస్ఎస్డీ పేరుతో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలపై సోమవారం అధికారులు దాడులు నిర్వహించారు. సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేపట్టి ఇటుక బట్టీలో 39 మంది కార్మికులు పనిచేస్తుండగా ఇందులో 11 మంది బాల కార్మికులను గుర్తించారు. ఇసుక బట్టీ యజమానులు బాలలను ముందుగా డబ్బులు ఎరచూపి గత ఆరు నెలలుగా ఇటుకల తయారీకి ప్రోత్సాహించినట్లు అధికారులు చేపట్టిన దర్యాప్తులో తేలింది. ప్రతీరోజు తమ పిల్లలతో 14 గంటల పాటు పనులు చేయిస్తున్నారని సబ్కలెక్టర్కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అదే విధంగా పని వదిలి వెళితే ఇబ్బందులు పడాల్సివస్తుందని యజమానులు బెదిరించడంతో గత్యంతరం లేక తమ పిల్లలను పనుల్లో చేర్పించడం జరిగిందన్నారు. ఎటువంటి వైద్య సౌకర్యాలు కల్పించడం లేదని వివరించారు. గత కొద్ది రోజుల క్రితం ఇటుక బట్టీలో బాలకార్మికులు పనిచేస్తున్నారన్న వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. -
చీటింగ్ కేసు నమోదు
మెళియాపుట్టి: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటకు చెందిన కోరాడ సంతోష్కుమార్ అనే వ్యక్తిపై మెళియాపుట్టి పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ఎస్సై పిన్నింటి రమేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. సంతోష్కుమార్ మెళియాపుట్టి పోలీస్ స్టేషన్లో గతంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించేవాడు. గొడ్డ గ్రామానికి చెందిన లిమ్మక గోపాలకృష్ణ అనే యువకుడికి కలెక్టరేట్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పలు దఫాలుగా రూ.4లక్షల సొమ్ము తీసుకుని మోసం చేశాడు. ఎటువంటి ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇంటర్నెట్ భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కె.వి.మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఫిబ్రవరి 11న ‘సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం’ పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అవగాహన ప్రచార పోస్టర్ను సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి ఇంటర్నెట్ కోసం అనే థీమ్తో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, డీఐఓ కిరణ్కుమార్, ఏడీఐఓ విజయబాబు, ఎల్డీఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పాముకాటుతో వ్యక్తి మృతి పొందూరు: సంతకవిటి మండలం సిరిపురం పంచాయతీ యాగాడిపేటకు చెందిన సీహెచ్ ఆనందరావు(50) సోమవారం పాము కాటుకు గురై మృతి చెందాడు. ఈయన న్యూస్ రిపోర్టర్గా పొందూరు మండలంలోని పని చేస్తున్నాడు. తుంగపేట పంచాయతీలో ఉన్న తన పొలంలో పెసరు చేను చూసేందుకు వెళ్లగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాముకాటు వేయడంతో చనిపోయాడు. ఈ మేరకు కుమారుడు సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు. సుందరరావును అభినందించిన కృష్ణదాస్ నరసన్నపేట: రావులవలసకు చెందిన పైల సుందరరావును మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అభినందించారు. సుందరరావు గ్రూప్–1 పరీక్షలో సత్తా చాటి డీఎస్పీగా ఎంపికై న విషయం విదితమే. డీఎస్పీగా ఎంపికై న సుందరరావు మర్యాద పూర్వకంగా సోమవా రం ధర్మాన కృష్ణదాస్ను మబగాంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు కృష్ణదాస్ శాలువతో సత్కరించారు. నిరుపేద కుటుంబం నుంచి గ్రూప్–1 పరీక్షలో సత్తా చాటి ఉన్నత కొలు వు సాధించడం గొప్ప విషయమని కృష్ణదాస్ అన్నా రు. అలాగే సుందరరావు తండ్రి పైల రాజారావును అభినందించారు. వైఎస్సార్సీపీ నాయకులు మడ్డు కృష్ణ, పంచిరెడ్డి సత్యం, పంచిరెడ్డి శివ, వెంకటేష్, ముద్దాడ గోపి తదితరులు పాల్గొన్నారు. 23 వరకు స్మార్ట్ మీటర్స్ పఖ్వాడా అరసవల్లి: విద్యుత్ వినియోగదారులకు అత్యాధునిక సాంకేతిక సేవలు, ప్రీపెయి డ్ మీటర్ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యా ప్తంగా ‘స్మార్ట్ మీటర్స్ పఖ్వాడా’ పేరిట ఈనెల 9 నుంచి 23 వరకు పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ప్రకటించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగం ఎంతమేర అవుతుందో అనే సమాచారం కూడా మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. ఈ పక్షోత్సవాల్లో విద్యుత్ వినియోగదారుల కోసం వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు, మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్ కేంద్రాలు, మీటర్ల పనితీరుపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లుగా ఆయన వివరించారు. సందేహాల నివృత్తికి టోల్ఫ్రీ నంబర్ 1912ను కూడా సంప్రదించవచ్చునన్నారు. -
వినతుల వెల్లువ
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సద్భావణ సమావేశం హాల్లో సోమవారం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి పాల్గొన్నారు. సమితిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 73 వినతులను స్వీకరించారు. 67 వ్యక్తిగతమైనవి, 16 గ్రామ సమస్యలుగా గుర్తించారు. స్వీకరించిన గ్రామ సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిల్లిప్, డీఎఫ్ఓ అన్నా సాహెబ్, జిల్లా ముఖ్యవైద్యాధికారి సరోజినిదేవి, పద్మపూర్ సమితి అధ్యక్షురాలు మనిమాల సబర్, తదితరులు పాల్గొన్నారు. 55 వినతుల స్వీకరణ.. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఖోయిర్పూట్ సమితి బోడ డురాల్ పంచాయతీలో సోమవారం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. 55 వినతులను స్వీకరించారు. 16 వ్యక్తిగత ఫిర్యాదులు, 39 గ్రామ సమస్యలున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాల సేవలను అందించేందుకు శిబిరంలో ప్రత్యేక క్యాంప్ను ఏర్పాటు చేశారు. కొత్త శ్రామిక కార్డులు అందజేశారు. సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద కొత్త పెన్షన్ల కోసం నమోదు చేపట్టారు. ఆరోగ్య శిబిరం నిర్వహించి వైద్య సేవలు అందించారు. ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అటవీశాఖ అధికారి సాయికిరణ్, సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, ఇతర అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. -
రిటైర్డు నేవీ ఉద్యోగి ఇంట్లో చోరీ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని పీఎన్కాలనీ రెండో లైన్లో నివాసముంటున్న రిటైర్డ్ నేవీ ఉద్యోగి ఎ.వి.రత్నం ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 5 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో లైన్లోని సత్యసాయిబాబా మందిరానికి వెళ్లే దారిలో వనిత బొటిక్ పక్కనే ఉన్న నివాసంలో ఎ.వి.రత్నం తన భార్యతో కలిసి ఉంటున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న కుమారుడి వద్దకు గత నెల 24న వెళ్లారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అక్కడి వాచ్మేన్ పరిశీలించగా ఇంటి కుడివైపు పోర్టికో పక్కన కిటికీ గ్రిల్ వంగి ఉండటాన్ని గమనించాడు. చోరీ జరిగిందన్న అనుమానంతో 112కు కాల్చేశాడు. రెండో పట్టణ ఎస్ఐ లక్ష్మి, ఫింగర్ ప్రింట్ సీఐ భరత్, క్లూస్ టీమ్ సభ్యులు ఘటనా స్థలికి చేరి పరిశీలించారు. ఇంటికి సమీపంలోనే సీసీ కెమెరాలుండటం, కారుపై కాలిబూట్ల మరకలు ఉండటం గమనించారు. ఈలోగా ఎ.వి.రత్నం బావమరిది సిమ్మ రాజశేఖర్ వచ్చి లోపలికి వెళ్లి చూడగా బీరువా లోపల హ్యాండ్బ్యాగులు, దుస్తులు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా ఉండటం గుర్తించారు. ఎ.వి.రత్నంతో ఎస్ఐ లక్ష్మి ఫోన్లో మాట్లాడగా.. బీరువాలో రుద్రాక్షలు కూడిన బంగారు గొలుసు, నల్లపూసల తాడు, కొంత వెండి సెంటిమెంట్ ప్రకారం దాచుకున్నామని, మిగతాదంతా బ్యాంకు లాకర్లలో దాచామని చెప్పారు. 4 నుంచి 5 తులాల బంగారం చోరీకి గురై ఉండవచ్చన్నారు. ఇంటి యజమానులు రాకపోవడంతో ప్రస్తుతానికి కేసు నమోదు కాలేదని సీఐ ఈశ్వరరావు చెప్పారు. -
● అరసవల్లికి భక్తుల వరుస..
ప్రత్యక్ష దైవం అరసవల్లి ఆదిత్యాలయానికి భక్తులు పోటెత్తారు. మాఘమాసం రెండో ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. పలువురు భక్తులు ఆరోగ్యం కోసం భక్తులు సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. మరోవైపు, ఎండ కారణంగా క్యూలైన్లలో పలువురు భక్తులు అవస్థలు పడ్డారు. ఆలయంలో ప్రత్యేక పూజలు సందర్భంగా ఆదివారం ఒక్క రోజే రూ.21,32,969 ఆదాయం వచ్చినట్లు ఈఓ కె.ఎన్.డీ.వీ.ప్రసాద్ తెలిపారు. టికెట్ల రూపంలో రూ.11,33,100, పూజలు, విరాళాలు రూపంలో రూ.2,51,239, ప్రసాదాల రూపంలో రూ.3,20,885, వివిధ రకాల ఆన్లైన్ సేవల ద్వారా రూ.4,27,745 ఆదాయం వచ్చినట్లు వివరించారు. – అరసవల్లి -
సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఏపీ ఎన్జీజీవో కార్యాలయంలో ఆదివారం ఐక్య సమావేశం నిర్వహించారు. ఇటీవల మరణించిన 40 మంది ఉద్యోగులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి ఇక మీదట జిల్లాలోని ఉద్యోగులకు బాసటగా నిలచి కలిసి పోరాడాలని తీర్మానించారు. అనంతరం ఏపీ ఎన్జీజీవో జాయింట్ సెక్రటరీ కూన వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల ఆత్మ గౌరవం దెబ్బతీసేలా కొందరు అధికారులు ప్రవర్తించటం తగదన్నారు. పదోన్నతులు, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఘనంగా సంబాద్ సాహిత్య ఘర్ వార్షికోత్సవం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా సంబాద్ సాహిత్య ఘర్ 10వ వార్షికోత్సవాన్ని స్థానిక ఎంయూజే భవనంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త, కవి చక్రపాణి పరిచా పాల్గొన్నారు. ముఖ్యవక్తగా జిల్లా ప్రణాళిక బోర్డు ఉపనిర్దేశకుడు గోలక్ చంద్ర దళేయి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబాద్ సాహిత్య ఘర్ అధ్యక్షుడు డాక్టర్ రంజన్ కుమార్ స్వైయి అధ్యక్షత వహించారు. గౌరవ అతిథులుగా రవేంద్ర కుమార్ మహరణా, సుకాంత సాహు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో జిల్లా సమన్వయకర్త ప్రమేంద్ర పరిచా సాహిత్య ఘర్ లక్ష్యాలు, ఉద్దేశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రవేంద్రనాథ్ ఠాగూర్ అమర కావ్య గ్రంథం గీతాంజలిపై సమాచార ప్రధానమైన ఉపన్యాసం ఇచ్చారు. కార్యక్రమంలో తారక్ మండాల్, ఆశోక్ కుమార్ షాడాంగీ, మానస్ రంజాన్ మాహపాత్రో, ఆశోక్ మిశ్రో, విక్రమ్ పాడీ, జితేంద్ర కుమార్ త్రిపాఠి, గుణనిధి లాబ్లా, ప్రకాష్ పట్నాయక్, రాహుల్ గోలారీ ఇతరులు పాల్గొన్నారు. -
మన ప్రశాంతి ‘బంగారం’
● ఏషియన్ మహిళల సెపక్తక్రా చాంపియన్షిప్ పోటీల్లో విజేతగా నిలిచిన భారత జట్టు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన సెపక్తక్రా క్రీడాకారిణి గేదెల దుర్గాప్రశాంతి సత్తా చాటింది. ఆరో ఏషియన్ మహిళల అంతర్జాతీయ సెపక్తక్రా చాంపియన్షిప్లో భారత జట్టు విజేతగా నిలిచింది. జట్టు విజయంలో ప్రశాంతి కీలక పాత్ర పోషించడం గమనార్హం. క్రీడాకారిణి రాణించడంపై కలెక్టర్తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు మాస్టారు, సెపక్తక్రా అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తితోపాటు, సంఘ ప్రతినిధులు, కోచ్ గాలి అర్జున్రెడ్డి, డీఎస్డీఓ ఎ.మహేష్బాబు, సీనియర్ క్రీడాకారులు తదితరులు సంతోషం వ్యక్తంచేశారు. దళిత నాయకులపై కేసులు సరికాదు టెక్కలి: దళితులు, దళిత నాయకులపై తప్పుడు కేసులు సరికాదని విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు అన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు బోకర మోహన్రావు అధ్యక్షతన ఆదివారం టెక్కలిలో జిల్లా మహాసభలను నిర్వహించారు. జిల్లాలో టెక్కలి, పాతపట్నం మండలాల్లో దళితులు, దళిత నాయకుల పై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని దుయ్యబట్టారు. రెవెన్యూ అధికారుల పక్షపాత వైఖరితో దళితులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో భూ ఆక్రమణలు, ఆధిపత్య కులాల కబ్జాలపై ప్ర స్తావించారు. అంబేడ్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. అనంతరం వివిధ రకాల దళిత సమస్యలపై తీర్మానం చేశారు. శ్రీముఖలింగంలో బారికేడ్లు ఏర్పాటు జలుమూరు: శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాలకు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ఈఓ కె.ఏడు కొండలు ఆదివారం తెలిపారు. ముందుగా ఆలయం రెండు వైపులా మాఢవీధుల గుండా బారికేడ్లు కట్టి అనంతరం ఆల యం ముందు, వెనుక భాగంలోనూ అవసరం మేర ఏర్పాటు చేయనున్నారు. విజయనగరం పైడితల్లి, అరసవల్లి దేవాలయాల నుంచి బారికేడ్లు తీసుకురానున్నారు. ఆలయంలో 12 సీసీ కెమెరాలు ఉండగా అదనంగా ఏడు సీసీ కెమెరాలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. శ్రీముఖలింగం శాశ్వత ధర్మకర్తకు ఆహ్వానం జలుమూరు: ఈ నెల 15 నుంచి 18 వరకు శ్రీముఖలింగంలో జరగనున్న శివరాత్రి ఉత్స వాలకు ఆలయ శాశ్వత ధర్మకర్త పర్లాఖిముండి మహారాణి కల్యాణి గజపతివర్మకు ఆహ్వానం అందించామని ఆలయ ఈఓ కె.ఏడుకొండలు ఆదివారం తెలిపారు. పర్లాఖిముండిలో ధర్మకర్త స్వగృహానికి అర్చకులు, కమిటీ సభ్యులతో వెళ్లి ఆహ్వానం అందించామన్నారు. శివరాత్రి రోజు రాత్రి జరిగే లింగోద్భవానికి ఏటా కల్యా ణి గజపతి వర్మ హాజరై స్వామికి బంగారు, వెండి పువ్వులతో ప్రత్యేక పూజలు,అభిషేకాలు చేయడం సంప్రదాయం. ఉల్లాసంగా రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు టెక్కలి: ఈ నెల 13 నుంచి రెండు రోజుల పాటు గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి మినీ జూనియర్ క్రీడా పోటీలకు సంబంధించి ఆదివారం టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించారు. అండర్–12 విభాగంలో నిర్వహించిన ఈ ఎంపికల్లో భాగంగా 210 మంది బాలురు, బాలికలు హాజరయ్యారు. వీరిలో 12 మంది చొప్పున రెండు విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులకు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి.రామకృష్ణ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులను అందజేశారు. బాలిగాంలో దొంగల హల్చల్ మందస: బాలిగాం గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు.శనివార రాత్రి కిల్లి శారదమ్మ ఇంట్లో తులమున్నర బంగారం, వల్లభ భూదేవి ఇంట్లో ఆరు తులాల వెండి పట్టుకుపోయా రు. మార్పు భుజంగరావు ఇంట్లో బీరువాలను తెరిచి చిందర వందరగా పడేశారు. ఆదివారం విషయం వెలుగు చూడటంతో కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, మందస ఎస్ఐ కృష్ణప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
క్రికెట్ విజేతగా చాలెంజర్స్
పర్లాకిమిడి: దివంగత క్రికెటర్ అబ్దుల్లా స్మారక కళింగా క్రికెట్ టోర్నమెంట్ శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రంతో ముగిసింది. గత నెల 11న క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. ఆదివారం వైట్క్యాప్స్ (పర్లాకిమిడి), చాలెంజర్స్ (పర్లాకిమిడి) జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన వైట్ క్యాప్స్ జట్టు నిర్ణీత 30 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. పర్లాకిమిడి చాలెంజర్స్ 26 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసి విజేతగా నిలిచింది. విజేత జట్టు చాలెంజర్స్కు చాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, పొట్నూరు రామకృష్ణ రూ.25 వేల చెక్కు, కప్పును అందజేశారు. రన్నర్స్గా నిలిచిన వైట్ క్యాప్స్ టీమ్కు అబ్దుల్లా తమ్ముడు రూ.18 వేల చెక్కు, కప్పును అందజేశారు. పొట్నూరు రామకృష్ణ ప్రథమ బహుమతిని స్పాన్సర్ చేసినందుకు కళింగ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు అట్టాడ రమేష్ అభినందనలు తెలిపారు. ఈ టోర్నమెంట్లో గజపతి క్రికెట్ ప్లేయర్స్ సెక్రటరీ దేబాషిష్ పాడీ(మిట్టు), సంతోష్ పట్నాయక్, న్యాయవాది పరిడా తదితరులు పాల్గొన్నారు. -
పోరాటంతోనే నాయకత్వం
● గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి భువనేశ్వర్: పోరాటాలతో నాయకత్వం రూపుదిద్దుకుంటుందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు పవిత్రమోహన్ ప్రధాన్ జీవిత విశేషాల్ని ఉటంకిస్తూ ఈ విషయం తెలిపారు. పవిత్రమోహన్ ప్రధాన్ 118వ జయంతి సందర్భంగా అంగుల్ జిల్లా కణిహా మండలం పవిత్ర నగర్లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో గవర్నర్ ప్రసంగించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దివంగత పవిత్ర మోహన్ ప్రధాన్ విగ్రహం ఆవిష్కరణ, మ్యూజియం ప్రారంభోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో పలు మౌలిక సదుపాయాలు, అభివృది్ధ్ ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు శంకుస్థాపనలు చేశారు. కొత్తగా ప్రారంభించిన శంకుస్థాపన విగ్రహం, మ్యూజియం స్మారక చిహ్నాలు, ప్రజాసేవ, సామాజిక పరివర్తనకు అంకితమైన జీవితానికి సజీవ చిహ్నాలని గవర్నర్ పేర్కొన్నారు. ధైర్యం, నిజాయితీ, త్యాగం, సమాజం పట్ల నిబద్ధత వంటి విలువలను పరిరక్షణ ప్రతిబింబంగా ఈ మ్యూజియం భావితరాలకు విద్యా కేంద్రంగా ఆవిర్భస్తుందన్నారు. పవిత్రమోహన్ ప్రధాన్ ఉద్యమ జీవితంలో గర్జత్ పాలకుడి అణచివేత పాలనకు వ్యతిరేకంగా తాల్చేర్ ప్రజా మండల్ ఉద్యమం, హిజ్రత్ సామూహిక నిరసన చారిత్రాత్మక మైలురాళ్లుగా నిలిచిపోయాయన్నారు. ఈ పోరాటాలు నిరంకుశ పాలనను అంతమొందించి తాల్చేర్ను ప్రజాస్వామ్య ఒడిశాలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. స్వాతంత్య్రం తరువాత పవిత్ర మోహన్ ప్రధాన్ శాసన సభ్యుడిగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రజలతో మంచి సంబంధాలను కొనసాగిస్తూనే తన ప్రజా సేవను కొనసాగించడం ఆదర్శప్రాయమైన నాయకత్వ ధీరత్వానికి నిలువెత్తు తార్కాణమన్నారు. విద్యా రంగంలో ఆయన సేవలు ప్రగతిశీల, విజ్ఞానవంతమైన, సాధికారత కలిగిన ఒడిశాకు పునాది వేశాయన్నారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ దివంగత పవిత్ర మోహన్ ప్రధాన్ ఈ నేల యొక్క గర్వం, గౌరవం, ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ఆయన తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారన్నారు. పోరాట జీవితం, రాజకీయ ప్రస్థానం, విద్యా రంగం పురోగతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఢెంకనాల్ లోక్సభ సభ్యుడు రుద్ర నారాయణ్ పాణి, ఎమ్మెల్యే అశోక్ మహంతి, కలెక్టర్ ముహమ్మద్ అబ్దుల్ అక్తర్ ప్రసంగించారు. -
ఆధ్యాత్మిక విలువలపై బోధన
జయపురం: స్థానిక సామాజిక సంస్థ సోషియల్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోషియేషన్(సీవా) ఆధ్వర్యంలో జయపురం సిటీ ఉన్నత పాఠవాలలో ఆధ్యాత్మిక సెమినార్ను ఆదివారం నిర్వహించారు. సీవా సీనియర్ సభ్యులు విశ్రాంత వ్యవసాయ అధికారి జి.వెంకట రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చైతన్యం, నైతిక విలువలు పెంపొందించటమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ప్రారంభించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు భారతీయ సంస్కృతి, మానవత్వం, నైతిక విలువలపై బోధించారు. శ్రీమద్భగవద్గీత శ్లోకాలు మానవ విలువలు, రామాయణం, మహాభారతం తదితర అంశాలపై క్విజ్ నిర్వహించారు. సీవా మాజీ కార్యదర్శి, సిటీ ఉన్నత పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ప్రతాప్ కుమార్ పట్నాయిక్ కృషి, సహకారాలతో సెమినార్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
రాయగడ: ఈ నెల మూడో తేదీన జిల్లాలోని అంబొదల పోలీస్ స్టేషన్ పరిధి శుండిపొదొరో గ్రామానికి చెందిన చిరిరామ్ బాగ్ (71) అనే వృద్ధుడు చేతబడి చేస్తున్నాడన్న నెపంతో గుర్తు తెలియని దుండగులు అతనిని హత్య చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన సుఖదేవ్ బాగ్ను శనివారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పాతకక్షలతో పాటు చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో చిరిరామ్ బాగ్ను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని ఐఐసీ కల్పన బెహర తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం రాయగడ: జిల్లాలోని కొలనార అగ్నిమాపక కేంద్రం సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతులు చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనకాబడి గ్రామానికి చెందిన జగన్నాథ సరక (32), బొడొపొదియారి గ్రామానికి చెందిన మహేష్ బిడిక (31)లుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. బైకులపై వస్తున్న ఇద్దరు కొలనార వద్ద గల అగ్నిమాపక కేంద్రం సీమీపంలో ఎదురెదురుగా ఢీకోవడంతో ప్రమాదం జరిగింది.తీవ్రగాయాలకు గురైన వీరు అక్కడిక్కడే మృతి చెందారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుని దుర్మరణం రాయగడ: సదరు సమితి పితామహల్ పంచాయతీలోని దుశారిగుడ గ్రామానికి చెందిన సునీల్ హిమిరిక (40) అనే యువ కుడు ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. పితామహాల్ –సిరికొన బైపాస్ ప్రధాన రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రహదారిని దాటుతుండగా వేగంగా వచ్చిన ఒక బైకు అతడిని బలంగా ఢీకొంది. దీంతో సంఘటన స్థలం వద్దే హిమిరిక మృతి చెందాడు. అయితే ఢీకొట్టిన బైకు చోదకుడు సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తు గ్రామస్తులు, బాధిత కుటుంబీకులు చేపట్టిన ఆందోళన ఫలితంగా ఆయా మార్గంలో గల వాహనాల రాకపోకలు నిలిచిపొయాయి. సమాచారం తెలుసుకున్న శెశిఖాల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పితామహల్ పంచాయతీ సర్పంచు టుటు తాడింగి సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులతో మంతనాలు చేశారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించే విధంగా కృషి చేయడంతో పాటు ఢీకొట్టి వెళ్లిన బైకు చోదకుడిని కూడా అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పరి స్థితి అదుపులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల పోలీస్ స్టేషన్ ఆద్వర్యంలో ఈ ఆదివారం స్థానిక పాఠశాల విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం మనుషులు తమ పనిభారం తగ్గించుకోవడానికి సాంకేతికతపై ఆధారపడుతున్నారు. అన్ని ముఖ్యమైన పనులు ఇంటర్నెట్, కంప్యూటర్ ద్వారా చాలా తక్కువ సమయంలో పూర్తవుతున్నాయి. అయితే ఈ సమయంలో అందరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు. కొద్దిపాటి నిర్లక్ష్యం చేసినా సైబర్ నేరగాళ్ల మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. -
● పుస్తకాల ఆవిష్కరణ
భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ రచించిన ‘యే మట్టి కొథా కొహే’, ‘బక్సీ జగబంధు: ది గ్రేట్ కమాండర్‘ అనే 2 పుస్తకాలను రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి ఆవిష్కరించారు. వేడుకగా జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కంభంపాటి మాట్లాడుతూ ఈ పుస్తకాలు బిశ్వ భూషణ్ హరిచందన్ జీవితకాలపు రాజ్యాంగ విలువలు, ప్రజా సేవ, ఒడిశా స్ఫూర్తి పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. యువ తరాలలో విలువ ఆధారిత నాయకత్వం, దేశ భక్తిని ప్రేరేపిస్తాయని గవర్నరు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి, సౌమ్య రంజన్ పట్నాయక్, ఇతరులు హాజరయ్యారు. -
పోడియా పోలీస్స్టేషన్ ఐఐసీ బాధ్యతల స్వీకరణ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోడియా సమితిలో నూతనంగా నిర్మించిన పోలీసు స్టేషన్కు ఐఐసీగా నియమితులైన సంతోష్ కుమార్ మాఝి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ ఈయన నవరంగ్పూర్ జిల్లా పాపడాహండి పోలీసుస్టేషన్లో ఎస్ఐగా సేవలు అందించి పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా పోడియ సమితి పాత్రికేయుల బృందం ఐఐసీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. అనంతరం ఐఐసీ సంతోష్ మాట్లాడుతూ.. అందరి సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యలు ఉంటే తమ సిబ్బంది దృష్టికి తీసుకురావాలన్నారు. మావోలు లొంగిపోవాలి ● తోటి మావోయిస్టులకు నిఖిల్ వీడియో సందేశంరాయగడ: ప్రభుత్వం ఆదరిస్తుంది. ఆయుధాలు వీడి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఇటీవల పోలీసుల ఎదుట తమ సహచరులతో కలిసి లొంగిపోయిన ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు, మావొ నేత నిఖిల్ రౌత్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశంలో తన మాజీ సహచరులకు విన్నవించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయుధాలతో ఎలాంటి ప్రయోజనం లేదని, ఆదివారం నాడు విడుదల చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. తాను కూడా ఆ బాటను వీడి ఆయుధాలతో సహా పోలీసుల సమక్షంలో లొంగిపొయానని మిత్రులంతా కూడా ఇదే బాటను అవలంబించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లొంగిపొయిన మావోయిస్టులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించడంతో పాటు జీవనోపాధిమార్గాలను కూడా కల్పిస్తుందని వివరించారు. రాజ్యాంబ బద్ధంగా పోరాడాలే తప్ప కొండల్లో ఉంటూ ఆయుధాలతో చేసేదేమీ లేదని పేర్కొన్నారు. మిత్రులు ఎవరైనా లొంగిపోవాలని అనుకుంటే 9437643839 నంబరుకు సంప్రదిస్తే తాను సహకరిస్తానని ప్రకటించారు. -
సాంకేతిక పరిజ్ఞాన ‘ప్రవాహ్’ం
డ్) సెమీకండక్టర్లపై దృష్టి సారించి ముందంజలో దూసుకుపోతుందని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రవాహ్లో రిజిస్ట్రేషన్లు 10 రెట్లు పెరిగాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అప్లైడ్ మెటీరియల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రిన్సిపల్ టెక్నాలజిస్ట్ డాక్టర్ సూరజ్ రంగరాజన్ టెక్ టాక్ ప్రసంగం విద్యార్థులు, ఇన్స్టిట్యూట్ సభ్యులను చైతన్యవంతం చేసింది. ఏఐ ఆన్ ట్రయల్ పుస్తక రచయిత, రాజ్య సభ సభ్యుడు సుజీత్ కుమార్ ప్రసంగం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, విధానం, వాటి సామాజిక ప్రభావంపై లోతుగా ఆలోచింపజేసింది. డేటా సైన్స్ హ్యాకథాన్, జనరల్ క్విజ్, మార్కటస్ బిజినెస్ ఛాలెంజ్, ఫ్యాషన్ షో, స్టార్టప్ ఎక్స్పో, రోబో సాకర్, సాంస్కృతిక ప్రదర్శనలు, స్టార్ నైట్ వంటి విభిన్న కార్యక్రమాల సముచిత మేళవింపు ప్రవాహ్ ఉత్సవం సాంకేతికత, వ్యవస్థాపకత, సంస్కృతి సమన్వయం ప్రదర్శించింది. ప్రముఖ స్టాండప్ కమెడియన్ ప్రణవ్ శర్మతో కామెడీ ప్రవాహ్ ఉత్సవంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఉత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీపాద కర్మల్కర్, విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ దాక్టరు రాజేష్ రోషన్ దాష్, ప్రవాహ్ చైర్పర్సన్ డాక్టర్ జి.సంతోష్ కుమార్, స్టూడెంట్ జింఖానా అధ్యక్షుడు డాక్టర్ కోదండ రామ్ మంగిపూడి, ప్రవాహ్ సహ చైర్పర్సన్ డాక్టర్ బంకిమ్ చంద్ర మహంత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి కందుల జోజి కుమార్ ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించాడు.భువనేశ్వర్: క్రానికల్స్ ఆఫ్ టైమ్ ఇతివృత్తంతో భువనేశ్వర్లోని భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) సంయుక్త సాంస్కృతిక, టెక్నోప్రెన్యూర్షిప్ వార్షిక ఉత్సవం ప్రవాహ్ ఉత్సాహంగా సాగింది. నాలుగు రోజుల పాటు జరిగిన ప్రవాహ్ కార్యక్రమం సాంకేతికత, సంస్కృతి, వ్యవస్థాపకత సంగమాన్ని ప్రతిబింబించింది. ప్రవాహ్ ప్రభావవంతమైన ఆలోచనలతో ఆవిష్కరణలకు ప్రాణం పోసి ఆధునిక యుగాలకు మార్గదర్శకంగా ప్రేరేపిస్తుందని వక్తలు అభినందించారు. ప్రవాహ్ ప్రత్యేకం సాంకేతికత, సంస్కృతి, వ్యవస్థాపకతలను విలీనం చేసి ప్రవాహ్ జాతీయ స్థాయిలో ప్రత్యేకత సంతరించుకుందని డైరెక్టర్ ప్రొఫెసర్ కర్మల్కర్ ప్రశంసించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్లో భాగంగా దేశంలోని ఇతర రాష్ట్రాలు ఎలిమెంటల్ సెమీకండక్టర్ తయారీపై దృష్టి సారిస్తుండగా ఒడిశా సమ్మేళన (కాంపౌం -
వర్సిటీ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన
జయపురం: విక్రమదేవ్ విశ్వవిద్యాలయ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు శనివారం ఆందోళన చేపట్టారు. పరీక్ష ఫలితాలు ఆలస్యంగా విడుదల చేయటం, హాస్టళ్లలో తగిన వసతులు, సౌకర్యాలు లేకపోవడం, స్కాలర్షిప్ మంజూరులో జాప్యంపై పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రిజిస్ట్రార్ మహేశ్వర్ చంద్ర నాయిక్కు ఏబీవీపీ ప్రతినిధులు అందజేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తామని రిజిస్ట్రార్ హామీ ఇచ్చారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విశ్వవిద్యాలయలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించటం తమకు ముఖ్యమని.. అందుకు ఒక కమిటీ వేసి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. డిమాండ్లను పరిశీలించి వాటిని విడతల వారీగా అమలు చేస్తామని చెప్పారు. విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని, సమస్యల పరిష్కారంలో తాము ఎటువంటి జాప్యం చేయమని హామీ ఇచ్చారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి, ప్రశాంతత విద్యార్థుల సహకారంతోనే సాధ్యమన్నారు. రిజిస్ట్రార్ హామీతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
వైభవంగా హనుమద్వాహనసేవ
● రేపటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలురాయగడ: అమలాభట్ట సమీపంలోని శ్రీక్షేత్ర టౌన్ షిప్ ప్రాంగణంలో కొలువైయున్న శ్రీనృసింహ స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి స్వామి వారికి హనుమద్వాహన సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో హనుమంతుని భుజంపై ఆశీనుడైన స్వామి వారిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ ప్రధాన ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్, ట్రస్టు సభ్యులు స్వామి వారి సేవలో నిమగ్నమయ్యారు. హనుమద్వాహన పల్లకిని మోసుకుంటూ స్వామి వారికి జయజయ ధ్వనాలతొ ఊరేగింపు నిర్వహించారు. ముందుగా మహిళలు కొలాటం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వాహనం మోసుకుంటూ మందిరం వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం స్వామి వారిని ఆశీనుడైన సమయంలో సహస్ర దీపాలంకరణ సేవలో భాగంగా దీపాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా మహిళలు దీపాలను వెలిగించారు. పద్మం పువ్వు ఆకారంలో దీపాలను ఉంచి స్వామి వారికి సమర్పించారు. తదుపరి నిత్యహోమాలతో పాటు నీరాజనం, మంత్రపుష్పములతో పూజా కార్యక్రమాలు జరిగాయి. కాగా మంగళవారంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని నిర్వహకులు తెలిపారు. -
ప్రతిభ చూపిన విద్యార్థులు
జయపురం: జయపురం పూజ్య పూజ సంసద్ 30 వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక అప్పర కొలాబ్ ప్రాజెక్టు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల మధ్య అనేక పోటీలు నిర్వహించారు. ముందుగా ఉత్కళ ఆరాధ్య దైవం శ్రీజగన్నాథ, బలభధ్ర, సుభద్ర మూర్తులకు పూజలు చేసి పోటీలు నిర్వహించారు. మూడు, నాలుగు, ఐదో తరగతుల విద్యార్థులకు దృష్టి, శ్రవణ పోటీలు నిర్వహించారు. 6 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు కథలు, కవితల రచన పోటీలు నిర్వహించారు. అలాగే కళాశాల స్థాయి విద్యార్థులకు కవితా పఠన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పూజ్య పూజా సంసద్ అధ్యక్షుడు ఉదయ శంకర జాని, ఉపాధ్యక్షుడు తపన్ కిరణ్ తరిపాఠీ, కార్యదర్శి భైరాగి యరణ సాహు సహాయ కార్యదర్శి మృత్యుంజయ సాహు సంసద సలహాదారు ఇంజనీర్కేధార్ నాత్ బెహర పాల్గొని పోటీలను నిర్వహించగా న్యాయ నిర్ణేతలుగా విజయ కుమార్ భట్, సంఘ మిత్రభక్త్ , ప్రమోద్ కుమార్ రౌళో, సస్మితా పాఢి,సవితా పాఢీ తదితరులు వ్యవహరించారు. -
సాంకేతికతపై శిక్షణ
పర్లాకిమిడి: అభివృద్ధి చెందుతున్న సాంకేతికతపై స్థానిక మహరాజా బాలుర ఉన్నత పాఠశాలలో ఐటీశాఖ ప్రభుత్వ ఒడిశా కంప్యూటర్ అప్లికేషన్ సెంటర్ (ఓకాక్) భువనేశ్వర్ నుంచి విచ్చేసిన నిపుణులు విద్యార్థులకు రోబోటిక్స్, కృత్రిమ మేధా, సైబర్ సెక్యూరిటీపై శనివారం అవగాహన కల్పించారు ఎమెర్జింగ్ టెక్నాలజీ శిక్షణలో ఓకాక్ గజపతి హెడ్ శ్రీకాంత్ మహంతి, అదనపు జిల్లా విద్యాధికారి ఎస్.గిరధర్, హెచ్ఎం మోనాలిసా దాస్ పాల్గొని మాట్లాడారు. దైనందిన జీవితంలో రోబోటిక్స్ ఎలా ఉపయోగపడతాయో వివిధ రోబోలను ప్రదర్శించారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు 120 మంది శిక్షణకు హాజరయ్యారు. కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీపై పలు అంశాలను క్షిరాబ్దితనయ పండా, అశుతోష్ శెట్టి, సూరజ్ స్వయి వివరించారు. ఉపాధ్యాయులు డి.శ్రీరామ్మూర్తి, శుభశ్రీదర్శిని, ఎం.సత్యనారాయణ, జగన్నాథ పట్నాయక్ పాల్గొన్నారు. -
టెన్త్ శిక్షణ శిబిరం సందర్శన
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 2026 పదవ తరగతి బోర్డు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు నిర్వహిస్తున్న రెండో విడత నివాస శిక్షణ కార్యక్రమాన్ని జగన్నాధపల్లి హైస్కూల్, బలిమెళాలోని పీఎంశ్రీ హైస్కూల్ను శనివారం సందర్శించారు. ఆయనతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి కూడా ఉన్నారు. ఈ నివాస శిక్షణలో తొలివిడతలో 200 మంది ఎంపికై న విద్యార్థులకు నాలుగు కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు ఉచిత భోజనం, విద్యాసామగ్రి, యోగాఅభ్యాసం, నిపుణులచే రోజు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదనపు కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలు, బోధనపై ఆరాతీసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి సారించాలని శిక్షణ కేంద్ర నిర్వహికులు ఇ.ఈశ్వరరావుకు సూచించారు . -
చట్టాలపై అవగాహన అవసరం
పర్లాకిమిడి: బాల్య వివాహాలు రద్దు, నల్సా చట్టాలపై ప్రజాచైతన్య శిబిరాన్ని జిల్లాలో గుసాని సమితి లావణ్యగడ పంచాయతీ కార్యాలయంలో జిల్లా న్యాయసేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రౌళో ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించారు. బాల్యవాహాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని బిమల్ రౌళో అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అనేక మహిళా పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిబిరం జస్టీస్ కార్నర్ చారిటబుల్ ట్రస్టు, నల్సా జాగృతి యోజన ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా అదాలత్ సీనియర్ క్యాడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా, కిశోర్ న్యాయలయం బోర్డు సభ్యులు భాగ్యలక్ష్మీనాయక్, గారబంద పోలీసు ఎస్ఐ అంబికా బెనియా, ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ తపస్వినీ జెన్నా తదితరులు పాల్గొన్నారు. -
ఆమె నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని మంగువారితోటకు చెందిన నానుబాల లలితారా ణి (72) మృతి చెందడంతో ఆమె నేత్రాల ను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. కుమారుడు భవానీప్రసాద్, ఎ.వెంకటరమణ, డోలా వలసయ్యలు విషయాన్ని రెడ్క్రాస్కు తెలియజేయగా సిబ్బంది వచ్చి కార్నియాలు సేకరించారు. అనంతరం విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్ కోరారు. టెక్కలి: మార్చి నెలాఖరులోగా వివిధ రకాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గంలో కొత్తగా రెండు ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి , పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖాధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ అధికారి, అసిస్టెంట్ బీట్ అధికారి, దేవదాయ శాఖ ఎగ్జిక్యూ టివ్ ఆఫీసర్ గ్రేడ్ 3, తానేదర్ ఇన్ ఎ.పి. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 11 వర కు జరిగే ఈ పరీక్షలకుఅభ్యర్థులు హాల్ టికెట్, ఒరిజినల్ ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతో హాజరుకావాలని కోరారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 1375 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, కాలేజీ ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. పలాస: ఉద్దానం ప్రాంతంలో ఆదర్శ విప్లవకారుడు రాజాం గుణవంతు అని పలువురు వక్తలు కొనియాడారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన రాజాం గుణవంతు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో శనివారం సంతాప సభ నిర్వహించారు. బొడ్డపాడు యర్రయ్య అధ్యక్షతన జరిగి న ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ గుణవంతు నాటి శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారని, పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వాన ఉద్దానం ప్రాంతంలో జరిగిన సముద్రం తీర ప్రాంత భూములు పంపిణీలోను, సారా వ్యతిరేక పోరాటంలో, జీడి రైతాంగ గిట్టుబాటు ధర ఉద్యమంలో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు దాసరి శ్రీరాములు, తామాడ త్రిలోచన రావు, కిక్కర ఢిల్లీరావు, బొడ్డు సింహాద్రి, కోత ధర్మారావు, ప్రభాకర్, బొడ్డు దుష్యంతు, మద్దిల ధర్మారావు, సాలిన వీరాస్వామి, మెట్టూరు వీరాస్వా మి, పోతనపల్లి కుసుమ, నైగాపు గంగాధర్, బొడ్డు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస: జీడిమామిడి సాగుతో గిరిజన రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ జి.శివన్నారాయణ అన్నారు. ఆమదాలవలస పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ కాష్యూ నట్ అండ్ కోకో డెవలప్మెంట్, కొచ్చిన్ వారి ఆర్థిక సహకారంతో జిల్లా స్థాయి జీడిమామిడి సదస్సును శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జీడిమామిడి గిరిజన రైతులకు ముఖ్య ఆదాయ వనరుగా మారిందని, సరైన సాగు యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. -
మావో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
● యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ఏడీజీ సంజీవ్ కుమార్ పండా రాయగడ: ఒడిశాను మావో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పోలీస్ విభాగం కృషి చేస్తుందని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తుందని యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ఏడీజీ సంజీవ్ కుమార్ పండా అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం నాడు నాగావళి, జంఝావతి, ఘుంసుర దళాలకు చెందిన 15 మంది మావోయిస్టులు పోలీసుల సమక్షంలో లొంగిపొయారని వారిలో టాప్ లీడర్స్ ఉన్నారని తెలిపారు. మార్చి నెలఖరు నాటికి రాష్ట్రంలో సంపూర్ణంగా మావోలను కూకటి వేళ్లతొ పెకిలించివేస్తామని అన్నారు. అయితే ఇప్పటికే కొంతమంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసులు సమక్షంలో లొంగిపోవడం శుభపరిణామమని అన్నారు. రాయగడ, కంధమాల్, కలహండి వంటి జిల్లాల్లో కొంతవరకు మావో కదలికలు ఉన్నాయని ఆయన వివరించారు. కొరాపుట్, నువాపడ, నవరంగపూర్, బౌధ్, మల్కన్గిరి జిల్లాలను ఇప్పటికే మావో రహిత జిల్లాలుగా ప్రకటించామని అన్నారు. 1998లో తాను ఎస్పీగా ఉన్న సమయంలో ఎక్కువగా మావోల కదలికలు ఉండేవి, ప్రస్తుతం యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ఏడీజీగా విధులు నిర్వహిస్తున్న సమయంలో మావోల అణచివేత చర్యలకు విశేషంగా కృషి చేశానని అన్నారు. రాయగడ, కంధమాల్, కలహండి జిల్లాల్లో ఇప్పటికీ మావోల కదలికలు ఉన్నాయని ప్రస్తుతం ఆయా జిల్లాల్లో కలసి సుమారు 35 నుంచి 40 వరకు మావోయిస్టులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు పోలీస్ శాఖ గుర్తించిందని అన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. లొంగిపోయిన వారి వివరాలు.. జగత్సింగ్పూర్కు చెందిన బలికుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని తెంతులిబిలరి గ్రామానికి చెందిన నిరంజన్ రౌత్ అలియాస్ నిహార్, ఆయన భార్య రస్మిత లెంక అలియాస్ అంకిత, ఇందు, చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వికాష్ అలియాస్ సునీల్, సుందర్ అలియాస్ గంపా ఒయం, ప్రదీప్ అలియాస్ సొను, రొషని అలియాస్ పల్లి మాడ్వి, అరుణ అలియాస్ ఆర్ణ, సుకి మాడ్వి, కుమారి అలియాస్ పొజికారం, దీపక్ అలియాస్ బమన్ బెకొ, రాకేష్ అలియాస్ జగా కవాసి, లలిత్ అలియాస్ సనకుంజామ్, రాజీ అలియాస్ ఛొటి ఉయ్క, మాలతి అలియాస్ ఇద్మి సొధిలు ఉన్నారు. లొంగిపొయిన మావోయిస్టుల నుంచి ఏకే47–రైఫల్ లు రెండు, ఎస్ఎల్ఆర్ రైఫల్–5, ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్– 1, 303 రైఫిల్స్ –1, కార్బయిన్ రైఫిల్ 3, నాటుతుపాకీలు 3, 12 బొర్మసింగిల్ బారెల్ బ్రీచ్ లోడింగ్–1 లతొ పాటు తుపాకీ గుళ్లును మావోలు సమర్పించారు. సమావేశంలొ ఐజీ ఆపరేషన్స్ దీపక్ కుమార్, డిఐజి అఖిలేశ్వర్ సింగ్, డిఐజి నర్వర్ విశాల్, కంధమాల్ ఎస్పీ హరిష్ బిసి, కలహండి ఎస్పి దేవరకొండ నాగరాజ్, రాయగడ జిల్లా కలెక్టర్ అశుతొష్ కులకర్ణి, ఫిరొజ్ కుజూర్ కమాండెంట్, 4వ బెటాలియన్, రాయగడ పాల్గొన్నారు. -
హైటెక్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
భువనేశ్వర్: వివాహ వేడుకలో ద్రవ నైట్రోజన్ పదార్థాలు, పానీయాలు సేవనంతో ఆకస్మిక అనారోగ్యానికి గురైన యువకుడిని హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వైద్య నిపుణుల బృందం అరుదైన శస్త్ర చికిత్సతో ప్రాణాలు కాపాడారు. స్థానిక జగన్నాథ్ నగర్కు చెందిన సంజీవ్ త్రిపాఠి అనే 34 ఏళ్ల వ్యక్తి కడుపు వాపు వ్యాధితో హైటెక్ ఆస్పత్రి అత్యవసర విభాగంలో చేరాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించి తక్షణమే ఐసీయూలో చేర్చి నిర్వహించిన సీటీ స్కాన్లో నైట్రోజన్ గ్యాస్ ప్రభావం కారణంగా అతని కడుపులో 3 నుంచి 4 సెంటీ మీటర్ల రంధ్రం ఏర్పడిందని తేలింది. ప్రాణాలు కాపాడేందుకు గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ ప్రేమానంద్ పట్నాయక్ ప్రత్యక్ష పర్యవేక్షణలో చేసిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. కడుపులోని రంధ్రం మూసివేయడంతో ముప్పు తప్పింది. హైటెక్ వైద్య నిపుణుల బృందం సమయస్ఫూర్తితో తీసుకున్న చర్యలు అభినందనీయమని హైటెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి హర్షం వ్యక్తం చేశారు. -
బీజేపీలో పలువురి చేరిక
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలలో గల కళ్యాణ మండపంలో బీజేపీ కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు టి.గోపి ఆనంద్ ముఖ్యఅతిథిగా, సీనియర్ నాయకులు శివశంకర్ ఉలక, పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు రామచంద్ర బెహరా, పార్టీ రాష్ట్ర శాఖ ఎస్సీ, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు కాళీరాం మాఝి, జిల్లా సాధారణ కార్యదర్శి భికారి నాహక్, ఉపాధ్యక్షుడు సుశీల్ సురాఫ్, దేవాశీస్ పండ, శాంతను సుబుద్ధి, వర్మిష్టా సామంత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపీఆనంద్ మాట్లాడుతూ జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సమితి వారిగా సమావేశాలను నిర్వహించి, పార్టీ సిద్ధాంతాలు, ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించాన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కార్యకర్తలు పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన మిశ్రణ కార్యక్రమంలో బీజేడీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వంద మందికిపైగా కర్యాకర్తలు బీజేపీలో చేరారు. వీరికి గోపీఆనంద్ కండువాలు వేసి స్వాగతం పలికారు. అంతా కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. -
బీజేడీ పార్టీ సంతోష్ మిశ్రా రాజీనామా
కొరాపుట్: ప్రతిపక్ష బీజేడీ పార్టీకి సీనియర్ నాయకుడు సంతోష్ మిశ్ర (పింటూ) రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్కి రాజీనామా లేఖను శనివారం పంపించారు. నబరంగ్పూర్ కి చెందిన పింటూ జనతాదళ్ పార్టీ విద్యార్థి విభాగం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. జనతాదళ్ ఒడిశాలో బీజేడీగా రూపాంతరం చెందినప్పడు పింటూ కూడా బీజేడీలో కొనసాగారు. 1998లో పార్టీ మద్దతుతో నబరంగ్పూర్ మహా విద్యాలయం విద్యార్థి విభాగం అధ్యక్షునిగా గెలుపొందారు. 2002–12 మధ్య కాలంలో పార్టీ జిల్లా యువ విభాగ ఉపాధ్యకునిగా, 2012–16 మధ్య నబరంగ్పూర్ పట్టణ అధ్యక్షునిగా పని చేశారు. సుమారు దశాబ్ద కాలంగా పార్టీ మద్దతుతో జిల్లా కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కొనసాగారు. ప్రస్తుతం విడుదలైన పార్టీ జిల్లా కార్యవర్గంపై అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన పేర్కొన్నారు. పింటూ తండ్రి ప్రకాష్ మిశ్ర పార్టీకి అవిభక్త కొరాపుట్ జిల్లాల జనరల్ సెక్రటరీగా పని చేశారు.పింటూ రాజీనామాతో పార్టీ వర్గాలు ఉలిక్కి పడ్డాయి. 311 మంది వైద్య పరీక్షలు పర్లాకిమిడి: ఇండియాన్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఐ.ఎస్.ఆర్.డి.), క్రాంతి స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా స్థానిక టౌన్హాల్లో ఉచిత క్యాన్సర్ పరీక్షలు, ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా, ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హనగ శనివారం ప్రారంభించారు. ఈ శిబిరంలో పురపాలక చైర్మన్ నిర్మలా శెఠి, జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారి మినాతీకుమారీ దెయి, డి.సి.పి.ఓ అరుణ్ కుమార్ త్రిపాఠి, ప్రొటెక్షన్, ప్రోగ్రాం అధికారి సరలా పాత్రో అతిథులుగా హాజరయ్యారు. 311 మందికి క్యాన్సర్, ఇతర వ్యాధుల స్క్రీనింగ్ చేశారు. ఈ శిబిరంలో జగన్నాథ క్యాన్సర్ ఫౌండేషన్ కవితా మిశ్రా, క్యాన్సర్ నిపుణులు దిలీప్ కోరో, వైద్యులు సుర్జిత్ పాణిగ్రాహి, గిరిధర్ రవుతో, రోజాలినీ శతపతి, ఐ.ఎస్.ఆర్.డి డైరెక్టర్ నాగేశ్వర చౌదరి, క్రాంతి సంస్థ నిర్మలా మిశ్రా, ప్రీతిరాయ్, తదితరులు పాల్గొన్నారు. బోధన–అభ్యాసన ప్రక్రియపై ఆడిట్ ప్రభావం జయపురం: బోధన, అభ్యాసన ప్రక్రియ నాణ్యతపై అకాడమిక్ ఆడిట్ చూపుతుందని, అందువల్ల అకాడమిక్ ఆడిట్ అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. స్థానిక విక్రమదేవ్ విశవ్విద్యాలయంలో ఐక్యూ ఏసీ డైరెక్టర్ డాక్టర్ సుజిత్ కుమార్ దేహురి ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉషా పథకం పరిధిలో అకాడమిక్ ఆడిట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విక్రమదేవ్ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్ర ప్రారంభించారు. బోధన–అభ్యాసన ప్రక్రియ నాణ్యతపై అకాడమిక్ ఆడిట్ ఎందుకు అవసరం, దాని ప్రభావం’ అన్న అంశాలపై చర్చ నిర్వహించారు. నిర్వహణ విక్రమదేవ్ విశ్వవిద్యాలయ రసాయనక శాస్త్రవిభాగ సహయ ప్రొఫెసర్ డాక్టర్ బ్రజబంధు నందా, రసాయన శాస్త్రవిభాగ సహాయ ప్రొఫెసర్ డాక్టర్ స్మిత్ సాగర్ శతపతి, తదితరులు పాల్గొన్నారు. -
బాలల హక్కులు పరిరక్షించాలి
ఆమదాలవలస: బాలల హక్కులపై చట్టసభల్లో సుదీర్ఘ చర్చలు జరపాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం ఆమదాలవలసలోని తన కార్యాలయంలో చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కమిటీ రూపొందించిన 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల సంరక్షణ దేశానికి కీలకమన్న అంశాన్ని యావత్ సమాజంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తెరగాలన్నారు. బాలలపై లైంగిక దాడులు సిగ్గుచేటన్నారు. బాలల హక్కుల కమిషన్లపై రాజకీయ ఒత్తిళ్లు లేనప్పుడే సంపూర్ణ హక్కులు కాపాడవచ్చన్నారు. కార్యక్రమంలో ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు గొండు ధనలక్ష్మి, చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం, తొగరాం పంచాయతీ సర్పంచ్ తమ్మినేని వాణి సీతారాం, వైఎస్సార్ సీపీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్, ఫోరం శ్రీకాకుళం ప్రతినిధులు కొత్తకోట శ్రీనివాస్, మొదలవలస వాసుదేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ బలోపేతమే ధ్యేయం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు సమావేశాన్ని శనివారం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్ పరిడా అధ్యక్షత వహించారు. జిల్లా ఇన్చార్జ్లు, మండల అధ్యక్షులు, కార్యదర్శులు హాజరయ్యారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో కమిటీలను బలోపేతం చేయడం, శక్తి కేంద్ర ప్రధానులను నియమించడం, కొత్తగా గ్రామ స్థాయి ఏజెంట్లను ఎంపిక చేయడం, మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విస్తరించడం వంటి విషయాలను ప్రస్తావించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్ సాహు మాట్లాడుతూ.. పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి, చిత్రకొండ మాజీ ఎమ్మెల్యే డోంబుర్ సీశా, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు దశరథి పోడియమి, మాత్తిలి సమితి చైర్మన్ మహేశ్ బాక్క పాల్గొన్నారు. -
నాల్కో ఎదుట కాంగ్రెస్ ఆందోళన
కొరాపుట్: భారత ఆల్యూమినియ కేంద్రం (నాల్కో) ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఆందోళన చేపట్టారు. కొరాపుట్ జిల్లా దమంజోడిలోని నాల్కో ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర సీఎల్పీ నాయకుడు, పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర ఖడం మాట్లాడుతూ.. నాల్కో యాజమాన్య వైఖరిపై మండి పడ్డారు. ఇక్కడ నాల్కో పరిశ్రమ ఏర్పాటు కోసం వందలాది కుటుంబాలు నిర్వాసితులుగా మారారని.. అయితే వారిని నేటి వరకు ఆదుకోలేదన్నారు. ఇక్కడ యువతకి ఉపాధి లభిస్తుందనే లక్ష్యంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దీన్ని ప్రారంభించారన్నారు. కానీ నాల్కో మాత్రం నిర్వాసితులకు నేటి వరకు ఉపాధి కల్పించలేదన్నారు. ఇక్కడ ప్రజలకు చెందిన వనరులను నాల్కో తరలించుకుపోతుందని రాం చంద్ర ఆగ్రహవేశం వ్యక్తం చేశారు. ఆందోళనలో లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత, మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం
● కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలురాయగడ: అమలాభట్ట సమీపంలోని శ్రీక్షేత్ర టౌన్షిప్లో వెలసియున్న శ్రీలక్ష్మీనరసింహ స్వామి మందిర ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా ఈ నెల ఐదో తేదీ నుంచి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం స్వామి వారి కల్యాణోత్సవం వైభంగా నిర్వహించారు. వేదపండితులు అయ్యవార్లం శ్రీనివాస్ ఆచార్యులు, ఫణిహారం భాస్కరాచార్యులు, తంతిన మోహన క్రిష్ణ, లక్ష్మణ్ ఆచార్యులు, రమేష్ ఆచార్యులు, కాండూరి జగన్నాధ ఆచార్యులు, సాకేత్ ఆచార్యులు, ఆలయ అర్చకులు మంగనాథ ఆచార్యుల ఆధ్వర్యంలో జరిగిన కల్యాణోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అంతకు ముందు ఏకశిల ధ్వజస్తంభ పూజలను సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషశయనంపై స్వామి వారు దర్శనం ఇచ్చారు. అదేవిధంగా ఉత్సవ మూర్తిని ఊరేగించారు. పూజా కార్యక్రమాలను తిలకించేందుకు భక్తుల సందడి కనిపించింది. ఈ నెల పదో తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ తెలియజేశారు. ఆఖరి రోజున చూర్ణోత్సవం, కలశాభిషేకం, చక్రస్నానం, హోమ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా అన్న ప్రసాద సేవన కార్యక్రమానికి భక్తులు హాజరు కావాలని కోరారు. -
సెంచూరియన్లో మంజర్ 4.ఓ ‘డాటాథాన్’ పోటీలు
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో మేనేజ్మెంట్ ఫెస్ట్ ’మంజర్ 4.ఓ’ రెండో రోజును రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్రో ప్రారంభించారు. కార్యక్రమానికి అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ప్రజ్ఞా పాణి, డీన్ (స్టూడెంట్స్) డాక్టర్ సుశాంత్ పట్నాయిక్, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు యం.సుదర్శనరావు, తదితరులు పాల్గొన్నారు. మంజర్ 4.ఓ లో పర్లాకిమిడితో పాటు భువనేశ్వర్ సీఐటీఎం, విజయనగరం కళాశాల ఇంటెల్ విజ్, ఎంబీఏ, సెంచూరియన్ విద్యార్థులు ‘డేటాథాన్’ ప్రాజెక్టులను ప్రజెంట్ చేశారు. పోటీలో విజేతలకు రూ.5 వేలను సెంచూరియన్ వర్సిటీ మేనేజ్మెంట్ బహుమతిగా విజయనగరం క్యాంపస్ ఇంటెల్ విజ్ బృందానికి అందజేశారు. -
మర్రిగుడ దోపిడీ కేసు ఛేదన
పర్లాకిమిడి: గజపతి జిల్లా సెరంగో పోలీసుస్టేషన్ పరిధిలో మర్రిగుడ గ్రామంలో ఈనెల 25న జరిగిన పట్టపగలు చోరీని పోలీసుల బృందం ఛేదించి ముగ్గురు నిందితుల్ని పట్టుకున్నట్టు ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా శనివారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ దొంగతనంలో 300 గ్రాముల బంగారు వస్తువులు, 80 గ్రాముల వెండి వస్తువులు, నగదు ఒకలక్షా 89వేలు పట్టుబడినట్టు ఆర్.లక్ష్మీకళ్యాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. రాణిపేట పంచాయతీలోని డీపీఓ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దొంగతనానికి సంబంధించిన సమాచారం అందజేశారు. 300 గ్రాముల బంగారం విలువ సుమారు రూ.45లక్షలు ఉంటుందని ఎస్పీ పండా తెలియజేశారు. గత నెల 25వ తేదీని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి, ఆర్.లక్ష్మీ కళ్యాణీ తన కుటుంబసభ్యులతో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి మందిరానికి దర్శనానికి వెళ్లారు. తిరిగి అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో మర్రిగుడ తన ఇంటికి చేరుకోగా ఇంటిలో అల్మరా పగులగొట్టి బంగారం, నగదు కొల్లగొట్టినట్టు గుర్తించారు. జనవరి 26న గుమ్మా బ్లాక్ సెరంగో పోలీసు స్టేషన్లో ఆర్.లక్ష్మీకళ్యాణి ఫిర్యాదు చేశారు. దీనిపై హెడ్క్వార్టర్ డీఎస్పీ అమితావ్ పండా ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టీమ్ను జిల్లా ఎస్పీ ఏర్పాటుచేసి పదిరోజుల్లో దొంగతనం మిస్టరీని ఛేదించారు. ఆర్.లక్ష్మీకళ్యాణీ ఇంటిలో పట్టపగలు వారి ఇంట్లోకి ముగ్గురు జొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. మూడో దొంగ బయటకాపలా కాశాడు. కాజేసిన బంగారం, వెండి వస్తువులు సమీపంలో అటవీ ప్రాంతంలో గొయ్యి తీసి పాతిపెట్టినట్టు ఎస్పీ జ్యోతింద్ర పండా తెలియ జేశారు. పోలీసులు దర్యాప్తు చేసి అనుమానంగా ఉన్న దొంగలను పట్టుకుని విచారించగా వారు దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. బంగారం, వెండి వస్తువులు శనివారం ఉదయం పాతిపెట్టిన స్థలంలో సెరంగో పోలీసులు సాక్షుల సహాయంతో బయటకు తీసుకొచ్చి విలేకరుల సమక్షంలో ప్రవేశపెట్టారు. మొత్తం బంగారం 300 గ్రాముల వస్తువులు, 80 గ్రాముల వెండి వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు. నగదు విషయంపై నిందితులను తర్వాత విచారించనున్నట్టు పోలీసు అధికారులు తెలియజేశారు. నిందితులు ముగ్గురు మర్రిగుడకు చెందిన మరాటి గిరిబాబు, అరుణ్ కుమార్ ప్రధాన్, పరిడా గ్రామానికి చెందిన మురళీ నాయక్ను శనివారం జిల్లా కోర్టుకు తరలించారు. ఇంటి యజమాని ఆర్.లక్ష్మీకళ్యాణీ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నది. ఈ దోపిడీకి పాల్పడి పదిరోజుల్లో మిస్టరీని ఛేదించిన జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండాను దుశ్శాలువతో కాశీనగర్ సమితి మాజీ చైర్మన్ ఛిత్రి సింహాఽద్రి, లక్ష్మీ కళ్యాణీలు సత్కరించారు. -
ముందుకు సాగాలి: ముఖ్యమంత్రి
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాంకేతిక పరిజ్ఞానంతో ● భారతీయ మజ్దూర్ సంఘ్ 21వ త్రైవార్షిక సమావేశంభువనేశ్వర్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆటోమేషన్, క్వాంటం కంప్యూటింగ్ వంటి భవిష్యత్ సాంకేతికతలు కార్మిక రంగాన్ని మారుస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సాంకేతికత పోకడతో కొనసాగేందుకు కార్మిక శక్తిని తిరిగి నైపుణ్యపరచుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పూరీలో జరిగిన భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) 21వ త్రైవార్షిక సమావేశంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మాట్లాడుతూ సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, కార్మికుల సంక్షేమం ద్వారా దేశ భవిష్యత్తు వృద్ధిని శక్తివంతం చేయడంలో ఒడిశా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో కార్మికులకు అత్యున్నత గౌరవం ఉందన్నారు. జగన్నాథుడి సంప్రదాయాన్ని ఉటంకిస్తూ ఈ తత్వ శాస్త్రం కార్మిక సంబంధాలను, విధాన రూపకల్పనను మార్గనిర్దేశం చేస్తుంది. కాబట్టి ఏ పనినీ చిన్నదిగా లేదా పెద్దదిగా పరిగణించబోమని ఆయన అన్నారు. భారత దేశం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద శ్రామిక శక్తిని కలిగి ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 13 మిలియన్ల మంది యువత ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) కారణంగా అనేక సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతున్నది వాస్తవం. నైపుణ్యాభివృద్ధి, సరికొత్త్త సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించి ఈ పరిస్థితిని అధిగమించాలని ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో, విద్య, పరిశ్రమల అవసరాల గురించి మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని స్వాగతించారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఐదేళ్లలో 500 అగ్ర స్థాయి కంపెనీలలో ఒక కోటి మంది యువతకు ఇంటర్న్షిప్లను అందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం గణనీయమైన వృద్ధిని సాధిస్తుందన్నారు. గత 20 నెలల్లో రూ. 2.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. మరి కొద్ది కాలంలో దాదాపు రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడిని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి శిక్షణ పొందిన, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అవసరం. పాత కార్మిక చట్టాలను సవరించి కార్మికులకు సామాజిక భద్రత, ఆరోగ్య సౌకర్యాలు, ఓవర్టైమ్ నిబంధనలను బలోపేతం చేసేందుకు 4 కార్మిక కోడ్లు జోడించారు. ఒడిశాలో కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఒడిశా భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కింద 5.1 మిలియన్లకు పైగా కార్మికులు లబ్ధి పొందుతున్నారు. వారి పిల్లలకు విద్య, వివాహ సహాయం, ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ. 6 లక్షల వరకు పరిహారం వంటి సహాయాలు అందజేస్తున్నారు. ఐటీఐ, డిప్లొమా కోర్సులకు స్కాలర్షిప్లు, పరిశ్రమల్లో గృహ సౌకర్యాలు, అసంఘటిత కార్మికులకు సంక్షేమ చర్యలు, అనేక జిల్లాల్లో 200 రోజుల ఉపాధి హామీ వంటి పథకాలు వలసలను అరికట్టడానికి సహాయపడుతున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. మారుతున్న కార్మిక రంగంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కార్మిక సంఘాలను అభ్యర్థించారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడుతు నైపుణ్యం పెంపొందించే కార్యక్రమాలకు చురుకుగా మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు. 2036 నాటికి ఒడిశా సంపన్న రాష్ట్రంగా, 2047 నాటికి భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా పయనిస్తోంది. ఈ దార్శనికతను సాధించడంలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తారు. కార్మికుల గౌరవం, భద్రత, భవిష్యత్ను కాపాడటానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు హిరణ్మయి పాండ్యా, డిప్యూటీ జనరల్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ సురేంద్ర కుమార్ పాండే, ప్రధాన కార్యదర్శి రబీంద్ర హిమేతే, ప్రముఖ కార్మిక నేత యుకీ వట్సుజీ, వివిధ దేశాల నుండి వచ్చిన కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
గుప్తేశ్వర శైవ పీఠం అభివృద్ధికి రూ.23.93 కోట్లు మంజూరు
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో దక్షిణ ఒడిశాలో ప్రసిద్ధ శివ క్షేత్రం గుప్తేశ్వర్ సౌందర్యీకరణ, ఆ ప్రాంతాన్ని అత్యాధునికంగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక విభాగం రూ.23.93 కోట్లు మంజూరు చేసింది. గుప్తేశ్వర్ మందిర ఆధునికీకరణతో పాటుగా ప్రాంతాన్ని అత్యంత సౌందర్యంగా తీర్చి దిద్దేందుకు, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులను పర్యాటకులను ఆకర్షించే విధంగా గుప్తేశ్వర్ను రూపొందిస్తారు. గుప్తేశ్వర్లో మహా శివలింగం దర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్గఢ్, మధ్య ప్రదేశ్ మొదలగు రాష్ట్రాల నుంచి ప్రతి రోజూ భక్తులు వస్తుంటారు. పర్వద పంక్తులల నడుమ ఒక గుహలో గల 6 అడుగుల పొడవు, 10 అడుగుల కై వారంతో గల అపూర్వ శివలింగం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. మంచినీటి సమస్యను పరిష్కరించండి రాయగడ: స్థానిక సాయిప్రియనగర్ 17, 18 లైన్లలో మంచినీటి సమస్య జఠిలమైంది. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆ ప్రాంత మహిళలు సాయిప్రియ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు పొట్టాం రమాదేవితో కలిసి కోరారు. ఈ మేరకు పీహెచ్డీ అధికారిని శనివారం కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ రెండు లైన్లలో దాదాపు పది కుటుంబాలకు చెందిన 50 మంది వరకు నివసిస్తున్నారని.. ఉన్న ఒక్క కుళాయి ద్వారా కూడా రెండు నెలలుగా పనిచేయకపొవడంతో తామంతా సమస్యను ఎదుర్కొంటున్నామని అన్నారు. దీనిపై స్పందించిన అధికారి వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నూతన పాఠ్య పుస్తకాలపై ముగిసిన శిక్షణజయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి బొరిగుమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్షా అభిజాన్ ద్వారా బ్లాక్స్థాయి పాఠ్యక్రమ రూపు రేఖ 2026, నూతన పాఠ్యపుస్తకాలపై ఉపాధ్యాయులకు ఇచ్చిన శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. బొరిగుమ్మ బ్లాక్ సహాయ విద్యాధికారి సుభాష్ చంద్రమఝి, ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు టి.శైలజా దొరల పర్యవేక్షణలో ఐదురోజులు శిక్షణ ఇచ్చారు. నూతన పాఠ్యపుస్తక పాఠ్యాంశలపై శిక్షణ ఇచ్చినట్టు నిర్వాహకులు వెల్లడించారు. మొదటి విడతగా వందమంది ఉపాధ్యాయులు శిక్షణ పొందారన్నారు. మిగిలిన వారికి మరో విడత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని ఏబీఈవో సుభాష్ చంద్ర మఝి వెల్లడించారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. సీఆర్సీసీ ఆశిశ్ కుమార్హొత్త, బౌష్ణవనాథ్ బెహర, ఉపాధ్యాయులు రమేష్ కుమార్ నాయిక్, ఉపాధ్యాయురాలు సొనాలిస దాస్, ప్రీతిప్రాజ్ఞ సాహులు శిక్షణ ఇచ్చారు. -
ఘనంగా అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం
జయపురం: జయపురం సబ్డివిజన్ కుంద్రా సమితి కుంధ్ర గ్రామంలో ఎం.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం జయపురం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం 2026 గురువారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తూ కుంద్ర సమితి లిమ పంచాయితీ మహిళా రైతు మండియ రాణిగా గుర్తింపు పొంది పద్మశ్రీ అవార్డు పొంది అంతర్జాతీయ ఖ్యాతి పొందారని తెలిపారు. ఆదివాసీ మహిళ డాక్టర్ రొయిమతి ఘివురియ కుంధ్ర సమితికే కాకుండా రాష్ట్రానికే పేరు తెచ్చారని కొనియాడుతూ వ్యవసాయ రంగానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆరుగురు ఆదర్శ మహిళా రైతులను సన్మానించారు. వ్యవసాయ రంగంలో ఆదర్శ మహిళా రైతులు సాధిస్తున్న విజయాలు మహిళా రైతులకు ఆదర్శంగా ఉంటాయన్నారు. వ్యవసాయ రంగంలో మహిళల కృషి, వారి నిరంతర శ్రమ, ప్రపంచ ఆహార భధ్రతలో వారు నిర్వహిస్తున్న కీలక పాత్ర కొనియాడదగినదని అన్నారు. కార్యక్రమంలో మహిళా రైతుల హక్కులపైన సామాజిక, ఆర్థిక రంగాల్లో వారికి కల్పించాల్సిన ప్రాధాన్యతపై ప్రసంగించారు. కార్యక్రమంలో కుంధ్ర సమితి బీడీఓ పి.మనశ్మిత, మహిళా శిశు అభివృద్ధి అధికారి ఆరతీ మహాపాత్రో, ఒడిశా జీవికా సమన్వయకర్త మాణిక్ పట్నాయిక్ లిమా పంచాయతీ సర్పంచ్ శ్రీమతి బానుమతి మాసియా, కుంద్ర సమితి ఉపాధ్యక్షుడు తరుణషేన్ బిశోయి పాల్గొన్నారు. -
‘గోదాన్’కు పన్ను మినహాయింపు
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి భువనేశ్వర్లోని తన అధికారిక నివాసంలో హిందీ చలన చిత్రం గోదాన్ ప్రీమియర్ను వీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా పన్ను రహితంగా ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. త్వరలో ఒడిశాలో గో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. గోదాన్ చిత్రం పూర్తి కుటుంబ చిత్రం. ఇది పిల్లలను వారి తల్లిదండ్రులతో అనుసంధానిస్తుంది. సనాతన ధర్మ విలువలను వివరించడానికి బలమైన సందేశాన్ని ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఈ చిత్రం యొక్క ఇతివృత్తం, సామాజిక విలువలు, సాంస్కృతిక సంప్రదాయాలు మరియు కుటుంబ విలువలను ప్రశంసించారు. గోదాన్ వంటి సంబంధిత చిత్రాలు సామాజిక అవగాహనను సృష్టించడంలో, సాంస్కృతిక అవగాహనను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. సమాజంలో సాంస్కృతిక భావాలకు ప్రాధాన్యత కల్పించే దిశలో యువత ఈ చిత్రాన్ని పూర్తి స్థాయిలో చూడాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సినిమా ప్రీమియర్కు రాష్ట్ర గనులు, ఉక్కు శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా, చిత్ర దర్శకుడు, నిర్మాత వినోద్ కుమార్ చౌదరి, శాసనసభ్యులు మరియు ఇతర విశిష్ట అతిథులు హాజరయ్యారు. -
ముగిసిన శిక్షణ శిబిరం
భువనేశ్వర్: ప్రభుత్వ దైనందిన కార్యకలాపాలు, అధికారిక వ్యవహారాల్లో ఒడియా భాషను వినియోగించడంపై ప్రభుత్వ అధికారుల కోసం నిర్వహించిన రెండు రోజుల శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి శాఖ సమన్వయంతో ఒడియా భాష అకాడమీ ఈ శిబిరాన్ని నిర్వహించింది. ఒడియా రచనా నైపుణ్యాలు, వాక్య నిర్మాణం, అక్షరాలు మరియు గమనికల తయారీ, అధికారిక సంప్రదింపులు, ఆదేశాల తయారీ, పరిపాలనా పదాల ఎంపిక, పద దోష నివారణలో జాగ్రత్తలు, ఇంగ్లిష్ నుంచి ఒడియా అనువాదం తదితర పనులపై శిక్షణ కల్పించారు. 13 విభాగాల నుంచి 100 మందికి పైగా ప్రభుత్వ అధికారులు ఈ శిబిరంలో శిక్షణ పొందారు. ఒడిశా సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ చంద్ర శేఖర్ హత్తా ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించారు. డాక్టర్ కై లాస్ చంద్ర టికాయత్ రాయ్, సురేంద్ర కుమార్ దాస్ ప్రభుత్వ అధికారులకు పరిపాలనా పనిలో ఒడియా భాష వాడకం మరియు ఒడియా భాషలో అక్షరాలు మరియు గమనికల తయారీపై శిక్షణ ఇచ్చారు. -
19 మంది మావోల లొంగుబాటు
భువనేశ్వర్: రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాల పూర్తి నిర్మూలనలో ఘన విజయం సాధించామని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా విలేకర్లకు తెలిపారు. ఈ ఏడాది మార్చి 31 లోపు రాష్ట్రంలో మావోయిజం పూర్తిగా నివారించడం లక్ష్యంగా పేర్కొన్నారు. హింస మార్గాన్ని విడిచిపెట్టి సమాజంలో చేరడానికి సిద్ధంగా ఉన్న మావోయిస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పునరావాస విధానాన్ని అమలు చేసింది. ఈ విధానం ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులు ప్రభుత్వ సౌకర్యాలు, భద్రత, గౌరవప్రదమైన భవిష్యత్కు అవకాశం పొందుతారు. హింస మార్గాన్ని విడిచిపెట్టి సమాజంలోని ప్రధాన స్రవంతిలో చేరి ఈ సదుపాయాలను పొందాలని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో, రాయగడ జిల్లా పోలీసుల ముందు 15 మంది మావోయిస్టులు, కంధమల్ జిల్లా పోలీసుల ముందు నలుగురు మంది మొత్తం 19 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. రాయగడ జిల్లా: రాయగడ జిల్లాలో వంశధార – ఘుముసర్ – నాగావళి (బీజీఎన్) డివిజన్కు చెందిన మొత్తం 15 మంది మావోయిస్టు కేడర్లు లొంగిపోయారు. వారిలో 2 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు నిఖిల్ అలియాస్ నిరంజన్ రౌత్ (జగత్సింగ్పూర్) మరియు అంకిత అలియాస్ రష్మిత లెంకా (టంగి, కటక్) ఉన్నారు. వారి పేర్లపై రూ. 55 లక్షల బహుమానం ప్రకటించారు. వీరితో పాటు బీజీఎన్ డివిజన్కు చెందిన మరో 13 మంది కేడర్లు కూడా లొంగిపోయారు. వారి నుంచి మొత్తం 14 ఆధునిక తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. 2 ఏకే 47, 5 ఎస్ఎల్ఆర్, 1 స్టెన్, 1 ఐఎన్ఎస్ఏఎస్, ఒక 303 రైఫిల్, 4 సింగిల్ షాట్ గన్లు స్వాధీనం చేసుకున్నారు. రాయగడ, గజపతి, కంధమల్ ప్రాంతాల్లో నిఖిల్ అలియాస్ నిరంజన్ రౌత్ రెండు దశాబ్దాలకు పైగా మావోయిజం కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నాడని పేర్కొన్నారు. కంధమాల్ జిల్లా: కలహండి, కంధమల్, బౌధ్, నయాగఢ్ (కేకేబీఎన్) డివిజన్కు చెందిన 4 మంది పార్టీ సభ్యులు (పీఎం) మావోయిస్టు కార్యకలాపాలకు స్వస్తి పలికి హింసా మార్గాన్ని విడిచిపెట్టారు. వారంతా కంధమల్ జిల్లా పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయే సమయంలో వారు తమ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర వస్తువులను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన (కేకేబీఎన్) డివిజన్ పార్టీ సభ్యుల్లో (పీఎం) జిటెన్ అలియాస్ గంగా కుంజామి, సుమిత్ర అలియాస్ ముచాకి మాసే, శాంతిల అలియాస్ చోమాలి కుంజామి మరియు మాలతి అలియాస్ బంధి మాధవి ఉన్నారు. వారి నుంచి ఒక ఎస్ఎల్ఆర్, ఒక 12 బోర్ గన్, రెండు 303 రైఫిల్ సహా పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ ఠాణాల్లో వారిపై అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా వివిధ జిల్లాల్లో నిర్వహించిన ఆపరేషన్ల ద్వారా మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించారు. సీనియర్ కేడర్ మావోయిస్టుల అరెస్టు, లొంగిపోవడంతో పాటు భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ వివరించారు. ఒడిశాను మావోయిస్టు రహితంగా మార్చే దిశగా ఒడిశా పోలీసుల ఈ కార్యాచరణ రాబోయే రోజుల్లో కూడా నిరవధికంగా కొనసాగుతుందని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభం
రాయగడ: జిల్లాలోని గుడారిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి గురువారం వర్చువల్గా దీనిని ప్రారంభించారు. స్థలాల క్రయ, విక్రయాలకు సంబంధించి ఇదివరకు గుడారి నుంచి 45 కిలోమీటర్ల దూరంలోని గుణుపూర్ వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై ఆ సమస్యకు తెరపడిందని తహసీల్దార్ స్నేహలత అన్నారు. కార్యక్రమంలో అదనపు తహసీల్దార్ సునీల్ కుమార్ సబర్, సెక్షన్ అధికారి రఘునాథ్ సబర్, సమితి అధ్యక్షుడు బిశ్వనాథ్ సబర్, న్యాయవాది సుదామ్ సబర్, ప్రసాద్ లిమ్మ తదితరులు పాల్గొన్నారు. 9 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు శ్రీకాకుళం: జిల్లాలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి పదో తరగతి వారికి ప్రీ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే ఒకటి నుంచి తొమ్మి దో తరగతి విద్యార్థులకు ఎఫ్ఏ–4 పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డీఈఓ రవిబాబు పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతికి సంబంధించిన ప్రశ్న పత్రాలను ఎమ్మార్సీ నుంచి క్లస్టర్ స్కూళ్లకు సరఫరా చేస్తారు. క్లస్టర్ పాఠశాలల్లో వాటిని భద్రపరుస్తారు. ఆరు నుంచి పదో తరగతి వరకు సంబంధించిన ప్రశ్న పత్రాలను ఎమ్మార్సీలోనే భద్రపరుస్తారు. ప్రశ్న పత్రాలను పరీక్ష ప్రారంభమయ్యే రోజున సరఫరా చేసేందుకు ము గ్గురు సభ్యులతో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ‘గిరిజన సమస్యలు ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం’ సారవకోట: జిల్లాలోని పలు మండలాల్లో గిరిజన గ్రామాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు గిరిజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ చౌదరి తెలిపారు. శుక్రవారం ఆయన సారవకోటలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్కు కేబినెట్ హోదా కల్పించడం శుభ పరిణా మమని, ఆయన దృష్టికి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్తామని తెలిపారు. ఈ నెల 8న రంపచోడవరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా నుంచి గిరిజనులు హాజరై ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లడానికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. బ్రహ్మోత్సవాలకు సంసిద్ధం మందస: వాసుదేవుని ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానుండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ అర్చకులు దాస్కూర్మాచార్యులు తెలిపారు. మొదటి రోజు ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. స్వామిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగంలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. ఆయన శుక్రవారం ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. దర్శనం సులువుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నారు. 18వ తేదీన వంశధార నదిలో జరగనున్న స్వామివారి చక్రతీర్థ స్నానాలు కీలకమని, భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఆయనతోపాటు శ్రీకాకుళం ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, డీఎస్పీ లక్ష్మణమూర్తి, ఏసీ ప్రసాద్ పట్నాయక్ తోపా టు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీముఖలింగ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిలతో ఫోన్ ద్వారా మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. -
మూఢ నమ్మకాలు ఇంకా మిగిలి ఉన్నాయి
పర్లాకిమిడి: కంప్యూటర్ యుగంలో కూడా చేతబడి, చిల్లంగి వంటి మూఢ నమ్మకాలు నమ్ముతున్నారని సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్ అన్నారు. చేతబడి చేస్తున్నారన్న వ్యక్తిపై కేసు పెట్టినా.. విచ్ హాంటింగ్ చట్టం కింద కేవలం మూడేళ్లు జైలు శిక్ష పడుతుందని, మరికొన్ని కేసుల్లో అస్సలు వారికి అరెస్టు కూడా చేయబోమని సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవా నంద నాయక్ అన్నారు. ఆయన స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా స్థాయి విచ్క్రాఫ్ట్ నిషేధ చైతన్య కార్యక్రమంలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రెవెన్యూ ఏడీఎం మునీంద్ర హానగ, జిల్లా సంక్షేమశాఖ అధికారిని మనోరమా దేవి, జిల్లా న్యాయసేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రవుళో, సీడీఎంఓ మానసిక నిపుణులు ప్రాణరంజన్ నాయక్, న్యాయవాది ప్రమోద్ రవుళో తదితరులు పాల్గొన్నారు. ఒడిషాలో కేందుఝార్, మయూర్భంజ్, కంధమాల్, రాయగడ, గజపతి జిల్లాలో మారుమూల గ్రామాల్లో చేతబడి పేరిట అనేక కుటుంబాలని గ్రామస్తులు హతమార్చిన సంఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయని, న్యాయశాఖ ఎన్ని చట్టాలు చేసినా ప్రజలు ఇంకా మూఢనమ్మకాలు విడిచి పెట్టడం లేదని రెవెన్యూ ఏడీఎం మునీంద్ర హానగా అన్నారు. చేతబడి, దెయ్యం పట్టడం అనేది అపోహా మాత్రమే అని.. అట్టాంటి రోగులు గత ఏడాది జిల్లాలో 1200 మందిని చికిత్సచేసి ఇంటికి పంపించామని జిల్లా మానసిక వైద్యులు ప్రాణ్ రంజన్ నాయక్ తెలిపారు. చేతబడి, చిల్లంగి వంటి మూఢవిశ్వాసాలుపై ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు వివిధ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులు కోరారు. ఈ జిల్లా స్థాయి చిల్లంగి నిషేధ సచేతన కార్యక్రమాన్ని జిల్లా ప్రోగ్రాం, ప్రొటెక్షన్ అధికారి సరలా పాత్రో అధ్యక్షత వహించగా, సీసీడీ స్వచ్ఛంద సంస్థ సెక్రటరీ అడ్డాల జగన్నాధ రాజు, ఇతర మెడికల్ సిబ్బంది హాజరయ్యారు. -
బెల్లం, వంటనూనెల తయారీ యూనిట్ల సందర్శన
జయపురం: fĶæ$-ç³#Æý‡… ™ðlË$VýS$ Ýë…çÜP–-†MýS çÜÑ$† °Æý‡Ó-íßæ-çÜ$¢¯]l² fĶæ$-ç³#Æý‡… íÜsîæ çE¯]l²™èl ´ëuý‡-Ô>ÌS ѧéÅ-Æý‡$¦Ë$ õÜ…{©Ä¶æ$ »ñæÌSÏ…, V>¯]l$-VýSÌS §éÓÆ> ¯]l*¯ðl E™èlµ†¢ ^ólõÜ Ä¶æÊ°-rϯ]l$ Ô¶æ${MýS-ÐéÆý‡… çÜ…§ýlÇØ…^éÆý‡$. õÜ…{©Ä¶æ$ Ð]lÅÐ]l-ÝëĶæ$…, ç³Æ>Å-Ð]lÆý‡×æ Æý‡íßæ™èl E™èlµ-™èl$¢ÌS Ñ«§é-¯éÌS {´ë«§éÅ-¯]lÅ™èlOò³ ѧéÅ-Æý‡$¦ÌZÏ AÐ]l-V>-çßæ¯]l MýSÍ-W…^ól…-§ýl$MýS$ D M>Æý‡Å-{MýSÐ]l$… ^ólç³-sêtÐ]l$° ´ëuý‡-Ô>ÌS CMø MýSϺ$¾ E´ë-«§ýlÅ„ýS$Ë$ {糙鋳 MýS$Ð]l*ÆŠ‡ ç³sê-²Ä¶æ$MŠS ÐðlÌSÏ-yìl…-^éÆý‡$. D M>Æý‡Å-{MýSÐ]l$… §éÓÆ> çÜ…{ç³-§éĶæ$, BàÆý‡ {´÷òÜ-íÜ…VŠæ Ñ«§é-¯]l…Oò³ ѧéÅ-Æý‡$¦ÌZÏ AÐ]lV>-çßæ¯]l MýSÍW…^èl-yýlÐól$ ™èlÐ]l$ E§ólª-Ôèæ-Ð]l$-¯é²Æý‡$. C…§ýl$ÌZ ¿êVýS…V> fĶæ$ç³#Æý‡… çÜÑ$† ¿ýæË$-VýS*yýl {V>Ð]l$…ÌZ° õÜ…{©Ä¶æ$ »ñæÌSÏ… ™èlĶæ*È MóS…{§é°² çÜ…§ýl-ÇØ…-^éÆý‡$. MóS…{§ýl… Ķæ$fÐ]l*° MýS–çÙ~^èl…{§ýl §é‹Ü ^ðlÆý‡$MýS$ ¯]l$…_ »ñæÌSÏ… ™èlĶæ*Æý‡$ ^ólõÜ Ñ«§é-¯é°² ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ ÑÐ]l-Ç…-^éÆý‡$. ^ðlÆý‡$MýS$ ¯]l$…_ Æý‡çÜ… ¡íÜ-¯]l-ç³µsìæ ¯]l$…_ MýSÇ-W…-^èlyýl…, A^èl$a-ÌSÌZ ´ùíÜ »ñæÌSÏ… ^èlMîSPË$ ™èlĶæ*Æý‡$ ^ólĶæ$-yé°² ^ðlేíÜ ^èl*í³…-^éÆý‡$. »ñæÌSÏ… ™èlĶæ*-ÈÌZ à°-MýS-Æý‡-OÐðl$¯]l Æý‡Ýë-Ƈ$$-¯éË$ Ѱ-Äñæ*-W…-^èlMýS$…yé Æý‡$_, ´ùçÙMýS ÑË$-Ð]lË$ VýSÌS »ñæÌSÏ… ™èlĶæ*-Ȱ ™ðlÍ-Ķæ$-gôæ-Ô>Æý‡$. ѧéÅ-Æý‡$¦ÌS çÜ…§ólà-ÌS¯]l$ ¡Æ>aÆý‡$. AÌêVóS V>¯]l$VýSÌZ ¯]l*¯ðl ¡õÜ Ñ«§é°² MýS*yé ѧéÅ-Æý‡$¦Ë$ {ç³™èlÅ-„ýS…V> ^èl*^éÆý‡$. ÐólÆý‡$-Ôèæ-¯]l-VýSË$, çÜ*Æý‡ÅM>…† W…fË$, BÐ]l W…fË$, JÍ-ÔèæË$ Ððl¬§ýlÌSVýS$ Ñ™èl¢¯éÌS ¯]l$…_ MøÌŒæz {ò³‹Ü, V>¯]l$-VýS$ÌS §éÓÆ> ¯]l*¯ól ¡õÜ Ñ«§é¯é°² Ðésìæ Ä¶æ$f-Ð]l*-¯]l$Ë$ ѧéÅÆý‡$¦-ÌSMýS$ ÑÐ]l-Ç…-^éÆý‡$. „óS{™èl ç³Æý‡Å-r¯]l ѧéÅ-Æý‡$¦ÌZÏ Mö™èl¢ E™éÞà°² C_a…§ýl° {糙鋳 ç³sê-²-Ķæ$MŠS ™ðlÍ-´ëÆý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ ´ëuý‡-Ô>ÌS íܺ¾…¨ MðS.ç³-§éÃ-§ólÑ, çÜ$íÜÃ-™é-´ë{™ø E¯é²Æý‡$. -
‘అపేక్షా’ యూనిట్ సందడి
రాయగడ: స్థానిక వీక్ సెంట్రల్ హాల్లో ఒడియా చలన చిత్రం అపేక్షా ప్రీమియర్ షోను శుక్రవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పట్టణంలో సందడి చేసింది. ప్రేమకథా ఇతివృత్తతో వినూత్నంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్లు సంగీత దర్శకులు వైద్యనాథ్ దాస్ తెలియజేశారు. ప్రీమియర్ షోకు ప్రముఖ గాయకుడు హ్యూమన్ సాగర్ తల్లి సినిమా హాల్లొ రిబ్బన్ కట్ చేసి మొదటి టిక్కెట్ను కొనుగోలు చేశారు. ఈ సినిమాలొ హ్యూమన్ సాగర్ రెండు పాటలు పాడారు. చిత్రంలోని పాటలన్నీ తరంగ్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. ప్రీమియర్ షోకు హాజరైన నటీనటుల్లో చౌదరి వికాష్ దాస్, ప్రదీప్దేవ్, పుష్పాపండ, శక్తిబరాల్, సార్ధక్, శుభంగి, అలివా దాస్, స్థానిక కళాకారుడు టునాటన్ టన్ (ప్రభాకర్ మిశ్రో), సుశాంత్, కేసీ రథ్ ఉన్నారు. చిత్రాన్ని స్టూడియో త్రీ సిక్స్ ఫైవ్ బ్యానర్పై డాక్టర్ కె.తమన్న నిర్మించగా, ఆనంద కుమార్ దర్శకత్వం వహించారు. కథ, మాటలు అశుతోష్ బారిక్, నిర్మల్ నాయక్, అరుణ్ మన్సీర్ సాహిత్యాన్ని సమకూర్చారు. దివంగత గాయకుడు హ్యూమన్ సాగర్, ఆసిమా పండ, చిరా, ఇప్సితాసాహులు పాటలు పాడారు. ప్రీమియర్ షో ప్రారంభానికి ముందు నటీనటులు స్థానిక రిలియన్స్ మార్ట్ నుంచి సినిమా హాల్ వరకు ఊరేగింపు నిర్వహించారు . -
బడ్జెట్పై సమాలోచనలు
● వివిధ రంగాలకు చెందిన 50 మందికి పైగా నిపుణులు హాజరు భువనేశ్వర్: ప్రభుత్వ బడ్జెట్ తయారీ ప్రక్రియ సచివాలయం నుంచి ప్రజల వద్దకు చేరుకుంది. ప్రజల నుంచి వారి విలువైన అభిప్రాయాలకు పట్టం గట్టే రీతిలో జాగ్రత్తగా పరిశీలించి, విశ్లేషించిన తర్వాత బడ్జెట్లో ప్రవేశ పెడుతున్నారు. ప్రభుత్వం ప్రజల బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఈ సన్నాహం చేస్తుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన అధ్యక్షతన బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశం జరిగింది. లోక్ సేవా భవన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశంలో పలు రంగాల నిపుణులు, పౌర సమాజం ప్రముఖులు, వివిధ రంగాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల గురించి చర్చించారు. ఇటీవల ప్రారంభించిన ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజనను ప్రజల అభిప్రాయం నుంచి సేకరించి అమలు చేసినట్లు ఉదహరించారు. అలాగే అమలు చేయబోయే శ్రీ జగన్నాథ్ దర్శన్ కార్యక్రమం, కటక్, భువనేశ్వర్, పారాదీప్, పూరీ ఆర్థిక ప్రాకారం ప్రాజెక్ట్ ప్రజా అభిప్రాయం నుంచి వెలుగు చూసిన అంశాలుగా వివరించారు. ప్రజా అభిప్రాయం ఆధారంగా విధానాలు, ప్రణాళిక కార్యక్రమాలలో అవసరమైన మార్పులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ వివిధ కార్యక్రమాలు, ప్రణాళికలు మరియు ప్రకటనలకు సంబంధించి పలు వర్గాల అభిప్రాయాలు, సూచనలను ఆహ్వానించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ, ఉద్యోగ సృష్టి, ఆర్థిక వృద్ధికి ఊతం పొందింది. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా ఆధారిత కార్యక్రమాలు, మహిళలు, రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచాయి. 2026–27 కేంద్ర బడ్జెట్లో కూడా రాష్ట్రంలో అనేక చర్యలు ప్రకటించారు. 2026–27 బడ్జెట్ తయారీకి వెబ్ పోర్టల్స్, ఈ–మెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా పెద్ద సంఖ్యలో ఆలోచింపజేసే సూచనలు వెల్లువలా దాఖలు అవుతున్నాయి. ప్రజా ప్రభుత్వంలో ప్రజల అభిప్రాయాలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించనున్నారు. సమావేశంలో అందిన సూచనలన్నింటినీ రికార్డ్ చేసి లోతుగా ఆలోచించి పరిగణించాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. మాజీ ఆర్థిక మంత్రి ప్రఫుల్ల ఘొడై, నిరంజన్ పూజారి, మాజీ ఆర్థిక కార్యదర్శి అర్ధేందు షడంగి, ఏకే త్రిపాఠి, ఆర్ఎన్ శతపతి, ఒడిశా వ్యాపారవేత్తల సమాఖ్య, ఒడిశా యువ పారిశ్రామికవేత్తల సమాఖ్య, ఎన్జీఓ సభ్యులు, ఫిన్టెక్ సీఈఓలు, వివిధ రంగాలకు చెందిన సామాజిక కార్యకర్తలు, క్రెడాయ్ ఉపాధ్యక్షురాలు, సీనియర్ రాజకీయ నాయకులు శారద శతపతి, అనిల్ శర్మ, మనోజ్ మహా పాత్రో, వివిధ రంగాలకు చెందిన 50 మందికి పైగా ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా, ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్, అభివద్ధి కమిషనర్ డీకే సింగ్, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి శాశ్వత్ మిశ్రా, ఆర్థిక కార్యదర్శి సంజీబ్ కుమార్ మిశ్రా మరియు ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
జాగరణ దర్శనం క్రమబద్ధీకరణకు సన్నాహాలు
భువనేశ్వర్: పవిత్ర మహా శివరాత్రి పురస్కరించుకుని స్థానిక ఏకామ్ర క్షేత్రంలో లింగ రాజ్ మహా ప్రభువు క్రమబద్ధమైన ఆచారాలు, ఆరాధనకు సంబంధించిన కార్యకలాపాల సన్నద్ధతని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ సమీక్షించారు. ఆమె అధ్యక్షతన లోక్ సేవా భవన్ సమావేశం గదిలో జరిగిన సమావేశంలో లింగ రాజ్ ఆలయంలో ఉత్సవ పూజాదుల్లో సమయ పాలన, భక్తులకు సులభ దర్శనం క్రమబద్ధీకరణ అంశాలపై చర్చించారు. ప్రధానంగా జాగర ఉత్సవాన్ని సజావుగా నిర్వహించడంపై ప్రధాన కార్యదర్శి అను గార్గ్ దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 15న జాగర ఉత్సవం సమయంలో భారీ సంఖ్యలో జన సమూహం తరలి వచ్చే అవకాశం ఉందని, భగవంతుని ఆచారాలలో తేలికపాటి నిర్లక్ష్యం భక్త జన మృదయాలను తీవ్రంగా కలచివేస్తుందని అన్నారు. జాగరణ రోజున భక్తులందరికి లింగ రాజ్ దర్శనం కల్పించడంలో రద్దీ నియంత్రణ పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, అగ్నిమాపక దళం, లింగరాజు ఆలయ సేవకులు, స్వచ్ఛంద సేవకులు, ప్రజల ఉమ్మడి సమన్వయ, సహకారంతో నిర్వహించాలని కోరారు. క్రమబద్ధమైన దర్శనం కోసం రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఉత్సవ ఆచారాలను సకాలంలో పూర్తి చేసి ఆలయం లోపల తగినంత కాంతి, వాయు ప్రసరణతో ఉక్కిరి బిక్కిరి పరిస్థితి నివారించాలన్నారు. అగ్నిమాపక భద్రతా వ్యవస్థ, ఆకస్మిక అనారోగ్య పరిస్థితుల్లో తక్షణ చికిత్స కోసం అనుబంధ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి వివిధ టీవీ, రేడియో, దిన పత్రికలు మరియు మైక్ ద్వారా సమాచారాన్ని ప్రసారం చేయడం అవసరమన్నారు. సమావేశంలో న్యాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పవిత్ర మోహన్ సామల్, పోలీస్ కమిషనర్ ఎస్.దేవదత్త సింగ్, దేవాదాయ శాఖ కమిషనర్ లలాటేందు జెనా, అదనపు పోలీస్ కమిషనర్ నరసింహ భోల్, న్యాయ శాఖ అదనపు కార్య నిర్వాహక కార్యదర్శి శివ ప్రసాద్ మహా పాత్రో, భువనేశ్వర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రమేష్ కుమార్ జెనా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
కోర్టులకు బాంబు బెదిరింపు
● బెంబేలెత్తిన యంత్రాంగం భువనేశ్వర్: రాష్ట్రంలో కటక్, ఫుల్బణి, పూరీలోని జిల్లా జడ్జి కోర్టులకు బాంబు బెదిరింపు ఈమెయిల్లు అందడంతో రాష్ట్రంలో అనేక జిల్లా కోర్టులు శుక్రవారం భయాందోళనలకు గురయ్యాయి. బాంబు బెదిరింపుతో అనుబంధ యంత్రాంగం బెంబేలెత్తింది. బెదిరింపుల కారణంగా కోర్టులు వెంటనే ఖాళీ చేయించారు. తక్షణమే బాంబు నిర్వీర్య బృందాలు, స్నిఫర్ డాగ్లను మోహరించారు. కోర్టు ప్రాంగణంలో సమగ్ర భద్రతా తనిఖీలు చేశారు. కోర్టు సముదాయాల్లో బాంబులు అమర్చినట్లు అనామక ఈమెయిల్స్ పేర్కొన్నాయని సమాచారం. దీని వల్ల న్యాయ మూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, సందర్శకులలో తీవ్ర ఆందోళన నెలకొంది. భద్రతా కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో పోలీసులు కోర్టు భవనాలను ఖాళీ చేసి ప్రవేశాన్ని పరిమితం చేశారు. కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. పోలీసులు సత్వర చర్యలు చేపట్టారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ యూనిట్లు కోర్టు ప్రాంగణాల ప్రతి మూల విస్తృత తనిఖీలు నిర్వహించాయి. స్థానిక పోలీసు బృందాలు, క్రైమ్ బ్రాంచ్ నుండి సైబర్ సెల్ నిపుణులు ఈ విషయాన్ని చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులను గుర్తించడానికి బాంబు బెదిరింపు ఈ–మెయిల్ పంపినవారి ఐపీ చిరునామా, మూలాన్ని గుర్తించడంపై దర్యాప్తు వర్గాలు దృష్టి సారించాయి. బాంబు బెదిరింపు సమాచారం అందిన వెంటనే కోర్టు క్యాంపస్కు చేరుకుని కోర్టును ఖాళీ చేశారు. స్థానిక పోలీసులు, బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్లతో కోర్టు సముదాయంలో ప్రతి మూలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని వాహనాలను తనిఖీ చేశారు. క్యాంపస్ను శుభ్రపరిచారు. కోర్టు కార్యకలాపాలు నిర్భయంగా నిర్వహించేందుకు సకాలంలో అన్ని చర్యలు చేపట్టారని పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రతీక్ సింగ్ తెలిపారు. సోదాలు నిర్వహించిన ప్రాంతాల్లో ఎలాంటి అభ్యంతరకరమైన పదార్థాలు లేదా పేలుడు పదార్థాలు కనుగొనలేదని ఆయన స్పష్టం చేశారు. గత నెలలో రాష్ట్రంలో కోర్టులకు ఇలాంటి బెదిరింపులు అలజడి రేపాయి. జనవరి నెలలో కటక్, సంబల్పూర్, దేవ్గఢ్, ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులు ప్రసారం చేసి రేపిన అలజడి ఇదే తరహాలో తుస్సుమనిపోయింది. వరుసగా రెండోసారి ఇటువంటి బూటకపు బెదిరింపు సందేశాల ప్రసారం పునరావృతం కావడంపట్ల సర్వత్రా భయాందోళనలు పెరుగుతున్నాయి. -
ఉన్నత ప్రమాణాలపై పరిశోధనలు అవసరం
జయపురం: ఉన్నత ప్రమాణాలపై పరిశోధనలు అవసరమని వక్తలు అన్నారు. ‘ఉన్నత ప్రమాణాలపై పరిశోధన వ్యాసాలు, పరిశోధన ప్రతిపాదనలు రచించటానికి సమర్ధవంతమైన వ్యూహాలు’ అనే ఆంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రొగ్రాన్ని స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో మానవ వనరుల అభివృద్ధి కేంద్రం శుక్రవారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శ్రీలంక వాయింబ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కిర్తిసిరి సమరకూన్, ఒడిశా శిక్షా ఓ అనుసంధాన్ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ నిహారంజన్ మిశ్ర, కొరాపుట్ కేంద్రవిశ్వ విద్యాలయం ప్రొఫెసర్ శౌరభ గుప్త హాజరై.. పరిశోధనల రచన, ప్రచురణల వ్యూహాలు, పరిశోధన ప్రతిపాదనల తయారీలో అనుసరించాల్సిన విధానాలపై ప్రసంగించారు. కార్యక్రమాన్ని నిర్వాహక కార్యదర్శి డాక్టర్ దేవదత్త ఇండోరియ పర్యవేక్షించారు. విక్రమదేవ్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ దేవీప్రసాద్ మిఽశ్ర ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో నాణ్యమైన పరిశోధనలు అవసరమన్నారు. కార్యక్రమంలో జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయ రిజస్ట్రార్ మహేశ్వరచంద్ర నాయిక్, పీజీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పి.కె.పాత్రో, డాక్టర్ సాగరిక మిశ్ర, విశ్వవిద్యాలయ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ సచిన్ కుమార్ నాయిక్, వివిధ కళాశాలల నుంచి 250 మందికిపైగా అధ్యాపకులు పాల్గొన్నారు. -
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి
జయపురం: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోట్పాడ్ ఎమ్మెల్యే రూపుబొత్ర అన్నారు. శుక్రవారం జరిగిన కోట్పాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం దమయంతి సాహు వార్షిక నివేదికను చదివి వినిపించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలిపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కోట్పాడ్ ఎన్ఏసీ చైర్మన్ ఎం.శంకరరావు, ఎంపీ ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర మఝి, పాఠశాల యాజమాన్య కమిటి అధ్యక్షుడు సుధీర్ చంద్ర మహంతి, కోట్పాడ్ బ్లాక్ విద్యాధికారి సర్వేశ్వర నాయిక్ తదితరులు పాల్గొన్నారు. సెల్ టవర్లు నిర్మించాలి కొరాపుట్: కొరాపుట్, రాయగడ జిల్లాలో వంద శాతం సిగ్నల్స్ వచ్చే విధంగా మొబైల్ టవర్లు నిర్మించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను గతంలో పార్లమెంట్లో వేసిన ప్రశ్నకి కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారన్నారు. కొరాపుట్ జిల్లాలో 459 టవర్లు నిర్మించాల్సి ఉండగా 386, రాయగడ జిల్లాలో 700 నిర్మించాల్సి ఉండగా 546 టవర్లు నిర్మించారన్నారు. మిగతా నిర్మాణం చేయకుండా సాకులు చెబుతున్నారన్నారు. ఈ సమస్య వలన వెనుకబడిన ఈ జిల్లాల్లో సెల్ సిగ్నల్స్ లేక గిరిజన్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బాలలకు విద్య, అత్యవసరం వైద్య సహాయం కోసం అంబులైన్స్కి ఫోన్ చేయలేక, ప్రభుత్వ పథకాల కోసం తెలియక గిరిజనులు బాధలు పడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తానని ఎంపీ సప్తగిరి ఉల్క ప్రకటించారు. క్రీడలతో మానసిక ప్రశాంతత రాయగడ: క్రీడలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని స్థానిక కస్తూరీ నగర్లోని మదర్ థెరిస్సా విద్యా సంస్థలకు చెందిన డైరక్టర్ బి.సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం విద్యా సంస్థల్లో వార్షిక క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి పిల్లలు క్రీడలపై ఆసక్తి కనబరిచేలా పోటీలను నిర్వహించాలన్నారు. ప్రస్తుత పరిస్థితిలో పోటీతత్వం పెరుగుతోందని, అందుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. క్రీడలతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రిన్సిపాల్ సూర్యనారాయణ హోత మాట్లాడుతూ రెండు రోజులు పాటు జరగనున్న క్రీడా పోటీల్లో వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హార్డ్వేర్ షాపులో అగ్ని ప్రమాదం రాయగడ: సదరు సమితి పరిధి కొమట్లపేట వద్ద పంచాయతీ కాంప్లెక్స్లో ఉన్న శ్రీరామ్ హార్డ్వేర్ షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.12 లక్షలు విలువ చేసే వస్తువులు, స్పేర్పార్ట్స్ దగ్ధమయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. షాపు నుంచి దట్టమైన పొగలు రావడంతో అటువైపుగా వెళ్లేవారు షాపు యజమానికి సమాచారం అందించారు. వెంటనే యజమాని మానస్ దళపతి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపు వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
రిటైర్డు ఉద్యోగికి సత్కారం
జయపురం: జయపురం గోష్టీ విద్యాధికారి కార్యాలయంలో పదవీ విరమణ చేసిన గ్రూపు–4 ఉద్యోగిని సిబ్బంది ఘనంగా సన్మాణించారు. నాల్గొవ తరగతి ఉద్యోగి రమేష్ చంద్ర పాలక ఎంతో కాలంగా సేవలు అందించారని.. అతడి సేవలు మరువ లేనివని ముఖ్యఅతిథిగా పాల్గొన్న జయపురం గోష్టీ(బ్లాక్ విద్యాధికారి) విద్యాధికారి చందన్ కుమార్ నాయిక్ ప్రశంసించారు. కార్యక్రమంలో విద్యాఽవిభాగ అధికారి రాజేంద్రనారాయణ పాఢీ, బొరిగుమ్మ గోష్టి విద్యాధికారి పద్మేశ్వర బిశాయిలు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. సీనియర్ అసిస్టెంట్ శశిభూషణ దాస్ అధ్యక్షతన నిర్వహించబడిన సన్మాన సభలో ఉపాధ్యాయులు మహేశ్వర మిశ్ర, జగదీష్ మిశ్ర, ప్రదీప్ మిశ్ర, పురందర్ నాయిక్, త్రినాథ్ పాణిగ్రహి, జయపురంలోనిల అన్ని గోష్టీ సాధనా కేంద్రాల సమన్వయకర్తలు, బ్లాక్ సహాయ విద్యాధికారులు కె.గోపాల్, సోమనాథ్ గదబ, గోపీనాథ్ మహంతి, కృష్ణ చంద్ర పండ, ఎం.మురళి, రజణీకాంత ఘొడయి, అనేక మంది విద్యా విబాగ ఉద్యోగులు పాల్గొని విద్యోగ విరమణ చేసిన రమేష చంద్ర పాలకకు శాలువ కప్పి జ్ఞాపికలతో సన్మానించారు. -
అగ్ని–3 పరీక్ష విజయవంతం
బాలాసోర్ (ఒడిస్సా): బారత సాయుధ దళాల అమ్ములపొది మరింత బలోపేతమైంది. శుక్రవారం జరిపిన అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన అత్యాధునిక అగ్ని–3 ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతమైంది. 3,000 కిలోమీటర్ల పై చిలుకు దూరంలోని లక్ష్యాలను ఛేదించగల 17 మీటర్ల పొడవైన ఈ సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణిని ఒడిస్సా తీర సమీపంలోని చందీపూర్లోని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ కేంద్రం నుంచి ప్రయోగించారు. ఈ సందర్భంగా క్షిపణి తాలూకు వ్యవస్థలన్నీ పూర్తిస్థాయిలో అంచనాల మేరకు పని చేసినట్టు అధికారులు వెల్లడించారు. ‘‘రెండు దశలతో కూడిన ద్రవ ఇంధన ఆధారిత క్షిపణి ఆద్యంతం నిర్దేశించిన మార్గంలో దూసుకెళ్లింది. బంగాళాఖాతంలో లక్ష్యాన్ని కచి్చతత్వంతో గమ్యాన్ని ఛేదించింది’’అని తెలిపారు. ప్రయోగం ద్వారా ఉద్దేశించిన లక్ష్యాలన్నింటినీ పూర్తిస్థాయిలో సాధించినట్టు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) వర్గాలు వెల్లడించాయి. అత్యాధునిక రాడార్ వ్యవస్థల ద్వారా క్షిపణి గమనాన్ని అనుక్షణం గమనిస్తూ వచి్చనట్టు వివరించాయి. అగ్ని–3 ఇప్పటికే సైన్యం అమ్ములపొదిలోకి చేరింది. ఏకంగా 1,500 కిలోలకు మించిన పేలోడ్తో 3,000 కి.మీ. పై చిలుకు దూరంలోని లక్ష్యాలను అలవోకగా ఛేదించగల సామర్థ్యం దీని సొంతం. -
రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ప్రారంభం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ముఖ్యమంత్రి మోహన్చరణ్ మఝి గురువారం వర్చువల్గా ప్రారంభించారు. మొత్తం ఒడిశాలో 57 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఒకేసారి ముఖ్యమంత్రి ప్రారంభించగా.. వాటిలో మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు గుమ్మా, నువాగడ, రాయఘడ బ్లాక్స్ ఉన్నాయి. రెవెన్యూ పట్టాలు, ఇళ్లు, భూ పట్టాలు సమితి స్థాయిలో కొనుగోళ్లపై రిజిస్ట్రేషన్ల లావాదేవీలు ఇకపై నిర్వహింవచ్చు. ప్రజలకు అతి సులువుగా రెవెన్యూ పట్టాలు అందించటంలో రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి మఝి తన ప్రసంగంలో వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవానికి మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, ఏ.డి.ఎం రెవెన్యూ మునీంద్ర హనగ, డిప్యూటీ కలెక్టర్ మిథాలీ మధుమితా పాడీ, అసిస్టెంట్ కలెక్టర్ త్రినాథ సాహు, తదితరులు పాల్గొన్నారు. -
రైతులసమస్యలు సీఎం పరిష్కరిస్తారు
● రాష్ట్ర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక శాఖ మంత్రి సంపద్ చరణ్ స్వయిని జిల్లా స్థాయి ధాన్యం సేకరణపై సమీక్ష సమావేశంలో కలెక్టర్, ఎమ్మెల్యే రూపేష్, మంత్రి సంపద్ చరణ్ స్వయిని, ఎమ్మెల్యే దాశరథి గోమాంగో పర్లాకిమిడి: రాష్ట్ర పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్, సాంకేతిక విద్యాశాఖ మంత్రి సంపద్ చరణ్ స్వయిని గురువారం మధ్యాహ్నం గజపతి జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఆయనకు బీజేపీ పార్టీ శ్రేణులు ఛిత్రి సింహాద్రి, ఎంపీ ప్రతినిధి దారపు చిట్టి తదితరులు సర్క్యూట్ హౌస్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఽఖరీఫ్ ధాన్యం ప్రొక్యూర్మెంట్ జిల్లాలో ఎంతవరకూ లక్ష్యం ఎంతవరకూ వచ్చిందో తెలుసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, మోహన ఎమ్మెల్యే దాశరథిగో మంగో, జిల్లా పౌరసరఫరాల శాఖఅధికారి అనుప్ పండా, కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రి సంపద్ స్వయిని బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. గుసాని సమితిలో గారబంద, లావణ్యగడ ధాన్యం మండీలను పరిశీలించారు. అయితే రైతులు ఽధాన్యం కోనుగోళ్ల కేంద్రాల వద్ద ఆభియోగాలు ముందుంచారు. తప్పకుండా రైతు సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించి తగు పరిష్కారం చేస్తామని, రైతుల ఆదాయం పెంపుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి కట్టుబడి హున్నారని అన్నారు. ఇప్పటివరకూ గజపతి జిల్లాలో నాలుగు బ్లాక్లలో కాశీనగర్, రాయఘడ, గుసాని, గుమ్మలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేశామని, మరో 10వేల మంది రైతులు మండీల వద్ద రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని మంత్రి సంపద్ చరణ్ స్వయిని అన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి అధికారి స్మృతిరంజన్ సౌభాగ్య త్రిపాఠి, జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతి రావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన గంజాం జిల్లా సోన్పూర్కు వెళ్లిపోయారు.


