మావో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
● యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ఏడీజీ సంజీవ్ కుమార్ పండా
రాయగడ: ఒడిశాను మావో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పోలీస్ విభాగం కృషి చేస్తుందని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తుందని యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ఏడీజీ సంజీవ్ కుమార్ పండా అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం నాడు నాగావళి, జంఝావతి, ఘుంసుర దళాలకు చెందిన 15 మంది మావోయిస్టులు పోలీసుల సమక్షంలో లొంగిపొయారని వారిలో టాప్ లీడర్స్ ఉన్నారని తెలిపారు. మార్చి నెలఖరు నాటికి రాష్ట్రంలో సంపూర్ణంగా మావోలను కూకటి వేళ్లతొ పెకిలించివేస్తామని అన్నారు. అయితే ఇప్పటికే కొంతమంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసులు సమక్షంలో లొంగిపోవడం శుభపరిణామమని అన్నారు. రాయగడ, కంధమాల్, కలహండి వంటి జిల్లాల్లో కొంతవరకు మావో కదలికలు ఉన్నాయని ఆయన వివరించారు. కొరాపుట్, నువాపడ, నవరంగపూర్, బౌధ్, మల్కన్గిరి జిల్లాలను ఇప్పటికే మావో రహిత జిల్లాలుగా ప్రకటించామని అన్నారు. 1998లో తాను ఎస్పీగా ఉన్న సమయంలో ఎక్కువగా మావోల కదలికలు ఉండేవి, ప్రస్తుతం యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ఏడీజీగా విధులు నిర్వహిస్తున్న సమయంలో మావోల అణచివేత చర్యలకు విశేషంగా కృషి చేశానని అన్నారు. రాయగడ, కంధమాల్, కలహండి జిల్లాల్లో ఇప్పటికీ మావోల కదలికలు ఉన్నాయని ప్రస్తుతం ఆయా జిల్లాల్లో కలసి సుమారు 35 నుంచి 40 వరకు మావోయిస్టులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు పోలీస్ శాఖ గుర్తించిందని అన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.
లొంగిపోయిన వారి వివరాలు..
జగత్సింగ్పూర్కు చెందిన బలికుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని తెంతులిబిలరి గ్రామానికి చెందిన నిరంజన్ రౌత్ అలియాస్ నిహార్, ఆయన భార్య రస్మిత లెంక అలియాస్ అంకిత, ఇందు, చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వికాష్ అలియాస్ సునీల్, సుందర్ అలియాస్ గంపా ఒయం, ప్రదీప్ అలియాస్ సొను, రొషని అలియాస్ పల్లి మాడ్వి, అరుణ అలియాస్ ఆర్ణ, సుకి మాడ్వి, కుమారి అలియాస్ పొజికారం, దీపక్ అలియాస్ బమన్ బెకొ, రాకేష్ అలియాస్ జగా కవాసి, లలిత్ అలియాస్ సనకుంజామ్, రాజీ అలియాస్ ఛొటి ఉయ్క, మాలతి అలియాస్ ఇద్మి సొధిలు ఉన్నారు. లొంగిపొయిన మావోయిస్టుల నుంచి ఏకే47–రైఫల్ లు రెండు, ఎస్ఎల్ఆర్ రైఫల్–5, ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్– 1, 303 రైఫిల్స్ –1, కార్బయిన్ రైఫిల్ 3, నాటుతుపాకీలు 3, 12 బొర్మసింగిల్ బారెల్ బ్రీచ్ లోడింగ్–1 లతొ పాటు తుపాకీ గుళ్లును మావోలు సమర్పించారు.
సమావేశంలొ ఐజీ ఆపరేషన్స్ దీపక్ కుమార్, డిఐజి అఖిలేశ్వర్ సింగ్, డిఐజి నర్వర్ విశాల్, కంధమాల్ ఎస్పీ హరిష్ బిసి, కలహండి ఎస్పి దేవరకొండ నాగరాజ్, రాయగడ జిల్లా కలెక్టర్ అశుతొష్ కులకర్ణి, ఫిరొజ్ కుజూర్ కమాండెంట్, 4వ బెటాలియన్, రాయగడ పాల్గొన్నారు.
మావో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
మావో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
మావో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం


