సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నేత, ఏఐసీసీ మీడియా చైర్మన్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన తాత్కాలిక ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. కాగా, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో గువాహటిలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ను అస్సాం పోలీసులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ చందుర్కర్ ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అస్సాం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా దరఖాస్తు చేసుకుంటే.. దానిపై తమ ఉత్తర్వుల ప్రభావం పడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


