అవకాశాలిప్పిస్తానని చెప్పి గత మూడేళ్లుగా దారుణం
బాలిక ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి
పాల్ఘర్, మహారాష్ట్ర: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఒక ఫుట్బాల్ కోచ్, మైనర్ క్రీడాకారిణిపై లైంగిక దాడికి పాల్పడిన వైనం కలకలం రేపింది. అత్యాచారం, బెదిరింపుల ఆరోపణలపై ప్రైవేట్ ఫుట్బాల్ కోచ్ను 36 ఏళ్ల అభిజిత్ మెండల్పై పోక్సో కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం దిగ్భ్రాంతికరమైన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2023లో వసాయిలోని తన ఫుట్బాల్ శిక్షణా అకాడమీలో చేరిన 17 ఏళ్ల బాలికపై మెండల్ పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు. గత మూడేళ్లుగా, పలుమార్లు లైంగిక దాడిచేయడంతోపాటు కొన్ని అభ్యంతరకరమైన వీడియోలను తీసి, బెదిరించి, తద్వారా తన కోరికలను తీర్చుకునేవాడు. ఈ మానసిక వేధింపులను తట్టుకోలేక ఆ బాలిక, చివరకు తన కుటుంబం సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ అనంతరం మెండల్ను అరెస్టు చేశారు.

ఫుట్బాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, ప్రలోభపెట్టాడని బాధితురాలు వాపోయింది. వేధింపులతో విసిగి, అతడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించింది. దీంతో వీడియోలు, ఫోటోలతో తనను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడని ఆరోపించింది. తనకు లొంగకపోతే, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతాననిబెదిరించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసి, కస్టడీకి అప్పగించారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: డేంజరస్ స్టంట్ : యెమెన్ స్పైడర్ మ్యాన్ దుర్మరణం


