న్యూఢిల్లీ: పెట్రోల్లో ఇథనాల్ను కలపడం (E20)పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ సమన్వయకన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ ఆందోళనలకు మద్దతు తెలిపిన ఆయన, తాజాగా ఈ20 విధానానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2023కి ముందు తయారైన వాహనాల్లో ఈ20 వాడకం సురక్షితమేనా అని తాను 29 ఆటోమొబైల్ కంపెనీలను ప్రశ్నించినట్లు తెలిపారు. అయితే మోదీ ప్రభుత్వంపై భయంతో ఏ కంపెనీ కూడా లిఖితపూర్వకంగా స్పందించలేదని అన్నారు.
సాంకేతికంగా ఈ విధానం వల్ల వాహనాలు దెబ్బతింటాయని, మైలేజ్ తగ్గుతుందని కంపెనీల అధికారులు అనధికారికంగా అంగీకరించినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ప్లాంట్లు మూసివేయిస్తామని, ఈడీ దాడులు చేయిస్తామని కేంద్రం నుంచి బెదిరింపులు వస్తున్నందునే వారు బయటకు చెప్పలేకపోతున్నారని విమర్శించారు. దేశంలో 2023కి ముందు కొనుగోలు చేసిన దాదాపు 30 కోట్ల వాహనాలను మోదీ ప్రభుత్వం పనికిరాకుండా చేస్తోందని ఆరోపించారు. ఇథనాల్ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, పైగా నీటి వనరులు కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు.
శనివారం తలపెట్టిన టౌన్హాల్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అనుమతుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. పోలీసులు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం ఈ20 విధానాన్ని శాంతియుతంగా వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రజలే తరగబడతారని ఆయన హెచ్చరించారు.


