తల్లి కోసం ఏఐలో వెతికాడు... చెల్లెల్ని కలుసుకున్నాడు! | Avtar Singh: I thought Iha​ve tried everything else, why not give AI a shot | Sakshi
Sakshi News home page

తల్లి కోసం ఏఐలో వెతికాడు... చెల్లెల్ని కలుసుకున్నాడు!

Jul 29 2026 5:13 PM | Updated on Jul 30 2026 9:53 AM

 Avtar Singh: I thought Iha​ve tried everything else, why not give AI a shot

మనమెంత కావాలనుకున్నా కొన్ని బంధాలు దరిచేరవు. ఏ బంధం లేనివారికి కూడా ఉండేది పేగు పంచిన తల్లి బంధం మాత్రమే. ఆ బంధం కూడా లేనప్పుడు మనిషి నిజంగా అనాథగా మిగిలిపోతాడు. ఇలాంటి కథలు మన మధ్యే కాదు.. ఖండాంతరాలలో కూడా జరుగుతాయి. అలాంటిదే ఈ అవతార్‌ సింగ్‌ కథ. 

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సరిగ్గా 66 ఏళ్ల కిందట అవతార్‌ సింగ్‌ జన్మించాడు. బాల్యమంతా ఇరుగుపొరుగు బంధువుల మధ్య హాయిగా సాగింది. కాని ప్రతిసారి ఎవరో అనేవారు ‘మీ అమ్మ ఇక్కడ లేదు..వేరే దేశంలో ఉంది.’ అని... అయితే చిన్న వయసులో అవతార్‌కి ఆ మాట అర్థమయ్యేది కాదు. కాని ఊహ తెలిశాక తెలిసిందేంటంటే... తనని పెంచింది తల్లిదండ్రులు కాదు అమ్మమ్మ, తాతయ్యలని... అవతార్‌ తల్లి పేరు సవీందర్‌..తండ్రి పేరు మోహన్‌  సింగ్‌..చిన్న వయసులో పెళ్లి చేసుకున్న సవీందర్‌కు అవతార్‌ పుట్టిన కొద్ది రోజులకే మోహన్‌సింగ్‌ మరణించాడు. 

కొన్నేళ్లకు సవీందర్‌ వేరొకరిని పెళ్లి చేసుకుని కెన్యా వెళ్లిపోయింది. ఇదంతా తెలుసుకున్న అవతార్‌ తన తల్లికోసం వెతికాడు. ఉత్తరాలు రాశాడు. తెలిసిన వాళ్లతో తల్లి జాడ కోసం గాలించాడు. కాని ఆ రోజుల్లో కమ్యూనికేషన్‌ వ్యవస్థ అంతంత మాత్రమే. అదే నిరాశలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. కొన్నేళ్ల తర్వాత ఉద్యోగం కోసం అవతార్‌ కెనడా వెళ్లిపోయాడు. 

కెనడా వెళ్లినా, ఉద్యోగంలో స్థిరపడినా..పెళ్లి చేసుకున్నా..అవతార్‌ను మాత్రం కలచివేసేది ఒక్కటే... తల్లి జాడ తెలుసుకోలేకపోయానని.. ప్రస్తుతం తనకి 66 ఏళ్లు.. భార్యతో కలిసి ఇటీవల ఫ్రాన్స్‌కి విహారయాత్రకు వచ్చాడు. ఎందుకో తెలియదు గాని ఓసారి ప్రయత్నించి చూద్దామని తల్లిజాడ కోసం చాట్‌ జీపీటీలో తనకి తెలిసిన కొన్ని వివరాలను ఇచ్చాడు. 

వెంటనే ఏఐ బ్రిటన్‌లో నివసిస్తున్న నిక్కీ ధాము అనే మహిళ రాసిన స్మృతి వ్యాసాన్ని అవతార్‌ ముందు ఉంచింది. అందులోని వివరాలు తన సొంత గ్రామానికి, కుటుంబ సభ్యుల పేర్లకు సారూప్యత ఉండడంతో అవతార్‌ మెయిల్‌ ద్వారా నిక్కీకి మెసేజ్‌ పంపాడు. 

కాసేపటికే అతడి కళ్లు చమర్చాయ్‌.. నిక్కీ ధాము ఎవరో కాదు అవతార్‌ సింగ్‌కి సవతి చెల్లెలు. అంటే సవీందర్‌ రెండో భర్త కూతురు. సవీందర్‌ తన భర్తతో కలిసి 1973లో కెన్యా నుంచి బ్రిటన్‌కు వలస వచ్చేసింది. కానీ విషాదమేంటంటే అవతార్‌ తల్లి సవీందర్‌ 2024 డిసెంబర్‌లోనే మరణించింది. ఆ వార్త అతడిని కలచివేసింది. 

అవతార్‌ ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరి బ్రిటన్‌లోని నిక్కీ ఇంటికి వెళ్లాడు. తాను అమ్మ కోసం వెతికినట్టే, సవీందర్‌ కూడా తనకు ఒక కొడుకున్నాడని పదేపదే తన పేరు చెప్పి పరితపించేదని నిక్కీ చెప్పడంతో అవతార్‌ కన్నీరు మున్నీరయ్యాడు. కాని తల్లిని కలుసుకోలేకపోయినా చెల్లెల్ని కలుసుకున్న సంతృప్తి అవతార్‌కు మిగిలింది. 

(చదవండి: నటి సోనాలి ఫిట్‌నెస్‌ సీక్రెట్‌..! ఆటోఫాగీ అంటే..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement