సాక్షి, హైదరాబాద్: ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.
పోలీసుల రిమాండ్ రిపోర్టు ప్రకారం.. ఉదయ్ కృష్ణారెడ్డి, బాధితురాలైన ట్రైనీ ఐపీఎస్ అధికారికి సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఉదయ్ జీవిత చరిత్రను తెలుసుకుని పరిచయం చేసుకున్నట్టు తెలిసింది. అనంతరం జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)లో శిక్షణ సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే, కొంతకాలం పాటు ఇద్దరి మధ్య సంబంధాలు కొనసాగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అయితే, మహిళా ఐపీఎస్ అధికారికి మే నెలలో వివాహం జరిగిన తర్వాత కూడా ఉదయ్ నుంచి వేధింపులు కొనసాగినట్లు ఆమె ఫిర్యాదులో ఆరోపించినట్లు సమాచారం. బాధితురాలు ఇతరులతో మాట్లాడటం, సన్నిహితంగా ఉండటంపై ఉదయ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్పీఏలో శిక్షణ పొందుతున్న సమయంలో మరికొందరు మహిళా ఐపీఎస్ అధికారులను కూడా ఉదయ్ ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి వాస్తవాలు దర్యాప్తు అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.
డిజిటల్ ఆధారాలపై పోలీసుల దృష్టి
ఈ కేసులో పోలీసులు దర్యాప్తును విస్తృతం చేశారు. హైదరాబాద్తో పాటు ఉదయ్ కృష్ణారెడ్డి స్వస్థలంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియా వివరాలు, డిజిటల్ ఆధారాలు, ఇతర సంబంధిత అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి న్యాయస్థానం ఆదేశాల మేరకు చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్నారు. దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.


