ఢిల్లీ: దేశవ్యాప్తంగా నేడు మూడు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఆగస్టు 3న జరగనుంది.
అయితే ఈ మూడు ఉపఎన్నికల్లో బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ స్థానం దేశవ్యాప్తంగా అత్యధిక రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా అభ్యర్థిగా బరిలో దిగుతుండటంతో ఈ పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారింది. మరోవైపు ఈ స్థానం బీజేపీకి బలమైన కోటగా ఉండటంతో పార్టీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఆర్జేడీ తన సంప్రదాయ ముస్లిం–యాదవ్ (ఎం-వై) ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రచారం నిర్వహించింది.
బంకీపూర్ స్థానం ఖాళీ కావడానికి బీజేపీ సీనియర్ నేత నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడమే కారణం. గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా స్థానాల్లో కూడా ఖాళీలు ఏర్పడటంతో ఎన్నికల సంఘం ఉపఎన్నికలను ప్రకటించింది. ఈ ఉపఎన్నికల ఫలితాలు అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ బలాబలాలను అంచనా వేయడమే కాకుండా, ఆయా రాష్ట్రాల్లో భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
#WATCH | Patna, Bihar: Voting begins for the by-election of Bankipur Assembly constituency.
(Visuals from Bihar State Library) pic.twitter.com/wXhhIuUpCJ— ANI (@ANI) July 30, 2026
ఇక, బంకీపూర్లో బీజేపీకి పట్టు ఉన్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలు సర్వేల ప్రకారం బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇటీవలి పరిణామాలు ప్రశాంత్ కిషోర్ ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జన్ సురాజ్ ఓటు శాతం గణనీయంగా పెరగడం, బీజేపీ ఓటు శాతం తగ్గడం విశేషం. అదే సమయంలో ఆర్జేడీ ఓటు బ్యాంకు కూడా క్షీణించినట్లు పలు సర్వేల్లో వెల్లడైంది.
బీజేపీకి ప్రతిష్ఠాత్మక ఎన్నిక
ఈ నియోజకవర్గం దాదాపు రెండు దశాబ్దాలుగా బీజేపీ ఆధీనంలో ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించింది. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ సహా పలువురు సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలో ప్రధాన పోటీ బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా, జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్, ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి గుప్తా మధ్య నెలకొంది. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, పోటీ ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్యే కొనసాగుతోంది.
యువ ఓటర్లే నిర్ణయాత్మకం
బ్యాంకీపూర్లో సుమారు 3.69 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు గల యువ ఓటర్లు దాదాపు 1.25 లక్షల మంది ఉన్నారు. యువతలో ప్రశాంత్ కిషోర్కు ఎక్కువ మద్దతు ఉన్నట్లు సర్వే వెల్లడించింది. మరోవైపు మహిళలు, వయోజన ఓటర్లలో బీజేపీకి బలమైన మద్దతు కనిపిస్తోంది.


