breaking news
Dr B R Ambedkar Konaseema
-
సత్యదేవుడు.. భక్తవరదుడు
● ఘనంగా ముగిసిన కోటి తులసి పత్రి పూజ ● రత్నగిరిపై పది రోజుల పాటు నిర్వహణఅన్నవరం: భక్తవరదుడు.. కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడు సత్యదేవుడు. లోక కల్యాణార్థం ఆ స్వామివారికి పవిత్ర మాఘ మాసంలో కోటి తులసి పత్రి పూజ అట్టహాసంగా జరిగింది. సత్యదేవుని వార్షిక కల్యాణ మండపంలో పది రోజులుగా జరుగుతున్న ఈ క్రతువు మహా శివరాత్రి పర్వదినాన ఆదివారం ఉదయం రుద్రహోమం పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. కోటి తులసి దళాలతో సత్యదేవుడు, అమ్మవార్లకు 66 మంది రుత్విక్కులు, వేద పండితులు, అర్చక స్వాములు పది రోజుల పాటు పూజలు చేశారు. చివరి రోజు ఉదయం ఎనిమిది గంటలకు వార్షిక కల్యాణ మండపం వద్ద రుద్ర హోమం ఘనంగా జరిపారు. ఉదయం 11 గంటలకు జరిగిన పూర్ణాహుతిలో హోమ ద్రవ్యాలను వేదపండితుల మంత్రోఛ్చాటన మధ్య రుత్విక్కులు సమర్పించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వేండ్ర త్రినాథరావు, డీసీ బాబూరావు, అసిస్టెంట్ కమిషనర్ మంజులా దేవి దంపతులు పాల్గొన్నారు. హోమం అనంతరం పవిత్ర జలాలను సత్యదేవుని ఆలయంతో పాటు ప్రాంగణంలో అర్చక స్వాములు చల్లారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కోటి తులసి పూజ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేద పండితులు గొల్లపల్లి ఘనాపాఠి గంగాధరబట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు కంచిభట్ల సాయిరామ్, దత్తాత్రేయ శర్మ, పరిచారకులు శివ, కొండవీటి రాజా, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, వ్రత పురోహిత సంఘం మాజీ అధ్యక్షులు నాగాభట్ల రవిశర్మ, కర్రి సత్యనారాయణ మూర్తి (నాని), పురోహితులు పాలంకి పట్టాభి, చల్లపిళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైదిక బృందానికి అభినందన పది రోజులుగా కోటి తులసి పూజను ఘనంగా నిర్వహించిన వేదపండితులు, అర్చకులు, వ్రత పురోహితులను దేవస్థానం చైర్మన్, ఈఓ అభినందిస్తూ ఉత్తమ సేవా పత్రాలను అందజేశారు. తులసి గొప్పదనంపై పది రోజుల పాటు ప్రవచనాలు సాగించిన సామవేద పండితుడు సూర్యనారాయణను ఈఓ సత్కరించారు. అదే విధంగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన ఏఈఓలు డీవీఎస్ కృష్ణారావు, అనకాపల్లి ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గణపతిని అభినందించారు. కాగా, వార్షిక కల్యాణ మండపంలో సత్యదేవుని నమూనా విగ్రహాల వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఉంచిన తులసి మొక్కలను పూజ అనంతరం భక్తులకు చైర్మన్, ఈఓ పంపిణీ చేశారు. త్వరలోనే మరో ఆధ్యాత్మిక కార్యక్రమం రత్నగిరిపై మాఘ మాసంలో నిర్వహించిన కోటి తులసి పూజకు భక్తుల నుంచి విశేష స్పందన లభించిందని అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు అన్నారు. తక్కువ సమయంలోనే ఈ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. రూ.12 లక్షల బడ్జెట్గా నిర్ణయించామన్నారు. అయితే దాతల నుంచి రూ.15 లక్షలు విరాళాలు వచ్చాయన్నారు. ఇందులో 135 మంది ఒక రోజు పూజకు రూ.1,500 చెల్లించిన దాతలు ఉన్నారన్నారు. రుత్విక్కులకు రూ.3.65 లక్షలు సంభావనగా అందజేశామని తెలిపారు. త్వరలోనే మరో ఆధ్యాత్మిక, పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 29,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
● మాకో మే...డ!
మనుషులకే కాదు మన్యంలో మూగజీవాలకూ మేడలు ఉంటాయి. ఆదివాసీలు తమ మేకలు, గొర్రెలను క్రూరమృగాలు, విష సర్పాల నుంచి రక్షించుకునేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు. రాత్రిళ్లు అవి నివసించేందుకు మేడల మాదిరిగా ఎత్తయిన పాకలను నిర్మించి, దానికి అటక ఏర్పాటు చేస్తారు. అటకను సులువుగా ఎక్కేందుకు మెట్లు మాదిరిగా ఓ తడికెను నిర్మిస్తారు. ఉదయం మేతకు వెళ్లి సాయంత్రానికి ఆ పాకలో రాత్రుళ్లు విశ్రాంతి తీసుకుంటాయి. ఇది చింతూరు మండలం కొత్తూరులో ఆకట్టుకుంటోంది. – చింతూరు -
ఆడబిడ్డ నిధికి నిధుల్లేవ్..
బడ్జెట్ సమావేశంలో ఆడబిడ్డ నిధికి నిధులు కేటాయించ లేదు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 18 నుంచి 59 వరకూ వయసున్న మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేల ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంది. సూపర్ సిక్స్ పేరుతో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఊదరగొట్టింది. ఈ బడ్జెట్లోనూ మహిళలకు నిరాశే మిగిలింది. మహిళలను మోసం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధహస్తుడని మరోసారి నిరూపించుకున్నారు. – గుమ్మడి దుర్గాభవాని, నేదునూరు, అయినవిల్లి మండలం ● -
ఘనంగా శూలాల సంబరం
అమలాపురం రూరల్: ఇమ్మిడివరప్పాడులో కరికాల భక్తుల ఆధ్వర్యంలో వీరభద్రస్వామి ఆలయం వద్ద శూలాల సంబరం ఆదివారం వైభవంగా జరిగింది. యువకులు ఉపవాస దీక్షతో బుగ్గలు, కంఠానికి శూలాలు గుచ్చుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. శూలధారులను ట్రాక్టరుపై ఉంచి బాజాభజంత్రీలతో గ్రామోత్సవం నిర్వహించారు. వరములివ్వు వినాయకా..అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజామున స్వామివారికి ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 53 మంది, లక్ష్మీగణపతి హోమంలో 29 మంది భక్తులు పాల్గొన్నారు. ఒక చిన్నారికి నామకరణ, ముగ్గురికి అన్నప్రశన, ముగ్గురికి అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఐదుగురికి తులాభారం సమర్పించారు. 46 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 6,258 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్కరోజు ఆలయానికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాలుగా రూ.3,67,299 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. నేటి నుంచి సహకార సమ్మెఅమలాపురం టౌన్: జిల్లా సహకార ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మె బాట పడుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని 18 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఫలితం లేక పోరాటానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విధిలేక ఈనెల 16 నుంచి సమ్మెకు దిగుతున్నామని జిల్లా సహకార ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫలితంగా జిల్లా సహకార సేవలు సోమవారం నుంచి తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 298 వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘాలకు చెందిన సీఈఓలు, ఇతర ఉద్యోగులు, సిబ్బంది సమ్మెలో పాల్గోనున్నారు. కోనసీమ జిల్లాలోని 166 సంఘాలు సోమవారం నుంచి మూత పడనున్నాయి. జీఓ నంబరు 36 ప్రకారం సహకార ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నది ప్రధాన డిమాండ్. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ విరమణ 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఇలా పలు డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర సహకార ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తోట వెంకట్రామయ్య, రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ, జిల్లా కోశాధికారి బొబ్బా సుబ్రహ్మణ్య చౌదరి, ఉపాధ్యక్షుడు మేడిచర్ల రామలింగేశ్వరరావు, ఉప ప్రధాన కార్యదర్శులు కుంపట్ల అయ్యప్పనాయుడు, మట్టపర్తి జయరామ్లు సమ్మెకు నాయకత్వం వహిస్తున్నారు. యువతి ఆత్మహత్యాయత్నంమామిడికుదురు: మాకనపాలెం గ్రామానికి చెందిన 29 ఏళ్ల యువతి (అవివాహిత) ఆదివారం వైనతేయ వారధిపై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మహా శివరాత్రి సందర్భంగా గోదావరి నదిలో స్నానానికి వచ్చిన భక్తులు యువతి గోదావరిలో దూకడాన్ని గమనించారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో ఆమెను బోటులో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆమె గత కొన్ని రోజుల నుంచి మానసిక సమస్యతో బాధపడుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ యువతిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించి, తర్వాత ఇంటికి తీసుకు వచ్చారు. గుండెపోటుతో మహిళ మృతిసీతానగరం: దైవ దర్శనానికి వెళ్తూ ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందింది. సీతానగరం మండలం ఇనుగంటివారిపేటకు చెందిన నల్లా బేబి (56) పట్టిసీమ వీరభద్రుని దర్శనానికి బయలుదేరింది. వంగలపూడి రేవు నుంచి ట్రాక్టర్పై గోదావరి పాయ వరకూ వెళ్లి, తర్వాత నడక మార్గంలో వెళ్లిన అనంతరం పట్టిసీమ ఆలయానికి ట్రాక్టర్ ఎక్కింది. కొద్ది దూరం వెళ్లిన అనంతరం గుండెనొప్పి వస్తుందని తన కుమారుడు శివకు ఫోన్ చేసింది. ఫోన్ పెట్టిన అనంతరం ట్రాక్టర్లోని కూర్చుని ఉన్న బేబి కుప్పకూలిపోయింది. అదే ట్రాక్టర్పై సీతానగరం బస్టాండ్ సెంటర్లోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త నాగేశ్వరరావు, కుమారుడు శివ, వివాహమైన కుమార్తె ఉన్నారు. -
లాభాలతో మురవంగ
● ఏడాది పొడవునా పంట ● వేసవి సాగుకు ఇదే అదును సమగ్ర సస్యరక్షణ ఇలా.. ● పురుగు ఆశించిన కాయలు, కొమ్మలను తుంచి నాశనం చేయాలి. ● ఈ పంటలో అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి వేసుకోవచ్చు. ● లింగాకర్షణ బుట్టలను ఎకరాకు 4 చొప్పున ఏర్పాటు చేయాలి. ● అల్లిక రెక్కల పురుగులను మొక్కకు రెండు చొప్పున పంట పెరిగే దశలో విడుదల చేయాలి. ● ట్రైకోగ్రామా బదనికలను ఎకరానికి 20 వేల చొప్పున విడుదల చేయాలి. ● బీటీ మందులను లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున పూత దశలో పిచికారీ చేయాలి. ● పంట పూత దశలో, కాయ దశలో 2, 4–డి మందును 10 మిల్లీగ్రాములు ఒక లీటరు నీటికి లేదా నాఫ్తాలిన్ అసిటికామ్లం ఒక మిల్లీలీటరు 5 లీటర్ల నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తే 15 నుంచి 20 శాతం అధికోత్పత్తి పొందవచ్చు.పెరవలి: వంగ తోటలతో లాభాల బాట పట్టవచ్చు.. కూరగాయల్లో అతి ప్రధానమైన ఈ పంటను ఏడాది పొడవునా పండించవచ్చు. సమయం, వాతావరణ పరిస్థితులను బట్టి సాగు చేస్తే మంచి దిగుబడులతో పాటు అధిక ఆదాయం పొందవచ్చు. తూర్పుగోదావరి జిల్లాలో కూరగాయల పంటలు 2,554 హెక్టార్లలో సాగు చేస్తుండగా, ఇందులో వంగ 900 హెక్టార్లలో ఉంది. ఈ పంట సాగుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు, ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివారణ చర్యల గురించి కొవ్వూరు వ్యవసాయ సహాయ సంచాలకుడు (ఏడీఏ) సీహెచ్ శ్రీనివాస్ పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా.. నారు.. ఆపై విత్తు ● వంగ పంటను ఏడాదిలో మూడు దఫాలు వేయవచ్చు. వర్షాకాలం పంటను జూన్ – జూలైలో, శీతాకాల పంటను అక్టోబర్ – నవంబర్లో, వేసవి పంటను జనవరి – ఫిబ్రవరి నెలల్లో నారు కోసం విత్తుకోవచ్చు. ● వంగ పంట సాగు చేసే రైతులు 30 నుంచి 35 రోజుల వయసు కలిగిన నారును మాత్రమే నాటుకోవాలి. వర్షాకాలం పంట జూలై – ఆగస్టులో, శీతాకాల పంట నవంబర్ – డిసెంబర్లో, వేసవి పంట ఫిబ్రవరి–మార్చి నెలల్లో నాటవచ్చు. విత్తన రకాలు ఎకరాకు సూటి రకాలు 250 గ్రాములు, సంకరజాతి రకాలు 150 గ్రాముల విత్తనం కావాలి. స్థానిక మార్కెట్లలో వినియోగదారుల అభిరుచిని బట్టి రకాలను ఎంపిక చేసుకోవచ్చు. జిల్లాలో ఎక్కువగా భాగ్యమతి, పూసాపర్పుల్ లాంగ్, పూసాపర్పుల్ క్లస్టర్, పూసా క్రాంతి, గులాబీ రకాలను వినియోగిస్తారు. అక్కడక్కడా చారల వంగను కూడా సాగు చేస్తారు. ఈ పంట రకాన్ని బట్టి 130 నుంచి 150 రోజులకు చేతికి వస్తుంది. నారుమడి పెంపకం వంగ పంట సాగు చేసే ముందు నారుమడి పెంపకానికి జాగ్రత్తలు తీసుకోవాలి. 6 అంగుళాల ఎత్తు, ఒక మీటరు వెడల్పు, 4 మీటర్ల పొడవు కలిగిన నారుమడులను ఎకరానికి 10 నుంచి 12 మడులను తయారు చేయాలి. 250 గ్రాముల విత్తనాన్ని ఈ మడులపై విత్తుకోవాలి. విత్తనాలను విత్తే ముందు 50 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన నీటిలో విత్తనాలను 30 నిమిషాల పాటు నానబెట్టి నీడలో ఆరనివ్వాలి. ఆ తరువాత కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరామ్ లేదా ఇండోఫిల్ అనే మందుతో విత్తనశుద్ధి చేయాలి. ఆ తరువాత ట్రైకోడెర్మావిరిడి కల్చర్ను ఒక గ్రాము విత్తనాలకు పట్టించి విత్తుకోవాలి. ఈ మడుల్లో నీరు నిల్వ లేకుండా చూడటంతో పాటు రోజూ మడులను తడపాలి. నీరు నిల్వ ఉండి మడులు మునిగిపోతే మాగుడు తెగులు ఆశిస్తుంది. దీని నివారణకు ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి వారం వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేయాలి. ఎరువుల యాజమాన్యం ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును పంట వేసే ముందు ఆఖరి దుక్కులో వేయాలి. 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ దుక్కులో వేయాలి. నారు వేసిన తరువాత ఎరువులను 30వ రోజు, 60వ రోజు, 75వ రోజుతో పాటు 40 కిలోల నత్రజనిని మూడు సమ భాగాలుగా చేసి వీటిని అందించాలి. నీటి యాజమాన్యం వంగ మొక్కలను నాటిన వెంటనే నీరు పెట్టాలి. వర్షాకాలంలో అవసరాన్ని బట్టి, శీతాకాలంలో 7 రోజులకు, వేసవిలో 3 నుంచి 5 రోజులకు ఒకసారి నీరు అందించాలి. వేసవి పంటలో నీటితడులు కాయలు కోయడానికి రెండు రోజుల ముందే ఇవ్వాలి. ఇలా ఇవ్వకపోతే వంకాయలు చేదుగా ఉంటాయి.అన్నవరప్పాడులో వంగ తోట పురుగులు.. తెగుళ్లు మొక్కలు నాటిన 30 నుంచి 40 రోజులకు మొవ్వ మరియు కాయతొలుచు పురుగు ఆశించవచ్చు. ఇది ఆశించిన వెంటనే కొమ్మలను తుంచి కార్బరిల్ 50 శాతం 3 గ్రాములు లేదా ప్రొఫెనోపాస్ రెండు మిల్లీలీటర్లు లేదా సైపర్మెత్రిన్ ఓ మిల్లీలీటరు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్డెమెటాన్ లేదా పిప్రానిల్ లీటరు నీటికి 2 మిల్లీమీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. నారు నాటిన 30 రోజులకు ఆకుమాడు, కాయకుళ్లు తెగులు ఆశిస్తుంది. వీటి నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున పది రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి. వెర్రి తెగులు నివారణకు రోగార్ లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఎండు తెగులు నివారణకు ఎటువంటి చర్యలు లేవు. ఈ తెగులును తట్టుకునే రకాలను ఎంచుకుని సాగు చేయడం ఉత్తమం. -
రాంగ్ రూట్ తెచ్చిన ముప్పు
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి ● జాతీయ రహదారిపై ఘటన దేవరపల్లి: రాంగ్ రూటే ముప్పు తెచ్చింది.. ఇద్దరి ప్రాణాలను హరించింది.. గుండుగొలను – కొవ్వూరు జాతీయ రహదారిపై దేవరపల్లి మండలం కొత్తగూడెం సమీపంలో యాదవోలు రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. దేవరపల్లి మండలం సుబ్బరాయపురం గ్రామానికి చెందిన ముప్పాల రాజశివకృష్ణ (24), అదే గ్రామానికి చెందిన పెనుమాక చిన్నారి (34) బైక్పై కొరుకొండ మండలం గోకవరం శివారు కృష్ణుడుపాలెం వెళ్లి శనివారం తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదవోలు రోడ్డు వద్ద హైవేపై శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఏలూరు వైపు నుంచి కొవ్వూరు వైపు వెళ్తున్న బొలెరో కారును ముప్పాల రాజశివకృష్ణ రాంగ్ రూట్లో వచ్చి ఢీకొన్నాడు. రాజశివకృష్ణ, చిన్నారి అక్కడకక్కడే మృతి చెందారు. మృతుడి తల్లి శాంతికుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతురాలు చిన్నారికి వివాహం కాగా, రాజశివకృష్ణకు వివాహం కాలేదని ఆయన చెప్పారు. రాంగ్ రూట్లో వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ఆయన వివరించారు. -
జాబ్ క్యాలెండర్ ఏది బాబూ?
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించ లేదు. యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ఇది నిరుద్యోగులను మోసం చేయడమే. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. కానీ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికే ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు వేలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నారు. కానీ ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు అప్పుల పాలయ్యారు. – దంగేటి శ్రీప్రసాద్, విద్యార్థి నాయకుడు, పుల్లేటికుర్రు ● -
పడవ సీజ్
తాళ్లపూడి: అనుమతులు లేకుండా గోదావరి నదిలో పడవపై భక్తులను తరలిస్తున్న వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్లు తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొవ్వూరు వాటర్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన నూకరాజు 15 మంది భక్తులను కొవ్వూరు గోదావరి మాత విగ్రహం సమీపంలో పడవలోకి రహస్యంగా ఎక్కించుకుని ఎటువంటి భద్రతా చర్యలు పాటించకుండా పట్టిసీమకు తీసుకు వెళ్తున్నాడు. తాళ్లపూడి ప్రాంతంలో పోలీస్ బీట్ సిబ్బంది ఆ పడవను అడ్డుకుని, నూకరాజును అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి పడవను సీజ్ చేసి, భక్తులకు అసౌకర్యం కలగకుండా రోడ్డు మార్గంలో పంపారు. -
రేపు ఉపాధ్యాయుల రణభేరి 2.0
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తవుతున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రణభేరి 2.0 ద్వారా నిరసన తెలియజేయనున్నారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద 17వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు యూటీఎ్ఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవీ రమణ, టీవీఏఎస్ సుబ్బారావు తెలిపారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహిస్తున్న క్రమంలో జిల్లా నుంచి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. పీఆర్సీ నియమించి ఐఆర్ ప్రకటించాలని, నాలుగు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని వారు పేర్కొన్నారు. అలాగే పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్లపై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమణ తెలిపారు. నేడు యథావిధిగా పీజీఆర్ఎస్ అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ (పీజీఆర్ఎస్) సోమవారం యథావిధిగా కలెక్టరేట్లోని గోదావరి భవన్లో నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు. అర్జీదారులు ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయితో పాటు మూడు రెవెన్యూ డివిజన్ అధికారుల కార్యాలయాల్లో మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ జరుగుతుందన్నారు. ఉత్సాహంగా ఏఎస్సార్ జాతీయ వాలీబాల్ పోటీలు ఉప్పలగుప్తం: మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని గొల్లవిల్లిలో భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో ఏఎస్ఆర్ (అరిగెల శ్రీరంగయ్య) టోర్నమెంట్ మెన్, వుమెన్ జాతీయ స్థాయి డే అండ్ నైట్ వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, టోర్నమెంటు గౌరవ అధ్యక్షుడు అయితాబత్తుల ఆనందరావు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, టోర్నీ అధ్యక్షుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, ముఖ్య సలహాదారు అరిగెల నానాజీ ఆదివారం ఈ పోటీలను ప్రారంభించారు. మొదటి రోజు మెదటి మ్యాచ్లో జీఎస్టీ ముంబై, ఎస్ఏఐ కేరళ జట్టుపై జీఎస్టీ ముంబై జట్టు విజేతగా నిలిచింది. రెండో మ్యాచ్లో ఆల్ఫోన్సో కేరళ, ఎస్సీఆర్ మహిళా జట్లు తలపడ్డాయి. మూడో మ్యాచ్లో ఇండియన్ బ్యాంక్ చైన్నె, కర్ణాటక జట్లు తలపడ్డాయి. రత్నగిరిపై రద్దీ అన్నవరం: మహాశివరాత్రి పర్వదినం, ఆదివారం కలసి రావడంతో రత్నగిరికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. దీంతో, సత్యదేవుని ఆలయ ప్రాంగణం, క్యూలు, వ్రత, విశ్రాంతి మండపాలు రద్దీగా మారాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సత్యదేవుని రథ సేవను ఉదయం టేకు రథంపై ఘనంగా నిర్వహించారు. జేఎన్టీయూకే విద్యార్థిని ఆత్మహత్య బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరుణ కెమికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతూ.. కళాశాల ఆవరణలోని నాగవళి హాస్టల్లో ఉంటోంది. ఆదివారం మధ్యాహ్నం తన గది నుంచి ఆమె ఎంతకూ బయటకు రాలేదు. దీంతో, తోటి విద్యార్థులు వెళ్లి చూడగా గదిలో తాడుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి, హాస్టల్ అధికారులకు ఈ విషయం చెప్పారు. దీంతో, అధికారులు సర్పవరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గదిలో లభించిన ఆధారాలు, లేఖల ఆధారంగా అరుణ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
సర్వం శివోహం
కోటిపల్లి వద్ద గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులుఐ.పోలవరం: మహా శివరాత్రి పర్వదినాన జిల్లాలోని శైవ క్షేత్రాలు పంచాక్షరితో మార్మోగాయి. ప్రముఖంగా ద్రాక్షారామలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వర ఆలయం, ఐ.పోలవరం మండలం మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం, కె.గంగవరం మండలం కోటిపల్లి క్షేత్రంలోని ఛాయా సోమేశ్వరస్వామి ఆలయం తదితర క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సమీప నదీ జలాల్లో స్నానాలు చేసి ఆయా క్షేత్రాలలోని స్వామివార్లను దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. లింగోద్భవ కాలాన స్వామి వారికి నదీ జలాలతో అభిషేకాలు చేయగా, భక్తులు శివనామ స్మరణతో జాగరణ చేశారు. అలాగే స్థానిక అధికారులు, ఆలయ కమిటీలు, స్వచ్ఛంద సేవకులు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. దాతలు భక్తులకు ఇతోధికంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైభవంగా పుష్కర నదీ జలాభిషేకాలు.. నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం మురమళ్ల శ్రీభద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం. మహా శివరాత్రి పర్వదినాన ఆలయం మహాదేవుని నామాలతో ప్రతిధ్వనించింది. ఐదు రోజుల పాటు జరిగే శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సుమారు 40 వేల మంది స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ద్వాదశ పుష్కర నదులైన గంగ, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి, భీమరథి, పుష్కరిణి, తుంగభద్ర, సింధు, ప్రణీత జలాలతో ఆలయ పండితులు నాగభట్ల రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు యనమండ్ర సత్యసీతారామ శర్మ, యనమండ్ర సుబ్బారావు, పేటేటి శ్యామల కుమార్ పర్యవేక్షణలో వీరేశ్వరునికి అభిషేకాలు చేశారు. ఈ అభిషేకాన్ని తిలకించేందుకు జిల్లా నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. తొలుత ద్వాదశ పుష్కర నదీ జలాలతో గ్రామోత్సవం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ, లక్ష పత్రి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం కేవలం మహా శివరాత్రికి మాత్రమే అలంకరించే నాగాభరణాన్ని స్వామివారికి తొడిగారు. సాయంత్రం మేళతాళాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో నందాదీపం మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, ఈఓ వి.సత్యనారాయణ, దేవదాయ శాఖ తనిఖీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భీమేశ్వర దర్శనం.. బంధ విమోచనం.. రామచంద్రపురం రూరల్: పంచారామాలలో ఒకటిగా.. త్రిలింగ క్షేత్రాలలో ప్రముఖమైనదిగా.. అష్టాదశ శక్తి పీఠాలలో 12వదిగా విరాజిల్లుతున్న స్థానిక ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తజన సంద్రమైంది. ఆలయ ప్రాంగణం అంతా హరనామ స్మరణతో ప్రతిధ్వనించింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. తెల్లవారు జామునుంచే సప్త గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. 33 మట్టి కుండలతో అభిషేక ద్రవ్యాలు, సప్త నదీ జలాలు, 12 గుండాలు నుంచి సేకరించిన జలాలతో స్వామికి తొలి అభిషేకం చేశారు. అనంతరం ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టెంట్లలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. ‘కోటిఫల’ ప్రాప్తిరస్తు.. కె.గంగవరం: మండలంలోని కోటిపల్లి క్షేత్రంలోని ఛాయా సోమేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి గౌతమీ గోదావరిలో పుణ్య స్నానాలు చేసి స్వామివారి దర్శించుకున్నారు. తీర్థపు బిందెలతో గోదావరి జలాలను తీసుకువచ్చిన అర్చకులు స్వామివారికి అభిషేకించి అనంతరం దర్శనాలు కల్పించారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం టెంట్లు, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. సుమారు లక్షకు పైగా భక్తులు దర్శించుకున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. సుమారు 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించగా, వైద్యులు శిబిరాల ఏర్పాటు చేశారు. స్వామి వారిని ఆర్డీఓ అఖిల, ఎంపీపీ పంపన నాగమణి, సుబ్బారావు దంపతులు దర్శించుకున్నారు. భక్తులకు పైండా సత్రం, ఆర్య వైశ్య సంఘం, కమ్మ సంఘం, అల్లూరి వంశీయులు, సత్యసాయి సేవ సంస్థలు, విశ్వ చైతన్య శక్తి చారిటబుల్ ట్రస్ట్, పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానాలు ఏర్పాటు చేశాయి. కె.గంగవరం నుంచి కోటిపల్లి వరకు దారిపొడవునా దాతలు పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. భక్తులతో కిక్కిరిసిన శైవ క్షేత్రాలు అభిషేక ప్రియుడికి విరివిగా పంచామృతాభిషేకాలు ఏర్పాట్లు చేసిన అధికారులు, ఆలయ కమిటీలు భక్తుల సేవలో తరించిన స్వచ్ఛంద సంస్థలు, దాతలు -
హోరాహోరీగా బ్యాడ్మింటన్ ఫైనల్స్
● మిక్స్డ్ డబుల్స్లో కాకినాడ.. ● 40 ప్లస్ మెన్స్లో విశాఖ.. ● మెన్స్ డబుల్స్లో హైదరాబాద్ విజేతలు ● ముగిసిన ఉభయ రాష్ట్రాల స్థాయి టోర్నీ అమలాపురం టౌన్: అమలాపురం ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ఇన్డోర్ స్టేడియంలో శని, ఆదివారాల్లో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్స్ హోరాహోరీగా జరిగాయి. అమలాపురానికి చెందిన స్పోర్ట్స్ లెజెండ్ దివంగత రంకిరెడ్డి కాశీ విశ్వనాథం పేరిట ఆయన కుమారులు అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్, చరణ్ తేజ (సాఫ్ట్వేర్ ఇంజినీర్) స్పోర్ట్స్ కాశీ అకాడమి ద్వారా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. పోటీలలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 85 జట్లు పాల్గొన్నాయి. మెన్స్ డబుల్, మిక్స్డ్ డబుల్, మెన్స్ 40 ప్లస్ డబుల్స్ విభాగాల్లో పోటీలు జరిగాయి. ఆదివారం జరిగిన ఫైనల్స్లో మిక్స్డ్ డబుల్ విభాగంలో కాకినాడకు చెందిన కె.సాయికర్, కె.సరయు ప్రధమ, అమలాపురానికి చెందిన టి.సాయి హర్షిణి, వై.గౌతమ్ ద్వితీయ, కాకినాడకు చెందిన పి.చంద్ర గోపీనాథ్, ఎం.వీరదుర్గ తృతీయ స్థానాల్లో గెలుపొందారు. 40 ప్లస్ మెన్స్ డబుల్ విభాగంలో విశాఖకు చెందిన ఉదయ భాస్కర్, జానీ ప్రధమ, గుంటూరుకు చెందిన జితేందర్, ఖాదర్ మస్తాన్ ద్వితీయ, విజయవాడకు చెందిన డి.సునీల్ కుమార్, ఎస్.రమేష్ తృతీయ స్థానాలు సాధించారు. మెన్స్ డబుల్ విభాగంలో హైదరాబాద్కు చెందిన పి.చంద్ర గోపీనాథ్, విఘ్నేష్ ప్రధమ, విజయవాడకు చెందిన కె.శ్రీకర్, బి.అభిషేక్ ద్వితీయ, ముంబైకి చెందిన హర్షిత్, గర్వ్ తృతీయ స్థానాలను కై వసం చేసుకున్నారు. విజేతలకు రూ.1.50 లక్షల నగదు బహుమతులు అందజేశారు. పోటీలు శనివారం ఉదయం ప్రారంభమై ఆదివారం రాత్రితో ముగిశాయి. విజేతలకు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, చరణ్ తేజ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్బాబు, కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి యాళ్ల నాగ సతీష్, ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ప్రతినిధులు తిక్కిరెడ్డి శ్రీనివాసరావు, కల్వకొలను బాబు, తిక్కిరెడ్డి సురేష్ తదితరులు నగదు బహుమతులు అందజేశారు. -
సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
బడాయి లెక్కల బడ్జెట్రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడాయి లెక్కలతో నిండిపోయింది. జిల్లాకు రిక్తహస్తం చూపించారు. సంక్షేమం, అభివృద్ధికి కేటాయింపులు లేవు. కాగితాల లెక్కలు మాత్రమే చూపారు. సూపర్ సిక్స్ పథకాలకు ఠికాణా లేదు. బడ్జెట్ రూ.3 లక్షల కోట్లని చెప్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆ మేరకు చేసిన అప్పులు కూడా చెప్పాలి. – వంటెద్దు వెంకన్నాయుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రజలకు ద్రోహం చేశారు కూటమి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రజలకు తీవ్ర ద్రోహం చేశారు. సూపర్ సిక్స్ హామీలకు మంగళం పాడేశారు. అభివృద్ధికి కూడా పెద్దగా నిధులు కేటాయించలేదు. ఆరోగ్యశ్రీకి అరకొర బడ్జెట్ కేటాయించి పేదలకు ఆరోగ్య భద్రతను పూర్తిగా విస్మరించారు. ఇది ముమ్మాటికీ నమ్మించి ఓట్లేయించుకుని ప్రజలను మోసం చేయడమే. ఇలా చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే. – గొల్లపల్లి సూర్యారావు, వైఎస్సార్ సీపీ రాజోలు నియోజకవర్గ ఇన్చార్జి -
దొరచేతిలో వైకుంఠం!
సాక్షి, అమలాపురం/అల్లవరం: ‘‘అంకెల గారడీ, మాటల మాయ, చెప్పదొకటి.. చేసేదొకటి, అరచేతిలో వైకుంఠం, హామీల అమలులో మోసం, సంక్షేమ లబ్ధి శూన్యం’’. చంద్రబాబు ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై జిల్లా వాసులలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు ఇవి. యువత, నిరుద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, రైతు, మహిళలు.. ఇలా చెప్పుకుంటూ పోతే సర్వ జనం రాష్ట్ర బడ్జెట్పై అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. ● జిల్లాలో ప్రధానమైంది వ్యవసాయం. దీని అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులంటూ చూపించలేదు. ప్రధానంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా ఈ ఏడాది నుంచి చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీకి ఇవ్వాల్సిన సొమ్ము లెక్కలలో చూపించపోవడంతో సుమారు 1.80 లక్షల మంది రైతులు అసంతృప్తితో ఉన్నారు. ● రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టీకల్చర్ హబ్గా గుర్తించామని, రూ.వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. అయితే అక్కడ కన్నా ఎక్కువ ఉద్యాన పంటలు సాగే గోదావరి జిల్లాలను పక్కన బెట్టడం రైతులను జీర్ణించుకోలేపోతున్నారు. మరీ ముఖ్యంగా కోనసీమ జిల్లాలో కొబ్బరి, అరటి, కోకో, పోక, పువ్వులు, కూరగాయలు సుమారు 1.50 లక్షల ఎకరాలలో సాగుతున్నాయి. ఉద్యాన ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయినా ఇక్కడ ఉద్యాన రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకోలేదు. ● గోదావరి డెల్టాకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.రెండు వందల కోట్లు చూపించారు. గత బడ్జెట్లోనూ ఇలా చూపించినా పనులు చేయలేదు. చివరకు రూ.మూడు కోట్లతో చేపట్టిన పంట, మురుగునీటి కాలువల్లో పూడిక తొలగింపు పనులు కూడా చేయలేదు. డెల్టాలో మురుగునీటి కాలువలు, పంట కాలువల్లో కనీస మరమ్మతులు చేసేందుకు రూ.500 కోట్ల అవసరమని నిపుణుల అంచనా. ● నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. కనీసం ఎంఎస్ఎంఈలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిధులు పెంచలేదు. ● 12వ పీఆర్సీపై ప్రకటన చేయకపోవడం, బడ్జెట్లో మధ్యంతర భృతి (ఐఆర్) ప్రస్తావన లేకపోవడం, నాలుగు డీఏల విషయాన్ని తేల్చకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, మరీ ముఖ్యంగా ఉపాధ్యాయుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ● మహిళలను చంద్రబాబు ప్రభుత్వం మరీ మోసం చేసింది. ఆడబిడ్డ నిధిగా నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీ అమలుకు ఈ ఏడాదీ కేటాయింపులు చేయలేదు. ● కోనసీమ జిల్లాకు నేరుగా మేలు చేసే ఒక్క ప్రకటన కూడా వెలువడ లేదు. పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా అనుబంధ ప్రోసెసింగ్ ప్లాంట్లు, విలువ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమల వంటి ఊసే లేదు. చివరకు కోనసీమ రైల్వే ప్రాజెక్టు భూసేకరణకు అవసరమైన రూ.300 కోట్ల ప్రస్తావన కూడా లేకపోవడం ఈ ప్రాంత వాసులను అసంతృప్తికి గురి చేస్తోంది. రాష్ట్ర బడ్జెట్పై అన్ని వర్గాలలో పెదవి విరుపు కోనసీమకు ప్రత్యేకంగా ఒనగూడింది శూన్యం వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలకు మొండి చేయి నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు పీఆర్సీ ఊసే లేదు కోనసీమ రైల్వే భూ సేకరణ మాట ఎత్తని వైనం -
వాడపల్లికి భక్తుల తాకిడి
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మీ హోమం, సుప్రభాత సేవ, తొలి హారతి నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతించారు. గౌతమీ గోదావరి నదిలో పుణ్యా స్నానాలు ఆచరించి క్యూ లో నిలబడి గోవింద నామాలు చెబుతూ మాడవీధులలో ఏడు ప్రదక్షిణలు చేసి, స్వామి వారిని దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వృద్ధులు, మహిళలు, పిల్లలకు దాతలు సమకూర్చిన ఎలక్ట్రిక్ వాహనాలపై కొత్త వంతెన నుంచి స్వామి వారి ఆలయానికి చేర్చారు. సుమారు లక్ష మంది స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి రూ.68,34,622 ఆదాయం వచ్చినట్టు దేవదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈవో ఎన్.చక్రధరరావు తెలిపారు. రాత్రి ధర్మపథం కార్యక్రమంలో నిర్వహించిన నృత్య ప్రదర్శన అలరించింది. ఆలయ చైర్మన్ ఎం.వెంకటరాజు భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. కోల్కతా టు కన్యాకుమారి సైకిల్ యాత్ర ఐ.పోలవరం: స్వామి వివేకానంద భావజాలాన్ని దేశానికి చాటి చెప్పేందుకు ఒక వ్యక్తి కోల్కతా నుంచి కన్యాకుమారి వరకు సైకిల్పై సాహస యాత్ర చేపట్టారు. దీనిలో భాగంగా శనివారం రాత్రి ఐ.పోలవరం మండలం మురమళ్ల వీరేశ్వరస్వామివారిని దర్శించేందుకు వచ్చారు. కోల్కతాకు చెందిన సంజీత్ మజుందార్ జనవరి 26న బయలుదేరి సుమారు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి శుక్రవారం రాత్రి మురమళ్లకు చేరుకున్నారు. అనంతరం మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో ఈ యాత్ర చేపట్టానని, తిరిగి కోల్కతాకు సైకిల్పై వెళతానన్నారు. తొమ్మిది రాష్ట్రాల మీదుగా సుమారు ఐదు వేల కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుందన్నారు. రోజుకు సగటున 50 కిమీల మేర తన యాత్ర సాగుతోందని తెలిపారు. ప్రతి చోట స్థానికులు ఆదరిస్తున్నారని, తన యాత్ర గురించి తెలిసి అభినందిస్తున్నారని తెలిపారు. కాశీ, అయోధ్యకు సూపర్ లగ్జరీ బస్సు రావులపాలెం: స్థానిక డిపో నుంచి కాశీలోని నూతన కాశీ విశ్వేశ్వర మందిర దర్శనానికి, అయోధ్యకు సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ వైవీవీఎన్ కుమార్ శనివారం తెలిపారు. ఈ బస్సు మార్చి మూడో తేదీన బయలుదేరి భువనేశ్వర్లోని లింగరాజ స్వామి ఆలయం, పూరీ జగన్నాథ స్వామి ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, జాజిపూర్ గిరిజాదేవి శక్తి పీఠం, అలహాబాద్లోని త్రివేణి సంగమం, ప్రయాగ మాధవేశ్వరి శక్తిపీఠం, కాశీ క్షేత్రం – కాశీ విశ్వేశ్వరజ్యోతిర్లింగం, విశాలాక్షి శక్తి పీఠం, అయోధ్య బాల రాముని ఆలయం, నైమి శారణ్యం– గోమతి నది స్నానం, లలితా దేవి ఉపశక్తి పీఠం, గయ– విష్ణు పాద ఆలయం, బు ద్ధగయ– గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం, అరసవిల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం, శ్రీకూర్మం –కూర్మనాథ దేవాలయం, అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి దేవాలయం దర్శనం అనంతరం 16 తేదీన రావులపాలెం చేరుతుందన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్తో కలిపి టికెట్ ధర రూ.13 వేలుగా నిర్ణయించామన్నారు. వివరాలకు అసిస్టెంట్ మేనేజర్ను 73829 11871 నంబర్లో సంప్రదించాలన్నారు. బాలాజీ క్షేత్రంలో భక్తజన కోలాహలం మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి క్షేత్రం మాఘమాసం శనివారం సందర్భంగా కోలాహలంగా మారింది. స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఉభయ దేవేరులతో కొలువై ఉన్న శ్రీబాల బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.3,09,353 ఆదాయం వచ్చిందని ఈఓ రాంబాబురెడ్డి తెలిపారు. స్వామి వారిని 8,500 మంది దర్శించుకున్నారని, మూడు వేల మంది స్వామి అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. స్వామి వారి నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకు భక్తులు రూ.1,12,691 విరాళాలుగా అందించారని తెలిపారు. -
నిరుద్యోగులను వంచించారు
అధికారంలోకి వస్తే నెలకు రూ.మూడు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఒక్క నెల కూడా నిరుద్యోగలకు భృతి ఇవ్వలేదు. ఇప్పుడు బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించలేదు. అంటే ఈ ఏడాది కూడా అందదన్నమాట. అసలు ఈ పథకం అమలు చేయబోమని చెప్పేస్తే సరిపోతుంది. నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా లేకుండా పోయాయి. – సత్తి నాగ పల్లారెడ్డి, రావులపాలెం ఇక్కడి ఉద్యాన పంటలకు గుర్తింపేది? రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్ట్టికల్చర్ హబ్గా గుర్తించడం మంచిదే. కాని ఇంతకన్నా ఎక్కువ ఉద్యాన పంటలు సాగు చేసే గోదావరి జిల్లాలకు ఆ తరహా గుర్తింపు ఎందుకు ప్రకటించలేదు. కొబ్బరి, కోకో, పోక, అరటి, కంద, పసుపుతోపాటు వేలాది ఎకరాల్లో పువ్వుల సాగు, నర్సరీలు ఉన్నాయి. కోకో పంటను ఇప్పటి వరకు ఉద్యాన పంటగా గుర్తించలేదు. ఉద్యాన పంటలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వలేదు. – ముత్యాల జమ్మీలు, నేషనల్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ సభ్యుడు, అంబాజీపేట రైతులకు ప్రయోజనం లేదు అన్నదాత సుఖీభవకు నిధులు ఇవ్వడం ఒక్కటే కాదు. రైతులకు మేలు చేయాల్సిన ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ఉచిత పంటల బీమా ఎత్తివేయడం వల్ల గత ఏడాది వేలాది మంది రైతులు పంట నష్టపోయినా పరిహారం పొందలేకపోయారు. కనీసం పెట్టుబడి రాయితీ కూడా ఇవ్వలేదు. ఇటువంటి వాటికి ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. – ఇళ్ల సూర్యనారాయణ, రైతు, శివల, కె.గంగవరం మండలం -
నేటి నుంచి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు
ఉప్పలగుప్తం: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మండలంలోని గొల్లవిల్లి భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం అరిగెల రంగయ్య (ఏఎస్ఆర్) జాతీయ స్థాయి డే అండ్ నైట్ వాలీబాల్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలను ఏఎస్ఆర్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదురోజుల పాటు నిర్వహిస్తున్నట్టు నిర్వాహక కమిటీ సభ్యులు శనివారం వెల్లడించారు. ఈ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో ఆయా రాష్ట్రాల నుంచి వుమెన్, మెన్ క్రీడాకారులు పాల్గొని సత్తా చాటనున్నారు. ఈ క్రీడల్లో మెన్స్ టీమ్ నుంచి ఎస్ఏఐ కేరళ, జీఎస్టీ ముంబై, ఇండియన్ బ్యాంక్ చైన్నె, కర్ణాటక, ఐఓబీ చైన్నె, టీమ్ ఆంధ్రప్రదేశ్, వుమెన్స్ టీమ్ నుంచి ఆల్పోన్సా కేరళ, సౌత్రన్ రైల్వే చైన్నె ఎస్ఆర్ఎం చెంగలపట్టు, ఎస్సీఆర్ సికింద్రాబాద్ టీమ్లు తలపడనున్నాయి. ప్రోత్సహిస్తున్న గొల్లవిల్లి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వాలీబాల్ పోటీలను ప్రోత్సహించడంలో గొల్లవిల్లి గ్రామం ముందుంటుంది. తొలుత 1987వ సంవత్సరంలో ఉండ్రు సాంబశివరావు మెమోరియల్ కోనసీమ స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. 1988లో కొనసాగగా 1989వ సంవత్సరంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయిలో రెండు సంవత్సరాలు కొనసాగించారు. 1991, 1992 సంవత్సరాల్లో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా స్థాయిలో నిర్వహించారు. 1993 నుంచి 1995 వరకూ ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణ జిల్లాల స్థాయిలో నిర్వహించారు. 1996లో రాష్ట్ర స్థాయి పోటీలను జరిపారు. ఇదే రాష్ట్రస్థాయి పోటీలను 2000 నుంచి 2002 వరకూ మూడు సంవత్సరాలు కొనసాగించారు. 2006లో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. మళ్లీ 2010 నుంచి 2012 వరకూ మూడు సంవత్సరాలపాటు సలాది పల్లంరాజు మెమోరియల్స్ (ఎస్పీఆర్) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించారు. అనంతరం 2014 నుంచి 2017 వరకూ నాలుగు సంవత్సరాల పాటు నిమ్మకాయల వెంకటరంగయ్య (ఎన్వీఆర్) వాలీబాల్ టోర్నీ ఆధ్వర్యంలో నాలుగేళ్లపాటు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలను ఘనంగా నిర్వహించారు. 2025 నుంచి అరిగెల రంగయ్య వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. -
ఆకర్షించే శివైశిష్ట్యం
● నేడు మహాశివరాత్రి ● ముస్తాబైన శైవ క్షేత్రాలు ● ఆలయాలకు పోటెత్తనున్న భక్తులు సాక్షి, అమలాపురం: సప్త గోదావరి నదీపాయల ప్రవాహంతో పునీతమైన కోనసీమ జిల్లాలో గ్రామగ్రామాన శివాలయాలున్నాయి. నదీపాయలను ఆనుకునే ఉన్న పురాణ ప్రసిద్ధి చెందిన ఆలయాలకు కూడా కొదవలేదు. వీటిలో స్వయంగా శ్రీరామ చంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఆలయాలు కూడా ఉన్నాయని భక్తుల విశ్వా సం. ఒక్కొక్క శివాలయానిది ఒక్కో చరిత్ర. అక్కడ జరిగే పుష్కర జలాల అభిషేకాలు, ఇతర అభిషేకాలు కూడా ఆయా ఆలయాలకు ప్రత్యేకమే. ఈ ఆలయాలకు నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. మహా శివరాత్రి రాత్రి సందర్భంగా ఆదివారం వేలాదిగా ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. జల్లాలో ముఖ్యమైన ఆలయా ల్లో భక్తులను ఆకర్షించే విశిష్టతలపై ప్రత్యేక కథనం.. శివ–శక్తి కలయికకు ప్రతీకగా.. అజ్ఞానంపై జ్ఞానం విజయానికి, శివ–శక్తి కలయికకు ప్రతీకగా మహాశివరాత్రిని జరుపుతారు. శివుడు మొట్టమొదటిసారిగా లింగాకారంలో ఆవిర్భవించిన రోజు గా కూడా మహా శివరాత్రిని భక్తులు విశ్వసిస్తారు. జి ల్లాలో ద్రాక్షారామ, కోటిపల్లి, ముక్తేశ్వరం, అయినవి ల్లి, కుండలేశ్వరం ప్రసిద్ధి చెందిన ఆలయాలుగా గుర్తింపు పొందగా, వందల సంఖ్యలో ఆలయాలు ఆదివారం జరిగే మహా శివరాత్రికి ముస్తాబవుతున్నాయి. కోటిపల్లి, కుండలేశ్వరం, మురమళ్ల వంటి ప్రాంతాల్లో భక్తులు నదీపాయాల్లో పుణ్యస్నానాలు చేసి అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. భైరవపాలెం, మగసానితిప్ప, పల్లం శివారు బ్రహ్మ సమేధ్యంలోని ఆలయాల వద్ద భక్తులు సముద్ర స్నానాలు చేస్తారు. ● పంచారామాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ భీ మేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి పొందింది. మహి మాన్విత శివలింగ క్షేత్రాల్లో ఇదొకటి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది 12వ శక్తి పీఠం. మాణిక్యాంబ అమ్మ వారు ఇక్కడ వెలిశారు. దీనిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ శివలింగం ఎత్తు 18 అడుగులు. ● గౌతమీ నదీ తీరాన కె.గంగవరం మండలం కోటిపల్లిలో శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం ఉంది. రాజ రాజేశ్వరీ సహిత సోమేశ్వరస్వామి, అమ్మవార్లతో కూడిన కోటేశ్వర స్వామివారు, శ్రీదేవి, భూదేవి సహిత జనార్థన స్వామివారు ఇక్కడ కొలువయ్యారు. ఈ విగ్రహాలను ఇంద్రుడు, చంద్రుడు, కశ్యప మహర్షి ప్రతిష్ఠించారని భక్తుల నమ్మకం. ● అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో వేంచేసి ఉన్న ముక్తికాంత సమేత క్షణముక్తేశ్వర స్వామి విగ్రహాన్ని స్వయంగా శ్రీరామ చంద్రమూర్తి ప్రతిష్ఠించారంటారు. స్వామివారిని దర్శిస్తే పాపాల నుంచి విముక్తి లభిస్తోందని నమ్మకం. ● వృద్ధ గౌతమి నదీ తీరంలో వెలిసిన సుప్రసిద్ధ శైవక్షేత్రం మురమళ్ల. ఇక్కడ ప్రధాన దైవం భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి. స్వామి వారు నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నారు. పెళ్లి కాని యువతీ, యువకులు ఇక్కడ స్వామివారికి కల్యాణం చేయించుకుంటే పెళ్లివుతుందని నమ్మకం. శివరాత్రి రోజు పన్నెండు పుష్కరాలు జరిగే నదుల నుంచి తీసుకువచ్చిన జలాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఐదు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరగనున్నాయి. ● పార్వతీ సమేత కుండలేశ్వరుని దర్శనం అనంత కుండాల ఫలం. కుండలేశ్వరుని దర్శిస్తే నూరు గోవులను హత్య చేసిన పాపం నుంచి విముక్తి పొందుతారని భక్తుల నమ్మకం. భక్తులు కోరిన కోర్కెలు తీరుతాయని విశ్వాసం. కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో ఈ ఆలయం ఉంది. ఆలయాల్లో ఏర్పాట్లు జిల్లాలో జరిగే మహా శివరాత్రి పర్వదినానికి శైవ క్షేత్రా లు ముస్తాబవుతున్నాయి. ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే ఆలయాల వద్ద ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. పార్కింగ్కు, ఇతర సౌకర్యాలు, ఆలయాల వద్ద భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, చిన్న పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేక రూమ్లు, గోదావరి, సముద్ర స్నానాలు చేసేచోట రక్షణ చర్యలు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు చేశారు. -
పరిపాలనాదక్షుడు సంజీవయ్య
అమలాపురం రూరల్: భారతదేశపు మొట్ట మొదటి దళిత ముఖ్యమంత్రిగా, నిరాడంబరమైన వ్యక్తిగా దామోదరం సంజీవయ్య గుర్తింపు పొందారని జిల్లా రెవెన్యూ అధికారి కొత్త మాధవి అన్నారు. శనివారం కలెక్టరేట్లో దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలను సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ సంజీవయ్య పరిపాలనాదక్షుడిగా గుర్తింపు పొందారన్నారు. దేశంలో తొలిసారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏర్పాటు చేశారన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత శాఖ అధికారిని పి.జ్యోతిలక్ష్మి దేవి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి సాధనప్రసాద్, కలెక్టరేట్ పరిపాలనాధికారి కడలి కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. నిజాయితీ గల నేతఅమలాపురం టౌన్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య నిరాడంబర రాజకీయ వేత్తే కాకుండా నిజాయితీ గల నేతని ఎస్పీ రాహుల్ మీనా గుర్తు చేశారు. దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన జయంతి కార్యక్రమంలో ఎస్పీ మీనా మాట్లాడారు. తొలుత సంజీవయ్య చిత్రపటానికి జిల్లా ఎస్పీతో పాటు ఎస్పీ కార్యాలయ సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంజీవయ్య జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని ఎస్పీ పేర్కొన్నారు. బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అజరామరమని స్పష్టం చేశారు. -
డెల్టాకు ఈ నిధులు సరిపోవు
గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు ధవళేశ్వరం బ్యారేజీ దిగువున ఉంది. దీనిని స్థిరీకరిస్తూ లోయర్ రైపేరియన్ రైట్స్ కల్పించాల్సి ఉంది. దీనిని చూపించే పోలవరం నిర్మిస్తున్నారు. కాబట్టి డెల్టాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. బడ్జెట్లో డెల్టాకు రూ.రెండు వందల కోట్లు కేటాయించారు. ఈ నిధులు సరిపోవు. ఒక్క మురుగునీటి కాలువ వ్యవస్థకే రూ.300 కోట్లు ఉండాల్సి ఉంది. దీనికితోడు పంట కాలువల ఆధునీకరణకు నిధులు ఇవ్వాల్సి. – తిక్కిరెడ్డి గోపాలకృష్ణ, కన్వీనర్, భారతీయ అగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్, అమలాపురం ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది. 12వ పీఆర్సీ ఊసేలేదు. ఉద్యోగులకు రూ.పదకొండు వందల కోట్ల బకాయిలు చెల్లించామని, కాగిత రహిత పెన్షన్ తీసుకు వస్తామని గొప్పలు చెప్పారు. ఇంకా చెల్లించాల్సిన ఆర్థిక బకాయిల కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదు. 12వ పీఆర్సీ చైర్మన్ నియామకం, దానికి సంబంధించిన నిధులు, నాలుగు డీఏల గురించి బడ్జెట్లో ప్రస్తావించకపోవడం దారుణం. – ఎం.టి.వి.సుబ్బారావు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇది నకిలీ బడ్జెట్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టింది ప్రజలను మోసం చేసే నకిలీ బడ్జెట్. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్లలో కేటాయింపులు ఎక్కువ చూపించి ఖర్చు తక్కువ చేస్తున్నారు. రెవెన్యూ లోటు తగ్గించే రోడ్డు మ్యాప్ లేదు. భవిష్యత్తులో రాష్ట్రంపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు నిధులు కేటాయించి, 54 లక్షల రైతుల నోట్లో మట్టి కొట్టారు. ఆడబిడ్డ నిధికి ఈ బడ్జెట్లోనూ మొండి చేయి చూపారు. నిరుద్యోగ భృతి ఊసేలేదు. ఉద్యోగుల డీఏ బకాయిలు, ఐఆర్, పీఆర్సీ అంశాల ప్రస్తావన లేదు. – బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ -
బ్మాడ్మింటన్ పోటీలు ప్రారంభం
అమలాపురం టౌన్: పట్టుదల, క్రమశిక్షణతో బ్యాడ్మింటన్ క్రీడలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఔత్సాహిక క్రీడాకారులకు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ సూచించారు. ఆయన తండ్రి స్పోర్ట్స్ లెజెండ్ దివంగత రంకిరెడ్డి కాశీ విశ్వనాథం పేరుతో కాశి బ్యాడ్మింటర్ అకాడమి ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఓపెన్, ఇన్విటేషన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు స్థానిక ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ఇన్డోర్ స్టేడియంలో శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమంలో సాత్విక్ సాయిరాజ్ మాట్లాడారు. పోటీలను రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మ చౌదరి ప్రారంభించారు. సాత్విక్ సాయిరాజ్ మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడాకారుడిగా తనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగం మన రాష్ట్రంలో వచ్చేలా చేయాలని సభా ముఖంగా అంకమ్మ చౌదరికి విజ్ఞిప్తి చేశారు. ఈ పోటీలు ఆదివారం కూడా కొనసాగుతాయని టోర్నమెంట్ నిర్వాహకుడు దివంగత కాశి పెద్ద కుమారుడు చరణ్ తేజ తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి టోర్నమెంట్లో తలపడేందుకు 85 టీమ్లు అమలాపురానికి వచ్చాయి. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్బాబు అధ్యక్షతన ప్రారంభ సభ జరిగింది. -
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
రాయవరం: జాతీయ స్థాయిలో నిర్వహించే వాలీబాల్ జట్టుకు రాయవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి పోలిశెట్టి భార్గవ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని శనివారం పాఠశాల హెచ్ఎం వీఎస్ సునీత తెలిపారు. ఈ నెల 13న అనకాపల్లిలో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాలురు, బాలికల 46వ సబ్ జూనియర్ సెలక్షన్స్ నిర్వహించారు. ఇందులో బాలుర జట్టుకు ఎంపికై న భార్గవ్ ఈ నెల 24 నుంచి మార్చి 1 వరకూ పశ్చిమ బెంగాల్లోని హుబ్లీలో జరిగే జాతీయ వాలీబాల్ చాంపియన్ షిప్లో పాల్గోనున్నట్లు ఆమె తెలిపారు. భార్గవ్ను, తర్ఫీదునిచ్చిన ఫిజికల్ డైరెక్టర్లు సీహెచ్ అజ్జిబాబు, కె.శ్రీనివాసులును పలువురు అభినందించారు. దేవరపల్లి: అనకాపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలక్షన్స్లో దేవరపల్లి మండలం దుద్దుకూరు రంగరాయ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు బి.బాలు మహీధర్, ఎం.వెన్నెల ప్రతిభ చాటారని హెచ్ఎం ఎం.వీర్రాజు తెలిపారు. వీరు పశ్చిమ బెంగాల్లో జరుగనున్న జాతీయ స్థాయి చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారు. -
కంటైనర్ కిందకు దూసుకుపోయిన స్కూటీ
యువకుడి మృతి, మరో ఇద్దరికి గాయాలు తాళ్లరేవు: జాతీయ రహదారి 216లో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. రెండు రోజుల క్రితం ఇదే జాతీయ రహదారిలో పోలేకుర్రు చెక్పోస్టు వద్ద టిప్పర్ కింద పడి ఎంబీఏ విద్యార్థిని మృతి చెందిన ఘటన మరువక ముందే, పటవల వద్ద మరో ప్రమాదం చోటు చేసుకోవడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ కథనం ప్రకారం.. యానాం శివారు సావిత్రినగర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు స్కూటీపై కాకినాడకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ప్రమాదవశాత్తూ స్కూటీ కంటైనర్ కిందకు దూసుకుపోయింది. ఈ ఘటనలో ఓలేటి కృష్ణ (20) మృతి చెందగా, ధర్మాడి మణికంఠ, సంగాని ప్రసాద్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. జాతీయ రహదారి చెంతన పటవల గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న రొయ్యల కంపెనీకి చెందిన కంటైనర్ అకస్మాత్తుగా తిరగడంతో, యువకులు స్కూటీని అదుపు చేయలేక ఒక్కసారిగా కంటైనర్ కిందకు దూసుకుపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనతో సావిత్రినగర్లో తీవ్ర విషాదం నెలకొంది. కోరంగి ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్–12 క్రికెట్ జట్టులో అమలాపురానికి చెందిన 7వ తరగతి విద్యార్థి సబ్బెళ్ల విశ్వఫణీందర్ రెడ్డి బ్యాట్స్ మెన్గా ఎంపికయ్యాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో ఇటీవల జరిగిన ఎంపికలో అతను ప్రతిభ చాటాడు. ఈ ఎంపికల్లో దాదాపు 300 మంది పాల్గొనగా, 18 మందిని మాత్రమే జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. అందులో విశ్వఫణీందర్రెడ్డి ఒకరు. ఉమ్మడి జిల్లా జట్టు ఈ నెల 16 నుంచి 19 వరకూ విజయనగరంలో జరిగే నార్త్ జోన్ క్రికెట్ టోర్నమెంట్లో ఆడనుంది. అమలాపురం సీటీఓ కార్యాలయంలో ఫణీందర్రెడ్డి తండ్రి సాయికుమార్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన కుమారుడు చిన్నతనం నుంచి క్రికెట్ పట్ల ఆసక్తి చూపుతూ ప్రతిభ చాటుతుండడంతో రోజూ ఉదయాన్నే దగ్గరుండి కోచింగ్ ఇప్పించారు. ఫణీందర్రెడ్డి స్థానిక సర్ సీవీ రామన్ స్కూల్లో చదువుతున్నాడు. ఆ విద్యార్థిని, అతనికి శిక్షణ ఇచ్చిన కోచ్లను స్కూల్ డైరెక్టర్ రవణం వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ సురేష్కుమార్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. మనోహరం.. ఉమా కొప్పేశ్వరుల కల్యాణం కొత్తపేట: భక్తుల హరహర మహాదేవ శంభోశంకర నామస్మరణ.. వేద పండితుల సుస్వర మంత్ర పఠనాలు.. ప్రతి ఘట్టాన్ని గుర్తు చేసేలా మంగళ వాయిద్యాలు.. సుగంధ భరిత పుష్పమాలికలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదిక.. దానిపై పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు ధరించి, బుగ్గన చుక్కతో వరుడిగా మెరిసిపోతున్న స్వామివారు, ఆ పక్కనే వధువుగా కొలువుదీరిన అమ్మవారు.. ఒక్కమాటలో చెప్పాలంటే పార్వతీదేవితో పరమేశ్వరుని కల్యాణ మహోత్సవం జరిగిన వేళ పురాణ ప్రసిద్ధి చెందిన పలివెల క్షేత్రం దేదీప్యమానంగా వెలిగిపోయింది. వందలాదిగా తరలివచ్చిన భక్తులు ఉమా కొప్పేశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి పులకించిపోయారు. రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో కొత్తపేట మండలం పలివెల ఒకటి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శివ పార్వతులు ఏకపీఠంపై కొలువైన క్షేత్రంగా స్థల పురాణంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దేవదాయ – ధర్మదాయ శాఖ జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో దేవస్థానం ఈఓ కామేశ్వరరావు ఆధ్వర్యంలో మహా శివరాత్రి ఉత్సవాలు శునివారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తెల్లవారుజామున ఆలయంలో కల్యాణమూర్తులైన ఉమా కొప్పేశ్వరులను అర్చకులు, వేద పండితులు ప్రాంగణంలో రాజరాజనరేంద్రుడు నిర్మించిన కల్యాణ మండపంలోకి తీసుకువచ్చారు. పలువురు స్థానిక ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. దేవస్థానం తరఫున ఈఓ కామేశ్వరరావు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. 4.05 గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి ఘట్టాన్ని పండితులు తమ వ్యాఖ్యానం ద్వారా కళ్లకు కట్టినట్టు వివరించారు. అనంతరం భక్తులకు కల్యాణ తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. -
వ్యసనాలకు బానిసై చోరీల బాట
ఐదుగురు నిందితుల గుర్తింపు రాయవరం: చెడు వ్యసనాలకు బానిసైన ఐదుగురు యువకులు చోరీల బాట పట్టారు. చివరికి కటకటాల పాలయ్యారు. శనివారం రాయవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చోరీ జరిగిన తీరును రాజమహేంద్రవరం డీఎస్పీ బి.విద్య వెల్లడించారు. రాయవరం గ్రామానికి చెందిన వంకా మణికంఠ, కఠారి రాజు, దండంగి వీరవెంకట సత్యనారాయణ (డీవీ)లు స్నేహితులు. వీరు సులువుగా డబ్బు సంపాదించాలని భావించారు. దీనికి చోరీ బాటను ఎంచుకున్నారు. మణికంఠ ఉంటున్న వీధిలోనే పులగం లక్ష్మి, భామిరెడ్డి కిరాణా వ్యాపారం నిర్వహిస్తున్నారు. లక్ష్మి ఒంటిపై బంగారు ఆభరణాలు ఉండడం గుర్తించి చోరీ చేయాలని మణికంఠ అనుకున్నాడు. దీనికి పలు కేసుల్లో నిందితుడు రాజమహేంద్రవరం వాసి లక్కోజు విశ్వనాఽథ సంతోష్ సాయికుమార్ సాయం కోరారు. గతంలో కొమరిపాలెంలో నివాసం ఉండడంతో సంతోష్ సాయికుమార్ రాయవరంలో దొంగతనం చేస్తే ఎవరైనా గుర్తు పడతారని భావించి రాజమహేంద్రవరం నుంచి దారపు దుర్గాప్రసాద్ను సాయం అడిగాడు. వీరందరూ కలసి చోరీకి ప్రణాళిక చేశారు. ఈ నెల 10న రాత్రి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న పులగం లక్ష్మి మెడలోని బంగారు పుస్తెల తాడును దుర్గాప్రసాద్ చోరీ చేసేందుకు యత్నించాడు. ఆ సమయంలో జరిగిన పెనుగులాటలో సగం తాడు లక్ష్మి వద్ద ఉండగా, సగం తాడును దుర్గాప్రసాద్ దొంగిలించాడు. అందులో బంగారు తాడు ముక్క, రూపు, ఒక సూత్రం కఠారి రాజుకు ఇచ్చాడు. రాజు అనుమానం రాకుండా ఆ బంగారు తాడును చైనుగా మలిచాడు. దొంగిలించిన తాడును దండంగి వీరవెంకట సత్యనారాయణ అనపర్తిలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వద్ద తాకట్టు పెట్టగా, రూ.3.30 లక్షలు వచ్చింది. ఆ సామ్మును ఐదుగురూ సమానంగా పంచుకున్నారు. మిగిలిన రూపు, ఒక సూత్రం అమ్మి డబ్బులు పంచుకోవడానికి వచ్చిన సందర్భంలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ విద్య తెలిపారు. మణికంఠ, సాయివద్ద నుంచి నేరానికి ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లు, రాజు వద్ద ఉన్న రూపు, సూత్రం, ఓ ఫైనాన్స్లో తాకట్టు పెట్టిన బంగారు గొలుసును రికవరీ చేశారు. లక్ష్మి వద్ద నుంచి దొంగిలించిన 42 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మూడు రోజుల్లోనే ఛేదించి.. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్ ఆదేశాలతో డీఎస్పీ విద్య పర్యవేక్షణలో అనపర్తి సీఐ పి.దొరరాజు, ఎస్సై డి.సురేష్బాబులు సిబ్బందితో కలసి కేసును దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల సహాయంతో, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసును ఛేదించారు. తొలుత చైన్ స్నాచింగ్కు ఒకరే పాల్పడినట్లు భావించగా, తీగ లాగితే డొంక కదిలిన చందంగా ఐదుగురు నేరంలో భాగస్వాములు అయినట్లు తేలింది. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
వంట సామగ్రి బహూకరణ
ఐ.పోలవరం: మురమళ్ల, పశువుల్లంక గ్రామ దేవత మాణిక్యాంబ అమ్మవారి ఆలయానికి ఓ భక్తుడు రూ.లక్ష విలువ చేసే వంట సామగ్రిని శనివారం అందజేశారు. పశువుల్లంక గ్రామానికి చెందిన దంతులూరి నరసింహరాజు (తాతరాజు), సుభద్ర, దంతులూరి సత్యనారాయణ వర్మ, సూర్యకుమారి సమకూర్చిన సుమారు వెయ్యి మందికి సరిపడా వంట సామగ్రిని ఆలయ కమిటీ సభ్యులు ధూళిపూడి చక్రం తదితరులకు అందజేశారు. ఈ సామగ్రి మహా శివరాత్రి మరుసటి రోజు నుంచి నెల రోజుల పాటు మాణిక్యాంబ అమ్మవారి ఆలయంలో ఉచిత అన్నదానానికి ఉపయోగ పడుతుందని కమిటీసభ్యులు తెలిపారు. జంప న భీమరాజు, దంతులూరి బుచ్చిబాబు పాల్గొన్నారు. -
బాలయోగీశ్వరులను దర్శించుకుందాం రారండి
నేటి నుంచి తీర్థమహోత్సవాలు ముమ్మిడివరం: ముని మండలంగా ప్రసిద్ధి చెందిన ముమ్మిడివరంలో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. నాలుగు దశాబ్దాల పాటు కఠోర తపస్సు ఆచరించి ముక్తి పొందిన శ్రీభగవాన్ బాలయోగీశ్వరుల తపో ఆశ్రమంలో ఆదివారం నుంచి తీర్థ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం బాలయోగీశ్వరుల దివ్య సమాధుల వద్ద ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం భక్తులు అన్నసమారాధన, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సోమవారం తెల్లవారు జామున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ దర్శన మండపంపై బాలయోగీశ్వరుల పరబ్రహ్మ మూర్తి విగ్రహ దర్శనం, దివ్య సమాధుల దర్శనం ఉంటుంది. కఠోర తపస్సు చేసి.. ముమ్మిడివరంలో కటికదల గంగయ్య, రామమ్మ దంపతులకు సుబ్బారావు 1930 అక్టోబర్ 23న జన్మించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సుబ్బారావు పశువుల కాపరిగా జీవనం సాగిస్తూ భక్తిభావం అలవర్చుకున్నారు. స్థానిక లంకతల్లమ్మ తీర్థంలో కృష్ణుడు, నారదుడు ఫొటోలను కొని తెచ్చుకుని కొబ్బరి తోటలో చెట్టు కింద పెట్టి గంటల తరబడి జ్ఞాన సాధనలో నిమగ్నమయ్యారు. 1946 జూన్ 22న కృష్ణ నామస్మరణతో తపస్సును ప్రారంభించారు. నిద్రాహారాలు మాని ధ్యానంలో గడిపారు. అదేవిధంగా అతని సోదరుడు కూడా తపస్సులో పాల్గొన్నారు. బాల్య దశలోనే జ్ఞాన నిరతిని కలిగిన ఈ సోదరులు బాలయోగీశ్వరులుగా ప్రసిద్ధి చెందారు. సుమారు 40 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసి ఈ ప్రాంతానికి చారిత్రాత్మక పేరు తెచ్చారు. తపో ఆశ్రమంలో నిరంతరం తపస్సు ఆచరిస్తూ ఏటా శివరాత్రి మరునాడు భక్తులకు ప్రత్యక్ష దర్శనమిచ్చేవారు. దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు దర్శనార్థం వచ్చేవారు. తీర్థం అనంతరం భగవాన్ బాలయోగీశ్వరుల తపస్సుకు భంగం వాటిల్లకుండా తపో మందిరం తలుపులకు తాళాలు వేసేవారు. 1985 జూలై 19న పెద బాలయోగీ, 1991 అక్టోబర్ 28న చిన బాలయోగీశ్వరులు కై వల్య సిద్ధి పొందారు. ఽసోమవారం జరిగే తీర్థ మహోత్సవాలను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు బాలయోగీశ్వరుల సమాధులను దర్శించుకోనున్నారు. ఇప్పటికే తపో ఆశ్రమాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
రూ.15 లక్షల విలువైన సొత్తు రికవరీ కాజులూరు: రెండేళ్లుగా కాజులూరు, కరప తదితర మండలాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు కాకినాడ రూరల్ సీఐ డీఎస్ చైతన్యకృష్ణ, గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్కుమార్ తెలిపారు. వారి కథనం ప్రకారం.. కొత్త గైగొలుపాడు అంబేడ్కర్ కాలనీకి చెందిన పిల్లి సింహాచలం, కాకినాడ మధురానగర్కు చెందిన ద్రాక్షరాపు ఉమాశంకర్, సర్పవరం పూల మార్కెట్ ప్రాంతానికి చెందిన దార నాని గత కొంత కాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. వీరిని పట్టుకునేందుకు కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ ఆదేశాల మేరకు ఏఎస్పీ పాటిల్ దేవరాజ్, రూరల్ సీఐ చైతన్యకృష్ణల ఆధ్వర్యంలో గొల్లపాలెం, కరప పోలీస్టేషన్ల సిబ్బంది రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో గొల్లపాలెం శలపాక రోడ్లోని రైస్మిల్లు ప్రాంతంలో శుక్రవారం రాత్రి గొల్లపాలెం ఎస్సై మోహన్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది వలపన్ని వారిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.15 లక్షల విలువజేసే కారు, ఏడు మోటారు సైకిళ్లు, ఒక ల్యాప్టాప్, 186 గ్రాముల వెండి వస్తువులు, మూడు సెల్ ఫోన్లు రికవరీ చేశారు. నిందితులను కోర్టుకు తరలించారు. -
అబాకస్ పోటీల్లో సత్తా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): అంతర్జాతీయ అబాకస్, వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి తెలిపారు. వివిధ దేశాలకు చెందిన సుమారు 10 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా, వారిలో వెయ్యి మంది మాత్రమే ప్రతిభ చూపారని, ఇందులో 686 (68–66 శాతం) మంది తమ పాఠశాలకు చెందిన వారు ఉండటం గర్వకారణమన్నారు. ప్రతిభ చూపిన వారందరికీ హైదరాబాద్ రవీంద్రభారతిలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగా బహుమతులను శనివారం అందజేశారన్నారు. విజేతలను స్మార్ట్ జీనియస్ చైర్మన్ నల్లమిల్లి రాజ్యలక్ష్మి, డైరెక్టర్ శృతిరెడ్డి, సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్స్ అభినందించారు. -
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ప్రభుత్వ టీచర్
మామిడికుదురు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగటపల్లికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని రూ.24.50 లక్షలు పోగొట్టుకున్నారు. నగరం ఎస్ఐ ఎ.చైతన్యకుమార్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం... మగటపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొనుకు శ్రీనివాస్కు ఇటీవల ఫేస్బుక్లో సైబర్ నేరగాళ్లు ఒక లింక్ను పంపారు. దానిని ఓపెన్ చేయగా, కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో కొంత డబ్బులు ఆన్లైన్లో బదిలీ చేస్తే రూ.10 లక్షల విలువైన ఎరువులు పంపిస్తామని, వాటిని అమ్మితే భారీ లాభం వస్తుందంటూ నమ్మించారు. నమ్మిన శ్రీనివాస్ మొదట కొంత డబ్బును ఫోన్ పే చేశారు. ఆ తర్వాతా విడతల వారీగా రూ.24.50 లక్షలు బదిలీ చేశారు. అయినా ఎరువులు రాకపోవడంతో శ్రీనివాస్ 1930కు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంకు అధికారులు నిందితుల ఖాతాలో రూ.9 లక్షలు ఫ్రీజ్ చేశారు. -
దందానతాన..
● తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు ● అధికార అండతో రాత్రి వేళల్లో తరలింపు ● చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం అల్లవరం: తీర ప్రాంతం.. విలువైన భూములకు కేంద్రం. అలాంటి భూములపై కొందరి కన్ను పడింది. అదే అక్రమ దందాకు వేదికై ంది. అల్లవరం మండలం ఓడలరేవు, కొమరగిపట్నం గ్రామాల్లో తీర ప్రాంతం ఉంది. ఆ భూముల్లో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడ్డూ అదుపు లేకుండా రాత్రి వేళల్లో ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. ఇలా రూ.కోట్ల ఆదాయం దారి తప్పుతోంది. ఇసుక తవ్వి తరలించిన ప్రాంతాల్లో అనధికార అక్రమ రొయ్యల చెరువులు పుట్టుకొస్తున్నాయి. ఆయా గ్రామాల్లో రెవెన్యూ, మత్స్య శాఖ అధికారులు నిత్యం తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. అటు వైపు చూడడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినా స్పందన ఉండడం లేదని పలువురు వాపోతున్నారు. గతంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం తరచూ దాడులు నిర్వహిస్తుండడంతో ఇసుక దందా ఎక్కడా జరిగేది కాదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పట్టించుకునే వారే కరవయ్యారు. రెవెన్యూ, పోలీస్, మైన్స్ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో మాత్రమే ఇసుక తరలించుకోవాలని అనధికార ఆదేశాలు ఇస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఆ భూముల్లోనే ఎందుకంటే.. ఓడలరేవు, కొమరగిరిపట్నం రెవెన్యూ గ్రామాల్లో తీరం ఏడు కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్న ఇసుక భూముల్లో ఈ దందా సాగుతుంది. డీ– పట్టా, జిరాయితీ భూముల్లో ఈ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. రైతుల నుంచి ఇసుక తవ్వుకుని తరలించుకునేందుకు ఎకరానికి రూ. 5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు లీజుకు ఒప్పందం చేసుకుని, మూడు మీటర్ల లోతున ఇసుక తవ్వి రవాణాకు అనువైన ప్రాంతాల్లో స్టోర్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాలకు పదులు సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. ఇసుక తవ్విన క్షేత్రాల్లో గట్లు చదును చేసి రొయ్యల సాగు చేస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు కనీసం పరిశీలన చేసి అనధికార సాగుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు మండి పడుతున్నారు. ● అలాగే ఓడలరేవు నుంచి కొమరగిరిపట్నం శివారు ఎన్.రామేశ్వరం వరకూ సుమారు వెయ్యి ఎకరాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక దిండ్లను తవ్వేసి, ఆపై సమాంతరంగా ఉన్న ఇసుక భూముల్లో కూడా అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాల నిమిత్తం రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడం, ఆపై తెర వెనుక రియల్టర్ల భూములకు తరలించి భారీగా సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకకు రూ.2 నుంచి రూ.2,200 వరకూ, లారీ ఇసుకై తే రూ. 7 వేల నుంచి దూరాన్ని బట్టి రూ. 10 వేల వరకూ తీసుకుంటున్నారు. దొరికిన కాడికి దోచేయ్.. జేబులు నింపేయ్ అన్నట్లు ఇసుక దందా సాగుతోంది. కళ్లెదుటే అక్రమ దందా సాగుతుంటే, అరికట్టాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది.. విలువైన భూములు కరిగిపోతున్నా, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా మనకెందుకులే అన్నట్లు వదిలేస్తోంది. అధికార అండతో కొందరు ఇష్టమొచ్చినట్లు ఇసుకను తరలిస్తూ అడిగే వారెవరంటూ సాగిపోతున్నారు.. అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలో జరుగుతున్న తంతు ఇది. అక్రమ మార్గాల్లో రవాణా ఇసుక అక్రమ రవాణాను గ్రామస్తుల సహకారంతో ఇటీవల అడ్డుకున్నాం. దీంతో తాత్కాలికంగా నిలిపివేసి ఇప్పుడు రూటు మార్చారు. ప్రత్యామ్నాయ దారుల్లో ఇసుక రవాణా సాగిస్తున్నారు. ఆ లారీలు, ట్రాక్టర్లను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తుంటే, వారిపై కేసులు నమోదు చేయకుండా వదిలేస్తున్నారు. ఇటీవల పలువురు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. –పెచ్చెట్టి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు, కొమరగిరిపట్నం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు తీరం పొడవునా సీఆర్జెడ్ పరిధిలో అనధికారి ఇసుక తవ్వకాలు, రవాణాపై ఇటీవల జిల్లా కలెక్టర్ని కలసి ఫిర్యాదు చేశాం. పర్యావరణానికి హాని కలిగించే ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరాం. అయితే అధికారులు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇసుక తవ్వకాలతో ఓడలరేవు, కొమరగిరిపట్నం గ్రామాలకు ప్రకృతి వైపరీత్యాల నుంచి పెను ముప్పు పొంచి ఉంది. – భైరిశెట్టి రామారావు, కొమరగిరిపట్నం, అల్లవరం మండలం -
ఎమ్మెల్యేలు ప్రజా విశ్వాసం కోల్పోయారు
– కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అమలాపురం రూరల్: చంద్రబాబు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఇసుక మట్టి, మద్యం, మాఫియాతో అవినీతికి పాల్పడుతూ ప్రజల విశ్వాసం కోల్పోయారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు జేడీ శీలం ఆరోపించారు. అమలాపురంలో గురువారం జరిగిన డీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు నమ్మి ఓట్లు వేశారని వారిని ప్రభుత్వం పట్టించుకోపోవడంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి పధకానికి ఉన్న మహాత్మాగాంధీని పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించి వీబీసీ రాంజీ అని పేరును పెట్టడం దారుణమని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు ఆవేదన వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్, ఏఐసీసీ మెంబర్ యార్లగడ్డ రవీంద్ర, పట్టణ అధ్యక్షుడు ఒంటెద్దు బాబి పాల్గొన్నారు. -
నిధుల దుర్వినియోగంపై చర్యలకు సిఫారసు
– వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ సభ్యురాలు కాశి మునికుమారిసాక్షి, అమలాపురం: ముమ్మిడివరం నగర పంచాయతీలో గతంలో టీడీపీ ఏలుబడిలో ఉన్న సమయంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై మున్సిపల్ కమిషనర్తోపాటు నలుగురు అధికారులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైందని వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ సభ్యురాలు, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కాశి బాల మునికుమారి తెలిపారు. అమలాపురంలో గురువారం ఆమె ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 2014–19లో ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.నాలుగు కోట్లు దుర్వినియోగం అయ్యాయని, అప్పట్లో కౌన్సిల్ ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న తాను, వైఎస్సార్ సీపీ అలుపెరగని పోరాటం చేశామన్నారు. దీనిపై తాను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు జరిగిన అవకతవకలను సాక్ష్యాధారాలతో సహా అందించానన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించడంతోపాటు నామినేషన్ పద్ధతిలో పనుల పేరుతో నిధులు దుర్వినియోగం జరిగాయని మునికుమారి తెలిపారు. నాడు విచారణ చేసిన విజిలెన్స్ అధికారులు నివేదికను ప్రభుత్వానికి అందించారన్నారు. నాడు అందిన నివేదికపై ప్రభుత్వం ఇప్పుడు స్పందించి చర్యలకు సిద్ధమైందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా అప్పుడు, ఇప్పుడు మున్సిపల్ కమిషనర్గా ఉన్న పి.రవివర్మ, నాడు మున్సిపల్ ఇంజినీరుగా ఉన్న కె.వెంకటరావు, మేనేజర్గా ఉన్న బి.శ్రీలక్ష్మి, అకౌంటెంట్గా ఉన్న టి.చిట్టిబాబులపై చర్యలకు రంగం సిద్ధమైందన్నారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఈ నలుగురు నుంచి తుది విచారణ చేసి అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలని గురువారం ఉత్తర్వులు జారీ చేశారన్నారు. -
సామాన్య భక్తులకు ప్రాధాన్యం
● దేవదాయశాఖ డీసీ రమేష్బాబు ● వీరేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి ఏర్పాట్ల పరిశీలన ఐ.పోలవరం: మహా శివరాత్రి ఉత్సవాలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ డి.ఎల్.వి రమేష్బాబు అన్నారు. మురమళ్ల శ్రీ వీరేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరగబోయే మహా శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లు గురువారం పరిశీలించారు. భక్తులు రద్దీ, క్యూ విధానం, కార్యక్రమ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కాకినాడ జోన్ పరిధిలో ఉన్న 7 జిల్లాల్లో 42 ముఖ్య ఆలయాలకు శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అధికారులను నియమించి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామన్నారు. మురమళ్ల ఆలయానికి సుమారు 30 వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసినట్టు ఏసీ వి.సత్యనారాయణ వివరించారు. శీఘ్ర, ఉచిత దర్శనం ఏర్పాటు చేశామన్నారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు పాల్గొన్నారు. భీమేశ్వరుని హుండీల ఆదాయం రూ. 27.46 లక్షలు రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ హుండీల ఆదాయం రూ. 27,46,616 వచ్చినట్లు ఈఓ, దేవదాయ శాఖ ఏసీ అల్లు వెంకట దుర్గాభవాని గురువారం విలేకరులకు తెలిపారు. గత ఏడాది నవంబర్ 27వ తేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఆలయ హుండీల నుంచి రూ.26,59,090, అన్నదానం హుండీల నుంచి రూ.87,526 వచ్చినట్లు పేర్కొన్నారు. ఈఓతో పాటు అంగర గ్రూపు టెంపుల్స్ ఈఓ ఎం.శ్రీదేవి, ఓదూరు గ్రూపు టెంపుల్స్ ఈఓ విత్తనాల శ్రీనివాస్, కె.గంగవరం గ్రూపు టెంపుల్స్ ఈఓ వి.బాలకృష్ణల పర్యవేక్షణలో లెక్కింపు సాగింది. ద్రాక్షారామ పీఏసీఎస్ చైర్మన్ ముప్పనపల్లి గణేష్, గ్రామ పెద్దలు దవులూరి రామకృష్ణ, అల్లం రామకృష్ణ, ఆళ్ల బుజ్జి, సలాది శ్రీను పాల్గొన్నారు. ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. క్వాయర్ పరిశ్రమలతో మహిళలకు ఉపాధి అమలాపురం రూరల్: క్వాయర్ పరిశ్రమల స్థాపన ద్వారా మహిళలకు ఉపాధి కల్పన సాధ్యమవుతుందని, ఆ దిశగా ఉప్పలగుప్తంలో పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ వెల్లిడించారు. క్వాయర్ బోర్డు, కేరళ కొచ్చి కేంద్ర క్వాయర్ పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్తలు గిరీష్ కుమార్, సుమీ సబాస్తియన్ వివేక్ ప్రసాద్ షా, జిల్లా ఉద్యాన అధికారి బివి రమణతో కలెక్టర్ అధ్యక్షతన గురువారం ఉత్పత్తుల తయారీ, ఎగుమతుల ప్రోత్సాహకం వంటి అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లా డుతూ ఉప్పలగుపుంలోరూజ 13.5 కోట్లతో ఈ ప్రాజెక్ట్కు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. -
22 నుంచి వాడపల్లి వెంకన్న ఏకాదశ బ్రహ్మోత్సవాలు
ఆత్రేయపురం: స్థానిక వాడపల్లి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఏకాదశ బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ పాతపాటి వెంకట సత్యనారాయణ రాజు (రమణ రాజు) తెలిపారు. బుధవారం ఆలయ అర్చకులు, వేద పండితులు బృందం సభ్యులు పందిరి రాట వేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. స్వామి వారి కరపత్రం ఆవిష్కరించి భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ అర్చకులు వాడపల్లి పవన్ దీక్షితులు, పెద్దింటి రవికృష్ణ, పెరవలి సాయి పవన్ తదితరులు ప్రారంభ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ పర్యవేక్షకులు గోరింట వినయ్కుమార్, సిబ్బంది పాకలపాటి సత్యనారాయణరాజు, శ్రీను పాల్గొన్నారు. -
చంద్రబాబూ దేవుళ్లతో ఆడుకోవద్దు
● మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ● మలికిపురంలో నిరసన ప్రదర్శన మలికిపురం: రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుళ్లతో ఆడుకోవద్దని, ప్రజలు క్షమించరని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. తనకు అనుకూలంగా అబద్దాలను ప్రచారం చేయడం, తిమ్మిని బమ్మిని చేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. తిరుపతి వేంకటేశ్వరస్వామి లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ, ల్యాబ్లు నిర్ధారించినా టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ గురువారం మలికిపురంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ తమ తప్పిదాలను కప్పి పుచ్చుకోవడం కోసం చంద్రబాబు ఎన్ని దారుణాలకై నా తెగబడతాడని అన్నారు. లడ్డూలో కల్తీ జరగ లేదని కూటమి ఎమ్మెల్యేలు, ప్రొఫెసర్లు చెబుతున్నా వారిని సైతం బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏకంగా తిరుపతి ఆలయ ప్రతిష్టనే వాడుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆయనను క్షమించరని సూర్యారావు అన్నారు. తిరుపతికి అపచారం తలపెట్టిన కూటమి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ప్రజలు ఎక్కడ అడుగుతారోనని డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతూ, తప్పుడు కేసులతో వైఎస్సార్ సీపీ నేతలను భయపెట్టి, పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే ప్రజలు తిరగబడతారని అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు పాటి శివకుమార్, కటకంశెట్టి ఆదిత్యకుమార్, సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చిన్న రాజా, బీసీ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ గుబ్బల మనోహర్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తాడి సహదేవ్, మండల పార్టీ అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్, రాష్ట్ర జిల్లా నాయకులు ఇందుకూరి పిప్పరరాజు, కూనపరెడ్డి రాంబాబు, మోకా సురేష్, కొల్లాబత్తుల మున్నా, సతీష్బాబు, దొంగ నాగ సత్యనారాయణ, గుబ్బల రోజా రమణి, ఉచ్చుల దాసు, చెల్లుబోయిన బుచ్చియ్య మాస్టారు, గుబ్బల వి.వి.సత్యనారాయణ, గుబ్బల సింహాచలం, యాండ్ర రాంబాబు, పాల్గొన్నారు. -
రయ్రయ్.. దుమ్ము ఎగరెయ్
టిప్పర్ల వేగానికి లేచిన దుమ్ము ఏడీబీ రోడ్డుపై ఒకేసారి మూడు టిప్పర్ల ప్రయాణం రయ్ రయ్మంటూ ఒకే రోడ్డులో మూడు భారీ వాహనాలు వెళ్తూ జనానికి దడ పుట్టిస్తున్నాయి.. గండేపల్లి మండలం రామేశంపేట ఏడీబీ రోడ్డుపై గ్రావెల్ లోడుతో టిప్పర్లు ఒకదానికొకటి పోటీ పడి మరీ వెళ్తున్నాయి. ఒకే సమయంలో వేగానికి తోడు ఎదురెదురుగా తిరుగుతున్నాయి. ఈ టిప్పర్ల రాకపోకలతో దుమ్మూ ధూళిపైకి రేగడంతో దారి కనబడడం లేదు. అయినా ఇది అధికారుల కంట పడకపోవడం శోచనీయం. – గండేపల్లి ఆగిపోయిన మోటార్ సైకిల్ను మరో వాహనంపై ఉన్న వ్యక్తి ఇలా నెట్టుకొచ్చారు. రాయవరంలో ఈ చిత్రం కంట పడింది. ఇంధనం లేక బైక్ మొరాయించడంతో వెనుక నుంచి మరో వాహనం ద్వారా కాలితో మోటార్ సైకిల్ను ఇలా నెట్టుకొచ్చారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి కావడంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందే కదా! – రాయవరం -
నైపుణ్యం వెలికి తీసేందుకు శాప్ లీగ్ పోటీలు
ఐ.పోలవరం: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతిభగల యువ క్రీడాకారులను (బాలురు, బాలికలు) గుర్తించి వారిలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సమితి (శాప్) ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తోందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వి.ఆర్.రుద్ర తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి నెల మంగళవారం క్రీడా పోటీలు నిర్వహించేందుకు శాప్ లీగ్స్ స్పోర్ట్స్ క్యాలెండర్ –2026ను విడుదల చేసిందన్నారు. 31 క్రీడాంశాలలో ఈ లీగ్ పోటీలు జిలా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు శాప్ ప్రత్యేక శిక్షణ అందించి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. చదరంగం అండర్–13, 15, 17 – 19, సైక్లింగ్ అండర్–18 జూనియర్స్, మాస్టర్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో ఈ నెల 17న చదరంగం, 24న సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలైన చెస్ క్రీడాకారులను ఫిబ్రవరి 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. సైక్లింగ్ విభాగంలో గెలుపొందిన క్రీడాకారులను ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని వెల్లడించారు. పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు తప్పనిసరిగా శాప్ వెబ్సైట్లో జిల్లా, క్రీడా విభాగం, కేటగిరీ వారీగా ఓపెన్ రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. నమోదు చేసుకున్న క్రీడాకారులకే పోటీలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. గెలుపొందిన వారికి క్రీడా యాప్ ద్వారా ధ్రువపత్రాలు జారీ చేస్తామని రుద్ర తెలిపారు. -
అగ్గి.. సర్వం బుగ్గి
● మామిడికుదురులో 11 తాటాకిళ్లు దగ్ధం ● రోడ్డున పడ్డ బడుగుజీవులు ప్రమాదంలో కాలిపోయిన తాటాకు ఇళ్లు సర్వం కోల్పోయి దిగాలు చెందుతున్న బాధితులు మామిడికుదురు: అనుకోని అగ్ని ప్రమాదం ఆ కుటుంబాలను రోడ్డున పడేసింది.. ఉన్న గూడును బుగ్గి చేసింది.. మామిడికుదురు ఆల్క్యాస్ట్ కాలనీలో గురువారం 11 తాటాకిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం 14 కుటుంబాలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాయి. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారుల ప్రాథమిక అంచనా వేశారు. ఆరుగాలం శ్రమిస్తూ రెక్కాడితే కానీ డొక్కాడని నిరు పేద కుటుంబాలు ఈ ప్రమాదంలో అన్నీ కోల్పోయాయి. గ్యాస్ సిలెండర్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రాజోలు అగ్నిమాపక కేంద్రం అధికారి కేఎన్వీ రమణ ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. డిగ్రీ చదువుకున్న తమ సర్టిఫికెట్లు ప్రమాదంలో కాలిపోయాయని జల్లి నాగరాజు, కల్లి దుర్గాప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులకు మామిడికుదురు జెడ్పీహెచ్ స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, తహసీల్దార్ పి.సునీల్కుమార్, ఎంపీడీఓ జి.భవాని, ఎంఈఓ మోకా వెంకన్నబాబు, సర్పంచ్ గౌస్ మొహిద్దీన్ తదితరులు బాధితులను పరామర్శించారు. -
నమ్మించి.. దోచేసి..
చోరీ కేసులో నిందితుల అరెస్ట్ కోరుకొండ: ఓ ఇంట్లో పనికి చేరారు.. ఎంతో నమ్మకంగా ఉన్నారు.. అత్యాశకు పోయి, చోరీ చేసి చివరికి కటకటాల పాలయ్యారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో ఈ ఘటన జరిగింది. దీనిపై గురువారం కోరుకొండ పోలీస్ స్టేషన్లో నార్త్జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన కథనం ప్రకారం.. శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన సర్పంచ్ మద్దాల అమ్మాజీ ఇంట్లో సరకనం జగత్ కొండలరావు, దండు అనిల్కుమార్లు పని చేస్తున్నారు. ఎంతో నమ్మకంగా ఉండేవారు. ఇదిలా ఉంటే ఆ ఇంట్లో ఈ నెల 10న దొంగతనం జరిగింది. 92 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.లక్ష చోరీకి గురయ్యాయి. దీనిపై సర్పంచ్ భర్త మద్దాల రమణ కోరుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంట్లో, పరిసరాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. దాని ఆధారంగా అనుమానం వచ్చి జగత్కొండలరావు, అనిల్కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఆభరణాలను రికవరీ చేశారు. ఆ ఇద్దరినీ కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్ విధించింది. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన ఎస్సై శ్రీనివాస్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ ఎస్వీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
తిమ్మాపురంలో మూగజీవాల మృతి
కాకినాడ రూరల్: తిమ్మాపురం గ్రామంలో మూగజీవాలు అనుమానాస్పదంగా మృతి చెందడంపై తిమ్మాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడి పెదపూడి శ్రీరామకృష్ణకు చెందిన మకాంలో మూడు గేదెలు, ఒక ఆవు గురువారం మృతి చెందాయి. దీనిపై విచారణ జరపాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై గణేష్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన గేదెలు, ఆవుల విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. దీనిపై తిమ్మాపురం పశు వైద్యురాలు వి.సుధ మాట్లాడుతూ తమకు సమాచారం వచ్చిన వెంటనే పశువుల మకాం వద్దకు చేరుకున్నామని, అప్పటికే రెండు చనిపోయాయని, మరో రెండింటికి వైద్యం చేసినప్పటికీ ప్రాణాలు నిలవలేదన్నారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తెలుస్తుందన్నారు. కరప ఏడీ సురేష్బాబు, ఆర్ఏడీడీఎల్ వైద్యుడు సందీప్ పర్యవేక్షణలో పీఎం నిర్వహించామన్నారు. -
అలల పంచన.. అపాయం అంచున..
●● ప్రమాదకర స్థితిలో ప్రయాణాలు ● మన పంట్లు, నాటు పడవలూ సేఫేనా? ● రోజూ వందలాది మంది రాకపోకలు ● అరకొరగా లైఫ్ జాకెట్లు ● గతంలో పడవలూ, టూరిస్ట్ బోట్లు మునిగి... పోయిన అనేక ప్రాణాలు ● అయినా వంతెనల నిర్మాణాలకు మీనమేషాలు మలికిపురం: నేటి ఆధునిక కాలంలో అనేక చోట్ల షికారుకే పరిమితం అయిన బోట్ల ప్రయాణం నేటికీ కోనసీమ ప్రజల జీవన యానానికి అవసరం అంటే మీరు నమ్మగలరా? చెక్కలతో నీటిపై తేలియాడేలా చేసే నాటు పడవలు, పంట్లు... ఇవే ఇక్కడ ప్రయాణానికి దిక్కు. సముద్రం ఆటుపోట్ల కారణంగా బ్యాక్ వాటర్ అధికంగా రావడం, వరదల బీభత్సం అధికంగా ఉండే నదీ మార్గాలు ఇవి. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి – పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మధ్య గల మాధవాయపాలెం రేవు, సోంపల్లి – అబ్బిరాజుపాలెం రేవు, ముక్తేశ్వరం – కోటిపల్లి రేవులు ఇందుకు తార్కాణం. ఇటువంటి ప్రధాన అధిక ప్రజల రవాణా జరిగే ప్రమాదకర రేవులు రాష్ట్రంలో ఎక్కడా లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ వాహనాల రాకపోకల కోసం జాతీయ, రారష్ట్ర రహదారులకు మాత్రమే వంతెనలు వేస్తున్నాయి తప్ప ఇక్కడ సాధారణ ప్రజల సురక్షిత రాకపోకలకు వారధి నిర్మించడం లేదు. సఖినేటిపల్లి – నర్సాపురం రేవు కొద్ది సంవత్సరాల క్రితం దేవీపట్నం వద్ద లాంచీ మునగడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రేవులలో భద్రత అంశంపై అప్పట్లో హడావుడి చేసి టూరిస్ట్ బోట్లపై కూడా ఆంక్షలు విధించారు. సముద్రానికి దగ్గరలో ఉన్న ఈ కోనసీమ రేవులలో నదీ ప్రవాహ వేగం అధికంగా ఉంటుంది. అలల తాకిడి కూడా అధికమే. పోటు సమయంలో పంటు సైతం అలలపై ఎగిరి పడుతుంది. ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ ప్రయాణికులకు భద్రత పూజ్యం. ప్రస్తుతం వశిష్ట గోదావరిపై సఖినేటిపల్లి రేవులో రెండు పంట్లు నడుస్తున్నాయి. ఇక్కడ రేవు వేలం పాట ఏడాదికి రూ.కోటి యాభై లక్షలకు పైగా పలుకుతుంది. ఈ రేవు సముద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అత్యంత దగ్గరగా నదికి మలుపు ఉంటుంది. దీంతో నది ప్రవాహ వేగం, ఆటుపోట్లకు అలల తీవ్రత అధికం. మత్స్యకారుల వేట బోట్లు సైతం ఇక్కడ అధికం. దీంతో ఇక్కడ పలుమార్లు పంటు, బోట్లు ఢీకొన్నాయి. ప్రాణనష్టాలు త్రుటిలో తప్పాయి. గడచిన నాలుగేళ్లలో నాలుగు సార్లు ఇంజను మధ్యలో ఆగిపోయి పంట్లు నాలుగు కిలోమీటర్ల వరకూ జనంతో సముద్రం వైపు వెళ్లి పోయాయి. గతంలో ఇక్కడ నాటు పడవలు మునిగి పలువురు చనిపోవడంతో పంటుపై ప్రయాణాలే కొనసాగిస్తున్నారు. వందేళ్ల నుంచి ఇక్కడ వంతెన కోసం ఐదుసార్లు శంకుస్థాపనలు జరిగాయి. కానీ, నిర్మాణం ప్రారంభం కాలేదు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 216 జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా ఇక్కడ వంతెన నిర్మాణం కోసం కేంద్రం ద్వారా రూ.600 కోట్లు మంజూరు చేయించారు. భూసేకరణ పూర్తి చేసి శంకుస్థాపన చేసే సమయంలో టీడీపీ నాయకులు కుట్ర పూరితంగా కోర్టులో కేసు వేశారు. దీంతో, నాలుగు రోజుల్లో జగన్ శంకుస్థాపన చేస్తారనగా వంతెన నిర్మాణం, రోడ్ల పనులకు బ్రేక్ పడింది. జగన్కు పేరు రాకూడదనే కేసు కుట్ర ఈ వంతెన కం రోడ్డుకు సంబంధించి కేవలం మలికిపురం మండలం గుడిమెళ్లంక గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కోర్టులో కేసు వేశారు. తన పొలం మీదుగా రోడ్డు వేయవద్దని, తాను చాలా పేద రైతునని పేర్కొన్నారు. ఈ కేసును కింది కోర్టులు కొట్టి వేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసు హియరింగ్ ఈ నెల 17న ఉందని జాతీయ రహదారుల అధికారులు చెప్పారు. ఫిర్యాదుదారుకు ఇవ్వాల్సిన పరిహారం కోర్టుకు జమ చేసినట్లు పేర్కొన్నారు. చాలా చిన్న విషయాన్ని పట్టుకుని ఏకంగా రూ.600 కోట్ల విలువైన ప్రాజెక్టును అమలు చేయకుండా ఉండడం చంద్రబాబు సర్కారు కుట్రగా భావిస్తున్నారు. మాజీ సీఎంకు జగన్కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ కుట్ర జరుగుతున్నట్టు ప్రచారంలో ఉంది. సోంపల్లి – అబ్బిరాజుపాలెం రేవు సోంపల్లి – అబ్బిరాజుపాలెం రేవులో గత వైఎస్సార్ సీపీ హయాంలో పంట్లు ఉండేవి. ప్రస్తుతం ఇక్కడ నాటు పడవలే గతి. రాత్రి వేళల్లో కూడా ఇక్కడ నాటు పడవల పైనే కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు ఎవరి వైపు వారే రేవులు పాడుకుంటారు. బోట్లు మాత్రం ప్రైవేటు వ్యక్తులకు ఇస్తారు. ఇక్కడ రద్దీ ఉన్నా పంట్లు వేయడం లేదు. దీంతో ప్రమాదకరమైనా నాటు బోట్ల పైనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. నాటు పడవలపై లైఫ్ జాకెట్లు ఉండవు. కోటిపల్లి – ముక్తేశ్వరం రేవు ఇది బ్రిటిష్ కాలం నుంచీ రాకపోకలు అధికంగా ఉండే రేవు. ఇక్కడ వంతెన నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఈ రేవులన్నీ నిత్యం వందలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. బైక్లు, కార్లు, అవసరమైతే పశువుల రవాణా కూడా జరుగుతుంది. ట్రిప్కు 100 నుంచి 200 మందికి పైగా ప్రయాణికులు ఉంటారు. కార్లు, బైక్లు అదనం. ఒక్కొక్కసారి లారీలను కూడా పంట్లపై ఎక్కిస్తారు. పడవలపై కార్లు కూడా ఎక్కిస్తారు. కానీ పదుల సంఖ్యలో మాత్రమే లైఫ్ జాకెట్లు ఉంటాయి. ఇక్కడ పడవలు, పంట్లు ఇంజన్ల సామర్థ్యంపై అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు పాలనలో ముందుకు సాగని పనులు, ప్రతిపాదనలు గోదావరి నది రేవులు, నది మధ్యలో లంకల ప్రజల శ్రేయస్సు కోసం ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడం లేదు. గత వైఎస్సార్ సీపీ హయాంలో రూ.600 కోట్లతో తలపెట్టిన సఖినేటిపల్లి – నర్సాపురం (రామేశ్వరం – రాజుల్లంక) వంతెన, జాతీయ రహదారి (బైపాస్) పనులను ముందుకు తీసుకుని రావడం లేదు. భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర మంత్రిగా, జనసేన నుంచి నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ (రిటైర్డ్ ఐఏఎస్) ప్రాతినిధ్యం ఉండి కూడా ఇక్కడ పనులు సాగడం లేదు. గత సీఎం జగన్ మంజూరు చేయించిన ఈ పనులకు భూసేకరణ నిధులు రెవెన్యూకు, రైతులకు బదలాయించారు. అయినా, ముందుకు సాగడం లేదు. ముక్తేశ్వరం – కోటిపల్లి వంతెనకు అప్పటి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ద్వారా ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రభుత్వం వాటినీ పట్టించుకోవడం లేదు. ఊడిమూడి రేవు వద్ద వంతెనకు గత సీఎం జగన్ రూ.40 కోట్లు మంజూరు చేశారు. వంతెన దాదాపు పూర్తయినా మిగిలిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
భార్య ఆత్మహత్య కేసులో వ్యక్తి అరెస్ట్
కాకినాడ క్రైం: మనస్తాపంతో ఈ నెల 2న ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల ప్రకారం.. అనుమలశెట్టి లక్ష్మీదీప్తి (36), తన భర్త జగదీష్ కుమార్తో కలసి తణుకులో నివాసం ఉంటోంది. భర్త బాధ్యతా రాహిత్యం, మరో వివాహం చేసుకున్నాడనే ఆరోపణలు, అప్పుల నేపథ్యంలో నిత్యం గొడవలు జరుగుతుండేవి. దీంతో లక్ష్మీదీప్తి మనస్తాపం చెంది కాకినాడ రామారావుపేటలోని పుట్టింటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 2న ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు, కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జగదీష్ను గురువారం అరెస్టు చేశారు. సూసైడ్ నోట్ రాసి వ్యక్తి అదృశ్యం సీతానగరం: తనకు అప్పులు ఉన్నాయని ఇంట్లో సరిగ్గా చూడడం లేదని, సూసైడ్ నోట్ రాసి తన భర్త కుమ్మరి కృపానందం ఎక్కడికో వెళ్లిపోయాడని అమూల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై డి.రామ్కుమార్ గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 10న ఉదయం రఘుదేవపురం గ్రామానికి చెందిన కృపానందం (36) ఇంట్లో సూసైట్ నోట్ పెట్టి బయటకు వెళ్లిపోయాడు. ఆ నోట్లో అప్పులు ఎక్కువగా ఉన్నాయని ఇంట్లో తనను సరిగా చూడటం లేదని, రెండు మొక్కులు ఉన్నాయని, వాటిని తీర్చి చనిపోతానని కృపానందం రాశాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఒంటిపై గ్రీన్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని ఆచూకీ తెలిసిన వారు కోరుకొండ సీఐ 94409 04829, సీతానగరం ఎస్సై 94409 04832 నంబర్లకు తెలపాలని ఎస్సై వివరించారు. ‘నన్నయ’లో షార్ట్ టర్మ్ ఆఫ్ లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఏపీఎస్ఎస్డీసీ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ షార్ట్ టర్మ్ ఆఫ్ లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను ఈ నెల 16 నుంచి 20 వరకూ నిర్వహించనున్నామని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను గురువారం ఆమె విడుదల చేశారు. యూనివర్సిటీ క్యాంపస్లో చదువుతున్న బీఈడీ, ఎమ్మెస్సీ విద్యార్థులందరికీ ఉచితమన్నారు. త్వరలో కంప్యూటర్ ఫండమెంటల్స్, సర్టిఫికెట్ ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్, ఆప్టిట్యూడ్, టేలీ, సర్టిఫికెట్ ఇన్ మిషన్ లెర్నింగ్, డేటా ఎనలిటిక్స్, పైతొన్, గ్రాఫిక్ డిజైన్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఆచార్య బి.జగన్మోహన్రెడ్డి, డాక్టర్ ఎ.శ్రీరామచంద్రమూర్తి, ట్రైనర్ జి.సౌజన్య పాల్గొన్నారు. వీఆర్వో ఆత్మహత్యాయత్నం గొల్లప్రోలు (పిఠాపురం): గొల్లప్రోలు మండల తహసీల్దార్ వేధిస్తున్నారంటూ ఓ వీఆర్వో కార్యాలయం ముందే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన గురువారం గొల్లప్రోలులో కలకలం రేపింది. బాధితుడు, స్థానికుల కథనం ప్రకారం.. గొల్లప్రోలు నగర పంచాయతీ 6వ సచివాలయంలో పరమేశ్వరరాజు వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ రామ్కుమార్ తనపై పని ఒత్తిడి పెంచుతూ మానసికంగా హింసిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా సచివాలయ విధులతో పాటు అదనంగా దుర్గాడ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. ఎంత చెప్పినా వినకుండా తనపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపిస్తూ పరమేశ్వరరాజు గురువారం తహసీల్దార్ కార్యాలయం బయట నిద్రమాత్రలు మింగారు. గమనించిన తోటి సిబ్బంది, స్థానికులు వెంటనే ఆయనను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 29,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 అంబాజీపేట కొబ్బరి మార్కెట్ -
హాల్ టికెట్ తీసుకొస్తూ.. అనంత లోకాలకు..
● టిప్పర్ ఢీకొని యువతి దుర్మరణం ● మరొకరికి తీవ్ర గాయాలు తాళ్లరేవు యానాం: పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్ తీసుకుని తిరిగి వస్తుండగా, జాతీయ రహదారి 216లోని పోలేకుర్రు చెక్పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం పాలైంది. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ, స్థానికుల కథనం ప్రకారం.. యానాం పెదపూడి వీధికి చెందిన మహ్మద్ మోమినా తన్వీర్ (21), సయ్యద్ అఫ్రీన్ సుల్తానాలు పటవల పైడా విద్యా సంస్థలో ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్నారు. శుక్రవారం నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరూ ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళ్లి హాల్ టికెట్లు తీసుకున్నారు. తిరిగి వస్తుండగా పోలేకుర్రు చెక్పోస్టు వద్ద టిప్పర్ ఢీకొనడంతో తన్వీర్ కింద పడిపోయింది. ఆమె తలపై నుంచి టిప్పర్ వెళ్లిపోవడంతో నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా సుల్తానా రెండో వైపునకు పడడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతురాలి తండ్రి జిలానీ యానాం మార్కెట్లో చికెన్ షాపు నిర్వహిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె అర్ధాంతరంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తన్వీర్ సోదరుడికి రెండు నెలల క్రితం వివాహమైందని, ఇంతలోనే ఇంతటి విషాదం జరగడం దారుణమని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చెక్పోస్టు నిర్వహణ వల్లే.. జాతీయ రహదారిలోని మలుపులో చెక్పోస్టు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపించారు. అటు అమలాపురం నుంచి, ఇటు యానాం నుంచి వాహనాలు వేగంగా వచ్చే ప్రాంతం, చెక్పోస్టు వద్ద అనేక బారికేడ్లు ఏర్పాటు చేయడం, నిర్వహణ సక్రమంగా చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, ప్రజాప్రతినిధులు స్పందించి చెక్పోస్టును సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. -
కదం తొక్కిన కార్మిక వర్గాలు
అమలాపురం రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తోందని, ప్రధాని మోదీ కార్పొరేట్ దొంగల ముఠాకు నాయకుడిగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు విమర్శించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో కార్మిక, కర్షక, ఉద్యోగ వర్గాలు కదం తొక్కాయి. ఈదరపల్లి వంతెన నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు వేలాదిమంది కార్మికులు, రైతు కౌలు రైతులు, వ్యవసాయ, ఉద్యోగ ఉపాధ్యాయ, ఆటో కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఎల్ఐసీ మెడికల్ రిప్స్ ఐఎంఎల్ డిపో, మున్సిపల్ కార్మికులు, కోపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు స్కీమ్ వర్కర్లు భారీ ప్రదర్శన నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేసిన నినాదాలతో పట్టణం హోరెత్తింది. మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాస్తూ 29 చట్టాలను రద్దు చేసి బానిసత్వానికి ప్రతీకగా నిలిచే 4 లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గం అన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి, పేదవాడి పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.ి రైతు సంఘం రాష్ట్ర నాయకులు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ మోదీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేనిపక్షంలో ఢిల్లీ తరహాలో మరో భారీ రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా చేస్తామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు కె.సత్తిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు, కార్యదర్శి గుడాల వెంకట రమణ, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీవీ సుబ్బారావు, అంగన్వాడీ జిల్లా కోశాధికారి పి.అమూల్య, ఆశా వర్కర్ల జిల్లా నాయకురాలు బి.ఈశ్వరి, మిడ్ డే మిల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు లోవలక్ష్మి, ఐద్వా అధ్యక్షురాలు జి దైవ కృప మెడికల్ రిప్స్ యూనియన్ జిల్లా నాయకులు సంతోష్, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు కడలి సత్యనారాయణ పాల్గొన్నారు. -
హాకీ పోటీల్లో విజేత ఎన్సీఓఈ
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆటల్లో గెలుపు ఓటములు కన్నా క్రీడా స్ఫూర్తి ప్రదానమని రాజమహేంద్రవరం, కాకినాడ రేంజ్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ప్రతాప్సింగ్ భూక్య అన్నారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఈ నెల 4 నుంచి జరుగుతున్న మొదటి కోకనాడ గోల్డ్కప్ జాతీయ స్థాయి మహిళా విభాగ పోటీలు గురువారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతాప్సింగ్ భూక్య, అతిథులుగా డీఈఓ రమేష్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్కే చక్రవర్తి, డీఎస్డీఓ సతీష్ కుమార్, మాజీ అంతర్జాతీయ క్రీడాకారుడు దాసరి మురళీకృష్ణ, మెడికవర్ హెడ్ ఎం.అంజనేయస్వామి హాజరయ్యారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కె.రవిచంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. హాకీ మహిళల ఫైనల్స్లో హర్యానా, ఎన్సీఓఈ సోనిపట్ జట్లు పోటీ పడగా 2–1 స్కోర్తో ఎన్సీఓఈ విజయం సాధించింది. సాయిభోపాల్, యూనియన్ బ్యాంక్ జట్లు పోటీ పడగా 5–1 స్కోర్తో సాయిభోపాల్ జట్టు విజయం సాధించి మూడో స్థానాన్ని అందుకుంది. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఇండియన్ హాకీ టీం కెప్టెన్ ప్రీతమ్ శివాజ్, అసిస్టెంట్ టోర్నమెంట్ డైరెక్టర్ అజయ్ శర్మ, ఏపీ హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు బాబ్జీ, పీడీలు సూరిబాబు, హరిబాబు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదం.. 10 పూరిగుడిసెలు దగ్ధం
మామిడికుదురు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలడంతో భారీగా పూరి గుడిసెలు దగ్ధమైన ఘటన మామిడికుదురులో సంభవించింది. ఒక ఇంట్లో సిలిండర్ పేలడంతొ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు చెలరేగి పక్కనున్న పూరిగుడిసెలు సైతం దగ్ధమయ్యాయి. సుమారు 10 పూరిగుడిసెలు వరకూ అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. -
ఎస్బీఐ విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ రివిజన్ జరగాలి
రాజమహేంద్రవరం రూరల్: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ రివిజన్ జరగాలని ఫెడరేషన్ ఆఫ్ ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీడీ నడాఫ్ అన్నారు. మోరంపూడిలోని కల్యాణ మండపంలో బుధవారం ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ఐదో సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఎస్ రామచంద్రరావు, పీఎస్వీఎస్ శర్మ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పాటిల్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్, జనరల్ సెక్రటరీ నడాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడాఫ్ మాట్లాడుతూ ఉద్యోగస్తులకు జీతాలు పెరిగినట్లే పెన్షనర్లకు కూడా రివిజన్ జరగాలని డిమాండ్ చేశారు. రివిజన్ పెరగకపోవడం వల్ల దేశ వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం కోర్టులో న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సమావేశంలో ఫెడరేషన్ ఆఫ్ ఎస్బీఐ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.రాధాకృష్ణ, ఎస్బీఐ స్టాఫ్ యూనియన్, ఆలిండియా ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎల్.చంద్రశేఖర్, ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి.కాశీ విశ్వనాథ్, ఎస్బీఐ సేవ జనరల్ సెక్రటరీ ఎం.సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
నాసిరకం బియ్యం సరఫరా
ముమ్మిడివరం: నాసిరకం బియ్యం సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ సూచించారు. ఆయన బుధవారం ముమ్మిడివరం మండలం అనాతవరం, భట్నవిల్లి అంగన్వాడీ కేంద్రాలను, రేషన్ షాపులను తనిఖీ చేశారు. అక్కడకు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. విచారణ చేయగా మండల లెవెల్ స్టాక్ పాయింట్ నుంచి ఇవే బియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిసిందన్నారు. అలాగే ఐ.పోలవరంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో అన్నం ఉడక లేదని, కూరలు తినడానికి బాగోలేవ న్నారు. నాసిరకం బియ్యం సరఫరా, నాణ్యత లేని భోజనంపై విచారణ చేయాలని ఎంఈవోను ఆదేశించామన్నారు. మందపల్లి మహా గణపతికి పంచలోహ కవచం కపిలేశ్వరపురం (మండపేట): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మందపల్లిలోని శనైశ్చరస్వామి దేవాలయంలో కొలువైన మహా గణపతికి విజయవాడకు చెందిన వాసా పల్లపురాజు పంచలోహ కవచం చేయించారు. మండపేటకు చెందిన రామకృష్ణ బ్రాస్, సిల్వర్ వర్క్స్ శిల్ప కళాకారుడు వాసా శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ కవచం రూపుదిద్దుకుంది. దీన్ని గురువారం మందపల్లి ఆలయానికి తరలించనున్నట్టు దాతలు తెలిపారు. సాక్షి, అమలాపురం: ఒక వైపు పల్లె పోరు (స్థానిక సంస్థల ఎన్నికలు)కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. దానిలో భాగంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చింది. మరో వైపు ఆశావాహులు తమ పంచాయతీ సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లపై జోరుగా చర్చించుకుంటున్నారు. ఇంకో వైపు చంద్రబాబు ప్రభుత్వం స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు సిద్ధమవుతోందని విశ్వసనీయ సమాచారం. అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. తాజాగా తిరుమల లడ్డూపై చంద్రబాబు, కూటమి నాయకులు చేసిన అసత్య ప్రచారం బెడిసి కొట్టింది. దీంతో మార్చిలో జరగాల్సిన పల్లె పోరుపై సందిగ్ధత నెలకొంది. ఏప్రిల్ 2తో పాలన పూర్తి రాష్ట్రంలో పంచాయతీల పాలనా కాలం ఏప్రిల్ రెండో తేదీ నాటికి ముగియనుంది. ఆ సమయానికి ఎన్నికలు జరిగి కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు బాధ్యతలు తీసుకోవాలి. జిల్లాలో 342 పంచాయతీలున్నాయి. ఇప్పుడున్న వారి పదవీ కాలం ముగుస్తుండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. పంచాయతీలలో ఓటర్ల జాబితాను మార్చి 9వ తేదీ నాటికి సిద్ధం చేయాలని ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు, జిల్లాల పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అవసరాన్ని బట్టి 2026 జనవరి ఒకటో తేదీ అసెంబ్లీల ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. అవసరమైన మేరకు పంచాయతీలలో వార్డుల విభజన ఈ ఓటర్ల జాబితాతోనే చేయాలని ఆదేశించింది. ఆశావహుల సందడి ఇదంతా ఎన్నికల సంఘం సహజంగా చేసే ప్రక్రియ. కానీ ఈ ప్రకటన చూసి ఆశావహులలో మాత్రం ఎక్కడా లేని సందడి నెలకొంది. టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నాయకుల హడావుడి మరీ ఎక్కువైంది. నామినేటెడ్ పదవులను ఆశించి భంగపడిన వారందరూ సర్పంచ్, ఇతర స్థానిక సంస్థల పదవులపై భారీగా ఆశలు పెంచుకున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీల కాల పరిమితి సెప్టెంబర్లో గానీ పూర్తయ్యే అవకాశం లేదు. ఈ కారణంగా తొలుత సర్పంచ్ పదవులను కై వసం చేసుకోవాలని ఆశతో ఉన్నారు. ముఖ్యంగా మాచవరం, పి.గన్నవరం, తాటిపాక, రాజోలు, రావులపాలెం, కొత్తపేట, ద్రాక్షారామం, మురమళ్ల, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం వంటి మేజర్ పంచాయతీలు, బండారులంక, పేరూరు, కామనగరువు, ఈదరపల్లి వంటి పట్టణాలను ఆనుకుని, రియల్ ఎస్టేట్ పరంగా, ఇతర అభివృద్ధి చెందుతున్న పంచాయతీల్లో ద్వితీయ శ్రేణి ఆశావహుల సందడి అధికంగా ఉంది. కూటమిలో నిరుత్సాహం పల్లెపోరు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చూస్తుంటే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి. ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు తమ కేడర్ను ఇప్పటికే సమాయత్తం చేయాలి. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగకున్నా, పార్టీకి చెందిన మద్దతుదారులు ఎక్కువ మంది గెలిచేలా ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తాయి. ఇందుకు అనుగుణంగా గ్రామ స్థాయిలో గెలిచే అభ్యర్థుల మీద ఒక అంచనాకు వస్తాయి. కానీ ఇటు టీడీపీలోనూ, అటు జనసేనలోనూ ఎన్నికల ప్రస్తావనే లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికలు నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ధైర్యంగా లేదనేది నిజం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తోంది. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తొలి ఏడాది పాలనలో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. రెండో ఏడాది కొన్ని పథకాలు అమలు చేసిన లబ్ధిదారులకు భారీ గా కోత పెట్టింది. విద్యార్థులకు ఇచ్చే తల్లి వందనం, రైతులకు అందించిన అన్నదాత సుఖీభవ, మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్బండ్లు తదితర పథకాలు అమలు చేసినా, లబ్ధిదారుల్లో భారీగా కోత పెట్టిన విషయం తెలిసిందే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఈ సమయంలో పంచాయతీ ఎన్నికలకు వెళితే చేదు ఫలితాలు చవిచూడాల్సి వస్తోందని ఎన్నికల వాయిదాకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. వాయిదా వేసేందుకు.. ఎన్నికల ముందు కనీసం ఒకటి, రెండు పథకాల లబ్ధిని ప్రజలకు అందించకపోతే ఫలితాలు దారుణంగా ఉంటాయని ఉద్దేశంతో ప్రభుత్వం ఏదో ఒక సాకుతో ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తోందని సమాచారం. సర్పంచ్ల పదవీ కాలం పూర్తి కాగానే ప్రత్యేక అధికారులను నియమిస్తారనే వార్త లు వస్తున్నాయి. ఎన్నికల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి చూస్తుంటే ప్రత్యేక అధికారుల పాలన తప్పదని పంచాయతీరాజ్ శాఖలోని కీలక ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ నుంచి జనగణన మొదలు కానున్న నేపథ్యంలో దాన్ని బూచిగా ఎన్నికలను వాయిదా వేసే అవకాశం ఉంది. కనీసం రెండు, మూడు నెలల పాటు జనగణన జరిగే అవకాశం ఉన్నందున జూలై వరకూ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. ఇదే జరిగితే సర్పంచ్ ఆశావహులకు నిరీక్షణ తప్పదు. ఫ జిల్లాలో 342 పంచాయతీలు ఫ ఏప్రిల్ 2 నాటికి ముగియనున్న సర్పంచ్ల పాలన ఫ మార్చి నెలాఖరు నాటికి ఎన్నికల నిర్వహణకు కమిషన్ సన్నాహాలు ఫ రిజర్వేషన్లపై ఆశావహుల లెక్కలు ఫ ప్రజా వ్యతిరేకతతో ఎన్నికలకు సిద్ధంగా లేని ప్రభుత్వం -
‘ఆర్చి’ నిర్మాణం ప్రారంభం
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మొదటి ఘాట్రోడ్ వద్ద నుంచి రత్నగిరికి నిర్మించిన రెండో మెట్ల దారి ప్రారంభంలో ఆర్చి నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. దీంతో బాటు మెట్లకు ఇరువైపులా భక్తుల భద్రతకు పిట్టగోడ పనులు కూడా ప్రారంభించారు. సుమారు రూ.30 లక్షల వ్యయంతో చేయనున్నారు. పది అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పున ఆర్చి నిర్మించనున్నారు. దేవస్థానం కళాశాల మైదానం ఎదురుగా గల ఘాట్ రోడ్ నుంచి రత్నగిరికి నిర్మించిన రెండో మెట్లదారి నిర్మాణం పనులు పూర్తయ్యాయని, ఆర్చి, పిట్టగోడ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాక ఈ మెట్లదారిని ప్రారంభిస్తామని ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
మహాలక్ష్మి ఆలయానికి రూ.11.5 లక్షల విరాళాలు
పి.గన్నవరం: లంకల గన్నవరం గ్రామ దేవత మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి బుధవారం పలువురు గ్రామస్తులు రూ.11.5 లక్షల మేర విరాళాలు అందజేశారు. యర్రంశెట్టి అచ్యుత రామయ్య కుమారుడు రాజారావు రూ.3.01 లక్షలు, మొండెపులంక లాకు ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి నాగేశ్వరరావు రూ.2.25 లక్షలు, యర్రంశెట్టి రాజు (జొన్నలరాజు) రూ.2.06 లక్షలు, యర్రంశెట్టి సత్యనారాయణ కుటుంబ సభ్యులు రూ.1.6 లక్షలు, యర్రంశెట్టి చిన్న లోన వారి సేవా కమిటీ సభ్యులు రూ.1.01 లక్షలు, తాపీమేస్త్రి అంబటి దుర్గారావు రూ.50 వేలు, గన్నవరపు అప్పారావు కుటుంబ సభ్యులు రూ.21 వేలు, రామేశ్వరపు గోవిందరావు రూ.20 వేలు, యర్రంశెట్టి బులి వెంకయ్య కుటుంబ సభ్యులు రూ.20 వేలు, లంకే పాల్గుణ రూ.15 వేలు, ఇంకా పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. -
పెన్షనర్ల ధర్నా
అమలాపురం టౌన్: కనీస పెన్షన్ రూ.9 వేలను డీఏతో కలిపి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా యునైటెడ్ యాక్షన్ కమిటీ ఆ్ఫ్ ఈపీఎఫ్ 95 పెన్షనర్స్ ఆర్గనైజేషన్ అమలాపురం శాఖ ఆధ్వర్యంలో బుధవారం గడియారం స్తంభం సెంటర్లో పెన్షనర్లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 8వ పీఆర్సీ అమలయ్యే వరకూ మధ్యంతర భృతి ఇవ్వాలని కోరారు. పెండింగ్లో ఉన్న అన్ని రకాల బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. ధర్నాలో అమలాపురం పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కడలి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి.గోపాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. రాజోలులో జనసేన పంచాయితీ మలికిపురం: రాజోలు నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న వివాదాలు, ఘర్షణల నేపథ్యంలో ఆ పార్టీ మంగళగిరి కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బుధవారం నియోజక వర్గంలో పర్యటించింది. బండారు శ్రీనివాస్, కొటికలపూడి గోవిందరావుతో కూడిన ఆ బృందం జనసేన కార్యకర్తలను విచారణ చేసింది. ఈ సందర్భంగా మలికిపురం ఎల్ఎస్ ల్యాండ్ మార్క్లో జరిగిన సమావేశంలో కూడా పార్టీ కార్యకర్తల నుంచి సమాచారం తీసుకుంది. నియోజకవర్గంలో దిరివాల బాలాజీ, యెనుముల వెంకటపతిరాజు వర్గాల మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలతో పోస్టులు పెట్టుకున్నారు. దీంతో పోలీస్లు కవాతు కూడా నిర్వహించారు. గుండెపోటుతో వైద్యుడి మృతి నిడదవోలు: పట్టణంలోని అమ్మ హాస్పిటల్ వైద్యుడు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో అందే వీవీఎస్ తాతారావు (56) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. తణుకులో విధులు ముగించుకుని నిడదవోలు ఇంటికి కారులో వస్తుండగా ఉండ్రాజవరం రాగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. కారును రోడ్డు పక్కగా ఆపగా స్థానికులు గమనించి బయటకు తీసి అంబులెన్సులో తణుకు తరలిస్తుండగానే కన్నుమూశారు. ఆయనకు భార్య లావణ్య, కుమార్తెలు చిట్టి ప్రణతి, ప్రవళ్లిక ఉన్నారు. తాతారావు తల్లి మొగల్తూరు వైఎస్సార్ సీపీ ఎంపీపీగా చేస్తున్నారు. తండ్రి భుజంగరావు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఆయన మృతికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే గెడ్డం శ్రీనివాస్ నాయుడు తదితరులు సంతాపం తెలిపారు. -
పుష్కర యాత్రికులకు ప్రత్యేక రూట్ మ్యాప్
రాజమహేంద్రవరం సిటీ: 2027 గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికుల కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పుష్కరాల సమయంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు వచ్చే వాహనాలు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ సౌకర్యాలు తదితర వాటిపై బుధవారం జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్, కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ఆమె క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ప్రధాన కూడళ్ల సమీపంలో విస్తృత పార్కింగ్ స్థలాలను గుర్తించి, అక్కడి నుంచి వివిధ ఘాట్లకు పుష్కర యాత్రికులను ప్రత్యేక షటిల్ బస్సుల ద్వారా తరలించాలని, తిరిగి అదే మార్గంలో చేరవేసేలా ప్రత్యేక రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రావులపాలెం, కాకినాడ వయా అనపర్తి కెనాల్ రోడ్డు మార్గం ద్వారా వచ్చే వాటికి వేమగిరి సెంటర్ నుంచి ధవళేశ్వరం కాటన్ పేట, బొమ్మూరు సెంటర్, వేమగిరి, ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రూట్లను పరిశీలించారు. అలాగే వేమగిరి సెంటర్, ధవళేశ్వరం, బొమ్మూరు, మోరంపూడి, ఆర్టీసీ కాంప్లెక్స్, తూర్పు రైల్వే స్టేషన్ మార్గం, లాలాచెరువు, కాతేరు మీదుగా కోటిలింగాల రేవు వరకు ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, స్థానికుల వాహనాలకు ప్రత్యేక అనుమతుల జారీ వంటి అంశాలపై సమీక్షించారు. ఫ ఈ నెల 15న మహా శివరాత్రి సందర్భంగా ఘాట్ల వద్ద, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ముఖ్యంగా అన్న ప్రసాదాల పంపిణీ క్రమబద్ధంగా జరిగేలా సంబంధిత శాఖలు పర్యవేక్షణ చేయాలన్నారు. పుష్కరాలు, శివరాత్రి వేడుకలు విజయవంతం కావాలంటే ప్రజలు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి ఎస్పీ నరసింహ కిశోర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద అదనపు పోలీసు బలగాలు, ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని, వాహనాల రాకపోకలను దశల వారీగా మళ్లించే ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. అత్యవసర వాహనాలకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించాలని సూచించారు. వారి వెంట ఎస్డీసీ ఇన్చార్జి ఆర్డీవో కె.భాస్కర్ రెడ్డి, ఆర్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు, రూరల్ తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఆర్మ్స్ట్రాంగ్, సీఐ కాశీవిశ్వనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఫ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి ఫ ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్కు క్షేత్రస్థాయి పరిశీలన ఫ మహాశివరాత్రి వసతులపై దిశానిర్దేశం ఫ పాల్గొన్న ఎస్పీ నరసింహ కిశోర్, కమిషనర్ రాహుల్ మీనా -
ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో అద్భుత ప్రతిభ
అమలాపురం రూరల్: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టించగలరని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు రెండు రోజుల పాటు నిర్వహించే జిల్లా స్థాయి ఆర్ట్స్ కల్చరల్ పోటీలను బుధవారం అంబేడ్కర్ భవన్లో ఆయన ప్రారంభించారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో సహిత విద్యా విభాగం వీటిని నిర్వహిస్తోంది. కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు విభిన్న ప్రతిభాపాటవాలు కలిగి ఉంటారన్నారు. ఫ జిల్లాలో జీఎస్టీ వాణిజ్య పన్నుల వసూలులో అధికారులు కీలకంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా జిల్లా స్థాయి అధికారులతో జీఎస్టీ పన్నుల వసూలుపై సమావేశం నిర్వహించి, పురోగతిపై సమీక్షిస్తామన్నారు. వాణిజ్య పన్నులకు సంబంధించి కీలక కార్యాచరణ అమలు చేయాలని, జాయింట్ టాస్క్ఫోర్సు బృందాలను పెండింగ్ బకాయిల వసూలుకు నియమించాలన్నారు. ఫ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించినందుకుగాను అధికారులను కలెక్టర్ అభినందించారు. ఈ మేరకు కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. అధికారులు, కమిటీ సభ్యుల సమన్వయంతో కల్యాణోత్సవాలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ద్రాక్షారామం, కోటిపల్లి, కుండలేశ్వరాలలో భక్తులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. ఫ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9న ప్రారంభమైన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు ఈ నెల 13 వరకూ జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ఈ వారోత్సవాల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు పాటించడం, డిజిటల్ లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం, పొదుపు అలవాట్లు పెంపొందించుకోవడం, ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. -
చుక్.. చుక్.. రైలు రాదాండీ!
‘‘నీవు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’’ అన్నారు ఒక సినీ కవి. రైలు ఏమో కానీ కోనసీమ రైల్వే ప్రాజెక్టు తీరు తెన్నులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ప్రాజెక్టుకు శంకుస్థాపన రాయిపడి 26 ఏళ్లు కావస్తోంది. కాని రైలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 2016–17 నుంచి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. కాని రెండేళ్లుగా మాత్రం కేటాయింపులు అరకొరగా ఉండడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమవుతోందని కోనసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు.సాక్షి, అమలాపురం: కాకినాడ– కోటిపల్లి– నర్సాపురం రైల్వే ప్రాజెక్టుకు 2000 సంవత్సరంలో శంకుస్థాపన జరిగింది. 2014 వరకు అరకొర కేటాయింపులు జరిగాయి. తరువాత నుంచి బడ్జెట్ కేటాయింపులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కానీ ఖర్చు మాత్రం కావడం లేదు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించింది కేవలం రూ.1,035 కోట్లు. కాని ఖర్చు మాత్రం అరకొరగా సాగింది. గౌతమీ, వైనతేయ, వశిష్ఠ నదుల మీద పిల్లర్ల నిర్మాణ తీరు నత్తను తలపించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 వరకు రూ.1,496 కోట్ల నిధులు బడ్జెట్లో కేటాయించారు. పనులు వేగంగా సాగి మూడు నదీపాయల మీద పిల్లర్లు పూర్తయ్యాయి. గౌతమీ నదిపై కోటిపల్లి– శానపల్లి లంక మధ్య 3.50 కిమీల వంతెనకు సంబంధించి పిల్లర్లు మీద వేయాల్సిన గడ్డర్లు, ఐరన్ రైలింగ్ వంటి నిర్మాణాలకు రూ.296 కోట్లకు టెండర్లు ఖరారయ్యాయి. భూసేకరణకు నాటి జగన్ ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించడంతో సర్వే పనులు వేగంగా సాగాయి. ఏడాదిన్నరగా ప్రచారానికే పరిమితం రాష్ట్రంలో తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో రావడం.. కోనసీమ రైల్వే ప్రాజెక్టు పనులు పడకేయడం జరిగిపోయింది. గత ఏడాదిన్నరగా వశిష్ట నదీపాయపై ఒకటి రెండు పిల్లర్లు, వైనతేయ వద్ద మరికొన్ని పిల్లర్ల పనులు మాత్రమే జరిగాయి. గౌతమీ నదిపై గెడ్డర్ల నిర్మాణ పనులు ఇంకా మొదలు కాలేదు. అసలు జరుగుతాయో లేదో కూడా తెలియని దురవస్థలో ఉంది. దీనికితోడు రెండు బడ్జెట్లలో నిధులు కేటాయింపులపై స్పష్టత లేదు. 2016లో సవరించిన అంచనాల మేరకు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.2,120 కోట్లు గత బడ్జెట్లోనే చూపించేశారని కూటమి నాయకులు ప్రచారం చేశారు. తరువాత రూ.120 కోట్లని మరోసారి చెప్పారు. ఈ ఏడాది కూడా ఇదే ప్రచారం చేశారు. మరి కొంతమంది ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.2.60 కోట్లు మాత్రమే ఇచ్చారని సామాజిక మాధ్యమాలలో చేస్తున్న ప్రచారంతో తమ చిరకాల వాంఛ రైల్వే లైన్ ఇప్పుడప్పుడే పూర్తి కాదని కోనసీమ వాసుల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింక్బుక్ లేదు కాకినాడ– కోటిపల్లి– నర్సాపురం రైల్వే లైన్కు గత ఏడాది, ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులపై అనిశ్చితి కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టింది. కానీ ఇంతవరకు కోటిపల్లి– నర్సాపురం రైల్వే ప్రాజెక్టుకు నిధులు కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం రైల్వేకు సొంతంగా బడ్జెట్ ప్రవేశపెట్టేది. ఆ రోజుల్లో సాయంత్రాని కల్లా కోనసీమ రైల్వేలైన్కు కేటాయింపుల వివరాలు తెలిసేవి. 2016 నుంచి రైల్వే ప్రత్యేక బడ్జెట్ నిలిపివేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించే బడ్జెట్లోనే రైల్వేకు కేటాయింపులు చేస్తున్నారు. రైల్వేకు ఇచ్చిన నిధులను జోన్లు, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసే పింక్ బుక్ (రైల్వే ఆస్తులు, ఖర్చులు, నిర్మాణాలు పొందు పరిచే పుస్తకం)లో నమోదు చేసేవారు. కేంద్ర బడ్జెట్ ప్రకటించిన నాలుగైదు రోజుల్లో ప్రాజెక్టులు వారీగా కేటాయింపులు పింక్ బుక్ ద్వారా విడుదలయ్యేవి. కానీ గత ఏడాది నుంచీ ఈ విధానం ఎత్తివేసి కేవలం జోన్ల వారీగా కేటాయింపులు చేస్తున్నారని సమాచారం. ఆయా ప్రాజెక్టులకు కేటాయింపులు చేయడం లేదు. రైల్వే ప్రాజెక్టు సంబంధించి అమలాపురం మండలం భట్నవిల్లి నుంచి మలికిపురం మండలం దిండి వరకు భూ సేకరణ చేయకపోవడంతోపాటు వంతెనలు పూర్తి చేసే పనులకు టెండర్లు ఖరారు కాకపోవడంతో పనులు జరగడం లేదు. ఆ ప్రచారం ఊహాజనితం రైల్వేలో పింక్ బుక్ అనేది ఎత్తివేశారు. దీనివల్ల ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయడం లేదు. కేవలం జోన్ల వారీగా కేటాయింపులు సాగుతున్నాయి. కాబట్టి రైల్వే ప్రాజెక్టుకు కేటాయింపులు అంత చేశారు, ఇంత చేశారు అనే ప్రచారం ఊహాజనితమే కానీ వాస్తవం కాదు. – డాక్టర్ ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం, కోనసీమ రైల్వే సాధన సమితి కన్వినర్, అమలాపురం -
13, 14, 15 తేదీల్లో శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
అమలాపురం రూరల్: మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం ఆలయానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని డీఎం డీఎల్ఎన్ శర్మ తెలిపారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఉదయం 9.30, సాయంత్రం 5.30, 6.15, 6.45, రాత్రి 7 గంటలకు ఈ సర్వీసులు నడుస్తాయన్నారు. ఈ బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉందని, ప్రయాణికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అలాగే 15, 16 తేదీల్లో ఉదయం 5 నుంచి రాత్రి 7 వరకూ ప్రతి గంటకూ కుండలేశ్వరానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. భర్త అనుమానం.. మహిళ ఆత్మహత్య రాయవరం: అనుమానంతో భార్యను వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో పాకలపాటి వీర వెంకట లక్ష్మీదుర్గ ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందనే అనుమానంతో భర్త మహేష్ తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కూడా ఆమెతో గొడవపడి, సెల్ఫోన్ లాక్కున్నాడు. మనస్తాపానికి గురైన లక్ష్మీదుర్గ మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంట్లో ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో నిందితుడు మహేష్ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. బాలుడికి తీవ్ర గాయాలు అమలాపురం టౌన్: మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో పాఠశాలకు వెళుతున్న బాలుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామ శివారు ఇంద్ర కాలనీకి చెందిన 11 ఏళ్ల బడుగు భరత్ ఐదో తరగతి చదువుతున్నాడు. అతడు మంగళవారం ఉదయం స్కూల్కు వెళుతూ ఇంద్ర కాలనీ వద్ద 216 జాతీయ రహదారిని దాటుతుండగా కె.గంగవరానికి చెందిన రావి రాంజీ మోటారు సైకిల్పై వస్తూ బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలై అపప్మారక స్థితిలోకి వెళ్లడంతో పేరూరు వై.జంక్షన్లోని ఆస్పత్రిలో చేర్పించారు. భరత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాంజీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అన్నవరంలో సిబ్బందికి అంతర్గత బదిలీలు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్ నుంచి రికార్డు అసిస్టెంట్, రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వరకూ 68 మందికి అంతర్గత బదిలీలు నిర్వహిస్తూ దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రసాదం విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పి.లక్ష్మీనారాయణను నిత్య పూజలు, కల్యాణాల విభాగానికి బదిలీ చేశారు. అతడి స్థానంలో కేశఽఖండనశాలలో పనిచేస్తున్న చిక్కాల సాయిబాబాను నియమించారు. అన్నదానం స్టోర్స్ గుమస్తాగా పనిచేస్తున్న బండారు వెంకట రమణను ప్రసాదం విభాగంలో నియమించారు. వ్రతాల విభాగం సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వెలగా రమేష్ కుమార్ను రిసెప్షన్కు మార్చారు. ఆయన స్థానంలో అన్నదానంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కంచిభట్ల రాంబాబును నియమించారు. ఇంకా మిగిలిన ఉద్యోగులను కూడా వారి స్థానాల నుంచి ఇతర విభాగాలకు మార్చారు. -
మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
రాజమహేంద్రవరం రూరల్: మహిళలు, బాలికలపై జరిగే నేరాలతో పాటూ మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. ఆయన మంగళవారం సాయంత్రం బొమ్మూరు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్లోని పలు రికార్డులను, సీసీ కెమెరాలను పరిశీలించి, నమోదైన కేసులపై ఆరా తీశారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథం, ఎస్సైలకు సూచించారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా, యాంటీ డ్రగ్స్, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలీసింగ్లో టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఆయనకు ఎస్పీ డి.నరసింహ కిశోర్ వివరించారు. ముందుగా బొమ్మూరు పోలీస్ స్టేషన్లో నూతన భవనాన్ని ప్రారంభించి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్, ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య తదితరులు పాల్గొన్నారు. -
కంచి కామకోటి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఆహ్వానం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కంచి కామకోటి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆ విద్యాలయాల చీఫ్ కో ఆర్డినేటర్ మాంధాత మాధవి అన్నారు. జయేంద్ర నగర్ వినాయకుని ఆలయంలో మంగళవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఉపనయనమైన బ్రాహ్మణులకు విద్య, వేదం, వైద్యంతో పాటు ఇంగ్లిషు, స్మార్తం, ఆగమనం, సంగీతం, రామాయణం వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. నాయీ బ్రాహ్మణులకు నాదస్వరం, మంత్రసాని, నర్సింగ్, యాదవులకు గోవిజ్ఞానం, కుమ్మరులకు కుంభాకార విద్య, విశ్వ బ్రాహ్మణులకు తక్ష విద్యతో పాటు ఆంగ్ల విద్యను బోధిస్తామని తెలిపారు. బ్రాహ్మణ ఆడపిల్లలకు సంప్రదాయ విద్య, మడి ఆచారం, ఇంగ్లిషు నేర్పిస్తామన్నారు. తమ విద్యా సంస్థలు తిరుపతిలో ప్రారంభమై దేశ వ్యాప్తంగా పదిచోట్ల ఉన్నాయని చెప్పారు. కాకినాడలోని సూర్యకళా మందిరంలో ఈ నెల 21 ఉదయం 9 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. కాంచీపురంలోని కంచి చంద్రశేఖర సరస్వతి మహా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, పారామెడికల్, ఆయుర్వేదం, లా, నర్సింగ్ వంటి కోర్సులకు 2026 – 27 సంవత్సరానికి మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. వారికి వచ్చిన మార్కులను బట్టి స్కాలర్షిప్ సదుపాయం కూడా ఉందన్నారు. తమ విద్యాసంస్థల్లో వార్డెన్లు, వంటవారి ఉద్యోగాలు ఉన్నాయని, ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని మాధవి తెలిపారు. సమావేశంలో ఆకలి మురళీకృష్ణ, మాంధాత సూర్యారావు, మాంధాత స్వర్ణ పాల్గొన్నారు. స్కూల్ బస్సులపై కేసులు రావులపాలెం: నిబంధనలు పాటించని రెండు స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.10,200 అపరాధ రుసుము విధించినట్టు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. స్కూల్ బస్సులపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. ఓవర్ లోడింగ్, అతివేగం, సెల్ఫోన్ డ్రైవింగ్పై దృష్టి సారించామన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
● ఫుట్పాట్లు
చంద్రబాబు ప్రభుత్వం ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టాక మహిళా ప్రయాణికులు బాగా పెరిగారు. కానీ ఆ రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచకపోవడంతో వారందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులో కూర్చోవడానికి సీటు కోసం చూసే స్థాయి నుంచి నిలబడే స్థలం దొరికితే చాలనే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఫుట్పాత్పై నిలబడితే ప్రమాదమని చెప్పేవారు. ప్రస్తుతం అలాంటి స్థితిలోనే మహిళలు ప్రయాణం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో మంగళవారం కనిపించిన ఈ చిత్రం దానికి నిదర్శనంగా నిలుస్తోంది. – ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 29,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
గంటి కేసులో కొత్తపేట పోలీసులపై చర్యలకు వినతి
అమలాపురం రూరల్: గంటి గ్రామంలో దళిత యువకులపై మారణాయుధాలతో విచక్షణారహితంగా కొంతమంది దాడి చేశారని, గాయపడిన ఆ యువకులను ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా కొత్తపేట పోలీసులు ఆలమూరు స్టేషన్కు తీసుకెళ్లి అమానుషంగా కొట్టారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ దళిత సంఘాల నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కలెక్టర్ మహేష్కుమార్కు మంగళవారం అందించారు. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్కు వివరించారు. ఎస్.ఐ. సురేంద్ర నిందితులపై సరైన సెక్షన్లు నమోదు చేయకుండా, బాధితులపైనే కేసులు పెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, హింసకు పాల్పడి, బాధితులతో మూత్రం తాగించిన ఎస్ఐ, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి, నేషనల్ ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మోహన్కుమార్ ధర్మా, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కరవాక సుబ్బారావు ఏపీ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది మర్రి బాబ్జి, మాల మహానాడు జిల్లా నాయకులు జక్కల అరుణ్ కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వర రావు, శెట్టిబతుల తులసీరావు, మోకా శ్రీను కలెక్టర్ను కలిశారు. కలెక్టర్కు వివరాలు అందించిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు -
రాజకీయ విభేదాలతో దాడులు దుర్మార్గం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ● మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ కుటుంబ సభ్యులకు పరామర్శ కొత్తపేట: రాజకీయ విభేదాలతో దాడులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో దుర్మార్గం అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఇటీవల మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడి ఘటనలను ఆయన ఖండించారు. కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి జగ్గిరెడ్డి మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి, కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్టణంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు తావులేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. దాడులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకావాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, రావులపాలెం జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్రాజు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్లు తమ్మన శ్రీను, ముత్యాల వీరభద్రరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు జవ్వాది రవిబాబు, కొవ్వూరి సుధాకరరెడ్డి, కోరిబాబు పాల్గొన్నారు. -
సమన్వయంతో వీరేశ్వరస్వామి ఉత్సవాలు
ఐ.పోలవరం: మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాలలో అధికారుల సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని డీఆర్వో కె.మాధవి ఆదేశించారు. ఆలయ ఆవరణలో చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్, కార్య నిర్వాహణాధికారి వి.సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగిన సమావేశంలో డీఆర్వో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ భక్తుల భద్రతకు పెద్ద పీట వేయాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, పంచాయతీ, మెడికల్ సిబ్బంది మూడు షిఫ్ట్లలో పని చేయాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. 19వ తేదీన జరిగే స్వామివారి జల విహార ఉత్సవ ఏర్పాట్లు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ, పోలీసు శాఖ, రెవెన్యూ, మత్స్య, అగ్నిమాపక, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. 100 రోజుల ప్రణాళికపై దిశానిర్దేశంఅమలాపురం రూరల్: జిల్లాలో పదో తరగతి విద్యార్థులలో వెనుక గ్రేడులలో ఉన్నవారిని గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో విద్య, సమగ్ర శిక్ష, సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి 100 రోజుల ప్రణాళిక అమలుపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. మూడు రెవెన్యూ డివిజన్లలో వెనుకబడిన వారిని గుర్తించి రెసిడెన్షియల్ పాఠశాలలో జాయిన్ చేసి ప్రత్యేక తరగతుల ద్వారా మెరుగైన విద్యా బోధన అందించాలని సంక్షేమ, విద్యా శాఖల అధికారులను ఆదేశించారు. డీఈవో పి నాగేశ్వరరావు, సమగ్ర శిక్ష ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి మమ్మీ, సాంఘిక సంక్షేమ బీసీ సంక్షేమ జిల్లా అధికారి పి జ్యోతిలక్ష్మి దేవి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎస్.మధుసూదన్ పాల్గొన్నారు. సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలి జొన్నాడ ఫ్లై ఓవర్ వద్ద సర్వీస్ రోడ్లు నిర్మాణ పనులను ఈ నెల 15 ప్రారంభించి మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ రామకృష్ణను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆర్డీవోలు, జాతీయ రహదారుల అధికారులు , రెవెన్యూ అధికారులు, జొన్నాడ ఫ్లైఓవర్ కాంట్రాక్లర్లతో సమావేశం నిర్వహించి ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై సమీక్షించారు. 216 ఈ రావులపాలెం నుండి అమలాపురం వరకు బైపాస్ నిర్మాణం కు సంబంధించి భూ సేకరణ స్థితిగతులను ఆయన రెవెన్యూ సిబ్బంది జాతీయ రహదారుల ఇంజినీర్లతో సమీక్షించారు. ఆర్డీవోలు కే మాధవి, పి శ్రీకర్, తహసీల్దార్లు చినబాబు, వీఎస్ దివాకర్, రాంబాబు, జాతీయ రహదారుల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిక్కీ క్రాస్ పాల్గొన్నారు. చట్టం లక్ష్యాలను ప్రజలకు చేరువ చేయాలి రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యుడు కృష్ణ కిరణ్ అమలాపురం రూరల్: ఆహార భద్రత చట్టం లక్ష్యాలు ప్రజల వరకు సమర్థంగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యుడు జక్కంపూడి కృష్ణ కిరణ్ అధికారులకు పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రేషన్ సరఫరా, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, అంగన్వాడీ పోషకాహార పథకాల అమలులో లోపాలు ఉండకూడదన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచాలని సూచించారు. పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని వండి వడ్డించాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ మాట్లాడుతూ ఆహార కమిషన్ జాతీయ ఆహార భద్రత చట్టం అమలు తీరును పర్యవేక్షిస్తుందన్నారు. పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పి.శ్రీనివాస్ ఏఎస్ఓ శరత్, జిల్లా విద్యాశాఖ అధికారి పి.నాగేశ్వరరావు, తూనికలు కొలతల నియంత్రణాధికారి విశ్వేశ్వరరావు, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
ఈ పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే..
● శ్రీవారి లడ్డూలో కల్తీ అంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాశ్ రామచంద్రపురం: శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహాపాపం చేస్తున్నారని, ఈ పాపం చంద్రబాబు ప్రభుత్వానిదేనని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, రామచంద్రపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ అన్నారు. కూటమి నేతలు శ్రీవారి భక్తులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని గాంధీపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ స్వార్థం కోసమే సీఎం చంద్రబాబు దుష్ప్రచారానికి పాల్పడ్డారన్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని కోర్టుకు సీబీఐ నివేదిక ఇవ్వటంతో రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకు అంబటి రాంబాబుపై దాడికి పాల్పడి, అక్రమ అరెస్టులకు తెర లేపారన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత మాత్రమే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఘటనలు జరుగుతున్నాయన్నారు. విజయవాడలోని అమ్మవారి ఆలయంలో విద్యుత్ను నిలిపివేయటం, సింహాచలంలో భక్తులు క్యూలో మృతి చెందటం వంటివి భక్తుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. తాజాగా శ్రీశైలంలో మాలధారణతో స్వామివారి దర్శనానికి వచ్చిన శివస్వాములపై పోలీసులు లాఠీచార్జీ చేయడం ఈ ప్రభుత్వం దమనకాండకు నిదర్శనమన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడతామని చెప్పుకునే ఈ కూటమి నేతలు భక్తులపై దౌర్జాన్యాలకు దిగుతున్నారని విమర్శించారు. తిరుమల శ్రీ వారి సన్నిధిలోని మహా ప్రసాదంపై కూటమి ప్రభుత్వం అబద్దాలు చెబుతూ మహా అపచారం చేస్తోందని, ఇకనైనా శ్రీవారి లడ్డూపై చేస్తున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని, లేకుంటే వేంకటేశ్వరస్వామి ఆగ్రహానికి కూటమి నేతలు గురికాక తప్పదన్నారు. తొలుత పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళీ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం ఇతర కూటమి నేతలు కలిసి పెద్ద ఎత్తున మీడియా సమావేశం పెట్టి శ్రీవారి లడ్డూ వివాదంపై వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు గాధంశెట్టి శ్రీధర్, పెట్టా శ్రీనివాసరావు, పోలినాటి వరప్రసాద్, సర్పంచ్లు చిల్లే నాగేశ్వరరావు, పెంకే వీరరాఘవులు, కౌన్సిలర్లు కేతా శ్రీను, గుబ్బల గణ, పార్టీ నేతలు పెంటపాటి శ్రీను, యాళ్ల సత్తిబాబు, పోతంశెట్టి గోపాలకృష్ణ, కోటిపల్లి శివాజీ, గుంటముక్కల దొరబాబు, కూళ్ల చిన్ని, కొయ్యా బంగారుబాబు పాల్గొన్నారు. -
● మీనమిలలు
● డేంజర్ ఫిష్ పల్లిపాలెం ఫిష్ మార్కెట్కు మంగళవారం వడగర్లు రకం చేపలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. ఈ చేపలన్నీ కలిసి సుమారు మూడు టన్నులు ఉంటాయని మత్స్యకారులు చెప్పారు. వీటిని కేజీ రూ.50 చొప్పున విక్రయిస్తామని, మాంసాహార ప్రియులు ఈ రకం చేపల కోసం ఎదురు చూస్తుంటారన్నారు. అలాగే చాలామంది వాటిని కొనుగోలు చేశారు. వాటిని ఎగుమతి చేసేందుకు ఐస్ బాక్సుల్లో భద్ర పరిచే పనులు చేపట్టారు. – సఖినేటిపల్లి పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా చేసుకుని సోమవారం సముద్రంపై వేటకు వెళ్లిన మత్య్సకారుల వలకు ఇతర రకాల సంపదతో పాటు కొమ్ముకోణం రకం భారీ చేప చిక్కింది. దాన్ని మంగళవారం ఫిష్ మార్కెట్కు తీసుకువచ్చారు. సుమారు 40 కేజీల బరువున్న కొమ్ముకోణం చేపను ఓ వ్యక్తి రూ.8 వేలకు కొనుగోలు చేశాడు. ఈ చేప ముక్కుకు కొమ్ము ఉండడంతో దీన్ని కొమ్ముకోణం అని పిలుస్తామని, మనిషి ప్రాణం తీసే శక్తి దీనికి ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. – సఖినేటిపల్లి -
హడావేడి ఏమైందో!
ఉన్నతాధికారులకు నివేదించాం విశ్వసనీయ సమాచారం మేరకు కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాం. ఈ తనిఖీల్లో 911 డాక్యుమెంట్లను తక్కువ వాల్యూకు రిజిస్టర్ చేసినట్లు గుర్తించాం. సబ్ రిజిస్ట్రార్ లక్ష్మి టేబుల్ సొరుగులో రూ.79 వేలు, సమీప లేఖర్ల నుంచి రూ.1.32 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. దీనిపై నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు తెలియజేశాం, వారి ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయి. – ఎం.కిశోర్ కుమార్, డీఎస్పీ, ఏసీబీ, రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం రూరల్: అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) దాడులు చేస్తుంది. అలాగే ఆదాయానికి మించిన ఆస్తులున్న వారిపై కూడా నిఘా పెడుతుంది. అవినీతి జరుగుతున్నట్టు ఫిర్యాదు వచ్చిన వెంటనే తనిఖీలు నిర్వహించి, సమగ్రంగా విచారణ జరిపి, అక్రమార్కులను అరెస్టు చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల జరిగిన దాడి వ్యవహారం మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తోంది. ఈ దాడి తర్వాత అంతా గప్చుప్గా మారింది. తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు తదుపరి చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామంటూ వెళ్లిపోయారు. దాదాపు 12 రోజులు దాటినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి చక్రం తిప్పడం వల్లనే అధికారులు సైలెంట్ అయ్యిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలివీ.. కడియం సబ్ రిజిస్ట్రార్ ఎప్పిలి లక్ష్మి విధుల్లో ఉండగా గత నెల 29వ తేదీన ఏసీబీ డీఎస్పీ కిశోర్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం ఆకస్మిక తనిఖీలు చేసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ తనిఖీల్లో సుమారు 911 డాక్యుమెంట్లను తక్కువ విలువకు రిజిస్టర్ చేసినట్లు గుర్తించామని ఏసీబీ అధికారులు ప్రకటించారు. అలాగే సబ్ రిజిస్ట్రార్ టేబుల్ సొరుగులో రూ.79 వేలు, సమీప లేఖర్ల నుంచి రూ.1.32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సబ్ రిజిస్ట్రార్, కార్యాలయం సిబ్బంది, లేఖర్ల నుంచి ఏసీబీ అధికారులు ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారు వేరే నంబర్లతో తమ కార్యకలాపాలను ఎప్పటి మాదిరిగానే చేస్తున్నారని కక్షిదారులు చెబుతున్నారు. తనిఖీల అనంతరం తదుపరి చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామంటూ ఏసీబీ అధికారులు వెళ్లిపోయారు. అప్పట్నుంచి అంటే దాదాపు పది రోజులుగా లక్ష్మి, సిబ్బంది యథాతథంగా కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. చర్యల్లేనట్టేనా.. అదనంగా డబ్బులు కలిగి ఉండడం, తక్కువ విలువకు డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయడం ద్వారా సుమారు రూ.2.62 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించినట్లుగా ఏసీబీ అధికారులు తమ విచారణలో నిర్ధారించారు. అయినప్పటికీ, దీనికి బాధ్యులైన వారిపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలోనే పలువురు బాధితులు రిజిస్ట్రార్ కార్యాలయానికి క్యూ కట్టారు. అయితే సంబంధిత అధికారులు వారిని పరిగణనలోకి తీసుకున్న దాఖలాల్లేవని తెలుస్తోంది. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ నేరుగా విచారణ జరిపి పలు అవకతవకలను వెలికి తీశారు. ఆ తరువాత ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు తేల్చిన అవకతవకలనే వారు మరోమారు మీడియాకు వెల్లడించారు. అదనంగా డబ్బులు, సెల్ఫోన్లను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఈ తతంగమంతా ఆయా శాఖల విధి నిర్వహణలో భాగంగానే జరిగిందా? లేక ఎవరి ప్రయోజనాల కోసమైనా చేశారా అనే అనుమానాలూ లేకపోలేదు.మాజీ మంత్రి దన్ను ఈ కేసు గప్చుప్గా మారడం వెనుక టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత ఉన్నతాధికారులతో ఆయనే నేరుగా మాట్లాడారని, ఈ నేపథ్యంలోనే విచారణ అనంతరం చర్యలు తీసుకోవడంలో కాలయాపన జరుగుతోందని చెబుతున్నారు. వీలైనంత కాలయాపన అనంతరం గుట్టుచప్పుడు కాకుండా నామమాత్రపు పెనాల్టీతో సరిపెట్టేస్తారని అంటున్నారు. అలా కాకపోతే ఎవరో ఒకరిని బలి చేసి అసలు వ్యక్తులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మరో ప్రచారం కూడా జోరందుకుంది. దీంతో కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారుల విచారణలో ఏం తేలింది? ఎవరైనా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యమవుతోందనే ప్రశ్నలకు అటు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల నుంచి గానీ, ఇటు ఏసీబీ అధికారుల నుంచి గానీ కచ్చితమైన సమాధానం లభించడం లేదు. కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల ఏసీబీ తనిఖీలు అవకతవకలు గుర్తించినట్టు వెల్లడి దాడుల అనంతరం అంతా గప్చుప్ యథావిధిగా కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది -
పుష్కర ఘాట్లను పరిశీలించిన ఎస్పీ
కె.గంగవరం: మండల పరిధిలోని కోటిపల్లి ఫెర్రిలో గల పుష్కర ఘాట్లను మంగళవారం ఎస్సీ రాహుల్ మీనా పరిశీలించారు. ఈ నెల 15న జరగబోయే మహాశివరాత్రి నేపథ్యంలో ఎస్సీ మీనా పర్యటించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. గౌతమి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. గజ ఈతగాళ్లను నియమించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆలయం లోపల పక్కాగా క్యూ లు ఏర్పాటు చేయాలని ఆలయ సిబ్బందికి సూచించారు. డీఎస్సీ రఘువీర, ఎస్సైలు సోమేంద్ర, జానీ భాష, గ్రామపెద్దలు పప్పుల మసేను వెంకన్న(రేవు శ్రీను), సర్పంచ్ పెమ్మాడి బేబి సత్తిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
హోంగార్డు ఇంట్లో రూ.4.45 లక్షల సొత్తు చోరీ
బిక్కవోలులో చోరీ జరిగిన ఇంటిని పరిశీలిస్తున్న అనపర్తి సీఐ సుమంత్, కానిస్టేబుళ్లు అనపర్తి: బిక్కవోలులోని హోంగార్డు ఇంట్లోకి దొంగలు పడి నగలు, నగదు చోరీ చేశారు. ఎస్సై వి.రవిచంద్ర కుమార్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. జి.మామిడాడ రోడ్డులోని లక్ష్మీనారాయణస్వామి ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న ఉర్లంకుల సత్యకృష్ణ ప్రసాద్ కాకినాడలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్ద హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన ఇంట్లోకి సోమవారం అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో దొంగలు చొరపడ్డారు. ప్రధాన ద్వారం తాళాన్ని పగులగొట్టి లోపలకు వచ్చారు. ఇంట్లోని ఇనుప బీరువాను పగులకొట్టి రూ.4,10 లక్షలు, 14 గ్రాముల బంగారం కలిపి సుమారు రూ.4.45 లక్షల విలువైన సొత్తును చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలాన్ని అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్ పరిశీలించారు. -
పూరీలు చేయలేకపోతున్నాం
రాజోలు: తెల్లవారుజామునే తమతో పూరీలు చేయిస్తున్నారని, దీంతో నిద్ర సరిపోవడం లేదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ వద్ద శివకోటి గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం శివకోటి గురుకుల బాలిక పాఠశాలను తనిఖీ చేశారు. దీనిలో భాగంగా విద్యార్థినులతో మాట్లాడారు. తమకు వడ్డిస్తున్న కూరలు రుచిగా ఉండడం లేదని, చికెన్ పీసులు తక్కువ వేస్తున్నారని తెలిపారు. కాగా.. తనిఖీల్లో భాగంగా పాడైపోయిన కూరగాయలు, చిక్కీలను ఆయన గుర్తించారు. విద్యార్థినులతో పూరీలు చేయించడంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాల జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే కూనవరం జెడ్పీ హైస్కూల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. -
కక్ష సాధింపే.. క్లియర్గా తెలిసిపోయింది: ఉండవల్లి
సాక్షి, తూర్పుగోదావరి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మంగళవారం కలిశారు. రాజమండ్రి జైలులో అంబటితో ఉండవల్లి అరణ్కుమార్, మాజీ మంత్రి కన్నబాబు ములాఖత్ అయ్యారు.అనంతరం ఉండవల్లి.. మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కొత్త పద్దతి నడుస్తుందన్నారు. ‘‘ధ్వంసం చేసిన వారికి స్టేషన్ బెయిల్.. విమర్శించిన వారికి జైలు. పెట్రోల్ బాంబులతో దాడులు చేసిన వారికి బెయిల్ దారుణం. జైల్లో వేయడం, 30 చోట్ల నుంచి కంప్లైట్ల పెట్టడం దారుణం. చంద్రబాబు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కక్ష సాధింపు అనేది క్లియర్ గా తెలిసిపోయింది’’ అని ఉండవల్లి పేర్కొన్నారు.కాగా, అంబటి రాంబాబుకు ఒక కేసులో బెయిల్ రాగా, మరో కేసులో ఈ నెల 22వ తేదీ వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న అంబటి రాంబాబును పోలీసులు సోమవారం గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరు పరిచారు. ఒక కేసులో బెయిల్ లభించినా.. మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను తిరిగి రాత్రి 7.30 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు.అంబటిపై ఆగని కుట్రలునల్లపాడు పోలీసు స్టేషన్లో కేసుకు సంబంధించి అంబటి రాంబాబుకు బెయిల్ ఇచ్చిన స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్తోపాటు సౌకర్యాలు కోరుతూ రాంబాబు వేసిన ఎమినిటీస్ పిటిషన్లను తిరస్కరించారు. నల్లపాడు కేసులో బెయిల్ వస్తుందన్న ఉద్దేశంతో గతంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనపై పట్టాభిపురం పోలీసు స్టేషన్లో పెట్టిన కేసులో పీటీ వారెంట్పై సోమవారం రాజమండ్రి నుంచి గుంటూరు తీసుకువచ్చి ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది వక్కాల సూరిబాబు, మాజీ ఎంపీపీ మాతంగి శ్రీకాంత్, సహచర న్యాయవాదులు, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు వాదనలు వినిపించారు.బెయిలబుల్ సెక్షన్లతో ఉన్న కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగ బద్ధమైన హక్కు అని, అలాంటి సందర్భాల్లో అరెస్ట్, రిమాండ్ అవసరంపై కోర్టు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే.. ఈ కేసులో ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా.. అంబటికి ఎట్టిపరిస్థితుల్లో బెయిల్ రాకుండా, పాత కేసుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. -
ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శ
రామచంద్రపురం: సోదర వియోగంతో బాధపడుతున్న ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులును మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం వెంకటాయపాలెంలోని ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల త్రిమూర్తులు సోదరుడు తోట సత్యనారాయణ మృతిచెందిన విషయం తెలిసిందే. సత్యనారాయణ చిత్రపటానికి పేర్ని నాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ఫోన్లో ఎమ్మెల్సీ త్రిమూర్తులను పరామర్శించారు. ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, వంకా రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్కుమార్, సత్తి సూర్యనారాయణరెడ్డి, రాపాక వరప్రసాద్, పాముల రాజేశ్వరి, సింహాద్రి రమేష్, ప్రత్తిపాడు వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, ముద్రగడ గిరిబాబు, రామచంద్రపురం వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్, రామచంద్రపురం, మండపేట మున్సిపల్ చైర్మపర్సన్లు గాధంశెట్టి శ్రీదేవి, పతివాడ నూక దుర్గారాణి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, పెదపూడి ఎంపీపీ కేతా తులసీ శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి, రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవానీ, వెంకటాయపాలెం సర్పంచ్ యర్రమల్లి సతీష్కుమారి త్రిమూర్తులును పరామర్శించిన వారిలో ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కాకినాడ క్రైం: స్థానికంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడికి చెందిన మోకా గౌతమ్ (18) స్థానిక చికెన్ షాప్లో పనిచేస్తున్నాడు. ఆదివారం అతని పుట్టిన రోజు సందర్భంగా తన స్నేహితులను ఇంటికి పిలిచి భోజనాలు పెట్టాడు. అర్ధరాత్రి వరకూ సందడిగా గడిపి అందరూ వెళ్లిపోగా, ఉండూరుకు చెందిన ఏలేటి కార్తీక్ (20), యానాం సమీపంలో ఇంజరానికి చెందిన మేడిశెట్టి మణి వెంకటసాయి (25)లు గౌతమ్తోనే ఉన్నారు. నిద్రపోకుండా ఈ ముగ్గురు అర్ధరాత్రి దాటే వరకూ మేడపై మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశారు. సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో ఈ ముగ్గురు స్కూటీపై మెయిన్ రోడ్కు వెళ్లారు. ఆ సమయంలో ఉదయం డ్యూటీ నిమిత్తం కాకినాడ జగన్నాథపురానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ షేక్ అహ్మద్ రాజా తన బుల్లెట్పై జగన్నాథపురం నుంచి వస్తున్నారు. మెయిన్ రోడ్లో కేఎఫ్సీ స్టోర్ వద్దకు వచ్చేసరికి ఈ రెండు వాహనాలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు యువకులతో పాటు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. మోకా గౌతమ్ అక్కడిక్కడే చనిపోగా, మేడిశెట్టి సాయి ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నెత్తురోడుతున్న ఏలేటి కార్తీక్ను అక్కడి వారు కాకినాడ జీజీహెచ్కు, కానిస్టేబుల్ రాజాను కుటుంబ సభ్యులు అక్కడికి సమీపాన ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, ప్రమాదానికి కారణాలను పరిశీలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. స్కూటీపై వచ్చిన ముగ్గురు యువకులు మద్యం తాగి, ట్రిపుల్ రైడింగ్లో అతి వేగంగా వచ్చారని కానిస్టేబుల్ రాజా కుటుంబీకులు ఆరోపిస్తుంటే, కానిస్టేబుల్ రోడ్ లైన్ను క్రాస్ చేసి రహదారి మధ్యలో వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని బాధితుల కుటుంబీకులు అంటున్నారు. ట్రిపుల్ రైడింగ్ నిజమేనని, మద్యం తాగి ఉన్నారా లేదా అనేది పోస్ట్మార్టం నివేదికలో వెల్లడి కావాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. మృతులు అవివాహితులని పేర్కొన్నారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ బుజ్జి బాబు దర్యాప్తు చేస్తున్నారు. -
రైతుకు అరుదైన పురస్కారం
రాజవొమ్మంగి: మండలంలోని కిండ్రకాలనీకి చెందిన రైతు గంపా నాగరాజుకు అరుదైన పురస్కారం దక్కింది. ఈ రైతు గ్రాండ్ నైన్ అనే అరటి సాగులో మంచి ఫలితాలు సాధించడంతో ఈ అవార్డు అందుకున్నారు. పంత్నగర్ (ఉత్తరాఖండ్) వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన అఖిల భారత పండ్ల సమన్వయ పథకం వార్షిక గ్రూప్ మీటింగ్లో నాగరాజుకు ఈ గౌరవం దక్కింది. ప్రాజెక్టు కోఆర్డినేటర్లు డాక్టర్ ఘోష్, ప్రకాష్ పాటిల్ తదితరులు నాగరాజును సత్కరించి ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతు టిష్యూ కల్చర్ అరటి సాగులో సాంకేతిక సలహాలు ఇస్తూ, తనను ప్రోత్సహించిన డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన వన పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన్ని మండలంలోని రైతులు అభినందించారు. -
ఈ నిర్ణయం సరికాదు
ఎంతో చరిత్ర కలిగిన ఏయూ దూరవిద్య కేంద్రం ద్వారా జిల్లాలో లక్షలాది మంది పట్టభద్రులయ్యారు. వీరిలో ఎంతో మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. స్టడీ సెంటర్కు సంబంధించిన అన్ని సేవలనూ ఆన్లైన్లో ఉంచి, ఈ కేంద్రాలను మూసివేయాలనేది సరైన నిర్ణయం కాదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. – ఎం.గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఉద్యమిస్తాం ఫీజు, అడ్మిషన్ల వంటివన్నీ ఏయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేసి సమాచారం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ, స్టడీ సెంటర్లు మూసివేతతో ఆవిధంగా సమాచారం ఇచ్చేవారుండరు. హెల్ప్లైన్ నంబర్లు పని చేయవు. ఏదైనా సమస్య వస్తే విశాఖపట్నంలోని వర్సిటీకి వెళ్లాలి. ఆన్లైన్ విధానం చూస్తూంటే ప్రైవేటు సంస్థల వైపు మొగ్గు చూపేలా ఉంది. స్టడీ సెంటర్లను తిరిగి కొనసాగించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. లేని పక్షంలో ఉద్యమిస్తాం. – పెంకే రవితేజ, విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకుడు -
ఆక్రందనలు ఆగోవు
ఫ సముద్ర తీరంలో ఆవుల మృత్యుఘోష ఫ బాలబందు మొక్కలను తిని చనిపోతున్న వైనం ఫ అధికారుల చర్యలు శూన్యం కాట్రేనికోన: మూగజీవాల మృత్యుఘోష ఆగడం లేదు.. విష తుల్యమైన ఆకులు తిని ఆవులు చనిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. సముద్ర తీరం వెంబడి సంచరిస్తున్న ఆ జీవుల ఆక్రందనలు ఎవరికీ వినిపించడం లేదు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి, అల్లవరం, కాట్రేనికోన మండలాల పరిధి శివారు ప్రాంతాలను ఆనుకుని సముద్ర తీరం విస్తరించి ఉంది. దీని వెంబడి సంచరిస్తున్న ఆవులు మేతగా తీగ జాతికి చెందిన (బాలబందు) మొక్క ఆకులను ఆహారంగా తీసుకుంటున్నాయి. చిర్రయానం నుంచి నీళ్లరేవు మధ్యలో సుమారు 700 ఆవులు సముద్ర తీరంలో జీవిస్తున్నాయి. అంతర్వేది, ఓడలరేవు, నక్కారామేశ్వరం, వాసాలతిప్ప, ఎస్.యానం, చిర్రయానం, నీళ్లరేవు, కొత్తపాలెం లైట్ హౌస్, మొగ ప్రాంతం సముద్ర తీరం వెంబడి తీగ జాతి మొక్కలు విరివిగా పెరుగుతున్నాయి. ఈ మొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆవులు మేతకు అవసరమైన గడ్డి జాతి, ఇతర మొక్కలను పెరుగుదలను అడ్డుకుంటున్నాయి. సముద్ర తీరం వెంబడి వందలాది ఆవులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ మేత లేక విషపూరితమైన ఈ తీగ జాతి మొక్కల ఆకులను ఆహారంగా తీసుకుంటున్నాయి. అలాగే సముద్ర తీరం వెంబడి ఆవులకు తాగేందుకు మంచి నీరు ఉండడం లేదు. గిర్రున తిరిగి.. కిందకు ఒరిగి విషపూరితమైన తీగ జాతి మొక్కల ఆకులను ఆహారంగా తీసుకుంటున్న ఆవుల తల తిరిగిపోవడంతో గిర్రున తిరిగి తూలుతూ కిందకు పడిపోతున్నాయి. అలా రోజుల పాటు ఆహారంగా తీసుకోవడంతో వాటికి తెలియని మత్తు రావడంతో తూలుతూ తిరుగుతై చివరకు మృత్యువాత పడుతున్నాయి. ఆ ఆవులు గంజాయి, మద్యం తాగిన వారివలే పడుతూ లేస్తూ ఉంటున్నాయి. సముద్ర తీరం వెంబడి మేత లేక వదిలినప్పుడు ఆకులు తినడంతో చనిపోతున్నాయని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మసమేథ్యం సమీపంలో కాల భైరవస్వామి ఆలయం అర్చకుడికి చెందిన ఐదు పాడి ఆవులు విష పూరితమైన ఈ ఆకులను ఆహారంగా తీసుకునే చనిపోయాయి. ఈ తీగను ఆహారంగా తిన్న తల్లి ఆవు పాలు తాగుతున్న పిల్లలు సైతం మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల పల్లం శివారు బ్రహ్మసమేథ్యం కాలభైరవస్వామి ఆలయ సమీపంలో సముద్రం ఒడ్డున ఆవు దూడ చలికి శరీరం పూర్తిగా చల్లబడి వణికిపోవడంతో పాటు కాళ్లు బిగిసిపోవడంతో చలి మంటను వేసి ఆవు దూడకు వేడి తగిలే విధంగా స్థానికులు ఏర్పాటు చేశారు. అయితే విష పూరితమైన తీగ ఆకును ఆహారంగా తీసుకున్న తల్లి పాలతో పాటు ఆవు దూడ తీగ ఆకును తినడంతో పరుగులు పెడుతూ.. తూలుతూ.. పడి పోవుతూ.. కొన్ని రోజులకు చనిపోయింది. ఐదు ఆవులు చనిపోయాయి తీగ ఆకులు తినడంతో ఐదు ఆవులు చనిపోయాయి. ఇటీవల కాలభైరవస్వామికి క్షీరాభిషేకం, నైవేద్యం కోసం రూ.35 వేలు పెట్టి పాడి ఆవును కొన్నాం. మేతకు వదిలినప్పుడు తీగ జాతికి చెందిన ఆకులను తినడంతో గుండ్రంగా తిరుగుతూ కొన్ని రోజులకు మృత్యువాత పడింది. –కామేశ్వరరావు, కాలభైరవస్వామి ఆలయ అర్చకుడు, పల్లం పీక్కుతింటున్నాయి.. విషపూరితమైన తీగ ఆకులు ఆహారంగా తినడంతో తెలియని మత్తులో తూలుతూ, పడుతూ బలహీనంగా ఉన్న ఆవులను కుక్కలు, రాత్రి వేళ నక్కలు సైతం పీక్కు తింటున్నాయని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రైతులు పాలు వదిలిన తరువాత సముద్ర తీరం వెంబడి ఆవులను వదిలేస్తున్నారు. తిరిగి ఆవులు బాగుంటే పాల కోసం తెచ్చుకుంటున్నారు. పాడి రైతులు సొంత ఆవులను పాలు వదిలిన తరువాత సముద్ర తీరం వెంబడి వదిలివేయకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఆవులను గుర్తించి గోశాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అప్పుడే మూగజీవాలకు రక్షణ ఉంటుందని పశు ప్రేమికులు అంటున్నారు. -
మహిళ అదృశ్యం
అనపర్తి: ఓ మహిళ అదృశ్యంపై సోమవారం కేసు నమోదు చేసినట్టు బిక్కవోలు ఎస్సై వి.రవిచంద్ర కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బిక్కవోలు మండలం కాపవరం గ్రామానికి చెందిన గాజుల పాపారత్నం (45)కు మతిస్థిమితం లేదు. ఆమె భర్త చనిపోవడంతో అదే గ్రామంలోని తల్లి ఇంటి వద్దే ఉంటుంది. శనివారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో సోమవా రం ఆమె సోదరి చక్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపా రు. వివరాలు తెలిస్తే తన నంబర్ 94409 04851, అనపర్తి సీఐ సుమంత్ 94407 96538 ఫోన్ నంబర్లకు తెలియజేయాలని కోరారు. -
ట్రాఫిక్కు సినిమా కష్టాలు
సామర్లకోట: రద్దీగా ఉండే సెంటర్.. ఆపై సినిమాతో కష్టాలను పట్టణ ప్రజలు సోమవారం ఎదుర్కొన్నారు. సామర్లకోట మఠం సెంటర్లో సినిమా షూటింగ్ జరగడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ముఖ్యకూడలిలో సినిమా షూటింగ్కు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా విమర్శలకు దారి తీసింది. జీవిత, రాజశేఖర్, వారి కుమార్తె శివానీ నటిస్తున్న చిత్ర షూటింగ్ సామర్లకోట మఠం సెంటర్లో ప్రారంభించారు. ఇక్కడ అంబేడ్కర్ విగ్రహం, కూరగాయల మార్కెట్, బడ్డీలు ఏర్పాటు చేసి షూటింగ్ జరిపారు. తొలిరోజు రాజశేఖర్ కుమార్తె శివానీ, ఆలీలు కూరగాయల మార్కెట్కు వచ్చిన సన్నివేశం చిత్రీకరించారు. సామర్లకోట – పెద్దాపురం రోడ్డు ముఖ్య కూడలి కావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీనికితోడు షూటింగ్ చూడడానికి వచ్చిన స్థానికులను సినిమా యూనిట్కు చెందిన బౌన్సర్లు దగ్గరకు రాకుండా గెంటి వేయడంతో వాదోపవాదాలు జరిగాయి. ఏదేమైనా ముఖ్య కూడలిలో సినిమా షూటింగ్కు అనుమతి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 29,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బస్సు
నిడదవోలు: స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన సోమ వారం జరిగింది. నిడదవోలులోని ఓ ప్రైవేట్ కళాశాల నుంచి బస్సు పంగిడి వెళ్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా నిడదవోలు – చాగల్లు ప్రధాన రోడ్డులో ఆటోను తప్పించే క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు క్లీనర్కు స్పల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పట్టణ ఎస్సై జయరాజు వచ్చి విచారణ చేపట్టారు. పట్టణ విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు తన టెక్నికల్ సిబ్బందితో వచ్చి విద్యుత్ లైన్లను పునరుద్ధరించారు. -
అంతా మా ఇష్టం..
ఫ అర్ధరాత్రి రోడ్డును తవ్వేసి తూరల ఏర్పాటు ఫ రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు పెరవలి: అధికారం చేతిలో ఉందని కొందరు రోడ్డును తవ్వేసి తూరలు ఏర్పాటు చేయడం ఆందోళనకు దారి తీసింది.. దీనిని అడ్డుకోవాల్సిన అధికారులు మౌనం వహించడం విమర్శలకు తావిచ్చింది.. పెరవలి మండలం నడుపల్లి–నడుపల్లి కోట రోడ్డులో జరిగిన తంతు ఇది. నడుపల్లి నుంచి నడుపల్లి కోట వరకూ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.50 కోట్లు మంజూరు చేసింది. గ్రామమంతా సీసీ రోడ్డు, బయట తారు రోడ్డు వేసేలా ప్రతిపాదనలు తయారు చేసి అంచనాలు వేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండగా, నాలుగు రోజుల కిందట నడుపల్లి కోట వద్ద తూరలు ఏర్పాటు చేయాలని అధికారులను అడిగితే కుదరదని చెప్పడంతో కూటమి నేతలు ఆగ్రహించారు. ఎప్పుడూ లేనిది ఇక్కడ తూరలు ఏర్పాటు చేయడం ఏంటని, అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు చేస్తారా అంటూ నడుపల్లికోట రైతులు నిలదీశారు. కానీ తూరలు పెడతాం.. ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ కూటమి నేతలు అనడంతో రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతో అటువంటి పనిచేయవద్దని నేతలను హెచ్చరించారు. ఆదివారం అర్ధరాత్రి పొక్లెయినర్తో కూటమి నేతలు రోడ్డును అడ్డంగా తవ్వేసి తూరలు ఏర్పాటు చేశారు. సోమవారం చేల వద్దకు వచ్చిన రైతులు ఇదేం దారుణమని అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దీనిపై జిల్లా పరిషత్ ఏఈ అగస్టీన్ను ‘సాక్షి’ వివరణ కోరగా తూరలు పెట్టడానికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, వారు అనధికారకంగా పెట్టారన్నారు. రోడ్డును తవ్వేశారు కదా.. చర్యలు తీసుకుంటారా అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. దీనిపై కోర్టును ఆశ్రయించడానికి వెళ్తున్నట్లు కొందరు రైతులు తెలిపారు. ● తవ్వేసి తూరల ఏర్పాటు కూటమి నేతలు ఇష్టారాజ్యంగా అడ్డదిడ్డంగా రోడ్డును తవ్వేసి తూరులు ఏర్పాటు చేశారు. అధికారులను అడుగుతుంటే మాకేమీ తెలియదని చెబుతున్నారు. అర్ధరాత్రి తూరలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. దీనివల్ల మా పంట చేలు మునిగిపోతాయి. –పరిమి సూర్యారావు, రైతు, నడుపల్లి ● కుదరదని చెప్పినా.. రోడ్డును తవ్వి తూరలు పెడతామని కూటమి నేతలు అంటుంటే రైతులంతా కలసి కుదరదని చెప్పాం. దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేశాం. పోలీసులకు చెప్పాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. అర్ధరాత్రి దౌర్జన్యంగా తూరలు పెట్టారు. ఇదేం పాలన. –పరిమి బాలాజీ, రైతు, నడుపల్లికోట -
దారిలో జలదరింపు
వీఆర్పురం – చింతూరు మండలాల ప్రధాన రహదారిలో ఏజీకొడేరు, తిమ్మిరిగూడెం నడుమ జల్లివారిగూడెం వాగు ఉంది. ఇది ప్రవహించే ప్రాంతంలో రహదారిపై గతంలో లోలెవల్ చప్టా నిర్మించారు. ఈ చప్టాకు ఎగువభాగంలో భారీగా ఇసుక మేటలు పేరుకుపోయాయి. దీంతో ఎగువ ప్రాంతంలో ఎక్కడ వర్షం పడినా ఆ నీరు చప్టాపై నుంచి ప్రవహిస్తూ రాకపోకలు నిలిచిపోతున్నాయి. చప్టాకు ఎగువభాగంలో పేరుకుపోయిన పూడికను తొలగిస్తే నీరు చప్టా కింద నుంచి ప్రవహిస్తుంది. ఆయా గ్రామాల ప్రజలు వర్షాకాలంలో ఈ చప్టా కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. –చింతూరు పడితే.. అటో.. ఇటో పిఠాపురం మండలం భోగాపురంలో కల్వర్టుకు ఇరువైపులా రక్షణ గోడలు (రెయిలింగ్) లేక ప్రయాణం దినదిన గండంలా మారింది. నిత్యం వందలాది వాహనాలు ఇటుగా వెళ్తుంటాయి. శిథిలావస్థకు చేరిన ఈ కల్వర్టు ఎప్పుడు కూలిపోతుందోనన్న భయం అందరిలో నెలకొంది. కొత్తగా కల్వర్టు నిర్మించాలని, అప్పటి వరకూ కనీసం రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. –పిఠాపురం రూరల్ -
డొక్కా సీతమ్మ స్ఫూర్తి కావాలి
సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పి.గన్నవరం: అన్నదాతగా పేరొందిన డొక్కా సీతమ్మను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని కనీసం నెలకోసారైనా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఎల్.గన్నవరం గ్రామంలోని సీతమ్మ వారి నివాసాన్ని ఆయన సందర్శించారు. సీతమ్మ వారు వినియోగించిన రోలు, కుర్చీ, మంచినీళ్ల బావి, భోషానం పెట్టె తదితర వస్తువులను పరిశీలించారు. సీతమ్మ కుటింబీకులైన సూర్యప్రభ తదితరులతో ఆయన మాట్లాడారు. ఆమె చిత్రపటానికి నమస్కరించారు. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. సీతమ్మ వారి నివాసాన్ని సందర్శించడంతో ఒళ్లు పులకించిందన్నారు. చిన్నప్పటి నుంచి ఆమె జీవిత చరిత్రను కథలు, కథలుగా విన్నామని అన్నారు. సీతమ్మ వారి పేరుపై వారి కుటుంబ సభ్యులు ఏమైనా చేయాలనుకుంటే తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. అవకాశం వస్తే తన రచనల్లో సీతమ్మ వారికి ప్రాధాన్యం కల్పిస్తానని ఆయన అన్నారు. విజయేంద్ర ప్రసాద్ను డొక్కా బుచ్చిబాబు దుశ్శాలువాతో సత్కరించారు. తొలుత ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆయనకు స్వాగతం పలికారు. స్వామి ప్రతిబింబాన్ని చూపినట్టు.. విజయేంద్ర ప్రసాద్ అంతర్వేదిలో కొత్త అద్దం తీసుకుని, దానిని నరసింహ స్వామివారిని చూపి, వెంటనే ఒక వస్త్రంతో దానిని మూసివేశారు. ఆ అద్దాన్ని ఇక్కడ సీతమ్మ వారి చిత్రపటం ముందు తెరిచారు. దీంతో నరసింహ స్వామి ప్రతిరూపం సీతమ్మ వారికి చూపినట్టు అవుతుందని ఆయన వివరించారు. ఇలా ఎందుకు చేశానంటే.. సీతమ్మ వారు ఒక రోజు లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి బయల్దేరారు. దారిలో బోయీలు చెట్టుకింద ఆగారు. అయితే అక్కడ ప్రయాణికుల బృందంలోని చిన్న పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. అందులో ఒకరు ఏడవకండి అమ్మా, దగ్గరలో సీతమ్మ వారి ఇల్లు ఉంది, అక్కడికి వెళితే మనకి అన్నం పెడతారని పిల్లలకు చెప్పారు. ఈ మాటలు విన్న సీతమ్మ వారు, వెంటనే ఇంటికి తిరిగి వచ్చి ప్రయాణికులు వచ్చేలోగా వారికి వంట చేసి, అన్నం పెట్టారని విజయేంద్ర ప్రసాద్ వివరించారు. నాడు సీతమ్మ వారు నరసింహస్వామిని దర్శించుకోలేక పోయారని, అందుకే స్వామి ప్రతిబింబాన్ని సీతమ్మ వారికి అద్దంలో చూపినట్టు ఆయన చెప్పారు. -
తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం
హిందువుల మనోభావాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలుఆత్రేయపురం : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక సీఎం చంద్రబాబు హిందువులకు అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై నిర్ధారణ లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. ఆయన సోమవా రం పార్టీ అమలాపురం పార్లమెంటరీ ఇనచార్జి జక్కంపూడి విజయలక్ష్మితో కలసి ఆత్రేయపురం అల్లూరి సీతారామరాజు సెంటర్లో విలేకరులతో మాట్లాడారు. హిందువుల మనోభావాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుకుంటోందని, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ఆలవాలమైన తిరుమలలో లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రసారం నీచ రాజకీయాలకు నిదర్శనం అన్నారు. సుప్రీంకోర్టు వాస్తవాలు చెప్పినా మరింత దిగజారి శ్రీశైలం మల్లికార్జునస్వామి లడ్డూ ప్రసాదంపై కూడా ఆరోపణలు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ అసత్య ప్రచారాలను నిలిపివేసి స్వామివారి ప్రసాదంపై ప్రజల్లో ఉన్న అపారమైన విశ్వాసాన్ని కాపాడాలని, లేకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు అత్యున్నత న్యాయస్థానం తీర్పులను సైతం లెక్క చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి, ప్రజలను భయానికి గురి చేస్తున్నారని అన్నారు. హెరిటేజ్ పాలల్లో కొవ్వు శాతం తగ్గిందని వచ్చిన నివేదికలపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చిలువూరి రామకృష్ణంరాజు, వైఎస్సార్ సీపీ నాయకులు మార్గాని గంగాధర్, చల్లా ప్రభాకరరావు, కప్పల శ్రీధర్, కనుమూరి శ్రీను రాజు, తమ్మన శ్రీను, నానాజీ, గొట్టుముక్కల గోపి రాజు, ముదునూరి బండ కృష్ణంరాజు, వేగేశ్న గోపాలం, సరెళ్ల ధనలక్ష్మి పాల్గొన్నారు. -
దూరమైన విద్య
● దూరవిద్య కేంద్రాలకు ఏయూ మంగళం ● కాకినాడ, రాజమహేంద్రవరంలోని స్టడీ సెంటర్ల మూసివేత ● విద్యార్థి నేతల ఆగ్రహం ● వీటిని కొనసాగించాలని డిమాండ్ ● లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక బాలాజీచెరువు (కాకినాడ సిటీ): చదువుకోవాలనే ఆశ ఉన్నా.. కుటుంబ పరిస్థితులు అనుకూలించనందువల్లనో.. ఇతర కారణాలతోనో ఉన్నత విద్య అభ్యసించలేకపోయిన వారికి.. డిగ్రీ చదువును చేరువ చేసి, పట్టాలు అందించిన ఘనత ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) దూరవిద్యా కేంద్రానిది. కేవలం చదవడం, రాయడం వస్తే చాలు.. ఎటువంటి విద్యార్హతా లేకపోయినా.. 18 సంవత్సరాలు నిండి.. వివిధ కారణాలతో కళాశాలలకు వెళ్లలేని వారికి.. మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పిన వారికి.. ఉద్యోగులు, ప్రమోషన్లు పొందాలనుకునే వారు, గృహిణులు తదితర వర్గాల వారికి డిగ్రీ, పీజీ వంటి ఉన్నత చదువులను దూరవిద్య విధానంలో అందుబాటులోకి తెచ్చారు. క్రమంగా ఏ విద్యార్హతా లేకుండా డిగ్రీ ఇవ్వకూడదని, పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన వారికే అడ్మిషన్లు ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. ఆ మేరకు దూరవిద్య కేంద్రం డిగ్రీ అడ్మిషన్లు కల్పిస్తోంది. ఈ సేవలను విస్తృతం చేసేందుకు 1972లో పలు జిల్లాల్లో స్టూడెంట్ సపోర్టు సెంటర్లు (స్టడీ సెంటర్లు) ఏర్పాటు చేసింది. వీటిద్వారా అనేక మంది పట్టభద్రులవుతున్నారు. దాదాపు 50 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ, విద్యార్థుల ఆదరణ పొందిన దూరవిద్య కేంద్రం స్టడీ సెంటర్లు ఇక శాశ్వతంగా మూసివేయాలని ఏయూ ఉన్నతాధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, వివిధ జిల్లాలతో పాటు కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇప్పటి వరకూ నిర్వహిస్తున్న స్టడీ సెంటర్లను ఇకపై పూర్తిగా మూసివేయనున్నారు. ఏటా 6 వేలకు పైగా అడ్మిషన్లు ఏయూ దూరవిద్యలో చేరికకు ఏటా జూన్ నెలలో నోటిఫికేషన్ ఇస్తారు. కాకినాడ, రాజమహేంద్రవరంలోని ఏయూ దూరవిద్య కేంద్రం స్టడీ సెంటర్ల ద్వారా వివిధ డిగ్రీ కోర్సులలో 6 వేల మంది, పీజీ కోర్సులలో 1,500 మంది ఏటా అడ్మిషన్లు పొందేవారు. వీరందరికీ అడ్మిషన్లు, వారాంతపు తరగతుల షెడ్యూల్, ఏ కళాశాలలో, ఏయే విభాగాల్లో కాంటాక్ట్ తరగతులు నిర్వహిస్తున్నారు, పరీక్ష ఫీజులు, దరఖాస్తుల స్వీకరణ, హాల్ టికెట్ల జారీ, పరీక్ష కేంద్రం తదితర వివరాలు అందించేందుకు ఆయా స్టడీ సెంటర్లలో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉండేవారు. వీరు పై పనులతో పాటు విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందించడం వంటి సేవలు కూడా అందించేవారు. విద్యార్థులకు సమయానికి స్టడీ మెటీరియల్ అందకపోతే సీనియర్ల పుస్తకాలు తీసుకుని అందజేసేవారు. ఆయా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ అందుబాటులో ఉండేవారు. ఈ సిబ్బందిని విశాఖపట్నంలోని ఏయూ కేంద్రానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ స్టడీ సెంటర్లను మూసివేయడంతో ఇకపై వీరి సేవలు అందవని, డిగ్రీ పట్టా పొందడం కష్టమేనని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఆన్లైన్లోనే అడ్మిషన్లు ఇక నుంచి డిగ్రీ లేదా పీజీ అడ్మిషన్ కావాలంటే ఏయూ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అడ్మిషన్ పొందాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే, చాలా మందికి ఆన్లైన్పై అవగాహన లేదు. అలాగే, ఏదైనా నెట్ సెంటర్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసినా.. ఫీజు చెల్లింపు, ఇతర విషయాల్లో తప్పిదాలు జరిగితే తాము నష్టపోతామని విద్యార్థులు వాపోతున్నారు. అయితే, వివిధ కోర్సులనే ఆన్లైన్లో నిర్వహిస్తూండగా.. అడ్మిషన్ల వంటివి ఆన్లైన్లో జరపడం పెద్ద విషయమేమీ కాదన్నట్టుగా ఏయూ వ్యవహరిస్తోంది. వాస్తవానికి యూజీసీ నిబంధనలు సక్రమంగా పాటించడం ద్వారా ఏయూ దూరవిద్య కేంద్రం సర్టిఫికెట్లకు మంచి గుర్తింపే ఉంది. అటువంటిది ఇకపై ఆన్లైన్ ప్రోగ్రాం ప్రవేశపెట్టడం ద్వారా అడ్మిషన్ల వేళ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన నుంచి తరగతులు, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన వంటివన్నీ ప్రైవేట్ ఎడ్యుటెక్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై దూరవిద్య కేంద్రం అధికారుల పర్యవేక్షణ ఉండదని అంటున్నారు. మరోవైపు యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతి ఆన్లైన్ కోర్సుకు కచ్చితంగా 20 శాతం పైగా విద్యార్థి చేతిరాత ద్వారా తరగతులు, ప్రాక్టికల్ పరీక్షలు చేపట్టాలి. మిగిలిన 80 శాతం ఆన్లైన్లో ఉండవచ్చు. కానీ, ఏయూ మాత్రం 100 శాతం ఆన్లైన్లోనే కొనసాగించే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. ఇకపై డిగ్రీ, పీజీ సబ్జెక్టులను అధ్యాపకుడు తరగతి గదిలో బోధించడం కాకుండా ఆరు నెలల ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సు తరహాలో మార్చేస్తారని చెబుతున్నారు. -
వక్ఫ్ భూములపై చంద్రబాబు ప్రభుత్వం కుట్ర
అమలాపురం రూరల్: వక్ఫ్ బోర్డుకు చెందిన భూములను ప్రభుత్వ భూములుగా చంద్రబాబు సర్కారు మార్చిందని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని 71.57 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములను ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండానే, నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ ఆన్లైన్ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా మార్చారని పేర్కొన్నారు. ఇదే విధంగా మంగళగిరి సమీపంలోని మల్లయ్యపాలెంలో 232 ఎకరాల వక్ఫ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. అమరావతి సీఆర్డీఏ పరిధిలోకి ఈ భూములను తీసుకువచ్చి, టీడీపీకి అనుకూలంగా ఉండే వర్గాలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వ తీరు వల్ల ముస్లిం సమాజానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంలోని ముస్లింలు ఈ విధానాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మైనార్టీ సెల్ నేతలు ఎండీ షరీఫ్, షేక్ ఖాజా బాబు, ఆలీ హుస్సేన్, అజీమ్, యూసుఫ్, అమీర్, ఆసిఫ్ పాల్గొన్నారు. రేపు జాబ్ మేళా అమలాపురం రూరల్: నిరుద్యోగ యువతకు పరిశ్రమలు సేవా రంగాల సమన్వయంతో ఉద్యోగ అవకాశాల కల్పనకు బుధవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి కే. మాధవి తెలిపారు. సోమవారం ఆమె ప్రచార వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో 10 కంపెనీల మానవ వనరుల ప్రతినిధులు పాల్గొని 550 ఖాళీలను భర్తీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు అందిస్తారని ఆమె చెప్పారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటీఐ పూర్తి చేసినవారు పాల్గొనవచ్చన్నారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి. మమ్మీ, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు, జిల్లా వికాస మేనేజర్ గోళ్ళ రమేష్, రావి ఫౌండేషన్ కార్యదర్శి పాలగుమ్మి వెంకటకృష్ణ పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 33 అర్జీలు అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 33 అర్జీలు వచ్చాయి. అమలాపురం డీఎీస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఎస్పీ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ను నిర్వహించారు. అర్జీలను పరిశీలించిన డీఎస్సీ ఆయా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి సీఐలు, ఎస్సైలతో మాట్లాడి గ్రీవెన్స్కు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 11, 12 తేదీలలో దివ్యాంగుల సాంస్కృతిక ఉత్సవాలు ముమ్మిడివరం: జిల్లాలో ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న దివ్యాంగులకు ఈ నెల 11, 12 తేదీలలో అమలాపురం అంబేడ్కర్ భవన్లో ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్షా అదనపు పథక సంచాలకులు, డిప్యూటీ కలెక్టర్ జి.మమ్మీ తెలిపారు. సమగ్ర శిక్షా, సహిత విద్య ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించినవన్నారు. -
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
● పంచాయతీ కార్యదర్శుల నెత్తిన ‘‘పన్ను’’ భారం ● దగ్గర పడుతున్న మార్చి 31 ● ఇప్పటి వరకు సగం కూడా వసూలు కాని ఇంటి పన్నులు ● ఉన్నతాధికారుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి ● కార్యదర్శులలో కలవరపాటు వసూళ్ల ఒత్తిడి.. ఇంటింత కాదయా! -
కోటి జన్మల ఫలం తులసి పూజ
● రత్నగిరిపై మూడో రోజుకు చేరిన పూజలు ● విశేషంగా హాజరైన భక్తజనం అన్నవరం: మాఘ మాసంలో మహా విష్ణువును తులసి దళాలతో పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న ‘కోటి తులసి పూజ’ ఆదివారం మూడో రోజుకు చేరుకుంది. వేకువ జామున సుప్రభాత సేవతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు పండితులు వార్షిక కల్యాణ వేదికపై ఆశీనులై ఉన్న స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం ప్రసాదాలు నివేదించారు. ఉదయం తొమ్మిది నుంచి 11–30 గంటల వరకు 60 మంది రుత్విక్కులు ఐదు లక్షల తులసి దళాలతో విష్ణుసహస్ర నామాలతో స్వామి వారికి అర్చన చేశారు. అనంతరం నివేదనలు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు రుత్విక్కులు మరో ఐదు లక్షల తులసి దళాలతో స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం ప్రసాద నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. వేద పండితులు వేదాశీస్సులు అందజేసి పవళింపు సేవతో రెండో రోజు కార్యక్రమాలు ముగించారు. దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్సింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, తదితరులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. -
పల్లెవెలుగు మెట్లపై డోర్లు
అమలాపురం రూరల్: జిల్లా రహదారి భద్రత కమిటీ ఆదేశాల మేరకు ప్రయాణికుల రద్దీ, భద్రత దృష్ట్యా పల్లె వెలుగు బస్సు మెట్లపై డోర్ లేదా బద్దీ ఏర్పాటు చేయాలని జిల్లా రవాణాధికారి డి.శ్రీనివాసరావు ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. డిపో మేనేజర్ శర్మతో కలిసి ఆదివారం పల్లెవెలుగు బస్సును పరిశీలించారు. త్వరలోనే ప్రయోగాత్మకంగా ఒక బస్సుకు తలుపు లేదా సపోర్ట్ బద్దీ ఏర్పాటు చేస్తామని, సత్ఫలితాలిస్తే అన్ని బస్సులకు వాటిని బిగిస్తామని డిపో మేనేజర్ శర్మ తెలిపారు. ఈ అంశంపై జిల్లా రీజనల్ మేనేజర్, డిపో మేనేజర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని డీటీఓ పేర్కొన్నారు. ఓపీఆర్ఎస్ ఇన్చార్జి నంది వరహాలబాబు తదితరులు పాల్గొన్నారు. ● ఏర్పాట్లకు డీటీవో పరిశీలన ● రహదారి భద్రత కమిటీ ఆదేశాలతో చర్యలు -
షామియానా తొలగించారు
కోటి తులసి పూజ సందర్భంగా వేసిన షామియాను ఆదివారం ఆలయ అధికారులు తొలగించారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కోటి తులసి పూజకు శ్రీకారం’ వార్తలో భక్తుల ఇబ్బందిని ప్రస్తావించిన విషయం తెలిసిందే. 2022లో నిర్వహించిన కోటి తులసి పూజలో కల్యాణ వేదిక ముందు తులసి వనంలో ‘సత్యదేవుడు, అమ్మవారి విగ్రహాలను’ ఉంచడం వల్ల భక్తులు అక్కడ ఫొటోలు దిగేవారు. ఇప్పుడు అటువంటి ఏర్పాటు లేకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేసున్నారు. అలాగే కల్యాణ వేదిక నుంచి విశ్రాంతి మండపం వరకు షామియానా వేయడంతో వేదిక గోపురం కనిపించకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈఓ ఆదేశం మేరకు షామియానాను ఆలయ సిబ్బంది తొలగించారు.కల్యాణ వేదిక ముందు గల విశ్రాంతి మండపంలో తులసి వనం మధ్య సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను సైతం ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడ ఫొటోలు దిగారు. -
ఎమ్మెల్సీ తోటకు మాజీ సీఎం జగన్ పరామర్శ
రామచంద్రపురం: మండపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఫోన్లో పరామర్శించారు. త్రిమూర్తులు సోదరుడు తోట సత్యనారాయణ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను జగన్, ఎంపీ మిథున్రెడ్డి ఫోన్ చేసి వివరాలను తెలుసుకుని పరామర్శించారు. అలాగే త్రిమూర్తులును పలువురు జిల్లా, రాష్ట్ర నాయకులు వెంకటాయపాలెంలోని ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, టీడీపీ నేతలు పప్పుల మసేను వెంకన్న (రేవు శ్రీను), మాజీ ఏఎంసీ చైర్మన్ కొమరిన వీర్రాజు, మాజీ ఎంపీపీ యాళ్ల కృష్ణారావు, కొప్పిశెట్టి తాతాయిలు, రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పరామర్శించారు. వారు సత్యనారాయణ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
కనకదుర్గమ్మకు చీర, సారె
ఉరేగింపుగా తరలి మొక్కులు చెల్లించుకున్న భక్తులుఅమలాపురం రూరల్: గాంధీనగర్లో కొలువైన కనకదుర్గమ్మ తల్లి ఆలయ 30వ వార్షికోత్సవం సందర్భంగా మాఘమాసం ఆదివారం భక్తులు అమ్మవారికి చీర, సారె సమర్పించారు. వేలాదిగా మహిళలు సారెను నెత్తిన మోస్తూ ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రారంభించిన ఊరేగింపు అమ్మవారి ఆలయం వరకు సాగింది. ఆలయ అర్చకుడు రామేశ్వరవరపు రామప్రసాద్ అధ్వర్యంలో అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి సమర్పించిన సారె, ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ తిక్కిరెడ్డి ఆదినారాయణ అధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ప్రసాదాలు, గాజులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన అన్నసమారాధనలో వేలాది భక్తులు పాల్గొన్నారు. -
బాలాజీ స్వామికి రూ.2.92 లక్షల ఆదాయం
మామిడికుదురు: మాఘ మాసం ఆదివారాన్ని పురస్కరించుకుని అప్పనపల్లి బాల బాలాజీ స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.2,92,990 ఆదాయం వచ్చిందని ఈఓ వి.రాంబాబురెడ్డి తెలిపారు. స్వామి వారిని 5,300 మంది భక్తులు దర్శించుకున్నారని, 2,600 మంది అన్న ప్రసాదం స్వీకరించారని ఆయన తెలిపారు. నిత్య అన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.1,03,371 విరాళాలుగా అందించారన్నారు. ఆత్రేయపురానికి చెందిన అద్దేపల్లి వెంకటేశ్వరరావు, మాణిక్యాంబ దంపతులు రూ.10,116 విరాళాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణికి అందజేశారని, దాత కుటుంబ సభ్యులకు ఆయన స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. నడిపూడికి చెందిన కుడుపూడి బాలయోగి, కుటుంబ సభ్యులు స్వామి వారి సన్నిధిలోని గోవులకు ట్రాక్టర్ ఎండుగడ్డిని ఉచితంగా సమర్పించారు. ఉచిత అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం ముమ్మిడివరం: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత అడ్మిషన్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ కలెక్టర్, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ జి.మమ్మీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీఈ 12(1)సీ చట్టం ప్రకారం పేద, వెనుకబడిన వర్గాల చిన్నారులకు ఒకటో తరగతిలో ఉచితంగా అడ్మిషన్లు కల్పిస్తారని ఆమె తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఉచితంగా అడ్మిషన్ల కోసం 25 శాతం సీట్లు కేటాయించినట్టు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు నివాస ప్రాంతం సమీపంలో ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలకు ఆన్లైన్లో నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెబ్సైట్లో ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి పదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. మార్చి 25 నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీ విధానంలో మొదటి విడతగా సీట్లు కేటాయిస్తారన్నారు. వివరాలకు 1804258599 టోల్ ఫ్రీ నంబరుకు సంప్రదించవచ్చునని మమ్మీ తెలిపారు. పర్ణం.. విచిత్ర వర్ణం! రాయవరం: పల్లె సీమలు ప్రకృతి అందాలకు నిలయాలు. చెట్టు, పుట్ట, గట్టు ఏదైనా వివిధ ఆకృతుల్లో అలరిస్తూ, ఆహ్లాదాన్ని పంచుతాయి. చూసే వారికి కనువిందు చేస్తాయి. అటువంటి దృశ్యమే రాయవరం మండలం సోమేశ్వరం సమీపంలో రహదారి పక్కన కనువిందు చేస్తోంది. మామిడి చెట్టు మూడు రంగుల్లో ఆకట్టుకుంది. లేలేత మావి చిగురులు ఎరుపు వర్ణంలో, ముదురు ఆకులు పచ్చగా.. కొమ్మలు లేత పచ్చగా వివిధ రంగుల్లో చూపరులను ఆకట్టుకుంటోంది. నెమలికోన @ 8 వేలు సఖినేటిపల్లి: పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా సముద్రంపై వేటకు వెళ్లిన మత్య్సకారుల పంట పండింది. శనివారం సాయంత్రం వేటకు వెళ్లిన వారు ఆదివారం మత్స్య సంపదతో తిరిగి వచ్చారు. ఇతర సంపదతో పాటు నెమలికోన రకం చేపలు వలకు చిక్కాయి. ఇందులో భారీ నెమలికోన చేపను కొనుగోలుదారుడు రూ.8 వేలకు దక్కించుకున్నాడు. ఈ రకం చేపలకు చైన్నె, కేరళ రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉండడంతో అక్కడికి ఎగుమతి చేస్తున్నారు. -
పుష్కర నీరాజనం
నిత్య కల్యాణస్వామికి పుష్కర నదీ స్నాన ఫలం పుష్కరాల సమయంలో ఆయా నదులలో స్నానం చేయడం ద్వారా సర్వపాపాలు తొలగి పుణ్య ఫలం దక్కుతుంది. ఏటా ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. ఆ 12 నదుల్లోనూ పుష్కరాల సమయంలో స్నానాలు చేయడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఈ కారణంగానే మురుమళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో 12 నదుల పుష్కర జలాలతో అభిషేకం చేస్తున్నాం. – గంటి సుబ్రహ్మణ్యశాస్త్రి, వేద పండితులు, వీరేశ్వర స్వామి ఆలయం, మురమళ్ల ● శివరాత్రి సందర్భంగా వీరేశ్వరునికి పవిత్ర నదీ జలాలతో అభిషేకం ● పుష్కర కాలాల్లో పవిత్ర జలాల సేకరణ ● 2009 నుంచి మొదలై ఏటా నిరంతరాయంగా నిర్వహణ ● విశేషంగా ఆదరిస్తున్న భక్తకోటి ఐ.పోలవరం: దేశంలో పుష్కరాలు జరిగే నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో జరిగే అభిషేకానికి నిత్య కల్యాణ వీరేశ్వరుడు సిద్ధమవుతున్నాడు. మహా శివరాత్రి పర్వదినాన ఉత్తర, దక్షణాది ప్రాంతాలలోని ద్వాదశ పుష్కర నదీ జలాలతో వీరేశ్వరుని అభిషేకించనున్నారు. పుష్కరాలు నిర్వహించే కాశ్మీర్లోని సింధు నది మొదలుకొని గంగ, యమున, నర్మద, సరస్వతి, గోదావరి, కృష్ణ, భీమ, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, ప్రాణహిత, కావేరి వరకు మహిమాన్విత నదీ జలాలు ఇప్పటికే మురమళ్ల చేరుకున్నాయి. కనుల వైకుంఠంగా సాగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాదిమంది భక్తులు వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. నిత్యకల్యాణం.. పచ్చ తోరణంగా విరాజిల్లే స్థానిక భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామికి ఏటా జరిగే ద్వాదశ పుష్కర జలాల అభిషేకానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐదు రోజుల పాటు జరిగే శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా 15వ తేదీ ఆదివారం మహా శివరాత్రి పర్వదినాన ఈ పుష్కర నదీ జలాల అభిషేకం జరగనుంది. దేశంలో ప్రతి నదికి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో సేకరించిన నదీ జలాలకు ఓ ప్రత్యేకమైన మహిమ, లేదా శక్తి ఉంటుందన్నది ఓ నమ్మకం. ఇక్కడి స్వామివారికి నిర్వహించే పుష్కర నదీ జలాభిషేకానికి నెల రోజుల ముందుగానే ఆయా 12 నదుల వద్దకు వెళ్లి ఆ జలాలను సేకరించి తీసుకువస్తారు. అది కూడా ఎలా పడితే అలా కాకుండా నదిని ఆనుకుని ఉన్న ప్రత్యేకమైన ప్రాంతం నుంచి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సేకరించి తీసుకు వస్తారు. ఇలా తెచ్చిన నీటిని మహాశివరాత్రి రోజున వీరేశ్వర స్వామికి అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. దేశంలో ప్రతి 12 ఏళ్లకు పుష్కరాలు జరిగే గంగ, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణా, కావేరి, భీమరధి, పుష్కరణి, తుంగభద్ర, సింధు, ప్రణీత నదుల నుండి సేకరించిన జలాలతో స్వామి వారికి పుష్కర నదీ జలాభిషేకం చేయనున్నారు. నిత్య కళ్యాణ స్వామి వీరేశ్వరునికి 2009వ సంవత్సరం నుంచి పుష్కర నదీ జలాలతో అభిషేకం చేయడం మొదలుపెట్టారు. నాటి నుంచి ఏటా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ నిర్వహించే పుష్కర జలాభిషేకానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి జన జాతరను తలపిస్తారు. పుష్కర జలాల అభిషేకానికి ముందు స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ, లక్ష పత్రి పూజ, వేదమంత్రాలతో కై లాసమే భువికి దిగివచ్చిందా అన్నట్టు. పుష్కరాలు జరిగే పన్నెండు నదులకు సామాన్యులు వెళ్లే అవకాశం ఉండదు. అలా వెళ్లలేని వారికి పుష్కర నదీ స్నాన ఫలితాన్ని అందించేందుకు వీరేశ్వరుని ఆలయంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. పుష్కర నదీ జలాలతో స్వామివారిని అభిషేకించి అనంతరం ఆ జలాలను అక్కడికి వచ్చిన భక్తులకు, స్వామి సేవకులకు ప్రసాదంగా అందజేయనున్నారు. వీటిని కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల శిరస్సున చల్లడం ద్వారా పన్నెండు నదులలో పుష్కర స్నానం చేసిన పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఒక వైపు మహా శివరాత్రి పర్వదినం.. మరోవైపు పుష్కర నది జలాభిషేకంతో మురమళ్ల, పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. ప్రతిష్టాత్మకంగా పుష్కర నది జలాభిషేకం వీరేశ్వర స్వామి ఆలయంలో ఏటా జరిగే పుష్కర నది జలాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. స్వామివారికి జరిగే ఈ పుష్కర నది జలాభిషేకంలో ప్రతి భక్తుడు పాల్గొనాలని మా ఆకాంక్ష. – వి.సత్యనారాయణ, ఈఓ, వీరేశ్వరస్వామి వారి ఆలయం, మురమళ్ల -
పూటుగా తాగి.. తన్నులాట
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సెక్యూరిటీ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికీ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. రత్నగిరి దిగువన తొలి పావంచా వద్ద స్వామివారి ప్రసాదం కొనుగోలుకు వచ్చిన భక్తులు ఆదివారం క్యూలో ఘర్షణ పడి, దాదాపు పావుగంట పాటు కొట్టుకున్నారు. దీంతో, ప్రసాదం కొనుగోలుకు అక్కడకు వచ్చిన ఇతర భక్తులు భయభ్రాంతులకు గురై, ఏం జరుగుతుందోననే భయంతో పరుగులు తీశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కానీ, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కానీ అక్కడ లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క రోజే కాదు.. ప్రతి ఆదివారం లోవ దేవస్థానానికి వెళ్తున్న భక్తుల్లో కొంత మంది మద్యం తాగి, తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ప్రసాదాల కొనుగోలుకు ఆగుతున్నారు. ఈ క్రమంలో వారిలో వారు తరచుగా ఘర్షణకు దిగుతున్నా ఆపేవారే ఉండటం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. అందుబాటులో ఉండని సిబ్బంది మరోవైపు తొలి పావంచా వద్ద ప్రసాదం కౌంటర్లలోని దేవస్థానం సిబ్బంది మధ్య సమన్వయం కొరవడుతోంది. ఈ నెల 2న తొలి పావంచా వద్ద ప్రసాదాల కొనుగోలుకు వెళ్లిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రసాదం ప్యాకెట్లు ఇచ్చే ఉద్యోగి బయటకు వెళ్లాడని, పావుగంట ఆగాలని అక్కడ ప్రసాదం టికెట్లు విక్రయించే మరో ఉద్యోగి చెప్పాడు. చాలా దూరం వెళ్లాలని, ఇలా ఆలస్యం చేస్తే ఎలాగని ఆ భక్తులు పక్కనే గెస్ట్ హౌస్లో ఉన్న దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ఆ కౌంటర్ వద్దకు వచ్చి, అక్కడి ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసి, దగ్గరుండి మరీ ప్రసాదాలు అమ్మించారు. ఆ సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా లేడు. పోలీసులను నియమించే అవకాశం లేదు తలుపులమ్మ లోవకు వెళ్లి వచ్చిన కొంత మంది భక్తులు మద్యం తాగి వచ్చి, అన్నవరం వచ్చి ఆ మత్తులో ప్రసాదాల కౌంటర్ల వద్ద ఘర్షణ పడుతున్నారు. వారిని నియంత్రించేలా అక్కడ నియమించడానికి తగినంత మంది పోలీసులు మాకు లేరు. దేవస్థానమే అక్కడ సెక్యూరిటీ గార్డులను నియమించాలని చాలాసార్లు చెప్పాం. అయినప్పటికీ వారు నియమించడం లేదు. ఇప్పటికై నా దేవస్థానం అదివారం నాడు అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డులను నియమించాలి. ప్రసాదాల కౌంటర్ వద్ద ఘర్షణ పడిన వారు మాకు ఎటువంటి ఫిర్యాదూ చేయలేదు. – శ్రీహరిబాబు, ఎస్సై, అన్నవరం ఫ సత్యదేవుని తొలి పావంచా ప్రసాదం స్టాల్ వద్ద భక్తుల ఘర్షణ ఫ పావుగంట పాటు కొట్టుకున్న వైనం ఫ భయభ్రాంతులకు గురైన ఇతరులు అంత సెక్యూరిటీ ఉన్నా ప్రయోజనమేదీ! అన్నవరం దేవస్థానంలో వంద మందికి పైగా సెక్యూరిటీ గార్డులు, 38 మంది పోలీసు శాఖకు చెందిన హోం గార్డులు పని చేస్తున్నారు. తొలి పావంచా వద్ద ఒక్క భద్రతా సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. కనీసం ఇద్దరు హోంగార్డులు లేదా ఇద్దరు సెక్యూరిటీ గార్డులున్నా ఇలాంటి ఘర్షణలను నివారించే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమయంలో ఆ ఒక్కరు కూడా ఉండటం లేదనే విమర్శ ఉంది. -
స్కూటీపై నలుగురు ప్రయాణం
● రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురికి తీవ్రగాయాలు ● ఒకరికి స్వల్ప గాయాలుఅమలాపురం టౌన్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఓ స్కూటీపై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరికి స్వల్ప గాయమై ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ కథనం మేరకు కొత్తపేట మండలం వానపల్లికి చెందిన పలివెల నూకరాజు తన స్కూటీపై అతని కుటుంబీకులు కావ్య, మీనా కుమారి, వీర వెంకటలక్ష్మిలను తీసుకుని అమలాపురం వైపు నుంచి రాజోలు వెళ్తున్నాడు. అదే సమయంలో రాజోలు నుంచి అమలాపురం వైపు తీర్థయాత్రకు వెళ్తున్న మినీ బస్సు పేరూరు వై జంక్షన్ వద్ద వారి వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో నూకరాజు, మీనాకుమారి, వీర వెంకటలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. కావ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. క్షతగాత్రులు వై జంక్షన్లోని సాయి విశ్వాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్కూటీపై నలుగురు వెళ్లడం సరికాదని పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.కడియపులంకలో అగ్ని ప్రమాదం కడియం: మండలంలోని కడియపులంక కొబ్బరితోట కాలనీలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కె.సత్తిరాజు ఇంట్లోని వాషింగ్ మెషిన్ ఆన్ చేయగా షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. స్థానికులు అప్రమత్తమై మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ లోపు స్థానిక ఎస్ఐ నాగదుర్గాప్రసాద్ స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకుని అగ్ని మాపక శకటాన్ని పిలిపించగా ఆ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రాణనష్టం జరగక పోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు బ్రాండ్ ‘శ్యామ్’బోట్క్లబ్ (కాకినాడసిటీ): ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఒక బ్రాండ్గా నిలిచిందని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. పోలీసు ఉద్యోగాలకే కాకుండా ఏపీపీ ఎస్సీ గ్రూప్– 2 ఉద్యోగాల్లోనూ శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయం సాధించడం అభినందనీయమన్నారు. స్థానిక శ్యామ్ ఇనిస్టిట్యూట్లో ఆదివారం గ్రూపు–2 విజేతల విజయోత్సవ సభ నిర్వహించారు. ఇనిస్టిట్యూట్ అధినేత గుంటూరి శ్యామ్ ఎంతో నిబద్ధతతో, క్రమ శిక్షణతో ఇనిస్టిట్యూట్ను తీర్చిదిద్దడంతో అనేకమందికి ఉద్యోగాలు అందించే సంస్థగా ఆవిర్భవించిందన్నారు. సంస్థ అధినేత గుంటూరి శ్యామ్, డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా గ్రూప్స్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించడంతో తొలి ప్రయత్నంలోనే గ్రూప్– 2 ఫలితాల్లో 94 పోస్టులను తమ విద్యార్థులు సాధించారన్నారు. సంస్థ ప్రారంభించిన 25 ఏళ్లలో 26 వేలకు పైగా ఉద్యోగాలు సాధించామన్నారు. రెండేళ్లుగా 7210 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించామని వివరించారు. గ్రూప్–2 విజేతలు మాట్లాడుతూ శ్యామ్ ఇనిస్టిట్యూట్లో ఉన్నతమైన బోధనతో పాటు మోటివేషన్, భరోసా, ఆత్మస్థైర్యం కల్పించడంతోనే ఈ ఉద్యోగాలు సాధించగలిగామన్నారు. అనంతరం విజేతలతో పాటు వారి తల్లితండ్రులను సత్కరించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
వైభవంగా గంధోత్సవం
● బషీర్ బీబీ దర్శనానికి పోటెత్తిన భక్తులు ● ప్రత్యేక ప్రార్థనలు ● కిక్కిరిసిన పొన్నాడ కొత్తపల్లి: స్థానిక పొన్నాడ బంగారు పాపమ్మ (బషీర్ బీబీ ఔలియా) ఉర్స్ ఉత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నాడ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసాయి. పోలీసుల భారీ బందోబస్తు నడుమ సుమారు 30 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ముజావర్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా గంధోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మూలపేటకు చెందిన షెక్మౌలాసాహేబ్ ఇంటి వద్ద నుంచి పెద్ద బొడ్డేపల్లికి చెందిన ఎండీ తాజుద్దీన్బాబా సమర్పించిన గంధాన్ని (సంథల్) ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంపై ఉంచి ఫకీర్ మేళాతో మూలపేట నుంచి పొన్నాడ బషీర్బీబీ ఆలయం వరకు ఊరేగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతికి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ ప్రార్థనల అనంతరం భక్తులకు గంధాన్ని పంపిణీ చేశారు. ఉత్సవాల సందర్భంగా మూలపేట నుంచి పొన్నాడ వరకు కాలినడకన వెళ్లేందుకు కూడా వీలులేని పరిస్థితులు నెలకొంది. పలు మార్లు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పిఠాపురం, తుని, కాకినాడల నుంచి వచ్చిన వాహనాలు పొన్నాడ చేరుకోవడానికి ఇబ్బంది పడ్డాయి. ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో సుమరు 120 సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. వాహనాలు ఆలయ ప్రాంగణంలోకి వెళ్లకుండా పొన్నాడ, అమరవిల్లి, నాగులపల్లి వద్దె నిలిపివేశారు. గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, పారిశుధ్య నిర్వహణ ఏర్పాట్లు చేశారు. -
విన్నపాలు వినవలె విఘ్ననాథా..
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. ఆలయ ప్రధాన అర్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారు జామున మేలుకోలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరికపూజ వంటి విశేష పూజలు చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 62 మంది పాల్గొన్నారు. 41 మంది భక్తులు స్వామివారి హోమం నిర్వహించారు. నలుగురు భక్త దంపతులు స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. స్వామికి ఇద్దరు భక్త దంపతులు ఉండ్రాళ్ల పూజ చేశారు. ఇద్దరు చిన్నారులకు నామకరణ, ఏడుగురికి అన్నప్రాశన, ఐదుగురికి అక్షరాభ్యాసాలు చేశారు. ఇద్దరికి తులాభారం, 50 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 3,226 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. ఆదివారం వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.4,55,732 ఆదాయం లభించినట్లు ఈఓ, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
గట్టుకాయస్వాహా!
కె.గంగవరం: గోదావరి ఏటిగట్టును దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రూ.వందల కోట్ల వ్యయంతో పటిష్టం చేశారు. ప్రస్తుతం దానిని ఇష్టమొచ్చినట్టు తవ్వేసి గుల్ల చేసేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో కూళ్ల నుంచి యానం వరకు గౌతమి గోదావరి నది ఒడ్డు ఉంది. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోదావరికి వరద వచ్చినప్పుడు ముంపు గ్రామాల్లోని నీరు చేరకుండా ఏటిగట్టును ఐదు అడుగులకు పెంచారు. జొన్నడ నుంచి గొవలంక వరకు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ పనులు చేయించారు. ప్రస్తుతం పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఏటిగట్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఏటిగట్టుపై ఉన్న మట్టిని కొందరు రాత్రివేళల్లో తవ్వేసి పట్టుకుపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన సంక్రాంతి కోడి పందేల కోసం బోదిలంక వద్ద ఏటిగట్టును రెండు చోట్ల తవ్వేసి రోడ్డును ఏర్పాటు చేశారు. దీంతో పాటు అనధికారిక ఇసుక ర్యాంపు కోసం కూడా కూళ్ల నుంచి బ్రహ్మపూరి వరకు పలు చోట్ల గట్టును తవ్వి ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. గట్టును విచ్చలవిడిగా తవ్వేసి రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల దాని మనుగడ ప్రశ్నర్ధకమైంది. వరదలు వచ్చినప్పుడు హడావిడి చేయడం తప్ప మామూలు రోజుల్లో ఏటిగట్టును పట్టించుకునే నాథుడు లేడని గోదావరి పరీవాహక ప్రజలు వాపోతున్నారు. అటు కన్జర్వెన్సీ అధికారులు కానీ, ఇటు స్థానిక రెవెన్యూ అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని గట్టును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. మహానేత వైఎస్సార్ హయాంలో రూ.వందల కోట్లతో పటిష్టం రాత్రి వేళల్లో యథేచ్ఛగా తవ్వకాలు పట్టించుకోని అధికార యంత్రాంగం బలహీన పడుతున్న ఏటిగట్లపై ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు -
నింద వేయడం చంద్రబాబు నైజం
ఫ జగన్ హయాంలో అప్పుల గురించి అబద్ధాలు ప్రచారం చేశారు ఫ అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బ తీశారు ఫ శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపడేలా చేయడమే ఉద్దేశ్యమా? ఫ రాజకీయ లబ్ధి కోసం ఎంతకై నా తెగించడం దారుణం ఫ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు రాజమహేంద్రవరం రూరల్: ఎదుటి వారిపై నింద వేయడం, దాని నుంచి లబ్ధి పొందాలని చూడడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటని, అందుకే పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. శాటిలైట్ సిటీ గ్రామంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ఫ ఎన్నికల ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు అంటూ గగ్గోలు పెట్టారు. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పు రూ.7 లక్షల కోట్లేనని, అందులో జగన్ హయాంలో చేసినవి రూ.3.27 లక్షల కోట్లేనని చెప్పారు. దీనినిబట్టి ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పింది నిజం కాదనే విషయం తేటతెల్లమైంది. జగన్ దిగిపోయే సమయానికి ఖజానాలో రూ.7 వేల కోట్ల మిగులున్నప్పటికీ ఈ 20 నెలల్లో రూ.3.27 లక్షల కోట్ల అప్పులు ఎలా చేశారు? దీని నుంచి తప్పించుకోవడానికి ఒక్కో రోజు ఒక్కో ఎత్తుగడ వేస్తున్నారు. సంక్షేమం అమలు చేయకుండా, అప్పులు పెంచుకుంటూ పోతున్నారు. ప్రజల ఆస్తుల్ని ఇష్టానుసారం నచ్చిన వాళ్లకు పంచేస్తున్నారు. లేనిది భ్రమగా చూపించి గొప్పగా చేసినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఫ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ వంటివి కలిశాయంటూ గతంలో నింద వేశారు. దీనిపై ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారంటూ సుప్రీకోర్టు హెచ్చరించింది. చంద్రబాబు వ్యాఖ్యలతో శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపడ్డాయి. దీనిపై సుప్రీంకోర్టు వేసిన సిట్ తన దర్యాప్తు అనంతరం, సమర్పించిన చార్జిషీట్లో లడ్డూలో జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలవలేదనే విషయాన్ని నిర్ధారించింది. శ్రీవారే ఈవిధంగా నిజాన్ని పలికించారని భక్తులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో లడ్డూలో బాత్ రూము క్లీనింగ్ యాసిడ్లు కలిశాయంటూ చంద్రబాబు చెప్పడం దారుణం. సిట్ ఈవిధంగా ఎక్కడ చెప్పింది? ఇది బాధ్యతారాహిత్యం కాదా? భక్తులు అడగలేరని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారా? ఏదోవిధంగా జగన్ను అణగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నంలో ఎవరిపై నిందలు వేస్తున్నారో తెలుస్తోందా? శ్రీవారి ప్రసాదంపై లేనిపోని నిందలు వేసి, భక్తుల మనసుల్ని విరిచేస్తున్నారు. చంద్రబాబు శ్రీవారి నిజమైన భక్తుడు కానందువల్లనే రాజకీయ ప్రయోజనం కోసం ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఫ ఇటీవల విలేకర్ల సమావేశంలో చంద్రబాబు సహా తొమ్మిది మంది కూర్చుని మాట్లాడినపుడే ఆయన మాటలు నిజం కాదని తెలిసిపోయింది. రాజకీయ ప్రయోజనాన్ని ఆశించే ఇలా తప్పుడు ప్రచారం చేశారనే విషయం మీ ప్రెస్మీట్ ద్వారా ప్రజలకు, భక్తులకు అర్థమైంది. కేవలం జగన్ను ప్రజలో పలుచన చేయడానికి అబద్ధం చెప్పారని ప్రజలకు తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకో గాయం చేస్తున్నారు. శ్రీశైలం ప్రసాదంలో అపవిత్రత గురించి వార్తలు వస్తున్నాయంటూ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు దారుణంగా వ్యవహరిస్తున్నారా? స్వామివారి పట్ల అపచారం చేసే వ్యాఖ్యలు చేసిన వ్యక్తిగా చరిత్రలో చంద్రబాబు నిలిచిపోతారు. ఇప్పటికై నా భక్తులు వాస్తవాలు ఆలోచించి, చంద్రబాబు దుష్ప్రచారాన్ని, నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. -
పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై రాకపోకలు బంద్
● ఈ నెల 10 నుంచి 40 రోజుల పాటు మరమ్మతులు ● పాత అక్విడెక్టుపై చిన్న వాహనాలకు మాత్రమే అనుమతి పి.గన్నవరం: సీఎస్ఆర్ నిధులు రూ.49.3 లక్షలతో పి.గన్నవరం కొత్త అక్విడెక్టు రోడ్డుకు ఈ నెల 10 నుంచి మరమ్మతులు నిర్వహించేందుకు ఇరిగేషన్ అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో 10వ తేదీ నుంచి 40 రోజుల పాటు కొత్త అక్విడెక్టుపై రాకపోకలు నిలిపి వేస్తున్నారు. పాత అక్విడెక్టు మీదుగా చిన్న వాహనాలు, మోటారు సైకిళ్ల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ డీఈఈ భూపతిరాజు ప్రసాద్రాజు శనివారం రాత్రి అమలాపురంలో కలెక్టర్ కార్యాలయానికి తెలియజేశారు. జాయింట్లు దెబ్బతిని.. కొత్త అక్విడెక్టు రోడ్డుపై పిల్లర్ల మధ్య ఎక్పేన్సన్ జాయింట్లు దెబ్బతినడంతో గోతులు ఏర్పడి ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో రూ.49.03 లక్షలతో 34 జాయింట్ల వద్ద స్ట్రిప్ సీల్ ఏర్పాటు చేసి, కాంక్రీట్తో వేరింగ్ కోట్ వేయడం, దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. వీటిని పూర్తి చేసేందుకు 20 రోజులు, అనంతరం వాటర్ క్యూరింగ్కు 20 రోజులు పడుతుందని అంచనా వేశారు. మరమ్మతులకు మెటీరియల్ను సిద్ధం చేశారు. దీంతో 40 రోజుల పాటు పాత అక్విడెక్టు మీదుగా రాజోలు దీవిలోకి చిన్న వాహనాల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలకు అనుమతి లేదు. అక్విడెక్టు మీదుగా ప్రయాణించే భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. దెబ్బతిన్న జాయింట్లుపి.గన్నవరం కొత్త అక్విడెక్టు -
పర్యవేక్షణ కొరవడి.. బాల్యం అవస్థలు పడి
ఫ కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత ఫ దేవరపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఘటన ఫ 88 మందికి ఆసుపత్రుల్లో చికిత్స రంపచోడవరం: ఎన్నో ఆశలు, మరెన్నో కలలతో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న బాల్యంపై నిర్లక్ష్యం అలముకుంది.. వారికి వడ్డించే ఆహారం విషయంలోనూ పర్యవేక్షణ కొరవడింది.. ఏటా అనేక ఘటనలు జరుగుతున్నా అధికారుల్లో చలనం లేకుంది. మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 88 మంది విద్యార్థులకు శనివారం ఫుడ్ పాయిజన్ జరగడం అందుకు ఉదాహరణ. నిల్వ శెనగపిండితో బొంబాయి చట్నీ చేయడంతో అది తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 277 మంది విద్యార్థులు ఉంటే, ఇందులో 88 మందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఉదయం ఇడ్లీ, బొంబాయి చట్నీతో టిఫిన్ తిన్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన కొద్ది నిమిషాల్లోనే విద్యార్థులకు కళ్లు తిరిగి వాంతులు కావడంతో 18 మందిని మారేడుమిల్లి పీహెచ్సీకి, 68 మంది రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం ఏడు గంటలు తరువాత మరో ఇద్దరు అస్వస్థతకు గురికావడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. బొరగా బుజ్జిబాబుదొర అనే విద్యార్థికి వాంతులతో పాటు శ్వాస సంబంధిత ఇబ్బంది కలగడంతో రాజమహేంద్రవరం ఆసుపత్రికి రిఫర్ చేశారు. వైద్య చికిత్స దయనీయం : రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతున్న పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. ఒకే మంచంపై ఆరుగురు పిల్లలు పడుకుని సెలెన్లు పెట్టించుకునే దౌర్భగ్య పరిస్థితులు కనిపించాయని అన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజన సంక్షేమాన్ని గాలికొదిలేసిందని అన్నారు. రంపచోడవరం ప్రాంతంలోని పాఠశాలల్లో వరుసగా మరణాలు సంభవించాయని, అయినా స్పందన లేదన్నారు. మారేడుమిల్లి మండలంలో ఒక పాప తలకు దెబ్బతగిలి చనిపోయిందని, పోస్టుమార్టం రిపోర్టు ఇప్పటికీ వెల్లడించలేదన్నారు. గత వైఎస్సార్ ప్రభుత్వంలో పాఠశాలలు, ఆసుపత్రులు, గిరిజనుల వైద్యానికి పెద్దపీట వేశారని ధనలక్ష్మి అన్నారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతం పట్ల ఆ శాఖ మంత్రి హేళనగా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం కొనసాగితే ఐటీడీఏ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ, వార్డెన్ గణపతిలకు ఐటీడీఏ పీఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒకే మంచం.. ఐదుగురికి వైద్యం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి అస్వస్థతకు గురైన విద్యార్థులను తీసుకురావడంతో వారికి చికిత్స అందించేందుకు సరిపడా మంచాలు లేవు. దీంతో ఒకే మంచంపై నలుగురు నుంచి ఐదుగురిని పడుకోబెట్టి వైద్యం చేశారు. అస్వస్థతకు గురై నిరసంగా ఉన్న విద్యార్థులు ఆ మంచాలపైనే ఇబ్బందికరంగా కూర్చుని సైలెన్లు పెట్టించుకున్నా రు. రంపచోడవరం ఐటీడీఏ పీఓ బచ్చు స్మరణ్రాజ్ విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. ఏరి యా ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకర్లుతో మాట్లాడా రు. అక్కడి నుంచి దేవరపల్లి ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు. -
● ఇంకెన్నాల్.. ఈ పాట్లు
మాచవరం నుంచి చిరతపూడి వెళ్లే ప్రధాన పంట కాలువ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, మందు సీసాలు, పశు కళేబరాలతో నిండిపోయింది. అయినా ప్రభుత్వం, పాలకులు చోద్యం చూస్తున్నారు. వాటిని తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు వివరించినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. ఈ వ్యర్థాలతో దుర్వాసన వస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. –అంబాజీపేట ● పొగబెట్టారండోయ్.. రావులపాలెం గౌతమి గోదావరి పాత బ్రిడ్జిపై శనివారం మధ్యాహ్నం నల్లని పొగ కమ్మేసింది. ఇది ఆకాశంలో మేఘంలా రావులపాలెం సెంటర్ వరకూ వ్యాపించింది. హుటాహుటిన పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. బ్రిడ్జి కింద గోదావరిలో పాత ఇసుక ర్యాంపు బాట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థాలతో పాటు, తారు లాంటి వ్యర్థాలకు నిప్పంటించారు. దీంతో బ్రిడ్జి అంతా పొగతో నిండిపోయింది. కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు. –రావులపాలెం ● నిలపడేలా ఎందుకో! నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అజాగ్రత్తగా కారణంగానే ఎందరో ప్రాణాలు పోతున్నాయి. అయినా ఇలా ఆటో వెనుక ఇలా నిలబడి ప్రయాణం చేయడంపై అంతా ముక్కున వేలేసుకున్నారు. చింతూరు – కూనవరం రహదారిలో శనివారం ఓ ఆటోలో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను ఎక్కించుకున్నారు. వెనుక డోరుపై మహిళలను సైతం నిలబెట్టి తీసుకెళ్లారు. –చింతూరు -
ఫొటోషూట్కు ఎంతో అనుకూలం
చింతూరు, మారేడుమిల్లిలోని మన్యం ప్రాంతాలు ఫొటోషూట్ల కు ఎంతో అనుకూలంగా ఉన్నా యి. అటవీ ప్రాంతంలో మంచి లొకేషన్లు ఉండడంతో సినిమా, సీరియల్ దర్శకులు ఇక్కడ షూటింగ్లు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మా ఆర్గనైజేషన్ ఆధ్వ ర్యంలో ఇప్పటివరకూ ఇక్కడ తొమ్మిది నేషనల్ లెవల్ ఫొటో వర్క్షాప్లు నిర్వహించాం.–నాగరాజు దేవర, ఖమ్మం ఫొటోఆర్ట్స్ ఆర్గనైజేషన్ నిర్వాహకుడు రిసార్టులకు గిరాకీ పెరిగింది సినిమా, సీరియల్స్ షూటింగులతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. పొల్లూరు సమీపంలోని వాటర్ఫాల్స్తో పాటు పుష్ప సినిమా చిత్రీకరించిన ఫోర్బై రిజర్వాయర్, దాని సమీపంలో పవర్ కెనాల్ అక్విడెక్ట్ (వంతెన) ఎంతగానో పాపులర్ అయ్యాయి. ఈ ప్రాంతాలను తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. –పంచాడ నాని, రిసార్టు నిర్వాహకుడు, పొల్లూరు -
విశాఖపట్నం జూకు పెద్ద పులి
రాజమహేంద్రవరం రూరల్: ఆపరేషన్ టైగర్ విజయవంతమైంది. తూర్పుగోదావరి జిల్లాలో జనావాసాల్లో సంచరిస్తూ, కనిపించిన ఆవులు, దూడలను చంపేస్తూ దాదాపు వారం రోజుల పాటు జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పెద్ద పులి ఎట్టకేలకు శుక్రవారం చిక్కింది. దీంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలోని ఓ పాకలో దాగిన పెద్ద పులిని పూణే నుంచి వచ్చిన రెస్క్యూ బృందం, ఆటవీ శాఖ అధికారుల బృందం పట్టుకుంది. ఆ పులికి శాసీ్త్రయంగా మత్తు మందు ఇవ్వడంతో కొద్దిదూరం వెళ్లి అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం దాన్ని వెంబడించి అత్యంత జాగ్రత్తగా, బంధించారు. అనంతరం పులిని ప్రత్యేక బోనులో విశాఖపట్నంలోని రెస్క్యూ కేంద్రానికి తరలించారు. పులిని కొద్ది రోజులు పరిశీలించి, దాని ప్రవర్తనను బట్టి అడవిలో విడిచిపెట్టాలా లేక, జూలో ఉంచాలా అన్నది నిర్ణయిస్తామని అటవీరేంజ్ ఆఫీసర్ ఎన్.దావీదురాజు తెలిపారు. పులిని బంధించిన పూణే రెస్క్యూ బృందాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రత్యేకంగా అభినందించారు. అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో నిర్వహించిన ఈ ఆపరేషన్లో వైజాగ్ జూకు చెందిన వెటర్నరీ డాక్టర్లు ఫణీంద్ర, భాను, రాజమహేంద్రవరం సీసీఎఫ్, అటవీశాఖాధికారి ఎన్.దావీదురాజు బృందం కీలక పాత్ర పోషించారని జిల్లా అటవీ శాఖ అధికారి బి.ప్రభాకరరావు తెలిపారు. -
సమాజ భాగస్వామ్యంతో విద్యార్థులకు సౌకర్యాలు
అమలాపురం రూరల్: సమాజ భాగస్వామ్యాన్ని పెంచి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఉప విద్యాశాఖాధికారి గుబ్బల సూర్యప్రకాష్ అన్నారు. విద్యాంజలి 2.0 కార్యక్రమంపై అమలాపురం మండల పరిషత్ కార్యాలయంలో పట్టణ, రూరల్ పరిధిలోని 105 ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శనివారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ సరేళ్ల దుర్గాదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యాంజలిపై అవగాహన పెంచుకుని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రిసోర్స్ పర్సన్లు సీహెచ్వీ సతీష్, కె.కిషోర్ కుమార్, నోడల్ ప్రధానోపాధ్యాయుడు ఘన సత్యనారాయణ విద్యాంజలిపై అవగాహన కల్పించారు. దాతలతో పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నారు. పట్టుదలతో ఉన్నత శిఖరాలకు.. తాళ్లరేవు: చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా, ఆత్మవిశ్వాసంతో చదవి తన తల్లి ఆశయాన్ని నెరవేర్చింది ఒక అమ్మాయి. తాళ్లరేవులోని అయినగడ్డవారి వీధికి చెందిన శేరు ప్రియాంక తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందారు. ఆమె తన అమ్మమ్మ అమ్మాజీ ఇంటి వద్ద ఉంటూ విద్యనభ్యసించింది. తాళ్లరేవు మార్గదర్శి హైస్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్న ప్రియాంక.. కాకినాడ పీఆర్ కళాశాలలో 2017లో డిగ్రీ పూర్తి చేసింది. అప్పటి నుంచి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ గ్రూప్–2 పరీక్షలు రాసింది. ఇటీవల విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ, అకౌంట్స్ విభాగంలో బీసీ వెల్ఫేర్ శాఖలో జూనియర్ అకౌంటెంట్గా ఎంపికై ంది. తాను ఈ ఘనత సాధించేందుకు అమ్మమ్మ, మావయ్యలు, పిన్ని, స్నేహితులు ఎంతో సహకరించారని ప్రియాంక తెలిపింది. తన తల్లికి తాను ప్రభుత్వ ఉద్యోగం చేయడమంటే ఎంతో ఇష్టమని, ఆమె ఆశయం కోసం తాను కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించానని ప్రియాంక గర్వంగా తెలిపింది. ఈ సందర్భంగా ఆమెను కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందించారు. పాఠశాల హెచ్ఎం సస్పెన్షన్ కాట్రేనికోన: మండలంలోని పి.లక్ష్మీవాడ జెడ్పీహెచ్ పాఠశాల హెచ్ఎం ఎస్.రాజేశ్వరీదేవిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశా రు. గతంలో అమలాపురం బాలుర హైస్కూల్లో పనిచేస్తున్న సమయంలో నిధుల దుర్వినియోగం చేసినట్టు ఆమైపె ఆరోపణలు వచ్చాయి. సంబంధిత శాఖ ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అవకతవకలను గుర్తించారు. అనంతరం శాఖా పరమైన పూర్తిస్థాయి విచారణలో నిబంధనలకు విరుద్ధంగా నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రాజేశ్వరీదేవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ ప్లాంట్ పరిశీలన అమలాపురం టౌన్: అమలాపురం బైపాస్ రోడ్డుకు సమీపంలోని మున్సిపల్ డంపింగ్ యార్డులో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న ప్లాస్మా టెక్నాలజీ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ ప్లాంట్ పనులను కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ శనివారం పరిశీలించారు. పనుల ప్రగతిపై అక్కడే అమలాపురం ఆర్డీవో కొత్త మాధవి, మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్తో ఆయన చర్చించారు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు పది టన్నుల చెత్త డిస్పోజల్ అవుతుందన్నారు. పట్టణంలో సేకరించే చెత్తతో పాటు పరిసర గ్రామాల్లోని చెత్తను కూడా ఈ ప్లాస్మా ప్లాంట్కు తరలించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ప్లాంట్ ద్వారా చెత్తను సరికొత్త టెక్నాలజీతో శుద్ధీకరణ చేయడమే కాకుండా హానికర వ్యర్థాలను తగ్గించవచ్చన్నారు. -
రేషన్ బియ్యం స్వాధీనం
రాజానగరం: స్థానిక ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎదురుగా జాతీయ రహదారిపై లారీలో అక్రమంగా రవాణా అవుతున్న 18,140 కిలోల రేషన్ బియ్యాన్ని శనివారం పట్టుకున్నారు. రాజానగరం ఎంఎస్ఓ బాపిరాజు కథనం ప్రకారం.. వివిధ రంగుల్లో ఉన్న 311 ప్లాస్టిక్ సంచులలో ప్యాక్ చేసిన ఈ బియ్యాన్ని గోపాలపురం నుంచి రాజానగరానికి తరలిస్తున్నా రు. దీని విలువ రూ. 8,43,510 ఉంటుందని అంచనా. ఈ మేరకు గొల్లప్రోలుకు చెందిన లారీ డ్రైవర్, ఓనర్లు అల్లు శ్రీనివాస్, చోడిశెట్టి మహేష్లపై 6ఏ కేసు నమోదు చేశారు. బి య్యంతోకూడిన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
వక్ఫ్బోర్డు భూములపై చంద్రబాబు కుట్ర
● ప్రభుత్వ భూములుగా మార్చేందుకు యత్నాలు ● వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ ఆగ్రహం అమలాపురం టౌన్: రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు భూములను చంద్రబాబు ప్రభుత్వం క్రమేపీ ప్రభుత్వ భూములుగా మార్చేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోందని జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్ అన్నారు. దీనిలో భాగంగానే మంగళగిరిలోని 71.57 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములను ప్రభుత్వం చట్టబద్ధత పాటించకుండా నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు రెవెన్యూ ఆన్లైన్ రికార్డుల్లో పభుత్వ భూములుగా మార్చిందన్నారు. ఈ మేరకు ఆయన శనివారం అమలాపురంలో ప్రకటన విడుదల చేశారు. మంగళగిరిలోని 71.57 ఎకరాలకు అటు వక్ఫ్ బోర్డు గానీ, ఇటు ఆ భూములను పర్యవేక్షిస్తున్న అంజుమన్–ఇ–ఇస్లామియా సంస్థ గానీ ఎలాంటి అనుమతులు ఇవ్వకుండానే ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ఇదే తరహాలో మంగళగిరి ప్రాంతానికి సమీపంలోని మల్లయ్యపాలెంలో గల 232 ఎకరాల వక్ఫ్ భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అమరావతి సీఆర్డీఏ పరిధిలోకి ఈ వక్ఫ్ భూములను తీసుకుని వచ్చి టీడీపీ అనుకూల వర్గాలకు కేటాయించే ప్రయత్నం చాపకింద నీరులా జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కుట్ర వల్ల ముస్లిం సమాజానికి తీవ్ర అన్యాయం జరుగుతున్న క్రమంలో రాష్ట్రంలోని ముస్లిం సోదరులు ఈ విధానాన్ని వ్యతిరేకించాలని ఖాదర్ విజ్ఞప్తి చేశారు. రేపు కలెక్టర్కు ఫిర్యాదు వక్ఫ్ భూములను ప్రభుత్వ భూములుగా పేర్కొంటున్న ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ అమలాపురంలోని కలెక్టరేట్లో సోమవారం జరిగే గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయనున్నట్లు ఖాదర్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మైనార్టీ సోదరులు ఆ రోజు ఉదయం 10 గంటలకు కలెక్టరేట్కు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
భక్తవత్సలా.. నిత్యనిర్మలా..
● మార్మోగిన గోవింద నామస్మరణ ● వాడపల్లికి పోటెత్తిన భక్తులు ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంతో పాటు దేవస్థానానికి వచ్చే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. స్వామివారికి అర్చకులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించి, భక్తులను దర్శనాలకు అనుమతించారు. దేవదాయశాఖ ఉప కమిషనర్, ఆలయ ఈవో నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా.. ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. గౌతమీ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, మాడ వీధులలో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు లక్షమందికి పైగా భక్తులు విచ్చేసినట్టు ఆలయ చైర్మన్ ఎం.వెంకటరాజు, ఈవో నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. డీఎస్పీ సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో రావులపాలెం సీఐలు సీహెచ్ విద్యాసాగర్, శేఖర్ బాబు, ఎస్ఐ ఎస్.రాము, సిబ్బంది వాడపల్లిలో ట్రాఫిక్ను నియంత్రించారు. అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్వామివారి ఆలయానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది. ఆత్రేయపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారుల పర్యవేక్షణలో సిబ్బంది మూర్తి ఆలయ ఆవరణలోని నడింపల్లి రాజేశ్వరీదేవి మంటపంలో వైద్య శిబిరం, ఈవో పర్యవేక్షణలో మరో వైద్య శిబిరం నిర్వహించారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి నిర్వహించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. -
15 కిలోల గంజాయి పట్టివేత
ఎటపాక: ఆటోలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని ఎటపాక పోలీసులు శనివారం పట్టుకున్నారు. సీఐ కన్నపరాజు కథనం ప్రకారం.. ముందస్తు సమాచారం మేరకు ఎస్సై అప్పలరాజు నెల్లిపాక జాతీయ రహదారిపై ఉన్న అటవీ శాఖ చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో భద్రాచలం వైపు వెళ్తున్న ఓ ఆటోను తనిఖీ చేయగా, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. సంచిలో 15 కిలోల గంజాయి ఉండటంతో ఆటోను, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. అడపా రాకేష్, కణితి సాయిరామ్లు తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా కోదాడకు ఒడిశా రాష్ట్రం నుంచి ఆటోలో గంజాయి తరలిస్తున్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పారిపోయారని ఎస్సై తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు. -
యాస్ట్రో టర్ఫ్ హాకీ మైదానాలు ఏర్పాటు చేయాలి
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి హాకీ అభివృద్ధి చెందాలంటే ప్రతి జిల్లాలో యాస్ట్రో టర్ఫ్ హాకీ మైదానాలు ఏర్పాటు చేయాలని ఒలింపియన్, మాజీ ఇండియన్ టీమ్ గోల్ కీపర్ రజని తెలిపారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న జాతీయ స్థాయి మొదటి గోల్డ్కప్ హాకీ పోటీలను శనివారం తిలకించేందుకు తిరుపతి నుంచి ఆమె విచ్చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆమె తన క్రీడానుభవాలు పంచుకున్నారు. తిరుపతి జిల్లాకు చెందిన తనను పీఈటీ వెంకటరాజు, ప్రసన్నకుమార్లు గుర్తించి క్రీడాల్లో ప్రోత్సహించారన్నారు. 2007లో తొలిసారి జూనియర్ నేషనల్స్ ఆడానని, 2009లో జాతీయ జట్టుకు ఎంపికై నట్లు తెలిపారు. 2013 నుంచి 2024 వరకూ ఏసియా కప్, ఏసియన్ చాంపియన్షిప్ ట్రోఫీ, వరల్డ్ కప్, కామన్ వెల్త్గేమ్స్, రియో ఒలింపిక్స్, ఏసియన్ గేమ్స్లో బంగారు, రజత, కాంస్య పతకాలు సాఽధించానన్నారు. కాకినాడలో జాతీయ స్థాయి పోటీలు ఈ స్థాయిలో నిర్వహిస్తున్న కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ను ఆమె అభినందించారు. భవిష్యత్తులో కాకినాడ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారు కావడానికి ఇదో చక్కని వేదిక అన్నారు. విశాఖ, తిరుపతి, కాకినాడలో హాకీ యాస్ట్రో టర్ఫ్ మైదానాలు ఉన్నాయని, ప్రభుత్వం ప్రతి జిల్లాలో హాకీ మైదానాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కాకినాడలో జరుగుతున్న పోటీల్లో దేవేష్, దీపక్, రాఘవన్ వంటి జాతీయ, అంర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఆడుతున్నారని, వర్ధమాన క్రీడాకారులు వీరి నుంచి ఎంతో నేర్చుకోవచ్చన్నారు. సాధించాలనే పట్టుదల, అంకితభావం, నేర్చుకోవాలనే తపన ఉంటే ఏ క్రీడలోనైనా రాణించవచ్చన్నారు. -
‘పుష్ప’తో ఒక్కసారిగా క్రేజ్
మారేడుమిల్లి, చింతూరు మండలాల్లో చిత్రీకరించిన పాన్ ఇండియా సినిమా పుష్ప ద రైజింగ్ విడుదలై సూపర్ హిట్ కావడంతో మన్యం ప్రాంతంపై ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. మారేడుమిల్లి మండలం గుడిస, చింతూరు మండలం ఫోర్ బై ప్రాంతంలో ఈ సినిమా చిత్రీకరణ అధిక శాతం జరిగింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ సమయంలో గుడిస ప్రాంతంలోని ఒంపులు తిరిగే ఎర్రటి ఘాట్ రోడ్పై వాహనాలు వెళ్లే దృశ్యాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. చింతూరు మండలం ఫోర్ బై రిజర్వాయర్ వద్ద ఈ సినిమాలోని సామీ, సామీ సాంగ్తో పాటు హీరో, హీ రోయిన్ నడుమ చిత్రీకరించిన కొన్ని కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. దీంతో పాటు పుష్ప–2 సినిమాలోని మరికొన్ని సన్నివేశాలను మారేడుమిల్లి, తులసిపాక సమీపంలోని సోకిలేరువాగు ప్రాంతాల్లో తీశారు. ఈ ప్రాంతాల్లో నిత్యం షూటింగ్లు జరుగుతుండడంతో స్థానిక యువతకు సైతం క్యారెక్టర్ అర్టిస్టులుగా నటించే అవకాశం లభిస్తోంది. -
పుష్కరిణి.. పట్టని ధోరణి
ఫ పాదగయలో కో‘నీటి’ కష్టాలు ఫ లక్షల మంది పుణ్యస్నానాలతో కలుషితం ఫ నీరు బయటకు పోయే ఏర్పాట్లు అవశ్యం పిఠాపురం: దేశంలోనే పేరున్న శైవక్షేత్రం.. త్రిగయలలో ఒకటైన పిఠాపురం పాదగయలో అతి పవిత్రమైన పుష్కరిణి భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతోంది. అంతటి ప్రాధాన్యం ఉన్న పుష్కరిణి ముఖ్యమైన పర్వదినాల్లో కంపు కొడుతోంది.. ఏటా దసరా, మహా శివరాత్రి పర్వదినాల్లో ఈ సమస్య తలెత్తుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై భక్తుల్లో ఆందోళన నెలకొంది. పాదగయ క్షేత్రంలోని పుష్కరిణిలో స్నానమాచరించడం పితృ ముక్తికరం, సర్వపాప హరం, సర్వాభీష్ట సిద్ధి ప్రదం అనే నానుడి ఉండడంతో, దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. భారత దేశంలోని బీహార్ రాష్ట్రంలో శిరోగయ ఉండగా, ఒడిశా రాష్ట్రంలో నాభిగయ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో పాదగయ ఉంది. త్రిగయ క్షేత్రాల్లో పాదగయకు విశిష్టత ఉంది. ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన దైవం కావడం, పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం ఉండటంతో ఈ క్షేత్రానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. స్వయం భూ శివ క్షేత్రంగా విరాజిల్లుతోంది. దీనిని వ్యాస మహర్షి స్వయంగా దర్శించుకున్నట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. మహా శివరాత్రి రోజుల్లో ఇక్కడ స్నానమాచరించని వారే ఉండరు. ఇలా చేస్తే మేలు.. పవిత్రమైన పాదగయ పుష్కరిణిలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు పాత నీరు పోయి కొత్త నీరు వచ్చే విధంగా చూడాలి. కలుషిత వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించాలి. పిండ ప్రదాన సామగ్రి బయటకు పోయే ప్రదేశాల్లోనే నిమజ్జనం చేసే విధంగా చూడాలి. ఉత్సవాలు పూర్తయ్యే వరకూ నీటి పారుదలపై దృష్టి సారించి, పుష్కరిణి పవిత్రతను కాపాడాలి. రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి. ఒక్క రోజులోనే కలుషితం పాదగయ క్షేత్రంలోని పుష్కరిణిలో ప్రతి 10 నిమిషాలకు సుమారు వెయ్యి మందికి పైగా స్నానాలు ఆచరిస్తారని అంచనా. మహా శివరాత్రి రోజున ఈ పుష్కరిణిలో సుమారు 1.50 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఇది పారే నది, ఏరు కాకపోవడంతో పాటు దీనికితోడు భక్తులు పితృ కార్యక్రమాలు చేసి పిండాలు, అరటి పండ్లు, డొప్పలు వదిలి పెట్టడంతో నీరు తొందరగా కలుషితమవుతుంది. సుమారు 24 గంటల పాటు నిర్విరామంగా భక్తుల తాకిడి ఉండి లక్షల్లో స్నానాలు ఆచరించడంతో నీరు పాడైపోతోంది. దీంతో మరుసటి రోజుకే దానిలో వేసిన వ్యర్థాలు కుళ్లి నీరు మురికి నీరుగా మారి దుర్గంధం వెదజల్లుతోంది. ఏటా ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఉత్సవాల్లో భాగంగా శివరాత్రి తరువాత స్వామివారికి నిర్వహించే త్రిశూల స్నానం పుష్కరిణిలో చేయించాల్సి ఉండగా, నీరు కంపు కొడుతుండటంతో కుళాయి నీటితో చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు చెత్తను తీయించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ౖపైపె చెత్త మాత్రమే తొలగిస్తుండగా, నీటి అడుగుకు చేరిన పిండ వ్యర్థాలు మాత్రం నీటిని కలుషితం చేస్తుంటాయి. దీంతో కేవలం ఒక్క రోజులోనే పుష్కరిణి పుణ్యస్నానాల మాట అటుంచితే, కనీసం కాళ్లు కడుగుకోవడానికి కూడా పనికిరాకుండా మారిపోతుంటాయి. దాని పక్క నుంచి కూడా వెళ్లలేనంతగా దుర్గంధం వెదజల్లుతుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం పుష్కరిణి నీరు ఒక రోజులోనే కలుషితం అవుతుంది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. పెద్ద బోర్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కొత్త నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. అలాగే పాత నీరు బయటకు పంపే ఏర్పాట్లు చేపట్టాం. కలుషిత పదార్థాలను ఎప్పటికప్పుడు ఏరి వేసేలా చూస్తున్నాం. ఐదు రోజుల పాటు నీరు కలుషితం కాకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నాం. భక్తులు కూడా తమకు సహకారం అందించాలి. –కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, ఈఓ, పిఠాపురం పాదగయ క్షేత్రం -
ఊరెళ్లారని తెలుసుకుని ఉన్నదంతా ఊడ్చేశారు!
దుర్గాడలో భారీ చోరీ పిఠాపురం: ఇంట్లో వారు ఊరెళ్లారని తెలుసుకుని గుర్తుతెలియని వ్యక్తులు, ఆ ఇంటిని కొల్లగొట్టిన సంఘటన గొల్లప్రోలు మండలం దుర్గాడలో శనివారం చోటుచేసుకుంది. భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీకి గురైంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. దుర్గాడకు చెందిన కొండేపూడి సూర్యనారాయణ తన భార్యతో కలసి పూణేలో ఉంటున్న తన కుమారుడి ఇంటికి గత 24న వెళ్లారు. వెళ్లే ముందు తన ఇంటికి తాళాలు వేసి అదే గ్రామంలో నివాసముంటున్న తన అల్లుడు వెలుగుల భాస్కరరావుకు తన ఇంటిని అప్పగించారు. అప్పటి నుంచి ఇంటిని చూస్తున్న భాస్కరరావు రోజూ బయట గేటు తాళాలు తీసి ఇంటి బయట తుడిపించడం, లైట్లు వేయించడం చేస్తున్నారు. శనివారం వచ్చి చూసేసరికి ఇంటి ప్రధాన తలుపులు తీసి ఉండడంతో అనుమానం వచ్చి లోపలకు వెళ్లి చూడగా, దొంగతనం జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. సుమారు 50 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి ఆభరణాలతో పాటు కొంత నగదు పోయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును పిఠాపురం సీఐ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు. -
సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం
● ఎస్పీ రాహుల్ మీనా ● పోలీస్ పీజీఆర్ఎస్లో వినతుల స్వీకరణ అమలాపురం టౌన్: పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ ప్రాధాన్యమిస్తుందని ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఆయన ప్రత్యేక పోలీస్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది తమ బదిలీలు, సెలవులు, ఆరోగ్య సమస్యలు, సర్వీస్ ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చినట్టు ఆయన తెలిపారు. వారి విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, అలాగే వారి సంక్షేమానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల నుంచి కొందరు సిబ్బంది వచ్చి తమ వ్యక్తిగత సమస్యలు, వృత్తి పరమైన సమస్యలను ఎప్పీకి విన్నవించుకున్నారు. పరీక్షలకు సిద్ధంకండి ● పదో తరగతి విద్యార్థులకు ధైర్యం చెప్పిన డీఈవో నాగేశ్వరరావు ఐ.పోలవరం: పదో తరగతి పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున విద్యార్థులు సిద్ధంగా ఉండాలని డీఈవో పి.నాగేశ్వరరావు సూచించారు. మండలం మురమళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలలో ఉత్తమమైన మార్కులు సాధించేలా వారికి పలు సూచనలిచ్చారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించి విషయ నిపుణులతో మెళకువలు నేర్పించారు. ప్రముఖ సైకాలజిస్టు ఎన్.సన్ షైన్, విషయ నిపుణులు పాల్గొని జిల్లా లోని సీ, డీ గ్రేడ్లలో ఉన్న 3,600 మంది విద్యా ర్థులకు పరీక్షలకు తీసుకోవలసిన జాగ్రత్తలను చెప్పించారు. ఎంఈవో వీధి సురేష్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీఈబీ కార్యదర్శి బి.హనుమంతరావు, హెచ్ఎం ఎస్.సుజాత, సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనసు నియంత్రణతో సానుకూల శక్తి ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ శివాని అమలాపురం రూరల్: మనసును నియంత్రించుకోవడం ద్వారా భావోద్వేగాలను సానుకూల శక్తిగా మార్చుకోవచ్చునని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ బీకే శివాని అన్నారు. శుక్రవారం రాత్రి కిమ్స్ కళాశాల ప్రాంగణంలో అమలాపురం బ్రహ్మకుమారీస్ హార్మొనీ హౌస్ ఆధ్వర్యంలో ఆమె ప్రసంగించారు. భావోద్వేగాలను సరైన మోతాదులో ప్రదర్శిస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదని, వాటిపై నియంత్రణ లేనపుడే మనిషి విచక్షణ కోల్పోతాడని, తద్వారా క్షణికావేశంలో దారుణాలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మహేష్కుమార్ మాట్లాడుతూ ఇటువంటి భావోద్వేగ అవగాహన కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. మాజీ ఎంపీ చింతా అనురాధ, జేసీ నిషాంతి, కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు, ఆర్డివో కె.మాధవి, మెట్ల రమణబాబు, బీకే శ్రీదేవి, వంటెద్దు వెంకన్నాయుడు పాల్గొన్నారు. అన్నదానానికి రూ.1,67,126 విరాళాలు ఆత్రేయపురం: వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి దాతలు రూ.1,67,126 విరాళాలు సమర్పించారు. అమలాపురం బసవ సత్య వెంకట సుబ్బారావు, దుర్గా దంపతులు రూ.50,116, అంకంపాలెం తవ్వ అరుణ్ కుమార్, సిరి దంపతులు రూ.66,892, హైదరాబాద్ నవీన్ కుమార్, నవత దంపతులు రూ.25,116, నూజువీడు వట్టికూటి చిరంజీవి కుటుంబం రూ.25వేల విరాళం అందించారు. వీరికి ఆలయ ఈవో నల్లం సూర్య చక్రధరరావు, అర్చకులు, వేదపండితులు స్వామి వారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు, ఫొటోలు అందజేశారు. -
పారదర్శకంగా జనాభా లెక్కలు
అమలాపురం రూరల్: జనాభా లెక్కలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో 2027 జనాభా లెక్కల సేకరణపై వారికి విధివిధానాలు వివరించారు. వివరాల నమోదుపై ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఈ మేరకు శిక్షణ ఇవ్వాలన్నారు. మొబైల్ యాప్లు, ఆన్లైన్ పోర్టల్ ద్వారా డిజిటల్ విధానంలో మొదటి సారిగా సమగ్ర కుల గణన చేస్తున్నారన్నారు. మొదటి దశలో ఇళ్లు, రెండో దశలో జనాభా గణన, తద్వారా కులాల వారీగా సమగ్ర వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. ఆ గణాంకాలను అనుసరించి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సీట్ల సర్దుబాట్లు ఉంటాయన్నారు. సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనా, డీఆర్వో కె.మాధవి, ఆర్డీఓలు పి.శ్రీకర్, దేవరకొండ అఖిల, సీపీఓ మురళీకృష్ణ పాల్గొన్నారు. అధికారులకు అభినందనలు జిల్లాలో ఇటీవల నిర్వహించిన డ్రాగన్ పడవల పోటీలు, జగ్గన్నతోట తీర్థం, అంతర్వేది లక్ష్మీనరసింహుని ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించిన అధికారులను కలెక్టర్ అభినందించారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఈ నెల 15న జిల్లా వ్యాప్తంగా 6 ప్రాంతాలలో నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లలపై సమీక్షించారు. పోలీస్ రెవెన్యూ దేవదాయ, ధర్మదాయ శాఖలు భక్తులకు అన్ని విధాలా సహకరించాలని, ప్రొటోకాల్ నిబంధనలను పాటించాలని సూచించారు. డీఎస్పీలు మురళీమోహన్ టీఆర్ఎస్కే ప్రసాద్, జిల్లా అగ్నిమాపక అధికారి పార్థసారధి పాల్గొన్నారు. -
కోటి తులసి పూజకు శ్రీకారం
● సత్యదేవుని సన్నిధిలో ఘనంగా ప్రారంభం ● 10 రోజుల పాటు నిర్వహణ ● పాలు పంచుకుంటున్న 60 మంది పండితులుఅన్నవరం: సత్యదేవుని సన్నిధిలో పది రోజుల పాటు జరిగే కోటి తులసి పత్రి పూజ ఘనంగా ప్రారంభమైంది. రత్నగిరి రామాలయం వద్ద సత్యదేవుని వార్షిక కల్యాణ మండపంలో శుక్రవారం ఉదయం 7.30 గంటలకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు పండితుల మంత్రోచ్చారణల నడుమ ఈ పూజకు శ్రీకారం చుట్టారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు తులసి దళాలు సమర్పించారు. కోటి తులసి పూజలో పాల్గొంటున్న వేద పండితులు, అర్చకులు, వ్రత పురోహితులు, ఆగమ పాఠశాల విద్యార్థులకు చైర్మన్, ఈఓలతో పాటు అసిస్టెంట్ కమిషనర్ ఎం.మంజులాదేవి దీక్షా వస్త్రాలు అందించారు. 15వ తేదీ వరకూ.. కోటి తులసి పూజలో భాగంగా మహాలింగార్చన, సూర్య నమస్కారాలు, నవావరణార్చన, రామాయణ, భారత, భాగవత పారాయణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాల అనంతరం, రుత్విక్కులు విష్ణు సహస్ర నామాలు పఠిస్తూ స్వామి, అమ్మవార్లను తులసి దళాలతో అర్చించారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకూ ఈ కార్యక్రమం కొనసాగింది. అనంతరం, స్వామి, అమ్మవార్లకు నివేదనలు చేసి, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించి, భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ తులసి పూజ నిర్వహించారు. రోజుకు 10 లక్షల చొప్పున ఈ నెల 15వ తేదీ నాటికి కోటి తులసి పూజ పూర్తి చేస్తారు. చివరి రోజు ఉదయం 8 గంటలకు రుద్రహోమం నిర్వహించడంతో ఈ మహా క్రతువు ముగియనుందని ఈఓ త్రినాథరావు తెలిపారు. ప్రతిధ్వనించిన వేదనాదం కోటి తులసి పూజ సందర్భంగా రత్నగిరిపై వేదనాదం ప్రతిధ్వనించింది. దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, యనమండ్ర శర్మ ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, సూర్యనారాయణ, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు సుధీర్, దత్తాత్రేయశర్మ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, కొంపెల్ల మూర్తి, పరిచారకులు శివ, పవన్, మరో 60 మంది పండితుల సుస్వర వేద మంత్రోచ్చారణలతో ఈ క్రతువు నిర్వహించారు. ఈ పూజను పురస్కరించుకుని సత్యదేవుని వార్షిక కల్యాణ మండపం, విశ్రాంతి మండపాలను పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహాయజ్ఞంతో సమానమైన ఈ క్రతువును అందరూ తిలకించి సత్యదేవుని కృపకు పాత్రులు కావాలని పండితులు కోరారు. కోటి తులసి పూజకు రూ.5 లక్షల విరాళం సమర్పించిన అరబిందో ఫార్మా కంపెనీ తరఫున డైరెక్టర్ లక్ష్మి, దేవస్థానానికి వివిధ రూపాల్లో సుమారు రూ.20 లక్షల విరాళం ఇచ్చిన పీఎస్ కుమార గురుపరన్, శాంతి దంపతులు (చైన్నె), పలువురు దాతలు స్వామివారికి తులసి దళాలు సమర్పించారు. ఏర్పాట్లను ఏఈఓలు కృష్ణారావు, అనకాపల్లి ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గణపతి తదితరులు పర్యవేక్షించారు. సుమారు 50 మంది స్వచ్ఛంద సేవా కార్యకర్తలు తులసి దళాలను సిద్ధం చేసే సేవలో పాల్గొన్నారు. సత్యదేవుని దీక్ష ప్రచార కర్త నల్లమిల్లి కృష్ణబాబు కూడా సేవలో పాల్గొన్నారు. ● కోటి తులసి పూజ సందర్భంగా స్వామివారి వార్షిక కల్యాణ వేదికపై అలంకరణ బాగుంది. అయితే, కల్యాణ వేదిక నుంచి విశ్రాంతి మండపం వరకూ షామియానా వేయడంతో ఆ అలంకరణతో పాటు కల్యాణ వేదిక గోపురం కూడా కనిపించడం లేదు. దీనిపై అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిని గుర్తించిన ఈఓ త్రినాథరావు ఆ షామియానాను తొలగించాలని ఆదేశించారు. ● 2022లో కోటి తులసి పూజ జరిగినప్పుడు మండపం ప్రారంభంలో తులసి మొక్కల కుండీల నడుమ సత్యదేవుని ఉత్సవమూర్తులను ఏర్పాటు చేశారు. భక్తులు అక్కడ ఫొటోలు దిగేవారు. ఇప్పుడు అటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ● 2022తో పోల్చితే అలంకరణ కూడా తక్కువగా ఉంది. మిగిలిన రోజుల్లోనయినా అలంకరణ బాగా చేయాలని భక్తులు కోరుతున్నారు. -
గాండ్రింపు ఆగింది..
చిక్కదు.. దొరకదు.. అన్నట్టుగా తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులి.. ఎట్టకేలకు పట్టుబడింది. రాయవరం మండలం కూర్మాపురంలోని ఓ పాడుబడిన ఇంట్లో నక్కిన పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ, అది అక్కడి నుంచి తప్పించుకుని, సాయంత్రానికి సమీపంలోని పశువుల పాకలో నక్కింది. అక్కడి నుంచి అది తప్పించుకోవడానికి వీలు లేకుండా.. ఆ పాక చుట్టూ అధికారులు వల పన్ని, చివరకు ట్రాంక్విలైజర్తో మత్తు మందు ఇచ్చి, బంధించారు. దీంతో, గత నెల 31న సీతానగరం మండలంలో మొదలైన టైగర్ టెర్రర్కు తెర పడింది. – వివరాలు 8లో.. -
పింఛను బకాయిలు చెల్లించాలి
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అమలాపురం టౌన్: పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. స్థానిక గొల్లగూడెంలో శుక్రవారం జరిగిన జిల్లా పెన్షనర్ల సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏపీ జీఈఏ జిల్లా అధ్యక్షుడు మద్దాల బాపూజీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీజీఈఏ విజయనగరం జిల్లా సంఘం ఉపాధ్యక్షుడు పైడిరాజు, జిల్లా సంఘం అధ్యక్షుడు కె.మల్లిబాబు, తూర్పు గోదావరి జిల్లా సంఘం అధ్యక్షుడు గిరిప్రసాద్ వర్మ ప్రసంగించారు. పెన్షనర్లకు రావలసిన డీఏ బకాయిలు, గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ తదితరాలతో పాటు గత పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పలు డిమాండ్లపై సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేధావి వర్గం నుంచి ప్రతిభావంతుడైన పెన్షనర్ను కో ఆప్షన్ సభ్యుడిగా లేదా ఆధార్ మెంబర్గా నియమించాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. -
పన్నులు వసూలైతేనే పురాభివృద్ధి
● మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు ● కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష అమలాపురం టౌన్: ప్రజలు పన్నులు నూరుశాతం చెల్లించినపుడే మున్సిపాలిటీలు పురోభివృద్ధి సాధిస్తాయని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ సీహెచ్ నాగ నరసింహారావు అన్నారు. వచ్చే మార్చి నెలాఖరు నాటికి పన్నులను పూర్తి స్థాయిలో చెల్లించి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని 6 మున్సిపాలిటీల కమిషనర్లతో వారి పరిధిలో పన్నులు, పనుల స్థితిగతులపై శుక్రవారం సమీక్షించారు. అంతకు ముందు ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆస్తి, తాగునీరు, ఖాళీ స్థలాల పన్నుతో పాటు ప్రకటనల పన్ను, ట్రేడ్ లైసెన్సులు, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లలో అద్దెలను సకాలంలో చెల్లించేలా చూడాలని కోరారు. రెండు జిల్లాల పరిధిలోని అమలాపురం, రామచంద్రపురం, ముమ్మిడివరం, మండపేట, నిడదవోలు, కొవ్వూరు మున్సిపాలిటీల్లో జనవరి నెలాఖరు నాటికి ఉన్న బకాయినను వివరించారు. అమలాపురం మున్సిపాలిటీలో ఆస్తి పన్ను 49.83 శాతం, తాగునీటి పన్ను 46.81 శాతం, నిడదవోలు మున్సిపాలిటీలో 52.83 శాతం, 44.06 శాతం, రామచంద్రపురం మున్సిపాలిటీలో 57.16 శాతం, 10.7 శాతం, మండపేట మున్సిపాలిటీలో 59.83 శాతం, 15.64 శాతం, ముమ్మిడివరం నగర పంచాయతీలో 62.68 శాతం, 7.07 శాతం, కొవ్వూరు మున్సిపాలిటీలో 67.79 శాతం, 33.27 శాతం వసూలైనట్టు తెలిపారు. సమీక్షలో భాగంగా దోమలు, పందులు, కుక్కుల బెడద తదితర అంశాలపై చర్చించారు. దాదాపు రూ.5 కోట్లతో ప్లాస్మా టెక్నాలజీలో పది టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తాగునీటి ఎద్దడి ప్రాంతాల పరిశీలన అంతకు ముందు ఆర్డీ నాగ నరసింహారావు అమలాపురం మున్సిపల్ కమిషర్ వి.నిర్మల్కుమార్తో కలసి స్థానిక గాంధీనగర్లోని తాగునీరు సక్రమంగా అందని ప్రాంతాలను పరిశీలించారు. హాట్స్పాట్ ద్వారా ఒకే వార్డు సచివాలయం నుంచి పదేపదే తాగునీటి ఫిర్యాదులు అందుతున్నట్లు తాను వెబ్సైట్ నుంచి గుర్తిస్తున్నానని వివరించారు. ఈ తరహాలో అమలాపురం గాంధీనగర్ ప్రాంతం నుంచి ఫిర్యాదులు రావడంతో ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి తాగునీటి సమస్య పరిష్కారానికి నిత్యం ట్యాంకర్ పంపించేలా కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారని ఆర్డీ పేర్కొన్నారు. -
దొంగే దొంగ అన్నట్టు!
● తమ్ముళ్ల కబ్జాలో పర్ర భూములు ● ఆక్రమణలు తొలగించాలంటున్న అమలాపురం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు ● అధికారంలో ఉండి చర్యలు తీసుకోకపోగా నిరసనలు ఏమిటని ప్రశ్నిస్తున్న రైతులు ● గత ప్రభుత్వంలో ఆక్రమణల తొలగింపునకు అనుమతులు ● స్వయంగా సమీక్షించిన నాటి సీఎం జగన్ ● ఎన్నికలు రావడంతో చర్యలు పక్కకు ● పర్యవసానంగా సాగునీటికి అవరోధం ● ఏటా అన్నదాతలకు తప్పని తిప్పలు సాక్షి, అమలాపురం: ‘జిల్లాలో మురుగునీటి కాలువలలో తూడు, గుర్రపు డెక్క తొలగింపునకు గత ఏడాది ప్రభుత్వం రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేసింది. కాని గోదావరి మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీలో కీలక టీడీపీ నేత ఒకరు మొత్తం పనులు చేస్తానని పనులు చేయకుండా వదిలేశారు. గత ఏడాది భారీ వర్షాలు.. గోదావరికి ఐదుసార్లు వచ్చిన వరదలు.. మోంథా తుపాను వల్ల సుమారు 77 వేల ఎకరాల్లో వరి పంట నష్టానికి ఇదే ప్రధాన కారణం. అయినా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నోరు మెదపలేదు. పనులు పూర్తి చేయలేదు’. కాలం కాని కాలంలో జిల్లాలో సహజ సిద్ధంగా ఏర్పడిన పర్ర భూములు (సాంప్)లు ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని తక్షణం తొలగించాల్సిందేనని టీడీపీ అనుబంధ కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద పర్ర భూములలో ఆక్రమణల తొలగించాలని రైతులు ధర్నాకు దిగడం.. ఇందుకు అధికార పార్టీకి చెందిన అమలాపురం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు వచ్చి సంఘీభావం తెలపడం తెలిసిందే. వారిని చూసి విస్తుపోయిన రైతులు అధికారం చేతిలో ఉన్నవారు సాంప్లలో ఆక్రమణలు తొలగించడం మానేసి ఇలా ధర్నాలకు దిగడమేమిటని ప్రశ్నిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే పర్ర భూముల కబ్జాదారులలో అధికంగా టీడీపీ అనుకూలురే కావడం గమనార్హం. గోదావరి డెల్టాలో ప్రస్తుతం రబీ సాగులో ఉంది. శివారుకు నీరందక జిల్లాలో నాట్లు ఆలస్యమవుతున్నాయి. మరీ ముఖ్యంగా సాగు ఆలస్యమవుతోంది. అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలలోనే ఈ విషయమై మాట మాత్రమైనా స్పందించని ఇద్దరు ఎమ్మెల్యేలు పర్ర భూమి ఆక్రమణలపై స్పందించడం గమనార్హం. పర్ర భూములలో ఆక్రమణలు తొలగించాలని తీర మండలాల రైతులు దశాబ్దాలుగా కోరుతున్నారు. పులికాట్... కొల్లేరు తరహాలోనే కోనసీమలోని కాట్రేనికోన వృద్ధ గౌతమీ నదీపాయ నుంచి అల్లవరం మండలం వైనతేయ నదీపాయ వరకు సుమారు 6 వేల ఎకరాల్లో పర్ర భూములున్నాయని అంచనా. వీటిని ఆనుకుని రామేశ్వరం, కూనవరం మొగలు ఉండగా, వీటి ద్వారా ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలకు చెందిన 40 వేల ఎకరాల ఆయకట్టు ముంపునీరు సముద్రంలో చేరుతోంది. మొగలు తెరుచుకోకపోవడం, పర్ర భూముల ఆక్రమణల వల్ల రైతులు ఏటా సుమారు రూ.60 కోట్ల విలువైన పంటను కోల్పోతున్నారు. మొగల ద్వారా నేరుగా సముద్రంలోకి నీరు దిగే అవకాశం తక్కువ. భారీ వర్షాల సమయంలో ముంపునీరు రామేశ్వరం, కూనవరం డ్రెయిన్ల నుంచి పర్ర భూములలోకి వెళ్లేది. కూనవరం డ్రెయిన్ నీరు చిర్ర యానం పర్ర భూమి ద్వారా వెళ్లి పల్లం, నీళ్లరేవు, ఏటిమోగ వద్ద గౌతమీ నదీపాయలో కలిసి అక్కడ నుంచి సముద్రంలోకి వెళ్లేది. దీని వల్ల భారీ వర్షాల సమయంలో చేలు ముంపుబారిన పడినా రెండు, మూడు రోజుల్లో నీరు తీసేది. పర్రభూముల్లో ఆక్వా చెరువులు పెద్ద ఎత్తున వచ్చాయి. రామేశ్వరం పర్ర భూముల్లో 480 ఎకరాలు, ఎస్.యానాం, చిర్ర యానాం పర్ర భూముల్లో సుమారు 1,650 ఎకరాలు అక్రమంగా ఆక్వాసాగవుతున్నట్టు అంచనా. సుమారు 2,130 ఎకరాల భూమి కబ్జాల బారిన పడడంతో డ్రెయిన్ల ద్వారా వస్తున్న ముంపునీరు పర్రభూముల్లోకి వెళ్లే సామర్థ్యం పడిపోయింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్), మెడ్రాస్ కన్జెర్వెన్సీ చట్టాలను తోసిరాజని పర్ర భూముల్లో ఆక్వా చెరువులు తవ్వుతున్నా... వేలాది ఎకరాల వరి ఆయకట్టు ముంపునకు కారణమవుతున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు.తొలగింపునకు కమిటీలు పర్ర భూములలో కబ్జాల తొలగింపునకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఆయకట్టు రైతులు, రైతు సంఘాలు, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ నుంచి వెళ్లిన విజ్ఞాపనలపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా స్పందించి సమీక్షించారు. పర్ర భూములను సర్వే చేయించడంతో పాటు ఆక్వా చెరువులు తొలగించాలని నిర్ణయించారు. మండల స్థాయిలో తహసీల్దార్, మత్స్యశాఖ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రాష్ట్ర ఫిషరీష్ కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్కు మౌఖిక ఆదేశాలు కూడా వచ్చాయి. ఈ సమయంలో ఎన్నికలు రావడంతో సర్వే, కబ్జాల తొలగింపు పక్కకు పోయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సర్వే చేసి తొలగింపు చర్యలు చేపట్టవచ్చు. చంద్రబాబు సర్కార్ కొలువుదీరి 19 నెలలు కావస్తోంది. కాని ఇంత వరకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. స్థానిక ఎమ్మెల్యేలు శాసనసభలోను, ప్రభుత్వం వద్ద ఈ విషయాన్ని లేవనెత్తి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యపై ఒత్తిడి చేసి ఉంటే ఇప్పటికే పర్ర కబ్జాల బారి నుంచి బయటపడేది. కాని ఇవేమీ చేయకుండా అధికారంలో ఉండి కూడా ధర్నాలకు సంఘీభావం చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయకట్టు రైతులు విమర్శిస్తున్నారు. -
'పులి'.. అక్కడ చిక్కింది.. ఇక్కడ నక్కింది!
రాయవరం: వారం రోజులుగా తూర్పు గోదావరి జిల్లా ప్రజలను వణికించిన పులి ఎట్టకేలకు రాయవరం మండలం కూర్మాపురంలో పట్టుబడింది. గ్రామంలోని పంట పొలాల్లో శుక్రవారం ఉదయం రైతులకు పులి కనిపించింది. పాద ముద్రలను గుర్తించిన వారు గ్రామ శివార్లలోని చెరువు గట్టు వద్ద దాని గాండ్రింపులు వినిపించడంతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ, పోలీసు అధికారులు అక్కడకు చేరుకున్నారు. గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలో తిష్ట వేసినట్లు గుర్తించారు. వెంటనే ఆ ఇంటిని చుట్టుముట్టారు. ట్రాంక్విలైజేషన్ ద్వారా పూణే నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ పులిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే, అధికారుల కళ్లుగప్పి ఆ పులి గోడ దూకి పారిపోయింది. అక్కడి నుంచి ఓ పశువుల పాకలోకి దూరింది. ఆ పాక చుట్టూ అధికారులు వలలు పన్ని పులిని పట్టుకునేందుకు వ్యూహం రచించారు. బయటకు రాగానే ట్రాంక్విలైజేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో పులి బయటకు రావడంతో రెస్క్యూ టీమ్ సిబ్బందిలో ఇద్దరు ట్రాంక్విలైజర్ (తుపాకి వంటి సాధనం)తో మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. దీంతో పులికి ఇంజక్షన్ తగిలి 100 మీటర్ల దూరం వెళ్లి గ్రామంలోని దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద మత్తు తో పడిపోయింది. నిమిషాల వ్యవధిలో అధికారులు పులిని బోనులోకి నెట్టా రు. విశాఖపట్నంలోని జంతు ప్రదర్శన శాలకు తరలిస్తున్నామని చెప్పారు.రఘునాథపల్లి మండలంలో లేగదూడపై పెద్దపులి దాడి రఘునాథపల్లి/బచ్చన్నపేట: జనగామ జి ల్లా రఘునాథపల్లి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మండెల గూడెం శివారులోని పరిశె రాజుకు చెందిన లేగదూడపై శుక్రవారం తెల్లవారుజా మున పెద్ద పులి దాడిచేసి చంపింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై దూదిమెట్ల నరేశ్, డీఎఫ్వో కొండల్రెడ్డి, సిబ్బందితో వెళ్లి పులి పాదముద్రలు గుర్తించారు. అవి పులి అడుగులేనని నిర్ధా రించారు. పులిని సురక్షితంగా బంధించేందుకు చర్యలు చేపట్టినట్లు డీఎఫ్వో కొండల్రెడ్డి పేర్కొన్నారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.మద్దూర్లో పులి సంచారం...జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సరిహద్దు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామంలో పులి పాదముద్రలను గుర్తించారు. శుక్రవారం ఉదయం గ్రామ పొలాల్లో పులి అడుగులను గుర్తించిన రైతులు.. పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రమేశ్, ఎస్సై ఆసిఫ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాముడు కలిసి వచ్చి పాదముద్రలు పరిశీలించారు. పులి అడుగులుగా నిర్ధారించారు. పక్క గ్రామాలైన బచ్చన్నపేట మండలంలో కట్కూర్, వీఎస్ఆర్ నగర్, బండనాగారం, బంజేరు, మార్మాముల గ్రామాల సర్పంచ్లకు సమాచారమిచ్చి జాగ్ర త్తగా ఉండాలని సూచించారు. కాగా, రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లో సంచరిస్తున్న పులులు వేర్వేరని, రెండు పులులు ఉన్నట్లు భావిస్తున్నారు. -
East Godavari: కూర్మాపురంలో పెద్దపులి.. రాత్రంతా ఆ ఇంట్లోనే..
రోజుకో రూటులో పులి తిరుగుతోంది.. ఎటెళ్తుందో ఎవరికీ అంతు‘చిక్కకుండా’ పోతోంది.. దానిని పట్టుకునేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖలు శ్రమిస్తున్నా, ఆనవాళ్లను మాత్రమే వదిలి వెళ్తోంది.. అయితే పులి పంజాకు మూగజీవులు బలైపోవడం పరిపాటిగా మారింది.. ఇలా వారం రోజులుగా అధికారులను పులి పరుగులు పెట్టిస్తోంది. ఎక్కడా ఆగకుండా రోజుకో చోట ప్రత్యక్షమవుతోంది.. దీంతో ఆయా గ్రామాల్లో భయాందోళన నెలకొంది. అదిగో పులి.. ఇదిగో పులి.. వారం రోజులుగా అందరి నోటా ఇదే మాట. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం అంతటా హాట్ టాపిక్ అయ్యింది. వెళ్లిన రూటులో వెళ్లకుండా రోజుకో రూటు మారుస్తూ, ఎవరికీ దొరకుండా తిరుగుతున్న పెద్ద పులిని పట్టుకోవడం అటవీ శాఖకు సవాలుగా మారింది. దానిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి.ఈ క్రమంలో మూగజీవాలు దాని ఆకలికి బలైపోతున్నాయి. ఆరు రోజుల కిందట సీతానగరం మండలం తొర్రేడులో ఆవులపై దాడి చేసి ఆకలి తీర్చుకుంది. కోలమూరు, గాడాల, పాలచర్ల, దివాన్చెరువు మీదుగా రఘునాథపురం చేరుకుని గేదెను బలికొంది. తాజాగా భూపాలపట్నంలో ఆవును చంపింది. అక్కడి నుంచి జి.యర్రంపాలెం ఆయిల్పామ్ తోటల్లోకి వెళ్లిపోయింది. ఈ గ్రామంలో పులి దెబ్బకు మూడు లేగ దూడలు మృతి చెందాయి.హడలెత్తిపోతున్న జనం.. పెద్దపులి సంచారంతో రాజమహేంద్రవరం పరిసర మండలాల్లోని ప్రజలు హడలిపోతున్నారు. చిక్కదు.. దొరకదు అనే రీతిలో జరుగుతున్న పులి పయనంతో ఎప్పుడు ఎటువైపు వస్తుందోననే భయంతో అంతా వణికిపోతున్నారు. రాత్రి వేళల్లోనే కాదు పగటి సమయంలో కూడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులలో రాజానగరం మండలం దివాన్చెరువు, భూపాలపట్నం, పుణ్యక్షేత్రం, నామవరం, జి.యర్రంపాలెం, తుంగపాడు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని స్థితిలో ఉంటే పొలాల్లో ఉండే మూగజీవాలైన ఆవులు, గేదెలు, లేగదూడలు మాత్రం పెద్ద పులికి ఆహారంగా మారిపోతున్నాయి. ఆరు రోజులుగా నాలుగు ఆవులు, ఆరు లేగ దూడలు, రెండు గేదెలు పులి పంజాకు మృత్యువాత పడ్డాయి.రెస్క్యూ బృందాల రాక: జిల్లా కలెక్టర్ పెద్ద పులిని సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలేందుకు రెస్క్యూ బందాలను రాజమహేంద్రవరానికి రప్పించామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జి.యర్రంపాలెంలోని ఆయిల్పామ్ తోటల్లోకి పులి వెళ్లిందనే ప్రచారం నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అటవీ శాఖ సిబ్బందితో కలసి కలెక్టర్ గురువారం సందర్శించి, పులి పాదముద్రలను పరిశీలించారు. పులిని పట్టుకోవడంలో నేషనల్ ఎక్స్ఫర్ట్ టీమ్ ఇప్పటికే జిల్లాకు చేరుకుందన్నారు. సీసీఎఫ్ మార్గదర్శంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన బృందాలు కూడా పనిచేస్తున్నాయన్నారు. అలాగే థర్మల్ డ్రోన్, ట్రాప్ కెమెరాలను సిద్ధం చేశామని అన్నారు.వెటర్నరీ వైద్యులు, వన్యప్రాణి నిపుణులు రంగంలోకి వచ్చారని వివరించారు. పులి జాడ తెలిసిన వెంటనే పట్టుకునే విధంగా ఏర్పాట్లు చేశారన్నారు. అయితే పులి సంచరించిన చోట పాదముద్రలను చెడగొట్టకుండా గ్రామస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పులి సంచరించే ప్రాంతాల్లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ అ«ధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. దానిని రెచ్చకొట్టే పనులు మాత్రం చేయవద్దని కోరారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జిల్లా ఎస్పీ నరసింహకిశోర్, డీఎఫ్ఓ బి.ప్రభాకరరావు, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పీవీ చలపతిరావు, సీపీఎఫ్ బీఎన్ఎన్ మూర్తి, ఎఫ్ఆర్ఓ దావీదురాజు నాయుడు, ఎనీ్టసీఏ అధికారి రాజశేఖర్, మత్తు వైద్యులు ఫణీంద్ర ఉన్నారు. కేశవరంలోకి..మండపేట మండలం కేశవరం గ్రామ శివారు కోకాకోలా ఫ్యాక్టరీ సమీపంలోని ఉండమట్ల లక్ష్మయ్య వ్యవసాయ క్షేత్రంలో పులి సంచరిస్తోందని అధికారులు భావిస్తున్నారు. గురువారం రాత్రి సుమారు ఐదు సెకన్ల పాటు పులి సంచరించినట్టు ఆ ప్రాంతంలోని డ్రోన్ కెమెరాలో పడినట్లు చెబుతున్నారు. అయితే పులి మండపేట మండలం నుంచి పక్కన అనపర్తి మండలంలోకి వెళ్లే అవకాశం ఉండడంతో పోలీస్, అటవీ తదితర శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు.మండపేట మండలం కేశవరం ద్వారపూడి వేములపల్లి జెడ్ మేడపాడు గ్రామ పరిధిలో పులి సంచరిస్తున్నట్లు తెలిపారు. ఆ గ్రామాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయట సంచరించవద్దని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు తెలిపారు.రాయవరం మండలంలోకి..ఇవాళ ఉదయం(శుక్రవారం) పెద్దపులి.. రాయవరం మండలంలోకి ప్రవేశించినట్లు అధికారులు చెబుతున్నారు. జి.ఎర్రం పాలెం నుంచి చెల్లూరు మీదుగా కూర్మాపురం వెళ్లిన పులి. మనుషుల్లేని ఇంట్లో రాత్రంతా ఉన్నట్లు తెలిపారు. కూర్మాపురానికి చేరుకున్న పెద్దపులి.. పాలచర్ల రాజు గారికి చెందిన ఓ ఇంట్లోకి చేరింది. కుక్కలు మొరగడంతో స్థానికులు గుర్తించారు. ఆ ఇంటి వద్దకు అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. కూర్మాపురం పరిసర గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. -
దక్కని ఆధరవు
సాక్షి, అమలాపురం/ రావులపాలెం: జిల్లాలో కొబ్బరి, అరటి, వెనామీ రొయ్యల ధరలు పెరిగినా రైతులకు లబ్ధి చేకూరడం లేదు. మార్కెట్లో సరకుకు డిమాండ్ ఉండి మంచి ధర పలుకుతున్నా ఆ ఫలాలను అందుకోలేని స్థితిలో రైతులు ఉన్నారు. ఆశించిన స్థాయిలో ధరలు పెరిగినా దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడం వల్ల గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరికి మంచి రేటు నాలుగు నెలలుగా ధర లేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఊరట కలిగిస్తూ గత నెల నాలుగో వారంలో కొబ్బరి ధరలు పెరిగాయి. అంబాజీపేట మార్కెట్లో పచ్చి కొబ్బరి వెయ్యికాయల ధర రూ.19 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంది. గయర కాయ (పెద్ద కాయ) ధర రూ.21 వేల వరకు పెరిగింది. అడపాదడపా తగ్గుతున్నా డిమాండ్ను బట్టి మార్కెట్లో ధర పెరుగుతోంది. పండగా సీజన్లు కావడంతోపాటు దిగుబడి గణనీయంగా తగ్గడం కూడా కొబ్బరి డిమాండ్కు కారణం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. కొబ్బరి సగటు దిగుబడి ఎకరాకు 1,200 నుంచి 1,400 కాయలు. దిగుబడి ఏకంగా 30 శాతం నుంచి 40 శాతం వరకు తగ్గి ఎకరాకు 600 నుంచి 700 కాయలు మాత్రమే వస్తున్నాయి. దీనివల్ల ధరలు పెరిగాయి. ధర పెరిగినా దిగుబడి తగ్గడం వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో పెరిగిన కొబ్బరి, అరటి, వెనామీ రొయ్యల రేట్లు అయినా రైతుకు లబ్ధి చేకూరని దుస్థితి కొబ్బరి, అరటికి కలసి వచ్చిన మహా శివరాత్రి, మాఘమాసం కొబ్బరి వెయ్యికాయలు రూ.20 వేలు 40 శాతం తగ్గిన దిగుబడులు కర్పూరం అరటి గెల రూ.700 రావులపాలెం మార్కెట్కు వచ్చేది సగం గెలలు వనామీ రొయ్యలకు అంచనాలకు మించి ధర ప్రస్తుతం పావు వంతు మాత్రమే సాగు అరటికి డిమాండ్ మూడేళ్లుగా అంతంత మాత్రంగా ఉన్న అరటి ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి. నిన్న మొన్నటిదాకా నష్టాలను చూసిన రైతులు అరటి సాగు తగ్గించడం, మరోపక్క ప్రకృతి వైపరీత్యాలకు ఉన్న పంట నేలకూలడం, మరికొంతమంది ప్రత్యామ్నాయంగా కంద, కోకో, పసుపు, కూర పంటల వైపు మొగ్గ చూపడం వంటి కారణాలతో దిగుబడి తగ్గింది. గతంలో జిల్లావ్యాప్తంగా 25,204 ఎకరాల్లో అరటిసాగు జరగగా ఇప్పుడు కేవలం 13 వేల ఎకరాల్లో మాత్రమే ఉందని అంచనా. విజయవాడ, గుంటూరు, కడప తదితర దక్షిణాంధ్ర ప్రాంతాల్లో కూడా అరటి రైతులు మొక్కజొన్న, మిర్చి పంటల వైపు మొగ్గు చూపడంతో విస్తీర్ణం తగ్గింది. విజయనగరం, సాలూరు, పార్వతీపురం తదితర ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో గాలులకు అరటి చెట్లు పడిపోవడంతో స్థానిక అరటికి డిమాండ్ పెరిగింది. రావులపాలెం మార్కెట్ యార్డ్కు రోజుకు 25 వేల నుంచి 30 వేల అరటి గెలలు ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం 10 నుంచి 12 వేల గెలలు మాత్రమే వస్తున్నాయి. దీంతో అరటి గెలలకు భారీ డిమాండ్ ఏర్పడింది. గత నెలలో రూ.200 నుంచి రూ.300 వరకు ఉన్న కర్పూరం, చక్కర కేళి తెలుపు, ఎరుపు ధరలు ప్రస్తుతం అమాంతంగా రూ.700 నుంచి రూ.800 పలుకుతున్నాయి. అరటి ధరలు మార్చి నెల వరకు ఇలాగే ఉంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మహాశివ రాత్రి, రంజాన్ మాసం ప్రారంభం కావడంతో పాటు, శ్రీరామనవమి, ఉగాది పండగలు ఉండడంతో ధరలు తగ్గే అవకాశం లేదంటున్నారు. ధర ఉన్నా సరకు లేదు గత మూడేళ్లుగా అరటికి సరైన ధర లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ధర చుక్కలలో ఉన్నా సరకు లేదు. రైతులు అరటి పంటకు ప్రత్యామ్నాయంగా కంద వైపు వెళ్లడం ఈ పరిస్థితికి కారణం. ఏప్రిల్ నాటికి అరటి పంట అందుతుంది. అప్పటి వరకు పండగలు, పూజల కారణంగా మార్చి నెలాఖరు వరకు ధరలు తగ్గకపోవచ్చు. – కోనాలా చంద్రశేఖర్ రెడ్డి, అరటి వ్యాపారి, ఊబలంక. వనామీ రేటు పెరిగినా.. వంద కౌంట్ (కేజీకి వంద రొయ్యలు) ధర ప్రస్తుతం రూ.250 వరకు ఉంది. ఇటీవల కాలంలో వంద కౌంట్కు ఈ ధర రావడం అరుదైన విషయమే. 90 కౌంట్ రూ.260 ఉండగా, 80 కౌంట్ రూ.280, 70 కౌంట్ రూ.310, 60 కౌంట్ రూ.330, 50 కౌంట్ రూ.350, 40 కౌంట్ రూ.380, 30 కౌంట్ రూ.480 వరకు ధరలు ఉన్నాయి. 30 కౌంట్కు ధర రూ.480 రావడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో వెనామీ రొయ్యల కౌంట్కు మంచి ధర వచ్చింది. తరువాత ఎగుమతులపై అమెరికా టారిఫ్ల కొరడాతో ధరలు పతనమయ్యాయి. అమెరికా టారీఫ్లు తగ్గించామని చె ప్పడానికి ముందే వనామీ రొయ్యలకు ఈ స్థాయి లో ధరలు ఉన్నాయి. కోనసీమ, కాకినాడ జిల్లాలో ని తీరాన్ని ఆనుకుని సుమారు 23 వేల ఎకరాల్లో వనామీ సాగు జరుగుతోంది. కానీ ప్రస్తుతం రైతు లు ఈ ఏడాది తొలి పంటకు సిద్ధమవుతున్నారు. మొత్తం సాగులో పావు వంతు అంటే సుమారు 6 వేల ఎకరాలలో మాత్రమే సాగు జరుగుతోందని అంచనా. రొయ్యల లభ్యత తక్కువగా ఉండడంతో ధరలు పెరగడానికి కారణమైంది. ఎప్పుడూ ఇదే తీరు వనామీ రొయ్యల పట్టుబడులు జరిగే సమయంలో వాటి ధరలు తగ్గడం, దిగుబడి తక్కువగా ఉన్న సమయంలో వాటి ధరలు పెరగడం సాధారణమైపోయింది. కొనుగోలుదారులు సిండికేటుగా మారడం వల్ల ఈ పరిస్థితి. ఇప్పుడు మార్కెట్కు రొయ్యల రాక తగ్గింది. దీని వల్లే రొయ్యల ధరలు పెరిగాయి. – దంతులూరి నానాజీరాజు, ఆక్వా రైతు, అన్నంపల్లి. -
40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం
కాకినాడ క్రైం: స్థానిక రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ)లో జీఎన్ఎం నర్సింగ్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు విద్యార్థులకు 40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం ఇవ్వడం వివాదాస్పదమైంది. పరీక్షకు గంట ముందే హాజరవ్వాలని విద్యార్థులకు సూచనలు అందగా, అందుకు తగ్గట్లుగానే వందలాది మంది విద్యార్థులు ఉదయం 7 గంటల నుంచే జిల్లా నలుమూలల నుంచి కాకినాడకు వచ్చి పరీక్ష కేంద్రం బయటే పడిగాపులు కాశారు. అయితే వారికి ప్రశ్నపత్రం ఇవ్వడం 40 నిమిషాలు ఆలస్యం అయ్యింది. ఆర్ఎంసీలో ఎగ్జామినేషన్ హాల్–1, 2, డైనింగ్ హాలు, ఆడిటోరియం ఇలా నాలుగు చోట్ల పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 1,801 మంది హాజరు కానున్నారన్న స్పష్టమైన సమాచారం ఉన్నా పరీక్షలు నిర్వహిస్తున్న జీజీహెచ్ బృందం విద్యార్థులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. కళాశాల ప్రధాన ద్వారం తెరిచింది మొదలు పదుల సంఖ్యలో విద్యార్థులు ఈ హాల్ నుంచి ఆ హాల్కి, ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్కి అంటూ పరుగులు పెడుతూనే ఉన్నారు. తమ సీటు ఏదో తెలియక తీవ్ర గందరగోళానికి గురయ్యారు. కళాశాల ఆవరణలో హాల్ టికెట్ ఆధారంగా పరీక్ష గది ఎక్కడో తెలిపే సూచికలు (సైన్ బోర్డులు) ఏవీలేవు. అలా అని మార్గనిర్దేశం చేసే సహాయకులు కూడా లేరు. ఓ వైపు ఉదయం 9 గంటలు గడుస్తుండగా తీవ్ర ఒత్తిడితో ఎందరో విద్యార్థినులు అటు, ఇటు పరుగులు పెట్టడం కనిపించింది. ఇంతటి గందరగోళానికి తమదే తప్పని గుర్తించిన జీజీహెచ్ పరీక్షల నిర్వహణ బృందం విద్యార్థులందరూ తమ సీట్లలో కూర్చునే వరకు వేచి చూసి 40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రాన్ని ఇచ్చింది. 12 గంటలకు ముగియాల్సిన పరీక్షను 12.30 వరకూ కొనసాగించారు. కూర్చునే ఏర్పాట్లు, సూచికలు సరిగ్గా లేక పరీక్షకు కొద్ది నిమిషాల ముందు తీవ్ర ఒత్తిడికి గురయ్యామని, సకాలంలో పరీక్ష జరగలేదని, నిర్ణీత వ్యవధిని వినియోగించుకోలేక పోయామని, విలువైన పది నిమిషాల సమయం కోల్పోయామని పరీక్షలు రాసి బయటకు వచ్చిన విద్యార్థులు వాపోయారు. ఈ ఘటనపై రాష్ట్ర డీడీ నర్సింగ్ జ్యోతిని వివరణ కోరగా, బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేసి పునరావృతం కాకుండా చూస్తామన్నారు. 327 మంది గైర్హాజరు ఇదిలా ఉంటే జీఎన్ఎం మొదటి సంవత్సర పరీక్షలో 1,801 మందికి గాను 1,474 మంది హాజరయ్యారు. 327 మంది గైర్హాజరయ్యారు. జీఎన్ఎం పరీక్షల ఆరంభంలోనే వివాదం -
పునరుద్ధరించాలి
ఏటా రుణాలు సక్రమంగా చెల్లించడంతో బ్యాంకులు తిరిగి రుణాలివ్వడంతో పాటు, ప్రభుత్వం వడ్డీ రాయితీ కూడా సక్రమంగా అందించేది. కానీ, గత రెండేళ్లుగా రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా వడ్డీ రాయితీ రావడం లేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి తెస్తూండటంతో మరో గత్యంతరం లేక వడ్డీ కూడా చెల్లిస్తున్నాం. రైతులకు ఉపయోగపడే పథకాల్లో కోతలు పెట్టడం ప్రభుత్వానికి తగదు. – కరక అప్పనాయుడు, రైతు, కేఈ చిన్నయ్యపాలెం,కోటనందూరు మండలం వెంటనే విడుదల చేయాలి ప్రభుత్వం వడ్డీ రాయితీ చెల్లిస్తుందని గత ఏడాది బ్యాంకులకు చెల్లించలేదు. ఇటీవల రుణం కోసం బ్యాంకుకు వెళ్తే ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేయలేదని అక్కడి అధికారులు చెప్పి, గత ఏడాది తీసుకున్న రుణంపై వడ్డీ వసూలు చేశారు. అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తామని గొప్పలు చెప్పడం తప్ప, పథకాలకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. వెంటనే వడ్డీ రాయితీ బకాయిలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. – రావుల ప్రసాద్, కూరాడ, కరప మండలం -
13 నెలల తరువాత విధుల్లోకి..
రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండల విద్యాశాఖ అధికారి మానుపూడి శ్రీనివాస్ గురువారం తిరిగి విధుల్లో చేరారు. ఆ వివరాల్లోకి వెళితే.. మండలంలో 13 నెలల క్రితం జరిగిన సమ్మేటివ్ పరీక్షల్లో పేపర్ లీకై ందన్న కారణంతో (లోకేష్ విద్యా శాఖ మంత్రిగా ఉండటంతో ప్రిస్టేజ్గా తీసుకుని) పేపర్ లీకేజీకి కారణమైన ఉపాధ్యాయుడిని విధుల్లోంచి పూర్తిగా తొలగించారు. ఇందులో ఎంఈఓ శ్రీనివాస్ను కూడా సస్పెండ్ చేశారు. అయితే గత ఏడాది ఏప్రిల్ నెలలోనే ఎంఈఓను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పుటికీ ఇంతకాలం సాగదీసి ఇప్పుడు విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు మంచి వ్యక్తికి న్యాయం జరిగిందంటూ ఎంఈఓ శ్రీనివాస్ను కలసి అభినందించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు వాడ్రేవు శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోలిశెట్టి వీరవెంకట సత్యానారాయణ మూర్తి, సుదర్శనరెడ్డి, రేఖా రామలక్ష్మి, యూటీఎఫ్ నాయకులు బాపూజీ, రమణమూర్తి, చైతన్యబాబు, శివగణేష్, పీఆర్టీయూ నాయకులు మొంగం అమృతరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎంఈఓగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ -
జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు వైష్ణవి
అంబాజీపేట: జాతీయ స్థాయి యూనివర్శిటీ తైక్వాండో పోటీలకు అంబాజీపేట శ్రీనివాస తైక్వాండో క్లబ్ విద్యార్ధిని కె.వైష్ణవి ఎంపికై నట్లు సీనియర్ కోచ్ పితాని త్రిమూర్తులు తెలిపారు. స్థానిక జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని వైష్ణవిని పలువురు గురువారం అభినందించారు. ఆదికవి నన్నయ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన వుమెన్స్ తైక్వాండో రాష్ట్ర స్థాయి ఎంపికలు జరిగాయని త్రిమూర్తులు తెలిపారు. 72 కేజీల విభాగంలో వైష్ణవి గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు ఒడిశా ఫకీర్ మోహన్ కాలేజీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గోనుందన్నారు. పాఠశాలల్లో సమాజ భాగస్వామ్యాన్ని పెంచాలి – సమగ్ర శిక్షా ఏపీసీ మమ్మీ అమలాపురం టౌన్: పాఠశాలల్లో సమాజ భాగస్వామ్యాన్ని పెంచాలని డిప్యూటీ కలెక్టర్, సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీ పిలుపునిచ్చారు. స్థానిక విద్యానిధి పాఠశాల సమావేశపు హాలులో గురువారం జరిగిన విద్యాంజలి 2.0 జిల్లా స్థాయి ఒక రోజు ఓరియంటేషన్ క్లాస్లో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాంజలి కార్యక్రమం రూపుదిద్దుకుందని వివరించారు. దాతలు, పూర్వపు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం విద్యాజంలి ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలో 1,561 పాఠశాలలు విద్యాంజలి భాగస్వామ్యం అవుతున్నాయి. సమావేశంలో సమగ్ర శిక్షా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ బీవీఎస్ రంగారావు, డీవైఈవో గుబ్బల సూర్యప్రకాశం, సమగ్ర శిక్షా సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం, ఏపీవో డాక్టర్ ఎంఏకే భీమారావు, ఏఎస్వో కొమ్ముల నారాయణావు, రీసోర్స్ పర్సన్లు సీహెచ్ ఆంజనేయులు, ఏవీఎల్ నరసింహారావు విద్యాంజలి పోర్టల్పై అవగాహన కల్పించారు. లక్ష్మీనరసింహస్వామి హుండీల ఆదాయం రూ.56.10 లక్షలుసఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీల ద్వారా రూ.56,10,249 ఆదాయం వచ్చినట్టు అమలాపురం ఎండోమెంట్స్ తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు తెలిపారు. హుండీలను గురువారం లెక్కించినట్టు చెప్పారు. జనవరి 20వ తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ వరకూ 16 రోజులకు ఈ ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రధాన ఆలయ హుండీల ద్వారా రూ.54,83,401, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.1,02,679, అన్నదానం హుండీల ద్వారా రూ.24,169 వచ్చినట్టు ఈవో ఎంకేటీఎన్వీ ప్రసాద్ వివరించారు. 6.66 మిల్లి గ్రాముల బంగారం, 141 గ్రాముల వెండి వస్తువులు, పలు దేశాల కరెన్సీలు వచ్చాయన్నారు. ఎంపీటీసీ సభ్యుడు బైరా నాగరాజు, సూపరింటెండెంట్ పి.విజయ సారథి, సీనియర్ అసిస్టెంట్ ఎం.సత్యకిరణ్ పాల్గొన్నారు. -
క్యాన్సర్ లక్షణాలను ప్రాథమిక దశలో గుర్తించాలి
అమలాపురం టౌన్: కేన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు వీలుగా గురువారం నుంచి శనివారం వరకూ మూడు రోజులపాటు జిల్లాలోని అన్ని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు, నివారణకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని డీఎం అండ్ హెచ్వో డాక్టర్ ఎం.దుర్గారావు దొర తెలిపారు. జిల్లాలోని ఫ్రంట్ లైన్ ఆర్యోగ సిబ్బందికి ఈ టెస్ట్లు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. తొలుత ప్రభుత్వ ఏరియా ఆస్పతి ప్రాంగణంలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ఆరోగ్య సిబ్బందికి స్క్రీనింగ్ టెస్ట్లు చేశారు. డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో డాక్టర్ భరతలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకరరావు, డాక్టర్ అనూష పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం స్వాధీనం
అంబాజీపేట: పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబాజీపేట ఎస్సై కె.చిరంజీవి కథనం ప్రకారం.. మామిడికుదురుకు చెందిన గోకవరపు రాఘవ అవినాష్ 82 బస్తాల్లో 2,988 కిలోల రేషన్ బియ్యాన్ని మామిడికుదురు నుంచి ఆలమూరుకు బొలెరో వాహనంలో తరలిస్తున్నారు. ముక్కామల వచ్చేసరికి పోలీసులు దాడి చేసి ఆ వాహనాన్ని పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని తక్కువకు కొనుగోలు చేసి ఆలమూరు పరిసర ప్రాంతాల్లో పనులు చేసే కూలీలకు ఎక్కువ ధరకు విక్రయిస్తారని ఎస్సై తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బియ్యాన్ని ఎమ్ఎస్ఓ పూర్ణిమ సారధ్యంలో సివిల్ సప్లయిస్ గొడౌన్కు తరలించామన్నారు. త్రుటిలో తప్పిన ప్రమాదంనిడదవోలు: స్థానిక గణేష్చౌక్ సెంటర్లో గురువారం ఓ వృద్ధుడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పంగిడి నుంచి విజ్జేశ్వరం వెళ్తున్న క్వారీ లారీ పట్టణంలో గణేష్చౌక్ సెంటర్లో మలుపు తిరుగుతున్న సమయంలో స్కూటీపై వెళుతున్న వృద్ధుడు దుప్పాడ రామారావును ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను లారీ కింద పడ్డాడు. లారీ టైర్లు అతనిపై ఎక్కకపోవడంతో స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. అతన్ని స్థానికులు బయటకు లాగి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి లారీని స్టేషన్కు తరలించారు. అయితే కేసు నమోదు చేయలేదు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన వృద్ధుడి పేరు కూడా పోలీసులకు తెలియకపోవడం చర్చనీయాంశమైంది. పంగిడి, దేవరపల్లి ప్రాంతాల నుంచి క్వారీ లారీలు అడ్డూఅదుపు లేకుండా వేగంగా రాకపోకలు సాగిస్తుండడంతో ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుతున్నాయి. పోలీస్ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థి ఆత్మహత్య కొత్తవలస: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం విజయనగరం రోడ్డులో ఉన్న డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ముడికి వికాస్ (16) తీవ్రమైన తలనొప్పిని భరించలేక బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సీఐ సీహెచ్ షణ్ముఖరావు కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన వికాస్ ఇక్కడి డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. కొద్ది నెలలుగా అతను తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు తండ్రి సుబ్రహ్మణ్యంతో పాటు తోటి విద్యార్థులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం మరోమారు తలనొప్పి రావడంతో కళాశాల సిబ్బంది వికాస్ తండ్రికి ఫోన్లో సమాచారం అందించారు. ఇంటికి పంపించేస్తామని తెలిపారు. ఇప్పుడు బయల్దేరితే ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుందని, మరుసటి రోజు పంపించాలని కళాశాల సిబ్బందిని మృతుడి తండ్రిని కోరాడు. తోటి విద్యార్థులు డ్రిల్ కోసం మైదానంలోకి వెళ్లగా.. హాస్టల్ రూమ్లో ఎవరూ లేని సమయంలో బెడ్షీట్తో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. తోటి విద్యార్థులు రూమ్కు వచ్చి చూసేసరికి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే కళాశాల సిబ్బంది సహాయంతో కిందకు దించి స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
పులిని బంధించడంలో ప్రభుత్వం విఫలం
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న పెద్ద పులిని బంధించడంలో ప్రభుత్వంతో పాటు అధికారులు విఫలమయ్యారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీనివాస చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. పులిని పట్టుకుని అటవీ ప్రాంతంలోకి పంపే ప్రయత్నం సక్రమంగా జరగడం లేదని అన్నారు. రాత్రయితే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. రైతులు పొలం పనులకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పులిని పట్టుకునే ప్రయత్నం చేయాలన్నారు. చనిపోయిన పశువులకు ఎక్స్గ్రేషియా ప్రకటించి యజమానులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు నియోజకవర్గాల్లో పది పశువులను చంపినట్లు రికార్డులు చెబుతున్నాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల హడావుడి తప్ప, పులిని బంధించే ప్రయత్నం కనిపించడం లేదని విమర్శించారు. సాంకేతికత పెరిగినా పులి జాడ కనిపెట్టడంలో విఫలం కావడం శోచనీయమని అన్నారు. పులిని పట్టుకునే ప్రయత్నాల్లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రద్ధ చూపకపోవడం దారుణమని అన్నారు. ప్రజలు భయాందోళన చెందుతున్నా కనీసం స్పందించక పోవడం సరైన విధానం కాదన్నారు. అనుకోని ప్రమాదం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తక్షణ మే పశువులు కోల్పోయిన పాడి రైతులకు రూ.మూడు లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వా లని డిమాండ్ చేశారు. రానున్న 12 గంటల్లో పెద్ద పులిని పట్టుకునే ప్రయత్నాన్ని అటవీ శాఖాధికారులు ముమ్మరం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని వేణు, రాజా హెచ్చరించారు. మాజీ మంత్రి వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా -
160 కిలోల గంజాయి స్వాధీనం
జగ్గంపేట: gñæ.Mö™èl*¢Æý‡$ Ð]l§ýlª ¿êÈV> VýS…gêÆ‡$$° ´ùÎ-çÜ$Ë$ ÝëÓ«-©¯]l… ^ólçÜ$-MýS$°, ¯]lË$-VýS$ǰ AÆð‡çÜ$t ^ólÔ>Æý‡$. VýS$Æý‡$ÐéÆý‡… ©°Oò³ fVýSY…õ³r çÜÇPÌŒæ M>Æ>Å-ÌS-Ķæ$…ÌZ ò³§éª-ç³#Æý‡… yîlGïܵ }çßæ-ÇÆ>k ÑÌôæMýS-Æý‡Ï™ø Ð]l*sêÏ-yéÆý‡$. gñæ.Mö-™èl*¢-Æý‡$ÌZ° §ýl$Æý‡Y VýS$yìl çÜÒ$-ç³…ÌZ fVýSY…õ³r GOòÜÞ Æý‡çœ¬-¯é£ýl-Æ>Ð]l# B«§ýlÓÆý‡Å…ÌZ ´ùÎ-çÜ$ÌS ™èl°-TË$ ^ólç³-sêtÆý‡$. VýS*yŠæÞ BsZÌZ ™èlÆý‡-Í-çÜ$¢¯]l² 80 ´ëÅMðSrÏÌZ VýS…gêÆ‡$$, òÜÌŒæ¸ù¯Œl, Æý‡*.ÌS„ýS ÝëÓ«-©¯]l… ^ólçÜ$MýS$-¯é²Ð]l$° yîlGïܵ ™ðlÍ-´ëÆý‡$. Òsìæ ÑË$Ð]l Æý‡*.82.48 ÌS„ýSË$ E…r$…§ýl° ^ðl´ëµÆý‡$. JyìlÔ> Æ>[Úët-°MìS ^ðl…¨¯]l çÜ$«§éMýSÆŠ‡ §éÓÆ> D VýS…gêÆ‡$$° çÜ™èlÅ-ÝëÆ‡$$ hÌêÏÌZ Ñ{MýS-Ƈ$$…^ól…§ýl$MýS$ ¡çÜ$MýS$ Ððlâ¶æ$™èl$…-yýlV> ç³r$t-MýS$-¯]l²r$Ï ™ðlÍ-´ëÆý‡$. çÜ™èlÅ-ÝëÆ‡$$ hÌêÏMýS$ ^ðl…¨¯]l Ðól$MýSÌS {ç³M>‹-Ù, Ðól$MýSÌS Ô>ÅÐ]l$ÌS, A¯]l²-Ð]l$Ķæ$Å hÌêÏMýS$ ^ðl…¨¯]l BÐ]l#ÌS }°ÐéçÜ$Ë$, «§ýl°-Ķæ$ÅÌS A…f-Ð]l$ÃOò³ MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólÔ>Æý‡$. ïÜI OÐðlB-ÆŠ‡MóS }°-Ðé‹Ü ™èl¨™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. ˘ -
‘కూటమి’లో ఇసుక ర్యాంపుల వివాదం
తాళ్లపూడి: కూటమిలోని టీడీపీ, జనసేన మధ్య వర్గ విభేదాలు మరోసారి బయట పడ్డాయి. ఇసుక ర్యాంపుల విషయంలో నాయకుల మధ్య చిచ్చు రేగింది. దీంతో వేగేశ్వరపురం ఇసుక ర్యాంపులో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని అధికారులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. మండలంలో జరిగే ఇసుక అక్రమాలపై ఇకపై తమ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని జనసేన నాయకుడు, ఎంపీటీసీ సభ్యుడు హరిబాబు విలేకరులకు చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నా మండలంలో మాత్రం జనసేనను దూరంగానే ఉంచుతున్నారని, టీడీపీ వర్గీయులు జనసేన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఇసుక ర్యాంపులన్నీ టీడీపీ నాయకులే నిర్వహిస్తున్నారని, తమను చేతకానివారిగా చూస్తున్నారని అన్నారు. ఇసుక ర్యాంపుల్లో జరిగే తప్పులపై అందుకే గళం విప్పామని, ఎన్డీఏలో తాము భాగస్వామ్యమా? కాదా? తెలియకుండా ఉందని ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. -
● పెంట కాలువే..
ఎటు చూసినా, ప్లాస్టిక్ వ్యర్థాలు జంతు కళేబరాలు చూసి పెంట కాలువ అనుకుంటే పొరపాటే.. ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో గొరగొనమూడి, కూనవరం టైల్ ఎండ్ పంట కాలువ దుస్థితి ఇది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగుకు నీరు అందించాల్సిన కాలువ ఇలా అధ్వానంగా తయారైంది. నిండా చెత్తా చెదారం, వ్యర్థాలతో మూసుకుపోయింది. సన్నవిల్లి పంచాయతీ పరిధి దుర్గమ్మ గుడి సమీపంలో ఇలా ఉండడంతో దుర్వాసన భరించలేకపోతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. –ఉప్పలగుప్తం -
సైబర్ మోసాల నివారణకు చర్యలు
ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ అమలాపురం రూరల్: ఇటీవల కాలంలో జరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. అమలాపురం రూరల్ సీఐ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలసి బుధవారం ఆయన తనిఖీ చేశారు. అక్కడ ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో సీబీఐ డిజిటల్ అరెస్టుల పేరుతో జరిగే సైబర్ మోసాలు తగ్గినట్లు తెలిపారు. దీనిలో ఓ ముఠాను అరెస్టు చేశామని అన్నారు. ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులను లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, వీటిపై బ్యాంకు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి డిపాజిట్లు విత్ డ్రాల్లో జాగ్రత్తలు పాటించాలని ఆదేశించామని అన్నారు. జిల్లా కేంద్రంలో సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. డీఎస్పీ టీఎస్ఆర్ కె.ప్రసాద్, సీఐ ప్రశాంత్ కుమార్, అమలాపురం తాలూకా ఎస్సై వై.శేఖర్బాబు, అల్లవరం, ఉప్పలగుప్తం ఎస్సైలు సంపత్కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అయినవిల్లి పోలీస్ స్టేషన్లో.. అయినవిల్లి: వార్షిక తనిఖీల్లో భాగంగా అయినవిల్లి పోలీస్ స్టేషన్లో రికార్డులను ఐజీ అశోక్కుమార్ పరిశీలించారు. ఇటీవల సంక్రాంతి సంబరాలు, ప్రభల ఉత్సవాలు, అంతర్వేది నరసన్న తీర్థ మహోత్సవాలు ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసు బందోబస్తు నిర్వహించారన్నారు. శివరాత్రి మహోత్సవాల్లో వివాదాలకు తావులేకుండా ఇప్పటికే పోలీసు శాఖ అప్రమత్తమైందన్నారు. అభ్యంతరం లేని పోస్టులు మాత్రమే సోషల్ మీడియాలో పెట్టాలన్నారు. ఈ పోస్టుల కారణంగా ఏ వివాదం జరిగినా నిందితులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. హాస్టళ్లలో విద్యార్థులను వారి అనుమతులు ప్రకారమే తీసుకెళ్లాలన్నారు. మైనర్లకు మోటార్ సైకిళ్లను ఇవ్వరాదన్నారు. మద్యం తాగి, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని అశోక్కుమార్ సూచించారు. -
పాదగయ పిలుస్తోంది
● మహా శివరాత్రికి ఏర్పాట్లు ● సిద్ధమవుతున్న పుష్కరిణి ● 13 నుంచి ఉత్సవాలు ఆరంభం పిఠాపురం: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రం భక్తులను రా రమ్మని పిలుస్తోంది.. మహా శివరాత్రి ఉత్సవాలకు ఇప్పటి నుంచే ముస్తాబవుతోంది.. ఈ నెల 13న శివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. శివరాత్రి మహాత్సవాలను కన్నుల పండువగా నిర్వహించడానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని పాదగయ క్షేత్రాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవాల ప్రారంభం నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండడంతో ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రఖ్యాత శైవ క్షేత్రాల్లో పాదగయ క్షేత్రం ప్రాధాన్యం కలిగి ఉంది. మహా శివరాత్రి పర్వదినాల్లో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ ఉత్సవాలు పురస్కరించుకుని వారం రోజుల పాటు నిత్యం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రత్యేక లక్షపత్రి పూజలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించనున్నారు. త్రిగయా క్షేత్రాల్లో పిఠాపురంలో వేంచేసియున్న పాదగయ క్షేత్రం అత్యంత ప్రాచీన దివ్య శైవ క్షేత్రం. పుణ్యస్నానంతో పునీతం పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానం చేస్తే పునీతం అవుతారని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా వేలాది మంది భక్తులు వచ్చి ఈ పుష్కరిణిలో స్నానాలు ఆచరిస్తుంటారు. మహా శివరాత్రి ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ పుణ్య స్నానాలకు పుష్కరిణిని సిద్ధం చేస్తున్నారు. ఇటీవల అందులో పాత నీరు తొలగించిన అఽధికారులు పూర్తిగా శుభ్రం చేసి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. కొత్త నీటితో నింపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులు ఒకేసారి పుణ్య స్నానాలు ఆచరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు వివరిస్తున్నారు. 13న కుక్కుటేశ్వరుని కల్యాణం పాదగయ క్షేత్రంలో రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామివారి దివ్య కల్యాణం ఈ నెల 13న రాత్రి 8.32 గంటలకు నిర్వహించనుండగా, 14న స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరుపనున్నారు. 15వ తేదీ మహా శివరాత్రి ఉత్సవం, 16న మధ్యాహ్నం 3 గంటలకు నాకబలి, దండాడింపు, దొంగలదోపు ఉత్సవాలు, స్వామివారి రథోత్సవం, 18న స్వామివారి త్రిశూల స్నానం, తెప్పోత్సవం, శ్రీపుష్పోత్సవం నిర్వహించనున్నారు. ప్రపంచ స్థాయిలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రంతో పాటు సకలేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలతో పాటు గొల్లప్రోలు మండలం దుర్గాడలోని ఉమారామలింగేశ్వరస్వామి, గొల్లప్రోలులో ప్రసిద్ధి చెందిన ఉమారామలింగేశ్వరస్వామి, చేబ్రోలులో పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి, తాటిపర్తిలో అపర్ణాసమేత నాగేశ్వరస్వామివారి ఆలయాల్లోనూ ఉత్సవాలు జరుగనున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్నాం ఈ ఏడాది మహా శివరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్, ఎస్పీ, దేవదాయ శాఖ ఉన్నతాధికారుల తదితరులు ఇప్పటికే పలు సూచనలు చేశారు. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులపై దృష్టి పెట్టాం. అందరికీ స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తాం. అంతా పుణ్యస్నానాలు ఆచరించే విధంగా పాదగయ పుష్కరిణిని సిద్ధం చేస్తున్నాం. తగిన విధంగా క్యూలైన్లు నిర్మిస్తాం. –కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, పాదగయ ఈఓ, పిఠాపురం -
జాడలు సరే.. పులేది?
అక్కమ్మతల్లికొండ వద్ద ఏర్పాటు చేసేందుకు తీసుకువచ్చిన బోనుఅక్కమ్మతల్లి కొండవద్ద పరిశీలిస్తున్న ఫారెస్టు చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు రాజమహేంద్రవరం రూరల్: ఐదు రోజులుగా జిల్లాలో పెద్దపులి సంచారం జిల్లా ప్రజలను వణికిస్తోంది. అటవీశాఖ అధికారుల అంచనాలను సైతం తారుమారు చేస్తూ ఇష్టారీతిన సంచరిస్తోంది. దీంతో అధికారులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ పెద్దపులి చిక్కడం లేదు. మంగళవారం రాత్రి దివాన్చెరువు ఎస్వీపీసీ కల్యాణ మండపం వద్ద ప్రత్యక్షమైన పులి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీదుగా బీజాపురి టౌన్షిప్లోకి వెళ్లింది. బుధవారం ఉదయానికి చూస్తే రఘనాథపురంలో మామిడితోటల్లో నుంచి వెళ్లినట్లు ఉన్న ప్లగ్ మార్కులను అధికారులు గుర్తించారు. అక్కడ ఒక గేదె దూడపై దాడిచేయడంతో అది మృతి చెందింది. అక్కడ నుంచి శాటిలైట్ సిటీ అక్కమ్మతల్లి కొండపైకి వెళ్లినట్లు ప్లగ్మార్క్ల ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. అక్కమ్మతల్లి కొండపై నుంచి కిందకు దిగిందా లేదా వెనుక నుంచి జీడిమామిడి తోటల్లోకి ఏమైన వెళ్లిందా అనే కోణాల్లో అటవీశాఖ అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా బుధవారం రాత్రి పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు నేతృత్వంలో జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకరరావు, అటవీ రేంజ్ అధికారి దావీదురాజు, సిబ్బంది అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు మాట్లాడుతూ పెద్దపులి శాటిలైట్ సిటీలోని అక్కమ్మతల్లికొండపై ఉన్నట్లు గుర్తించామని, దానిని పట్టుకునేందుకు పూణే నుంచి ఒక బృందంతో పాటు, మొత్తం 12 బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదన్నారు. పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు ప్రజలకు పెద్దపులి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారన్నారు. ఈ పులి తడోబా నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రం పాల్వంచ మీదుగా ఏలూరు జిల్లా నుంచి మన జిల్లాలోకి వచ్చిందని ఆయన తెలిపారు. పులిని పట్టుకునేందుకు రాత్రి వేళల్లో ధర్మల్ కెమెరాలను వినియోగించినట్టు తెలిపారు. ఇప్పటికే బోన్లతో పాటు ట్రాప్ కెమెరాలను సైతం ఏర్పాటు చేశామన్నారు. పులి సంచరించిన స్థలాన్ని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సందర్శించి ప్రజలకు సూచనలిచ్చారని తెలిపారు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథం, తహసీల్దార్ బి.శ్రీనివాస్, ఎంపీడీవో ఆర్మ్స్ట్రాంగ్, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శి, ఎస్సైలు, సిబ్బంది అటవీశాఖ అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఆందోళన చెందుతున్న రాజమహేంద్రవరం ప్రజలు పాద ముద్రలు తప్ప పులిని పట్టుకోలేకపోతున్న అధికారులు తాజాగా శాటిలైట్ సిటీ అక్కమ్మతల్లి కొండపై ఉన్నట్టు గుర్తింపు పూణే నుంచి నిపుణులతో పాటు 20 బృందాల ఏర్పాటు -
స్పైరులీనాలో పోషకాలు మెండు
● నాచు తయారీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ● యువకుడికి అభినందనలు పి.గన్నవరం: స్పైరులీనా ఉత్పత్తులను అత్యంత పోషక విలువలున్న ఆహారాల్లో ఒకటిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. మండలంలోని మానేపల్లి గ్రామంలో స్పైరులీనా నాచు తయారీ యూనిట్ను బుధవారం ఆయన సందర్శించి దాని తయారీ విధానాన్ని నిర్వాహకుడు బోకేశవ సత్యశ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్ బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం వద్దనుకుని స్వగ్రామంలోనే ఉపాధికి బాట వేసుకోవాలన్న లక్ష్యంతో ఈ యూనిట్ను నెలకొల్పారన్నారు. ఆక్వా రంగంలో చేపలు, రొయ్యల చెరువుల్లో వాడే మేతలో దీనిని కలపడం ద్వారా వాటి ఉత్పత్తి బాగా పెరుగుతుందన్నారు. రెండు ట్యాంకులతో పాటు ఫిల్టర్ యూనిట్లు నెలకొల్పేందుకు రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారన్నారు. ఒక్కొక్క ట్యాంకులో రోజుకు నాలుగు నుంచి ఐదు కిలోల కళ్లు ఉప్పు, 10 కిలోల సోడియం బైకార్బొనేట్ కలిపి, తద్వారా రోజుకు 80 కిలోల తడి నాచును ఉత్పత్తి చేస్తున్నట్టు వివరించారు. దీనిని ఆక్వా రైతులకు కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నానని, పది కిలోల తడినాచు ఎండబెడితే కిలో పొడి నాచు తయారవుతుందని, దీనిని కిలో రూ.800 చొప్పున విక్రయిస్తున్నట్టు వివరించారు. స్పైరులీనా నాచుకు రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుందని కలెక్టర్ వివరించారు. యూనిట్ నిర్వాహకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ స్పైరులీనా అత్యధిక పోషక విలువలు కలిగిన నీలి–ఆకుపచ్చ పదార్థమని, దీనిని సూపర్ ఫుడ్గా పిలుస్తారన్నారు. దీనిని పశువుల మేతలో వినియోగిస్తే నాణ్యమైన పాలతో పాటు, పాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పితాని చంద్రకళ, పితాని నరసింహరావు, డీటీ సత్యనారాయణ, ఆర్ఐ వెన్నపు డాంగే తదితరులు పాల్గొన్నారు. -
తిరుమల ప్రతిష్టను పాడుచేసింది చంద్రబాబు ప్రభుత్వమే
అల్లవరం: చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి నేతలు తిరుమల వేంకటేశ్వరుని ప్రతిష్టను దిగజారుస్తూనే ఉన్నారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు బుధవారం అన్నారు. మండలం డి.రావులపాలెంలోని ఆయన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్ష సాధించేందుకు చంద్రబాబు ప్రభుత్వం స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని అబద్ధాన్ని ప్రచారం చేసి తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించారన్నారు. లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ నిర్థారించినా చంద్రబాబు, కూటమి నేతలు హిందువుల మనోభావాలతో ఆటలాడుతున్నారని, వారిలో కొంచైమెనా ప్రాశ్చాత్తాపం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలను, తప్పులను కప్పి పుచ్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్సార్ సీపీ నేతలు, వారి ఇళ్లపై దాడులకు ప్రోత్సహిస్తున్నారని రామారావు అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఇటీవల టీడీపీ నాయకులు దాడి చేసి తప్పుడు పదజాలాన్ని ప్రయోగించి, పక్కా ప్లాన్ ప్రకారం ఆయన్ని రెచ్చగొట్టారని, తిరిగి ఆయనపైనే కేసులు, వారి ఇళ్లపై దాడులు, చేశారన్నారు. అంబటి రాంబాబుపై దాడి చేసిన వారిని వదిలేసి బాధితుడైన రాంబాబుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం అన్యాయమని ఆయన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మకుండా తిరుమల తిరుపతి ప్రతిష్టను కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రామారావు అన్నారు.వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కళాశాల బస్సు
తప్పిన పెను ప్రమాదం అమలాపురం రూరల్: ఓ కళాశాల బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ఉదయం ఉప్పలగుప్తం మండలం నుంచి అమలాపురంలో ఓ కళాశాలకు విద్యార్థులతో బస్సు వెళ్తోంది. సమనస వైన్ షాప్ సమీపంలో ఆ బస్సు అదుపుతప్పి పంట కాలువ వైపు దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. తీగలు తెగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులంతా క్షేమంగా బయట పడ్డారు. బస్సును నిర్లక్ష్యంగా నడిపినందుకు డ్రైవర్ లైసెన్స్ను, బస్సు పర్మిట్ను మూడు నెలలు సస్పెండ్ చేశామని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ బస్సును వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు త్వరలోనే పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలకు సమావేశాలు నిర్వహిస్తామని డీటీఓ చెప్పారు. -
రేపటి నుంచి సత్యదేవునికి కోటి తులసి పత్రి పూజ
అన్నవరం: ఈ నెల ఆరో తేదీ నుంచి 15వ తేదీ వరకు సత్యదేవుని సన్నిధిలో జరగనున్న కోటి తులసి పత్రి పూజకు సుమారు వంద బస్తాల తులసి అవసరమని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తులసిని తీసుకువస్తున్నారు. ఈ పది రోజులు రెండు పూటలా రోజూ 11 లక్షల తులసి దళాలు అవసరమవుతాయని వివరించారు. దాత వీర్ల రాంబాబు సహకారంతో వివిధ ప్రాంతాల నుంచి ఈ తులసిని సేకరిస్తున్నట్లు ఏఈఓ అనకాపల్లి ప్రసాద్ తెలిపారు. ఈ తులసిని భద్రపర్చడానికి ఈఓ వేండ్ర త్రినాథరావు ఆదేశాల మేరకు వ్రతాల విభాగంలోని కోల్డ్ స్టోరేజీ యూనిట్ను సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తులసిని అక్కడ నిల్వ చేసి అక్కడ నుంచి అవసరమైన తులసి దళాలను పూజ కార్యక్రమం జరిగే వార్షిక కల్యాణ మండపానికి తీసుకురానున్నారు. కొమ్మలు, రెమ్మలుగా ఉన్న తులసిని విడదీసి దళాలుగా చేయడానికి 50 మంది స్వచ్ఛంద సేవా కార్యకర్తలను నియమించారు. రూ.రెండు లక్షల విరాళం సత్యదేవునికి నిర్వహించనున్న ‘కోటి తులసి పత్రి పూజ’కు విశాఖపట్నంలోని సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ రూ.రెండు లక్షల విరాళాన్ని అందజేశారు. పూజలో పాల్గొనే రుత్విక్కులు 40 మంది, వేదపండితులు, అర్చకులు మరో 20 మందితో కలిపి మొత్తం వంద మందికి మూడు పూటలా భోజనం, ఫలహారం ఏర్పాటు చేసే భాధ్యతలను దేవస్థానం వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు ఛామర్తి కన్నబాబు, మాజీ అధ్యక్షుడు నాగాభట్ల రవిశర్మకు అప్పగించారు. తునికి చెందిన దాత చక్కా సూర్యనారాయణ (తాతబాబు) నిర్మించిన నివేదన శాలలో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వాడపల్లి వెంకన్నకు వెండి కలశం సమర్పణ
ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామివారికి ఓ కుటుంబం వెండి కలశాన్ని సమర్పించింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన కీర్తిశేషులు గొట్టుముక్కల అప్పలరాజు, లక్ష్మీకాంతం, కదిరాజు సూర్యనారాయణరాజు, సూర్యకాంతంల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 842 గ్రాముల వెండి కలశం తయారుచేయించి, బుధవారం దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావుకు సమర్పించారు. దివ్యాంగ జేఏసీ జిల్లా కార్యవర్గం అమలాపురం టౌన్: స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో అఖిల భారత దివ్యాంగ జేఏసీ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. కార్యక్రమానికి దివ్యాంగ జేఏసీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కొమ్ముల కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా దివ్యాంగ జేఏసీ గౌరవాధ్యక్షుడిగా కేతా శ్రీనివాసరావు, అధ్యక్షుడిగా పెనుమాల నాగరాజు, సలహదారుగా నిమ్మకాయల సురేష్, ఉపాధ్యక్షుడిగా జొన్నాడ ప్రభాస్రాజు, కార్యదర్శిగా కొప్పాడి వెంకట నాగరాజు, సహాయ కార్యదర్శిగా కోడేటి పాండురాజు, కోశాధికారిగా సలాది మూర్తి, మహిళా అధ్యక్షురాలిగా విత్తనాల సూర్య వెంకట గౌరి, ఉపాధ్యక్షురాలిగా పలివెల ఉమాదేవి ఎన్నికయ్యారు. వీరితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులుగా వాసంశెట్టి లక్ష్మీనారాయణ, సలాది నాగబాబు, కంటిపూడి సాయి భారతి, గొలకోటి మహాలక్ష్మిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పురస్కారం అందుకున్న దివ్యాంగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల కోటేశ్వరరావును నూతన కార్యవర్గ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. నేడు సత్యదేవుని హుండీల లెక్కింపు అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించనున్నారు. దేవస్థానంలో హండీ ఆదాయాన్ని చివరిసారిగా డిసెంబర్ 31న లెక్కించారు. దీంతో 35 రోజులలో భక్తులు సత్యదేవుని హుండీలలో సమర్పించిన కానుకలను గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కించనున్నారు. దేవస్థానం సిబ్బంది అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఈఓ త్రినాథరావు ఆదేశించారు. నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కాకినాడకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. కాకినాడ రమణయ్యపేటకు చెందిన గారికపర్తి నమశ్శివాయ కోట సూర్య నరసింహ, నాగమణి అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,152 విరాళం అందజేశారు. శాప్ అకాడమీల ఏర్పాటుకు చర్యలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ, తిరుపతి, విశాఖలో ఆయా క్రీడల ప్రాధాన్యాన్ని బట్టి అకాడమీలు ఏర్పాటు చేస్తామని, కాకినాడను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) చైర్మన్ ఏ.రవినాయుడు ప్రకటించారు. బుధవారం కాకినాడ వచ్చిన ఆయన డీఎస్ఏలో విలేకరులతో మాట్లాడారు. జగన్నాథపురంలో రూ.9.84 కోట్లతో 16 ఎకరాల్లో క్రీడా వికాస కేంద్రం ఏర్పాటుకు ఆమోదం ఇచ్చామని తెలిపారు. రూ.1.81 కోట్లతో లింగంపర్తి, రూ.1.07 కోట్లతో పెద్దాపురం, రూ.76.80 లక్షలతో జగ్గంేపేటలో కేవీకేల నిర్మాణాలకు ఉత్తర్వులు జారీచేశామన్నారు. -
అట్టహాసంగా హాకీ పోటీలు ప్రారంభం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్థానిక జిల్లా క్రీడా మైదానంలో కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొదటి కోకనాడ గోల్డ్ కప్ జాతీయ స్థాయి హాకీ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి డీఎస్డీఓ వి.సతీష్ కుమార్, హాకీ మాజీ ఇండియన్ కెప్టెన్, పద్మశ్రీ ధనరాజ్ పిళ్లై, కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత బల్వీర్ సింగ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ప్రీతమ్ శివాజ్, శాప్ డైరెక్టర్లు రవీంద్ర, జగదీశ్వరి, హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజ్, కార్యదర్శి హర్షవర్ధన్, అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి హాజరయ్యారు. శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ కాకినాడ డీఎస్ఏలో వచ్చే ఏడాది హాకీ అంతర్జాతీయ టోర్నీ నిర్వహణకు అవసరమైన సదుపాయాలు, గ్యాలరీ, టాయిలెట్స్, ఫ్లడ్లైట్లు వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. ఒలింపియన్ ధనరాజ్ పిళ్లై మాట్లాడుతూ ఈ టోర్నీ వర్థమాన క్రీడాకారులకు స్ఫూర్తిని ఇఽస్తుందన్నారు. కాకినాడకు గతంలో ఒకసారి వచ్చానని, ఇక్కడ టోర్నమెంట్ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి రవిచంద్రప్రసాద్ మాట్లాడూ కోకనాడ గోల్డ్ కప్ హాకీ పోటీలకు దేశ వ్యాప్తంగా పురుష, మహిళల 24 జట్లు వచ్చాయన్నారు. ఈ నెల 14 వరకూ టోర్నీ జరుగుతుందన్నారు. జాతీయ జెండాను శాప్ చైర్మన్ రవినాయుడు, హాకీ ఆంఽధ్రప్రదేశ్ జెండాను ధనరాజ్ పిళ్లై, కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ జెండాను క్లబ్ అధ్యక్షుడు బాబ్జి ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు సూరిబాబు, ఇమ్మానుయేల్ రాజు, సురేష్రాజు, పరుశురాం, హరిబాబు, పీఈటీ సంఘ రాష్ట్ర మాజీ అద్యక్షుడు రవిరాజు, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి సుధారాణి, డీఎస్ఏ కోచ్లు సమీర్, సురేష్, అప్పలనాయుడు, డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు నాలుగు మ్యాచ్లు డీఎస్ఏ మైదానంలో ప్రారంభమైన కోకనాడ గోల్డ్ కప్ హాకీ పోటీల్లో భాగంగా తొలిరోజు నాలుగు మ్యాచ్లు జరిగాయి. మహిళల విభాగంలో ఎస్సీఓఈ భోపాల్, హర్యానా మధ్య జరిగిన మ్యాచ్లో హర్యానా జట్టు, ఎన్సీఓఈ సోనిపత్, బిలాయ్ స్టీల్ప్లాంట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఎన్సీఓఈ జట్టు విజయం సాధించాయి. యూనియన్ బ్యాంక్, గ్వాలియర్ ఎంపీ అకాడమీ జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. పురుషుల విభాగంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆర్మీ మధ్య జరిగిన మ్యాచ్లో ఇండియన్ ఆర్మీ జట్టు విజయం సాధించిందని నిర్వాహకులు ప్రకటించారు. -
గోదావరి సా..గుతోంది!
సాక్షి, అమలాపురం: ‘నీరు పల్ల మెరుగు’ అన్నది సామెత. కాని గోదావరి డెల్టాలో నీరు పల్లానికి పారడానికి చాలా ఆపసోపాలు పడుతోంది. ఈ జాప్యంతో శివారులలో సాగు ఆలస్యం కావడంతో పాటు రబీకి కీలక సమయంలో నీరందక రైతులు అవస్థలు పడుతున్నారు. రబీకి అవసరమైన నీటిలో సగానికి పైగా ఇప్పటికే విడుదల చేసినా డెల్టా పరిధిలోని శివార్లలో ఇంకా నాట్లు పూర్తికాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మధ్య డెల్టాలో రబీ ఇంకా సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మార్చి 31 నాటికి గడువు దాటిన తరువాత కూడా ఆయకట్టుకు నీరందించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య డెల్టాలలో మొత్తం 1.82 లక్షల ఎకరాల ఆయకట్టులో రబీ వరి సాగవ్వాల్సి ఉంది. అధికారులు మాత్రం 1.69 లక్షల ఎకరాల్లో రబీ సాగవుతోందని అంచనా వేశారు. ఇప్పటి వరకు 1,59,545 ఎకరాల్లో మాత్రమే నాట్లు, వెదజల్లు పద్ధతిలో పూర్తి చేశారు. ఇంకా సుమారు 10 వేల ఎకరాలలో సాగు జరగాల్సి ఉంది. ప్రధానంగా జిల్లాలో అమలాపురం, ముమ్మిడివరం వ్యవసాయ సబ్ డివిజన్ల లోనే సాగు ఆలస్యమైంది. అమలాపురం మండలంలో మొత్తం ఆయకట్టు 5,400 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 3,285 ఎకరాలలో మాత్రమే నాట్లు వేశారు. ఉప్పలగుప్తం మండలంలో 6,500 ఎకరాలకు గాను 5,600 ఎకరాల్లో, అల్లవరం మండలంలో సుమారు 5 వేల ఎకరాల ఆయికట్టు ఉండగా 3,800 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాల్లో సైతం నాట్లు పూర్తి కాలేదు. ఈ మండలాల్లో సుమారు రెండువేల ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉంది. జిల్లాలో శివారు ప్రాంత మండలాలైన మామిడికుదురు, సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో నాట్లు ఇంకా పడుతూనే ఉన్నాయి. పంట కాలువలకు 56.153 టీఎంసీలు గోదావరి డెల్టాలో ఇప్పటికీ నాట్లు పడుతూనే ఉండగా, నీటి వినియోగం మాత్రం ఎక్కువగానే జరిగింది. జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం (ఐఏబీ)లో నిర్ణయించిన దాని ప్రకారం డిసెంబరు నెలాఖరు నాటికి నాట్లు, వెదజల్లులు పూర్తి కావాల్సి ఉంది. కాని ఫిబ్రవరి మొదటి వారం వచ్చినా ఇప్పటికీ నాట్లు వేస్తూనే ఉన్నారు. రబీ డెల్టా అవసరాల కోసం 93 టీఎంసీలు కావాలని అధికారులు నిర్ణయించారు. దీనిలో సగానికి పైగా నీరు కాలువలకు విడుదల చేయడం జరిగింది. మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు మూడు డెల్టా కాలువలకు కలిపి 56.153 టీఎంసీల నీరు విడుదల చేశారు. దీనిలో తూర్పు డెల్టాకు 17.496, మధ్య డెల్టాకు 9.818, పశ్చిమ డెల్టాకు 28.839 టీఎంసీల చొప్పున వదిలారు. సీలేరు పవర్ జనరేషన్ నుంచి నీరు తక్కువగా వస్తుండడంతో పోలవరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల తగ్గించారు. దీంతో ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీకి రోజుకు 8,832 క్యూసెక్కుల మాత్రమే నీరు వస్తోంది. దీనిలో సీలేరు నుంచి వచ్చేది 3,017 క్యూసెక్కులు కాగా, మిగిలిన 5,815 క్యూసెక్కులు పోలవరం వద్ద నిల్వ ఉంచారు. వస్తున్న నీటిని తూర్పు డెల్టాకు 2,600, మధ్య డెల్టాకు 1,700, పశ్చిమ డెల్టాకు 4,300 క్యూసెక్కుల చొప్పున మూడు డెల్టాలకు 8,600 క్యూసెక్కులు వదులుతున్నారు. కాలువల వ్యవస్థ అధ్వానమే కారణం! జిల్లా పరిధిలో తూర్పు, మధ్య డెల్టా ప్రధాన పంట కాలువ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో శివారు, మెరక ప్రాంతాలకు నీరు అందడం లేదు. పూర్తి సామర్థ్యం మేరకు కాలువలకు నీరు వదులుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. తూర్పు డెల్టాలో కోటిపల్లి బ్యాంకు కెనాల్, మండపేట, కోరింగ, మధ్య డెల్టాలో ముక్తేశ్వరం, పి.గన్నవరం బ్యాంకు కెనాల్లు, అమలాపురం, బెండా కెనాల్, ఐలెండ్లోని కాలువలు, వాటికి అనుబంధంగా ఉన్న కాలువలు, పంట బోదెల వ్యవస్థలు దారుణంగా ఉన్నాయి. తూడు, గుర్రపుడెక్క, అనధికార వంతెనలు, భవనాల నిర్మాణం, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కాలువలు మూసుకుపోవడంతో శివారు ప్రాంతాలకు నీరందడం లేదు. పంట, మురుగునీటి కాలువలకు భారీగా నిధులు ఇచ్చామని అధికారులు చెబుతున్నా పనులు మాత్రం జరగడం లేదు. కనీస మరమ్మతులు కూడా నోచుకోకపోవడం, పూడిక తొలగింపు లేకపోవడం వంటి కారణాల వల్ల నీరందక నాట్లు ఆలస్యమవుతోంది. సాగునీటి పారుదల, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయం కొరవడం కూడా డెల్టాలో రబీ ఆలస్యానికి కారణంగా మారింది. రబీ సాగు ఆలస్యం కావడం వల్ల కాలువల మూసివేత గడువు పెంచాల్సిన దుస్థితి నెలకొంది. ఏటా మార్చి 31 నాటికి కాలువలు మూసివేస్తామని చెప్పే అధికారులు ఏప్రిల్ 15 వరకు గడువు పెంచుతున్నారు. ఈసారి అసాధారణ జప్యం జరగడం వల్ల ఏప్రిల్ నెలాఖరు వరకు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ఏటికా ఏడు శివారు రైతులు సాగునీటి కోసం అర్రులు చాచుకుని చూడడమే.. నీరెప్పుడొస్తుందా అని. నెర్రెలు పడిన నేలను చూసి ఆశలు వదులుకునే సమయానికి అదిగదిగో నీరొచ్చేస్తోంది అన్న కబురు వినిపిస్తుంది. అప్పటి నుంచి మళ్లీ పనులు ఊపందుకుంటాయి. ఏటా ఇవే అవస్థలా.. నీటి పారుదలలో ఎందుకింత జాప్యం అంటే కాలువల వ్యవస్థ అస్తవ్యస్తం అంటారు. మరి వాటినెందుకు బాగుచేయలేదంటే నిధులు ఇచ్చామని గొప్పగా చెప్తారు. వాటితో చేసిన పనులెక్కడంటే జవాబు ఉండదు. నీటి పారుదల, వ్యవసాయ శాఖల సమన్వయ లోపంతో ఏ పనీ చేయక.. ఎక్కడి తూడు అక్కడే.. ఎక్కడి ఆక్రమణలు అక్కడే.. అనధికార వంతెనల నిర్మాణాలు.. ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలువల్లో పూడికలు అన్నదాతను ఎండగట్టేస్తున్నాయి. గోదావరిలో సమృద్ధిగా నీరు.. చెంతనే సాగు భూములు.. అయినా నీరు లేక ఎండే పొలాలు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం.. అధికారుల అనాలోచిత నిర్ణయాలు ఎంతకాలం సాగుతాయో మరి. నీరందక శివారు రైతుల గగ్గోలు జిల్లాలో కొలిక్కి రాని రబీసాగు ఇప్పటి వరకు 56.153 టీఎంసీల నీరు విడుదల అవరోధాలతో ముందుకు పారని వైనం యంత్రాంగం మధ్య సమన్వయ లోపం నిధులున్నా మరమ్మతులకు నోచుకోని కాలువలు డిసెంబర్ 1 నుంచి మొదలైనా పూర్తి కాని నాట్లు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరివ్వక తప్పని పరిస్థితి -
అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్తపై ఫిర్యాదు
రాజోలు: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజోలుకు చెందిన టీడీపీ కార్యకర్త నార్కెడమిల్లి కనకరాజుపై వైఎస్సార్ సీపీ నాయకులు మంగళవారం రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజోలు నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కనకరాజు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను నరికివేస్తానంటూ హెచ్చరికలు జారీ చేసిన కనకరాజుపై చర్యలు తీసుకోవాలని రాజోలు సీఐ నరేష్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. అనంతరం రాజోలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్ మాట్లాడుతూ కూటమి పాలనలో అన్ని వర్గాలపై దాడులు పెరిగిపోయాయని, కూటమి ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింద న్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పూర్తిగా విస్మరించి రాక్షస పాలన సాగిస్తున్నారని విమర్శించారు. పార్టీ మండల అధ్యక్షుడు కట్టా శ్రీనివాసరావు, సర్పంచ్ రేవు జ్యోతి, గ్రామ శాఖ అధ్యక్షుడు అడబాల జానకిరామ్, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి నేతల నాని, నియోజకవర్గ అధ్యక్షుడు గుర్రం జాషువా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొల్లాబత్తుల సతీష్ ,ఎంపీటీసీ చెల్లింగి లక్ష్మీఈశ్వరి, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి బొడ్డపల్లి ప్రసాద్, కొల్లాబత్తుల శ్రీను, జిల్లెళ్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినా ఆగని కుట్రలు
పి.గన్నవరం: తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు, చేపనూనె కలిసిందని కూటమి నేతలు చేసిన ప్రచారం నిజం కాదని సీబీఐ సిట్ క్లీన్చిట్ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ దుష్ఫ్రచారానికి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు మంగళవారం పి.గన్నవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే ఒక పథకం ప్రకారం వైఎస్సార్ సీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై పెట్రోలు బాంబులు వేసి దగ్ధం చేసిన కూటమి పెద్దలపై కేసు నమోదు చేయాలని మరో ఫిర్యాదును ఎస్ఐ బి.శివకృష్ణకు అందజేశారు. అనంతరం స్టేషన్ బయట గన్నవరపు విలేకరులతో మాట్లాడారు. తిరుపతి లడ్డూపై కూటమి నేతలు చేసిన దుష్ఫ్రచారం నిజం కాదని తేలడంతో చంద్రబాబు ఉక్రోషంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. పెట్రోల్ బాంబులతో ఇళ్లను దగ్ధం చేస్తూ దౌర్జన్యకాండ సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు ఫ్లెక్సీలతో ప్రజల దృష్టిని మరల్చేందుకు కుట్రలు పన్నారన్నారు. ప్రశ్నించే వారిని అంతం చేయాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఎంతటి దాడులు, దౌర్జన్యాలకు దిగినా భయపడేది లేదని హెచ్చరించారు. లడ్డూపై చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్కళ్యాణ్ చేసిన దుష్ఫ్రచారాన్ని దేశ ప్రజలు, ఆధ్యాత్మిక సంస్థల పెద్దలు గమనిస్తున్నారని అన్నారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారితో ఆటలాడవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు బూడిద వరలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు యన్నాబత్తుల ఆనంద్, కొమ్ముల రాము, విత్తనాల ఇంద్రశేఖర్, మట్టపర్తి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మందపాటి కిరణ్కుమార్, దొమ్మేటి వెంకట శివరామన్, కుడుపూడి విద్యాసాగర్, తోరం సూర్య భాస్కరరావు, వాసంశెట్టి తాతాజీ, నక్కా వెంకటేశ్వర రావు, దొమ్మేటి సత్యమోహన్, మిందగుదటి శిరీష్, పేరి శ్రీను పాల్గొన్నారు. -
వణికిస్తున్న పెద్ద పులి
ఫ బీజాపురి లేఅవుట్ పరిసరాల్లో ప్రత్యక్షంఫ అంతకు ముందు కోలమూరు, గాడాల, గామన్ బ్రిడ్జి రోడ్డు సమీపంలో సంచారం రాజానగరం/రాజమహేంద్రవరం రూరల్: పెద్ద పులి గడియకో రూటు మార్చుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. రాజమహేంద్రవరం రూరల్ మండల పరిసరాలతో పాటు వాటికి సమీపంలో ఉన్న కోరుకొండ, సీతానగరం మండలాల గ్రామాల్లో ప్రజలు రకరకాల ప్రచారాలతో వణికిపోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రాజానగరం మండలం పాలచర్ల వైపు నుంచి ఆటోనగర్ వైపునకు పులి వచ్చిందని కొందరు తెలిపారు. 2024 ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు 13 రోజుల పాటు చిరుత పులి సంచారంతో గజగజలాడిన ఈ ప్రాంత వాసులు.. ఇప్పుడు పెద్ద పులి వచ్చిందనే వార్తతో భయపడిపోతున్నారు. ఆటోనగర్ నుంచి దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూలు గోడ దాటుకుని, గామన్ బ్రిడ్జి రోడ్డులోని జీడిమామిడి తోటల్లోకి వెళ్లిపోయిందని కొందరు వ్యక్తులు చెప్పడంతో పాటు వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అనంతరం బీజాపురి లేఅవుట్ పరిసరాలకు వెళ్లిపోయిందని సమాచారం. రెండు రోజులుగా.. తొర్రేడు, వెంకటనగరం గ్రామాల్లో రెండు రోజులుగా సంచరించిన పెద్ద పులి కోలమూరు, కోరుకొండ మండలం గాడాల గ్రామాల మధ్యలో తిరిగినట్టు మంగళవారం ఉదయం అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే దాని దాడిలో పశువులు చనిపోయినట్లు ఎటువంటి సమా చారమూ లేదు. కోలమూరు, గాడాల గ్రామాల వ్యవసాయ భూముల్లో పులి తిరిగినట్టు పగ్ మార్కులను జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకరరావు, అటవీ రేంజ్ ఆఫీసర్ దావీదురాజు గుర్తించారు. దీంతో వారితో పాటు రెవెన్యూ, పోలీసు అధికారులు ఆయా ప్రదేశాలలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. పగ్మార్క్ ప్రాంతాల సమీపంలో డ్రోన్లు,బోనులు,ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అప్రమత్తంగా ఉండాలి జిల్లా అటవీశాఖ అధికారి ప్ర భాకరరావు మాట్లాడుతూ గ్రామస్తులు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువులను ఇళ్ల వద్ద జాగ్రత్తగా ఉంచుకోవాలని, ప్రకాశవంతమైన లైట్లు ఉంచాలని, జంతువును మళ్లించడానికి శబ్దాలు చేయాలన్నా రు. గాడాల నుంచి సుమారు 15 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
పొగాకు రైతుల నడ్డి విరిచిన కేంద్ర బడ్జెట్
ఫ రైతుల మొరను ఆలకించని వైనం ఫ అక్రమ సిగరెట్లను ప్రోత్సహించేలా రూపకల్పన ఫ జీఎస్టీని తక్షణం తగ్గించాలి ఫ వర్జీనియా పొగాకు రైతుల ఆవేదన దేవరపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తమ నడ్డి విరిచిందని వర్జీనియా పొగాకు రైతులు విమర్శించారు. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద మంగళవారం సాయంత్రం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర బడ్జెట్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పొగాకు ఉత్పత్తులపై 28 శాతం ఉన్న జీఎస్టీని 40 శాతానికి పెంచడం వల్ల పరోక్షంగా పొగాకు రైతులపై ప్రభావం పడుతుందన్నారు. ఎకై ్సజ్ సుంకం, జీఎస్టీ పెంచడం వల్ల విదేశీ (నాన్ టాక్స్బుల్) సిగరెట్లకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడి, స్వదేశీ సిగరెట్ల వినియోగం పడిపోతుందన్నారు. పెంచిన జీఎస్టీని తగ్గించాలని ఇటీవల రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధుల బృందం ఢిల్లీలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. బడ్జెట్లో రైతులకు న్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినప్పటికీ అమలు కాలేదన్నారు. పండించిన పొగాకులో 40 శాతం స్వదేశీ సిగరెట్ల తయారీకి, 60 శాతం ఎగుమతులు జరుగుతున్నాయని, ముడిసరుకు పొగాకుపై పన్ను తగ్గించినప్పటికి రైతులకు ప్రయోజనం లేదన్నారు. జీఎస్టీ పెరగడం వల్ల పొగాకు రైతులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రయోజనం శూన్యం వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడు కరుటూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల మొరను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అక్రమ సిగరెట్ల వినియోగం తగ్గించాలంటే స్వదేశీ సిగరెట్లపై జీఎస్టీ తగ్గించాలన్నారు. ముడి సరుకుపై పన్ను తగ్గించడం వల్ల రైతులకు ప్రయోజనం లేదని తెలిపారు. వర్జీనియా పొగాకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు కాట్రు సత్యనారాయణ మాట్లాడుతూ జీఎస్టీ పెంచడం వల్ల సిగరెట్ పెట్టైపె రూ.50 నుంచి రూ.100 ధర పెరుగుతుందన్నారు. దీని ప్రభావం పొగాకు ఉత్పత్తి దారులపై తీవ్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. రైతు సంఘం ప్రతినిధి యాగంటి సాయిబాబు మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులపై పెంచిన జీఎస్టీని తక్షణం తగ్గించి రైతులు, రైతు కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో జీఎస్టీ ని ఇన్వాయిస్పై వసూలు చేసేవారని, ఇప్పుడు ఎమ్మార్పీఎస్ ధరపై వసూలు చేస్తున్నా రని ఆయన తెలిపారు. కొత్తగా తీసుకు వచ్చిన పన్ను ల విధానం వల్ల అక్రమ సిగరెట్ల వాటా భారీగా పెరుగుతుందని, ఇప్పటికే పన్ను కట్టని అక్రమ సిగరెట్ల వాటా 26 శాతం ఉన్నట్టు రైతులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతుల గోడును వినిపించుకుని, పెంచిన జీఎస్టీని తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమా వేశంలో రైతు సంఘాల ప్రతినిధులు సుంకవల్లి శ్రీనివాస్, సింహాద్రి ధర్మావతారం, కరుటూరి శ్రీనివాసరావు, ఈలపోలు చిన్ని పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాజ్యాంగ పాలన పూర్తిగా విఫలం
కొత్తపేట: రాష్ట్రంలో రాజ్యాంగ పాలన పూర్తిగా విఫలమైందని కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. టీటీడీ లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై సిట్ చార్జ్షీట్ విడుదల చేసినా వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఫొటోలతో ప్లెక్సీలు ఏర్పాటు చేసి, ప్రజల్లో కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడౖంపె తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం, కూటమి నాయకులు వ్యవహరిస్తున్న తప్పుడు విధానాలపై తగు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం నియోజకవర్గంలో నాలుగు మండలాల వైఎస్సార్ సీపీ ప్రతినిధులు కొత్తపేటలో డీఎస్పీ సుంకర మురళీమోహన్కు వినతిపత్రం సమర్పించారు. శాంతిభద్రతలకు భంగం కలిగేలా ఫ్లెక్సీలు పెట్టి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ప్రసాదానికి వాడే నెయ్యిలో గొడ్డుకొవ్వు, పందికొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను చంద్రబాబు అండ్ కో గాయపరిచారన్నారు. వాస్తవాలు బయటపడినప్పుడు నియంతలు ఎప్పుడూ హింసకే పాల్పడతారన్నారు. చంద్రబాబు ఏపీని జంగిల్రాజ్గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వులేదని ల్యాబ్లు తేల్చడంతో చంద్రబాబు అహం దెబ్బతిందన్నారు. చంద్రబాబును ప్రజలు ఛీదరించుకుంటున్నారన్నారు. అది తట్టుకోలేక డైవర్షన్ కోసం కుట్రలు పన్నారన్నారు. ప్రశ్నించేవారిని అంతం చేయాలన్నది చంద్రబాబు పథకమని ఆందోళన వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే వైఎస్సార్ సీపీ నాయకులపై వరుసగా దాడులు జరిగాయన్నారు. పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు, ఎంపీపీలు మార్గన గంగాధరరావు, తోరాటి లక్ష్మణరావు, జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, తమ్మన శ్రీను, బొక్కా కరుణాకర్, మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు నెల్లి లక్ష్మీపతిరావు, సర్పంచ్ రెడ్డి చంటి, రాష్ట్ర కాపు సంఘం నాయకుడు చల్లా ప్రభాకరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ గుత్తుల భవాని పాల్గొన్నారు. మండిపడిన వైఎస్సార్ సీపీ నేతలు నాయకుల ఫొటోలతో ప్లెక్సీల ఏర్పాటుపై నిరసన కొత్తపేటలో డీఎస్పీకి ఫిర్యాదు -
నేటి నుంచి జాతీయ గోల్డ్కప్ హాకీ పోటీలు
ఫ ఈ నెల 14 వరకూ నిర్వహణ ఫ దేశవ్యాప్తంగా తరలిరానున్న 24 జట్లు ఫ పూర్తయిన ఏర్పాట్లు ఫ టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి రవిచంద్ర నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి కాకినాడ డీఎస్ఏ మైదానంలోని యాస్ట్రో టర్ఫ్ హాకీ మైదానంలో నిర్వహించనున్న కోకనాడ గోల్డ్కప్ జాతీయ స్థాయి పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కె.రవిచంద్ర ప్రసాద్ మంగళవారం ఈ విషయం తెలిపారు. డీఎస్ఏ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హాకీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో 13 పురుషుల జట్లు, 8 మహిళల జట్లు పాల్గొంటున్నాయన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే క్రీడాకారులకు భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని, పోటీలను శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. చక్కని వేదిక ద్రోణాచార్య అవార్డు గ్రహిత, భారత జట్టు మాజీ కెప్టెన్ ప్రీతిమ్ శివాజ్ మాట్లాడుతూ పూర్వ క్రీడాకారులందరూ కలుసుకోవడానికి ఈ పోటీలు చక్కని వేదిక అన్నారు. టోర్నమెంట్ నిర్వాహకుడు రవిచంద్రను ఆమె అభినందించారు. అడిషనల్ డీఎస్పీ లక్ష్మీపతి మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలు కాకినాడ వేదికగా జరగడం ఆనందంగా ఉందన్నారు. ఏపీ హాకీ సంఘ సంయుక్త కార్యదర్శి వి.రవి రాజు, డీఎస్డీఓ వి.సతీష్ కుమార్, డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర, కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు బాబ్జీ, వినయ్, సూరిబాబు, హరిబాబు, పరశురాం, ఇండియన్ గోల్ కీపర్ రమ్య, సత్యగౌరి, నాగమణి, ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలి
అమలాపురం టౌన్: తిరుమల తిరుపతి లడ్డూపై అసత్య ఆరోపణలు చేసి కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచిన బాధ్యులైన కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోక్ష్లే కాకుండా కూటమి నాయకులు చేసిన వ్యాఖ్యలు అవాస్తమని సీబీఐ సిట్ నివేదిక ద్వారా తేలిపోయినా ఇంకా బొంకు తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి) తదితరులు పట్టణ సీఐ పి.వీరబాబుకు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై జరిగిన ఆటవిక దాడులను నిరసిస్తూ తొలుత పట్టణ పోలీస్ స్టేషన్కు ఎదురుగా గడియారం స్తంభం సెంటరులో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పార్టీ ఎమ్మెల్సీలు, పార్టీ కో ఆర్డినేటర్, పార్టీ నాయకులు వినతి పత్రం అందించారు. పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్, ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మాట్లాడుతూ తిరుపతి లడ్డూపై కూటమి ప్రభుత్వం కుట్ర బయట పడిందని చెప్పిన మాజీ మంత్రులు రాంబాబు, రమేష్లపైన, వారి ఇళ్లపైన కూటమి నాయకుల చేసిన దాడులు, దమనకాండ దారుణమని పేర్కొన్నారు. తక్షణమే ఈ ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ఉసిగొల్పడం వల్లే కూటమి నాయకులు మాజీ మంత్రులపై హత్యాయత్నాలకు ప్రయత్నించారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉండి కూడా తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ పదే పదే మీడియా సమావేశాల్లో వైఎస్సార్ సీపీ పైన, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన బురద జల్లుతున్నారన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామ్గోపాల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్ భూషణ్, పార్టీ జిల్లా అనుబంధ కమిటీల అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, జాన గణేష్, అమలాపురం పట్టణం, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, గుత్తుల చిరంజీవిరావు, పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల నాయకులు చొల్లంగి సుబ్బిరామ్, సరెళ్ల రామకృష్ణ, చీకట్ల కిషోర్, సూదా గణపతి, విత్తనాల మూర్తి, పొగాకు శ్రీను, ములపర్తి శ్రీను, దూడల ఫణి, ఈతకోట శ్రావణ్, మున్సిపల్ కౌన్సిలర్లు చిట్టూరి పెదబాబు, కట్టోజు సన్నయ్యదాసు, కొల్లాటి దుర్గాబాయి పాల్గొన్నారు. తిరుమల లడ్డూపై భక్తుల మనోభావాలను గాయపరిచారు అమలాపురం వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్, ఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు, ఇజ్రాయిల్ డిమాండ్


