22 నుంచి వాడపల్లి వెంకన్న ఏకాదశ బ్రహ్మోత్సవాలు
ఆత్రేయపురం: స్థానిక వాడపల్లి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఏకాదశ బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ పాతపాటి వెంకట సత్యనారాయణ రాజు (రమణ రాజు) తెలిపారు. బుధవారం ఆలయ అర్చకులు, వేద పండితులు బృందం సభ్యులు పందిరి రాట వేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. స్వామి వారి కరపత్రం ఆవిష్కరించి భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ అర్చకులు వాడపల్లి పవన్ దీక్షితులు, పెద్దింటి రవికృష్ణ, పెరవలి సాయి పవన్ తదితరులు ప్రారంభ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ పర్యవేక్షకులు గోరింట వినయ్కుమార్, సిబ్బంది పాకలపాటి సత్యనారాయణరాజు, శ్రీను పాల్గొన్నారు.


