కదం తొక్కిన కార్మిక వర్గాలు
అమలాపురం రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తోందని, ప్రధాని మోదీ కార్పొరేట్ దొంగల ముఠాకు నాయకుడిగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు విమర్శించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో కార్మిక, కర్షక, ఉద్యోగ వర్గాలు కదం తొక్కాయి. ఈదరపల్లి వంతెన నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు వేలాదిమంది కార్మికులు, రైతు కౌలు రైతులు, వ్యవసాయ, ఉద్యోగ ఉపాధ్యాయ, ఆటో కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఎల్ఐసీ మెడికల్ రిప్స్ ఐఎంఎల్ డిపో, మున్సిపల్ కార్మికులు, కోపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు స్కీమ్ వర్కర్లు భారీ ప్రదర్శన నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేసిన నినాదాలతో పట్టణం హోరెత్తింది. మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాస్తూ 29 చట్టాలను రద్దు చేసి బానిసత్వానికి ప్రతీకగా నిలిచే 4 లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గం అన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి, పేదవాడి పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.ి రైతు సంఘం రాష్ట్ర నాయకులు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ మోదీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేనిపక్షంలో ఢిల్లీ తరహాలో మరో భారీ రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా చేస్తామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు కె.సత్తిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు, కార్యదర్శి గుడాల వెంకట రమణ, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీవీ సుబ్బారావు, అంగన్వాడీ జిల్లా కోశాధికారి పి.అమూల్య, ఆశా వర్కర్ల జిల్లా నాయకురాలు బి.ఈశ్వరి, మిడ్ డే మిల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు లోవలక్ష్మి, ఐద్వా అధ్యక్షురాలు జి దైవ కృప మెడికల్ రిప్స్ యూనియన్ జిల్లా నాయకులు సంతోష్, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు కడలి సత్యనారాయణ పాల్గొన్నారు.


