‘ఆ బిడ్డ నాది కాదు’.. తేజ్ ప్రతాప్ విలవిల | I Am In Depression Tej Pratap | Sakshi
Sakshi News home page

‘ఆ బిడ్డ నాది కాదు’.. తేజ్ ప్రతాప్ విలవిల

Feb 9 2026 10:48 AM | Updated on Feb 9 2026 10:56 AM

I Am In Depression Tej Pratap

పట్నా(బిహార్‌): జన్ శక్తి జనతా దళ్ (జేజేడీ) అధినేత, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో తనతో సంబంధం ఉన్నట్లు ప్రచారంలో ఉన్న ఓ మహిళ ఒక బిడ్డ జన్మనిచ్చిందని, దానికి తానే కారకుడిని అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. ఈ విషయంలో సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఆయన స్పందించారు.

ఇది తన వ్యక్తిత్వాన్ని దిగజార్చడానికి జరుగుతున్న కుట్ర అని, ఆ బిడ్డతో తనకు ఎటువంటి సంబంధం లేదని తేజ్ ప్రతాప్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుట్ర వెనుక తన రాజకీయ ప్రత్యర్థులతో పాటు తన సొంత వర్గానికి చెందిన ఐదుగురు నేతలు ఉన్నారని తేజ్ ప్రతాప్ ఆరోపించారు. ముకేశ్ రౌషన్, సంజయ్ యాదవ్, శక్తి సింగ్ యాదవ్, రమీజ్, సునీల్ సింగ్‌లను ఆయన ఇందుకు కారకులుగా ఆరోపించారు.  వీరిలో ఒక రాజ్యసభ ఎంపీ, ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారని పేర్కొంటూ, వీరంతా కలిసి తనపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.

తన పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలకు తెరలేపారని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. 
గత ఏడాది ఒక మహిళతో తేజ్‌ ప్రతాప్ ఉన్న ఫోటోలు ఫేస్‌బుక్‌లో వైరల్ కావడంతో ఆయనను రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) నుండి బహిష్కరించారు. అయితే, తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయ్యిందని,  కొందరు వ్యక్తులే ఆ పని చేశారని నాడు తేజ్ ప్రతాప్‌ ఆరోపించారు. అనుష్క యాదవ్, ఆకాష్ భాటి అనే వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రస్తావిస్తూ, ఆ బిడ్డకు అసలైన తండ్రి ఎవరో తనకు తెలుసని తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన పేరును  ఈ వివాదంలోకి లాగి, మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యానని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తానని అన్నారు. నిందితులపై కోర్టులో దావా వేస్తానని, న్యాయం కోసం పోరాడతానని పేర్కొన్నారు. బిహార్ రాజకీయాల్లో  ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement