breaking news
-
‘భోగాపురం’ పూర్తి క్రెడిట్ వైఎస్ జగన్దే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: భోగాపురం ఎయిర్ పోర్ట్పై చంద్రబాబువి అబద్ధపు ప్రచారాలని.. వైఎస్ జగన్ చేసిన మేలు అంతా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్, భోగాపురం వరకు అన్నీ క్రెడిట్ చోరీ. ఒక వైపు క్రెడిట్ చోరీ చేస్తూనే మరోవైపు మాపై విష ప్రచారం’’ అంటూ ఆయన మండిపడ్డారు.‘‘డమ్మీ సీఎం చంద్రబాబు, డిఫ్యాక్టో సీఎం లోకేష్, డిప్యూటీ సీఎం పవన్తోపాటు ఇప్పుడు కొత్తగా ఇంకో సీఎం రామ్మోహన్ నాయుడు వచ్చారు. వేల ఎకరాలు ఎయిర్ పోర్టుకు ఎందుకని ఒక యువతి అడిగిందని జగన్ చెప్పారు. దానికి కూడా చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. కొబ్బరి కాయ కొట్టిందీ, గుమ్మడి కాయ కట్టిందీ నేనే అని చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు శంకుస్థాపన రాయి వేసి చేతులు దులుపుకున్నారు. భోగాపురం పేరుతో వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. భోగాపురం ఎయిర్ పోర్టు కోసం వైఎస్ జగన్ రూ.1200 కోట్లు ఖర్చు చేశారు...2026 జూన్ లో విమానాలు ఎగురుతాయని జగన్ ఆరోజే చెప్పారు. జగన్ హయాంలోనే 75-80 శాతం పూర్తయింది. కరోనా లేకపోతే మా హయాంలోనే పూర్తయ్యేది. ఎయిర్ పోర్టు కలను సాకారం చేసింది వైఎస్ జగన్. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసినా మాకు ఇబ్బంది లేదు. కానీ మాపై విష ప్రచారం చేయటం ఎందుకు?. రూ.6,300 కోట్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి గట్కారీ ప్రకటించారు. కానీ చంద్రబాబు వచ్చి రెండేళ్లయినా ఇప్పటికీ ఆ రోడ్డు నిర్మాణానికి అతీగతీ లేదు. భోగాపురం నుండి విజయవాడకు విమానంలో వెళ్లటం కష్టంగా మారింది. దానికంటే రైలు మార్గంలో వెళ్లటం తేలిక అని కూటమి నాయకుడే చెప్పారు. అప్పటికీ చంద్రబాబుకు బల్బు వెలగలేదు..దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ కడపకు తెచ్చింది వైఎస్ జగన్. ఆయన స్వయంగా దాల్మియాతో మాట్లాడి ఫ్యాక్టరీ తెప్పించారు. స్టీల్ ప్లాంట్ కూడా వైఎస్ జగన్ తెప్పిస్తే పారిశ్రామిక వేత్తలను బెదిరించి తరిమేశారు. చంద్రబాబు రూ.30 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టారు. తన బంధువు ఎంపీ భరత్ కు రూ.5 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టారు. వైఎస్ జగన్ రిషి కొండ మీద బిల్డింగులు కట్టిస్తే తన కోసమే అన్నట్టు ప్రచారం చేశారు. మరి నిజంగా ఆ బిల్డింగులు వైఎస్ జగన్వే అయితే ఇప్పుడు అందులో ఎందుకు నివాసం ఉండటం లేదు?. చంద్రబాబు విష ప్రచారాన్నే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు..మహిళా ఎస్ఐ మీద అసభ్యంగా ప్రవర్తించారంటూ మా నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జై జగన్ నినాదాలతో ఎస్ఐ చెవులు మూసుకుంటే దాన్ని కూడా తప్పుదారి పట్టించారు. పైగా అన్ని రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎస్ఐను బెదిరించి మరీ బలవంతంగా కేసు పెట్టించారు. నిజానికి ఆ ఎస్ఐతో తప్పుగా ప్రవర్తించిందే పోలీసులు’’ అంటూ సజ్జల వివరించారు. -
పోలీసులు జేసీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు: పెద్దారెడ్డి
సాక్షి, అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డైరక్షన్ లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడి.. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ నేత హనుమంతరెడ్డిని కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు.టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి.. 24 మంది వైఎస్సార్సీపీ నేతలను అంతం చేస్తామని హిట్ లిస్ట్ ప్రకటించి.. దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దురదృష్టకరమన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత పోలీసులకు లేదా? అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. జేసీ అస్మిత్రెడ్డి, ప్రభాకర్రెడ్డి ఆగడాలు శృతిమించాయని.. పోలీసులు జేసీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టండి’
తాడేపల్లి :ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఇందుకోసం సోషల్ మీడియాను గ్రామస్థాయి నుంచి విస్తృతంగా వాడుకోవాలన్నారు. ఈరోజు(శుక్రవారం, జూలై 31వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా విభాగం సమావేశం నిర్వహించారు సజ్జల. దీనికి రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ, నగర అధ్యక్షులు హాజరయ్యారు.దీనిలోభాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ అసభ్య పదజాలం, మార్ఫింగ్ కంటెంట్కు తావివ్వకూడదు. ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టండి. గ్రామస్థాయి నుంచి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలి. అక్రమ కేసులు, వేధింపులన్నీ ‘డిజిటల్ డైరీ’ లో నమోదు చేయాలి. ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. వివరణలు ఇచ్చే పరిస్థితి నుంచి అటాకింగ్ మోడ్లోకి రావాలి. సోషల్ మీడియా కార్యకర్తలు ఒక వన్ మ్యాన్ ఆర్మీలా పని చేయాలి. పదునైన కంటెంట్తో నిజాన్ని పదిమందికి చేరవేయాలి. ప్రజల గొంతుకగా, క్రమశిక్షణతో కూడిన బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రతినిధులుగా పని చేయాలి. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా, సిద్ధాంతాలను, లైన్ ఆఫ్ థింకింగ్ను వదులుకోకుండా నిలబడాలి. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగాన్ని తొలిసారిగా ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థగా గ్రామ స్థాయి వరకు బలోపేతం చేశాం. చంద్రబాబుకు ప్రజాబలం లేదు.. కేవలం భ్రమలు కల్పించే మీడియా వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం, కుట్రలతో అధికారం చలాయిస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న మనపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను తీవ్ర అప్పుల ఊబిలోకి నెట్టి, అబద్ధాలతో స్వర్గం చూపిస్తున్నది. పాలనలో విఫలమై, ప్రశ్నించే వారిపై వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల ఆకాంక్షలే శ్రీరామరక్షగా మన పార్టీ ధృఢంగా నిలబడింది.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేయడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. నాయకత్వ నిబద్ధత, కార్యకర్తల కృషితో 2029లోభారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం’ అని స్పష్టం చేశారు. -
‘భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ ఎవరు చేశారు?’
విశాఖ: భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్తో పాటు, ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డే కారణమని, వారు చేసిన కృషి వల్లే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ తుదిరూపు దిద్దుకుందని పార్టీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తిగా చెప్తున్నానని, విశాఖ ఎయిర్ పోర్ట్ విస్తరణ ప్రత్తిపాధన వచ్చినప్పుడు భోగాపురం, యలమంచిలి వద్ద స్థలాలు చూసామన్నారు. ఈ విషయాలు చంద్రబాబుకి, అశోక్ గజపతిరాజుకి సైతం తెలుసని బొత్స తేల్చిచెప్పారు. ఈరోజు(శుక్రవారం, జూలై 31వ తేదీ) విశాఖపట్నం నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన బొత్స.. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ ఎవరు చేశారు? ఎవరు పరిహారం ఇచ్చారో లెక్కలు తీయమని సవాల్ విసిరారు. కొత్త ఎయిర్ పోర్ట్ ఆలోచన చంద్రబాబుది అని ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నించారు బొత్స. ఆయన హయాంలో ఒక్క ఎకరా భూమిని కూడా సేకరించలేదని, అటువంటప్పుడు ఆలోచన ఆయనది ఎలా అవుతుందన్నారు. ‘2019 వరకు భూ సేకరణ ఎక్కడ జరిగింది..?, 15 వేల ఎకరాలు కావాలని చెప్పిన చంద్రబాబు.. ఒక్క ఎకరమైనా సేకరించారా..?, భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం భూ సేకరణ ఎవరు చేశారు..?, పరిహారం ఎవరు ఇచ్చారు..? , లెక్కలు తియ్యండి. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ నుంచి నిర్మాణం వరకూ మా నాయకుడు వైఎస్ జగనే చేశారు’ అని స్పష్టం చేశారు. -
ఔను.. ‘భోగాపురం’ ఘనత వైఎస్ జగన్దే
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్పోర్ట్ను తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ కొట్టేయాలన్న చంద్రబాబు సర్కార్ తీరుపై వైఎస్సార్సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఎయిర్పోర్టుకు భూసేకరణ పూర్తి చేసి.. అనుమతులు తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం. అయితే, చంద్రబాబుదే క్రెడిట్ అంటూ ఆంధ్రజ్యోతి రాతలపై కారుమూరి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ తప్పుడు రాతలను దుయ్యబట్టారు.వైఎస్సార్సీపీ ‘భోగాపురం’ క్రెడిట్ కొట్టేయాలని చూస్తుందంటూ ఎల్లో మీడియా రాతలపై కారుమూరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తే 2019 కంటే ముందే మీరు కట్టేయొచ్చుగా.. విమానాశ్రయానికి సంబంధించి ఎన్నికలకు రెండు నెలలు ముందు చంద్రబాబు ఉత్తుత్తి శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలు చేయటమే తప్ప ఏ ప్రాజెక్టుని పూర్తి చేసిన దాఖలాలు ఉండవు.. ఆ ప్రాజెక్టులను వదిలేస్తాడు. ఎవరైనా అన్ని అనుమతులు తీసుకొని వచ్చి శంకుస్థాపన చేస్తారా? ఏం అనుమతులు తీసుకురాకుండా కోర్టు కేసులు పెండింగ్ ఉండగా శంకుస్థాపన చేస్తారా? రాధాకృష్ణ సమాధానం చెప్పాలి కదా?..2200 ఎకరాలలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను భోగాపురంలో కట్టాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టులో పెండింగ్ కేసులను పరిష్కరించి.. అక్కడ నాలుగు గ్రామాల్లో 404 కుటుంబాలు నిర్వాసితులను వేరే ప్రాంతాలకు తరలించి కాలనీలు నిర్మించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం భూసేకరణ చేసి.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్వోసీ తీసుకొచ్చింది. 2023 మే 3న వైఎస్ జగన్ భూమి పూజ చేశారు...విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు 77 మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుకు ప్రణాళిక సిద్ధం చేసి కేంద్ర మంత్రి గడ్కరీని ఒప్పించారు. నేడు భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయిందంటే అది వైఎస్ జగన్ ముందు చూపు వల్లే.. ఆ విషయం గుర్తుపెట్టుకో రాధాకృష్ణ. మీరు ఎన్ని తప్పుడు రాతలు రాసిన ప్రజలకు వాస్తవాలు తెలుసు’’ అని కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. -
‘డీఎస్సీ నియామకాల్లో క్రీడా కోటా పేరిట భారీ అక్రమాలు’
మచిలీపట్నం: కూటమి ప్రభుత్వంలో చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో స్పోర్ట్స్ కోటా పేరిట అనర్హులకు, పచ్చ చొక్కాల అనుచరులకు అడ్డదారిలో ఉద్యోగాలు కట్టబెడుతూ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు నియామాకల్లో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం తక్షణమే సీబీఐ తో విచారణ జరిపించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...జీవోల రద్దు – అడ్డదారిలో సరికొత్త 'పచ్చ' క్రీడలు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనాదిగా అమలవుతున్న జీవో నెంబర్ 74, 75 ల ప్రకారం ఉద్యోగ నియామకాలలో 2% స్పోర్ట్స్ కోటా అమలు జరిగేది. కానీ, సరిగ్గా డిఎస్సీ ప్రకటన వెలువడే ఏప్రిల్ 19వ తేదీన ఆ పాత జీవోలను రద్దు చేసి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా జీవో నెంబర్ 4, జఏడీ ద్వారా జీవో నెంబర్ 47 తీసుకొచ్చారు. ఈ రెండు జీవోల ముఖ్య సారాంశం ఏంటంటే... స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం రావడానికి ఎలాంటి డిగ్రీ చదవక్కర్లేదు, టెట్ (TET) రాయక్కర్లేదు, ఆఖరికిడీఎస్సీ పరీక్ష కూడా రాయాల్సిన అవసరం లేదు.టీడీపీ నాయకుల చేతుల్లో క్రీడా సంఘాలు – సర్టిఫికెట్ల విక్రయంఈ జీవోల ప్రకారం క్రీడల్లో పాల్గొన్నట్లు ఇచ్చే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటే చాలు ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టేస్తున్నారు. ఇలా మొత్తం 400 చిల్లర పోస్టుల్లో ఇప్పటికే 380 కి పైగా ఉద్యోగాలను నియామకం చేశారు. ఈ సర్టిఫికెట్లు ఇచ్చే క్రీడా సంఘాలు, అసోసియేషన్ల అధ్యక్షులుగా ఉన్నది ఎవరయ్యా అంటే... కూటమి ప్రభుత్వంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, లోకేష్ గారి అనుచరులు, టీడీపీ జెండాలు మోసిన నాయకులే! జూడో, సాఫ్ట్ బాల్ వంటి క్రీడా సంఘాల నుంచి ఒక్కో దానికి 38, 39 చొప్పున సర్టిఫికెట్లు ఇప్పించుకుని తమ సొంత మనుషులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు.అంతర్జాతీయ మెడలిస్టులకు సున్నామన దేశం, రాష్ట్రం గర్వపడేలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇస్తే ఏమాత్రం తప్పులేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? అసలు గ్రౌండ్లో అడుగుపెట్టకుండా, కేవలం నాలుగు కాలేజీలు కలిసి ఆడుకున్న ఆటల్లో బయట కూర్చుని నీళ్ల సీసాలు, బాల్స్ అందించిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటే చాలు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడు ఉద్యోగం రాక కన్నీళ్లు పెట్టుకుంటుంటే, అడ్డదారిలో వచ్చిన కూటమి కార్యకర్తలకు మాత్రం ఉద్యోగాలు పంచిపెట్టడం అత్యంత దారుణం.ద్వంద్వ నీతి..30-35 ఏళ్లుగా విద్యార్థులకు పాఠాలు చెప్పి, మరో రెండేళ్లలో రిటైర్ అయ్యే 60 ఏళ్ల వయసున్న ఉపాధ్యాయులను మాత్రం నైపుణ్య పరీక్షల పేరిట 'టెట్ రాయండి' అని వేధిస్తున్నారు. మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు గారు మాత్రం తన కంటి సైగలతో డిఎస్సీలో 400 చిల్లర మందికి టెట్ లేదు, డిఎస్సీ పరీక్షా లేదు అని అడ్డదారి ఉద్యోగాలు ఎలా ఇస్తారు? ఇది నిరుద్యోగ యువతను, కష్టపడి చదివిన అభ్యర్థులను తీవ్రంగా మోసం చేయడమే. దొడ్డిదోవన పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో పొందిన 380కి పైగా నియామకాలను వెంటనే రద్దు చేసి, అర్హులైన ప్రతిభావంతులకు, నిజమైన క్రీడాకారులకు న్యాయం చేయాలి.వైఎస్సార్సీపీ డిమాండ్లివే... ఈ నేపధ్యంలో జీవో నెంబర్ 4, 47 ల మరుగున జరిగిన ఉపాధ్యాయ నియామకాల అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించడంతో పాటు.. విద్యావ్యవస్థను, నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసినందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. -
ఆనాడు అసలు వైఎస్ జగన్ ఏమన్నారంటే..
భోగాపురం ఎయిర్ పోర్టును వైఎస్ జగన్ వ్యతిరేకించినట్లు పచ్చగుంపు అబద్దపు ప్రచారం చేస్తోంది. ఆయన ఏనాడూ ఎయిర్ పోర్ట్ను వ్యతిరేకించలేదు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు సొంత భాష్యాలు చెబుతూ.. ఎల్లో మీడియా చెలరేగిపోతోంది. అయితే, విమానాశ్రయానికి సీఎం హోదాలో వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారనే అసలు వాస్తవానికి మాత్రం ముసుగేసింది.ఆనాడు సీఎం హోదాలో వైఎస్ జగన్ కేవలం శంకుస్థాపనకే పరిమితం కాలేదు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న న్యాయపరమైన వివాదాలన్నిటినీ పరిష్కరించారు. కావాల్సిన అనుమతులన్నీ తెప్పించారు. అన్నీ చేసిన తరవాత... 30 నెలల్లో పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థకు లక్ష్యం విధించి మరీ కొబ్బరికాయ కొట్టారు. కానీ ఎల్లో మీడియా మాత్రం ఎయిర్ పోర్ట్ను వ్యతిరేకించారంటూ దుష్ప్రచారం చేస్తోంది.ఆనాడు అసలేం జరిగిందంటే..భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం చంద్రబాబు 2015లో రైతుల నుంచి 15,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయం తీసుకోవడంపై స్థానిక రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఈ ఆందోళనతో వైఎస్ జగన్ కూడా ఏకీభవించారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు అన్ని ఎకరాల భూమి దేనికంటూ నిలదీశారు. 2,300 ఎకరాలు ఉంటే సరిపోతుందన్నారు. ‘‘చెన్నై ఎయిర్పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? ఢిల్లీ ఎయిర్పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? అని ప్రశ్నిస్తూ వైఎస్ రైతులకు మద్దతుగా నిలిచారు.చివరకు చంద్రబాబు ప్రభుత్వం సేకరించాల్సిన భూమిని తొలుత 6,000 ఎకరాలకు.. ఆ తర్వాత 2,700 ఎకరాలకు కుదించుకుంటూ వచ్చింది. చివరకు 2017లో 2,700 ఎకరాల్లో ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడంతో పాటు.. ఇందుకోసం ఏర్పాటు చేసిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ కంపెనీ పేరుమీద రూ.1,500 కోట్ల అప్పును హడ్కో నుంచి తీసుకోవడానికి అనుమతిస్తూ జీవో ఇచ్చారు. అయితే బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇవేమీ పట్టని ఎల్లో గ్యాంగ్.. నాడు భూసేకరణను వ్యతిరేకించి.. ఎయిర్పోర్ట్ను అడ్డుకున్నారంటూ అసత్యాలు ప్రచారాలు చేస్తోంది. -
సంతాప సభలకూ రాజకీయ రంగు.. చంద్రబాబు వైఖరిపై ప్రశ్నలు!
రాష్ట్ర రాజకీయాలలోనే కాదు.. దేశ రాజకీయాలలో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్గా ఉన్నారు. ఆ విషయం ఆయన కూడా పలుమార్లు చెప్పుకుంటారు. ఆ సీనియారిటీని ఆయన సమాజ హితవు కోసం, వివిధ వర్గాల ఐక్యత కోసం ఉపయోగించాలని ఎవరైనా కోరుకుంటారు. దురదృష్టవశాత్తు ఈ వయసులో కూడా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు.కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే, కాపు వర్గ నేత బోండా ఉమామహేశ్వరరావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాని, వైఎస్సార్సీపీని పదేపదే అనుచిత భాషతో ప్రస్తావించడం కాని, సామాజిక కార్యక్రమాలలో సైతం ఆయా పార్టీలవారు శత్రువుల మాదిరిగా చూసుకోవాలన్నట్లుగా చేస్తున్న సూచనలు కాని ఏ మాత్రం సమంజసమైనవని అనిపించవు. బోండా ఉమా పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తుంటే పిలిచి మాట్లాడవచ్చు. అలాకాకుండా పార్టీలోని ఇతర నేతలకు కూడా ఒక సంకేతం వెళ్లేలా చంద్రబాబు ఇచ్చిన డైరెక్షన్ టీడీపీలోనే చర్చనీయాంశం అయింది.మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణించిన తర్వాత వివిధ పార్టీలకు చెందినవారు ఆయన స్వస్థలం కిర్లంపూడి వెళ్లి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముద్రగడకు కాపు సామాజికవర్గంలో ఉన్న గుర్తింపు రీత్యా వివిధ ప్రాంతాలలో సంతాప సభలు జరిగాయి. ఇవి పార్టీలకు అతీతంగా జరగడం గమనించదగ్గ అంశం. ఆ సభలు పెద్దగా రాజకీయ ప్రస్తావన లేకుండానే సాగాయి. ఒక సంతాప సభలో బోండా ఉమా, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. ఈ ఘట్టాన్ని వైఎస్సార్సీపీ నాయకత్వం సీరియస్గా తీసుకోలేదు. అంబటిని కాని మరెవ్వరిని కాని తప్పు పట్టలేదు. కాని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం బోండా ఉమాపై సీరియస్ అయినట్లు తెలుగుదేశం పత్రికలలో ప్రముఖంగా వార్తా కథనాలు వచ్చాయి.ఈ సందర్భంగా గొడ్డలి పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దని చంద్రబాబు చెప్పారని ఎల్లో మీడియాలో ఒకటైన ఈనాడు పత్రిక మొదటి పేజీలో ప్రచురించింది. చంద్రబాబు ఎప్పుడైనా విమర్శల కోసం ఒకసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే అదో తరహా. కాని నిత్యం గొడ్డలి అని అభ్యంతరకర పదం వాడుతున్నారంటే ఏమని అనుకోవాలి? గొడ్డలితో హత్య చేసింది ఎవరు? అతను ఎల్లో మీడియాలో కూర్చుని డిబేట్లలో ఎలా పాల్గొన్నారు. ఆయనకు లాయర్ను పెట్టిందెవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నప్పటికీ, చంద్రబాబు మాత్రం గొడ్డలి పదాన్ని వాడడం మానడం లేదు. ఆ కేసులో జగన్కు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ చెప్పినా అదే దుష్ప్రచారం చేయడం కూడా సీనియర్ రాజకీయ నేతకు తగిన విషయమేనా? ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా వైఎస్సార్సీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దని చెప్పడం అంటే మరీ అతిగా లేదా?పెళ్ళిళ్లు, పబ్బాలు, చావులు, సంతాప సభలలో వివిధ రాజకీయ పక్షాలవారు కలవకుండా ఉంటారా? వారు మాట్లాడుకోకుండా ఉంటారా? అది కూడా తప్పే అవుతుందా? ముద్రగడ చనిపోయే సమయానికి వైఎస్సార్సీపీలో ఉన్నా, ఆయన కాపు ఉద్యమ నేతగానే జనంలో నిలిచారు. ఆయన ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు వద్దని అంతిమ లేఖలో చెప్పి ఉండవచ్చు. అందువల్లే ఆయన సంతాప సభలలో పాల్గొన్న టీడీపీ నేతలను తప్పుపట్టవచ్చా? కాపులంతా ఒక చోట సమావేశం అవుతుంటే, అలాంటి వేదికలను ఆ వర్గానికి చెందిన ఆయా పార్టీ నేతలు ఎలా పంచుకోకుండా ఉంటారు. అలా చేస్తే కులానికి దూరం అవుతామోమో అన్న భయం వారిలో ఉండవచ్చు.ఇంకో విషయం చెపాలి. ఈ మధ్య ఒక సదస్సులో అంబటి రాంబాబు, టీడీపీకి గతంలో పెద్ద మద్దతుదారు అన్న పేరున్న మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అంత మాత్రాన వారిద్దరూ ఒకటైపోయినట్లవుతుందా? కొద్ది సంవత్సరాల క్రితం ఒక సందర్భంలో అప్పటి వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి, చంద్రబాబు పక్కపక్కన కూర్చుని మాట్లాడుకున్నారే! ఒకప్పుడు చంద్రబాబు ఏమని ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. మిగిలిన సమయం అంతా అభివృద్ది, పాలనపైనే దృష్టి పెట్టాలని అనేవారు. అలా చేసినా, చేయకపోయినా కనీసం మాటవరసకైనా ప్రసంగించేవారు. కాని ఇప్పుడేమో వైఎస్సార్సీపీవారికి ఏమి చేయవద్దు.. వైఎస్సార్సీపీవారితో కలవవద్దు, వేదికలు పంచుకోవద్దని అంటున్నారు. తద్వారా చంద్రబాబు సీనియారిటీకే అప్రతిష్ట అవుతుంది తప్ప మరొకటి కాదు.రాజకీయాల కోసం బంధుత్వాలు, స్పేహాలు కూడా వదలుకోవాలా! అన్నప్రశ్న రాదా? సంతాప సభలో ఉమా ప్రసంగిస్తూ కాపులలో అలజడి ఆరంభమైందని వ్యాఖ్యానించారు. కాపులను పట్టించుకోవాలని, వారి డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని ఆయన పేర్కొన్నారు. కాపు ఉద్యమం చేస్తున్న తరుణంలో ముద్రగడను నిర్లక్ష్యం చేయడం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. బహుశా మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో బోండా ఉమా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చన్న సందేహం చంద్రబాబుకు కలిగి ఉండవచ్చు. అయినా ఇంత ఓపెన్గా టెలికాన్ఫరెన్స్లో వైఎస్సార్సీపీ నేతలతో వేదిక పంచుకోవద్దని అనడం ద్వారా చంద్రబాబు వ్యక్తిత్వానికే నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో ఏర్పడింది. దీనికి ప్రతిగా బోండా ఉమా మరో వాదన తెరపైకి తీసుకువచ్చారు.వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏర్పాటు చేసిన సంతాప సభకు టీడీపీ నేతలు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వంటివారు వెళ్లినప్పుడు లేని అభ్యంతరం తను వెళితేనే వచ్చిందా అన్నది ఆయన ప్రశ్నగా ఉంది. బొత్స, తోట త్రిమూర్తులు వంటి వైఎస్సార్సీపీ నేతలతో కూడా టీడీపీ నేతలు ఆ కార్యక్రమాలలో సన్నిహితంగా మెలిగారు కదా అని ఉమా ఎత్తిచూపారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, బీజేపీ నేత సోము వీర్రాజు వంటివారు కూడా ఆ సభలో పాల్గొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారట. తాను వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లలేదని, కాపు నేత దాసరి రాము నిర్వహించిన సభకు వెళ్లానని, అక్కడ అంబటి రాంబాబు కలిసి పలకరిస్తే, సంస్కారంగా తాను కూడా మాట్లాడానని, తానేమీ పార్టీని ఇబ్బంది పెట్టలేదన్నది ఆయన అభిప్రాయంగా ఉంది.ఈ నేపథ్యంలో బోండా ఉమాను పిలవడానికి ఒక కమిటీనే చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వద్దకు వెళ్లిన బోండా ఆ తర్వాత కాస్త తగ్గి మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఇకపై వైఎస్సార్సీపీవారితో వేదిక పంచుకోనని ఆయన అన్నారని వార్తలు వచ్చాయి. అంటే ఇది ఉమా తన వ్యక్తిత్వాన్ని తానే కించపరచుకోవడమే అవ్వదా! మొత్తం మీద ఏదో రకంగా ఉమాను భయపెట్టి ఉండాలి. జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధాల జోలికి పార్టీ అధిష్టానం ఎందుకు వెళ్లలేదో తెలియదు.ఈ మధ్యకాలంలో కాపులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విశ్వాసం సడలుతోంది. ఆ వర్గంలో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడుతోందన్న ప్రచారం జరుగుతుండడానికి తోడు ఇలాంటి వివాదాల వల్ల తెలుగుదేశం పార్టీ మరింత ఇరుకున పడే అవకాశం ఉంటుంది. అది ఎలా ఉన్నా సామాజిక కార్యక్రమాలలో టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు కలిసినంతమాత్రాన ఏదో జరిగిపోతుందని భయపడి వాటిపై ఆంక్షలు పెట్టడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరీ సంకుచిత స్థాయికి చంద్రబాబు తీసుకువెళ్లినట్లు అవుతుందని చెప్పాలి. గతంలో ఇలాంటి వాతావరణం ఎన్నడూ లేదు. ఇది అత్యంత దురదృష్టకరం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నరసాయమ్మ.. మరో గీతాంజలి కాకూడదు!
రాజకీయాల్లో మాటలు ఒక్కోసారి ఆయుధాలుగా మారుతాయి. ఒకరి వ్యాఖ్యలు మరొకరి ప్రచారానికి అస్త్రాలవుతాయి. కానీ ఆ మాటల వెనుక ఉన్న మనిషి జీవితం, ఎదుర్కొన్న పరిస్థితులు మాత్రం చాలాసార్లు కనిపించవు. భోగాపురం ఎయిర్పోర్టు వ్యవహారంలో ఇప్పుడు చర్చకు వచ్చిన నరసాయమ్మ విషయంలోనూ ఇదే ప్రశ్న తలెత్తుతోంది.దాదాపు పదేళ్ల క్రితం భోగాపురంలో జరిగిన ఓ బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఆ సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన.. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం చంద్రబాబు సర్కార్ చేపట్టిన భూసేకరణ, రైతులకు పరిహారం అంశాలను ప్రస్తావిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే..నరసాయమ్మ తన భూమి కోల్పోతున్న ఆవేదనను వేదికపై వ్యక్తం చేసింది. ఎర్రబస్సు రాని చోటుకి ఎయిర్బస్ ఎందుకు? సర్.. అంటూ మాట్లాడింది( ఈ వ్యాఖ్యలనే జగన్ ప్రస్తావిస్తే.. జగనే ఆ మాట అన్నారని టీడీపీ మీడియా, సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది). ఆనాడు అయ్యన్నపాత్రుడి భూముల జోలికి పోకుండా.. ప్రభుత్వం తన కుటుంబానికి ఉన్న రెండెకరాల భూమి బాబు సర్కార్ లాక్కుంటుందనే విషయం ప్రస్తావించి.. న్యాయం కావాలని జగన్ సమక్షంలో వేడుకుంది.అయితే భోగాపురం ఘనత ఎవరిది? అనే ప్రస్తుత చర్చ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు, ప్రచారాలకు వేదికగా మారాయి. ఎయిర్పోర్టు విషయంలో ఎవరి పాత్ర ఎంత? ఎవరి నిర్ణయాల వల్ల ప్రాజెక్టు ముందుకు వెళ్లింది? ఎలా పూర్తైంది? అనే క్రెడిట్ వార్లో నరసాయమ్మ పేరు కూడా తెరపైకి వచ్చింది. నరసాయమ్మ ఎక్కడ?.. ఎయిర్బస్సు వచ్చింది చూడమ్మా?.. జగన్ నీ నెత్తిన చెయ్యి పెట్టాడు.. అంటూ ఇలా ఆమెపై అభ్యంతకర సందేశాలు కనిపిస్తున్నాయి పలు పేజీల్లో.భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో వైస్సార్సీపీ, కూటమి నేతలు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఒకవైపు భూసేకరణలో మార్పులు చేసి రైతులకు న్యాయం చేశామని, పరిహారం సైతం ఇప్పించామని, శంకుస్థాపనతో పనులు ప్రారంభించిందే తమ ప్రభుత్వమని వైఎస్సార్సీపీ లెక్కలతో చెబుతుంటే.. మరోవైపు ప్రాజెక్టు ప్రతిపాదన చేసింది తమదే కాబట్టి ఎంటైర్ క్రెడిట్ తమదేనని చంద్రబాబు పార్టీ చెబుతోంది. వాస్తవానికి విశాఖ ఎయిర్పోర్ట్ ఉండగా.. బలవంతపు భూసేకరణతో రైతులకు అన్యాయం చేయడం ఎందుకని? మాత్రమే జగన్ అన్నారు. అంతేగానీ అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో ఏమాత్రం కాదు. ఆ ఉద్దేశమే ఉంటే.. ఉత్తరాంధ్రను అసలు పట్టించుకునేవారే కాదు కదా!. అధికారంలోకి రాగానే భోగారం ఎయిర్పోర్ట్ భూసేకరణను తగ్గించి.. నష్టపోయిన వాళ్లకు పరిహారం ఇప్పించి.. అన్ని అనుమతులతో శంకుస్థాపన చేసే వారా?.. అయితే ఈ రాజకీయ వాదోపవాదాల మధ్య పాపం నరసాయమ్మ సోషల్ మీడియాకు ఎక్కింది.గతంలో తెనాలికి చెందిన గీతాంజలి ఘటనను గుర్తు చేసుకుంటే.. సోషల్ మీడియా చర్చలు, ట్రోలింగ్లు ఒక వ్యక్తి జీవితంపై ఎంతటి ప్రభావం చూపగలవో అర్థమవుతుంది. వైఎస్ జగన్ వల్లే తన కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరిందని చెప్పినందుకు.. ఆమెను నెట్టింట తెగ ట్రోల్ చేశారు. అది చేసింది ఎవరో అందరికీ తెలుసు. అది తట్టుకోలేక మనస్థాపంతో బలన్మరణానికి పాల్పడిందామె. అంతకు ముందు బెండపూడి విద్యార్థిని విషయంలోనూ అలాగే జరిగింది. ఇప్పుడు.. నరసాయమ్మను ఆ స్థాయిలోనే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక సాధారణ మహిళ మాట్లాడిన మాటలను రాజకీయ కోణంలో చూసి వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రమాదకర ధోరణి. భోగాపురం విషయంలోనూ నరసాయమ్మను ఒక రాజకీయ ప్రతీకగా మార్చకుండా.. ఆమె ఒక సాధారణ మహిళ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు.. రాజకీయ విమర్శలు ఉండొచ్చు.. కానీ ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం సాగకూడదు.క్రెడిట్ కోసం ఒక మహిళను పావుగా మార్చే రాజకీయ ప్రయత్నాలు అత్యంత దురదృష్టకరం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, నరసాయమ్మ విషయంలోనైనా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త అవసరం. అదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకునే సంస్కృతి ఎంతటి పార్టీకైనా, ఏ వర్గానికైనా మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు విధానాలపై ఉండాలి కానీ వ్యక్తుల జీవితాలపై కాదు. రాజకీయ లాభాల కోసం ఆమెను తెరపైకి తీసుకొచ్చి, తమకు అనుకూలమైన కథనాన్ని నిర్మించే ప్రయత్నాలు జరిగితే అది మరో అన్యాయమే అవుతుంది. -
వైఎస్ జగన్ పట్టుదలకు సాక్ష్యం ఇదిగో..
చంద్రబాబే మొత్తం భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం చేసినట్లు ఎల్లో గ్యాంగ్ తెగ బిల్డప్ ఇస్తోంది. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిందేమిటో రికార్డుపరంగా ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రజల దృష్టిని మరల్చేందుకు కూటమి నేతలు నానా పాట్లు పడుతున్నారు. వైఎస్ జగన్ పడిన కష్టమేంటి?. ఆయన శ్రమ ఎలా ఫలించింది? అసలు వాస్తవం ఏంటో? పరిశీలిస్తే..వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి కార్యరూపం తీసుకొచ్చేందుకు నడుంబిగించారు. 2023 మే 3న భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. దాని వెనుక వైఎస్ జగన్ పడిన శ్రమను గుర్తుచేసుకుంటే.. ఇక్కడ 2,751 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయించారు. మరో వైపు, రైతులకు తగిన నష్టపరిహారం, నిర్వాసితులకు పునరావాసం విషయంలో తన ఉదారతను చాటుతూ వారిని ఒప్పించారు.హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్లన్నీ పరిష్కారమయ్యేలా చొరవ చూపించారు. విమానాశ్రయానికి అవసరమైన అనుమతుల కోసం వైఎస్ జగన్.. ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మరో వైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని నిర్ణయించారు. పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ అందించారు. అసైన్డ్ భూములకు కూడా జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు.ఇదే క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు జరిపిన చర్చలతో చాలామంది రైతులు సానుకూలంగా స్పందించారు. కోర్టుల్లో పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ట్రిబ్యునల్ పరిష్కరించాయి. నిర్వాసితులైన నాలుగు గ్రామాల్లోని 404 కుటుంబాలకు అత్యుత్తమమైన పునరావాసప్యాకేజీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో టౌన్షిప్లను తలదన్నేలా రెండు కాలనీలను వారి కోసం నిర్మించింది. -
ఇప్పుడు చెప్పండి తమ్ముళ్లు.. ‘భోగాపురం’ క్రెడిట్ ఎవరిదో?
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో చంద్రబాబు క్రెడిట్ చోరీపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. హైదరాబాద్ను నేనే కట్టాను.. సెల్ ఫోన్ను కూడా నేనే కనిపెట్టాను.. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చానంటూ డబ్బాలు కొట్టుకున్న చంద్రబాబు.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా తన ఖాతాలోనే వేసుకున్నారు. 2023 మే 3న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అన్ని అనుమతులతో పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. విమానాశ్రయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ అధిగమించారు. అయితే, ఈ క్రెడిట్ అంతా వైఎస్ జగన్కు దక్కకూడదని ఎల్లో గ్యాంగ్ దుష్ప్రచారం మొదలుపెట్టింది.నిజాలు కళ్లముందు కనబడుతున్నా.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా.. కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను దాచి.. ఎల్లో ముఠా అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ప్రజలు నమ్మేస్తారులే అన్న భ్రమల్లో ఇదే భ్రమలతో విషం కక్కుతున్నారు. సంక్షేమం, అభివద్దిని పక్కనపెట్టి వైఎస్ జగన్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడమే పనిగా చంద్రబాబు సర్కార్ పెట్టుకుంది.అసలు జరిగింది ఇదే.. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణకు సంబంధించి అంశాలపై ఫోకస్ పెట్టింది. కోర్టు వివాదాలు, కేసుల్ని పరిష్కరించడంతో పాటుు.. భూసేకరణను 2,750.78 ఎకరాలకు కుదించింది. భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కాలనీలు నిర్మించి పునరావాసం కల్పించారు. అనంతరం భోగాపురం విమానాశ్రయం పనులకు సంబంధించి జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎయిర్పోర్ట్కు అవసరమైన ఎన్వోసీలు సహా మిగిలిన అనుమతుల్ని పొందారు. (Bhogapuram Airport Real Story)ఇది కదా వాస్తవం.. 2014–19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్కు ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసింది. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో పాటు మరో వైపు, క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు.భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు పరిహారం చెల్లించారు. డి.పట్టా భూములకు జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు. దీంతో రైతులు చాలా మంది పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. మిగతా వాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించింది.విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 1,413 మంది రైతులకు చెందిన 1,383.39 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న డీ పట్టా (అసైన్డ్) భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. (Bhogapuram Airport Timeline)ఇందులో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడ వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. రూ.900 కోట్లతో 2,751 ఎకరాల భూమి సేకరణ పక్కాగా పూర్తి చేసింది. కేసులు వేసిన రైతుల డిమాండ్లను పరిష్కరించింది. రెట్టింపు పరిహారం ఇచ్చింది. ఇళ్లు కోల్పోయిన 376 నిర్వాసిత కుటుంబాలకు దాదాపు రూ.80 కోట్లతో టౌన్షిప్ను తలదన్నే సౌకర్యాలతో కాలనీలు నిర్మించింది. -
కూటమికి దిమ్మతిరిగిపోయేలా.. ఉత్తరాంధ్రలో జనసంద్రం
సాక్షి, విశాఖపట్నం: జగన్ పర్యటనలో జనం లేరు అని చూపించడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నం మరోసారి ఘోరంగా విఫలమైంది. గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనకు భారీ స్పందన లభించింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గంలో సాగిన జగన్ ప్రయాణంలో దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.జగన్ కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఇది మొదలైంది. పలుచోట్ల కాన్వాయ్ ఆగడంతో జగన్ వాహనం దిగి ప్రజలకు అభివాదం చేశారు. ఆప్యాయంగా వాళ్లను పలకరించి.. సమస్యలను విన్నారు. ఈ క్రమంలో ఆయన వాహనం నెమ్మదిగా ముందుకు కదలింది. జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించింది. ఈ క్రమంలోనే పోలీసు వ్యవస్థను ప్రయోగించింది. గత రెండేళ్లలో ఏనాడూ లేని రీతిలో.. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయంటూ పోలీసులు అటువైపు రావొద్దని జనాలను హెచ్చరించారు. కేవలం 8 వాహనాల కాన్వాయ్తో.. సీదిరి అప్పలరాజుతో ములాఖత్కు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఉల్లంఘిస్తే కేసులు పెడతామని బెదరించారు. అయినప్పటికీ జనం తగ్గలేదు.ఈ క్రమంలో గురువారం ఉదయం అటు వైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు పెట్టి కాపలా కాశారు. కానీ, జనం మాత్రం ‘జగన్ వెంటే మేం’ అని కదిలారు. ఆంక్షలను దాటుకుని జగన్ దగ్గరకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్టు ప్రాంగణంలో మొదలైన జన వాహిని.. శ్రీకాకుళం దారి పొడవునా కనిపించింది. మహిళలు, యువత, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్కు స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ తన పర్యటనను కొనసాగించారు. భారీగా తరలివచ్చిన జనసందోహంతో ‘కూటమి సర్కార్ మైండ్ బ్లాక్’ అయ్యిందనే కామెంట్లు ఇటు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు రహదారుల వెంట కనిపించిన ప్రజల తాకిడి.. జగన్పై ఉన్న అభిమానానికి నిదర్శనంగా కనిపించింది. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. జగన్కి ఉన్న ప్రజాదరణను అడ్డుకోలేరని మరోసారి రుజువు చేసింది. -
ఇదేం విచిత్రమో.. ఆ లాజిక్కు మిస్సయ్యిందా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కోర్టులో ఇకనైనా వేగంగా సాగుతుందా? ఈ కేసు ఈ ఏడేళ్లలో అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. నిందితులుగా ఉన్న వివేకా రక్త సంబంధికులు ఈ కేసు సత్వరమే విచారణకు రావాలని కోరుతుంటే, స్వయంగా వివేకా కుమార్తె సునీత ఈ విచారణ జాప్యం అవడానికి కారణం అవుతున్నట్లు వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సీబీఐ విచారణపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆమె తరచు వేస్తున్న పిటిషన్లు ఈ జాప్యానికి కారణంగా కనిపిస్తున్నాయని న్యాయవాదులు చెబుతున్నారు. ఆమె ఏకంగా కొత్తగా ప్రైవేట్ కేసును సీబీఐ కోర్ట్లో వేసి మళ్లీ మొదటినుండి సీబీఐ విచారణ కోరడం చూసి కోర్ట్ వారు కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆ పిటిషన్ చట్టపరంగా మెయిన్టెయినబుల్ కాదని కోర్టు స్పష్టం చేసింది. ఆమె లేవనెత్తిన అంశాలకు కోర్టువారు 70 పేజీలలో ఉత్తర్వులు ఇచ్చారు.. ఆమెకు ఎవరిమీద కోపం ఉంటే వారిని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారన్న విమర్శ వచ్చింది.సీబీఐ తమను అక్రమంగా కేసులో చేర్చిందని కొంతమంది నిందితులు వాపోతుంటే, తానే వివేకాను చంపాను అన్న నిందితుడు ఆప్రోవర్గా మారడం విశేషంగా కనిపిస్తుంది. సునీత ఏ లాయర్నైతే నియమించుకున్నారో, ఆయనే ఇతనికి లాయర్గా ఉండడం, సుప్రీంకోర్టులో కేసులు వేయడం చిత్రంగా ఉందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వివేకా హత్య జరిగిన తర్వాత కొంతకాలం పాటు ఆమె చేసిన ఆరోపణలకు, ఆ తర్వాత కాలంలో చేసిన అభియోగాలకు ఎందుకు తేడా వస్తోందంటే ఏమి చెబుదాం. వర్తమాన రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు అన్న భావన కలుగుతుంది. ఇందులో బంధాలు, అనుబందాల కన్నా, ఇతరత్రా లక్ష్యాలకే ప్రాధాన్యం ఇస్తుండవచ్చు. తన తండ్రిని హత్య చేశానని బహిరంగంగా ప్రకటించిన దస్తగిరి అనే నిందితుడికి బెయిల్ రావడానికి సునీత సహకరించారన్న ప్రచారం ఆమె ప్రతిష్ట మసకబారేలా చేసిందనిపిస్తుంది. అలాగే అన్నిటిని మించి వరుసకు తన సోదరుడయ్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో తగాదాపడి, తెలుగుదేశం అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుతున్న చదరంగంలో ఆమె ఒక పావుగా మారిందన్న ఆరోపణను వైఎస్సార్సీపీ నేతలు చేస్తుంటారు.ఈ కేసులో టీడీపీ చేసే విమర్శలు, ఈమె చేసే ఆరోపణలు గమనిస్తే అది నిజమేనేమో అన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్ను, ఆయన సతీమణిని ఎలాగైనా ఈ కేసులోకి తీసుకురావాలని ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు వరకు ఆమె వెళ్లారు. ఆ సందర్భంగా కోర్టు సూచన మేరకు సీబీఐ మళ్లీ, మళ్లీ విచారణ చేసినా, ఎక్కడా ఎలాంటి కొత్త ఆధారాలు కనిపించలేదు. దాంతో ఎవరెవరిమీదో తోచిన ఆరోపణల్లా చేయడం, ఆ కోణంలో సీబీఐ విచారణ జరపడం నిత్యకృత్యంగా మారింది.ఈ కేసులో సీబీఐ కూడా ఒక కీలకమైన కోణాన్ని వదలిపెట్టిందన్నది నిందితుల తరపు న్యాయవాదుల వాదన. వివేకా రెండో పెళ్లి చేసుకున్నారా? లేదా? ఆమెకు ఈయన ద్వారా సంతానం కలిగిందా? లేదా? ఆమె వేసిన పిటిషన్ను పరిగణనలోకి తీసుకుంటారా?లేదా? దస్తగిరి తరపున వాదించిన లాయర్ కాని, సునీత పక్షాన వాదన చేసిన లాయర్ కాని టీడీపీ తరపున పనిచేసేవారే కావడంలోని ఆంతర్యం ఏమిటి? వారికి ఢిల్లీలో లక్షల రూపాయల చొప్పున ఫీజులు చెల్లించవలసి ఉంటుంది. అవన్ని ఎవరు సమకూర్చారు?వివేకా హత్య కేసులో ఆయన సమీప బంధువుల ప్రమేయం ఉందా? లేక వ్యక్తిగత స్నేహితుల హస్తం ఉందా? రియల్ ఎస్టేట్ లావాదేవీలు, సంబంధిత డబ్బు కారణంగా ఈ హత్య జరిగిందా? లేక ఎంపీ సీటుకు పోటీ వస్తాడన్న కారణంగా హత్య జరిగిందా?ఇక్కడ ఒక లాజిక్ సీబీఐ కూడా మిస్ అవుతోందన్న అభిప్రాయం ఉంది. అవినాశ్ రెడ్డి వైఎస్సార్సీపీ ఎంపీగా కొనసాగుతున్న సమయంలో 2019 ఎన్నికలలో కూడా ఆయనే అభ్యర్ధి అని అందరికి తెలుసు. నిజంగా వివేకా ఎంపీ సీటు ఆశించి ఉంటే, అవినాశ్ తరపున ప్రచారానికి ఎందుకు వెళతారు? ఇలాంటి మిస్సింగ్ లింకులన్నీ విచారణ సందర్భంగా ఒక కొలిక్కి వస్తాయోమో తెలియదు. హత్య జరిగిన రోజు వివేకా రాసిన లేఖ, ఆయన పీఏ. కృష్ణారెడ్డి వాదన, సీబీఐ అధికారులను మార్చిన వైనం మొదలైనవి ఎన్నో శేషప్రశ్నలుగా ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తు జరిగిన తీరుతెన్నులపై పరిశోధన జరిగితే మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయేమో చెప్పలేం.అంతేకాదు... వివేకా హత్య కేసులో జగన్కు ఎలాంటి సంబంధం లేదని పలుమార్లు స్పష్టమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్లు పదేపదే ఆయనపై ఎందుకు ఆరోపణలు చేశారు? ఇప్పటికీ ఎందుకు చేస్తూనే ఉన్నారు. అంతేకాక వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీగా ముద్రవేసి లబ్ది పొందాలని ఎందుకు యత్నిస్తున్నారు? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తిని లాకప్ డెత్ చేసి బూడిద కూడా మాయం చేసిన నేపథ్యంలో టీడీపీకి బూడిద పార్టీ అని మాజీ మంత్రి కొడాలి నాని పేరు పెట్టి కౌంటర్ ఇచ్చి ఉండవచ్చు. అది వేరే విషయం.ఇన్ని పరిణామాల నేపథ్యంలో తాజాగా సీబీఐ కోర్టు ఇచ్చిన ఒక తీర్పు సునీతకు, బహుశా టీడీపీకి, ఎల్లో మీడియాకు ఆశాభంగం కలిగించి ఉండాలి. మరోసారి విచారణ చేయండని సీబీఐ కోర్టు ఆదేశించి ఉంటే ఆ పేరుతో మరికొంతకాలం గడిచేదేమో! కాని చట్టం ప్రకారం అది కరెక్టు కాదని గౌరవ న్యాయస్థానం అభిప్రాయపడి సునీత పిటిషన్ను తోసిపుచ్చింది. సీబీఐ విచారణ సరిపోలేదని సునీత అంటున్నా, కొత్త ఆధారాలు ఏమీ వెలుగులోకి రాలేదని కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు ఎలా చేయాలో తాము నిర్దేశించజాలమని కూడా కోర్టు స్పష్టం చేసింది.రోజువారీ విచారణ జరగాలని ఒకవైపు కోర్టును కోరుతూ, సీబీఐ దర్యాప్తు మరింత లోతుగా జరపాలని మరో వైపు కోర్టులలో ఆమె పిటిషన్లు వేస్తున్నారని నిందితుల తరపున న్యాయవాదులు పేర్కొంటున్నారు. క్రిమినల్ కేసుల్లో నిరంతర దర్యాప్తు జరగదని, సుప్రీంకోర్టు కూడా వేగవంతంగా ఈ కేసును విచారించాలని ఆదేశించిన విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. కుమార్తె అన్న సానుభూతి పొందడానికి ఆమె ప్రయత్నిస్తున్నారా? లేక చిత్తశుద్దితో తన తండ్రి హత్య కేసు విచారణ సత్వరమే జరగాలని కోరుకుటున్నారా? అన్న ప్రశ్నలను ప్రతివాదులు వేస్తున్నారు.విశేషం ఏమిటంటే ఏ కేసులో అయినా నిందితులు విచారణ జాప్యం కావాలని ప్రయత్నిస్తుంటారు. కాని ఈ కేసులో మాత్రం స్వయంగా వివేకా కుమార్తె పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ విచారణ జాప్యానికి కారణం అవుతున్నారన్న భావన ప్రజలలో కలుగుతోంది. ఆ విషయాన్ని ఆమె గ్రహిస్తే మంచిదన్న అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా దురుద్దేశాలతోనో, కక్ష కట్టి ఎవరిపైనో కేసును బనాయించాలని ప్రయత్నించడం సమంజసం కాదని పలువురి వ్యాఖ్యగా ఉంది. పైగా ఇందులో రాజకీయంగా తన తండ్రి ప్రత్యర్థుల సహాయ సహకారాలు తీసుకుంటున్నారన్న విమర్శలు రావడం కూడా ఆమెకు మంచిది కాదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మేం మీలా కాదు.. అంగళ్లు ఘటన మరిచిపోయారా?: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు విధిస్తోందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. పోలీసులు ఏర్పాటు చేస్తున్న నిబంధనలు భద్రతా చర్యల పేరుతో రాజకీయ నిర్బంధంగా మారుతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.జగన్ శ్రీకాకుళం పర్యటనకు సంబంధించి కాన్వాయ్ను పరిమితం చేయడం, రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేయడం, నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించడం.. రాజకీయ నిర్బంధం కిందకే వస్తుందని, అది ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడమేనని వైఎస్సార్సీపీ అంటోంది. "జగన్ ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది" అని పార్టీ నేతలు చెబుతున్నారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా వైఎస్ జగన్పై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేరన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని, ఆ జనాదరణ చూసే ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. ఇటు.. సీదిరి అప్పలరాజు వ్యవహారంలో కూడా ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ అంటోంది. అలాగే ఒక ప్రజా ప్రతినిధితో ములాఖత్ కోసం వెళ్లే కార్యక్రమాన్ని కూడా రాజకీయ అంశంగా మార్చి ఆంక్షలు విధించడం సరికాదని పేర్కొంది. గత రెండేళ్లుగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కార్యక్రమాలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరిగాయని, ఎక్కడా హింసాత్మక ఘటనలకు తమ పార్టీ కారణం కాలేదని నేతలు స్పష్టం చేశారు.అదే సమయంలో అధికార పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన సమయంలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ వైఎస్సార్సీపీ విమర్శలు గుప్పించింది. అంగళ్లు తరహా ఘటనల్లో పోలీసులపై దాడులు, వాహనాల ధ్వంసం వంటి ఘటనలు జరిగాయని గుర్తు చేసింది. తమ కార్యక్రమాలపై మాత్రమే ఆంక్షలు విధించడం వివక్షపూరిత వైఖరి అని ఆరోపించింది. "ప్రభుత్వానికి సహకరిస్తున్నప్పటికీ.. అధికార యంత్రాంగం అనవసర ఆంక్షలతో వ్యవహరిస్తోంది. ప్రజల మధ్యకు వెళ్లే హక్కును ఎవరూ అడ్డుకోలేరు" అని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు.చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా.. అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో రాజకీయ ఘర్షణలు చోటుచేసుకుని రాళ్ల దాడులు జరిగాయి. టీడీపీ శ్రేణులు జరిపిన దాడుల్లో.. పలువురు పోలీసులు గాయపడగా, ఏఆర్ కానిస్టేబుల్ రణధీర్ ఒక కన్ను చూపు శాశ్వతంగా కోల్పోయారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుపై అప్పట్లో కేసు కూడా నమోదు అయ్యింది. -
‘డీఎస్సీలో అక్రమాలు నిజం.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్’
సాక్షి, నెల్లూరు జిల్లా: ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలో అన్నీ కోతలే.. ఉద్యోగులు కూడా ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. రైతుల మీద కేసులు బనాయించిన ఏకైక ప్రభుత్వం టీడీపీ’’ అంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘విద్యా వ్యవస్థను భష్టు పట్టించేందుకే లోకేష్కి ఆ శాఖ ఇచ్చారు. సీబీఐ విచారణ జరిపిస్తే మీకు వచ్చే నష్టం ఏంటి..? అక్రమాలు జరిగాయి కాబట్టే.. దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. లోకేష్తో చర్చించేందుకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిని పంపిస్తాం.. లోకేష్ రాగలడా..?. మేము అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెప్పాలి. అబద్ధానికి చొక్కా, ప్యాంట్ వేస్తే అది చంద్రబాబే. ఎమ్మెల్యే సోమిరెడ్డి జీవితం గురించి ఒక పుస్తకం రాయొచ్చు’’ అంటూ కాకాణి ఎద్దేవా చేశారు. ‘‘టీడీపీ నేతల విమర్శలకు భయపడే రోజులు పోయాయి. ధర్మేంద్ర ప్రధాన్కి నైతిక విలువ ఉన్నాయి కాబట్టే రాజీనామా చేశారు. నారా కుటుంబానికి నైతిక విలువలు ఉండవని లోకేశ్ నిరూపించారు. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి.. రిలే నిరహార దీక్షలకు సిద్ధమవుతున్నాం’’ అని కాకాణి పేర్కొన్నారు. -
‘డీఎస్సీపై లోకేష్తో చర్చకు సిద్ధం’
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరారు.ఇసుక దోపిడీకి బాధ్యత వహిస్తూ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలు విజయవంతమయ్యాయని తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై లోకేష్ తో బహిరంగ చర్చకు తాను కూడా సిద్ధమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:డీఎస్సీపై లోకేష్తో చర్చకు సిద్ధం:టీచర్ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా సిద్ధమైన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం డీఎస్సీ నియామకాలను అక్రమాలతో కలుషితం చేసింది. స్పోర్ట్స్ కోటాలో అర్హులను పక్కనపెట్టి అధికార పార్టీకి చెందిన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు జీవోలను మార్చారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను మా పార్టీ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అయినప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే, విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకుని స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా సీబీఐతో విచారణ జరిపించాలి. డీఎస్సీ నియామకాలలో మెరిట్ లిస్టులు, రోస్టర్లు బహిరంగంగా ప్రకటించలేదు. ఇది పారదర్శకత లోపానికి నిదర్శనం. డీఎస్సీ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను.కొండపిలో టీడీపీ నాయకుల ఇసుక అక్రమ మైనింగ్:రాష్ట్రంలో గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ఇసుక, గ్రావెల్, రేషన్ బియ్యం దోపిడీకి పాల్పడుతోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 37 సార్లు ఆధారాలతో అక్రమ ఇసుక తవ్వకాల అంశాన్ని ప్రస్తావించినా ప్రభుత్వం స్పందించలేదు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం పాలేరు నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై గనుల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.మైనింగ్ శాఖ అధికారులే స్వయంగా టిడిపి మండల ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇంచార్జులు, మాజీ ఎంపిపిల పేర్లను (అనుమోలు సుధా, పోకూరి రవి, దాసరి కృష్ణారావు, ఎర్ర నరేంద్ర, కొండగుంట శ్రీనివాసరావు మొదలైనవారు) రాస్తూ, వీరిపై పిడి యాక్ట్ పంపాలని లేదా మండల బహిష్కరణ చేయాలని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు లేఖలు రాసినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ అక్రమ తవ్వకాలపై విచారణ జరిపి, పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసినా, స్థానిక మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అండదండలు ఉండటంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. మైన్స్ అండ్ జియాలజీ శాఖ టీడీపీకి చెందిన పలువురు స్థానిక నాయకుల పేర్లతో పోలీసులకు లేఖలు రాసి, వారిపై పీడీ చట్టం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అయినప్పటికీ అవి అమలు కాలేదు. హైకోర్టు పలుమార్లు ప్రశ్నించినా అధికార యంత్రాంగంలో ఎలాంటి మార్పు రాలేదు.మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాజీనామా చేయాలి:కొండేపి నియోజకవర్గంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని లెక్కించాలి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమ మైనింగ్పై కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. హైకోర్టు ఆదేశాలు, మైన్స్ శాఖ నివేదికలు, అధికారిక పత్రాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. మంత్రి ఆదేశాలతోనే అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు.మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేదా సీఎం చంద్రబాబే ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కూటమి క్యాబినెట్ అంతా ‘దోచుకో, పంచుకో, తినుకో విధానంతో నడుస్తోంది. యువత మరియు ప్రజల హక్కు సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో మరిన్ని రూపాల్లో తీవ్రతరం చేస్తుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. -
డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ పోరాటం ఉధృతం
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ పోరాటం ఉధృతం చేసింది. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 31న అన్ని జిల్లాల కలెక్టర్లకు వైఎస్సార్సీపీ నేతలు వినతి పత్రాలు సమర్పించనున్నారు. వచ్చే నెల ఆగస్టు 3, 4 తేదీలలో అన్ని నియోజకవర్గాలోనూ టౌన్ హాలు సమావేశాలు నిర్వహించడంతో పాటు 6 నుండి 9 వరకు నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. 10న పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని తెలిపారు.కాగా, మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నిన్న (మంగళవారం) పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు.ఈ కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి కదంతొక్కారు. డీఎస్సీలో అక్రమాలపై కళ్ల ముందే ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులను దగాకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. -
డీఎస్సీలో అక్రమాలు.. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
సాక్షి, తాడేపల్లి: విద్యాశాఖను భ్రష్టు పట్టించడానికే నారా లోకేష్.. విద్యాశాఖను వాడుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటలు కోటలు దాటుతున్నాయి.. లోకేష్ విద్యాశాఖను తప్పితే అన్ని శాఖలను పట్టించుకుంటారు’’ అంటూ దుయ్యబట్టారు.‘‘ఎస్ఈఆర్టీ కన్వీనర్, డీఎస్సీ కన్వీనర్ ఒక్కరే!. పరీక్ష పేపర్ తయారీ హెడ్, పరీక్ష నిర్వహించే హెడ్ ఒక్కరే. డీఎస్సీలో పారదర్శకతకు నారా లోకేష్ పాతరేశారు. ఎస్ఈఆర్టీ ఉన్న వ్యక్తులే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అత్యంత గోప్యంగా జరగాల్సిన వ్యవహారాలను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో నిర్వర్తించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో డీఎస్సీ ప్రశ్నపత్రం అప్లోడ్ చేయించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్కి టాప్ ర్యాంక్ వచ్చింది. నవీన్ని టాపర్గా ప్రకటించి మళ్ళీ లిస్ట్లో మార్పులు చేశారు. నవీన్ని ఎందుకు తీసేసారో సమాధానం చెప్పాలి’ అని పేర్ని నాని నిలదీశారు.‘‘పేపర్ లీక్ అయ్యిందని ఒప్పుకున్నట్టే కదా?. లీకేజీని కప్పి పెట్టడానికే నవీన్ పేరు తొలగించారు. బరితెగించి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు పాల్పడ్డారు. డీఎస్సీ, టెట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. డీఎస్సీ నోటిఫికేషన్ ముందురోజు 4, 47 జీవోలను తెచ్చారు. అర్హత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తే పిల్లలు భవిష్యత్ ఏమవ్వాలి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చిన టీచర్లతో లోకేష్ కొడుక్కి పాఠాలు చెప్పించగలరా..?. నారా లోకేష్కి దమ్ముంటే దేవాన్స్కి ఈ టీచర్లతో పాఠాలు చెప్పించాలని ఛాలెంజ్ చేస్తున్నా. డీఎస్సీ అయిపోగానే మళ్ళీ జీవో మార్చేశారు. ఇక మీదట స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాస్తేనే ఉద్యోగం ఇస్తాం అని మార్చారు. డీఎస్సీలో అక్రమాలకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి.?‘‘ఐఏఎస్ అధికారులు కొందరు సిగ్గులేకుండా తప్పులు చేసినోళ్లకు వంత పాడుతున్నారు. తండ్రి, కొడుకులు ఇద్దరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. బ్రిడ్జ్ అనేది పేకాట కాదా..?. జోకర్ లేకుండా ఆడే పేకాట బ్రిడ్జ్ కాదా..?. దానికి ఉద్యోగం ఇస్తామన్నది వాస్తవం కాదా?. ఆ విమర్శ చేశానని నా మీద కేసు పెడతారా..?. కేసు పెట్టిన పోలీసులు పశ్చాత్తాప పడే రోజులు వస్తాయి. పోస్టులు అమ్ముకుంటు బేరాల వీడియోలు బయటకొచ్చినా సమగ్ర విచారణ జరపలేదు. డీఎస్సీలో అక్రమాలపై పోరాటం కొనసాగిస్తాం. జిల్లా కలెక్టర్ల కు 31 న వినతిపత్రాలు ఇస్తాం. వచ్చే నెల 6 నుండి 9 వరకు 4 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహారదీక్షలు చేస్తాం. ఆగస్టు 10 అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, నారా లోకేష్ రాజీనామా, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు విడుదల, నిరుద్యోగ భృతి విడుదల చేయాలని కోరతాం’’ అని పేర్ని నాని పేర్కొన్నారు. -
జనసేన పార్టీ కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధులను పవన్ కల్యాణ్ రద్దు చేశారు. పార్టీ నూతన కమిటీలు ప్రకటించే వరకు ఎవరు టీవీ డిబేట్లలో పాల్గొనకూడదని పవన్ ఆదేశించారు. నూతన కమిటీలు ప్రకటించే వరకు మీడియాలో జనసేన పార్టీ పేరుతో పాల్గొనవద్దంటూ జనసేన పేర్కొంది. నూతన కమిటీ నియామకం తర్వాతే టీవీ డిబేట్లలో పాల్గొనాలని పేర్కొన్న పవన్ కల్యాణ్.. మీడియాలో జనసేన పేరు వాడకూడదంటూ ఆదేశాలు ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. -
ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: చేయనిది చెప్పుకోవడం.. వేరొకరు చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ రాజకీయ క్రెడిట్ వార్లో భాగంగా.. ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్పోర్ట్ పునాది నుంచి నిధుల కేటాయింపుల దాకా అప్పటి జగన్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుందని ఆయన గుర్తు చేశారు.బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ధర్మాన.. భోగాపురం ఎయిర్పోర్ట్పై కూటమి ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంపై స్పందించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందించిందని, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టిందని చెప్పారు.భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన కీలక అనుమతులను వైఎస్ జగన్ హయాంలోనే సాధించామని ధర్మాన తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేసి, నిర్మాణానికి అనుకూల వాతావరణం కల్పించామని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ కోసం జగన్ ప్రభుత్వం రూ.1200 కోట్ల నిధులు కేటాయించిందని ఆయన చెప్పారు. ప్రాజెక్టు పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు.జగన్ ప్రభుత్వం వేసిన పునాదులే ఇవిభోగాపురం ఎయిర్పోర్ట్ను తామే పూర్తి చేశామని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదని ధర్మాన విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని అన్నారు. "భోగాపురం ఎయిర్పోర్ట్కు జగన్ ప్రభుత్వం పునాది వేసింది. అవసరమైన అనుమతులు, సదుపాయాలు, నిధుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది" అని ధర్మాన పేర్కొన్నారు.భోగాపురంపై కొనసాగుతున్న క్రెడిట్ ఫైట్ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక ప్రాజెక్టుగా నిలిచిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. వైఎస్ జగన్ హయాంలోనే ప్రాజెక్టు వేగం పుంజుకుందని వైఎస్సార్సీపీ చెబుతుండగా.. కూటమి ప్రభుత్వం అదంతా తమ క్రెడిటేనంటూ సోషల్ మీడియాలో ఉత్త ప్రచారం చేసుకుంటోంది. కీలక వ్యాఖ్యలుఉత్తరాంధ్ర నిధులను అమరావతికి ఖర్చు పెడుతున్నారు. ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా అమరావతిలో పెట్టుబడుతు పెడుతున్నారు. చంద్రబాబు విధానాలతో మళ్లీ విభజన వాదం బలపడే పరిస్థితులు వచ్చాయి. మరో రాష్ట్ర విభజన డిమాండ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. -
కదంతొక్కిన యువజనం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థులు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మంగళవారం పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి కదంతొక్కారు. డీఎస్సీలో అక్రమాలపై కళ్ల ముందే ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులను దగాకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. టెట్, డీఎస్సీ రాత పరీక్ష లేకుండా ఏకంగా జీవోలు జారీ చేసి, తమ వారికి దొడ్డి దారిన ఉద్యోగాలు కట్టబెట్టడం అత్యంత దుర్మార్గమని నిప్పులు చెరిగారు. అర్హులను పక్కనపెట్టి, డిగ్రీలు లేని వారికి సైతం ఉద్యోగాలివ్వడం బరితెగింపునకు పరాకాష్ట అని.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి బకాయిలతో సహా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన రీతిలోనే డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలనే నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పలుచోట్ల పోలీసులు ర్యాలీలను అడ్డుకునేందుకు విఫల యత్నం చేశారు. అందరి నోట అదే డిమాండ్ డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని అన్ని జిల్లా కేంద్రాలు మంగళవారం యువత ప్లకార్డులతో నిర్వహించిన ర్యాలీలతో హోరెత్తాయి. పలు చోట్ల వైఎస్సార్సీపీ నేతలను, విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని చోట్ల ముందస్తు అరెస్ట్లు చేశారు. కేంద్ర మంత్రి రాజీనామా చేశారనీ, మీరెప్పుడు చేస్తారని లోకేశ్ను నేతలు సూటిగా ప్రశ్నించారు. గుంటూరులో నిరుద్యోగుల బాధలను స్కిట్ రూపంలో ప్రదర్శించారు. రాజమండ్రిలో పోలీసులు అడ్డుకోవడంతో నేతలు, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసుల వలయాన్ని దాటుకుని ర్యాలీ కొనసాగించారు. శ్రీకాకుళంలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్.. మహిళలు, నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటున్నారని.. మంత్రి లోకేశ్ రాజీనామా చేసేంత వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని హెచ్చరించారు. -
నెటిజన్ల ఫైర్.. ఎన్టీఆర్ గాయాలపై స్పందించని చంద్రబాబు, లోకేశ్
టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల గాయాలపాలయ్యారు. తన భుజానికి గాయం తగలడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. దాంతో వైద్యులు ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.అయితే ఈ ఘటనపై ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో ఈ విషయం ప్రస్తుతం నెటిజన్లలో చర్చనీయాంశమైంది. కానీ ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ లీడర్ ఒకరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ వెంటనే ట్వీట్లు చేస్తూ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ గాయాలపై మాత్రం మౌనం వహించడంతో వారికి మానవత్వం లేదా? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇతర పార్టీ నాయకులపై చూపిన ప్రేమాభిమానాల్లో కనీసం పదో వంతు కూడా అత్యంత దగ్గరి బంధువైన ఎన్టీఆర్పై చూపలేదని చంద్రబాబు, లోకేశ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘సీబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?’
తాడేపల్లి : పరీక్షలు రాయకపోయినా టీడీపీ సభ్యత్వం ఉంటే చాలన్నట్టు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఏపీలోనే చూస్తున్నామని ధ్వజమెత్తారు. ఈరోజు(మంగళవారం, జూలై 28వ తేదీ) ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలతో చంద్రబాబు ప్రభుత్వం కూసాలు కదిలాయాన్నారు. డీఎస్సీ అక్రమాలపై గట్టిగా ఉద్యమించామని, పోలీసుల అడ్డంకులను అధిగమించి మరీ పోరాడామన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..‘డీఎస్సీలో అర్హులకు అన్యాయం జరిగింది. అందుకే ఈ నిరసన ర్యాలీలు చేపట్టాం. స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్లు తెచ్చుకున్న వారికీ ఉద్యోగాలు ఇచ్చారు. పరీక్షలు రాయకపోయినా టీడీపీ సభ్యత్వం ఉంటే చాలన్నట్టు ఉద్యోగాలు ఇచ్చారు. ఇలాంటి దిక్కు మాలిన ప్రభుత్వాన్ని ఏపీలోనే చూస్తున్నాం. డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేదా?, సక్రమంగా ఉద్యోగాలు ఇస్తే సీబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?నారా లోకేష్ ఉత్తర ప్రగల్భాలు పలకడం తప్ప చేసిందేమీ లేదు. జగన్తో చర్చించే స్థాయి నారా లోకేష్కు లేదు. లోకేష్తో చర్చకు మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు చాలు. డేట్, ప్లేస్, టైం చెబితే చర్చకు మేము రెడీ. నీట్ పేపర్ లీకైన కేసులో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. అలాగే నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీల విజయవంతంపై వైఎస్ జగన్ హర్షం
తాడేపల్లి : డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట అన్యాయాలపై వైఎస్సార్సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీల విజయవంతంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లోనూ బారీగా జరిగిన నిరసన ప్రదర్శనపై వీడియోను పోస్టు చేశారు వైఎస్ జగన్.‘చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ Gen-Z ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసిందన్నారు. విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు విజయవంతమయ్యాయని, డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ వరకు జరిగిన ప్రతి అక్రమంపైన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని గట్టిగా గొంతెత్తారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించాల్సిన యువతను రోడ్లెక్కించిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే. టీచర్ ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వ.. డీఎస్సీలో లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును కాలరాసింది. సాక్ష్యాలు, ఆధారాలు కళ్ల ఎదుటే కనిపిస్తా ఉన్నా సీఎం చంద్రబాబు కానీ, విద్యాశాఖమంత్రి లోకేష్ కానీ ఇప్పటివరకూ వాటిమీద నోరుమెదపలేదు. డైవర్షన్లతో కప్పిపెట్టాలని చూస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట అన్యాయాలు… ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ Gen-Z ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసింది. ప్రజలతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన… pic.twitter.com/C0ZpLL2hC3— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2026ఇదీ చదవండి: ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలుదగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ పోరాటం (ఫొటోలు) -
ఈనెల 30న శ్రీకాకుళంలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం పర్యటనకు సిద్ధమయ్యారు. గురువారం (జులై30) శ్రీకాకుళం వెళ్లనున్న జగన్.. జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు.సీదిరి అప్పలరాజును కుట్ర పూరితంగా చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధినేతగా జగన్ ఆయనకు సంఘీభావం తెలిపేందుకు జైలుకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన ద్వారా పార్టీ శ్రేణులకు ధైర్యం, భరోసా కల్పించడంతో పాటు.. కార్యకర్తలకు తాము అండగా ఉన్నామనే సందేశాన్ని జగన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అప్పలరాజు అరెస్టుపై వైఎస్సార్సీపీ ఆగ్రహంమాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై పెట్టిన కేసు రాజకీయ కక్షతోనేనని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేతలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోందని మండిపడుతున్నారు. యాక్సిడెంట్ కేసును.. హత్య కేసుగా మార్చడం, అందులో సీదిరిని ఏ3గా చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం పర్యటనపై ఆసక్తిజగన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ మంత్రి అరెస్టు అంశంపై పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వడంతో పాటు.. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకర్తలతోనూ ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


