మంత్రి అచ్చెన్న అనుచిత వ్యాఖ్యలతో వేడెక్కిన మండలి
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ సభ్యులు
నా మతం గురించి మాట్లాడ్డానికి మీరెవరని నిలదీసిన చైర్మన్ మోషేన్ రాజు
తాను హిందువునని, తన వ్యక్తిత్వాన్ని, కులాన్ని కించపర్చడం సరికాదని, తక్షణం ఆ పదాలను వెనక్కి తీసుకోవాలని చైర్మన్ డిమాండ్
మంత్రి క్షమాపణ కోరుతూ సభా కార్యక్రమాలను అడ్డుకున్న వైఎస్సార్సీపీ సభ్యులు
గందరగోళ పరిస్థితుల మధ్య అయిదు నిమిషాలు సభ వాయిదావేసిన చైర్మన్
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అదే మత విద్వేష వ్యాఖ్యలు కొనసాగించిన అచ్చెన్న
సాక్షి, అమరావతి: కుల మతాలకు అతీతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేస్తామంటూ ప్రమాణం చేసిన మంత్రులే బుధవారం శాసనమండలి సాక్షిగా వ్యక్తులకు మతాలను ఆపాదిస్తూ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ‘‘మీరు, మీ పార్టీ నాయకుడు క్రిస్టియన్లు కాబట్టే వెంకటేశ్వరస్వామి, హిందుసమాజంపై కక్ష కట్టి వ్యవహరిస్తున్నారు’’ అంటూ మంత్రి కె.అచ్చెన్నాయుడు నేరుగా మండలి చైర్మన్ మోషేన్ రాజు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం తిరుమల లడ్డూపై చర్చ జరుగుతున్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేరుగా చైర్మన్ స్థానానికే మతాలను ఆపాదించడంతో సభ ఒక్కసారిగా భగ్గుమంది.
మంత్రులమనే బాధ్యత మరిచి మరీ చట్ట సభలోనే ఎస్సీ వర్గానికి చెందిన హిందువైన మోషేన్ రాజు మతాన్ని మార్చే దుస్సాహసానికి టీడీపీ ఒడికట్టింది. తిరుపతి లడ్డూపై చర్చను పక్కదోవ పట్టించే పక్కా ప్రణాళికతో టీడీపీ మంత్రులు సభలో లేని వైఎస్ జగన్మోహన్రెడ్డి మత ప్రస్తావనను పదేపదే తీసుకొచ్చారు. వైఎస్ జగన్ను మతం ఆధారంగా నిందించడం, తిరుపతి లడ్డూకు కళంకం తేవడమే లక్ష్యంగా మంత్రులు ప్రవర్తించారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన తెలిపారు.
తక్షణం ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించడంతో పాటు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నన్ను క్రిస్టియన్ అనడానికి మీరు ఎవరు? మీరు ఎలా చెప్పారం’టూ నిలదీయడంతో పాటు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరారు. అయినా అచ్చెన్నాయుడు ‘ఆ మాటలకు కట్టుబడి ఉన్నా... క్షమాపణ చెప్పేది లేదం’టూ భీష్మించి కూర్చున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తాను హిందువునని, తన మతాన్ని, కులాన్ని కించపర్చడం సరికాదని గట్టిగా చెప్పారు.
మంత్రి వ్యాఖ్యలతో అధికారపక్షం కూడా ఇరుకునపడటంతో పలువురు మంత్రులు అచ్చెన్నాయుడు వద్దకు వచ్చి దీన్ని నుంచి ఎలా బయటడాలన్నదానిపై తీవ్ర తర్జనభర్జనలు చేశారు. అయినా అచ్చెన్నాయుడు తన అహాన్ని వీడకుండా ‘మీరు సభ సాక్షిగా హిందువునని చెప్పినందుకు ఎటువంటి భేషజాలకు పోకుండా ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా’ అని ప్రకటించారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందానని, ఇక చర్చను కొనసాగిద్దామని చైర్మన్ చెప్పారు. అయితే వైఎస్సార్సీపీ సభ్యులు అచ్చెన్నాయుడు సభకు క్షమాపణ చెప్పాలిందేనంటూ పట్టుపట్టారు. దీంతో సభను అయిదు నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
తిరిగి అదే మత విద్వేష వ్యాఖ్యలు
తిరిగి గంటన్నర తర్వాత మొదలైన తర్వాత కూడా అధికారపార్టీ సభ్యులు అదే విధంగా మత విద్వేష వ్యాఖ్యలను కొనసాగించారు. వెంకటేశ్వరస్వామి మీకు దేవుడు కాదా అంటూ మరింత విద్వేషకర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా చైర్మన్ నిజంగా హిందువైతే వైఎస్సార్సీపీ సభ్యులను కంట్రోల్ చేయాలంటూ మరోమారు చైర్మన్కు మతం రంగుపూసే ప్రయత్నం చేశారు. రూ.620లకు కేజీ నెయ్యిని కొనడాన్ని వ్యతిరేకించేవారు హిందువులు కారంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండటంతో చైర్మన్ సభను గురువారానికి వాయిదా వేశారు.


