బెంగళూరు: సాంకేతిక నగరం బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన మేధస్సుకు పదునుపెట్టి, వంటగదిలో జరుగుతున్న బాగోతాన్ని బయట పెట్టారు. తన ఇంట్లో పని చేసే వంటమనిషిపై కలిగిన అనుమానంతో ఆయన ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత నిఘా వ్యవస్థను వంటగదిలో ఏర్పాటు చేశారు. పంకజ్ తన్వర్ అనే ఈ టెక్కీ తాను రూపొందించిన ఈ వ్యవస్థను ‘ఏఐ రూమ్మేట్’గా అభివర్ణించారు. రిఫ్రిజిరేటర్ నుంచి ఆపిల్స్, బ్లూబెర్రీస్, అరటిపండ్లను వంటమనిషి పదేపదే తస్కరించడాన్ని ఈ ఏఐ బాట్ క్లిప్పింగులతో సహా రిపోర్ట్ చేయడంతో, పంకజ్ తన్వర్ ఆమెను వెంటనే పనిలోంచి తొలగించారు.
ఈ వినూత్న నిఘా వ్యవస్థ కేవలం దొంగతనాన్ని పట్టుకోవడానికే పరిమితం కాకుండా, ఆ వంటమనిషి పనితీరును, శుభ్రతను కూడా నిశితంగా పరిశీలించింది. ఏ సమయంలో ఆమె వంటగదిలోకి వచ్చింది.. ఫ్రిజ్ ఎన్నిసార్లు తెరిచింది అనే వివరాలతో పాటు ఆమె పాటించే పరిశుభ్రతను కూడా యజమానికి నివేదించింది. చెత్త బుట్ట మూతను తాకిన చేతులతోనే చపాతీలు చేయడం, స్టౌ వెనుక భాగాన్ని శుభ్రం చేయకుండా నిర్లక్ష్యం వహించడం లాంటి అంశాలను ఏఐ బాట్ ఫోటోలతో సహా పంకజ్ దృష్టికి తీసుకెళ్లింది.
నెలకు రూ. 5,000 వేతనం తీసుకుంటూ, ఇలాంటి అక్రమాలకు పాల్పడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. పంకజ్ తన్వర్ ఈ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో గోప్యతకు కూడా ప్రాధాన్యతనిచ్చారు. కెమెరా రికార్డ్ చేసే దృశ్యాల్లో ముఖాలను బ్లర్ చేసి, కేవలం చర్యలను మాత్రమే విశ్లేషించేలా దీనిని రూపొందించారు. భవిష్యత్తులో గ్యాస్ లీకేజీని గుర్తించే ఫీచర్లను కూడా దీనికి జోడించనున్నట్లు ఆయన వెల్లడించారు.
అయితే ఈ ఉదంతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కొందరు ఆయన సాంకేతిక నైపుణ్యాన్ని మెచ్చుకుంటుండగా, మరికొందరు అతి తక్కువ వేతనానికి పని చేసే సామాన్యులపై ఇంతటి నిఘా ఉంచడం నైతికంగా సరికాదని విమర్శిస్తున్నారు. ఈ విమర్శలపై స్పందించిన పంకజ్.. సదరు వంటమనిషిని తాను ఇదివరకే రెండుసార్లు హెచ్చరించానని అన్నారు. తన అనుమతితో ఆహారం తీసుకుంటే తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని, కానీ దొంగతనాన్ని తాను సహించేదిలేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: హోలీ తర్వాత ఉంటదీ.. బయటకొస్తే చుక్కలే!


