వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను నిర్వహిస్తున్న తీరుపై భారతీయ అమెరికన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ తాజాగా విడుదల చేసిన ‘2026 ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే’ ప్రకారం 55 శాతం మంది ఇండో అమెరికన్లు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నారు.
‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ 2025, నవంబర్ 25 నుండి 2026, జనవరి 6 వరకు వెయ్యి మంది భారతీయ అమెరికన్ల అభిప్రాయాలను సేకరించగా, కేవలం 20 శాతం మంది మాత్రమే ట్రంప్ పనితీరును సమర్థించారు. ఇది 2020తో పోలిస్తే 35 శాతం కంటే తక్కువ కావడమే కాకుండా, 2024 చివరలో జో బైడెన్కు లభించిన 48 శాతం మద్దతుతో పోలిస్తే భారీ తగ్గుదలగా నమోదైంది. వాణిజ్య సంక్షోభాలు, సాంకేతిక బదిలీల్లో అవరోధాలు, క్వాడ్ (Quad) కూటమిలో సందిగ్ధత తదితర అంశాలు ఇండో-అమెరికన్లలో అసహనాన్ని పెంచాయి.
సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం డెమొక్రాటిక్ పార్టీ వైపు మొగ్గు చూపే వారిలో 70 శాతం మంది ట్రంప్ విధానాలను తప్పుబడుతుండగా, రిపబ్లికన్ మద్దతుదారుల్లో 50 శాతం మంది ఆయనకు అండగా నిలిచారు. డెమొక్రాటిక్ పార్టీపై విధేయత గతంలో కంటే తగ్గగా, స్వతంత్ర ఓటర్ల సంఖ్య 29 శాతానికి పెరిగింది. ఇది ఇండో-అమెరికన్ ఓటర్లు రెండు ప్రధాన పార్టీల విషయంలో కొంత విముఖంగా ఉంటూ, స్వతంత్రంగా ఆలోచిస్తున్నారనే సంకేతాలను ఇస్తోంది. వయస్సు, మతపరమైన అంశాలు కూడా ఈ అభిప్రాయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
18-29 ఏళ్ల మధ్య వయస్సున్న యువ భారతీయ అమెరికన్లు తిరిగి డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపుతుండగా, క్రైస్తవ మతానికి చెందిన ఇండో-అమెరికన్లు రిపబ్లికన్ పార్టీకి గట్టి మద్దతుదారులుగా మారుతున్నారు. ముఖ్యంగా భారత ఐటీ రంగానికి అత్యంత కీలకమైన హెచ్-1బి వీసాల వంటి అంశాలు ఈ మార్పులకు కారణమవుతున్నాయి. అలాగే ఇటీవల అమెరికాకు వలస వెళ్లిన వారు డెమొక్రాట్ల విషయంలో సానుకూలంగా ఉండగా, దశాబ్దాలుగా అక్కడే స్థిరపడిన కుటుంబాలు రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపుతున్నాయి.
రాజకీయ అంశాలకంటే మిన్నగా, భారతీయ అమెరికన్లు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో భారతీయులకు వ్యతిరేకంగా జాత్యహంకార ధోరణి 48 శాతం పెరిగిందని, ఇది తమలో ఆందోళనను, భయాన్ని నింపుతోందని వారు పేర్కొన్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల వల్ల చాలా మంది ఆన్లైన్లో రాజకీయ చర్చలకు దూరంగా ఉండటం లేదా తమ సంప్రదాయ దుస్తులు ధరించడానికి కూడా వెనుకాడుతుండటం గమనార్హం. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసేలా ఉన్నాయని నివేదిక హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: ‘భార్యాపిల్లలను వివాదాల్లోకి లాగుతారా?’.. సీఎంపై ప్రియాంక ఆగ్రహం


