పై వైపు తెలుపులో
కిందివైపు చిక్కటి నీలంరంగులో
మధ్యలో పెద్ద ఎర్రరంగు గీత
వాషింగ్టన్: తన అధికార గణంలో మెచ్చిన వ్యక్తిని కొనసాగిస్తూ, నచ్చని వ్యక్తిని సాగనంపుతూ తనదైన శైలిలో పరిపాలన కొనసాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ప్రయాణించబోయే అధికారిక విమానం ‘ఎయిర్ఫోర్స్ వన్’విమానం రంగులనూ మార్చేస్తున్నారు. తన వ్యక్తిగత విమానం ఉండే రంగుల్లోకి ఎయిర్ఫోర్స్వన్ విమానాలను మార్చేయాలని అధికారులను ఆదేశించారు.
దీంతో జాన్ ఎఫ్.కెన్నడీ హయాం నుంచి ఒకే రంగుల మిశ్రమంగా ఉన్న ఈ అత్యాధునిక శక్తివంతమైన విమానాలు ఇకపై కొత్త రంగుల్లో కన్పించనున్నాయి. విమానం పైభాగానికి తెలుపు రంగు మాత్రమే వేయనున్నారు. కిందివైపు మొత్తం గాఢమైన నీలంరంగును వేయనున్నారు. డార్క్ బ్లూ కలర్కు చివరన మందంగా ఒక పొడవాటి ఎరుపు రంగు గీతను గీయనున్నారు. ఇది కాక్పిట్ మొదలు వెనక తోకదాకా కొనసాగనుంది.
రెక్కలు, ఇంజిన్లకు తెలుపు రంగు వేయనున్నారు. అమెరికా జాతీయజెండాలో కన్పించే ఎరుపు, తెలుపు, నీలం రంగుల్లో మాత్రమే విమానం కన్పించాలని ట్రంప్ ఆదేశించడంతో ఈ కొత్త డిజైన్ను ఖరారుచేసినట్లు తెలుస్తోంది. గతేడాది సెస్టెంబర్లో పోలండ్ అధ్యక్షుడితో ట్రంప్ శ్వేతసౌధంలో భేటీ సందర్భంగా ఓవెల్ ఆఫీస్ బల్ల మీద కొత్త డిజైన్లో చిన్న విమానం ప్రతిమను ఉంచారు.
ట్రంప్ వినియోగించబోయే కొత్త విమానాలు అచ్చం అదే రంగులను అద్దుకోనున్నాయని అమెరికా మిలటరీ విభాగం ప్రకటించింది. ఎయిర్ఫోర్స్ వన్తోపాటు ట్రంప్ ఉపయోగించే చిన్న విమానాలకూ ఇదే కలర్ ప్యాట్రన్ను అనుసరించనున్నారు. ప్రస్తుతం ట్రంప్ బోయింగ్747–200 రకం విమానాలను ఎయిర్ఫోర్స్వన్గా ఉపయోగిస్తున్నారు. ఇకపై బోయింగ్ 747–800 రకం రెండు విమానాలను ఎయిర్ఫోర్స్వన్గా ఆధునీకరించి వాటికి ‘బ్లూ, వైట్, రెడ్’రంగులు వేయనున్నారు.
గత నిర్ణయం రద్దు..!
తన విమానం ఇవే రంగుల్లో ఉండాలని 2018లో తొలిసారిగా అధ్యక్షుడైన కాలంలో ట్రంప్ అధికారులకు సూచించారు. అది అమలయ్యేలోపే ఆయన పదవీకాలం పూర్తయి గద్దె దిగారు. తర్వాత గెలిచిన జో బైడెన్ అధ్యక్షుడయ్యారు. రంగు మార్పులపై కమిటీ వేశారు. రంగు చిక్కగా వేయాలంటే ఖర్చు భారీగా పెరిగిపోతుందని తేల్చారు.
దీంతో ట్రంప్ నిర్ణయాన్ని జో బైడెన్ పక్కనపడేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన ట్రంప్.. బైడెన్ను తప్పుబట్టారు. ‘‘బేబీ బ్లూ అస్సలు వద్దు. మనకు పవర్ బ్లూనే కావాలి. ప్రతి ఒక్క నిర్ణయానికి తనదైన సమయం వస్తుంది. ఇప్పుడు మేం రంగులు మార్చబోతున్నాం’’అని ట్రంప్ అన్నారు.
కొత్త 747–8ఐ బోయింగ్ జెట్కూ కొత్త రంగులు వేయనున్నారు. ఖతార్ నుంచి కానుకగా అందుకున్న లగ్జరీ బోయింగ్ 747 జెట్కు ఎయిర్ఫోర్స్ వన్కు వాడతామని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అన్నారు. ఆ విమానాన్ని అధ్యక్షుడి భద్రతకు అనుగుణంగా ‘సెక్యూరిటీ మోడిఫికేషన్’కు ఏకంగా రూ.3,600 కోట్లు అవుతుందని ఎయిర్ఫోర్స్ సెక్రటరీ ట్రోయ్ మెయింగ్ గత జూన్లో ప్రకటించడం గమనార్హం.


