‘అదంతా ఫేక్‌ న్యూస్‌’.. కీలక విషయం చెప్పిన మాయావతి | Mayawati Denies Alliance Speculations, Confirms BSP Will Contest 2027 UP Elections Independently | Sakshi
Sakshi News home page

‘అదంతా ఫేక్‌ న్యూస్‌’.. కీలక విషయం చెప్పిన మాయావతి

Feb 18 2026 1:48 PM | Updated on Feb 18 2026 2:00 PM

Mayawati rejects alliance buzz go solo in 2027 Uttar Pradesh polls

లక్నో: రాబోయే 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోతోందంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఖండించారు. బుధవారం లక్నోలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ పార్టీ ఏ ఇతర పార్టీతోనూ జతకట్టదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. పొత్తులపై వస్తున్న కథనాలన్నీ కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే అని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇటువంటి వదంతులను పుట్టిస్తున్నారని ఆరోపించారు.  

ఓటర్లను గందరగోళానికి గురిచేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారని మాయావతి ఆరోపించారు. 2025, అక్టోబర్ 9న కాన్షీరాం వర్ధంతి సందర్భంగా లక్నోలో నిర్వహించిన భారీ ర్యాలీలోనే తాను ఈ విషయాన్ని స్పష్టం చేశానని ఆమె గుర్తుచేశారు. ఆ ప్రకటన తర్వాత కూడా  కొందరు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని, ఇది బీఎస్పీకి వ్యతిరేకంగా సాగుతున్న కుట్ర అని ఆమె విమర్శించారు.

కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, భారతీయ జనతా పార్టీలు సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తున్నాయని, అవి డాక్టర్ అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకమని మాయావతి ధ్వజమెత్తారు. గతంలో ఇతర పార్టీలతో పొత్తుల వల్ల బీఎస్పీకి నష్టం తప్ప లాభం చేకూరలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయా పార్టీలు తమ రాజకీయ స్వార్థం కోసమే పొత్తుల గురించి మాట్లాడుతున్నాయని, వాటి ట్రాప్‌లో పడవద్దని పార్టీ శ్రేణులకు మాయావతి పిలుపునిచ్చారు. 2027 ఎన్నికల్లో పూర్తి అంకితభావంతో ఒంటరిగా పోరాడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

2007 తరహాలో ఉత్తరప్రదేశ్‌లో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని మాయావతి పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఢిల్లీలో తనకు కేటాయించిన టైప్-8 బంగ్లాపై జరుగుతున్న వివాదాన్ని ఆమె తోసిపుచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి అనవసర వివాదాలు సృష్టించి బీఎస్పీని అధికారం నుండి దూరం చేయాలని చూస్తున్నారని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఎన్నికల సన్నద్ధతపై దృష్టి సారించాలని మాయావతి కోరారు.

ఇది కూడా చదవండి:సంతానోత్సత్తి రేటుపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement