న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తున్న నేపథ్యంలో, ఆ పార్టీ అధినేత రెహ్మాన్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన మోదీ.. ఈ విజయం తారిఖ్ రెహ్మాన్ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. పొరుగు దేశంతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు, ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వానికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ తన పోస్ట్లో స్పష్టం చేశారు. ‘ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్కు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది’ అని ఆయన తన సందేశంలో ఉద్ఘాటించారు. 2024లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం పతనమై, అనంతరం జరిగిన సాధారణ ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఈ చారిత్రాత్మక మార్పు నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బంగ్లాదేశ్లోని మొత్తం 299 నియోజకవర్గాలకు గాను, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బీఎన్పీ, దాని మిత్రపక్షాలు 177 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతున్నాయి. మొత్తం 237 స్థానాల లెక్కింపు పూర్తి కాగా, మిగిలిన 62 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల ద్వారా 17 ఏళ్ల ప్రవాసం తర్వాత తారిఖ్ రెహ్మాన్ తిరిగి అధికార పీఠాన్ని అధిష్టించేందుకు మార్గం సుగమమైంది. బీఎన్పీకి ప్రధాన పోటీదారుగా భావించిన జమాతే ఇస్లామీ, దాని మిత్రపక్షాలు కేవలం 53 స్థానాలకే పరిమితమయ్యాయి. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పోటీలో లేకపోవడంతో, ప్రధాన పోరు బీఎన్పీ, జమాతే ఇస్లామీ మధ్యే నెలకొంది. అయితే, బంగ్లాదేశ్ ఓటర్లు తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీకే పట్టం కట్టారు.
I convey my warm congratulations to Mr. Tarique Rahman on leading BNP to a decisive victory in the Parliamentary elections in Bangladesh.
This victory shows the trust of the people of Bangladesh in your leadership.
India will continue to stand in support of a democratic,…— Narendra Modi (@narendramodi) February 13, 2026


