న్యూఢిల్లీ: భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) రష్యా నుండి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు ‘యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ’ (ఏఓఎన్) కింద పచ్చజెండా ఊపింది. సుమారు 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ కొనుగోళ్లలో 120 స్వల్ప శ్రేణి, 168 సుదీర్ఘ శ్రేణి క్షిపణులు ఉన్నాయి. గత ఏడాది మే నెలలో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో వినియోగించిన క్షిపణుల నిల్వలను పునరుద్ధరించడంతో పాటు, వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేయడం ఈ ఒప్పందపు ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియను ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్ (ఎఫ్టీపీ) ద్వారా వేగవంతంగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
గత ఏడాది పాకిస్తాన్తో తలెత్తిన ఉద్రిక్తతల (ఆపరేషన్ సిందూర్) సమయంలో ఎస్-400 వ్యవస్థ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. పంజాబ్ సరిహద్దు నుంచి ఏకంగా 314 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ యుద్ధ విమానాన్ని కూల్చివేసి రికార్డు సృష్టించింది. ఆదంపూర్, భుజ్ సెక్టార్లలో మోహరించిన ఈ వ్యవస్థకు భయపడి పాక్ తన యుద్ధ విమానాలను అఫ్గానిస్థాన్, ఇరాన్ సరిహద్దులకు తరలించాల్సి వచ్చింది. తాజాగా కొనుగోలు చేయబోయే 400 కి.మీ, 200 కి.మీ, 150 కి.మీ, 40 కి.మీ శ్రేణి క్షిపణులు భవిష్యత్తులో డ్రోన్ దాడులను, శత్రు విమానాలను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి సహకరించనున్నాయి.
భారత వైమానిక దళం క్షిపణి రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉన్న ఎస్-400 వ్యవస్థలతో పాటు, రష్యాకు చెందిన 'పాంత్సిర్' (Pantsir) స్వల్ప శ్రేణి వ్యవస్థలను కూడా అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది. ఈ రెండు వ్యవస్థల కలయికతో సరిహద్దుల్లో 'టూ-లేయర్' రక్షణ కవచం ఏర్పడనుంది. ఇది ముఖ్యంగా కామికాజ్ డ్రోన్లు, ఇతర వైమానిక దాడుల నుండి భారత గగనతలాన్ని కాపాడుతుంది. ఈ ఏడాది జూన్, నవంబర్ నెలల్లో భారత్ కు మరిన్ని ఎస్-400 వ్యవస్థలు అందనున్నట్లు సమాచారం.
కేవలం క్షిపణులే కాకుండా, త్రివిధ దళాల ఆధునీకరణ కోసం మొత్తం 3.60 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా వైమానిక దళం కోసం మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ (ఎంఆర్ఎఫ్ఏ), రాఫెల్ యుద్ధ విమానాలు, హై-ఆల్టిట్యూడ్ శాటిలైట్లను కొనుగోలు చేయనున్నారు. వీటిలో మెజారిటీ యుద్ధ విమానాలను ‘మేక్ ఇన్ ఇండియా’ కింద భారత్లోనే తయారు చేయనున్నారు. అదేవిధంగా నౌకాదళం కోసం పి-8ఐ విమానాలు, ఆర్మీ కోసం విభవ్ యాంటీ-ట్యాంక్ మైన్లు, టీ-72 ట్యాంకుల ఆధునీకరణకు కూడా నిధులు కేటాయించారు.
ఇది కూడా చదవండి: ‘ప్రేమ’ ఎంత మధురం.. ‘వ్యాపారం’ అంత కపటం!


