న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దేశ రాజధానిలో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తనకు ఎలాంటి రాజకీయ ఆశయాలు లేవని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన తన స్వగ్రామం సంతుక్ పింప్రికి సర్పంచ్గా సేవలందించడమే తన నిజమైన కల అని ఆయన పేర్కొన్నారు. ఏబీపీ న్యూస్తో మాట్లాడుతూ రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం తనకు లేదని దీప్కే తెలిపారు. తన రాజకీయ ఆశయం కేవలం గ్రామాభివృద్ధి మాత్రమేనని, అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించింది పదవుల కోసం కాదని స్పష్టం చేశారు.
బాల్యంలో తాను చూసిన గ్రామీణ పరిస్థితులే తనలో ఈ ఆలోచనను బలపరిచాయని ఆయన వెల్లడించారు. తన సొంతూళ్లో పాఠశాలల దుస్థితి, మౌలిక వసతుల లేమి తనను కలిచివేశాయని చెప్పారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడంతో పాటు, ఒక ఆసుపత్రిని నిర్మించడమే తన లక్ష్యమని వివరించారు. తాము ఏర్పాటు చేసిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) రాజకీయ పార్టీగా కాకుండా, ఒక రాజకీయ ఒత్తిడి గ్రూప్గా పనిచేస్తుందని దీప్కే ప్రకటించారు. ప్రజా సమస్యలను మరింత ప్రభావవంతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఇలాంటి సంఘాలు ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. నీట్ ఆందోళనల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆగస్టు 5న ఛత్రపతి శంభాజీనగర్లోని ఆయన నివాసంలో సీజేపీ కీలక సమావేశం జరగనుంది.
ఇది కూడా చదవండి: ప్రశ్నపత్రాల లీకేజీ ముఠా గుట్టు రట్టు


